-
ఉచితంగా ఇంగ్లిష్ నైపుణ్యాలు : ఈజీగా స్పొకెన్ ఇంగ్లీష్
సాక్షి, హైదరాబాద్: ఉపాధికి తప్పనిసరి అర్హతగా మారుతున్న ఇంగ్లీషులో మరింత మంది నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందని ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ వ్యవస్థాపకుడు, చీఫ్ కోచ్ డాక్టర్ ఏ. చిరంజీవి అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఏ రంగంలోనైనా ఇంగ్లిష్పై పట్టున్న వారికే అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో ప్రాథమిక విద్య నుంచీ ఇంగ్లీషు మీడియాన్ని అందుబాటులోకి తేవటం చాలా ప్రశంసనీయమన్నారు. రేపటి తరం పిల్లలంతా ఇంగ్లీషు విద్యను అభ్యసిస్తున్నారు కనక.. వారితో మ్యాచ్ కావాల్సిన నిన్నటితరం పెద్దలు, ఇంగ్లీషు భాషా నైపుణ్య లోపాల కారణంగా మెరుగైన అవకాశాలు అందుకోలేని యువత.. వీరందరి కోసం తమ సంస్థ ఉచితంగా ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సును అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ‘‘ఇంగ్లీషు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికోసం ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మా ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి 30 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈజీ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆన్లైన్లో ఉచితంగా అందజేస్తాం’‘ అని చిరంజీవి తెలియజేశారు. ఈజీ ఇంగ్లీష్ ద్వారా రాష్ట్రంలోని యువతకు కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే కాకుండా దాదాపు 9 రకాల అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. ఉచితంగా.. అందరికీ ‘‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ను 1994లో ప్రారంభించాం. విశాఖపట్నంలో ఆరంభించి తెలుగు రాష్ట్రాల్లో 18 శాఖలుగా విస్తరించాం. ప్రస్తుతం ఆన్లైన్ మాడ్యూల్స్పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం. మా సంస్థకు 30 ఏళ్లయిన సందర్భంగా అందిస్తున్న ఉచిత ఇంగ్లిష్ నైపుణ్య కోర్సుకు ఆసక్తి ఉన్న ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం దిగువ ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకుంటే చాలు. వారి మొబైల్కు రిజిస్ట్రేషన్ లింకు వస్తుంది. లేనిపక్షంలో 9866006662 ఫోన్ నంబర్కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపినా వారి మొబైల్ ఫోన్కు లింకును పంపిస్తాం". అదే విధంగా పది అంశాల్లో శిక్షణ.. "ఈజీ ఇంగ్లీష్ ద్వారా స్పొకెన్ ఇంగ్లీష్ తరగతులే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, గోల్ సెట్టింగ్, పాజిటివ్ మెంటల్ ఆటిట్యూడ్, పబ్లిక్ రిలేషన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్పై శిక్షణ ఇస్తాం. ప్రతి రోజు శిక్షణ ముగిసిన తర్వాత పరీక్ష పెట్టడంతో పాటు స్టడీ మెటీరియల్నూ ఇస్తాం. ఈ కార్యక్రమాలను ఆన్లైన్ పద్దతిలో లైవ్లో అందిస్తాం. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభిస్తాం. ఈ శిక్షణ కోసం మేధా ఇన్స్టిట్యూట్ తరపున 30 మంది నిపుణుల బృందం పనిచేస్తుంది. లైవ్లో నిర్వహించే ఈ తరగతులపై ఏవైనా సందేహాలుంటే చాట్ ద్వారా జవాబులిస్తాం’’ అని చిరంజీవి తెలిపారు. ఇవి చదవండి: వారెవ్వా.. నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు! -
సవాలుగా మారిన సరికొత్త నాటకం ‘నచికేత’
సవాళ్ళు ఎదురైనప్పుడే సృజనాత్మకత మరింత రాటుదేలుతుంది. నాటక రచయితగా మొదలై, సీరియల్స్ నుంచి సినిమా రచయితగా ఎదిగిన నాకు ఆ సంగతి అనుభవైకవేద్యం. ‘నరవాహనం’ నాటకం నుంచి ‘రంగమార్తాండ’ చిత్రం, తాజా ‘కన్నప్ప’ సినిమా వరకు రచనలో క్లిష్టమైన సందర్భాలు ఎదురైనప్పుడల్లా నాలోని రచయిత రాటుదేలడానికి అది దేవుడిచ్చిన అవకాశంగా భావించాను. రంగస్థలంపై ఇటీవల నాకు అలాంటి ఓ కొత్త సవాలు – ‘నచికేత’ నాటకం. ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా, రసరంజని 31వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆచార్య కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో ‘నచికేత’ నాటకాన్ని ప్రదర్శించాం. భారతీయ ఉపనిషతుల్లో సుప్రసిద్ధమైన కఠోపనిషత్తులోది నచికేతుడి కథ. సాక్షాత్తూ మృత్యుదేవత యముడే నచికేతుడికి బోధించిన మరణరహస్యం ఇందులోని ప్రధాన అంశం. ‘నచికేతుడి’ కథను నాటకంగా మలిస్తే బాగుంటుందనేది కోట్ల హనుమంతరావు ఆలోచన. ఆ ఆలోచన ఆయన నాతో పంచుకున్నప్పుడు ఉపనిషత్ రహస్యాన్ని నాటకంగా ఎలా మలచాలి అనేది పెద్ద సవాలుగా మారింది. ఈ విషయంపై లోతుగా చర్చించాం. నాటక రచన ప్రయత్నంలో భాగంగా పలు పుస్తకాలను తిరగేయడం మొదలుపెట్టాను. మొదటగా రామకృష్ణమఠం వారు ప్రచురించిన స్వామి స్వరూపానంద గారి ‘ఉపనిషత్ కథలు’, ‘ఆర్ష విద్యాతరంగాలు’ ప్రచురణ, స్వామి పరమార్థనంద గారి కఠోపనిషత్తు, విఎస్ఆర్ మూర్తిగారి ‘ఉపనిషత్ సుధ’ చదవడం మొదలెట్టాను. ఉపనిషత్తులోని లోతైన విషయం అర్థమమయింది గానీ, దాన్ని ఎలా చెప్పాలో అంతుచిక్కలేదు. యథాతథంగా రాస్తే పండితులకూ, మేధావులకూ, కేవలం ఈ విషయంపై ఆసక్తిగలవారికి మాత్రమే అర్థమవుతుంది. అలా కాకుండా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాయడం ఎలా అని ఆలోచించాం. అప్పటికీ నాటకీయంగా ఈ విషయం ఎలా అందించాలి అనే అంశంపై ఆలోచనలు కొలిక్కిరాలేదు. సంప్రదాయ పద్ధతిలో ఉపనిషత్తులు గురుశిష్య సంవాదరూపంలో వున్నాయి గనుక అదే పద్ధతిని అనుసరించి నాటక రచన చేస్తే, స్పష్టమైన అంశాలను సంభాషణలుగా రాస్తే నాటకీయత ఎలావున్నా విషయాన్ని సులభంగా అందించినట్టవుతుందని, గురువు - శిష్యుల ఫార్మెట్ని అనుసరించి ఈ నాటక రచన మొదలుపెట్టడం జరిగింది. అయితే, కేవలం సంభాషణలు మాత్రమే రాస్తే శ్రవ్య నాటికగా ఉంటుందేమోగానీ, దృశ్యనాటికగా ఎలా రక్తికడుతుంది? అదీ సంశయం. దాంతో, కచ్చితంగా దృశ్య రూపకంగా అందించాలని నిర్ణయించుకున్నాం. పదేపదే ఆ కథను చదివితే కొన్ని దృశ్యాలు వచ్చాయి. ఆ దృశ్యాలకు పొందికైన రూపమివ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు మరో సందేహం వెంటాడింది. చాలా విషయాలు జటిలంగా ఉన్నప్పుడు నృత్యరూపకంగా అందిస్తే, కొన్ని హావభావాలను బాగా అందించే అవకాశం వస్తుందని నృత్యనాటిక రూపంలో మొదట రాశాను. దర్శకులు కోట్ల హనుమంతరావు అది చదివి బాగుందనుకున్నా, కేవలం నృత్యరూపకంగా అందిస్తే ‘నాటకీయత’ లోపించే ప్రమాదం ఉందంటూ నాటకంగా రాయమన్నారు. వెరసి, నృత్యరూపకంలో ఉన్న అంశాల్లో కొన్ని నాటకరూపంలోకీ వచ్చాయి. మళ్ళీ మరో సందేహం! నృత్యరూపకం, నాటకరూపం - రెండూ చదివాను. ఆ క్రమంలో ప్రస్తుత సమాజానికి ఈ కథ ద్వారా సందేశం ఏమైనా ఉందా అని ఆలోచనలో పడ్డాను. కేవలం సందేశాలకే నాటకాలు పరిమితం అయిపోవాలన్న భావన లేకపోయినా, ఉపనిషత్తు ఆధారంగా అందులోని కథను నాటకంగా రాసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎందరో ఋషులు, దార్శనికులు అన్ని కాలాలలో దర్శించిన విశ్వజనీన సత్యాలకు నాటకరూప మిస్తున్నప్పుడు, దేశ కాలాతీతంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఉపనిషత్ సారాన్ని, వర్తమాన సమాజానికి అన్వయించే ప్రయత్నం చేస్తే వస్తుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపం ఇవ్వడానికి ప్రయత్నించాను. నృత్యరూపకాన్నీ, నాటకాన్నీ కలిపి, నాటకీయతను జోడించి రచించడం జరిగింది. చివరకు చిన్నచిన్న పాటలను, శ్లోకాలను కలిపి ‘నచికేత’ నాటకం రాయడం జరిగింది. ఒక కొత్త నాటకం రచన, ప్రొడక్షన్ వెనుక ఇంత కథ నడించింది. మరో విషయం... ఈ నాటకం తయారు అవుతున్నప్పుడు స్వామి కృష్ణానంద ‘కామెంట్రీ ఆన్ కఠోపనిషత్’, వేద సమితి ఉపనిషత్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎండ్ ఉపనిషత్ పుస్తకాలను కూడా చదవడం జరిగింది. చివరి నిముషంలో సాధ్యమైనన్ని మార్పులు చేసుకుంటూ ఈ నాటక ప్రదర్శన జరిగింది. ఈ ‘నచికేత’ నాటకాన్ని రసరంజని వారి నిర్వహణలో తొలిసారిగా ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు ప్రదర్శించడం ఆనందం కలిగించింది. నాటకంలో భాగంగా నచికేతుడు యమపురికి వెళ్ళే మార్గం, మరణానంతరం ఆత్మ జ్యోతులుగా సాగిపోవడం, యమధర్మరాజు - నచికేతుల మధ్య సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. కథను సమకాలీన పరిస్థితులకు అన్వయించే ప్రయత్నంలో ‘ప్రాయో మార్గాన్ని’ అనుసరించిన వ్యక్తి , అతని ప్రవర్తన, ‘మృత్యువు’ను పర్సానిఫై చేసిన వైనం ప్రదర్శన తిలకించినవారిని ఆకర్షించాయి. ఎంతటి జటిలమైన అంశాన్నయినా సరళంగా అందించే ప్రయత్నం చేస్తే, సహృదయులైన ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని అర్థమైంది. గత 31 సంవత్సరాలుగా నాటకరంగానికి విశేషమైన సేవలు అందిస్తున్న ‘రసరంజని’ చొరవ తీసుకుని, ఒక విభిన్న అంశంతో కూడిన నాటకానికి వేదిక కల్పించడం ఆనందం. అదే విధంగా, కేవలం టి.వీలకి, సిన్మాలకి పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా నాటకం చూడడానికి దూరప్రాంతాల నుంచి సైతం ప్రేక్షక దేవుళ్ళు రావడం సంతోషం. తెలుగు రంగస్థలం మరింత ముందుకు సాగడానికి మరిన్ని కొత్త ప్రయత్నాలు కావాలి, రావాలి. ఆ క్రమంలో మా ‘నచికేత’ ఓ చిరు ప్రయత్నం. - ఆకెళ్ళ శివప్రసాద్, ప్రముఖ నాటక – సినీ రచయిత -
"కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం!"
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల 18వ తేదీన అకాడమీ ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయ సంగీత వాదుల నుంచి నిరసనల గళం పెద్దఎత్తున వినపడుతోంది. ఇది ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఎం కృష్ణను సమర్థిస్తూ కూడా కొన్ని వర్గాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వున్నారు. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలను బలపరిచేవారు, సనాతన సంప్రదాయం పట్ల గౌరవంలేనివారు, నాస్తికులు అందులో వున్నారు. టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కార ప్రకటనను నిరసిస్తూ, గతంలో ఈ పురస్కారాన్ని తీసుకున్న కొందరు వెనక్కు ఇచ్చేస్తున్నారు. చాలామంది కళాకారులు ఇక నుంచి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాడబోమని, సంగీత కచేరీలు చేయబోమని తమ నిరసనను చాటుకుంటున్నారు. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక అధినేతలలో ఒకరైన ఎన్.మురళి ప్రస్తుతం మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షులుగా వున్నారు. టీఎం కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంలో మురళి పాత్ర ప్రధానంగా వున్నదని సంగీత సమాజంలో గట్టిగా వినపడుతోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేట్టు లేదు. రకరకాల రూపం తీసుకుంటోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ చరిత్రలో ఇంతటి వివాదం గతంలో ఎన్నడూ చెలరేగలేదు. టీఎం కృష్ణకు ఒక వర్గం మీడియా మద్దతు, సహకారం కూడా బాగా వున్నాయని అనుకుంటున్నారు. ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే.. మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే ప్రచారం వుంది. వేదికలపైన పాడేటప్పుడే కాక, వివిధ సందర్భాల్లోనూ ఆయన చేసే విన్యాసాలు, హావభావాలపై చాలా విమర్శలు వచ్చాయి. అట్లే, ఆయనను మెచ్చుకొనే బృందాలు కూడా వున్నాయి. సంప్రదాయవాదులు ఎవ్వరూ ఇతని తీరును ఇష్టపడరు. ఈ క్రమంలో రేపు డిసెంబర్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికలో జరగబోయే ప్రతిష్ఠాత్మకమైన వేడుకలకు చాలామంది దూరంగా జరుగుతారని అనిపిస్తోంది. ప్రసిద్ధ జంట కళాకారిణులు రంజని - గాయత్రి పెద్ద ప్రకటన కూడా చేశారు. హరికథా విద్వాంసులు దుష్యంతి శ్రీథర్, విశాఖ హరి వంటీఎందరో నిరసన స్వరాన్నే అందుకున్నారు. తెలుగునాట కూడా అవే ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. 1976లో తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో, శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన కృష్ణ మొదటి నుంచీ కొత్త గొంతును వినిపిస్తున్నారు. బ్రాహ్మణత్వంపైన, కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణుల పెత్తనం పెరిగిపోతోందంటూ కృష్ణ నినదిస్తున్నారు. సమాజంలో, సంగీత సమాజంలో ఎన్నో సంస్కరణలు రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని మాట్లాడుతున్నారు. తాను గురుశిష్య పరంపరలోనే సంగీతం నేర్చుకున్నప్పటికీ దాని పైన తన దృక్పథం వేరని చెబుతున్నారు. చెంబై విద్యనాథ భాగవతార్ - కె జె ఏసుదాసు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు - అన్నవరపు రామస్వామి వంటివారి గురుశిష్య బంధాలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతున్నాయో? అనే ప్రశ్నలు వస్తున్నాయి. త్యాగయ్య మొదలు మహా వాగ్గేయకారులందరిపైనా ఆయన వివిధ సమయాల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రాహ్మణత్వంతోనే ప్రవర్తించారని, అదే పద్ధతిని అనుసరించి పాడుతూ పెద్దపేరు తెచ్చుకున్నారని, ఆ కీర్తి కోసమే ఆమె ఆలా చేశారని గతంలో కృష్ణ చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి. బ్రాహ్మణత్వాన్ని పులుముకోకపోతే ఈ శాస్త్రీయ సంగీత రంగంలో ఇమడలేరని, రాణించలేరని, అందుకే సుబ్బలక్ష్మికి కూడా అలా ఉండక తప్పలేదని కృష్ణ బాధామయ కవి హృదయం. కులాన్ని బద్దలు కొట్టాలని, కళలు, సంగీతం అందరికీ అందాలని, అది జరగడంలేదని వాదిస్తూ, సముద్ర తీరాలలో, మత్స్యకార వాడల్లో, వివిధ సమాజాల్లో కచేరీలు, సంగీత ఉత్సవాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ విధ్వంసంపైన, బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, వివిధ ఉద్యమ వేదికల ద్వారా తన వ్యతిరేకతను చాటుకుంటూ వస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాల దగ్గరకు తీసుకెళ్లాలంటూ చేసిన ప్రదర్శనలు మీడియాను కూడ బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంతో 2016లో ప్రతిష్ఠాత్మక 'రామన్ మెగసెసే అవార్డు' కూడా అందుకున్నారు. తమిళ భాషను, యాసను ప్రచారం చేసే క్రమంలో కృష్ణ తెలుగును చిన్నచూపు చూస్తూ వస్తున్నారు. త్యాగయ్య కీర్తనలు ఈనాటికి పనికిరావని, ఆ సాహిత్యం మూఢమైనదనే భావనలను కూడా ప్రచారం చేశారు. మహా వాగ్గేయకారులు రచించిన కీర్తనలను సాహిత్యానికి, భావానికి, భాషకు సంబంధం లేకుండా నడ్డివిరచి పాడుతూ మహనీయులను హేళన చేస్తున్నాడని, తెలుగు భాషను అవమానపరుస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇతను కేవలం సంగీత విద్వాంసుడుగానే కాక, ఉద్యమకారుడుగానూ ప్రచారంలోకి వచ్చాడు. ఈ.వి రామస్వామి పెరియార్ భావాలను అనుసరిస్తూ, గీతాలను సృష్టిస్తూ, గానం చేస్తూ, ప్రచారం చేస్తూ వున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ పాటలు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్వరపరచి ఎందుకు పాడకూడదు? అన్నది అతి వాదన. బ్రాహ్మణులు, దైవం, హిందూమతం, కాంగ్రెస్, మహాత్మాగాంధీని పెరియార్ వ్యతిరేకించారు. కృష్ణ కూడా ఇంచుమించు అవే భావనలలో వున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్పైన కూడా అనేకసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన ప్రస్తుత పురస్కారం ఎంపిక విధానాన్ని, అర్హతను గమనిస్తే, ఇతని కంటే గొప్పవాళ్ళు, జ్ఞాన, వయో వృద్ధులు ఎందరో వున్నారు. వాళ్లందరినీ కాదంటూ ఈయనకు ఈ పురస్కారం ఇవ్వాల్సినంత శక్తి సామర్ధ్యాలు, అనుభవం ఆయనకు లేవన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సంప్రదాయ వ్యతిరేకత ముసుగులో, సంస్కరణ మాటున సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవమానిస్తున్నాడని సంప్రదాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నాడని తెలుగు భాషాప్రియులెందరో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల, వాగ్గేయకార మహనీయుల పట్ల, తెలుగు భాష పట్ల గౌరవం లేనప్పుడు అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడని అనేకులు మండిపడుతున్నారు. సంగీత కళానిధి పురస్కారం సంగతి అటుంచగా, ఇంతటి విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూస్తూ ఊరుకోబోమనే మాటలు సనాతన సమాజాల నుంచి వినపడుతున్నాయి. ఈ పురస్కార ప్రకటనను మ్యూజిక్ అకాడమీ విరమించుకుంటుందని చెప్పలేం. ఈ ధోరణులతో నడుస్తున్న కృష్ణ శాస్త్రీయ రాగాలను ఎంచుకోకుండా, తాను కొత్త కొత్త రాగాలను పుట్టించుకొని అందులో పాడుకొమ్మని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సనాతన భారతంలో "కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం " అని సంప్రదాయ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతనిపై న్యాయస్థానాలలో కేసులు కూడా పెడుతున్నారు. ఏమవుతుందో చూద్దాం. - రచయిత, మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
‘‘డిజిటల్ యుగంలో డా.అంబేద్కర్ భావజాలం’’ పుస్తకంపై విజయభాను కోటే రివ్యూ
పుస్తక సమీక్ష: “Dr. Ambedkar’s Ideology in the Digital Era” (రచయిత- డా. జేమ్స్ స్టీఫెన్ మేకా (రిజిస్ట్రార్-ఆంధ్ర విశ్వవిద్యాలయం) ప్రపంచం మరుపులో కూరుకుపోతున్నట్లు కనిపించినప్పుడు, కొంతమంది వ్యక్తులు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రతిధ్వనులను కలిగించే స్వరాలను ఎక్కుపెడతారు. డాక్టర్ జేమ్స్ స్టీఫెన్ మేకా గారిని తన తాజా పుస్తకం "డాక్టర్ అంబేద్కర్స్ ఐడియాలజీ ఇన్ ది డిజిటల్ ఎరా" గురించి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అదే భావోద్వేగం కలిగింది. “మీ పుస్తకం శీర్షిక వినూత్నంగా ఉంది. అసలు డిజిటల్ శకానికి, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వారధి కట్టాలని మీకు ఎలా అనిపించింది?” ఈ ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ జేమ్స్ స్టీఫన్ చూపించిన వీడియో చూసి నేను, నా సహచరుడు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురయ్యాము. డాక్టర్ అంబేడ్కర్ చైర్ గా సేవలు అందించిన డాక్టర్ జేమ్స్ స్టీఫన్ వంటి అంబేడ్కరిస్ట్ ను టీవీ కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు వేదనకు గురిచేసింది. ఈ కార్యక్రమంలో అడిగిన ఒక ప్రశ్నకు హాట్ సీట్ లో పాల్గొంటున్న వ్యక్తి మాత్రమే కాక కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులు కూడా అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం తెలియని పరిస్థితుల్లోకి భారతదేశం వెళ్లిపోతోందని అర్థం అయిన ఆయన ఆ సమస్యను తీవ్రమైన సమస్యగా గుర్తెరిగి, పరిష్కారంగా ఈ పుస్తకాన్ని రచించారు. ఆ “మీలో ఎవరు కోటీశ్వరుడు” ప్రోగ్రామ్ వీడియోలో అడిగిన ప్రశ్న, “వీరిలో బాబాసాహెబ్ గా పేరొందిన వారు ఎవరు? దీనికి పార్టిసిపెంట్కు జవాబు తెలియక, షోలో భాగంగా “ఆడియన్స్ పోల్” ఎంచుకోవడం, అందులో అంబేడ్కర్ కు 27శాతం మాత్రమే ఓటింగ్ రావడం, చివరికి వల్లభాయి పటేల్ అని జవాబు చెప్పడంతో తనకు సమస్య తాలూకా తీవ్రత అర్థంఅయిందనీ, పనులెన్ని ఉన్నా, లోపల మండుతున్న ఒక నిప్పు రవ్వ నిద్రపోనివ్వని కారణంగా ఈ రచన జరిగిందని చెప్తారు డా. జేమ్స్ స్టీఫన్. అంబేడ్కర్ అనుచరులు ఆయనను ఆప్యాయంగా, అభిమానంతో పిలిచే పేరు “బాబాసాహెబ్”. బాబా అంటే తండ్రి, సాహెబ్ అంటే సార్ అనే గౌరవ సంబోధన. అంబేడ్కర్ “బాబాసాహెబ్” గా భారతదేశం లోనే కాక అంతర్జాతీయంగా కూడా పేరు పొందారు. మన దేశంలో విశ్వవిద్యాలయాలు ఆయన పేరుతో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో ఒక జిల్లా, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా. అంబేడ్కర్ జయంతిని ఘనంగా జరిపే భారతావనిలో నేటి యువత ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యతను. ఆ వ్యక్తి భారతదేశానికి చేసిన అత్యున్నత సేవను, ఆ వ్యక్తి చరిత్రలో వేసిన ముద్రను తెలియని స్థితిలోకి జారిపోతున్నారన్న ఆలోచన, ప్రస్తుతం సమాజంలో, ముఖ్యంగా నేటి యువతలో అంబేడ్కర్ గురించిన అవగాహన పెంచడానికి, డిజిటల్ వ్యవస్థను వినియోగించడం ఎలా అన్న అంశాన్ని లోతైన అధ్యయనాల ద్వారా ఈ పుస్తకంలో తెలియజేశారు. అంతే కాక అంబేడ్కర్ సిద్ధాంతాలు నేటి డిజిటల్ యుగానికి ఏ రకంగా అవలంబించవచ్చో తెలియజేశారు. ఈ 20 అధ్యాయాల పుస్తకం నిజమైన అంబేద్కర్ను ప్రపంచానికి పరిచయం చేయవలసిన ఆవశ్యకతను వెల్లడిస్తుంది. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు అందించబడాలని నిక్కచ్చిగా చెబుతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఇండియా వీడీఎం ఇండియా ఆన్ ద మూవ్ ఛైర్మన్ ఆచార్య శ్రీ అజయ్ కుమార్ "ఈ పుస్తకం అంబేద్కర్ యొక్క విజన్, ఒక గొప్ప నాయకుని ఆశయాలు మరియు ఆలోచనలను డిజిటల్ యుగం యొక్క పరివర్తన శక్తితో సమకాలీకరించే ఉన్నతమైన పనిని పూర్తి చేస్తుంది." అన్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి సిద్ధాంతాలను ప్రస్తుత కాలానికి అన్వయించాలంటే ఆ వ్యక్తి గురించిన లోతైన అధ్యయనం చెయ్యాలి, ఆ సిద్ధాంతాలు ఏ కాలానికైనా అవలంబించదగినవని తెలియాలంటే, అనుసంధాన ప్రక్రియ బలంగా ఉండాలి. ఈ పుస్తకంలో రచయిత చేసినది అదే! చరిత్ర భవిష్యత్తుకు పునాదిగా పనిచేస్తుంది. మనం డాక్టర్ అంబేద్కర్ను కేవలం గురువుగా మాత్రమే కాకుండా, వారి ఆలోచనలు మరియు దృష్టిని మన భవిష్యత్తుకు అన్వయించగల వ్యక్తిగా కూడా గుర్తుంచుకోవాలి. ఏ కాలానికైనా వర్తించే ఆలోచనలను కొద్ది మంది మాత్రమే ప్రతిపాదించగలరు. అలాంటి వారిలో డాక్టర్ అంబేద్కర్ ఒకరు. డాక్టర్ అంబేద్కర్ జీవితం అన్ని కాలాలకు ఆదర్శంగా నిలుస్తుంది. జ్ఞానాన్ని ఆయుధంగా వాడుకున్న యోధుని గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. భారతదేశపు మొదటి న్యాయ మంత్రిగా ఆయన ఎప్పుడూ గుర్తింపు పొందారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని పాటించినంత కాలం ఆయన మన పౌర జీవితాల్లో జీవిస్తారు. అంబేద్కర్ తన విద్యను సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఉపయోగించారు. మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలకు ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేసుకునే హక్కు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 20 అధ్యాయాలుగా విభజించబడ్డ ఈ పుస్తకంలో ఒక్కో అధ్యాయాన్ని పుస్తకం యొక్క మూల లక్ష్యాన్ని నిర్మాణాత్మకంగా చేరేలా రచించారు. డాక్టర్ అంబేడ్కర్ జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతూ ఆయన ఎదుర్కొన్న వివక్ష ఎంత కాలం, ఎలా ఆయన జీవితాన్నివెంటాడిందో తెలియజేస్తూ, ఆయనలో వివక్షకు వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు ధోరణి, ఆ తిరుగుబాటుకు సూచనగా ఆయన విద్యను ఆయుధంగా ఎంచుకోవడం, ఆ తిరుగుబాటును వ్యక్తీకరించడానికి ఆయన రచనను ఆయుధంగా, వ్యక్తీకరణ సాధనంగా ఎంచుకోవడం గురించి సూక్ష్మంగా అయినా, పదునుగా తెలియజేస్తారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ భావజాలం అప్పట్లో ఒక తిరుగుబాటుగానే పరిగణించబడింది. తన సిద్ధాంతాలను సమాజ మార్పుకు పునాదులుగా చేయడానికి ఒక వ్యక్తి చేసిన అనితరసాధ్య, నిరంతర సంఘర్షణల ఫలితమే అంబేడ్కరిజం. ఆయన సిద్ధాంతాలు లేదా భావజాలం యొక్క పురోగతి వేల యుద్ధాలను దాటిన అనుభవంగా మనం చెప్పవచ్చు. ఇక డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి గల నాయకుడని ఆయన రచనలు చదివే ఈ నాటి యువతకు అర్థం అవుతుంది. ఆయన దృష్టిలో సమ న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక చేర్పు అనే అంశాలను నేటి సాంకేతిక యుగానికి అనుసంధానం చేస్తూ, డిజిటల్ డివైడ్ లేని సమాజం వైపు అడుగులు వేయడం వలన సాంకేతిక సమసమాజ చేర్పుకు నాంది పలకాలని పిలుపును ఇవ్వడం ఈ పుస్తకం యొక్క ఒక ముఖ్య ఉద్దేశ్యం. సాంకేతిక విప్లవం నేటి కాలపు విజయం అని అభివర్ణించే ఈ కాలంలో విద్య మరియు సాంకేతిక సాధికారత గురించి, సాంకేతిక ప్రజాస్వామ్యం గురించి రచయిత లేవనెత్తిన అంశాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇక ఈ కాలంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య సమాచార గోప్యత లేకపోవడం లేదా సమాచార దోపిడీ (మనకు తెలియకుండానే మన సమాచారం ఇతరులు వినియోగించడం. ఉదాహరణకు మనకు తెలియని కంపెనీల నుండి, బ్యాంకుల నుండి మనకు ఫోన్ రావడం రోజూ జరుగుతూనే ఉంటుంది. అది సమాచార చౌర్యం అని తెలిసినా మనకు ఏమి చెయ్యాలో తెలియదు) గురించి వివరించారు రచయిత. ప్రపంచ సమాజం మొత్తం ఇపుదు డిజిటల్ ఆక్టివిజం లోనే ఉందన్నది వాస్తవం. సాంకేతిక క్రియాశీలత వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి అని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతూనే ఉంటారు. అయితే ఈ సాంకేతిక క్రియాశీలత వలన ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయి. ఉదాహరణకు బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ సేవలను గురించి చెప్పుకోవచ్చు. మరి సామాజిక మాధ్యమాల విషయానికి వస్తే నేడు వార్తా పత్రికల కన్నా సామాజిక మాధ్యమాల ద్వారా వార్తలను తెలుసుకునేవారి సంఖ్య పెరిగింది. ఈ మాధ్యమాలు చర్చావేదికలుగా మారాయి. దేశపు సాధారణ పౌరుల నుండి అత్యున్నత అధికారులు, రాజకీయ నాయకులు కూడా తమ అకౌంట్ల ద్వారా సమాచారాన్ని, ప్రకటనలను వెలువరిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న సాంకేతిక క్రియాశీలత ద్వారా సామాజిక మార్పు సాధ్యాసాధ్యాల గురించి రచయిత విపులంగా చర్చిస్తారు. ఆల్గారిథమిక్ బయాస్ అనేది సమాజంలో ఇప్పటికే ఉన్న పక్షపాతాలను ప్రతిబింబించే డేటాపై అల్గారిథమ్లను రూపొందించినప్పుడు లేదా శిక్షణ ఇచ్చినప్పుడు సంభవించే దైహిక మరియు అన్యాయమైన వివక్షను సూచిస్తుంది. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను నిలబెట్టడానికి, అల్గారిథమిక్ డెసిషన్ మేకింగ్లో ఇటువంటి పక్షపాతాలను నిశితంగా పరిశీలించి సరిదిద్దడానికి కృషి చేయాలి. డాక్టర్ అంబేడ్కర్ భావజాలాన్ని నేటి సాంకేతిక యుగం లో సామాజిక న్యాయం మరియు సమత్వం గురించి చర్చిస్తూ, అట్టడుగు వర్గాలను ఈ డిజిటల్ యుగంలో సామాన్య హక్కుదారులుగా ఎలా చేర్చాలో చర్చిస్తారు. సాంకేతిక యుగంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్షలను కూకటివేళ్ళతో ఎలా పెకిలించాలో దిశానిర్దేశం చేస్తారు. అలాగే డిజిటల్ విద్య అవసరత, తద్వారా ఉపాధి లేదా సామాన అవకాశాల ఆవశ్యకత గురించి చర్చిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ సమసమాజ స్థాపన కొరకు పాటు పడ్డారు. అది విద్య, సాధికారత వలనే సాధ్యం అవుతుందని భావించారు. ఈ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుని, సాంకేతిక సాధికారత, సామాజిక సమానత్వం తీసుకురావడంలో సాంకేతికత పాత్ర గురించి వివరిస్తూ, జీవితకాల అభ్యాసం వలన వనగూరే లాభాలను గురించి ప్రకటిస్తారు. ఈ పుస్తకంలో ఒక మంచి అంశం చాలా చోట్ల కేస్ స్టడీస్ (ఉదాహరణ అధ్యయనాలు) ను తీసుకోవడం. డాక్టర్ అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను పునాదిగా చేసుకుని నేటి కాలపు స్థితులకు అనుగుణంగా పౌరులను చైతన్యపరచడంలో రచయిత సఫలీకృతులు అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూరదృష్టి గల సంఘ సంస్కర్త మరియు భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి. ఈ ఆదర్శాల గురించి లోతైన అంతర్దృష్టులను అందించారు. డిజిటల్ వ్యాపారంలో సైతం అసమాన్యతల తొలగింపు గురించి చర్చిస్తూ పౌర నిర్వహణ లేదా పౌర భాగస్వామ్యం గురించి రాసిన విధానం పౌరులందరినీ ఆలోచింపజేస్తుంది. అట్టడుగు వర్గాలకు అందని కొన్ని ప్రయోజనాలు, అనుమతి అసమాన్యతల గురించి చర్చిస్తూ భౌగోళిక అంశాలను గురించి వివరించడం, ఆన్లైన్ అభ్యాస మార్గాలలో అసమానతల నిర్మూలనకు మార్గాలను నిర్దేశించడం జరిగింది. అసమానతలు దేశ ఆర్థికాభివృద్ధిపై చూపే ప్రభావం, వ్యవస్థాపకత లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి కారణాలను తెలియజేస్తుంది ఒక అధ్యాయం. ఇక ఆన్లైన్ అంశాలలో బ్లాగింగ్, వీడియోల ద్వారా సమాచార ప్రచారం, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార ప్రసారం మొదలైన ఎన్నో విషయాలను చర్చిస్తాయి ఇందులోని అధ్యాయాలు. నేటి కాలంలో టెలీ మెడిసిన్, ఆన్లైన్ హెల్త్ కేర్ మొదలైన అంశాలను కూడా తన పుస్తకంలో చేర్చారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ సూత్రాల ఆధారంగా సాంకేతిక అసమానతలను అధిగమించేందుకు సోపానాలను ఒక అధ్యాయంలో వివరించారు రచయిత. సమాచారం సాధికారతకు సోపానం అంటారు రచయిత. అందుకే డిజిటల్ గ్రంధాలయాలకు ఓపెన్ యాక్సెస్ గురించి మాట్లాడుతారు. అందరికీ సామాన విద్య గురించి మాట్లాడుతూ ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అంటారు. డిజిటల్ విద్య అంతరాన్ని తగ్గించడంపై అందరం దృష్టి పెట్టాలి. అలాగే డిజిటల్ లిటరెసీను పెంపొందించే కార్యక్రమాల ఆవశ్యకత, డిజిటల్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జ్ఞానసముపార్జనను ప్రజాస్వామీకరించడం వంటి విలువైన అంశాలను ఈ పుస్తకంలో చేర్చారు. ఈ ప్రక్రియలో భాగంగా మనం ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలకు పరిష్కారాలను, డాక్టర్ అంబేడ్కర్ చారిత్రక ఉద్యమాలను ఉదాహరణలుగా చూపుతూ చర్చించారు. డిజిటల్ వేదికల సద్వినియోగం, అంతర్జాతీయ సహకారం యొక్క ఆవశ్యకత, వెసులుబాటు అవకాశాలు, మార్గాలు, సమాచార భద్రత, సమాచార జీవావరణ వ్యవస్థ (డేటా ఏకొ సిస్టమ్), సమాచార దోపిడీ వలన కలిగే హాని, సమాచార ఆధారిత వివక్ష, సమాచారం యొక్క నైతిక వినియోగం, నిఘా పటిష్టత మొదలైనవాటి గురించిన సంక్షిప్త సమాచారం ఈ పుస్తకంలో ఉంది. రచయిత గోప్యతను మానవ హక్కుగా పేర్కొంటూ రాసిన అధ్యాయం అందరూ చదివి తీరాలి. ఈ అంశాలన్నింటినీ డాక్టర్ అంబేడ్కర్ దృష్టికి, సిద్ధాంతాలకీ అన్వయించి వివరించిన విధానం బావుంది. అదే విధంగా ఆన్లైన్ నేరాలు, సైబర్ బుల్లియింగ్ మొదలైన వేధింపుల గురించి, ఫిర్యాదు పద్ధతుల గురించి ఈ పుస్తకంలో విపులంగా ఉంది. సురక్షితమైన ఆన్లైన్ వేదికల సృష్టి యొక్క ఆవశ్యకతను వివరించారు. కృత్రిమ మేధస్సు సాంకేతికతలో పురోగతి, తద్వారా ఎదుర్కొనే సవాళ్ళు, నైతిక అనిశ్చితి గురించి వివరిస్తూ, సామాజిక సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ గవర్నెన్స్, డిజిటల్ వ్యవస్థాపకతల గురించి డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలతో పోలుస్తూ కొన్ని అధ్యాయాలు రాశారు. వెనుకబడిన సమూహాలకు అందుబాటులో సాంకేతికత ఉండాలన్నది ఆయన వాదన. తద్వారా సామాన అవకాశాలు దక్కుతాయని ఉదాహరణ అధ్యయనాల ద్వారా నిరూపించిన తీరు అమోఘం. డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలను నేటి సాంకేతితక ద్వారా ప్రచారం చేయడానికి పూనుకోవాల్సిన ఆవశ్యకత అవగతం అవుతుంది చదివిన ప్రతి ఒక్కరికీ. అంబేడ్కర్ గురించి అందరికీ తెలియాలి! నేటి సమాజానికే కాదు, ఏ కాలానికైనా ఆయన దార్శనికత వెలుగు చూపే దివ్వె అవుతుందని తెలియాలి! అంబేద్కర్ భావజాలాన్ని డిజిటల్ యుగానికి చేర్చాలనే ఆలోచన భారతదేశ పౌరులతో పాటు మొత్తం ప్రపంచ పౌరులలో అంబేద్కర్ భావజాలం యొక్క అక్షరాస్యతను మెరుగుపరుస్తుందన్నది వాస్తవం. ఈ పుస్తకం మన అందరి భవిష్యత్ ఆలోచనా సరళి మార్పును, భవిష్యత్ తరాలకు అంబేడ్కర్ ఆశయాలను చేర్చేందుకు తీసుకోవలసిన చర్యల ఆవశ్యకతను సూచిస్తుంది. శరవేగంతో పరుగులు పెడుతున్న అభివృద్ధి భారతదేశాన్ని ఏ స్థాయిలో నిలబెట్టగలదో అంచనా వేసేందుకు కొన్ని అధ్యయనాలు, కొన్ని ఆచరణలు అవసరం అని అందరికీ తెలుసు. భారతదేశ భవిష్యత్తు గురించి అత్యున్నత దృక్పథాన్ని కలిగి ఉన్న జాతీయ నాయకుడికి భిన్నమైన భావజాలం ఉంది. దూరదృష్టి కలిగిన ఆ దార్శనికుని మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అందిపుచ్చుకోగలిగితే, అది భారతదేశాన్ని అభివృద్ధిలో శిఖరాగ్రంలో ఉంచగలదన్న విషయాన్ని అర్థం చేసుకుని, సాంకేతికత పరంగా కూడా ఆ భావజాలాన్ని వినియోగించుకోగలగాలి. ఇంత విపులంగా అంబేడ్కర్ ఆశయాల సాధన కొరకు నేటి కాలం సాంకేతికతను సమ్మిళితం చేయగలిగే విధానాలను సూచిస్తూ రచించిన ఈ పుస్తకం ఎంతో మంది పరిశోధకులు, పౌరులు, విద్యార్థులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక పరిజ్ఞాన అభ్యాసకులకు మార్గదర్శిగా ఉండగలదు. - విజయభాను కోటే ఫ్రీలాన్స్ రైటర్, టీచర్, హ్యుటగాజీ ఎక్స్పర్ట్ 8247769052 (పుస్తకం దొరుకు చోటు: Amazon: Dr. Ambedkar's Ideology in The Digital Era https://a.co/d/9erV5My) -
అమర్ రచన "మూడు దారులు" పై.. కల్లూరి భాస్కరం సమీక్ష!
సహచర పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ తన నాలుగున్నర దశాబ్దాల అనుభవసారం రంగరించి రచించిన ‘మూడు దారులు - రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు’ అనే ఈ పుస్తకంలో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి. ‘రాజకీయాలు-ఒక సమాలోచన’ అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ రచనలో అమర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు-మొదట ఆంధ్రరాష్ట్రాన్ని, ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్ను - ఏకచ్చత్రంగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి, కాంగ్రెస్ ముఠాకలహాల గురించి, ఒకరినొకరు పడదోసుకుంటూ సాగించిన రాజకీయక్రీడ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి వివరించి ఈ తొలి అధ్యాయం ద్వారా ఈ పుస్తకానికి ఒక చారిత్రక ప్రతిపత్తిని సంతరించారు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయాన్ని ‘చరిత్రను తిరగ తోడటం దేనికి?’ అనే ప్రశ్నతో అమర్ ప్రారంభిస్తారు. ‘చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా, రావచ్చు కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది’ అంటూ ప్రారంభంలోనే ఈ పుస్తకంలోని థీమ్కి ఒక డెప్త్ తీసుకువచ్చారు, దీనిని చరిత్రగా చూపించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఒకే కాలంలో రాజకీయరంగ ప్రవేశం చేయడం, భిన్నమైన దారుల్లో వెళ్లడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశం ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ఈ విషయాల్లో ఎక్కడా రచయిత బేసిక్ ఫ్యాక్ట్స్తో కాంప్రమైజ్ కాలేదు. బేసిక్ ఫ్యాక్ట్స్పై, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలపై ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్ను డిస్టార్ట్ చేయడం గానీ, కప్పిపుచ్చడం గానీ చేయలేదని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ముగ్గురు నాయకులూ, వారు అనుసరించిన దారుల గురించి ప్రధానంగా చర్చించిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వైస్రాయి ఘట్టం చదువుతున్నప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఒక సినిమాకు సబ్జెక్టు అది. అమర్ ఈ పుస్తకంలో బేసిక్ ఫ్యాక్ట్స్తో కాంప్రమైజ్ అవలేదనడానికి ఇంకో ఉదాహరణ ఏం చెబుతానంటే, వైస్రాయ్తో ముడిపడిన ఈ మొత్తం ఉదంతంలో ఎన్టీఆర్ స్వయంకృతం కూడా చాలా ఉంది. రాజకీయంగా అనుభవం లేకపోవడం, చెప్పినా వినకపోవడం, మొండితనం వంటివి కూడా దీనికి కొంత దోహదం చేశాయి. ఆ సంగతినీ అమర్ ప్రస్తావించారు. ఆవిధంగా రెండువైపులా ఏం జరిగిందో చిత్రించారు. అలాగే లక్ష్మీపార్వతి జోక్యాన్నీ ఆయన దాచలేదు. ఆ తరువాత మీడియా! ఇందులో ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి, అల్లుళ్లతో సహా ఆయన కుటుంబ సభ్యుల పాత్ర, ఆయన అర్ధాంగి పాత్ర.. వీటన్నిటితో పాటు మీడియా కూడా ప్రధాన పాత్రధారి. ఎన్టీఆర్ అధికారచ్యుతికి సంబంధించిన మొత్తం ఉదంతంలో మీడియా పాత్ర గురించి, మీడియా వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం రావాలని! ప్రీ-తెలుగుదేశం, పోస్ట్-తెలుగుదేశం అనే డివిజన్తో తెలుగు మీడియా చరిత్ర రాయాలని నేనంటాను. నాదెండ్ల భాస్కరరావు చేసిన దానికి చంద్రబాబు చేసినది ఒకవిధంగా పొడిగింపే. మొత్తం మీద అమర్ ఈ పుస్తకంలో పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలనే అందించారు. ప్రత్యక్షసాక్షిగా తన దృక్కోణాన్ని కలుపుకుంటూ వాటిని కథనం చేశారు. చివరిగా జగన్ మోహన్ రెడ్డిగారి విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, ఇతరత్రా చర్యలు, విధానాల గురించి చెప్పారు. ఈ అధ్యాయంలో కూడా అమర్ ఫ్యాక్ట్స్తో రాజీపడలేదనే విశ్వసిస్తున్నాను. (ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు పుస్తక పరిచయ సభలో పాత్రికేయ ప్రముఖులు, రచయిత కల్లూరి భాస్కరం చేసిన సమీక్ష నుంచి ముఖ్య భాగాలు). ఇవి చదవండి: Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement