Mystery Case
-
మర్డర్ మిస్టరీని ఛేదించిన సిగరెట్ పీక
ఎంత ప్రొఫెషనల్ నేరగాడైనా నేరానికి సంబంధించి ఏదో ఒక క్లూ వదులుతాడంటారు. అది నిజమేనని మరోసారి నిరూపించిన ఉదంతమిది. అప్పుడెప్పుడో 1984లో జరిగిన ఓ హత్య మిస్టరీని 2014లో చేధించారు. హంతకుడు తాగి పడేసిన సిగరెట్ పీకే అతని పీకకు చుట్టుకుంది. అత్యాధునికమైన డీఎన్ఏ ప్రొఫైలింగ్ మనవాన్ని పట్టించింది. 2021లో అతనికి శిక్ష పడింది.బ్రిటన్లో గ్లాస్గోకు చెందిన 58 ఏళ్ల మేరీ మెక్ లాఫ్లిన్కు రెండు పెళ్లిళ్లయ్యాయి. మొత్తం 11 మంది పిల్లలున్నారు. వారు వేర్వేరు నగరాల్లో ఉంటడంతో ఒక్కతే ఉంటోంది. కొడుకు మార్టిన్ కలెన్ (24) వారానికోసారి తల్లిదగ్గరకు వచ్చేవాడు. 1984 అక్టోబర్ 2న తల్లిని చూసేందుకు వచ్చినప్పుడు ఫ్లాట్ నుంచి భయంకరమైన వాసన వచ్చింది. లోపల మేరీ శవమై, మంచం మీద పడుంది. ఐదు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు పోస్టుమార్టంలో తేలింది. సెప్టెంబర్ 26న ఆమె పబ్లో గడిపిందని, తర్వాత నడుచుకుంటూ ఇంటికెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దారిలో ఆగి సిగరెట్ కొనుక్కుందని కూడా చెప్పారు. బూట్లు చేతబట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను వెంబడించడం చూసినట్టు ఓ ట్యాక్సీ డ్రైవర్ వాంగ్మూలమిచ్చాడు. అయినా కేసు ఎటూ తేలలేదు. ఒకానొక దశలో ఆమె పిల్లలపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఏడాది దర్యాప్తు తర్వాత కేసును మూసేశారు. తర్వాత మరో నాలుగుసార్లు దర్యాప్తు చేసినా లాభం లేకపోయింది. 30 ఏళ్ల తరువాత 2014లో ఈ హత్యకు సంబంధించిన సాక్షాధారాలను మరోసారి సమీక్షించాల్సిందిగా స్కాటిష్ క్రైమ్ క్యాంపస్లో పనిచేస్తున్న జోవాన్ కోక్రాన్ను మేరీ కుమార్తె గినా మెక్ గావిన్ అడిగారు. 1984ల్లో డీఎన్ఏ ప్రొఫైలింగ్ గురించి అంతగా తెలియకపోయినా అన్ని సాక్ష్యాలనూ భద్రపరిచారు. వాటిలోని మేరీ జుట్టు, గోరు వంటివాటిని డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేశారు. లివింగ్ రూమ్లో కాఫీ టేబుల్ మీది యాష్ ట్రేలోని ఉన్న సిగరెట్ పీక కీలక క్లూగా మారింది. పీకకు అంటిన డీఎన్ఏ గ్రాహం మెక్ గిల్ అనే నేరస్తుని డీఎన్ఏతో సరిపోలింది. అతను పలు లైంగిక నేరాల కేసుల్లో తీవ్ర శిక్షలు అనుభవిస్తున్నాడు. సరే, కేసు వీడింది కదా అనుకుంటే మరో చిక్కు వచ్చి పడింది. మేరీ హత్యకు గురైన సమయంలో మెక్ గిల్ ఖైదీగా ఉన్నట్టు రికార్డులు చూపించాయి. జైల్లో ఉంటే హత్య ఎలా చేయగలడా అని అధికారులు తల పట్టుకున్నారు. నేషనల్ రికార్డ్స్ ఆఫ్ స్కాట్లాండ్లో విచారించిన మీదట చిక్కు ముడి వీడింది. మేరీ హత్య జరిగిన సమయంలో మెక్ గిల్ ఐదు రోజులు పెరోల్పై బయట ఉన్నట్టు తేలింది. దాంతో 2019లో మెక్గిల్ను అరెస్టు చేశారు. దోషిగా నిర్ధారించి 2021లో 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మేరీ హత్య సమయంలో మెక్గిల్కు 22 ఏళ్లు. 59 ఏళ్ల వయసులో అతనికి శిక్ష పడింది. ‘‘తల్లి హంతకుడిని జీవితకాలంలో చూస్తామనుకోలేదు. ఆశే మమ్మల్ని నడిపించింది. మొత్తానికి ఉపశమనం కలిగింది’’అని గినా అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2016లో గల్లంతు.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ
ఢిల్లీ/చెన్నై: ఎనిమిదేళ్ల కిందటి భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఏఎన్-32 మిస్సింగ్ మిస్టరీ వీడింది. బంగాళా ఖాతం అడుగున విమాన శిథిలాల్ని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇందులో ప్రయాణించిన 29 మంది సజీవంగా లేరనేది దాదాపుగా నిర్ధారణ అయ్యింది. 2016లో బంగాళాఖాతం మీదుగా 29 మందితో వెళ్తున్న విమానం జాడ లేకుండా పోయింది. అయితే అది సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఓ అంచనాకి వచ్చిన అధికారులు.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించిన ఆటానమస్ యుటిలిటీ వెహికల్(AUV) ద్వారా అన్వేషణ ప్రారంభించారు. చివరకు.. ఇన్నేళ్ల తర్వాత చెన్నై తీరానికి దాదాపు 310 కి.మీ దూరంలో సముద్రగర్భంలో కూలిపోయిన విమానం శిథిలాలు కనిపెట్టారు. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించిన జరిపిన అన్వేషణలో పలు అంశాల పరిశీలన తర్వాత.. సముద్రం అడుగున కనిపించిన శిథిలాలు ఏఎన్-32వేనని అధికారులు నిర్ధారించుకున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. జూలై 22, 2016 ఉదయం ఏం జరిగిందంటే.. ఉదయం 8.30ని ప్రాంతంలో IAF ఆంటోనోవ్ An-32, చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరింది. మూడు గంటల తర్వాత అది గమ్యస్థానం అయిన అండమాన్ ,నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్కు చేరాల్సి ఉంది. ఎఎన్-32 రకానికి చెందిన విమానాలు చాలా బరువుతో పాటు బలంతో ఉంటాయి. పర్వతాలు, ఎడారుల్లో ఈ ఫ్లైట్ అధికంగా సంచరిస్తుంది. వారానికోసారి పోర్ట్బ్లెయిర్కు ఈ రవాణా విమానం వెళ్లాల్సి ఉంది. ఆతేదీ సిబ్బందితో సహా మొత్తం 29 మంది బయల్దేరారు. అయితే పోర్ట్ బ్లెయిర్లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయిన INS ఉత్క్రోష్లో అది ల్యాండ్ కాలేదు. బయల్దేరిన 15 నిమిషాలకే చెన్నై ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా రాడార్తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు ధృవీకరించుకుని రంగంలోకి దిగారు. అదృశ్యమైన విమానం కోసం భారతదేశం తీవ్రంగా వెతికింది. భారత వైమానిక దళం అణువణువు గాలించినా ఫలితం లేకపోవడంతో.. సెప్టెంబర్లో బాధిత కుటుంబ సభ్యులకు ‘‘విమానాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని, విమానంలో ఉన్నవారిని చనిపోయినట్లు భావించి ప్రకటించడం తప్ప వేరే మార్గం లేద’’ని లేఖలు రాసింది. అలా.. విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చునని అధికారులు అప్పుడు భావించారు. విమానం కోసం ఐదు యుద్ధనౌకలు సముద్ర జలాల్లోకి గాలింపు చర్యల నిమిత్తం బరిలోకి బయల్దేరాయి. వీటితో పాటు 13 ఫుల్ స్పీడ్ పడవలను కూడా పంపారు. అయితే జాడను గుర్తించేందుకు ఉపయోగపడే పరికరాలను ఎయిర్క్రాఫ్ట్ మోసుకెళ్లలేదనే విషయం దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సెర్చ్ ఆపరేషన్కు తీవ్ర విఘాతం ఏర్పడింది. అలా.. ఎయిర్క్రాఫ్ట్ కోసం భారత్ జరిపిన అతిపెద్ద గాలింపు చర్యగా మిగిలిపోయింది ఈ ఆపరేషన్. -
కూతురు జాడ కోసం తుది శ్వాస వరకు ఆరాటపడ్డ ఓ తల్లి వ్యథ!
కాలం ఎప్పుడూ.. బంధాల కోసం పాకులాడే అనురాగాలతో పాటు, ఆ బలహీనతలతో ఆటలాడుకునే నైజాన్ని సరితూకమేస్తుంది. జరిగినదాంట్లో పాపపుణ్యాలను పక్కనపెడితే చివరికి మిగిలిన వ్యథే.. ఎన్నో హెచ్చరికలను జారీ చేస్తుంది. సుమారు యాభై ఏళ్ల క్రితం అదృశ్యమైన ‘అమీ బిల్లిగ్’ అనే అమ్మాయి ఉదంతం అలాంటిదే. అమెరికా, ఫ్లోరిడాలోని మయామిలో ‘కోకోనట్ గ్రోవ్’ సమీపంలో నివసించే నెడ్ బిల్లిగ్, సుసాన్ బిల్లిగ్ దంపతులు.. కూతురు అమీ, కొడుకు జోస్తో కలసి సంతోషంగా జీవించేవారు. తండ్రి నెడ్ ఆర్ట్ గ్యాలరీ నడుపుకుంటుంటే.. తల్లి సుసాన్ ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తూ .. వచ్చినదానితోనే పిల్లల్ని ప్రాణంగా చూసుకునేవారు. జోస్ కంటే అమీ సుమారు పదేళ్లు పెద్దది. అమ్మాయికి యుక్త వయసు వచ్చేనాటికి.. ఆ కుటుంబాన్ని ఊహించని ఉపద్రవం ముంచెత్తింది. అది 1974 మార్చి 5, మధ్యాహ్నం 12 దాటింది. పదిహేడేళ్ల అమీ.. స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. రాగానే ఆర్ట్ గ్యాలరీకి కాల్ చేసి.. తండ్రితో మాట్లాడింది. ‘డాడ్.. నేను మా స్నేహితులతో కలసి హోటల్లో లంచ్కి వెళ్తున్నా.. నాకు 2 డాలర్లు కావాలి’ అని కోరింది. ‘సరే.. గ్యాలరీకి వచ్చి తీసుకెళ్లమ్మా’ అన్నాడు నెడ్. వెంటనే రెడీ అయ్యి.. కెమెరా పట్టుకుని.. ‘అటు నుంచి అటే వెళ్తా మమ్మీ’ అని తల్లికి చెప్పి.. తండ్రి దగ్గరకు బయలుదేరింది అమీ. ఇంటి నుంచి గ్యాలరీకి పావుగంట పడుతుంది. దాంతో కాసేపట్లో కూతురు వస్తుందని నెడ్ ఎదురు చూడసాగాడు. గంటదాటినా రాలేదు. ‘ఒకవేళ డబ్బులు వద్దనుకుని వెళ్లిపోయిందేమో’ అని సరిపెట్టుకున్నాడు నెడ్. సాయంత్రం ఇంటికెళ్లి చూస్తే.. కూతురు ఇంకా ఇల్లు చేరలేదు. మధ్యాహ్నం వెళ్లిన అమ్మాయి.. రాత్రి కావస్తున్నా రాకపోయేసరికి భయమేసింది. పైగా అమీ డబ్బులు తీసుకోవడానికి తన దగ్గరకు కూడా రాలేదనే భర్త మాటలు విని.. సుసాన్కి గుండె ఆగినంత పనైంది. వెంటనే ఆమె స్నేహితుల్ని ఆరా తీస్తే.. తెలియదనే సమాధానమే వినిపించింది. పోలీసుల్ని ఆశ్రయిస్తే.. ‘ఈ రోజుకి చూడండి.. రేపటికీ రాకపోతే కేసు నమోదు చేసుకుందాం’ అనే బదులొచ్చింది. మరునాడు కూడా అమీ అడ్రస్ లేకపోయేసరికి.. అన్నమాట ప్రకారం పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వెతుకులాటలోనే వైల్డ్వుడ్ ఎగ్జిట్ అనే హైవే రోడ్లో అమీ తీసుకెళ్లిన కెమెరా దొరికింది. దానిలోని ఏ ఫొటో.. తదుపరి విచారణకు సహకరించలేదు. కొన్ని రోజులకు.. నెడ్ దంపతులకు ఓ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఆ కాల్స్లో ప్రతిసారి.. ‘మమ్మీ, డాడీ కాపాడండి’ అంటూ ఏడ్చే అస్పష్టమైన అమ్మాయి స్వరం వారిని వణికించింది. ‘పోలీసులకు చెప్పకుండా 30 వేల డాలర్లు ఇస్తే.. మీ అమ్మాయిని వదిలిపెడతాం.. లేదంటే చంపేస్తాం’ అనే హెచ్చరిక.. వారి కన్నపేగును మెలిపెట్టింది. దాంతో వారు చెప్పిన సమయానికి.. అడిగినంత డబ్బు పంపించేశారు. అయితే రోజులు గడిచినా అమీ తిరిగి రాలేదు. కనీసం ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ కూడా లేవు. తిరిగి కాల్ చేస్తే కలవలేదు. దాంతో నెడ్ దంపతులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూపీ లాగిన పోలీసులు.. ఆ బెదిరింపు కాల్స్ చేసింది చార్ల్స్, లారే గ్లాసర్ అనే కవలలని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. చివరికి వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే అలా చేశారని.. అమీ మిస్సింగ్కి వాళ్లకి ఏ సంబంధం లేదని తేలింది. అమీ తల్లిదండ్రుల ఎమోషన్స్తో ఆడుకున్నందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. మరికొన్ని రోజులకు.. ‘ది అవుట్లాస్’ అనే మోటర్సైకిల్ గ్యాంగ్.. అమీని కిడ్నాప్ చేసుండొచ్చు అనే కొందరు స్థానికుల అనుమానం.. నెడ్ దంపతుల్ని బెదరగొట్టింది. దాంతో నెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు.. పోలీసులతో సంబంధం లేకుండా.. ఓ అనుమానిత బైక్ ముఠా సభ్యులతో నెడ్ కుటుంబానికి రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. అమీ ఫొటోలు చూసిన ఆ ముఠా సభ్యుల్లో కొందరు.. ‘మేము అమీనైతే చూడలేదు. కానీ, గతంలో కొందరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్ముకున్న మాట వాస్తవమే’ అని ఒప్పుకున్నారు. అందులో కొందరు కేవలం క్రెడిట్ కార్డ్స్ కోసం, బైక్స్ కోసమే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, విక్రయించినట్టు చెప్పారు. అమీ వివరాలు ఇతర బైకర్స్ నుంచి సంపాదిస్తామని నెడ్ ఫ్యామిలీకి మాటిచ్చారు. కానీ వాళ్ల నుంచి ఆ తర్వాత ఎలాంటి సహాయమూ అందలేదు, సమాచారమూ రాలేదు. అయితే అంతకు ఐదేళ్ల క్రితం బైకర్ ముఠాకు చిక్కిన ‘గినా ఆండ్రూ’ అనే అమ్మాయి తప్పించుకుని క్షేమంగా తిరిగి రావడంతో.. అమీ కూడా అలాగే తిరిగి వస్తుందని ఆశపడింది నెడ్ కుటుంబం. కానీ అలా జరగలేదు. అమీ తల్లి సుసాన్.. కూతురి ఫొటోలు పట్టుకుని పిచ్చిదానిలా చాలా చోట్ల వెతికింది. ఆ క్రమంలోనే తమ ఇంటికి 160 మైళ్ల దూరంలో ఉన్న ఒక కన్వీనియెన్స్ స్టోర్ మేనేజర్ని కలిసింది. అమీ ఫొటో చూసి గుర్తుపట్టిన ఆ మేనేజర్.. ‘అమీ ఇద్దరు బైకర్స్తో కలసి చాలాసార్లు మా స్టోర్కి వచ్చింది. ఆమె వెజిటేరియన్ కావడంతో తను నాకు బాగా గుర్తుంది’ అని చెప్పాడు. అతని మాట విన్న కొన్ని పత్రికలు.. అమీ తన ఇష్టప్రకారమే కుటుంబానికి దూరంగా పారిపోయిందనే కథనాలను అల్లాయి. ఆ ఊహాగానాల్లో ఏడాది గడిచిపోయింది. సుసాన్ మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదు. ఎవరి మాటలూ నమ్మలేదు. ఒకరోజు ఓ కొత్త నంబర్ నుంచి నెడ్ కుటుంబానికి కాల్ వచ్చింది. ‘నా పేరు జాన్సన్.. అమీ గురించి మరచిపొండి, తనని వెతకొద్దు.. నేనో సెక్స్ రాకెట్ సభ్యుడ్ని. తనని బంధించింది నేనే’ అని బెదిరించాడు అవతలి వ్యక్తి. కాసేపటికే ఫోన్ కట్ అయ్యింది. అతడి నుంచి వరసగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అతడు పబ్లిక్ బూత్ నుంచి కాల్స్ చేస్తుండడంతో పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆ బెదిరింపు కాల్స్ నెడ్ కుటుంబాన్ని మరింత కుంగదీశాయి. ‘అమీ మాట వినలేదని నాలుక కత్తిరించాం. మీరు ఇలానే అమీ కోసం వెతుకుతూ ఉంటే ఆమెను చంపేస్తాం. అమీని కిడ్నాప్ చేసినట్లే.. నిన్ను కూడా కిడ్నాప్ చేస్తాం’ అని సుసాన్ని వీలు చిక్కినప్పుడల్లా హడలెత్తించాడు జాన్సన్. అసభ్యకరమైన పదజాలంతో హింసించేవాడు. వేధింపులు ఎక్కువైనా.. ఏదో ఒకరోజు జాన్సన్.. అమీ గురించి నిజం చెబుతాడేమోనన్న ఆశతో ఫోన్ నంబర్ మార్చలేదు నెడ్ కుటుంబం. ఇక 1975 చివరిలో డేవిడ్ అనే ఒక ముఠా సభ్యుడు సుసాన్ని వ్యక్తిగతంగా కలిశాడు. ‘ఒక వార్తాపత్రికలో అమీ ఫొటో చూసి, గుర్తుపట్టి వచ్చాను. ఆమె నాకు బాగా తెలుసు’ అని చెప్పాడు. ‘ఎలా తెలుసు?’ అని అడిగితే.. ‘చట్టవిరుద్ధంగా ఒక ముఠాకి కొంత డబ్బు ఇచ్చి.. కొన్ని నెలలకుగాను అమీని నేను కొన్నాను. ఆమె నా దగ్గరున్నంత కాలం దిగులుగానే ఉంది. మూగది కావడంతో తన బాధ నాకు అర్థం కాలేదు’ అని చెప్పాడు. ఆ అమ్మాయి మూగది అనడంతో.. జాన్సన్ మాటలు గుర్తొచ్చాయి సుసాన్కి. అమీ ఒంటిమీదుండే రహస్య పుట్టుమచ్చల వివరాలు డేవిడ్ నోట వినడంతో.. తన నమ్మకం బలపడింది. అయితే సుసాన్ ఆవేదన చూడలేకపోయిన డేవిడ్.. అమీని వెతకడంలో సాయం చేస్తానని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే డేవిడ్.. ఒకరోజు సుసాన్ని అసాంఘిక ప్రదేశానికి తీసుకెళ్లి.. అక్కడున్న ఓ ముఠా దగ్గర అమీ గురించి ఆరా తీశాడు. తీరా వారికి డేవిడ్ మీద అనుమానం వచ్చి దాడికి దిగారు. అదృష్టవశాత్తూ సుసాన్ తప్పించుకోగలిగింది. సరిగ్గా ఐదువారాలకు కాళ్లు, చేతులకు కట్లతో డేవిడ్.. సుసాన్ దగ్గరకు వచ్చాడు. ఓక్లహామా, తుల్సాలోని ఒక బార్లో అమీ పనిచేస్తున్నట్లు తెలిసిందని సమాచారమిచ్చి వెళ్లిపోయాడు. తిరిగి ఎప్పుడూ సుసాన్ని అతడు కలుసుకోలేదు. కూతురు మీద బెంగతో సుసాన్కి గుండెపోటు వచ్చింది. అయినా సరే.. కూతురి కోసం తుల్సా వెళ్లి.. అక్కడే కొన్ని నెలల పాటు ఉండి.. సమీపంలోని బార్లు, టాటూ సెంటర్స్ అన్నీ వెతికింది. అయితే అమీ ఫొటో చూసిన కొందరు.. డేవిడ్ చెప్పినట్లే ఆమె మూగ అమ్మాయిగా గుర్తు చేసుకున్నారు. ఏళ్లు గడిచాయి. జాన్సన్ వేధింపులూ ఆగలేదు. సుసాన్కి మరో రెండుసార్లూ గుండెపోటు వచ్చింది. అమీ మిస్ అయిన నాటికి బాలుడిగా ఉన్న జోస్ పెద్దవాడయ్యాడు. తల్లితో పాటు తన అక్క కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇక తండ్రి నెడ్ 1993లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడ్డాడు. చనిపోయే ముందు చివరిసారిగా అమీని చూడాలని ఆరాటపడ్డాడు. జాన్సన్ కాల్ కోసం ఎదురు చూసిన సుసాన్.. నెడ్ పరిస్థితి వివరించి.. తన కూతుర్ని చూపించమని వేడుకుంది. అయినా జాన్సన్ నుంచి సమాధానం రాలేదు. చివరికి నెడ్ తన కోరిక తీరకుండానే మరణించాడు. హెన్రీ(ఎడమవైపు), అమీ(కుడివైపు) సుమారు 20 ఏళ్లకి.. పోలీసులు జాన్సన్ని అదుపులోకి తీసుకోగలిగారు. అయితే అతడి పూర్తిపేరు హెన్రీ జాన్సన్ బ్లెయిర్ అని.. కస్టమ్స్ డిపార్ట్మెంట్ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. తీరా అధికారులు తమదైన శైలిలో విచారిస్తే.. ‘అమీ నాకు తెలియదు. కేవలం సెక్సువల్ ప్లెజర్ కోసమే నెడ్ కుటుంబానికి అలా బూటకపు కాల్స్ చేసేవాడ్ని’ అని చెప్పాడు. అతడో ‘మానసిక రోగి, మద్యానికి బానిస’ అని అతడి సన్నిహితులు తెలిపారు. అతడు మరికొందరికి చేసిన ఇలాంటి బూటకపు కాల్స్ అధికారికంగా నిరూపితమయ్యాయి. దాంతో నెడ్ కుటుంబానికి హెన్రీ జాన్సన్ కలిగించిన మనోవ్యథకు జైలు శిక్ష పడింది. అయితే హెన్రీ జాన్సన్.. అమీకి సుపరిచితుడేనని తేల్చాయి కొన్ని ఆనవాళ్లు. అమీ ఫొటోస్లో ఉన్న ఒక తెల్ల కారు.. హెన్రీ జాన్సన్ దగ్గరుంది. అలాగే అమీ తన డైరీలో ఒక చోట ‘హంక్ అనే స్నేహితుడు నన్ను దక్షిణ అమెరికా తీసుకెళ్తా అన్నాడు’ అని రాసుకుంది. ఆశ్చర్యకరంగా కస్టమ్స్ ఏంజెంట్గా హెన్రీ జాన్సన్ మారుపేరు హంక్. అయితే స్పష్టమైన మరే ఇతర సాక్ష్యాలు లేకపోవడంతో హెన్రీ ఈ కేసు నుంచి బయట పడ్డాడు. ఇక 1997లో ఒక మహిళ.. పోలీస్ స్టేషన్కి వచ్చి ‘పాల్ బ్రాండ్’ అనే వ్యక్తి నా భర్త, మోటర్సైకిల్ ముఠా మాజీ సభ్యుడు, అతడు చనిపోతూ అమీ వివరాలు చెప్పాడు’ అని షాకిచ్చింది. ఆమె మాటలకు అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. పాల్ ఆమెతో చెప్పిన మాటల సారాంశం ఇలా ఉంది. ‘ఒకసారి అమీ.. మోటర్సైకిల్ ముఠా సభ్యులను అవమానించిందనే కక్షతో ఆమెను కిడ్నాప్ చేసి, ఫ్లోరిడా ఎవర్గ్లేడ్స్ పార్టీకి తీసుకెళ్లాం. ఆమెపై పలుమార్లు లైంగికదాడి చేశాం. ఆమెను లొంగదీసుకోవడానికి చాలాసార్లు డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడంతో ఆమె చనిపోయింది. దాంతో ఆ రాత్రికే ఓ చిత్తడి నేలలో ఆమెను పూడ్చిపెట్టాం’ అని చనిపోయే ముందు భార్యతో చెప్పాడట పాల్. దీన్ని నమ్మేందుకు ఒక ఆధారం ఉంది. అమీ మిస్ అయిన కోకోనట్ గ్రోవ్కి.. పాల్ చెప్పిన క్రైమ్ జరిగిన ఎవర్గ్లేడ్స్కి మార్గం మధ్యలోనే అమీ తీసుకెళ్లిన కెమెరా దొరికింది. మొదట పాల్ మాటల్ని నమ్మిన సుసాన్ కుటుంబం.. అమీకి స్మారక చిహ్నం కూడా కట్టించింది. కానీ పాల్ పబ్లిసిటీ కోసం ఈ కథను సృష్టించి ఉంటాడేమో అనే ఆలోచన రావడంతో మళ్లీ అమీ కోసం వెతకడం మొదలుపెట్టింది ఆ కుటుంబం. దురదృష్టవశాత్తు సుసాన్ .. 2005, జూన్ 7న ఎనభై ఏళ్ల వయసులో మరణించింది. ఇప్పుడు అమీని వెతికే బాధ్యతను.. జోస్ అందుకున్నాడు. అసలు.. అమీ ఎవరినైనా గుడ్డిగా నమ్మి మోసపోయిందా? లేక బలవంతంగా అపహరణకు గురైందా? హెన్రీ జాన్సన్ మాటల్లో వాస్తవమెంత? పాల్ తన భార్యకు చెప్పింది నిజమేనా? డేవిడ్ ఏమయ్యాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే. ∙సంహిత నిమ్మన (చదవండి: -
అప్పటికే సూపర్ స్టార్,రెండో పెళ్లి.. ఇప్పటికీ మిస్టరీగా చమ్కీలా మరణం
మనసులో పుట్టిన మాటలకు బాణీ కట్టి రాగం అందుకుంటే, అది మహామహా జనసందోహాలను కూడా ఏకం చేసి ఉరకలేయిస్తుంది. సై.. సై.. అంటూ ఉర్రూతలూగిస్తుంది. విప్లవాలను, ఉద్యమాలను, సంస్కరణలను జతచేర్చి.. తరతరాలకు పాఠమవుతుంది. అయితే అదే రాగం కొందరికి చేదును, మరికొందరికి చికాకును ఇంకొందరిలో అసూయనూ రగిలించి నిప్పు రాజేస్తుంది. ఆ నిప్పే కాల్చేసిందో, లేక అంతటి ఔదార్యమున్న కలానికి కులం రంగు అద్దిన ఉన్మాదమే కడతేర్చిందో.. తెలియదు కానీ అమర్ సింగ్ చమ్కీలా జీవితంలో పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చింది. అసలు ఎవరీ చమ్కీలా? ఏం జరిగింది? భారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. చమ్కీలా అంటే పంజాబీలో ప్రకాశవంతమైనదని అర్థం. పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో చమార్ (దళిత్) కులానికి చెందిన కర్తార్ కౌర్, హరిరామ్ సింగ్ దంపతులకు 1960 జూలై 21న చమ్కీలా జన్మించాడు. అతని అసలు పేరు ధనీరామ్. చిన్నవయసులోనే గుర్మైల్ కౌర్ అనే బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరికి అమన్దీప్ కౌర్, కమన్ చమ్కీలా (ప్రస్తుతం ఫోక్ సింగర్) అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మరో కొడుకు పుట్టి.. అనారోగ్యంతో చనిపోయాడు. మొదటి నుంచి ఎలక్ట్రీషియన్ కావాలని ఆశపడిన ధనీరామ్.. ఆ ఆలోచనను పక్కనపెట్టి.. ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి దుస్తుల మిల్లులో చేరాడు. అక్కడ ఓ స్నేహితుడు ఇతని రాతకు ముగ్ధుడై.. సురీందర్ షిండా అనే ఓ సంగీతవిద్వాంసుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ధనీరామ్ కథలో, పేరులో మార్పులు అక్కడి నుంచే మొదలయ్యాయి. చమ్కీలా (ధనీరామ్) టీమ్లో చేరినప్పటి నుంచి షిండా పేరు దేశవిదేశాలకు పాకింది. చమ్కీలాకు మాత్రం గుర్తింపు దక్కలేదు. పైగా ఇతర దేశాల్లో ప్రదర్శనలకు చమ్కీలాను తీసుకెళ్లడానికి షిండా ఇష్టపడేవాడు కాదు. 1980లో ఒకసారి షిండా.. కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ గ్రూప్లోని సోనియా అనే మరో గాయని చమ్కీలాను కలిసింది. ‘షిండాను దాటి నీకు గుర్తింపు రావాలంటే.. నేను కొత్తగా ప్రారంభిస్తున్న బృందంలో చేరు’ అని చెప్పడంతో చమ్కీలా సరే అన్నాడు. సోనియా పెట్టుబడి పెడితే.. చమ్కీలా తన ఆలోచనలకు మరింత పదునుపెట్టి.. ఆమె దగ్గరే జీతానికి కుదిరాడు. అనుకున్నట్లే షిండా కెనడా నుంచి పంజాబ్ వచ్చేలోపు.. సోనియా ఆధ్వర్యంలో ఎనిమిది యుగళగీతాలను విడుదల చేసి పంజాబ్ని ఓ ఊపు ఊపాడు చమ్కీలా. అయితే ఆ ఏడాది చివరికి.. సోనియా, ఆమె భర్త కలసి.. తన కారణంగా లక్షలు సంపాదిస్తూ, తనకు నెల జీతం మాత్రమే ఇస్తున్నారని గ్రహించాడు. దాంతో చమ్కీలా.. తానే ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే హార్మోనియం, ఢోలక్ వాయించగలిగే బృందంతో పాటు.. అమర్జోత్ కౌర్ అనే ఒక మహిళా గాయనినీ తన టీమ్లోకి తీసుకుని.. ఆల్బమ్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు. రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్ హిట్ కొట్టడంతో చమ్కీలా పంజాబ్ సూపర్ స్టార్ అయ్యాడు. చమ్కీలా పాటల్లో కొన్ని.. ‘పెహెలే లల్కార్ నాల్ (తొలుత బాకా మోగింది)’ ఇది పెళ్ళైన జంట గురించి పాడిన పాట. ‘బాబా తేరా నన్కానా (బాబా నీ మందిరం, నీ గురువు గురునానక్)’ ఇది సిక్కులకు ధైర్యం చెప్పే పాట. ‘భూల్ గయీ మై ఘుండ్ కడ్నా (ముసుగు వేసుకోవడం మరచాను)’.. లాంటి పాటలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆ సమయం లోనే అతనికి అమర్ జోత్తో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లిదాకా వెళ్లింది. మొదటి భార్య గుర్మైల్ని ఒప్పించి (విడాకులు తీసుకున్నాడని కొందరంటారు).. 1983లో అమర్జోత్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి జైమన్ (ప్రస్తుత ఫోక్ సింగర్) అనే కొడుకు పుట్టాడు. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా. వేడుక ఏదైనా.. ప్రతి ఊళ్లో అతని దరువు వినిపించాల్సిందే. ఏడాదికి ఊరూరా 366 ప్రత్యక్ష ప్రదర్శనలు చేసేవారంటే చమ్కీలా దంపతులు ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం. కొన్ని సంగీత బృందాలు కేవలం చమ్కీలా వల్లే మరుగున పడ్డాయని.. ఆ అక్కసుతోనే వారంతా కలసి అతనిని చంపించారని మరి కొందరి ఊహ. మరోవైపు చమ్కీలా రెండో భార్య అమర్జోత్ ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ కావడంతో.. ఇది పరువు హత్య అని.. అమర్జోత్ కుటంబీకులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని ఇంకొందరి వాదన. ఇతడి జీవితకథపై చాలా సినిమాలు, పుస్తకాలూ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని వివాదాల పాలయ్యాయి. ఏది ఏమైనా చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు దాటింది. అయినా నేటికీ జానపద సంగీత ప్రియులకు అతడి పాట వినిపిస్తూనే ఉంది. ∙సంహిత నిమ్మన -
అబద్ధమని కొట్టిపారేయకండి.. దెయ్యాలతో మాట్లాడిన చిన్నారి!
దెయ్యాల కథలు సృష్టించే ప్రకంపనాలకు సాక్ష్యాలు తక్కువ. నిజమా? అబద్ధమా? అనే సంశయం నుంచి పుట్టే ఆత్రానికి.. వాదోపవాదాలు ఎక్కువ. అందుకే ‘పుట్టుకకు ముందు.. చావు తర్వాత..’ అనే ఆత్మాన్వేషణ కథలెప్పుడూ మిస్టరీలుగానే మిగిలిపోతాయి. అలాంటిదే సరిగ్గా 34 ఏళ్ల క్రితం.. ఓ నాలుగేళ్ల అమ్మాయి జీవితంలో జరిగింది. అది 1989. ఫిబ్రవరి మొదటి వారం. ఆండ్రూ వైరిక్, లీసా దంపతులు తమ నాలుగేళ్ల కూతురు హెడీతో కలసి.. కొత్తింట్లోకి అడుగుపెట్టారు. రావడం రావడమే హెడీ ఆడుకోవడానికి పరుగులు తీస్తే.. భార్యభర్తలు మాత్రం ఇల్లంతా సర్దుకునే పనిలో పడ్డారు. ఆ ఇల్లు అమెరికా, జార్జియాలోని ఎల్లెర్స్లీలో ఉంది. హెడీకి ఆ ఇల్లు బాగా నచ్చేసింది. అక్కడున్న ఓ పెద్దాయన కూడా. ఆ ఇంటికి రావడం రావడమే పెరట్లో ఉన్న ఆయనతో ఆటలాడటం మొదలుపెట్టింది. పనుల హడావిడి నుంచి తేరుకున్న హెడీ తల్లి లీసా.. ఆ పెద్దాయన సంగతులన్నీ హెడీ నోట విని షాక్ అయ్యింది. అతడి పేరు గోర్డీ అని హెడీ చెప్పింది. అసలు లీసా.. ఆ ఇంటి చుట్టు పక్కల హెడీ చెప్పిన పోలికలతో ఎవరినీ చూసింది లేదు. ‘హెడీని కిడ్నాప్ చేయడానికి ఎవరైనా నాటకం ఆడుతున్నారా?’ అనే అనుమానం లీసాని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే భర్తకు విషయం చెప్పింది. హెడీని బయటికి పోనీకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత హెడీ ప్రవర్తనపై దృష్టిపెట్టిన లీసా.. ఆమె ఎవరితోనో మాట్లాడుతోందని.. ఆమె చేతిని ఎవరో పట్టుకుని నడుస్తున్నారని గుర్తించింది. పైగా అర్ధరాత్రులు ఊయల ఊగడం, నిద్రలో లేచి నడవడం ఇలా చాలానే చేసేది హెడీ. లీసాకి ఏం అర్థం కాలేదు. కానీ వెన్నులో కాస్త భయం మొదలైంది. హెడీకి స్నేహితులు లేకపోవడంతో అలా ఏదో ఊహించుకుని ఆడుకుంటోందని సరిపెట్టుకుంది. అయితే హెడీ.. గోర్డీతో పాటు లోన్ అనే మరో ముసలాయన పేరు చెప్పడం మొదలుపెట్టింది. లోన్ ఎడమ చేతికి రక్తంతో కట్టు ఉందని.. అతడి షర్ట్ నిండా రక్తం ఉందని చెప్పేది హెడీ. వెంటనే లీసా.. తన భర్తతో కలసి.. ‘హెడీ చెబుతున్న పేర్లతో ఎవరైనా ఉన్నారా?’ అంటూ ఆ చుట్టూ వెతకడం మొదలుపెట్టింది. లోన్, గోర్డీ ఇద్దరు కాదేమో.. ఒకే వ్యక్తి అయ్యి ఉంటాడని వాళ్లు నమ్మారు. ‘లోన్ గోర్డీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా?’ అంటూ అందరినీ ఆరా తీశారు. ఆ ప్రయత్నంలోనే లోన్ గోర్డీ గురించి పక్కింట్లో ఉండే తన సోదరితో చర్చించింది లీసా. అయితే.. లీసా చెప్పింది విని లీసా సోదరి షాక్ అయ్యింది. అతడి పూర్తి పేరు జేమ్స్ ఎస్. గోర్డీ అని.. అతడు తమ ఇంటి మాజీ యజమాని అని, అతడు చనిపోయి చాలా ఏళ్లు అయ్యిందని చెప్పింది ఆమె. సాక్ష్యం కోసం తన ఇంటి దస్తావేజులు కూడా చూపించింది. అది చూడగానే లీసాకి చెమటలు పట్టేశాయి. వెంటనే ఇద్దరూ.. గోర్డీ బంధువైన కేథరీన్ లెడ్ఫోర్డ్ అనే స్థానికురాలి దగ్గరకి పరుగుతీశారు. జేమ్స్ గోర్డీ 1974లోనే మరణించాడని, అతడికి కొలంబస్లో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండేదని, చాలా సంవత్సరాలు అతను జార్జియాలో ఎల్లెర్స్లీలో ఉండే ఎల్లిసన్ మెథడిస్ట్ ^è ర్చ్లో సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేశాడని వివరాలిచ్చింది కేథరీన్. అచ్చం హెడీ చెప్పినట్లే.. గోర్డీ మెరిసిన జుట్టుతో.. సూట్, టై, నల్లటి బూట్లు వేసుకుని ఎప్పుడూ నీట్గా ఉండేవాడని నిర్ధారించింది. వెంటనే హెడీని కేథరీన్ ఇంటికి తీసుకుని వెళ్లిన లీసా.. తన పాపకి ఆ ఇంట్లోని పాత ఫొటోలన్నీ చూపించమని కోరింది. ఆశ్చర్యకరంగా ఆ ఫొటోల్లో లోన్ ఫొటోని గుర్తుపట్టింది హెడీ. ‘ఎడమ చేతికి కట్టుతో ఉన్న ముసలాయన ఇతడే’ అంటూ లోన్ ఫొటోని చూపించింది. అతడ్ని హెడీ గుర్తు పట్టగానే బిత్తరపోయింది కేథరీన్. వరుసగా లీసా, ఆండ్రూ, హెడీ, జోర్డాన్, జోయిస్ (హెడీ మేనత్త) ‘ఇతడు మా అంకుల్ లోన్’ అంది షాక్లో. లోన్ 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇక్కడే గడిపేవాడని, అతడు 1957లో క్యాన్సర్తో చనిపోయాడని, అతడు ఓ ప్రమాదంలో తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడని చెప్పింది. దాంతో లీసాకి.. హెడీ మాట్లాడే గోర్డీ, లోన్లు కల్పితపాత్రలు కాదని.. వారు నిజంగా చనిపోయిన వ్యక్తులని స్పష్టమైంది. (హెడీ విషయంలో హెడీ మేనత్త జోయిస్ కూడా లీసాకు చాలా సాయం చేసింది).అలా గోర్డీ, లోన్లతో హెడీ సంభాషణ సుమారు నాలుగేళ్ల పాటు సాగింది. 1993లో హెడీ తల్లి గర్భవతి అయింది. అప్పుడొచ్చింది మరో ఆత్మ. అది చీకట్లో బొమ్మల రూపంలో కదలడం హెడీని తీవ్రంగా భయపెట్టింది. కొన్నిసార్లు ఆ ఆత్మ చేసిన హింసకు హెడీ చాలా ఏడ్చేది. అప్పుడప్పుడు హెడీ ముఖంపైన రక్తపు చార లు కనిపించేవి. 1994 ఫిబ్రవరి 3న హెడీకి జోర్డాన్ అనే చెల్లెలు పుట్టింది. 2 వారాల తర్వాత, హెడీ మరింతగా వణకసాగింది. అయితే ఆ ఆత్మ గురించి.. హెడీ తండ్రి ఆండ్రూ మొదట్లో నమ్మలేదు. కానీ కొన్ని రాత్రుల తర్వాత ఆండ్రూ కూడా ఆ ఆత్మ దాడికి గురయ్యాడు. ఆ సమయంలోనే హెడీ ఒంటి మీద గోళ్ల చారికలు తీవ్రమైన నొప్పిని కలిగించేవి. వెంటనే పారా సైకాలజిస్ట్ డాక్టర్ విలియం రోల్ని ఇంటికి పిలిపించింది లీసా. హెడీ చెప్పే మాటలు నిజమేనన్న నిర్ధారణకు వచ్చిన రోల్.. చనిపోయిన వారితో కమ్యూనికేట్ చేయడానికి హెడీ.. ఏదైనా రహస్యమైన శక్తిని కలిగి ఉందా? అంటూ హెడీపై ఎన్నో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏ విషయాన్నీ తేల్చలేకపోయాడు. కొన్నేళ్లకు హెడీ కుటుంబం ఆ ఇంటికి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత గోర్డీ, లోన్ ఆత్మలు హెడీకి కనిపించడం మానేశాయి. కానీ ఇప్పటికీ హెడీని చీకటి బొమ్మలు, వికృత రూపాలు, జంతు ఆత్మలు భయపెడుతూనే ఉన్నాయట. హెడీకి సాధారణమైన జీవితం గడపాలనే ఆశే ఆమెని ప్రపంచానికి దూరంగా బతికేలా చేస్తోంది. కానీ హెడీకి ఆత్మలు, దుష్టశక్తులు కనిపించడం మాత్రం ఆగలేదు. దురదృష్టవశాత్తూ హెడీ తండ్రి ఆండ్రూ 45 ఏళ్ల వయసులో 2012లో మరణించాడు. అసలు హెడీ చెప్పింది నిజమేనా? అబద్ధమైతే అంత చిన్ని పిల్ల గోర్డీ, లోన్ల ఆత్మల కథలను ఎలా ఊహించగలిగింది? చనిపోయిన వారితో మాట్లాడే శక్తి హెడీకి నిజంగానే ఉందా? ఇలా వేటికీ సమాధానాల్లేవు. పైగా ఆ కుటుంబం మీడియాకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడంతో సమగ్ర సమాచారమూ దొరకలేదు. ఈ కథ ఆధారంగా ఎన్నో నవలలు, డాక్యుమెంటరీలు, సినిమాలు పుట్టుకొచ్చాయి. అయితే హెడీ చెప్పింది నిజమే అనేవాళ్లు ఎంతమందో.. అబద్ధమని కొట్టిపారేసేవాళ్లూ అంతేమంది. అందుకే ఈ కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. హెడీ మాటల్లో.. ఎప్పుడైతే దుష్ట ఆత్మలు కనిపించడం మొదలయ్యాయో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ప్రతిరోజూ ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నా జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఇలాంటి వాటితో పేరు పొందాలనుకోను.. ప్రజలు కొంతమంది విశ్వసిస్తారు, కానీ మరికొంత మంది మమ్మల్ని పిచ్చివాళ్లుగా భావిస్తారు. ఇప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి.. ధైర్యంగా ఉండటానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ∙సంహిత నిమ్మన -
అక్కడ శిశువులు ఎలా చనిపోతున్నారనేది?..అంతుపట్టని మిస్టరీ!
