Satellites
-
గరుడుడి రెక్కలు తొడిగిన ఇస్రో!
అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. భారత్ సొంతంగా తయారు చేసుకున్న క్రయోజెనిక్ ఇంజిన్ సీఈ–20ని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న పరిశోధన శాలలో విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోని శూన్య పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి జరిపిన ఈ ప్రయోగం క్రయోజెనిక్ టెక్నాలజీ ప్రస్థానంలో ముఖ్యమైంది. దాని ప్రాముఖ్యం తెలుసుకునేందుకు చిన్న పోలికను చూద్దాం. వాహనం నడిపేటప్పుడు... వాలుగా ఉన్న రహదారి కనిపించిన వెంటనే చాలామంది మోటర్ను ఆఫ్ చేస్తూంటారు. గురుత్వాకర్షణ శక్తి ఆధారంగానే వాహనం వేగం పుంజుకుంటుంది. వాలు మొత్తం పూర్తయిన తరువాతే మళ్లీ మోటర్ను ఆన్ చేయడం కద్దు. అచ్చం ఇలాగే ఉపగ్రహాలను అంతరిక్షంలో వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు ఇంజిన్ను ఆన్/ఆఫ్ చేయాల్సి వస్తూంటుంది. అంగారక గ్రహం పైకి ఇస్రో ప్రయోగించిన ‘మంగళ్యాన్’నే ఉదాహరణగా తీసుకుంటే... ప్రయోగం తరువాత దీని ఇంజిన్ను సుమారు పది నెలల విరామం తరువాత ఆన్ చేశారు. ఇలా ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఆన్/ఆఫ్ చేసుకోగల ఇంజిన్ ఇస్రో వద్ద ప్రస్తుతానికి ఒక్కటే ఉంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి ఏడున జరిగిన ప్రయోగానికి ప్రాధాన్యం ఏర్పడుతుంది. సీఈ–20యూ ఇంజిన్ ప్రయోగంలో... అనుకున్నట్టుగానే పనిచేసింది. రీ స్టార్ట్ చేయాల్సినప్పుడు ఇంధన ట్యాంకుపై ఉండే పీడన పరిస్థితులను అనుకరించి మరీ ప్రయోగం నిర్వహించారు. మరిన్ని ప్రయోగాలు చేపట్టిన తరువాత మాత్రమే దీన్ని ఉపగ్రహ ప్రయోగ రాకెట్లలో ఉపయోగిస్తారు.బాగా పీడనానికి గురిచేసిన గాలిని ఒక్కసారిగా వదిలామను కోండి... న్యూటన్ మూడో సూత్రం ప్రకారం గాలి ఉన్న ట్యాంకు వ్యతిరేక దిశగా వేగమందుకుంటుంది. ఇదే పద్ధతిలో వేడి వాయువును ఉత్పత్తి చేసి ఒక చిన్న నాజిల్ గుండా విడుదల చేయడం ద్వారా వాహనాన్ని నడిపించవచ్చు. మండించేందుకు ఇంధనంతో పాటు ఆక్సిజన్ అవసరం ఉంటుంది. వీటినే మనం ఇంగ్లీషులో ‘ప్రొపెల్లంట్స్’ అని పిలుస్తూంటాం. రాకెట్ ప్రొపెల్లంట్స్ ప్రధానంగా ఘన, ద్రవ, వాయు అని మూడు రకాలు. ఘన ఇంధనం స్థానంలో కిరోసిన్ను, దీనికి సరిపోయే ఆక్సిడైజర్ ఒకదాన్నీ వాడుకోవచ్చు. సీఈ–20 ద్రవ ఇంధనంతో నడిచే రాకెట్. వాయువులతో పోలిస్తే ఘన, ద్రవ ఇంధనాలు రెండూ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.ద్రవంగా ఉన్నప్పటి కంటే నీరు వాయువుగా ఉన్నప్పుడు పదహారు రెట్లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఈ కారణంగానే క్రయోజెనిక్ ఇంజిన్లలో వాడే ఇంధనాన్ని బాగా చల్లబరుస్తారు. సైన్స్ పరిభాషలో మైనస్ 153 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత (మీథేన్ వాయువు మరిగే ఉష్ణోగ్రత)ను ‘క్రయో’ అని పిలుస్తారు. ‘క్రయో జెనిక్’ ఇంధనంగా వాడే ద్రవ హైడ్రోజన్ ‘–253 డిగ్రీల’ ఉష్ణోగ్రతల్లో ఉంటుంది. ద్రవ ఆక్సిజన్ ‘–183 డిగ్రీల’. ఈ రెండూ కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి ఆవిరి ఉత్పత్తి అవుతుంది. ఈ వాయువు ఎంత తేలికగా ఉంటే... వేగం పెరగడం అంత ఎక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ అత్యంత తేలికైన మూలకం కాబట్టి ఇది సమర్థమైన క్రయోజెనిక్ ఇంధనం. కాబట్టే దీన్ని అంతరిక్ష ప్రయోగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. జాబిల్లి లేదా సుదూర గ్రహాలను అందుకునేందుకు ఈ క్రయోజెనిక్ ఇంజిన్లు, ఇంధనాలు బాగా ఉపయోగపడతాయి. భూ వాతావరణానికి అవతల మాత్రమే ఉపయోగించే ఈ క్రయోజెనిక్ ఇంజిన్లతో పనిచేసిన అనుభవం ప్రస్తుతానికి అమెరికా, రష్యా, జపాన్, భారత్, ఫ్రాన్స్, చైనాలకు మాత్రమే ఉంది. భూమి నుంచి వంద కిలోమీటర్లకు అవతల ఉన్న ప్రాంతాన్ని అంతరిక్షం అంటాం. క్రయోజెనిక్ ఇంజిన్లు బాగా సమర్థ మంతమైన వే అయినప్పటికీ వీటిని భూమ్మీది నుంచే వాడుకోవడం కష్టతరమవుతుంది. ఎందుకంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తిని అధిగ మించేందుకు చాలా ఎక్కువ బలం కావాలి.ట్రాఫిక్సిగ్నల్లో పచ్చలైట్ పడిన వెంటనే మనం ఏం చేస్తాం? వీలైనంత వేగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాం. ఇందుకు మంచి పికప్ ఉన్న ఇంధనం అవసరం. అదే మీరు హైవేపై దూరం వెళుతున్నారనుకోండి... బాగా మైలేజీ ఇచ్చే ఇంజిన్ కావాలి. పెట్రోలు వాహనాలకు పికప్ బాగుంటే... డీజిల్ ఇంజిన్కు మైలేజీ ఎక్కువన్నది మనకు తెలుసు. ఇదే మాదిరిగా అంతరిక్ష ప్రయోగాల మొదట్లో జడత్వాన్ని అధిగమించి ఆకాశంలోకి ఎగబాకగలిగే, గురుత్వాకర్షణతో పోటీపడి ముందుకు దూసుకెళ్లే... వాతావరణం తాలూకూ ప్రభావాన్ని అధిగమించగలిగే ఇంజిన్ అవసరం. వీటన్నింటికీ ఘన లేదా ద్రవ ఇంధనాలు బాగుంటాయి. అయితే అంతరిక్షంలోకి చేరిన తరువాత మాత్రం మైలేజీ బాగా ఉండే ఇంజిన్ కావాలి. గతంలో సోవియట్ యూనియన్, అమెరికాలు రెండూ అత్యంత శక్తిమంతమైన లాంచ్ వెహికల్స్ తయారీలో పోటీపడ్డాయి. ఆ క్రమంలోనే జాబిల్లిని కూడా అందుకున్నాయి. గ్రహాలను దాటగల అంతరిక్ష వాహనాలను సిద్ధం చేయగలిగాయి. 1963లో తొలి క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ ‘ఆర్ఎల్–10’ ప్రయోగం జరిగింది. ఈ క్రయో జెనిక్ను అమెరికా ఇప్పటికీ ఉపయోగిస్తోంది. సోవియట్ విషయానికి వస్తే... ఇది ‘ఆర్డీ–56’ లేదా ‘11డీ–56’ అనే క్రయోజెనిక్ ఇంజిన్ను 1964లో తయారు చేసింది. తరువాతి కాలంలో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ తయారీపై రష్యా దృష్టి పెట్టింది. ఫలితంగా అత్యంత శక్తిమంతమైన, కిరోసిన్, ఆక్సిజన్లను ఇంధనంగా వాడుకోగల ఆర్డీ–18 ఇంజిన్ తయారైంది. దీంతోపాటే తయారైన మరో మెరుగైన డిజైన్ కలిగిన క్రయోజెనిక్ ఇంజిన్ ‘కేవీడీ–1’ రష్యా మనకు అమ్మింది. 1990ల నాటికి ఇస్రో కూడా క్రయోజెనిక్ టెక్నాలజీకై ప్రయత్నాలు మొదలుపెట్టింది. జపాన్, అమెరికాలను ఇవ్వమని కోరింది కూడా. అయితే ఇంజిన్లు అమ్మడంతోపాటు తయారీ టెక్నాలజీని కూడా అందించేందుకు సోవియట్ ముందుకు రావడంతో ఇస్రో దానిని అందిపుచ్చుకుంది. కొంత కాలానికే సోవియట్ కాస్తా ముక్కలయింది. రష్యాపై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చి భారత్కు క్రయోజెనిక్ టెక్నాలజీ ఇవ్వరాదని కట్టడి చేసింది. ఈ టెక్నాలజీతో భారత్ అణ్వాస్త్రాలు తయారు చేస్తుందన్నది అమెరికా భయం. అయితే ఈ వాదన చాలా అసంబద్ధమైంది. ఎందుకంటే క్షిపణులను అవసరమైనప్పుడు క్షణాల్లో ప్రయోగించేలా ఉండాలి. కానీ ఒక క్రయోజెనిక్ ఇంజిన్ను ఆన్ చేయాలంటే కనీసం 24 గంటల ముందు నుంచి దాంట్లో ఇంధనం నింపాల్సి ఉంటుంది. అంతేకాదు... కొన్ని నెలల క్రితమే అధిక ధరలకు ఈ ఇంజిన్లను అమ్మేందుకు అమెరికానే ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా తనపై అమెరికా ఒత్తిడిని కాదని ఆరు ఇంజి న్లను మనకు అప్పగించింది. కానీ.. టెక్నాలజీని ఇవ్వలేకపోయింది.ఈ సమయంలోనే ఇస్రోపై కూడా అమెరికా నిషేధం విధించింది. ఆ పరిస్థితుల్లో ఇస్రో తన వద్ద ఉన్న ఆరు ఇంజిన్లను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా సీఈ–20ని తయారు చేసింది. ఈ డిజైన్ రష్యా ఇంజిన్కు నకలు కాకపోవడం విశేషం. ఎందుకంటే రష్యా ఇచ్చిన ఇంజిన్లో ఇంధనం మండటం అన్నది దశలవారీగా జరుగుతుంది. సీఈ–20 మాత్రం దీనికి భిన్నం. ఇది గ్యాస్ జనరేటర్ తరహాలో పనిచేస్తుంది. ఏళ్లపాటు కష్టపడి తయారు చేసిన ఈ సీఈ–20ని మొదటిసారి 2017 జూన్ 5న∙జీశాట్–19 ప్రయో గంలో ఉపయోగించారు. అలాగే చంద్రయాన్–2, 3 లాంచ్ వెహికల్స్లోనూ అమర్చారు. తాజా ప్రయోగాల ద్వారా దీన్ని అవసరమైనప్పుడు ఆన్/ఆఫ్ చేసే సామర్థ్యం అందడంతో భవిష్యత్తులో ఈ ఇంజిన్ను గ్రహాంతర ప్రయాణాలకూ వాడుకునే వీలు ఏర్పడింది.టీవీ వెంకటేశ్వరన్ వ్యాసకర్త విజిటింగ్ ప్రొఫెసర్, ఐసర్ – మొహాలీ -
శతప్రయోగ విజయసీమ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది. బుధవారం ఉదయం జరిపిన నూరవ రాకెట్ ప్రయోగంతో చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఎగసిన భూ సమకాలిక ఉపగ్రహ ప్రయోగవాహక నౌక (జీఎస్ఎల్వీ–ఎఫ్15) ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని విజయ వంతంగా నిర్ణీత కక్ష్య అయిన జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ – జీటీఓలోకి చేర్చింది. ఈ కొత్త ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం నిర్విఘ్నంగా సాగడం శాస్త్రవేత్తల్లో ఆనందం పెంచింది. రోదసిలో చేరిన ఈ తాజా శాటిలైట్తో మన ‘నావిక్’ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్)లో విధులు నిర్వహిస్తున్న ఉపగ్రహాల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. దీని వల్ల మన దేశంతో పాటు మన పొరుగు దేశాలకూ మొబైల్ ఫోన్లలో జీపీఎస్ సహా అనేక సేవల్లో కచ్చితత్వం పెరగనుంది. ఇతర దేశాలన్నీ అమెరికా తాలూకు జీపీఎస్పై ఆధారపడితే, భారత్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్లో సొంత కాళ్ళపై నిలబడేందుకు చేస్తున్న ఈ కృషి సగటు భారతీయుడి ఛాతీ ఉప్పొంగే క్షణం. సైకిళ్ళు, ఎడ్లబండ్లపై రాకెట్ విడిభాగాలను తరలించిన కాలం నుంచి ఇటీవలే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించే (డాకింగ్ చేసే) స్థాయికి ఇస్రో చేరడం చిరకాలం చెప్పుకోవా ల్సిన స్ఫూర్తిగాథ. విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధవన్ లాంటి దిగ్గజాల తొలి అడుగులతో ఆరంభించి, ఆపైన కలామ్ లాంటి వారి మేధను వినియోగించుకొని అయిదు దశాబ్దాల పైగా సాగించిన ప్రస్థానం చిరస్మరణీయం. 1962లో అణుశక్తి విభాగం కింద ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ ద్వారా ఇస్రోకు బీజం పడింది. చంద్రుడి మీదకు అమెరికా మానవుణ్ణి పంపిన 1969లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రో స్థాపన జరిగింది. 1972లో ప్రత్యేకంగా అంతరిక్ష శాఖ ఏర్పాటైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేక రాకెట్లకు పురుడు పోయడమే కాక, ఇతర దేశాల ఉపగ్రహ ప్రయోగాలలోనూ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగింది. మన ఇస్రో 1979 ఆగస్ట్ 10న తొలిసారిగా ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్ఎల్వీ–3 ఈ10) ద్వారా ప్రయోగాత్మకంగా రోహిణీ టెక్నాలజీ పేలోడ్ను నింగిలోకి పంపిన క్షణాలు ఆ తరంలో చాలామందికి ఇప్పటికీ గుర్తే. అప్పట్లో ఇస్రోతో పనిచేస్తున్న అబ్దుల్ కలామే ఆ ప్రయోగానికి డైరెక్టర్. సదరు ప్రయోగం పాక్షికంగానే విజయం సాధించింది కానీ, ఆ తర్వాత కాలగతిలో అంతరిక్ష ప్రయోగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా ఆరితేరాం. అంకెల్లో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఇస్రో 548 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 120 టన్నుల పేలోడ్ను నింగిలోకి పంపింది. అందులో 433 విదేశీ ఉపగ్రహాలకు చెందిన 23 టన్నులూ ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో షార్ కేంద్రం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైంది. మూడు చంద్రయాన్లు, ఒక మార్స్ ఆర్బిటర్ ప్రయోగం, ఆదిత్య ఎల్1 ప్రయోగం లాంటివి గణనీయమైనవి. కక్ష్యలో పరిభ్రమించే వ్యోమనౌకను భూవాతావరణంలోకి ప్రవేశింపజేసి... భూమి పైకి క్షేమంగా తెచ్చి రికవరీ చేసే ‘స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం’ (ఎస్ఆర్ఈ), అలాగే ఒకే రాకెట్తో 104 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వగైరా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇస్రో ప్రయోగించినవాటిల్లో కమ్యూనికేషన్ శాటిలైట్లు, భూ పరిశీలన ఉపగ్రహాలు, మార్గనిర్దేశక (నావిగేషనల్), ప్రయోగాత్మక శాటిలైట్లు అనేకం. ఆ వివరాలు సగర్వంగా తోస్తాయి. రానున్న రోజుల్లోనూ మరిన్ని చారిత్రక ఘట్టాలకు ఇస్రో చోదకశక్తి కానుంది. గగన్యాన్లో భాగంగా మానవరహిత జి1 ప్రయోగం తొలిసారి చేయనున్నారు. అలాగే, నెక్స్›్ట జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ), చంద్రయాన్, శుక్రయాన్ జరగనున్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలకు సైతం వేదికగా నిలిచి, అంతరిక్ష వాణిజ్యంలో తగిన వాటా కోసం ప్రయత్నిస్తున్న ఇస్రో మరో రెండేళ్ళలో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ను నిర్మించనుండడం విశేషం. అలాగే, తమిళనాడులోని కులశేఖరపట్నంలో రెండో ఉపగ్రహ ప్రయోగ కాంప్లెక్స్ సైతం సిద్ధమవుతోంది. భారీ పేలోడ్ లను రోదసిలోకి తీసుకెళ్ళగలిగే ఎన్జీఎల్వీల రూపకల్పనకూ, మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికీ దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుంది. అంత మొత్తం వెచ్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన, ప్రయోగ రంగానికి ఇది పెద్ద ఊతం. ఇవన్నీ ప్రైవేట్ రంగ రోదసీ ప్రయోగాల్లో ఇస్రో సింహభాగం దక్కించుకోవడానికి ఉపకరిస్తాయి. ఒకప్పుడు అగ్రరాజ్యాలు సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించినప్పుడు స్వశక్తితో దేశీయంగా బుడిబుడి అడుగులతో మొదలుపెట్టిన భారత్ దాదాపు అయిదు పదుల ఏళ్ళలో శత రోదసీ ప్రయోగాలు సాగించింది. రానున్న అయిదేళ్ళలోనే రెండో శతం పూర్తి చేసి, మొత్తం 200 ప్రయోగాల మైలురాయికి చేరుకోవడానికి ఉరకలు వేస్తోంది. ఇన్నేళ్ళుగా మన అంతరిక్ష పరిశోధ కులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చూపుతున్న అచంచలమైన నిబద్ధత, అంకితభావానికి మచ్చుతునక ఈ ఇస్రో విజయగీతిక. విశ్వవేదికపై అగ్రరాజ్యాల సరసన అంతరిక్షంలో భారత్ సూపర్ పవర్గా ఎదిగిందనడానికీ ఇది ప్రతీక. అనేక ఆర్థిక, సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ సృజనాత్మకంగా ఆలోచించి, పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మలుచుకొంటే గణనీయ విజయాలు సాధ్యమే అనడానికి ఇదే తిరుగులేని రుజువు. 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం నుంచి ఆ మధ్య మంగళ్యాన్ వరకు ప్రతిసారీ తక్కువ ఖర్చుతో, అంచనాలకు అందని విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల ఘనతకు భవిష్యత్తులోనూ ఆకాశమే హద్దు. -
డాకింగ్ దిశగా... ఇస్రో తొలి అడుగు
సూళ్లూరుపేట: అంతరిక్షంలో ఉపగ్రహాల అనుసంధానం, విడదీత సామర్థ్యాన్ని సమకూర్చుకునే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వేసిన తొలి అడుగు విజయవంతమైంది. స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్)లో భాగంగా ఛేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ–సీ60 రాకెట్ సోమవారం విజయవంతంగా నిర్ధారిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాంతో ప్రయోగంలో తొలి అంకం దిగి్వజయమైంది. అతి కీలక మైలురాయికి ఇస్రో కేవలం అడుగు దూరంలో నిలిచింది. రెండో దశలో జంట ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానం (డాకింగ్) చేయడం స్పేడెక్స్ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియ జనవరి 7న జరగవచ్చని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. అది సఫలమైతే అమెరికా, చైనా, రష్యా తర్వాత అతి సంక్లిష్టమైన డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇస్రో నిర్వహించబోయే మానస సహిత గగన్యాన్, చంద్రయాన్–4 ప్రయోగాలతో పాటు భారతీయ స్పేస్ స్టేషన్ నిర్మాణం తదితరాల్లో ఈ టెక్నాలజీది కీలక పాత్ర కానుంది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వెలిబుచ్చారు. ఇలా జరిగింది... ప్రయోగం ముందు నిర్ణయించినట్టు సోమవారం రాత్రి 9.58కు బదులు 2 నిమిషాల ఆలస్యంగా పదింటికి జరిగింది. 25 గంటల కౌంట్డౌన్ అనంతరం రెండు ఉపగ్రహాలతో పీఎల్ఎల్వీ–సి60 తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లోని తొలి ప్రయోగవేదిక నుంచి నింగికెగిసింది. మామూలుగా 320 టన్నులుండే పీఎస్ఎల్వీ రాకెట్ స్ట్రాపాన్ బూస్టర్లు లేకపోవడంతో 229 టన్నులతోనే దూసుకెళ్లింది. 111.12 సెకన్లకు తొలి దశ, 262.06 సెకన్లకు రెండో దశ, 511.22 సెకన్లకు మూడో దశ, 792.48 సెకన్లకు నాలుగో దశ విజయవంతంగా పూర్తయ్యాయి. 15.15 నిమిషాలకు టార్గెట్, 15.20 నిమిషాలకు ఛేజర్ ఉపగ్రహాలను 470 కి.మీ. ఎత్తులో నూతన సెమీ మేజర్ యాక్సిస్ వృత్తాకార కక్ష్యలో 55 డిగ్రీల వాలులో విజయవంతంగా ప్రవేశపెట్టారు. తర్వాత పీఎస్–4లో అమర్చిన పలు స్టార్టప్ కంపెనీలకు చెందిన 24 పేలోడ్లను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తయింది. 2024లో చివరిదైన ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం విజయవంతం కావడంతో సైంటిస్టుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. షార్ కేంద్రం నుంచి ఇది 99 ప్రయోగం. పీఎస్ఎల్వీ సిరీస్లో 62వది. వాటిలో 60 విజయాలే కావడం విశేషం! వారంలోనే పని మొదలు స్పేడెక్స్ ఉపగ్రహాలు వారంలోనే పని చేయడం ఫ్రారంభిస్తాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ చెప్పారు. సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ సందర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2025 మార్చిలోపు రెండు పీఎస్ఎల్వీ, ఒక జీఎస్ఎలీ్వ, రెండు ఎల్వీఎం3 రాకెట్ ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. గగన్యాన్ ప్రయోగమూ వీటిలో ఉంది’’ అని వివరించారు.స్పేడెక్స్ ఉపయోగాలెన్నో... స్పేడెక్స్ జంట ఉపగ్రహాలను ఇస్రో పూర్తిగా సొంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది. ఒక్కోదాని బరువు 220 కిలోలు. ఇవి రెండేళ్ల పాటు సేవలందిస్తాయి. వీటి అనుసంధానం సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడింది. అత్యంత వేగంగా ప్రయాణించే రెండు ఉపగ్రహాలు వేగాన్ని నియంత్రించుకుంటూ క్రమంగా పరస్పరం చేరువవుతూ సున్నితంగా అనుసంధానం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఢీకొని పేలిపోతాయి. — అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి స్పేడెక్స్ ప్రయోగం తొలి అడుగు. — రోదసీలో వ్యోమనౌకల మధ్య వస్తు మారి్పడి తదితరాలకు డాకింగ్ టెక్నాలజీ వీలు కలి్పస్తుంది. — ఇస్రో చేపట్టే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఎంతో దోహదపడుతుంది. — చంద్రయాన్–4 ద్వారా చంద్రుడి ఉపరితలంపై సేకరించిన నమూనాలను భూమికి తేవడాన్ని సులభతరం చేస్తుంది. ఇందుకోసం రెండు రాకెట్ల ద్వారా భిన్న మాడ్యూల్స్ను పంపి భూమి, చంద్రుడి కక్ష్యలో డాకింగ్ చేయనున్నారు. — కక్ష్యలో ఉపగ్రహాల మరమ్మతులు, వాటిలో ఇంధనం నింçపడం తదితరాలకు ఉపయోగపడుతుంది. — ఈ టెక్నాలజీ వల్ల ఉపగ్రహాల జీవితకాలమూ పెరుగుతుంది. — జంట ఉపగ్రహాల్లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా మెరుగైన భూ పరిశీలనకు తోడ్పడుతుంది. — మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్ మానవసహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడుతుంది. ISRO has successfully launched PSLV-C60 with SpaDeX and innovative payloads from Sriharikota, Andhra Pradesh 🚀A MASSIVE STEP IN SPACE EXPLORATION 🙌pic.twitter.com/vLdIIyOghN— The Khel India (@TheKhelIndia) December 30, 2024 -
ISRO: ప్రోబా-3 మిషన్ సక్సెస్
-
శత్రు దేశాల ఉపగ్రహాల పాలిట డెత్స్టార్.. ‘స్టార్ వార్స్’తరహాలో సూపర్ వెపన్!
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ ‘స్టార్ వార్స్’చూశారా? అందులో సూపర్ వెపన్ అయిన ‘డెత్ స్టార్’ అనే అంతరిక్ష కేంద్రం భారీ లేజర్ కిరణాలతో ఏకంగాగ్రహాలనే నామరూపాల్లేకుండా చేయడం గుర్తుందా? అచ్చం అలాగే అంతరిక్షంలోని శత్రు దేశాల ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే నిజమైన ‘డెత్ స్టార్’ను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు! ఈ దిశగా ప్రయోగాలను కూడా విజయవంతంగా పూర్తిచేశారు!! ఈ అత్యాధునిక ఆయుధానికి సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచినప్పటికీ అంతరిక్షంలో ఉపయోగించేందుకే ఈ తరహా ఆయుధాల అభివృద్ధి జరుగుతున్నట్లుపలు చైనా జర్నల్స్ చెబుతున్నాయి.ఇంతకీ దాన్ని ఎలా రూపొందించారు..అందులో వాడే టెక్నాలజీ ఏమిటి?ఎలా పనిచేస్తుందంటే..సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ కథనం ప్రకారం ఈ సూపర్ వెపన్.. మైక్రోవేవ్ ఎనర్జీ (ఒక రకమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్)ని ప్రసరించే ఏడు ‘యంత్రాలను’ ఉపయోగిస్తుంది. అంతరిక్షంలో దూరదూరంగా ఉండే ఈ ఏడు యంత్రాలు ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా అనుసంధానమై ఉంఆయి. ఒక్కో యంత్రం ఒకే ఒక్క శక్తివంతమైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్వేవ్ను శత్రు లక్ష్యంపై విడుదల చేస్తుంది. ఇలా ఏడు యంత్రాల నుంచి ఏకకాలంలో ఏడు తరంగాలు విడుదలై నిర్దేశిత లక్ష్యాన్ని నాశనం చేస్తాయి. అయితే ఇలా ఏకకాలంలో లక్ష్యాన్ని ఢీకొట్టాలంటే ఆ యంత్రాల నుంచి తరంగాలు కచ్చితంగా ఒకే సమయానికి విడుదల కావాలి.ఎంత కచ్చితత్వంతో అంటే అవి ఒక సెకనులో 170 లక్షల కోట్లవ వంతు కాలంలో విడుదల కావాలన్నమాట!! ప్రస్తుతం అత్యాధునిక జీపీఎస్ శాటిలైట్లలోని అటామిక్ గడియారాలు కొన్ని వందల కోట్ల ఏళ్లలో ఒకే ఒక్క సెకనును మాత్రమే మిస్ అవుతున్నాయి. వాటికన్నా ఎన్నో రెట్ల కచ్చితమైన కాలాన్ని లెక్కించడం అసాధ్యమని ఇప్పటివరకు భావిస్తుండగా చైనా శాస్త్రవేత్తలు ఈ అడ్డంకిని కూడా అధిగమించారు. గతేడాదే వారు సుమారు 1,800 కిలోమీటర్ల పరిధి నుంచి ఒక సెకనులో 10 లక్షల కోట్లవ వంతు కాలానికి సమానమైన కచ్చితత్వాన్ని సాధించారు. నిర్దేశిత లక్ష్యంలోని ఒకే భాగాన్ని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ తాకేందుకు ఈ ఆయుధంలో లేజర్ పొజిషనింగ్ పరికరాలు కూడా ఉన్నాయి. లక్ష్యం ఉన్న దూరం, దాన్ని ఢీకొట్టేందుకు అవసరమైన కచ్చితత్వంతో కూడిన సమయాన్ని లెక్కించాక మొబైల్ కమాండ్ సెంటర్ నుంచి దాడి చేయాలని సంకేతం పంపగానే ఆయుధంలోని యంత్రాలు వాటి పని కానిస్తాయి. కేవలం ఒక గిగావాట్ శక్తిని విడుదల చేసే సామర్థ్యంగల ఒక ఆయుధం ద్వారా భూమికి సమీపంలోని ఉపగ్రహాలను నాశనం చేయడం సాధ్యమవుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.కమ్యూనికేషన్ నిర్వీర్యమే ఉద్దేశంమైక్రోవేవ్ ఆయుధాలు నిర్దేశిత లక్ష్యాలను పేల్చేసే బదులు శక్తివంతమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ను విడుదల చేయడం ద్వారా ఆయా లక్ష్యాల్లో ఉండే ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను దెబ్బతీస్తాయి. దీంతో ఉపగ్రహాల వంటి సమాచార వ్యవస్థల్లో గ్రౌండ్ సెంటర్లతో కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. డ్రోన్ల వంటి చిన్న లక్ష్యాలపై ఈ తరహా ఆయుధాలు సమర్థంగా పనిచేసినట్లు ఇప్పటికే పలు ప్రయోగాల్లో తేలింది. అమెరికా ఎయిర్ఫోర్స్ రీసెర్చ్ ల్యాబ్ అభివృద్ధి చేసిన థోర్ (ద టాక్టికల్ హైపవర్ ఆపరేషనల్ రెస్పాండర్) కొన్ని వందల డ్రోన్లను ఏకకాలంలో నిరీ్వర్యం చేయగలదు. అగ్రరాజ్యం గత నెలలోనే రష్యా లేదా చైనా శాటిలైట్ సిగ్నళ్లను నిలువరించగల మెడోలాండ్స్ అనే జామర్ ఆయుధాన్ని సమకూర్చుకుంది. మరోవైపు యూకే సైతం డ్రాగన్ఫ్లై లేజర్ వెపన్ను అభివృద్ధి చేసింది. గాల్లో ఎగిరే డ్రోన్లను కూల్చేసే సామర్థ్యాన్ని దీనికి ఉంది. అలాగే ఏకంగా 1.5 కి.మీ. దూరం నుంచే ఒక నాణెం సైజులో ఉండే లక్ష్యాన్ని కూడా కచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం.- సాక్షి సెంట్రల్ డెస్క్ -
అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణ కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సైన్స్ బోధించేది వేరు. సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం, సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం ‘కృత్రిమ రావుకేతువుల’ సాయంతో కోరుకున్నప్పుడల్లా కృత్రిమ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో ఉన్నారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో జంట ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్బోర్డ్ అటానమీ3 (ప్రోబా3). ఇందులో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. కక్ష్యలో పరస్పరం దగ్గరగా మోహరించే ఈ శాటిలైట్లు... లేజర్లు, కాంతి సెన్సర్లతో అనుసంధానమై ఉంటాయి. రెండో ఉపగ్రహం నుంచి చూస్తే సూర్యుడు కనబడకుండా ఉండేలా మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ఈ తరహా కృత్రిమ సూర్యగ్రహణాలు అక్కరకొస్తాయని పరిశోధకులు అంటున్నారు. విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యుడు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఈ ప్రయోగం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, మన సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో ఉండే గ్రహాల (ఎక్సో ప్లానెట్స్)కు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అద్యయనాలకు ‘ప్రోబా3’ మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఉపగ్రహాలు... ఒకే ఉపగ్రహంగా! ‘ప్రోబా3’ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ‘ప్రోబా3’లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచ్చితత్వంతో రెండు ఉపగ్రహాలను అతి దగ్గరగా కలిపి ఉంచేలా (లాక్ చేసేందుకు) కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాస్తవానికి ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనప్పటికీ... 144 మీటర్ల పొడవుండే ఏకైక అబ్జర్వేటరీ మాదిరిగా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ‘ప్రోబా3’ అనేది రెండేళ్ళు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇందులో సౌరగోళం ఆకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం నిర్వహించే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. తన పక్కనే ఉండే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహానికి సూర్యబింబం తాత్కాలికంగా కనిపించకుండా ‘అకల్టర్’ ఉపగ్రహం అడ్డుపడుతుంది. అలా ‘అకల్టర్’ ఉపగ్రహం ఏర్పరచిన ఛాయలో ఉంటూ ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం సూర్యుడి కరోనాను నిశితంగా పరిశీలిస్తుంది. ఉభయ ఉపగ్రహాలు భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచ్చినప్పుడు ‘అకల్టర్’ ఉపగ్రహం తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా సదరు డిస్క్ లాంటి పరికరం సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తుంది. అంటే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహంలోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. ‘అకల్టర్’లో లేజర్, విజువల్ మెట్రాలజీ ఆప్టికల్ హెడ్స్, ‘కరోనాగ్రాఫ్’లో షాడో పొజిషన్ సెన్సర్లు ఉంటాయి. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుందని ఈఎస్ఏ ‘ప్రోబా3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వెల్లడించారు. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. దురదృష్టవశాత్తూ సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున ప్రతి రెండేళ్ళకోసారి మాత్రమే సంభవిస్తాయని, వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని గలీనో వివరించారు. అంత కష్టపడినా చివరికి ఫలితం వాతావరణం దయపై ఆధారపడివుంటుందని, వాతావరణం అనుకూలించకుంటే ఆ ప్రయత్నాలన్నీ వృథాయేనని చెప్పారు. అంతగా ప్రయాసపడినా ఏవో కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని గలీనో తెలిపారు. సవివర పరిశోధనలకు ఆ అతి స్వల్ప సమయం సరిపోదన్నారు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారని, అయితే అంతర కరోనాను ఆ ప్రయోగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయలేవని తెలిపారు. సూర్యుడి ఉపరితలంపై 6 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కాగా కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇది వైరుద్ధ్యభరిత అంశమని ‘ప్రోబా3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ అన్నారు. నిజానికి సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలని, కానీ కరోనా విషయంలో అలా జరగదని, అందుకే శాస్త్రవేత్తలు సూర్యుడి అంతర కరోనాను అధ్యయనం చేసేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తారని చెప్పారు. సూర్యుడి ఉపరితలం కంటే సూర్యుడికి బాహ్య పొర అయిన కరోనా ఎందుకు ఎక్కువ వేడిమితో ఉందో తెలుసుకునేందుకు అంతర కరోనాను తాము దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తామని, కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ‘ప్రోబా3’ అందిస్తుందని ఫ్రాన్సిస్కో డీగో చెప్పారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో అంతరిక్షంలోకి సూర్యుడు భారీ స్థాయిలో ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూమి ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతోపాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. ఈ అంశాలపై ‘ప్రోబా3’ అవగాహనను పెంచుతుందని, సౌర భౌతికశాస్త్రాన్ని అది పంపే ఫలితాలు సమూలంగా మార్చివేస్తాయని భావిస్తున్నారు. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహాన్ని బెల్జియం కేంద్రంగా ఉన్న లీగ్ స్పేస్ సెంటర్ నేతృత్వంలోని 15 కంపెనీలు, పలు సంస్థల కన్సార్టియం ఈఎస్ఏ కోసం అభివృద్ధి చేసింది. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా3’ జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదికగా జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సివుంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగాసి’ రాకెట్ కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ఈఎస్ఏ, ఇస్రో ఈ ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సివుంది.జమ్ముల శ్రీకాంత్ -
కుప్పకూలనున్న 20 స్టార్లింక్ శాటిలైట్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్కు గట్టి ఎదురుదెబ్బ. అది గురువారం ప్రయోగించిన 20 స్టార్లింక్ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయి. స్పేస్ ఎక్స్ కూడా దీన్ని ధ్రువీకరించింది. ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న పొరపాటే ఇందుకు కారణమని తెలిపింది. ‘‘గురువారం రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్–9 రాకెట్ రెండో దశ ఇంజన్ సకాలంలో మండటంలో విఫలమైంది. దాంతో ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు బదులు భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించాయి. దాంతో వాటి మనుగడ అసాధ్యంగా మారింది. అవి త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోనున్నాయి’’ అని వివరించింది. అయితే, ‘‘వాటివల్ల ఇతర ఉపగ్రహాలకు ఏ సమస్యా ఉండబోదు. అలాగే ఉపగ్రహాలు ఒకవేళ భూమిని తాకినా జనావాసాలకు ముప్పేమీ ఉండదు’’ అని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ అత్యంత విశ్వసనీయంగా పని చేసిన ఫాల్కన్–9 రాకెట్ చరిత్రలో ఇది తొలి భారీ వైఫల్యంగా చెప్పవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆకాశంలో శాటిలైట్ల లెక్క తెలుసా?
ఇంటర్నెట్ నుంచి జీపీఎస్ దాకా..వాతావరణ అంచనాల నుంచి భూమ్మీద వనరుల అన్వేషణ దాకా.. రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నింటికీ శాటిలైట్లే కీలకం. ఇందుకే చాలా దేశాలు ఏటేటా మరిన్ని శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతూనే ఉన్నాయి. మరి మన భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లు ఎన్ని?.. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఓసారి తెలుసుకుందామా.. మూడు కక్ష్యల్లో.. ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ 11వ తేదీ నాటికి భూమి చుట్టూ 11,870 శాటిలైట్లు తిరుగుతున్నాయి. అవి కూడా భూమి చుట్టూ మూడు కక్ష్యలలో తిరుగుతున్నాయి. అవి జియో స్టేషనరీ ఆర్బిట్ (జీఈఓ), మీడియం ఎర్త్ ఆర్బిట్ (ఎంఈఓ), లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ). ఇందులో జీఈఓ కక్ష్యలోకి శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ రాకెట్లు కావాలి. ఖర్చు చాలా ఎక్కువ. అందుకే అక్కడ శాటిలైట్లు బాగా తక్కువ. జీఈఓభూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష్య ఇది. పక్కాగా భూమి భ్రమణ వేగానికి సరిపడే వేగంతో శాటిలైట్లు ప్రయాణించేందుకు అనువైన ప్రాంతమిది. అంటే జీఈఓలో తిరిగే శాటిలైట్లు ఎప్పుడూ భూమ్మీద ఒకేప్రాంతంపైనే ఫోకస్ చేస్తూ స్థిరంగా ఉంటాయి. కమ్యూనికేషన్, వాతావరణ శాటిలైట్లను ఈ కక్ష్యలోనే ఉంచుతారు. ఎంఈఓభూమికి పైన 2 వేల కిలోమీటర్ల నుంచి 30 వేల కిలోమీటర్ల మధ్య ఉండే ప్రాంతం ఇది. జీపీఎస్, గ్లోనాస్ వంటి నావిగేషన్ శాటిలైట్లు, రక్షణ రంగ శాటిలైట్లు వంటివాటిని ఈ కక్ష్యల్లో తిరిగేలా చేస్తారు.ఎల్ఈఓభూమికిపైన కేవలం 150 కిలోమీటర్లనుంచి 450 కి.మీ. మధ్య ఉండే ప్లేస్ ఇది. ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్ సంబంధిత శాటిలైట్లు ఈ కక్ష్యల్లో ఉంటాయి. స్టార్ లింక్ శాటిలైట్లతో.. ప్రస్తుతమున్న శాటిలైట్లలో అత్యధికం ‘స్టార్ లింక్’శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థకు చెందినవే. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్్కకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆధ్వర్యంలోని స్టార్ లింక్ కోసం 6,050 శాటిలైట్లను ప్రయోగించింది. ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో స్పేస్లోకి పంపినవే కావడం గమనార్హం. త్వరలోనే మరో 6వేల శాటిలైట్ల ప్రయోగానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. - సాక్షి సెంట్రల్డెస్క్ -
రైతులకు ఉపగ్రహ ఊతం
ఉత్తర భారతదేశ రైతులు ఒకవైపు దేశ రాజధానిలో కనీస మద్దతు ధరతో పాటు ఇతర హక్కుల సాధన కోసం పోరు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం వాన రాకడ, పోకడలతోపాటు వాతావరణానికి సంబంధించి మరింత కచ్చితమైన అంచనాలను రూపొందించేందుకు ఉద్దేశించినది. రైతులతోపాటు, మత్స్యకారులకూ ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వర్గాలకు సకాలంలో అందే హెచ్చరికలు, దీర్ఘకాలిక అంచనాలు ఎంతో ఉపయోగపడతాయి. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల 2050 నాటికి గోధుమ, వరి దిగుబడుల్లో గణనీయ మైన తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇన్షాట్–3డీఎస్ ప్రయోగం దేశంలోనే అతి పురాతనమైన ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమం తాలూకూ పరిణతికి నిదర్శనం. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్శాట్) కార్యక్రమానికి యాభై ఏళ్ల క్రితమే బీజం పడింది. 1975లో ఇన్శాట్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలకు అనుమతులు లభించాయి. 1982లో తొలి ఉపగ్రహం (ఇన్శాట్–1ఏ) ప్రయోగం జరిగింది. మొదట్లో ఈ ఉపగ్రహాల్లో అత్యధికం ఫోర్డ్ ఏరోస్పేస్ అండ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి, ఫ్లారిడా(యూఎస్)లోని కేప్ కానవెరల్ నుంచి ప్రయోగించేవారు. ఇన్శాట్–1 శ్రేణి ఉపగ్రహాల కారణంగా భారతీయ వాతావరణ విభాగం ఉపగ్రహ ఆధారిత వాతావరణ అంచనాల రంగంలోకి అడుగుపెట్టింది. తుపానులు, ఈదురుగాలులతోపాటు అల్పపీడనా లను కూడా ఉపగ్రహాల సాయంతో పరిశీలించడం మొదలైంది. 1992లో ప్రయోగించిన ఇన్శాట్–2 శ్రేణి ఉపగ్రహాలు మునుపటి వాటి కంటే సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినవి కావడం గమనార్హం. దేశీయంగా తయారు చేసిన చాలా హై రెజొల్యూషన్ రేడియో మీటర్లను ఇందులో ఉపయోగించారు. ఫలితంగా రోజువారీ వాతావరణ అంచనాలు, ముందస్తు అంచనాలు, మేఘాల ఛాయాచిత్రాల సేకరణ సులువు అయ్యింది. సమాచార వినిమయానికి కూడా... ఇన్శాట్–1, ఇన్శాట్– 2 శ్రేణి ఉపగ్రహాలు అటు వాతావరణ అంచనాలతోపాటు ఇటు సమాచార వినిమయం, బ్రాడ్కాస్టింగ్ రంగా లకూ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇన్శాట్–2 శ్రేణిలోని కొన్ని ఉప గ్రహాల్లో వాతావరణ సంబంధిత పేలోడ్లు అసలు లేకపోవడం గమ నార్హం. కొన్ని రకాల సమాచారాన్ని సేకరించేందుకు (తుపానుల మధ్య భాగం వంటివి) భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమెరికా రక్షణ శాఖ ఉపగ్రహాలపై ఆధారపడింది. ఈ సమస్యను అధిగ మించే లక్ష్యంతో ఐఎండీ 2002లో మెట్శాట్ను ప్రయోగించింది. తరు వాతి కాలంలో దీని పేరును కల్పన–1గా మార్చారు. కర్నాల్ (హరియాణా)లో పుట్టి, ‘నాసా’ వ్యోమగామిగా ఎదిగి 2002లో స్పేస్షటిల్ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా స్మరణార్థమన్న మాట! ఈ సమయంలోనే వాతావరణ పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక ఉపగ్రహం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఐఎండీ వ్యక్తం చేసింది. ఫలితంగానే 2013లో ఇన్శాట్–3డీ శ్రేణి మూడోతరం వాతా వరణ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. 2016లో ఇదే శ్రేణిలో ఇంకో ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి –17న ప్రయోగించిన ఉపగ్రహం ఇన్శాట్–3డీ శ్రేణిలో తాజాది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఈ ఉపగ్రహానికి నిధులు సమకూర్చింది. ఐఎండీతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ (నోయిడా), ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (పూణే) వంటి సంస్థలు ఈ ఉపగ్రహం అందించే సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి. వాతావరణం, సముద్ర సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఇన్శాట్–3డీఎస్ ద్వారా అందుకోవచ్చు. దీంట్లోని పరికరాలు ఆరు రకాల పౌనఃపున్యాలలో ఛాయాచిత్రాలు తీయగలవు. నేల నుంచి మొదలుపెట్టి అంతరిక్షం వరకూ వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు, తేమశాతం వంటి వివరాలూ సేకరించగలవు. సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు, మేఘాల లక్షణాలు, పొగమంచు, వాన, మంచు ఆవరించిన ప్రాంతం, పడిన మంచు మందం, కార్చిచ్చులు, వాతావరణంలోని కాలుష్యకారక కణాలు, టోటల్ ఓజోన్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఈ దశలో ఒక వైపు ఉపగ్రహ నిర్మాణంలో దేశీ టెక్నాలజీల వాడకం పెంచుకుంటూనే ఇంకోవైపున ఉపగ్రహ సమాచారాన్ని అందుకునేందుకు, విశ్లేషించేందుకు అవసరమైన భూతల సామర్థ్యాన్ని కూడా భారత్ పెంచుకుంది. వాతావరణ ఉపగ్రహాల నుంచి సమా చారం అందుకునేందుకు ఐఎండీ కొత్త కొత్త ఎర్త్ స్టేషన్స్ నిర్మాణాన్ని చేపట్టింది. సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించేందుకు కంప్యూ టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. వాతావరణ మోడలింగ్ కోసం సూపర్ కంప్యూటర్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిన 1980లలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ– డాక్)ను ఏర్పాటు చేసి, దేశీయంగానే హై స్పీడ్ కంప్యూటింగ్ వ్యవస్థ లను అభివృద్ధి చేసే పనిలో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్ వాతావరణ సంబంధిత సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మా ణంలో అగ్రగామి దేశంగా నిలిచింది. తాజాగా అంటే గత ఏడాది మరింత అత్యాధునిక వాతావరణ పరిశోధనల కోసం కేంద్ర భూపరి శోధన మంత్రిత్వ శాఖ రెండు సూపర్ కంప్యూటర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఫ్రెంచ్ కంపెనీ సాయంతో పది కోట్ల డాలర్ల ఖర్చుతో వీటిని నిర్మించనున్నారు. నోయిడా, పూణెల్లోని కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీతోపాటు మారుతూ... వాతావరణ అంచనాల ఫలితాలను సామాన్యులకు చేర్చేందుకు ఐఎండీ టెక్నాలజీతోపాటుగా మారుతూ వచ్చింది. అడ్వయిజరీస్, ఎర్లీ వార్నింగ్, షార్ట్ – మీడియం రేంజ్ స్థానిక అంచనాల వంటివి అందించే వ్యవస్థలను కూడా కాలక్రమంలో ఏర్పాటు చేసుకుంది. ఒకప్పుడు వాతావరణ సమాచారాన్ని టెక్స్ట్ ఎస్ఎంఎస్ రూపంలో పంపితే, మొబైల్ ఫోన్ల కాలంలో వేర్వేరు భాషల్లో సమాచారాన్ని అందించే వీలేర్పడింది. అయితే వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులకు ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాట్సప్, సోషల్మీడియా ప్లాట్ఫామ్ల వంటి అనేకానేక సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యమూ ఏర్పడుతోంది. నకిలీ, తప్పుడు వార్తలు విచ్చలవిడిగా ప్రవహిస్తున్న ఈ కాలంలో విశ్వసనీయమైన సమాచారం అందించేందుకు భారత వాతావరణ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న భారత ప్రయత్నాల్లో ఇన్శాట్–3డీఎస్ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. విదేశాల నుంచి ఉపగ్రహాల కొనుగోళ్లు, ప్రయోగాలు నిర్వహించే స్థితి నుంచి మనం సొంతంగా వాతావరణ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలను చేపట్టే స్థితికి చేరాము. అది కూడా భారతీయ రాకెట్ల సాయంతో మనకు కావాల్సిన కక్ష్యలో ప్రవేశ పెట్టగలుగుతున్నాము. సాంకేతిక పరిజ్ఞాన లభ్యతలో ఉన్న అంతరా లను జాగ్రత్తగా గుర్తించడం, విదేశీ టెక్నాలజీలను ఔపోసన పట్టడం, వ్యవస్థలు–ఉప వ్యవస్థల నిర్మాణానికి తగిన కార్యక్రమాలను అమల్లోకి తేవడం, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ , ఐఎండీ, ఇతర శాస్త్రీయ సంస్థలతో సన్నిహితంగా పనిచేయడం వంటి అనేకానేక చర్యల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇటీవలి కాలంలో దేశీ టెక్నాలజీ పరిశ్రమల ముఖచిత్రంలో గణనీమైన మార్పులు వస్తున్నాయి. మైక్రో ఉపగ్రహ సమూహాల ప్రయోగంలో ప్రైవేట్ సంస్థలు బిజీగా ఉంటున్నాయి. వేగంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో స్వావలంబ నకు, మరీ ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీల విషయంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
స్పేస్ స్టార్టప్లకు కొత్త జోష్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడంతో స్పేస్ స్టార్టప్లకు మరింత ఊతం లభించగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాల తయారీ, అసెంబ్లింగ్ మొదలైన విభాగాల్లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం దక్కగలదని పేర్కొన్నారు. అలాగే, భారతీయ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష రంగ సరఫరా వ్యవస్థల్లో మరింతగా భాగం అయ్యేందుకు కూడా ఇది తోడ్పడగలదని డెలాయిట్ పార్ట్నర్ శ్రీరామ్ అనంతశయనం, నాంగియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ మయాంక్ ఆరోరా తదితరులు చెప్పారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తూ ఎఫ్డీఐ నిబంధనలను కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం ఉపగ్రహాల సబ్–సెక్టార్ను మూడు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఉపగ్రహాల తయారీ.. కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన వాటిలో 74 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో, అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి. అలాగే, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్లు మొదలైన వాటిలో 49 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అది దాటితే ప్రభుత్వ ఆమోదం ఉండాలి. శాటిలైట్ల కోసం విడిభాగాలు, సిస్టమ్స్ మొదలైన వాటిలోకి 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉంటుంది. గణాంకాల ప్రకారం దేశీయంగా స్పేస్ విభాగంలో దాదాపు 200 పైచిలుకు స్టార్టప్లు ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష ఎకానమీలో భారత ప్రైవేట్ స్పేస్ రంగం వాటా కేవలం రెండు శాతంగా ఉంది. 2040 నాటికి ఇది 10 శాతానికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. -
ఫ్యూయల్ సెల్ పరీక్ష సక్సెస్: ఇస్రో
బెంగళూరు/హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్షంలో ఉపగ్రహాలు తదితరాలకు నిరంతర ఇంధన సరఫరాలో కీలకం కాగల ప్యూయల్ సెల్ పనితీరును విజయవంతంగా పరీక్షించినట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పేర్కొంది. ‘‘జనవరి 1న పీఎస్ఎల్వీ–సి58 ద్వారా భూ దిగవ కక్ష్యలోకి చేర్చిన ఫ్యూయల్ సెల్ ఆధారిత ఇంధన వ్యవస్థ (ఎఫ్సీపీఎస్)లోని పాలీమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ పరీక్ష విజయవంతమైంది. దీనిద్వారా కొద్ది సమయం పాటు 180 వాట్ల విద్యుదుత్పత్తి జరిగింది’’ అని శుక్రవారం తెలిపింది. సంప్రదాయ బ్యాటరీ సెల్స్తో పోలిస్తే ఈ ఫ్యూయల్ సెల్స్కు చాలా తక్కువ ఖర్చవుతుంది. పైగా ఇవి అధిక సామర్థ్యంతో పని చేస్తాయి. పూర్తిగా పర్యావరణహితం కూడా. వీటిని అంతరిక్షంతో పాటు భూమిపై కూడా పలురకాలుగా వాడుకోవచ్చు’’అని వివరించింది. భావి అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన డిజైన్లపై అవగాహనకు వచ్చేందుకు తాజా పరీక్ష దోహదపడుతుందని చెప్పింది. కృష్ణబిలాలపై పరిశోధనల నిమిత్తం జనవరి 1న ప్రయోగించిన ఎక్స్పోశాట్ బాగా పని చేస్తోందని ఇస్రోర చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించారు. -
గగనాంతర గవేషణ
కొత్త ఏడాది మొదలవుతూనే భారత్ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్–రే పోలారిమీటర్ శాటిలైట్’ (ఎక్స్పో శాట్)నూ, మరో 10 ఇతర ఉపగ్రహాలనూ మోసుకుంటూ నింగిలోకి సాగిన ఈ ప్రయోగం అనేక విధాల ప్రత్యేకమైనది. ఖగోళంలోని కృష్ణబిలాలను (బ్లాక్ హోల్స్) అధ్యయనం చేసి, కొత్త అంశాల్ని వెలికితీసేందుకు ‘ఎక్స్పోశాట్’ ఉపకరిస్తుంది. ఈ తరహా శాస్త్రీయ శోధనకే పూర్తిగా అంకితమైన ఉపగ్రహాన్ని ఇస్రో పంపడం ఇదే తొలిసారి. దీంతో, అమెరికా తర్వాత రోదసిలోని ఇలాంటి దృగ్విషయాలపై ప్రయోగాలు జరుపుతున్న రెండో దేశమనే ఖ్యాతి భారత్కు దక్కింది. ఇక, వివిధ ప్రైవేట్ సంస్థల, విద్యార్థుల, ఇస్రో కేంద్రాలకు చెందిన మిగతా ఉపగ్రహాలు మన శాస్త్రవేత్తల, ప్రైవేట్ రంగ ఆలోచనలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తున్నాయి. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయాన్3 మిషన్తో మనం చంద్రునిపై జెండా పాతాం. చంద్ర యాన్3 విజయం తర్వాత గత అయిదు నెలల్లో ఇస్రో విజయవంతం చేసిన రెండు మిషన్లూ శాస్త్రీయ స్వభావమున్నవే కావడం గమనార్హం. సూర్యుడి అధ్యయనానికి ముందుగా ఆదిత్య ఎల్1ను నింగిలోకి పంపింది. తాజాగా ఖగోళ–భౌతిక శాస్త్ర ఘటనలో భాగంగా వెలువడే ధ్రువీకృత ఎక్స్రేల అధ్యయనానికి ఈ ‘ఎక్స్పో శాట్’ను తెచ్చింది. ‘ఆదిత్య ఎల్1’ లాగా ‘ఎక్స్పో శాట్’ సైతం పూర్తిగా అంతరిక్ష పరిశోధన–ప్రయోగశాలే. ఇది రెండు పేలోడ్లను నింగిలోకి మోసుకుపోయింది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ‘పోలిక్స్’ పేలోడ్ రాగల అయిదేళ్ళలో దాదాపు 50 మూలాల నుంచి వచ్చే ఉద్గారాలను పరిశీలిస్తుంది. 8 నుంచి 30 కిలో ఎలక్ట్రాన్ ఓల్ట్ (కేఈవీ) శక్తి పరిధిలోని ఎక్స్రేల గమనాన్ని గమనిస్తుంది. ఇక, ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ రూపొందించిన ‘ఎక్స్పెక్ట్’ అనే రెండో పేలోడ్ 0.8 నుంచి 15 కేఈవీల శక్తి గల ఎక్స్రేలను పరిశీలిస్తుంది. నిరంతర ఎక్స్రే ఉద్గారాల్లోని మార్పులను అధ్యయనం చేస్తుంది. వెరసి రెండు పేలోడ్లూ ప్రబల మైన ఎక్స్రేస్కు ఉత్పత్తిస్థానాలైన కృష్ణబిలాలు, పల్సర్ల విషయంలో కొత్త అంశాల్ని వెలికి తీస్తాయి. గగనాంతర సీమలో మన తాజా గవేషణ... అమెరికా, చైనా, రష్యాలదే ఆధిపత్యమైన అంతరిక్ష యాన రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. 2021 డిసెంబర్లోనే అమెరికా ‘నాసా’ చేసిన ఈ తరహా ఐఎక్స్పీఈ మిషన్కు ఏకంగా 188 మిలియన్ డాలర్లయితే, మన తాజా ఎక్స్పో శాట్ కేవలం 30 మిలియన్ డాలర్ల (రూ. 250 కోట్ల)కే సిద్ధమవడం విశేషం. అమెరికా ఉపగ్రహ జీవిత కాలం రెండేళ్ళే. మనది అయిదేళ్ళు. ఇలా అగ్రరాజ్యంతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్లో మరింత సమర్థమైన రాకెట్లు, ఉపగ్రహాలు రూపొందించి మన ‘ఇస్రో’ మరోసారి సత్తా చాటింది. మిగతా దేశాల్ని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎక్స్కిరణాల ధ్రువీభవనాన్ని కొలిచేందుకు సాగుతున్న ప్రయత్నాలు తక్కువ. ‘నాసా’ చేస్తున్నవీ బెలూన్ ఆధారిత, స్వల్పకాలిక ప్రయోగాలే. 2015 సెప్టెంబర్లో మనం ప్రయోగించిన ఆస్ట్రోశాట్ ద్వారానే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు గతంలో ఎక్స్రే ఉత్పత్తి స్థానాల బ్రాడ్బ్యాండ్ వర్ణపటమాపనం చేస్తూ వచ్చారు. అతి సున్నితమైన, కచ్చితమైన ఉపకరణాలు అవసరం గనక ఎక్స్రేల ధ్రువీభవనాన్ని కొలిచే ప్రయత్నాలెప్పుడూ పెను సవాలే. ఇస్రో చేసిన ఎక్స్పో శాట్ ప్రయోగం ఆ సవాలుకు సరైన జవాబవుతుందని ఆశంస. ఇలాంటి అనేక సవాళ్ళను ఇస్రో భుజానికెత్తుకుంది. పలు అంతరిక్ష ప్రయోగాలు, మిషన్లతో ఈ ఏడాది పొడుగూతా ఇస్రో క్యాలెండర్ నిండిపోయి ఉంది. సగటున నెలకు కనీసం ఒక అంతరిక్ష ప్రయోగమో, ప్రయత్నమో చేయనుంది. ఈ జోరు ఇలాగే సాగితే, ఈ జోరులో ఇస్రో ఈ ఏడాది జరిపే ప్రయోగాల సంఖ్య డజను దాటేసినా ఆశ్చర్యం లేదు. వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) కోసం రెండు పీఎస్ఎల్వీ వాణిజ్య మిషన్లను సైతం ఇదే ఏడాది ఇస్రో చేపడుతోంది. అలాగే, నిరుడు చేసిన పునర్వినియోగ ప్రయోగవాహక నౌక ప్రయోగాన్ని మరింత కఠోర పరిస్థితుల మధ్య విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నేళ్ళ క్రితం హైడ్రోజన్ను ఇంధనంగా చేసుకొని శ్క్రామ్జెట్ ప్రయోగాత్మక పరీక్ష చేసిన ఇస్రో ఈసారి కిరోసిన్ వాడి, పరీక్షించనుంది. అలాగే, నిరుడు సెప్టెంబర్ 2న ఆరంభమైన భారత తొలి సౌరయాత్ర ‘ఆదిత్య ఎల్1’ సైతం తుది విన్యాసం అనంతరం ఈ జనవరి 6 నాటికి లక్షిత ఎల్1 గమ్యానికి చేరుకోనుంది. మొత్తం మీద ఈ కొత్త ఏడాది అంతా ఇస్రో తీరిక లేకుండా ప్రయోగాలు చేయనుంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాటల్లో చెప్పాలంటే ఈ 2024 ‘గగన్యాన్’ సన్నాహక సంవత్సరం. అంతేకాదు... తాజా రోదసీ ప్రయోగంలో భాగంగా నింగిలోకి పంపిన ఇతర ఉపగ్రహాలలో ‘ఉయ్ శాట్’ పూర్తిగా కేరళలోని మహిళలే తీర్చిదిద్దినది కావడం విశేషం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల ముందంజకు అది ఓ ప్రతీక. ఇతర ప్రైవేట్ ఉపగ్రహాల వ్యవహారం అంతరిక్ష రంగంలో వస్తున్న సంస్కరణల్ని ప్రతిఫలిస్తోంది. ఈ ఆవిష్కరణలు, అతి తక్కువ ఖర్చు ప్రయోగాలు ప్రైవేట్ రంగానికి రోదసి తలుపుల్ని బార్లా తీస్తున్న భారత్కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే దేశంలోని అంకుర సంస్థలు విదేశీ సంస్థలతో జత కలిసి ఉపగ్రహ నిర్మాణ వ్యాపారంలో దూసుకొస్తున్నాయి. ఖగోళ శోధనలో పురోగతికీ, ఉపగ్రహ నిర్మాణ సాధనలో భారత్ కేంద్రంగా మారడానికీ ఇవన్నీ శుభ శకునాలే! నూతన సంవత్సరం తొలి రోజున సాగిన విజయవంతమైన ప్రయోగం అందులో ఒకటి. -
మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్
సియోల్(దక్షిణ కొరియా): కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణాకొరియా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయని ఉత్తరకొరియా నియంత కిమ్ జాన్ మండిపడ్డారు. బదులుగా తామూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ప్రకటించారు. కొత్త ఏడాదిలో అదనంగా మూడు నిఘా ఉపగ్రహాల ప్రయోగాలు చేపడతామని ప్రకటించారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ తయారు చేస్తామన్నారు. ఉత్తర కొరియా అధికారిక కేసీఎన్ఏ వార్తాసంస్థ ఈ మేరకు వెల్లడించింది. ట్రంప్ హయాంలో అమెరికాతో చర్చలు విఫలమయ్యాక అగ్రరాజ్యం నుంచి ఆక్రమణ, దాడి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో కిమ్ ఆయుధ సంపత్తి విస్తరణకు తెర తీశారు. ‘‘అమెరికా, దక్షిణకొరియా కవి్వంపు చర్యలు కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు తీసుకెళ్లాయి. వాటి మెరుపుదాడులను తట్టుకుని నిలబడాలంటే మా సాయుధ, శక్తి సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవడం అత్యవసరం’’ అన్నారు. -
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. ఐర్లాండ్కు చెందిన మొదటి ఉపగ్రహాన్ని, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మొదటి దశ ఫాల్కన్ 9 రాకెట్.. వాండెన్బర్గ్లోని ల్యాండింగ్ జోన్ 4 వద్ద సురక్షితంగా ల్యాండింగ్ అయింది. కాగా.. నింగి నుంచి క్షేమంగా స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేసిన రాకెట్లలో ఇది 250వది కావడం గమనార్హం. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ బృందానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. Congrats to the @SpaceX team on the 250th landing of a Falcon rocket pic.twitter.com/U3KoKGmUOm — Elon Musk (@elonmusk) December 2, 2023 ఈ ప్రయోగంలో మొత్తం 25 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ విద్యార్థులు నిర్మించిన ఎడ్యుకేషనల్ ఐరిష్ రీసెర్చ్ శాటిలైట్-1 (EIRSAT-1) ఇందులో ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఐదు ఉపగ్రాహాలను 2025 నాటికి నింగిలోకి పంపించాలని స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దక్షిణ కొరియాకు చెందిన 425 ప్రాజెక్ట్ EO/IR ఉపగ్రహం 1,700 పౌండ్లు (800 kg) ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రో-ఆప్టికల్ సామర్థ్యాలను కలిగి ఉంది. అంతరిక్షంలోకి గూఢచారి ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా మోహరించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే దక్షిణ కొరియా ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
శాటిలాజిక్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ జట్టు
బెంగళూరు: టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), అమెరికాకు చెందిన శాటిలాజిక్ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం భారత్లో లో ఎర్త్ ఆర్బిట్ (లియో) ఉపగ్రహాలను తయారు చేయనున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. ఇందుకోసం కర్ణాటకలోని తమ వేమగల్ ఫ్యాక్టరీలో టీఏఎస్ఎల్ ఉపగ్రహాల అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ (ఏఐటీ) ప్లాంటును ఏర్పాటు చేనుంది. దేశ రక్షణ బలగాలు, వాణిజ్య అవసరాల కోసం ఉపగ్రహాల తయారీ, ఇమేజరీ డెవలపింగ్ మొదలైన వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వివరించాయి. పేలోడ్లు, ఇతర టెక్నాలజీ కోసం స్థానికంగా చిన్న, మధ్య తరహా సంస్థలతో (ఎస్ఎంఈ) కలిసి పని చేయనున్నట్లు టీఏఎస్ఎల్ సీఈవో సుకరణ్ సింగ్ తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ డిఫెన్స్, కమర్షియల్ మార్కెట్లోకి ప్రవేశించడం తమకు ఒక మైలురాయి కాగలదని శాటిలాజిక్ సీఈవో ఎమిలియానో కార్గీమ్యాన్ పేర్కొన్నారు. -
అంతరిక్షంలో వ్యర్థాలు, ఆ శాటిలైట్లు భూమిపై దొర్లకుండా..
అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్త వివిధ దేశాలకు సవాల్ విసురుతోంది. టెక్నాలజీ పరంగా ఎదిగేందుకు అంతరిక్షంలో పంపించిన శాటిలైట్లలో కొన్ని డెబ్రిస్(చెత్త)గా మారాయి. ప్రపంచ దేశాలు పోటీపడి మరీ పంపిస్తున్న శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్ పెరిగిపోతోంది. కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల శిథిలాలతో అంతరిక్షం చెత్తకుప్పగా మారిపోతోంది. అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ప్రయోగాలకు కొన్నిసార్లు అంతరాయం ఏర్పడుతుంది. యూఎస్ స్పేస్ కమాండ్ అంచనా ప్రకారం భూమి చుట్టూ దాదాపు 25వేలఅంతరిక్ష వ్యర్ధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని శిథిలాలు భూమిపైకి చేరతున్నాయి.మరోపక్క అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై రేణువుల్లా విడిపోయి అంతరిక్ష కక్ష్యను కలుషితం చేస్తున్నాయి. ఇవికాకుండా రాకెట్ల నుంచి రాలిపడిన మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షం చుట్టూ పేరుకుపోయాయి. దీనివల్ల అంతరిక్షంలో డెబ్రిస్ (చెత్త)తో నిండిపోతుంది. అనేక శాటిలైట్లు పాడైన స్థితిలో శిధిలాలుగా మారి అంతరిక్షంలో భూకక్ష్య చుట్టూ ప్రమాదకర వేగంతో తిరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడటమో లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష శిథిలాల సంఖ్య లక్షకు పైగా పెరుగుతుందని అంచనా. సాదారణంగా రెండు ఉపగ్రహాలు ఢీకొన్నప్పుడు కెస్లర్ సిండ్రోమ్ అని పిలువబడే ఘర్షణ ఏర్పడి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటీవల క్యూబ్శాట్ Exo-0 అని పిలువబడే ఎయిర్బస్ పరికరాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. ఇది కాలం చెల్లిన ఉపగ్రహాలు భూమిపైకి దొర్లకుండా నిరోధిస్తుంది. దీని ద్వారా పనిచేయని ఉపగ్రహాలు భూమిపైకి దొర్లకుండా ఒక అయస్కాంత శక్తితో అడ్డుకుంటుంది. ఈ ఎయిర్బస్ పరికరం సింపుల్గా మోటార్ను పోలి ఉంటుంది. ఇది మ్యాగ్నటిక్ ఫీల్డ్తో పనిచేస్తుంది. రోటార్ మూవ్మెంట్ను బట్టి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఇది శాటిలైట్ తిరిగే దశను కదలనీయకుండా ఉంచుతుంది. దీనివల్ల ఉపగ్రహాలు నేలపై పడటం వంటిది జరగదు. -
30న పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగాన్ని నిర్వహించనున్నామని షార్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రయోగాన్ని ఈనెల 23న నిర్వహింయాల్సి ఉంది. చంద్రయాన్–3 మిషన్ను లూనార్ ఆర్బిట్లోకి పంపే ప్రక్రియలో ఇస్రో శాస్త్రవేత్తలంతా నిమగ్నమై ఉండడంతో ఈ ప్రయోగాన్ని 30కి పొడిగించారు. ఈ ప్రయోగంలో 422 కిలోలు బరువు కలిగిన సింగపూర్కు చెందిన ఏడు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 351 కిలోల డీఎస్–ఎస్ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోలు బరువు కలిగిన ఆర్కేడ్, 23 కేజీల వెలాక్స్–ఏఎం, 12.8 కిలోలు బరువు కలిగిన ఓఆర్బీ–12 స్ట్రైడర్, 3.84 కేజీల బరువున్న గలాసియా–2, 4.1 కేజీల బరువైన స్కూబ్–11, 3.05 కేజీల నులయన్ అనే ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైంది కావడం విశేషం. -
‘నాసా’ సైంటిస్టుల పురోగతి.. సౌర కుటుంబం అంచున జలరాశి!
జీవుల మనుగడకు ఆధారం జలం. భూగోళంపై తొలుత నీరు, ఆ తర్వాత మనుషులతో సహా రకరకాల జీవులు పుట్టుకొచ్చినట్లు అనేక పరిశోధనల్లో తేటతెల్లమయ్యింది. మొట్టమొదటి జీవి నీటిలోనే పుట్టిందట. విశ్వంలో భూమిపైనే కాకుండా ఇంకెక్కడైనా జలరాశి ఉందా? అనేదానిపై సైంటిస్టులు శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇతర గ్రహాలు లేదా వాటి ఉపగ్రహాలపై నీటి జాడ ఉన్నట్లు తేలితే అక్కడ జీవులు సైతం ఉండేందుకు ఆస్కారం లేకపోలేదు. సూర్యుడి ప్రభావం పెద్దగా ఉండని సౌర వ్యవస్థ అంచుల్లోనూ జల అన్వేషణ సాగుతోంది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు పురోగతి సాధించారు. మన సౌర కుటుంబం కొసభాగాన యురేనస్ గ్రహానికి చెందిన ఉపగ్రహాలపై మహా సముద్రాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు కనిపెట్టారు. ► యురేనస్ గ్రహానికి దాదాపు 27 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి యురేనస్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటిలో ఏరియల్, అంబ్రియెల్, టైటానియా, ఒబెరాన్, మిరండా అనేవి ప్రధానమైనవి. ఇందులో టైటానియా అన్నింటికంటే పెద్దది. ► యురేనస్పై పరిశోధనల కోసం 1980వ దశకంలో ప్రయోగించిన వొయేజర్–2 అంతరిక్ష నౌక అందించిన సమాచారాన్ని, నాసా ప్రయోగించిన గెలీలియో, కాసినీ, డాన్, న్యూహోరిజాన్స్ స్పేస్క్రాఫ్ట్లు పంపించిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఇందుకోసం నూతన కంప్యూటర్ మోడల్ను ఉపయోగించారు. ► యురేనస్ ఉపగ్రహాల అంతర్గత నిర్మాణం, వాటి ఉపరితలం స్వభావాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలించారు. ► ప్రధానమైన ఐదు ఉపగ్రహాల్లో నాలుగు ఉపగ్రహాల ఉపరితల పొర అంతర్గత వేడిని రక్షిస్తున్నట్లు గుర్తించారు. అంటే ఉపగ్రహ అంతర్భాగంలోని వేడి బయటకు వెళ్లకుండా ఆ పొర నిరోధిస్తున్నట్లు కనిపెట్టారు. ► ఏదైనా గ్రహంపై సముద్రం ఏర్పడాలంటే దాని అంతర్భాగంలో తగిన ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఉండాలి. ► సాధారణంగా గ్రహాల లోపలి భాగంలో సలసల కాగే శిలాద్రవం(లావా) ఉష్ణోగ్రతను విడుదల చేస్తూ ఉంటుంది. సముద్రాల ఉనికికి ఈ లావా నుంచి వెలువడే ఉష్ణం తోడ్పడుతుంది. యురేనస్ ఉప గ్రహాల్లో ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వెల్లడయ్యింది. ► సౌర వ్యవస్థ అంచున మిరండా సహా నాలుగు ఉపగ్రహాలపై సముద్రాలు కచ్చితంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. ► యురేనస్ ఉపగ్రహాలపై ఉన్న సముద్రాల్లో క్లోరైడ్, అమోనియా వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉన్నట్లు భావిన్నారు. ► యురేనస్ గ్రహం సూర్యుడి నుంచి ఏడో గ్రహం. ఇది వాయువులతో నిండిన భారీ మంచు గ్రహం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో యురేనస్ను ఇటీవల పరిశీలించారు. అది చిన్నపాటి సౌర వ్యవస్థతో కూడుకొని ఉన్న గ్రహమని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెరపైకి ‘ప్రాజెక్ట్ సంజయ్’
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక డిజిటల్ యుద్ద క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ప్రాజెక్ట్ సంజయ్’పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి. దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్లైన్ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇందులోభాగంగా, పర్వత ప్రాంతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ ‘ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్వర్కింగ్’కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి. ప్రాజెక్ట్ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్(ఆర్టిలరీ కంబాట్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టం) కింద వ్యవస్థల అప్గ్రేడ్ చేపట్టారు. దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్ సంజయ్తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
22న పీఎస్ఎల్వీ సీ55 ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న మధ్యాహ్నం 2.19 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధం చేస్తోంది. ఇస్రో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారి వాణిజ్య ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్–02 అనే ఉపగ్రహంతో పాటు లూమిలైట్–4 అనే 16 కేజీల బుల్లి ఉపగ్రహాన్ని రోదశీలోకి పంపించనున్నారు. ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ రాకెట్లో నాలుగోదశ (పీఎస్–4)ను ఒక ఎక్స్పర్మెంటల్ చేయనున్నారు. ఈ రాకెట్లో ఆర్బిటల్ ఎక్స్పర్మెంటల్ మాడ్యూల్ (పీవోఈఎం) అమర్చి పంపిస్తున్నారు. అంటే పోలార్ ఆర్బిట్లో ఇంకా ఎన్ని రకాల కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టవచ్చో పరిశోధన చేయడానికి ఈ ఎక్స్పర్మెంటల్ ప్రయోగాన్ని చేస్తున్నారు. -
ONEWEB: ఇస్రో కీర్తి కిరీటంలో... మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఇస్రో మరో అద్భుత వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 36 వన్వెబ్ ఇండియా–2 ఇంటర్నెట్ సమాచార ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి అత్యంత బరువైన ఎల్వీఎం3–ఎం3 బాహుబలి రాకెట్ వాటిని తీసుకుని ఆదివారం ఉదయం 9.00 గంటలకు నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. బ్రిటన్కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించిన 5,805 కిలోలు బరువున్న ఈ ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ 36 ఉపగ్రహాలను 97 నిమిషాల వ్యవధిలో ఒక్కోసారి నాలుగేసి ఉపగ్రహాల చొప్పున 9 విడుతలుగా భూమికి అతి తక్కువ దూరంలో లోయర్ ఎర్త్ లియో అర్బిట్లోకి ప్రవేశపెట్టారు. అవన్నీ కక్ష్యలోకి చేరాయని, అంటార్కిటికా గ్రౌండ్స్టేషన్ నుంచి సిగ్నల్స్ అందాయని ఇస్రో ప్రకటించింది. వన్వెబ్ ఇండియా–1 పేరిట 2022 అక్టోబర్ 23న తొలి బ్యాచ్లో 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం తెలిసిందే. తాజా ప్రయోగంతో మొత్తం 72 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. ఇస్రో స్థాయి పెరిగింది: చైర్మన్ సోమనాథ్ ప్రయోగం విజయవంతం కాగానే మిషన్ కంట్రోల్ సెంటర్లో శాస్త్రవేత్తలు పరస్పరం అలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. రాకెట్లోని అన్ని దశలు అద్భుతంగా పనిచేసినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ‘‘ఇది టీం వర్క్. ప్రపంచంలోనే అద్భుతమైన విజయంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలను పెంచినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయోగం చరిత్రాత్మకమైనది. దీనివల్ల ఇస్రో వాణిజ్యపరమైన ప్రయోగాల ప్రయోజనాలకు మరింత బలం చేకూరింది. ఇదే ఊపులో పీఎస్ఎల్వీ సీ55 రాకెట్ ద్వారా ఏప్రిల్లో సింగపూర్కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ ఏడాది చంద్రయాన్–3, ఆదిత్య–ఎల్1తో పాటు మరో నాలుగు ప్రయోగాలు చేసే అవకాశముంది’’ అని చెప్పారు. వాణిజ్య ప్రయోగాలకు ఎల్వీఎం3 రాకెట్ ఎంతో ఉపయోగకారి అని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సీఎండీ డి.రాధాకృష్ణన్, మిషన్ డైరెక్టర్ ఎస్.మోహన్కుమార్ చెప్పారు. ఆత్మనిర్భరతకు తార్కాణం ప్రధాని మోదీ అభినందనలు వన్వెబ్ ఇండియా–2 ప్రయోగం దిగ్విజయం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘‘వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో అంతర్జాతీయంగా భారత్ పై చేయిని ఈ ప్రయోగం మరింత దృఢపరిచింది. ఆత్మనిర్భరత స్ఫూర్తిని ఎలుగెత్తి చాటింది’’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. -
ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ2)ను శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్–1, ఆజాదీ శాట్–2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ ప్రయోగానికి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత (తెల్లవారితే శుక్రవారం) 2.18 గంటలకు కౌంట్ డౌన్ను ప్రారంభిస్తారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ ఈఎస్ పద్మకుమార్ ఆధ్వర్యాన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం గురువారం ఉదయం నిర్వహించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో సమావేశాన్ని నిర్వహించి కౌంట్డౌన్, ప్రయోగ సమయాలను అధికారికంగా నిర్ణయించారు. ఎస్ఎస్ఎల్వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొదటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. రాకెట్ వివరాలు... ప్రయోగం ఇలా... ఎస్ఎస్ఎల్వీ–డీ2 రాకెట్ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తిచేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 785.1 సెకన్లలో పూర్తి చేస్తారు. మొదటిగా 156.3 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్–07)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆంటారిస్–యూఎస్ఏకు చెందిన 10.2 కేజీల బరువు కలిగిన జానుస్–1 అనే ఉపగ్రహాన్ని 880.1 సెకన్లలో, అనంతరం 8.7 కేజీల బరువు కలిగిన ఆజాదీ శాట్–2 అనే ఉపగ్రహాన్ని 900.1 సెకన్లలో అంటే 15 నిమిషాలకు భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్ (సూర్యునికి సమకాలిక కక్ష్య)లోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ఇది షార్ నుంచి 84వ ప్రయోగం కాగా, ఎస్ఎస్ఎల్వీ–డి1 సిరీస్లో రెండోది కావడం విశేషం. ఎస్ఎస్ఎల్వీ–డీ2కు ప్రత్యేక పూజలు తిరుమల: ఎస్ఎస్ఎల్వీ–డి2కు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, సభ్యులు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ–డి2 నమూనాను ఉంచి పూజలు చేశారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ గురువారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని రాకెట్ నమూనాకు పూజలు నిర్వహించారు. -
బృహస్పతి... ఉపగ్రహాల రాజు.. డజను చంద్రుల గుర్తింపు
కేప్ కెనవెరాల్ (యూఎస్): సౌరకుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం (బృహస్పతి) చుట్టూ మరో 12 ఉపగ్రహాలను సైంటిస్టులు కనిపెట్టారు. దీంతో దాని ఉపగ్రహాల సంఖ్య ఏకంగా 92కు పెరిగింది. తద్వారా 83 ఉపగ్రహాలున్న శని గ్రహాన్ని వెనక్కు నెట్టి సౌరమండలంలో అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహంగా నిలిచింది. హవాయి, చిలిల్లోని టెలిస్కోప్ల సాయంతో 2021, 2022ల్లోనే గురు గ్రహపు కొత్త ఉపగ్రహాలను గుర్తించినా ఇంతకాలం పాటు నిశితంగా గమనించిన వాటి ఉనికిని తాజాగా నిర్ధారించారు. ఏకంగా 92 ఉపగ్రహాలతో గురు గ్రహం ఓ మినీ సౌరకుటుంబంగా భాసిల్లుతోందని వీటిని కనిపెట్టిన సైంటిస్టు స్కాట్ షెపర్డ్ చమత్కరించారు. ‘‘అయితే ఇవన్నీ బుల్లి ఉపగ్రహాలే. ఒక్కోటీ కేవలం కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉన్నాయి’’ అని వివరించారు. పూర్తి వాయుమయమైన గురు గ్రహాన్ని, మంచుతో కూడిన దాని అతి పెద్ద ఉపగ్రహాలను అధ్యయనం చేసేందుకు ఏప్రిల్లో ఒక అంతరిక్ష నౌకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపనుంది. వీటిలో యూరోపా క్లిపర్ అనే ఉపగ్రహం ఉపరితలంపై పేరుకున్న అపారమైన మంచు కింద భారీ సముద్రం దాగుందని నాసా భావిస్తోంది. దాని అధ్యయనం కోసం 2024లో యూరోపా క్లిపర్ మిషన్ను ప్లాన్ చేస్తోంది. అది వాసయోగ్యమేనా అన్న అంశాన్ని పరిశోధించనుంది. బృహస్పతి, శని చుట్టూ ఉన్న భారీ ఉపగ్రహాలు బహుశా పరస్పరం ఢీకొని ఉంటాయని, ఇన్నేసి బుల్లి ఉపగ్రహాలుగా విడిపోయాయని షెపర్డ్ పేర్కొన్నారు. ‘‘యురేనస్, నెప్ట్యూన్లదీ ఇదే పరిస్థితి. కానీ అవి మరీ సుదూరాల్లో ఉన్న కారణంగా వాటి ఉపగ్రహాలను గుర్తించడం చాలా కష్టం’’ అని వివరించారు. యురేనస్కు 27, నెప్ట్యూన్కు 14, అంగారకునికి రెండు ఉపగ్రహాలున్నాయి. బుధ, శుక్ర గ్రహాలకు ఒక్కటి కూడా లేదు. -
ప్రపంచదేశాలకు ‘చెత్త’ సవాల్.. ఆకాశం కూడా ఆగమాగం.. ఏంటీ పరిస్థితి?
భూగోళాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ‘చెత్త’. నానాటికీ పెరుగుతున్న వ్యర్థాలను వదిలించుకునేందుకు చాలా దేశాలు పెద్ద కసరత్తే చేస్తున్నాయి. కాగా.. ఇదే సందర్భంలో అంతరిక్షంలోనూ పేరుకుపోతున్న చెత్త వివిధ దేశాలకు సవాల్ విసురుతోంది. ప్రస్తుతం రోదసీలో 3,409 శాటిలైట్లు చెత్తగా మారిపోయాయి. ఇవికాకుండా దాదాపు 34 వేల స్పేస్ జంక్ ముక్కలు, మిలియన్ల కొద్దీ చిన్నపాటి ముక్కలు అంతరిక్షాన్ని కమ్మేశాయి. 2030 నాటికి రోదసీలో ఉండే శాటిలైట్ల సంఖ్య 58 వేలకు దాటిపోవచ్చని అంచనా. దీనివల్ల గగనతలం భవిష్యత్లో పెద్ద ముప్పునే ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, అమరావతి అంతరిక్ష ప్రయోగాలు మానవాళి చరిత్రను సమూలంగా మార్చేశాయి. ఉపగ్రహాల (శాటిలైట్స్) వినియోగంతో టీవీ, ఫోన్, ఇంటర్నెట్, జీపీఎస్ తదితర సేవలతో పాటు ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను ముందే పసిగట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్క క్లిక్తో సమస్త సమాచారాన్ని అరచేతిలో చూడగలుగుతున్నాం. ఇదంతా శాటిలైట్స్ వల్లే సాధ్యమైంది. సోవియట్ యూనియన్ 1957 అక్టోబర్ 4న స్పుతి్నక్ శాటిలైట్ ప్రయోగంతో అంతరిక్ష యుగం మొదలైంది. వివిధ దేశాల ఆధ్వర్యంలో మాత్రమే శాటిలైట్ ప్రయోగాలు కొనసాగగా.. ఇటీవల ప్రైవేట్ కంపెనీలు సైతం ఈ రంగంలోకి ప్రవేశించాయి. ఐక్యరాజ్య సమితి ఔ టర్ స్పేస్ అఫైర్స్ విభాగం లెక్కల ప్రకారం 2022 జనవరి నాటికి భూమి చుట్టూ 8,261 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ‘ఆర్యభట్ట’. 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్టతో మొదలుపెట్టిన భారత్ ఇప్పటివరకు సుమారు 180 శాటిలైట్స్ను అంతరిక్షంలోకి పంపించింది. ఇవికాక సుమారు 38 దేశాలకు చెందిన 350కి పైగా శాటిలైట్లను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మనదేశ శాటిలైట్లలో 40 వరకు సేవలందిస్తుండగా.. మిగిలినవి విశ్వంలో నిరుపయోగంగా ఉన్నాయి. నాణేనికి రెండో వైపు.. ప్రపంచ దేశాలు పోటీపడి మరీ పంపిస్తున్న శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్ పెరిగిపోతోంది. కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల శిథిలాలతో గగనతలం చెత్తకుప్పగా మారిపోతోంది. యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్ (యూసీఎస్) లెక్కల ప్రకారం స్పేస్లో ఉన్న మొత్తం 8,261 శాటిలైట్లలో ప్రస్తుతం 4,852 మాత్రమే సేవలందిస్తున్నాయి. మిగిలిన 3,409 శాటిలైట్లు నిరుపయోగమై వ్యర్థాలుగా మారిపోయాయి. ఇవికాకుండా రాకెట్ల నుంచి రాలిపడిన దాదాపు 34 వేల స్పేస్ జంక్ ముక్కలు (10 సెం.మీ కంటే పెద్దవి), మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షం చుట్టూ పేరుకుపోయాయి. ఇటీవల అమెజాన్, స్పేస్–ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు అంతరిక్షంలోకి అడుగుపెట్టి శాటిలైట్ల ప్రయోగాలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల 2030 నాటికి రోదసీలో శాటిలైట్ల సంఖ్య 58 వేలకు పైగా దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అంతరిక్షంలో స్పేస్ ట్రాఫిక్ పెరిగిపోవడంతోపాటు డెబ్రిస్ (చెత్త)తో నిండిపోతుందని అంచనా. పెనుసవాల్.. స్పేస్ జంక్ అంతరిక్షంలో ఉపగ్రహాలు తిరిగే వృత్తాకార మార్గాన్ని కక్ష్య (ఆర్బిట్) అంటారు. శాటిలైట్స్ను మూడు రకాల ఆర్బిట్స్లో ఉంచుతారు. ఇవి భూమి నుంచి 300కి.మీ. వరకు లోయర్ ఆర్బిట్, 700–1,000 కి.మీ వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఆర్బిట్స్, 36 వేల కి.మీ. జియో సింక్రనస్ ఆర్బిట్ (కమ్యూనికేషన్ శాటిలైట్స్) ఉంటాయి. ఏటా వందల సంఖ్యలో శాటిలైట్లను కక్ష్యల్లోకి పంపుతుండటంతో వాటి మధ్య దూరం తగ్గిపోయి స్పేస్ ట్రాఫిక్ ఏర్పడుతోంది. దీంతో కొత్త ఉపగ్రహాలను పంపేటప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్షంలో రాకెట్ పరికరాల శిథిలాలను స్పేస్ డెబ్రిస్ అంటారు. ఎక్కువ అంతరిక్ష శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయి. సాఫ్ట్బాల్ పరిమాణంలో 34 వేల స్పేస్ డెబ్రిస్ శిథిలాలు ఉన్నాయని, ఒక మిల్లీమీటర్ కంటే పెద్ద పరిమాణంలో 128 మిలియన్ల శిథిలాలు ఉన్నాయని నాసా ప్రకటించింది. ప్రతి 10 వేల శిథిలాలలో ఒకటి ప్రమాదానికి కారణమవుతుందని అంచనా వేసింది. ఇలాంటి శిథిలాలు 1999 నుంచి ఇప్పటిదాకా 25 ఐఎస్ఎస్ను తాకినట్టు స్పేస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మరోపక్క అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై రేణువుల్లా విడిపోయి అంతరిక్ష కక్ష్యను కలుíÙతం చేస్తున్నాయి. ఈ వ్యర్థ రేణువుల్లో కొన్ని గంటకు 40 వేల కి.మీ. వేగంతో భూకక్ష్య వైపు దూసుకొస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అంతర్జాతీయ కమిటీ వాస్తవానికి అంతరిక్ష వ్యర్థాల్లో మూడింటి ఒక భాగం అమెరికా, రష్యాలవే. వేల కి.మీ. వేగంతో తిరుగుతున్న డెడ్ శాటిలైట్లు, రాకెట్ శిథిలాలను తొలగించడం కత్తిమీద సాములా మారింది. దీంతో అమెరికా వివిధ దేశాల స్పేస్ శాస్త్రవేత్తలతో 1993లో ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కో–ఆర్డినేషన్ కమిటీని నియమించింది. ఐక్యరాజ్య సమితి 1959లోనే ‘ఔటర్ స్పేస్ శాంతియుత ఉపయోగాల కమిటీ’ (యూఎన్–సీఓపీయూఓఎస్)ని నియమించింది. ఈ రెండు కమిటీల్లోనూ భారత్ ప్రారంభ సభ్యదేశంగా ఉంది. ఈ కమిటీల్లోని శాస్త్రవేత్తలు అంతరిక్ష శిథిలాల తొలగింపుపై ఓ నివేదికను రూపొందించాయి. దీనిప్రకారం అధునాతన రాడార్లు, టెలిస్కోపులను ఉపయోగించి అంతరిక్ష వ్యర్థాలను పసిగట్టి ముందస్తు హెచ్చరికలు చేస్తుంటారు. కాలం చెల్లిన శాటిలైట్లను కక్ష్య నుంచి తప్పించి భూ వాతావరణంలోకి తెచ్చే యోచన జరుగుతోంది. స్పేస్ డెబ్రిస్ను తొలగించే యంత్రాంగం ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం వద్దా లేదు. – ఎంవైఎస్ ప్రసాద్, మాజీ డైరెక్టర్, షార్ ‘నాసా’ ట్రాక్ చేస్తోంది స్పేస్లోకి వెళ్లిన ప్రతి వస్తువుకు పొజిషనింగ్ నంబర్ ఇచ్చి వాటి కదలికలను అనుక్షణం ‘నాసా’ ట్రాక్ చేస్తోంది. దీనినే స్పేస్ సర్వేలెన్స్ నెట్వర్క్ ట్రాకింగ్ అంటారు. నాసా అంచనా ప్రకారం ప్రతిరోజూ ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడటమో లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష శిథిలాల సంఖ్య లక్షకు పైగా పెరుగుతుందని, ఇవి ట్రాక్ చేయడానికి చిన్నవే అయినా అంతరిక్ష నౌకను దెబ్బతీసేంత పెద్దవని యూఎస్ మిలటరీ సైతం ప్రకటించింది. అంతరిక్ష యాత్రకు ప్రాణాంతకం లేదా విపత్తు కలిగించే వేల వస్తువులు, నష్టాన్ని కలిగించేంత సామర్థ్యం గలవి మిలియన్ల కొద్దీ ఉన్నాయని అంచనా వేసింది. జియో సింక్రనస్ ఆర్బిట్లో భారీ బరువుండే ఉప గ్రహాలుంటాయి. ఈ ఆర్బిట్లోని పనికిరాని శాటిలైట్లను పైస్థాయికి పంపేస్తారని.. ఇక్కడ డెబ్రిస్ని అంచనా వేయలేమని ‘షార్’ మాజీ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ చెప్పారు. అయితే, అధిక ‘డెడ్ శాటిలైట్లు’, శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయని, ఇవే ప్రధాన సమస్య అని ఆయన స్పష్టం చేశారు. -
మరోసారి 36 ఉపగ్రహాలు ప్రయోగానికి ‘వన్వెబ్’ ఏర్పాట్లు
న్యూఢిల్లీ: ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు గ్లోబల్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ సంస్థ వన్వెబ్ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఇస్రో వాహక నౌక మార్క్–3 నుంచి ఈ ఏడాది మార్చి తొలివారంలో ఈ ప్రయోగం చేపట్టనున్నారు. 36 ఉపగ్రహాలు తమ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరాయని, వాటి గమ్యస్థానం భారత్ అంటూ వన్వెబ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మాసిమిలియానో లాడోవెజ్ ట్వీట్ చేశారు. వన్వెబ్ సంస్థ గత అక్టోబర్ 22న శ్రీహరికోటలో ఇస్రో వాహక నౌక ఎల్వీఎం–3 నుంచి 36 శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించడం తెలిసిందే. -
దిగంతాలకు తెలంగాణ కీర్తి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ‘ధ్రువ’స్పేస్టెక్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన తైబోల్ట్–1, తైబోల్ట్– 2 అనే నానో ఉపగ్రహాలను ఇస్రో సంస్థ శ్రీహరికోట నుంచి ‘పీఎస్ఎల్వీ–సీ54’ఉపగ్రహ ప్రయోగనౌక ద్వారా శనివారం విజయవంతంగా ప్రయోగించడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. టీ–హబ్ సభ్యసంస్థ, తెలంగాణకు చెందిన ‘స్కైరూట్’స్టార్టప్ కంపెనీ ఇటీవలే ‘విక్రమ్–ఎస్’ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా దేశచరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి స్టార్టప్గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ మూడు ఉపగ్రహాల ప్రయోగంతో టీహబ్ తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటిందన్నారు. తైబోల్ట్–1, తైబోల్ట్– 2 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశీయ స్టార్టప్ల చరిత్రలో చిరస్మరణీయమని, దీని వల్ల స్టార్టప్ల నగరంగా హైదరాబాద్కు ఉన్న విశిష్టత రెట్టింపు అయిందని పేర్కొన్నారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితీయడంతోపాటు పరిశ్రమలు, శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగాల్లో అవకాశాల సృష్టి లక్ష్యంగా ప్రారంభించిన టీ–హబ్ భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు సాధిస్తుందనే నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీ–హబ్ ప్రోత్సాహంతో ఉపగ్రహాలను రూపొందించి విజయవంతంగా ప్రయోగించడం ద్వారా తెలంగాణ కీర్తిని చాటిన స్కైరూట్, ‘ధ్రువ’స్పేస్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ యువత తమ మేధో సంపదను దేశ ప్రగతికి వెచ్చించి పనిచేయాలని, అద్భుత ఆలోచనలను స్టార్టప్లుగా కార్యరూపమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగాల్లో ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఉన్నతాధికారులు, టీ–హబ్ సిబ్బందిని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన ఎల్వీఎం3-ఎం2ను విజయవంతంగా ప్రయోగించటం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(ఎస్డీఎస్సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్వెహికల్ఎం3–ఎం2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది. ఇదీ చదవండి: ఇస్రో దీపావళి ధమాకా -
ఇస్రోకి చేరిన 36 వన్వెబ్ ఉపగ్రహాలు
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్వెబ్కి చెందిన 36 ఉపగ్రహాలు శ్రీహరికోటలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కి చేరుకున్నాయి. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ–షార్) నుంచి జీఎస్ఎల్వీ–ఎంకే ఐఐఐ రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించనున్నారు. ఇందుకోసం వన్వెబ్ సంస్థ .. ఇస్రోలో భాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)తో చేతులు కలిపింది. ఈ ఏడాది మరో విడత, వచ్చే ఏడాది మరో మూడు విడతలు లాంచింగ్లు ఉంటాయని వన్వెబ్ తెలిపింది. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) ఉపగ్రహాల ద్వారా ఇప్పటికే అలాస్కా, కెనడా, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో కనెక్టివిటీ సర్వీసులు అందిస్తున్నట్లు వివరించింది. వన్వెబ్లో దేశీ దిగ్గజం భారతి ఎంటర్ప్రైజెస్ ప్రధాన ఇన్వెస్టరుగా ఉంది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ షాక్: 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటికి! -
ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలం.. నిరుపయోగంగా శాటిలైట్స్
సూళ్లూరుపేట(తిరుపతి): ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలమైందని అధికారికంగా ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఆ రాకెట్ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు ఇకపై పనికిరావని ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. మూడు దశలను విజయవంతంగా దాటిన రాకెట్.. టర్మినల్ దశలో అదుపు తప్పింది. రెండు ఉపగ్రహాలను 356x76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే.. ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ వాటిని 356 కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. అందువల్ల ఈ ఉపగ్రహాలు పనికి రావని ఇస్రో వెల్లడించింది. సెన్సార్ విఫలమవటం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. టర్మినల్ దశలో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఇస్రో ఏర్పాటు చేసిన కమిటీ విశ్లేషిస్తోందని, ఈ కమటీ ఇచ్చే నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే ఎస్ఎస్ఎల్వీ-డీ2 ప్రయోగాన్ని చేపడతామని పేర్కొంది. ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహా వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ డీ1ను తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. ఈ రాకెట్ ఈవోఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఈవోఎస్-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. ఆజాదీశాట్ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు. ఈ ప్రయోగంలో మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో మొదట వెల్లడించింది. టెర్మినల్ దశకు సంబంధించిన సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలిపింది. (1/2) SSLV-D1/EOS-02 Mission update: SSLV-D1 placed the satellites into 356 km x 76 km elliptical orbit instead of 356 km circular orbit. Satellites are no longer usable. Issue is reasonably identified. Failure of a logic to identify a sensor failure and go for a salvage action— ISRO (@isro) August 7, 2022 -
బుల్లి ఉపగ్రహం.. భళా!
తెనాలి: వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి ‘లక్ష్య శాట్’ పేరుతో 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేయడంతోపాటు దాన్ని విజయవంతంగా ప్రయోగించారు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కూరపాటి సాయి దివ్య. ఉపగ్రహ కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న ఆమె తన సొంత పరిజ్ఞానంతో సాధించిన ఈ ఘనతకు అందరి అభినందనలు అందుకుంటున్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన సాయి దివ్య కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్లో ఎంటెక్ చేశారు. తన పీహెచ్డీ థీసిస్లో భాగంగా తెనాలిలోని తన నివాసంలోనే ఎన్–స్పేస్ టెక్ అనే సంస్థను ప్రారంభించి.. ఉపగ్రహ తయారీని ఆరంభించారు. ఈ క్రమంలో లక్ష్య శాట్ పేరుతో ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. ఉపగ్రహానికి సంబంధించిన పేలోడ్, ప్రోగ్రాం కోడింగ్, విద్యుత్ వినియోగం అంచనా, సమాచార సేకరణ వంటి అంశాలన్నింటిపైన పట్టు సాధించిన సాయి దివ్య వాటి ఆధారంగా 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేశారు. యూకే నుంచి ప్రయోగం.. గత నెల 15న లక్ష్య శాట్ ఉపగ్రహాన్ని యునైటెడ్ కింగ్డమ్ నుంచి బీ2 స్పేస్ అనే కంపెనీ ద్వారా స్ట్రాటో ఆవరణంలోకి పంపారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్ సాయంతో దీన్ని ప్రయోగించారు. ఇది భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి స్ట్రాటో ఆవరణంలో దాదాపు మూడు గంటలపాటు ఉందని సాయి దివ్య గురువారం తెనాలిలో మీడియాకు వివరించారు. లక్ష్య శాట్లోని అన్ని విభాగాలు ఎలాంటి లోపం లేకుండా పనిచేయటంతో ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. అక్కడ తొమ్మిది రకాల వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహంతో సేకరించానని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రస్తుతం విశ్లేషిస్తున్నానని వివరించారు. తెనాలిలో తాను నెలకొల్పిన ఎన్–స్పేస్ టెక్ సంస్థ ద్వారా తక్కువ ఖర్చుతో చిన్న, సూక్ష్మ ఉపగ్రహాలను అందుబాటులోకి తెస్తానన్నారు. లక్ష్య శాట్కు రూ.2 లక్షల వరకు ఖర్చయిందన్నారు. తన విజయాలకు తల్లిదండ్రులు నగజశ్రీ,, ప్రసాద్, భర్త కొత్తమాసు రఘురామ్ ఎంతో ప్రోత్సాహమందిస్తున్నారని తెలిపారు. -
భారత జెండాను టచ్ చేయని రష్యా.. కారణం ఇదే!
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. యుద్ధ ప్రభావం ఉక్రెయిన్పై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే అమెరికా,బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉక్రెయిన్ బాసటగా నిలవడంతో పాటు రష్యాపై ఆంక్షల విధిస్తున్నాయి. అయితే.. భారత్ మాత్రం ఈ విషయంలో తటస్థంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత అనుసరిస్తున్న తీరపై రష్యా కూడా సానుకూలంగా స్పందించింది. తాజాగా రష్యాతో భారత్కి ఉన్న స్నేహబంధం ఎలాంటిదో నిరూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరు మారలేదని కొన్ని దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు బదులుగా రష్యా తాను చేపడుతున్న ఉపగ్రహ ప్రయోగాలకూ పలు దేశాలను సహాయం అందించకూడదనే ఆలోచనలో ఉంది. అంతేకాదు వన్వెబ్ రాకెట్పై నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ జాతీయ జెండాలను రష్యా తొలగించింది. బైకనోర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించాల్సిన స్పేస్ రాకెట్ ద్వారా వివిధ దేశాల భాగస్వామ్యంతో 36 వన్ వెబ్ శాటిలైట్లను ప్రయోగించనున్నారు. అయితే, ఈ రాకెట్ పై ఉన్న అమెరికా, బ్రిటన్, జపాన్ జెండాలను తొలగించిన రష్యా.. భారత్ జెండాను మాత్రం అలాగే, ఉంచింది. అంతేకాకుండా రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ డిమిత్రి రోగోజిన్ ఈ విషయంపై స్పందిస్తూ.. “కొన్ని దేశాల జెండాలు లేకుండా, మా రాకెట్ మందుకంటే అందంగా ఉందని తెలుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంతరిక్షంపైనా ప్రభావం చూపిస్తోందని టెక్నాలజీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Стартовики на Байконуре решили, что без флагов некоторых стран наша ракета будет краше выглядеть. pic.twitter.com/jG1ohimNuX — РОГОЗИН (@Rogozin) March 2, 2022 -
బుల్లి ఉపగ్రహాలతో.. తుర్రుమనేలా
సూళ్లూరుపేట: అతి తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పుడు చిన్నచిన్న ఉపగ్రహాలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ను కూడా తయారు చేసింది. ఈ ఏడాది మార్చి నెలలోనే దీనిని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరి నాటికి ఎస్ఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా వంద కిలోల నుంచి 500 కిలోల బరువు కలిగిన 6,000 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి నెలలో ఎస్ఎస్ఎల్వీ రాకెట్ను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు సమాచారం. ఆ ఫలితానికి అనుగుణంగా మార్చి 25న పూర్తిస్థాయి ప్రయోగం చేపట్టనున్నారు. 34 మీటర్ల ఎత్తు.. రెండు మీటర్ల వ్యాసార్థం.. ఇప్పటిదాకా ఇస్రో ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్3 అనే ఐదు రకాల రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తోంది. తాజాగా వీటి సరసన ఎస్ఎస్ఎల్వీ చేరబోతోంది. దీన్ని నాలుగు దశల్లో ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు. 34 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ను.. 500 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా వున్న లియో ఆర్బిట్లో ప్రవేశపెట్టే విధంగా డిజైన్ చేశారు. ఈ రాకెట్ను వర్టికల్ పొజిషన్లో పెట్టి ప్రయోగించనున్నారు. ఎస్ఎస్ఎల్వీ రాకెట్లోని మొదటి, రెండు, మూడు దశలను ఘన ఇంధనంతో ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు. ఇందులో ద్రవ ఇంధనం దశ ఉండదు. వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్ అనే దశను కొత్తగా అమర్చారు. ఆ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడతారు. విద్యార్థులనూ ప్రోత్సహించే విధంగా.. ఇప్పటికే దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన ఆస్ట్రోనాట్, ఐఐటీ విద్యార్థులు చిన్నచిన్న ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. వీరిని మరింతగా ప్రోత్సహించేందుకు ఎస్ఎస్ఎల్వీ ఎంతగానో దోహదపడనుంది. ఇస్రో కూడా భవిష్యత్ శాస్త్రవేత్తలు తయారు కావాలనే లక్ష్యంతో విద్యార్థులను భాగస్వాములను చేస్తోంది. ఇందులో భాగంగానే దేశ, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం, తగిన ప్రోత్సాహకం అందిస్తోంది. చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేసుకుని ముందుకొస్తే.. ఇస్రో ఉచితంగా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన ఆనంద్–01 అనే ఉపగ్రహాన్ని మార్చిలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. -
కూలిపోతున్న స్పేస్ ఎక్స్ శాటిలైట్లు
కేప్ కన్నవెరల్: సౌర తుఫాన్ల కారణంగా తమ కొత్త శాటిలైట్లలో కనీసం 49 దాకా తమ కక్ష్యల నుంచి జారి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయినట్టు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ‘‘గత వారం ప్రయోగించిన వీటిలో చాలావరకు తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయాయి. మిగతావీ కూడా అదే బాటలో ఉన్నాయి’’ అని చెప్పింది. గత శుక్రవారం నాటి జియోమాగ్నటిక్ తుఫాన్ల దెబ్బకు వాతావరణ సాంద్రత పెరగడం తమ శాటిలైట్ల పుట్టి ముంచిందని వివరించింది. ఒక్కోటీ కేవలం 260 కిలోలుండే ఈ బుల్లి శాటిలైట్లను కాపాడేందుకు గ్రౌండ్ కంట్రోలర్లు ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయిందని వాపోయింది. అయితే స్పేస్ ఎక్స్కు చెందిన కనీసం 2,000 స్టార్ లింక్ శాటిలైట్లు దాదాపు 550 కిలోమీటర్ల ఎత్తులో భూమికి చుట్టూ తిరుగుతూ ప్రపంచంలోని మారుమూలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ సమకూరుస్తున్నాయి. -
ఉప గ్రహాలకు ఉప ద్రవం
మనం వాడుతున్న సాంకేతికతకు... జీపీఎస్, మొబైల్ ఫోన్ల నుంచి అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థల వరకు అంతరిక్షంలో భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న మన ఉపగ్రహాలే కీలకం. మరి ఉన్నట్టుండి వాటికేమైనా అయితే? వామ్మో ఇంకేమైనా ఉందా? ఇప్పటికిప్పుడు ఏదో ఉపద్రవం వచ్చిపడబోతోందని కాదుకానీ... భూకక్ష్యలో రద్దీ ఎక్కువమవుతోంది. ఎవరి అవసరాని కొద్దీ వారు ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఎలన్మస్క్ అయితే స్టార్లింక్ ద్వారా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు శ్రీకారం చుట్టేశారు. లెక్కకు మిక్కిలి బుల్లి శాటిలైట్లను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేస్తున్నారు. వీటన్నింటినీ మోసుకెళ్తున్న రాకెట్ల శకలాలు కొన్ని భూమి మీదపడగా... మిగతా కొన్ని విడిభాగాలు అలా భూకక్ష్యలో తేలియాడుతున్నాయి. అలాగే కాలం చెల్లిన శాటిలైట్లు... వాటినుంచి వేరుపడుతున్న విడిభాగాలు కూడా. ఇవే ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రష్యా తాము 1982లో ప్రయోగించిన ‘కాస్మోస్–1408’ ఉపగ్రహం నిరర్ధకంగా మారిందని ఈనెల 15వ తేదీన ఓ మిస్సైల్ ద్వారా దాన్ని పేల్చివేసింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి (ఐఎస్ఎస్) 80 కిలోమీటర్ల పైభాగంలో ఇది జరగడం గమనార్హం. భూమి లేదా విమానం నుంచి మిస్సైల్ను ప్రయోగించి భూకక్ష్యలోని వెళ్లాక దాని గమనాన్ని నియంత్రించి లక్ష్యాన్ని ఢీకొట్టేలా చేస్తారు. రష్యా శాటిలైట్ పేలిపోవడంతో 1,500 పైచిలుకు శకలాలు అంతరిక్షంలోకి విరజిమ్మబడ్డాయి. ఎఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాములను రెండు గంటలపాటు సురక్షితంగా క్యాప్యూల్స్లోకి వెళ్లి తలదాచుకోమని నాసా హెచ్చరించాల్సి వచ్చింది. రష్యా చర్యను తీవ్రంగా ఖండించింది కూడా. గతంలో అమెరికా, చైనా, భారత్లు కూడా ఇలాగే భూకక్ష్యలోని తమ పాత ఉపగ్రహాలను పేల్చేశాయి. ఎంత చెత్త ఉంది... భూమి దిగువ కక్ష్యలో దాదాపు 9,600 టన్నుల చెత్త (విడిభాగాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, నట్లు, బోల్టులు తదితరాలు) పేరుకుపోయిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) అంచనా. సాఫ్ట్ బాల్ సైజులో ఉన్న భాగాలు 23 వేలు ఉంటాయని నాసా లెక్క. సెంటీమీటరు పరిమాణంలో ఉండేవి ఐదు లక్షల పైచిలుకే ఉంటాయి. ఇవి గంటకు ఏకంగా 25,265 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్తుంటాయి. ఈ శకలాలు ఒకరోజులో భూమి చుట్టూ 15 నుంచి 16 సార్లు పరిభ్రమిస్తాయి. ఈ వేగంతో వెళుతున్నపుడు ఎంత చిన్నశకలమైనా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొడితే కలిగే నష్టాన్ని ఊహించగలమా? విస్పోటం లాంటిది సంభవించే అవకాశం ఉంటుంది. శాటిలైట్లను తాకితే అవి తునాతునకలైపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. సాధారణంగా భూమికి వెయ్యి కిలోమీటర్ల ఎత్తుల్లో కక్ష్యలో సమాచార, పరిశోధక ఉపగ్రహాలు పరిభ్రమిస్తుంటాయి. వీటికి ఈ మానవ జనిత చెత్త, శకలాల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. మునుముందు శాటిలైట్ ప్రయోగాలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి కాబట్టి... చెత్త పేరుకుపోయే... ముప్పు మరింత పెరుగుతుంది. భూకక్ష్యను దాటివెళ్లే అంతరిక్ష ప్రయాణాలకు వీటివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. భూమి కక్ష్యలో 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే చెత్త క్రమేపీ కొన్నేళ్లలో కిందికి దిగజారుతూ భూమిపైకి పడిపోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చెబుతోంది. కాకపోతే వెయ్యి కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమించే శకలాలే 100 ఏళ్లు.. ఇంకా అంతకుపైనే తిరుగుతూ ఉంటాయట. వీటితోనే ముప్పు. పైగా భవిష్యత్తులో ఇలాంటి శకలాల నుంచి ముప్పు తప్పించుకునే సాంకేతికతలను శాటిలైట్లకు జోడించాలంటే మొత్తం ప్రాజెక్టు వ్యయం 5 నుంచి 10 శాతం పెరుగుతుందని అంచనా. మొత్తానికి భూమిపైనే కాదు అంతరిక్షంలోనూ మానవ జనిత చెత్తతో మనకు చిక్కొచ్చిపడుతోంది! – నేషనల్ డెస్క్, సాక్షి -
భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు
స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్బెజోస్లు భూమి మీద జరిగే వ్యాపారాల్లోనే కాదు, అంతరిక్షంలో జరిపే ప్రయోగాల్లోనూ నువ్వా నేనా అంటూ ఒకరికొకరు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా లూనార్ ల్యాండర్ ప్రాజెక్ట్ను ఛేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసి అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ విఫలమయ్యారు. తాజాగా స్పేస్లో ఆదిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శాటిలైట్ ఇంటర్నెట్ విషయంలో మస్క్ అందరికంటే ముందంజలో ఉండగా.. జెఫ్బెజోస్ సైతం 'ప్రాజెక్ట్ కైపర్' పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ను అందించనున్నారు. ఇందుకోసం ఉపగ్రాహాలను స్పేస్లోకి పంపేందుకు అమెరికా ప్రభుత్వం నుంచి వరుసగా అనుమతులు తీసుకుంటున్నారు. జెఫ్బెజోస్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే 4,500 కంటే ఎక్కువ ఉపగ్రహాలను (శాటిలైట్స్) స్పేస్లోకి పంపేందుకు యూఎస్ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందారు. తాజాగా గత వారం మరో 7,774 ఉపగ్రహాలను స్పేస్లోకి పంపేందుకు, నవంబర్ 7న (నిన్న ఆదివారం) అమెజాన్ 2022 చివరి నాటికి రెండు ప్రోటోటైప్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఎఫ్సీసీని అనుమతి కోరారు. ఈ అనుమతులతో ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని వినియోగదారులందరికి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించవచ్చని ఎఫ్సీసీ అనుమతి కోసం పంపిన నివేదికలో జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. వరల్డ్ వైడ్గా ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడినప్పటికీ ప్రపంచ జనాభాలో 51%, అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాలో 44% మాత్రమే ఇంటర్నెట్ సేవల్ని వినియోగిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. స్పేస్ ఎక్స్ ముందంజ స్పేస్ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రాజెక్ట్ లో భాగంగా 2027 నాటికల్లా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,800కుపైగా శాటిలైట్లను పంపారు. వాటి సాయంతో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్లోని 14 దేశాల్లో వంద డాలర్ల ప్రీ-ఆర్డర్ బుకింగ్(రిఫండబుల్) శాటిలైట్ సేవల్ని అందిస్తున్నారు. ఒకవేళ సిగ్నల్ వ్యవస్థ గనుక పని చేయకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. స్టార్లింక్స్తో పాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్స్టార్ట్ తో పాటు వర్జిన్ గెలాక్టిక్ ‘వన్వెబ్’ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నారు. చదవండి:శుభవార్త..! 'జియో'కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..! -
ఆనంద్.. మంచి కాఫీలాంటి శాటిలైట్
తన 50 ఏళ్ల చరిత్రలో ‘ఇస్రో’ తొలిసారిగా మన ప్రైవేట్ సంస్థల శాటిలైట్లను నింగిలోకి పంపనుంది. ఈ నెల 28న పీఎస్ఎల్వీ–సి51 ద్వారా పంపే ఈ శాటిలైట్లలో బెంగళూరు స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ‘పిక్సెల్’ రూపొందించిన ‘ఆనంద్’ ఒకటి. పాతికేళ్లు కూడా నిండని ఎవ్యాస్ అహ్మద్, క్షితిజ్ ఖండేల్వాల్లు ఈ కంపెనీ రథసారథులు. ‘పిక్సెల్’ విజయప్రస్థానం... చిన్నప్పుడు ఆకాశం అంటే అంతులేని ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు. చిక్కమగళూరు(కర్నాటక) అబ్బాయి ఎవ్యాస్ అహ్మద్ కూడా అంతే. ఆ ఆసక్తి తాను చదువుకున్న బిట్స్ పిలాని(రాజస్థాన్) వరకు కొనసాగింది. బిట్స్ పిలానిలో ‘హైపర్లూప్ ఇండియా’ ప్రాజెక్ట్ వ్యవస్థాపక సభ్యులో అహ్మద్ కూడా ఒకరు. ‘హైపర్లూప్ ఇండియా’తో తన కలలకు శాస్త్రీయ పునాది ఏర్పడింది. వేరు వేరు క్యాంపస్లలో నుంచి వచ్చిన విద్యార్థులతో పరిచయం, పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నాలు జరిగాయి. టెక్ దిగ్గజం ఎలాన్ మాస్క్కు చెందిన ‘స్పేస్ఎక్స్’ స్పాన్సర్ చేసే ‘హైపర్లూప్ పోడ్ కాంపిటీషన్’లో ప్రపంచం నలుమూలల నుంచి స్టూడెంట్స్, నాన్ స్టూడెంట్స్ టీమ్లు పాల్గొంటాయి. ఈ పోటీలో పాల్గొనడాన్ని ప్రతిష్ఠాత్మక విషయంగా భావిస్తాయి. హైపర్లూప్ కాన్సెప్ట్ ప్రకారం సబ్స్కేల్ ప్రోటోటైప్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ నిర్మించడం, డిజైన్ చేయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం. ‘హైపర్లూప్ ఛాలెంజ్’లో బిట్స్ పిలాని టీమ్కు పాల్గొనే అవకాశం వచ్చింది. కాలిఫోర్నియాలోని ‘స్పేస్ఎక్స్’ ప్రధానకార్యాలయంలో తమదైన హైపర్లూప్ టెక్నాలజీ(అత్యంగా వేగంగా ఒక మైలు దూరం వ్యాక్యూమ్ ట్యూబ్లో ప్రయాణం చేసే సాంకేతిక జ్ఞానం) డెమో ఇచ్చారు. ఫైనల్ వరకు వెళ్లారు. ఈ పోటీ పుణ్యమా అని టెక్స్టార్ ఎలాన్ మాస్క్ను కలుసుకునే అవకాశం వచ్చింది. ‘మాస్క్తో మాట్లాడడం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. నా కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలనే పట్టుదల పెరిగింది’ అంటాడు ఆరోజుని గుర్తు చేసుకుంటూ 22 సంవత్సరాల అహ్మద్. హైపర్లూప్ కాంపిటీషన్లో పాల్గోవడం వల్ల తన పరిమిత అవగాహనలోని ఖాళీలకు జవాబులు దొరికాయి. ఆ తరువాత ‘ఏఐ ఎక్స్ప్రైజ్ కాంపిటీషన్’లో పాల్గొన్నాడు. సాంకేతిక అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీలు నిర్వహించే ఈ సంస్థను 1994లో కాలిఫోర్నియాలో స్థాపించారు. జెమ్స్ కామెరూన్, లారీపేజ్లాంటి ప్రముఖులు ఈ సంస్థకు ట్రస్టీలుగా ఉన్నారు. ‘ఎక్స్ప్రైజ్’లో పాల్గొన్న సందర్భంలోనే అహ్మద్కు ‘శాటిలైట్ ఇమేజరీ’ గురించి ఆలోచన వచ్చింది. రిమోట్ లొకేషన్లలో, పైప్ల నుంచి గ్యాస్ లీకేజిలను గుర్తించడానికి ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా గనులలో అక్రమ తవ్వకాలను గుర్తించడానికి, వ్యవసాయానికి సంబంధించిన ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి, విత్తడానికి సరిౖయెన సమయాన్ని ఎంచుకోవడానికి...ఒకటి రెండు అని ఏమిటి! చాలా రకాలుగా శాటిలైట్ ఇమేజరీలను వాడుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ పిక్సెల్. బిట్స్పిలానిలో తనతో పాటు చదువుకున్న క్షితిజ్ ఖండెల్వాల్తో కలిసి 2019లో బెంగళూరులో ‘పిక్సెల్’ స్టార్టప్ ప్రారంభించాడు అహ్మద్. అయితే నిధుల సమస్య పెద్ద సవాలుగా మారింది. వీరు ఎంత సీరియస్గా తమ ప్రాజెక్ట్ గురించి వివరించినా అందరూ తేలిగ్గా తీసుకునేవారు. దీనికి కారణం వారి వయసు. నిధుల సమస్యను అధిగమించడానికి రాజస్థాన్ గవర్నమెంట్, ఇతరుల కోసం కొన్ని ప్రాజెక్ట్లు చేశారు. కొద్ది కాలం తరువాత ‘పిక్సెల్’ ప్రాజెక్ట్ గురించి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. తొలిరోజుల్లో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించని ‘పిక్సెల్’ టీమ్ ఇండస్ తరువాత ఇండియన్ స్పేస్ స్టార్టప్లలో హైయెస్ట్ ఫండింగ్లో ఉంది. తాము అత్యున్నత ప్రమాణాలతో జెనరేట్ చేసే ఇమేజరీ డాటా యూఎస్ నుంచి యూరప్ వరకు వినియోగదారులకు అనేకరకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ‘పిక్సెల్’ సీయివో,సీటీవో అహ్మద్, క్షితిజ్లు. మూడు రోజుల తరువాత పిక్సెల్ వారి ‘ఆనంద్’ ఆకాశంలోకి దూసుకెళ్లబోతుంది. వెళుతూ వెళుతూ ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చివెళుతుంది. పట్టుదల ఉంటే కన్న కలలు సాకారమవుతాయి. జీవితాన్ని ఆనందంతో నింపుతాయి. -
కలప ఉపగ్రహం.. ఎందుకంటే?
కలపేంటి? ఉపగ్రహమేంటి? ఇదేదో కొయ్యగుర్రంలాంటిదేమో అనుకుంటున్నారా? కానే కాదు. ఒకసారి అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత మిగిలిన ఉపగ్రహాల మాదిరిగానే పూర్తిస్థాయిలో పనిచేయగల అసలు సిసలు ఉపగ్రహం. ఇప్పటి వరకు ఉపగ్రహాలను అల్యూమినియం వంటి లోహాలు, ప్లాస్టిక్ తదితర పదార్థాలతో తయారు చేస్తూ వస్తున్నారు. ఇవి తిరిగి నేలకు చేరుకున్నా, వీటి వ్యర్థాలను పర్యావరణానికి చేటు కలిగించకుండా నిర్మూలించడం ఒక పట్టాన సాధ్యమయ్యే పనికాదు. అలాగే, ఇవి అంతరిక్షంలోనే చక్కర్లు కొడుతూ మిగిలిపోయినా ఇబ్బందే! ఇప్పటికే చాలా ఉపగ్రహ వ్యర్థాలు అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నాయి. వీటినే ‘స్పేస్జంక్’ అంటున్నారు. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఉండేందుకే జపాన్లోని క్యోటో యూనివర్సిటీ, సుమిటిమో ఫారెస్ట్రీ నిపుణులు కలపతో ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇందులో అత్యవసరమైన కొద్ది భాగాలను మాత్రమే అల్యూమినియంతో తయారు చేసినవి అమర్చారు. దీనిని 2023లో అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రపంచంలోనే ఇది తొలి కలప ఉపగ్రహం. నిర్దేశించిన పని పూర్తి చేసుకున్నాక, ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే కాలి బూడిదైపోతుంది. కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. చదవండి: వైరల్గా మత్స్యకన్య ‘మెసేజ్’ -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-49
సాక్షి, శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ద్వారా స్వదేశానికి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్(ఈవోఎస్ 01) శాటిలైట్తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్స్ంబర్గ్కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, తిథువేనియాకు చెందిన ఒక చిన్న తరహా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. వ్యవసాయం, ప్రకృతి వైపరిత్యాలపై ఈవోఎస్ 01 అధ్యయనం చేయనుంది. షార్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయోగ ప్రక్రియను చేపట్టారు. పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. Hearty congratulations to the team at @isro behind the successful launch of #PSLVC49, carrying #E0S01 and nine international customer satellites. My best wishes to the scientists for their future endeavours. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2020 WATCH ISRO launches EOS01 and 9 customer satellites from Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/2ifOeAYIpx — ANI (@ANI) November 7, 2020 -
సరిహద్దులపై నిఘాకు ఉపగ్రహాలు!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ఇప్పట్లో సమసే అవకాశం లేకపోవడంతో భారత్ దీర్ఘకాలిక పోరుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు సరిహద్దులపై నిత్యం నిఘా ఉంచేందుకు ఉపగ్రహాల సాయం తీసుకోవాలని నిర్ణయించడమే కాకుండా.. మొట్టమొదటిసారి చైనా దురాక్రమణకు పాల్పడిందని భారత్ అంగీకరిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదాన్ని అతిక్రమణగా అభివర్ణించిన ఓ నివేదిక కొద్ది సమయంలోనే రక్షణ శాఖ వెబ్సైట్ నుంచి అదృశ్యమవడం గమనార్హం. భారత్, చైనాల మధ్య సరిహద్దు సుమారు నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది. హద్దుల వెంబడి రోజంతా నిఘా పెట్టేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రత సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు కేవలం సరిహద్దులపై నిఘాకు ఉపయోగిస్తారు. చైనా ఇటీవల జిన్జియాంగ్ ప్రాంతంలో మిలటరీ విన్యాసాల పేరుతో సుమారు 40 వేల మంది సైనికులు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని అతితక్కువ కాలంలో తరలించగలిగింది. ఆ తరువాతే చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత్ భూభాగంలోకి చొరబడ్డారు. ఈ చొరబాట్లు కాస్తా లేహ్ ప్రాంతంలోని భారత్ సైనిక బలగాలను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో ఏ చిన్న కదలికనైనా గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అత్యధిక రెజల్యూషన్ ఉన్న సెన్సర్లు, కెమెరాలతో వ్యక్తుల కదలికలను గుర్తించవచ్చునని వీరు భావిస్తున్నారు. వెనక్కు తగ్గేందుకు ససేమిరా... గల్వాన్ ప్రాంతంలో ఫింగర్స్గా పిలిచే శిఖరాలను ఆక్రమించిన చైనా వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటోంది. పాంగాంగ్ సో సరస్సు వద్ద కూడా భారత దళాలు వెనక్కు తగ్గితేనే తాము వెళతామని భీష్మించుకుంది. అంతేకాకుండా ఫింగర్ –5పై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తున్నట్లు సమాచారం. భారత్ సరిహద్దుల వెంబడి మరింత మంది సైనికులను మోహరిస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్లోనూ వాస్తవాధీన రేఖ వెంబడి సైనికులను మోహరిస్తున్నట్లు సమాచారం. మే నెలలో ఈ దాడిని మొదలుపెట్టిన చైనా అక్కడి నుంచి వెనుదిరిగేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో దీన్ని అతిక్రమణగానే చూడాలని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారిక దస్తావేజు స్పష్టం చేసింది. అయితే రక్షణ శాఖ వెబ్సైట్లో ఈ దస్తావేజు కనిపించిన కొద్ది సమయానికి మాయమైపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చైనాపై విరుచుకుపడ్డ భారత్ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కుకు చైనాకు లేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. కశ్మీర్ అంశాన్ని భద్రత మండలిలో లేవనెత్తేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని నిరసించడమే కాకుండా.. ఇతరుల జోక్యం సరికాదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో బుధవారం కశ్మీర్ అంశంపై చర్చ జరగాలని పాకిస్తాన్ ప్రతిపాదించగా చైనా దానిని మద్దతు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దయి బుధవారానికి ఏడాదైన విషయం తెలిసిందే. చైనా ప్రయత్నాలు ఫలించలేదు. భారత్లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ అంశాలను చైనా భద్రతా మండలిలలో ప్రస్తావించే ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో మాదిరిగానే దేశ అంతర్గత వ్యవహారాలపై చైనా జోక్యం చేసుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపిన చైనా
బీజింగ్ : ఇంటర్నెట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం చైనా మంగళవారం రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. జిన్గున్ 2 01, జిన్గున్02 అనే రెండు ఉపగ్రహాలను .. కువజువా-1ఏ (కేజెడ్-1ఏ) రాకెట్ ద్వారా ప్రయోగించారు. వాయువ్య చైనాలోని జుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. విజయవంతంగా ఆ రెండు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. జిన్గున్ శాటిలైట్ కంపెనీ.. ఆ రెండు ఉపగ్రహాలను డెవలప్ చేసింది. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ సేవలపై ఆ శాటిలైట్లు ప్రయోగాలు చేపడుతాయి. ఐఓటీ అప్లికేషన్స్పై పైలట్ పరిశోధన చేపట్టనున్నాయి. లో ఆర్బిట్ స్మాల్ శాటిలైట్లను నింగిలోకి పంపేందుకు కేజెడ్-1ఏ రాకెట్ను వాడుతారు. -
బుల్లి ఉపగ్రహాల కోసం ప్రత్యేక రాకెట్
సూళ్లూరుపేట: వాణిజ్య పరంగా ఎంతో ఉపయుక్తంగా ఉండే చిన్న చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ)కు రూపకల్పన చేస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే దీన్ని ప్రయోగించనుంది. ఇందుకోసం తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి సమీపంలోని కులశేఖరపట్నంలో ప్రయోగ వేదికను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకూ ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి ఐదు రకాల రాకెట్లను రూపొందించిన ఇస్రో ఆరో రకం రాకెట్గా ఎస్ఎస్ఎల్వీని తయారుచేస్తోంది. చిన్న తరహా ఉపగ్రహాల ప్రయోగానికి వివిధ దేశాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో ఇస్రో దీనికోసమే ప్రత్యేకంగా ఎస్ఎస్ఎల్వీ రాకెట్ను రూపొందిస్తోంది. అంతేకాకుండా దేశీయంగా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ప్రయోగాత్మకంగా చిన్న చిన్న ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారు తయారు చేస్తున్న బుల్లి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఎస్ఎస్ఎల్వీ వివరాలివీ.. ఎస్ఎస్ఎల్వీ రాకెట్ 300 కిలోల నుంచి 500 కిలోల బరువు కలిగిన చిన్నతరహా ఉపగ్రహాలను ఎన్నింటినైనా సునాయాసంగా తీసుకెళుతుంది. 34 మీటర్ల పొడవు, 2.1 మీటర్ల వ్యాసార్థం కలిగిన ఈ రాకెట్ ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు వుంటుంది. ఈ రాకెట్ను కూడా నాలుగు దశల్లోనే ప్రయోగించనున్నారు. ఇందులో మొదటి, రెండు, మూడు దశలు ఘన ఇంధనంతో, నాలుగో దశ మాత్రమే ద్రవ ఇంధనం సాయంతో ప్రయోగించేలా డిజైన్ చేశారు. 300 కేజీల నుంచి 500 కేజీల బరువు కలిగి బహుళ ఉపగ్రహాలను భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి ప్రవేశపెట్టేలా దీన్ని రూపొందించారు. -
విదేశీ ఉపగ్రహ మార్కెట్పై ఇస్రో దృష్టి
సాక్షి, అమరావతి: ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట వేదిక కావడం గమనార్హం. అతి తక్కువ వ్యయంతో ఒకేసారి పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపే సామర్థ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కలిగి ఉండటంతో విదేశాలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. 1999లో తొలిసారిగా జర్మనీకి చెందిన డీఎల్ఆర్–టబ్సాట్ రిమోట్ సెన్సింగ్ మైక్రో శాటిలైట్ను విజయవం తంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇస్రో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఇస్రో స్వయం ప్రతిపత్తి... విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో 2018–19లో రికార్డు స్థాయిలో రూ.324.19 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2017–18లో రూ.232.56 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. గడిచిన ఐదేళ్లలో రూ.1,245.17 కోట్ల నికర ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇస్రో తన ప్రయోగాలకు సొంతంగానే నిధులను సమకూర్చుకునే స్థితికి చేరుకుంటోంది. విదేశీ ఉపగ్రహా ప్రయోగాల కోసం బెంగళూరు కేంద్రంగా ఆంట్రిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. 1992లో ఏర్పాటైన ఈ సంస్థ గడిచిన మూడేళ్లలో 239 ఒప్పందాల ద్వారా రూ.6,280 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని సముపార్జించింది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో పీఎస్ఎల్వీ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతవరకు పీఎస్ఎల్వీ 52.7 టన్నుల శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. గత నెలలోనే పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. వచ్చే మార్చిలోగా ఆరుసార్లు ఉపగ్రహలను నింగిలోకి పంపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. పదేళ్లలో రూ.20,300 కోట్లు రానున్న పదేళ్లలో అంతర్జాతీయ శాటిలైట్ మార్కెట్ వేగంగా విస్తరించనుందని బీఐఎస్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17,000కుపైగా మినీ శాటిలైట్లను ప్రయోగిస్తారని చెబుతోంది. ప్రస్తుతం రూ.3,591 కోట్లుగా ఉన్న శాటిలైట్ లాంచింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి రూ.20,300 కోట్లకు చేరుతుందని బీఐఎస్ లెక్కగట్టింది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఇస్రో వాటా కేవలం 2 శాతమే. ఈ వ్యాపార అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి ఆంట్రిక్స్కు అనుబంధంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) పేరిట 2019లో మరో సంస్థను ఇస్రో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విదేశాలకు చెందిన ఉపగ్రహ ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధి వ్యాపారంపై దృష్టి సారిస్తుంది. -
గ‘ఘన’ విజయ వీచిక
సూళ్లూరుపేట: ఇస్రో తన విజయ విహారాన్ని కొనసాగిస్తూ శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 75 ప్రయోగాలను పూర్తి చేసింది. బుధవారం ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ–48 ప్రయోగంతో ప్లాటినం జూబ్లీ రికార్డుని నమోదు చేయగా.. మరోవైపు పీఎస్ఎల్వీ సిరీస్లో అర్ధ సెంచరీని పూర్తి చేసింది. బుధవారం సాయంత్రం 3.25 గంటలకు ఇస్రో తన కదనాశ్వం పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ ద్వారా 628 కిలోల రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ (రీశాట్–2బీఆర్1) శాటిలైట్తోపాటు అమెరికాకు చెందిన మరో 6 ఉపగ్రహాలు, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్కు చెందిన మూడు ఉపగ్రహాలను 21.19 నిమిషాల్లో భూమికి 576 కిలో మీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రయోగం సాగిందిలా.. - పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.19 నిమిషాల్లో పూర్తి చేశారు. సాయంత్రం 3.25 గంటలకు 44.4 మీటర్ల పొడవు గల పీఎస్ఎల్వీ–సీ48 ఉపగ్రహ వాహక నౌక 628 కిలోల బరువైన 10 ఉపగ్రహాలను విజయవంతంగా రోదసీలోకి మోసుకెళ్లింది. - 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ను నాలుగు స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. - ప్రయోగ సమయంలో 291 టన్నుల బరువును మోసుకుంటూ రాకెట్ భూమి నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగికి పయనమైంది. - మొదటి దశలోని నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో 48 టన్నుల ఘన ఇంధనంతోపాటు కోర్ అలోన్ దశలో మరో 139 టన్నుల ఘన ఇందనాన్ని మండించుకుంటూ రాకెట్ భూమి నుంచి నింగి వైపు దూసుకెళ్లింది. - నాలుగో దశ నుంచి రీశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని భూమికి 576 కిలోమీటర్ల ఎత్తులోని వృత్తాకార సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. - అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలు, 1,278 సెకన్లకు జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్కు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. - జపాన్కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన టైవాక్–0092, ఇజ్రాయెల్కు చెందిన డచీఫాట్–3 అనే మూడు ఉపగ్రహాలను వాహక నౌక బయలుదేరిన 21.19 నిమిషాల్లో విజయవంతంగా ప్రవేశపెట్టి 75వ సారి విజయం సాధించారు. రీశాట్ ప్రత్యేకతలివీ.. సరిహద్దులో జరిగే చొరబాట్లును పసిగడుతుంది. ఇప్పటికే రెండు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో మూడో ఉపగ్రహమైన రీశాట్–2బీఆర్1ను రక్షణ రంగ అమ్ముల పొదిలో చేర్చింది. ఇందులో అమర్చిన పేలోడ్స్ను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. తాజా ఉపగ్రహంలో అమర్చిన ఎక్స్బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ భూమి మీద జరిగే మార్పులను పసిగడుతుంది. భూమి మీద 10 సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఉండే ఎలాంటి చిన్న వస్తువునైనా నాణ్యమైన చిత్రాలు తీసి çపంపిస్తుంది. దేశ సరిహద్దులో అక్రమ చొరబాట్లు, పంటలు, సాగు విస్తీర్ణం, అడవులను పరిశోధించడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ నాణ్యమైన ఫొటోలు తీసి పంపిస్తుంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్ భూమికి 576 కి.మీ. ఎత్తు నుంచి దేశానికి ఒక సరిహద్దు సెక్యూరిటీగా ఐదేళ్లపాటు పనిచేస్తుంది. మహానుభావుల కృషి ఫలితమిది: ఇస్రో చైర్మన్ సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ వరుస విజయాలకు నాటి మహానుభావుల కృషే కారణమని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అన్నారు. పీఎస్ఎల్వీ సీ–48 ప్రయోగం సక్సెస్ కావడంతో ఆయన మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో 50 ప్రయోగాలు చేయనున్నామని చెప్పారు. తొలుత ‘గోల్డెన్ జూబ్లీ ఆఫ్ పీఎస్ఎల్వీ’ పుస్తకాన్ని శివన్ ఆవిష్కరించారు. గవర్నర్ అభినందనలు సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సీ–48 వాహక నౌక ద్వారా ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. ఇస్రో సాధించిన ఈ ఘనతతో దేశం గర్వపడుతోందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం జగన్ అభినందనలు సాక్షి,అమరావతి: పీఎస్ఎల్వీ–సీ 48 వాహక నౌక ద్వారా రీశాట్ –2బీఆర్1తోపాటు మరో తొమ్మిది వాణిజ్య ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎంవో అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలను సొంతం చేసుకోవాలని సీఎం ఆకాంక్షించారు. -
ప్లాటినం షార్, శాస్త్రవేత్తల సంబురాలు
సాక్షి, సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. అయిదేళ్లపాటుసేవలు అందించనున్న ఈ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మరోవైపు రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. పీఎస్ఎల్వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్శాట్ ఉపగ్రహాలు, జపాన్కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు. రిశాట్-2బీఆర్1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగించారు. ఇక ఇస్రో ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ రాకెట్కు ప్రత్యేక స్థానమున్నది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఒకటిగా దీనికి పేరుంది. 49 ప్రయోగాల్లో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి. మూడో తరం లాంచ్ వెహికల్ అయిన పీఎస్ఎల్వీ.. చంద్రయాన్-1, మంగళ్యాన్ మిషన్లను విజయవంతం చేసింది. కాగా ఇప్పటివరకూ 74 రకాల రాకెట్లను నింగిలోకి పంపిన ఇస్రో... ఈ ప్రయోగంతో ప్లాటినం జూబ్లీని అందుకుంది. అంతేకాకుండా పీఎస్ఎల్వీ సిరీస్లో 50వ ప్రయోగానికి విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రాయన్-1,2, మంగళ్యాన్-1 వంటి గ్రహాంతర ప్రయోగాలకు వేదికిగా నిలిచింది. 2020లో గగన్యాన్కు సమాయత్తమవుతోంది. భవిష్యత్లో ఇస్రో మరిన్ని ప్రయోగాలు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మాట్లాడుతూ... ‘ ఈ రోజు చారిత్రాత్మకమైన 50వ పీఎస్ఎల్వీ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించాం. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం. 26 సంవత్సరాల పీఎస్ఎల్వీ రాకెట్ విజయాలలో ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉంది. పీఎస్ఎల్వీని వివిధ రకాలుగా అభివృద్ధి చేశాం. భవిష్యత్లో ఎన్నో ప్రయోగాలకు ఇస్రో సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఓ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీఎస్ఎల్వీ ఆధునీకరణలో కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తల వివరాలను ఈ పుస్తకంలో సవివరంగా ప్రచురించారు. సీఎం వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్లో ఇస్రో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
పీఎస్ఎల్వీ సీ-48 కౌంట్డౌన్ స్టార్ట్
-
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ–48
సూళ్లూరుపేట/తిరుమల: పీఎస్ఎల్వీ సీ–48 ఉపగ్రహ వాహక నౌక బుధవారం సాయంత్రం 3.25 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి రోదసీలోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తిచేసింది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ఇస్రో చైర్మన్ కె.శివన్ సమక్షంలో కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. పీఎస్ఎల్వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్శాట్ ఉపగ్రహాలు, జపాన్కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఇస్రో చైర్మన్ కె.శివన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఇది ఇస్రోకు చరిత్రాత్మక ప్రయోగమన్నారు. -
రేపు సా.3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ–48 ప్రయోగం
-
నేడు పీఎస్ఎల్వీ సీ–48కి కౌంట్డౌన్
సూళ్లూరుపేట : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ‘షార్’ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ–48కు మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించేందుకు ఇక్కడి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం ఉ.9.30 గంటలకు ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఉపగ్రహం లాంచ్ రిహార్సల్ను సోమవారం ఉ.6 గంటలకు విజయవంతంగా నిర్వహించారు. అయితే, కౌంట్డౌన్ సమయంలో మార్పుచేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరోవైపు.. ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం సాయంత్రం ‘షార్’కు విచ్చేయనున్నారు. ముందుగా ఆయన తిరుమల, శ్రీకాళహస్తిలలో దర్శనాలు చేసుకున్న అనంతరం చెంగాళమ్మ ఆలయం వద్ద పూజలు చేయడానికి వస్తారని షార్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం ప్రయోగించబోయే పీఎస్ఎల్వీ సీ–48 ప్రయోగంతో పీఎస్ఎల్వీ సిరీస్ అర్ధ సెంచరీ పూర్తిచేసుకోనుంది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఇప్పటిదాకా 49 పీఎస్ఎల్వీ ప్రయోగాలు చేయగా వీటిలో రెండు మాత్రమే విఫలమయ్యాయి. -
ఇస్రో తదుపరి లక్ష్యం.. సూర్యుడు!
సూళ్లూరుపేట: భారత, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు (ఇస్రో, నాసా) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గతేడాదే దీనిపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే అమెరికా ఇటీవలే సూర్యుడిపై పరిశోధనలకు సోలార్ ప్రోబ్ అనే ప్రయోగాన్ని చేపట్టింది. దీని తర్వాత ఇస్రో–నాసా కలిసి మరో ప్రయోగాన్ని చేపట్టేందుకు చర్చలు జరుపుతున్నాయి. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో హ్యూమన్ స్పేస్ ప్రోగ్రాం ముందుగానే ప్రయోగించే అవకాశముంటుందని గతంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఉపగ్రహంలో యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చి పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకుల్లేకుండా సూర్యుడిని నిత్యం పరిశీలించడం వీలవుతుందని అంచనా వేస్తున్నారు. కరోనాలో వేడి పెరుగుదలకు గల కారణాలపై పరిశోధనలు సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల కెల్విన్స్ ఉంటుంది. సూర్యుడి అంతర్భాగంలో ఆరు వేల కెల్విన్స్ ఉష్ణోగ్రత ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతుచిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1తో పరిశోధనలు చేస్తారు. సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై కూడా పరిశోధనలు చేయడానికి ఇస్రో–నాసాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని కూడా అంచనా వేశారు. దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తారు. సౌరగోళాన్ని పరిశోధించేందుకు ఆదిత్య ఎల్1 ఉపగ్రహంలో అమర్చబోయే ఆరు పరికరాలు. (ఊహాచిత్రం) బెంగళూరులోని ఉపగ్రహాల తయారీకేంద్రంలో ఈ ఉపగ్రహాన్ని తయారుచేసేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. అన్నీ సమకూరితే 2020 ఆఖరులోపు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని మీడియా సమావేశాల్లో పలుమార్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్–1, అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్యాన్–1లను అత్యంత తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోనే ప్రయోగించి విజయం సాధించారు. తాజాగా చంద్రయాన్–2 మిషన్ను కూడా అత్యంత తక్కువ వ్యయంతో గత నెల 22న ప్రయోగించి మొదటిదశను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం చంద్రయాన్–2 మిషన్ చంద్రుడి వైపునకు ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. మూడు గ్రహాంతర ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో.. నాలుగో గ్రహాంతర ప్రయోగమైన ఆదిత్య–ఎల్1ను కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. -
22న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ46
శ్రీహరికోట (సూళ్లూరుపేట): మరో అంతరిక్ష ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమయ్యింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 5.57 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ46ను నింగిలోకి పంపనున్నారు. రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రిశాట్–2బి) అనే అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని భూమికి 555 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. 300 కిలోల బరువైన ఈ ఉపగ్రహంలో ఎక్స్బాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. భూమి మీద జరిగే మార్పులను, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నాణ్యమైన చిత్రాలను తీసి పంపే సామర్థ్యం కలిగి వుంది. సైనిక అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడనుంది. ఇది రిశాట్ ఉపగ్రహాల సిరీస్లో నాలుగవది. ఇప్పటికే రిశాట్–1, రిశాట్–2, స్కాట్శాట్–1 అనే మూడు ఉపగ్రహాలు విజయవంతంగా రోదసీలో పనిచేస్తున్నాయి. వీటితో అనుసంధానమై రిశాట్ 2బి భారత్కు అన్నివిధాలా ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు. -
రేపు పీఎస్ఎల్వీ సీ45 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఏప్రిల్ 1న సోమవారం నాడు ఉదయం 9.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ45 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నట్లు మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) కమిటీ అధికారికంగా శనివారం ప్రకటించింది. షార్లోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో తుది విడత ఎంఆర్ఆర్ సమావేశాన్ని నిర్వహించారు. రాకెట్కు అన్ని రకాల తనిఖీలు నిర్వహించగా శనివారం రాత్రి లాంచ్ రిహార్సల్స్ చేసి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) చైర్మన్ ఎస్.పాండియన్కు అప్పగించారు. ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి కౌంట్డౌన్ ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగంలో 216 కిలోల బరువు కలిగిన ఈఎంఐ శాట్ అనే స్వదేశీ ఉపగ్రహంతో పాటు 220 కిలోలు బరువు కలిగిన నాలుగు దేశాలకు చెందిన 28 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగంలో 436 కేజీల బరువు కలిగిన ఈఎంఐ శాట్తో పాటు యూఎస్ఏకు చెందిన ఫ్లోక్–4ఏ పేరుతో 20 చిన్న ఉపగ్రహాలు, లీమూర్ పేరుతో మరో నాలుగు చిన్న ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఎం–6పీ, బ్లూవాకర్–1 అనే రెండు చిన్న తరహా ఉపగ్రహాలు, స్విట్జర్లాండ్కు చెందిన ఆస్ట్రోకార్ట్–1 అనే ఉపగ్రహం, స్పెయిన్కు చెందిన ఎయిస్టెక్ శాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. -
హచ్ డాగ్లా వెంటే.. వెన్నంటే..
2014, మార్చి 8.. 239 మంది ప్రయాణికులతో బయల్దేరిన మలేసియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 370 అంతుచిక్కని రీతిలో మాయమైంది... అన్ని రకాల టెక్నాలజీలను వాడి వెతికారు.. ఇదిగో తోక..అదిగో రెక్క అన్నారు.. మూడేళ్లకుపైగా వెతికారు..చివరికి ఎక్కడుందో కనుక్కోలేక చేతులెత్తేశారు.. విమానం ఎక్కడో కూలి ఉంటుందని..అందరూ చనిపోయిఉంటారని చెబుతూ కేస్ క్లోజ్ చేశారు.. ఇంతకీ అదెక్కడ కూలింది.. ఆ విమానానికి ఏమైంది అని అడిగితే ఏమో.. ఎవరిని అడిగినా ఇదే జవాబు.. అయితే, ఇకపై అలా ఉండదు..ఈ భూప్రపంచం మొత్తమ్మీద ఏ విమానం ఎటు వెళ్లినా.. ఎటు కదిలినా..అనుక్షణం పర్యవేక్షించే కొత్త వ్యవస్థ వచ్చేస్తోంది..విమానం తప్పిపోయినా.. దారి మళ్లినా..క్షణాల్లో గుర్తించి, అప్రమత్తం చేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తోంది.. అదే ఇరిడియం నెక్ట్స్.. ఇరిడియం నెక్ట్స్.. ఇందులో భాగంగా మొత్తం 75 ఉపగ్రహాలను మోహరిస్తున్నారు. తాజాగా ఇందులోని చివరి 10 ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ మొత్తం ఉపగ్రహాల వ్యవస్థ భూమి చుట్టూ ఓ సాలిగూడులా ఏర్పడి.. విమానాల రాకపోకలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయి. దీని వల్ల తొలిసారిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు ప్రపంచంలోని ఏ విమానం ఎక్కడుందన్న విషయం క్షణాల్లో తెలుస్తుందని అమెరికాకు చెందిన ఇరిడియం సంస్థ తెలిపింది. 2020 సరికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ ఇలా.. ఇప్పటివరకూ విమానం రాకపోకలను రాడార్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గ్రౌండ్ సిస్టం ద్వారా ట్రాక్ చేస్తున్నారు. విమానం కాక్పిట్లో ఉండే బ్లాక్ బాక్స్ ద్వారా ప్రతి 10 నుంచి 15 నిమిషాలకొకసారి ఈ సిగ్నల్ అందుతుంది. ఎంహెచ్ 370 విషయానికొస్తే.. ఆ బ్లాక్ బాక్స్ అన్నది దొరకనే లేదు. దీని వల్ల అసలేం జరిగిందన్నది తెలియరాలేదు. అసలు.. ఆ 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఆ విమానం ఎక్కడుంది అన్న విషయాన్ని ట్రాక్ చేసే వ్యవస్థ ప్రస్తుతానికి లేదు. ఇరిడియం నెక్ట్స్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే.. ఉపగ్రహాలు అన్ని విమానాలను కనిపెట్టుకుని ఉంటాయి. తేడా వస్తే. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సమాచారమందిస్తాయి. అంటే.. ఇక భవిష్యత్తులో ఎంహెచ్ 370లాంటి మిస్టరీలకు చోటు లేదన్నమాట.. ప్రమాదం జరిగినా.. ఎక్కడ జరిగిందన్న విషయం క్షణాల్లో తెలిసిపోతుంది కనుక.. సహాయక చర్యలను వెంటనే చేపట్టడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. ఈ ఇరిడియం.. ఇరగదీసే ఐడియా కదూ.. – సాక్షి సెంట్రల్ డెస్క్.. -
అంతరిక్షం..10000 కోట్లు
పది వేల కోట్ల రూపాయలు.. ముగ్గురు వ్యోమగాములు..వారం రోజుల అంతరిక్ష ప్రయోగం.. 2022 కల్లా కల సాకారం దిశగా అడుగులు... విజయం సాధిస్తే భారత్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి... అంతరిక్షాన్ని అందుకున్న అమెరికా, రష్యా, చైనాల సరసన సగర్వంగా నిలిచే అవకాశం..అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగంలో ఉపాధి కల్పనకు ఊతం.. ఇదీ ఇస్రో చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టు ప్రణాళిక. స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్షయానం కోసం ఇస్రో భుజానికెత్తుకున్న ఈ బృహత్తర ప్రాజెక్టు విశేషాలు స్థూలంగా.. 2004 లోనే గగన్యాన్కు శ్రీకారం.. అంతరిక్షంలోకి మనుషులను పంపించాలన్న ఆలోచనకు సూత్రప్రాయ అంగీకారం తెలపడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్లానింగ్ కమిటీ 2004లో గగన్యాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే ప్రయోగం ఎప్పుడు? ఎలా? అనే అంశాలపై మాత్రం స్పష్టత లేకపోయింది. 2015కల్లా ప్రయోగం చేపట్టాలన్నది తొలినాళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యం. రెండేళ్ల క్రితం కూడా మానవసహిత అంతరిక్ష ప్రయోగ ప్రణాళిక ఏదీ లేదని ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే అంటూ వచ్చిన ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదం ద్వారా శుక్రవారమే గగన్యాన్ను ధ్రువీకరించింది. సంక్లిష్టమైన ప్రయోగం... ఇస్రో ఇప్పటివరకూ ఎన్నో రాకెట్లను, వాటి ద్వారా మరెన్నో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినా మానవసహిత అంతరిక్ష ప్రయోగం వాటన్నింటికంటే భిన్నమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రయాన్, మంగళ్యాన్లతో పోల్చినా గగన్యాన్ చాలా సంక్లిష్టమైన, భారీ ప్రయోగమనే చెప్పాలి. మళ్లీమళ్లీ వాడుకోగల రాకెట్ను తయారు చేయడం ఒక ఎత్తైతే.. వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు అనువైన మాడ్యూల్ను తయారు చేయడం ఇంకో ఎత్తు. వ్యోమగాములు తినేదేమిటి? ఒక్కమాటలో చెప్పాలంటే మెనూ ఇంకా రెడీ కాలేదు. కాకపోతే మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) ఈ మెనూపై ఏళ్లుగా పనిచేస్తోంది. దక్షిణాది వ్యోమగాములైతే మనవాళ్ల ఫేవరెట్ ఆహారం పులిహోర లేదంటే దోసలు. ఉత్తరాది వారికి చపాతీ ముక్కలు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కొన్నేళ్ల క్రితమే సీఎఫ్టీఆర్ఐ ఉన్నతాధికారులు ప్రకటించారు. వీలైనంత వరకూ భారతీయులు ఇష్టపడే మసాలా నిండిన వెజ్, నాన్వెజ్ ఆహారాన్ని గిన్నెల్లోనే ప్యాక్ చేసి ఇస్తామని, కాకపోతే వ్యోమగాములు ఈ ఆహారాన్ని గొట్టాల ద్వారా పీల్చుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారరహిత స్థితిలో నీళ్లుతాగడమైనా, ఆహారం తీసుకోవడమైనా చాల ఇబ్బందితో కూడుకున్న విషయమన్నది తెలిసిందే. వాటితోపాటు ఫ్రూట్బార్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గ్రనోలా బార్లు కూడా వ్యోమగాములకు ఇస్తామని సీఎఫ్టీఆర్ఐ డైరెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు డైరెక్టర్గా మహిళా శాస్త్రవేత్త... అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ స్థాయిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే గగన్యాన్ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ వి.ఆర్. లలితాంబిక. ఉపగ్రహ ప్రయోగాల్లో 30 ఏళ్ల అనుభవమున్న ఈ శాస్త్రవేత్త గతేడాది ఒకే రాకెట్ ద్వారా 104 రాకెట్ల ప్రయోగంలోనూ కీలకపాత్ర పోషించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తన తాత స్ఫూర్తితో ఇస్రోలో చేరానని, తిరువనంతపురంలో ఇస్రో తొలి సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని పసిపిల్లగా చూసిన తాను సైన్స్పట్ల ఆసక్తి పెంచుకుని ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లు లలితాంబిక చెబుతారు. పది వేల కోట్ల రూపాయలు పోసి అంతరిక్షంలోకి మనుషులను పంపడం అవసరమా? అని ప్రశ్నిస్తే కచ్చితంగా అవసరమేనని.. అంతరిక్ష ప్రయోగాలను శాంతియుత, సామాజిక ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న భారత్ ఉద్దేశాలకు తగ్గట్లుగానే ఇది కూడా ఉంటుందని ఆమె వివరించారు. జీఎస్ఎల్వీనే ఎందుకంటే? ఇస్రో అత్యంత విజయవంతంగా ప్రయోగించిన రాకెట్లలో ముందు వరసలో నిలిచేది పీఎస్ఎల్వీనే. అయితే వాటి సామర్థ్యం తక్కువ. అంటే ఇవి మోసుకెళ్లగల బరువు గరిష్టంగా రెండు టన్నులు మాత్రమే. భూ ఉపరితలం నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఇవి తిరగ్గలవు. ఈ కారణం వల్లే గగన్యాన్లో జీఎస్ఎల్వీని ఉపయోగిస్తున్నారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 విషయాన్నే తీసుకుంటే దీని ద్వారా ఐదు నుంచి ఆరు టన్నుల బరువును అంతరిక్షంలోకి చేర్చవచ్చు. ముగ్గురు వ్యోమగాములను మోసుకెళ్లే రాకెట్, అంతరిక్షంలో వారం రోజులు గడిపేందుకు ఉపయోగించే మాడ్యూల్ల బరువు 7.8 టన్నులు ఉంటుందని అంచనా. క్రయోజెనిక్ ఇంజిన్లతో కూడిన జీఎస్ఎల్వీని తొలిసారి 2014 డిసెంబర్లో విజయవంతంగా ప్రయోగించగా మూడో ప్రయోగం ఈ నెలలోనే పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గగన్యాన్ కూడా సక్సెస్ అవుతుందనే అంచనా. పూర్తయినవి ఇవీ.. గగన్యాన్ కోసం ఇస్రో ఇప్పటికే బోలెడన్ని టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. 2014లో జీఎస్ఎల్వీ ప్రయోగం సందర్భంగా ఇస్రో వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మాడ్యూల్ అట్మాస్ఫరిక్ రీ ఎంట్రీ ఎక్స్పరిమెంట్ (కేర్) భూమికి 126 కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లి తిరిగి వచ్చింది. అండమాన్ నికోబార్ ద్వీపాల సమీపంలో సముద్రంలో పడిపోయిన ఈ మాడ్యూల్ను కోస్ట్గార్డ్ సిబ్బంది రికవర్ చేయగలిగారు. దీన్నే 2022లో జరిగే గగన్యాన్లోనూ వాడతారని అంచనా. రాకెట్ ప్రయోగం సందర్భంగా అనుకోని అవాంతరం ఏర్పడితే వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు కూడా ఇస్రో ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసింది. అత్యవసర పరిస్థితుల్లో క్రూ మాడ్యూల్ను సురక్షిత దూరానికి తీసుకెళ్లడం.. కొంత సమయం తరువాత పారాచూట్ల సాయంతో ల్యాండ్ కావడం దీని ప్రత్యేకత. ఈ ఏడాది జూలైలో ఈ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. క్రూ మాడ్యూల్ లోపల భూమిని పోలిన వాతావరణం ఉండేలా చూసేందుకు ఇస్రో సిద్ధం చేసిన వ్యవస్థ డిజైనింగ్ ఇప్పటికే పూర్తికాగా త్వరలో పరీక్షించనున్నారు. వ్యోమగాముల శిక్షణ కోసం బెంగళూరులో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో ఆలోచించినా ఇప్పటివరకూ ఈ దిశగా జరిగింది కొంతే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నేడు నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్11
-
జీఎస్ఎల్వీ ఎఫ్11 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): జీఎస్ఎల్వీ ఎఫ్11 ప్రయోగానికి సంబంధించి కౌంట్డౌన్ ప్రక్రియను ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్11) ప్రయోగించనున్నారు. మంగళవారం ఉదయాన్నే సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి వద్ద పూజలు చేయించుకుని కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం కౌంట్డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాకెట్లోని రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను మంగళవారం రాత్రి చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి రాకెట్కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. 26 గంటల కౌంట్డౌన్ అనంతరం బుధవారం సాయంత్రం 4.10 గంటలకు 2,250 కిలోలు బరువు కలిగిన జీశాట్–7ఎ ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లేందుకు షార్లోని రెండో ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–7ఏ: కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఎక్కువగా డీటీహెచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. జీశాట్–7ఏ మాత్రం అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా ఇస్రో చెబుతోంది. 2,250 కిలోలు బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్ ట్రాన్స్పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్)లో రూపొందించారు. -
రేపు రాత్రి పీఎస్ఎల్వీ సీ42 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో)సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగవేదిక (షార్) నుంచి ఆదివారం రాత్రి 10.07 గంటలకు పీఎస్ఎల్వీ సీ42 ఉపగ్రహ వాహకనౌకకు శనివారం మధ్యాహ్నం 1.07 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమవుతుందని మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్)లో అధికారికంగా ప్రకటించారు. షార్ కేంద్రంలోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ కాటూరి నారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మిషన్ సంసిద్ధతా సమావేశాలు నిర్వహించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఎస్.పాండ్యన్ ఆధ్వర్యంలో ప్రయోగానికి 33 గంటల ముందు శనివారం మధ్యాహ్నం 1.07 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించాలని నిర్ణయించారు. పీఎస్ఎల్వీ సీ42 ద్వారా యునైటెడ్ కింగ్డం (బ్రిటన్)కు చెందిన 889 కిలోల బరువు కలిగిన నోవాసార్, ఎస్1–4 అనే రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు సిద్ధం చేశారు. -
సినిమా చూపిస్తా మామా
500 ఉపగ్రహాలు.. అన్నింటిలోనూ హైడెఫినెషన్ కెమెరాలు.. భూమిపై ప్రతి చోటినీ గమనించగలిగేలా ఏర్పాట్లు.. ఎక్కడ ఏం జరిగినా అందరికీ తెలిసిపోతూంటుంది! ఏ పొలంలో పంట చెడిపోయిందో.. ఏ అడవిలో కార్చిచ్చు చెలరేగిందో స్మార్ట్ ఫోన్లోనే చూసుకోవచ్చు.. ఇదంతా లైవ్ సినిమా. నిత్యం నడుస్తూనే ఉండే సినిమా. క్లుప్తంగా చెప్పాలంటే.. భూమి మొత్తం ఎప్పటికప్పుడు మనకు లైవ్లో అందుబాటులో ఉంటుందన్నమాట! అపర కుబేరుడు బిల్గేట్స్ దీనికోసం వంద కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నారు. భూమిని చిత్రీకరించడం ఏమిటి..? అది ఎప్పటికప్పుడు.. ఎక్కడపడితే అక్కడ స్మార్ట్ఫోన్లో కనిపించడం ఏమిటి?.. ఇందుకు బిల్గేట్స్ బోలెడంత డబ్బు ఖర్చు చేయడం ఏమిటి?.. అంతా అయోమయం అనుకుంటున్నారేమో.. కొన్నేళ్లలో వాస్తవ రూపం దాల్చబోయే అంశమిది. భూమి చుట్టూ ఓ 500 ఉపగ్రహాలను ఏర్పాటు చేసి, ప్రతి అంగుళాన్ని హైడెఫినెషన్ వీడియోలో బంధించాలని.. దానిని భూమ్మీద అందరికీ అందుబాటులో ఉంచాలని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ ‘ఎర్త్ నౌ’ప్రణాళిక రూపొందించింది. రస్సెల్ హానిగన్ అనే టెకీ గతేడాది ఈ కంపెనీని స్థాపించారు. ఈ ఏడాది జనవరి నాటికల్లా తొలి రౌండ్ నిధుల సేకరణ కూడా పూర్తయింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని భావించిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్.. వంద కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నారు. ప్రఖ్యాత ఎయిర్బస్, సాఫ్ట్బ్యాంక్ సహా మరికొన్ని సంస్థలు కూడా ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు సై అనేశాయి. సెకను తేడాతో అందరికీ... ఎర్త్ నౌ ప్రాజెక్టు ద్వారా భూమ్మీద ఉన్న ఏ ప్రాంతాన్ని అయినా మనం లైవ్లో చూడొచ్చు. కేవలం ఒకే ఒక్క సెకను తేడాతో ఈ లైవ్ వీడియో అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వీడియో దృశ్యాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. జీపీఎస్ ఉపగ్రహాలతో భూమ్మీద వివిధ ప్రాంతాల లొకేషన్ సమాచారం ఎప్పటికప్పుడు ఎలా లభిస్తుందో.. అలా ‘ఎర్త్ నౌ’ప్రాజెక్టుతో భూమ్మీది వివిధ ప్రాంతాల వీడియోలు కూడా ఎప్పటికప్పడు అందుబాటులోకి వస్తాయని అంచనా. ప్రతి ఉపగ్రహంలోనూ అత్యధిక ప్రాసిసింగ్ సామర్థ్యంతో కంప్యూటర్లు.. అన్ని ఉపగ్రహాల మధ్య నెట్వర్క్ కూడా ఉంటుంది. ఈ టెక్నాలజీని రస్సెల్ 2014 – 17 మధ్యకాలంలో అభివృద్ధి చేశారు. ఎయిర్బస్ కంపెనీ మొత్తం 500 ఉపగ్రహాలను తయారు చేసేందుకు సిద్ధంగా ఉంది. దశలవారీగా వీటిని నిర్దేశిత కక్ష్యలోకి చేరుస్తారు. జూమ్ చేసుకునీ చూడొచ్చు ‘ఎర్త్ నౌ’నెట్వర్క్లో ప్రధానంగా రెండు రకాల వీడియోలు ఉంటాయి. ‘గ్లోబల్ వ్యూ ఇమేజర్’భూమి మొత్తం తాలూకూ స్థిరమైన దృశ్యాన్ని అందిస్తూంటుంది. అదే సమయంలో ‘స్పాట్ వ్యూ ఇమేజర్’ఆప్షన్ ద్వారా మనకు కావాల్సిన ప్రాంతం తాలూకు వీడియోను జూమ్ చేసి తీసుకోవచ్చు. అయితే వ్యక్తిగత గోప్యతను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోల రెజల్యూషన్ను కాస్త తక్కువగా ఉంచాలని భావిస్తున్నారు. ఇక రాత్రివేళల్లో కృత్రిమ దీపాల వెలుగుతో కూడిన అన్ని ప్రాంతాల వీడియోలు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలను నిర్దిష్ట వ్యక్తులు, కంపెనీలకు అమ్ముకోవడం ద్వారా ‘ఎర్త్ నౌ’ఆదాయం సమకూర్చుకుంటుంది. అదే సమయంలో సామాన్యులందరికీ స్మార్ట్ఫోన్ ద్వారా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరికి ఉపయోగం? ‘ఎర్త్ నౌ’ద్వారా అనేక ఉపయోగాలు ఉంటాయని కంపెనీ చెబుతోంది. సముద్ర ప్రాంతాల్లో చెలరేగే తుపానులు, హరికేన్లను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చని.. కార్చిచ్చులను తొలిదశలోనే గుర్తించి ఆర్పేందుకు తగిన చర్యలు తీసుకోవచ్చని రస్సెల్ హానిగన్ అంటున్నారు. ఇక అగ్ని పర్వతాలను నిత్యం పరిశీలిస్తూ.. పేలిపోయిన మరుక్షణమే చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయవచ్చని.. తిమింగలాల వంటి భారీ సముద్రజీవులు ఎటువైపు కదులుతున్నాయో గుర్తించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పంటపొలాల్లో వచ్చే మార్పులను గమనించవచ్చని.. చీడపీడల బెడద మొదలైనప్పుడు తగిన రక్షణ చర్యలకు సూచనలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక నగరాలకు త్రీడీ మోడళ్లను తయారు చేయగలగడం మరో ఉపయోగమని చెబుతున్నారు. -
మహాభారతంలో ఇంటర్నెట్ ఉంది : సీఎం
అగర్తలా, త్రిపుర : భారతీయ జనతా పార్టీ మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలను మరువక ముందే ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగర్తలాలోని ఓ ఈవెంట్కు హాజరైన మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, ఉపగ్రహ వ్యవస్థ భారత్కు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మహాభారత సంగ్రామంలో ఎప్పటికప్పుడు ఏం జరగుతుందో సంజయ ద్రుతరాష్ట్రుడి తెలియజేశాడని, అది ఇంటర్నెట్ వల్లే సాధ్యం అయిందని చెప్పారు. అయితే, ఈ టెక్నాలజీ అప్పట్లోనే ఉందని మనకు తెలియలేదని అన్నారు. ఇంటర్నెట్ను పాశ్చాత్య దేశాలు కనుగొన్నాయని భావించే ప్రతిఒక్కరూ లక్షల సంవత్సరాల క్రితమే భారత్ ఇంటర్నెట్ను వినియోగించిందని తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. సాంకేతికతకు పుట్టినిల్లు అయిన భారత్లో జన్మించినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. ఇంటర్నెట్ వంటి అద్భుత సాంకేతికతను దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. కాగా, విప్లవ్ వ్యాఖ్యలపై సోషల్మీడియాలో జోకులు పేలుతున్నాయి. బీజేపీలో ఉంటూ కెరీర్ను అభివృద్ధి పథాన నడిపించుకోవాలంటే స్టూపిడ్ కామెంట్స్ చేయాలని ఒకరు. అవునా..!! అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, కొందరు నిపుణులు విప్లవ్ కామెంట్లపై ప్రశ్నలు సంధించారు. మీరు చెప్పిందే నిజమైతే పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడు ఎలా వెనక్కురావాలో క్వొరాలో అడగలేదు ఎందుకు? అని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం సత్యపాల్ డార్విన్ సిద్ధాంతాన్ని తప్పుబట్టిన విషయం తెలిసందే. This raises a few questions. Why didn't Abhimanyu ask Quora how to escape the Chakravyuha? Why did Sanjay narrate the Kurukshetra War when Siri could have done it? Also, Krishna really should have streamed the Bhagavad-Gita on Facebook Live. #Mahabharata — Audrey Truschke (@AudreyTruschke) 17 April 2018 How to build your career in BJP. Say stupider things than your supreme leader. 🤦♂️https://t.co/jTKLGJ6Zug — Sasidharan Pazhoor (@inquestioner) 17 April 2018 -
ఇస్రో గొప్ప విజయాలు సాధించింది
సాక్షి, హైదరాబాద్: ఇస్రో గొప్ప విజయాలు సాధించిందని.. వాటి ఫలితాలను ప్రస్తుతం అనుభవిస్తున్నామని ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఏఎస్ కిరణ్కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన పోలీస్ అకాడమీలో ఐపీఎస్ వ్యాస్ స్మారకోపన్యాసం ఇచ్చారు. రోడ్ నావిగేషన్, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, రైల్వే భద్రతలో టెక్నాలజీ వినియోగం, డిజాస్టర్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ తదితర అంశాల్లో ఇస్రో ప్రవేశపెట్టిన సాంకేతికతను ఆయన పోలీస్ అధికారులకు వివరించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల పోలీస్ విభాగాల సక్సెస్కు వ్యాస్ ఒక మార్గనిర్దేశకుడని అన్నారు. వ్యాస్ ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ ఇప్పుడు దేశంలోనే అత్యంత కీలకమైన బలగంగా పేరు సంపాదించిందన్నారు. కార్యక్రమంలో వ్యాస్ సతీమణి అరుణా వ్యాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం వ్యాస్ బాగా కృషి చేశారని, పోలీస్ శాఖ కోసం ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తని గుర్తుచేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, అకాడమీ డైరెక్టర్ జితేందర్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ఉపగ్రహాలకు రోబోలతో రిపేరు!
వాషింగ్టన్: అంతరిక్షంలో చక్కర్లు కొట్టే ఉపగ్రహాలకు ఇంధనాన్ని నింపడం, మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైతే శత్రుదేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేసేందుకు వీలుగా రోబో శాటిలైట్ల తయారీకి అమెరికా సిద్ధమైంది. ఇందుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా), అమెరికాæ రక్షణ పరిశోధనా విభాగం ‘డార్పా’ జట్టుకట్టాయి. ‘సర్వీస్ స్టేషన్స్ ఇన్ ఆర్బిట్స్’గా వ్యవహరించే వీటివల్ల కక్ష్యల్లోని ఉపగ్రహాల జీవితకాలం బాగా పెరగనుంది. ప్రస్తుతం ఉపగ్రహాల్లో తలెత్తే లోపాలు సరిచేసేందుకు చాలా ఖర్చవుతోంది. కానీ ఈ సర్వీస్ స్టేషన్ల ద్వారా ఖర్చు బాగా తగ్గే వీలుంది. అంతరిక్ష యుద్ధం తలెత్తితే శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేయగల సత్తా వీటికి ఉంటుంది. -
10న పీఎస్ఎల్వీ సీ40 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఈ నెల 10న పీఎస్ఎల్వీ సీ40 ప్రయోగాన్ని చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ను రోదసీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత నెల 10 నుంచి పీఎస్ఎల్వీ సీ40 క్యాంపెయిన్ను ప్రారంభించి నాలుగు దశల రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసింది. డిసెంబర్ ఆఖరి వారంలో ప్రయోగించాలని తొలుత నిర్ణయించినా, రాకెట్కు సంబంధించిన కొన్ని విడిభాగాలు షార్కు చేరుకోకపోవడంతో జనవరికి వాయిదా వేశారు. ఈ రాకెట్ ద్వారా 30 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. ఇందులో దేశీయ అవసరాల కోసం కార్టోశాట్–2 సిరీస్లో ఓ ఉపగ్రహం ఉండగా, మిగిలిన 29 విదేశాలకు చెందినవే. గతేడాది ఆగస్టు 31న నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ39 ప్రయోగం విఫలం కావడంతో, ఈసారి ఎలాంటి తప్పిదాలకు చోటివ్వకుండా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
సౌత్ చైనా సీపై డ్రాగన్ డేగ కన్ను
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా మరింత పట్టుబిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సముద్రాన్ని 24 గంటల పాటు పరిశీలించేందుకు ప్రత్యేక శాటిలైట్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ చైనా సీలోని చైనాకు సంబంధించిన హైనాన ద్వీపం కేంద్రంతా.. రిమోట్ శాటిలైట్ సెన్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చైనా అధికారలు ప్రకటించారు. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ మిషన్ 2019లో మొదలు పెడుతున్నట్లు శాన్యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డైరెక్టర యాంగ్ తియాన్లాంగ్ తెలిపారు. ఈ మిషన్లో భాగంగా సౌత్ చైనా సీపై మూడు మొదట ఆప్టికల్ శాటిలైట్స్ ప్రయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలాఉండగా.. 2021 నాటికల్లా.. ఇకమరో మూడు ఆప్టికల్ శాటిలైట్లు, రెండు హైపర్స్పెక్ట్రాల్ శాటిలైట్లు, మరో రెండు ఎస్ఏఆర్ రకానికి చెందిన ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లు చైనా అధికారులు తెలిపారు. ఈ ఉపగ్రహ వ్యవస్థ మొత్తం దక్షిణ చైనా సముద్రాన్ని నితరంతం డేగ కళ్లతో కాపు కాస్తుంటాయని చెప్పారు. -
పీఎస్ఎల్వీ సీ–40 ‘క్యాంపెయిన్’ప్రారంభం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదికపై పీఎస్ఎల్వీ సీ–40కి మొదటి దశ మోటార్లను అనుసంధానం చేసే ప్రక్రియను (క్యాంపెయిన్) సోమవారం ప్రారంభించారు. వాస్తవానికి డిసెంబర్ నెలాఖరులోనే పీఎస్ఎల్వీ సీ–40 ప్రయోగిం చాలనుకున్నా.. రాకెట్ విడిభాగాలు షార్కు చేరుకోక పోవడంతో అనుసంధాన పనులు ఆలస్యమయ్యాయి. 2018 జనవరిలో ప్రయోగించనున్న ఈ రాకెట్ ద్వారా 30 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన పీఎస్ఎల్వీ సీ–39 ప్రయోగం విఫలమైన నాలుగు నెలల తరువాత చేస్తున్న మొదటి ప్రయోగం ఇదే. ఈ నేపథ్యంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీఎస్ఎల్వీ సీ–40 రాకెట్ ద్వారా దేశీయ అవసరాల కోసం కార్టోశాట్–2 సిరీస్లో ఒక ఉపగ్రహం, విదేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. ఇందులో 25 చిన్న తరహా ఉపగ్రహాలు, మూడు అతిచిన్న ఉపగ్రహాలతో పాటు ఓ యూనివర్సిటికీ చెందిన ఉపగ్రహం కూడా ఉంటుందని ఇస్రో అధికారిక వర్గాల సమాచారం. -
మంటలు రేపుతున్న సూరీడు!
సూర్యుడిపై మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. వారం రోజులుగా ఇదే తంతు. సన్స్పాట్ రీజన్ 2673పై ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో వచ్చే మార్పుల వల్ల ఈ మంటలు చెలరేగుతుంటాయని మనకు తెలుసు. 11 ఏళ్లకు ఒకసారి ఈ మంటల సంఖ్య, తీవ్రత పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతం మంటల సంఖ్య, తీవ్రత తగ్గాలి. అయినాసరే చాలా పెద్ద స్థాయిలో మంటలు ఎగసిపడుతుండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మంటలను సాధారణంగా ఎ, బి, సి, ఎం, ఎక్స్ వర్గాలుగా గుర్తిస్తుంటారు. ఎ కంటే బి పది రెట్లు, బి కంటే సి ఇంకో పదిరెట్లు ఇలా ఎక్కువ తీవ్రత కలిగి ఉంటాయి. కొన్ని రోజుల క్రితం వరకు భూమికి అభిముఖంగా ఉన్న సన్స్పాట్ 2673పై వెలువడిన మంటలు ఎం క్లాస్ నుంచి ఎక్స్ క్లాస్ వరకు ఉండటం గమనార్హం. సెప్టెంబర్ 6న కొన్ని ఎం క్లాస్ మంటలు చెలరేగాయి. ఆ తరువాత రెండు రోజుల పాటు ఎక్స్ క్లాస్ స్థాయి మంటలు రేగాయి. సెప్టెంబర్ 10న ఏకంగా ఎక్స్ 9.3 స్థాయిలో అతిపెద్ద మంట చెలరేగింది. ఈ మంటల సమయంలో సూర్యుడి ఉపరితలం నుంచి ఎగజిమ్మే ప్లాస్మా కారణంగా కొన్ని కణాలు కక్ష్యల్లో తిరుగుతున్న ఉపగ్రహాలను సైతం నాశనం చేయగలవు. -
నింగిలోకి 31 ఉపగ్రహాలు
ఇస్రో ఖాతాలో మరో అరుదైన ఘనత - అంతరిక్షంలోకి కార్టోశాట్ 2ఈ, స్వదేశీ ఉపగ్రహంతో పాటు 29 విదేశీ ఉపగ్రహాలు - 23.18 నిమిషాల్లో విజయవంతంగా కక్ష్యలోకి ఉపగ్రహాలు - భౌగోళిక సమాచార సేవలు అందించనున్న కార్టోశాట్ 2ఈ శ్రీహరికోట (సూళ్లూరుపేట): వినువీధిలో విజయ పరంపరను ఇస్రో కొనసాగిస్తోంది. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంటూ.. 955 కిలోల బరువున్న 31 ఉపగ్రహాల్ని శుక్రవారం నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మొదట్లో ఒకేసారి 104 ఉపగ్రహాల్ని, ఈ నెల్లోనే మార్క్ 3డీ1 వంటి భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించి సత్తా చాటిన ఇస్రో తాజా ప్రయత్నంతో మరో మైలు రాయిని అధిగమించింది. శుక్రవారం ఉదయం 9.29 గంటలకు 44.4 మీ. పొడవైన పీఎస్ఎల్వీ సీ 38 ఉపగ్రహ వాహకనౌక 31 ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. గురువారం ఉదయం 5.29 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ 28 గంటలు కొనసాగింది. 23.18 నిమిషాల్లో భూమికి 505 కి.మి. – 509 కి.మి. ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టింది. కార్టోశాట్ 2ఈ, తమిళనాడులోని నూరుల్ ఇస్లాం వర్సిటీకి చెందిన నియూశాట్ ఉపగ్రహాన్ని 16.50 నిమిషాలకు నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. హసన్లోని మాస్టర్ కంట్రోల్ రూంకు సిగ్నల్స్ అనంతరం ఏడు నిమిషాలకు 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాల్ని 9 రకాల కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. వీటిలో లీమూర్–2, సీసీరో–6, టైవాక్–53బీ(అమెరికా), డైమండ్స్–3(బ్రిటన్), క్యూబీ50–బీఈ06, ఇన్ఫ్లేట్ శైల్, యూసీఐ శాట్(బెల్జియం), ఉర్స్మియార్, డీశాట్, మ్యాక్స్వెల్లర్(ఇటలీ), సుచోయ్–1(చిలీ), ఎజ్లూశాట్–1(చెక్ రిపబ్లిక్), ఆల్టో–1(ఫిన్ల్యాండ్), రోబూస్టా–1బీ( ఫ్రాన్స్), క్యూబీ 50–డీఈ04(జర్మనీ)ఉపగ్రహాలతో పాటు జపాన్, లాత్వియా, లిథువేనియా, స్లోవేకియా దేశాల ఉపగ్రహాలున్నాయి. ఉపగ్రహాలు కక్ష్యలో ప్రవేశించిన వెంటనే కర్ణాటకలోని హసన్లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్, మారిషస్లోని గ్రౌండ్స్టేషన్కు సిగ్నల్స్ అందడం మొదలయ్యాయి. కార్టోశాట్–2ఈ ఐదేళ్ల పాటు సేవలందిస్తుంది. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 40వ ప్రయోగం. ఇస్రోలో సంబరాలు.. ప్రయోగం విజయవంతం కాగానే మిషన్ కంట్రోల్రూంలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ మాట్లాడుతూ.. ఒకేసారి 31 ఉపగ్రహాల ప్రయోగం చరిత్రాత్మక విజయమని, ఇస్రో టీం సమష్టి కృషని అభివర్ణించారు. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలు 200లు దాటాయని, ఇదొక సువర్ణాధ్యాయమన్నారు. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ప్రశంసలు న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: ప్రయోగం ఇస్రో చరిత్రలో కీలక మైలురాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. కిరణ్ కుమార్కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించారు. శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తారు. భారత్ గర్వపడేలా ఇస్రో పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా, రాహుల్లూ శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రయోగం విజయవంతంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తంచేశారు. మన ఖ్యాతి ఇనుమడించింది: జగన్ పీఎస్ఎల్వీ–సీ 38 ఉపగ్రహ వాహక నౌకను దిగ్విజయంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి అభినందించారు. ఈ ప్రయోగంతో అంతర్జాతీయంగా మన దేశఖ్యాతి ఇనుమడించిందన్నారు. కార్టోశాట్ సిరిస్లో ఆరో ఉపగ్రహం భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ సిరీస్ ప్రయోగాలను ఇస్రో కొనసాగిస్తోంది. ఈ ఉపగ్రహాల ప్రయోగం 2005 లోనే ప్రారంభం కాగా.. అనంతరం కార్టోశాట్–2(2007), కార్టోశాట్–2ఏ( 2008), కార్టోశాట్–2బీ(2010), కార్టోశాట్–2సీ, 2డీ(2016)ల్ని ప్రయోగించారు. వాటిలో అయిదు ఉపగ్రహాలు ఇంకా సేవలందిస్తున్నాయి. తాజాగా కార్టోశాట్ 2ఈ ప్రయోగంతో మరో ముందడుగు పడింది. కార్టోశాట్ ఉపగ్రహ వ్యవస్థ 505 కి.మి. ఎత్తులో పరిభ్రమిస్తూ భౌగోళిక సమాచారాన్ని అందచేస్తుంది. ఫ్రాంక్రోమాటిక్ మల్టీ స్ప్రెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను పంపిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్లు తయారు చేయడం, విపత్తుల్ని విస్తృతంగా అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడతాయి. సైనిక నిఘాలో, సైనిక సామర్థ్యం పెంపొందించేందుకు కూడా ఇది సాయమందిస్తాయి. భూమి మీద మార్పుల్ని ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. గ్రహాంతర ప్రయోగాలకు సిద్ధం శ్రీహరికోట: ఇస్రో భవిష్యత్లో నాలుగు గ్రహాంతర ప్రయోగాలు చేసేందుకు అధ్యయనం చేస్తోందని, 2018–19 నాటికి ఈ ప్రయోగాలకు సిద్ధమవుతామని చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషితోనే భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపడతామని తెలిపారు. ఇస్రో భవి ష్యత్ ప్రయోగాలపై ఆయన చెప్పిన వివరాలు.. ► అంగారకుడిపై మరిన్ని పరిశోధనలకు మార్స్–2, చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్–2, సూర్యుడిపై ఆదిత్య–1, శుక్ర గ్రహంపై ‘వీనస్’ ఉపగ్రహాల ప్రయోగాలకు జరుగుతున్న అధ్యయనం. ► 2018 డిసెంబర్ నాటికి ఈ నాలుగు ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధం. ► ఈ నెల 28న ఫ్రెంచ్ గయానా(కౌరూ) నుంచి జీశాట్–17 ఉపగ్రహ ప్రయోగం. ► సాంకేతిక లోపం ఉన్న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ స్థానాన్ని భర్తీచేసేందుకు జూలై చివర్లో మరో ప్రయోగం. ► భవిష్యత్తులో ఏడాదికి 8–10 పీఎస్ఎల్వీ రాకెట్లు, రెండేసి చొప్పున జీఎస్ఎల్వీ–మార్క్2, జీఎస్ఎల్వీ–మార్క్3 రాకెట్ల ప్రయోగం. -
క్యాసినీ ‘ఆత్మహత్య’ ప్రయాణం షురూ!
ఖగోళ పరిశోధనల్లో రికార్డు సృష్టించిన వ్యోమనౌక క్యాసినీ ఆత్మహత్య (శాశ్వత విశ్రాంతి)కు రంగం సిద్ధమైంది. నాసా 1997 అక్టోబర్లో ప్రయోగించిన క్యాసినీ కోట్ల మైళ్ల దూరాన్ని అధిగమించి వెళ్లి.. పదేళ్లుగా శనిగ్రహం చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో శనిగ్రహం తాలూకు ఎన్నో విశేషాలను మనకు అందించింది. దానికున్న ఉపగ్రహాల్లో ఏడింటిని గుర్తించింది కూడా. ఇకముందు ఆ గ్రహం చుట్టూ ఉండే వలయాల ద్వారా ప్రయాణిస్తూ.. వాటి విశేషాలను మనకు అందించనుంది. ఆ తరువాత కూలిపోనుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను నాసా పూర్తి చేసింది. మొత్తంగా ఈ ఏడాది సెప్టెంబర్కల్లా క్యాసినీ తన సుదీర్ఘ ప్రయాణాన్ని చాలించనుంది. క్యాసినీ రికార్డులు, అందించిన సమాచారం 24 లక్షలు:ఇప్పటివరకూ క్యాసినీ ఉపయోగించిన కంప్యూటర్ ఆదేశాలు 3,616: క్యాసినీ అందించిన వివరాల ఆధారంగా ప్రచురితమైన పరిశోధన వ్యాసాలు 220 కోట్ల మైళ్లు: శనిగ్రహం చుట్టూ క్యాసినీ తిరిగిన దూరం 599 గిగాబైట్లు: సేకరించిన సమాచారం 10: గుర్తించిన ఉపగ్రహాల సంఖ్య 27: నాసాతోపాటు ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన దేశాలు 243: శనిగ్రహం చుట్టూ జరిపిన భ్రమణాలు 3,79,300:తీసిన ఫొటోల సంఖ్య 349:ఇంజిన్ను ఆన్/ఆఫ్ చేసిన సంఖ్య – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మేలో అంతరిక్షంలోకి 3 ఉపగ్రహాలు
టీనగర్(చెన్నై): దక్షిణాసియా దేశాలకు చెందిన ఉపగ్రహం సహా మూడింటిని మే నెలలో అంతరిక్షంలోకి ప్రయోగించనున్నట్లు ఇస్రో డైరెక్టర్ పీవీ.వెంకటకృష్ణన్ వెల్లడించారు. బుధవారం చెన్నై ఐఐటీ 58వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఎస్ఎల్వీ ఎంకే–2 రాకెట్ ద్వారా దక్షిణాసియా దేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు సంబంధిం చిన అన్ని పనులు ముగిశాయన్నారు. జీఎస్ఎల్ వీ ఎంకే–2 మే మొదటి వారం లో, జీఎస్ఎల్వీ ఎంకే–3 చివరి వారంలో శ్రీహరి కోట కేంద్రం నుంచి ప్రయో గించనున్నట్లు తెలిపారు. క్రయోజెనిక్ ఇంజిన్ ద్వారా రాకెట్లను అంతరిక్షంలోకి ప్రయోగించడంలో ఇబ్బందులు ఏర్పడవని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇంతింతై వటుడింతై..
అంచెలంచెలుగా ఎదిగిన ఇస్రో – దేశీయ పరిజ్ఞానమే పెట్టుబడి జూన్ 19, 1981... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బాలారిష్టాలు దాటుకుని తొలి విజయాలు అందుకుంటున్న సమయం అది. దేశ వ్యాప్తంగా టెలివిజన్ ప్రసారాల కోసం ఉద్దేశించిన ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ (ఆపిల్) ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రానికి తరలించాలి. విమానం దాకా తీసుకెళ్లేందుకు లోహాలేవీ లేని వాహనం అవసరం. అత్యాధునికమైన వాటిని దిగుమతి చేసుకుని వాడేంత స్థోమత లేదు. సొంతంగా తయారు చేసుకుందామా అంటే... 1974 నాటి అణు పరీక్షల కారణంగా అగ్రరాజ్యాల ఆంక్షలు అనుమతించవు. ఆ సమయంలో సింపుల్గా ఓ ఎడ్ల బండిపై ఉపగ్రహాన్ని తీసుకెళ్లిపోయారు. సెప్టెంబరు 24, 2014... ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతంగా కక్ష్యలోకి చేరిన రోజిది. రెండు రోజుల ముందు అగ్రరాజ్యం అమెరికా ప్రయోగించిన మావెన్ కూడా కక్ష్యలోకి చేరింది. ఇస్రో నిర్మించిన మంగళ్యాన్ కేవలం రూ.450 కోట్లతో అంతదూరాన్ని అధిగమిస్తే... మావెన్ ఇందుకోసం తొమ్మిది రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా అంగారక గ్రహాన్ని అందుకున్న దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది కూడా ఈరోజే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయ పరంపరలో ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను పంపించడం తాజా ఘట్టం. ఇది అపురూపమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిమితమైన వనరులు, కీలకమైన టెక్నాలజీపై ఇప్పటికీ కొనసాగుతున్న ఆంక్షల నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు అసాధ్యాలను సుసాధ్యం చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఏడాది బడ్జెట్నే ఉదాహరణగా తీసుకుంటే భారత్ తన అంతరిక్ష కార్యక్రమాల కోసం పెట్టే ఖర్చు కేవలం వందకోట్ల డాలర్లు మాత్రమే. అగ్రరాజ్యం అమెరికా చేసే వ్యయం 1930 కోట్ల డాలర్లు! ఇంకోవైపు ఇస్రోలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. శాస్త్రవేత్తల వేతనాలు కూడా గొప్పగా ఏమీ లేవు. అయినా ఇస్రో ఇన్ని అద్భుతమైన విజయాలు సాధించగలుగుతోంది అంటే అందుకు కారణం దేశం కోసం ఏమైనా చేయాలి అన్న దృఢ సంకల్పం మాత్రమే. తెలివే పెట్టుబడి అంతరిక్ష ప్రయోగాల ఖర్చును వీలైనంత వరకూ తగ్గించేందుకు ఇస్రో తెలివినే పెట్టుబడిగా పెట్టింది. మంగళ్యాన్ ప్రయోగాన్నే ఉదాహరణగా తీసుకుందాం. దీంట్లో ఇంధన ఖర్చును తగ్గించేందుకు ఎప్పుడో 1993లో వాడిన ఓ చిన్న రాకెట్ను ఇందులో ఉపయోగించింది. ఇతర దేశాల మాదిరిగా అనేక మోడళ్లను తయారు చేయకుండా ఒకే ఒక్క మోడల్ను తయారు చేసి దాన్నే ప్రయోగించింది. మునుపు ఎన్నడూ ఎవరూ ఉపయోగించని స్లింగ్ షాట్ పద్ధతిని ఉపయోగించింది. పొలాల్లో పక్షులను పారదోలేందుకు వాడే వడిసె గురించి తెలుసుగా... ఈ స్లింగ్ షాట్ పద్ధతి కూడా అలాంటిదే. ఎలాగైతే మనం వడిసెలో రాయిని పెట్టి గిర్రున తిప్పుతూ తగిన వేగం అందుకోగానే విసిరేస్తామో... అలాగే ఓ రాకెట్ను భూమిచుట్టూ కొన్నిసార్లు తిప్పి.. అంగారక గ్రహం మనకు అత్యంత దగ్గరగా వచ్చే సమయానికి దానివైపు విసిరేశామన్నమాట. తద్వారా అంగారకుడిపైకి నేరుగా వెళ్లేందుకు భారీ సైజున్న రాకెట్ను ఉపయోగించాల్సిన అవసరాన్ని తప్పించింది ఇస్రో. మంగళ్యాన్లో వాడిన విడిభాగాల్లో దాదాపు 60% లార్సెన్ అండ్ టూబ్రో, గోద్రేజ్ అండ్ బాయ్సీ వంటి దేశీయ కంపెనీలే తయారు చేశాయి. ఒకేసారి 104 ఉపగ్రహాలు బుధవారం ఇస్రో పీఎస్ఎల్వీ సీ– 37 ద్వారా ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించడం భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఓ మైలురాయి. ఈ సంక్లిష్టమైన, కీలకమైన ప్రక్రియ మొత్తం ఎలా జరిగిందో కళ్లారా చూడాలనుకుంటే.. ఇస్రో వెబ్సైట్లోని ఆన్బోర్డ్ కెమెరా రికార్డింగ్ను (http://www.isro.gov.in/pslv&c37&cartosat&2&series&satellite/pslv&c37&lift&and&onboard&camera& video) చూడవచ్చు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కార్టోశాట్–2డీతో భౌగోళిక సమాచారం
శ్రీహరికోట (సూళ్లూ రుపేట): దేశీయ అవసరాల కోసం , భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్ను 2005లోనే ఇస్రో రూపొందించింది. దీనిని 2007 నాటికి రూపకల్పన చేసి అదే ఏడాది జనవరి 10న పీఎస్ఎల్వీ సీ7 ద్వారా కార్టోశాట్–2, 2008 ఏప్రిల్ 28న పీఎస్ఎల్వీ సీ9 ద్వారా కార్టోశాట్–2ఏ, 2010 జులై 12న పీఎస్ఎల్వీ సీ15 ద్వారా కార్టోశాట్–2బీ, 2016 జూన్ 22న పీఎస్ఎల్వీ సీ34 ద్వారా కార్టోశాట్–2సీని కక్ష్యలోకి పంపారు. ఈ 4 ఉపగ్రహాలు ఇప్పటికే పని చేస్తున్నాయి. మరింత సమాచారాన్ని అందించేం దుకు బుధవారం 714 కిలోల బరువు ఉన్న కార్టోశాట్–2డీని పీఎస్ఎల్వీ సీ37 ద్వారా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 510 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో పరిభ్రమిస్తూ భౌగోళిక పరమైన సమాచారాన్ని అందజేస్తుంది. అందులో అమర్చిన ఫ్రాంక్రో మాటిక్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుం ది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, తీర ప్రాంతాల నిర్వహణ, రహదా రుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్లు తయారు చేయ డం, విపత్తుల విస్తృతిని అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సంబంధి తమై న సమాచారం దీని ద్వారా అందుబాటులోకి వస్తుంది. నిఘాలో తోడ్పాటుగా సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది. దీనికి రూ.350 కోట్లు వ్యయం చేసినట్టు సమాచారం. ఈ ఉపగ్రహం అయిదేళ్లపాటు సేవలు అందిస్తుంది. నానోశాటిలైట్స్ పనితీరు: ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్ఎస్–1ఏ, ఐఎన్ఎస్–1బీ) ఉపగ్రహాలను కూడా ఈ ప్రయోగంలో కక్ష్యలోకి పంపారు. అహమ్మదాబాద్లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు ఈ 2 చిన్న తరహా ఉపగ్ర హాలను తయారు చేసి ప్రయోగిస్తున్నారు. ఇందులో బిడిరెక్షనల్ రెఫ్లెక్టెన్సీ డిస్ట్రి బ్యూషన్ ఫంక్షన్ రేడియో మీటర్ (బీఆర్డీఎప్), సింగల్ ఈవెంట్ అప్సెట్ మానిటర్ పేలోడ్స్ అమర్చారు. ఇది కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఈ పేలోడ్ భూమిమీద పడే సూర్య ప్రతాపాన్ని తెలియజేస్తుంది. భూమి మీద రేడియేషన్ ఎనర్జీని మదింపు చేస్తుంది. ఇది 6 నెలలు మాత్రమే పని చేస్తుంది. డవ్ శాటిలైట్స్, లెమూర్ ఉపగ్రహాల పనితీరు అమెరికాకు చెందిన డవ్ ఫ్లోక్–3పీ శాటిలైట్స్లో 88 చిన్న తరహా ఉపగ్రహా లున్నాయి. ఇవి ప్రతిరోజూ వాణిజ్య, వాతావరణ సమాచారాన్నిస్తాయి. విదేశీ ఉపగ్రహాలు: నెదర్లాండ్కు చెందిన 3 కేజీల బరువైన పీయాస్, స్విట్జర్లాండ్కు చెందిన 4.2 కేజీల డిడో–2, ఇజ్రాయెల్కు చెందిన 4.3 బీజీయూ శాట్, కజికిస్తాన్కు చెందిన 1.7 కేజీల ఆల్–ఫరాబి–1, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన 1.1 కేజీల బరువు కలిగిన నాయిప్ అనే ఉపగ్రహాలు కూడా టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్కు ఉపయోగించనున్నారు. -
సాహో.. ఇస్రో
ఒకేసారి 104 ఉపగ్రహాలు కక్ష్యలోకి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన భారత్ ⇒ భారత పరిశోధనల్లో కీలకంగా మారనున్న కార్టోశాట్–2డీ ⇒ నమ్మకాన్ని వమ్ముచేయని పీఎస్ఎల్వీ–సీ37 ⇒ డబుల్ సెంచరీ దాటిన ఇస్రో ఉపగ్రహాలు ⇒ స్పేస్ లాంచ్ మార్కెట్లో ఏకఛత్రాధిపత్యానికి భారత్ ప్రయత్నం ⇒ ఇస్రోతోపాటు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగ యవనికపై భారత్ కొత్త చరిత్రను లిఖించింది. ఒకే మిషన్ ద్వారా (ఒకేసారి) 104 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) దేశం మొత్తం గర్వపడేలా చేసింది. బుధవారం ఉదయం 9.28 గంటలకు 1378 కిలోలు బరువు కలిగిన 104 ఉపగ్రహాలను (పీఎస్ఎల్వీ సీ37 ద్వారా) రోదసీలోకి ప్రవేశపెట్టి అంతరిక్షంలో అత్యద్భుతాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రయోగంలో 3 భారత ఉపగ్రహాలు, 101 విదేశీ నానో ఉపగ్రహాలున్నాయి. భారత వాతావరణ విభాగానికి సంబంధించిన కార్టోశాట్–2 భారత పరిశోధనల్లో కీలకం కానుంది. ఈ విజయంతో.. ఒకేసారి 37 ఉపగ్రహాలను పంపించిన రష్యా (2014లో) రికార్డును భారత్ తిరగరాసింది. నాసా 2013లో 29 ఉపగ్రహాలనే ప్రయోగించింది. విజయాల వేదిక శ్రీహరికోట శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఇస్రోకు అచ్చొచ్చిన పీఎస్ఎల్వీ–సీ37 ఉపగ్రహ వాహకనౌక.. 104 ఉపగ్రహాలను విజయవంతంగా మోసుకెళ్లి భూమికి 505 కిలోమీటర్లు నుంచి 524 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యాను వర్తన ధృవకక్ష్య (సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో ప్రవేశపెట్టింది. ప్రయో గం మొదలైన 28.42 నిమిషాల తర్వాత ఉపగ్రహా లన్నీ కక్ష్యలోకి ప్రవేశించాయి. అయితే.. అమెరికాకు సంబంధించిన ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరి అంటార్కిటికా గ్రౌండ్స్టేషన్కు (అమెరికా సెంటర్) సంకేతాలు అందించేందుకు మరో 3 నిమిషాలు పైగా సమయం పట్టింది. దీంతో మొత్తం ప్రయోగం పూర్తయ్యేందుకు 31.30 నిమిషాలు పట్టినట్లయింది. ఇందులో 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2డీ, 8.4 కిలో బరువు కలిగిన ఇండియన్ నానో శాటిలైట్స్ (ఐఎన్ఎస్–1ఏ), 9.7 కిలోలు బరువు కలిగిన ఐఎన్ఎస్–1బీ అనే మూడు స్వదేశీ ఉపగ్రహాలతో పాటు ఆఖరులో ప్రవేశపెట్టిన అమెరికాకు చెందిన 96 డవ్ శాటిలైట్స్, లెమూర్ శాటిలైట్స్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, కజికిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఒక్కో నానో ఉపగ్రహాలున్నాయి. ప్రయోగం విజయవంతమైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోపాటు వివిధ రంగాల ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో డబుల్ సెంచరీ పీస్ఎల్వీ రాకెట్లు ద్వారా ఇప్పటివరకు ఇస్రో 226 ఉపగ్రహాలను ప్రయోగించగా.. ఇందులో 179 విదేశాలకు చెందినవే కావటం విశేషం. ఇందులో 37 స్వదేశీ ఉపగ్రహాలు, పలు యూనివర్శిటీలకు చెందిన 8 ఉపగ్రహాలున్నాయి. ఈ కఠినమైన ప్రయోగం విజయవంతం కావటంతో వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో సామర్థ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. పీఎస్ఎల్వీ ద్వారా ‘స్పేస్ లాంచ్ మార్కెట్’లో ఏకఛత్రాధిపత్యం కోసం ఇస్రో ప్రయత్నిస్తోంది. ప్రయోగం ఇలా.. పీఎస్ఎల్వీ–సీ37 రాకెట్ ద్వారా నింగిలోకి పంపిన 104 ఉపగ్రహాలను భూమికి 505 కిలోమీటర్ల ఎత్తునుంచి 525 కిలో మీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన «ధృవ కక్ష్యలో ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి తగలకుండా వివిధ రకాల కక్ష్యలలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 44.4 మీటర్లు పొడవు కలిగిన పీఎస్ఎల్వీ–సీ37 ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో నింగికి దూసుకెళ్లింది. 28.42 నిమిషాల్లో ప్రయోగం పూర్తయింది. భూమికి 510.383 కిలోమీటర్లు ఎత్తులోని ఎస్ఎస్వోలోకి ముందుగా 17.41 నిమిషాలకు 714 కిలోలు బరువు కలిగిన కార్టోశాట్–2డీను ముందుగా ప్రవేశపెట్టారు. ఆ తరువాత 17.58 నిమిషాలకు 510.590 కిలోమీటర్లు ఎత్తులో ఇస్రో నానోశాటిలైట్స్ ఉపగ్రహాన్ని, 17.59 నిమిషాలకు 510.601 కిలో మీటర్లు ఎత్తులో ఐఎన్ఎస్–1బీ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఆ తరువాత 18.32 నిమిషాలకు 511.719 కిలోమీటర్లు ఎత్తులో మొదటి బాక్సులో అమర్చిన నానోశాటిలైట్స్ను, అనంతరం 28.42 నిమిషాలకు 524.075 కిలో మీటర్లు ఎత్తులోని సన్ సింక్రోనస్ ఆర్బిట్లో చివరి బాక్సులో అమర్చిన మరో 50 నానోశాటిలైట్స్ను ప్రవేశపెట్టి తిరుగులేని, మరపురాని విజయాన్ని నమోదు చేశారు. బ్రాండ్ ‘ఇస్రో’ ఇప్పటి వరకు 39 సార్లు ఇస్రో ప్రయోగాలు చేయగా.. మొదటిది (విఫలమైంది) మినహా 38 సార్లూ భారత అంతరిక్ష సంస్థ వేసిన ప్రతి అడుగూ విజయమే. చంద్రయాన్ ఘనవిజయం తర్వాత ఇస్రో అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలకు ఓ బ్రాండ్గా మారింది. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 39వ ప్రయోగం కాగా, ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల ప్రయోగంలో 16వ ప్రయోగం కావడం విశేషం. ఇస్రో 55 సంవత్సరాల సుదీర్ఘ అంతరిక్షయానంలో ఇదొక సువర్ణ మజిలీ. 2013లో ఆమెరికా అంతరిక్ష సంస్థ నాసా 29ఉపగ్రహాలను , 2014లో రష్యా అంతరిక్ష సంస్థ 39 ఉపగ్రహాలను ఒకేసారి పంపించి రికార్డులు సృష్టిస్తే ఇపుడు ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపించి అంతరిక్షంలో సెంచరీని అధిగమించి వినువీధిలో భారత కీర్తిని ఇనుమడింపజేసింది. 2015 జూన్లో ఇస్రో 20 ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా పంపించిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం నాటి ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి వ్రవేశించిన వెంటనే కర్ణాటకలోని హాసన్లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్, మారిషస్లోని గ్రౌండ్స్టేషన్ సిగ్నల్స్కు అందాయి. ఆ తర్వాతే ఉపగ్రహాలన్నీ సరిగానే ఉన్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో అమెరికాకు చెందిన 96 డవ్ అండ్ లెమూర్ శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ అందడానికి మరో మూడు నిమిషాలు అదనంగా తీసుకుని ఉపగ్రహాలు అంతరిక్షంలో బాగానే వున్నాయని అమెరికా గ్రౌండ్ స్టేషన్ తెలియజేసింది. శభాష్! అంతర్జాతీయ మీడియా ప్రశంసల జల్లు వాషింగ్టన్/లండన్: ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహా లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంపై అంతర్జాతీ యంగా భారత్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష పోటీలో భారత్ కీలక దేశంగా ఆవిర్భవించిందంటూ విదేశీ మీడియా కీర్తించింది. ‘తక్కువ ఖర్చుతో ప్రయోగాలను విజయవంతంగా చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం’ అని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. అంతరిక్ష ఆధారిత నిఘా, సమాచార వ్యవస్థల్లో వాణిజ్య మార్కెట్ పెరుగుతున్న తరుణంలో భారత్ ‘కీలక దేశం’గా తనను తాను నిరూపించుకుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం: ఇస్రో చైర్మన్ శ్రీహరికోట (సూళ్లూరుపేట): ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భవిష్యత్తులో సరికొత్తగా భారీ ప్రయోగాలు చేయాల్సి వుంటుందని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ పేర్కొన్నారు. పీఎస్ఎల్–సీ37 ఘనవిజయం చరిత్రాత్మకమై నదని అభివర్ణించారు. బుధవారం ప్రయోగం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుం దన్నారు. ప్రయోగాన్ని విజయవంతం చేసినందు కు ఇస్రో శాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు కిరణ్ కుమార్ అభినందనలు తెలిపారు. రాకెట్ శిఖరభాగంలో స్వదేశీ ఉపగ్రహాలైన కార్టోశాట్ –2డీ, ఐఎన్ఎస్–1ఏ, ఐఎన్ఎస్–1బీ ఉపగ్రహా లను ముందుగా కక్ష్యలోకి చేర్చామని.. మిగిలిన 101 విదేశీ ఉపగ్రహాలను 4 పెట్టెల్లాగా తయారు చేసి ఒక్కోపెట్టెలో 25 ఉపగ్రహాలను అమర్చి ఒక్కొక్క పెట్టెను నాలుగైదు సెకన్ల తేడాతో విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు. సార్క్దేశాలకు అనుకూలంగా సార్క్శాట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక ఉందని చెప్పారు. ఏ దేశమైనా ముందుకొస్తే వాణిజ్య పరంగా వారి ఉపగ్రహాలను పంపేం దుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈఏడాది జీఎస్ఎ ల్వీ మార్క్–3 ద్వారా జీశాట్–19, జీఎస్ఎల్వీ–ఎఫ్09 ద్వారా జీశాట్– 9ను ప్రయో గించేందుకు సర్వం సిద్ధం చేశామ న్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే చంద్ర యాన్–2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని, ఇందుకు సంబం «ధించిన అన్ని ఏర్పాట్లును ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. డైరెక్టర్ పీ కున్హికృష్ణన్, వీఎస్ఎల్సీ డైరెక్టర్ డాక్టర్ కే శివన్, శాటిలైట్ డైరెక్టర్ ఎంఏ సదానందరావు, వెహికల్ డైరెక్టర్ బీ జయకుమార్ పాల్గొ న్నారు. పీఎస్ఎల్వీ–సీ37 ప్రయోగం విజయవంతం కావడం జాతికే గర్వకారణం. ఈ ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపిన ఇస్రో.. భారత అంతరిక్ష పరిశోధనా సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. – ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతి పీఎస్ఎల్వీ–సీ37 ద్వారా కార్టోశాట్తో పాటు 103 నానో ఉపగ్రహాలను ఒకే సారి నింగిలోకి పంపం డంలో విజయం సాధించిన భారత శాస్త్రవేత్తలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతికి గర్వకారణంగా నిలిచిన శాస్త్రవేత్తలకు యావత్ దేశం నమస్కరిస్తోంది. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, దేశ ఖ్యాతిని, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారతదేశం రికార్డు సృష్టించడం గర్వకారణం. – కేసీఆర్,రాష్ట్ర ముఖ్యమంత్రి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు. ప్రపంచంలోనే తొలిసారిగా 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్తో కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం అభినంద నీయం. ఇందుకోసం అవిశ్రాంతంగా కృషి చేసిన శాస్త్రవేత్తలను యువత ఆదర్శంగా తీసుకోవాలి. – చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయోగం విజయవంతం కావడం చరిత్రాత్మకం. ఈ ఘనతతో భారత దేశ కీర్తి పతాక విశ్వంలో రెపరెప లాడింది. ఇస్రో శాస్త్రజ్ఞులకు అభినం దనలు. భవిష్యత్తులో చేపట్టే అన్ని ప్రయోగాలు సంపూర్ణంగా విజయవంతం కావాలి. – వైఎస్ జగన్మోహన్ రెడ్డి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు -
మరో చరిత్రకు సర్వం సిద్ధం
15న పీఎస్ఎల్వీ సీ37 ద్వారా 104 ఉపగ్రహాల ప్రయోగం 14న ఉదయం 5.28 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం నేడు ఎంఆర్ఆర్ సమావేశం 104 ఉపగ్రహాలివే.. పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా 1,478 కిలోల బరువైన 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. కార్టోశాట్ ఉపగ్రహం 714 కిలోల బరువు కాగా, మిగిలిన 103 ఉపగ్రహాల బరువు 664 కిలోలు మాత్రమే. ఇందులో 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2డీ ఉపగ్రహం, 8.4 కేజీల బరువున్న ఇస్రో నానోశాటిలైట్ (ఐఎన్ఎస్–1ఏ), 9.7 కిలోల బరువు కలిగిన ఇస్రో నానోశాటిలైట్ (ఐఎన్ఎస్–1బీ) అనే మూడు స్వదేశీ ఉపగ్రహాలను ప్రధానంగా పంపనున్నారు. అమెరికాకు చెందిన 631.8 కిలోల 88 డౌవ్ శాటిలైట్స్, 8 లీమూర్ శాటిలైట్స్తో కలిపి 96 చిన్న తరహా ఉపగ్రహాలను పంపనున్నారు. నెదర్లాండ్కు చెందిన మూడు కేజీల పీయాస్–1, స్విట్జర్లాండ్కు చెందిన 4.2 కేజీల డిడో–2, ఇజ్రాయెల్కు చెందిన 4.3 కేజీల బీజీయూశాట్, కజకిస్థాన్కు చెందిన 1.7 కేజీల ఆల్–ఫరాబీ–1, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన 1.1 కేజీల నాయిప్–1 అనే విదేశీ ఉపగ్రహాలను పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 22 దేశాలకు చెందిన 76 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారానే పంపించి మన సత్తా ప్రపంచానికి చాటారు. ప్రస్తుతం 101 ఉపగ్రహాల ప్రయోగం పూర్తయితే మొత్తం 177 ఉపగ్రహాలు వాణిజ్యపరంగా పూర్తి చేసినట్లవుతుంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించనుండడంతో దేశంలోని మేధావులే కాకుండా ప్రపంచం అంతా కూడా ఇస్రో వైపే చూస్తోంది. ప్రయోగమిలా.. పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా నింగిలోకి పంపనున్న 104 ఉపగ్రహాలను భూమికి 505 కిలోమీటర్ల ఎత్తు నుంచి 525 కిలో మీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలో ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి తగలకుండా వివిధ రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టేందుకు డిజైన్ చేశారు. 44.4 మీటర్ల పొడవు కలిగిన పీఎస్ఎల్వీ సీ37 ప్రయోగసమయంలో 320 టన్నుల బరువుతో నింగికి పయనమవుతుంది. 28.42 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేసేలా రూపొందించారు. రాకెట్లోని మొదటిదశను 211.4 టన్నుల ఘన ఇంధనంతో కలిపి ప్రారంభిస్తారు. మొదటిదశలోని ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్అలోన్ దశలో 138.2 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశను 110.88 సెకెన్లకు పూర్తి చేస్తారు. అనంతరం 42 టన్నుల ద్రవ ఇంధనంతో రెండో దశను 262.92 సెకెన్లకు, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 492.22 సెకెన్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1007.80 సెకెన్లకు నాలుగోదశను పూర్తి చేయనున్నారు. అనంతరం భూమికి 510.383 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలోకి ముందుగా 17.29 నిమిషాలకు 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2డీని ప్రవేశపెడతారు. తరువాత 17.39 నిమిషాలకు 510.590 కిలోమీటర్ల ఎత్తులో ఐఎన్ఎస్–1ఏ ఉపగ్రహాన్ని, 17.40 నిమిషాలకు 510.601 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెడతారు. అనంతరం 18.32 నిమిషాలకు 511.719 కిలోమీటర్ల ఎత్తులో ఫస్ట్ ఫెయిర్ నానోశాటిలైట్స్ను, అనంతరం 28.42 నిమిషాలకు 524.075 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి లాస్ట్ ఫెయిర్ ఆఫ్ నానోశాటిలైట్స్ను వదిలి పని పూర్తి చేసేవిధంగా డిజైన్ చేసుకున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 39వ ప్రయోగం కాగా, ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లలో ప్రయోగం విషయంలో 16వ ప్రయోగం కావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 15న ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. రాకెట్కు శిఖరభాగంలో 104 ఉపగ్రహాలను పొందికగా అమర్చి అనుసంధాన ప్రక్రియను పూర్తి చేశారు. శనివారం సాయంత్రం రాకెట్ శిఖర భాగంలో ఉపగ్రహాలను అత్యంత భద్రంగా అమర్చి హీట్షీల్డ్ క్లోజ్ చేశారు. ఆదివారం లెవెల్–1, లెవెల్–2, లెవెల్–3 పరీక్షలు నిర్వహించి సాయంత్రం తుది విడత మిషన్ సంసిద్ధత (ఎంఆర్ఆర్) సమావేశాన్ని నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఎంఆర్ఆర్ సమావేశం ముగిసిన అనంతరం ప్రయోగాన్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగించనున్నారు. సోమవారం ల్యాబ్ ఆధ్వర్యంలో మరోమారు తనిఖీలు నిర్వహించిన అనంతరం మంగళవారం ఉదయం 5.28 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించనున్నారు. – శ్రీహరికోట (సూళ్లూరుపేట) -
పీఎస్ఎల్వీ సీ–37 ప్రయోగ సమయం మార్పు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ సీ– 37 రాకెట్ ప్రయోగ సమయం నాలుగు నిమిషాలు ముందుకు మారింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ– 37 ద్వారా 104 ఉపగ్రహాల ప్రయోగాన్ని ఈ నెల 15న ఉదయం 9.32 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శాస్త్రవేత్తలు దీనిని ఉదయం 9.28 గంటలకు మార్చారు. 14వ తేదీ వేకువజామున 5.48 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షార్లోని క్లీన్రూంలో శాస్త్రవేత్తలు ఉపగ్రహాలకు పరీక్షలు నిర్వహించి ఈ నెల 9న ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చే ప్రక్రియ చేపట్టనున్నారు. 10, 11వ తేదీల్లో రాకెట్ తుది విడత తనిఖీలు నిర్వహించి, 12న తుది విడత మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) ఏర్పాటు చేసి, ప్రయోగ సమయాన్ని, కౌంట్డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. -
అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో సిద్ధం
-
అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో సిద్ధం
ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు శ్రీహరికోట (తడ): వరుస విజయాలతో దూసుకు పోతూ ప్రపంచదేశాలను అబ్బురపరుస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 15 లేదా 17వ తేదీన మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో మొదటి ప్రయోగవేదికపై పీఎస్ఎల్వీ సీ37 రెండు దశల రాకెట్ అనుసంధానం పూర్తయింది. శుక్రవారం మూడు, నాలుగు దశలను అనుసంధానం చేసి రెండు దశలను ఒకేసారి రాకెట్కు అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియ అనంతరం రాకెట్ శిఖర భాగంలో ఉపగ్రహాలను అమర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగంలో మొదట 83 ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించగా వాణిజ్యపరంగా మరికొన్ని దేశాలు ముందుకు రావడంతో మరో 20 ఉపగ్రహాలు పెరిగి ఆ సంఖ్య 103కు చేరింది. ఉపగ్రహాలను అమర్చే క్రమంలో మరోదేశం ముందుకు రావడంతో ఆ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఉపగ్రహాల సంఖ్య 104కు చేరనుంది. 90 నిమిషాల్లోనే ప్రయోగం పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రయోగంలో ఒకేసారి 104 ఉపగ్రహాలను భూమికి 500 కిలోమీటర్లు నుంచి 630 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు రంగం సిద్ధం చేస్తున్నారు. 104 ఉపగ్రహాలను కక్ష్యలో వదిలిపెట్టేటపుడు ఒక దానితో ఒకటి ఢీకొనకుండా ఉపగ్రహాలను అమర్చి ఒకదాని తరువాత ఒక దాన్ని ప్రవేశ పెడతారు కాబట్టి ప్రయోగానికి 90 నిమిషాలు పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుది విడతగా మిషన్ రెడీ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించిన తరువాత ప్రయోగ తేదీని, సమయాన్ని అధికారికంగా నిర్ణయిస్తారు. -
ఒక రాకెట్.. 103 ఉపగ్రహాలు
ఫిబ్రవరి మొదటివారంలో ప్రయోగం అద్భుతాన్ని ఆవిష్కరించనున్న ఇస్రో శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగాల పరంపరలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నద్ధమవుతోంది. పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా 1,392 కిలోల బరువు కలిగిన 103 ఉపగ్రహాలను ఫిబ్రవరి మొదటివారంలో రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) కమిటీ చైర్మన్ బీఎన్ సురేశ్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. 103 ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న విషయాన్ని సమావేశంలో అంతర్గతంగా ప్రకటించినట్టు సమాచారం. దేశీయంగా కార్టోశాట్–2 సిరీస్, రెండు ఇస్రో నానో శాటిలైట్లతోపాటు నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన 100 చిన్నతరహా ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ప్రయోగించనున్న విషయాన్ని ప్రకటించారు. షార్లోని మొదటి ప్రయోగ వేదికపై ఇప్పటికే మూడు దశల రాకెట్ అనుసంధానం పనులను పూర్తి చేశారు. ఉపగ్రహాలు రాగానే నాలుగోదశ పనుల్ని పూర్తిచేసి ప్రయోగానికి సిద్ధం చేయాలని సమావేశంలో సూచించినట్టు తెలిసింది. అత్యధిక ఉపగ్రహాలు పంపే మొదటి దేశంగా భారత్! ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో అత్యధికంగా 103 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపబోయే మొట్టమొదటి దేశంగా భారతదేశం ముందువరుసలో నిలవనుంది. ఇప్పటికే 2008లో ఒకేసారి పది ఉపగ్రహాలు, 2016లో 20 ఉపగ్రహాలను పంపించి స్వీయ చరిత్రను తిరగరాసింది. అయితే ఇప్పటిదాకా అత్యధిక ఉపగ్రహాలను పంపిన దేశాలుగా రష్యా, అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. 2013లో అమెరికా 29 ఉపగ్రహాలు, 2014లో రష్యా 37 ఉపగ్రహాలు పంపించి మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా ఇస్రో 20 ఉపగ్రహాలను పంపించిన మూడో దేశంగా నిలిచింది. ఫిబ్రవరి మొదటివారంలో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా 103 ఉపగ్రహాలు ప్రయోగం అనంతరం ఒకే దఫాలో అత్యధిక ఉపగ్రహాల్ని పంపిన మొట్టమొదటి దేశంగా భారత్ ఆవిర్భవించనుంది. ఇందుకు సంబంధించిన పనుల్లో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. -
చంద్రుడి పుట్టుక గుట్టు ఇదీ..!
జెరూసలెం: చిన్నచిన్న చంద్రుడి లాంటి సమూహాలు ఢీకొని చంద్రుడు ఏర్పడ్డాడని తాజా అధ్యయనంలో తేలింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న చంద్రుడు భూమికి మొదటివాడు కాదని, ఇప్పటివరకు చాలా చంద్రగ్రహాలు మన భూమికి ఉపగ్రహాలుగా ఉన్నాయని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన ఇజ్రాయిల్లోని వైజ్మన్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇజ్రాయిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. పురాతన భూగ్రహానికి అనేక చంద్రగ్రహాలు ఉపగ్రహాలుగా ఉన్నాయని, అనంతరం ఈ చిన్న చిన్న గ్రహాలే ఢీకొని పెద్ద చంద్రుడు ఉద్భవించేందుకు దోహదపడ్డాయని పరిశోధకుడు హగాయ్ పెరెట్స్ తెలిపారు. -
నెలాఖరులో పీఎస్ఎల్వీ సీ37 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల ఆఖరి వారంలో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా 81 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. దీనికి సంబంధించి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదికపై తొలిదశ రాకెట్ అనుసంధాన పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచంలోనే ఈ ప్రయోగం చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది. పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా పంపనున్న ఉపగ్రహాలను దేశ, విదేశాలకు చెందిన పలు యూనివర్సిటీల విద్యార్థులు తయారుచేశారు. ఒక్కో ఉపగ్రహం బరువు 10 కేజీల నుంచి వంద కేజీలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. -
ప్రయోగం విజయవంతం
ఉపగ్రహాలను భూమిపై స్థిరప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించడం చూశాం. అందుకు భిన్నమైన ప్రయోగమిది. కింద బిగించిన ఉపగ్రహాలున్న రాకెట్ను విమానం మోసుకెళ్తుంది. ఆకాశంలో వెళ్తున్నపుడు దాని నుంచి విడివడి రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. తుపాన్ల జాడ పసిగట్టి, వాటి సామర్థ్యాన్ని అంచనావేసి, హెచ్చరించే 8 ఉపగ్రహాలున్న నాసా ‘సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్’ను రాకెట్ విజయవంతంగా అట్లాంటిక్ సముద్రంపై 39వేల అడుగుల ఎత్తులో ప్రయోగించింది. యూఎస్లోని కేప్ కనావరెల్లో తీసిందీ ఫొటో. -
ఒకేసారి 20 ఉపగ్రహాలు
పీఎస్ఎల్వీ రాకెట్తో కక్ష్యలోకి అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త చరిత్ర - విజయవంతంగా20 ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఇస్రో - పీఎస్ఎల్వీ సీ-34 రాకెట్తో 26 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తి - భారత్కు చెందిన మూడు, అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలు - కార్టోశాట్-2 శ్రేణి ఉపగ్రహంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, భూమి వినియోగం, నీటి పంపిణీ తదితర రంగాల్లో సేవలు - రాష్ట్రపతి, ప్రధాని, సోనియా తదితర ప్రముఖుల అభినందనలు శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో చరిత్ర సృష్టించింది. ఒకేసారి 20 ఉపగ్రహాలను బుధవారం విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో గల షార్ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం) ఇందుకు వేదికయింది. షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా ఉదయం 9:26 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ-సీ34) ఉపగ్రహ వాహక నౌక ద్వారా.. 17 విదేశీ ఉపగ్రహాలతో సహా మొత్తం 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కేవలం 26 నిమిషాల వ్యవధిలోనే కొత్త తరం భూ పరిశీలన ఉపగ్రహం (కార్టోశాట్-2 శ్రేణి)తో పాటు మరో 19 ఉపగ్రహాలను నిర్దేశిత సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటిలో ఒక కేజీ బరువున్న ఉపగ్రహాల నుంచి 700 కిలోలకు పైగా బరువున్న ఉపగ్రహాల వరకూ ఉన్నాయి. మొత్తం 20 ఉపగ్రహాల బరువు దాదాపు 1,288 కిలోలు. విజయవంతంగా ముగిసిన ఈ ప్రయోగంతో వేల కోట్ల అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో భారత్ కీలక దేశంగా అవతరించింది. ఇస్రో ప్రయోగించిన 20 ఉపగ్రహాల్లో 13 అమెరికాకు చెందినవి కావటం విశేషం. అందులోనూ 12 ఉపగ్రహాలు భూమిని చిత్రీకరించే డవ్ శాటిలైట్లు. ఒక్కొక్కటి 4.7 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాలు ప్లానెట్ ల్యాబ్స్ అనే సంస్థకు చెందినవి. మరొకటి గూగుల్ యాజమాన్యంలోని ఒక సంస్థకు చెందిన స్కైశాట్ జెన్-2 ఉపగ్రహం. దాని బరువు 110 కిలోలు. ఇవిగాక.. కెనడాకు చెందిన రెండు ఉపగ్రహాలు, జర్మనీ, ఇండోనేసియా దేశాల నుంచి ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. కార్టోశాట్-2 శ్రేణి ఉపగ్రహం బరువు 727.5 కిలోలు. ఇది సాధారణ రిమోట్ సెన్సింగ్ సేవలు అందిస్తుంది. ఇందులో వ్యూహాత్మక అప్లికేషన్లు కూడా ఉన్నాయి. పట్టణ, గ్రామీణ అప్లికేషన్లు, తీర భూమి వినియోగం, నియంత్రణ, రోడ్ల వ్యవస్థ పర్యవేక్షణ, నీటి పంపిణీ వంటి వినియోగ నిర్వహణ తదితరాలకు కూడా దీనిని వినియోగిస్తారు. భూ వినియోగ మ్యాపుల రూపకల్పన, కచ్చితమైన అధ్యయనం, భౌగోళిక, మానవ కల్పిత లక్షణాల మార్పును గుర్తించటం, వివిధ ఇతర భూ సమాచార వ్యవస్థ, భౌగోళిక సమాచార వ్యవస్థ అప్లికేషన్లు కూడా ఉన్నాయి. దీనితో పాటు ప్రయోగించిన.. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీకి చెందిన సత్యభామశాట్, పుణెలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కు చెందిన స్వయం ఉపగ్రహం భారతదేశానికి చెందినవి. కిలో కన్నా తక్కువ బరువున్న స్వయం ఉపగ్రహాన్ని ఈ కాలేజీ విద్యార్థులు 170 మంది కలిసి రూపొందించారు. మారుమూల ప్రదేశాల్లోనూ సమాచార సంబంధాల కోసం ఉద్దేశించినది. ఇంతకుముందు ఇస్రో 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. ఇప్పటివరకూ ఒకే ప్రయోగంలో అత్యధిక ఉపగ్రహాలను నింగిలోకి పంపిన రికార్డు రష్యాకు చెందుతుంది. 2014లో రష్యా ఒకేసారి 37 ఉపగ్రహాలను ప్రయోగించింది. అమెరికాకు చెందిన నాసా అత్యధికంగా ఒకేసారి 29 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కొత్త మైలురాళ్లు దాటుతోంది ఈ ప్రయోగం విజయవంతమవటం పట్ల ఇస్రోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తదితర ప్రముఖులు అభినందించారు. అంతరిక్ష పరిశోధనల్లో దేశ సామర్థ్యం పెరుగుతోందని ప్రణబ్ అన్నారు. మోదీ స్పందిస్తూ.. ‘ఒకేసారి 20 ఉపగ్రహాలు. కొత్త మైలురాళ్లను అధిగమించటాన్ని ఇస్రో కొనసాగిస్తోంది. మనం అంతరిక్ష కార్యక్రమాల్లో ఇతర దేశాలకు సహాయపడే నైపుణ్యతను, సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాం’ అని ట్వీట్ చేశారు. ఇస్రోను కేంద్ర కేబినెట్ కూడా అభినందించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కూడా శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ అభినందనలు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయ పూర్వకంగా అభినందించారు. ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ ప్రపంచంలోని బహుళ ఉపగ్రహాలను ప్రయోగించే అగ్ర దేశాల సరసన నిలిచిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయోగ క్రమం ఇలా.. ► ఉదయం 9.25కు ప్రయోగం ప్రారంభం ► ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనంతో 108 సెకన్లకు మొదటిదశ పూర్తి ► 42 టన్నుల ద్రవ ఇంధనంతో 260 సెకన్లకు రెండో దశ పూర్తి ►7.6 టన్నుల ఘన ఇంధనంతో 491 సెకన్లకు మూడో దశ ► 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 987 సెకన్లకు నాలుగో దశ ► ముందుగా ఇస్రో కార్టోశాట్-2ను 17.07 నిమిషాలకు భూమికి 508 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశం ►17.42 నిమిషాలకు చెన్నై, పుణేలోని వర్సిటీ విద్యార్థుల సత్యభామశాట్, స్వయంశాట్ ఉపగ్రహాలు కక్ష్యలోకి.. ►18.23 నిమిషాలకు ఇండోనేసియాకు చెందిన లపాన్-ఏ3, జర్మనీకి చెందిన బిరోస్ ఉపగ్రహాలు కక్ష్యలోకి ►19 నిమిషాలకు కెనడాకు చెందిన ఎం3 ఎంశాట్, యూఎస్ఏ గూగుల్ సంస్థకు చెందిన స్కైశాట్జెన్లు కక్ష్యలోకి.. ►19.22 నిమిషాలకు కెనడా జీహెచ్బీశాట్ ► 26.20 నిమిషాలకు యూఎస్ఏకు చెందిన 12 డవ్ శాటిలైట్స్.. ►మొత్తం 26.30 నిమిషాల్లో ప్రయోగం సక్సెస్ ►ప్రయోగం తర్వాత భవిష్యత్ పరీక్షల కోసం ప్రయోగాత్మకంగా 4వ దశలోని ఇంజిన్లను మండించి మరో ఆరు నిమిషాల పాటు పీఎస్-4ను పరీక్షించి విజయం సాధించారు. వ్యయం తగ్గిస్తాం: ఇస్రో చైర్మన్ ‘‘ఒకే పేలోడ్లో 20 ఉపగ్రహాలను ప్రయోగించటం.. పక్షులను గాలిలోకి ఎగురవేయటం వంటిది’’ అని ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను ఏడాదికి 12-18కి పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పరిశ్రమలు - ఇస్రో భాగస్వామ్యంతో పనిచేయనున్నట్లు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో వ్యయాన్ని తగ్గించే దిశగా తమ కృషి కొనసాగుతుందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి లోగా సౌత్ ఈస్ట్ ఏసియన్ ఉపగ్రహాన్ని (గతంలో సార్క్ ఉపగ్రహం) ప్రయోగించేందుకు కృషి కొనసాగుతోందని తెలిపారు. తాజా ప్రయోగంలో సూర్యానువర్తన కక్ష్యలోకి వివిధ రకాల ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు నాలుగోదశ (పీఎస్-04)లో ఆరు నిమిషాల పాటు చేసిన ప్రయోగాత్మక పరీక్షలో సఫలమయ్యామన్నారు. కాగా, పీఎస్ఎల్వీ 35వ వరుస విజయవంతమైన కార్యక్రమాల్లో తాజా ప్రయోగం భారీ విజయమని షార్ డెరైక్టర్ పి.కున్నికృష్ణన్ పేర్కొన్నారు. ఇస్రోకు, భారత్కు పీఎస్ఎల్వీ ఒక చిహ్నంగా నిలిచిందని అభివర్ణించారు. ఈ విజయం ఒక ప్రధాన మైలురాయి అని మిషన్ డెరైక్టర్ డి. జయకుమార్ చెప్పారు. కార్టోశాట్ -2 శ్రేణి ఉపగ్రహం ద్వారా గ్రామీణ, పట్టణాభివృద్ధి, సమాచార వ్యవస్థ, కొత్త ప్రాంతాల్లో నిర్దిష్ట వ్యవసాయం వంటి పలు రంగాల్లో సామర్థ్యం పెరుగుతుందని ఆ ప్రాజెక్ట్ డెరైక్టర్ సత్యానంద్ రావు తెలిపారు. -
మరో అడుగు ముందుకు
అంతరిక్ష వీధుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఎప్పటిలాగే మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. బుధవారం పీఎస్ఎల్వీ-సీ34 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను పంపి కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. 2008లో అతి చౌకగా ఒకేసారి పది ఉపగ్రహాలను పంపి ఔరా అనిపించుకున్న ఇస్రో... నిరుడు డిసెంబర్లో నిర్వహించిన ప్రయోగంలో సింగపూర్కు చెందిన ఆరు ఉప గ్రహాలను పంపింది. ఇప్పుడు పంపిన ఇరవై ఉపగ్రహాల్లోనూ అతి తక్కువ బరువున్న జర్మనీకి చెందిన నానో ఉపగ్రహం మొదలుకొని 700 కిలోలకు మించి బరువున్న కార్టోశాట్-2 ఉపగ్రహాల వరకూ ఉన్నాయి. వీటన్నిటి బరువు దాదాపు 1,288 కిలోలు. ఇందులో కార్టోశాట్-2 ఉపగ్రహం అధునాతన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. అది అందించే సేవలు నిరుపమానమైనవి. తీర భూమి వినియోగం మొదలుకొని నీటి పంపిణీ నిర్వహణ వరకూ అనేకానేక అంశాల్లో వినియోగించగల కీలక అనువర్తితాలకు ఇది వేదికగా ఉంటుంది. మిగిలిన 19 ఉపగ్రహాల్లో చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ విద్యార్థుల బృందం రూపొందించిన సత్యభామ శాట్, పుణెలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపకల్పన చేసిన ‘స్వయం’ ఉపగ్రహం ఉన్నాయి. ఇతర ఉపగ్రహాల్లో గూగుల్ యాజమాన్యానికి చెందిన స్కైశాట్ జెన్-2, అమెరికాకే చెందిన మరికొన్ని సంస్థల ఉపగ్రహాలు... కెనడా, జర్మనీ, ఇండొనేసియా దేశాల ఉపగ్రహాలు ఉన్నాయి. తాజా ప్రయోగంతో బహుళ ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఘనత పొందిన రష్యా, అమెరికాల సరసన మన దేశం కూడా సగర్వంగా నిలబడింది. 2014లో రష్యా ఒకేసారి 37 ఉపగ్రహాలను అంత రిక్షానికి పంపగా అంతకు ముందు సంవత్సరం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 29 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రవేశపెట్టగలిగింది. అయితే ఈ మాదిరి ప్రయోగాలకు ఆ రెండు దేశాలూ వెచ్చించిన మొత్తాలతో పోలిస్తే ఇస్రోకు అయిన వ్యయం పది రెట్లు తక్కువ! రెండున్నర దశాబ్దాలు వెనక్కెళ్తే ఇస్రో ప్రయాణంలో ఎన్నో వైఫల్యాలు కనబడతాయి. అనుకున్నది సాధించి తీరాలన్న సంకల్పం, పట్టుదల, ఏకాగ్రత వంటి లక్షణాలు అచిరకాలంలోనే ఆ సంస్థను విజయపథానికి నడిపించాయి. ఇస్రోకిది అసాధ్యం అన్న నోళ్లను మూతబడేలా చేయడమే కాదు... 1999లోనే యాంత్రిక్స్ కార్పొరేషన్ పేరిట అనుబంధ సంస్థను నెలకొల్పి ఉపగ్రహాలను పంపడం ద్వారా ఇస్రో ఆదాయాన్ని సముపార్జించడం మొదలుపెట్టింది. వాణిజ్య పరంగా కూడా తనకెవరూ సాటిరారని నిరూపించుకుంది. ఇంతవరకూ 21 దేశా లకు చెందిన 57 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టి 10 కోట్ల డాలర్లపైనే ఆదాయాన్ని పొందింది. ఇవిగాక మన దేశానికి చెందిన 35 ఉపగ్రహాలు వేర్వేరు కక్ష్యల్లో తిరుగుతూ ఇస్రో దక్షతనూ, మన దేశ ఘనతనూ ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఉపగ్రహాల ప్రయోగానికయ్యే వ్యయాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడంతోపాటు ఆ ప్రయోగాల్లో మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి మన శాస్త్రవేత్తలు నిరంతరం కృషిచేస్తున్నారు. 2014లో జీశాట్-16ను ఫ్రెంచి గయానా నుంచి ఎరియాన్-5 సాయంతో ప్రయోగించిన మన శాస్త్రవేత్తలు వచ్చే సెప్టెంబ ర్లో జీశాట్-18ని ఇక్కడినుంచే పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మన ఇస్రో సాధిస్తున్న విజయాలు ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తున్నాయి. వాణిజ్య పరంగా వాటికి సవాళ్లు విసురుతున్నాయి. ఉపగ్రహాల ప్రయోగానికి తాము వసూలు చేసే మొత్తాన్ని తగ్గించుకోక తప్పని స్థితిని కల్పిస్తున్నాయి. వచ్చే అయిదారేళ్లలో వివిధ దేశాలు దాదాపు వేయికి పైగా ఉపగ్రహాలను పంపుతాయన్న అంచనాలున్నాయి. కనుక ఈ రంగంలో విపరీతమైన పోటీ ఉంటుంది. కోట్లాది రూపాయలు ఆర్జించడానికి అవకాశాలున్నాయి. దీనికి మన ఇస్రో సమయా త్తమవుతోంది. సాధారణంగా ఏ సమస్యలోనైనా ఉండే సంక్లిష్టతను చెప్పడానికి రాకెట్ సైన్స్తో దానికి పోలిక తెస్తారు. ఎందుకంటే ఎన్నో వ్యవస్థలు, ఉపవ్యవస్థలు నిర్దిష్టంగా, నిర్దుష్టంగా పనిచేస్తే తప్ప ఒక రాకెట్ ఖచ్చితమైన వేగంతో దూసుకెళ్లడం, మోసుకెళ్లిన ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ఉంచడం సాధ్యం కాదు. ఇక బహుళ ఉపగ్రహాలను ప్రవేశపెట్టడమన్నది మరిన్ని సంక్లిష్టతలతో నిండి ఉండేది. అందుకే రాకెట్ ప్రయోగం విషయంలో ప్రతి సూక్ష్మ విషయాన్నీ అత్యంత నిశితంగా పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయన్న నిర్ధారణ తర్వాతే ప్రయోగానికి సిద్ధపడతారు. ఏ చిన్న లోపం ఉన్నదన్న సందేహం కలిగినా ప్రయోగాన్ని ఆపేస్తారు. భూమికి 512 కిలోమీటర్ల ఎత్తున 26.5 నిమిషాల వ్యవధిలో ఈ 20 ఉపగ్రహాలనూ జయప్రదంగా ఉంచగలగటం మన శాస్త్రవేత్తలు సాధించిన విజయం. సాంకేతికంగా ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉండే ఈ ప్రయోగంలో కార్టోశాట్-2 ఉపగ్రహాన్ని ఒక కక్ష్యలోనూ, మిగిలిన ఉపగ్రహాలను స్వల్పదూరంలో ఉండే మరో కక్ష్యలోనూ ప్రవేశపెట్టడమన్నది ఒక సాంకేతిక విన్యాసమే. ఎన్నో అవాంతరాలనూ, ప్రతికూల పరిస్థితులనూ ఎదుర్కొంటూ అంచెలం చెలుగా ఈ సాంకేతిక విజ్ఞానాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారు. 1975లో తొలిసారి ‘ఆర్యభట’ ప్రయోగం తర్వాత మన అంతరిక్ష కార్యక్రమం పట్టా లెక్కడానికి దాదాపు పదేళ్లు పట్టింది. సాంకేతికతను ఇవ్వడానికి నిరాకరించే సంపన్న దేశాలొకవైపు... ఇస్రో ప్రాముఖ్యతనూ, అది చేపట్టే ప్రయోగాల అవసరాన్నీ గుర్తించలేని మన పాలకులు మరోవైపు ఇస్రోను ఇరకాటంలోకి నెట్టారు. ప్రజానీకానికి నిత్యజీవితంలో ఎంతో మేలు చేసేందుకు తమ ప్రయోగాలు ఎంతగానో తోడ్పడతాయని చెప్పినా చాలాకాలం చెవికెక్కించు కున్నవారు లేరు. అగ్రరాజ్యమైన అమెరికాలో నాసా మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడాన్ని అటుంచి, మన పొరుగునున్న చైనా ఎంతో శ్రద్ధాసక్తులతో అంతరిక్ష ప్రయోగాలకు వెచ్చిస్తున్న మొత్తాన్నయినా పరిగణనలోకి తీసుకోవాలన్న దృష్టి లేకపోయింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇస్రోకు ప్రస్తుతం లభిస్తున్న సహకారం దాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్న భరోసానిస్తోంది. అది కొనసా గాలని ఆశిద్దాం.