sahithyam
-
ఉగాది సాహిత్య సమ్మేళనం, ఎంట్రీలకు ఆహ్వానం!
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం సంయుక్త ఆధ్వర్యంలో..విశ్వావసు నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగాఉగాది సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం ఉచితమని తెలిపారు. ‘విశ్వాససు’ నామ ఉగాది శుభ సందర్భంగా కొత్త సంవత్సరానికి ‘సాహిత్య స్వాగతం’ పలుకుతూ వైవిధ్యభరితమైన సాహిత్యాంశాలతో రోజంతా జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, పండితులు, రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం.తేదీ: ఏప్రిల్ 13, 2025, ఆదివారంసమయం: ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 దాకావేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్.సంగ్రహ కార్యక్రమం ప్రారంభ సభకవి సమ్మేళనంమహిళా పృఛ్ఛకులతో అష్టావధానం - ‘ద్విశతావధాని’ డా బులుసు అపర్ణనూతన పుస్తకావిష్కరణ సభ-2025కవి సమ్మేళనం నమోదు వివరాలుభారత దేశం, సింగపూర్, అమెరికా దేశ సంస్థల నిర్వహణలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సాహిత్య సమ్మేళనం లో పాల్గొని తమ స్వీయ కవితలని సభా ముఖంగా వినిపించే ఆసక్తి ఉన్నవారు సకాలంలో ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకుని సహకరించమని కోరుతున్నాం.నమోదు పత్రంhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSc8fSIPdScAsrz89h6Q9rAWNIqazuTtUeWPgpIpew93Wv3qEQ/viewformనమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025• నమోదు పత్రం లో అందిన కవితలు మాత్రమే పరిశీలించబడతాయి.• కవిత వ్యవధి 3 నిమిషాలు (25 వాక్యాలు) దాటరాదు.• కవిత ఏదైనా సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక అంశంపై రాయవచ్చు. మత కుల రాజకీయ ప్రసక్తి లేకుండా కవిత శుభసూచకంగా ఉండాలి.• స్థానికులకి తగిన గుర్తింపు, బయట ప్రాంతాలనుండి వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.• కవితల ఎంపికలో అంతిమ నిర్ణయం నిర్వాహకులదే.నూతన పుస్తకావిష్కరణలునమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025 (ఉగాది)‘విశ్వావసు’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనంలో తమ నూతన గ్రంధాలు సభా ముఖంగా ఆవిష్కరించ దలచుకున్న వారు వివరాలతో సంప్రదించాలని, కేవలం 2025 లో ప్రచురించబడిన కొత్త పుస్తకాలు మాత్రమే ఆవిష్కరణకి పరిశీలిస్తామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.వివరాలకోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లుప్రధాన సమన్వయ కర్త: రాధిక మంగిపూడి (+91 9029409696)రత్న కుమార్ కవుటూరు +65 91735360 (సింగపూర్)డా. వంశీ రామరాజు +91 9849023852 (హైదరాబాద్)డా. వంగూరి చిట్టెన్ రాజు +1 8325949054 (హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా) మరిన్ని NRI వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి: -
దివికేగిన కలువకొలను
సీమ సాహితీ రత్నం.. కథల కలువ.. తొలితరం రచయిత.. కథా చక్రవర్తి.. కలువకొలను సదానంద మృతి సాహితీ లోకానికి తీరనిలోటు. ఆయనతో అనుబంధం ఉన్న పలువురు కవులు, రచయితలు సదానందం మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాక్షి, తిరుపతి : కలువకొలను సదానంద పరిచయం అక్కర్లేని పేరు. జిల్లాకు చెందిన తొలితరం రచయితల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. 1939లో చిత్తూరు జిల్లా పాకాలలో నాగమ్మ, కృష్ణయ్య దంపతులకు ఆయన జన్మించారు. బాల్యంలో నిరుపేద జీవితం గడిపిన సదానంద సునిశిత దృష్టితో సమాజాన్ని అధ్యయనం చేశారు. ఆయన రచనల్లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 1958లో ఆయన తొలి కథానిక “రచన్ఙ ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. తర్వాత కాలంలో తెలుగు స్వతంత్ర, సైనిక సమాచార్, జయంతి, స్రవంతి, ఆనందవాణి, చిత్రగుప్త, భారతి, ఆంధ్రపత్రిక ఆయన రచనలను ప్రచురించాయి. ఆయన కేవలం రచనలకు మాత్రమే పరిమితం కాకుండా కార్టూన్లు కూడా వేసేవారు. నిజాయితీగా, వాస్తవిక ధోరణితో స్వేచ్ఛగా రచనలు చేసేవారు. అవినీతిపై సునిశిత విమర్శలు ఎక్కుపెట్టేవారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసినా అందులోనూ ప్రతిభ కనబరిచారు. 1992లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సత్కారం సైతం పొందారు. రక్తయజ్ఞం, పైరుగాలి, నవ్వే పెదవులు ఏడ్చే కళ్లు తదితర కథా సంపుటాలను రచించారు. గాడిద బ్రతుకులు, గందరగోళం, బంగారుమామ వంటి నవలలు రాశారు. ఆయన రచించిన అడవితల్లి నవలకు కేంద్రప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డును సైతం అందుకున్నారు. సాహిత్య ప్రపంచానికి విశేష సేవలందించిన సదానంద(81)మంగళవారం పరమపదించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరదని జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు ఆవేదన వెల్లడించారు. రచయిత సదానంద మృతి బాధాకరం తిరుపతి కల్చరల్ : జిల్లా కథా రచయితల్లో మొదటితరం రచయిత అయిన కలువకొలను సదానంద మృతి చెందడం బాధాకరమని, సాహిత్య లోకానికి తీరని లోటని జిల్లా రచయితల సమాఖ్య సమన్వయకర్తలు పలమనేరు బాలాజీ, సాకం నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాహితీ కృషి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అభ్యుదయ రచయితల సంఘం నాయకులు గంటా మోహన్, యువశ్రీ మురళి, నెమిలేటి కిట్టన్న బౌద్ధసంఘం నేత సహదేవ నాయుడు ఎంఆర్ అరుణకుమారి, రచయిత డా క్టర్ మౌని, పలువురు రచయితలు, కవులు, సాహితీవేత్తలు సంతాపం ప్రకటించారు. రాయలసీమ సాహిత్య రత్నం నేను కవితలు, కథలు రాయడం ప్రారంభించిన కొత్తలో(1976 ప్రాంతం) కొంతకాలం పాకాల రైల్వేకాలనీలో ఉన్నాను. అప్పుడే సదానంద నాకు పరిచయం. చాలా సార్లు కలిశాను ఆయన్ని. ఆయన ద్వారా రచనలో మెలకువలు తెలుసుకున్నాను. అంత పెద్ద రచయిత అయి కూడా ఆయన చాలా సాదా సీదాగా ఉండేవారు. అది నాకు గొప్పగా అనిపించేది. ఓ పత్రికకు ఆయన గురించి వ్యాసం రాస్తూ ‘కలువ కొలను కథల కొలను– సదానంద సదా ఆనంద’ అని పేరు పెట్టాను. ఆయన మనల్ని వదలి వెళ్లడం బాధాకరం. రాయలసీమ సాహిత్య రత్నం ఆయన. – డాక్టర్ శైలకుమార్ కథల ‘కలువ‘ రాలిపోయింది కథాప్రక్రియలో తనకంటూ ఒక ముద్ర వేసుకుని కథల కలువలు పూయించిన కథా చక్రవర్తి కలువకొలను సదానంద. చిత్తూరు జిల్లా సాహితీవనంలో ఒక వృక్షం నేలకొరగడం భాషా సాహిత్యాలకు తీరని లోటు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నపుడు చూడడానికి కొంతమంది రచయితలు పాకాలకు వెళ్లాం. నేను ఆయన్ని చూడడం ఆ ఒకసారే. అప్పుడు మెట్లెక్కుతున్న నన్ను ‘జాగ్రత్త పేరూరు’ అన్నారు. అప్పటికి పూర్తిగా చూపు కోల్పోయిన సదానంద గారు ఏం ఆ అబ్బాయికి ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆయనతో నేను ‘నాకు పోలియో సార్ దివ్యాంగుడిని’ అంటే అయితే నువ్వు బాగా రాసి మంచిపేరు తెచ్చుకోవాలి నాయనా! అని చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. – పేరూరు బాలసుబ్రమణ్యం -
ఆవిరైపోతున్న అస్తిత్వాలు
మాలర్డ్. అమెరికా దక్షిణాదిలో మాప్లో దొరకని ఒక కాల్పనిక గ్రామం. అక్కడున్న నల్లవాళ్లంతా తెల్లవాళ్లుగా చలామణీ కాగలిగినంత తెల్లగా, తగ్గితే కాస్త చామనఛాయగా ఉంటారు. వీళ్లటు పూర్తిగా నల్లవారూ కాదు, ఇటు తెల్లవాళ్లలో కలిసిపోనూలేరు. స్టెల్లా, డెజిరీ అనే ఇద్దరు అమ్మాయిలూ ఒకే పోలికతో ఉన్న కవలలు. తండ్రి చదువు రానివాడైనప్పటికీ అతను ఒక అమెరికన్ యువతికి అసభ్యకరమైన ఉత్తరం రాసాడన్న నెపం మీద అమెరికన్లు కొంతమంది అతన్ని కొడుతూ బయటకు ఈడ్చుకెళ్లి తుపాకీతో కాల్చేస్తారు. తలుపుచాటు నుండి ఈ లించింగ్ని చూసిన కవలలకి అప్పటిదాకా తమ అస్తిత్వాల గురించి అర్థంకాని విషయమేదో ఆ క్షణంలో అర్థమయినట్టు అనిపిస్తుంది. ఒకరికొకరు అన్నట్టుగా ఉండే ఈ అక్కచెల్లెళ్లు, తండ్రి చనిపోయాక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక అమెరికన్ ఇంట్లో పనిచేయటం మొదలుపెడతారు. ఉన్న ఊరిలో భవిష్యత్తు లేదనుకున్న కవలలు తల్లికి చెప్పకుండా ఊరొదిలి పారిపోతారు. న్యూ ఆర్లీన్స్కి చేరుకున్న కొద్దిరోజుల తరవాత డెజిరీని వదిలేసి వెళ్లిపోతుంది స్టెల్లా. ‘వైట్ ప్రివిలేజెస్’ కోసం స్టెల్లా అమెరికన్ యువతిగా చలామణి అవుతూ ఉన్నత కుటుంబీకుడైన ఒక అమెరికన్ని పెళ్లిచేసుకుని తాను కోరుకున్న స్వతంత్రతా, భద్రతా, సమాజంలో గౌరవం సంపాదించుకున్నప్పటికీ ఆమె జీవితం కత్తిమీద సాములా సాగుతుంది. భర్త ప్రేమను పూర్తిగా పొందినా, ఒంటరితనం ఆమెను వేధిస్తూ ఉంటుంది. ఇంకొకరిలా మారడమనే ప్రక్రియ అసంపూర్ణమనీ, తనది కాని ప్రపంచంలో తను ఎప్పుడూ ఒంటరేననీ ఆమె ఊహించలేదు. నిరంతరం చేసే నటనలో ఎప్పుడైనా తాను దొరికిపోతుందేమో, భర్త తనని వదిలేస్తాడేమో అన్న అనుమానం, తనగతాన్ని తనే తృణీకరించుకున్నానన్న నిజం ఆమెను వేధిస్తూనే ఉంటాయి. కూతురు కెన్నెడీకి ఆమె విషయమంతా తెలిసిపోవటంతో, అప్పటికే ఇద్దరి మధ్యా ఉన్న దూరం మరింత పెద్దదవుతుంది. జీవితంలో ఏం చేయాలో, తనకేం కావాలో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటుంది కూతురు కెన్నెడీ. ఇటు ఒంటరిగా జీవిస్తున్న డెజిరీ కొంతకాలానికి ఒక నల్ల జాతీయుడిని పెళ్లి చేసుకుంటుంది గానీ, అతను పెడుతున్న బాధల్ని తట్టుకోలేక కూతురు జూడ్ని తీసుకుని తల్లి దగ్గరకు తిరిగి వచ్చేస్తుంది. మాలర్డ్లో తనను ప్రేమించిన, తనకీ ఇష్టమైన వ్యక్తితో సహజీవనం ప్రారంభిస్తుంది. కూతురు జూడ్ మాత్రం తను ఎదుర్కొంటున్న వివక్షకి అతీతంగా అకుంఠిత ధ్యేయంతో మెడికల్ కాలేజ్లో చేరుతుంది. ఆడపిల్లగా పుట్టిన ట్రాన్స్ సెక్సువల్రీస్ పట్ల ఆమె ప్రేమా, అతనికి ఆసరానివ్వడం ఆమె స్థిర జీవిత దృక్పథాన్ని తెలియజేస్తాయి. నలభై యేళ్ల కథతో బాటు ఆ కథని జాతి వివక్ష, ఎల్జీబీటీక్యూ చరిత్రలతో అనుసంధానించే స్పష్టమైన కాలరేఖ నవలలో ఉంది. వానిషింగ్ హాఫ్ – అదృశ్యమైపోతున్న సగం అస్తిత్వం – అనేది నవలలోని కీలకాంశం. విడిపోయిన డెజిరీ, స్టెల్లాలు తమలోని చెరి సగాలనీ, గతాన్ని కోల్పోవడం వల్ల స్టెల్లా తనలోని సగాన్నీ, మానసిక దూరాల కారణంగా స్టెల్లా, కెన్నెడీలు తమలో చెరి సగాలనీ కోల్పోయారు. నవలంతా పరుచుకునున్న ఊపిరి సలపని అస్తిత్వాన్వేషణల సమస్యలకి భిన్నంగా జూడ్, రీస్ల మధ్య ప్రవహించే ప్రేమమాత్రం కొంత ఊరట కలిగిస్తుంది. నవలలో తప్పొప్పుల నైతిక బేరీజులు లేవు– జీవిత గతులను పరిచయం చేయటం తప్ప, ఆ జీవితాల గురించి మనకి ఆలోచనలు రేకెత్తించడం తప్ప. మరో టోనీ మారిసన్, జేమ్స్ బాల్డ్విన్ అని విశ్లేషకులచేత అభివర్ణించబడుతున్న అమెరికన్ రచయిత్రి బ్రిట్ బెన్నెట్ రాసిన ద వానిషింగ్ హాఫ్ నవల గత నెల రివర్హెడ్ ద్వారా విడుదలై అగ్రస్థానంలో ఉంది. హెచ్బివో వారు పెద్దమొత్తానికి సినిమా హక్కులు కొనటం రచయిత్రి సాధించిన మరో విజయం. ‘‘దూరమవడానికి వంద కారణాలుండవచ్చు, చేరువవవ్వటానికి కొన్ని చాలు,’’ అని నవలలోని ఒక పాత్ర అంటుంది. ఆ కారణాలని ఆప్యాయంగా భద్రపరచుకోకపోతే, ఉత్తరోత్తరా వివక్ష సృష్టించే ఉత్పాతాలకి మనమే ఉత్తరవాదులం అవుతాం. (నవల: ద వానిషింగ్ హాఫ్ రచన: బ్రిట్ బెన్నెట్ ప్రచురణ: రివర్ హెడ్, 2020) - పద్మప్రియ -
తిమింగలంతో నా సమరం
మాబీ డిక్ 1851లో ప్రచురితమైనప్పుడు విమర్శకులు పెద్దగా పట్టించుకోలేదు. దీని రచయిత హెర్మన్ మెల్విల్లి (1819–1891) చనిపోయేనాటికి కూడా ఆయనకు పెద్ద పేరు లేదు. కనీసం ఆ సమయంలో నవల పునర్ముద్రణలోనైనా లేదు. కానీ ఆయన శతజయంతి తర్వాత నెమ్మదిగా నవల పాఠకుల్లో కొత్త ఆసక్తి పుట్టించింది; రచయిత మళ్లీ సజీవుడైనాడు. ఇప్పుడు మాబీ డిక్ గొప్ప అమెరికన్ నవలల్లో ఒకటి. హెర్మన్ మెల్విల్లి నావికుడిగా తన జీవితం ప్రారంభించాడు. పంతొమ్మిదవ శతాబ్దంలో తిమింగలాల వేట పెద్ద పరిశ్రమ. ఆ వ్యాపారంలో ఉన్నవాళ్లు మహాసముద్రాలన్నింటినీ కలియదిరిగి, తిమింగలాలను వేటాడి, వాటి నుండి లభించే నూనెను అమ్ముకునేవారు. దీనికోసం నెలలు, సంవత్సరాల పాటు సముద్రాల మీద తిరిగేవారు. ఆ క్రమంలో ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొనేవారు. ఈ నవలలో వర్ణితమైన తిమింగలాల వేట, ఆ జీవితం తాలూకు ఎన్నో విషయాలు రచయిత ప్రత్యక్ష అనుభవం అనుకోవచ్చు. ఈ విశిష్ట నవలను తెలుగులోకి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం అనువదించారు. 1967లో గంగాధర పబ్లికేషన్స్ ప్రచురించింది. అనువాదకుడు క్లుప్తంగా రాసిన పరిచయంలోంచి కొంతభాగం: ‘‘ఇది కేవలం తిమింగలపు వేటలోని కష్టనిష్ఠూరాలను చిత్రించే కథ మాత్రం కాదు. ఈ కథకు ప్రధానపాత్ర అయిన అహబ్, ఒకానొక సన్నివేశంలో, ‘మాబీ డిక్’ అనబడే తిమింగలపు వేటు వల్ల తన కాలుని పోగొట్టుకుంటాడు. ప్రస్తుత కథ అహబ్ యొక్క ప్రతీకార దీక్షకి చెందినది. చతుస్సముద్రాలు గాలించి, మాబీ డిక్ని మరల చూచి, ఎలాగైనా దానిని వధించి, తన పగ తీర్చుకొంటానని అహబ్ పట్టుబడతాడు. తన అనుచరులు ఎంత వారించినా లెక్క చేయక, నెగ్గించుకోవడానికి పంతము పూనుకొంటాడు. అది విధి ప్రేరణ. చిట్టచివరకు ఆ తిమింగలాన్ని కనుగొంటాడు, తన శక్తినంతా ఉపయోగించి దానిని ఎదుర్కొంటాడు. కాని ఆ భూతానికి బలి అవుతాడు. ఈ విషాదగాథ ఒక ‘‘ట్రాజెడీ’’ అయింది– విషాదాంత నాయకునకు ఉండే లక్షణములలో ముఖ్యమైనది ఏమనగా, తనను కబళింపనున్న విధికి తనకి తెలియకుండగనే తన చేతుల వల్ల సాయపడుట! తుది నిశ్వాసమును విడుచుచున్నను పరాజయమును ఒప్పుకోకపోవుట. ఈ లక్షణము ఈ కథానాయకుడగు అహబ్ ఎడ సంపూర్ణంగా సమన్వయించుకోవచ్చు.’’ -
తప్పిపోయిన కాలం
బాల్యం ఔతలి ఒడ్డున ఒకరినుంచి ఒకరం తప్పిపొయ్యి మళ్ళ యిక్కడ ఈ బిగ్ బాజారుల కలుసుకున్నం వాషింగు మిషనులు ఫ్రిజ్జులు ఎల్ఈడీ టీవీలపై పడి దొరులుతున్న చూపుల నడుమ ఇద్దరం రోబోలుగ ఎదురుపడ్డం కొంచెం సేపటికి ఎప్పటినుంచో వెతుకుతున్న వస్తువు కంటిముందర ప్రత్యక్షమైన మాదిరిగ ఒకింత ఆశ్చర్యంగనే ఒకరికొకరం దొరికి పోయినం వస్తుజాలంల చిక్కుకున్న మమ్ములని అమాంతం పొంగిన సుద్దవాగు ముంచేసింది సీసీ కెమెరాలు చూస్తున్నయని మరిచి వాగునీళ్ళల్ల ఏసంగిల పారిచ్చిన దోసకాయలు ఇరుగ తిన్నం కాళ్ళకింద చలువరాయి ఉన్నా గుంచీలు తవ్వి గోటీలు, గిల్లి దండలాడినం దిగుడు కాదు కదా పట్నంల మట్టే కరువన్నది మరిచి సలాక ఆడుకుంటు కుంటినం గుట్టలమీద కంపల్ల పడి ఆడినా ఏడ యింత దెబ్బ తగులలె గని ఇంత నొప్పైతె ఎప్పుడు లేదు రాంరాయని వాగు ఖిల్లగుట్ట బత్తీస్ గడి కజాన్ చెరూ బంగల్ చెరూ బొమ్మల కార్ఖాన చిన్న తిరిగితిమా ఇంత తిరిగినా కాళ్ళనొప్పులు లేవు కండ్ల నీళ్ళు తప్ప - మడిపల్లి రాజ్కుమార్ -
వివక్ష మీద న్యాయపోరాటం
పదహారు, పదిహేడో శతాబ్దాలలో బానిసలుగా అమెరికాకి తీసుకురాబడ్డ ఆఫ్రికన్లకు అమెరికన్ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉంది. ఎన్నో పోరాటాల తరవాత ఇప్పటికీ వీళ్లు సమానత్వం, అస్తిత్వాల కోసం ‘బ్లాక్ లైవ్స్ మాటర్’ అని పోరాడాల్సి రావటం, శతాబ్దాలు మారినా కరడుగట్టిన జాత్యహంకారం కరగకపోవడం నేటి నిజాలు. అమెరికాలో పొలీసు, న్యాయ వ్యవస్థలు ఆఫ్రో–అమెరికన్లపై చూపిన విద్వేషం, చేసిన హింస ఒక ప్రత్యేక చరిత్ర. ప్రపంచంలోని అన్ని దేశాలలోకన్నా, అమెరికాలోని జైళ్లలోనే అత్యధిక సంఖ్యలో నేరస్తులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. వారిలో సింహభాగం ఎవరన్నది ఊహించడం కష్టం కాదు. ఆఫ్రో–అమెరికన్, లాయర్ అయిన బ్రయాన్ స్టీవెన్సన్ వృత్తిరీత్యా తను వాదించిన కొన్ని కేసుల విశేషాలనూ, న్యాయ వ్యవస్థలో తెచ్చిన, తేవలసిన మార్పులనూ ప్రస్తావిస్తూ, ఆఫ్రో–అమెరికన్ల వ్యథార్త జీవితాలలోని విషాదాలను తన జీవితంతో సమాంతరంగా చెప్పిన ఆత్మకథ ఈ ‘జస్ట్ మెర్సీ’. పేదరికం, అభద్రతల మధ్య గడిచిన బ్రయాన్ బాల్యం, న్యాయశాస్త్రం చదవటానికి కాలేజీలో చేరడంతో మలుపు తిరుగుతుంది. కాలేజీ సెలవులప్పుడు అట్లాంటాలోని ఒక సంస్థలో చేరిన బ్రయాన్ మరణశిక్ష విధించబడిన ఖైదీని చూడటానికి జైలుకి వెళ్తాడు. అక్కడి పరిస్థితులు గమనించిన అతనికి, న్యాయవాదిగా తను చేయాల్సిన పనిపట్ల స్పష్టత ఏర్పడి, ఆ ధ్యేయంతోనే న్యాయశాస్త్ర విద్యను పూర్తిచేస్తాడు. చదువు ముగించిన బ్రయాన్, దక్షిణ అమెరికాలో జాతివివక్ష ఎక్కువగా ఉన్న అలబామా రాష్ట్రంలో, మరణశిక్షలు విధింపబడిన పేద, ఆఫ్రో అమెరికన్స్ కోసం ఉచితంగా పనిచేసే సంస్థను స్థాపించి న్యాయవాద వృత్తిని మొదలుపెడతాడు. చేయని తప్పుకి మరణశిక్ష విధించబడి జైల్లో మగ్గుతున్న వాల్టర్ అనే ఆఫ్రో అమెరికన్ నేపథ్యంగా కథనం సాగినా, మరిన్ని వ్యథాభరిత జీవన వాహినులు పుస్తకమంతా ప్రవహిస్తూనే ఉంటాయి. ఒక హత్య కేసులో వాల్టర్ని ఇరికించి, హత్య జరిగిన సమయంలో వాల్టర్ ఇంట్లోనే ఉన్నాడన్న సాక్ష్యాన్ని పట్టించుకోని పోలీసులు, వాల్టరే హత్య చేసినట్టు దొంగసాక్ష్యాలు సృష్టించి కోర్టులో అతనిని దోషిని చేస్తారు. హతురాలు అమెరికన్ యువతి కావటంతో వాల్టర్కి మరణశిక్ష పడుతుంది– ‘కాపిటల్ పనిష్మెంట్ అంటే కాపిటల్ లేనివారికి ఇచ్చే పనిష్మెంట్’ అని బ్రయాన్ స్నేహితుడు వ్యంగ్యంగా అన్నట్టు. వాల్టర్ పక్షాన బ్రయాన్ వాదనలు విన్న కోర్టు, కేసును పునఃపరిశీలించి వాల్టర్ శిక్షలన్నింటినీ రద్దుచేస్తుంది. పక్షపాత వైఖరి, ఉదాసీనత, నిర్లక్ష్యాల మూలంగా వెలువడే ఆధార రహిత తీర్పులు, వాటిపట్ల సమాజం ప్రదర్శించే తటస్థత, ఉపేక్ష సరి కావనీ, సరైన న్యాయం అందకపోతే నల్లజాతి మొత్తం నిర్వీర్యం అవుతుందన్న ఆవేదన బ్రయాన్ మాటల్లో ధ్వనిస్తుంది. అమెరికన్ సివిల్ వార్ సమయంలో వచ్చిన బానిసత్వ నిర్మూలన కాగితాల మీద మాత్రమే అందించిన సంపూర్ణ స్వేచ్ఛ, పౌరసత్వం– ఇవేవీ ఆఫ్రో–అమెరికన్లకు భద్రత నివ్వలేదనీ, వారి జీవితాల్లోని విషాదాలనీ, జీవితాల మీద అరాచకాలను ఆపలేదనీ జిమ్క్రో న్యాయసూత్రాల నేపథ్యంలో వివరిస్తాడు రచయిత. వాదించిన కేసులూ, స్టేట్/ఫెడరల్ న్యాయ వ్యవస్థల్లో ఉన్న తేడాలూ, ఆఫ్రో–అమెరికన్లకు వ్యతిరేకంగా వెలువడిన తీర్పులూ, జడ్జీలలోనూ జ్యూరీలలోనూ తక్కువ శాతంలో కనిపించే ఆఫ్రో–అమెరికన్ల గురించీ ప్రస్తావిస్తాడు రచయిత. వ్యాపార ధోరణితో నడిచే ప్రైవేట్ జైళ్లు, ప్రేమించిన నేరానికి జరిగిన లించింగ్లు, పిల్లలు కూడా పెద్దల కోర్టులలోనే విచారింపబడి పెరోల్ లేని జీవిత ఖైదులు అనుభవించటం, వాళ్లని కరడుగట్టిన నేరస్తులుండే పెద్దల జైళ్లకే తరలించడం, విచ్ఛిన్నమైన కుటుంబాలు, గృహహింస, పేదరికం, బాల్యమే తెలియని పసిపిల్లల జీవితాలు, జైళ్లలో అత్యాచారాలకి గురవుతున్న స్త్రీలూ– ఈ అణచివేతల్లోని వెతలు మనిషిలో అడుగంటిపోయిన వివేకాన్ని ప్రశ్నిస్తాయి. బ్రయాన్ తన సంస్థ ద్వారా వారికి చేస్తున్న సేవ, చూపిస్తున్న త్రోవ కొంతమేరకు కొత్త వూపిరి. బ్రయాన్ అన్నట్టు ‘‘పరస్పరం అన్న మానవ భావనకి అతీతంగా ఏ సంపూర్ణత్వమూ సిద్ధించదు.’’ ఈ పుస్తకం ఆధారంగా ఇదే పేరుతో 2019లో సినిమా కూడా వచ్చింది. - పద్మప్రియ (నవల: జస్ట్ మెర్సీ, రచన: బ్రయాన్ స్టీవెన్సన్, ప్రచురణ: వన్ వల్డ్; 2015) -
‘ప్రతిభా’వంతుడు
అప్పట్లో భారతి పత్రికలో రచనలు అచ్చవడం కవులకు రచయితలకు గీటురాయిగా వుండేది. అటువంటిదే తెలికచర్ల వెంకటరత్నం సంపాదకత్వంలో వెలువడిన ప్రతిభ మాసపత్రిక కూడా. పొందికగా వస్తున్న ప్రతిభలో తన పేరు చూసుకోవాలని మధునాపంతులకు కోరికగా వుండేది. అయితే ముందు చందాదారునిగా చేరదాం, తరవాత రచనలు పంపిద్దాం అనుకున్నారో ఏమో, పత్రికకు చందా కట్టారు. మరుసటి నెల సంచికలో చందాదారుల జాబితాలో ‘మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి’ పేరు ముద్రించారు. అది చూసిన ఆంధ్రి సహ సంపాదకుడు, విద్వాన్ పాలెపు వెంకటరత్నం ఆయనతో వున్న చనువుతో ‘‘మొత్తానికి ప్రతిభా’వంతుడవయ్యావు’’ అని చమత్కరించారు. అందరినీ చమత్కరించే మధునాపంతుల తన మీది చమత్కారానికి ముసిముసిగా నవ్వుకున్నారు. సేకరణ: శిఖామణి -
రారండోయ్
పట్నాయకుని వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్న వారం వారం తెలుగు హారం 100వ వారం వేడుక మార్చి 1న ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరగనుంది. నందమూరి లక్ష్మీపార్వతి, ఆర్.దిలీప్ రెడ్డి, కేవీ రమణాచారి, మామిడి హరికృష్ణ, వర్ధెళ్లి మురళి, ప్రభాకర రెడ్డి, ఎంవీ రామిరెడ్డి, గౌరీశంకర్, సన్నిధానం నరసింహశర్మ, కాలువ మల్లయ్య, పొట్లూరి హరికృష్ణ పాల్గొంటారు. మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కా రాన్ని ‘సీమేన్’ కథలకు గాను అద్దేపల్లి ప్రభుకు ఫిబ్రవరి 25 సా.6 గం.లకు రవీంద్ర భారతి మినీ హాల్లో ప్రదానం చేయనున్నారు. శీలా వీర్రాజు, కాలువ మల్లయ్య, నెల్లుట్ల రమాదేవి, నాళేశ్వరం శంకరం పాల్గొంటారు. ధనికొండ హనుమంతరావు శతజయంతి ముగింపు సభ మార్చి 1న ఉ.10 – సా.5గం. వరకు రవీంద్రభారతి మినీ హాల్లో జరగనుంది. వకుళాభరణం రామకృష్ణ, సంగిశెట్టి శ్రీనివాస్, కె.శ్రీనివాస్, కాత్యాయని విద్మహే, జగన్నాథ శర్మపాల్గొంటారు. ధనికొండ ఎంపిక చేసిన 40 కథల మీద 25 మంది యువ రచయితలు మాట్లాడుతారు. జాగృతి కథలు, నవలల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం మార్చి 1న ఉ. 10 గం.కు ఓయూ ప్రాంగణంలోని పీజీఆర్ఆర్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో జరగనుంది. వక్త: సిరివెన్నెల సీతారామశాస్త్రి. విజేతలు: కథలు– ఆర్.దమయంతి, కనుపూరు శ్రీనివాసులు రెడ్డి, పాణ్యం దత్తశర్మ; నవలలు– పుట్టగంటి గోపీకృష్ణ, ఆకెళ్ల శివప్రసాద్. సీఏఏ, రిజర్వేషన్లు, కాశీం, వరవరరావు, సాయిబాబా అరెస్టు, వారి కవిత్వం వంటి అంశాలపై మార్చి 1న మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9గం. వరకు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సదస్సు జరగనుంది. నిర్వహణ: విప్లవ రచయితల సంఘం. ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి సమగ్ర సాహిత్యం ప్రచురించే నిమిత్తం– అలభ్యంగా ఉన్న ఆయన రచనలు గురుక్షేత్ర సంగ్రామము, సంయుక్త, నేత్రావధాన చంద్రిక, మానసబోధ శతకము జాడ తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నారు అనిల్ అట్లూరి. ఫోన్: 8142642638. -
వాతావరణ సూచన : హర్షాభావం
అడవిలో నడుస్తున్న ఇద్దరు కొద్ది దూరంలో ఆకలిమీదున్న ఒక ఎలుగుబంటిని చూశారు. వెంటనే ఒకతను పారిపోవడానికి తయారైపోయాడు. రెండో అతను, ‘‘నువ్వెంత ప్రయత్నించినా ఎలుగుబంటి కంటే వేగంగా పరిగెత్తలేవు,’’ అన్నాడు. మొదటి వ్యక్తి అతన్ని చూసి–‘‘ఫర్లేదు, నీకంటే వేగంగా పరిగెత్తితే చాలు కదా!’’ అన్నాడు. ఆరేళ్ల క్రితం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెక్యులేషన్ నవలతో సంచలనాన్ని సృష్టించిన అమెరికన్ రచయిత్రి జెన్నీ ఓఫిల్ తన తాజా నవల వెదర్లో ‘లేట్ కాపిటలిజం’ అంటే ఏమిటి అన్న ఒక ప్రశ్నకి ఇచ్చిన చమత్కార సమాధానం అది. అలాగని ఈ నవల లేట్ కాపిటలిజమ్ గురించి కాదు. హాస్య వ్యంగ్యాలు కథనశైలిలో ఒక భాగమే తప్ప, ఇది పూర్తిగా అలాంటి తరహా నవలా కాదు. వీటన్నింటినీ దాటుకుని వాతావరణం, పర్యావరణం, మనిషి మనుగడల మీదుగా నవల విస్తృతి కొనసాగుతుంది. నవలలోని కథకురాలు లిజీ ఒక లైబ్రేరియన్. భర్త, కొడుకు, తమ్ముడి చుట్టూ ఆమె జీవితం అల్లుకుని ఉంటుంది. లిజీకి ఒకప్పటి ప్రొఫెసర్ అయిన సిల్వియా, వాతావరణంలో వస్తున్న పెనుమార్పుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తన ప్రసంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తూంటుంది. సిల్వియాకి ఉన్న పని ఒత్తిళ్ల వల్ల ఆమెకొచ్చే రకరకాల మెయిల్స్ చూసి సమాధానాలు ఇవ్వటానికి లిజీని కుదుర్చుకుంటుంది. ఆ మెయిల్స్లోని వైవిధ్యం చూసి లిజీ ఆశ్చర్యపోతుంది. పర్యావరణానికి మనిషి కలిగిస్తున్న హాని, తద్వారా వచ్చే వాతావరణ మార్పులు రానున్న ఉపద్రవానికి సూచనలనీ, ఆ ప్రమాదం సుదూర భవిష్యత్తులో కాదనీ, అనుకున్న దానికంటే చాలా వేగంగా సమీపిస్తోందనీ ఎంతోమంది ఆందోళన చెందటం ఆ మెయిల్స్లో గమనిస్తుంది. ముంచుకొస్తున్న వినాశనాన్ని ఎవరూ సరిగ్గా అంచనా వేయని అలసత్వాన్ని గుర్తిస్తుంది. రాబోయే తరాల భద్రత గురించి ఎలాంటి అనుమానాలూ లేని లిజీకి ఈ కొత్త ఎరుక ఉలికిపాటుని కలిగిస్తుంది. తన పిల్లవాడి గురించీ, తరువాతి తరాల గురించీ ఆలోచిస్తున్న లిజీతో ‘‘నువ్వు నీ పిల్లల్ని వీటన్నిటినుంచీ రక్షించగలననే అనుకుంటున్నావా?’’ అని ఆమె ఆలోచనా భారాన్ని మరింత పెంచుతుంది సిల్వియా. అందరిలానే జీవన వైరుధ్యాలని లిజీ కూడా ఎదుర్కొంటూనే ఉంటుంది. బొటాబొటి జీతం, తమ్ముడి బాధ్యత, ఆ బాధ్యత వల్ల సంసారంలో ఇబ్బందులూ, పిల్లవాడూ, చదువూ వంటి వైయక్తిక సమస్యలు ఎన్ని ఉన్నా, ఎన్నికల ఫలితాలూ, నిరంకుశ ధోరణులూ, పెరుగుతున్న అసమానతలూ, స్కూల్లో కాల్పులూ, అభద్రతలూ, అలుముకుంటున్న నిరాశ వంటి సామాజిక పరిస్థితులు భయం కలిగిస్తున్నా – వీటన్నిటి మధ్య కూడా పర్యావరణం పట్ల తన బాధ్యత గురించి ఆలోచించే లిజీ కథే ఈ నవల. రకరకాల విషయాల ప్రస్తావనలతో ప్రారంభంలో పాఠకుడికి పట్టు దొరకనివ్వని కథనం, పోనుపోను అల్లిక చిక్కనై అందులోకి లాగేస్తుంది. కథావిస్తరణలో ఏ నవలా సూత్రాలకీ కట్టుబడకుండా, తార్కికమైన మొదలూ తుదీ అంటూ లేకుండా సాగే కథ– లిజీ ఆలోచనల విస్ఫోటనాల చుట్టూ పాదరసంలా సంచలిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు కొంత హాస్యంతో, కొంత తాత్త్వికతతో కలగలిసి ఆమె మేధను తాకి విడిపోతుంటాయి. రోజువారీ జీవితపు పరుగులో మనిషి కొట్టుకుపోతూ, తన మనుగడనే ప్రశ్నార్థకం చేసే ముఖ్యమైన విషయాలను చూసీచూడనట్టు వదిలేయటం సరికాదన్నదే ఈ నవల ఇతివృత్తం. మేధోపరమైన చర్చలకే పరిమితమైపోతున్నవారు, మార్పుకోసం బరిలోకి దిగి అందరితో కలిసి నడవాలన్నది నవలాంతరంగం. పద్మప్రియ -
కావ్యదహనోత్సవం
తన కావ్యాన్ని ఎవరూ చదవడం లేదని నిశ్చయమైన ఒక కవి, ఒక కొత్త సంప్రదాయానికి తెర తీస్తూ కావ్యదహనోత్సవానికి సిద్ధపడ్డాడు. దానికి తగినట్టుగా సభ ఏర్పాటైంది. అధ్యక్షుడు క్లుప్తంగా శ్రోతలకు విషయం వివరించి, కృతికర్తను మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు. అప్పుడు కృతికర్త ప్రసంగం ఇలా సాగింది: ఒకళ్లనొకళ్లు పొగుడుకోవడంతో మొదలై, పార్టీలతో ఆఖరవుతున్న ఈనాటి సాహిత్య సభలని చూస్తున్న నేను; సాహిత్య సమస్యలని నిష్కపటంగా చర్చించే ఉదాత్త సభ చూడగలనా అనుకునేవాడిని. చచ్చిపోతే చచ్చిపోయింది కానీ, నాకింత ఉదాత్త సాహిత్యసభలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నా కావ్యానికి ధన్యవాదాలు అర్పించకుండా ఉండలేను. కాలేజీ పత్రికలకి పద్యాలు, పెళ్లిళ్లకి పంచరత్నాలు రాయడంతో నా సాహిత్యజీవితం మొదలయ్యింది. నా దగ్గిర స్నేహితుడు ఒకడు చనిపోతే, షెల్లీ రాసిన ఎడొనోయిన్ దగ్గర పెట్టుకొని, ‘విలపామి’ అనే ఖండకావ్యాన్ని వ్రాశాను. ఆ పద్యాలు అచ్చవగానే, నా మిత్రులందరూ, ‘నీలో సరికొత్త కంఠం మాకు గంభీరంగా వినపడుతున్నది’ అని ఉబ్బేశారు. అప్పటికి నేను కవిననే భ్రాంతి నన్ను పూర్తిగా ఆవరించింది. నా వేషభాషల్లో కూడా మార్పు వచ్చింది. గ్లాస్గో పంచలు, పెద్ద జరీ పంచెలు, శాండో బనీను లీలగా కనిపిస్తూ వుండే తెల్లటి మల్లెపువ్వుల్లాంటి లాల్చీలు, నగిషీ చెక్కిన చెప్పులు, ఇవి నా ట్రేడుమార్కులు! ఛందోకవిత్వం పేరుతో కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యడం మొదలుపెట్టాను. చిత్రవిచిత్ర బంధనలతో రకరకాల సమాసాలతో, కవితలు వ్రాశాను. దేశంలో ఏ మూల సాహిత్య సభ పెట్టినా వెళ్లేవాడిని. సాహితీ సభలకు వెళ్లడానికి ఏ అర్హతా అక్కరలేదు కదా! అనతికాలంలోనే, దేశంలో హేమాహేమీ సాహిత్యవేత్తలంతా నాకు పరిచయం అయ్యారు. పబ్లిక్ మీటింగుల్లో కూడా నన్ను పొగడటం మొదలుపెట్టారు. ఆరు నెలలు తిరక్కుండా ఒక చిన్న ఖండకావ్యానికి సరిపడే పద్యాలు, గేయాలు తయారుచేశాను. దానితో సర్వ యువకవి బంధువుగా ప్రసిద్ధికెక్కిన ఒక పీఠాధిపతి నన్ను వెన్ను చరిచి, తాను ఉపోద్ఘాతం రాస్తాననీ, అచ్చు వెయ్యమనీ వెంటపడ్డాడు. కావ్యానికి అగ్నిశంఖం అన్న పేరు ఆయనే పెట్టాడు. మా వేలువిడిచిన పినతండ్రి ఒకాయన సెంట ర్లో కాస్త పెద్ద పదవిలో ఉండటం మూలంగా కృతిపతిని వెతుక్కోవలసిన బాధ తప్పింది. ఆయనతో ఏవో లావాదేవీలుండి, మా ఇంటిచుట్టూ తిరిగే ఈ గోపాలరెడ్డి నా స్నేహం కట్టి, తనకి అంకితం ఇమ్మని కూచున్నాడు. పుస్తకం అచ్చుకయ్యే ఖర్చు కాకండా, ఆవిష్కరణ రోజున ఓ వెయ్యి నూటపదహార్లు ఇస్తానని చెప్పాడు. పుస్తకం తెల్లటి పాలవెన్నెల లాంటి ఆర్ట్ కాగితాల మీద అచ్చయ్యింది. అప్పట్లో మత్స్య, అటవీ శాఖకి డిప్యూటీ మంత్రిగా ఉన్న ఒకాయన సభాధ్యక్షుడిగా వచ్చాడు. దినపత్రికల్లో మా బొమ్మలు బ్రహ్మాండంగా అచ్చయ్యాయి. రెండున్నరేళ్లు ఆ కైపులో కొట్టుకుపోయాను. నా వ్రాతప్రతుల్లో ఎవరికయినా ఓపిక వుండి చూడగలిగితే, అసంపూర్తిగా వదిలేసిన ప్రబంధాలు, చంపూకావ్యాలు, వాస్తవిక, అధివాస్తవిక గేయాలు, ‘నిజము అన్నపూర్ణ నీదు మాట’ మకుటంతో వందలకొద్దీ పద్యాలు దొరుకుతాయి. నేను నా గతజీవితంలోలాగా మీరు ఏ మాట చెబితే చప్పట్లు కొడతారో ఆ మాటలే చెప్పి సెభాస్ అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అసలు ప్రపంచ సాహిత్యాలకంటే నా తెలుగు సాహిత్యం గొప్పదని విర్రవీగాను. ఏ భాషలోకి అనువదించినా ఇది కావ్యంగానే నిలబడుతుంది, అన్న కావ్యం ఒక్కటీ మనకు రాలేదు. యునెస్కో వాళ్లు ఫ్రెంచ్లోకి అనువదిస్తాం, మీ కావ్యం ఒకటి చెప్పండయ్యా అని అంటే, మనవాళ్లు మీనమేషాలు లెక్కపెట్టి చివరికి వేమన పద్యాలు చూపించారు! ఒకసారి ఆంధ్రాభ్యుదయోత్సవ సభకి ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్లాను. సభ అధ్యక్షుడు హైస్కూలు హెడ్మాస్టరు. ‘బాబూ! అన్నన్ని మాటలు వాడావు?’ భ్రసృమర, అఘమర్షణ, నిబర్హణ, వీటికి అర్థం ఏమిటీ, అనడిగాడు. నా పద్యాల్లో నేను ఏ అర్థమూ వుద్దేశించి రాయలేదని నిరూపించాడు. ఏలూరులో నేను నా మిత్రులూ రోజూ దాదాపు అరడజను పకోడీ పొట్లాలు తెప్పించుకునేవాళ్లం. పకోడీలు ఒక్కో షాపులో ఒక్కోరకంగా వుండేవి. కానీ, పొట్లం కటిన కాయితాలు మాత్రం అన్నీ అగ్నిశంఖం కాయితాలే! నిజంగా కవిత్వం అంటే ఏమిటి? ఒక గొప్ప కావ్యం వ్రాయాలంటే సంపాదించుకోవలసిన వ్యుత్పత్తి ఎటువంటిది? ఎలాంటి అనుభవాలు ఒక వ్యక్తిని కవిగా చేస్తాయి? ఈ ప్రశ్నలు నన్ను వేధించటం మొదలెట్టాయి. ఆధునిక ఆంగ్ల కవిత్వ యుగప్రవక్తగా విఖ్యాతుడయిన గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్ తన జీవితకాలంలో ఒక్క పద్యం కూడా అచ్చు వెయ్యలేదు. అతని కవిత్వమంటే ఇష్టమయినవాళ్లు అచ్చువేస్తామని చెప్పినా ఒప్పుకోలేదు. ఒక దశలో అంతకుముందు వ్రాసిన పద్యాలన్నీ చింపేసి, ఇక పద్యాలు రాయకూడదని శపథం కూడా చేయడం జరిగింది. అతను చనిపోయింతర్వాత అక్కడక్కడ అతని స్నేహితుల వద్దా, ఇతరత్రా దొరికిన 50, 60 పద్యాలు మాత్రం అతని మిత్రుడు రాబర్ట్ బ్రెడ్జెస్ ప్రకటించాడు. ఈనాడు హాప్కిన్స్ మీద వచ్చిన విమర్శక గ్రంథాలు ఒక బీరువాకి సరిపోతాయి. క్షమించండి. ఇప్పటికే చాలాసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించాను. మనిషి సుఖంగా బ్రతకాలంటే కవిగా డబ్బా వాయించుకోనక్కరలేదు. ఏ దొరస్వామిలాగానో యూనివర్సిటీ ముందు ఒక కిళ్లీకొట్టు పెట్టుకొని ఆనెస్టుగా బ్రతకచ్చు. తెలుగు సాహిత్యంతో ఇక ఈ జన్మలో సంబంధం పెట్టుకోను. కొంతమందికి అనుమానం రావచ్చు; సినిమాలకి మాటలు పాటలు రాస్తానేమోనని. ఆ పనీ చెయ్యను. ఇక సెలవ్. ఒక చారిత్రక ప్రహసనం ఇటు ఆకలి అటు కాకలి అటు వేకువ ఇటు లోకువ అటు మకుటం ఇటు కటకం అటు సమరం ఇటు భ్రమరం ఇటు కృస్చేవ్ అటు మిస్చీఫ్ ఇటు టర్కీ అటు గోర్కీ నాలో మాత్రం సత్యం నిత్యం నవ్య భవ్య దివ్యాకృతి (‘అగ్నిశంఖం’) కవిని ఎవరో కావ్యం రాయమని అభ్యర్థించటం, కవి కృతిని రాయటం, ఆ కృతికన్యను ఒక కృతిభర్తకి అంకితం ఇవ్వడం– ఇలాంటి కర్మలు మన సంప్రదాయంలో ఉన్నప్పుడు, ఎవరూ చదవని పుస్తకానికి దహనోత్సవం ఎందుకు చెయ్యకూడదు? ఈ సందేహం ఒకమారు వెల్చేరు నారాయణరావుకు వచ్చింది. ‘ఎవరైనా అటువంటి దహనకర్మ చేయటానికి ముందుకొస్తే నా పుస్తకాలు ఇస్తాను’ అన్నారు ఆంధ్రవిశ్వకళా పరిషత్తు ప్రధాన లైబ్రేరియన్గా పనిచేస్తున్న అబ్బూరి రామకృష్ణారావు. అదీ నాంది. ఇదే ఊతంగా ఒక ప్రహసనం రాశారు అప్పటికి నవయువకుడైన వేలూరి వేంకటేశ్వరరావు. ‘కావ్యదహనోత్సవం’ చేయాలంటే ముందు కవి కావాలి. అది వేలూరే. ఆయనో కావ్యం రాయాలి. రాశాడు(?). దాని పేరు అగ్నిశంఖం. 14–12–1960 రోజున ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆవరణలో దహనోత్సవం జరగనుందనీ, ‘అమూల్య హర్షాశ్రుతర్పణము’ వదలడానికి అందరూ రావాలనీ పత్రికలు కొట్టించారు. సభ అంటే దానికో అధ్యక్షుడు (మేడేపల్లి వరాహనరసింహ స్వామి) కావాలి, ప్రధాన వాహకుడు (ఎ.సత్యమూర్తి) ఉండాలి, కృతి భర్త (అనంతరం బంగోరెగా ప్రసిద్ధుడైన బి.గోపాలరెడ్డి) తప్పనిసరి. ఇంకా, శ్రోతల్లోంచి చీటీ పంపి మాట్లాడతాననే ఓ యువకుడు (చేకూరి రామారావు). ‘అచ్చుయంత్రం ఏటేటా వేలు లక్షల పుస్తకాలు ప్రజల మీద పడేస్తున్నది. వీటిల్లో మంచి చెడ్డల ఎన్నిక బహు దుస్తరం అయిపోతున్నది’ అంటూ అధ్యక్షుడు సభ ప్రారంభించాడు. ‘ఒక తుచ్ఛకావ్యం యొక్క తుచ్ఛత్వం లోకానికంతటికీ తెలిసిన చాలా కాలానికిగానీ కవికి’ తెలియదనీ, అలాంటిది ‘అగ్నిశంఖం వ్రాసిన వేంకటేశ్వరరావు మా దగ్గరికొచ్చి, తన కావ్యం క్షుద్రకావ్యం అని’ ఒప్పుకుని దహనోత్సవం జరిపించమన్నాడనీ నిర్వాహకుడు సభను ముందుకు జరుపుతాడు. అనంతరం, ఈ దహనానికి ఎందుకు ఒప్పుకున్నాడో చెబుతూ కవి ప్రసంగిస్తాడు. (ప్రసంగంలోని కొంతభాగం కథాసారంలో చూడండి.) కవి అప్పటికే నన్నయ్య నుంచి నానాసాహెబ్ దాకా ఎన్నో ప్రయోగాలు చేసినవాడు. ఎన్నో బిరుదులు పొందినవాడు. కానీ ప్రచారం వలననే సాహిత్య విలువలు స్థిరపడుతున్నాయని జ్ఞానోదయమైంది. అందుకే, తన ‘సర్వ రచనల మీద మమకారం వదులు’కుంటున్నానని సభాముఖంగా ప్రకటించాడు. దహనం అంటే భౌతికంగా పుస్తకాన్ని తగలబెట్టడం కాదని వీళ్లందరికీ తెలుసు. తెలుగులో సాహిత్యం పేరుతో చలామణీ అవుతున్న చెత్తను గుర్తించాలని అదొక పిలుపు. అరవై ఏళ్ల కింద ఈ ఘటన సహజంగానే సంచలనం కలిగించింది. ‘విష్ క్రెమేషన్ సక్సెస్’ అని తంతి పంపించాడు శ్రీశ్రీ. మా ఊరికి ఎప్పుడు వస్తారని ఉత్తరం రాశాడు ఇస్మాయిల్. ‘ఒక పుస్తకం మరణించిందని మీరెలా చెప్పగలరు?’ అని నిలదీశాడు కొనకళ్ల వెంకటరత్నం. నాటకం, వీధి నాటకం, నిజమైన మనుషులే పాత్రలు కావడం వల్ల ఇంకో వింత రూపం తెచ్చుకున్న ఈ ఘటన– ఇన్నేళ్లూ కేవలం సాహిత్య మరమరాలు కోవలో మౌఖిక ప్రచారంలో ఉండి, అప్పటి విశేషాలు కలుపుకుని వేలూరి 84వ యేట చిరుపుస్తకంగా వచ్చింది. వేలూరి వేంకటేశ్వరరావు అధ్యాపకుడిగానూ, పరిశోధకుడిగానూ పనిచేశారు. ‘మెటమార్ఫసిస్’, ‘ఆనేల, ఆ నీరు, ఆ గాలి’ కథాసంపుటాలు వెలువరించారు. ఒరియా కవి సౌభాగ్యకుమార మిశ్ర కవిత్వం – ‘అవ్యయ’, ‘ద్వాసుపర్ణా’ తెలుగులోకి అనువదించారు. ప్రస్తుత నివాసం అమెరికా. -
అంతా వాళ్లే
ఒకసారి ఒక సినిమాకు మాటలు రాయడానికి చెన్నై వెళ్లి తిరిగి విశాఖ వస్తున్నారు రావిశాస్త్రి. ‘‘గురువు గారూ, సినిమా ప్రపంచం ఎలా వుంది?’’ అని ఒకతను పలకరించాడు. రావిశాస్త్రి నవ్వి ఇలా జవాబిచ్చారట: ‘‘సినిమా వాళ్లతో చాలా సుఖం. మన గదికి మనని అద్దె చెల్లించనివ్వరు, వాళ్లే చెల్లిస్తారు. మన సిగరెట్లు మనం కొనే పనిలేదు, వాళ్లే కొనిస్తారు. మన మందు, మన తిండి మనం కొనక్కర్లేదు, వాళ్లే ఏర్పాటు చేస్తారు. మన డైలాగులు మనల్ని రాయనివ్వరు, వాళ్లే రాసుకుంటారు.’’ -
రారండోయ్
రావి రంగారావు సాహిత్య పీఠం జన రంజక కవి పురస్కారాలను ఫిబ్రవరి 10న సా. 6 గం.కు గుంటూరులోని అన్నమయ్య కళావేదికలో ప్రదానం చేస్తారు. గ్రహీతలు: మెట్టా నాగేశ్వరరావు (మనిషొక పద్యం), కరీముల్లా (ఎదురు మతం), మందరపు హైమవతి (నీలి గోరింట), కన్నెగంటి వెంకటయ్య (మమతల హృదయాలు), ఎరుకలపూడి గోపీనాథరావు (భావనా తరంగాలు). సిరికోన – మహాంధ్రభారతి సాహిత్యోత్సవం ఫిబ్రవరి 13న సాయంత్రం 5:30కు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఇందులో బులుసు వేంకటేశ్వర్లు ‘నీలమోహనం’ ఆవిష్కరణ, సిరికోన భారతి వ్యాస సంపుటి (సం. గంగిశెట్టి లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి) ఆవిష్కరణ కానున్నాయి. గంగిశెట్టి స్మారక ఉత్తమ అనువాదక పురస్కారాన్ని డాక్టర్ కోడూరి ప్రభాకర రెడ్డికీ; రుక్మిణమ్మ గంగిశెట్టి స్మారక ఉత్తమ ప్రథమ కవితా సంపుటి పురస్కారాన్ని దేవనపల్లి వీణావాణికీ; చెన్నరాయ కిశోర్ స్మారక తెలుగు తేజో స్ఫూర్తి పురస్కారాన్ని దేశముఖ్ ప్రవీణ్ శర్మకూ ప్రదానం చేయనున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా ఫిబ్రవరి 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో పి.వి.నరసింహారావు ‘లోపలి మనిషి’పై పరాంకుశం వేణుగోపాల స్వామి ప్రసంగిస్తారు. అధ్యక్షత: నందిని సిధారెడ్డి. భూతపురి సాహిత్య పురస్కారాన్ని గండ్లూరి దత్తాత్రేయ శర్మకు ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడపలో ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: భూతపురి సుబ్రహ్మణ్య శర్మ మెమోరియల్ ట్రస్ట్, అల్లసాని పెద్దన సాహిత్య పీఠం. అనిల్ డ్యానీ కవితా సంపుటి స్పెల్లింగ్ మిస్టేక్ పరిచయ సభ ఫిబ్రవరి 16న సా. 6 గంటలకు సీసీవీఏ, మొఘల్రాజపురం, విజయవాడలో జరగనుంది. అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా గుడిపల్లి నిరంజన్ రాసిన ‘నిట్టాడి’ దీర్ఘ కవిత ఆవిష్కరణ ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు నాగర్కర్నూల్, సి.యన్.రెడ్డి సేవాసదన్లో జరగనుంది. ఆవిష్కర్త గోరటి వెంకన్న. నిర్వహణ: పూలే అంబేడ్కర్ అధ్యయన వేదిక, నాగర్కర్నూల్. -
నా నాటకాల మూలసూత్రాలు
‘కావ్యేషు నాటకం రమ్యమ్’ అనే వాక్యం నాకు బాల్యంలోనే జీర్ణమైపోయింది. నేను హైస్కూలు దాటకుండానే రంగు పూసుకున్నాను. బాలరాముడి పాత్రతో 1960లో నాటకరంగానికి శ్రీకారం చుట్టేను. దాదాపు 200 కథలు రాశాను. 20 నవలలు రాశాను. టీవీ సీరియల్స్కి దాదాపుగా 800 ఎపిసోడ్స్ రాశాను. దాదాపు 80 సినిమాలకు కథ, మాటలు రాశాను. దినపత్రికలో కాలమ్స్ రాశాను. ఎన్ని రాసినా, నాటక రచన పట్ల నా ఆసక్తి పెరుగుతూనే వచ్చింది– సాంఘిక నాటికలు, పిల్లల నాటికలు, పద్య నాటకాలు, రేడియో నాటకాలు ఇలా అన్ని విభాగాల్లో రచన చేశాను. 1997లో నేను రాసిన మొట్టమొదటి నాటకం ‘కాకి ఎంగిలి’ హైదరాబాదు రసరంజని హాలులో రోజువారీ ప్రదర్శనలు ఇచ్చారు. ఇది రాయటానికి ముందు నాటకం ఎలా రాయాలి? అనే విషయం చాలాకాలం ఆలోచించేను. నాటకంలో వస్తువైవిధ్యం, సన్నివేశాల కూర్పు, పాత్ర చిత్రణ, పాత్ర స్థాయి, స్వభావాన్ని అనుసరించి సంభాషణలు ఉంటే ఆ నాటకం ప్రేక్షకులని ఆకర్షిస్తుందని గ్రహించేను. పద్యనాటకాలు రాసినా ఇవే మూలసూత్రాలు పాటించేను. ‘అల్లసాని పెద్దన’, ‘రాణి రుద్రమ’, ‘రాణాప్రతాప్’ లాంటి చారిత్రక నాటకాలు రాసినా ఇదే మార్గాన్ని అనుసరించేను. ‘క్రాస్ రోడ్స్’ లాంటి స్త్రీవాద ఇతివృత్తం తో ఇంకో నాటకం రాయండి అని అడిగే మహిళామణులున్నారు. ‘ఓం’ లాంటి ధర్మప్రభోదాన్ని చేసే నాటకం రాయండి అని అడిగే ఆర్ష విద్యా సంపన్నులున్నారు. ‘మీ ఇల్లెక్కడ?’ లాంటి తాత్విక చింతనతో నాటకాలు రాయాలి అని ఆశించే తత్త్వవేత్తలున్నారు. ‘కలనేత’ లాంటి నాటకాలు చూసి తెలంగాణ మాండలికంలో రచనలు చేయమని కోరేవాళ్లున్నారు. 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది నాటక పోటీలు మొదలుపెట్టింది. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ దాదాపు ప్రతీ సంవత్సరం నేను రచించిన ఏదో ఒక నాటిక పోటీలో పాల్గొంటూ వచ్చాయి. 13 సార్లు ఉత్తమ రచనకు నంది బహుమతులు అందుకున్నాను. నా నాటకాలకు బహుమతులు రావటానికి, నాకు ఇంత పేరు రావటానికి, ఆయా నాటకాల్లో ఆ పాత్రలు ధరించిన నటీనటులు, టెక్నీషియన్స్– ముఖ్యంగా దుగ్గిరాల సోమేశ్వరరావు, బి.ఎం.రెడ్డి, కె.వెంకటేశ్వరరావు, గంగోత్రి సాయి లాంటి దర్శకులే కారణం. ఆకెళ్లగా ప్రసిద్ధులైన ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ నాటకాలు రెండు సంపుటాలుగా వచ్చాయి. ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి. రచయిత ఫోన్: 9440054477 -
నవ్వుల గజ్జెలు
‘‘వేడిగా ఏ మే ముంది?’’‘‘వడ, దోసె, ఇడ్లీ, పూరీ, బోండా, మైసూర్పాక్’’ ఏకబిగిని రాము పాఠం వల్లించాడు. వాడి చూపులు ఫ్యామిలీ రూమ్స్కేసి పదే పదే పరుగులెత్తుతున్నాయి.‘‘రెండు ప్లేట్లు ఇడ్లీ చట్నీ పట్రా!’’రాము వడిగా వంటింటివేపు నడిచాడు. నడుస్తుంటే ఏదో పొరపాటు చేసినట్టు తట్టింది. చప్పున ఆర్డర్ తీసుకున్న టేబుల్ దగ్గరకు వెళ్లి ‘‘ఇడ్లీ లే’’దని సమాధానం చెప్పాడు.ఆర్డర్ యిచ్చిన కుర్రాడు ఆలోచనలో పడ్డాడు. ‘‘అయితే రెండు కప్పుల టీ పట్రా!’’‘‘రెండు టీ’’ అని రాము గట్టిగా అరిచాడు. అరుపు వేగంతో వంటింట్లోకి వెళ్లాడు. కౌంటర్ పైన ‘టీ’ కనపడకపోవడంతో విసుక్కున్నాడు. కౌంటర్ మీద మోచేతులు ఆనించి, వదులుగా నిలబడ్డాడు. కొంతసేపటికి టీ కప్పులు కనపడ్డాయి. వెంటనే అందుకుని దుడుకుగా టేబుల్ దగ్గరకొచ్చాడు. కప్పుల అంచులు ఒరుసుకుని నడకలో టీ సాసర్లలో పడింది. టీ తగిలి, చేతి బొటనవ్రేలు చురుక్కుమంది. చెయ్యి వణికింది. చేతిలోంచి కప్పు జారి ఆర్డరిచ్చిన కుర్రాడి ఒళ్లో పడింది. అతను దిగ్గున లేచి రామును ఫెళ్లున చెంపమీద కొట్టాడు. ఆ దెబ్బకి రెండవకప్పు, ఎడమచేతి సాసర్లోంచి దొర్లి టేబుల్పైన ముక్కలైంది. రాము శరీరంపైన పడగలు విప్పి, పాములు, జెర్రులు పాకాయి. మనసులో కోపం లేదు. కాని ఒళ్లు తెలియని ఉద్రేకం పొంగి ఆర్డర్ యిచ్చిన కుర్రాడిని ఫెళ్లున కొట్టాడు. హోటలులోని మనుషులు ఈ సంఘటనకు ఏక కంఠంతో గొల్లుమన్నారు. కౌంటర్ మీది యజమాని తిట్ల వర్షంతో లేచాడు. దెబ్బలతో, తన్నులతో రాముని హోటల్నుంచి తరిమాడు. రాము గుడ్డల్ని గిరాటు వేశాడు. రాముకి యజమానిపై తిరగబడదామన్న వాంఛే కలగలేదు. నరాలన్నీ సడలి ఒక విధమైన ఆనందం కమ్మింది. శరీరం తడిబట్టకు మల్లే బిగుసుకు పోయింది. కళ్లముందు నగ్నంగా రోడ్డు పరుచుకొని వుంది. బరువుగా అడుగులు వేస్తూ ముందుకు సాగాడు. కొంతదూరం అనాలోచితంగా నడిచాడు. కాళ్లు ఎందుకో పీక్కుపోతున్నాయి. కొద్దిగా ఆకలనిపించింది. ఆకలిని దులిపేసుకుని, రోడ్డు పక్కనున్న మైదానంలో గుమిగూడిన ఒక గుంపులోకి వెళ్లాడు. వెళ్లడంలో తనకు రెండింతలు పొడుగున్న మనిషి కాలు తొక్కాడు. అతను కస్సున లేచాడు. రాము పిల్లికి మల్లే ముందుకి వెళ్లి మొదటి వరుసలో కూర్చున్నాడు. అక్కడ మగకోతి, ఆడకోతిని బతిమాలుతున్నది. ఆడకోతి తల్లిగారింటికి వెడతానని మగకోతిని భయపెట్టుతున్నది. మగకోతి తల నిమరడానికి చూస్తోంది. ఆడకోతి గుర్రుమంటున్నది. ఆ కోతుల్ని చూస్తే నవ్వు వచ్చింది కాని, వాటి ఆలుమగల బాగోతం ఎందుకో కలత పెట్టింది. ఆడకోతి తల నిమరాలనిపించింది. లేచి ఆడకోతి వేపు వెళ్లాడు. కోతులాడించేవాడు ‘కుర్రాడా, కూర్చో’ అని గద్దించాడు. తనని ‘కుర్రా’డనటం వెగటుగా తోచింది. ఆ మాటతో ఉత్సాహం చచ్చింది. తన చోటుకి వచ్చి కూర్చున్నాడు. ఆడకోతి అంత బతిమిలాడించుకోవడం చూచి కోపం వచ్చింది. ఇంతలో మగ కోతి కర్ర తీసుకుని ఆడకోతి వెంట పడింది. ఆడకోతి కోతులాడించేవాడి చుట్టూ దొరకకుండా పరుగెత్తుతున్నది. మగకోతి వేగం హెచ్చింది. త్వరగా సమీపించి రెండు బాదింది. ఆడకోతి కీచుకీచులాడింది. మగకోతి చెప్పినట్టల్లా వినడం మొదలుపెట్టింది. రాముకు ఎందుకో ఆడకోతి మక్కెలు విరగదన్నాలనీ, ఆ తర్వాత తల నిమరాలనీ అనిపించింది. ఆట ముగిసింది. ఆడించేవాడు డబ్బులు అడుక్కుంటున్నాడు. రాము లేచి, తిరిగి నడక సాగించాడు. రోడ్డుపైన ఒక జంట చిరునవ్వులతో సాగింది. రాము తన కళ్లని ఆ జంటకి వప్పగించాడు. పర్దాతో ఒక రిక్షా ఎదురుగా వచ్చి, దాటేసి వెళ్లింది. రాము కళ్లు ఆ పర్దాని చీల్చడానికి ప్రయత్నించాయి. ఒక అమ్మాయి గాలికి ఎగురుతున్న కొంగుతో, సైకిలు పైన దాటేసి వెళ్లింది. రాము చూపులు చక్రాల వేగంలో యిరుక్కొని పోయినాయి. ఆ సైకిలుని నిలుచున్న పాటున పడగొట్టాలనిపించింది. సైకిలు మళ్లిన సందులోకి వెళ్లాడు. సైకిలు కనపడలేదు. ఏదో పోగొట్టుకున్నవాడికి మల్లే సందును దిగులుగా కలియ జూశాడు. సందులో చీకట్లు అలముకొంటున్నాయి. కళ్లముందు మసక తెరల్ని ముంచుతున్నాయి. చీకట్లోకి వెళ్లడానికి మనస్సు ఒప్పుకోలేదు. తిరిగి హోటలుకు వెడితే బాగుండు ననిపించింది. నిలుచున్న పాటున తరిమివేసిన యజమాని ఆశ్రయమిస్తాడన్న నమ్మకం లేదు. ఎక్కడా తలదాచుకోవడానికి చోటు లేదన్న తలపుతో భయం వేసింది. ఆకలి వేస్తున్నది. తినడానికి ఏమైనా దొరికితే బాగుండు ననిపించింది. పోనీ చొక్కాలు అమ్ముకుంటే? చిరిగిన చొక్కాలు ఎవ్వరూ తీసుకోరనే అధైర్యం వెంటనే తగిలింది. బిచ్చమెత్తుకుంటే? హోటలు ముందు రోజూ బిచ్చమెత్తుకునే బిచ్చగాళ్ల దురవస్థ అతనికి వచ్చింది. వెళ్లగొట్టేముందు పని చేసిన జీతమైనా కట్టిస్తే బాగుండేది. రెండు సంవత్సరాలు చేసిన చాకిరీ అయినా యజమానికి గుర్తురాలేదు. ఎన్నడూ లేనిది ఈ మధ్యనే తిరగబడటం ఎక్కువైంది. కెలికి కయ్యం పెట్టుకోవాలని వుంటుంది. పట్నమంతా ఒకటే పనిగా తిరగాలని వుంటుంది. ఏమీ తోచక వచ్చిన దారి పట్టాడు. తాను తిరిగిన రోడ్డుపై దీపాలు పెట్టివున్నాయి. పైన ఆకాశం మబ్బులతో పచ్చిగర్భిణిలా వుంది. వాన వస్తుందన్న భయమేసి, వడివడిగా నడిచాడు. వంద అడుగులు వేశాడో లేదో చినుకులు ప్రారంభమైనాయి. రాము వెంటనే ఒక కొట్టు చూరు కిందికి చేరుకున్నాడు. కొట్టులోని దీపాల వెలుతురులో రకరకాల చీరెలు జిగేలు మంటున్నాయి. రంగుచీరలన్నింటిని కప్పుకొని, వాటి మెత్తదనాన్ని ఆనందిస్తూ ఆ కొట్టులోనే పడుకోవాలనిపించింది. కాని కొట్టువాడి లావుపాటి శరీరం చూచి భయమేసింది. వర్షం ఎక్కువవుతున్నది. ఆకలి కలవర పెడుతున్నది. కాని వానతెరల్లోంచి వీధి దీపాలు ముచ్చటగా కనబడుతున్నాయి. ఏ హోటల్కైనా వెళ్లి తిరిగి సర్వర్గా చేరితే? చీరెల కొట్టువాడు కొట్టు కట్టేసే సన్నాహంలో ఉన్నాడు. దూరాన ఎక్కడో ఒక కుక్క ఏడుస్తున్నది. ఆకలి వేసి కాబోలు. కుక్కమోస్తరు ఆకలికి మనిషి ఎందుకు ఏడ్వడు? అయినా ఈ అర్ధరాత్రి ఉద్యోగం ఎవరిస్తారని? తిరిగి తన హోటల్కి వెళ్లి ఏ సర్వర్నైనా పట్టెడన్నం కోసం బతిమాలడం మంచిదనిపించింది. యజమాని రాత్రిపూట హోటల్లో ఉండడు. కొట్టువాడు కొట్టు మూశాడు. కొట్టు ముందుభాగం గుడ్డి చీకటిలో మునిగింది. కొట్టువాడు కారెక్కి యింటికి వెళ్లిపోయాడు. వర్షం యింకా కురుస్తూనే వుంది. చలి ఎక్కువవుతున్నది. రాము చంకలోని చొక్కాలు తీసి ఒకదానిపైన ఒకటి తొడుక్కున్నాడు. వర్షం వెలిసే సూచన కనబడలేదు. రెండు గంటలయింది. ఆకలికి పేగులు అరుస్తున్నాయి. హోటల్కి వెళ్లటం అసాధ్యమనిపించింది. ఉన్న రెండు బట్టలు తడుపుకోవడానికి మనస్సు ఒప్పుకోలేదు. కొట్టుముందే ఆకలి పడక వేయడానికి నిశ్చయించుకున్నాడు. కప్పుకున్న ధోవతి తీసి కింద పరిచాడు. ఇంతలోకే తడుస్తూ ఒక కుక్కకూన కొట్టు కప్పుకిందికి పరుగెత్తుకొచ్చింది. దాన్ని వెళ్లగొట్టే ఉద్దేశంతో కడుపులో ఒక తన్ను తన్నాడు. కుంయిమని ఒకమాటు వెలుపలకు వెళ్లి, వానకి తిరిగి లోపలికి వచ్చింది. దాని అవస్థ చూచి జాలి వేసింది. తనకు ఎదురుగా వున్న మూలకి నక్కి పడుకుంది. చేసేదేమీ లేక, ధోవతి మీద మేను వాల్చాడు. మిగిలిన యింకొక ధోవతి కప్పుకున్నాడు. కళ్లు పొడుచుకున్నా నిద్ర రావడం లేదు. చలీ, ఆకలీ పోటీలు పడుతున్నాయి. వాటి తాకిడికి రోడ్డు దీపాల వంక చూస్తూ లొంగిపోతున్నాడు. జ్వరంతో శరీరం సలసల కాగుతున్నది. అయిదు, పది, యిరవై నిమిషాలు గడిచాయి. కుక్కకూన లేచి వచ్చి రాము పక్కలో పడుకుంది. రాము కుడి చెయ్యి అనాలోచితంగా కుక్కపైన పడి, దాని తల నిమరడం మొదలుపెట్టింది. కూన మరీ దగ్గరికి జరిగింది. రాము కళ్లు బరువుగా మూతలు పడ్డాయి. ఆడకోతి కిచకిచలు, రిక్షా చక్రాల గజ్జెలు, గాలిలో ఎగురుతున్న పమిటలు, అతని చెవుల్లో గలగలా మోగినై. కొట్లో కనిపించిన రంగురంగుల చీరెలు కప్పుకుంటూ నిద్రలో మునిగాడు. కొంతసేపటికి వాన వెలిసింది. కుక్కపిల్ల అతని చెయ్యి తప్పించుకుని తిరిగి వీధి కెక్కింది. భాస్కరభట్ల కృష్ణారావు (1918– 1966) కథ ‘నవ్వుల గజ్జెలు’కు సంక్షిప్త రూపం ఇది. వయసుకు వస్తున్న ఒక కుర్రాడి మానసిక అవస్థ ఇందులో చిత్రితమైంది. సౌజన్యం: తెలంగాణ సాహిత్య అకాడమీ వెలువరించిన ‘పరిసరాలు’. 1940–50 మధ్య వచ్చిన వివిధ రచయితల కథల్ని వట్టికోట ఆళ్వారుస్వామి రెండు సంపుటాలుగా వెలువరించారు. 1956లో దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించిన వీటిని ఒకే సంపుటంగా తె.సా.అ. గతేడాది తెచ్చింది. కథకుడు, నవలా రచయిత భాస్కరభట్ల ఆలిండియా రేడియోలో పనిచేశారు. కృష్ణారావు కథలు, చంద్రలోకానికి ప్రయాణం, వెన్నెల రాత్రి పేరుతో కథాసంపుటాలు వచ్చాయి. ‘వెల్లువలో పూచిక పుల్లలు’ ఆయనకు పేరుతెచ్చిన నవల. -
దేవుడికేం కావాలో!
జాక్ లండన్ ఆత్మలాలసత గురించి ఒక్క విషయం చెప్పవచ్చు. ‘‘నా యిష్టం’’ అన్నమాటకు తిరుగులేదని అతను ‘‘క్రూయిజ్ ఆఫ్ ద స్నార్క్’’లో రాశాడు. అతని ఆత్మీయులు అతని యిష్టానికి తలవగ్గవలిసి వచ్చేది, లేకపోతే ఆత్మీయులు కాకుండా పోవలసిందే. చాలామందికి అతనిలో ఉన్న ఈ గుణం నచ్చలేదు. అతని కెప్పుడూ బోలెడంతమంది శత్రువులుండేవారు. మన్యూంగీ అనే జపనీయుడొకడు జాక్ లండన్కు నౌకరుగా ఉండేవాడు. వాడిలో తన యజమానిపై చాలాకాలంగా కసి పేరుతూ ఉండి ఉండాలి. ఒకనాడు జాక్ లండన్ అనేకమంది అతిథుల మధ్య ఉన్న సమయంలో వాడు పళ్లెంలో పానీయాలు తెచ్చి, తన యజమాని ముందు వంగి, అతి వినయంగా, ‘‘దేవుడికి బీర్ కావాలా?’’ అని అడిగి కసి తీర్చుకున్నాడు. అతిథులు నివ్వెర పోయారు. జాక్ లండన్ జీవితం రచించిన అతని భార్య అతని అహంకారాన్ని ‘‘రాజోచితమైనది’’ అన్నది. (కొడవటిగంటి కుటుంబరావు తెలుగులోకి అనువదించిన జాక్ లండన్ ‘ప్రకృతి పిలుపు’ ముందుమాటలోంచి) - ఫ్రాంక్ లూథర్మాట్ -
తెలుగులో నవ్వే హోవార్డ్ రోర్క్
75 ఏళ్లుగా పాఠకులు చదువుతున్నారు. 20కి పైగా భాషలలోకి మార్చుకున్నారు. 70 లక్షల ప్రతులకు మించి కొన్నారు. కాలాలు దేశాలు దాటివచ్చిన పుస్తకం క్లాసిక్ కాక మరేమిటి? ఇందులో కథ కొన్ని ఏళ్లపాటు జరిగిన కథ. హీరో పాత్రకి 22 ఏళ్లుండగా మొదలౌతుంది. అతనికి సుమారుగా 40 ఏళ్లు వచ్చేదాకా నడుస్తుంది. 1943లో అచ్చయిన ఈ పుస్తకంలో హీరో హోవార్డ్ రోర్క్ పాత్ర 1936 నాటికే పుట్టింది. 1937 నాటికే అయిన్ రాండ్కు టూహీ పాత్ర గురించి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఎంత చిన్న పాత్ర అయినా సరే వాళ్లని రూపురేఖలు దుస్తులతో సహా ఊహించింది అయిన్ రాండ్. ఉదాహరణకు టూహీ అర్భకంగా ఉండటం కేవలం వైచిత్రి కోసం చేసిన కల్పన కాదు. అతని మానసిక వైఖరికి కారణాల్లో అర్భకత్వం ఒకటి. నేపథ్య చిత్రణ వాస్తవంగా లేకపోతే నవల సహజంగా పండదు. అందుచేత వాస్తవిక చిత్రణ కోసం ఆర్కిటెక్చర్ రంగం గురించి విస్తృతంగా అధ్యయనం చేసింది. ఒక సంవత్సరం పాటు ఒక ఆర్కిటెక్చర్ ఆఫీసులో ఉద్యోగం చేసింది. ఇది ఆమె శ్రద్ధ. ఇది ఆర్కిటెక్చర్ మీద పుస్తకం కాదు. కానీ చిత్రంగా ఈ నవలలో అయిన్ రాండ్ చేసిన ఊహలతో అమెరికన్ ఆర్కిటెక్చర్ రంగం ప్రభావితం అయిందంటున్నారు విశ్లేషకులు. అదీ ఆమె క్రియేటివిటీలోని లోతు మనిషి అంటే ఏమిటో చూపించడానికి ఇది రాయాలనుకుంది అయిన్ రాండ్. మనిషి ‘అయినవాడు’ ఏం కోరుకుంటాడో, ఏ రకంగా ఆ కోరికను తీర్చుకుంటాడో రాయడానికి పూనుకుంది. ‘మనిషి చైతన్యం సాధించే గెలుపుకి ఒక ఇతిహాసంగా, మనిషిలోని ‘నేను’కు ఒక ‘హిమ్’గా (ప్రశంసా గీతంగా, కీర్తనగా) ఈ నవలను తీర్చిదిద్దాలని ఆవిడ సంకల్పం. స్వార్థపరుడైన గొప్ప వ్యక్తి ఈ నవలలో హీరో. స్వార్థం అనేది తప్పు అని మనకు చెబుతూ వచ్చాయి మతాలు. అనేకమంది తత్వవేత్తలు కూడా స్వార్థ రాహిత్యం గొప్పదని బోధించారు. అయిన్ రాండ్ అదంతా తప్పు అంది. ఇంతవరకూ మనం స్వార్థమని భావిస్తున్నది ఎంత నిస్సా్వర్థమో అందువల్ల ఎంత నిస్సారమో చూపించింది. హోవార్డ్ రోర్క్ నిరుద్వేగి. దేనికీ కుంగిపోడు. దేనికీ ఉప్పొంగిపోడు. పోతపోసిన ఇనుము. అతని నిస్సందిగ్ధత మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఏ నిర్ణయంలోనూ పరాధీనత ఉండదు. అతనికి ప్రపంచంతో నిరంతర ఘర్షణ. కానీ తన లోలోపల పరిపూర్ణ శాంతి. ఘర్షణలో ఉంటూ అంతశ్శాంతిని నిలుపుకున్నవాళ్లు అరుదు. రోర్క్ ఎందరో మేధావులకి ప్రేరణగా నిలిచిన పాత్ర. అయిన్ రాండ్ తన ఫిలాసఫీని ఆబ్జెక్టివిజం పేరుతో ప్రకటించింది. విభేదించడానికి అయినా చదవాల్సిన రచయిత్రి. సోదర భాషల మధ్య ఫరవాలేదుకాని తెలుగు ఇంగ్లీషుల్లాగా రెండు ఏమాత్రం సంబంధం లేని భాషల మధ్య అనువాదం కష్టం. వీటిలో కర్త, కర్మ, క్రియల కూర్పు వేర్వేరు. జాతీయం వేరు. సంస్కృతి వేరు. అలవాట్లు వేరు. మర్యాదలు వేరు. వాళ్ల లివింగు రూములు, డ్రాయింగు రూములు, స్టడీ రూములు మనకు పరాయివి. అన్నింటినీ ‘తెలుగు చెయ్యడం’ కుదరదు. ఇంగ్లీషులో కన్నా తెలుగులో పదజాలం తక్కువ. అనేక అర్థచ్ఛాయల్ని ఇముడ్చుకున్న ఏకపదాలు ఇంగ్లీషులో ఉంటాయి. అంతవరకూ ఎందుకు, ఇంగ్లీషులో కామాలు, సెమీకోలన్లు, కోలన్లు, హైఫెన్లు కూడా అవిభాజ్యాలయిన భాషా భాగాలు. తెలుగులో వాటి వాడుకకు కచ్చితమైన వ్యవస్థ ఏర్పడలేదు. అవి అలా ఉండగా, అయిన్ రాండ్ నిర్దాక్షిణ్యంగా రాస్తుంది. ఎక్కడ ఏ పదం ఉచితం అనుకుంటే అక్కడ ఆ పదాన్ని నిస్సందేహంగా వాడుతుంది. ఆవిడ డిక్షన్ సామాన్యమయింది కాదు. ఆలోచనలో లోతెక్కువ. గాఢత సున్నితత్వం హెచ్చు. మెలికలు ఎక్కువ. పదక్లిష్టతని ఏ డిక్షనరీ సహాయంతోనో అధిగమిస్తాం. భావ క్లిష్టతని? సగటు పాఠకుడికి అర్థమయ్యేలా రాయమని ఒకరిద్దరు సూచించారు. రీ టెల్లింగులో సులభపరిచే స్వేచ్ఛ ఉంటుంది. కానీ లోతు పోతుంది. గొప్ప నవలని వట్టి కథ స్థాయికి దించకూడదు. కాబట్టి అనువాదమే దారి. ఎంత దులుపుదామన్నా ఈ తెలుగు పుస్తకానికి భాషరీత్యా కూడా కొద్దో గొప్పో ఇంగ్లీషు అంటుకునే ఉండిపోయింది. తెలుగు భాషకి ఉన్న పరిమితులే కాక నా భాషాజ్ఞానానికి ఉన్న పరిమితులు కూడా ఉంటాయి. ప్రయత్న లోపం మటుకు లేదు. - రెంటాల శ్రీవెంకటేశ్వరరావు -
పిల్లల పేర్ల కృతజ్ఞత
రావూరి భరద్వాజ (1927–2013) అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, రంపం లాగే పనివాడిగా, కొలిమి దగ్గర తిత్తులూదే కూలీగా, పేపర్ బాయ్గా ఎన్నో రకాల పనులు చేశారు. చదివింది ఏడవ తరగతే. పదిహేడో యేట మొదలుపెట్టి, కథానికలు, నవలలు, నవలికలు, కవితలు, వ్యాస సంపుటాలు, నాటికలు, స్మృతి సాహిత్యంతో కలిపి సుమారు 190 పుస్తకాలు రాశారు. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. ఆయన ప్రసిద్ధ నవల పాకుడు రాళ్లు. రావూరి తన ఇంటికి పెట్టుకున్న పేరు కాంతాలయం. ఆయన సహధర్మచారిణి కాంతం. కన్నబిడ్డలా చూసేది కాబట్టి భార్య అయినా ఆమెను ‘కాంతమ్మ’ అనే పిలిచేవారు. కష్ట సమయాల్లో అండగా నిలిచినవారికి రావూరి చూపిన కృతజ్ఞత గొప్పది. ఆయనకు అయిదుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వారికి పేర్లు ఎలా పెట్టారో ఆయన ఇలా చెప్పారు: ‘‘నాకు ప్రూఫ్రీడర్గా అవకాశం ఇచ్చిన ఆలపాటి రవీంద్రనాథ్ పేరును నా పెద్దకుమారుడికి రవీంద్రనాథ్గా పెట్టాను. ఆకాశవాణిలో ఉద్యోగం కల్పించిన త్రిపురనేని గోపీచంద్ పేరుని నా రెండోకొడుక్కి గోపీచంద్గా నామకరణం చేశాను. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని సమయంలో నాకూ నా కుటుంబానికీ ఉచితంగా వైద్యం చేసిన వైద్యుని పేరును నా మూడో కొడుక్కు బాలాజీగా పెట్టుకున్నాను. నా చిన్న కొడుక్కేమో మా నాన్న పేరు కలిసేలా కోటీశ్వరరావు అని నామకరణం చేశాను. మా తండ్రి పేరు కోటయ్య, తల్లి పేరు మల్లికాంబ. ఇక నా ఏకైక కుమార్తె పద్మ. ఆ పేరు వెనుక కూడా ఓ సంఘటన ఉంది. 1942–44 ప్రాంతంలో ఓ మూడు రోజుల పాటు అన్నంలేక నీరసించి స్పృహ తప్పి పడిపోయాను. అప్పుడు పద్మక్క అనే ఆవిడ నాకు అన్నం పెట్టింది. ‘బాబూ, మాది మాల కులం మీరు తింటారా?’ అని అడిగింది. ‘అదేం లేదమ్మా తప్పకుండా తింటాను’ అని చెప్పాను. వెంటనే ఇంటికి తీసుకెళ్లి ఓ గిన్నెలో అన్నం వేసి, పులుసు పోసింది. ఆ పులుసులో ఓ చేప కనిపించింది. అప్పుడన్నాను ‘అమ్మా నేను మాంసాహారం తినను’ అని. అప్పుడు తన కొడుక్కు పెట్టిన గిన్నెను నాకు ఇచ్చి, అందులో పాలు పోసి ‘ఇంట్లో కనీసం బెల్లం కూడా లేకపోయెనే’ అని నొచ్చుకుంటూ కొంచెం ఉప్పు వేసి పెట్టింది. ఆమె ఆప్యాయతకు గుర్తుగా నా కూతురికి పద్మ అని పేరు పెట్టుకున్నాను’’. డాక్టర్ పోతిరెడ్డి చెన్నకేశవులు -
ఒకరోజు ఎదురుచూపు
మేమింకా మంచంలోనే ఉన్నాం అప్పటికి. వాడు వస్తూనే గదిలోని కిటికీలన్నీ మూసేశాడు. అనారోగ్యంగా కనిపించాడు. ఒళ్లు వణుకుతోంది, ముఖం పాలిపోయివుంది. నడుస్తుంటే నొప్పిగా ఉన్నప్పటికీ నెమ్మదిగా అడుగులు వేశాడు.‘ఏమైంది షట్స్?’‘నాకు తలనొప్పిగా ఉంది.’‘నువ్వు కాసేపు పడుకుంటే బాగుంటుంది.’‘ఏం ఫర్లేదు.’‘నువ్వెళ్లి పడుకో. నేను డ్రెస్ మార్చుకుని వస్తాను.’కానీ నేను కిందికి దిగేప్పటికి వాడు డ్రెస్ చేసుకుని, మంట పక్కన కూర్చున్నాడు. తొమ్మిదేళ్ల పిల్లాడు జబ్బుతో నీరసంగా ఉన్నాడు. నుదుటి మీద చేయి వేస్తే జ్వరంగా ఉందని తెలుస్తోంది.‘కాసేపు పడుకో, నీకు బాలేదు’ అన్నాను.‘నాకు బానేవుంది’ అన్నాడు వాడు.డాక్టర్ వచ్చాక వాడి ఉష్ణోగ్రత చూశాడు.‘ఎంతుంది?’ అడిగాను.‘నూటా రెండు.’డాక్టర్ మూడు రంగుల్లో ఉన్న మూడు రకాల గోళీలు ఇచ్చి, ఎలా వేయాలో చెప్పాడు. ఒకటి జ్వరం తగ్గడానికి, ఇంకోటి విరేచనం సాఫీగా కావడానికి, మరొకటి కడుపులో మంట ఏమైనా ఉంటే పోవడానికి.కడుపులో ఆమ్లగుణం ఉన్నప్పుడే ఇన్ఫ్లూయెంజా క్రిములు బతుకుతాయని చెప్పాడు డాక్టర్. చూస్తుంటే ఆయనకు ఇన్ఫ్లూయెంజా గురించి సమస్తం తెలిసినట్టు అనిపించింది. జ్వరం నూటా నాలుగు డిగ్రీలకు మించనంతవరకు భయపడవలసింది ఏమీలేదన్నాడు.కొద్దికొద్దిగా వ్యాపిస్తున్న ఫ్లూ ఫలితం ఇది, నిమోనియా రాకుండా చూసుకుంటే ప్రమాదం ఏమీలేదు అన్నాడు. వాడి ఉష్ణోగ్రత ఎంతుందో నోట్ చేసి, ఏ మందు ఏ టైముకు వేసుకోవాలో రాసిపెట్టాను.‘నీకోసం నన్ను ఏదైనా చదవమంటావా?’ ‘నీ ఇష్టం’ అన్నాడు వాడు. వాడి ముఖం పాలిపోయివుంది, కళ్లకింద నల్లటి చారలు ఏర్పడ్డాయి. మంచం మీద పడుకున్నాడు. చుట్టూ జరుగుతున్నదానికి పట్టనట్టుగా కనబడ్డాడు. హొవార్డ్ పైల్ సముద్రపు దొంగల పుస్తకం గట్టిగా చదివాను. కానీ వాడు దానిమీద మనసు పెట్టి వింటున్నట్టు అనిపించలేదు.‘ఇప్పుడేమనిపిస్తోంది షట్స్’ అని అడిగాను.‘ఇందాకటిలాగే ఉంది’ అన్నాడు.వాడికి తరువాతి మాత్ర వేసే సమయం కోసం వేచి చూస్తూ, వాడి కాళ్ల దగ్గర కూర్చుని కాసేపు పుస్తకం నాది నేను చదువుకున్నాను. ఇట్లాంటి సమయంలో వాడు నిద్ర పోవడం సహజం. కానీ నేను మళ్లీ తలెత్తేప్పటికి వాడు నా వైపే వింతగా చూస్తూవున్నాడు.‘కొద్దిసేపు నిద్రపో నానా, నేను మందు వేసుకోవడానికి లేపుతాన్లే.’‘నేను పోను.’కాసేపుండి అన్నాడు నాతో, ‘నీకు విసుగ్గా వుంటే, నా దగ్గర కూర్చోనక్కర్లేదు నానా.’‘నాకెందుకు విసుగ్గా వుంటుందిరా?’‘అంటే, ఇబ్బందిగా ఉండేట్టయితే కూర్చోనక్కర్లేదు అంటున్నా.’జ్వరం వల్ల ఉండే చపలచిత్తంతో అట్లా మాట్లాడుతున్నాడేమో అనిపించి, వాడికి పదకొండింటికి వేయాల్సిన గోళీ వేసి, కాసేపు బయటికి వెళ్లాను.బయట తేటగా, చల్లగా ఉంది. నేల మీదంతా కురిసి గడ్డ కట్టుకుపోయిన సన్నటి మంచు వల్ల చెట్లు, పొదలు, కుప్పేసిన కలప మెరుపు పూత పూసినట్టుగా కనబడుతున్నాయి. నా ఐరిష్ సెట్టర్ను కూడా నడకకు తీసుకెళ్లాను. కాసేపు రోడ్డు మీదా, కాసేపు గడ్డకట్టిన కయ్య పక్కనా నడిచాం. కానీ దాని మీద నిలబడటానికిగానీ నడవడానికీ గానీ కష్టంగా ఉంది. ఎర్ర కుక్క తొట్రుపడింది, జారింది, రెండు సార్లు కింద పడింది, ఓసారి దెబ్బ గట్టిగానే తాకించుకుంది, ఇంకోసారి నా తుపాకీని కింద పడగొట్టి మంచు మీద జారుతూపోయేట్టు చేసింది. పొదల్లోంచి మేము ఓ పూరేళ్ల గుంపును లేవగొట్టి, అవి ఒడ్డు వెంబడి కనబడకుండా పోయేలోపల రెండింటిని వేటాడాం. గుంపులోంచి కొన్ని చెట్లమీదకు ఎక్కాయి, కొన్ని కట్టెల మండెల్లోకి మాయమైనాయి, కొన్ని పొదల్లోకి చెల్లాచెదురైనాయి. స్థిరంగా నిల్చోవడానికి కష్టంగా ఉండటంతో గురి కుదరలేదు. రెండింటిని కాల్చాం, ఐదింటి గురి తప్పాం. కానీ తిరిగి వస్తుండగా ఇంటికి దగ్గరలోనే మరో పూరేళ్ల గుంపు కనబడి సంతోషం వేసింది, మరో రోజు వెతకడానికి కావాల్సినన్ని మిగిలేవున్నాయి.ఇంటికెళ్లేసరికి పిల్లాడు ఎవరినీ గదిలోకి రావద్దు అన్నాడని తెలిసింది. ‘మీరెవరూ రావడానికి వీల్లేదు, నాకున్నది మీకూ అంటుకుంటుంది’ అన్నాడట.నేను పైకి వెళ్లేసరికి వాడిని ఎలా పడుకోబెట్టి వెళ్లానో అలాగే కదలకుండా ఉన్నాడు మంచంలో. అదే పాలిపోయిన ముఖం. చెంపలు మాత్రం జ్వరంతో ఎర్రబారివున్నాయి. రెప్పలు కదల్చకుండా మంచం కాళ్లవైపు చూస్తున్నాడు, ఇందాకటిలాగే. మరోసారి ఉష్ణోగ్రత చూశాను.‘ఎంతుంది?’‘నూటికి దగ్గర’ అన్నాను. నూటా రెండు పాయింట్ నాలుగు ఉంది.‘నూటా రెండు’ అన్నాడు వాడు.‘ఎవరన్నారు?’‘డాక్టర్.’‘మరీ ఎక్కువేమీ లేదు, భయపడనక్కర్లేదు.’‘నేనేం భయపడట్లేదు, కానీ మళ్లీ మళ్లీ అదే గుర్తుకు వస్తోంది’ అన్నాడు.‘ఎక్కువ ఆలోచించొద్దు, తేలిగ్గా తీసుకో’.‘నేను తేలిగ్గానే తీసుకుంటున్నాను’ అని నిటారుగా చూశాడు. దేన్నో నాకు తెలియకుండా వాడు దాస్తున్నాడు.‘ఇది వేసుకుని కొన్ని నీళ్లు తాగు.’‘దీని వల్ల నిజంగా నయం అవుతుందంటావా?’‘తప్పకుండా అవుతుంది.’నేను మళ్లీ మంచం మీద కూర్చుని, ఇందాకటి సముద్రపు దొంగలు పుస్తకం చదువుదామని చూశాను. కానీ వాడు దృష్టిపెట్టడం లేదని మానుకున్నాను.‘నేను ఏ టైము వరకు చచ్చిపోతానంటావ్?’ అడిగాడు వాడు.‘ఏంటి?’‘నేను చచ్చిపోవడానికి ఇంకా ఎంత సేపుంది?’ ‘నీకేమీ కాదు. ఏమైంది నీకు?’‘నాకు తెలుసు, నేను చచ్చిపోతాను. డాక్టర్ నూటా రెండు అని చెప్పడం నేను విన్నాను.’‘నూటా రెండు జ్వరానికి మనుషులు ఎవరూ చచ్చిపోరు. పిచ్చి మాటలు మాట్లాడకు.’‘నాకు తెలుసు, చచ్చిపోతారు. ఫ్రాన్స్లో ఉన్నప్పుడు మా స్కూల్లో నా స్నేహితులు అన్నారు, నలభై నాలుగు డిగ్రీలు దాటితే అంతేనట, మరి నాకుందేమో నూటా రెండు.’వాడు ఈ రోజంతా,పొద్దున తొమ్మిదింటినుంచీ ఎప్పుడు చచ్చిపోతానా అని ఎదురుచూస్తున్నాడు.‘ఒరే పిచ్చి కన్నా, నా పిచ్చి బంగారం. అది మైళ్లు, కిలోమీటర్ల లాంటిది. నువ్వు చనిపోవు. ఆ థర్మామీటర్ వేరే. దాన్లో ముప్పై ఏడు సాధారణం. ఇలాంటిదాన్లో తొంభై ఎనిమిది.’‘నిజంగానా?’‘నిజంరా. మైళ్లు, కిలోమీటర్ల లాగే. ఇప్పుడు చెప్పు, మన కార్లో డెబ్బై ప్రయాణించామంటే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది?’‘ఓ’ అన్నాడు. నెమ్మదిగా మంచం కాళ్ల వైపు సారించిన వాడి చూపు తీక్షణత తగ్గింది, వాడి శరీరపు బిర్రు తగ్గింది. తెల్లారేసరికి పూర్తిగా మామూలైపోయాడు. ఏ ప్రాధాన్యతా లేని చిన్న చిన్న విషయాలకోసం కూడా మళ్లీ అల్లరి చేయడం మొదలుపెట్టాడు. -
