Grain purchases
-
వడ్లు కొనమంటే నోట్ల లోడ్ ఎత్తుతున్నారు
మర్రిగూడ: రాష్ట్రంలో రైతుల వడ్ల లోడ్ ఎత్తమంటే సీఎం రేవంత్రెడ్డి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. గత సంవత్సరం నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈ సంవత్సరం కృష్ణా నదిలో పుష్కలంగా నీరు రావడం వల్ల 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్నారు. కానీ, సీఎం రేవంత్రెడ్డి నిర్లక్ష్యం వల్ల నల్లగొండలో కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. హరీశ్రావు బుధవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, రైతులకు అవసరమైనన్ని గన్నీ బ్యాగులను అందించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్రావు అన్నారు. ప్రభుత్వం రైతులను పట్టించు కోకపోవడంతో రైతులు రూ.1,800కే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటివర కు నల్లగొండ జిల్లాలో ఒక కిలో సన్న వడ్లనూ కొన్న పాపాన పోలేదన్నారు. వడ్లు కొనకపోతే అధికారులను ఎందుకు కొనట్లేదని అడగడం లేదు కాని మ ద్యం తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మా త్రం మెమోలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదన్నారు. పక్క రాష్ట్రం నుంచి దళారులు వచ్చి తెలంగాణ రైతుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని కొంటున్నారని చెప్పారు. రేవంత్రెడ్డి రాజ్యంలో రైతులు రోదిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులను సమీకరించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కాగా, గతంలో ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకల్లో రూ.48 లక్షలు అవినీతి చోటుచేసుకోగా.. కొనుగోలు డబ్బులు నేటికీ రైతుల ఖాతాలో జమ కాలేదని రైతు మోదుగు రాజేందర్.. హరీశ్రావుకు చెబుతుండగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సర్కారుపై బీజేపీ సమరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు బీజేపీ వేగంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే ఈ నెల 9, 11, 13 తేదీల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు మద్దతు ప్రకటించిన ఆ పార్టీ నేతలు, 16, 17 తేదీల్లో మూసీ ప్రాజెక్టు బాధితుల సమస్యలు తెలుసుకొనేందుకు ‘మూసీ నిద్ర’కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. దానికి కొనసాగింపుగా మరో భారీ కార్యాచరణను సిద్ధం చేశారు.రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, గత ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు వారంపాటు ఈ పాదయాత్రలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ నాయకత్వం వహించనుండగా, బీజేపీలోని కింది స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నేత వరకు అందరూ తప్పనిసరిగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా: 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ఇప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు వరుస కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపైనే పోరాట కార్యాచరణ చేపడుతున్నది.పాదయాత్రలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనే బీజేపీ నేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, గ్రామాలకు చేరుకునే వీలును బట్టి ఐదు నుంచి ఏడురోజుల పాటు పాదయాత్రలు నిర్వహించనున్నారు. రోజుకు 15 నుంచి 17 కి.మీ. యాత్ర నియోజకవర్గాల్లో రోజుకు 15 నుంచి 17 కి.మీ. దూరం పాదయాత్ర కొనసాగేలా రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో రోజుకు అంతకంటే ఎక్కువ దూరం యాత్ర చేసే వీలుండటంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కొందరు నాయకులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేసి పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారు. ప్రతిరోజు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా యాత్ర నిర్వహించాలి? నైట్ హాల్ట్ ఎక్కడ ఉండాలి? అనే అంశాలన్నింటినీ ఈ బృందాలు చూసుకొంటాయి. వచ్చే నాలుగేళ్లపాటు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, ప్రజాసమస్యలపై పోరాడేందుకు పార్టీ పరంగా వివిధ రూపాల్లో చేపట్టబోయే నిరసనలు, ఆందోళ నలకు ఈ పాదయాత్ర పూర్వరంగంగా ఉపయోగ పడుతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభు త్వం మొగ్గుచూపినా, చూపకపోయినా... గ్రామ, మండల స్థాయిల్లో బీజేపీ బలపడేందుకు ఈ పాదయాత్రలు దోహదపడతాయని భావిస్తున్నారు.25 ప్రాంతాల్లో మూసీ నిద్ర ఈ నెల 16 నుంచి 17వ తేదీ ఉదయం వరకు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని 25 ప్రాంతాల్లో మూసీ నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాష్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలతో కలిసి భోజనం చేసి బస చేస్తామని వెల్లడించారు. ప్రక్షాళన పేరుతో ఇళ్లను కూలి్చతే ఊరుకోబోమని హెచ్చరించారు. బుల్డోజర్లను తమపై నుంచి ఎక్కించిన తర్వాతే ప్రజల ఇళ్లను ముట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు. -
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పోరాటానికి సిద్ధమయ్యారు. శనివారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండల కేంద్రంతో పాటు రేవన్నపల్లి గ్రామంలో కిషన్రెడ్డి, పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, బూర నర్సయ్యగౌడ్, గూడూరు నారాయణరెడ్డి తదితరులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారు.నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో డా. లక్ష్మణ్ , బంగారు శ్రుతి, సంకినేని వెంకటేశ్వరరావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేఎల్పీనేత మహేశ్వర్రెడి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్బాబు పర్యటించనున్నారు. 11వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్, బోడిగె శోభ, జి.మనోహర్రెడ్డి, రాణీ రుద్రమ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డీకే అరుణ, మాజీఎంపీ పి.రాములు, చింతల రామచంద్రారెడ్డి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఎం.ధర్మారావు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపీ రఘునందన్రావు, మాజీ ఎంపీ బీబీపాటిల్, జె.సంగప్ప, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాటిపట్టి వెంకటరమణారెడ్డి, కొండపల్లి శ్రీధర్రెడ్డి దాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శిస్తారు. 13న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రాకేష్రెడ్డి, సూర్యనారాయణగుప్తా, డి.ప్రదీప్కుమార్ ఇతర నేతలు పాల్గొంటారు. -
ఐదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. గత నెల మూడోవారం నుంచే నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో కూడా కోతలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో పౌరసరఫరాల సంస్థ బిజీగా ఉంది. మార్చి 25వ తేదీ నుంచే అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ సీజన్లో మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రారంభించిన 443 కొనుగోలు కేంద్రాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఒకటి రెండు రోజుల తర్వాత కోతలు పెరిగి ..ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్ వంటి సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడేనా..? కొన్నేళ్లుగా ధాన్యం సేకరణ ప్రక్రియలో మిల్లర్ల జోక్యం పెరిగింది. కొనుగోలు కేంద్రాలలోనే తరుగు పేరుతో క్వింటాల్కు 5 కిలోలకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి అదనంగా తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. తీరా ధాన్యం మిల్లులకు పంపిన తర్వాత కూడా రంగు మారిందని, తాలు, తేమ అధికంగా ఉందని కారణాలు చెబుతూ మిల్లర్లు నేరుగా రైతులకు ఫోన్లు చేయించి వేధించి తరుగు తీయడం పరిపాటిగా మారింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం తప్ప, కొర్రీలు పెడితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మిల్లులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో కూడా తరుగు, హమాలీ పేరుతో కిలోల కొద్దీ ధాన్యం రైతుల నుంచి దోచుకునే విధానానికి స్వస్తి పలకాలని రైతులు కోరుతున్నారు. అందుబాటులో 14 కోట్ల గన్నీ సంచులు రాష్ట్రంలో ఈసారి కొనుగోలు కేంద్రాలకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినా, ఈసారి దిగుబడి, ధాన్యం విక్రయాల తీరును బట్టి చూస్తే 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులలోపే ధాన్యం సేకరణ జరిగే అవకాశముందని పౌరసరఫరా వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈసారి వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని ప్రభుత్వం భావించింది. అందులో ఇప్పటికే 14 కోట్ల గన్నీ సంచులను పౌరసరఫరాల శాఖ అందుబాటులో ఉంచింది. ఈ గన్నీ బ్యాగులు 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు ఇవి సరిపోతాయి. మిగతా గన్నీ బ్యాగులను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా, వాటి అవసరం ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు. -
ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే!
ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ మిల్లు నుంచి గత సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో ప్రభుత్వం ఇచ్చిన 10 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను రికవరీ చేసుకునేందుకు ధాన్యం కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. తీరా అక్కడికి వెళితే మిల్లులో ధాన్యం నిల్వలు లేవు. మిల్లులో ఉన్న ధాన్యం చెడిపోతుందని అమ్మివేసినట్లు మిల్లర్ ఒప్పుకున్నాడు. దీంతో క్వింటాల్కు రూ. 2,259 లెక్కన 10 మెట్రిక్ టన్నులకు రూ. 2,25,900 చెల్లించాలని లెక్క చెప్పి వెళ్లారు. సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా సాఫీగా సాగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు మిల్లర్లకు దడపుట్టిస్తోంది. గత సంవత్సరం యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయలేమని రాష్ట్రంలోని మిల్లర్లంతా చేతులెత్తేయడంతో ఆగిపోయిన సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా మిల్లుల్లోనే నిల్వ చేసిన ధాన్యం నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం వేలం వేసి, బిడ్డింగ్లో పాల్గొన్న సంస్థలకు ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులను అప్పగించింది. గన్నీ బ్యాగులతో కలిపి క్వింటాలుకు సగటున రూ. 2,007 లెక్కన ధాన్యం కాంట్రాక్టు పొందిన సంస్థలు తమకు కేటాయించిన జిల్లాల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టాయి. తీరా ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని మిల్లులకు వెళితే అక్కడ ధాన్యం కనిపించడం లేదు. దీంతో మిల్లర్ల నుంచి క్వింటాలు ధాన్యానికి బదులుగా రూ. 2,259 లెక్కన డబ్బులు వసూలు చేయాలని కాంట్రాక్టు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించడంతో మిల్లర్లు బెంబే లెత్తుతున్నారు. వేలంలో 6 సంస్థలకు ధాన్యం అప్పగింత 2022–23 సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 20 ఎల్ఎంటీ ధాన్యాన్ని ఎఫ్సీఐ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ కింద బాయిల్డ్ బియ్యంగా మిల్లింగ్ చేసి అప్పగించారు. మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, మిల్లింగ్ చేయలేదు. దీంతో నిల్వ ఉన్న ధాన్యాన్ని గత ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12 లాట్ల కింద వేలం వేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో కేవలం ఏడు సంస్థలే బిడ్డింగ్లో పాల్గొన్నాయి. అందులో ఓ సంస్థ తిరస్కరణకు గురికాగా మిగతా ఆరు సంస్థలు ఈ బిడ్లను దక్కించుకున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ భండార్, నాకాఫ్ కూడా ఉన్నాయి. వేలంలో క్వింటాలు ధాన్యానికి సగటున రూ. 2,007 లెక్కన (గన్నీ బ్యాగులతో కలిపి) ప్రభుత్వానికి చెల్లించేలా బిడ్లు ఆమోదం పొందాయి. ఈ బిడ్డింగ్ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలపడంతో సదరు సంస్థలు ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు.. గత యాసంగి సీజన్లో సీఎంఆర్ చేయ కుండా నిల్వ చేసినట్లు మిల్లర్లు చెప్పినప్పటికీ, ఏ మిల్లర్ దగ్గరా సరిపడా ధాన్యం నిల్వలు లేవు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో సమావేశం సందర్భంగా మిల్లర్లే ఒప్పుకున్నారు. తడిసి న, నిల్వ ఉంచిన ధాన్యం పాడైపోతుందనే కార ణంగా చాలా వరకు విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మీడియాకు కూడా చెప్పారు. అయి తే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని రికవరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు క్వింటాలుకు బిడ్డింగ్లో రూ.1,852 నుంచి 2,260 వరకు ధర పలికింది. సగటున క్వింటాలుకు రూ.1879 కాగా, రూ.125 గన్నీ బ్యాగుల కింద .. మొత్తంగా క్వింటాలుకు రూ. 2,007 చొప్పున లెక్క చూపారు. ఆయా సంస్థలు ఎంతకు ధాన్యం కొనుగోలు టెండర్లు దక్కించుకున్నా య నే విషయాన్ని పక్కనబెట్టి క్వింటాలు ధాన్యం ఇవ్వకపోతే, దాని బదులు రూ. 2,259 చెల్లించాలని అల్టిమేటం ఇస్తున్నట్లు పలువురు మిల్లర్లు తెలిపారు. సన్న ధాన్యం టెండరును క్వింటాలుకు రూ. 2,260కి దక్కించుకున్న హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ నిజామాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంది. మిల్లర్లు సన్న ధాన్యం ఇవ్వని పక్షంలో క్వింటాలుకు రూ.2,500కు పైగా వసూలు చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 50 నుంచి 100 మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీకి కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ పొందినట్లు చెపుతున్నారు. -
వడ్ల పైసలస్తలేవు..!
సాక్షి, కామారెడ్డి: ధాన్యం కాంటా వేసిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆచరణలో అమలు కావడంలేదు. ధాన్యం కొనుగోళ్లు నేటితో ముగియనున్నాయి. అయితే నెల క్రితం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. సకాలంలో ధాన్యం డబ్బులు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా లో యాసంగిలో సోమవారం నాటికి 3,52, 418.600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ. 725.98 కోట్లు. కాగా ఇప్పటి వరకు రైతులకు రూ. 401.14 కోట్లు చెల్లించారు. అంటే ఇంకా రైతులకు రావాల్సిన బకాయిలు రూ. 325 కోట్లు ఉన్నాయి. వడ్ల పైసలు వస్తే డబ్బులు ఇవ్వాల్సిన వారికి ఇచ్చేయా లని రైతులు ఎదురుచూస్తున్నారు. వరి కోతలు, పంట నూర్పిడి, రవాణా, లేబర్ ఖర్చులకు తెచ్చిన అప్పులు, అప్పటికే పంట సాగు కోసం చేసిన అప్పులు రైతులకు భారంగా మారాయి. డబ్బుల గురించి అధికారులను ఎప్పుడు అడిగినా రెండు, మూడు రోజుల్లో జమ అవుతాయనే సమాధానం చెబుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైసలు రాక ఇబ్బందులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తెగుళ్లతో దెబ్బతినడం, వడగళ్ల వానలతో వడ్లు రాలిపోవడం, కోతలకు చైన్ మిషన్లకు అడ్డగోలుగా వెచ్చించాల్సిన పరిస్థితి ఆపై దిగుబడులు తగ్గిపోవడం, కేంద్రాల వద్ద ధాన్యం నానిపోయి రోజుల తరబడి జాగారం చేయాల్సిన పరిస్థితుల్లో రైతులు అనేక అవస్థలు పడ్డారు. ఎలాగోలా ధాన్యం కాంటా అయి మిల్లులకు చేరి రోజులు గడుస్తున్నా డబ్బులు రాకపోవడం రైతులకు సమస్యగా మారింది. దాదా పు అందరు రైతులు పంట సాగుకోసం అప్పలు చేసి పెట్టుబడులు పెట్టిన వారే. పంట చేతికి వచ్చిన తర్వాత అప్పులు చెల్లించడం, మళ్లీ పంట సాగుకోసం అప్పులు చేస్తుంటారు. ఈ సారి వడ్ల పైసలు రాకపోవడంతో అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్లు అమ్మినా అప్పు కట్టడం లేదంటూ చాలామంది రైతులను వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు రాలేదని సర్ది చెప్పలేక అవస్థలు పడుతున్నారు. వెంటనే వడ్ల డబ్బులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. వానాకాలం సాగుకు కష్టాలు యాసంగిలో సాగు చేసిన వరి దెబ్బతిని దిగుబడులు పడిపోయి పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితుల్లో రైతులు వానాకాలం సాగుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో వరికి తెగుళ్లు, వడగళ్ల వానలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. చాలా మంది రైతులకు దిగుబడి పడిపోయి పెట్టుబడులు కూడా చేతికి అందే పరిస్థితి లేదు. వానాకాలం సీజన్ దగ్గర పడుతోంది. ముందస్తుగా పంటలు సాగు చేయాలని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. విత్తనాలు కొనుగోలు చేయడం, దున్నకాలకు పెట్బుడులు ఎక్కడి నుంచి తేవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరాకు ఇచ్చే రూ. 5వేలు కూడా ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో రైతులకు వానాకాలం సాగు ఇబ్బందికరంగా మారింది. నెల రోజులైనా పైసలు రాలేదు మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేసిన. నెల రోజుల క్రితమే వరి కోసి వడ్లను కేంద్రానికి తీసుకువెళ్లాను. 150 బస్తాలు అయ్యాయి. అమ్మి నెల రోజులైనా డబ్బులు రాలే దు. పంట సాగు కోసం, కోతకు అప్పులు చేసిన. డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మళ్లీ వానాకాలం పంట వేయడానికి సమ యం దగ్గర పడుతోంది. ఎప్పుడు వస్తయో ఏమో తెలుస్తలేదు. – కిష్టారెడ్డి, రైతు, డబ్బులు జమ కాలేదు నేను 36 రోజుల కిందట కొనుగోలు కేంద్రంలో 83 బస్తాల వడ్లు అమ్మినా. ఇప్పటికీ నయాపైసా రాలేదు. డబ్బులకు ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు వస్తయో చెప్తలేరు. లాగోడీకి తెచ్చిన డబ్బులు సర్దుబాటు చేయాల్సి ఉంది. వానాకాలం సీజన్ కూడా ముంచుకు వచ్చింది. తొందరగా డబ్బులు ఇవ్వాలి. -
పూర్తి కాని కొనుగోళ్లు..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం తలపెట్టిన ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడం రైతులను కలవరపెడుతోంది. చాలా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా అమ్ముడుకాకపోవ డంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఓవైపు రుతుపవనాలు సమీపిస్తుండటం, రబీ సీజన్ మొదలవుతుండటం.. ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా అమ్ముడుపోకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు.. మిల్లర్లు కుమ్మక్కై చాలాచోట్ల క్వింటాలుకు 9 నుంచి 11 కిలోల వరకు కోత పెడుతున్నారు. అయినా సరే రైతులు కోతలకు సమ్మతించినా.. మిల్లర్లు చాలా చోట్ల కొర్రీలు పెడుతుండటం, ధాన్యాన్ని మిల్లుల్లో దింపకుండా అలాగే ఉంచడంతో లారీలు కొనుగోలు కేంద్రాలకు సరిగా వెళ్లడం లేదు. దీంతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. మరో 4.55 లక్షల మెట్రిక్ టన్నుల దూరంలో.. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 62.16 లక్షల మెట్రిక్ టన్నుల (ఎంటీలు) ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 7,192 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జూన్ 6 నాటికి అందులో 3,181 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. కానీ, మధ్యలో మిల్లర్ల కొర్రీలు, అకాల వర్షాలు, లారీల కొరత తదితర కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు 57.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, మరో 4.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ధాన్యం విలువ రూ.11,843 కోట్లుగా ఉంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేనా? ఏరువాక ఉత్సవాలతో రబీ సీజన్ మొదలైంది. ఈసారి రబీని నవంబరు నాటికి పూర్తి చేసి, యాసంగి పంట కోతలను మార్చి నాటికి ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి వేసవిలో అకాల వర్షాలు రైతులకు గత వందేళ్లలో ఏనాడూ చూడని నష్టాన్ని కలగజేశాయి. దీనికితోడు వేసవిలో కోతలు ఏప్రిల్ వరకు సాగితే, వరి నుంచి మర ఆడిస్తే నూక అధికంగా వస్తుంది. ఈ సమస్యలను అధిగమించి మార్చి నాటికి కోతలను ముగిస్తే.. రైతుకు ప్రకృతి విపత్తులు, నూకల బెడద తప్పుతుందన్నది ప్రభుత్వ వ్యూహం. కానీ, కొనుగోళ్ల ప్రక్రియ జాప్యమవడంతో రబీ, యాసంగి సీజన్ల పంట ఆలస్యమయ్యే ప్రమాదముందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల్లో పూర్తి మరో మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం. ఎక్కడా రైతులకు ఇబ్బంది రానీయం. 95% ధాన్యం కొనుగోలు చేశాం. త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమవుతాయి. –మంత్రి గంగుల కమలాకర్ కొనుగోళ్ల వేగం పెంచాం రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంగళవారం ఒక్కరోజే 1,31,703 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. అకాల వర్షాలు, సాంకేతిక సమస్యల కారణంగా కొంచెం జాప్యమైన మాట వాస్తవమే. రెండు మూడు రోజుల్లో మిగిలిన 4.55 లక్షల మెట్రిక్ టన్నులు సైతం కొనేస్తాం. –సర్దార్ రవీందర్ సింగ్, పౌరసరఫరాల శాఖ, చైర్మన్ -
అన్నదాతల్లో ‘ధర’హాసం
గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి వరదా ఎస్వీ కృష్ణకిరణ్ : రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్లు వెల్లువలా కొనసా గుతున్నాయి. అకాల వర్షాల సమయంలో కోసిన ధాన్యాన్ని.. కోసినట్టుగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. తడిసిన, నూక ధాన్యాన్ని సైతం (బ్రోకెన్ రైస్) ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టాల ఊబి నుంచి రైతులను గట్టెక్కించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. తొలిసారిగా జయ రకం (బొండా లు) ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో ప్రైవేట్ మార్కెట్లో ఆ పంటకు మంచి ధర పలుకుతోంది. బుధవారం సాయంత్రానికి రూ. 2,541.51 కోట్ల విలువైన 12.45 లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా ప్రభుత్వం కొనుగోలు చే సింది. ఇందులో ధాన్యం విక్రయించిన 1.38 లక్షల మంది రైతులకు గాను 96 వేల మందికి రూ.1,673 కోట్లకు పైగా చెల్లింపులు పూర్తి చేసింది. బాయిల్డ్ మిల్లులకు తరలింపు వరి కోతలు ప్రారంభమైన దశలో అకాల వర్షాలు కు రవడం.. ఆ తరువాత అధిక ఉష్ణోగ్రతలతో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య తలెత్తింది. దీనిని సా కుగా చూపించి రైతులను మిల్లర్లు మోసం చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంబేడ్కర్ కోనసీ మ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున.. ఏలూరు, కాకినా డ, తూర్పు గోదావరి జిల్లా ల్లో బ్రోకెన్స్ అధికంగా వ స్తు న్న ప్రాంతాల్లో మొబైల్ మి ల్లులను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. రైతులు ముందుగా నే శాంపిళ్లను మొబైల్ మి ల్లు ల్లో మరాడించి.. అక్కడ ఇచ్చే రశీదు ఆధారంగా ధా న్యాన్ని విక్రయించుకునే సౌకర్యాన్ని కల్పించింది. ముక్క విరుగు డు ధాన్యాన్ని బాయిల్డ్ రకంగా పరిగణించి కొనుగోలు చేస్తూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. జయ రకం (బొండాలు) ధాన్యానికి కూడా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుండటంతో మార్కెట్లో పోటీ పెరిగింది. ప్రైవేట్ వ్యాపారులు మంచి ధరకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. జయ రకం ఎక్కువగా పండించిన ప్రాంతంలో కళ్లాల్లోకి వచ్చి మరీ బస్తా (75 కేజీలు) రూ.1,500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ రకాన్ని తక్కువ పండించిన ప్రాంతాల్లో అయితే.. బస్తాకు రూ. 1,600–రూ.1,700 కూడా చెల్లిస్తున్నారు. రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు వేగంగా మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ఉమ్మడి గోదావరి పరిధిలోని 5 జిల్లాలకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ను ముందుగానే విడుదల చేసింది. ఫలితంగా ఆయా జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితు లకు అనుగుణంగా వాహనాలు, కూలీలను ఏ ర్పాటు చేస్తూ రైతులకు భారాన్ని తగ్గిస్తున్నారు. ఒకవేళ రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే ఆ మొత్తాన్ని కూడా మద్దతు ధరతో కలిపి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. వాస్తవ పరిస్థితి ఇదీ.. ♦ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 90 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో ఇంకా కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం శివరామ్ చెప్పారు. ♦ తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల టన్నుల దిగుబడిలో సగానికి పైగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. బొండాలు రకం సాగు చేసిన రైతులు బయట మార్కెట్లోనే ఎక్కువగా విక్రయిస్తున్నారని పౌర సరఫరాల సంస్థ జిల్లా అధికారి కుమార్ తెలిపారు. ♦ కాకినాడ జిల్లాలో 10 శాతం విస్తీర్ణంలో కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం పుష్పమణి చెప్పారు. ♦ ఏలూరు జిల్లాలో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య అధికంగా ఉంది. ఆ ధాన్యాన్ని కృష్ణా జిల్లాలోని బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం భార్గవి చెప్పారు. చింతలపూడి, లింగపాలెం, చాట్రాయి, పోలవరం ప్రాంతాల్లో కోతలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ♦ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోతలు ఆలస్యం కావడంతో ధాన్యం ఇంకా పొలాలు, కళ్లాల్లోనే ఉంది. ఇక్కడ పంటను వేగంగా కొనుగోలు చేసేందుకు వీలుగా దగ్గర మిల్లులకే ధాన్యం తరలించేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం సాగర్ తెలిపారు. మొత్తంగా అన్నిచోట్లా జూన్ రెండో వారంలోగా కొనుగోళ్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు వర్షాల్లోనూ కొన్నారు ఇటీవల కురిసిన వర్షాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తీరు రైతుల్లో భరోసా నింపింది. అంత యుద్ధప్రాతిపదికన ఎక్కడి ధాన్యాన్ని అక్కడే ఆఫ్లైన్లో కొనేసి వెంటనే మిల్లులకు తరలించారు. నేను కూడా ఆ సమయంలో కొంత, వారం కిందట 582 బస్తాల (ఒక్కో బస్తా 40 కేజీలు) ధాన్యాన్ని విక్రయించాను. డబ్బులు కూడా చాలా వేగంగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. – సూర్య నారాయణరాజు, లొల్ల, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎంతైనా కొంటాం అకాల వర్షాల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేశాం. ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఇంకా కోతలు చేయాల్సి ఉంది. రైతులు తెచి్చన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ రైతులు నష్టపోకుండా చర్యలు ధాన్యం సేకరణ పూర్తయ్యే వరకు ఈ ఫీడ్బ్యాక్ కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా వ్యవస్థలో జవాబుదారీ పెంచడం, రైతులు నష్టపోకుండా కాపాడటమే ప్రధాన ఉద్దేశం. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ను ఆయా జిల్లాలకు పంపిస్తున్నాం. రైతులను ఇబ్బంది పెట్టినా, డబ్బులు వసూలు చేసినా మిల్లులను కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తున్నాం. జేసీలకు చెప్పి ఆ మొత్తాన్ని రైతులకు వెనక్కి ఇప్పిస్తున్నాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
అప్పట్లో ‘కొనుగోళ్లు’ కతలెన్నో! ధాన్యం కొనుగోళ్లు అంతా రికార్డుల్లోనే..
సాక్షి అమలాపురం: తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లను గాలికొదిలేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నీతులు వల్లిస్తుండడంపై అన్నదాతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అప్పట్లో రైతులకు కావల్సిన కనీస అవసరాలేవీ అమలులో లేవు. రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే)గానీ, ఈ–క్రాప్ విధానం కానీ, మద్దతు ధర కానీ వీటి గురించి చంద్రబాబు కనీస ఆలోచన కూడా చేయలేదు. ఇవేకాదు.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం అన్న ఊసు కూడా ఎక్కడాలేదు. పైగా.. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి స్థానిక రైతుల పేరు మీద చూపించి అడ్డుగోలుగా దోపిడీ చేశారు. మిల్లులు అధికంగా ఉన్నచోట ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ దోపిడీ తతంగాన్ని నడిపారు. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పల్లెపల్లెలో ఆర్బీకేలను ఏర్పాటుచేసి రైతులకు కావల్సిన అన్ని సదుపాయాలు అక్కడ నుంచే కల్పించడం, ఈ–క్రాప్ విధానం ప్రవేశపెట్టడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం చేస్తుంటే అన్యాయం, ఘోరం జరిగిపోయిందని టీడీపీ వెర్రెక్కిపోతూ గుండెలు బాదుకుంటోంది. నిజానికి.. చంద్రబాబు హయాంలో కొనుగోళ్ల తీరుతెన్నులు ఎలా ఉండేవంటే.. టీడీపీ హయాంలో ఇలా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2014 నుంచి 2019 వరకు వరి ధాన్యం కొనుగోళ్లు తీసుకుంటే రైతులు ఎంతో నష్టపోయారు. ఉదాహరణకు.. ► 2015లో ఖరీఫ్ దిగుబడి 12 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, నాటి ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులలోపు మాత్రమే. అంటే దిగుబడిలో మూడోవంతే. కొనుగోళ్లలో 90 శాతం రికార్డుల్లోనే. కొన్నది లేదు సరికదా.. రికార్డుల్లో చూపినదంతా తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి దొడ్డిదారిన తెచ్చిన ధాన్యం. ► అలాగే.. స్థానికంగా తక్కువ ధరకు కొనుగోలు చేసింది. అప్పట్లో ధాన్యం పండించిన చోట ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కన్నా, మిల్లులు ఎక్కువగా ఉన్న బిక్కవోలు, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, అనపర్తి, రాయవరం వంటి కేంద్రాల్లో కొనుగోళ్లు అధికంగా ఉండడానికి కారణం ఈ దొడ్డిదారి వ్యవహారమే. ► అప్పట్లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.1,057 ఉండేది. కానీ, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేసే అవకాశంలేక రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చేది. ► వీరి ధాన్యాన్ని తేమ, నూకలు, తాలూ తప్పల పేరుతో క్వింటాల్ ధాన్యాన్ని రూ.600ల నుంచి రూ.800లు చొప్పున కొనుగోలు చేయడంవల్ల రైతులు ఎంతగానో నష్టపోయారు. ► వీటిని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు చూపించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,057 పొందేవారు. ► కొనుగోలు లేకున్నా కొన్నామని చూపించడం ద్వారా కేంద్రాల నిర్వాహకులు సైతం ప్రభుత్వం నుంచి క్వింటాల్కు రూ.32 కమీషన్ రూపంలో నొక్కేసేవారు. ► రైతులకు ఇవ్వాల్సిన రవాణా ఖర్చులను, కూలీ ఖర్చులను కూడా స్వాహా చేసేవారు. ► అంతేకాక.. అప్పట్లో ఈ–క్రాప్ లేనందున ఇష్టానుసారం బుక్ ఎంట్రీ చేసే వీలు ఉండేది. మిల్లర్లు ధాన్యం బహిరంగంగా కొనుగోలు చేసినా కొనుగోలు కేంద్రాల్లో తమకు తెలిసిన రైతుల చిరునామాలను, సర్వే నెంబర్లు మీద ధాన్యం కొనుగోలుగా చూపించేవారు. అప్పట్లో వీటిల్లో టీడీపీ నేతల హవా ఉండడంతో దోపిడీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. 2015లో ధాన్యం కొనుగోలు అక్రమాలపై నాడు సాక్షిలో వచ్చిన కథనం (ఫైల్ ఫోటో) వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. టీడీపీ హాయాంలో జరిగిన విధానంలో ధాన్యం కొనుగోళ్ల తీరుతో రైతులు నష్టపోతున్న విషయాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గుర్తించారు. తన ప్రభుత్వం వచ్చిన తరువాత ధాన్యం కొనుగోలులో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆర్బీకేల ద్వారా క్షేత్రస్థాయిలో నేరుగా ధాన్యం సేకరణ సమర్ధవంతంగా జరుగుతోంది. ఎలాగంటే.. ► రైతులకు అడుగడుగునా అండగా నిలిచే రైతుభరోసా కేంద్రాలు ఊరూరా వెలిశాయి. ► ఈ–క్రాప్ విధానంవల్ల దిగుబడిపై పక్కాగా లెక్కలు వస్తున్నాయి. ఇప్పుడు తప్పుడు రికార్డులు సృష్టించే అవకాశమేలేదు. ► క్షేత్రస్థాయిలో కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ.. సమస్యలను అధిగమిస్తూ ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేయడంవల్ల రైతుకు కనీస మద్దతు ధరకు ఢోకా లేకుండా పోయింది. ► చివరకు మిల్లుల వద్ద రైతులకు సమస్యలు రాకుండా కస్టోడియన్ అధికారులను ఏర్పాటుచేశారు. ► ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుత రబీలోనే కాదు.. గత ఖరీఫ్లో సైతం రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసింది. ► ఉమ్మడి ‘తూర్పు’లో 7.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా, 7.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అంటే.. 97.84 శాతం ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసింది. రైతులకు రవాణా చార్జీల రూపంలో రూ.6.51 కోట్లు సైతం చెల్లించడం విశేషం. ► ఇక ప్రస్తుత రబీ విషయానికొస్తే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు. ► ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడ సమస్య వచ్చినా అక్కడికెళ్లి పరిష్కరిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై నిరంతర సమీక్ష చేస్తున్నారు. ► అయినప్పటికీ టీడీపీ నేతలు ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళనకు దిగడం చూసి రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఈ నెల 6వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తడిచిన ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు ఎగుమతి చేస్తున్న దృశ్యం నాటి విధానంతో నష్టమనే మార్పులు.. టీడీపీ హయాంలో ధాన్యం కొనుగోలు విధానంవల్ల రైతులు నష్టపోయారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోలుపై సమీక్ష జరుపుతున్నారు. సమస్యలను ఆహ్వానిస్తున్నారు. ప్రతిపక్షాలు, దళారులు, ఒక వర్గం మీడియా చేస్తున్న రాజకీయాలవల్ల రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలేదనే విష ప్రచారంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. – జిన్నూరి రామారావు (బాబీ), ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు, అల్లవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లా -
Telangana: వాన పడి.. కంటతడి
సాక్షి నెట్వర్క్: అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తీవ్ర వేగంతో వీస్తున్న ఈదురుగాలులు దాటికి చాలా చోట్ల వరి నేలకొరిగింది. వరి గింజలు రాలిపోయాయి. మరోవైపు వరి కోతలు పూర్తిచేసి.. ధాన్యాన్ని కల్లాలకు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కళ్ల ముందే ధాన్యం తడిసిపోతున్నా, నీటిలో కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేక కన్నీళ్లు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు పాట్లు పడుతున్నారు. వానకు తడిసిన ధాన్యాన్ని ఆరబోయడం, మళ్లీ వానకు తడిసిపోవడం, మళ్లీ ఆరబోయాల్సి రావడంతో అరిగోస పడుతున్నారు. వరుసగా వానలతో తడిసే ఉంటుండటంతో.. చాలాచోట్ల ధాన్యంలో మొలకలు వస్తున్నాయి. మరోవైపు మామిడి పూర్తిగా దెబ్బతినగా.. మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర, నువ్వుల పంటలకు నష్టం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. మరికొన్ని రోజులూ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కొనుగోళ్లలో ఆలస్యంతో.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సమస్యగా మారిందని.. కొనుగోళ్లు ఊపందుకుని ఉంటే ఈ బాధ ఉండేది కాదని రైతులు అంటున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కూడా వర్షాలు తెరిపినివ్వడం లేదని.. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పలుచోట్ల కొనుగోళ్లు జరుగుతున్నా తేమ, తరుగు పేరుతో మిల్లర్లు ధాన్యం తీసుకునేందుకు మెలిక పెడుతున్నారు. లేకుంటే క్వింటాల్కు నాలుగైదు కిలోలకుపైగా కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. అకాల వర్షం మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి 19,568 ఎకరాల్లో పంటలు నష్టపోగా.. అందులో 17 వేల ఎకరాల్లో వరి పంటే దెబ్బతిన్నది. ఇంకా పంట నష్టం సర్వే కొనసాగుతూనే ఉంది. ఇక వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో 40వేల టన్నులకుపైగా ధాన్యం తడిసిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. టార్పాలిన్లు అందుబాటులో లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకలెత్తుతోంది. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కథలాపూర్, సారంగాపూర్, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానతో భారీగా ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. అన్ని పంటలు కలిపి 1,52,577 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో భారీగా వరి చేన్లు నీట మునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసిన ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. అకాల వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను కొలుకోలేని దెబ్బతీశాయి. సిద్దిపేట జిల్లాలో సుమారు 91,569 ఎకరాల్లో, మెదక్ జిల్లాలో 13,947 వేల ఎకరాల్లో, సంగారెడ్డిలో 5,682 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోతకొచ్చే దశలోని వరి నేలకొరిగింది. మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం గణనీయంగా ఉంది. కామారెడ్డి జిల్లాలో 42వేల మంది రైతులకు చెందిన 60,289 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతినగా.. అందులో వరి 19,500 ఎకరాలు, నువ్వులు 4,500 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో 52 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13,905 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 8,014 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరి పంట దెబ్బతిన్నది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో నష్టం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 40వేల క్వింటాళ్ల ధాన్యం తడిసినట్టు అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు, వలిగొండ మండలాల్లో ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరితోపాటు మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరితోపాటు మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో 15,494 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏన్కూరు, ఖమ్మం అర్బన్, కూసుమంచి, సత్తుపల్లి, వేంసూరు, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో వరి నేలవాలింది. జిల్లాలో ఇప్పటివరకు 197 కొనుగోలు కేంద్రాలను తెరవగా.. 102 కేంద్రాల్లోనే కొనుగోళ్లు చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు ధాన్యాన్ని తీసుకురాగా.. వానలకు తడిసిపోతోందని వాపోతున్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షాలకు 3,299 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. వరితోపాటు మామిడికి నష్టం వాటిల్లింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాను వడగళ్ల వానలు వణికిస్తున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో పంటలు చేలలోనే దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఆదివారం రాత్రి కొందుర్గు మండలంలో వడగళ్ల వానకు వరి, మామిడి, కూరగాయల పంటలకు నష్టం జరిగింది. -
కేసీఆర్.. ఛత్తీస్గఢ్కు వెళ్లి చూడు
గుండాల: ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం కార ణంగా రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాల పాలవుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన మాటముచ్చట సమావేశంలో మాట్లాడుతూ.. వరి కోతలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాలతో రైతులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని పక్షం రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించినా చాలాచోట్ల మొదలుకాలేదన్నారు. ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నా.. రైతులు నష్టపోకుండా వడ్ల సంగతి తేల్చాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఔరంగాబాద్లో కాదని.. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్కు వెళ్లి చూడాలని, అక్కడ మార్కెట్లలోకి వచ్చిన ధాన్యాన్ని గంటలోనే మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. ఇది నిజం కానట్లయితే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. నిజమైతే నీ పదవికి రాజీనామా చేస్తావా అని కేసీఆర్ను ప్రశ్నించారు. సమ్మేళనాలు పెట్టి ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటమాడుతోందని ఆరోపించారు. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: గత సీజన్లో రైస్మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద పౌరసరఫరాల శాఖకు అప్పగించని మిల్లర్లకు యాసంగి ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంఆర్ కోసం 18 నెలల పాటు గడువు ఇచ్చినా, ధాన్యాన్ని మర పట్టించి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న రైస్ మిల్లులను ఇక బ్లాక్లిస్ట్లో పెట్టాలని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంగళవారం నుంచి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఈ మేరకు మంత్రులు టి.హరీశ్రావు, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతస్థాయి అధికారులు సోమవారం బీఆర్కే భవన్లో జిల్లాల అదనపు కలెక్లర్లు, డీఎంలు, డీఎస్ఓలు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్ కేటాయింపు, రైతులకు ఉపయోగకర అంశాలు వంటి వాటిపై చర్చించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని కొనుగోళ్ళకు సిద్దం కావాలని, రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఇందు కోసం యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయా జిల్లాల్లో మొదలైన కోతలు, ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముగ్గురు మంత్రులు అధికారులకు దిశా నిర్శేశం చేశారు. ధాన్యం కొనుగోళ్ళకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్ధం చేసుకోవాలని, వచ్చే వారంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. యాసంగికి సీజన్ సీఎంఆర్ అప్పగింతకు ఆఖరు తేదీగా ఈ నెల 30వ తేదిని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఈలోగా మిల్లర్లు నుంచి సీఎంఆర్ను పూర్తి స్థాయిలో సేకరించాలని ఆదేశించారు. ఇక నుంచి సీఎంఆర్ అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ని అప్పగించిన తరువాతే ఈ సీజన్ కు సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు. ఇప్పటి వరకు సీఎంఆర్లో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగాస్వామ్యం చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. రెండు సీజన్లలో పూర్తి ధాన్యాన్ని సేకరిస్తున్న రాష్ట్రం తెలంగాణనే... దేశ వ్యాప్తంగా రెండు సీజన్లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణా మాత్రమేనని మంత్రులు హరీష్రావు, గంగుల, సింగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నుంచి అదనపు కలెక్టర్లు ఆయా జిల్లా స్థాయిలలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకొని ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లను గుర్తించి తగు ప్రతిపాధనలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. అలాగే ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకోచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడి రాష్ట్రంలో రోజురోజుకూ ధాన్యం దిగుబడి, కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయని మంత్రులు వెల్లడించారు. 2014–15 లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020–21 నాటికి రూ.26 వేల 600 కోట్లతో ధాన్యం సేకరించగలిగామని చెప్పారు. 9 సంవత్సరాలలో ఆరు రెట్ల ధాన్యం కొనుగోలు పెరగగా , ఈ రబీ(యాసంగి)లో దేశంలో సగం పంట తెలంగాణలో మాత్రమే ఉండడం మనకు గర్వకారణమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పడు ఆన్ లైన్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు రూ.1,773.98 కోట్లు జమ చేసినట్టు పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం రూ.926.90 కోట్లను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినట్టు పేర్కొన్నారు. దాదాపు 16 రోజులు దాటిన ఎఫ్టీవోలు అన్నింటికీ నగదు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు 3,10,791 మంది రైతుల నుంచి రూ.3,578.43 కోట్ల విలువైన 17.35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటి వరకు 1.67 లక్షల మంది రైతులు మద్దతు ధర నగదును అందుకున్నట్టు వివరించారు. త్వరలోనే మిగిలిన రైతులకూ మద్దతు ధరను ఖాతాల్లో వేస్తామని తెలిపారు. రైతులకు గోనె సంచులు, హమాలీ, రవాణా ఖర్చుల కింద రూ.17.66 కోట్లు అందించినట్టు వివరించారు. -
ధాన్యం సేకరణ అంతంత మాత్రమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. అక్టోబర్ 1 నుంచి కొనుగోళ్లు మొదలైనా తొలి మూడు వారాల్లో నిర్దేశిత లక్ష్యంలో సేకరణ కేవలం 10 శాతమే పూర్తయినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్లో ఇప్పటిదాకా 53 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు జరగ్గా, 2004లో ఇదే సమయానికి 35.83 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ నెలలో ఇంత తక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరగడం ఇదే తొలిసారి అని కేంద్ర ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నిజానికి దేశంలో వరిసాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5.5 శాతం తగ్గింది. 3.67 కోట్ల హెక్టార్లకు పరిమితం అయ్యింది. సాగు విస్తీర్ణాన్ని బట్టి చూస్తే ధాన్యం కొనుగోళ్లు దేశవ్యాప్తంగా 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటాయని కేంద్రం అంచనా వేసింది. ఈ నెల నుంచే సేకరణ ప్రారంభించింది. అయితే, పంజాబ్, హరియాణాలో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో సేకరణ జరిగింది. పంజాబ్లో 1.50 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 18.94 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయ్యింది. అధిక తేమశాతంతో ఇబ్బందులు ప్రతికూల వాతావరణం కారణంగానే ధాన్యం సేకరణ మందగించిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ధాన్యంలో తేమశాతం పరిమితిని 17 శాతంగా నిర్ణయించగా, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఇది 22 శాతం వరకూ ఉంటోంది. దీంతో ఆశించినంత వేగంగా సేకరణ జరగడం లేదు. వరి అధికంగా పండించే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ఆయా రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా మొదలయ్యాయి. ఫలితంగా పంటల సాగులో జాప్యం జరిగింది. -
ఆర్బీకేల వద్ద వే బ్రిడ్జిలు
సాక్షి, అమరావతి: పంట కొనుగోళ్లను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దళారీలు, మిల్లర్ల ప్రమేయం లేకుండా గత వ్యవసాయ సీజన్ నుంచి ధాన్యంతో పాటు అన్ని రకాల పంటలు ఆర్బీకేల ద్వారా కొనుగోలుచేస్తున్నారు. ఖరీఫ్లో రూ.7859.30 కోట్ల విలువైన 40.38 లక్షల టన్నులు, రబీలో రూ.5245.23 కోట్ల విలువైన 26.98 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుత ఖరీఫ్లో 85.58 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొస్తాయని అంచనా. రైతన్నలు నష్టపోకుండా... ధాన్యంలో తేమ శాతాన్ని ఆర్బీకేల్లో ప్రస్తుతం మాయిశ్చర్ మిషన్ ద్వారా పరీక్షిస్తున్నారు. కొనుగోలు తేదీలను రైతులకు వెల్లడిస్తూ గన్నీ బ్యాగ్లు కూడా సరఫరా చేస్తున్నారు. ఆ సమయానికి రైతులు ధాన్యాన్ని గోతాల్లో నింపి కల్లాల వద్దే తూకం వేసి ఆర్బీకే పరిధిలోని రైసు మిల్లులకు తరలిస్తున్నారు. అయితే కల్లాల వద్ద రైతు వేసిన తూకానికి, మిల్లువద్ద వేసే తూకానికి వ్యత్యాసం వస్తోంది. కల్లాల వద్ద వెయ్యి కిలోలున్న ధాన్యం బస్తాలు మిల్లు వద్ద తూకం వేస్తుంటే 900–950 కేజీలే ఉన్నట్లు మిల్లర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తూకాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసి రైతులు పండించిన ప్రతి గింజకు కనీస మద్దతు ధర లభించాలన్న సంకల్పంతో అవసరమైన చోట ఆర్బీకేల వద్ద వేబ్రిడ్జ్లు ఏర్పాటు చేయాలని ఇటీవల సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యేలోగా తొలిదశ వే బ్రిడ్జిల ఏర్పాటుకు అధికారుల సిద్ధమయ్యారు. ఐదు సెంట్ల స్థలంలో.. ఒక్కో వే బ్రిడ్జికి ఐదు సెంట్ల స్థలం అవసరమని అంచనా వేశారు. ఆ మేరకు స్థలాలు అందుబాటులో ఉన్న ఆర్బీకేలకు తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్కు చెందిన 28 గోదాముల వద్ద ఇప్పటికే వే బ్రిడ్జిలుండగా కొత్తగా మరో 35 గోదాముల వద్ద వే బ్రిడ్జిల నిర్మాణానికి అనువైన స్థలాలున్నట్లు గుర్తించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రెండు గోదాములతో పాటు 16కిపైగా వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాముల వద్ద కొత్తగా వే బ్రిడ్జిలను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటితోపాటు వరి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో కనీసం 40 ఆర్బీకేల పరిధిలో కొత్తగా వే బ్రిడ్జిల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మొత్తమ్మీద 93 చోట్ల కొత్తగా వే బ్రిడ్జిల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్బీకేల పరిధిలో వీలైనంత మేరకు మరిన్ని అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ నాటికి సిద్ధం! 60 టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఒక్కో వే బ్రిడ్జి కోసం రూ.19.95 లక్షలు వ్యయం కానుందని అంచనా. ఈ మొత్తంతో 9 గీ 3 మీటర్ల పిట్లెస్ టైప్ వే బ్రిడ్జి, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, యూపీఎస్, సిబ్బంది ఉండేందుకు వీలుగా ఎంఎస్ క్యాబిన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్కల్లా వీటిని అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు జరుగుతోంది. -
అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది?
అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది? పతాక శీర్షికల్లో చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా? మీరేం రాస్తే అది నిజమైపోవటానికి ఇవి వైస్రాయ్ రోజులనుకున్నారా రామోజీరావు గారూ? కూలీల ఫొటోలు తీసి వారు రైతులంటూ.. దోపిడీకి గురయ్యారంటూ దుర్మార్గపు రాతలు రాస్తే ఎలా? వారి చేతికందిన సొమ్మును కూడా అందలేదని రాస్తే ఎలా? ఏది నిజమో... ఏది మీ నైజమో చెప్పటానికి మరో మీడియా లేదనుకున్నారా? ఫోటోలతో సహా మీరు వేసిన అబద్ధాలను... వీడియోలతో సహా వివరించడానికి ‘సాక్షి’ ఉందిక్కడ. మీ ‘బాబు’ కోసం జనం మెదళ్లలో ప్రభుత్వంపై విద్వేష భావాలు నాటడానికి ఈ వయసులో కూడా ఇన్ని కాకిలెక్కలు మీకు అవసరమా? కనీసం ఇన్నాళ్లు మీ పత్రికను నమ్మిన జనం కోసమైనా నిజాలు చెప్పరా? ఆంధ్రప్రదేశ్లోని రైతు భరోసా కేంద్రాలకు పొరుగు రాష్ట్రాలే కాదు.. కేంద్రంతో పాటు అంతర్జాతీయ సమాజమూ సలాం కొడుతోంది. ‘విత్తు నుంచి విక్రయం వరకూ’ అనే నినాదంతో ఊరూరా రైతన్నకు భరోసాగా నిలుస్తున్న ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని కొత్త దారిలో నడిపిస్తున్నాయి. అందుకే రామోజీ పథకం ప్రకారం గురువారం ‘ఈనాడు’ పతాక శీర్షికలో ‘ధాన్యంలో దోపిడీ’ అంటూ వీలైనన్ని అబద్ధాలు పోగేశారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతకు భరోసాయే దక్కటం లేదంటూ మొత్తం వ్యవస్థపైనే విషం గక్కారు. విశేషమేంటంటే చంద్రబాబు హయాంలో రైతు భరోసా కేంద్రాల మాట అటుంచి.. రైతుకు భరోసాయే లేదు. ధాన్యం సేకరించాలంటూ రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే అప్పుడు కొనుగోళ్లకు ఉపక్రమించిన చరిత్ర బాబుది. ఆయన ఐదేళ్ల పాలనలో 2.81 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ఇందుకు రూ.43,134 కోట్లు అయితే, ఇందులోనుంచి రూ.4,838 కోట్లను ఎన్నికల్లో గెలుపుకోసం పసుపు కుంకుమకు మళ్లించారు. తర్వాత వచ్చిన సీఎం జగన్ ఆ బకాయిలనూ తీర్చి రైతులను గట్టెక్కించారు. అంతేకాదు.. జగన్ ఈ మూడేళ్లలోనే 2.33 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించి, ఏకంగా 43,549 కోట్లు చెల్లించారు. రామోజీది ఎంత నిఖార్సయిన జర్నలిజం అంటే.. బాబు ఏమిచేసినా ఆయనకు తప్పు అనిపించదు. ఇప్పుడు ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. నిజాలు ఎప్పుడూ చెప్పరు!!. అప్పట్లో సేకరించలేదనికానీ... ఇప్పుడు సేకరిస్తున్న విషయాన్ని కానీ నిజాయితీగా అంగీకరించరు. ఈ ఏడాది ఇప్పటికే ప్రభుత్వం 6.68 లక్షల రైతులకి చెందిన 52.54 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందంటే రైతులకు ఎంత దన్నుగా నిలుస్తున్నదో అర్థమవుతుంది. ఆర్బీకే అంటేనే... భరోసా పంట విక్రయానికి సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాలన్నదే ఆర్బీకేల లక్ష్యం. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నేరుగా కొనుగోలు చేయడానికే ఈ ఏర్పాటు. ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు అమ్మాలనుకున్న రైతులు తొలుత వారి పంట, బ్యాంకు ఖాతా వివరాలను ఈ–క్రాప్ పోర్టల్లో నమోదు చేసుకోవటం తప్పనిసరి. దీన్నిబట్టే ఆర్బీకేలు సేకరణ మొదలెడతాయి. ఇక రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆన్లైన్లో నగదు చేరిపోతుంది. 16నే మేకా సూర్యనారాయణకు హమాలీ చార్జీని చెల్లించిన చెక్కు ఈ మేరకు వీలు కల్పించే ధాన్యం సేకరణ పోర్టల్ను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా టీసీఎస్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ–క్రాప్లో నమోదు చేసుకోకున్నా... కౌలు రైతు కార్డు లేకున్నా అలాంటి వారు ఒకరో ఇద్దరో ఇబ్బంది పడొచ్చు. కానీ దాన్ని సార్వత్రికం చేస్తూ... యావత్తు రైతాంగం దోపిడీకి గురయిపోతున్నారని రామోజీ ఆక్రోశించటమే దుష్ప్రచార యుద్ధంలో కీలక ఘట్టం. ఆర్బీకేల ద్వారా సమీకరించేందుకు అవసరమైన గోనె సంచులను ప్రభుత్వమే సరఫరా చేయటంతో పాటు... హమాలీ చార్జీలనూ అందజేస్తోంది. అందరి ఖాతాల్లోనూ ఈ సొమ్ము పడుతున్నా... ఎవ్వరికీ దీని గురించి తెలియదన్నట్లుగా రాయటమే చిత్రాతిచిత్రం. నాణ్యమైన బియ్యం కోసం.. బాబు హయాంలో సేకరించటమే అరకొరయితే... అలా సేకరించిన దాన్లో ముక్కిపోయిన, నూకలుగా మారిపోయిన బియ్యాన్ని మాత్రమే రేషన్ డిపోలకు సరఫరా చేసేవారు. అప్పట్లో రేషన్ బియ్యం తినేవారు అతితక్కువ. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయటానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలూ తీసుకోవటంతో... దీనికి అవసరమైన సార్టెక్స్ రైస్ను మిల్లింగ్ చేయడానికి రైస్ మిల్లులకు అదనంగా క్వింటాలుకు రూ.110 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఫోర్టిఫైడ్ బ్లెండింగ్ కోసమూ అదనపు మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తున్నారు. అందుకే నాణ్యమైన బియ్యం రేషన్ కార్డు దారులకు చేరుతోంది. వారంతా తమ ఇళ్లలో వీటిని వాడుతున్నారు. కాకపోతే ఈ నిజాలేవీ ‘ఈనాడు’ రాయదు. రైతు కూలీల్ని ఫోటోలు తీసి... రైతులంటూ అబద్ధపు రాతలు మాత్రం రాస్తుంది. ఎందుకంటే రామోజీ లక్ష్యం... అడ్డూ అదుపూ లేని దుష్ప్రచారం మరి!!. రామోజీ రాసిన ఈ రైతుల సంగతి చూస్తే... ఇన్నాళ్లూ అబద్ధాలను ‘ఈనాడు’ ఎంత అందంగా అచ్చేసిందో అర్థమవుతుంది. ఒక్కో రైతు కథనూ చూస్తే... ‘ఈనాడు’ రాతల ప్రకారం రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఉండవల్లి వీరభద్రరావు నాలుగెకరాల్లో వరి వేశారు. షావుకారులే కొంటున్నారని, బస్తాకు రూ.1,380 ఇస్తామన్నారని, అంతకన్నా ఎక్కువ జమయితే తెచ్చి కమీషన్ దారుకు ఇవ్వాలన్నారని ఆయన చెప్పినట్లు రాశేశారు. పోయిన పంటకూ ఇలాగే చేసారని, హమాలీ, రవాణా చార్జీలు ఇస్తారనే విషయం తమకు తెలియదన్నట్లు కూడా రాశారు. కానీ నిజమేంటో తెలుసా? ఉండవల్లి వీరభద్ర రావు పేరిట పొలం లేదు. ఆయన భార్య ఉండవల్లి పద్మావతి పేరిట పొలం ఉండటంతో అమ్మిన ధాన్యం సొమ్ము ఈ ఏడాది జనవరి 3న NPCI ద్వారా నేరుగా రైతు ఖాతాలో (యూనియన్ బ్యాంక్ ) జమ అయింది. హమాలీ చార్జీల రూపేణా ఈ నెల 4న రూ.1,740 జమయింది. దీన్ని పద్మావతి స్వయంగా చెప్పారు. ఐదు నెలల కిందట సొమ్ము జమైనా... నెల కిందట హమాలీ చార్జీలు వచ్చినా... ఈ అబద్ధపు రాతలెందుకు? ఎవరిని నమ్మించడానికి? రామోజీ రాతల ప్రకారం రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మేకా వీర సూర్యనారాయణ 12 ఎకరాల్లో వచ్చిన ధాన్యం అమ్మారు. లిస్టులో పేరున్నా డబ్బులివ్వడం లేదు. అమ్మి 5 నెలలైనా ఇప్పటిదాకా హమాలీ చార్జీలు ఇవ్వలేదు. డీసీసీబీకి వెళ్లినా పనికాలేదు!!. ఆర్బీకే ఇచ్చిన రసీదు ఇక వాస్తవం చూద్దాం... రైతు మేకా వీర సూర్యనారాయణ అమ్మిన ధాన్యము యొక్క హమాలీ చార్జీలు రూ.2,520 ఈ నెల 16నే చెక్కు రూపంలో ఆయనకు అందాయి. ఇది ఆయనే అంగీకరించారు. కానీ.. రామోజీ తనకు తోచినట్లు రాసేశారు. ‘ఈనాడు’ కథనం మేరకు... రాయవరం మండలం నదురుబాద గ్రామానికి చెందిన కొండపల్లి వెంకట సత్యనారాయణ అనే రైతు ఐదున్నర ఎకరాల్లో వరి వేశారు. బస్తా రూ.1,380కి అమ్మారు. తామే మిల్లుకు తీసుకెళితే బస్తాకు రూ.1,455 ఇస్తారన్నారని, లేకుంటే రూ.1,380 ఇస్తామన్నారని, ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లాక నెమ్ము చేరిందన్నారని, ఎంత తరుగు తీసేస్తారో తెలియడం లేదని ఆయన వాపోయినట్లు రాసిపారేశారు. కానీ వాస్తవమేంటో తెలుసా? కొండపల్లి వెంకట సత్యనారాయణ కౌలు రైతు అని ‘ఈనాడు’ రాసింది తప్ప... ఆయన ఎక్కడ కౌలు రైతుగా నమోదు చేసుకున్నారో రాయలేదు. ఆయన కూడా... తానెక్కడా నమోదు చేసుకోలేదని, తనకు సీసీఆర్సీ కార్డు కూడా లేదని స్పష్టం చేశారు. మరి ఈ–క్రాప్లో నమోదు కాకుండా ఆ పంటనెలా కొంటారు? సీసీఆర్సీ కార్డు లేనిదే కౌలు రైతు ఎలా అవుతారు? రాసేముందు ఈ మాత్రం చూసుకోవద్దా రామోజీరావు గారూ? ఇక రామోజీ రాతల్లో డొల్లెంతో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రత్తిపాడు గ్రామంలో మన్యం గోపాలకృష్ణ ఐదెకరాల్లో వరి వేసారని, ఎకరాకు 30–35 బస్తాలొస్తుండగా 3 రోజులుగా ఎండబెడుతున్నారని రాశారు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే ఈ తిప్పలు పడలేరు, కమీషన్.దారులకు ఇచ్చేయమన్నారని... మిల్లులకు తీసుకెళితే తేమ, నూక తేడా ఉంటే బస్తాకు రూ.200/– కోత పెడతామన్నారని, ఆర్బీకేల్లో సంచులు ఇవ్వడం లేదని ఆయన , చెప్పినట్లుగా రాసేశారు. అందుకే కమీషన్ దారులకు ధాన్యం ఇస్తున్నారని సూత్రీకరించారు. ‘ఈనాడు’ రాయని నిజమేంటంటే మన్యం గోపాల కృష్ణ వ్యవసాయ కూలీ. తనకు పొలం లేదు. ఆయన పొలంలో ధాన్యం పట్టుబడి చేస్తుంటే ‘ఈనాడు’ బృందం వెళ్లి ఫోటో తీసుకుంది. పేపర్లో ఏం రాశారో తనకు తెలియదని, తానైతే వాళ్లతో ఏమీ చెప్పలేదని ఆయన వాపోయాడు. తమ గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే మద్దతు ధరకు ధాన్యాన్ని కొంటున్నారని, సంచుల కొరత లేదని కూడా చెప్పాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరిస్తున్నాయి.. జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక రైతుల కోసం రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, అధిక మద్దతు ధర, ఉచిత విద్యుత్, భూ రికార్డుల ప్రక్షాళన, కస్టమ్ హైరింగ్ సెంటర్ల వంటి విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల రైసు మిలర్ల పాత్ర వల్ల రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో మొత్తం వ్యవస్థ తప్పుగా ఉందని నేనన్నట్లు వక్రీకరించి రాశారు. ఇది సరికాదు. నేను ఈ అంశాన్ని చెప్పిన వెంటనే వ్యవసాయ మంత్రి, పౌర సరఫరాల మంత్రులు నాతో మాట్లాడి దీనిపై విచారణ చేయిస్తామని చెప్పారు. – పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ నిజానికి రైతు భరోసా కేంద్రాలు ఎంత అండగా నిలుస్తున్నాయో ఏ ఊళ్లో ఏ రైతును కదిలించినా తెలుస్తుంది. అలాంటి కొందరు రైతుల అభిప్రాయాలివీ.. పంట నష్టం కూడా అందింది... మాకు రామచంద్రపురం మండలం చోడవరంలో మూడెకరాల వరిపొలం ఉంది. ప్రతి సీజన్లో పంట నమోదు చేస్తున్నా. మూడేళ్లుగా రైతు భరోసా రూపంలో పెట్టుబడి సాయం అందుతోంది. తొలకరిలో అధిక వర్షాల వల్ల పంట నష్టపోయినా... ఆర్బీకేలోని గ్రామ వ్యవసాయ సహాయకుడు దాని వివరాలు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందింది. నేను పండించిన ధాన్యాన్ని మూడేళ్లుగా ఆర్బీకే ద్వారానే విక్రయిస్తున్నా. ఖరీఫ్లో క్వింటాలుకు రూ.1940 ధాన్యం సొమ్ము గతంలో 21 రోజులకు అందింది. హమాలీ ఖర్చులు క్వింటాలుకు రూ.25 చొప్పున చోడవరం సొసైటీ ద్వారా చెక్కు రూపంలో అందజేశారు. ఎరువుల కోసం తిప్పలు లేకుండా ఆర్బీకే నుంచే యూరియా, డీఏపీ అందాయి. – గుణ్ణం రామకృష్ణ, రైతు, చోడవరం, కోనసీమ జిల్లా తూకం.. లెక్కల్లో తేడాలు లేవు.. ఐదెకరాలు కౌలుకు తీసుకుని రబీ పంట సాగు చేశా. రెండెకరాల్లో కోత కోశా. 77 బస్తాల ధాన్యం వచ్చింది. ఆర్బీకేలో గురువారం విక్రయించాను. బస్తాకు రూ.1,455 చొప్పున 77 బస్తాలకు రూ.1,12,035 నగదు ఇస్తామని రసీదు ఇచ్చారు. హమాలీ చార్జీలు క్వింటాలుకు రూ.25 ఇస్తున్నారు. తూకం, లెక్కల్లో తేడాల్లేవు. అదే ధాన్యాన్ని గ్రామంలోని దళారి వద్దకు తీసుకెళితే బస్తాకు రూ.1,300 ఇస్తానన్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే న్యాయం జరుగుతోంది. మిగిలిన మూడెకరాలూ కోత కోశాక ఆర్బీకేలోనే విక్రయిస్తా. – మొర్త అప్పారావు, కేశనకుర్రు గ్రామం, పెదలంక -
హస్తినలో వరి యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు సిద్ధమైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. సీఎం కేసీఆర్ ఈ దీక్షలో పాల్గొని కేంద్ర వైఖరిని ఎండగట్టనున్నారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సహా రెండు వేల మందికిపైగా నిరసనలో పాల్గొననున్నారు. ఈ దీక్షకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఆదివారం రాత్రికే ఢిల్లీకి వచ్చారు. మిగతావారు సోమవారం ఉదయం చేరుకోనున్నారు. బహుముఖ వ్యూహంతో.. రైతుల సమస్య తీర్చడంతోపాటు రాష్ట్రంలో బీజేపీకి చెక్పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకోవడమనే బహుముఖ లక్ష్యాలతో సీఎం కేసీఆర్ చేపట్టిన ఢిల్లీ దీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీక్ష జరిగేది ఇలా.. ► ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి ‘తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’గా పేరు పెట్టారు. ► ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ► మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సహా 2 వేల మంది వరకు దీక్షలో పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ► ‘ఒకే దేశం.. ఒకే సేకరణ విధానం’ నినాదంతో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, జెండాల ఏర్పాటు చేశారు. ‘ఒకే దేశం.. ఒకే సేకరణ’తో.. తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొద్దినెలలుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. బాయిల్డ్రైస్ (ఉప్పుడు బియ్యం) తీసుకోబోమని.. రా రైస్ చేస్తేనే కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టం చేయగా.. ధాన్యం కొనాల్సిందేనని టీఆర్ఎస్ సర్కారు పట్టుపడుతోంది. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లోనూ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రుల బృందం ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయినా సానుకూల నిర్ణయం రాలేదు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ విస్తృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. సోమవారం ఢిల్లీలో ‘తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరిట ఆందోళనకు సిద్ధమైంది. ‘ఒకే దేశం.. ఒకే సేకరణ’ డిమాండ్తో రాష్ట్రంలో పండే ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనుంది. ఢిల్లీలో దీక్షావేదిక రాజకీయ వ్యూహంతోనూ.. ఈ నిరసన దీక్ష ద్వారా అటు రైతులకు మేలు చేసే లక్ష్యంతోపాటు.. ఇటు రాజకీయ కోణంలోనూ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని, రైతులను ఇబ్బందిపెడుతోందని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా.. రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా పావులు కదుపుతోంది. ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలంటూ గత ఏడాది డిసెంబర్లో స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా కేంద్రం తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమానిస్తోందంటూ ఢిల్లీలోనే దీక్ష చేపడుతోంది. ఈ దీక్ష సందర్భంగా తదుపరి కార్యాచరణను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రానికి..! దేశ పాలనలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందంటూ సీఎం కేసీఆర్ కొంతకాలంగా ప్రకటనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలతో వరుసగా సమావేశమయ్యారు. తెలంగాణ సాధనకోసం దేశవ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టి విజయం సాధించామని.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీపైనా పోరు సాగించేందుకు ముందు వరుసలో ఉంటామని కూడా ప్రకటించారు. తాజాగా ఢిల్లీ దీక్ష ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయపక్షాలు, ప్రజల దృష్టిని ఆకర్షించడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. వారం రోజులుగా ఢిల్లీలోనే కేసీఆర్ పంటి నొప్పితో బాధపడుతున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. శస్త్రచికిత్స, అనంతరం విశ్రాంతి కోసం వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఇదే సమయంలో నిరసన దీక్ష ఏర్పాట్లపై టీఆర్ఎస్ ఎంపీలు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతా గులాబీమయం తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ ఢిల్లీ అంతటా కనిపించేలా ఇండియాగేట్, తెలంగాణ భవన్ చుట్టూ దారులను హోర్డింగులు, ఫ్లెక్సీలతో నింపేశారు. ‘ధాన్యంపై కేంద్రం మొండి వైఖరి వీడాలి, మొత్తం ధాన్యాన్ని కొనాలి, రైతులను ఆదుకోవాలి’ అనే నినాదాలను వాటిపై రాశారు. ► తెలంగాణ భవన్లోని దీక్షావేదికను గులాబీ మయం చేశారు. కేసీఆర్, ఇతర నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ధర్నా వేదిక, ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ పర్యవేక్షించారు. ఆదివారం ఈ ఏర్పాట్లను మంత్రులు, ఎంపీలతోపాటు ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ► తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ► ఢిల్లీకి వచ్చే ప్రజా ప్రతినిధులందరికీ మధ్యాహ్నం భోజనం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయగా, రాత్రి ఎంపీ బీబీ పాటిల్ నివాసంలో భోజన ఏర్పాట్లు చేశారు. నేతలెవరికీ ఇబ్బందులు రాకుండా ఎంపీలు సమన్వయం చేస్తున్నారు. కేంద్రం దిగి వస్తుంది కేసీఆర్ నాయకత్వంలో చేపట్టబోయే దీక్ష చరిత్రాత్మకం అవుతుంది. వాజ్పేయి ప్రభుత్వహయాంలోనూ ఎఫ్సీఐ, కేంద్ర ఆహార మంత్రి ఇలాగే ధాన్యం కొనుగోళ్లకు నిరాకరిస్తే.. పంజాబ్ ప్రభుత్వం ఆందోళనకు దిగింది. కేంద్రం ముందుకొచ్చి కొనుగోళ్లు చేపట్టింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకునే విషయంలో రైతులను క్షోభ పెట్టొద్దు. కేంద్రం మొండి వైఖరి వీడాలి. – మంత్రి నిరంజన్రెడ్డి బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు: రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పటికే రైతుల ఆందోళనతో బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. ధాన్యం సేకరణ విషయంలోనూ కేంద్రం మొండి వైఖరి వీడాలి. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం తేవాలి. – ఎమ్మెల్సీ కవిత -
సకాలంలో ధాన్యం డబ్బుల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2.96 లక్షల మంది రైతుల నుంచి 21.04 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 1.42 లక్షల మంది రైతులకు రూ.1,969 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా రైతు పొలం ముంగిట నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా ఆధార్ ఆధారిత నగదు జమ పద్ధతులను అవలభిస్తున్నట్టు చెప్పారు. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో రైతులకు కచ్చితంగా చెల్లింపులు చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో ఐదు వేల టన్నుల సేకరణ లక్ష్యం కాగా.. 376 మంది రైతుల నుంచి 2,748 టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. 46 మంది రైతులకు రూ.60 లక్షలు జమ చేసినట్టు వివరించారు. అయితే కొన్ని పత్రికలు(సాక్షి కాదు) వాస్తవాలు గ్రహించకుండా రైతులకు చెల్లింపులు జరపట్లేదంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ఇలాంటి వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వీరపాండియన్ హెచ్చరించారు. -
వడ్లు దగ్గరవడ్డయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు దగ్గరపడుతున్నాయి. 13 జిల్లాల్లో సేకరణ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 6,875 కేంద్రాలకు గాను 1,657 కేంద్రాల్లోనే కొనుగోళ్లు నడుస్తున్నాయి. శుక్రవారం రాత్రి వరకు రాష్ట్రంలో 12.21 లక్షల మంది రైతుల నుంచి 67 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఈ ధాన్యం విలువ రూ. 13,093 కోట్లు కాగా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ. 10,619 కోట్లు చేరింది. సంక్రాంతికల్లా కొనుగోళ్లు దాదాపు పూర్తవ్వొచ్చని, కొన్నిప్రాంతాల్లోనే ఇంకాస్త ఆలస్యమవ్వొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నాట్లు వేయడంలో జాప్యమవడం, సాగు నీటిని ఆలస్యంగా విడుదల చేయడం వల్ల కోతలు ఆలస్యంగా మొదలయ్యాయని అంటున్నారు. మూతబడ్డ 5,218 కేంద్రాలు రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణకు 32 జిల్లాల్లో 6,875 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయి కేంద్రాలను పూర్తిగా మూసేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జనగాం, నల్లగొండ, యాదాద్రి, మహబూబ్నగర్ల్లోనూ కొనుగోళ్లు చాలా వరకు పూర్తయినా అక్కడక్కడ మిల్లర్ల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులతో కేంద్రాలను కొనసాగిస్తున్నారు. మొతం్తగా ఇప్పటివరకు 5,218 కొనుగోలు కేంద్రాలు మూతబడ్డాయి. సాగునీటిని ఆలస్యంగా విడుదల చేయడం, నాట్లు ఆలస్యమవడం లాంటి కారణాలతో ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, భూపాలపల్లి, నాగర్కర్నూల్, గద్వాల జిల్లాల్లో వరి కోతలు ఆలస్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. మహబూబ్నగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ట్రాన్స్పోర్టు సమస్యతో పాటు గోడౌన్లు ఖాళీ లేవంటూ మిల్లర్లు ధాన్యం తీసుకోవట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల లోపు ధాన్యం సేకరించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ లెక్క కడుతోంది. -
10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. 50 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంలో ఇప్పటికే 20.64 శాతం పూర్తయింది. బుధవారం నాటికి రూ.2,007.46 కోట్ల విలువైన 10,32,039 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తద్వారా 1,36,745 మంది రైతులు మద్దతు ధర పొందారు. 10 జిల్లాల్లోని 8,557 ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వరద కారణంగా పంట దెబ్బతినగా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కోతలు ఆలస్యమయ్యాయి. ఈ జిల్లాల్లో స్వల్పంగా 1.35 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. పారదర్శకంగా చెల్లింపులు రైతులకు చెల్లింపులు పక్కదారి పట్టకుండా, జాప్యాన్ని నివారించడానికి పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా ఆధార్ నంబరు ప్రకారం నగదును జమచేస్తోంది. తొలిసారిగా ఫామ్–గేట్ (పొలాల వద్ద ధాన్యం కొనుగోలు) విధానం ద్వారా రైతులపై ఒక్క రూపాయి రవాణా ఖర్చు పడకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోతాల్లో నింపి నేరుగా మిల్లులకు తరలిస్తోంది. సడలింపునకు కేంద్రానికి వినతి రాష్ట్ర వ్యాప్తంగా 7,38,369 టన్నుల ధాన్యం దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,31,946 టన్నులు, గుంటూరులో 1,53,472, పశ్చిమగోదావరిలో 78,848, చిత్తూరు జిల్లాలో 61,633 టన్నుల ధాన్యం దెబ్బతిని రంగుమారింది. మొలకలొచ్చాయి. వైఎస్సార్ కడప జిల్లాలో 1.77 లక్షల టన్నుల ధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో రైతులు తమ పంట విలువను నష్టపోకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు నిబంధనల్లో సడలింపులు కోరుతూ కేంద్రానికి నివేదిక పంపించింది. దెబ్బతిన్న, రంగుమారిన, విరిగిన ధాన్యం కొనుగోలులో 5 శాతం ప్రమాణాలు పాటిస్తుండగా దాన్ని కర్నూలు జిల్లాలో 8 శాతం, వైఎస్సార్ కడపలో 15 శాతం, ప్రకాశంలో 30 శాతం, మిగిలిన జిల్లాల్లో 10 శాతానికి పెంచాలని కోరింది. ఏ ఒక్క రైతుకు నష్టం రానివ్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌరసరఫరాలశాఖ ద్వారా లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాం. ఈ క్రమంలోనే దెబ్బతిన్న ధాన్యం వివరాలను కేంద్రానికి పంపించి, కొనుగోలు ప్రమాణాల్లో జిల్లాల వారీగా సడలింపులు కోరాం. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కూడా నష్టం రానివ్వం. ఇప్పటికే 20 శాతానికిపైగా కొనుగోళ్లు పూర్తిచేశాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
ప్రతి రైతుకూ ‘మద్దతు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి రైతన్నకూ కచ్చితంగా ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) దక్కేలా చూడటం, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయడం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, అధికారులు కృషి చేయాలని సూచించారు. పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా రైతులకు చెల్లింపులు జరగాలని నిర్దేశించారు. రైతన్నలపై రవాణా వ్యయం, గోనె సంచుల కొనుగోలు, హమాలీ ఖర్చుల భారం పడకూడదని ఆదేశించారు. పంటల కొనుగోళ్లకు సంబంధించి సమస్యలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ఉండాలని, పంటల కొనుగోలు బాధ్యతను ఆర్బీకేల్లో ఐదుగురు సిబ్బందికి అప్పగించాలని సూచించారు. ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. రైతులకు సేవలందించడంలో అలసత్వం వహించరాదు. సమాచార లోపం ఉండకూడదు. తరచూ రైతులతో మాట్లాడాలి. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గతంలో ఎవరూ ముందుకొచ్చిన దాఖలాలు లేవు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతన్నలకు గరిష్టంగా వీలైనంత మేర ప్రయోజనం కల్పిస్తున్నాం. వారికి భరోసా కల్పిస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి. ధాన్యం నాణ్యత పరిశీలనలో రైతులు మోసాలకు గురి కారాదు. విదేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చర్యలు చేపట్టాలి. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. ఆర్బీకేలో ఐదుగురు సిబ్బందిదే బాధ్యత.. ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కనీసం ఐదుగురు సిబ్బంది ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్తోపాటు ఇతర సిబ్బంది ముగ్గురు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి ఆర్బీకేలో కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి. రైతుల దగ్గరకు వెళ్లి మాట్లాడి కొనుగోలుకు సంబంధించి అవసరమైన బాధ్యతలన్నీ వారే నిర్వర్తించాలి. గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను ఈ ఐదుగురు సిబ్బందే ఏర్పాటు చేయాలి. వాటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదు. ఆ భారం రైతులపై పడకుండా చర్యలు తీసుకోవాలి. కృష్ణా జిల్లా గొల్లపూడిలోని రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం ఆరబోస్తున్న మహిళ నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయి పర్యటనలు.. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా చెల్లింపులు జరిపి రైతులకు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలి. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అనే అంశంపై దృష్టి పెట్టండి. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారో లేదో పరిశీలించండి. కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును నిశితంగా గమనించండి. వీటన్నిటిపై వచ్చే మూడు నాలుగు రోజులు దృష్టి పెట్టండి. తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి మీ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలి. సీసీఆర్సీ కార్డ్స్పై మరింత అవగాహన కౌలు రైతులకు సీసీఆర్సీ (క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్) కార్డుల జారీపై అవగాహన కల్పించాలి. సీసీఆర్సీ కార్డుల వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదన్న విషయాన్ని చెప్పాలి. ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక బోనస్ రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అవగాహన పెంపొందించండి. అలా పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి. ప్రత్యామ్నాయ పంటల సాగుపై కార్యాచరణ సిద్ధం చేయండి. వాటి కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపడుతుందన్న విషయాన్ని తెలియచేయాలి. రైతులకు మంచి ఆదాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. సగటున 42,237 టన్నుల కొనుగోలు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు రోజుకు సగటున 42,237 మెట్రిక్ టన్నులకు చేరినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు. సమీక్షలో మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, సీఎస్ సమీర్శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధనరెడ్డి, సివిల్ సఫ్లైస్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, సివిల్ సఫ్లైస్ డైరెక్టర్ ఎస్.డిల్లీరావు, సివిల్ సఫ్లైస్ ఎండీ జి.వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల కోసం ఫోన్ నంబర్ పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో నంబర్ ఏర్పాటు చేయాలి. ఆ నంబర్కు వచ్చే ఫిర్యాదులను సీరియస్గా తీసుకోవాలి. క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులు చెప్పే సమస్యలను వినాలి. దీనివల్ల సమస్య తీవ్రత తెలియడంతోపాటు పరిష్కార మార్గాలు లభిస్తాయి. రైతులతో అధికారులు నిరంతరం సంప్రదించాలి. జేసీల నుంచి కూడా పంటల కొనుగోలుపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. -
ఉదారంగా విపత్తు సాయం
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు మానవతా ధృక్పథంతో ఉదారంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయాల్సిందిగా నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాన్ని కోరారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన కేంద్ర అధికారులతో మాట్లాడుతూ... ఈ విపత్తు హృదయ విదారకరమన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదు. వాస్తవాలు ఎలా ఉంటే అలా ఇచ్చాం. ఎందుకంటే నష్టం అంచనాల తయారీకి మాకు క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలున్నాయి. ప్రతి రైతు పండించే పంటా ఇ–క్రాప్లో నమోదవుతోంది. సోషల్ ఆడిట్ కూడా నిర్వహిస్తున్నాం. ఇ– క్రాప్కు సంబంధించి రైతులకు రశీదులు కూడా ఇచ్చాం., నష్టపోయిన పంటలపై కచ్చితమైన, నిర్ధారించిన లెక్కలున్నాయి’’ అని ఆయన వివరించారు. తాత్కాలిక ప్రాతిపదికన నిధులివ్వాలి క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను అందచేశామని, కోవిడ్ నియంత్రణ చర్యల కోసం వినియోగించినందువల్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు నిండుకున్నాయనే విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి మీకు (కేంద్ర బృందానికి) వివరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పనులు సాఫీగా జరగాలంటే నిధులు అవసరమని, వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన విడుదలకు సహకారం అందించాలని కేంద్ర బృందాన్ని కోరారు. మీ సూచనలు పరిగణలోకి కేంద్ర బృందం సూచనలను పరిగణలోకి తీసుకుంటామని, దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని చేపట్టామని, దీనిద్వారా పెద్ద మొత్తంలో వేగంగా తరలించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రిజర్వాయర్లు, డ్యామ్లపై పరిశీలన జరిపి తగిన చర్యలు చేపడతామని, ఆటోమేటిక్ వాటర్ గేజ్ సిస్టంపైనా దృష్టిపెడతామని చెప్పారు. చేతికందే పంట నీటి పాలైంది... వైఎస్సార్ కడప జిల్లాలో మౌలిక సదుపాయాలు దారుణంగా దెబ్బతిన్నాయని, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం సభ్యుడు, ఎన్ఎండీఏ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ సలహాదారు కునాల్ సత్యార్థి చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట అపార నష్టం జరిగిందన్నారు. తాగునీటి సరఫరా, ఇరిగేషన్కూ తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని, పంట చేతికందే సమయంలో నీటి పాలైందని, శనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు నిబంధనలు సడలించాలి ధాన్యం కొనుగోలు నిబంధనలను సడలించేలా కృషి చేయాలని కేంద్ర బృందాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బ తిన్నందున తేమ, ఇతర నిబంధనల విషయలో సడలింపులు ఇచ్చి ఉదారంగా వ్యవహరించాలని అభ్యర్థించింది. మీ వేగం.. బాగుంది విపత్తు సమయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని, మీ (ముఖ్యమంత్రి జగన్) నాయకత్వంతో ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమని వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం పేర్కొంది. విద్యుత్ సహా అన్నిరకాల శాఖలు చాలా బాగా పనిచేశాయని, అత్యవసర సేవలను వెంటనే పునరుద్ధరించారని తెలిపింది. అంకితభావంతో పనిచేసే అధికారులు మీకున్నారని, క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలన్నీ బాగున్నాయని అభినందించింది. భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర అధికారుల బృందం సభ్యులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై తమ దృష్టికి వచ్చిన అంశాలను తెలియచేశారు. తమ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను కలుసుకున్నామని, ప్రతి ఒక్కరూ వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారని చెప్పారు. వెంటనే నిధుల విడుదలతో తక్షణ సాయం.. ‘ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇంత త్వరగా విద్యుత్తు పునరుద్ధరణ సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం. సహాయ కార్యక్రమాల కోసం కలెక్టర్లకు వెంటనే నిధులిచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి. ఈ డబ్బులతో బాధితులను తక్షణమే ఆదుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును మేం చూడలేదు’ అని కేంద్ర బృందం సభ్యుడు, ఎన్ఎండీఏ, కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్థి పేర్కొన్నారు. జేసీబీలను తరలించి అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారని, సహాయక శిబిరాలను ప్రారంభించి ముంపు బాధితులను ఆదుకున్నారని చెప్పారు. యువకులు, డైనమిక్గా పనిచేసే అధికారులున్నారని అభినందించారు. అధికారులంతా తమకు చక్కటి సహకారాన్ని అందించారన్నారు. వైఎస్సార్ కడప జిల్లాకు భారీ నష్టం తన పర్యటన సందర్భంగా వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించామని, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని కునాల్ సత్యార్థి తెలిపారు. పశువులు మృత్యువాత పడ్డాయని, రోడ్లు, భవనాలు, లాంటి మౌలిక సదుపాయాలతోపాటు ప్రాజెక్టులు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఆనవాయితీగా వరదలొచ్చే ప్రాంతాలు కావు.. అవి సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదని, అలాంటి చోట ఊహించని రీతిలో వర్షాలు కురిశాయని కునాల్ సత్యార్థి పేర్కొన్నారు. ఈ స్థాయిలో వరద ప్రవాహాన్ని మోసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదని చెప్పారు. కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయని, ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యామ్లు కూడా ఆ ప్రాంతంలో లేవన్నారు. ఉన్న డ్యామ్లు, రిజర్వాయర్లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావన్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయని, కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. తీరం దాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదని, అది చాలా రోజులు కొనసాగిందని చెప్పారు. మావంతు సహకారాన్ని అందిస్తాం వరదల వల్ల జరిగిన నష్టంలో 40 శాతం రోడ్లు, భవనాలు రూపేణా జరిగిందని, 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగిందని, ఇరిగేషన్ స్కీమ్ల రూపేణా 16 శాతం మేర నష్టం జరిగిందని కేంద్ర బృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ను వీలైనంత మేర ఆదుకునేలా తమ వంతు సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది. -
రైతులకు బాసటగా నిలవండి.. పార్టీ కేడర్కు బండి సంజయ్ పిలుపు
ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నందున రైతులకు బాసటగా నిలవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డులను సందర్శించి కొనుగోళ్లు జరిపేలా అధికారులపై ఒత్తిడి తేవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ చేపడుతున్న ఆందోళన, నిరసనలు విజయవంతం కావడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో పార్టీలోని అన్ని విభాగాలు తమ కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలన్నారు. సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు చేపట్ట కుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతార హితంగా వ్యవహరిస్తున్నందున రైతులకు బాసటగా నిలవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డు లను సందర్శించి కొనుగోళ్లు జరిపేలా అధికారు లపై ఒత్తిడి తీసుకురావాలని సూచిం చారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానా లపై పార్టీ చేపడుతున్న ఆందోళన, నిరసనలు విజయవంతం కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అనుబంధ మోర్చా లు, అన్ని విభాగాలు తమ కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలన్నారు. వివిధ అంశాలపై సీఎం రెచ్చ గొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు, టీఆర్ఎస్ నాయకుల దాడులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ కార్యక్రమా లపై.. పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేం దర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులతో బండి సంజయ్ చర్చిం చారు.పార్టీ నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి ప్రేమేం దర్రెడ్డి ఒకప్రకటనలో మీడియాకు తెలియజేశారు. పెట్రోధరలు తగ్గించాలని రేపు నిరసనలు:రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు వాట్ను తగ్గించి పెట్రోధరలను తగ్గించడం ద్వారా ప్రజలపై కొంత మేర భారాన్ని తగ్గించినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనవరి 26న దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 27, 28తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రేమేందర్ తెలిపారు. జిల్లా స్థాయిలో డిసెంబర్ 1 నుంచి 15 వరకు, మండల స్థాయిలో డిసెంబర్ 16 నుండి 30 వరకు పార్టీ నాయకులకు శిక్షణా శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
రైతన్నకు అండగా నిలవండి
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు చేపట్ట కుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతార హితంగా వ్యవహరిస్తున్నందున రైతులకు బాసటగా నిలవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డు లను సందర్శించి కొనుగోళ్లు జరిపేలా అధికారు లపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానా లపై పార్టీ చేపడుతున్న ఆందోళన, నిరసనలు విజయవంతం కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అనుబంధ మోర్చా లు, అన్ని విభాగాలు తమ కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలన్నారు. వివిధ అంశాలపై సీఎం రెచ్చ గొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు, టీఆర్ఎస్ నాయకుల దాడులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ కార్యక్రమా లపై.. పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేం దర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులతో బండి సంజయ్ చర్చిం చారు.పార్టీ నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి ప్రేమేం దర్రెడ్డి ఒకప్రకటనలో మీడియాకు తెలియజేశారు. పెట్రోధరలు తగ్గించాలని రేపు నిరసనలు:రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు వాట్ను తగ్గించి పెట్రోధరలను తగ్గించడం ద్వారా ప్రజలపై కొంత మేర భారాన్ని తగ్గించినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనవరి 26న దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 27, 28తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రేమేందర్ తెలిపారు. జిల్లా స్థాయిలో డిసెంబర్ 1 నుంచి 15 వరకు, మండల స్థాయిలో డిసెంబర్ 16 నుండి 30 వరకు పార్టీ నాయకులకు శిక్షణా శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
రూ.10 వేల కోట్లతో వడ్లు కొనలేరా?
సాక్షి, హైదరాబాద్: వడ్ల కొనుగోలుకు ఈ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు వెచ్చించలేదా అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ రాష్ట్ర రైతాంగానికి ఆ మాత్రం చేయలేరా అని నిలదీశారు. ఆదివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనాలంటూ టీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాల్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. కేసీఆర్కు నిజంగా వరి రైతులపై ప్రేమ ఉంటే ఆయన ఢిల్లీ వెళ్లి జంతర్మంతర్ వద్ద దీక్ష ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ప్రత్యేక బడ్జెట్ పెట్టి అయినా రాష్ట్రంలోని ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాల్సిం దేనని డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటమిపై ఢిల్లీ వార్రూంలో ఏఐసీసీ నేతల సమక్షంలో అర్థవంతమైన చర్చ జరిగిందని చెప్పారు. -
రైతుల కోసం నిధులు లేవా?
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చకముందే కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు నిధులు ఖర్చు చేసే స్తోమత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో నిరంజన్రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురిచేసి దెబ్బతిన్న చరిత్రను కేంద్ర ప్రభుత్వం నెమరు వేసుకోవాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తున్న విధానాలను అదే పా ర్టీకి చెందిన రాష్ట్ర నేతలు అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. భారత్లో అనేకమంది ఆహార కొరతతో బాధ పడుతున్నారని, దేశంలో ధాన్యం నిల్వలు పేరు కుపోతున్నా పేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తే ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కొత్త వ్యవసాయ విధానాలను అవలంబించాలని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నా, పంటల మార్పిడి కోసం కేంద్రం ప్రోత్సాహకాలు ఎందుకు ప్రకటించడం లేదని మంత్రి ప్రశ్నించారు. యాసంగిలో బాయిల్డ్ బియ్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇస్తే రైతులు, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత వస్తుందన్నారు. పంటల సాగుపై కేంద్రానికి విధానం లేదు రాష్ట్రాల వారీగా సాగయ్యే పంటల విషయంలో కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి విధానం లేదని నిరంజన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం టీఆర్ఎస్ అధ్వర్యంలో జరిగిన మహాధర్నాపై కాంగ్రెస్ శాసన సభాపక్షం నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. నల్లచట్టాలకు కాంగ్రెస్ పునాదులు వేస్తే, మోదీ ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందన్నారు. శుక్రవారం తమ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా రైతుల కోసం చేశామని, గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నరేంద్ర మోదీ 51 గంటల దీక్ష చేసిన విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చిస్తారని, త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉంటాయని వెల్లడించారు. రైతులు చైతన్యమైతే అద్భుతాలు సృష్టించవచ్చు: నిరంజన్రెడ్డి రైతులను చైతన్యం చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని, వరి సాగు నుంచి రైతుల దృష్టి మళ్లించాలని నిరంజన్రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం హైదరాబాద్లోని ఉద్యాన శిక్షణా సంస్థలో జిల్లా వ్యవసాయాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. అధికారులు మనసుపెట్టి పనిచేస్తే పంటల మార్పిడి వైపు రైతులను మళ్లించడం అసాధ్యమేమీ కాదన్నారు. ఆముదాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని, రైతులు కుసుమలు, ఆముదాల సాగును తిరిగి చేపట్టేలా చూడాలని సూచించారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించడంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పప్పుగింజలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు
హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాల వల్లనే రైతులు బజారున పడ్డారని, దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని, ఈ ఆందోళనలో 600 మంది రైతులు చనిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, యాసంగిలో వరి పంట సాగులో కేసీఆర్ ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా శుక్రవారం హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలోకి రాకుండా మెయిన్ గేట్లు వేయడంతో చాడ ఆధ్వర్యంలో కార్యకర్తలు గేట్లను తొలగించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, రోడ్లపై ధర్నా చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు అనుమతిచ్చిన పోలీసులు, శాంతియుతంగా ధర్నా చేసుకుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలాపి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాలన్నారు. ధర్నాచౌక్ను ఎత్తివేసిన ఇందిరాపార్క్ వద్దే నేడు టీఆర్ఎస్ ధర్నా చేస్తుందని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు. -
రైతుల వేషంలో ఉన్నది బీజేపీ కార్యకర్తలే: పల్లా
సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీకి కనీస అవగాహన లేదని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీ ధర్నాలు చేస్తోందని విమర్శించారు. గురువారం బీజేపీ నిర్వహించిన ధర్నాలో రైతుల వేషంలో ఉన్న బీజేపీ కార్యకర్తలే పాల్గొన్నారన్నారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, సోమ భరత్కుమార్ గుప్తాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,550 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా బీజేపీ నాయకులు సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వానాకాలం పంట కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. కనీస జ్ఞానం లేని వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో పండించే వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నాలు చేయాలని పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. ఇతర రాష్ట్రాల్లో రైతులు తమ దిగుబడులను అమ్ముకునేందుకు బహిరంగ మార్కెట్లకు వెళ్లారని, కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతుల ముగింట్లోకి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసిందీ లేనిదీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. అబద్ధాలతో కొనసాగుతున్న బీజేపీ రాజకీయ ప్రస్థానం రాష్ట్రంలో ఎక్కువ కాలం కొనసాగదని పల్లా అన్నారు. ధర్నా చౌక్ను రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఎత్తివేయలేదని.. స్థానికుల ఫిర్యాదు మేరకే ఆ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. -
బీజేపీ మాటలను నమ్మొద్దు
కరీంనగర్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో దొంగే దొంగ.. అన్న చందంగా బీజేపీ వ్యవహరిస్తోందని, రైతులు ఆ పార్టీ చెప్పే మాటలు నమ్మవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వానాకాలం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. యాసంగి వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ పత్రాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తుంటే.. వానాకాలం వడ్లను కొనుగోలు చేయాలని బీజేపీ ధర్నాలకు దిగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు వానాకాలం వడ్లను కొనుగోలు చేయాలని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధర్నాలు చేయాల్సింది తెలంగాణలో కాదని.. ఢిల్లీలో చేసి యాసంగి వడ్ల కొనుగోళ్లకు కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో అన్ని వివరాలు చూసుకోవచ్చని బీజేపీ నేతలకు సూచించారు. -
కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ధర్నాలు
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపు మేరకు.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మహా ధర్నాకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో జరిగే ఈ ధర్నా కార్యక్రమాలకు సంబంధిత జిల్లా మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు నేతృత్వం వహిస్తారు. సీఎం కేసీఆర్ మినహా రాష్ట్ర మంత్రులందరూ తాము ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజవకర్గ కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొంటారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్ హాజరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు సిరిసిల్లలో, ఆర్థిక, వైద్య శాఖల మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలందరూ ఒకేచోట రైతులకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొంటారు. మరో వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతులతో కలిసి స్థానిక ఎమ్మెల్యేలు ధర్నాలు నిర్వహిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 3వేల మంది చొప్పున సుమారు మూడు లక్షల మంది రైతులు శుక్రవారం జరిగే ధర్నాల్లో పాల్గొంటారని అంచనా. శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ మినహా మిగతా చోట్ల ఎన్నికల కోడ్ అమ ల్లో ఉండటంతో ధర్నాలకు అనుమతి కోరుతూ సంబంధిత నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం వైఖరిని వివరించేలా ధర్నా వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని రాష్ట్ర ప్రజలకు వివరించేలా ఈ ధర్నాను నిర్వహించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం వైఖరిని విమర్శిస్తూ టీఆర్ఎస్ ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. రాష్ట్ర అవతరణ సమయంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, 136 గ్రామాలను ఏపీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ 2014 మే 29న బంద్ పాటించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది డిసెంబర్ 8న జరిగిన రాస్తారోకోలో పార్టీ నేతలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తాజాగా రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన అంశంపై అధికార పార్టీ మరోమారు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవడంతో ధాన్యం కొనాల్సిన కేంద్రం ససేమిరా అంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
AP: దైన్యాన్ని తరిమి.. ధాన్యం భరోసా
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ధాన్యం కొనుగోళ్లతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు( పీఏసీఎస్) ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి. రుణాలు సకాంలో చెల్లించక, బినామీల పేరుతో లక్షలు కొల్లగొట్టడం వంటి చర్యలతో బలహీనపడిన సంఘాలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి. జిల్లాలో సహకార సంఘాలకు ఆర్థిక భారం వెంటాడుతోంది. చంద్రబాబు హయంతలో సహకార స్పూర్తిని దెబ్బతీస్తూ సంఘాలను నిర్వీర్యం చేశారు. టీడీపీ నాయకులు..వారి అనుచరులు ఎక్కడికక్కడ సంఘాల్లో లక్షలు నొక్కేసి ఖజానా గుల్ల చేసేశారు. వైఎస్ చలవతో.. సహకార సంఘాలకు మేలు చేయాలనే తలంపుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో ధాన్యం కొనుగోలు బాధ్యతలు అప్పగించారు. ఒక రకంగా సంఘాల నెత్తిన ఆయన పాలు పోశారని సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. రైతులు తాము పండించిన పంటను సంఘాలకు విక్రయించేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. నాడు వైఎస్ ఏ ఉద్ధేశంతో అయితే వీటికి అనుమతించారో ఆ లక్ష్యం నెరవేరుతూనే ఉంది. ఒకానొక దశలో సంఘాల్లో పనిచేసే సిబ్బందికి కనీసం జీతాలు, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దీనావస్థలో ఉండేవి. ఆ ఇబ్బందులు తొలగి సంఘం సభ్యులకు లాభాలు పంచే స్థాయికి సొసైటీలు చేరుకున్నాయి. వైఎస్ ముందుచూపుతో ఇది సాధ్యమైందనడం ఎలాంటి సందేహమూ లేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మూస బాణీని మార్చుకున్నాయి. రైతులకు పంట రుణాలు, ఎరువులు విక్రయం, పెట్రోల్ బంక్ల నిర్వహణ, గోదాముల నిర్మాణం, వాటర్ ప్లాంట్ల ఏర్పాటు వంటి చర్యలతో ధాన్యం కొనుగోళ్లు కూడా చేపడుతున్నాయి. రైతుల పండించే వరి, మొక్కజొన్న తదితర పంటలు కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి.ఈ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా వచ్చే కమీషన్తో సంఘాల్లో మౌలిక వసతులు కలి్పంచడంతో పాటు సభ్యులకు బోనస్ ఇచ్చే స్థాయికి చేరుకున్నాయి. కమీషన్లతో ఆర్జన తూర్పు గోదావరి జిల్లాలో సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ద్వారా సహకార సంఘాలకు రూ.5 కోట్లు కమీషన్ రూపంలో ఆర్జిస్తున్నాయి. జిల్లాలో 401 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో సీజన్లో కనీసం 375 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోళ్లతో సమకూరిన ఆదాయాలతో జిల్లాలో సగానికి పైగా సంఘాలు ఆరి్థకంగా బలోపేతమవుతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సైతం ధాన్యం కొనుగోళ్లుకు సంఘాలు సిద్ధపడుతున్నాయి.ఈ మేరకు సహకార అధికారులు సంఘాలను సమాయత్తం చేస్తున్నారు.ఈ సారి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహకార సంఘాలు తోడ్పాటుతో ఆర్బీకేలలో కొనుగోలు చేయనున్నారు. గతం నుంచి పెండింగ్లో ఉన్న కమీషన్లను త్వరలో విడుదల కానున్నాయని సమాచారం. ఇందుకు కసరత్తు జరుగుతోందని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. మచ్చుకు కొన్ని... ►ముమ్మిడివరం మండలం ఠాణేలంక పీఏసీఎస్ గతేడాది 80 వేల క్వింటాళ్ల కొనుగోలు చేసింది. ప్రభుత్వం ఒక క్వింటాలు ధాన్యం కొనుగోలుకు రూ.31.25 కమీషన్గా ఇస్తోంది. 80 వేల క్వింటాళ్ల కొనుగోలుపై ఈ సంఘానికి రూ.24 లక్షలు కమీషన్గా ఆదాయం సమకూరింది. ►పి.గన్నవరం మండలం నాగల్లంక పీఏసీఎస్ 74 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రూ.23 లక్షలు కమీషన్ రూపంలో లాభపడింది. ►జిల్లాలో 2019– 2020 ఖరీఫ్ సీజన్లో 244 కేంద్రాల ద్వారా రూ.2,300 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించాయి. ►ప్రతి సీజన్లోను సొసైటీలు రూ.2000 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలు చేస్తూ వచ్చాయి. ►కొనుగోలుచేసే ధాన్యంపై క్వింటాల్కు ఏ–గ్రేడ్ ధాన్యానికి రూ.32, కామన్రకం «ధాన్యానికి రూ.31.25 వంతున కమీషనుగా సంఘాలకు ప్రభుత్వం జమ చేస్తుంది. – ►రెండు నెలల వ్యవధిలోనే ఆదాయం వస్తుండటంతో కొనుగోళ్లపై సంఘాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ►కమీషన్ త్వరితగతిన అందచేస్తే మరింత కొనుగోళ్లు ఊపందుకుంటాయని సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. సంఘాల తోడ్పాటుతో కొనుగోలు ఇలా.. ఈ సీజన్లో ప్రభుత్వం తొలిసారి వినూత్నంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తోంది. సహకార సంఘాల తోడ్పాటుతో ఆర్బీకేల వద్దనే కొనుగోలు చేయనుంది. జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశాల మేరకు సహకార సంఘాలను అప్రమత్తం చేసేందుకు శనివారం జిల్లా సహకార అధికారి దుర్గాప్రసాద్ పీఏసీఎస్ అధికారులతో డివిజన్ వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. రైతులు నేరుగా పంట పొలాలకు సమీపాన ఉన్న ఆర్బీకేల వద్దనే ధాన్యం అమ్ముకునే వెసలుబాటు కలి్పస్తోంది. జిల్లాలో 900పైనే ఆర్బీకేలను గుర్తించారు. ధాన్యం లభించే ప్రాంతాన్ని బట్టి ఆర్బీకేలను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి అవసరాన్ని బట్టి ఉద్యోగులను నియమించనున్నారు. ఏ గ్రూపు(ధాన్యం ఎక్కువగా కొనుగోలు)లో నలుగురు, బీ గ్రూపులో ముగ్గురు, సీ గ్రూపులో ఒకరు వంతున పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంఘాల్లోని సుమారు 600 మంది ఉద్యోగులను వినియోగించనున్నారు. వీరితో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 1800 మంది సిబ్బంది ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వామ్యం వహించనున్నారు. సంఘాలు బలపడుతున్నాయి ప్రభుత్వ లక్ష్యం మేరకు సంఘాల తోడ్పాటుతో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సంఘం పరిధిలో రెండు, మూడు ఆర్బీకేలు ఉండటంతో తగ్గట్టుగా సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కమీషన్తో సహకార సంఘాలు ఆర్థికంగా బలపడతాయి. కమీషన్తో సంఘాలను సహకారశాఖ అధికారులు మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. –ఇ లక్ష్మీరెడ్డి, జిల్లా మేనేజర్, పౌరసరఫరా కార్పొరేషన్ -
8,774 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు
సాక్షి, అమరావతి: మిల్లర్ల పాత్రను పూర్తిగా తగ్గిస్తూ రైతులకు మరింత మేలు చేకూర్చేలా ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విజయవాడలో భేటీ అయ్యింది. మంత్రులు కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, కొడాలి నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం విజయవాడలో సమావేశమై ధాన్యం సేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇకనుంచి ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఒక్క రైతు కూడా తాను పండించిన ధాన్యం అమ్ముకునేందుకు పక్క గ్రామానికి వెళ్లే అవసరం లేకుండా స్వగ్రామంలోనే అమ్ముకునేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. వరి సాగయ్యే ప్రాంతాల్లో ఉన్న 8,774 ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా తీర్చిదిద్దబోతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారం నుంచి ఆర్బీకేల్లో కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ధాన్యం సేకరణకు నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్, పౌరసరఫరాలశాఖ సంయుక్తంగా ధాన్యం సేకరణ చేపట్టాలని ఆదేశించారు. నూటికి నూరుశాతం కనీస మద్దతు ధరకే రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై సీఎంకి నివేదిక సమర్పిస్తామని, ఆయన ఆదేశాల మేరకు విధివిధానాలు రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు ‘సాక్షి’కి చెప్పారు. బంద్ చేస్తే ప్రత్యామ్నాయం చూసుకుంటాం: మంత్రి కొడాలి రేషన్ డీలర్లు బంద్ చేసినంత మాత్రాన బియ్యం సరఫరా నిలిచిపోదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి బంద్ చేస్తామంటూ డీలర్లు మొండిపట్టుపడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. గన్నీ బ్యాగులు, యూజర్ చార్జీల విష యంలో రేషన్ డీలర్లకు సమస్య ఉందన్నారు. కరోనా కారణంగా రాష్ట్రం ఇచ్చే బియ్యం కాకుండా కేంద్రం కూడా రేషన్ ఇస్తోందని చెప్పారు. కేంద్రం కిలోకి 35 పైసల కమీషన్ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మరో 65 పైసలు కలిపి రూపాయి కమీషన్ ఇస్తోందని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన పేమెంట్ పెండింగ్లో ఉందని చెప్పారు. సమస్యలు ఉంటే చర్చించుకోవాలే తప్ప ధర్నాలు, బంద్లు చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. డీలర్ల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారానికి కృషిచేస్తామని, అయితే డెడ్లైన్లు పెడితే కుదరదన్నారు. ప్రజలకు బియ్యం వెళ్లకుండా చేస్తాం.. అంటే ఊరుకునేది లేదని, రేషన్ డీలర్లు 1వ తేదీన బంద్ చేస్తామంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామన్నారు. -
తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో ఉండనున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. ఈ స్థాయిలో సేకరణకు వీలుగా 6,500కుగా పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తోంది. ఇప్పుడిప్పుడే కోతలు మొదలైన దృష్ట్యా..అవసరాలు, ప్రాధాన్యాలకు తగ్గట్లుగా కేంద్రాలను తెరవనుంది. వారం, పది రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం సేకరణ మొదలుకానుంది. గణనీయంగా పెరిగిన సాగు ప్రస్తుత వానాకాలంలో వరి సాధారణ విస్తీర్ణానికి మించి సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 16.73 లక్షల హెక్టార్లు కాగా, నీటి లభ్యత గణనీయంగా పెరగడంతో ఈసారి ఏకంగా 24.99 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. సాగైన విస్తీర్ణానికి తగ్గట్లుగా కనీసం 1.33 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుం దని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో గృహావసరాలకు 14.23 లక్షల మెట్రిక్ టన్ను లు, విత్తన అవసరాలకు 4.86 లక్షల మెట్రిక్ టన్నులు పక్కనపెట్టినా, 1.13 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వస్తుందని అంచ నా ఉంది. ఇందులో మిల్లర్లు 12.49 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేసినా, మిగ తా ధాన్యం అంటే 1.01 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ లెక్కలేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా కోతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మరో 10 రోజుల తర్వాత నుంచి ఉధృతం కానున్నాయి. వాస్తవానికి గత సోమ వారం నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా ఇప్పటివరకు పదుల సంఖ్యలో కూడా కేంద్రాలు తెరవలేదు. గన్నీ బ్యాగులతో పాటు టార్పాలిన్లు, తూకం కొలిచే యంత్రాలు, తేమ కొలిచే మిష న్లు మొదలైన వాటిని సమకూర్చుకునే పనిలో పడ్డాయి. కేంద్రాలు ప్రారంభమైతే ఏ ఒక్క సమస్య ఎదురైనా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితులు ఉండటంతో అన్నింటినీ ముం దే సమకూర్చుకోవాలని జిల్లా యంత్రాంగాలు భావిస్తున్నాయి. అవసరమైనవెన్ని.. అందుబాటులో ఉన్నవెన్ని అనే లెక్కలను పౌరసరఫరాల శాఖకు పంపిన జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను గుర్తించే పనిలో పడ్డారు. యాసంగిలో రికార్డు స్థాయి కొనుగోళ్లు గత ఏడాది యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే గత ఏడాది వానాకాలంలో కేవలం 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా, ఈ ఏడాది అంతకు రెండింతలకు పైగా ధాన్యం సేకరణ జరగనుంది. జిల్లాల వారీగా చూస్తే అధికంగా నిజామాబాద్ జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటుందని లెక్కలు వేయగా, సిద్దిపేట జిల్లాలో 6.86 లక్షలు, జగిత్యాల జిల్లాలో 6.57 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 5.80 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ తేల్చింది. -
ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్టేట్ వర్సెస్ కేంద్రం
-
కుప్పలు కుప్పలుగా వస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం సేకరణ ఎంతకీ ముగియడం లేదు. అంచనాలకు మించి ఇప్పటికే 83.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినా.. మరో 4.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరగాల్సి ఉందని పౌర సరఫరాల శాఖ లెక్కగడుతోంది. ఎంత ధాన్యం రావచ్చన్న దానిపై జిల్లాల అధికారులు ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగానికి సమాచారమిచ్చారు. ఇందులో వనపర్తి జిల్లా నుంచి 95 వేల టన్నులు, మెదక్ 84 వేలు, ఖమ్మం 73 వేలు, నారాయణపేట 56 వేలు, సిద్దిపేట 50 వేలు, నాగర్కర్నూలు 50 వేల మెట్రిక్ టన్నుల మేర వచ్చే అవకాశాలున్నాయని నివేదించారు. అంటే మొత్తంగా 87.95 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు అదనంగా ప్రస్తుత సేకరణకు మరో రూ.2 వేల కోట్లు అవసరం ఉండటంతోపాటు మరో 2 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయని లెక్కలేశారు. ఈ నిధుల సేకరణ, గన్నీ సంచుల సేకరణకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిధుల అంశమై మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలోనూ మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తావించినట్లు సమాచారం. సేకరణను ఈ నెల 10లోగా ముగించాలని భావించినా, భారీగా ధాన్యం వస్తున్న జిల్లాల్లో ఈ నెల 20 వరకు సేకరణ జరపాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. లారీల కొరత, వానలు, మిల్లుల్లో ఖాళీ కాని ధాన్యం వంటి కారణాలతో సేకరణ కత్తిమీది సాములా మారుతోంది. కొన్నిచోట్ల నెలరోజులుగా పడిగాపులే.. రాష్ట్రం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నా కొన్ని ప్రాంతాల్లో నెలరోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు. ఆవేదనతో అధికారుల కాళ్లావేళ్లాపడుతూ కొన్నిచోట్ల ధాన్యాన్ని అధికారుల ముందటే తగలబెడుతున్నారు. నిస్సహాయ స్థితిలో అన్నదాతలు మిగిలిపోతున్నారు. ఈ సమస్యను సరిగ్గా అంచనా వేయకపోవడం, సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోలేకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. దీనికితోడు కొన్ని జిల్లాల్లో రైస్ మిల్లులు లేవు. ఆ జిల్లా ధాన్యాన్ని పొరుగున ఉన్న జిల్లాలకు కేటాయించారు. ఆ మిల్లర్లు సొంత జిల్లాల్లో సేకరణ పూర్తయితే తప్ప.. మరో జిల్లా నుంచి ధాన్యం తీసుకోవడంలేదని సమాచారం. వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండటానికి కనీసం గన్నీ బ్యాగులనూ సమకూర్చడం లేదని అంటున్నారు. ఈక్రమంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పంట కోసం తెచ్చిన అప్పులు చెల్లించలేక, కౌలు ఇవ్వలేక నానా అవస్థలు పడుతున్నారు. అంచనాకు మించి సేకరణ జరిగిన జిల్లాలు: నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ రూరల్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, నారాయణ పేట, భూపాలపల్లి, గద్వాల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, జగిత్యాల. -
కేంద్రంతో మాట్లాడే బాధ్యత మాది: సీఎం జగన్
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. ఈ విషయాన్ని నిస్సందేహంగా చెబుతున్నా. విత్తనాలు మొదలు పంట అమ్ముకునే వరకూ అండగా ఉంటున్నాం. మంచి మనసుతో రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో గత 18 నెలలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. పంటల బీమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతులకు గుదిబండ కాకుండా వారి తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ఏకంగా 50 లక్షల మంది రైతులకు చెందిన కోటి 14 లక్షల ఎకరాలకు బీమాను వర్తింప చేస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పంటల బీమా పట్ల రైతుల్లో విశ్వసనీయత కల్పించామని, పంట నష్టపోతే ఇప్పుడు పంటల బీమా పరిహారం వస్తుందనే నమ్మకం వారిలో కలిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో పంటల బీమాపై నమ్మకం లేదని, అందుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని తెలిపారు. నష్టపోయిన రైతులకు బీమా కల్పించకపోగా, ప్రీమియం పేరుతో వందల కోట్ల రూపాయల భారం వారిపై మోపిందన్నారు. రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా తన కళ్లతో చూశానని, అందుకే పంటల బీమా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. 2019 సీజన్కు సంబంధించి పంటలు కోల్పోయిన 9.48 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి రూ.1,252 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పంటల బీమా లబ్ధిదారులైన రైతులనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నాడు మూడు భాగాలుగా.. ► గతంలో ఇన్సూరెన్స్ పరిస్థితి దారుణం. ఇన్సూరెన్స్ ప్రీమియంను రైతులు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేర్వేరుగా మూడు భాగాల్లో కట్టేవారు. దీంతో రైతుల తరఫున సంప్రదించడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో ఇన్సూరెన్స్ సక్రమంగా వచ్చేది కాదు. అందువల్ల చాలా తక్కువ మంది రైతులు బీమా చేయించే వారు. పాదయాత్రలో రైతుల కష్టాలన్నీ స్వయంగా చూశాను. 2012 ఏడాదికి సంబంధించిన ఇన్సూరెన్స్ రాలేదు. మన ప్రభుత్వం వచ్చాక వారికి ప్రీమియం చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఆ బీమా పరిహారం ఇప్పించాం. ► 2016–17, 2017–18, 2018–19 వరకు రైతులు ఏటా సగటున రూ.290 కోట్ల ప్రీమియమ్ మాత్రమే కట్టారు. అప్పటి ప్రభుత్వం తన వాటాగా సగటున చెల్లించిన ప్రీమియం కేవలం రూ.393 కోట్లు మాత్రమే. ► 2016–17లో 17.79 లక్షల మంది రైతులు, 2017–18లో 18.22 లక్షలు, 2018–19లో 24.83 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఏటా సగటున 20 లక్షల మంది రైతులు కూడా బీమా చేయించుకోని పరిస్థితి. అడుగడుగునా అండగా నిలుస్తున్నాం ► మన ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక అన్ని విధాలా రైతులకు అండగా నిలిచింది. అందుకే రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటా రూ.468 కోట్లతో పాటు, ప్రభుత్వ వాటా రూ.503 కోట్లు.. రెండూ కలిపి రూ.971 కోట్ల ప్రీమియం చెల్లించింది. ► ఇప్పుడు మన ప్రభుత్వం అక్షరాలా 49.80 లక్షల మంది రైతుల తరపున ప్రీమియం కడుతోంది. అప్పట్లో మూడేళ్లలో సగటున కేవలం 23.57 లక్షల హెక్టార్లు మాత్రమే బీమా పరిధిలోని వస్తే, ఇప్పుడు 45.96 లక్షల హెక్టార్లు, అంటే 1.14 కోట్ల ఎకరాలను ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చాం. ► విత్తనం వేసినా పంట పండని పరిస్థితులు ఉన్నప్పుడు, కరువు, వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు త్వరితగతిన పరిహారం అందేలా మన ప్రభుత్వం మనసు పెడుతోంది. ఇన్సూరెన్స్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే బాధ్యతను కూడా ప్రభుత్వ భుజస్కంధాలపై వేసుకున్నాం. ఇందుకు ఈ రోజు రైతులకు ఇస్తున్న ఈ పంటల బీమా పరిహారమే ఉదాహరణ. ► బీమా పరిహారాన్ని డిసెంబర్ 15వ తేదీన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో, అసెంబ్లీ సమావేశాలకు ముందు క్యాబినెట్ సమావేశంలో చెప్పాం. ఇవాళ ఆ మాట నిలబెట్టుకున్నాం. ఆర్బీకేలతో అన్ని విధాలా భరోసా ► రాష్ట్రంలో ఇవాళ 10,641 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) గ్రామ సచివాలయాలకు అనుసంధానమై పని చేస్తున్నాయి. అన్ని పంటల ఈ–క్రాపింగ్ జరుగుతోంది. ఆ వివరాలను ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నాం. ► ఏ సీజన్లో జరిగిన పంట నష్టంపై అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం. ఇటీవల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఈ నెల 31న ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తాం. ► ఈ–క్రాప్లో నమోదైన ప్రతి రైతుకు లాభం ఉంటుంది. రైతుల బీమా కూడా కట్టి, ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నాం. ఈ–క్రాప్ ద్వారా చాలా వేగంగా పరిహారం ఇచ్చే వీలుంటుంది. కులం, మతం, రాజకీయం చూడకుండా అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తున్నాం. ► 2020 ఖరీఫ్ పంట కోతలు వచ్చే ఏడాది జనవరిలో పూర్తి అయితే, పంట నష్టపోయిన రైతులకు సంబంధించి ఫిబ్రవరిలో నివేదిక తీసుకుని.. మార్చి, ఏప్రిల్లోనే బీమా పరిహారం ఇస్తాం. ఆ డబ్బు వారికి వచ్చే ఖరీఫ్కు ఉపయోగపడుతుంది. రంగు వెలిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇది చరిత్రలో తొలిసారి. గ్రేడెడ్ ఎమ్మెస్పీ ఇచ్చి ఆ కార్యక్రమం అమలు చేస్తాం. రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.కన్నబాబు, సి.వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు. మీరే మా ధైర్యం భారీ వర్షాలు వచ్చినా, బీమా సొమ్ము అందుతుందని ధీమాగా ఉన్నాం. మేము అడగక ముందే మీరు అన్నీ ఇచ్చేస్తున్నారు. నాకు, మా అమ్మకు, చెల్లికి పంటల బీమా కింద రూ.1 లక్షా 69 వేలు అందింది. గతంలో పరిహారం వస్తుందో రాదో తెలీదు. వచ్చినా అరకొరే. మీ హయాంలో వ్యవసాయం పండగలా ఉంది. మీరే మా ధైర్యం. ఆర్బీకేల వల్ల ఎంతో ఉపయోగం ఉంటోంది. మా మండలానికి రూ.5 కోట్ల 26 లక్షల బీమా సొమ్ము వచ్చింది. జిల్లాలో ఇదే అత్యధికం. – కె.వీరరాజు, పెదపూడి, తూర్పు గోదావరి మీరు చల్లగా ఉండాలి నాకు పంట నష్టం కింద రూ.7 వేలు వచ్చింది. ఇది వరకు విత్తనాల కోసం అనంతపురానికి రెండు, మూడు రోజులు తిరగాల్సి వచ్చేది. మీ పుణ్యమా అని మాకు ఆ బాధ తప్పింది. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు మీరు మాకు అండగా నిలుస్తున్నారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా కానుక, పింఛన్లు.. ఇలా అన్నీ అందుతున్నాయి. మీరు చల్లగా ఉండాలి. మా కరువు జిల్లాను గుర్తించి కొత్తగా మూడు రిజర్వాయర్లు కడుతున్నందుకు ధన్యవాదాలు. – వెంకటలక్ష్మి, నర్సినీకుంట, రాప్తాడు మండలం, అనంతపురం రైతును నిలబెట్టిన ఏకైక సీఎం మీరే రైతు దేశానికి వెన్నెముక అని చాలా మంది పోసుకోలు కబుర్లు చెప్తారు. వరుస కరువులు, అతివృష్టి వల్ల రైతు వెన్నెముక వంగిపోయే పరిస్థితుల్లో.. మీరు రైతు వెన్నెముకను నిటారుగా నిలబెట్టారు. ఇలా చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి మీరే. దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడు. నాకు నాలుగూ ముక్కాలెకరా పొలం ఉంది. గత ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.8 వేల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, నేను కేవలం ఒక్క రూపాయి మాత్రమే కట్టాను. ఇప్పుడు నాకు రూ.40 వేల పరిహారం వచ్చింది. వర్షాలకు పంట నష్టపోతే నెలకే పరిహారం ఇచ్చిన ఘనత మీదే. – తిరుమలరెడ్డి, వీఎన్ పల్లి, వైఎస్సార్ కడప అందరి గుండెల్లో చిరస్థాయిగా.. నేను దళిత రైతుని. నాలుగెకరాల పొలంలో సాగు చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చాక రైతు కేవలం ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించేలా మీరు నిర్ణయం తీసుకున్నారు. మా మండలంలో 4,700 మంది రైతులకు రూ.4 కోట్ల 90 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది. నాకు రూ.4,065 వచ్చింది. రైతులందరి తరఫున మీకు ధన్యవాదములు. మీరు అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రతి ఒక్కరి గుండెల్లో మీరు చిరస్థాయిగా నిల్చిపోతారు. – అడిపి సుందరకుమార్, యర్రగొండ పాలెం, ప్రకాశం జిల్లా -
రైతు పక్షపాత ప్రభుత్వమిది
మండపేట: తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో రూ.10,500 కోట్లు జమచేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలకరి ధాన్యం కొనుగోళ్లకు శుక్రవారం ఆయన శ్రీకారం చుట్టారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తోట త్రిమూర్తులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని సొసైటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.130 కోట్ల విలువైన పొగాకు కొనుగోళ్లు చేసిందని తెలిపారు. రైతులు సాగు వివరాలను ఆర్బీకేలో నమోదు చేసుకుంటే వాటి కొనుగోలు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గతేడాది మార్కెటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.17 వేల కోట్లు విలువైన ధాన్యం, రూ.3,200 కోట్లతో ఇతర పంటలను కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా నిర్ణయించామని మంత్రి తెలిపారు. -
రబీ రికార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూస్తోంది. రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో రైతుల నుండి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆగస్ట్ నెలాఖరు వరకు రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ.. నెల్లూరు వంటి జిల్లాల్లో ఆలస్యంగా కోతలు ప్రారంభించడం, ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో అక్కడక్కడా ధాన్యం తడిసిపోయింది. దానిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సీజన్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వమే అక్కడి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులకు ఉపశమనం కల్పిస్తోంది. సీజన్ ముగిసినా కొనుగోళ్లు ► 2019–20 ఆర్థిక సంవత్సరంలో 1,442 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.6,088.51 కోట్లు విలువ చేసే 32.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ► ఇంకా రైతుల వద్ద మిగిలిపోయిన ధాన్యాన్ని అక్టోబర్ 31వ తేదీ వరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ► గ్రామ స్థాయిలోనే ధాన్యం సేకరించడం వల్ల కొనుగోలు కేంద్రాలు లేదా మిల్లులకు తరలించేందుకు అయ్యే రవాణా చార్జీల భారం నుంచి రైతులు బయటపడ్డారు. ► లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా ఈసారి కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు, అండమాన్, నికోబార్ దీవులకు బియ్యం పంపించి మన రాష్ట్రం అక్కడి ప్రజల ఆహార కొరత తీర్చగలిగింది. ► ఖరీఫ్లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలనే లక్ష్యంతో ప్రణాళికలను సిద్ధం చేశారు. -
అక్టోబర్ 31 వరకు ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసేందుకు వీలుగా నెల్లూరు జిల్లా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తడిసిన ధాన్యంతో పాటు మిగిలిన ధాన్యం సేకరించేందుకు అక్టోబర్ 31వ తేదీ వరకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తడిచిన ధాన్యం పరిశీలనకు కేంద్ర పౌరసరఫరాలశాఖ అధికారులు ఎం.జెడ్.ఖాన్(పాట్నా), యతేంద్ర జైన్(పూనా) ఈనెల 21న రాష్ట్రానికి రానున్నారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 82 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. నాట్లు ఆలస్యంగా వేయడం, వర్షాలు అధికంగా రావడం వల్ల చాలా వరకు ధాన్యం తడిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం లేఖకు స్పందించి అనుమతులు ఇస్తూ కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి రాసిన లేఖ ఇందులో ఎన్ఎల్ఆర్– 3354 రకం ధాన్యం ఎక్కువగా తడిచిపోయింది. తడిచిన, మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్ కేంద్రానికి లేఖ రాశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ఆహార శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన కేంద్రం శుక్రవారం అనుమతులు జారీ చేసింది. ప్రతి గింజా కొనుగోలు చేస్తాం రైతుల నుంచి ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. తడిచిన, మిగిలిన ధాన్యాన్ని అక్టోబర్ 31లోగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తాం. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దు. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ -
రైతుల చేతికే గోనె సంచులు!
ధాన్యం కొనుగోళ్లు సమయంలో ఏటా ఎదురవుతున్న గోనె సంచుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందునుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియను పక్కాగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. పొరుగు జిల్లా విజయనగరంలో విజయవంతమైన రైతులకే గోనె సంచులు అందించే విధానాన్ని ఇక్కడ కూడా ఈ ఏడాది అమలు చేయనున్నారు. వీరఘట్టం/పాలకొండ: రైతుల కోసం వైఎస్సార్కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమం కార్యక్రమాలను చేపడుతోంది. రైతులు ఆరుగాలం శ్రమించి పండిస్తున్న వరి ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందుల్లేకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో 2.15 లక్షల హెక్టార్లలో వరిసాగవుతోంది. గతేడాది వచ్చిన దిగుబడుల ప్రకారం ఈసారి 10.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో బీపీటీలు, సాంబమసూరి వంటి వాణిజ్య ప్రాధాన్యం ఉన్న రకాలు స్థానిక అవసరాల కోసం తీసివేయగా 7.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సొసైటీలు, రైతుభరోసా కేంద్రాలు సంయుక్తంగా ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సిద్ధంగా 50 శాతం గోనె సంచులు ఏటా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపడుతున్నప్పటికీ గోనె సంచుల కొరత వేధిస్తోంది. రైతులకు అవసరమైనప్పడు సంచులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా గోనె సంచుల ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అధికారుల లెక్క ప్రకా రం 7.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు 1.50 కోట్లు సంచులు అవసరం ఉంది. గతేడాది మిల్లర్లకు ఇచ్చిన 50 లక్షల గోనె సంచులు వారి వద్దే ఉన్నాయి. అధికారుల వద్ద మరో 25 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల కోసం 50 శాతం సంచులు సిద్ధంగా ఉన్నట్టే. ఇంకా కావాల్సిన సంచుల కోసం పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తోంది. పొరుగు జిల్లా మాదిరిగానే.. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో ఏటా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నప్పుడు కావాల్సిన గోనె సంచులను రైతులు లేదా మిల్లర్లు సమకూర్చుతున్నారు. దీంతో రైతు నుంచి గోనె సంచి రూపంలో అదనంగా రెండు కిలోల ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుంటున్నారు. ఈసారి ఇలాంటి ఇబ్బంది లేకుండా పక్క జిల్లా విజయనగరంలో అమలు చేస్తున్న మాదిరిగానే ధాన్యం కొనుగోళ్లు సమయంలో రైతులకు కావాల్సిన గోనె సంచులను ప్రభుత్వమే అందించనుంది. తర్వాత ఈ గోనె సంచిలో మిల్లుకు చేరిన ధాన్నాన్ని మిల్లింగ్ చేసి అదే గోనె సంచిలో మరలా సీఎంఆర్ కింద బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగిస్తారు. అంతా పారదర్శకంగానే.. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కొనుగోళ్లు కేంద్రాల ద్వారా గోనె సంచులు (50 కిలోల బస్తా)ను రైతులకు ఇచ్చి..వారి నుంచి ధాన్యం సేకరించి మిల్లర్లకు అప్పగిస్తాం. అదే బస్తాలో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లర్ నుంచి సేకరిస్తాం. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఇదే పద్ధతిలో ఏటా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే పద్ధతి అనుసరిస్తాం. –ఎ.కృష్ణారావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, శ్రీకాకుళం -
ముమ్మరంగా.. ధాన్యం కొనుగోళ్లు
వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే.. పండే పంటలో మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలి. కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను సేకరించడంతో పాటు మార్కెట్ కల్పించేలా చూడాలి. ఈ విధానాన్ని వ్యవస్థీకృతం చేసుకుంటేనే ధరల స్థిరీకరణ జరుగుతుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు వస్తే ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుపాన్ను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లను ఉధృతం చేయాలని, కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వీలైనంత త్వరగా కొనుగోలు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. వర్షాల వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలన్నారు. కోవిడ్–19 విపత్తు నేపథ్యంలో రైతుల ఉత్పత్తుల కొనుగోళ్లు, ఎంఫాన్ తుపాన్ సంసిద్ధత అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. సర్వసన్నద్ధంగా ఉండాలి ► తుపాను ఏపీ వైపు వస్తే ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా ఉండాలి. తుపాను కదలికల్ని ఎప్పటికప్పుడు గమనించాలి. విద్యుత్, రెవెన్యూ, పౌర సరఫరాలు, వైద్య శాఖ సన్నద్ధంగా ఉండాలి. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి. ► వేట నిషేధ సమయమే అయినప్పటికీ.. బోట్లలో సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. తుపాన్ను ఎదుర్కోవడానికి, తగిన చర్యల కోసం కొంత మంది అధికారులను సిద్ధం చేసుకోవాలి. ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. ► తుపాన్ దృష్ట్యా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. ధాన్యం సేకరణలో మరింత ఉధృతంగా ఉండాలి. కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంత వరకూ కొనుగోలు చేయాలి. వర్షాల వల్ల దెబ్బ తినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలి. ► ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిషబుల్ గూడ్స్ (త్వరగా పాడయ్యేవి)ను ఈ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. -
ధాన్యం కొనుగోళ్లు మొదలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ఏర్పాటైన కొనుగోలు కేంద్రాలకు మొదటి రోజు 4773.360 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి క్వింటాల్కు రూ. 1,835, సాధారణ రకం క్వింటాల్కు రూ. 1,815లు ధాన్యానికి ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. ధర విషయంలో దళారుల చేతిలో రైతులు మోసపోకూడదనే ఉద్దేశంతో ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 48 గంటల్లో నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. – రబీ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం కేంద్రాలు ప్రారంభించిన వెంటనే మూడు జిల్లాల్లోని 34 మండలాల రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చారు. – చిత్తూరు జిల్లాలోని కె.వి.పి.పురం, రేణిగుంట, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు 354.920 మె.ట ధాన్యం వచ్చింది. – నెల్లూరు జిల్లాలోని అల్లూరు, అనుమసముద్రంపేట, ఆత్మకూరు, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, చిత్తమూరు, డక్కిలి, గూడూరు, జలదంకి, కలిగిరి, కలువాయి, కావలి, కొడవలూరు, కోట, కోవూరు, మనుబోలు, ముత్తుకూరు, నాయుడుపేట, నెల్లూరు, ఓజిలి, పెళ్లకూరు, పొదలకూరు, సంగం, సూళ్లూరుపేట, వాకాడు, వెంకటాచలం, విడవలూరు మండలాల్లోని కేంద్రాలకు 4,317.640 మె.ట ధాన్యం వచ్చింది. – పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు, పెదపాడు మండలాల్లోని కేంద్రాలకు 100.800 మె.ట ధాన్యం వచ్చింది. 75 రోజుల పాటు కేంద్రాలు లాక్డౌన్ నేపథ్యంలోనూ రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయి. దీంతో రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. 75 రోజుల పాటు కేంద్రాలు పని చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రబీ సీజన్లో కోతలు ప్రారంభం కావడంతో అవసరాన్ని బట్టి కేంద్రాలు ప్రారంభించనున్నారు. కృష్ణా, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో కోతలు కొంత ఆలస్యంగా ప్రారంభంకానున్నాయి. అవసరాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1,280 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సీజన్లో 30 లక్షల మె.ట పైగా ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. -
సాక్షి ఎఫెక్ట్: వేటు మొదలైంది..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై వేటు మొదలైంది. తొలుత ఇద్దరు వీఆర్వోలను, జిల్లా పౌరసరఫరాల కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ చేశారు. అక్రమాలను ప్రోత్సహించేలా చోద్యం చూశారని వీరిపై చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేశారు. తేమ శాతం తక్కువ ఉందని, 1075 రకాన్ని మద్దతు ధరకు తీసుకోమని చెప్పి తక్కువ ధరకు తీసుకున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అలాగే ఒడిశా నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు కేంద్రాల్లో బినామీ రైతుల పేరున ఆన్లైన్ చేసి ప్రభుత్వ మద్దతు ధరను కొట్టేశారు. దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ వీఆర్వోలు పట్టించుకోలేదు. మిల్లర్లకు పరోక్షంగా సహకరించారు. ప్రత్యేక అధికారుల తనిఖీల్లో వీరి నిర్లక్ష్యం, నిర్వాకం బయటపడింది. దీంతో సీరియస్గా తీసుకున్న కలెక్టర్ వారిపై సెస్పెన్షన్ వేటు వేశారు. కలెక్టర్ ఆదేశాలతో కదలిక రైతుల గోడును కళ్లారా చూశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని రైతుల నోట నుంచి విన్నారు. పండించిన ధాన్యానికి సంబంధించి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇక్కట్లను దగ్గరుండి గమనించారు. దీంతో ధాన్యం కొనుగోళ్లు వ్యవహారాన్ని కలెక్టర్ జె.నివాస్ సీరియస్గా తీసుకున్నారు. ఎంత పకడ్బందీగా వ్యవహరించినా పరిస్థితిలో మార్పు రాలేదని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సైతం ప్రతిష్టాత్మకంగా భావించారు. అధికారులందరినీ పరుగులు తీయించారు. అక్రమాలకు పాల్పడినా, ధాన్యం తీసుకోవడానికి వెనకడుగు వేసినా మిల్లులు సీజ్ చేసే అధికారాన్ని ఇచ్చారు. మిల్లుల వద్ద వీఆర్వోలను, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆర్ఐలను నియమించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తహశీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో కొందరు మిల్లర్లు దారికొచ్చారు. ఫలితంగా కొనుగోళ్లు కొంతమేరకు వేగవంతమయ్యాయి. మిల్లర్ల రికార్డుల తనిఖీల్లో నిర్లక్ష్యం కలెక్టర్ అప్పగించిన బాధ్యతలను క్షేత్రస్థాయి సిబ్బందిలో కొందరు సరిగా నిర్వర్తించలేదు. కొందరు వీఆర్వోలు మిల్లులను తనిఖీలు చేయకుండా పరోక్షంగా అక్రమాలకు సహకరించారు. ధాన్యానికి సంబంధించి మిల్లర్లు రెండు రికార్డులు నిర్వహించాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం కోసం ఒక రికార్డు, నేరుగా రైతుల నుంచి (ప్రైవేటుగా) కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మరో రికార్డును మిల్లరు చూపించాలి. కానీ తమకు వచ్చే లాభాలు పోతాయన్న ఉద్దేశంతో జిల్లాలో చాలామంది మిల్లర్లు రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదు. ప్రైవేటుగా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, ఎంత ధరకు తీసుకున్నారన్నది ఇట్టే తెలిసిపోతుంది. అదే జరిగితే మిల్లర్ల అక్రమాలు దాదాపు బయటపడతాయి. కానీ కొందరు క్షేత్రస్థాయి ఉద్యోగులు మిల్లర్ల వద్ద ఉండే రికార్డులను పరిశీలించడం లేదు. దీంతో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల వద్ద తెచ్చిపెట్టుకుంటున్నారు. ఆ ధాన్యాన్నే రైతుల వద్ద ఎంఎస్పీకి కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఆన్లైన్ చేయించుకుంటున్నారు. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్ ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేసినట్టుగా చూపిస్తున్నారు. ఇవన్నీ కలెక్టర్ దృష్టికి వచ్చాయి. ప్రత్యేక అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను నివేదించారు. కొందరు వీఆర్వోలు కలెక్టర్ ఆదేశాలను పెడచెవిన పెట్టిన విషయం బయటపడింది. సస్పెన్షన్ల పర్వం మిల్లుల రికార్డుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంతో పొందూరు మండలం కనిమెట్ట వీఆర్వో పి.రంగారావు, వీఆర్ గూడేనికి చెందిన వీఆర్వో జి.వెంకటరమణలను సస్పెండ్ చేశారు. ఆరోపణలు రావడంతో డీఎస్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అనంత్ను తొలుత సీటును నుంచి తప్పించారు. శాఖాపరమైన విచారణ చేపట్టి మిల్లుల అడ్డగోలు ట్యాగింగ్లో ఆయన పాత్ర ఉన్నట్టు తేలిన అనంతరం సస్పెన్షన్ వేటు వేశారు. పోలాకి మండలంలోని రాళ్ళపాడు గ్రామంలో ఉన్న శ్రీవెంకటసిరి ఎంటర్ప్రైజెస్ అండ్ శ్రీరామకృష్ణ మోడరన్ రైస్మిల్కు 3269 క్వింటాళ్ల మేరకు అర్హత ఉంది. ఆ మిల్లును ఈదులవలసలో వెలుగు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ట్యాగ్ చేశారు. అక్కడ రికార్డుల ప్రకారం 240 క్వింటాళఉ్ల మాత్రమే వెలుగు సిబ్బంది కొనుగోలు చేసి మిల్లుకు పంపించారు. అయితే సదరు మిల్లు యజమాని మాత్రం రాత్రికి రాత్రి నరసన్నపేటలోని ఒక కొనుగోలు కేంద్రం ద్వారా మొత్తం ధాన్యం తెప్పించుకున్నట్టుగా ఆన్లైన్ చేయించుకున్నారు. దానితో ఈదులవలస కొనుగోలు కేంద్రం పరిధి రైతుల నుంచి ధాన్యం తీసుకోవడానికి ససేమిరా అన్నారు. దీనిని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అధికారులు అప్రమత్తమై ఆరా తీయగా.. జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో జరిగిన కుమ్మక్కు వ్యవహారమే కారణమని తేలింది. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన అనంత్ ముందురోజు రాత్రి అడ్డగోలుగా ఆ మిల్లును నరసన్నపేట కొనుగోలు కేంద్రానికి ట్యాగింగ్ చేశారు. ఆ మిల్లు నిర్వాహకులు నరసన్నపేట కొనుగోలు కేంద్రం పేరుతో రాత్రికి రాత్రి ధాన్యం లావాదేవీలను ఆన్లైన్ చేయించుకున్నారు. ‘సాక్షి’ కథనం అక్షర సత్యం కావడంతో అనంత్పై చర్య తీసుకున్నారు. అయితే ఆయన ఒక్కరే బాధ్యులని చెప్పడానికి లేదు. వాస్తవంగానైతే ఆ లాగిన్ అనంత్ పరిధిలోనిది కాదు. ఒక అధికారి పరిధిలో ఉంటుంది. ఆ అధికారి లాగిన్ నుంచే మిల్లుల ట్యాగింగ్ జరగాలి. అలాంటిది అధికారి లాగిన్ నుంచి సీనియర్ అసిస్టెంట్ అడ్డగోలుగా మిల్లులు ట్యాగ్ చేయడం వెనక మరికొన్ని శక్తులు ఉండొచ్చని తెలుస్తోంది. అడ్డగోలుగా వ్యవహరిస్తే వేటు తప్పదు ధాన్యం కొనుగోలు విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరిపైనైనా వేటు తప్పదు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదు. రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయడమే మా లక్ష్యం. రైతులకు ఇబ్బందులున్నా, సమస్యలు ఎదురైనా నేరుగా మాకు తెలియజేయవచ్చు. – కె.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ -
ధాన్యం కొనుగోళ్లు.. లక్ష్యం చేరేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు సంబం ధించి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుతాయా.. అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సారి ధాన్యం దిగుబడులు భారీగా ఉంటాయని సేకరణకు 3,700 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత 3 నెలల కాలంలో 3,658 కేంద్రాల ద్వారా 40 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తయింది. 15, 20 రోజుల్లో ఖరీఫ్ ముగియనుంది. మరో 16 లక్షల టన్నుల సేకరణ చేయాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లా నుంచి 7.20 లక్షల టన్నుల మేర ధాన్యం వస్తుందని అంచనా వేయగా.. 5 లక్షల టన్నుల మేర సేకరణ జరిగింది. గరిష్టంగా మరో 50 వేల టన్నులు సేకరించినా, మిగతా లక్ష్యాలు చేరుకోవడం కష్టమే. అంచనాలు తప్పాయా..? వ్యవసాయ శాఖ లెక్కలు అంచనాలు తప్పాయా? లేక మిల్లర్లతో కుమ్మౖక్కై అధికారులు ఏమైనా తప్పుడు అంచనాలు రూపొందిం చారా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గతంలో జిల్లాకు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గంలో ధాన్యం తీసుకొచ్చి, ఇక్కడి కేంద్రాల్లో అమ్మేవారు. ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా పోలీసు శాఖ సాయంతో కట్టడి చేశారు. ఈ చర్యల కారణంగా కొనుగోళ్లు ఏమైనా తగ్గాయా? అనే దానిపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. ఇక జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లోనూ అంచనాలకు తగ్గట్లుగా ధాన్యం సేకరణ జరగడం లేదు. అయితే ఖరీఫ్ ఆలస్యమైనందున ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని, ఈ 15 రోజుల్లో ఉధృతంగా కొనుగోళ్లు ఉంటాయని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఎంత నిజముందో ఈ నెలాఖరుకు తేలిపోనుంది. -
ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోంది. రేషన్ కార్డులు కలిగిన పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్వర్ణ, మేలురకం ధాన్యం సేకరణకు పౌరసరఫరాలశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యమైన బియ్యాన్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా నిపుణులను నియమించారు. కొనుగోలు కేంద్రాల సిబ్బందితో కలిసి వీరు నేరుగా కల్లాల వద్దకు వెళ్లి మంచి రకాలను గుర్తించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో పెద్దఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరిపారు. 2,000 కొనుగోలు కేంద్రాలు రైతులు ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకు విక్రయించేందుకు వీలుగా 13 జిల్లాల్లో ప్రభుత్వం రెండు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మధ్యవర్తులు, దళారీల కారణంగా ధాన్యానికి ధర దక్కలేదనే పరిస్థితి ఎదురు కాకుండా ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా 2019–20 ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 1,451 కేంద్రాల ద్వారా 15,02,869 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1,59,751 మంది రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకున్నారు. మద్దతు ధరపై విస్తృత ప్రచారం.. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు మద్దతు ధరపై రైతులకు పూర్తి అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ–పంటలో నమోదు కాని రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారిని అందుబాటులో ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో 1:1గా ఉన్న బ్యాంకు గ్యారెంటీని 1:2కి సవరించారు. రైతులకు 72 గంటల్లో చెల్లింపులు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ధాన్యం విక్రయించిన రైతులకు కేవలం 72 గంటల్లోనే చెల్లింపులు జరుపుతున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.2,368 కోట్ల మేర చెల్లింపులు జరిపారు. దాదాపుగా 70 శాతం మేర ధాన్యం కొనుగోళ్లకు చెల్లింపులు చేసినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా నేరుగా 1902 నెంబర్ ద్వారా అధికారుల దృష్టికి తెచ్చే అవకాశం కల్పించారు. తేమ శాతం పేరుతో జరిగే మోసాలను అరికట్టేందుకు తూనికలు కొలతల శాఖ అధికారుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మిల్లర్ల ద్వారా సిద్ధం చేసిన బియ్యాన్ని ఎఫ్సీఐకి 1,600 టన్నులు, పౌరసరఫరాలశాఖకు 2.15 లక్షల టన్నులు అందచేశారు. -
మిల్లర్ల మాయాజాలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర పెంచింది. కళ్లాల్లోనే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చింది. అందుకు తగ్గట్టుగా రవాణా చార్జీలను సైతం భరిస్తామని ప్రకటించింది. నిధులు కూడా అందుబాటులో ఉంచింది. ఇన్ని సదుపాయాలు కలి్పంచినా కొనుగోళ్లు మాత్రం అనుకున్నంత వేగంగా జరగడం లేదు. దీని వెనుక కారణాలు గమనిస్తే మిల్లర్ల మాయాజాలం కనిపిస్తోంది. ఒడిశా నుంచి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ ధాన్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద నమోదు చేయిస్తున్నారు. తమ సొంత మీటర్లతో తేమ శాతం ఎక్కువ ఉందని చూపించి రైతుల నుంచి ధాన్యం తీసుకోవడం లేదు. తాము చెప్పిన ధరకు ఇస్తే కొనుగోలు చేస్తామంటూ మెలిక పెడుతున్నారు. నూకలు ఎక్కువ వస్తున్నాయని 1075 రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. అదే ధాన్యాన్ని తక్కువ ధరకు, అదనంగా బరువుతో అదే మిల్లర్లు ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం రెండు అడుగు లు ముందుకు వేస్తే.. మిల్లర్లు మూడు అడుగులు వెనక్కి లాగుతున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా కాసింత భయపెట్టేలా ఉండడంతో అన్నదాతలు భయపడుతున్నారు. రైతులు పండగను సంతోషంగా జరుపుకోవాలంటే ధాన్యం కొనుగోళ్లు సత్వరం జరగాలి. మద్దతు ధర పెంచినా.. గతంలో సాధారణ వరి రకం క్వింటా రూ. 1750 ఉన్న ధరను రూ. 1815కు పెంచారు. గ్రేడ్ ఎ రకం గతంలో క్వింటా రూ. 1770ఉండగా ఇప్పుడది రూ. 1835కి పెంచారు. గతంలో కొనుగోలు కేంద్రం నుంచి మిల్లు వరకు మాత్ర మే రవాణా చార్జీలు చెల్లించేవారు. అది కూడా పూర్తిగా చెల్లించలేదు. ఐదేళ్లకు సంబంధించి రూ. 84కోట్లు చెల్లించకుండా గత ప్రభుత్వం చేతులేత్తేసింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పాత రవాణా బకాయిలను చెల్లించేందుకు వైఎ స్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల వరకు, కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు రవాణా చార్జీలను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించింది. రైతుల వద్దనే నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేందుకు నిధులు కూడా అందుబాటులో ఉంచింది. ఆశించిన స్థాయిలో కొనుగోలు జరగడం లేదు. మిల్లర్లు పాత అలవాట్లు మార్చుకోకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. నూక శాతం విషయంలో ప్రభుత్వం ఆంక్షలేవీ పెట్టకపోయినా మిల్లర్లు రైతులను ట్రాప్ చేసి ప్రభుత్వం ప్రక టించిన మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. రూ. 1100కు, 1200కు సాధారణ రకాలను ఇలా కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్ల దందా.. ఓ వైపు ఇక్కడి రైతులను మోసగిస్తున్న కొందరు మిల్లర్లు మరో వైపు ఒడిశా నుంచి ధాన్యం తీసుకువచ్చి వాటినే కొనుగోలు చేసినట్టు మాయ చేస్తున్నారు. సోమవారం పోలాకి మండలంలో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఒడిశా నుంచి తీసుకొచ్చి నిల్వచేసిన ధాన్యం గుట్టు రట్టు అయింది. రైతుల నుం కొనుగోలు చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న తేమ శాతం మీటర్లతోనే కొలవాలి. కానీ కొందరు మిల్లర్లు తమకు అనుకూలమైన మీటర్లను ఏర్పాటు చేసుకుని తేమ శాతం ఎక్కువ ఉందని చూపించి అభ్యంతరాలు పెడుతున్నారు. జిల్లాలో రైస్ మిల్లుల వద్ద అధిక సంఖ్యలో ధాన్యం లోడులు కనిపిస్తున్నాయి. పిరమిడ్ల మాదిరిగా కుప్పలేసి ఉన్నాయి. ఒకవైపు రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరగకుండా, మరోవైపు మిల్లుల వద్ద అధిక సంఖ్యలో ధాన్యం ఉన్నాయంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. వాటిలో చాలా వరకు ఒడిశా నుంచి తీసుకొచ్చినవేనని తేటతెల్లమవుతుంది. మరోవైపు ధా న్యం కొనుగోలులో వెనుకబాటుకు సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)బియ్యంను సివిల్ సప్లయిస్ అధికారులు తీసుకోవడం లేదని, తమ వద్ద ఉన్న ధాన్యం ఆడించడం ద్వారా బియ్యాన్ని తీసుకుంటేనే కొత్తగా పీపీసీ కేంద్రాల నుంచి ధాన్యం తీసుకోగలమంటూ సాకు చూపిస్తున్నారు. వాస్తవంగా అటు ఎఫ్సీఐ, ఇటు సివిల్ సప్లయిస్ అధికారులు ఎప్పటికప్పుడు సీఎంఆర్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు తగ్గ గోదాములు అందుబాటులో ఉన్నాయి. కలెక్టర్ హెచ్చరిక గత కొన్ని రోజులగా జిల్లాలో మందకొడిగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ జె.నివాస్ ఆరా తీశారు. క్షేత్రస్థాయి నుంచి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. మిల్లర్ల సమస్యను తెలుసుకుంటూనే వారి అక్రమ బాగోతాన్ని కూడా ఆధారాలతో సేకరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం మీటర్లను కాదని తమ సొంత మీటర్లతో తేమ శాతం కొలుస్తున్నారని, అందులో ఎక్కువ చూపించి రైతుల నుంచి తక్కువ ధరకు, అదనపు బరువుతో కొనుగోలు చేస్తున్నారని గుర్తించారు. అంతేకాకుండా 1075 రకంలో నూకలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి పీపీసీల వద్ద తీసుకోకుండా నేరుగా రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని గమనించారు. ఒడిశా ధాన్యాన్ని తీసుకొచ్చి పీపీసీల వద్ద మా యాజాలం చేస్తున్న విషయాన్ని ఆరా తీశారు. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని సోమవారం మిల్లర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ జె.నివాస్ బహిర్గతం చేశారు. జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసునని, రైతులకు అన్యాయం చేయవద్దని సీరియస్గా హెచ్చరించారు. -
‘పొరుగు ధాన్యాన్ని అడ్డుకోండి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో సీలింగ్ విధించడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో దళారులు, వ్యాపారస్తులు రైతుల పేరుతో తెలంగాణలో ధాన్యం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దులో గట్టి నిఘాతో దీన్ని అరికట్టాలని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్ర రైతులకు నష్టం కలిగించే ఏ చర్యను కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడి శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లోడింగ్ చేసి ఆ వివరాలను కేంద్రాల నిర్వాహకులు ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్లో నమోదు (ట్రక్ షీట్) చేస్తున్నారని, నమోదు చేసిన వివరాలకు రైస్ మిల్లర్లు ఆన్లైన్లోనే ఆమోదం తెలపాలని సూచించారు. తద్వారా రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల్లో త్వరితగతిన రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు వీలవుతుందన్నారు. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో కేంద్రం నిబంధనల మేరకు తేమ 17 శాతంలోపు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంట పొలాల నుంచి ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురాకుండా దశలవారీగా తీసుకువచ్చేలా కేంద్రాల నిర్వాహకులు రైతులకు సూచించాలన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు నాలుగింతలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు గడిచిన ఐదేళ్లలో 4 రెట్లు పెరిగాయి. కనీస మద్దతు ధరలకు జరుగుతున్న కొనుగోళ్లు, మార్కెట్ వ్యవస్థ బలోపేతం, సాగునీటి వనరుల వృద్ధితో పంటల విస్తీర్ణం పెరగడం, వీటికి అనుగుణంగా సేకరణను ఆ శాఖ విస్తరించడంతో ధాన్యం కొనుగోళ్లు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. 2014–15లో ఖరీఫ్, రబీ సీజన్ల్లో కలిపి మొత్తంగా 24.29 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయగా, రూ.3,392 కోట్లను రైతులకు చెల్లించారు. అది 2016–17, 2017–18 నాటికి 53.90 లక్షల టన్నులకు చేరగా, అదే 2018–19 నాటికి 73.02 లక్షల టన్నులకు చేరింది. ఈ సేకరించిన ధాన్యం విలువ రూ.12,906 కోట్లుగా ఉంది. అది ప్రస్తుత 2019–20 నాటికి 80 లక్షల టన్నులను దాటే అవకాశం ఉంది. ఇప్పటికే 77.07 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి గతంలో ఎన్నడూలేని రికార్డులు నెలకొల్పింది. గడిచిన ఐదేళ్లలో పౌర సరఫరాల శాఖ పరిధిలో చేపట్టిన సంస్కరణలు, వాటి ఫలితాలకు సంబంధించి ‘పౌర సరఫరాల శాఖ వార్షిక నివేదిక 2018–19’ని పౌర సరఫరాల శాఖ మంత్రి నిరంజన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. నివేదికలో ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
‘మూడ్రోజుల్లో ఇస్తామని మూడు నెలలైనా ఇవ్వరా?’
సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల్లో డబ్బులు వస్తాయన్న ఆశతో 6.25 లక్షల మంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మూడు నెలలవుతున్నా ఇంతవరకు చెల్లింపులు చేయకపోవడం దారుణమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రబీ ధాన్యం కొనుగోళ్ల కింద 3.5 లక్షల మంది రైతులకు రూ.1,900 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఈ డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోతే రైతులు ఖరీఫ్ ఎలా సాగుచేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. పెట్టుబడుల కింద వాడుకునేందుకు 4 రోజుల్లో ఆ డబ్బులు ప్రభుత్వం విడుదల చేయాలని కోమటిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
భారమంతా రైతులపైనే!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): కష్టాలన్నీ రైతులకే.. విత్తనం వేసింది మొదలు, పంట చేతికొచ్చే వరకూ ఎన్నో కష్టాలు పడుతున్న రైతులకు.. వచ్చిన పంటను అమ్ముకునేందుకూ తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు అనేక రకాలుగా నష్టపోతున్నారు. అండగా నిలబడాల్సిన కేంద్రం ప్రభుత్వం కూడా రైతుల పట్ల చిన్నచూపు చూస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భరించిన హమాలీ చార్జీలను కేంద్రం తిరిగి ఇవ్వకుండా మెండిచేయి చూపుతోంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) అభ్యంతరం కారణంగా గత రెండు సంవత్సరాలుగా జిల్లాకు ఈ నిధులు రావడం లేదు. దీంతో గత మూడు సీజన్లుగా హమాలీ చార్జీల భారం రైతులపైనే పడుతోంది. 2017–18 సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి 2.40 కోట్లు, 2018–19 సంవత్సరంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రూ.2.50 కోట్లు కలిపి మొత్తంగా జిల్లాకు రూ. 5కోట్ల వరకు హమాలీ డబ్బులు రైతులకు రావాల్సి ఉంది. అయితే, ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్కు హమాలీ చార్జీలు ఇప్పించాలని రైతులు కోరారు. కేంద్ర ప్రభ్వుతానికి విన్నవిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చార్జీలను విడుదల చేయకపోవడం వెనుక ఓ కారణం ఉంది. హమాలీ చార్జీలను నిజంగా రైతులు చెల్లించింది నిజమో కాదోనని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించాలని కాగ్ కోరింది. ఇందుకు జిల్లా నుంచి సివిల్ సప్లయి కార్పొరేషన్ అధికారులు ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. బస్తాకు రూ.5 చొప్పున.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలను తూకం వేసి లారీల్లో ఎక్కించడానికి హమాలీల ఖర్చును ముందుగా సంబంధిత రైతులే భరించాల్సి ఉంటుంది. ఒక్కో బస్తాకు రూ.5 వరకు హమాలీలకు చెల్లిస్తారు. అయితే, కొన్ని రోజుల తరువాత హమాలీ చార్జీలను కేంద్ర ప్రభుత్వం తిరిగి సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. కానీ 2016–17 సంవత్సరం వరకే రైతులకు హమాలీ చార్జీలు అందాయి. 2017–18, 2018–19 కలిపి 60 వేల మంది రైతులకు సంబంధించిన మూడు సీజన్ల డబ్బులు రూ.5 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఇప్పటికే మూడు సీజన్లు ముగిసి ప్రస్తుత రబీ సీజన్లో కూడా హమాలీ చార్జీలను రైతులే భరిస్తున్నారు. వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం నుంచి హమాలీ చార్జీలను ఇప్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. ఇచ్చి లాగేసుకున్న కేంద్రం.. రైతులకు తిరిగి చెల్లించాల్సిన హమాలీ చార్జీలను 2016–17 వరకు చెల్లించింది కేంద్రం. అయితే, చెల్లించిన ఏడాది వరకు మూడు, నాలుగు సీజన్లకు సంబంధించిన చార్జీలను కేంద్ర ప్రభుత్వం రూ.27.53 కోట్లు సివిల్ సప్లయి కార్పొరేషన్కు ఇచ్చింది. అదే సమయంలో కాగ్ ఈ నిధులపై ఆడిట్ చేసింది. అయితే, అప్పటికే జిల్లాకు వచ్చిన హామాలీ చార్జీల డబ్బులను సివిల్ సప్లయి కార్పొరేషన్ అధికారులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అదే సమయంలో ఇచ్చిన నిధులను తిరిగి ఇచ్చేయాలని కేంద్రం సూచించింది. కానీ డబ్బులు రైతులు ఖాతాలో జమ కావడంతో వీలు కాలేదు. ఇందుకు ఎఫ్సీఐ నుంచి సివిల్ సప్లయి కార్పొరేషన్కు రావాల్సిన నిధుల్లోంచి రూ.27.53 కోట్లు హమాలీ చార్జీల రూపంలో తీసేసుకుంది. దీంతో ఈ భారం మొత్తం సివిల్ సప్లయి కార్పొరేషన్పై పడింది. -
39 లక్షల టన్నులు.. 3,732 కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా సన్నద్ధమవుతోంది. 39 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో ఏప్రిల్లో 14.25 లక్షల టన్నులు, మేలో 20.22 లక్షలు, జూన్లో 5.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,732 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఐకేపీ 1,366, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) 2,163, డీసీఎంఎస్, ఐటీడీఏ 203 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను నిర్వహిస్తాయి. కనీస వసతులపై దృష్టి పెట్టండి యాసంగి ధాన్య సేకరణ ఏర్పాట్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ బుధవారం జాయింట్ కలెక్టర్లు, డీసీఎస్ఓలు, జిల్లా మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్థానిక అవసరాలను బట్టి రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే అప్పటికప్పుడు కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. వర్ష ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎగువ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మిల్లుల సామర్థ్యం మేరకు రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరపాలని, పౌరసరఫరాల శాఖకు కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు సంబంధించి బియ్యం ఎగవేతదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయింపులు జరపకూడదన్నారు. ధాన్యం దిగుబడిని దృష్టిలో పెట్టు కొని ప్రాధాన్యత క్రమంలో జిల్లాల వారీగా గోనె సంచులను కేటాయించడం జరుగుతోందని, స్థానికంగా ఎక్కడైనా అవసరమైతే రేషన్ డీలర్ల నుంచి ఒక్కో గోనె సంచి ధర రూ.16 చొప్పున కొనుగోలు చేయాలన్నారు. అంతా నిఘా నీడలో.. ప్రభుత్వానికి, రైతులకు, మిల్లర్లకు ప్రయోజనకరంగా ఉండేలా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్)ను మరింత అభివృద్ధి చేశామని అకున్ సబర్వాల్ చెప్పారు. రైస్మిల్లు సీడింగ్ సామర్థ్యం తెలుస్తుందని, మిల్లులకు ధాన్యం కేటాయించడానికి వాటి మిల్లింగ్/బాయిలింగ్ సామర్థ్యం సమాచారం ఉంటుందని తెలిపారు. ధాన్యం కేటాయించిన 7 రోజులకైనా మిల్లుల నుంచి సమాచారం అందకపోతే ఆయా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు, జిల్లా మేనేజర్లకు హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. ఆన్లైన్లో రైతుల రిజిస్ట్రేషన్ జరుగుతుందని, జియో ట్యాగింగ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు, మిల్లులపై నిఘా ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు ధాన్యాన్ని తరలించే వాహనాలకు జీపీఎస్ యంత్రాలను అమర్చడం జరుగుతుందని తెలిపారు. -
కొండెక్కిన ధాన్యం కొనుగోళ్లు
ప్రభుత్వ ఆదేశాలు లేవంటున్నారు.. అయ్యా...మాది పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు. మా ఊళ్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు కొని 20 రోజులు దాటింది. ఎందుకు ఆపారో తెలియదు. అదేమంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం లేదంటున్నారు. పంట పండించినా, పండించక పోయినా కష్టాలు తప్పడం లేదు. మా గోడు వినేవారే లేరు. ఎక్కడ చావమంటారయ్యా? – శ్రీనివాస్ (కౌలు రైతు) తిప్పి పంపిస్తున్నారు.. తూర్పు గోదావరి జిల్లాలోని 16 మండలాల్లో 294 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఘనంగా ప్రకటించారు. ధాన్యాన్ని ఎప్పుడు తీసుకువెళ్లినా ఏదో ఒక వంకతో తిప్పి పంపిస్తూనే ఉన్నారు. – పి.ప్రసాద్ (రైతు, పిఠాపురం) సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి డెల్టాలో ఏ మూలకు వెళ్లినా ధాన్యం పండించే రైతుల గోడు ఇదీ. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఉత్తర్వులు ఇచ్చి రెండు నెలలు దాటినా అధికారిక లెక్కల ప్రకారమే సగానికి కూడా మించలేదు. ఖరీఫ్లో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్టు గత నవంబర్ 13న వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి ప్రకటించగా ఆదివారం నాటికి 19.72 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నట్టు అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఇందులో సగానికిపైగా మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేసిందే ఉంది. మరోవైపు అక్టోబర్– నవంబర్ నాటికే 1,500 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 1,332 మాత్రమే ఏర్పాటయ్యాయి. బస్తాకు రూ.200 దాకా నష్టపోతున్న రైతులు.. నిబంధనల ప్రకారం మహిళా స్వయం సహాయక సంఘాలు (వెలుగు), పీఏసీఎస్, డీసీఎంఎస్లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి. ప్రతి కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉండాలి. ధాన్యం విక్రయించే రైతుల ఖాతాల్లోకి ఆన్లైన్లో నేరుగా డబ్బు జమ చేయాలి. రైతులకు రవాణా ఖర్చులు కూడా చెల్లించాలి. ఒకవేళ మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేస్తే కనీస మద్దతు ధర ఇవ్వాలి. మిల్లర్లు కూడా రైతులకు ఆన్లైన్ లేదా చెక్కుల రూపంలో చెల్లించాలి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు దారుణంగా ఉన్నాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం 75 కిలోల వడ్ల బస్తాకు గరిష్టంగా రూ.1,312 చొప్పున ధర పలకాల్సి ఉంటే రైతులకు దక్కింది వేయి, రూ.1,150 మధ్యే ఉండటం గమనార్హం. దీంతో రైతులు బస్తాకు కనీసం రూ.రెండు వందలు దాకా నష్టపోతున్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాల్ రూ.1,790, సాధారణ రకాన్ని రూ.1,750 చొప్పున కొంటామని మంత్రి సోమిరెడ్డి గతంలో చెప్పారు. 20 రోజులుగా మూత... రైస్ మిల్లర్లతో సయోధ్య కొరవడడంతో గత 20 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. 2018–19 ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి 86.17 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 45 లక్షల టన్నులే కొనుగోలు చేయాలని నిర్ణయించడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ధాన్యం కేంద్రాలలో కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లర్లు మర ఆడించి బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ధాన్యం కేంద్రాలలో క్రయ విక్రయాలు ఆగిపోవడంతో ఎక్కడి సరకు అక్కడ నిలిచిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కమీషన్ ఏజెంట్లు పెద్దఎత్తున ధాన్యాన్ని తక్కువ రేటుకు కల్లాల్లోనే కొంటూ లబ్ధి పొందుతున్నారు. రైతు సంఘాలు ఈ వ్యవహారాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) సక్రమంగా అందాలంటే విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఎంటీయూ 1010 రకం కొనరట! తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పండించే ఐఆర్ 64, ఎంటీయూ 1010, 1001 రకాలను కొనుగోలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా చెబుతోంది. ధాన్యం కేంద్రాలలో ఈ రకాన్ని కొనుగోలు చేయడం లేదు. ఈ రకం ధాన్యాన్ని రాష్ట్రంలో తినరని పేర్కొంటూ బహిరంగ మార్కెట్, ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవాలని సూచించడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు దగాకు రుజువు... ’పెథాయ్ తుపానుతో తడిసిన ధాన్యాన్ని కొంటామని మంత్రులు మొదలు ముఖ్యమంత్రి వరకు అంతా చెప్పారు. కృష్ణా జిల్లాలోని ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లినా ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం నుంచి మార్చిన నిబంధనలు రాలేదు. మేం ఏమీ చేయలేమని అధికారులు చెబుతున్నారు. సర్కారు దగాకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?’ – పి.జమలయ్య (కౌలు రైతుల సంఘం నేత) -
జాగేది ?
ధాన్యం కొనుగోళ్లకు స్థలం సమస్య స్టాక్ను దించుకోకుండా చేతులెత్తేస్తున్న మిల్లర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు ఉచితంగా మార్కెట్ గోదాముల కేటాయింపు సాక్షి, నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్లకు కొత్త సమస్య వచ్చి పడింది. వర్షాలు కురవడం ప్రారంభం కావడంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ దాచాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంట వెంటనే రైస్మిల్లులకు తరలిస్తుంటే మిల్లర్లు తమ మిల్లుల్లో స్థలం లేదని ధాన్యం లారీల నుంచి స్టాక్ను దించుకోవడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం, ఈదురు గాలుల నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో జిల్లా అధికారయంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లాలో అందుబాటులో ఉన్న గోదాముల కోసం అన్వేషిస్తున్నారు. ఆరు వేల మెట్రిక్ టన్నులు.. జిల్లాలో ఇప్పటి వరకు 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం రోజుకు ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తోంది. సీజను ప్రారంభంలో రోజుకు 13 వేల మెట్రిక్ టన్నులు వచ్చేది. కాంటాలైన ధాన్యాన్ని వెంట వెంటనే దించుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం సుమారు ఆరు నుంచి ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయాయి. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో మిల్లులో ఆరు బయట నిల్వ చేయడానికి మిల్లర్లు జంకుతున్నారు. శని, ఆది, సోమ, మంగళవారాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మిల్లర్లు ధాన్యం దించుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఉచితంగా మార్కెట్ గోదాములు.. ఒక్కసారిగా స్థలం సమస్య ఏర్పడటంతో జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ధాన్యం నిల్వలను ఉంచేందుకు అవసరమైన గోదాముల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా బోధన్లో సుమారు 1,800 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెట్ కమిటీ గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచాలని నిర్ణయించారు. అలాగే నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న గోదాముల్లో కూడా ధాన్యం నిల్వ చేయాలని భావిస్తున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ గోదాములను రెండు నెలల పాటు ఉచితంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సీడబ్ల్యూసీ అధికారులతో మాట్లాడుతున్నాం వర్షాలు ప్రారంభం కావడంతో ఏర్పడిన స్థలం సమస్య పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. నిజామాబాద్ దుబ్బలో ఉన్న సీడబ్ల్యూసీ గోదాములను వినియోగించుకోవాలని రైస్మిల్లులకు సూచిస్తున్నాము. ఇక్కడ 18 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములున్నాయి. అలాగే సారంగపూర్లోని సీడబ్ల్యూసీ, ఎస్డబ్ల్యూసీ గోదాముల్లో కూడా ఐదు వేల మెట్రిక్ టన్నుల చొప్పున నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. వీటిని వినియోగించుకోవాలని భావిస్తున్నాము. - హరికృష్ణ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పది రోజులు దాటుతోంది.. ధాన్యం తెచ్చి పది రోజులు దాటింది. తూకం వేసి కూడా మూడు రోజులవుతోంది. కానీ ధాన్యం తరలించడం లేదు. దీంతో 600 బస్తాలను తడవకుండా కాపాడటం కష్టంగా ఉంది. అధికారులు స్పందించి వెంటవెంటనే ధాన్యం తరలించేలా చూడాలి. - బైరి చిన్న గంగాధర్, ఇందల్వాయి -
ఎక్కడి కుప్పలు అక్కడే!
► లారీలు రాక, ఖాళీ సంచులు లేక.. ► కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు ► పేరుకుపోతున్న వేలాది వడ్ల బస్తాలు ► అక్కడే పడిగాపులు పడుతున్న రైతులు ► అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు నర్సాపూర్: వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఖాళీ సంచులను సకాలంలో అందజేయలేకపోవడంతోపాటు,తూకం వేసిన ధాన్యం బస్తాలను రైసుమిల్లులకు పంపేందుకు లారీలను సమకూర్చడంలోనూ అధికారులు విఫలమవుతున్నా రు. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని ఎçపుడు తూకం వేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. రో జుల తరబడి నిరీక్షణ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం బస్తాలు కేంద్రాల్లో పేరుకుపోయాయి. స్థలా భావంతో కొత్తగా తూకం వేయడం నిలి పివేశారు. పలు చోట్ల ఖాళీ సంచులు లేక తూకం పనులు సాగడం లేదు. ఇదీ పరిస్థితి సొసైటీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రంలో గురువారంనాటికి సుమారు మూడు వేల ధాన్యం బస్తా లను తూకం వేసి మిల్లులకు పంపేందుకు సిద్ధంగా ఉంచారు. లారీలు రాక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఐకేపీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో రెండు రోజులుగా ఖాళీ సంచుల కొరత ఏర్పడింది. లారీలు రాక తూకం వేసిన బస్తాలు ఇక్కడే ఉండిపో యాయి. స్థలం లేకపోవడం, సంచుల కొరతతో కొనుగో ళ్లను నిలిపేశారు. మండలంలోని ఖాజీ పేట కేంద్రంలో ఖాళీ సంచులు లేకపోవడంతో రెండు రోజులుగా కొనుగోళ్లు సా గడం లేదు. ఇక్కడ సుమారు నాలుగు వేల బస్తాల ధాన్యం కుప్పలుగా పడి ఉంది. రెడ్డిపల్లిలో సుమారు వెయ్యి బ స్తాల ధాన్యం నిలిచిపోయింది. సుమారు మూడు వేల బస్తాల «ధాన్యం కుప్పలు గానే ఉంది. ఇబ్రహీంబాద్లో సైతం ఇ లాంటి సమస్యలే ఉన్నాయి. అక్కడ సు మారు వెయ్యి బస్తాల ధాన్యం ఉండిపోయింది. ఈ విషయమై మండల ఐకేపీ కో ఆర్డినేటర్ గౌరీశంకర్ను వివరణ కోరగా, లారీలు రానందున తూకం వేసిన బస్తాలను రైసుమిల్లులకు పంలేకపోతున్నామని అన్నారు. స్థలం లేక తూకం వే యడం లేదన్నారు. శుక్రవారం ఉదయం వరకు అన్ని కేంద్రాలకు ఖాళీ సంచులు వస్తాయన్నారు. తూకం వేసిన బస్తాలు షిఫ్ట్ చేయగానే కొనుగోళ్లు ప్రారంభి స్తామని పేర్కొన్నారు. రైతుల సమస్యలు పట్టవా? రైతులు అనేక సమస్యలు ఎదుర్కొం టున్నా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం. బస్తాలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నా, ఖాళీ సంచులు లేక కొనుగోళ్లు నిలిచిపోతున్నా, రైతులు∙పడిగాపులు పడు తు న్నా ప్రజాప్రతినిధులు అటు వైపు కన్నెత్తి చూడక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కొత్త జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు
- వచ్చే ఏడాది నుంచి చేస్తామన్న - రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కొత్త జిల్లాల వారీగా ధాన్యం కొనుగోలు చేస్తామని, 31 జిల్లాలను ఆన్లైన్ పరిధిలోకి తీసుకువస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నిరీక్షించే పరిస్థితులు లేకుండా వేగంగా కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. రబీ సీజన్కు సంబంధించి కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఆగస్ట్ 31వ తేదీలోగా అప్పగించాలని రైస్ మిల్లర్లను కోరారు. యాదాద్రి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో గురువారం ఆయన పర్యటించి కొనుగోలు కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా జిల్లా డీసీఎస్ఓలు, సంస్థ మేనేజర్లు, అధికారులతో సమీక్షలు జరిపారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో ఈ నెల 24వ తేదీ వరకు పౌర సరఫరాల సంస్థ 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రబీలో ఏకంగా 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో ఇరవై రోజుల్లో 10 నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. అంచనాలకు మించి ధాన్యం దిగుబడి వచ్చినా క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికా రులు, సిబ్బంది సమస్యలను అధిగమించారని అభినందించారు. రేషన్ షాపుల్లో సంస్కరణలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఖాళీల భర్తీ, కార్డుల క్రమబద్ధీకరణ, బినామీ డీలర్ల తొలగింపు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ–పాస్ విధానం అమలు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. -
ధాన్యం అమ్ముడుపోక రైతు మృతి
దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం జనగామలో మంగళవారం ఉదయం విషాద సంఘటన జరిగింది. ఆకుల పోచయ్య అనే రైతు తాను పండించిన వరికుప్పపైనే ప్రాణాలు విడిచాడు. గ్రామంలోని ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు కేంద్రంవ వద్ద మంగళవారం వేకువజామున వరికుప్పపై నిద్రించిన పోచయ్య నిద్రలోనే తుదిశ్యాస విడిచాడు. తాను అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం కుప్పపైనే రైతు మృతిచెందడంతో అక్కడ విషాదఛాయలు నెలకొన్నాయి. రైతు గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎమ్ఆర్ఓ జయంత్రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పోచయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాను పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు వారం రోజుల క్రితమే పోచయ్య ఎస్ఎఫ్సి కేంద్రం వద్దకు తెచ్చాడని, అయితే కొనుగోళ్లు జరగకపోవడంతో రోజూ రావడం తిరిగి గ్రామానికి వెళ్లడం చేసేవాడని స్థానికులు తెలిపారు. వర్షం, దొంగతనం భయంతో రాత్రి పూడ వరికుప్పపైనే నిద్రించేవాడని, ధాన్యం అమ్ముడుపోలేదన్న బెంగతో మనస్థాపం చెంది గుండెపోటుతో మృతిచెందిఉంటాడని భావిస్తున్నారు. -
మొదలైన ధాన్యం కొనుగోళ్లు
► ఇప్పటివరకు 3.08 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు ► సోయాబీన్ కొనుగోలుకు ఏర్పాట్లు ► మిర్చి రైతులకు కేంద్రం మొండిచెయ్యి! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభ మయ్యాయి. ఈ ఏడాది యాసంగి వరి పంట ప్రస్తుతం మార్కెట్లకు చేరుకుంటోంది. ఈ సీజన్లో 26.41 లక్షల మెట్రిక్ టన్నులమేర దిగుబడులురాగా ఇప్పటివరకు 3.08 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో ‘ఏ’ గ్రేడ్ రకం వరిని రూ.1,450, సాధారణ రకం వరిని రూ.1,410 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు మార్కెటింగ్శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 3,076 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. వరి పంటను ఎంఎస్పీకి తగ్గకుండా కొనుగోలు చేస్తామని పార్థసారథి వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్లో 2,025 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 16.46 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేశారు. యాసంగిలో అధి కంగా ధాన్యం వస్తుందని గమనించి మరో వెయ్యి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు సోయాబీన్ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తోంది. అందుకోసం ఆయిల్ ఫెడ్ ద్వారా 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కేవలం 702 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కంది కొనుగోలుకూ చర్యలు ఈ ఏడాది కందికి ఎంఎస్పీ కంటే తక్కువ ధర పలకడంతో ప్రభుత్వ సంస్థలు రంగం లోకి దిగాయి. గతంలో క్వింటాలు కంది మార్కెట్లో రూ. 10 వేలకు పైగా ధర పలకగా, ఈసారి రూ. 4 వేల వరకు పడిపోయింది. దీంతో ప్రభుత్వ సంస్థలు క్వింటాలుకు రూ.5,050 ఎంఎస్పీకి కొనుగోలు చేశాయి. రాష్ట్రంలో 2 లక్షల మంది రైతుల నుంచి 2.08 లక్షల మెట్రిక్ టన్నుల కందిని నాఫెడ్, ఎఫ్సీఐ, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేశారు. ఇందుకు 95 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పత్తిని 4.50 లక్షల మంది రైతుల నుంచి 6.40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అందుకోసం 92 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. అలాగే 157 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 18,256 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ను మార్క్ఫెడ్, ఎఫ్సీఐ కొనుగోలు చేశాయి. ఇదిలా వుంటే మిర్చి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కనికరం చూపలేదు. మార్కెట్లో మిర్చిని వ్యాపారులు క్వింటాలుకు రూ. 4,500 మించి కొనడంలేదు. దీంతో రూ. 7,500కు కొనుగోలు చేసేలా చూడాలని, లేదంటే ప్రతీ మిర్చి రైతుకు క్వింటాలుకు రూ. 1,500 పరిహారంగా ఇవ్వాలని రాష్ట్ర మార్కెటింగ్శాఖ కేంద్రానికి విన్నవించింది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
వ్యవసాయ మార్కెట్లలో పడిపోతున్న ధాన్యం కొనుగోళ్లు
సర్కారుకు మార్కెటింగ్శాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లోకి వస్తున్న ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు పెద్ద ఎత్తున పడిపోతున్నాయని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి విన్నవిస్తూ సమగ్ర నివేదికను శనివారం అందజేసింది. ధాన్యంతో మార్కెట్లకు వచ్చే రైతులకు చిల్లర సమస్య ఎదురవుతోందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రైతు ధాన్యాన్ని విక్రరుుంచిన తర్వాత రవాణా ఖర్చు, లోడింగ్, అన్లోడింగ్, హమాలీల కూలీ తదితర చెల్లింపులకు చిల్లర ఉండట్లేదని పేర్కొన్నారు. ధాన్యం కొనే వ్యాపారులు కూడా చిన్న నోట్లు లేకపోవడంతో సరుకు కొనేందుకు ఆసక్తి కనబరచట్లేదని నివేదికలో వివరించారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా జరుగుతున్న పత్తి, వరి, మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాలను రైతుల ఖాతాల్లో ఆన్లైన్, ఆర్టీజీఎస్ విధానంలో చెల్లిస్తున్నారు. అరుుతే ఖాతాల్లో జమ అరుున మొత్తాన్ని తీసుకోవడంలో ఉన్న పరిమితుల కారణంగా రైతులకు కష్టాలు తప్పట్లేదని అధికారులు పేర్కొన్నారు. పది రోజులుగా పెద్ద నోట్లు చెల్లకపోవడం, చిన్న నోట్లు ఇవ్వని పరిస్థితుల వల్ల వారి జీవితాలు అతలాకుతలం అయ్యాయని పేర్కొన్నారు. రైతులకు, హమాలీలకు సరిగా చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో కేసముద్రం, మహబూబాబాద్ మార్కెట్లను మూసేశారని వెల్లడించారు. అరుుతే సూర్యాపేట, తిరుమలగిరి వంటి చోట్ల చెక్లు, ఆర్టీజీఎస్ ద్వారా రైతులకు చెల్లింపులు చేస్తున్నారని వివరించారు. రబీలో రైతులకు అవసరమైన రోజువారీ ఖర్చుల కోసం కొంతమేర చిన్న కాగితాల సొమ్ము అవసరమని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మార్కెట్లలో కమీషన్ ఏజెంట్లకు కూడా రోజువారీ కూలీలకు, హమాలీలకు, రైతులకు చెల్లించేందుకు నగదు అవసరమని పేర్కొన్నారు. చెక్కుల రూపంలో చెల్లింపులు జరుపుతున్నా బ్యాంకుల్లో వాటిని మార్చుకోవడం.. అవసరమైనంత తీసుకోవడం రైతులకు కష్టంగా మారిందన్నారు. దీనివల్ల రబీలో అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కొనుగోలుకు రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. ప్రైవేటు వ్యాపారులు కూడా రైతులకు అప్పుల రూపంలో ఇచ్చే సొమ్ము కూడా నిలిచిపోరుుందన్నారు. మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోకుండా ఐకేపీ సహా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నామని వివరించారు. -
షేమ్సీన్l
ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటాడుతున్న గన్నీ సంచుల కొరత ఆందోళనలో రైతన్నలు... ఖరీఫ్ కోతలు ప్రారంభమయ్యాయి... పలు చోట్ల రైతులు ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకొస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిల్వలు సైతం పేరుకుపోయాయి. అయినా.. గత సమస్యే అన్నదాతలను వెన్నాడుతోంది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయక పోవడం.. దళారులకు రైతులు దాసోహమవడం ఈ సారి కూడా షరామామూలుగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర ఏమోగానీ అసలు ధాన్యాన్ని కొనేవారు లేక నానా అవస్థలు పడుతున్నారు. పాలకుల పాపమో.. అధికారుల శాపమో గానీ కర్షకులు అరిగోస పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని పంటను సాగు చేయడం కంటే.. దాన్ని అమ్ముకోవడం గగనంగా మారడంతో వారు రెక్కలు తెగిన పక్షుల్లా విలవిల్లాడుతున్నారు. నల్లగొండ : జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం పెద్ద ఎత్తున తరలివస్తున్నా... ఇప్పటికీ ఏ ఒక్క కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది లేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారుల తీరు షరామాములే అయ్యింది. 144 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న నిర్ణయం ప్రతిపాదనలకే పరిమితమైంది. నిజానికి నేడు కోనుగోలు కేంద్రాలు ప్రారంభం కావల్సి ఉన్నా... ఒక్కటంటే ఒక్కటీ ప్రారంభం కాలేదు. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి తమకు అందిన కాడికి దండుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కొనుగోలు చేసేలా లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ధాన్యాన్ని ‘అడ్డికి పావుసేరు’ చందంగా అమ్ముకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోళ్ల పై అధికార యంత్రాంగం ఇంకా మేల్కొనలేదు. గత కొద్దీ రోజులుగా వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం పెద్ద ఎత్తున తరలివస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించ లేదు. మూసీ నదీ పరివాహక ప్రాంతం, ఏఎమ్మార్పీ పరిధిలోని భువనగిరి, నల్లగొండ డివిజన్ ప్రాంతాల్లో వరి కోతలు వేగం పుంజుకున్నాయి. పంటలు చేతికొస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంది. గతేడాది ఇదే సీజన్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఆరంభించారు. జిల్లాల విభజనలో నిమగ్నమైన అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నెల మొదటి వారంలో ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి వస్తుందన్న ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లకు సంబంధించి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. కానీ మూడు జిల్లాలు విడిపోవడం, ఆ తర్వాత దసర పండగ రావడంతో గ్రామాల్లో ఎక్కడా ఐకేపీ కేంద్రాలు ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఖరారు చేసిన కొనుగోళ్ల ప్రణాళికను ఆయా జిల్లాలకు పంపించారు. కానీ అక్కడి యంత్రాంగం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తోంది. కొత్త జిల్లాల్లో కొత్త పాలనాధికారులు కొలువు దీరడంతో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలపై స్పష్టత రావ డం లేదు. ఎ న్ని సెంటర్లు ఏర్పాటు చే యాలనే దాని పై నిర్ణయం తీసుకున్నా.. వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందనే విషయం అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. కొనుగోళ్లను పర్యవేక్షించాల్సిన జాయింట్ కలెక్ట ర్లు సంబంధిత శాఖలైన డీఆర్డీఓ, సివిల్ సప్లై, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారుల తో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి త్వరితగతిన ఏర్పా ట్లు చేయాల్సి ఉంది. కానీ సంబంధిత శా ఖల్లో సిబ్బంది కొరత పట్టిపీడిస్తుండడంతో కొ నుగో లు సెంటర్లను ఏరా>్పటు చేయడంలో జా ప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సివిల్ సప్లై మేనేజర్ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఒక్కరే కావడం, డీఆర్డీఓ పోస్టు యాదాద్రి జి ల్లాలో భర్తీ కాకపోవడంతో పాలనాపరంగా తలెత్తే ఇబ్బందులు అంత సులువుగా పరిష్కారం కావట్లేదు. మిల్లర్ల పేచీ... ఐకేపీ, పీఏసీఎస్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల పంచాయితీ నడుస్తోంది. సీఎమ్మార్ ధాన్యాన్ని మర ఆడించినందుకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న కమీషన్ సరిపోవడం లేదని, మిల్లులను నడిపే పరిస్థితుల్లో తాము లేమని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయమై ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కమీషన్ పెంచితే తప్ప ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకోబోమని మెలిక పెట్టారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా మిల్లర్లు ధాన్యం దింపుకోకుంటే అధికారులకు అదొక పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మూడు జిల్లాల్లోనూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాకపోవడంతో రైతులు మార్కెట్లోకి ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. నల్లగొండ, తిప్పర్తి, భువనగిరి డివిజన్ ప్రాంతాల్లోని మార్కెట్లలో ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. అయినా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేవారు లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర కంటే తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు జిల్లాల్లో గన్నీ సంచుల కొరత... యాదాద్రి జిల్లాలో 20 లక్షల గన్నీ సంచులు కావాల్సి ఉండగా, 7.8 లక్షలు సివిల్ సప్లై గోదాముల్లో ఉన్నాయి. మరో 7.2 లక్షల సంచులను నల్లగొండ జిల్లా నుంచి సర్ధుబాటు చేస్తున్నారు. ఇవిగాక ఇంకా 5.8 లక్షల గన్నీ బ్యాగుల జిల్లాలో కొరత ఉంది. సూర్యాపేట జిల్లాలో 10 లక్షల గన్నీ బ్యాగులకు గాను 4.2 లక్షల గన్నీలు అందుబాటులో ఉండగా ఇంకా 5.8 లక్షల గన్నీల కొరత ఉంది. నల్లగొండ జిల్లాలకు సంబంధించి 22.50 లక్షల గన్నీ సంచులకు 23 లక్షల సంచులు సివిల్ సప్లై గోదాముల్లో నిల్వ ఉన్నాయి. తేమ యంత్రాలు, టార్ఫాలిన్లు, ఫ్యాన్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేల్స్కు ఎలాంటి కొరత లేదు. అన్ని వ్యవసాయ మార్కెట్ల్లో సిద్ధంగా ఉన్నాయి. -
కొనుగోళ్లకు సిద్ధం
ఉమ్మడి జిల్లా కార్యాచరణే ఖరారు 645 ధాన్యం, 31 మక్కల కేంద్రాలు 5లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం వారంలోగా సెంటర్లు ప్రారంభం అమ్మిన రెండు రోజుల్లోనే చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లా కార్యాచరణనే ఖరారు చేశారు. గత ఖరీఫ్లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించారు. వారంలోగా ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటున్నారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పత్తి కొనుగోళ్లపై సీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కరీంనగర్ అగ్రికల్చర్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 645 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5లక్షల టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్... డీఆర్డీఏ, ఐకేపీ, డీసీవో, సివిల్ సప్లయిస్, మార్కెటింగ్, మార్క్ఫెడ్ అధికారులతో ధాన్యం సేకరణ విధివిధానాలపై సమీక్షించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత ఖరీఫ్లో 576 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.30 లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరించారు. ఈసారి 645 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఐకేపీ 246, పీఏసీఎస్ 396, జీసీసీ 3 కేంద్రాలున్నాయి. గ్రేడ్–1 రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1510, సాధారణ రకానికి రూ.1470 కనీస మద్దతు ధర చెల్లించనున్నారు. ప్రతి కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా పర్యవేక్షించనున్నారు. అందుకు ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని నియమించనున్నారు. నగదును రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాల్సి ఉన్నందున వారి వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చే యాలని అధికారులకు జేసీ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకు ఖాతాలు లేని రైతులు వెంటనే తెరవాలని కోరుతున్నారు. నాణ్యత లేని ధాన్యం కొనుగోలు చేసినట్లయితే సదరు సెంటర్ ఇన్చార్జిపై చర్యలు తీసుకునేలా నిబంధనలు విధించారు. దిగుబడిపై దిగులు ఈ ఖరీఫ్లో 1.43 లక్షల హెక్టార్లలో వరి సాగుచేయగా దాదాపు సగం పంట ఎండిపోయింది. మిగిలిన పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు, వరదలు దెబ్బతీశాయి. మంథని నియోజకవర్గం మినహా అన్ని ప్రాంతాల్లో దాదాపు కోతలు కూడా మొదలవుతున్నాయి. ఈసారి దిగుబడి దాదాపు సగానికి పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అక్టోబర్ చివరి వరకు ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. మక్కల కొనుగోళ్లకు సై... జిల్లావ్యాప్తంగా 31 మొక్కజొన్న కొనుగోలు కేంద్రా ల ఏర్పాటుకు మార్క్ఫెడ్ సిద్ధమైంది. డీసీఎంఎస్, పీఏసీఎస్ల ద్వారా మక్కలను కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1365కు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది మార్క్ఫెడ్ ద్వారా 40 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొనుగోలు చేశారు. వ్యాపారులు మద్దతు ధర కంటే అధికంగా చెల్లించడంతో మార్క్ఫెడ్ కొనుగోలు చేపట్టలేదు. ఈసారి కూడా 31 సెంటర్లలో మక్కల కొనుగోళ్లు చేపట్టనున్నారు. ప్రస్తుతం వ్యాపారులు సైతం రూ.1400 పైచిలుకు ధర పెడుతున్నారు. మక్కల రాకను బట్టి వారంలోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మార్క్ఫెడ్ డీఎం శ్యాంకుమార్ తెలిపారు. మక్కల కొనుగోలు కేంద్రాలివే.. కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్, హుజూ రాబాద్, చొప్పదండి, జమ్మికుంట, జగిత్యాల, పెద్దపల్లి, ధర్మారం, గొల్లపల్లి, మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, మంథని, కాల్వశ్రీరాంపూర్ సబ్యార్డు, బెజ్జంకి సబ్యార్డు, మెట్పల్లి (వెల్లుల్ల), డీసీఎంఎస్ కేంద్రాలైన ఓదెల, కోహెడ, సారంగాపూర్, ఇల్లంతకుంట, చిగురుమామిడి, రాయికల్, సిరిసిల్ల, కథలాపూర్, సుల్తానాబాద్, జూలపల్లి, మేడిపల్లి, పెగడపల్లి. -
మేం కొనలేం..
ధాన్యం తీసుకెళ్లండి కొనుగోలు కేంద్రాల దుస్థితి ఇది ఇంకా తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు దళారుల ఇష్టారాజ్యం.. రోజురోజుకు తగ్గిపోతున్న ధర నిల్వచేసుకునే వీలు లేక తెగనమ్మేస్తున్న అన్నదాత సర్కారు నిబంధనలతో దక్కని మద్దతు ధర గూడూరుకు చెందిన రంగయ్యనాయుడుకు రెండెకరాల పొలం ఉంది. ఎకరాకు 4 పుట్లు చొప్పున 8 పుట్ల ధాన్యం పండింది. నూర్పిళ్లు చేశాక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ కేంద్రానికి తాళం వేసి ఉంది. అక్కడి నుంచి అధికారికి ఫోన్చేయగా ‘మేం కొనలేం.. తీసుకొచ్చిన ధాన్యాన్ని వెనక్కు తీసుకెళ్లండి’ అంటూ కట్చేశారు. ధాన్యాన్ని ఇంట్లో ఉంచుకునే చోటులేక.. మధ్యలోనే వ్యాపారస్తుడికి ఫోన్చేశారు. ఆ వ్యాపారి బస్తా రూ.వెయ్యికి అడిగారు. రంగయ్య బతిమలాడితే మరో రూ.50 పెంచాడు. బస్తా రూ.1050కి తెగనమ్మేసి ఇంటికి చేరుకున్నాడు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఎన్నడూలేని విధంగా రబీలో అధికారికంగా 5.4 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. పంటంతా దాదాపు కోతకు వచ్చింది. కొందరు నూర్పిళ్లు చేసి నివాసాల్లో దాచి ఉంచితే.. మరికొందరు పొలాల్లోనే నిల్వచేసుకుని మద్దతు ధర కోసం వేచిచూస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి ఉంది. అందుకోసం 164 కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటి ద్వారా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో నిల్వ చేయాలనుకున్నారు. ఆదిలో హంసపాదు జిల్లాలో ఈ ఏడు వరిని విస్తారంగా సాగుచేశారు. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో చేతికొచ్చింది. దీంతో రైతుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. అయితే గిట్టుబాటుధర వారిని భయపెడుతోంది. ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కేవలం 16 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసింది. అందులో ఇంతవరకు ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదు. రైతులు ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తీసుకెళితే చేదు అనుభవం ఎదురవుతోంది. రైతులకు అన్యాయం ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వచేస్తుంది. అయితే ఈసారి ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. అందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలే కారణం. గతేడాది ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద నిల్వచేశారు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యానికి 60 శాతం బియ్యం ఇచ్చేవారు. అయితే ఈసారి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులో నిల్వచేయాలంటే ఆ వ్యాపారి బ్యాంకు గ్యారెంటీ చూపించాలని నిబంధన పెట్టింది. రూ.కోటి విలువచేసే ధాన్యం నిల్వచేసుకోవాలంటే అంతే మొత్తానికి ష్యూరిటీ ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. అయితే మిల్లర్లు మాత్రం ‘మాకు అంత అవసరం ఏముంది. 25 శాతం మాత్రం గ్యారెంటీ ఇస్తాం. నిల్వచేసేపనైతే చేయండి.. లేదంటే మీ ఇష్టమొచ్చినచోట్ల ఉంచుకోండి’ అని తెగేసి చెబుతున్నారు. అన్నదాతకు దక్కని మద్దతు ధర ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు ఐదారుగురు మిల్లర్లు తప్ప మిగిలిన వారు ముందుకు రావటం లేదు. దీంతో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభింలేదు. అదేవిధంగా కొత్తవాటిని ఏర్పాటు చేయలేని దుస్థితి. ప్రభుత్వ చర్యలతో దళారులు, వ్యాపారుల పంట పండుతోంది. మొదటి రకం ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర రూ.1,450 ఉంటే.. వ్యాపారులు బస్తా రూ.1,200 నుంచి రూ.1,100కి కొనుగోలు చేసుకుంటున్నారు. అదేవిధంగా సాధారణ రకం రూ.1,410 ఉంటే.. వ్యాపారులు మాత్రం రూ.1,050 నుంచి రూ.1,070 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల పుణ్యమా అంటూ రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర దక్కకటం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు మాత్రం చెల్లించి మిగిలిన మొత్తాన్ని వచ్చే ఏడాది తీరుస్తానని వ్యాపారులను వేడుకుంటున్నారు. అప్పులబాధతో తక్కువ ధరలకే విక్రయించాం: వ్యవసాయ పెట్టుబడుల కోసం అప్పులు చేశాం. పంట వచ్చింది. అప్పులవాళ్లు అడుగుతున్నారు. ఇటుచూస్తేమో మేం అనుకున్న ధరకు ధాన్యం అమ్ముడుపోయేలా కనిపించడం లేదు. అటు చూస్తేనేమో అప్పులబాధ తట్టుకోలేకపోతున్నాం. వడ్డీ భారం పెరుగుతుండటంతో తక్కువ ధరలకే ధాన్యం అమ్మేశాం. -మోపూరు చెంచురామయ్య, రైతు అధికారులు పట్టించుకోలేదు: వరికోతలు చివరి దశలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే వాటి ద్వారా ఇంకా కొనుగోలు చేయటం లేదు. అప్పులబాధ భరించలేక వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. అయితే దళారులు మమ్మల్ని నిలువునా మోసం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. -మధుసూధన్రాజు,రైతు. -
జోరుగా రబీ లక్ష్యం
7 లక్షల మెట్రిక్ టన్నులకు దగ్గరగా ధాన్యం కొనుగోళ్లు గత ఏడాదితో పోలిస్తే 2.50 లక్షల మెట్రిక్టన్నులు ఎక్కువ హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్కు గాను పౌరసరఫరాల శాఖ ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోళ్లు భారీగా సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఈ ఏడాది రబీలో 7లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు జరగ్గా, మరో నెలన్నరలో 12లక్షల మెట్రిక్ టన్నుల మార్కును దాటవచ్చని అంచనా.గత ఏడాది ఇదే సమయానికి జరిగిన కొనుగోళ్లతో చూస్తే సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం బియ్యం లెవీని 75శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తూ జూన్ నెలలో నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలనుంచే ధాన్యం సేకరణను ప్రారంభించింది. ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో ఆన్లైన్ ద్వారా కనీస మద్దతు ధరను చెల్లించే ఏర్పాట్లు చేసింది. ఇలా ఇప్పటికే 1,426 కేంద్రాలను తెరిచి మొత్తంగా 6.88లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. దీనికి సంబంధించిన రూ.963.34కోట్లను ఆన్లైన్ ద్వారానే నేరుగా విక్రయదారుడి ఖాతాలో పడేలా చర్యలు తీసుకుంది. గత ఏడాది ఇదే సమయానికి 4.31లక్షల మెట్రిక్ టన్నుల సేకరణతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 2.57లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి మరో నెలన్నర రోజుల సమయం ఉన్న దృష్ట్యా, ఈ కాలంలో 15లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ లక్ష్యం అనుకున్నా 12లక్షల మెట్రిక్టన్నులకు దాటుతుందని సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి వంద శాతం సేకరణ.. కాగా వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తిగా లెవీని కేంద్రం ఎత్తివేయనున్న దృష్ట్యా పూర్తి ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేయనుంది. దీనికోసం ఇప్పటినుంచే పౌర సరఫరాల శాఖ కసరత్తు ఆరంభించింది. ఇందుకు మౌలిక వసతుల కల్పన, అధికారుల మోహరింపు అన్ని రాష్ట్రాలకు పెనుభారంగా పరిణమించే పరిస్థితి తలెత్తుతుంది. కొన్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాముల సమస్య రాష్ట్రాలకు ఇబ్బంది కల్గించే అంశమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని అధిగమించి కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతుల ఏర్పాటుకు ఆశాఖ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
ప్రతి గింజా కొంటాం
రైతులకు ఇబ్బంది రానివ్వం డిసెంబర్ 10 నుంచి ధాన్యం కొనుగోళ్లు డీఎస్వో కృష్ణారావు వెల్లడి మచిలీపట్నం : రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని డీఎస్వో కృష్ణారావు వెల్లడించారు. రైతులకు ఇబ్బంది రానివ్వబోమని స్పష్టం చేశారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూతన విధానం అమలులోకి తెస్తోంది. మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం నుంచి 25 శాతం మాత్రమే ఎఫ్సీఐ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. మిగిలిన 75 శాతం మిల్లర్లే బహిరంగ మార్కెట్లో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేసింది. దీంతో స్థానిక మార్కెట్లో బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ ఏడాది నుంచి ఈ విధానం మారడంతో మిల్లర్లు సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరుపుతారా అనేది రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఎంతమేరకు కొనుగోళ్లు జరుగుతాయి, నిబంధనలు ఎలా ఉన్నాయి, కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సిబ్బంది ఉన్నారా, గోనె సంచులు సకాలంలో రైతులకు అందిస్తారా, కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటిలోగా నగదు చెల్లింపులు ఉంటాయి తదితర అంశాలపై రైతులకు అనేక అనుమానాలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే వరికోతలు ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభించాలి. ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేని విధంగా ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎ.కృష్ణారావు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ వివరాలివీ... ప్రశ్న : ధాన్యం కొనుగోలులో నూతన విధానంపై రైతుల్లో అయోమయం నెలకొంది? డీఎస్వో : ఏదైనా నూతన విధానం అమలు చేసే సమయంలో కొన్ని అపోహలు ఉండటం సహజం. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై రూపొందించిన విధానం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. నూతన విధానం వల్ల బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు గణనీయంగా తగ్గే అవకాశముంది. ప్రశ్న : ధాన్యం మద్దతు ధర ఎంత ? డీఎస్వో : ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1400, కామన్ వెరైటీకి రూ.1360గా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. ప్రభుత్వం సూచించిన విధంగా ధాన్యం నాణ్యతతో ఉంటే మద్దతు ధర ప్రకారం కొనుగోలు జరుగుతుంది. ప్రశ్న : కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సిబ్బంది ఉన్నారా? డీఎస్వో : కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. సాంకేతిక నిపుణులకు ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి బుధవారం నుంచి విజయవాడలోని డీఆర్డీఏ కార్యాలయంలో శిక్షణ ప్రారంభమైంది. 28వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది. సమయం వృథా కాకుండా ఐదు సెషన్స్లో శిక్షణ ఇచ్చేందుకు అన్ని చర్యలూ తీసుకున్నాం. కొనుగోలు కేంద్రాల్లో ఉండే సిబ్బందికి ధాన్యం నాణ్యత పరిశీలన, రికార్డుల నిర్వహణ ఎలా చేయాలనే అంశం పైనా పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తాం. ప్రశ్న : రైతులకు నగదు చెల్లింపు ఎలా చేస్తారు? డీఎస్వో : కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయటం జరుగుతుంది. ధాన్యం అమ్మకం చేసే సమయంలోనే రైతు తన ఆధార్ నంబరును బ్యాంకు ఖాతా ఉన్న ఐఎఫ్ఎస్సీ కోడ్, పాన్ కార్డు నంబరు కొనుగోలు కేంద్రంలోని సిబ్బందికి ఇవ్వాల్సి ఉంది. ఏ కేంద్రంలో ఎన్ని టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు, ఏ రైతు నుంచి కొనుగోలు చేశారు, నగదు చెల్లింపు జరిగిందా, లేదా తదితర అంశాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచుతాం. దీని కోసం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి ట్యాబ్లెట్ పీసీలు ఇస్తాం. ప్రశ్న : రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ? డీఎస్వో : వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు హార్వెస్టర్ల ద్వారా వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉంటుంది. రైతులు ఈ విషయాన్ని గ్రహించి ధాన్యాన్ని 17 శాతం తేమ ఉండే వరకు ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. దీనివల్ల రైతులకు, కొనుగోలు కేంద్రంలోని సిబ్బందికి ఇబ్బందులు తగ్గుతాయి. ధాన్యంలో మట్టి బెడ్డలు, తాలు, తప్ప మూడు శాతం కన్నా ఎక్కువ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్న : గోనెసంచులు సిద్ధంగా ఉన్నాయా ? డీఎస్వో : డిసెంబరు 10లోగా సంచులు సిద్ధం చేయాలని మార్కెటింగ్ శాఖకు బాధ్యతలు అప్పగించాం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పరీక్ష చేసే యంత్రాలను సిద్ధం చేయాలని ఇప్పటికే చెప్పటం జరిగింది. మార్కెటింగ్ శాఖ అధికారులు వాటిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ప్రశ్న : గతంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో 27 వేల టన్నులకు మించి కొనుగోళ్లు జరగలేదు కదా.. ధాన్యం కొనేందుకు ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? డీఎస్వో : గతం సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం రైతులు పండించిన ప్రతి గింజా కొనేందుకు పౌరసరఫరాల శాఖ ద్వారా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం. ఏం జరుగుతుందో మీరే చూస్తారు. రైతులను ఎలాంటి ఇబ్బందులూ పడనివ్వం. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై జేసీ జె.మురళి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. -
వారంలో ధాన్యం కొనుగోళ్లు..
ఆదిలాబాద్ అర్బన్ : మరో వారం రోజుల్లో వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. 2014-15 ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరిధాన్యం మరో వారంలో విక్రయించవచ్చు. ఈ ఖరీఫ్లో 92,500 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనికోసం ఆయా కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎమ్మెస్, రైస్ మిల్లర్ల యజమానులు ధాన్యం కొనుగోలు చేయనున్నారు. మార్కెట్కు వచ్చే ధాన్యంలో మిల్లర్లు కొంత ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయాలని అధికారులు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. మిల్లర్లు కొనుగోలు చేసిన దాంట్లో 25శాతం లెవీ కింద ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ధాన్యం ఏ గ్రేడ్ రకానికి రూ.1,400, కామన్ రకానికి రూ.1,360 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. గతేడాది రబీలో పండించిన వరి ధాన్యం నిల్వకు సరిపడా గోదాములు లేక పక్క నిజామాబాద్ రైస్మిల్లర్లకు కొనుగోలు బాధ్యత అప్పగించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందు జాగ్రత్తగా గోదాముల కోసం పర్యవేక్షిస్తున్నారు. 179 కొనుగోలు కేంద్రాలు.. జిల్లా వ్యాప్తంగా 179 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయనున్నారు. ఐకేపీ ద్వారా 105 కొనుగోలు కేంద్రాలు, పీఏసీఎస్ 62, డీసీఎంఎస్ ద్వారా 12 కేంద్రాల్లో కొనుగోలు జరుపనున్నారు. గన్నీ బ్యాగులను సైతం సమకూర్చుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే.. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత రైస్ మిల్లర్లకు రవాణా చేయాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సంబంధిత తహశీల్దార్లు, ఆర్డీవోలు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు. దీంతోపాటు రైస్ మిల్లర్ల యజమానులు సైతం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నారు. మిల్లర్లు ధాన్యం కొనేందుకు ఆయా రైస్మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెస్పీ ధర ప్రకారంగానే రైతుల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. నిబంధనలివీ.. క్వింటాల్ గ్రేడ్-ఏ వరిధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1,400, కామన్ రకానికి రూ.1,360 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నాణ్యతకు సంబంధించి కూడా నిబంధనలు విధించింది. ధాన్యంలో తేమ 18 శాతానికి మించకూడదు. వ్యర్థాలు ఒక శాతం, చెత్త, తప్పలు ఒక శాతం, రంగుమారిన, పురుగు తిన్న, మొలకెత్తిన ధాన్యం 4 శాతం, పూర్తిగా తయారు కానీ, కుంచించుకుపోయిన ధాన్యం 3 శాతం, కల్తీరకం ధాన్యం 6 శాతం వరకు కోత విధించాలనే నిబంధన ఉంది. వీటిలో ఏ ఒక్కశాతం పెరిగినా ప్రభుత్వం నిర్ణయించిన ధరలో కోత పడుతుంది. -
ధాన్యం రైతుల దైన్యం
రైతన్నలకు పెద్ద కష్టమే వచ్చింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మార్కెట్ యార్డులు, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోళ్లు నత్తనకడన సాగుతున్నాయి. ఈ నెల మొదట్లో కేంద్రాలు ప్రారంభించిన నాటి నుంచి అదే ధోరణి. దీంతో పలువురు రైతులు తమ ధాన్యం కుప్పల వద్ద పదిహేను రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. చీటికి మాటికి అకాల వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేసరికి మళ్లీ వర్షం పడుతుండటంతో ధాన్యం మొలకెత్తుతోంది. ధాన్యం కొన్న వెంటనే డబ్బులు చెల్లిస్తామని ఇంతవరకు పైసా ఇవ్వలేదని రైతులు మండిపడుతున్నారు. తడిసిన ధాన్యానికి వెంటనే కొనుగోలు చేసి, మద్దతు ధర చెల్లించాలని ఆందోళనలకు దిగుతున్నా.. అరణ్య రోదనే అవుతోంది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. లారీల కొరత, మిల్లర్లు సహకరించకపోవడం, గన్నీ సంచులు, హమాలీల కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయింది. ఫలితంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల తీరు రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. కేంద్రాలకు, యార్డులకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఆ కుప్పల వద్దే నిరీక్షించక తప్పడం లేదు. ఇదే అదనుగా దళారులు, వ్యాపారులు రంగంలోకి దిగి అంది నకాడికి దోచుకుంటున్నారు. రబీ సీజన్లో ఒకేసారి ధాన్యం ముంచెత్తుతుందని తెలిసి కూడా అధికారులు ఏర్పాట్లలో శ్రద్ధచూపడం లేదు. 619 ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు లారీల కొరత వేధిస్తోంది. ట్రాన్స్పోర్టు కిరాయి విషయమై మిల్లర్లకు లారీ యజమానులకు జరుగుతున్న వివాదంతోనే వాహనాలు అందుబాటులో ఉంచడం లేదని సమాచారం. మరికొన్ని చోట్ల సరిపడా గన్నీ సంచులు కేంద్రాలకు రాలేదు. 50 లక్షల గన్నీ సంచులు అవసరమున్నా అందుబాటులో ఉంచలేదు. ఫలితంగా తరలింపు ఆలస్యమై ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. స్థలం కొరత ఏర్పడి ధాన్యం ఆరబోయడానికి ఇబ్బంది అవుతోంది. సరిపడా కాంటాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల కొనుకోళ్ల ప్రక్రియ నత్తనకడన సాగుతోంది. వ్యాపారులు తెచ్చిన ధాన్యాన్ని ముందుగా లోడింగ్, అన్లోడింగ్ చేసుకుం టున్న మిల్లర్లు... ఐకేపీ కేంద్రాల ద్వారా వచ్చిన ధాన్యాన్ని ఆలస్యంగా తీసుకుంటున్నారు. దీం తో అన్లోడింగ్ కాక లారీలు అక్కడే నిలిచి పోతున్నాయి. రైతులకు కనీసం తాగునీరు, నీడ కల్పించడంలో అధికారులు, నిర్వాహకులు విఫలమయ్యారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచడం లేదు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా వాహనాలు, గన్నీ సంచు లు వచ్చేలా చూడకుండా... సరిపడా కాంటాలు ఏర్పడకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు కాయలేక ధర తక్కువైనా నేరుగా మిల్లులకు, వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. చెల్లింపులేవీ? ఈ నెల 4న కొనుగోళ్లు ప్రారంభం కాగా... ఇప్పటివరకు 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి సుమారు రూ.200 కోట్లు పెండింగ్ ఉన్నాయి. కొనుగోలు చేసిన వారం రోజుల్లోగా డబ్బులు అందిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎవరికీ డబ్బులు చెల్లించలేదు. ఆన్లైన్లో నేరుగా ఖాతాల్లో జమ చేస్తామంటున్న అధికారుల తీరుతో రైతులు మరింత ఆం దోళన చెందుతున్నారు. ఖాతాల్లోకి చేరిన డబ్బు ను రుణ బకాయి కింద బ్యాంకులు రికవరీ చేసుకుంటాయేమోనని భయపడుతున్నారు. దండుకుంటున్నారు.. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు మందగించడంతో దళారులు, వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. కల్లాల వద్దే క్వింటాల్కు రూ.1,200 నుంచి రూ.1,250 లోపు మాత్రమే చెల్లిస్తున్నారు. దళారుల దోపిడీ రోజుకు రూ.35 లక్షల వరకు ఉంటున్నట్లు అంచనా. సోమవారం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు 15 వేల బస్తాల ధాన్యం వచ్చింది. తేమ సాకుతో ప్రభుత్వరంగ సంస్థలు ధాన్యం కొనుగోలు చేయలేదు. నాణ్యమైన ధాన్యానికి సైతం వ్యాపారులు మద్దతు ధరకంటే రూ.150 తక్కువగా ధర నిర్ణయించారు. ఇష్టముంటే అమ్ముకోండి... లేదంటే వెళ్లిపోండి.. అని వ్యాపారులు నిర్లక్ష్యంగా మాట్లాడటంతో రైతులు ఆగ్రహంతో మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులను నిర్బంధించే ప్రయత్నం చేశారు. చివరకు దిక్కులేక క్వింటాల్కు రూ.100 తక్కువకు వ్యాపారులకే అమ్ముకుని వెనుదిరిగారు. -
మా సమస్యలు పరిష్కరించకపోతే... ధాన్యం కొనుగోళ్లు నిలిపేస్తాం
సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల సమస్యలు పరిష్కరించని పక్షంలో నవంబరు 15వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తామని, లెవీ కార్యక్రమంలో పాల్గొనబోమని రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో జరిగిన అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్ణయించిందని రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు దేవేందర్రెడ్డి తెలిపారు. సంఘం పదాధికారులతో కలిసి బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ‘‘రూ.30 వేల కోట్ల వార్షిక టర్నోవరుతో రూ. 3 వేల కోట్లకుపైగా పన్ను చెల్లిస్తున్న రైస్ మిల్లింగ్ పరిశ్రమను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ధాన్యం సేకరణ, బియ్యం లెవీ పంపిణీ, కస్టమ్డ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్ - ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడం)లో కీలక భూమిక పోషించే రైస్ మిల్లింగ్ పరిశ్రమను అన్ని అంశాల్లో భాగస్వామ్యం చేయాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. గత కొంతకాలంగా ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో కనీసం పరిశ్రమ ప్రతినిధులను సంప్రదించడమే లేదు. రాష్ట్రంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసేది ప్రైవేటు రంగంలోని మా పరిశ్రమే. ఇంతటి ముఖ్యమైన పరిశ్రమ సమస్యలను పట్టించుకోకుండా ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం సాధించాలంటే ఎలా? ప్రభుత్వం చేయాల్సినవి చేయకుండా, సమస్యలు పరిష్కరించకుండా రైస్ మిల్లర్లను విలన్లుగా చూపాలని ప్రయత్నిస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి అయితే మమ్మల్ని సమావేశానికి పిలవడానికే పెద్ద మేలు చేసినట్లు భావిస్తున్నారు..’ అని అసోసియేషన్ ప్రతినిధులు విమర్శించారు. ఇంత దారుణమా?: ‘‘ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ఆడించేందుకు (సీఎంఆర్) మిల్లింగ్ చార్జీలు ప్రభుత్వం పదేళ్ల నుంచి పెంచలేదు. గత నాలుగేళ్లలో విద్యుత్తు చార్జీలు భారీగా పెరిగాయి. ఉదాహరణకు గతంలో రూ. 75 వేల విద్యుత్తు బిల్లు చెల్లించే మిల్లు ఇప్పుడు రూ.2.5 లక్షలు చెల్లిస్తోంది. మరి ఇంతగా విద్యుత్తు చార్జీలు పెంచిన ప్రభుత్వం సీఎంఆర్ చార్జీలు పెంచకపోవడంకంటే దారుణం ఏముంటుంది?’’ అని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవేందర్రెడ్డి, హనుమంతరావు ప్రశ్నించారు. 15 నుంచి నిలిపేస్తాం: ‘‘మా డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో వచ్చేనెల 15వ తేదీ నుంచి ధాన్యం సేకరణ, లెవీ పంపిణీ, సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియలను పూర్తిగా నిలిపివేస్తాం. ధాన్యం మద్దతు ధరకు అమ్ముకునే విషయంలో రైతులకు ఇబ్బంది కలుగరాదనే ఉద్దేశంతోనే ప్రభుత్వానికి సమస్యల పరిష్కారం కోసం ఈ గడువు ఇస్తున్నాం’’ అని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మార్కెట్లో కిలో బియ్యం రూ. 55కు పెరగడానికి మిల్లర్లు కారణం కాదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘‘మిల్లుల్లో ఎక్కడా కిలో బియ్యం రూ. 35 మించి లేదు. ప్రభుత్వం కోరితే ఇదే ధరతో రెండు లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి మేం సిద్ధం’’ అని పేర్కొన్నారు. మిల్లర్ల డిమాండ్లివీ... గత పదేళ్లుగా క్వింటాల్ ధాన్యాన్ని ఆడించేందుకుగాను ప్రభుత్వం ముడి బియ్యానికి రూ. 15, ఉప్పుడు బియ్యానికి రూ.25 సీఎంఆర్ చార్జీల కింద చెల్లిస్తోంది. మన రాష్ట్రంలో కంటే విద్యుత్తు చార్జీలు తక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్లో క్వింటాల్కు ముడి బియ్యానికి రూ. 55, ఉప్పుడు బియ్యానికి రూ.85 చెల్లిస్తున్నారు. ఇదే ప్రకారం మన రాష్ట్రంలోని రైస్మిల్లులకు కూడా చెల్లించాలి. 2013 -14 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ధాన్యానికి క్వింటాల్కు కామన్ గ్రేడ్ రూ. 1,310, గ్రేడ్-‘ఎ’ రూ.1,345 చొప్పున కనీస మద్దతు ధరలు నిర్ణయిం చిన ప్రభుత్వం మిల్లర్ల నుంచి లెవీ బియ్యం సేకరణ ధరను మాత్రం ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఇప్పటికైనా వెంటనే బియ్యం లెవీ సేకరణ ధరను నిర్ణయించాలి. బీపీటీ లాంటి మేలురకం బియ్యం బయట రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునేందుకు సంబంధించి ఆంక్షలను తక్షణ మే తొలగించాలి. ఈ ధాన్యానికి క్వింటాల్కు రూ.1,500 ప్రోత్సాహక ధర ప్రకటించిన ప్రభుత్వం ఈ బియ్యం అమ్మకం ధరను ప్రకటిస్తే తదనుగుణంగా అమ్ముతాం.