ICICI Prudential
-
కొత్త ఫండ్ గురూ.. ఇన్వెస్ట్ చేసేది ఇక్కడే..
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (ICICI Prudential) మ్యుచువల్ ఫండ్ (Mutual Fund) తాజాగా రూరల్ ఆపర్చూనిటీస్ ఫండ్ (rural opportunities fund) పేరిట న్యూ ఫండ్ ఆఫర్ను (NFO) ప్రకటించింది. ఇది జనవరి 9న ప్రారంభమై 23న ముగుస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల సంబంధిత స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీము.దేశ జీడీపీలో గ్రామీణ ప్రాంతాల వాటా గణనీయంగా ఉంటోంది. ప్రభుత్వం కూడా గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఎకానమీని మెరుగుపర్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. కాబట్టి ఈ థీమ్ అనేది వృద్ధి అవకాశాలను అందించవచ్చు. ఈ ఫండ్, వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రూరల్ థీమ్ ఆధారిత సెక్టార్లకు కేటాయింపులను అటూ, ఇటూ మార్చుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుంది.ఆర్థిక వృద్ధికి దోహదపడే విభాగం అయినందున ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు దేశ గ్రామీణ వృద్ధి గాథలో పాలుపంచుకునే అవకాశం లభించగలదని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈడీ శంకరన్ నరేన్ తెలిపారు. దీనికి నిఫ్టీ రూరల్ ఇండెక్స్ ప్రామాణిక సూచీగా ఉంటుంది. 6 నెలల ఫ్రీ–ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సగటు ఆధారంగా అతి పెద్ద 75 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. శంకరన్ నరేన్, ప్రియాంక ఖండేల్వాల్ ఈ స్కీమును నిర్వహిస్తారు. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నుంచి కొత్త పాలసీ
పెరిగే వ్యయాలను ఎదుర్కొనడంలో పదవీ విరమణ చేసిన వారికి కొంత తోడ్పాటు అందించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కొత్త పాలసీని ఆవిష్కరించింది. ఏటా అయిదు శాతం అధికంగా యాన్యుటీ చెల్లింపు ప్రయోజనాలను అందించే ఫీచరుతో గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీని ప్రవేశపెట్టింది. ఈ తరహా పాలసీల్లో ఇదే మొట్టమొదటిదని సంస్థ తెలిపింది.ద్రవ్యోల్బణం వల్ల కాలక్రమేణా కొనుగోలు శక్తి తగ్గినా, జీవన ప్రమాణాలను స్థిరంగా కొనసాగించుకోవడంలో కస్టమర్లకు ఈ పాలసీ ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చీఫ్ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పల్టా తెలిపారు. ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లు ఉన్న నేపథ్యంలో జీవితకాలం పాటు అధిక రాబడులను అందుకునేలా యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేసేందుకు ఇది సరైన తరుణమని ఆయన పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో క్లెయిమ్స్ సరళతరం: ఐసీఐసీఐ ప్రు లైఫ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సంబంధించి క్లెయిమ్స్ ప్రక్రియను సరళతరం చేసినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం మూడు ప్రాథమిక డాక్యుమెంట్లను సమరి్పస్తే సరిపోతుందని వివరించింది. ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉన్న బ్యాంకు అకౌంటు నంబరు లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీ, డెత్ సరి్టఫికెట్ లేదా ఆస్పత్రులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు జారీ చేసిన మృతుల జాబితా, ఆధార్ వంటి ధృవీకరణ పత్రాలను ఇవ్వొచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా క్లెయిమ్ను రైజ్ చేయొచ్చని వివరించింది. ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ క్లెయిమ్కేర్ హెల్ప్లైన్ 1800–2660ని ప్రారంభించినట్లు సంస్థ పేర్కొంది. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్
ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్ను ప్రారంభించినట్టు ప్రకటించింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మాదిరే ఈ పథకం రాబడులు అందిస్తుందని తెలిపింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లో 15 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్, గ్యాస్, పెట్రోలియం రంగంలో సేవలు అందిస్తున్నవి. సూచీలో ఈ కంపెనీలకు వెయిటేజీకి అనుగుణంగానే ఈ పథకం కూడా పెట్టుబడులు పెడుతుంది. తక్కువ వ్యాల్యూషన్ల వద్ద ఉండడం, ఆయిల్, గ్యాస్ వినియోగానికి డిమాండ్ పెరుగుతుండడం పెట్టుబడులకు గొప్ప అవకాశాలను అందిస్తున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఈ నెల 8న ప్రారంభమైన ఈటీఎఫ్ 18వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
అరుదైన పెట్టుబడుల అవకాశాలు..!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు సంబంధించి ఎన్నో విధానాలు ఉన్నాయి. అందులో స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్ కూడా ఒకటి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని కంపెనీల ధరలు ఆకర్షణీయమైన స్థాయిలకు, చౌక విలువకు దిగి వస్తాయి. అలాంటప్పుడు వాటిల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించడమే స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్లో కనిపిస్తుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ కూడా ఇదే మాదిరి పనిచేస్తుంటుంది. ఈ పథకానికి మెరుగైన రాబడుల చరిత్ర ఉంది. రాబడులు ఈ పథకంలో ఐదేళ్ల క్రితం ఒకే విడత రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇప్పుడు అది రూ.2.8 లక్షలుగా మారి ఉండేది. ఈ పథకానికి ఐదేళ్ల చరిత్ర ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో శంకరన్ నరేన్తోపాటు, రోషన్ చట్కే దీని నిర్వహణ వ్యవహరాలు చూస్తున్నారు. ఈ పథకం 2019 జనవరి 15న మొదలైంది. ఆరంభం నుంచి చూస్తే ఈ పథకం ఏటా 22.9 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక రాబడులు (సీఏజీఆర్) అందించింది. ఈ పథకం పనితీరుకు బెంచ్మార్క్గా పరిగణించే నిఫ్టీ 500 టీఆర్ఐ ఇదే కాలంలో ఇచ్చిన రాబడి 19 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో ఏటా 37.7 శాతం చొప్పున రాబడి అందించగా, నిఫ్టీ 500 టీఆర్ఐ రాబడి 19.8 శాతంగానే ఉంది. సూచీ కంటే 17.9 శాతం అధిక రాబడిని అందించినట్టు తెలుస్తోంది. ఏడాది కాల రాబడి చూసినా 38 శాతంగా ఉంది. ఇదే కాలంలో సూచీ రాబడి 30 శాతమే కావడం గమనించాలి. ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున ఈ పథకంలో సిప్ చేస్తూ వచ్చి ఉంటే, రూ.12.58 లక్షలు సమకూరి ఉండేది. పెట్టుబడుల విధానం ముందు చెప్పినట్టుగానే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ అన్నది స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్తో నడిచే పథకం. ఏదైనా ఒక కంపెనీ లేదా రంగంలో కొన్ని సమస్యల వల్ల షేరు ధర గణనీయంగా దిద్దుబాటుకు గురైనప్పుడు, ఆ కంపెనీ/రంగం దీర్ఘకాల వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయన్నది ఈ పథకం అంచనా వేస్తుంది. దీర్ఘకాలంలో బలమైన, మెరుగైన పనితీరుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫండ్ మేనేజర్ భావిస్తే వెంటనే దిద్దుబాటుకు గురైన కంపెనీల్లో, రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, పెట్టుబడిదారులకు మంచి రాబడులను ఇచ్చే విధంగా పనిచేస్తుంటారు. సకాలంలో లాభాలు స్వీకరించడం, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కంపెనీలపై దృష్టి సారించడం వంటివి మంచి పనితీరుకు దోహదం చేస్తున్న అంశాలు. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,205 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 92.52 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 1.53 శాతం డెట్ సాధనాలకు కేటాయించగా, మిగిలినది నగదు రూపంలో ఉంది. ఈక్విటీల్లో 78 శాతం పెట్టుబడులు లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీలకు 20 శాతం కేటాయించగా, స్మాల్క్యాప్ కేటాయింపులు 1.78 శాతంగా ఉన్నా యి. ప్రధానంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, ఫార్మాస్యూటికల్స్, టెలికం సర్వీసెస్ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉంది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం భారతీ ఎయిర్టెల్ 6.74 ఐసీఐసీఐ బ్యాంక్ 6.40 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.64 సన్ఫార్మా 4.43 ఇన్ఫోసిస్ 3.96 కోటక్ బ్యాంక్ 3.92 ఓఎన్జీసీ 3.81 ఎన్టీపీసీ 3.75 టాటా స్టీల్ 2.93 హీరో మోటో 2.82 -
ఈ ఫండ్తో నమ్మకమైన రాబడులు!
ఇన్వెస్టర్లలో కొందరు రిస్క్ తీసుకోలేరు. అటువంటి వారు ఈక్విటీలకు దూరంగా ఉంటుంటారు. కానీ, దీర్ఘకాలంలో అంటే ఐదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇచ్చినట్టు చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక రిస్క్ను చూసి భయపడి ఈక్విటీ పెట్టుబడులకు దూరంగా ఉండడం సరికాదు. కాకపోతే మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు కొంత తక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఐదేళ్లకు మించి పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉండి, మోస్తరు రిస్క్కు సిద్ధపడే వారికి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ ఎంతో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తోంది. రాబడులు ఈ పథకానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1999 నవంబర్ 3న ప్రారంభమైంది. ఆరంభంలో ఈ పథకంలో ఒకే విడత రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు అది రూ.29.33 లక్షలుగా మారి ఉండేది. అంటే ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడిని అందించింది. ఆరంభం నుంచి ప్రతి నెలా సిప్ రూపంలో రూ.10,000 ఇన్వెస్ట్ చేసినా రూ.28.9 లక్షలు సమకూరి ఉండేది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 25 శాతం రాబడులు అందించింది. ఇదే కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడి 19 శాతంగా ఉంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 26 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఐదేళ్లలో 19 శాతం, ఏడేళ్లలో 16.61 శాతం, పదేళ్లలో 17.69 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం కంటే ఈ పథకంలోనే 2–9 శాతం మధ్య వివిధ కాలాల్లో అధిక రాబడులు ఉన్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. సూచీతో పోల్చి చూసినా ఈ పథకమే ఎక్కువ రాబడిని తెచ్చి పెట్టింది. అన్ని కాలాల్లోనూ స్థిరమైన, నమ్మకమైన రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో కేవలం బెంచ్ మార్క్ అనే కాకుండా, ఈ విభాగంలోని పోటీ పథకాల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. పెట్టుబడుల విధానం, పోర్ట్ఫోలియో పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకం ఈక్విటీ పెట్టుబడులను 65–80 శాతం మధ్య నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే, డెట్ పెట్టుబడులను 20–35 శాతం మధ్య కొనసాగిస్తుంది. స్మాల్క్యాప్, మిడ్క్యాప్, లార్జ్క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛ ఈ పథకానికి ఉంది. అంతే కాదు విదేశీ స్టాక్స్లో పెట్టుబడుల అవకాశాలను సైతం ఈ పథకం పరిశీలిస్తూ ఉంటుంది. మార్కెట్ల కరెక్షన్లలో పెట్టుబడుల విలువను కాపాడుకునేందుకు డెరివేటివ్స్లో ఎక్స్పోజర్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.28వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 69 శాతం కేటాయించగా, డెట్ పెట్టుబడులు 22 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లో 2 శాతం పెట్టుబడులు ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 7 శాతంగా ఉన్నాయి. ఇక ఈక్విటీల్లో 86 శాతానికి పైనే లార్జ్క్యాప్ కంపెనీలకు కేటాయించింది. మిడ్క్యాప్ కంపెనీల్లో 12 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 1.24 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. డెట్ విభాగంలో ఎస్వోవీల్లో 13 శాతం పెట్టుబడులు, 4 శాతం ఏఏ రేటెడ్ సాధనాల్లో కలిగి ఉంది. ఈక్విటీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 16 శాతం కేటాయించింది. ఇంధన రంగ కంపెనీల్లో 15.66 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 9 శాతం, కమ్యూనికేషన్ కంపెనీల్లో 6.35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఎన్టీపీసీ 7.43 ఐసీఐసీఐ బ్యాంక్ 7.01 భారతీ ఎయిర్టెల్ 6 ఓఎన్జీసీ 4.18 మారుతి సుజుకీ 3.92 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.39 సన్ఫార్మా 3.07 ఇన్ఫోసిస్ 3.02 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.95 టాటామోటార్స్ డీవీఆర్ 2.63 -
ఈ మ్యానిఫ్యాక్చరింగ్ ఫండ్తో లాభాలే లాభాలు
ప్రపంచ సేవల రంగంలో భారత్ అగ్రగామిగా ఉంది. మన దేశ ఎగుమతుల ఆదాయంలో సేవల రంగం వాటాయే ఎక్కువ. ప్రపంచ తయారీ రంగంలో మన వాటా నామమాత్రం. అందుకే కేంద్ర సర్కారు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆత్మనిర్భర భారత్, భారత్లో తయారీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 14 రంగాల్లో ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్ఐ) కింద భారీ ప్రోత్సాహకాలు ఇస్తోంది. మరోవైపు తయారీ కోసం చైనాపై ఆధారపడిన ప్రపంచ దేశాలు, సరఫరా వ్యవస్థలో భాగంగా ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాల వైపు చూస్తున్నాయి. దీంతో భారత్ ముందు తయారీ పరంగా అపార అవకాశాలున్నాయి. దీంతో వచ్చే దశాబ్ద కాలంలో భారత్ అంతర్జాతీయ తయారీ రంగంలో తన వాటాను గణనీయంగా పెంచుకోనుందని అంచనా. ఆటోమొబైల్, రక్షణ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్, రైల్వేస్, టెక్స్టైల్స్, కెమికల్స్, పెట్రోలియం అండ్ గ్యాస్ రంగ కంపెనీలు మంచి వృద్ధి అవకాశాలు చూడనున్నాయి. పట్టణీకరణ, అధిక జనాభా, పెరుగుతున్న ఆదాయం హౌసింగ్, ఇన్ఫ్రా రంగాలకు కలసి రానుంది. కనుక తయారీ రంగంలో రానున్న అద్భుతమైన అవకాశాల నుంచి లబ్ధి పొందాలనుకునే ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. ఈ విభాగంలో మంచి పనితీరు కలిగిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్ను పరిశీలించొచ్చు. రాబడులు ఘనం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఆరంభం నుంచి అద్భుత పనితీరు చూపిస్తోంది. ఈ పథకం 2018 అక్టోబర్లో మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏటా 18 శాతానికి పైనే రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ట్రెయిలింగ్ విధానంలో (ఏడాది, రెండు, మూడేళ్ల చొప్పున) ఏడాదిలో 35.3 శాతం, మూడేళ్లలో ఏటా 35.3 శాతం చొప్పు న రాబడిని అందించింది. ఇక ఐదేళ్లలో చూస్తూ రాబడి ఏటా 19.7 శాతంగా ఉంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈ పథకంలో చేసిన పెట్టుబడులపై రాబడి ఐదేళ్లలో ఏటా 25.3 శాతం చొప్పున ఉంది. ముఖ్యంగా రాబడుల్లో స్థిరత్వాన్ని గమనించొచ్చు. రోలింగ్ రాబ డులు (ఒక కాలం నుంచి మరో కాలం వరకు నిర్ధేశిత కాలంలో పనితీరు) చూస్తే 2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ మధ్య ఏటా 24.6 శాతంగా ఉన్నాయి. ఈ పథకం అప్సైడ్ క్యాప్చర్ రేషియో 116గా ఉంది. అంటే మార్కెట్ ర్యాలీల్లో ఈ పథకం ఎన్ఏవీ వృద్ధి మెరుగ్గా ఉండడానికి ఇది నిదర్శనం. డౌన్సైడ్ క్యాప్చర్ రేషియో 59.3గా ఉంది. అంటే బెంచ్ మార్క్తో పోలిస్తే తక్కువ నష్టపోతుందని అర్థం. పోర్ట్ఫోలియో/పెట్టుబడుల విధానం తయారీలో సైక్లికల్, డిఫెన్సివ్ (రక్షణాత్మకమైనవి) రంగాలను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. వ్యాల్యూ, గ్రోత్ ఈ రెండు రకాల పెట్టుబడి విధానాలను అనుసరిస్తుంది. లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ ఇలా అన్ని రకాల విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మల్టీక్యాప్ తరహా విధానాన్ని అనుసరిస్తోంది. మెరుగైన ఫలితాలకు, రంగాల వారీ, కంపెనీల వారీ ఎంపిక విధానాన్ని కూడా పాటిస్తుంటుంది. ప్రస్తుతం ఈ పథకం ఆటో యాన్సిలరీ, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ రంగాలపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంది. ఆటోమొబైల్ రంగ కంపెనీల్లో 15 శాతం ఇన్వెస్ట్ చేయగా, ఇంధన రంగ కంపెనీలకు 7 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 7%, హెల్త్కేర్ కంపెనీలకు 6.81%, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.47 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, మెటల్స్, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలపై తక్కువ వెయిటేజీ అనుసరిస్తోంది. తన నిర్వహణ ఆస్తుల్లో 90 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్ సాధనాల్లో 1.43 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 8.86% మేర నగదు నిల్వలు ఉన్నాయి. -
ఒకే పాలసీలో జీవిత, ఆరోగ్య బీమా ప్రయోజనాలు: అదేంటో తెలుసా?
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి ‘ఐషీల్డ్’ పేరిట కొత్త బీమా పాలసీని ప్రవేశపెట్టాయి. ఇటు ఆరోగ్య బీమా, అటు జీవిత బీమా ప్రయోజనాలు ఉండేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దాయి. వైద్య చికిత్సల వ్యయాలకు కవరేజీ ఇస్తూనే పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో కుటుంబానికి పెద్ద మొత్తంలో సమ్ అష్యూర్డ్ను అందించేలా ఈ పాలసీ ఉంటుందని ఐసీఐసీఐ లాంబార్డ్ ఈడీ సంజీవ్ మంత్రి తెలిపారు. (కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్) చికిత్స వ్యయాల భారం పడినా, ఇంటిపెద్దకు ఏదైనా జరిగినా కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఈ సమగ్రమైన బీమా పథకం తోడ్పడగలదని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ చీఫ్ డి్రస్టిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా వివరించారు. హాస్పిటలైజేషన్, డే–కేర్ ట్రీట్మెంట్ మొదలైన వాటికి ఆరోగ్య బీమా భాగం ఉపయోగపడనుండగా, జీవిత బీమా భాగంతో.. 85 ఏళ్ల వయస్సు వరకూ లైఫ్ కవరేజీ ఉంటుంది. (792 బిలియన్ డాలర్లకు యాప్ ఎకానమీ ) -
ఫండ్ రివ్యూ: ఈ ఫండ్తో రిస్క్ తక్కువ.. మెరుగైన రాబడులు
ఈక్విటీలు ఇటీవల రెండు నెలల కాలంలో ర్యాలీ చేసి ఆల్టైమ్ గరిష్ట స్థాయి సమీపానికి చేరుకున్నాయి. ఈ సమయంలో మార్కెట్లోకి ప్రవేశించడం రిస్క్గా ఇన్వెస్టర్లు భావించొచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే అని కాదు, ఏ సమయంలో అయినా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనుకూలమైన విభాగమే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, స్థూల ఆర్థిక అంశాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య కేటాయింపులు మారుస్తూ, రిస్క్ తగ్గించి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా ఇవి పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ టాప్ పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం 16 ఏళ్ల స్థిరమైన రాబడుల చరిత్రతో బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగంలో మెరుగైన స్థానంలో ఉంది. స్టాక్స్, బాండ్స్, డెరివేటివ్స్ (హెడ్జింగ్) మధ్య కేటాయింపులు మారుస్తూ, తక్కువ రిస్క్తో స్థిరమైన రాబడులు అందిస్తోంది. ఈ పథకం పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 13.5 శాతం చొప్పున రాబడులు అందించింది. అదే ఐదేళ్ల కాలంలో రాబడులు చూస్తే ఏటా 11 శాతానికి పైనే ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏడాది కాలంలో 13.72 శాతం రాబడి తెచ్చి పెట్టింది. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో రాబడుల పరంగా ఈ పథకం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగం సగటు రాబడుల కంటే మెరుగైన పనితీరు చూపించింది. 2–3 శాతం అధిక రాబడులు అందించింది. ఈ కాలంలో ఈక్విటీ కేటాయింపులు 49 శాతంగానే ఉన్నాయి. అయినా కానీ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంతో మెరుగైన రాబడులు అందించడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. క్రిసిల్ హైబ్రిడ్ 50ప్లస్50 మోడరేట్ ఇండెక్స్ను మూడు, ఐదేళ్ల కాలం రాబడుల పరంగా ఈ పథకం అధిగమించింది. బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వారు అచ్చమైన ఈక్విటీ పథకాల కంటే తక్కువగా, అదే సమయంలో డెట్ కంటే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు. అంటే ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు వీటితో సొంతం అవుతాయి. ఈ పథకంలో పదేళ్ల కాలంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎక్స్ఐఆర్ఆర్ రాబడి వార్షికంగా 11.95 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్ఫోలియో సెబీ నిబంధనల ప్రకారం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీ, డెట్లో ఎందులో అయినా సున్నా నుంచి నూరు శాతం వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంటే పెట్టుబడుల విషయంలో వీటికి పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈక్విటీ, డెట్ విభాగాలకు కేటాయింపులు చేసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్కు కష్టమైన పనే. ఆ పనిని ఈ పథకం చేసి పెడుతుంది. ఈక్విటీ, డెట్ మధ్య మార్పులు చేర్పులు చేస్తూ ఈ పథకం దీర్ఘకాలంలో సమర్థవంతమైన, విశ్వసనీయమైన పనితీరు చూపిస్తోంది. స్టాక్స్ అధిక విలువలకు చేరాయా? లేక చౌకగా ఉన్నాయా? అన్నది నిర్ణయించుకునేందుకు తనదైన నమూనాను ఈ పథకం అనుసరిస్తుంది. 2020 మార్చిలో సెన్సెక్స్ గణనీయంగా పడిపోయినప్పుడు నికర ఈక్విటీ పెట్టుబడులను 73.7 శాతానికి పెంచుకుంది. ఆ తర్వాత మార్కెట్ ర్యాలీ చేయడంతో 2021 నవంబర్ నాటికి ఈక్విటీ పెట్టుబడులను 30 శాతానికి తగ్గించుకుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.46,534 కోట్ల పెట్టుబడులు ఉంటే, అందులో ఈక్విటీ కేటాయింపులు 40.9 శాతంగా, డెట్ కేటాయింపులు 24 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాల్లో 32.54 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ రిస్క్ను దాదాపు తగ్గించేందుకు 91 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిడ్క్యాప్నకు 8.52 శాతం కేటాయింపులు చేసింది. డెట్ విభాగంలోనూ అధిక నాణ్యత కలిగిన ఏఏఏ, ఏఏప్లస్ బాండ్లకే కేటాయింపులు ఎక్కువ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ 5.94 ఐసీఐసీఐ బ్యాంక్ 5 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.85 ఇన్ఫోసిస్ 3.66 టీవీఎస్ మోటార్ 2.81 మారుతి సుజుకీ 2.57 హెచ్డీఎఫ్సీ 2.44 భారతీ ఎయిర్టెల్ 2.44 ఎస్బీఐ 2.31 యాక్సిస్ బ్యాంక్ 1.88 -
అదనపు రాబడికి బంగారం లాంటి పథకం..