రారండోయ్
తెలంగాణ సాహిత్య అకాడమీ ‘నవలా స్రవంతి’లో భాగంగా జూలై 12న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో బి.ఎన్.శాస్త్రి చారిత్రక నవల ‘వాకాటక మహాదేవి’పై శ్రీరామోజు హరగోపాల్ ప్రసంగిస్తారు. తెలంగాణ చైతన్య సాహితి ఆవిర్భావ సభ జూలై 13న సాయంత్రం 4 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. మూడు వీచికలుగా జరిగే ఈ సభకు ముఖ్య అతిథి: దేశపతి శ్రీనివాస్. వక్తలు: పి.వేణుగోపాల స్వామి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి. కవి సమ్మేళనం ఉంటుంది. బొంత లచ్చారెడ్డి కావ్య కుసుమాలు, బాలబోధ, సులభ వ్యాకరణాల ఆవిష్కరణ జూలై 14న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత బెలగం భీమేశ్వరరావు అభినందనసభ జూలై 14న సాయంత్రం 6 గంటలకు విజయనగరంలోని గురజాడ గృహంలో జరగనుంది. నిర్వహణ: సహజ. చంద్రశేఖర్ ఇండ్ల కథల సంపుటి రంగుల చీకటి పరిచయ సభ జూలై 14న ఉదయం పదింటికి ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరగనుంది. తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) 21వ వార్షికోత్సవ సందర్భంగా కథ, నాటక పోటీ నిర్వహిస్తోంది. కథల మూడు బహుమతులు రూ.30 వేలు, 20 వేలు, 15 వేలు. నాటకాల రెండు బహుమతులు రూ.40 వేలు, 25 వేలు. రచనలను డిజిటల్ రూపంలో జూలై 31లోగా పంపాలి. మెయిల్: telsa.competitions @gmail.com. telsaworld.org జాగృతి వార పత్రిక వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ నిర్వహిస్తోంది. 1500 పదాల లోపు రాసిన కథలను ఆగస్టు 18 లోపు పంపాలి. మూడు బహుమతులు వరుసగా 12 వేలు, 7 వేలు, 5 వేలు. పత్రిక చిరునామాకు పోస్టులోగానీ jagriticometition@ gmail.comగానీ పంపొచ్చు. వివరాలకు: 9959997204 -
ఉనికి సైతం ఉత్త భ్రమే
‘నా ఉనికి సైతం ఉత్త భ్రమే’ అని తెలుసుకున్నాడు మసనోబు ఫుకుఓకా (1913–2008). ‘ఈ జనన మరణ చక్రాలలో పాల్గొని, అనుభూతి పొంది, ఆనందించగలిగితే అంతకు మించి సాధించాల్సిన అవసరం లేదు’ అనుకున్నాడు. తన ఆలోచనను ఆచరణలో రుజువు చేసుకోవడానికిగానూ నగరంలో చేస్తున్న ఉద్యోగం వదిలి సొంతవూరికి వెళ్లిపోయాడు. భూమిని దున్నకుండా, రసాయనిక ఎరువులు వేయకుండా ప్రకృతి వ్యవసాయాన్ని సాధన చేశాడు. ప్రకృతి దానికదే అన్నీ అమర్చి పెట్టిందని నమ్మి, దానిమీద ‘గెలిచి’ ఆ అమరిక చెదరగొట్టకుండా, దానితో సమన్వయంతో బతికేందుకు ప్రయత్నించాడు. ‘నేను కనుగొన్న విషయం చాలా విలువైనదయినంత మాత్రాన నాకేదో ప్రత్యేక విలువ ఉన్నట్లు కాదు’ అని ప్రకటించుకున్నాడు. ఆ ఆలోచనా ప్రయాణాన్ని వివరించే పుస్తకం జపనీస్ నుంచి ఇంగ్లిష్లోకి వన్ స్ట్రా రెవల్యూషన్గా 1978లో వచ్చింది. అది తెలుగులోకి గడ్డిపరకతో విప్లవంగా అనువాదమైంది. ఆ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఫుకుఓకా విద్యార్థి, సాధకుడు ల్యారీ కార్న్ ఇలా అంటారు: ‘తన సిద్ధాంతం ఏ మతంపైనా ఆధారపడి లేదని ఫుకుఓకా చెపుతారు. కానీ అతని బోధనా పద్ధతిపైనా, ఉపయోగించే పదజాలంపైనా జెన్, బౌద్ధం, టావోయిజమ్ల ప్రభావం బాగా ఉంది. అప్పుడప్పుడు అతను చెపుతున్న దానిని మరింత బాగా వివరించటానికో, చర్చను ప్రేరేపించటానికో బైబిల్ నుంచీ, క్రైస్తవ మతం నుంచీ ఉదాహరణలు ఇస్తుంటాడు. ‘వ్యక్తి ఆధ్యాత్మిక ఆరోగ్యం నుంచి ప్రకృతి సేద్యం పుట్టుకొస్తుందని ఫుకుఓకా నమ్మకం. భూమిని బాగుపరచటం, మానవ ఆత్మను ప్రక్షాళన చేయటం ఒకటేనని అతని అభిప్రాయం. ఆధ్యాత్మికంగా సంతృప్తికరమయిన జీవితానికి దారితీసే రోజువారీ పనులు ప్రపంచాన్ని సుందరంగా, అర్థవంతంగా మారుస్తాయని నిరూపించటమే అతను మనకిచ్చిన కానుక.’ దీనికే రాసిన ముందుమాటలో అమెరికా రచయిత, పర్యావరణ కార్యకర్త వెండెల్ బెర్రీ ఇలా వ్యాఖ్యానిస్తారు: ‘కేవలం వ్యవసాయం గురించే ఈ పుస్తకంలో ఉంటుందనుకొనే పాఠకులు ఆహారం గురించీ, ఆరోగ్యం గురించీ, సాంస్కృతిక విలువల గురించీ, మానవ జ్ఞాన పరిమితుల గురించీ కూడా ఇందులో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఈ పుస్తకంలోని తత్వసిద్ధాంతాల గురించి ఆ నోటా ఈ నోటా విన్న పాఠకులు దీంట్లో వరి, శీతాకాలపు పంటలు, పండ్లు, కూరగాయలు ఎలా పండించాలో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు.’ ‘ప్రగతి, పురోగమనం ఎందుకు సాధించాలి? సాధారణమయిన జీవితం గడుపుతూ అన్నిటినీ తేలికగా తీసుకోగలగటం కంటే మించినది మరేదయినా ఉందా?’ అని ప్రశ్నించే ఫుకుఓకా తత్వం ఈ హడావుడి లోకరీతికి పూర్తి భిన్నమైనది. పూర్తిగా కావాల్సినది కూడానేమో! -
ఉత్తరమే దీపం
వాళ్లిద్దరినీ చిదివి దీపం పెట్టవచ్చు. అంతముద్దు వస్తున్నారు. తలంటు పోసుకుని కొత్త చొక్కాలు తొడుక్కున్నారు. ‘‘నేనే– నేనే’’ ఏదో తమ్ముడు చెప్పబోతున్నాడు. ‘‘ఊ’’ ‘‘ఊ అంటే కాదే. వినవే–’’ ‘‘వింటున్నాగా చెప్పు.’’ ‘‘తలెత్తి వినాలి’’అక్క నవ్వింది. పెద్దాడబడుచు తను ఆ యింటికి. తనకు కోపం రారాదు. అమ్మ చెప్పింది ఆ మాట. అప్పటినుంచీ ‘జానకి’కి కోపం రాదు. కోపం వచ్చినా నవ్వేస్తుంది. ‘‘తలెత్తాను చెప్పు’’ ‘‘మనం మామయ్యగారింటికి వెళ్దామే’’ ‘‘దీనికేనా యింత చేశావ్?’’ నవ్వింది జానకి. తమ్ముడికి కోపం వచ్చింది. తమ్ముడు ఎలాగైనా మగబిడ్డ. మగబిడ్డలు కోపాన్నీ ప్రేమనూ అణుచుకోలేరు. ‘నే చెప్పను ఫో’ అన్నాడు. ‘‘మానాన్నే– చెప్పమ్మా. అల్లాగే వెళదాంలే,’’ అంది జానకి. తమ్ముడి బుగ్గలు పట్టుకు నిమిరింది. అంత కోపం వచ్చిన తమ్ముడూ ఫక్కున నవ్వాడు. ‘‘ఉత్తరమండోయ్’’ అంటూ పోస్టు జవాను వచ్చాడు. జానకి ఉత్తరం పుచ్చుకుంది. ‘నాన్నగారికి నేనే యిస్తా. ఉత్తరమండోయ్ అంటా. నాన్న నవ్వుతాడు’ అనుకుంది. పక్కయింటి పిల్లవాడు టపాకాయలు కాల్చడం మొదలెట్టాడు. జానకి నేరుగా తల్లి దగ్గిరికి వచ్చింది. ‘‘ఏం అమ్మా ఇల్లా వచ్చావు’’ అంది తల్లి. తల్లికి జానకి అంటే ఎంతో ఆపేక్ష. ‘‘టపాకాయలు ఇవ్వవూ’’ అంది జానకి. యింట్లో టపాకాయలు లేవు. దీపావళికి కొన్నవన్నీ జానకీ, తమ్ముడూ కాల్చేశారు. యివాళ అమ్మాయి పుట్టినరోజు. వచ్చేప్పుడు కాసిని పువ్వొత్తులూ టపాకాయలూ తెండని చెప్పింది భర్తతో. ‘‘వచ్చేప్పుడు తెస్తాలే’’ అని వెళ్లాడు ఆయన, ఆఫీసుకు పోతూ. ‘‘అమ్మా, అమ్మా’’ అంటూ వచ్చాడు బాబు. ‘‘టపాకాయలేవీ’’ అన్నాడు. తల్లి క్షణం ఊరుకుంది. బాబు దుడుకువాడు. జానకిలాగా చెప్తే వినడు. ‘‘అప్పచ్చులా?’’ అంది తల్లి. ‘‘కావే. టపాకాయలే. ఏవీ?’’ అన్నాడు బాబు. ‘‘సాయంత్రం కాందే.’’ ‘‘సాయంత్రం కావాలేమిటీ?’’ ‘‘చీకటి పడవద్దూ, కాల్చుకోడానికి?’’ ‘‘అన్నీ అబద్ధాలే–’’ ‘‘కావమ్మా. అక్కయ్య పుట్టినరోజు కదా యివాళ అబద్ధాలు చెప్తామ్మా?’’ ‘‘వాళ్లబ్బాయి కాల్చడంలా మరీ?’’ అన్నాడు బాబు. ‘‘అమ్మా, అమ్మా, ఉత్తరం వచ్చిందే–’’ అంది జానకి. ‘‘ఇలాతే. చూస్తా,’’ అంది తల్లి. ‘‘ఊహూ. నీకివ్వను. నాన్నగారేమన్నారు? ఇంకోళ్ల ఉత్తరాలు చూడకూడదనలా?’’ అంది జానకి. ‘‘మా అమ్మే’’ అని కూతుర్ని ఎత్తుకుని ముద్దెట్టుకుంది తల్లి. జేబులోంచి ఎక్కడ ఉత్తరం లాగుతుందో అని జాగ్రత్తగా జేబు దగ్గర చెయ్యి పెట్టుకుంది జానకి. ‘‘నన్నెత్తుకోమరి’’ అన్నాడు బాబు. తల్లి జానకిని దించింది. యింతలో పక్కయింట్లో టపాకాయల మోత బాగా వినబడటం మొదలెట్టింది. బాబు బిక్కమొహం వేశాడు. తల్లికి ఇదయింది. ‘‘నాన్నా, పరమాన్నం తిందాం...’’ అంది. ‘‘టపాకాయలు’’ అన్నాడు బాబు. ‘‘నాన్నగారు వచ్చాక, అక్కయ్యా, నువ్వూ కొనుక్కుందురు గాని’’ అంది. ‘‘మామయ్యో’’ హఠాత్తుగా మామయ్య ఏమిటో అర్థం కాలేదు ఆమెకు. మామయ్యగారింటికి పోదాం అంటూ తమ్ముడు అన్నమాటను జానకి తల్లికి చెప్పింది. ‘‘వెళ్దాంలే అమ్మా, వెళ్దాంలే’’ అంది తల్లి. ‘‘మామయ్య, మామయ్య’’ అంటూ బాబు కిందికి దిగాడు. టపాకాయల మాట కాస్త మరిచిపోయాడుగదా అని తల్లి సంతోషించింది. పిల్లలిద్దర్నీ పడమటింట్లోకి తీసుకుపోయింది. పరమాన్నం పెట్టింది. సాయంత్రం అయింది. వీధిలో దీపాలు వెలిగించారు. ‘‘నాన్న రాలా?’’ అడిగాడు బాబు. యింతసేపూ ఆగాడు. ఇక ఆగడు. పనిమనిషి చేత కొద్దిగా టపాకాయలూ అవీ తెప్పించింది. ‘‘ఎప్పుడొస్తాడే నాన్న’’ అంటూ మళ్లీ వచ్చాడు బాబు. తల్లి ఆకాశదీపం వెలిగిస్తోంది. ‘‘దణ్ణంపెట్టు బాబూ.’’ఇంతట్లో జానకి చక్కా వచ్చింది. అందరూ దణ్ణం పెట్టాక, దీపాన్ని తాటికి కట్టి ఆకాశానికి ఎత్తింది. దీపారాధన కాంగానే జానకి, తనలో తాననుకున్నట్లు ‘నాన్నా రాలా’ అంది. తల్లి నెమ్మదిగా దీపాలు వెలిగించింది. ఒక్కొక్కటీ వీధి వాకిలి దగ్గిర గూళ్లల్లో పెట్టింది. ఆయన యింకా యింటికి రాలేదు. ‘‘టపాకాయలు కాల్చుకోరూ’’ అంది. టపాకాయలు టపాకాయలు అంటూ బాబు గబగబా వస్తూ పడ్డాడు. దెబ్బ తగల్లేదు. వీపు రాచింది. నేలను కొట్టింది. బాబు ఏడుపు మానాడు. తెప్పించిన టపాకాయలు కాసినీ యిద్దరికీ యిచ్చింది. తనుగూడా గుమ్మంలో నుంచుంది. ఐపోయినై. ‘‘ఇంకా కాసిని’’ అన్నాడు బాబు. ‘‘పోనీ, నావి తీసుకోరా’’ అంది జానకి. జానకి పెద్దాడబడుచు. పెద్దాడబడుచు అంటే తల్లి అంత. ‘‘తే’’ అని, అవీ కాల్చేశాడు. ‘‘అన్నాలు తినరూ’’అంది ఆమె. ‘‘పువ్వొత్తులు కావాలి’’ అన్నాడు బాబు. జానకి తమ్ముణ్ణి సముదాయించింది. పిల్లలు అన్నాలు తిన్నారు. ఆయన యింకా రాలేదు. పిల్లలకు నిద్దరవొస్తోంది. జోగుతున్నారు. ‘‘ఇంతాలిస్యం చేశారేమి చెప్మా’’ అనుకుందామె. ‘‘అక్కడికీ వెళ్లేప్పుడు చెప్పాను గూడానూ’’ అనుకుంది మళ్లీ. వీధిలోకి చూసింది. రావడం లేదు. ‘‘ఎప్పుడొస్తారో ఏమో’’ అనుకుని పిల్లవాడి దగ్గిర పడుకుంది. నాన్నగారికి వుత్తరం యిస్తా అని నిద్ర మానుక్కూర్చున్న జానకి కూడా నిద్రపోయింది. వీధిలో పిల్లల మోత గూడా ఆగిపోయింది. అప్పుడు వచ్చాడు ఆయన. వస్తూనే ఉస్సూరుమన్నాడు. ‘‘పొద్దోయి వచ్చారేం?’’ అంది. అతను మాట్లాడలేదు. ‘‘సినీమాకు పోయారా?’’ అంది. తనూ, పిల్లలూ రాందే ఆయన పోడని తెలుసు. ఐనా అనాలని అంది. ‘‘అబ్బా లేదే’’ అన్నాడు ఆయన. చిరు చలికాలంలో గూడా ఆయనకు గొంతిక పొడి ఆరిపోయింది అప్పుడు. ‘‘మీరొస్తారు వస్తారని చూసి చూసి పిల్లలు యిప్పుడే పడుకున్నారు’’ అంది. ‘‘పాపం’’ అన్నాడు భర్త. ‘‘ఏం అల్లా వున్నారు?’’ ఏదో జరుగుతోందని తెలుసు. యింట్లో చెప్పడం దేనికని చెప్పలేదు. ‘‘నన్ను యివాళ పనిలోనుంచి తీసేశారు’’ అన్నాడు ఆయన. ఆమె ఏమీ మాట్లాడలేదు. ‘‘కాళ్లు కడుక్కోండి, భోజనం చేద్దురుగాని’’ అంది. అతడు కాళ్లు కడుక్కుంటున్నాడు. జానకి చప్పుడు విని లేచింది. ‘‘లెక్కంతా చూచి చెక్కు ఇచ్చారు’’ అన్నాడాయన. ‘‘నీకు ఉత్తరం వచ్చింది నాన్నా’’ అంటూ పక్కమీంచి లేచింది జానకి. ‘‘మీకేదో ఉత్తరం వచ్చిందిట. తనే ఇస్తానని నాకు చూపించనన్నా లేదు అది’’ అంది తల్లి. ‘‘ఏదమ్మా’’ అని తీసుకున్నాడు. దీపం దగ్గిరికి వచ్చి కవరు చింపి ఉత్తరం చదువుకున్నాడు. ‘‘ఎక్కణ్ణుంచండీ’’ అందామె. ‘‘మీ తమ్ముడు వ్రాసేడే, ఇదిగో వినూ’’ ‘‘బావకు నమస్కారాలు. అక్కయ్యను అడిగానని చెప్పండి. జానకికీ బాబుకూ నా ముద్దులు. ఇక్కడ నీకు మంచి ఉద్యోగం చూశాను బావా. అక్కడపడి ఎన్నాళ్లని బాధపడతావు? సెలవు పెట్టిరా. ఓ వేళ సెలవు ఇవ్వకపోతే– ఆ ఉద్యోగాన్ని తన్నేసి మరిరా. అన్నీ ఆలోచించే రాస్తున్నానిది. అందరం కలిసివుందాము. ఎక్కువ జీతం గూడాను. నా మాటవిని, ఒకసారి రా బావా.’’ ‘‘నేననుకుంటూనే ఉన్నా. అమ్మాయి పుట్టినరోజు ఇది. చెడు జరగలేదీరోజున. పోతే పోయిందిలెండి పాడు వుద్యోగం. రాత్రింబవళ్లూ రెక్కలు విరుచుకున్నా మెప్పు లేదు’’ ‘‘మామయ్య దగ్గిరికి పోదాం నాన్నా’’ అంది జానకి. ‘‘మాతల్లే’’ అని జానకిని ముద్దాడాడు తండ్రి. ‘‘మా తల్లి వుండగా చీకటా. నేను, మా అమ్మ, మా యింటికి. శరత్ పూర్ణిమ’’ అన్నాడు తండ్రి. -
నీవే నేను! నీవే నేను!
సాహిత్య మర్మరాలు ఒక రోజున సంస్కృత కవి దిగ్గజాలైన దండి, భవభూతి, కాళిదాసు– ముగ్గురూ రాజవీథిలో నడచి వెళుతూ ఉన్నారు. మాటల మధ్య ‘మన ముగ్గురిలో ఎవరు ఎవరి కంటే ఎంత గొప్పవారు?’ అన్న మాట వచ్చింది. ‘ఈ విషయాన్ని గురించి మనలో మనం మాట్లాడుకోవటమెందుకు? అమ్మవారినే అడుగుదాం రండి!‘ అన్నాడు కాళిదాసు. ముగ్గురూ దగ్గరలోనే ఉన్న సరస్వతీదేవి ఆలయానికి వెళ్లారు. కాళిదాసు అమ్మవారిని స్తుతించాడు. అమ్మ ప్రత్యక్షమైంది. కాళిదాసు భక్తిపురస్సరంగా ఆమెకు నమస్కారం చేసి ‘అమ్మా! మాలో ఎవరు గొప్పవారు?’ అని అడిగాడు. శారదాదేవి చిద్విలాసంగా నవ్వి, ‘కవిర్దండీ కవిర్దండీ, భవభూతిస్తు పండితః– దండి ముమ్మాటికీ మహాకవి. భవభూతి అచ్చమైన పండితుడు’ అన్నది. ఆ తీర్పును విన్న కాళిదాసు అపరిమితమైన ఆగ్రహంతో ‘కోహం రండే?– అట్లా ఐతే మరి నేనెవరినే?’ అని అడిగాడు. భారతీదేవి ప్రశాంతంగా నవ్వి, ‘త్వమేవాహం త్వమేవాహం న సంశయః – నాయనా! వీరిద్దరితో నీకు పోలిక ఎందుకోయీ? అతడు కవి. ఇతడు పండితుడు. నేను అరవై నాలుగు కళలకు అధిష్ఠాన దేవతను. నీవే నేను. నీవే నేను. ఇందులో సందేహ మెంత మాత్రమూ లేదు’ అన్నది. ఆ నిర్ణయాన్ని విన్న ఆ ముగ్గురు మహాకవులు అమ్మకు అంజలి ఘటించారు. దండి, భవభూతి, కాళిదాసులకు సంబంధించి ప్రచారంలో ఉన్న వృత్తాంత మిది. -డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణ మూర్తి -
లెక్కలు రావా?
అతిగా అలంకరించుకొని తన వయసును మరుగు పరచాలని తాపత్రయపడే ఓ వన్నెలాడి బెర్నార్డ్ షాని ఒక విందులో చూసి ఆయన్ని సమీపించింది. ‘‘మిస్టర్ షా! సరదాగా నా వయసు ఎంత ఉంటుందో చెప్పండి చూద్దాం’’ అంది వయ్యారం ఒలకబోస్తూ. షా ఆమెను ఎగాదిగా చూస్తూ, ‘‘మీ పలువరుస చూస్తే మీ వయసు పద్దెనిమిది ఉండొచ్చు. మీ ఉంగరాల ముంగురులు చూస్తే పంతొమ్మిదనిపిస్తోంది. కాని మీ ప్రవర్తన చూస్తుంటే మాత్రం పద్నాలుగు దాటవేమో అనిపిస్తున్నది’’ అని జవాబిచ్చాడు. ఆ మాటలు విని తబ్బిబ్బవుతూ ‘‘మీ ప్రశంసకి ధన్యవాదాలు. ఇంతకీ మీ దృష్టిలో నా వయసెంతో కచ్చితంగా చెప్పలేదు’’ అంది విలాసంగా. ‘‘ఏముంది? నేను చెప్పిన మూడంకెలూ కలుపుకుంటే నా దృష్టిలో నీ వయసెంతో తెలుస్తుంది’’ అన్నాడు కొంటెగా. ఆ వన్నెలాడి ముఖం కందగడ్డయి పోయింది. – ఈదుపల్లి వెంకటేశ్వరరావు -
ఉత్తమ లేఖకుడు
ఆంధ్రమహాభారతంలోని 18 పర్వాలలో 15 పర్వాలను రచించిన ‘కవిబ్రహ్మ’ తిక్కన సోమయాజికి గురునాథుడు లేఖకుడు. తిక్కన ఆశువుగా పద్యాలను చెప్తూవుంటే గురునాథుడు తాటాకుల మీద రాస్తూ ఉంటాడన్నమాట. ఒక సందర్భంలో తొమ్మిదవ పర్వమైన శల్యపర్వ రచన జరుగుతున్నది. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన ఉన్న వీరులు చాలామంది మరణించారు. దుర్యోధనుడు ఒంటరివాడైనాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడు ఈ విషయాన్ని చెప్తూ– పలపలని మూకలో కాల్/ నిలువక గుర్రంబు డిగ్గి నీ కొడుకు గదా/ కలిత భుజుండై ఒక్కడు/ తొలగి చనియె’(నీ కుమారుడైన దుర్యోధనుడు పల్చబడిపోయిన సైన్యంలో నిలిచి ఉండలేక తన గుర్రం నుండి దిగి, గదను భుజాన పెట్టుకొని రణరంగం నుండి బయటకు వెళ్లిపోయాడు) అంటాడు. ఇది కంద పద్యం. మూడు పాదాలు ఐపోయినై. నాలుగవ పాదంలో ఉండవలసిన ఐదు గణాలలో ఇంకా మూడు గణాలు రావలసి ఉన్నది. వాక్యం మాత్రం పూర్తి ఐంది కనుక ‘ఏమి చెబుదామా?’ అని ఆలోచిస్తూ– ‘ఏమి చెప్పుదుం గురునాథా’ అన్నాడు తిక్కన పరాకుగా. ‘బాగుంది. తర్వాత పద్యం చెప్పండి’ అన్నాడు గురునాథుడు. ‘పద్యం పూర్తి కాకుండానేనా?’ అన్నాడు తిక్కన. గురునాథుడు విస్తుబోయి ‘కురునాథా (ఓ ధృతరాష్ట్ర మహారాజా)! ఏమి చెప్పుదున్ (ఏమని చెప్పేది?) అని మీరే చెప్పారు కదా! నాలుగవ పాదం పూర్తి ఐంది. యతి కూడా సరిపోయింది’ అన్నాడు. లేఖకోత్తముడైన గురునాథుడి తెలివిని మెచ్చుకొంటూ తర్వాతి వచనాన్ని ప్రారంభించాడు తిక్కన. కురునాథుడు సంధి వలన గురునాథుడు కావటమూ, అది లేఖకుడి పేరు కావటమూ ఈ సందర్భంలోని విశేషం! -డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి -
అన్నంభట్టును ఇవతలకు తెండి!
సాహిత్య మరమరాలు తర్కసంగ్రహం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించిన ‘మహామహోపాధ్యాయ’ అన్నంభట్టు క్రీ.శ. 17వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించాడు. ఆయన గొప్ప శాస్త్రకారుడు మాత్రమే కాదు, ఆచారపరుడు కూడా! ఆయన ఆ గ్రంథం మొత్తాన్నీ మడి కట్టుకొనే రచించాడు. ఒకరోజున గ్రంథరచన పూర్తి ఐంది. కవి వివరాలను తెలిపే ముగింపు శ్లోకాన్ని వ్రాయవలసి ఉన్నది. ఆయనకు ‘విదుషాన్నంభట్టేన’– పండితుడైన అన్నంభట్టుచే రచించబడిన అనే ఆలోచన వచ్చింది. బాగానే ఉన్నది కానీ అది అనుష్టుప్పు శ్లోకం కనుక, ప్రతి పాదంలోనూ ఎనిమిది అక్షరాలు ఉండాలి. అన్నంభట్టు వ్రాయాలనుకొన్న పాదంలో ఏడు అక్షరాలు మాత్రమే ఉన్నై. ఆ ఎనిమిదవ అక్షరం కోసం నానా తంటాలు పడుతున్నాడు. అంతటి మహాకవికి కూడా గంటలు గడుస్తున్నై కానీ సరియైన రీతి దొరకటం లేదు. ఇంట్లో ఆ పని మీద, ఈ పని మీద అటుగా వచ్చి వెళుతున్న అతని భార్య ఈ పరిస్థితిని చూసింది. ‘సంగతేమిటండీ?’ అని అడిగింది. చెప్పాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ‘దీని కింత ఆలోచన ఎందుకండి? ఆ వైపున ఉన్న అన్నంభట్టును ఈ వైపునకు తీసుకొనిరండి!’ అన్నది. అన్నంభట్టు చూశాడు. తను వ్రాయాలనుకొన్న ‘విదుషాన్నంభట్టేన’ ఇప్పుడు ‘అన్నంభట్టేన విదుషా’ ఐంది. ఎనిమిది అక్షరాలూ సరిపోయినై. భార్య వైపు కృతజ్ఞతగా చూశాడు. - డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి -
నవల రాయడం పెళ్లి లాంటిది
గ్రేట్ రైటర్ హీబ్రూ నుంచి అత్యధికంగా అనువాదమైన రచయితల్లో మొదట చెప్పగలిగే పేరు ఏమస్ ఓజ్. ఇజ్రాయెల్కు వలస వచ్చిన లేదా మూలాలను వెతుక్కుంటూ తిరిగి వచ్చిన యూదు తల్లిదండ్రులకు 1939లో జన్మించాడు. అతడి పన్నెండో ఏట తల్లి డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మీద ఒక తిరుగుబాటుగా సామూహిక వ్యవసాయ క్షేత్రాలైన కిబుట్స్కు వెళ్లిపోయాడు. అక్కడే జీవితంలో చాలాభాగం గడిపాడు. ఓజ్ అంటే స్ట్రెంత్. తన బలం రాయడంలో ఉందని గ్రహించిన తర్వాత రాయడాన్ని సీరియస్గా తీసుకున్నాడు. నవలలు, కథలు, వ్యాసాలు విరివిగా రాశాడు. కవిత రాయడమంటే ఎఫైర్– వన్ నైట్ స్టాండ్ లాంటిదనీ, కథ రాయడం రొమాన్స్– ఒక బంధం, కానీ నవల రాయడమంటే పెళ్లి చేసుకోవడం– దానికోసం త్యాగాలు చేయాలి, రాజీ పడాలీ అంటాడు. తనతో తాను నూటికి నూరు శాతం ఏకీభవించే అంశాలైతే, అలా అరుదుగా జరిగినప్పటికీ, వాటిని వ్యాసాలుగా రాస్తాననీ; ఒక అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయదలిచినప్పుడు కథకుగానీ నవలకుగానీ పూనుకుంటాననీ చెబుతాడు. అలాగని రచయితేమీ దేవుడు కాదు, ఎలాగైనా పాత్రల్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ పోవడానికి; ఒకసారంటూ వాటికి ప్రాణం పోశాక వాటిని రచయితైనా నిలువరించలేడని చెబుతాడు. ఇజ్రాయెల్లో జన్మించినవాడిగా వాస్తవం నుంచి పారిపోలేననీ, ఒక అన్యాయం పట్ల తిరుగుబాటుగా తాను రాస్తాననీ అంటాడు. తక్కువ విస్తృతి ఉన్నప్పటికీ హీబ్రూలోనే రాయడానికి కారణం, అది తాను నవ్వే, శపించే, కలలుగనే భాష కాబట్టి, అంటాడు. ఒకవేళ దేశం వదిలి పెట్టాల్సివచ్చినా భాషను వదులుకోనని చెబుతాడు. ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణను న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న న్యాయ పోరాటంగా చూస్తాడు. అదే ట్రాజెడీ అనీ, ఇద్దరూ భూమిని పంచుకుని పరస్పరం సహకరించుకోవడం మినహా మార్గం లేదనీ చెబుతాడు. పీస్ నౌ మూవ్మెంట్ ఆద్యుల్లో ఒకడైన ఏమస్ ఓజ్ మొన్న 2018 డిసెంబర్ 28న మరణించాడు. -
పుట్టిన చోటును వెతికే సింహం
కొత్త బంగారం 1986. ఐదేళ్ళ సరూ, పక్క ఊరి రైల్వే స్టేషన్లో తప్పిపోయి, పొరపాటున కలకత్తా వెళ్ళే రైలెక్కుతాడు. తన ఊరు ‘గినెస్తలే’ అనీ, తల్లి ‘అమ్మీ’ రాళ్ళు మోస్తూ, తమ నలుగురు పిల్లల్నీ పోషిస్తుందనీ తప్ప మరేదీ తెలియదు. హిందీ తప్ప మరే భాషా రాదు. సరూ కలకత్తా రోడ్లమీదతిరుగుతూ మూడు వారాలు గడిపిన తరువాత, పిల్లాడిని వొక అనా«థాశ్రమంలో పెడుతుంది ప్రభుత్వం. ఆస్ట్రేలియా జంటయిన సూ, జాన్ బ్రియలీ– కుర్రాడిని దత్తు తీసుకుంటారు. సరూ నిజ జీవిత కథ అయిన, ‘ఎ లాంగ్ వే హోమ్’ నవలకి కథకుడు– తన అసలు పేరైన ‘షేరూ’ (సింహం) పలకడానికి నోరు తిరగని సరూయే. ఆ తరువాత, బ్రియలీ దంపతులు మానసిక సంతులనం లేని మాంతోష్ని దత్తు తీసుకుంటారు కానీ అతని ప్రస్తావన ఎక్కువ ఉండదు. సరూకి మాతృదేశం గుర్తుండేలా, సూ– కొడుకు గదిలో అనాథాశ్రమంలో తీసిన అబ్బాయి ఫొటోతో పాటు ఇండియా మ్యాప్ కూడా పెడుతుంది. సరూ తన గత జీవితపు అస్పష్టమైన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకుంటాడు. ‘మరొక దేశానికి, సంస్కృతికి మారడం అంత కష్టం కాలేదు నాకు. ఇండియాలో నా జీవితంతో పోలిస్తే ఆస్ట్రేలియాలోనే చక్కగా గడిపాను. కాకపోతే, అమ్మీ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉండేది. అది అసాధ్యం అని తెలిసిన తరువాత, బతకాలంటే దొరికిన ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకోవాలని అర్థం అయింది’ అంటాడు. అతను హాస్పిటాలిటీ మానేజ్మెంట్ చదువుతున్నప్పుడు, గూగుల్ ఎర్త్ రిలీజ్ అవుతుంది. జ్ఞాపకం ఉన్న కొండగుర్తులతోనూ, తన ఇండియన్ క్లాస్మేట్స్ సహాయంతోనూ– ఇండియన్ రైల్వే లైన్ల పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ, శాటిలైట్ ఇమేజెస్ వెతుకుతాడు. మధ్యప్రదేశ్లో ఉన్న ఖాండ్వా పక్కనున్న గణేష్ తలై తన పల్లె అని కనుక్కోడానికి ఆరేళ్ళు పడుతుంది. 2012లో సరూ తన ఊరు వస్తాడు. షేరూ తిరిగి వస్తాడన్న ఆశతో అమ్మీ ఊరు మారదు. సరూ అమ్మీకి ఇల్లు కొనిస్తాడు. ఇంటివారితో వీడియో చాట్లు చేస్తూ అనేకసార్లు ఇండియా వస్తూపోతాడు. ఆఖరికి, అతని ఇద్దరు తల్లులూ కలుసుకుంటారు. సరూ నవల చివర్న చెప్తాడు: ‘‘నా ఊరిని, కుటుంబాన్ని కనుక్కోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయితే, అది నా పాత జీవితానికి తిరిగి వెళ్ళడం కోసం కాదు. జీవితమంతా ఆస్ట్రేలియాలోనే గడిపాను. ఇక్కడ నాకు తెంచుకోలేని కుటుంబ బంధాలున్నాయి... నేనెవరో, ‘ఇల్లు’ అని దేన్ని పిలవాలో అన్నదాని గురించి నాకే అయోమయమూ లేదు. ఒక్క కుటుంబమూ లేని తప్పిపోయిన కుర్రాడిని. ఇప్పుడు నాకు రెండు కుటుంబాలు ఉన్నాయి, రెండు గుర్తింపులు కావు. నేను సరూ బ్రియలీని.’’ సరూ జ్ఞాపకాలనీ, అతని వెతుకులాటనీ చూపిస్తూ, కథనం వెనక్కీ ముందుకీ మారుతుంటుంది. రచయిత సరూ బ్రియలీ కథ– సగం ప్రపంచాన్ని చుట్టివచ్చి, తన గతాన్ని తిరిగి చేజిక్కించుకుని, రెండు భిన్నమైన సంస్కృతులని తనవిగా చేసుకున్న అతని దృఢచిత్తం గురించినది. ఉద్విగ్నభరితంగా ఉండే పుస్తకం –పట్టుదల, ప్రయత్నాల కొదవ లేకపోయినప్పుడు దేన్నైనా సాధించవచ్చన్న ఆశ లేవనెత్తుతుంది. కథనం స్పష్టంగా, సరళంగా ఉంటుంది. ‘కుటుంబం అంటే ఏమిటి!’ అన్న ప్రశ్న పుస్తకమంతటా కనిపిస్తుంది. స్ఫూర్తిదాయకమైన బ్రియలీ ప్రయాణపు పుస్తకం, కట్టుకథకున్నంత ఆశ్చర్యాన్ని కనపరుస్తుంది. నవలని వైకింగ్ 2014లో పబ్లిష్ చేసింది. దీని ఆధారంగా తీసిన ‘లయన్’ సినిమా 2016లో వచ్చింది. - కృష్ణ వేణి -
కోకిల లోకంలో అతిథి కవిత్వం
ప్రతిధ్వనించే పుస్తకం నీటిరంగుల చిత్రం కవితల గుచ్చంలో కవి వాడ్రేవు చినవీరభద్రుడు జీవితానందం, సత్యం, సౌందర్యం మొదలైన వాటికోసం చేస్తున్న అన్వేషణ కనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైన సొగసు, ఒక అపురూప అనుభవం తాలూకు సౌకుమార్యం ప్రతి పదంలో పొంగిపొరలుతూ ఉంటాయి. ప్రతి కవితా కొన్ని అద్భుత చిత్రాల గది. ఒక్కో గదిలో ఎంతసేపైనా ఉండిపోవచ్చు. ఈ కవి, కవితను రాయడం కాదు దర్శించాలంటారు. వాక్కును గోవులా సేవించాలంటారు. జీవితానుభవాన్ని క్షీరంగా మార్చుకుంటూ ఆవు వెనకే నడుస్తూ ఆ క్షణాలను గుక్కగా నొల్లుకుని ఇంటికొచ్చి నెమరువేసుకోవాలట. అనుభవాలు బాధించేవైనా, బోధించేవైనా రక్తాస్థిగతమయిన తర్వాత ఎవరెక్కడ గిల్లినా ఒళ్ళంతా పాలు కారతాయట. కవి ఋషి అయిపోయాక, అంతే కదా మరి! కవి దారి పక్కన నిలబడి యాత్రికుడికి దోసిళ్లకొద్దీ కవితలు అందిస్తాడట. ఏ ఒక్క పండు కొరికినా మొత్తం అడవినే రుచి చూసినట్టు ఉండాలట. కవి, మొత్తం తన కవిత్వాన్ని పండ్లుగా మలిచిన తీరు మనల్ని చకితుల్ని చేస్తుంది. నిండుగా పూచిన చెట్టు ఎదుట ఈ ప్రపంచాన్ని క్షణం విస్మరించాను అని కవి అంటుంటే ఈ పుస్తకం చదువుతుంటే మనకి అలానే అనిపిస్తుంది. మనల్ని మనం మరిచిపోయి ఒక ఆనందసంద్రంలో ఈదుతుంటాం. నాకు పద్యం రాయడం రాదు, కవిత నిర్మించడం ద్వారా వచ్చిందల్లా నా హృదయాన్ని కాగితంపై పరిచెయ్యడమే అంటారు. ఈ కవితల్ని చదువుతుంటే అందమైన పడవెక్కి సరస్సులోకి షికారుకెళ్ళి ఆనందిస్తున్న భావన! పడవ దిగడం ఎంత కష్టమో ఈ పుస్తకం చదవడం పూర్తిచేసిన వారికి తెలుస్తుంది. కోకిల కూత వినబడుతుంటే పూజ మొదలైనట్టుంటుందట. ఆ కూత అతని హృదయాన్నొక బాజా చేసి ఏదో పండుగ మొదలైన సందడి చేసేస్తుందట. చదువుతుంటే మన మదిలో కూడా ఒక సంతోషకరమైన ఊరేగింపు మొదలౌతుంది. ఇంకా ఆ కోకిల పంటలు బాగా పండిన రోజుల్లో రాత్రి నామ సప్తాహం చేసినట్టు కరువు తీరా (రైతుల కరువు తీర్చి) కూసిందట. ఇన్నాళ్లూ కోకిల నా లోకానికి అతి«థి అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది కోకిలల ప్రపంచంలో తానే కొన్నాళ్ళు అతిథిని అంటారు. కవి తాదాత్మ్యత అది. బతుకు ఫలప్రదం కావడం అంటే ఎక్కడుంటే అక్కడ ప్రపంచాన్ని సుసంపన్నం చేయడం, తాను నిశ్శేషం కావడం అంటూ మానవుడి అంతిమ లక్ష్యం ఏమిటో తాత్వికంగా ముగించారు భద్రుడు. అందుకే ఈ పుస్తకం ఒక సంపూర్ణత్వాన్ని సంతరించుకుంది. - అల్లూరి గౌరీలక్ష్మి -
మూడు పదాలు– మూడు కావ్యాలు
సాహిత్య మరమరాలు కాళిదాసు అఆలు కూడా తెలియని అమాయకుడనీ, అతని భార్య పండితురాలనీ కథలు ప్రచారంలో ఉన్నై కదా! ఆ ముచ్చట ఇది.కాళిదాసు శోభనం గదిలో పందిరి మంచం మీద కూర్చొని ఉన్నాడు. భార్య పాలపాత్రతో గదిలోపలికి వచ్చింది. ‘అస్తి కశ్చిత్ వాగ్విశేషః?’(విశేషా లేమిటండీ) అంది. సంస్కృతంలో అఇఉణ్లు కూడా రాని కాళిదాసు తెల్లమొగం వేసి ‘నువ్వడిగింది ఏమిటి?’ అన్నాడు. సంగతి తెలుసుకొన్న భార్య పరిహాసంగా మాట్లాడింది. దాని నాయన అవమానంగా భావించి, ఆ అర్ధరాత్రి సమయంలోనే కాళికాదేవి ఆలయానికి వెళ్లాడు. ఆమె అనుగ్రహంతో అద్భుతమైన కవనశక్తిని పొందాడు. ఇంటికి తిరిగివచ్చాడు. తాను మహాకవి కావటానికి కారణమైన ఆ ప్రశ్నలోని అస్తి, కశ్చిత్ , వాక్... మూడు పదాలు ముందు వచ్చేట్లుగా కుమార సంభవం, మేఘ సందేశం, రఘువంశం రచించాడు. ‘అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధి రాజః’– భారతదేశానికి ఉత్తర దిగ్భాగంలో హిమాలయమనే పర్వతరాజ మున్నది అంటూ కుమార సంభవం ప్రారంభ మవుతుంది. ‘కశ్చిత్కాంతా విరహగురుణా స్వాధికారాత్ ప్రమత్తః’– ఒకానొక యక్షుడు తన కర్తవ్యాన్ని సరిగా నిర్వహించకపోవటం వలన శపించబడి భార్యకు దూరమై విరహంతో వేగిపోతున్నాడు అంటూ మేఘసందేశం ప్రారంభ మవుతుంది. ‘వాగర్థా వివ సంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే’– శబ్దార్థాల జ్ఞానం కోసం శబ్దం అర్థం లాగా కలిసి ఉన్నటువంటి జగన్మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అంటూ రఘువంశం ప్రారంభమవుతుంది. - డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి -
శరీరాన్ని నమ్మిన రచయిత
రచయితకంటే ఆలోచనాపరుడిగా ఎక్కువగా కనిపిస్తాడు మిషిమా యుకియొ (1925–70). అ–క్రమంగా ఉన్నదాన్ని ఒక క్రమంలోకి తేవడమే కళాకారుడి పనిగా భావించాడు. ‘ఎలా ఉన్నదో’ కాదు, ‘ఎలా ఉండాలో’ ముఖ్యం. పదాల మీద మిషిమాకు అమితమైన విశ్వాసం. ఒక చక్రవర్తి తన ఖడ్గంతో ప్రపంచాన్ని జయించినట్టే, ఒక కవీశ్వరుడు తన పదాలతో జయించాలని తలపోశాడు. ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ మాస్క్’, ‘ద టెంపుల్ ఆఫ్ ద గోల్డెన్ పెవిలియన్’, ‘ద బ్లూ పీరియడ్’, ‘ఆఫ్టర్ ద బాంక్వెట్’ నవలలూ, ‘సన్ అండ్ స్టీల్’ ఆత్మకథా వ్యాసం ఆయన రచనల్లో కొన్ని. 20వ శతాబ్దపు జపాన్ ఉత్తమ రచయితల్లో ఒకడిగా నిలిచిన మిషిమా– దర్శకుడు, నటుడు, మోడల్గానూ కొనసాగాడు. చిన్నతనంలో నానమ్మ దగ్గర పెరిగాడు మిషిమా. ఒంటరిగా ఉండేవాడు. మనిషి చేతన, బౌద్ధిక జ్ఞానం అందుకోలేని ప్రతిదాని పట్ల ఆయనకు భయం. ప్రతిదీ మాటల్లో చెప్పగలిగినప్పుడే దాని మీద పట్టు ఉంటుందని నమ్మాడు. మాటలకు అతీతమైన సంగీతం అన్నా భయమే. ఏ క్షణమైనా బోనును బద్దలుగొట్టుకుని మీద పడే వన్యమృగంలా అది తోచేది(చిత్రంగా, సంగీతం పట్ల ఒక స్త్రీ భయం ఎలా పోయిందో ‘ద మ్యూజిక్’లో రాశాడు. సంగీతం ఇక్కడ జడత్వానికి ప్రతీక). సమాజం కూడా అలాంటి వన్యమృగంలానే కనబడింది. దాన్ని క్రమంలోకి తేవడానికి సాహిత్యం సరిపోదనిపించింది. శరీరాన్ని ధారవోశాడు. ‘మీటరు ఛాతీ’ పెంచాడు. జాతీయవాదిగా మారి తతెనొకాయ్ పేరుతో ప్రైవేటు సేనను స్థాపించాడు. యుద్ధానికి ముందటి చక్రవర్తి అధికారాలను తిరిగి నిలబెట్టే యోచనతో 1970లో తన సహచరులతో తంత్రంతో సైనిక స్థావరం మీద దాడి చేశాడు. అది విఫలమవడంతో జపాన్ సమురాయ్లు గౌరవంగా మన్నించే సంప్రదాయ ఆత్మహత్య ‘సెప్పుకు’(హరాకిరి)కు పాల్పడ్డాడు, తను రాస్తున్న నవల చివరి భాగం ‘ద డికే ఆఫ్ ద ఐంజిల్’ పూర్తిచేసి, నిజమైన సమురాయ్ మృత్యువును ఎదుర్కొనేందుకు సదా సిద్ధంగా ఉండాలని నమ్మి. -
కుదరదు అనడానికీ కుదరదా?
