Year End 2023
-
2023 భారీ డిజాస్టర్ సినిమా ఇదే.. రూ. 45 కోట్ల బడ్జెట్కు లక్ష మాత్రమే వచ్చింది
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టాయి. నేడు ఇండియన్ సినిమాను ప్రపంచ దేశాలు కూడా దగ్గర చేర్చుకుంటున్నాయి. ఒక సినిమా కోసం నెలల పాటు కష్టపడటమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. సినిమా బాగుంటే థియేటర్ ప్రేక్షకుల నుంచి వచ్చే డబ్బే కాకుండా శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్ ఇలా పలు రకాలుగా తిరిగి పొందుతారు. అదే సినిమా బాగలేదని టాక్ వస్తే మొదటి రోజు నుంచే ఆ థియేటర్ వైపు వెళ్లరు. దీంతో నిర్మాతకు కోట్ల రూపాయల నష్టం తప్పదు. 2023లో కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ - హీరోయిన్ భూమి పెడ్నేకర్ నటించిన 'ది లేడీ కిల్లర్' నవంబర్ 3న విడుదలైంది. ఈ చిత్రం దారుణమైన వసూళ్లను అందుకుంది. బాలీవుడ్లో వీళ్లు అల్లాటప్పా యాక్టర్లు ఏమీ కాదు.. అక్కడ టాప్ రేంజ్లో వారికి గుర్తింపు ఉంది కాబట్టే ఈ సినిమా కోసం రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ నిర్మాతకు ఫైనల్గా కేవలం రూ. లక్ష మాత్రమే వచ్చింది. నమ్మలేకున్నా ఇదే నిజం. 2023లో విడుదల అయిన ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్గా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని అజయ్ బెహల్ దర్శకత్వం వహించారు. శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు. టీ-సీరీస్ వాళ్ల భాగస్వామ్యంతో ఈ సినిమా విడుదలైంది. మొత్తంగా ముంబై, ఢిల్లీ కలిపి 11 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు. సినిమా షూటింగులో ఉండగానే ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు అప్పటికే భారీగా బడ్జెట్ పెట్టేశారు. మళ్లీ ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు.. దీంతో సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయకుండానే విడుదల చేశారు. సినిమాలో కథతో పాటు ఏ ఒక్క విషయం కూడ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. మొదటిరోజు కేవలం 293 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఐఎండీబీలో కూడా కేవలం 1.5 రేటింగ్తో 'ది లేడీ కిల్లర్' ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ తీసుకుంది. అందుకు గాను నిర్మాతకు ఎంత చెల్లించారనేది తెలియదు. ఓటీటీలో కూడా ఆ చిత్రం వ్యూస్ మరీ దారుణంగా ఉన్నాయి. -
2023లో విపత్తులకు నిలయమైన రాష్ట్రం ఏది?
2023 ఉత్తరాఖండ్కు ప్రమాదాల సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్లో పలు భారీ ప్రమాదాలు జరిగాయి. 2023 ప్రారంభం నుండి చివరి వరకు ఏదో ఒక విపత్తు చోటుచేసుకుంటూనే ఉంది. ఈ ఏడాది ఉత్తరాఖండ్కు అనేక చేదు అనుభవాలను మిగిల్చింది. ఏడాది ప్రారంభంలోనే జోషిమఠ్లో భూమి కుంగిపోయిన ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టివేసింది. 2023 జనవరిలో చమోలి జిల్లా జోషిమఠ్లోని ఇళ్లు, రోడ్లకు అకస్మాత్తుగా భారీ పగుళ్లు కనిపించాయి. కుంగిపోతున్న జోషిమఠ్ అందరినీ కలవరానికి గురి చేసింది. ఈ వార్త దేశ విదేశాల్లో కూడా పతాక శీర్షికల్లో నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్లోని చమోలీలో నమామి గంగే ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా విద్యుదాఘాతానికి గురై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటన నేపధ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున పరిహారం అందించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఉత్తరాఖండ్లోని గంగోత్రి హైవేపై నుంచి బస్సు కాలువలో పడి ఏడుగురు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. నవంబర్లో ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మరణించారు. దీపావళి రోజున ఉత్తరకాశీలో సొరంగం కూలి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు వారిని 17 రోజుల తరువాత ర్యాట్ హోల్ మైనర్స్ బయటకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం చూతము రారండి! -
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు త్రివిధ దళాలలో మహిళా అధికారులకు సంబంధించి ఈ సంవత్సరంలో ఎన్నో ‘ప్రథమం’లు కనిపిస్తాయి. మహిళా సైనికులు ఆర్టిలరీ బ్రాంచిలలోకి అడుగుపెట్టారు. యుద్ధనౌకల కమిషనింగ్ బృందంలో భాగం అయ్యారు. అత్యంత కఠినమైన యుద్ధభూమి సియాచిన్లోకి వైద్యసేవల కోసం వెళ్లారు. భారత నావికాదళానికి చెందిన గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్’ ఇంఫాల్ మహిళా అధికారులు, నావికులతో ప్రత్యేక వసతులతో కూడిన తొలి యుద్ధనౌకగా అవతరించింది, నావికా, వైమానిక దళాలు తమ ఆపరేషన్లకు సంబంధించిన ప్రతి విభాగం లోకి మహిళలను అనుమతిస్తున్నాయి. ఇంతకాలం పురుషులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండే విభాగాలలో ఈ సంవత్సరం మహిళా అధికారులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చారు.... ► హరియాణాలోని జింద్ జిల్లాకు చెందిన చెందిన పాయల్ చబ్ర ఎంబీబీఎస్, ఎంఎస్ చేసింది. అంబాలా కంటోన్మెంట్ని ఆర్మీ హాస్పిటల్, లడఖ్లోని ఖర్దుంగ్లా ఆర్మీ హాస్పిటల్లో పనిచేసింది. ఆ తరువాత లడఖ్లోని ఆర్మీ హాస్పిటల్లో సర్జన్గా పనిచేసింది. ఒకవైపు సర్జన్గా పనిచేస్తూనే మరోవైపు పారో కమాండో కావడానికి ఆగ్రాలోని పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత పారా మిలిటరీ ప్రత్యేక భద్రతా దళంలో చేరిన తొలి మహిళా ఆర్మీ సర్జన్గా ప్రత్యేకత సాధించింది. ►ముంబాయికి చెందిన ప్రేరణ దేవస్థలీ సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2009లో భారత నావికా దళంలో చేరింది. పశ్చిమ నౌకాదళానికి చెందిన పెట్రోలింగ్ నౌక ‘ఐఎన్ఎస్ త్రిన్కాత్’ ఫస్ట్ ఫిమేల్ కమాండింగ్ ఆఫీసర్గా చరిత్ర సృష్టించింది. ప్రేరణ సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తాడు. అతడి స్ఫూర్తితోనే నావికాదళంలోకి వచ్చింది ప్రేరణ. ‘భారత నౌకాదళం అవకాశాల సముద్రం. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది ప్రేరణ. ► దిల్లీ కంటోన్మెంట్లోని భారత సైన్యానికి చెందిన రక్తమార్పిడి కేంద్రం(ఎఎఫ్టీసీ) ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్గా ప్రత్యేకత చాటుకుంది కల్నల్ సునీతా బీఎస్. రోహ్తక్ మెడికల్ కాలేజీలో ‘పాథాలజీ’లో పీజీ చేసిన సునీత అరుణాచల్ప్రదేశ్లో మిలిటరీ ఆస్పత్రిలో కమాండింగ్ ఆఫీసర్గా పనిచేసింది. ► ‘ఫ్రంట్లైన్ ఐఏఎఫ్ కంబాట్ యూనిట్’ కమాండర్ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ షాలిజా ధామి. 2003లో హెలికాప్టర్ పైలట్ అయింది. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఆమె సొంతం. వెస్ట్రన్ సెక్టార్లోని హెలికాప్టర్ యూనిట్లో ఫ్లైట్ కమాండర్గా పనిచేసింది. పంజాబ్లోని లూథియానా థామి స్వస్థలం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసింది. భారత వైమానిక దళంలో శాశ్వత కమిషన్ను పొందిన మొదటి మహిళా అధికారిగా నిలిచింది. ► తూర్పు లడఖ్లో భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ‘స్వతంత్ర ఫీల్డ్ వర్క్షాప్’కు పురుష అధికారులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండేవారు. ఈ ఏడాది ఆ అవకాశం గీతా రాణాకు వచ్చింది. స్వతంత్ర ఫీల్డ్ వర్క్షాప్కు కమాండ్గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా అధికారిగా గీతా రాణా ప్రత్యేకత నిలుపుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్(ఈఎంఈ) ట్రైనింగ్ సెంటర్లో ఇన్స్ట్రక్టర్గా బాధత్యలు నిర్వహించింది గీతా రాణా. ► స్క్వాడ్రన్ లీడర్ మనిషా పధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్కు ఎయిడ్–డి–క్యాంప్(ఏడీసీ)గా నియామకం అయినా ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్గా చరిత్ర సృష్టించింది. మనిషా స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్ఫోర్స్ స్టేషన్–పుణె చివరగా భటిండాలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది. ► ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. వైద్యసేవలు అందించడానికి ఈ ప్రమాదకరమైన యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ప్రత్యేకత చాటుకుంది కెప్టెన్ ఫాతిమా వసిమ్. దీనికిముందు ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ తీసుకుంది. (చదవండి: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు) -
Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ
స్ట్రయిట్ చిత్రాలు 236... డబ్బింగ్ సినిమాలు 70... మొత్తం 306 చిత్రాలను 2023 ఇచ్చింది. మరి జయాపజయాల శాతం ఎంత? అంటే... ఎప్పటిలానే విజయాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు... అపజయాలు లెక్కలేనన్ని. అయితే విజయం సాధించినవాటిలో ఎమోషనల్గా సాగేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏడాది భావోద్వేగాలకు ప్రేక్షకులు ప్రాధాన్యం ఇచ్చారనుకోవచ్చు. ఇక ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకిగాను కీరవాణి, చంద్రబోస్లకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కడం ఓ రికార్డ్. తెలుగు నుంచి జాతీయ తొలి ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్కి దక్కడం మరో ఆనందం. ఇలా కొన్ని ఆనందాలను ఇచ్చింది 2023. కె. విశ్వనాథ్, జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహస్ వంటి వారిని దూరం చేసి, విషాదాన్ని మిగిల్చింది. ఇక... ఈ ఏడాది లెస్ హిట్.. మోర్ ఫట్గా సాగింది తెలుగు సినిమా. ఆ విశేషాల్లోకి... స్టార్ హీరోలు కొందరు ‘హిట్ హిట్ హుర్రే’ అంటూ మంచి విజయాలు అందుకున్నారు. వారితో పాటు కొందరు మీడియమ్ రేంజ్, చిన్న రేంజ్ హీరోలకూ 2023 విజయానందాన్నిచ్చింది. ఆ హిట్స్ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సినిమాల పండగ. అలా ఈ ఏడాది పండగకి అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మంచి వసూళ్లు రాబట్టాయి. చిరంజీవి హీరోగా, రవితేజ ఓ కీలక పాత్రలో ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించగా, ‘వీరసింహారెడ్డి’ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ దసరా పండక్కి ‘భగవంత్ కేసరి’తోనూ మరో హిట్ సాధించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఈ ఏడాది ఓ హిట్.. ఓ ఫట్ పడ్డాయి. ‘సలార్: సీజ్ఫైర్’తో ప్రభాస్కి సూపర్ డూపర్ హిట్ దక్కింది. స్నేహం ప్రధానాంశంగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ ఏడాది నానీకి బాగా కలిసొచ్చింది. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన మాస్, ఎమోషనల్ మూవీ ‘దసరా’ బ్లాక్బస్టర్గా నిలిచింది. అలాగే శౌర్యువ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని హీరోగా నటించిన ఎమోషనల్ మూవీ ‘హాయ్ నాన్న’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, సమంతల వెండితెర ప్రేమకథ ‘ఖుషీ’ కూడా ప్రేక్షకులను ఖుషీ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందిన ఈ ఎమోషనల్ లవ్స్టోరీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. తమిళ స్టార్ ధనుష్ తెలుగులో చేసిన స్ట్రయిట్ ఫిల్మ్ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపోందిన ఈ పీరియాడికల్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. నాలుగేళ్లుగా హీరోయిన్ గా తెలుగు వెండితెరపై కనిపించని అనుష్కా శెట్టి ఈ ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఈ సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి పి. మహేశ్బాబు దర్శకుడు. అలాగే కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ హిట్తో జోష్గా ఉన్నారు. హారర్ థ్రిల్లర్గా కార్తీక్ దండు దర్శకత్వంలో ‘విరుపాక్ష’ రూపోందింది. గత ఏడాది హిట్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకులను నవ్వించి ఈ ఏడాది సూపర్ హిట్ సాధించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. అలాగే కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’తో పెద్ద హిట్ అందుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్స్టోరీ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు వేణు కెరీర్ డైరెక్షన్ ఈ ఏడాది మరో మలుపు తిరిగింది. వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా సూపర్‡హిట్గా నిలిచింది. తెలంగాణలోని కాకిముట్టుడు సంప్రదాయం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపోందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ‘బలగం’ విడుదలయ్యేటప్పుడు చిన్న చిత్రమైనా వసూళ్లతో పెద్ద సినిమాగా మారింది. రెండేళ్ల క్రితం ‘మా ఊరి పోలిమేర’తో మంచి హిట్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. అయితే ఆ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా సీక్వెల్ ‘మా ఊరి పోలిమేర 2’తో ఈ ఏడాది థియేటర్స్లో సక్సెస్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఇక 2023కి ముగింపు పలుకుతూ శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైన చిత్రాల్లో కల్యాణ్రామ్ ‘డెవిల్’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. స్వీయదర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా స్ట్రయిట్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ‘బెదురులంక 2012’, ‘అల్లరి’ నరేశ్ ‘ఉగ్రం’, పాయల్ రాజ్పుత్ ‘మంగళవారం’, నవీన్ చంద్ర ‘మంత్ ఆఫ్ మధు’, సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ల ‘మ్యాడ్’, తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ వంటివి ఉన్నాయి. అనువాద చిత్రాల్లో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘వారసుడు’, ‘లియో’, మణిరత్నం ‘పోన్నియిన్ సెల్వన్ 2’, విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’, టొవినో థామస్ ‘2018’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, రణ్బీర్ కపూర్ ‘యానిమల్’ వంటివి మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలతో పాటు ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు పరాజయాన్ని చవి చూశాయి. ఫట్ అయిన ఆ చిత్రాల గురించి.. ‘వాల్తేరు వీరయ్య’చిత్రంతో హిట్ సాధించిన చిరంజీవికి ‘భోళా శంకర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్గా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ రూపోందింది. ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ ఫలితాన్ని ఆశించారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపోందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో రూపోందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పరాజయంగా నిలిచింది. రవితేజ సోలో హీరోగా నటించిన (‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర చేశారు) ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు బోల్తా కొట్టాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపోందాయి. ‘కస్టడీ’ చిత్రం రూపంలో ఈ ఏడాది నాగచైతన్యకు పరాజయం ఎదురైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపోందింది. హీరో రామ్–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్కంద అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్’ కూడా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది వరుణ్ తేజ్ వ్యక్తిగతంగా ఫుల్ హ్యాపీ. లావణ్యా త్రిపాఠీని పెళ్లి చేసుకుని, లైఫ్లో కొత్త చాప్టర్ని మొదలుపెట్టారు. అయితే కెరీర్ పరంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’ నిరాశపరిచింది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో రూపోందిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ ఆర్డినరీ సినిమా అనిపించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ ఎమోషనల్ మూవీ అనిపించుకుంది. టాక్ బాగున్నా వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. హీరోయిన్ సమంత, నటుడు దేవ్ మోహన్ కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇవే కాదు.. గోపీచంద్ ‘రామబాణం’, కల్యాణ్ రామ్ ‘అమిగోస్’, నిఖిల్ ‘స్పై’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, సుధీర్ బాబు ‘హంట్, మామా మశ్చీంద్ర’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
యూట్యూబ్ షేక్.. 2023లో దుమ్ము రేపిన వీడియోలు, షార్ట్స్ ఇవే..
ఆధునిక కాలంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన నిమిషంలో తెలిసిపోతోంది. ఇందులో కూడా కొన్ని సంఘటనలు మాత్రమే పెద్దగా వైరల్ అవుతాయి. ఈ ఏడాది (2023) ఎక్కువ మంది చూసిన వీడియోలు ఏవి, టాప్ ట్రెండింగ్ కంటెంట్, దాని వెనుక ఉన్న క్రియేటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023లో ఎక్కువ మంది వీక్షించిన వీడియాల్లో చెప్పుకోదగ్గది 'చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్-ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్'. దీనికి ప్రారంభంలో 8.5 మిలియన్స్.. ఇప్పటి వరకు 79 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో యూట్యూబ్లో అతిపెద్ద లైవ్ స్ట్రీమ్గా ఇది సంచలనం సృష్టించింది. ఆ తరువాత వరుసగా మ్యాన్ ఆన్ మిషన్, యూపీఎస్సీ స్టాండ్ అప్ కామెడీ, డైలీ వ్లాగర్ పేరడీ, శాస్తా బిగ్ బాస్ 2 వంటివి ఎక్కువ వ్యూవ్స్ పొందాయి. టాప్ 15 గేమింగ్ వీడియోలు 2023లో 'ఐ స్టోల్ సుప్రా ఫ్రమ్ మాఫియా హౌస్' ఎక్కువమంది హృదయాలను దోచింది. ఈ గేమింగ్ వీడియో ఇప్పటికి 30 మిలియన్ వీక్షణనలను పొందింది. ఆ తరువాత స్థానంలో జీటీఏ5 ఇన్ రియల్ లైఫ్, గ్రానీ చాఫ్టర్ 1, స్కిబిడి టాయిలెట్ 39 - 59, కునాలి కో దర్ నహీ లగ్తా వంటివి ఉన్నాయి. టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ ఈ ఏడాది యుట్యూబ్లో సంచలనం సృష్టించిన టాప్ 10 కంటెంట్ క్రియేటర్ల జాబితాలో ప్రధమ స్థానంలో పవన్ సాహు ఉండగా.. ఆ ఆ తరువాత స్థానాల్లో నీతూ బిష్ట్ (Neetu Bisht), క్యూట్ శివాని 05, ఫిల్మీ సూరజ్ యాక్టర్, అమన్ డ్యాన్సర్ రియల్, ఆర్టిస్ట్ సింతు మౌర్య మొదలైనవారు ఉన్నాయి. ఇందులోనే మహిళల విభాగంలో నీతూ బిష్ట్, షాలు కిరార్, జశ్వి విశ్వి, ది థాట్ఫుల్ గర్ల్, రాయల్ క్యూన్, సోనాల్ అగర్వాల్, మింకు టింకు, అంజు డ్రాయింగ్ షార్ట్స్, మహి లక్రా వ్లాగ్స్, మామ్ అండ్ రీదిష్ణ వంటి వారు ఉన్నారు. టాప్ 15 షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ విభాగంలో ఈ ఏడాది వరుసగా పతి కో బనాయా పాగల్, కదం కదం భజాంగే జా, 500 మీ ఐఫోన్, బ్లో ద రోలర్ అండ్ విన్ ఛాలెంజ్, చలాక్ బాయ్ ఫ్రెండ్, టామ్ అండ్ జెర్రీ (రిత్వి & కవి), పోర్ ఛాలెంజ్ విత్ సిరప్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా.. టాప్ 15 మ్యూజిక్ వీడియోలు 2023లో పాపులర్ అయిన వీడియోల విషయానికి వస్తే.. ఇందులో మొదటి స్థానంలో ఘనీ కో సబ్ ఘన్, జరా హక్తే జరా బచ్కే, జవేద్ మోహ్సిన్, క్యా లోగే తుమ్, హా నువ్ కావాలయ్యా (జైలర్), పల్సర్ బైక్ (ధమాకా), నా రెడీ (లియో) మొదలైనవి ఉన్నాయి. -
Rewind 2023: బడ్జెట్తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్గా నిలిచిన స్మాల్ మూవీస్పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్టాక్తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే..
స్టాక్మార్కెట్లో మదుపుదారులకు ఈ ఏడాది చాలా గుర్తుండిపోతుంది. వరుసగా ఎనిమిదో సంవత్సరమూ సూచీలు లాభాల బాటపట్టాయి. ఈ ఏడాదిలో నిఫ్టీ 50లోని 27 షేర్లు ఆల్టైమ్హైను చేరాయి. 40కి పైగా కంపెనీలు 10-100 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్క్యాప్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసినవారికి, ఇతర పెట్టుబడిదారులకు ఐపీఓలు లిస్ట్ అయిన తొలిరోజే మంచి లాభాలను తీసుకొచ్చాయి. 2023 ప్రారంభంలో మార్కెట్లు కాస్త నష్టాల్లోకి వెళ్లినా తరువాత భారీగా రాణించాయి. అంతర్జాతీయ మాంద్యం భయాలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలతో గతంలో నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 4, 3 శాతమే రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులతో ఏప్రిల్ నుంచి సూచీలు పుంజుకున్నాయి. ర్యాలీకి కారణాలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్ల పెంపునకు విరామం ఇవ్వడం, ముడి చమురు ధరలు వేగంగా తగ్గడంతో, రెండు నెలల పాటు బాగా రాణించిన సూచీలు ప్రథమార్ధాన్ని 6 శాతం పైగా లాభాలతో ముగించాయి. సెప్టెంబరు త్రైమాసికంలో 7.6% వృద్ధి నమోదైంది. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధించడం, విదేశీ మదుపర్ల పెట్టుబడులు బలంగా కొనసాగడం, 2024లో రేట్ల కోతకు అవకాశం ఉందని అమెరికా ఫెడ్ సంకేతాలివ్వడం ఇందుకు దోహదం చేసింది. ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ.. చరిత్రలోనే తొలిసారిగా డిసెంబరు 6వ తేదీన 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను దాటేసింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.81.90 లక్షల కోట్లు పెరిగి రూ.364 లక్షల కోట్ల ఆల్టైం గరిష్ఠానికి చేరింది. జూన్లో నిఫ్టీ సూచీ 19,000 పాయింట్లు, సెప్టెంబరులో 20,000, ఈనెల 8న 21,000 పాయింట్లకు చేరింది. డిసెంబరు 28న ఆల్టైం గరిష్ఠస్థాయి అయిన 21,801.45ను చేరింది. సెన్సెక్స్ జూన్లో 64,000 పాయింట్లను అధిగమించింది. జులైలో 67,000ను తాకింది. నవంబరు, ఈనెల 28నలో ఏకంగా 8000 పాయింట్లకుపైగా ర్యాలీ అయి 72,484.34 వద్ద జీవనకాల రికార్డు గరిష్ఠాన్ని చేరింది. ఏడాది మొత్తం మీద నిఫ్టీ 18%, సెన్సెక్స్ 19% మేర లాభాలను అందించాయి. 2024లో ఎలా ఉండబోతుందంటే.. వచ్చే ఏడాది స్టాక్మార్కెట్లు భారీగా లాభపడడానికి పెద్దగా అవకాశాలను ఈ ఏడాది మిగల్చలేదని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత స్థాయి నుంచి మహా అయితే 8-10% రాణించొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నివేదించింది. ఎన్నికల ముందు ర్యాలీ కారణంగా వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు సానుకూలంగా ఉండొచ్చు. ఇదీ చదవండి: ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..? ఎన్నికల ఫలితాలు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రకటనలు వచ్చాకే స్టాక్ మార్కెట్ దిశపై ఒక అంచనాకు రాగలమని బ్రోకరేజీలు అంటున్నాయి. అదే సమయంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. -
Year End 2023: లాభాల స్వీకరణతో 2023కు వీడ్కోలు
2023 ఏడాదిని స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగించింది. సూచీలు అయిదు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇంధన, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టపోయి 72,240 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 47 పాయింట్లు పతనమై 21,731 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఒక దశలో సెన్సెక్స్ 328 పాయింట్లు క్షీణించి 72,083 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 21,677 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ టెలికం, ఆటో, సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టాటా మోటార్స్ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.781 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఆరున్నర శాతం పెరిగి రూ.803 ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది నిఫ్టీ– 50 షేర్లలో రెట్టింపు లాభాలు(111%) పంచిన షేరు ఇదే. లాభాల్లో ఇన్నోవా క్యాప్టాబ్ ఇన్నోవా క్యాప్టాబ్ లిస్టింగ్ రోజు ఇన్వెస్టర్లను మెప్పించింది. ఇష్యూ ధర రూ. 448తో పోలిస్తే బీఎస్ఈలో 2 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో 22 శాతం(రూ. 99)పైగా జంప్చేసి రూ. 547ను అధిగమించింది. చివరికి రూ. 97 లాభపడి రూ. 545 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలోనూ రూ. 452 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ముగిసేసరికి 21 శాతం ఎగసి రూ. 543 సమీపంలో నిలిచింది. సెకండరీ మార్కెట్ కోసం యూపీఐ సెకండరీ మార్కెట్లో లావాదేవీల కోసం కూడా యూపీఐ సదుపాయాన్ని వచ్చే వారం అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. రూ. 82,00,000 కోట్ల సంపద సృష్టి ఈ ఏడాది సెన్సెక్స్ 19% ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మార్కెట్ విలువ 2022 డిసెంబర్ ఆఖరకు రూ.282.38 లక్షల కోట్లు ఉండగా.., ఈ ఏడాది చివరి ట్రేడింగ్ నాటికి రూ.82 లక్షల కోట్లు పెరిగి రూ.364.05 లక్షల కోట్లకు చేరింది. విలువ పరంగా 4 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్తో ప్రపంచలోనే అతిపెద్ద నాలుగవ నాలుగవ ఈక్విటీ మార్కెట్గా దలాల్ స్ట్రీట్ అవతరించింది. 2023లో 58 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.54,000 కోట్లు సమీకరించాయి. లిస్టింగ్ నాటి నుంచి ఇరెడా(220%), సైయంట్ డీఎల్ఎం(154%), నెట్వెబ్ టెక్నాలజీ(137%), టాటా టెక్నాలజీ(136%), విష్ణు ప్రకాశ్ ఆర్(118%) అత్యధిక లాభాలు పంచాయి. -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Happy New Year 2024: వెల్కమ్ పార్టీ
2023 కి వీడ్కోలు, న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి బంధు మిత్రులు బృందంగా ఒక చోట చేరుతుంటారు. ఏడాది మొత్తం జ్ఞాపకంగా మిగిలిపోయే ఈ రోజును ఇంట్లో ఉల్లాసభరితంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. న్యూ ఇయర్ వేడుకల అలంకరణలో మెరిసే, ఆకర్షణీయమైన వెలుగులతో ఈ రోజును అలంకరించడానికి చకచకా సిద్ధం అయిపోవచ్చు. ► బ్యానర్ ముందుగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని చూపే ఒక సాధారణ బ్యానర్ను ఏర్పాటు చేసుకోవాలి. నలుపు, బంగారం, వెండి రంగులు ఉండే బ్యానర్తో ఉన్న ఈ అలంకారం అందరిలోనూ ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ బ్యానర్ ను మీ ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు. దీనిని టేప్తో గోడలకు అతికించడం, ఆ తర్వాత తొలగించడం కూడా సులువే. ► బెలూన్స్ నూతన సంవత్సర వేడుకల అలంకరణలో బెలూన్లు మరో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పార్టీ మూడ్ను తీసుకురావడానికి ఇంట్లో బెలూన్ ఆర్చ్ని సృష్టించుకోవాలి. రెడీమేడ్గా కూడా ఈ ఆర్చ్లు దొరుకుతాయి. ఈ బెలూన్స్ కూడా బంగారం, తెలుపు, మెరిసే బెలూన్స్ మరింత పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. ► కొవ్వొత్తులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చున్నప్పుడు అక్కడి వాతావరణం హాయిగొలిపే అనుభూతిని ఇవ్వాలి. ఇందుకు ఫ్లేమ్లెస్, సెంటెడ్ క్యాండిల్స్ ఎంతగానో తోడ్పడతాయి. అందుకని, ముందుగానే వీటిని సిద్ధం చేసుకోవడం మంచిది. న్యూ ఇయర్లోకి అడుగిడే కొత్త సమయంలో ఈ కొవ్వొత్తుల వెలుగులు అందరిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. ► ఫన్ నెక్లెస్ లు టేబుల్పై కొవ్వొత్తులు ఒకటే ఉంచితే సరిపోదు. ఆ టేబుల్పైన పరిచే రన్నర్ పై పూసల దండలను అమర్చడం, వేలాడదీయడం పండగ సంబరాన్ని తీసుకువస్తుంది. వీటిలో కూడా బంగారం, నలుపు, వెండి పూసల దండలను ఎంచుకోవడం మంచిది. ► డిస్కో థీమ్ కొత్తసంవత్సరం అంటేనే ఒక జోష్తో నడవాలనుకుంటారు. న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పే సమయంలో డాన్స్ చేసే వీలుండేలా డిస్కో థీమ్ని అలంకరించుకోవాలి. ఇందుకు సియెర్రా వంటి కొన్ని డిస్కో బాల్స్ ఈ అలంకరణకు ఉపయోగించుకోవాలి. ► పిల్లల కోసం ప్రత్యేకం పార్టీలో పిల్లలు ఉంటే వారి కోసం.. వారి చేత నియాన్, పేస్టెల్ బెలూన్లు, రంగురంగుల నాప్కిన్స్, కప్పులతో వారి పార్టీ ప్లేస్ను అలంకరించవచ్చు. ► తెల్ల బంగారం తెలుపు, బంగారు రంగులతో పార్టీ ప్లేస్ను మెరిసేలా అలంకరించండి. ఇందుకు షిమ్మరీ గోల్డ్ ఫ్రింజ్ కర్టెన్లను జోడించే ముందు డోర్ ఫ్రేమ్ పై భాగంలో తెల్లటి బెలూన్లను బ్లో అప్ చేయచ్చు. ► స్ట్రింగ్ లైట్లు బయటి వైపు స్ట్రింగ్ లైట్లను వేలాడదీసి, వాటిని మెరిసేలా చేయచ్చు. దీంతో బయటి వాతావరణం వెలుగులతో పండగ వాతావరణాన్ని నిండుగా కనిపంచేలా చేస్తుంది. ► పేపర్ ప్లేట్స్ రంగు రంగుల పేపర్ ప్లేట్లను వాల్ డెకార్గా మార్చుకోవచ్చు. గోడపైన ఉల్లాసాన్ని కలిగించే రంగులను ఆకర్షణీయంగా అలంకరించుకోవడానికి చవకైన, సరైన మార్గం అవుతుంది. ► రంగు రంగుల టిష్యూ కొత్త కొత్త అలంకరణతో పార్టీ ప్లేస్ను ఉత్తేజంగా మార్చడానికి రంగురంగుల టిష్యూ పేపర్లు కూడా వాడచ్చు. పింక్, బ్లూ, వైట్ టిష్యూ పేపర్లను తీసుకొని, వాటిని ఒక్కొక్కటీ జోడిస్తూ దండలా అల్లుకోవాలి. దీనిని పార్టీ ప్లేస్లో వేలాడదీయాలి. ► టేబుల్ క్లాత్ పింక్ గ్లిటర్ టేబుల్ క్లాత్ పరిచి, దానిపైన బంగారు, స్టార్ మోటిఫ్లతో ఉల్లాసభరితమైన థీమ్ని తీసుకురావచ్చు. దీంతో డిన్నర్ చేసే టేబుల్ న్యూ ఇయర్ వేడుకలో మరింత ప్రత్యేకతను నింపుకుంటుంది. -
2023 రౌండప్: భారత క్రీడారంగంలో కీలక ఘట్టాలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ ఈ ఏడాది అత్యుత్తమ విజయాలు నమోదు చేసి తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్బాల్, క్రికెట్, చెస్, పారా అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో భారత ఆటగాళ్లు ఈ ఏడాది చిరస్మరణీయ విజయాలు సాధించి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది భారత ఆటగాళ్లు వ్యక్తిగతంగా, టీమ్ విభాగాల్లో సాధించిన అత్యుత్తమ విజయాలు.. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా.. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ తొలిసారి 100 పతకాల మార్కును దాటి (107 పతకాలు (28 గోల్డ్, 38 సిల్వర్, 41 బ్రాంజ్)), పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. రమేష్బాబు ప్రజ్ఞానంద.. 18 సంవత్సరాల వయసులో ఫిడే చెస్ ప్రపంచ కప్కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు. చరిత్ర సృస్టించిన సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ షెట్టి.. బ్యాడ్మింటన్ డబుల్స్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారత జోడీగా రికార్డు. తొమ్మిదోసారి SAFF చాంపియన్గా నిలిచిన భారత ఫుట్బాల్ జట్టు. కువైట్పై చారిత్రక విజయం సాధించడంతో ఫిఫా వరల్డ్కప్ రౌండ్-2కు అర్హత. భారత పురుషుల క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో వరల్డ్ నంబర్ వన్ జట్టుగా అవతరణ. టీ20 ప్రపంచకప్ను గెలిచిన భారత మహిళల అండర్ 19 జట్టు. వన్డే ప్రపంచకప్లో తుది సమరం వరకు అద్భుతంగా పోరాడిన టీమిండియా .. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్లు.. ఆసియా పారా గేమ్స్ చరిత్రలో తొలిసారి వందకు పైగా పతకాలు (111, 29 గోల్డ్, 31 సిల్వర్, 51 బ్రాంజ్) సొంతం. ఈ పోటీల్లో భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అర్చరీ వ్యక్తిగత విభాగంలో తొలి వరల్డ్ టైటిల్ను సాధించిన అదితి స్వామి ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం.. పర్నీత్ కౌర్, అదితి స్వామితో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ను గెలుచుకుంది. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. -
ఐఫోన్ కొనటానికి ఇది మంచి సమయం - ఎందుకంటే?
2023 ముగుస్తోంది.. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలామంది కొత్త బైకులు, కార్లు లేదా మొబైల్ ఫోన్స్ వంటివి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఐఫోన్ 15 (iPhone 15)పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. వండర్లస్ట్ ఈవెంట్లో లాంచ్ అయిన ఐఫోన్ 15 ధర రూ. 79990. ఈ లేటెస్ట్ ఫోన్ను అమెజాన్లో కొనుగోలు చేసినట్లయితే రూ. 74990కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఐఫోన్ 15 కొనుగోలుదారులు రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5000 డిస్కౌంట్ మాత్రమే కాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులు 5 శాతం (రూ. 3745) క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతో రూ.79990 మొబైల్.. అన్ని డిస్కౌంట్స్ తరువాత రూ.71245కే కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద ఐఫోన్ 15 కొనుగోలుపై ఇప్పుడు 8745 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఇదీ చదవండి: సచిన్కు రూ.27 కోట్ల లాభం.. ఎలా అంటే? ఐఫోన్ 15 ఫీచర్స్ ఐఫోన్ 15 అనేది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కొత్త డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తుంది. 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ అద్భుతమైన కెమెరా సెటప్ పొందుతుంది. దీంతో వినియోగదారులు 0.5x, 1x, 2x జూమ్ స్థాయిలలో కూడా ఫోటోలను తీసుకోవచ్చు. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ మొబైల్ 128, 256, 512 జీబీ మెమొరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పుడు USB-C ఛార్జర్కు సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద ఐఫోన్ 15 అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది. మంచి డిస్కౌంట్తో ఐఫోన్ కొనాలనే వారికి ఇది గొప్ప అవకాశం అని తెలుస్తోంది. -
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్లోని డాలస్లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
ఈ కార్ల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్స్ - పూర్తి వివరాలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్ ఇండియా' ఈ ఏడాది బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి కోసం అద్భుతమైన ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటి వున్నాయి. కంపెనీ అందించే ఈ బెనిఫిట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెనాల్ట్ కైగర్ కంపెనీ తన రెనాల్ట్ కైగర్ కొనుగోలుపైన రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 స్పెషల్ కస్టమర్ లాయల్టీ బోనస్లు, రూ.12,000 కార్పొరేట్ బెనిఫిట్స్ మొదలైనవి ఉన్నాయి. 1.0 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపైన కంపెనీ రూ.50000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ.10,000 లాయల్టీ కస్టమర్ ప్రయోజనాల కింద తగ్గింపు ఉన్నాయి. రూ.6.34 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారును ఈ నెలలో కొనుగోలు చేస్తే రూ.50,000 వరకు సేవ్ అవుతుంది. ఇదీ చదవండి: 2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్ రెనాల్ట్ క్విడ్ ప్రారంభం నుంచి అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న రెనాల్ట్ క్విడ్ కొనుగోలుపైన కంపెనీ ఇప్పుడు రూ. 50000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. రూ.4.5 లక్షల ప్రారంభ ధరలో లభించే ఈ కారుని ఇప్పుడు రూ.50,000 తగ్గింపుతో ఈ నెలలో కొనుగోలు చేయవచ్చు. Note: రెనాల్ట్ కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ అందించే తగ్గింపులు కేవలం మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి వినియోగదారులు సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవాలి. -
ఈ ఏడాది విచిత్రమైన ఆవిష్కరణలు ఇవే..
ప్రపంచంలో ఎప్పటికప్పుడు అనేక కొత్త సాంకేతిక ఆవిష్కరణలు సృష్టిలోకి వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని చాలా ఉపయోగకరమైనవి, వేగంగా ప్రాచుర్యం పొందుతుంటాయి. మరికొన్ని మరింత ప్రయోగాత్మకంగా ఉంటాయి. అయితే కొన్ని ఆవిష్కరణలు మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి. వాటిని మనం ఎప్పటికీ ఊహించలేము. అయినా వాటితో సమాజానికి ఉపయోగం ఉంటుంది. ఇలా ఈ ఏడాది వచ్చిన కొన్ని విచిత్రమైన సాంకేతిక ఆవిష్కరణలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. హైబ్రిడ్ మొబిలిటీ రోబో(హెచ్ఎంఆర్) రోబోటిక్స్లో హైబ్రిడ్ మొబిలిటీ రోబోను టెక్ నిపుణులు ఒక సంచలనంగా చెబుతారు. ఇది బంతిని పోలి ఉండే ఎగిరే పరికరం. బంతిలాగా అన్నివైపులా కదులుతూ ఉంటుంది. అది వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకి లేదా నిటారుగా ఉన్న నిర్మాణాలు ఎదురైతే పైకి కిందకు ఎగురుతూ ముందుకు సాగిపోతుంది. హ్యూమని ఏఐ పిన్ హ్యూమని ఏఐ పిన్ను మొదటిసారిగా ఏప్రిల్ 2023లో జరిగిన టెడ్ కాన్ఫరెన్స్లో ఆవిష్కరించారు. ఇది రోజువారి ఫోన్కాల్లు చేయడం, రోజువారి కార్యకలాపాలను విశ్లేషించడం, ఆహార పదార్థాలను స్కాన్ చేయడం వంటి కొన్ని అంశాలను ప్రదర్శించారు. ఈ పరికరం సెప్టెంబరు 2023లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్లో మరోసారి దర్శణమిచ్చింది. ఎయిర్బ్యాగ్ జీన్స్ స్వీడిష్ కంపెనీ మోసైకిల్ ఎయిర్బ్యాగ్ జీన్స్ను తయారుచేసింది. మోటార్సైకిల్ ఢీకొనేటప్పుడు ఈ జీన్స్ ధరిస్తే కొంత ప్రమాదాన్ని నివారించవచ్చని కంపెనీ తెలిపింది. అందులో ఉండే సెన్సార్లు ప్రమాదం జరిగిన వెంటనే జీన్స్లో ఉన్న బ్యాగ్లో ఓపెన్ అయి ప్రమాదాన్ని కొంత నివారించేలా తోడ్పడతాయి. సాధారణంగా ఆ జీన్స్ ధరిస్తే మాములుగానే కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం బ్యాగ్లు ఓపెన్అయి కొంత లావుగా ఉంటుంది. అండర్వాటర్ జెట్ప్యాక్ నీటిలో అన్వేషణకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నీటిలో ప్రయాణం క్లిష్టంగా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని సులువు చేసేందుకు అండర్వాటర్ జెట్ప్యాక్ అనే పరికరాన్ని తయారుచేశారు. దాన్ని వీపునకు ధరించి నీటిలో ప్రయాణించవచ్చు. రాకెట్ ఎలాగైతే ఆకాశంలో దూసుకుపోతుందో..ఈ పరికరం నీటిలో వర్టికల్గా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. ఇదీ చదవండి: నైట్లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో.. ఫ్లైయింగ్ జెట్స్కి కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్సన్ అనే కంపెనీ జెట్సన్ వన్ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ ఎయిర్క్రాఫ్ట్లను తయారు చేస్తోంది. ఇది విద్యుత్శక్తి సాయంతో ఎగురుతుంది. జెట్సన్ వన్ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. -
వాళ్లకు సారీ చెప్పారా? వీళ్లతో థ్యాంక్యూ అన్నారా?
365 రోజులు... జీవితమనే అంతులేని ప్రయాణంలో 2023వ సంవత్సరం ఈ 365 రోజులు మనకెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు, సంతోషాలు, సవాళ్లు ఇచ్చి ఉంటుంది. ఈ ప్రయాణం మనం ఒక్కరమేచేయగలమా? ఎందరో సాయం చేసి ఉంటారు. వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పామో లేదో. ఇప్పుడు చెబుదామా. కొందరిని తెలిసో తెలియకో హర్ట్ చేసి ఉంటాం. ఎంత బాధ పడ్డారో ఏమో.. సారీ చెబుదామా. పాత సంవత్సరం అకౌంట్లు సెటిల్ చేసుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదామా? ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి. ఎవరినో సలహా అడిగి ఉంటాం. హాస్పిటల్కు తోడు రమ్మని చెప్పి ఉంటాం. అప్పు అడిగి ఉంటాం. వారు ఇచ్చి ఉంటారు. ఆ హడావిడిలో వారికి సరైన థ్యాంక్యూ చెప్పి ఉండం. పట్టించుకోరులే అనుకుంటాం. కాని పట్టించుకుంటారు. మనకు ఈ సంవత్సరం ఇంత సాయం చేసిన వారికి ఈ సంవత్సరాంతంలో కాల్ చేసి, లేదా ఇంటికి వెళ్లి, ఈ సంవత్సరం ఫలానా టైమ్లో మీరు నాకు ఈ సాయం చేశారు... థ్యాంక్యూ అని చెప్పి చూడండి... వాళ్ల కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతాయి... మీ కళ్లల్లో కూడా. చెబుదామా? సాయం చేసిన వాళ్లు అవతలి వారి నుంచి కృతజ్ఞతను ఆశించరు కానీ అలాగని కృతజ్ఞత తెలియచేయడం కనీస బాధ్యత కదా! అసలు మేలు చేస్తేనే థ్యాంక్యూ చెప్పాలా? మీ ఇరుగున ఒక ఇల్లు, పొరుగున ఒక ఇల్లు ఉంటుంది. వారితో ఏ తగాదా గొడవా లేకుండానే హ్యాపీగా ఈ సంవత్సరం గడిచిపోయింది. వాళ్లను పలకరించి ‘ఈ సంవత్సరమంతా మనం స్నేహంగా ఉన్నాం. అందుకు థ్యాంక్యూ. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఉందాం’ అని చిన్న స్వీట్ ఇచ్చి చూడండి. ఆ మేజిక్ ఎలా ఉంటుందో. మీ ఆఫీస్లో కలీగ్స్తో ‘థ్యాంక్యూ... ఈ సంవత్సరమంతా మనం కలిసి మెలిసి పని చేసినందుకు’ అని టీకి పిలవండి... అదీ చిన్న మేజిక్ కాదు. ఒక సంవత్సరం దాటి వచ్చినందుకు ఎందరికో కృతజ్ఞత ప్రకటించాలి. తల్లిదండ్రులకు, తోడ బుట్టిన వారికి, మిత్రులకు... వీరున్నారనే ధైర్యం వల్లే కదా... ప్రతి రోజునూ చులాగ్గా దాటాం. వీరికి థ్యాంక్స్ చెప్పండి: ఈ సంవత్సరమంతా మనకు ఇంటి సాయం చేసిన పని మనిషికి, కారు డ్రైవర్కు, ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసిచ్చిన ఏజెంట్కు, పిల్లలకు ట్యూషన్ చెప్పిన టీచర్కు, అపార్ట్మెంట్ వాచ్మెన్కు, ఫ్యామిలీ డాక్టర్కు... డబ్బు చెల్లించే పని చేయించుకుని ఉండొచ్చు. డబ్బు ఇచ్చినా అలాంటి పని చేసేవారు దొరకనప్పుడు తెలుస్తుంది వారి విలువ. అందుకే థ్యాంక్స్ చెప్పండి. బాగుంటుంది. ఇక మీకు సపోర్ట్గా నిలిచిన స్నేహితులకు కాల్ చేసి, వారు ఏ సందర్భంలో ఎంత సపోర్ట్ చేశారో చెప్పి థ్యాంక్స్ చెప్పండి. ఊళ్లో ఉన్న అమ్మా నాన్నలను ఎవరో ఒక పక్కింటి పిన్ని పలకరించి బాగోగులు గమనిస్తుంటుంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పండి. మన పిల్లలను రోజూ ఆటకు పిలిచి వారితో స్నేహంగా ఆడుతున్న పిల్లలకూ థ్యాంక్స్ చెప్పండి. వారు ఇంకా విలువైన వారు. అన్నింటికి మించి మన పట్ల కనికరంగా ఉన్న ప్రకృతికి. కరుణతో ఉన్న రుతువులకి, తిన్న ప్రతి అన్నం ముద్దకి, మీరు విశ్వసించే ఈశ్వరునికి థ్యాంక్స్ చెప్పండి. వీరితో సారీ చెప్పండి: ఈ సంవత్సరం రెండు మూడుసార్లు కూడా వెళ్లి చూడటం కుదరని తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, అన్నదమ్ములకు... ‘సారీ.. మీరంటే ఎంతో ప్రేమ... కాని కలవడం కుదరలేదు’ అని చెప్పండి. మనసు తేలిక అవుతుంది. ఎందరో స్నేహితులు, బంధువులు శుభకార్యాలకు పిలిచి ఉంటారు. వెళ్లి ఉండరు. వారికి పనిగట్టుకుని ఫోన్ చేసి సారీ చెప్పండి. ఇకపై తప్పక వస్తామని చెప్పండి. బాగా ఆత్మీయులు కొందరు స్వర్గస్తులై ఉంటారు. ఏదో కారణాన వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ఉండరు. ఇప్పుడు ఫోన్ చేసి వీలైతే కలిసి సహేతుకమైన కారణం చెప్పి సారీ చెప్పండి. కొందరు మీరు చేయదగ్గ సాయం అడిగినా మీరు నిర్లక్ష్యంతో చేసి ఉండరు. వారు బాధ పడిన విషయం కూడా మీకు తెలిసి ఉండదు. గుర్తు తెచ్చుకుని సారీ చెప్పండి. ఎవరికో ఏవో వాగ్దానాలు చేసి తప్పి ఉంటారు. సారీ చెప్పండి. భార్య భర్తను బాధించిన సందర్భాలకు, భర్త భార్యను కష్టపెట్టిన సందర్భాలకు తప్పక ఒకరికొకరు సారీ చెప్పాలి. పిల్లల్ని చిన్నబుచ్చిన సందర్భాలకు కూడా వారికి సారీ చెప్పాలి. చేజారిన బంధాలు, స్నేహాలు... పలచబడిన బాంధవ్యాలు కేవలం ‘థ్యాంక్యూ’, ‘సారీ’ అనే రెండు పదాలతో తిరిగి అతుక్కుంటాయి. రెండు మూడు రోజులు టైమ్ ఉంది. తెమిలి కూచుని ఇతరుల ఒప్పులను, మీ తప్పులను లిస్ట్ చేసుకుని ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పి కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా మొదలెట్టండి. -
2023.. న్యూ ఇయర్ వేళ.. ఢిల్లీలో జరిగిన ఘోరమిదే!
అది 2023, జనవరి ఒకటి.. దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతోంది. ఇంతలో దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశప్రజలను కలచివేసింది. మర్నాటి ఉదయం వెలుగు చూసిన ఒక వీడియో సంచలనంగా మారింది. అదే.. ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ కంఝావాలాలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ఘటన. ఒక హోటల్ జరిగిన న్యూ ఇయర్ పార్టీకి హాజరైన అంజలి(20) స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతోంది. ఇంతలో అటుగా కారులో వచ్చిన యువకులు ఆమె వాహనాన్ని ఢీకొని, కారుని వేగంగా పోనిచ్చారు. అయితే ఆమె కారు కింద ఇరుక్కుపోయింది. కారు ఆమెను ఈడ్చుకుంటూ 12 కిలోమీటర్లు దూరం వరకూ వెళ్లింది. ఆమె తనను కాపాడాలని అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని నింపింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో అంజలి స్నేహితురాలు నిధిని కూడా విచారించారు. ఆ సమయంలో అంజలి మద్యం మత్తులో ఉందని నిధి పోలీసులకు తెలిపింది. కాగా వారి స్కూటీ కంఝావాలాలోని సుల్తాన్పురి ఏరియాకు చేరుకున్నంతలో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కారు వీరి స్కూటీని ఢీకొంది. దాంతో నిధి ఎగిరి పక్కన పడిపోగా, అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయితే కారును ఆపకుండా.. కారులో ఉన్న అయిదుగురు నిందితులు 12 కిలోమీటర్ల దూరం వరకూ అంజలిని ఈడ్చుకుంటూ వెళ్లారు. తరువాత ఆమె మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి పరారయ్యారు. పోలీసుల విచారణలో నిధి.. తమను కారు ఏవిధంగా ఢీకొన్నదో తెలిపింది. అయితే ఆ సమయంలో తాను భయాందోళనకు లోనైనందుకు పోలీసులకు వెంటనే ఈ విషయం చెప్పలేకపోయానని నిధి పేర్కొంది. కాగా తెల్లవారుజామున 3.24 గంటలకు ఒక మృతదేహాన్ని ఈడ్చుకుంటూ ఒక కారు కుతుబ్ మినార్ వైపు అతివేగంతో వెళుతున్నదని ఢిల్లీలోని కంఝావాలా పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. ఈ ఘటన దర్యాప్తు దరిమిలా విధులలో నిర్లక్ష్యం వహించారంటూ 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు ఏడుగురిని నిందితులుగా కేసులో చేర్చారు. వీరిలో అమిత్ ఖన్నా, అశుతోష్లపై మోటారు వాహన చట్టం కింద కేసు కూడా నమోదైంది. బాధిత కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇది కూడా చదవండి: 2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు? -
పాక్ రాజకీయాల్లో పెను సంచలనాలు!
2023లో పాకిస్తాన్లో చోటుచేసుకున్నరాజకీయాలు సినిమా సీన్లను తలపించాయి. యాక్షన్, సస్పెన్స్, డ్రామా అన్నీ కనిపించాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు పాక్లో చోటుచేసుకున్న రాజకీయ గందరగోళం మున్ముందు కూడా ఇలానే కొనసాగేలా కనిపిస్తోంది. 2023లో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగి రావడం సంచలనాలుగా నిలిచాయి. పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మాజీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఈ ఏడాది పెను సంచలనం సృష్టించింది. ఈ నేపధ్యంలో ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టారు. విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయి. మే 9న జరిగిన నిరసనను పాక్ ఆర్మీ.. ఇదొక చీకటి అధ్యాయంగా అభివర్ణించింది. కాగా ఇమ్రాన్ ఖాన్ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించారని పాక్ మాజీ ప్రధాని షరీఫ్ ఆరోపించారు. తోషాఖానా కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కోర్టు ఆగస్టులో దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. అనంతరం పాక్ ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్పై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ప్రస్తుతం పాక్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థానంలో పీటీఐ కొత్త అధ్యక్షునిగా బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్టీలో ఎన్నికలు జరిగాయి. గౌహర్ ఖాన్ను స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ఈ పదవికి నామినేట్ చేశారు. మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్కు తిరిగి వచ్చిన దరిమిలా రాజకీయాలు మరింత వేడెక్కాయి. నవాజ్ షరీఫ్ బ్రిటన్లో నాలుగేళ్ల పాటు ఉండి, అక్టోబర్ 21న దుబాయ్ మీదుగా పాకిస్తాన్కు చేరుకున్నారు. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. 2024 ఫిబ్రవరిలోపు పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ అధికార పగ్గాలు తాత్కాలిక ప్రధాని చేతుల్లోనే ఉన్నాయి. నవాజ్ షరీఫ్ నాలుగేళ్లు దేశానికి దూరంగా ఉన్నా ఆయన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ బలహీనపడలేదు. నవాజ్ షరీఫ్ లేనప్పటికీ, కుమార్తె మరియం, నవాజ్ సోదరుడు షాబాజ్ షరీఫ్లు ఇమ్రాన్ ఖాన్ను అధికారం నుండి దించి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు. అల్-అజీజియా మిల్స్, అవెన్ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ కోర్టు నవాజ్ షరీఫ్ను దోషిగా నిర్ధారించి, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు 2017లో తన జీతం ప్రకటించనందుకు సుప్రీంకోర్టు అతనిపై జీవితకాల అనర్హత వేటు వేసింది. ఈ నేపధ్యంలో షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో ఇమ్రాన్ ఖాన్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్ వైద్య చికిత్స కోసం 2019లో లండన్ వెళ్లేందుకు అనుమతి కోరారు. దీనిపై లాహోర్ హైకోర్టు నాలుగు వారాల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతించింది. అయితే నాలుగు వారాలకు బదులుగా నవాజ్ షరీఫ్ నాలుగు సంవత్సరాల తర్వాత లండన్ నుండి పాకిస్తాన్ తిరిగి వచ్చారు. ఇది కూడా చదవండి: సన్యసించి, కాశీ వెళ్లిన పెరియార్ నాస్తికుడెలా అయ్యారు? -
ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి..
ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవంటారు. ప్రేమను పొందేందుకు కొందరు ఎంతకైనా వెనుకాడరు. ఇదేకోవలో ఐదుగురు మహిళలు ప్రేమ కోసం తమ దేశ సరిహద్దులు దాటి, విదేశాల్లోకి ప్రవేశించి, చిక్కుల్లో పడ్డారు. వీటికి సంబంధించిన ఉందంతాలు 2023లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సీమా హైదర్ సీమా హైదర్ పేరు దేశంలో చర్చనీయాంశమైంది, పాకిస్తాన్కు చెందిన ఈ 27 ఏళ్ల మహిళ ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ 21 ఏళ్ల భారతీయ కుర్రాడు సచిన్ మీనా ప్రేమలో పడింది. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా తన ప్రేమను నెరవేర్చుకునేందుకు పాకిస్తాన్ నుంచి సరిహద్దులు దాటి భారత్కు చేరుకుంది. సీమా.. భారత్ వచ్చేందుకు పాకిస్తాన్లోని తన ఇంటిని అమ్మేసింది. భారత్ వచ్చిన సీమాపై గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. విచారణ కూడా జరిగింది. ఇప్పటికి పూర్తి వివరాలు వెల్లడికాలేదు. అంజు రాజస్థాన్కు చెందిన అంజు తన ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్తాన్కు వెళ్లింది. ఆమె అక్కడ తన తన పాకిస్తానీ ప్రేమికుడిని పెళ్లాడిందనే ప్రచారం జరిగింది. అయితే ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత అంజు భారత్కు తిరిగి వచ్చింది. అంజును మొదట ఐబీ, తర్వాత పంజాబ్ పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆమె గ్వాలియర్లోని తన తండ్రి ఇంటిలో ఉంటోంది. అయితే ఆమె భారత్లో ఎంతకాలం ఉంటుంది? పాకిస్తాన్కు తిరిగి వెళ్తుందా? అనేది ఇంకా వెల్లడికాలేదు. జవేరియా ఖానుమ్ జావేరియా పాకిస్తాన్లోని కరాచీ నివాసి. త్వరలో ఆమె కోల్కతాకు చెందిన సమీర్ఖాన్ను పెళ్లి చేసుకోబోతోంది. వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఖానుమ్ భారతదేశానికి వచ్చి 45 రోజులు ఉంది. ఆమెకు డప్పులతో ఘన స్వాగతం పలికారు. అట్టారీ సరిహద్దు నుంచి ఆమె భారత్లోకి ప్రవేశించింది. బార్బరా పొలాక్ జార్ఖండ్లోని తన ప్రియుడిని కలవడానికి పోలాండ్కు చెందిన బార్బరా పొలాక్ భారతదేశానికి వచ్చింది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. విడాకులు తీసుకున్న ఆమె తన సోషల్ మీడియా స్నేహితుడు షాదాబ్ను పెళ్లి చేసుకోనుంది. ఆమె షాబాద్ను పెళ్లి చేసుకోవడానికి వీలుగా 2027 వరకు చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ వీసాతో ఇండియాకు వచ్చింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. కృష్ణా మండల్ కృష్ణా మండల్ అనే బంగ్లాదేశ్ మహిళ తన ప్రియుడు అభిక్ మండల్ను కలిసేందుకు బంగ్లాదేశ్ మీదుగా ఈదుకుంటూ భారత్ వచ్చింది. కృష్ణా.. అభిక్ మండల్ వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ఆమెకు పాస్పోర్ట్ లేదు. కోల్కతాలోని కాళీఘాట్ ఆలయంలో వారు పెళ్లి చేసుకున్నారు. అయితే కృష్ణాను భారత ఏజెన్సీ అరెస్టు చేసి, బంగ్లాదేశ్ హైకమిషన్కు అప్పగించింది. ఇది కూడా చదవండి: 2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు? -
2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు?
ఆర్టికల్ 370ని తొలగించి నాలుగున్నరేళ్లు దాటినా జమ్ముకశ్మర్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్లో 85 మంది ఉగ్రవాదులు, 35 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మృతి చెందారు. 2023లో జమ్ముకశ్మీర్లో తొమ్మిది ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిలో ఆరు జమ్మూ డివిజన్లో, మూడు కశ్మీర్ లోయలో జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ డివిజన్లో 25 మంది సైనికులు మరణించారు. ప్రధానంగా పూంచ్, రాజౌరి జిల్లాల్లో, కశ్మీర్ లోయలో జరిగిన మూడు ఆపరేషన్లలో తొమ్మదిమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత మార్చి, జూన్, జూలై, అక్టోబర్లలో సైనిక ప్రాణనష్టం జరగలేదు. ఫిబ్రవరిలో ఒక సైనికుడు, ఏప్రిల్, మే, నవంబర్, డిసెంబర్లలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు, సెప్టెంబర్లో నలుగురు, ఆగస్టులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని మాచెల్ సెక్టార్లోని ఒక ఫార్వర్డ్ ఏరియాలోని లోయలో జారిపడి ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఇద్దరు సైనికులు మరణించారు. ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలోని పొట్గంపొర అవంతిపొర వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హిమాచల్ ప్రదేశ్ సైనికుడు వీరమరణం పొందారు. ఏప్రిల్లో పూంచ్ జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్లోని భటాధురియన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఒక సైనికుడు గాయపడ్డాడు. స్థానికేతర మిలిటెంట్లు యూబీజీఎల్ ఉపయోగించి ఆర్మీ వాహనంపై గ్రెనేడ్తో దాడి చేసినట్లు సమాచారం. మేలో జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ జిల్లాలోని కంది అటవీ ప్రాంతంలో కార్డన్, సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. ఆగస్టులో దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. సెప్టెంబరులో, రాజౌరిలోని నార్లా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికునితో పాటు ఒక ఆర్మీ శునకం మరణించింది. దక్షిణ కాశ్మీర్లోని గాడోల్ కోకెర్నాగ్ ఎన్కౌంటర్లో కల్నల్, మేజర్తో సహా కనీసం ముగ్గరు ఆర్మీ సిబ్బంది మరణించారు. నవంబర్లో కలకోట్ రాజౌరిలోని బాజీ మాల్ అటవీ ప్రాంతంలో 30 గంటలపాటు జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. డిసెంబరులో పూంచ్లోని తన్నమండి సూరంకోట్ రోడ్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో నలుగురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఏడాది ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది పౌరులు మరణించగా, ఆర్మీ కస్టడీలో ముగ్గురు మరణించారు. 2023లో ఇప్పటి వరకు 85 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది కూడా చదవండి: ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు! -
ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!
చివరిదశకు వచ్చిన 2023లో మనం చాలా చూశాం. అంతకన్నా ఎక్కువగానే నేర్చుకున్నాం. కాలంతో పాటు మన జీవన విధానం కూడా ఎంతగానో మారిపోయింది. ఈ జీవనశైలి వల్ల చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు తలెత్తాయి. 2024ని స్వాగతించే ముందు 2023లో మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా రాబోయే సంవత్సరంలో ఈ వ్యాధులతో పోరాడేందుకు మనమంతా సన్నద్దంగా ఉండగలుగుతాం. 2023లో మానవాళి ఎదుర్కొన్న ప్రధాన వ్యాధులేమిటో ఇప్పుడు చూద్దాం.. 1. గుండె జబ్బులు: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు (హృద్రోగాలు) అధికమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బుల ముప్పు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. హృదయాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవనశైలిని ఎంతో ముఖ్యం. అస్తవ్యస్త జీవనశైలి, మద్యం, ధూమపానం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మన దేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. 2. డెంగ్యూ ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ముప్పు అధికంగా వెంటాడింది. వచ్చే ఏడాది కూడా ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డెంగ్యూతో మృత్యువాత పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ వ్యాధి నివారణకు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 3. మిస్టీరియస్ న్యుమోనియా ఈ సంవత్సరం మిస్టీరియస్ న్యుమోనియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి చైనా, అమెరికాలో తీవ్రంగా కనిపించింది. ఈ వ్యాధి చైనాలో అధికంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి పిల్లలలో అధికంగా కనిపించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న కారణంగానే వారు త్వరగా న్యుమోనియాకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు అధికంగా కనిపించనప్పటికీ, ఈ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4. వైరల్, ఇన్ఫెక్షన్ నిపా వైరస్ ముప్పు ఈ సంవత్సరం అధికంగా కనిపించింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ ఇది. గబ్బిలాలతో పాటు పందులు, మేకలు, కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి ముప్పు మన దేశంలో అధికంగా ఉంది. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుంటారు. 5. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఈ సంవత్సరం కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా మనదేశంలో అధికంగా కనిపించింది. అస్తవ్యస్త జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం మొదలైనవి కిడ్నీ సమస్యలకు కారణమని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి..
2023వ సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పలువురు స్వామీజీలు అటు రాజకీయాలను, ఇటు ప్రజలను అమితంగా ప్రభావితం చేశారు. వీరు వార్తల్లో తరచూ కనిపించారు. ఇలాంటి 10 మంది స్వామీజీల గురించి ఇప్పుడు తెలసుకుందాం. 1. సంత్ ప్రేమానంద్ సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఏడాది పొడవునా అగ్రస్థానంలో వార్తల్లో నిలిచారు. బృందావనంలో నివసిస్తున్న సంత్ ప్రేమానంద్ సత్సంగాన్ని వినడానికి జనం ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు సంత్ ప్రేమానంద్ మహరాజ్ను దర్శించుకున్నారు. ప్రేమానంద్ చిన్ననాటి పేరు అనిరుధ్ కుమార్ పాండే. ఆయన 13 సంవత్సరాల వయసులోనే సన్యాసం స్వీకరించారు. 2. పండిట్ ధీరేంద్ర శాస్త్రి బాగేశ్వర్ ధామ్కు చెందిన పండిట్ ధీరేంద్ర గార్గ్ ప్రవచనకర్తగా రెండవ స్థానంలో నిలిచారు. తన ముందున్నవారి ఆలోచనలు గ్రహించి, వారి సమస్యలను పరిష్కరించగలరనే పేరు సంపాదించారు. ధీరేంద్ర గార్గ్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసిద్ది చెందారు. తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన హనుమంతుని పూజించడం ప్రారంభించారు. 3. జయ కిషోరి కథకురాలు జయ కిషోరి జీ 2023లో ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఆమె పూర్తి పేరు జయ శర్మ. ఆమె 1995లో రాజస్థాన్లోని సుజన్గఢ్లో జన్మించారు. ఈ 27 ఏళ్ల కథకురాలు యూట్యూబ్లో ఎంతో ఫేమస్ అయ్యారు. జయ కిషోరి చిన్న వయస్సులోనే భగవద్గీతను పారాయణం చేస్తూ, ప్రజలను ఆకట్టుకున్నారు. జయ కిషోరి భజన గాయకురాలిగానూ పేరొందారు. 4. సద్గురు జగ్గీ వాసుదేవ్ కర్ణాటకలో జన్మించిన సద్గురు జగ్గీ వాసుదేవ్ మోటివేషనల్ స్పీకర్, యోగా టీచర్. జగ్గీవాసుదేవ్ స్థాపించిన ఇషా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. జగ్గీవాసుదేవ్ను సద్గురు అని కూడా పిలుస్తారు. జగ్గీవాసుదేవ్ యూట్యూబ్ చానళ్లు ఇంగ్లీషుతో సహా అనేక భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 5. శ్రీశ్రీ రవిశంకర్ తమిళనాడులో జన్మించిన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ తన ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ద్వారా కోట్లాదిమందిని ప్రభావితం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 6. గౌర్ గోపాల్ దాస్ మహారాష్ట్రలో జన్మించిన మోటివేషనల్ స్పీకర్, కృష్ణ భక్తుడైన సన్యాసి గౌర్ గోపాల్ దాస్ 2023లో తన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలతో వార్తల్లో నిలిచారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా హోల్డర్ అయిన సంత్ గోపాల్దాస్ ఇస్కాన్లో సభ్యునిగా ఉన్నారు. 7. పండిట్ ప్రదీప్ మిశ్రా భోపాల్కు చెందిన పండిట్ ప్రదీప్ మిశ్రా.. శివ మహాపురాణం చెప్పడంలో ప్రసిద్ధి చెందారు. ఈ ఏడాది పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తల్లో నిలిచారు. ఆయన ప్రవచనాలు వినేందుకు లక్షలాది మంది తరలివస్తుంటారు. 8. అనిరుద్ధాచార్య జీ మహారాజ్ ఈయన బృందావన నివాసి. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో జన్మించారు. తన ఉపన్యాసాలలో గోసేవ, జీవిత విలువల గురించి చెబుతుంటారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుంటారు. అనిరుద్ధాచార్య జీ మహారాజ్కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. 9. వైష్ణవ్ రామ భద్రాచార్య వైష్ణవ శాఖకు చెందిన రామానందాచార్య స్వామి శ్రీరామ భద్రాచార్య మహారాజ్ ఐదేళ్ల వయసులో కంటిచూపు కోల్పోయారు. అయితే పీహెచ్డీ పొందడమే కాకుండా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా దివ్యాంగులకు అనేక విద్యావకాశాలు కల్పించారు. 2015లో భారత ప్రభుత్వం అతనిని పద్మభూషణ్తో సత్కరించింది. 10. దేవకీ నందన్ ఠాకూర్ దేవకీ నందన్ ఠాకూర్ జీ ప్రముఖ కథకునిగా పేరొందారు. 2022, 2023లలో సనాతన ధర్మానికి మద్దతు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. దేవకీ నందన్ ఠాకూర్ మధురలోని ఓహవా గ్రామంలో జన్మించారు. తన ఆరేళ్ల వయస్సులో బృందావనం చేరుకుని, పరమ భక్తునిగా మారిపోయారు. ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది? -
2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు
కోవిడ్ పరిణామాల్లో దాదాపు అన్ని రంగాల సంస్థలు, తమ కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేశాయి. ఈకామర్స్ కొనుగోళ్లు అధికంగా జరిగాయి. లాక్డౌన్ల కారణంగా, ఇళ్ల వద్ద ఖాళీగా ఉన్న వారు సామాజిక మాధ్యమాలను, యూట్యూబ్లో వీడియోలను ఎక్కువగా తిలకించారు. ఆన్లైన్లోనే పాఠ్యాంశాలు బోధించే ఎడ్యుటెక్ సంస్థలకూ అమిత డిమాండ్ ఏర్పడింది. దీంతో సాంకేతిక నిపుణులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇందువల్లే అంతర్జాతీయ సంస్థలైన మెటా, గూగుల్, అమెజాన్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి వాటితో పాటు దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలతో పాటు చాలా స్టార్టప్ కంపెనీలు తమకు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. 2023 ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి..ఎందుకు తొలగించాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ‘లేఆఫ్స్.ఫై’ డేటా ప్రకారం.. 2023లో సుమారు 100 ఇండియన్ స్టార్టప్ కంపెనీలు 15000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఈ ఏడాది 100 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్లను అందజేసిన స్టార్టప్లలో ఓలా (200), కెప్టెన్ ఫ్రెష్ (120), షేర్చాట్ (500), స్విగ్గీ (380), మెడిబడ్డీ (200), డీల్షేర్ (100), మైగేట్ (200), బహుభుజి (100), సాప్ ల్యాబ్స్ (300), అప్గ్రేడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1k కిరానా (600), డంజో (500), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్ట్రామార్క్ (300), వాహ్ వాహ్! (150), మీషో (251), క్యూమత్ (100), హప్పే (160), గ్లామియో హెల్త్ (160), మోజోకేర్ (170), వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్బాస్కెట్ (400), టెకియోన్ (300), స్పిన్నీ (300), ఎంపీఎల్ (350) మొదలైనవి ఉన్నాయి. ఇదీ చదవండి: మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా.. ప్రపంచవ్యాప్తంగా 1160 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 2,24,508 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. 2022లో 1064 కంపెనీలు 1,64,969 మంది సిబ్బందిని తొలగించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యయ నిర్మాణాలను సరిచేయడం, కాస్ట్కటింగ్ వంటి వాటిలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీలు స్పష్టం చేశాయి. -
యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది?
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాదికి సంబంధించిన అనేక అంశాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఈకోవలో 2023లో అత్యధికంగా డిలీట్ చేసిన సోషల్ మీడియా యాప్ల జాబితా కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 4.8 బిలియన్లను (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) దాటింది. ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాల సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 2023లో యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ల విషయానికొస్తే.. అమెరికన్ టెక్ సంస్థ టీఆర్జీ డేటాసెంటర్ నివేదిక ప్రకారం... అందుబాటులోకి వచ్చిన 24 గంటల్లోనే 100 మిలియన్ల (ఒక మిలియన్ అంటే 10 లక్షలు) వినియోగదారులను సంపాదించిన మెటాకు చెందిన త్రెడ్ యాప్.. ఆ తర్వాతి ఐదు రోజుల్లో 80 శాతం మంది వినియోగదారులను కోల్పోయింది. ఆ నివేదిక ప్రకారం 2023లో చాలా యాప్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోని దాదాపు 10 లక్షల మంది యూజర్స్ ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించే మార్గాల కోసం వెతికారు. ఇన్స్టాగ్రామ్ యాప్ను 10,20,000 మందికి పైగా వినియోగదారులు డిలీట్ చేశారు. అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ల జాబితాలో రెండవ స్థానంలో స్నాప్చాట్ ఉంది. దీనిని 1,28,500 మంది డిలీట్ చేశారు. దీని తర్వాత ‘ఎక్స్’ (ట్విట్టర్), టెలీగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్,యూట్యూబ్, వాట్సాప్, విచాట్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఏడాది 49 వేల మంది ఫేస్బుక్ యాప్ను తొలగించారు. వాట్సాప్ను తొలగించిన వినియోగదారుల సంఖ్య 4,950గా ఉంది. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! -
పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ!
హిందువులు చార్ధామ్ యాత్రను ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు భక్తులు తరలివస్తుంటారు. చార్ధామ్ యాత్ర అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలను చుట్టిరావడం. ఈ చార్ధామ్ యాత్రతో పాటు ఇతర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా 2023లో భక్తుల తాకిడి ఎదురయ్యింది. 2023లో ఏ ధామాన్ని సందర్శించడానికి ఎంత మంది భక్తులు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం 50 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ యాత్రచేశారు. 2021లో సుమారు 5 లక్షల 18 వేల మంది భక్తులు చార్ ధామ్ యాత్ర చేశారు. 2022లో ఈ సంఖ్య 46 లక్షల 27 వేలు దాటింది. 2023లో అక్టోబర్ 16 నాటికి ఈ సంఖ్య 50 లక్షలు దాటడం విశేషం. కేదార్నాథ్ ధామ్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. 2023 లో 19 లక్షల 61 వేల మందికి పైగా భక్తులు కేదార్నాథ్ ధామ్కు తీర్థయాత్ర చేశారు. 2023లో కేదార్నాథ్ తలుపులు ఏప్రిల్ 25న తెరుచుకున్నాయి. ఈ యాత్ర నవంబర్ 15న ముగిసింది. బద్రీనాథ్ ధామ్ విష్ణు భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించడాన్ని ఒక వరంగా భావిస్తారు. ఈ సంవత్సరం బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభమై, నవంబర్ 15న ముగిసింది. ఈ ఏడాది బద్రీనాథ్కు వచ్చిన 18 లక్షల 34 వేల మందికి పైగా భక్తులు బద్రీ విశాల్ స్వామిని దర్శించుకున్నారు. గంగోత్రి ఈ ఏడాది 9 లక్షల 5 వేల మందికి పైగా భక్తులు గంగోత్రి యాత్రను పూర్తి చేసుకున్నారు. 2023లో గంగోత్రి యాత్ర ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై, నవంబర్ 14న ముగిసింది. ప్రతి సంవత్సరం గంగోత్రి యాత్ర ప్రారంభం కాగానే గంగమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికు తరలి వస్తుంటారు. యమునోత్రి ఈ ఏడాది యమునోత్రిని 7 లక్షల 35 వేల మందికి పైగా భక్తులు సందర్శించారు. యమునోత్రి యాత్ర 2023, ఏప్రిల్ 22న న ప్రారంభమై నవంబర్ 15న ముగిసింది. యమునోత్రిని యమునా దేవి నివాసంగా చెబుతారు. ఇక్కడ యమునా దేవి ఆలయం కూడా ఉంది. అమర్నాథ్ చార్ధామ్తో పాటు ఇతర యాత్రా స్థలాల విషయానికి వస్తే 2023లో దాదాపు 4 లక్షల 40 వేల మంది భక్తులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై ఒకటి నుండి ప్రారంభమై ఆగస్టు 31న ముగిసింది. అమర్నాథ్ ప్రయాణం ఎంతో కష్టతరమైనప్పటికీ భక్తులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఇక్కడికి తరలివస్తుంటారు హేమకుండ్ సాహిబ్ యాత్ర హేమకుండ్ సాహిబ్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్ర మే 20 నుంచి నుండి అక్టోబర్ 11 వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. 2023లో దాదాపు 2 లక్షల మంది హేమకుండ్ సాహిబ్ను సందర్శించుకున్నారు. ఇది కూడా చదవండి: అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం! -
గుడ్బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ..
కొద్దిరోజుల్లో 2023వ సంవత్సరం ముగియబోతోంది. ఆశలు రేకెత్తిస్తూ.. 2024 మన ముందుకు వస్తోంది. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆనందాన్ని అందించబోతోంది. అయితే 2023 దేశ ప్రజలకు కొన్ని మంచి, కొన్ని చెడు జ్ఞాపకాలను అందించింది. 2023 జనవరి 28న గగనతలంలో ఊహకందని ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్-2000 ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఈ రెండు యుద్ధ విమానాలు గ్వాలియర్లోని మహారాజ్పురా ఎయిర్బేస్ నుండి సాధారణ శిక్షణ కోసం బయలుదేరాయి. ఈ ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. మధ్యప్రదేశ్లోని మోరెనాలోని పహర్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మన్పూర్ మహాదేవ్ అడవిలో మిరాజ్ యుద్ధ విమానం కూలిపోయింది. సుఖోయ్కు చెందిన రెక్కలు మోరెనాలోని పహర్ఘర్ ప్రాంతంలో పడిపోయాయి. మిగిలిన విమానం రాజస్థాన్లోని భరత్పూర్లోని ఉచైన్ పోలీస్ స్టేషన్లోని నాగ్లా బిజా గ్రామ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మిరాజ్ పైలట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి మృతి చెందగా, సుఖోయ్ పైలట్లిద్దరూ గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిరాజ్-2000 చాలా కాలంగా భారత వైమానిక దళంలో భాగంగా ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించారు. భారత వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానాలు.. విమాన శిక్షణ మిషన్లో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, ఇద్దరు పెలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు.. చర్చిలు శోభాయమానం! -
చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు!
నిత్యావసర సరుకుల ధరల ప్రభావం సామాన్యుల జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఆహార ద్రవ్యోల్బణంలో 2023వ సంవత్సరం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. పప్పులు, టమాటాలు, అల్లం, ఉల్లి, బీన్స్, క్యారెట్, మిర్చి, టమాటా ఇలా రోజువారీ ఉపయోగించే అనేక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి, ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కిలో రూ. 300 దాటిన టమాటా సాధారణ రోజుల్లో కిలో రూ. 20 నుంచి 30కి విక్రయించే టమాటా ఈ ఏడాది ఖరీదు పరంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఆగస్టు చివరిలో కిలో రూ.250 నుంచి 260 వరకూ పలికింది. దేశంలోని కొన్ని నగరాల్లో టమాటా ధర కిలో రూ.300 దాటింది. ఇలా ధరలు ఎందుకు అదుపు తప్పుతున్నాయనే దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా కూరగాయల రవాణాకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొండవాలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు నష్టం కలిగించాయి. ఆకాశాన్ని అంటిన కంది పప్పు ధర 2023వ సంవత్సరంలో అన్ని పప్పుల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కంది పప్పు ధర 2023వ సంవత్సరంలో అన్ని రికార్డులను అధిగమించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 12న ఢిల్లీలో కంది పప్పు కిలో ధర రూ.118గా ఉంది. జూలై 12న ఢిల్లీలో కిలో కంది పప్పు ధర రూ.100కి చేరింది. ఈ పప్పు ధర ఇప్పటికీ ఆకాశంలోనే ఉంది. కందిపప్పు చిల్లర ధర కిలో రూ.170 నుంచి రూ.300 వరకు ఉంది. ఇతర పప్పుల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. పొలాల నుంచి అల్లం చోరీ 2023లో అల్లం ధర సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఏడాది అల్లం ధర కిలో రూ. 400కు చేరుకుంది. ఏడాది చివరి భాగంలో ధరల్లో తగ్గుదల కనిపించింది. కాగా ఆన్లైన్లో కిలో వెల్లుల్లి ధర రూ.320 నుంచి రూ.500 వరకు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జూలైలో అల్లం ధర రూ.300 నుంచి రూ.400కి చేరింది. ధర పెరిగిన నేపధ్యంలో కర్ణాటకలో పొలాల నుంచి అల్లం చోరీకి గురైన సంఘటనలు వెలుగు చూశాయి. గణనీయంగా కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలైలో కూరగాయల ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. జూలై 2023లో వార్షిక ప్రాతిపదికన 37.34 శాతానికి పెరిగింది. ఇది కాకుండా ఆహార, పానీయాల ద్రవ్యోల్బణం స్థాయి జూన్ 2023లో 4.63 శాతం నుండి జూలై 2023 నాటికి 10.57 శాతానికి పెరిగింది. ధాన్యాల ద్రవ్యోల్బణం జూన్ 2023లో 12.71 శాతం నుంచి 13.04 శాతానికి పెరిగింది. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు... తీవ్రమైన చలిగాలులు! -
Year End 2023: అన్నీ మంచి శకునములే!
ఓజోన్ పొరకు గండి పూడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరుగుతోంది. పర్యావరణపరంగా వరుస దుర్వార్తల పరంపర నడుమ ఇలాంటి పలు సానుకూల పరిణామాలకు కూడా 2023 వేదికవడం విశేషం! బ్రెజిల్లో అమెజాన్ అడవుల క్షీణత బాగా తగ్గుముఖం పట్టడం మొదలు ఇటీవలి కాప్28 సదస్సులో కీలక పర్యావరణ తీర్మానం దాకా ముఖ్యమైన ఇలాంటి ఓ ఐదు పరిణామాలను గమనిస్తే... సంప్రదాయేతర ఇంధనోత్పత్తి పైపైకి... శిలాజ ఇంధనాలకు వీలైనంత త్వరగా స్వస్తి పలికితేనే గ్లోబల్ వారి్మంగ్ భూతాన్ని రూపుమాపడం సాధ్యమని పర్యావరణవేత్తలంతా ఎప్పటినుంచో చెబుతున్నదే. సౌర విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం ఇందుకున్న మార్గాల్లో ముఖ్యమైనది. ఈ విషయంలో 2023లో ప్రపంచ దేశాలు చెప్పుకోదగ్గ ప్రగతినే సాధించాయి. అంతర్జాతీయంగా సంప్రదాయేతర ఇంధనోత్పత్తి ఈ ఒక్క ఏడాదే ఏకంగా 30 శాతం, అంటే 107 గిగాబైట్లకు పైగా పెరిగిందట! అంతర్జాతీయ ఇంధన సంస్థ ఈ మేరకు వెల్లడించింది. వాతావరణ కాలుష్య కారక దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న చైనాయే ఈ విషయంలోనూ అందరికంటే ముందుంది! చైనా సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గత జూన్ నాటికే మిగతా ప్రపంచ దేశాలన్నింటి ఉమ్మడి సామర్థ్యాన్ని కూడా మించిపోయిందని ఒక నివేదిక తేల్చడం విశేషం. అదే సమయంలో చైనాలో బొగ్గు ఉత్పత్తి కూడా కొద్ది నెలలుగా తారస్థాయికి చేరినా, త్వరలోనే అది బాగా దిగొస్తుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తుండటం మరో సానుకూల పరిణామం. హాలోవీన్ వేడుక సందర్భంగా పోర్చుగల్ అక్టోబర్ 31 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు కేవలం సంప్రదాయేతర ఇంధన వనరులను మాత్రమే వినియోగించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఓజోన్ క్రమంగా కోలుకుంటోంది... అతినీల లోహిత కిరణాల వంటివాటి బారి నుంచి భూమిని కాపాడే కీలకమైన ఓజోన్ పొర కోలుకునే ప్రక్రియ 2023లో మరింతగా వేగం పుంజుకుంది. విచ్చలవిడి క్లోరోఫ్లోరో కార్బన్ల విడుదల తదితరాల కారణంగా ఓజోన్కు రంధ్రం పడిందని, అది నానాటికీ పెరుగుతోందని 1980ల నుంచీ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరిగిన ప్రయత్నాలు ఫలితాలిస్తున్నట్టు వారు తాజాగా చెబుతున్నారు. ఇందుకోసం చేసుకున్న మాంట్రియల్ ఒప్పందం ప్రకారం క్లోరో ఫ్లోరో కార్బన్లకు పూర్తిగా స్వస్తి చెప్పాలన్న లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కృషి ఇలాగే కొనసాగితే 2040 కల్లా ఓజోన్ పొర 1980లకు ముందునాటి స్థితికి మెరుగు పడటం ఖాయం’’ అని ఐరాస తాజా నివేదికలో హర్షం వెలిబుచి్చంది. అయితే అంటార్కిటికా మీద మాత్రం ఓజోన్కు పడ్డ రంధ్రం గతంతో పోలిస్తే మరింతగా విస్తరించిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెజాన్కు ఉద్దీపన అమెజాన్ అడవులను ప్రపంచం పాలిట ఊపిరితిత్తులుగా, ఆకుపచ్చని వలగా అభివరి్ణస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద వర్షాధారిత అడవులివి. బ్రెజిల్లో కొన్నేళ్లుగా అడ్డూ అదుపూ లేకుండా సాగుతూ వస్తున్న వాటి విచ్చలవిడి నరికివేతకు 2023లో భారీ బ్రేక్ పడింది. బ్రెజిల్ గురించే చెప్పుకోవడం ఎందుకంటే 60 శాతానికి పైగా అమెజాన్ అడవులకు ఆ దేశమే ఆలవాలం! గత జూలై నాటికే అక్కడ అడవుల నరికివేత ఏకంగా 22.3 శాతం దాకా తగ్గుముఖం పట్టిందట. గత ఆర్నెల్లలో ఇది మరింతగా తగ్గిందని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. 2030 నాటికి బ్రెజిల్లో అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని ప్రకటించిన నూతన అధ్యక్షుడు లులా డసిల్వా ఆ దిశగా గట్టి చర్యలే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోష్ పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచమంతటా దుమ్ము రేపుతున్నాయి. 2023లో వాటి అమ్మకాల్లో అంతర్జాతీయంగా విపరీతమైన పెరుగుదల నమోదైంది. అగ్ర రాజ్యం అమెరికాలోనైతే ఈవీల అమ్మకాలు ఆల్టైం రికార్డులు సృష్టించాయి! 2023లో అక్కడ 10 లక్షలకు పైగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్టు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. చైనాలో కూడా 2023లో మొత్తం వాహనాల అమ్మకాల్లో 19 శాతం వాటా ఈవీలదేనట! పలు యూరప్ దేశాల ప్రజలు కూడా వాటిని ఇబ్బడిముబ్బడిగా కొనేస్తున్నారు. అక్కడ 2022తో పోలిస్తే ఈవీల అమ్మకాల్లో 55 శాతానికి పైగా వృద్ధి నమోదైంది! మొత్తమ్మీద 2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాహన కొనుగోళ్లలో 15 శాతానికి ఈవీలేనని తేలింది. ప్రపంచ కాలుష్యంలో ఆరో వంతు వాటా రోడ్డు రవాణా వాహనాలదే. ఈ నేపథ్యంలో ఈవీలు ఎంతగా పెరిగితే ఈ కాలుష్యం అంతగా దిగొస్తుంది. శిలాజ ఇంధనాలపై తీర్మానం బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలని ఇటీవల దుబాయ్లో జరిగిన కాప్28 అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తీర్మానించడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ తీర్మానాన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఏకంగా 100కు పైగా దేశాలు దీనికి సంపూర్ణంగా మద్దతు పలకగా, ఈ దిశగా శక్తివంచన లేకుండా ప్రయతి్నంచాలని మరో 50 పై చిలుకు దేశాలు ఈ సదస్సు వేదికగా అభిప్రాయపడ్డాయి. గతంలోనూ పలు కాప్ సదస్సుల్లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగినా అవి చర్చల స్థాయిని దాటి తీర్మానం దాకా రాకుండానే వీగిపోయాయి. అందుకే ఇది చరిత్రాత్మక తీర్మానమని కాప్28 సదస్సుకు అధ్యక్షత వహించిన సుల్తాన్ అల్ జబర్ అభివరి్ణంచారు. ఇది దేశాల ఆర్థిక వ్యవస్థలనే పునరి్నర్వచిస్తుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. దీనికి దేశాలు ఏ మేరకు కట్టుబడి ఉంటాయన్న దానిపై భూగోళం భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టార్టప్లూ వదిలిపెట్టలేదు! ఈ ఏడాది ఎంతమందిని తొలగించాయంటే..
2023 ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్లకు మాత్రం కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ కథనంలో భారతదేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి, ఎందుకు తొలగించాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. Layoffs.fyi డేటా ప్రకారం.. 2023లో సుమారు 100 ఇండియన్ స్టార్టప్ కంపెనీలు 15000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా బైజు సంస్థ రెండు విడతల్లో 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవల ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్ తన ఆస్తులను తాకట్టుపెట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఏడాది 100 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్లను అందజేసిన స్టార్టప్ కంపెనీలలో ఓలా (200), కెప్టెన్ ఫ్రెష్ (120), షేర్చాట్ (500), స్విగ్గీ (380), మెడిబడ్డీ (200), డీల్షేర్ (100), మైగేట్ (200), బహుభుజి (100), SAP ల్యాబ్స్ (300), అప్గ్రాడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1k కిరానా (600), Dunzo (300), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్ట్రామార్క్లు (300), వాహ్ వాహ్! (150), మీషో (251), క్యూమత్ (100), హప్పే (160), గ్లామియో హెల్త్ (160), మోజోకేర్ (170), వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్బాస్కెట్ (400), టెకియోన్ (300), స్పిన్నీ (300), MPL (350) మొదలైనవి ఉన్నాయి. ఇదీ చదవండి: రూ. 700లకే మహీంద్రా థార్! ఆనంద్ మహీంద్రా రిప్లై ఇలా.. ప్రపంచవ్యాప్తంగా 1160 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 26,02,238 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 1064 కంపెనీలు 1,64,969 మంది సిబ్బందిని తొలగించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యయ నిర్మాణాలను సరిచేయడం వంటి వాటిలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీలు స్పష్టం చేశాయి. -
భారత్లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు - వివరాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ 2022 కంటే 2023లో విపరీతంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన వాహనాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ కథనంలో ఈ సంవత్సరం మార్కెట్లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎస్1 ఎక్స్ ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలై ఉత్తమ అమ్మకాలు పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'ఓలా ఎస్1 ఎక్స్'. రూ.89999 ప్రారంభ ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి డ్యూయెల్ టోన్ డిజైన్, సింగిల్ పీస్ సీటుతో, ట్యూబ్యులర్ గ్రాబ్ రెయిల్, డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్లైట్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 2 కిలోవాట్, 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 91 కిమీ, 151 కిమీ రేంజ్ అందిస్తాయి. ఏథర్ 450ఎస్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ ఈ ఏడాది '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. మంచి స్పోర్టివ్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ 7 ఇంచెస్ టచ్స్క్రీన్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. 2.9 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). రివర్ ఇండీ ( River Indie) దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'రివర్ ఇండీ'లో డ్యూయెల్ పాడ్ హెడ్లైట్ సెటప్, సింగిల్ పీస్ సీటు, 42 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులోని 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 120 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.25 లక్షలు. సింపుల్ డాట్ 1 బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో డిసెంబర్ 15న 'డాట్ వన్' (Dot One) ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ. 99,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీతో 151 కిమీ రేంజ్(సింగిల్ ఛార్జ్) అందిస్తుంది. టీవీఎస్ ఎక్స్ రూ. 2.50 లక్షల ధర వద్ద ఈ ఏడాది విడుదలైన టీవీఎస్ ఎక్స్.. మార్కెట్లో లాంచ్ అయిన ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇందులో వర్టికల్లీ స్టేక్డ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్ క్లస్టర్, వైడ్ హ్యాండిల్ బార్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, 10.25 ఇంచెస్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. ఇందులోని 3.8 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 140 కిమీ రేంజ్ అందిస్తుంది. -
2023 Roundup: స్టార్ డైరెక్టర్స్కి ఈ సినిమాలు తెగ నచ్చేశాయ్.. ఇవన్నీ ఆ ఓటీటీల్లో!
కళ్లు మూసి తెరిచేలోపు మరో ఏడాది పూర్తయిపోయింది. 2023 న్యూయర్ సెలబ్రేషన్స్ మొన్నే చేసుకున్నట్లు. ఇంతలోనే చాలా అంటే చాలా ఫాస్ట్గా ఈ ఏడాది గడిచిపోయింది. మిగతా విషయాలన్నీ పక్కనబెడితే 2023లో మాత్రం పలు అద్భుతమైన సినిమాలు రిలీజయ్యాయి. మూవీ లవర్స్తో పాటు స్టార్ డైరెక్టర్స్ కూడా చాలా సినిమాలకు ఫిదా అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో... స్టార్ డైరెక్టర్ ఈ ఏడాది తమకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో చెప్పేశారు. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటంటే? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్.. పఠాన్ (హిందీ- అమెజాన్ ప్రైమ్), సప్త సాగర ఎల్లో దాచే-రెండు భాగాలు (కన్నడ-అమెజాన్ ప్రైమ్), జవాన్ (హిందీ-నెట్ఫ్లిక్స్) సినిమాలు తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చాడు. 'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. 'డాడా' (తమిళం) చిత్రం తనని బాగా మెప్పించిందని చెప్పుకొచ్చాడు. ఇది ప్రస్తుతం హాట్స్టార్లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కొంకణ సేన్ శర్మ.. 'ద గ్రేట్ ఇండియా కిచెన్' (తమిళ-తెలుగు) సినిమా.. ఈ ఏడాది వచ్చిన వాటిలో తన ఫేవరెట్ అని చెప్పింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్కి అయితే జైలర్ (తమిళ-నెట్ఫ్లిక్స్), సప్త సాగర ఎల్లో దాచే సైడ్-ఏ (కన్నడ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు బాగా నచ్చాయని చెప్పాడు. మలయాళ స్టార్ డైరెక్టర్ జియో బేబీకి.. జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తమిళ-నెట్ఫ్లిక్స్), B 32 ముతళ్ 44 వరే (మలయాళ) సినిమాలు బాగా నచ్చేశాయని చెప్పాడు. వీటిలో ఒకటి ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ అవినాష్ అరుణ్.. 12th ఫెయిల్ (హిందీ- హాట్స్టార్), రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (హిందీ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. కన్నడ దర్శకుడు హేమంత్ ఎమ్ రావు.. తమ తోటీ దర్శకులు తీసిన ఆచార్ అండ్ కో (కన్నడ-అమెజాన్ ప్రైమ్), హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే (కన్నడ-జీ5) సినిమాలు బాగా నచ్చాయని అన్నాడు. ఇలా పలువురు స్టార్ దర్శకులకు నచ్చిన సినిమాలంటే కచ్చితంగా అవి బెస్ట్ మూవీస్ అయ్యింటాయ్. వీటిల్లో చాలావరకు మీరు చూసేసి ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయింటే మాత్రం.. 2023 ముగిసేలోపు ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయితే.. పవన్ బర్రెలాగా మారిపోయాడు: ఆర్జీవీ) -
2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరించిన టాప్-10 జడ్జ్మెంట్స్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ ఏడాది కీలక తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు, డిమానిటైజేషన్ వంటి పాలసీ నిర్ణయాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు.. మోదీసర్కార్కు బిగ్ బూస్ట్ ఇచ్చాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ 10 జడ్జ్మెంట్స్ ఒకసారి చూద్దాం.. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దుపై.. 2023 డిసెంబర్ 11న కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టంచేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ వాదనలతో పూర్తిస్థాయిలో ఏకీభవించింది సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాదాపు 23 పిటిషన్లపై 16 రోజులపాటు ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. ఆర్థికశాఖలో చేపట్టిన అతిపెద్ద సంస్కరణ డీమోనిటైజేషన్. 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేస్తూ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోదీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై.. ఏడేళ్ల తర్వాత 2023లో తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. పెద్ద నోట్ల రద్దును సమర్థించింది. ఈ మేరకు 4-1 తేడాతో మెజార్టీ తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసనం. జస్టిస్ BV నాగరత్న ఒక్కరే ప్రభుత్వ నిర్ణయంతో వ్యతిరేకించారు. ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో.. కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుందని స్పష్టంచేసింది. 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించగా.. ఎన్నికల కమిషనర్ల అప్పాయింట్మెంట్స్కు సంబంధించిన సవరణ బిల్లును.. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తెచ్చింది కేంద్రప్రభుత్వం. ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, విపక్ష నేతతో కూడిన ప్యానెల్.. సీఈసీ, ఈసీలను ఎంపికే చేసేలా 1991 నాటి చట్టానికి కీలక సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అదానీ-హిండెన్బర్గ్ కేసులో.. తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు చేపట్టాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. హిండెన్బర్గ్ నివేదికతోపాటు ఆధారాలేమైనా ఉన్నాయా అని పిటిషనర్లను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. షార్ట్ సెల్లింగ్ కారణంగా మార్కెట్లు ఇబ్బందులు పడకుండా ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని సెబీకి ఆదేశాలు జారీచేసింది. విద్వేషపూరిత ప్రసంగాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది సుప్రీంకోర్టు. దీనిని తీవ్రమైన నేరంగా పేర్కొంది.విద్వేష ప్రసంగాల కారణంగా దేశ లౌకికవాదం ప్రభావితం అవుతుందని.. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా..విద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలంటూ సంచలనఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. వివాహ వ్యవస్థ, విడాకుల మంజూరుకు సంబంధించి ఈ ఏడాది కీలక ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారం ఉన్న డివోర్స్ కేసుల్లో ఆరు నెలల కంపల్సరీ గడువు అవసరం లేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. 6 నెలల సమయం వద్దని.. విడాకులు వెంటనే జారీచేయాలని సూచించింది సుప్రీంకోర్టు. విడాకుల మంజూరుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. స్వలింగ సంపర్కలు వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై 2023 అక్టోబర్లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. LGBTQ+ కమ్యూనిటీ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. 21 పిటిషన్లను విచారించిన సీజేఐ జస్టిస్ DY.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. 3-2 తేడాతో తీర్పు ఇచ్చింది. స్వలింగ వివాహం చట్టం చేసే హక్కు కేవలం పార్లమెంట్కే ఉందని స్పష్టం చేసింది. జల్లికట్టు, కంబల. ఎద్దులబండి పందాల వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోవలేమని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. 2023 మేలో ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబల, మహారాష్ట్రలో ఎద్దుల బండి పోటీలను అనుమతిస్తూ.. ఆయా రాష్ట్రప్రభుత్వాలు చేసిన చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్ల దాఖలయ్యాయి. వీటిని విచారించింది సర్వోన్నత న్యాయస్థానం. సంప్రదాయ క్రీడలు మన సంస్కృతిలో భాగమని.. వాటికి అటంకం కలిగించలేమని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ జడ్జ్మెంట్స్ ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చిన సుప్రీంకోర్టు డీమోనిటైజేషన్పై ఏడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం సీఈసీ, ఈసీల నియామకానికి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సీజేఐ స్థానంలో కేబినెట్ మంత్రిని చేర్చిన కేంద్రప్రభుత్వం విదేశీ రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు సరికాదన్న సుప్రీం విద్వేషపూరిత ప్రసంగాలను తీవ్రమైన నేరంగా పేర్కొన్న సుప్రీంకోర్టు విద్వేష ప్రసంగాలపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. వెంటనే విడాకులు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీం నిరాకరణ 3-2 తేడాతో తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోలేమని స్పష్టంచేసిన సుప్రీంకోర్టు -
ఆరంభం.. ముగింపు ఒకేలా! సౌతాఫ్రికా, టీమిండియాకు కన్నీళ్లు
Rewind: 2023... ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన రెండు జట్లకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆఖరి మెట్టుపై బోల్తా పడేసి.. సొంతగడ్డపై అభిమానుల మధ్య కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది. వీటితో పాటు ఈ ఏడాది ప్రపంచ క్రికెట్లో చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాల గురించి తెలుసుకుందాం!! 1. ఆస్ట్రేలియా ముచ్చటగా మూడోసారి సౌతాఫ్రికా వేదికగా ఈ ఏడాది ఆరంభంలో మహిళల టీ20 వరల్డ్కప్ ఈవెంట్ జరిగింది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన తొమ్మిదవ ఎడిషన్లో సౌతాఫ్రికా జట్టు ఫైనల్కు చేరుకుంది. ఓటమితో టోర్నీని ఆరంభించినా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే, మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా టైటిల్ గెలవాలన్న సౌతాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లింది. బెత్ మూనీ అర్ద శతకం(53)కు తోడు బౌలర్లు రాణించడంతో 19 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. కేప్టౌన్ వేదికగా ట్రోఫీ గెలుపొంది.. ఏకంగా మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. 2. డబ్ల్యూపీఎల్ ఆరంభం భారత మహిళా క్రికెట్లో సువర్ణాధ్యాయానికి 2023లో నాంది పలికింది బీసీసీఐ. టీ20 లీగ్ ఫార్మాట్లో వుమెన్స్ ప్రీమియర్ లీగ్ను ప్రవేశపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన మహిళా క్రికెటర్లను ఒక్క చోట చేర్చి ఐదు జట్లుగా విభజించి పోటీని నిర్వహించింది. ఐపీఎల్ మాదిరి వేలంలో క్రికెటర్లను కొనుగోలు చేసే అవకాశం ఫ్రాంఛైజీలకు ఇచ్చింది. ఇక ఈ చరిత్రాత్మక ఈవెంట్లో మొట్టమొదటి టైటిల్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ వుమెన్ టీమ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు.. మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీని ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. 3. ఆసియా కప్ విజేతగా టీమిండియా ఆసియా వన్డే కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే, తమ జట్టును అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఇండియా ఆడే అన్ని మ్యాచ్లకు శ్రీలంకను వేదికగా నిర్ణయించింది. ఇక ఈ టోర్నలో పాకిస్తాన్ సూపర్-4 దశలోనే నిష్క్రమించగా.. టీమిండియా- శ్రీలంక ఫైనల్ చేరాయి. తుదిపోరులో రోహిత్ శర్మ సేన లంకను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి సంచలన విజయంతో టైటిల్ను కైవసం చేసుకుంది. 4. జనాలు లేని వన్డే వరల్డ్కప్-2023 ఆరంభ మ్యాచ్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ జరిగింది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్కు తెరలేచింది. అయితే, క్రికెట్ను మతంలా భావించే భారత్లో వరల్డ్కప్ ఆరంభం పేలవంగా జరిగింది. ఎలాంటి హడావుడి, పెద్దగా ప్రేక్షకులు లేకుండానే తొలి మ్యాచ్ జరిగిపోయింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. 5. పసికూనలుగా వచ్చి.. సెమీస్ రేసులో నిలిచి వన్డే వరల్డ్కప్-2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా అడుగుపెట్టిన జట్టు అఫ్గనిస్తాన్. ఆరంభ మ్యాచ్లలో బంగ్లాదేశ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన అఫ్గన్.. ఆ తర్వాత జూలు విదిల్చిన సింహంలా చెలరేగింది. వరుసగా ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ను ఓడించి చరిత్రాత్మక విజయాలతో సెమీస్ రేసులో తానూ ఉన్నాననే సంకేతాలు పంపింది. టాపార్డర్లో యువ బ్యాటర్లు రాణించడం, రషీద్ ఖాన్ నాయకత్వంలోని స్పిన్ దళ రాణించడం అఫ్గన్కు కలిసివచ్చింది. సెమీస్ చేరకపోయినా అద్భుత ప్రదర్శనలతో ఈసారి వరల్డ్కప్లో అఫ్గనిస్తాన్ తమదైన ముద్ర వేయగలిగింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కంటే మెరుగ్గా రాణించి మధుర జ్ఞాపకాలు మిగిల్చుకుంది. 6. ఒలింపిక్స్లో క్రికెట్ విశ్వక్రీడల్లో బ్యాటర్ల మెరుపులు.. బౌలర్ల దూకుడు చూడాలని కోరుకుంటున్న అభిమానుల కల త్వరలోనే నెరవేరనుంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చేందుకు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ఈ ఏడాది ఆమోదం తెలిపింది. కాగా 1900 ఒలింపిక్స్లో క్రికెట్ కూడా ఉంది. అయితే, ఆ తర్వాత మళ్లీ తిరిగి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఇక లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో టీ20 ఫార్మాట్లో పురుష, మహిళా జట్లు బరిలోకి దిగనున్నాయి. 7. మాక్సీ మాగ్జిమమ్ ఇన్నింగ్స్ వన్డే వరల్డ్కప్-2023లో అఫ్గనిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ విధ్వంసకర ద్విశతకంతో చెలరేగాడు. సహచరులంతా చేతులెత్తేసిన వేళ.. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. తన చేతిలో ఏదో మంత్రదండం ఉందా అన్న అనుమానం కలిగేలా షాట్ల మీద షాట్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కండరాలు పట్టేయడంతో కదల్లేక క్రీజులో నిలబడిపోయినా మాక్సీ పట్టువీడక నభూతో అన్న చందంగా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్లో కెప్టెన్ కమిన్స్ సహకారం అందిస్తుండగా.. 201 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 8. రికార్డుల రారాజు కిరీటంలో అరుదైన కలికితురాయి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు బాదుతూ.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ శతకాల రికార్డుకు ఎసరుపెట్టిన కోహ్లి.. వన్డేల్లో అతడిని అధిగమించాడు. వన్డే ప్రపంచకప్-2023లో తన పుట్టినరోజు(నవంబరు 5) నాటి మ్యాచ్లో సచిన్ వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లి.. న్యూజిలాండ్తో సెమీస్ సందర్భంగా అతడి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో 50వ సెంచరీ నమోదు చేశాడు. 9. ఆరోసారి జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా సొంతగడ్డపై వరుసగా పది మ్యాచ్లు గెలిచి వరల్డ్కప్-2023 ఫైనల్కు చేరుకున్న టీమిండియాకు ఆస్ట్రేలియా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరంభంలో తడబడ్డా.. తమకే సాధ్యమైన రీతిలో పుంజుకుని ఏకంగా విశ్వవిజేతగా అవతరించింది. అహ్మదాబాద్లో లక్ష మందికి పైగా టీమిండియా అభిమానుల ప్రత్యక్షంగా చూస్తుండగా.. రోహిత్ శర్మ సేనను ఓడించి ఆరోసారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ట్రవిస్ హెడ్ అద్భుత ఇన్నింగ్స్తో ఆసీస్ను విజయతీరాలకు చేర్చి వరల్డ్కప్ హీరోల జాబితాలో తన పేరునూ లిఖించుకున్నాడు. 10. ఆస్ట్రేలియాపై భారత్ తొలి టెస్టు గెలుపు భారత మహిళా క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు గెలుపు నమోదు చేసింది. బ్యాటర్లు, బౌలర్లు రాణించడంతో ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా జయకేతనం ఎగురవేసింది హర్మన్ప్రీత్ బృందం. ఇక ఇంతవరకు ఇరు జట్ల మధ్య పదకొండు టెస్టులు జరుగగా.. నాలుగు ఆసీస్ గెలవగా.. ఒకటి భారత్ సొంతమైంది. ఆరు మ్యాచ్లు డ్రా అయ్యాయి. -
ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సినీతారలు వీళ్లే!!
మరో వారం రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. 2023కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల వారికి ఎన్నో మధురానుభూతులను తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ఏడాదిలో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు వివాహాబంధంతో ఒక్కటయ్యారు. వారిలో ప్రధానంగా వరుణ్-లావణ్య, శర్వానంద్-రక్షితా రెడ్డి, మంచు మనోజ్- భూమా మౌనిక లాంటి స్టార్ జంటలు ఉన్నాయి. ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలుకుతూ.. పెళ్లిబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారి పెళ్లి విశేషాలు తెలుసుకుందాం. వరుణ్- లావణ్య ఈ ఏడాది మెగా ఇంట పెళ్లి సందడి గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మాదాపూర్లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య హఠాత్తుగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్కు షాకిచ్చారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) శర్వానంద్-రక్షితా రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది ఇంటివాడయ్యాడు. జూన్ 2న జైపూర్లోని లీలా ప్యాలెస్లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. శర్వానంద్ పెళ్లి వేడుకకు రామ్ చరణ్తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం ఈ ఏడాది మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికమెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి మార్చి 3న హైదరాబాద్లోని మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. భూమా మౌనిక 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) మానస్ - శ్రీజ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్. ఈ బుల్లితెర నటుడు ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో కనిపించిన మానస్ తర్వాత సీరియల్స్తో పాటు యాంకరింగ్లోనూ తన ప్రతిభ చాటుకున్నాడు. విజయవాడలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీతారలు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. మానస్ బిగ్బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న ఇతడు ఆ మధ్య మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్లోనూ నటించాడు. కేఎల్ రాహుల్ను పెళ్లాడిన అతియాశెట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ భామ అతియా శెట్టి- కేఎల్ రాహుల్. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి పలు బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. కేఎల్ రాహుల్తో మూడేళ్లపాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. వీరిద్దరి పెళ్లి ముంబై సమీపంలోని ఖండాలాలో ఉన్న సునీల్శెట్టి ఫాంహౌస్లో జరిగింది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్ను టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లాడారు. అంతుకుముందే ఆమెతో నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన పాండ్యా ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన కుమారుడు అగస్త్య పాండ్యా సమక్షంలో నటాషా స్టాంకోవిచ్ను వివాహం చేసుకున్నారు. వీరిపెళ్లి రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో ఘనంగా జరిగింది. ఎంపీని పెళ్లాడిన హీరోయిన్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఈ జంట ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. చమ్కీలా అనే సినిమా షూటింగ్ పంజాబ్లో జరిగినప్పుడు వీరిద్దరు ప్రేమలో పడ్డారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్లో జరిగిన వీరిపెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. పెళ్లిబంధంతో ఒక్కటైన జంట బాలీవుడ్కు చెందిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సైతం ఈ ఏడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. షేర్షా చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించారు. రాజస్థాన్లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అలాగే ఈ ఏడాది మరికొందరు సినీ తారలు కూడా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వారిలో రణ్దీప్ హుడా, స్వరాభాస్కర్, మసాబా గుప్తా లాంటి వారు కూడా ఉన్నారు. -
2023 టాలీవుడ్లో టాప్-10 కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు
కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది. మరో వారంలో 2023 సంవత్సరానికి గుడ్బై చెప్పేసి కొత్త సంవత్సరం 2024లోకి అడుగు పెట్టేస్తాము. ఇలాంటి సమయంలో గడిచిపోయిన సంవత్సరంలో మనమేం సాధించాం..? ఏం నష్టపోయాం..? అనే లెక్కలు వేసుకోవడం సహజం. సినిమా అనేది అందరినీ ఎంటర్టైన్ చేసే విభాగం.. అందుకే ఈ పరిశ్రమపై ప్రేక్షకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలున్నా కేవలం బాలీవుడ్కు మాత్రమే అందరూ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అక్కడి చిత్రాలకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ నటించిన వారికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండేది. దీంతో మిగిలిన చిత్ర పరిశ్రమల పేర్లు కూడా అందరికీ తెలిసేవి కావు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బాలీవుడ్కు పోటీగా టాలీవుడ్ చిత్రపరిశ్రమ మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా 2023లో రిలీజైన తెలుగు సినిమాల్లో కలెక్షన్స్ పరంగా టాప్-10లో ఉన్న చిత్రాల గురించి ఒకసారి చూద్దాం. కేవలం ఈ కలెక్షన్స్ వివరాలు టాలీవుడ్ పరిధి అంటే రెండు తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గమనించగలరు. 1. 'వాల్తేరు వీరయ్య' మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. 2023 సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్తో దుమ్మురేపింది. ఇందులో రవితేజ కీ రోల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 250 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్లో రూ. 160 కోట్ల రాబట్టి 2023లో విడుదలైన చిత్రాల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ పరంగా టాప్-1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 2. ఆదిపురుష్- ప్రభాస్ రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. 'ఆదిపురుష్'. ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 393 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 133 కోట్లు రాబట్టింది. టాలీవుడ్లో 'వాల్తేరు వీరయ్య' కంటే కలెక్షన్స్ పరంగా 'ఆదిపురుష్' వెనకపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టాప్లో ఉన్నా కూడా టాలీవుడ్లో మాత్రం రెండో స్థానానికి పరిమితం అయింది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 3. వీరసింహా రెడ్డి - బాలకృష్ణ 2023 సంక్రాంతి బరిలో 'వీరసింహా రెడ్డి'తో బాలకృష్ణ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య'కు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. ఈ రేసులో మెగాస్టారే పైచేయి సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 134 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 97 కోట్లు రాబట్టి మూడో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 4. భగవంత్ కేసరి- బాలకృష్ణ బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ ఏడాదిలో బాలయ్య రెండు హిట్ సినిమాలను అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 115 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 85 కోట్లు రాబట్టి నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 5. 'బ్రో'- సాయిధరమ్ తేజ్,పవన్ కల్యాణ్ సాయిధరమ్ తేజ్ ప్రధాన కథానాయకుడిగా పవన్ కల్యాణ్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దీనిని డైరెక్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 114 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 82 కోట్లు రాబట్టి ఐదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 6. దసరా- నాని నాని పాన్ ఇండియా హీరోగా దసరా చిత్రంతో పరిచయం అయ్యాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. కీర్తి సురేశ్ ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. నానికి ఇది తొలి పాన్ ఇండియా చిత్రంకావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 118 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 76 కోట్లు రాబట్టి ఆరో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 7. జైలర్- రజనీకాంత్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’ . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 604 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 68 కోట్లు రాబట్టి ఏడో స్థానం దక్కించుకుంది. రజనీకాంత్ కెరియర్లో ఆల్టైమ్ హిట్గా జైలర్ నిలిచింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 8.'బేబీ'- ఆనంద్ దేవరకొండ 2023లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ప్రేమ కథా చిత్రం 'బేబీ' . సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్ను భారీగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 81 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 64 కోట్లు రాబట్టి ఎనిమిదో స్థానం దక్కించుకుంది. 9. విరూపాక్ష- సాయిధరమ్ తేజ్ సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' . శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ హీరోయిన్గా నటించింది. రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతినిచ్చిన ఈ సినిమా సాయిధరమ్ తేజ్కు బిగ్గెస్ట్ను ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 89 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 63 కోట్లు రాబట్టి తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 10. సలార్- ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా సలార్ ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతానికి (డిసెంబర్ 23) టాలీవుడ్లో రూ. 101కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన టాప్ టెన్ లస్ట్లో మూడో స్థానానికి సలార్ చేరుకున్నాడు. కానీ బాక్సాఫీస్ వద్ద సలార్ కలెక్షన్స్ దూకుడు భారీగానే కొనసాగుతుంది. దీంతో సలార్ కలెక్షన్స్ క్లోజింగ్ అయ్యే సరికి టాప్-1 లోకి కూడా రావచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సలార్ డిజిటల్ రైట్స్ను సుమారు రూ.160 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలను ప్రముఖ సినీ ట్రేడ్ వర్గాల ఆధారం చేసుకుని ఇవ్వడం జరిగింది. -
2023 రౌండప్: బెడిసికొట్టిన రీమేక్.. భారీ డిజాస్టర్ చిత్రాలివే!
ఒకప్పుడు టాలీవుడ్లో రీమేకులు సర్వసాధారణం. ఇతర భాషల్లో రిలీజై సూపర్ హిట్ అయిన చిత్రాలన్నీ తెలుగులో రీమేక్ చేసేవారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జునతో పాటు స్టార్ హీరోలంతా రీమేక్ చిత్రాల్లో నటించిన వారే. వాటిలో చాలా వరకు సూపర్ హిట్గా నిలిచాయి కూడా. కానీ ఓటీటీ రాకతో రీమేక్ చిత్రాల పని అయిపోయింది. ఇప్పుడు ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు. అందుకే ఈ ఏడాది రీమేక్ చిత్రాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. భారీ నుంచి ఓ మోస్తరు చిత్రాలవరకు అన్ని రీమేకులు డిజాస్టర్స్గా నిలిచాయి. బోల్తా పడిన భోళా శంకర్ ఈ ఏడాది విడుదలై డిజాస్టర్ అయిన చిత్రాల్లో భోళా శంకర్ ముందు వరుసలో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ మూవీ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్. అక్కడ అజిత్ ..ఇక్కడ చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళంలో ఈ కథ సూపర్ హిట్గా నిలిచింది. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. చిరు కెరీర్లో దారుణమైన సినిమాల్లో భోళా శంకర్ ఒకటిగా నిలిచింది. భారీ నష్టాలు మిగిల్చిన ‘బ్రో’ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బ్రో’ మూవీ కూడా రీమేక. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వినోదయ సిత్తం చిత్రాన్ని కొద్దిగా మార్పులు చేసి బ్రోగా తెరకెక్కించాడు దర్శకుడు సముద్రఖని. త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటన.. తమన్ సంగీతం ..ఏది ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. పవన్ కోసం చేసిన మార్పులు ఈ సినిమాను మరింత దెబ్బతీశాయి. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్గా ‘రావణాసుర’ పైకి చెప్పనప్పటికీ రావణాసుర కూడా రీమేక్ చిత్రమే. ‘విన్సీ డా’అనే బెంగాలీ మూవీకి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాలోని మెయిన్ పాయింట్ని మాత్రమే తీసుకొని కమర్షియల్ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. తొలిసారి రవితేజ నెగెటివ్ షేడ్స్లో కనిపించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలైన డిజాస్టర్గా నిలిచింది. కృష్ణవంశీ ఆశలపై నీళ్లు చల్లిన ‘రంగమార్తాండ’ చాలా కాలం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. మరాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేక్గా వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అయితే వచ్చాయి కానీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. కథ, కథనం, మేకింగ్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ ప్రస్తుత ట్రెండ్కి విరుద్ధంగా ఈ చిత్రం ఉండడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఆకట్టుకోలేకపోయిన ‘హంట్’ ఈ ఏడాది సుధీర్ బాబు చేసిన మరో ప్రయోగం హంట్. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన 'ముంబై పోలీస్' అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ.. ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడం.. మక్కీకి మక్కీ తెరకెక్కించడం కారణంగా ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇవి మాత్రమే కాదు ఫిబ్రవరిలో విడుదలైన బుట్టబొమ్మ(మలయాళ మూవీ ‘కప్పేలా’ తెలుగు రీమేక్), నవంబర్లో రిలీజైన కోట బొమ్మాళి పీఎస్(మలయాళ సూపర్ హిట్ ‘నాయట్టు’ తెలుగు రీమేక్) చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
2023.. భారతీయ రైల్వేలో అద్భుతాలివే..
2023 సంవత్సరం ముగియబోతోంది. కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో ప్రవేశించనుంది. 2023లో భారతీయ రైల్వే అనేక విజయాలను నమోదు చేసుకుంది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే భారతీయ రైల్వే 2023లో ఏమి సాధించిందో ఇప్పుడు చూద్దాం. అత్యంత పొడవైన రైల్వే స్టేషన్.. ప్రపంచంలో భారీ నెట్వర్క్ కలిగిన రవాణా సాధనాలలో భారతీయ రైల్వే ఒకటి. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్గా భారత్లోని ఒక రైల్వే స్టేషన్ రికార్డు సృష్టించింది. గతంలో యూపీలోని గోరఖ్పూర్ స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్గా రికార్డు సృష్టించింది. దీని పొడవు 1,366.4 మీటర్లు. అయితే ఈ సంవత్సరం మార్చి లో హుబ్లీ రైల్వే స్టేషన్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం కలిగిన స్టేషన్గా కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్లాట్ఫారమ్ పొడవు 1,507 మీటర్లు. ఈ ప్లాట్ఫారం ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. అమృత్ భారత్ స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ల ద్వారా భారతీయ రైల్వే రూపురేఖలు మారనున్నాయి. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆగస్టు 6న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. వీటి అభివృద్ధికి రూ.24,470 కోట్లు ఖర్చుకానుంది. ఈ పథకం ద్వారా దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లు మరింత అభివృద్ధి చెందనున్నాయి. మూడువేల కొత్త రైళ్లు.. పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా భారతీయ రైల్వే రాబోయే నాలుగైదు సంవత్సరాలలో మూడువేల అదనపు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రస్తుతం రైల్వే ఏటా ఎనిమిది వందల కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నదని అన్నారు. ప్రయాణికుల పెరుగుదల దృష్ట్యా మరో మూడువేల రైళ్లు అవసరమని అన్నారు. ప్రతి సంవత్సరం 200 నుండి 250 కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. 400 నుండి 450 వందే భారత్ రైళ్లకు ఇవి అదనం అని పేర్కొన్నారు. లిఫ్ట్లు/ఎస్కలేటర్లు సుగమ్య భారత్ అభియాన్లో భాగంగా భారతీయ రైల్వేలు రైల్వే ప్లాట్ఫారమ్లలో వికలాంగులు, వృద్ధులు, పిల్లలకు ఉపయోగపడేలా లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. 2021-22లో 208 లిఫ్టులు, 182 ఎస్కలేటర్లు ఏర్పాటు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 215 లిఫ్టులు, 184 ఎస్కలేటర్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ రైల్వేలు 68 వేల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్వర్క్ను కలిగివుంది. ఉపాధి కల్పన విషయంలో భారతీయ రైల్వే చాలా దేశాల కంటే ముందుంది. భారతీయ రైల్వేలో 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం! -
యూపీఐ కొత్త పుంతలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు భారత్లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్లో 1,123.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ ఏకంగా రూ.17.4 లక్షల కోట్లను తాకింది. ఈ వేగాన్నిబట్టి చూస్తే డిసెంబర్ నెల యూపీఐ లావాదేవీల విలువ రూ.20 లక్షల కోట్ల మార్కును చేరే అవకాశం ఉంది. నూతన సంవత్సర వేడుకల కోసం చేసే చెల్లింపులు ఇందుకు దోహదం చేయనున్నాయి. డిసెంబర్ 1–18 తేదీల మధ్య 703 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.11 లక్షల కోట్లు. పండుగల సీజన్తో.. ఈ ఏడాది జూలై నుంచి సెపె్టంబర్ మధ్య యూపీఐ లావాదేవీల విలువ ప్రతి నెల రూ.15.3–15.8 లక్షల కోట్ల మధ్య నమోదైంది. పండుగల సీజన్ కారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో యూపీఐ లావాదేవీలతోపాటు విలువ కూడా అనూహ్యంగా పెరిగింది. గడిచిన రెండు మాసాల్లోనూ ప్రతి నెల విలువ రూ.17 లక్షల కోట్ల మార్కును తాకింది. 2023 అక్టోబర్లో 1,140.8 కోట్ల లావాదేవీలు జరగగా వీటి విలువ రూ.17.1 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2022 డిసెంబర్లో రూ.12.8 లక్షల కోట్ల విలువైన 783 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే ఏడాది నవంబర్లో రూ.11.9 లక్షల కోట్ల విలువైన 731 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. తొలి స్థానంలో ఫోన్పే.. ప్రస్తుతం భారత్లో 516 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. థర్డ్ పార్టీ యాప్, డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తున్న ఫోన్పే నవంబర్ నెలలో రూ. 8,54,939 కోట్ల విలువైన 528 కోట్ల లావాదేవీలతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. లావాదేవీల విలువ పరంగా గూగుల్ పే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, యెస్ బ్యాంక్ యాప్స్, భీమ్, అమెజాన్ పే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ యాప్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చిన్న మొత్తాలే ఎక్కువ.. నవంబర్లో విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీలు ఏకంగా 74.31 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. వీటి విలువ రూ.12.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగిన లావాదేవీలు 25.69 శాతం వాటాతో రూ.4.46 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఇక పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు 58.62 శాతం వాటాతో 658.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు 41.38 శాతం వాటాతో 464.9 కోట్ల లావాదేవీలు జరిగాయి. పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు చెల్లించిన మొత్తాల్లో రూ.500 లోపు లావాదేవీల సంఖ్య ఏకంగా 83.75 శాతం ఉంది. వ్యక్తుల నుంచి వ్యక్తులకు బదిలీ అయిన మొత్తాల్లో రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా 54.85 శాతం నమోదైంది. దీనినిబట్టి చూస్తే చిన్న మొత్తాలే అధిక సంఖ్యలో చేతులు మారుతున్నాయి. -
ఈ ముద్దుగుమ్మలు ఆడా లేరు...ఈడా లేరు!
ఈ ఏడాది కొంతమంది కథానాయికలను తెలుగు తెర మిస్సయింది. ఆ మాటకొస్తే తెలుగులో మాత్రమే కాదు.. ఏ భాష తెరపైనా ఈ తారలు కనిపించలేదు. ఆడా లేరు.. ఈడా లేరు అన్నట్లు ఎక్కడా కనిపించకుండా ఆ నాయికలు ఏం చేస్తున్నారో చూద్దాం. ‘లవ్ స్టోరీ (2021)’, ‘శ్యామ్ సింగరాయ్ (2021)’, ‘విరాటపర్వం (2022)’ సినిమాలతో రెండేళ్లుగా తెలుగు తెరపై సందడి చేసిన సాయి పల్లవి ఈ ఏడాది మాత్రం సిల్వర్ స్క్రీన్కి దూరమయ్యారు. చెప్పాలంటే 2023లో నటిగా సాయిపల్లవి పూర్తిగా బ్రేక్ తీసుకున్నట్లే. ఎందుకంటే ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలేవీ తెలుగులోనే కాదు... ఇతర భాషల్లో కూడా విడుదల కాలేదు. 2022లో తమిళంలో చేసిన ‘గార్గి’ చిత్రం తర్వాత సాయి పల్లవి నటించిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘తండేల్’, శివ కార్తికేయన్తో ఒక చిత్రం... సాయి పల్లవి కమిట్ అయిన సినిమాలు ఇవే. ‘తండేల్’ షూటింగ్ జరుగుతోంది. శివ కార్తికేయన్తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. సో.. వచ్చే ఏడాది డబుల్ ధమాకాలా సాయి పల్లవి ఈ రెండు చిత్రాలతో థియేటర్స్లో సందడి చేస్తారు. హీరోయిన్గా ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’, ‘అంటే.. సుందరానికీ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, ‘బటర్ ఫ్లై’తో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఇలా.. 2022లో అనుపమా పరమేశ్వరన్ ఫుల్ ఫామ్లో కనిపించారు. కానీ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయలేదు. తెలుగులో అనుపమ చేస్తున్న ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘డీజే టిల్లు స్క్వేర్’ చిత్రం ఈ ఏడాది విడుదలకు ముస్తాబైనా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. దాంతో ఈ ఏడాది ఆమె కనిపించలేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో రవితేజ ‘ఈగల్’, తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ఉన్నాయి. ఇతర భాషల్లో మరో రెండు సినిమాలు ఉన్నాయి. జనవరిలో ‘ఈగల్’, ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు స్క్వేర్’ విడుదలవుతాయి. చూస్తుంటే.. 2024లో అనుపమా పరమేశ్వరన్ ముచ్చటగా మూడు సార్లయినా వెండితెరపై మెరిసే అవకాశం ఉంది. గత ఏడాది రెండు తెలుగు సినిమాలు (పక్కా కమర్షియల్, థాంక్యూ), రెండు తమిళ సినిమాలు (తిరుచిత్రంబలం, సర్దార్)లతో కెరీర్లో దూకుడు పెంచినట్లుగా కనిపించారు రాశీ ఖన్నా. కానీ ఆ స్పీడ్కు ఈ ఏడాది స్పీడ్ బ్రేకర్ పడింది. రాశీ ఖన్నా సైన్ చేసిన హిందీ చిత్రం ‘యోధ’ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అలాగే తెలుగులో శర్వానంద్తో రాశీ ఖన్నా కమిట్ అయిన సినిమా ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది. ఇలా రాశీ ఖన్నా వెండితెరపై మెరవలేకపోయారు. అయితేనేం.. తమిళంలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్గా నటించిన ‘అరణ్మణై 4’, హిందీ ‘యోధ’ రిలీజ్కు రెడీ అవుతున్నాయి. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ స్టేజ్లో ఉన్నాయి. సో.. వచ్చే ఏడాది రాశీ ఖన్నా జోరు మళ్లీ కనిపిస్తుంది. అన్నట్లు మరో మాట.. తెలుగులో ‘తెలుసుకదా’ అనే సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ ఓ హీరోగా, ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధీ శెట్టి మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఇక గత ఏడాది ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్, తమిళంలో ‘కోబ్రా’ చిత్రంతో తెరపై కనిపించిన శ్రీనిధీ శెట్టి ఈ ఏడాది కనిపించలేదు. తెలుగులో ‘హీరో’, తమిళంలో ‘కలగ తలైవన్’ సినిమాలతో గత ఏడాది సిల్వర్ స్క్రీన్పై మెరిశారు నిధీ అగర్వాల్. కానీ ఈ ఏడాది మాత్రం స్లో అయ్యారు. ఈ ఏడాది ఆమె హీరోయిన్గా నటించిన ఏ చిత్రం ఏ భాషలో కూడా వెండితెరపైకి రాలేదు. నిధి నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. నాని ‘గ్యాంగ్లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ సుపరిచితురాలే. గత ఏడాది ‘ఈటీ’, ‘డాన్’ వంటి తమిళ చిత్రాలతో వెండితెరపై మెరిశారామె. అయితే ఈ యంగ్ బ్యూటీ కూడా ఈ ఏడాది వెండి తెరపై కనిపించలేదు. ప్రియాంక హీరోయిన్గా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం ఈ ఏడాది రిలీజ్కు షెడ్యూలై, ఆ తర్వాత సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. అలా ఈ ఏడాదిని మిస్ అయ్యారు ప్రియాంక. ప్రస్తుతం తెలుగులో ‘సరిపోదా శనివారం’, ‘ఓజీ’, తమిళంలో ‘బ్రదర్’ చిత్రాలు చేస్తున్నారు ప్రియాంకా అరుళ్ మోహన్. -
2023లో ఎక్కువగా ఈ కార్ల కోసమే సెర్చ్ చేశారు
టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో ఎప్పుడు ఏం కావాలన్నా గూగుల్ సెర్చ్ చేయడం అలవాటు అయిపోయింది. ఈ ఏడాది (2023లో) ఎక్కువ మంది గూగుల్లో ఏ కార్ల కోసం సెర్చ్ చేశారు, ఎన్ని దేశాల్లో సెర్చ్ చేశారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 👉2023లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన కార్ బ్రాండ్స్ జాబితాలో ప్రధానంగా జపనీస్ కార్ల తయారీ సంస్థ 'టయోటా' అగ్రస్థానం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 64 దేశాల్లో ఈ బ్రాండ్ కార్ల కోసం శోధించినట్లు తెలుస్తోంది. 👉ఆ తరువాత స్థానంలో అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉంది. టెస్లా బ్రాండ్ కార్లను ప్రపంచంలోని సుమారు 29 కంటే ఎక్కువ దేశాలలో సెర్చ్ చేసినట్లు సమాచారం. ఇందులో కూడా ఎక్కువ టెస్లా మోడల్ 3, మోడల్ వై, సైబర్ ట్రక్ కోసం శోధించినట్లు సమాచారం. 👉ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచిన కంపెనీ బీఎండబ్ల్యూ. ప్రపంచంలోని 29 కంటే ఎక్కువ దేశాలలోని ప్రజలు ఈ బ్రాండ్ కార్ల కోసం సెర్చ్ చేశారని తెలుస్తోంది. గత ఏడాది ఎక్కువ సెర్చింగ్స్ పొందిన రెండవ కంపెనీకి నిలిచిన BMW ఈ ఏడాది మూడవ స్థానంలో నిలిచింది. 👉నాలుగవ స్థానంలో నిలిచిన 'ఆడి' కార్ బ్రాండ్ కోసం 7 దేశాల్లోని ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు సమాచారం. గత ఏడాది మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆడి సెర్చింగ్ విషయంలో నాల్గవ స్థానంలోనే నిలిచింది. 👉ఇక చివరగా ఐదవ స్థానం పొందిన కంపెనీ మెర్సిడెస్ బెంజ్. గత ఏడాది మూడవ స్థానం పొందిన బెంజ్.. ఈ ఏడాది 5వ స్థానంలో చేరింది. కేవలం ఆరు దేశాలలో మాత్రమే ఎక్కువగా ఈ కార్లను సెర్చ్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ.. -
ఇలా ఎలా అనిపించిన ఓలా..
ప్రారంభంలో మంచి ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్.. క్రమంగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద లెక్కకు మించిన కంప్లైంట్ అందుకుంది. స్కూటర్లలో ఎన్ని సమస్యలు తలెత్తినప్పటికీ.. అమ్మకాల్లో మాత్రం కనీవినీ ఎరుగని విధంగా దూసుకెళ్లినట్లు నివేదికల ద్వారా తెలిసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఓలా ఎలక్ట్రిక్ నివేదికల ప్రకారం, 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ వరకు కంపెనీ మొత్తం సేల్స్ 2,52,647 యూనిట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. కేవలం ఒక సంవత్సర కాలంలో 2.5 లక్షల యూనిట్ల అమ్మకాలు సొంతం చేసుకున్న కంపెనీకి ఓలా ఈ ఏడాది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది అత్యధిక అమ్మకాలు చేపట్టిన కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో టీవీఎస్ (1,62,399 యూనిట్లు), ఏథర్ ఎనర్జీ (1,01,940 యూనిట్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ లెక్కన ఓలా ఎలక్ట్రిక్ నెలకు సుమారు 20000 యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. ఇదీ చదవండి: న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ.. నెలవారీ అమ్మకాల పరంగా ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా 30.50శాతం, టీవీఎస్ వాటా 19.60 శాతం, ఏథర్ వాటా 12.30శాతంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రూ. 90000 నుంచి రూ. 1.47 లక్షల ధర మధ్య లభించే స్కూటర్లను విక్రయిస్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. బహుశా ఇది 2024 చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. -
న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ..
2023 ప్రారంభం నుంచి మొదలైన లేఆప్స్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'షేర్చాట్' (ShareChat) తన ఉద్యుగులలో సుమారు 15 శాతం మందిని తొలగించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో కంపెనీ నష్టాలను చవి చూడటం వల్ల ఖర్చులను క్రమబద్ధీకరించడానికి, ప్రస్తుతం 15 శాతం లేదా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు అధికారికంగా వెల్లడించింది. గత ఏడాది 4.9 బిలియన్స్ ఉన్న కంపెనీ విలువ ఈ సంవత్సరం 1.5 బిలియన్స్ తగ్గినట్లు సమాచారం. షేర్చాట్ తన కార్యకలాపాలను, ఉత్పాదకతను మెరుగుపరచడం, స్థిరమైన వృద్ధికి స్థానం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని, 2024 వార్షిక ప్రణాళికలో భాగంగా.. కంపెనీ వ్యూహాత్మక పునర్నిర్మాణాన్ని వివరిస్తూ షేర్చాట్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగులను తొలగించడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు! ఇండియన్ స్టార్టప్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షేర్చాట్ ఈ ఆర్థిక సంవత్సరంలో దాని వాల్యుయేషన్ సగానికి పైగా తగ్గడంతో నష్టాల్లో సాగింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో కూడా సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించింది. మళ్ళీ ఇప్పుడు సంవత్సరాంతంలో కూడా ఉద్యోగులను తొలగించి వారికి పెద్ద షాక్ ఇచ్చింది. -
కొత్త పిన్ కోడ్తో బిర్యానీ డెలివరీ.. సిద్దమైన బావర్చి
క్రిస్మస్, న్యూ ఇయర్లను పురస్కరించుకుని హైదరాబాద్ వాసులకు బావర్చి రెస్టారెంట్.. స్విగ్గీతో కలిపి సుమారు 35 లక్షల వినియోగదారులకు తమ వంటకాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బిర్యానీ ప్రియులకు మరచిపోలేని ఇయర్ ఎండ్ అనుభవాన్ని అందించడానికి హైదరాబాద్లో 31 అనే కొత్త పిన్ కోడ్తో అమీర్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నిజాంపేట్, నానక్రామ్గూడ మొదలైన ప్రాంతాల్లో 2023 డిసెంబర్ 22 నుంచి 2024 జనవరి 1 మధ్య స్విగ్గీ వినియోగదారులకు బావర్చి బిర్యానీ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. RTC X రోడ్డులో ఉన్న బావర్చి రెస్టారెంట్ నగరంలోనే కాకుండా దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిర్యానీ రెస్టారెంట్లలో ఒకటి. గత ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా స్విగ్గీలో నిమిషానికి 3 బిర్యానీలను విక్రయించడం ద్వారా జాతీయ రికార్డు సొంతం చేసుకుంది. బిర్యానీకి ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్.. చికెన్, మటన్ బిర్యానీ వంటి వంటకాలను వినియోగదారులకు అందిస్తోంది. దేశంలోని వేలాది రెస్టారెంట్లతో అనుభందం ఉన్న స్విగ్గీకి హైదరాబాద్ కూడా అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది వినియోగదారులకు బావర్చి రెస్టారెంట్ను అందుబాటులోకి తీసుకురావడం గురించి స్విగ్గీ నేషనల్ బిజినెస్ హెడ్ సిద్దార్థ్ భకూ మాట్లాడుతూ.. హైదరాబాద్ వాసులకు బిర్యానీ పట్ల ఉన్న ప్రేమ వర్ణించలేనిది. హౌ ఇండియా స్విగ్గీ నివేదిక 2023 ప్రకారం, దేశంలోని ఆర్డర్ చేసుకునే ప్రతి ఆరు బిర్యానీలలో ఒకటి హైదరాబాద్ బిర్యానీ ఉంటుందని వెల్లడించారు. -
భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే..
ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం మాత్రమే కాకుండా రియర్ ఎస్టేట్ రంగం కూడా బాగా ఊపందుకుంది. 2023వ సంవత్సరంలో అపార్ట్మెంట్లకు గిరాకీ భారీగా పెరిగిందని 'జేఎల్ఎల్ ఇండియా' (JLL India) వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు డిమాండ్ బాగా పెరిగిందని ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, పూణేలలో మొత్తం రెండు లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. గతం కంటే ఈ ఏడాది 20 శాతం అమ్మకాలు పెరుగుతాయని, 2023 మొదటి తొమ్మిది నెలల్లో అమ్మకాలు 1,96,227 యూనిట్లు అని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2022 ఇదే సమయంలో మొత్తం విక్రయాన్ని 1,61,575 యూనిట్లు మాత్రమే అని కూడా నివేదికలో వెల్లడైంది. వచ్చే ఏడాదికి అపార్ట్మెంట్ అమ్మకాలు 2.9 లక్షల నుంచి 3 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని జేఎల్ఎల్ ఇండియా భావిస్తోంది. మార్కెట్లో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో 2024లో కూడా సేల్స్ తారా స్థాయికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 2023లో బెస్ట్ సీఎన్జీ కార్లు.. ఇవే! అపార్ట్మెంట్స్ ధరలు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో దేశంలో హోసింగ్ మార్కెట్ సజావుగా ముందుకు సాగుతుందని జేఎల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ 'సమంతక్ దాస్' తెలిపారు. రానున్న రోజుల్లో ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. -
2023లో బెస్ట్ సీఎన్జీ కార్లు.. ఇవే!
దేశీయ విఫణిలో కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్లను CNG కార్లుగా రూపొందించి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఈ కథనంలో 2023లో లాంచ్ అయిన బెస్ట్ సీఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం. మారుతి గ్రాండ్ విటారా సీఎన్జీ (Maruti Grand Vitara CNG) ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి 'సుజుకి గ్రాండ్ వితారా'.. ఏప్రిల్ 2023న సీఎన్జీ కారుగా అడుగుపెట్టింది. 1.5 లీటర్ కె15సీ ఇంజిన్ కలిగిన ఈ కారు 26 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ మోడల్ కేవలం సిటీ డ్రైవింగ్కు మాత్రమే కాకుండా హైవేలలో కూడా మంచి పనితీరుని అందిస్తుంది. మారుతి బ్రెజ్జా సీఎన్జీ (Maruti Brezza CNG) దేశీయ విఫణిలో లాంచ్ అయిన మరో మారుతి CNG కారు బ్రెజ్జా. 2023 'మే'లో విడుదలైన ఈ కారు డిజైర్ సీఎన్జీ మాదిరిగానే 1.5 లీటర్ కె12సీ ఇంజిన్ కలిగి 20.15 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సరసమైన ధర వద్ద లభిస్తున్న బెస్ట్ CNG కార్లలో ఒకటిగా ఉంది. టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG) దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీకి చెందిన 'పంచ్' మైక్రో SUV కూడా జూన్ 2023న CNG కారుగా లాంచ్ అయింది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కారు 73 పీఎస్ పవర్, 113 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.2 లీటర్ 3 సిలినార్ ఇంజిన్ పొందుతుంది. ఇది 18.5 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ (Hyundai Exter CNG) 2023 ఆటో ఎక్స్పోలో అరంగేట్రం చేసిన 'హ్యుందాయ్ ఎక్స్టర్' 2023 జులైలో CNG కారుగా మార్కెట్లో లాంచ్ అయింది. 1.2 లీటర్ ఫోర్ సిలినార్ ఇంజిన్ కలిగిన ఈ కారు 74 పీఎస్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ మోడల్ 21 కిమీ?కేజీ మైలేజ్ అందిస్తుంది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు! టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ (Tata Altroz CNG) టాటా ఆల్ట్రోజ్ కూడా ఇప్పుడు మార్కెట్లో CNG కారుగా అందుబాటులో ఉంది. దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా పెద్దగా మార్పు పొందినప్పటికీ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 74 పీఎస్ పవర్, 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 25.15 కిమీ/కేజీ మైలేజ్ అందించే ఈ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. -
విరాట్ కోహ్లి 3.O.. 2023లో ఎన్నో ఘనతలు! కానీ అదొక్కటే
2023.. టీమిండియా స్టార్ బ్యాటర్, రన్మిషన్ విరాట్ కోహ్లికి చాలా ప్రత్యేకం. ఈ ఏడాది విరాట్కు తన జీవితాంతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిన ఏడాది ఇది. ఎవరికి సాధ్యం కాదనుకున్న వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లి.. తన పేరును క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 50 సెంచరీలు చేసిన విరాట్.. వరల్డ్క్రికెట్లో తానే కింగ్ అనే మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో విరాట్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డుతో పాటు మరిన్నో అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాదిలో కోహ్లి సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం. క్రిస్ గేల్ రికార్డు బద్దలు.. ఈ ఏడాది ఐపీఎల్లో విరాట్ కోహ్లి సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023లో విరాట్ రెండు అద్భుతమైన సెంచరీలతో చెలరేగాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు ఈ క్యాష్రిచ్ లీగ్లో 7 సెంచరీలు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు విండీస్ లెజెండ్ క్రిస్ గేల్(6) పేరిట ఉండేది. ఈ ఏడాది సీజన్తో గేల్ ఆల్టైమ్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. తొలి ఆటగాడిగా.. ఈ ఏడాది ఐపీఎల్లో విరాట్ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 7000 పరుగులు మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు 229 ఐపీఎల్ ఇన్నింగ్స్లలో 7263 పరుగులు కోహ్లి చేశాడు. సచిన్ రికార్డు బ్రేక్.. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. వన్డే వరల్డ్కప్లో-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్లో 1000కుపైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్(7) ఆల్టైమ్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. 765 పరుగులతో.. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్-2023 విరాట్ కోహ్లి దుమ్మురేపాడు. 11 మ్యాచ్లు ఆడి 765 పరుగులతో టోర్నీ టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. తద్వారా వన్డే వరల్డ్కప్ ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్(674)ను అధిగమించాడు. పాకిస్తాన్పై వరల్డ్ రికార్డు.. వన్డేల్లో అత్యంత వేగంగా 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఆసియాకప్-2023లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ను బ్రేక్ చేశాడు. సచిన్ 321 ఇన్నింగ్స్లలో ఈ మైలు రాయిని అందుకోగా.. కోహ్లి కేవలం 267 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లి 3.O.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. 2019-2022 ఏడాది మధ్య గడ్డు పరిస్ధితులను ఎదుర్కొన్నాడు. ఒకనొక దశలో జట్టులో కోహ్లి అవసరమా అన్న స్ధితికి దిగజారిపోయాడు. ఇటువంటి సమయంలో దెబ్బతిన్న సింహంలా కోహ్లి అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. గతేడాది డిసెంబర్లో ఆసియాకప్లో భాగంగా అఫ్గానిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్లో మెరుపు సెంచరీ చేసిన విరాట్.. తన 1000 రోజుల నిరీక్షణకు తెరదించాడు. ఇక అప్పటినుంచి కోహ్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఈ ఏడాదిని సెంచరీతో ఆరంభించిన కోహ్లి పరుగులు వరుద పారించాడు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 27 వన్డేలు, 7 టెస్టు మ్యాచ్లు ఆడిన కోహ్లి.. వరుసగా 1377, 557 పరుగులు చేశాడు. ఓవరాల్ ఈ ఏడాదిలో 8 సెంచరీలు విరాట్ సాధించాడు. కాగా గతేడాది టీ20 వరల్డ్కప్ నుంచి ఇప్పటివరకు భారత తరపున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అదొక్కటే.. ఈ ఏడాదిలో ఇన్ని ఘనతలు సాధించిన కోహ్లికి ఒకటి మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్కప్ ట్రోఫిని ముద్దాడాలన్న కోహ్లి కల మాత్రం నెరవేరలేదు. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా ఆఖరి మొట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తా పడింది. ఓటమి అనంతరం కోహ్లి కన్నీరు పెట్టుకున్నది అభిమానులు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. -
ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే..
కంపెనీ స్థాపించి దాన్ని స్టాక్మార్కెట్లో లిస్ట్ చేయాలంటే 20 ఏళ్ల కింద పెద్ద సాహసంతో కూడిన వ్యవహారం. కానీ పెరుగుతున్న సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధితో మంచి బిజినెస్ మోడల్ ఐడియా ఉంటే ప్రస్తుతం కోటీశ్వరులుగా మారొచ్చు. మంచి కంపెనీని స్థాపించి ఆర్థికంగా ఎదుగుతూ, వారిని నమ్ముకున్న ముదుపర్లను సైతం ఎదిగేలా చేయొచ్చని చాలా మంది నిరూపిస్తున్నారు. అయితే 2023లో అలాంటి మంచి బిజినెస్ మోడల్ ఐడియాతో మార్కెట్లో లిస్ట్అయి ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించిన కొన్ని టాప్ ఐపీఓల గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీవోలు మంచి లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. అందులో అధిక రాబడులను అందించిన టాప్ ఐపీవోల జాబితాలో.. ఐఆర్ఈడీఏ, సియెట్ డీఎల్ఎం, టాటా టెక్నాలజీస్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే మంచి లాభాలను అందించాయి. ఇన్వెస్టర్లకు అధిక లాభాలు మిగిల్చిన ఐపీఓ లిస్ట్లో టాప్లో ఇండియన్ రెన్యూవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(ఐఆర్ఈడీఏ) నిలిచింది. నవంబర్లో ఈ కంపెనీ రూ.32 ఇష్యూ ధరతో ఐపీఓగా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం రూ.109 వద్ద ఈ కంపెనీ షేర్ ట్రేడవుతోంది. పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించిన ఐపీవోగా ఈ ఏడాది సియెంట్ టీఎల్ఎం నిలిచింది. జూలై 10న మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 58 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆ తర్వాత సైతం ఐపీవో తన పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఐపీవో ఇష్యూ ధర రూ.265గా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.778.90గా ఉంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? ఇక మంచి రాబడులను అందించిన జాబితాలో టాటా టెక్నాలజీస్ ఐపీవో మూడో స్థానంలో నిలిచింది. ఐపీవో 140 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ గెయిన్స్తో బీఎస్ఈలో రూ.1199.95 వద్ద మార్కెట్లోని అడుగుపెట్టింది. తరువాతి స్థానంలో సెన్కో గోల్డ్ నిలిచింది. జులైలో ఈ కంపెనీ ఐపీగా లిస్ట్ అయింది. వాస్తవానికి కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.301-రూ.317గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ రూ.725 వద్ద ట్రేడవుతుంది. -
2023లో భారత్లో అడుగుపెట్టిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!
రోజు రోజుకి ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈవీలనే లాంచ్ చేయడానికి సుముఖత చూపుతున్నాయి. 2023లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లోటస్ ఎలెట్రా (Lotus Eletre) ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు 'లోటస్ ఎలెట్రా'. నవంబర్ 2023న అధికారికంగా లాంచ్ అయిన ఈ కారు ధర రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్లు. ఈ కారు కేవలం 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 265కిమీ. సింగిల్ చార్జితో 600 కిమీ ప్రయాణించే ఈ కారు రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5) హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐయోనిక్ 5 దేశీయ మార్కెట్లో 2022లో అడుగు పెట్టినప్పటికీ 2023లో అధికారిక ధరలు వెల్లడయ్యాయి. 2023లో భారతీయ విఫణిలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. దీని ధర రూ. 44.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). సింగిల్ చార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా చాలా కొత్తగా ఉంటుంది. 2023 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్లిఫ్ట్ (2023 Tata Nexon EV Facelift) దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది టాటా నెక్సాన్ ఈవీ ఫేస్లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించే ఈ కారు ప్రారంభం నుంచి ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తోంది. సింగిల్ చార్జితో 325 కిమీ రేంజ్ అందించే ఈ కారు ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు. ఎంజీ కామెట్ (MG Comet) ఇండియన్ మార్కెట్లో సరసమైన ధరకు లభించే ఎంజి ఈవీ కామెట్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయింది. రూ. 7.89 లక్షల వద్ద లభించే ఈ కారు సింగిల్ చార్జితో 230కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు టాటా టియాగో ఈవీ, సిట్రోయిన్ ఈసీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. సిట్రోయిన్ ఈసీ3 (Citroen EC3) 'సిట్రోయెన్ సీ3'తో భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్.. ఈ ఏడాది రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ఈసీ3 విడుదల లాంచ్ చేసింది. సింగిల్ చార్జితో 320కిమనీ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచేలా తయారైంది. -
2023లో మగువలు మెచ్చిన బెస్ట్ స్కూటర్లు.. ఇవే!
Best Scooters For Womens: భారతదేశంలో రోజురోజుకి లెక్కకు మించిన టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో మగవారికి నచ్చినవి, మహిళకు నచ్చినవి రెండూ ఉన్నాయి. ఈ కథనంలో మహిళలకు ఇష్టమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? వివరాలు ఏంటి అనే సమాచారం వివరంగా చూసేద్దాం.. హోండా యాక్టివా జి6 (Honda Activa G6) దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న 'హోండా యాక్టివా జి6' మగువలు మెచ్చిన టాప్ స్కూటర్లలో ఒకటని చెప్పవచ్చు. ఇది కొంత ఖరీదైన స్కూటర్ అయినప్పటికీ.. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి, ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగి అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధరలు రూ. 77,710 నుంచి రూ. 84,207 వరకు (ఎక్స్ షోరూమ్) ఉంది. టీవీఎస్ జుపీటర్ (TVS Jupiter) టీవీఎస్ కంపెనీకి చెందిన జుపీటర్ కూడా ఎక్కువ మంది మహిళకు ఇష్టమైన మోడల్. రూ. 76,738 నుంచి రూ. 91,739 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ స్కూటర్ డిజైన్ పరంగా, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగిన జుపీటర్ 7.88 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) మంచి రైడింగ్ అనుభూతిని అందించే స్కూటర్ల జాబితాలో ఒకటైన సుజుకి యాక్సెస్ 125 రూ. 82,171 రూ. 92,271 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ మంచి అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. 50 నుంచి 62 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్, 10 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా డియో (Honda Dio) అతి తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలు పొందిన హోండా డియో మహిళలకు బాగా నచ్చిన మరో మోడల్. రూ. 74,231 నుంచి రూ. 81,732 మధ్య లభించే ఈ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ కలిగి 7.76 పీఎస్ పవర్, 9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ మంచి రైడింగ్ అనుభూతిని అందించే కారణంగానే కొనుగోలుదారులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! టీవీఎస్ స్కూటీ జెస్ట్ (TVS Scooty Zest) మన జాబితాలో మహిళలకు ఇష్టమైన మరో స్కూటర్ టీవీఎస్ కంపెనీకి చెందిన 'స్కూటీ జెస్ట్'. దీని ధర రూ. 71,636 నుంచి రూ. 73,313 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగి 7.81 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఈ స్కూటర్ సింపుల్ డిజైన్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
ఈ ఏడాది నిర్మాతలుగా డామినేట్ చేసిన మహారాణులు
‘అనుకున్న టైమ్కి షూటింగ్ పూర్తి కావాల్సిందే... ప్లాన్ తప్పకూడదు’ అని హుకుం జారీ చేయాలంటే చేసే పని మీద ప్రేమ, శ్రద్ధ... ఈ రెంటికీ మించి ధైర్యం, ఆత్మవిశ్వాసం లాంటివి కూడా ఉండాలి. ముఖ్యంగా ‘మేల్ డామినేటెడ్’ ఇండస్ట్రీస్లో ఒకటైన సినిమా పరిశ్రమలో ‘ఫీమేల్ప్రొడ్యూసర్’ రాణించాలంటే తెగువ కావాలి. అవసరమైనప్పుడు రాణిలా హుకుం జారీ చేయాలి. సున్నితంగా పనులు చక్కబెట్టడంతో పాటు కఠినంగానూ ఉండాలి. అలా రెండు రకాలుగా ఉంటూ... ‘మేం రాణిస్తాం’ అంటూ ఈ ఏడాది నిర్మాణ రంగంలోకి వచ్చిన కొందరు ఫీమేల్ ప్రొడ్యూసర్ క్వీన్స్ గురించి తెలుసుకుందాం. హీరోయిన్గా యాభైకి పైగా సినిమాలు చేశారు సమంత. అగ్రశ్రేణి నటిగా ప్రేక్షకులు కితాబులిచ్చారు.ఇప్పుడు ‘ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన కథలను ఈ నిర్మాణ సంస్థ వేదికగా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నామని సమంత పేర్కొన్నారు. ► ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రి బాటలో నిర్మాత అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు ఇప్పటికే 50కి పైగా సినిమాలు నిర్మించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాల నిర్మాతగా ఆయనకు పేరుంది. ఇక ‘దిల్’రాజుప్రొడక్షన్స్ స్థాపించి ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ నిర్మించిన హన్షిత తొలిసారి ‘బలగం’ సినిమా నిర్మించి, బ్లాక్బస్టర్ అందుకోవడంతో పాటు అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకునిగా మారారు. ఈ ఏడాది మార్చి 3న విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. అన్నట్లు.. ‘బలగం’కి హర్షిత్ రెడ్డి మరో నిర్మాత. ఇక ఆ మధ్య రెండు చిత్రాలు ఆరంభించిన ఈ నిర్మాతలు మంగళవారం మరో చిత్రాన్ని ఆరంభించారు. ► ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర ‘మ్యాడ్’ చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 6న రిలీజై, హిట్గా నిలిచింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను బాగా నవ్వించింది. తొలి చిత్రంతోనే అభిరుచి ఉన్న నిర్మాత అనిపించుకున్నారు హారిక. ► తండ్రి నిమ్మగడ్డ ప్రసాద్ సక్సెస్ఫుల్ బిజినెస్మేన్. ఇక కూతురికి సినిమాలంటే ఫ్యాషన్. ఆ∙ఇష్టంతో ‘మంగళవారం’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలి విజయం అందుకున్నారు స్వాతీ రెడ్డి. పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా గత నెల 17న విడుదలై హిట్గా నిలిచింది. ► మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక (నాగబాబు కుమార్తె) అటు నటన, ఇటుప్రొడక్షన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ పలు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ నిర్మించిన ఆమె తొలిసారి ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా యాదు వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయమవుతుండటం విశేషం. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ► శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘బన్నీ’ వాసుతో కలిసి విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న విడుదలైన ఈ పొలిటికల్, పోలీస్ బ్యాక్డ్రాప్ మూవీ హిట్గా నిలిచింది. ► నటిగా, గాయనిగా, నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మాతగా మారి, ‘కలశ’ చిత్రాన్ని నిర్మించారు. భానుశ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొండ రాంబాబు దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. చిన్న బడ్జెట్ చిత్రమైనా కాన్సెప్ట్ బాగుందనిపించుకుంది. ► పాయల్ సరాఫ్కి సినిమా నేపథ్యం లేదు. అయితే నిర్మాత కావాలన్నది ఆమె కల. ‘భరతనాట్యం’ చిత్రంతో నిర్మాతగా మారారామె. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సూర్యతేజ ఏలే హీరోగా, మీనాక్షీ గోస్వామి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ‘‘షూటింగ్ లొకేషన్లో అమ్మాయిలు తక్కువగా ఉంటారు. మనం అమ్మాయి అనే విషయాన్ని మరచిపోయి మన పని మనం శ్రద్ధ చేయగలిగితే సక్సెస్ గ్యారంటీ’’ అంటున్నారు పాయల్ సరాఫ్. -
2023.. భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చిన సంవత్సరం
2023.. భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర విషాదం మిగిల్చిన సంవత్సరంగా చిరకాలం గుర్తుండిపోనుంది. భారీ అంచనాల నడుమ స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత జట్టు చివరి వరకు అద్భుతంగా పోరాడి అనూహ్య రీతిలో తుది మెట్టుపై బోల్తా పడి అభిమానులకు తీవ్ర గుండెకోతను మిగిల్చింది. లక్షలాది మంది సమక్షంలో, కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల నడుమ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలై 140 కోట్ల మంది భారతీయుల ఆశలను అడియాశలు చేసింది. ఈసారి కప్ మనదే అని ధీమాగా ఉండిన భారతీయులు ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోధించారు. టోర్నీ గడిచి దాదాపు నెల రోజులు అవుతున్నా అభిమానులు, ఆటగాళ్లు ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ చేదు అనుభూతి మినహాయిస్తే భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాదంతా తీపి జ్ఞాపకాలే ఉన్నాయి. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకోవడం ద్వారా భారత్ 2023కు ఘన స్వాగతం పలికింది. అనంతరం అదే శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఆతర్వాత న్యూజిలాండ్పై టీ20 సిరీస్ (3-0), వన్డే సిరీస్లు (2-1) నెగ్గి, కొత్త ఏడాది తిరుగులేని జట్టుగా ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. దీని తర్వాత స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో (టెస్ట్లు) నెగ్గిన భారత్.. వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయి 2023లో తొలి సిరీస్ పరాజయాన్ని చవిచూసింది. అనంతరం ఏప్రిల్, మే మసాల్లో టీమిండియా ఆటగాళ్లు సహా ప్రపంచ క్రికెట్ మొత్తం ఐపీఎల్తో బిజీగా ఉండింది. జూన్లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్తో టీమిండియా తిరిగి అంతర్జాతీయ వేదికపై ప్రత్యక్షమైంది. ఇంగ్లండ్లోని ఓవల్లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై వరుసగా రెండోసారి టెస్ట్ ఛాంపియన్షిప్ దక్కించుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. దీని తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0తో, వన్డే సిరీస్ను 2-1తో గెలుపొందింది. ఈ పర్యటనలో భారత్ టీ20 సిరీస్ను 2-3 తేడాతో కోల్పోయింది. అనంతరం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో నెగ్గింది. దీని తర్వాత శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్లో పాల్గొన్న టీమిండియా.. ఆ టోర్నీ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఆతర్వాత స్వదేశంలో ఆసీస్తో 3 వన్డేలు ఆడిన భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తర్వాత వన్డే ప్రపంచకప్లో పాల్గొన్న టీమిండియా.. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం అదే ఆసీస్తో స్వదేశంలోనే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడిన భారత్ 4-1 తేడాతో జగజ్జేతను ఓడించింది. దీని తర్వాత భారత్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లింది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ 1-1తో డ్రా కాగా.. వన్డే, టెస్ట్ సిరీస్లు జరగాల్సి ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ ఏడాదంతా భారత క్రికెట్ జట్టుకు సానుకూల ఫలితాలే వచ్చాయని చెప్పాలి. -
ఈ ఏడాది గూగుల్ టాప్ సెర్చ్లో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు
ఈ ఏడాది (2023) భారత దేశంలో అత్యధిక మంది గూగుల్ చేసిన వ్యక్తుల వివరాలను గూగల్ సంస్థ ఇవాళ వెల్లడించింది. ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి కియారా అడ్వానీ టాప్లో ఉండగా.. టీమిండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితా టాప్-10లో ఏకంగా ఆరుగురు క్రికెటర్లు ఉండగా.. టీమిండియాకు చెందిన వారు ముగ్గురు ఉండటం విశేషం. గిల్ రెండులో, మొహమ్మద్ షమీ నాలుగో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ తొమ్మిదో ప్లేస్లో ఉండగా.. న్యూజిలాండ్ నయా సెన్సేషన్ రచిన్ రవీంద్ర మూడో స్థానంలో, ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఏడులో, వరల్డ్కప్ ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ పదో స్థానంలో ఉన్నారు. కియారా అడ్వానీ భర్త సిద్దార్థ్ మల్హోత్రా ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉండగా.. ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఐదులో, మాజీ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హామ్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇండియాలో ఈ ఏడాది అత్యధికంగా గూగుల్ చేయబడిన చిత్రాల విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (మొదటి స్థానం), పఠాన్ (ఐదో ప్లేస్) సినిమాలు టాప్-5లో నిలిచాయి. ఈ ఏడాది భారత్లో అత్యధికంగా గూగుల్ చేయబడిన సినిమాలు.. జవాన్ గదర్ 2 ఓపెన్హైమర్ ఆదిపురుష్ పఠాన్ ద కేరళ స్టోరీ జైలర్ లియో టైగర్ 3 వారీసు -
2023 రౌండప్: ఈ ఏడాది ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాలు ఇవే!
మనకు ఏ డౌట్ వచ్చినా గూగుల్ మీదే ఆధారపడతాం.. సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలన్నా గూగులమ్మనే ఆశ్రయిస్తాం. దాదాపు అన్ని ప్రశ్నలకు వీలైనన్ని ఎక్కువ సమాధానాలిచ్చుకుంటూ పోతూనే ఉంటుందీ సెర్చ్ ఇంజన్. అలా గూగుల్లో ఈ ఏడాది చాలామంది కొన్ని సినిమాల గురించి తెగ వెతికేశారట. 2023లో ఇండియాలో ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్ 10 చిత్రాలివే అంటూ గూగుల్ తాజాగా ఓ జాబితాను రిలీజ్ చేసింది. ఆ సినిమాలేంటి? అందులో సౌత్నుంచి ఎన్ని ఉన్నాయి? ర్యాంకులవారీగా ఓ లుక్కేయండి.. ఈ ఏడాదికిగానూ ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్ 10 చిత్రాలు ► 1. జవాన్ ► 2. గదర్ 2 ► 3. ఓపెన్హైమర్ ► 4. ఆదిపురుష్ ► 5. పఠాన్ ► 6. ది కేరళ స్టోరీ ► 7. జైలర్ ► 8. లియో ► 9. వారిసు/ వారసుడు ► 10. టైగర్ 3 ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ 10 షోలు, వెబ్ సిరీస్లు.. ► 1.ఫర్జి ► 2. వెడ్నస్డే ► 3. అసుర్ ► 4. రానా నాయుడు ► 5. ద లాస్ట్ ఆఫ్ అస్ ► 6. స్కామ్ 2003 ► 7. బిగ్బాస్ 17 ► 8. గన్స్ అండ్ గులాబ్స్ ► 9. సెక్స్/ లైఫ్ ► 10. తాజా ఖబర్ చదవండి: Vyooham: ఓటీటీలో వ్యూహం.. అప్పటినుంచే స్ట్రీమింగ్! -
ఈ ఏడాదిలో తొలి సినిమాతోనే హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్లు
ఈ ఏడాది సినిమా డైరీ చివరి పేజీలకు చేరుకుంది. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా కొత్త దర్శకులు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. ఈ ఏడాదలో ఎక్కువగా చిన్న చిత్రాలే మెప్పించాయి. ఏడాది తెరపై తొలి సినిమాతోనే విజయం సాధించిన డైరెక్టర్లు ఉన్నారు. నేడు ఓటీటీలు యుగం నడుస్తోంది. దీంతో తెలుగు సినిమాలతో పాటు పర భాష చిత్రాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. అలా సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో 2023లో పరిచయం అయిన కొత్త కెప్టెన్లు ఎవరో తెలుసుకుందాం పదండి. మారుతున్న సినీప్రియుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కథలతో వినోదాలు వడ్డించడంలో కొత్త దర్శకులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే కొత్త ప్రతిభ తెరపై మెరుస్తుందంటే చాలు.. సినీప్రియులంతా వారి వైపు ఓ కన్నేస్తుంటారు. అలా ఈ ఏడాది మొదటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు ఎవరో తెలుసుకోండి. దసరా- శ్రీకాంత్ ఓదెల నేచురల్ స్టార్ నాని- కీర్తి సురేష్ జోడిగా నటించిన చిత్రం దసరా... శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2023 మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథతో రూపొందిన ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాని కెరీర్లోని హిట్ సినిమాల లిస్ట్లో చేరింది. నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు డైరెక్టర్ సుకుమార్ టీమ్లో శ్రీకాంత్ ఓదెల పనిచేశాడు. అదే సమయంలో దసరా కథను రెడీ చేసిన శ్రీకాంత్.. నిర్మాత సుధాకర్ చెరుకూరికి వినిపించడం ఆపై అది కాస్త నానికి నచ్చడం చకచక పనులు జరిగిపోయాయి. అలా మొదటి చిత్రంతోనే పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేశాడు శ్రీకాంత్. దసరా చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. హాయ్ నాన్న- శౌర్యువ్ నాని సినిమాలతో కొత్త దర్శకులు వెలుగులోకి వస్తుంటారు. ఇదే ఏడాది రెండోసారి కూడా కొత్త డైరెక్టర్ శౌర్యువ్కు నాని అవకాశాన్ని కల్పించాడు. అలా భారీ అంచనాలతో నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్గా నటించగా శ్రుతి హాసన్ , బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం హౌస్ఫుల్ కలెక్షన్స్తో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కు చెందిన శౌర్యువ్.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. రాజమౌళి సినిమాలు చూస్తూనే డైరెక్షన్ విభాగంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. హాయ్ నాన్న కథ విషయానికొస్తే.. సాధారణంగా పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకుంటారు. కానీ, సింగిల్ పెరెంట్ అయితే పూర్తి బాధ్యత ఒకరే చూసుకోవాలి. ఇందులో నాని పాత్ర అలానే ఉంటుంది. ఎక్కడ ఉన్నా సమయానికి కూతురు దగ్గర ఉంటాడు. కథ అంతా ఇలానే సాగుతుంది. శౌర్యువ్ వద్ద ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయని. త్వరలో వాటి గురించి చెబుతానని ఆయన ప్రకటించాడు. రోమాంచమ్- జీతూ మాధవన్ (మలయాళం,తెలుగు) కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా మలయాళంలో వస్తుంటాయి. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా మలయాళం, తమిళ చిత్రాలను ఆదరిస్తున్నారు. ఓటీటీల పుణ్యామాని భాషతో సంబంధం లేకుండా మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే రోమాంచమ్ సినిమా కూడా హిట్ కొట్టింది. ఈ చిత్రం ద్వారానే జీతూ మాధవన్ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆయన పేరు దేశ వ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఫిబ్రవరి 3న మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. కామెడీ, హారర్.. రెండూ పూర్తి భిన్నమైన నేపథ్యాలతో మంచి వినోదాన్ని పండించాడు డైరెక్టర్ జీతూ.. ఓయిజా బోర్డుతో ఆట ఆడడం వల్ల 2007లో బెంగళూరులోని ఓ ఇంట్లో ఉన్న ఏడుగురు స్నేహితులు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారనేదే ఈ సినిమా సారాంశం. ప్రస్తుతం డిస్నీ+ హాట్స్టార్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. దాదా- గణేష్ కె. బాబు (తమిళ్) కోలీవుడ్లో కెవిన్ హీరోగా నటించిన తమిళ మూవీ దాదా.. ఈ సినిమా బిగ్ హిట్గా నిలిచింది. దాదాపు మూడు కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 22 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే ఏడాదిలో ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గణేష్ కె. బాబు డైరెక్టర్గా దాదా చిత్రం ద్వారానే పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుని ఆపై వారిద్దరి మధ్య జరిగిన సంఘర్షణలో వారికి జన్మించిన బిడ్డ తండ్రి వద్దే ఉండిపోతాడు. సుమారు కొన్నేళ్ల తర్వాత ఆ బిడ్డ తల్లి వద్దకు ఎలా చేరిందనేది ఈ చిత్రం. తండ్రి గొప్పతనంతో రూపొందిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా దీనికి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాను డైరెక్టర్ గణేష్ కే బాబు చాలా చక్కగా తెరకెక్కించాడు. చిన్న సినిమా అయినా దాదా కథ నచ్చి తమిళంలో ఉధయనిధి స్టాలిన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అపర్ణ దాస్ హీరోయిన్గా నటించింది. అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్కు పా..పా అనే టైటిల్ను ఖరారు చేశారు మేకర్స్. త్వరలో విడుదల కానుంది. బాయ్స్ హాస్టల్- నితిన్ కృష్ణమూర్తి (కన్నడ,తెలుగు) కన్నడలో ఘనవిజయం సాధించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంస్థలు విడుదల చేశాయి. నితిన్ కృష్ణమూర్తి దర్శకుడిగా ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రలు పోషించగా.. రిషబ్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్భాస్కర్ అతిధి పాత్రల్లో నటించారు. ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా సరదాగా, అల్లరిచిల్లరగా గడిపే ఓ బాయ్స్ హాస్టల్లోని కుర్రాళ్లకు ఆ హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ చావును కుర్రాళ్లు యాక్సిడెంట్గా మార్చే క్రమంలో ఎదురైన సంఘటనలు ఎంతో సరదాగా ఉంటాయి.