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా గోల్డ్ పేరిట వినూత్న, దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ఆవిష్కరించింది. ఇటు వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయానికి తోడు అదనపు రాబడి అందుకోవాలనుకునే వారికి అనువైనదిగా ఇది ఉంటుందని సంస్థ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా తెలిపారు. ఇది జీవిత బీమా కవరేజీతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రతను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. (కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ.. అమల్లోకి కొత్త ధరలు) ఐసీఐసీఐ ప్రు గోల్డ్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇమీడియట్ ఇన్కమ్, ఇమీడియట్ ఇన్కమ్ విత్ బూస్టర్, అలాగే డిఫర్డ్ ఇన్కమ్ వీటిలో ఉన్నాయి. మొదటి దానిలో పాలసీ జారీ చేసిన 30 రోజుల తర్వాత నుంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇక రెండో వేరియంట్లో ప్రతి ఐదో ఏటా అదనంగా గ్యారంటీడ్ ఆదాయాన్ని కూడా అందుకోవచ్చు. మూడోదైన డిఫర్డ్ ఇన్కమ్ వేరియంట్లో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వినియోగదారులు ఆదాయాన్ని ఎప్పటి నుంచి పొందాలనుకుంటున్నది తామే నిర్ణయించుకోవచ్చు. అంటే పాలసీ తీసుకున్న రెండో ఏడాది నుంచే లేదా 13 ఏళ్ల తర్వాత నుంచైనా ఆదాయాన్ని అందుకోవడం ప్రారంభించవచ్చు. చెల్లింపులను సాధారణంగా తీసుకోవడానికి బదులుగా సేవింగ్స్ వాలెట్లో జమ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని కావాలంటే పూర్తిగా లేదా పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం ఆఫ్సెట్ సదుపాయంతో తమ భావి ప్రీమియంలను కూడా ఈ మొత్తం నుంచి చెల్లించవచ్చు. (Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?) -
అధిక కవరేజీ వైపు మొగ్గు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కస్టమర్లలో అధిక కవరేజీ ఉండే ప్లాన్ల వైపు మొగ్గు చూపే ధోరణి పెరిగిందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ప్రోడక్ట్స్ విభాగం హెడ్ శ్రీనివాస్ బాలసుబ్రమణియన్ తెలిపారు. యాక్సిడెంటల్ డిజేబిలిటీ, ప్రీమియం వెయివర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ల వంటి అదనపు ప్రయోజనాలు ఉండే టర్మ్ ప్లాన్లకు, జీవితంలోని వివిధ దశల్లో అవసరాలకు అనుగుణమైన కవరేజీనిచ్చే వినూత్న ప్లాన్లకు ఆదరణ పెరుగుతోందని వివరించారు. పొదుపునకు సంబంధించి కచ్చితమైన రాబడినిచ్చే సాధనాలపై ఆసక్తి ఏర్పడిందన్నారు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా భరోసా కల్పిస్తూ జీవితకాలం ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఐసీఐసీఐ ప్రూ ఐప్రొటెక్ట్ స్మార్ట్, ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ స్మార్ట్ రిటర్వ్ ఆఫ్ ప్రీమియం వంటి వినూత్న పథకాలను తాము అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటు కచ్చితమైన రాబడులిచ్చే పథకాలను కస్టమర్లు ఇష్టపడుతుండటంతో సుఖ్ సమృద్ధిలాంటి పథకాలు ఉన్నాయన్నారు. ఇవి కచ్చితమైన రాబడులతో పాటు బోనస్ల వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తాయని శ్రీనివాస్ చెప్పారు. రిటైర్మెంట్ ప్లానింగ్ ముఖ్యం.. జీవన ప్రమాణాలు మెరుగుపడి జీవిత కాలం పెరుగుతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ కోసం తగిన ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటోందని శ్రీనివాస్ చెప్పారు. పదవీ విరమణ తర్వాత ఆదాయం తగ్గిపోతుందని, ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్నదొక్కటే ఆదాయ మార్గంగా ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి ఆర్థికంగా ఒత్తిడి లేని రిటైర్మెంట్ జీవితం గడపాలంటే సరైన ప్రణాళిక వేసుకుని, తగిన సాధనాల్లో సాధ్యమైనంత ముందు నుంచీ ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని శ్రీనివాస్ వివరించారు. రిటైర్మెంట్ ప్రణాళికను ప్రధానంగా రెండు దశలుగా వర్గీకరించవచ్చని ఆయన చెప్పారు. మొదటి దశలో నిధిని ఏర్పాటు చేసుకోవడం, రెండో దశలో దాన్ని వినియోగించుకోవడం ఉంటుందన్నారు. జీవిత బీమా కంపెనీలు అందించే యులిప్స్, సాంప్రదాయ సేవింగ్స్ సాధనాల్లాంటివి దీర్ఘకాలికంగా రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకునేందుకు ఉపయోగపడగలవని శ్రీనివాస్ వివరించారు. అధిక రిస్కును భరించగలిగే వారు యులిప్లను ఎంచుకోవచ్చని, రిస్కులను ఎక్కువగా ఇష్టపడని వారు సాంప్రదాయ సేవింగ్స్ పథకాలను ఎంచుకోవచ్చన్నారు. యాన్యుటీలకు సంబంధించి జాయింట్ లైఫ్ ఆప్షన్ను ఎంచుకుంటే జీవిత భాగస్వామికి కూడా జీవితాంతం స్థిరమైన ఆదాయం లభించగలదని ఆయన చెప్పారు. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కొత్త మైలురాయి
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2.5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి. ఈ సంస్థ 2000 డిసెంబర్లో మొదలైంది. 2020–21 నాటికి ఏయూఎం రూ.100 కోట్లుగా ఉంటే, ఇన్నేళ్ల కాలంలో రూ.2.5 లక్షల కోట్లకు చేరింది. మొదటి రూ.50,000 కోట్ల మైలురాయిని చేరుకునేందుకు తొమ్మిదేళ్లు పట్టగా, రూ.లక్ష కోట్ల ఏయూఎం మార్క్ను 14 ఏళ్లలో చేరుకుంది. ఆ తర్వాత ఆరేళ్లలోనే ఏయూఎంను రెట్టింపు చేసుకుంది. రూ.లక్ష కోట్ల మైలురాయిని చేరిన తర్వాత వృద్ధి వేగాన్ని అందుకున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ తెలిపింది. కంపెనీ పట్ల కస్టమర్ల విశ్వాసానికి తమ నిర్వహణలోని ఆస్తులే ప్రామాణికమని, ఎందుకంటే జీవిత బీమా దీర్ఘకాల ఉత్పత్తి అని సంస్థ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంకు ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ జీవిత బీమా మార్కెట్లో 15.7 శాతంతో మొదటి స్థానంలో ఉంది. 2022 సెప్టెంబర్ నాటికి నూతన పాలసీల సమ్ అష్యూరెన్స్ పరంగా ఈ స్థానం దక్కించుకుంది. -
మంచి పనితీరు చూపించే టాప్ ఫండ్స్లో ఇది ఒకటి!
ఆర్బీఐ రెపో రేట్ల పెంపుతో కొంత కాలంగా డెట్ మార్కెట్లు అస్థిరతలను చూస్తున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఆర్బీఐ వరుసగా రేట్లను పెంచుతూనే వస్తోంది. ఇప్పటికే 2.25 శాతం వడ్డీ రేట్లు పెరిగాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే ఉన్నందున, రానున్న కాలానికి అస్పష్టత నెలకొంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులకు అనువైనవి డైనమిక్ బాండ్ ఫండ్స్. పరిస్థితులకు తగినట్టు ఇవి స్వల్ప కాలం నుంచి దీర్ఘకాల సాధనాల మధ్య పెట్టుబడులను మార్చే సౌలభ్యంతో పనిచేస్తాయి. ఈ విభాగంలో ఎన్నో పథకాలు అంబాటులో ఉన్నాయి. మంచి పనితీరు చూపించే టాప్ ఫండ్స్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్ ఒకటి. రాబడులు.. గడిచిన ఆరు నెలల్లో పెట్టుబడి 5 శాతం మేర వృద్ధి చెందగా, ఏడాది కాలంలో 4 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో ఏటా 7.30 శాతం, ఐదేళ్లలో 7.26 శాతం, ఏడేళ్లలో 8.28 శాతం, పదేళ్లలో 9.28 శాతం చొప్పున రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. స్వల్పకాలంతో పోలిస్తే దీర్ఘకాలంలో రాబడి స్థిరంగా, మెరుగ్గా కనిపిస్తోంది. డైనమిక్ బాండ్ ఫండ్ విభాగం సగటు రాబడుల కంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్సీజన్స్ బాండ్ ఫండ్లోనే అధిక రాబడులు ఉన్నాయి. మూడేళ్లలో 1.5 శాతం, ఐదేళ్లలో 1.30 శాతం, ఏడేళ్లలో 1.5 శాతం, పదేళ్లలో 1.60 శాతం అధిక రాబడులు ఈ పథకం ఇవ్వడాన్ని గమనించాలి. ఈ పథకం ఆరంభమైన 2009 నుంచి చూస్తే వార్షిక రాబడి సుమారు 9 శాతంగా ఉంది. పెట్టుబడుల విధానం, పోర్ట్ఫోలియో.. ఈ విభాగంలో నిర్వహణ ఆస్తుల పరంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్ అతిపెద్దది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.6,074 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేసినప్పుడు ఈ పథకం తన పోర్ట్ఫోలియోలోని సాధనాల డ్యురేషన్ను ( కాలవ్యవధి) పెంచుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని భావించినప్పుడు, ఆ ప్రయోజనాలను ఒడిసి పట్టేందుకు, మార్కెట్ టు మార్కెట్ నష్టాలను తగ్గించుకునేందుకు పోర్ట్ఫోలియోలోని డెట్ సాధనాల డ్యురేషన్ను తగ్గిస్తుంది. స్థూల ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ పోర్ట్ఫోలియో డ్యురేషన్ మార్పులపై నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో ఈ పథకానికి ఎంతో అనుభవం ఉంది. ఈ పథకం కార్పొరేట్ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీల్లోనూ (జీసెక్) ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో డ్యురేషన్ పథకంగా, వడ్డీ రేట్లు తగ్గే క్రమంలో అక్రూయల్ పథకంగా పనిచేస్తుంది. ఈ పథకం ఆరంభం నుంచి ఎన్నో పర్యాయాలు వడ్డీ రేట్ల సైకిల్ (పెరగడం, తరగడం)ను చూసింది. కనుక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా, మెరుగైన నిర్ణయాలు తీసుకోడంలో కాస్త అనుభవం ఎక్కువ. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్ఫోలియో సగటు డ్యురేషన్ 1.91 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం వడ్డీ రేట్ల పెరుగుదల సైకిల్లో ఉన్నాం. కనుక డ్యురేషన్ తక్కువగా ఉంది. మొత్తం పెట్టుబడుల్లో 38.2 శాతం ఫ్లోటింగ్ రేట్ బాండ్లలో కలిగి ఉంది. అంటే వడ్డీ రేట్లు పెరిగినా, తరిగినా రిస్క్ ఉండదు. 29 శాతం పెట్టుబడులను ఏఏ మైనస్ అంతకంటే మెరుగైన రేటింగ్ సాధనాల్లో కలిగి ఉంది. మొత్తం పెట్టుబడుల్లో 92.91 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయగా, 7.09 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ సుఖ్ సమృద్ధి
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సుఖ్ సమృద్ధి పేరుతో దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. పన్ను రహిత గ్యారంటీ ఇన్కం లేదా ఏక మొత్తంలో మెచ్యూరిటీ కార్పస్ పొందవచ్చు. పాలసీ వ్యవధిలో ఏ సమయంలోనైనా ఆదాయాన్ని కూడబెట్టుకోవడానికి, సేకరించిన కార్పస్ను ఉపసంహరించుకోవడానికి సేవింగ్స్ వాలెట్ వీలు కల్పిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళా కస్టమర్లకు అధిక మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడంతోపాటు ఆదాయ కాలంతో సహా పాలసీ మొత్తం వ్యవధిలో లైఫ్ కవర్ కొనసాగుతుంది. చదవండి: ‘రేపట్నించి ఆఫీస్కు రావొద్దు’, అర్ధరాత్రి ఉద్యోగులకు ఊహించని షాక్..భారీ ఎత్తున తొలగింపు -
పెట్టుబడుల రక్షణకు మూడు సూత్రాలు...రిస్క్లేకుండా!
గత ఏడాది కాలంగా అంతర్జాతీయంగా అనిశ్చితిపరమైన సవాళ్లు నెలకొన్నా ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే రాణిస్తోంది. దేశీ మార్కెట్లలో కరెక్షన్ కొంత స్థాయికే పరిమితమైంది. రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం, కార్పొరేట్లు మొదలైన వర్గాలన్నీ పరిస్థితిని చక్కగానే ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను ఆపేవరకూ మార్కెట్లలో కుదుపులు కొన సాగుతూనే ఉంటాయి. దేశీ మార్కెట్ వేల్యుయేషన్లు ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నందున మదుపరులు.. రిస్కులను గుర్తెరిగి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో పోర్ట్ఫోలియోను రిస్కుల నుండి కాపాడుకునేందుకు వ్యక్తిగత ఇన్వెస్టర్లు పాటించతగిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. డెట్ ఫండ్స్లో మదుపు ఏడాదిన్నర, రెండేళ్లుగా పాపులారిటీని కోల్పోయిన డెట్ సాధనాలు మళ్లీ ఆకర్షణీయంగా మారుతున్నాయి. వివిధ కాలావధులకు సంబంధించి అధిక రాబడులు అందిస్తున్నాయి. అధిక ధరలు, అంతర్జాతీయ ఎకానమీకి పెను సవాళ్లు పొంచి ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ రెపో రేట్ పెంపు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ రిస్కులు ఉండే స్వల్ప, మధ్య కాలిక ఎక్రూవల్ ఫండ్స్, అలాగే డైనమిక్ వ్యవధుల స్కీములను ఎంచుకోవచ్చు. ఫ్లోటింగ్-రేట్ బాండ్లు (ఎఫ్ఆర్బీ) అన్నింటి కన్నా మెరుగ్గా రాణించగలవని అంచనాలు ఉన్నాయి. పోర్ట్ఫోలియోను కాపాడుకోవడంలో .. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోవాలి. లక్ష్యాల ఆధారిత ఫండ్స్ .. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్కి అందుబాటులో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించడం పూర్తయ్యే వరకూ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు .. ముఖ్యంగా భారతీయ మదుపుదారులు కొంత ఆచితూచి వ్యవహరించాలి. మూడు నుంచి అయిదేళ్ల కాల వ్యవధిని నిర్దేశించుకుని రాబోయే ఏడాది కాలంలో సిప్మార్గంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. ఇక ఈక్విటీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లేదా మల్టీ–అసెట్ కేటగిరీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని పరిశీలించవచ్చు. అలాగే వివిధ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళికబద్ధంగా సాధించేందుకు బూస్టర్ సిప్, బూస్టర్ ఎస్టీపీ లేదా ఫ్రీడమ్ ఎస్డబ్ల్యూపీ వంటి ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు .. వివిధ సాధనాల్లో పెట్టుబడులతో పోర్ట్ఫోలియోలో వైవిధ్యం పాటిస్తే.. ఒక సాధనం వల్ల నష్టాలేవైనా వచ్చినా మరొక దాని ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్న తరుణంలో బంగారం, వెండి వంటి కమోడిటీలు ఆసక్తికరమైన సాధనాలుగా ఉండగలవు. ద్రవ్యోల్బణానికి మాత్రమే కాకుండా కరెన్సీ క్షీణతకు కూడా ఇవి హెడ్జింగ్ సాధనంగా పని చేయగలవు. ఈటీఎఫ్ల మార్గంలో వీటిలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. డీమ్యాట్ ఖాతా లేని వారికి గోల్డ్ లేదా సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉండగలవు. -ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ ఎండీ, నిమేష్ షా -
రవాణా, లాజిస్టిక్స్లో పెట్టుబడి అవకాశాలు
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వరకు వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. బలమైన జీడీపీ వల్ల ప్రయోజనం పొందే రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు మెరుగైన రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్, ఆటో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు (ఓఈఎంలు), ఆటో విడిభాగాల కంపెనీలు, లాజిస్టిక్స్ రంగాలు ఎక్కువ లబ్ధి పొందనున్నాయి. ఈ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ నూతన పథకం (ఎన్ఎఫ్వో) ప్రారంభమైంది. ఈ ఇష్యూ ఈ నెల 20న ముగియనుంది. వృద్ధి అవకాశాలు ఆసియాలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూసినా, పాశ్చాత్య దేశాలతో పోల్చినా తలసరి కార్ల వినియోగం మన దేశంలోనే చాలా తక్కువ. ఇది వచ్చే కొన్ని దశాబ్దాల పాటు వృద్ధికి మద్దతునిచ్చే అంశం. పైగా ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగవంతమైన వృద్ధిని చూపిస్తోంది. తలసరి ఆదాయం కూడా పెరుగుతోంది. ఇవన్నీ కలసి కార్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. 2021–22 నుంచి 2026–27 మధ్య ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర మోటారు వాహనాల విక్రయాలు డబుల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని చూస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఏటా 12–15 శాతం మేర కాంపౌండెడ్ వృద్ధిని చూడనున్నాయి. ఈ అప్సైకిల్లో ఆటోమొబైల్ తయారీదారులు, విడిభాగాల కంపెనీలు వచ్చే కొన్నేళ్లపాటు ప్రయోజనం పొందనున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల హవా పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మొత్తంలో సబ్సిడీలను అందిస్తోంది. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్ తదితర ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో వినియోగదారుల్లోనూ పర్యావరణం పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. ఇది కూడా ఆటోమొబైల్ రంగానికి అనుకూలమే కానుంది. ఇప్పటికే భారత ఆటోమొబైల్ మార్కెట్లో చాలా కంపెనీలు ఈవీలను ప్రవేశపెట్టాయి. లాజిస్టిక్స్కు ప్రోత్సాహం భారత్లో తయారీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం లాజిస్టిక్స్ రంగానికి సానుకూలించనుంది. నూతన లాజిస్టిక్స్ పాలసీని కేంద్ర సర్కారు ఇటీవలే ప్రకటించింది. భారత్లో తయారీకి లాజిస్టిక్స్ కీలకం కానుంది. తక్కువ ఖర్చుకే వేగంగా ఉత్పత్తులను రవాణా చేసే సదుపాయాలు ఎంతైనా అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దీంతో లాజిస్టిక్స్కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రోడ్డు, పోర్టులను అనుసంధానించనుంది. తద్వారా లాజిస్టిక్స్ వ్యయాలు, సమయాన్ని ఆదా చేయాలన్నది లక్ష్యం. పెట్టుబడుల అవకాశాలు ఆటో, లాజిస్టిక్స్ రంగాలకు అపార అవకాశాలు ఉండడంతో ఈ రంగంలోని మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందొచ్చు. ఈ రంగంలో వచ్చే కొన్నేళ్లపాటు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కనీసం రూ.5,000 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్వో ఈ నెల 20న ముగుస్తుంది. ఇది ధీమ్యాటిక్ ఫండ్ అవుతుంది. అంటే ఫలానా రంగాలకు పెట్టుబడులను పరిమితం చేసేవి. వీటిల్లో ఉండే రిస్క్ను అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. రిస్క్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనం ఎదుర్కొంటున్నాయి. దీనికితోడు వడ్డీ రేట్ల పెరుగుదల స్వల్ప కాలంలో ఇవి ఆటోమొబైల్ రంగంపై చూపించే అవకాశం లేకపోలేదు. కానీ, 2030 నాటికి ప్రపంచంలోని టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి కానుంది. కనుక దీర్ఘకాలానికి రవాణా, లాజిస్టిక్స్ థీమ్ మంచి రాబడులనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విభాగంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న యూటీఐ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ ఆరంభం నుంచి వార్షికంగా 15 శాతంపైనే రాబడినిచ్చింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
ఈక్విటీ మ్యచువల్ ఫండ్స్: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ రివ్యూ
ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు చూస్తున్నాం. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికే సెంట్రల్ బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆర్బీఐ, ఫెడ్ సహా అన్ని ప్రముఖ సెంట్రల్ బ్యాంకులు రేట్ల పెంపు బాటలోనే దూకుడుగా వెళుతున్నాయి. కరోనా సమయంలో ఇచ్చిన ఉద్దీపనలను వెనక్కి తీసుకుంటున్నాయి. ఇవన్నీ ఈక్విటీలకు ప్రతికూలతలే. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లను చురుగ్గా పెంచాల్సిందేనని, అవసరమైతే వృద్ధి రేటును కూడా త్యాగం చేయాల్సి రావచ్చని ఫెడ్ చైర్మన్ జీరోమ్ పావెల్ పేర్కొనడాన్ని గమనించాలి. కనుక సమీప భవిష్యత్తులో మార్కెట్లు అస్థిరతలను చూడనున్నాయి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ తరహా ప్రతికూల పరిస్థితులు ఎంతో అనుకూలం. ఈ దశలో వ్యాల్యూ ఫండ్స్ను పరిశీలించడం మెరుగైన ఆప్షన్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విభాగంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం.. వడ్డీ రేట్లు పెరిగే తరుణం కనుక ఖరీదైన వ్యాల్యూషన్లతో ఉన్న స్టాక్స్లో పెట్టుబడి రిస్క్ అవుతుంది. ఈ తరుణంలో అంతర్గత విలువ కంటే తక్కువలో లభించే నాణ్యమైన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వ్యాల్యూ ఫండ్స్ను ఆకర్షణీయంగా భావించొచ్చు. పెట్టుబడులకు ముందు ఆయా కంపెనీల పుస్తక విలువ, క్యాష్ ఫ్లో సామర్థ్యాలను ఫండ్ పరిశోధన బృందం చూస్తుంది. ఈ సామర్థ్యాల బలంతోనే ఈ పథకం వ్యాల్యూ విభాగంలో దీర్ఘకాలంగా ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మంచి విలువను తెచ్చి పెడుతోంది. రాబడులు వ్యాల్యూ విభాగంలోనే అని కాదు, మొత్తం ఈక్విటీ మ్యచువల్ ఫండ్స్లోనే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ పనితీరు ప్రమాణాలకు తగ్గకుండా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించొచ్చు. అదిపెద్ద వ్యాల్యూ ఫండ్ కూడా ఇదే. దీని నిర్వహణలో రూ.24,694 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 17 శాతంగా ఉంది. మూడేళ్లలో వార్షికంగా 24 శాతానికి పైనే పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్ల కాలంలో వార్షికంగా 14 శాతం, ఏడేళ్లలో 13 శాతం, పదేళ్లలో 14.40 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2004 ఆగస్ట్లో ఈ పథకం ఆరంభమైంది. నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన రాబడి 20 శాతం. పోర్ట్ఫోలియో.. పస్త్రుతం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 92 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించింది. 1.4 శాతం డెట్ సాధనాల్లో, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. మార్కెట్లో దిద్దుబాటు ఏర్పడితే ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా నగదు నిల్వలు పెంచుకుంది. ఇక ఈక్విటీల్లోనూ 81 శాతాన్ని లార్జ్క్యాప్ కంపెనీలకే కేటాయించింది. 14 శాతాన్ని మిడ్క్యాప్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టింది. స్మాల్క్యాప్ పెట్టుబడులు 5 శాతంగా ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో మొత్తం 63 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల్లో 19 శాతాన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు, 17 శాతాన్ని ఇంధనరంగ కంపెనీలకు, 12 శాతం హెల్త్కేర్ కంపెనీలకు, 10 శాతం కమ్యూనికేషన్ స్టాక్స్కు, 8 శాతం టెక్నాలజీ కంపెనీలకు కేటాయించింది. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి పెన్షన్ ప్లాన్
ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ పేరిట యాన్యుటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రిటైర్మెంట్ అవసరాల కోసం క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేసి, దీర్ఘకాలంలో నిధిని సమకూర్చుకునేందుకు ఇది దోహదపడుతుందని సంస్థ తెలిపింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండేలా యాక్సిలరేటెడ్ హెల్త్ బూస్టర్స్, బూస్టర్ పేఅవుట్స్ వంటి ఏడు వేరియంట్లలో ఇది లభిస్తుంది. బూస్టర్ పేఅవుట్ ఆప్షన్లో యాన్యుటీకి అదనంగా అయిదు సార్లు పెద్ద మొత్తంలో చెల్లింపులు పొందవచ్చు. -
ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ ర్యాలీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల ఫలితాలపై దేశీ మార్కెట్ల తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఐవో ఎస్ నరేన్ తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గి, పరిస్థితి సద్దుమణిగితే మార్కెట్లలో ఒక్కసారిగా ర్యాలీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే గానీ జరిగితే మార్కెట్ల ఫోకస్ మళ్లీ అమెరికా ఫెడ్ రేట్ల పెంపు తదితర పాత అంశాల పైకి మళ్లుతుందని చెప్పారు. మరో మారు మార్కెట్లో ఒడిదుడుకులకు ఇది దారితీయొచ్చన్నారు. అలా కాకుండా ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే, మరింత కరెక్షన్ చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని నరేన్ వివరించారు. క్రూడాయిల్ ధర భారీగా పెరిగిపోవడం భారత్కి ప్రతికూల పరిణామమే కాగలదన్నారు. ‘‘దీర్ఘకాల ఇన్వెస్టర్లు, సిస్టమాటిక్గా వచ్చే 12–18 నెలల పాటు పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ మంచి అవకాశం కాగలదు. దీర్ఘకాలికంగా భారత్ వృద్ధి అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఇటు ఈక్విటీ, అటు డెట్ ఫండ్స్లో సిస్టమాటిక్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అసెట్ అలోకేషన్లో సమతుల్యత ఉండేలా చూసుకోవాలి’’ అని నరేన్ చెప్పారు. మెరుగ్గా లార్జ్ క్యాప్స్ .. ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్తో పోలిస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా ఉన్నట్లుగా కనిపిస్తోందని నరేన్ తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) .. ప్రతి నెలా దేశీయంగా ఈక్విటీలను నికరంగా విక్రయిస్తూనే ఉన్నారని.. ఇప్పటి వరకూ 15.41 బిలియన్ డాలర్ల ఈక్విటీలను విక్రయించారని ఆయన చెప్పారు. 2008 తర్వాత ఎఫ్పీఐలు ఇంత సుదీర్ఘకాలం పాటు అమ్మకాలు జరపడం ఇదే ప్రథమం అని నరేన్ తెలిపారు. సాధారణంగా ఎఫ్పీఐలు ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇప్పటి వరకూ భారీ స్థాయిలో అమ్మకాల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా కనిపిస్తున్నాయని నరేన్ చెప్పారు. మార్కెట్లలో మధ్యమధ్యలో వచ్చే ఒడిదుడుకుల కారణంగా వచ్చే 2–3 ఏళ్లలో వేల్యూ ఇన్వెస్టింగ్కు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాబట్టి వేల్యూ స్టాక్స్ ఆధారిత స్కీమ్లలో పెట్టుబడులు పెట్టడాన్ని ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చని నరేన్ పేర్కొన్నారు. -
ఎఫ్వోఎఫ్ లాంచ్ చేసిన ఐసీఐసీఐ ప్రుడెన్నియల్..!
ఐసీఐసీఐ ప్రుడెన్నియల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ప్యాసివ్ మల్టీ-అసెట్ ఫండ్ ఆఫ్ ఫండ్(ఎఫ్వోఎఫ్) ఆవిష్కరించింది. ఈ ఫండ్ జనవరి 10తో ముగుస్తుంది. కనీసం రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని కింద 25-65 శాతం నిధులను దేశీయంగా ఈక్విటీల్లోను, 25-85 శాతం మొత్తాన్ని డెట్ సాధనాల్లోనూ, 0-15 శాతం నిధులను బంగారం, 10-80 శాతం మొత్తాన్ని అంతర్జాతీయ సంస్థల షేర్లలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈటీఎఫ్ మార్గంలో పెట్టుబడులు పెడుతుంది. సాధారణంగా ఏ ఆర్ధిక సాధనానికి ఎంత 'మేర ఇన్వెస్ట్ చేయాలన్న విషయంలో ఇన్వె స్టర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఇన్వెస్టర్లు. ప్యాసివ్ విధానంలో వివిధ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది సరళతరమైన సాధనంగా ఉపయోగపడుతుందని సంస్థ హెడ్ (ప్రోడక్ట్ డెవలప్మెంట్, స్ట్రాటజీ) చింతన్ హరియాతెలిపారు. దేశీ ఈక్వటీలతో పాటు అంతర్జాతీయ కంపెనీల్లోనూ పెట్టుబడుల వల్ల డైవేర్సిఫికేషన్ మరింత మెరుగ్గా ఉండగలదని పేర్కొన్నారు. ఇతర ఫండ్, పౌస్ల ఈటీఎఫ్లలో కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్కి ఉంటుందని తెలిపారు. ఐసీఐసీఐ ప్రుడెన్నియల్ సిల్వర్ ఈటీఎఫ్ ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఫండ్ దేశంలోనే మొదటే సిల్వర్ ఈటీఎఫ్ను, ఈ నెల 6న ప్రారంభించనుంది. ఇది 19వ తేదీన ముగుస్తుంది. సిల్వర్, సిల్వర్ ఆధారిత సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కార్పొరేట్ రుణ పత్రాల్లోనూ ఎక్స్పోజర్ తీసుకుంటుంది. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్(ఏడాది కాలం వరకు), సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సిల్వర్. ఈటీఎఫ్ల నిర్వహణ మార్గదర్శకాలను సెబీ గత నవంబర్లో ప్రకటించిన తర్వాత ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఎన్ఫ్వోకు దరఖాస్తు చేసుకుంది. వెండిలో ఇన్వెస్ట్ చేసుకునే వారికి భౌతిక వెండితో పోలిస్తే ఇది మెరుగైన సాధనం అవుతుంది. -
మరణించినా, జీవించి ఉన్నా ప్రయోజనం.. కొత్త టర్మ్ ప్లాన్ వివరాలు
ముంబై: చెల్లించిన ప్రీమియంతో పోలిస్తే 105 శాతం వెనక్కి చెల్లించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త టర్మ్ ప్లాన్ ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐ ప్రొటెక్ట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ను ప్రవేశపెట్టింది. పాలసీదారు జీవిత దశల ఆధారంగా బీమా కవరేజీ సర్దుబాటు అయ్యే (లైఫ్స్టేజ్ కవర్) ఆప్షన్ ఉండడం ఈ పాలసీలో ఉన్న ప్రత్యేకత. ఇది కాకుండా కవరేజీ స్థిరంగా ఉండే ‘లెవల్ కవరేజీ’ ఆప్షన్ కూడా ఉంది. పాలసీదారులు తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. 64 క్రిటికల్ ఇల్నెస్లకు (తీవ్ర అనారోగ్య సమస్యలు) సైతం ఈ ప్లాన్లో కవరేజీ తీసుకోవచ్చు. లైఫ్స్టేజ్ ఆప్షన్లో బీమా కవరేజీ ఆరంభంలో క్రమంగా పెరుగుతూ వెళుతుంది. పాలసీ చివర్లో (పెద్ద వయసులో) క్రమంగా కవరేజీ తగ్గుతూ వస్తుంది. పాలసీ అమల్లో ఉన్నప్పుడు మరణిస్తే పరిహారం, గడువు పూర్తయ్యే వరకు జీవించి ఉన్నాకానీ ప్రయోజనం కోరుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. కేన్సర్, గుండె జబ్బులు తదితర జీవనశైలి వ్యాధులను (క్రిటికల్ ఇల్నెస్లు) దృష్టిలో పెట్టుకుని ప్లాన్ను అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. -
గొప్ప రాబడుల చరిత్ర
ICICI Prudential Equity And Debt Fund: రాబడులు కావాలి. పెట్టుబడులు పూర్తిగా ప్రమాదంలో పడకూడదు. అంటే రిస్క్ కొంచెం తక్కువగా ఉండాలి. ఇలా భావించే వారికి హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ కిందకు వస్తుంది. అంటే తన నిర్వహణలోని మొత్తం ఆస్తుల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. డెట్ సాధనాల్లో 20 శాతం నుంచి 35 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. రాబడులు ఈ పథకం 1999 నవంబర్ 3న మొదలు కాగా, ఆరంభంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి అది రూ.21.76 లక్షలు సమకూరి ఉండేది. అంటే కాంపౌండెడ్గా ఏటా 15.03 శాతం రాబడిని ఇచ్చింది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ కాంపౌండెడ్గా వార్షికంగా ఇచ్చిన ప్రతిఫలం (సీఏజీఆర్) 14.04 శాతంగానే ఉంది. అంటే నిఫ్టీలో రూ.లక్ష పెట్టుబడి రూ.18.01 లక్షలు అయి ఉండేది. నూరు శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకుండా, కొంత మొత్తాన్ని డెట్లో పెడుతూ ఈక్విటీ సూచీ కంటే అధిక రాబడిని ఇవ్వడం అన్నది కచ్చితంగా మెరుగైన పనితీరుగానే చూడాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈ పథకంలో ప్రతీ పెలా రూ.10,000 చొప్పున ఆరంభం నుంచి ఇన్వెస్ట్ చేసి ఉంటే.. మొత్తం పెట్టుబడి ఇన్నేళ్లలో రూ.26.4 లక్షలు కాగా, సమకూరిన మొత్తం రూ.2.11 కోట్లుగా ఉండేది. సిప్ మార్గంలో సీఏజీఆర్ 16.22 శాతంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో పెట్టుబడులపై 53 శాతం ప్రతిఫలం లభించింది. మూడేళ్లలో వార్షికంగా 19 శాతం చొప్పున రాబడిని ఇచ్చింది. ఐదేళ్లలో 15.58 శాతం, ఏడేళ్లలో 13.49 శాతం, పదేళ్లలో 17 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఒక హైబ్రిడ్ ఫండ్ ఇంత నిలకడైన పనితీరు చూపించడం అరుదైనది. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను ఎస్.నరేన్ చూస్తున్నారు. గడిచిన 18 నెలల్లో వ్యాల్యూ స్టాక్స్కు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మార్కెట్ ర్యాలీలో అన్ని రంగాల స్టాక్స్ పాల్గొనడంతో వ్యాల్యూ స్టాక్స్ మంచి రాబడులను ఇచ్చాయి. పోర్ట్ఫోలియో/పెట్టుబడుల విధానం ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.18,740 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అన్ని విభాగాల్లోని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఈ పథకానికి ఉంది. అంటే లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ స్టాక్స్లో ఎక్కడ అవకాశాలున్నా ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి మొత్తం నిర్వహణ ఆస్తుల్లో ఈక్విటీ విభాగంలో 74.4 శాతం పెట్టుబడులు ఉన్నాయి. డెట్ సాధనాల్లో 17.1 శాతం ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్క్యాప్ కంపెనీల్లోనే 90 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. మిడ్, స్మాల్క్యాప్ స్టాక్స్కు చెరో 5 శాతం కేటాయింపులు చేసింది. ప్రైస్ టు బుక్ విధానంలో స్టాక్స్ ఎంపిక ఉంటుంది. టాప్ డౌన్, బోటమ్ అప్ విధానాలను అనుసరిస్తుంటుంది. విద్యుత్, టెలికం, ఆయిల్, నాన్ ఫెర్రస్ మెటల్ స్టాక్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. బ్యాంకులు, సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్ కంపెనీల పట్ల తక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈక్విటీలకు సంబంధించి విదేశీ స్టాక్స్లో ఇన్వెస్ట్ ఆప్షన్ కూడా ఈ పథకంలో భాగంగా ఉంది. మార్కెట్ల దిద్దుబాట్లలో పెట్టుబడుల విలువకు రక్షణ కోసం గాను డెరివేటివ్స్లో హెడ్జింగ్ కూడా చేస్తుంది. డెట్ విభాగంలో దీర్ఘకాల ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలను, ఏఏ అంతకంటే మెరుగైన రేటింగ్ ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటుంది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 8.46 ఎన్టీపీసీ 7.69 భారతీ ఎయిర్టెల్ 7.32 ఓఎన్జీసీ 5.17 హిందాల్కో ఇండస్ట్రీస్ 4.35 సన్ఫార్మా 3.97 టాటా మోటార్స్ డీవీఆర్ 3.93 హెచ్సీఎల్ టెక్నాలజీస్ 3.19 ఇన్ఫోసిస్ 2.67 ఐటీసీ 2.36 చదవండి: హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ రివ్యూ -
పెట్టుబడుల్లో రిస్క్ తగ్గించుకునే మార్గం
ఈక్విటీ మార్కెట్ ఇటీవలి కాలంలో చక్కని ర్యాలీతో గరిష్ట విలువలకు చేరింది. కనుక అస్సెట్ అలోకేషన్ విధానాన్ని (ఒక్క విభాగంలోనే కాకుండా భిన్న సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం) అనుసరించాలంటూ ఆర్థిక సలహాదారులు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. భిన్న సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకుని, రిస్క్ తగ్గించుకోవాలని భావించే వారికి అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. వివిధ సాధనాల మధ్య వ్యూహాత్మక స్థాయిలో కేటాయింపులు అనేవి అన్ని వేళలా ఇన్వెస్టర్లకు రిస్క్ నుంచి రక్షణ కల్పిస్తాయని మార్కెట్ పండితులు అభిప్రాయపడుతుంటారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మల్టీ అస్సెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావిస్తుంటే.. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తున్న వాటిల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎంతో పేరున్న ఎస్.నరేన్ ఈ ఫండ్కు మేనేజర్గా వ్యవహరిస్తుండడం సానుకూలాంశం. ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది. పెట్టుబడుల విధానం.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ ఈక్విటీలకు.. పరిస్థితులకు అనుగుణంగా 10 శాతం నుంచి 80 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. అలాగే, డెట్ సాధనాలకు 10 శాతం నుంచి 35 శాతం వరకు, బంగారం ఈటీఎఫ్లకు 0–10 శాతం వరకు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లకు 0–10 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంటుంది. దాదాపు అన్ని రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఈ ఒక్క పథకం ద్వారా సాధ్యపడుతుంది. సెబీ నిబంధనల ప్రకారం మల్టీ అస్సెట్ ఫండ్స్ మూడు అంతకంటే ఎక్కువ సాధనాల్లో.. కనీసం 10 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. రాబడులు మల్టీ అస్సెట్ ఫండ్ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ మెరుగైన, స్థిరమైన పనితీరు చూపిస్తోంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని తప్పకుండా పరిశీలించొచ్చు. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 62 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఇదే సమయంలో మల్టీ అస్సెట్ ఫండ్స్ విభాగం సగటు రాబడులు 32 శాతంగానే ఉన్నాయి. మూడేళ్లలో చూసినా కానీ, వార్షిక రాబడులు 18 శాతంగా ఉండడం గమనార్హం. అంతేకాదు, ఐదేళ్లలో 15 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 15 శాతం చొప్పున రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఏ కాలంలో చూసినా కానీ, మల్టీ అస్సెట్ విభాగం సగటుతో పోల్చి చూస్తే ఈ పథకం పనితీరు ఎంతో మెరుగ్గా కనిపిస్తుంది. ఈక్విటీతో కూడిన పథకం కనుక దీర్ఘకాలంలో 12 శాతం అంతకుమించి వార్షిక రాబడులను మెరుగైన పనితీరుగా భావించొచ్చు. 2002 అక్టోబర్లో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి చూస్తే ఒక యూనిట్ నికర అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) 39 రెట్లు వృద్ధి చెందింది. అంటే ఆరంభంలో చేసిన రూ.10 పెట్టుబడి రూ.390గా వృద్ధి చెందింది. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసినా కానీ, నేటికి రూ.5.36 లక్షలుగా వృద్ధి చెందేది. ఈ పథకం ప్రారంభం నుంచి చూస్తే వార్షిక రాబడులు 14 శాతానికి పైనే ఉన్నాయి. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.12,405 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈక్విటీ పెట్టుబడులు 66 శాతంగా ఉన్నాయి. డెట్లో 10.9 శాతం మేర పెట్టుబడులు పెట్టి ఉంటే, 23 శాతం మేర నగదు నిల్వలను కలిగి ఉంది. అంటే మూడు విభాగాల్లోనే ప్రస్తుతం పెట్టుబడులు పెట్టి ఉంది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఎన్టీపీసీ 9.41 భారతీ ఎయిర్టెల్ 7.90 ఐసీఐసీఐ బ్యాంకు 7.73 ఓఎన్జీసీ 5.59 సన్ఫార్మా 3.75 హిందాల్కో 3.31 ఇన్ఫోసిస్ 2.56 ఎస్బీఐ 2.26 ఐటీసీ 2.15 మారుతి సుజుకీ 2.01 -
వ్యాల్యూ డిస్కవరీ ఫండ్... పెట్టుబడులకు విలువ తెచ్చిపెట్టేది..!
మోస్తరు రాబడులు చాలు.. రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లకు వ్యాల్యూ డిస్కవరీ ఫండ్స్ విభాగం చక్కగా నప్పుతుంది. కంపెనీ వ్యాపారం, ఆర్థిక బలాల ఆధారంగా వాస్తవ విలువ షేరులో ప్రతిఫలించని సందర్భాలు కొన్ని వస్తుంటాయి. అటువంటి సందర్భాలను వ్యాల్యూ డిస్కవరీ పథకాలు అనుకూలంగా మలుచుకుని, మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో 17 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పథకం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్. పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఈ పథకాన్ని ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. రాబడులు ఈ పథకం నిర్వహణలో ఈ ఏడాది జూలై నాటికి రూ.21,195 కోట్ల ఆస్తులున్నాయి. వ్యాల్యూ ఫండ్స్ విభాగంలో అతిపెద్ద పథకం ఇది. మొత్తం వ్యాల్యూ ఫండ్స్ పరిధిలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 30 శాతం ఒక్క ఈ పథకంలోనే ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 48 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 13.49 శాతం, ఐదేళ్లలో 12.66 శాతం, ఏడేళ్లలో 12.69 శాతం, పదేళ్లలో 18.16 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. 2004 ఆగస్ట్లో ఈ పథకం మొదలు కాగా.. నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 20 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో నిఫ్టీ50టీఆర్ఐ కాంపౌండెడ్ వార్షిక రాబడి రేటు 15.91 శాతంగానే ఉంది. ఈ ప్రకారం సూచీల కంటే మెరుగైన పనితీరును చూపించిందని అర్థమవుతోంది. ఈక్విటీ విభాగంలో వీటిని మెరుగైన రాబడులుగా చూడొచ్చు. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.1.46 లక్షలు అయి ఉండేది. ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.100 చొప్పున కూడా పెట్టుబడులకు ఈ పథకం అనుమతిస్తోంది. పెట్టుబడులు పెట్టిన ఏడాదిలోపు వైదొలిగితే 1 శాతం ఎగ్జిట్లోడ్ను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ పథకం ఆరంభంలో రూ.లక్షను ఇన్వెస్ట్ చేసి (17 ఏళ్ల క్రితం) అలాగే కొనసాగించి ఉంటే నేటికి .22.13లక్షలు అయి ఉండేది. పెట్టుబడుల విధానం కంపెనీ వాస్తవ విలువతో పోలిస్తే తక్కువలో లభిస్తున్న కంపెనీలను, వివిధ రంగాల వారీగా ఎంపిక చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆర్థిక వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా అవసరమైతే స్వల్ప మార్పులను కూడా తీసుకుంటుంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు తగినంత సమయం ఉన్న వారికి వ్యాల్యూ డిస్కవరీ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల పరంగా ఈ పథకం లార్జ్క్యాప్ స్టాక్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ప్రస్తుతానికి మొత్తం పెట్టుబడుల్లో 92 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించింది. డెట్లో 2 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మిగిలిన మేర నగదు నిల్వలను కలిగి ఉంది. పోర్ట్ఫోలియోలో 69 స్టాక్స్ ఉన్నాయి. 82 శాతం పెట్టుబడులను లార్జ్క్యాప్నకే కేటాయించింది. మిడ్క్యాప్లో 13 శాతం, మిగిలిన మొత్తాన్ని స్మాల్క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇంధనం, ఫైనాన్షియల్, హెల్త్కేర్, ఆటోమొబైల్, కమ్యూనికేషన్ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేయడాన్ని గమినించొచ్చు. ధర్మేష్ కక్కాడ్ ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం సన్ఫార్మా 10.05 భారతీ ఎయిర్టెల్ 6.96 ఎన్టీపీసీ 6.90 ఎంఅండ్ఎం 6.72 ఐటీసీ 5.33 యాక్సిస్బ్యాంకు 5.02 ఓఎన్జీసీ 4.32 హిందాల్కో 4.24 ఇన్ఫోసిస్ 4.08 బీపీసీఎల్ 3.61 చదవండి: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏదీ మంచిది ? -
మ్యూచువల్ ఫండ్లకు అపార అవకాశాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మ్యుచువల్ ఫండ్లు ఇంకా సామాన్య ప్రజానీకానికి పూర్తిస్థాయిలో చేరలేదని, ఈ నేపథ్యంలో ఫండ్స్ విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎండీ, సీఈవో నిమేష్ షా తెలిపారు. పెట్టుబడి సాధనంగా ఫండ్స్పై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా 2018–19 జూన్లో రూ. 7,554 కోట్ల పెట్టుబడులు రాగా, 2020–21 జూన్లో రూ. 9,156 కోట్లు రావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రతి బుల్ మార్కెట్ తరహాలోనే ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు నేరుగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ధోరణులు కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యురోకి ఇచ్చిన ఇంటర్వూ్యలో తెలిపారు. అయితే, మార్కెట్లు బులిష్గా ఉన్నప్పుడు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండని ఇన్వెస్టర్లు ఆ తర్వాత రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని చరిత్ర చెబుతోందన్నారు. సరైన పెట్టుబడి సాధనాలకు తగు పాళ్ళలో నిధులను కేటాయించడం ముఖ్యమని, ఇందుకోసం అవసరమైతే ఆర్థిక సలహాదారు సహాయాన్ని తీసుకోవాలని షా సూచించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రస్తుత మార్కెట్లు.. అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు విడుదల చేసిన నిధుల ఊతంతో ప్రపంచవ్యాప్తంగాను, దేశీయంగాను స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్టాలకు పరుగులు తీస్తున్నాయి. భారీ వేల్యుయేషన్లతో ట్రేడవుతున్నాయి. నిధుల లభ్యతతో పాటు దాదాపు సున్నా స్థాయి వడ్డీపై రుణాలు మొదలైన అంశాలన్నీ ఈక్విటీ మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. వ్యాపార పరిస్థితుల వలయాన్ని బట్టి చూస్తే భారత బిజినెస్ సైకిల్ ఆకర్షణీయంగానే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక వృద్ధి రికవరీ కాస్త మందగించినట్లుగా ఉన్నప్పటికీ దేశీయంగా సానుకూల ఆర్థికాంశాలు, ప్రభుత్వ విధానాలు, రిజర్వ్ బ్యాంక్ ఉదారవాద చర్యలు తదితర అంశాలు వల్ల సరైన దిశలోనే సాగుతోందని చెప్పవచ్చు. వచ్చే రెండేళ్లలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఫండ్స్ విషయంలో ఇన్వెస్టర్లు పాటించాల్సిన వ్యూహం.. అంతర్జాతీయంగా ఈక్విటీలు, కమోడిటీలు సహా రిస్కులతో కూడుకున్న అన్ని పెట్టుబడి సాధనాలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో వ్యాపారాలు కోలుకునే క్రమంలో కార్పొరేట్ల ఆదాయాలు, లాభదాయకత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇటీవల బిజినెస్ సైకిల్ ఆధారిత ఫండ్ను ప్రవేశపెట్టాం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈక్విటీల విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించడం శ్రేయస్కరం. మహమ్మారి పరిణామాలు, అంతర్జాతీయంగా వృద్ధి రికవరీ క్రమంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు తోసిపుచ్చలేము. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లేదా డైనమిక్ అసెట్ అలోకేషన్ కేటగిరీకి చెందిన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఇలాంటి ఫండ్స్ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి ఈక్విటీల్లో పెట్టుబడుల వ్యూహాలను సరిచేసుకుంటూ ఉంటాయి. అటు మార్కెట్ క్యాప్లపరంగా వివిధ కేటగిరీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సిక్యాప్ ఫండ్స్ను కూడా పరిశీలించవచ్చు. వేల్యూ ఇన్వెస్టింగ్ ద్వారా సైతం మంచి రాబడులను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పలు రంగాల్లో సంస్థలు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో లభిస్తున్నాయి. వీటిలో చాలా మటుకు విభాగాలు 2008 తర్వాత పెద్దగా రాణించలేకపోయాయి. ఈక్విటీలో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు .. వేల్యూ ఇన్వెస్టింగ్ విధానం పాటించవచ్చు. అయితే, రికార్డు స్థాయిలో నిధులు వస్తుండటంతో ప్రస్తుతం ధరలు.. వాస్తవిక స్థాయిలో లేవు. సెంట్రల్ బ్యాంకుల చర్యల ప్రభావాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయన్నది తెలియదు కాబట్టి ప్రతీ పెట్టుబడి సాధనానికి ఎంతో కొంత రిస్కు ఉంటుందన్న సంగతి ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. గత సంవత్సరం.. డెట్ సంక్షోభం.. గతేడాది తొలినాళ్లలో డెట్ మార్కెట్లో సంక్షోభమనేది ఒక కంపెనీకి మాత్రమే పరిమితమైన సంఘటన తప్ప వ్యవస్థాగతంగా ఎలాంటి రిస్కులూ తలెత్తలేదు. మా విషయానికొస్తే గత 23 ఏళ్లలో ఎన్నడూ ఏ స్కీములోనూ డిఫాల్ట్ గానీ చెల్లింపుల్లో జాప్యం గానీ జరగలేదు. -
రిస్క్ తక్కువ,.. రాబడి ఎక్కువ...
మన రోజువారి అవసరాలు తీర్చే బహుల జాతి కంపెనీలు (ఎంఎన్సీలు) పెట్టుబడుల విషయంలో.. ఎంతో విశ్వసనీయంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎంఎన్సీ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసే (థీమ్యాటిక్) పథకాలను ఇందుకు ఎంపిక చేసుకోవచ్చు. ఇటువంటి పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్ఎసీ ఫండ్ కూడా ఒకటి. ఈక్విటీల్లో తక్కువ రిస్క్ కోరుకునే వారికి ఎంఎన్సీ పథకాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విధానం.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ ఫండ్ పెట్టుబడుల విషయంలో మూడు రకాల విధానాలను అనుసరిస్తుంటుంది. భారత్కు చెందిన బహుళజాతి సంస్థలు (మన దేశంలో లిస్ట్ అయ్యి విదేశాలకూ వ్యాపార కార్యకలాపాలను విస్తరించిన కంపెనీలు), భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఇక్కడి స్టాక్ ఎక్సేంజ్ల్లో లిస్ట్ అయిన విదేశీ కంపెనీలు, భారత్లో లిస్ట్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను ఈ పథకం పెట్టబడులకు ఎంపిక చేసుకుంటుంది. వినియోగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, పారిశ్రామిక తయారీ, మెటల్స్, ఐటీ, సిమెంట్, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు సంబంధించిన ఎంఎన్సీ కంపెనీలు పోర్ట్ఫోలియోలో భాగంగా ఉంటాయి. బహుళజాతి సంస్థలు కార్పొరేట్ గవర్నెన్స్లో అత్యున్నత ప్రమాణాలను నిర్వహిస్తుంటాయి. నిపుణుల ఆధ్వర్యంలో డైనమిక్గా పనిచేస్తుంటాయి. లాభాల నుంచి వాటాదారులకు ఎక్కువ డివిడెండ్ కూడా పంచుతుంటాయి. కనుక స్థిరమైన రాబడులకు వీటిని మార్గంగా నిపుణులు పరిగణిస్తుంటారు. బలమైన బ్రాండ్, దండిగా నగదు నిల్వలు ఎంఎన్సీ కంపెనీల్లో చూడొచ్చు. అందుకే పరిణతి కలిగిన ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో ఎంఎన్సీ కంపెనీలకు చోటిస్తుంటారు. ఈ తరహా లక్షణాలు ఉండడం వల్ల ఇతర రంగాల థీమ్యాటిక్ పథకాలతో పోలిస్తే ఎంఎన్సీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ తక్కువ అస్థిరతలను ఎదుర్కొంటుంటాయి. సెబీ నిబంధనల మేరరు ఎంఎన్సీ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతం పెట్టుబడులను బహుళజాతి కంపెనీలకే కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్ని ఫండ్ మేనేజర్లు తమ స్వేచ్ఛ మేరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎంఎన్సీ పథకాల్లోనూ సైక్లికల్ (రాబడుల్లో స్థిరత్వం లేని), డిఫెన్సివ్ (స్థిరమైన రాబడులతో రక్షణాత్మకమైనవి) ఉంటాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగాల కంపెనీల్లో స్థిరత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి చూస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ పథకం 20 శాతం పెట్టుబడులను అంతర్జాతీయ ఎంఎన్సీలకు కేటాయించింది. వీటిల్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ పెట్రోలియం కంపెనీలున్నాయి. దేశీయ ఎంఎన్సీ కంపెనీల విషయానికొస్తే.. ఈ పథకం పెట్టుబడుల్లో 61 శాతాన్ని లార్జ్క్యాప్ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత 26.5 శాతం మిడ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్ఫోలియో మొత్తం మీద వైవిధ్యంతో కూడుకుని ఉంది. దేశీయ కంపెనీల్లో కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్, సాఫ్ట్వేర్, ఆటో, పారిశ్రామిక ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ రంగానికి చెందినవి ఉన్నాయి. రాబడులు పెట్టుబడుల విషయంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ ఫండ్ మంచి పనితీరే చూపిస్తోంది. ఈ పథకానికి దీర్ఘకాల రాబడుల చరిత్ర లేదు. ఎందుకంటే 2019 జూన్లో ప్రారంభమైంది. నాటి నుంచి చూస్తే వార్షిక రాబడులు 28 శాతంగా ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 62 శాతం రాబడులను ఇచ్చింది. మెరుగైన రాబడులుగానే వీటిని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బెంచ్మార్క్తో పోల్చి చూసినా లేక ఎంఎన్సీ థీమ్యాటిక్ విభాగం రాబడులతో చూసినా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ రాబడులు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. -
ఫండ్ రివ్యూ: పెట్టుబడుల్లో పూర్తి వైవిధ్యం
గుడ్లు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే బాస్కెట్లో పెట్టేయరాదన్నది పెట్టుబడులకు సంబంధించి ఒక ప్రాథమిక సూత్రం. ఉదాహరణకు పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి పూర్తిగా డెట్ సాధనాల్లోనో లేక ఈక్విటీల్లోనో లేక బంగారంలోనో లేక రియల్ ఎస్టేట్పైనో ఇన్వెస్ట్ చేయరాదన్నది ఇందులోని సూత్రం. ఇలా ఒకే విభాగంలో మొత్తం పెట్టుబడులను పెట్టేయడం వల్ల రిస్క్ పాళ్లు చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఆయా విభాగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో నిధుల అవసరం ఏర్పడిందనుకోండి.. పెట్టుబడులపై రాబడులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వైవిధ్యం అన్నది పెట్టుబడులకు ప్రాణం వంటిది. మల్టీ అస్సెట్ ఫండ్స్ అన్నవి ఇన్వెస్టర్లకు పెట్టుబడుల పరంగా వైవిధ్యాన్ని కల్పిస్తాయి. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ కూడా ఒకటి. మ్యూచువల్ ఫండ్స్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఎస్.నరేన్ ఈ ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. పెట్టుబడుల విధానం.. మల్టీ అస్సెట్ ఫండ్స్ అన్నవి నిబంధనల ప్రకారం ఈక్విటీలకు 10 శాతం నుంచి 80 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులు, స్టాక్స్ వ్యాల్యూషన్లను బట్టి ఈ కేటాయింపులను ఫండ్ మేనేజర్లు నిర్ణయిస్తుంటారు. ఉదాహరణకు ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురయ్యి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయనుకుంటే గరిష్టంగా 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయింపులు చేయవచ్చు. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్లు ఎంతో ఖరీదైన వ్యాల్యూషన్లకు చేరాయని భావించిన సందర్భంలో ఈక్విటీలకు కేటాయింపులను కనిష్టంగా 10 శాతానికి వరకూ తగ్గించుకునే వెసులుబాటు ఈ పథకాల్లో ఉంటుంది. అలాగే, డెట్ సాధనాలకు 10 నుంచి 35 శాతం మధ్య, బంగారం ఈటీఎఫ్లకు 10 శాతం నుంచి 35 శాతం మధ్య కేటాయింపులు చేయడం పెట్టుబడుల విధానంలో భాగంగా ఉంటుంది. అదే సమయంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లలోనూ గరిష్టంగా 10 శాతం వరకు కేటాయింపులు చేస్తుంటాయి. ముఖ్యంగా ఈక్విటీ, డెట్, బంగారం సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఈ పథకాల రూపంలో లభిస్తుంది. ప్రస్తుతానికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ ఈక్విటీల్లో 87 శాతం, డెట్ సాధనాల్లో 9 శాతం, బంగారంలో 3.9 శాతం చొప్పున పెట్టుబడులను కలిగి ఉంది. రాబడులు మల్టీ అస్సెట్ ఫండ్ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 44 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ కేటాయింపులు కూడా ఉన్నాయి కనుక ఏడాది రాబడులను అంత ముఖ్యంగా పరిగణించరాదు. కనీసం ఐదేళ్లు అంతకు మించిన కాలంలో పనితీరును పరిశీలించాలి. మూడేళ్లలో ఈ పథకం వార్షికంగా 10 శాతం రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో 14 శాతం, ఏడేళ్లలోనూ 14 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. ఈక్విటీతో కూడిన పథకం కనుక దీర్ఘకాలంలో 12 శాతం అంతకుమించి వార్షిక రాబడులను ఇస్తున్నట్టయితే మెరుగైన పనితీరుగా భావించొచ్చు. 2002 అక్టోబర్లో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి చూస్తే ఒక యూనిట్ నికర అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) 34 రెట్లు వృద్ధి చెందింది. ఆరంభం నుంచి చూస్తే వార్షిక రాబడులు 14 శాతానికి పైనే ఉన్నాయి. గడిచి ఏడాది కాలంలో ఈక్విటీ మార్కెట్లు భారీగా ర్యాలీ చేయడం తెలిసిందే. ఈ విధంగా చూస్తే నూరు శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలతో పోలిస్తే ఈ పథకం మెరుగైన ఎంపికే అవుతుంది. -
జీవిత బీమా షేర్లు ప్లస్సూ.. మైనస్సూ!
కోవిడ్-19 నేపథ్యంలోనూ జూన్లో కొత్త బిజినెస్ ప్రీమియం(ఎన్బీపీ)లపై పెద్దగా ప్రతికూల ప్రభావం కనిపించకపోవడంతో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఏప్రిల్- మే నెలల స్థాయిలోనే ఎన్బీపీలు క్షీణించడంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్లో మాత్రం అమ్మకాలు తలెత్తాయి. ఇతర వివరాలు చూద్దాం.. రికవరీ బాట కరోనా వైరస్ సవాళ్ల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్లో జీవిత బీమా కంపెనీల ఎన్బీపీలు వార్షిక ప్రాతిపదికన 32.6 శాతం క్షీణించాయి. మే నెలలోనూ 25.4 శాతం వెనకడుగు వేయగా.. జూన్లో 10.5 శాతమే తగ్గాయి. వెరసి జూన్లో జీవిత బీమా కంపెనీల మొత్తం ఎన్బీపీలు రూ. 28,869 కోట్లను తాకాయి. లాభాలలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 2.2 శాతం లాభంతో రూ. 858 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 872 వరకూ జంప్చేసింది. ఈ బాటలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 1.3 శాతం బలపడి రూ. 593 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 600 వరకూ జంప్చేసింది. నేలచూపు.. జూన్లో ఎన్బీపీలు 37 శాతం క్షీణించి రూ. 565 కోట్లను తాకినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇవి 32.6 శాతం తక్కువగా రూ. 1499 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ ప్రు లైఫ్ షేరు 3.5 శాతం పతనమై రూ. 418 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 416 వరకూ నీరసించింది. -
ఇన్ఫో ఎడ్జ్- ఐసీఐసీఐ ప్రు లైఫ్.. జోరు
దేశీయంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 164 పాయింట్లు పుంజుకుని 35,075కు చేరింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 35,000 పాయింట్ల మైలురాయి ఎగువన కదులుతోంది. ఇక నిఫ్టీ 55 పాయింట్లు బలపడి 10,386 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఆన్లైన్ క్లాసిఫైడ్ సేవల కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్, బీమా రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ప్రస్తావించదగ్గ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇన్ఫో ఎడ్జ్ ఇండియా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు ఆన్లైన్ క్లాసిఫైడ్ సేవల కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా పేర్కొంది. తద్వారా రూ. 1,875 కోట్లవరకూ సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వాటాదారుల నుంచి ఈవోటింగ్ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది(2019-20) క్యూ4లో కంపెనీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 63 శాతం క్షీణించి రూ. 119 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం పెరిగి రూ. 327 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇన్ఫో ఎడ్జ్ షేరు 5 శాతం జంప్చేసి రూ. 2,907 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2962 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లో 1.5 శాతం వాటాకు సమానమైన 21.5 మిలియన్ షేర్లను సోమవారం మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ విక్రయించింది. తద్వారా సమకూర్చకున్న రూ. 840 కోట్లను బ్యాలన్స్షీట్ను పటిష్టపరచుకునేందుకు వినియోగించనుంది. కాగా.. ప్రయివేట్ రంగ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్లో 1.14 శాతం వాటాను సింగపూర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ. 391.6 ధరలో 16.43 మిలియన్ షేర్లను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేరు 3 శాతం జంప్చేసి రూ. 419 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 424 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. వెరసి రెండు రోజుల్లో ఈ షేరు 7 శాతం బలపడింది. -
ఐబీ హౌసింగ్- ఐసీఐసీఐ.. స్పీడ్
ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎన్బీఎఫ్సీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్కు మరోసారి భారీ డిమాండ్ కనిపిస్తోంది. గత వారాంతాన ఎఫ్పీఐలు కంపెనీలో వాటా కొనుగోలు చేసిన వార్తలు ఈ కౌంటర్కు జోష్నిస్తుంటే.. బీమా అనుబంధ విభాగంలో వాటా విక్రయ వార్తలతో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం.. ఐబీ హౌసింగ్ బల్క్ డీల్ ద్వారా గత వారాంతాన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో విదేశీ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) 1.05 శాతం వాటాకు సమానమైన దాదాపు 45.23 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. షేరుకి రూ. 184.76 సగటు ధరలో వీటిని కొనుగోలు చేయగా.. యూకే సంస్థ బ్లాక్రాక్ అడ్వయిజర్స్కు చెందిన ఐషేర్స్ 1.66 శాతం వాటాను రెండు ఈటీఎఫ్ల ద్వారా కొనుగోలు చేసింది. ఐబీ హౌసింగ్లో ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ UCITS 25.69 లక్షల షేర్లు, ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ 45.59 లక్షల షేర్లను.. షేరుకి 189.51 సగటు ధరలో సొంతం చేసుకున్నాయి. షేరు దూకుడు విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) వాటా కొనుగోలు వార్తలతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐబీ హౌసింగ్ షేరు 21 శాతం దూసుకెళ్లి రూ. 246 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 254 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమానం 2.9 కోట్ల షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా 5.24 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఎఫ్పీఐల వాటా కొనుగోలు వార్తలతో శుక్రవారం సైతం ఐబీ హౌసింగ్ కౌంటర్లో భారీ ట్రేడింగ్ నమోదైంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ. 202 ఎగువన ముగిసింది. ఈ నెల 26 నుంచీ ఐబీ హౌసింగ్ షేరు నిఫ్టీ మిడ్క్యాప్-100 ఇండెక్స్లో చోటు దక్కించుకోనుంది. గత మూడు నెలల్లో ఈ షేరు ఏకంగా 160 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఐసీఐసీఐ బ్యాంక్ బీమా అనుబంధ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్లో 1.5 శాతం వాటాను విక్రయించినట్లు మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. తద్వారా సుమారు రూ. 840 కోట్లను సమీకరించినట్లు తెలియజేసింది. దీంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్లో బ్యాంక్ వాటా 51.4 శాతానికి పరిమితమైనట్లు పేర్కొంది. ఇక మరో అనుబంధ సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్లోనూ 3.96 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 2250 కోట్లను సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 371 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 375 వరకూ పెరిగింది. వెరసి వరుసగా మూడో రోజు లాభాలతో కదులుతోంది. కాగా.. మరోపక్క ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేరు సైతం 4 శాతం జంప్చేసి రూ. 406 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 419 వరకూ ఎగసింది. ఐసీఐసీఐ లంబార్డ్ షేరు 0.5 శాతం పుంజుకుని రూ. 1277 వద్ద కదులుతోంది. -
అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడుల కోసం
మన మార్కెట్లతో పోలిస్తే అమెరికా స్టాక్ మార్కెట్లలో పరిపక్వత ఎక్కువ. అలాగే అస్థిరతలు కొంచెం తక్కువ. ప్రపంచంలో ఆర్థికంగా బలీయమైన స్థానంలో ఉన్న అమెరికాలోని స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయమే అవుతుంది. పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. ఆ విధంగా చూసినా అమెరికా ఈక్విటీలకు కొంత పెట్టుబడులు కేటాయించుకోవడం మంచిది. ఇలా అమెరికా స్టాక్ ఎక్సేంజ్ల్లోని లిస్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్న ఫండ్స్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం సూచనీయం కాదు. ఈక్విటీ, డెట్ రెండు రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు వర్గీకరించుకోవడం వైవిధ్యం అవుతుంది. ఇది రిస్క్ను తగ్గిస్తుంది. ఇక ఈక్విటీల్లోనూ వైవిధ్యం కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ వీలు కల్పిస్తుంది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి మన ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి బదులు, కొంత మేర అమెరికా స్టాక్స్కూ కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే గత రెండేళ్లుగా మన స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు బాగా పెరిగాయి. ఈ సమయంలో కేవలం ఎంపిక చేసిన బ్లూచిప్ స్టాక్స్ మాత్రమే ర్యాలీ చేశాయి. కానీ, ఇదే కాలంలో అమెరికా స్టాక్స్ మంచి పనితీరు ప్రదర్శించాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడుల విధానం.. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇవ్వడమనే విధానంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పథకం తన పెట్టుబడులను అమెరికా స్టాక్ ఎక్సేంజ్ల్లో లిస్టెడ్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే, భారత్, ఇతర విదేశీ కంపెనీలు జారీ చేసే ఏడీఆర్, జీడీఆర్లలోనూ పెట్టుబడులు పెడుతుంది. అందులోనూ లార్జ్ క్యాప్ కంపెనీలకే పెట్టుబడులను పరిమితం చేస్తుంది. ప్రస్తుతం ఈ పథకం తన దగ్గరున్న నిధుల్లో 95.1 శాతం మేర స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉంది. ఇక ఈక్విటీ మొత్తం పెట్టుబడుల్లో 94 శాతం మెగాక్యాప్, 6 శాతం లార్జ్క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది. మనదేశంలో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అధిక శాతం (సెక్టార్ ఫండ్స్ కాకుండా) బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్కే అగ్ర ప్రాధాన్యం ఇస్తాయి. కానీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ అమెరికా స్టాక్స్లో హెల్త్కేర్ రంగానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగానికి చెందిన కంపెనీల్లో 25% ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత 18% పెట్టుబడులను టెక్నాలజీ కంపెనీల్లో, 12% ఎఫ్ఎంసీజీలకు కేటాయించగా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 7 శాతం కేటాయింపులు చేసింది. రాబడులు ఆరంభం నుంచి ఆకర్షణీయంగానే ఉంది. ఏడాది కాలంలో 9.71% రాబడులను ఇచ్చింది. గడిచిన మూడేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడులు 12.52 శాతం. ఐదేళ్లలో 11.54%, ఏడేళ్లలో 15.35% చొప్పున వార్షిక రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఇన్వెస్టర్లు కనీసం ఐదేళ్లు, అంతకంటే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు, ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. అప్పుడే ఆశించిన రాబడులకు అవకాశం ఉంటుంది. లార్జ్క్యాప్ ఫండ్ కనుక సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకాస్త మెరుగైన రాబడులకు వీలుంటుంది. -
బాండ్లలో స్థిరమైన రాబడులు
దేశ జీడీపీ వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు చేరింది. అదే సమయంలో ప్రభుత్వానికి పన్నుల ఆదాయం తగ్గడం ద్రవ్యలోటుపై భారాన్ని మోపేదే. ఇదంతా బాండ్ మార్కెట్పై ప్రతిఫలిస్తుంది. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ బాండ్ల పరంగా అధిక సరఫరా నెలకొనే పరిస్థితులు ఉన్నాయని అంచనా. అంటే ప్రభుత్వం అధికంగా రుణ సమీకరణ చేస్తే అది బాండ్ మార్కెట్పై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ద్రవ్యలోటు అంచనాలను మించే అవకాశాలు, అలాగే, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం బాండ్ ఈల్డ్స్ను నిర్ణయించనున్నాయి. స్వల్పకాల బాండ్లలో ర్యాలీ నెలకొనే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో దీర్ఘకాల గిల్డ్ ఫండ్స్ తీసుకోవడం కొంత రిస్కే అవుతుంది. కనుక ఈ విధమైన పరిస్థితుల్లో అన్ని రకాల కాల వ్యవధులు కలిగిన బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డైనమిక్ బాండ్ ఫండ్స్ను పెట్టుబడులకు పరిశీలించడం అనుకూలం అవుతుంది. మార్కెట్లలో రేట్లకు అనుగుణంగా డైనమిక్ బాండ్ ఫండ్స్ మేనేజర్లు తమ పోర్ట్ఫోలియోలోని బాండ్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛతో ఉంటారు. కనుక ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్సీజన్స్ బాండ్ ఫండ్ను పరిశీలించొచ్చు. పనితీరు..: డైనమిక్ బాండ్స్ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్సీజన్స్ బాండ్ పథకం నిలకడైన పనితీరు చూపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో పెట్టుబడులపై రాబడులు 10.4 శాతం. కానీ, ఈ కాలంలో ఈ విభాగం సగటు రాబడులు 7.8 శాతమే. అలాగే, మూడేళ్లలో వార్షిక రాబడులు 6.9 శాతంగా ఉంటే, ఐదేళ్లలో సగటు వార్షిక రాబడులు 8.8 శాతంగా ఉండడం బాండ్లలో మెరుగైన పనితీరుగానే చూడాల్సి ఉంటుంది. మూడేళ్లలో డైనమిక్ బాండ్స్ విభాగం సగటు వార్షిక రాబడులు 5.1 శాతం, ఐదేళ్ల కాలంలో 7.1 శాతంతో పోలిస్తే ఈ పథకం పనితీరు బాగానే ఉంది. కొంత రిస్క్ తీసుకునే సామర్థ్యం కలిగిన వారికి మంచి ఫండ్. పెట్టుబడుల విధానం.. డిసెంబర్లో ఆర్బీఐ ఎంపీసీ విధాన ప్రకటన తర్వాత పదేళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ వేగంగా పెరిగాయి. 30 బేసిస్ పాయింట్ల వరకు పెరిగి 6.7–6.8 శాతాన్ని చేరాయి. కానీ, ఆర్బీఐ ట్విస్ట్, ఓఎంవో చర్యలతో మళ్లీ ఈల్డ్స్ తగ్గాయి. అయితే, దీర్ఘకాలిక బాండ్ ఈల్డ్స్ మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా. సాధారణంగా దీర్ఘకాలిక బాండ్లు వడ్డీ రేట్ల పరంగా సున్నితంగా ఉంటాయి. కనుక అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అనుకూలమైన కాలానికి బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డైనమిక్ బాండ్ ఫండ్స్ను ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. -
అవకాశం ఎక్కడ ఉన్నా అందిపుచ్చుకోవడమే..!
లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగంలో వృద్ధి, లాభాలకు అవకాశం ఉన్న స్టాక్స్ల్లో ఇన్వెస్ట్ చేసేవే మల్టీక్యాప్ ఫండ్స్. విడిగా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్తో పోలిస్తే మల్టీక్యాప్ ఫండ్స్లో రిస్క్ తక్కువ. అదే సమయంలో అచ్చమైన లార్జ్క్యాప్ ఫండ్స్తో పోలిస్తే మల్టీక్యాప్ ఫండ్స్లో అస్థిరతలు ఎక్కువ. గత ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో లార్జ్క్యాప్ స్టాక్స్లోనే రాబడులు ఉన్నాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగాల్లో అధిక శాతం స్టాక్స్ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. త్వరలో ఈ విభాగంలోని స్టాక్స్ కూడా ర్యాలీ చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనుక లార్జ్క్యాప్కే పరిమితం కాకుండా, మార్కెట్ వ్యాప్తంగా పెట్టుబడుల అవకాశాలను గుర్తించి ఇన్వెస్ట్ చేసే మల్టీక్యాప్ ఫండ్స్ను ఎంచుకోవడం మంచి ఆలోచన అవుతుంది. అందులోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ కూడా ఒకటి. రాబడులు..: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ పథకానికి మార్కెట్లో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1994 అక్టోబర్లో ఈ పథకం ఆరంభమైంది. నాటి నుంచి నేటి వరకు వార్షికంగా 14.43 కాంపౌండెడ్ రాబడులను (సీఏజీఆర్) ఈ పథకం అందించింది. ఇదే కాలంలో నిఫ్టీ–50 వృద్ధి 10.36 శాతమే. గత 15 ఏళ్లుగా ఈ ఫండ్లో ప్రతీ నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇన్వెస్టర్లకు రూ.51.6 లక్షలు సమకూరేది. ప్రతీ నెలా రూ.10వేల చొప్పున గత మూడేళ్లలో మొత్తం రూ.3.6 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే, అదిప్పుడు రూ.3.9 లక్షలుగా ఉండేది. అంటే సీఏజీఆర్ రాబడులు 6.1 శాతమే. అదే గత ఐదేళ్లలో ప్రతీనెలా రూ.10వేల చొప్పున పెట్టుబడి పెడితే రూ.7.4 లక్షలు అయ్యేది. ఇక్కడ సీఏజీఆర్ రాబడులు 8.5 శాతం. ఇక గత పదేళ్ల కాలంలో ప్రతీ నెలా రూ.10వేల పెట్టుబడి పెట్టి ఉంటే రూ.23 లక్షలు సమకూరేవి. ఇక్కడ సీఏజీఆర్ రాబడులు 12.5 శాతం. అంటే దీర్ఘకాలంలో ఈ పథకం స్థిరమైన, మెరుగైన రాబడులను ఇచ్చినట్టు చెప్పుకోవాలి. కనుక మార్కెట్లలో అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని, ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం అయితే దీన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం టాప్ డౌన్, బోటమ్ అప్ ఈ రెండు విధానాలను రంగాల వారీ, స్టాక్ వారీ ఎంపికకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ మేనేజర్ అనుసరిస్తున్నారు. ఇందులో టాప్ డౌన్ అంటే, స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక రంగంలో పరిణామాలు, అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ ధోరణులను పరిగణనలోకి తీసుకుని అనువైన రంగాలను పెట్టుబడులకు ఎంచుకోవడం. అదే బోటమ్ అప్ అంటే.. విడిగా కంపెనీలను, వాటి వృద్ధి అవకాశాలు, స్టాక్ వ్యాల్యూషన్ల ఆధారంగా పెట్టుబడులకు ఎంపిక చేసుకోవడం. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్ఫోలియోలో 78 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్క్యాప్లో 71 శాతం, మిగిలిన మేర మిడ్, స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 26 శాతం పెట్టుబడులను ఈ రంగం స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసింది. -
ఐసీఐసీఐ లైఫ్తో ఎయిర్టెల్ బ్యాంక్ జట్టు
ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఐసీఐసీఐ ప్రూ లైఫ్ జీవిత బీమా పాలసీలతో పాటు ఇతరత్రా పొదుపు పథకాలను కూడా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు సులభతరంగా పొందేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. చౌక ప్రీమియంలతో మెరుగైన పథకాలను అందించడం, టెక్నాలజీని వినియోగించుకుని కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడంపై దృష్టి పెడుతున్నట్లు ఐసీఐసీఐ ప్రూ లైఫ్ ఎండీ ఎన్ఎస్ కణ్ణన్ తెలిపారు. -
వైవిధ్యమైన పెట్టుబడుల కోసం...
గడిచిన ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలంలో మార్కెట్లు తీవ్ర అస్థిరతలను ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితి మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం లేకపోలేదు. దీంతో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల విషయమై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ అస్థిరతలు దీర్ఘకాలంలో సంపద సృష్టికి దారితీసేవే అయినప్పటికీ, స్వల్ప కాలంలో ఎదురయ్యే నష్టాలు ఇబ్బందే. రిస్క్కు విముఖంగా ఉండే ఇన్వెస్టర్లు, అదే సమయంలో మంచి రాబడులు కోరుకునే వారు మల్టీ అస్సెట్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ రిస్క్ను అధిగమించి మరీ దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపించింది. పెట్టుబడుల విధానం...: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ అన్నది ఓపెన్ ఎండెడ్ పథకం. భిన్న రకాల సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రధానంగా ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించడం, అలాగే, డెట్, బంగారం వంటి ఇతర సాధనాల్లోనూ పెట్టుబడులతో స్థిరమైన ఆదాయం కల్పించే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. వైవిధ్యమైన అస్సెట్ క్లాసెస్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ పథకం అనుకూలం. ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 65% వరకు, డెట్, గోల్డ్/గోల్డ్ ఈటీఎఫ్లో 10–35% వరకు, రీట్, ఇన్విట్ వంటి సాధనాల్లో 0–10% వరకు ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. శంకరన్ నరేన్ 2012 ఫిబ్రవరి నుంచి ఈ పథకానికి ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు 2006 సెప్టెంబర్ నుంచి 2011 ఫిబ్రవరి వరకు కూడా ఆయన ఈ పథకం నిర్వహణను చూశారు. ఆయనకు మొత్తం 29 ఏళ్ల అనుభవం ఉంది. ఇహబ్ దల్వాయి, అనుజ్ తగ్రా సైతం ఈ పథకానికి ఫండ్ మేనేజర్లుగా ఉన్నారు. ఈక్విటీలో పెట్టుబడులు అధిక రాబడుల సాధనకు, డెట్, బంగారం ఇతర సాధనాల్లో పెట్టుబడులు రిస్క్ బ్యాలన్స్తోపాటు స్థిరమైన రాబడులకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తాయి. ప్రస్తుతం ఈ పథకం ఈక్విటీలో 66.24% వరకు పెట్టుబడులు పెట్టి ఉంది. ఫ్లెక్సీ క్యాప్ విధానాన్ని ఈక్విటీ పెట్టుబడులకు అనుసరిస్తుంది. అంటే అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి అన్ని మార్కెట్ క్యాప్ విభాగాల్లోనూ స్టాక్స్ను ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసుకుంటుంటారు. ఈ పథకం డెట్ విభాగంలో 15.66%, బంగారం, ఇత ర కమోడిటీల్లో 12.82% ఇన్వెస్ట్ చేయగా, నగదు, నగదు సమానాలు 5.28% వరకు ఉ న్నాయి. ఈ పథకం ఇంధనం, బ్యాంకింగ్ ఫైనాన్షియల్, మెటల్స్ స్టాక్స్లో ఎక్కువ వెయిటేజీ ఉంది. పనితీరు..: ఈ పథకం నిర్వహణలో రూ.11,060 కోట్ల ఆస్తులు జూలై చివరి నాటికి ఉన్నాయి. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ బెంచ్ మార్క్తో చూసుకుంటే మంచి పనితీరు చూపించింది. ఈ పథకం ఆరంభం నుంచి చూసుకుంటే సగటున 21.96% వార్షిక రాబడులిచ్చింది. అదే కాలంలో బెంచ్ మార్క్ ఇండెక్స్ రాబడులు 17.90%. ఈ పథకం ఆరంభమైన 2002 అక్టోబర్ 31 నుంచి నుంచి ప్రతీ నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వచ్చినట్టయితే ఈ ఏడాది జూన్ చివరికి రూ.97.62 లక్షలు సమకూరేది. ఇందులో పెట్టుబడి రూ.19.9 లక్షలు. ఈ పథకానికి మంచి డివిడెండ్ చరిత్ర కూడా ఉంది. ప్రతీ నెలా డివిడెండ్ చెల్లిస్తూనే ఉంది. మల్టీ అస్సెట్ ఫండ్ విభాగంలో పోటీ పథకాలైన యూటనై మల్టీ అస్సెట్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మల్టీ అస్సెట్ ఫండ్, యాక్సిస్ ట్రిపుల్ అడ్వాంటేజ్ ఫండ్, ఎస్బీఐ మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్ కంటే కూడా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ పథకమే మూడు, ఐదు, పదేళ్లు, ఆరంభం నుంచి అధిక రాబడులను ఇచ్చినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. గమనిక: ఈ పథకం తమకు అనుకూలంగా ఉంటుందా, లేదా అన్నది ఇన్వెస్టర్లు తమ ఫైనాన్షియల్ సలహాదారును సంప్రదించి తెలుసుకోవాలి. -
రాబడుల్లో ‘డైనమిక్’..
లాంగ్ డ్యూరేషన్ గిల్ట్ ఫండ్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు మంచి ర్యాలీ చేశాయి. పదేళ్ల జీసెక్ ఈల్డ్స్ 80–90 బేసిస్ పాయింట్ల మేర పడిపోవడం గిల్ట్ ఫండ్స్ రాబడులకు దారితీసింది. అయితే, జూలై నెలలో 60 బేసిస్ పాయింట్ల వరకు ర్యాలీ చేసిన తర్వాత గత వారంలో పదేళ్ల జీసెక్ ఈల్డ్స్ తిరిగి స్వల్పంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు పై నెలకొన్న ఆందోళనలే ఇందుకు కారణం. ఆర్బీ ఐ ఇటీవలే రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం గిల్ట్ ఫండ్స్కు అనుకూలించేదే. ఎన్నో అంశాలు బాండ్ మార్కెట్పై ప్రభావం చూపిస్తుంటాయి. కనుక వీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు నిజంగా ఓ టాస్క్ అనుకోవాలి. మోస్తరు రిస్క్ తీసుకునేవారు, బాండ్ ధరల ర్యాలీని సొమ్ము చేసుకోవాలనుకునే వారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ తరహా డైనమిక్ బాండ్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. పనితీరు..: డైనమిక్ బాండ్ ఫండ్స్ వివిధ కాల వ్యవధులతో కూడిన బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. దీని ద్వారా వడ్డీ రేట్లలో మార్పుల ప్రభావాన్ని ఇవి అధిగమించగలవు. రేట్ల మార్పుల అంచనాల ఆధారంగా ఫండ్ మేనేజర్లు ఒకే కాల వ్యవధితో కూడిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. డైనమిక్ బాండ్ ఫండ్స్ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ పథకం అన్ని రకాల మార్కెట్ పరిస్థితుల్లోనూ స్థిరమైన రాబడులను ఇచ్చిన చరిత్ర కలిగి ఉంది. ఈ పథకం ఏడాది కాలంలో 9.9 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 7.8 శాతం, ఐదేళ్లలో 10 శాతం వార్షిక సగటు రాబడులను ఇచ్చింది. కానీ, డైనమిక్ బాండ్ ఫండ్స్ విభాగం సగటు రాబడులు ఏడాది కాలంలో 9.3 శాతం, మూడేళ్లలో 6.3%, ఐదేళ్లలో 8.3%గా ఉన్నాయి. ఈ విభాగంతో పోలిస్తే ఒక శాతం అధికం గా ఈ పథకం రాబడులను ఇచ్చినట్టు తెలుస్తోంది. పెట్టుబడుల విధానం..: ముఖ్యంగా 2014–16 మధ్య కాలంలో ఈ పథకం 16–19% వరకు రాబడులను ఇవ్వడం గమనార్హం. ఇక 2017లో బాండ్ మార్కెట్కు ప్రతికూలంగా ఉన్న ఏడాదిలో ఈ పథకం 5 శాతం రాబడులను ఇచ్చింది. దీర్ఘకాలిక గిల్ట్ ఫండ్స్ సైతం ఈ కాలంలో కేవలం 2–3 శాతమే రాబడులను ఇచ్చాయి. బాండ్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ పోర్ట్ఫోలియోలో చేసే మార్పులే ఈ పథకం రాబడులు గొప్పగా ఉండేందుకు తోడ్పడుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధరలు తగ్గుతాయి. అదే విధంగా వడ్డీ రేట్లు పడిపోతే బాండ్ ధరలు పెరుగుతాయి. వడ్డీ రేట్లు, బాండ్ల ధరలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. గత మూడు సంవత్సరాల్లో ఈ పథకం పెట్టుబడులను గమనిస్తే ఏడాది నుంచి 13 ఏళ్ల కాల మెచ్యూరిటీతో కూడుకుని ఉండడం గమనార్హం. ప్రస్తుత ఈ పథకం పెట్టబడుల్లో 37 శాతం వరకు ఏఏఏ, వీటికి సమానమైన రేటింగ్ పథకాల్లో, 41 శాతం వరకు ఏఏ రేటింగ్ పథకాల్లో ఉన్నాయి. 19.6% వరకు సార్వభౌమ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసింది. -
ఈక్విటీల్లో పెట్టుబడులు... అయినా రిస్క్ తక్కువే!
ఈక్విటీల్లో కొంత ఇన్వెస్ట్ చేయాలి, అదే సమయంలో పెట్టుబడులకు రిస్క్ కొంత తక్కువగా ఉండాలని ఆశించే వారు ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ సేవింగ్స్ పథకం రాబడుల విషయంలో మెరుగ్గా ఉంది. ఈక్విటీ, డెట్తోపాటు, ఆర్బిట్రేజ్ అవకాశాల్లోనూ ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంటుంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ ఇ¯Œ కమ్ పేరుతో ఈ పథకం కొనసాగింది. రాబడులు..: ఈ పథకం 2014లో ఆరంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే మంచి రాబడులను ఇచ్చింది. ఈక్విటీ సేవింగ్స్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు ఈ పథకంలో రాబడులు ఎక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ పథకం 8.5 శాతం, రెండేళ్లలో వార్షికంగా 6.8 శాతం, మూడేళ్లలో వార్షికంగా 9.2 శాతం చొప్పున ప్రతిఫలాన్నిచ్చింది. ఈ విభాగం సగటు రాబడులు ఏడాదిలో 5.2 శాతం, రెండేళ్లలో 5.1 శాతం, మూడేళ్లలో 7.4 శాతంగానే ఉన్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలి, అదే సమయంలో రిస్క్ తక్కువగా ఉండాలనుకునే వారికి ఈక్విటీ సేవింగ్స్ పథకాలు అనుకూలంగా ఉంటాయి. రిస్క్ ఆధారిత రాబడుల విషయంలో ఈ విభాగం అటు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, ఇటు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్కు మధ్యస్థంగా ఉంటాయి. ఈ పథకం ఈక్విటీ, ఈక్విటీ ఆర్బిట్రేజ్కు కనీసం 65 శాతం కేటాయింపులు చేస్తుంది. పన్ను పరంగా ఈక్విటీ ఆర్బిట్రేజ్ పెట్టుబడులు కూడా ఈక్విటీగానే పరిగణించబడతాయి. డివిడెండ్, మూలధన లాభాలపై పన్ను ఉంటుంది. ఇన్వెస్టర్ల లక్ష్యాలను బట్టి కనీసం మూడేళ్లు, అంతకు మించిన కాలానికి ఈ పథకాలను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం..: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ సేవింగ్స్ పథకం ఈక్విటీలకు 15–50 శాతం వరకు పెట్టుబడులను కేటాయిస్తుంది. డెట్కు 10–35 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి 25–75 శాతం మధ్య ఆర్బిట్రేజ్ వ్యూహాలకు కేటాయించడం ద్వారా రాబడులు పొందే ప్రయత్నం కూడా చేస్తుంటుంది. ఈక్విటీ డెరివేటివ్స్లో హెడ్జ్ పొజిషన్ల ద్వారా రాబడులపై అస్థిరతలను తగ్గించడంతోపాటు, కొంచెం అదనపు రాబడులను ఇచ్చే వ్యూహం ఈ పథకంలో గమనించొచ్చు. 43 శాతం పెట్టుబడులను ఈక్విటీ హెడ్జ్ పొజిషన్ల కోసం, 24 శాతం పెట్టుబడులను పూర్తిగా ఈక్విటీ ఎక్స్పోజర్ రూపంలో నిర్వహిస్తుంటుంది. మల్టీక్యాప్ విధానంలో, ఎక్కువగా లార్జ్క్యాప్కు ప్రాధాన్యం ఇస్తుంది. ఈక్విటీల కోసం చేసిన మొత్తం కేటాయింపుల్లో 83 శాతం లార్జ్క్యాప్లోనే ఉండగా, మిడ్క్యాప్లో 10 శాతం, స్మాల్క్యాప్లో 7 శాతం చొప్పున ఉన్నాయి. అస్థిరతల మార్కెట్లలో లార్జ్క్యాప్ కంపెనీలు కొంచెం స్థిరంగా, సౌకర్యంగా ఉంటాయని తెలిసిందే. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇంధన రంగ స్టాక్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని గమనించొచ్చు. -
ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్
ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి ముందు లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ తదితర ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్ విలువ ఆధారంగా ప్రత్యేకించి చిన్న, మధ్య, పెద్ద సైజు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలు. లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే... మధ్య, చిన్న స్థాయి కంపెనీలకు దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారు వీటిల్లో ఏ కంపెనీ అని ఎంపిక చేసుకోవాలి...? ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఎదురయ్యే సందేహం ఇదే. ఇటువంటి వారికి మల్టీక్యాప్ పథకాలు అనువుగా ఉంటాయి. ఇవి ఒకే తరహా మార్కెట్ సైజు కలిగిన కంపెనీల్లో కాకుండా, లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో మంచి వృద్ధి, రాబడులకు అవకాశాలున్న కంపెనీలను పెట్టుబడులకు ఎంచుకుంటాయి. తద్వారా దీర్ఘకాలంలో మార్కెట్లను మించి రాబడులను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ మల్టీక్యాప్ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ పథకం మంచి పనితీరు చూపించిన వాటిల్లో ఒకటి. రాబడులు..: బెంచ్ మార్క్ సూచీతో పోలిస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ ఒక్క మూడేళ్ల కాలంలో మినహా... ఏడాది, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్ల కాల రాబడుల్లో ముందుంది. ప్రతీ నెలా రూ.15,000ను సిప్ రూపంలో 15 ఏళ్ల పాటు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే నేడు రూ.56.4 లక్షలు సమకూరేది. ఇందులో అసలు పెట్టుబడి రూ.18 లక్షలు. ఏటా 14 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు ఇది. కానీ, ఇదే కాలంలో ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా చూసే బీఎస్ఈ 500 టీఆర్ఐ కాంపౌండెడ్గా ఇచ్చిన వార్షిక రాబడి 14 శాతంగానే ఉంది. ఈ పథకం ఏడాదిలో 5.38 శాతం రాబడులు ఇవ్వగా, మూడేళ్లలో 9.60 శాతం, ఐదేళ్లలో 10.98 శాతం, పదేళ్లలో 13.44 శాతం వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. బీఎస్ఈ 500 టీఆర్ఐ రాబడులు ఏడాదిలో 1.75 శాతం, మూడేళ్లలో 10.47 శాతం, ఐదేళ్లలో 9.85 శాతం, పదేళ్లలో 11.70 శాతం రాబడులు ఇచ్చింది. భిన్న మార్కెట్లలోనూ ఈ పథకం స్థిరమైన పనితీరు చూపించిన నేపథ్యంలో దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం..: మల్టీక్యాప్ కావడంతో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఏ విభాగంలో ఉంటే, ఆయా విభాగంలోని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఈ పథకాలకు ఉంటుంది. దాంతో మంచి రాబడులను ఇవ్వగలవు. వృద్ధి అవకాశాలు, విలువ పరంగా చౌకగా ఉన్న వాటిని ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. భిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, అదే సమయంలో ఒకే రంగంలో ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా రిస్క్ చర్యలను కూడా ఈ పథకంలో గమనించొచ్చు. ఇటువంటి చర్యలతోనే ఈ పథకం స్థిరమైన రాబడులను ఇవ్వగలుగుతోంది. ఇక స్మాల్ క్యాప్నకు ఎంత, మిడ్క్యాప్నకు ఎంత, లార్జ్క్యాప్నకు ఎంత మొత్తం పెట్టుబడులు కేటాయించాలనే విషయంలో ఈ పథకానికి ఓ నమూనా కూడా ఉంది. ప్రస్తుతం ఈ పథకం ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, టెలికం, విద్యుత్, కన్జ్యూమర్ ఆధారిత కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. -
రిస్క్ తగ్గిస్తూ.. డైనమిక్ రాబడులు
బాలన్సుడ్ అడ్వాంటేజ్ విభాగంలోని మ్యూచువల్ ఫండ్స్ (వీటినే డైనమిక్ అసెట్ అలోకేషన్ ఫండ్స్ అని కూడా అంటారు) ఈక్విటీలో, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డైనమిక్గా ఇన్వెస్ట్ చేస్తూ రాబడులను ఇచ్చే విధానంలో పనిచేస్తుంటాయి. ఈక్విటీ మార్కెట్లు తక్కువ వ్యాల్యూషన్లకు చేరినప్పుడు అందులో పెట్టుబడులు పెంచుకోవడం, మార్కెట్లు అధిక వ్యాల్యూషన్లకు చేరినప్పుడు ఎక్స్పోజర్ తగ్గించుకోవడం అనే రిస్క్ బాలన్సుడ్ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ప్రస్తుతం ఈ విభాగంలో 19 ఫండ్స్ ఉన్నాయి. ప్రతీ ఫండ్ కూడా తనకుంటూ వ్యా ల్యూషన్ విధానాన్ని అనుసరిస్తోంది. అయితే, ఈక్వి టీ విభాగం పెట్టుబడులను కనీసం 65% కొన సాగించడం వల్ల ఇవి ఈక్విటీ ఫండ్స్ కిందకే వస్తాయి. రాబడులు..: ఈ విభాగంలో చాలా ఫండ్స్ మార్కెట్లు గరిష్టాలకు చేరినప్పుడు ఈక్విటీ డెరివేటివ్లోనూ పొజిషన్లను తీసుకోవడం ద్వారా హెడ్జింగ్ విధానాలను అనుసరిస్తున్నాయి. ఈక్విటీలకు కేటాయింపులు 65 శాతానికి పైగా చేయడం వల్ల మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే నష్టాలను తగ్గించడం కోసం ఇలా చేస్తుంటాయి. ముఖ్యంగా ఈక్విటీల్లో కొంత పెట్టుబడులు పెట్టాలనుకునే వారు, పరిమిత రిస్క్ కోరుకునే వారు ఈ తరహా పథకాలను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో అగ్రగామి పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా ఒకటి. ఈ పథకం ఏడాదిలో 6.5 శాతం రాబడులను ఇవ్వగా, ఈ విభాగం సగటు రాబడులు 3.3 శాతంగానే ఉన్నాయి. మూడేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడులు 9.8 శాతంగాను, ఐదేళ్లలో వార్షికంగా 10 శాతం చొప్పున రాబడులను ఇచ్చాయి. కానీ, ఈ విభాగం సగటు రాబడులు మూడేళ్లలో 7.8 శాతం, ఐదేళ్లలో 8.1 శాతం చొప్పున ఉన్నాయి. ఈ పథకంతోపాటు ఎల్అండ్టీ డైనమిక్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్, ఇన్వెస్కో ఇండియా డైనమిక్ ఈక్విటీ పథకాలు గత ఏడేళ్ల కాలంలో కాంపౌండెడ్గా 13–14 శాతం రాబడులను ఇచ్చాయి. ఇదే కాలంలో నిఫ్టీ 50 టీఆర్ఐ రాబడులు 11 శాతంగానే ఉన్నాయి. రిస్క్, రాబడుల ఆధారంగా క్రమాన్ని చూస్తే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ విభాగం... ఈక్విటీ సేవింగ్స్, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ మధ్య ఉంటుంది. పెట్టుబడుల విధానం..: ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి మల్టీక్యాప్ విధానాన్ని అనుసరిస్తుంది. లార్జ్క్యాప్ స్టాక్స్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. గత ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఈ పథకం ఈక్విటీల్లో పెట్టుబడులను 65–69% మధ్య నిర్వహిస్తోంది. ఈక్విటీ మార్కెట్లు బాగా పెరిగిన సందర్భాల్లో ఫండ్ మేనేజర్ డెరివేటివ్లో ఈక్విటీ పొజిషన్ల ఆధారంగా షార్ట్కు వెళుతుంటారు. 2015 జనవరి, 2018 జనవరిలో ఈ పథకం హెడ్జ్డ్ పొజిషన్లను 34–36 శాతానికి పెంచుకుంది. ఈక్విటీ నికర పొజిషన్లను 34.36 శాతానికి తగ్గించుకోవడం గమనార్హం. -
రిస్క్ తీసుకున్నా రాబడులకు భరోసా!
ఇటీవలి మార్కెట్ల అస్థిరత సమయంలో మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పతనం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందిన విషయం నిజమే. కానీ, దీర్ఘకాలంలో పెద్ద లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా సంపద సృష్టికి ఈక్విటీలకు దూరంగా ఉండడం కూడా సరికాదు. కనుక నాణ్యమైన ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకోవడం అర్థవంతమైనదే. ఆ విధంగా చూసినప్పుడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ కూడా పరిశీలించదగ్గదే. ఎందుకంటే మార్కెట్లు ర్యాలీ చేస్తున్న సమయంలో స్టాక్స్ను కొంత మేర విక్రయించి నగదు నిల్వలు పెంచుకోవడం, అదే సమయంలో డెట్ విభాగంలోనూ కొంత మేర పెట్టుబడుల ద్వారా నష్టాలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం ఈ పథకం పనితీరులో భాగం. హైబ్రిడ్ పథకంగా ఇది 65–80 శాతం వరకు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. కనీసం 65 శాతం ఈక్విటీలోనూ, 20–35 శాతం వరకు డెట్ విభాగంలోనూ పెట్టుబడులు పెట్టే ఈ పథకాన్ని అటు రాబడుల పరంగా, ఇటు మార్కెట్ల ఆటుపోట్ల సమయంలోనూ కాస్తంత రక్షణగా భావించొచ్చు. పనితీరు గతంలో ఇది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ ఫండ్గా ఉండేది. సెబీ మార్పుల తర్వాత పేరు మారింది. దీర్ఘకాలంలో చూసినప్పుడు ఈ విభాగం సగటు రాబడులతో పోలిస్తే ఈ పథకం పనితీరు కాస్త అధికంగానే ఉంది. స్వల్ప కాలం అంటే ఏడాది కాలంలో మాత్రం కాస్త ప్రతికూలంగా ఉండటం గమనార్హం. ఏడాది కాలంలో ఈ పథకం 4.9 శాతం రాబడులు ఇస్తే, ఈ విభాగం సగటు రాబడులు 6.2 శాతంగా ఉన్నాయి. ఇక మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు సగటున 10.4 శాతంగా ఉంటే, ఇదే విభాగం సగటు రాబడులు 8.6 శాతమే. ఐదేళ్లలో ఈ పథకం రాబడులు వార్షికంగా 17.4 శాతం కాగా, ఈ విభాగం రాబడులు 15.3 శాతం. గత మూడేళ్లుగా ఈ పథకం ఈక్విటీల్లో 65–74 శాతం మేర పెట్టుబడులు కొనసాగిస్తోంది. 2017లో వడ్డీ రేట్లు పెరిగిన సమయంలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎక్స్పోజర్ను 11–14 శాతం వరకు తగ్గించుకుంది. 2017లో ఈ పథకం రాబడులు తక్కువగా ఉండడానికి కారణం ఐటీ స్టాక్స్లో ఎక్స్పోజర్ తగ్గించుకుని, అధిక భాగం లార్జ్క్యాప్నకు పరిమితం కావడమే. పోర్ట్ఫోలియో ఈక్విటీల్లో ప్రధానంగా లార్జ్క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అవసరమైన సమయాల్లో మిడ్క్యాప్ స్టాక్స్లోనూ పెట్టుబడులు పెట్టడం ద్వారా రాబడులను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడులు మార్చడం ద్వారా రాబడులు మెరుగ్గా ఉండేలా చూస్తుంది. 2014 ర్యాలీ సమయంలో ఈక్విటీ పెట్టుబడులను 68–70 శాతం స్థాయిలో కొనసాగిస్తే, 2013లో ఇది 65–67 శాతంగా ఉండడం గమనార్హం. 2016లో బ్యాంకింగ్, పవర్, ఆయిల్, గ్యాస్ కంపెనీల స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రాబడులను ఇవ్వగలిగింది. -
మరీ ఎక్కువ రిస్కు వద్దా..?
సెబీ ఆదేశాల నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా ఏర్పడిన కేటగిరీ ‘కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్’. ఈక్విటీల్లో మోస్తరు రిస్క్ తీసుకునే వారికి ఇది అనుకూలం. ఈ విభాగంలోని ఫండ్ పథకాలు తమ పెట్టుబడుల్లో 10 నుంచి 25 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన పెట్టుబడులను డెట్ సాధనాల్లో పెడతాయి. అధిక భాగాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కచ్చితంగా నిర్ణీత శాతం రాబడులకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈక్విటీ భాగం నుంచి అధిక రాబడులొస్తాయి. రిస్క్ పరిమితంగా ఉండాలని ఆశించే వారు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నవారు, రిటైర్మెంట్ తీసుకున్న వారు కూడా కొంత భాగాన్ని వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఈ విభాగంలో కాస్త మెరుగైన రాబడులను ఇస్తున్న పథకంగా ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఐపీ25’ పథకాన్ని చెప్పుకోవాలి. అయితే, సెబీ ఆదేశాల నేపథ్యంలో ఈ పథకం పేరు ఈ నెల 28 నుంచి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్గా మారుతోంది. పేరు మారుతున్నప్పటికీ పథకం పెట్టుబడుల విధానం అలానే కొనసాగనుంది. గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం ఈక్విటీల్లో 21– 25 శాతం వరకు ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించింది. పనితీరు ఇలా ఉంది... ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ ‘క్రిసిల్ హైబ్రిడ్ 75+25 కన్జర్వేటివ్ ఇండెక్స్’. ఇది బీఎస్ఈ 200 (25 శాతం ఈక్విటీ), క్రిసిల్ కాంపోజిట్ బాండ్ ఫండ్ ఇండెక్స్ (75 శాతం డెట్) కలయిక. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఐపీ25 పథకం 2014లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూస్తే వార్షికంగా 10.3 శాతం రాబడులను పంచింది. మూడేళ్ల కాలంలో చూస్తే వార్షికంగా 9.5 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 11 శాతం, ఏడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 10.8 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈ విభాగం (తొమ్మిది ఫండ్స్తో కూడిన విభాగం) సగటు రాబడులు 7.6 శాతం, 8.8 శాతం, 8.8 శాతం చొప్పునే ఉన్నాయి. ఈ ప్రకారం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఐపీ25 పథకం రాబడులు మెరుగ్గా ఉన్నాయి. అన్ని సమయాల్లోనూ మెరుగైన పనితీరును చూపిస్తూ వస్తోంది. ఈక్విటీల్లో లార్జ్క్యాప్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కరెక్షన్ సమయాల్లోనూ రాబడులకు పెద్ద విఘాతం కలగలేదు. అదే సమయంలో బుల్ ర్యాలీల్లోనూ మోస్తరు రాబడులను అందించింది. ఇదీ పోర్ట్ఫోలియో... మార్కెట్లలో ఆటుపోట్లకు అనుగుణంగా ఈక్విటీల్లో పెట్టుబడులను 10–25 శాతం మధ్య పెడుతోంది. డెట్ సాధనాల్లో ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. ఇటీవల డెట్ మార్కెట్లలో ఊగిసలాట పెరగడం, బాండ్లపై పెరిగిన ఈల్డ్ నేపథ్యంలో ఈ పథకం క్రెడిట్ సాధనాల్లో పెట్టుబడిని పెంచింది. రుణ సాధనాల్లో సగటు మెచ్యూరిటీ పదేళ్లు కాగా, గడిచిన ఏడాదిలో దీన్ని 3.6 ఏళ్లకు తగ్గించుకుంది. ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ స్టాక్ పేరు పెట్టుబడుల శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు 4.84 గ్రాసిం ఇండస్ట్రీస్ 3.36 సన్ఫార్మా 3.20 జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.60 ఎల్అండ్టీ 2.60 భారత్ ఫైనాన్షియల్ 2.45 ఇన్ఫోసిస్ 2.06 టైటాన్ కంపెనీ 2.02 సెంచురీ టెక్స్టైల్స్ 1.75 ఆర్ఐఎల్ 1.73 -
పిల్లల కోసం... రిస్క్ లేకుండా!!
ఈక్విటీ మార్కెట్లు గత రెండు నెలలుగా ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఇక డెట్ మార్కెట్లోనూ గడిచిన ఆరు నెలలుగా ఊగిసలాట ధోరణే ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో రిస్క్ లేని రాబడులు ఆశించేవారు.. తమ చిన్నారుల చదువు కోసం లేదా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అవసరమైన నిధిని సమకూర్చుకోవాలని అనుకునే వారు పరిశీలించతగిన పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్కేర్ స్డడీ ప్లాన్ కూడా ఒకటి. ఇది దేన్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే... ఈ పథకం 75– 80 శాతం పెట్టుబడుల్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అందులోనూ ప్రభుత్వ సెక్యూరిటీలు (జీ–సెక్), అధిక రేటింగ్ కలిగిన ఏఏఏ కార్పొరేట్ బాండ్లలోనే పెట్టుబడి పెడుతుంది. కనుక ఆ మేరకు రిస్క్ లేనట్టుగానే భావించాలి. మిగిలిన పెట్టుబడుల్ని... అంటే 20 శాతం వరకు లార్జ్క్యాప్ షేర్లకు కేటాయిస్తుంటుంది. దీంతో ఈక్విటీ పెట్టుబడులకు రిస్క్ పరిమితంగా ఉంటుంది. ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ప్లాన్ ఎక్కువగా మిడ్క్యాప్ స్టాక్స్లో ఎక్స్పోజర్ తీసుకుంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మాత్రం రిస్క్ తక్కువగా ఉంచే ఉద్దేశంతో లార్జ్క్యాప్పై దృష్టి పెడుతుంది. రాబడులు ఇలా ఉన్నాయ్... చిన్నారులకు ఉద్దేశించిన పథకాల కేటగిరీలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్కేర్ స్డడీ ప్లాన్ రాబడుల విషయంలో మెరుగ్గా ఉంది. మూడు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో రాబడుల విషయంలో ఈ విభాగం బెంచ్మార్క్ రిటర్నుల కంటే 1–5 శాతం ఎక్కువే అందించింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 9 శాతం చొప్పున, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 15 శాతం చొప్పున, పదేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతం చొప్పున లాభాలను పంచింది. అయితే, ఏడాది కాలం పనితీరు విషయంలో మాత్రం ఈ కేటగిరీ కంటే వెనుకబడి ఉండటం గమనార్హం. దీనికి కారణం డెట్ పెట్టుబడుల్లో అధిక భాగం 2017లో గడువు తీరిపోవడమే. అలాగే, డెట్ మార్కెట్లో ఆటుపోట్ల ప్రభావం కూడా రాబడులపై ఉంది. కానీ, స్వల్పకాలంలో పనితీరు అన్నది అంత ప్రామాణికంగా చూడక్కర్లేదు. ఎందుకంటే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడి పథకం ఇది. 17 ఏళ్ల కాలంలో దీని పనితీరు చూసుకున్నా ఆకర్షణీయంగానే ఉంది. ఈ పథకం 2001లో ప్రారంభం కాగా, ఏటా 12.4 శాతం చొప్పున రాబడులు అందించింది. సంప్రదాయ ఇన్వెస్టర్లు, దీర్ఘకాల లక్ష్యాలతో ఇన్వెస్ట్ చేసే వారు ఈ పథకాన్ని నిశ్చింతగా ఎంచుకోవచ్చు. చార్జీలు ఇలా ఉంటాయ్... చిన్నారుల విద్యావసరాల కోసం ఉద్దేశించిన పథకం కావడంతో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే చార్జీలుంటాయి. నిర్ణీత కాలం కంటే ముందుగా వైదొలిగితే పెట్టుబడుల విలువపై 3 నుంచి 1 శాతం వరకు ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఏడాదిలోపు 3 శాతం, ఏడాది నుంచి రెండేళ్లలోపు 2 శాతం, రెండు నుంచి మూడేళ్లలోపు ఒక శాతం ఎగ్జిట్లోడ్ అమలవుతుంది. మూడేళ్లపాటు లేదా చిన్నారికి 18 ఏళ్లు నిండే వరకు ఈ రెండింటిలో ఏది ఆలస్యం అయితే అప్పటి వరకు లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. -
సెబీ చెంతకు 85 కొత్త ఫండ్ స్కీములు
మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చెంతకు ఈ ఏడాది ఇప్పటివరకూ 85 కొత్త స్కీములు పరిశీలనకు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు... ఈక్విటీ, డెట్, హైబ్రీడ్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ల జారీకి ఈ స్కీము ప్రతిపాదనల్ని సెబీకి సమర్పించాయి. న్యూ ఫండ్ ఆఫర్ల(ఎన్ఎఫ్ఓలు)కోసం సెబీకి దరఖాస్తు చేసిన సంస్థల్లో మహింద్రా, యాక్సిస్, రిలయన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, బిర్లా సన్లైఫ్ హెచ్డీఎఫ్సీ, యూటీఐ, ఎడెల్వీజ్, ఎస్బీఐలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఎన్ఎఫ్ఓలు ఇప్పటికే జారీకాగా, మరికొన్ని అనుమతులు రాగానే ప్రారంభంకానున్నాయి. హిందీ పేర్లతో...: ఆసక్తికరమైన అంశమేమిటంటే..కొన్ని మ్యూచువల్ ఫండ్స్ జారీచేసే స్కీములకు హిందీ భాషలో పేర్లు పెట్టాయి. ఫండ్ స్కీములకు ఇప్పటివరకూ ఇంగ్లీషులోనే పేర్లు ఉంటుండగా, గ్రామీణ ప్రాంతాల ఇన్వెస్టర్లకు స్కీముల లక్ష్యాలు సులభంగా అర్థమవుతాయన్న ఉద్దేశ్యంతో హిందీ పేర్లతో స్కీముల్ని జారీచేసేందుకు ఫండ్ హౌస్లు శ్రీకారం చుట్టాయి. మహీంద్రా మ్యూచువల్ ఫండ్ సెబీకి సమర్పించిన స్కీములకు.. డైనమిక్ బాండ్ బచత్ యోజన, ప్రగతి బ్లూచిప్ యోజన, ఉన్నతి మిడ్ స్మాల్క్యాప్ యోజన వంటి పేర్లు ఉన్నాయి. 4.8 కోట్లకు ఫండ్ ఇన్వెస్టర్లు.... మ్యూచువల్ ఫండ్ స్కీముల పట్ల రిటైల్ ఇన్వెస్టర్లు కనపరుస్తున్న అమితాసక్తి కారణంగా కొత్త స్కీముల జారీని ఫండ్ హవుస్లు వేగవంతం చేశాయని, ఇటీవల ప్రారంభమైన స్కీములకు మంచి స్పందన లభించిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది జూలై చివరినాటికి మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్ల సంఖ్య 4.8 కోట్లకు చేరిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి హార్ట్, క్యాన్సర్ ప్రొటెక్ట్ ప్లాన్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సంస్థ .. హార్ట్/ క్యాన్సర్ ప్రొటెక్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గుండె జబ్బు లేదా క్యాన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిన పక్షంలో బీమా కవరేజీలో కొంత భాగాన్ని ఏకమొత్తంగా కంపెనీ అందజేస్తుంది. సరైన చోట సరైన చికిత్స పొందేందుకు ఇది ఉపయోగపడగలదని కంపెనీ ఈడీ పునీత్ నందా తెలిపారు. ఇన్కం రిప్లేస్మెంట్ పేరిట ప్రత్యేక యాడ్ ఆన్ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది. బీమా కవరేజీలో 1 శాతం మేర ప్రతి నెలా పాలసీదారుకు చెల్లిస్తారు. చికిత్స చేయించుకుంటున్న సమయంలో పాలసీదారు కోల్పోయే ఆదాయాన్ని ఇది కొంత మేర భర్తీ చేయగలదని నందా చెప్పారు. అత్యంత చౌకగా నెలకు రూ. 100కే రూ. 20 లక్షల పైగా క్యాన్సర్ కవరేజీ, రూ. 10 లక్షల హార్ట్ కవరేజీ పొందవచ్చు (సిగరెట్ అలవాటు లేని 30 ఏళ్ల వ్యక్తి, 20 ఏళ్ల వ్యవధికి పాలసీ తీసుకుంటే). క్యాన్సర్ లేదా హృద్రోగం ఉందని పరీక్షల్లో తేలితే భవిష్యత్లో ప్రీమియంలు కట్టకపోయినా పాలసీ కొనసాగుతుంది. క్యాన్సర్ లేదా హార్ట్ లేదా రెండింటికీ కలిపి కవరేజీ తీసుకునే వెసులుబాటు ఉంది. ఇండియాబుల్స్ ఫండ్లో ఇన్స్టంట్ యాక్సెస్ సదుపాయం ఇండియాబుల్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తమ లిక్విడ్ ఫండ్లో ఇన్స్టంట్ యాక్సెస్ సదుపాయం ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్లు సత్వరం తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వారాంతాలైనా, బ్యాంకు సెలవుదినాలైనా, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా మూడొం దల అరవై అయిదు రోజులు, ఇరవై నాలుగ్గంటలూ రిడెంప్షన్ (యూనిట్లు విక్రయించుకోవడం) అవకాశం కల్పిస్తున్నట్లు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అక్షయ్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం దీన్ని దేశీ ఇన్వెస్టర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఎన్నారై, కార్పొరేట్లకు వర్తించదు. రిడెంప్షన్ అనంతరం నిమిషాల వ్యవధిలోనే సదరు మొత్తం ఐఎంపీఎస్ (ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్) విధానంలో ఇన్వెస్టరు బ్యాంకు ఖాతాలో జమవుతుందని గుప్తా పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా రూ. 50,000 దాకా లేదా తమ పోర్ట్ఫోలియో విలువలో 90% దాకా (ఏది తక్కువైతే అది) రిడీమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. బజాజ్ అలయంజ్ లైఫ్ నుంచి ఫ్యూచర్ వెల్త్ గెయిన్ పాలసీ ప్రైవేట్ బీమా దిగ్గజ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ తాజాగా బజాజ్ అలయింజ్ లైఫ్ ఫ్యూచర్ వెల్త్ గెయిన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. యూనిట్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పథకంలో ’వెల్త్ ప్లస్’, ’వెల్త్ ప్లస్ కేర్’ పేరిట రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకవైపు పాలసీదారు కుటుంబానికి బీమా రక్షణ కల్పిస్తూనే మరోవైపు క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా సంపదను మరింతగా పెంచగలిగే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. పాలసీదారు కన్నుమూసిన పక్షంలో వెల్త్ ప్లస్ వేరియంట్లో అత్యధిక సమ్ అష్యూర్డ్, ఫండ్ విలువ కుటుంబానికి చెల్లిస్తారు. డెత్ బెనిఫిట్ కింద అప్పటిదాకా కట్టిన ప్రీమియంలపై 105 శాతం మేర చెల్లింపులు జరుపాతురు. ఇక వెల్త్ ప్లస్ కేర్ వేరియంట్లో డెత్ బెనిఫిట్తో పాటు పాలసీదారుకు ఇన్కమ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు కన్నుమూసినా లేదా ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడినట్లు తేలినా ఇన్కమ్ బెనిఫిట్ వర్తిస్తుంది. ఫ్యూచర్ వెల్త్ గెయిన్ ప్రీమియం ఏడాదికి కనీసం రూ.50,000గా ఉంటుంది. గరిష్టంగా 25ఏళ్లకు, కనిష్టంగా 5 ఏళ్లకు పాలసీ తీసుకోవచ్చు. -
పేలవంగా ప్రుడెన్షియల్ లిస్టింగ్
ఇష్యూ ధర కంటే 11% నష్టంతో ముగింపు న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లిస్టింగ్ పేలవంగా జరిగింది. ఇష్యూ ధర(రూ.334) కంటే 1 శాతం తక్కువగా రూ.329 వద్ద బీఎస్ఈలో లిస్టయింది. చివరకు 11 శాతం క్షీణతతో రూ.298 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12 శాతం క్షీణతతో రూ.295ను తాకింది. బీఎస్ఈలో 1.2 కోట్లు, ఎన్ఎస్ఈలో 8 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. గురువారం మార్కెట్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,722 కోట్లుగా ఉంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తొలి బీమా కంపెనీ ఇదే. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లిస్టింగ్ నిస్తేజంగా ఉండటంతో ఆ ప్రభావం ఐసీఐసీఐ బ్యాంక్ షేర్పై కూడా పడింది. బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 4% క్షీణించి రూ.251 వద్ద ముగిసింది. రూ.300-334 ధరల శ్రేణితో వచ్చిన రూ.6,057 కోట్ల ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 10 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయ్యింది. కోల్ ఇండియా(రూ.15,000 కోట్లు) తర్వాత వచ్చిన అతి పెద్ద ఐపీఓ ఇదే. పుష్కలంగా నిధులు: చందా కొచర్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మార్కెట్ను మించిన వృద్ధిని సాధిస్తుందని కంపెనీ చైర్పర్సన్ చందా కొచర్ ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమ కంటే వేగంగా వృద్ధి చెందే సంప్రదాయం తమ కంపెనీదని, ఇదే జోరును కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయిన కొన్ని నిమిషాలకే ఆమె మాట్లాడారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సంస్థ గత 4-5 ఏళ్లలో ఏడాదికి 15 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని వివరించారు. ప్రస్తుతానికి తమ వద్ద పుష్కలంగా నిధులున్నాయని, మరో కొన్నేళ్లదాకా పెట్టుబడులు అవసరం లేదని పేర్కొన్నారు. ఐఆర్డీఏఐ నిర్దేశించిన సాల్వెన్సీ రేషియో 150 శాతమని, కానీ తమ కంపెనీ సాల్వెన్సీ రేషియో 320 శాతమని వివరించారు. -
నేడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లిస్టింగ్
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేడు(గురువారం) మార్కెట్లో లిస్ట్ కానున్నది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న తొలి బీమా కంపెనీ ఇదే. ఈ నెల 19-21 మధ్య వచ్చిన రూ.6,057 కోట్ల ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీఓ 10 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.300-334గా కంపెనీ నిర్ణయించింది. 2010లో వచ్చిన కోల్ ఇండియా ఐపీఓ (రూ.15,000 కోట్లు) తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీఓకు 10 రెట్లు స్పందన
న్యూఢిల్లీ: సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ మద్దతు లభించడంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) 10.5 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. బుధవారం ఆఫర్ ముగిసే సమయానికి రూ. 46,298 కోట్ల విలువైన బిడ్స్ను కంపెనీ ఆకర్షించగలిగింది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన రూ. 1,635 విలువైన షేర్లతో కలుపుకుంటే ఆఫర్ అందుకున్న బిడ్స్ విలువ రూ. 47,933 కోట్లకు చేరుతుంది. 10 లక్షలకుపైగా దరఖాస్తులు రావడం విశేషం. రూ. 300-334 ప్రైస్బ్యాండ్తో రూ. 6,057 కోట్ల సమీకరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈ ఆఫర్ జారీచేసింది. 2010లో వచ్చిన రూ. 15,000 కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూ తర్వాత ఇదే పెద్ద ఐపీఓ. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన కోటా 11.83 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్కాగా, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 28.55 రెట్ల స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా మాత్రం 1.37 రెట్లు మాత్రమే ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ షేర్హోల్డర్లకు కేటాయించిన కోటాకు 12.20 రెట్లు సబ్స్క్రిప్షన్ వచ్చింది. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీవో..
తొలిరోజు 16% సబ్స్క్రిప్షన్ న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రారంభమైన సోమవారం 16 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. దేశంలో పబ్లిక్ ఇష్యూ జారీచేసిన తొలి బీమా కంపెనీ ఇదే. రూ. 6,057 కోట్ల సమీకరణకు 13.24 కోట్ల షేర్లు ఈ మెగా ఐపీఓ ద్వారా జారీచేస్తుండగా, సోమవారం సాయంత్రానికి 2.09 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన కోటాలో 6 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలో 4 శాతం సబ్స్క్రయిబ్కాగా, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటివరకూ వారి కోటాలో 25 శాతం వాటాకు బిడ్స్ వచ్చాయి. ఈ ఐపీఓ బుధవారం ముగుస్తుంది. రూ. 300-334 ప్రైస్బ్యాండ్తో ఈ ఆఫర్ జారీఅయ్యింది. -
ఆరేళ్లలో దేశంలో అతిపెద్ద ఐపీవో ఇదే
ముంబై : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఐపీవో సోమవారం లాంచ్ కానుంది. దేశంలో గత ఆరేళ్లలో ఇదే అతిపెద్ద, జీవితబీమా రంగంనుంచి మొట్టమొదటి పబ్లిక్ ఇష్యూగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఐపీవో బుధవారం(21న) ముగియనుంది. సుమారు రూ. 1,635 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్న ఇష్యూకి ప్రైస్బ్యాండ్ ను రూ. 300-334గా కంపెనీ నిర్ణయించింది. దీనికోసం ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆఫర్లో భాగంగా కంపెనీ రూ. 10 ముఖవిలువగల 181.34 మిలియన్ల షేర్లను విక్రయించనుంది. మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ విక్రయిస్తున్న ఈ షేర్లు ఇష్యూ తరువాత కంపెనీ ఈక్విటీ క్యాపిటల్లో 12.63 శాతం వాటాకు సమానంగా నిలవనున్నాయి. సహ ప్రమోటర్ ప్రుడెన్షియల్ సంస్థ ఎలాంటి వాటాను విక్రయించదని రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ తెలిపింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇప్పటికే 38 యాంకర్ ఇన్వెస్టర్లకు 4.89 కోట్ల షేర్లను విక్రయించింది. షేరుకి రూ. 334 ధరలో అమ్మకాలతో రూ. 1,635 కోట్లను సమీకరించింది. మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ శాక్స్, నోమురా ఇండియా ఇన్వెస్ట్ మెంట్ లతోపాటు మానెటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ తదితర వెల్త్, మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో ఉన్నాయి. కాగా మోర్గాన్ స్టాన్లీ అత్యధికంగా 6.2 మిలియన్ షేర్లను కొనుగోలుచేయగా, సింగపూర్ సావరిన్ సంస్థ 4.3 మిలియన్ షేర్లను సొంతం చేసుకుంది. అలాగే రిటైల్ విభాగంలో 5.72 కోట్ల షేర్లు, సంపన్న వర్గాల(హెచ్ఎన్ఐ) కోటాలో 2.44 కోట్ల షేర్లు దక్కించుకున్నాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం(క్విబ్)లో 8.16 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. క్విబ్ కోటాలో ఇప్పటికే 4.9 కోట్ల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు కంపెనీ వెల్లడించింది. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీఓ ధర శ్రేణి రూ.300-334
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ.6 వేల కోట్లు సమీకరించడానికి ఉద్దేశించిన ఐపీవోకు సంబంధించి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బుధవారమిక్కడ రోడ్షో నిర్వహించింది. సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే ఐపీవో 21న ముగుస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ బాత్రా తెలిపారు. ప్రమోటరు ఐసీఐసీఐ బ్యాంకు వాటాలతో కలిపి సుమారు 18.13 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇది నికరంగా సంస్థ పెయిడప్ షేర్ క్యాపిటల్లో 11.37 శాతం వాటా. కనీసం 44 షేర్ల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుందని బాత్రా తెలియజేశారు. షేరు ధరల శ్రేణిని రూ. 300-334గా నిర్ణయించినట్లు చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ మొత్తం ప్రీమియం వసూళ్లు సుమారు రూ. 19,164 కోట్ల మేర నమోదయ్యాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) దాదాపు రూ. 1.09 లక్షల కోట్లు కాగా, ప్రైవేట్ రంగ బీమా సంస్థల మార్కెట్లో దీనికి 11.3 శాతం వాటా ఉంది. -
19న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇష్యూ
21న ముగింపు ఇష్యూ సైజు 18.13 కోట్ల షేర్లు న్యూఢిల్లీ: జీవిత బీమా రంగం నుంచి తొలిసారిగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రాబోతుంది. ఈ ఐపీవో ఈ నెల 19న ప్రారంభమై 21న ముగుస్తుంది. ఇష్యూ ధరల శ్రేణిని రూ.300 - రూ.334గా నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు తన వాటాల్లోంచి 12.65 శాతం వాటాకు సమానమైన 18,13,41,058 ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా సుమారు రూ.6,000 కోట్ల నిధులను సమీకరించనుంది. గత ఆరేళ్లలో ఈ స్థాయిలో నిధులు సమీకరిస్తున్న ఐపీవో ఇదే కావడం విశేషం. ఈ సంస్థ జూలై 18న సెబీ వద్ద ఐపీవో పత్రాలను దాఖలు చేయగా ఈ నెల 2న అనుమతి లభించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఐసీఐసీఐ బ్యాంకుకు 68 శాతం, యూకేకు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్కు 26 శాతం, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీకి చెందిన ప్రేమ్జీ ఇన్వెస్ట్కు 4 శాతం, సింగపూర్కు చెందిన తెమసెక్ హోల్డింగ్స్కు 2 శాతం వాటా ఉంది. పబ్లిక్ ఇష్యూలో జారీ చేసే షేర్లలో పది శాతం షేర్లు ఐసీఐసీఐ బ్యాంకు షేర్ హోల్డర్లకు రిజర్వ్ చేశారు. గరిష్టంగా 50 శాతం క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ప్రభుత్వరంగ కోల్ ఇండియా 2010లో రూ.15వేల కోట్ల నిధులను ఐపీవో ద్వారా సమీకరించగా, ఆ తర్వాత మళ్లీ భారీ స్థాయిలో నిధులు సమీకరిస్తున్న ఐపీవో ఇదే. కాగా, పెప్సీకో కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ తయారీ, మార్కెటింగ్ వ్యవహారాలను చూసే వరుణ్ బెవరేజెస్, సీవేస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ ఐపీవోలకు సైతం సెబీ ఇటీవలే ఆమోదం తెలిపింది. -
ఐపీఓకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్!
రూ.5,000 కోట్ల వరకూ సమీకరణ! న్యూఢిల్లీ: భారత క్యాపిటల్ మార్కెట్లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల జోరు కొనసాగుతోంది. తాజాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓకు రానున్నది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.5,000 కోట్ల సమీకరించనున్నదని అంచనా. ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకి సమర్పించే సన్నాహాల్లో ఉంది. ఈ ఐపీఓను బ్యాంక్ ఆప్ అమెరికా మెరిల్ లించ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, డాషే బ్యాంక్, యూబీఎస్, సీఎల్ఎస్ఏలు నిర్వహించవచ్చు. -
హైదరాబాద్లో రేపు సాక్షి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు
సాక్షి, హైదరాబాద్ : వ్యక్తిగత పొదుపు పథకాలతో పాటు ఆర్థిక అంశాలపై మదుపరులకు అవగాహన కల్పించడానికి ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు శనివారం కూకట్పల్లిలో జరగనుంది. ఇప్పటిదాకా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాక్షి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సులు నిర్వహించగా పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు హాజరై... వివిధ ఆర్థిక అంశాలు, షేర్లు, పథకాలకు సంబంధించి తమ సందేహాలను నిపుణుల ద్వారా తీర్చుకున్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఈ సదస్సు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జేఎన్టీయూలోని యూజీసీ-ఏఎస్సీ ఆడిటోరియంలో జరగనుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచ్వల్ ఫండ్తో కలిసి ‘సాక్షి’ నిర్వహిస్తున్న ఈ సదస్సులో వివిధ ఆర్థిక సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొని ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలిస్తారు. దీనికి ఎవరైనా హాజరుకావచ్చు. ఉచిత సభ్యత్వ నమోదు కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 9505555020 నంబరుకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి రికవరీ ఫండ్ సిరీస్ 2
హైదరాబాద్: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తాజాగా ఇండియా రికవరీ ఫండ్ సిరీస్ 2ను ప్రవేశపెట్టింది. 3.5 సంవత్సరాల వ్యవధి గల ఈ క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్ దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువైనదని సంస్థ తెలిపింది. రాబోయే 3-5 సంవత్సరాల్లో దేశీ ఎకానమీ మరింత పుంజుకుంటుందన్న అంచనాల కారణంగా.. షేర్లు తదితర సాధనాల్లో ఈ ఫండ్ నిధులను ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ సీఈవో నిమేష్ షా పేర్కొన్నారు. ఇందులో కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. -
పోలీసుల అదుపులో అలేఖ్య
* పోలీసుల కళ్లుగప్పి కెనడాకువెళ్లే ప్రయత్నం * చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు శాఖ * ఆమెతో పాటు తల్లిదండ్రుల అరెస్టు చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బీమా కంపెనీలో ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసిన అకౌంటెంట్ అలేఖ్య(24)ను పోలీసులు పట్టుకున్నారు. పది మందికి పైగా బీమా సొమ్ము చెల్లించిన వారి నుంచి రూ.31 లక్షలు కాజేసిన విషయంపై బ్రాంచ్ మేనేజరు శ్రీధర్ మంగళవారం చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పటికప్పుడు స్పందించిన సీఐ సూర్యమోహనరావు బుధవారం ఉదయానికే నెల్లూరులోని అలేఖ్య స్వగ్రామానికి చేరుకున్నారు. అలేఖ్యతో పాటు ఆమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు(55), రాజ్యలక్ష్మి (50)లను సైతం అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించి, ఇక్కడ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖాతాదారులు చెల్లించే నగదును అలేఖ్య తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి ఆన్లైన్ ద్వారా రూ.31 లక్షలు జమ చేసింది. ఏ రోజుకారోజు బ్యాంకు ఖాతాల్లో జమయ్యే నగదును ఆమె తల్లిదండ్రులు విత్డ్రా చేసుకునే వాళ్లు. జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన ఐసీఐసీఐ బీమా కంపెనీ ప్రతినిధులు అలేఖ్య తల్లిదండ్రుల ఖాతాల్లో ఉన్న నగదును ఫ్రీజింగ్ చేయాలని నెల్లూరులోని బ్యాంకు అధికారులను కోరడంతో ఖాతాలో ఉన్న రూ.2 లక్షలు మాత్రం ఇటీవల విత్డ్రా కాకుండా చేయగలిగారు. అలేఖ్య తండ్రి నెల్లూరు ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. ఇతను కొంత కాలంగా మెడికల్ సెలవులో ఉన్నాడు. నిందితులకు పట్టుకోవడానికి వెళ్లిన చిత్తూరు పోలీసులు పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. గత నెల 23న ఈ కుంభకోణం వెలుగు చూడడం.. అదే నెల 19నే అలేఖ్య ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. అంటే ముందుగానే ప్రణాళిక రూపొందిం చుకున్నారు. దీనికితోడు అలేఖ్య తన తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మితో కలిసి కెనడా వెళ్లడానికి పాస్పోర్టులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. పాస్పోర్టు రావడం కాస్త ఆలస్యం కావడంతో దానికోసం వేచి చూస్తూ పోలీసులకు దొరికిపోయారు. అలేఖ్య, వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మిపై ఛీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐ సూర్యమోహనరావు వారిని అరెస్టు చేసి, చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. వీళ్లకు 14 రోజుల రిమాండు విధిస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిందితులను చిత్తూరు నగరంలోని జిల్లా జైలుకు తరలించారు. పోలీసులను పలువురు అభినందించారు. -
ఐసీఐసీఐకి మహిళా ఉద్యోగి టోకరా
చిత్తూరు: చిత్తూరు నగరంలోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ జీవిత బీమా శాఖలో ఓ ఉద్యోగిని సంస్థకు రూ.31 లక్షల మేర టోకరా పెట్టింది. ఈ శాఖలో అకౌంటెంట్గా పనిచేస్తున్న నెల్లూరు జిల్లా కోడూరుకు చెందిన అలేఖ్య(26) పాలసీ దారుల నుంచి సుమారు రూ.31 లక్షల మేర ప్రీమియంను వసూలు చేసి సంస్థకు జమచేయకుండా తన తల్లిదండ్రుల ఖాతాల్లో వేసుకుంది. ఆ తర్వాత జనవరి 19న ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయింది. అయితే, తన పాలసీకి సంబంధించిన సొమ్ము తన ఖాతాలో జమ కాలేదని జనవరి 23న రత్నకుమార్ అనే వ్యక్తి శాఖ మేనేజర్ దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు ప్రీమియం చెల్లించాలంటూ పాలసీదారులకు సంస్థ నుంచి నోటీసులు వెళ్లడంతో పలువురు చిత్తూరులోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ శాఖకు వచ్చి మేనేజర్ను నిలదీశారు. తాము ప్రీమియం చెల్లించినప్పటికీ నోటీసులు రావడం ఏంటని ప్రశ్నించారు. దీంతో అకౌంటెంట్ అలేఖ్య రూ.31 లక్షల వరకు స్వాహా చేసినట్లు గుర్తించిన శాఖా మేనేజర్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అలేఖ్యపై చిత్తూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. -
బ్యాంక్ ఎఫ్డీయా? డెట్ ఫండా?
నేను ప్రస్తుతం క్వాంటమ్ లాంగ్టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, హెచ్డీఎఫ్సీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇటీవలే నిఫ్టీ బిఈఈఎస్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తున్నాను. ఇది మంచి రాబడినే ఇస్తోంది. ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ను కొనసాగించమంటా రా? సుందరం సెలెక్ట్ మిడ్క్యాప్, బీఎన్పీ పారిబస్ మిడ్క్యాప్ ఫండ్స్ల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ రెండు ఒకే ఫండ్ హౌస్కు చెందినవా? - జానకి, అమలాపురం ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎంత రాబడి పొందవచ్చో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. నిఫ్టీ ఇండెక్స్ను పూర్తిగా ప్రతిబింబించే నిఫ్టీ బీఈఈఎస్ ఈటీఎఫ్ -నిఫ్టీ లాగానే రాబడులందిస్తోంది. అంతేకాకుండా భారత్లో అత్యంత తక్కువ వ్యయాలున్న ఫండ్ కూడా ఇదే. దీని ఎక్స్పెన్స్ రేషియో 0.5 శాతంగా ఉంది. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇండెక్స్ ఫండ్ సరైనది కాదని చెప్పవచ్చు. పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నిఫ్టీ కంటే డైవర్సిఫైడ్ ఫండ్లు ఉత్తమమని చెప్పవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మూడు ఫండ్స్- క్వాంటమ్ లాంగ్టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ డైనమిక్, హెచ్డీఎఫ్సీ ఈక్విటీలు దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి ఫండ్స్ అని పేర్కొనవచ్చు. ఇక బీఎన్పీ పారిబస్, సుందరం సెలెక్ట్ మిడ్క్యాప్లు ఒకే కంపెనీకి చెందిన ఫండ్స్ కావు. బీఎన్పీ పారిబస్, సుందరం సంస్థలు గతంలో జాయింట్ వెంచర్ను నిర్వహించాయి. కొన్నేళ్ల కితం ఈ జాయింట్ వెంచర్ను ఈ రెండు సంస్థలు రద్దు చేసుకున్నాయి. ఇవి రెండు విభిన్నమైన ఫండ్లు. మంచి రాబడులనే ఇస్తున్నాయి. డెట్ ఫండ్స్ గురించి వివరించండి. వీటికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లకు తేడా ఏమిటి? - రమేశ్, జగిత్యాల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో గ్యారంటీ రాబడులు వస్తాయి. ఎంత రాబడులు వస్తాయో ముందే తెలుస్తుంది. మరోవైపు డెట్ ఫండ్స్ల్లో రాబడులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే ఎక్కువ రావచ్చు. లేదా తక్కువ రావచ్చు. అయితే ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా తేడా బ్యాంక్ ఎఫ్డీల కన్నా స్వల్పంగానే ఉంటుంది. డెట్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీ ఫండ్స్. అంటే మీరు ఈ ఫండ్స్ల్లో ఎప్పుడైనా, ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా, ఈ ఫండ్స్నుంచి ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్ ఫండ్స్ల్లో మీకు అసలు నష్టాలే రావు. వివిధ రకాల డెట్ఫండ్స్ విషయానికొస్తే, లిక్విడ్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్మెంట్స్పై నష్టాలు రావడమనేది చాలా అరుదు. అయితే బాండ్ ఫండ్స్ల్లో మాత్రం వడ్డీరేట్లు పెరిగితే బాండ్ ఫండ్స్ విలువ తగ్గుతుంది. ఇక ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్ విషయానికొస్తే, ఈ ఫండ్ వల్ల మీకు పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ విషయానికొస్తే, దీనిపై వచ్చే వడ్డీ మీ ఆదాయానికి కలిపి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ను ఏడాది కాలానికి మించి కొనసాగిస్తే, వాటిపై వచ్చే రాబడులను క్యాపిటల్ గెయిన్స్గా పరిగణిస్తారు. నేను నెలకు రూ.10,000 మొత్తాన్ని 10-15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఏడాదికి ఎల్ఐసీ జీవన్ ఆనంద్ కింద రూ.42,000, పీపీఎఫ్ కింద రూ.10,000 చొప్పున చెల్లిస్తున్నాను. రెలిగేర్ నుంచి రూ.50 లక్షల టెర్మ్ప్లాన్ను తీసుకున్నాను. ఇన్వెస్ట్ చేయడానికి తగిన ఫండ్స్ సూచించండి? - జాన్ పాషా, నిజామాబాద్ మీ పోర్ట్ఫోలియోను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఏమంటే, ఒక అత్యవసర ఫండ్ను ఏర్పాటు చేసుకోవడం. ఏ సమయంలోనైనా వెంటనే మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ను వెనక్కితీసుకునేలా ఈ ఫండ్ ఉండాలి. ఇది కాకుండా, ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇక టెర్మ్ ప్లాన్ను కొనసాగించండి. ఎల్ఐసీ జీవన్ ఆనంద్, పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే, 10-15 కాలానికి ఏదైనా ఒకటే. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ అనేది యులిప్(యూ నిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్). బీమా లేదా ఇన్వెస్ట్మెంట్ పూర్తి ప్రయోజనాలను ఇది ఇవ్వలేదని చెప్పవచ్చు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు పీపీఎఫ్ కూడా సరైనది కాదని నేను భావిస్తున్నాను. మరోవైపు ఏవైనా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. మ్యూచువల్ ఫండ్స్పై మీకు సరైన అవగాహన వచ్చాకే పూర్తి స్థాయి ఈక్విటీ ఫండ్స్కు మీ ఇన్వెస్ట్మెంట్స్ను మళ్లించండి. మీరు ఎంచుకోవడానికి ఉన్న కొన్ని ఆప్షన్లలో టాటా బ్యాలెన్స్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాండేజ్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్స్ను పరిశీలించండి. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి గ్రోత్ ఫండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మ్యూచువల్ ఫండ్ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తాజాగా గ్రోత్ ఫండ్-సిరీస్1ను ఆవిష్కరించింది. సెన్సెక్స్, నిఫ్టీలను మించి రాబడులు అందించే అవకాశాలున్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఈ ఫండ్ ప్రధానోద్దేశమని ఫండ్ మేనేజర్ వెంకటేశ్ సంజీవి సోమవారం ఇక్కడ తెలిపారు. ఇందులో భాగంగా బ్యాంకింగ్, ఇన్ఫ్రా, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందిన 40-60 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తామని ఆయన వివరించారు. ఈ ఫండ్ ద్వారా సుమారు రూ. 500-1000 కోట్ల దాకా నిధులు సమీకరించాలని యోచిస్తున్నట్లు, ఇందులో 40 శాతం మొత్తాన్ని లార్జ్ క్యాప్ షేర్లకు, మిగతాది మిడిల్.. స్మాల్ క్యాప్ షేర్లకు కేటాయించనున్నట్లు సంజీవి పేర్కొన్నారు. మూడేళ్ల ఈ క్లోజ్డ్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్లో కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 16 దాకా ఆఫర్ ఉంటుంది. ఎకానమీ కోలుకుంటుండటం, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుతో మార్కెట్ సెంటిమెంట్లు సానుకూలంగా ఉండటం, అటు స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం భారత్కి సానుకూల అంశాలని వివరించారు. ప్రస్తుతం ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే దేశీ మార్కెట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
ఎల్ఐసీ నుంచి తొలి ఆన్లైన్ టర్మ్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న ఆన్లైన్ టర్మ్ పాలసీ విభాగంలోకి దేశీయ అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ ప్రవేశించింది. ‘ఈ టర్మ్’ పేరుతో తొలి ఆన్లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా ఎల్ఐసీ కేవలం తక్షణం పెన్షన్ అందించే జీవన్ అక్షయ-6 మాత్రమే అందుబాటులో ఉండేది. తొలిసారిగా బీమా రక్షణతో కూడిన పాలసీని ప్రవేశపెట్టినా, ఇతర ప్రైవేటు బీమా కంపెనీలతో పోలిస్తే ప్రీమియం అధికంగా ఉంది. 30 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్లకు టర్మ్ పాలసీ తీసుకుంటే ఏడాదికి సుమారుగా రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. అదే చాలా ప్రైవేటు కంపెనీలు ఇదే మొత్తానికి రూ.5,500 నుంచి రూ.8,000 వరకు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీ అయి ఉండటం, క్లెయిమ్ సెటిలిమెంట్స్లో 97.73 శాతంతో అందరికంటే మొదటి స్థానంలో ఉండటం వంటి కారణాలు ప్రీమియం ధరను అధికంగా నిర్ణయించడానికి కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం బీమా రక్షణ తప్ప ఎటువంటి మెచ్యూర్టీ ఉండని చౌకగా ఉండే విధంగా టర్మ్ పాలసీలను ఆన్లైన్లో తొలిసారిగా 2009లో ప్రవేశపెట్టారు. సాధారణ టర్మ్ పాలసీల కంటే ప్రీమియం తక్కువగా ఉండటం, అధిక బీమా రక్షణ ఉండటంతో సహజంగానే వీటికి డిమాండ్ పెరిగింది. పాలసీలోని ఆకర్షణలు ధూమపానం అలవాటు లేనివారికి ప్రీమియంలో సుమారు 30% తగ్గింపును ఈ టర్మ్ పాలసీ ఆఫర్ చేస్తోంది. 18 ఏళ్లు నిండిన వారి నుంచి 60 ఏళ్ల వారు వరకు పాలసీ తీసుకోవచ్చు. పాలసీ కనీస కాలపరిమితి 10-35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస బీమా రక్షణ మొత్తం రూ.25 లక్షలు, అదే ధూమపానం అలవాటు లేని వారికి రూ.50 లక్షలుగా నిర్దేశించారు. ఏడాది ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా నేరుగా నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియం చెల్లించొచ్చు. కాని ఈ పాలసీ తీసుకునే ముందు ఇప్పటి వరకు మీ పేరు మీద ఉన్న అన్ని బీమా పాలసీ వివరాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. -
షేర్లలో పెట్టుబడికి మంచి తరుణమిది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికలొస్తున్న ప్రస్తుత తరుణంలో ఈక్విటీలకు మరింత కేటాయించాలని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫండ్ మేనేజర్ వెంకటేష్ సంజీవి సూచించారు. ఎలక్షన్ల తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతే.. స్థూల ఆర్థిక పరిస్థితులతో పాటు మార్కెట్లు కూడా మరింత మెరుగుపడగలవని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు 15-20 శాతం పెరిగాక ఇన్వెస్ట్ చేయడం కన్నా కాస్త ముందుగానే నిర్ణయాలు తీసుకుంటే గణనీయంగా లాభపడొచ్చని చెప్పారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కొత్తగా ప్రారంభించిన ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ సిరీస్ 1 గురించి వివరించేందుకు మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెంకటేష్ ఈ విషయాలు తెలిపారు. చాలా మటుకు దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. మార్కెట్లు అధిక స్థాయిల్లో ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా వంటి కొన్ని రంగాలు మినహా చాలా రంగాల పీఈ నిష్పత్తి గతంతో పోలిస్తే తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. టెలికం, సిమెంటు, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాల షేర్లలో గణనీయ వృద్ధికి ఆస్కారం ఉందని వెంకటేష్ పేర్కొన్నారు. మరోవైపు, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు కూడా దిగిరావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చమురుకు డిమాండ్ అదుపులో ఉన్నంత దాకా దేశీయంగా ద్రవ్యోల్బణం ఎగియకపోవచ్చని చెప్పారు. అందుబాటులో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ - సిరీస్1 ఈ క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్ ప్రధానంగా వచ్చే మూడేళ్లలో అధిక రాబడులు అందించే అవకాశమున్న 20-25 కంపెనీల షేర్లపై దృష్టి సారిస్తుందని వెంకటేష్ చెప్పారు. కొత్త ఇన్వెస్టర్లకు పన్ను పరమైన ప్రయోజనాలు అందించే.. రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ (ఆర్జీఈఎస్ఎస్)కి అర్హమైన కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తామని వివరించారు. ఈ నెల 20న మొదలైన ఈ న్యూ ఫండ్ ఆఫర్ వచ్చే నెల 7తో ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ. 5,000 కాగా, కనీస లాకిన్ వ్యవధి మూడేళ్లు ఉంటుందని వెంకటేష్ పేర్కొన్నారు. -
ఐసీఐసీఐ ప్రు ఈజీ రిటైర్మెంట్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగా ఐసీఐసీఐ ప్రు ఈజీ రిటైర్మెంట్ ప్లాన్ను అందిస్తోంది. వినియోగదారుల పెట్టుబడి మార్కెట్ ఆటుపోట్లకు గురికాకుండా క్యాపిటల్ గ్యారంటీ ఫీచర్ ఈ యూనిట్ లింక్డ్ ప్లాన్ ప్రత్యేకత అని సంస్థ తెలిపింది. తాము భరించగలిగే రిస్క్ స్థాయిలను బట్టి షేర్లలో పెట్టుబడి పరిమితులను ఇన్వెస్టర్లు ఎంచుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా ఈ ప్లాన్ను కొనుగోలు చేసుకోవచ్చు. రిటైరైన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది.