Nellore Crime News
-
నాకెందుకు శాపం.. నేనేమి చేశాను పాపం!
‘దేవుడా..! నాకెందుకు ఈ శాపం.. నేనేమి చేశాను పాపం.. నన్ను కూడా తీసుకెళ్లితే బావుండు.. నేను ఎవరి కోసం బతకాలి.. నేనెందుకు బతకాలి..’ అంటూ ఆ ఇల్లాలు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉన్న భర్త, ఇద్దరు పిల్లలను చూసి తల్లడిల్లిపోయింది. కళ్లల్లో నీళ్లు ఇంకిపోయే వరకు ఏడ్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు దూరమవడాన్ని తట్టుకోలేకపోయింది. వారి తల నిమురుతూ.. పదేపదే ముద్దాడుతూ గుండెలు పగిలేలా రోదించింది. ఈ ఘటన రాపూరు మండలం గుండవోలులో ఆదివారం విషాదాన్ని నింపింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: మండలంలోని వెలుగోను జంక్షన్ నుంచి ఏపూరు వెళ్లే జాతీయ రహదారిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ప్రమాదంలో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అంతవరకు తనతో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న ఆ ఇల్లాలు షాక్కు గురై కుప్పకూలిపోయింది. మోటారు బైక్పై గంగోటి ప్రతాప్ తన కుమార్తె వైష్ణవి, కుమారుడు సిద్ధార్ధతో కలిసి గుండవోలుకు బయల్దేరారు. ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో ప్రతాప్, వైష్ణవి, అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన సిద్ధార్ధను వైద్యం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సిద్ధార్ధ (8) ఆదివారం మృతి చెందాడు. కుప్పకూలిన ప్రభావతి భర్త, పిల్లలు ఒకేసారి మృత్యువాత పడడంతో ప్రభావతి కుప్పకూలింది. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్న ప్రతాప్ (38) ముంపు గ్రామానికి చెందినవాడు కావడం త్వరలో ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఉన్న కుటుంబానికి నిరాశే మిగిలింది. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉంటున్న కుటుంబంలోని ముగ్గురూ మృత్యువాత పడడంతో వృద్ధ తల్లిదండ్రులతోపాటు గ్రామం అంతా విషాదంలో మునిగింది. ఒకేసారి ముగ్గురికి అంత్యక్రియలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతాప్, వైష్ణవి, సిద్ధార్ధకు ఆదివారం గ్రామంలో ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలోని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు రోదనలతో గ్రా>మం శోకసంద్రంలో మునిగిపోయింది. -
మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కుమార్తెపైనా కన్నేయడంతో...!
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: ఓ మహిళకు ఒకతనితో వివాహేతర సంబంధం ఉంది. అతను ఆమె కుమార్తెను లైంగికంగా వేధింపులకు గురిచేయసాగాడు. ఈ విషయంపై మహిళ అతడిని పలుమార్లు హెచ్చరించింది. అయినా తీరు మారకపోవడంతో భరించలేకపోయిన తల్లి కర్ర, రాళ్లతో అతడిపై దాడి చేయగా తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై వెంకటాచలం పోలీసులు ఈ ఏడాది జూన్ 8వ తేదీన హత్య కేసును నమోదు చేశారు. ఎట్టకేలకు హత్య కేసును ఛేదించారు. వెంకటాచలం పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కసుమూరు కొండపై నివాసం ఉంటున్న కూరపాటి వెంకయ్య (74)కు, అక్కడే నివాసముంటున్న మోతే నారాయణమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే నారాయణమ్మ కుమార్తెను కూడా వెంకయ్య లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న నారాయణమ్మ పలు సందర్భాల్లో వెంకయ్యను మందలించింది. జూన్ 8న తెల్లవారుజామున నారాయణమ్మ కుమార్తె బహిర్భూమికి వెళ్లగా, వెంకయ్య వెంబడించి పట్టుకోవడంతో పెద్దగా కేకలు వేసింది. నారాయణమ్మ అక్కడికి చేరుకుని కర్రతో వెంకయ్యపై దాడి చేసింది. అక్కడి నుంచి కుమార్తెను తీసుకుని వెళ్లిపోతుండగా, వెంకయ్య మళ్లీ వెంబడించడంతో అక్కడే ఉన్న రాళ్లతో కొట్టి వెళ్లిపోయింది. అయితే వెంకయ్య మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. నారాయణమ్మను కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ గంగాధర్రావు, ఎస్సై అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
తండ్రిని చంపితే రూ.3 లక్షలు.. తల్లిని కూడా చంపితే రూ.5 లక్షలు!
నెల్లూరు (క్రైమ్): దొంగతనం కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను పోలీసులు విచారించగా.. తల్లిదండ్రులను హతమార్చేందుకు వారి కుమారుడు.. కిరాయి ఇచ్చిన వైనం వెలుగులోకొచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాళెం పోలీస్స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చోరీ జరిగిన ప్రదేశాల్లో లభ్యమైన ఆధారాల ఆధారంగా పాతనేరస్తులైన ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంకు చెందిన షేక్ గౌస్బాషా, బుచ్చిపట్టణం ఖాజానగర్కు చెందిన షేక్ షాహూల్ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఐదు దొంగతనాలతో పాటు కావలి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో కిరాయి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి వారి నుంచి రూ 2.95 లక్షలు విలువచేసే బంగారం, రూ.30వేలను స్వాధీనం చేసుకున్నారు. మూడు సార్లు రెక్కీ కావలి పట్టణం తుఫాన్నగర్కు చెందిన బాలకృష్ణయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు కుమారులకు ఆయన గతంలో సమానంగా ఆస్తి పంచాడు. అయితే తనకు సరిగా పంచలేదని లక్ష్మీనారాయణ తండ్రితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను అడ్డుతొలగించుకుంటే వారి పేర ఉన్న ఆస్తి తనకు దక్కుతుందని లక్ష్మీనారాయణ భావించాడు. తన స్నేహితుడైన కావలికి చెందిన సుబ్బారావుకు విషయం తెలిపాడు. అతడి ద్వారా పాతనేరస్తుడు షేక్ షఫీ ఉల్లాను సంప్రదించాడు. తండ్రిని హత్య చేస్తే రూ.3 లక్షలు, తల్లిదండ్రులిద్దరినీ చంపితే రూ.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో షఫీఉల్లా గతంలో జైల్లో ఉన్న సమయంలో పరిచయమైన గౌస్ బాషా, షేక్ షాహుల్తో కలిసి కిరాయి హత్యకు పథకం రచించారు. లక్ష్మీనారాయణ నిందితులకు అడ్వాన్స్ కింద రూ.30 వేలు, కత్తులను ఇచ్చాడు. నిందితులు మూడుసార్లు బాలకృష్ణయ్య ఇంటివద్ద రెక్కీ నిర్వహించారు. అదును కోసం వేచి చూస్తున్నామని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ విషయం పోలీసుల ద్వారా తెలుసుకున్న బాలకృష్ణయ్య శుక్రవారం రాత్రి కావలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీనారాయణ, పి.సుబ్బారావు, షేక్ షఫీ ఉల్లాను శనివారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: భార్యను హత్య చేసి.. ఆపై చెరువులో పడేసి.. -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్ దారుణ హత్య
సూళ్లూరుపేట(నెల్లూరు జిల్లా): సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ తాళ్లూరు వెంకటసురేష్ (49) సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. కారును పార్క్ చేయడానికి వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కత్తులతో పాశవికంగా పొడిచి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూళ్లూరుపేట మునిసిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కౌన్సిలర్ అయిన వెంకటసురేష్ సోమవారం తన పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం సూళ్లూరుపేట చేరుకున్నారు. కుటుంబ సభ్యులను బ్రాహ్మణ వీధిలోని ఇంటివద్ద దింపిన వెంకటసురేష్ కారును పార్కింగ్ చేయడానికి పొట్టి శ్రీరాములు వీధిలోని పార్కింగ్ స్థలానికి వెళ్లారు. అక్కడ నుంచి ఎంతసేపటికీ ఆయన తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అతని కుమారుడు ధీరజ్ పార్కింగ్ స్థలానికి వెళ్లి చూడగా.. ఒళ్లంతా కత్తిపోట్లతో కారు డ్రైవింగ్ సీటులో రక్తపు మడుగులో వెంకటసురేష్ పడి ఉన్నాడు. కారు హ్యాండ్ గేర్ వంకర్లు తిరిగిపోయి ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై ఉమాశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు వెంకటసురేష్ శరీరంపై కిడ్నీలు, లివర్ ఉన్నచోటే అతి పాశవికంగా పొడిచినట్టుగా గుర్తించారు. వెంకటసురేష్కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. వెంకట సురేష్కు సౌమ్యుడిగా పేరుంది. ఆయనకు ఎవరితోనూ వివాదాలు గాని, రాజకీయ విభేదాలు గాని లేవని చెబుతున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు అతడిని హత్యచేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం ఐరాల(చిత్తూరు జిల్లా): మండలంలోని వేదగిరివారిపల్లె పంచాయతీకి చెందిన గూబలవారిపల్లెలోని అటవీ ప్రాంతంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కె.చంద్రశేఖర్పై హత్యాయత్నం జరిగింది. పాతకక్షల కారణంగా టీడీపీకి చెందిన అరుణ్నాయుడు, వేదగిరివారిపల్లె సర్పంచ్ రాజేంద్ర ఆదివారం సాయంత్రం నుంచి తనపై దాడి చేసేందుకు కాపు కాశారని బాధితుడు తెలిపారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి బైక్పై వెళ్తున్న తనపై కారంపొడి చల్లి ఇనుపరాడ్లతో దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని వాపోయారు. ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకోవడంతో టీడీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. -
విజిలెన్స్ దాడి: భారీ ఎత్తున రెమిడిసివర్ ఇంజక్షన్లు..
నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిధిలోని పొగతోటలో రెమిడిసివర్ ఇంజక్షన్లను బ్లాక్లో అమ్ముతున్న ముఠాను విజిలెన్స్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఒక హాస్పిటల్కు అనుబంధంగా ఉన్న ల్యాబ్ కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. వీరిని ఎలాగైనా పట్టుకోవాలని భావించిన అధికారులు సోషల్ మీడియా వేదికగా ఇంజక్షన్ కావాలని అడ్వర్టెజ్ మెంట్ ఇచ్చారు. అయితే దీనికి సదరు ముఠా స్పందించింది. ఆ ముఠా సదరు వ్యక్తికి, ఒక్కొక్క ఇంజక్షన్ను రూ. 25 వేల చోప్పున.. మూడు బాక్సులకు నాలుగున్నర లక్షలకు అమ్మేలా డీల్ కుదుర్చుకుంది. అయితే, అప్పటికే ఈ విషయం తెలిసి మాటువేసి ఉన్న విజిలెన్స్ అధికారులు వారిపై దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో భారీ మొత్తంలో రెమిడిసివర్ ఇంజక్షన్ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు దుర్మరణం
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని పెళ్లకూరు మండలం నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారిపై తల్వాయిపాడువద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్నా కారు ఢీకొనడంతో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న టిప్పర్ వైపు దూసుకెళ్లింది. అప్పటికే వేగంగా వస్తున్న టిప్పర్ ఆటోను ఢీకొనింది. దీంతో ఆటో ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం మోదుగుల పాలెం గ్రామానికి చెందిన కూలీలు ప్రతిరోజూ నాయుడుపేటకు వచ్చి లారీ కాటా పనులు జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్వగ్రామం నుంచి నాయుడుపేటకు పనుల నిమిత్తం ఆటోలో వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ధీంతో ఆటో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న టిప్పర్ వైపు దూసుకెళ్లింది. అప్పటికే వేగంగా ఉన్న టిప్పర్ ఆటోను ఢీకోనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న అప్పాడి రమేష్ (39), వెంకటేశ్వర్లు (28) అక్కడికక్కడే మృతి చెందారు. ఇక గురవయ్య, మునుస్వామి, గురునాధం,చెంగయ్య ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల నిమ్మిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు -
వేధింపులకు తాళలేక టిక్టాక్ స్టార్ ఆత్మహత్య
నెల్లూరు: టిక్టాక్లో స్టార్గా ఉన్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఓ అమ్మాయి విషయంలో జరిగిన సంఘటనలే అతడి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రంగనాయకుపేటకు చెందిన షేక్ రఫీ టిక్టాక్ స్టార్గా గుర్తింపు పొందాడు. రోజూ టిక్టాక్లో వీడియోలు అప్లోడ్ చేసి నెటిజన్లు.. ఫాలోవర్లను ఆకట్టుకునేవాడు. అయితే అతడి స్నేహితుడితో జరిగిన వివాదంలో మనస్ఫార్థానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరులో కెమెరామెన్గా పని చేస్తున్న రఫీ టిక్టాక్ వీడియోలు కూడా చేస్తూండేవాడు. అయితే అతడి స్నేహితుడు ముస్తఫా ప్రేయసి రఫీతో చనువుగా ఉండేది. రఫీతో ప్రేమగా ఉండటం.. సన్నిహితంగా ఉండటంతో తట్టుకోలేకపోయాడు. ఈ విషయమై ముస్తాఫా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రఫీపై దాడి చేయించాడు. ప్రణాళిక ప్రకారం స్నేహితులతో రఫీపై దాడి చేయించాడు. తీవ్ర గాయాల పాలైన రఫీని తండ్రి రియాజ్ ఆస్పత్రిలో చేర్పించాడు. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంలో రఫీపై వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ సమయంలో ఆ వేధింపులు తట్టుకోలేక జనవరి 22వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన రఫీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయమై తండ్రి రియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేధింపుల కారణంగా తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. దీనిక కారణమైన ముస్తాఫాపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
దారణం: హత్యకు దారితీసిన యువకుల గొడవ
సాక్షి, నెల్లూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్ల కుక్కలగుంట కూరగాయల మార్కెట్ వద్ద ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. కరివేపాకు వ్యాపారం చేసుకొని జీవించే సాయి అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన దయానంద్తో చిన్నపాటి వివాదం తలెత్తింది. గొడవ మరింత ముదరడంతో దయానంద్ ఆవేశంతో సాయిపై కత్తితో దాడి చేశాడు. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్లానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
అప్పన్న బంగారం కేసులో కీలక మలుపు
సాక్షి, నెల్లూరు: అప్పన్న బంగారం పేరిట మహిళను మోసగించిన ఘటనలో ప్రధాన నిందితురాలు కె.హైమావతి పోలీసు కస్టడీ సోమవారంతో ముగిసింది. పోలీసులు ఆమె వద్ద నుంచి రూ.30 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీసీఎస్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్సైదా కేసు పూర్వాపరాలను వెల్లడించారు. విశాఖపట్నం పెందుర్తి ప్రాంతానికి చెందిన కె.హైమావతి అలియాస్ డెక్క హైమావతి సింహాచలంలో అల్లిక దారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. సూళ్లూరుపేటకు చెందిన ఎం.శ్రావణితో పరిచయం ఏర్పడింది. ఆలయంలో బంగారం వేలం వేస్తున్నారంటూ మాయమాటలు చెప్పి హైమావతి ఆమెను నమ్మించి రూ. 38 లక్షలు ఖాతాలో జమ చేయించుకుంది. శ్రావణి బిల్లులు కోరగా నిందితురాలు సింహాచలం ఆలయ ఈవో ఫోర్జరీ సంతకాలతో బిల్లులను పంపింది. నగదు తీసుకున్న నిందితురాలు బంగారం ఇవ్వకుండా ఆమెను మోసగించడంతో బాధితురాలు సూళ్లూరుపేట పోలీసులకు, సింహాచలం ఆలయ అధికారులకు ఈ–మెయిల్ ద్వారానూ ఫిర్యాదు చేసింది. మెయిల్లో పంపిన బిల్లులు నకిలీవని ఆలయ అధికారులు గుర్తించి గోపాలపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోలీసులు నిందితురాలితో పాటు మరో ఇద్దరిని ఇటీవల అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితురాలు విశాఖపట్నం జైలులో ఉంది. నగదు స్వాధీనం : పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. హైమావతిని పిటీ వారెంట్పై నెల్లూరుకు తీసుకువచ్చారు. సూళ్లూరుపేట కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఆమె వద్ద నుంచి రూ.11.35 లక్షల నగదు, 280 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచినట్లు ఇన్స్పెక్టర్ బాజీజాన్సైదా తెలిపారు. -
తల్లీకూతుళ్ల హత్యకేసులో ఇంతియాజ్కు ఉరిశిక్ష
-
నెల్లూరు కోర్టు సంచలన తీర్పు
సాక్షి, నెల్లూరు: డబుల్ మర్డర్ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2013లో జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసులో న్యాయస్థానం గురువారం తీర్పును వెల్లడించింది. నిందితుడు షేక్ ఇంతియాజ్కు ఉరిశిక్ష విధిస్తూ ఎనిమిదో అదనపు న్యాయమూర్తి సత్యనారాయణ తీర్పునిచ్చారు. కాగా హరినాథపురం 4వ వీధికి చెందిన దినకర్ రెడ్డి భార్య శకుంతలతో పాటు మెడిసిన్ చదువుతున్న కుమార్తె భార్గవిని ముగ్గురు దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే నగరంలోని వాగ్దేవి డి-ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్ దినకర్ రెడ్డి, స్థానిక హరనాథపురంలో భార్య, కుమార్తెతో నివాసం ఉండేవారు. ఆయన కుమార్తె భార్గవి ఎంబీబీఎస్ చదువుతోంది. 2013 ఫిబ్రవరి 12న దినకర్రెడ్డి నూతన గృహానికి సంబంధించిన ప్లాన్ ఇచ్చేందుకు వచ్చిన ముగ్గురు..శకుంతల, భార్గవిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర రక్తగాయాలైన తల్లీకూతురు కిందపడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. -
మితిమీరిన వేగం: ఒకరి దుర్మరణం
సాక్షి, నెల్లూరు : మితిమీరిన వేగంతో వస్తున్న ఓ కారు బైక్ను ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన నగరంలోని ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని బీవీనగర్కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి జనార్దన్ (65), అయన బావమరిది నాగరాజు తమ కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా సంక్రాంతి పండగను జరుపుకున్నారు. ఇద్దరూ కలసి బైక్లో ఎన్టీఆర్ నగర్కు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో కావలి వైపు నుంచి మితిమీరిన వేగంతో వస్తున్న ఓ కారు వీరి బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై నుంచి జనార్దన్ రోడ్డుపై పడ్డాడు. కారు అతని కాలుపై ఎక్కి సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి పోయింది. జనార్దన్ ఎడమకాలు మోకాలి వరకు తెగి రోడ్డుపై పడింది. అతని తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజు రోడ్డుపై పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఐ.ఆంజనేయరెడ్డి, ఎస్సై శంకరరావు ఘటనా స్థలాన్నిపరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం జనార్దన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లిన ప్రమాదానికి కారణమైన కారు ఆత్మకూరు: అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనానికి బైక్లో వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని మురగళ్లలో బుధవారం రాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు.. బండారుపల్లి గ్రామానికి చెందిన గడ్డం ప్రసాద్, వెంకటప్రతాప్ ఆత్మకూరు పట్టణంలోని కాశీనాయన ఆశ్రమంలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో మకరజ్యోతి దర్శనానికి బైక్లో నీటి పారుదల కాలువ కట్ట రోడ్డుపై బయలుదేరారు. మురగళ్ల సమీపంలో మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ వేగంగా ఎదురుగా వస్తూ వీరిని ఢీకొన్నాడు. ఈ ఘటనలో బైక్పై ఉన్న ప్రసాద్, ప్రతాప్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వీరి వెనకే వస్తున్న మరి కొందరు యువకులు గుర్తించి ఆటోలో ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వారు ఆటోను అడ్డుకుని తమ కారుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యువకులు సర్దుబాటు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సైతం కారులోని వారికే మద్దతుగా వ్యవహరించారని బాధితులు వాపోయారు. -
రొయ్యల మేత లారీ అపహరణ
నెల్లూరు (క్రైమ్): రొయ్యల మేతలోడ్తో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటనపై బాధిత లారీ యజమాని డయల్ 100కు ఫోన్ చేయడంతో బాలాజీనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలోనే లారీని స్వాదీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సేకరించిన సమాచారం మేరకు.. ఎన్టీఆర్ నగర్ నాల్గో బిట్లో ఎ.మల్లికార్జున్రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయనకు ఐదు లారీలు ఉన్నాయి. వాటిని అద్దెకు తిప్పుతున్నారు. అతని వద్ద సరస్వతీనగర్కు చెందిన జి.వెంకటేశ్వర్లు (అల్లుడు) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న వెంకటేశ్వర్లు బియ్యం లోడ్ను తీసుకుని చెన్నైకు వెళ్లాడు. అక్కడ 13వ తేదీన నెల్లూరు రామ్మూర్తినగర్లోని నర్మదా ఎంటర్ప్రైజస్కు చెందిన రొయ్యల మేతను లారీలో లోడ్ చేయించుకుని నెల్లూరుకు బయలుదేరాడు. రాత్రి 9.30 గంటలకు నెల్లూరుకు చేరుకున్నాడు. ఆ సమయలో కూలీలు లేకపోవడంతో లారీని ఎన్టీఆర్నగర్లోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద పార్క్ చేసి లారీలోనే పడుకుని ఉదయం కూలీలు వచ్చిన అనంతరం అన్లోడ్ చేయించాలని అతని మామ మల్లికార్జునరెడ్డి సూచించాడు. అయితే వెంకటేశ్వర్లు లారీలో కొద్ది సేపు పడుకుని, లారీ తాళాలను క్యాబిన్లో పెట్టి డోర్కు తాళం వేసుకుని ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం కళాశాల వద్దకు వచ్చి చూడగా లారీ కనిపించలేదు. దీంతో వెంకటేశ్వర్లు తన మామకు చెప్పాడు. డయల్ 100కు ఫిర్యాదు.. గంటల వ్యవధిలో లారీ పట్టివేత లారీ చోరీ ఘటనపై బాధితుడు మల్లికార్జునరెడ్డి శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఘటనా స్థలం నుంచే డయల్ 100కు ఫిర్యాదు చేశారు. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య జిల్లా వ్యాప్తంగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందం కావలి వైపు టోల్ప్లాజా, మరో బృందం గూడూరు బూదనం టోల్ప్లాజాలను పరిశీలించారు. చోరీకి గురైన లారీ బూదనం టోల్ ప్లాజాను క్రాస్ చేసి వెళ్లినట్లు సోమయ్య గుర్తించి లారీ ఆచూకీని కనుగొన్నారు. పోలీసు వాహనం లారీని సమీపిస్తున్న విషయాన్ని గమనించిన దుండగుడు లారీని ఆపి దూకి పరుగులు తీశాడు. పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. లారీని స్వాదీనం చేసుకుని, నిందితుడితో పాటు బాలాజీనగర్ స్టేషన్కు తరలించారు. నగర ఇన్చార్జి డీఎస్పీ పి. శ్రీధర్ బాలాజీనగర్ పోలీసుస్టేషన్కు చేరుకుని లోతుగా విచారిస్తున్నారు. రొయ్యల ఫీడ్ విలువ రూ.43 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన రెండు గంటల వ్యవధిలోనే లారీని, అందులోని రొయ్యల ఫీడ్ను స్వాదీనం చేసుకున్న బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య, ఎస్సైలు పవన్కుమార్, వీరప్రతాప్ తదితరులను ఎస్పీ భాస్కర్భూషణ్ అభినందించినట్లు సమాచారం. -
హత్య చేసి.. గోనె సంచిలో పెట్టి
సాక్షి, కోవూరు(నెల్లూరు): మండలంలోని పడుగుపాడు జాతీయ రహదారి సమీపంలో ఉన్న జిమ్మిపాళెం రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి పడవేశారు. దీంతో కోవూరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పోలీసుల కథనం మేరకు.. జమ్మిపాళెం రోడ్డుపక్కనే ఉన్న పంటకాలువలో గోనెసంచి అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కృష్ణారెడ్డిలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంచిని బయటకు తీయించగా అందులో మహిళ మృతదేహం ఉంది. మహిళ నైటీ ధరించి తీవ్రగాయాలతో ఉంది. హత్య చేసి సంచిలో ఉంచి బూట్ల లేస్లతో కట్టి కాలువలో పడవేశారు. మహిళ హత్యకు గురైందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె వయస్సు 30 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పోలీస్ జాగిలాలు పరిసర ప్రాంతాల్లో తిరిగాయి. హత్య జరిగి మూడురోజులై ఉంటుందని, మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని పోలీసులు తెలిపారు. స్థానికులను విచారించారు. వారినుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో బయటి ప్రాంతంలో హత్య చేసి వాహనంలో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
షార్ట్ ఫిల్మ్లలో అవకాశమంటూ.. వ్యభిచారంలోకి
సాక్షి, నెల్లూరు : షార్ట్ ఫిల్మ్లలో అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెబుతూ నగరంలోని మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న జాకీర్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఒక బాలిక ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, పోలీసులు వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి ఎనిమిది మంది యువతులను పట్టుకున్నారు. అనంతరం యువతులను రెస్క్యూ హోమ్కు తరలించారు. నిందితుడు జాకీర్ను విచారించగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అతనిపై పలు కేసులున్నట్టు తేలింది. -
ఆధిపత్యం కోసమే హత్య
నెల్లూరు, వెంకటాచలం: పనిచేసే చోట సొంత తమ్ముడి కంటే బయటి వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని ఓ వ్యక్తి కక్ష పెంచుకున్నాడు. ఈక్రమంలో ఆధిపత్యం కోసం మరో వ్యక్తితో కలిసి హత్య చేశాడు. ఈ కేసును వెంకటాచలం పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మంళవారం వెంకటాచలం పోలీసుస్టేషన్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లూరు నగరంలోని కొరడావీధికి చెందిన షేక్ సుభానీ (35) అనే వ్యక్తి షేక్ జమీర్ బంగారు నగల దుకాణంలో పనిచేస్తున్నాడు. అక్కడ సుభానీతోపాటు జమీర్ సోదరుడు షేక్ షామీర్, షేక్ మీరామొహిద్దీన్ పనిచేస్తున్నారు. సుభానీ పనితీరు బాగా నచ్చడంతో యజమాని జమీర్ ఎక్కువగా అతడినే నమ్మేవాడు. జమీర్ తాను బయటికి వెళ్లేప్పుడు బంగారు నగలు దాచే లాకర్ తాళాలు, ఇతర వ్యవహారాలు సుభానికే అప్పజెప్పేవాడు. దీంతో షామీర్ సుభానీపై కక్ష పెంచుకుని ఎలాగైనా అతడి అడ్డుతొలగించాలని మీరామొహిద్దీన్తో కలిసి కుట్ర పన్నాడు. ఈనెల 7వ తేదీన షామీర్, మీరామొహిద్దీన్ కలిసి సుభానీని కసుమూరు దర్గాకు వెళదామని నమ్మబలికి తీసుకెళ్లారు. వెంకటాచలం దాటిన తర్వాత చాకిరేవుమడుగు వద్దకు తీసుకెళ్లి వారి వెంట తీసుకువచ్చిన పొదునైన కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గొంతుకోసి హత్య చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతని వద్దనున్న దుకాణం లాకర్ తాళాన్ని తీసుకుని చాకిరేవుమడుగులో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఈనెల 12వ తేదీన చాకిరేవుమడుగులో కుళ్లిన మృతదేహం ఉందని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంకటాచలం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి గుర్తుతెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేశారు. ఇలా బయటపడింది హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈనెల 16వ తేదీన జమీర్ బంగారు నగల దుకాణంలో షామీర్, మీరామొహిద్దీన్ కలిసి లాకర్ తాళాలు తీసి 300 గ్రాముల బంగారు నగల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయం సీసీ టీవీ ఫుటేజీలో బయటపడింది. దీంతో జమీర్ వారిద్దరిపై నిఘా పెట్టాడు. ఈక్రమంలో గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వారి నుంచి చోరీ చేసిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నాడు. కాగా 7వ తేదీ నుంచి సుభానీ కనిపించకపోవడంతో వీరికి అసలు విషయం తెలిసి ఉండొచ్చని జమీర్ భావించాడు. సుభానీ విషయంలో నిజాలను పోలీసులకు చెపాల్పని వారికి చెప్పగా అక్కడినుంచి పరారయ్యారు. దీంతో జమీర్ అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం షామీర్, మీరామొహిద్దీలను రూరల్ సీఐ కె.రామకృష్ణ తనసిబ్బందితో నిఘా ఉంచి నెల్లూరులోని జిల్లా కోర్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారే హత్య చేసినట్లుగా తేలింది. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. హత్యకేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్సై కరిముల్లా పాల్గొన్నారు. -
వృద్ధురాలి కళ్లలో కారం చల్లి..
నెల్లూరు, నాయుడుపేటటౌన్: ఓ యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లలో కారం చల్లి ఆమె ఒంటిపై ఉన్న సుమారు పది సవర్ల బంగారు నగలు అపహరించి పరరాయ్యాడు. ఈ సంఘటన నాయుడుపేటలో మంళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా మిద్దెపై విశ్రాంతి ఉపాధ్యాయురాలు చతురవేదుల విశాలక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ విషయాన్ని పసిగట్టిన గుర్తుతెలియని యువకుడు మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె ఇంట్లోకి చొరబడి కళ్లలో కారం చల్లాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న మూడు బంగారు చైన్లను లాక్కొని పరారయ్యాడు. వృద్ధురాలు పెద్దఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకునేసరికి దుండగుడు రైల్వే స్టేషన్ రహదారి వైపు ఉడాయించాడు. సమాచారం అందుకున్న ఎస్సై డి.వెంకటేశ్వరరావు వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడాడు. నిందితుడి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రహదారిపై ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా పరారైన నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఘటన జరిగిన తర్వాత పోలీసు సిబ్బంది, స్థానిక యువకులు పెద్దఎత్తున నిందితుడి కోసం జల్లెడ పట్టారు. ఓ మద్యం షాపు వద్ద నిందితుడు ఉండగా పట్టుకున్నారు. అతనితోపాటు మరో వ్యక్తి ఈ చోరీలో పాలుపంచుకున్నట్లుగా సమాచారం. -
డబ్బు కోసం స్నేహితులే కడతేర్చారు
సాక్షి, మనుబోలు (నెల్లూరు): మనుబోలు మండలం జట్ల కొండూరు సమీపంలో గతనెల 19వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం అతని స్నేహితులే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడ్డ ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో గూడూరు డీఎస్పీ బీఎస్బీ హర్ష విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హత్య పూర్వాపరాలను వెల్లడించారు. హత్యకు గురైన వాకాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన మల్లి గురుప్రసాద్ రెండేళ్ల నుంచి అపాచీ కంపెనీలో పనిచేస్తూ సూళ్లూరుపేటలో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. అతను అంతకుముందు కొంతకాలం గూడూరు నిమ్మ మార్కెట్లో హమాలీగా పనిచేశాడు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న గూడూరుకు చెందిన మల్లి చెంచయ్య, ఉప్పలపాటి గురుప్రసాద్ స్నేహితులయ్యారు. ఎలా వ్యాప్తి చెందిందో తెలియదుగాని అపాచీలో పనిచేస్తున్న గురుప్రసాద్కు రూ.కోటి దొరికినట్లుగా పుకారు వచ్చింది. ఈ విషయం పూర్వాశ్రమంలో తన స్నేహితులైన గూడూరుకు చెందిన చెంచయ్య, గురుప్రసాద్ చెవిన పడింది. దీంతో ఆ పుకారును నమ్మిన గురుప్రసాద్, చెంచయ్య వారి స్నేహితుడైన రౌడీ షీటర్ వేముల కనకారావు అలియాస్ రాజా సాయంతో గురుప్రసాద్కు దొరికిందనుకుంటున్న సొమ్మును కాజేసేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో సూళ్లూరుపేటలో ఉంటున్న మల్లి గురుప్రసాద్ వద్దకు వెళ్లి అమ్మాయిల వద్దకు పోదాం అని అతడ్ని టాటా ఏస్ వాహనంలో ఎక్కించుకుని వరగలి క్రాస్రోడ్డు సమీపంలోని పోటుపాళెం రోడ్డు వద్దకు తీసుకెళ్లి దొరికిన రూ.కోటి సొమ్మును ఇవ్వాలంటూ జాకీ రాడ్తో కొట్టారు. తనకు డబ్బు దొరకలేదని తనని వదిలేయాలని ఎంత వేడుకున్నా వినకుండా అక్కడ నుంచి తీసుకొచ్చి మనుబోలు మండలం జట్ల కొండూరుకు వెళ్లే రోడ్డు వద్ద మళ్లీ కొట్టారు. చొక్కా చించి మెడకు చుట్టి నీటి గుంతలో తలను ముంచి తొక్కడంతో పూపిరాడక మల్లి గురుప్రసాద్ మృతిచెందాడు. రౌడీ షీటర్ కనకారావు కాల్డేటా ఆధారంగా అతడ్ని శుక్రవారం గూడూరు రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని స్నేహితులు ఉప్పలపాటి గురుప్రసాద్, చెంచయ్యను తిప్పవరప్పాడు క్రాస్రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన పోలీసులకు డీఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. సమావేశంలో గూడూరు రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి, మనుబోలు, చిల్లకూరు ఎస్సైలు సూర్యప్రకాష్రెడ్డి, హుస్సేన్బాషా, హెసీలు శ్రీనివాసులు, ఆది నారాయణ, మాధవరావు, అశోక్ పాల్గొన్నారు. -
మంత్రం చెప్పి.. చైన్ మాయం చేశాడు
సాక్షి, సంగం(నెల్లూరు): ఆ వృద్ధురాలు చిన్నపాటి అంగడి పెట్టుకుని తినుబండారాలు విక్రయిస్తోంది. గుర్తుతెలియని యువకుడు ఆమె వద్దకు వెళ్లి వ్యాపారం బాగా జరిగేందుకు మంత్రం వేస్తానని బంగారు చైన్ తీసుకున్నాడు. మంత్రం చదివి చైన్ మాయం చేశాడు. చైన్ అపహరించాడని గుర్తించిన వృద్ధురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మండల కేంద్రమైన సంగంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెసల భాగ్యమ్మ అనే వృద్ధురాలు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణం సమీపంలో అంగడి పెట్టుకుని తినుబండారాలు విక్రయిస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆమె వద్దకు గుర్తుతెలియని యువకుడు వెళ్లాడు. దక్షిణ ఇస్తే జరగబోయేది చెబుతానని ఆమెను నమ్మించాడు. వ్యాపారం బాగా జరగాలంటే మెడలో ఉన్న చైన్ తీసి తనకు ఇస్తే మంత్రించి తమలపాకుల్లో పెట్టి పసుపు, కుంకుమ రాసి డబ్బాలో వేస్తానని భాగ్యమ్మతో అన్నాడు. ఆమె నిజమని నమ్మి తన రెండు సవర్ల బంగారు చైన్ తీసి ఆ యువకుడికి ఇచ్చింది. అతను తమలపాకులో పెట్టినట్లుగా చూపించి చైన్ మాయం చేశాడు. మంత్రాలు చదివి తమలపాకు, పసుపు, కుంకుమ ఓ డబ్బాలో పెట్టి భాగ్యమ్మకు ఇచ్చి పరారయ్యాడు. యువకుడు వెళ్లిన పది నిమిషాలకు భాగ్యమ్మ డబ్బా తెరిచి చూడగా అందులో చైన్ కనిపించలేదు. తమలపాకు, పసుపు, కుంకుమ మాత్రమే ఉన్నాయి. దీంతో వెంటనే సంగం పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : రాజులు వేసుకున్న ఆభరణాలని చెప్పి.. -
పెట్రేగుతున్న దొంగలు
పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా గస్తీకాస్తున్నారు. కార్డన్ సర్చ్ పేరుతో జల్లెడ పడుతున్నారు. అయినా జిల్లాలో దొంగలు పేట్రేగిపోతున్నారు. ఒక చోరీ కేసు దర్యాప్తులో ఉండగానే.. ఇంకో ప్రాంతంలో దొంగతనం జరుగుతోంది. ఎంత నిఘా పెడుతున్నా వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విరుసుతున్నారు. సమయంతో నిమిత్తం లేకుండా అందినకాడికి దోచుకెళుతున్నారు. దీంతోప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నెల్లూరు నగరం వేదాయపాళెంలోని ఓ మొబైల్ షోరూంలో చోరీ జరగడం కలకలం రేపింది. సాక్షి, నెల్లూరు: జిల్లాలో 22 సర్కిల్స్ పరిధిలో 64 పోలీసుస్టేషన్లున్నాయి. నెల్లూరు నగరంలో ఆరు పోలీసుస్టేషన్లు, క్రైమ్ స్టేషన్ ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా స్టేషన్ల పరిధిలో నిఘా వ్యవస్థ పెరిగింది. పగలు, రాత్రి అనే తేడాలేకుండా సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పాతనేరస్తులు, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా పెంచారు. ప్రతిరోజూ రాత్రి ఆయా స్టేషన్ల పరిధిలో పాతనేరస్తులు, రౌడీషీటర్లను సిబ్బంది నేరుగా కలుసుకుని వారి వివరాలను ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి నేరస్తు ఆట కట్టిస్తున్నారు. అంతేకాకుండా అనేక చోరీ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి పెద్దఎత్తున చోరీసొత్తును రాబడుతున్నారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేసి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వరుసగా జరుగుతున్న చోరీలపై పోలీసుశాఖ ఇంకా అప్రమత్తం కావాలన్న సూచన సర్వత్రా వినిపిస్తోంది. సవాల్ విసురుతున్న చోరులు పోలీసు చర్యలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి అనుకుంటుండగానే వరుస చోరీలతో దొంగలు పేట్రేగిపోతున్నారు. యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసరుతున్నారు. తాళం వేసిన ఇళ్లలో దొంగతనం చేయడమే కాదు.. ఇళ్లలో ఉన్నవారిని, రహదారులపై వెళుతున్న వారిని సైతం బెదిరించి దోపిడీలకు పాల్పడుతూ అందినకాడికి దోచేస్తున్నారు. ప్రయాణికుల ముసుగులో దొంగతనాలకు పాల్పడుతున్నారు. సహకారం తప్పనిసరి ఇళ్లు విడిచి ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎల్హెచ్ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్) సేవలను వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఇళ్లలో విలువైన ఆభరణాలు, నగదు ఉంచరాదు. వాటిని బంధువుల వద్దనో బ్యాంకు లాకర్లలోనో భద్రపరచాలి. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తులు తారసపడితే వెంటనే సమీప పోలీసుస్టేషన్కు సమాచారం అందించాలి. సెల్ఫోన్ల చోరీలు పెరిగాయ్ జిల్లాలో సెల్ఫోన్ల చోరీలు పెరిగాయి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, సినిమా హాళ్లలో ఎవరైనా ఆదమరిచి ఉంటే చాలు.. చోరులు క్షణాల్లో వారి ఫోన్లను తస్కరించి మాయమవుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దొంగలించిన ఫోన్లను ఇతర ప్రాంతాల్లో అమ్మివేయడమో లేక సిమ్ మార్చివేసి వినియోగించడమో చేస్తున్నారు. కొన్ని ఘటనలు.. ► ఈ ఏడాది మేలో సైదాపురంలో ఓ మహిళ కంట్లో కారంపొడి చల్లి 12 సవర్ల బంగారు నగలు దోచుకెళ్లారు. ► జూన్లో వెంకటాచలం అటవీ ప్రాంతంలో మధు అనే వ్యక్తిని కత్తులతో బెదిరించి రూ.18 వేలు నగదు దోచుకెళ్లారు. ► జూలైలో ఇందుకూరుపేట మండలం మైపాడులో ఓ ఇంట్లో దొంగలు పడి రూ.10 లక్షల నగదు, రూ.3 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు. ► వెంకటాచలం మండలం కాకుటూరు శివాలయంలో దొంగలు పడి రూ 2.07 లక్షలు విలువచేసే సొత్తు అపహరించారు. ► నగరంలోని బాలాజీనగర్లో ఓ ఇంట్లో దొంగలు పడి 33 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ► నెల్లూరు రవీంద్రనగర్లోని ఓ ఇంట్లో దొంగలు పడి ఏడు సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ► ఇందుకూరుపేట మండలం కొత్తూరులో ఓ ఇంట్లో దొంగలు పడి ఎనిమిది సవర్ల బంగారు నగలు చోరీ చేశారు. ► కోవూరు శాంతినగర్లో ఓ ఇంట్లో దొంగలు పడి రూ.లక్ష నగదు, 10 సవర్ల బంగారు ఆభరణాలు దొంగతనం చేశారు. ► వేదాయపాళెం పోలీసుస్టేషన్ పరిధిలో రెండురోజుల్లో నాలుగుచోట్ల 32 సవర్ల బంగారు గొలుసులు అపహరించుకుపోయారు. ► జీజీహెచ్లో వైద్యం కోసం వచ్చిన ఓ వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి 8.5 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ► తాజాగా పొదలకూరు మండలం పార్లపల్లిలో భారతి అనే మహిళను చంపుతామని బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న ఏడుసవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. -
భార్య.. భర్త, ఓ స్నేహితుడు..
సాక్షి, కావలి (నెల్లూరు): భార్య..భర్త.. ఓ స్నేహితుడు దారి దోపిడీ దొంగలుగా మారి దోపిడీకి పాల్పడ్డారు. తమకు సన్నిహిత పరిచయం ఉన్న ఓ ఆర్ఎంపీ ని దోచుకున్న ఈ ముగ్గురి ముఠాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ డి.ప్రసాద్ విలేకరుల సమావేశంలో వివరాలు వివరించారు. పట్టణంలోని వెంగళరావునగర్కు చెందిన కందుల రాజేష్, పర్వీన్ భార్యాభర్తలు. ఆ ప్రాంతంలో ఆర్ఎంపీగా ఉన్న తాళ్లపాళెం రాఘవేంద్రరావుతో పర్వీన్ పరిచయం ఏర్పడింది. సన్నిహితంగా ఉంటుండేది. ఆర్ఎంపీ ఒంటిపై ధరించిన బంగారు నగలపై పర్వీన్ కన్నుపడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మనం గట్టెక్కడానికి ఆర్ఎంపీ ధరించిన బంగారాన్ని ఎలాగైనా కొట్టేయాలని ఆమె భర్తకు చెప్పింది. దీంతో దంపతులతో పాటు రామ్మూర్తిపేటలో నివాసం ఉండే వారి స్నేహితుడు కనమర్లపూడి సాయికుమార్తో కలిసి స్కెచ్ వేశారు. అందులో భాగంగా పర్వీన్ గత నెల 8న పట్టణంలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందని, తన భర్త అందుబాటులో లేడని రాఘవేంద్రరావుకు చెప్పింది. తనను బైక్పై శుభకార్యం వరకు తీసుకెళ్లి, మళ్లీ బైక్పైనే ఇంటికి తీసుకురావాలని పర్వీన్ కోరడంతో రాఘవేంద్రరావు ఆ రోజు రాత్రి 10–11 గంటల సమయంలో శుభకార్యం నుంచి తన బైక్పై పర్వీన్ను ఎక్కించుకొని వెంగళరావునగర్కు వస్తున్నాడు. మార్గమధ్యంలో కచేరిమిట్ట ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి బైక్ను అడ్డగించారు. ఆర్ఎంపీ పై దాడి చేసి చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న బంగారు చైను, రెండు ఉంగరాలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు తాళ్లపాళెం రాఘవేంద్రరావు కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ బీవీవీ సుబ్బారావు, ఎస్సైలు, సిబ్బంది లోతుగా విచారణ జరపడంతో భార్య, భర్త, వారి స్నేహితుడు దోపిడీకి పాల్పడ్డారని గుర్తించారు. నిందితులైన దంపతులు రాజేష్, పర్వీన్, సాయి కుమార్ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దోపిడీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష ఉంటుందని డీఎస్పీ చెప్పారు. -
తమ్ముడిని కడతేర్చిన అన్న
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): ఇల్లు పంపకం విషయంలో సొంత అన్నదమ్ముల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు తమ్ముడి ప్రాణం తీసింది. ఈ ఘటన చేజర్ల మండలంలోని కాకివాయిలో ఆదివారం జరిగింది. స్థానికులు, చేజర్ల ఎస్సై ఎన్.కాంతికుమార్ సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన మస్తానయ్య, చినమస్తానయ్య ఇద్దరూ సోదరులు. వీరికి మరో చెల్లెలు ఉంది. కాలనీ ఇల్లు మంజూరు కావడంతో రెండేళ్ల క్రితం నిర్మించుకున్నారు. అప్పటికే ఓ ఇల్లు ఉండగా కాలనీ ఇల్లు చెల్లెలికి ఇవ్వాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే చిన మస్తానయ్య (40) ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయినా చెల్లెలుకు, తల్లికి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఎలాంటి ఆదరువు లేని చెల్లెలకు కాలనీ ఇల్లు ఇద్దామని చెప్పినా ఒప్పుకోక పోవడంతో గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మరోసారి అన్నదమ్ముల మధ్య ఇంటి విషయమై గొడవ జరిగింది. ఆవేశంలో అన్న మస్తానయ్య తమ్ముడు చినమస్తానయ్యను కర్రతో తలపై కొట్టడంతో తల పగిలి తీవ్రగాయమై అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. వెంటనే నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం తెల్లవారు జామున చెన్నైకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న చేజర్ల ఎస్సై ఎన్ కాంతికుమార్ గ్రామానికి చేరుకుని విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
పసికందు మృతి.. గుట్టు చప్పుడు కాకుండా
సాక్షి, నెల్లూరు: ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. బాధిత తల్లిదండ్రులు అతని కోసం గాలిస్తుండగా తొట్టెలో (ప్లాస్టిక్ డ్రమ్) మృతదేహమై కనిపించాడు. దీంతో వెంటనే అతడిని హాస్పిటల్కు తరలించగా వైద్యులు మృతిచెందాడని నిర్ధారించారు. మంగళ వారం మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లి పూడ్చిపెట్టేం దుకు యత్నించగా బంధువుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని సంతపేటకి చెందిన హుస్సేనీ అలియాస్ వైష్ణవికి నాలుగేళ్ల క్రితం వెంకటగిరి పట్టణం నాగులగుంటపాళేనికి చెందిన విజయకుమార్తో వివాహమైంది. విజయకుమార్ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి రేవంత్కుమార్ (14 నెలలు) కుమారుడు ఉన్నాడు. వినాయకచవితి సందర్భంగా సుమారు 15 రోజుల క్రితం హుస్సేనీ తన కుమారుడితో కలిసి నెల్లూరులోని పుట్టింటికి వచ్చింది. విజయకుమార్ ఈనెల రెండో తేదీన నెల్లూరుకు వచ్చాడు. అందరూ కలిసి పండగ చేసుకున్నారు. మంగళవారం హుస్సేనీ, విజయకుమార్లు వెంకటగిరికి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రేవంత్కుమార్ అదృశ్యమయ్యాడు. బాలుడు కనిపించకపోవడంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల వెతికారు. ఈక్రమంలో ఇంటిపక్కనే ఉన్న నీటితొట్టె (ప్లాస్టిక్ డ్రమ్)లో బాలుడు తేలుతుండగా గుర్తించి వెంటనే కనికల హాస్పిటల్కు తీసుకెళ్లారు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. బాధిత తల్లిదండ్రులు మంగళవారం తెల్లవారుజామున మృతదేహాన్ని వెంకటగిరి నాగులగుంటపల్లికి తీసుకెళ్లారు. అక్కడ పూడ్చిపెట్టేందుకు యత్నించగా రేవంత్కుమార్ మృతి అనుమానాస్పదంగా ఉందని బంధువులు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంకటగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అంత్యక్రియలను అడ్డుకున్నారు. అనంతరం జరిగిన విషయాన్ని సంతపేట పోలీసులకు తెలియజేసి మృతదేహాన్ని నెల్లూరుకు పంపారు. సంతపేట ఎస్సై పి.వీరనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తొట్టిలో పడే అవకాశం తక్కువగా ఉండటం, మృతికి తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటుండటంతో అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. బుధవారం ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై దుర్మరణం
సాక్షి, నెల్లూరు(ఆత్మకూరు) : ఏఎస్సై రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సమ్మెట వెంకటరాజు (56) ఏఎస్సైగా ఆత్మకూరు పోలీసుస్టేషన్లో పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబం గూడూరులో ఉంటోంది. విధుల కోసం ఆత్మకూరులో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి విధులు పూర్తి చేసుకున్నాడు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో గూడూరుకు వెళ్లేందుకు నెల్లూరుపాళెం వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో పామూరుకు అద్దెకు వెళ్లి తిరిగి నెల్లూరుకు వెళుతున్న కారు డ్రైవర్ మోహన్రెడ్డి ఏఎస్సై రాజును ఎక్కించుకున్నాడు. కారు నెల్లూరు – ముంబై రహదారిపై వాశిలి గ్రామ సమీపంలో పంది అడ్డుగా రావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలో బోల్తా పడింది. ఏఎస్సై రాజు తలకు తీవ్ర గాయమై సీట్ల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. నెల్లూరు టౌన్ మూలాపేట ఇరుకళలమ్మ కాలనీకి చెందిన కారు డ్రైవర్ మోహన్రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. 108లో క్షతగాత్రుడిని తొలుత ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు అనంతరం నెల్లూరుకు తరలించారు. రెండునెలల క్రితమే పదోన్నతి మృతుడు ఏఎస్సై ప్రకాశం జిల్లా వాసి. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. కాగా ఇటీవల ఏఎస్సైగా పదోన్నతి పొందాడు. మరో రెండునెలల్లో ఎస్సైగా పదోన్నతి వస్తుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఐ పాపారావు, ఎస్సైలు సంతోష్కుమార్రెడ్డి, రోజాలత, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాజు మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
మత్తులో డ్రైవర్.. స్కూల్ బస్సు బోల్తా
సాక్షి, నెల్లూరు(డక్కిలి) : మండలంలో జరిగిన శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు ప్రమాదానికి డ్రైవర్ మద్యం మత్తే కారణమని పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకటగిరి శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్కు చెందిన బస్సు ఉదయం 7.30 గంటలకు డక్కిలి మండలంలోని కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయిపాళెం గ్రామాలకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని డక్కిలి వైపు వస్తోంది. ఎనిమిది గంటల సమయంలో కుప్పాయిపాళెం దాటిన తర్వాత బస్సు అదుపుతప్పినట్లుగా విద్యార్థులు గుర్తించి కేకలు వేశారు. డ్రైవర్ నవకోటి మద్యం మత్తులో ఉండటం, నిద్రలోకి జారుకోవడంతో బస్సు చెరువు వద్ద గుంతలో బోల్తా పడింది. ఈ సంఘటనలో నర్రావుల వెంకటేష్ (6వ తరగతి), పోకూరు రోహిత్ (6వ తరగతి), వేముల నాని (6వ తరగతి), తంబిశెట్టి యామిని (5వ తరగతి), పెదనేని చంద్రిక (5వ తరగతి), కొక్కనేటి శ్రీనివాస్కుమార్ (9వ తరగతి), వేముల శరణ్య (4వ తరగతి), ఏలేశ్వరం మహేష్ (5వ తరగతి), పత్తిపాటి భానుప్రకాష్ (6వ తరగతి), ఎ.మోహన్ (9వ తరగతి), కుంచెం నిఖిలేస్ (3వ తరగతి), డ్రైవర్ నవకోటిలకు గాయలయ్యాయి. వీరిలో నిఖిలేష్, యామిని, మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో డక్కిలి పోలీసుల స్పందన స్కూల్ బస్సు బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న డక్కిలి ఎస్సై కామినేని గోపి వెంటనే స్పందించి తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. భయాందోళనతో కేకలు వేస్తున్న విద్యార్థులను ఎస్సై, పోలీసు సిబ్బంది స్థానికులు సాయంతో బస్సులో నుంచి బయటకు తీశారు. పోలీసు వ్యాన్లో డక్కిలి పీహెచ్సీకి తరలించారు. అక్కడ విద్యార్థులకు డాక్టర్ సుధీర్కుమార్ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వెంకటగిరిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. గూడూరు ఆర్డీఓ బాపిరెడ్డి, డక్కిలి తహసీల్దార్ మునిలక్ష్మి లు విద్యార్థులను పరామర్శించారు. వైద్యసేవల గురించి ఆరాతీశారు. తహసీల్దార్ కుప్పాయిపాళెం, డీ వడ్డిపల్లి గ్రామాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ వెంకటగిరి సీఐ అన్వర్బాషా ప్రమాదం గురించి తెలుసుకుని ఘటనా స్థలానికి వివరాలు ఆరాతీశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా తెలిపారు. ఈ విషయం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో వెల్లడైందన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 49 శాతం ఆల్కాహాల్ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్ను కూడా నియమించలేదని వాపోయారు. రాత్రంతా నిద్రపోలేదు స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 49 శాతం ఆల్కాహాల్ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్ను కూడా నియమించలేదని వాపోయారు. డ్రైవర్ నిద్రలో ఉన్నాడు : విద్యార్థి కుప్పాయిపాళెం గ్రామం దాటగానే చెరువు వద్ద బస్సు పక్కకు వెళ్లి పోతుండటాన్ని గుర్తించి కేకలు వేశాం. అప్పటికే డ్రైవర్ నిద్రలో ఉన్నాడు. బస్సు అదుపుతప్పి గుంతలో పడిపోగానే మేము గాయపడ్డాం. కేకలు వేయగా చుట్టుపక్కల వారు, పోలీసులు వచ్చి కాపాడారు. -
తొలిబండికి లారీ రూపంలో ప్రమాదం
సాక్షి, వెంకటాచలం(నెల్లూరు) : ఆర్టీసీ బస్సును వెనుకనుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు మృతిచెందగా, మరో పదిమంది గాయపడ్డారు. మండలంలోని చెముడుగుంట పంచాయతీ పవన్కాలనీ వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఈదగాలి గ్రామం నుంచి తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు నెల్లూరుకు బయలుదేరింది. జిల్లా కేంద్రానికి వెళ్లే మొదటి బస్సు కావడంతో కూలి పనులకు వెళ్లేవారు, విద్యార్థులతో కిక్కిరిసింది. ఈక్రమంలో పవన్కాలనీ సమీపానికి చేరుకోగానే వెనుకనుంచి లారీ ఆర్టీసీ బస్సును ఢీకొంది. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో జాతీయ రహదారి నుంచి కిందకు దిగి 50 మీటర్ల దూరం వెళ్లి మురిగుకాలువ వద్ద ఆగిపోయింది. బస్సు వెనుకభాగం పూర్తిగా దెబ్బతినడంతో వెనుక కూర్చున్న బుజబుజనెల్లూరుకు చెందిన మోపూరు శీనయ్య (20), ఈదగాలి గ్రామానికి చెందిన వలిపి చెంచయ్యలు ఇరుక్కుపోయారు. ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ కిందకు దిగేశారు. స్థానికుల సాయం ప్రమాణికుల కేకలు విన్న పవన్కాలనీ వాసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శీనయ్య, చెంచయ్యలను స్థానికులు, ఇతర ప్రయాణికుల కష్టపడి బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది గాయపడగా క్షతగాత్రులను 108 అంబులెన్స్ ఈఎంటీ శ్రీనివాసులు, పైల్ట్ వినయ్లు చికిత్స నిమిత్తం నెల్లూరులోని జీజీహెచ్కు తరలించారు. తీవ్రంగా గాయపడిన మోపూరు శీనయ్య చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈదగాలి గ్రామానికి చెందిన పెంచలయ్య, ఇడిమేపల్లి గ్రామానికి చెందిన పోలమ్మ, విజయమ్మ, పావని, వెంకమ్మ, చిరంజీవి, రమణయ్య, నాగంబోట్లకండ్రిగకు చెందిన చంద్ర, చెంచమ్మలు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై షేక్ కరిముల్లా ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాపం శీనయ్య.. మృతుడు శీనయ్య స్వగ్రామం బుజబుజనెల్లూరు. పెయింట్ పనులు చేస్తుంటాడు. అతను ఈదగాలి గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. నాలుగునెలల కుమారుడు ఉన్నాడు. కాన్పు అనంతరం భార్య ఈదగాలిలో ఉంటోంది. దీంతో శీనయ్య అక్కడే ఉంటున్నాడు. పనికోసం నెల్లూరుకు వెళుతూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నడుము, కాళ్లు విరిగిపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రికి వచ్చిన కొద్దిసేపటికే మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి
-
సోమిరెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు
సాక్షి, వెంకటాచలం: అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సాగించిన భూదందాపై కోర్టు ఆదేశాలతో మంగళవారం ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో పామర్రు పిచ్చిరెడ్డికి సర్వే నెంబరు 581 ప్రకారం 8.89ఎకరాలు, 583 ప్రకారం 4.42 ఎకరాలతో మొత్తం కలిపి 13.71ఎకరాల భూమి ఉంది. ఇందులో 10.94 ఎకరాలకు పంపకాలు సరిగా జరగలేదనే వివాదం ఉంది. దీంతో విషయం అప్పట్లో సోమిరెడ్డి దృష్టికి వెళ్లడంతో లేని రికార్డులను సృష్టించారు. సర్వే నంబరు 583 ప్రకారం ఉన్న 2.36 ఎకరాల భూమిని తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత భూమిని చెన్నై నగరానికి చెందిన మేఘనాథన్, ఏఎం జయంతిలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కాగా బాధితుడు ఏలూరు రంగారెడ్డిలో అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు మంగళవారం సోమిరెడ్డితోపాటు వీఆర్ మేఘనాథన్, ఏఎం జయంతి, సర్వేయర్ సుబ్బరాయుడులపై 471, 468, 447, 427, 397 సెక్షన్ల కింద పోలీసలు కేసు నమోదు చేశారు. -
దొంగగా మారిన రైల్వే కూలీ
సాక్షి, నెల్లూరు(క్రైమ్): అతను రైల్వే కూలీగా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసైయ్యాడు. తాళం వేసిన దుకాణాలు, ఇళ్లలో చోరీలు చేసి అందినకాడికి దోచుకెళ్లసాగాడు. మూడేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఘరానా దొంగను నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.18.50 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వేదాయపాళెం పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలను వెల్లడించారు. వెంకటాచలం మండలం పలుకూరివారిపాళేనికి చెందిన శివనారాయణ అలియాస్ శివ నెల్లూరు నగరంలో రైల్వే కూలీగా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసైన నిందితుడు చోరీల బాటపట్టాడు. మూడేళ్లుగా నెల్లూరు నగరంలోని పలుచోట్ల కుదువ షాపులు, ఫ్యాన్సీ షాపులు, ఫైనాన్స్ సంస్థ, మొబైల్ షోరూంలలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. శివ ఈ ఏడాది జూలై 25వ తేదీ రాత్రి వేదాయపాళెంలోని లాట్ మొబైల్షాపులో గోడకు కన్నం వేసి లోనికి ప్రవేశించి 15 సెల్ఫోన్లు, 21 బ్లూటూత్లు, మెమొరీ కార్డులు, క్యాష్ కౌంటర్లోని కొంత నగదును అపహరించాడు. ఈ ఘటనపై వేదాయపాళెం ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో సోమవారం శివ, నెల్లూరు శిల్పారామం సమీపంలోని కంపచెట్ల వద్ద ఉన్నాడనే పక్కా సమాచారం వేదాయపాళెం పోలీసులకు అందింది. ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నా రు. అనంతరం పోలీస్స్టేషన్కు తరలించి విచా రించగా లాట్ మొబైల్ షోరూంతోటు అనేకచోట్ల చోరీలకు పాల్పడినట్లుగా అంగీకరించాడు. 2016 నుంచి నేరాలు నిందితుడు శివ 2016 సంవత్సరం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్ప డుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. 2016 మే 11వ తేదీన సంతపేటలోని నాలుగుకాళ్ల మంటపం సమీపంలో ఓ కుదువ షాపులో 280 గ్రాముల బంగారం, 2018 సంవత్సరం మే 18వ తేదీన అదే ప్రాంతంలోని మరో కుదువ అంగడిలో ఎనిమిది కేజీల వెండి ఆభరణాలు, 16 గ్రాముల బంగారం, గతనెలలో బోసుబొమ్మ సమీపంలోని ఓ షాపులో వస్తువులు, ఆటోనగర్లో ఇన్నోవా కారును దొంగిలించాడని డీఎస్పీ వెల్లడించారు. అతని నుంచి రూ.18.50 లక్షలు విలువచేసే 12 సవర్ల బంగారు ఆభరణాలు, 11 కేజీల వెండి కాళ్ల గొలుసులు, 14 సెల్ఫోన్లు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి అభినందన నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన వేదయపాళెం ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్సైలు కె.లక్ష్మణ్రావు, ఎం.పుల్లారెడ్డి, క్రైమ్ పార్టీ సిబ్బంది ప్రసాద్, సుధాకర్, గోపాలయ్య, జిలానీ తదితరులను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. -
భార్య వెళ్లిపోయింది.. కూతురిపై అత్యాచారం
సాక్షి, నెల్లూరు: కన్నకూతురిపై లైంగికదాడి చేసిన కేసులో తండ్రికి జీవితఖైదు విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్కుమార్ మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. ఇందుకూరుపేట మండలానికి చెందిన చాంద్బాషా తన భార్య, ఐదుగురు పిల్లలతో నెల్లూరులోని హరనాథపురంలో కాలువకట్ట ప్రాంతంలో నివాసం ఉండేవాడు. అతను బేల్దారి పనులు చేసేవాడు. మద్యానికి బానిసైన చాంద్బాషా భార్యను వేధించడంతో ఆమె 2015 సంవత్సరం జూన్లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. బాషా మద్యం సేవించి మైనర్ అయిన తన కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. తరచూ ఆమెపై లైంగికదాడికి పాల్పడేవాడు. చుట్టుపక్కల వారు విషయం తెలుసుకుని బాలికను అడగటంతో ఆమె విషయం చెప్పింది. వారి సలహా మేరకు 2015లో నవంబర్ 4వ తేదీన సొంత గ్రామానికి వెళ్లి అంగన్వాడీ టీచర్కు విషయం తెలపడంతో ఆమె సదరు బాలికను నెల్లూరు బాలసదన్కు తీసుకెళ్లింది. వారి సూచన మేరకు అదే నెల 7వ తేదీన నెల్లూరు 4వ నగర్ పోలీసులకు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిపై చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ కేబీఎస్ మణి కేసు వాదించారు. ఇద్దరికి ఏడేళ్ల జైలు ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై లైంగికదాడి చేశారనే కేసులో నేరం రుజువు కావడంతో వెండి అలియాస్ రాగి భార్గవ్, జల్లి గోపి అనే ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్కుమార్ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. సంగం మండలంలోని ఓ గ్రామంలో 2016 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి భార్గవ్, గోపిలు బాలిక ఇంటికి వెళ్లారు. భార్గవ్ బాలికపై లైంగికదాడికి పాల్పడగా ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కల వారు రావడంతో భార్గవ్, గోపి అక్కడినుంచి పరారయ్యారు. బాలిక ఫిర్యాదు మేరకు సంగం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు అనంతరం ఇద్దరిపై కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ కేబీఎస్ మణి కేసు వాదించారు. -
స్నేహితుడి భార్య కోసం హత్య..!
సాక్షి, వెంకటాచలం (నెల్లూరు): మండలంలోని నిడిగుంటపాళెం సమీపంలో నక్కలకాలువ బ్రిడ్జి వద్ద గత నెల 30వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి గురువారం మండల కేంద్రమైన వెంకటాచలంలోని పోలీస్స్టేషన్లో వివరాలను వెల్లడించారు. ఈదగాలి గ్రామం ఉలవదిబ్బ ప్రాంతానికి చెందిన బండారు ప్రకాష్, అతని స్నేహితులు గత నెల 30వ తేదీన మద్యం తాగేందుకు నిడిగుంటపాళెం నక్కలకాలువ బ్రిడ్జి కిందకు వెళ్లారు. ప్రకాష్ మద్యం మత్తులో కాలువలో పడి మృతిచెందాడని స్నేహితులు చెప్పడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో ప్రకాష్ ప్రమాదవశాత్తు చనిపోలేదని తేలడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాఘవరెడ్డి నమ్మించారు ప్రకాష్ భార్యకు అతని స్నేహితుడైన ఇడిమేపల్లి గ్రామానికి చెందిన ఎ.వెంకటేష్కు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ప్రకాష్కు తెలిసి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈక్రమంలో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రకాష్ ఇదంతా నీ వల్లే జరిగిందంటూ వెంకటేష్తో గొడవపడేవాడు. దీంతో వెంకటేష్ ప్రకాష్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితులైన చెన్నకృష్ణయ్య, విజయభాస్కర్ల సాయం కోరాడు. వీరు ముగ్గురూ కలిసి గత నెల 30వ తేదీన మద్యం తాగుదామని చెప్పి ప్రకాష్ను నక్కలకాలువ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లారు. అక్కడ గొంతు నలిపి హత్య చేసి కాలువలో పడి చనిపోయాడని అందర్ని నమ్మించారు. పోస్టుమార్టం నివేదికలో ప్రకాష్ ప్రమాదవశాత్తు చనిపోలేదని తెలియడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈక్రమంలో వెంకటేష్ను విచారించగా అసలు విషయం బయటపడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారింగా హత్య చేసినట్టుగా ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్సై షేక్ కరీముల్లా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బంపర్ ఆఫర్ ఇచ్చిన దొంగ!
నెల్లూరు (క్రైమ్): ఇదొక వింతైన దోపిడీ. ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగుడు తల్లి, కుమార్తెను బెదిరించి రూ.2.50 లక్షల విలువైన 76 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. తనకు రూ.లక్ష అవసరమని, ఆ నగదు ఇస్తే ఆభరణాలు ఇస్తానని దుండగుడు బాధితులతో బేరం పెట్టాడు. వారు డబ్బులు లేవనడంతో నగలతో పరారయ్యాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున బాలాజీనగర్ రాంజీనగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కోటకు చెందిన పి.వెంకటకృష్ణారెడ్డి, శ్రీలత దంపతులు. వెంకటకృష్ణారెడ్డి బియ్యం వ్యాపారి. ఆరు నెలల కిందట కుమార్తె అన్వేషకి వివాహ నిమిత్తం రాంజీనగర్కు వచ్చారు. కుమార్తె వివాహానంతరం వెంకట కృష్ణారెడ్డి కోటకు వెళ్లారు. కుమార్తె ఆషాఢ మాసం కావడంతో తల్లితో కలిసి రాంజీనగర్లోనే ఉంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు కిటికీ నుంచి కర్ర సాయంతో ఇంటి తలుపు గడియ తొలగించి ఇంట్లోకి వచ్చాడు. కప్బోర్డును తెరచి చూడగా అందులో ఏమీ కనిపించక పోవడంతో పడక గదిలో నిద్రిస్తున్న శ్రీలత, ఆమె కుమార్తెను నిద్రలేపి బంగారు ఆభరణాలు ఇవ్వాలని లేని పక్షంలో చంపుతామని బెదిరించాడు. శ్రీలత దిండుకింద ఉంచిన మూడున్నర సవర్ల బంగారు గొలుసు, ఆమె కుమార్తె మెడలోని 6 సవర్ల బంగారు గొలుసును లాక్కున్నాడు. రూ.లక్ష ఇస్తే నగలిచ్చేస్తా.. ఘటనలో నిందితుడు బాధితులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు వ్యక్తిగత పనుల నిమిత్తం రూ.లక్ష అవసరమని, ఆ నగదు ఇస్తే దొంగిలించిన ఆభరణాలను తిరిగి ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు. అయితే డబ్బులు లేవని చెప్పడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితులు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కంపెనీ స్టిక్కర్ వేశారు.. అమ్మేశారు
సాక్షి, నెల్లూరు : ఆ టీవీలు పైకి పెద్ద కంపెనీవి. కానీ అవి లోకల్గా తయారుచేసిన సెట్లు. బ్రాండెడ్ కంపెనీ పేరుతో అసెంబుల్డ్ టీవీలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను నెల్లూరు సీసీఎస్, నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.25 లక్షల విలువచేసే 72 టీవీలను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామిలీ జిల్లా కిరానా తాలుకాకు చెందిన పఠాన్ షబ్బీర్ఖాన్, ముజ్ఫర్ నగర్ జిల్లా బుదాస్ తాలూకాకు చెందిన అబ్దుల్ రహిమాన్లు స్నేహితులు. వీరు వివిధ రాష్ట్రాల్లో గ్యాస్ స్టౌలు విక్రయిస్తూ జీవనం సాగించేవారు. సంపాదన అంతంతమాత్రంగానే ఉండడంతో తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించాలని నిర్ణయించుకున్నారు. రూ.4 వేలు లోపే.. షబ్బీర్ఖాన్, అబ్దుల్ ఢిల్లీలోని చాందినీచౌక్లో స్థానికంగా తయారుచేసే (అసెంబుల్డ్) టీవీలను అతి తక్కువ ధరకు (రూ.3 వేల నుంచి రూ.4 వేల లోపు) పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. వాటి మీద వివిధ టీవీల కంపెనీల పేరున్న స్టిక్కర్లను అతికించారు. కంపెనీ టీవీలంటూ ప్రజలకు ఒక్కో దానిని రూ.15 నుంచి రూ.20 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకోసాగారు. ఇటీవల నిందితులు టీవీలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నెల్లూరుకు తరలించి వెంకటేశ్వరపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఓ ఇంట్లో నిల్వ చేశారు. వాటికి సోనీ కంపెనీ స్టిక్కర్లను అంటించారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కంపెనీ టీవీలని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేయసాగారు. పక్కా సమాచారంతో.. వారిద్దరి నిర్వాకంపై సీసీఎస్, నవాబుపేట ఇన్స్పెక్టర్లు షేక్ బాజీజాన్ సైదా, కె.వేమారెడ్డిలకు పక్కా సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి వారు తమ సిబ్బందితో కలిసి టీవీలు నిల్వచేసిన ఇంటిపై దాడిచేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని, విక్రయాలకు సిద్ధంగా ఉంచిన రూ.25 లక్షలు విలువచేసే టీవీలను, సోనీ కంపెనీ పేరున్న స్టిక్కర్లను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. వారిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన సీసీఎస్, నవాబుపేట ఇన్స్పెక్టర్లు బాజీజాన్సైదా, వేమారెడ్డి, ఎస్సై మరిదినాయుడు, సీసీఎస్ ఏఎస్సై గిరిధర్రావు, హెడ్కానిస్టేబుల్స్, జీవీ రమేష్, సీహెచ్ వెంకటేశ్వర్లు, టి.విజయకుమారి, కానిస్టేబుల్స్ పి.సతీష్, పీవీ సాయిఆనంద్లను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో సీసీఎస్, నవాబుపేట పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం సెక్రటరీనంటూ మాజీ క్రికెటర్ డబ్బులు డిమాండ్
నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ పేరుతో మాజీ క్రికెటర్ నెల్లూరులోని కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రంజీ స్థాయిలో ఆడిన మాజీ క్రికెటర్ నాగరాజు సీఎం పేరు చెప్పి రూ.3.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనపై ఇప్పటికే ఆరు కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం యవ్వారి గ్రామానికి చెందిన బుడమూరు నాగరాజు 2014లో నాన్స్టాప్గా 82 గంటల పాటు క్రికెట్ ఆడి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. ఆతర్వాత విలాసవంత జీవితానికి అలవాటు పడి ప్రముఖల పేర్లను ఉపయోగించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలోనే నెల్లూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. -
కుక్క కోసం కత్తిపోట్లు
సాక్షి, వెంకటగిరి (నెల్లూరు): పెంపుడు కుక్క విషయమై ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. చినికి చినికి గాలివానలా మారి చివరికి ముగ్గురు కత్తి పోట్లుకు గురైన ఘటన మంగళవారం రాత్రి వెంకటగిరిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని బొగ్గులమిట్ట ప్రాంతానికి చెందిన వినోద్, గణేష్ తమ బాబాయి వీరాస్వామి చెందిన పెంపుడు కుక్క తప్పిపోవడంతో వెతుక్కుంటూ రాగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న గీతాంజలి కుమార్తె తులసి వద్ద కుక్క ఉండాన్ని గమనించారు. వినోద్, గణేష్లు తులసి, గీతాంజలిలను కుక్క విషయమై ప్రశ్నించే క్రమంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తులసి సోదరుడు సాయికిషోర్ ఒకింత ఆగ్రహంతో వినోద్, గణేష్పై దాడి చేశాడు. దీంతో వినోద్, సాయిగణేష్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే బొగ్గులమిట్టలో వివాదం మరింత తీవ్రమైంది. గణేష్, వినోద్పై దాడి చేశారన్న సమాచారం అందుకున్న వారి బాబాయి వీరాస్వామి గీతాంజలి ఇంటి వద్దకు రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో వీరాస్వామి కత్తితో గీతాంజలి, తులసి, సాయి కిషోర్పై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం తిరుపతి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణాలు తీసిన సిమెంట్ ట్యాంకర్
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం(నెల్లూరు) : వారంతా వ్యవసాయ కూలీలు. అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరారు. గడ్డిని ట్రాక్టర్లలో నింపి సూర్యోదయం నాటికి చేరుకుంటారు. వాములుగా వేసి సూర్యుడు నడినెత్తికెక్కేసరికి ఇళ్లకు వెళ్లిపోతారు. కానీ వారి జీవితంలోకి సిమెంట్ ట్యాంకర్ మృత్యువులా వచ్చింది. ఆగి ఉన్న ట్రాక్టర్ను ట్యాంకర్ వెనుకనుంచి ఢీకొంది. దీంతో ఒక్కసారిగా కూలీలందరూ చెల్లాచెదురుగా పడిపోయారు. ముగ్గురికి స్వల్పగాయాలు కాగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికిని నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం 108 వాహనాల్లో సిబ్బంది హుటాహుటిన తరలించారు. అందులో ఓ వ్యక్తి వెంటనే మృతిచెందగా, మరో మహిళ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ వైద్యం అందక మృతిచెందింది. మిగిలిన నలుగురిలో ముగ్గురిని నెల్లూరులోని డీఎస్సార్ ఆస్పత్రికి 108లో తరలించగా, నలుగురిని బుచ్చిరెడ్డిపాళెం సామాజిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అందించి నలుగురిని కూడా వైద్యులు లేకపోవడంతో నెల్లూరుకే సిఫార్సు చేశారు. ఈ విషాదకర ఘటన శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇస్కపాళెం పంచాయతీ పల్లాప్రోలుకు చెందిన జమ్మలమడుగు లచ్చయ్య వ్యవసాయ కూలీలకు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సాల్మాన్పురానికి చెందిన మల్లికార్జున్రెడ్డి ట్రాక్టర్లో పంచేడుకు వెళ్లి గడ్డి తేవాలని అనుకున్నారు. ఈక్రమంలో అర్ధరాత్రి ఒంటిగంటకు ట్రాక్టర్ను మల్లికార్జున్రెడ్డి పల్లాప్రోలుకు తీసుకెళ్లాడు. అక్కడ పోలినాయుడు చెరువు గిరిజనకాలనీకి చెందిన తిరంశెట్టి వెంకటలక్ష్మమ్మ, మారుబోయిన వెంకటరమణమ్మ, కల్లూరు సునీల్, బండి వెంకటేశ్వర్లు, పల్లాప్రోలుకు చెందిన జమ్మలమడుగు శారద, వడ్డి రామయ్య, తురకా సుమతి, పెనుమాల అన్నమ్మ, తురకా వెంకటలక్ష్మిలను తీసుకుని బుచ్చిరెడ్డిపాళేనికి బయలుదేరారు. రాఘవరెడ్డి కాలనీ వద్ద మరో మహిళా కూలీ తలారి మంజులను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్ను ముంబై జాతీయ రహదారిపై పక్కన ఆపారు. అందరూ టీ తాగారు. మంజుల వచ్చి ట్రాక్టర్ ఎక్కింది. బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో నెల్లూరు నుంచి సంగం వైపు వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ వెనుక నుంచి వేగంగా వచ్చి ట్రాక్టర్ను ఢీకొంది. దీంతో డ్రైవర్ మల్లికార్జున్రెడ్డితోపాటు ట్రాక్టర్లో ఉన్నవారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. విషయాన్ని స్థానికులు 108కు సమాచారం అందించారు. వైద్యసేవలందక.. సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాళెం, సంగం, నెల్లూరు నుంచి మూడు 108 వాహనాలు సంఘటనా స్థలానికి వచ్చాయి. అందులో బుచ్చిరెడ్డిపాళెం వాహనంలో బండి వెంకటేశ్వర్లు, తురకా సుమతి, సానిగుంట మస్తానమ్మ, జమ్మలమడుగు శారద, వడ్డి రామయ్య, తలారి మంజులను బుచ్చిరెడ్డిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తిరంశెట్టి వెంకటలక్ష్మమ్మ, కల్లూరు సునీల్, మారుబోయిన వెంకటరమణమ్మను సంగం 108 వాహనంలో నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో ఆస్పత్రికి వచ్చిన రెండు నిమిషాల్లో వడ్డి రామయ్య (53) మృతిచెందాడు. తలారి మంజుల (45) 20 నిమిషాలపాటు కొనఊపిరితో ఉండి వైద్యసేవలందక మృతిచెందింది. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ చిరంజీవి రాలేదని అందుకు ఇద్దరూ మృతిచెందారని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా మంజూల స్వగ్రామం దగదర్తి మండలం శ్రీరామపురం కాగా బుచ్చిరెడ్డిపాళెంలోని బంధువుల వద్ద ఉంటోంది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. వైద్యం చేసిన స్టాఫ్ నర్స్ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో రాత్రి విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ సృజన అంతా తానై చేయాల్సి వచ్చింది. కొంత సమయం తర్వాత మరో స్టాఫ్ నర్స్ ఇందిరావతి సహాయంగా వచ్చింది. నలుగురు క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యసేవలందించి నెల్లూరు డీఎస్సార్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. 108 సిబ్బంది స్పందన ప్రమాద స్థలం నుంచి ఆస్పత్రికి తీసుకురావడం, ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరుకు తీసుకెళ్లడంతో 108 సిబ్బంది చూపిన శ్రద్ధపై ప్రజలు అభినందనలు తెలిపారు. కుటుంబసభ్యులు ఎవరూ లేకున్నా బుచ్చిరెడ్డిపాళెం ఈఎన్టీ శ్యామ్కుమార్, పైలెట్ దిలీప్, సంగం వాహనం ఈఎన్టీ రమేష్, పైలెట్ నాగరాజు, నెల్లూరు వాహనం ఈఎన్టీ సురేంద్ర, పైలెట్ అబూబకర్కు కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబసభ్యుల మండిపాటు ఆస్పత్రిలో రాత్రి పూట ఉండాల్సిన డాక్టర్ లేని కారణంగా వడ్డిరామయ్య, తలారి మంజుల మృతిచెందారని కుటుంబసభ్యులు ఆరోపించారు. స్టాఫ్ నర్సు మొత్తం చేయాల్సి వచ్చిందని చెప్పారు. డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రసన్నకుమార్రెడ్డి సంతాపం ఇస్కపాళెం పంచాయతీ పల్లాప్రోలు, పోలినాయుడు చెరువు గ్రామస్తులు ప్రమాదానికి గురయ్యారని తెలిసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. వైఎస్సార్సీపీ నాయకులు కోడూరు మధుసూదన్రెడ్డితో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. -
భార్య మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందని..
సాక్షి, నెల్లూరు : భార్య మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందనే అవమానంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంతపేట మెట్లరేవులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సంతపేట పోలీసుల సమాచారం మేరకు.. మెట్లరేవుకు చెందిన శివకుమార్ (34) ఇనుప సామాన్ల విక్రయ వ్యాపారి. ఆయనకు సుమారు 12 ఏళ్ల క్రితం వెంకటగిరి మండలానికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. ఆర్నెల్ల క్రితం శివకుమార్ అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో భార్య అదే ప్రాంతానికి చెందిన కిశోర్తో సన్నిహితంగా మెలగసాగారు. గమనించిన అత్త ప్రభావతి పలుమార్లు ఆమెను మందలించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రభావతి తన కోడలు, కిశోర్ను మందలించి తన కుమారుడి కాపురాన్ని చక్కదిద్దాలని కోరారు. దీంతో పోలీసులు వారిద్దర్నీ పిలిచి మందలించారు. విషయం తెలుసుకున్న శివకుమార్ మనస్థాపానికి గురై తన ఇంటి పైభాగంలో ఉన్న గదిలో ఫ్యాన్కు దుప్పటితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన ప్రభావతికి కుమారుడు కనిపించకపోవడంతో మేడపై ఉన్న గదికి వెళ్లిచూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి హుటాహుటిన కుమారుడ్ని నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. శివకుమార్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న సంతపేట ఎస్సై సుభాన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించనున్నారు. -
మహిళా కానిస్టేబుల్కు వేధింపులు
సాక్షి, నెల్లూరు : మహిళా కానిస్టేబుల్ను వెంటపడి వేధింపులకు గురిచేస్తున్న ఓ విశ్రాంత ఉద్యోగిపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు నెల్లూరు నగరంలోని బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్లో ఓ యువతి నివాసం ఉంటోంది. ఆమె నగరంలోని ఓ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రసన్నమాల ఆమె వెంటపడుతూ కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. పలుమార్లు సదరు యువతి అతనిని తీవ్రస్థాయిలో మందలించినా మార్పురాలేదు. ఇటీవలే ఆయన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ఈ నెల 2వ తేదీ రాత్రి సదరు మహిళా కానిస్టేబుల్ స్టేషన్లో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమెను వెంబడిస్తూ క్వార్టర్స్ సమీపంలోకి వచ్చేసరికి ఫోన్నంబర్ ఇవ్వాలని ఆమెను చేయిపట్టుకునేందుకు యత్నించాడు. దీంతో ఆమె అతని నుంచి తప్పించుకుని వెళుతుండగా క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఓ ఉద్యోగి ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. అనంతరం విశ్రాంత ఉద్యోగిని మందలించి అక్కడి నుంచి పంపివేశాడు. బుధవారం సదరు విశ్రాంత ఉద్యోగి బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లి అక్కడున్న ఉద్యోగులకు సదరు మహిళా కానిస్టేబుల్కు డబ్బులు ఇచ్చానని, తనను పెళ్లిచేసుకోమన్నదని ఇలా అనేక రకాల ఆరోపణలు చేశాడు. ఈ విషయంపై పలువురు ఉద్యోగులు మాట్లాడుతుండగా విన్న మహిళా కానిస్టేబుల్ మనస్థాపానికి గురై చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఆరోపణలు చేయడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్న విశ్రాంత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశ్రాంత ఉద్యోగిపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నబజారు ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్ తెలిపారు. -
ప్రాణాలు తీస్తున్న ఈత సరదా
సాక్షి, నెల్లూరు : చిన్నారులు, యువత ఈత సరదా పలువురి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఈత రాకపోవడం, ప్రమాదకర ప్రదేశాల హెచ్చరికలు లేకపోవడంతో స్నేహితులతో కలిసి నీటి వనరుల వద్దకు వెళ్లే పిల్లలు, యువకులు ప్రమాదాలను అంచనా వేయలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఎండల వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పిల్లలు, యువకులు సరదాగా జల వనరుల్లో ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. మైపాడు, కొత్తకోడూరు, తూపిలిపాళెం సముద్ర తీరంలో జలకాలు ఆడుతూ అలల్లో కొట్టుకుపోయి ఇటీవల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. గూడూరు మండలంలో ఇటీవల మైన్ గుంతలో ఈతకు దిగి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సోమశిల జలాశయంలో ఇద్దరు బాలికలు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ప్రమాదాలకు కారణాలు ఇవే జిల్లాలోని చెరువుల్లో మట్టి కోసం అక్రమంగా పెద్ద పెద్ద గుంతలు తవ్వ వదిలేసి ఉన్నారు. ఈ గుంతలు నీటితో ప్రమాదభరితంగా ఉన్నాయి. చిన్నారులు సెలవు రోజుల్లో జలాశయాలు, సముద్రతీరాలు, పెద్ద పెద్ద కాలువల్లో స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. గుంతలు లోతుగా బురదతో నిండి ఉండడం, సముద్ర తీరంలో అలల తాకిడి, జలాశయాల్లో ఊబిల్లో కూరుకుపోయి మృత్యువు పాలవుతున్నారు. ఈత రాని పిల్లలు కాలువలు, చెరువుల్లోకి వెళ్తే మునిగిపోతారు. చిన్నారుల కదలికలపై తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ⇒ జిల్లాలో వ్యవసాయ బావులు, నీటి పారుదల కాలువలు, చెరువులు ఉన్నాయి. కాలువల్లో నీరు ఎప్పుడూ ప్రవహిస్తుండడం వల్ల అంచుల్లో, అడుగుభాగాన నాచు పేరుకుని ఉంటుంది. దీంతో ప్రమాదవశాత్తు కాలువల్లో జారిపడి ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగి పోయే అవకాశం ఉంది. ⇒ ఈత రాకపోవడం ప్రమాదాలకు మరో ముఖ్య కారణం. జలవనరుల అడుగు భాగంలో పూడిక ఉండడంతో పాటు నాచు, గుర్రపుడెక్క చెట్ల తీగలు అల్లుకుపోయి ఉంటాయి. వీటిని అంచనా వేయకుండా ఏమరపాటుగా లోనికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకుని జల సమాధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చెరువులు, బావుల్లోకి ఈతకు వెళ్తారు. సరదా కోసం ఎత్తులో నుంచి బావిలో దూకినప్పుడు లోతుకు వెళ్లి మట్టిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ⇒ నీటి లోతు తెలుసుకోకుండా జలాశయాలు, ప్రధాన కాలువలు, సముద్రాల్లోకి దిగడంతో మునిగిపోయే ప్రమాదం ఉంది. నీటి లోతు కారణంగా మృతదేహాల కోసం రోజుల తరబడి నిరీక్షించాచాల్సి రావడం విషాదం జరిగిన కుటుంబాల్లో తీరని వేదన నింపుతోంది. ఉజ్వల భవిష్యత్ ఉన్న యువకులు ప్రమాదాలు అంచనా వేయకపోవడం, అజాగ్రత్తతో కన్న వారికి పుట్టెడు శోకాన్ని మిగుల్చుతున్నారు. ప్రమాదాలను ఇలా నివారించవచ్చు ⇒ ఈత నేర్చుకునే సమయంలో పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి ⇒ జలాశయాల్లోకి దిగేటప్పుడు జాగ్రత్త వహించాలి. ⇒ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దూకడం, ఈత కొట్టడం చేయొద్దు. పూర్తిగా ఈత వచ్చే వరకు లోతైన ప్రాంతానికి పోకూడదు. ⇒ నేర్చుకునే సమయంలో ట్యూబులు, బెండ్లు వాడుతున్నప్పటికీ శిక్షకులు లేకుండా జలవనరుల్లోకి దిగడం మంచిది కాదు.. ⇒ ఈత నేర్చుకోవాలనుకునే ఉత్సాహం ఉన్న పిల్లల ను సెలవు రోజుల్లో పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ⇒ నీటి ప్రవాహాలు బావులు, చెరువులు ఉన్న చోట పంచాయతీల పాలకులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి ⇒ ఈత రాకున్నా స్నేహితులు బలవంతం చేస్తున్నారని జలాశయాల్లోకి దిగే సాహసం చేయొద్దు ⇒ మైపాడు, కొత్తకోడూరు, తూపిలిపాళెం బీచ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద సూచికలు దాటి వెళ్లే ప్రయత్నం చేయకూడదు. -
అత్యాశపడ్డాడు.. అడ్డంగా చిక్కాడు
సాక్షి, నెల్లూరు : అత్యాశకుపోయిన ఆటో డ్రైవర్ దొంగగా మారాడు. ప్రయాణికుల నగల బ్యాగ్ను తస్కరించాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలైయ్యాడు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్హాలులో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా తిరుపతి నగరానికి చెందిన మొలగముడి రాఘవయ్య ఈనెల 15వ తేదీన తన కుటుంబసభ్యులతో కలిసి గంగపట్నం వెళ్లేందుకు తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరి నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. వారు ఆటోలో ఆత్మకూరు బస్టాండ్కు బయలుదేరారు. ఈక్రమంలో రాఘవయ్య తన వద్ద ఉన్న ఓ బ్యాగ్ను పదేపదే గమనిస్తుండటాన్ని ఆటో డ్రైవర్ చూశాడు. అందులో విలువైన వస్తువులు ఉంటాయని భావించాడు. ఆటోడ్రైవర్ దానిని తస్కరిస్తే జీవితంలో స్థిరపడవచ్చని భావించి అదనుకోసం వేచి చూడసాగాడు. రాఘవయ్య, అతని కుటుంబసభ్యులు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆటో దిగి బ్యాగ్ల తీసుకునేందుకు యత్నిస్తుండగానే డ్రైవర్ అక్కడి నుంచి ఆటోను వేగంగా తీసుకెళ్లిపోయాడు. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న బాధితులు కొద్దిసేపటికి తేరుకుని జరిగిన ఘటనపై అదేరోజు రాత్రి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపహరించిన బ్యాగ్లో 148 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు చోరీ ఘటనపై కేసు నమోదు చేశారు. అనంతరం జరిగిన విషయాన్ని నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు కేసు విచారణ చేపట్టారు. ఇలా పట్టుకున్నారు బాధితులు చోరీ ఘటనను వెల్లడించడం మినహా ఆటోకు సంబంధించిన ఎలాంటి వివరాలు చెప్పలేకపోయారు. దీంతో ఇన్స్పెక్టర్ బాధితులు ఆటో ఎక్కిన సమయాన్ని తెలుసుకుని కమాండ్ కంట్రోల్లో సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. బాధితులు దిగిన ఆటోను అందులో గుర్తించారు. అయితే ఆటో, పోలీస్ నంబర్ సరిగ్గా కనిపించలేదు. దీంతో అనేక నంబర్లను పరిశీలించగా అందులోని ఓ నంబర్కు గతంలో పోలీసులు ఈ చలాన్ విధించడంతో దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆటో డ్రైవర్ ఫొటో లభ్యమైంది. దానిని బాధితులకు చూపించగా అతనేనని గుర్తించారు. నిందితుడు కంటేపల్లి గ్రామ వాసి ప్రయాణికుల నగల బ్యాగ్ను తస్కరించిన ఆటో డ్రైవర్ వెంకటాచల సత్రంలోని కంటేపల్లి గ్రామానికి చెందిన వి.శీనయ్యగా పోలీసు విచారణలో వెల్లడైంది. దీంతో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎస్సై నరేష్, సిబ్బందితో కలిసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం అతను కంటేపల్లి గ్రామ సమీపంలో ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్కు తరలించి విచారించగా నేరం చేసినట్టుగా అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. రూ.3.78 లక్షలు విలువచేసే 148 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వెల్లడించారు. ఆటో డ్రైవర్ అత్యాశే అతడిని దొంగగా మార్చి జైలు పాలుచేసిందని ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన నవాబుపేట ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎస్సై నరేష్, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. సమావేశంలో నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రీకొడుకులు.. ఘరానా దొంగలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పలు చోరీలకు, నేరాలకు పాల్ప డుతూ హత్య కేసులో సైతం నిందితుడిగా ఉన్న ఓ తండ్రి తన కుమారుడితో కలిసి దొంగతనాలకు పాల్పడుతుండగా వీరిద్దరినీ ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని జిల్లా నూతన పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా ఆటోలు, బైక్లు చోరీకి గురవుతున్నాయంటూ పలు ఫిర్యాదులు వచ్చాయి. సీసీఎస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలివ్వడంతో ఏఎస్పీ పరమేశ్వరరెడ్డి పర్యవేక్షణలో నెల్లూరు సీసీఎస్ సీఐ ఎస్కే బాజీ జాన్సైదా, నెల్లూరురూరల్ సీఐ జీఎల్ శ్రీనివాసరావు తమ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో శనివారం ఆరో మైలు, యాగర్లసెంటర్ వద్ద అనుమానంతో ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళేనికి చెందిన తండ్రీకొడుకులైన దొడ్ల సంతోష్, దొడ్ల సందీప్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా జిల్లాలోనే కాక ఇతర జిల్లాలో కూడా ఆటోలు, బైక్లు చోరీచేసినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువ చేసే 10 అపే ఆటోలు, రూ.5 లక్షల విలువ చేసే 8 బైక్లు, రూ.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణం, చైన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొడ్ల సంతోష్ గతంలో పలు చోరీలకు పాల్పడిన కేసులో నిందితుడిగా ఉంటూ ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడని తెలిపారు. హత్య కేసులో జైలుకు వెళ్లి తిరిగి వచ్చినప్పటి నుంచి తన కొడుకు సందీప్తో కలసి మరిన్ని చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈ ఘరానాదొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన నెల్లూరు సీపీఎస్ సీఐ ఎస్కే బాజిజాన్సైదా, రూరల్ పీఎస్ సీఐ జీఎల్ శ్రీనివాసరావు, క్రైంబ్రాంచ్ ఏఎస్ఐ జె.వెంకయ్య, హెడ్కానిస్టేబుల్స్ ఎస్డీ వారిస్ అహ్మద్, పి.విజయ్ప్రసాద్, ఆర్.సత్యయనారా యణ, కానిస్టేబుల్స్ జి.నగేష్, ఎం.సుబ్బారావు, జి.అరుణ్కుమార్, ఎం.వేణు, సీహెచ్ శ్రీనులను ఎస్పీ అభినందించి సర్వీస్ రివార్డులు అందజేశారు. తండ్రీకొడుకులు చేసిన చోరీల వివరాలు ఇందుకూరుపేట పోలీస్స్టేషన్ పరిధిలో 2017వ సంవత్సరంలో నిడుముసలి గ్రామంలో నిద్రపోతున్న ఓ మహిళ మెడలో రూ.2 లక్షల విలువైన తొమ్మిదిన్నర సవర్ల బంగారు ఆభరణం, చైన్ను అపహరించారు. నరసాపురం గ్రామంలో ఒక ఆటో చోరీ చేశారు. గంగపట్నం గ్రామంలోని వేపచెట్టు దర్గా వద్ద ఓ ఆటోను చోరీ చేశారు. వెంకటాచలసత్రం పోలీస్స్టేషన్ పరిధిలో గొలగమూడి గ్రామంలో రెండు ఆటోలు అపహరించారు. బుచ్చిరెడ్డిపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో బుచ్చిరెడ్డిపెలెం సెంటర్లో రెండు ఆటోలు చోరీ చేశారు. కోవూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఇనమడుగు ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఓ ఆటోను చోరీ చేశారు. వేగూరుకండ్రిగ వద్ద ఒక ఆటోను చోరీ చేశారు. చిత్తూరు జిల్లాలోని తిరుచానూరు, రేణిగుంట, వడమాలపేట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో రెండు ఆటోలు, 8 బైక్లు చోరీ చేశారు. -
రైల్వే పోలీసుల అదుపులో టీడీపీ నాయకుడు
కావలి: మండలంలోని చెన్నాయపాళేనికి చెందిన టీడీపీ నాయకుడు మర్రి రవిని శనివారం వేకువన నెల్లూరు రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారు బిస్కెట్ల దందాకు సంబంధించిన రూ.50 లక్షలను నకిలీ రైల్వే పోలీసులు మాయం చేశారు. బంగారు వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రైల్వేపోలీసులు చెన్నాయపాళెం చేరుకుని రవిని అదుపులోకి తీసుకోవడం గ్రామంలో కలకలం రేగింది. ఈ విషయాన్ని టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా విషయం తెలుసుకుని తొందరపడి జోక్యం చేసుకుంటే అభాసుపాలవుతామని మిన్నకుండిపోయినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు.. కావలిలో కొందరు బంగారు వ్యాపారులు జీరో దందా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. చెన్నైలో బంగారాన్ని బిల్లులు లేకుండా కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. స్థానిక వ్యాపారి ఒకరు రూ.50లక్షలు చెన్నై నుంచి బంగారాన్ని తీసుకొచ్చే సీజన్ బాయ్కి అప్పగించాడు. పోలీసులు, ఐటీ అధికారుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు మహిళలను అతనికి తోడుగా పంపాడు. బుధవారం నవజీన్ ఎక్స్ప్రెస్లో బయలుదేరిన వీరు నెల్లూరుకు చేరుకోగానే రైల్వే పోలీసులమని కొందరు వ్యక్తులు వచ్చి రూ.50లక్షలు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీజన్ బాయ్ కావలిలోని బంగారు వ్యాపారికి తెలియజేశాడు. వెంటనే సదరు వ్యాపారి తనకు పోలీసు వర్గాల్లో ఉన్న పరిచయాల ద్వారా నగదు తీసుకెళ్లింది నకిలీ పోలీసులని నిర్ధారించుకుని నెల్లూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు సీజన్ బాయ్తో పాటు ఇద్దరు మహిళలను విచారించారు. మహిళల్లో ఒకరి ఫోన్ నుంచి టీడీపీ నాయకుడు రవి ఫోన్కు పెద్ద సంఖ్యలో కాల్స్ వెళ్లిన విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు రవిని అదుపులోకి తీసుకుని నెల్లూరు తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. కాగా టీడీపీ నాయకుడైన రవికి దూరపు బంధువు వెంకయ్య చెన్నాయపాళెం వీఆర్ఏగా వ్యవహరిస్తున్నాడు. వెంకయ్య విడవలూరు మండలం రామతీర్థంలో నివాసం ఉంటున్నాడు. దీంతో రవి వీఆర్ఏగా గ్రామంలో హల్చల్ చేస్తుంటాడు. వివాహితుడైన రవి రాత్రి వేళల్లో గ్రామంలో ఉండడు. తనకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక విధులు అప్పగించారని, అందుకే రాత్రి వేళల్లో డ్యూటీలు చేయాల్సి వస్తోందని గ్రామస్తులకు చెబుతుండేవాడు. కాగా జీరో దందాలో పనిచేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నేరం జరగడానికి ముందు, వెనుక ఆమెతో ఫోన్లో పలుమార్లు మాట్లాడడంతో రవిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. -
నెల్లూరులో కిరాతకం..
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి భార్యను హత్యచేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఈ ఘటన నెల్లూరులోని ప్రశాంతి నగర్లో చోటుచేసుకుంది. నవాబుపేట ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళంకు చెందిన గౌరీశ్వరి, తౌడు దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, సంధ్య (20) కుమార్తె. అందరూ 18 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చారు. సౌత్రాజుపాళెంలోని ఓ రైస్మిల్లులో పనిచేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. అదే మిల్లులో కోడూరుపాడుకు చెందిన మహేష్ మెషిన్ ఆపరేటర్గా చేరాడు. అతనికి సంధ్యతో పరిచయమైంది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి 2016 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. ప్రశాంతి నగర్లో కాపురం ఉంటున్నారు. వారికి పదినెలల కొడుకు ఉన్నాడు. కొంతకాలం కాపురం సజావుగా సాగింది. అనంతరం మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. మహేష్ వివాహానికి ముందు ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవాడని తెలుసుకున్న సంధ్య అతడిని నిలదీసింది. దీంతో వారి మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి. తీవ్ర ఘర్షణ కొద్దిరోజులుగా దంపతులిద్దరూ ఘర్షణ పడుతుండటంతో ఇరువురి పెద్దలు వారికి సర్దిచెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి దంపతుల నడుమ తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన మహేష్ ఆమెపై దాడిచేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో ఖంగుతిన్న అతను సంధ్యది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకున్నట్లు చేసి చుట్టుపక్కల వారిని పిలిచాడు. వారి సమక్షంలో భార్యను చికిత్స నిమిత్తం నారాయణ హాస్పిటల్కు తరలించాడు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్స్పెక్టర్ సోమవారం మృతదేహాన్ని పరిశీలించారు. తన సోదరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి అన్న అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్యులు సైతం ఆమెది ఆత్మహత్య కాదని పేర్కొనడంతో హత్య కేసుగా నమోదు చేశామని ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వెల్లడించారు. తహసీల్దార్ మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. మంగళవారం మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహిస్తారని పోలీసులు వెల్లడించారు. -
ప్రేమ పేరిట మహిళలకు వల
నెల్లూరు(క్రైమ్): ప్రేమ పేరిట మహిళలకు వలవేసి వారిని మోసం చేసి బెదిరింపులకు పాల్పడడం.. రూ.లక్షలు వసూలు చేసి విలాసవంతంగా జీవిస్తున్న ఓ నిత్య ప్రేమికుడిని నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని బాలాజీనగర్ పోలీసు స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఇందుకూరుపేట మండలం రావూరు గారమానికి చెందిన తాటిచెట్ల వాసు ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఏసీలు బిగించేందుకు, సర్వీస్ చేసేందుకు పలువురికి ఇళ్లకు వెళుతుండేవాడు. ఈ క్రమంలో అక్కడున్న మహిళలు, యువతులను పరిచయం చేసుకునేవాడు. వారి వివరాలను సేకరించి తరచూ వారికి ఫోన్లు చేయడం, వాట్సాప్, ఫేస్బుక్ల్లో చాటింగ్ చేసి వారిని ప్రేమిస్తున్నాని మాయమాటలు చెప్పి లోబర్చుకునేవాడు. వారి స్నేహితురాల వివరాలను తెలుసుకుని ఇదే తరహాలో వంచించేవాడు. ఆ తర్వాత వారిని బెదిరించి రూ.లక్షలు వసూలు చేసి విలాసవంతంగా జీవించసాగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వాసు నగరంలోని చిన్నబజారుకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. సదరు మహిళ ద్వారా ఆమె స్నేహితురాలైన వరంగల్ జిల్లా కె.సముద్రంకు చెందిన ఓ మహిళకు వలవేశాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమెను తీసుకుని నెల్లూరుకు వచ్చాడు. ఇందుకూరుపేటలోని గంగమ్మగుడిలో వివాహం చేసుకుని కాపురం పెట్టాడు. అనంతరం ఆమెను పీడించి డబ్బులు తీసుకుని తీవ్రంగా హింసించడంతో బాధిత మహిళ తన స్వగ్రామానికి వెళ్లింది. వాసుపై కె.సముద్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.12 లక్షలు కాజేశాడు అనంతరం ఇందుకూరుపేటకు చెందిన ఓ యువతికి ఫేస్బుక్, వాట్సప్ ద్వారా ప్రేమిస్తున్నాని సందేశాలు పంపి ఆమెను లోబర్చుకుని మోసం చేశాడు. కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటూ నగరానికి చెందిన ఓ వైద్య విద్యార్థినికి వలవిసిరాడు. ఆమెకు మాటలు చెప్పి రూ.12 లక్షలు నగదు కాజేశాడు. ఈ మేరకు బాధితురాలు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు ఇదే తరహాలో పలువురిని మోసగించినట్లు విచారణలో వెల్లడై ంది. అదేక్రమంలో 2013లో వాసు సైదాపురం పోలీసు స్టేషన్ పరిధిలో స్నేహితులతో కలిసి డెకాయిటీకి పాల్పడ్డాడని తేలింది. అతడిని అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. జాగ్రత్త.. విద్యార్థినులు, యువతులు, మహిళలు సోషల్ మీడియాను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ మురళీకృష్ణ సూచించారు. వ్యక్తిగత వివరాలు తెలుసుకుని దుండగులు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. తీయని మాటలు చెబుతూ ప్రేమిస్తున్నాని నమ్మబలికే ఈ తరహా వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. నిత్య ప్రేమికుడిని అతి చాకచక్యంగా అరెస్ట్ చేసిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి, ఎస్సై రమేష్, నాలుగో నగర హెడ్కానిస్టేబుల్ ప్రసాద్ను డీఎస్పీ అభినందించారు. -
ఇంటికి చేరుకునేలోపే..
నెల్లూరు , ఆత్మకూరు/మర్రిపాడు: మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ఘోర రోడ్డు ప్రమాదం వారి ప్రాణాలను బలితీసుకుంది. కుటుంబసభ్యుల్లో తీవ్ర నిషాదాన్ని నింపింది. అతివేగం కారణంగా మూడు నిండు ప్రాణాలు బలికావడంతోపాటు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి మర్రిపాడు మండలంలోని నందవరం సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లు ఉన్నారు. ఇంటి యజమాని సయ్యద్ వశీ అహ్మద్, అతని మరో ఇద్దరు కుమార్తెలు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన సయ్యద్ వశీ అహ్మద్ 15 సంవత్సరాల క్రితం జిల్లా కేంద్రమైన నెల్లూరుకు ఉపాధి కోసం వచ్చాడు. కర్నూలుకు చెందిన షాజీయా పర్వీన్ (40)ను వివాహం చేసుకున్న ఇతను నగరంలోని గాంధీనగర్లో ఉన్న ఓ స్కూల్ పక్కనే నివాసం ఉంటున్నాడు. ఆటోనగర్లో హోస్పైపుల తయారీ వ్యాపారం నిర్వహిస్తున్న అహ్మద్కు సౌమ్యుడిగా పేరుంది. తన వ్యాపారం, తన కుటుంబం అన్నట్లుగా ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె తుహారా బేగం డిగ్రీ, మరో కుమార్తె ఉమైనా బేగం (18) ఇంటర్మీడియట్, చిన్న కుమార్తె మొబీనా చదువుతున్నారు. ఇటీవల కళాశాలకు వరుసగా సెలవులు రావడంతో అహ్మద్ కుటుంబంతో సహా కారులో అత్త వారి ఊరైన కర్నూలుకు వెళ్లాడు. సెలవులు ముగుస్తుండడంతో గురువారం నెల్లూరుకు కారులో గురువారం బయలుదేరారు. ఈ క్రమంలో నందవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురికావడంతో అహ్మద్ భార్య షాజియా పర్వీన్ కుమార్తె ఉమైనా బేగంలను కోల్పోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న గాంధీనగర్లోని వశీ అహ్మద్ ఇంటి సమీపంలోని వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ కుటుంబానికి ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పనిచేసే చోటుకు వెళుతూ.. చేజర్ల మండలం కోటితీర్థంకు చెందిన పెంచలమ్మ, కుమారుడు నాగేంద్ర జీవనం కోసం బద్వేల్లో సిమెంట్ ఒరలు తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన వారు తిరిగి పనిచేసే ప్రాంతానికి వెళ్లేందుకు నెల్లూరుపాళెం వద్ద బద్వేల్కు వెళుతున్న కారులో ఎక్కారు. వారితోపాటు జలదంకి మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన రామానాయుడు (55) బద్వేల్కు వెళ్లేందుకు అదే కారులో ప్రయాణం చేస్తున్నాడు. నందవరం వద్ద ట్రాక్టర్ను తప్పించబోయి ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొంది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రామానాయుడు ఆస్పత్రిలో చికిత్స అందించేలోగా మృతిచెందాడు. బీపీ ఎక్కువై.. తల్లి పెంచలమ్మ, తమ్ముడు నాగేంద్ర రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న సుబ్బారాయుడు వారిని చూసేందుకు ఆత్మకూరులోని ఆస్పత్రికి వచ్చాడు. వారిద్దరిని చూసి బీపీ ఎక్కువ కావడంతో ఆస్పత్రి వెలుపల మెట్లపై బోర్లా పడిపోయాడు. దీంతో అతని దంతాలు ఊడిపోవడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. -
రూ.50 లక్షలు స్వాహా చేసిన ‘అక్షయపాత్ర’..!
సాక్షి, నెల్లూరు : ఓవైపు నట్టింట్లోకి టెక్నాలజీ సేవలు వచ్చి చేరడంతో ఆన్లైన్ మోసాలు పెరిపోగా.. మరోవైపు టీ దగ్గర నుంచి బాంబు చుట్టడం వరకు యూట్యూబ్ పుణ్యమా అని అందరూ నేర్చేసుకుంటున్నారు. ఇక మూఢనమ్మకాల పేరుతో బురిడీ కొట్టించడానికి ‘మహిమగాళ్ల’కు అమాయక జనం కొరత ఎప్పడూ ఉండదు. తాజాగా నెల్లూరు జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. అక్షయ పాత్ర పేరుతో జిల్లాలో జరిగిన భారీ మోసం బయటపడింది. అక్షయ పాత్రకు ఉన్న మహిమతో భారీగా సంపాదించవచ్చని పలువురికి ఆశ చూపిన నలుగురు వ్యక్తులు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రసాద్ రెడ్డి, హైదరాబాద్కు చెందిన కోళ్ల శేషగిరితో పాటు మరో ముగ్గురిని బురిడీ కొట్టించారు. వారి వద్ద నుంచి కోట్ల రూపాయాలు వసూలు చేశారు. అక్షయపాత్ర మోసాన్ని గ్రహించిన ప్రసాద్రెడ్డి చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నిందితులు వికాస్, సుభాష్లను అరెస్టు చేసిన పోలీసులు.. వారివద్ద నుంచి రూ.51 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
వేటాడుతున్నారు!
నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని వెలుగొండ అటవీ ప్రాంతంలో నిఘా పాగా వేసింది. ఎర్రచందనం కొల్లగొడుతున్న దొంగల కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. టాస్క్ఫోర్సు, స్థానిక పోలీసు అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున డక్కిలి పోలీసు డక్కిలి, వెంకటగిరి పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. 10 మంది అంతర్రాష్ట్ర ఎర్రస్మగ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను నెల్లూరులోని ఉమేష్చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్హాలులో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి విలేకరులకు వెల్లడించారు. దేవుడు వెల్లంపల్లిలో చేసిన దాడుల్లో డక్కిలి ఎస్సై నిందితుల నుంచి 78 ఎర్రచందనం దుంగలు, ఆరు సెల్ఫోన్లు, మూడు మోటారుబైక్లు, బరువు కొలిచే యంత్రం, రూ.900 నగదును స్వాధీనం చేసుకున్నారు. కోనమల్లేశ్వరకోనలో చేసిన దాడుల్లో వెంకటగిరి ఎస్సై తన సిబ్బందితో కలిసి నిందితులను అరెస్ట్చేసి 44 చందనం దుంగలు, ఆరు సెల్ఫోన్లు, మూడు మోటారుబైక్లు ఒక ఐచర్ వ్యాన్, 8.5 కిలోల ఎర్రచందనం పొడి, బరువు తూచే యంత్రం, రూ.1,200 నగదను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రదుంగలు, వాహనాలు విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.75 కోట్లు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతోపాటు వారి ఆస్తులను సీజ్ చేస్తామని తెలిపారు. సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులను అందజేశారు. సమాచారం అందించండి జిల్లా పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు, ఎర్రచందనం, ఇసుక, సిలికా, గుట్కా అక్రమరవాణాపై ప్రజలు 9390777727, డయల్ 100, క్రైమ్ స్టాఫర్ 1090కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి, టాస్క్ఫోర్స్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ వెంకటరావు, డక్కిలి, వెంకటగిరి ఎస్సై వాసు, కొండపనాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చైనా మార్కెట్కు.. డక్కిలి మండలంలోని దేవుడువెల్లంపల్లి కొండల్లో, వెంకటగిరి మండలంలోని కోన మల్లేశ్వరకోనల్లోని అటవీ ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు పాగావేశారు. విలువైన ఎర్రచందనం దుంగలను నరికి రహస్య మార్గాల్లో చెన్నై, ముంబై, కొచ్చి, కాండ్లా, కోల్కత్తాలోని నౌకాశ్రయాలకు చేరుస్తున్నారు. అక్కడినుంచి అంతర్జాతీయ మార్కెట్కు తరలించి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కొందరు స్మగ్లర్లు దుంగలను హస్తకళా వస్తువులుగా మార్చి విమానాల ద్వారా చైనా మార్కెట్కు తరలిస్తున్నారు. గతేడాది.. గతేడాది 45 కేసులు నమోదు చేసి 222 మందిని అరెస్ట్ చేశారు. వారినుంచి రూ 13.91 కోట్లు విలువచేసే 13 టన్నుల బరువు కలిగిన 1,330 దుంగలు, 54 వాహనాలు, 193 సెల్ఫోన్లు, ఐదు తుపాకులు, ఆరు గొడ్డళ్లు, రూ.75 వేల నగదు, 800 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది స్మగ్లర్లపై పీడీయాక్ట్లు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమరవాణాను పూర్తిస్థాయిలో కట్టడిచేసే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జిల్లాలోని వెలుగొండ అటవీ, సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా ఓ వైపు పోలీసులు దాడులు చేసి స్మగ్లర్ల ఆటలు కట్టిస్తున్నా మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాల్లో విలువైన ఎర్రసంపదను సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. వందేళ్లకు పైబడిన.. పోలీసులు స్వాధీనం చేసుకున్న దుంగల్లో 100 సంవత్సరాలకు పైబడిన 192 కిలోల బరువున్న వేరుముద్ద ఉంది. ప్రస్తుతం జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎర్రచందనం వేరుముద్దల అక్రమరవాణా జోరుగా సాగుతోంది. వాటికి చైనా, సింగపూర్, మలేసియా, జపాన్, హాంకాంగ్తోపాటు అరబ్ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ దేశాల ప్రజలు ఈ వేరుముద్దలతో తయారుచేసిన వస్తువులకు అతీంద్రియ శక్తులు ఉంటాయని బలంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో వీటిపై ఎర్రస్మగ్లర్లు దృష్టి సారించారు. -
ముఠా చిక్కిందా?
నెల్లూరు(క్రైమ్): బైక్ దొంగతనాలు జిల్లావాసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇల్లు, బయట అన్న తేడా లేకుండా ఎక్కడా పార్కింగ్ చేసినా దుండగులు అపహరించుకెళుతున్నారు. నెల్లూరు నగరంతోపాటు, శివారు ప్రాంతాల్లో బైక్ చోరీలు అధికంగా జరుగుతున్నాయి. రూ.వేలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు అపహరణకు గురవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైక్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వెళితే దొంగల కోసం గాలిస్తున్నామని దొరికితే వాహనాలు ఇస్తామని చెప్పి పంపుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. నిఘా ముమ్మరం ఈ నేపథ్యంలో నెల్లూరు సీసీఎస్ పోలీసులు బైక్ దొంగతనాలపై దృష్టి సారించారు. చోరీలకు పాల్పడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. పాతనేరస్తుల కదలికలపై నిఘా ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్చేసి రూ.లక్షలు విలువచేసే బైక్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. తాజాగా నెల్లూరు నగరంలో ఓ ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వారి వద్ద నుంచి పెద్దసంఖ్యలో బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరిన్ని బైక్లను రాబట్టే పనిలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా పట్టుబడుతున్న దొంగల్లో అందరూ కొత్తవారే. 25 ఏళ్లలోపు ఉన్న యువకులే కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. జల్సాల కోసం నేరాలబాట కొందరు యువకులు విలాసవంతమైన జీవితం కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. బెట్టింగ్, మద్యం, వ్యభిచారం, పేకాట తదితర జల్సాలకు అలవాటుపడిన కొందరు నేరాల బాట పడుతున్నారు. దొంగలించిన సొత్తును విక్రయించి జల్సాగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ముగ్గురు యువకులు బైక్ దొంగతనాలకు పాల్పడుతూ సీసీఎస్ పోలీసులకు చిక్కిన విషయం విధితమే. సదరు నిందితులు విచారణలో మత్తు ఉత్ప్రేరకాలు, మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో చోరీలు చేస్తున్నామని వెల్లడించారు. బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఓ మైనర్ ఉన్నాడు. గతంలో ఈ తరహా దొంగతనాలు పాతనేరస్తులు చేసేవారు. ఇప్పుడు కొత్తవారు ఆర్థిక అవసరాల కోసం దొంగలుగా మారి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పలు ఘటనలు.. ♦ నెల్లూరు మూలాపేటకు చెందిన అరుణ్కుమార్ ఇటీవల నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లాడు. అక్కడ తన బైక్ను పార్క్చేసి హాస్పిటల్లో ఉన్న బంధువులను పలకరించి వచ్చేలోగా అతని బైక్ అపహరణకు గురైంది. ♦ నెల్లూరు నవాబుపేటకు చెందిన చాన్బాషా విజయమహాల్గేటు సమీపంలోని కల్యాణమండపం వద్ద బైక్ను పార్క్చేసి టికెట్ల కోసం ఎస్–2 థియేటర్కు వెళ్లాడు. తిరిగి వచ్చేలోపు అతని బైక్ చోరీకి గురైంది. ♦ నెల్లూరు బట్వాడిపాళెంకు చెందిన పీటర్ బంధువులను రైలు ఎక్కించేందుకు బైక్పై రైల్వేస్టేషన్కు వెళ్లారు. తిరిగి వచ్చిచూసేసరికి బైక్ను దుండగులు అపహరించారు. ఇలా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బైక్ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
నెల్లూరు(క్రైమ్): వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వివాహిత దారుణహత్యకు గురైన ఘటన నెల్లూరులోని నవాబుపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న రాజీవ్గాంధీ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, భర్త సమాచారం మేరకు.. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన శ్యామల (28)కు కోట బొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బి.లక్ష్మీనారాయణతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉమ (ఐదో తరగతి), శివరామ్ (ఒకటో తరగతి) పిల్లలు న్నారు. ఏడాది క్రితం లక్ష్మీనారాయణ తీవ్ర అనారోగ్యానికి గురై అక్కడి ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో శ్యామలకు తన స్వగ్రామానికి చెందిన సమీప బంధువు పి.రాజుతో స్నేహం మొదలైంది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అనంతరం ఆస్పత్రిలో ఉన్న భర్త వద్దకు రాజును తీసుకువచ్చి మనకు అండగా ఉంటాడని చెప్పి అతనివద్దనే ఉంచింది. లక్ష్మీనారాయణ కోలుకునేంత వరకు రాజు అతనితోనే ఉన్నాడు. వైద్యశాల నుంచి డిశ్చార్జి అయిన కొద్దిరోజుల్లోనే శ్యామల, రాజుల ప్రవర్తనపై భర్తకు అనుమానం వచ్చింది. భార్యకు ఆమె కుటుంబసభ్యుల ద్వారా చెప్పించడంతోపాటు రాజును సైతం మందలించాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పురాలేదు. అప్పటికే లక్ష్మీనారాయణ అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో నెల్లూరులో నివాసం ఉంటున్న శ్యామల బంధువుల వద్దకు వెళ్లి పనులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏడునెలల క్రితం నెల్లూరుకు.. అప్పులు తీరుతాయని, మరోవైపు రాజు బాధ తప్పుతుందని భావించిన లక్ష్మీనారాయణ కుటుంబంతో కలిసి ఏడునెలల క్రితం నెల్లూరుకు వచ్చాడు. కొత్తకాలువ సెంటర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బేల్దారి పనులు చేసుకోసాగాడు. ఈ క్రమంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో రైస్మిల్లులో లక్ష్మీనారాయణ పనికి చేరాడు. అతనికి తెలియకుండా రాజు తరచూ నెల్లూరుకు వచ్చి శ్యామలతో మాట్లాడి వెళ్లేవాడు. కొంతకాలం క్రితం లక్ష్మీనారాయణ పనిపై శ్రీకాకుళం వెళ్లగా రాజు నెల్లూరుకు చేరుకుని అతనికి ఫోన్ చేశాడు. దీంతో భర్త విషయాన్ని శ్యామల బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు వెళ్లి రాజును అక్కడినుంచి పంపివేశారు. లక్ష్మీనారాయణ నెల్లూరుకు చేరుకుని 15 రోజుల క్రితం కొత్తకాలువ వద్ద నుంచి కాపురాన్ని కిసాన్నగర్ రాజీవ్గాంధీకాలనీకి మార్చాడు. పిల్లల్ని స్థానికంగా ఉన్న మున్సిపల్ పాఠశాలలో చేర్పించాడు. మందలించినా.. ఇటీవల రాజు నెల్లూరుకు రాగా లక్ష్మీనారాయణ అతడిని భార్యను మందలించాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో శ్యామల కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వారు గ్రామానికి రావాలని సూచించడంతో పిల్లలు తీసుకుని అతను అక్కడకు వెళ్లారు. అప్పటికే శ్యామల వారి పుట్టింట్లో ఉంది. పెద్దమనుషులు శ్యామలను మందలించారు. ఫోనులో రాజును హెచ్చరించారు. శ్యామల మరోమారు ఇలా చేయనని చెప్పి భర్తతో కలిసి నెల్లూరుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె తనతో రాకపోతే చంపేస్తానని, లేదంటే చచ్చిపోతానని రాజు బెదిరిస్తున్నాడని భర్తకు చెప్పింది. తనను వదిలేయమని రాజును ప్రాధేయపడింది. రోకలిబండతో కొట్టి.. రాజు రెండురోజుల క్రితం నెల్లూరుకు చేరుకున్నాడు. బుధవారం లక్ష్మీనారాయణ పని నిమిత్తం రైస్మిల్లుకు వెళ్లడం, ఉమ టిఫిన్ కోసం వెళ్లడాన్ని గుర్తించాడు. వెంటనే ఇంట్లోకి ప్రవేశించిన తనతో వచ్చేయాలని రాజు శ్యామలను కోరాడు. ఆమె నిరాకరించడంతో రోకలిబండతో తలపై మోదాడు. దీంతో ఆమె తలపగిలి తీవ్రరక్తసావ్రం అవుతుండటంతో అక్కడినుంచి పరావుతూ రోకలిబండను ముళ్లపొదల్లో విసిరేశాడు. శ్యామల తనను కాపాడాలని పెద్దగా కేకలువేస్తూ ఇంట్లోనుంచి బయటకు వెళ్లి అక్కడే కుప్పకూలి మృతిచెందింది. «శ్యామల హత్య ఘటనపై స్థానికులు నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.బాలసుందరరావు, నవాబుపేట ఎస్సైలు శ్రీహరి, ప్రతాప్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి భర్తను పిలిపించి హత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
అంతర్జిల్లా ఎర్ర దొంగల ముఠా అరెస్ట్
నెల్లూరు(క్రైమ్) : ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 8 మంది అంతర్జిల్లా ఎర్రచందనం దొంగల ముఠాను మర్రిపాడు ఎస్ఐ, టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.55లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని ఉమేష్చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి నిందితుల వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా ఎర్రదొంగల కదలికలపై నిఘా ఉంచామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. శుక్రవారం వేకువన మర్రిపాడు మండల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందిందన్నారు. మర్రిపాడు ఎస్ఐ తిరుపతయ్య, ఎర్రచందనం టాస్క్ఫోర్స్ ఇన్చార్జి వెంకటరావు తన సిబ్బందితో కలిసి పడమటినాయుడిపల్లి ట్యాంక్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారన్నారు. మారుతీ ఓమిని వ్యాన్లో కొందరు అనుమానాస్పదంగా కనిపించగా తనిఖీ చేశామన్నారు. ఈ క్రమంలో దుండగులు పోలీసు సిబ్బందిని నెట్టివేసి పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారన్నారు. వారి వద్ద నుంచి రూ.55లక్షల విలువచేసే ఒకటిన్నర టన్నుల బరువు కలిగిన 18 ఎర్రదుంగలు, మారుతీకారు, నాలుగు ద్విచక్రవాహనాలు, తొమ్మిది సెల్ఫోన్లు, రూ.4,100నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొంతకాలంగా అక్రమ రవాణా వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం దాసరిపాళేనికి చెందిన ఎం.నరహరి, బ్రహ్మంగారి మఠం రేకులకుంటకు చెందిన వెంకటేష్ కొంత కాలం నుంచి ఎర్రస్మగ్లర్లుగా అవతారమెత్తారని ఎస్పీ తెలిపారు. బద్వేల్ మండలం బాలాయపల్లికి చెందిన ఎన్. చంద్రశేఖర్(పైలెట్), పోరుమామిళ్ల మండలం రేపల్లికి చెందిన ఏ ప్రభాకర్(ఉడ్ కట్టర్), కలతసాడు మండలం చెన్నుపల్లికి చెందిన చంద్రశేఖర్(ఉడ్కట్టర్), రాయచోటి నియోజకవర్గం మోతకట్లకు చెందిన జె.వెంకటేశ్వర్లు(పైలెట్), నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తడకలూరు గ్రామానికి చెందిన జె.విజుæ(వాహన యజమాని, పైలెట్), కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా కొండషెత్తల్లికి చెందిన అక్రమ్పాషాల(డ్రైవర్)తో కలిసి ముఠాగా ఏర్పడినట్లు తెలిపారు. నెల్లూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం దుంగలను నరికించి చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకునేవారని వివరించారు. పైఅందరిపై చార్జిషీట్లు తెరవనున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఏఎస్పీ పీ పరమేశ్వర్రెడ్డి, ఎర్రచందనం టాస్క్ఫోర్స్ ఇన్చార్జి వెంకటరావు, మర్రిపాడు ఎస్సై తిరుపతయ్య పాల్గొన్నారు. -
కూతుర్ని ప్రేమికుడితో చూసి..
గూడూరు: కన్న కూతురు ప్రియుడితో ఉండడాన్ని చూసిన తండ్రి సహనం కోల్పోయి, కత్తితో దాడి చేయగా అడ్డుగా వచ్చిన కుమార్తె గాయపడి ఆసుపత్రి పాలైన సంఘటన శుక్రవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. ఎస్ఐ హుస్సేన్బాషా తెలిపిన మేరకు.. నరశింగరావుపేటలో కూకటి సిద్ధయ్య కుటుంబం నివాసముంటోంది. సిద్ధయ్య గొర్రెల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని కుమార్తె దేవయాని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన జావీద్ ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. దేవయాని, జావీద్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దేవయాని తండ్రి సిద్ధయ్య ప్రతి శుక్రవారం సంతకు వెళ్లి గొర్రెలు కొనుగోలు చేసి, వాటిని చెన్నైకి తీసుకెళ్లి విక్రయిస్తూ వస్తుంటాడు. శుక్రవారం తెల్లవారుజామునే సిద్ధయ్య చిల్లకూరులో జరిగే సంతకు వెళ్లాడు. తల్లి లక్ష్మి బయటకు వెళ్లింది. దీంతో దేవయాని తన ప్రియుడు జావీద్ను ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. జావీద్ సిద్ధయ్య ఇంటికి వచ్చాడు. సంతకు వెళ్లిన సిద్ధయ్య గొర్రెలు కొనుగోలు చేసేందుకు ధరలు అనుకూలంగా లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చి తలుపు తట్టగా, భయాందోళనకు గురైన దేవయాని, జావీద్ను దేవునిమూల చాటుగా దాచి తలుపు తీసింది. సిద్ధయ్య ఇంట్లోకి వచ్చి నగదును బీరువాలో ఉంచేందుకు దేవుని గదిలోకిరాగా, అక్కడ నక్కి ఉన్న జావీద్ను చూసి కోపోద్రిక్తుడయ్యాడు. చాకుతో జావీద్పై దాడి చేయబోగా దేవయాని అడ్డుగా వచ్చింది. ఆమె తలకు గాయమైంది. పొరుగువారు గాయపడిన దేవయానిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ హుస్సేన్బాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగతనం చేసిందంటూ బాలికపై దాష్టీకం
సంగం: డబ్బు దొంగిలించిందంటూ నేరం మోపి తనను ఉపాధ్యాయులు చితకబాదారని గురుకుల విద్యార్థిని బుధవారం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సంగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల్లూరు తడికల బజారుకు చెందిన రాపూరు రమణయ్య, మునెమ్మల పెద్ద కుమార్తె నందిని.. సంగం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఈ నెల 7న కళాశాలకు చెందిన అటెండర్ భువనేశ్వరి ఆఫీసు రూం నుంచి హాజరుపట్టిక తీసుకురమ్మని నందినిని పంపింది. నందిని వెళ్లి రిజిస్టర్ను తీసుకొచ్చి భువనేశ్వరికి ఇచ్చింది. కొంతసేపటి తర్వాత భువనేశ్వరి ఆఫీస్ రూంలో ఉంచిన తన హ్యాండ్ బ్యాగ్లో రూ.19,600 నగదు కనిపించట్లేదని.. నువ్వే తీశావంటూ నందినిని నిలదీసింది. తనకు తెలియదని హాజరుపట్టిక మాత్రమే తెచ్చానని నందిని మొరపెట్టుకున్నా వినలేదు. పాఠశాల ప్రిన్సిపాల్ మార్గరేట్, గణితం ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఎన్ఎస్ ఉపాధ్యాయురాలు విజయ, మరో ఉపాధ్యాయురాలు నాగ లలిత, కంప్యూటర్ ఆపరేటర్ మురళీ, అటెండర్ భువనేశ్వరి బాలికను గదిలో నిర్బంధించి చితకబాదారు. 21న నందిని తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి, వారికి విషయం చెప్పగా డబ్బులు తీసుకుని ఉంటే ఆ అమ్మాయి దగ్గర ఉండాలి కదా అని వారు ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు వారిని పంపించేసి నందినిని మరో గదిలో నిర్బంధించి 22న మధ్యాహ్నం వరకు కొడుతూనే ఉన్నారు. సెలవులు రావడంతో 22న సాయంత్రం నందిని తల్లిదండ్రులు కళాశాలకు వచ్చారు. వారిని రూ. 20 వేలు కట్టి నందినిని తీసుకుని వెళ్లాలని ప్రిన్సిపాల్, మరో ఐదుగురు ఉపాధ్యాయులు తేల్చిచెప్పడంతో, వారు తాము కూలి పని చేసుకునేవారమని బతిమిలాడి రూ. 5 వేలు నగదు భువనేశ్వరికి ఇచ్చి నందినిని తీసుకెళ్లారు.ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ నందిని, ఆమె తల్లిదండ్రులు రమణయ్య, మునెమ్మ సంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విషం తాగి వివాహిత ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత మరో మహిళతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ విషయమై దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి. పద్ధతి మార్చుకోమని పలుమార్లు భార్య కోరింది. అయినా అతనిలో మార్పురాకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది వివాహిత విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు వెంకటేశ్వరపురానికి చెందిన సాయిభాను (29), రాజీవ్ గృహకల్పకు చెందిన శేఖర్లు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి రాజీవ్గృహకల్పలో నివాసం ఉంటున్నారు. సాయిభాను పాచి పనులు చేస్తుండగా, శేఖర్ ఆటో నడుపుతున్నాడు. శేఖర్ తరచూ బీవీనగర్లోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో స్నేహితుని భార్య చెల్లెలితో అతనికి పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉండసాగారు. భర్త ప్రవర్తనలో మార్పురావడాన్ని గుర్తించిన సాయిభాను అతని గురించి ఆరాతీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భర్తను పద్ధతి మార్చుకోమని చెప్పింది. అయినా అతని ప్రవర్తనలో మార్పురాకపోగా మహిళకు మరింత దగ్గరయ్యాడు. దీంతో సాయిభాను పెద్దలను ఆశ్రయించి న్యాయం చేయమని కోరింది. వారు సర్దిచెప్పి కాపురాన్ని చక్కదిద్దారు. కొద్దిరోజులు ప్రశాంతంగా ఉన్నారు. వారంరోజుల క్రితం శేఖర్ ఏకంగా ఆ మహిళను తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకువచ్చాడు. అక్కడే ఉంచి ఆమెతో సహజీవనం చేయసాగాడు. దీంతో సాయిభాను, శేఖర్ల నడుమ రోజూ తీవ్ర ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఆ మహిళను పంపివేయాలని భార్య పట్టుబట్టింది. అయినా శేఖర్ పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన సాయిభాను ఈనెల 17వ తేదీన విషం తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు హుటాహుటిన జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 22వ తేదీన మృతిచెందింది. సమాచారం అందుకున్న చిన్నబజారు ఎస్సై కరిముల్లా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆదివారం మృతురాలి కుటుంబసభ్యులు సమక్షంలో స్థానిక తహసీల్దార్ మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలి చెల్లెలు పావని ఫిర్యాదు మేరకు కరిముల్లా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రిమాండ్ ఖైదీ పరారీ
నెల్లూరు(క్రైమ్): రైల్వే పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన బుధవారం అర్ధరాత్రి నెల్లూరులో జరిగింది. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేట మండలం సనత్నగర్కు చెందిన రంగా అలియాస్ ఎలాంగో అలియాస్ రవి చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రేణిగుంట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నెల్లూరు రైల్వే కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి నిందితుడు నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ అనుభవిస్తున్నారు. నిందితుడిపై తమిళనాడు రాష్ట్రం జోలార్పేటై రైల్వేపోలీసుస్టేషన్ పరిధిలో కేసులు ఉన్నాయి. నిందితుడిని తిరువత్తూరు జేఎఫ్సీఎం(111) కోర్టులో హాజరు పరిచేందుకు జోలార్పేటై రైల్వే సీఐ ఎస్.శివాహమిరమి తన సిబ్బందితో కలిసి బుధవారం నెల్లూరుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుంచి పీటీ వారెంట్పై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బంగారు వ్యాపారిని తరలించే యత్నం.. అడ్డుకున్న సహచర వ్యాపారులు రంగాను రైల్వేపోలీసులు ఓ దొంగతనం కేసుకు సంబంధించి విచారించగా చిన్నబజారులోని ఓ బంగారు దుకాణంలో చోరీ సొత్తును విక్రయించాడని వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితుడిని వెంట బెట్టుకుని సదరు బంగారు దుకాణం వద్దకు వెళ్లి దుకాణ యజమానిని విచారించారు. అతను తన వద్ద అమ్మలేదని చెప్పడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా సహచర వ్యాపారులు పోలీసులను అడ్డుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న సంతపేట ఎస్సై సుభాన్ ఘటన స్థలానికి చేరుకుని రైల్వేపోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరూ కలిసి సంతపేట పోలీసుస్టేషన్కు వెళ్లారు. అక్కడ నిందితుడు చెప్పిన వివరాల మేరకే వ్యాపారిని అదుపులోకి తీసుకుంటున్నామని తమిళనాడు పోలీసులు సంతపేట పోలీసులకు తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపకపోవడంతో అవి తీసుకు వచ్చి వ్యాపారిని తీసుకెళ్లాలని పోలీసులు చెప్పడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. ప్యాసింజర్లో తరలిస్తుండగా కళ్లుగప్పి బుధవారం రాత్రి నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి కాకినాడ తిరుపతి ప్యాసింజర్లో తిరుపతికి బయలుదేరారు. రైలు సిగ్నల్ కోసం కొమ్మరపూడి సమీపంలో ఆగగా నిందితుడు మరుగుదొడ్డికి వెళ్లాలని చెప్పడంతో వారు అతన్ని బాత్రూమ్వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు వారిని తోసేసి రైల్లోంచి దూకి పరారయ్యాడు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న రైల్వే సిబ్బంది, సీఐ హుటావుటిన రైల్లో నుంచి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో అప్పటికే నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ మేరకు సీఐ నెల్లూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎస్డీ సిరాజుద్దీన్ కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
సాల్మాన్పురంలో భారీ పేలుడు
నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని సాల్మాన్పురం శివారు ప్రాంతంలోని కోటయ్య నివాసంలో సోమవారం అర్ధరాత్రి భారీ పేలుడు జరిగింది. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన కోటయ్య కోతులు, పందులను కాల్చేవాడు. తుపాకీ లైసెన్స్ పొంది ఉన్నాడు. ఈ క్రమంలో కొంత కాలం కిందట సాల్మాన్పురం శివారు ప్రాంతంలోని ఇంటిని కొన్నాడు. కోటయ్య బుచ్చిరెడ్డిపాళెంలోనే నివాసముంటున్నాడు. ఇంట్లో నల్ల మందును నిల్వ చేసుకున్నాడు. తుపాకీ గుండ్లకు కావాల్సినంత కాకుండా మొత్తం కలిపి ఉంచాడు. దీంతో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇల్లు మొత్తం నేలమట్టమైంది. గోడలు సైతం పగిలి చెల్లాచెదురుగా పడ్డాయి. ఇంటి శకలాలు గ్రామంలో వెళ్లి పడ్డాయి. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి పరిశీలించారు. సీఐ సుబ్బారావు, సంగం ఎస్సై నాగార్జున ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కోటయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. నల్లమందు నిల్వ కారణమని తేల్చారు. నల్లమందు నిల్వపై నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణం కావడంపై కోటయ్యపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
తండ్రే కాలయముడు
నెల్లూరు, విడవలూరు: మద్యానికి బానిసై చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని కన్న కొడుకునే కడతేర్చాడు ఓ తండ్రి. ఈ ఘటన మండలంలోని చౌకచెర్లలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చౌకచెర్ల గ్రామానికి చెందిన ఎల్లు వెంకయ్య కుమారుడు ఎల్లు కిరణ్ (35) దంతవైద్య నిపుణుడు. కిరణ్ నెల్లూరులోని బీవీనగర్లో సొంతగా దంద వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. అయితే కిరణ్ నాలుగేళ్ల క్రితం కడపకు చెందిన దంత వైద్య నిపుణురాలైన ముస్లిం యువతిని మతాంతర వివాహం చేసుకున్నాడు. మొదటి నుంచి కిరణ్ మద్యానికి బానిస కావడంతో భార్యను కూడా శారీరకంగా మానసికంగా చిత్ర హింసలకు గురి చేసేవాడు. దీంతో భార్య రెండేళ్ల క్రితం కిరణ్ను వదిలేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న కిరణ్ మరింత మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు చౌకచెర్లలో ఉన్న తన తల్లిదండ్రులైన వెంకయ్య, లక్ష్మి వద్దకు వచ్చి వారిపై దాడి చేసి వారిని శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా కిరణ్ పూటుగా మద్యం తాగి చౌకచెర్లలోని తన ఇంటికి వచ్చి తండ్రి వెంకయ్యతో పాటు తల్లి లక్ష్మిపై దాడి చేశాడు. దీంతో సహనం కోల్పోయిన తండ్రి వెంకయ్య కొడుకు నుంచి తప్పించుకునేందుకు రోకలి బండతో కిరణ్పై దాడి చేశాడు. అయితే రోకలి దెబ్బ అదుపు తప్పి కిరణ్ తలపై బలంగా తగలడంతో కిరణ్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోవూరు సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, విడవలూరు ఎస్సై ముత్యాలరావు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించడంతో పాటు కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
వివాహిత బలవన్మరణం
నెల్లూరు(క్రైమ్): వారిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వ్యసనాలకు బానిసైన భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. ఆది వారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త ఆమెను తీవ్రంగా కొట్టడంతో తలకు తీవ్రగాయమైంది. మనస్తాపానికి గురైన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నెల్లూరు వెంగళరావ్నగర్ సీ బ్లాక్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరా లిలా ఉన్నాయి. వెంగళరావ్నగర్ సీ బ్లాక్లో హుస్సేన్సాహెబ్ మస్తానమ్మ దంపతులు ఉంటున్నా రు. వారికి ముగ్గురు పిల్లలు. చిన్నకుమార్తె సుల్తానీ అలియాస్ సుప్రియ (24) అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్ చంద్రశేఖర్లు ప్రేమించుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వివాహమైన కొద్దిరోజులు కాపురం సజావుగా సాగింది. తర్వాత చంద్రశేఖర్ వ్యసనాలకు బానిసై కుటుంబపోషణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఈ విషయమై దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి. అయినా మార్పురాలేదు పలుమార్లు సుప్రియ భర్తను పద్ధతి మార్చుకోవాలని కోరింది. అయినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత పెద్దలు రాజీకుదిర్చారు. దీపావళి సందర్భంలో గొడవలు తీవ్రరూపం దాల్చడంతో మళ్లీ ఆమె తన పుట్టింటికి వెళ్లింది. చంద్రశేఖర్ అక్కడకు వెళ్లి భార్యతోపాటు అత్తమామలపై దాడిచేశాడు. అత్త చేయిని విరగొట్టాడు. అప్పట్లో బాధితురాలు మహిళా పోçలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భార్యను బాగా చూసుకుంటానని నమ్మబలకడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. రెండు, మూడురోజులు తర్వాత చంద్రశేఖర్ మళ్లీ భార్యను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. తల్లికి చేయివిరగడంతో సుప్రియనే వారికి వంటచేసి వచ్చేది. ఆదివారం ఉదయం తల్లికి చికెన్ ఇచ్చి మళ్లీ వచ్చి వంట చేస్తానని చెప్పి తన ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో దంపతుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సుప్రియను తీవ్రంగా కొట్టి చంద్రశేఖర్ ఇంట్లోనుంచి బయటకు వెళ్లాడు. సుప్రియ తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె పిల్లల్ని బయటకు పంపి ఇంటిలోపల గడియ పెట్టుకుని ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వంట చేసేందుకు వస్తానని చెప్పిన కుమార్తె ఎంతకీ రాకపోవడంతో మస్తానమ్మ సుప్రియ ఇంటివద్దకు చేరుకుంది. కిటికీలోనుంచి తొంగిచూడగా సుప్రియ ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని చూసి పెద్దగా కేకలు వేసింది. స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లిచూడగా ఆమె అప్పటికే మృతిచెంది ఉంది. వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నరసింహరావు, ఎస్సై కొండయ్యలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మృతదేహాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చి చంద్రశేఖర్ను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు. -
సెల్ఫోన్ వాడాడు.. దొరికిపోయాడు
నెల్లూరు(క్రైమ్): నేరం చేసిన వాడు ఎప్పటికైనా ఊచలు లెక్కించాల్సిందేనన్న నానుడి అక్షరాలా రుజువైంది. ఓ దుండగుడు వృద్ధురాలిని హత్యచేసి నగదు దోచుకెళ్లాడు. పోలీసులు పట్టుకోలేరనుకున్నాడు. ఓ ఇంట్లో సెల్ఫోన్ను దొంగిలించి దానిని వినియోగించాడు. చివరకు అదే అతడిని పోలీసులకు పట్టించేలా చేసింది. విచారణలో వృద్ధురాలి హత్యతోపాటు పలునేరాలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నెల్లూరులోని ఉమేష్చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్హాలులో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి నిందితుడి వివరాలను వెల్లడి ంచారు. కొడవలూరు మండలం రాజుపాళెంకు చెందిన జి.విజయ్కుమార్ వ్యసనాలకు బానిసై దొంగగా మారాడు. పెద్దపుత్తేడులోని కోదండరామస్వామి దేవాలయంలో ఉన్న కలశం రూ.కోట్లు విలువ చేస్తుందని భావించిన అతను తన స్నేహితులతో కలిసి 2016లో దానిని దొంగిలించాడు. అప్పట్లో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. హమాలీగా పనిచేస్తూనే... జైలు నుంచి బయటకు వచ్చిన విజయ్కుమార్ ప్రస్తుతం నెల్లూరులోని వేదాయపాళెం జనశక్తినగర్లో ఉంటూ ఓజిలిలోని లిక్కర్ గోదాములో హమాలీగా పనిచేస్తున్నాడు. రాత్రిపూట నేరాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. ఇటీవల వేదాయపాళెం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో ఎల్ఈడీ టీవీ, సెల్ఫోన్, గ్యాస్ సిలిండర్, తాళిబొట్టును అపహరించుకెళ్లాడు. బా«ధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఎస్, వేదాయపాళెం పోలీసులు అపహరణకు గురైన సెల్ఫోన్ టవర్ లొకేషన్, కాల్ డీటైల్స్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నిందితుడు వేదాయపాళెం రైల్వే స్టేషన్లో ఉన్నాడని టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సీసీఎస్, వేదాయపాళెం పోలీసు ఇన్స్పెక్టర్లు షేక్ బాజీజాన్సైదా, జి.నరసింహారావు, సీసీఎస్ ఎస్సై టి.మధుసూదన్రావు, వారి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విజయకుమార్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బయటపడ్డ హత్యకేసు నిందితుడిని విచారించే క్రమంలో నెల్లూరులోని బీవీనగర్ ఉప్పుకట్లవారివీధిలో ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీ అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన వృద్ధురాలు మహబూబ్జానీ (68) కేసు వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా నిద్రిస్తున్న మహబూబ్జానీని హత్యచేసి ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను అపహరించుకువెళ్లినట్లు విజయకుమార్ విచారణలో వెల్లడించాడు. ఇంకా ఈ ఏడాది మే 21వ తేదీన కొడవలూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలోని 32 గ్రాముల బంగారు గొలుసును, అదే ప్రాంతంలో ఓ మహిళ మెడలోని 12 గ్రాముల బంగారు సరుడును తెంపుకెళ్లినట్లు చెప్పాడు. అక్టోబర్ 16వ తేదీన వేదాయపాళెం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో ఎల్పీజీ స్టౌవ్, గ్యాస్ సిలిండర్, ఈనెల 15న వేదాయపాళెం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, 19, 25 తేదీల్లో రెండు ఇళ్లలో ఎల్ఈడీ టీవీలను చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రూ.3 లక్షలు విలువచేసే 86 గ్రాముల బంగారు ఆభరణాలు, 65 గ్రాముల వెండి ఆభరణాలు, 4 సిలిండర్లు, 2 ఎల్ఈడీ టీవీలు, నాలుగు సెల్ఫోన్లు, గ్యాస్స్టౌవ్ను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి అభినందన నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన సీసీఎస్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు, నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, సీసీఎస్, వేదాయపాళెం ఇన్స్పెక్టర్లు, సీసీఎస్ ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కేసును ఛేదించేందుకు కృషిచేసిన సీసీఎస్ సిబ్బంది పి.సుబ్రహ్మణ్యం, సతీష్కుమార్, వినోద్కుమార్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులను అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి, క్రైమ్ ఏఎస్పీ ఆంజనేయులు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
సెల్ఫీ పోలిసింగ్
నేరస్తులు మొదలుకుని అనుమానితుల వరకు ప్రతిఒక్కరితో సెల్ఫీ దిగాలి. రాత్రి డ్యూటీలో ఉండే పోలీసులు వారి లోకేషన్ను షేర్ చేయాలి. పోలీసులకు సెల్ఫీలు, లోకేషన్లతో ఏం పని. ఇదేదో వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఒక వినూత్న ప్రయోగం. ఇది జిల్లా పోలీస్ బాస్ ఎస్పీ ఐశ్యర్య రస్తోగి కొత్త రూల్. సరికొత్త పోలిసింగ్ మొదలైంది. టెక్నాలజీకి కాస్త దూరంగా ఉండే పోలీసులు కూడా దానినే పూర్తిగా నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్తకొత్త మార్పులు కొంత ఇబ్బందికరంగా ఉన్నా తప్పనిసరి. పోలీస్ బాస్ ఆదేశాలతో పోలీసులందరూ సెల్ఫీల బాట పడుతున్నారు. విజిబుల్ పోలీసింగ్ పక్కా అమలు కోసమే ఈ సెల్ఫీ పోలీసింగ్. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో నేరాల నియంత్రణ కోసం ఎస్పీ ఐశ్యర్య రాస్తోగి టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్తగా ఈ–బీట్ సిస్టమ్ను అమలులోకి తేవడం, అలాగే విజిబుల్ పోలీసింగ్ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించి సరికొత్త విధానానికి తెరతీశారు. ఆయా స్టేషన్ పరిధిలోని ఎస్సైలు, సీఐలు నిత్యం వారి పరిధిలోని దొంగలు మొదలుకుని రౌడీషీటర్ల వరకు అందరి ఇళ్లు ఒక్కసారి తనిఖీ చేయాలి. తనిఖీలు చేసినట్లు ఆధారం కోసం అక్కడ వారితో ఒక సెల్ఫీ దిగి జిల్లా ఎస్పీ నంబర్కు నిత్యం వాట్సాప్ చేయాలి. అలాగే ఈ–బీట్లో కూడా నిత్యం కేటాయించిన డ్యూటీల ప్రాంతంలో తిరగుతున్నట్లు సంబంధిత ప్రాంతంలో ఉన్నట్లు లోకేషన్ను షేర్ చేయాలి. ఇందుకోసమే.. జిల్లాలో 22 సర్కిళ్ల పరిధిలో, 62 పోలీసు స్టేషన్లున్నాయి. నేరాల తీవ్రత ఎక్కువగానే ఉంది. గడిచిన నాలుగు నెలల వ్యవధిలో నగరంలోనే మూడు హత్యలు జరిగాయి. అలాగే జిల్లాలో అత్యధికంగా 135 కిలో మీటర్లు జాతీయ రహదారి ఉంది. సముద్ర తీర ప్రాంతం అధికంగా ఉంది. వీటితోపాటు సెజ్లు, కృష్ణపట్నం పోర్టు ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల నేరా లు అధికంగానే జరుగుతున్నాయి. ముఖ్యం గా జాతీయ రహదారిపై ప్రమాదాలైతే నెల కు సగటున 10కి పైగా జరుగుతున్నాయి. ఈ ప్రభావమంతా పూర్తి స్థాయిలో పోలీసులపైనే ఉంటుంది. ఈక్రమంలో విజిబుల్ పోలీసింగ్ అంటే పోలీసు గస్తీలో నిరంతరం రోడ్డుపై కనబడడంతో కొంతమేరకు నేరాలు తగ్గుముఖం పడతాయని యోచన. సునిశిత పరిశీలన .. ఇప్పటివరకు వారానికి ఒకసారి రౌడీషీటర్లు పోలీసు స్టేషన్ వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత వారంరోజులపాటు వారి కదలికలపై ఎలాంటి నిఘా ఉండని పరిస్థితి. ఏదైనా ప్రాంతంలో గొడవ జరిగితే, దాడులు జరగ్గానే రౌడీషీటర్లను స్టేషన్కు పిలిపించడం పరిపాటిగా జరగుతోంది. అలాగే దొంగలు, సస్పెక్ట్ షీటు ఉన్నవారు ఇలా అందరిపైనా నామామత్రపు నిఘా ఉండేది తప్ప పూర్తిస్థాయి కొనసాగేది కాదు. కానీ పోలీసు రికార్డుల ప్రకారం మాత్రం సదరు వ్యక్తులపై నిరంతర నిఘా ఉన్నట్లు జీడీ కానిస్టేబుల్స్ పరిశీలిస్తున్నట్లు నివేదికల్లో ఉంటుంది. విజిబుల్ పోలీసింగ్ లేకపోవటంతో నగరంలో ఆకతాయిల అల్లర్ల నుంచి హత్యల వరకు అన్ని జరగుతున్నాయనేది పోలీసులే చెబుతున్న మాట. జిల్లాలో 62 స్టేషన్ల పరిధిలో 250 మంది డీసీలు (డెకాయిటీ షీట్లు) కేడీలు, సస్పెక్టెడ్ షీటర్లు ఉన్నారు. అలాగే నెల్లూరు నగరంలో 152 మంది రౌడీషీటర్లు ఉన్నారు. జిల్లాలో మరో 75 మంది ఉన్నారు. ఎక్కడైనా నేరం జరిగినా, దొంగతనం జరిగినా వీరి పాత్ర ఎంతోకొంత ఉంటుంది. ఈక్రమంలో ఆయా పరిధిలోని పోలీసులు నిరంతర నిఘా వల్ల కొంత నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశంతో పాటు వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సై మొదలుకుని డీఎస్పీ వరకు అందరూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారా లేదా అనేది వైర్లెస్ సెట్ ద్వారా మాత్రమే ఇప్పటివరకు తెలుసుకుంటున్నారు. ఈక్రమంలో ఎలాంటి ఖర్చు లేకుండా విజిబుల్ పోలీసింగ్. ఈ–బీట్ అమలులో భాగంగానే సెల్ఫీ విధానానికి గత వారంలో తెరతీశారు. ఎస్సై మెదలుకుని డీఎస్పీ వరకు అందరూ ఆయా స్టేషన్ల పరిధిలో నేరస్తులపై నిరంతర నిఘా ఉంచుతున్నారని, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నారని తెలియడం కోసం నేరస్తుడితో లేదా అతని ఇంటి వద్ద సోదాలు చేసినట్లు సెల్ఫీలు దిగాలని ఆదేశించారు. పోలీసులకు ఇది కొంత కొత్తగా ఉన్నా బాస్ ఆర్డర్ కావటంతో అలవాటు చేసుకుంటున్నారు. -
భద్రత.. అంతంతే!
జిల్లా కేంద్రం నెల్లూరు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉపాధి, విద్య, ఉద్యోగ నిమిత్తం పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంత వాసులు నగరానికి తరలివస్తున్నారు. జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. నగర పోలీస్స్టేషన్ల పరిధులు పెరిగాయి. నేరాల సంఖ్యా పెరుగుతోంది. అయితే సిబ్బంది సంఖ్య తగిన స్థాయిలో లేదు. దీంతో భద్రత.. అంతంత మాత్రంగా మారింది. ఉన్న వారిపైనే పనిభారం పడింది. కేసుల దర్యాప్తుల్లో పురోగతి కొరవడుతోంది. జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. నెల్లూరు(క్రైమ్): 2011 జనాభా లెక్కల ప్రకారం నెల్లూరు నగర జనాభా 6.01 లక్షలు ఉండగా ప్రస్తుతం సుమారు 8 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో జనాభా సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నగరంలో ఆరు పోలీసుస్టేషన్లు ఉన్నాయి. గత జనాభాకు అనుగుణంగా స్టేషన్ల పరిధులు ఉండేవి. ఇటీవల స్టేషన్ల పరిధులను సైతం పెంచారు. దీంతో నేరాల సంఖ్య పెరుగుతోంది. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటలు నిత్యకృత్యంగా మారాయి. 2016లో రూ.3 కోట్ల ప్రజల ఆస్తులను దొంగలు కొల్లగొట్టగా 2017లో రూ.2.59 కోట్లు, ఈ ఏడాది రూ.4.91 కోట్ల సొత్తును దొంగలు దోచుకెళ్లారు. నామమాత్రంగానే సిబ్బంది పోలీసుస్టేషన్ల పరిధి, జనాభా పెరిగినా ఏళ్ల తరబడి సిబ్బంది పెంపు జరగలేదు. ఆరు పోలీసుస్టేషన్లలో 433 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 272 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కొందరు డిప్యుటేషన్లపై వేరే చోట పనిచేస్తున్నారు. 161 ఖాళీలు ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం రెట్టింపు అవుతోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే కానిస్టేబుల్ పోస్టులు 104 ఖాళీగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. నగరంలో సుమారు 8 లక్షల మంది జనాభా ఉన్నారు. నగరంలో సిబ్బందిని లెక్కిస్తే 1,847 మందికి ఓ పోలీసు లెక్కన ఉన్నారు. స్టేషన్ విధులు, బందోబస్తులు, నేరనియంత్రణ. కోర్టు డ్యూటీ, ప్రమాదాల నివారణ తదితరాలు సిబ్బందికి తలకు మించిన భారంలా మారుతోంది. పెరుగుతున్న నేరాలు..అపరిష్కృతంగా కేసులు ఇటీవల నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలు వంటివి నిత్యకృత్యమయ్యాయి. రోజు రోజుకు స్టేషన్లలో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే సిబ్బంది కొరతతో కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో మూడు సెక్షన్లు ఉండేవి. ప్రస్తుతం రెండు సెక్షన్లకు మార్చారు. దీంతో సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నగరంలో ఆరు పోలీస్స్టేషన్ల పరిధిలో సీఐ, నలుగురు ఎస్సైలు, 8 మంది ఏఎస్సైలు, 15 మంది హెడ్కానిస్టేబుల్స్, 104 మంది కానిస్టేబుల్స్ ఖాళీలు ఉన్నాయి. -
ఇద్దరు కిరాతకుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): అంతా పాతికేళ్ల లోపు యువకులు. చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. ఆటోల్లో తిరుగుతూ మొబైల్ వ్యభిచారం చేయించడం, ఒంటరిగా ఉన్న మహిళలపై లైంగిక దాడులు చేయడం, ఎదురు తిరిగిన వారిని కిరాతకంగా హత్య చేయడంలో వెనుకాడని పరిస్థితిలో ఉన్నారు. గతేడాది ఓ మహిళను లైంగికంగా అనుభవించి దారుణంగా హత్య చేశారు. ఈ ఏడాది ఓ మహిళపై లైంగికదాడి యత్నంకు పాల్పడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. దర్గామిట్ట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ నిందితుల వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన కె. నాగేంద్ర, ఎ.క్రాంతి, టి శ్యామ్కుమార్, జి.రాము, కె.సునీల్, జి.నాగేంద్ర, జి.సుబ్రహ్మణ్యం, యు.చందు, అలీ స్నేహితులు. వీరందరూ చిన్నతనం నుంచే చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. తల్లిదండ్రులు వారిని పట్టించుకోవడంలేదు. దీంతో ఆటోల్లో మొబైల్ వ్యభిచారం చేయిస్తూ వచ్చిన సంపాదనను వ్యసనాలకు వెచ్చించేవారు. ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేసి అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఒంటరి మహిళలపై లైంగిక దాడులకు యత్నించేవారు. ఈ నేపథ్యంలో గతేడాది జనవరి 5వ తేదీన దుండగులు నగరంలో బాపట్లకు చెందిన ఓ మహిళను తమ ఆటోలో ఎక్కించుకొని మాగుంటలేఅవుట్ రైలు పట్టాల సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై లైంగిక దాడిచేశారు. అనంతరం ఆమె వద్దనున్న వెండి పట్టీలు, కాలికున్న కడియం, కొంత నగదును దోచుకొని ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాల వద్ద నుంచి లాక్కొచ్చి సమీపంలోని కాలువలో పడేసి నిందితులు పరారయ్యారు. మృతదేహం తీవ్ర దుర్ఘందం వెదజల్లుతుండటంతో అదే నెల 7వ తేదీన స్థానికులు దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. అయితే ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మిస్టరీగా మారింది. మహిళపై లైంగిక దాడియత్నం ఇది ఇలా ఉండగా దుండగులు నగరంలో మరో ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ ఏడాది మే 15వ తేదీన చెన్నైకు చెందిన ఓ మహిళ, తన బంధువుతో కలిసి నెల్లూరుకు వచ్చింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సుందర్ లాడ్జిలో అద్దెకు దిగారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు లాడ్జిలోకి వెళ్లారు. ఆమెతో పాటు ఉన్న వ్యక్తిపై దాడి చేసి ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. దీంతో బాధిత మహిళ పెద్దగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారీ అవుతూ లాడ్జి మేనేజర్పై దాడి చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఇద్దరు నిందితులు మహిళపై లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితులైన టి. శ్యామ్కుమార్, జి. రామును దర్గామిట్ట పోలీసులు ఆదివారం పొదలకూరురోడ్డు సర్కిల్లో అరెస్ట్చేశారు. హత్య కేసులో మిగిలిన నిందితుల్లో అలీ ఇప్పటికే మృతి చెందారనీ, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. లాడ్జి ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని పరారీలో ఉన్న నలుగురిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. నిందితులపై ఇప్పటికే అనేక కేసులున్నాయని, వీరిపై రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో దర్గామిట్ట పోలీసుస్టేషన ఇన్చార్జి ఇన్స్పెక్టర్ జి. వేణుగోపాల్రెడ్డి, ఎస్సై ఎం. పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. కేసులో చిక్కుముడి వీడింది ఇలా.. నగరానికి చెందిన కె.నాగేంద్ర, ఎ.క్రాంతి అనుమానాస్పదంగా తిరుగుతుండగా దర్గామిట్ట పోలీసులు గత నెలలో వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుస్టేషన్కు తరలించి విచారించగా సుందర్ లాడ్జి ఘటనతో పాటు మాగుంట లేఅవుట్లో మహిళను హత్య చేసింది తామేనని నేరం అంగీకరించారు. లాడ్జి ఘటనలో తమతో పాటు శ్యామ్కుమార్, కె. సునీల్, ఖాదర్బాషా, కాలు, సునీల్ స్నేహితుడు పాల్గొన్నారని పోలీసులకు వెల్లడించారు. మహిళను హత్య చేసిన ఘటనలో తమతో పాటు శ్యామ్కుమార్, రాము, సునీల్, జి. నాగేంద్ర, జి. సుబ్రహ్మణ్యం, యు. చందు, అలీలు పాల్గొన్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు అప్పట్లో కె. నాగేంద్ర, ఎ. క్రాంతిలను అరెస్ట్ చేసి మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
భద్రత..కొరత
రైళ్ల సంఖ్య గణనీయంగా పెరిగాయి. వాటిల్లో నేరాలు సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రయాణికుల భద్రత కొరవడుతోంది. రైల్వే ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించేందుకు నియమించిన జీఆర్పీ (రైల్వే జనరల్ పోలీస్) వ్యవస్థను కొన్ని దశాబ్దాలుగా పటిష్టం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఉన్న అరకొర సిబ్బందితో కేసుల దర్యాప్తులో పురోగతి లేకుండా పోతోంది. రైల్వే ట్రాక్పై జరిగే ఆత్మహత్యలు, హత్యల కేసుల పరిస్థితే ఇందుకు అద్దం పడుతోంది. ఇక రైళ్లల్లో జరిగే చోరీలకు సంబంధించి రికవరీలకు నోచుకోవడం లేదు. మొత్తంగా చెప్పాలంటే కేసులకు పరిష్కారం దొరకడం లేదు. నెల్లూరు(క్రైమ్): రైళ్లలో దోపిడీలు, దొంగతనాలు నిత్యకృత్యంగా మారుతోన్నాయి. రైలు పట్టాలపై మృతులు పెరుగుతున్నారు. రైల్వే గణాంకాల ప్రకారం నెలకు 40 నుంచి 50కు పైగా కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 25 శాతం కేసులు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇక అనధికార (నమోదు కాని) కేసులు ఇంతకు రెండింతలపైనే ఉన్నట్లు సమాచారం. సిబ్బంది కొరత కారణంగానే కేసులు పరిష్కారం కావడం లేదన్నది అధికారుల మాట. నెల్లూరు జిల్లా పరిధిలో కావలి, బిట్రగుంట, నెల్లూరు, కృష్ణపట్నం పోర్టు, గూడూరు, సూళ్లూరుపేటల్లో రైల్వే పోలీస్స్టేషన్లు ఉన్నాయి. ఇవన్ని నెల్లూరు రైల్వే డీఎస్పీ పరిధిలో పని చేస్తున్నాయి. రైల్వేలో రోజు రోజుకు నేరాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా దోపిడీలు, దొంగతనాలు అధికమయ్యాయి. వీటితో పాటు రైల్వేట్రాక్లపై మృతదేహాలు తరచూ పడుతున్నాయి. కొందరు ప్రమాదాల్లో మరణిస్తుండగా మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైల్వే పోలీసులు ఏళ్ల తరబడి పట్టించుకోరన్న విషయం తెలుసుకున్న క్రిమినల్స్ హత్యలు చేసి ఈజీగా తప్పించుకునేందుకు మృతదేహాలను రైలు పట్టాలపై వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏడాది వేసవిలో, పండగ వేళల్లో రైలు ప్రయాణాలు అధికంగా ఉంటున్నాయి. దొంగలు ప్రత్యేక ప్రణాళికతో విజృంభిస్తున్నారు. వీటితో పాటు గంజాయి, బంగారం, ఎర్రచందనం, గుట్కా, రేషన్, ఉప్పుడు బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు అంతే సిబ్బంది బ్రిటిష్ హయాంలో నెల్లూరు జిల్లా మీదుగా 12 ఎక్స్ప్రెస్లు, రెండు ప్యాసింజర్ రైళ్లు వెళ్లేవి. ప్రస్తుతం సుమారు 90కు పైగా ఎక్స్ప్రెస్లు, 16 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. అప్పటి రైళ్లు, నేరాల ఆధారంగా పోలీస్స్టేషన్కు ఒక ఎస్సై, ముగ్గురు హెడ్కానిస్టేబుల్స్, 20 మంది కానిస్టేబుల్స్ను ఏర్పాటు చేశారు. నేడు రైళ్ల సంఖ్య, నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రైళల్లో బ్యాగ్లు, గొలుసు, జేబు దొంగతనాలు జరిగేవి. ప్రమాదవశాత్తు రైళ్లలోంచి జారిపడడం, పట్టాలు దాటుతూ మృత్యువాతపడడం, ఆత్మహత్యలు ఉండేవి. నేటి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. నేరగాళ్లు కొత్త పం«థాల్లో నేరాలకు తెగబడుతున్నారు. దోపిడీలు, దొంగతనాలు, మత్తు మందులిచ్చి నగలు, నగదు అపహరణ, సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడడం, దాడులు, హత్యలు, మిస్సింగ్ కేసులు అధికం అయ్యాయి. సిబ్బంది విధుల్లోనే మార్పులు వచ్చాయి. నేర నియంత్రణతో పాటు ఎస్కార్ట్లు, కోర్టు విధులు, మార్చురీ విధులు, రాత్రి, పగటి గస్తీలు నిర్వహించాల్సి వస్తోంది. అయితే నాటి సిబ్బంది సంఖ్యే నేటికి కొనసాగుతోంది. అందులోనూ కొన్ని ఖాళీలు ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పడుతోంది. నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారం తలకు మించిన భారంగా మారుతోంది. వీటిని అధిగమించాలంటే సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఖాళీల పోస్టుల భర్తీ ఇలా జీఆర్పీ నియమకాలు గతంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేవి. 1982 అనంతరం ఈ విధానం మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సివిల్ పోలీసులనే డిప్యుటేషన్పై రైల్వేకు పంపుతారు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాలతో పాటు డిప్యుటేషన్ ముగిసి తిరిగి సొంతగూటికి వెళ్లిన వారి స్థానంలో ఖాళీలను భర్తీ చేయాలంటే సివిల్ నుంచి పోలీసులను రైల్వేకు పంపాల్సి ఉంది. అయితే సివిల్ పోలీసు అధికారులు సకాలంలో సిబ్బందిని ఇవ్వకపోవడంతో సిబ్బంది కొరత ఉంటుంది. సిబ్బంది కేటాయింపు.. పెంపు కలేనా పెరిగిన పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పోలీసుస్టేషన్లో సిబ్బంది సంఖ్యను పెంచడమే కాకుండా ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సి ఉంది. పలు దఫాలు పాలకులు, అధికారులు చర్యలు చేపడుతామన్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో సిబ్బంది కేటాయింపు.. పెంపు కలే అని తెలుస్తోంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పెరిగిన పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని రైల్వే సిబ్బంది కోరుతున్నారు. ఏళ్ల తరబడి నియామకాల్లేవు ఇప్పటి వరకు జిల్లా పరిధిలోని రైల్వే స్టేషన్ల్లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. నెల్లూరు పోలీస్స్టేషన్ పరిధిలో డీఎస్పీ, సీఐతో పాటు ముగ్గురు ఎస్సైలు, ముగ్గురు హెడ్కానిస్టేబుల్స్, 20 మంది కానిస్టేబుల్స్ ఉండాల్సి ఉంది. అయితే అందులో ఇద్దరు ఎస్సైలు లేరు. కావలిలో ఒక ఎస్సై, ముగ్గురు హెడ్కానిస్టేబుల్స్, 20 మంది కానిస్టేబుల్స్ ఉండాల్సి ఉండగా 3 కానిస్టేబుల్స్ లేరు. గూడూరులో ఒక ఎస్సై, ముగ్గురు హెడ్కానిస్టేబుల్స్, 20 మంది కానిస్టేబుల్స్ ఉండాల్సి ఉండగా ముగ్గురు హెడ్కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుల్స్ లేరు. సూళ్లూరుపేటలో ఒక ఎస్సై, ఒక హెడ్కానిస్టేబుల్స్, 8 మంది కానిస్టేబుల్స్ ఉండాల్సి ఉండగా ఎస్సై, హెడ్కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ లేరు. బిట్రగుంట, కృష్ణపట్నం పోర్టు స్టేషన్ల్లో ఒక హెడ్కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుల్స్ ఉండాల్సి ఉండగా రెండు పోలీసుస్టేషన్లలో హెడ్కానిస్టేబుల్స్ లేరు. దీన్ని బట్టి చూస్తే సిబ్బంది కొరత వెంటాడుతోంది. -
మహిళ హత్యకేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వడ్డీ వ్యాపారం చే స్తున్న అవివాహిత మహిళను హత్యచేసిన కేసులో పోలీసులు శుక్రవారం ముగ్గురు నిందితులను అదుపులో తీసుకున్నారు. వారివద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు, నగలు స్వాధీ నం చేసుకున్నారు. శుక్రవా రం నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ నెల్లూరులోని చిన్నబజారు (ఒకటో పట్ట ణ) పోలీసుస్టేషన్లో విలేక ర్ల సమావేశంలో వివరాల ను వెల్లడించారు. నగరంలోని కుమ్మరివీధికి చెందిన ఎస్కే అజీమున్నీసా అనే మహిళ తన కూతురు ఎస్కే తహసీన్ గత నెల 22వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని 28న చిన్నబజారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచనలతో చిన్నబజారు సీఐ ఎండీ అబ్దుల్ సుభాన్ నేతృత్వంలో జరిపిన దర్యాప్తులో తహసీన్ హత్యకు గురైందని నిర్ధారించారు. హత్య చేసింది బాకీదారులే తహసీన్ వడ్డీ వ్యాపారంతోపాటు చిట్టీలు నిర్వహిస్తుండేది. ఆమె కాలేషా అనే వ్యక్తికి రూ.4 లక్షలు, ఇనామతుల్లాకు రూ.లక్ష, సాధిక్కు రూ.50 వేలు, ఫర్షాత్కు రూ.లక్ష వడ్డీకి ఇచ్చింది. వారి నుంచి ప్రామిసరీ నోట్లు రాయించుకుంది. కాగా వడ్డీ చెల్లించే క్రమంలో బాకీదారులతో తహసీన్కు గొడవలు జరిగాయి. దీంతో వారు తహసీన్ను హత్య చేస్తే బాకీ తీర్చే అవసరం ఉండదని భావించి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. దైవభక్తిని ఆసరాగా చేసుకుని.. తహసీన్ను హత్య చేసేందుకు నిందితులు (బాకీదారులు) నలుగురు పన్నాగం పన్నారు. తహసీన్కు దైవభక్తి ఎక్కువగా ఉందని గుర్తించి గత నెల 22వ తేదీన తన ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నామని సాధిక్ చేత మిగిలిన ముగ్గురు ఫోన్ చేయించి తహసీన్ను పిలిపించారు. ఇంటికి వచ్చిన తహసీన్కు దైవ ప్రసాదం అని చెప్పి మిఠాయిలో సైనెడ్ కలిపి ఇచ్చారు. ఆమె వెంటనే మృతిచెందకుండా వాంతులు చేసుకుంది. తహసీన్ బతికితే తమ బండారం బయటపడుతుందని భావించిన బాకీదారులు ఆమె గొంతు నులిమి చంపివేశారు. మృతురాలి మెడలోని బంగారు చైను, చేతికి ఉన్న రెండు ఉంగరాలను దోచుకున్నారు. అనంతరం మృతదేహాన్ని కారులో వెంకటాచలం మండలంలోని కాకుటూరుకు తరలించారు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడి పొలాల్లో గుంటలో పూడ్చివేశారు. ప్రామిసరీ నోట్లు అపహరణ నిందితులు 23వ తేదీ తహసీన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలోకి ప్రవేశించి వారి బాకీ తాలూ కు ప్రామిసరీ నోట్లు, రూ.77 వేల నగదు, మూ డు సెల్ఫోన్లు అపహరించారు. మిస్సింగ్ కేసుపై పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసి ఫర్షాత్పై అనుమానంతో అదుపులో తీసుకుని విచారించారు. అతను తాను ఎస్కే కాలేషా, ఇనామతుల్లా, సాధిక్లు కలసి తహసీన్ను హత్య చేసినట్లు వెల్లడించాడు. పోలీసులు ఫర్షాత్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించా రు. మిగిలిన ముగ్గురు నిందుతులు పరారీలో ఉండగా శుక్రవారం వారిని అయ్యప్పగుడి ప్రాం తంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి తహసీన్ను హత్య చేసే సమయంలో ఉపయోగించిన గ్లౌజు, దోచుకున్న రూ.45 వేల నగదు, సెల్ఫోన్లు, రెండు బంగారు ఉంగరాలు, చైన్, ప్రామిసరీ నోట్లు, బీరువా తాళాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ అబ్దుల్ సుభాన్, ఎస్సై కరీముల్లా, రమణ, అల్తాఫ్, సురేష్, రాజా పాల్గొన్నారు. -
వ్యభిచారం ముసుగులో దోపిడీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వ్యభిచారం ముసుగులో వ్యక్తులపై దాడిచేసి నగదు, బంగారం దోపిడీ చేస్తున్న ముఠాను నెల్లూరు వేదాయపాళెం (ఐదవ నగర) పోలీస్స్టేషన్కు చెందిన పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ కె.నరసింహారావు గురువారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఒక ఆటో డ్రైవర్, ఇద్దరు మహిళలు ముఠాగా ఏర్పడి వ్యభిచారం పేరుతో పురుషులను ఆకర్షిస్తున్నారు. తమతో వచ్చినవారిని ఆటోలో శివారు ప్రాంతాలకు, నిర్జీవ స్థలాలకు తీసుకువెళ్లి దాడి చేసి నగదు, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు దోచుకుంటున్నారు. ఈనెల 1వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో గూడూరు మండలం దివిపాళెంకు చెందిన పిన్ని వెంకట శ్రీనివాసులు అనే వ్యక్తి నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆటో ఎక్కాడు. ఇద్దరు మహిళలు, డ్రైవర్ శ్రీనివాసులను చంద్రబాబునగర్ ప్రాంతంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.10 వేల నగదు, బంగారు ఉంగరం, ఒక సెల్ఫోన్ను దోచుకున్నారు. దీనిపై వేదాయపాళెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు అందింది. దీంతో ముఠాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఈ క్రమంలో బుధవారం రాత్రి వేదాయపాళెం పోలీసుస్టేషన్ పరిధిలో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. వేదాయపాళెం సెంటర్ వద్ద అనుమానాస్పదంగా వెళుతున్న ఏపీ 26 టీఏ 4750 నంబర్ ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా అందులో ఉన్న డ్రైవర్, మరో ఇద్దరు మహిళలు వాహనంలో నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. 1వ తేదీన ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆటోలో ఎక్కిన వ్యక్తిపై దాడి చేసి దోపిడీ చేసినట్లు వారు అంగీకరించారు. నిందితులు చంద్రబాబునగర్ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ కొంగ శ్రీనివాసులు, అదే ప్రాంతానికి చెందిన మెక్కల సరళ, వెంకటేశ్వరపురం, భగత్సింగ్ కాలనీకి చెందిన విడవలూరు మున్నీలుగా గుర్తించారు. వారిపై కేసు నమెదుచేసి ఒక బంగారు ఉంగరం, రూ.3 వేల నగదు, సెల్ఫోన్, దోపిడీకి ఉపయెగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. డ్రైవర్ కొంగ శ్రీనివాసులపై ఇప్పటికే నెల్లూరు రూరల్, సంతపేట పోలీస్స్టేషన్లో దారి దోపిడీకి సంబంధించిన కేసులు నమోదై ఉన్నట్లు చెప్పారు. అతడిని పట్టుకునేందుకు రూరల్ సీఐ వి.శ్రీనివాసులురెడ్డి సహకరించాడని తెలిపారు. ఈ ముఠాను పట్టుకునేందుకు చొరవ చూపిన వేదాయపాళెం పోలీస్స్టేషన్ సిబ్బందికి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిపార్సు చేస్తామని సీఐవెల్లడించారు. -
పేలిన గన్
సింహపురి ప్రశాంతతకు మారుపేరనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, లైంగికదాడులు, కిడ్నాప్లతో అట్టుడుకుతోంది. జిల్లా ఓ వైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోన్న తరుణంలో అంతే వేగంగా వ్యవస్థీకృత నేరాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఉగ్రవాదులు, మాఫియాలు, అంతర్రాష్ట్ర నేరగాళ్లు జిల్లాలో పాగావేసి తమ నేరసామ్రాజ్యాన్ని విస్తృతం చేస్తున్నారు. నేరగాళ్ల కదలికలను పసిగట్టడంలో నిఘా వ్యవస్థ విఫలమైందనే ఆరోపణలున్నాయి. ఫలితంగా నేరగాళ్లు విజృంభిస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. నెల్లూరు(క్రైమ్): తుపాకీ కల్చర్ సైతం జిల్లాకు పాకింది. రోజురోజుకు తుపాకీ సంస్కృతి జడలు విప్పుతోంది. నెల్లూరు ఫత్తేఖాన్పేట సమీపంలో మహేంద్రసింగ్(47)అనే వ్యాపారిపై ఇద్దరు దుండగులు శనివారం రాత్రి కాల్పులు జరిపి హతమార్చడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా పోలీసులు నిర్లిప్తత వీడకుంటే భారీగా మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఓ విశ్రాంత పోలీసు అధికారి వెల్లడించారు. ⇔ వెంకటేశ్వరపురంలోని ఓ బార్వద్ద అందరూ చూస్తుండగా రౌడీషీటర్ సాయి అలియాస్ బస్టాండు సాయిని స్నేహితులే అతికిరాతకంగా హతమార్చారు. ⇔ నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైవోవర్ బ్రిడ్జి సమీపంలో బిల్డర్ నెల్లూరు శిరీష్కుమార్ను ప్రత్యర్థులు కిరాయి హంతకులతో దారుణంగా హత్యచేయించారు. ⇔ పానీపూరిబండి వద్ద చెలరేగిన స్వల్పవివాదం కారణంగా ఇద్దరు పాతనేరస్తులు అన్నదమ్ములపై విచక్షణా రహితంగా దాడిచేశారు. ⇔ నగరంలోని కుమ్మరవీధికి చెందిన వడ్డీ వ్యాపారి తహసీన్ను నలుగురు మిఠాయిలో సైనెడ్కలిపి చంపి ఆమె మృతదేహాన్ని వెంకటాచలం సమీప అటవీప్రాంతంలో పూడ్చిపెట్టారు. అనంతరం ఆమెకు చెందిన బంగారు, నగదు, ప్రామిసరీ నోట్లను అపహరించారు. ⇔ తాజాగా నగర నడిబొడ్డులో శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో వ్యాపారి మహేంద్రసింగ్పై ఇద్దరు దుండగులు గన్తో కాల్పులు జరిపారు. ఈఘటనలో మహేంద్రసింగ్ మృతిచెందాడు. వేళ్లూనుకుంటున్న కిరాయి సంస్కృతి ఉత్తరాది రాష్ట్రాలు, మెగా సిటీలకే పరిమితమైన కిరాయి సంస్కృతి జిల్లాలోనూ పెరుగుతోంది. దుండగులు సుపారీ తీసుకుని ప్రత్యర్థుల ప్రాణాలను ఇట్టే తీసేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. కావలి డివిజన్ పరిధిలో ఓ వ్యక్తి కోర్టువాయిదాకు వెళుతుండగా కిరాయిహంతకులు వేటకొడవళ్లతో దారుణంగా హత్యచేశారు. నెల్లూరు నగరంలో ఓ మహిళను ఆమె భర్తే సుపారీ ఇచ్చి హత్యచేయించాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అక్టోబర్ ఐదో తేదీన వ్యాపార లావాదేవీల్లో నెలకొన్న విభేదాలతో బిల్డర్ శిరీష్కుమార్ను ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి దుండగులతో హత్యచేయించారు. తనిఖీలు నామమాత్రం జిల్లాలో క్రమేపి శాంతిభద్రతలు క్షీణదశకు చేరుకుంటున్నాయి. నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేరస్థులకు నెల్లూరు జిల్లా షెల్టర్ జోన్గా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా లోపించడం, తనిఖీలు నామమాత్రంగా ఉండటం నేరగాళ్లకు అనుకూలంగా మారింది. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా పెద్ద ఎత్తున ఇతర ప్రాంత వాసులు జిల్లాకు తరలివస్తున్నారు. వారు ఎవరన్నది పోలీసుల వద్ద కచ్చితమైన సమాచారం లేదు. దీంతో కరుడుగట్టిన నేరగాళ్లు, ఉగ్రవాదులు, మవోయిస్టులు, స్మగ్లర్లు, ఆర్థిక నేరగాళ్లు జిల్లాలో తలదాచుకున్న ఘటనలు లేకపోలేదు. గతంలో సిమి ఉగ్రవాదులు జిల్లాలోని తడలో ఉన్నారనే సమాచారం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఉలికిపాటుకు గురిచేసిన విషయం విదితమే. ఉగ్రవాదులు ఏకంగా కోర్టు ఆవరణలో బాంబులు పేల్చిన సంఘటన జిల్లాలో కలకలం రేకెత్తించింది. నగరానికి చెందిన ఇద్దరు యువకులు తాము డీ–గ్యాంగ్ సభ్యులమని ఏకంగా బీసీసీఐ సభ్యులు రాజీవ్శుక్లాకు ఫోనుచేసి ఏకంగా రూ.100కోట్లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కిడ్నాప్ చేస్తామని హెచ్చరించారు. ఇక ఎర్రస్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్లు విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా జరిగితేనే నాకాబందీ దేశంలో లేదా రాష్ట్రంలో ఏదైనా కీలకమైన సంఘటన జరిగిన సమయంలో పోలీసులకు నాకాబందీ గుర్తొస్తుంది. నాకాబందీ అనేది పోలీసులు నెలలో కచ్చితంగా నాలుగుసార్లు చేయాలి. ఇది చాలా వరకు అమలు కావడం లేదు. పోలీసులు అప్పుడప్పుడు చేసే తనిఖీల్లో చాలాసార్లు కీలకమైన సమాచారం లభించిన సందర్భాలూ ఉన్నాయి. అయినా పోలీసులు అధికారులు దీనిని గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక లైసెన్స్ తుపాకీలను సైతం మూడు నెలలకోసారి కచ్చితంగా తనిఖీ చేయాలన్న నిబంధన ఉంది. తుపాకీనీ ఈ మధ్యకాలంలో ఏవైనా వినియోగించారా? ఎన్ని బుల్లెట్లున్నాయి. అనే విషయంపై ఆరా తీయాలి. అయితే ఈ ప్రక్రియ తూతూమంత్రంగానే సాగుతుందనే విమర్శలున్నాయి. కేవలం ఎన్నికలు, ఇతర కీలక సందర్భాల్లో పోలీసులు ఆయుదాలను జప్తు చేసుకుని ఆ నాలుగురోజులు శాంతిభద్రతలు కాపడుతున్నామని చెబుతున్నారు. ఏదిఏమైనా ప్రశాంత సింహపురి ఒకప్పటి మాటగానే మారింది. జిల్లా ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. వీటితో పాటు పోలీసుల పనితీరుపై విమర్శలకు పోలీసుశాఖ ఎలాంటి సమాధానం చెబుతుందో వేచిచూడాల్సిందే. పెరుగుతున్న గన్కల్చర్ మారుతున్న కాలానికి అనుగుణంగా జిల్లాలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం ఎవరి బతుకు వారిది..ఎవరి వ్యాపకాలు వారివి.. అయితే ఇటీవల అధికమైన తుపాకీ సంస్కృతి జిల్లా వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాలో గన్కల్చర్ పెరుగుతోంది. నేరగాళ్లు తుపాకీలతో కాల్చుతూ, వాటిని చూపిస్తూ ఘాతుకాలకు ఒడిగడుతున్నారు. ⇔ 2013 జూలై ఐదో తేదీన నెల్లూరు హాస్పిటల్ సమీపంలో పట్టపగలు మావోయిస్టు మాజీనేత, అమరవీరుల కుటుంబమిత్రుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు గంటిప్రసాదను గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ⇔ 2015లో కావలికి చెందిన బంగారు వ్యాపారి రామయ్య, సునీల్ రూ. 86.55లక్షలు నగదుతో బంగారం కొనుగోలు చేసేందుకు నవజీవన్ రైల్లో వెళుతుండగా ఓ పోలీసు అధికారి(దొంగల ముఠా నాయకుడు) ఆధ్వర్యంలో ముగ్గురు కానిస్టేబుల్స్, ఓ పాతనేరçస్తుడు తుపాకులతో బెదిరించి నగదు దోచుకెళ్లారు. ⇔ భూవివాదం నేపథ్యంలో తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆమలూరుకు చెందిన కిరణ్పై ఆయన సమీప బంధువు రూప్కుమార్ తుపాకీతోకాల్పులు జరిపారు. ⇔ 2015 ఆగస్టులో నెల్లూరు నగరంలోని దేవిరెడ్డివారివీధిలో జయంతి జ్యూయలరీస్లో దుండగులు లోనికి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని గన్లతో బెదిరించి రూ.లక్షలు విలువచేసే బంగారు నగలను అపహరించుకుని వెళ్లారు. ⇔ బిట్రగుంటలో టాస్క్ఫోర్సు పోలీసులపై తిరగబడ్డ దుండగులు వారి వద్దనున్న తుపాకీలను లాక్కొని పోలీసులపై దాడులుకు పాల్పడ్డారు. ⇔ ఇటీవల పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద నుంచి తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. -
తూటా పేల్చి.. హతమార్చి
నెల్లూరు (క్రైమ్): అంతా పది నిమిషాల వ్యవధిలో జరిగి పోయింది. దుకాణానికి తాళం వేసి ఇంటికి బయలుదేరిన మహేం ద్రసింగ్పై దుండగులు తూటా పేల్చి హతమర్చారు. తుపాకీ కాల్పుల ఘటన జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ సంచలనం రేకెత్తించింది. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హత్య వెనుక గల కారణాలను ఛేదించే పనిలో ఉన్నారు. నెల్లూరు నగరంలోని సీసీ కెమెరాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీ లించడంతో పాటు రాత్రంతా నగరంలో నాకా బందీ నిర్వహించారు. మృతుడికి రెండు సెల్ఫోను నంబర్లు ఉండటంతో కాల్ డీటైల్స్ను పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎలాంటి సమాచారం చెప్పకపోవడం, ఘటన జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహేంద్రసింగ్ రాజ్పురోహిత్ (40) ది రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా సంద్రి మండలం ఆర్తండి గ్రామం. ఆయనకు అదే జిల్లా లుద్దర గ్రామానికి చెందిన ఉషాదేవితో వివాహమైంది. మహేంద్రసింగ్ 15 ఏళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఫత్తేఖాన్పేట రైతుబజారు ఎదురు అక్కనవారి వీధిలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె కోమల్ పేరుతో సంతపేట, ఫత్తేఖాన్పేట, తిరుపతిలో పవర్ టూల్స్ సర్వీస్ అండ్ సేల్స్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని దుకాణ బాధ్యతలను ఆయన అన్న మంగిలాల్ రాజ్పురోహిత్ చూసుకుంటున్నాడు. మహేంద్రసింగ్ స్వతహాగా మృదు స్వభావి. అందరితో ఎంతో కలివిడిగా ఉం డేవారు. సామాజిక కార్యకర్త. తనకు ఉన్నదాంట్లోనే ధాన ధర్మాలు చేస్తుండటంతో పాటు స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వర్తించారు. వినాయకచవితికి ఆయన తన స్వ గ్రామానికి ఒకటిన్నర నెల కిందట వెళ్లి రెండు వారాల కిందట తిరిగి నెల్లూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను దుండగులు హతమార్చడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. సంఘటన ఇలా.. ప్రతి రోజు మహేంద్రసింగ్ 9.30 గంటలకే దుకాణంను మూసివేసేవాడు. అయితే శనివారం రాత్రి 10 గంటలకు దుకాణం మూసివేశాడు. దుకాణంలో పనిచేస్తున్న యువకులు ఇంటికి వెళుతుండగా వెనుక ఫోనుల్లో మాట్లాడుకొంటూ దుకాణం వద్ద నుంచి బయలుదేరారు. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆయనతో మాట్లాడి అతి దగ్గరగా రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వారి నుంచి తప్పిం చుకునే ప్రయత్నం చేయడంతో మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడ నుంచి నిందితులు బైక్పై పరారైనట్లు సమాచారం. ప్రొఫెషనల్స్ పనే మహేంద్రసింగ్ హత్య ప్రొఫెషనల్స్ పని అయి ఉండొచ్చని, కిరాయి తీసుకుని హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన ప్రాంతంలో ల భ్యమైన తూటా కేస్ల ఆధారంగా ఫిస్టల్లో వినియోగించే 9 ఎంఎం బుల్లెట్లుగా పోలీసులు గుర్తించారు. జిల్లాలో తుపాకీ సంస్కృతి లేకపోవడంతో నిందితులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారై ఉం టారని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యే క బృందాలతో విచారణ చేస్తున్నామని త్వరలోనే కేసులోని మిస్టరీని చేధిస్తామని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి మహేంద్రసింగ్ మృతదేహానికి ఆదివారం ప్రభుత్వ వైద్యులు జీజీహెచ్లో పోస్టుమార్టం పూర్తి చేసి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏఎస్పీ పి. పరమేశ్వరరెడ్డి, నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులను హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. చిన్నబజారు ఇన్స్పెక్టర్ అబ్దుల్ సుభాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు హత్య వెనుక పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నిర్మల్లో మహేంద్రసింగ్ బావమరిది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడి పోలీసులు సైతం ఆత్మహత్య కిందే పరిగణించి కేసును మూసివేశారు. అయితే ఇటీవల మహేంద్రసింగ్ తన బావమరిదిది ఆత్మహత్య కాదనీ, పలు అనుమానాలున్నాయని, కేసును పునః పరిశీలించాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు తిరిగి ఆ కేసు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ హత్యకు గురికావడం వెనుక ఈ ఘటనే ఉండొచ్చన్న అనుమానాలను స్నేహితులు వ్యక్తం చేస్తున్నారు. మహేంద్రసింగ్ స్వగ్రామంలో ఓ యువతిని కొందరు కిడ్నాప్ చేసి హత్య చేశారని, అందులో మృతుడి ప్రమేయం ఉందనే ఆరోపణలు సైతం వెల్లు వెత్తుతున్నాయి. మహేంద్రసింగ్ తన స్వగ్రామంలో అనేక సేవా, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి వద్ద మంచి పేరును గడించారు. ఈ క్రమంలో స్థానిక సర్పంచ్ దీన్ని జీర్ణించుకోలేక అతనితో తరచూ గొడవలు పడేవారని పోలీసులకు తెలిసింది. దీంతో ప్రత్యేక బృందం విచారణ నిమిత్తం రాజస్థాన్కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. మహేంద్రసింగ్కు బంగారు వ్యాపారంలోనూ ప్రమేయం ఉంది. కొన్నేళ్ల కిందట ఓ వ్యక్తి తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పడంతో అతని కోసం రోజుల తరబడి తిరిగి తర్వాత మానుకొన్నాడని బంధువులు పోలీసులకు వెల్లడించారు. నెల్లూరులో మహేంద్రసింగ్ షాపు ఉన్న చోట బిహార్కు చెందిన పానీపూరీ నిర్వాహకుడితో తార స్థాయిలో గొడవలు ఉన్నాయని పోలీసులకు సమాచారం. బిహార్లో తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు పానీపూరీ నిర్వాహకుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తొలుత పోలీసులు నగదు కోసం హత్య చేసి ఉంటారని భావించారు. అయితే ఘటన జరిగిన సమయంలో అతని జేబులో సుమారు రూ 1.50 లక్షల నగదు ఉంది. నగదు కోసం హత్య చేసి ఉంటే దుండగులు ఆ నగదును అపహరించుకుని వెళ్లి ఉండేవారు. హత్యకు నగదు కారణం కాదని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో నిందితులిద్దరిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించడం లేదు. -
నెల్లూరులో కాల్పుల కలకలం
-
పానీపూరి బండి వద్ద వివాదం
నెల్లూరు(క్రైమ్): పానీపూరి తినే క్రమంలో వివాదం నెలకొని దుండగులు కత్తులతో అన్నదములపై దాడిచేసి పరారైన ఘటన నెల్లూరులోని బీవీనగర్ సెంటర్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీ సుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజ స్తాన్ రాష్ట్రం కరోలి జిల్లా రూమ్తాకాపూరు మండలం మాసరోపూరు గ్రామానికి చెందిన సంతోష్కుమార్, జండేర్ అలియాస్ బబ్లూలు అన్నదమ్ములు. వారు పదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఆర్టీఓ కార్యాలయం సమీప అనగుంట కాలనీలో ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. మార్బుల్స్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా అన్నదమ్ములిద్దరూ మనుమసిద్ధినగర్లో పనిచేస్తున్నారు. మాటామాటా పెరిగి.. శుక్రవారం రాత్రి ఇద్దరూ పనులు ముగించుకుని బీవీనగర్ మైన్స్ కార్యాలయం సమీపంలో పానిపూరి తింటుండగా ఇద్దరు వ్యక్తులు కేటీర్ (కరిజ్మా) బైక్పై పానీపూరి తీనేందుకు బండి వద్దకు వచ్చారు. అక్కడ బైక్పై వచ్చిన వ్యక్తులు పానీపూరి తినేక్రమంలో అన్నదమ్ములపై నీళ్లుపడ్డాయి. చూసుకుని తినండి అని వారు ఇద్దరు వ్యక్తులకు సూచించారు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా తమ బైక్లో ఉన్న కత్తులు తీసి అన్నదమ్ముల వీపులపై విచక్షణారహితంగా దాడిచేసి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో సంతోష్కుమార్, జండేర్లు అక్కడే కూలబడిపోయారు. స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది శ్రీను ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు సమాచారం అందుకున్న నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, వేదాయపాళెం ఇన్స్పెక్టర్ నరసింహారావులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను, పానీపూరి బండి యజమానిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారు ఖచ్చితమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడారు. వారి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ నరసింహారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటనపై పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితులకు, బాధితులకు గతంలో ఏవైనా గొడవలున్నాయా? లేదా అనుకోకుండా ఈ ఘటన జరిగిందా?, అలా జరిగి ఉంటే నిందితులు బైక్లో కత్తులెందుకు పెట్టుకుని తిరుగుతున్నారు. వారెవరు? తదితర వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. సీసీపుటేజ్ను పరిశీలిస్తున్నారు. కాగా ఘటన జరగకముందు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బీవీనగర్ ప్రాంతాన్ని పరిశీలించారు. గురువారం రాత్రి ఆ ప్రాంతంలో చైన్స్నాచింగ్ జరిగింది. ఆ బాధితురాలిని ఎస్పీ విచారించినట్లు సమాచారం. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు,సంగం: ఐదు రోజుల క్రితం అత్తగారింటికి వచ్చిన భార్యాభర్తల మధ్య చిన్న ఘర్షణ జరగడంతో మనస్థాపానికి గురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన సంగం–కావలి కాలువ సమీపంలో గురువారం తెల్ల వారుజామున జరి గింది. పోలీసుల సమాచారం మేరకు.. వెంకటాచలం మండలం గొలగమూడికి చెందిన కరేటి సురేంద్ర(38) స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 15 ఏళ్ల క్రితం వింజ మూరు మండలం గుండెమడగల గ్రామానికి చెందిన శివరావమ్మతో వివాహం అయింది. వీరికి గోవర్ధన్, లాస్యప్రియ పిల్లలు ఉన్నారు. సురేంద్ర అన్ని రకాల వ్యాపారాలు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఇటీవల ఓ ఆటో కొనుక్కుని బతుకుబండిని లాగిస్తున్నాడు. అయితే ఐదు రోజుల క్రితం సురేంద్ర అత్తగారి ఊరు గుండెమడగలకు భార్య, పిల్లలతో వెళ్లాడు. అక్కడే ఉన్న సురేంద్ర బుధవారం రాత్రి ఏదో విషయంలో భార్యతో చిన్న గొడవ పడ్డాడు. మనస్థాపానికి గురైన తాను గొలగమూడికి వెళ్లి చనిపోతానని ఇంట్లో చెప్పి వచ్చేశాడు. గురువారం తెల్లవారు జామున కావలి కాలువ సమీ పంలో డాబా వెనుక వైపునున్న నేరుడు చెట్టుకు ఉరేసుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుమున బహిర్భూమికి వెళ్లిన స్థానికులు గమనించి ఎస్సై నాగార్జునరెడ్డికి సమాచారం ఇచ్చారు. ఎస్సై ఘటనా స్థలా న్ని పరిశీలించి, మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం చేసి బ«ంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రస్తోగీ.. జర దేఖోజీ
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నారు. దోపిడీలు, దొంగతనాలు, సుపారీ హత్యలు, రౌడీ దందాలు పెరగడంతో జిల్లాలో క్రమేపీ శాంతిభద్రతలు క్షీణదశకు చేరుతున్నాయి. అక్రమరవాణా జోరుగా సాగుతోంది. పోలీసుశాఖను సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో పనిఒత్తిడి పెరిగి సిబ్బంది అనారోగ్యం పాలవుతున్నారు. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది కుమ్మకై బాధితులను నిలువు దోపిడీకి గురిచేస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఇలా పలు సమస్యలు నూతన ఎస్పీ ఐశ్వర్య రస్తోగికి స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సమస్యల పరిష్కారానికి నూతన ఎస్పీ ఎలాంటి చర్యలు చేపడతారో వేచిచూడాలి. సిబ్బంది ఇష్టారాజ్యం జిల్లాలో 22 స్కరిళ్లు, 64 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కలిసి సుమారు 2 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. పలు పోలీసుస్టేషన్లలో పాలన అస్థవ్యస్థంగా మారింది. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. అంగ, ఆర్థిక బలం ఉంటేనే పనులు జరుగుతున్నాయి. స్టేషన్లలో రైటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు చెప్పిందే వేదంగా మారడంతో బాధితులు ముందుగా వారిని ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక పోలీసు పాలనలో ఖద్దరు జోక్యం మితిమీరింది. కొన్ని పోలీస్స్టేషన్లను నేతలు అడ్డాగా చేసుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారు. వచ్చిన మొత్తంలో అధికారులు, నేతలు పంచుకొంటున్నారు. ఈ క్రమంలో న్యాయం కోసం జిల్లా నలుమూలల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్డేలో పోలీసు ఉన్నతాధికారులకు తమగోడును వినిపించి కన్నీటిì పర్యంతమవుతున్నారు. ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ పలువురు అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. నూతన ఎస్పీ అయినా ఖద్దరు జోక్యాన్ని, అవినీతిని నిర్మూలించి బాధితుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే çపరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్షీణిస్తున్న శాంతిభద్రతలు జిల్లాలో అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నారు. దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్లు నిత్యకృత్యంగా మారాయి. అంతర్రాష్ట్ర నేరగాళ్లు జిల్లాలో పాగావేసి అందినకాడికి దోచుకెళుతున్నారు. మహిళలకు ఇంటా, బయటా భద్రత కొరవడింది. లైంగికదాడులు పెరిగాయి. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని దుండగులు ఆభరాణాలను తెంపుకెళుతున్నారు. కిరాయి సంస్కృతి జిల్లాలో ఇటీవల కాలంలో అధికమైంది. çనిందితులు సుపారీ తీసుకుని ఎదుటి వారి ప్రాణాలను నిలువునా తీసేస్తున్నారు. వరుస ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెరుగైన శాంతిభద్రతలను అందించేందుకు ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దొంగతనాలు, దోపిడీలను నియంత్రించేందుకు సీసీఎస్ వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆగని అక్రమరవాణా జిల్లాలో ఎర్రచందనం, ఇసుక, సిలికా, గుట్కా, గంజాయి, రేషన్బియ్యం, నిత్యావసరాల అక్రమరవాణా జోరుగా సాగుతోంది. గత ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ అక్రమరవాణా నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో కొంతమేర వాటికి ఫుల్స్టాప్ పడింది. కొందరు పోలీసు సిబ్బంది సహకారంతో ఇసుక, సిలికా, గుట్కా అక్రమరవాణా జోరుగా సాగుతోంది. మామూళ్ల కోసం కొందరు పోలీసు సిబ్బంది అక్రమ వ్యాపారులను వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జడలు విపుతున్న బెట్టింగ్ బెట్టింగ్, సింగల్ నంబర్లాట, జూదం తిరిగి ఊపందుకొంటోంది. గత ఎస్పీ బెట్టింగ్ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. దీంతో పూర్తిస్థాయిలో బెట్టింగ్కు బ్రేక్పడింది. అందుకు సహకరించిన పోలీసు సిబ్బందిపై సైతం వేటు వేశారు. ఇటీవల పోలీసు నజర్ లేకపోవడంతో తిరిగి బెట్టింగ్ ఊపందుకొంటోంది. రహస్యంగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ అస్తవ్యస్తం నెల్లూరు నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడపడితే అక్కడ నిలిపే బస్సులు, నడిరోడ్లపైనే ఆటోస్టాండ్లు, పార్కింగ్లు, వ్యాపారాలు వెరసి నగరవాసులకు ట్రాఫిక్ టెర్రిఫిక్గా మారింది. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పూర్తి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పని ఒత్తిడి సిబ్బంది కొరత పోలీసుశాఖను వెంటాడుతోంది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో శాంతిభద్రతల పరిరక్షణ కష్టతరంగా మారింది. ఉన్న సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగి పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. సిబ్బంది కొరత సమస్యను తీర్చి పనిఒత్తిడి తగ్గించాల్సి ఉంది. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలో బాపూజీవీధిలో ఉన్న ఆర్కే లాడ్జిలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన సామినేని వెంకటేష్(29) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి చెందిన సామినేని వెంకటేష్ ఈ నెల 26వ తేదీన సూళ్లూరుపేట పరిసర ప్రాంతంలోని సెజ్లో ఉద్యోగం కోసం వచ్చి బజారులోని ఆర్కే లాడ్జిలో దిగారు. లాడ్జిలో ఉంటూ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అన్నం పార్శిల్ తీసుకుని వేసుకున్న తలుపులు మంగళవారం సాయంత్రానికి కూడా తీయకపోవడంతో లాడ్జి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగులగొట్టి చూడగా బాత్రూంలో విగతజీవుడై పడి ఉన్నాడు. అతని పక్కనే బీరు బాటిల్, ఓ పురుగు మందు బాటిల్ ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. అయితే నిరుద్యోగ సమస్యను తట్టుకోలేక ఆత్యహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావించి అతని బంధువులకు సమాచారం అందించారు. లాడ్జి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ బంధం.. విషాదం
భార్యాభర్తలు.. వారికిద్దరూ బిడ్డలు. వాళ్లది ఎంతో అన్యోన్యమైన కుటుంబం. పిల్లలు, భార్య అంటే ఆయనకు ఎంతో ఇష్టం. వారిని అత్యంత ప్రేమగా చూసుకునేవాడు. వాళ్లు సైతం ఆయన్ను విడిచి ఉండేవారు కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమానుబంధాలు అల్లుకున్న పొదరిల్లు. ఈ క్రమంలో అతను గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలిసి భార్య, పిల్లలు జీర్ణించుకోలేకపోయారు. ఆయన లేని జీవితం వ్యర్థమనుకున్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ విషాదంలో పెద్ద కుమార్తె మృతి చెందగా, తల్లి, చిన్న కుమార్తె ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హృదయ విదారక విషాద ఘటన నగరంలోని రంగనాయకులపేట గురుతోటలో ఆదివారం జరిగింది. నెల్లూరు(క్రైమ్): నగరంలోని రంగనాయకులపేట గురుతోట ఒకటో వీధిలోని సాయి శ్రీనివాస నిలయం రెండో అంతస్తులో నాలుగేళ్లుగా ముం గర కొండలరావు (50), సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి విష్ణువర్ధిని (13), దివ్యసోనిక ఇద్దరు కుమార్తెలు. స్టోన్హౌస్పేట అరుణాచలంవీధిలోని నారాయణ స్కూల్లో పెద్ద కుమార్తె ఏడో, చిన్నకుమార్తె ఐదో తరగతులు చదువుతున్నారు. కొండలరావు గతంలో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వద్ద పీఏగా పనిచేశారు. ఆయనకు విస్తృత పరిచయాలు ఏర్పడ్డాయి. అనంతరం అక్కడ పనిమానేసి రియల్ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. భార్య, పిల్లలంటే ఆయనకు చెప్పలేనంత ఇష్టం. అధిక సమయం వారితోనే గడిపేవాడు. వారు సైతం కొండలరావును వదిలి ఉండేవారు కాదు. వ్యాపార నిమిత్తం కొండలరావు తరచూ హైదరాబాద్కు వెళ్లేవాడు. వారం, పది రోజుల పాటు అక్కడే ఉండి వ్యాపార లా వాదేవీలు చూసుకుని తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఎప్పటిలాగే నాలుగు రోజుల కిందట ఆయన హైదరాబాద్కు వెళ్లారు. అబిడ్స్లోని బృందావనం లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఆయన గుండెపోటుకు గురై లాడ్జిలోని తన గదిలో మృతి చెందాడు. లాడ్జి యాజమాన్యం అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కొండలరావు వద్ద లభ్యమైన ఫోను నంబర్లు ఆధారంగా అతని స్నేహితుడైన నెల్లూరు గురుతోటకు చెందిన ల్యాండ్రి యజమాని వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. మృతిని జీర్ణించుకోలేక.. ఆదివారం కావడంతో సుజాత తన పిల్లల కోసం చికెన్, దోసెలు చేసింది. ముగ్గురూ టిఫిన్ తింటుండగా వెంకటేశ్వర్లు కొండలరావు మృతి చెందాడన్న విషయాన్ని వారికి తెలియజేశాడు. దీంతో వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెలవిసేలా రోదిస్తుండటంతో వెంకటేశ్వర్లు గొల్లవీధిలోని మృతుడి బంధువులకు తెలియజేశారు. కొండలరావు లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని తల్లి, కుమార్తెలు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. బంధువులు హుటాహుటిన కొండలరావు ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా అవి రాలేదు. సుజాత, పిల్లలను పిలువగా లోపలి నుంచి అలికిడి లేకపోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచారు. కింద ఇంట్లో కొయ్యపనిచేస్తున్న వారు పైకి వచ్చి తలుపులు తెరిచేందుకు ప్రయత్నం చేశారు. స్థానికులు షాబుద్దీన్, మరికొందరు అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. హాలులో పెద్ద కుమార్తె విష్ణువర్ధిని (13) ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. సుజాత, చిన్న కుమార్తె దివ్యసోనిక కోసం వెతగ్గా హాలులో ఉన్న మరో ఫ్యాన్కు, పడక గదిలోని ఫ్యాన్కు చీరలు వేలాడుతూ కనిపించాయి. పడక గదిలో తల్లి, దివ్యసోనికలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారి పక్కనే హిట్, హార్పిక్స్ బాటిల్స్ ఉన్నాయి. ఉరేసుకోవడం కుదరకపోవడంతో దోమలను చంపేందుకు ఉపయోగించే హిట్, మరుగుదొడ్లును శుభ్రం చేసే హార్పిక్స్లను తాగినట్లు తెలుస్తోంది. దివ్యసోనిక ముక్కు, నోట్లో నుంచి రక్తం రావడాన్ని గమనించారు. వెంటనే సుజాత, ఆమె కుమార్తెను చికిత్స నిమిత్తం హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నారాయణ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. సంతపేట ఇన్స్పెక్టర్ బి. పాపారావు , ఎస్సై సుభాని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల సహాయంతో విష్ణువర్ధిని మృతదేహాన్ని కిందకు దించారు. బాధిత బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కొండలరావు మృతదేహం సోమవారం నెల్లూరుకు రానుంది. అందుకు బంధువులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గురుతోటలో విషాదఛాయలు కొండలరావు అతని కుమార్తె విష్ణువర్ధిని మృతి చెందండం, అతని భార్య సుజాత, కుమార్తె దివ్యసోనిక ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో ఉండడంతో గురుతోట, గొల్లవీధిలో విషాదం నింపింది. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని విష్ణువర్ధిని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తోటి పిల్లలతో ఆడుకున్న విష్ణువర్ధిని, దివ్యసాయి, వారి తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరి హృదయాలను కలిచి వేసింది. -
ఇంటిపెద్ద మరణవార్త విని తట్టుకోలేక..
సాక్షి, నెల్లూరు : నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిపెద్ద గుండెపోటుతో మరణించాడన్న వార్త విని తట్టుకోలేకపోయిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం నెల్లూరు నగరంలోని రంగానాయకులపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు రంగనాయకకులపేటకు చెందిన కొండలరావు రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. ఈ ఆదివారం వ్యాపారానికి సంబంధించిన పనిపై హైదరాబాద్ వెళ్లాడు. హైదరాబాద్లో ఉండగానే గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయం నెల్లూరులో ఉన్న అతని కుటుంబసభ్యులకు తెలిసింది. కొండలరావు మరణవార్త విని తట్టుకోలేకపోయిన భార్య సుజాత, కూతర్లు దివ్య, విష్ణువర్థినిలు ఇంట్లోనే ఉరిపోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో కొండలరావు చిన్న కుమార్తె విష్ణువర్ధిని మరణించగా భార్య, పెద్ద కూతురు పరిస్థితి విషమంగా మారింది. -
క్షణికావేశంలో బలవన్మరణం
నెల్లూరు (క్రైమ్): క్షణికావేశంలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఇస్కాన్ సిటీ సమీపంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. కోవూరు చల్లాయపాళెంకు చెందిన నాగరాజు, వాణి (22) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగరాజు మార్బుల్ పాలిష్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొంతకాలంగా వీరు ఇస్కాన్ సిటీ సమీపంలో నివాసం ఉంటున్నారు. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వస్త్రాలు పెట్టాలని, అందుకు డబ్బులు ఇవ్వాలని శనివారం వాణి తన భర్తను కోరింది. ఈ విషయమై దంపంతుల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది. నాగరాజు ఆమెను మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన వాణి తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జరిగిన విషయాన్ని దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పూర్ణచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రియుడే కాలయముడు..ప్రియురాలు హత్య
వెంకటగిరి (నెల్లూరు): వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. ప్రియుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. వెంకటగిరిలోని చింతచెట్టు సెంటర్కు చెందిన రజియా అలియాస్ పోలమ్మ (22)ను ఆమె ప్రియుడు పట్టణానికి చెందిన పూజారి రాంబాబు హత్యచేసి పూడ్చిపెట్టిన ఘటన గురువారం మండలంలోని యాతలూరు అటవీప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్ట్టణంలోని కైవల్యానది సమీపంలోని వీరమాతల దేవాలయం చింతచెట్టు ప్రాంతానికి చెందిన రజియా శ్రీకాళహస్తి మండలం చింతపూడికి చెందిన వెంకటేశ్వర్లు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం రజియా భర్త వెంకటేశ్వర్లు సూళ్లూరుపేటలో భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. ఈనెల 11వ తేదీన సబ్బు తీసుకువస్తానని పోలమ్మ పట్టణంలోకి వెళ్లి అప్పటినుంచి కనిపించకుండా పోయింది. రజియా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బంధువుల ఇళ్ల వద్ద వాకబు చేశారు. అయితే ఆచూకీ తెలియలేదు. దీంతో ఆమె తల్లి జవ్వల మస్తానమ్మ తన కుమార్తె కనిపించడంలేదని ఈనెల 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన పూజారి రాంబాబుపై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే రాంబాబు పరారీలో ఉండటంతో అతని ఆచూకీ కోసం గాలించారు. రాయితో కొట్టి.. ఈ నేపథ్యంలో 18వ తేదీ ఉదయం స్థానిక వీఆర్వోతో కలసి రాంబాబు పోలీసులకు లొంగిపోయాడు. అతడిని విచారించగా రజియాను హత్య పూడ్చిపెట్టినట్లు చెప్పాడు. ఆమెతో తనకు పదేళ్ల నుంచి సన్నిహిత సంబంధం ఉందని విచారణలో వెల్లడించాడు. రజియా వివాహం చేసుకున్న తర్వాత తనతో సరిగ్గా ఉండటంలేదని 11వ తేదీన పిలిపించుకుని మండలంలోని యాతలూరు అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో పక్కనే ఉన్న రాయితో రజియా ముఖంపై కొట్టడంతో మృతిచెందినట్లు నిందితుడు పోలీసులకు చెప్పారు. మృతదేహాన్ని సమీపంలోని గుంటలో పూడ్చిపెట్టాడు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కొండపనాయుడు, తహసీల్దార్ రాజ్కుమార్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడి వైద్యుడు శ్రీనివాస్ శవపరీక్ష నిర్వహించేందుకు నిరాకరించడంతో ఎస్సై చొరవతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం పూర్తి చేయించారు. రాంబాబును పోలీసులు కోర్టుకు హజరుపరిచి అనంతరం రిమాండ్కు తరలించారు. -
పొట్టకూటి కోసం వెళ్తుండగా..
చిట్టమూరు(నెల్లూరు): ఎదురుగా వస్తున్న మోటారుసైకిల్ను తప్పించే క్రమంలో రొయ్యల కంపెనీ వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడడంతో పొట్టకూటి కోసం కంపెనీలోకి పనికి వెళ్తున్న 29 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని మల్లాం సమీపంలో ఆదివారం వేకువన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కోట మండలం చెందోడు వద్ద ఉన్న సాగర్ గాంధీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జీవీఆర్) రొయ్యల కంపెనీలో పనికి వాకాడు మండలం వాలమేడు, వైట్ కుప్పం తదితర గ్రామాలకు చెందిన మహిళా కూలీలు నిత్యం వెళ్తుంటారు. రోజూలాగే ఆదివారం వేకువన 29 మంది మహిళలు కంపెనీ వ్యాన్లో పనికి బయలుదేరారు. మండలంలోని తిరుమూరు గ్రామానికి వెళ్లే మలుపు వద్దకు వ్యాన్ వచ్చేసరికి ఎదురుగా మోటారు సైకిల్ వచ్చింది. డ్రైవర్ మోటారు సైకిల్ను తప్పించబోగా వ్యాన్ అదుపుతప్పి ఒక్కసారిగా తిరగబడి పోయింది. ఈ ప్రమాదంలో వ్యాన్లోని 29 మంది మహిళలు కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. మహిళల అరుపులను విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలు పాలైన వారిని వ్యాన్లో నుంచి బయటకు తీసి ఆటోల్లో మల్లాం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. 108కు ఫోన్ చేసినా సకాలంలో స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన గంట తర్వాత రెండు 108 వాహనాలు మల్లాం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చాయి. తీవ్రంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం గూడూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మహిళలను నెల్లూరు వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. చిట్టమూరు ఎస్సై వేణుగోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. వ్యాన్ డ్రైవర్ను విచారించి వివరా>లు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పరిమితికి మించి కూలీలను ఎక్కించడంతోనే.. జీవీఆర్ కంపెనీకు చెందిన వ్యాన్ సీటింగ్ కెపాసిటీ 15 మంది కాగా, పరిమితికి మించి ఎక్కించడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన కూలీలకు వైద్యం అందించి కంపెనీ ఆదుకోవాలని కోరారు. -
వివాహిత ఆత్మహత్య
గూడూరు రూరల్: గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో నివాసం ఉంటున్న అల్లూరు సురేఖ(32) అనే వివాహిత గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు శుక్రవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఏరియా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు మనుబోలు మండలం చెర్లోపల్లికి చెందిన అల్లూరు సుబ్బయ్య, సురేఖలకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి స్వరూప, వినయ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి కోసం గత ఐదేళ్లుగా చెన్నూరులో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మనుబోలు పోలీస్స్టేషన్లో కూడా భర్తపై సురేఖ ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు సర్దిచెప్పి పంపారు. మద్యానికి బానిసైన సుబ్బయ్య తమ కుమార్తెను తరచూ వేధిస్తుండేవాడని తల్లి సుశీలమ్మ కన్నీటిపర్యంతమైంది. భర్తే చంపి ఉంటాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ ఎం.బాబి తెలిపారు. -
ఖరీదైన కార్లలో ఎర్రబంగారం స్మగ్లింగ్
విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఎర్రచందనం సంపదను అక్రమార్కులు కొల్లగొడుతూనే ఉన్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. నిఘా అధికారుల కళ్లుగప్పుతూ పొరుగు రాష్ట్రం తమిళనాడు మీదుగా ఎర్రబంగారాన్ని విదేశాలకు తరలించేస్తున్నారు. ఖరీదైన కార్లు, వాహనాలను వినియోగిస్తూ ఎలాంటి అనుమానం రాకుండా స్మగ్లింగ్ చేసేస్తున్నారు. సీట్లను తొలగించి అందులో ఎర్రచందనం దుంగల్ని రవాణా చేస్తున్నారు. గురువారం సూళ్లూరుపేటలో పట్టుబడిన ఎర్రచందనం వాహనమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. అంతేకాదు వాహనాలకు ఎమ్మెల్యే స్టిక్కర్లు వినియోగించి అధికారులను బురిడీ కొట్టించడం గమనార్హం. అధికారులు కూడా మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. నెల్లూరు, సూళ్లూరుపేట: రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని అటవీప్రాంతాల్లో అపారమైన ఎర్రచందనం సంపద ఉంది. ఎంతో విలువైన ఎర్రబంగారం పొరుగు రాష్ట్రం తమిళనాడు మీదుగా విదేశాలకు తరలిపోతోంది. ఈ అక్రమ రవాణాతో అటు స్మగ్లర్లు, ఇటు అధికారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. దొరికితేనే దొంగలు.. లేదంటే దొరలు అన్నట్టుగా తయారైంది. జిల్లాలోని వెంకటగిరి, రాపూరు, సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట ప్రాంతాల్లోనే కాకుండా చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో నిత్యం ఏదో ఒకచోట ఎర్రచందనం తరలించే వాహనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ అక్రమ రవాణాకు మినీలారీలు, పార్శిల్ లారీలు, ఖరీదైన కా>ర్లను ఉపయోగిస్తున్నారు. ఖరీదైన అధునాతన వాహనాల్లో సీట్లను తొలగించి ఎర్రచందనం దుంగల్ని ఉంచుతున్నారు. అంతేకాదు ఏదో రాజకీయ నాయకుడి(ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) స్టిక్కర్లు చేసుకుని దర్జాగా రవాణా చేస్తున్నారు. దుండగులను పట్టుకోవడంలో అధికారులు ప్రతిసారీ ఘోరంగా విఫలమవుతూనే ఉన్నారు. ఎర్రచందనం వాహనంతో వ్యక్తులు పట్టుబడినా రాజకీయ నాయకుల ఫోన్ల వల్ల, ఈ వ్యాపారం చేసే వారు ఇచ్చే తాయిలాల వల్ల పట్టుబడిన వ్యక్తులను గుట్టుచప్పుడు కాకుండా వదిలేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. విధి లేని పరిస్థితిలో ఎర్రచందనం తరలించే వాహనాలు పట్టుబడితే దుండగులు పరారయ్యారని, పట్టుబడిన దుంగలు, వాహనంపై కేసు నమోదు చేసేసి అటవీశాఖకు బదలాయించి పోలీసులు చేతులు దులిపేసుకుంటున్నారు. వివరాలు తెలిసినా.. ఏవాహనంలో ఎర్రచందనం రవాణా అవుతుందో పోలీసులకు, చెక్పోస్టులోని అటవీ శాఖాధికారులకు తెలుసుననే విషయం బహిరంగ రహస్యమే. జిల్లాలోని వెలిగొండ అటవీప్రాంతంలో సుమారు 2 లక్షల హెక్టార్లలో, తిరుమల–తిరుపతి కొండల్లోని శేషాచలం అడవుల్లో విస్తారంగా ఎర్రచందనం విస్తరించి ఉందని అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. గత పదేళ్లలో అధికారులు జరిపిన దాడుల్లో వేల టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసున్నారు. ఇందులో 1000 మందికి పైగా అరెస్ట్ చేసి వందలాది వాహనాలు సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాలో పట్టుబడిన వారంతా ఎర్రచందనాన్ని నరికే కూలీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. అక్రమ రవాణా చేసే అసలు సిసలైన బడా వ్యక్తులు మాత్రం పట్టుబడరు. చిత్తూరు జిల్లా కేంద్రంగా నెల్లూరు జిల్లా మీదుగా భారీ ఎత్తున ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో కడప, రాజంపేట, తిరుపతి పట్టణాల్లో ఎర్రచందనాన్ని నరికే కూలీలను భారీ ఎత్తున అరెస్ట్ చేసినప్పటికీ రవాణా ఆగలేదంటే పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుపతి, కడప జిల్లా వైపు నిఘా ఎక్కువ కావడంతో కూలీలు కర్నాటక మీదుగా రూటు మారి రావడమే కాకుండా ఆంధ్రా–తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాలను కేంద్రంగా చేసుకుని స్మగ్లింగ్ జరుగుతోంది. ఈ ఏడాది జూన్ 20వ తేదీన ఫారెస్టు బీటు అధికారితోపాటు 16 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. సుమారు రూ.2.5 కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. నియోజకవర్గంలోని తడలో 2003లో పోలీసుల సాయంతో తమిళనాడు గుమ్మిడిపూండికి చెందిన ఓ స్మగ్లర్ జాతీయ రహదారికి పక్కనే మూతపడిన ఓ కంపెనీని లీజుకు తీసుకుని ఏకంగా ఇక్కడ సామిల్లు పెట్టేశాడు. ఈ సామిల్లులోనే ఎర్రచందనాన్ని కటింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారు. అప్పట్లో జిల్లా పోలీస్ అధికారులకు స్థానికులు అందించిన సమాచారం మేరకు దాడులు చేసి సుమారు రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని ఈ సామిల్లులో పట్టుకున్నారు. కేసులు.. అరెస్టులు జిల్లావ్యాప్తంగా ఏడాది కాలంలో సుమారు 66 కేసులు వరకూ నమోదు చేసి 393 మందిని అరెస్టు చేశారు. ఎనిమిది మందిపై పీడీ కేసులు కూడా నమోదయ్యాయి. 2000 టన్నుల బరువైన 1310 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుంది. 83 వాహనాలను సీజ్ చేశారు. ఎర్రచందనం దుంగలు స్వాధీనం సూళ్లూరుపేట: వెలిగొండ అటవీ ప్రాంతం నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలివెళుతున్న సుమారు రూ.3 లక్షలు విలువైన ఐదు ఎర్రచందనం దుంగలను సూళ్లూరుపేట పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైవే మొబైల్ పోలీసులు హోలీక్రాస్ సెంటర్ వద్ద గురువారం తెల్లవారుజామున గస్తీలో ఉన్నారు. టీఎన్ 05 ఏజడ్ 4133 నంబర్ కలిగిన అశోక్ లేలాండ్ స్టైల్ అనే కారుపై అనుమానంతో వెంబడించారు. ఈ విషయాన్ని గుర్తించిన కారు డ్రైవర్, మరో వ్యక్తి చెంగాళమ్మ పరమేశ్వరి దక్షిణంవైపు స్వాగత ద్వారం వద్ద వాహనాన్ని నిలిపి పరారయ్యారు. పోలీసులు తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. దీంతో ఎస్సైకి సమాచారం అందించారు. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని టాస్క్పోర్స్ అధికారులకు అప్పగించామని ఎస్సై తెలిపారు. -
సివిల్ ఇంజినీర్ మృతదేహం వెలికితీత
నెల్లూరు, పెళ్లకూరు/నాయుడుపేటటౌన్: మండలంలోని పాలచ్చూరు గ్రామం మామిడి కాలువ సమీపంలోని పారిశ్రామిక కారిడార్ భూముల్లో దారుణహత్యకు గురైన గుంటూరుకు చెందిన సివిల్ ఇంజినీర్ తన్నీరు సురేష్గోపి (25) మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. ఈ కార్యక్రమం తహసీల్దార్ నాగరాజలక్ష్మి, నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రావుల ఆధ్వర్యంలో జరిగింది. గోపిని హత్య చేసి గోనె సంచిలో కట్టి సెజ్ పరిధిలో పనులు జరుగుతున్న కాలువలో పడేసి మట్టి వేసినట్లుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహం బాగా కుళ్లిపోయింది. ఇయర్ ఫోన్స్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటరత్నమ్మ, పెళ్లకూరు, నాయుడుపేట ఎస్సైలు మహ్మద్హనీఫ్, వేణు, ఆర్ఐ చిదానందం, వీఆర్వో చెంచుబాబు, గ్రామపెద్దలు మునికృష్ణయ్య, వీఆర్ఏలు వంశీ, సురేష్ పాల్గొన్నారు. వారి పైనే అనుమానం సురేష్గోపి హత్య కేసు మిస్టరీగా మారింది. ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి వరకు డ్యూటీ చేసిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు టిప్పర్ డ్రైవర్లు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటేనే పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ మల్లికార్జునరావు చెబుతున్నారు. కాగా అనుమానితులైన ఇద్దరు డ్రైవర్లు, ఆరోజు డ్యూటీలో లేని మరో ఇద్దరు అదే రాష్ట్రానికి చెందిన డ్రైవర్లు కాంట్రాక్టర్, సూపర్వైజర్లకు చెప్పకుండా వెళ్లిపోవడంతో హత్యతో వారికి సంబంధం ఉంటుందేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నుంచి 21 తేదీ వచ్చిన గోపి అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో అతని తల్లి ధనలక్ష్మీతో మాట్లాడాడు. అలాగే పాలచ్చూరు సెజ్ భూముల వద్ద పనిచేస్తున్న సంస్థ సూపర్వైజర్ తేజతో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మాట్లాడినట్లు విచారణలో తెలియవచ్చింది. కాగా హత్య వెనుక సూపర్వైజర్ ప్రమేయం కూడా ఉంటుందని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గోపి నాయుడుపేటకు వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడాడు, అతను పనిచేస్తున్న సెజ్ భూముల వద్ద ఉన్న సెక్యూరిటీ మొదలుకొని సైట్ ఇంజినీర్, టిప్పర్, ఇతర వాహనాల డ్రైవర్లతో పోలీసులు మాట్లాడి విచారించారు. కుటుంబాన్ని పోషించేందుకు.. నాయుడుపేటటౌన్: కుటుంబానికి అండగా ఉండేందుకు సురేష్గోపి కాంట్రాక్టర్ వద్ద విధుల్లో చేరాడు. అయితే అతని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గుంటూరులోని కేవీపీ కాలనీకు చెందిన తన్నీరు శ్రీనివాసరావు, ధనలక్ష్మీలకు ఇద్దరు సంతానం. కొడుకు గోపిని బీటెక్ వరకు చదివించారు. కుమార్తె గాయత్రిదేవికి వివాహం చేశారు. గోపిని ఎంటెక్ చదివించాలనుకున్నారు. అయితే శ్రీనివాసరావుకు ఒక్కసారిగా ఆరోగ్య సమస్యల రావడంతో మంచం పడ్డాడు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు గోపి గుంటూరులో యార్ల తిరుపతిరావు అనే కంట్రాక్టర్ వద్ద రూ.8 వేలు జీతానికి సివిల్ కాంట్రాక్టర్గా ఈనెల 4 తేదీన పనిలో చేరాడు. గోపి ఆచూకీ కోసం వారంరోజులుగా వెతుకులాడుతున్న గుంటూరుకు అతని మేనమామ శ్రీనివాసులు, బాబాయిలు తన్నీరు ఏడుకొండలు, చుండూరు కృష్ణకిషోర్, మరో మేనమామ నగలపాటి వెంకటరమణలు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. తమ బిడ్డను కిరాతకంగా హత్య చేసి అనవాళ్లు తెలియకుండా పూడ్చిపెట్టారని నిందితులను గుర్తించి వారికి కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు. పోస్ట్మార్టం అనంతరం వారు మృతదేహాన్ని గుంటూరుకు తీసుకెళ్లారు. -
సివిల్ ఇంజినీర్ దారుణహత్య
నాయుడుపేటటౌన్ (నెల్లూరు): గుంటూరుకు చెందిన సివిల్ ఇంజినీర్ తన్నీరు సురేష్గోపి (25) అనే యువకుడిని మేనకూరు సేజ్ పరిధిలో కోనేటి రాజుపాళెం సమీపంలో దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరులోని కేవీపీ కాలనీకి చెందిన సురేష్కుమార్ బీటెక్ (సివిల్) పూర్తి చేశాడు. తమ ప్రాంతానికి చెందిన యార్ల తిరుపతిరావు అనే కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఓ కాంట్రాక్ట్కు సంబంధించి జేసీబీలు, టిప్పర్లు నాయుడుపేట మండలం కోనేటిరాజుపాళెంలో ఉన్నాయని, అక్కడ సిబ్బందితో కలిసి పనిచేయాలని కాంట్రాక్టర్ అతడికి చెప్పాడు. గోపి ఈనెల 22వ తేదీన నాయుడుపేటకు చేరుకున్నట్లు ఆరోజు రాత్రి తల్లి ధనలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. 23న గోపికి అతని కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కాంట్రాక్టర్ను కలిసి తన కుమారుడు ఫోన్ పనిచేయడంలేదని చెప్పారు. దీంతో కాంట్రాక్టర్ కోనేటిరాజుపాళెం వద్ద తేజ అనే సూపర్వైజర్ ఉన్నాడని, అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. దీంతో గోపి కుటుంబసభ్యులు ఈనెల 25వ తేదీన కోనేటిరాజుపాళెం చేరుకుని విచారించగా సురేష్గోపి ఇక్కడకు రాలేదని తేజ వారికి చెప్పాడు. దీంతో వారు భయాందోళనకు గురైన అతని మేనమామ సిరిగిరి శ్రీనివాసులు అదేరోజు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు యువకుడు అదృశ్యమైనట్లుగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. హత్య చేసి పూడ్చిపెట్టారు గోపి అదృశ్యమైన విషయమై బాధిత కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు సారథ్యంలో సీఐ మల్లికార్జునరావు, ఎస్సై జి.వేణులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న కొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు యువకుడిని అక్కడ పనిచేస్తున్న ఎవరో హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టినట్లుగా తెలుసుకున్నారు. దీంతో డీఎస్పీతో పాటు పోలీసు అధికారులు సంస్థ సమీప ప్రాంతాల్లో బుధవారం తవ్వకాలు చేపట్టారు. ఓ చోట దుర్వాసన వస్తుండటంతో తవ్వించారు. యువకుడి మృతదేహం బయటపడింది. కాగా గోపి కనిపించకుండా పోయినరోజు నుంచి అక్కడ పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు టిప్పర్ డ్రైవర్లు కూడా కనిపించడంలేదని చెబుతున్నారు. దీంతో హత్య వెనుక వారి ప్రమేయం ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో గురువారం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. గోపి మృతిచెందాడన్న విషయం తెలుసుకుని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.