సి. నారాయణ రెడ్డి గొప్ప వక్త. వేదిక ఏదైనా ఆయన ఉపన్యాసం ప్రవాహంలా సాగిపోయి శ్రోతలను ఆనందపరవశులను చేసేది. ఒక నాటక కళాపరిషత్తు నిర్వహించిన పోటీలలో నేను న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. మొదటిరోజు సినారెకు సన్మానం ఏర్పాటు చేశారు. ఒకాయన వేదిక మీద ఉన్నవారిని మితిమీరి పొగుడుతూ ‘‘ఇది నిజంగా మయసభలా ఉంది’’ అన్నాడు. చివరగా సినారె మాట్లాడుతూ ‘‘ఇంతకుముందు మాట్లాడినవారు దీనిని మయసభ అన్నారు. మయసభ అంటే ఉన్నది లేనట్టూ, లేనిది ఉన్నట్టూ కనిపించే ప్రమాదం ఉంది. అయినా పెద్దలమాట కొట్టేయకుండా– ఇంతమంది కవులూ, కళాకారులూ పాల్గొన్న ఈ సభ మయసభ కాదు– వాఙ్మయ సభ అనుకుందాం!’’ అని చమత్కరించారు. సినారె అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పర్యటిస్తున్నప్పుడు ఒక కార్యాలయ ఉద్యోగులు కొన్ని ఆంగ్లపదాలు సూచిస్తూ ‘‘అన్నిటికీ తెలుగులో సరైన పదాలు దొరకవండీ’’ అంటూ వితండవాదం చేశారు. సినారె ముఖం మీద చిరునవ్వు చెరగకుండా చక్కని సమాధానం ఇచ్చారు: ‘‘మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ఆలోచించడం లేదు. లీవ్ లెటర్ బదులుగా ‘సెలవు చీటి’ అని రాయండి. గ్రాంటెడ్ అనడానికి ‘అలాగే’ అని రాయండి. రిజెక్టెడ్ అనాలంటే ‘కుదరదు’ అనండి. అదీ కాకపోతే ‘ఊహూ’ అని రాసి సంతకం పెట్టండి!’’ అన్నారు. ఉద్యోగులు మళ్లీ నోరెత్తలేదు. అదృష్టదీపక్ -
మూడు స్థితుల్లోని జీవితం
ధనికొండ హనుమంతరావు శతజయంతి సంవత్సరం ఇది. ఆయన సుమారు 150 కథలు, మూడు నవలలు, తొమ్మిది నవలికలు, రెండు నాటకాలు, పన్నెండు నాటికలు రాశారు. మొపాసా కథలతోపాటు అనేక గ్రంథాలను అనువదించారు. పత్రికా సంపాదకుడిగా, ముద్రాపకుడిగా ఆయన సేవలు అపురూపమైనవి. ధనికొండ రాసిన గుడ్డివాడు నవలిక ప్రత్యేకమైనది. ఇది మానవ మనస్తత్వానికి అద్దం పట్టే నవల. బాగా కళ్లుండి లోకంలోని అందాల్ని ఆస్వాదిస్తూ ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా కళ్లు పోతే అతని ప్రవర్తన ఎలా ఉంటుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. బాహ్య సౌందర్యాన్ని చూడలేనప్పుడు అంతఃసౌందర్యాన్ని దర్శించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ నవలలో పాత్రలు తక్కువగా ఉన్నా సామాజిక సాంస్కృతికాంశాలకు కొదవ లేదు. జగన్నాథం ప్రమాదంలో కళ్లు పోగొట్టుకొని ఆసుపత్రిలో చేరతాడు. అక్కడ నర్సుతో ప్రేమలో పడతాడు. అక్కడే మరో నర్సుతోనూ ప్రేమాయణం సాగిస్తాడు. ఈ ప్రణయం అతని జీవితంలో ఎలాంటి భూకంపం సృష్టించిందో ధనికొండ అద్భుతంగా సృజించాడు. చూడ్డానికి త్రికోణ ప్రేమకథలా ఉన్నప్పటికీ ఇది ప్రధాన పాత్రల మధ్య జరిగే జీవన సంఘర్షణ. ఫ్రాయిడ్ తదితర మానసిక శాస్త్రవేత్తల ప్రభావం ఉన్న ధనికొండ మనుషుల మనసుల్ని చిత్రించడంలో ఆరితేరిన రచయిత. కళ్లు ఉన్నప్పుడు, కళ్లు పోయిన తరువాత, మళ్లీ కళ్లు వచ్చిన తరువాత, ఇలా జీవితంలోని మూడు సందర్భాల్లో జగన్నాథం ప్రవర్తన ఎలా ఉంటుందో చిత్రించాడు. కళ్లు పోయిన జగన్నాథం కళ్ల కోసం ఆరాటపడతాడు. కళ్లు వచ్చిన తరువాత ‘నాకు కళ్లెందుకిచ్చావు? కళ్లు లేనప్పుడే నేను సత్యాన్ని చూడగలిగాను. కళ్లు ఉంటే చూసేదంతా మి«థ్య! ఈ ఘోరాన్ని చూసేందుకేనా నాకు దృష్టి నిచ్చింది?’ అని వాపోతాడు. సమాజంలో కనిపించే వివిధ అసమానతలు, కుటుంబ జీవితం, అనుబంధాలు, కులాలు, మతాలు, కులవృత్తులు మొదలైన అనేక అంశాలను ధనికొండ చిత్రించిన విధం మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ధనికొండ శతజయంతి సందర్భంగా ఆయన సాహిత్యమంతా పన్నెండు సంపుటాల్లో ముద్రితమయింది. అందులో భాగంగా అనేక సంవత్సరాల తరువాత గుడ్డివాడు నవలిక కూడా పునర్ముద్రణకు నోచుకుంది. విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఈ పన్నెండు సంపుటాలు జనవరి 3న ఆవిష్కృతం కానున్నాయి. మాడభూషి సంపత్ కుమార్ -
కాలం గీసిన చివరి చిత్రం
1987. న్యూయార్క్. ‘తను చనిపోతున్నాడని ఫిన్ మామయ్యకి తెలుసు. అందుకే అక్క గ్రెటాదీ, నాదీ చిత్రం గీస్తున్నాడు,’ అంటుంది 14 ఏళ్ళ జూన్. సిగ్గరి అయిన జూన్ మేనమామతో మనసు విప్పి మాట్లాడగలుగుతుంది. ఫిన్ పేరున్న చిత్రకారుడు. అక్కచెల్లెళ్ళిద్దరూ ఆదివారాలు మేనమామతో గడపటానికి తల్లి డానీతోపాటు, అతని మన్హటన్ ఇంటికి వెళ్తుంటారు. పిల్లలకు వారి చిత్రం బçహూకరిద్దామనుకుంటున్నానని ఫిన్ అక్క డానీకి చెప్తాడు. నిజానికి, అది పిల్లలిద్దరితో గడిపే అవకాశం కలిపించుకోడానికి మాత్రమే. తోడేలు తల కూడా ఉన్న ఆ చిత్రానికి ‘టెల్ ద వుల్వ్స్ ఐ ఆమ్ హోమ్’ అన్న పేరు పెడతాడు ఫిన్. మామయ్యకున్న జబ్బేమిటో ఎవరూ పిల్లలకు చెప్పరు. ‘అమ్మ– మామయ్య వంటింట్లో రంగురంగుల రష్యన్ టీ సెట్టులో టీ కలుపుతూ, గంటలు వెచ్చిస్తుంది. ఆ సెట్ తనకిష్టమైన వాళ్ళకోసమేనని ఫిన్ చెప్పాడు,’ అంటుంది జూన్. ఫిన్ చనిపోతాడు. అంత్యక్రియలప్పుడు, అక్కడే తచ్చాడుతున్న టాబీని చూపిస్తూ, ‘అదిగో, అతనే ఫిన్కు జబ్బు అంటించిన వాడు,’ అని తల్లి చీదరిస్తూ పిల్లలకు చెప్తుంది. అంతకాలమూ డానీ పెట్టిన షరతువల్లే ఫిన్, టాబీ ఉనికిని పిల్లలనుండి దాచి పెట్టి ఉంటాడు. అతను ఫిన్ ప్రేమికుడని అప్పుడు జూన్కు తెలుస్తుంది. ఒక రోజు ప్యాకెట్లో జూన్కు ఫిన్ టీ సెట్ వస్తుంది. దానితో పాటు తనని కలుసుకోమంటూ టాబీ రాసిన చీటీ ఉంటుంది. టాబీతో కలిసి ఊరంతా తిరుగుతున్నప్పుడు, ఫిన్ లేని లోటు అనుభవిస్తున్నది తనొక్కతే కాదని జూన్ గ్రహిస్తుంది. అప్పటికే చెల్లెలికీ, ఫిన్కూ మధ్యనున్న అన్యోన్యత సహించలేని 16 ఏళ్ళ గ్రెటా– తాగుడు అలవరచుకుంటుంది. జూన్కి టాబీ ఒక పుస్తకం ఇస్తాడు. దాన్లో, ‘టాబీకి ఎవరూ లేరు. అతనూ చనిపోబోతున్నాడు. నాకోసమని, అతన్ని జాగ్రత్తగా చూసుకో,’ అని ఫిన్ గతంలో రాసిన ఉత్తరం పెట్టుంటుంది. ఇంతలో మీడియాకి చిత్రం గురించి తెలుస్తుంది. దాని వెల ఎంతో తెలిసిన తల్లి, చిత్రాన్ని బ్యాంక్ లాకర్లో పెట్టి, తాళాలు కూతుళ్ళకి ఇస్తుంది. జూన్ చిత్రాన్ని చూడ్డానికి వెళ్ళిన ప్రతిసారీ, తన చొక్కా మీద నల్ల బొత్తాలూ, గ్రెటా చేతి వెనుక కపాలం వంటి కూడికలు కనిపిస్తాయి. అది అక్క పనేనని అర్థం చేసుకున్న జూన్, తనూ చిత్రంలోని తమ జుట్టుమీద బంగారం రంగు చారలని వేస్తుంది. తన స్కూల్ పక్కనున్న అడివంటే జూన్కు ఇష్టం. అక్కడుండే తోడేళ్ళ అరుపుల కోసం ఎదురు చూస్తూ సంతోషంగా అడివంతా తిరుగుతుంటుంది. ‘తోడేళ్ళు చెడ్డవి కావు. ఆకలి గొన్నవీ, స్వార్థపూరితమైనవి అంతే’ అనుకుంటుంది. ఒకసారి అక్కడే తాగి పడిపోయిన గ్రెటాని టాబీ ఇంటికి చేరుస్తాడు. ‘అక్కా, నేనూ ఎలా వేరయ్యామో అర్థం అయింది నాకు. ఇన్నేళ్ళ ఆప్తమిత్రులం. తన్ని నేనే విడిచిపెట్టానని ఎందుకు గుర్తించలేకపోయాను!’ అనుకున్న జూన్, గ్రెటాతో రాజీ పడుతుంది. టాబీని జూన్ తనింటికి తీసుకొస్తుంది. తల్లి అతన్ని క్షమాపణ అడుగుతుంది. అదే రాత్రి టాబీ మరణిస్తాడు. డానీ, గ్రెటా– జూన్ జీవితంలో టాబీకున్న స్థానాన్ని అంగీకరిస్తారు. హెచ్ఐవీ ఒక కళంకం, ఎయిడ్స్ అంటువ్యాధి– అనుకునే కాలపు నేపథ్యం ఉన్న పుస్తకం ఇది. అదే మంకుతనంతో కూడిన అజ్ఞానం డానీలోనూ కనిపిస్తుంది. సమలైంగికత గురించి నోరెత్తడానికి కూడా భయం వేసే ఆ కాలం గురించి సవివరంగా రాసిన కెరోల్ రఫికా బ్రంట్ తొలి నవలను రాండమ్ హౌస్ 2012లో ప్రచురించింది. కృష్ణ వేణి -
పెళ్లాం దిద్దిన కాపురం
‘‘తలుపు! తలుపు!’’ తలుపు తెరవలేదు. గదిలో గడియారం టింగుమని వొంటి గంట కొట్టింది. ‘‘ఎంత ఆలస్యం చేస్తిని? బుద్ధి గడ్డి తిన్నది. రేపట్నుంచి జాగ్రత్తగా వుంటాను. యాంటినాచల్లా పోయి సానిదాని పాట సరదాలో మనసు లగ్నమై పోయింది. ఒక్క పాట సరదాతోటి కుదరలేదు. పాడే మనిషి మీదిక్కూడా మనసు పరుగెత్తుతోంది. లేకుంటే, నేను పోకిరి మనిషిలాగ పాట ముగిసిందాకా కూర్చోవడమేమిటి? ఏదో వొక అవకాశం కలగజేసుకుని దానితో నాలుగు మాటలు ఆడడపు ఆసక్తి ఏమిటి? యిదుగో, లెంపలు వాయించుకుంటున్నాను. రేపట్నుంచి పాటకు వెళితే వొట్టు. మరి వెళ్లను. నిశ్చయం. గట్టిగా గాని పిలిస్తినట్టయినా కమలిని లేవగలదు. మెల్లిగా తలుపు తట్టి రాముణ్ని లేపగలిగితినా చడీ చప్పుడూ లేకుండా పక్కజేరి పెద్దమనిషి వేషం వెయ్యవచ్చు. గోపాలరావు తలుపు చేతనంటగానే, రెక్క విడబారింది. ‘‘అరే యిదేమి చెప్మా!’’ అనుకొని తలుపు మెల్లిగ తెరిచేసరికి, నడవలో దీపం లేదు. పడకగది తలుపు తీసిచూస్తే దాన్లోనూ దీపం లేదు. చడీచప్పుడూ లేకుండా అడుగువేస్తూ మంచము దరికిపోయి, కమలిని మేలుకొని వున్నదా, నిద్రించుతున్నదా అని కనిపెట్ట ప్రయత్నించెను గాని, యేర్పరించ లేకపోయినాడు. బల్లమీద తడివి అగ్గిపెట్టె తీసి ఒక పుల్ల వెలిగించినాడు. మంచం మీద కమలిని లేదు. నిశ్చేష్టుడైపోయినాడు. చేతినుంచి అగ్గిపుల్ల రాలింది. గదినీ, అతని మనస్సునీ చీకటి కమ్మింది. వెఱి< శంకలూ, అంతకు వెఱి< సమాధానాలూ మనసున పుట్టుతూ గిట్టుతూ వ్యాకులత కలగజేశాయి. నట్టి వాకిట వచ్చి నిలబడ్డాడు. చుక్కల కాంతిని నౌకరుగానీ, దాసీగానీ కానరాలేదు. తిరిగి గదిలోకి పోయి దీపం వెలిగించి, గది నాలుముఖాలా పరికించి చూశాడు. కమలిని ఎక్కడా కానరాలేదు. వీధి గుమ్మం దగ్గిరికి వెళ్లి తలుపు తెరిచి చూసేసరికి, చుట్ట కాలుస్తూ తల ఎత్తి ఆకాశం మీది చుక్కల్ని చూస్తూ రావుడు కనపడ్డాడు. ‘‘రామా!’’ అని పిలిచాడు. రావుడి గుండె జల్లుమంది; నోట్లో చుట్ట జారి కిందపడ్డది. ‘‘రా వెధవా!’’ కాలీడ్చుకుంటూ రావుడు దగ్గర కొచ్చాడు. ‘‘మీ అమ్మేదిరా?’’ ‘‘మా యమ్మా బాబు? మా కొంపలున్నాది.’’ ‘‘నీ అమ్మ కాదురా! నా భార్యరా.’’ ఆ మాటతో రావుడికి మతి పోయింది. ‘‘ఎక్కడుంటారు బాబూ? అమ్మగోరు గదిలో తొంగున్నారు బాబూ!’’ ‘‘యింట్లో ఎక్కడా లేదురా, యిల్లు విడిచి నువ్వెక్కడికి పోయినావురా?’’ రావుడు మొహం ఓరజేసుకుని ‘‘నౌఖరోడికి కాల్నొస్తుంది, కడుపు నొస్తుంది బాబూ. పెద్దయ్యోరు మరీ మరీ అప్పసెప్పి ఎల్లినారు గందా, అమ్మగారి నొక్కర్నీ ఒగ్గేసి నిసి రాత్రేళ సానమ్మ గారి–’’ రావుడి వీపు మీద రెండు వీశ గుద్దులు పడ్డాయి. ‘‘సంపేసినారు బాబూ’’ గోపాలరావు దయగలవాడు. కోపం దిగజారి పశ్చాత్తాపం కలిగింది. వీపు నిమిరి, గదిలోకి తీసుకువెళ్లాడు. కుర్చీమీద తాను కూచుని ‘రామా ఏమాయెరా!’యని దైన్యంతోటి అన్నాడు. రావుడు యీ తట్టూ, ఆ తట్టూ చూసి ‘‘ఏటో మాయలా ఉంది, బాబూ’’ అన్నాడు. ‘‘పుట్టింటిగ్గానీ వెళ్లివుండునా?’’ ‘‘అంతోరు కారనా? కోపగించితే సెప్పజాల్నుగానీ, ఆడోరు సదువుకుంటే ఏటౌతది బాబూ?’’ ‘‘విద్య విలువ నీకేం తెలుసురా’’ అని గోపాలరావు మోచేతులు బల్లపైన ఆనిచ్చి, ఆ నడుమ శిరస్సు వుంచి తలపోస్తూ ఉన్నంతలో, ముద్దులొలికే చేవ్రాలున్న వుత్తరవొకటి బల్లమీద కనపడ్డది. పైకి చదివాడు. ‘‘అయ్యా! ‘‘ప్రియుడా!’ పోయి ‘అయ్యా’ కాడికి వొచ్చిందా?’’ ‘‘పెయ్య పోయిందా బాబూ?’’ ‘‘మూర్ఖుడా! ఊరుకో.’’ ‘‘అయ్యా! పది దినములాయె రాత్రుల నింటికి మీ రాకయే నే నెరుగను. మీటింగులకు బోవుచుంటిమంటిరి. లోకోపకారమునకై యుద్యమముల నిదురమాని చేయుచుంటిమంటిరి. నేనింట నుండుటను గదా మీరిన్ని కల్లలు పలుకవలసి వచ్చెను. మీచే దినదినము అసత్యమాడించుట కన్న మీ త్రోవకు అడ్డుగ నుండకుండుటయే, పతి మేలు కోరిన సతికి కర్తవ్యము కాదా? నేనీ రేయి కన్నవారింటికి చనియెద. సంతసింపుడు.’’ ఉత్తరం ముగించి, ‘‘నేను పశువును’’ అని గోపాలరావు అనుకున్నాడు. ‘‘అదేటి బాబూ, అలా శలవిస్తారు?’’ ‘‘శుద్ధ పశువును’’ రావుడు అతి ప్రయత్నం చేత నవ్వు ఆపుకున్నాడు. ‘‘గుణవతి, విద్యవతి, వినయ సంపన్నురాలు, నా చెడుబుద్ధికి తగిన శాస్తి చేసింది.’’ ‘‘అమ్మగారేటి సేసినారు బాబూ!’’ ‘‘పుట్టింటికి వెళ్లిపోయింది– గాని, నీకు తెలియకుండా ఎలా వెళ్లిందిరా?’’ రావుడు రెండడుగులు వెనక్కి వేసి, ‘‘నా తొంగున్నాను కావాల బాబు! అలిగితే సెప్పసాల్ను గాని బాబు, ఆడదాయి సెప్పకుండా పుట్టినోరింటికి ఎల్తానంటే లెంపలోయించి కూకోబెట్టాలి గాని మొగోర్లాగా రాతలూ, కోతలూ మప్పితే ఉడ్డోరం పుట్టదా బాబూ?’’ ‘‘ఓరి మూర్ఖుడా! భగవంతుడి సృష్టిలోకల్లా ఉత్కృష్టతమయిన వస్తువు విద్య నేర్చిన స్త్రీ రత్నమే. శివుడు పార్వతికి సగం దేహం పంచియిచ్చాడు కాదా. ఇంగ్లీషువాడు భార్యను ‘బెటర్ హాఫ్’ అంటాడు. అనగా పెళ్లాం మొగుడికన్న దొడ్డది అన్నమాట. బోధపడ్డదా?’’ ‘‘నాకేం బోధకాదు బాబు?’’ రావుడికి నవ్వు ఆచుకోవడం అసాధ్యం కావచ్చింది. ‘‘నీ కూతుర్ని బడికి పంపిస్తున్నాం కదా, విద్య యొక్క విలువ నీకే బోధపడుతుంది. మీ వాళ్లకంటే అప్పుడే దానికి ఎంత నాగరికత వొచ్చిందో చూడు. ఆ మాట అలా వుణ్ణియ్యిగాని, యిప్పుడు నువ్వో నేనో వెంటనే బయల్దేరి చెంద్రవరం వెళ్లాలి. నే వెళ్డానికి శెలవు దొరకదు. నువ్వు తాతల నాటి నౌఖరువి. నీ మీద కమలినికి యిష్టం. గనక నువ్వే వెళ్లడం మంచిది.’’ ‘‘శలవైతే యెలతాను. ఆర్రానంటే–’’ ‘‘యింద పది రూపాయలు. బతిమాలి తీసుకొస్తివట్టాయనా, మరి పది రూపాయలిస్తాను.’’ ‘‘సిత్తం.’’ ‘‘ఐతె, యేవిటి చెప్పాలో తెలుసునా?’’ ‘‘యేటా బాబూ? సెప్పకుండా లేసి రావడం మా మంచి పని సేసినారమ్మా. బాబు నా యీపు పగలేసినారు. రండి రండమ్మా అని సెప్తాను.’’ ‘‘నన్ను క్షమించి దెబ్బ మాట మర్చిపో. కమలినితో ఎన్నడూ దెబ్బల మాట చెప్పబోకు. ఈమాట జ్ఞాపకం ఉంచుకుంటావు గదా?’’ ‘‘సిత్తం’’ ‘‘నువ్వు కమలినితో చెప్పవలసిన మాటలేవో చెబుతాను. బాగా చెవొగ్గి విను... పంతులికి బుద్ధి వొచ్చిందను...’’ ‘‘అదేటి బాబు!’’ ‘‘నీకెందుకు? నే అన్న మాట గట్టిగా జ్ఞాపకం వుంచుకుని చెప్పు. పంతులికి బుద్ధి వొచ్చింది అను. యిటుపైని ఎన్నడూ, రాత్రిళ్లు యిల్లు కదలరు. ఇది ఖరారు. తెలిసిందా?’’ రావుడు తల వూపాడు. ‘‘ఇంకా ఏవిటంటే, గెడ్డం పట్టుకుని బతిమాలుకున్నానని చెప్పమన్నారు. దయదల్చి పంతుల లోపాలు బయట పెట్టొద్దన్నారు. (ఇది ముఖ్యమైన మాట. విన్నావా?) మీరు దగ్గర లేకపోవడం చేత వెఱె -
ఉరితీతకు నాలుగు రోజుల ముందు...
అమెరికా– టెక్సస్లో ఉన్న చిన్న ఊరు స్లోన్. నల్ల ఫుట్బాల్ ఆటగాడైన డూంట్ మీద, స్కూల్ ఛీర్ లీడర్ అయిన తెల్లమ్మాయి నిక్కీని మానభంగం చేసి, హత్య చేసిన నేరం మోపబడి ఉరిశిక్ష పడుతుంది. నిజానికి, అతనికి ఆ హత్యతో ఏ సంబంధం ఉండదు. కాకపోతే, జ్యూరీ సభ్యులందరూ తెల్లవారే కావడం వల్ల డూంట్ జాత్యహంకారానికి బలై, తొమ్మిదేళ్ళ శిక్ష పూర్తి చేస్తుండగా నవల మొదలవుతుంది. 1998లో నిక్కీని అపహరించి, బలాత్కరించి, గొంతు నులిమి – ఆరుగంటల దూరాన ఉన్న మిజోరీలో శరీరాన్ని పాతి పెట్టినది ట్రావిస్. పోలీసులు డూంట్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తూ ఊరుకుంటాడు. వర్తమానంలో డూంట్ ఉరిశిక్షకి నాలుగు రోజులే మిగులుతాయి. బ్లాక్ అమెరికన్లు డూంట్ మీదున్న తప్పు దోషనిర్ధారణని వ్యతిరేకిస్తూ, సమ్మె చేస్తారు. డూంట్ లాయరైన రాబీ దానికి నాయకత్వం వహిస్తాడు. ట్రావిస్ లైంగిక దాడుల రికార్డ్ చిన్నదేమీ కాదు. మరో నేరం చేసి, పూచీకత్తు మీద వదిలి పెట్టబడతాడు. శస్త్రచికిత్స లేని మెదడు కణితితో బాధపడుతూ, తన పాత నేరాన్ని వొప్పుకుందామని నిర్ణయించుకుంటాడు. ఊర్లో జాతి ఉద్రిక్తత నెలకొన్నప్పుడు, తను నిక్కీని ఎక్కడ పాతి పెట్టాడో ట్రావిస్ చెప్తాడు. డీఎన్ఏ శాంపిల్స్ బట్టి – బలాత్కారం, హత్యా నిర్థారించబడినప్పటికీ – తన అరెస్ట్ తాకీదుకి ముందే, ట్రావిస్ పారిపోతాడు. డూంట్ ఉరి ఎవరూ ఆపలేకపోతారు. పాస్టర్ అయిన ష్రౌడర్– రేపిస్టూ, హంతకుడూ అయిన ట్రావిస్కు హామీ ఇచ్చి, జైలుబారిన పడకుండా రక్షించినందుకు పశ్చాత్తాపపడి, జరిమానా చెల్లిస్తాడు. తన పదవికి రాజీనామా చేస్తాడు. ఈ పుస్తకంలో అతి వ్యాకులపరిచేవి డూంట్ గత జ్ఞాపకాలూ, తన పేరుకంటిన కళంకాన్ని దూరం చేసుకునే అతని ప్రయత్నాలూ. తన స్వస్థచిత్తతను కాపాడుకోడానికి జైల్లో బైబిల్ చదువుతూ, తన ఫుట్బాల్ ఆటని గుర్తు చేసుకుంటుంటాడు. భూమ్మీద తన ఆఖరి దినాన తనకు తాను నచ్చజెప్పుకుంటాడు: ‘రోజులు లెక్కపెట్టుకుంటూ సంవత్సరాలు గడిచిపోవడం చూస్తావు. నీవు మరణిస్తేనే నయం అని నమ్ముతూ, నిన్ను నీవు సమర్థించుకుంటావు. మరణాన్ని తేరిచూస్తూ, అవతల నీకోసం వేచి ఉన్నదేదైనా కానీ– అది మాట్లాడ్డానికి ఎవరూ లేని యీ ఆరు బై పది పంజరంలో, ముసలివాడివవుతూ గడపడం కన్నా నయమే అయి ఉంటుందనుకుంటావు. ఎలాగూ సగం మరణించే ఉన్నావు కనుక మిగతా సగాన్నీ చంపెయ్యమని మృత్యువు మొహం మీదే చెప్పడమే మంచిది అనుకుంటావు.’ ‘ద కన్ఫెషన్’ పుస్తకం, రచయిత జాన్ గ్రిషమ్ నమ్మకాల ఆధారమే. ఏదీ ఉపదేశించే ప్రయత్నం చేయనప్పటికీ, రచయిత ఒక ఎదురులేని ప్రశ్న మాత్రం వేస్తారు: ‘ఒక అమాయకుడిని దోషిగా నిర్ణయించి, ఉరిశిక్ష వేసిన సందర్భంలో, స్వతంత్రంగా తిరిగే దోషులకి ఏమీ అవదా?’. మరణశిక్షకి గ్రిషమ్ వ్యతిరేకి అని మొదటినుండీ తెలుస్తూనే ఉంటుంది. వర్తమానం నుండి గతానికి, ఒక పాత్రనుండి మరొక పాత్రకు వెళ్ళే పుస్తకం, మొదలయినంత వేగంగానే ముగుస్తుంది కూడా. పూర్తి పుస్తకం కేంద్రీకరించేది కేవలం ఉరిశిక్ష ఎంత ఘోరమైనదోనన్న విషయం పైనే. నవల్లో–చట్టపరమైన సాంకేతికతల వివరాలూ, జైళ్ళల్లో జరిగే వాస్తవమైన సంఘటనలూ, సామాజిక సమస్యల అనేకమైన వివరాలూ ఉంటాయి. కథనం– తనకి తెలియకుండానే కేసులోకి లాగబడిన పాస్టర్ దృష్టికోణంతో ఉంటుంది. ‘మరణశిక్ష హంతకులకు ఒక పీడకల. ఒక అమాయకుడికి అది మానసిక హింస. దాన్ని తట్టుకునే ధైర్యం మనుష్యులకి ఉండదు’ అని గ్రిషమ్ చెప్పే ఈ నవలని డబల్ డే 2010లో ప్రచురించింది. కృష్ణ వేణి -
చీకట్లో చిత్రం
కథను మనం నెరేటర్ గొంతులో వింటాం. సంభాషణ శైలిలో చెబుతూవుంటాడు. ఈ గుడ్డాయన కథకుడి ఇంటికి వస్తున్నట్టు తెలియడంతో కథ మొదలవుతుంది. వచ్చి ఒక రాత్రి ఉండి వెళ్లాలనేది ప్లాను. ఆ అంధుడు కథకుడి భార్యకు పాత స్నేహితుడు. ఆయన భార్య చనిపోయింది. భార్య బంధువుల ఇంటికి వెళ్తూ, అక్కడి నుంచి ఫోన్ చేశాడు. అతడు ట్రెయిన్లో రావాలి. కథకుడి భార్య పికప్ చేసుకోవాలి. ఐదు గంటల ప్రయాణం. పదేళ్ల క్రితం సియాటిల్లో ఒక వేసవి కాలం ఆమె అతడి కోసం పనిచేసింది. ఇన్నేళ్లలో వాళ్లు మళ్లీ కలుసుకోలేదు. కానీ ఇరువురూ తమ సంగతులు చేరవేసుకుంటూనే ఉన్నారు. అతడు వస్తున్నాడంటే కథకుడికేమీ ఉత్సాహంగా లేదు. ఆ గుడ్డితనం ఇబ్బంది పెడుతోంది. సినిమాల్లో గుడ్డివాళ్లు ఎలా ఉంటారు? నెమ్మదిగా నడుస్తారు, ఎప్పుడూ నవ్వరు. ఒక వేసవిలో వార్తా పత్రికలో ‘హెల్ప్ వాంటెడ్’ అన్న ప్రకటన ‘ఈమె’ చూసింది. ఇచ్చింది ఈ అంధుడే. అప్పుడామెకు అర్జెంటుగా ఏదో ఒక జాబ్ కావాలి. వెళ్లగానే పనిలోకి తీసుకున్నాడు. అతడికి ఏవి అవసరమో అవి చదివిపెట్టడం ఆ పని. కేస్ స్టడీలు, రిపోర్టుల లాంటివి. సోషల్ సర్వీస్ డిపార్ట్మెంటులో అతడి ఆఫీసు. అట్లా స్నేహితులయ్యారు. పని మానేసే చివరి రోజున ఆ అంధుడు ఆమెను ముఖం తాకవచ్చా అని అడిగాడు. ముఖం, ముక్కు అంతా వేళ్లతో తడిమి చూశాడనీ భార్య ఓసారి చెప్పినప్పుడు కథకుడు ఇబ్బంది పడతాడు. అట్లా వేళ్లు కదలాడిన అనుభవంతో ఆమె ఒక కవిత కూడా రాయడానికి ప్రయత్నిస్తుంది. అయితే నేనతణ్ని బౌలింగ్కు తీసుకెళ్తాను, అంటాడు కథకుడు. ఆ వ్యంగ్యం భార్యకు అర్థమవుతుంది. ఇద్దరూ వంటింట్లో ఉంటారప్పుడు. ఆమె ఆలుగడ్డలను గుండ్రంగా తరుగుతోంది. నీకే ఒక స్నేహితుడుండి, అతడు ఇంటికి వస్తే నేను అతణ్ని సౌకర్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తానంటుంది. కానీ నాకు గుడ్డి స్నేహితులు ఎవరూ లేరంటాడతను. ఆయన భార్య చనిపోయింది, నీకు అర్థం కావట్లేదా? పాపం ఆయన భార్యను పోగొట్టుకున్నాడని ఆమె జాలి పడుతుంది. గుడ్డాయన భార్య పేరు బ్యూలా. నీగ్రోలా ధ్వనించే పేరు. ఈమె ఉద్యోగం మానేశాక బ్యూలా అక్కడ చేరింది. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లపాటు విడదీయలేనంత బాగా బతికారు. కానీ ఆమె క్యాన్సర్తో పోయింది. ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆమె చేయిని ఇతడు పట్టుకుని వీడ్కోలు ఇవ్వడం కథకుడు ఊహించుకున్నాడు. ఎనిమిదేళ్లు ఒక ఇంట్లో ఉండి, కలిసి బతికి, ఆమె ముఖం ఎలావుంటుందో కూడా ఇతడికి తెలియకపోవడం అనేది కథకుడి అవగాహనలో లేని విషయం. ముందు అంధుడి పట్ల జాలిపడతాడు. కానీ ఆమెది కదా అసలైన బాధ! ప్రేమిస్తున్నవాడి కళ్లు ఎలా చూస్తాయో ఆమె ఎప్పుడూ అనుభవించలేదు. ఆమె ముఖంలో మార్పులు అతడు గమనించలేడు. ఈ రోజు ఇలా ఉన్నావని ప్రశంసించలేడు. తయారైనా, కాకపోయినా తేడా ఉండదు. సాయంత్రం కథకుడి భార్య రాబర్ట్ను, ఆ అంధుడి పేరు రాబర్ట్, స్వాగతించడానికి స్టేషన్కు వెళ్తుంది. వాళ్లు తిరిగి వచ్చేసరికి కథకుడు ఒక డ్రింకు కలుపుకొని, టీవీ చూస్తూవుంటాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తారు. అంటే కారు ఆగాక, ఈమె దిగి అతడి డోర్ తెరుస్తుంది. పెద్ద సూట్కేస్తో కిందికి దిగుతాడు రాబర్ట్. అతడికి పెద్ద గడ్డం ఉంది. ‘గుడ్డి మనిషికి గడ్డం’! ఇతడు టీవీ ఆపేసి తలుపు దగ్గరికి వెళ్తాడు. భార్య పరస్పరం ఇద్దరికీ పరిచయం చేస్తుంది. వెల్కమ్ అని మర్యాదకు అంటాడు. తర్వాత ఏం మాట్లాడాలో తోచదు. రాబర్ట్ మాత్రం మీ గురించి చాలా విన్నానంటాడు. కథకుడి భార్య ‘రాబర్ట్ ఇక్కడ కుర్చీ ఉంది, రాబర్ట్ నీ కుడి పక్కన’ అంటూ సూచనలు ఇస్తూ ఇంట్లోకి తోలుకొస్తుంది. ప్రయాణంలో హడ్సన్ నది అందం చూడాలంటే, న్యూయార్క్ వైపు వెళ్తున్నట్టయితే కుడివైపు కూర్చోవాలి; న్యూయార్క్ నుంచి వస్తుంటే ఎడమవైపు కూర్చోవాలి. ‘రైలు ప్రయాణం బాగా జరిగిందా, అవునూ వచ్చేప్పుడు కుడివైపు కూర్చున్నారా, ఎడమవైపా?’ అని ఇతడు అడుగుతాడు. అదేం ప్రశ్న అని అతడి భార్య అంటుంది. కుడివైపు కూర్చున్నానని రాబర్ట్ చెబుతాడు. నలబై ఏళ్లుగా తను రైలే ఎక్కలేదనీ, పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా ఎక్కలేదనీ చెబుతాడు. రాబర్ట్ నలబైల చివర్లో ఉన్నాడు. బరువు మోసి వంగిపోయినట్టుగా ఉన్న భుజాలు. లేత గోధుమరంగు చొక్కా, గోధుమరంగు బూట్లు. నల్ల కళ్లద్దాలు మాత్రం పెట్టుకోలేదు. చూడ్డానికి మామూలు కళ్లలాగే ఉన్నాయి. కానీ దగ్గరగా చూస్తే తేడా ఉంది. కనుగుడ్డులో తెలుపు ఎక్కువ. కంటిపాపలు నియంత్రణ లేకుండా కదులుతున్నాయి. ఒక డ్రింకు తీసుకొస్తానని ఇతడు చెప్పగానే, ‘సరే బాబు, నేను స్కాచ్ మనిషిని’ అన్నాడు రాబర్ట్. బాబు! రాబర్ట్ తన వేళ్లతో సూట్కేసును తడుముకున్నాడు. దాన్ని నేను పైన నీ గదిలో పెట్టనా? అంది కథకుడి భార్య. ఏం పర్లేదు, నేను పైకి వెళ్లినప్పుడు అదీ వస్తుంది అన్నాడు రాబర్ట్. స్కాచ్లో చాలా తక్కువ నీళ్లు పోయమన్నాడు రాబర్ట్. దానికి ఐరిష్ నటుడు బారీ ఫిట్జ్గెరాల్డ్ కొటేషన్ ఒకటి చెప్పాడు. నీళ్లు తాగాలనుకున్నప్పుడు నీళ్లు తాగుతా, విస్కీ తాగాలనుకున్నప్పుడు విస్కీ తాగుతా. కథకుడి భార్య నవ్వింది. రాబర్ట్ తన గడ్డాన్ని చేత్తో లేపుకుని మళ్లీ వదిలేశాడు. డ్రింక్సు తీసుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. రాబర్ట్ తన ప్రయాణం గురించి చెప్పాడు. వదులుతున్న పొగను చూడలేరు కాబట్టి, గుడ్డివాళ్లు స్మోక్ చేయరని కథకుడు ఎక్కడో విన్నాడు. కానీ రాబర్ట్ హాయిగా సిగరెట్లు ఊదాడు. తర్వాత డిన్నర్ కోసం టేబుల్ దగ్గర చేరారు. టేబుల్ మీద ఉన్న ప్రతి పదార్థాన్నీ ఇద్దరూ ఆవురావురుమని ఆరగించారు. మాంసం, బీన్సు, బటర్ బ్రెడ్, ఆలుగడ్డలు. తన పళ్లెంలో ఏది ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకున్నాడు రాబర్ట్. కత్తి ఫోర్కులు అవసరమైనప్పుడు సరిగ్గా వాడాడు. ఇంక మళ్లీ రేపు లేదన్నట్టుగా తిని తేన్చి ఇద్దరూ టేబుల్ వదిలేసి, మళ్లీ లివింగ్ రూములోకి వచ్చారు. రాబర్ట్, కథకుడి భార్య సోఫాలో కూర్చున్నారు. కుర్చీలో కథకుడు ఉన్నాడు. పదేళ్లలో జరిగిన విశేషాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిద్ర ముంచుకొస్తుండగా, అన్ని జాగ్రత్తలూ చెప్పి కథకుడి భార్య పైన గదిలో పడుకోవడానికి వెళ్తుంది. వీళ్లిద్దరూ మాట్లాడుతూ టీవీ ఆన్ చేస్తారు. వాతావరణం, స్పోర్ట్స్ రౌండప్ లాంటి కార్యక్రమాలు ఏవో మారుతూ కెథెడ్రల్(పెద్ద చర్చి; బిషప్ నడిపేది) గురించి వస్తోంది. పోర్చుగల్లో ఉన్న కెథెడ్రల్స్కూ, ఇటలీ, ఫ్రాన్సుల్లో ఉన్నవాటికీ తేడా చెబుతూ, పోర్చుగల్లో ఉన్నవి నిర్మాణపరంగా అంత ఉన్నతమైనవి కావని దాని సారాంశం. ఈ సమయంలో కథకుడికి ఉన్నట్టుండి అనుమానం వస్తుంది. అసలు కెథెడ్రల్ అన్నప్పుడు, ఆ మాట అనగానే రాబర్ట్కు ఏం ఊహ కదలాడుతుంది? అదేంటో తెలుసా అసలు? ఎవరో చెబుతుంటే విన్నాను, వందల మంది దానికోసం శ్రమిస్తారు, కొన్ని తరాలు పనిచేస్తాయి, విషాదం ఏమిటంటే పూర్తయిన నిర్మాణం చూసుకునేదాకా ఎవరూ బతకరు, మనకూ వాళ్లకూ తేడా ఏం లేదు కదా? అని బదులిస్తాడు రాబర్ట్. టీవీలో ఇప్పుడు జర్మనీలోని కెథెడ్రల్ గురించి చెబుతున్నారు. బాబూ, నాకు ఇంతే తెలుసు, నువ్వు చెబితే వినాలనుందని అంటాడు రాబర్ట్. కానీ ఎలా వర్ణించడం? చాలా పొడుగ్గా ఉంటాయి, పొడుగ్గా పొడుగ్గా, ఆకాశం తాకేట్టుగా, కొన్నిసార్లు రాయితో, కొన్నిసార్లు పాలరాయితో కడతారు, దాన్ని ఎలా బొమ్మ కట్టించాలో అర్థం కాక, సిగ్గుపడతాడు కథకుడు. అయితే, ఇద్దరం కలిసి బొమ్మ గీద్దామని సూచిస్తాడు రాబర్ట్. పరుగెత్తికెళ్లి పెన్నుకోసం వెతుకుతాడు. భార్య గదిలో పెన్నులు దొరుకుతాయి. తర్వాత దళసరి కాగితం కావాలి. ఎలా? కిచెన్లో అడుగున ఉల్లిగడ్డ పొట్టు ఉన్న ఒక బ్యాగు కనబడుతుంది. దాన్ని సరిచేసి టేబుల్ మీద పెడతాడు. ఈ లోపు పై గది నుంచి వచ్చిన భార్యకు ఏమీ అర్థం కాక, ఏం చేస్తున్నారని అడుగుతుంది. కెథెడ్రల్ గీస్తున్నామని చెబుతాడు రాబర్ట్. రాబర్ట్ చేతులను పట్టుకుని కథకుడు బొమ్మ గీయించడానికి ప్రయత్నిస్తాడు. ఆర్చులు, తలుపులు, అక్కడక్కడా జనం... సరిగ్గా ఈ సమయంలో రాబర్ట్ ఒకసారి కళ్లు మూసుకొమ్మని కథకుడిని అడుగుతాడు. మూయాలి, తెరవొద్దు. కథకుడు మూసుకుంటాడు. ఇప్పుడు బొమ్మ గీద్దామంటాడు. రాబర్ట్ చేతులు కదిలిస్తూవుండగా కథకుడు చేతులు కదుపుతూవుం టాడు. గీయడం ఆగుతుంది. కథకుడు ఇంకా కళ్లు మూసుకునే ఉంటాడు. చూస్తున్నావా? అంటాడు రాబర్ట్. కథకుడు ఇంకా కళ్లు తెరవడు. ఇంట్లోనే ఉన్నప్పటికీ, ఎందులోనూ లేనట్టుగా అనిపిస్తుంది. అంధుల పట్ల ఒక సహానుభూతిని కలిగించే కథ ఇది. అలాగని నాటకీయ పరిణామాలు ఏమీవుండవు. కళ్లు లేకుండా బతకడం అంటే ఏమిటో నెరేటర్ సున్నితంగా అనుభవంలోకి తెచ్చుకోవడమే ఇందులోని విశేషం. కథ పేరు ‘కెథెడ్రల్’. 1981లో రాసింది. రచయిత రేమండ్ కార్వర్ (1938 – 1988). అమెరికన్. ప్రధానంగా కవి. ఊపిరితిత్తుల కేన్సర్తో యాభై ఏళ్లకే మరణించారు. కెథెడ్రల్ పేరుతో ఆయన కథాసంకలనం వచ్చింది. మరో కథా సంకలనం పేరు ‘వాట్ వి టాక్ ఎబౌట్ వెన్ వి టాక్ ఎబౌట్ లవ్’. ఈ కథాసారం: సాక్షి సాహిత్యం డెస్క్. -
మాదిరెడ్డి లోకమలహరి రచనలు
తెలంగాణ సాహిత్య అకాడమి ఇటీవల రెండు పుస్తకాలు ప్రచురించింది. మాదిరెడ్డి సులోచన కథలు, లోకమలహరి నవలలు. లోకమలహరి (1910–2010) ‘శతాధిక గ్రంథకర్త’. చివర్లో సన్యాసాశ్రమం స్వీకరించి, వేదానంద సరస్వతీస్వామిగా పేరు మారాడు. లోకమలహరి 114 పేజీల పుస్తకంలో రెండు నవలలున్నాయి. జెగ్గని యిద్దె, సంఘము. వీటిని నవలికలు లేదా పెద్దకథలు అనవచ్చు. రెండూ రాసిన కాలం 1955. ‘పచ్చి పల్లెటూరు భాష’లో రాసిన జగ్గని విద్య వ్యవహారంలో జెగ్గని యిద్దె అయింది. ‘హరిజనులు కూడా చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాలనేది జెగ్గని యిద్దె నవల పరమార్థం’. కథ మొదట్లోని జెగ్గడే కథ పూర్తయ్యేసరికి జగదీశ్ ఎం.ఎ., ఎల్.ఎల్.బి. అవుతాడు. గ్రామానికి తిరిగొచ్చి నిరక్షరాస్యతా నిర్మూలనకు కృషి చేస్తాడు. ఇందులో వాడినదంతా నిజామాబాద్ గ్రామ్యభాష. ‘చేనేత జీవితాన్ని చిత్రించిన తొలి నవల’ సంఘము. జెగ్గని యిద్దె తర్వాత దీన్ని రాశాడు లోకమలహరి. ‘పద్మశాలీల దైనందిన జీవితంలోని కడగండ్లను, వాటికి ఊతమిచ్చే సమాజంలోని పెద్దమనుషుల నిజరూపాలను ‘సంఘము’ నవలలో బయటపెట్టాడు’. డాక్టర్ సరోజ వింజామర సంపాదకురాలిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్య చరిత్రలో 1960, 70 దశకాలు రచయిత్రుల యుగం. కోస్తా నుంచి చెప్పుకోదగినంత మంది రచయిత్రులు ఈ కాలంలో విరివిగా రచనలు వెలువరించారు. అయితే ఉర్దూ రాజభాషగా ఉండటం వల్ల తెలుగు అక్షరాస్యత తక్కువగా ఉన్న తెలంగాణ నుంచి కూడా ఈ కాలంలో కొంతమంది రచయిత్రులు తలెత్తుకుని నిలబడటం విశేషం. ఇందులో మాదిరెడ్డి సులోచన ఒక్కరే 72 నవలలు, 100 పైగా కథలు వెలువరించడం గమనించాల్సిన విషయం. ఆమె రచనలు వెలువడిన కాలం 1965–83. మాదిరెడ్డి సులోచన రచనలు పాఠకులకు అందుబాటులో లేకుండా పోయిన తరుణంలో సంగిశెట్టి శ్రీనివాస్ ఆమె కథలను సేకరించి, 2017లో తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ రీసెర్చ్ అండ్ రిఫరెల్ సెంటర్ తరఫున 20 కథలతో ఒక పుస్తకం వేశారు. ఆయన సేకరించిన మరో 32 కథలతో తెలంగాణ సాహిత్య అకాడమి ఈ పుస్తకాన్ని ప్రచురించింది. భార్యా కోపవతీ, పురుష లక్షణము, స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః, నేటి కథ, రంగప్రవేశం లాంటి కథలున్నాయిందులో. ‘మాదిరెడ్డి సులోచన కథల్లో శైలి సాఫీగా సాగుతుంది. మామూలు విషయమైనా ఇతివృత్తాన్ని ఆసక్తికరంగా మార్చే నైపుణ్యం వుంది’ అంటారు ముందుమాటలో ముదిగంటి సుజాతారెడ్డి. -
దొరసాని – కిన్నెరసాని
సురవరం ప్రతాపరెడ్డి ఒకసారి విశ్వనాథ సత్యనారాయణకు కొంత ఆర్థిక సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఆయనను ఒక సంస్థానాధీశురాలి దగ్గరికి తీసుకెళ్లారు. నాడు సంస్థానాధీశులకు సివిల్, క్రిమినల్ అధికారాలు ఉండేవి. నాటి మర్యాదలను అనుసరించి ఆమె పరదాకు ఆవైపు, ఇవతలివైపు విశ్వనాథ కూర్చున్నారు. ‘‘మీరు చాలా సంప్రదాయికులనీ, మంచి కవిత్వం వ్రాస్తారనీ విన్నాను. కానీ మీరు ‘సాని’ పాటలు కూడా వ్రాశారేమిటండీ?’’ అని ప్రశ్నించిందామె. ఆమె తన ‘కిన్నెరసాని’ పాటలను గూర్చి అడుగుతున్నదని విశ్వనాథకు అర్థమైంది. ‘‘అమ్మా! అది ఈ ప్రాంతంలో ఒక వాగు పేరు. ఆ పేరుతో పాటలు వ్రాశానే గాని, వాటిల్లో ఎలాంటి అశ్లీలమూ లే’’దని ఎంతచెప్పినా ఆమె వినిపించుకోలేదు. ‘మీరు ఎన్నైనా చెప్పండి సాని సానే’ అని ముక్తాయించింది. ఇది విశ్వనాథ అహాన్ని దెబ్బ తీసింది. ‘‘అమ్మా, ఇందాకటినుంచీ పనివాళ్లు మిమ్మల్ని దొరసానీ! అని పిలుస్తున్నారు గదా, దాని సంగతేవిటి? ఇక వస్తాను, సెలవు’’ అని లేచి వచ్చేశారు. ఇది చూస్తున్న ప్రతాపరెడ్డి, ‘‘ఎంతపని చేశావయ్యా, ఆమె కోపిస్తే ఏమైనా చేయవచ్చు’’ అన్నారట. అందుకు విశ్వనాథ, ‘‘ఆ ఏం చేస్తుంది, చంపుతుందా? నిజం చెప్పడానికి భయపడటం కన్నా చావడమే నయం’’ అన్నారట. అప్పుడు ప్రతాపరెడ్డి నవ్వుతూ, ‘‘ఏది ఏమైనా మీరీ వేళ నూటపదహార్లు పోగొట్టుకున్నారు’’ అన్నారట. అందుకు విశ్వనాథ ‘‘నా అభిమానాన్ని మాత్రం పోగొట్టుకోలేదు, అదే నాకు పదివేలు’’ అన్నారట. (పురాణం ‘విశ్వనాథ ఒక కల్పవృక్షం’ ఆధారంగా) డి.వి.ఎం.సత్యనారాయణ -
నువ్వూ నేనూ ఒకటే
అకస్మాత్తుగా తన జేబు ఎవరో లాగినట్లయ్యి వెనక్కు తిరిగాడు. అతని కుడిచెయ్యి దానంతటదే ఏదో వస్తువునో జంతువునో పట్టుకున్నది. ఆ గుడ్డివెలుతురులో మెల్లగా తానొక కుర్రవాడి చెయ్యి పట్టుకొని వున్నానని గ్రహించాడు. అతను తెనాలి స్టేషనులో ప్లాట్ఫారం మీద కూచుని వున్నాడు. పేరు ప్రసాదరావు. మెడ్రాసువెళ్లే మెయిలు కోసం ఎదురుచూస్తున్నాడు. ఎవరినో పంపించటానికి వచ్చాడు. రాత్రి తొమ్మిది గంటలవుతున్నది. బండి రావటానికి అరగంట టైమున్నది. ముందు జాగ్రత్త వున్న ప్రయాణీకులు అప్పుడే ప్లాట్ఫారం మీద నిండారు. ప్రసాదరావు గొంతుకు కూర్చుని వున్నాడు. అతనికి కొంచెం దూరంలో పక్కచుట్ట మీద కుదురుగా కూర్చునివున్నారు పూర్ణచంద్రరావు. ఆయనకు కొంచెం దూరంలో ఆయన భార్య చతికిలబడి వున్నది. ఆమె ఒక మాంసపు ముద్ద. వాళ్లిద్దరిని చూడగానే లక్ష్మీదేవి దయ వాళ్లమీద లేకపోలేదని తోస్తుంది. పూర్ణచంద్రరావు గారికి మెడ్రాసులో ఏదో మంచి ఉద్యోగం అయిందట. గంపెడు సామాన్లతో బండి ఎక్కడానికి సిద్ధంగా వున్నారు. పూర్ణచంద్రరావు ఇందాకటినుంచి ఏదో మాట్లాడుతూనే వున్నారు. అతను ఊకొడుతూనే ఉన్నాడు. చేయబోయే ఉద్యోగం సంగతి, ఇళ్లు దొరకటం ఎంత కష్టమో, ఆంధ్రుల అరవల తగాదాల సంగతి... ఆఖరుకు ఆయన ఏం చెబుతున్నది కూడా వినటం మానేశాడు అతను. అతని ధ్యాసంతా ఒక బలవత్తరమైన సమస్యపై కేంద్రీకరించబడి వున్నది. సమస్య కొత్తదేమీ కాదు. వయస్సు వచ్చిన దగ్గర్నించీ బాధిస్తున్న సమస్యే. అర్జెంటుగా కొంత డబ్బు కావలసి ఉన్నది. డబ్బు ఎప్పుడూ కావలసిందే! కాని ఇప్పుడు ప్రత్యేకంగా అవసరం వచ్చింది. అతను ఆ సాయంత్రమే వెళ్లి పూర్ణచంద్రరావుగారిని డబ్బు అడిగాడు. ఆయన ఇస్తాననిగానీ, ఇంత ఇస్తాననిగానీ చెప్పలేదు. లేదనీ చెప్పలేదు. అందువల్ల అతను ఆశ పెట్టుకొనే ఉన్నాడు. కాని పక్షంలో లేదని చెప్పేవాడేగా? ఈ ఆశతోనే ఆ సాయంత్రమంతా ఆయనతో గడిపాడు. కాని మళ్లా డబ్బు ప్రస్తావన రాలేదు. అతనికి ఆ ప్రస్తావన తెచ్చే సాహసం లేదు. అసలు వచ్చి అడిగినందుకే పశ్చాత్తాప పడుతున్నాడు. అందువల్ల అతను మనస్సు ఎక్కడో పెట్టుకుని కాళ్లు గుదులు పట్టిన గుర్రంలా, ఉరకలెత్తుతున్న పూర్ణచంద్రరావు వాగ్దాటిని భరించాడు. అప్పటికీ చాలక తమతో బాటు స్టేషనుకు కూడా రమ్మన్నాడు. విసుగెత్తి తప్పుక పోదామని చూశాడుగానీ వీలుపడలేదు. డబ్బు లేక, ఉద్యోగం లేక డబ్బు అడగటానికి వచ్చిన వాడిమీద డబ్బు ఉండి, మంచి ఉద్యోగం ఉండి, అప్పు పెట్టగలిగిన వానికుండే ఆధిక్యత పూర్ణచంద్రరావుకు అతని మీద ఉంది. జరుగుతున్నదంతా అతనికి ఒక కల మాదిరిగా ఉంది. ఎందువలనోగాని అతను ఆ డబ్బు అడగడానికి వచ్చిందీ, డబ్బు లేక కష్టాలు అనుభవించపోతున్నదీ తానేనని భావించలేకపోతున్నాడు. కాని ఒక ప్రక్క ఇదంతా తనకు సంభవించిందేనని తెలుసు. ఈ విధంగా అతను కొంతకాలం నుంచి రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నాడు. అందులో ఒక ప్రపంచం రెండోదాన్ని దూరం నుంచి మాత్రమే చూస్తున్నది. ఈ రెండు ప్రపంచాలకూ వంతెనలాగా డబ్బు అవసరం. సాయంత్రం పూర్ణచంద్రరావు మాటలు వింటూనే అతను డబ్బు దొరకటానికి ఇతర మార్గాలన్నీ ఆలోచించాడు. ఒక్కొక్క మార్గాన్నీ తీసుకుని పూర్వపరాలన్నీ ఆలోచించి, నిదానంగా ఒక్కొక్కదానికీ నీళ్లు వదులుకున్నాడు. ఆఖరుకు ఏమార్గం అనుసరించినా లాభం లేదని తెలుసుకున్న తర్వాత ఒక రకమైన ప్రశాంతిలో పడ్డాడు. అప్పుడు అతని మనస్సు ఇదివరకు అతను ఎన్నడూ గమనించని విషయాలు గమనించసాగింది. మాట్లాడేటప్పుడు పూర్ణచంద్రరావుగారి మూతి వంకరగా ఒక ప్రక్కగా ఎందుకుపోతుందా అని ఆశ్చర్యపడసాగాడు. ఈ విషయాన్ని ఇదివరకు ఎందుకు గమనించలేదా అనుకున్నాడు. అతని అవ్యక్తంలో కదులుతున్న నీడ కొంచెం చిక్కనయింది. ఇంటివాడి ముఖం కనిపించింది. ‘ఏమండీ రెండు నెలల అద్దెబాకీ!’ కానీ అది అంత కష్టమైన విషయం కాదు. ఇంటివాణ్ని ఎలాగో మాటలతో సరిపుచ్చవచ్చు. ఇబ్బంది కిళ్లీకొట్టువాడితోనే. ఇరవై ఏడు రూపాయలు. వాడి కొట్టెంత కొట్టు? వాడికి తన మీద ఎంత నమ్మకం? ఉలకడు. పలకడు. మొన్న మాత్రం ‘బాబుగారూ! లెక్క యిచ్చారు కారు. కొంచెం ఇబ్బందిగా ఉంది’ అన్నాడు. ‘కొంచెం’ అన్నాడంటే ఎంత ఇబ్బందిగా ఉండి ఉండాలి! అతను గొంతుక్కూర్చున్న వాడల్లా కదిలాడు. నడుము నొప్పిపట్టినట్టుంది. భారమంతా మోయటం వల్ల కుడికాలు బొటనవ్రేలు నరం లాగుతున్నది. అకస్మాత్తుగా బ్రహ్మాండమైన కెరటంలా బాహ్య స్మృతి అతనిమీద విరుచుకు పడింది. బండి వస్తున్నట్లుంది. ప్లాట్ఫారం రూపం మారిపోయింది. వందలకొలది తలకాయలు లేచి నుంచున్నాయి. క్రింద కూర్చున్న అతనికి తన చుట్టూ భూమిలోంచి లెక్కలేనన్ని చెట్లు మొలుచుకొచ్చి చూస్తుండగానే పెరిగి పెద్దవై ఆకాశమంత ఎత్తయినట్టు తోచింది. ఒక్క అరక్షణంలో అతనికీ, ఆ సాయంత్రం గడిచిన గడియలకూ సంబంధం తెగిపోయి మధ్య అఘాతం ఏర్పడింది. పూర్ణచంద్రరావుగారి ‘బండి వస్తున్నది. లే’ కేకతోపాటు, తనంతటతానే లేచి నుంచున్నాడు. వందల కాళ్లూ చేతులూ పెట్టెల దరవాజాల దగ్గర కొట్టుకోసాగినై. అతను నడవ నవసరం లేకపోయింది. గట్టిగా ఊపిరి పీల్చి తెప్పరిల్లి చూచేటప్పటికి రెండవ తరగతి పెట్టె ముందు కమ్మీలు పట్టుకొని నిలబడివున్నాడు. లోపల ఒక సీటు మీద బెడ్డింగు సగం పరుచుకొని పూర్ణచంద్రవుగారి భార్య నిండుగా కూచుని వున్నది. పూర్ణచంద్రరావు వాకిట్లో నిలబడి ఏదో చెపుతూ జేబులో చెయ్యిపెట్టాడు. అతని దృష్టంతా చేతిమీదే వున్నది. ఆ చేయి మెల్లగా తన చేతిలో ఏదో పెట్టింది. ఐదు రూపాయల నోటు. అతను ఏమీ మాట్లాడలేకపొయ్యాడు. అతని మనసులో మొట్టమొదట కలిగిన భావం వద్దందామని. కానీ వద్దనలేక పొయ్యాడు. డబ్బు మీది ఆశ వలన కాదు. ఐదు రూపాయలు అతన్ని గట్టెక్కించలేవు. వద్దనే శక్తి లేకనే మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఇది ఒక అవమానం కింద లెక్కగాదు. ఇప్పుడు ఆయన ఐదు ఇచ్చినా వంద ఇచ్చినా ఒకటే. ఆ ఐదు తను తేలిగ్గా తిరిగి వచ్చివేయొచ్చు. కాని ఇచ్చినాయన బాధపడినట్టు మొఖం పెట్టడం, ఇద్దరి మధ్యా తప్పనిసరిగా పెంచుకోవలసిన ద్వేషం, ఇవన్నీ తలచుకునేటప్పటికి అతనికి అసహ్యం వేసింది. ఆ పరిస్థితిలో అభిమానం ఒక ఆడంబరంగా తోచింది. ఇంకొకప్పుడయితే ఇలాంటిది జరిగిన పక్షంలో నొచ్చుకుని ఉండేవాడేమో? ఇప్పుడు అలా అనిపించలేదు. సాయంత్రం నుంచి జరుగుతున్నదానికి క్రమానుగతమైన పర్యవసానంలా తోచింది. రైలు కూతవేసింది. పూర్ణచంద్రరావు వెళ్లొస్తానని చెప్పారు. చెయ్యి ఊపటానికి కూడా సిగ్గు వేసింది. దూరంగా చీకట్ల సుడిగుండంలో మాయమవుతున్న మొఖాలను చూస్తూ నిలబడ్డాడు. ఒక నిమిషం తరువాత అక్కడ ఏమీలేదు. అతను వెనక్కు తిరిగి, ఆ యాతన నుంచి బయటపడి, వంతెన మెట్లు ఎక్కసాగాడు. ఇక ఇప్పుడు తొందర లేదు. మెల్లగా ఇష్టం వచ్చినప్పుడే గదికి చేరుకోవచ్చు. అకస్మాత్తుగా రాత్రి యొక్క సమ్మోహన విద్యుత్సS్పర్శ అనుభవించాడు. నగరమంతా మెలకువకూ నిద్దరకూ మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలా ఉంది. ఈపాటికి ఎక్కువమంది నిద్రపోయి ఉండరు. అంతా నిద్రల నీలవనంలో ప్రవేశించటానికి వుంకిస్తూ వుండి వుంటారు. ఈ నీడల నాటకరంగం మీద జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్లందరూ ఒకే హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతినిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడెవ్వడూ ఉత్తచేతులతో తిరిగి వెళ్లడు. ఇదే రోజువారీగా చేసే యాత్రల గమ్యస్థానం. అకస్మాత్తుగా తన జేబు ఎవరో లాగినట్లయ్యి వెనక్కు తిరిగాడు. అతని కుడిచెయ్యి దానంతటదే ఏదో వస్తువునో జంతువునో పట్టుకున్నది. ఆ గుడ్డివెలుతురులో మెల్లగా తానొక కుర్రవాడి చెయ్యి పట్టుకొని వున్నానని గ్రహించాడు. ఆ కుర్రవాడికి 14, 15 ఏళ్లుంటాయ్. అతను నడిచివచ్చిన చీకటంత నల్లగా ఉన్నాడు. వీడికేదో జబ్బు అనుకొనేటంత సన్నగా వున్నాడు. ఆకలి మొఖం మీద తాటికాయంత అక్షరాలలో రాసివున్నది. చిరిగిన చొక్కా వేసుకొని వున్నాడు. వాడి కుడిచేతిలో అతని జేబులోంచి ఇప్పుడే తీసిన ఐదు రూపాయల నోటు నలిగి గట్టిగా చిక్కుకుని వున్నది. వాడు దాన్ని ప్రపంచమంతా లాక్కోటానికి వచ్చినా వదలకుండా వుండేటంత దృఢనిశ్చయంతో పట్టుకొని వున్నాడు. ఆ కుర్రవాడు క్రమంగా అతని దృష్టిలోంచి కరిగిపోయి, అతని నిర్దాక్షిణ్యాన్ని దూషిస్తున్నట్టూ, దేశకాలాలు మరిపించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. క్రమేపీ ద్వేషం లేని కోపం, ప్రత్యేకమైన లక్ష్యం లేని జాలి, జాలితో కూడుకున్న అసహ్యం, ఇంకా అనేక మనోభావాలు విరుచుకుపడి అతని మనఃస్థితిని ముంచెత్తాయి. వాటి బరువు క్రింద అల్లల్లాడిపొయ్యాడు. వాటి బ్రహ్మాండమైన ఆకారం ముందు అతను విశ్వరూపాన్ని సందర్శించిన వానిలా తన అల్పత్వాన్ని గుర్తించాడు. ఒక్క క్షణం అతను అన్ని మెట్టపల్లాలు అధిగమించి ఆ కుర్రవాడితో సంపూర్ణ తాదాత్మS్మం అనుభవించాడు. తనే జేబుదొంగననీ, ఆ కుర్రవాడి జేబు తనే కొట్టినట్టూ అనుకున్నాడు. ఈ విశాల భూతలం మీద కళ్లు తెరచిన రోజునుంచీ నేటి వరకూ ఎన్నడూ అనుభవించని ఏకత్వాన్ని ఆ క్షణంలో సాధించగలిగాడు. అతనికిప్పుడు ప్రపంచమంటే అసంతృప్తి లేదు. అకస్మాత్తుగా ఆ కుర్రవాడి భుజం మీద చెయ్యి వేసి బుజ్జగించాలనీ, దగ్గరకు తీసి లాలించాలనీ కోరిక కలిగింది. కుర్రవాడి చెయ్యి వదిలి భుజం మీద చెయ్యి వేయటానికి చెయ్యిజాచాడు. కుర్రవాడు గిరుక్కున పిల్లిలా వెనక్కు తిరిగి చీకటిలో మాయమయ్యాడు. వాడు ఐదు రూపాయల నోటును గుప్పెటతో అలాగే పట్టుకొని వున్నాడు. అతడు కుర్రవాడు మాయం కావడం చూస్తూ నిలబడ్డాడు. కవీ కథకుడూ ఆలూరి బైరాగి (1925–1978) ‘జేబుదొంగ’ కథకు సంక్షిప్త రూపం ఇది. సంక్షిప్తం: సాహిత్యం డెస్క్. ఇందులోని చిక్కటి కవిత్వాన్ని అనుభవించాలంటే మాత్రం పూర్తి పాఠం చదవాల్సిందే. ‘ఆగమ గీతి’, ‘నూతిలో గొంతుకలు’ కవితా సంపుటాలు, ‘దివ్య భవనం’ కథాసంపుటి బైరాగి ప్రసిద్ధ రచనలు. -
జీవితంతో అక్కాచెల్లెళ్ల ఆటలు
ప్రదానపుటుంగరం తానే కొనేసుకుని, రిచర్డ్ తనని పెళ్ళి చేసుకొమ్మని అడుగుతాడనుకున్న 33 ఏళ్ళ ఛార్లెట్ (లాట్టీ) ఆశలని వమ్ము చేస్తూ ఆ ప్రసక్తే ఎత్తడు అతను. అక్క ఫిలిస్కి ఫోన్ చేసి వెక్కుతూ, ‘రిచర్డ్ పెళ్ళి గురించి మాట్లాడలేదు. అతనితో మూడేళ్ళు గడిపాను’ అని చెప్తుంది లాట్టీ. ‘తన విడాకుల సమస్యతోనే తలమునకలవుతున్న ఫిలిస్కు ‘ఏ బోయ్ఫ్రెండుతో సంబంధం తెగిపోయినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, ఆ తరువాత పశ్చాత్తాపపడే అలవాటు లాట్టీకి’ అని తెలుసు. కొన్ని రోజుల్లోనే, 15 ఏళ్ళ పాత స్నేహితుడైన బెన్, లాట్టీకి ఫోన్ చేసి ‘ముప్పై ఏళ్ళొచ్చేవరకూ మనిద్దరికీ పెళ్ళి కాకపోతే మనం పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం కదా!’ అన్న తమ ఒప్పందాన్ని గుర్తు చేస్తాడు. లాట్టీకి బెన్ గురించి తెలిసినది శూన్యం. తన పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో అతణ్ని ఒకసారి కలుసుకున్న తరువాత అతణ్ని చూడను కూడా లేదు. అయినప్పటికీ, మరింకేం ఆలోచించకుండా ‘పెళ్ళి అయ్యేవరకూ శృంగారం జరగదు’ అన్న షరతు పెట్టి, అదే రోజు పెళ్ళి చేసేసుకుంటుంది. తాము మొదటిసారి కలుసుకున్న ‘ఇకొనోస్’ అనే గ్రీక్ ఐలాండుకి హనీమూన్ గడపడానికి వెళ్ళిపోతుంది, ‘వెడ్డింగ్ నైట్’ నవల్లో. ఆ పెళ్ళి రద్దు చేయాలంటే, లాట్టీ హనీమూన్ జరగకూడదు కనుక, ట్రావెల్ పత్రిక ఎడిటర్గా పని చేస్తున్న ఫిలిస్ తన పరపతి ఉపయోగించి, కొత్తదంపతులు ఉంటున్న హోటెల్ యజమాని ‘నీకో’కి, వారిద్దరూ ఏకమవకుండా ఆటంకాలు కలిగించమని చెబుతుంది. ఆమె ప్రయత్నాలకి తోడుగా బెన్ స్నేహితుడైన లోర్కాన్ కూడా యీ పెళ్ళికి వ్యతిరేకే. అతనికి బెన్ అపరిపక్వత, సంబంధాలకు కట్టుబడి ఉండలేకపోయే స్వభావం తెలుసు. లోర్కాన్, ఫిలిస్, ఫిలిస్ కొడుకు నోవా– బెన్, లాట్టీలు ఉండే హోటెల్కు వెళ్తారు. లోర్కాన్, ఫిలిస్ మాట్లాడుకుంటూ– తమ తమ విడాకుల్లో ఎదురయిన కష్టాల గురించి చెప్పుకుంటారు. ఫిలిస్, ‘నా మనస్సు బొబ్బలు కట్టింది. అవి ఎవరికీ కనబడవు’ అంటుంది. ‘విడాకులు నియంత్రిత విస్ఫోటం వంటివి. దానికి బయటున్నవారందరూ సరిగ్గానే ఉంటారు’ అంటాడు లోర్కాన్. ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటారు. కొత్తజంటకి నీకో కలిపించిన సమస్యలు– గదిలో బిగ్గరగా టీవీలో వస్తున్న పిచ్చి ప్రోగ్రాములని ఆపుచేయలేకపోవడం, డబుల్ బెడ్కి బదులు రెండు మంచాలు దూరదూరంగా వేసి ఉండటం వంటి హాస్య సంఘటనలు. అతనికి సహకరించిన అతని స్టాఫ్ పుణ్యమా అని వివాహం సంపూర్ణం అవదు. ఆశాభంగం కలిగిన జంట, తాము తొలిసారి కలుసుకున్న గెస్ట్హౌస్ అయితే నయం అనుకుని అక్కడికి వెళ్తారు. అక్కడ పోట్లాడుకుని తము పెళ్ళి చేసుకోవడమే తప్పనే నిర్ణయానికి చేరి, ‘పోనీ, ఆఖరిసారి హోటెల్లోనే ప్రయత్నించి, ఆ తరువాత విడాకులు తీసుకుందాం’ అనుకుంటారు. అలా అవడానికి ముందే నీకో, ఫిలిస్తో ఫోన్లో మాట్లాడుతూ– తను వారి మొదటిరాత్రికి ఎలా అడ్డుపడ్డాడో అని చెప్పడం వింటుంది లాట్టీ. ఫిలిస్ తన బృందంతో పాటు చెల్లెల్ని కలుసుకోడానికి వచ్చినప్పుడు, లాట్టీ అక్కను క్షమించదు. అప్పుడు రిచర్డ్ వచ్చి, తనని పెళ్ళి చేసుకొమ్మని లాట్టీని అడుగుతాడు. విడిపోయిన ప్రేమికులు వొకటవుతారు. ఫిలిస్ లోర్కాన్తో పాటు డ్రింక్స్ కోసం వెళ్తుంది. ఇద్దరి మధ్యా సంబంధం తలెత్తుతోందన్న రచయిత్రి సోఫీ కిన్సెలా సూచింపుతో, నవల ముగుస్తుంది. వేగంగా నడిచే కథ– అక్కా చెల్లెళ్ళిద్దరి దృష్టికోణాలతో చెప్పబడి, ముందుకీ వెనక్కీ నడుస్తుంటుంది. పుస్తకంలో హాస్యం, చమత్కారానికీ కొదవ ఉండదు. శైలి అద్భుతమైనది. డయల్ ప్రెస్ ఈ నవలని పబ్లిష్ చేసినది 2014లో. కృష్ణ వేణి -
ప్రతిధ్వనించే పుస్తకం.. పనికొచ్చే కథలు
మన్నవ గిరిధరరావు, గుంటూరు హిందూ కళాశాలలో రాజనీతి శాస్త్రాన్ని బోధించారు. ఉపాధ్యాయ వర్గం తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 1968–74 మధ్య ప్రాతినిధ్యం వహించారు. యువభారతి, భారతీయ మార్గము మాసపత్రికలకు సంపాదకత్వం వహించారు. వృత్తి రీత్యా, వ్యావృత్తి రీత్యా అనేక గ్రంథాలు, పత్రికలు చదవవలసి రావటంతో, వారు జ్ఞాపకార్థం రాసుకున్న నోట్సులను అవసరం తీరాక పారేయకుండా వాటిని పిట్టకథలుగా ఒక సంకలనంగా తీసుకు వస్తే బాగుంటుందనే సలహాతో 1985లో మొదటిసారి 116 పిట్టకథలతో ఈ పనికొచ్చే కథలని వెలుగులోకి తెచ్చారు. నా దగ్గరిది 2003 నాటి ఐదవ ముద్రణ. ఇందులో మరో వంద చేరి 218 అయినాయి. అమెరికా శాస్త్రవేత్త ఇసిడార్ ఐజాక్ రాబి 1944లో తన 46వ ఏట ఫిజిక్స్లో నోబెల్ అందుకున్నారు. ఆ సందర్భంగా తనని కలసిన పాత్రికేయులతో ఇలా చెప్పారు: ‘నా ఉన్నతికి కారణం మా అమ్మ. ఆమె నాకు పాఠాలు చెప్పలేదు, హోంవర్క్ చేయించలేదు. బడి నుంచి రాగానే ‘ఈ వేళ మీ మాష్టారును అడిగి ఏవైనా తెలియని విషయాలు తెలుసుకున్నావా?’ అని అడిగేది. మాష్టారుని ప్రశ్నించాలంటే, మర్నాడు చెప్పబోయే పాఠం ఆయన కన్నా ముందు నేను చదువుకొని అర్థం చేసుకోటానికి ప్రయత్నించి, ఆ సందర్భంలో ఎదురైన అడ్డంకులని ప్రశ్నలుగా సంధిస్తే నాకు ఇటు చదువూ వస్తుంది, అటు అమ్మ ముందు అబద్ధాలాడకుండా అమ్మ కోరిక నిజాయతీగా తీర్చిన వాడినీ అవుతాను’. కాశీమజిలీల నాటి రోజుల్లో మైళ్ళ కొలదీ నడచి వస్తున్న ఓ బాటసారికి మర్రి చెట్టు కనబడేసరికి సేదతీరాలనిపించి, చుట్టుపక్కలా శుభ్రం చేయసాగాడు. అంతటి మర్రిమానుకి చిన్న చిన్న పళ్ళు, బాటంతా విస్తరించి ఉన్న గుమ్మడి తీగకి పెద్ద పెద్ద కాయలు... దేవుడి తెలివి తక్కువతనానికి నవ్వుకుంటూ విశ్రమించాడుట. మెలకువ వచ్చేసరికి తన మీద పడివున్న మర్రిపళ్ళని చూసుకుని, తెలివితక్కువతనం భగవంతునిది కాదు, తనదని చెంపలు వాయించుకున్నాట్ట! ఒక ప్రత్యేకమైన జాతి కందిరీగ ఒకటి ఉన్నది. ఆ ఆడ కందిరీగ జీవితంలో ఒకేసారి గుడ్లను పెడుతుంది. మరొకసారి పెట్టక పోవటానికి కారణం: గుడ్లు పెట్టిన కొద్ది సేపటిలో అది చనిపోవాలి. పుట్టిన పిల్లలని కళ్ళారా చూసుకునే యోగం దాని ముఖాన ఎందుకు లేదో! ఐనా గుడ్డు పగుల కొట్టుకుని బయటకు వచ్చే పిల్లలకి ఇంగిత జ్ఞానం వచ్చే వరకూ బతకటానికి అవసరమైన ఆధరవుని ఏర్పరచి మరీ చచ్చిపోతుందట. గుడ్లు పెట్టబోయే సమయం ఆసన్నం కాబోతున్నదని శారీరకంగా పొడసూపగానే ఆ కందిరీగ చేరువలో దొరికే మిడుతను పూర్తిగా చంపకుండా ఆయువు పట్టున మాడుపగిలేలా కొట్టి, అచేతనావస్థ/కోమాలో ఉన్న దాన్ని తెచ్చి, పిల్లల్లో కాస్త కదలిక కలగగానే నోటికి అందేలా దీన్ని ఉంచుతుందిట. కోమాలో ఉన్న ఈ మాంసపు ముద్దని, పళ్ళు, గోళ్ళు ఇంకా రాని ఆ పసి కందులు ఎడాపెడా చిన్నాభిన్నం చేయకుండా నెమ్మదిగా చప్పరిస్తూ బతికి బట్టకడతాయట. ఇట్లాంటి పనికొచ్చే సంగతులెన్నో పుస్తకంలో ఉన్నాయి. సాయి పీవీఎస్ -
తాపీ, సున్నం, రాళ్లబండి...
రచయితలు తాపీ ధర్మారావు, సున్నం వీర్రాజు, రాళ్లబండి కుటుంబరావు తదితరులు 1966లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని కలిశారు. విశాఖపట్నంలో ‘కవితా సమితి’ శాశ్వత భవన నిర్మాణానికి ‘కాసు’ల కోసం ఆయన్ని సంప్రదించారు. సాహిత్యవేత్త కాకపోయినప్పటికీ బ్రహ్మానందరెడ్డి ఛలోక్తులు విసరడంలో దిట్ట. ‘ఖజానాలో కాసుల కొరత ఏర్పడింది’ అని చెబుతూ– ‘సున్నం’ ఉండీ, ‘తాపీ’ ఉండీ, ‘రాళ్లబండి’ కూడా ఉండీ సొంతభవనం నిర్మించుకోలేరా? అని హాస్యమాడారు. మరోసారి చూద్దాం లెండని పంపేశారు. రచయితల ఇంటిపేర్ల తమాషా ఇది. ఈమధ్యే నిర్యాణం చెందిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంచి సాహితీవేత్త. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉద్యోగులు జీతాలు పెంచి తమను ‘కరుణి’ంచండని ఓ అర్జీని సమర్పించారు. అందుకు ఆయన నవ్వుతూ– ‘కరుణ’ ఉంది కానీ ‘నిధి’ లేదు అని బదులిచ్చి, ఖజానా పరిస్థితి మెరుగైనప్పుడు చూద్దామన్నారు. ఉద్యోగులు పేషీ నుంచి నిష్క్రమించారు. వాండ్రంగి కొండలరావు -
గ్రేట్ రైటర్ (హెన్రిక్ ఇప్సెన్)
నార్వేలో జన్మించాడు హెన్రిక్ ఇప్సెన్ (1828–1906). మొదట్లో ‘బలవంతపు అబార్షన్’లాగా నాటకాలు రాశాడు. అందులో జాతి నిర్మాణం కోసం పాటుపడాలన్న ధోరణి కనబడేది. తర్వాత్తర్వాత నాటకానికి మనో విశ్లేషణను అద్ది, రంగస్థల ఫ్రాయిడ్ అనిపించుకున్నాడు. షేక్స్పియర్ తర్వాత షేక్స్పియర్ అంతటివాడు అనిపించుకున్నాడు. సామాజిక ప్రాధాన్యతలకు కూడా ఆయన నాటకాల్లో చోటున్నా దానికిమించిన మానవీయ అంశకు పెద్దపీట వేశాడు. నిర్ణయాలు తీసుకోవడంలో డైలమా, ఇంకెలాగో బతకాలనే ద్వంద్వం, స్వీయ సామర్థ్యాన్ని అంచనా వేసుకోలేని స్వభావం, రోజువారీ చీకటి, గుడ్డిగా అనుకరించే తత్వం, అన్నీ వుండీ నిరంతరం వెంటాడే శూన్యం, చచ్చిపోయాకగానీ బతకలేదన్న గ్రహింపునకు రావడం... ఇట్లాంటివన్నీ ఆయన నాటకాల్లో చూపించాడు. ఉల్లిగడ్డ పొరల్లాగా విప్పుతూపోతే మనకుగా ఏమీ మిగలనితనాన్ని గురించి కూడా రాశాడు. వెన్ వి డిడ్ అవేకెన్, పిల్లర్స్ ఆఫ్ సొసైటీ, ఘోస్ట్స్, ద వైల్డ్ డక్, ద లేడీ ఫ్రమ్ ద సీ, ద ప్రిటెండర్స్, బ్రాండ్, పీర్ జైంట్, ఎంపరర్ అండ్ గెలీలియన్, హెడ్డా గాబ్లర్ ఆయన కొన్ని నాటకాలు. పెళ్లంటే చట్టబద్ధ వ్యభిచారమనీ, వివాహం బేరసారాల మయమనీ బోలెడన్ని బోల్డు స్టేట్మెంట్లు ఇచ్చిన ఇప్సెన్, స్త్రీవాదానికి ఊతమిచ్చాడు, ప్రత్యేకంగా స్త్రీవాది కాకపోయినా. దేనికైనా చట్టాలు, సంస్థాగత పరిష్కారాల కన్నా వ్యక్తి తనకు తానుగా మారాలన్నది ఆయన అభిమతం. -
పాలాశ కుసుమం వృథా
సంస్కృత మహాకావ్యాలకు వ్యాఖ్యానం రచించిన మల్లినాథ సూరి తండ్రేమో మహా పండితుడు. ఈయనకు మాత్రం విద్యాగంధం అబ్బలేదట. పెళ్లయ్యాక ఆయన జీవితం మారిపోయింది. ఓరోజు అత్తారింటికి వెళ్తే, పూజకు పూలు తెమ్మని కోరింది భార్య. ఎర్రగా మెరుస్తున్న మోదుగుపూలను తెచ్చాడు. ఈయనకు శాస్త్రజ్ఞానం లేదని గ్రహించి, ఈ శ్లోకం చెప్పింది భార్య. రూప యౌవన సంపన్నా, విశాల కులసంభవా విద్యావిహీన శోభంతే, పాలాశ కుసుమం వృథా –ఇదేమిటో సూరికి అర్థం కాలేదు. కానీ అసాధారణ ధారణ వల్ల పాదాలు గుర్తుపెట్టుకుని, ఊళ్లోని మరో పండితుడిని అర్థమడిగాడు. ‘అందము, యౌవనము కలిగి ఎంత మంచి వంశంలో జన్మించినా, విద్య లేకపోతే శోభించడనీ, అలాంటివాడు పూజకు పనికిరాని మోదుగుపువ్వు లాంటివాడనీ అర్థం చెప్పాడాయన. తనకు చదువు లేదని భార్య ఎత్తిపొడిచిందని అర్థం చేసుకున్న సూరి ఎవరికీ చెప్పకుండా కాశీకి వెళ్లిపోయి, పన్నెండు సంవత్సరాల పాటు చదువుకుని, తిరిగి అత్తగారింటికి వచ్చి, వారి అరుగు మీద కూర్చున్నాడు. ఎవరో యాత్రికుడనుకుని ఇంట్లోకి భోజనానికి పిలిచారు. భార్యే వడ్డించింది. చారులో ఉప్పు లేదు. అప్పుడు సూరి– చారు చారు సమాయుక్తం హింగు జీర సమన్వితం లవణ హీన నరుచ్యంతే పాలాశ కుసుమం వృ«థా (చారు ఎంత కంటిగింపుగా ఉన్నా, ఇంగువా జీలకర్రా వేసినా, ఉప్పు లేకపోతే రుచిగా ఉండదు. అది పనికి రాని మోదుగు పువ్వుతో సమానం) అని శ్లోకం చెప్పగానే, ‘పాలాశ కుసుమం వృ«థా’ మాట ఎక్కడో విన్నట్టుగా ఉందే అని ఆయన ముఖం వంక తేరిపార జూసి, అతిథి భర్తే అని గ్రహించి, మహాపండితుడై తిరిగి వచ్చినందుకు ఆమె పరమానంద పడిందని కథ. డి.వి.ఎం.సత్యనారాయణ -
పేదరికమే నీ రహస్య కవల
1984. పల్లెటూరైన ధనౌలో పేదరికంలో మగ్గే కవిత, జసూ దంపతులకు మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది. ‘జసూ పిల్లని పారేస్తాడు’ అని అనుభవపూర్వకంగా తెలిసిన కవిత, పుట్టిన బిడ్డకు ‘ఉష’ అన్న పేరు పెడుతుంది. ‘తన తల్లిదండ్రులెవరో తెలియకపోయినా ఇబ్బంది లేదు. కనీసం, పిల్ల బతికే అవకాశం ఉంటుంది’ అనుకుని, భర్తకు తెలియనీయకుండా దూరాన్న ఉండే అనాథాశ్రమానికి కూతుర్ని అప్పగిస్తుంది. క్రిష్ణన్ (క్రిస్) బొంబాయి ధనిక కుటుంబానికి చెందిన న్యూరో సర్జన్. భార్య సోమర్, 30లలో ఉన్న అమెరికన్ డాక్టర్. వైద్యపరమైన సమస్య వల్ల పిల్లల్ని కనలేకపోతుంది. క్రిస్ తల్లి సలహాతో– దంపతులు, అనా«థాశ్రమంవారు ‘ఆశ’ అని పిలిచే, సంవత్సరం వయస్సున్న ఉషను దత్తత తీసుకుని, కాలిఫోర్నియా తీసుకు వెళ్తారు. భారతీయుడిని పెళ్ళి చేసుకున్నప్పుడు కనిపించకపోయిన సాంస్కృతిక తేడా ఆశను పెంచడంలో ఎదురవుతుంది సోమర్కు. ఆశాను స్కూలు నుండి తెస్తున్నప్పుడు, ఇతర తల్లులు ఆమెను కేవలం ‘ఆశా తల్లి’ గా మాత్రమే గుర్తిస్తారు. స్కూల్ మీటింగులకు సోమర్ వద్ద సమయం ఉండదు. ‘తల్లి అవడం, నా వృత్తి కూడా నన్ను నిర్వచించలేకపోతున్నాయి. రెండూ నాలో భాగమే. కానీ కలవలేకపోయాయి’ అంటుంది. తల్లి నిర్లక్ష్యం నడుమ పెరిగిన ఆశ జర్నలిస్టు అయి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందడానికి మొట్టమొదటిసారి బోంబే వచ్చి, క్రిస్ తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. మురికివాడల గురించి పత్రికకు రిపోర్ట్ చేస్తున్నప్పుడు, మొదట తన జీవసంబంధమైన తల్లిదండ్రుల ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. వారు తనని అనాథాశ్రమంలో పెట్టి, మెరుగైన జీవితాన్ని అందించకపోయుంటే, తను ఇప్పటికీ ఆ వాడల్లోనే ఉండేదని అర్థం చేసుకున్నప్పుడు తన ప్రయత్నం విరమించుకుంటుంది. అయితే, వారింకా తన గురించి బెంగ పడుతున్నారేమో అన్న అక్కరతో వారికోసం ఒక ఉత్తరం వదులుతుంది ‘సీక్రెట్ డాటర్’ నవల్లో. యీ లోపల ‘క్రిస్, నేనూ– సరస్సుకి రెండు వైపులా ఉన్న ఒడ్డుల మీద నిలుచున్నాం. మధ్యనున్న దూరాన్ని తగ్గించే శక్తి ఇద్దరికీ లేదు’ అనుకునే సోమర్, క్రిస్ విడాకులు పుచ్చుకుంటారు. దీనికి సమాంతరంగా నడిచే జసూ దంపతుల కథలో, కవితకు విజయ్ పుట్టాక వారు బోంబేకి మారుతారు. కవిత తన ‘రహస్య కూతురు’ గురించి మరచిపోదు. జసూ కూతురి గురించి తెలుకున్నప్పుడు, భార్యతో: ‘తన పేరిప్పుడు ఆశ. అమెరికాలో పెరిగింది. పత్రికలకు రాస్తుంటుంది. ఇది రాసినది తనే. మనతో ఉంటే తనిలా ఎదగగలిగేదా!’ అంటూ, పత్రికలో ఉన్న కాలమ్ చూపిస్తాడు. ‘నా పేరు ఆశ’ అని మొదలుపెట్టిన ఉత్తరాన్ని కవితకు అందిస్తాడు. తాత మరణించినప్పుడు, ‘మనం సృష్టించుకున్న కుటుంబమే మనల్ని కన్నదానికన్నా ఎక్కువ ముఖ్యమవుతుంది’ అని క్రిస్ ముందు ఆశ ఒప్పుకుంటుంది. ‘ఒక డాక్టరుగా, నా వృత్తి వల్ల నేను గర్వపడలేదు. ఒక భార్యగా, నేనేమీ చేయలేదు. తల్లిని అసలే కాను. నా లోకాన్ని ఎవరో తలకిందులా తిప్పేశారు’ అనుకున్న సోమర్– భర్తా, కూతురితో రాజీ పడుతుంది. కవిత, జసూ కూడా ఒకరికి మరొకరి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచుకుంటారు. ఆడపిల్లలు గుదిబండలు అనుకునే భారతదేశపు ఆలోచనా ధోరణిని చక్కగా చిత్రిస్తారు రచయిత్రి శిల్పి సోమయ గౌడ. ఇండియాను విమర్శించరు కానీ ఆధునిక భారతదేశంలో ఉండే లింగ అసమానతలను చూపుతారు. దత్తతకు ఉన్న సాంస్కృతిక గుర్తింపునూ, స్త్రీల పాత్రనూ విడమరచి చెప్తారు. ముప్పై భాషల్లోకి అనువదించబడిన రచయిత్రి యీ తొలి నవలను మోరో/హార్పర్ కాలిన్స్, 2010లో పబ్లిష్ చేసింది. కృష్ణ వేణి -
రారండోయ్
‘షేక్ మహమ్మద్ మియా, కె.ఎల్.నర్సింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక 2018 రొట్టమాకురేవు కవిత్వ’ అవార్డుల ప్రదాన సభ అక్టోబర్ 7న ఖమ్మం జిల్లా, కారేపల్లి, రొట్టమాకురేవులో జరగనుంది. స్వీకర్తలు: నారాయణస్వామి(వానొస్తద?), బొల్లోజు బాబా(వెలుతురు తెర), నిర్మలారాణి తోట(ఒక చినుకు కోసం). చిత్రకారుడు ఏలె లక్ష్మణ్కు సత్కారం, కొత్తతరం కవులతో సంభాషణ ఉంటాయి. అతిథులు: కె.శివారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, ఖమర్. అధ్యక్షత: ప్రసేన్. మొవ్వ వృషాద్రిపతికి ‘మహాకవి’ గడియారం వేంకట శేషశాస్త్రి స్మారక 37వ సాహిత్య పురస్కారాన్ని అక్టోబర్7న సాయంత్రం 5:30కు ప్రొద్దుటూరులోని అనీబిసెంటు పురపాలకోన్నత పాఠశాలలో ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: గడియారం కుటుంబీకులు మరియు రచన సాహిత్య వేదిక, కడప. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ‘నుడి–గుడి’ భాషా పరిశోధన గ్రంథం ఆవిష్కరణ అక్టోబర్ 14న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభ మినీ హాల్లో జరగనుంది. ఆవిష్కర్త: ఆచార్య ఎన్.గోపి. నిర్వహణ: రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ మరియు త్యాగరాయ గానసభ. సలీం ‘ఎడారిపూలు’, ‘మాయ జలతారు’ ఆవిష్కరణ అక్టోబర్ 7న ఉదయం 10:30కు విశాఖపట్నం పౌర గ్రంథాలయం మినీ హాల్లో జరగనుంది. ఆవిష్కర్త: ఆచార్య వి.సిమ్మన్న. నిర్వహణ: మొజాయిక్ సాహిత్య సంస్థ. సత్య–మూర్తి ఛారిటబుల్ ట్రస్ట్ వారు ‘మోదు గురుమూర్తి స్మారక పురస్కారం’ కోసం 2015–18 మధ్య ప్రచురించిన కవితా సంపుటాల 4 ప్రతులను అక్టోబర్ 31లోగా .. ట్రస్ట్, జుత్తాడ కాలనీ, పెందుర్తి, విశాఖపట్నం–531173 చిరునామాకు పంపాలని కోరుతున్నారు. నలుగురు కవులకు పురస్కార ప్రదానం నవంబర్ 19న. ఫోన్: 8333807116 -
ఏ గగనమో కురులు జారి...
తన సుందరిని వర్ణిస్తూ పాడుతున్నాడు రసికోత్తముడు. ‘రవివర్మకే అందని ఒకే ఒక అందానివో’. రవివర్మ కూడా కుంచెలోకి దించలేని రూపలావణ్యం! అందమైన అతిశయం. కవులు చేసేది అదేగా. అయితే ఈ పాటలో వేటూరి అసలైన కవిత్వం రెండో చరణంలో కనబడుతుంది. ‘ఏ గగనమో కురులు జారి నీలిమై పోయే ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే’. ఆకాశపు నలుపంతా ఆమె వెంట్రుకల్లోకి జారింది. ఉదయకాంతి ఆమె నుదుట చేరి కుంకుమగా మారింది. వినగానే ఆ రెండు భావచిత్రాలు కళ్లముందు మెదులుతాయి. ‘రావణుడే రాముడైతే’ చిత్రం కోసం ఇది వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ‘రవివర్మకే అందని ఒకే ఒక అందానివో/ రవి చూడని పాడని నవ్యనాదానివో’ పాట అని మీకు అర్థమైపోయే ఉంటుంది. గీత రచయిత పేరు తెలియకపోతే గనక ఈ మార్కు సి.నారాయణరెడ్డిది అనిపిస్తుంది. ఈ పాట పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి. సంగీతం జి.కె.వెంకటేశ్ సమకూర్చారు. 1979లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు దాసరి నారాయణరావు. జయచిత్ర, అక్కినేని నాగేశ్వరరావు ఈ పాటలోని నటీనటులు. -
జూలియస్ సీజర్
ఎప్పుడో నాలుగు శతాబ్దాల క్రితం షేక్స్పియర్ రాసిన చారిత్రక విషాదాంత నాటకం ‘జూలియస్ సీజర్’ నేటికీ ప్రదర్శితమవుతోంది. పాత్రల స్వరూప స్వభావాలను లోతుగా అధ్యయనం చేసి బరువైన సంభాషణలతో ఈ నాటకం రాశారు షేక్స్పియర్. సీజర్ గొప్ప వీరుడు. రోమ్ సైన్యాధిపతిగా ఉన్న సీజర్ ఓసారి ఆఫ్రికా నుంచి రోమ్ నగరానికి విజయగర్వంతో వస్తాడు. మార్గమధ్యంలో ఓ జ్యోతిష్కుడు ఎదురై ‘మార్చి 15వ తేదీ వస్తోంది, జాగ్రత్త’ అని హెచ్చరిస్తాడు. మూఢనమ్మకాలంటే గిట్టని సీజర్ ఆ మాటల్ని కొట్టేస్తాడు. సీజర్ బలపడుతున్నాడనీ, నియంతగా మారతాడనీ, గణతంత్రానికి గండి పడుతుందనీ భయపడిన వాళ్లలో బ్రూటస్ ఒకడు. రోమ్ నగర పెద్దలలో ఒకడైన కేషియస్... బ్రూటస్ను కలిసి సీజర్ను హతమార్చడమే తక్షణ కర్తవ్యమని బ్రూటస్ను సన్నద్ధం చేస్తాడు. మానవ స్వభావాన్ని అవపోసన పట్టిన సీజర్ ఓసారి బ్రూటస్ పక్కనే వున్న కేషియస్ను చూస్తాడు. తనకు ఆప్తుడైన ఆంటోనీతో ‘ఆ కేషియస్ను చూశావా? బక్కపలుచని శరీరం ఉన్నవాళ్లు, ఆకలిచూపుల వాళ్లు, ఎప్పుడూ అదేపనిగా ఆలోచిస్తుండేవాళ్లు, నవ్వలేనివాళ్లు, సంగీతాన్ని మెచ్చుకోలేనివాళ్లు ఎంతో ప్రమాదకరమైనవాళ్లు’ అంటాడు.సీజర్ హత్య జరగబోయే ముందురోజు రాత్రి అతని భార్య కాల్ఫూర్నియా ఓ పీడకల కంటుంది. సీజర్ను హత్య చేస్తున్నారు అని మూడుసార్లు బిగ్గరగా అరుస్తుంది. సెనేట్ సమావేశానికి గైర్హాజరు కమ్మని విన్నవిస్తుంది. ‘పిరికిపందలు మరణానికి ముందే అనేకసార్లు చస్తారు. వీరులు మరణాన్ని ఒక్కసారే చవిచూస్తారు. ప్రమాదం కంటే సీజర్ ప్రమాదకారి’ అంటూ సీజర్ జవాబిస్తాడు. సీజర్ సెనేట్ మందిరానికి వెళ్తాడు. కుట్రదారులు కత్తితో పొడుస్తారు. బ్రూటస్ది చివరి కత్తిపోటు. ‘బ్రూటస్ నువ్వు కూడానా’ అంటూ సీజర్ ప్రాణాలు విడుస్తాడు. సీజర్ అంత్యక్రియలకు ముందు ఓ కూడలిలో ప్రజలను ఉద్దేశించి బ్రూటస్, సీజర్పై నాకు ద్వేషం లేదు, అతనికి అధికార కాంక్ష పెరిగింది, ఆయన బతికివుంటే నియంతగా మారతాడు, మీరంతా బానిసలు అవుతారని వివరిస్తాడు. ఇంతలో ఆంటోనీ, సీజర్ పార్థివదేహాన్ని తీసుకొని వస్తాడు. ‘సీజర్కు మూడు సార్లు కిరీటం ఇచ్చినా తిరస్కరించాడు. ఇదేనా సీజర్ అధికార దాహం’ అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నిస్తాడు. నేను బ్రూటస్వంటి మాటకారినైతే సీజర్ గాయాలతో మాట్లాడించగలను, రోమ్ రాళ్లతో ప్రతిఘటించగలను అంటాడు. మేం తిరగబడతాం, అంటూ మృతదేహం వద్ద గుమికూడిన ప్రజలు గర్జిస్తారు. ఇదిలావుండగా ఆంటోనీ బలపరాయణుడని గుర్తించిన బ్రూటస్ భార్య పోర్షియా నిప్పులు మింగి చనిపోతుంది. తర్వాత ఆంటోనీ, బ్రూటస్ వర్గాల మధ్య పోరు సాగుతుంది. సీజర్ను పొడిచిన కత్తితోనే నౌకరు చేత పొడిపించుకుని కేషియస్ చనిపోతాడు. బ్రూటస్ తన కత్తితో తానే పొడుచుకుని చనిపోతాడు. అంతిమ విజయం ఆంటోనీ, అతని మిత్రుడు ఆక్టేవియస్ సీజర్ను వరిస్తుంది. ఆక్టేవియస్ రోమన్ సామ్రాజ్యాధిపతి అవుతాడు. గగుర్పాటు కలిగించే విధంగా అన్ని పాత్రలనూ తన శైలీ సంభాషణలతో షేక్స్పియర్ తీర్చిదిద్దిన నాటకం ఇది. వాండ్రంగి కొండలరావు -
జీవించి భయపెట్టారు
రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడైన బళ్లారి రాఘవ స్టేజీ మీద వచ్చే అవాంతరాలను తన సమయస్ఫూర్తితో సులువుగా దాటేసేవారని చెబుతారు. ఆయనోసారి ‘విజయనగర సామ్రాజ్య పతనం’ లో నటిస్తున్నారు. ఆయన వేస్తున్న వేషం పఠానుగా. చివరి సీనులో ఆషాబీని చంపాలి. మరి దేనితో చంపాలి? అదేదో స్టేజీ మీద పెట్టడం మరిచారు. సంభాషణలు చెబుతూ ఆ విషయం గమనించిన రాఘవ ఏమాత్రం తడబడకుండా, అదే ఊపును కొనసాగిస్తూ అక్కడే బల్లపై ఉన్న గాజుగ్లాసును తీసుకొని దాన్ని బద్దలుకొట్టి, తన చేతిని కొంత గాయపరుచుకుని, అదే రక్తపు చేయితో ఆషాబీ గొంతు నులిమినట్టు నటించారు. చూస్తున్న ప్రేక్షకులు నిజంగానే రాఘవ చంపేస్తున్నాడేమో అన్నంత భ్రాంతికి లోనయ్యారట. చంద్రగుప్త నాటకంలో చాణక్యుడిగా వేస్తున్నప్పుడు కూడా ఉన్నట్టుండి స్టేజీ మీదకు వచ్చిన కుక్కను ఉద్దేశించి రాఘవ, ‘శునకమా, వచ్చితివా, రమ్ము. ఈ శ్మశాన వాటిక నాదే కాదు నీది కూడా’ అని సందర్భోచితంగా పలికి సన్నివేశాన్ని రక్తి కట్టించారు. -
అలెగ్జాండర్ సోల్జెనిత్సిన్
అలెగ్జాండర్ సోల్జెనిత్సిన్ (1918–2008) రష్యన్ నవలా రచయిత, కథకుడు, చరిత్రకారుడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సోల్జెనిత్సిన్ తల్లి పెంపకంలో పెరిగాడు. సోవియట్ ప్రభుత్వాన్నీ, కమ్యూనిజాన్నీ నిశితంగా విమర్శించాడు. ప్రభుత్వ బలవంతపు కార్మిక క్యాంపుల వ్యవస్థ ‘గులాగ్’ వైపు మిగతా ప్రపంచం దృష్టిసారించేట్టు చేశాడు. సైన్యంలో పనిచేసిన సోల్జెనిత్సిన్, జర్మన్ మహిళలపై రెడ్ ఆర్మీ చేసిన దురాగతాలను ‘ప్రష్యన్ నైట్స్’ కవితలో వర్ణిస్తాడు. ‘మనమేమైనా మంచివాళ్లమా?’ అని కూడా ‘ద గులాగ్ ఆర్కిపెలగో’లో ప్రశ్నిస్తాడు. ‘బాస్’ (స్టాలిన్)ను విమర్శించడం, సోవియట్ వ్యతిరేక ప్రచారం చేయడం కారణాలతో ఆయనకు కారాగార శిక్ష పడింది. జైల్లో ఏది దొరికితే దానిమీదే రాశాడు. ఆయన కొన్ని రచనలు కృశ్చేవ్ హయాంలో మాత్రమే ప్రచురణకు నోచుకున్నాయి. కృశ్చేవ్ పదవీచ్యుతుడైన తర్వాత సోల్జెనిత్సిన్ మళ్లీ తన సృజన స్వేచ్ఛ కోల్పోయాడు. 1970లో నోబెల్ బహుమతి వరించినప్పటికీ, దేశం విడిచి వెళ్తే తిరిగి రానివ్వరేమో అన్న భయంతో స్వీకరించడానికి వెళ్లలేదు. అయినా నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం ఆయన్ని దేశం నుంచి బహిష్కరించింది. సోవియట్ రష్యా పతనం తర్వాత ఇరవయ్యేళ్లకు 1994లో మాత్రమే తిరిగి మాతృదేశంలో పాదం మోపగలిగాడు. 89వ ఏట చనిపోయేవరకు అక్కడే నివసించాడు. ‘వన్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇవాన్ డెనిసోవిచ్’, ‘ఆగస్ట్ 1914’, ‘కేన్సర్ వార్డ్’ ఆయన ప్రసిద్ధ రచనలు. -
గౌరవాన్ని తిన్న ఆకలి
ముసలితనం అంటే బాల్యం మళ్లీ తిరిగిరావడమే. నాలుక తప్ప మిగిలిన అన్ని జ్ఞానేంద్రియాల శక్తి కోల్పోయింది చిన్నమ్మ. ఆమె కాళ్లు, చేతులు, కళ్లు అన్నీ ఉడిగిపోయినై. ఇంట్లోవాళ్లు ఆమెకు వేళకు భోజనం పెట్టకపోయినా, చాలినంత పెట్టకపోయినా ఇల్లు అదిరేలా ఏడుస్తుంది. ఆమె భర్త పోయి చాలా కాలమైంది. కొడుకు కూడా తరుణప్రాయంలోనే చనిపోయాడు. చెల్లెలి కొడుకు పండిత్ బుద్ధిరామ్ తప్ప ఆమెకు ఎవరూ లేరు. అతడి దగ్గరే ఉంటోంది. ఆమెకున్న ఆస్తినంతా అతడి పేర రాసింది. రాసేముందు అతడు పెద్ద వాగ్దానాలే చేశాడుగానీ అన్నీ కల్లలైపోయాయి. ఆమె ఆస్తి వల్ల ఏడాదికి రెండు వందల రూపాయలకు తక్కువ ఆదాయం రాదు. అయినా ఆమెకు కడుపునిండా తిండే పెట్టరు. దీనికి బుద్ధిరామ్ను నిందించాలా, ఆయన భార్య రూపనా అన్నది అర్థం కాదు. బుద్ధిరామ్ నిజానికి బుద్ధిమంతుడే, డబ్బులను ఖర్చు పెట్టాల్సిన అవసరం రానంతవరకు. రూపకు ముక్కుమీదే కోపం. కానీ దైవభీతి పరురాలు. మొత్తం కుటుంబంలో చిన్నమ్మకు ఎవరిమీదైనా ప్రేమ ఉందంటే అది లాడ్లీ. బుద్ధిరామ్ ముగ్గురు పిల్లల్లోకీ చిన్నది. మొదటి ఇద్దరు మగవాళ్లు. తల్లిదండ్రులను బట్టే పిల్లల ప్రవర్తన ఉన్నట్టు ఈ ఇద్దరూ ముసలామెను ప్రతిదానికీ ఏడిపిస్తారు. ఒకడు గిచ్చి పరుగెడతాడు, ఇంకొకడు నీళ్లు జల్లుతాడు. ఇంట్లో ఏదైనా మిఠాయి చేసినప్పుడు అన్నలు గుంజుకుంటారని తన భాగాన్ని అమ్మమ్మ గదిలోకి వెళ్లి తింటుంది లాడ్లీ, తినుబండారాలు అంటే పడిచచ్చే అమ్మమ్మ తన మిఠాయిలో వాటా కోరుతుందని తెలిసీ. కానీ రౌడీ అన్నలు లాక్కునేదానితో పోలిస్తే అమ్మమ్మకు పోయేది తక్కువే కాబట్టి ఏం ఫరవాలేదు. రాత్రి వేళ. బుద్ధిరామ్ ఇంట్లో షెహనాయ్ వినిపిస్తోంది. ఊళ్లోని పిల్లలు కళ్లు పెద్దవి చేసుకుని దాన్ని ఆనందిస్తున్నారు. అతిథులకు క్షురకుడు మర్దన చేస్తున్నాడు. ఒక కవిగాయకుడు కవిత్వాన్ని వినిపిస్తుంటే, అతిథులు ‘వహ్వా’ ‘వహ్వా’ అంటున్నారు. ఇంగ్లీషు చదువుకున్న యువకులు ఈ మూర్ఖులతో కలవడం తమ స్థాయికి తగదని దూరంగా నిలుచున్నారు. ఈరోజు బుద్ధిరామ్ పెద్దకుమారుడు సుఖ్రామ్కు వరపూజ జరుగుతోంది. రూప విందు పనుల్లో హడావుడిగా ఉంది. మట్టిపొయ్యిల మీద పెద్ద మూకుళ్లు పెట్టారు. ఒకదాన్లో పూరీ, కచోరీ, ఇంకోదాన్లో రుచికరమైన కూరలు తయారవుతున్నాయి. నెయ్యి వాసన గాలితో వ్యాపిస్తోంది. తన గదిలో ఉన్న చిన్నమ్మకు ఈ వాసన సోకి ప్రాణం పోతోంది. నాకు కచ్చితంగా ఈ పూరీలు తేరు, అందరూ తినేసివుంటారు, నాకేమీ ఉంచరు అని తలుచుకుని ఆమె నీరయింది. ఏడుపొచ్చినా ఇంటికి అశుభమని దిగమింగుకుంది. అబ్బా, ఏం ఘుమఘుమ! నా గురించి ఎవరికి పట్టింది? ఎండిపోయిన రొట్టెలు పెట్టడానికే వాళ్లకు చేతులు రావు, ఈ తీపి పూరీలు నాకు వడ్డిస్తారా? లాడ్లీ ఇవ్వాళ ఇటువైపు రాలేదు. ఇద్దరు మగవాళ్లు మామూలుగానే రారు. అసలు ఇంకా ఏమేం వండుతున్నారో తెలిస్తే బాగుండు. పూరీలను తలుచుకోగానే చిన్నమ్మ నోట్లో నీళ్లూరినై. ఆమె ఊహలకు రెక్కలు వచ్చినై. బంగారు రంగులో కాలి, మృదువుగా తుంచుకోగలిగే పూరీలు ఆమె కళ్ల ముందు నర్తించినై. చిన్నమ్మకు వెళ్లి మూకుడు ముందు కూర్చోబుద్ధయింది. చేతులు నేలకు ఆన్చి, పాక్కుంటూ గడపదాటి బయటకు వచ్చి, మూకుడు ముందుకు చేరింది. రూప ఆ సమయంలో ఆత్రంగా ఒక గది నుంచి ఇంకో గదికీ, మూకుళ్ల దగ్గరికీ, భోజన సామగ్రి పెట్టిన చోటుకీ తిరుగుతోంది. ఎవరో వస్తారు, బుద్ధిరామ్ సాబ్ లస్సీ తెమ్మంటున్నాడని చెబుతారు. మరెవరో వస్తారు, ఇంకేదో ఇమ్మంటారు. ఈలోపు ఒకరు వచ్చి, ఇంకా భోజనాలకు ఎంత సమయం పడుతుందని అడుగుతారు. ఎవరి మీదా అరవడానికి లేదు. అరిచామా ఈ మాత్రం పనులు వెళ్లదీసుకోలేక పోయిందని బంధువులు దెప్పుతారు. దాహంతో ఆమె గొంతు తడారిపోతోంది. మూకుళ్ల వేడి ఒంటిని మాడుస్తోంది. గుక్కెడు నీళ్లు తాగడానికిగానీ విసనకర్రతో ఊపుకోవడానికిగానీ ఆమెకు తీరుబడి లేదు. ఆ సమయంలో ముసలామె మూకుడు ముందు కూర్చోవడం రూప కంటబడింది. ఆమె కోపం నాషాళానికి ఎక్కింది. ‘అప్పుడే నీ కడుపు కాలిపోతోందా? అది కడుపా, కయ్యా? కదలకుండా నీ గదిలో కూర్చోలేవా? ఇంకా చుట్టాలకే పెట్టలేదు, దేవుడికి పెట్టలేదు, ఈమె తయారయ్యింది. నీ నాలుక పడిపోను. ఒకరోజు తిండి పెట్టలేదంటే వేరేవాళ్ల ఇండ్ల మీద పడుతుంది. అందరూ ఈమెకు భోజనం పెట్టక మాడుస్తున్నామని అనుకుంటారు. ప్రాణమైనా పోదు, పాతకి!’ముసలామె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా పాక్కుంటూ వెనక్కి తన గదిలోకి పోయింది. భోజనాలు సిద్ధమైనాయి. విస్తళ్లు వేశారు. వడ్డనలు జరుగుతున్నాయి. పనివాళ్లు కూడా భోజనానికి వచ్చారు. కాకపోతే బంతితో కాకుండా దూరంగా కూర్చున్నారు. అందరి తినడమూ పూర్తయ్యేదాకా ఎవరూ బంతిలోంచి లేవకుండా ఉండటం మర్యాద. పనివాళ్లు తినడానికి ఎక్కువసేపు తీసుకుంటున్నారని ఒకరిద్దరు చదువుకున్న అతిథులు విసుక్కుంటున్నారు. ఎంగిలి చేత్తో ఊరికే కూర్చోవడంలో అర్థం లేదని వాళ్ల ఉద్దేశం. తను చేసిన పనికి ముసలామె సిగ్గుపడింది. రూపమీద ఆమెకు కోపం రాలేదు. కోడలు నిజమే మాట్లాడింది– అతిథులు తినకుండా ఇంట్లోవాళ్లు ఎలా భోంచేస్తారు? ఎవరైనా పిలిచేదాకా ఈ గదిలోంచి బయటకు వెళ్లకూడదనుకుంది. కానీ గాలిలో కలిసి వస్తున్న నెయ్యి వాసన ఆమె ఓపికను పరీక్షిస్తోంది. ఒక్కో క్షణం ఒక యుగంలా గడుస్తోంది. నోట్లో ఏదో పాడుకోవడానికి ప్రయత్నించింది. ఇంతసేపు తింటున్నారా అతిథులు? ఆమెకు ఏ శబ్దమూ వినపడలేదు. అందరూ తినేసి వెళ్లిపోయివుంటారు. నన్ను పిలవడానికి ఎవరూ రాలేదు. రూప కోపంతో ఉంది, ఆమె పిలవకపోవచ్చు. నేనే వస్తానని ఆమె అనుకుంటూండవచ్చు. నేనేమైనా బంధువునా ఆమె వచ్చి పిలుచుకుపోవడానికి. తనే వెళ్లడానికి సిద్ధపడింది వృద్ధురాలు. పూరీలు, కచోరీల తలంపు ఆమెను చక్కలిగింతలు పెట్టింది. చాలారోజుల తర్వాత ఇంట్లో పూరీలు చేశారు. కడుపారా తినేయాలని నిశ్చయించుకుంది. జిహ్వ చాపల్యమని ఎవరు అనుకున్నా సరే లెక్క చేయకూడదనుకుంది. నెమ్మదిగా చేతులు నేల మీద ఆన్చి, పాక్కుంటూ అరుగు మీదికి వెళ్లింది. కానీ అదృష్టం బాగాలేదు. ఆమె ఓపికలేని మనసు వేసిన లెక్క తప్పింది. అతిథులు ఇంకా తింటున్నారు. అప్పుడే తిన్నవాళ్లు వేళ్లు నాక్కుంటున్నారు. మిగిలిపోయిన పూరీలు ఎలా తీసుకెళ్లాలా అని కొందరు ఆలోచిస్తున్నారు. పెరుగు కానిచ్చి, మారు అడగటానికి మొహమాటపడుతున్నవాళ్లు కొందరు. సరిగ్గా ఈ సమయంలో వాళ్ల మధ్యకు వెళ్లింది. కొందరు ఉలిక్కిపడ్డారు. ఈ ముసల్ది ఎక్కడినుంచి ఊడిపడిందని కొందరు ఆశ్చర్యపోయారు. ఏమీ తాకకుండా చూడండని కొందరు అరిచారు. చిన్నమ్మను చూడగానే బుద్ధిరామ్కు మండిపోయింది. ఆమె అప్పటికే పూరీల పళ్లెం పట్టుకుంది. దాన్ని నేల మీదికి విసిరికొట్టాడు. అప్పు చెల్లించకుండా పారిపోతున్నవాణ్ని కఠినమైన వడ్డీ వ్యాపారి ఎలా పట్టుకుంటాడో అలా ఆమెను గదిలోకి లాక్కెళ్లాడు. వృద్ధురాలి కల క్షణంలో కరిగిపోయింది. అతిథులు తినడం పూర్తయింది. ఇంట్లోవాళ్లందరూ తిన్నారు. వాద్యకారులు, పనివాళ్లు కూడా తినడం అయింది. కానీ ముసలామెను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమె చేసిన సిగ్గుమాలినపనికి ఈమాత్రం శిక్ష పడవలసిందే అనుకున్నారు బుద్ధిరామ్, రూప. ఎవరూ ఆమె వయసు మీద దయచూపలేదు. ఆమె నిస్సహాయతను పరిగణనలోకి తీసుకోలేదు. లాడ్లీకి తప్ప ఎవరికీ ఆమె మీద ప్రాణం కొట్టుకోలేదు. తల్లి, తండ్రి ఇద్దరూ నానమ్మను అలా అనడం ఆ చిట్టితల్లికి ఏడుపు తెప్పించింది. ఆమెకు చేతినిండా పూరీలు ఇస్తే ఏం పోతుంది? అతిథులకన్నా ఆమె ముందు తింటే ఆకాశం భూమ్మీద కూలిపోతుందా? గదిలోకి పోయి ఓదార్చుదామనుకుందిగానీ వాళ్లమ్మకు భయపడి ఊరుకుంది. తనకు వడ్డించిన పూరీల్ని తన బొమ్మపెట్టెలో దాచుకుంది. రాత్రి పదకొండయ్యింది. రూప అరుగు మీద పడుకుంది. పూరీలు తింటున్నప్పుడు నానమ్మ కళ్లల్లో కనబడే సంతోషాన్ని తలుచుకుని లాడ్లీకి నిద్ర పట్టలేదు. అమ్మ నిద్రపోగానే నానమ్మ దగ్గరకు పోవాలనుకుంది. కానీ బయట చీకటిగా ఉంది. మట్టిపొయ్యిల్లోని నిప్పులు మాత్రమే వెలుగుతున్నాయి. అక్కడో కుక్క కూర్చునివుంది. తలుపు వెనకాల నిమ్మచెట్టు మీద లాడ్లీ చూపు పడింది. దానిమీద హనుమంతుడు కూర్చున్నట్టుగా అనిపించింది. తోక, గద స్పష్టంగా కనబడుతున్నాయి. భయంతో కళ్లు మూసుకుంది. అప్పుడే కుక్క లేచి నిలబడింది. అది లాడ్లీకి ధైర్యాన్నిచ్చింది. పడుకునివున్న మనుషులకన్నా నిద్రలేచిన కుక్కే ఆమెకు ఎక్కువ ధైర్యాన్నిచ్చింది. తన బొమ్మపెట్టెను తీసుకుని నానమ్మ గదిలోకి వెళ్లింది. కొండమీదకు ఎవరో లాక్కుపోతున్నట్టుగా కల కంటున్న వృద్ధురాలు ఉన్నట్టుండి మేల్కొంది. అతిథులంతా వెళ్లిపోయుంటారు. దేవుడా, తిండి లేకుండా ఈ రాత్రి ఎలా గడపడం? నాకు పూరీలు ఇస్తే వాళ్ల సంపదేమైనా తరిగిపోతుందా? ‘నానమ్మ, లే’ అంటున్న లాడ్లీ గొంతు విని హుషారుగా లేచి కూర్చుంది. లాడ్లీని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. లాడ్లీ పూరీలు చేతికిచ్చింది. ‘మీ అమ్మ ఇచ్చిందా?’ ‘కాదు, ఇవి నా వాటా’. ఐదు నిమిషాల్లో పూరీలు తినేసింది. కొద్దిపాటి వాన భూమ్మీది తాపాన్ని తగ్గించకపోగా వృద్ధి చేసినట్టు ఆ పూరీలు ముసలామె ఆకలిని మరింత పెంచాయి. ఇంకొన్ని తెమ్మని పాపను అడిగింది. అమ్మ కొడుతుందని భయపడింది చిన్నది. మిగిలిపోయిన తునకలు కూడా తిని, వేళ్లు నాక్కుంది ముసలామె. ఆకలి మరింత ఉధృతమైంది. విచక్షణ కోల్పోయేట్టు చేసింది. అతిథులు తిన్నచోటుకు పట్టుకెళ్లమని పాపను కోరింది. దేవుడా! అతిథుల ఎంగిలి విస్తళ్లలో మిగిలిపోయిన పూరీ ముక్కలను తీసుకుని తినసాగింది ఆ దీన హీన వృద్ధురాలు! వృద్ధాప్యం, శాపం. కళ్లు తెరిచిన రూపకు లాడ్లీ కనబడలేదు. ఆందోళనతో లేవగానే కనబడిన దృశ్యం ఆమెను స్తంభింపజేసింది. తన గొంతు కోస్తున్నప్పుడు ఆవు అనుభవించే లాంటి క్షోభను ఆమె అనుభూతించింది. ఎంగిలి విస్తళ్లలో చేయిపెట్టే ఖర్మానికి ఈ వృద్ధురాలిని తీసుకొచ్చానే! అయ్యో, ఈ ప్రపంచానికి ఏ విపత్తు రానున్నది? దయ, భయం ఆమె కళ్లల్లోంచి నీళ్లుగా జారినై. ఈ అధర్మానికి బాధ్యులెవరు? దేవుడా, నా బిడ్డల మీద దయ చూపించు. నేను చేసిన పాపానికి నన్ను శిక్షించకు. అయ్యో అయ్యో, ఇవ్వాళే నా పెద్దబిడ్డకు శుభకార్యం జరిగింది. వందల మంది భోంచేసి వెళ్లారు. ఎవరి ఆస్తినైతే మేము అనుభవిస్తున్నామో, ఆమెనే బిచ్చగత్తెను చేశామే! రూప దీపం వెలిగించింది. పళ్లెంలో పూరీలు నిండుగా పెట్టుకుంది. వృద్ధురాలి ముందు నిలబడి గద్గద స్వరంతో క్షమించమని ప్రార్థించింది. -
కొండంత పేదరికానికి మతిమరుపు శిక్ష
ఖాలిద్ హుస్సేనీ మూడవ నవల, ‘ద మౌంటెన్స్ ఎకోడ్’ కథ 1952లో మొదలవుతుంది. అఫ్గానిస్తాన్లోని ఓ కుగ్రామంలో అన్నాచెల్లెలు పదేళ్ళ అబ్దుల్లా, మూడేళ్ళ పరీ– తండ్రి సబూర్, సవతి తల్లి పర్వానీతో కలిసి ఉంటుంటారు. మూడో బిడ్డ ఈ లోకంలోకి రాబోతున్నప్పుడు, కటిక పేదరికాన్ని తప్పించుకోడానికి, సబూర్, ‘చేతిని కాపాడుకోడానికి ఒక వేలుని కత్తిరించేయక తప్పదు’ అని తనకు తాను నచ్చజెప్పుకుని, పిల్లలకు, ‘ఒక రాక్షసుడి కోపాన్ని చల్లార్చడానికి మనకిష్టమైన పిల్లనో, పిల్లాడినో బలిస్తే తప్ప ఊరిని నాశనం చేయకుండా ఉండడు’ అన్న కాల్పనిక కథ చెప్తాడు. పిల్లల్లేకపోయిన ధనవంతులైన సులేమాన్, నీలా దంపతులకి డ్రైవరూ, వంటవాడూ అయిన నబీ– సబూర్ బావమరిది. అతను పరీని వారికి అమ్మడంలో సహాయపడతాడు. పరీ మొదట కాబూల్లోనూ, ఆ తరువాత పారిస్లోనూ పెరిగి పెద్దదవుతుంది. అన్నాచెల్లెలు వేరయినప్పుడు, చిన్నపిల్లయిన పరీ ఇంటిని త్వరగానే మరిచిపోతుంది. కానీ అబ్దుల్లా పరీని తలుచుకోని క్షణం ఉండదు. అయితే, అతడి జీవితం గురించి పాఠకులకు పరిచయం అయ్యేది అతడు అమెరికా వెళ్ళాకే. పరీ పరోక్షం ఇతర పాత్రల మీద చూపించే ప్రభావం గురించి తెలుసుకోకుండానే సబూర్ మరణిస్తాడు. పరీ ఉద్యోగం చేస్తూ, పెళ్ళి చేసుకున్న తరువాత, తను దత్తత తీసుకోబడిందన్న అనుమానం కలిగినప్పుడు, ఎప్పుడో అప్పుడు అఫ్గానిస్తాన్ వెళ్ళి తన గతం తెలుసుకోవాలనుకుని, ‘తన ఉనికికి మౌలికంగా బాధ్యత వహించిన ఎవరో, ఏదో లేరు/దు’ అని భావిస్తుంటుంది. అబ్దుల్లా కాలిఫోర్నియాలో ఒక రెస్టారెంటు నడుపుతుంటాడు. అతనూ, భార్యా తమ ఏకైక కూతురికి, ‘పరీ’ అన్న పేరే పెడతారు. అసలు పరీ ముసలితనానికి చేరువయి, అన్న ఎక్కడున్నాడో తెలిసి కలుసుకోడానికి వెళ్ళినప్పుడు, అతను అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ, పరీని అసలు గుర్తించకపోవడం మరీ విషాదకరంగా మారుతుంది.రచయిత అన్నా చెల్లెళ్ళ పరిస్థితిని ఒక పదునైన రూపకంతో వివరిస్తారు: ‘వంతెన నదికి మధ్యనే అంతం అయింది. ఇంచుమించు ఒడ్డుకి చేరబోతూ ఉన్నప్పుడే, అటువైపు భాగం పొట్టిదయిపోయింది’.కాలం ముందుకీ వెనక్కీ మారుతూ, నాలుగు తరాల యొక్క యాబై సంవత్సరాలని –తొమ్మిది అధ్యాయాల్లో, వేర్వేరు పాత్రల దృష్టికోణాలతో చూపిస్తుంది ఈ నవల. అయితే, ‘కథ కదులుతున్న రైలువంటిది. ఎక్కడెక్కినా సరే, ఎప్పుడో అప్పుడు గమ్యానికి చేరుస్తుంది’ అంటూ, పుస్తకాన్ని అర్థం చేసుకునే బాధ్యతని పాఠకులకే వదిలేస్తారు హుస్సేనీ.రచయిత కేంద్రీకరించేది సబూర్ చర్య వల్ల కలిగిన పర్యవసానాల మీద. సంబంధాలు తెగిపోయినప్పుడు ఏమవుతుందో అన్న సంగతిని ప్రతి చిన్న పాత్రకి కూడా జీవం పోసి మాట్లాడించడం ద్వారా తెలియజేస్తారు. పాత్రల మీద ఏ కనికరమూ చూపకుండా, నిశితంగా విమర్శిస్తూ, మానవ సంబంధాలని నేర్పుగా విశ్లేషిస్తారు. నైతిక సంక్లిష్టతల గురించిన ఈ కథ, ‘ఉద్దేశాలు మంచివయితే సరిపోతుందా! మంచితనాన్ని నిర్వచించేది ఎలా? తమ పిల్లలు బాధలనుభవించకుండా కాపాడేటందుకు తల్లిదండ్రులు ఎంత దూరం వెళ్ళవచ్చు! సొంత కుటుంబం నుంచి వేరుపడటం కటిక పేదరికం భరించడం కన్నా ఎక్కువ బాధాకరమైనదా?’ అన్న ప్రశ్నలని లేవనెత్తు్తతుంది. విలియమ్ బ్లేక్ కవిత ‘పిల్లల కంఠాలతో ప్రతిధ్వనించే కొండలు’ ఈ పుస్తక శీర్షికకు ప్రేరణ. 2013లో అచ్చయింది. ‘టైమ్స్ లిస్ట్’లో ఉత్తమమైన నవలగా 33 వారాల పాటు నిలిచింది. కృష్ణ వేణి -
పెద్ద నేను
మనలోని ఎదగని నేను గుర్తొచ్చినప్పుడు మన పెద్ద నేను ఎలా బాధపడుతుంది? ఎనిమిదేళ్ల కింద గాలాహర్ ఇంత స్థాయికి ఎదుగుతాడని చాండ్లర్ ఊహించలేదు. అలాంటి స్నేహితుడు ఉండటం మాటలు కాదు. లంచ్ టైమ్ నుంచే చాండ్లర్ ఆలోచనలు గాలాహర్ చుట్టూ, గాలాహర్ నివసిస్తున్న లండన్ చుట్టూ తిరుగుతున్నాయి. తను పనిచేస్తున్న కింగ్స్ ఇన్స్లోని డెస్క్ దగ్గర కూర్చుని, ఈ ఎనిమిదేళ్లు తెచ్చిన మార్పు గురించి ఆలోచిస్తున్నాడు చాండ్లర్. తన స్నేహితుడికి సరైన అవసరాలే తీరేవి కావు. అలాంటిది ఇప్పుడు లండన్ పత్రికారంగంలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. విసుగెత్తించే రాత నుంచి దృష్టి మరల్చుకోవడానికి కిటికీలోంచి కిందకు చూశాడు. ఉడిగిపోయిన ముసలాళ్లు, అరుస్తున్న పిల్లలు అతడిని జీవితం గురించి ఆలోచింపజేసి బాధపెట్టాయి. జీవితం గురించి ఎప్పుడు ఆలోచించినా అతడికి బాధ కలుగుతుంది. అవ్యక్త దుఃఖమేదో చుట్టుముట్టింది. భాగ్యానికి వ్యతిరేకంగా ఎంత పోరాడితే ఏం లాభం? ఇంటి షెల్ఫుల్లో ఉన్న కవిత్వ పుస్తకాలు గుర్తొచ్చాయి. వాటిని తన బ్రహ్మచారి దినాల్లో కొన్నాడు. చాలా సాయంత్రాలు అందులోంచి ఒక పుస్తకం తీసి తన భార్యకు చదివి వినిపిద్దామన్న ఉబలాటం పుట్టేది. కానీ ఏదో సిగ్గు అడ్డు వచ్చి పుస్తకాలు అలాగే ఉండిపోయేవి. టైమ్ అవగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డెస్క్లోంచి లేచి బయటకు వచ్చేశాడు. హెన్రియెటా వీధి మురికి మనుషుల్ని దాటేసి, కులీనులు డంబాలు కొట్టే డబ్లిన్ వీధుల గుండా నడవడం మొదలుపెట్టాడు. కార్లెస్కు అతడు ఎప్పుడూ వెళ్లలేదు. కానీ దానికున్న పేరు తెలుసు. థియేటర్కు వెళ్లిన వాళ్లు ఇక్కడ నత్తగుల్లలు తింటారు, మద్యం సేవిస్తారు. అక్కడ వెయిటర్లు ఫ్రెంచ్, జర్మన్ మాట్లాడుతారని విన్నాడు. ఖరీదైన వస్త్రాలు ధరించిన మహిళలు, విలాస పురుషులు తోడురాగా క్యాబుల్లోంచి దిగి వేగంగా నడుస్తున్నారు. కాపెల్ వీధి వైపు మలిగాడు. లండన్ పత్రికారంగంలో ఇగ్నేషస్ గాలాహర్! ఎనిమిదేళ్ల కింద ఇది సాధ్యమని ఎవరు అనుకున్నారు? కానీ తన మిత్రుడి భవిష్యత్ గొప్పతనానికి సంకేతాలు అప్పుడే కనబడ్డాయి. కాకపోతే అతడికి పద్ధతీ పాడూ ఉండేది కాదు. పోకిరిరాయుళ్లతో తిరిగేవాడు. ఉదారంగా తాగేవాడు. అన్ని చోట్లా అప్పులు చేసేవాడు. కానీ అతడిలో ఉన్న ప్రతిభను మాత్రం ఎవరూ కాదనలేరు. అతడు అప్పు అడిగినా చేయి చాచినట్టు ఉండేది కాదు. చాండ్లర్ తన వేగం పెంచాడు. జీవితంలో మొదటిసారి తను దాటుతున్న మనుషులకన్నా తాను ఉన్నతుడినన్న భావం కలిగింది. సొగసు లేని కాపెల్ వీధి పట్ల అతడి మనసు ఎదురు తిరిగింది. నువ్వు సక్సెస్ కావాలంటే బయటికి వెళ్లాలి. ఈ డబ్లిన్లో ఉండి నువ్వేమీ చేయలేవు. గ్రాటెన్ వంతెన దాటుతుండగా కింద పారుతున్న నదిని చూశాడు. రేవులో ఉన్న గుడిసెల్లాంటి ఇళ్ల పట్ల జాలి కలిగింది. మనుషులంతా గుంపుగా పోగైన దేశ దిమ్మరుల్లా కనబడ్డారు. వారి మురికి కోట్లు, మూర్ఛిల్లజేసే సూర్యాస్తమయం, మెలకువకు వీడ్కోలు పలికే చల్లటి రాతిరి గాలి... ఈ భావాన్నంతా ఒక కవితగా మలవగలనా అని ఆలోచించాడు. గాలాహర్ దాన్ని ఏదైనా లండన్ పత్రికలో ప్రచురణ అయ్యేలా చూడొచ్చు. నిజంగా తాను సిసలైనది రాయగలడా? తన మనోవీధిలో చిన్న కాంతిపుంజం కదలాడింది. తన వయసు మరీ పెద్దదేం కాదు– ముప్పై రెండు. ఎన్నో భావాల్ని తను వ్యక్తం చేయాలనుకుంటాడు. నిజంగా తనకో కవి హృదయం ఉన్నదా? నిజంగా ఇవన్నీ కవితలుగా వ్యక్తం చేయగలిగితే పాఠకులు పట్టించుకుంటారు. మరీ అంత జనాదరణ పొందలేకపోవచ్చు. కానీ కొంతమంది సహృదయ పాఠకులను చేరగలడు. విమర్శకుల నుంచి రాబోయే గమనింపు వాక్యాలు కూడా అతడు ఊహించాడు. ‘శ్రీ చాండ్లర్కు సరళ సుందరమైన కవిత్వం వరంలా అబ్బింది’. కాకపోతే ఒకటే బాధ. తన పేరు ఎంతమాత్రమూ ఇక ఐరిష్గా ధ్వనించదు. అమ్మ పేరును తన పేరులో కలుపుకోవాలి. థామస్ మెలోన్ చాండ్లర్ లేదా టి.మెలోన్ చాండ్లర్. దీని గురించి గాలాహర్తో మాట్లాడాలి. కార్లెస్ను సమీపించగానే మళ్లీ ఆందోళన అతడిని ఆక్రమించింది. తలుపు తెరిచేముందు ఒక క్షణం నిలిచి, ఎట్టకేలకు లోనికి ప్రవేశించాడు. బారులోని కాంతి, శబ్దం అతణ్ని ద్వారంలోనే కుదిపేశాయి. అందరూ తననే కుతూహలంతో గమనిస్తున్నట్టుగా భావించుకున్నాడు. అదిగో కౌంటర్కు ఒరిగి కూర్చుని... ఇగ్నేషస్ గాలాహర్! ‘హలో, టామీ, పాత హీరో, నువ్విక్కడ! ఏం తీసుకుంటావ్? దేవుడా, ఎట్లా పెద్దోళ్లమైపోతున్నాం!’ విస్కీ ఆర్డర్ చేశాడు గాలాహర్. అతడు సోడా పోసుకోలేదు. చాండ్లర్ మాత్రం పలుచగా తాగుతానన్నాడు. ఎప్పుడూ పరుగులు పెట్టాల్సిన పత్రికోద్యోగం గురించి మాట్లాడాడు గాలాహర్. మురికి డబ్లిన్లో అడుగుపెట్టాక చాలా విశ్రాంతిగా ఉందన్నాడు. పాత స్నేహితులను గుర్తు చేసుకున్నారు. ‘టామీ, నువ్వు ఇంత కూడా మారలేదు. ఆదివారం ఉదయాల్లో నాకు లెక్చర్లు ఇచ్చే అదే గంభీరమైన మనిషివి. నువ్వు ప్రపంచాన్ని ఏదో చేయాలనుకునేవాడివి. ఎక్కడికీ పోలేదా కనీసం యాత్రకైనా?’ ‘ఐల్ ఆఫ్ మేన్(ఐర్లాండ్ పక్కని చిన్న ద్వీపం)కు పోయాను,’ చెప్పాడు చాండ్లర్. గాలాహర్ నవ్వాడు. ‘లండన్ వెళ్లు లేదా పారిస్. పారిస్ బాగుంటుంది.’ ‘నువ్వు పారిస్ చూశావా?’ పారిస్ లాంటి నగరం మరోటి లేదనీ, అందం కన్నా అక్కడి జీవితం ఆకర్షిస్తుందనీ ఊరించాడు గాలాహర్. ఐరిష్ వాళ్లంటే ఫ్రెంచ్వాళ్లకు పిచ్చి, తాను ఐరిష్ అని తెలిసి దాదాపు తినేయబోయారని చెప్పాడు. పారిస్ అమ్మాయిలు ఉంటారు...! బార్మాన్ చూపును తనవైపు తిప్పుకోవడానికి కొంచెం తిప్పలు పడి, డ్రింక్ ఆర్డర్ చేశాడు చాండ్లర్. గాలాహర్ యాస, అతడు తన గురించి వ్యక్తం చేసుకుంటున్న తీరు చాండ్లర్కు అంతగా నచ్చలేదు. లండన్ అలా మార్చేస్తుందేమో! కానీ గాలాహర్ ప్రపంచాన్ని చూశాడు. చాండ్లర్లో అసూయ జనించింది. గాలాహర్ తన సిగార్ కేసులోంచి సిగార్లు బయటికి తీశాడు. ఇద్దరూ మౌనంగా కాల్చారు. తర్వాత పై స్థాయి ఇంగ్లీషు సమాజంలోని చాలా రహస్యాలు పంచుకున్నాడు గాలాహర్. ఎవరినీ వదలిపెట్టలేదు. ‘అన్నట్టూ హోగన్ చెప్పాడు, నువ్వు దాంపత్య సౌఖ్యాన్ని రుచి చూశావట, రెండేళ్ల కింద, నిజమేనా?’ చాండ్లర్ సిగ్గుతో నవ్వాడు. అప్పుడు చిరునామా తెలియలేదనీ, ఇప్పటికైనా మించిపోలేదని భావిస్తూ శుభాకాంక్షలు అందించాడు గాలాహర్. ‘నీకు ఎల్లవేళలా సంతోషం, కట్టలకొద్దీ డబ్బులు, నేను కాల్చేదాకా రాని చావును కోరుకుంటున్నా’. పిల్లల గురించి అడిగాడు గాలాహర్. ‘ఒకరు’. ‘కొడుకు? కూతురు?’ ‘బాబు’ వెళ్లే లేపు తమ ఇంటికి ఓసారి రావాలనీ, తన భార్య సంతోషిస్తుందనీ ఆహ్వానించాడు చాండ్లర్. ‘మనం ముందే కలవలేకపోయాం. రేపు రాత్రే నేను వెళ్లాల్సివుం’దని క్షమాపణ కోరాడు గాలాహర్. ‘పోనీ ఈ రాత్రికి’ ఈ రాత్రి ఇంకొకరిని కలవాల్సివుందని బదులిచ్చాడు. వచ్చే సంవత్సరం కచ్చితంగా వస్తానని హామీ ఇచ్చాడు. ‘సంతోషం వాయిదాపడుతుందంతే’. తన బంగారు వాచీని తీసి టైమ్ చూసుకున్నాడు గాలాహర్. చివరి రౌండు డ్రింక్స్ తాగడం పూర్తయింది. మూడు పెగ్గులు, స్ట్రాంగ్ సిగార్ మితంగా తాగే చాండ్లర్ తలకు బాగా ఎక్కాయి. తన జీవితానికీ తన స్నేహితుడి జీవితానికీ మధ్య వున్న భేదం స్పష్టంగా అర్థమవసాగింది. పుట్టుకలోనూ చదువులోనూ గాలాహర్ తనకు సాటిరాడు. ఇది ఏ విధంగానూ న్యాయంగా కనబడలేదు. అన్నింటికీ జంకే తన స్వభావమే దీనికి కారణం. తన ఆహ్వానాన్ని గాలాహర్ తిరస్కరించడం ఎత్తినట్టుగా కనబడింది. ‘ఎవరికి తెలుసు? వచ్చే సంవత్సరం నువ్వు ఇక్కడికి వచ్చేసరికల్లా మిస్టర్ అండ్ మిసెస్ ఇగ్నేషస్ గాలాహర్కు నేను శుభాకాంక్షలు చెబుతానేమో.’ గాలాహర్ ఖండించాడు. దానికంటే ముందు లోకాన్ని చూడాలని వుందన్నాడు. ఒకవేళ చేసుకున్నా డబ్బు బలిసిన అమ్మాయిని చేసుకుంటానన్నాడు. ‘వందలు వేల జర్మన్లు, యూదులు డబ్బుతో కుళ్లిపోతున్నారు. చూడు నా ఎత్తులు ఎలా వేస్తానో’.∙∙l బాబును ఎత్తుకునివున్నాడు చాండ్లర్. డబ్బులు మిగుల్చుకోవడానికి వాళ్లు పనిమనిషిని పెట్టుకోలేదు. పొద్దున కాసేపు ఆనీ చిన్న చెల్లెలు మోనికా వచ్చి ఇంటిపనుల్లో సాయం చేసి వెళ్తుంటుంది. పావు తక్కువ తొమ్మిదయింది. ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా ఆనీ తెమ్మన్న కాఫీపొడిని మరిచిపోయి వచ్చాడు చాండ్లర్. అందుకే అతడు అడిగినవాటికి పొడిగా జవాబిచ్చింది. పడుకుంటున్న బాబును అతడి చేతుల్లో పెట్టి మళ్లీ షాపులు మూసేస్తారేమోనని తనే కాఫీ పొడి, చక్కెర తేవడానికి బయటికి వెళ్లింది. ‘ఇదిగో, వాడిని నిద్రలేపకు’. ఫ్రేములో ఉన్న ఆనీ ఫొటో చూశాడు చాండ్లర్. ఆమె వేసుకున్న బ్లూ సమ్మర్ బ్లౌజ్ కొనడానికి తను ఎలా హడావుడి పడిందీ, అంత ఖరీదైనది ఎందుకని ముందు అని తర్వాత ఎలా వేసుకుని మురిసిపోయిందీ అంతా గుర్తొచ్చింది. హ్మ్! ఆమె కళ్లవైపు చూశాడు. స్నేహంగా కనబడలేదు. గాలాహర్ చెప్పిన ధనిక యూదుల గురించి ఆలోచించాడు. ఈ కళ్లను ఎందుకు తాను పెళ్లాడాడు! ఇంటికోసం అద్దె పద్ధతిలో తెచ్చిన అందమైన ఫర్నిచర్లో కూడా ఏదో అల్పత్వం కనబడింది. ఈ చిన్న ఇంట్లోంచి బయటపడే మార్గం లేదా? గాలాహర్లాగా ధైర్యంగా బతక ప్రయత్నించడానికి మరీ ఆలస్యమైందా? తాను లండన్ వెళ్లగలడా? ఒక పుస్తకం రాయగలిగితే ఏదైనా ద్వారం తెరుచుకుంటుందేమో! టేబుల్ మీద పెట్టివున్న బైరన్ పొయెట్రీ తీసి చదవడానికి ప్రయత్నించాడు. తాను అలా రాయగలడా? గ్రాటన్ వంతెన దాటుతుండగా కలిగిన సంవేదన లాంటిది... పిల్లాడు నిద్ర లేచి ఏడవటం ప్రారంభించాడు. వాడిని ఊరడిస్తూనే చదవబోయాడు. సాధ్యం కాలేదు. తాను చదవలేడు. ఏమీ చేయలేడు. వ్యర్థం, వ్యర్థం! పిల్లాడు అలాగే ఏడుస్తున్నాడు. ‘నోర్ముయ్’ అని అరిచాడు. వాడు ఒకసారి ఆగి, అంతకంటే గట్టిగా మొదలెట్టాడు. శ్వాస ఆగిపోతుందా? ఊరుకోబెట్టడం తన వల్ల కావడం లేదు. తలుపు తెరుచుకుని ఆనీ పరుగెత్తుకుంటూ వచ్చింది, ‘ఏమైంది? ఏమైంది? ఏం చేశావ్ వాణ్ని?’ పార్సిల్ను కింద పెట్టి భర్త చేతిలోంచి కొడుకును తీసుకుంది. తల్లి మాట వినగానే పిల్లాడు మరింత గట్టిగా ఏడ్చాడు. ‘నేనేం చేయలేదు ఆనీ... వాడే ఏడుస్తున్నాడు... నేనేం చేయలేదు... నేను నేను...’ ‘ఓ చిన్ని తండ్రీ. భయపడ్డావా? ఉల్లలలలలలల.. నా బుజ్జి గొర్రెపిల్ల’ చాండ్లర్ చెంపలు సిగ్గుతో ఎర్రబారాయి. పిల్లాడి ఏడుపు క్రమంగా నెమ్మదించింది. చాండ్లర్ కళ్లలోంచి పశ్చాత్తాపపు కన్నీళ్లు కారాయి. జేమ్స్ జాయ్స్(1882–1941) ‘ఎ లిటిల్ క్లౌడ్’ కథాసారం ఇది. ఐరిష్ కథకుడు, కవి, నవలాకారుడు జాయ్స్. ‘యులసిస్’ ఆయన ప్రసిద్ధ నవల. అత్యున్నత స్థాయిలో చైతన్య స్రవంతి శైలి కనబరిచిన రచన. ‘డబ్లినర్స్’ ఆయన కథా సంకలనం. -
గతంతో వర్తమానం సంభాషణ
మృదులా కోషీ రాసిన తొలి నవల, ‘నాట్ ఓన్లీ ద థింగ్స్ దట్ హావ్ హాపెన్డ్’– కేరళ కుగ్రామంలో అన్నాకుట్టీ వర్గీస్, మరణశయ్య మీదనుండగా ప్రారంభం అవుతుంది. దుబాయ్లో ఉండే సవతి చెల్లి కూతురు– నీనా, పెత్తల్లితోపాటు ఉంటుంది. కొడుకు జ్ఞాపకాలు అన్నాని విడిచిపెట్టక, మరణించడానికి ఇష్టపడదు. ఆమె నీనాతో చెప్పిన మాటలే శీర్షికకి ఆధారం: ‘జ్ఞాపకాలే నిజమైతే, జరిగిన సంగతులే కాక, జరగబోయేవి కూడా గుర్తుంటాయి’. ఆమెని తండ్రీ సవతి తల్లీ కలిసి, మద్రాసు కాన్వెంట్లో ఉంచినప్పుడు 16 ఏళ్ళ వయస్సులో, పెళ్ళి కాకుండానే గర్భవతి అవుతుంది. కుటుంబ వొత్తిడివల్లా, ఆర్థిక స్థితి సరిగ్గా ఉండకపోవడంతోనూ అక్కడి నన్స్, అన్నా నాలుగేళ్ళ కొడుకైన మధుని, ఊర్లోకొచ్చిన ఒక జర్మన్ జంటకప్పగిస్తారు. ఆ తరువాత కుంటివాడైన తంబీని పెళ్ళి చేసుకున్నప్పటికీ, శేషజీవితమంతా కొడుకు కోసం ఎదురు చూడ్డంలోనే గడుపుతుంది అన్నా. జర్మన్ జంటలో, భర్త ట్రైన్ ప్రయాణంలో కుర్రాడిని వదిలేస్తాడు. మధు మూడేళ్ళు ఢిల్లో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ముష్టెత్తుకునే గుంపుతో గడుపుతాడు. ఏడేళ్ళ వయస్సులో ఒక ఏజెన్సీ ద్వారా, ఒక అమెరికన్ కుటుంబం మధుని దత్తత తీసుకుని, ‘ఆసా గార్డనర్’గా మారుస్తుంది. నవల్లో మనకి పరిచయం అయ్యేది పెద్దవాడయి, తన గతకాలపు జ్ఞాపకాలతో సతమతమవుతూ ఉండి, కాలిఫోర్నియాలో తన్ని పెంచుకున్న దంపతులతోనూ, తన మాజీ భార్యా కూతురితోనూ కూడా సంబంధాలు నిలుపుకోలేకపోయిన ఆసా. రచయిత అనేకమైన పాత్రల దృష్టికోణాలతో కథ చెప్తారు: అన్నా సవతి తల్లి సారమ్మ, సవతి చెల్లెలు టెస్సీ, ఆమె కూతురు నీనా. రెండు భాగాల్లో ఉన్న పుస్తకం– వర్తమానానికీ గతానికీ సులభంగా మారుతూ, అన్నా మరణం తరువాత కేవలం 36 గంటల్లోనే చోటు చేసుకున్నదైనప్పటికీ, ఆ పరిధిలోనే మూడు దశాబ్దాల సంఘటనలని జ్ఞాపకాల ద్వారా కలిపి కుడుతుంది. మొదటి భాగంలో పాఠకులని కేరళ, మద్రాస్, పాండిచ్చేరి తిప్పి, రెండవ భాగంలో అమెరికాని చూపిస్తుంది. మొదటిది అన్నా గురించి మాట్లాడుతుంది. రెండవది కొడుకు చుట్టూ తిరుగుతుంది. తల్లీ కొడుకూ కూడా, ఊహించుకున్న ఆశాజనకమైన సంఘటనల చుట్టూ తమ జీవితాలని మలచుకుంటారు. ఉదా: అన్నకుట్టీ చివరకు తన కొడుకుని కలుసుకుంటుంది. ఆసా కూడా తనెవరో తెలుసుకుని, తల్లిని చేరుకుంటాడు.కేరళ గ్రామ ప్రజల మీద ఉండే క్రిస్టియానిటీ ప్రభావం గురించీ, దత్తత ప్రక్రియలో జరిగే మోసం, దుర్వినియోగించబడే డబ్బు గురించీ కోషీ మాట్లాడతారు. అన్నా జ్ఞాపకాలనీ, కేరళ గ్రామీణ జీవితాలనీ అద్భుతంగా వర్ణిస్తూ, పాత్రలని ఎంతో నిపుణతతో చెక్కుతారు.యువతుల ఊసులాటలప్పుడు, వారి నోట్లోంచి వెలివడే ‘అయ్యై, య్యో’లని హాస్యంగా చిత్రీకరిస్తారు. మతం పట్ల గ్రామీణుల దృక్పథం అన్నా మృతదేహం చుట్టూ మూగినప్పుడు కనిపిస్తుంది. అది వాళ్ళకి ఆమె పట్ల ఉన్న ప్రేమవల్ల కాక, ప్రార్థన తరువాత తినబోయే ఫలహారాల కోసం ఎదురుచూపు. పుస్తకం చదవడానికి తేలికైనదే కానీ సంతోషకరమైనదని అనలేం. వచనం విషాదాన్నీ కలిగించదు. ఉత్కంఠ పెంచుతుంది. దత్తత ప్రభావం, అణచివేత గురించిన ఆలోచనలనీ రేకెత్తిస్తుంది కనుక చదవాల్సినది. అయితే, ఎన్నో సందేహాలు సమాధానం లేకుండానే మిగిలిపోతాయి. నవల కవర్ పేజీ వెనక, రచయిత జీత్ థాయిల్ రాసిన ఎండార్సుమెంటు ఉంది. 2013లో ‘క్రాస్వర్డ్ బుక్ అవార్డ్’ కోసం షార్ట్ లిస్ట్ అయిన ఈ నవలని హార్పర్ కాలిన్స్ ప్రచురించింది. కృష్ణ వేణి -
డైలీ దౌడ్
ఎవరో కుర్రవాడు రన్నింగ్ రేస్ చేస్తున్నవాడిలా పేవ్మెంట్ మీద బాణంలాగా పరుగెత్తిపోతున్నాడు. రామచంద్రమూర్తి ఒక్క క్షణం ఆగి వెనుదిరిగి చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే ఆ కుర్రవాడు కనుచూపుమేర దాటిపోయాడు. వేగంగా పరుగెత్తుతున్న వారెవరిని చూచినా అతడు అలాగే నిలబడిపోతాడు. తర్వాత నవ్వుకుంటాడు. అతడు మళ్లీ నడవడం ప్రారంభించాడు. మరొక ఫర్లాంగు దూరం నడిస్తే కానీ బస్సు స్టాపు చేరుకోలేడు. ఎంత పెందలాడి యింట్లో నుంచి బయలుదేరితే తప్ప బస్సు అంది ఆఫీసుకు చేరుకోవడం కష్టం. అప్పటికి సీతమ్మ ఎంతో పెందలకడనే– నిద్రలేచి పనులు ప్రారంభిస్తుంది. అవి సర్దుకొని, యివి సర్దుకొని వంటకు ఉపక్రమించి ఎంత ఉరుకులు పరుగుతు పెడుతూ చెమటలు కక్కుతూ పనిచేసినా తొమ్మిది గంటల లోపున వంట తయారు కాదు. నాలుగు మెతుకులు నోట వేసుకుని తాను తయారయ్యేసరికి తొమ్మిదిన్నర అవుతుంది. ఎంత వేగంగా నడిచినా బస్స్టాపుకు చేరుకునే సరికి మరొక పావుగంట. ఆ తర్వాత బస్సు కోసం పడిగాపులు పడి ఉండాలి. ఎంతకూ తనెక్కవలసిన బస్సు రాదు. పోనీ ఓపిక చేసుకుని నడిచిపోదామా అంటే ఆఫీసు దగ్గరా దాపూ కాదు. అయిదు కిలోమీటర్ల దూరంలో ఊరికి అవతలి వైపున ఉంటుంది.‘పోనీ ఆఫీసుకు దగ్గర్లో ఏదైనా యిల్లు చూసుకోరాదూ?’ అన్నారు చాలామంది. కానీ అక్కడి అద్దెలు తాను భరించలేడు. ఆఫీసులో కొందరు జల్సారాయుళ్లు ఉన్నారు. కొత్త కరెన్సీ నోటుల్లా పెళపెళ లాడుతుంటారు. కానీ వారి సీట్లు అటువంటివి. తన సీటు అటువంటిది కాదు. చాకిరీకి మాత్రం ఏమీ తక్కువ ఉండదు. టన్నుల కొద్దీ ఫైళ్లు పేరుకుపోతుంటాయి. ఫలితం మాత్రం నెల తిరిగేసరికి వచ్చే ఆ జీతపు రాళ్లే. అందులో బోలెడన్ని కట్లూ, కత్తిరింపులూ. అతడు కోటు వేసుకుంటాడు. ‘మీకేమండీ కోటు తొడుక్కుంటారు దర్జాగా’ అంటారు కొందరు. వారికి తెలియదు తన లోపలి చొక్కాలోని ఎన్ని చిరుగులను బయటికి కనబడకుండా ఆ కోటు కప్పుతున్నదో! ఎండ చిటచిట లాడుతున్నది. రామచంద్రమూర్తి నుదుట పట్టిన చెమటను అరచేత్తో తుడుచుకుంటూ వీధి చివరకు కళ్లు చికిలించి చూశాడు. ఏదో బస్సు వస్తున్నది. నంబరు సరిగా కనిపించడం లేదు. చత్వారం వస్తున్నదేమో! ఎస్సెల్సీ రిజిస్టరులో ఉన్న తన పుట్టిన తేదీ నిజమే అయితే తనకిప్పుడు నలభై ఎనిమిది వెళ్లి రెండు నెలలయింది. ఇంకా ఏడేళ్లు సర్వీసున్నది. బస్సు దగ్గరికి వచ్చాకకానీ నంబరు సరిగా కనిపించ లేదు. అది తన బస్సు కాదు. రామచంద్రమూర్తి ఆలోచిస్తూ నిలబడ్డాడు. తాను ఆఫీసుకు నడిచిపోతే ఎంతసేపటిలో పోగలడు? వేగంగా నడవగలిగితే గంట. పరుగెత్తి పోతే? ఇప్పుడు తాను పరుగెత్తగలడా? ఒకప్పుడు పరుగెత్తాడు. తమ జిల్లా పేరు నిలబెట్టాడని విపరీతంగా మెచ్చుకున్నారు. ఫొటోలు తీశారు, దండలు వేశారు. తానప్పుడు రోజూ పరుగెత్తేవాడు. మైళ్ల కొద్దీ దూరం అతని సన్నని కాళ్ల క్రింద తరిగిపోయేది. ఆ కండరాలకు అలుపు తెలిసేది కాదు. ఇంతకాలం తరువాత పరుగెత్తగలడా?పక్కనే నిలబడి ఉన్న వ్యక్తిని ‘‘ఏమండీ! టైమెంత అయింది?’’ అని అడిగాడు. కొంచెం విసుగుతో చేతి గడియారం వంక చూసి ‘‘నైన్ ఫిఫ్టీ’’ అని సమాధానం చెప్పాడు. బాప్రే. తాను పదిగంటలకల్లా సీటులో ఉండాలి. లేకపోతే ఆ కొత్త ఆఫీసరు అగ్గిరాముడై పోతాడు. అసలా మనిషి ముఖం చూస్తేనే అదొక రకంగా ఉంటుంది. మెడ అంతా కొవ్వుపట్టి ఉంటుంది. ఎవరి వంకైనా చూడదలుచుకుంటే మెడ ఒక్కటీ తిప్పి చూడలేడు. మొత్తం శరీరమే గిర్రున తిరగవలిసి ఉంటుంది.ఇప్పుడు పది దాటుతున్నది కదా? ఈ బస్సు ఎప్పుడు వచ్చేట్టు? తానెలా ఎక్కేట్టు? ఎన్ని గంటలకు ఆఫీసుకు చేరుకునేట్టు? ఆఫీసరుకు ఏమి సంజాయిషీ ఇచ్చుకునేట్టు? అదుగో బస్సు. ఇంతకాలానికి దాని దర్శనమైంది. రామచంద్రమూర్తి కమ్మీ పట్టుకుని వదల్లేదు. దిగేవారు దిగగానే లోపలికి దూసుకుపోయాడు. బస్సెక్కడం అనే విద్యలో ఈ మాత్రపు ప్రాథమిక అనుభవమైనా లేకపోతే– ఆ సూట్వాలాలాగా పేవ్మెంట్ మీదనే గంటలు తరబడి నిలబడిపోక తప్పదు. సోదరా! దూసుకుపోయేవాడిదే రాజ్యం. లేకపోతే నీ సంగతి అంతే. రామచంద్రమూర్తి కళ్లముందు యెప్పటిదో దృశ్యం కనిపించింది. మరీ చిన్నప్పుడు తమ ఊరికి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న చిన్న పట్నంలో స్కూలు చదువు. పొద్దున్నే లేచి చద్దన్నం తిని పుస్తకాల సంచీ భుజానికి తగిలించుకుని నడక ప్రారంభించేవాడు. సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు మరీ హుషారుగా ఉండేది. నాలుగు మైళ్లు పరుగెత్తుకుంటూ తిరిగి వచ్చేవాడు. ఆ విధంగా రన్నింగ్ అలవాటయింది. స్కూల్ పోటీలలో తానే ప్రథముడు. దాంతో ఇంకా అభిరుచి పెరిగింది. ఎక్కడికి వెళ్లినా పరుగెత్తుతూ వెళ్లడమే. బస్సు ఆగింది. రామచంద్రమూర్తి ఇద్దరు వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసి మళ్లీ కిందికి దిగాడు. టైమ్ కనుక్కున్నాడు. గుండె గతుక్కుమన్నది. మళ్లీ నడక. మరో అర ఫర్లాంగు దూరం. ఎండ నియంత పరిపాలనలా భయంకరంగా ఉంది. ఆ రోజు... అంతర్ జిల్లా ఎథ్లెటిక్స్ ముగింపు రోజు. రన్నింగ్ ఫైనల్స్. ట్రాక్ అంతా శుభ్రంగా ఉంది. మొత్తం పద్దెనిమిది మంది. మెత్తని ప్రేలుడు వినిపించగానే ముందుకు దూకాడు. కళ్లముందు ట్రాక్ తప్ప మనుషులు కనిపించలేదు. గుండెకు తగిలిన పలుచని దారం తెగిన తర్వాత కొద్ది గజాల దూరం పరుగెత్తిపోయి పచ్చికలో కూలబడిపోయాడు. జనం మూగారు. పైకెత్తి గాలిలోకి ఎగరవేశారు. కలెక్టరు తనకు ట్రోఫీ బహూకరిస్తున్నప్పుడు కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం అంతా మార్మోగిపోయింది. ‘ద ఫాస్టెస్ట్ రన్నర్ ఆఫ్ ద స్టేట్’ అని సావనీర్లో ఫొటో కింద వ్రాశారు.రామచంద్రమూర్తి ఆఫీసు మెట్లెక్కుతున్నాడు. ఆయాసంతో వగరుస్తున్నాడు. ఆ ట్రోఫీ ఇంకా తనదగ్గరే ఉంది. దాన్ని ఇతర చిన్న చిన్న కప్పులూ దాచేందుకు తన దగ్గర అద్దాల బీరువాలు లేవు. కొన్ని అసలైన వెండికప్పులు డబ్బు అవసరం వచ్చినప్పుడు వాటికి కాళ్లొచ్చి వెండి దుకాణాల్లోకి వెళ్లిపోయాయి. స్ప్రింగు డోరు తెరుచుకుని లోపల అడుగు పెట్టేసరికి అయ్యగారు పేపరు చదువుతున్నారు. శబ్దం విని కుర్చీ మొత్తం పక్కకు తిప్పి గడియారం వంక చూసి మొహాన గంటు పెట్టుకుని పేపరు బల్లమీద పడేసి ‘‘ఊ’’ అన్నాడు. రామచంద్రమూర్తి రిజిస్టరు అందుకోబోతూ ఉంటే ‘‘కాస్సేపాగండి– ఎలాగూ పన్నెండు అవుతుంది. ఈ పూటకు లీవు పెట్టేద్దురుగాని’’ అన్నాడు. ‘‘లీవు వుందా? అంతా వాడేసుకున్నారా?’’ రామచంద్రమూర్తి రిజిస్టరు మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుని ‘‘ఉందనే అనుకుంటానండి’’ అన్నాడు. ‘‘గూడ్. అది సరేనండీ. మీరెన్నింటికి బయలుదేరుతారు ఇంటినుంచి?’’ ‘‘బస్సులతో బాగా ఇబ్బందిగా ఉందండి. ఆపరు, ఎక్కించుకోరు’’ ‘‘గూడ్. కాబట్టి మనకు బస్సు సరిపడదని అర్థం– అంతేనా?’’ రామచంద్రమూర్తి తల వంచుకున్నాడు. ‘‘బస్సు మీద వస్తే లాభం లేదని తెలిశాక మీరు వేరే వసతి చూసుకోవాలి. మరో మీన్స్ ఆఫ్ కన్వేయన్స్. పోనీ ఒక స్కూటరు కొనుక్కోగూడదూ?’’ రామచంద్రమూర్తి నవ్వేందుకు ప్రయత్నించాడు. ‘‘డబ్బు కావాలి కదండీ’’ అన్నాడు. ‘‘గూడ్– డబ్బులేదు కాబట్టి కారు, స్కూటరు వగైరాలు వీల్లేదు. ఆగవు, ఎక్కించుకోవు కాబట్టి బస్సు వీల్లేదు. మరి కొంచెం ముందుగా యింటిదగ్గర బయలుదేరితే?’’ ‘‘అప్పటికి యింట్లో వంటకాదండి’’ ‘‘ఓహో అదొకటా? కాబట్టి అదీ వీలులేదు. ముందు లీవ్ లెటరు రాయండి. ఈ లోపల నేను ఉపాయం ఆలోచిస్తాను’’ లీవ్ వ్రాస్తున్నంతసేపూ ఆఫీసరు రామచంద్రమూర్తి వంక తమాషాగా చూస్తూ కూర్చున్నాడు. ‘‘ఆ ఉపాయం తట్టింది. అది బెస్టు’’. ‘‘చెప్పండి సార్’’ ‘‘తొమ్మిదింటికి ఇంట్లోనుంచి బయటికి రండి– వెంటనే పరుగు ప్రారంభించండి. ఎక్కడా ఆగకండి. అరగంటలో ఆఫీసులో ఉంటారు. పైగా వొంటికి ఎంతో మంచిది. ఏమంటారు?’’ ఈ మాటలని అతడు నవ్వడం ప్రారంభించాడు. రామచంద్రమూర్తి మొహం జేవురించింది. మనిషి నిలువెల్లా ఊగిపోయాడు. ‘‘మీ ధోరణి మీ హోదాకు తగినట్టు లేదు. అయామ్ సారీ. రియల్లీ సారీ. అన్నట్టు మీకు తెలియదేమో. పరుగెత్తమని సలహా ఇచ్చారు. ఐ వజ్ ఎ ఫేమస్ రన్నర్ వన్స్’’ అని స్ప్రింగ్ డోర్ మూసి యివతలికి వచ్చాడు. ∙∙ ఆ సాయంకాలం ఆఫీసు నుంచి బయటపడి రామచంద్రమూర్తి నుదురు చేత్తో రుద్దుకున్నాడు. చల్లనిగాలి వీస్తున్నది. వేగంగా నడవడం ప్రారంభించాడు. ఈ ప్రాంతంలో పెద్ద ఆవరణ ఉంది. కొందరు యువకులు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూవుంటారు. అతనికి పరుగెత్తాలని సరదా పుట్టింది. ప్యాంట్ కొంచెం పైకి మడిచాడు. కోటు చేతులు పైకి మడిచాడు. ‘‘రన్ రన్’’ అనుకున్నాడు. అలా తమ వీధికి చేరుకునేవరకూ పరుగెత్తుతూనే ఉన్నాడు. ఆయాసంతో వగర్చుతూ యింటికి వచ్చిపడ్డాడు. మంచం మీద కూలబడిపోయాడు. సీతమ్మ ఆదుర్దాగా ‘‘ఏమిటండీ’’ అంటూ వచ్చింది. ఆయాసంలోనే ‘‘మంచినీళ్లు... వద్దు కాఫీ’’ అన్నాడు. ఆమె లోపలికి వెళ్లింది. అతడు కాళ్లు చాపి మంచంలో వెల్లకిలా పడుకున్నాడు. అయిదు నిమిషాల తర్వాత వచ్చి చూసి ఆమె అదిరిపడింది. భయంతో పరుగెత్తుతూ వెళ్లి దగ్గర్లోనే ఉన్న డాక్టరును పిలుచుకొచ్చింది. ఆయన పరీక్ష చేసి ‘‘చిన్న పెరాలసిస్ స్ట్రోక్, అదే పక్షవాతం. కుడి కాలూ చెయ్యీ పడిపోయాయి. విశ్రాంతిగా పడుకోనివ్వండి. నేను మళ్లీ వచ్చి చూస్తాను. ప్రాణభయం ఏమీలేదు’’ అని చెప్పి వెళ్లిపోయాడు. రామచంద్రమూర్తి కళ్లలో నీళ్లు ఉబికి వచ్చి బుగ్గల మీదుగా కిందికి జారుతున్నాయి. ‘‘రన్... రన్ మై డియర్బాయ్ రన్...’’ -
చంఘిజ్ఖాన్
‘చంఘిజ్ఖాన్’ నవల రాస్తున్నప్పుడు తెన్నేటి సూరిని ఒక మిత్రుడు అడిగాడట: ‘‘నువ్వు వ్రాస్తున్నది చంఘిజ్ఖాన్ జీవితమా లేక వారం వారం వెలువడుతున్న వర్తమాన రాజకీయాల సమీక్షా?’’ ఈ నవల వెలువడిన కాలం 1950. నవలలో చిత్రించిన ఆసియా కుళ్లు రాజకీయాలు 12, 13 శతాబ్దాల నాటివి. కాలం తప్ప ఏమీ మారలేదు. ‘చరిత్ర పుటలు వెనక్కు తిరగబడుతున్నాయా?’ అదీ ఈ నవల ప్రాసంగికత. చరిత్రలో రాక్షసుడిగా, పరమ క్రూరుడైన హంతక నియంతగా చిత్రించబడిన చంఘిజ్ఖాన్ కాలంనాటి సామాజిక రాజకీయ పరిస్థితులను చిత్రిస్తూ, చంఘిజ్ఖాన్లోని ‘మహోన్నత మానవవాది’ని అర్థం చేయించడానికి సూరి ఈ నవలను సంకల్పించారు. ఎవడు ఎప్పుడు మీద పడి, ఆడవాళ్లనూ సంపదనూ దోచుకెళ్తాడో తెలియని అరాచక కాలంలో మంగోలియాలో జన్మించాడు చంఘిజ్ఖాన్. అసలు పేరు టెముజిన్. అంటే ఉక్కుమనిషి అని అర్థం. మన చేతిలోని ఆయుధాన్ని నిర్ణయించేది శత్రువు చేతిలోని ఆయుధమే, అని నమ్మాడు టెముజిన్. మహత్తరమైన సైనిక శక్తిని సిద్ధం చేశాడు. ‘123 గుడిసెలు, లేక డేరాలు గల ఒక బంజారీ తండా నాయకుడు ప్రపంచంలో ముప్పాతిక వంతు వరకూ జయించి మూడు శతాబ్దాల పర్యంతం స్వర్ణయుగాన్ని అనుభవించిన ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగాడు?’ మానవుడిగా అతను ఎలాంటి స్వభావం కలవాడు? అతనిలో వున్న బలీయమైన గుణసంపత్తి ఏమిటి? ‘నీకున్నది మాత్రమే బలం కాదు శత్రువు నీకుందని నమ్మేది కూడా నీ బలమే!’ అన్న యుద్ధసూక్తిని అనుసరించి ఎలా శత్రువులను బోల్తా కొట్టించాడు? ఎలాంటి అనితరసాధ్యమైన యుద్ధవ్యూహాలను రచించాడు? చివరకు ప్రపంచాన్ని జయించే చంఘిజ్ఖాన్(జగజ్జేత) ఎలా కాగలిగాడు? అన్న ప్రశ్నలకు నవల సమాధానం చెబుతుంది. తెన్నేటి సూరి వివిధ గ్రంథాలను, ముఖ్యంగా హెన్రీ హెచ్, హౌవర్త్ రాసిన మంగోల్ హిస్టరీని అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా టెముజిన్తోపాటు, చమూగా, కరాచర్, తుఘ్రల్ఖాన్, భగత్తూర్, ‘షామాన్’, యూలన్, కూలన్ లాంటి పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన నవల ఇది. తెన్నేటి సూరి -
ఇద్దరు ముగ్గురయ్యారు
అబ్బూరి రామకృష్ణారావు వాళ్ల నాన్న లక్ష్మీనారాయణ శాస్త్రి. సంస్కృత పండితుడు. తండ్రి లాగే తానూ గొప్పవాడినవ్వాలని ఆయన ఆశయం. మైసూరు సంస్కృత పాఠశాలలో చదవడానికి చేరాడు. అది 1915–16 కాలం. ఆ సమయంలో కట్టమంచి రామలింగారెడ్డి మైసూర్ స్టేట్ విద్యాధికారి. ఆ పాఠశాలలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. వాళ్లిద్దరూ కలిసి సాయంత్రాలు సాహిత్య కబుర్లు చెప్పుకునేవారు.ఒకరోజు కట్టమంచి, ‘ఏమోయ్ శర్మ, ఆంధ్రభారతి పత్రిక చూశావా? ఎవరో కవి ‘మల్లికాంబ’ అని చక్కటి కావ్యం రాస్తున్నాడు. మూడు విడతలుగా వచ్చింది’ అన్నాడు. ఈ ఆంధ్రభారతి– భారతి, ఆంధ్రపత్రిక కన్నా ముందు వచ్చిన పత్రిక. ‘నాకెందుకు తెలీదండి. ఆ రాస్తున్న కుర్రాడు మన దగ్గరే చదువుతున్నాడు, మీరు చూస్తానంటే పిలుస్తాను’ అన్నాడు అనంతకృష్ణ శర్మ. కట్టమంచి లాంటి కఠిన విమర్శకుడి, రాళ్లపల్లి లాంటి సంప్రదాయ పండితుడి మెప్పు పొందిన అబ్బూరికి అప్పుడు పదిహేను – పదహారు సంవత్సరాలే. ఇక తర్వాతి సాయంత్రాలు ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం మొదలయింది.తర్వాతి కాలంలో– కట్టమంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ అయ్యాక అబ్బూరికి తగిన విద్యార్హత లేకపోయినా లైబ్రేరియన్ ఉద్యోగం ఇప్పించాడు. విశాఖపట్నంలో సాహిత్య వాతావరణం పెరగడానికి అది దోహదం చేసింది. అబ్బూరిని శ్రీశ్రీలాంటివాళ్లు మేస్టారు అనేవారు. -
ఇంగ్లిష్కన్నా వందేళ్ల ముందే తెలుగులో తిసారెస్
ఇంగ్లిష్ Thesaurus1805 ప్రాంతాల నుంచీ తయారీ అని చెప్పినా, ఒక కొలిక్కి వచ్చి అచ్చులోకి వచ్చింది 1852లో! మన తెలుగు భాషా నిర్మాతలు 1750 ప్రాంతాలలోనే తెలుగు మాటల తిసారెస్ తేవడం గమనార్హం. దీన్ని భాషకు సంబంధించి ఆధునికతల తొలి వేకువగా చెప్పవచ్చు. పద్నాలుగో శతాబ్దానికి ఇంకా చెదురుమదురుగా ఉండి, 1343లో, చాసర్ మహాకవి జననానికి ఇంగ్లండ్లో సాహిత్యం ఎదురుచూస్తున్నది. ఇంకా రెండు వందలేళ్ళ తర్వాత కానీ షేక్స్పియర్ ఆంగ్ల సాంస్కృతిక సమాజంలో ప్రభవించడు. చాసర్ కాలానికే, భారత అనువాదం పూర్తి కావచ్చి, నన్నెచోడ కవి, పాల్కురికి సోమనల రచనా ధార తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తోంది. తెలుగు మాటల అంటే దేశి మాటల వాడుక పెరిగి, సంస్కృతి అంతా దేశి పదాల్లో విస్తరిస్తున్న సమాజం అది. భాష అభివృద్ధి వల్లనే ఏ భాషలోనైనా పర్యాయపదాలు, నానార్థాలు ఏర్పడతాయి. ఈ పర్యాయ పదాలను ఒక చోట చేర్చడం నామకోశం అని మన దేశంలోనూ, తిసారెస్ అని ఆంగ్లంలోనూ వాడుక. సంస్కృత ‘నామలింగానుశాసనం’ పేరిట క్రీస్తు శకం నాలుగో శతాబ్ది నాటికే అమరసింహుని అమరకోశం, సంస్కృత పదాలకు ఇటువంటి ఒక సూచిగా పద్య రూపంలో నిలిచింది. ఇదే పీటర్ మార్క్ రోజెట్ తయారీ అయిన ఇంగ్లిష్ తిసారెస్కు మూల ప్రేరణ అని ఆంగ్ల పండితుడు డాక్టర్ జాక్ లించ్ (1917–1999) అభిప్రాయపడ్డారు. రోజెట్ నామకోశం 1805 ప్రాంతాల నుంచీ తయారీ అని చెప్పినా, ఒక కొలిక్కి వచ్చి అచ్చులోకి వచ్చింది 1852లో! పదమూడు శతాబ్దాలు ముందరే ఇటువంటి నామకోశం సంస్కృత పదాలకు ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. అప్పటికే అది సౌష్టవమైన భాష. కానీ మన భాషా నిర్మాతలు ఆంగ్ల తిసారెస్ (్టజ్ఛిట్చuటuట) కన్నా దాదాపు శతాబ్దం ముందరే తెలుగు మాటల తిసారెస్ తేవడం గమనార్హం. దీన్ని భాషకు సంబంధించి ఆధునికతల తొలి వేకువగా చెప్పవచ్చు. ఈ గణనీయమైన కృషి 1750 ప్రాంతాలలో జరిగింది. దీని పేరు ఆంధ్రనామ సంగ్రహము. కవి, సంకలన కర్త, ఆ నానార్థ పదాలతో పద్యాల నిర్మాత... పైడిపాటి లక్ష్మణకవి. వీరు ఏ ప్రాంతంవారో చెప్పడానికీ, కచ్చితం అయిన కాల నిర్ణయం చేయడానికీ ఆధారాలు లేవు. కానీ వీరి తరువాత, ఈ నామ సంగ్రహానికి ఇంకొన్ని జోడింపులు జరిగితే కానీ సంపూర్ణం కాదని, ఆ పని చేసింది మాత్రం విజయనగర సంస్థాన ఆస్థానకవి ఆడిదం సూరకవి. ఈయన 1780 వరకూ జీవించారు. వీరు జత కూర్చిన మాటలతో ‘ఆంధ్ర నామ శేషము’ అని దానికి అనుబంధంగా వెలువరించి ఆంధ్ర నామ సంగ్రహకర్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ భాషావేత్తల తెలుగు మాటల సేకరణ జరిగిన చాలా దశాబ్దాలకు, చిన్నయ సూరి(1809–1861) ఇంకా ఆరేళ్లలో కన్ను మూస్తారు అనగా, 1855లో బాలవ్యాకరణం వచ్చింది. వ్యాకరణ పద్ధతుల స్థిరీకరణ జరగడానికి వందేళ్ల ముందరే, తెలుగు మాటల నామ సంగ్రహం జరగడం... తెలుగు భాష విషయంలో సరైన క్రమంలోనే జరిగిందని భావించవచ్చు. భారతీయ సాహిత్య లక్షణం అయిన పద్య రూపాల్లో లక్ష్మణకవి, సూరకవి ఈ నామకోశం రచించారు. దేవ వర్గు మొదల్లో శివుడి ఇరవై పేర్లను ఒక సీసపద్యం, ఒక తేటగీతిగా లక్ష్మణకవి పొందుపరచిన తీరు ఒక సుశిక్షిత నిర్మాణానికి మచ్చు తునక. సీ. ముక్కంటి యరపది మోముల వేలుపు, మినుసిగ దయ్యంబు, మిత్తి గొంగ గట్టు విల్తుడు, గరకంఠుడు మిక్కిలి కంటి దేవర, బేసి కంటి వేల్పు వలిమలల్లుడు, వాక తాలుపు కొండ, వీటి జంగము, గుజ్జు వేల్పు తండ్రి వలరాజసూడు, జక్కుల రేని చెలికాడు బూచుల ఏకి మీడు పునుక తాల్పు, తే. విసపు మేతరి, జన్నంపు వేటకాడు బుడుత నెలతాల్పు, వెలియాల పోతు రౌతు తోలు దాలుపు, ముమ్మొనవాలుదాల్పు నాగ భవదాఖ్యలొప్పు అంధక విపక్ష ఇలా అచ్చ తెలుగులో రెండు వందల పేజీలుగా దీని నిర్మాణ విభాగాలు దేవ వర్గు, మానవ వర్గు, స్థావర వర్గు, జంగమ వర్గు, నానార్థ వర్గు. ఏ పద్ధతి అయితే అమరసింహుడు మొదలు పెట్టాడో అదే యిక్కడ తెలుగులోనే కాక, సముద్రాల కడ నున్న ఇంగ్లిష్ వారికీ 18వ శతాబ్దంలో శిరోధార్యం అయింది. ఈ విభాగ పద్ధతిలోనే ఇంగ్లిష్ తిసారెస్ ప్రతి దశాబ్ద్దమూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆంగ్లభాషా ప్రేమికులకు, అభ్యసనశీలురకు ఈ రోజెట్ తిసారెస్ తప్పనిసరి సంప్రదింపు పుస్తకం. దీని మొదటి రూపం, రెండు మూడు వత్సరాలు అటూ ఇటూగా మన బాల వ్యాకరణం వచ్చే కాలానికి పదిహేను వేల మాటలతో వెలువడ్డది. ఇప్పుడు రెండువేల మూడు వందల గ్రూపులుగా పర్యాయపదాలను కలిగి ఉన్నది. ఈ అభివృద్ధి ఆంగ్ల భాషకు సాధ్యం కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇంగ్లిష్ వారికి మన వంటి పద్యం లేదు కనుక వారి తిసారెస్ నిర్మాణం వచనంలోనే జరిగింది. ఇలా తెలుగులో వచన పర్యాయ పదకోశం మనకు తిరుపతి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా పని చేసిన ఆచార్య జి.ఎన్.రెడ్డి రచన తెలుగు పర్యాయపద నిఘంటువు వచ్చేంత వరకూ రాలేదు. ఈ నిఘంటువులో తెలుగు, సంస్కృత పర్యాయపదాలు కలిసే ఉన్నాయి. మొదటి తెలుగు నామ సంగ్రహాలు మాత్రం తెలుగు భాషకే పరిమితం అయ్యాయి. భాష అభివృద్ధిని సూచించే ఒక సూచీ పదకోశాన్ని తెలుగు భాషావేత్తలు పదిహేడో శతాబ్దంలోనే నిర్మించడం, అదీ ఆంగ్లభాష తిసారెస్ కన్నా దాదాపు వందేళ్ల ముందరే రావడం ప్రపంచ భాషా సమాజాల్లో తెలుగుకు ఒక సమున్నతమైన గుర్తింపును అందచేసే పరిణామం! ఇందుకు కారకులైన పైడిపాటి లక్ష్మణకవి, అడిదం సూరకవిని మనం రోజూ తలచుకోవాలి.- ఠి రామతీర్థ, మొబైల్ నెం: 98492 00385 -
నేడు సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు
అనంతపురం కల్చరల్ : విమలాశాంతి సాహిత్య సాంఘిక సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో పలు సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు శాంతినారాయణ ఓ ప్రకటనలో వెల్లడించారు. లలితకళాపరిషత్తు వేదికగా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాలను రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ, ఆర్డీటీ కల్చరల్ విభాగం వారు రూపొందించారు. ఉదయం 10 గంటలకు సకల వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జానపద గీతాలాపన, 11 గంటలకు డాక్టర్ శాంతి నారాయణ రచించిన ‘పెన్నేటి మలుపులు’ నవలావిష్కరణ ఉంటాయి. మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛోఫెర్రర్, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ తదితరులు నవల గురించి ప్రసంగిస్తారు. అనంతరం ‘తెలుగు సాహిత్యం, సమాజం–దళిత బహుజన, గిరిజన, మైనార్టీల అస్థిత్వం’ అనే అంశంపై చర్చా వేదిక ఉంటుంది. ప్రముఖ రచయితలు లక్ష్మీనరసయ్య, బండి నారాయణస్వామి తదితరులు సమన్వయం చేస్తారు. సాయంత్రం రెండు రాష్ట్రాలకు చెందిన 120 మంది కళాకారులు, రచయితలు, కవులతో సమ్మేళనం ఉంటుంది. రాత్రి 7 గంటలకు డాక్టర్ విజయభాస్కర్ రచించిన ‘రాజిగాడు రాజయ్యాడు’ అనే సందేశాత్మక నాటకం ప్రదర్శిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాహితీ, కళాభిమానులు విరివిగా విచ్చేయాలని శాంతినారాయణ కోరారు. -
నీట రాసిన పేరొక్కటి కాలగతిని మార్చింది
తనకు కలిగిన విస్మయానందాలనే కాదు, అనుభవించిన విషాదాన్ని కూడా మధురిమగా మార్చి, పాతికేళ్లకే ప్రపంచాన్ని అబ్బురపరచి, పండి, రాలిపోయిన ఒక మహాకవి, తనకు తానే స్మృతి వాక్యం చెప్పుకున్నాడట, తన సమాధిపైన శిలా ఫలకం మీద, ఈ మాటను రాయమన్నాడట. "Here lies One whose name is writ in water." ఈ పదును, ఈ వేదన, ఈ నైరాశ్యం, ఈ ఆత్మనిస్పృహ మూర్తీభవించిన ఈ వాక్యాన్ని, తెలుగులో ఎలా చెప్పాలో తెలియక ఒక రోజంతా కొట్టుమిట్టాడాను. ‘వాక్యమే దైవం’ అనే సంస్కృతికి చెంది, ఈ మాటను అక్షరాలా నమ్మే యువకవి, తన మూర్తిమత్వాన్నంతా ఆ వాక్యంలోనే నిక్షిప్తం చేసుకొన్నాడు. అందుకే బిబ్లికన్ స్ఫురణ కలిగేలా ’గిటజ్టీ’ అనే మాటను అప్రయత్నంగా వేసుకొన్నాడు. ఆ మాట పదును, అందులోని నిర్వేదం చెడకుండా తన ‘స్మృతి వాక్యాన్ని’ మరో భాషలోకి తేవడం సాధ్యమవుతుందా? అందులోనూ భిన్న సంస్కృతి సంప్రదాయానికి చెందిన తెలుగులోకి! తెలుగులో ఆ మాటల అర్థమైనా, తేటదనం చెడకుండా తెలుసుకోవాలనేవారి సౌలభ్యం కోసం, తాత్కాలికంగా, ఆ భావాన్నిలా తెలుగులో పెడుతున్నాను. ‘‘ఇట నుండె నొకడు నీట రాసిన పేరుగలవాడు’’. భయంకరమైన క్షయవ్యాధి పాలై, జీవితంలో ఆశించినదేదీ పొందకుండా, అసలు జీవితాన్నే చూడకుండా, మృత్యుగహ్వరంలోకి వెళ్లిపోతున్న ఒక కవి, పాతికేళ్లు నిండీ నిండని వాడు, అలా తన గూర్చి తాను ‘స్మృతి వాక్యం’ పలికాడంటే, తన పేరొక నీటిపై రాతగా మారిపోతున్న స్థితిని అనుభవించాడంటే, అ క్షణంలో అతనను భవించిన వేదన ఎంతటిదో ఒక్కక్షణం మనం ఊహించుకొన్నా చాలు, ఇప్పటికీ కరిగి కన్నీరవుతాము. జీవితమంతా ఆ కన్నీటిని రుచి చూస్తూనే, అక్షరాల పన్నీటిని లోకంపై చల్లి, నిష్ర్కమించిన ఆ మహాకవి పేరు జాన్ కీట్స్! ఆంగ్ల సాహిత్య విద్యార్థిగా బియ్యే చదువుతున్నప్పుడు మా విశ్వనాథం మేష్టారు, కీట్స్ పాఠం చెబుతూ "My Heart aches, and a drowsy numbness pains" అనే మాటల్లో ఆ "aches" (బాధపడుతోంది) అనే పదాన్ని, "drowsy numbness" (మగత కమ్మిన జడత) అనే పదాలను అలా సుతారంగా నొక్కుతూ, లయబద్ధంగా పలుకుతోంటే, ఏదో తెలియని పారవశ్యంలో మా గుండెలూ మూలిగేవి, క్షణంసేపు మాగన్నుగా మారేవి... కీట్సును సాంతం చదవాలని ఆశ... కాని అర్థమయ్యేది కాదు... అక్షరమక్షరంలోనూ కరిగించే అనుభూతితో పాటు, అడుగడుక్కూ అర్థంకాని భావనిధి! పురాగాథ ముడి! వాటిని తెలుసుకొనే లోపు, అనుభూతి జారి పోతుంటుంది. ధారగా చదువుకోవడానికి కుదిరేది కాదు... శాశ్వతానందమిచ్చే కీట్స్ కవితామృతాన్ని తెలుగు పలుకుల్లో ఏ మహానుభావుడైనా సాంతం అందించకూడదా; అని వెర్రిగా ఆశపడే తెలుగువారు అసంఖ్యాకులున్నారు. ఇదిగో, ఇంతకాలానికి, ఒక మహానుభావుడు, మూడు పాతికలు దాటిన వయసులో, పాతికేళ్ల గుండె మృదు మధుర ‘ధ్వని’ని పట్టుకొని, ఇలా తెలుగుతో శ్రుతి పరచి ‘సాంతం’ అందిస్తున్నారు... కీట్స్ కవితల సమగ్ర అనువాదం ఇది. నిజానికి దీన్ని అనువాదం అనడం తప్పు; ఇది అనుశ్రుతి! ఓ భాషా రచన మరో భాషా వచనంలోకి వస్తుంటే అది అనువాదమవుతుంది; కాని, ఓ కావ్యరచన మరోభాషలో అవతరిస్తుంటే అది ‘అనుశ్రుతి’ అవుతుంది. ఓ భాషాకవి గుండెతో మరో భాషాకవి తన గుండెను శ్రుతిపరిస్తే అది అనుశ్రుతి అవుతుంది. భాషల మధ్య అనుశ్రుతి, భాషాతీత భావన కోసం! నాగరాజు రామస్వామి గారి ప్రస్తుత కావ్యంలో సరిగ్గా అదే జరుగుతున్నది. తన్ను ప్రేమించే వారికోసం, కీట్స్ తెలుగు నేర్చుకొని, తెలుగులో తన గొంతు శ్రుతి పరచుకొన్నాడు. ప్రతి రచన ఒక తపస్సే. ఈ దారిలోని అనుసృజన ఉగ్రతపస్సు. మాట మాటకూ అర్థం వెదుక్కోవడం కాదు కష్టమైనది, దాని వెనుక ఉన్న అర్థం- ఉద్దేశితార్థం+ అనుద్దేశంగానే ధ్వనించే అర్థం- కలిపి పట్టుకోవడం చాలా కష్టం. కవితలో శబ్ద సౌందర్యాన్ని గ్రహించడం కొంత సులువే. కాని శబ్దంలోని ధ్వనిని పారమ్యంగా గ్రహించడం మహాకష్టం. ఆనందవర్ధనుల వారు ‘ధ్వని’కున్న మూడు ప్రధాన పార్శ్వాలనూ ఆవిష్కరించారు. ‘వస్తువు’కున్నది మూడు పార్శ్వాలే కనుక, వస్తు దృష్టితో ఆయన మూడు పార్శ్వాల వద్దనే ఆపారు. కాని ‘ధ్వని’కి గల పార్శ్వాలు అనంతం. అసలు ఆ ‘అనంతమే’- శబ్దం ధ్వనించగా మిగిలిన నిశ్శబ్దం- అదే ఒక గొప్ప పార్శ్వం. ‘వస్తువు’లోని మూడు పార్శ్వాలను మించిన ‘పరావస్తువే’ అసలైన గొప్ప ధ్వని. అలాంటి అనంత శక్తిమంతమైన ధ్వనిని ఎంతో కొంత ప్రతి సత్కవి తన కవితలో ఉపలక్షిస్తుంటాడు. భౌతికేంద్రియాల స్థాయిలోని సంవేదన రగిలించడంలో పేరు పడ్డ- ఐంద్రిక కవి, ‘సెన్షువల్ పొయెట్’గా గుర్తింపబడ్డ- కీట్స్, అలా భౌతికేంద్రియ స్థాయిలో కవిత రాస్తూ రాస్తూనే, అద్భుతమైన ఆత్మ రహస్తీరాల్లోకి తీసుకుపోతాడు. చెప్పిన వాటికంటే, చెప్పటి వాటి సౌందర్యాన్ని గుండెల్లో నింపేస్తాడు. ఆధ్యాత్మికతకు నిజమైన అర్థమే అది. సౌందర్యం, ఆధ్యాత్మికతకు మరోపేరు అవుతున్నదే అక్కడ! దాన్ని+దాన్ని ధ్వనించేదాన్ని పట్టుకోవడమెలా సాధ్యం? కీట్స్ చెప్పుకున్న ఒక స్మృతి వాక్యాన్ని తెలుగులో చెప్పడానికి, ఒక్క రోజంతా కొట్టుమిట్టాడాను, అయినా ఆ అందం, పదును పొరపాటున కూడా తొంగిచూడలేదు. మరి ఈ నలభై ఒక్క గీతాల సమగ్ర అనుశ్రుతిని వెలువరించడానికి నా.రా.గారు ఎంత తపించి ఉంటారు. ‘‘మలి సంజలో వికసిస్తున్నవి మేఘ మాలికలు పశ్చిమాకాశంలో పూస్తున్నవి గులాబీలు ఏటిగట్టున చిరు చిమ్మటల చిరు బృందగానం కొండకొమ్మున గొర్రె మందల కోలాహలం గుబురు పొదలలో గొల్లభామల గీతం’’ ఈ మాటల్ని చదువుతూంటే, ఇదో ఆంగ్ల కవితకు తెలుగు సేతగా అగుపించదు. ‘గొర్రెమందల కోలాహలం’ అన్నదగ్గర కాస్త భ్రుకుటి ముడిపడ్డా, ‘గొల్లభామల గీతం’ అనగానే నెన్నుదురు విప్పారుతుంది. మనది కాని సంస్కృతి పరిసరాన్ని, మన మాటల్లోకి దించినప్పుడు కూడా ఆ మాటల పోహళింపువల్ల మనతనం అనుభూతి విడిపోదు. ‘‘తమసు పులుముకున్న పొదల మృదుల తావులు మధు శీధువు నిండిన వనకస్తూరి రోజా పరిమళాలు రెల్లుగరికల, రేగుపళ్ల, రేతిరి పూల సుగంధాలు, వేసవి సాయంత్రాలలో వెంటాడే ఈగల రొదలు’’ మృదువైన ఈ మాటల కూర్పు మనల్ని వెంటనే తమలోకి తీసుకువెళ్తాయి. అయితే అందులో వర్ణితమైన వస్తువులు, ఆ ‘వస్తు’ పరిసరం మనకు చాలా అపరిచితమైనవి. అవి మన కావ్యసీమ మర్యాదకి చెందినవి కావు. వనకస్తూరి పరిమళాల మధ్య రోజా ఉండదు. రెల్లుగరికలు, రేగుపళ్లు మనకు కొత్తవి కాకపోయినా వాటిని రేతిరి పూల సుగంధాలతో ఎవరు కలబోయరు. వేసవి సాయంత్రాలలో ఏ తెలుగు రసికకవి, ఈగల రొదలని వినిపించలేదు. మన కావ్యభాషలో మనది కాని వస్తు ప్రపంచాన్ని కూడా మనదిగా మార్చేస్తున్నారు నా.రా. కీట్సంటేనే ‘గుండెమూలిగే’ మాలాంటి వారు, ఇప్పుడు కీట్సును చదువుకోవచ్చు, అమ్మ ఉగ్గుపాల నుడిరుచితో. (జాన్ కీట్స్ కవితలను నాగరాజు రామస్వామి ‘ఈ పుడమి కవిత్వం ఆగదు’ పేరిట తెలుగులోకి తెచ్చారు. ఫోన్: 040-23112625) ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, 9441809566 -
కొత్త పుస్తకాలు
అద్దంలో అటువైపు కథకుడు: డాక్టర్ యండమూరి సత్యకమలేంద్రనాథ్; పేజీలు: 192; వెల: 120; ప్రతులకు: నవసాహితి బుక్ హౌస్, ఏలూరు రోడ్, విజయవాడ-2. ఫోన్: 0866-2432885 ఇందులో 22 కథలున్నాయి. దాదాపు ఐదేళ్ల కాలంలో రాసినవివన్నీ. ‘చాలా కథల్లో ముఖ్యపాత్ర డాక్టరుదవటానికి, బహుశా ఈ రచయిత అదే వృత్తిలో ఉండటం కారణం కావచ్చు. అయితే తనకు తారసపడిన వివిధ రకాల పేషెంట్ల మనస్తత్వ విశ్లేషణ ఈ కథల్లో కనబడుతుంది. అంతేకాదు, కొంత రొమాన్సు, కొంత కవిత్వం, హాస్యం కూడా ఇందులో ఉన్నాయి’. మరణం అంచున రచన: వర్ధెల్లి వెంకటేశ్వర్లు; పేజీలు: 110; వెల: 75; ప్రతులకు: పెద్ద పుస్తక షాపులతోపాటు, అడుగుజాడలు పబ్లికేషన్స్, 302, వైష్ణవి నెస్ట్, మూసారాంబాగ్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-36. ‘ఒక అనాదిజాతి(చెంచు) యావత్తూ మరణం అంచుకు నెట్టబడిన అమానుష సన్నివేశానికి మానవీయ దర్పణం ఈ పుస్తకం’. చెంచుల పట్ల అమితమైన తపనతో పదేళ్లపాటు నల్లమలలో తిరిగి రూపొందించిన పాత్రికేయ డాక్యుమెంట్. చెంచుల ఆహారపు అలవాట్లు, వివాహ వ్యవస్థ, ఆచారాలు, పండుగలతోపాటు వారి మనుగడను దెబ్బతీస్తున్న అంశాలను ‘నిఖార్సయిన సమాచారం’తో వెల్లడించిన రచన. తూరుపు వలస రచన: మన్నె సత్యనారాయణ; పేజీలు: 156; వెల: 75; ప్రతులకు: పల్లవి పబ్లికేషన్స్, డాక్టర్ ఎ.ప్రేమ్చంద్ కాంప్లెక్స్, అశోక్నగర్, విజయవాడ-10; ఫోన్: 9866115655 ‘ఆంధ్రదేశంలో ఒకపుడు జరిగిన అతి పెద్ద వ్యవసాయ వలస ద్వారా ఏర్పడిన ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక సమ్మేళనాలను పరిశీలించి వ్రాయబడిన తెలుగువారి కథ. విస్మరింపబడిన సమీపగతంలోని జీవన పరిస్థితులు, పరిభాష, ప్రజా చిత్రాన్ని నేటి తరం వారికి తెలియ చెప్పే నవల’. వాడుక భాష - రాసే భాష రచన: ఉన్నం వెంకటేశ్వర్లు; పేజీలు: 96; వెల: 50; ప్రతులకు: కె.ఉషారాణి, 12-628/25, 26, 6వ క్రాస్ రోడ్డు, సుందరయ్య నగర్, తాడేపల్లి, గుంటూరు జిల్లా-522501; ఫోన్: 9618976880 ఎందరో పాత్రికేయులకు శిక్షణ ఇచ్చిన ‘వి.వి.’ చెబుతున్న భాషా పాఠాలు ఇవి. అచ్చు తప్పులు, వాక్య నిర్మాణంలో దోషాలు, పదబంధాలు, వాడుకలో లేని మాటలు, రచనాశైలి మెరుగుపరుచుకోవడం లాంటి అంశాలను సుబోధకంగా వివరించిన పుస్తకం. వర్తమాన జర్నలిస్టులకు ఉపయుక్తం. తంగేడు వనం సంపాదకుడు: మామిడి హరికృష్ణ; పేజీలు: 350; ప్రతులకు: డెరైక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్. ‘ప్రపంచ సాహితీ చరిత్రలో తంగేడు పూలపై అత్యధిక కవితల సంకలనం’గా వెలువడిన ఈ పుస్తకంలో 166 కవితలున్నాయి. బతుకమ్మకూ బతుకమ్మలో ప్రధాన పేర్పుగా ఉండే తంగేడుపూలకూ తెలంగాణ జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంది. అట్లాంటి తంగేడు పూలకు ‘తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ’ అర్పించిన నివాళి ఇది. -
సాహిత్య కార్యక్రమాలు
భాషా సాహిత్యాల అధ్యయనం యానాంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కళాశాలలో ఫిబ్రవరి 23న ‘ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషా సాహిత్య అంశాల తులనాత్మక అధ్యయనం’ అంశంపై సదస్సు జరగనుంది. కీలకోపన్యాసం: శిఖామణి. సి.రత్నఘోష్ కిశోర్, మణివేళ్, టి.విశ్వనాథరావు, కోయి కోటేశ్వరరావు, విస్తాలి శంకరరావు, దాట్ల దేవదానం రాజు పాల్గొంటారు. పత్ర సమర్పకులు పాల్గొనవలసిందిగా ప్రిన్సిపల్ టి.సెల్వం కోరుతున్నారు. వివరాలకు: 9440127967 146 మంది పత్ర సమర్పణ మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ‘పరిశోధన: నాడు, నేడు, రేపు’ పేరిట జరగనున్న అంతర్జాతీయ సదస్సులో 146 మంది పరిశోధకులు వివిధ అంశాలపై పత్ర సమర్పణ చేయనున్నారు. ‘కవిత్రయ మహాభారతం-వ్యక్తిత్వ వికాసం’తో ప్రారంభమై, ‘ఎరుకల భాష- ఒక పరిశీలన’తో ముగిసే ఈ సదస్సు వేదిక: చెన్నైలోని విశ్వవిద్యాలయ రజతోత్సవ ప్రాంగణం, మెరీనా క్యాంపస్. అధ్యక్షులు: రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. పరిశోధన పత్రాల పుస్తకావిష్కరణ: చిలకం రామచంద్రారెడ్డి. ఇందులో, పి.డేవిడ్ కుమార్, శ్రీనివాసరెడ్డి, కొంచాడ మల్లికేశ్వరరావు, బూదాటి వేంకటేశ్వర్లు, జి.వి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, మాడభూషి సంపత్కుమార్, విస్తాలి శంకరరావు, వెలుదండ నిత్యానందరావు, నాగసూరి వేణుగోపాల్, గుమ్మా సాంబశివరావు, మేడిపల్లి రవికుమార్, పేట శ్రీనివాసరెడ్డి, ఎస్.జయప్రకాశ్, శారద, పుల్లూరి ఉమ తదితరులు పాల్గొంటారు. చింతపట్ల పుస్తకావిష్కరణ పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో- చింతపట్ల సుదర్శన్ ‘సుదర్శన్ సెటైర్స్ ః తెలంగాణ.కామ్’, గొట్టిపర్తి యాదగిరి రావు ‘విస్ఫోటనం’ పుస్తకాల ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 25న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరాబాద్లో జరగనుంది. అమ్మంగి వేణుగోపాల్, ఎస్వీ సత్యనారాయణ, అంబటి సురేంద్రరాజు, ఏనుగు నరసింహారెడ్డి, కె.పి.అశోక్కుమార్, గుడిపాటి పాల్గొంటారు. -
పడావు పడిన నేల పడే తన్లాట
పుస్తక సమీక్ష ఈ పద్నాలుగు కథలు అనేక సారూప్యతలనూ, పరస్పర విభిన్నతలనూ వొదిగించుకొని ఏడేడు పద్నాలుగు లోకాలను చూపిన అనుభవాన్నిస్తాయి. ఈ సంకలనంలోని చాలా కథలకూ నేపథ్యం సుదీర్ఘ చరిత్ర. ‘దుఃఖాగ్ని’, ’ సంపుడుపంజెం’, ’పూర్తికాని కథ’, ‘అమ్మ’ గత చరిత్ర రగిల్చిన దుఃఖాలు. వర్తమానంలో ప్రతిఫలిస్తున్న నిఘ్ఠర గాయాలు. ‘తమ్ముడి మరణం’, ‘థర్డ డిగ్రీ’, ‘అలికిన చేతులు’ ఆ గాయాలకు పూసిన రక్తపుష్పాలు. వెరసి ఈ కథలన్నీ తెలంగాణ రక్తమాంసాలు. కవితాత్మకమైన వుద్వేగంతో ప్రారంభమై ప్రతీకాత్మక పాత్రల్ని తలదన్నే పాత్రల్ని రూపొందించుకొని నడిచిన ‘దుఃఖాగ్ని’ తెలంగాణ వుద్యమాన్నీ , వుద్యమానికి మూలమైన దైన్యాన్నీ చిత్రించడంతోనే ఆగకుండా ఒక కార్యాచరణ వైపుకు ముగింపు నిచ్చింది. ‘సంపుడుపంజెం’ దళిత వరస మరణాల దగ్గర ప్రారంభమై, తరతరాలుగా సంస్కృతిని నిలబెడుతున్న వాళ్లని రికార్డు చేయలేక పోవడంలోని వైయక్తిక అసహాయతను చిత్రించింది. ‘అమ్మ’ చరిత్ర మలుపులో ఒక అనివార్యతలో కనుమరుగైపోయిన కొడుకును ఎదురు చూసే తెలంగాణను గుర్తుచేస్తుంది. ఉద్యమమది ఏదైనా, అదెంత ప్రజాస్వామికమైనదైనా, దానిలోని ‘అతి’ కొందరు కార్యకర్తల్లో వ్యక్తీకరింపబడుతుంది. ప్రతి వుద్యమంలోని కార్యకర్తయినా ‘పూర్తికాని కథ’లోని పాత్రలాగే వుండొచ్చు. ఇక, ఐడెంటిటీ క్రైసిస్తో, వ్యకిగత సంక్షోభంతో సతమతమయ్యే వ్యక్తులు వర్తమాన చరిత్రలో కొల్లలు. ఈ సంక్లిష్ట స్థితికి ఉప ఫలితాలుగా వచ్చినవే ‘తమ్ముడి మరణం’ లోని ‘థర్డ డిగ్రీ’లోని, ‘అలికిన చేతులు’లోని మృత్యు దుఃఖాలు. ఈ సంకలనంలోని దుఃఖ దృశ్యాలు అక్కడితోనే ఆగలేదు. ఆధునిక అభివృద్ధి ప్రతిఫలనాలైన రహదారుల మీద మృత్యు కోరలు చాస్తున్న టోల్ గేట్లను చిత్రిస్తూ, ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా వుండాల్సిన ఆరోగ్యశ్రీ కార్యక్రమాల్లో తెల్లకోట్లు జరిపే విశృంఖల ఆపరేషన్లు స్త్రీలను పెడుతున్న హింసలను వివరిస్తూ, స్త్రీని ఆస్తిగా చూసే ‘ఇండియాస్ సన్ ’లోని రేపిస్టు మగ యిగో స్వగత దుఃఖాల మీదుగా, ‘2047’లోని ఆత్మలు చెప్పే అసమ అభివృద్ధి ఆత్మకథలుగా కొనసాగినాయి. ఇన్ని కథలూ మృత్యు చిత్రాలుగా వుండి పాఠకుడి అంతరంగాన్ని కలవరపరుస్తాయి. తెలంగాణ కథలంటే పొక్కిలి నేల మీద పారాడే అమాయక కోడిపిల్లలనిపిస్తాయి. వీటికి భిన్నంగా ‘చౌరస్తా’ ‘ఇల్లు’ ఇంకో విరుద్ధ కోణాన్ని పట్టి చూపుతున్నాయి. ఆశ్చర్యకరంగా చౌరస్తాలోని ప్రొటాగనిస్ట్ ‘బతుకుడంటే లోకమ్మీద పడి అందినకాడికి దొబ్బుకు తినుడే’ అనే తత్త్వాన్ని కథ ఆద్యంతమూ నిరూపించి నిలబెడతాడు. ‘ఇల్లు’లో త్యాగానికి ప్రతీకగా వుండాల్సిన తెలంగాణ తాత, కొడుకుల మీది కోపంతో మనవడి భవిష్యత్తును కాంక్షించని వికారాన్ని ప్రదర్శిస్తాడు. మృత్యువుతో పొక్కిలైన నేల ఈ కొత్త వికారాల్ని ఎలా పొందిందని ఆలోచిస్తే, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సలో భాగంగా పొందిందా, దీనికి వేర్లు ‘పూర్తికాని కథ’లో చెప్పిన మేధావుల వైయక్తిక విధ్వంసంలోంచి బయలుదేరాయా అన్నది పరిశోధించాల్సిన అంశం. అయితే ఇవి ఇంగిలీసు విద్యామాయలో పడ్డ తెలంగాణ గ్రామీణుల్లోనూ వ్యాపించాయని ‘చుక్కలురాని ఆకాశం’లోనూ కథనం చేయబడింది. 25 సంవత్సరాలుగా వెలువడుతున్న వార్షిక కథా సంకలనాల కంటే భిన్నమైన కథా సంకలనాల పరంపరను వెలువరించే బాధ్యతను నెత్తికెత్తుకున్న సంపాదకులు ఒక ట్రెండు కథల ఎంపికలోనూ, చాలా కథ ల్లో దొర్లిన అచ్చుతప్పుల మీదనూ మరింత శ్రద్ధ పెట్టివుంటే బావుండేది. తన్లాట-తెలంగాణ కథ 2014 సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, వెల్దండి శ్రీధర్; పేజీలు: 160; వెల: 60 ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలు; సంగిశెట్టి ఫోన్: 9849220321 జి.వెంకటకృష్ణ, 8985034894 -
సాహిత్యం హృదయ వ్యాపారం
ఫిబ్రవరి 28న రారా జయంతి ‘‘సాహిత్యం సంపూర్ణంగా హృదయ వ్యాపారం. విమర్శ మేధా వ్యాపారం. అయితే సాహిత్యాన్ని ముందు హృదయంతో ఆస్వాదించి, తరువాత మేధతో పరిశీలించేవాడే ఉత్తమ విమర్శకుడౌతాడు. ఆధ్యాత్మికవాదమూ, ప్రతీకవాదమూ, అస్తిత్వవాదమూ మొదలైన వాదాలెన్నివున్నా అవి సాహిత్య విమర్శకు సమగ్రతను చేకూర్చలేవు. మానవతావాదమొక్కటే నిజమైన సాహిత్యవాదం’’- ఈ వాక్యాలు ఉత్తమ సాహిత్య విమర్శకుడి గురించి, ఉత్తమ సాహిత్య లక్ష్యం గురించి రాచమల్లు రామచంద్రారెడ్డి(రారా) దృక్పథం. వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడమూ, ఉన్నత జీవనవిధానానికి మార్గం చూపించడమూ, ఉత్తమ హృదయ సంస్కారానికి ప్రేరణ యివ్వడమూ సాహిత్య లక్ష్యాలుగా చలామణి కావడం లేదు. యిట్టి స్థితిలో విస్మరణవాద సాహిత్యానికి అడ్డుకట్ట వేయకపోతే కలిగే ఉపద్రవాన్ని పసిగట్టిన రారా, తెలుగు పాఠకులు, పత్రికలు పనిగట్టుకుని మోసే అనాగరిక, ఆటవిక అథోస్థాయి సాహిత్యాన్ని తన కత్తివాదర లాంటి శైలితోనూ, రాజీలేని మార్క్కిస్ట్ నిబద్ధతతోనూ తుత్తునియలు చేశాడు. ‘సమాజంలోంచి పుట్టే సాహిత్యానికి గమ్యస్థానం కూడా సమాజమే’ కావాలని తపించిన వ్యక్తి రారా. మంచి సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్యం రావాలి, మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ రావాలి. అందుకే రారా మార్క్స్ సిద్ధాంతాన్ని సాహిత్యానికి అన్వయించి చూపి, సాహిత్యానికి గల సమాజాన్ని మార్చే శక్తిని విశదీకరించినాడు. రారా కథకుడిగా కన్ను తెరిచినప్పటికీ, విమర్శకుడిగానే సాహితీలోకానికి సుపరిచితుడు. చాలామంది సమీక్ష వేరు, విమర్శ వేరు అనుకొంటుంటారు. ఈ సాంప్రదాయాన్ని మార్చి, పుస్తక సమీక్షల స్థాయిని పెంచి వాటిని గొప్ప విమర్శలుగా చేసిన ఘనత రారాతోనే మొదలైంది. ఒక రచనను విమర్శించేటపుడు ఆ రచయిత సాహిత్య జీవితాన్నంతటినీ ప్రస్తావించవచ్చుగానీ, అతని సాహిత్యేతర జీవితాన్ని ప్రస్తావిస్తే అది అక్రమమైన వ్యక్తిగత విమర్శ అవుతుందని రారా అభిప్రాయం. అలాగే గ్రంథ రచయిత ఎంతటివాడైనా, చివరకు తనతో స్నేహ బంధుత్వాలు కలిగివున్నా ఆ ప్రభావం గ్రంథవిమర్శ మీద పడకూడదనేది కూడా ఆయన అభిప్రాయం. అంతేగాక అకడమిక్గా చదువుకొని ఆ సూత్రాల చట్రంలో సాహిత్య విమర్శ చేస్తే, అది ‘అకడమిక్ విమర్శ’ అవుతుందనీ, గాఢమైన సాహిత్యాభిరుచి వున్నపుడే అతడు గొప్ప విమర్శకుడౌతాడనీ రారా వాదన- నిజమే సాహిత్యం హృదయానికి మాత్రమే అర్థమౌతుంది కనుక. టి.హజరత్తయ్య 9502547993 -
సుతిమెత్తని హృదయపు మేరునగధీరుడు
అస్తమయం తొమ్మిదో తరగతి విద్యార్థిగా, 1947 మార్చి నవయుగలో 'ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరాయుధమోయ్' అని రాసి, ఇతరులకు ఇచ్చిన ఉద్యమ జీవిత పిలుపును ఆయన ఆ తర్వాత డెబ్భై సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడ మరిచిపోకుండా పాటించారు. నిత్యవర్తమానమూ నిరంతర చలనశీలీ చలసాని ప్రసాద్ గురించి గతం అన్నట్టుగా రాయడమంటే విశాఖ సముద్రపు విషాదఘోష వినిపించడం తప్ప మరేమీ కాదు. ఆయనలోని ఎన్నెన్నో కోణాలను ఆయన బహుముఖ ప్రజ్ఞను చూసిన నాలుగున్నర దశాబ్దాల పరిచయంలో, స్నేహంలో, ప్రేమలో, వాత్సల్యంలో, ఆలోచనాచరణల సాహచర్యంలో ఏ శకలాన్ని తీసి చూపితే ఆయనను అర్థం చేయించగలను? విశాఖ సముద్రంలో ఏ ఒక్క అలను చూపి కడలిని రూపుకట్టించగలను? నలభై ఐదేళ్లుగా నన్నాయన పేరు పెట్టి పిలవడం కూడ దూరమే అనుకుని బాబూ అని పిలిచేవాడు. అంతరాంతర రహస్యాల్నీ, దుఃఖాల్నీ, ఆలోచనల్నీ, ఆనందాల్నీ ఎన్నిటినో పంచుకున్న ఆయనను ప్రసాద్గారూ అని పిలిచినా, చివరి రోజుల్లో చాదస్తం వస్తున్నదని విసుక్కున్నా ఆయన నా హృదయంలోని ఒక అవిభాజ్యమైన భాగం. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు. బహుశా ఆయన గురించి అలా అనుకోగలిగినవాళ్లు తెలుగు సమాజంలో కొన్ని వేలమంది ఉండి ఉంటారు. ఈ కాలంలో అజాతశత్రువులూ, అందరికీ కావలసినవాళ్లూ ఉండే అవకాశం లేదు గాని, బహుశా ఆయన అటువంటి అసాధారణ జీవి. లోకమంతా తప్పుడు మనిషని విమర్శించే మనిషిని కూడ ఆయన ‘మంచాడే’ అనగలిగేవాడు. నాకు తెలిసి ఇద్దరే ఇద్దరి పేర్లు వింటేనే అసహ్యించుకునేవాడు తప్ప ఆయన తప్పుపట్టిన మూడో మనిషి పేరు నేను వినలేదు. తనకు ద్రోహం చేసినవాళ్లను కూడ ఆ ద్రోహం ఆనవాలు కూడ తాను చూడలేదన్నంతగా ప్రేమించాడు. కృష్ణా జిల్లా దివి తాలూకా నాదెళ్లవారిపాలెంలో 1932 డిసెంబర్ 8న పుట్టిన చలసాని ప్రసాద్ తన ప్రాంతాన్నీ కులాన్నీ వయసునూ కూడ అధిగమించి వేలాది మందికి స్నేహం పంచాడు. వేలాది మంది ప్రేమను చూరగొన్నాడు. ఒకవైపు తండ్రి చల్లపల్లి జమీందారు దగ్గర పనిచేస్తుండినా, 1930లలోనే కుటుంబంలోకి కమ్యూనిస్టు భావజాలం ప్రవేశించింది. అందుకే తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు, తన ఐదో ఏట, 1937 ఎన్నికల్లో భూస్వాముల జస్టిస్ పార్టీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు బలపరచిన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార ఊరేగింపులలో పాల్గొనడం తన తొలి జ్ఞాపకం. ఆ తర్వాత దశాబ్దం కృష్ణాతీరంలో మరిన్ని విప్లవ ప్రభంజనాలు వీచాయి. ఆయన కుటుంబమంతా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలై, జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో, తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమయ్యారు. ఆ ఉద్యమాల మీద కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్బంధంలో భాగంగా ఆయన పినతండ్రి జగన్నాథరావు, అన్న వాసుదేవరావు, బావ పాపారావు ముగ్గురినీ 1940 దశకం చివరిలో పోలీసులు కాల్చిచంపారు. అంటే ఆయన సరిగ్గా యవ్వన దశలో ప్రవేశిస్తున్న సమయానికే ఆయన ఏ మార్గంలో నడవవలసి ఉన్నదో నిర్ణయమైపోయింది. తొమ్మిదో తరగతి విద్యార్థిగా, స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యుడిగా, 1947 మార్చి సంచిక నవయుగలో ‘ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరాయుధమోయ్’ అని రాసి, ఇతరులకు ఇచ్చిన ఉద్యమ జీవిత పిలుపును ఆయన ఆ తర్వాత డెబ్భై సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడ మరిచిపోకుండా పాటించారు. ఆ ఉద్యమ జీవితమే ఆయనను సహజంగా సాహిత్యాభిమానంలోకి, సాహిత్యంలోకి నడిపించింది. 1955 ఎన్నికల ప్రచారంలో శ్రీశ్రీని వెన్నంటి ఉన్న సహచరుడిగా ఆయన శ్రీశ్రీకి అత్యంత సన్నిహితుడయ్యారు. శ్రీశ్రీ స్వయంగా ‘నా ఏకైక కైక’ అని సంబోధిస్తూ ప్రసాద్కు ఉత్తరాలు రాసేవారంటే, వాళ్లిద్దరి అవినాభావ సంబంధం అర్థమవుతుంది. ఈ ఉద్యమ జీవితం వల్ల నియతమైన చదువు సాగకపోయినా ప్రాచీన, ఆధునిక సాహిత్యమంతా ఆయనకు మేధలో మాత్రమే కాదు, హృదయమంతా నిండింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నోటిమీద పలికే ధారణాశక్తీ వచ్చింది. ఆయన సొంత గ్రంథాలయం బహుశా తెలుగు సమాజంలో వ్యక్తిగత గ్రంథాలయాలలో అతిపెద్ద వాటిలో ఒకటి కావచ్చు. నియతమైన చదువు లేకపోవడం వల్ల కాజీపేట రైల్వేస్టేషన్ క్యాంటీన్లో ఉద్యోగం దగ్గరి నుంచి మిత్రులు తీసిన సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ దాకా అనేక ఉద్యోగాలు చేసి చిట్టచివరికి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకుని 1960ల చివర విశాఖపట్నం మిసెస్ ఏవీఎన్ కాలేజీలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా చేరి, మూడు దశాబ్దాలకు పైగా అక్కడే ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట కాలం నుంచీ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సుందరయ్య, బసవపున్నయ్య వంటి ఎందరితోనో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, 1960ల మధ్య కాజీపేటలో ఉన్న రోజులనుంచే ఆయన కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి ఆలోచనలకు దగ్గరయ్యారు. ఇక విశాఖపట్నం జీవితం, పొరుగున ఉన్న శ్రీకాకుళ విప్లవోద్యమంతో, నక్సల్బరీతో సంబంధాన్ని ఇచ్చింది. శ్రీశ్రీ అరవయ్యో పుట్టినరోజు సందర్భంగా ‘రచయితలారా, మీరెటువైపు’ అని విశాఖ విద్యార్థులు విసిరిన సవాలులో, ఆ సవాలుకు ప్రతిస్పందనగా జరిగిన పరిణామాలలో, శ్రీశ్రీని విప్లవ రచయితల సంఘం వైపు తీసుకురావడంలో చలసాని ప్రసాద్ పాత్ర ఇంకా పూర్తిగా చరిత్రకు ఎక్కవలసే ఉంది. ఆయనే చాలాసార్లు 1970 గురించి చెపుతూ రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు ఆ తర్వాత గడిచిన నలభై ఐదు సంవత్సరాలలో ఆయన ఇంకా ఎక్కువ చరిత్రను రచించారు, చరిత్రను నిర్మించారు. శ్రీశ్రీ సమగ్ర సాహిత్యం ఇరవై సంపుటాలనూ, కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సర్వస్వం పద్దెనిమిది సంపుటాలనూ ఒక్కచేతిమీద ప్రచురించడంలోగాని, వక్తగా, కార్యకర్తగా, నాయకుడిగా, సాహిత్య ప్రేమికుడిగా, పుస్తక ప్రేమికుడిగా, స్నేహశీలిగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ వేలాది మంది హృదయాలలో తన సుతిమెత్తని హృదయంతో, నిరాడంబర ఆత్మీయతతో విద్యుత్తేజం నింపడంలో గానీ ఆయన మేరునగధీరుడు. మరొక కమ్యూనిస్టు సంప్రదాయపు కుటుంబం నుంచి వచ్చిన సహచరి విజయలక్ష్మి ఒక దశాబ్దం కింద మరణించినా పుస్తకాలతో, స్నేహితులతో, విశాఖ సమాజంతో కొనసాగిన ఆయన సాహచర్యం శనివారం ఉదయం ముగిసిపోయింది. ఎన్.వేణుగోపాల్ (వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు).