jangoan
-
రాజయ్య Vs కడియం: ‘ఎవరో ఒక్కరే ఉండాలి అంటూ..’
సాక్షి, జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా శ్రీహరి వ్యాఖ్యలపై రాజయ్య స్పందిస్తూ ప్రతి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.సీనియర్ నేతలు కడియం, రాజయ్య మధ్య రాజకీయం మరోసారి పీక్ స్టేజ్కు చేరుకుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలి అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య స్పందించారు. ఈ క్రమంలో రాజయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కడియం సవాలును స్వీకరిస్తున్నాను. కడియం శ్రీహరి స్థానికేతరుడు. దళిత వ్యతిరేకి. ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నేను నిద్రపోను. నియోజకవర్గంలో నువ్వో నేనో.. ఎవరో ఒక్కరే మిగలాలి.కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అల్లుడ్ని అడ్డం పెట్టుకొని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా?. నీ భూ కబ్జాలు నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు నిజంగా సత్య హరిశ్చంద్రుడివి అయితే నీ బిడ్డను ఎంపీ చేయడానికి రూ.100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు?. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. శ్రీహరికి నాకు పోటీనే లేదు. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కడియం శ్రీహరి ప్రజానాయకుడు కాదు.. రాజకీయ నాయకుడు మాత్రమే’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
దారి ఇలా.. పాఠశాలకు వెళ్లేది ఎలా?
జనగామ జిల్లా, చిల్పూరు: దారి ఇలా ఉంటే తాము పాఠశాలకు ఎలా వెళ్లేదంటూ విద్యార్థులు సోమవారం నిరసన చేపట్టగా తల్లిదండ్రులు, నాయకులు సహకరించారు. మండలంలోని ఫత్తేపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు వెళ్లే రహదారిలో గ్రామంలోని మురుగు నీరు పాఠశాల సమీపంలో నిలుస్తోంది.చిరుజల్లులకే కుంటలా మారుతోంది. గతంలో గ్రామ ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే పాఠశాల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదుగతంలో ఎన్నో సార్లు అధికారులకు విన్నవించాం. అయినా పట్టించుకోవడం లేదు. మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల అంటూ పనులు చేస్తున్నారే తప్ప పాఠశాలకు పిల్లలు వచ్చే రోడ్డు ఎందుకు పట్టించుకోరు. త్వరగా సమస్య తీర్చాలి.– బానోత్ బాలరాజు, గ్రామస్తుడుబురదలోనే నడుస్తున్నాంప్రతీ రోజు చెప్పులు చేతపట్టుకుని బురదలో నడిచి పాఠశాలకు వెళ్తున్నాం. మధ్యాహ్న భోజనం తినే సమయంలో వాసన భరించలేక పోతున్నాం. అధికారులు స్పందించాలి.– హరిప్రసాద్, విద్యార్థిఒక్కోసారి బురదలో జారిపడుతున్నాం..పుస్తకాల బ్యాగుతో నడిచి వస్తుంటే ఒక్కోసారి జారి బురదలో పడుతున్నాం. దీంతో తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆ వాసన భరించలేక వాంతులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మా బడి వరకు రోడ్డు నిర్మించాలి.– సాత్విక, విద్యార్థిని -
బీఆర్ఎస్ నుంచి డబ్బు తీసుకుంది నిరూపిస్తే దేనికైనా రెడీ: కడియం
సాక్షి, జనగామ: ఎవరు ఎన్ని కుట్రలు, కుయుక్తులు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్య విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. తమకు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చినట్టు నిరూపిస్తే తాము ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. కాగా, కడియం స్టేషన్ ఘన్పూర్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రూ.10కోట్లు తీసుకున్నామని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమని ఎలాంటి ఆధారాలు చూపించినా, నిరూపించినా మేము ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటాము. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కావ్య గెలుపు ఖాయమైంది. సీఎం రేవంత్ ఆశీర్వాదంతో నేను వరంగల్ను అభివృద్ధి చేస్తాను. బీజేపీ వాళ్ళు రాజ్యాంగం మీద అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. చేసిన పని చెప్పడానికి ఏమీ లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది, ఇక్కడే కడియం ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమలు చేసింది. 2017లో ఐదుగురు జడ్జిల ధర్మసానం భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదు అని తెలిపింది. పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుంది. కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాను. నా 30ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. నా నిజాయితే నాకు పెట్టుబడి. నేను ఏ పార్టీకి వెన్ను పోటు పొడవలేదు. కానీ నా ద్వారా ఎదిగిన ఆరూరి రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. నేను ఛాలెంజ్ చేస్తున్న నీదగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నానా చెప్పాలి. 2014, 2018లో నీ గెలుపు కోసం నేను ప్రచారం చేసాను. నువ్వు చేసిన భూకబ్జాల కారణంగా ఓడిపోయావు. ఓటమి భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మందకృష్ణ నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఒక్క నాపై మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నావు. నాది మాదిగ ఉప కులం. మాదిగలకు ద్రోహం చేస్తున్నది మందకృష్ణ. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నా పార్టీకి ఓటు వేయమని ఎలా చెపుతున్నావు. దీనికి సమాధానం చెప్పాలి. నీ నాయకత్వం సరిగా లేకపోవడం వల్లనే ఎంఆర్పీఎస్లో చీలికలు వచ్చాయి అంటూ విమర్శలు చేశారు. -
ఫలించిన కేటీఆర్ ప్లాన్.. సీనియర్ నేతకు టికెట్ ఫిక్స్
సాక్షి, వరంగల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. కాగా, ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది. అయితే, బీఆర్ఎస్లో సీట్ల పంచాయితీపై ఇంకా కోల్డ్వార్ నడుస్తూనే ఉంది. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు సందర్భంగా దొరికిన ప్రతీసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. నేతల మధ్య సయోధ్య కుదురుస్తున్నారు. ఇందులో భాగంగానే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. ఇద్దరు నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జనగామ సీటును పల్లా రాజేశ్వర్రెడ్డికి కేటాయించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడి యాదగిరిరెడ్డితో చర్చించారు. వీరి మధ్య సయోద్య కుదిర్చి జనగామ స్థానాన్ని పల్లాకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ముత్తిరెడ్డికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక, జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని స్థానిక నేతలకు కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపునకు కలిసి పని చేయాలని ముత్తిరెడ్డి సైతం పిలుపునిచ్చారు. మరోవైపు.. జనగామ సీటు ఖరారు కావడంతో పల్లా రాజేశ్వర్రెడ్డి నేడు కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం, అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక, ఇదే జోష్లో ఈనెల 16న కేసీఆర్ నేతృత్వంలో జనగామలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు. ఈ సభ ఏర్పాట్లను నేడు మంత్రి హరీష్ రావుతో కలిసి పల్లా పర్యవేక్షించనున్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వైపు.. తండ్రి కొడుకుల చూపు? -
అసలు కథ ముందుంది.. ఎమ్మెల్యే రాజయ్య షాకింగ్ కామెంట్స్
సాక్షి, జనగామ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం రాష్ట్రంలో టికెట్ల విషయం కాక రేపుతోంది. మూడు ప్రధాన రాజకీయపార్టీల్లోనూ వేడి పుట్టిస్తోంది. బీఆర్ఎస్లో టికెట్ దక్కని ఆశావహులు అసమ్మతి రాగం ఎత్తుకున్నారు. మరికొందరు నేతలు ఏకంగా పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ లభించని ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఝలక్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు.. తాజాగా రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ రాకపోయినా నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అంతా అనుకుంటున్నారు. ఎవరూ రారు.. ఏమీ జరగదు. నా పని ఇప్పుడే అయిపోందని భావించకూడదు అంటూ కీలక కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన ఏం చేస్తారనే టెన్షన్ బీఆర్ఎస్ నేతల్లో నెలకొంది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాజయ్య బుధవారం లింగాలఘనపురం మండలంలో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. అయితే, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్కు చెందిన స్థానిక నేతలు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో నేతల తీరుపై రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చూస్తూ ఊరుకుంటామా.. ఇక, అంతకుముందు కూడా రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న రాజయ్య.. ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలో ఉంటానని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంపై పరోక్షంగా రాజయ్య మనోవేదన చెందుతున్నారు. ఈ సందర్భగా రాజయ్య మాట్లాడుతూ.. భూమి కొని మొట్లు కొట్టి దుక్కి దున్ని నారు పోసి కలుపుతీసి, పంట పండించి కుప్ప పోశాక కుప్ప మీద వచ్చి ఎవరో కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నవ్వుతూ నోరు కొట్టుకున్నారు. దేవుడున్నాడు, దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు.. రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల కోసమే నేనున్నా, ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని తెలిపారు. ఇది కూడా చదవండి: సాగర్ బీఆర్ఎస్లో అంతర్గత పోరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని డిమాండ్ -
నర్సంపేటలో బీఆర్ఎస్పై డబుల్ బెడ్రూం ఎఫెక్ట్?
2018 ఎన్నికల్లో నర్సంపేటలో బీఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన పెద్దిరెడ్డి సుదర్శనరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డిపై 16949 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సుదర్శనరెడ్డి.. పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా పని చేశారు. 2018లో నర్సంపేట నుంచి పోటీచేసి గెలు పొందారు. మాధవరెడ్డి 2014లో ఇండిపెండెంట్గా పోటీచేసి విజయం సాధించగా, 2018లో కాంగ్రెస్ టిక్కెట్పై పోటీచేసి ఓడిపోవడం విశేషం. సుదర్శనరెడ్డికి 94135 ఓట్లు రాగా, మాదవరెడ్డికి 77186 ఓట్లు వచ్చాయి. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : నిరుద్యోగ సమస్య. రోడ్లు. డ్రైనేజీ. డ్రింకింగ్ వాటర్. సరియైన గృహవసతులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు (డబుల్ బెడ్ రూమ్). భూ సమస్యలు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : వరంగల్ జిల్లాకు ఎడ్యుకేషన్ హబ్గా మారిన నర్సంపేట. త్వరలో రాబోతున్న మెడికల్, నర్సింగ్ కళాశాల. ఇప్పటికే ఉన్న రెండు ఇంజనీరింగ్, బీఈడి కళాశాలలు. త్వరలో ప్రారంభం కానున్న 350 పడకల జిల్లా ఆస్పత్రి. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్రెడ్డి (కన్ఫాం) కాంగ్రెస్ దొంతి మాధవరెడ్డి (ఆశావాహులు) బీజేపీ రేవూరి ప్రకాశ్రెడ్డి (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు రైతులు. వ్యాపారులు. మతం/కులం పరంగా ఓటర్లు బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు భౌగోళిక పరిస్థితులు.. పాఖాల అభయారణ్యం. పర్యాటక కేంద్రంగా పాఖాల సరస్సు. -
కడియంకే టికెట్.. ఘన్పూర్లో ఉత్కంఠ!
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇద్దరు నేతలు మాత్రమే డిప్యూటీ సీఎంలుగా అయ్యారు. వారిద్దరు కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య కాగా.. రెండో ఉప ముఖ్యమంత్రి.. కడియం శ్రీహరి. వీళ్లిద్దరూ ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ విరోధులు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంటూ నువ్వా-నేనా అనే స్థాయిలో పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. రాజయ్య ప్రస్తుతం ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే.. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు. నియోజకవర్గంలోని రాజకీయ అంశాలు : సిట్టింగ్లకే టికెట్ ఇస్తామన్న అధిష్టానం స్టేషన్ ఘనపూర్ విషయంలో తన మాట తప్పింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా.. కడియంకు టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి రెండుసార్లు, బీఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో టీడీపీ నుండి కడియం శ్రీహరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత BRSలో చేరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఏమ్మెల్సిగా ఉప ముఖ్యమంత్రిగా ( విద్యాశాఖ మంత్రి) పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిరా, దొమ్మాటి సాంబయ్య ఉన్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరామారావు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య తెలంగాణా రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి అయ్యారు. అనతి కాలంలోని పదవి పొగొట్టుకుని ఆయన స్థానంలో కడియం శ్రీహారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి మద్య అధికార పార్టీ బిఆర్ఎస్లో టిక్కెట్ వార్ సాగుతుంది. చివరికి ఈ వార్లో కడియాన్ని టికెట్ వరించింది. జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారం ఎమ్మెల్యే రాజయ్య రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, అభివృద్దికి నోచుకోకపోవడం. ధళితబందు పథకంలో కమీషన్ల దందా సాగడం, భూసమస్యలు పరిష్కారం కాకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులకు లభించకపోవడం ప్రధాన పార్టీలోని అభ్యర్థులు : బీఆర్ఎస్ కడియం శ్రీహరి (కన్ఫాం) కాంగ్రెస్ (ఆశావాహులు) సింగపురం ఇందిరా దొమ్మాటి సాంబయ్య బొల్లెపల్లి కృష్ణ బీజేపీ (ఆశావాహులు) డాక్టర్ విజయరామారవు మాదాసు వెంకటేష్ బోజ్జపల్లి సుభాస్ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్సీ ఓటర్లు ఆతర్వాత బిసి ఓటర్లు అధికంగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నియోజకవర్గం రెండు జిల్లాల కలయికతో ఉంటుంది. జనగామతోపాటు హన్మకొండ జిల్లాలో నియోజకవర్గం ఉంది. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం (చిలుపూరు గుట్ట) సీతారామచంద్రస్వామి ఆలయం (జీడికల్) మల్లన్న గండి రిజర్వాయర్, స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్, కిలా షాపూర్, జఫర్గడ్, తాటికొండ కోటలు, కాకతీయుల నాటి 500 పిల్లర్ టెంపుల్ (నిడిగొండ రఘునాథపల్లి మండలం) (పర్యాటకం) ఆకేరు వాగు(ఉప్పుగల్, జాఫర్గడ్ మండలం) -
ఈసారి పాలకుర్తిలో వాడివేడి పోటీ.. అధికార పార్టీపై హాస్తం వ్యూహాలు..!
పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ బారీ కసరత్తే చేస్తుంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశిస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం ఉంటుంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నాడు. రాజకీయపరమైన అంశాలు పాలకుర్తి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దయాకర్ రావు కలిసి వచ్చే అంశం నియోజకవర్గ ప్రజలతో రెగ్యులర్గా టచ్లో ఉండడం. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం. మహిళలకు కుట్టు మిషన్ సెంటర్ను ఏర్పాటు చేసి ఫ్రీగా కుట్టు మిషన్ ఇవ్వడం. మహిళలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీ మిల్స్ ఏర్పాటు చేయడం. జూనియర్ డిగ్రీ కాలేజీలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం కలిసి వచ్చే అంశాలు. కాంగ్రెస్ పార్టీ నుండి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి , నియోజకవర్గ లోకల్గా కలిసి వచ్చే అంశం. ఆమె గతంలో నిరుపేదలకు చేసిన సేవలు కూడా ప్రభావితం చేస్తాయి అని చెప్పవచ్చు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నాయకులు ఆమెతో కలిసి వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే నెమరు కొమ్ముల సుధాకర్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకపోవడంతో తనతో ఉన్న కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. పాలకుర్తిలో బిజెపి ప్రభావం పెద్దగా చెప్పుకోదగినంత ఏమీ లేదు. గతంలో రెండు సార్లు పెద్దగాని సోమయ్య పోటీ చేశాడు కానీ ఇప్పటివరకు మళ్లీ ఏ వ్యక్తికైనా బిజెపి నుండి అభ్యర్థిగా నిర్ణయించలేదు.. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పాలకుర్తి నియోజకవర్గం లోకల్ నాన్ లోకల్ అంశం, ఈ ఎలక్షన్లో రెడ్డి సామాజిక వర్గం ప్రభావితం చూపే అవకాశం ఉంది. నాలుగో సారి ఎన్నికల బరిలో మంత్రి దయాకర్ రావు ప్రజల నుంచి సహజంగా వచ్చే వ్యతిరేకత. మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకత ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు బీఆర్ఎస్ ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బీజేపీ పార్టీ పెద్దగాని సోమయ్య వృత్తిపరంగా ఓటర్లు: రైతులు. వ్యాపారులు. మతం/కులాల వారిగా ఓటర్లు: హిందుఓటర్లు అందులో రెడ్డి సామాజికవర్గం ఓట్లు ప్రభావం చూపుతాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: పాలకుర్తి నియోజకవర్గం మూడు జిల్లాలకు విస్తరించి ఉంది. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. అడవులు లేవు పర్యాటక కేంద్రంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ టెంపుల్, వల్మిడి సీతారామచంద్ర స్వామి టెంపుల్, బొమ్మెర పోతన స్మారక మందిరం. -
ఈ సారి పాలకుర్తి నియోజకవర్గ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేది ఎవరు..? గత చరిత్ర ఇదే..
పాలకుర్తి నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చెన్నూరు నియోజకవర్గం రద్దై పాలకుర్తి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. పాలకుర్తిలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి విజయం సాదించడం ద్వారా ఆయన ఆరు సార్లు గెలిచినట్లయింది. 2014 ఎన్నికలలో టిడిపి పక్షాన గెలిచిన దయాకరరావు ఆ తర్వాత పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. తిరిగి ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి జంగా రాఘవరెడ్డిపై 53053 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తదుపరి ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. దయాకరరావు ఐదుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి ఎమ్.పిగా కూడా నెగ్గారు. దయాకరరావుకు 117504 ఓట్లు రాగా, రాఘవ రెడ్డికి 64451 ఓట్లు వచ్చాయి.ఇక్కడ ఎస్.ఎఫ్ బి అభ్యర్ధిగా పోటీచేసిన ఎల్. విజయ్కు మూడువేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఎర్రబెల్లి దయాకరరావు 2014 ఎన్నికలనాటికి తెలంగాణ టిడిపి వర్కింగ్ అద్యక్షుడుగా ఉన్నారు. 2014 ఎన్నికలలో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే డి.శ్రీనివాసరావును 4313 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుదాకరరావుకు 52253 ఓట్లు వచ్చాయి. దయాకరరావు అంతకుముందు వర్ధన్నపేటలో మూడుసార్లు గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో వర్దన్నపేట రిజర్వుడ్ కావడంతో పాలకుర్తికి మారారు. ఒకసారి లోక్సభకు (ఉపఎన్నికలో) గెలుపొందారు. దుగ్యాల శ్రీనివాస రావు గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐకి మద్దతు ఇచ్చారు. శ్రీనివాసరావు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అనర్హతకు గురి అయిన తొమ్మిది మందిలో ఒకరుగా ఉన్నారు. అయితే తీర్పు రావడానికి ఒకరోజు ముందుగానే ఎమ్మెల్యే పదవికి దుగ్యాల రాజీనామా చేశారు. చెన్నూరు నియోజకవర్గం రద్దు కావడంతో దుగ్యాల పాలకుర్తిలో పోటీచేశారు. దయాకరరావు టిడిపి తరపున ప్రభుత్వ విప్గా గతంలో పనిచేశారు. సుధాకరరావు గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నికయ్యారు. తదుపరి టిఆర్ఎస్లో చేరారు. పాలకుర్తి, అంతకుముందు ఉన్న చెన్నూరు నియోజకవర్గాలలో కలిపి పదమూడు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు గెలుపొందితే, ఒకసారి మాత్రం రెడ్డి గెలిచారు. చెన్నూరు(2009లో రద్దు) రద్దయిన చెన్నూరు నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలుజరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి సోషలిస్టు ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. రాష్ట్రంలో ఏడుసార్లు నెగ్గిన అతికొద్ది మంది నేతలలోఒకరైన ఎన్.యతిరాజారావు చెన్నూరు నుంచే గెలుపొందారు. ఒక ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత కూడా ఈయన పొందారు. ఈయన భార్య విమలాదేవి, కుమారుడు డాక్టర్ ఎన్. సుధాకరరావు కూడా ఒక్కోసారి గెలిచారు. యతిరాజారావు మరో కుమారుడు ప్రవీణ్రావు 2009లో ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1972లో ఇండిపెండెంటుగా గెలిచిన మధుసూధనరెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. యతిరాజారావు గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో పనిచేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గం గెలిచిన అభ్యర్థులు వీరే...
