Rural Development Department
-
పవన్ శాఖలో చీలిక పీలికలు ఎందుకో!
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేటాయించిన మంత్రిత్వ శాఖలనూ చీలిక పీలికలు చేసి వేరే మంత్రికి అప్పగించడంపై ఆ పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాల్లోనూ కొత్త చర్చ మొదలైంది. ఒకే శాఖ పరిధిలో ఉండే విభాగాలను వేర్వేరు శాఖలుగా విభజించి ఇద్దరు మంత్రులకు కేటాయించడం హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ను వేరు చేసి కొండపల్లి శ్రీనివాస్కు అప్పగించడం చర్చకు దారితీసింది. ఈ రెండింటికి ఇద్దరు మంత్రులు ఉన్నా రెండు శాఖలకు ముఖ్య కార్యదర్శిగా ఒకరే ఉండటం గమనార్హం. ఇటీవల పవన్ కళ్యాణ్ వరుసగా తన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. తన శాఖల్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నిధుల కొరత వేధిస్తోందని ఆయన చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు సెర్ప్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంటాయి. దాదాపు 65 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా ఫింఛన్ల పంపిణీ సెర్ప్ నేతృత్వంలోనే సాగుతోంది. దీనికి డ్వాక్రా గ్రూపులు, వాటికనుగుణంగా వివిధ సంక్షేమ పథకాల అమలు కూడా సెర్ప్ పరిధిలోనే కొనసాగుతుంటాయి. అలాంటిది సెర్ప్ విభాగాన్ని పవన్ కళ్యాణ్కు కాకుండా మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు అప్పగించడానికి ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. సెర్ప్కే అధికంగా నిధులుపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మొత్తం బడ్జెట్పరంగా చూసినా నిధుల కేటాయింపు సెర్ప్కే ఎక్కువగా ఉంటుంది. సెర్ప్ ద్వారా జరిగే పింఛన్ల పంపిణీకి ఏటా ప్రభుత్వం దాదాపు రూ.27 వేల కోట్లకు పైబడే నిధులు కేటాయిస్తోంది. ఇతర కార్యక్రమాలకు మరికొన్ని నిధులు ఎటూ తప్పనిసరి. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఇతర అన్ని విభాగాలకు దాదాపు అంత బడ్జెట్ కేటాయింపులకు అవకాశం ఉన్నప్పటికీ.. వాటిలో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నేరుగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు కేటాయించే నిధులే. అందులో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల వాటా తక్కువే. ఓవైపు నిధుల కేటాయింపులోనూ అధిక వాటా కలిగి ఉండి, మరోవైపు ప్రభుత్వ పథకాల అమలులో ప్రత్యక్షంగా ప్రజల నుంచి మంచి పేరును తెచి్చపెట్టేందుకు ఎక్కువ అవకాశం ఉన్న సెర్ప్ను పవన్ కళ్యాణ్కు కేటాయించకపోవడం ఏమిటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. నారాయణకు ప్రత్యేకం గ్రామాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం గ్రామీణాభివృద్ధి శాఖలో సెర్ప్ ఉన్నట్టే.. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మెప్మా పేరుతో ఒక విభాగం ఉంది. అయితే, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న మెప్మాను ఆ శాఖ మంత్రి నారాయణ పరిధిలోనే ఉంచడం గమనార్హం. -
మళ్లీ కొత్త పద్ధతుల్లో ‘పనికి ఆహార పథకం’?
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కొత్త పద్ధతుల్లో ‘పనికి ఆహార పథకం’ అమలు కానుందా? జాతీయ స్థాయిలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార సమస్య ల పెరుగుదలతో కొత్త రూపంలో ఈ పథకాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నాయనే చర్చ అధికార వర్గాల్లో జరుగు తోంది. మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈఎస్) కింద చేసే ఉపాధి పనులకు ఇచ్చే కూలీలో కొంత (పార్ట్ పేమెంట్) బియ్యం ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు చేరినట్లు తెలుస్తోంది. భారీగా పెరిగిన నిల్వలు..: గతేడాది బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషే ధం, పారాబాయిల్డ్ రైస్పై 20 శాతం ఎక్స్పోర్ట్ డ్యూటీ వంటి చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలతో దేశంలో బియ్యం నిల్వలు 1.4 కోట్ల టన్నులకు చేరుకోవడంతో గిడ్డంగి ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ‘పనికి ఆహార పథకం’కింద గ్రామీణభివృద్ధి శాఖకు బియ్యం కేటాయింపును ఒక మార్గాంతరంగా కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక వివిధ కాంబినేషన్లు, రూపాల్లో దీన్ని ఇచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. ప్రయోజనం ఉండదంటున్న నిపుణులు కూలీ మొత్తంలో కొంత భాగాన్ని బియ్యంగా ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కూలీలు ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొనే ఆస్కారం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి హామీ పథకం అమల్లోకి రావడానికి ముందు ‘పనికి ఆహార పథకం’కింద అనేక అక్రమాలు, కుంభకోణాలు జరిగిన తీరును గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ‘ఫుడ్ ఫర్వర్క్ స్కీం’లో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకోవడం, ఈ పథకం కింద కేటాయించిన బియ్యం నేరుగా బహిరంగ మార్కెట్కు చేరుకోవడం వంటివి జరిగిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. అదీగాకుండా ఉపాధి హామీ పథకం కింద కూలీని నగదు రూపంలో ఇవ్వాల్సి ఉండటం, ఇచ్చే బియ్యానికి లెక్క కట్టడం, ఇతర సమస్యలు ఉత్పన్నమౌతాయని చెబుతున్నారు. -
ఇక జెడ్పీలు, మండలాల్లో ‘ప్రత్యేక’ పాలన
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్లలో ‘ప్రత్యేక’ అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. జూలై 4తో 32 జిల్లా పరిషత్లు, 538 మండల పరిషత్ పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. టర్మ్ ముగిసేలోగా ఎన్నికలు జరిపే అవకాశం లేకపోవడంతో రోజువారీ కార్యక్రమాల కొనసాగింపునకు వీలుగా స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. మెజారిటీ జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు బీఆర్ఎస్కు చెందినవారే ఉండటంతో ఎన్నికలు జరిగే దాకా పాత పాలక మండళ్లనే కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సన్నాహాలు చేస్తోంది. జూలై 5 కల్లా కసరత్తు పూర్తిచేసి, పీఆర్, రెవెన్యూ, మున్సిపల్,విద్య, వైద్య, ఆరోగ్య శాఖల నుంచి ఉద్యోగుల హోదాలకు అనుగుణంగా ప్రత్యేక అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. గత ఫిబ్రవరి 1తో రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామపంచాయతీల కాలపరిమితి ముగిసింది. మరుసటి రోజు నుంచే పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. ఇవీ సమస్యలు... పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక, మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినా వివిధ కారణాలు, ఆయా అంశాలపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వపరంగా అటు గ్రామపంచాయతీలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అడుగు ముందుకుపడలేదు. ⇒ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, ఉపకులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అయితే ఈ వాగ్దానం అమలు చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉండగా, దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో కసరత్తు మొదలు కాలేదు. ⇒ బీసీ కులగణన ఆధారంగా గ్రామీణ స్థానికసంస్థల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ⇒ రాష్ట్రవ్యాప్తంగా కులగణనకు ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉండటంతో కొత్త ఓటర్ల జాబితా (లోక్సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన లిస్ట్) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి..ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. ⇒ బీసీ కమిషన్పరంగా ఓటర్ల జాబితా ఆధారంగా ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ, రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించి ముందుకు సాగొచ్చనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు సమాచారం. ⇒ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఓటర్ల జాబితా ప్రకారమా లేక క్షేత్రస్థాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై ప్రభుత్వపరంగా స్పష్టత కొరవడినట్టు చెబుతున్నారు. ⇒ ఓటర్ల లిస్ట్కు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చొచని, సామాజిక, ఆర్థిక కులసర్వే అయితే సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ మరో రెండునెలల్లో (ఆగస్టు నాటికి) ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషన్న్ద్వారానే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారా లేక కొత్త కమిషన్ను నియమించేదాకా ఆగుతారా అనేదానిపై స్పష్టత లేదు. ట్రిపుల్ టెస్ట్..మరో మెలిక సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు నిర్దేశించింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల ఏఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని స్పష్టం చేసింది. ⇒ మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి) 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ⇒ ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహ¯న్రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది. ⇒ ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనే సూచనలు బీసీ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సందిగ్ధత నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆ వివరాలు, ఎన్నికల నిర్వహణకు తేదీలు తెలియజేస్తే 15, 20 రోజుల అంతరంలో గ్రామపంచాయతీ, జిల్లా, మండలపరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. -
కరువు మండలాల్లో అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 103 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూలు మినహాయించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగిలిన 102 మండలాల్లో అదనపు పనులు కల్పిస్తారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సోమవారం కేంద్రానికి లేఖ రాశారు. కరువు మండలాల్లో అదనపు పని దినాలు.. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి వంద పనిదినాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో మాత్రం ఈ ఏడాది ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు కల్పిస్తారు. 102 మండలాల పరిధిలో 5.68 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటుంటారు. 5.68 లక్షల కుటుంబాల్లో దాదాపు లక్ష కుటుంబాలు ఇప్పటికే వంద పనిదినాల గరిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఉండడం లేదా గరిష్ట లక్ష్యానికి అతి దగ్గరగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబాలతోపాటు దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో అదనపు పనులు కోరేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 102 మండలాల పరిధిలో కనీసం 2,42,282 కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
‘ఉపాధి’లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: పేదలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించే విషయంలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ తర్వాత వంద రోజుల వ్యవధిలోనే పేదలకు వారి గ్రామాల్లోనే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.4,554.34 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. పని కావాలని అడిగిన ప్రతి వారికి పనులు కల్పించడంతో పాటు సగటున రోజువారీ వేతనంగా రూ. 246 చొప్పున అందజేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలయ్యే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రాథమికంగా 15 కోట్ల పని దినాలు కేటాయించింది. ఉపాధి హామీ పథకం చట్టం ప్రకారం పని కావాలని అడిగిన ప్రతి వారికి తప్పనిసరిగా పనులు కల్పించాలన్న నిబంధనకు అనుగుణంగా జూన్ నెలాఖరు నాటికే ఆ 15 కోట్ల పని దినాల లక్ష్యం పూర్తయినా.. అదనపు పనుల కేటాయించాలని కోరుతూ కేంద్రానికి సమాచారం తెలియజేసి, ఆ తర్వాత పని కావాల్సిన వారికి పనులు కల్పిస్తూ వస్తోంది. శనివారం (జూలై 22వ తేదీ) నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 42.27 లక్షల కుటుంబాలు 18.47 కోట్ల పని దినాలను పూర్తి చేసుకుని లబ్ధి పొందినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రం కల్పించలేని స్థాయిలో.. దేశవ్యాప్తంగా మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొనసాగుతుండగా... అత్యధికంగా పనుల కల్పనలో మన రాష్ట్రమే దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. మన రాష్ట్రం తర్వాత తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 69.26 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కార్డులు ఉండగా, అందులో 56.76 లక్షల కుటుంబాలు గత మూడేళ్లలో అవసరమైన రోజు ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకొని లబ్ధి పొందినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. గత వంద రోజులలో మన రాష్ట్రంలో మొత్తం æ74,092 మంది దివ్యాంగులు కూడా ఉపాది హామీ పథకం పనులకు హాజరై లబ్ధి పొందారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. 24 కోట్ల పని దినాలు సాధించే దిశగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు పూర్తికాక మునుపే.. 18.47 కోట్ల పని దినాలు కల్పించిన నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం 24 కోట్ల పనిదినాలు కల్పించేలా లేబర్ బడ్జెట్ కేటాయింపులను పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కేంద్ర అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. -
సందీప్ సుల్తానియా వ్యవహారశైలిపై అధికారులు, ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా వ్యవహార శైలిపై ఆ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన వ్యవహారశైలి మార్చుకునేలా జోక్యం చేసుకోవాలని మంత్రి దయాకర్రావును తెలంగాణ సీఈవోలు, డిప్యూటీ సీఈవోల సంక్షేమ సంఘం విన్నవించింది. ఈ మేరకు ఓ వినతిపత్రం మంత్రికి సమర్పించింది. సానుకూల వాతావరణం చెడిపోతోంది తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి తీసుకున్న చర్యలతో దీర్ఘకాలంగా ఉన్న సర్వీసు, పరిపాలనా పరమైన సమస్యలు పరిష్కారమై అన్ని స్ధాయిల్లో ప్రమోషన్లు, పోస్టింగ్లతో అధికారులు, ఉద్యోగుల్లో సానుకూల వాతావరణం ఏర్పడిందని ఆ సంఘం సభ్యులు వెల్లడించారు. అయితే కొంతకాలంగా సుల్తానియా వ్యవహారశైలి, అధికారులు, ఉద్యోగుల పట్ల ప్రదర్శిస్తున్న అనుచిత వైఖరితో ఈ సానుకూల వాతా వరణమంతా దెబ్బతిందని మంత్రి దృష్ఖికి తీసుకొచ్చారు. టెలీ, వీడియో కాన్ఫ రెన్స్లలో అధికారులు, ఉద్యోగుల పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయి అధికారుల స్పందన, వారి వైపు నుంచి అభిప్రా యాలు తీసు కోకుండానే పరుషంగా వ్యవహరిస్తుండడంతో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. చిన్న చిన్న కారణాలతో డీఆర్డీవోలు, డీపీవోలను సైతం సస్పెన్షన్ లేదా ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి పరిణామాలు అధికారులను తీవ్ర ఒత్తిళ్లకు, అయోమయానికి గురి చేస్తున్నాయని తెలియజేశారు. పీఆర్ శాఖ అధికారులు, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, తక్షణమే మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకుని పనిచేసే వాతావరణం కల్పించాలని కోరారు. పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా వ్యవహారశైలిపై అధికారులు, ఉద్యోగుల ఆగ్రహం telangana ceo ఎర్రబెల్లికి తెలంగాణ సీఈవోలు, డిప్యూటీ సీఈవోల సంక్షేమ సంఘం వినతిపత్రం -
ఇక కొండలపై మొక్కల పెంపకం
సాక్షి, అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లోని కొండలపై ఈ వర్షాకాలంలో ఒకే రోజు కోటి పండ్ల మొక్కలు నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. ఉపాధి హామీ పథకంలో.. కొండలపై మొక్క బతికేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి ఖర్చుతో అధికారులు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. సాధారణంగా మొక్కల పెంపకంలో ఒక్కో మొక్క నాటాలంటే.. గుంత తీసేందుకు కనీసం రూ.25, మొక్క కొనుగోలుకు రూ.25 నుంచి రూ.50.. ఇలా ఒక్కో మొక్కకే రూ.50 నుంచి 100 దాకా ఖర్చవుతుంది. అయితే సీడ్ బాల్స్ విధానంలో ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి మాత్రమే ఖర్చుపెట్టేలా కొండలపై ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సేంద్రియ ఎరువులతో కూడిన షోషకాలు ఎక్కువగా ఉండే మట్టిని సిద్ధం చేసుకుని.. ఆ మట్టిని ఉండలు ఉండలుగా చేస్తారు. ఒక్కో ఉండలో నాటాల్సిన మొక్కకు సంబంధించిన విత్తనాన్ని ఉంచుతారు. ఎలాంటి నేలలోనైనా నామమాత్రపు తేమకే ఆ విత్తనం మొలకెత్తేలా ఆ మట్టి ఉండలు(సీడ్స్ బాల్స్) అత్యంత నాణ్యంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విత్తనం, మట్టి ఉండల తయారీకి అయ్యే ఖర్చు కూడా ఒక్కో దానికి అర్ధరూపాయి లోపే ఉంటుందంటున్నారు. కనీసం వెయ్యి కొండల్లో పదివేల చొప్పున.. ఈ వర్షాకాలంలో కొండలపై కోటి మొక్కలు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ.. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు మండలానికి రెండేసీ కొండలను ఎంపిక చేసుకోనుంది. మండలానికి కనీసం ఒక్క కొండపైనైనా ఈ సీడ్ బాల్స్ విధానంలో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇలా రాష్ట్రంలో 660 మండలాల్లో కనీసం వెయ్యి కొండల్లో ఒక్కో కొండపై పది వేల చొప్పున మొక్కల పెంపకాన్ని చేపడతారు. ఉపాధి హామీ పథకం, వాటర్హెడ్ కార్యక్రమాల్లో భాగంగా గతంలో కూలీల ద్వారా వర్షం నీరు నిల్వలకు స్ట్రెంచ్ల తవ్వకం జరిపిన కొండలను ఎక్కువగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. కాగా, సీతాఫలం, ఉసిరి, రేగు వంటివాటితో పాటు కుంకుడు, వెలగ వంటి వాటినే ఈ మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. నీడకు పనికొచ్చే వేప, కానుగ మొక్కలను కూడా పెంచుతారు. కొండల గుర్తింపు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వర్షాకాలం మధ్య కల్లా కార్యక్రమాన్ని చేపడతామని అధికారులు వెల్లడించారు. -
గిరిజనులకు అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రతియేటా రూ.151 కోట్ల మేర అదనపు ‘ఉపాధి’ చేకూర్చేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఆయా కుటుంబాలన్నింటినీ ఉపాధి హామీ పథకంలో ఏటా 150 రోజుల చొప్పున పనులు పొందే వారి జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం.. సాధారణ కుటుంబాలకు ఏటా గరిష్టంగా వంద రోజుల చొప్పున పనులు కల్పిస్తున్నప్పటికీ, అటవీ భూహక్కు పట్టాదారులకు కుటుంబానికి ఏటా 150 రోజులు పనులు కల్పించే వెసులుబాటు ఉంది. దీంతో.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఓఎఫ్ఆర్ లబ్దిదారులు మొత్తం 1,82,316 కుటుంబాలు ఉండగా.. నెలరోజుల క్రితం వరకు ఈ సంఖ్య 72,646 కుటుంబాలు మాత్రమే 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హత ఉన్న జాబితాల్లో పేర్లు నమోదు చేసుకున్నాయి. నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్.. ఈ నేపథ్యంలో.. అర్హత ఉన్న మిగిలిన కుటుంబాలను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. ఆయా గిరిజన గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లే తమ పరిధిలోని ఆయా అర్హులను గుర్తించి, వారి వివరాలను మండల కేంద్రంలో అప్డేట్ చేస్తారు. గత 15 రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్లే ఆయా లబ్ది దారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,424 కుటుంబాలను కొత్తగా 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హుల జాబితాలోకి తీసుకొచ్చారు. ఇంకా 55,246 కుటుంబాలను ఈ పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని.. ఈ నెలాఖరుకల్లా అర్హులందరినీ ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వివరించారు. ఇక ప్రస్తుతం గరిష్టంగా ఏటా వంద రోజుల చొప్పున ఉపాధి హామీ పథకం పనులు పొందుతున్న ఆయా కుటుంబాలు అదనంగా 50 రోజుల ఉపాధి పొందితే ఒక్కో పనిదినానికి గరిష్టంగా రూ.272 చొప్పున రూ.13,600ల వరకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. -
AP: గ్రామీణాభివృద్ధిశాఖకు మరో స్కోచ్ అవార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మరో స్కొచ్ అవార్డును సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటిని పెద్ద ఎత్తున నిల్వచేసుకునే ప్రక్రియలో భాగంగా అమృత్ సరోవర్ కార్యక్రమం అమలుకుగాను 2023 సంవత్సరానికి స్కోచ్ సిల్వర్ అవార్డుకు రాష్ట్రం ఎంపికైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఒక్కో జిల్లాలో 75 వంతున రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 1,950 చెరువులను ఈ కార్యక్రమంలో ఉపాధి పథకం ద్వారా నిరి్మంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,810 చెరువుల నిర్మాణం పూర్తయింది. ఈ నెలాఖరుకల్లా మిగిలిన 140 చెరువుల నిర్మాణం పూర్తవుతుందని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. స్కోచ్ సిల్వర్ అవార్డుకు రాష్ట్రం ఎంపికైన విషయాన్ని స్కోచ్ సంస్థ ప్రతినిధులు బుధవారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలకు గత ఏడాది గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)తో పాటు వివిధ జిల్లాల డీఆర్డీఏలకు ఆరు స్కోచ్ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: సీఎం జగన్ను కలిసిన జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ -
జేపీఎస్ల సమ్మె ఉధృతం!
సాక్షి, హైదరాబాద్: జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్/ఓపీఎస్) సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. తమ సర్వీసు రెగ్యుల రైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటిదాకా జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు తెలిపిన జేపీఎస్లు, ఇకముందు ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేయనున్నారు. వినూత్న పద్ధతుల్లో నిరసనలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామస్తుల నుంచి వీరికి మద్దతు పెరుగుతోంది. మరోవైపు ఓ మహిళా జేపీఎస్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన ఉద్యోగం ఇక పర్మినెంట్ కాదనే బెంగతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని జేపీఎస్లు చెబుతున్నారు. ఇదిలాఉండగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరసన కార్యక్రమాలు వరుసగా 15వ రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో ట్యాంక్బండ్పై బతుకమ్మ ఆడి, ర్యాలీ తీసి ప్రదర్శనలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘భద్రాద్రి రామయ్యా.. రెగ్యులరైజేషన్ జీవో ఇప్పించయ్యా’ అనే బ్యానర్ను ప్రదర్శిస్తూ గోదావరి నదిలో దిగి నిరసన తెలిపారు. కాగా 15 రోజులుగా జేపీఎస్లు విధులకు గైర్హాజరు అవుతుండటంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. తొమ్మిది వేల మందికిపైగా సమ్మెలోనే.. రాష్ట్రంలోని మొత్తం 12,769 పంచాయతీలకు గాను మూడువేల మందికిపైగా పంచాయతీ కార్యదర్శులు (పర్మినెంట్ ఉద్యోగులు) ఉన్నారు. మిగతా 9,350 గ్రామపంచాయతీల్లో 8 వేలకుపైగా జేపీఎస్లు, వెయ్యిమంది దాకా ఓపీఎస్లు విధులు నిర్వహిస్తున్నారు. గతనెల 11వ తేదీతో దాదాపు 6వేల మంది జేపీఎస్లు నాలుగేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియపై ప్రభుత్వపరంగా ఎలాంటి కసరత్తు మొదలెట్టకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. దీంతో తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలంటూ సమ్మె నోటీస్ ఇవ్వడంతో పాటు గత నెల 28 నుంచి సమ్మె ప్రారంభించారు. వీరితో పాటు మిగతా జేపీఎస్లు, ఓపీఎస్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. టర్మినేషన్ హెచ్చరికలు బేఖాతర్.. గత మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్చరించారు. దీంతో అయిదారు వందల మంది జేపీఎస్లు తిరిగి విధుల్లో చేరినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే వారిలో పలువురు తిరిగి సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. జేపీఎస్ల డిమాండ్ల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానంపై స్పష్టత లేకపోవడం, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే చట్ట, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న ఉద్దేశంతో సమ్మె చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో కీలక విధులు నిర్వర్తించే కార్యదర్శులపై ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలు వ్యతిరేకతకు దారితీయవచ్చనే ఆందోళన కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వపరంగా ఏ హామీ లభించినా సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేపీఎస్లు చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం గోదావరిలో దిగి నిరసన తెలుపుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. అనంతరం భద్రాద్రి రామయ్యకు వినతిపత్రం సమర్పించారు. – భద్రాచలం అర్బన్ అన్ని పనులకూ వారే.. గ్రామాల్లో దాదాపు అన్ని పనులు పంచాయతీ కార్యదర్శుల ద్వారానే జరుగుతుంటాయి. రోజువారీ పారిశుధ్యం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధిత పనులన్నీ పర్యవేక్షిస్తుంటారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ సర్టిఫికెట్లు, ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులు, మ్యుటేషన్ల జారీ వంటి అనేక విధులను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి సమ్మెతో గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడ పేరుకుపోతున్నాయి. జేపీఎస్ల స్థానంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, కారోబార్లు, సెర్ప్ సిబ్బంది, ఇతర గ్రామ స్థాయిల్లోని కాంట్రాక్ట్, ఇతర విధులు నిర్వహిస్తున్న వారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం కనిపించడం లేదని అంటున్నారు. మరోపక్క ఉద్యోగ ఆందోళనతోనే జేపీఎస్ సోనీ ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. జేపీఎస్, ఓపీఎస్లు ఆత్మస్థైర్యం కోల్పోయి తీవ్రమైన చర్యలకు దిగొద్దని తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్గౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సోని ఆత్మహత్య దురదృష్టకరమని, ఆమె మొన్నటి దాకా సమ్మెలో పాల్గొని మళ్లీ ఉద్యోగంలో చేరిందని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ తెలిపింది. జేపీఎస్ల డిమాండ్లు ఇవీ.. – సర్వీసుల క్రమబద్ధీకరణ జీవో జారీచేయాలి. – నాలుగేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీసుగా పరిగణించాలి. – ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జేపీఎస్లుగా ప్రమోట్ చేయాలి. – వారు పనిచేసిన కాలాన్ని ప్రొబేషన్గా పరిగణించి పర్మినెంట్ చేయాలి. -
Andhra Pradesh: సాధికారత సుస్థిరం
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ చేయూత, ఆసరా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ ద్వారా జీవనోపాధి మార్గాలను మరింత విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చేయూత లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్దేశిత వ్యవధి ప్రకారం ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామన్నారు. ఒకవైపు ఆర్థిక సాయంతో పాటు మరోవైపు బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి కోసం తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ అమలు, గ్రామీణ రహదారులపై కూడా సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా.. లబ్ధిదారులు పథకాన్ని అందుకున్న మొదటి ఏడాది నుంచే స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను పెంచడం వల్ల గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు పడతాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అర్హులైన మహిళలకు అవగాహన పెంపొందించి బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి ఉపాధి మార్గాలను సమర్థంగా కొనసాగించాలన్నారు. మహిళలు తయారు చేసే వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్ వ్యవస్ధ ఉండాలని, దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలని సూచించారు. చేయూతతో 9 లక్షల మందికి స్వయం ఉపాధి 45 – 60 సంవత్సరాల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా అమలు చేస్తున్న వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటివరకూ 9 లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హిందుస్తాన్ యూనీ లీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహీంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్ జీ లాంటి అంతర్జాతీయ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా మార్టులు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్, లేస్ పార్కు, ఇ–కామర్స్, ఇ–మిర్చ, బ్యాక్ యార్డు పౌల్ట్రీ, ఆనియన్ సోలార్ డ్రయ్యర్ల లాంటివి చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ ఏడాది ‘ఉపాధి’ వ్యయం రూ.8,800 కోట్లు ఉపాధి హామీపై సమీక్ష సందర్భంగా ఈ ఏడాది 1,500 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 215.17 లక్షల పనిదినాలు కల్పించారు. ఉపాధి హామీ పనిదినాల రూపంలో రూ.5,280 కోట్లు ఖర్చు చేయనున్నారు. మెటీరియల్ రూపంలో రూ.3,520 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులు సుమారు రూ.880 కోట్లు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించగా దీనిపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణాలు గడువులోగా పూర్తి కావాలన్నారు. మన్నికగా నాణ్యమైన రోడ్లు.. రహదారుల నాణ్యతపై మరింత దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కనీసం ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. రహదారుల పనులు చేసిన మరుసటి ఏడాదే మళ్లీ మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తకూడదన్నారు. ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంజనీర్లు రోడ్ల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాల నాయుడు, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.బసంత్ కుమార్, సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు రెండు మహిళా సూపర్ మార్కెట్లు గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్లను నెలకొల్పుతున్నట్లు సీఎం జగన్కు అధికారులు వివరించారు. జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్లను ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. ఇప్పటికే 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటయ్యాయని వివరించారు. ఒక్కో సూపర్ మార్టును నెలకు కనీసం రూ.30 లక్షలు టర్నోవర్ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్లైన్ బుకింగ్, వాట్సాప్ బుకింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల భాగస్వామ్యంతో ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్ ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ‘వస్త్ర’ పేరుతో ఏర్పాటైన దుస్తుల తయారీ యూనిట్లో 200 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని, ట్రెండ్స్, అజియో లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కురుబలకోటలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా సుమారు 3 వేల కుటుంబాలకు చేయూత లభిస్తున్నట్లు వివరించారు. -
నిధులు కోసి, కార్డులు తగ్గించేసి 'ఇదేం పని'! గడ్డు రోజులు మొదలయ్యాయా?
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్ట కాలంలో, తీవ్రమైన కరువుల్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో గ్రామీణ పేదలను ఆదుకుని, వారి జీవితాలకు భరోసాగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గడ్డు రోజులు మొదలయ్యాయా? పలు రాష్ట్రాల్లో ఇది క్రమంగా నిర్వీర్యమైపోతోందా? పేదలకు కనీస వేతనంతో కూడిన వంద రోజుల ఉపాధి కల్పనకు గుర్తింపు పొందిన ఈ పథకం కాస్తా.. నెమ్మది నెమ్మదిగా తన ప్రాధాన్యతను, గుర్తింపును కోల్పోతోందా?..అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఈ పథకం మార్గదర్శకాలకు భిన్నంగా అమలు చేస్తున్న విధానాలు, కొత్తగా విధిస్తున్న కఠిన నిబంధనలు, బడ్జెట్ను గణనీయంగా తగ్గించడం, జాబ్కార్డుల కోత.. ఇందుకు ప్రధాన కారణాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు గతంలో ఉపాధిహామీ అమల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణలోనూ ఈ పథకం ప్రాబల్యాన్ని కోల్పోతూ నీరుగారిపోతోంది. అన్నీ అవరోధాలే..: కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల తీసుకొచ్చిన సాంకేతిక ఆవిష్కరణలు ఉపాధి హామీ పథకానికి ప్రతిబంధకంగా మారినట్టు నిపుణులు చెబుతున్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)లో భాగంగా మొబైల్ యాప్ ద్వారా పనిచేసే ప్రదేశాల్లోనే రోజుకు రెండుసార్లు కూలీల అటెండెన్స్ నమోదు (ఉదయం ఒకసారి, మధ్యాహ్నం తర్వాత రెండోసారి), ఆధార్ కార్డుతో జాబ్ కార్డుల సీడింగ్, అథెంటికేషన్, బ్రిడ్జి పేమెంట్స్ లాంటి విధానాల కారణంగా ఉపాధి వర్కర్లు పని, కూలీ పొందడంలో ఇబ్బందులు పడడం.. ఈ పథకం మౌలిక సూత్రాలకే ఉల్లంఘనగా నిలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల పాటు పనుల నమోదు, కూలీ లెక్కింపు, జాబ్ కార్డుల జారీ, ఇతర అంశాల నమోదుకు రాష్ట్రస్థాయిలో ఉపయోగించిన రాష్ట్ర వెబ్సైట్ రాగా సాఫ్ట్కు బదులు, జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సాఫ్ట్వేర్ను కేంద్రం తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో కూలీల సమస్యలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ విధంగా సాంకేతికంగా చోటు చేసుకున్న మార్పు, చేర్పులు రాష్ట్రంలో ఈ పథకం అమలుకు, పని కోసం కూలీలు ముందుకు వచ్చేందుకు ఆటంకంగా మారాయి. మరోవైపు రాష్ట్రంలో దీని అమలు పూర్తి సామర్థ్య స్థాయిలో జరగడం లేదు. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. వివిధ రకాల ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్లు (ఉద్యోగిత సూచిలు) కూడా దిగజారాయి. అత్యధిక స్థాయిలో జాబ్ కార్డుల్లో కోతతో పాటు ఆధార్ సీడింగ్, అథెంటికేషన్, ఆధార్ బ్రిడ్జి పేమెంట్స్ విధానం, ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ తప్పనిసరి చేయడం వంటివి ప్రభావం చూపినట్టుగా ఉపాధి హామీ పథకం అమలు, పర్యవేక్షక, పరిశీలన సంస్థ ‘లిబ్టెక్ ఇండియా’ జరిపిన కూలంకష పరిశీలనలో వెల్లడైంది. 5 లక్షల జాబ్ కార్డుల కోత ఈ నెల 7వ తేదీ వరకు ఉపాధిహామీ పథకం అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన గణాంకాలు, సమాచారం ఆధారంగా గత మూడేళ్ల డేటాను విశ్లేషిస్తూ లిబ్టెక్ సంస్థ నివేదిక రూపొందించింది. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత మార్చి 31తో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 5 లక్షల జాబ్ కార్డుల కోత (ఇది ఇక్కడి మొత్తం జాబ్ కార్డుల్లో 8.2 శాతం) పడింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 24.3 శాతం, జోగుళాంబ గద్వాలలో అత్యల్పంగా 2.7 శాతం తొలగింపునకు గురయ్యాయి. 17.3 లక్షల కూలీల పేర్లు కూడా ఈ కార్యక్రమంలో లేకుండా పోయాయి. జాబ్ కార్డుల కోత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర సర్కార్పైనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఐసీ సాఫ్ట్వేర్కు సంబంధించి, సామర్ధ్యం పెంపుదలకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులకు ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడలేదు. అధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ కంటే కూడా బ్యాంక్ ఖాతా ఆధారిత పేమెంట్ సిస్టమే మెరుగైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ సర్కార్ తప్పుబడుతోంది. కేంద్రం నిరుపేదల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తోందని, పేదలను కొట్టి పెద్దలకు పంచే పద్ధతిని అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గడిచిన రెండేళ్లలో బడ్జెట్లో రూ.55 వేల కోట్ల మేర కోత విధించడాన్ని గుర్తు చేస్తోంది. మరోవైపు పని దినాలు తగ్గిపోవడం, పని దినాల ద్వారా వచ్చే మెటీరియల్ కాంపొనెంట్ కూడా తరిగిపోవడంపై కేంద్ర మంత్రులను కలిసి మౌఖికంగా, లేఖల ద్వారా విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ధ్వజమెత్తుతోంది. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని, ఉపాధి హామీ పని దినాలను పెంచాలని కోరుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించిన ఉపాధి హామీపై పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఇటీవల ఆర్థిక మంత్రి టి.హరీశ్రావు కేంద్రానికి లేఖ రాశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. వ్యవసాయ కూలీకి రోజుకు రూ.257 ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ, ఒక్కో కూలీకి వంద రూపాయలకు మించడం లేదని, పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలైన టెంట్లు, మంచినీరు, గడ్డపారలు, తట్టలు వంటివి అందించడం లేదని విమర్శలు గుప్పించారు. ఆన్లైన్ పద్ధతి వల్ల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్లో అటెండెన్స్ అప్లోడ్ చేయాలనే నిబంధనలు పాటించలేక పోతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి గుర్తు చేశారు. గణనీయంగా తగ్గిన పని దినాలు తెలంగాణలో గత రెండేళ్లతో పోల్చితే 2022–23లో హోస్హోల్డ్ పనులు, పర్సన్ డేస్, సగటు పనిదినాలు గణనీయంగా తగ్గాయి. కేంద్రం తగిన ప్రణాళిక లేకుండా క్లిష్టమైన సాంకేతిక అంశాలను ప్రవేశపెట్టడం సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో ఉపాధి కల్పన అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. ఉపాధి పనులు చేసే కుటుంబాల సంఖ్య తగ్గడం శ్రేయస్కరం కాదు. తెలంగాణలో కనీసం వందరోజుల పనిదినాల కల్పన భారీగా పడిపోవడందారుణం. ఇది ఎందుకు జరిగిందనే దానిపై లోతైన పరిశీలన జరపాల్సిన అవసరముంది. జాబ్ కార్డుల పునరుద్ధరణ, పనికి డిమాండ్ తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యామ్నాయ అవకాశాల కల్పన ప్రభుత్వం చేపట్టాలి. – చక్రధర్ బుద్ధా, డైరెక్టర్, లిబ్ టెక్ ఇండియా పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేందం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టంను తీసుకొచ్చింది. కోట్లాది మంది రైతు కూలీలకు ఉపయోగపడుతున్న ఉపాధి హమీ పథకానికి (నరేగా) ప్రతి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం సిగ్గుచేటు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నరేగా సంఘర్షణ మోర్చా అధ్వర్యంలో ఉపాధి హమీని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ 100 రోజుల ధర్నా జరుగుతోంది. సోమవారం నాటికి 54 రోజులు పూర్తయ్యాయి. ధర్నాలో తెలంగాణ, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలు పాల్గొన్నారు. – పి.శంకర్, జాతీయ కార్యదర్శి, దళిత బహుజన ఫ్రంట్ -
గ్రామాలను పట్టణాలకు కలుపుతూ మరో 976 కి.మీ. రోడ్లు
సాక్షి, అమరావతి: గ్రామాలను సమీప పట్టణాలకు కలుపుతూ రాష్ట్రంలో మరో 976 కిలోమీటర్ల పొడవున కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. పీఎంజీఎస్వైలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 40:60 నిష్పత్తిన మొత్తం రూ.1,110.1 కోట్లు వెచ్చించనున్నాయి. దీన్లో రూ.607.87 కోట్లతో 976 కిలోమీటర్ల రోడ్లు నిర్మించనుండగా, రూ.502.23 కోట్లతో 76 బ్రిడ్జిలు నిర్మిస్తారు. జిల్లాల వారీగా కొత్తగా నిర్మించే రోడ్ల వివరాలతో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. దీనికి తుది ఆమోదం కోసం ఉగాది పండుగ రోజు (ఈ నెల 22న) కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం లాంఛనమేనని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలన్నింటికీ కేంద్రం ఇప్పటికే సూత్రపాత్రయంగా అంగీకారం తెలిపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు పీఎంజీఎస్వై ద్వారా రాష్ట్రంలో 1,291 కిలోమీటర్ల పొడవున 268 కొత్త రోడ్ల నిర్మాణం పూర్తిచేసినట్టు తెలిపారు. వాటికి సంబందించి జనవరి నెలాఖరు వరకు బిల్లులను కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించిందని చెప్పారు. -
పోషకాల్లో మునగండి
సాక్షి, అమరావతి: క్యాన్సర్ నివారణతో పాటు అత్యధిక పోషకాలుండే మునగ చెట్లను ఉపాధి హామీ పథకం కూలీల ఇళ్లు, పొలాల్లో సాగు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు ఐదేసి మొక్కల చొప్పున పంపిణీకి గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2 వేల ఎకరాలలో కూలీలు మునగ పంటను సాగు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. మునగ చెట్లు, ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలను మొక్కల పంపిణీ సమయంలోనే కూలీలకు అవగాహన కల్పిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కూలీలకు పంపిణీ చేసే మునగ మొక్కలను గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోనే ఉపాధి నిధులతో ఏర్పాటు చేసిన నర్సరీలలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 177 నర్సరీలలో ఇప్పటికే మునగ మొక్కల పెంపకం చేపట్టగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 250 నర్సరీలలో మునగ మొక్కల్ని ఉత్పత్తి చేయనున్నారు. కూలీలు తమకు ఉండే కొద్దిపాటి వ్యవసాయ భూముల్లో మునగ పంట సాగు చేసుకోవడానికి ముందుకొస్తే రెండేళ్లలో ఎకరానికి రూ.85 వేల వరకు చెల్లిస్తారు. -
ఏపీకి రెండు ‘స్కోచ్ గోల్డ్’ అవార్డులు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించడమే కాకుండా ఆయా కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అలుపెరగని కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో రెండు స్కోచ్ గోల్డ్, మరో నాలుగు స్కోచ్ సిల్వర్ అవార్డులను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాదాపు వంద ప్రాజెక్టులు ఈ ఏడాది స్కోచ్ అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఆయా రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్న అన్ని ప్రాజెక్టులపై ఇప్పటికే రెండు విడతల స్కూృటినీ నిర్వహించగా.. చివరగా బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పలు ప్రాజెక్టులను మరో విడత సమీక్షించి.. స్కోచ్ సంస్థ అవార్డులను ప్రకటించింది. మొత్తంగా 6 అవార్డులు మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందటమే కాకుండా వాటిని çసద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో అందజేస్తున్న సహాయ సహకారాలకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్ సంస్థ గోల్డ్ అవార్డును ప్రకటించింది. 2019 నుంచి 2022 మార్చి వరకు మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలు రూ.77,106.74 కోట్లను రుణాలుగా పొందారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.35 వేల కోట్లను రుణాలుగా అందజేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. మరోవైపు దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో పొదుపు సంఘాలు సగటున రూ.5.31 లక్షల చొప్పున బ్యాంకు రుణాలు పొందాయి. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతలుగా ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తోంది. ఇప్పటికే రూ. 12,758 కోట్లను వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రెండు విడతల్లో మహిళలకు ఆర్థిక సహాయం అందజేసింది. సకాలంలో రుణాలు చెల్లించే వారికి వైఎ స్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వం తిరిగి ఆయా పొదుపు సంఘాలకు చెల్లిస్తోంది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో మహిళలు బ్యాం కుల నుంచి తీసుకుంటున్న రుణాలను 99.5 శాతం మేర సకాలంలో చెల్లిస్తూ రికార్డు సాధించారు. ‘స్త్రీ నిధి’కి మరో గోల్డ్ అవార్డు ► గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు అనుబం« దంగా పనిచేస్తున్న ‘స్త్రీ నిధి’ సంస్థ బ్యాంకులిచ్చే రుణాలకు తోడు అత్యంత సులభ విధానంలో అదనంగా రుణాలు అందజేస్తుండటంతో స్కోచ్ సంస్థ స్త్రీ నిధిని గోల్డ్ అవార్డుకు ఎంపిక చేసింది. ► ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొదుపు సంఘాల విజయ గాథలను ‘మహిళా నవోదయం’ పేరిట ప్రతినెలా ప్రత్యేక మాసపత్రిక రూపంలో ప్రచురిస్తూ సభ్యులందరికీ తెలియజేస్తున్న ఆ జిల్లా డీఆర్డీఏ విభాగానికి ప్రత్యేక సిల్వర్ అవార్డు దక్కింది. ► ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో మహిళలు పెద్దఎత్తున నాటు కోళ్ల పెంపకం చేపట్టి అధిక ఆదాయం పొందుతున్నందుకు ఆ జిల్లా డీఆర్డీఏకు మరో సిల్వర్, పాడి గేదెల పెంపకం ద్వారా ఆధిక ఆదాయం సాధించేలా చేస్తున్న చిత్తూరు జిల్లా డీఆర్డీఏకు మరో సిల్వర్, జిల్లాలో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహిస్తున్నందుకు చిత్తూరు డీఆర్డీఏకు మరో సిల్వర్ అవార్డు దక్కాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్లే.. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా పొదుపు సంఘాల మహిళలకు పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ ప్రోత్సాహకాల కారణంగా మహిళలు కీలకంగా ఆర్థిక కార్యకలాపాలు పెంపొందించుకుంటున్నారు. ప్రభుత్వం అందజేసే అర్థిక సహాయానికి తోడు బ్యాంకుల నుంచి అందే రుణ మొత్తాలతో కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యవసాయం మాత్రమే తెలిసిన వారు పెద్ద సంఖ్యలో పాడి గేదెలు, ఆవులు, గొర్రెల పెంపకం చేపట్టి కుటుంబ ఆదాయాన్ని భారీగా పెంచుకుంటున్నారు. ఇలా లాభదాయక కార్యకలాపాలు సాగిస్తూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం అందజేసే ప్రోత్సహకాలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సైకిల్ చాలా వేగంగా తిరుగుతోంది. ఇలాంటి విజయాలను నమోదు చేయడంతో సెర్ప్ కార్యక్రమాలకు ఈ ఏడాది ఆరు అవార్డులు దక్కాయి. – ఇంతియాజ్ అహ్మద్, సీఈవో, సెర్ప్ -
మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రం హోం చేసుకొనే ఐటీ ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు, విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ క్లాసులు, వారికి అవసరమైన సమాచారాన్ని గ్రామ గ్రామాన అందుబాటులో ఉంచేలా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష వేగంగా కార్యరూపం దాలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 3,960 డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు జరుగుతోంది. వీటిలో కొన్ని పూర్తవగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన ప్రతి చోటా డిజిటల్ లైబ్రరీ ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కొత్తగా మరో 6,965 గ్రామాల్లో వీటి ఏర్పాటుకు అనుమతి తెలిపింది. వీటితో మొత్తం 10,925 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో అత్యాధునిక సౌకర్యాలు, ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు. ఉద్యోగులు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఇవి వరమనే చెప్పాలి. వర్క్ ఫ్రంహోమ్ చేసే ఉద్యోగులు వారి స్వగ్రామం నుంచే ఉద్యోగం చేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరవడానికి, వారికి అవసరమైన సమాచారాన్ని ఆన్లైన్, డిజిటల్ పద్ధతుల ద్వారా సేకరించుకోవడానికి ఈ లైబ్రరీలు ఉపయోగపడతాయి. ఒక్కొక్క లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.16 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇతరత్రా సదుపాయాలకు మరింత ఖర్చు పెడుతోంది. వీటి భవనాలకు స్థల సేకరణ చేయాలని ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణానికే ప్రభుత్వం రూ. 1,114 కోట్లు ఖర్చు చేస్తోంది. వీటితో కలిపి గత మూడున్నర సంవత్సరాల్లో రూ. 9,630 కోట్ల ఖర్చుతో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, వంటి వాటితో కలిపి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 44 వేల భవన నిర్మాణాలు సాగుతున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. -
పండ్ల తోటలకు ప్రభుత్వ తోడ్పాటు
ఈ రైతు పేరు ఉడుముల పిచ్చిరెడ్డి. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం రాచకొండ స్వగ్రామం. 2019 వరకు తనకున్న రెండెకరాల్లో మిర్చి, పత్తి లాంటి వాణిజ్య పంటలు సాగు చేసేవాడు. నాటుకునే మొక్కలు మొదలు.. పండ్ల తోట ద్వారా ఫలసాయం వచ్చే దాకా వివిధ రూపాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలుసుకుని 2020లో తైవాన్ జామ పంట సాగు చేశాడు. మొక్కలు తెచ్చుకోవడానికి ప్రభుత్వమే డబ్బులిచ్చింది. నాటేటప్పుడు గుంతల ఖర్చు, తర్వాత కలుపు తీసేందుకు కూలి డబ్బులు, అవసరమైనప్పుడు నీళ్లకు డబ్బులిచ్చింది. మొక్కలు నాటిన ఏడు నెలల నుంచే ఫలసాయం రావడం మొదలైంది. కాయల కోత ఖర్చులు పోను ఏటా రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల దాకా మిగులుతోంది. గతంలో మిర్చి, పత్తి పంటలు వేసినప్పటి కంటే ఇప్పుడే నికర ఆదాయం వస్తోందని పిచ్చిరెడ్డి ఆనందంగా చెబుతున్నాడు. ఇదే జిల్లా పీసీపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వీరపునేని బాలచెన్నయ్య తన పొలం, తన సోదరుడి పొలం.. మొత్తం రెండెకరాల్లో 2021 జూన్లో 800 తైవాన్ జామ మొక్కలు నాటాడు. గుంతలు తీసేందుకు ప్రభుత్వం రూ. 50 వేలు ఆర్థిక సాయం చేసింది. కాపలా, నీటి తడుల కోసం ఇప్పటి దాకా రూ.72 వేలు ఇచ్చింది. ప్రస్తుతం పంట తీరును బట్టి ఎకరాకు రూ.50 వేలకు పైగా నికర ఆదాయం వస్తుందని సంతోషంగా చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: మెట్ట భూముల్లో వర్షాధారంగా కంది, పత్తి వంటి పంటలు పండించుకునే రైతులు 1,18,842 మందికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మూడేళ్లుగా పండ్ల తోటల పెంపకానికి పూర్తి స్థాయిలో ఆర్థిక తోడ్పాటును అందజేసింది. మొక్కలు నాటుకోవడానికి గుంతలు తవ్వడం మొదలు.. మొక్కల కొనుగోలు, నాటిన మొక్కలకు నీటి తడుల ఖర్చు, పెంపకంలో అవసరమయ్యే ఎరువు ఖర్చుల వంటిì వాటన్నింటికీ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రూపాల్లో ఆర్థిక సహాయం చేసింది. మూడేళ్లలో రైతులకు ఎకరాకు రూ.1,35,141 దాకా లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వం అందజేస్తోన్న ఆర్థిక సహాయంతో ఆగస్టు 2019 – 2022 మార్చి మధ్య 1,18,842 మంది రైతులు 1,75,493 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు రూ.400.28 కోట్లు ఆర్థిక సహాయం అందజేసిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది కూడా పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను గుర్తించే ప్రక్రియ అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని చెప్పారు. మూడో వంతు మామిడి సాగే మామిడి, జీడిమామిడి, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, కొబ్బరి, దానిమ్మ, రేగు, సీతాఫలం, నేరేడు, ఆయిల్ పామ్, అంజూర వంటి పండ్ల మొక్కల పెంపకానికి ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. పండ్ల తోట సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతుకు తొలి ఏడాది రూ.65 వేల దాకా, రెండో ఏడాది మరో రూ.35 వేలు, మూడో ఏడాది రూ.33–34 వేల మధ్య ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని అధికారులు వెల్లడించారు. మూడేళ్లుగా ఈ పథకం ద్వారా 33 శాతం మంది రైతులు మామిడి తోటలనే సాగు చేశారని అధికారులు వెల్లడించారు. 2019లో 20,824 ఎకరాల్లో, 2020లో 22,147 ఎకరాల్లో మామిడి తోటలు సాగయ్యాయి. ఏటా రూ.1000 కోట్ల ఆదాయం మామిడి, జీడి, కొబ్బరి పంటలను సాగు చేసుకునే రైతులకు ఏటా ఎకరాకు రెండు లక్షల దాకా నికర ఆదాయం ఉంటుంది. మార్కెట్లో వివిధ రకాల పండ్లకు ఉన్న డిమాండ్ మేరకు పంట తక్కువ వచ్చే ఏడాది కూడా ఎకరాకు లక్ష ఆదాయం గ్యారంటీగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. పండ్ల తోటలు సాగు చేసిన వారిలో దాదాపు మూడో వంతు మంది రైతులు ఏటా నికర ఆదాయం పొందుతున్నారు. వీరి ఆదాయం ఏటా రూ.1,000 కోట్లకు తక్కువ లేదన్నది అంచనా అని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. -
నిరుద్యోగులకు 'స్మార్ట్'గా టోకరా.. కాల్ లెటర్లు, పథకాలపై సర్వేలంటూ డ్రామా
‘కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో ఫీల్డ్ ఆపీసర్.. రైల్వేలో జూనియర్ అసిస్టెంట్.. ఎయిర్పోర్ట్ అథారిటీలో అడ్మినిస్ట్రేటివ్ జాబ్.. నేషనల్ హైవేస్ అథారిటీలో సూపర్వైజర్ జాబ్.. ఏది కోరుకుంటే అది.. మీరు అలా లక్షలు ఇస్తే.. మేము ఇలా జాబ్ ఇస్తాం.. ఇదిగో జాయినింగ్ లెటర్..’ స్మార్ట్గా ఎరవేసి వేలాది నిరోద్యోగులను బురిడీ కొట్టించి, కోట్లు కొల్లగొట్టిన స్మార్ట్ యోజన వేల్ఫేర్ సొసైటీ ఘరానా మోసం ఇది. – సాక్షి, అమరావతి అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని చోట్లా ఈ సంస్థ వేలాది నిరుద్యోగులను మోసం చేసింది. బండారం బయటపడటంతో సొసైటీ స్థాపించిన ఇండిపూడి సుధాకర్ పత్తా లేకుండా పోయారు. దాంతో నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా మోసం వివరాలు.. 2018లో అప్పటి విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం అనకాపల్లి జిల్లా)లోని అనకాపల్లికి చెందిన ఇండిపూడి సుధాకర్ అదే జిల్లాలోని నర్సీపట్నం కేంద్రంగా ‘స్మార్ట్ యోజన వెల్పేర్ సొసైటీ’ని స్థాపించాడు. తాను చైర్మన్గా ఉన్న ఆ సొసైటీ పేరుతో నర్సీపట్నంలో కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. కొన్నేళ్లు కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన ప్రాజెక్టులు చేస్తున్నట్లు చెప్పాడు. ఢిల్లీ పెద్దలకు సన్నిహితులైన స్థానిక నేతలతో ఉన్న పరిచయాలను అనుకూలంగా మలచుకొని, తనకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందర్నీ నమ్మించాడు. 2021లో అసలు దందాకు తెరతీశాడు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలు, రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ), ఎయిర్పోర్ట్ అథారిటీ మొదలైన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో థర్ట్ పార్టీ ద్వారా ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టు వచ్చినట్లు చెప్పాడు. ఈ సంస్థల్లో తాము ఉద్యోగులను నియమిస్తామని, కేంద్ర ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని కూడా చెప్పాడు. సొసైటీ తరపున జిల్లాకు ఓ ఇన్చార్జిని నియమించాడు. అప్పటికే ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు కాల్ లెటర్లు కూడా చూపించాడు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి రూ.10లక్షలు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి రూ.5 లక్షలు చెల్లించాలని రేటు పెట్టాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనే ఆశతో సుధాకర్ మాటలను చాలా మంది నిరుద్యోగులు నమ్మి డబ్బు ముట్టజెప్పారు. వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కాల్ లెటర్లు ఇచ్చారు. కొందరితో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సర్వేలు చేయించినట్టుగా డ్రామా నడిపించారు. దాంతో ఆ సంస్థను చాలామంది నమ్మారు. అప్పులు చేసి మరీ అడిగినంత చెల్లించారు. ఇలా శ్రీకాకుళం జిల్లాతో మొదలుపెట్టి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. దాదాపు 6,500 మంది నుంచి రూ.50 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు అంచనా. డబ్బులు చెల్లించినా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు సుధాకర్ను నిలదీశారు. కేసు పెడతామని బెదిరించారు. వారిని సుధాకర్ మరోసారి మాయ మాటలతో బురిడీ కొట్టించాడు. ప్రస్తుతం ఉద్యోగానికి రానవసరం లేదని, జీతాలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పాడు. రెండు నెలల జీతాలు కూడా చెల్లించాడు. ఆ తరువాత నుంచి జీతాలు రాలేదు. దీంతో పలువురు నిరుద్యోగులు నర్సీపట్నంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళనలు కూడా చేశారు. దాంతో సొసైటీ చైర్మన్ సుధాకర్ మెల్లగా జారుకున్నాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ కార్యాలయం కేసులు నమోదు స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ, సంస్థ చైర్మన్ ఇండిపూడి సుధాకర్పై అనేకమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా విచారించిన అనంతరం నర్సీపట్నం పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 506 ఆర్/డబ్లూ 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుధాకర్పై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కూడా తాజాగా కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలీసులూ దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగులను మోసం చేసిన ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసును సత్వరం దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఇప్పటికే ఆదేశించింది. పరారీలో ఉన్న సుధాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
‘ఉపాధి’కి పరిమితి
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో కేంద్రం కొత్త నిబంధన తెచ్చింది. కొత్త పనులకు అనుమతిని క్లిష్టతరం చేసింది. ఈ పథకం ద్వారా ఒక్కో పంచాయతీలో ఒకే సమయంలో 20 పనులకు మాత్రమే వీలు కల్పిస్తూ నిబంధన విధించింది. వాటిలో మాత్రమే కూలీలు, ఇతర కార్యకలాపాలకు, బిల్లులు పెట్టడానికి వీలుంటుంది. ఈ 20 పనుల్లో ఒకటి పూర్తయిన తర్వాతే మరో కొత్త పని మంజూరవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 1నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ధర్మవీర్ ఝా రెండు రోజుల క్రితం అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనుల నిర్వహణ, పర్యవేక్షణ మొత్తం ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్ (నరేగా సాఫ్ట్) ద్వారా ఆన్లైన్లో జరుగుతుంది. గ్రామాల్లో పనులు జరిగిన తర్వాత కూలీల వేతనాలు సహా అన్నిరకాల బిల్లులను సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారు. వీటి ప్రకారం కేంద్రం కూలీలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాల డబ్బు జమ చేస్తుంది. నూతన నిబంధన ప్రకారం ఆన్లైన్లో ఆ 20 పనులకు మాత్రమే బిల్లుల నమోదుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని మొత్తం 2.69 లక్షల గ్రామ పంచాయతీల పరిధిలో 1.64 కోట్ల ఉపాధి హామీ పనులు మంజూరయ్యాయి. వాటిలో 1.44 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. అంటే ఒక్కో గ్రామ పంచాయతీలో సరాసరిన 53 పనులు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనూ 13,113 గ్రామ పంచాయతీల్లో 9.73 లక్షల పనులు మంజూరవగా, వాటిలో 9.67 లక్షల పనులు పురోగతిలో ఉన్నాయి. అంటే రాష్ట్రంలోనూ ఒక్కో గ్రామ పంచాయతీలో సరాసరిన 73 పనులు జరుగుతున్నాయి. నూతన నిబంధన ప్రకారం ఈ పనులను 20కి పరిమితం చేయడం చాలా కష్టమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మంజూరైన పనులకు కొత్త నిబంధన వర్తించకపోవచ్చని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కొత్త పని మంజూరులో ఈ నిబంధన తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయడానికే ఉపాధి పథకం పనులు గడువులోగా పూర్తి చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిబంధన తెచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రెండు మూడేళ్లు కొనసాగే మొక్కల పెంపకం, గృహ నిర్మాణ పథకం వంటి పనులకు కొత్త నిబంధన వర్తించదని కేంద్రం పేర్కొందని వివరించారు. తప్పనిసరి, ప్రత్యేక పరిస్థితుల్లో గ్రామాల్లో స్థానిక ఎంపీడీవో సవివరమైన వివరణ, జిల్లా కలెక్టర్ అనుమతితో 20 పరిమితికి మించి పనులు మంజూరుకు అవకాశం కల్పించిందని తెలిపారు. -
ఉవ్వెత్తున ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో పేదలకు పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా ఇప్పటివరకు దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, బిహార్ తరువాత స్థానాల్లో నిలిచాయి. ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశం గ్రామాల్లో పేదల వలసలను నివారించడం, వ్యవసాయ పనులు లేని వేసవి సీజన్లో సొంతూరిలో పనులు కల్పించడం. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల రోజుల్లోనే రాష్ట్రంలో 2,84,03,576 పనిదినాల పాటు ప్రభుత్వం పేదలకు పనులు కల్పించింది. మధ్యప్రదేశ్ నెల రోజుల వ్యవధిలో 2.06 కోట్ల పనిదినాలు కల్పించగా తెలంగాణ 1.65 కోట్లు, బిహార్ 1.48 కోట్ల పనిదినాలను కల్పించగలిగాయి. ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రాష్ట్రాలు పేదలకు తాజాగా కల్పించిన పనిదినాల వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. నెలలో 17.07 కోట్ల పనిదినాలు ► దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ నెల రోజుల వ్యవధిలో 17.07 కోట్ల పనిదినాలను కల్పించగా రూ.4,288 కోట్లు పేదలకు కూలీగా చెల్లించారు. ఏపీలో 20.01 లక్షల కుటుంబాలకు చెందిన 29.84 లక్షల మంది పేదలు పనులకు హాజరై రూ.474.98 కోట్లు వేతనాల రూపంలో పొందారు. పనులకు హాజరైన వారిలో 60.04 శాతం మంది మహిళలే ఉన్నారు. ► వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎండల వల్ల కూలీలు ఇబ్బంది పడకుండా ఉదయమే 6.30 నుంచి పనులకు వీలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో పనులకు హాజరయ్యేలా ఉదయం, సాయంత్రం రెండు పూటలా వీలు కల్పించారు. ► పనులకు వచ్చే పేదలు రోజువారీ ఎక్కువ మొత్తంలో కూలీ గిట్టుబాటు అయ్యే విధంగా వీలున్న సమయంలో నిర్దేశిత పనులు చేసేందుకు అవకాశం ఉంది. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు రోజులో చేయాల్సిన పనులను ముందే మార్కు చేసి ఉంచుతారు. ► గత నెల రోజులుగా రాష్ట్రంలో ఉపాధి పథకం పనులకు హాజరయ్యే కూలీలకు సరాసరిన రోజుకు రూ.181.58 చొప్పున వేతనం అందుతోంది. ► వేసవిని దృష్టిలో పెట్టుకొని గత రెండేళ్ల పాటు ఏప్రిల్, మే, జూన్లో 20 – 30 శాతం తక్కువ పనిచేసినా నిర్ణయించిన కూలీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే ఈ విధానానికి కేంద్రం అభ్యంతరం తెలపడంతో ప్రస్తుత ఏడాది అమలులో లేదు. దీంతో గతంతో పోల్చితే కూలీ నామమాత్రంగా తగ్గింది. ► ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజూ 16–17 లక్షల మంది పేదలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. రోజు రోజుకూ ఇది పెరుగుతోంది. గత నెల రోజుల్లో 2.84 కోట్ల పని దినాలను కల్పించగా అందులో కోటి పనిదినాలు దాకా గత వారం రోజుల్లో జరిగినవేనని అధికారులు వెల్లడించారు. తండాలకు ‘ఉపాధి’ అండ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని జనంగూడ తండాకు చెందిన డంబున్ నాయుడు కుటుంబం ఉపాధి హామీ పనులకు వెళ్లి నెల రోజుల్లో రూ.13,620 సంపాదించింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మే 1 వరకు ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు 66 పనిదినాలను పొందారు. ఇదే పంచాయతీ పరిధిలోని వివిధ తండాలలో నివసించే 481 కుటుంబాలు ఉపాధి పనులకు వెళ్లి కూలీ కింద రూ.16.02 లక్షలు వేతనం పొందాయి. -
పచ్చగా.. పరిశుభ్రంగా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలన్నీ పచ్చదనంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించి మురుగునీటి కాలువల నిర్వహణ, చెత్త సేకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పల్లెల్లో రోడ్ల మీద మురుగునీరు, చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలోని 13 వేలకుపైగా గ్రామ పంచాయతీల్లో మురుగు నీటి పారుదల వ్యవస్ధ సక్రమంగా ఉండేలా, కాలువల్లో మురుగునీరు పొంగి పొర్లకుండా నిర్వహణ చేపట్టాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు కల్లా 100 శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు. అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పక్కాగా ఉండాలన్నారు. చెత్త తరలించేందుకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ సమకూర్చటాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని దశలవారీగా అన్ని గ్రామాలకు అందజేయాలని సూచించారు. గ్రామీణ రహదారులకు మరమ్మతుల పనులను ఈ నెల మూడో వారంలోగా చేపట్టి వెంటనే టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. పనులు పూర్తి చేసిన అనంతరం నాడు – నేడుతో ఫొటోల ద్వారా ప్రజలకు వ్యత్యాసాన్ని తెలియచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇళ్ల నుంచి చెత్తను సేకరించే క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలు చెల్లించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ రహదారులు, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం తదితరాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాగునీటి కష్టాలు తలెత్తకుండా.. వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి గతంతో పోలిస్తే సమస్యను గణనీయంగా నియంత్రించగలిగినట్లు అధికారులు తెలిపారు. జూలై నెలాఖరు వరకు కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు. ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉండే ఉద్దానంతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉప్పునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలు, వైఎస్సార్ కడప జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలు, తరచూ తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సరఫరాకు చేపడుతున్న ఏర్పాట్లపై సమావేశంలో సీఎం సమీక్షించారు. కాలువలతో అనుసంధానం.. గ్రామాల్లో పేదలకు ఉపాధి హామీ పధకం ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించాలని సీఎం జగన్ సూచించారు. చెరువుల్లో పూడిక తీతతో పాటు కాలువలతో అనుసంధానించేలా పనులు చేపట్టాలన్నారు. ఐదేళ్లలో ప్రతి చెరువును కాలువలు, ఫీడర్ ఛానళ్లతో అనుసంధానించడం ద్వారా నీటిఎద్దడిని అరికట్టవచ్చన్నారు. కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కాలువల ద్వారా మంచి నీటి ట్యాంకులను అనుసంధానించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రూ.3 వేల కోట్లకుపైగా పెండింగ్ బకాయిల చెల్లింపు గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజీ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఏ కారణంతోనూ పనులు ఆగకూడదని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోయినప్పటికీ అడ్వాన్స్ రూపంలో నిధులు సర్దుబాటు చేసి బిల్లులు చెల్లింపులన్నీ పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లుల అప్లోడ్తో పాటు చెల్లింపుల్లో ఆలస్యం జరగకూడదని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాం నాటి దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా బకాయి బిల్లులను చెల్లించాల్సి రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి చెల్లింపులు జరిపామని తెలిపారు. రైతుల ఖాతాల్లోకే ‘జలకళ’ డబ్బులు.. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తోందని, విద్యుత్తు సదుపాయం కల్పిచడంతో సహా ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. పథకం ద్వారా రైతుల పొలాల్లో బోరు తవ్వినప్పుడు డ్రిల్లింగ్ డబ్బులను రైతుల ఖాతాకు నేరుగా (డీబీటీ) జమ చేసి లబ్ధిదారుడి నుంచి బోరు యజమానికి చెల్లించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీనివల్ల లంచాలు లేకుండా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతాయన్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రైతుల పొలాల్లో 13,245 బోర్లు తవ్వినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వీలుగా 2 కోట్ల డస్ట్బిన్లను అక్టోబరు నాటికి సిద్ధం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతిప్రియా పాండే, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ రోడ్లకు మరమ్మతులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిధిలోని గ్రామీణ రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 9,122 కిలోమీటర్ల పొడవైన 3,246 రోడ్లకు రూ.1,072 కోట్లతో మరమ్మతులకు సంబంధించి తక్షణమే పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. మే 15 – 20వతేదీ నాటికల్లా గ్రామీణ రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభం కావాలని నిర్దేశించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ పరిధిలో రహదారులకు సంబంధించి గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాటిని ఎలా బాగు చేశామనే వివరాలను తెలియచేసేలా నాడు–నేడు ద్వారా ఫొటోలతో వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలియచేయాలన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రహదారులకు సంబంధించి చేపట్టిన పనులను వెల్లడించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫోటోలను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. -
ఉపాధిలో కేంద్రం భారీ కోత
సాక్షి, అమరావతి: గ్రామీణ పేదలకు పనులు కల్పించే ఉపాధి హామీ పథకానికి భారీగా కోతలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలవారీగా కేటాయించే లేబర్ బడ్జెట్కు భారీ కోతలు పెట్టింది. ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి 23.68 కోట్ల పనిదినాల పాటు పనులు కల్పించగా 2022–23లో ప్రాథమికంగా కేవలం 14 కోట్ల పనిదినాలనే కేటాయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14.27 కోట్ల పనిదినాలు కల్పించగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాథమికంగా 10 కోట్ల పనిదినాలే కేటాయించారు. తెలుగు రాష్ట్రాల తరహాలోనే మిగిలిన రాష్ట్రాలకూ లేబర్ బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోతలు విధించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రం కోరిన దాంట్లో సగమే.. రాష్ట్రంలో వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి 30 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించేందుకు జిల్లాలవారీగా లేబర్ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 తేదీన జరిగిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక సమీక్షలో కనీసం 26 కోట్ల పనిదినాలను రాష్ట్రానికి కేటాయించాలని అధికారులు కోరారు. తెలంగాణ కూడా తమకు 15 కోట్ల పనిదినాలు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. అయితే రాష్ట్రాలు కోరిన దాంట్లో దాదాపు సగం రోజులు కోతలు విధించి కేంద్రం లేబర్ బడ్జెట్ కేటాయింపులు చేయడంపై అధికారులు విస్తుపోతున్నారు. జూన్లో మళ్లీ సమీక్ష... లేబర్ బడ్జెట్లో భారీగా కోతలు విధించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అవసరమైతే జూన్ చివరిలో మరోసారి రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి అదనపు కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి మొదట 20 కోట్ల పనిదినాలు కేటాయించి తర్వాత 23.50 కోట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా తొలుత 13 కోట్ల పనిదినాలు కేటాయించి తర్వాత 14.25 కోట్లకు పెంచారు. ఈ లెక్కన 20 – 25 శాతానికి మించి లేబర్ బడ్జెట్లో అదనపు కేటాయింపులు ఉండవని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా చూసినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు తగ్గుతున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఏడాది చివరకు అదనపు నిధుల కేటాయింపు అవసరం లేకుండా కేంద్రం ముందస్తుగా రాష్ట్రాలకు లేబర్ బడ్జెట్లో కోతలు విధిస్తూ వస్తోందని భావిస్తున్నారు. రాష్ట్రంలో కోటి మంది పేదలపై ప్రభావం.. రాష్ట్రంలో 97.76 లక్షల కుటుంబాలకు చెందిన 1.95 కోట్ల మంది ఉపాధి కూలీలు పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 57.49 లక్షల కుటుంబాలకు చెందిన 99.48 లక్షల మంది యాక్టివ్ కూలీలు.గత మూడేళ్లలో కనీసం ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైతే యాక్టివ్ కూలీలుగా పరిగణిస్తారు. 2020–21లో రాష్ట్రంలో 47.71 లక్షల కుటుంబాలకు చెందిన 80 లక్షల మంది ఉపాధిహామీ ద్వారా ప్రయోజనం పొందగా 2021–22లో 46.60 లక్షల కుటుంబాలకు చెందిన 77 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఉపాధి పథకానికి బడ్జెట్లో కోతలతో దాదాపు కోటి మంది కూలీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
పల్లెకు తగ్గని ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో ఈసారి కూడా పల్లెకు పట్టం కట్టారు. గత కొన్నేళ్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొనసాగించారు. గతేడాది ఈ శాఖకు రూ.29,271 కోట్లు కేటాయించగా, 2022–2023 బడ్జెట్లో రూ.29,586.06 కోట్లు ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే పంచాయతీరాజ్ సంస్థల పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా బడ్జెట్లోనూ అదే దృష్టిని, ప్రాధాన్యతను ప్రభుత్వం కొనసాగించింది. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టే వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు బడ్జెట్లో రూ.3,330 కోట్లు ప్రతిపాదించారు. ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 38.41 లక్షల మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఇస్తున్నారు. 57 ఏళ్ల అర్హత వయసుతో దరఖాస్తు చేసుకున్న వారందరికీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో చెల్లించే ఏర్పాటు చేస్తామని చెబుతున్నా దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఎస్టీ పంచాయతీ భవనాలకు నిధులు గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత పంచాయతీ భవనాల నిర్మాణం నిమిత్తం ఒక్కోదానికి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.600 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నుంచి రూ.1,000 కోట్లు ప్రతిపాదించింది. పావలా వడ్డీ రుణాల కోసం రూ. 187 కోట్లు, మిషన్ భగీరథ అర్బన్ కింద రూ.800 కోట్లు కేటాయించింది. -
2022–23లో 30 కోట్ల పనిదినాల ఉపాధి
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఉపాధిహామీ పథకం ద్వారా 30 కోట్ల పనిదినాల పాటు పనులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు గ్రామాల వారీగా పనులు కావాలని కోరుకుంటున్న వారిని గుర్తించిన గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రతిపాదిత లేబర్ బడ్జెట్ రూపొందించారు. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా ఒక్కో జిల్లాలో మూడుకోట్లకుపైగా పనిదినాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో పనిదినానికి 60:40 నిష్పత్తిన కూలీకి ప్రస్తుత రేట్ల ప్రకారం గరిష్టంగా రూ.245 వేతన రూపంలో చెల్లించడంతోపాటు మెటీరియల్ విభాగంలో మరో రూ.163 కేటాయిస్తారు. కూలీలు వారు కోరుకున్నప్పుడు వారి సొంత గ్రామంలోనే పనులను కల్పించేందుకు వీలుగా ఆయా గ్రామాల్లో కొత్త పనులు గుర్తించే ప్రక్రియ క్షేత్రస్థాయిలోని ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ల ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతోంది. ఇలా గుర్తించిన పనులకు మొదట గ్రామసభ, తరువాత పంచాయతీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించే సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత లేబర్ బడ్జెట్కు ఆమోదం లభిస్తే.. ప్రసుత ఉపాధి పథకం కూలీరేట్ల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల కూలీలకు గరిష్టంగా రూ.7,350 కోట్లు వేతనాల రూపంలో లభించే అవకాశం ఉంది. కూలీలకు గిట్టుబాటయ్యే సరాసరి వేతనాల మొత్తం ఆధారంగా గరిష్టంగా మరో రూ.4,890 కోట్లు మెటీరియల్ కోటాలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకునేందుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. 56.98 లక్షల కుటుంబాలకు ప్రయోజనం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 97.73 కోట్ల కుటుంబాలకు చెందిన 1.95 కోట్ల మంది ఉపాధిహామీ పథకం కూలీలుగా నమోదయ్యారు. వీరిలో 56.98 లక్షల కుటుంబాల వారు క్రియాశీలకంగా ఏటా పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 45.45 లక్షల కుటుంబాలకు 21.73 కోట్ల పనిదినాల పాటు ప్రభుత్వం పనులు కల్పించింది. రూ.4,817 కోట్లను కూలీలకు వేతనాల రూపంలో చెల్లించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవడం వల్ల ఇప్పటి నుంచి మళ్లీ ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి 26 కోట్ల పనిదినాల పాటు పనుల కల్పన పూర్తిచేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
ఎంపీడీవోలకు నెరవేరుతున్న పాతికేళ్ల కల
సాక్షి, అమరావతి: పాతికేళ్లుగా ఎంపీడీవోలు కంటున్న కలలు నెరవేరుతున్నాయి. 25 సంవత్సరాల కిందట ఎంపీడీవోలుగా ఉద్యోగంలో చేరినవారు కూడా అప్పటి నుంచి పదోన్నతులు లేకుండా ఇంకా అలాగే కొనసాగుతున్నారు. ఉద్యోగ విరమణ చేసేలోగా ఒక్క పదోన్నతి వస్తుందా అని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. వారి కల ఇప్పుడు నేరవేరబోతుంది. ఎంపీడీవోలకు పదోన్నతి కల్పించడానికి వారి క్యాడర్కు పైస్థాయిలో తగినన్ని పోస్టులు లేకపోవడంతో వారి పదోన్నతి ప్రక్రియ ఇన్నాళ్లు నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రామీణాభివృద్ధిశాఖలో 149 పోస్టుల్లో ఆన్డ్యూటీ లేదా డిప్యుటేషన్ రూపంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతులపై నియమించేలా సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణాభివృద్ధిశాఖలోని కమిషనర్ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం, వాటర్షెడ్ పథకం విభాగాల్లో 9 కేటగిరీల్లో 15 పోస్టులు, జిల్లాల్లోని డ్వామా పీడీ కార్యాలయాల్లో మరో 9 కేటగిరీల్లో 134 పోస్టులు కలిపి మొత్తం 149 పోస్టుల్లో ఆన్డ్యూటీ లేదా డిప్యుటేషన్ విధానంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతి ద్వారా నియమించనున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ 149 పోస్టుల్లో ప్రస్తుతం డిప్యుటేషన్, ఆన్డ్యూటీలో కొనసాగుతున్నవారు నిర్ణీత సర్వీసు కాలం ఆ పోస్టుల్లోనే కొనసాగుతారని, భవిష్యత్లో ఆ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల్లోనే ఎంపీడీవోలను పదోన్నతిపై నియమించనున్నట్లు తెలిపారు. 200 మందికిపైగా ఒకేసారి పదోన్నతి.. పాతికేళ్లుగా ఎంపీడీవోలు పదోన్నతులకు నోచుకోని అంశంపై జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దృష్టి పెట్టారు. దీంతో పదోన్నతులకు వేచి ఉన్నవారికి ఒకేసారి పెద్దసంఖ్యలో పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఇప్పటికే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీఎల్డీవో) పోస్టు వ్యవస్థను ఏర్పాటు చేసి కొత్తగా 51 డీఎల్డీవో పోస్టులను ఎంపీడీవోలకు పదోన్నతి ద్వారా భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో 149 పోస్టుల కోసం పదోన్నతికి వీలు కల్పించింది. ఒకేసారి 200 మందికిపైగా ఎంపీడీవోలకు పదోన్నతి దక్కేలా కసరత్తు చేస్తున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. -
బంజరు ‘బంగారం’
సాక్షి, అమరావతి: ఎలాంటి పంటలకూ పనికి రాని 6.20 లక్షల ఎకరాల బంజరు భూములను వాటర్షెడ్ పథకాలతో బంగారు భూములుగా మార్చి సాగులోకి తేవడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పీఎంజీఎస్కేవై 2.0 కార్యక్రమంలో భాగంగా వాటర్షెడ్ డెవలప్మెంట్ విభాగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఈ పథకాలు చేపడతారు. ఇందుకయ్యే ఖర్చును 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 2022–26 మధ్య ఐదేళ్లలో కొత్తగా వాటర్షెడ్ పథకాలకు ప్రణాళికలు పంపాలని కేంద్రం తాజాగా కోరింది. మన రాష్ట్రం నుంచి గరిష్టంగా 2.50 లక్షల హెక్టార్ల (6.20 లక్షల ఎకరాలు) ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఇందుకు రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బంజరు భూములను ఎంపిక చేశారు. కనీసం 2,500 హెక్టార్ల బంజరు ఉండే ప్రాంతాన్ని ఒక ప్రాజెక్టు (ప్రాంతం)గా తీసుకొని 61 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో 5,000 హెక్టార్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాజెక్టు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు గ్రామాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అధికారులు అదనంగా మరో 30 ప్రాజెక్టులతో 75 వేల హెక్టార్లు (1.85 లక్షల ఎకరాలు) అభివృద్దికి ప్రతిపాదనలు ముందస్తుగా సిద్ధం చేశారు. ఈ నెల 4న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మొత్తం 91 ప్రాజెక్టుల పరిధిలో 3.25 లక్షల హెక్టార్లతో ప్రతిపాదనలను రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు కేంద్ర అధికారులకు అందజేశారు. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే రాష్ట్రంలో కనీసం 4 లక్షల మంది రైతు, కూలీల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. నిధుల పెంపు, నిబంధనల్లోనూ మార్పు పీఎంజీఎస్కేవై 1 లో రాష్ట్రంలో ఇప్పటికే దశల్లో వాటర్షెడ్ కార్యక్రమాలు జరిగాయి. ఆ పథకాల్లో అభివృద్దికి హెక్టారుకు గరిష్టంగా రూ.12 వేలు మాత్రమే కేటాయించారు. ఇంత తక్కువ నిధులతో చెక్ డ్యాంల నిర్మాణం, భూమిలో తేమ శాతం పెంపు, ఇతర కార్యక్రమాలతో పాటు ఆ ప్రాంతంలోని కూలీల కుటుంబాలకు వ్యవసాయ ఆధారిత జీవనోపాధి కల్పనలో సత్ఫలితాలు రాలేదు. ఈ నేపధ్యంలో పీఎంజీఎస్కేవై – 2లో వాటర్షెడ్ కార్యక్రమాల నిర్వహణకు హెక్టారుకు రూ.22 వేల నుంచి రూ.28 వేలు కేటాయించాలని నిర్ణయించారు. దీనికి తోడు గతానికి భిన్నంగా మెరుగైన ఫలితాలు దక్కేలా నిబంధనల్లోనూ మార్పులు చేశారు. ఒక ప్రాజెక్టులో చేపట్టే పనుల ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులివ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం గతంలో ఎక్కువ శాతం నిధులిచ్చిన పనులకు ఇప్పుడు తక్కువ కేటాయించాలని, గతంలో తక్కువ శాతం నిధులిచ్చిన పనులకు ఇప్పుడు ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. -
గ్రామాల్లో మొబైల్ యాప్తో ఇంటిపన్ను వసూళ్లు
సాక్షి, అమరావతి: ఇక నుంచి గ్రామాల్లో ఇంటి పన్నును అన్లైన్ విధానంలోనే వసూలు చేస్తారు. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ యాప్ ద్వారా ఇంటిపన్ను పూర్తి పారదర్శకంగా నూరు శాతం వసూలవుతుందని తెలిపారు. గ్రామాల్లోని సుమారు 86 లక్షల గృహాలకు సంబంధించిన డేటాను సేకరించి, ఆ వివరాలను యాప్తో ఇప్పటికే అనుసంధానం చేసినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ఇకపై గ్రామాల్లో మాన్యువల్ విధానంలో ఇంటి పన్ను వసూళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. ఇలా అన్లైన్ విధానంలో పన్ను చెల్లించిన వెంటనే అన్లైన్లోనే రశీదు తయారై, ఆ రశీదు వెంటనే పన్ను చెల్లించిన వారి మొబైల్ నెంబరుకు వెళ్తుందని మంత్రి చెప్పారు. అంతేకాక.. ఇంటి యజమానులకు ఎంత పన్ను చెల్లించారు.. ఇంకా ఎంత చెల్లించాలి అనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా ఆయా పంచాయతీల్లోని పన్ను చెల్లింపుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుందని వివరించారు. పొదుపు సంఘాల కార్యక్రమాలపైనా సమీక్ష పొదుపు సంఘాల కార్యక్రమాలతో పాటు పెన్షన్ల పంపిణీ అంశాలపై మంత్రి పెద్దిరెడ్డి సచివాలయంలోని తన ఛాంబరులో సెర్ప్ అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
నేటినుంచి సర్పంచులకు శిక్షణ
సాక్షి, అమరావతి: ఏపీలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పంచాయతీ పాలనపై గురువారం నుంచి ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ఆగస్టు 14 వరకు పంచాయతీరాజ్శాఖ, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ (ఎస్ఐఆర్డీ) ఆధ్వర్యంలో కొనసాగే ఈ శిక్షణ తరగతులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభిస్తారని ఎస్ఐఆర్డీ డైరక్టర్ జె.మురళి తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు మొత్తం 60 కేంద్రాల్లో ఈ తరగతులు మొదలవుతాయన్నారు. సర్పంచులకు రెసిడెన్షియల్ పద్ధతిలో వారి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రతి తరగతికి 20 మందే హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఒక్కో బ్యాచ్లో ప్రతి జిల్లాలో 120 మందికి మాత్రమే శిక్షణ ఇస్తున్నామన్నారు. ఒక్కో బ్యాచ్కి 3 రోజులపాటు 14 అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి జిల్లాలో గరిష్టంగా 7 బ్యాచ్లు ఉంటాయని చెప్పారు. ఈ తరగతుల నిర్వహణకు మొదటి విడతగా జిల్లాలకు రూ.1,77,63,998 విడుదల చేసినట్టు చెప్పారు. సర్పంచుల్లో గర్భిణులకు మినహాయింపు ఇచ్చామని, పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. సర్పంచులకు శిక్షణ ఇచ్చే 14 అంశాలు తొలిరోజు 1. గ్రామ పంచాయతీలు, మన స్థానిక ప్రభుత్వాలు– గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత 2. సర్పంచ్, వార్డుసభ్యులు, సిబ్బంది అధికారాలు, విధులు, బాధ్యతలు 3. స్థానిక స్వపరిపాలన– గ్రామ సచివాలయాలు, వలంటీర్లు, గ్రామసభ, గ్రామ పంచాయతీ సమావేశాలు, కార్యచరణ కమిటీలు 4. మౌలిక వసతుల కల్పనతో గ్రామాభివృద్ధి – తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, వీధిదీపాలు మొదలైనవి 5. పారిశుధ్యం – జగనన్న స్వచ్ఛ సంకల్పం రెండో రోజు 6. నియంత్రణ అధికారులతో గ్రామ పంచాయతీ పాలన– పార్ట్1 7. నియంత్రణ అధికారులతో గ్రామ పంచాయతీ పాలన– పార్ట్ 2 8. గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక వ్యవహారాలు 9. గ్రామ పంచాయతీల ఆదాయ వ్యయాలు– వ్యయ నియమాలు– బడ్జెట్, అభివృద్ధి ప్రణాళికలు 10. ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు– నవరత్నాలు– గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న వివిధ పథకాలు మూడో రోజు 11. పారదర్శక పాలన– పంచాయతీలపై పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థ 12. పంచాయతీ రికార్డులు, నివేదికలు 13. గ్రామ పంచాయతీలో జవాబుదారీతనం– క్రమశిక్షణ 14. కేంద్ర ఆర్థికసంఘం నిధులు, ఉపాధిహామీ పథకం, స్వచ్ఛ భారత్ -
గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు
సాక్షి, అమరావతి: గృహ వినియోగదారుల విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు వీలుగా గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించిన గ్రామ ఉజాలా పథకాన్ని త్వరలోనే ఏపీలో అమలు చేయనున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ సీడ్కోల సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) ఈ ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ పథకం అమలుపై చర్చించేందుకు సీఈఎస్ఎల్ ఎండీ మహువా ఆచార్య బుధవారం రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 450 కోట్లు వెచ్చించేందుకు అవకాశం ఉందని మహువా వివరించారు. ఈ పథకాన్ని ఇప్పటికే బిహార్, యూపీలో అమలు చేస్తున్నామని, ఇప్పుడు ఏపీలో ప్రారంభించడానికి అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసినట్టు తెలిపారు. గ్రామాల్లో నమూనా సర్వే కూడా పూర్తయిందన్నారు. ఎల్ఈడీ లైట్లు 75 శాతం తక్కువ విద్యుత్ను వినియోగిస్తాయని, 25 రెట్లు ఎక్కువ కాలం పనిచేస్తాయని వివరించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకం విజయవంతానికి వలంటీర్ల సేవలు వినియోగించుకుంటామన్నారు. గ్రామ ఉజాలా కార్యక్రమం ప్రారంభ తేదీ, వేదికను ఖరారు చేయాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. అమలు ఎలా? ► ఈ పథకంలో భాగంగా అర్హులైన గ్రామీణ ప్రజల నుంచి వాళ్ల ఇళ్లలో ఇప్పుడు వినియోగిస్తున్న 60 వాట్, 100 వాట్ బల్బులను తీసుకొని వాటి స్థానంలో ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేస్తారు. ► ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 5 ఎల్ఈడీ బల్బులను అందజేస్తారు. ► బహిరంగ మార్కెట్లో 7 వాట్ ఎల్ఈడీ బల్బు రూ.70, 12 వాట్ ఎల్ఈడీ బల్బు రూ.120 ధర ఉండగా.. కేవలం రూ. 10కే వాటిని అందజేస్తారు. లాభం ఇలా.. పథకం అమలుతో ప్రతి ఇంటికీ ఏడాదికి రూ. 600 నుంచి రూ.700 వరకు విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖకు అనుబంధంగా పనిచేసే స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఏస్ఈసీఎం) అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ ఏడాదికి 1,144 మెగా వాట్ల మేర తగ్గి, డిస్కంలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 81,55,316 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని తెలిపారు. -
‘ఉపాధి’లో మహిళా శక్తి
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కూలీల గ్రూపు లీడర్లు (మేట్)గా మహిళలనే ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఉపాధి హామీ చట్టం ప్రకారం మేట్గా కొనసాగే వారికి సంఘం తరఫున పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య ఆధారంగా రూ.3 చొప్పున అదనపు ఆదాయం పొందే వీలుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ జాబ్ కార్డులున్న కూలీలు కలిసి 5,99,256 శ్రమ శక్తి సంఘాలుగా ఏర్పడగా 3.83 లక్షల సంఘాలకు మహిళలే మేట్లుగా ఉన్నారు. మహిళా మేట్లలో అత్యధికులు ఇటీవలే ఎంపిక కాగా మిగిలిన సంఘాల్లో కూడా మహిళల ఎంపికకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కూలీల పని సామర్థ్యం పెంచడంతోపాటు అత్యధిక వేతనం పొందేలా ఉపాధి పథకం ద్వారా వ్యక్తిగతంగా కాకుండా గ్రూపుల ప్రాతిపదికన పనులు కల్పిస్తోంది. 15 – 25 మంది కూలీలు కలిసి శ్రమ శక్తి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం లో కూలీల సంఖ్యపై నిర్దిష్టంగా నిబంధనలు ఏవీ లేవు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక్కోశ్రమ శక్తి సంఘంలో కూలీలందరికీ కలిపి ఒకేచోట పనులు అప్పగిస్తున్నారు. ఈ సంఘాల్లో కొన్ని చోట్ల ఇప్పటివరకు పురుషులు మేట్గా వ్యవహరిస్తుండగా తాజాగా మేట్లుగా మహిళలనే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
YS Jagan: పరిశుభ్రతకు పెద్దపీట
గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలను సమీపంలోని ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించే ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఒక ప్రత్యేక నంబర్ను డిస్ప్లే చేయాలి. కాల్ చేయగానే సంబంధిత వాహనం ద్వారా వ్యర్థాలను సేకరించి, ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించాలి. మురుగు నీటి కాల్వల శుద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. డ్రెయిన్లను తరచూ శుభ్రం చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బలమైన పారిశుధ్య కార్యక్రమాల వల్లే ప్రజారోగ్యం మెరుగు పడుతుందని చెప్పారు. ప్రధానంగా పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో 14 వేల ట్రై సైకిళ్లు, పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1,034 ఆటోలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కార్యక్రమాల అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెల్లో ఎంత స్వచ్ఛత పాటిస్తే అంత ఎక్కువగా రోగాల వ్యాప్తిని నిరోధించవచ్చని స్పష్టం చేశారు. డోర్ టు డోర్ వ్యర్థాల సేకరణ కోసం ఇప్పటికే విధుల్లో 23,747 మంది గ్రీన్ అంబాసిడర్స్, 4,482 గ్రీన్ గార్డ్స్ను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా మరో 11,453 మంది గ్రీన్ అంబాసిడర్స్, 5,551 మంది గ్రీన్ గార్డ్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యర్థాల నిర్వహణకు భారీగా యంత్రాలను వినియోగించాలని, పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఇంకా ఏమన్నారంటే.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలి వ్యర్థాల సేకరణతో పాటు వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలి. పీపీఈ కిట్స్ డిస్పోజల్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను పక్కాగా చేపట్టాలి. ఈ అంశంలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. అప్పుడే క్లీన్ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. – ఫోన్ చేయగానే వ్యర్థాలను తొలగించడానికి అనుసరించాల్సిన విధానంపై పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రోటోకాల్ ఉండాలి. 6 లక్షల మంది మహిళలకు సుస్థిర జీవనోపాధి కింద లబ్ధి వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా సుస్థిర జీవనోపాధి కింద ఈ ఏడాది 6 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. మహిళల ఉత్పాదనలు, వారి వ్యాపారాలకు మార్కెటింగ్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి. టై అప్ చేస్తున్న కంపెనీలు కచ్చితంగా ప్రతిష్ట ఉన్నవి, మంచి పనితీరు కలిగినవిగా చూసుకోవాలి. మార్కెటింగ్ సామర్థ్యాలు విస్తృతంగా ఉన్న కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలి. సమగ్ర భూ సర్వే, ఉపాధి పనులు వేగవంతం సమగ్ర సర్వేను ఉద్ధృతంగా చేపట్టడంపై దృష్టి పెట్టాలి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి, రెవెన్యూ మంత్రులతో త్రిసభ్య కమిటీ చేయాలి. ఈ ఏడాది ఉపాధి హామీ కింద చేపట్టిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు అన్నీ కూడా పూర్తి కావాలి. వీటి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. నిర్మాణాలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. జియో ట్యాగింగ్ చేసి.. నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. ఇళ్ల నిర్మాణం పూర్తి కాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రోడ్లు.. ఇలా ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ జలకళ ప్రాజెక్టుపై మరింతగా దృష్టి సారించాలి. భూగర్భ జలాలను పెంపొందించడంలో భాగంగా చిన్న చిన్న నదులపై ఉన్న వంతెనల వద్ద చెక్డ్యాం తరహా నిర్మాణాలు చేపట్టాలి. ప్రగతిపథంలో పనులు.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఉపాధి హామీ కింద చేపట్టిన పనుల ప్రగతిని, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం వివరాలు తెలిపారు. నాడు–నేడులో భాగంగా పనులు చేపడుతున్న ఆస్పత్రులు, స్కూళ్లలో కూడా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వైఎస్సార్ బీమా, జలజీవన్ మిషన్, గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల ప్రగతిని వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా 9,148 ఇన్సినిరేటర్స్ (బూడిదగా మార్చేవి), 3,279 మిస్ట్ బ్లోయర్స్ (పిచికారి చేసేవి), 3,197 బ్రష్ కట్టర్స్ (గడ్డి కత్తిరించేవి), 3130 హైప్రెషర్ టాయ్లెట్ క్లీనర్లు, 165 పోర్టబుల్ థర్మల్ ఫాగింగ్ మిషన్లు, 157 షడ్డింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ గార్డ్స్ అందరికీ పీపీఈ కిట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.వి.సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సీఈఓ పి.రాజాబాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉపాధిలో నంబర్ వన్ ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు తీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–జూన్ నెలల మధ్య దేశవ్యాప్తంగా పథకం అమలు తీరుపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నాగేంద్రనాథ్ సిన్హా బుధవారం అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. విజయవాడ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ చినతాతయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో నాలుగు సూచీలలో దేశంలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో నిలవగా.. మిగిలిన ఇతర సూచీలలోనూ రాష్ట్రం మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. దీంతో కేంద్ర కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మూడు నెలల్లో దేశంలోనే అత్యధికంగా 17.29 కోట్ల పని దినాల పాటు పేదలకు పనులు కల్పించడం.. పనులు పారదర్శకంగా జరిగాయా లేదా అన్న దానిపై సోషల్ ఆడిట్ నిర్వహించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎంతో ముందు ఉందని అధికారులు వెల్లడించారు. పని చేపట్టే ప్రాంతాలను అన్లైన్ జియో ట్యాగింగ్లో గుర్తించే జీఐఎస్ ప్రణాళికల రూపకల్పనలోను, సీఎఫ్పీ సూచీలోను రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. చేపట్టిన పనులలో 96 శాతం పూర్తి చేస్తుండటంపై కేంద్ర కార్యదర్శి రాష్ట్రాన్ని అభినందించారు. ‘వ్యవసాయ’ పనులే 70 శాతం రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే 70 శాతం పనులు చేపడుతుండటంపై కేంద్రం అభినందించింది. పథకం అమలుకు దేశం మొత్తం మీద ఖర్చు చేస్తున్న వ్యయంలో 60 శాతం ఈ రంగంలో పనులు వెచ్చిస్తుండగా.. రాష్ట్రంలో 70 శాతం ఖర్చు పెట్టింది. -
గ్రామీణాభివృద్ధిలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును కేంద్రం ప్రశంసించింది. ఉపాధి హామీ పథకంతో పాటు పింఛన్ల పంపిణీ, భూ రికార్డుల ఆధునీకరణ, ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల బృందం గతేడాది దేశంలోని 24 రాష్ట్రాల పరిధిలోని 233 జిల్లాల్లోని 2,330 గ్రామాల్లో పర్యటించింది. గతేడాది అక్టోబరులో మన రాష్ట్రంలోనూ నాలుగు జిల్లాల పరిధిలో 40 గ్రామాలను కేంద్ర అధికారులు సందర్శించారు. ఆ వివరాలతో ‘నేషనల్ లెవల్ మానిటరింగ్’ పేరుతో కేంద్రం తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో శుక్రవారం వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలోనూ, ఉపాధిహామీ అమలులోనూ ఏపీ వంద శాతం పనితీరు కనబరుస్తున్నదంటూ కేంద్ర అధికారులు ప్రశంసించారు. వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో ఉపాధి హామీ పథకం డైరెక్టర్ చిన్నతా -
పట్టణాలకు దీటుగా పల్లెలు
సాక్షి, అమరావతి: పట్టణాలకు దీటుగా పల్లెల్ని కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్లు ముందుండి పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8 నుంచి వంద రోజులపాటు చేపట్టే ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాల్లో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచి వారిని భాగస్వాములను చేయాలన్నారు. ఆ రోజు ఈ స్వచ్ఛ సంకల్పం యజ్ఞాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహక శంఖారావం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర ఎండీ సంపత్కుమార్, జగనన్న స్వచ్ఛ సంకల్పం ఓఎస్డీ దుర్గాప్రసాద్లు తాడేపల్లి కమిషనర్ కార్యాలయం నుంచి పాల్గొనగా.. ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆయా మండలంలో సర్పంచులందరూ ఈ ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్లతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి గ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని సీఎం వైఎస్ జగన్ తపిస్తున్నందున ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకువస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 567 పల్లెలు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషమని పెద్దిరెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని 13,371 పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని విజయవంతం చేయాలని కోరారు. పరిశుభ్రతతో 95 శాతం అంటువ్యాధులు తగ్గాయి గత ఏడాది కాలంగా పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు 95 శాతం తగ్గినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇంటిని ఎలా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో, గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని సర్పంచ్లకు సూచించారు. 11,412 మంది సర్పంచులకు చెక్ పవర్.. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 11,412 మంది సర్పంచులకు సోమవారం నాటికి చెక్ పవర్ బదలాయింపు ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. మరో 1,680 మందికీ ఒకట్రెండు రోజులలోనే బదలాయించనున్నట్లు తెలిపారు. అలాగే, పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,704 కోట్లను పంచాయతీల ఖాతాల్లో జమచేశామన్నారు. మంచి ఫలితాలను సాధించిన సర్పంచ్లు, అధికారులను ప్రభుత్వం సన్మానిస్తుందని తెలిపారు. కాగా, వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయపల్లి సర్పంచ్ ఇందిరెడ్డి స్వాతి, కర్నూలు జిల్లా ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష, నెల్లూరు జిల్లా జమ్మలపాలెం సర్పంచ్ బి. శ్రీదేవి, ప్రకాశం జిల్లా జువ్వలేరు సర్పంచ్ ఎస్. సుధాకర్రెడ్డి మాట్లాడారు. రీచ్ల నుంచే నేరుగా జగనన్న కాలనీలకు ఇసుక విజయవాడలో మంత్రి పెద్దరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేరుగా రీచ్ల నుంచే జగనన్న కాలనీల్లో కడుతున్న ఇళ్ల వద్దకు ఇసుకను పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల రవాణా చార్జీలు తగ్గడంతోపాటు డిపోల నుంచి ఇసుకను తీసుకెళ్లే హ్యాండ్లింగ్ చార్జీలు కూడా ఆదా అవుతాయన్నారు. లేనిపక్షంలో వీటిని ప్రభుత్వమే భరించాల్సి వస్తుందన్నారు. కడుతున్న ప్రతి ఇంటికీ 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు. కాగా, వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని.. నెలాఖరులోపు ఈ సీజన్కు అవసరమైన ఇసుకను సిద్ధం చేస్తామన్నారు. -
సర్పంచ్లతో నేడు మంత్రి పెద్దిరెడ్డి సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ సర్పంచ్లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జూలై 8 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించనున్న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం అమలుపై ఆయన సర్పంచ్లతో చర్చిస్తారు. ప్రతిధ్వని పేరుతో పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున 26 మంది సర్పంచ్లు మంత్రితో మాట్లాడనున్నారు. -
Andhra Pradesh: గ్రామీణ 'ఉపాధి' పుష్కలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటూనే, ఈ విపత్తు సమయంలో జీవనోపాధి కోల్పోయి పేదలెవరూ ఇబ్బంది పడకుండా అన్ని విధాలా ఆదుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అనేక భయాందోళనల మధ్య స్థానికంగా పేదలెవరూ పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పిస్తోంది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు.. 45 రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మన రాష్ట్రంలో అలాంటి ఇబ్బందుల మధ్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కూలీలకు రూ.1,216.58 కోట్ల మేర పనులు కల్పించింది. పని చేసిన వారం రోజుల వ్యవధిలో క్రమం తప్పుకుండా కూలీ డబ్బులు చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా 31,35,231 కుటుంబాలు ఈ పథకం కింద పని చేసి.. ఈ 45 రోజుల వ్యవధిలో ప్రతి కుటుంబం సరాసరి రూ.3,880 చొప్పున ఉపాధి సొమ్ము పొందారు. ఒక వ్యక్తి ఒక రోజు పని చేస్తే రూ.220 చొప్పున వేతనం ఇస్తున్నారు. (చదవండి: ప్రాణ వాయువుకు ఫుల్‘పవర్’) సీఎం, మంత్రి ప్రతి వారం సమీక్ష ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి వారం జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ గ్రామాల్లో పని అడిగిన ప్రతి ఒక్కరికీ లేదనకుండా పనులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో పేదలకు పనుల కల్పనలో జిల్లా, మండల స్థాయిలో అధికారులెవరూ నిర్లక్ష్యం వహించకుండా లక్ష్యాలను నిర్దేశించారు. ఎండల కారణంగా పనులు చేయడానికి ఇబ్బంది పడకుండా ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 3 గంటల తర్వాతనే పనులు కల్పిస్తున్నారు. సొంత ఊరిలో ఉపాధి పనుల కోసం ఇంటి నుంచి ఎక్కువ దూరం వెళ్లే అవసరం లేకుండా వీలైనంత వరకు ఇంటికి సమీపంలో పనులు కల్పించాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు చేశారు. పని సమయంలో కూలీలు ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడానికి ప్రభుత్వం సబ్బులు అందజేయడంతో పాటు పని జరిగే అన్ని చోట్ల మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచింది. అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే.. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారేనని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో రెండో విడత కరోనా తీవ్రత పెరిగిన తర్వాత ప్రభుత్వం 5.55 కోట్ల పని దినాలతో ఉపాధి పథకం కింద పేదలకు పనులు కల్పిస్తే.. అందులో 52 శాతం మేర బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి 2.89 కోట్ల పని దినాలు దక్కాయి. దాదాపు రూ.635 కోట్ల మేర లబ్ధి పొందారు. ఎస్సీలు 22.95 శాతం పనులు పొందగా, 10.17 శాతం మేర ఎస్టీలు ఉపాధి పొందారు. దాదాపు 15 శాతం ఇతర వర్గాల పేదలు కూడా ఉపాధి హామీ పనుల ద్వారా లబ్ధిపొందారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు చెక్ పవర్.. గ్రామ పంచాయతీల ఖాతాల్లో దాదాపు రూ.1,800 కోట్ల మేర 15వ ఆర్థిక సంఘం నిధులు అందుబాటులో ఉన్నట్టు పంచాయతీరాజ్ అధికారులు వెల్లడించారు. ఈ విపత్తులో గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉన్న డబ్బులను స్థానిక అవసరాలకు ఉపయోగించుకునేలా కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ప్రభుత్వం తాజాగా చెక్ పవర్ సౌకర్యాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన బదలాయింపునకు చర్యలు చేపట్టింది. అవ్వాతాతలకు అండగా.. ఇంతటి విపత్తులో వృద్ధాప్యంలో ఉండే అవ్వాతాతలు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు సైతం ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా కొత్తగా అర్హత ఉన్న 59,062 మందికి ప్రభుత్వం మే నెల ఒకటవ తేదీన పింఛన్లు పంపిణీ చేసింది. మే 1–3 తేదీల మధ్య ప్రభుత్వం 61.40 లక్షల మందికి రూ.1,480 కోట్ల మొత్తాన్ని పింఛన్ల రూపంలో పంపిణీ చేసింది. రైతు భరోసా కింద మూడో ఏడాదీ సాయం రైతులకు పంట పెట్టుబడి సాయంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడతగా 52.38 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.7,500 చొప్పున గురువారం సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి రూ.3,928 కోట్లు జమ చేశారు. కోవిడ్ సంక్షోభంలో ప్రభుత్వ కష్టం కంటే రైతుల కష్టమే ఎక్కువ అని భావించానని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఆదాయ వనరులు తగ్గినప్పటికీ రైతులకు ఇచ్చిన మాట మేరకు వరుసగా మూడో ఏడాది రైతు భరోసా కింద ఆయా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశామని చెప్పారు. 2019–20 నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.13,101 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. తాజా మొత్తం కూడా కలుపుకుంటే ఒక్క రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చారు. (చదవండి: మిగులు జలాలపై ఇద్దరికీ హక్కు) కరోనా కట్టడికీ పట్టిష్ట చర్యలు కరోనా కట్టడికీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పట్టిష్ట చర్యలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా, 9704 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల నేతృత్వంలో కరోనా కట్టడి కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేసింది. శుక్రవారం 6,042 గ్రామాల్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసింది. 2,690 గ్రామాల్లో రాత్రి వేళ ఫాగింగ్ చేసింది. 7,355 గ్రామాల్లో ప్రధాన వీధులన్నింటిలో శుక్రవారం బ్లీచింగ్ పౌడర్ చల్లారు. స్పష్టమైన లక్ష్యాలతో పనులు కరోనాకు తోడు వ్యవసాయ పనులన్నీ ముగిసిన ఈ సమయంలో గ్రామాల్లో పేదలకు పనులు దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పనులు కల్పించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జూన్ నెలాఖరు వరకు పెద్ద ఎత్తున పనులు కల్పించేందుకు జిల్లాల వారీగా స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించాం. ఇప్పుడు కూడా ప్రతి రోజూ 30 లక్షల మంది ఉపాధి పథకంలో పనులకు హాజరవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 90 లక్షల కుటుంబాలు ఉంటే ఈ విపత్తులో మూడో వంతు కుటుంబాలకు గత 45 రోజులుగా పనులు కల్పిస్తున్నాం. పనికి వచ్చిన వారికి వెంటనే వారి బ్యాంకు ఖాతాలలో నేరుగా కూలి డబ్బులను జమ చేస్తున్నాం. – గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి -
విపత్తులోనూ పేదలకు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: ప్రస్తుత కరోనా పరిస్థితులలోనూ పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గ్రామాల్లో పని కావాల్సిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ దాదాపు 31 లక్షల మంది ఈ పథకంలో పనులకు హాజరవుతున్నట్టు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. వలసలు ఎక్కువగా ఉండే విజయనగరం, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోనే అత్యధిక మంది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు.. సుమారు నెల రోజుల వ్యవధిలోనే ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు రూ. 751.29 కోట్లను వేతనాల రూపంలో చెల్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల రోజుల వ్యవధిలో 26.38 లక్షల కుటుంబాలకు సంబంధించి 40 లక్షల మంది ప్రయోజనం పొందినట్టు అధికారులు తెలిపారు. పని ప్రదేశాలలో కూలీలకు కరోనా భయాలు లేకుండా ఉపాధి పథకం సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► ఎక్కువ మంది గుమికూడే అవకాశం లేకుండా ఒక్కో చోట గరిష్టంగా 30 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. ► సాధ్యమైనంత వరకు కూలీ ఇంటికి సమీపంలోనే పనులు కల్పిస్తున్నారు. కూలీలు ఆటోల వంటి వాహనాల్లో కిక్కిరిసి వెళ్లాల్సిన అవసరం లేకుండా నడిచి వెళ్లే దూరంలోనే పనులు కల్పిస్తున్నారు. ► ప్రతిరోజు పనుల ప్రారంభానికి ముందు కూలీలందరినీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష చేస్తున్నారు. కరోనా లక్షణాలు లేకపోతేనే పనులకు అనుమతిస్తున్నారు. ► పని ప్రదేశంలో కూలీలతో తప్పనిసరిగా మాస్క్లు ధరింపచేస్తున్నారు. అలాగే చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు సబ్బులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తోంది. -
20 వేల ఎకరాల్లో పచ్చిమేత
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమను మరింతగా ప్రోత్సహించటంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. పాడి రైతులు పచ్చిమేత (పశుగ్రాసం) పెంచడానికి ఉపాధిహామీ పథకం ద్వారా లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సహాయం చేయనుంది. ఈ ఏడాది దాదాపు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి ప్రోత్సాహకాలు అందజేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధిశాఖ, పశుసంవర్ధకశాఖ సంయుక్తంగా చేపడతాయి. పశుసంవర్ధకశాఖ లబ్ధిదారులను ఎంపిక చేస్తే, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పథకం అమలు చేస్తారు. లబ్ధిదారుడు నిర్ణీత పొలంలో మూడేళ్లు పచ్చిమేత పెంచాలి. ఈ మూడేళ్లలో ఉపాధిహామీ పథకం నిధుల నుంచి ఎకరాకు రూ.77,204 వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసే అవకాశం ఉంది. పొలంలో గడ్డి విత్తనాలు చల్లడానికి ముందు భూమిని తయారు చేయడం మొదలు, విత్తనాల కొను గోలు, విత్తడానికి అయ్యే ఖర్చు, ఎరువులు, ఏడాదికి 20 నీటితడులకు అయ్యే ఖర్చు, గడ్డి పెరిగిన తరువాత కోత ఖర్చులతో సహా అన్నింటికి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తుంది. 18 సార్లు కోతకొచ్చే పచ్చిమేత ఒక విడత విత్తితే మూడేళ్ల పాటు పచ్చిగడ్డి వచ్చే విత్తనాలనే లబ్ధిదారుడు వినియోగించాలి. మూడేళ్లలో 18 కోతలపాటు పశుగ్రాసం పాడిరైతుకు అందుబాటులోకి వస్తుంది. తొలి ఏడాది రూ.35,204, మిగిలిన రెండేళ్లు రూ.21 వేల చొప్పున లబ్ధిదారుడికి అందజేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి అనుమతి ఇవ్వాలన్నది పశుసంవర్ధకశాఖ నిర్ణయిస్తుంది. ఒక్కొక్కరు కనిష్టంగా 25 సెంట్ల నుంచి గరిష్టంగా 2.5 ఎకరాల వరకు పచ్చిమేత పెంపకం చేపట్టేందుకు అనుమతి ఇస్తారు. లబ్ధిదారుడు ఉపాధిహామీ పథకం జాబ్కార్డు కలిగి ఉండాలి. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కూడా ఒక్కోచోట గరిష్టంగా 5 ఎకరాల వరకు ప్రభుత్వ భూముల్లో పచ్చిమేత పెంపకానికి ఈ పథకం ద్వారా నిధులు అందజేస్తారు. గ్రామ సచివాలయంలోని పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న మహిళల్లో 4.21 లక్షలమంది పాడి పశువుల మీద పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో పెరిగే పశుసంపద అవసరాలకు తగినట్లు పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
లేని కారుకు కిరాయి.. ఇదెలా సాధ్యం సార్!
సాక్షి, నిజామాబాద్ : సాధారణంగా కొందరు అధికారులు కారు అద్దె డబ్బులను స్వాహ చేసేందుకు తమ సొంత కార్లను, బంధువుల పేరిట ఉన్న వాహనాలను వినియోగిస్తారు. కానీ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లో ఓ అధికారి మరో అడుగు ముందుకేశాడు. లేని కారును ఉన్నట్లుగా, తిరగకున్నా తిరిగినట్లుగా చూపించి అద్దె డబ్బులు స్వాహా చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు నెలల పాటు అక్రమంగా ప్రభుత్వ సొమ్మును మింగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా, ప్రస్తుతం ఆ శాఖ ఉద్యోగుల్లో హాట్ టాపిక్గా మారింది. గ్రామీణాభివృద్ధి శాఖలో ఇదివరకు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తికి టీఎస్ 05యూఏ 7336 నంబరు గల కారు ఉండేది. ఆ కారు తన భార్య పేరుపై రిజిస్టరై ఉంది. అయితే సదరు కారు గ్రామీణాభివృద్ధి శాఖలో అద్దెకు వినియోగించనేలేదు. కానీ శాఖకు చెందిన ఓ అధికారి సంబంధిత కారు ఆర్సీని ఆధారంగా చేసుకొని కారు తిరిగినట్లుగా రికార్డులు సృష్టించాడు. మొదట ఒక నెల అద్దె డబ్బులను తీసుకోగా, రుచి మరగడంతో వరుసగా ఐదు నెలల అద్దె డబ్బులను స్వాహా చేశాడు. ప్రతినెలా 25వేలు, అంతకు పైగానే తిరిగినట్లుగా చూపించి నెలకు రూ. 32,340 చొప్పున ఐదు నెలలు కలిపి రూ. లక్షా 50 వేలకుపైనే జేబులో వేసుకున్నారు. లేని కారు పేరిట తిరగకున్నా బిల్లులు తీసుకోవడం పద్ధతి కాదని శాఖలోని ఒకరిద్దరు ఉద్యోగులు సదరు అధికారికి చెప్పినా వినలేదు. అంతా నేను చూసుకుంటానని చెప్పి వారితో బలవంతంగా బిల్లులు చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. విషయం బయటకు పొక్కడంతో ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. డ్రైవర్ వద్దన్నా.. డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి తన భార్య పేరిట ఉన్న కారు పేరుతో అక్రమంగా బిల్లులు తీసుకోవడంపై తొలుత అభ్యంతరం వ్యక్తం చేశాడు. అధికారి కింద పనిచేస్తుండడంతో ఉద్యోగానికి ప్రమాదం ఏర్పడి ఉపాధి దెబ్బ తింటుందనే ఉద్దేశంతో గట్టిగా అనలేకపోయాడు. అయితే కొన్నిరోజులకు సదరు కారును వేరే వ్యక్తులకు అమ్మేశాడు. అయినప్పటికీ కూడా ఆర్సీని ఆధారంగా చేసుకుని అధికారి బిల్లులు పొందాడు. ఇలాగే ఉంటే తనకు ప్రమాదం ఏర్పడుతుందని ఆ కారు డ్రైవర్ కూడా గ్రామీణాభివృద్ధి శాఖలో విధులు మానుకుని వేరేశాఖలో పని చేసున్నాడు. ఇదిలా ఉండగా, అద్దె వాహనాన్ని నిబంధనల ప్రకారం జిల్లా పరిధిలోనే తిప్పాలి. శాఖకు సంబంధించిన పని ఉంటే రాష్ట్ర శాఖకు వెళ్లడానికి హైదరాబాద్ వరకు నెలలో నాలుగైదు సార్లు వెళ్లే అవకాశం కూడా ఉంది. కానీ గ్రామీణాభివృద్ధి శాఖలోని సదరు అధికారి మాత్రం వారంలో ఒకటి, రెండు సార్లు వేరే జిల్లాకు వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. అలాగే శాఖలోని ఇతర ఉద్యోగుల వాహనాలను కూడా సొంత పనులకు వినియోగించుకున్నట్లు విమర్శలున్నాయి. శాఖ పనులకు ఉపయోగించాం కారును శాఖ పనులకు వినియోగించాం. వేరే జిల్లాకు రెండు, మూడు సార్లు వెళ్లిన విషయం వాస్తవమే. రికార్డులు పక్కగా ఉంటేనే బిల్లులకు అనుమతి ఇచ్చాం. – శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్డీవో చదవండి: ఖమ్మం నగరంలో మోడల్ ‘వైకుంఠధామం’ కొడుకా.. నువ్వులేక మేము బతుకుడెట్లా! -
Andhra Pradesh: ఎండిన నదులకు ఎనర్జీ
సాక్షి, అమరావతి: ఒకప్పుడు గలగలపారే నీటితో కళకళలాడిన ఎన్నో నదులు ఇప్పుడు వివిధ కారణాలతో ఏడాది పొడవునా ఎడారిని తలపిస్తున్నాయి. చెలమల్లోనూ చుక్కనీటి జాడ కూడా కనిపించని దుస్థితి. ఇలా ఎండిన నదులకు పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. తమిళనాడులోని నాగా నది విషయంలో వచ్చిన సత్ఫలితాల స్ఫూర్తితో ఏపీ సర్కారు కూడా ఈ వినూత్న కార్యక్రమానికి సమాయత్తమైంది. ఇందుకోసం ముందుగా నాలుగు సీమ జిల్లాలతోపాటు ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో నదిని గుర్తించింది. శ్రీకాకుళం జిల్లాలోని చంపావతి, ప్రకాశంలో గుండ్లకమ్మ, అనంతపురంలో పెన్నా, కర్నూలులో హంద్రీ, వైఎస్సార్ జిల్లాలో పాపాగ్ని, చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదిని ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. ఉపాధి హామీ పథకం నిధులతో ఈ నదుల పునరుజ్జీవం కార్యక్రమాన్ని సర్కారు చేపట్టనుంది. పునరుజ్జీవానికి ఏమి చేస్తారంటే.. నదీ గర్భంలోనూ, నదికి ఇరువైపులా ఉండే ప్రాంతంలో కురిసే వర్షపు నీరు సముద్రంలో కలవకుండా వాటర్షెడ్ తరహాలో ప్రభుత్వం కట్టడాలు నిర్మిస్తుంది. నదీ గర్భంలోని ఇసుక పొరల కింద నుంచి పారే నీటిని ఎక్కడికక్కడే ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి నది పొడవునా పలుచోట్ల చిన్నచిన్న సబ్సర్ఫేస్ డ్యామ్లు (నది పొరల కింద కట్టేవి) నిర్మిస్తారు. అంటే.. నదీ గర్భంలో గట్టి నేల వచ్చేదాక తవ్వుతారు. అక్కడ బంకమట్టితో కట్ట కడతారు. తర్వాత ఇసుకతో కప్పేస్తారు. దీనివల్ల ఇసుక పొరల్లోంచి ముందుకు పారే నీటికి అడ్డుకట్ట పడుతుంది. నీటి వాలు, నది లోతును బట్టి వీటిని ఎంతెంత దూరంలో నిర్మించాలనేది నిర్ణయిస్తారు. ► అలాగే, నది పుట్టక ప్రాంతం నుంచి.. దాని పరీవాహక ప్రాంతం మొత్తంలో సబ్సర్ఫేస్ డ్యామ్లు, పర్కులేషన్ ట్యాంకులను (ఊట చెరువుల మాదిరి) నిర్మించి ఆ చుట్టుపక్కల వాగుల ద్వారా వర్షపు నీటిని నదిలోకి మళ్లిస్తారు. ► ఒక్కో నది వద్ద సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ తరహా పనులు చేపట్టే అవకాశముంది. ► ఇలా ఒక్కో నది వద్ద మూడేళ్ల పాటు ఈ తరహా కార్యక్రమాలు చేపడతారు. ఈ కాలంలో ఒక్కో దానికి రూ.50–70 కోట్లు ఖర్చుపెట్టే అవకాశముందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. మే నుంచి పనులు ప్రారంభం ఇదిలా ఉంటే.. ఈ ఆరు నదుల వద్ద ఏయే పనులు చేపట్టాలన్న దానిపై ‘వ్యక్తి వికాస కేంద్ర ఇండియా’ సంస్థ నిపుణులు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది కలిసి ఏప్రిల్ నెల మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించి చేపట్టాల్సిన పనులను గుర్తిస్తారు. ఆ తర్వాత మే నుంచే పనుల ప్రారంభించి, వర్షాకాలానికి ముందే కొన్ని ముఖ్యమైన పనులను ఆయా ప్రాంతాల్లో పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు. పాత మ్యాప్ల ఆధారంగా చర్యలు నదుల పునరుజ్జీవం కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన నదుల్లో నీటిని చేర్చడానికి అవకాశం ఉన్న వాగులు, వంకలన్నింటిని అభివృద్ధి చేస్తాం. నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి పాత మ్యాప్లను ఆధారంగా చేసుకుని పనులు గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం నిమిత్తం కొన్ని ప్రముఖ సంస్థల నుంచి సాంకేతిక సహాయం తీసుకుంటున్నాం. జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో వారి తోడ్పాటు కూడా ఈ కార్యక్రమానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా పనులు చేపడుతున్న నదుల పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు బాగా పెరిగడం ద్వారా అక్కడ అనేక సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. – గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి నాగా నది అనుభవంతో.. తమిళనాడులో ఎండిపోయిన నాగా నది పునరుజ్జీవనానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ (ఆర్ట్ ఆఫ్ లివింగ్)కు చెందిన ‘వ్యక్తి వికాస కేంద్ర ఇండియా’ సంస్థ చేసిన కృషి సత్ఫలితాలివ్వడంతో ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని మెరుగైన ఫలితాల సాధనకు మన రాష్ట్రంలోనూ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ ప్రక్రియతో అక్కడ సాగు విస్తీర్ణం, నది వెంబడి పచ్చదనం కూడా పెరిగింది. కర్ణాటకలో కూడా మరో నదికి పనిచేసిన అనుభవం ఈ సంస్థకు ఉండడంతో గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు రెండ్రోజుల క్రితం దీనితో ఎంఓయూ కుదుర్చుకున్నారు. నది పునరుజ్జీవం కోసం నదీ గర్భంలోనూ, నదీ పరీవాహకంలో ఎక్కడ ఏ పనులు చేపట్టాలన్నా.. పనుల గుర్తింపు, వాటి పర్యవేక్షణలో ఆ సంస్థ ప్రతినిధుల గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి తోడ్పాటు అందిస్తారు. -
'వాల్టా' నిబంధనల మార్పు!
సాక్షి, అమరావతి: రైతుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్టు చట్టం (వాల్టా) నిబంధనల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలపై శాస్త్రీయ అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. రాష్ట్రంలో ప్రస్తుతం భూగర్భ జలమట్టం ఎలా ఉంది, వాల్టా చట్టంలోని ఏయే నిబంధనలు రైతులకు సమస్యాత్మకంగా మారాయి, వీటిని రైతులకు ప్రయోజనం కలిగించేలా ఎలా మార్చాలి, ఇందుకు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే అంశాలపై కమిటీ ప్రతినిధులైన నిపుణులు లోతుగా అధ్యయనం చేశారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని వ్యవసాయ బోర్లు ఉన్నాయి, ఏయే ప్రాంతాల్లో ఈ బోర్లలో ఎంత లోతులో నీరు ఉంది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితిలో ఎలాంటి మార్పు వచ్చిందనే సమాచారాన్ని కూడా తెప్పించుకుని శాస్త్రీయంగా విశ్లేషించారు. ఇంకా కొంత అదనపు సమాచారం పంపాలని రాష్ట్ర భూగర్భ జల శాఖను కోరారు. ఈ శాఖ అధికారులు ఈ డేటా సమీకరించి పంపించే పనిలో ఉన్నారు. 27, 28 తేదీల్లో సెమినార్ ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీలో పంచాయతీరాజ్ కమిషనర్ చైర్మన్గా, భూగర్భ జల శాఖ సంచాలకులు కన్వీనర్గా, ఆయా రంగాల/సంస్థల ప్రతినిధులైన నిపుణులు సభ్యులుగా ఉన్నారు. జాతీయ భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) వాటర్ షెడ్ విభాగం డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్ఐహెచ్), నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ప్రతినిధులు, రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ), ఆంధ్ర విశ్వవిద్యాలయం జియో ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ తదితరులు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు, డ్వామా పీడీలు, జల వనరుల శాఖ ఎస్ఈలు, ఇతర జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా సెమినార్ నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ ప్రతినిధులంతా ఈ సెమినార్కు హాజరై చర్చలు జరుపుతారు. అనంతరం చట్టంలోని నిబంధనల మార్పునకు సంబంధించి ఈ కమిటీ త్వరలో మధ్యంతర నివేదిక సమర్పించే దిశగా కసరత్తు చేస్తోంది. అనంతరం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోనుంది. అసలు చిక్కు ఇదీ! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో–227 జారీ చేసింది. భూగర్భం నుంచి నీటిని ఎక్కువగా తోడేసిన (ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్) ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయరాదనేది ఇందులో ఒక నిబంధన. రాష్ట్రంలో ప్రస్తుతం 1,094 గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ గ్రామాల్లో ‘వైఎస్సార్ జలకళ’ పథకం కింద కూడా బోర్లు వేయడానికి లేదు. అలాగే హార్డ్ రాక్ ప్రాంతంలో 120 మీటర్ల లోతుకు మించి బోరు వేయరాదనేది మరో నిబంధన. ఒక బోరు ఇంత దూరంలో ఉంటే ఆ పరిధిలో మరో బోరు వేయరాదనేది ఇంకో నిబంధన జీవోలో ఉన్నాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో రాతి నేలలే ఉన్నాయి. ఇక్కడ 120 మీటర్ల లోతున మాత్రమే బోరు వేయాలన్న నిబంధన ఉంది. ఇంత లోతు మాత్రమే బోరు వేస్తే నీరు రాదు. అందువల్ల బోరు వేసినా ప్రయోజనం శూన్యం. అలాగే 200–300 మీటర్ల పరిధిలో బోరు ఉంటే మరో బోరు వేయకూడదనే నిబంధన వల్ల పక్క రైతు పొలంలో బోరు ఉంటే మరో రైతు వేసుకోవడానికి వీలుకాదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్లు వేసి మోటర్లు అమర్చాలనే సమున్నత ఆశయంతో ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళకూ ఇవే నిబంధనలు వర్తిస్తున్నాయి. దీనివల్ల తమకు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం లేకుండా పోయిందని, ఈ నిబంధనలను సవరించాలని రైతుల, రైతు సంఘాల నుంచి ప్రభుత్వానికి పెద్దఎత్తున వినతులు అందాయి. దీంతో రైతుల ప్రయోజనార్థం ఈ నిబంధనలు మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు సమర్పించే బాధ్యతను ఉన్నత స్థాయి కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. -
వైఎస్సార్ జలకళ ద్వారా మార్చి నాటికి 22,400 ఉచిత బోర్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకం ద్వారా మార్చి నెలాఖరు కల్లా రైతుల పొలాల్లో 22,400 ఉచిత బోర్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వాటర్ షెడ్ డైరెక్టర్ పీవీఆర్ఎం రెడ్డి బుధవారం 13 జిల్లాల డ్వామా పీడీలతో సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరిలో 3,200, ఫిబ్రవరిలో 9,600, మార్చిలో 9,600 చొప్పున ఉచిత బోర్లు తవ్వేందుకు జిల్లాల వారీగా ప్రణాళికలు ఖరారు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల దరఖాస్తులు నిబంధనల మేరకు తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఆయా రైతులు కనీసం రెండున్నర ఎకరాలుండేలా గ్రూపులుగా ఏర్పడి తిరిగి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు సూచించారు. -
ఏపీలో ఉపాధి హామీ; 30 కోట్ల పని దినాలు
సాక్షి, అమరావతి: ఏప్రిల్ ఒకటవ తేదీతో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా 30 కోట్ల పని దినాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు జిల్లాలవారీగా లేబర్ బడ్జెట్ ప్రాథమిక ప్రణాళికను గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రూపొందించారు. ప్రస్తుతం నిర్ధారించిన ధరల ప్రకారం ఒక్కో పని దినానికి కూలీకి వేతన రూపంలో చెల్లించడానికి గరిష్టంగా రూ.237, మెటీరియల్ ఖర్చులకు గరిష్టంగా రూ.158 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అంటే ఒక్కో పని దినానికి మొత్తం రూ.395 చొప్పున 30.02 కోట్ల పని దినాలను కూలీలకు కల్పించేందుకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.11,857 కోట్ల వరకు ఉపాధి హామీ పథకం ద్వారా ఖర్చుపెట్టే వీలుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25.25 కోట్ల మేరకు పనిదినాలు కల్పించాలని నిర్దేశించుకోగా.. ఇప్పటి వరకు 22.50 కోట్ల పనిదినాలు కల్పించారు. నేడు, రేపు డ్వామా పీడీలతో సమావేశాలు ఇదిలా ఉండగా, జిల్లాల్లో ఉపాధి హామీ పథకం నిర్వహణ తీరుపై సమీక్షించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన గురు, శుక్రవారాల్లో 13 జిల్లాల డ్వామా పీడీలతో తాడేపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చిస్తారు. పనిచేసిన వెంటనే కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లింపులు, ఈ పథకం ద్వారా నాటిన మొక్కలను వందశాతం బతికించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల్లో భాగంగా చేపడుతున్న గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, అంగన్వాడీ కేంద్రాలు, నాడు–నేడు కింద పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా జిల్లా అధికారులకు మంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేస్తారు. -
‘ఉపాధి’తో శాశ్వత ఆస్తులు
సాక్షి, అమరావతి: రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించింది. స్థానిక ప్రజలకు శాశ్వత అవసరాలకు ఉపయోగపడేలా ఆస్తుల కల్పన దిశగా పేదలకు పనులు కల్పింస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 515 గ్రామాల్లో కొత్తగా ఆట స్థలాలను తయారు చేశారు. మరో 461 గ్రామాల్లో పార్కులు ఏర్పాటు చేశారు. 6,396 ప్రాంతాల్లో మట్టి రోడ్లు.. 5,007 చోట్ల అంతర్గత రోడ్డు పనులు చేశారు. చిన్నా, పెద్ద తరహా ఆస్తులతో కలిపి దాదాపు ఐదు లక్షల వరకు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పనులు చేపట్టారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 275 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 77,70,594 మంది కూలీలకు 22,10,99,729 పని దినాలు కల్పించారు. ఈ పథకం ద్వారా పనులు చేసుకోవడం ద్వారా 46.71 లక్షల కుటుంబాలు రూ.5,084 కోట్ల మేర వేతనాల రూపంలో లబ్ధి పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఈ స్థాయిలో ఎప్పుడూ పనులు కల్పించలేదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వచి్చన 3,85,625 కుటుంబాలకు చెందిన 6,27,989 మందికి పనులు కల్పించడానికి వీలుగా కొత్తగా జాబ్ కార్డులు మంజూరు చేశారు. -
‘వైఎస్సార్ జలకళ’ నిబంధనల సవరణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకంలో ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక రైతు కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులవుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలో వేర్వేరు సభ్యుల పేరుతో ఒకే ప్రాంతంలో పక్కపక్కనే మూడు నాలుగు బోర్ల కోసం కొన్ని దరఖాస్తులు అందాయి. అయితే.. ఒక బోరుకు మరొక బోరుకు మధ్య కనీసం 200 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన వాల్టా చట్టంలో ఉంది. దీంతో సమస్య పరిష్కారానికి పథకం అర్హత నిబంధనలలో సవరణలు సూచిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపగా.. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అర్హత నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సవరణలతో కూడిన నిబంధన ప్రకారం.. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ పథకంలో ఉచిత బోరు మంజూరైతే.. ఆ కుటుంబంలో మరొకరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులవుతారని పేర్కొన్నారు. సవరించిన నిబంధనలివీ.. ► ప్రభుత్వ ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు ► ఈ పథకంలో ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకునే రైతులకు కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. అలా లేనిపక్షంలో చుట్టుపక్కల రైతులతో గ్రూపుగా ఏర్పడి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఈ పథకంలో ఉచిత బోరు మంజూరై, డ్రిల్లింగ్ తర్వాత అది ఫెయిలై.. అక్కడ మరో బోరు వేయాలంటే మరోసారి హైడ్రో జియాలజికల్ సర్వే జరిపించాలి. ఎంపీడీవో, డ్వామా ఏపీడీ పర్యవేక్షణలో రెండో బోరు తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. ► వైఎస్సార్ జలకళ పథకం కింద వేసే ఉచిత బోర్లలో కనీసం10 శాతం బోర్లు క్వాలిటీ కంట్రోల్ విభాగం తప్పనిసరిగా తనిఖీ చేయాలనే నిబంధన కూడా కొత్తగా తీసుకొచ్చారు. -
గ్రామాల్లో సగం కుటుంబాలకు.. ఉపాధి
అనంతపురం జిల్లా చినకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో 1,166 కుటుంబాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 79,739 పనిదినాల ద్వారా రూ.1,85,69,000 వేతనాలుగా పొందాయి. అంటే.. సగటున ప్రతి కుటుంబం ఏడు నెలల కాలంలో రూ.15,925 చొప్పున ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద దోర్నాలలో 1,858 కుటుంబాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 82,422 రోజుల పనిదినాల ద్వారా రూ.1,84,33,000 వేతనాలుగా పొందాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దాదాపు సగం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో 96 లక్షల కుటుంబాలు ఉన్నాయని అంచనా. ఇందులో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 46,39,981 కుటుంబాలకు పథకం కింద ప్రభుత్వం పనులు కల్పించినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు కూలీలు రూ.4,913 కోట్ల మేర పనులు చేయగా..రూ.4,858 కోట్లు మేర చెల్లింపులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. 2006లో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 14 ఏళ్ల కాలంలో.. ఒక ఆర్థిక ఏడాది సమయంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఇంత ఎక్కువ సంఖ్యలో కుటుంబాలకు పథకం కింద పనులు కల్పించిన దాఖలాలు లేవని.. ఇదో రికార్డని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రమంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గ్రామాల్లో వ్యవసాయ పనులు పెద్దగా లేకపోయినప్పటికీ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించలేకపోయారు. 2016–17 ఆర్థిక ఏడాదిలో 39.91 లక్షల కుటుంబాలు మాత్రమే పనులు పొందగా.. 2017–18లో 39.94 లక్షల కుటుంబాలే పనులు పొందాయి. యాక్టివ్ కూలీ కుటుంబాలు.. 54.89 లక్షలు ఉపాధి హామీ పథకంలో పనుల కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు 67,43,508 కుటుంబాలు నమోదు చేసుకొని జాబ్కార్డులు పొందినప్పటికీ.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరాల ప్రకారం యాక్టివ్ కూలీ కుటుంబాలు 54.89 లక్షలుగా ఉన్నాయి. గత మూడేళ్ల కాలంలో కనీసం ఒక్క రోజు అయినా పనులు కావాలని కోరి, చేసిన వారినే యాక్టివ్ జాబ్కార్డు కుటుంబాలుగా ఆ శాఖ గుర్తిస్తోంది. ఈ లెక్కన రాష్ట్రంలో యాక్టివ్ జాబ్కార్డు కుటుంబాలుగా గుర్తింపు పొందిన వాటిలో దాదాపు 90 శాతం ఈ ఆర్థిక ఏడాది పనులు పొందాయి. 3,33,989 కుటుంబాలు పూర్తి స్థాయిలో వంద రోజుల పనులు పూర్తిచేశాయి. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 60,01,097 కుటుంబాలు పనులు పొందాయి. కరోనా, లాక్డౌన్ వంటి కారణాలతో గ్రామాల్లో చాలా కుటుంబాలు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. -
అర్హులైన రైతులందరికీ ‘వైఎస్సార్ జలకళ’
సాక్షి, అమరావతి: మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేయనున్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తించనున్నారు. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నెరవేర్చడానికి రంగం సిద్ధం చేశారు. ► గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను తొలుత వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా ఏపీడీకి వెళ్తాయి. ఆ దరఖాస్తులను ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. ► అనుమతి అనంతరం కాంట్రాక్టర్ బోరుబావులను తవ్వుతారు. ► ఒకసారి బోర్వెల్ విఫలమైతే మరోసారి కూడా బోర్ వేస్తారు. ► ఈ పథకం కింద వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్ నిర్వహిస్తారు. ► ఈ కార్యక్రమం సమర్థవంతంగా పర్యవేక్షణకు, అమలుకు రాష్ట్ర స్థాయిలో పీఎంయూ (ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్) ఏర్పాటు చేస్తారు. ► బోర్ వేయడం పూర్తయిన తరువాత కాంట్రాక్టర్తో పాటు లబ్ధిదారుడి సమక్షంలో జియో ట్యాగింగ్తో కూడిన డిజిటల్ ఫొటో తీస్తారు. -
మెట్టభూములకు ‘వైఎస్సార్ జలకళ’
సాక్షి, అమరావతి: సాగునీరు అందుబాటులో లేని మెట్ట, బీడు భూములు ఇకపై పచ్చని పైర్లతో కళకళలాడనున్నాయి. ‘వైఎస్సార్ జలకళ’ పథకంతో ఇది సాధ్యంకానుంది. ఈ బృహత్తర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకంలో ప్రభుత్వమే ఉచితంగా బోర్లు తవ్వించి ఐదు లక్షల ఎకరాలను పూర్తి స్థాయిలో సాగులోకి తీసుకురానుంది. అందుబాటులో ఉన్న భూగర్భజల వనరులను ఉపయోగించుకుంటూ వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తారు. బోర్లు తవ్వించడానికి చిన్న, సన్నకారు రైతులు అప్పులు పాలవుతుండటాన్ని పాదయాత్ర సమయంలో చూసి చలించిన వైఎస్ జగన్.. ఉచిత బోర్ల పథకానికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉచిత బోర్ల పథకానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ‘వైఎస్సార్ జలకళ’ పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. – వచ్చే నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా సుమారు 2,00,000 బోర్లు తవ్వించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. – ఈ పథకానికి రూ. 2,340 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. – ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున డ్రిల్లింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీని ఇప్పటికే ఎంపిక చేశారు. – కనీసం 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు లేదా గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడి బోరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. – దరఖాస్తు చేసుకునే రైతుల భూమిలో అంతకు ముందు బోరు ఉండకూడదు. – అర్హత కలిగిన వారు గ్రామ సచివాలయంలో లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. – పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించిన తరువాతనే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలుపెడతారు. – భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయరు. – వైఎస్సార్ జలకళ పథకంలో పారదర్శకంగా పనులు చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను సిద్ధం చేసింది. రైతులు దరఖాస్తు చేసుకున్న తరువాత ప్రతి దశలోనూ దరఖాస్తుదారుడికి వివరాలను ఎస్ఎస్ఎంల ద్వారా పంపిస్తారు. ఈ వివరాలు ఆన్లైన్ కూడా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రైతుపక్షపాతి: మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో పాటు ఈ ప్రభుత్వం రైతుపక్షపాతి అన్న విషయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆచరించి చూపిస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు వినియోగానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. జియోలజిస్ట్ నిర్దేశించిన లోతులోనే బోర్ల తవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ పథకం కింద తవ్వే ప్రతి బోరుబావికి జియో ట్యాగింగ్ చేస్తామని, అదే క్రమంలో భూగర్భజలాలు ఎప్పటికప్పుడు రీచార్జ్ అయ్యేలా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు కూడా ఉంటాయని తెలిపారు. పర్యావరణానికి నష్టం జరగకుండా, భూగర్భజలాలు అడుగంటి పోకుండా శాస్త్రీయ పద్ధతుల్లో బోరుబావుల తవ్వకం ఉంటుందన్నారు. -
28న ‘వైఎస్సార్ జలకళ’ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో పెద్ద పథకం ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ► వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.98 లక్షల మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ► ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వేర్వేరుగా ఎంపిక చేసిన బోర్ రిగ్ వాహనాలను సీఎం 28వ తేదీన జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను కూడా సీఎం అదే రోజు ప్రారంభిస్తారు. ► ఆన్లైన్ విధానంతో పాటు ఎంపీడీవోల ద్వారా నేరుగా దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ వాటర్షెడ్ విభాగపు డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. -
పరీక్షలన్నీ పూర్తయ్యాకే ‘కీ’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకోసం ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో మొత్తం వారంపాటు జరిగే ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాకే అన్నిటికీ కలిపి ఒకేసారి ‘కీ’ విడుదల చేసే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 19 కేటగిరీలలో పారదర్శకంగా 16,208 ఉద్యోగాల భర్తీకి చేపట్టిన ఈ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 26 వరకు రోజుకు రెండేసి చొప్పున పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మొదటిరోజు జరిగిన పరీక్షలకు 6,81,664 మంది దరఖాస్తు చేసుకోగా 5,06,386 మంది హాజరయ్యారు. రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. పోటాపోటీగా... ► ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలో ఒక్కో ఉద్యోగానికి 332 మంది చొప్పున రాతపరీక్షల్లో పోటీపడగా సాయంత్రం జరిగిన పరీక్షల్లో ఒక్కో ఉద్యోగానికి 147 మంది చొప్పున పోటీపడ్డారు. ► 1,025 పోస్టులకు ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకోగా 4,08,687 మంది హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 3,40,386 మంది రాతపరీక్షలకు హాజరయ్యారు. 2,221 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ► సాయంత్రం పరీక్షలకు 2,24,667 మంది దరఖాస్తు చేసుకోగా, 2,02,998 మంది హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 1,65,922 మంది 1,059 కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యారు. వారికి ఐసోలేషన్ గదుల్లో పరీక్షలు.. ► తొలిరోజు 634 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న అభ్యర్థులు హాజరవగా.. వీరికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదుల్లో పరీక్ష నిర్వహించారు. ► పరీక్ష కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ అనంతరం అభ్యర్థులను లోపలకు అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందు, తర్వాత సోడియం హైపో క్లోరైట్తో పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు. ► పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. ► రాతపరీక్షలు ముగియగానే అన్నిచోట్ల నుంచి జవాబు పత్రాలను గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంకు తరలించారు. పకడ్బందీగా పరీక్షలు: పెద్దిరెడ్డి యూనివర్సిటీ క్యాంపస్: సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి చేపట్టిన రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు నియంత్రణ చర్యలు పక్కాగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. -
12 నుంచి ‘సచివాలయ’ హాల్టికెట్లు
సాక్షి,అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను ఈనెల 12 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం 16,208 పోస్టులు అందుబాటులో ఉండగా.. 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాతపరీక్షలు జరగనున్నాయి. (కొత్త పాలసీలో ‘వర్క్ ఫ్రం హోమ్’) ఏడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎమ్మార్ షీట్ల ముద్రణ ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ.. పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున, మధ్యస్తంగా ఉండే గదిలో 16 మంది చొప్పున సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
2.5 ఎకరాలకు ఒక ఉచిత బోరు
సాక్షి, అమరావతి: సన్న, చిన్న కారు రైతులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం ద్వారా ఉచిత బోర్ వెల్స్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు గ్రామీణాభివృద్ది శాఖ ప్రకటించింది. నవరత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని అమలుకు సంబంధించి శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ► బోరు డ్రిల్లింగ్ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత రైతు పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాలి. ► భూగర్భ జల మట్టం ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయరు. అర్హతలు, విధివిధానాలు.. ► రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి. అంత భూమి లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడవచ్చు. ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండవచ్చు. ఈ అర్హతలు ఉన్న రైతులు బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు ఆ భూమిలో ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. ► అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ► పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేస్తారు. ► బోరు బావి మంజూరు అనంతరం ఆ çసమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతుకు తెలియజేస్తారు. -
గ్రామీణ రోడ్లలో కొబ్బరి పీచు వినియోగం
సాక్షి, న్యూఢిల్లీ: పీఎంజీఎస్వై–3 కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో కాయిర్ జియో టెక్స్టైల్స్ను ఉపయోగిస్తామని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏజెన్సీ తెలిపింది. కొబ్బరి పీచుతో తయారైన చాపలు మంచి శోషణ శక్తిని కలిగి ఉంటాయి. ఇవి సహజమైనవి. బలంగా, చల్లగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయి. చిరుగులకు లోనకావు. సూక్ష్మజీవులను దరి చేరనివ్వవు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరి పీచును గ్రామీణ రోడ్ల నిర్మాణంలో వాడేందుకు అనుమతి లభించింది. గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కొబ్బరి పీచును ప్రత్యామ్నాయంగా వాడేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో ఎంఎస్ఎంఈ, రహదారి రవాణా–హైవే శాఖల మంత్రి నితిన్ గడ్కరీ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇది ముఖ్యమైన పరిణామం. రోడ్ల నిర్మాణంలో కాయిర్ జియో టెక్స్టైల్స్ వాడడంలో మనం ఇప్పుడు విజయం సాధించాం. కోవిడ్ –19 సమయంలో కుదేలైన కొబ్బరి పీచు పరిశ్రమకు ఈ నిర్ణయం ప్రాణం పోస్తుంది..’అని చెప్పారు. పీఎంజీఎస్వై ఇచ్చిన కొత్త సాంకేతిక మార్గదర్శకాల ప్రకారం, ప్రతి నిర్మాణ ప్రతిపాదనలో 15 శాతం పొడవైన రోడ్లను కొత్త సాంకేతికత ఉపయోగించి నిర్మించాలి. ఇందులో 5 శాతం రోడ్లను ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్(ఐఆర్సీ) గుర్తింపు పొందిన సాంకేతికత ఆధారంగా నిర్మించాలి. కాయిర్ జియో టెక్స్టైల్స్ను నిర్మాణ సామగ్రిగా ఐఆర్సీ ప్రస్తుతం గుర్తించింది. కేంద్ర సూచనల ప్రకారం పీఎంజీఎస్వై–3 కింద నిర్మించే గ్రామీణ రహదారుల్లో 5 శాతాన్ని కాయిర్ జియో టెక్స్టైల్స్ను ఉపయోగించి నిర్మించాలి. దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో 164 కిలోమీటర్లు, తెలంగాణలో 121 కి.మీ., గుజరాత్లో 151, కేరళలో 71, మహారాష్ట్రలో 328, ఒడిశాలో 470, తమిళనాడులో 369 కిలోమీటర్ల రహదారిని కాయిర్ జియో టెక్స్టైల్స్ ఉపయోగించి నిర్మిస్తారు. ఈ ఏడు రాష్ట్రాల్లో మొత్తం 1674 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంలో కాయిర్ జియో టెక్స్టైల్స్ను వినియోగిస్తారు. ఇందుకోసం ఒక కోటి చదరపు మీటర్ల కాయిర్ జియో టెక్స్టైల్స్ అవసరమని, ఇందుకు రూ. 70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. -
కూలీలకు ఎక్కువ ‘ఉపాధి’
గ్రామాల్లో ఎక్కడా మంచి నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. రానున్న 45 రోజుల పాటు ఎక్కడ నీటి ఎద్దడి గుర్తించినా,ఆ ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలి. అవసరమైన చోట పశువులకు అవసరమయ్యే తాగునీటిని కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు వెనుకాడొద్దు. సాక్షి, అమరావతి: ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ పేద కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాల అమలు తీరుపై శుక్రవారం ఆయన సమీక్షించారు. కరోనా కారణంగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొంత మందగించాయని, ఇప్పుడిప్పుడే పనులు వేగం పుంజుకుంటున్నాయని అధికారులు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వర్షాలు వచ్చే లోపు వీలైనన్ని పని దినాలు కల్పించాలని సూచించారు. పని కోసం వచ్చే కూలీలకు కరోనా వైరస్ సోకకుండా క్షేత్ర స్థాయిలో తగిన జాగ్రత్తలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. వివిధ పనుల పూర్తికి నిర్దిష్ట గడువు ► గ్రామాల్లో చేపట్టే సచివాలయ భవనాల నిర్మాణం, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాల భవనాలతో పాటు పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో అధికారులు సీఎం జగన్కు వివరించారు. ► అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన నిర్మాణ పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31, గ్రామ సచివాలయాల నిర్మాణం ఆగస్టు 31, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షల నిర్వహణ గురించి సమావేశంలో చర్చకు వచ్చింది. కరోనా పరిస్థితులు మెరుగు పడగానే పరీక్షల నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు సీఎంకు వివరించారు. ► ట్యాంకర్ల ద్వారా సరఫరాకు వీలుగా ముందుగానే ప్రైవే ట్ నీటి వనరులను గుర్తించి అధికారులందరూ సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రస్తుతం 2,847 గ్రామీణ నివాసిత ప్రాంతాలకు 14,113 ట్రిప్పులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసినట్టు అధికారులు వివరించారు. ► ఈ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’తో వారికి జీవనోపాధి
సాక్షి, అమరావతి: ప్రత్యేక పనిలో నైపుణ్యం ఉండి.. ఇప్పటి దాకా వేర్వేరు నగరాలు, పట్టణాల్లో ఉపాధి పొందుతూ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో తిరిగి గ్రామాలకు వచ్చిన ప్రత్యేక కేటగిరీ వలస కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధిని కల్పించే కార్యక్రమాల అమలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరింది. కరోనా నేపథ్యంలో వేలాది మంది కార్మికులు సొంత గ్రామాలకు తిరిగొచ్చారని, వారు మరింత కాలం గ్రామాల్లోనే ఉండాల్సి ఉంటుందని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం.. వివిధ వృత్తుల్లో పాక్షిక, పూర్తి స్థాయి నైపుణ్యం ఉన్న వారికి సంబంధిత పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేలా ఒక విధానం అమలు చేయాలని కోరింది. ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి కొత్త పనులకు అనుమతించాలన్న విషయంపై రెండు రోజుల క్రితం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ అన్ని రాష్టాల గ్రామీణాభివృద్ది శాఖ అదికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర అధికారులు ఈ ప్రతిపాదన చేశారు. పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రవేశపెట్టాల్సిన పనులపై రాష్ట్ర అధికారులు చేసిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఒక నివేదిక కూడా కేంద్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలివీ.. ► పది ఎకరాలున్న రైతుల పొలాల్లో కూడా ఉపాధి హామీ పథకంలో పండ్ల తోట పెంపకం, బీడు భూముల చదును వంటి పనులకు అనుమతించాలి. ప్రస్తుతం వ్యవసాయ, అనుబంధ పనుల్లో ఇప్పటి వరకు అయిదెకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకంలో అనుమతి ఉంది. కరువు మండలాలు, గిరిజన ప్రాంతాల్లోనైనా ఈ పరిధిని పది ఎకరాలకు పెంచాలి. ► వరుసగా రెండు మూడేళ్ల పాటు వంద పనిదినాలు ఉపాధి హామీ పథకంలో పని పొందిన కుటుంబాలకు అదనపు పని దినాలు కల్పించే విషయం పరిశీలించాలి. ఆ కుటుంబాలు ఉపాధి హామీ పథకంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయని పేర్కొంది. ► వేలాది రజక కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా దోభీ ఘాట్ల నిర్మాణాలకు అనుమతి తెలపాలి. ప్రతి దోభీ ఘాట్లో అవసరమైన వసతుల కల్పనకు అనుమతించాలి. ► గ్రామాల్లో ఎండిపోయిన బావుల్లో తిరిగి నీటి ఊట ఏర్పడేలా పూడికతీత పనులకు అనుమతివ్వాలి. ► రైతులు పండించిన కూరగాయలకు మంచి ధర వచ్చే వరకు తమ గ్రామంలోనే నిల్వ ఉంచుకునేలా చిన్న పాటి కోల్డు స్టోరేజీల నిర్మాణంతో పాటు గ్రామాల్లో హెల్త్ సబ్ సెంటర్లు, విలేజ్ అగ్రి క్లినిక్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతించాలి. -
ముందుగానే 3 నెలల పింఛను
న్యూఢిల్లీ: కరోనా ‘లాక్డౌన్’ నేపథ్యంలో వితంతువులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు 3 నెలల పింఛను ముందుగానే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ సామాజిక చేయూత పథకం(ఎన్ఎస్ఏపీ) కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దేశంలోని సుమారు 2.98 కోట్ల మంది పేద సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు నెలవారీ పింఛను పంపిణీ చేస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏప్రిల్ మొదటి వారంలో మూడు నెలల పింఛను మొత్తాన్ని ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఎన్ఎస్ఏపీ కింద 60–79 ఏళ్ల సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.200 చొప్పున, 80 ఆపైన వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది. 79 ఏళ్ల వ రకు ఉన్న దివ్యాంగులకైతే రూ.300, 80 ఆపై వ యస్సు వారికి రూ.500, వితంతువులు 40–79 ఏళ్ల వారికి రూ.300, 80 ఆపై వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది. దీంతోపాటు కరోనా ప్యాకేజీ కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదనంగా రెండు విడతల్లో కలిపి రూ.1,000 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. -
రూ.8,791 కోట్లు కేటాయించండి
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుకు రూ.8,791.65 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా వచ్చే ఆర్థిక ఏడాదికి.. ఏ రాష్ట్రంలో ఎంత మంది కూలీలకు ఉపాధి కల్పిస్తారనే దానిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాల వారీగా ఈ నెల 12 నుంచి వచ్చే నెల 2 వరకు వేర్వేరుగా సమావేశాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మన రాష్ట్ర అధికారులతో ఈ నెల 26న కేంద్ర అధికారులు సమావేశం కానున్నారు. ఇందులో రాష్ట్రంలో నిరుపేద కూలీలకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది (2021) మార్చి 31 మధ్య కాలంలో 25 కోట్ల పనిదినాలపాటు కూలీ పనులు కల్పించడానికి, కూలీలకు వేతనాలుగా చెల్లించేందుకు రూ.5,274.99 కోట్లు.. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల్లో మెటీరియల్ కొనుగోళ్లకు మరో రూ.3,516.66 కోట్లు కేటాయించాలని కోరనున్నారు. -
ఇంటి వద్దకే పింఛన్..
-
ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దకే పింఛన్
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం మొదలు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వలంటీర్ల ద్వారా నేరుగా చేరవేయాలన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుపై బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణంతో పాటు నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్ గ్రిడ్ అంశాలపై చర్చించారు. వివిధ సర్వేలంటూ ముడిపెట్టి అసలైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలను నిరాకరించే పరిస్థితి ఉండకూడదని సీఎం అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, ఆ మేరకు లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అర్హులు ఎంత మంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రామాల్లో మినీ గోడౌన్ల నిర్మాణం రైతులు తమ పంటలకు గిట్టుబాబు ధర వచ్చేంత వరకు నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మినీ గోడౌన్ల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయ భవనాలు, వాటికి అనుబంధంగా నిర్మించే రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు అవసరమైన వాటన్నింటినీ రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేలా ప్రణాళిక బద్దంగా పని చేయాలని సూచించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున గ్రామాల్లో ఎక్కడికక్కడ వ్యవసాయ రంగంలో కూలీలకు పనులు లభిస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించడంలో ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఈ పథకం ద్వారా చేపట్టే ప్రతి పని పకడ్బందీగా, ప్రజలకు ప్రయోజనం కలిగించేదిగా ఉండాలని సీఎం సూచించారు. సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయండి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడున్న 11,158 గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 వరకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఇందుకు కొత్తగా మరో 3 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేయాల్సి ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలతో పాటే వీటిని భర్తీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
సచివాలయ వ్యవస్థ అద్భుతం
చోడవరం: గ్రామ సచివాలయ వ్యవస్థపై విదేశీ ప్రతినిధుల అధ్యయన బృందం ప్రశంసల జల్లు కురిపించింది. గ్రామీణ ప్రజల అభివృద్ధి, అవసరాలు తీర్చడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పాలన చాలా బాగుందని అభినందించింది. జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ సౌజన్యంతో 19 దేశాలకు చెందిన 23 మంది ప్రతినిధులు సోమవారం విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ప్రతినిధి బృందంలో శ్రీలంక, బంగ్లాదేశ్, బోట్సువానా, బురుండీ, కెమెరూన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనా, ఇరాక్, కెన్యా, మారిషస్, నైజీరియా, దక్షిణ సూడాన్, తజికిస్థాన్, టాంజానియా, ఉజ్బెకిస్థాన్, జాంబియా తదితర దేశస్తులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పాలన వ్యవస్థ, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సేవలు, గ్రామీణాభివృద్ధిపై వీరు అధ్యయనం చేశారు. 11 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది సేవలందించేందుకు ప్రజలకు చేరువగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుందన్నారు. సచివాలయ కార్యాలయం ఏర్పాటు, ఉద్యోగుల నియామకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థ గురించి తమ దేశాల ప్రభుత్వాలకు సూచిస్తామని చెప్పారు. చోడవరం ఎమ్మెల్యే తరఫున స్పెషలాఫీసర్ వెంకటేశ్వర్లు, ఈవోపీఆర్డీ చైతన్య, పంచాయతీ ఈవో లోవరాజు, వైఎస్సార్సీపీ నేతలు విదేశీ బృందాన్ని ఘనంగా సత్కరించారు. పాలనా వ్యవస్థ బాగుంది భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పాలనా వ్యవస్థ బాగున్నాయి. గ్రామీణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ప్రజలకు ప్రభుత్వం చాలా మేలు చేస్తుండటం అభినందనీయం. ప్రజలు చూపించే ప్రేమాభిమానాలకు చాలా సంతోషిస్తున్నాం. –అగిసన్యంగ్కౌప, బోట్సువానా ప్రతినిధి గ్రామీణ వ్యవస్థ బలంగా ఉంది ప్రభుత్వ ఆధీనంలో గ్రామీణ పరిపాలనను సాగిస్తుండటం బాగుంది. అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు చాలా పథకాలు అందించడం వల్ల గ్రామీణ వ్యవస్థ బలంగా ఉంది. –ఎన్చుఫర్ క్రిస్టోఫర్, కెమెరూన్ ప్రతినిధి ప్రజలకు దగ్గరగా గ్రామీణ వ్యవస్థ ప్రజల అవసరాలకు దగ్గరగా గ్రామీణ వ్యవస్థ ఉంది. ప్రభుత్వం వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవడం మంచి విధానం. దారి్రద్యరేఖకు దిగువన ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకోవడం అభినందనీయం. – ఒజయ్కుమార్ హల్డార్, బంగ్లాదేశ్ ప్రతినిధి -
గ్రామాల్లో మౌలిక వసతులు ‘పది’లం
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నంత వేగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. ఈ ఆర్థిక ఏడాదిలో మిగిలిన ఐదు నెలల కాలంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం రూ.10 కోట్లకు తక్కువ కాకుండా గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు చెల్లించే వేతనాలతో నిమిత్తం లేకుండా మెటీరియల్ నిధుల కేటగిరీలో రూ.2,000 కోట్లు.. స్వచ్ఛ భారత్ పథకంలో మరో రూ.600 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడానికి వెసులుబాటు ఉంది. ఈ నిధులతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రూ.10 కోట్లకు తగ్గకుండా కొత్తగా అభివృద్ధి పనులకు ఆమోదం తీసుకొని, వేగంగా పనులు ప్రారంభించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఇప్పటికే జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి అవసరాలకు అనుగుణంగా చేపట్టే కొత్త పనులకే... ఉపాధి హామీ పథకంలో, ఆయా శాఖల్లో గత ప్రభుత్వంలో అనుమతి తీసుకున్న పనులకు ఈ నిధులను ఉపయోగించకుండా.. గ్రామాల్లో ఇప్పటి అవసరాలకు అనుగుణంగా చేపట్టే కొత్త పనులకు మాత్రమే ఈ నిధులను ఉపయోగించుకోవాలని గ్రామీణాభివృద్ది శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు 13 జిల్లాల పరిధిలో 2,903 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కాంక్రీట్ మురుగు కాల్వల నిర్మాణానికి ఆయా జిల్లాల నుంచి పలు ప్రతిపాదనలు అందినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. కాంక్రీట్ మురుగు కాల్వలు, సచివాలయ భవనాలకు ప్రాధాన్యత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా.. కాంక్రీట్ మురుగు కాల్వల నిర్మాణం, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి పనుల మంజూరులో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కనీసం 3 వేల కిలోమీటర్ల పొడవునా కాంక్రీట్ మురుగు కాల్వల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటికి రూ.600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికీ పంచాయతీ కార్యాలయం లేని చోట్ల రూ.35 లక్షలతో సచివాలయ కార్యాలయం నిర్మించాలని.. ఏదో ఒక భవనం ఉన్న చోట సచివాలయ అవసరాలకు తగ్గట్టు అదనపు భవన నిర్మాణానికి రూ.12–15 లక్షల చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐదు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.1,000 కోట్లు దాకా ఖర్చు చేయాలని ప్రణాళికగా పెట్టుకున్నారు. గ్రామాల్లో ఉండే స్కూళ్ల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వంటి వాటికి రూ.100 కోట్లు, అటవీ, గృహ నిర్మాణ శాఖల ద్వారా రూ.100 కోట్ల చొప్పున మరో రూ.200 కోట్లు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మిగిలిన శాఖల ద్వారా మరో రూ.500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. -
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని అభ్యర్థులు గడువు పెంచమని కోరారని అధికారులు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును ఈ నెల 11 (రేపు ఆదివారం) అర్థరాత్రి 12గంటల వరకు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో 13 జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆదివారం రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి 21 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మరోక రోజు గడువు పెంచడంతో 22 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 19 రకాల ఉద్యోగాలను నాలుగు రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబరు 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
సచివాలయ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, మధ్యాహ్నం నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్ 2) పరీక్షలను సెప్టెంబర్ 7 ఉదయానికి వాయిదా వేశారు. వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి పరీక్షను సెప్టెంబర్ 8, ఉదయం నుంచి అదే రోజు మధ్యాహ్నానికి మార్చారు. మిగిలిన పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మారిన పరీక్షల షెడ్యూల్ ఇలా.. సెప్టెంబర్ 1, ఉదయం పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, పిల్లల సంరక్షణ సహాయకురాలు, సంక్షేమం, విద్య సహాయకులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి సెప్టెంబర్ 1, మధ్యాహ్నం గ్రామీణ రెవెన్యూ ఆఫీసర్, గ్రామీణ సర్వేయర్, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, గ్రామీణ ఉద్యావన సహాయకులు, గ్రామీణ మత్యశాఖ సహాయకులు, పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సహాయకులు, పశుసంవర్థకశాఖ సహాయకులు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు (మహిళలు), గ్రామీణ సెరీకల్చర్ సహాయకులు సెప్టెంబర్ 7, ఉదయం ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి సెప్టెంబర్ 8, ఉదయం వార్డు ప్రణాళిక, నియంత్రణ కార్యదర్శి, వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి సెప్టెంబర్ 8, మధ్యాహ్నం వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి -
చేసింది చాలు..!
సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో గల ఉపాధి హామీ విభాగం హరితహారం సెక్షన్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కీలకమైన సెక్షన్లో పని చేసిన ఓ ఉద్యోగి హరితహారానికి సంబంధించిన గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచీ ఈ సెక్షన్లో పని చేసిన సదరు ఉద్యోగిని ప్రస్తుతం మొక్కలు నాటే కీలక సమయంలో సెక్షన్ బాధ్యతల నుంచి తప్పించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అనుకోకుండా సెక్షన్ తొలగించి సోషల్ ఆడిట్ విభాగానికి మార్చడంతో అక్రమ వసూళ్లు జరిగాయన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. ప్రస్తుతం ఈ విషయం ఉపాధి హామీ విభాగంలో హాట్ టాపిక్గా మారింది. జిల్లాలో ఈ ఏడాది డ్వామా శాఖ ఆధ్వర్యంలో కోటి వరకు మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేశారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. అయితే, టేకు మొక్కలను రైతులకు ఉచితంగా అందజేయడానికి టేకు స్టంపులను టెండరు ద్వారా కొనుగోలు చేసి జిల్లాకు తెప్పించి నర్సరీల్లో పెంచుతున్నారు. అయితే హరితహారం విభాగానికి మొన్నటి వరకు జిల్లా పరిషత్కు చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్ డ్వామాకు డిప్యూటేషన్పై వచ్చి పని చేశారు. గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు, పాలిథిన్ కవర్లు, టేకు స్టంపులు, నీటి ట్యాంకుల కొనుగోలు ఇతర విషయాలను మొదటి నుంచీ సదరు ఉద్యోగే చూశారు. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు వసూల్ చేసినట్లు ఆరోపణలున్నాయి. సెక్షన్ ఉద్యోగి పర్సంటేజీలు అడుగుతున్నట్లు నేరుగా డీఆర్డీవోకే గుత్తేదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అప్పటికే సదరు ఉద్యోగిపై అనేక ఫిర్యాదులు రావడం, విధుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వంటి ఆరోపణలున్నాయి. కమీషన్లకు ఆశపడి డీఆర్డీవోనే తప్పుదోవ పట్టించి హరితహారంలో తెరచాటుగా వసూళ్ల పర్వం కొనసాగించినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగి వ్యవహారంపై సీరియస్ అయిన డీఆర్డీవో నెల క్రితం హరితహారం సెక్షన్ నుంచి తొలగించి సోషల్ ఆడిట్ విభాగానికి మార్చారు. సదరు ఉద్యోగిని సొంత శాఖ జిల్లా పరిషత్కు సరెండర్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉపేక్షించని డీఆర్డీవో.. హరితహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై డీఆర్డీవో చర్యలు ఉపక్రమిస్తున్నారు. నర్సరీల్లో మొక్కలను పెంచకుండా నిర్లక్ష్యంగా ఉన్న వివిధ మండలాల్లోని ఐదారుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. మరి కొందరికి నోటీసులు జారీ చేసి హెచ్చరించారు. అయితే, డీఆర్డీవో కళ్లుగప్పి హరితహారం విభాగంలో గుత్తేదారుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లుగా ఉద్యోగిపై ఆరోపణలు రావడంతో సెక్షన్ నుంచి తొలగించినట్లు చర్చ జరుగుతోంది. సెక్షన్ మార్చిన విషయం వాస్తవమే.. హరితహారం విభాగం చూస్తున్న ఉద్యోగిని వేరే సెక్షన్కు మార్చిన విషయం వాస్తవమే. అయితే, ఆ ఉద్యోగిపై అవినితీ ఆరోపణలు లేవు. సహజంగానే ఇతర సెక్షన్కు బదిలీ చేశాం. ఆరోపణలున్నాయనే విషయం నా దృష్టికి రాలేదు. – రమేశ్ రాథోడ్, డీఆర్డీవో, నిజామాబాద్ -
‘ఉపాధి’ పనులపై 76శాతం మందికి సంతృప్తి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పనులతో ఎంతో మంచి జరిగిందని ప్రజలు అనుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఉపాధి పథకం పనుల నాణ్యతపై 76% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. తమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇటీవల చేపట్టిన సర్వేలో కేవలం 0.5శాతం మంది మాత్రం ఉపాధి పనుల్లో నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. గ్రామాల్లో ఉపాధి వనరులను కల్పించటం ద్వారా స్థిరమైన అభివృద్దికి అవసరమైన వనరులను సృష్టించటమే ఉపాధి హామీ పథకం ఉద్దేశం. దీనికోసం గత మూడేళ్లుగా చేపట్టిన అనేక పనులను పూర్తి చేసి, నాణ్యతను పెంచినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. దేశంలో 2016–17 కాలంలో దాదాపు 1.02 కోట్ల పనులను పూర్తి చేసినట్లు పేర్కొంది. -
ఇదెక్కడి పంచాయితీ!
- గ్రామాల్లో వైకుంఠధామాల అభివృద్ధికి ఉపాధిహామీ నిధులు - ప్రహరీ బాధ్యత తమది కాదంటున్న గ్రామీణాభివృద్ధి అధికారులు సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో వైకుంఠధామాల (శ్మశానవాటిక) ఏర్పాటు/ అభివృద్ధి ప్రక్రియ గ్రామ పంచాయతీలకు తలనొప్పిగా మారింది. ఎంపిక చేసిన గ్రామా ల్లో ఒక్కో శ్మశానవాటిక అభివృద్ధికి రూ. 10 లక్షలు కేటాయించిన గ్రామీణాభి వృద్ధి శాఖ, శ్మశాన స్థలాల రక్షణ కోసం ప్రహరీ ఏర్పాటు చేసుకునే బాధ్యత గ్రామ పంచాయతీలదేనని స్పష్టం చేసింది. గ్రామాల్లో ఒక్కొక్క శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మించడానికి కనీసం రూ. 10 లక్షల నుంచి గరిష్టంగా రూ. 25 లక్షల దాకా వ్యయమవుతుందని అధికారుల అంచనా. ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ నిధుల నుంచి గాని, దాతల నుంచి విరాళాల రూపంలో గాని వెచ్చించాలని గ్రామీణాభి వృద్ధిశాఖ సూచించింది. అయితే.. రాష్ట్రంలో 90 శాతానికి పైగా గ్రామ పంచాయతీలకు ఈ మేరకు ఆదాయ వనరులు లేకపోవడంతో పలు గ్రామాల సర్పంచులు ప్రహరీల నిర్మాణ వ్యయాన్ని తాము భరించే పరిస్థితి లేదంటూ చేతులెత్తేశారు. మరోవైపు ఆయా గ్రామాల్లో వైకుంఠధామం ప్రహరీ నిర్మాణం కోసం రూ. 5 లక్షలకు పైగా విరాళమిచ్చిన గ్రామస్తులు వారి పెద్దల స్మారకంగా వైకుంఠధామానికి పేరును పెట్టుకునే వెసులుబాటును ప్రభు త్వం కల్పించినా, గత రెండు నెలలుగా ఏ గ్రామంలోనూ విరాళాలిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఉపాధి నిధులే ఇవ్వాలంటున్న కలెక్టర్లు రాష్ట్రంలో మొత్తం 8,685 గ్రామాల్లో శ్మశానవాటికలను ఉపాధిహామీ నిధులతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 1,050 గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి ఐదు నుంచి ఏడు గ్రామాలను ఎంపిక చేసి శ్మశాన వాటికల అభివృద్ధి పనులను చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూచించారు. అయితే.. గత నెలరోజులుగా కొన్ని జిల్లాల్లో పర్యటించిన కొన్ని జిల్లాల కలెక్టర్లు.. గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు లేకపోవడంతో ఉపాధిహామీ నిధుల నుంచే ప్రహరీల ఏర్పాటు చేయాలని లేఖలు రాశారు. ఆ లేఖలకు కమిషనర్ నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. వైకుంఠధామం ఏర్పాటుకే పరిమితం.. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఒక్కో వైకుంఠధామం ఏర్పాటు/అభివృద్ధికి మాత్రమే ఉపాధిహామీ నిధులను వెచ్చించనున్నారు. ఈ నిధులతో ఒక్కో శ్మశాన వాటికలో రెండు దహన వేదికలు, ఒక స్టోర్రూమ్, సందర్శకుల కోసం ఒక షెడ్, రెండు మరుగుదొడ్లు, సింటెక్స్ ఓవర్హెడ్ ట్యాంక్, సోలార్ లైటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు భూమి అభివృద్ధి, పొదల తొలగింపు, భూమి చదును, హద్దుల ఏర్పాటు పనులను ఉపాధిహామీ కింద వేరుగా చేపడతారు. అన్ని పనులు పూర్తి కాగానే వైకుంఠధామాన్ని సదరు గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. -
ఉద్యోగాలు ఊడుతున్నాయ్..!
ఇంటిగ్రేటెడ్ వాటర్షెడ్ ప్రోగ్రామ్ను రద్దు చేసిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు ఊడుతున్నాయ్. గత రెండున్నరేళ్లుగా ఈ విభాగంలో కొత్తగా ఎటువంటి ఉద్యోగ నియామకాలు చేపట్టని ఉన్నతాధికారులు.. వివిధ ప్రాజెక్ట్ల కింద పనిచేస్తున్న చిరుద్యోగులను తొలగించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ వాటర్షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద గత ఏడేళ్లుగా సేవలందిస్తున్న 1,125 మంది చిరుద్యోగులకు గత ఏడాది మార్చినుంచి అధికారులు వేతనాలను చెల్లించడం లేదు. వారికి ఇస్తున్న వేతనం నెలకు రూ.2,200 మాత్రమే. వేతనం తక్కువ, ఉద్యోగ భద్రత లేకున్నా సొంత గ్రామంలోనే ఉండి నీటి సంరక్షణ పనుల్లో వారంతా సేవలందిస్తుండడం విశేషం. ఏడాదిగా జీతాలు లేవు: ఏడేళ్ల కిందట ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకానికి వర్తించే నిబంధనల మేరకు వాటర్షెడ్ అసిస్టెంట్లను కూడా ప్రభుత్వం నియమించింది. గతేడాది వాటర్షెడ్ ప్రోగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఆ ప్రోగ్రామ్లో పనిచేస్తున్న అసిస్టెంట్లకు కష్టాలు మొదలయ్యాయి. కేంద్రం నుంచి నిధులు నిలిచిపోవడంతో గ్రామీణాభివృద్ధి అధికారులు చిరుద్యోగులకు వేతనాలను నిలిపివేశారు. అయితే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన (పీఎంకేఎస్వై) పథకం పేరిట వాటర్షెడ్ కార్యక్రమాలను చేయాలని తలపెట్టింది. అయితే, పీఎంకేఎస్వై పనులను ఉపాధి హామీలోని ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా చేయించాలని గ్రామీణాభివృద్ధి అధికారులు నిర్ణయించడంతో వాటర్షెడ్ అసిస్టెంట్ల ఉద్యోగాల పునరుద్ధరణపై నీళ్లు చల్లినట్లైంది. -
గ్రామపంచాయతీలకు మహర్దశ
♦ తొలిదశలో 1,000 పంచాయతీలకు సొంత భవనాలు ♦ ఈ ఏడాది రూ.120 కోట్లు వెచ్చించనున్న గ్రామీణాభివృద్ధి శాఖ ♦ అక్టోబరులో పనుల ప్రారంభానికి సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ కార్యాలయాలకు మహర్దశ పట్టనుంది. శిథిల, అద్దె భవనాల్లో నడుస్తున్న పంచాయతీలకు సొంత భవనాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పల్లెప్రగతి, గ్రామజ్యోతి తదితర పథకాల ద్వారా పౌర సేవలు, ఉపాధిహామీ, ఆసరా పింఛన్ తదితర ఆర్థిక చెల్లింపులు, విద్య, వైద్య, పారిశుధ్య తదితర కార్యక్రమాలపట్ల అవగాహన సదస్సులు, గ్రామ కమిటీల సమావేశాలు ఇకపై పంచాయతీ కార్యాలయాల నుంచే నిర్వహించాల్సి ఉన్నందున విశాలమైన భవనాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో మొత్తం 8695 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 375 పంచాయతీలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన మరో 4500 గ్రామపంచాయతీల భవనాలు శిథిలావస్థకు చేరినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణాన్ని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెటీరియల్ కాంపొనెంట్ కింద ఈ ఏడాది రూ.120 కోట్లు పంచాయతీ భవనాల నిర్మాణానికి కేటాయించారు. తొలిదశలో ఒక్కో గ్రామపంచాయతీ భవనానికి రూ.12 లక్షల చొప్పున 1,000 గ్రామ పంచాయతీలకు కొత్త/ సొంత భవనాలు నిర్మించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దశలవారీగా వచ్చే మూడేళ్లలో మరో నాలుగు వేల భవనాలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు జిల్లాలవారీగా భవనాల ఆవశ్యకత ఉన్న గ్రామాలను ఎంపిక చేసి నెలాఖరు కల్లా నివేదిక సమర్పించాలని తొమ్మిది జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్లో కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
విజిలెన్స్ మోనటరింగ్ కమిటీ చైర్మన్గా మురళీమోహన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీకి చైర్మన్, కో-చైర్మన్లను నియమిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్గా రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ నియమితులయ్యారు. కో-చైర్మన్లుగా కాకినాడ, అమలాపురం ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు, కో-చైర్పర్సన్గా అరకు ఎంపీ కొత్తపల్లి గీతను నియమించారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
‘సాక్షి’ కథనంపై అధికారుల స్పందన సాక్షి, హైదరాబాద్: ధాన్యానికి మద్దతు ధరతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. ధాన్యానికి మద్దతు ధర లభిం చడం లేదని గురువారం సాక్షి పత్రికలో ‘ముద్దకు మద్దతేది ?’ అనే కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పౌరసరఫరాల కార్పొరేషన్ ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుత సీజన్ రబీ ధాన్యన్ని కొనుగోలు చేయడానికి వీలుగా 2,018 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పామని, అవసరం అనుకుంటే మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు అవసరం అయ్యే 4.95 కోట్ల గోనె బస్తాలను కూడా అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా 2.08 లక్షల మంది రైతుల నుంచి రూ.884 కోట్ల విలువ చేసే 7.90 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వివరించారు. అలాగే మద్దతు ధరపై 18.75 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లను చేసినట్టు తెలిపారు. కాగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి నిధులు విడుదల చేశామని సివిల్ సప్లయ్స్ అధికారి పేర్కొన్నా.. రైతులకు మాత్రం డబ్బు అందలేదు. సివిల్ సప్లయ్స్ నుంచి ఇప్పటి వరకు కేవలం రూ. 370 కోట్లు మంజూరు అయితే విడుదలైంది మాత్రం రూ. 309 కోట్లు మాత్రమే విడుదల అయినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొన్నాయి.