ఆ ఊరిలోని కుటుంబాలు పిల్లల్ని కనడానికే భయపడతున్నారు. అక్కడ శిశువులంతా కేవలం పుట్టిన మూడు నెలలకే చనిపోవడం. చనిపోయిన శిశువులంతా సడెన్గా కాళ్లు చేతులు వెనక్కి వాలేసి.. గుక్కపెట్టి ఏడ్చి చనిపోతున్నారు. శిశువుల మరణాలన్నీ ఒకే తీరు. పోనీ ధైర్యం చేసి వేరే ఊరు వెళ్లి పురుడు పోసుకుని వచ్చినా.. అదే పరిస్థితి. అక్కడ ప్రజలకు బిడ్డలను కనే యోగం లేదో మరేదైనా కారణం ఉందా!.. అనేది వైద్యులకు సైతం అంతుపట్టకపోవడం ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలేం జరిగిందంటే..రెండేళ్ల కిందట 2021 ఆగస్ట్ నెలలో అశోక్, మత్స్యమ్మ దంపతులకు పుట్టిన మొదటి బిడ్డకు రెండు నిండి, మూడో నెల నడుస్తున్న సమయంలో...ఒక రోజు తల్లి మత్స్యమ్మ పాలు ఇచ్చిన కాసేపటికే పిడికిలి బిగిపెట్టి ఏడుస్తూ ప్రాణాలు వదిలేసింది ఆ శిశువు. పిల్లలకు ఏ పేర్లు పెట్టాలా అని అశోక్, మత్స్యమ్మల కుటుంబాల్లో చర్చలు జరుగుతున్న సమయానికే పిల్లల ప్రాణాలు పోయాయి. మత్స్యమ్మ, అశోక్ ఇంట్లో జరిగినట్లుగానే ఆ రూఢకోట గ్రామంలోని అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. గత మూడేళ్లలో 20 మంది శిశువులు మరణించారు. వారి మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు వైద్య బృందాలు పరిశోధనలు చేసినా నిర్దిష్టమైన కారణం ఇంతవరకు తెలియలేదు. చనిపోయిన చిన్నారులంతా మూడు నుంచి ఆరు నెలల లోపు వయసు వారే. మా చేతుల్లో చనిపోడానికే అయితే పిల్లల్ని కనడం ఎందుకు? మాకు పిల్లలు వద్దు, ఊరులో పరిస్థితులు బాగుపడితేనే పిల్లల్ని కంటాం. లేదంటే పిల్లలు వద్దు అని మూడు నెలల వయసున్న ఇద్దరు శిశువుల్ని పొగొట్టుకున్న బాలు, సంధ్యారాణి దంపతులు ఆవేదనగా చెబుతున్నారు. అశోక్, మత్స్యమ్మ దంపతులు కూడా ఇలాగే వాపోయారు. ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాను. కారణాలేంటో తెలియడం లేదు. చనిపోయే క్షణం వరకు పిల్లలు ఆరోగ్యంగానే ఉంటున్నారు. మాతో చక్కగా ఆడుకున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒక్కసారిగా పిడికిలి బిగబట్టి, తల వాల్చేసి క్షణాల్లో చనిపోతున్నారు. పీహెచ్ సీ కూడా పక్కనే ఉంది. కానీ అక్కడకు తీసుకెళ్లేంత సమయం కూడా దొరకడం లేదు. ఇంకేం చేయాలి?” అని సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి గర్భం దాల్చినా కూడా ఈ గ్రామంలో ఉండను. వేరే గ్రామానికి వెళ్లిపోయి, అక్కడే శిశువుకి జన్మనిచ్చి, కొంచెం పెద్దయ్యాకే గ్రామంలోకి అడుగు పెడదామనుకుంటున్నాను అని చెప్పారామె. పోనీ వేరే చోట పురుడు పోసుకున్నా.. రూఢకోటకు కోడలిగా వచ్చిన ఓ మహిళ గర్భం దాల్చగానే తన పుట్టినిల్లయిన హుకుంపేటకు వెళ్లిపోయారు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఆ బిడ్డ కూడా మూడు నెలలకే ఈ ఏడాది మేలో మరణించాడు. ఈ విషయాన్ని రూఢకోట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నిర్థారించారు. రూఢకోటకు హుకుంపేటకు మధ్య దూరం 35 కిలోమీటర్లు. ఆరు నెలలు ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు! 2019 నుంచి 2022 మే వరకు 17 మంది శిశువులు మరణించారు. ఆ తర్వాత ఆరు నెలలు ఏ విధమైన మరణాలు సంభవించలేదు. మళ్లీ ఈ ఏడాది జనవరి, మే, ఆగస్ట్ నెలల్లో ముగ్గురు శిశువులు మరణించారు. ఇప్పటి వరకు 20 మంది శిశువులు రూఢకోట గ్రామంలో మరణించారని రూఢకోట పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ సత్యారావు చెప్పారు. రూఢకోటలో గర్భం దాల్చిన మహిళలు గ్రామంలో ఉన్నా, బయటకు వెళ్లినా, ఇంటి దగ్గరే ప్రసవమైనా లేదా ఆసుపత్రిలో ప్రసవమైన వారిలోని కొందరు శిశువులు మరణిస్తున్నారు. కారణాలపై మాత్రం స్పష్టత రాలేదని డాక్టర్ సత్యారావు చెప్పారు. వరుసగా శిశువులు మరణిస్తుండటంతో ఆ ఊర్లో మహిళలు పిల్లలను కనేందుకు భయపడుతున్నారు. అందుకనే 2022 మే, జూన్ తర్వాత ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు. ఆరు నెలలు పాటు ఊరిలో ఎటువంటి మరణాలు సంభవించకపోవడంతో సంతోషపడ్డాం. కానీ మళ్లీ 2023 జనవరిలో ఒక శిశువు మరణిచడంతో మళ్లీ పిల్లల మరణాలు మొదలయ్యాయి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని రూఢకోట ప్రజలు ఆవేదనగా చెబుతున్నారు. వైద్య బృందాలు అధ్యయనం చేయగా.. వైద్య బృందాలు అధ్యయనం చేసినప్పుడు.. ప్రసవాలన్నీ ఆసుపత్రుల్లోనే జరిగాయని గుర్తించారు. శిశువుల బరువు సాధారణ స్థాయిలో ఉంది. తల్లుల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవు. వీరిలో ఒక మహిళ డిప్లొమా వరకు చదివింది. ఈ గ్రామంలో 138 గృహాలు ఉండగా 247 మంది పురుషులు, 244 మంది మహిళలు. ఇక్కడ ఉన్నవారంతా చదువుకున్నవారే. గుర్తించిన అంశాలు.. శిశువుల మరణాలు అత్యధికంగా అర్ధరాత్రి పూట సంభవించాయి. తీవ్రస్థాయిలో ఏడుస్తూ.. వాంతులు చేసుకుంటూ 6 నుంచి 12 గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. శ్వాస పీల్చుకోవడంలో శిశువులు బాగా ఇబ్బందులు పడ్డారు. ఒక శిశువులో ఫిట్స్ లక్షణాలు కనిపించాయి. స్థానికులు తాగే మంచినీటి నాణ్యత కూడా బాగానే ఉంది. ఎందువల్ల శిశువులు చనిపోతున్నారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరిలా మిగిలిపోయింది. (చదవండి: అత్యంత అరుదైన పాము! వీడియో వైరల్) -
సాక్స్ కిల్లర్..జంటలే టార్గెట్గా హత్యలు! అతడెవరనేది ఇప్పటకీ..
అది 1985 డిసెంబర్ 12, మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. వాషింగ్టన్ లోని మినరల్ సమీపంలోని స్పానవేలో కె–మార్ట్ స్టోర్ కస్టమర్స్తో రద్దీగా ఉంది. ఆ బయట రెండేళ్ల పాప ఒక్కర్తే అయోమయంగా, అటు ఇటు తచ్చాడటాన్ని కొందరు స్టోర్ ఉద్యోగులు గమనించారు. వారు పాపను చేరదీసి, పోలీసులకు సమాచారమిచ్చారు. కాసేపటికి ఆ మార్ట్కు చేరుకున్న అధికారులు పాప పరిస్థితి చూసి, స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. పాప శారీరకంగా బాగానే ఉన్నా, ఏదో చూసి భయపడిందని గుర్తించి, తాత్కాలికంగా దగ్గర్లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్న పాప కావడంతో అందరినీ చూసి బెదిరిపోయింది. తను ఎవరు? తన వాళ్లు ఎవరు? తనొక్కర్తే అక్కడెందుకు ఉంది?’ లాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలయ్యాయి. పాప వివరాల సేకరణలో భాగంగా పత్రికలకు కూడా పాప ఫొటో ఇచ్చి ‘ఎవరీ పాప?’ అనే శీర్షికతో వార్తలు రాయించారు అధికారులు. సరిగ్గా రెండు రోజులకు పాప వార్త ఉన్న న్యూస్ పేపర్, కొన్ని రియల్ ఫొటోలు పట్టుకుని.. లూయిస్ కాన్రాడ్ అనే మహిళ పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ‘మార్ట్ ముందు దొరికిన పాప నా మనవరాలే, తన పేరు క్రిస్టల్’ అంటూ ఇంట్లోని పాప ఫొటోలను ఆధారంగా చూపించింది. పాప దొరికిన రోజు (డిసెంబర్ 12) ఉదయాన్నే తన కూతురు డయానా రాబర్ట్సన్(21), అల్లుడు మైక్ రీమర్(36), క్రిస్టల్తో కలసి టకోమా సమీపంలోని పర్వతాలలో వన్ డే వెకేషన్ కోసం వెళ్లారని చెప్పింది లూయిస్. పాప ఒక్కర్తే ఒంటరిగా దొరికిందంటే.. మైక్, డయానాలకేమైందోనని కూలబడి ఏడ్చేసింది. లూయిస్ సమాచారంతో ఆ పర్వాతాల సమీపంలో మొత్తం గాలింపు చర్యలు మొదలుపెట్టారు అధికారులు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. ఇక మనవరాలు క్రిస్టల్ని ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకుని ‘మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు?’ అని ఆరా తీసింది లూయిస్. ఆ ప్రశ్నకు ‘మమ్మీ చెట్లలో ఉంది’ అని జవాబు ఇచ్చింది క్రిస్టల్. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం చెప్పింది. క్రిస్టల్ చిన్నది కావడంతో తనని విచారించి ప్రయోజనం లేదని అర్థమైంది. రెండు నెలలు గడిచిపోయాయి. 1986 ఫిబ్రవరి 18 ఉదయాన్నే వాషింగ్టన్లోని మినరల్కు ఉత్తరంగా ఉన్న రోడ్డుపై వాకింగ్కి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. రోడ్డు నుంచి కాస్త లోపలికి గుబురు చెట్ల మధ్య.. కరుగుతున్న మంచుపెళ్లల్లో రెడ్కలర్ ప్లిమత్ పికప్ ట్రక్ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే, దాని పక్కనే ఓ మహిళ కుళ్లిన నగ్న మృతదేహం భయపెట్టింది. ఆమె మెడకు సాక్స్తో ముడివేసి బిగించినట్లుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎన్ఏ పరీక్షలో అది డయానా శవమని తెలియడంతో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది. క్రిస్టల్ చెప్పినట్లే తన మమ్మీ చెట్ల మధ్య ఉండటం అధికారులను ఆశ్చర్యపరచింది. అంటే తన తల్లి చావుని క్రిస్టల్ చూసే ఉంటుందని అంతా అంచనాకు వచ్చారు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడా మైక్ జాడ కనిపించలేదు. ఆ పికప్ ట్రక్ మైక్దే కావడంతో దానిలో అంతా క్షుణంగా పరిశీలించారు. డ్రైవర్ పక్క సీట్లో రక్తం మరకలున్నాయి. వాటి శాంపిల్స్ ల్యాబ్కి పంపిస్తే, ఆ రక్తం మనిషిదే కాని ఎవరిదో తేలలేదు. ట్రక్లో దొరికిన ఒక ఎన్వలప్ కవర్ మీద ‘ఐ లవ్యూ డయానా’ అని రాసి ఉంది. అది మైక్ హ్యాండ్ రైటింగ్ అని లూయిస్ గుర్తించింది. డయానా కడుపులో పదిహేడు కత్తిపోట్లు ఉన్నాయని, మెడ చుట్టూ బిగించిన సాక్స్ ఆమెని కదలకుండా నియంత్రించడానికి మాత్రమే వాడిన సాధనమని తేలింది. ఓ పక్క దట్టమైన మంచు దర్యాప్తుకు ఆటకం కలిగిస్తున్నా, మైక్ కోసం తీవ్రంగా గాలించారు అధికారులు. ఎక్కడా మైక్ ఆనవాళ్లు లేవు. అయితే గతంలో మైక్.. డయానా విషయంలో చాలా అనుచితంగా ప్రవర్తించేవాడని పోలీసుల దృష్టికి రావడంతో డయానాని అతడే చంపేసి పారిపోయాడని నమ్మారు. మైక్.. డయానాని చాలాసార్లు కొట్టేవాడని, చంపేస్తానని బెదిరించేవాడని, అతడి వేధింపులు భరించలేక విడిపోయి తనకు మైక్ దూరంగా ఉండాలంటూ డయానా కోర్టు ఉత్తర్వును కూడా పొందిందని, కొన్నాళ్లకు వాళ్లు మళ్లీ కలసి జీవించడం మొదలుపెట్టారని చెప్పింది. దాంతో మైక్ అనుమానితుడుగా మారాడు. అయితే కొందరు మైక్ కూడా బాధితుడు కావచ్చని, గడ్డకట్టే చలిలో మైక్ తన చలికోటును ట్రక్లో వదిలి పారిపోయే అవకాశం లేదని నమ్మారు. ఈ క్రమంలోనే డయానా మెడకు చుట్టిన సాక్స్ కీలక ఆధారమైంది. మైక్, డయానా మిస్సింగ్కి ముందు.. అంటే 1985 ఆగస్ట్ 10న స్టీఫెన్ హార్కిన్, రూత్ కూపర్ అనే జంట మర్డర్ కేసు తిరగేశారు అధికారులు. ఈ జంట వాషింగ్టన్లో తులే సరస్సు పక్కన క్యాంపింగ్కి వెళ్లి తిరిగి రాలేదు. నాలుగు రోజులకు స్టీఫెన్ తన కారు డ్రైవింగ్ సీట్లో శవమై కనిపించాడు. నుదుటి మీద బుల్లెట్ గాయం ఉంది. అతడు నిద్రిస్తున్న సమయంలోనే దాడి జరిగినట్లు తేలింది. వెంట తీసుకెళ్లిన వారి పెంపుడు కుక్క సమీపంలో బుల్లెట్ గాయాలతో చనిపోయి ఉంది. రూత్ బూట్లు తప్ప మరో ఆధారం కనిపించలేదు. సరిగ్గా రెండు నెలలకు (అంటే డయానా మర్డర్కి సరిగ్గా నెల క్రితం) స్టీఫెన్ దొరికిన మైలున్నర దూరంలో రూత్ తల, మొండెం వేరువేరుగా దొరికాయి. రూత్ మెడకు కూడా డయానా మెడకు కట్టినట్లే సాక్స్తో బిగించి ఉంది. ఆమె కడుపులో చాలాసార్లు తుపాకీతో కాల్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాల్పుల కారణంగానే మరణించింది తప్ప సాక్స్ కారణంగా కాదని తేలింది. రూత్ మెడలోని సాక్స్, డయానా మెడలోని సాక్స్ రెండూ ఒకేలా ఉన్నాయని సాంకేతిక నిపుణులు కొందరు భావించారు. ఇది కచ్చితంగా సీరియల్ కిల్లర్ పనేనని వారి నమ్మారు. అయితే మైక్ జంతువుల కోసం వలపన్నే ప్రాంతం.. రూత్, స్టిఫెన్లు మృతదేహాలు దొరికిన ప్రాంతం రెండూ ఒకటే కావడంతో అనుమానాలన్నీ మైక్ మీదకు తిరిగాయి. నిజానికి మైక్.. తన భార్యను, కూతుర్ని తీసుకుని బయలుదేరేముందే ఆ వలపన్నిన ప్రాంతాన్ని ఒకసారి సందర్శించి వస్తామని ఇంట్లో చెప్పాడట. ఇన్ని ఆధారాలతో పాటు మైక్ కనిపించకపోవడంతో అతడే సీరియల్ కిల్లర్ అని కొందరు అధికారులు నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఈ తరహా కేసే మరొకటి పోలీసులు దృష్టికి వచ్చింది. 1985 మార్చి 9న వాషింగ్టన్ గ్రాంట్ కౌంటీలో ఎడ్వర్డ్ స్మిత్, కింబర్లీ లావైన్ అనే ప్రేమజంట మరణం వెనుక కూడా ఇదే సీరియల్ కిల్లర్ ఉండి ఉంటాడని నమ్మారు అధికారులు. అయితే ఎడ్వర్డ్ కారులో దొరికిన వేలిముద్రల ఆధారంగా 1989లో బిల్లీ రే బల్లార్డ్ అనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు ఎడ్వర్డ్, కింబర్లీ హత్యల నేరాన్ని అంగీకరించాడు కాని రూత్ జంట, డయానా జంటల హత్యలు తనకు సంబంధం లేదన్నాడు. 1986 ఆగస్ట్ 22న మిస్ అయిన రాబర్ట్, డాగ్మార్ మిస్సింగ్ కేసును కూడా కలిపి విచారించారు. తర్వాత రాబర్ట్ క్రెడిట్ కార్డ్ వినియోగించిన ఓ సీరియల్ కిల్లర్ చార్లెస్ సింక్లైర్ని అరెస్ట్ చేశారు. అయితే విచారణ సమయంలోనే అతడు మరణించాడు. కాలక్రమేణా మినరల్ పరిసరప్రాంతాల్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడని పుకార్లు స్థానికుల్ని పర్యటకులను తీవ్రంగా భయపెట్టాయి. మరోవైపు మైక్ కనిపించకపోవడంతో అతడే సీరియల్ కిల్లర్ అనే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. 2011 మార్చి 26న డయానా మృతదేహం దొరికిన మైలు దూరంలో హైకర్స్కి మనిషి పుర్రె కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దంత పరీక్షలతో ఆ పుర్రె మైక్దని తేలింది. దాంతో మైక్ కూడా ఆ సీరియల్ కిల్లర్ బాధితుడేనని, అసలు హంతకుడు వేరే ఉన్నాడని స్పష్టమైంది. మొత్తానికీ వాషింగ్టన్ మినరల్ సమీపంలోని ప్రేమ జంటలు, దంపతుల హత్యకేసులు.. రూత్, డయానా జంటల హత్యలతో కలిసి విచారించినా, ఎంతోమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా అసలు సాక్స్ కిల్లర్ ఎవరో బయటపడలేదు. క్రిస్టల్(పాప) దొరికిన రోజు.. మైక్ రెడ్ కలర్ ట్రక్ని కె–మార్ట్ స్టోర్ ముందు చూశామని కొందరు సాక్షులు చెప్పారు. అంటే పాపను ఆ కిల్లరే ఆ స్టోర్ దగ్గర వదిలివెళ్లాడా? ఆ స్టోర్ దగ్గరకు వచ్చాడా? అనేది ఎప్పటికీ తేలలేదు. వాళ్లని చంపింది ఎవరు? ఆ కిల్లర్ ఇంకా ఎంత మంది మాయం చేశాడు? ఇలా వేటికీ సమాధానాలు లేవు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన (చదవండి: ఇప్పటకీ అంతుతేలని కేర్టేకర్ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..?) -
ఇప్పటకీ అంతుతేలని కేర్టేకర్ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..?
అది 1999 జూలై 15. తెల్లవారుజామున మూడు కావస్తోంది. అమెరికా మిస్సోరీ, సెయింట్ లూయీలోని రిచ్మండ్ హైట్స్లో 1600 బ్లాక్ ముందు ఉన్నట్టుండి అలజడి రేగింది. అప్పటిదాకా గాఢ నిద్రలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు.. పోలీస్ హారన్స్తో ఉలిక్కిపడి లేచారు. చాలాసేపటి నుంచి తమ పక్క ఇంట్లో పసికందు ఏడుపు వినిపిస్తోందని.. తమకేదో అనుమానంగా ఉందని ఓ కుటుంబం.. ఎమర్జెన్సీ కాల్ చేయడంతోనే పోలీసులు అక్కడికి వచ్చారు. సదరు కుటుంబమిచ్చిన సమాచారంతో.. అంతా ఆ అనుమానాస్పద ఇంటి తలుపు తీసే ప్రయత్నం మొదలుపెట్టారు. లోపల బిడ్డ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే బయటున్నవారందరికీ హృదయం ద్రవించిపోతోంది. తీరా తలుపు తీసి లోపలికి వెళ్లేసరికి ఆ ఇంట్లో ఆ పసిపాప తప్ప ఇంకెవరూ కనిపించలేదు. దాంతో అంతా షాకయ్యారు. ఇరుగూ పొరుగూ ఆ పాపని సేదతీర్చే పనిలో పడ్డారు. కాసేపటికి పోలీసు కన్ను పడకగదిలో రక్తపుచుక్కల్ని పసిగట్టింది. వెంటనే ఇల్లంతా శోధించారు. రక్తం మరకలున్న చేతి రుమాలు, చెత్తబుట్ట వెనుక రక్తంతో తడిసిన తలదిండ్లు ఒక్కొక్కటిగా బయటపడినప్పుడు.. అదో మిస్టీరియస్ కేసుగా మిగలబోతోందని అక్కడున్న వారెవ్వరికీ తెలియదు. ఈ పాప తల్లిదండ్రులు.. డానా మాడెన్(తల్లి), క్రిస్టోఫర్ హెర్బర్ట్(తండ్రి) అనే దంపతులు. వాళ్లు ఆఫీసులకు వెళ్లినప్పుడు పాపని చూసుకోవడానికి ఎవరో తెలిసిన వాళ్ల అమ్మాయిని కేర్ టేకర్గా పెట్టి వెళ్తారని.. కనీసం ఆ అమ్మాయి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని.. పోలీసులకు స్థానికుల్లో కొందరు చెప్పారు. అసలు చంటిపాపను చూసుకోవడానికి వచ్చిన అమ్మాయి ఎవరు? అని ఆరా తీస్తే.. పన్నెండేళ్ల హెదర్ కులోర్న్ అని.. తను, మాడెన్ స్నేహితురాలైన క్రిస్టీన్ కులోర్న్ కూతురని తేలింది. బ్లో మిడిల్ స్కూల్లో చదువుతున్న ఆ పాప.. మాడెన్ కూతురికి కేర్టేకర్గా ఉండేదట. క్రిస్టీన్, మాడెన్, హెర్బర్ట్లతో మాట్లాడిన తర్వాత ఆ రాత్రి పాపతో ఆ ఇంట్లో ఉన్నది హెదరేనని పోలీసులకు స్పష్టమైంది. రెండు రోజులకు ఆ ఇంట్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్ను డీఎన్ఏ పరీక్షకు పంపిస్తే.. ఆ రక్తం హెదర్దేనని తేలింది. అసలు హేథర్కి ఏమైంది? ‘కేవలం మా పసిబిడ్డను చూసుకోవడానికే ఆ బాలికను ఇంట్లో ఉంచాం. ఆ రాత్రి మేము ఆ ఇంట్లో లేకపోవడం వల్ల ఏం జరిగిందో? హెదర్ని ఎవరు ఏం చేశారో? మాక్కూడా తెలియదు’ అని చెప్పుకొచ్చారు మాడెన్ దంపతులు. ఆ రోజు తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆ అపార్ట్మెంట్ నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దుప్పట్లో ఏదో బరువైనది మోసుకుని వెళ్లడాన్ని తాను చూసినట్టు ఓ సాక్షి చెప్పాడు. అయితే ఆ దుండగుడ్ని అతడు గుర్తించలేకపోయాడు. ఆ దుప్పట్లో ఉన్నది హెదర్ మృతదేహం కావచ్చని కొందరు నమ్మారు. కానీ అందుకు ఎటువంటి ఆధారాల్లేవు. హెదర్ కోసం ఆమె తల్లి క్రిస్టీన్ గుండెలవిసేలా ఏడ్చింది. ‘నా బిడ్డకు మధుమేహం ఉంది.. తనకు మందులు అందకపోతే ఎక్కువ కాలం బతకలేదు. రోజువారీ ఇన్సులిన్ ఇస్తూ, తరచుగా రక్తపరీక్ష చేస్తూ ఉండాలి. దయచేసి నా బిడ్డను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే వదిలిపెట్టండి’ అంటూ మీడియా ముఖంగానే వేడుకుంది. అయినా హెదర్ సమాచారం బయటికి రాలేదు. ఆ తల్లి వ్యథ ఎందరినో కంటతడి పెట్టించింది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని.. ప్రీప్లాన్గానే ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారని.. అది హేథర్కి తెలిసినవారి పనేనని.. రక్తపు ఆనవాళ్లు ఉన్నాయంటే చంపేసి ఉంటారని కూడా అధికారులు అంచనాకు వచ్చారు. అయితే మృతదేహం దొరక్కపోవడంతో క్రిస్టీన్ తన న్యాయపోరాటాన్ని ఆపలేదు. తొమ్మిది నెలలు గడిచినా కేసులో ఎలాంటి పురోగతిలేదు. దాంతో ‘హెదర్ ఎక్కడ?’ అంటూ.. మాడెన్, హెర్బర్ట్లను అరెస్ట్ చేసి.. గట్టిగా నిలదీశారు. కానీ ఆ దంపతులు సరైన సమాధానాలు ఇవ్వలేదు. మాడెన్ ఆ రాత్రి నైట్ షిఫ్ట్లో ఉందని తేలినప్పటికీ.. హెర్బర్ట్ ఎక్కడున్నాడనే దానిపై సరైన క్లారిటీ రాలేదు. అతడు పొంతన లేని ఎన్నో సమాధానాలిచ్చి.. ఆధారాలు లేక నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే క్రిస్టీన్ మాత్రం.. ‘తన కూతురు మాయం కావడానికి అసలు కారణం మాడెన్ దంపతులకు కచ్చితంగా తెలిసే ఉంటుంది’ అని నమ్మింది. ఆ క్రమంలోనే దర్యాప్తులో మరో నిజం బయటపడింది. మిస్సోరీలోని ప్రధాన డ్రగ్స్ మూలాలు ఆ అపార్ట్మెంట్లోనూ ఉన్నాయనే కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. అంటే అపార్ట్మెంట్లో రహస్యంగా ఉన్న చట్టవిరుద్ధమైన ఆ ల్యాబ్ గురించి హెదర్కి తెలిసి ఉంటుందని.. అపార్ట్మెంట్ గ్యారేజీలో మాదకద్రవ్యాల కార్యకలాపాలను ఆమె కళ్లారా చూసి ఉంటుందని.. అందుకే బలవంతంగా అపహరించి, హత్య చేసి ఉంటారని విశ్వసించారు. ఇది పరిష్కారం కాకుండానే.. క్రిస్టీన్ 2017 డిసెంబర్ 16న కన్నుమూసింది. ఏదైమైనా హెదర్కి ఏమైందనేది మాత్రం బయటపడలేదు. ఒకవేళ సీరియల్ కిల్లర్ దాడి చేసి ఉంటాడా? మాడెన్ భర్త హెర్బర్ట్ దురుద్దేశంతో హెదర్ మీద ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి, చంపేశాడా? లేదంటే హెదర్ తన స్నేహితుల్ని గుడ్డిగా నమ్మి.. ఆ ఇంటికి ఆహ్వానించి మోసపోయిందా? అనేది మాత్రం నేటికీ తేలలేదు. 12 ఏళ్ల హెదర్ కులోర్న్ అదృశ్యమై.. 24 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కేసులో హెదర్ ఊహాచిత్రాలు పెరిగాయి తప్ప మిస్టరీ అయితే వీడలేదు. సంహిత నిమ్మన (చదవండి: ఆ దేశంలోని టొమోటా ధర వింటే..కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!) -
పోలీసులకే చుక్కలు చూపించిన పుర్రె కేసు..ఆగంతకుడెవరో తెలిసినా..
విచక్షణ లేని ఆధిపత్యం.. తట్టుకోలేనంత క్రోధం.. దానికి మించిన స్వార్థం.. పశ్చాత్తాపమే లేని మనస్తత్వం.. మానవత్వం సిగ్గు పడటానికి ఇంతకన్నా అవలక్షణాలేముంటాయి? కానీ.. అవన్నీ కూడదీసుకుని చరిత్రలో ఒకడు ప్యాంటూ షర్టు వేసుకుని దర్జాగా తిరిగాడు. ఓ అమాయకురాలి జీవితాన్ని నేటికీ మిస్టరీగా మిగిల్చాడు. అది 1990 జూన్ 28 మధ్యాహ్నం రెండు కావస్తోంది. అమెరికా, మిస్సోరీలో బ్రిడ్జ్టన్ లోని కాసా గలార్డో రెస్టారెంట్.. కస్టమర్స్తో కిటకిటలాడుతోంది. కిటికీ పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న ఇద్దరు ఫ్లైట్ అటెండంట్స్కి ఉన్నట్టుండి, కిటికీ బయట ఏదో అలికిడి వినిపించింది. తిరిగి చూస్తే ఆ పొదల మాటున ఓ పుర్రె స్పష్టంగా కనిపింంది. కావాలనే ఎవరో దాన్ని అక్కడ పెట్టి తప్పుకున్నారు. దగ్గరకెళ్లి చూసేసరికి ఆ చుట్టుపక్కల మనుషులెవ్వరూ లేరు. ఊహించని ఆ క్రైమ్ సీన్.. అక్కడున్న వారందరినీ వణికింంది. రంగంలోకి దిగిన విచారణ అధికారులు.. పుర్రెను స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలకు పంపించారు. ఆ పరిశీలనలో పుర్రె ఓ మహిళదని తేలింది. అయితే కొన్ని రోజుల క్రితమే ఆ ప్రాంతంలోని శ్మశానవాటికను ఒక చోటి నుం మరోచోటికి మార్చారు. చాలా సమాధులను తరలించారు. ఆ సమయంలో బయటపడిన పుర్రెను ఎవరో ఆకతాయిలు కావాలనే జనాల మధ్య పెట్టి భయపెట్టి ఉంటారనే అంచనాకొచ్చారు. దాంతో ఆ పుర్రెను బ్రిడ్జ్టన్ మార్చురీకి పంపించేశారు. సరిగ్గా పద్నాలుగు నెలల తర్వాత (1991 సెప్టెంబర్ 6న) పుర్రె దొరికిన రెస్టారెంట్కి 25 మైళ్లదూరంలో ఉన్న వినిటా పార్క్ పోలీస్ స్టేషన్కి.. తెరిచి ఉన్న ఓ ఎన్వలప్ లెటర్ వచ్చింది. దానిలో ‘బ్రిడ్జ్టన్ పోలీసులకు రెస్టారెంట్ బయట దొరికిన పుర్రె లిండా షెర్మాన్ అనే మహిళది’ అని టైపింగ్ అక్షరాలతో ఉంది. అది చూడగానే ఆ అధికారులు షాకయ్యారు. వెంటనే బ్రిడ్జ్టన్ పోలీసులను అలర్ట్ చేశారు. దాంతో ఆ పుర్రెను పరీక్షలకు పంపించారు. అన్ని నెలలుగా ఆ పుర్రెపై ఎలాంటి సీల్ లేకపోవడంతో దానిపై ఏ వేలి ముద్రలు దొరకలేదు. వైద్య పరీక్షల్లో డీఎన్ఏ తేలలేదు. చివరికి దంత పరీక్షల్లో.. ఆ పుర్రె నిజంగానే ఆరేళ్ల క్రితం (1985 ఏప్రిల్ 22న) మిస్సయిన లిండా షెర్మాన్దేనని రుజువైంది. దాంతో ఒక్కసారిగా ఈ కేసు సంచలనమైపోయింది. పత్రికల మొదటి పేజీ వార్తగా వరింది. పాత ఫైల్స్ తిరగేస్తే.. వినిటా పోలీస్ స్టేషన్లో లిండాకి సంబంధించిన కేసులు చాలానే బయటికి వచ్చాయి. అప్పటికి ఆరేళ్ల క్రితమే మిస్సోరీలోని సెయింట్ లూయీలో గవర్నమెంట్ రికార్డ్స్ సెంటర్లో పనిచేసే లిండా.. తన 27 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయినట్లు రికార్డ్స్లో ఉంది. వినిటా పార్క్లోని సెయింట్ లయీ శివారులో పుట్టి పెరిగిన లిండా.. పదహారేళ్ల వయసులో తన సీనియర్ విద్యార్థి డోనాల్డ్ డాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదికే వారికి ఒక పాప కూడా పుట్టింది. ఆ పాపకి ప్రేమగా ప్యాట్రీషియామేరీ అని పేరు పెట్టుకున్నారు. పాప పుట్టిన తర్వాత కూడా లిండా చదువు కొనసాగించింది. అయితే వారి సంతోషాలకు ఆర్థిక కష్టాలు శాపంగా మారాయి. ఇద్దరూ ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. షిఫ్ట్ టైమింగ్స్, చాలీచాలని ఆదాయం వారి బంధాన్ని మరింత దెబ్బతీశాయి. రెండు మూడేళ్లకే కేసులు, విడాకులు అనుకుంటూ వైవాహిక జీవితం ఛిద్రమైంది. చాలాసార్లు పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు తిరిగిన ఆ భార్యభర్తలు.. కొన్నిసార్లు రాజీపడి కలసి బతకడానికి ప్రయత్నించారు. గొడవ జరిగిన ప్రతిసారీ లిండా.. తన కూతురు మేరీని తీసుకుని దగ్గర్లోని పుట్టింటికి వెళ్లిపోయేది. రాజీ కుదరగానే తిరిగి భర్త దగ్గరకు వచ్చేది. డాన్.. లిండాపై చాలా పొసెసివ్గా ఉండేవాడు. అది కాస్తా అనుమానంగా మారిపోయింది. ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చినా భరించేవాడు కాదు. వేరే మగవాళ్లతో మాట్లాడితే సహించేవాడు కాదు. ఎదురు తిరిగితే కొట్టేవాడు. ఏప్రిల్ 1985 నాటికి డాన్ పెట్టే బాధలు భరించలేక అతడికి వ్యతిరేకంగా.. రిస్టెయినింగ్ ఆర్డర్ (గృహ హింస, రక్షణా ఉత్తర్వులు) తెచ్చుకుంది. అయినా డాన్ మారలేదు. దాంతో తన తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి శాశ్వతంగా ముగింపు చెప్పాలని నిర్ణయించుకుని.. ఆ విషయాలన్ని తన కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో పంచుకుంది. అయితే ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. అతడితో ఆమెకి వివాహేతర సంబంధం ఉందని డాన్ నమ్మేవాడు. పంచాయతీకి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ అదే వాదనకు దిగేవాడు. ఉన్నట్టుండి అదే ఏడాది, ఏప్రిల్ 22 తర్వాత లిండా ఎవరికీ కనిపించలేదు. ఈ కథ మొత్తం తిరగదోడిన పోలీసులు.. వెంటనే డాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ‘లిండా మరణంతో నాకెలాంటి సంబంధం లేదు. ఆరేళ్లక్రితమే నా భార్య.. తన బాయ్ఫ్రెండ్తో పారిపోయింది. వాళ్లిద్దరూ సహోద్యోగులని నా అనుమానం. వాడే ఆమెను చంపి ఉంటాడు’ ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా ప్రశ్నింనా ఇదే సమాధానం ఇచ్చాడు డాన్. దాంతో పోలీసులు లిండా.. చివరి రోజు ఎక్కడికి వెళ్లింది? ఏం జరిగింది? లాంటి వివరాలు సేకరించడంలో బిజీ అయ్యారు. ఏప్రిల్ 22 తెల్లవారు జామున 2:16కి తన ఆఫీస్ నుంచిబయలుదేరిందని తేలడంతో లిండా కూతురు మేరీని విచారించారు. ‘ఆ రోజు నిద్రపోతుంటే మమ్మీ, డాడీల గొడవ వినిపింంది. మరునాడు నేను లేచేసరికి మమ్మీ సోఫాలో అటు తిరిగి పడుకుని ఉంది. రోజూ నన్ను స్కూల్కి తీసుకుని వెళ్లే మమ్మీ ఆ రోజు ఇంకా లేవకపోవడం ఆశ్చర్యంగా అనిపింంది. ఆ రోజు డాడీనే నన్ను స్కూల్కి తీసుకెళ్లారు. కనీసం నాకు బై చెప్పడానికి కూడా మమ్మీ నిద్ర లేవలేదు. నేను మమ్మీని చూడటం అదే చివరిసారి’ అని చెప్పింది మేరీ. దాంతో ఆ రాత్రి ఏం గొడవ పడ్డారు? అని డాన్ను మరోసారి విచారణలో కూర్చోబెట్టారు పోలీసులు. ‘ఇంటికి రావడానికి అంత ఆలస్యం ఎందుకు అయిందని గొడవ పడ్డాను. మేరీని స్కల్లో డ్రాప్ చేసి, నేను ఆఫీస్కి వెళ్లిపోయాను. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి.. లిండా ఇంట్లో హడావుడిగా పనులు చేసుకుంటోంది. సాయంత్రం 6 గంటలకు కారులో ఇంటి నుం బయలుదేరడం చూశాను. మళ్లీ రాలేదు. ఆఫీస్లో ఆరా తీస్తే అసలు ఆఫీస్కే రాలేదన్నారు. గతంలోలానే తాత్కాలికంగా నాకు దూరంగా వెళ్లి ఉంటుందని సరిపెట్టుకున్నాను. ఇంట్లో వెతికితే తన బ్యాగ్, ఇతర ముఖ్యమైన వస్తువులు కనిపించలేదు. అదే విషయాన్ని లిండా కుటుంబానికి చెప్పి.. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను’ అని చెప్పాడు. డాన్. లిండా కనిపించకుండా పోయిన కొన్ని రోజులకే ఆమె కారు.. ఓ స్థానిక విమానాశ్రయంలో దొరికింది. అందులో ఆమె వస్తువులన్నీ భద్రంగానే ఉన్నాయి. ఏప్రిల్ 24 నుంచి ఆ కారును అక్కడ చూశామని సెక్యూరిటీ చెప్పారు. అయితే ఆమె పేరు మీద ఏ ఫ్లైట్ టికెట్ న మోదు కాలేదు. కొన్ని రోజులకు ఆమె.. వేరే వ్యక్తి కారులో వెళ్లడం చూశానని డాన్ ఆరోపించాడు. గలార్డో రెస్టారెంట్కి డాన్ రెగ్యులర్గా వెళ్తుండేవాడట. అది అతడి ఫేవరెట్ ప్లేస్ అని అతడి సన్నిహితులు కొందరు బయటపెట్టారు. ‘పుర్రె దొరికిన రోజు సాయంత్రం అదే రెస్టారెంట్లో ఉన్నాను. అదేరోజు పుర్రె కలకలం గురించి నేనూ విన్నాను. అయితే ఆ రోజు.. అది నా భార్య లిండా పుర్రె అని నాకు తెలియలేదు’ అని పోలీసులకు చెప్పుకొచ్చాడు డాన్. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది.1989లో డాన్.. లిండాతో విడాకులకు అప్లై చేసుకున్నప్పుడు.. లిండా అదృశ్యంపై సరైన ఆధారం లేకపోవడంతో విడాకులు ఇవ్వకుండా ఆ కేసును కొట్టేసింది కోర్టు. సరిగ్గా ఏడాదికి లిండా పుర్రె బయటపడింది. అంటే హంతకుడు కచ్చితంగా డాన్ అయ్యి ఉంటాడని కొందరు అధికారులు నమ్మారు. ‘పుర్రె బయటపెట్టడంతో పాటూ.. అది లిండా పుర్రె అని అజ్ఞాత లేఖ రాశారంటే.. ఆమె చావు ప్రపంచానికి నిర్ధారణ కావాలి. ఆ అవసరం ఒక్క డాన్కి మాత్రమే ఉంది. అతడికి విడాకులు కావాలన్నా.. రెండో పెళ్లి చేసుకోవాలన్నా.. లిండా లేదు, ఇక తిరిగి రాదు అనే క్లారిటీ కోర్టుకు రావాలి. నిజానికి డాన్ ఆ రోజు తెల్లవారు జామునే గొడవ సమయంలో లిండాను చంపేసి.. కూతురుకి తెలియకుండా జాగ్రత్తపడి ఉంటాడు. ఆ తర్వాత లిండాను ఎక్కడో పాతిపెట్టి ఉంటాడు. విడాకులు రాకపోయేసరికి పుర్రె బయటపడేలా చేసి, అజ్ఞాత లేఖ రాసి.. ఈ కథను నడిపించి ఉంటాడని వారు భావించారు. అదే వాదనను లిండా కుటుంబం కూడా నమ్మింది. కానీ దేనికీ ఆధారం లేదు. ఈ వాదనను బలపరిచేలా నిజంగానే డాన్ 1994లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. డాన్ చెప్పినట్లు.. ఇంటి నుంచి లిండా కారులో వెళ్లడం.. మరో వ్యక్తి కారులో తిరగడం.. ఏ ఒక్కరూ చూడలేదు. మరోవైపు 1999లో లిండా పుర్రెను పరిశీలింన ఆర్కియాలజిస్టులు.. అది ఆల్రెడీ భూమిలో ఖననం చేసిన పుర్రె అని, దానిపైనున్న మట్టి నమూనాలను సేకరించి.. మిస్సోరీలో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. మిగిలిన శరీర భాగాల కోసం చాలా చోట్ల తవ్వి, తనిఖీలు చేశారు. కుటుంబంలోనూ నేర చరిత్ర కానీ ఎక్కడా లిండా అవశేషాలు దొరకలేదు. కొన్నేళ్లకు డాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఒకామె పోలీస్ స్టేషన్కి వచ్చి.. ‘డాన్.. తన భార్య లిండాను చంపానని నా ముందు ఒప్పుకున్నాడు’ అని చెప్పింది. కానీ, ఆధారాలేమీ చూపించలేకపోయింది. ఇక 2015 మే 7న ఇల్లినాయిలోని మౌంట్ వెర్నాయాలో ‘గుడ్ సమారిటన్ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం’లో డాన్ తన 58వ ఏట అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే అతడి కూతురు మేరీ.. అతడిని చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేదు. 1974లో డాన్ తండ్రి చార్లెస్ను ఎవరో అతడి ఇంట్లోనే గన్తో కాల్చి చంపేశారు. హంతకులు తేలకపోయినా, కుటుంబీకులే అనుమానితులయ్యారు. కొన్నాళ్లకు డాన్ తల్లి ఆడ్రీ.. ఒక హత్య కేసులో నేరస్థురాలిగా.. జైలుకి కూడా వెళ్లింది. ఏది ఏమైనా డాన్.. లిండాను చంపేశాడనే దానికి సరైన ఆధారం లేక.. ఆమె మిగిలిన బాడీ ఎక్కడ ఖననమైందో తెలియక.. ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన (చదవండి: ఇప్పటికీ అంతు తేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ.. అడవిలో ఏం జరిగింది?) -
గాజు ముక్కతో కళ్లలో పొడిచి.. బురదలో తొక్కి చంపి..