స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాడికొండ రాజయ్య నాలుగోసారి విజయం సాదించారు. 2018లో రాజయ్యకు టిక్కెట్ వస్తుందా? రాదా అన్న మీ మాంస ఏర్పడినప్పటికీ, చివరికి ఆయన టిక్కెట్ పొందడం, భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగాయి. రాజయ్యకు 35790 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది సింగాపూర్ ఇందిరను ఓడిరచారు. రాజయ్యకు 98612 ఓట్లు రాగా, ఇందిరకు 62822 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి అభ్యర్దిగా పోటీచేసిన రాజారపు ప్రతాప్కు 22700 పైగా ఓట్లు వచ్చాయి. తెలంగాణ తొలి క్యాబినెట్లో రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చారు. కాని కొద్ది నెలలకే ఆయనను తప్పించి ఎంపీిగా ఉన్న మరో నేత కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా క్యాబినెట్లోకి తీసుకున్నారు. 2018 ఎన్నికలలో మాత్రం శ్రీహరికి అవకాశం రాలేదు. 2018లో ఆయన కూడా మంత్రి కాలేకపోయారు. ఎమ్మెల్సీ పదవి మాత్రం మిగిలింది. 2014లో రాజయ్య, కాంగ్రెస్ ఐ అభ్యర్ధి విజయ రామారావుపై 58829 ఓట్ల ఆదిక్యతతో విజయ డంఖా మోగించారు. రాజయ్య రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఐలో గెలుపొంది టిఆర్ఎస్లోకి వస్తే, విజయ రామారావు 2004లో టిఆర్ఎస్లో గెలిచి శాసనసభ పక్ష నేతగా ఉండి, తదుపరి ఉప ఎన్నికలో ఓటమి చెందారు. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్ ఐలోకి వెళ్లినా ఆయనకు ఫలితం దక్కలేదు. రాజయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఐ కు రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరారు. తదుపరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. తిరిగి సాదారణ ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించారు. కాగా గతంలో ఇక్కడ మూడుసార్లు ప్రాతినిద్యం వహించిన టిడిపి నేత కడియం శ్రీహరి కూడా టిఆర్ఎస్లో చేరి వరంగల్ నుంచి లోక్ సభకు పోటీచేసి విజయం సాదించడం విశేషం. స్టేషన్ఘన్పూర్ నుంచి 2008 ఉపఎన్నికలో గెలుపొందిన టిడిపి పక్షాన కడియం శ్రీహరి 2009 సాధారణ ఎన్నికలో ఓడిపోయారు. ఆ తర్వాత టిఆర్ఎస్లోకి వెళ్లారు. కడియం శ్రీహరి ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిస్తే, గోక రామస్వామి రెండుసార్లు గెలిచారు. 2004లో టిఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా వ్యవహరించిన డాక్టర్ జి. విజయరామారావు ఇక్కడ నుంచే ఒకసారి గెలిస్తే, మరోసారి మెదక్ జిల్లా గజ్వేల్లో గెలిచారు. ఒకసారి సిద్దిపేట నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2008లో టిఆర్ఎస్ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేయగా, ఆయన ఓడిపోయారు. అప్పుడు టిడిపి నేత కడియం శ్రీహరి గెలిచారు. 1985లో ఇక్కడ గెలిచిన బొజ్జపల్లి రాజయ్య, 1999లో పరకాలలో విజయం సాధించారు. ఘనపూర్ నియోజకవర్గం జనరల్గా వున్నప్పుడు ఇక్కడ ఒకసారి గెలిచిన టి.హయగ్రీవాచారి, ధర్మసాగర్లో రెండుసార్లు, హన్మకొండలో ఒకసారి గెలిచారు. హయగ్రీవాచారి తర్వాత కాలంలో నక్సల్స్ తూటాలకు బలైపోవడం ఓ విషాదం. హయగ్రీవాచారి గతంలో పి.వి, మర్రి, అంజయ్య, కోట్ల క్యాబినెట్లలో పనిచేశారు. గోకా రామస్వామి 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్లో కొద్దికాలం పనిచేసి, ముఖ్యమంత్రితో తగాదపడి, పడక రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. కడియం శ్రీహరి 1994లో ఎన్.టి.ఆర్. క్యాబినెట్లోను, తదుపరి చంద్రబాబు క్యాబినెట్లోను పనిచేశారు. ఆ తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. డాక్టర్. జి. విజయరామారావు కొంతకాలం డాక్టర్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. డాక్టర్ రాజయ్య కూడా కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కొంతకాలం ఉన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిపి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ మూడుసార్లు , ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. జనరల్ గా ఉన్నప్పుడు రెడ్లు రెండుసార్లు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారిఇతరులు గెలుపొందారు. స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ముగ్గురు విద్యార్థినిలు మిస్సింగ్.. ఏమయ్యారు?
సాక్షి, జనగామ: జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో శనివారం ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. దీంతో విద్యార్థినిల పేరెంట్స్ హెడ్మాస్టర్కు విషయం తెలిపారు. దీంతో, వీరంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. జనగామ జిల్లాలో ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. స్టేషన్ రోడ్లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆశ్విత(15), శివరాత్రి రక్షిత(14), దూదేకుల రుబిన(12) శనివారం అదృశ్యమయ్యారు. ఈరోజు భోజన సమయంలో వీరు ముగ్గురు కనిపించలేదు. ఈ విషయం వీరి పేరెంట్స్కు హెడ్మాస్టర్ వలబోజు కృష్ణమూర్తి తెలియజేశారు. ఈ క్రమంలో వీరి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విషాదం.. కొడుకు మరణ వార్త విని తండ్రి మృతి -
పొలిటికల్ ఎంట్రీపై ముత్తిరెడ్డి కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
జనగామ: ‘రాజకీయాలంటే ఇష్టం లేదు.. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు.. అందుకే నాన్న పంచాయితీ విషయంలో సీఎం కేసీఆర్ను కలవలేదు’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి అన్నారు. తన అధికారిక కార్యక్రమాలను కూతురు, అల్లుడు రాహుల్రెడ్డి అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం తుల్జా భవానీరెడ్డి బంధువు రామకృష్ణను పోలీసులు బుధవారం పిలిపించగా, అల్లుడు, కూతురు సైతం జనగామ పీఎస్కు వచ్చారు. ఎమ్మెల్యే అధికారిక పర్యటనను అడ్డుకున్నారనే ఆరోపణలతో పాటు ఇతర విషయాలను పోలీసులు అడిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రామకృష్ణ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. తుల్జా భవానీరెడ్డి, రాహుల్రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కాగా, ముత్తిరెడ్డి అధికారిక కార్యక్రమాన్ని తాను ఎప్పుడూ అడ్డుకోలేదని తుల్జాభవానీరెడ్డి అన్నారు. ఇదే సమయంలో తాను చేర్యాల భూమిని మున్సిపాలిటీకి ఇచ్చిన తర్వాత తన తండ్రి స్వాగతిస్తున్నానని అన్నారని, ఇప్పుడేమో కేసులు పెట్టి మళ్లీ తమను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. తాను ఆ భూమిని కబ్జా చేశానని తన తండ్రి ఓపెన్గా ఒప్పుకున్నారని.. మరి ఆయన తన పదవిలో ఎందుకు ఉన్నారు? రాజీనామా ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. భూమి ఆయన కబ్జా చేశాడని, భూమి తాను ఇచ్చానని, కాబట్టి ఈ విషయంలో తండ్రి కూడా వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్నకూతురిపై ఓ తండ్రి ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: బస్సు రూట్లో కాంగ్రెస్ -
నవ్య ఎపిసోడ్.. ‘ఆడియోలు, వీడియోల’పై రాజయ్య సవాల్
సాక్షి, జనగామ: జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరోక్షంగా స్పందించారు. ఈ వ్యవహారంలో గోబెల్స్ ప్రచారం నమ్మవద్దని రాజయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఆడియోలు వీడియోలు ఉన్నాయని అంటున్నారు. వారికి ఛాలెంజ్ చేస్తున్నా.. ఆరోపణలను కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. అవసరమైతే పరువు నష్టం దావా వేస్తా. సైబర్ నేరం కింద జైలుకు పంపిస్తా. నేను ప్రజాజీవితంలో ఉన్నాను. ఎమ్మెల్యే రాజన్న అంటే ఓ ప్రజా నాయకుడు’ అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపైనా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్కౌంటర్ల సృష్టికర్త. పార్టీ నుంచి బహిష్కరించనవారే కడియం వెంట ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కడియంను సస్పెండ్ చేయాలి. ఆంధ్రాకు చెందిన దూదేకుల వ్యక్తిని పెళ్లి చేసుకున్న కడియం కుమార్తె ఎస్సీ కాదు.. బీసీ కులానికి చెందుతుంది. సకల జనుల సమ్మెలో భాగంగా నేను రాజీనామా చేశాను.. కానీ, శ్రీహరి మాత్రం అలా చేయలేదు. ఇదే క్రమంలో ఆడియోలు, వీడియోలు అంటూ నాపై వస్తున్న ఆరోపణలను కోర్టు ద్వారా ఎదుర్కొంటాను అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ‘సర్పంచ్ నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవు’ -
జనగామలో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవం
-
ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయి: సీఎం కేసీఆర్
సాక్షి, జనగామ: తెలంగాణలో ఎప్పుడూ కరెంట్ సమస్య ఉండదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోవద్దని కేసీఆర్ సూచించారు. ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 7 తెలంగాణలోని గ్రామాలే అని గుర్తు చేశారు. పట్టుదలతో పనిచేస్తేనే ఇవన్నీ సాధ్యమైందన్నారు. , విద్యుత్శాఖ ఉద్యోగులు రాత్రిబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు వేరువేరు కాదని అన్నారు. జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సీఎం కేసీఆర్ కొబ్బరికాయ కొట్టించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు జనగామ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేవి. అప్పట్లో జనగామలో మంచినీళ్లు కూడా ఉండని పరిస్థితి ఉండేది. చాలామంది పొట్టచేతపట్టుకొని వలసపోయారు. అప్పటి పరిస్థితి చూసి ఎంతో బాధపడ్డా. రాష్ట్రం వచ్చాక పరిస్థితి మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకున్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. చదవండి: ‘కేంద్ర’ ఉద్యోగాల భర్తీపై స్పష్టత: ఆర్.కృష్ణయ్య భూముల ధరలకు రెక్కలు తలసరి ఆదాయం త్వరలో రూ.2.70లక్షలకు పెరగబోతుంది. హైదరాబాద్లో 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు. ఢిల్లీ ముంబై నుంచి వచ్చి హైదరాబాద్లో కొంటున్నారు. జోనల్ వ్యవస్థతో అందరికీ న్యాయం. అవగాహన లేక కొందరు వ్యతిరేకించారు.’అని తెలిపారు. అనంతరం సమీపంలోని మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. జనగామలో భూముల విలువలు పెరిగాయి. ఏడేళ్ల కింద రూ. రెండు లక్షల విలువన్న ఎకర భూమి.. ఇప్పుడు రూ.3,3 కోట్లకు చేరింది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎకర పొలం రూ. 25 లక్షలకు తక్కువ పోతలేదు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధ్యమైంది. సీఎస్, అధికారులు, ప్రజాప్రతినిధులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
వివాహ వేడుకలో పెట్రోలు బహుమానం..
సాక్షి, నర్మెట(జనగామ): పెట్రోల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య చాలా వివాహ వేడుకలలో దీన్ని కూడా బహుమానంగా ఇస్తుండం ఒక ట్రెండ్గా మారింది. కాగా, పెళ్లి వేడుకలకు వచ్చిన బంధుమిత్రులు వధూవరులకు బహుమతిగా నగదు, నూతన వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే నర్మెట మండల కేంద్రంలో శనివారం జరిగిన మహేష్–సుస్మిత వివాహానికి హాజరైన బాల్య మిత్రులు భాస్కర్, సతీష్, శివ, శ్రీనివాస్, నవీన్ లీటర్ పెట్రోలు అందజేసి ధరలు బాగా పెరిగాయి పొదుపుగా వాడుకోవాలని సలహా ఇచ్చారు. చదవండి: టీ సర్కార్ ఉల్లంఘనలపై తెలంగాణ హైకోర్టుకు ఏపీ రైతులు -
మాస్కు ధరించలేదని చిన్నారులతో..
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం భాంజీపేటలో మాస్క్లు లేని చిన్నారులతో ఓ పంచాయతీ కార్యదర్శి రహదారిపై కప్పగంతులు వేయించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీరంగారెడ్డి మంగళవారం గ్రామంలో పర్యటిస్తూ మాస్క్లు ధరించని ఇద్దరికి జరిమానా వేశారు. ఆ తర్వాత పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు మాస్క్ లేకుండా కనిపించగా.. వారిని కప్పగంతులు వేయాలని ఆదేశించారు. దీంతో చిన్నారులు మోకాళ్లపై కొద్దిదూరం కప్పగంతులు వేయగా, స్థానికులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ఈ విషయమై శ్రీరంగారెడ్డి మాట్లాడుతూ కరోనాపై చిన్నారులకు అవగాహన కల్పించేందుకు కప్పగంతులు వేయించానే తప్ప మరే ఉద్దేశం లేదని తెలిపారు. ఒకే ఇంట్లో ఆరుగురికి పాజిటివ్ .. బాధితుల్లో ఐదు నెలల బాబు స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని అక్కపెల్లిగూడెంలో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఇప్పగూడెం పీహెచ్సీ వైద్యాధికారి మౌనిక తెలిపారు. పీహెచ్సీకి వచ్చిన కుటుంబ సభ్యులను పరీక్షించగా కుటుంబంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్గా తేలిందని చెప్పారు. కాగా, బాధితుల్లో ఐదు నెలల వయసు కలిగిన బాబు కూడా ఉన్నాడని తెలిపారు. చదవండి: ఇంట్లోనూ మాస్క్ ధరించండి..ఎందుకంటే ? -
చాయ్ వారి చావుకొచ్చింది
బచ్చన్నపేట: టీ తాగి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్లో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మణ్రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన దాసారం మల్లయ్య ఇంటికి హైదరాబాద్లో ఉంటున్న తన సోదరుడు భిక్షపతి వచ్చాడు. ఉదయం మల్లయ్య భార్య అంజమ్మ.. భర్త, మరిదికి టీ ఇచ్చింది. అనంతరం తానూ తాగింది. కాసేపటికి ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. వారి కుమారుడు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అంజమ్మ మృతి చెందింది. మల్లయ్య, భిక్షపతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, టీ పొడిలో విషపు గుళికలు ఉన్నట్లుగా గుర్తించామని ఎస్సై లక్ష్మణ్రావు తెలిపారు. -
బాబోయ్.. భల్లూకం
సాక్షి, జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి – కంచ నపల్లి రోడ్డుపై ఎలుగుబంట్ల సంచారం పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్ర వారం దొడ్డిగుట్ట వద్ద రహదారిపైకి ఒక్కసారిగా ఎలుగుబంటి రావడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని, పొలాల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి ఎలుగుబంట్లను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాలని కోరుతున్నారు. -
ఆయిల్ఫెడ్కు 1.3 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్పాం సాగుకు నోటిఫై చేసిన ఏరియాలో 1.3 లక్షల ఎకరాలు ఆయిల్ ఫెడ్కు ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, జనగామ జిల్లాలో 20 వేల ఎకరాలు, గద్వాల జిల్లాలో 20 వేలు, నారాయణపేట్ జిల్లాలో 10 వేల ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకుంటామని ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ నిర్మల తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 25 జిల్లాల్లో 8,24,162 ఎకరాలు ఆయిల్పాం సాగుకు అనువైన ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. అందులో దాదాపు 8 లక్షల ఎకరాలను 13 కంపెనీల పరిధిలోకి తీసుకురావడం, ఆయిల్ఫెడ్కు 24,500 ఎకరాలు (2.97 శాతం) మాత్రమే కేటాయిస్తూ వ్యవసాయశాఖ ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడం విదితమే. దీంతో ఆయిల్ఫెడ్ అధికారులు తమకు మరికొంత కేటాయించాలని వ్యవసాయశాఖకు విన్నవించారు. ఇదిలావుంటే ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన దాంట్లో కొన్ని ప్రముఖ సంస్థలే ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో ఆయిల్ఫెడ్ కోరినట్లుగా నోటిఫై చేసిన ప్రాంతాల్లో కొంతమేరకు ఇచ్చారు. కొన్ని కంపెనీలు రాని ఏరియాలను ఇప్పటికే టెండర్లలో పాల్గొన్న సంస్థలకు ఇస్తామని ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
‘కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు’
సాక్షి, జనగామ: ‘పార్టీలో పదవులు రాలేదని చీటికిమాటికి కొట్లాటలు వద్దు. ఉద్యమ సమయం నుంచి నేను పార్టీలో కష్టపడి పనిచేసిన. అయినా నిన్నకాక మొన్న టీఆర్ఎస్లో చేరిన వారు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. దీనికి నేనేమైనా కొట్లాట చేశానా? అన్నింటికీ అధినేత సీఎం కేసీఆర్ ఉన్నారనే భరోసా ఉంది’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట, పాలకుర్తి, ఉప్పల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. కేసీఆర్ను నమ్ము కోవడంతో జనగామ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చారన్నారు. మనకు మనం మనస్పర్థలకు వెళ్లి, పార్టీకి చెడ్డ పేరు తేవొద్దని హితవు పలికారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పినోళ్లకే పథకాలు వస్తాయని, కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు దక్కు తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు. -
స్కూటీని ఢీకొట్టిన మాజీ ఎమ్మెల్యే వాహనం
జనగామ: మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం.. ముందు వెళుతున్న స్కూటీని ఢీకొట్టి ఎగిరి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు కాగా, మాజీ ఎమ్మెల్యేకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనలో మాధవరెడ్డితోపాటు ఆయన పీఏ, డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మాజీ శాసనసభ్యుడు మాధవరెడ్డి తన ఇన్నోవా వాహనం లో హైదరాబాద్ బయలుదేరారు. జనగామ జిల్లా కేంద్రం బైపాస్ లోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో ముందు వెళుతున్న స్కూటీని ఆయన వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెళుతున్న మామిడాల రాకేశ్ ఎగిరి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఇన్నోవా సైతం అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ముందు సీట్లో కూర్చున్న మాజీ ఎమ్మెల్యేతోపాటు డ్రైవర్ రంజిత్కుమార్, వెనక సీట్లో ఉన్న పీఏ శ్రీపతి స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాకేశ్ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ వేమెళ్ల సత్యనారాయణరెడ్డి మరో వాహనంలో మాధవరెడ్డి, డ్రైవర్, పీఏను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డీసీపీ శ్రీనివాస్రెడ్డితో కలసి సీఐ మల్లేశ్, ఎస్సై రాజేశ్ నాయక్ సంఘటన స్థలం చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. రాకేశ్ సోద రుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నీటి కొరత ఉంటే తలస్నానం చేస్తారా?
సాక్షి, రఘునాథపల్లి : హోలీ సందర్భంగా సోమవారం రంగులు చల్లుకున్న విద్యార్థినులు తలస్నానాలు చేశారు. నీటి కొరత ఉన్నప్పుడు తలస్నానాలు చేసి నీటిని వృథా చేశారంటూ ఆగ్రహంతో విద్యార్థినులను కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి చితకబాదింది. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కేజీబీవీలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ప్రత్యేకాధికారి సుమలత పాఠశాలకు వచ్చేసరికి సంపులోని నీరు ఖాళీ అయింది. దీంతో తలస్నానాలు చేసిన బాలికలందరినీ పిలిచి చేతి వేళ్లపై కర్రతో కొట్టింది.ఘటనపై సుమలతను వివరణ కోరగా.. ‘పాఠశాలలో నీటి సమస్య ఉంది.. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున రంగులు చల్లుకోవద్దని చెప్పినా వినలేదు’ అని చెప్పారు. -
పొన్నాల వర్సెస్ జంగా!
సాక్షి , వరంగల్ : పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, అతని అనుచరులకు ఘోర పరాభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనగామలోని 30 వార్డులకు గానూ పొన్నాల అనుచరులకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు. మంత్రిగా, పీసీసీ చీఫ్గా వ్యవహరించిన పొన్నాలకు ఈసారి కనీసం బీ ఫాంలు కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పొన్నాలకు పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డీసీసీ నేత జంగా రాఘవరెడ్డికే బీ ఫాంలు, అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు టీపీసీసీ ఇవ్వగా, జంగా రాఘవరెడ్డి ఒకే కుటుంబానికి రెండు రెండు టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ నేతలు జనగామలో రోడ్డెక్కారు. చేసేదేం లేక పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పీసీసీ కార్యదర్శులు కంచ రాములు, ధర్మ సంతోష్రెడ్డి అధిష్టానానికి తమ రాజీనామా లేఖలు పంపించారు. కాంగ్రెస్లో బీసీలను అణిచివేశారని ఈ సందర్భంగా వారు ఆరోపణలు చేశారు. పెల్లుబికిన నిరసనలతో పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరిన కాంగ్రెస్ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జంగా రాఘవరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనగామలో స్థానికేతురుడైన రాఘవరెడ్డి పార్టీని నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. -
మద్యం టెండర్ల కోసం బంగారం తాకట్టు
సాక్షి, జనగామ : మద్యం టెండర్ల దరఖాస్తుకు గడువు రేపటితో ముగుస్తుండడంతో దరఖాస్తులు డబ్బులు కోసం బంగారం తాకట్టు పెడుతున్నారు. క్యాష్ కోసం పరేషాన్ అవుతున్నారు. ప్రైవేట్ చిట్ఫండ్లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మద్యం షాపుల టెండర్ల అప్లికేషన్లకు ఈనెల 16వ తేదీతో గడువు ముగిసిపోనుంది. దీంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి డీడీలు, చలాన్ ఇచ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా 42 మద్యం షాపులకు ఈ నెల తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీన అప్లికేషన్ల దాఖలుకు చివరి గడువు కాగా 18వ తేదీన డ్రా తీయడానికి ఎక్సైజ్ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. డబ్బు కోసం ముమ్మర ప్రయత్నాలు.. ప్రభుత్వం ఈ ఏడాది నూతన మద్యం పాలసీని ప్రకటించింది. రెండేళ్ల కాలపరిమితి ఉన్న షాపుల కేటాయింపు కోసం టెండర్ ప్రక్రియను నిర్వహిస్తోంది. టెండర్లో పాల్గొనడం కోసం అప్లికేషన్ దరఖాస్తు ఫీజును రూ.రెండు లక్షలకు పెంచింది. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.రెండు లక్షలు చెల్లించి టెండర్లో పాల్గొనడం కోసం అప్లికేషన్ సమర్పించాల్సి ఉంది. అప్లికేషన్ ఫీజు రూ.రెండు లక్షలు పెంచడంతో దరఖాస్తుదారులు డబ్బులు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో గోల్డ్ లోన్, ఇతర ప్రైవేట్ చిట్ఫండ్ కంపెనీలు, వడ్డీ వ్యాపారులు నుంచి డబ్బుల కోసం చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం పంటలు చేతికి రాకపోవడంతో రైతుల వద్ద సైతం డబ్బులు లేవు. దీంతో చివరి ప్రయత్నంగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, బంధువుల వద్ద సంప్రదింపులు చేస్తున్నారు. రూ.లక్షకు రూ.రెండు నుంచి నాలుగు రూపాయల వడ్డీతో తీసుకుంటున్నారు. గ్రూపులు గ్రూపులుగా.. మద్యం టెండర్ల అప్లికేషన్ల కోసం దరఖాస్తు చేయడానికి కొంతమంది గ్రూపులు గ్రూపులుగా జత కడుతున్నారు. ఐదు నుంచి పది మంది సభ్యులు కలిసి సమష్టిగా డబ్బులను సమకూర్చుకొని దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. మద్యం వ్యాపారంలో ఆరితేరిన పెద్ద వ్యాపారులు అయితే కుటుంబ సభ్యుల పేర్లతోనే కాకుండా బినామీ పేర్లతో దరఖాస్తులు సమర్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. పెరుగుతున్న టెండర్ ఫీజుతో పరేషాన్.. మద్యం లైసెన్స్ కోసం టెండర్ల ఫీజు పెరుగుతుండడంతో వ్యాపారులు డబ్బుల కోసం పరేషాన్ అవుతున్నారు. 2012కు ముందు సీక్రెట్ పద్ధతిలో టెండర్లు నిర్వహించే వారు. ఎవరు ఎక్కువ టెండర్ వేస్తే వారికే ఆ షాపు దక్కేది. 2012 నుంచి డ్రా పద్ధతితో మద్యం షాపులను అప్పగిçస్తున్నారు. 2012–14 రెండేళ్ల కోసం నిర్వహించిన టెండర్ల కోసం కేవలం రూ.25వేలు మాత్రమే ఫీజుగా ఉండేది. ఆ తరువాత 2014–15లో టెండర్ అప్లికేషన్ ఫీజు రూ.50 వేలుగా ఉండేది. 2015–17, 2017–19లో టెండర్ అప్లికేషన్ ఫీజు రూ. లక్షగా నిర్ణయించారు. ప్రస్తుతం టెండర్ అప్లికేషన్ ఫీజు మాత్రం అమాంతం రూ.రెండు లక్షలకు పెంచడంతో డబ్బులు కోసం నానా పాట్లు పడుతున్నారు. 2017–19 సంవత్సరంలో 41 షాపులకు 1280 దరఖాస్తులు వచ్చాయి. కానీ పెంచిన ఫీజు కారణంగా గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. చివరి రోజు బుధవారం మంచి ముహుర్తం ఉండడంతో అధికంగా దరఖాస్తులు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. -
అధైర్యపడొద్దు.. మేం అండగా ఉన్నాం
సాక్షి, జనగాం : ప్రభుత్వ చర్యలతో ఆర్టీసీ కార్మికులు అధైర్య పడొద్దని అండగా ఉంటామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా కేంద్రం లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న రిలే నిరవధిక దీక్షలు సోమవారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన పొన్నాల కార్మికులకు పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు. పొన్నాల లక్ష్మయ్య ఆర్టీసీ డిపోకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించి సుమారు రూ. 60 వేల కోట్ల ఆస్తులను ఏళ్ల పాటు తన అనుయాయులకు లీజుకు కట్టబెట్టేందుకు కేసీఆర్ కట్రలో భాగంగానే సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డదారిలో తొలగిస్తున్నాడన్నారు. ప్రపంచ నియంతల చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్థానంలో నిలుస్తున్నాడని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ కావాలని కొట్లాడితే కేవలం తన కుటుంబంతో పాటు అనుయాయులకు మేలు చేసుకునే విధంగా రాజ్యాంగ పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలన కంటే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఆర్టీసీని దివాలా తీయించారన్నారు. దీనిపై కార్మికులు గర్జిస్తుంటే సమ్మెను తప్పుదారి పట్టించేందుకు అనేక కుట్రలు పన్నుతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను 144 సెక్షన్తో తొక్కిపడేస్తూ ప్రైవేట్పరం చేసేందుకు లోలోపల అంతా సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రజల ప్రతిస్పందన చూడబోతున్నావ్... నియంత పాలనతో విసుగుపుట్టిన ప్రజలు తమ ప్రతి స్పందన చూపించబోతున్నారని పొన్నాల అన్నారు. వేతనాలు ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికులను పస్తులుంచిన కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని చెప్పారు. హన్మకొండ హంటర్ రోడ్డు ఆర్టీసీ పరిధిలోని రీ ట్రేడింగ్ సెంటర్ను కరీంనగర్కు బదిలీ చేసి. రూ.100 కోట్ల విలువైన భూమిని కేసీఆర్ తన అనుయాయులకు అప్పగించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపించాలి రాష్ట్రంలో జరుగుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుల్లో జరుగుతున్న అనేక అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారి సమస్యలను పరిష్కరించకుంటే పోరును మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 48 వేల ఆర్టీసీ కుటుంబాలను » జారున పడేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు లింగాజీ, రంగరాజు ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజమౌళి, లక్కార్సు శ్రీనివాస్, అల్వాల ఎల్లయ్య, ధర్మపురి శ్రీనివాస్, వరలక్ష్మి, అజహరొద్దీన్, ఖాదర షరీఫ్, జమాల్షరీఫ్, కొమ్ము నర్సింగారావు, ఎండీ.అన్వర్, ఆకుల వేణుగోపాల్రావు, సుంకరి శ్రీనివాస్రెడ్డి, మోర్తాల ప్రభాకర్, జక్కుల వేణుమాధవ్, దిలీప్రెడ్డి, క్రాంతి, రంగు రవి, చెంచారపు బుచ్చిరెడ్డి, మేడ శ్రీనివాస్ తదితరులున్నారు. -
మున్సిపోల్స్లో కాంగి‘రేస్’
సాక్షి, జనగామ : పంచాయతీ నుంచి ప్రాదేశిక ఎన్నికల వరకు, శాసన సభనుంచి లోక్సభ ఎన్నికల వరకు జరిగిన వరుస ఎన్నికల్లో ఓటములతో డీలా పడిన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బలమైన క్యాడర్ను కలిగిన ఆ పార్టీ ప్రస్తుతం మునిసిపాలిటీ ఎన్నికలే టార్గెట్గా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుంది. కాంగ్రెస్ కంచుకోటగా రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన జనగామలో ఆ పార్టీ పట్టు నిలుపుకోవడం కోసం తహతహలాడుతోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి నూతనోత్తేజం నింపడానికి సిద్ధమైంది. ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సభ్వత్వ నమోదుతో కార్యకర్తలను సమీకరిస్తుండగా కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారైనా కలిసొచ్చేనా? కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు రాజకీయంగా జన్మనిచ్చిన జనగామ ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. నాలుగు దశాబ్దాల పాటు పొన్నాల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘనమైన చరిత్రను సొంతం చేసుకుంది. ముఖ్యంగా జనగామ మునిసిపాలిటీ చరిత్రలో ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యతను కనబరిచింది. 1953 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు మినహాయిస్తే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ చైర్మన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. తొలిసారిగా 1987లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోగా రెండోసారి 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 28 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో విజయం సాధించింది. మరో ఇద్దరు అభ్యర్థులు 1, 2 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ ఇద్దరు అభ్యర్థులు విజయం సాధిస్తే ఏకపక్షంగానే చైర్మన్ స్థానం దక్కి ఉండేది. కానీ అనూహ్యంగా కేవలం ఆరు స్థానాల్లోనే విజయం సాధించిన టీఆర్ఎస్ చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. మెజారిటీ కౌన్సిలర్లను గెలుచుకున్నప్పటికీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోక పోవడంలో పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించలేదనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మొదటి నుంచే పక్కా ప్రణాళికను అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. రిజర్వేషన్లలో బీసీ కోటాకు ప్రభుత్వం కోత విధిస్తున్నప్పటికీ పార్టీపరంగా బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీసీ, దళిత, మైనార్టీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ‘పొన్నాల’ మకాం మునిసిపాలిటీ ఎన్నికలు అయ్యే వరకు పొన్నాల లక్ష్మయ్య జిల్లా కేంద్రంలోనే మకాం వేయనున్నారు. ప్రతి వార్డులో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టనున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే స్థానిక సమస్యలను ప్రచార అస్త్రాలుగా ఎక్కు పెట్టడానికి రెడీ అవుతున్నారు. వార్డుల వారీగా ఆశావహుల జాబితాను తయారు చేయడం, పార్టీ క్యాడర్కు దిశానిర్ధేశం చేయడం, పట్టణ ప్రజలతో మమేకం కావడం వంటి కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు జెండా పండుగలు శనివారం పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో మునిసిపాలిటీ పరిధిలో విస్తృతంగా జెండా పండుగను జరుపనున్నారు. రోజుకు 10 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. పొన్నాలతోపాటు టీపీసీసీ మునిసిపాలిటీ ఎన్నికల పరిశీలకుడు మక్సూద్ అహ్మద్తోపాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, ముఖ్యనేతలను ఆయా వార్డుల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టిన మహిళా ఉద్యోగి
సాక్షి, జనగామ: తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉన్నతాధికారికి ఓ మహిళా అధికారి చెప్పుతో బుద్ధి చెప్పారు. ప్రభుత్వ అధికారి లైంగిక వేధింపులు భరించలేక సహ మహిళా ఉద్యోగి చెప్పు తో కొట్టిన సంఘటన జనగామలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా అల్పసంఖ్యకుల సంక్షేమ శాఖలో (జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్) శ్రీనివాస్ అధికారిగా పని చేస్తున్నారు. అదే కార్యాలయంలో ఔట్ సోర్సింగ్గా ఓ మహిళ ఉద్యోగి పనిచేస్తున్నారు. అయితే శ్రీనివాస్ ఆ మహిళా ఉద్యోగితో కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాను చెప్పినట్టు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి నిత్యం లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. శ్రీనివాస్ తీరుతో విసుగు చెందిన ఆ మహిళా ఉద్యోగి విషయాన్ని స్థానిక నాయకుడి దృష్టికి తీసుకెళ్లింది. అతను ఆఫీసుకెళ్లి నిలదీసి డీసీపీకి చెప్పుతానని బెదిరించే ప్రయత్నం చేశారు. అయినా కూడా అతను తన తీరును మార్చుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ ఉద్యోగి కార్యాలయంలోనే శ్రీనివాస్ను చెప్పుతో కొట్టింది. అందరిముందు కొట్టడంతో చేసేది ఏమిలేక ఆమె కాళ్లపై పడి తాను తప్పుచేశానని ఒప్పుకున్నాడు. ఈ ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే విషయం బయటకు రావడంతో అధికారి కీచక పర్వంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. -
సూర్యాపేట - జనగామా క్రాస్ వద్ద ప్రమాదం
సాక్షి, సూర్యాపేట : పట్టణంలోని సూర్యాపేట-జనగామ క్రాస్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు బైక్ని ఢీకొట్టిన ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కుడకుడ గ్రామానికి చెందిన సాయి, వినయ్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సంబంధం చెడగొట్టాడని.. వ్యక్తి దారుణ హత్య
సాక్షి, చిల్పూరు: పెళ్లి సంబందం చెడగొట్టాడనే నెపంతో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫత్తేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బోడబండతండా సమీపంలో గత నెల 29న జరిగింది. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్, కట్కూరు ఎస్ఐ పాపయ్య నాయక్, చిల్పూరు ఎస్ఐ శ్రీనివాస్లు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతిపల్లి గ్రామానికి చెందిన కూరపట్ల అరుణ్కుమార్(30)కి భార్య లత, ఏడాది బాబు ఉన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరుకు చెందిన మాధవితో అరుణ్కుమార్కు మూడేళ్ల క్రితం పరిచయం ఉండేది. వారి మధ్య తరచు గొడవలు జరగడంతో అతడు, ఆమెను వదిలి లతను వివాహమాడాడు. అనంతరం మాధవికి చిల్పూరు మండలం ఫత్తేపూర్కు చెందిన వేల్పుల రవికుమార్తో గత నెల 30న పెళ్లి నిశ్చయమయింది. విషయం తెలుసుకున్న అరుణ్కుమార్ గతంలో మాధవితో కలిసి తిరిగిన ఫోటోలను, వారు మాట్లాడుకున్న సంభాషణలను పెళ్లికొడుకుకు పంపాడు. దీంతో మాధవిని పెళ్లి చేసుకోనని రవికుమార్ చెప్పాడు. తమ కూతురి వివాహాన్ని అడ్డుకున్నాడని మాధవి తండ్రి రాములు, వారి కుటుంబ సభ్యులు గత నెల 29న చిన్నరాతిపల్లికి వెళ్లి అరుణ్కుమార్ను పెళ్లికొడుకు వద్దకు వచ్చి అబద్ధం చెప్పానని చెప్పాలంటూ ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు. అరుణ్కుమార్ తల్లి మల్లమ్మ కూడా అదే ఆటోలో వెళ్లింది. బోడబండతండా సమీపంలోకి రాగానే అరుణ్కుమార్ పారిపోయాడు. రాములుతో పాటు వెంట వచ్చిన వారు అరుణ్కుమార్ను వెంబడిస్తూ వెళ్లి దారుణంగా హత్య చేశారు. పక్కనే గొయ్యి తీసి పాతిపెట్టారు. ఆటో వద్దకు వచ్చి అరుణ్కుమార్ తల్లికి మీ కొడుకు తప్పించుకుపోయాడని చెప్పి అదే ఆటోలో వెనక్కి వెళ్లిపోయారు. రెండు రోజులు గడిచిన కొడుకు నుంచి సమాచారం రాకపోవడంతో అనుమానంతో కట్కూరు పోలీస్స్టేషన్లో అరుణ్కుమార్ తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాములును అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిని విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం నిందితులతో ఘటనా స్థలానికి వచ్చి పాతిపెట్టిన శవాన్ని బయటకు తీశారు. కేఎంసీ ప్రొఫెసర్ మోహన్ నాయక్ పోస్టుమార్టం చేయగా చిల్పూరు తహశీల్ధార్ శ్రీలత శవ పంచనామా చేశారు. -
సీపీఐ నేతలకు తప్పిన ప్రమాదం
జనగామ: సీపీఐ నేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వెళుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం అర్ధరాత్రి జనగామలో రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వీరిద్దరు నేతలు మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని.. ఇన్నోవా వాహనంలో జనగామ మీదుగా హైదరాబాద్కు బయలుదేరారు. జనగామ వద్ద రోడ్డుపై ఉన్న గుంతలో వారు ప్రయాణిస్తున్న వాహనం పడి పైకి లేచి.. భూమికి గట్టిగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు స్వల్పగాయాలతో బయటపడగా.. మరో వాహనంలో వస్తున్న మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి మరో వాహనంలో హైదరాబాద్కు పంపించారు. అనంతరం రోడ్డు దుస్థితిపై కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. -
జనగామ జిల్లాలో కాల్పుల కలకలం
సాక్షి, జనగామ : జనగామ జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఐదుగురు దుండగులు వైన్స్ సిబ్బందిని తపంచతో(నాటు తుపాకీ) బెదిరించి దోపిడి చేశారు. జనగామ మండలంలోని కొడకండ్ల మండలం మొండ్రాయి క్రాస్ రోడ్డు సమీపంలోని తిరుమల వైన్స్ సిబ్బంది శ్రీను,రమేష్ షాప్ మూసివేసి మంగళవారం రాత్రి 10:50కి బైక్ పై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో దుండగులు వీరిని మార్గమధ్యలో ఆపి రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సుమారు 6 లక్షల 70 వేల నగదు ఎత్తుకెళ్లారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటు తుపాకీతో కొంత మంది దుండగులు సంచరిస్తున్నారని ప్రజలు అందోళనకు గురయ్యారు. అయితే అలాంటి దుష్ప్రచారం నమ్మొద్దని పోలీసులు అప్పడు కొట్టి పడేశారు. కానీ, ఆ దుండగులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు రేకెత్తుతున్నాయి. వర్ధన్న పేట ఏసీపీ మధుసూధన్, స్థానిక పాలకుర్తి సీఐ రమేష్ నాయక్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక ఎస్సైలతో గాలింపు చర్యలు చేపట్టారు.ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి సమాచారం దొరకలేదని ఇంకా దుండగుల గురించి జల్లెడ పడుతున్నామని పోలీసులు తెలిపారు. -
పోటీ నుంచి తప్పుకుంటున్నా : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్క్లియర్ అయినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కోదండరాం జనగామ నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ కూడా తన తొలి జాబితాలో జనగామ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో అక్కడ నుంచి కోదండరాం బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తాను జనగామ పోటీ నుంచి తప్పుకుంటున్నాని కోదండరాం పేర్కొన్నారు. బీసీ సీటు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనతో జనగామ పోటీ నుంచి కోదండరాం తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్క్లియర్ అయింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ సీటును తనకే కేటాయించాలని పొన్నాల మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కోదండరాం తప్పుకోవడంతో కాంగ్రెస్ జనగామ టికెట్ను పొన్నాలకు కేటాయించే అవకాశం ఉంది. కాగా కోదండరాం ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి తరపున ప్రచారం చేస్తారని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై కోదండ రాం ఎలాంటి ప్రకటన చేయలేదు. తన పోటీపై ఇప్పుడేమి మాట్లాడని కోదండరాం మంగళవారం మీడియాతో చెప్పారు. ఎక్కడ నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. టీజేఎస్ కు మొత్తం 11 సీట్లు ఖరారయ్యాయని కోదండరాం పేర్కొన్నారు. మల్కాజ్గిరి, మెదక్, దుబ్బాక, సిద్ధిపేట, వర్ధన్నపేట, అంబర్పేట సీట్లను టీజేఎస్కు కేటాయించారన్నారు. మరో ఐదు సీట్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. టీజేఎస్ సీట్లను బుధవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
ఎంపీ టికెట్ వద్దు.. ఎమ్మెల్యేనే కావాలి!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోనే బీసీ నాయకుడిని పక్కన పెట్టడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరిన ఆయన అక్కడ సాక్షితో మాట్లాడారు. తన సర్వే రిపోర్ట్ బాగా లేదంటున్నవారు 65 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్ను బయట పెట్టాలన్నారు. ఒకే పార్టీ ఒకే నియోజకవర్గంలో ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతున్నాని తెలిపారు. జనగామ టికెట్ను ఎన్నికల కమిటీ తనకు ప్రతిపాదించిందని, అయినా తన పేరు జాబితాలో ఎందుకు రాలేదో తెలియదన్నారు. టీఆర్ఎస్లో చేరుతానని కొందరు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేశారని, ఏడాదికి పైగా తనకు టికెట్ రాకుండా కుట్ర జరుగుతోందని తెలిపారు. భువనగిరి ఎంపీ టికెట్ తనకొద్దని, మాజీమంత్రులు అందరినీ లోక్సభకు పంపుతున్నారా? అని ప్రశ్నించారు. మహాకూటమి ఒప్పందంలో భాగంగా టీజేఎస్ అధినేత కోదండ రాం జనగామ టికెట్ను ఆశిస్తున్నారు. దీంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పెండింగ్లో పెట్టింది. పొన్నాల లక్ష్మయ్య ఇతర స్థానాలు నుంచి పోటీచేసేలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. పొన్నాల మాత్రం తనకు జనగాం తప్పా.. ఏ స్థానం వద్దని పట్టుబడుతున్నారు. -
నాన్నను మట్టిలో పెట్టి.. నాకు గుండు గీయించారు
అనంతమైన ప్రేమకు చిరునామా ‘అమ్మ ఒడి’. ఈ ప్రపంచంలో ఎవరికైనా.. ఎంత వయసొచ్చినా అమ్మ దూరమైనప్పుడు కన్నీళ్లు ఆగవు. మనసు లోతుల్లో అమ్మపై ఉన్న ప్రేమ, అమ్మతో గడిపిన క్షణాలు ఆమె దూరమైనప్పుడు ఒక్కసారిగా అలా ద్రవించి కళ్ల వెంట రాలుతాయి. కానీ పొత్తిళ్ల నుంచి బయటి ప్రపంచాన్ని అప్పుడప్పుడే చూస్తున్న ఓ మూడేళ్ల పసిపాప.. అమ్మ ప్రేమ తప్ప ఇంకేదీ తెలియని మూడేళ్ల చిన్నారి.. అమ్మకు దూరమైతే..!!! ఊహించగలమా వారి పరిస్థితిని.. ? పాలకోసం ఏడ్చి ఏడ్చి గొంతు తడారిపోతున్న ఆ శిశువును ఎలా వదిలేయాలన్పించిందో.. ముక్కుపచ్చలారని మూడేళ్ల కొడుకును ఎందుకు దూరం చేసుకోవాలన్పించిందో.. ఆ మాతృమూర్తికి ఇంత కర్కశమైన ఆలోచన ఎందుకు వచ్చిందో.. ఆ దేవుడికే తెలియాలి.. జనగామ జిల్లా : నవమాసాలు మోసిన తల్లి తమను కాదనుకునే సరికి ఆ పిల్లలు ఒక్కసారిగా అనాథలయ్యారు.. బువ్వపెట్టి బుజ్జగించే తల్లి లాలనకు దూరమై ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. నాన్న తనువు చాలించినా.. అమ్మ ఒడి చేరి అనంతమైన ప్రేమను పొందాల్సిన పసి మనసులకు రాకూడని కష్టం వచ్చింది.. ఇటీవల జనగామ ఎంసీహెచ్ ఆస్పత్రి వద్ద ఓ తల్లి వదిలి వెళ్లిన ధీనగాథ ఇది.. అమ్మా అనే పదం వినపడగానే ముఖంపై చిరునవ్వుతో ఆ బాబు అందరినీ హుషారెత్తిస్తుంటే, అక్కడే ఉన్న చాలా మంది ఆడవాళ్లు కన్నీళ్ల పర్యంతమయ్యారు. 18 గంటల పాటు పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, వైద్యులు, బాలింతలు ఆ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుని.. అనంతరం వరంగల్ శిశుగృహానికి తరలించారు. సోమవారం రాత్రి ఓ తల్లి తన పిల్లలైన మూడు నెలల పసికందు మానస, మూడేళ్ల బాలుడు సాయిని జనగామ జిల్లా చంపక్హిల్స్లోని మాతా శిశు కేంద్రం (ఎంసీహెచ్)లో వదిలేసి వెళ్లిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆ పిల్లలు జనగామ మండలంలోని పసరమడ్ల, ఓబుల్కేశ్వాపూర్ గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు ఉమారాణి, ఎల్లమ్మ సంరక్షణలో మంగళవారం వరకు ఉన్నారు. నాన్నను మట్టిలో పెట్టి..నాకు గుండు గీయించారు. మూడేళ్ల బాలుడు సాయిని.. అధికారులు అమ్మానాన్నల గురించి ఆరా తీయగా నాన్న పేరు ఆచార్య, అమ్మపేరు శైలజ, నాపేరు సాయి ఆచార్య, చెల్లి పేరు మాసన అని చెప్పాడు. నాన్నను మట్టిలో పెట్టి, కట్టె వేసి.. నాకు గుండు చేయించారు. ఎంత పిలిచినా రాలేదు. అమ్మ నన్ను, పాపను తీసుకుని రైలులో వచ్చిందంటూ సాయి ఐసీడీఎస్ అధికారులకు వివరించాడు. మీతో ఎవరు ఉండేవారు అంటూ అధికారులు ప్రశ్న వేయగా.. జగన్ అంటూ సమాధానం చెప్పాడు. కట్టెలతో అమ్మను కొడితే.. ఇక్కడకు వచ్చామంటూ చెప్పడంతో.. కుటుంబంలో ఏ మైనా గొడవలు జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. మీ ఊరి పేరు ఏంటమ్మా అని అడిగి తే అమ్మ చెప్పిన మాటకు బాబు జవదాటలేదు. బాబయ్ ఎక్కడ ఉంటాడు.. చెప్పవా అంటూ ప్రేమతో పలకరిస్తే.. గోంస్లాం, గాండ్ల అని చెబుతున్నాడు. దీంతో ఖమ్మం జిల్లా గార్ల కావచ్చని అధికారులు బావించి.. అక్కడి ఐసీడీఎస్ అధికారులను అలర్ట్ చేశారు. చెల్లెలంటే అమితమైన ప్రేమ.. అమ్మ కనిపించడం లేదనే బెంగకంటే.. చెల్లి ఏడవగానే.. రెండు చేతులా.. పట్టుకుని.. ‘ఏందమ్మా.. ఏందమ్మా’ అంటూ సాయి పలకరిస్తుంటే అక్కడున్న వాళ్ల హృదయాలు ద్రవించాయి. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఎంసీహెచ్లో అందరూ గాఢ నిద్రలో కి జారుకోగా... మూడు నెలల పసికందు మానస ఏడవడంతో.. నిద్రలోంచి మేలు కున్న సాయి.. తన చెల్లి వద్దకు వచ్చి తెల్లవారేదాకా కూర్చున్నాడు. ఏరా మీ చెల్లిని మాకిచ్చేస్తావా అంటూ అడిగితే.. గుండెలకు హత్తుకుని ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. కంటికి రెప్పలా చూసుకున్నారు. అంగన్వాడీ టీచర్ల సంరక్షణలో ఉన్న సాయి, మానసలను ఎంసీహెచ్లో అక్కడున్న బాలింతలు కంటికి రెప్పలా చూసుకున్నారు. మూడు నెలల పసికందు పాల కోసం ఏడుస్తుంటే.. డబ్బా ద్వా రా పాలు పట్టారు. వాంతులు చేసుకోవడంతో.. ఓ తల్లి తన పాలను పట్టించి మాతృత్వాన్ని చాటింది. కన్నీళ్లు పెట్టుకున్న మహిళలు పిల్లలను వరంగల్కు తరలించే క్రమంలో అంగన్వాడీ మహిళలు, ఐసీడీఎస్ అధికారులు కంటనీరు పెట్టుకున్నారు. చెమర్చిన కళ్లతో వారిని సాగనంపారు. రెండు నెలల పాటు ఇద్దరి సంరక్షణ బాధ్యతలతో పాటు.. వారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రేమలత విలేకరులకు వివరించారు. 2 నెలల తర్వాత.. దత్తత విషయమై శిశుగృహ అధికారులు చర్చిస్తారన్నారు. శిశుగృహకు చిన్నారుల అప్పగింత కాజీపేట అర్బన్: జనగామలోని ఎంసీహెచ్ ఆవరణలో ఓ తల్లి వదిలి వెళ్లిన ఇద్దరు చిన్నారులను మంగళవారం వరంగల్ సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరచి శిశు గృహకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ పరశురాములు, కౌన్సిలర్ నర్సింహస్వామి, సూపర్వైజర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అసలేం జరిగింది.. మూడేళ్ల బాబు సాయి చెబుతున్నట్లుగా తండ్రి ఆచార్య అటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆచార్య మృతిచెందిన కొన్ని రోజులకే.. ఆ తల్లి ఇద్దరు పిల్లలను వదిలి పెట్టడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. ఎందుకంటే.. బాబుకు గుండు చేయించగా.. తలపై వెంట్రుకలు రాకపోవడంతో.. ఈ సంఘటన జరిగి నెలరోజులు కూడా గడవలేదని అధికారులు బావిస్తున్నారు. భర్తను కోల్పోయిన సమయంలో ఇంట్లో పోరు పడలేక పిల్లలను వదిలేసి వెళ్లిందా..? లేక ఏదైనా అఘాయిత్యానికి పాల్పడిందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంసీహెచ్కు నేరుగా రావడం కూడా చర్చనీయాంశమైంది. ఈ ప్రాంతంలోనే గత కొన్నేళ్లుగా జీవిస్తున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మూడు నెలల క్రితం జన్మించిన పాపకు.. ప్రభుత్వం అందించిన ‘కేసీఆర్ కిట్ ’బ్యాగు పిల్లల వద్దనే ఉంది. దీంతో ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒక చోట తల్లి ఉండవచ్చనే పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు మగవారితో సోమవారం రాత్రి ఎంసీహెచ్కు వచ్చిన మహిళ పార్కులో ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లినట్టుగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. సీసీ పుటేజీల్లో కూడా ఆ మహిళ ఆటోలో వచ్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీనిపై రాష్ట్రంలోని 31 జిల్లాల అంగన్వాడీ కేంద్రాలు, పోలీస్స్టేషన్లకు బాబు, పాప వివరాలను పంపించారు. ఎంసీహెచ్ ఆస్పత్రిలో పర్యవేక్షకులు డాక్టర్ శ్రీనివాస్, చిన్న పిల్లల వైద్యులు శంకర్ డిశ్చార్జి ఫాం పూర్తి చేసి.. ఐసీడీఎస్, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్) ప్రతినిధులు, ఇన్చార్జి డీడబ్ల్యూఓ ప్రేమలత, డీసీపీఓ రవికాంత్, సూపర్ వైజర్ రమ, స్వరూపారాణి, జ్యోతిలకు అప్పగించగా.. వరంగల్లోని శిశుగృహానికి పిల్లలను తరలించారు. -
కన్నపేగును కాదనుకుని..
జనగామ : పిల్లలు మారాం చేసినా.. తండ్రి మందలించినా..అక్కున చేర్చుకునే ప్రేమ అమ్మ వద్దనే దొరుకుతుంది. తన కడుపును మాడ్చుకుని పిల్లల ఆకలి కోసం ఆరాటపడే ఓ తల్లి.. తన నాలుగు మాసాల కూతురు.. ఐదేళ్ల కొడుకును జనగామ చంపక్హిల్స్లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో వదిలి వెళ్లిపోయిన బాధాకరమైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. రోగులు, డాక్టర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఊరు, పేరు తెలియని ఓ తల్లి.. తన కుమారుడు (5), కుమార్తె (4నెలలు)ను తీసుకుని సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎంసీహెచ్కు వచ్చింది. రాత్రి వరకు అక్కడే ఉన్న ఆ తల్లి తన ఇద్దరు పిల్లలను పార్కులో వదిలి ఆటోలో వెళ్లి పోయింది. రాత్రి వరకు అక్కడే ఉన్న పిల్లలను రోగి బంధువులు చూసి వైద్యులకు సమాచారం అందించారు. అరగంటపాటు ఐదేళ్ల బాబుని విచారించగా అమ్మపేరు శైలజ, తన పేరు సాయి, చెల్లి పేరు మానస, ఊరిపేరు గోంస్లా అంటూ బుడి బుడి మాటలతో చెబుతూ ఏడ్చాడు. అక్కడే ఉన్న ఓ మహిళ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి అమ్మలా ప్రేమను పంచింది. ఏరా ..ఏమైంది..అమ్మ ఎక్కడికి వెళ్లింది.. నాన్న కొట్టాడా అంటూ ఆప్యాయంగా అడిగింది. నాన్న అమ్మను కొట్టాడు.. అమ్మమ్మ ఇంటికి వెళ్లి పొమ్మన్నాడు అంటూ తడబడుతూ చెప్పాడు. వెంటనే పోలీసులు ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. తల్లి తన ఇద్దరు పిల్లలతో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇక్కడకు వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. కుమారుడు సాయి మాట్లాడే భాషను క్షుణ్ణంగా పరిశీలించగా.. ఖమ్మంగా జిలాకు చెందిన వారా లేదా ఏపీకి చెందిన వారా అని ఆరా తీస్తున్నారు. రైలులో వచ్చి ఆస్పత్రి వరకు ఆటోలో వచ్చినట్లు చిన్నోడు సాయి చెబుతున్నాడు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులే రైలును బండి అనడంతో..అక్కడి వారుగా భావిస్తున్నారు. ఇటుక, బొగ్గు, సీసీ రింగులు, భవన నిర్మాణ కార్మికులు పొట్టకూటి కోసం చాలా మంది ఆంధ్ర ప్రాంత వాసులు జిల్లాలో బతుకుతున్నారు. పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వివరాలను రాత్రికి రాత్రే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ విషయమై డీసీపీ మల్లారెడ్డి స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలను ఐసీడీఎస్ ప్రతినిధులకు అప్పగించారు. -
నూలుపై 40 శాతం సబ్సిడీ
జనగామ: చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ నూలు పథకంలో 20 శాతం సబ్సిడీని 40 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని శాసన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నేత కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తాలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డితో కలిసి బోడకుంటి వెంకటేశ్వర్లు ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నూలు సబ్సిడీ పథకంలో తీసుకొచ్చిన మార్పులు సహకార సంఘం సభ్యులతోపాటు సహకారేతర కార్మికులకు కూడా వర్తిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఐడీసీ ద్వారా అందిస్తున్న పది శాతం సబ్సిడీకి ఇది అదనమని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న సబ్సిడీ జియో ట్యాగింగ్ చేసిన మగ్గాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 657 మంది లబ్ధిదారులకు రూ.24,94,720 నిధులను మంజూరు చేసేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సిఫారసు చేశారని చెప్పారు. సబ్సిడీ నిధులను విడతల వారీగా లబ్ధిదారులకు డీబీటీ ద్వారా అందిస్తారని చెప్పారు. ముఖ్యంగా చేనేత కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక భద్రతను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొదుపు భద్రతా పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. 18 ఏళ్ల వయస్సు పైబడి, చేనేత వృత్తిపై 50 శాతం వచ్చే నేత కార్మికులు, అనుబంధ రంగాలైన డిజైనింగ్, డ్రైయింగ్, వార్పింగ్, సైజింగ్ కార్మికులు దీని పరిధిలోకి వస్తారని చెప్పారు. చేనేత కార్మికులు తమ ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడంతోపాటు 8« శాతాన్ని ఆర్డీ–1 ఖాతాలో వేస్తే.. ఇందులో 16 శాతం ఆర్డీ ఖాతాలో ప్రభుత్వ వాటా కలుపుతుందన్నారు. ఈ పథకంలో ఇప్పటి వరకు 1,443 మంది చేరినట్లు స్పష్టం చేశారు. రూ.2.30 కోట్ల రుణమాఫీ:కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి చేనేత కార్మికులకు ప్రభుత్వం రూ.2.30 కోట్ల రుణాలను మాఫీ చేసిందని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ.. వృత్తి కనుమరుగు కాకుండా కాపాడుకోవాలని సూచించారు. మగ్గంపై పట్టు వస్త్రాల తయారీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకుతోపాటు ప్రభుత్వం నుంచి రుణ సదుపాయాన్ని కల్పించేందుకు లీడ్ బ్యాంకు మేనేజర్తో మాట్లాడుతానని చెప్పారు. చేనేత కార్మికుల భద్రతను ప్రభుత్వం బాధ్యతగా చూస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో నేత కార్మికులను సెక్టార్ల వారీగా విభజించి, అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు దక్కేలా చూస్తామన్నారు. కడు పేదరికంతో ఉన్న వారికి మాత్రమే అంత్యోదయ కార్డులను ఇవ్వనున్నుట్ల తెలిపారు. చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు సాగర్ మాట్లాడతూ ప్రభుత్వం అందిస్తున్న 16 శాతం వాటా ద్వారా 877 మందికి రూ.11.79 లక్షలు, 40 శాతం వాటాలో 276 మందికి రూ.24.76 లక్షలు అందించామని వివరించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి, మునిసిపల్ కమిషనర్ ఈశ్వరయ్య, సొసైటీ చైర్మన్ వేముల బాలరాజు, గుర్రం నాగరాజు పాల్గొన్నారు. -
సినిమా థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు
జనగామ అర్బన్ : సినిమా..చూసొద్దామా మామ.. సినిమా చూసొద్దామా.. మామ అనే పాటను మధ్య తరగతి ప్రజలు ఇక ఎంచాక్కా పాడుకోవచ్చు. పండుగపూటో, సెలవుదినాల్లో కుటుంబంతో సరాదగా సినిమాకెళ్తే టికెట్ల ధరల కన్నా తినుబండారాల బిల్లు తడిసిమోపెడవుతోంది. దీంతో కుటుంబ సభ్యులతో సహా సినిమాకు వెళ్లాలంటేను జంకుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సగటు ప్రేక్షకుడు హాయిగా సినిమా చూడటంతో పాటు జేబుకు చిల్లుపడే కార్యక్రమానికి స్వస్తి పలికే దిశగా అడుగులు వేస్తోంది. థియేటర్లలో విక్రయించే తినుబండారాలు, శీతల పానీయాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆదేశాలను జారీ చేసింది. ఇందుకు గాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలోని 20, మహబూబాబాద్ జిల్లాలోని 08, జనగామ 03, భూపాలపల్లి జిల్లాలో 04 సినిమా థియేటర్ల యాజమాన్యాలకు తూనికలు, కొలతల అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో పాటు ఇటీవల వరంగల్ జిల్లా కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించి తగు సూచనలు చేశారు. కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి.అంతేకాకుండా మొదటి వారంలో తనిఖీలు నిర్వహించడానికి అవసరమైన చర్యలను కూడా చేపట్టనున్నారు. కాగా సినిమా థియేటర్లలో ప్రేక్షకులు, వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్ఫ్రీ నంబర్ 18004250033, వాటప్స్ నబంర్ 7330774444 కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. సినిమా హాళ్లలో ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు చట్టబద్ధంగా నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టనుంది. వీటిపై ఫిర్యాదు చేయవచ్చు..విడిగా విక్రయించే తినుబండారాల్లో నాణ్యత లోపించినా.. ఉత్పత్తుల బరువు, పరిమాణం, గడువు దాటినా, ఎమ్మార్పీ లేకపోయినా, ప్యాకేజీ రూపంలో ఉన్న వస్తువులపై పేరు, కస్టమర్ కేర్ వివరాలు లేకపోయినా ప్రేక్షకులు టోల్ఫ్రీ లేదా వాటప్స్ నంబర్కు వెంటనే సమాచారం ఇవ్వడంతో పాటు ఫిర్యాదు చేయవచ్చు. ప్రేక్షకుల ఫిర్యాదును బట్టి జరిమానాతో పాటు జైలు శిక్షలు విధించే విధంగా అధికారులు విధి విధానాలను రూపొందించడం గమనార్హం. ఇక నుంచి సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు కష్టాలు తప్పనున్నాయి. అధికారులు తీసుకుంటున్న చర్యలపై సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం.. సినిమా థియేటర్లలో విక్రయించే తినుబండారాలపై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. దీంతో నాణ్యమైన ఉత్పత్తులు సరైన ధరలకు లభించడంతో పాటు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మధ్య తరగతి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. – పాము శ్రీనివాస్, జనగామ నిబంధనలను పాటించాల్సిందే.. ప్రభుత్వం తూనికలు, కొలతల శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలు, రూపొందించిన విధివిధానాలను అన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు పాటించాల్సిందే. ఇప్పటికే ఈ విషయంలో నోటీసులు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాం. – ఎస్. విజయ్కుమార్, జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి, జనగామ -
సర్దార్పై చిన్నచూపు..!
సాక్షి, జనగామ : మొగల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపనకు నడుం కట్టిన సర్దార్ సర్వాయి పాపన్నకు గుర్తింపు లభించడం లేదు. అణగారిన వర్గాలను ఏకం చేసి గోల్కొండ రాజ్యస్థాపనే ధ్యేయంగా దండయాత్ర ఆరంభించిన విప్లవయోధుడికి చరిత్ర పుటల్లో స్థానం దక్కకుండాపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో మరుగున పడిన పాపన్న జీవిత చరిత్రకు స్వరాష్ట్రంలోనే అదే దుస్థితి దాపురించింది. నాటి పాలకుల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వీరవిహారం చేసిన బహుజన యోధుడి చరిత్ర భావితరాలకు తెలియకుండా కనుమరుగవుతోంది. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ కేంద్రంగా 17వ శతాబ్దంలో బహుజన రాజ్యస్థాపన చేసిన సర్వాయి పాపన్న జన్మదినాన్ని ఈనెల 18వ తేదీన జరుపుకోనున్నారు. పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరుతూ బుధవారం(నేటి) నుంచి ఈ నెల 7వ తేదీ వరకు వారం రోజుల పాటు స్ఫూర్తి యాత్రకు పిలుపునిచ్చారు. పాపన్న జీవిత చరిత్రపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. మొగలు ఆధిపత్యాన్ని ఢీకొట్టిన పాపన్న.. 17వ శతాబ్దంలో దక్కన్ ప్రాంతంలో గోల్కొండ సామ్రాజ్యం సిరిసంపదలతో తులతూగుతుండేది. ధనిక ప్రాంతమైన గోల్కొండ రాష్ట్రంపై నాటి మొగలు పాలకుల కన్ను పడింది. ప్రపంచ రాజ్య విస్తరణలో భాగంగా మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడంలో భాగంగా దండయాత్రకు పూనుకున్నారు. ఈక్రమంలోనే క్రీ.శ.1687లో గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నారు. మొగలు పాలన క్రీ.శ. 1687 నుంచి క్రీ. శ.1724 వరకు కొనసాగింది. ఈ కాలంలో పాలకులు నియమించుకున్న సుబేదార్ల ఆగడాలతో రాజ్యం మొత్తం ఆరాచకం నెలకొన్నది. ఎక్కువ పన్నులు వసూల్ చేయడం, ప్రజలను దోచుకోవడం, మహిళలపై దాడులు వీపరితంగా పెరిగిపోయాయి. భయంతో భయంతో ప్రజలు జీవిస్తున్న కాలంలోనే క్రీ.శ 1650లో పాపన్న జన్మించారు. గౌడ కులంలో జన్మించిన పాపన్న పశువుల కాపరిగా పని చేశారు. తర్వాత కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించారు. నాటి కులవృత్తుల వారితో మంచి సంబంధాలను కలిగిన పాపన్నకు నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి.ఈ క్రమంలోనే నాటి పాలకులు, వారి నియమించుకున్న సుబేదార్లు సాగిస్తున్న విధానాల కారణంగా పాపన్నలో రాజ్యకాంక్ష పెరిగింది. బలహీన వర్గాలు ఏకం అయితే రాజ్యాధికారానికి రావచ్చనే ఆలోచన చేసి సొంతం సైన్యం ఏర్పాటు చేసి బహుజన రాజ్యస్థాపనకు శ్రీకారం చుట్టారు. తిరుగుబాటుకు చిహ్నంగా ఖిలాషాపూర్ కోట.. బలవంతులపై బలహీనుల తిరుగుబాటుకు చిహ్నంగా ఖిలాషాపూర్ కోటను నిర్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. బలవంతులైన మొగలు పాలకులపై సామాన్యులు పోరాటం సాగిస్తున్నారు. దండయాత్రలో భాగంగా ఖిలాషాపూర్లో మకాం వేసిన పాపన్నకు ఒక దృశ్యం కన్పించింది. వేటకుక్క కుందేలుపై దాడికి యత్నించింది.అయితే వేట కుక్కను కుందేలు తిరగబడి తరిమికొట్టింది. ఈ మట్టికి తిరుగుబాటు తత్వం ఉందని గ్రహించిన పాపన్న ఇక్కడే కోటను నిర్మించినట్లుగా ప్రచారంలో ఉంది. అధికారిక ఉత్సవాల కోసం‘స్ఫూర్తి యాత్ర’.. బహుజన రాజ్య స్థాపకుడిగా గుర్తింపు పొందిన సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్తో ‘సర్వాయి పాపన్న స్ఫూర్తి యాత్ర’కు శ్రీకారం చూట్టారు. ఈనెల 18వ తేదీన పాపన్న జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ట్యాంకుబండ్పై పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతోపాటు ఆయన నిర్మించిన కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి, పాపన్న జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చడంతోపాటు జనగామ జిల్లాలో పాపన్న మ్యూజియంను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గౌడ ఐక్య సాధన వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ‘తాటికొండ నుంచి గోల్కొండ వరకు స్ఫూర్తి యాత్ర’ను చేపట్టారు. సజీవసాక్ష్యాలుగా రాతి కోటలు..సర్వాయి పాపన్న నిర్మించినట్లుగా చెబుతున్న రాతి కోటలు ఆయన యుద్ధనీతికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో పాపన్న క్రీ.శ 1675లో రాతి కోటను నిర్మించారు. 20 అడుగుల ఎత్తులో రాతికోటను నిర్మించారు. ఆ కోటపై నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తుతో బురుజులు, మధ్యలో మరో బురుజును నిర్మించారు. స్టేషన్ఘన్పూర్ మండలంలోని తాటికొండ కోట, నల్లగొండ, హుస్నాబాద్ బురుజు, దూల్మిట్ట వంటి కోటలను నిర్మించారు. ఈ కోటల నిర్మాణం దూర ప్రాంతాల నుంచి శత్రువులు దండెత్తి వస్తే సులువుగా గుర్తించే విధంగా నిర్మాణం చేశారు. శత్రు దుర్భేద్యంగా పూర్తిగా రాతితో కోట నిర్మాణం చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో బురుజులను నిర్మించారు. పాపన్న నిర్మించిన కట్టడాలు నేటికి కళ్ల ముందు కదలాడుతున్నాయి. పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి బహుజన రాజ్యస్థాపకుడిగా చరిత్రలో నిలిచిన సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. పదో తరగతి తెలుగు పాఠ్యాంశంలో పాపన్న చరిత్రను పొందుపర్చాలి. స్వరాష్ట్రం ఏర్పడిన పాపన్నకు గుర్తింపు లభించడం లేదు. భావితరాలకు ఆయన చరిత్రను అందించాలి. పాఠ్య పుస్తకాల్లో చేర్చేవరకు ఉద్యమాలను ఆపేది లేదు. తీగల సిద్ద్ధుగౌడ్, గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాపన్న ఆనవాళ్లను కాపాడాలి పాపన్న జీవితంతో జనగామ జిల్లా చరిత్ర ముడిపడి ఉంది. పాపన్న నిర్మించిన ఆనవాళ్లు ఉన్నాయి. కోటలు, బురుజులను పర్యాటక ప్రాంతాల జాబితాలో చేర్చి అభివృద్ధి చేయాలి. పాపన్న పేరుతో మ్యూజియం ఏర్పాటు చేస్తే ముందు తరాల వారికి పాపన్న చరిత్ర తెలుస్తుంది. ప్రభుత్వమే అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించాలి. మేకపోతుల ఆంజనేయులుగౌడ్, పోపా అధ్యక్షుడు గోల్కొండ కోటపై బహుజనుల జెండా.. బహుజన రాజ్యస్థాపన ధ్యేయంగా సర్వాయి పాపన్న(క్రీ.శ 1650క్రీ.శ 1709) దండయాత్రను చేపట్టి గోల్కొండ కోటపై బహుజను జెండాను ఎగురవేశారు. తన తోటి బహుజనులను సమీకరించి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఔరంగజేబు మరణం తర్వాత బలహీనపడిన మొగల్ సామ్రాజ్యంపై దండెత్తి పలు కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఖిలాషాపూర్ కోట కేంద్రంగా వరంగల్, భువనగిరి, చివరికి గోల్కొండను వశపర్చుకున్నారు. పాపన్న విజయాలను ఖిలాషాపూర్ కేంద్రంగానే సాధించినట్లుగా చరిత్ర కారులు చెబుతున్నారు. -
అదనపు కట్నం కోసం భార్యను హత్యచేసిన భర్త
స్టేషన్ఘన్పూర్ వరంగల్ : మూడుముళ్లు వేసి కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్య నందనబోయిన రాధిక(21)ను భర్త రాజ్కుమార్ హత్య చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి మండలంలోని నమిలిగొండలో జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు నారబోయిన నర్సయ్య, రాజమణి తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ఘన్పూర్కు చెందిన నర్సయ్య, రాజమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. వారి పెద్ద కుమార్తె రాధికను మూడేళ్ల క్రితం నమిలిగొండ గ్రామానికి చెందిన నందనబోయిన రాజ్కుమార్కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నంగా రూ.4లక్షలు, నాలుగున్నర తులాల బంగారు నగలు ముట్టజెప్పారు. గతేడాదిగా కట్నం డబ్బులు సరిపోలేదని, మరో రూ.2లక్షలు కట్నం ఇవ్వాలని రాధికను భర్త, అత్తమామలు వేధించ సాగారు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం మరో రూ.50వేలు ఇచ్చారు. రాధిక అత్తమామలు భూలచ్చమ్మ, కొమురయ్య కొండాపూర్ నుంచి ఘన్పూర్కు వచ్చి సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వచ్చి రాధికకు కడుపులో నొప్పి లేచిందంటూ చెప్పి వెళ్లారు. రాధిక కుటుంబ సభ్యులు నమిలిగొండకు వెళ్లేసరికి ఆమె శవమై ఉందని తల్లిదండ్రులు బోరున విలపించారు. రాధికను తీవ్రంగా కొట్టి హింసించి ముఖంపై మెత్త పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని వారు ఆరోపించారు. ఆమె చేతులు, నోరు, మెడ, తొడపై గాయాలున్నాయని, నోటి వెంట రక్తం కారి ఉందని తెలిపారు. అదనపు కట్నం కోసం హత్య చేశారని ఆరోపించారు. గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ సీఐ రావుల నరేందర్, ఎస్సై రవి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడిందా, హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్వరబాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భర్త రాజ్కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అదనపు కట్నం కోసం భార్యను హతమార్చిన భర్తను కఠినంగా శిక్షించాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య డిమాండ్ చేశారు. -
ఆలయ తలుపుల్ని పగలగోట్టిన ఎలుగుబంటి
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండ లం కట్కూర్ గ్రామంలో గురువారం రాత్రి ఎలుగుబంటి సంచరిండం గ్రామస్తులను కలవరపెట్టింది. అర్ధరాత్రి గ్రామంలో ఎలుగుబంటిని చూ సి కుక్కలు అరవగా గ్రామస్తులు దానికి గమనించి భయంతో తలుపులు వేసుకున్నారు. గ్రామ నడిబొడ్డునఉన్న హనుమాన్ ఆలయం తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లింది. అదే సమయంలో అటు గా వెళ్తున్న కొందరు ఎలుగుబంటిని చూసి అం దరికీ ఫోన్లో సమాచారం అందించారు. కాగా కుక్క లు తరమడంతో ఎలుగుబంటి గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయి ంది. కాగా ఎలు గుబంటు భయంతో పాలవ్యాపారులు వ్యవసాయ కూలీలు, రైతులు ఒంటరిగా బయటకు రాలేదు. రాత్రి వేళ గ్రామం లోని జీపీ కార్యాల యం వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో ఎలుగుబంటి దృశ్యాలు న మోదయ్యాయి. సంబంధిత అధికారులు ఎలుగుబంటిని పట్టుకెళ్లాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అనుమతి లేకుండా వెంచర్లు..
సాక్షి, జనగామ : ప్రజల డిమాండ్ను ఆసరాగా చేసుకుని చోటామోటా రియల్టర్లు రియల్ దందాకు తెర లేపుతున్నారు. వ్యవసాయ భూములను నివాస ప్రాంతాలుగా మార్చడం కోసం నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అనధికార వెంచర్లపై కఠిన చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడంతో మూడు వెంచర్లు..ఆరు ప్లాట్లుగా జిల్లా కేంద్రం సరిహద్దులో రియల్ దందా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా అనుమతి లేని ప్లాట్లు కొనుగోలు చేసి సామాన్యులు ఇబ్బందుల్లో పడుతున్నారు. జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న నాలుగు వైపులా రోజుకు రోజు వెంచర్లు వెలుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్..ఉమ్మడి వరంగల్ జిల్లాకు సెంటర్ పాయింట్ కావడమే కాకుండా నాలుగు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రవాణా మార్గాలున్నాయి. అంతేకాకుండా జాతీయ రహదారులతోపాటు రైల్వే రవాణా అభివృద్ధి చెందడంతో మెజార్టీ ప్రజలు ఇక్కడే నివాసం ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. వీటితోపాటు దేవాదుల కాల్వల నిర్మాణంతో వ్యవసాయ భూములు కోల్పోవడంతో రూ.లక్షల్లో పరిహారం రైతులకు అందింది. పిల్లల చదువుల కోసం జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో భూముల క్రయవిక్రయాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. భూముల కొనుగోలు కోసం పోటీ ఏర్పడడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లను ఏర్పాటు చేసి అమ్మకానికి పెడుతున్నారు. గతంలో హైదరాబాద్ రోడ్డుకు పరిమితమైన రియల్ వ్యాపారం ఇప్పుడు సూర్యాపేట రోడ్డు, సిద్దిపేట రోడ్డు, వరంగల్ రోడ్డు వైపు విస్తరిస్తోంది. గ్రామ పంచాయతీలే టార్గెట్.. జనగామ మునిసిపాలిటీలో వెంచర్లు చేస్తే ప్రభుత్వానికి భారీగా పన్ను కట్టాల్సి వస్తుందనే భావనతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామ పంచాయతీలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. పెంబర్తి, శామీర్పేట, నెల్లుట్ల, యశ్వంతాపూర్, నిడిగొండ గ్రామాల సరిహద్దులను ఎంచుకుని వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా రెవెన్యూ అధికారుల వద్ద మార్చాలి. ఆర్డీఓ పరిధిలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించి ఎన్ఓసీ తీసుకుకోవాలి. కానీ, అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా మార్చకుండానే ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతోనే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం మూలంగా ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర గండిపడుతోంది. దళారులకు ఆఫర్లు.. అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మధ్య దళారులను ఏర్పాటు చేసుకుని ప్లాట్లను విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1000 నుంచి 1500 మంది వరకు బ్రోకర్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఒక్కో ప్లాట్ విక్రయానికి ఒక్కో రేటు చొప్పున చెల్లిస్తున్నారు. ఎక్కువ ప్లాట్లు అమ్మకం చేసిన దళారులకు విదేశీ పర్యటనలను సైతం ఆఫర్ చూపెడుతున్నారు. అరచేతిలోనే రియల్ వ్యాపారం జోష్ను చూపించి పెద్ద మొత్తంలో దందా కొనసాగిస్తున్నారు. శాఖల మధ్య లోపించిన సమన్వయం.. మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ శాఖల మధ్య సమన్వయం లోపించినట్లుగా తెలుస్తోంది. జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వెంచర్ల వివరాలను తెలుపాలని మునిసిపాలిటీ అధికారులు రెండు నెలల క్రితమే పంచాయతీ అధికారులకు లేఖను పంపించారు. ఇప్పటి వరకు పంచాయతీ శాఖ నుంచి మునిసిపాలిటీ అధికారులకు ఎలాంటి నివేదిక అందలేదు. దీంతో కొంతమంది దళారులు ఇష్టారాజ్యంగా వెంచర్లను ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, భువనగిరి ప్రాంతాలకు చెందిన బడా రియల్టర్లు స్థానికంగా ఉండే కొంతమందిని బినామీలుగా మలుచుకుని ప్లాట్ల బిజినెస్కు శ్రీకారం చుడుతున్నారు. అనుమతులు లేని వెంచర్లపై అధికారులు కొరడ ఝళిపిస్తేనే అమాయకులు వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. లేఔట్ లేని ప్లాట్లను కొనుగోలు చేయవద్దు.. అనుమతి లేని లేఔట్ ప్లాట్లను కొనుగోలు చేయవద్దు. లేఔట్ లేని ప్లాట్లను కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణానికి అనుమతి రాదు. బ్యాంకు నుంచి రుణం లభించదు. డబుల్ టాక్స్ పడుతుంది. భూ వివాదాలు వస్తాయి. నెల్లుట్ల, నిడికొండ, యశ్వంతాపూర్లో ఉన్న వెంచర్లకు మాత్రమే అనుమతి ఉంది. మరో ఐదు వెంచర్ల అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు చేపడుతున్నాం. - రంగు వీరస్వామి, టీపీఓ -
‘కంటి వెలుగు’కు ఏర్పాట్లు
జనగామ: సంపూర్ణ ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పేరిట జిల్లా వ్యాప్తంగా గతంలో పెద్ద ఎత్తున వైద్య పరీక్షలను నిర్వహించారు. అంధులు లేని రాష్ట్రం చేయాలనే తలంపుతో సీఎం కేసీఆర్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘కంటి వెలుగు’ పేరుతో ఆగస్టు 15 నుంచి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయనున్నారు. జిల్లాలో 40 శాతం మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5,82,485 జనాభా ఉంది. ఇందులో రూరల్ పరిధిలో 5,33,746, అర్బన్లో 48,739 జనాభా ఉంది.జీ జనాభాలో 0-5 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు 12 శాతం, మరో 8 శాతం మంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని భావిస్తున్నారు. మిగతా 80 శాతం మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. ప్రతి రోజు 750 మందికి పరీక్షలు చేసే విధంగా అధికారులు పక్కా ప్రణాళికలను రూపొందించారు. ప్రస్తుత జనాభాలో జనాభాలో 30 నుంచి 50 శాతం మంది కంటి సమస్యలతో బాధపడే వారు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేసుకుంటున్నారు. ఈ లెక్కన జనగామ జిల్లాలో 2 లక్షల మందికి పైగా మంది నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రెండు నెలల్లో పరీక్షలు పూర్తి.. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 4.09 లక్షల అద్దాలు చేరుకున్నాయి. రెండు నెలల వ్యవధిలో కంటి పరీక్షలను పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నారు. వెద్యులు కంటి పరీక్షలు చేసిన అనంతరం ప్రాథమిక స్థాయి, దూర, దగ్గరి చూపు ఉన్నవారికి అక్కడికక్కడే కళ్ల అద్దాలను అందిస్తారు. వైద్య పరీక్షలను చేసిన వారి వివరాలను ఆన్లైన్లో వెంట వెంటనే నమోదు చేస్తారు. కళ్లలో నరం వల్ల అంధత్వం, మోతి బిందు, నల్ల పాపపై పొర, నీటి కాసులు తదితర సమస్యలు ఉన్న వారికి హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సలు చేస్తారు. నోడల్ ఆఫీసర్గా విక్రమ్కుమార్.. కంటి వెలుగుల కోసం 13 ప్రత్యేక బృందాలనే ఏర్పాటు చేశారు. 13 ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రంలోని అర్బన్ పీహెచ్సీ ద్వారా కంటి పరీక్షలను చేస్తారు. క్యాంపు టీంలు(13), సబ్ సెంటర్లు (115), ఏఎన్ఎంలు(119), ఆశ కార్యకర్తలు (557), హెల్త్ సూపర్ వైజర్లు (63), పారామోడికల్ ఆఫ్తాల్మిక్(13), మెడికల్ ఆఫీసర్లు(13), ఆర్బీఎస్కే (16) బృందాల ద్వారా ఆయా గ్రామాల్లో కంటి పరీక్షలను నిర్వహిస్తారు. బృందంలో డాక్టర్, సూపర్ వైజర్, ఆఫ్తాల్మిక్, ఏఎన్ఎం, ఆశ, ఇద్దరు డాడా ఎంట్రీలు ఉంటారు. కాగా, ఈ కార్యక్రమానికి జిల్లా నోడల్ ఆఫీసర్గా స్టేట్ జాయింట్ డైరెక్టర్ విక్రమ్కుమార్ను నియమించారు. -
నా తండ్రి హత్యపై సమగ్ర విచారణ జరపాలి
జనగామ అర్బన్: ప్రెస్టన్ పాఠశాల కరస్పాండెంట్ దైదా క్రిస్టోఫర్ హత్యకు సంబంధించి పోలీసులు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలన్నీ అవాస్తవమని, క్రిస్టోఫర్ కూతురు, న్యాయవాది దైదా ప్రియాంక ప్రియదర్శని అన్నారు. ప్రెస్టన్ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిందితులు ఉపేష్, ఉప్పలయ్య ప్రెస్టన్ భూములను పెద్దమొత్తంలో తమకు విక్రయించాలని ఒత్తిడి తెచ్చినా తన తండ్రి ఒప్పకోకపోవడంతో కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఈ విషయంలో 17 నెలల క్రితం దాడికి పాల్పడి త్రీవంగా గాయపరిచారని అన్నారు. బాణపురానికి సంబంధించిన ఇంటి విషయంలో ఎలాంటి గొడవలు లేవని, అది మా వ్యక్తిగత ఆస్తి అని తెలిపారు. ఇక తన తండ్రిపై దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపేష్ను అరెస్టు చేయలేదన్నారు. పోలీసులు చెప్పినట్లు ఉపేష్ తన తండ్రికి రూ.6 లక్షలు ఇచ్చి ఉంటే సదరు విషయాన్ని ఉపేష్ ఎప్పుడు పోలీసుల దృష్టికి గాని, న్యాయపరంగా కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దాడి జరిగిన క్రమంలో సైతం బాణపురానికి సంబంధించిన ఆస్తిగొడవ అని ఫిర్యాదు ఇవ్వలేదని, ఇప్పటికైనా వాస్తవాలను వెలికితీసే విధంగా సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు. కేసును పది రోజుల్లోనే ఛేదించినందుకు పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
మేకలమ్మగుట్టపై దిగంబర విగ్రహాలు
రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టు గ్రామంలో ఉన్న మేకలమ్మ గుట్టపై దంపతుల దిగంబర విగ్రహాలు వెలుగు చూశాయి. జనగామ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక పరిశోధకుడు రత్నాకర్రెడ్డి బుధవారం తాజాగా వీటిని గుర్తించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టపై కనిపించిన స్త్రీ, పురుష దిగంబర విగ్రహాలను మేకలయ్య, మేకలమ్మగా భావిస్తున్నారు. 10 శతాబ్దానికి చెందిన ఈ దంపతుల శిల్పాలు విడివిడిగా అడుగున్నర ఎత్తులో ఉన్నాయి. ఎలాంటి ఆయుధాలు, జంతువుల చిహ్నాలు లేకపోవడంతో వారు ఏ దేవతామూర్తులే చెప్పలేకపోతున్నారు. మేకలమ్మ శిల్పం మూడు ముక్కలుగా ఉండగా మధ్య భాగం కనిపించడం లేదు. ఇక్కడ రాతితో నిర్మించిన మేకలమ్మ గుడిని దశాబ్దాల క్రితం కూల్చి వేయడంతో పూర్తిగా మాయమైంది. గుడికి ఉన్న మాన్యం భూములు అన్యాక్రాంతం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ జాతర జరిగేదని, రెండు దశాబ్దాలుగా అటు వైపు వెళ్లే వారు లేరని తెలుస్తోంది. అరుదైన డోల్మన్ సమాధులు.. గుట్టకు తూర్పు వైపున అనేక బండలున్నాయి. అక్కడ సముద్ర మట్టానికి 1,565 అడుగుల ఎత్తులో అనేక డోల్మన్ సమాధులను నిర్మించారు. మేకలమ్మ గుడికి 100 అడుగుల దూరంలో మూడు మీటర్ల పొడవైన రెండు రాతి పలకలు, అడుగున్నర పొడవులో ఉన్న పలకలను స్వస్తిక్ ఆకారంలో అమర్చారు. ఈ నాలుగింటి మధ్య మూడు నుంచి నాలుగు అడుగుల ఖాళీ స్థలాన్ని వదిలి పై భాగాన కప్పు బండ బోర్లించారు. ఇటువంటి నిర్మాణాలు చాలు అరుదుగా ఉంటాయి. చుట్టు పక్కల ఉన్న అనేక డోల్మన్ సమాధులను కూల్చివేశారు. గుట్ట కింద ఉన్న కుంటల్లో వందల సంఖ్యలో పెలికాన్ కొంగలు వచ్చి సేదతీరుతున్నాయి. మేకలమ్మ గుట్టను పురావస్తుశాఖ అధికారులు సందర్శిస్తే మరెంతో చరిత్ర వెలుగులోకి రానుంది. ఖిలాషాపూర్ సర్వాయి పాపన్న కోట సమీపంలోని ఈ గుట్టపై మేకలమ్మ ఆలయం నిర్మిస్తే పర్యాటక ప్రాంతం కావడంతోపాటు డోల్మన్ సమాధులు రక్షించబడతాయి. సమగ్రంగా పరిశోధించాలి జిల్లాలో ఎక్కడా లేని విధంగా మేకలమ్మ గుట్టపై దిగంబర విగ్రహాలు వెలుగుచూశాయి. ఎంతో ఘన చరిత్ర గల ఈ విగ్రహాలపై పురావస్తుశాఖ సమగ్రంగా పరిశోధించాలి. ఇక్కడి విగ్రహాలను మ్యూజియానికి తరలిస్తే గ్రామ చరిత్రకున్న ప్రాధాన్యం పోతుంది. మేకలమ్మ గుట్టను పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని ఆలయాన్ని పునరుద్ధరించాలి. డోల్మన్ సమాధులు, శిల్పాలను రక్షించడంతోపాటు ఎకో టూరిజం కింద మేకలమ్మ గుట్టను అభివృద్ధి చేయాలి. - రత్నాకర్రెడ్డి,ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు -
ఫసల్ బీమాలో మాయాజాలం..
జనగామ: ఫసల్ బీమా ద్వారా రైతులు పత్తి, వరి తదితర పంటలకు బీమా చేసుకుంటున్నారు. గత ఏడాది ఓ రైతు పత్తిపంటకు చేసుకున్న డీడీని ఆరు నెలల తర్వాత కంపెనీ వెనక్కి పంపించింది. దీంతో రైతు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు ముగ్గురు కలెక్టర్లను కలిసి మొరపెట్టుకున్నా స్పదించకపోవడంతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగిన సంఘటన గురువారం జరిగింది. జనగామ మండలం చీటకోడూరుకు చెందిన బాధిత రైతు ఓరుగంటి నర్సయ్య విలేకరులతో మాట్లాడారు. 2017 జూలైలో ఎకరం పత్తి పంట కోసం చోలా మండలం కంపెనీ పేరుతో రూ.1650 డీడీ తీసి, వ్యవసాయ శాఖకు అప్పగించానని తెలిపారు. పత్తి సాగు సమయంలో వర్షాభావ పరిస్థితుల్లో కొంత మేర నష్టం వచ్చిందని, బీమా ద్వారా ఆదుకుంటారని ఆశపడ్డామన్నారు. పత్తిని సేకరించి, తిరిగి సాగు చేçసుకునేందుకు దుక్కులు దున్నిన తర్వాత 2017 డిసెంబర్ మాసంలో డీడీని తిరిగి పంపించారని పేర్కొన్నారు. ఇదేంటని వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నిస్తే..కలెక్టర్ వద్దకు వెళ్లాలని సూచించారన్నారు. గతంలో పని చేసిన కలెక్టర్ శ్రీదేవసేన, ఇన్చార్జి కలెక్టర్, ప్రస్తుతం పనిచేస్తున్న వినయ్ కృష్ణారెడ్డిని ఎన్నోసార్లు కలిసి విజ్ఞప్తి చేశానని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పుడల్లా నీ పని ఇంకా కాలేదా అనడం తప్ప.. వారు చేసిందేమీ లేదన్నారు. తనతో పాటు మరో 50 మంది రైతుల డీడీలు వాపస్ వచ్చాయని వెల్లడించారు. డీడీ విషయంలో కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేశారని, ఏమీ చేయలేని పరిస్థితుల్లో డీడీని విడిపించుకుంటున్నానన్నారు. నకిలీ విత్తనాలుపై దృష్టి సారించే ఉన్నతాధికారులు.. బీమా కంపెనీలు సాగిస్తున్న మోసాలపై ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. -
జనగామ మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి మృతి
జనగామ/పాలకుర్తి: జనగామ మాజీ ఎమ్మెల్యే కోడూరు వరదారెడ్డి(82) హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వరదారెడ్డిని మెరుగైన వైద్య పరీక్షలను అందించేందుకు ఆస్పత్రిలో చేర్పించగా కన్నుమూశారు. పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన వరదారెడ్డి చిన్న నాటి నుంచే ప్రజా సంబంధాలు కలిగి ఉంటూ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. కాంగ్రెస్లో కీలక నేతగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. అంచలంచెలుగా ఎదుగుతూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు. 1958 నుంచి 1970 వరకు ఈరవెన్ను సర్పంచ్గా, 1970 నుంచి 1975 వరకు కొడకండ్ల సమితి అధ్యక్షుడిగా కొనసాగారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లాలో అప్పటికే మంచి పేరున్న వరదారెడ్డికి గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. 1978 నుంచి 1983 వరకు జనగామ ఎమ్మెల్యేగా పని చేశారు. సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల మన్ననలు పొందారు. కరువుకు కేరాఫ్గా ఉన్న జనగామ ప్రాంతాన్ని మరో కోనసీమలా మార్చేందుకు వరదారెడ్డి పోచంపాడు ఎత్తిపోతల పథకం కోసం జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చేశారు. ఆ సమయంలోనే 1984లో ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మడంలం నిడిగొండ గ్రామంలో బహిరంగసభ నిర్వహించి నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆహ్వానించారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోచంపాడు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని ఇందిర ప్రకటించడంతో ఆయన కృషి ఫలించినట్లయ్యింది. దీంతోపాటు రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర చాలా కీలకం. పేదల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఆయన వీరోచిత గాథలను నేటికీ చెప్పుకుంటారు. తెలంగాణ ఏర్పాటుతోనే ప్రజల సమస్యలు తీరుతాయని భావించి 2001లో కేసిఆర్తో కలిసి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ స్థాపనకు కృషి చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అసెంబ్లీ ఆవరణలో చేతి వేలు కోసుకుని ఉద్యమానికి ఊతమిచ్చారు. ఆ తర్వాత∙టీఆర్ఎస్ను వీడి రైతు నాయకుడిగానే ప్రజల పక్షాన గొంతు వినిపించారు. రైతు కుటుంబ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయన కుటుంబానికి 200 ఎకరాల భూమి ఉండేది. కాలక్రమంలో 50 ఎకరాలకు మిగిలింది. ఇద్దరు కుమారులకు పంచి, 10 ఎకరాలు తీసుకుని సేద్యం చేశారు. వరదారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. జనగామ జిల్లా జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆయనకు స్వయాన అల్లుడు. వరదారెడ్డి మృతితో కుటుంబ సభ్యులతో పాలకుర్తి, ఈరవెన్ను గ్రామాలతోపాటు జిల్లా వాసులు విషాదంలో మునిగి పోయారు. గురువారం ఈరవెన్నులో వరదారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. టీపీసీసీ, మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య..వరదారెడ్డి మృతదేహాన్ని యశో ద హాస్పిటల్లో సందర్శించి నివాళులర్పించారు. మరిచిపోలేని నేత: మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి రాజకీయాల్లో నిస్వార్థంగా సేవలు చేసిన మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో కొలువై ఉంటారని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి సీపీఐ కార్యాలయంలో వరదారెడ్డి చిత్ర పటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నివాళులర్పించిన వారిలో జిల్లా సమితి సహాయ కార్యదర్శి బర్ల శ్రీరాములు, ఆకుల శ్రీనివాస్, సోమయ్య, జనార్దన్, సత్యం, వైకుంఠం, సుగుణమ్మ ఉన్నారు. అదేవిధంగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తదితరులు సంతాపం తెలిపారు. -
భార్య కోసం వచ్చి..బలైన భర్త
ఇద్దరు ఇష్టపడ్డారు.. ఒకరిని విడిచి..ఒకరు ఉండలేని బంధం... పెళ్లికి పెద్దలు అంగీకరించకున్నా.. ఏడడుగులు నడిచారు.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో వివాహం చేసుకుని కొద్ది రోజుల పాటు వేరు కాపురం పెట్టారు. కొడుకు బాధను చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు అక్కున చేర్చుకున్నారు. కొత్త కాపురం సాఫీగా సాగిపోతున్న తరుణంలో.. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో భార్య ఎనిమిది నెలల క్రితం పుట్టింటికి వెళ్లి పోయింది. భార్య కోసం తరుచూ అత్తింటికి వస్తున్న భర్త.. చివరకు మామ చేతిలో బలైన సంఘటన జనగామ మండలం చీటకోడూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ: యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన గంధమాల అయిలయ్య, అరుణల ఒక్కగానొక్క కుమారుడు ఉదయ్(25) జనగామ మండలం చీటకోడూరుకు చెందిన గంధమాల ఎల్లయ్య, హంసల కుమార్తె మౌనికను ప్రేమించాడు. ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు అడ్డు చెప్పడంతో.. 2017లో ఓ పుణ్యక్షేత్రంలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న ఉదయ్.. ఉన్నంతలో హాయిగా బతికారు. కొడుకు కష్టాన్ని చూసిన తల్లిదండ్రులు.. ఇంటికి ఆహ్వానించారు. రెండు, మూడు నెలల పాటు అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో మౌనిక భర్తను వదిలి తన పుట్టినిల్లైన చీటకోడురుకు వచ్చింది. అప్పటి నుంచి భార్య కోసం ఉదయ్ తరుచూ అత్తింటికి వచ్చి వెళ్లి పోయేవాడు. ఈ క్రమంలోనే అబ్బాయి, అమ్మాయి తరుపు కుటుంబాలు పెద్ద మనషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఇరువురి వాదనలు విన్న పెద్ద మనుషులు.. అబ్బాయి తరుఫున అమ్మాయికి రూ.1.50 లక్షలు పరిహారం ఇచ్చి విడాకులు తీసుకోవాలని తీర్పు చెప్పారు. దీనికి మృతుడు ఉదయ్ తల్లిదండ్రులు అంగీకరించ లేదు. కోడలును తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఎందుకు జరిమానా కట్టాలని ప్రశ్నిం చారు. దీంతో పంచాయితీ వాయిదాలు పడుతూ వస్తుంది. భార్య కోసం వచ్చి.. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడం, భార్య మౌనిక పుట్టింటికి వెళ్లి పోవడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ కుమిలి పోయాడు ఉదయ్. భార్యను తీసుకు వెళ్లేందుకు అప్పుడప్పుడు చీటకోడూరుకు వచ్చి వెళ్లి పోయేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తన బైక్పై చీటకోడూరుకు వచ్చాడు. ఆ రాత్రి భార్య, మామ, అత్త, కుటుంబ సభ్యులు... ఉదయ్(25) మధ్య ఏం జరిగిందో తెలియదు కాని.. తెల్లవారే సరికి దారుణ హత్యకు గురయ్యాడు. మెడపై మూడు నుంచి నాలుగు గాట్లు కనిపించగా.. గొడ్డలితో నరికినట్లు బావిస్తున్నారు. అర్థరాత్రి 12.30 గంటలకు హత్య చేయగా.. తెల్లవారు జామున విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. మృతదేహం తరలింపుపై పెల్లుబికిన ఆగ్రహా వేశాలు తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. బంధువులు పెద్ద సంఖ్యలో జనగామ జిల్లా ప్రధాన ఆస్పత్రికి చేరుకున్నారు. హత్యకు గురైన కన్న కొడుకును చూసి కుమిలి కుమిలి ఏడ్చారు. కుటుంబ సభ్యులు రాకుండా.. మృతదేహాన్ని ఆస్పత్రికి ఎలా తీసుకు వచ్చారని పోలీసులను నిలదీశారు. హత్య చేసిన వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సిద్దిపేట హైవేపై రాస్తారోకోకు దిగారు. నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని పోలీసులు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. ఉదయ్ను హత్య చేసిన ప్రాంతాన్ని చూపెట్టాలని పట్టుబట్టడంతో అందుకు పోలీసులు నిరాకరించారు. చీటకోడూరులో ఉద్రిక్తత.. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న క్రమంలో.. మృతుడు తల్లిదండ్రులు, బంధువులు చీటకోడూరుకు చేరుకున్నారు. అప్పటికే పట్టణ మొదటి ఎస్సై శ్రీనివాస్ బందోబస్తు చేపట్టారు. అయినప్పటికీ.. ఉదయ్ తరుపు బంధువులు, తల్లిదండ్రులు మౌనిక ఇంటిపై దాడికి దిగారు. ఇంటి తలుపులను బద్దలు కొట్టి.. ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. చీటకోడూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఏసీపీ బాపురెడ్డి హుటాహుటిన సీఐ ముష్క శ్రీనివాస్తో కలిసి వెళ్లారు. జనగామ, నర్మెట, రఘునాథపల్లి, బచ్చన్నపేట, దేవరుప్పుల సీఐ, ఎస్సైలతో పాటు స్పెషల్ పోర్స్ను రప్పించారు. కోడలు ఇంటిని తగుల బెడతా.. లేకుంటే తనకు తానే కాల్చుకుంటానంటూ మృతుడి తల్లి అరుణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బైక్పైనే చంపేశారా..? తన భార్య కోసం బైక్పై వచ్చిన ఉదయ్ ను ఎక్కడ చంపారనే దానిపై క్లారిటీ రావడం లేదు. బైక్ వస్తుండగానే.. మెడపై గొడ్డలి కాటు వేశారా.. లేదా గొడవపడి పారి పోతుండగా అడ్డగించి హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైక్ డూం...ఫుట్ రెస్ట్, పెట్రోల్ ట్యాంక్ పై ఉన్న రక్తపు మరకలు అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఉదయ్ చనిపోయిన తర్వాత..ఇంటి ముందు డ్రెయినేజీ పక్క న పడేశారు. కాని తల్లిదండ్రులు మాత్రం.. ఇం టికి పిలిపించి హత్య చేశారని ఆరోపిస్తున్నారు.అత్తింటి వారే హత్య చేశారు...తన కొడుకును అత్తింటి వారే చంపేశారని మృతుడు ఉదయ్ తల్లిదండ్రులు అయిలయ్య, అరుణ విలేకరులకు తెలిపారు. మామా, అత్త, భార్య, బావ మరుద్దలు, మేనమామలు కుట్ర పన్ని హత్య చేశారని ఆరోపించారు. ఎవరు హత్య చేశారనే దానిపై సమగ్ర విచారణ జరిపించి, తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. అదుపులోకి తీసుకున్నాం... ఉదయ్ని హత్య చేసినట్లుగా బావిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ బాపురెడ్డి తెలిపారు. గంధమల్ల ఎల్లయ్య, ఆయన భార్య హంస తమ కస్టడీలోనే ఉన్నారన్నారు. కుటుంబ సభ్యులతో పాటు మేన మామలపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరిని కూడా వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
నొప్పి తగ్గదు.. నిద్ర పట్టదు
జనగామ : యాంత్రిక జీవనంలో ప్రజలు అనేక వ్యాధులబారిన పడుతున్నారు. వైద్యులకు కూడా అంతుపట్టని రోగాలు వస్తున్నాయి. కొంతమంది ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ నిత్యం నరకం చూస్తున్నారు. ఇందులో ప్రధానమైన (రుమటాయిడ్ ఆర్థరైటిస్) వ్యాధి కీళ్ల నొప్పులు. రాత్రుళ్లు నిద్రపట్టక పోవడం, ఉదయం లేవగానే కీళ్లు పట్టేసినట్లుగా ఉండ డం, కనీసం కదల్లేక పోవడం, ఎక్కువ దూరం నడిస్తే మోకాళ్ల నొప్పి.. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నాయా.. అయితే రుమటాయిడ్ ఆర్థరైటీస్తో బాధపడుతున్నట్లే. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని వైద్యులు చెబు తుండడం గమనార్హం. జనగామ జిల్లాలో సుమారు 2,500 మందికి పైగా ఈ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే ఎక్కువగా ఈ వ్యాధి బారినపడుతున్నారు. బాధితుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. 18 సంవత్సరాల లోపు వారిలోనూ వ్యాధిని గుర్తిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక దశలో అప్రమత్తమైతే పెద్దగా ప్రమాదం లేదని.. నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాప్యం వద్దు.. రుమటాయిడ్ ఆర్థరైటిస్కు చికిత్సలో జాప్యం చేస్తే కళ్లు తడారిపోవడం, కంటి చూపు తగ్గిపోవడం, దుద్దర్లు రావడం, దగ్గు, ఆయాసంతో పాటు గుండె చుట్టూ నీరు చేరుతుందని వైద్యులు చెబుతున్నారు. నరాల పటుత్వం తగ్గిపోవడం, చేతి వేళ్లు, కాలి వేళ్లు నల్లగా మారుతాయి. మధుమేహం, రక్తపోటులాగే ఈ వ్యాధి ఉన్న వారికి గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. నిర్ధారణ..చికిత్స కీళ్ల నొప్పులు వచ్చిన తొలి దశలో వైద్యులను సంప్రదిస్తే రుమటాయిడ్ ప్రాక్చర్, యాంటీ సీసీపీ అనే యాంటీ బాడీస్ రక్త పరీక్షలు చేసి, వ్యాధిని నిర్ధారిస్తారు. ఆ తర్వాత వ్యాధి నిరోధక శక్తిలో ఏర్పడిన లోపాన్ని సరిదిద్దేందుకు మందులు ఇస్తారు. ' రుమటాయిడ్ ఆర్థరైటిస్కు కారణాలు జన్యుపరమైన లోపాలు, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, వైరల్ ఇన్ఫెక్షన్, పొగతాగం వంటి కారణలతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి వస్తుంది. వ్యాధి లక్షణాలు.. కీళ్ల వద్ద నొప్పి, వాపు రావడం ఉదయం నిద్ర లేవగానే 15 నిమిషాల వరకు కీళ్లు పట్టేయడం రాత్రిపూట కీళ్ల నొప్పులతో నిద్రపట్టక పోవడం కీళ్లలో గుజ్జు తగ్గిపోయి వంకర పోవడం ఎముకలు పటుత్వం తగ్గి చిన్నపాటి దెబ్బలకే ఫ్యాక్చర్ కావడం -
జనగామ పరిసరాల్లో గూడు సమాధులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అరుదైన సమాధి నిర్మాణంగా గుర్తింపు పొందిన గూడు సమాధులు (డాల్మన్స్) జనగామ జిల్లాలోనూ వెలుగు చూశాయి. చుట్టూ వృత్తాకారంలో పాతిన రాళ్లు.. వాటి మధ్య నిలువు రాళ్లు, వాటి మీద వెడల్పాటి రాతి మూత ఏర్పాటు... ఇది క్రీ.పూ. 600 క్రితం నాటి సమాధుల ఆకృతి. గోదావరి నదీతీరంలోని పినపాక, మల్లూరు, జానంపేట, తాడ్వాయి తదితర దట్టమైన అటవీప్రాంతంలో వేల సంఖ్యలో ఈ తరహా నిర్మాణాలు పురావస్తు శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తున్నాయి. గత ఏడాది అమెరికాలోని శాండియాగో వర్సిటీ ఆచార్యులు వీటిని పరిశీలించి ఆశ్చర్యపోయారు. వీటిపై పరిశోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. తాజాగా కేంద్ర పురాతత్వ పర్యవేక్షణ సంస్థ (ఏఎస్ఐ) పినపాక మండలం జానంపేటలో వీటిపై అధ్య యనం మొదలుపెట్టింది. ఆ తరహా సమాధులు గోదావరి నదీ తీరానికే పరిమితమయ్యాయన్న భావన అప్పట్లో వ్యక్తమైంది. కానీ జనగామ జిల్లా రఘునాథపల్లి పరిధిలోని గుట్టలపై కూడా వీటిని పోలిన సమాధులున్నట్టు తేలింది. ఆ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు రత్నాకర్రెడ్డి తాజాగా రఘునాథపల్లిలోని రాములవారిగుట్టపై వీటిని గుర్తించారు. ఈ ప్రాంతంలోని అన్ని గుట్టలపై ఇలాంటి సమాధులున్నాయని, వాటికి రక్షణ లేకపోవటంతో క్వారీ పేలుళ్లతో ధ్వంసమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భావితరాలకు వీటి దర్శనభాగ్యం ఉండాలంటే క్వారీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మల్లూరు గుట్టపైఉన్న గూడు సమాధుల్లో శవాల అవశేషాలు ఉంచేందుకు రాతి తొట్లను ఏర్పాటు చేసేవారని, కానీ ఈ ప్రాంతంలోని సమాధుల్లో అలాంటి తొట్లు కనిపించటం లేదన్నారు. గుట్ట దిగువన రాకాసిగుళ్లు (సమాధుల చుట్టూ గుండ్రటి రాళ్ల ఏర్పాటు) వేల సంఖ్యలో ఉన్నాయని, వ్యవసాయం వల్ల అవన్నీ కనుమరుగవుతున్నాయన్నారు. రాములవారి గుట్ట పై అతిపెద్ద డాల్మన్ శిథిలాలు కనిపించాయి. 24 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పున్న భారీ రాతి సల్ప మూడు ముక్కలై కనిపిస్తోంది. ఇది గూడు సమాధి పైభాగంలోని రాయి. క్వారీ పనుల్లో భాగంగా దీన్ని ధ్వంసం చేశారు. పైమూతగా వాడిన రాతి సల్ప అంతపెద్దగా ఉందంటే, ఆ సమాధి కూడా పెద్దగా ఉండి ఉండాలి. వాటిపై అధ్యయనం జరిపేందుకు విదేశీ నిపుణులు ఆసక్తి కనబరుస్తున్నారు కానీ పురావస్తు శాఖ మాత్రం వీటిని గుర్తించకపోవటం, వాటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో అవి ధ్వంసమవుతున్నాయి. ఇదే ప్రాంతంలో ఆదిమానవులు రాతి ఆయుధాలను నూరేందుకు రాతి బండలపై ఏర్పాటు చేసుకున్న పొడవాటి గుంతలు (గ్రూవ్స్) కూడా ఉన్నాయి. ఇక కాకతీయుల కాలం నాటిదిగా భావిస్తున్న ఓ శాసనం, సమీపంలోని కానుగులవాగు ఒడ్డుపై దేవాలయ ఆనవాళ్లు, మెత్తటి శిలపై రెండు పాదాలు మాత్రమే కనిపిస్తున్న శిల్పం ఉంది. ఆ శిల్పం మిగతా భాగం భూమిలో కూరుకుపోయి ఉంది. అది వీరగల్లు శిల్పమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
టీసీలు, మెమోలు ఇవ్వరట!
జనగామ అర్బన్: జిల్లాలోని కొన్ని మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదివిన విద్యార్థుల కు అధికారులు టీసీలు, మెమోలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది ఫలితాలు వెలువడి దాదాపు నెల రోజలు అవుతోంది. ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు సైతం ప్రారంభమై 20 రోజులు కావస్తోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో మొత్తం 9 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 8 స్కూళ్లలో ఇంటర్ కోర్సు ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో దాదాపు 500 మం ది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. అయి తే మోడల్ స్కూల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన విద్యార్థులను ఇంటర్ సైతం ఇక్కడే చదవాలని కొందరు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కళాశాలల్లో చేరే అంశం విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థి తి, విద్యార్థుల ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, వేరే కళాశాలల్లో చేరేందుకు టీసీ, మెమోలు ఇచ్చేది మాత్రం లేదని అధికారులు పేర్కొంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు హైదరాబాద్లోని కార్పొరేట్ కళాశాలల్లో చేరే విద్యార్థులకు మాత్రం టీసీ, మెమోలు ఇస్తున్నారని పలు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల అధికారులు పదో తరగతి పాసై న విద్యార్థి టీసీ అడిగితే అందులో విద్యను అభ్యసిస్తున్న వారి తమ్ముడు, చెల్లి టీసీలు కూడా ఇస్తామని ఒకింత కఠినంగా చెబుతున్నారని తెలుస్తోంది. మోడల్ స్కూల్లో బో«ధించే కొందరు ఉపాధ్యాయుల పిల్లలు మాత్రం కార్పొరేట్ విద్యను అభ్యసిస్తున్నార ని, వారేందుకు మోడల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు ఇష్టంలేని చోట విద్య కొనసాగదని, భవిష్యత్ భరోసా ఎవరిస్తారని పలు వురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ఇష్టంతో చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకో వాలని, ఇష్టంలేకున్నా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం తగదంటున్నారు. ఇప్పటికైనా మోడల్ స్కూల్లో ఇంటర్ చదవడం ఇష్టంలేని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని టీసీ, మెమోలు జారీ చేయాలని విద్యార్థి సంఘాల బాధ్యులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా, నాణ్యమైన వి ద్య అందుతుందనే దృష్టితోనే విద్యార్థులను మోడల్ స్కూల్లో ఇంటర్లో చేరే విధంగా అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇష్టంలేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. -
రేషన్ డీలర్ల భిక్షాటన
జనగామ: ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రేషన్ డీలర్లు జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం భిక్షాటన చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు మురళీధర్రావు ఆధ్వర్యంలో ప్రిస్టన్ కళాశాల మైదానం నుంచి భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్కు, రైల్వే స్టేషన్ మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైగా రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులు పడుతూ ప్రజలకు రేషన్ సరుకులు అందజేస్తున్నారని తెలిపారు. తక్కువ కమీషన్ ఇచ్చినా సేవే పరమావధిగా ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా పనిచేస్తున్న తమను సీఎం కేసీఆర్ చిన్నచూపు చూడడం బాధగా ఉందన్నారు. ఈ పాస్ విధానాన్ని సక్సెస్ చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని, జూలై 1 వరకు ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక బంద్ పాటిస్తామని హెచ్చరించారు. డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు రూ.30 వేల వేతనం అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అబ్బాస్, సింగపురం మోహన్, పుణ్యవతి, వెంకటేశ్వర్లు, అంజయ్య, శ్రీధర్, కిరణ్ ఉన్నారు. -
గులాబీ పార్టీలో ముసలం
సాక్షి, జనగామ: జనగామ నియోజకవర్గంలోని అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. ఒక వైపు సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. నేడో, రేపో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో.. అధికార పార్టీ నాయకులకు సొంత కార్యకర్తల నుంచే విమర్శలు ఎదురవుతుండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని నర్మెట మండలానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత ఇమ్మడి శ్రీనివాస్రెడ్డి.. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగాపై తిరుగుబాటు ప్రకటించారు. జనగామ ఎమ్మెల్యే చేత నియమితులై సమన్వయకర్తగా చెలామణి అవుతున్న నాయకుడు నాలుగేళ్లుగా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, వారి బాగోగులు మరిచారని, నర్మెట ఎంపీపీ మరణిస్తే కనీసం పరామర్శకు సైతం రాలేదని తన వాట్సప్ పోస్టింగ్లో తెలిపారు. నాలుగేళ్లుగా కార్యకర్తలతో సమన్వయకర్త మీటింగ్లు పెట్టిన సందర్భాలు లేవని, ఎలక్షన్లు దగ్గరపడుతున్నాయని, ఇప్పటికైనా పార్టీని కాపాడాలని ఇమ్మడి శ్రీనివాస్రెడ్డి కామెంట్ చేస్తూ పోస్టింగ్ చేశారు. కాగా, శ్రీనివాస్రెడ్డి చేసిన పోస్టింగ్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారింది. నియోజకవర్గంలోనే సీనియర్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్రెడ్డి పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలకు దిగడం టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు పొడచూపుతుండడంతో నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఇమ్మడి శ్రీనివాస్రెడ్డి సంధించిన విమర్శలకు సొంత పార్టీలోని నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలపడం గమనార్హం. ఏదిఏమైనా అధికార పార్టీలో శ్రీనివాస్రెడ్డి చేసిన విమర్శలు టీఆర్ఎస్లోనే కాకుండా రాజకీయాల్లో వర్గాల్లో చర్చకు దారీతీస్తున్నాయి. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
జనగామ అర్బన్ : పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, గ్రూపు–4 పోటీ పరీక్షల కోసం అర్హులైన వారికి 60 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీసీపీ మల్లారెడ్డి, డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ, పోలీస్శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘వారధి’ సంస్థ కరీంనగర్ సహకారంతో సుమారు 400 మందికి ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను సదరు సంస్థ భరిస్తుందని తెలిపారు. శిక్షణార్థులకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ శిక్షణ సంస్థల ప్రతినిధులు తరగతులు బోధిస్తారని పేర్కొన్నారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈనెల 18 నుంచి 22 వరకు ఆయా మండలాల్లోని పోలీస్ స్టేషన్న్లలో ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతోపాటు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు తీసుకుని తమ పేర్లను నమోదు చేసుకుని, వెంటనే అర్హత పరీక్షకు సంబంధించిన హాల్టికెట్ పొందవచ్చునని తెలిపారు. అదేవిధంగా వీఆర్వో, గ్రూపు–4 పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని చాకలి అయిలమ్మ జిల్లా సమాఖ్యలో ఈనెల 22 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి కోరారు. ఈనెల 24న యశ్వాంతాపూర్ గ్రామ శివారులోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం కానిస్టేబుల్స్ అభ్యర్థులకు, మధ్యాహ్నం వీఆర్వో, గ్రూపు–4 అభ్యర్థులకు అర్హత పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు కూడా ఉచిత శిక్షణ అని అనుకోవద్దని, ప్రమాణాలు పాటించి నిష్ణాతులైన వారిచే బోధించనున్న తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే పీహెచ్సీ (వికలాంగ) అభ్యర్థులకు వసతి కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో మాలతి, ఏసీపీ బాపురెడ్డి, డీఆర్డీఓ కార్యాలయ అధికారి రాజేంద్రప్రసాద్, ఈజీఎస్ ప్రతినిధులు, ఆయా మండలాల పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వేగ నియంత్రణకు ‘స్టాప్ లైన్’
జనగామ: జాతీయ రహదారితో పాటు రాష్ట్ర హైవేపై ప్రమాదాలను నివారించేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్–వరంగల్ నేషనల్ హైవేతో పాటు సిద్ధిపేట–విజయవాడ రహదారిలోని ప్రధాన కూడళ్ల వద్ద స్టాప్ లైన్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ లైన్లు వేగంగా దూసుకొచ్చే వాహనాలను నియంత్రించేందుకు కొంత మేరకు ఉపయోగపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా కేంద్రంతో పాటు హైవేలపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా యి. దీనికి ప్రధాన కారణం వాహనాలు అతివేగంగా రావడమేనని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నేషనల్ హైవే అధికారులతో పాటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డీసీపీ మల్లారెడ్డి.. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ మేరకు ప్రమాదకర కూడళ్లను తెలియజేస్తూ చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారిపై స్పీడు బ్రేకర్లను వేసేందుకు నిబంధనలు అడ్డురావ డంతో.. స్టాప్లైన్లను వేయిస్తున్నారు. ఇంచు ఎత్తులో ఉండే ఈ స్టాప్లైన్లు వరుసగా ఏడు నుంచి ఎనిమిది వేయడంతో.. వేగంగా వచ్చే వాహనాల స్పీడ్ను కంట్రోలు చేస్తున్నాయి. స్టాప్ లైన్పై వెళ్లే క్రమంలో కుదుపునకు లోనవుతుండడంతో.. డ్రైవర్లు బ్రేకులు వేయడం పరి పాటిగా మారిపోతుంది. ప్రమాదాలను వందశాతం నియంత్రించ లేకపోయినప్పటికీ, ఎంతో కొంత మేర వేగం తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అతి ప్రమాదకరమైన ప్రదేశాల్లో పది లైన్లు, ఇతర చోట్ల ఎనిమిది వరకు ఏర్పాటు చేస్తున్నారు. జనగామ జిల్లా పరిధిలోని హైదరాబాద్ రోడ్డు, ఆర్టీసీ చౌరస్తాతో పాటు అంబేడ్కర్ సెంటర్, నెహ్రూపార్కు, ఫ్లై ఓవర్, చంపక్ హిల్స్ ప్రధాన మలుపులు, మాతాశిశు ఆరోగ్య కేంద్రం తదితర పాంతాల్లో స్టాప్ లైన్ ఏర్పాటు చేశారు. స్టాప్లైన్తో వేగ నియంత్రణ రోడ్డు ప్రమాదాల నివారణకు వేసిన స్టాప్లైన్లు కొంత మేరకు ఉపయోగపడుతున్నాయి. ఒక్క సారిగా కుదుపునకు లోనయ్యే అవకాశం ఉండడంతో.. డ్రైవర్లు వేగాన్ని అదుపు చేసుకుంటున్నారు. ఇలా చేయడంతో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువయ్యే అవకాశం ఉంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రమాద ప్రదేశాలను గుర్తించి, వాహన డ్రైవర్లతో పాటు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం. –శ్రీనివాస్, ఎస్సై, జనగామ -
గొర్రెల కాపరిపై లిక్విడ్తో గుర్తు తెలియని వ్యక్తుల దాడి
రఘునాథపల్లి : గొర్రెలు మేపుతున్న ఓ కాపరిపై గుర్తు తెలియని వ్యక్తులు లిక్విడ్ చల్లి హత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని అశ్వరావుపల్లి శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అశ్వరావుపల్లి శివారులోని వ్యవసాయ పొలాల వద్ద గ్రామానికి చెందిన గాజుల రాజు అనే గొర్రెల కాపరి గొర్రెలు మేపుతున్నాడు. మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తమ వెంట ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చుకున్న లిక్విడ్ (ద్రావకం) చల్లారు. నెత్తికి రుమాలు చుట్టుకోవడంతో లిక్విడ్ మొఖంపై ఎక్కువగా పడలేదు. కళ్లలో పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పాటు రాజు గొంతు నులిమేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించగా కొద్ది దూరంలో ఉన్న వేరొక గొర్ల కాపరి గుర్తించి అరవడంతో ఆగంతకులు పారిపోయారు. గాయాలతో రోదిస్తున్న రాజును స్థానికులు జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రంజిత్రావు ఆసుపత్రికి చేరుకొని బాధితుడి నుంచి వివరాలు సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు. పట్టపగలే అఘాయిత్యం.. గొర్రెలు మేపుతున్న రాజుపై పట్టపగలే అఘాయిత్యానికి పాల్పడటం గ్రామంలో కలకలం రేపింది. కొద్ది దూరంలో ద్విచక్రవాహనం నిలిపిన దుండగులు కాలినడకన రాజు వద్దకు చేరుకున్నారు. దుండగులు వెంట తెచ్చుకున్న లిక్విడ్ యాసిడ్గా బావించారా ..? చల్లిన వెంటనే ఒంటిపై గాయాలు కాకపోవడంతో గొంతు నులిపి హత్యచేసేందుకు యత్నించడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు గ్రామస్తులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. రాజుకు తొమ్మిది సంవత్సరాల క్రితం అలేరు మండలానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య ఏర్పడిన వివాదాలు, పలు కారణాలతో రెండేళ్ల క్రితం దూరమయ్యారు. ఆరు నెలల క్రితం అదే మండలంలోని కొలనుపాకకు చెందిన జ్యోతితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలతో దాడి జరిగిందా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడిపై చల్లింది యాసిడా ..? ఇతర ఏ లిక్విడ్ అన్నది ఆరా తీస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రంజిత్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజును ఎంపీపీ దాసరి అనిత పరామర్శించారు. -
తెలంగాణ రీసెర్చర్కు రూ.80 లక్షల ఫెలోషిప్
-
తెలంగాణ రీసెర్చర్కు రూ.80 లక్షల ఫెలోషిప్
సాక్షి, హైదరాబాద్: జనగాం జిల్లాలోని రఘునాథ్పల్లి మండలం బానాజీ పేట గ్రామానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ గవ్వల కృష్ణకు ప్రతిష్టాత్మక ఫ్రాన్స్ ఫెలోషిఫ్ లభించింది. కృష్ణ ఫ్రాన్స్లోని స్ట్రాస్ బర్గ్ యూనివర్సిటీలో 2016 నుంచి పరిశోధకుడిగా పని చేస్తున్నారు. ఈయన సేవలను గుర్తించిన ఫ్రాన్స్ ప్రభుత్వం లక్ష యూరోల ఫెలోషిప్(రూ.80 లక్షలు)ను ప్రకటించింది. కృష్ణ ఐఐఎస్ఈఆర్, పుణె నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఐఐటీ రూర్కీలో ఎంఎస్సీ(కెమిస్ట్రీ), ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. గ్రామీణ నేపధ్యం, పేదరికం నుంచి వచ్చిన కృష్ణకు ఈ అవార్డు రావడం పట్ల గ్రామస్థులు, స్నేహితులు, ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కృష్ణ ప్రాథమిక విధ్యను స్థానిక ప్రభుత్వ స్కూల్లోనే పూర్తి చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. -
‘బియ్యం’ పక్కదారి
జనగామ కేంద్రంగా బ్లాక్ దందా నలుగురు ఏజెంట్ల కనుసన్నల్లో వ్యాపారం జనగామ : రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ పథకం దళారుల పాలిట వరంగా మారింది. బియ్యం తరలింపుపై రెవెన్యూ, పోలీ సు అధికారులు మండలాలు, గ్రామాల్లో నిఘా వేయడంతో బియ్యం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో గ్రామాల్లో ఇప్పటి వరకు రూ.14 పలికిన కిలో బియ్యం ధర సింగిల్ డిజి ట్కు పడిపోయింది. ఇదే అదనుగా భావించిన కొందరు జనగామ కేంద్రంగా చేసుకొని, నలుగురు దళారుల కనుసన్నల్లో ఈ వ్యాపారం జోరు గా సాగిస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం చేరుతున్నప్పటికీ, బ్లాక్ మార్కెట్కు ఎలా వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల డీలర్ల మాయాజాలం, మరికొన్ని చోట్ల రిటైల్ అమ్మకాలతో సబ్సిడీ బియ్యం ప్రైవేటు మార్కెట్ వైపు వస్తున్నాయి. గ్రామాలు, తండాల నుంచి నేరుగా రేషన్ బియాన్ని కొనుగోలు చేసి జనగామ పట్టణంలోని రహస్య ప్రదేశాల్లో ఉన్న తమ గోదాం లకు తరలిస్తున్నారు. గ్రామాల్లో బియ్యం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో దళారులు కిలో బియ్యానికి రూ.6 నుంచి రూ. 8 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ బియ్యం మాఫియా నల్లగొండ జిల్లా ఆలేరు, మెదక్ జిల్లా సిద్దిపేట, మడికొండతో పాటు హైదరాబాద్, కాకినాడ, రాజ మండ్రి పట్టణాలకు రాత్రికి రాత్రే బియ్యాన్ని తరలిస్తోంది. జనగామలోని పలు ఏరియాల్లోని గోదాముల్లో వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం స్టాక్ ఉన్నట్లు సమాచారం. -
జనగామ బంద్ సక్సెస్
అధికార పార్టీతో సహా ప్రతిపక్షాల నిరసనలు డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు నిర్మానుష్యంగా రహదారులు జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని మంగళవారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. హన్మకొండ వద్దు... జనగామ జిల్లా చేయాలని కోరుతూ అన్ని వర్గాల ప్రజలు రహదారులపైకి వచ్చి గర్జించారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజే పీ, సీపీఎం, సీపీఐ, టీడీపీ, బహుజన సమాజ్వాది, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ప్రాంగణం ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు సైతం జనగామ బంద్కు మద్దతు పలికారు. యువత బైక్ర్యాలీలతో వాడవాడలా తిరుగుతూ జనగామ జిల్లా నినాదాలతో హోరెత్తించారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో సీఐలు ముసికె శ్రీనివాస్, చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని జనగామ, వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్ సబ్ డివిజన్లోని ఎస్సైలు, పోలీసు సిబ్బందితోపాటు పారామిలటరీ బలగాలు, మహిళా కానిస్టేబుళ్లతో బందోబస్తు చర్యలు చేపట్టారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై అన్ని పార్టీల నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. బంద్లో వ్యాపార, వాణి జ్య సంస్థలతోపాటు ప్రైవేటు పాఠశాలు స్వచ్ఛందం గా పాల్గొన్నాయి. జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. ప్రైవేటు వాహనాలు ఎక్కడివక్కడే నిలిచి ప్రయాణీలు చాలా ఇబ్బందులు పడ్డారు. జనగామ పట్టణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. సంపూర్ణ బంద్తో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. జనగామ జిల్లా చేయకపోతే అగ్నిగుండా మారుస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో అన్ని పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, బండ యాదగిరిరెడ్డి, నెల్లుట్ల నర్సిం హారావు, నాగారపు వెంకట్, చెంచారపు శ్రీనివాస్రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, మహంకాళి హరిశ్చంద్రగుప్తా, వజ్జ పర్శరాములు, బొట్ల శ్రీనివాస్, మంగళ్లపల్లి రాజు, మామిడాల రాజు, పెద్దోజు జగదీష్, ఆలేటి సిద్దిరాములు, జక్కుల వేణుమాధవ్, పసుల ఏబేలు, ఉల్లెంగుల క్రిష్ణ, తిప్పారపు ఆనంద్, రావెల రవి ఉన్నారు.