పరిగి: కలకలం రేపిన శిరీష మృతి మిస్టరీ కేసు వీ డింది. సొంత అక్క భర్తే హత్య చేసినట్లు విచారణ లో తేలిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం పరిగిలో మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాల ను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు యాదమ్మ, జంగయ్య దంపతులకు ఇద్దరు కూతు ళ్లు, పెద్ద కుమార్తె శ్రీలతను పరిగి పట్టణానికి చెందిన ఎర్రగడ్డపల్లి అనిల్కు ఇచ్చి పెళ్లి చేశారు. అనిల్కు వికారాబాద్లో నర్సింగ్ చేస్తున్న మరదలు శిరీష(18)పై కన్ను పడింది. ఈ క్రమంలో శిరీష ఫోన్లో వేరే యువకుడితో మాట్లాడుతోందని ఆమెపై కోపం పెంచుకున్నాడు. కాగా, ఇటీవల శిరీష తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను నగరంలో ని ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఇంట్లో ఉంటు న్న శిరీష ఈనెల 10న ఫోన్లో మాట్లాడుతుండటంతో తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ మందలించారు. ఇదే అదనుగా అనిల్ కూడా శిరీషను ఫోన్లో మందలించడంతో పాటు జంగయ్యతో కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి పారిపోయిన శిరీష తీవ్ర మనస్తాపం చెందిన శిరీష ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఆమెను వెతికే క్రమంలో గోనె మై సమ్మ గుడివద్ద శిరీష ఉందన్న సమాచారం మేరకు అనిల్ అక్కడికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇన్ని రోజులూ తనతో కలవడానికి నిరాకరించి వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడతావా అంటూ కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. పగిలిన బీరు సీసా ముక్కతో కళ్లలో పొడిచాడు. పడిపోయిన శిరీషను పక్కనే ఉన్న నీటి కుంటలోకి లాక్కెళ్లి బురదలో తొక్కి.. చనిపోయిందని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. తొందరగా శిక్ష పడేట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
మెడికో ప్రీతీ మృతిపై వీడని మిస్టరీ
-
నార్వేను ఉలిక్కిపడేలా చేసిన ‘ఇస్డాల్ ఉమన్’
ఉన్నత ఆశయానికీ.. ఒట్టి మోసానికీ పోలికేంటీ? గొప్ప ప్రేరణకు.. స్వార్థ గుణానికి పొంతనేంటీ? కానీ ఆమె జీవితంలో.. వాటన్నింటికీ చోటుంది. అవును.. ఆమె బతుకు, చావు రెండూ మిస్టరీనే. నార్వే చరిత్రలో ఎన్నో అనుమానాలతో లిఖించిన ‘ఇస్డాల్ ఉమన్ ’ స్టోరీ పూర్తిగా చదివితే అది నిజమే అనిపిస్తుంది. 1970 నవంబర్ 29, ఆదివారం మిట్ట మధ్యాహ్నం మొదలైందీ కథ. నార్వేలోని బర్గన్ నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఇస్డాలెన్ వ్యాలీ సమీపంలోని కొండ మీదకు ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లతో హైకింగ్ ట్రయల్కి వెళ్లాడు. ఉన్నట్టుండి కాలిన వాసన గుప్పుమంటూ.. ఆ తండ్రీకూతుళ్లను ఆ చుట్టూ వెతికేలా చేసింది. కాసేపటికి.. వెనుకవైపు ఏటవాలుగా ఉన్న లోయలో సగం కాలిన ఓ అమ్మాయి శవం.. వాళ్లని గజగజా వణికించింది. వెంటనే ముగ్గురూ బర్గన్ పోలీస్ స్టేషన్కి పరుగుతీశారు. దట్టమైన చెట్లతో.. చెత్తాచెదారంతో కాస్త భయంకరంగా ఉండే ఆ చోటు.. చాలామందికి పర్యాటక ప్రదేశం. నిరంతరం ఆత్మహత్యలు, అనుకోని ప్రమాదాలతో అప్పటికే ఇస్డాలెన్ లోయకి ‘ది డెత్ వ్యాలీ’ అనే పేరు పుట్టుకొచ్చింది. నిటారుగా, అగమ్యగోచరంగా ఉన్న క్రైమ్ స్పాట్కి చేరుకోవడం పోలీసులకు చాలా కష్టమైంది. శవం సగంపైనే కాలిపోయింది. రూపం చెదిరిపోయింది. రెండు పిడికిళ్లు బిగించి.. బాక్సర్ పొజిషన్ లో ‘ఫైట్ చేయడానికి సిద్ధమే’ అన్నట్లుంది ఆమె శవం. ఆ పక్కనే సగం కాలిన గొడుగు, రెండు ప్లాస్టిక్ సీసాలు, లిక్కర్ బాటిల్ ఇలా చాలా పడి ఉన్నాయి. నిజానికి అక్కడ ప్రతి గుర్తింపుని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లనిపించింది. డ్రెస్ లేబుల్స్, బాటిల్ లేబుల్స్ ఏవీ లేవు. పైగా ఆమె నగలు, వాచ్ ఓ పక్కన పొందిగ్గా కనిపించాయి. వైద్యపరీక్షల్లో ఆమె కడుపులో 50 నుంచి 70 దాకా నిద్రమాత్రలున్నాయని.. తేలింది. కొన్ని రోజులకి బర్గన్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో 2 సూట్కేసులు దొరికాయి. వాటిపై చనిపోయిన అమ్మాయి వేలిముద్రలు ఉండటంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఓపెన్ చేశారు. అందులో 2 కళ్లద్దాలు.. రంగురంగుల డ్రెస్లతో పాటు చాలా విగ్గులు.. జర్మనీ, నార్వే, బెల్జియం వంటి దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు.. కోడింగ్లో రాసిన ఒక పేపర్, షూ షాప్ కవర్ ఉన్నాయి. అన్నింటిలో కోడింగ్ పేపర్, షూ కవర్.. కేస్ను ఛేదించే క్లూస్గా కనిపించాయి. షూ కవర్.. నార్వేలోని స్టవంగర్లో రార్ట్వెట్ షూ షాప్కి చెందిందని గుర్తించి.. అక్కడికి వెళ్లి ఆరా తీశారు. కొన్ని రోజుల క్రితం ఒక యువతి తమ దగ్గర జత బూట్లు కొన్నదని.. సెలెక్ట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకుందని.. తను చాలా వినయంగా, అందంగా ఉందని.. కళ్లు, జుట్టు గోధుమ రంగులో ఉన్నాయని.. ఆ షాప్ యజమాని కొడుకు చెప్పాడు. మృతదేహం దగ్గర దొరికిన షూస్ అవేనని అతడు గుర్తించాడు. దాంతో పోలీసులు వెంటనే ఆమె ఊహాచిత్రాన్ని గీయించారు. ఇంతలో కోడింగ్ పేపర్లో ఉన్నదాన్ని కనిపెట్టి.. ఆమె బస చేసిన ఓ హోటల్కి వెళ్లారు. ఊహాచిత్రం ఆధారంగా ఆ హోటల్లో ఆరా తియ్యగా.. ఆమె ‘ఫనెలా లార్ష్’ అనే పేరుతో చెక్ ఇన్ అయ్యిందని, కొన్ని రోజుల అక్కడే ఉందని తేలింది. ఆల్విల్డా రంగ్నెసా అనే వెయిట్రెస్.. ఆమెని వెంటనే గుర్తుపట్టింది. ‘ఆమె చాలా అందంగా ఉంది. ఆమె అందానికి ముగ్ధురాలినయ్యానని ఆమె గ్రహించి.. నన్ను చూసి కొంటెగా నవ్వేది. అందుకే తను నాకు బాగా గుర్తుండిపోయింది’ అని చెప్పింది. అలాగే ఆమె మరో కీలక సమాచారాన్నీ ఇచ్చింది. ‘ఒకరోజు ఆమె.. డైనింగ్ హాల్లో ఇద్దరు జర్మనీ నేవీ అధికారుల పక్కనే చాలాసేపు కూర్చుంది. అయితే తను వాళ్లతో మాట్లాడటం నేను చూడలేదు’ అనీ చెప్పింది. దాంతో కోడ్ లాంగ్వేజ్ రాతలను సరిపోల్చుకుంటూ.. ‘ఆమె ఒక గూఢాచారి’ అన్న అభిప్రాయం ఏర్పడింది. కొన్నిరోజులకు ఆమె చాలా మారుపేర్లతో, మారువేషాలతో.. పలు హోటల్స్లో ఉందనే సమాచారం వచ్చింది. 1960లో నార్వేజియన్ పెంగ్విన్ క్షిపణి ట్రయల్స్తో ఒక స్త్రీ కదలికలు చురుగ్గా ఉండేవని, ఆమె ఈమే కావచ్చనే నివేదికలూ బయటికొచ్చాయి. ఈ క్రమంలోనే.. ‘ఆమె మోసగత్తె అయ్యి ఉంటుంది, డబ్బు కోసం వేషాలు మారుస్తూ ఉండేదేమో?’ అని కొందరు.. ‘లేదు లేదు తనో వేశ్య కావచ్చు’ అని మరికొందరు సొంత కథనాలు అల్లడం మొదలుపెట్టారు. పోలీసులు ఎంత దర్యాప్తు చేసినా.. కనీసం ఆమె పేరు కూడా తెలుసుకోలేకపోయారు. ఆమె శవం ఇస్డాలెన్లో దొరికింది కాబట్టి కాలక్రమంలో ‘ఇస్డాల్ ఉమన్’ అంటూ వార్తాపత్రికలే నామకరణం చేశాయి. అయితే సడెన్గా 1971లో పోలీసులు ఆ కేసును క్లోజ్ చేశారు. సరిగ్గా 46 ఏళ్ల తర్వాత.. 2016లో తీవ్ర ఒత్తిళ్ల మధ్య.. ఈ కేసుని రీ–ఓపెన్ చేశారు. ఆమె అవశేషాలకు మళ్లీ వైద్య పరీక్షలు చేయించారు. ఆమె ఊపిరితిత్తుల్లో పొగ రేణువులు ఉన్నాయని.. మంటల్లో కాలుతున్నప్పుడు ఆమె బతికే ఉందని.. శరీరం పెట్రోల్తో కాలిందని, కడుపులోని నిద్రమాత్రలతో పాటు.. మంటలతో ఏర్పడిన కార్బ¯Œ మోనాక్సైడ్ కూడా ఆమె మరణానికి కారణమైందని వైద్యులు తేల్చారు. ఇక రీ ఓపెన్లోనూ సేమ్ సీన్. ఆమె చావుపై కాస్త క్లారిటీ వచ్చినా.. ఆమె ఎవరన్నది ఎవరికీ తెలియలేదు. 2019లో ఫ్రాన్స్లోని ఫర్బాష్ నివాసి ఒకరు ‘లే రిపబ్లికేన్ లోరేన్ ’ అనే న్యూస్ పేపర్లో వచ్చిన ఈమె కథనాన్ని చదివి.. ఆ సంస్థ రిపోర్టర్స్ని కలిశాడు. ‘1970 వేసవిలో.. నేను సుమారు 26 ఏళ్ల వయసున్న ఓ యువతితో కలసి జీవించాను. తను చాలా భాషల్లో మాట్లాడగల సమర్థురాలు. యూరప్లోని బాల్కన్ యాసలో మాట్లాడేది. వ్యక్తిగత వివరాలు పంచుకోవడానికి ఇష్టపడేది కాదు. తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చేవి. తన దగ్గర చాలా విగ్గులు, రంగురంగుల దుస్తులు ఉండేవి. ఆమె అచ్చం ఇస్డాల్ ఉమన్ ఊహాచిత్రంలానే ఉంది’ అని చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం కథను రసవత్తరంగా మార్చింది తప్ప.. ముందుకు మాత్రం తీసుకెళ్లలేదు. ఇక ఈ కేసుని శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకున్నారు. డీఎన్ఏ ప్రొఫైల్ ఆధారంగా.. ఆమె యూరప్ సంతతికి చెందని మహిళ అంటూ.. ఆమె బంధువుల్ని వెతికే పనిలో పడ్డారు. నిజానికి వాళ్ల ప్రయత్నం ఫలిస్తే.. ఏదో ఒకరోజు ఆమె ఎవరు అన్నది ప్రపంచానికి తెలుస్తుంది. కానీ అది హత్యా? ఆత్మహత్యా? హత్య అయితే ఎవరు చేశారు? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకడం మాత్రం కష్టమే. ఏదేమైనా చివరికి ఆమె సృష్టించుకున్న మారుపేర్లు, మారు రూపాలే.. ఆమె ఉనికిని కాలగర్భంలో కలిపేశాయి. ఆమె ఒక స్పై(గూఢచారి)గా తన దేశానికి గొప్ప సేవ అందించి యోధగా శత్రువు చేతిలో మరణించిందా? లేక మోసగత్తెగా ఎవరి ప్రతికారానికైనా బలయ్యిందా? జీవితంపై విరక్తితో నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? అన్న ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాల్లేవు. - సంహిత నిమ్మన -
Mystery: ఆ కుటుంబాన్ని కడతేర్చిందెవరు..?
ఆకస్మిక అదృశ్యాలను, అసహజ మరణాలను తిరగదోడేటప్పుడు.. ప్రతి కోణం ఉత్కంఠగానే ఉంటుంది. కానీ కొన్నింటికి ముగింపే ఉండదు. ఎంత వెతికినా దొరకదు. ఎందుకంటే అవి కల్పితాలు కావు, నిజ జీవిత కథలు. పైశాచికత్వం ముందు ఓడిపోయిన బతుకులు. అలాంటి మరో మిస్టరీనే ఇది.. 48 ఏళ్ల క్రితం.. పిక్నిక్కి వెళ్లిన కూతురు, అల్లుడు, పిల్లలు.. తన ఇంటి దగ్గర ఆగి, డిన్నర్ చేసి వెళ్తారని ఆశపడింది ఆ తల్లి. ఎందుకంటే అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రం, కాపర్లోని తనింటికి.. 2 కిలో మీటర్లలోపే ఉన్న సిస్కియో పర్వతాల్లో క్యాంప్గ్రౌండ్కే వాళ్లు వెళ్లింది. రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి, ఎదురు చూడసాగింది. ఎంతకూ రాకపోయేసరికి మనసెందుకో కీడు శంకించింది. దగ్గరే కావడంతో ధైర్యం చేసి క్యాంప్గ్రౌండ్కి నడిచేసింది. అక్కడ క్రీక్ రోడ్ సమీపంలోని క్యాంప్గ్రౌండ్కి వెళ్లి, తనవాళ్ల టెంట్ని గుర్తుపట్టింది. తీరా లోపలికి వెళ్తే అందులో ఎవ్వరూ లేరు. చిన్న టేబుల్ మీద సగం ఖాళీ చేసిన పాలడబ్బా, వెహికిల్ తాళం చెవి, అల్లుడు రిచర్డ్ కౌడెన్(28) పర్స్ కనిపించాయి. రిచర్డ్.. కూతురు బెలిండా(22), మనవడు డేవిడ్(5), ఐదు నెలల మనవరాలు మెలిసా సహా ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ల వెంటవెళ్లిన పెంపుడు కుక్కలు కూడా కనిపించలేదు. దాంతో ఆ పెద్దావిడకు టెన్షన్ పెరిగిపోయింది. పైగా ఆ టెంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా కనిపించాయి. పర్స్లో 21 డాలర్లు సురక్షితంగా ఉన్నాయి. వెంటనే కూతురు, అల్లుడు వచ్చిన వాహనం కోసం వెతకడం మొదలుపెట్టింది బెలిండా తల్లి. క్రీక్ రోడ్పై పార్క్ చేసి ఉన్న ట్రక్కులో బాతింగ్ సూట్లు తప్ప అన్ని బట్టలూ ఉన్నాయి. బహుశా వాగుల్లో స్నానానికి వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ ఆలోచనే ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీస్ స్టేషన్ కి పరుగుతీసింది. పాలడబ్బా సాక్ష్యం సంఘటన స్థలానికి అధికారులు వచ్చారు. అక్కడ ఎలాంటి హింసాత్మక వాతావరణం కనిపించకపోవడంతో ఆ రాత్రి విచారణను అశ్రద్ధ చేశారు. మరునాడు వాళ్ల పెంపుడు కుక్కలైన బాసెట్ హౌండ్, డ్రూపీలు ‘కాపర్ జనరల్ స్టోర్’ ముందు తచ్చాడుతూ కనిపించాయి. సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటలకు రిచర్డ్, కొడుకు డేవిడ్ కలసి వచ్చి.. తమ స్టోర్లో పాల ప్యాకెట్ కొనుక్కుని వెళ్లారని ఆ స్టోర్ యజమాని చెప్పాడు. దానికి టెంట్లో టేబుల్ మీదున్న సగం పాలడబ్బానే సాక్ష్యం. చరిత్రలోనే.. కౌడెన్ కుటుంబం వైట్ సిటీలో ఉండేవారు. 1974 ఆగస్టు 30న వీకెండ్ ట్రిప్ అంటూ ఓరెగన్ లోని అత్తగారి ఇంటి నుంచే క్యాంప్గ్రౌండ్కి వెళ్లారు. సెప్టెంబర్ 1 సాయంత్రానికల్లా అత్తగారి ఇంటికి చేరుకుని, అటు నుంచి తిరిగి వైట్ సిటీకి వెళ్లాలనేది వారి ప్లాన్. కానీ అలా జరగలేదు. వాళ్లు వెళ్లిన చోటికి పర్యాటకులు వస్తూపోతూ ఉంటారు. రిచర్డ్ ఫ్యామిలీ మిస్ అవడంతో ఆ ప్రాంతం నిఘా నీడలోకి చేరింది. జాతీయ మీడియా దీనిపై కవరేజ్ ఇవ్వడంతో కౌడెన్ కుటుంబం పట్ల సానుభూతి మొదలైంది. హైకర్స్ వల్ల.. స్థానిక వాలంటీర్లు, ఎక్స్ప్లోరర్ స్కౌట్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, ఒరెగన్ నేషనల్ గార్డ్స్ విచారణాధికారులకు గట్టి సహకారమే అందించారు. ఫారెస్ట్ సర్వీస్ క్యాంప్ సైట్ చుట్టూ అణువణువూ గాలించారు అధికారులు. హెలికాప్టర్ల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేదు. 1975 ఏప్రిల్ 12న ఒరెగన్ లోని ఫారెస్ట్ గ్రోవ్ నుంచి ఇద్దరు హైకర్స్ కొండపైన ఓ చెట్టుకు కట్టేసిన వ్యక్తి శవాన్ని చూశారు. అది బాగా కుళ్లిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని గుహలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల శవాలను గుర్తించారు. ఆ మృతదేహాలు కౌడెన్ కుటుంబానివేనని పరీక్షల్లో తేలింది. నిజానికి ఆ ప్రదేశం వారి క్యాంప్సైట్ నుంచి దాదాపు 11 కిమీ దూరంలో ఉంది. శవపరీక్షల్లో బెలిండా, డేవిడ్లను తుపాకీతో కాల్చి, మెలిసాను బండకు బాది చంపారని తేలింది. చెట్టుకు కట్టిన తర్వాతే రిచర్డ్ చనిపోయాడని, బెలిండాతో పాటు ఇద్దరు పిల్లల్నీ వేరే చోట చంపి, గుహలో పడేశారని వైద్యులు భావించారు. అతనే.. సెప్టెంబర్ 1న క్యాంప్గ్రౌండ్లో ఉన్న పర్యాటకుల్ని విచారించినప్పుడు ‘ఓ లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు మగవారు, ఒక మహిళ పికప్ ట్రక్లోంచి దిగడం చూశాం. వారు మమ్మల్ని భయాందోళనకు గురిచేశారు. అక్కడి నుంచి మేమెప్పుడు కదులుతామా అన్నట్లు ప్రవర్తించారు. అందుకే జనావాసం ఉండే చోటికి వెళ్లిపోయాం’ అంటూ చెప్పారు. అప్పుడే ఓ స్థానికుడు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ‘సెప్టెంబరులో కౌడెన్ కుటుంబం కోసం శోధించినప్పుడు ఆ గుహ మొత్తం నేను వెతికాను. అప్పుడు అక్కడ ఏ మృతదేహాలు లేవు’ అంటూ. ఈ క్రమంలోనే రూష్కు చెందిన డ్వైన్ లీ లిటిల్(25) అనే ఖైదీని నిందితుడిగా భావించారు. అతడు పదహారేళ్ల వయస్సులో ఓ యువకుడిపై అత్యాచారం, హత్య చేసిన నేరంపై శిక్షను అనుభవిస్తూ, కౌడెన్స్ కుటుంబం అదృశ్యానికి 3 నెలల ముందే పెరోల్ మీద విడుదలయ్యాడు. మిస్ అయిన రోజు అతడు కాపర్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పైగా 1975 జనవరిలో లిటిల్ దగ్గర తుపాకీ ఉందని తేల్చుకున్న పోలీసులు పెరోల్ రద్దు చేశారు. మళ్లీ 1977 ఏప్రిల్లో బయటికి వచ్చిన లిటిల్.. ఓ గర్భవతిపై లైంగికదాడి చేసి, తీవ్రంగా కొట్టాడు. కొంచెంలో ఆ తల్లి, బిడ్డా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కేసులో కోర్టు లిటిల్కి 3 జీవిత ఖైదులను విధించింది. అంగీకరించలేదు విచారణలో లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ చెప్పినట్లుగా పార్క్ సమీపంలో ట్రక్లో వచ్చిన ఇద్దరు మగవారు, ఒక మహిళ ఎవరో కాదని.. లిటిల్, అతని తల్లిదండ్రులేనని పోలీసులు బలంగా నమ్మారు. కానీ సాక్ష్యాలే లేవు. 1974 సెప్టెంబర్ 2 సోమవారం నాడు లిటిల్ కుటుంబం క్యాంప్ గ్రౌండ్ సమీపంలోనే ఉన్నారని, గెస్ట్ బుక్లో సంతకం కూడా చేశాడని ఓ మైనర్ సాక్ష్యమిచ్చాడు. అయితే లిటిల్ కుటుంబం ఆ ఆరోపణలను అంగీకరించలేదు. మరోవైపు లిటిల్తో సెల్ పంచుకున్న ఓ ఖైదీ.. కౌడెన్ కుటుంబాన్ని చంపింది తనేనని లిటిల్ తన ముందు ఒప్పుకున్నట్లుగా చెప్పాడు. కానీ నేరం రుజువు కాకపోవడంతో కౌడెన్ కుటుంబాన్ని హతమార్చింది ఎవరో? నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన -
21 ఏళ్లైనా అంతుచిక్కని జర్నలిస్ట్ డెత్ మిస్టరీ.. హత్యే అని తెలిసినా..!
దుష్టులు నిర్మించుకున్న దుర్భేద్యమైన కోటలను కూలగొట్టాలని విఫలయత్నం చేశాడో వీరుడు. కథల్లోనో, సినిమాల్లోనో అయితే.. ఆ వీరుడే గెలిచేవాడు. కానీ ఈ రియల్ స్టోరీ.. అతడి మరణాన్నే మిస్టరీగా మలచింది. 1991 ఆగస్టు 10, మధ్యాహ్నం వెస్ట్ వర్జీనియాలోని మార్టిన్స్బర్గ్ సమీపంలోని షెరటన్ హోటల్ ముందు ఒక్కసారిగా జనం గుమిగూడారు. హోటల్ కస్టమర్స్, సిబ్బంది, యాజమాన్యం.. అంతా అక్కడున్నారు. వేగంగా వచ్చి ఆగిన పోలీస్ వ్యాన్లోంచి పోలీసులు ఒక్క ఉదుటన దుమికి.. ‘ఏ రూమ్?’ అన్నారు. సిబ్బందిలో ఒకరు 517 అని చెప్పగానే.. పోలీస్ బూట్లు అటుగా పరుగుతీశాయి. రూమ్ నంబర్ 517లోని బాత్టబ్లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ డానీ కాసోలారో(44) నిర్జీవంగా పడి ఉన్నాడు. అతడి రెండు చేతుల మణికట్లు లోతుగా తెగున్నాయి. ఓ పక్కన రేజర్ బ్లేడ్, మరోపక్కన సూసైడ్ నోట్ కనిపించాయి. నోట్ ఓపెన్ చేస్తే.. ‘నన్ను ప్రేమించేవారంతా నన్ను క్షమించండి. ముఖ్యంగా నా కొడుకు నన్ను అర్థం చేసుకుంటాడనుకుంటున్నా.. దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు’ అని రాసుంది. డానీ.. 1977లో మాజీ మిస్ వర్జీనియా అయిన టెరిల్ పేస్ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ట్రే అనే కొడుకున్నాడు. పదేళ్ల తర్వాత వాళ్లు విడాకులు తీసుకోవడంతో కొడుకు ట్రే బాధ్యతను డానీకే అప్పగించింది కోర్టు. 1970 నుంచి జర్నలిస్ట్గా ఉన్న డానీ.. కమ్యూనిస్ట్ చైనా నల్లమందును యూఎస్లోకి అక్రమంగా రవాణా చేయడం.. వంటి ఎన్నో సమస్యలను వెలుగులోకి తెచ్చి.. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డానీ రూమ్ మొత్తం క్షుణ్ణంగా వెతికిన పోలీసులకు.. క్రెడిట్ కార్డులు, డబ్బులున్న అతని వాలెట్ బెడ్ మీద సురక్షితంగా కనిపించింది. బలవంతంగా ఎవరైనా రూమ్లోకి వచ్చారా? అంటే.. అలాంటి ఆనవాళ్లేమీ లేవు. దాంతో డానీ మరణాన్ని ఆత్మహత్యగా నిర్ధారించేశారు పోలీసులు. రెండు రోజుల తర్వాత సమాచారం అందుకున్న డానీ ఫ్యామిలీ.. అది కచ్చితంగా హత్యేనని మొరపెట్టుకున్నారు. ‘మృతదేహం దొరికిన రోజే ఎందుకు మాకు సమాచారం ఇవ్వలేదు’ అని నిలదీశారు. దానికి అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. రిపోర్టర్గా డానీ జరిపిన వందలాది విచార ణ పత్రాలు, ఇతర ముఖ్యమైన ఫైల్స్.. వేటినీ కుటుంబానికి అందించలేదు. ‘అవన్నీ ఎక్కడా?’ అని ఆరా తీసిన డానీ సోదరుడు టోనీకి.. మృతదేహం దొరికిన హోటల్ రూమ్లో అవేం దొరకలేదనే సమాధానం వచ్చింది. రక్తపరీక్షల కోసం సూది గుచ్చితేనే భయపడే డానీ.. చేతులను కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేమంటూ.. అతడి కుటుంబం పోరాటం మొదలుపెట్టింది. డానీ మరణానికి కొద్ది రోజుల ముందు.. అతను చాలా మంది స్నేహితులతో.. ‘నేను చాలా పెద్ద కేసుని దర్యాప్తు చేస్తున్నా. త్వరలోనే వెలుగులోకి తెస్తా’ అని చెప్పాడట. నిజానికి ఆగస్ట్ 1990లో ఇన్స్లా అనే కార్పొరేట్ – గవర్నమెంట్ సాఫ్ట్వేర్ కంపెనీదారులైన బిల్ హామిల్ట¯న్Œ , నాన్సీలను ఇంటర్వ్యూ చేయడంతోనే ఆ సాఫ్ట్వేర్ మీద డానీ పరిశోధన మొదలైందట. వారు ప్రారంభించిన ‘ప్రామిస్’ అనే శక్తిమంతమైన ప్రాసిక్యూషన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో.. చాలా పెద్ద మోసం ఉందని.. తెరవెనుక పెద్ద స్కామ్ నడుస్తుందని అనుమానించిన డానీ.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టాడు. అప్పటికే ఇన్స్లా కంపెనీ సాఫ్ట్వేర్ను దుర్వినియోగం చేస్తున్నారని.. కొందరు న్యాయశాఖ అధికారులు దీన్ని ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందులో ప్రభుత్వపెద్దల కుట్ర కూడా ఉందని.. ఆ లింకులు ఇతర దేశాలకూ పాకుతున్నాయని వస్తున్న పుకార్లను కూపీలాగడం మొలుపెట్టాడు డానీ. ఎందరో గూఢచారుల్ని కలసి.. ఎన్నో ఆధారాలను సంపాదించాడు. ఆ క్రమంలోనే ఎన్నో బెదిరింపు కాల్స్నూ ఎదుర్కొన్నాడు. ఆ విషయం తన సోదరుడు టోనీకి చెబుతూ.. ‘ఒకవేళ నేను చనిపోతే, అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని నమ్మవద్ద’ని చెప్పాడట. తను విచారిస్తున్న కుంభకోణానికి ‘ది ఆక్టోపస్’ అని పేరు కూడా పెట్టాడట. పోలీస్ విచారణపై నమ్మకం లేని కుటుంబ సభ్యులు.. హోటల్ సిబ్బందిని ఆరా తీయగా మరో నిజం బయటపడింది. డానీ చనిపోయిన రోజు.. పోలీసులు రాకముందే ఎవరో.. ప్రొఫెషనల్ క్లీనింగ్ వర్కర్స్తో డానీ రూమ్ని శుభ్రం చేయించారని తేలింది. ఆ క్లీనింగ్ వర్కర్లలో ఒకరు మాట్లాడుతూ.. ‘ఆ రోజు రక్తంతో తడిచిన రెండు టవల్స్ని మృతదేహం దగ్గర్లో చూశాం. వాటిని అప్పుడే చెత్తలో వేసేశాం. మాకంటే ముందే ఎవరో ఆ రూమ్లో నేల మీద పడిన రక్తాన్ని ఆ టవల్స్తో తుడిచినట్లు అనిపించింది’ అని చెప్పాడు. అయితే అతడు బహిరంగ సాక్ష్యానికి అంగీకరించలేదు. ఇక ఆగస్టు 9 సాయంత్రం ఐదున్నరకు.. డానీ తన పక్క గదిలో దిగిన లూనీని పలకరించాడట. ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని కలవబోతున్నానని చెప్పాడట. తొమ్మిదింటికి లూనీని మళ్లీ కలసిన డానీ.. ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని వెళ్లి.. కొన్ని నిమిషాల్లోనే తిరిగివచ్చాడట. ‘బహుశా అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో? తెలియదు. మేం చాలాసేపు మామూలుగా మాట్లాడుకున్నాం’ అని లూనీ చెప్పుకొచ్చాడు. ఆ రోజు రాత్రి డానీ.. సమీపంలోని పిజ్జాహట్లో డిన్నర్ చేశాడట. అందులోని వెయిట్రెస్ డానీని గుర్తుపట్టింది. రాత్రి 10 దాటాక కాసోలారో సమీపంలోని కన్వీనియెన్స్ స్టోర్లో కాఫీ కొనుక్కుని తాగాడట. అదే అక్కడివారికి డానీ చివరిసారిగా సజీవంగా కనిపించింది. ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. మరి ఆ రాత్రి ఏం జరిగింది? మరునాడు మధ్యాహ్నం వరకూ శవాన్ని ఎందుకు గుర్తించలేదు? ఇలా వేటికీ సమాధానాల్లేవు. మరోవైపు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని ఒక ఆర్మీమన్.. డానీ అంత్యక్రియలకు హాజరయ్యాడట. డానీ శవపేటిక మీద గౌరవప్రదంగా ఒక పతకాన్ని ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడట. అసలు అతడు ఎవరు? ఎందుకు వచ్చాడు? అతడు నిజంగానే సైనికాధికారా? లేక డానీని చంపిన కిల్లరా? అనేది నేటికీ తేలలేదు. 1973లో లాభాపేక్షలేని సంస్థగా ఏర్పడిన ఇన్స్లా.. 1981లో లాభాపేక్షతో కూడిన అనుబంధసంస్థలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాతే దాని ఆస్తులన్నీ కొత్త సంస్థలకు బదిలీ అయ్యాయి. డానీ మరణం తర్వాత.. ఇన్స్లా సంస్థ.. తన సాఫ్ట్వేర్ను దొంగిలించడానికి ప్రభుత్వమే కుట్ర పన్నిందని, దొంగిలించిన సాఫ్ట్వేర్ను.. విదేశీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గూఢచర్య కార్యకలాపాలకు వినియోగించిందని.. నాసాతో సహా సీ.ఐ.ఏ, డి.ఓ.జీలు ఈ సమాచారాన్ని ఉపయోగించుకున్నాయని.. హత్యల్లోనూ ప్రమేయం ఉందని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆధారాలు దొరికాయి. కానీ.. 12 సంవత్సరాల సుదీర్ఘన్యాయ విచారణ తర్వాత ఫెడరల్ క్లెయిమ్స్ కోర్ట్ వాటన్నింటినీ కొట్టిపారేసింది. ఇక్కడ 1960 నుంచి 66 వరకూ బిల్ హామిల్టన్ ఆరేళ్ల పాటు నాసా ఉద్యోగిగా ఉండడం గమనార్హం. -సంహిత నిమ్మన -
Mystery: ఆ మాటలు వణుకు పుట్టించాయి! మత్స్యకారుల వలలో మృతదేహం! నేటికీ..
అది 2010 జనవరి 12, రాత్రి ఎనిమిది కావస్తోంది. పన్నెండు డిగ్రీల వాతావరణంలో మంచు.. వానలా కురిసే రోజులవి. అమెరికాలోని మిషిగన్లో సెయింట్ పాల్ కేథలిక్ చర్చ్కి, క్లెయిర్ సరస్సుకు మధ్యలో వన్–వే ఎగ్జిట్ డ్రైవ్వేలో పెట్రోలింగ్ చేస్తున్న లెఫ్టినెంట్ ఆండ్రూ దృష్టి.. ఆగి ఉన్న ఓ సిల్వర్ కలర్ కారు మీద పడింది. అది సరస్సుకు వంద అడుగుల దూరంలో ఉంది. దగ్గరకు వెళ్లిన ఆండ్రూ కారుని పరిశీలనగా చూశాడు. కారులో ఎవరూ లేరు. ఆ చుట్టుపక్కలా ఎవరూ లేరు. ‘ఇన్ఫర్మేషన్ నెట్వర్క్’లో కారు నంబరు చెక్ చేసి, కారు మిషెల్ అనే అమ్మాయి పేరు మీద ఉన్నట్లు నిర్ధారించుకున్నాడు. కారుకి ఏదైనా సమస్య వచ్చి వదిలారనుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరో గంట తర్వాత పెట్రోలింగ్లో ఉన్న పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ కీత్ దృష్టి కూడా ఆ కారు మీదే పడింది. కారు ముందు సీట్లో హ్యాండ్ బ్యాగ్ ఉండటంతో అతడికి అనుమానం మొదలైంది. మంచునేలపై కొన్ని అడుగుల ఆనవాళ్లు.. కారు నుంచి సరస్సు వైపు దారిని చూపడంతో, కీత్ వాటినే అనుసరించాడు. సుమారు 75 అడుగుల తర్వాత రెండు విరిగిన దిమ్మలపై పేరుకున్న మంచు మరింత రక్తికట్టించే కథను చెప్పు కొచ్చింది. ఒక దిమ్మపై మనిషి కూర్చున్నట్లు, మరో దిమ్మపై మనిషి జారి సరస్సులో పడినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. వాటిని గమనించిన కీత్, వెంటనే ఆండ్రూ సాయం కోరాడు. తక్షణమే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. కారు నంబర్ ఆధారంగా.. అడ్రెస్ పట్టుకుని.. తొమ్మిదిన్నర అయ్యేసరికి మిషెల్ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. కాలింగ్ బెల్ కొట్టగానే.. ‘ఇంత ఆలస్యమా?’ అన్నట్లు మిషెల్ ఆత్రంగా తలుపు తీసింది. అప్పటి దాకా సరస్సులో పడింది మిషెల్ అనుకున్న పోలీసులు, తలుపు తీసింది స్వయంగా ఆమేనని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వచ్చింది తన తల్లి జోవాన్ అనుకున్న మిషెల్.. పోలీసులను చూసి షాక్ అయ్యింది. కారు జోవాన్(50) తీసుకుని వెళ్లిందని తెలుసుకున్న పోలీసులు, ‘మీరు ఆమెతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు మిషెల్కి గుండె ఆగినంత పనైంది. వెంటనే తల్లి ఫోన్కి వరసగా డయల్ చేస్తూనే ఉంది. ‘దిస్ నంబర్ ఈజ్ అవుటాఫ్ స్టేషన్’ అనే మాటలు వణుకు పుట్టించాయి. రాత్రి పది దాటేసరికి మిషెల్, తన చెల్లెలు కెల్లీ, తమ్ముడు మైకేల్ ముగ్గురూ కలిసి బిక్కు బిక్కమంటూ పోలీసుల వెంట సరస్సు దగ్గరకు వెళ్లారు. కారు చుట్టూ ఉన్న క్రైమ్ సీన్ టేప్ వాళ్లని మరింత భయపెట్టింది. ఎటు చూసినా పోలీసులే! వారిలో ఒక పోలీస్ ‘జోవాన్ మీ మదరా? ఆవిడ ఈ లేక్లో పడిపోయారు’ అన్న మాటలు చుట్టూ చెలరేగే శబ్దాలను నిశబ్దం చేస్తూ ఒక్కసారిగా వారిని దుఃఖంలో ముంచెత్తాయి. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లలతో, లేక్ షోర్ డ్రైవ్లతో సరస్సు మొత్తం జల్లెడపడుతున్నాడు. మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు సర్చ్ ఆపేసి, కారును పోలీసు స్టేషన్కు తీసుకెళ్లిపోయారు. ఏదైనా సమాచారం అందితే చెబుతామంటూ మిషెల్ వాళ్లని ఇంటికి పంపించేశారు. జోవాన్ 1980లో డేవిడ్ రోమైన్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన ఇరవై ఐదేళ్లకి విడాకులు ఇచ్చి, తన ముగ్గురు పిల్లలతో కలిసి బతకడం మొదలుపెట్టింది. అయితే విడిపోయే వరకూ ఇద్దరి మధ్య చాలా గొడవలు నడిచాయి. జోవాన్కు స్నేహితులు ఎక్కువ. ఎప్పుడూ పార్టీలు, గెట్ టుగెదర్ అంటూ జీవితంలో తనకు తానే సంతోషాన్ని సృష్టించుకునేది. అలాంటి మనిషి అకస్మాత్తుగా కనిపించకపోవడం ఆమె పిల్లలకే కాదు, ఆమె సన్నిహితులకు కూడా మింగుడుపడలేదు. జోవాన్ తప్పకుండా తిరిగి వస్తుందనే వారంతా నమ్మారు. మర్నాడే కారు స్పేర్ కీతో హ్యాండ్ బ్యాగ్ బయటికి తీశారు పోలీసులు. అందులో 15 వందల డాలర్లు సురక్షితంగా ఉండటంతో, ఈ కేసు కుట్రపూరితం కాదని తేల్చేశారు. సరిగ్గా డబ్భై రోజులకు బోబ్లో దీవిలో డెట్రాయిట్ నదిలో మత్స్యకారుల వలలో ఓ మృతదేహం చిక్కింది. అది జోవాన్దేనని తేలింది. ఆ దీవి.. క్లెయిర్ సరస్సుకు 35 మైళ్ల దూరంలో ఉంది. పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే, ‘మా మామ్ని ఎవరో కావాలనే చంపేశారు. కేసు తారుమారు చేయడంలో పోలీసుల పాత్ర కూడా ఉంది, తను మిస్ అవ్వడానికి ముందురోజుల్లో తనను ఎవరో ఫాలో అవుతున్నారని భయపడింది’ అంటూ కోర్టుకెక్కారు జోవాన్ పిల్లలు. ఆ రోజు కారు సమీపంలో, సరస్సు చుట్టు ప్రక్కల పాదముద్రలు కానీ, సరస్సులో పడిన ఆనవాళ్లు కానీ లేవని చీఫ్ జెన్సన్ తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది. పోలీసులపై నమ్మకం లేని మిషెల్.. రాండాల్ అనే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని నియమించుకుంది. అతడు చర్చిలో చాలామంది సాక్షులతో మాట్లాడాడు. ఆ రోజు చర్చి నుంచి బయటికి వచ్చే సమయంలో జోవాన్ కారు నుంచి అలారం మోగిందని, పొరబాటున టచ్ అయ్యి ఉంటుందనుకున్నామని కొందరు, సమీపంలో ఓ నల్లటి వ్యాన్ని, నల్ల కండువా ధరించిన మనిషిని చూశామని మరికొందరు చెప్పుకొచ్చారు. మరి జోవాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చర్చికి వెళ్లేముందు ఎందుకు కారులో గ్యాస్ని ఫుల్ ట్యాంక్ చేయించింది? గ్యాస్ట్స్టేషన్ మేనేజర్తో ఎందుకంత సంతోషంగా మాట్లాడింది? సరసులో గంటల తరబడి వెతికినా దొరకని మృతదేహం అంతదూరం నీటిలో ఎలా వెళ్లింది? వంటి ఎన్నో అనుమానాలను లేవనెత్తాడు రాండాల్. జోవాన్ శవపరీక్షలో పాల్గొన్న డాక్టర్ జెంట్జెన్.. మృతదేహం కనుగొన్నప్పుడు ఆమె ఊపిరితిత్తులలో నీరు లేదని, అంటే నీటిలో పడకముందే ఆమె ప్రాణాలు పోయాయని ధ్రువీకరించాడు. అయితే అది ప్రమాదమా? హత్యా? ఆత్మహత్యా? అనేది తేల్చలేకపోయాడు. మృతదేహం కోటు జేబులోనే అసలు కారు కీస్ దొరికాయి. జోవాన్ అదృశ్యం కావడానికి నెల్లాళ్ల ముందు.. కారుతో పాటు ఇంటి స్పేర్ కీస్ కూడా కనిపించడం లేదని కూతురు మిషెల్తో చెప్పింది. అయితే పోలీసులకు కారు స్పేర్ కీ ఎలా అందింది అనేది అనుమానాస్పదమే. మరోవైపు జోవాన్ మృతదేహాన్ని పరిశీలించిన మిషెల్, ‘మా మామ్ ఎప్పుడూ కోటును ఇలా గడ్డం వరకూ జిప్ చేసుకోదు. అలాగే తను ఎప్పుడూ హ్యాండ్ బ్యాగ్ని ఎడమ చేతికే వేసుకునేది. అదే చేతికి రెండు చిన్నచిన్న గాయాలు ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్కి చిరుగులు ఉన్నాయి. పైగా అది పదిరోజుల క్రితం కొన్న కొత్త బ్యాగ్. బహుశా కిల్లర్కి, మామ్కి మధ్య జరిగిన పెనుగులాటలో ఆ డ్యామేజ్ జరిగి ఉంటుంది’ అని ఆరోపించింది. హత్యకు కారకులుగా.. తండ్రి డేవిడ్, మేనమామలు జాన్, బిల్లతో పాటు జోవాన్ కజిన్ టిమ్ మటౌక్లపై అనుమానం వ్యక్తం చేసింది మిషెల్. తన తల్లికి తండ్రితో ఉన్న వ్యక్తిగత తగాదాలతో పాటు మిగిలిన వారితో ఉన్న ఆర్థిక తగాదాలను కారణంగా చూపించింది. జోవాన్కి సంబంధించిన రోజరీ (మెడలో వేసుకునే శిలువ), సెల్ఫోన్ ఇప్పటికీ దొరకలేదు. స్కాట్ లూయీ అనే మరో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ సాయంతో.. మిషెల్ నేటికి ఆన్లైన్ పిటిషన్స్ వేస్తూ.. తల్లి కోసం న్యాయం పోరాటం చేస్తూనే ఉంది. సుమారు పన్నెండేళ్లుగా జోవాన్ మరణం మిస్టరీగానే మిగిలింది. -సంహిత నిమ్మన -
చెరువులో దూకి.. చెన్నైలో తేలిన టెక్కీ.. కేసులో ఊహించని ములుపు!
కోలారు: 16వ తేదీన కోలారు తాలూకాలోని కెందట్టి చెరువులో బెంగళూరు రూరల్ బాగలూరులో ఉండే చెందిన టెక్కీ రాహుల్ (27), కూతురు దియా (3)తో కలిసి దూకాడన్న కేసులో మిస్టరీ వీడుతోంది. చిన్నారి దియా అదే రోజు చెరువులో శవమై తేలడం తెలిసిందే. టెక్కీ జాడ మాత్రం కనిపించలేదు. దీంతో పోలీసులు అతడు చెరువులోకి దూకలేదని, పాపను విసిరేసి పరారై ఉంటాడని అనుమానం వ్యక్తంచేశారు. చివరకు అదే నిజమైంది. టెక్కీ రాహుల్ శనివారం చెన్నై నుంచి భార్యకు ఫోన్కు చేసి తనను కిడ్నాప్ చేశారని ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నానని చెప్పినట్లు తెలిసింది. దీంతో అతడు బతికే ఉన్నాడని ఖరారైంది. మరో కొత్త డ్రామా అని అనుమానాలు అయితే కిడ్నాప్ అయ్యానని అతడు చెబుతున్న మాటలు మరో కొత్త డ్రామా అని భావిస్తున్నారు. 15వ తేదీన తన కుమార్తె దియాను బడికి వదలి వస్తానని కారులో బయలేదేరిన రాహుల్ అనంతరం కనిపించలేదు. తరువాత 16వ తేదీన తాలూకాలోని కెందట్టి చెరువులో కూతురు దియా మృతదేహం కనిపించింది. కానీ రాహుల్ కనిపించలేదు. రాహుల్ను నిజంగానే కిడ్నాప్ చేశారా, లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీడి దేవరాజ్ తెలిపారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలను తట్టుకోలేక ఈ విధంగా కథ నడుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చదవండి: షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి.. -
'డ్రీమ్ ఆఫ్ ఎ లైఫ్'.. మిస్టరీ స్టోరీ
అది 2006 జనవరి 25.. లండన్లోని మెట్రోపాలిటన్ హౌసింగ్ ట్రస్ట్ అధికారులు.. అడ్వకేట్స్తో కలసి తమ ఆధీనంలో ఉన్న బెడ్సిట్ అపార్ట్మెంట్స్లోని ఓ ఫ్లాట్ ముందు నిలబడి.. కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు. బెడ్సిట్ ఫ్లాట్స్ అంటే.. వసతి గృహాలు లాంటివి. గృహహింసల నుంచి విముక్తి పొందిన మహిళలకు తక్కువ అద్దెతో వసతి కల్పించే ఆవాసకేంద్రాలు. ఎంతసేపటికీ తలుపు తియ్యకపోవడంతో.. అనుమానం వచ్చిన వారంతా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తలుపు తెరవగానే.. గుమ్మం ముందే కుప్పలు తెప్పలుగా పడున్న ఉత్తరాలు చూసి షాక్ అయ్యారు. చీకటిగా ఉన్న ఎంట్రెన్స్ గేట్ నుంచి కిచెన్లోకి వెళ్లారు. సింక్ నిండా చాలారోజులగా కడగని సామాన్లే. గది అంతా కుళ్లిన వాసన. అక్కడ నుంచి ఇంకాస్త లోపలికి వెళ్లేసరికి హాల్లో టీవీ ఆన్లోనే ఉంది. టీవీ ముందు సోఫాలో ఓ మహిళ కూర్చుని ఉన్నట్లు కనిపించింది. దగ్గరకు వెళ్లేసరికి గుప్పుమన్న దుర్గంధం నిమిషం కూడా అక్కడ నిలబడనివ్వలేదు. అస్థిపంజరానికి బట్టలు తొడిగినట్లుగా ఉన్న ఆ శవం.. ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న మహిళదే అని గుర్తించడానికి వారికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె కాళ్ల దగ్గర ఓ షాపింగ్ బ్యాగ్ పడుంది. కాస్త దూరంలో కొన్ని క్రిస్మస్ గిఫ్ట్స్ ప్యాక్ చేసున్నాయి. ఫ్రిజ్లోని ప్రొడక్ట్స్ 2003 ఎక్స్పెయిరీ డేట్తో కనిపించాయి. అంటే ఆమె చనిపోయి ఆరోజుకి మూడేళ్లు కావస్తోందా? టీవీ అప్పటి నుంచి ఆన్లోనే ఉందా? ఆ షాక్తో వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు శవాన్ని పోస్ట్మార్టమ్కి పంపించి.. విచారణ మొదలుపెట్టారు. నిజానికి హౌసింగ్ ట్రస్ట్ అధికారులు.. అడ్వొకేట్స్తో ఆ అపార్ట్మెంట్కి రావడానికి కారణం మూడేళ్లుగా ఆ మహిళ అద్దె కట్టకపోవడమే. కేసు విచారణలో భాగంగా ఆ మహిళ ఊరు, పేరు, వయసు అన్నీ ట్రస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. మరిన్ని వివరాలను ఆమె అపార్ట్మెంట్లో సేకరించారు. మరునాడు ఉదయం పత్రికల్లో ‘మూడేళ్లకు బయటపడిన మహిళ శవం’ అనే వార్తతో పాటు.. చనిపోయిన ఆ మహిళ పేరు జాయిస్ కరోల్ విన్సెంట్ అని, ఆమె వయసు 38 ఏళ్లని, మీలో ఎవరికైనా ఆమె గురించి తెలుసా? తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండంటూ ప్రకటనలూ వచ్చాయి. శరీరం పూర్తిగా కుళ్లిపోయి, అస్థిపంజరం మాత్రమే మిగలడంతో.. ఆమె మరణానికి గల కారణాన్ని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. తలుపు వేసి ఉన్న ఇంట్లో.. టీవీ చూస్తున్న మహిళ.. కూర్చున్న చోటే ఎలా మరణించింది? అనేది ఎవ్వరికీ అంతుపట్టలేదు. పైగా ఆ ఫ్లాట్స్లో ఎంతో మంది ఉంటున్నారు. ‘మూడేళ్లుగా ఏ ఒక్కరికీ కుళ్లిన వాసన రాలేదంటే ఆశ్చర్యమే?’ అదే ప్రశ్న ఆ అపార్ట్మెంట్స్ వాళ్లను అడిగితే.. కిందే పేరుకున్న డంప్ యార్డ్ని చూపించారు. ఆ కుళ్లిన వాసన.. కిందున్న చెత్త వల్లే వస్తుందనుకున్నామని చెప్పారు. ఇక ఈ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యేసరికి.. జాయిస్ విన్సెంట్ మాజీ కొలీగ్స్, బాయ్ఫ్రెండ్స్, స్నేహితులు ఇలా ఒక్కొక్కరూ బయటికి వచ్చారు. వాళ్లకు తెలిసిన సమాచారాన్ని అందించారు. జాయిస్ 1965 అక్టోబరు 19న లండన్లోని హ్యామర్స్మిత్ ప్రాంతంలో జన్మించిందని, తండ్రి లారెన్స్.. ఆఫ్రికన్ సంతతికి, తల్లి లిరిస్.. భారత సంతతికి చెందినవారని, తన పదకొండేళ్ల వయసులో తల్లి మరణించిందని, తర్వాత తన నలుగురు తోబుట్టువులే ఆమె ఆలనాపాలనా చూశారని, పదహారేళ్ల వయసులో పాఠశాలను విడిచిపెట్టి.. మ్యూజిక్ వైపు దృష్టిసారిస్తూనే లండన్లోని ౖఇఔలో సెక్రటరీగా పని చేసిందని, ఎర్నెస్ట్లోని ట్రెజరీ డిపార్ట్మెంట్లో నాలుగు సంవత్సరాలకు పైగా పని చేసి.. 2001 మార్చిలో ఉన్నట్టుండి రాజీనామా చేసిందని.. ఆమె జీవితంలో నెల్సన్ మండేలా వంటి గొప్పవారిని కలుసుకుందని.. ఇలా కొన్ని వివరాలు సేకరించగలిగారు పోలీసులు. అదే 2001లో తనకు ఎంతో ఇష్టమైన తండ్రి మరణ వార్త ఆమెను చాలా కుంగదీసిందని కొందరు సన్నిహితులు చెప్పారు. నిజానికి జాయిస్ తండ్రి లారెన్స్ 2004లో చనిపోయాడు. అతడి కంటే ముందే జాయిస్ చనిపోయిందన్న విషయం లారెన్స్కు తెలియదు. జాయిస్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత బెడ్సీట్ ఫ్లాట్స్లో ఆశ్రమం పొందుతూ డబ్బుల కోసం హోటల్లో క్లీనర్గా మారింది. ఈక్రమంలోనే ఆమె తన కుటుంబానికి, స్నేహితులకు దూరమైంది. తన వాళ్లు ఇంతమంది ఉన్నా.. తను చనిపోయిన విషయం ఏ ఒక్కరూ గుర్తించకపోవడమే ఈ కథ విన్న ప్రతిఒక్కరినీ కదిలించింది. 2003 నవంబర్లో ఆమె కడుపులో పుండు కారణంగా రెండు రోజుల పాటు నార్త్ మిడిల్సెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందిందని, ఉబ్బసంతో బాధపడిందని, పెప్టిక్ అల్సర్ అటాక్ అవ్వడం వల్లే చనిపోయిందని అధికారులు భావించారు. ఎలాంటి విషప్రయోగం జరగలేదని రిపోర్ట్ రావడంతో.. సహజ మరణమేనని పోలీసులు తేల్చారు. టెలివిజన్ అన్నేళ్లుగా పనిచేయడానికి కారణం.. ఆటోమేటిక్ డెబిట్ సిస్టమ్ యాక్టివ్లో ఉండటమేనని నిర్ధారించారు. అన్నేళ్లుగా టీవీ సౌండ్ వినిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధాకరమే.అయితే ఈ వార్తను మీడియాలో ఫాలో అయిన కరోల్ మోర్లీ అనే ప్రముఖ దర్శకురాలు.. దీనిపై డాక్యుమెంటరీ తియ్యాలనే ఉద్దేశంతో జాయిస్ స్నేహితులను, బంధువుల్ని కలసినప్పుడు జాయిస్ చనిపోయిందన్న విషయం తెలిసి వాళ్లు షాకయ్యారట. 2011లో మోర్లీ డైరెక్షన్లో వచ్చిన ‘డ్రీమ్ ఆఫ్ ఎ లైఫ్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ జాయిస్ జీవితాన్ని చూపిస్తూనే.. ఒంటరి జీవితంపై ఎందరినో ఆలోచింపచేసింది. జాయిస్ విన్సెంట్ కథ ఎంత వింతగా ఉంటుందో అంతే విషాదకరమైనది. ‘మనిషికి జీవిత భాగస్వామే అసవరం లేదు.. కనీసం తన అనుకునే మనిషి.. తనకోసం ఆలోచించే మనిషి ఉండేలా చూసుకోవడం చాలా అవసరం’ అని నమ్మేవాళ్లు ఎక్కువయ్యారు. ఏదిఏమైనా కూర్చున్న మనిషి కూర్చున్నట్లే ప్రాణాలు విడవడంతో.. ఆమె మరణానికి సరైన కారణాన్ని తేల్చకపోవడంతో ఈ కథ మిస్టరీగానే మిగిలింది. ∙సంహిత నిమ్మన -
సోనాలి ఫోగట్ మృతి కేసు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులా కానివొద్దు
చండీగఢ్: హర్యానా బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినా ఆమె మరణానికి గల కారణాలపై మిస్టరీ వీడటం లేదు. ఈ నేపథ్యంలో సోనాలి ఫోగట్ కుటుంబసభ్యులు ఈ కేసును బాలీవుడ్ దివంగత నుటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుతో పోల్చుతున్నారు. ఫోగట్ మృతి కేసు కూడా సుశాంత్ కేసులా కాకూడదని అంటున్నారు. 'సుశాంత్ సింగ్ హత్యకు గురై ఉంటాడని ఆయన కుటుంబసభ్యులు ఇంకా నమ్ముతున్నారు. రియా చక్రవర్తి అతనికి డ్రగ్స్ ఇచ్చింది. అయినా ఇప్పుడు ఆమె బయటే ఉంది. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఆ కేసు డ్రగ్స్ గురించి కాదు. హత్య గురించి' అని సోనాలి ఫోగట్ సోదరుడు కుల్దీప్ ఫోగట్ అన్నారు. సోనాలి ఫోగట్ మృతికి కారణమైన వారిని ఉరి తీయాలని కుల్దీప్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమె హత్యకు గురైందని పోలీసులు రుజువు చేయలేకపోతే సీబీఐని ఆశ్రయిస్తామన్నారు. నార్కో టెస్టు కూడా నిర్వహించాలని కోరుతామన్నారు. కుటుంబసభ్యుల అనుమతి అనంతరం సోనాలి భౌతికకాయానికి గురువారం పోస్టుమార్టం చేశారు వైద్యులు. ఆమె శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో గోవా పోలీసులు సోనాలి మృతిని హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమె సహాయకులిద్దరితో పాటు క్లబ్ ఓనర్, డ్రగ్ పెడ్లర్ను అరెస్టు చేశారు. చదవండి: సోనాలి ఫోగట్ దారుణ హత్య.. ఆ రెండున్నర గంటలేం జరిగింది? -
Mystery: పసికందుగా మాయమై.. ఐదుగురు పిల్లల తల్లిగా! కానీ ఆమె తల్లిదండ్రులు..
ఫ్లోరిడాలో ఇది 1980 నాటి కథ. డోనా కాసాసంటా అనే ఓ మహిళ.. తన కొడుకు, కోడలు, మనవరాలు కనిపించడం లేదంటూ టెక్సాస్ పోలీసుల్ని ఆశ్రయించింది. ‘కొడుకు హెరాల్డ్ డీన్ క్లౌస్ జూనియర్.. టీనా గెయిల్ లిన్ క్లౌస్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, టెక్సాస్లో నివాసం ఉంటున్నారని, వారికి ఓ పాప కూడా పుట్టిందని, పాప పేరు బేబీ హోలీ అని, కొన్ని వారాలుగా వీళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదని, తనకు చెప్పకుండా వాళ్లు ఎక్కడికీ వెళ్లరని.. ఇలా ఎన్నో విషయాలు చెబుతూ కేసు నమోదు చేయించింది. పోలీసులు రంగంలోకి దిగారు. డీన్ క్లౌస్ టెక్సాస్లో వడ్రంగి పని చేసేవాడు. అతడికి మత ఆచారాలు ఎక్కువ. ఫ్లోరిడాలోని వోలుసియా కౌంటీలో ఉన్నప్పుడు.. 1970లో ఒక మతఛాందస బృందంలో సభ్యుడిగా చేరాడు. ఆ బృందం ఆచార నియమాల ప్రకారం సర్వ భోగాలు, పెళ్లి, పిల్లలు, ఆస్తులు ఇలా అన్నింటినీ త్యజించాల్సిన డీన్ క్లౌస్.. టీనాని పెళ్లి చేసుకుని.. పాపని కని.. టెక్సాస్లోని లెవిస్విల్లేలోకి మకాం మార్చాడు. తన జీవితాన్ని రంగుల ప్రపంచంగా మార్చుకున్నాడు. దాంతో మత సమూహం నుంచి కొన్ని బెదిరింపులొచ్చాయి. డీన్ వాటిని పట్టించుకోలేదు. అయితే ఉన్నట్టుండి అతడి కుటుంబం కనిపించకుండా పోయింది. ఆ జంట మిస్ అవ్వడానికి ముందు.. టూ–డోర్ రెడ్ బర్గండీ ఏఎంసీ కాంకార్డ్ కారుపై తిరిగే వారు. ఆ కారుతోనే వారు మిస్ అయ్యారు. కీలకంగా ఫోన్ కాల్! 1981 జనవరిలో డోనా కుటుంబం.. ఓ ఫోన్ కాల్ అందుకుంది. అదేంటంటే.. ‘మేము లాస్ ఏంజెలెస్ నుంచి కాల్ చేస్తున్నాం.. టీనా, డీన్లు మా మత బృందంలో చేరారు.. ఇకపై వారు కుటుంబాలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండరు. తమ ఆస్తుల్ని కూడా వదులుకుంటున్నట్లు చెప్పమన్నారు. వారి కారు మా వద్దే ఉంది. కావాలంటే దాన్ని మీకు అందిస్తాం.. కానీ కొంత ఖర్చు అవుతుంది’ అని సిస్టర్ సుసాన్ అనే మహిళ డోనా కుటుంబంతో డీల్ మాట్లాడింది. అందుకు డోనా కుటుంబం సరేనంది. ‘ఫ్లోరిడాలోని డేటోనా రేస్ట్రాక్లో.. సిస్టర్ సుసాన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. ముందు చేసుకున్న డీల్ ప్రకారం నలుగురు వ్యక్తులు కారు ఇవ్వడానికి వచ్చారు. అందులో ముగ్గురు ఆడవారు ఉన్నారని.. వారంతా తెల్లటి వస్త్రాలను ధరించి, చెప్పులు లేకుండా ఉన్నారని.. డోనా కుటుంబం అధికారులకు తెలిపింది. ఆ దిశగా దర్యాప్తు మొదలైంది. ఎలాంటి ఆధారాలు చిక్కకపోవడంతో 2021 వరకూ ఈ కేసు మిస్సింగ్ కేసుగానే మిగిలిపోయింది. కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. టీనా, డీన్ల శవాలు సరే.. బేబీ హోలీ ఎక్కడా? 2021 అక్టోబర్లో ఓ షాకింగ్ విషయం బయటపడింది. 1981 జనవరిలో హారిస్ కౌంటీలోని వాలిస్విల్లే రోడ్ సమీపంలో హ్యూస్టన్ లోని అటవీ ప్రాంతంలో లభించిన ఓ జంట శవాలు.. టీనా, డీన్లవని తేలడంతో డోనా కుటుంబం అల్లాడిపోయింది. మరి పసికందు బేబీ హోలీ ఎక్కడా? అనే ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం లేకపోయింది. ఆ పాపకు సంబంధించి.. ఒక్క ఆధారం కూడా ఘటనా స్థలంలో దొరకలేదు. దాంతో ఆనాడు గుర్తుతెలియని నూతన దంపతుల హత్య అని మాత్రమే కేసు నమోదు చేసుకున్నారు. భర్తని కొట్టి, భార్యని పీక కోసి చంపేశారని అప్పుడే తేలింది. కానీ వాళ్లు ఎవరు అనేది అంతుపట్టలేదు. ఏది ఏమైనా బేబీ హోలీ ఏమైంది? ఇదే ప్రశ్నతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు. మీడియా కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించింది. పాప ఫొటోతో ఊహాచిత్రాలు బయటికి వచ్చాయి. పోలీసులు.. అనాథ పిల్లలు, దత్తత వెళ్లిన పిల్లలు ఇలా 1980–81 చరిత్రను తిరగేశారు. డీఎన్ఏ పరీక్షలు విస్తృతంగా నిర్వహించారు. ఈ క్రమంలో 2022 జూన్లో.. ఓక్లహోమాలో నివసిస్తున్న 42 ఏళ్ల మహిళే ఈ బేబీ హోలీ అని తేలింది. ప్రపంచం నివ్వెరపోయింది. ఇదెలా సాధ్యం? అని ఆరా తీశారు అధికారులు. 1981లో తెల్లవస్త్రాలు ధరించిన ఓ మత సమూహం.. ఆ పాపని అరిజోనాలోని ఒక చర్చ్లో ఇచ్చి వెళ్లారని.. లాండ్రోమాట్ దగ్గర పాప దొరికిందని వారు చెప్పారని.. వారంతా సర్వం త్యజించిన శాకాహారులని.. విచారణలో తేలింది. చర్చ్ నుంచి ఓ కుటుంబం బేబీ హోలీని దత్తత తీసుకుని పెంచింది. బేబీ హోలీ ప్రస్తుతం అత్తింటితో, పెంచిన కుటుంబంతో మంచి సంబంధాలే కలిగి ఉంది. అలాగే డోనా కుటుంబాన్ని కలుసుకుంది. అయితే తమ వివరాలు గోప్యంగా ఉంచమంటూ హోలీ కుటుంబం అధికారులని కోరింది. అలాగే దత్తత తీసుకున్న కుటుంబానికీ, ఈ మర్డర్ కేసులకి ఏ సంబంధం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికీ డీన్ పుట్టిన రోజు నాడే హోలీ దొరకడంతో డోనా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. అయితే టీనా, డీన్లను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేదానికి నేటికీ సరైన సమాధానం దొరకలేదు. దాంతో ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలి ఉంది. అరిజోనా, కాలిఫోర్నియా, టెక్సాస్తో సహా నైరుతి యునైటెడ్ స్టేట్స్లో ఆ మత సమూహం బిక్షాటన చేసేదని.. ఆ దిశగా విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఏది ఏమైనా.. నలభై దశాబ్దాల క్రితం ఒక పసికందుగా మాయమైన బేబీ హోలీ.. ఐదుగురు పిల్లల తల్లిగా తిరిగి ప్రపంచానికి పరిచయం కావడం గమ్మత్తైన విషయం. -సంహిత నిమ్మన -
హింటర్కైఫెక్ హత్యలు.. ఇప్పటికే మిస్టరీ గానే..!
కొన్ని నేరాలు ఘోరాతి ఘోరంగా.. భయంకరంగా.. ఒళ్లు గగుర్పొడిచేలా.. ఉంటాయి! హింటర్కైఫెక్ మర్డర్స్ అలాంటివే! జర్మనీ అపరిష్కృత నేరాల్లో ఇదీ ఒకటి. సుమారు 100 ఏళ్ల నాటి ఆ కథే.. ఈ వారం మన ముందున్న మిస్టరీ. జర్మనీలోని మ్యూనిక్కి 43 మైళ్ల దూరంలో ఉంటుంది ఈ హింటర్కైఫెక్ అనే గ్రామీణ అటవీ భూభాగం. అక్కడ ఆండ్రీస్ గ్రూబర్(64) అనే మోతుబరి అతి పెద్ద ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. అతని భార్య కాజిలియా గ్రూబర్(73), వాళ్ల వితంతు కూతురు విక్టోరియా(35), ఆమె ఇద్దరు పిల్లలు జూనియర్ కాజిలియా(7), జోసెఫ్(2) అంతా కలసి ఆ ఇంట్లోనే ఉండేవారు. వారికి అన్ని పనులు చేసిపెట్టడానికి ఓ పనిమనిషి వాళ్లతోనే ఉండేది. అయితే 1921 అక్టోబర్లో ఆమె ఉన్నట్టుండి ఆ ఇంటి నుంచి పారిపోయింది. అప్పటికే ఆమె ‘ఆ ఇంటి అటక మీద ఏవో స్వరాలు, శబ్దాలు వినిపిస్తున్నాయి. భయంగా ఉంటోంది’ అంటూ ప్రచారం చేసింది. అదే విషయాన్ని ఆండ్రీస్ కూడా చాలామందితో చెప్పేవాడు. పైగా ఇంటి వెనుకవైపు పడిన మంచు మీద ఏవో విచిత్రమైన అడుగులు కనిపించాయని, అవి ఇంటివైపు వేసిన అడుగులే కానీ బయటకు వెళ్లిన అడుగులు కావనీ, లేవనీ అతడు చెప్పాడు. అది విన్నవారంతా ‘ఇంట్లో ఓ తుపాకీ ఉంచుకోవడం మంచిది’ అని సలహా కూడా ఇచ్చారు. కానీ ఆండ్రీస్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఆరునెలల తర్వాత మారియా(45) అనే ఆవిడ ఆ ఇంట్లో పనికి కుదిరింది. గ్రామస్థులతో కలివిడిగా ఉండే ఆ కుటుంబం.. 1922 మార్చి 31 తర్వాత ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆదివారం రోజున చర్చ్కి రాలేదు. సోమవారం జూనియర్ కాజిలియా స్కూల్లోనూ కనిపించలేదు. పోస్ట్మ¯Œ బట్వాడా చేసిన ఉత్తరాలూ ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. దాంతో గ్రామస్థుల్లో అనుమానం మొదలైంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు.. ఆండ్రీస్ ఇంట్లోనూ వెదకడం మొదలుపెట్టారు. బెడ్రూమ్లో కొత్త పనిమనిషి మారియా రక్తపు మడుగులో పడి చనిపోయి ఉంది. రెండేళ్ల జోసెఫ్ తన ఉయ్యాల్లో నిర్జీవంగా పడి ఉన్నాడు. మిగిలిన వారు ఎక్కడా కనిపించలేదు. ఇంతలో పోలీసులూ వచ్చారు. కాసేపటికి ధాన్య కొటారంలో నాలుగు శవాలు వరుసగా ఒకదానిపై ఒకటి పేర్చి.. ఎండు గడ్డి కప్పి ఉన్నట్లుగా గుర్తించారు. ఆ శవాలను చూస్తే అక్కడున్నవారందరి వెన్నులో వణుకుపుట్టింది. పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో.. ఆ హత్యలు చేయడానికి మట్టాక్ (పదునైన వ్యవసాయ పరికరం)ను ఉపయోగించినట్లు తేలింది. ఎవరెవరు ఏ విధంగా చనిపోయారు? ఏ సమయంలో చనిపోయారు? అన్నీ లెక్కలు తేలాయి. ఆ క్రమంలోనే ఏడేళ్ల కాజిలియా చావు అందరినీ కలచివేసింది. కిల్లర్ కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆ పాప.. చాలా సమయం ఆ శవాల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడిందని.. చనిపోయే ముందు చాలా భయపడిందని తేలింది. పైగా హత్యల తర్వాత కూడా కిల్లర్.. అదే ఇంట్లో వంట చేసుకుని తిన్నట్లు ఆధారాలు ఉన్నాయి. దాంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. వందమందికి పైగా అనుమానితుల్ని విచారించారు. కానీ ఫలితం లేదు. ఈ కేసులో మరో విషాదకరమైన విషయమేంటంటే.. కొత్త పనిమనిషి ఆ ఇంటికి వచ్చిన రాత్రే ఆమె హత్యకు గురైంది. అయితే గతంలో ఆండ్రీస్ మాటలను గుర్తు చేసుకున్న చాలామంది.. హంతకుడు చాలా కాలంగా ఆ ఇంటి అటకపైన ఉన్నాడని నమ్మారు. విచారణలో భాగంగా ఆండ్రీస్ కుటుంబ చరిత్రను తవ్వడం మొదలుపెట్టారు పోలీసులు. అప్పుడో సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆండ్రీస్.. కూతురు విక్టోరియాతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడని, అందుకే 1915లో ఆ ఇద్దరికీ జైలు శిక్ష విధించారని, అయినా వాళ్లలో మార్పు రాలేదని.. జోసెఫ్ వాళ్లిద్దరికీ పుట్టిన బిడ్డేనని ఇరుగుపొరుగు చెప్పుకొచ్చారు. మరికొంత మంది.. జోసెఫ్ తండ్రి ఆండ్రీస్ కాదని.. ఆ ఇంటికి సమీపంలో నివసించే లోరెంజ్ బౌర్ అనే వ్యక్తి అని వాదించారు. దాంతో జోసెఫ్ అసలు తండ్రి ఎవరో నేటికీ తేలలేదు. తదుపరి పరీక్ష కోసం బాధితుల తలలను వేరు చేసి, వాటిని మ్యూనిక్కి పంపినట్లు నివేదిక రాసి.. అందరినీ ఒకేచోట ఖననం చేశారు. అయితే ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి ఓ డాక్టర్.. ఆ తలలను అంజనం వేసే వ్యక్తుల దగ్గరకు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులు మాత్రం.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ పుర్రెలు కనిపించకుండా పోయాయని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హంతకుడు ఎవరో తెలియకపోవడంతో చాలా ఊహా గానాలు మొదలయ్యాయి. నిజానికి విక్టోరియా భర్త గాబ్రియేల్ ఒక సైనికుడు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయాడు. అయితే గాబ్రియేల్ చనిపోలేదని.. తిరిగి వచ్చాడని.. విక్టోరియా పాపాలు తెలుసుకుని.. ఈ ఊచకోతలకు తెగబడ్డాడనేది ఓ వర్గం వాదన. మరోవైపు.. ఈ ఘోరానికి తెగబడింది లోరేంజ్ అని.. విక్టోరియా తనతో ఉంటూనే తండ్రితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక ఇలా చేశాడనేది మరికొందరి ఊహాగానం. అయితే 1919లో ఓ వృద్ధురాలు పోలీస్ అధికారులను కలసి.. ‘ఈ హత్యలను నా మాజీ భూస్వామి చేశాడు. మొత్తం సమాచారం అతడితోనే ఉంది’ అని తెలిపింది. అయితే ఆ ప్రధాన నిందితుడు అప్పటికి ప్రాణాలతో లేడు. 2007లో జర్మనీ పోలీసు అకాడమీలోని విద్యార్థులు.. ఎలాగైనా ఈ కేసుని క్లోజ్ చెయ్యాలని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి.. ఒక అనుమానితుడ్ని హంతుకుడిగా గుర్తించారు. అయితే అతడు కూడా అప్పటికి ప్రాణాలతో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యుల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని.. అతడి పేరునూ బహిర్గతం చేయలేదు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
బాక్స్ ఆఫ్ బోన్స్.. ఇప్పటికీ మిస్టరీగానే..!
అది 1992 మార్చి 30. అమెరికాలోని వ్యోమింగ్లోని థర్మోపోలిస్లో నివాసముంటున్న న్యూవెల్ సెషన్స్ ఇంట్లో ఉన్నట్టుండి గందరగోళం మొదలైంది. న్యూవెల్, అతడి స్నేహితులు కలసి.. ఓ పాత ట్రంకు పెట్టె తాళాన్ని పగలగొడుతున్నారు. గత ఆరేళ్లుగా అందులో ఏముందనే వారి కుతూహలం.. ఆ పనికి ఉసిగొల్పింది. తాళం ఊడింది. తలుపు తెరుచుకుంది. పాక్షికంగా కప్పిన ప్లాస్టిక్ కవర్ను తీసి చూస్తే.. అందులో ఒక బ్యాగ్.. ఆ బ్యాగ్లో ఓ మనిషి అస్థిపంజరం విడి భాగాలు ఉన్నాయి. అంతా షాక్. ఒక్కమాటలో చెప్పాలంటే గజగజా వణికిపోయారు. ఆ షాక్లోనే న్యూవెల్ భార్య డైసీ.. ‘ఇప్పుడు ఏం చేద్దాం’ అంది. ‘గొయ్యి తవ్వి పూడ్చిపెట్టడం బెటర్’ అన్నారంతా. అది మరింత నేరం కావచ్చని డైసీ హెచ్చరించింది. దాంతో న్యూవెల్.. ఆ ట్రంక్ పెట్టెను అక్కడ వదిలిపోయిన తన స్నేహితుడు గాబీ కోసం పరుగుతీశాడు. గాబీ ఎదురు పడగానే.. ట్రంక్ పెట్టె గురించి ఆరా తీసి.. అతడి హావభావాలను గమనించాలనుకున్నాడు. గాబీ 1986లో న్యూవెల్కి ఓ షెడ్ని అప్పగించాడు. వెళ్తూ వెళ్తూ కొన్ని వస్తువుల్ని అందులో వదిలేసి వెళ్లాడు. వాటిలో ట్రంకు పెట్టె ఒకటి. వదిలేసిన వస్తువుల్ని తీసుకెళ్లడానికి గాబీ చాలా సార్లు షెడ్కు వచ్చాడు కానీ..ఆ ట్రంక్ పెట్టెను తీసుకెళ్లే ప్రయత్నమైతే చెయ్యలేదు. ‘ఎందుకు?’ అని న్యూవెల్ అడగనూ లేదు. ఇప్పుడు గాబీని కలసిన న్యూవెల్.. ‘షెడ్లో నువ్వు వదిలిపెట్టిన ట్రంక్ పెట్టె గుర్తుందా?’ అని అడిగాడు. ‘గుర్తుంది.. కానీ దాన్ని నేనెప్పుడూ తెరవలేదు. కొన్నప్పుడే దాని తాళంచెవి మిస్ అయ్యింది. డమ్మీ కీస్తో చాలా సార్లు ట్రై చేశా.. కానీ ఓపెన్ కాలేదు..’ అంటూ ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా సమాధానమిచ్చాడు గాబీ. అందులో మనిషి అస్థిపంజరం ఉందని న్యూవెల్ చెప్పగానే.. ‘వేళాకోళాలు వద్దు బ్రదర్’ అంటూ పెద్దగా నవ్వాడు గాబీ. తాను తమాషా చేయడం లేదని నమ్మించడానికి న్యూవెల్కి చాలా సమయమే పట్టింది. అయితే గాబీ సమాధానాల మీద న్యూవెల్కి నమ్మకం కుదరలేదు. వెంటనే న్యూవెల్.. జాన్ లమ్లీ అనే అధికారి సాయాన్ని కోరాడు. అతడి సమక్షంలోనే వివిధ పరీక్షల కోసం అస్థిపంజరం ల్యాబ్కి తరలింది. ఎడమ పుర్రెలో, ఎడమ భుజంలో బుల్లెట్స్ ఉన్నట్లు ఎక్స్రేలు తేల్చాయి. దాంతో పుర్రె ఆకారాన్ని బట్టి చనిపోయిన వ్యక్తి ఊహచిత్రాలను గీయించి .. విడుదల చేశారు పోలీసులు. దీనిపై పత్రికలు కూడా ప్రత్యేక శ్రద్ధచూపించాయి. లమ్లీ వెంటనే.. గాబీని కలసి, తన స్టైల్లో ప్రశ్నించాడు. అప్పుడు కూడా గాబీ తడబడలేదు. ‘చాలా సార్లు పెట్టె ఓపెన్ చేయడానికి ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. దాన్ని ఎక్కడ కొన్నానో గుర్తులేదు. కానీ.. అది 1973 నాటి పెట్టె’ అని బదులిచ్చాడు. దాంతో వెంటనే లమ్లీ.. అస్థిపంజరాన్ని చెయెన్నేలోని వ్యోమింగ్ స్టేట్ క్రైమ్ ల్యాబ్కు అప్పగించాడు. అక్కడి ల్యాబ్ అధికారి శాండీ మేస్.. ఆ అస్థిపంజరం ఒక పురుషుడిదని, సుమారు 5.9 పొడవు ఉంటాడని తేల్చాడు. అప్పుడే దర్యాప్తు చేస్తున్న అధికారులకు.. గాబీ మిసిసిపీలో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందింది. దాంతో ఈ హత్యకు గాబీకి కచ్చితంగా సంబంధం ఉందని తేలినా.. గాబీ లేకుండాపోవడంతో ట్రంక్ పెట్టె కేసుకు బ్రేక్ పడినట్టయింది. అప్పట్లో లయోవా వాసి షెల్లీ స్టాట్లర్(16), ఆమె తండ్రి ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘బహుశా ఆ అస్థిపంజరం మీ తాత జోసెఫ్ ముల్వానీది కావచ్చ’ని స్టాట్లర్ తండ్రి పదేపదే అనుమానించాడు. అయితే అప్పట్లో స్టాట్లర్ పెద్దగా పట్టించుకోలేదు. ఏళ్లు గడిచేకొద్ది.. స్టాట్లర్కు తన కుటుంబ చరిత్రపై ఆసక్తి పెరిగింది. ఒకసారి తన అమ్మమ్మ మేరీ అలైస్.. తన భర్త జోసెఫ్ ముల్వానీని తన కొడుకు జాన్ డేవిడ్ మోరిస్ చంపేసి ఉంటాడని బాధపడింది. తన తాత గురించి ఎన్నో ఎంక్వైరీలు చేసిన స్టాట్లర్కు 2017 వచ్చేసరికి.. ఆ అస్థిపంజరం తన తాత జోసెఫ్దేననే నమ్మకం బలపడింది. వెంటనే తన తల్లి కేథరిన్ డీఎన్ఏతో సరిచూడాలని అధికారులకు సిఫారసు చేసింది. అదే ఏడాది అక్టోబర్ 19న కేథరిన్ నుంచి డీఎన్ఏ నమూనా తీసుకున్నారు అధికారులు. అనుకున్నట్లే ఆ అస్థిపంజరం జోసెఫ్ ముల్వానీదే కావడంతో జాతీయస్థాయిలో ఈ కేసు మరోసారి వార్తలకు ఎక్కింది. జోసెఫ్ ముల్వానీ ఎవరో కాదు. 1941 నాటి ఇల్లినాయిస్ నేషనల్ గార్డ్లోని 130వ పదాతిదళంలో సభ్యుడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో పసిఫిక్ థియేటర్కి పోరాటయోధుడిగా వెళ్లాడు. తర్వాత కాలిఫోర్నియాలో రైల్రోడ్ వర్కర్ అయ్యాడు. మేరీ అలైస్ను వివాహం చేసుకున్నాడు. కేథరిన్, ఓఓ, పాట్రిక్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మరి మోరిస్ ఎవరు? మేరీ అలైస్ మొదటి భర్త కొడుకే జాన్ డేవిడ్ మోరిస్. 1963లో జోసెఫ్ లయోవాలో ఇల్లు కొని, అందులోకి కుటుంబంతో సహా మాకాం మార్చాడు. ఉన్నట్టుండి జోసెఫ్ అదృశ్యమయ్యాడు. అప్పుడే 16 ఏళ్ల మోరిస్.. జోసెఫ్ను హత్య చేసి పాతిపెట్టి ఉంటాడని, ఆ తర్వాత తవ్వి శరీరభాగాలను పెట్టెలో పెట్టి.. థర్మోపోలిస్ తీసుకుని వెళ్లి ఉంటాడని స్టాట్లర్ కుటుంబం భావించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మోరిస్, గాబీ ఒక్కరే కావడం. మోరిస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో చలామణీ అయ్యాడని దర్యాప్తులో తేలింది. దాంతో గాబీ ఆత్మహత్య కూడా ఒక డ్రామా కావచ్చనే అనుమానాలు బలపడ్డాయి. అయితే నిజం బయటపడక మునుపే.. న్యూవెల్(ట్రంక్ పెట్టె ఓపెన్ చేసిన వ్యక్తి) 2003న, 2009లో మేరీ అలైస్(జోసెఫ్ భార్య) కన్నుమూశారు. 2019 మార్చి 29న వ్యోమింగ్లోని బల్లార్డ్ ఫ్యునరల్ హోమ్లో జోసెఫ్ కుటుంబ సమక్షంలో పూర్తి సైనిక స్మారక లాంఛనాలతో గౌరవప్రదంగా జోసెఫ్ అంత్యక్రియలు జరిగాయి. మొత్తానికీ ఈ కథలో గాబీ అలియాస్ మోరిస్ ఏమయ్యాడు? అసలు స్టెప్ ఫాదర్ అయిన జోసెఫ్ను ఎందుకు చంపాడు? అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన చదవండి: Alzheimers Disease: ఇవి కూడా అల్జైమర్స్ లక్షణాలేనట!! -
ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి కిరాతకంగా హత్య చేసిం'ది'
కులమో మతమో.. ఆస్తో అంతస్తో.. కారణమేమైనా ఇరు కుటుంబాలకు నచ్చని ప్రేమకథల్లో విషాదాంతాలే ఎక్కువ. ఒకరి కోసం ఒకరు బతకలేనప్పుడు.. ఒకరి కోసం ఒకరు చావడమే మేలని తెగించిన సందర్భాలకు సాక్ష్యాలెన్నో చరిత్రలో. అయితే విఫలమైన ప్రేమలోంచి పుట్టుకొచ్చే ఉన్మాదం ఎంతకైనా తెగిస్తుంది. అదే జరిగింది ఎలిస్–ఫ్రీడా జీవితాల్లో. అయితే ప్రేమకు కులమతాలే కాదు లింగబేధాలు కూడా ఉండవని చెప్పిన తొలినాళ్ల కథ ఇది. అది 1892, జనవరి మొదటివారం. అమెరికాలోని టెన్నెసీ, మెంఫిస్లోని 17 ఏళ్ల ఫ్రీడా వార్డ్ దారుణ హత్య.. దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. చంపింది ఎవరో కాదు తన ఫియాన్సీ ఎలిస్ మిషెల్. అంతకుముందు ఏడాది.. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ ఎన్నో ప్రేమలేఖలు రాసుకున్నారు. ఎంతో ఇష్టంగా ఉంగరాలు మార్చుకున్నారు. ప్రాణంగా ప్రేమించిన మనిషే తన ప్రాణాలు తీస్తుంటే ఫ్రీడా నిస్సహాయంగా కూలబడిన క్షణాల గురించి.. ఆమె సోదరి.. ప్రత్యక్షసాక్షి.. ఎడా కన్నీటి పర్యంతమవుతూ జరిగిందంతా కళ్లకు కట్టింది. ‘నేను, మా చెల్లి (ఫ్రీడా) మా ఫ్యామిలీ ఫ్రెండ్ మిసెస్ కింబ్రోగ్ని కలవడానికి మెంఫిస్ వెళ్లాం. అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో ఎలిస్, వాళ్ల అక్క లిల్లీ .. ఇద్దరూ కలసి గుర్రపు బగ్గీలో మమ్మల్ని వెంబడించారు. మేము ఉండే గోల్డ్డస్ట్కి వెళ్తున్న దారిలో ఎలిస్.. మా చెల్లిని చేయి పట్టుకుని లాగి.. రేజర్తో దాడిచేయడంతో నేను షాక్ అయ్యాను. వెంటనే తేరుకొని ఎలిస్ని కాలితో తన్ని కిందకు తోశాను. గొడుగుతో ఎలిస్ని ఆపేందుకు ట్రై చేస్తూ.. ఫ్రీడాని పారిపోమని హెచ్చరించాను. క్షణాల్లో నన్ను తోసేసిన ఎలిస్.. ఫ్రీడా వెంట పగబట్టిన తోడేల్లా పరుగుతీయడం కళ్లరా చూశాను. అలా నా చెల్లిని వెంబడించి దొరకబుచ్చుకున్న ఎలిస్.. ఫ్రీడా జుట్టు పట్టుకొని వెనక్కి లాగి రేజర్తో కసుక్కున ఆమె మెడ కోయడం నేను చూశాను. ఎడమ చెవి కింద నుంచి కుడి చెవి వరకూ మెడ లోతుగా తెగడంతో క్షణాల్లో ఫ్రీడా కూప్పకూలిపోయింది. ఎలిస్ తనను చంపడమేంటనే అయోమయస్థితిలోనే నేలకొరిగింది. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఫ్రీడా చనిపోయింది.. నా చెల్లి ఫ్రీడా చనిపోయింది’ అంటూ ఎడా కోర్టు బోనులో కుమిలి కుమిలి ఏడుస్తుంటే అక్కడున్న వారందరి కళ్లు చెమర్చాయి. అసలు ఎవరీ ఎలిస్? తనకు ఫ్రీడా ఎలా తెలుసు? అంత ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని.. ఎందుకు వెంబడించి మరీ చంపాల్సి వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలు చాలామందిని నిలకడగా ఉండనివ్వలేదు. హత్య జరిగిన మరునాడే ఎలిస్, లిల్లీల అరెస్ట్తో దర్యాప్తు వేగవంతమైంది. అప్పటి దాకా ఈ కేసుపై దృష్టి పెట్టనివారిని కూడా ఆశ్చర్యపరచే ఒక విషయం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. ఎలిస్ అబ్బాయి కాదు. అమ్మాయి అని. నిజమే ఇది ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ. ఎలిస్, ఫ్రీడాలు కలసి చదువుకున్నారు. ఇద్దరూ సంపన్న కుటుంబాలకు చెందిన వారే. ప్రాణస్నేహితులు. ఆ స్నేహబంధం అంతకు మించిన అనుబంధంలా ఎప్పుడు మారిందో వాళ్లకు కూడా తెలియదు. వారి సన్నిహితుల్ని ఆరా తీస్తే.. 1890 నుంచే వారు ప్రేమలో ఉన్నారని తేల్చారు. ‘రెండేళ్ల క్రితమే వారి స్నేహం హద్దులు దాటి.. రొమాన్స్గా మారింది. పబ్లిక్గానే కౌగిలించుకుంటూ.. ముద్దులు పెట్టుకునేవారు. అయితే అప్పటికే చాలామంది ఆడపిల్లలు తమకు కాబోయే భర్తతో ఎలా ఉండాలో ఇతర ఆడపిల్లలతో రిహార్సల్స్ చేస్తుండటం సాధారణమైపోయేసరికి వాళ్ల వ్యవహారమూ అందులో భాగమే అనుకుని ఎవరం పెద్దగా పట్టించుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చారు స్కూల్ టీచర్స్, స్టూడెంట్స్. అయితే ఫ్రీడా, ఎలిస్ల తీరును ఫ్రీడా ఫ్యామిలీ ముందే పసిగట్టింది. కావాలనే ఎలిస్కి దూరంగా అర్కాన్సాస్లోని గోల్డ్డస్ట్కి మకాం మార్చింది. ఆ దూరం ఇరువురిలో విరహాన్ని పెంచిందే తప్ప.. ప్రేమని తుంచలేదు. 1891లో ఓ రాత్రి ఫ్రీడా సూట్కేస్ సర్దుకుంటూ ఎడా కంటపడింది. వెంటనే ఫ్రీడాని బంధించిన ఎడా.. ఆమె దగ్గరున్న ప్రేమ లేఖలను లాక్కుని చదవడం మొదలుపెట్టింది. ‘డియర్ ఫ్రీడా, ఈ లెటర్తో పాటు ఓ రింగ్ పంపిస్తున్నాను. దాన్ని నువ్వు పెట్టుకో.. దీని అర్థం మన పెళ్లి అయిపోయినట్లే. మనం సెయింట్ లూయీస్కి పారిపోదాం. అక్కడ నేను ఎల్విన్ జే వార్డ్ అనే అబ్బాయి పేరుతో అందరికీ పరిచయం అవుతాను. నిన్ను నా భార్యగా పరిచయం చేస్తాను. అప్పుడిక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు.. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం’ అంటూ ఎలిస్.. ఫ్రీడాకి రాసిన చివరి లేఖను చదివి.. షాక్ అయింది ఎడా. వెంటనే ఆ లేఖను పెద్దవాళ్లకు చూపించింది. నాటి నుంచి ఫ్రీడాపై ఇంట్లో ఆంక్షలు ఎక్కువయ్యాయి. ఆ ఇరువురి మధ్య ఉత్తరాలు కూడా బంద్ అయ్యాయి. ఇవన్నీ దర్యాప్తులో తేలిన నిజాలు. ఫ్రీడా హత్యతో లిల్లీకి ఎలాంటి సంబంధం లేదని భావించిన కోర్ట్.. పది వేల డాలర్ల ఫైన్ విధించి, ఆమెను విడుదల చేసింది. ఎలిస్కి మానసిక స్థితి బాగోలేదని, ఎలిస్ పర్సనాలిటీ అమ్మాయిలానే ఉన్నా.. మనస్తత్వం, లక్షణాలు మాత్రం అబ్బాయివే అన్న వాదన తెరపైకి తెచ్చాడు ఎలిస్ తరపు లాయర్. ఫ్రీడా దూరమయ్యాక తట్టుకోలేని ఎలిస్.. చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కూడా వాదనలో వినిపించారు.పది రోజుల వాదనలో చివరిరోజు.. జడ్జ్ తీర్పు కోసం, ఎలిస్ ఇచ్చే వివరణ కోసం కోర్టుకు వేలాదిమంది తరలి వచ్చారు. ఫ్రీడా కోసం ఆత్మహత్య చేసుకునేంతగా ప్రేమించిన ఎలిస్ ఎందుకు ఆమెనే చంపింది? ఇదే అందరి మనసుల్ని రగిల్చిన ప్రశ్న. ‘నాకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కడానికి వీల్లేదని అనుకున్నాను కానీ చంపాలనే కసి మాత్రం లేదు. ఎప్పుడైతే ఎడా నన్ను అడ్డుకుందో.. అప్పుడు ఫ్రీడాను చంపాలనే కసి కలిగింది. అందుకే వెంబడించి చంపేశాను’ అని కోర్టులో చెప్పింది ఎలిస్. అంతా విన్నాక ఎలిస్కి మానసిక పరిస్థితి సరిగా లేదని నమ్మింది కోర్టు. ఎలిస్ని టెన్నెసీలోని బొలీవర్ దగ్గరున్న మెంటల్లీ చాలెంజ్డ్ హోమ్కు తరలించాలని ఆదేశించింది. దాంతో 1892 నుంచి 1898... చనిపోయే వరకూ ఎలిస్ అక్కడే ఉంది. అయితే ఆమె క్షయ వ్యాధి సోకి చనిపోయిందని కొందరు.. వాటర్ టవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. ఏది ఏమైనా ఫ్రీడా హత్యపై ఎలిస్ సరైన వివరణ ఇవ్వకపోవడంతో చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఎలిస్ కంటే ఫ్రీడా అందగత్తె. చదువుకునే రోజుల్లో కుర్రాళ్లంతా ఫ్రీడా వెంటే పడేవారు. అది చూసినప్పుడల్లా ఎలిస్ అసూయపడేది. ఫ్రీడా తననే ప్రేమిస్తుంది కాబట్టి ఆ ఈర్ష్యని బయటపెట్టేది కాదు. హత్య జరిగిన రోజున ఫ్రీడాను చంపే ఉద్దేశం లేని ఎలిస్.. ఎడా జోక్యంతో రెచ్చిపోయి పాత అసూయనూ బయటపెట్టి అప్పటికప్పుడు ఆమె మెడ కోసి చంపేసింది’ అనేది ఒక పుకారు. ‘హత్య జరిగిన రోజున... ఓ అజ్ఞాత వ్యక్తిని ఎలిస్ గమనించింది. అతడు కచ్చితంగా ఫ్రీడా కోసమే వచ్చి ఉంటాడనే అనుమానంతో ఫ్రీడాను హత్య చేసి ఉంటుంద’ని ఇంకో పుకారు. దాన్ని బలపరచే స్థానిక జానపద గీతం నేటికీ ప్రాచుర్యంలో ఉంది. కానీ వేటికీ ఆధారాల్లేవు. - సంహిత నిమ్మన -
గుడ్డిగా నమ్మి ప్రాణాలు కోల్పోయింది.. కానీ ఆ విషయం మాత్రం మిస్టరీనే!
కొందరు మోసగాళ్లకి నమ్మకమే పెట్టబడి. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే.. కనీసం మోసపోయామనే విషయం కూడా తెలియకుండానే జీవితం ముగిసిపోతుందనడానికి ఈ కథ ఓ ఉదాహరణ. అది 1893 డిసెంబర్ 3.. మినీయపోలిస్ (మిన్నెసొటా, అమెరికా).. కనిచీకటి పడుతున్న వేళ.. 29 ఏళ్ల క్యాథరిన్ జింగ్.. గూస్మాన్ లివెరీ స్టేబుల్కి వెళ్లి క్లాస్ బ్లిక్ట్స్ అనే పేరు మీద ఓ గుర్రం, ఓ బగ్గీ (గుర్రబ్బండి)ని అద్దెకు తీసుకుంది. సరిగ్గా రాత్రి ఏడున్నర అయ్యేసరికి ఆ బగ్గీపై వెస్ట్ హోటల్ వైపు వెళ్లి.. అక్కడ క్లాస్ బ్లిక్ట్స్ అనే వ్యక్తిని కలిసింది. తన దగ్గరున్న నకిలీ నోట్లు అతడికి ఇచ్చి.. అతడి దగ్గరున్న ఒరిజినల్ కరెన్సీని తను తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. ఆమె రాకకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్న బ్లిక్ట్స్.. ఆమె రాగానే తుపాకీతో కాల్చాడు. క్షణాల్లో నేలకొరిగిన క్యాథరిన్ తలపై పెద్ద రాయితో కొట్టి, ఆమె దగ్గరున్న అన్నింటినీ లాక్కుని ఉడాయించాడు. గుర్రాన్ని, గుర్రబ్బండినీ గూస్మాన్ లివెరీ స్టేబుల్కి అప్పగించేశాడు. ఎలాగో బ్లిక్ట్స్ పేరుమీదే వాటిని క్యాథరిన్ అద్దెకు తీసుకుంది కాబట్టి వాటిని తిరిగి ఇవ్వడానికి అతడు పెద్దగా కష్టపడలేదు. ఎనిమిదిన్నర.. తొమ్మిది మధ్యలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న విలియం ఎర్హార్డ్ అనే వ్యక్తి రోడ్డు మీద జింగ్ మృతదేహాన్ని గుర్తించాడు. కాసేపటికే అజ్ఞాత యువతి యాక్సిడెంట్ అని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోస్ట్మార్టమ్ తర్వాత అది హత్య అని ఆమె తలలోని బుల్లెట్ తేల్చింది. ఆ తర్వాత.. ఆమె ఎవరో కాదు క్యాథరిన్ జింగ్ అనే డ్రెస్ మేకర్ అనీ తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. క్యాథరిన్ జింగ్... చాలా అందగత్తె. ఆమె సన్నిహితులంతా ఆమెని కిట్టీ అని ముద్దుగా పిలుచుకునేవారు. కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ నుంచి మిన్నెసొటాకి వచ్చి, బట్టలు తయారుచేసే సంస్థలో డ్రెస్ మేకర్గా చేరింది. మరో డిపార్ట్మెంట్ స్టోర్లో క్లర్కుగా పనిచేస్తున్న ఫ్రెడెరిక్తో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్థం అయిన తర్వాత ఏవో కొన్ని గొడవలతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అయితే ఫ్రెడెరిక్ తొడిగిన నిశ్చితార్థపు ఉంగారాన్ని మాత్రం ఆమె ఎప్పుడూ తన మెడలో వేసుకుని తిరిగేది. ఏళ్లు గడిచే కొలదీ ఆమె జీవితంలో కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులతో పాటు డబ్బూ జమకూడింది. అయితే జింగ్ మరణం తర్వాత మరింత లోతుగా ఆరాలు తీసిన పోలీసులు.. హత్య జరిగిన మూడురోజుల్లోనే నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో క్యాథరిన్ మాజీ ప్రేమికుడు ఫ్రెడెరిక్తో పాటు ధనిక కుటుంబానికి చెందిన హ్యారీ హేవార్డ్, హ్యారీ సోదరుడు ఆండ్రీ, సెక్యూరిటీ గార్డ్ బ్లిక్ట్స్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ విచారణలో ఫ్రెడెరిక్ అమాయకుడని నిర్ధారించి విడిచిపెట్టేశారు. ‘క్యాథరిన్ నా దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బు కోసమే ఆమెని చంపి, డబ్బు ఎత్తుకెళ్లి ఉంటారు’ చెప్పాడు హ్యారీ. తను క్యాథరిన్కు డబ్బు ఇచ్చేప్పుడు సాక్షిగా ఉన్న పనిమనిషినీ స్టేషన్కు పిలిపించాడు. దాంతో పోలీసులు హ్యారీది కూడా తప్పు లేదని నమ్మారు. ఆండ్రీ, బ్లిక్ట్స్ కూడా తమకు ఈ కేసుతో ఏ సంబంధం లేదనడంతో పోలీసుల దృష్టి హ్యారీ గర్ల్ఫ్రెండ్ లిలియన్ అలెన్ మీద పడింది. గతంలో హ్యారీతో క్యాథరిన్ క్లోజ్గా ఉండటం తట్టుకోలేకపోయిన అలెన్ .. రెండుమూడు సార్లు క్యాథరిన్తో గొడవపడిందట. కానీ విచారణలో ఆమె కూడా నిర్దోషిగానే తేలింది. అయితే పోలీసుల దెబ్బలు రుచి చూసిన ఆండ్రీ నోరు విప్పాడు. ‘హ్యారీ కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి.. క్యాథరిన్ను చంపేందుకు సాయం చేయాలని కోరాడు. కానీ నేను భయపడి నో చెప్పాను. మా ఫ్యామిలీ లాయర్ లెవీ స్టూవర్ట్కి అప్పుడే ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను. కావాలంటే స్టూవర్ట్ని ప్రశ్నించండి’ అంటూ కేసుని హ్యారీ వైపు తిప్పాడు ఆండ్రీ. స్టూవర్ట్.. ఆండ్రీకి అనుకూలంగా నిలబడటంతో హ్యారీ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఒజార్క్ ఫ్లాట్స్లోని క్యాథరిన్ అద్దెకుండే అపార్ట్మెంట్ ఓనర్ హ్యారీ తండ్రిదని.. హ్యారీకి, క్యాథరిన్కి చాలా సన్నిహిత సంబంధం ఉందని ప్రాథమిక విచారణలో బయటపడింది. హ్యారీ మంచి జూదగాడు. ఇన్సూరెన్స్ మోసాలు, డబ్బు కోసం భారీ చోరీలు, నకిలీ కరెన్సీ తయారీ వంటి పనుల్లో ఆరితేరిన మనిషి. చాలా అపరిష్కృత హత్య కేసుల్లో అతడి పేరుంది. అతడి గురించి తెలిసినవాళ్లంతా అతన్ని శాపనార్థాలు పెట్టేవారు. ఫ్రెడెరిక్తో విడిపోయిన బాధలో ఉన్న క్యాథరిన్కి.. హ్యారీ స్నేహం ఊరటనిచ్చింది. క్యాథరిన్కు డబ్బు ఆశ చూపిస్తూ తను చేసే ప్రతి దుశ్చర్యలో ఆమెను భాగంచేసేవాడు.. కొంత సొమ్ము ముట్టజెప్పేవాడు. ఆ క్రమంలోనే వారి మధ్య బంధం బలపడింది. హ్యారీ ప్రోత్సాహంతో క్యాథరిన్.. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకుంది. దానికి నామినీగా అతడి పేరు రాయించుకున్నాడు. క్యాథరిన్ చనిపోతే ఆ పాలసీ డబ్బులు తనకే వస్తాయని ఇదంతా చేశాడు హ్యారీ. మొత్తం కథలో బ్లిక్ట్స్ ఇచ్చిన సాక్ష్యం కీలకంగా మారింది. క్యాథరిన్ నన్ను కలవడానికి ప్లాన్ చేసిందే హ్యారీ. నకలీ డబ్బుల మార్పిడి కోసం క్యాథరిన్ నా దగ్గరకు వచ్చిందని చెప్పాడు. అంతే కాదు హ్యారీ ఈ హత్య ప్లాన్ గురించి చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు, అతడు నా కళ్లలోకి కళ్లు పెట్టి తదేకంగా చూశాడు. ఆ తర్వాత అతడు ఏం చెప్పినా నేను నో అనలేకపోయాను. ఆ చూపులో ఏదో మాయ ఉంది. అందుకే క్యాథరిన్ని హత్య చేశాను’ అంటూ హ్యారీ తనపై హిప్నాటిజం చేశాడని చెప్పుకొచ్చాడు బ్లిక్ట్స్. అయితే అప్పటికే స్థానికులు హ్యారీ హిప్నాటిజం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. అతడికి ఏదో శక్తి ఉందని, అతడి కళ్లల్లో ఏదో మాయ ఉందని.. వశీకరణ చేసి చాలా మందిని మట్టుబెట్టాడని ఇలా హ్యారీపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. బ్లిక్ట్స్ ప్రత్యక్షసాక్షి కావడంతో వశీకరణ అనే అంశాన్ని పక్కన పెట్టి.. న్యాయపరంగానే విచారణ సాగించారు. కొన్ని వాయిదాల తర్వాత హ్యారీకి ఉరిశిక్ష, బ్లిక్ట్స్కి జీవితఖైదు పడింది. ఆండ్రీ నిర్దోషిగా బటయపడ్డాడు. 1895 డిసెంబర్ 11న తెల్లవారు జామున 2.12కి హ్యారీని ఉరి తీశారు. అయితే హ్యారీ 2.25 ని.ల వరకూ బతికేవున్నాడనీ రికార్డుల్లో నామోదు చేసుకున్నారు అధికారులు. దాంతో నిజంగానే హ్యారీ చాలా శక్తిమంతుడని.. అతడికి క్షుద్రపూజలు కూడా తెలుసని.. చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. అతడు తిరిగి లేచి, బతికొస్తాడనీ కొందరు భావించేవారు. హ్యారీకి ఉరి తీసే కొన్ని రోజుల ముందు ఒక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తను చేసిన కొన్ని హత్యల గురించి నోరు విప్పాడు హ్యారీ. అప్పుడు కూడా వశీకరణ గురించి చెప్పలేదు. దాంతో బ్లిక్ట్స్ని నిజంగానే వశీకరణ చేసి క్యాథరిన్ని చంపించాడా? లేక బ్లిక్ట్స్ కావాలనే అబద్ధం చెప్పాడా? అనేది తేలలేదు. కేసు ముగిసినా నేరస్తుడికి శిక్షపడినా.. ఈ కథలోని వశీకరణ కోణం నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన చదవండి: Mystery Room No 1046 Story: నిన్ను చంపాలనుకుంది ఎవరు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రోలాండ్! -
వీడిన రెండేళ్ల మిస్సింగ్ కేసు మిస్టరీ
బద్వేలు అర్బన్ : రెండేళ్ల క్రితం బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్లో నమోదైన ఓ మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇటీవల జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ జిల్లాలోని మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రూరల్ పోలీసులు విచారణ చేపట్టగా సంచలన నిజాలు వెలుగు చూశాయి. సదరు తప్పిపోయిన మహిళ పొలానికి వేసిన విద్యుత్ కంచె తగులుకుని మృతిచెందగా పొలం యజమానితో పాటు మరికొందరు కలిసి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టినట్లు తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ ఎస్.ఆర్.వంశీధర్గౌడ్ వివరించారు. బద్వేలు మండలం మల్లంపేట గ్రామానికి చెందిన బొల్లా రామసుబ్బమ్మ (49) అనే మహిళ తన భర్తతో ఏర్పడిన విభేదాలతో సిద్దవటం మండలం జ్యోతి సమీపంలోని గొల్లపల్లె గ్రామంలోని ఆమె సోదరుని ఇంటి వద్ద నివసిస్తుండేది. అయితే 2020వ సంవత్సరం జూలై 9వ తేదీన తమ తల్లి కనిపించడం లేదని ఆమె కుమారుడు శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్ని నెలల పాటు విచారించి ఆచూకీ లభించకపోవడంతో పెండింగ్ కేసుగా ఉంచారు. ఇటీవల కాలంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ జిల్లాలోని మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి తిరిగి విచారణ చేయాలని ఆదేశించడంతో తన పర్యవేక్షణలో రూరల్ సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ చంద్రశేఖర్, సబ్ డివిజన్ ఐడీపార్టీ సిబ్బందితో కలిసి విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సిద్దవటం గొల్లపల్లె గ్రామంలోని జ్యోతిరామకృష్ణారెడ్డికి చెందిన పొలానికి అమర్చిన విద్యుత్ తీగల కంచె తగులుకుని ఓ మహిళ మృతి చెందిందని సమాచారం లభించింది. దీనిపై సదరు పొలం యజమానిని పూర్తిస్థాయిలో విచారించగా అసలు విషయం బయటపడింది. పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగులుకుని మహిళ మృతి చెందడంతో మరికొందరి సహాయంతో సిద్దవటం సమీపంలోని పెన్నానదిలో పూడ్చినట్లు విచారణలో తేలింది. తర్వాత పెన్నానదిలో పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీసి మృతదేహానికి ఉన్న చీర, జాకెట్ ఆధారంగా మృతురాలు అప్పట్లో తప్పిపోయిన రామసుబ్బమ్మగా నిర్ధారణకు వచ్చిఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పొలం యజమాని రామకృష్ణారెడ్డితో పాటు ఇందుకు సహకరించిన లక్షుమయ్య, వెంకటయ్య, కొండయ్య, వెంకటరమణ, వెంకటసుబ్బయ్యలను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచామని, ఈ కేసులో మరొక నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐలు రాజశేఖర్రెడ్డి, నరసింహారావు, ఐడీపార్టీ ఏఎస్ఐలు రాంభూపాల్రెడ్డి, నాగేంద్ర, కానిస్టేబుళ్లు శివ, అమరేశ్వర్రెడ్డి, ప్రసాద్లను జిల్లా ఎస్పీ, మైదుకూరు డీఎస్పీలు అభినందించారు. -
Mystery: నిన్ను చంపాలనుకుంది ఎవరు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రోలాండ్!
ప్రతీకారమో పశ్చాత్తాపమో కానీ.. ఓ జీవితం ముగిసింది. హత్యనో.. ఆత్మహత్యనో తేలకుండా అనుమానాస్పద కథనంగా మిగిలిపోయింది. అది 1935 జనవరి 4. అమెరికాలోని కేంజస్ సిటీలో నిత్యం అతిథులతో కళకళలాడే ‘ప్రెసిడెంట్ హోటల్’లో ఊహించని కలకలం మొదలైంది. అంతకు రెండు రోజుల క్రితం రూమ్ నం. 1046లో దిగిన రోలాండ్ టి. ఓవెన్ అనే యువకుడు చావుబతుకుల మధ్య నెత్తురోడుతున్నాడు. గమనించిన హోటల్ సిబ్బంది.. మొదటి కాల్ అంబులెన్స్కి, రెండో కాల్ పోలీస్ స్టేషన్కి చేశారు. ఆ రూమ్ మొత్తంలో ఒక సిగరెట్ పెట్టె, పగిలిన గ్లాస్, టెలిఫోన్ స్టాండ్ మీద దొరికిన ఒక మహిళ వేలిముద్రలు కీలక ఆధారంగా మారాయి. పోలీస్ విచారణలో వింత విషయాలు చాలానే బయట పడ్డాయి. రోలాండ్ చూడటానికి కాస్త బాడీ బిల్డర్లా ఉన్నాడని, బ్లాక్ కోట్ ధరించిన అతడికి సుమారు 20 నుంచి 35 ఏళ్ల వయసు ఉండొచ్చని.. జుట్టు బ్రౌన్ కలర్లో ఉందని, అతడి తల మీద చాలా గాయాల తాలూక ఆనవాళ్లు ఉన్నాయని, అతడి చెవులు కాస్త భిన్నంగా కిందకు వంగినట్లుగా ఉన్నాయని.. చెప్పుకొచ్చారు అక్కడి సిబ్బంది. అయితే అతడ్ని మొదటిసారి రూమ్కి తీసుకుని వెళ్లిన బెల్బాయ్ రాండమ్ క్రాఫ్ట్.. మరో విచిత్రమైన విషయాన్ని చెప్పాడు. రోలాండ్ జనవరి 2న మధ్యాహ్న సమయంలో హోటల్కి వచ్చాడని, తన వెంట కేవలం ఒక బ్రష్, ఒక పేస్ట్, ఒక దువ్వెన మాత్రమే తెచ్చుకున్నాడని, పైగా రూమ్ కావాలని కాకుండా.. కిటికీలు కూడా లేని ఇంటీరియర్ రూమ్ కావాలని.. ప్రైవసీ ఎక్కువగా ఉండాలని కోరడంతో మేనేజర్.. అలాంటి రూమ్నే కేటాయించాడని చెప్పుకొచ్చాడు. అసలేం జరిగింది? రోలాండ్.. హోటల్లో దిగిన రోజు సాయంత్రం రూమ్ క్లీన్ చేసేందుకు మేరీ సోప్టిక్ అతడి రూమ్కి వెళ్లింది. అప్పుడు రోలాండ్.. డిమ్ లైట్లో చైర్పై కూర్చుని కాస్త భయపడుతున్నట్లుగా కనిపించాడట. రూమ్ క్లీన్ చేసిన తర్వాత బయటికి రాబోతున్న సోప్టిక్తో రోలాండ్.. ‘కాసేపట్లో నా స్నేహితుడు వస్తాడు, డోర్ లాక్ చేయొద్దు’ అని చెప్పాడట. దాంతో ఆమె డోర్ లాక్ చేయకుండానే వెళ్లింది. కొద్దిసేపటికి టవల్స్ తీసుకుని సోప్టిక్ మళ్లీ రోలాండ్ రూమ్కి వచ్చింది. అప్పుడు రోలాండ్ ఒంటినిండా దుప్పటి కప్పుకుని మంచంపై పడుకుని కనిపించాడట. అయితే బల్ల మీద ‘డాన్, నేను పావుగంటలో వస్తా, వెయిట్ చేయండి’ అని నోట్ రాసిపెట్టాడట. అది చదవిన సోప్టిక్ టవల్స్ రూమ్లో పెట్టి, బయటికి వచ్చేసింది. ఆ మరునాడు సోప్టిక్ మళ్లీ రోలాండ్ రూమ్ని క్లీన్ చేయడానికి వెళ్లినప్పుడు.. తలుపు బయట నుంచి లాక్ చేసి ఉండటంతో తన దగ్గరున్న డూప్లికేట్ కీ సాయంతో తలుపు తెరిచింది సోప్టిక్. రూమ్ అంతా చీకటిగా ఉండటంతో, లైట్ వేసింది. ఎదురుగా రోలాండ్ దిగులుగా కూర్చుని ఉండటం చూసి షాక్ అయ్యింది. బయట తలుపు ఎవరు పెట్టారు? అనేది ఆమెకు అర్థం కాలేదు. షాక్ నుంచి తేరుకుని క్లీనింగ్ చేస్తున్నప్పుడు రోలాండ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ.. ‘వద్దు డాన్, నాకు తినాలని లేదు. నేను ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ చేశాను’ అని చెప్పాడట. మరునాడు మళ్లీ దుప్పట్లు మార్చేందుకు రోలాండ్ రూమ్ బెల్ కొట్టింది సోప్టిక్. అయితే ఈ సారి ఆ రూమ్లో రోలాండ్తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లుగా ఆమె గమనించింది. ‘మాకు ఏం అవసరం లేదు.. నువ్వు వెళ్లొచ్చు’ అనే గంభీరమైన స్వరం ఒకటి సోఫ్టిక్కి వినిపించింది. అది కచ్చితంగా రోలాండ్ స్వరం కాదు అనేది సోఫ్టిక్కి తెలుసు. మరోవైపు జనవరి 4 తెల్లవారు జామున రూమ్ నంబర్ 1048లో ఉంటున్న ఒక మహిళ నుంచి రిసెష్షన్కి ఓ కంప్లైంట్ వచ్చింది. ‘1046లో ఉంటున్న వాళ్లతో చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అందులో ఓ మహిళ పెద్దపెద్దగా అరుస్తోంది’ అని ఆమె రిసెప్షన్కి కాల్ చేసి చెప్పింది. దాంతో వెంటనే రోలాండ్ ఉండే రూమ్కి ఫోన్ ట్రై చేశారు రిసెష్షన్లో పని చేసే సిబ్బంది. ఫోన్ కలవకపోవడంతో టెలిఫోన్ కనెక్షన్ పోయి ఉంటుందనుకుని.. బెల్ బాయ్ని రోలాండ్ రూమ్కి పంపించారు. ఎంత సేపు కొట్టినా తలుపు తీయకపోవడంతో వెనుదిరిగాడు బెల్ బాయ్. కొన్ని గంటల తర్వాత మరో బెల్ బాయ్ రోలాండ్ రూమ్ దగ్గరకు వచ్చాడు. అతడు ఈసారి బలవంతంగా తలుపు తెరిచి చూశాడు. డోర్కి రెండు అడుగుల దూరంలో రోలాండ్ మోకాళ్లపై కూర్చుని తలను చేతులతో పట్టుకుని ఉన్నాడు. ఒంటి నిండా రక్తం కారుతోంది. లైట్ ఆన్ చేసిన బెల్ బాయ్.. మంచం మీద, బాత్ రూమ్లో, గోడలపైనా ఉన్న రక్తం మరకల్ని చూసి భయపడ్డాడు. పరుగున వెళ్లి మేనేజర్కి విషయం చెప్పాడు. రోలాండ్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్లు.. అతడ్ని ఎవరో తీవ్రంగా హింసించారని, ఛాతీలో, ఊపిరితిత్తుల్లో కత్తితో గట్టిగా పొడిచారని.. కుడివైపు మెదడు బాగా దెబ్బతిందని.. కొన్ని గంటల వరకూ ఏం చెప్పలేమని అన్నారు. దాంతో రోలాండ్పై హత్యాయత్నం చేసింది ఎవరంటూ పోలీసులు గట్టిగానే విచారణ మొదలుపెట్టారు. ఇక్కడే మరో ట్విస్ట్ కథను ఉత్కంఠగా మార్చింది. రోలాండ్ సృహలోకి వచ్చాడు. వెంటనే రోలాండ్పై డిటెక్టివ్, పోలీసులు కలసి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరు?’ అని రోలాండ్ని అడిగితే.. ‘నన్ను ఎవరూ చంపాలనుకోలేదు.. నేను బాత్ రూమ్ టబ్లో పడిపోయాను. అందుకే దెబ్బలు తగిలాయి’ అని షాకిచ్చాడు రోలాండ్. ‘నిజం చెప్పు.. ఎవరూ నీపై దాడి చేయకుంటే.. ఆత్మహత్యాయత్నం చేసుకున్నావా?’ అనీ ప్రశ్నించారు. ‘లేదు.. ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమే’ అని సమాధానమిచ్చి కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ మరునాడు జనవరి 5న అదే ఆసుపత్రిలో చనిపోయాడు. దాంతో పోలీసులు కేసుని సవాలుగా తీసుకున్నారు. అప్పుడే మరో కీలక సాక్ష్యం బయటపడింది. ఆ హోటల్ ఎలివేటర్ ఆపరేటర్ చార్ల్స్ బ్లాషర్.. ‘ఒక మహిళ రూమ్ నంబర్ 1026 ఎక్కడా? అని నన్ను అడిగింది, తర్వాత ఆమె రోలాండ్ రూమ్ ముందు తచ్చాడుతూ కనిపించింది, నన్ను చూడగానే కాస్త కంగారుపడి పొరపాటుగా ఇక్కడికి వచ్చానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. కాసేపటికి ఆమె మరో వ్యక్తితో కలసి మాట్లాడటం నేను చూశాను’ అని చెప్పాడు. అంతే కాదు ఆ వ్యక్తే డాన్ అయి ఉండొచ్చని చార్ల్స్ అభిప్రాయపడ్డాడు. చార్ల్స్ చెప్పిందంతా విన్నాక.. రోలాండ్ గదిలో దొరికిన మహిళ వేలిముద్రలు ఆమెవే కావచ్చనీ పోలీసులు భావించారు. ఇక పోలీసులు రోలాండ్ శవాన్ని ఖననం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. ఊహించిన ఒక ఫోన్ కాల్.. అతడి మరణం హత్యేనని బలపరచింది. ‘కావాల్సినంత డబ్బు పంపిస్తాను. అతడి అంత్యక్రియలు మాత్రం కేంజస్ సిటీ మెమోరియల్ పార్క్ శ్మశాన వాటికలోనే ఘనంగా జరిపించండి. అక్కడైతే అతడు మా చెల్లెలికి దగ్గరలో ఉంటాడు’ అని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. అతడు చెప్పినట్లే మార్చి 23న ఒక అజ్ఞాత సెంటర్ నుంచి పెద్ద డబ్బు కట్ట పోలీస్ స్టేషన్కి వచ్చింది. డబ్బుతో పాటు రాక్ ఫ్లవర్ కంపెనీ నుంచి కొన్ని పువ్వులు కూడా వచ్చాయి. వాటి మధ్యలో ‘లవ్ ఫరెవర్ లూయీ’ అనే నోట్ ఉంది. రాక్ కంపెనీలో ఆరా తీస్తే.. అక్కడ కూడా ఆధారాలు దొరకలేదు. ఇక ఈ విషయాన్ని వార్తాపత్రికలు కథలు కథలుగా ప్రచురించాయి. అలాంటి ఓ కథనాన్ని చదివిన రూబీ ఓగ్లెట్రీ అనే మహిళ.. కేంజస్ సిటీ పోలీస్ స్టేషన్ వెతుక్కుంటూ వచ్చింది. రోలాండ్ తన కన్నకొడుకు అని.. అతడి అసలు పేరు ఆర్టెమస్ ఓగ్లెట్రీ అని చెబుతూ తన కొడుకు తనకు రాసిన లెటర్లు కొన్ని సాక్ష్యంగా చూపించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. రూబీకి వచ్చిన లెటర్స్లో కొన్ని రోలాండ్ చనిపోయిన తర్వాత తేదీతో ఉన్నాయి. అవన్నీ హ్యాండ్ రైటింగ్తో కాకుండా టైప్ చేసి ఉన్నాయి. ఇంకో వార్త పత్రికకు మరో మహిళ ఫోన్ చేసి.. ‘వాడు చేసిన తప్పుకు వాడికి తగిన శిక్షే పడింది’ అని చెప్పిందట. ‘ మీరు మాట్లాడేది రోలాండ్ గురించేనా అంటే.. ‘అవును’ అని ఫోన్ పెట్టేసిందట. అయితే పోలీసులకు ఆ ఫోన్ కాల్స్పై కూడా ఏ ఆధారం దొరకలేదు. ఆ ఫోన్ కాల్స్ ఎపిసోడ్ తర్వాత.. రోలాండ్ అలియాస్ ఆర్టెమస్ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని, అది తట్టుకోలేక ఆమె చనిపోతే.. ఆమె బంధువులే అతడ్ని మట్టుపెట్టి ఉంటారనే కథా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. మొత్తానికీ రూబీకి లెటర్లు ఎవరు పంపారు? డాన్ ఎవరు? 1048 రూమ్ నుంచి కంప్లైంట్ చేసిన మహిళ చెప్పినట్లు రోలాండ్ రూమ్లో పెద్దపెద్దగా అరిచిన మహిళ ఎవరు? చనిపోయాక అతడి కోసం డబ్బులు, పువ్వులు ఎవరు పంపిచారు? అసలు లూయీ అంటే ఎవరు? రోలాండ్ అసలు పేరు నిజంగానే ఆర్టెమస్సేనా? ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య అతడి కథ ముగిసింది అనుమానాస్పదంగా! -సంహిత నిమ్మన -
Mystery: లాసన్ ఫ్యామిలీ ట్రాజెడీ..
అత్యంత క్రూరమైన జంతువు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కొందరు మనుషుల క్రూరమైన ఆలోచనల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే, అనుకున్నది జరిగేంత వరకూ.. వాళ్లు పన్నే వ్యూహాలు.. వేసే ఎత్తుగడలు.. ఎవరి ఊహలకూ అందవు. ఎలాంటి అనుమానాలకూ తావివ్వవు. దాదాపు 93 ఏళ్ల క్రితం జరిగిన.. ‘లాసన్ ఫ్యామిలీ ట్రాజెడీ’ చదివితే.. తోటి మనిషిపైన, రేపటి రోజుపైన క్షణకాలం పాటు నమ్మకం సడలుతుంది. \అది 1929, డిసెంబర్ 25 మధ్యాహ్నం.. అమెరికాలోని నార్త్ కరోలినాలోని జర్మన్టన్లో ప్రజలు క్రిస్మస్ సంబరాల్లోంచి ఇంకా బయటకు రాలేదు. ఉన్నట్టుండి చార్లెస్ డేవిస్ లాసన్ అనే పొగాకు రైతు ఇంట్లో వరుసగా తుపాకీ కాల్పులు వినిపించాయి. ఊరు ఊరంతా అటు పరుగుతీసింది. ఇంటినిండా ఛిద్రమైన శవాలు. రక్తపు చారలు. పెనుగులాడిన ఆనవాళ్లు. వంట గదిలోని క్రిస్మస్ కేక్ ఇంకా పొగలు కక్కుతూనే ఉంది. ఆ ఘాతుకానికి పాల్పడిన వారికోసం పోలీసులు, ప్రజలు చుట్టుపక్కలంతా గాలిస్తూనే ఉన్నారు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. కొన్ని గంటల తర్వాత పక్కనే ఉన్న అడవిలోంచి మరో తుపాకీ గుండు పేలిన శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే చార్లెస్ శవమై ఉన్నాడు. చార్లెస్ డేవిస్ లాసన్.. నార్త్ కరోలినాలోని లాస¯Œ విల్లేలో 1886, మే 10న జన్మించాడు. 1911లో ఫెన్నీ మాన్రింగ్తో పెళ్లి తర్వాత జర్మన్టన్లో స్థిరపడ్డాడు. 18 ఏళ్ల కాపురంలో ఆ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టారు. అయితే మూడో సంతానమైన విలియం 1920లో అనారోగ్యంతో చనిపోయాడు. 1927 నాటికి ఆర్థికంగా బలపడిన చార్లెస్ కుటుంబం.. బ్రూక్ కోవ్ రోడ్లో సొంత పొలాన్ని కొనడానికి సరిపడా డబ్బులు పోగు చేసుకుంది. అంతా సజావుగానే సాగుతుందనుకునే సమయంలో.. 1929 డిసెంబర్ 25 ఉదయాన్నే కుటుంబాన్ని తీసుకుని దగ్గరలోని పట్టణం వెళ్లాడు చార్లెస్(43). పండుగ పేరుతో భార్యబిడ్డలకు కొత్త బట్టలు కొనిచ్చాడు. నిజానికి ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి అవన్నీ అతి ఖరీదైన దుస్తులు. ఆ తర్వాత అంతా కలిసి ఒక గ్రూప్ ఫొటో కూడా దిగారు. అదే ఆ కుటుంబానికి చివరి ఫొటోగా మిగిలింది. ఇంటికి వచ్చాక చార్లెస్ తన పెద్దకొడుకు ఆర్థర్(17)తో కలిసి.. సమీపంలోని అడవికి వేటకు వెళ్లాడు. అక్కడ బుల్లెట్స్ అన్నీ అయిపోవడంతో.. వాటిని కొని తెమ్మని ఆర్థర్ని పట్టణానికి పంపించి.. ఇంట్లో మారణహోమానికి సిద్ధమయ్యాడు చార్లెస్. తన కుమార్తెలు క్యారీ(12), మేబెల్(7)లు మేనత్త ఇంటికి వెళ్లిరాగానే.. తుపాకీ గుళ్లతో విరుచుకుపడ్డాడు. ముందుగా క్యారీ, మేబెల్లను కాల్చి చంపి.. పొగాకు కుప్పల పక్కన దాచిపెట్టాడు. అనంతరం ఇంటి వాకిట్లో ఉన్న భార్యపై(37) కాల్పులు జరిపాడు. ఆ వెంటనే కొడుకులు జేమ్స్(4), రేమండ్(2)లను, వారిని కాపాడటానికి ప్రయత్నించిన పెద్ద కూతురు మేరీ(16)నీ చంపేశాడు. చివరికి మూడు నెలల పసి బిడ్డ మెర్రీ లూని కూడా విడిచిపెట్టలేదు. అతి కిరాతకంగా నేలకేసి కొట్టికొట్టి కడతేర్చాడు. అయితే పెద్దకొడుకు ఆర్థర్ని తనంతట తానే ఎందుకు వదిలిపెట్టాడనేది అంతుబట్టని రహస్యంగా మారింది. ఆర్థర్ ఇంటికి వచ్చేసరికి ఇల్లు శ్మశానంగా మారిపోయింది. అడవిలో ఆత్మహత్య చేసుకున్న చార్లెస్ జేబులో ఏవో రెండు లేఖలు దొరికాయి. అయితే అందులో తన తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారం తప్ప.. వీళ్లందరినీ ఎందుకు చంపాడనే వివరం లేదు. ఈ దుర్ఘటనపై చాలా ఊహాగానాలు, కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అవే ఈ కేసుపై ఆసక్తి చూపించినవారిని సమాధానపరచాయి. ఈ ఘటన జరడగానికి సరిగ్గా నెల రోజుల ముందు చార్లెస్ తలకి బలమైన దెబ్బ తగిలిందని, మానసిక స్థితి దెబ్బతినడం వల్లే అలా హత్యలకు పాల్పడి ఉంటాడని కొందరు వాదించారు. అయితే చార్లెస్ మెదడుపై చేసిన వైద్య పరీక్షల్లో అలాంటి తేడాలేం గుర్తించలేదు. మరొక కథనం అతి ఘోరమైనది. చార్లెస్ తన పెద్ద కుమార్తె మేరీతో అనుచిత సంబంధం కలిగి ఉన్నాడని.. అతడి కారణంగా ఆమె గర్భవతి అయ్యిందని, అందుకు సాక్ష్యం.. కుటుంబమంతా ఉన్న ఆ చివరి ఫొటోనే అని, అందులో మేరీని గమినిస్తే తను కడుపుతో ఉందన్న విషయం స్పష్టమవుతుందని, ఆ నిజం ప్రపంచానికి తెలియకూడదనే ఉద్దేశంతోనే కుటుంబం మొత్తాన్ని చార్లెస్ చంపేశాడనేది మరి కొందరి వాదన. మేరీ గర్భవతన్న విషయం.. తమతో మేరీ తల్లి ఫెన్నీ చెప్పిందని, చార్లెస్, మేరీల ప్రవర్తనపై ఆమె ఆందోళనగా ఉండేదని.. బంధువుల్లో, స్నేహితుల్లో కొందరు సాక్షులుగా ముందుకొచ్చారు. వారితో అలా ఎవరైనా చెప్పించారా అనేది కూడా ప్రశ్నే. పైగా, మేరీ గర్భవతని నిర్ధారించే వైద్యపరమైన ఏ అధికారిక నివేదికా రాలేదు. ఇది ఇలా ఉండగా.. చార్లెస్సే హత్యలు చేశాడనడానికి బలమైన కారణాలుగా అదే రోజు భార్యబిడ్డలకు ఖరీదైన దుస్తులు కొనివ్వడం, వారితో కలిసి ఫొటోదిగడం.. ఇవేమీ యాదృచ్ఛికం కాదంటారు చాలా మంది. పథకం ప్రకారమే చార్లెస్ తన కుటుంబాన్ని కడతేర్చాడు అనేది వారి వాదన. మరోవైపు.. చార్లెస్కి ఏ పాపం తెలియదని, చార్లెస్తో సహా ఆ కుటుంబాన్ని మొత్తం ఎవరో చంపేసి ఇలా చిత్రీకరించి ఉంటారనేది ఇంకో కోణం. మొత్తానికి ప్రాణాలతో మిగిలిన చార్లెస్ పెద్ద కొడుకు ఆర్థర్ లాసన్ ఏకాకిగా పెరిగి, పెద్దయ్యాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అతడికి నలుగురు పిల్లలు పుట్టారు. ఏవో ఆస్తి తగాదాల్లో తన భూమిని కూడా కోల్పోయాడు. దురదృష్టవశాత్తు, అతని 32వ ఏట 1945లో కారు ప్రమాదంలో చనిపోయాడు. నార్త్ కరోలినా, మాడిస¯Œ లోని ‘మాడిసన్ డ్రై గూడ్స్ కంట్రీ స్టోర్’లో చార్లెస్ లాసన్ కుటుంబానికి గుర్తుగా ఒక చిన్న మ్యూజియం ఉంది. ఇప్పటికీ ఈ భయంకరమైన విషాదాన్ని తెలుసుకోవడానికి అక్కడి ప్రజలు ఆ మ్యూజియానికి వస్తుంటారు. ఆ రోజు ఎవరూ తినకుండా మిగిలిపోయిన చార్లెస్ ఇంట్లోని క్రిస్మస్ కేక్ని కూడా కొన్నాళ్లపాటు ప్రజల సందర్శనకు ఉంచారు. చివరికి లాసన్ బంధువుల్లో ఒకరు గొయ్యితీసి దాన్ని పూడ్చేశారు. ఈ ఉదంతాన్ని కథనాంశంగా తీసుకుని ఎన్నో పుస్తకాలు, సిరీస్, కథలు ఇలా చాలానే వచ్చాయి. అయితే చార్లెస్ నిజంగానే ఈ కుట్రకు పాల్పడ్డాడా? లేక మరెవరైనా ఈ కుట్రకు పాల్పడి, చార్లెస్ని ఇరికించారా? అనేది నేటికీ మిస్టరీనే. ఏది ఏమైనా ఒక ఘోరమైన నిందతోనే ఈ కుటుంబ కథ ముగిసింది. ∙సంహిత నిమ్మన -
సంచలన కేసు.. శశికళను ప్రశ్నించిన పోలీసులు
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను తమిళనాట సంచలనం సృష్టించిన కొడనాడు కేసులో పోలీసులు ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక బృందం గురువారం టీ నగర్లోని ఆమె ఇంటికి వెళ్లింది. సుమారు గంటకు పైగా ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. 2017లో మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ బంగ్లా వద్ద దొపిడీ, ఆపై వరుస మరణాల ఉదంతాలు కలకలం రేపాయి. ఎస్టేట్ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన ఎస్టేట్లో ఉన్న పలటియల్ బంగ్లాలోకి ప్రవేశించిన దుండగలు.. ఓ వాచ్, ఖరీదైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. ఈ దొపిడీ కేసుగానే భావించినా.. ఆ తర్వాత చోటు చేసుకున్న నాలుగు మరణాలు.. పలు అనుమానాలకు తావిచ్చాయి. ఈ దోపిడీలో కీలక అనుమానితుడిగా భావించిన జయలలిత మాజీ డ్రైవర్ కనగరాజ్ ఎడపాడి వద్ద ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అది మాజీ సీఎం పళనిస్వామి సొంతవూరు. అదే రోజు రెండో నిందితుడు సయన్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తూ అతను బతికినా.. అతని భార్య, కూతురు చనిపోయారు. ఆ తర్వాత ఎస్టేట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణాలకు.. జయలలిత మరణానికి ముడిపెడుతూ రాజకీయంగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే సెక్యూరిటీ గార్డు హత్య జరిగిన టైంలో.. శశికళ అవినీతి కేసులో బెంగళూరు జైల్లో ఉన్నారు. అయినప్పటికీ మిగతా హత్యలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక టీంతో కొడనాడు మిస్టరీ కేసుల్ని దర్యాప్తు చేయిస్తామని ఎన్నికల హామీలో స్టాలిన్ చెప్పారు. అయితే ఇది తనను ఇరికించే ప్రయత్నమని పళనిస్వామి ఆరోపిస్తుండగా.. కోర్టు అనుమతులతోనే తాము ముందుకెళ్తున్నామని, ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. జయలలిత అంతరంగికురాలు అయిన శశికళకు ఈ ఎస్టేట్లో భాగం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: శశికళకు చెన్నై కోర్టులో ఎదురు దెబ్బ -
నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి..
రాయచోటి(వైఎస్సార్ జిల్లా): రాయచోటి రూరల్ మండల పరిధిలోని అనుంపల్లె అటవీ ప్రాంతంలో ఈనెల 11న కాలిన స్థితిలో శవమై తేలిన మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. రాయచోటి పట్టణంలోని సుండుపల్లె మార్గం పరిధిలో నివాసం ఉంటున్న కళావతి(50)గా గుర్తించారు. సహజీవనం చేసే వ్యక్తే నగల కోసం ఆమెను హత్య చేసినట్లు తేలిందని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. శనివారం ఆయన రాయచోటిలో వివరాలు వెల్లడించారు.హోటల్స్లో పనిచేసుకుంటూ జీవనం సాగించే కళావతి రామాపురం మండలం హసనాపురం దళితవాడకు చెందిన పూదోట గురవయ్య(40)తో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది. చదవండి: భార్యతో గొడవ.. ఇంటికి నిప్పుపెట్టి.. ఆపై ఎంత పనిచేశాడంటే.. ఈ క్రమంలో ఆమె ఒంటిపై ఉన్న నగలు కాజేయాలని పథకం పన్నిన గురవయ్య తన ఆటోలో ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం బంగారు నగలు తీసుకొని మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఉడాయించాడు. నిందితుడు గురవయ్య శనివారం రింగ్రోడ్డు పరిధిలోని గున్నికుంట్ల కూడలిలో ఆటోలో అనుమానాస్పద స్థితిలో వెళ్తుండగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యోదంతాన్ని బయట పెట్టాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనతి కాలంలోనే హత్యకేసును ఛేదించిన రాయచోటి డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. -
సజీవ దహనం ఘటనలో కొత్త మలుపు.. ఆమెది హత్యే..
తెర్లాం(విజయనగరం జిల్లా): మండలంలోని రాజయ్యపేట గ్రామంలో ఈ ఏడాది జనవరి 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో వృద్ధురాలు గాడి గౌరమ్మ సజీవదహనమైన సంగతి తెలిసిందే. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించిందని అంతా భావించారు. గౌరమ్మను హత్యచేసి కాల్చేసినట్టు నిందితుడు ఒప్పుకోవడంతో అందరూ అవాక్కవుతున్నారు. తెర్లాం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొబ్బిలి రూరల్ సీఐ శోభన్బాబు, తెర్లాం ఎస్ఐ సురేంద్రనాయు కేసు వివరాలను వెల్లడించారు. చదవండి: లొంగకపోతే అంతు చూస్తా.. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి.. గాడి గౌరమ్మకు చేతబడి ఉందన్నది అనుమానం. నాలుగేళ్ల కిందట నిందితుడు రెడ్డి సింహాచలం, ఆయన భార్య, పిల్లలకు గౌరమ్మ చేతబడి చేసిందని, అందుకే అనారోగ్యానికి గురైనట్టు భావించారు. ఆమె చేతబడి చేయడం వల్లే గత ఏడాది అక్టోబర్ నెలలో తండ్రికూడా మరణించినట్టు సింహాచలం మనసులో బలంగా నాటుకుపోయింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హతమార్చాలన్న నిర్ణయానికి వచ్చాడు. ముందురోజే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిదగ్గర వేరే పని ఉందని గొడ్డలిని తీసుకున్నా డు. గౌరమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా జనవరి 10 అర్ధరాత్రి ఇంటిలోకి వెళ్లి హతమర్చాడు. సీసాలో తీసుకెళ్లిన పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ప్రమా దంలో గౌరమ్మ సజీవదహనమైంది. పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు సైతం కాలిపోయాయి. అందరూ విద్యుత్ షార్ట్సర్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు భావించారు. వృద్ధురాలిని హత్యచేసి పెట్రోల్పోసి కాల్చివేసినట్టు సింహాచలం ఒప్పుకోవడంతో కేసు నమోదు చేశారు. హత్య వెలుగుచూసిందిలా... ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రాజయ్యపేటలో పాతినవలస కనకరాజు అనే వ్యక్తి పశువులశాల కాలిపోయింది. ఆ సమయంలో పశువులశాలలో ఉన్న ఎద్దు, ఆవు, దూడను విప్పేందుకు వెళ్లిన బాధితునికి రెడ్డి సింహాచలం తారసపడ్డాడు. అతనిపై అనుమానంతో స్థానిక పోలీసులకు కనకరాజు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ శోభన్బాబు, ఎస్ఐ సురేంద్రనాయుడు సింహాచలాన్ని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. కనకరాజు పశువుల శాలను ఎందుకు కాల్చావని తమదైన శైలిలో ప్రశ్నించారు. పశువుల శాలను కాల్చలేదని, జనవరి 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన గాడిగౌరమ్మ అనే వృద్ధురాలిని మాత్రం తనే గొడ్డలితో నరికి చంపేశానని, అనంతరం పెట్రోల్ పోసి కాల్చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. పథకం ప్రకారమే హత్య చేశా... గాడి గౌరమ్మను పథకం ప్రకారంగానే హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య, పిల్లలను అత్తవారింటికి పంపించేశానని తెలిపాడు. నాలుగేళ్లుగా ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తున్నానని, ఆ రోజుకు సమ యం అనుకూలించిందన్నాడు. హత్యా నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి బొబ్బిలి కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. మట్టారెడ్డి సహా ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు ఆయుధాలు, 20 రౌండ్ల బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మట్టారెడ్డిని కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. లేక్విల్లా భూ వివాదమే హత్యకు కారణంగా పోలీసులు నిర్థారించారు. చదవండి: టార్గెట్ శ్రీనివాస్రెడ్డా..?లేక రాఘవేందర్రెడ్డా..? ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. మట్టారెడ్డికి గతంలో నేర చరిత్ర ఉందని తెలిపారు. మట్టారెడ్డి గెస్ట్ హౌస్ వద్ద సీపీ ఫుటేజీ లభించడంతో కీలక ఆధారం లభించిందని సీపీ తెలిపారు. -
Chain Snatcher: తెంచిన గొలుసులన్నీ ఇక్కడే పడిపోయాయి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రెండు రోజుల్లో అయిదు స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేసిన సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ వ్యవహారంలో గుజరాత్ పోలీసులు షాక్ ఇచ్చారు. అతగాడు ఇక్కడ స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారాన్నీ వాళ్లు ‘కాజేశారు’. దాన్ని తమ వద్ద జరిగిన నేరాల్లో రికవరీ చూపించిన అధికారులు ఇక్కడ ఒక స్నాచింగ్లో తెంచిన గొలుసు మరో నేరం చేస్తున్నప్పుడు రోడ్డుపై పడిపోయినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. ఉమేష్ నేరాంగీకార వాంగ్మూలంలో ఈ విధంగానే రికార్డు చేశారు. దీన్ని చూసిన తెలంగాణ పోలీసుల అధికారులు కంగుతిన్నారు. మరోపక్క ఉమేష్ను ఇక్కడకు తరలించడానికి అనుమతి కోరుతూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు స్థానిక కోర్టుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేశారు. రికవరీలు కష్టం కావడంతో.. ► చాలా కాలం క్రితం తమ ప్రాంతాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన సొత్తు ఇప్పుడు రికవరీ కావడం కష్టం కావడంతో గుజరాత్ పోలీసులు అతి తెలివితో వ్యవహరించారు. ఉమేష్ ఈ నెల 19న హైదరాబాద్ చేరుకున్నాడు. అదే రోజు ఆసిఫ్నగర్లో యాక్టివా చోరీ చేశాడు. దానిపై సంచరిస్తూ 20న పేట్ బషీరాబాద్ మొదలుపెట్టి మేడిపల్లి వరకు అయిదు స్నాచింగ్స్ చేశాడు. మరో ఇద్దరు మెడలోని గొలుసులు లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక్కడ స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారంతో నేరుగా అహ్మదాబాద్లోని చంద్లోడియా ప్రాంతంలో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు. ► సుదీర్ఘ దర్యాప్తు నేపథ్యంలో ఈ విషయం 21 రాత్రి గుర్తించిన సిటీ పోలీసులు అహ్మదాబాద్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో 22న తెల్లవారుజామున ఉమేష్ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈలోపు అతడు ఇక్కడ నుంచి ‘లాక్కెళ్లిన’ బంగారాన్ని అమ్మేందుకు ఆస్కారం లేదు. అయినప్పటికీ అతడి నేరాంగీకార వాంగ్మూలంలో ఎక్కడా మన బంగారం రికవరీ చూపించలేదు. దీన్ని ఆ అధికారులు తమ వద్ద జరిగిన నేరాల లెక్కలో వేసేసుకున్నారు. వరుసపెట్టి పడిపోయిందంటూ.. ► ఇక్కడి పోలీసులు ఉమేష్ ఖతిక్ను తీసుకురావాలన్నా, నగరంలో నేరాలకు సంబంధించిన బంగారం రికవరీ చేయాలన్నా దానికి అక్కడి పోలీసులకు అతడిచ్చిన నేరాంగీకార వాంగ్మూలమే ఆధారం. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ పోలీసులను సంప్రదించిన ఇక్కడి అధికారులు దాన్ని సేకరించారు. అందులోని అంశాలను చూసిన మూడు కమిషనరేట్ల పోలీసులూ షాక్ తిన్నారు. మేడిపల్లిలో స్నాచింగ్ మినహా మిగిలిన అన్ని నేరాలను ఇందులో పొందుపరిచారు. వీటిలో కొన్ని స్నాచింగ్కు యత్నాలు ఉన్నాయి. ► తాను ఓ నేరంలో మహిళ మెడ నుంచి లాక్కున్న గొలుసు మరో నేరం చేస్తున్న సమయంలో రోడ్డు పైనో, ఎక్కడో తెలియని ప్రాంతంలోనే పడిపోయిందని ఉమేష్ చెప్పినట్లు నమోదు చేశారు. దీని ప్రకారం చూస్తే ఉమేష్ నగరంలో స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారం ఇక్కడే పడిపోయానట్లు లెక్క. ఫలితంగా అహ్మదాబాద్ పోలీసులను అడగడానికి కానీ, ఉమేష్ నుంచి రికవరీ చేయడానికి కానీ ఆస్కారం లేకుండా పోయింది. ఈ విషయంలో ఏం చేయాలనే అంశంపై మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు మల్లగుల్లాలుపడుతున్నారు. అక్కడివి అమ్మినట్లు రికార్డుల్లో.. ఉమేష్ ఖతిక్పై గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలోనూ అనేక కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్టు చేసినట్లు అహ్మదాబాద్లోని వడజ్ పోలీసుస్టేషన్ అధికారులు మంగళవారం ప్రకటించారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో నేరాంగీకార వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇందులో ఉమేష్ గేర్లు లేని వాహనాలను చోరీ చేసి వాటిపై సంచరిస్తూ చైన్ స్నాచింగ్స్ చేశాడని పొందుపరిచారు. ఇవన్నీ గతేడాది మే నుంచి నవంబర్ మధ్య చోటు చేసుకున్నవే అని చూపించారు. ఆ సొత్తును అహ్మదాబాద్లోని ఆనంద్నగర్కు చెందిన లబ్ధి జ్యువెలర్స్ యజమాని హర్ష భాయ్, మానిక్ చౌక్లోని హిమ్మత్ చౌక్, చాణక్యపురి ప్రాంతానికి చెందిన మహంకాళి జ్యువెలర్స్ యజమాని గిరీష్ భాయ్లకు అమ్మినట్లు రికార్డు చేశారు. -
జవానే 'హంతకుడు'! వీడిన బాలుడి హత్య కేసు మిస్టరీ
ఒంగోలు: దేశ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఓ సైనికుడే నరరూప రాక్షసుడిగా మారాడు. అభంశుభం తెలియని బాలుడిపై లైంగిక దాడి చేసి.. ఆపై దారుణంగా హత్య చేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు.. ప్రూఫ్ లేని సిమ్తో బెదిరింపు డ్రామాలాడాడు. చివరకు పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసే పరిస్థితి తలెత్తడంతో అర్ధరాత్రి పూట వీఆర్వో ముందు లొంగిపోయాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ నెల 22 జరిగిన బాలుడి హత్య వెనుక మిస్టరీ వీడింది. ఈ వివరాలను ఎస్పీ మలికాగర్గ్ ఆదివారం ఒంగోలులో మీడియాకు వెల్లడించారు. కొమరోలు మండలం అక్కపల్లికి చెందిన భూమా శ్రీనాథ్(11) ఈనెల 22న స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లి అదృశ్యమయ్యాడు. దీనిపై బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనాథ్ కోసం పోలీసులు గాలిస్తుండగా.. 25వ తేదీన కత్తులవానిపల్లి–ఇడమకల్లు గ్రామాల మధ్య ఉన్న రెడ్డి బావిలో మృతదేహం దొరికింది. శరీరానికి రాయి కట్టి ఉండటంతో.. హత్యగా నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో వారిని పక్కదారి పట్టించేందుకు నిందితుడు ఎలాంటి ప్రూఫ్ లేని సిమ్కార్డును ఉపయోగించి బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. వెంటనే రూ.50 లక్షలు ఇవ్వాలని.. లేకుంటే మరొకరిని చంపేస్తానని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇక తనను అరెస్టు చేస్తారని అర్థం చేసుకున్న దోనపాటి వెంకట ప్రశాంత్ (21) బాలుడ్ని తానే హత్య చేసినట్లు అంగీకరిస్తూ శనివారం అర్ధరాత్రి గ్రామ వీఆర్వో వద్ద లొంగిపోయాడు. వీఆర్వో అతడిని వెంటనే పోలీసులకు అప్పగించారు. అక్కపల్లికి చెందిన ప్రశాంత్ పంజాబ్లోని భటిండా రెజిమెంట్లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. సెలవుపై ఇటీవల ఇంటికి వచ్చాడు. అశ్లీల వీడియోలు ఎక్కువగా చూసే ప్రశాంత్.. 22వ తేదీన స్నేహితులతో ఆడుకుంటున్న శ్రీనాథ్ ద్వారా కూల్డ్రింక్ తెప్పించుకున్నాడు. అనంతరం తన బైక్పై ఎక్కించుకుని రెడ్డి బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలుడ్ని భయపెట్టి.. లైంగిక దాడి చేశాడు. బాలుడు పెద్దగా కేకలు వేస్తుండటంతో.. ప్రశాంత్ గొంతు పిసికి చంపేశాడు. మృతదేహానికి బండరాయి కట్టి బావిలో పడేశాడు. నిందితుడు వెంకట ప్రశాంత్పై ఐపీసీ సెక్షన్లు 364, 377, 302, 201, పోక్సో యాక్టు సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో పాల్గొన్న మార్కాపురం ఓఎస్డీ కె.చౌడేశ్వరి, మార్కాపురం డీఎస్పీ డాక్టర్ ఎం.కిషోర్ కుమార్, గిద్దలూరు సీఐ ఫిరోజ్లను ఎస్పీ మలికాగర్గ్ అభినందించారు. -
Nalgonda: నిశీధిలో ఏం జరిగింది..?
సాక్షి, రామగిరి (నల్లగొండ): తిప్పర్తి మండలం చిన్నాయిగూడెంలో సోమవారం వెలుగు చూసిన చెదురుపల్లి శ్రీనివాస్ (45) అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ పోలీసులకు అంతుచిక్కడం లేదు. మండల పరిధిలోని సిలార్మియగూడేని చెందిన శ్రీనివాస్ వివాద రహితుడని, అతడికి శత్రువులు ఎవరూ లేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, ఘటనాస్థలిలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లు లేకపోవడం, ఎవరో మట్టుబెట్టినట్లుగానే అక్కడి పరిస్థితులు కనిస్తుండడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగానే కేసు దర్యాప్తు చేస్తున్నారు. కలిసిరాని వ్యాపారం.. నామ మాత్రంగా చదువుకున్న శ్రీనివాస్ 2007లో మిర్యాలగూడ పట్టణంలోని కేఆర్ ఎస్టేట్లో దుస్తుల దుకాణం నెలకొల్పాడు. ఎనిమిదేళ్ల పాటు నిర్వహించిన వ్యాపారం శ్రీనివాస్ను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. అప్పట్లోనే శ్రీనివాస్కు రూ. 20లక్షల పైచిలుకు అప్పులు ఉండడంతో ఒత్తిడికి తట్టుకోలేక ఐపీ పెట్టినట్లు తెలిసింది. అక్కడినుంచి మకాం జిల్లా కేంద్రానికి మార్చి స్థానిక హుందాయ్ షోరూంలో నాలుగేళ్ల పాటు సూపర్ వైజర్గా పనిచేశాడు. చాలీచాలని వేతనంతో కుటుంబం గడవడం కష్టంగా మారడంతో స్వగ్రామంలో తమకున్న భూమితో పాటు బంధువుల భూమిని తీసుకుని కౌలుకు వ్యవసాయం చేసినా నష్టాలనే చవిచూశా డు. తదనంతరం గడిచిన ఏడాదిగా మేళ్ల దుప్పలపల్లిలోని ఓక్రషర్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వ్యవసాయంలో తండ్రికి చేదోడుగా.. శ్రీనివాస్ ఖాళీ సమయాల్లో స్వగ్రామానికి వెళ్లి వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడని తెలిసింది. ఇదే క్రమంలో ఆదివారం కూడా ఉదయం భోజనం చేసిన తర్వాత వ్యవసాయ భూమి వద్దకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. సాయంత్రం వరకు శ్రీనివాస్తో పాటు అతడి తండ్రి నారుమడి కోసం పొలంలో వడ్లు చల్లారు. సాయంత్రం తర్వాత నల్లగొండకు వెళ్తున్నానని చెప్పి బైక్పై బయలుదేరాడు. సాయంత్రం ఫోన్ చేసిందెవరు..? శ్రీనివాస్ సాయంత్రం 5:30 గంటలకు నల్లగొండకు బైక్పై వస్తూ సిలార్మియగూడెం స్టేజి వద్ద కొద్దిసేపు ఆగి స్థానికులతో మాట్లాడినట్లు సమాచా రం. ఆ సమయంలో అతడి సెల్కు ఎవరో ఫోన్ చేయగా శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. అలా అతను చాలా సేపు ఫోన్లో వాగ్వాదం చేశాడని, అవతలివైపు నుంచి మాట్లాడింది ఎవరనేది ఇప్పుడు గ్రామంలో చర్చ జరుగుతోంది. అయితే, కొద్ది సేపటి తర్వాత శ్రీనివాస్ ఇంటికి ఫోన్ చేసి అమ్మ ఫోన్ చేస్తే నల్లగొండకు వచ్చాడని చెప్పమని తనను ఆదేశించాడని, ఇంటికి రాకుండానే అలా ఎందుకు చెప్పమన్నాడో తెలియడం లేదని హైమావతి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. చదవండి: యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే.. -
బ్యూటీషియన్ అదృశ్యం
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కూతురు తిరిగి రాలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్కు చెందిన కల్లెపల్లి అక్షిత(27) ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. అక్షిత తల్లి ఎల్దండి కళావతి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవనోపాధి కోసం బ్యూటీపార్లర్ నడుపుతూ ఉండేదన్నారు. సర్ది చెప్పడానికి వచ్చిన మహిళపై దాడి సిరిసిల్ల: తమ ఇంటి ముందు జరుగుతున్న గొడవను నిలువరించేందుకు ప్రయత్నించిన మహిళపై దాడి చేసిన వ్యక్తి సోమవారం సిరిసిల్లటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్తాబాద్ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన పల్లపు సునీత సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్లో నివసించే వాళ్ల అక్కయ్య ఇంటికెళ్లింది. అక్క కూతురు, ఆమె భర్తకు మధ్య గొడవలను సద్దుమణిచేందుకు మాట్లాడడం గురించి వచ్చింది. ఈక్రమంలోనే కుటుంబికుడైన అరవింద్ అకారణంగా దాడి చేశాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దాడిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: మాల్దీవ్స్లో ఫుడ్, బెడ్, స్పా అంతా మాదే -
మిస్టరీగా మహిళ మృతి.. హత్యా.. ఆత్మహత్యా..?
సాక్షి,మిర్యాలగూడ అర్బన్(నల్గొండ): పట్టణంలోని అశోక్నగర్లో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ(45)ది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సంఘటనా స్థలంలో ఆధార్ కార్డు లభించిందని, అందులో జి. రాజ్యలక్ష్మి, భర్త జగదీశ్వర్రావు, బంజారాహిల్స్, భువనగిరి అని ఉన్నట్లు టూటౌన్ సీఐ నిగిడాల సురేష్ తెలిపారు. మృతురాలి ఫోన్ డేటా కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి ఫొటోను సైతం పోలీసులు విడుదల చేశారు. కాగా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన కాంతారావుతో ఆమె సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. 40 రోజుల క్రితం.. కాంతారావు, ప్రస్తుతం చనిపోయిన మహిళతో కలిసి అశోక్నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. భార్యాభర్తలమని చెప్పి తమ వివరాలను స్థానికులకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. కాగా ఈ నెల 15వ తేదీన ఇంటికి కాంతారావు తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. మూడు రోజుల తర్వాత వారు ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా మహిళ మృదేహం కుళ్లినస్థితిలో మంచంపై పడి ఉన్న విషయం విదితమే. ఇంటి యజమాని రామచంద్రయ్య ఇచ్చిన వివరాలతో కాంతారావు నంబర్కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు తెలిపారు. మహిళ మృతిచెందిన సమాచారం టీవీల్లో, పేపర్లో చూసిన కాంతారావు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతురాలి ప్రాథమిక ఆధారాలు గుర్తించామని పూర్తి వివరాలు ఆమె కుటుంబ సభ్యులు వస్తే తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. చదవండి: విషాదం: ఆడుకుంటూ.. అనంతలోకాలకు -
ఏమైందో ఏమో తెలియదు.. కత్తిపీటతో గొంతు కోసుకున్న భర్త..
సాక్షి, నూతనకల్(నల్లగొండ): కత్తిపీటతో గొంతుకోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నూతన్కల్లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి రాములు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి భార్య ప్రభుత్వ ఉద్యోగి. వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. కాగా, రాములు భార్య శిక్షణ నిమిత్తం రెండు రోజులుగా నల్లగొండలో ఉంటోంది. అయితే, ఏమైందో ఏమో తెలియదు కానీ రాములు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తిపీటతో గొంతు కోసుకున్నాడు. ఇంట్లో అలికిడి వినపడడంతో పక్కనే నివాసం ఉంటున్న తండ్రి సాయిలు వెళ్లి చూశాడు. కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండడంతో కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి రాములును సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ..
ఐదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని భర్య, బావమరిది హత్యచేశారనే అనుమానంతో కోర్టులో కేసు కూడా ఫైల్ అయ్యింది. ఇంతలో చనిపోయిన వ్యక్తి తిరిగిరావడంతో అందరూ షాక్!! అసలేంజరిగిందంటే.. బీహార్లోని కఠారీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 5 యేళ్ల క్రితం హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. సదరు వ్యక్తి సోదరుడు ఎంతవెతికినా ప్రయోజనం లేకపోయింది. సోదరుడిని అతని భార్య, బావమరిది హత్య చేశారనే అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. ఐతే పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో 2016లో తన సోదరుడు హత్య చేయబడ్డాడని, భార్య,బావమరిది హత్యచేశారనే నెపంతో కోర్టులో కేసు ఫైల్ చేశాడు. కోర్టులో కేసు నడుస్తుండగా చనిపోయాడనుకుంటున్న సదరు వ్యక్తి సొంతూరుకు వచ్చాడు. గుజరాత్లోని ఒక నూలు పరిశ్రమలో పనిచేసేవాడని, ఇంటికి తిరిగొస్తూ ఉండగా ఒక పెద్ద ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్లానని, ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ ప్రమాదంలో గత జ్ఞాపకాలు చాలామటుకు మరచిపోయానని తెలియజేశాడు. దీంతో ఈ హత్య మిస్టరీ వీడింది. ఈ అరుదైన సంఘటన తాజాగా వెలుగుచూసింది. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
కిల్లర్ చైర్.. దీని కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
ఎంతో మంది సీరియల్ కిల్లర్స్ చరిత్రలు చూసే ఉంటాం. ఒళ్లుగగుర్పొడిచే సైకో కిల్లర్స్ కథనాలూ చదివే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పుకునే కథలో కిల్లర్ మనిషి కాదు, ఒక కుర్చీ. అవును.. ఆ కుర్చీలో ముచ్చటపడి కూర్చున్నా.. పంతం పట్టి కూర్చున్నా మరణం మాత్రం తప్పదు. ఎంతటి వీరుడైనా ఆ కుర్చీలో కూర్చుంటే కోరి గండం తెచ్చుకున్నట్లే. ప్రమాదం ఎటునుంచైనా వస్తుంది. కబళించే తీరుతుంది. అందులో కుర్చున్నవారికి ఆ రోజు గడవదు. మరో రోజు ఉండదు. వందలమంది ప్రాణాలు తీసిన ‘బస్బే స్టూప్ చైర్’ చరిత్రను వణికించిన ఓ మిస్టరీ.. 17వ శతాబ్దంలో థామస్ బస్బే అనే ఓ చిల్లర దొంగ అమితంగా ఇష్టపడిన ఈ కుర్చి.. అతడి మరణానంతరం అందులో కూర్చున్నవారి ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఈ కుర్చీ చరిత్ర తెలియాలంటే.. ముందుగా థామస్ బస్బే కథ తెలుసుకోవాలి. ఇంగ్లాండ్లోని నార్త్ యార్క్షైర్లోని త్రిస్క్ అనే ప్రాంతంలో నివాసముండే డానియల్ ఔటీ కుమార్తె ఎలిజిబెత్ ఔటీని పెళ్లి చేసుకున్నాడు థామస్ బస్బే. డానియల్ ఔటీ.. ఓ దొంగ కావడంతో అల్లుడు థామస్ కూడా దొంగతనాలకు అలవాటుపడ్డాడు. కొంతకాలం సాఫీగా సాగిన బస్బే కాపురంలో విభేదాలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న డానియల్ కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చేయాలని.. బస్బే ఇంటికొచ్చాడు. మామగారు వచ్చిన కాసేపటికి ఇంటికి చేరుకున్న బస్బే.. తన మామ తను ఎంతో ఇష్టపడే కుర్చీలో కూర్చోవడం చూసి ఆవేశంతో రగిలిపోయాడు. ఆ కోపంతోనే డానియల్ని చంపేశాడు బస్బే. నేరనిర్ధారణతో 1706లో అతనికి ఉరిశిక్ష ఖరారైంది. దాంతో ఎలిజబెత్.. థామస్ బస్బే ఇంటిని ఖాళీ చేసి.. ఫర్నీచర్ మొత్తం ఓ హోటల్కు అమ్మేసింది. అందులో బస్బే ఇష్టపడే కుర్చీ కూడా ఉంది. ఉరి శిక్షపడిన థామస్ బస్బే చివరి కోరికగా తను ఎంతో ఇష్టపడే కుర్చీలో కూర్చుంటానని కోరాడు. దాంతో ఉరి తీయడానికి ముందు పోలీసులు బస్బేని ఆ హోటల్కి తీసుకెళ్లారు. ఆ కుర్చీలో కాసేపు కూర్చుని చాలా భావోద్వేగానికి గురయ్యాడట థామస్ బస్బే. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం అతడిని ఉరి తీశారు. కథ అక్కడే ఆరంభమైంది. బస్బే చివరి కోరిక తెలుసుకున్న జనం.. ఆ కుర్చీని చూడటానికి హోటల్కి ఎగబడటం మొదలుపెట్టారు. ఆ క్రేజ్ను సొమ్ము చేసుకోవాలని భావించిన హోటల్ యాజమాన్యం.. హోటల్కి ‘ద బస్బే స్టూప్ ఇన్’ అని పేరు మార్చింది. దాంతో హోటల్కి జనాలు క్యూకట్టారు. ఆ కుర్చీలో కూర్చుని బస చేసి.. గొప్పగా చెప్పుకునేవారు. అయితే అలా కూర్చున్నవారంతా ఏదో కారణంతో చనిపోసాగారు. తొలుత ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొందరు సైనికులు ఆ హోటల్లోనే తలదాచుకున్నారు. వారంతా బస్బే కుర్చీలో కుర్చొన్నవారే. ఆ మరునాడే వారంతా బాంబు దాడిలో చనిపోయారు. యుద్ధంలో ఇదంతా సర్వసాధారణమని కొందరు భావిస్తే.. కొందరు మాత్రం ఇదంతా కుర్చీ పనే అంటూ వాదించారు. అది కుర్చీ కాదు బస్బే ఆత్మ అంటూ నమ్మడం మొదలుపెట్టారు. 1894లో వరుస మరణాలు వారి వాదనను బలపరచాయి. హోటల్ లాభార్జనవైపు నడవడంతో అందులో పబ్ కూడా పెట్టింది యాజమాన్యం. కుర్చీని హోటల్ నుంచి పబ్లోకి మార్చారు. ఆ కుర్చీలో కుర్చుని మద్యం తాగిన ఓ వ్యక్తి మరునాడు హోటల్ వెనుకవైపు స్తంభానికి శవమై వేలాడాడు. అది ఆత్మహత్యని భావించేవారికంటే.. కుర్చీ చంపేసిందనే వారి సంఖ్య రెట్టింపయ్యింది. ఆ ప్రచారం కూడా హోటల్కు లాభాలనే తెచ్చిపెట్టింది. కొందరు ఔత్సాహికులు ఆ కుర్చీతో ‘డేర్’ గేమ్’ ఆడటం మొదలుపెట్టారు. సాహసవీరులు అందులో కూర్చోవడానికి పోటీపడేవారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పాటుచేసిన విందులో ఇద్దరు సైనికులు పందెం కాసి మరీ ఆ కుర్చీలో కూర్చున్నారు. చివరికి వారిద్దరూ కారు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత నుంచి హోటల్కి చెడ్డపేరు రావడం మొదలైంది. దాంతో హోటల్ యజమాని టోనీ ఎర్న్షా ఇకపై అందులో ఎవరూ కుర్చోకూడదని కుర్చీని హోటల్ సెల్లార్లోకి మార్పించాడు. అయితే, ఓ రోజు హోటల్కు సామాన్లు తీసుకొచ్చిన ఓ డ్రైవర్.. సెల్లార్లో ఉన్న ఆ కుర్చీలో కుర్చున్నాడు. కొన్ని గంటల వ్యవధిలో అతడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఎర్న్షా ఆ కుర్చీని స్థానిక త్రిస్క్ మ్యూజియానికి అప్పగించేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుర్చీలో కూర్చోకూడదనే ఉద్దేశంతో కుర్చీని నేలపైన ఉంచకుండా గోడకు వేలాడదీశారు. దాని కింద ఆ కుర్చీ ఎంత ప్రమాదకరమో తెలుపుతూ మొత్తం హిస్టరీ వివరంగా రాశారు కూడా. అందులో ‘కుర్చీని కనీసం ముట్టుకొనే సాహసం కూడా చెయ్యొద్ద’నే హెచ్చరికా ఉంటుంది. మ్యూజియంలో ఉన్నది అసలు కుర్చీ కాదా? అయితే మ్యూజియంలో ఉన్న ఆ కుర్చీ బెస్బే ఉరి సమయంలో కుర్చున్న అసలు కుర్చీ కాదని, ఈ డమ్మీ కుర్చీ కేవలం 138 ఏళ్ల కిందటిదేనని, 1840లో తయారుచేసినదని చెప్పుకొచ్చాడు ఫర్నీచర్ హిస్టోరియన్ ఆడమ్ బావెట్. అతను చెప్పిందే నిజమైతే.. ఎందరో ప్రాణాలు తీసేసిన బెస్బే అసలు కుర్చీ ఏమైనట్లు? హోటల్ నిర్వాహకులు అసలు కుర్చీని దాచిపెట్టారా? అనేది నేటికీ తేలలేదు. చదవండి: ముఖం తేటగా కనిపించాలంటే.. ఈ కొద్దిపాటి మార్పులు అవసరం..! -
Banjarahills: భార్యను చంపి.. గడ్డిలో చుట్టేశాడు
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్మెన్గా పని చేస్తున్న వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని దుర్గా భవానీనగర్ను ఆనుకొని ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీలో ఓ బిల్డర్ వద్ద చత్తీస్ఘడ్కు చెందిన అటల్ పార్థి, రేఖా పార్థి(32) గతేడాది కాలంగా పని చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం వారిద్దరి మధ్య గొడవ తీవ్రమవడంతో అటల్ తన భార్య రేఖను హత్య చేసి అదే ప్లాట్ ప్రహరీ వెంబడి గడ్డిలో చుట్టి పడేశాడు. ఇది గమనించి చుట్టుపక్కల వారు జూబ్లీహిల్స్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న భర్త అటల్పార్థీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నల్లగొండ: పట్టపగలే దారుణం.. మధ్యవయస్కురాలిపై హత్యాచారం -
Missing Cases: ఒంటరిగా అదృశ్యం.. జంటగా ప్రత్యక్షం
సాక్షి, దౌల్తాబాద్ (హైదరాబాద్): యువతీ యువకులు ఒంటరిగా అదృశ్యమై ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి తిరిగి కొద్ది రోజులకే జంటగా పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఒక వైపు ఇరువురి బంధువులు వారి కోసం వెతుకుతుంటే.. మరో వైపు ప్రేమ వివాహాలు చేసుకున్న వారంతా ఇళ్లకు వెళ్లకుండా కుటుంబసభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ నేరుగా పోలీస్స్టేషన్ను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మేము ప్రేమ వివాహం చేసుకున్నామని కుటుంబసభ్యులకు వాట్సాప్ ద్వారా పెళ్లి ఫోటోలు పంపుతున్నారు. ► కొడంగల్ సర్కిల్లోని దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్పేట పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 30 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. వాటిలో 28 కేసులను పోలీసులు పరిష్కరించారు. ► నిత్యం వివిధ కేసుల్లో బిజీగా ఉండే పోలీసులకు ఈ మిస్సింగ్ కేసులు తలనొప్పిగా మారాయి. ► అదృశ్యమైన యువతీయువకులు వివాహం అనంతరం తమకు రక్షణ కావాలని వస్తుండగా వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ► మైనర్ల అదృశ్యం కేసుల విషయానికొస్తే బాలికను తీసుకెళ్లిన వారిపై కిడ్నాప్ కింద కేసు నమోదు చేసి బాలిక అదృశ్యానికి కారణమైన వారిని రిమాండ్కు తరలిస్తున్నారు. ► ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ► సెల్ఫోన్లలో వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పరిచయాలు ఏర్పడి అదృశ్యాలకు దారితీస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే కేసు.. ► కొడంగల్ సర్కిల్ పరిధిలో వచ్చే మిస్సింగ్ కేసులపై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ► తమ అమ్మాయిని వివాహం చేసుకున్న అబ్బాయితో ముందు జాగ్రత్తగా పత్రం రాయించాలని కొందరు కుటుంబసభ్యులు పోలీసులను కోరుతున్నారు. ► సాధ్యమైనంత వరకు అమ్మాయిలు తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలు చేసుకోవాలని తొందర పాటునిర్ణయాలు మంచివి కావని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పిల్లలపై పర్యవేక్షణ అవసరం కొడంగల్ సర్కిల్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 30 కేసులు నమోదు కాగా 28 పరిష్కరించాం. మిగిలిన రెండు కేసులు దౌల్తాబాద్లో పెండింగ్ ఉన్నాయి. వాటినికూడా త్వరలో పరిష్కరిస్తాం. అదృశ్యమైన యువతీయువకులను వారిస్నేహితుల ఆ«ధారంగా గుర్తిస్తున్నాం. ఆన్లైన్ తరగతుల అనంతరం పిల్లల ఫోన్లను తల్లిదండ్రులు తరుచూ గమనిస్తూ ఉండాలి. – అప్పయ్య, సీఐ, కొడంగల్ -
వీడని మిస్టరీ: డాక్టర్ జయశీల్రెడ్డి ఏమయ్యారు?
నల్లగొండ క్రైం: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బాబాయ్ కుమారుడు దేవిరెడ్డి జయశీల్రెడ్డి (42) నల్లగొండ మండ లం మేళ్లదుప్పలపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి కనిపించకుండాపోయిన ఉదంతం మిస్టరీగా మారింది. వ్యవ సాయ క్షేత్రంలోని బావిలో పడ్డారా లేక అదృశ్యమయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం డ్రైవర్ పల్లయ్యను తీసుకుని వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. డ్రైవర్ను గెస్ట్హౌస్లో ఉండమని చెప్పి క్షేత్రం లోపలికి వెళ్లా రు. అక్కడ ఉన్న కుంట అలుగు పోస్తున్న ఫొటోలను మేనమామ వినోద్రెడ్డికి ఉదయం 7.30కి వాట్సాప్లో పెట్టారు. 8.11 గంటలకు తల్లి సునందతో ఫోన్లో మాట్లాడారు. 9 గంటలకు ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబసభ్యులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు తెలిపారు. డాగ్స్క్వాడ్తో పరిశీలించగా శునకం గ్రామాల్లోకి వెళ్లి, తిరిగి వ్యవసాయ క్షేత్రంలో అటూఇటూ తిరిగి వ్యవసాయ బావి వద్ద ఆగింది. దీంతో వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి ఉంటారా అన్న కోణంలో బావిలో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడిస్తున్నారు. డాక్టర్ కోర్సు చదివిన జయశీల్రెడ్డి జమైకాలో డాక్టర్ కోర్సును పూర్తిచేసిన జయశీల్రెడ్డి ఈనెల 8న యూఎస్ఏలో ఉన్న సోదరి వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే వెళ్లడం ఇష్టంలేదని కుటుంబసభ్యులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, నల్లగొండ డీఎస్పీ పరిశీలించారు. -
ఏమైందో? ఏమో?..మిస్టరీగా యువతి మృతి
శృంగవరపుకోట(విజయనగరం): ఎస్.కోట పట్టణంలోని ఎరుకలిపేటలో నేమాపు వాసవి (22) అనే యువతి మంగళవారం రాత్రి సుమారు 9గంటల సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. మృతురాలికి తల్లి లక్ష్మీ, సోదరి రోజా ఉన్నారు. ముగ్గురూ కలిసి లక్ష్మి శ్రీ వేంకటేశ్వర థియేటర్ ఎదురుగా మెయిన్రోడ్డు పక్కన జ్యూస్, పండ్ల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ సంఘటనపై మృతురాలి అక్క రోజా బుధవారం స్థానిక విలేకరులకు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట పట్టణానికి చెందిన నాని అనే వ్యక్తి ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోకపోతే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మీ చెల్లి వాసవి బెదిరిస్తోందని, వెంటనే ఇంటికి వెళ్లి ఆమె దగ్గర ఉండాలని చెప్పాడు. దీంతో వెంటనే ఇంటికి వెళ్లి చూడగా వాసవి కింద పడి ఉంది. ఎంత లేపినా చలనం లేవకపోవడంతో స్థానికుల సహకారంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారని చెప్పింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీ ప్రసన్నకుమార్ చెప్పారు. కాగా మృతురాలు వాసవి రాసినట్లు చెబుతున్న రెండు పేజీల లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు, చేతిరాతను నిర్ధారించే పనిలో ఉన్నట్లు సమాచారం. ముమ్మాటికీ హత్యే “వాసవి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఆమె పిరికిది కాదు. చాలా తెలివైనది. నేను దుకాణం వద్ద ఉండగా మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి వంట చేసింది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంటే ఎందుకు వంట చేస్తుంది. వైరు, తాడు, పెద్ద చున్నీ లేకుండా ఫ్యాన్కు ఎలా ఉరివేసుకోగలదు? వాసవిని ఎవరో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని’ మృతురాలి తల్లి లక్ష్మి ఆరోపించింది. రాత్రి ఇంటి బయట ఒక వ్యక్తి చీకట్లో నిల్చుని ఉండగా వీధి మహిళ ఒకరు చూశారని, మరో వ్యక్తి మేడపైకి వెళ్లి హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తోంది. వాసవి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమవుతోంది. చదవండి: 8 మంది భర్తలను మోసగించి.. తొమ్మిదో పెళ్లికి రెడీ, ఎయిడ్స్ సోకడంతో.. -
6 నెలల వ్యవధిలో 13 హత్యలు.. ఇప్పటికీ అతని పేరు కూడా మిస్టరీనే !
Stone Man: విచక్షణ కోల్పోయిన మనుషులకు ఇతరుల జీవితాలు ఎప్పటికీ ఓ ఆటే. అవసరం ఉన్నా లేకపోయినా అవకాశం ఉన్న ప్రతిసారీ.. ఉన్మాదపు కోరలతో బుసకొట్టడం, తాము చేసిన వికృతానికి జడిసిపోయే సమాజాన్ని అజ్ఞాతంగా గమనిస్తూ గర్వపడటం సైకోలకు అలవాటే. చరిత్ర మోసిన ఈ తరహా రక్తపు మరకల్లో మనదేశానికి చెందిన స్టోన్మేన్ కథ ఒకటి. ముంబై, కోల్కతా వంటి మహా నగరాలను గజగజలాడించిన ఈ రాక్షసుడి జీవితం నేటికీ ఓ మిస్టరీనే. 1985లో మొదలైన అతని హత్యాకాండ.. 2009 వరకూ కొనసాగింది. అతని టార్గెట్.. నిరాశ్రయులు, అనాథలే. కటిక దారిద్య్రంతో అల్లాడిపోతూ.. బంధాలు, బంధువులు లేక.. ఒంటరిగా ఆరుబయట, ఒళ్లు మరచి పడుకునే అభాగ్యులను నిర్దాక్షిణ్యంగా బండరాయితో మోది చంపేసేవాడు. గుర్తుపట్టలేని విధంగా ముఖాలను ఛిద్రం చేసి.. పోలీసులకే సవాలుగా మారాడు. 1989లో కోల్కతా పోలీసులకు.. అక్కడి మొదటి కేసుతోనే.. వెన్నులో వణుకు పుట్టించిన ఈ సీరియల్ కిల్లర్.. 6 నెలల వ్యవధిలో ఒకే విధంగా 13 హత్యలు చేశాడు. హత్యకు గురైనది ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. చీకటిపడితే చాలు బయట అంతా భయం.. భయం చీకటిపడితే ఇళ్ల నుంచి బయటికి రావద్దని.. ఒంటరిగా తిరగొద్దని నగరవాసులకు హెచ్చరికలు జారీ చేసే వారు పోలీసులు. రాత్రయితే చాలు అన్ని ఇళ్లకు తాళాలు పడేవి. ఆ జనసముద్రం కాస్త అలజడి లేని నిర్మానుష్య ఎడారి అయిపోయేది. అలా అతగాడ్ని పట్టుకోవడానికి పెద్దఎత్తునే ప్రయత్నాలు చేశారు. కానీ ఆచూకీ దొరకలేదు. రాయితో చంపుతున్నాడు కాబట్టి మీడియా అతడికి స్టోన్మేన్ అని పేరుపెట్టింది. హత్యకు సుమారు 30 కిలోల బండరాయిని ఉపయోగించేవాడని తేలింది. చంపిన తీరును బట్టి.. అతడు బలిష్టమైన కండలు కలిగిన వాడని, పొడగరని అంచనా వేశారు. ఎందరో అనుమానితుల్ని విచారించారు.పైగా హత్యకు గురైన బాధితులంతా అనాథలు, నిరాశ్రయులే కావడంతో వారిని ఎవరూ గుర్తించలేకపోయారు. మృతదేహానికి దరిదాపుల్లో ఎలాంటి బండరాయి కానీ, బలమైన రాడ్డు కానీ ఎప్పుడూ దొరకలేదు.కోల్కతా కంటే ముందే 1985–88 మధ్యకాలంలో ముంబైని వణికించాడు ఈ స్టోన్మేన్. అక్కడా ఇదే తరహాలో నిరాశ్రయులైన 26 మంది అనాథలను హత్య చేసి కోల్కతాకు చేరాడు. సినిమా కూడా తెరకెక్కింది 2009లో అస్సాంలోని గువాహటిలో కూడా ఇలాంటి హత్యలే జరగడంతో వాటిని కూడా స్టోన్మేన్ ఖాతాలోనే వేశారు పోలీసులు. ఈ వాస్తవ ఘటనల ఆధారంగా 2009లో ‘ది స్టోన్మేన్ మర్డర్స్’ అనే సినిమా తెరకెక్కింది హిందీలో. ఎన్ని విచారణలు జరిపినా.. ఎన్ని రాష్ట్రాలు మారినా.. నేటికీ స్టోన్మేన్ జాడ కాదుకదా కనీసం అతని అసలు పేరు కూడా ఈ ప్రపంచానికి తెలియలేదు. చదవండి: పుట్టింటి నుంచి అత్తింటి సారె తీసుకెళ్తూ.. -
పెళ్లయి ఐదేళ్లు.. మూడున్నరేళ్ల కుమారుడితో పాటు తల్లి అదృశ్యం
సాక్షి, సంగెం(వరంగల్): మూడున్నరేళ్ల కుమారుడితో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని షాపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ రఫీకి గత ఐదేళ్ల క్రితం రేష్మా(23)తో వివాహం జరిగింది. వీరికి ఆయాన్ (మూడున్నర సంవత్సరాలు) జన్మించాడు. రేవురి ప్రకాష్రెడ్డి వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న రఫీ ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తుంటాడు. ఎప్పటిలా 27వ తేది శుక్రవారం ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్య రేష్మా, కుమారుడు ఆయాన్ కన్పించలేదు. రఫీ ఇంటి నుంచి వెళ్లేటపుడు రేష్మా బ్లూ కలర్ పంజాబీ డ్రెస్, ఆయాన్ తెలుపు కలర్ చొక్కా, బ్లూకలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నారు. తెలుపు రంగులో ఉన్న రేష్మా నుదుటిపై కాలిన మచ్చ ఉంటుంది. వీరి ఆచూకి తెలిసిన వారు సంగెం పోలీస్స్టేషన్ 9440700530, ఎస్సై 9440904629 నంబర్లకు తెలియజేయాలని పీఎస్సై జీనత్కుమార్ కోరారు. చదవండి: Nizamabad: గుప్పుమంటున్న గంజాయి! -
తల్లిదండ్రులే కూతురిని చంపారంటూ పుకార్లు..
సాక్షి, మల్యాల(కరీంనగర్): తమ కూతురు చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భార్యాభర్తలు పోలీస్స్టేషన్ ఎదుట భైఠాయించిన సంఘటన మల్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మల్యాల మండలకేంద్రానికి చెందిన సంగ శ్రీనివాస్–మంజుల కుమార్తె తేజస్విని గతేడాది సెప్టెంబర్ 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా స్థానికుల సమాచారం మేరకు అప్పటి సీఐ కిశోర్ శవయాత్రను మధ్యలో నిలిపివేసి పోస్టుమార్టంకు తరలించారు. తల్లిదండ్రులే కూతురిని చంపారంటూ పుకార్లు పుట్టాయి. తమ కూతురు చావుకు తాము కారణం కాదని నిరూపించుకునేందుకు తేజస్విని మృతికి కారణాలు కనుగొనాలని పోలీసుల చుట్టూ తిరుగుతున్నామని శ్రీనివాస్ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంధువుల అబ్బాయి ప్రేమపేరుతో వంచించడంతోనే కూతురు మృతిచెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐ రమణమూర్తి బాధితులతో మాట్లాడి కేసు విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
బాలిక హత్య కేసు: ‘సాక్షి’ చేతిలో హంతకుడి కాల్ రికార్డ్
నల్లగొండ క్రైం: ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించిన దళిత బాలిక ప్రీతి మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాలిక మృతి అనుమానాస్పదం కాదని హత్యేనని, అనుమానంతో ఆమె ప్రియుడే ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలిక హంతకుడి కాల్ రికార్డ్ను ‘సాక్షి’ సంపాదించింది. కొప్పోలులో బాలిక హత్యకు ముందు పవన్ ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. బాలికను చంపేస్తానంటూ స్నేహితుడు రాజుకు పవన్ ఫోన్ చేయగా, వచ్చి మాట్లాడతానని రాజు వారించాడు. ఫోన్ సంభాషణ కంటే ముందే బాలికపై పవన్ దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన చింతమళ్ల దశరథ అలియాస్ శ్రీను, నాగమ్మ దంపతుల కుమార్తె ప్రీతి(17) నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో ఉంటోంది. ప్రీతి ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. ప్రీతి అదే గ్రామానికి చెందిన సమీప బంధువు దోరెపల్లి పవన్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అనుమానం పెంచుకుని.. పెళ్లికి నిరాకరించి.. ప్రీతి నల్లగొండలో మరొకరితో సఖ్యతగా మెలుగుతోందని పవన్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రీతిని దూరం పెడుతూ వచ్చాడు. ఇటీవల స్వగ్రామానికి ప్రీతి రావడంతో తలిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. దీనికి పవన్ ఒప్పుకోకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. అయినా, పవన్ తీరు మార్చుకోకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి బయటికి పిలిచి.. తల్లిదండ్రులతో కలిసి ప్రీతి ఈ నెల 12వ తేదీనే ఇంట్లోనే నిద్రించింది. కాగా, పవన్ అర్ధరాత్రి తర్వాత ఫోన్ చేసి ప్రీతిని బయటికి పిలిచాడు. అక్కడినుంచి గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలోకి తీసుకెళ్లాడు. అక్కడ పవన్ మద్యం సేవించి ప్రీతితో గొడవకు దిగాడు. ప్రీతిని కడతేరుస్తున్నానని.. ప్రీతి పదే పదే పెళ్లి ప్రస్తావన తీసుకురావడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోయాడు. మరొకరితో తిరుగుతూ నన్ను పెళ్లి చేసుకోమంటావా అంటూ ఘర్షణ పడ్డాడు. అనంతరం తన స్నేహితుడైన సూర్యాపేట సమీపం కొప్పిరెడ్డిగూడేనికి చెందిన రాజుకు ఫోను చేసి ప్రీతిని హత్య చేస్తున్నట్లు చెప్పాడు. పుట్టినరోజు వేడుకలో ఉన్న రాజు, ప్రవీణ్తో పాటు మరో మైనర్ వెంటనే తాము వస్తున్నామని, ప్రీతిని హత్య చేయొద్దని కోరారు. అనంతరం తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్ చున్నీని ప్రీతి మెడకు బిగించి హత్య చేశాడు. కాసేపటికి రాజు, ప్రవీణ్, మరో మైనర్ కొప్పోలుకు వచ్చి ఫోన్ చేశారు. అప్పటికే ప్రీతిని కడతేర్చినట్లు పవన్ చెప్పడంతో వెనుదిరిగారు. ఫోన్కాల్స్ డేటా ఆధారంగా.. తమ కుమార్తెతో చనువుగా ఉంటున్న పవన్ హత్య చేసి ఉంటాడని ప్రీతి తలిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం కావడంతో ఎస్పీ రంగనాథ్ ప్రీతి మృతదేహానికి రీపోస్టుమార్టం చేయించారు. అయితే, తుది నివేదికలో సైతం ప్రీతిని చున్నీతో ఉరి బిగించి హత్య చేసినట్లు తేలడంతో పవన్, ప్రీతి ఫోన్కాల్స్ డేటాను సేకరించారు. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. అయితే, హ త్యోదంతాన్ని దాచి పెట్టిన రాజు, ప్రవీణ్, మైనర్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎస్పీ రంగనాథ్ను వివరణ కోరగా నిందితులను అరెస్ట్ చేశామని, పూర్తి స్థాయి విచారణ అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. -
ముగ్గురి మృతి కలకలం: అంతా ‘మిస్టరీ’ !
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు వ్యక్తుల అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం వివాదాస్పదమైంది. కల్తీ కల్లు కారణమని ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త రంగంలోకి దిగి సదరు కల్లు డిపో బాధ్యులతో కలిసి బాధిత కుటుంబాలతో మాట్లాడి సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో పలువురు ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందినట్లు సమాచారం. 7వ తేదీన ఒకరెనుక ఒకరు.. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన వెంకట్రాముడు (55), పింజరి సిద్దయ్య (47), వెంకన్న (60)కు కల్లు తాగే అలవాటు ఉంది. దాదాపుగా ప్రతి రోజూ వీరు కల్లు తాగుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ముగ్గురు రోజు వారీగానే ఈ నెల ఏడో తేదీన కల్లు తాగి సాయంత్రం వారివారి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఒకరెనుక ఒకరు మృతి చెందారు. తెల్లారి ఉదయం గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వీరి మృతికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో ఏ విషయం బయటికి రాలేదు. కానీ ఆ ముగ్గురి అనుమానాస్పద మృతిపై ఇటీవల గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగింది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు? అనుమానాస్పదంగా ముగ్గురు మృతి చెందడంతో ఉలిక్కిపడిన కల్లు డిపో పెద్దలు వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కకుండా కుటుంబాలతో సంప్రదింపులు జరిపేలా జిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేసినట్లు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.10 వేలు, 50 కిలోల బియ్యం అందజేసినట్లు తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఎక్సైజ్ అధికారుల పాత్రపైనా అనుమానాలు ఈ ఘటనలో ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురి మృతి విషయం వెలుగులోకి రావడంతో ఎక్సైజ్ అధికారులు ఈ నెల 24న గ్రామాన్ని సందర్శించారు. నేరుగా కల్లు డిపోకు వెళ్లి శాంపిళ్లు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందు కలిపినట్లు తమకు ఆధారాలేవీ లభించలేదని.. అనుమానంతో శాంపిళ్లు సేకరించి ల్యాబ్కు పంపించినట్లు వెల్లడించారు. ఇక్కడ అనుమానాస్పదంగా ముగ్గురు మృతి చెందిన విషయాన్ని వెల్లడించకపోగా.. దాచిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. తాజాగా మంగళవారం గద్వాల ఆర్డీఓ రాములు, డీఎస్పీ యాదగిరి గ్రామంలోని మృతి చెందిన బాధితుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మరో ఆరుగురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం ఉందని వారు చెప్పారు. దీన్ని బట్టి తీగ లాగితే డొంక కదిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ కుట్ర ఉందా.. గద్వాల జిల్లాలో సంబంధించి అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకే పారీ్టకి చెందిన నాయకుల మధ్య పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధికి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు పొసగడం లేదు. జల్లాపురంలో ముగ్గురి అనుమానాస్పద మృతికి సంబంధించి అధికార పార్టీ శ్రేణుల్లో చర్చ ఈ ముగ్గురి నేతల చుట్టే సాగుతోంది. ఇందులో ఏమైనా కుట్ర జరుగుతోందా.. ఈ ప్రచారం వెనుక ఎవరు ఉన్నారు.. వంటి అంశాలు హాట్టాపిక్గా మారాయి. దీనిపై సదరు జిల్లా కీలక ప్రజాప్రతినిధి భర్త ‘సాక్షి’తో మాట్లాడుతూ..‘రాజకీయ కక్షలతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. గ్రామంలో ముగ్గురు చనిపోయిన విషయం వాస్తవమే. మేము ఆ సమాచారం తెలుసుకొని గ్రామానికి వెళ్లాం. అక్కడి పరిస్థితిని చూసి అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాం. అంత్యక్రియల కోసం ఇద్దరికి డబ్బులు పంపించాం. అందులో ఒక్కరు మాత్రమే తీసుకున్నారు. పదేళ్లుగా గ్రామంలో పెళ్లిలు, శుభకార్యాలకు, మట్టి ఖర్చులకు ఇస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇస్తున్నాం. కానీ ఒక బీసీ నాయకురాలు ఎదగడం ఇష్టం లేని కొందరు రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారు. విచారణ చేసి నిజనిజాలు వెలికితీయాలని మేము పోలీసులను కోరాం.’ అని తెలిపారు. -
చంపి.. సంచిలో కట్టి.. చెరువులో పడేసి
సాక్షి, రాజానగరం: బొమ్మూరు పోలీసు స్టేషనులో వ్యక్తి అదృశ్యం కేసుగా నమోదైన యువకుడు మండలంలోని భూపాలపట్నం చెరువులో శవమై తేలాడు. తల, మొండెం వేరుచేయబడి ఉన్న ఈ మృతదేహాన్ని స్థానికులు మంగళవారం ఉదయం చూసి వీఆర్వో కాళ్ల మోహనరావు ద్వారా రాజానగరం పోలీసులకు సమాచారమిచ్చారు. వ్యక్తిగత కక్షలో, మరో కారణమో తెలియదుగానీ ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అమానుషంగా నరికి, సిమెంటు సంచిలో వేసి మూట కట్టి చెరువులో పడవేశారు. అయితే మూట కట్టు విడిపోయి, సంచెలో నుంచి కాళ్లు బయటకు వచ్చి నీటిపై తేలడంతో స్థానికుల ద్వారా బయటపడింది. ఈ సంఘటన వివరాలను మంగళవారం రాజానగరం సీఐ ఎంవీ సుభాష్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. భూపాలపట్నం శివారులోని చెరువులో తేలిన ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం శాంతిపురానికి చెందిన రొంగలి దుర్గాప్రసాద్(22)గా గుర్తించారు. అవివాహితుడైన ఆ యువకుడు ఈనెల 13న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని అతడి తండ్రి వీరబాబు ఈనెల 15న బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విరోధులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వేరొక ప్రాంతంలో హత్య చేసి, ఆపై తలను, మొండేన్ని వేరుచేసి, సంచిలో మూట కట్టి, ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని తెలిపారు. చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీసి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును బొమ్మూరు, రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల, మొండెం వేరు చేసి ఉన్న మృతదేహం -
అసూయపడి.. ఉసురు తీసి
సోంపేట(శ్రీకాకుళం జిల్లా): అమ్మప్రేమ దక్కదన్న బాధో, వేరెవరికో వెళ్లిపోతుంద న్న ఆవేదనో గానీ ఆ బాలిక ఊ హించని నిర్ణయం తీసుకుంది. ఏకంగా హత్య చేయడానికే పూనుకుంది. రోజూ చూసే ముద్దుగారే పాపాయిని ట్యాంకులో పడేసి చంపేసేంత కోపం పెంచుకుంది. మండలంలోని టి.శాసనాం గ్రామంలో ఈ నెల 4న జరిగిన 11 నెలల చిన్నారి మూల హేమశ్రీ హత్య మిస్టరీని బారువ పోలీసులు ఛేదించారు. బారువ ఎస్ఐ పి.నారాయణస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలిక చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారిని పక్కింటి వారు తీసుకెళ్లడం, ఆ ఇంటి ట్యాంకులోనే పాప పడి మృతి చెందడంతో పోలీసులు అన్ని కో ణాల్లో దర్యాప్తు చేశారు. ఈ విచారణలో విస్మయం కలిగించే నిజాలు తెలిశాయి. హేమశ్రీని పక్కింటికి చెందిన నిర్మల అనే మ హిళ ప్రతి రోజూ ఆడించడానికి తనంటికి తీసుకెళ్లేవారు. పాపను ముద్దుగా చూసుకునేవారు. ఇది ఆ మె కూతురికి నచ్చలేదు. తన తల్లి ఆ చిన్నారిని దగ్గరకు చేర్చడం, ఆడించడం ఆమె చూసి తట్టుకోలేకపోయింది. తన అమ్మ తనకు దూరమవుతోందని భయపడింది. పదిహేనేళ్ల వయసు గల ఆ బాలిక హేమశ్రీపై విపరీతమైన కోపం పెంచుకుంది. అదీ కాక తను రోజూ ఫోన్లో మాట్లాడుతుంటే తల్లి మందలించేవారు. దీనికి కూడా హేమశ్రీనే కారణమని తప్పుగా భావించుకుంది. దీంతో సమయం చూసి పాపను ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంకులో పడేయడంతో చిన్నారి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలిని బాల నేరస్తుల కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళ దారుణ హత్య మిస్టరీనే!?
‘దిశ’ హత్యాచారం ఘటనతో దేశం మొత్తం అట్టుడికిపోయింది. నిందితులను తక్షణమే ఉరితీయాలనే డిమాండ్ అన్ని వర్గాలనుంచి వినిపించింది. సరిగ్గా అదే సమయంలో కామారెడ్డిలోనూ ఓ మహిళ హత్యోదంతం వెలుగుచూసింది. అయితే ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికీ ఆ కేసు మిస్టరీగానే ఉంది. సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రానికి సమీపంలోని పెద్ద చెరువు మత్తడి వాగు కాలువలో గతనెల 25న ఓ మహిళ మృతదేహం కనిపించింది. తల లేదు. మొండెం మాత్రమే ఉంది. అదీ కుళ్లిపోయి ఉంది. ఒంటిపైన జాకెట్ బట్ట తప్ప వేరే దుస్తులు లేవు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి.. 25 నుంచి 30 ఏళ్ల గుర్తు తెలియని మహిళ.. పది రోజుల క్రితమే హత్యాచారానికి గురై ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆధారాల కోసం సంఘటన స్థలంలో చుట్టుపక్కల వెతికారు. డాగ్ స్క్వాడ్ను రప్పించినా ప్రయోజనం లేకపోయింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకునేందుకుగాను టవర్ డంప్ ఏర్పాటు చేశారు. అయితే లక్షల ఫోన్ కాల్స్ ఉండడంతో విచారణలో అడ్డంకులు చోటు చేసుకున్నాయి. ఎక్కడో చంపి తలను వేరు చేసి, మొండాన్ని పెద్ద చెరువు మత్తడి వాగు కాలువలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. హతురాలు ఎవరో తెలిస్తేనే.. ఎంతటి నేరస్తుడయినా ఏదో ఒక తప్పు చేసి పోలీసులకు చిక్కుతుంటారు. చిన్న క్లూ దొరికినా పోలీసు విచారణ ముందుకు సాగుతుంది. అయి తే మహిళను హత్య చేసిన వ్యక్తులు.. ఆమె వివరాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. హతురాలు ఎవరో తెలిస్తే పోలీసులకు దొరికిపోతామనే ఆలోచనలతో తల తీసేసి, బట్టలు, ఇతర వస్తువులు, ఆనవాళ్లు లేకుండా చేశారు. హత్యకు గురైన మహి ళ చేతివేళ్లను సైతం చెక్కినట్లు తెలుస్తోంది. వేలిముద్రలు నమోదు కాకుండా ఉండేందుకు ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది. ఇది ఒకరితో సాధ్య మయ్యే పనికాదనీ, హంతకులు ఒకరికి మించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతు రాలి తలను సంఘటన స్థలానికి సమీపంలో ఐదు రోజుల తర్వాత గుర్తించారు. కానీ అప్పటికే కుళ్లిపోవడంతో ఎలాంటి వివరాలు తెలియ లేదు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటున్న పోలీసులు.. మిస్సింగ్ కేసుల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. కామారెడ్డితో పాటు చు ట్టు పక్కల ప్రాంతాల్లో ఇటీవల అదృశ్యమైన మహి ళల వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి మగ్గురు మహిళల మిస్సింగ్ కేసులను పరిశీలించగా వారిలో ఇద్దరు మహిళల ఆచూకీ ఉన్నట్లుగా తెలిసింది. మరో మహిళ మిస్సింగ్ కేసుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. సెల్ఫోన్ సిగ్నల్స్, పాత కేసులను పరిశీలిస్తున్నారు. ఈ ‘దిశ’కు న్యాయం జరిగేదెప్పుడో? హత్యకు గురైన మహిళ ఎవరనేది తెలియకపోవడంతో హంతకులు ఎవరో కనుక్కోవడం కష్టసాధ్యంగా మారింది. ఈ కేసును జిల్లా పోలీసులు సవాల్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పన్నెండు రోజులు గడిచినా సరైన ఆధారాలు లభించకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. షాద్నగర్లో ‘దిశ’పై క్రూరంగా లైంగిక దాడి చేసి హతమార్చిన సమయంలోనే కామారెడ్డి పెద్ద చెరువు మత్తడి వాగులో మహిళ మృతదేహం కనిపించింది. ఆ ఘటనలో బలైన ‘దిశ’ ఆత్మ శాంతించేలా నలుగురు నిందితులూ శుక్రవారం ఎన్కౌంటర్ అయ్యారు. కానీ ఇక్కడ మాత్రం కేసు ముందుకు సాగడం లేదు. ఈ ‘దిశ’ ఆత్మ శాంతించేది ఎప్పుడో? చదవండి: హత్యకు గురైన మహిళ తల లభ్యం -
చినతల్లే చిదిమేసింది..!!
కిలకిలమని నవ్వుతూ నట్టింట పరుగులు తీసే ఆ చిన్నారి లేలేత పాదాలకున్న మువ్వల పట్టీలు ఘల్లుమంటూ సవ్వడి చేస్తే.. ఆ తండ్రి మది ఆనందంతో మురిసిపోయేది. తన జీవితంలో కొండంత సంతోషాన్ని పంచుతున్న ఆ కుమార్తెను తనకు బహుమతిగా ఇచ్చిన భార్య కన్నుమూస్తే.. ఆ పసిబిడ్డ ఆలనాపాలనా చూడడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో అతడు రెండో వివాహం చేసుకున్నాడు. తన బిడ్డకు తల్లి లేని లోటును సవతితల్లి తీరుస్తుందని నమ్మాడు. తనకో కుమారుడు కలిగిన తరువాత.. ఆమెలో అనుమాన బీజాలు నాటుకున్నాయి. మొదటి భార్యకు పుట్టిన కుమార్తెను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న తన భర్త.. తన కుమారుడికి అన్యాయం చేస్తాడేమోనని సందేహించింది. ఆ అనుమానమే పెనుభూతమవడంతో.. చివరికి తన సవతి కుమార్తెను కడతేర్చింది. కాకినాడ జగన్నాథపురం పాఠశాల వద్ద గత శుక్రవారం ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ ఐసానిని అపహరించి.. గొంతుకు తువ్వాలు బిగించి, తానే హతమార్చినట్టు ఆమె సవతి తల్లి శాంతికుమారి పోలీసుల విచారణలో వెల్లడించింది. అనంతరం ఆ మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి ఇంద్రపాలెం వంతెన వద్ద ఉప్పుటేరులో పడేసినట్టు చెప్పింది. దీప్తిశ్రీ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పగడాలపేటలో నాన్నమ్మ ఇంటి వద్ద విషాదంలో బంధువులు ఏడేళ్ల బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసాని కిడ్నాప్తో కలవరపడిన కాకినాడవాసులు ఆ బాలిక హత్యకు గురైందని తెలియడంతో ఆదివారం తల్లడిల్లిపోయారు. సొంత కుమారుడి కంటే మొదటి భార్య కుమార్తెనే భర్త ప్రేమగా చూస్తున్నాడన్న కక్షతో.. రెండో భార్య.. చిన్నారిని కర్కశంగా హత్య చేసి ఉప్పుటేరులో పారేసింది. తొలుత తనకేమీ తెలియదని బుకాయించిన ఆమె.. ఆధారాలు దొరికిపోవడంతో.. పోలీసుల ఇంటరాగేషన్లో.. దీప్తిశ్రీని హత్య చేసినట్టు ఒప్పుకుంది. సవతి తల్లి దురాగతం పగడాలపేట వాసులను ఆవేదనకు గురిచేసింది. బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తుంటే.. ఆమె నాన్నమ్మ, బంధువులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. సాక్షి, కాకినాడ క్రైం: అపహరణనకు గురైన బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసాని (7)ని ఆమె సవతి తల్లి హత్య చేసి ఉప్పుటేరు కాలువలో మూటకట్టి పడేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. జగన్నాథపురం వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న నేతాజీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోన్న చిన్నారిని ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం కిడ్నాప్.. నగరంలో కలకలం సృష్టించిన విషయం పాఠకులకు విదితమే. ఆ బాలిక తండ్రి సూరాడ సత్యశ్యామ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి అదృశ్యమైన వెంటనే పోలీసులు ఆమె సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకున్నారు. ముందు తనకు ఏమీ తెలియదని పోలీసుల వద్ద బుకాయించింది. చిన్నారి చదువుతున్న పాఠశాలకు తీసుకెళ్లి విద్యార్థులకు ఆమెను పోలీసులు చూపించారు. దీప్తిశ్రీని ఆమె తీసుకెళ్లిందని, మమ్మీతో వెళుతున్నట్టు స్నేహితులకు చెప్పి వెళ్లిందని విద్యార్థులు పోలీసులకు తెలిపారు. దీప్తిశ్రీని తీసుకు వెళుతున్న పినతల్లి సీసీ కెమెరాల్లో చిన్నారిని సవతి తల్లే తీసుకువెళ్లినట్టు రికార్డు అయిందని, అయితే ముఖానికి ముసుగు వేసుకోవడం వల్ల పోలీసులు వెంటనే నిర్ధారించ లేకపోయారు. పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేయడం, పాఠశాల విద్యార్థులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో.. పాఠశాల నుంచి దీప్తిశ్రీని తీసుకువెళ్లి తానే హత్య చేశానని సవతి తల్లి ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పాఠశాల నుంచి నేరుగా సంజయ్నగర్లోని ఆమె ఇంటికి తీసుకెళ్లి పాప వెనక్కి తిరిగి ఉన్న సమయంలో మెడలో తువ్వాలు వేసి బిగించి చంపేసినట్లు అంగీకరించినట్టు చెబుతున్నారు. పాపను చంపేసిన తరువాత గోనె సంచిలో కట్టేసి సంజయ్నగర్ నుంచి బైక్పై ఇంద్రపాలెం బ్రిడ్జి వద్దకు వచ్చి ఉప్పుటేరులో పడవేసినట్లు పోలీసుల విచారణలో సవతి తల్లి వివరించినట్లు తెలుస్తోంది. ఉప్పుటేరులో దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టిన పోలీసులు పోలీసుల గాలింపు చర్యలు దీంతో బాలిక మృతదేహం కోసం పోలీసులు ఉప్పుటేరు, సామర్లకోట–ఇంద్రపాలెం పంట కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ డీఎస్పీలు కరణం కుమార్, భీమారావు పర్యవేక్షణలో కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, ఒన్టౌన్ సీఐ రామ్మోహన్రెడ్డి ప్రత్యేక పడవలపై కాలువలో గాలించారు. మృతదేహం కోసం గాలిస్తున్నామని, ఆ తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తామని సీఐ రామ్మోహన్రెడ్డి అన్నారు. పగడాలపేటలో విషాదం దీప్తిశ్రీ హత్య గురైనట్టు పోలీసులు నిర్ధారణకు రావడంతో పగడాల పేటలో విషాదఛాయలు అలముకున్నాయి. రోజూ అందరినీ ఆప్యాయంగా పలకరించే దీప్తిశ్రీ ఇకలేదని తెలియడంతో ఆమె నాన్నమ్మ సూరాడ బేబీతో పాటు బంధువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఎంతో చలాకీగా ఉండేదని, మంచిగా చదువుకుంటానని అందరితో చెప్పేదని నాన్నమ్మ ఇంటి పరిసరాల వారు కంటనీరు పెట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో నానమ్మ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. కోడలు చనిపోయిన తరువాత పెళ్లి చేసుకుంటానని తన కుమారుడు చెబితే.. ఈ సంబంధం వద్దని చెప్పామని, వినకుండా శాంతికుమారిని పెళ్లి చేసుకున్నాడని నాన్నమ్మ విలపిస్తూ చెప్పింది ఇప్పుడు బంగారం లాంటి మనుమరాలిని చంపేసిందని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. కేసు దర్యాప్తు ముమ్మరం దీప్తిశ్రీ ఐసాని కిడ్నాప్నకు కుటుంబ కలహాలే కారణమని కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలి పారు. ఆదివారం రాత్రి వన్టౌన్ పోలీస్స్టేషన్లో సీఐ రామ్మోహన్ రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని, సీసీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇంద్రపాలెం వంతెన వద్ద మృతదేహం ఉందని సమాచారం రావడంతో అక్కడ తనిఖీ చేశామని డీఎస్పీ తెలిపారు. కొడుకును నిర్లక్ష్యం చేస్తారని.. దీప్తిశ్రీ తల్లి చనిపోవడంతో తండ్రి శ్యామ్కుమార్ సంజయ్నగర్కు చెందిన శాంతికుమారిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 13 నెలల బాబు ఉన్నాడు. దీప్తిశ్రీపైనే తండ్రి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని భావించిన సవతి తల్లి.. ఆమెను ఇబ్బందులకు గురి చేస్తుండేది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ చిన్నారి ఈ బాధలను తనలోనే దాచుకుంది. బాలిక వంటిపై కాల్చిన గుర్తు ఉండడంతో తండ్రి నిలదీయడంతో తల్లి పెడుతున్న చిత్రహింసలు బయటపడ్డాయి. దీంతో బాలికను అతడి చిన్నమ్మ ఇంటి వద్ద ఉంచి జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో చదివిస్తున్నాడు. సంజయ్నగర్ నుంచి చిన్నమ్మ ఇంటికి వెళ్లి రోజూ పాపను స్కూల్కి దింపి వస్తున్నాడు. దీంతో చిన్నారిపై సవతి తల్లి కక్ష పెంచుకుంది. తన బాబుని నిర్లక్ష్యం చేస్తాడన్న అనుమానంతో ఆమెను చంపేస్తే ఇబ్బంది ఉండదని భావించి దీప్తిశ్రీని చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
కిరాయి అడిగాడని కొట్టి చంపేశారు
సాక్షి, హైదరాబాద్: మాట్లాడుకున్నంత కిరాయి ఇవ్వాలన్న ఆటోడ్రైవర్ను చితకబాది క్రూరంగా చంపేశారు. అనంతరం ఆటోను తగలబెట్టేశారు. ఈనెల 1న ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు నిందితులను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బషీర్బాగ్లోని నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ మీడియాకు వెల్లడించారు. ఈనెల 1న పహాడీషరీఫ్ సరస్సు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 30 నుంచి టి.సాయి నాథ్ అనే వ్యక్తి కనిపించడంలేదంటూ మే 2న చందానగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇక మే 3న రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని చింతల్మెట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆటోను దగ్ధం చేశారని కేసు నమోదైంది. ఈ ఘటనలన్నీ వెంటవెంటనే చోటుచేసుకోవడం.. అవి సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లతో ముడిపడినవి కావడంతో సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు..దర్యాప్తు చేసి చిక్కుముడిని ఛేదించారు. ఆటో నంబర్ ద్వారా దొరికిన లింక్.. మే 1న జల్పల్లి చెరువు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురికావడంతో స్థానిక పోలీసులు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో కాలిపోయిన ఆటో నంబర్ సాయంతో దాని యజమాని ఆర్సీ పురానికి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్గా గుర్తించారు. అతడితో మాట్లాడటంతో ఈ 3 ఘటనలకు లింకు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. తన ఆటో (టీఎస్15యూసీ–4194)ను టి.సాయినాథ్ కు అద్దెకు ఇచ్చినట్లు చెప్ప డంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. లింగంపల్లి నుంచి పహాడీషరీఫ్ వరకు ఉన్న 40 కిలోమీటర్ల మేర సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. 4 రోజులపాటు 5 టెరాబైట్స్ వీడియోలను విశ్లేషించడంతో నిందితులు ఎవరనే విషయం తెలిసింది. రూ.200 కోసం గొడవ పడి.. మల్లేపల్లికి చెందిన ఎస్కే ఇస్మాయిల్ అలియాస్ అదిల్, షాహీన్నగర్కు చెందిన ఎస్.కె.అమీర్, మరో మైనర్ బాలుడు స్నేహితులు. ఈ ముగ్గురికి నేరచరిత్ర ఉంది. గత నెల 30న రాత్రి 7.20కి వీరు ముగ్గురూ టోలిచౌకీలో కలుసుకున్నారు. వీళ్ల స్నేహితుడు షేరా కూడా అక్కడికి వచ్చాడు. షేరాకు లింగంపల్లిలో ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు రావాల్సి ఉంది. దీంతో నలుగు రూ టోలిచౌకీ నుంచి ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యం సేవించి రాత్రి 11 గంటలకు లింగంపల్లి చేరుకున్నారు. అక్కడ రావాల్సిన డబ్బులు తీసుకున్న తర్వాత సాయినాథ్తో కిరాయి మాట్లాడుకున్నారు. లింగంపల్లి నుంచి రాజేంద్రనగర్ చింతల్మెట్ వరకు రూ.700 కిరాయి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని అతడి ఆటో ఎక్కారు. టోలిచౌకీలో షేరా, మైనర్ బాలుడు దిగి వెళ్లిపోయారు. ఇస్మాయిల్, అమీర్లు రాజేంద్రనగర్లో ఆటో దిగాక కిరాయి కింద రూ. 500 ఇవ్వబోయారు. అయితే, తనకు మొత్తం కిరాయి రూ.700 ఇవ్వాలని సాయినాథ్ అడగడంతో మద్యం మత్తులో ఉన్న ఇస్మాయిల్, అమీర్లు సాయినాథ్ను చితకబాదారు. అహ్మద్ అలీఖాన్కు ఫోన్ చేసి కత్తి తీసుకొని రమ్మంటూ సూచించారు. అతడు కత్తి తీసుకుని రాగానే సాయినాథ్ను జల్పల్లిలోని చెరువు పక్క∙ ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్యచేశారు. చింతల్మెట్లో ఆటోదహనం.. సాయినాథ్ను హత్య చేసిన తర్వాత అతడి ఆటో తీసుకుని ఇస్మాయిల్, అమీర్, అహ్మద్లు వట్టేపల్లిలోని మైనర్బాలుడి ఇంటికి వెళ్లారు. తిరిగి చింతల్మెట్కు బయలుదేరారు. ఆ బాలుడు బైక్పై వారిని అనుసరించాడు. మార్గమధ్యంలో పెట్రోల్ తీసుకొని చింతల్మెట్లో ఆటోను కాల్చేశారు. తమ సెల్ఫోన్లతో పాటు మృతుడి సెల్ఫోన్ను ధ్వంసం చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని టోలిచౌకీ వెళ్లి మహ్మద్ అబ్దుల్ సమీర్ ఇంట్లో దాచిపెట్టారు. -
ఇద్దరు వివాహితల అదృశ్యం
చెన్నారావుపేట(నర్సంపేట): వేర్వేరు చోట్ల ఇద్దరు వివాహితలు అదృశ్యమయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలకేంద్రం లోని రాజీవ్నగర్–1 కాలనీకి చెందిన జన్ను రాజేష్ భార్య జన్ను గీత గత నెల 28న ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె వయసు 23 ఏళ్లు ఉంటాయి. బంధువుల ఇళ్లలో, పలు ప్రదేశాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో ఆదివారం భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు. మొగుళ్లపల్లిలో... మొగుళ్లపల్లి(భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన ఆకాంక్షకు ఇదే మండలం కొర్కిశాల గ్రామానికి చెందిన యువకుడితో గత ఏడాది వివాహమైంది. కాగా శనివారం ఆమె తల్లిగారి ఇంటికి వెళ్లింది. అదేరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తండ్రి తిప్పారపు శివరావు ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చల్లా రాజు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9440904634కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
వీడిన వివాహిత హత్య మిస్టరీ
కూడేరు: శివరాంపేట వద్ద జాతీయరహదారి సమీపాన జరిగిన వివాహిత హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. రాంగ్ కాల్ ఆధారంగా పరిచయమైన వ్యక్తే ఆమెను పథకం ప్రకారం హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ప్రసాద్రావు మంగళవారం కూడేరులో విలేకరులకు వెల్లడించారు. అనంతపురానికి చెందిన విజయలక్ష్మి (22) అనే వివాహిత సెల్కు నెలన్నర కిందట కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రుద్రేశ్ నుంచి రాంగ్ కాల్ వచ్చింది. బ్రేకప్ కావాల్సిన కాల్ను వారు కొనసాగించడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తరచూ వీరు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకునే వారు. విజయలక్ష్మి నుంచి అతడికి వాట్సప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ పెరిగాయి. ఈ క్రమంలో రుద్రేశ్ భార్యకు అనుమానం వచ్చింది. తరచూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండటం గమనించి ఆరా తీసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పదేపదే గొడవ జరిగేది. చివరకు విడిపోయే పరిస్థితికి దారి తీయడంతో రుద్రేశ్ ఆలోచనలో పడ్డాడు. ఇంతటి వివాదానికి కారణమైన విజయలక్ష్మిని దూరంగా ఉంచాలని అనుకున్నాడు. అది సాధ్యం కాకపోవడంతో ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. ఇందుకు పక్కా ప్రణాళిక రచించాడు. ఈ నెల ఐదో తేదీన విజయలక్ష్మిని అనంతపురం నుంచి తన ద్విచక్రవాహనంలో కూడేరు మండలం శివరాంపేట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ జాతీయరహదారి సమీపాన గుట్ట వద్ద మాటల్లో పెట్టి ఆమె గొంతుకు చున్నీతో బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. అనంతరం ఆమెను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు బండరాయిని ముఖం మీద వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హత్య ఘటన ఏడో తేదీ వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. కాల్ డేటాను పరిశీలించగా.. రుద్రేశ్ అనే వ్యక్తికి ఎక్కువగా ఫోన్ చేసినట్లు బయటపడింది. ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. -
కక్ష పెంచుకుని.. కటకటాలపాలు
చిలకలూరిపేటరూరల్: తన భార్యను బైక్పై ఎక్కించుకోవడంతో అవమానంగా భావించిన భర్త.. పథకం ప్రకారం అంజనీరాజును హత్య చేశాడని రూరల్ సీఐ యు.శోభన్బాబు చెప్పారు. స్థానిక పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అనుమానంతో కక్ష పెంచుకుని.. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లికి చెందిన నూతలపాటి అంజనీరాజు(25) చిలకలూరిపేటలో నివసిస్తూ.. మండలంలోని యడవల్లి గ్రానైట్ క్వారీలో ఆపరేటర్గా జీవనం సాగిస్తున్నాడు. గురిజేపల్లి గ్రామంలోని వరసకు సోదరుడైన రామాంజనేయులు భార్యను గత సంవత్సరం సెప్టెంబర్ ఆరో తేదీన అంజనీరాజు మాయమాటలు చెప్పి బైక్పై ఎక్కించుకుని వెళ్లాడు. ఏడో తేదీన సమీపంలోని కమ్మవారిపాలెం గ్రామ శివారులో వదిలిపెట్టాడు. స్థానికులు గమనించి రామాంజనేయులుకు సమాచారమిచ్చారు. దీనిని అవమానకరంగా భావించిన రామాంజనేయులు ఎలాగైనా అంజనీరాజును హత మార్చాలని కక్ష పెంచుకున్నాడు. దీని కోసం తన పొలాన్ని విక్రయించేందుకు నిర్ణయించాడు. విషయం తెలుసుకున్న అంజనీరాజు తన కుటుంబంతో కలిసి ఈ ఏడాది మేలో చిలకలూరిపేట వచ్చాడు. హత్యకు రూ. 10 లక్షల కిరాయి అంజనీరాజును హత్య చేయాలని నిర్ణయించుకున్న రామాంజనేయులు..తన బంధువులైన నూతలపాటి అంజయ్య, నూతలపాటి కోటేశ్వరరావులకు విషయం చెప్పాడు. వీరు ముగ్గురు కలిసి బల్లికురవ గ్రామానికి చెందిన సాదు బాబును హత్యకు సహాయం కోరారు. ఈ మేరకు సాదుబాబు ఈ ఏడాది మే నెలలో బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామానికి చెందిన క్వారీ మిషన్ ఆపరేటర్ సాదు రమేష్ను రామాంజనేయులుకు పరిచయం చేశాడు. అంజనీరాజును హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు. ఈ మేరకు రమేష్ రూ. 10 లక్షలు కిరాయి కోరటంతో అప్పుడే అడ్వాన్స్గా మూడు లక్షలు చెల్లించారు. సాదు రమేష్ చిలకలూరిపేట సంజీవ్నగర్కు చెందిన జంగా అచ్చిబాబు, వైఎస్సార్ కాలనీకి చెందిన దావల యేసుబాబులను హత్యకు సహకరించాలని కోరాడు. ఈ మేరకు ఆగస్టు రెండో తేదీన మరో రెండు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. నిందితులు చిలకలూరిపేటలోని పాత ఇనుపకొట్టులో రెండు జింక్ పైపులు కొనుగోలు చేశారు. గ్రానైట్ అధికారిగా పరిచయం.... ఈ నెల మూడో తేదీ రాత్రి సాదు రమేష్ యడవల్లి గ్రామంలో అంజనీరాజు పని చేసే కిషోర్ గ్రానైట్ క్వారీ వద్దకు వెళ్లాడు. తాను మైనింగ్ శాఖకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. అంజనీరాజు డ్యూటీ పూర్తయ్యే వరకు రమేష్ అక్కడే ఉన్నాడు. అనంతరం రాత్రి రెండు గంటల సమయంలో ఇద్దరూ వేర్వేరు బైక్లపై చిలకలూరిపేట బయలుదేరారు. నిందితులు పథకం ప్రకారం కృపా గ్రానైట్స్ వద్దకు కాపు కాశారు. రాత్రి 2.40 గంటలకు కృపా గ్రానైట్స్ సమీపంలో రాగానే సాదు రమేష్.. అంజనీరాజు మోటార్ సైకిల్కు తన వాహనాన్ని అడ్డుపెట్టాడు. అప్పటికే కాపు కాసి ఉన్న ఆరుగురు నిందితులు జింక్ పైపులతో అంజనీరాజుపై దాడి చేయడంతో కింద పడిపోయాడు. బండరాయితో తలపై కొట్టి హత్య చేశారు. దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహం పక్కనే బండరాయిని పెట్టి వెళ్లిపోయారు. మిస్టరీ వీడిందిలా.. అంజనీరాజు మృతదేహం తలకు ఎదురుగా నిందితులు బండరాయిని పడేశారు. కానీ మృతుని తలకు వెనక వైపు గాయం కావడంతో పోలీసులకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు మిస్టరీ ఛేదించారు. నిందితుల వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రెండు జింక్ పైపులు, ఆరు సెల్ఫోన్లు, రూ. 54 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండో నిందితుడైన జంగా అచ్చిబాబుపై నాదెండ్ల, యడ్లపాడు, నరసరావుపేట, చిలకలూరిపేట పట్టణాల్లో వివిధ కేసులు ఉన్నాయి. రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు సూచనల మేరకు డీఎస్పీ కే నాగేశ్వరరావు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసినట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదనకు కృషి చేసిన రూరల్ ఎస్ఐలు పీ ఉదయ్బాబు, అదనపు ఎస్ఐ పవన్కుమార్, హెచ్సీలు వెంకటేశ్వర్లు, బీ శ్రీనివాసరావు, ఎండీ జిలానీ, ప్రసాద్, కే వెంకటేశ్వర్లును అభినందించారు. -
7 కోట్ల నష్టాన్ని పూడ్చుకోవడానికి 20 కోట్లకు నిప్పు!
సాక్షి, గుంటూరు : వ్యాపారంలో ఒడిదొడుకులు అతన్ని మార్చేశాయి. నష్టం నుంచి బయటపడాలనే ఆరాటం దుర్భుద్ధిని తట్టిలేపింది. బ్యాంకుల రుణం ఎగ్గొట్టాలని పథకం వేశాడు. తన నష్టాన్ని పూడ్చుకొనే క్రమంలో ఇతరుల కష్టాన్ని బూడిదపాలు చేశాడు. చివరికి కటకటాలపాలై ఊచలు లెక్కిస్తున్నాడు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం కుందూరువారిపాలెనికి చెందిన జగన్నాథం వ్యాపారి. రైతుల నుంచి పంట కొనుగోలు చేసి.. ధర పలికినప్పుడు పెద్దపెద్ద వ్యాపారస్తులకు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో గతేడాది కూడా రైతుల నుంచి సరుకు కొనుగోలు చేశాడు. కాని సరైన ధర లేకపోవడంతో సరుకంతటిని బొప్పూడి కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచాడు. సరుకును చూపి బ్యాంకుల నుంచి ఏడు కోట్లు రుణం తీసుకున్నాడు. కాని గడువు పూర్తైనా అప్పు తీర్చకపోవడంతో బ్యాంక్ అధికారులు కొంత సరుకు వేలం వేశారు. కాలిపోయిన కోల్డ్ స్టోరేజ్ (ఇన్సెట్లో) పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి జగన్నాథం మిగతా అప్పు తీర్చాలని, లేదంటే.. మళ్లీ వేలం వేస్తామని బ్యాంకు అధికారులు హెచ్చరించడంతో దిక్కుతోచని జగన్నాధం కోల్డ్ స్టోరేజికు నిప్పు పెట్టే పథకం వేశాడు. గత నెల 14న అర్థరాత్రి కిరాయిగూండాలతో కలిసి కోల్డ్ స్టోరేజికి నిప్పుపెట్టాడు. జగన్నాధం స్వార్థపు ఆలోచన రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది. 7 కోట్ల నష్టాన్ని పూడ్చుకోవడానికి 20 కోట్ల సరుకుకు నిప్పుపెట్టాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. రైతులకు న్యాయం చేయడానికి జగన్నాధం ఆస్తిని విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకోసం లీగల్గా అన్ని చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒకరి నష్టం.. మరొకరికి భారంగా మారి 20 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. వ్యాపారంలో నష్టం వస్తే దాన్ని సరైన మార్గంలో అధిగమించే మార్గం వెతకాలి కానీ.. అడ్డదారుల్లోకి వెళ్తే జీవితమే నష్టపోతుందని జగన్నాధం కథ చెబుతోంది. -
ఆ 11 మంది.. 22 మందికి దారి చూపించారు..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీ ఏరియాలోని భాటియా కుటుంబంలోని 11మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. వారిలో ఆరుగురు ఉరికి వేలాడిన ఊపిరాడక చనిపోయినట్టుగా పోస్ట్మార్టం నివేదిక తేల్చింది. చనిపోయిన 11 మంది నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో 22 మందికి ఆ నేత్రాలు ఉపయోగపడనున్నాయి. భాటియాది చాలా మంచి కుటుంబం అని, వారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఉండేవారని ఫ్యామిలీ ఫ్రెండ్ నవ్నీత్ బత్రా తెలిపారు. అందుకే ఆ 11 మంది కండ్లను దానం చేసేందుకు అంగీకరించామని, దానికి కావాల్సిన అప్రూవల్ లెటర్ కూడా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 1st thing we did was to donate their eyes that could provide eyesight to 22 people, considering the family was religious & always wanted to help others. We gave approval letter yesterday: Navneet Batra,Friend of the family whose 11 members were found dead in #Delhi's Burari y'day pic.twitter.com/0s14vEsI0n — ANI (@ANI) 2 July 2018 -
11 మృతదేహాలు : 11 పైపులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీ ఏరియాలోని భాటియా కుటుంబంలోని 11మంది డెత్ మిస్టరీలపై క్షణానికో కథనం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా మోక్షం కేసమే ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు బలంగా నెలకొన్నాయి. ఇదే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులుకూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఆ ఇంట్లో దొరికిన ఓ లేఖను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ లేఖ డీకోడింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే మరో కొత్తకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఇంటికి గోడకున్న 11గొట్టాలు కలకలం రేపుతున్నాయి. ఇంటి ప్రవేశద్వారం వద్ద 11 పైపులు, అసాధారణ పద్ధతిలో అమర్చి ఉండటంతోపాటు ఆ పైపులు అమర్చిన తీరు, మృతదేహాలు వేలాడిన వైనం ఒకేలా ఉండటం మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. ఈ పైపులకు, భాటియా కుటుంబం మరణాలకు కచ్చితంగా సంబంధముందని భాటియా స్నేహితుడు నితిన్ ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కోరారు. కాగా మోక్షం మంత్ర, తంత్ర పూజల్లో ఆ కుటుంబీకులు పాల్గొన్నారా లేదా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయే ముందు చేతులు, కాళ్లు ఎలా కట్టుకోవాలన్న అంశాన్ని కూడా లేఖలో రాసినట్లు పోలీసులు గుర్తించారు. (చనిపోయిన11 మందిలో 10మందికి ముఖానికి, చేతులకు కట్టిన గుడ్డ ఒకే దుప్పటికి చెందిన ముక్కలు కాగా, మరో పెద్దావిడ వేరే గదిలో గొంతు నులిమి చంపినట్టుగా ఆనవాళ్లు) ఆ లేఖను మరింతగా విశ్లేషిస్తున్నామని పోలీస్ కమీషనర్ అలోక్ కుమార్ తెలిపారు. మొదట జూన్18న ఢిల్లీలో జరిగిన గ్యాంగ్వార్కు ఈ ఆత్మహత్యలకు సంబంధముందా అనే కోణంలో పోలీసులు విచారించారు. అలాగేభాటియా ఇంట్లోకి శనివారం రాత్రి 10:40 గంటలకు ఫుడ్ డెలివరీ అయినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. దీంతోపాటు ఇతర అనేక అంశాలను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నామనీ, లేఖను డీకోడ్ చేసిన తర్వాత మరికొన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలున్నాయని పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు ఉరికి వేలాడిన వారిలో ఆరుగురు ఊపిరాడక చనిపోయినట్టుగా పోస్ట్మార్టం నివేదిక తేల్చింది. వీరి అంత్యక్రియలు డిల్లీలో నేడు (సోమవారం) నిర్వహించనున్నారు. లేఖలో పేర్కొన్న అంశాల సారాంశం మరణానికి గురువారం లేదా ఆదివారాన్ని ఎంపిక చేసుకోవాలి.. కండ్లను బట్టతో కట్టుకోవాలి. ఏమాత్రం కనిపించవద్దు. తాడుతో పాటు చీర, దుపట్టాను కూడా వాడాలి.. చావు కంటే ఏడు రోజుల ముందు పూజలు చేయాలి. చాలా నిష్టంగా పూజలు నిర్వహించాలి. ఒకవేళ ఆ సమయంలో ఆత్మ ప్రవేశిస్తే.. మరుసటి రోజే పనిని పూర్తి చేయాలి. పెద్దవాళ్లు నిలబడలేని పక్షంలో, పక్క రూమ్లో వాళ్లను నిద్రపోయేలా చూడాలి. డిమ్ లైట్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి. చేతులు కట్టుకున్న తర్వాత.. ఒకవేళ ఏదైనా బట్ట మిగిలినట్లు అనిపిస్తే, దానితో కండ్లు మూయాలి. నోటిని కట్టేందుకు వాడిన బట్టను గట్టిగా కట్టాలి. ఎవరు ఎంత కఠోర దీక్షతో ఈ పని చేస్తారో.. వాళ్లకు ఉత్తమ ఫలితాలు అందుతాయి.. రాత్రి 12 నుంచి ఒకటి మధ్య ఈ తంతు నిర్వహించాలి. హవనం-పూజను అంతకుముందే చేయాలి. అందరిలోనూ ఒకేరకమైన పవిత్ర భావన ఉండాలి. అపుడు మాత్రమే మోక్షానికి మార్గం సుగమవుతుంది. -
క్రూరంగా చంపి.. ఎట్టకేలకు చిక్కాడు
సుమారు 30 ఏళ్ల క్రితం. 12 ఏళ్ల చిన్నారిని అతిక్రూరంగా హత్యాచారం చేసిన ఘటన టకోమా సిటీని కుదిపేసింది. అయితే చిన్న క్లూ కూడా లభించకపోవటంతో ఆ కేసు అటకెక్కిందని అంతా భావించారు. కానీ, పోలీసులు మాత్రం పట్టువిడవలేదు. అండర్ కవర్ ఏజెంట్ల సాయంతో మూడు దశాబ్దాలుగా దర్యాప్తు జరిపించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. వాషింగ్టన్: 1986, మార్చి 26న మిచెల్లా వెల్చ్ అనే అమ్మాయి తన ఇద్దరు చెల్లెల్లతో కలిసి స్థానికంగా ఉన్న ఓ పార్క్లో ఆడుకోటానికి వెళ్లింది. అయితే లంచ్ తీసుకొచ్చేందుకు వెళ్లిన బాలిక.. తిరిగి రాలేదు. కాసేపటికి ఆమె సైకిల్, లంచ్ బాక్స్ కాస్త దూరంలో కనిపించాయి. దీంతో కంగారుపడ్డ ఆ ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అటుపై వారు పోలీసులను ఆశ్రయించగా, డాగ్ స్క్వాడ్ పార్క్కు అరకిలోమీటర్ దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించింది. పోస్టుమార్టంలో మిచెల్లా దారుణంగా హత్యాచారానికి గురైనట్లు తేలింది. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అండర్ కవర్ ఏజెంట్లతో... దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో బాధిత కుటుంబం ఆశలు వదిలేసుకుంది. అయితే పోలీసులు మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. అండర్ కవర్ ఏజెంట్ల సాయంతో సుమారు మూడు దశాబ్దాలకు పైగా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తూ వచ్చారు. నిందితుడి డీఎన్ఏ ప్రొఫైల్ నేరస్థుల జాబితాలోని వారితో మ్యాచ్ కాకపోవటంతో తలలు పట్టుకున్నారు. దీంతో కేసును కొన్నాళ్లు హోల్డ్లో పెట్టారు. చివరికి 2016లో జన్యుశాస్త్రవేత్త సాయంతో నిందితుల వేటను తిరిగి ప్రారంభించారు. ఇందుకోసం జెనాలజీని ఆశ్రయించారు. జెనాలజీ అంటే వంశవృక్షాన్ని తయారుచేసేందుకు ఉపయోస్తారు.(ఆ డేటా ఇంటర్నెట్లో దొరుకుతుంది కూడా). దీని ద్వారా ఇద్దరు సోదరులను పోలీసులు అనుమానించారు. వారిలో ఒకడైన గ్యారీ హర్ట్మన్(66) తాజాగా ఓ రెస్టారెంట్కు వెళ్లి నాప్కిన్ను వాడాడు. అక్కడే ఉన్న సీక్రెట్ ఏజెంట్ దానిని సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్కు పంపాడు. అదికాస్త కేసులోని నిందితుడి డీఎన్ఏకు సరితూగటంతో.. గ్యారీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చివరకు మిచెల్లాను అత్యాచారం చేసి, హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించటంతో కోర్టులో ప్రవేశపెట్టారు. హర్టమన్కు కఠిన శిక్ష పడే అవకాశం ఉందని బాధితుల తరపు న్యాయవాది చెబుతున్నారు. మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా పోలీసులు ఈ కేసును ఛేధించగలిగారు. అన్నట్లు జెనటిక్ జెనాలజీ ద్వారానే 70, 80 దశకంలో 50 అత్యాచారాలు, పదుల సంఖ్యలో హత్యలు, దోపిడీలు చేసిన ‘గోల్డెన్ స్టేట్ కిల్లర్’ను ఈ ఏడాది ఏప్రిల్లో కాలిఫోర్నియా పోలీసులు అరెస్ట్ చేయటం విశేషం. -
80 ఏళ్ల మిస్టరీ వీడింది
వాషింగ్టన్ : దాదాపు 8 దశాబ్దాలకు పైగా నెలకొన్న మిస్టరీకి ఎట్టకేలకు తెర పడింది. అదృశ్యమైన అమెరికన్ వైమానికురాలు అమెలియా ఇయర్హార్ట్ మృతదేహం తాలూకు అవశేషాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పశ్చిమ పసిఫిక్ ఐలాండ్లో పరిశోధకులు వీటిని గుర్తించగా.. వాటిని పరిశోధించిన టెన్నెస్సె యూనివర్సిటీ ఆంథ్రోపాలజిస్ట్ రిచర్డ్ జాన్ట్జ్ ఇది అమెలియా అవశేషాలనే అని పేర్కొన్నారు. యాత్రికురాలు, రచయిత అయిన అమెలియా 1937లో విమానం ద్వారా ప్రపంచ యాత్రకు బయలుదేరారు. విమానంలో ఆమెతోపాటు నేవిగేటర్ ఫ్రెడ్ నూనన్ కూడా ఉన్నారు. విమానం ఫసిఫిక్ సముద్రం మీదుగా వెళ్తుండగా నికూమరోరో ప్రాంతంలో అదృశ్యమైంది. ఆ తర్వాత రెండేళ్లకు ఆమె జాడ తెలియకపోయేసరికి చనిపోయినట్లుగా అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె అదృశ్యం గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఈమె జీవిత చరిత్రపై పలు భాషల్లో చిత్రాలు కూడా వచ్చాయి. చివరకు 1940లో ఎముకల గూడు గార్డనర్ ఐలాండ్కు కొట్టుకొచ్చాయి. అప్పటి నుంచి వాటిపై అంథ్రోపాలజిస్టులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. మృత దేహ నిర్ధారణ కోసం చేసిన అధ్యయనాల్లో చాలా వరకు గందరగోళ ప్రకటనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చివరకు శాస్త్రీయంగా మూడు సిద్ధాంతాలను అన్వయించిన రిచర్డ్ .. చివరకు అది అమెలియాదే అని తేల్చారు. ఇంధనం అయిపోవటంతోనే విమానం కూలిపోయి ఉంటుందని.. ఆమె అస్థిపంజరం ద్వీపానికి కొట్టుకొచ్చిందని ఆయన అంచనా వేస్తున్నారు. ఫ్రెడ్ నూనన్ అవశేషాలు మాత్రం ఇప్పటిదాకా లభ్యం కాలేదు. అమెలియా ఇయర్హార్ట్ చివరి చిత్రం -
భార్యలను హత్యచేసి పూడ్చి పెట్టిన భర్త
-
మొగుళ్లే యముళ్లు
బుట్టాయగూడెం : పరిణయ సమయంలో నూరేళ్లపాటు తోడుగా ఉంటానని, ప్రేమగా చూసుకుంటామని వాగ్దానం చేసిన భర్తలే కాలయముళ్లుగా మారి హతమార్చి జీడిమామిడి తోటలో పూడ్చిపెట్టిన సంఘటన బుట్టాయగూడెం మండలం ఎర్రాయిగూడెం సమీపంలో చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మృతురాలు సావిత్రి తల్లి కొండా గంగమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో హత్యా సంఘటన బయటపడింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్ఎన్డి పేటకు చెందిన గంగమ్మ తన కుమార్తె సావిత్రిని అదే గ్రామానికి చెందిన రామాంజనేయులుకు ఇచ్చి వివాహం చేసింది. కొన్నేళ్లు బాగానే ఉన్నా అనంతరం భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అదేవిధంగా పులిబోయిన మంగతాయారు (సావిత్రి కూతురు/గంగమ్మ మనవరాలు), భర్త నాగరాజుల మధ్య కూడా గొడవలు జరిగేవి. ఈ గొడవలపై కేసులు పెట్టుకొని కోర్టుకు కూడా వెళ్లారు. గత ఏడాది నవంబర్ 8వ తేదీ నుంచి ఇళ్ళ సావిత్రి, పులిబోయిన మంగతాయారులు కనిపించకుండా పోయారు. వీరి ఆచూకీ కోసం బంధువుల ఇళ్లకు తిరిగి వాకబు చేసినా వారు కనిపించకపోవడంతో సావిత్రి తల్లి కొండా గంగమ్మ పోలవరం పోలీస్స్టేషన్లో నవంబర్ 28న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సావిత్రి భర్త రామాంజనేయులు, మంగతాయారు భర్త నాగరాజులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరపగా వారిద్దరు నేరం అంగీకరించారు. వారిచ్చిన సమాచారం మేరకు శనివారం బుట్టాయగూడెం మండలం ఎర్రాయిగూడెం సమీపంలోని జీడితోటలో ఒక ప్రదేశంలో తవ్వి సావిత్రి, మంగతాయారుల మృతదేహాలను వెలికితీశారు. భార్యభర్తల మధ్య తరచూ వస్తున్న గొడవల నేపథ్యంలో కక్షతో రామాంజనేయులు తన భార్య సావిత్రిని(40), నాగరాజు తన భార్య మంగతాయారును(19) ఒకేరోజు పథకం ప్రకారం హత్యచేసినట్లు తమ విచారణలో తేలిందని సీఐ ఎం.రమేష్బాబు తెలిపారు. డీఎస్పీ ఏటీవీ రవికుమార్, ఎస్సైలు కె.శ్రీహరి, అల్లు దుర్గారావు, తహసీల్దార్ జి.ఉదయ్భాçస్కర్ తదితరుల సమక్షంలో మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. తొలుత పోలీసులు ఎర్రాయిగూడెం చేరుకున్నారు. తర్వాత జీడిమామిడితోటలో తవ్వకాలు జరుగుతుంటే ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. తవ్వకాల్లో ఒక్కసారిగా రెండు మృతదేహాలు లభ్యం కావడంతో ఉలిక్కిపడ్డారు. -
ఎక్కడ?
బెంగళూరు, వైట్ఫీల్డ్: బెంగళూరు బెళ్ళందూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో ఐటీ ఇంజినీరుగా పనిచేస్తున్న పాట్నాకు చెందిన అజితబ్ (29) అదృశ్యం కేసు పదిరోజులు దాటినా మిస్టరీగానే ఉంది. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, మిత్రులు ఆన్లైన్లో ప్రచారాన్ని చేపట్టారు. తన కారును విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన చేసిన అజితబ్ ఎవరో దానిని కొనడానికి ఫోన్ చేయగా, కారు తీసుకొని వెళ్లాడు. అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో తెలియదు. ఈ నెల 18న ఘటన జరిగింది. అతని రూమ్మేట్ యిచ్చిన సమాచారం మేరకు టెక్కీ తమ్ముడు ఆర్ణబ్కుమార్ ఫిర్యాదు చేయగా వైట్ఫీల్డ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు అతని జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అజితబ్ ఆచూకీ తెలపాలని సోషల్ మీడియాలో ప్రకటనలు, వీడియోలతో ప్రచారం చేస్తున్నారు. అజితబ్ తండ్రి అశోక్ కుమార్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన బిడ్డ ఎవరికీ హాని చేయలేదని అమాయకుడని అన్నారు. తన బిడ్డను వదలివేయాలని విజ్ఞప్తి చేస్తున్న వీడియోను కూడా ఆన్లైన్లో ఉంచారు. త్వరలో పెళ్లికి విషయమై కొద్దిరోజుల కిందటే తనతో మాట్లాడాడని, బెంగళూరు అంటే ప్రశాంతతకు మారుపేరని అనుకున్నామని చెప్పారు. అతని అదృశ్యం అంతుచిక్కనిదిగా మారడంతో అతని కోసం పోలీసులు ఒకవైపు, మరోవైపు అతని కుటుంబ సభ్యులు, మిత్రులు వెదుకుతున్నారు. కారు కొంటామని కాల్ చేసినవారే ఏదైనా చేసి ఉంటారనే ప్రచారం సాగుతోంది. కార్ కొనుగోలుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 18వ తేదీ సాయంత్రం 7:30 సమయంలో చివరిసారిగా అతని ఫోన్ వైట్ఫీల్డ్ పరిధిలోని గంజూరులో పనిచేసింది. ఆ తరువాత నుంచి స్విచ్ఛాఫ్ అయ్యింది. ఎంబీఏ చదవడానికి కారు అమ్ముదామని.. మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన అజితబ్ ఉన్నత చదువుల కోసం తపించేవాడు. వచ్చే ఏడాది కోల్కతా ఐఐఎంలో ఎంబీఏ చేయాలనే లక్ష్యంతో డబ్బు సమకూర్చుకోవడానికి తన కారును విక్రయించాలని నిర్ణయించాడు. ఈ నెల 20వ తేదీ లోగా మొదటి వాయిదా కింద ఆ డబ్బు కట్టాల్సి ఉంది. అందుకే కొత్తగా కొన్నప్పటికీ ఎంతో ఒకంతకు అమ్మేసి బంగారు భవితను నిర్మించుకోవాలని అతను కలలుగన్నాడు. అయితే విధి ఏం తలచిందోగానీ అదే విషయంలో ఎక్కడో భారీ తప్పిదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ అనుమానాస్పద కారు, ఇతరత్రా లభ్యమైనట్లు తమకు సమాచారం అందలేదని వైట్ఫీల్డ్ డీసీపీ అబ్దుల్ అహద్ చెప్పారు. -
గుంటూరులో ఘోరం
సాక్షి, గుంటూరు : జిల్లాలో ఈ ఉదయం దారుణం చోటు చేసుకుంది. భారీ పేలుడు సంభవించగా.. ఓ బాలుడు మృతి చెందాడు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామం గంగానమ్మపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కొండ ప్రాంతంలో నాగరాజు కుటుంబం నివసిస్తోంది. ఆదివారం ఉదయం నాగరాజు తన ఇంటి ముందు పడేసి ఉన్న ఓ పెయింట్ బకెట్ను చూశాడు. ఇంట్లో వాడుకునే ఉద్దేశంతో దానిని తీసుకొచ్చి మూత తెరవాలని యత్నించాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారు. మూత తెరవగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బాలుడు గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగరాజు, భవానీ, నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో హుటాహుటిన విజయవాడకు తరలించారు. రంగు డబ్బానే అయినప్పటికీ రసాయనాలు ఉండటంతో పేలుడు సంభవించి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ, పోలీసులు మాత్రం కొండ ప్రాంతాలను పేల్చేందుకు వాడే బాంబులు అందులో ఉండి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
కర్నూలు : డోన్ సుందర్సింగ్ కాలనీలో నెల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గ్లోరి ఎంజెల్ అలియాస్ స్వీటీ (25)ది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలింది. రైల్వే ఉద్యోగి రాజప్ప, సౌజన్య దంపతుల కుమార్తె అయిన గ్లోరీ, అదే కాలనీకి చెందిన పవన్కుమార్ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తెలు హన్సిక (9), డింపుల్ (6)ఉన్నారు. గత నెల 22వ తేదీన గ్లోరి ఇంటిలో అనుమానాస్పదంగా మృతి చెందడంపై ఆమె తల్లిదండ్రులు డోన్ పోలీస్ స్టేషన్లో అల్లుడిపై ఫిర్యాదు చేశారు. సంఘటన అనంతరం పవన్ కుమార్, తన చిన్న కుమార్తెతో అజ్ఞాతంలోకి వెళ్లడంతో అతడిపై పోలీసులకు అనుమానం బలపడింది. ఎస్ఐ జయశేఖర్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోస్టుమార్టం నివేదికలో వాస్తవం వెలుగు చూసింది. గ్లోరిని గొంతు నులిమి హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చీరతో ఉరి వేసి పవన్కుమార్ పరారైనట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు మెజిస్ట్రేట్ ఆంజనేయులు ఎదుట నిందితుడిని హాజరుపరిచగా రిమాండ్కు ఆదేశించారు. -
మిస్టరీ కిల్లర్.. పట్టిస్తే 30 కోట్లు..
సిడ్నీ: దశాబ్దాలు గడిచిన చిక్కువీడని ఓ మిస్టరీ కేసుతో ఆస్ట్రేలియన్ పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. చివరికి చేసేదేమి లేక శనివారం రికార్డు రివార్డు ప్రకటించారు. 1980లో మెల్ బోర్న్లో జరిగిన వరుస మహిళల హత్యకేసును ఛేదించడం కోసం ఏకంగా రూ.30 కోట్ల రికార్డు రివార్డును ఆఫర్ చేశారు. 1980-1981 మధ్య కాలంలో దుండగలు 14 నుంచి 73 ఏళ్ల వయసుగల ఆరుగురు మహిళలను హతమార్చారు. ఆనాటి నుంచి ఈ కేసు మిస్టరీగా మారింది. ఈ కేసును ఛేదించేందుకు నడుంబిగించిన విక్టోరియా పోలీసులు సమాచారం అందించినా, మిస్టరీ ఛేదించినా ఒక్కో కేసుకు రూ.5 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. ఇది ఆస్ట్రేలియన్ పోలీసులు ప్రకటించిన రెండో అతిపెద్ద రివార్డని తెలిపారు. అంతేగాకుండా ఎవరికైనా మిస్టరీలు ఛేదించే మేధాశక్తి ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు. అయితే ఈ రివార్డుపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'దొంగలు పడ్డాక ఆర్నెళ్లకు కుక్కలు మొరిగిన'చందంగా పోలీసులు తీరుందని విమర్శిస్తున్నారు. -
పాకిస్థాన్ జర్నలిస్టును విచారించనున్నఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ను గురువారం విచారించనున్నామని ఢిల్లీ పోలీస్ కమీషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. సునంద గత ఏడాది జనవరి 17న ఢిల్లీలోని ఒక హెటెల్లో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. చనిపోవడానికి ముందు ఆమె విలేకరుల సమావేశం పెట్టాలనుకున్నారన్న సమాచారంతో ఇప్పటికే కొంతమంది జర్నలిస్టులను విచారించారు ఢిల్లీ పోలీసులు . ఈ కేసులో పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరార్ కీలక వ్యక్తిగా భావిస్తున్నఢిల్లీ పోలీసులు అవసరమైతే ఆమెనూ ప్రశ్నిస్తామని గతంలోనే ప్రకటించారు. దీనిపై తరార్ స్పందిస్తూ విచారణకు తాను సిద్ధమని, కానీ, తాను భారత్ రానని, పోలీసులే లాహోర్ రావాలన్నారు. సునందతో ట్విట్టర్ లో ఘర్షణ పడి పెద్ద తప్పు చేశానన్నారు. కాగా తన భర్త శశిథరూర్కు , మెహర్ తరార్తో సంబంధం ఉందంటూ తరార్ తో ట్విట్టర్ లో సునంద ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తరార్ ను విచారించేందుకు పోలీసులు నిర్ణయించారు. -
గోతిలో మృతదేహం.. ఎవరైందీ అనూహ్యం
- చంపి పూడ్చిపెట్టి ఉంటారని పోలీసుల అనుమానం - భిన్న ఆధారాలతో మిస్టరీగా మారిన కేసు కాకినాడ క్రైం: గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హత్యచేసి గోతిలో పూడ్చి పెట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జరిగి రెండు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు గురువారం సమయం లేకపోవడంతో శుక్రవారం తహశీల్దార్ సమక్షంలో బయటకు తీయించాలని పోలీసులు నిర్ణయించారు. వివరాలిలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలోని భావనారాయణ పురం శివారు పోస్టల్ కాలనీ సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో రక్తంతో తడిసిన బట్టలను గురువారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాకినాడ రూరల్ సీఐ వి.పవన్ కిశోర్ సంఘటనస్థలాన్ని పరిశీలించారు. రక్తంతో తడిసిన చొక్కా, లుంగీని పరిశీలించారు. అక్కడికి కొద్ది దూరంలో నేల తవ్వి ఉండడాన్ని గమనించారు. దానిని పరిశీలించగా, అందులో మృతదేహాన్ని పాతిపెట్టారని రూఢీ అయింది. దీంతో పరిసరాలను గాలించారు. కొద్ది దూరంలో రోడ్డు పక్కగా ఒక బ్యాగ్ పడి ఉంది. దాని పక్కనే ప్లాస్టిక్ కవర్లో ఓ పూలదండ, తుప్పల్లో మరో పూలదండ ఉన్నాయి. బ్యాగ్ను పోలీసులు తెరిచి చూడగా చొక్కాలు, ఫ్యాంట్లు, కుట్టేందుకు సిద్ధంగా ఉన్న కొన్ని బట్టలు, ప్లాస్టిక్ కవర్లలో కొత్త ధోవతి ఉన్నాయి. చొక్కా కాలర్పై ఉన్న స్టిక్కర్లను పరిశీలిస్తే అన్నిటిపైనా సందీప్ టైలర్స్ అని ఉంది. దానిపై ఉన్న సెల్ నంబర్కు పోలీసులు ఫోన్ చేయగా అవతలి వ్యక్తి తమది నల్గొండ జిల్లా భువనగిరి అని చెప్పాడు. అతడినుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఒక బృందాన్ని భువనగిరి పంపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి. మిస్టరీగా సంఘటనా స్థలం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో దుండగులు ఓ వ్యక్తిని హతమార్చి అతడిని పూడ్చిపెట్టారని అనుమానిస్తున్నారు. ఈ స్థలంలో ఒక్కో చోట ఒక్కోవిధమైన ఆధారాలు పోలీసులకు దొరికాయి. అయితే చనిపోయింది ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. బ్యాగ్లోని చొక్కాలపై భువనగిరి టైలర్ చిరునామా ఉన్నప్పటికీ ప్లాస్టిక్ కవర్లు కాకినాడలోని దుస్తుల దుకాణానికి చెందినవి కావడం మిస్టరీగా మారింది. కాకినాడ వాసినే హతమార్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఒక నిర్ధారణకు వచ్చారు. మృతుడు 60 ఏళ్ల వృద్ధుడని పోలీసులు భావిస్తున్నారు. కాగా పరిసరాల్లో లభ్యమైన పూల దండలు, కొత్త దుస్తులను చూసిన స్థానికుల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. స్థానిక యువతిని ప్రేమించిన వ్యక్తి ఇక్కడికి ఆమెను పెళ్లి చేసుకునేందుకు వచ్చి ఉండవచ్చని, కాకినాడలోనే దుస్తులు కొనుగోలు చేసి ఉంటాడని వారంటన్నారు. ఈ నేపథ్యంలో అతడిని ఈ మారుమూల ప్రాంతానికి తీసుకువచ్చి యువతి బంధువులు హతమార్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని శుక్రవారం వెలికి తీసిన తర్వాతే ఏదైనా నిర్ధారణకు వీలవుతుందని పోలీసులు అంటున్నారు. సర్పవరం ఎస్సై ప్రశాంత్ కుమార్, ట్రైనీ ఎస్సై బుజ్జిబాబు, పోలీసు సిబ్బంది ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. సంఘటనా స్థలంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
సునంద కేసులో జర్నలిస్టుల విచారణ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసు మిస్టరీని ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు కొందరు జర్నలిస్టులను ప్రశ్నించారు. ఆమె మరణించడానికి ముందుగా కొంతమంది విలేకరులతో మాట్లాడారన్న సమాచారంతో పోలీసులు వారిని విచారించారు. ఐపీఎల్ వివాదం గురించి గానీ, తన భర్త శశిథరూర్కు పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్తో సంబంధం గురించి గానీ, లేదా ఇతర ముఖ్యమైన విషయాల గురించి విలేకరులకు చెప్పారేమో తెలుసుకునేందుకు సిట్ బృందం గురువారం ముగ్గురు విలేకరులను ప్రశ్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సునంద గత ఏడాది జనవరి 17న మరణించడానికి ముందుగా తాను ఉంటున్న హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించాలని అనుకున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సిట్ రెండు మూడు రోజుల్లో మరికొంతమంది విలేకరులను ప్రశ్నించే అవకాశముందని, అవసరమైతే పాక్ జర్నలిస్టు మెహర్ తరార్ను కూడా విచారిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. సునంద మరణించడానికి రెండువారాల ముందు శశిథరూర్తో కలసి గోవాలో ఉన్నప్పుడు పిడికిలి నిండా మాత్రలు మింగి స్పృహతప్పిపోయారని చెప్పిన తేజ్ సరాఫ్ (77) అనే వ్యక్తితోనూ మాట్లాడతామని బస్సీ పేర్కొన్నారు.