Mahabubnagar District News
-
తల్లి పాల బ్యాంక్
దామరగిద్దలోని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటున్న యువకులునేడు జనరల్ ఆస్పత్రిలో ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం ● ఎస్ఎన్సీయూలో చికిత్స పొందేనవజాత శిశువులకు ఉపయోగకరం ● అత్యాధునిక పద్ధతిలో ఉత్పత్తి ● దాతల ద్వారా తల్లిపాల సేకరణ పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ భవనంలో గురువారం సుషేనా హెల్త్ ఫౌండేషన్–జనరల్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్– కంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం చేయనున్నారు. తల్లి పాలు నిల్వ చేయడంతో పాటు లాక్టేషన్ సపోర్ట్ సర్వీస్, బరువు తక్కువగా చిన్నారులకు, నెలలు నిండకముందే ప్రసవం అయిన చిన్నారులకు, తల్లిపాలు లేని చిన్నారుల కోసం తల్లి పాలను సేకరించి.. అవసరమైనన వారికి అందించడమే ఈ బ్యాంకు ముఖ్య ఉద్దేశం. ప్రసవం తర్వాత పాలు ఉత్పత్తి కాని తల్లులకు సైతం బ్రెస్ట్ పంప్ వంటి ప్రత్యేక పద్ధతి ద్వారా వారి నుంచి పాలు ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు చేపడతారు. అలాంటి తల్లులు మొదట వారి పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను బ్యాంకులో వితరణ చేయాల్సి ఉంటుంది. అలాగే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాలు వితరణ చేసిన తల్లుల పాలను సేకరించి అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసి చిన్నారులకు అందిస్తారు. ● ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న జనరల్ ఆస్పత్రిలో ప్రతి రోజు 30 నుంచి 35 ప్రసవాలు అవుతాయి. ఇందులో ముగ్గురి నుంచి నలుగురు శిశువులకు ఆరోగ్య సమస్యలతో పాటు తల్లిపాలు సక్రమంగా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఈక్రమంలో ఇలాంటి నవజాత శిశువులను ఎస్ఎన్సీయూలో అడ్మిట్ చేసి చిన్న పిల్లల వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తుంటారు. ప్రతి నెల జనరల్ ఆస్పత్రిలో ఎస్ఎన్సీయూలో 350 చిన్నారులు చేరుతుంటే.. ఇందులో బయటి ఆస్పత్రుల నుంచి రెఫర్ మీద దాదాపు వంద కేసులు వస్తుంటాయి. వీరందరికీ తల్లి పాలు ఉండవు. ఈ క్రమంలో ఇలాంటి శిశువులు అందరికీ తల్లి పాల బ్యాంకు వల్ల మేలు జరగనుంది. ● పాల బ్యాంకు ద్వారా పెస్టరైజ్ చేసిన డోనర్ బ్రెస్ట్ మిల్క్ను అందించడం జరుగుతుంది. సేకరించిన పాలలో 10ఎంఎల్ కల్చర్ పరీక్షలు పూర్తి చేసిన త ర్వాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా పెస్టరైజ్ డోనర్ వ్యూమన్ మిల్క్ను జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్న నవజాత శిశువులకు వైద్యుల సలహా, సూచన మేరకు ఉచితంగా అందిస్తారు. సాధారణంగా పౌడర్, డబ్బా పాలు, గేదె, ఆవు పాలు తాగించడం వల్ల నవజాత శిశువు ల జీర్ణక్రియ అరిగించే సామర్థ్యం చాలా తక్కువగా ఉండటం వల్ల కొత్త రకం ఆరోగ్య సమస్యలు వస్తా యి. ఈ పద్ధతి ద్వారా సేకరించిన తల్లి పాలు దాదా పు ఏడాది పాటు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ● జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ భవనంలో ధాత్రి మదర్ మిల్క్ బ్యాంకులో అత్యంత ఖరీదైన పరికరాలు ఏర్పాటు చేశారు. పెస్టరైజ్ ఫ్రీజర్లు, –20 డిగ్రీ ఫ్రిజ్లు, బ్రెస్ట్ పంప్లు మూడు, ప్రత్యేక ఆర్ఓ ప్లాంట్, ప్రత్యేక మిషనరీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నిలోఫర్ ఆస్పత్రి తర్వాత అత్యంత పెద్ద తల్లిపాల బ్యాంకుగా పాలమూరు జనరల్ ఆస్పత్రి నిలిచిపోనుంది. ప్రీటర్మ్, బరువు తక్కువగా ఉన్న పిల్లలు సాధారణ పాలు మింగలేరు. దీంతో డోనర్ పాల ద్వారా వారికి ముఖ్యమైన పోషకాలు, యాంటీబాడీస్, వృద్ధికారకాలను అందించడానికి ఉపయోగపడుతుంది. -
అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే..
ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించాలనే లక్ష్యంతో ఈ తల్లి పాల బ్యాంకు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ఎంతో మంది తల్లిలేని పిల్లలు, పాలు సక్రమంగా ఉత్పత్తి కానీ తల్లులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో పాలు ఉత్పత్తి కానీ తల్లులు ధాత్రి పాల బ్యాంకు ఉపయోగించుకోవాలి. పాలు ఉత్పత్తి చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం పాటు సేకరించిన పాలకు అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాత చిన్నారులకు అందిస్తాం. – రమేష్ లక్కర్స్, పాల బ్యాంకు ప్రోగ్రామ్ అధికారి నవజాత శిశువులకు మేలు.. చాలా మంది బాలింతలు, తల్లులకు హార్మోన్లతో పాటు అనారోగ్య సమస్యల వల్ల పాలు ఉత్పత్తి జరగవు. అలాగే నెలల నిండకముందే ప్రసవం అయిన తల్లులకు సైతం పాలు సకాలంలో రావు. ఇలాంటి వారి కోసం పాల బ్యాంకు నుంచి తల్లిపాలు సేకరించి అందిస్తాం. ఇది నవజాత చిన్నారులకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. ప్రతి శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆస్పత్రిలో నేడు ప్రారంభం చేయడానికి కలెక్టర్ విజయేందిర, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి హాజరవుతారు. – డాక్టర్ సంపత్కుమార్ సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ● -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించాలి
దేవరకద్ర: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం యూనిట్ కాస్ట్లో నిర్మించుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కలిగించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని మినుగోనిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామంలో ఐదు ఇళ్లు బేస్మెంట్ లెవల్ వరకు పూర్తికాగా, 14 ఇళ్లు మార్కింగ్ వేసినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా బేస్మెంట్ పూర్తయిన లబ్ధిదారురాలు మాసమ్మ ఇంటి వద్దకు కలెక్టర్ వెళ్లి పనులను పరిశీలించారు. బేస్మెంట్ కట్టడానికి ఎంతయిందని ఆమె ప్రశ్నించగా రూ.95 వేలు ఖర్చు అయినట్లు మాసమ్మ తెలిపింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ డిజైన్ ప్రకారం యూనిట్ కాస్ట్లో తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా కట్టుకోవచ్చని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుక సరాఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించారు. గ్రామంలోని అంగన్వాడీ, ఆశావర్కర్లవి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అడిగారు. కలెక్టర్ పర్యటిస్తున్న సమయంలో అక్కడిి నుంచి వస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. ఆమె వెంట గృహ నిర్మాణ పీడీ వైద్యం భాస్కర్, ఎల్డీఎం భాస్కర్, డీఆర్డీఓ నర్సింహులు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. బుధవారం తన చాంబర్లో పోషణ పక్షం వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ పక్షంలో భాగంగా ఈ నెల 22 వరకు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పోషకాహార లోపం అధిగమించడానికి గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ లబ్ధిదారులతో పాటు వారి కుటుంబసభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్రావు, మహిళ శిశు సంక్షేమాధికారి జరీనాబేగం, డీఎంహెచ్ఓ కృష్ణ, అదనపు డీఆర్డీఓ జోజప్ప తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పదేళ్ల బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలపైన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. పార్టీ ఏర్పడి 25ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్లోజరిగే రజతోత్సవ సభ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్రాజేశ్వర్గౌడ్, నాయకులు నర్సిములు, వెంకటన్న, ఆంజనేయులు, గణేష్, దేవేందర్రెడ్డి, శివరాజు, సాయిలు, శ్రీనివాస్రెడ్డి, నవకాంత్, శ్రీకాంత్రెడ్డి, శరత్, వర్థభాస్కర్, తదితరులు పాల్గొన్నారు. -
టూరిజం స్పాట్గా వానగట్టు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: త్వరలో స్థానిక నవాబుపేట రోడ్డులోని వానగట్టు టూరిజం స్పాట్ గా మారనుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న సు మారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక, అటవీ, మున్సిపల్ కార్పొరేషన్ శాఖల ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం శివారులో పిల్లలమర్రి, మయూరి పార్కు, మినీ ట్యాంక్బండ్, శిల్పారామం తదితర ప్రాంతాలు టూరిజం స్పాట్గా కొనసాగుతున్నాయి. తాజాగా వానగట్టు సైతం చేరింది. ఇది ఎత్తయిన ప్రదేశం కావడంతో నగరం మొత్తం ఇక్కడి నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉండేందుకు విరివిగా మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటుకు బుధవారం స్థల పరిశీలన చేశారు. కాగా, ఇప్పటికే అప్పన్నపల్లి రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించి మయూరి నర్సరీ ఆవరణలో వ్యూ పాయింట్ ఉంది. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఎఫ్ఓ సత్యనారాయణ, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. వ్యూ పాయింట్ కోసం స్థల పరిశీలన 3 శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు -
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (మహిళలు– మహబూబ్నగర్), (పురుషులు–నాగర్కర్నూల్)లలో విద్యార్థులకు బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని టీడబ్ల్యూ గురుకులం మహబూబ్నగర్ రీజియన్ కో–ఆర్డినేటర్ పీఎస్ కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కెమిస్ట్రీలో నాలుగు, ఫిజిక్స్లో రెండు, హిస్టరీ, కామర్స్, తెలుగు, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, లైబ్రేరియన్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని, అలాగే ఆయా సబ్జెక్టులలో సెట్, నెట్, పీహెచ్డీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఈనెల 16వ తేదీలోగా మహబూబ్నగర్ శివారు తిరుమల హిల్స్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ (మహిళలు) ప్రిన్సిపాల్కు పూర్తి చేసిన దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 17వ తేదీ ఉదయం పది గంటలకు ఇదే కళాశాలలో నిర్వహించే డెమోకు తప్పక హాజరు కావాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్ నం.7901097704, 9848616564లను సంప్రదించ వచ్చని పేర్కొన్నారు. ఈద్గానిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మహబూబ్నగర్ క్రైం: సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రతి గ్రామం ఈద్గానిపల్లిని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ డి.జానకి అన్నారు. రాజాపూర్ మండలం ఈద్గానిపల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు బుధవారం ఎస్పీ కార్యాలయంలో రూ.4 లక్షల చెక్కును ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల భద్రతను పెంపొందించుకోవడానికి, గ్రామంలో శాంతి భద్రతలను మెరుగుపరుచుకోవడానికి, దొంగతనాలు, అసాంఘీక కార్యకలాపాలను అరికట్టడానికి గ్రామస్తులు ముందుకు రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, రాజాపూర్ ఎస్ఐ శివానందంగౌడ్, గ్రామ పెద్దలు పంభాక్షరి, నరేందర్రెడ్డి, బాలగౌడ్, శ్రీనివాసులు, జగన్మోహన్రెడ్డి, రఘువీరారెడ్డి, శేఖర్గౌడ్ పాల్గొన్నారు. బెట్టింగ్పై కఠినంగా వ్యవహరిస్తాం జిల్లాలో ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ ఆడినా, వాటిని ప్రోత్సాహించిన వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని ఎస్పీ డి.జానకి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఈజీమనీ కోసం యువత అలవాటుపడి అధికంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని, దీనివల్ల బంగారు భవిష్యత్ అంధకారంగా మారుతుందని పేర్కొన్నారు. బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని సూచించారు. బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిస్తే 8712659360 నంబర్కు, డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు. బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి రూ.465 కోట్లు మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.465 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని జితేందర్రెడ్డి నివాసంలో బుధవారం లాక్రోస్ క్రీడాకారులు, రాష్ట్ర సంఘం ప్రతినిధులు ఆయనను మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో క్రీడలకు కేటాయించిన నిధులతో రాష్ట్రంలో మరుగున పడిన క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామన్నారు. యువత మాదక ద్రవ్యాల వైపు మరలకుండా ఏదో ఓ క్రీడలో పాలుపంచుకోవాలని సూచించారు. లాక్రోస్ క్రీడను రాష్ట్రంలో అభివృద్ధి పరిచి గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. లాక్రోస్ క్రీడ అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ముఖ్య క్రీడగా ఉందని, ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుందని లాక్రోస్ ఇండియా టీమ్ కెప్టెన్ అనుదీప్రెడ్డి తెలిపారు. త్వరలో ఆగ్రాలో లాక్రోస్ క్రీడ నేషనల్స్ నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ లాక్రోస్ అకాడమీ అధ్యక్షుడు భానుచందర్, ప్రధాన కార్యదర్శి శేఖర్, కోచ్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
రేషన్ కార్డు లేకపోవడంతో..
రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్కార్డు అడిగారు. మాకు రేషన్కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు. – రాజు, గద్వాల పట్టణం మా గ్రామానికి సంబంధం లేని బ్యాంక్ చూపిస్తోంది.. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా. మండల కేంద్రంలో కావడం లేదని మహబూబ్నగర్కు రెండుసార్లు వచ్చాను.వెబ్సైట్లో గ్రామం పేరు ఎంపిక చేసుకుంటే.. ఎస్బీఐ ఐఎఫ్ఎస్సీ కోడ్ చూపించడం లేదు. హెచ్డీఎఫ్సీ చూపిస్తోంది. నాకు అందులో ఖాతా లేదు. ఇలా కాదని ఎస్బీఐ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎంపిక చేసుకుంటే కంచంపల్లి గ్రామం పేరు చూపిండం లేదు. పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. నా సమస్యను పరిష్కరించాలి. – రమేష్, కంచంపల్లి, మహమ్మదాబాద్ టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తాం యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు టెక్నికల్ సమస్యలు మా దృష్టికి వచ్చాయి. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్నగర్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్కు అవకాశం ఉంది. – ఇందిర, బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
కుంటలో పడి రైతు మృతి
గోపాల్పేట: మోటారు బాగుచేసేందుకు కుంటలోకి దిగిన ఓ రైతు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన మండలంలోని బుద్ధారం లక్ష్మీతండాలో వెలుగుచూసింది. ఎస్ఐ నరేష్ కుమార్ వివరాల మేరకు.. బుద్ధారం లక్ష్మీతండాకు చెందిన కోటయ్య చిన్న కుమారుడు కిషన్ (39), అతడి భార్యకు చిన్నచిన్న గొడవలు జరగడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఐదారు నెలలుగా కిషన్ లక్ష్మీతండాలో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. గ్రామ సమీపంలోని కొత్తకుంటలో తన చిన్నాన్న బోరుమోటారు పనిచేయకపోవడంతో మంగళవారం సరిచేసేందుకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. అతడి కోసం స్థానికులు గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. బుధవారం కుంటలో అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి కోటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు.. రాజోళి: పురుగు మందు తాగి చికిత్స పొందుతున్న యువకుడు మంగళవారం రాత్రి మృతిచెందినట్లు ఏఎస్ఐ ప్రేమ్కుమార్ తెలిపారు. వివరాలు.. రాజోళికి చెందిన వీరన్న(23)కు మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో ఏడాది కిత్రం ఆయనకు పచ్చకామెర్లు వచ్చాయి. అయినా కూడా మద్యం సేవిస్తుండటంతో తల్లి ఎన్నో సార్లు మందలించింది. క్రమేణా తన ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఈ నెల 5న పురుగుమందు తాగాడు.చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి.. గోపాల్పేట: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఏదుల మండలం చెన్నారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. రేవల్లి హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన అబ్దుల్ అలీం (35) ఇంట్లోనే చికెన్ విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. బుధవారం ఎప్పటిలాగే చికెన్ డ్రెస్సింగ్ మిషన్ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడే పడిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే కారులో వనపర్తి ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అలీంకు భార్య ఫర్జానాబేగం, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తండ్రి అబ్దుల్ రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ వివరించారు. -
రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్
మెట్టుగడ్డ: రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్, కార్యాలయాల్లో మాత్రమే ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. గంటల తరబడి నిరీక్షణకు ముగింపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలు గంటల తరబడి వేచి యుండే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా కొన్ని కార్యాలయాల్లో ఉదయం వస్తే సాయంత్రంకు కూడా డాక్యుమెంట్ ప్రక్రియ కొనసాగుతుండేది. ఇందులో భాగంగానే దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులువుగా, వేగంగా పూర్తయ్యేందుకు ఈ స్లాట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకవస్తుంది. ఈ స్లాట్ బుకింగ్ ప్రక్రియలో ఒక్క దస్తావేజు రిజిస్ట్రేషన్కు 10నుంచి 15 నిమిషాలలో పూర్తయ్యేలా ఈ కొత్త విధానంలో తేనున్నారు. కొన్ని కార్యాలయాల్లో 80 నుండి 100 దస్తావేజులు వచ్చేవి. దీనితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మందకొడిగా సాగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొందరు దళారులను ఆశ్రయించి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకునేవారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రతి కార్యాలయంలో పని వేళల్లో 48 స్లాట్స్గా విభజించారు. రోజుకు కేవలం 48 దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగేలా అందుబాటులోకి తేనున్నారు. ప్రజలే దస్తావేజులను తయారు చేసుకునేలా మాడ్యుల్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు మధ్యవర్తులపై, దస్తావేజు లేఖరులపై, ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్సైట్ లో ఒక మాడ్యుల్ను అందుబాటులోకి తెచ్చారు. కేవలం సేల్డీడ్ దస్తావేజులు మాత్రమే చేసుకునేలా అవకాశం కల్పించారు. నూతన విధానానికి శ్రీకారం స్లాట్ బుకింగ్తో ప్రజలకు మేలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ సేవలతో ప్రజలకు మేలు జరుగుతుంది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులువుగా, వేగంగా కానుంది. ప్రజలు మధ్యవర్తులు, దస్తావేజు లేఖరులపై ఆధారపడకుండా స్వంతంగా దస్తావేజులు తయారు చేసుకునేలా మాడ్యు ల్ కూడా అందుబాటులోకి వచ్చింది.. – మొహమ్మద్ హమీద్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1, మహబూబ్నగర్ రోజుకు 48 మాత్రమే ప్రజలకు మరింత సులువుగా, వేగవంతంగా 10–15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి పైలట్ ప్రాజెక్ట్గా మహబూబ్నగర్, నాగర్కర్నూలు ఎంపిక నేటి నుంచి ప్రారంభం స్లాట్ బుకింగ్ విధానం ఇలా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్ సైట్ registration.telangana.gov.in లోని పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకొని, ఆ రోజు నిర్దేశించిన సమయానికి నేరుగా విచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించారు. స్లాట్ బుక్ చేసుకొని వారి కోసం ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లు జరిపేలా, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో దస్తావేజులు స్వీకరించేలా మరో నూతన పద్ధతికి శ్రీకారం చుట్టారు. -
పబ్బతి అంజన్న.. పాహిమాం
అచ్చంపేట/మన్ననూర్: చారిత్రాక ప్రాశస్త్య్రం కలిగి ప్రకృతి రమణీయ ప్రదేశంలో పబ్బతి ఆంజనేయస్వామి కొలువుదీరారు. కష్టాలను కడతేర్చే ఇష్టదైవంగా ఇక్కడి ప్రజలు ఆరాధిస్తారు. అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని మద్దిమడుగులో ఉన్న ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. గిరిజనులనేగాక నాగరీకులు, పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయానికి జిల్లా నలుమూలల నుంచేగాక నల్గొండ, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. నల్లమల కొండల్లో కృష్ణానది పశ్చిమ భాగాన దుంధుబి నది సంఘమించే రెండు నదుల కలయిక నడుమ శ్రీశైలం పుణ్య క్షేత్రానికి ఉత్తర దిశలో ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1120లో గుర్తించినట్లు.. పురాతన దేవాలయం కనుగొని ఓ చెట్టు కింద విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఏటా రెండు పర్యాయాలు.. మద్దిమడుగు అభయాంజనేయస్వామి ఉత్సవా లు ఏటా రెండు పర్యాయాలు పవిత్ర కార్తీక మాసం, చైత్రమాసంలో జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులు ఆంజనేయస్వామి మాలలు ధరిస్తారు. మాలధారుల సంఖ్య ప్రతి సంవత్సరం ఊహకందని విధంగా పెరిగిపోయింది. ఉత్సవాల సందర్భంగా మాచర్ల, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, హైదరాబాద్, నల్గొండ, నాగర్కర్నూల్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. చైత్రమాసం బ్రహ్మోత్సవాలు 10 నుంచి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దేశావత్ రాములునాయక్, ఈఓ నర్సింహులు తెలిపారు. కోట మైసమ్మ ఆలయం.. ఆంజనేయస్వామి ఆలయ ప్రదేశంలోనే కోట మైసమ్మ అమ్మవారు వెలిశారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. చాలామంది భక్తులు ఇక్కడ కోళ్లు, మేకలు సమర్పిస్తారు. భక్తుల ప్రగాడ విశ్వాసం.. స్వామివారిని దర్శించుకొని ఆలయం ఎదుట ఉన్న చెట్టుకు ఉయ్యాల కడితే సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. అలాగే కోరిన కోర్కెలు తీరాలని ముడుపులు కట్టి.. తీరగానే ఆ ముడుపులను వారే స్వయంగా విప్పుతారు. ఆవు పాలు, నెయ్యి, బెల్లం, తేనె, గోధుమ రొట్టెలతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. కార్యక్రమాలు ఇలా.. 10న గురువారం అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు అశ్వవాహనసేవ, శివపార్వతుల కల్యాణం 11న శుక్రవారం గవ్యాంతపూజ, ద్వాదశ వాస్తుపూజ, హోమం, రుద్రహోమం, మన్యసూక్తి హోమం, బలిహరణం, సహస్ర నామార్చన, రాత్రి 8 గంటలకు స్వామివారి వాహనసేవ, సీతారాముల కల్యాణం 12న శనివారం హన్మాన్ జయంతి రోజున ఉదయం 9 గంటలకు స్వామివారికి మహాకుంభాభిషేకం, శ్రీ హనుమాన్ గాయత్రి మహాయజ్ఞంలో పూర్ణాహుతి, హనుమాన్ దీక్షదారుల మాల విరమణ. మూడు రోజులు సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం నల్లమల కొండల్లో కొలువుదీరిన స్వామివారు వేలాదిగా తరలిరానున్న భక్తులు -
బ్యాంకింగ్ రంగంపై ప్రభావం..
బ్యాంకింగ్ రంగంలోనూ కృత్రిమ మేధ ప్రభావం చూపనుంది. రోజు జరిగే అన్ని వ్యవహారాలపై రిజర్వు బ్యాంక్ ప్రత్యక్ష నియంత్రణ కలిగి ఉంటుంది. ప్రజల డిపాజిట్లు కాపాడి.. వారికి మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి స్థాయిలో నియంత్రణ అవసరం అవుతుంది. ఈ నియమాలు కచ్చితంగా అమలు చేయడం కోసం బ్యాంకులు ఆటోమేషన్ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. దాన్ని రెగ్ టెక్ అని పిలుస్తాం. రెగ్ టెక్ పనితీరు మరింత మెరుగుపర్చడానికి కృత్రిమ మేధను బ్యాంకింగ్ రంగం వినియోగిస్తుంది. – సురేష్, అధ్యాపకుడు, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ కళాశాల -
ఏఐతో విప్లవాత్మక మార్పులు
ఉద్యోగాలు సృష్టించాలి.. విద్యార్థులు ఉద్యోగం కోసం చదవకుండా సాంకేతికతను ఉపయోగించుకుని ఉద్యోగాలను సృష్టించేందుకు సిద్ధం కావాలి. అందుకోసం ఆర్టిఫిషియల్ టెక్నాలజీని అవకాశంగా మార్చుకోవాలి. సమాజానికి ఉపయోగపడేలా సైన్స్, కామర్స్, ఇంజినీరింగ్తో పాటు అన్ని కోర్సుల సిలబస్లో మార్పులు తీసుకువస్తున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు గ్రామీణ ప్రాంత, మధ్యతరగతికి చెందిన వారే అధికం. వారందరికీ సాంకేతికతను అందించేందుకు కృషిచేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్లో అనేక మార్పులు తీసుకురానుంది. ఆ దిశగా మనం మారాలి. ఇలాంటి సదస్సుల్లో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు తమ అభిప్రాయాలు పంచుకుని సాంకేతికంగా ముందుకెళ్లాలి. సెమినార్లలో జ్ఞానం పంచుకోవటం అందరికీ ఉపయోగకరం. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పాలమూరు యూనివర్సిటీ ●● ప్రపంచంలో భారతదేశం కీలకం కాబోతుంది.. ● ఒక్క సముద్ర రంగంలోనే 20లక్షల ఉద్యోగాలు ● కళాశాల సిలబస్లోనూ మార్పులు తెచ్చేందుకు వీసీలతో చర్చలు ● జాతీయ సెమినార్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కృత్రిమ మేఽధా పనితనం ప్రశంసనీయం.. వాణిజ్య నిర్వహణలో కృత్రిమ మేధా పనితనం ప్రశంసనీయం. కృత్రిమ మేధ నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టడానికి సంఖ్యాకశాస్త్రం, సంభావ్యత శాస్త్రం విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు కృత్రిమ మేధ నుంచి అనేక దుష్పరిణామాలు సైతం ఎదుర్కొబోతున్నాం. వాటిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. పెరిగిన సాంకేతికత అభివృద్ధికి సోపానం కావాలి. – యలమంచిలి రామకృష్ణ, ఐపీఈ కళాశాల ప్రొఫెసర్ -
మట్టి తరలింపు వేగవంతం
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ)సొరంగం లోపల చిక్కుకున్న కార్మికుల అచూకీ కనుకొనేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ సిబ్బంది నిరంతరాయంగా పనులు చేపడుతున్నారు. సహాయక సిబ్బంది నిత్యం 20మీటర్ల వరకు మట్టి తవ్వకాలు చేపడుతూ శిథిలాలను బయటకు పంపిస్తున్నారు. ప్రభుత్వం విధించిన గడువులోగా సహాయక చర్యలు పూర్తి చేసేందుకు వేగం పెంచారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు సలహాలు,సూచనల మేరకు రెస్క్యూ బృందాలు ముందుకు సాగుతున్నారు. ఉబికి వస్తున్న నీటి ప్రవాహంతో సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయని సహాయక సిబ్బంది చెబుతున్నారు. సొరంగం ప్రమాదానికి ప్రధాన కారణం నీటి ఊటేనని జీఎస్ఐ,సీఎస్ఐ,ఎన్జీఆర్ఐలు నిర్థారించారు. వారి పర్యవేక్షణలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం మినహా మిగిలిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతూ వెంటిలేషన్, కన్వేయర్ బెల్టు పొడిగింపు, టీబీఎం స్టీల్ భాగాల కత్తిరింపు వంటి పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోగా ఇద్దరి మృతదేహాలు వెలికి తీశారు. మిగిలిన ఆరుగురి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 రకాల సహాయక బృందాలకు చెందిన సిబ్బంది 47రోజులుగా గాలిస్తున్నా వారి అచూకీ నేటికీ లభ్యం కాలేదు.బుధవారం సొరంగం లోపల కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులతో పాటు ఎస్కవేటర్ల సహాయంతో మట్టి, బురద,రాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు. మట్టి త వ్వకాలు పూర్తి అయిన ప్రదేశం వరకు లోకో ట్రైన్ వెళ్లే విధంగా ట్రైన్ ట్రాక్ పొడగించే పనిలో నిమగ్నమయ్యారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మైన్స్ సీనియర్ శాస్త్రవేత్త జీసీ నవీన్, నీటిపారుదలశాఖ డీఈ శ్రీ నివాసులు,కంపెనీ సీనియర్ ఇంజనీర్ సంజయ్ కు మార్సింగ్ ప్రమాద ప్రదేశంలో పరిస్థితులను క్షుణంగా పరిశీలించి సూచనలు, సలహాలు చేస్తున్నారు. లోకో ట్రాక్ పునరుద్ధరణ ప్రమాద ప్రదేశం సమీపం వరకు లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి అన్నారు. బుధవారం సొరంగం ఇన్లేట్ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక చర్యల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మట్టి తవ్వకాలకు అనుగుణంగా లోకో ట్రైన్ ట్రాక్ వెళ్లేవిధంగా మార్గం చేస్తున్నారని చెప్పారు. టీబీఎం స్టీల్ బాగాలు కత్తరింపు పనులు,డీవాటరింగ్ ప్రక్రియ సమాంతరంగా కొనసాగతుందన్నారు. కన్వేయర్ బెల్టు, వెంటిలేషన్ ప్రక్రియ ముందుకు కొనసాగిస్తున్నామని, సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారన్నారు.అర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య,ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఉబికి వస్తన్న నీటితో ఆటంకం 47రోజలుగా కొనసాగుతన్న సహాయక చర్యలు -
పప్పుధాన్యల దిగుబడులు పెంచాలి
బిజినేపల్లి: ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సమాజ నిర్మాణానికి పప్పు దినుసులు, తృణధాన్యాల సాగు పెంచాలని ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డా. బలరాం కోరారు. వానాకాలం, యాసంగి సాగులో అతివృష్టి, అనావృష్టి, చీడపీడలను తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మండలంలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం రెండోరోజు జెడ్ఈఆర్ఏసీ సమావేశం జరగగా ఆయన పాల్గొని మాట్లాడారు. సేంద్రియ సాగు, సమగ్ర వ్యవసాయం, వాణిజ్య పంటల్లో దిగుబడుల పెంపు, చీడపీడల నివారణపై దృష్టి సారించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. శాస్త్రవేత్తలు, అధికారులు పెద్ద రైతులను ఎంపిక చేసుకొని వారితో విప్లవాత్మక ప్రయోగాలు చేయించాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సరైన సూచనలు, సలహాలిస్తూ పంటల సాగులో దిగుబడుల్ని పెంచాలని కోరారు. రెండోరోజు ఆయా విభాగాల ప్రధాన శాస్త్రవేత్తలు, విస్తరణ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పంటల సాగులో వాతావరణ పరిస్థితులు, సస్యరక్షణ చర్యలు, సమగ్ర వ్యవసాయం, సాంకేతిక పద్ధతుల్లో విత్తనోత్పత్తి, విస్తరణ అంశాలు, చీడపీడలు, దిగుబడులు, నేలలు తదితర వాటిపై చర్చాగోష్ఠి నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డా. ఎం.యాకాద్రి, ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డా. సుధాకర్, ప్రధాన శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
చేప బక్క చిక్కింది..
సబ్సిడీ చేపల నాణ్యతపై అనుమానాలు ● చెరువుల్లో వదిలిన చేపపిల్లల వృద్ధిపై మత్స్యకారుల్లో ఆందోళన ● పావు కేజీ నుంచి అర కేజీ వరకే పెరిగిన వైనం ● జిల్లాలో గతేడాది 93.68 లక్షల చేప పిల్లల పంపిణీ మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రతి ఏడాది చెరువులు నిండగానే రాష్ట్ర ప్రభుత్వం మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు పంపిణీ చేస్తున్న చేపపిల్లల నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతేడాది చెరువుల్లో వదిలిన చేపపిల్లల సైజులో పెద్దగా వృద్ధి కనిపించకపోవడంతో మత్స్యకారులను ఆందోళనకు గురి చేస్తోంది. గత వర్షాకాలంలో చెరువులు నిండడం, ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యకారుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. తీరా.. చేపపిల్లల పంపిణీ సగానికి తగ్గించడం, ప్రైవేటు హేచరీలలో కొందామంటే అందుబాటులో లేకపోవడం వల్ల వారు నిరాశపడాల్సి వచ్చింది. చాలీచాలని చేపపిల్లలు చెరువుల్లో వదిలి ఉత్పత్తి కోసం ఎదురుచూసిన మత్స్యకారులకు మండుతున్న ఎండలతో నీరు పూర్తిగా అడుగంటిపోవడం, చేపల సైజు రాకపోవడం వల్ల వారి జీవనంపై ప్రభావాన్ని చూపింది. గతేడాది అక్టోబర్ నెలలో పంపిణీ చేసిన చేపపిల్లలు కనీసం అర కేజీ కూడా పెరగకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. టెండర్ల సమయంలో కొనుగోలు కమిటీ హేచరీలను సందర్శించి నాణ్యతపై సముఖత వ్యక్తం చేసిన తర్వాతే చేపపిల్లల పంపిణీకి టెండర్ ఫైనల్ చేస్తారు. ఆ సమయంలో నాణ్యతను పరిశీలించాల్సిన సంబంధిత శాఖ అధికారులు హడావుడిగా పంపిణీ చేయడం, వాటిలో కూడా సగం వరకు కోత విధించడం వల్ల మత్స్యకారులకు తీరని అన్యాయం జరిగింది. ● మహబూబ్నగర్ జిల్లాలో 234 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 12,496 మంది సభ్యులున్నారు. జిల్లావ్యాప్తంగా 1,091 చెరువులు, కుంటలు ఉండగా.. గత వర్షాకాలం సీజన్లో 993 చెరువుల్లో చేపపిల్లలను వదలాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 1.92 కోట్ల చేపపిల్లలు అవసరమవుతాయని అంచనా వేయగా.. సగానికి కుదించి పంపిణీ చేశారు. పథకాల అమలులోనూ జాప్యం మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయికి ఆశించిన స్థాయిలో చేరడం లేదు. ఎన్నో సంక్షేమ పథకాలున్నా అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. పథకాలపై అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే హడావుడి చేయడమే గానీ.. మిగతా సమయాల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారే విమర్శలున్నాయి. -
పేదల కడుపు నింపేందుకే సన్నబియ్యం
మహబూబ్నగర్ రూరల్: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కోడూర్లోని ఎస్సీ కాలనీలో రేషన్కార్డు లబ్ధిదారుడు హెచ్.గోపాల్, సత్యమ్మ ఇంట్లో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావు ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు. జిల్లాలో మొత్తం 506 చౌకధర దుకాణాల ద్వారా 5,228 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోడూర్లో 761 రేషన్కార్డులు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చౌకధర దుకాణాల ద్వారా అర్హత గల లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి టి.వెంకటేష్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రవినాయక్, తహసీల్దార్ సుందర్రాజ్, ఎంపీడీఓ కరుణశ్రీ ఉన్నారు. సన్న బియ్యం బాగుంది.. సన్న బియ్యం ఎలా ఉందని కలెక్టర్ అడగగా.. బాగుంది మేడం అని గోపాల్ చెప్పాడు. కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను తన భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారని గోపాల్ కలెక్టర్కు తెలిపాడు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ప్రతి ఒక్కరూ రేషన్షాపుల ద్వారా తీసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గోపాల్ కుమారుడితో మాట్లాడుతూ ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా స్వయం ఉపాధి పొందడానికి నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా.. ‘కలెక్టర్ తన ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు భోజనం చేయడం ఆ నందంగా ఉందని, మా జీవితంలో మర్చిపోలేం.’ అని లబ్ధిదారుడు గోపాల్ తెలిపారు. కలెక్టర్ విజయేందిర బోయి -
నేడు ఏఐపై జాతీయ సెమినార్
జడ్చర్ల టౌన్: డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్యశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)పై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.సుకన్య తెలిపారు. మంగళవారం కళాశాలలో ఆమె మాట్లాడారు. ‘వాణిజ్య రంగంలో ఏఐ ప్రభావం’ అన్న అంశంపై ఒకరోజు సెమినార్ కొనసాగుతుందని దేశంలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి సెమినార్ కోసం ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 130 జనరల్స్ వచ్చాయ న్నారు. త్వరలోనే విద్యార్థులకు పాఠ్యాంశంగా తేబోతున్న ఏఐతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని అన్నారు. సరైన మార్గంలో వినియోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని, దానివల్ల కలిగే అనర్థాలను అదే తరహా లో వివిధ కళాశాలల నుంచి ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారన్నారు. సెమినార్కు రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, పీయూ వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్, సీసీఈ జేడీ జి.యాదగిరి, రాజేందర్సింగ్, ఏజీఓ బాల భాస్కర్, ముఖ్యవక్త యలమంచిలి రామకృష్ణ, రీసోర్స్ పర్సన్ డా.కె.రాజ్కుమార్ హాజరుకానున్నారని తెలిపారు. వైస్ప్రిన్సిపాల్ డా.నర్మద, మీడియా కన్వీనర్ రాఘవేందర్, సభ్యులు సతీష్ పాల్గొన్నారు. రేపు జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన పద్మావతి కాలనీలోని నిర్మల్ ఆర్గనైజేషన్ నియర్ రెడ్ బక్కెట్, మన్నార్ ట్రైడర్స్ బిల్డింగ్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధికారి మైత్రిప్రియ మంగళశారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిది రకాల ప్రైవేట్ రంగ సంస్థల్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. వివరాల కోసం 99485 68830 నంబర్కు సంప్రదించాలని కోరారు. నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, పారిశుద్ధ్య సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లే స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లకు ప్రతి యజమాని వేరు చేసిన చెత్తను ఇవ్వాలని సూచించారు. ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో, ఓపెన్ ప్లాట్లలో, కూడళ్లలో చెత్త పారవేయొద్దన్నారు. ఇప్పటికీ ఎక్కడైనా చెత్త ఇవ్వని వారు ఉంటే వెంటనే గుర్తించి తమకు సమాచారం అందజేయాలన్నారు. ఈ విషయంలో ఎవరితోనూ ఘర్షణ పడొద్దని, సామరస్యంగా వ్యవహరించాలని, అలాంటి వారిలో మార్పు వచ్చేందుకు యత్నించాలన్నారు. ఇక డంపింగ్ యార్డుకు సిల్ట్ తప్పా మిగతా చెత్తను వేరు చేసి డీఆర్సీసీకి అప్పగించాలన్నారు. అక్కడ గుట్టలు గుట్టలుగా చెత్త పోగు కాకుండా చూడాలన్నారు. అంతకుముందు డంపింగ్ యార్డులోని సెగ్రిగేషన్ షెడ్లు, బయో మైనింగ్, డీఆర్సీసీలను పరిశీలించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు గురులింగం, రవీందర్రెడ్డి, వజ్రకుమార్రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ చరణ్, ఎస్బీఎం కన్సల్టెంట్ సుమిత్రాజ్ పాల్గొన్నారు. ‘దాడులపై ప్రభుత్వంస్పందించాలి’ పాలమూరు: రాష్ట్రంలో దశలవారీగా న్యాయవాదులపై దాడులు, హత్యలు జరగడం అత్యంత బాధాకరమని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాది సయ్యద్ ముస్తాబా అలీపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదులతో పాటు మహిళా జూనియర్ న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి కోర్టుకు నుంచి బయటకు ర్యాలీగా వెళ్లి ముఖద్వారం వద్ద నిరసన తెలిపారు. ఆ తర్వాత కోర్టు నుంచి ర్యాలీగా తెలంగాణ కూడలి వరకు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులపై దాడులు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్రావు, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, వెంకట్రావు, నాగోజీ, ఎన్పీ వెంకటేష్, ఉమామహేశ్వరి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
నాణ్యతగా ఉన్నవిసరఫరా చేయాలి
ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లలను నాణ్యతగా సరఫ రా చేయాలి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తీవ్రంగా నష్టపోతున్నాం. గత సంవత్సరం పంపిణీ చేసిన చేప విత్తనా ల సైజు రాలేదు. పావు కేజీ నుంచి అర కేజీ మాత్రమే వచ్చింది. చేపపిల్లలను ఎ ప్పటికప్పుడు పరిశీలించిన తర్వాత పంపిణీ చేస్తే బాగుంటుంది. – జిల్లెల శేఖర్, మత్స్యకారుడు, పెద్దదర్పల్లి, హన్వాడ నాణ్యతపరిశీలించేపంపిణీ చేశాం చెరువుల్లో పంపిణీ చేసే సమయంలో పరిశీలించి తీసుకోమని చెబుతున్నాం. నాణ్యత చూసుకొని సంతృప్తి చెందాకే చేప పిల్లలు పంపిణీ చేశాం. టెండర్ ప్రక్రియ ద్వారా చేపపిల్లలు పంపిణీ చేశాం. – రాధారోహిణి, జిల్లా మత్స్యశాఖ అధికారి అర కేజీ కూడా పెరగలేదు.. గత సంవత్సరం చెరువుల్లో ప్రభుత్వం వదిలిన ఉచిత చేపపిల్లలు పెరగలేదు. సైజు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా చెరువులో పావు కేజీ నుంచి అర కేజీ లోపే చేపల సైజులో వృద్ధి వచ్చింది. చేప పిల్లలు నాణ్యతపై అనుమానాలున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న చేపపిల్లలను నాణ్యతగా సరఫరా చేయాలి. – వెంకటయ్య, కొత్తపేట మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు తీవ్రంగా నష్టపోతున్నాం.. చెరువుల్లో ప్రతి సంవత్సరం ఉచితంగా వదిలే చేప విత్తనాల నాణ్యతపై నిర్లక్ష్యం వహించడం సరికాదు. బాధ్యత కలిగిన ప్రభుత్వ యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గత సంవత్సరం వదిలిన చేప విత్తనాలు సైజు రాకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. – శ్రీకాంత్, హజిలాపూర్, నవాబ్పేట మండలం -
వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని భారత మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓ వైపు నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడు బతకలేని స్థాయిలో ఉంటే మరోవైపు గ్యాస్ ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. పేదలకు అందించే ఉజ్వల గ్యాస్ సిలిండర్పై కూడా రూ.50 పెంపు మోయలేని భారమేనన్నారు. అంబానీ, అదానీలకు ఆదాయం కట్టబెట్టడానికే ధరల పెంపని తేట తెల్లమవుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పడిపోతే.. దేశంలో మాత్రమే పెరిగిందని సాకు చూపుతూ ధరల పెంపు ఏ మాత్రం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా కార్యదర్శి గీత, కమిటీ సభ్యులు మాధవి, సత్యమ్మ, సింధు, పద్మ, మహిళలు పాల్గొన్నారు. -
విద్య, స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత
స్టేషన్ మహబూబ్నగర్: నియోజకవర్గంలో విద్య, స్కిల్ డెవలప్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్తో కలిసి ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో ప్రథమస్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో ‘మహబూబ్నగర్ ఫస్ట్’ పేరుతో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని, తక్కువ సమయంలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వస్తాయన్నారు. మహబూబ్నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేస్తామని తెలిపారు. టెట్, డీఎస్సీ, వీఆర్ఏ, వీఆర్ఓ, గ్రూప్స్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర గ్రంథాల య సంస్థ చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాలకు ఉచిత శిక్షణ ప్రారంభించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. మహబూబ్నగర్ ఫస్ట్ నవరత్నాలు ద్వారా 250 మంది మహిళలకు నైపుణ్య శిక్షణ నిర్వహించడం, మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకొని, రెండో బ్యాచ్ శిక్షణ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మహబూబ్నగర్ ఫస్ట్ కోచింగ్ సెంటర్ అడ్మిషన్ దరఖాస్తులను ఆవిష్కరించారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కోచింగ్ ఫ్యాకల్టీ రవికుమార్, గాలి బాల్రాజు, నాని యాదవ్, రాజేంద్రచారి పాల్గొన్నారు. -
జోరుగా ఉల్లి విక్రయాలు
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం ఉల్లి విక్రయాలు జోరుగా సాగాయి. బుధవారం ఈశ్వర వీరప్పయ్యస్వామి రథోత్సవం ఉండటంతో మార్కెట్కు సెలవు ప్రకటించగా.. ఒకరోజు ముందుగానే ఉల్లి వేలం నిర్వహించారు. సుమారు మూడు వేల బస్తాల ఉల్లి మార్కెట్కు రాగా.. నాణ్యమైన ఉల్లి ఎక్కడ ఉంటే అక్కడ కొనుగోలుదారుల సందడి కనిపించింది. ఇతర మార్కెట్ల నుంచి వచ్చిన వ్యాపారులు కూడా ఉల్లిని తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేశారు. నిలకడగా ధరలు.. మంగళవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగానే ఉన్నాయి. ఉదయం 10 గంటలకే వేలం ప్రారంభం కాగా క్వింటా గరిష్టంగా రూ.1,800.. కనిష్టంగా రూ.1,200 ధర పలికింది. మార్కెట్ నిబంధనలు సడలించిన తర్వాత బస్తా 50 కిలోలుగా నిర్ణయించారు. బస్తా ధర గరిష్టంగా రూ.900.. కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు. క్వింటా గరిష్టంగా రూ.1,800.. కనిష్టంగా రూ.1,200 -
డీఆర్ డిపోలకు పూర్వ వైభవం తెస్తాం
మన్ననూర్: రాష్ట్రంలోని గిరిజన కోఆపరేటివ్ సంస్థల (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీఆర్ డిపోలకు పూర్వ వైభవం తీసుకువస్తామని సంస్థ రాష్ట్ర చైర్మన్ కోట్నావత్ తిరుపతి అన్నారు. మంగళవారం మన్ననూర్లోని జీసీసీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను జీసీసీ మేనేజర్ సంతోష్కుమార్, చెంచు సంఘాల నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ ప్రాంతంలోని చెంచులు కనీస జీవనోపాదులు లేక తీవ్ర ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్నారన్నారు. గతంలో జీసీసీ ఈ ప్రాంతంతోపాటు పరిసర జిల్లాల్లో కూడా ఎంతో ప్రాధాన్యతలో కార్యక్రమాలు ఉండేవని వివరించారు. కొంతకాలంగా అటవీ ఉత్పత్తులు లేక చెంచులు జీవనోపాధి కోల్పోయి ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం, ఇతర ఉచిత పథకాలపై ఆధారపడి జీవనం గడుపుతున్నారని వాపోయారు. దక్షిణ తెలంగాణ అమరనాథ్ యాత్రగా చెప్పుకునే సలేశ్వరం ఉత్సవాలను కనీసం 5 రోజులు నిర్వహించుకునే విధంగా అవకాశం కల్పించాలని స్థానికులు కోరారు. అదేవిధంగా సంస్థలో ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా ఇప్పించాలని రిటైర్డ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. అనంతరం చెంచు సేవా సంఘం నాయకులు శంకరయ్య, రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ఎంఏ రహీం, వెంకటరమణ, గోపాల్నాయక్ శాలువా, పూలబోకెతో ఆయనను ఘనంగా సన్మానించారు. -
రిజర్వాయర్ భూసర్వేను అడ్డుకున్న రైతులు
బల్మూర్: మండలంలోని బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ఉమామహేశ్వర ప్రాజెక్టు సర్వే పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. రైతుల అభిప్రాయ సేకరణ లేకుండా తమకు నష్టం కలిగించే ప్రాజెక్టుపై ఏడాదిగా పోరాటం చేస్తున్న తమతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం చర్చించకుండా పరిహారాలు ఇవ్వకుండానే భూసర్వే చేయడం ఏమిటని వారు సర్వే సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈసందర్భంగా మైలారం–అంబగిరి రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంపై కోర్టులో కేసు ఉన్న కూడా నిబంధనలు పాటించకుండా సర్వే చేయడంపై రైతులు మండిపడ్డారు. గతంలో రెండు సార్లు సర్వే పనులను అడ్డుకున్నా మళ్లీ సర్వే చేయడం తగదని, మరోసారి సర్వేకు వస్తే దాడులు తప్పవని రైతులు సర్వే సిబ్బందిని హెచ్చరించారు. దీంతో సర్వే సిబ్బంది వెనుదిరిగారు. కార్యక్రమంలో రైతు నాయకులు తిరుపతయ్య, శివశంకర్, కృష్ణయ్య, రాజేష్, కాగుల మల్లయ్య, శ్రీశైలం,తో పాటు బల్మూర్, అనంతవరం గ్రామానికి చెందిన భూనిర్వాసిత రైతులు పాల్గొన్నారు. సర్వే సిబ్బందితో వాగ్వాదం మరో సర్వేకు వస్తే దాడులు తప్పవు: రైతులు -
కనులపండువగా పూల రథోత్సవం
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంగళవారం తెల్లవారుజామునా పూల రఽథోత్సవం(చిన్నతేరు) కనులపండువగా సాగింది. ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ అంజనేయులు, మేనేజర్ నిరంజన్ అర్చకులు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిథులు, భక్తులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై దత్తాత్రేయ గుడి, ముక్కిండి పోచమ్మ, మైసమ్మ దేవాలయాలను దర్శించుకొని నైవేద్యం సమర్పించారు. మేళతాళాలు, భజనలు, భక్తుల శ్రీరామనామస్మరణతో రథం ముందుకు సాగింది. రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు క్యూలైన్ద్వార స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు మురళిధర్ శర్మ, లక్ష్మణ్ శర్మ,వేణు శర్మ, ఆనంద్ శర్మ, గోపి శర్మ, భాస్కర్ శర్మ, ప్రవీణ్ శర్మ భక్తులు పాల్గొన్నారు. నేటి రాత్రి పెద్ద రథోత్సవం బుధవారం అర్ధరాత్రి దాటాక పెద్ద రథోత్సవం ప్రారంభమవుతుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై రథోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఆలయ ఈఓ ఆంజనేయులు తెలిపారు. అర్చకుల ప్రత్యేక పూజలు పోటెత్తిన భక్తులు -
ఊర చెరువులో మొసలి
వీపనగండ్ల: మండల కేంద్రం సమీపంలో ఉన్న ఊరచెరువులో మొసలి సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తరచూ బయటకు వస్తుండటంతో అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారు. అధికారులు స్పందించి చెరువు నుంచి తరలించడంతో పాటు హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. కారులో మంటలు గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగిన ఘటన మంగళవారం ఉదయం పట్టణంలో చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది, బాధితుడి కథనం మేరకు.. పట్టణంలోని వీవర్స్కాలనీకి చెందిన కిరణ్కుమార్రెడ్డి ఉదయం కారును బయటకు తీసే క్రమంలో ఇంజిన్ నుంచి మంటలు వచ్చా యి. గుర్తించిన యజమాని మంటలను అ దుపు చేసేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచా రం ఇచ్చారు. దీంతో ఘటనస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసు కొచ్చారు. షార్ట్సర్క్యూట్తోనే ప్రమా దం జరిగి ఉండొచ్చని ఫైర్సిబ్బంది తెలిపారు. పంటకు పురుగు మందు కొట్టి.. రైతు మృతి నవాబుపేట: పంటకు పురుగు మందు కొట్టిన అస్వస్థతకు గురైన ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని లోకిరేవు గ్రామానికి చెందిన రైతు కావలి సత్తయ్య(46) ఈ నెల 3న తన ిపొలంలో పంటకు పురుగు మందు పిచికారీ చేశాడు. రోజంతా పురుగు మందు కొట్టి అస్వస్థతకు గురై పొలం చెంతనే పడిపోయాడు. దీంతో చుట్టుపక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులతో కలిసి 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది కోలుకోవడంతో 5న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చాడు. అయితే మరుసటి రోజు మరోసారి అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స ిపొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ ఘటనపై సత్తయ్య కుమారుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. వ్యక్తి మృతదేహం లభ్యం అలంపూర్: పట్టణంలోని వంతెన సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున నంద్యాల జిల్లా బనగానపల్లికి చెందిన ఆదిత్య శశాంక్ (33) మృతదేహం మంగళవారం లభ్యమైందని ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించామన్నారు. తల్లి అనాథ శరణాలయంలో ఉందని.. ఇద్దరు అక్కలు ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ఘటన స్థలాన్ని సీఐ రవిబాబు పరిశీలించారు. -
బస్సు, బైక్ ఢీ : ఒకరి దుర్మరణం
వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ స్టేజీ వద్ద హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై మంగళవారం బస్సు, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. ఆయన కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటకు చెందిన కింగ్లీకార్ ప్రవీణ్ కుమార్(40), అతడి స్నేహితుడు గోపికృష్ణ పెద్దాపూర్లో ఉన్న స్వామి గురూజీని కలవడానికి బైక్పై వస్తున్నారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న అచ్చంపేట డిపోకు చెందిన బస్సు పెద్దాపూర్ స్టేజీ వద్ద నిలిచిన బస్సును దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవీణ్కుమార్, గోపికృష్ణకు గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్కుమార్ మృతిచెందాడు. భార్య అక్షర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వివరించారు. గోపీకృష్ణ మిఠాయి దుకాణంలో పనిచేస్తుండగా.. ప్రవీణ్కుమార్ బడంగ్పేటలో మటన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మహిళ బలవన్మరణం రాజోళి: కుటుంబ సమస్యలతో ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జగదీశ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన కటిక లలితాబాయి (58)కి ఇద్దరు కుమా ర్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త చంద్రారావు మానసికంగా సక్రమంగా లేకపోవడం, కుమారులకు వివాహాలు కాక పోవడం, వ్యాపారాలు సాగకపోవడంతో మనోవేదనకు గురై సోమవారం రాత్రి పురుగుమందు తాగింది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెద్ద కుమారుడు కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మదనాపురం: తల్లి గొడ్డలితో దాడి చేయగా గాయపడ్డ కొడుకు చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు సీఐ శివకుమార్ తెలిపారు. వివరాలు.. మండలంలోని అజ్జకొల్లు గ్రామానికి చెందిన కోటకొండ బాలకృష్ణ (35) పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఏడాదిగా బాలకృష్ణ బదులు తల్లి లక్ష్మి పనిచేస్తుంది. ఈ నెల జీతం కుమారుడు ఖాతాలో పడింది. 3వ తేదీన డబ్బులు ఇవ్వమని లక్ష్మి కొడుకును కోరింది. దీంతో తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. లక్ష్మి గొడ్డలితో కొడుకుపై దాడి చేసింది. చిన్నకుమారుడు రవి హుటాహుటిన బాలకృష్ణను వనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఖిల్లాఘనపురంలో బాలిక.. ఖిల్లాఘనపురం: మండల కేంద్రానికి చెందిన సుష్మ(10) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ సురేశ్గౌడ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన అక్కి శ్రీశైలంకు సుష్మ (10), నిశిత కుమార్తెలు. వీరిద్దరు ఈ నెల 6న గొర్రెలు మేపుతుండగా.. సుష్మ అకస్మాత్తుగా కూలిపడి నోటిలో నుంచి నురగ వచ్చింది. గుర్తించిన నిశిత వెంటనే తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆయన వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి అటు నుంచి మహబూబ్నగర్, హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందింది. విష పురుగు కరిచి తమ కుమార్తె మృతి చెందిందని తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. గుర్తుతెలియని జంతువు దాడిలో ఆవు మృతి ధరూరు : మండలంలోని మార్లబీడుకి చెందిన రైతు బాయిదొడ్డి రాజుకు చెందిన ఆవుపై ఓ గుర్తు తెలియని జంతువు దాడి చేయగా మృతిచెందింది. బాధితుడు తెలిపిన వివరాలు.. మార్లబీడుకి చెందిన రైతు బాయిదొడ్డి రాజు పొలం ధరూరు గట్టు శివారులో ఉంటుంది. పశువులను అక్కడే కట్టేసిన రైతు మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా.. ఆవు గొంతు భాగం రక్తగాయాలతో కనిపించింది. దీంతో రైతు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించగా వారు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనఊపిరితో ఉన్న ఆవు మధ్యాహ్నం మృతిచెందింది. బాధిత రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు రాఘవేంద్ర, మార్లబీడు గ్రామస్తులు కోరారు. -
46 రోజులుగా శ్రమిస్తున్నారు..
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం లోపల సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగం పైకప్పు కూలిన ఘటన జరిగి మంగళవారం నాటికి 46 రోజులు గడవగా.. సొరంగం లోపల మట్టి, బురద, రాళ్లు, టీబీఎం బాగాల తొలగింపు పనులు వేగవంతమయ్యాయి. అలాగే ఎప్పటికప్పుడు వెంటిలేషన్ పనులు చేపడుతున్నారు. మంగళవారం రాత్రి షిఫ్ట్కు వెళ్లిన సహాయక సిబ్బంది కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం 13.730 కి.మీ., వరకు కన్వేయర్ బెల్టు ఉండగా మరో 70 మీటర్ల మేర దీనిని పొడిగించనున్నారు. ఈ నెల 11 వరకు నాలుగు రోజుల పాటు కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు కొనసాగనుండగా.. ఈ సమయంలో మట్టి, బురద బయటకు తరలించడం సాధ్యం కాదు. కన్వేయర్ బెల్టు పొడిగింపు ఇదే చివరి అవకాశంగా అధికారులు చెబుతున్నారు. తొలగించిన టీబీఎం బాగాలు, రాళ్లు, శిథిలాలను లోకో ట్రైన్ ప్లాట్ఫాం ద్వారా బయటకు తరలిస్తారు. మిగిలిన 70 మీటర్ల వరకు ఉన్న శిథిలాలను ఈ నెల 16 వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నాయి. సొరంగం పైకప్పు కూలిన 13.938 కి.మీ., ప్రదేశం అత్యంత ప్రమాదకరమైనదిగా నిర్ధారించి 45 మీటర్ల వరకు కంచె ఏర్పాటు చేశారు. అక్కడ తవ్వకాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో మిగిలిన 70 మీటర్ల వరకు ఉన్న మట్టి, బురద, రాళ్లు, టీబీఎం బాగాలను తొలగించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. వెంటిలేషన్ కొనసాగింపు.. సొరంగం లోపల మట్టి తవ్వకాలకు అనుగుణంగా వెంటిలేషన్ పనులు కొనసాగిస్తున్నారని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. మంగళవారం ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాద ప్రదేశంలో ఎలాంటి చర్యలు చేపట్టకుండా మిగిలిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఐదు ఎస్కవేటర్ల సహాయంతో మట్టి తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్టు ద్వారా మట్టి బయటకు తరలిస్తున్నామని చెప్పారు. సొరంగంలో నిరంతరాయంగా వస్తున్న నీటి ఊటను అత్యధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా బయటకు పంపింగ్ చేస్తున్నామన్నారు. మరోసారి కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు ప్రారంభం ఈ నెల 16 వరకు 70 మీటర్ల శిథిలాలు తొలగించేలా ముందుకు.. ఎస్ఎల్బీసీలో ముమ్మరంగా సహాయక చర్యలు -
రెట్టింపు లాభాలొచ్చే పరిశోధనలు రావాలి
బిజినేపల్లి : వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా రైతులకు రెట్టింపు లాభాలు అందించేలా పరిశోధనలు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధనలు, విస్తరణ సలహా సంఘం చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడారు. పరిశోధనల ద్వారా సత్ఫలితాలిచ్చిన మేలు రకం పంటలను రైతులకు అందించాలని, సరైన యాజమాన్య పద్ధతులను వారికి సకాలంలో వివరించి దిగుబడులు పెంచాలన్నారు. వాణిజ్య పంటలనే కాకుండా ధాన్యం పంటలను రైతులు సాగు చేసేలా చూడాలన్నారు. పీజేటీఏయూ పరిశోధన సంచాలకులు డా.ఎం.బలరాం మాట్లాడుతూ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆహార పంటలు, పప్పు దినుసులు, నూనెగింజల పంటలు అధికంగా పండిస్తారని అన్నారు. గత సంవత్సరం సాగులో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ విశ్వ విద్యాలయం అధిక దిగుబడుల్ని, చీడపీడలను తట్టుకునే వంగడాలను సృష్టించాలన్నారు. స్వల్పకాల పరిమితి రకాలను వృద్ధి చేయాలన్నారు. విస్తరణ సంచాలకులు డా.యం.యాకాద్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పద్ధతులను, సమాచారాన్ని వివిధ రకాల వినూత్న కార్యక్రమాలను చేపడుతూ రైతులకు సమయానుసారంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో పాలెం ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డా.సుధాకర్, శాస్త్రవేత్తలు సూచరిత, రామాంజనేయులు, ప్రభాకర్రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ దక్షిణ తెలంగాణలో పప్పు దినుసులు, నూనెగింజల సాగు అధికం: పీజేటీఏయూ పరిశోధన సంచాలకులు డా.ఎం.బలరాం -
జనం నెత్తిన గుదిబండ
మహబూబ్నగర్ రూరల్: ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గృహవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.858.50 ఉండగా, రూ.50 పెంపుతో ఇక రూ.908.50కు చేరనుంది. జిల్లావ్యాప్తంగా ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఆయిల్ కంపెనీలకు చెందిన 18 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 2,55,837 వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ప్రతి నెల ఒక్కో సిలిండర్ తీసుకున్నా.. పెంచిన గ్యాస్ సిలిండర్ ధర వల్ల జిల్లా వినియోగదారులపై దాదాపు రూ.1,27,91,850 అదనపు భారం పడనుంది. ఏడాదికి రూ.15.35 కోట్ల అదనపు భారం పడుతుంది. మరోవైపు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు రవాణా చార్జీల పేరిట వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీలు 5 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా డోర్ డెలివరీ చేయాలి. 30 కిలోమీటర్ల లోపు రూ.10 వసూలు చేయాలి. కానీ డెలవరీ బాయ్ సిలిండర్కు అదనంగా రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం ఎల్పీజీ గ్యాస్ ధర రూ.908.50 డెలవరీ బాయ్ చార్జీలు కలుపుకుంటే రూ.950కి చేరుతుంది. గ్యాస్ సబ్సిడీ సిలిండర్పై రూ.50 పెంపు రవాణా చార్జీల పేరిట అదనపు దోపిడీ జిల్లా వినియోగదారులపై ప్రతినెలా రూ.1.27 కోట్ల భారం -
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ను వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మండల ప్రత్యేకాధికారులు ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి ఎక్కడైనా సమస్యలు, నిధుల అవసరం ఉంటే ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరాపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. రేషన్దుకాణాల ద్వారా ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తోంది, మండల ప్రత్యేక అధికారులు రేషన్షాపులను పర్యవేక్షించాలని, లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం సరఫరా చేస్తున్నందున పేదలు పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. దిశ సమావేశం ఈనెల 16న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అధ్యక్షతన నిర్వహించనున్నందున కేంద్ర పథకాలు అమలుపై ఆయా శాఖలు పథకాలు ప్రగతిపై నోట్స్ అంద చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ఆరోగ్యకర ఆరంభం ఆశాజనక భవిష్యత్ అనే అంశంపై నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లి గర్భంలో పుట్ట బోయే శిశువు నుంచి శిశువు పుట్టే వరకు తల్లి, శిశువు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. మాతా, శిశు మరణాలను నివారించాలన్నారు. -
వేసవి శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ, జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేనెల 1 నుంచి 31వ తేదీ వరకు వివిధ క్రీడాంశాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ ఎస్.శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడా శిక్షణా శిబిరాల ను నిర్వహించేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ క్రీడాకారులైతే కనీసం జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఉండాలని తెలిపారు. ఆసక్తిగలవారు తమ దరఖాస్తులను ఈనెల 22వ తేదీ వరకు జిల్లాకేంద్రంలోని యువజన, క్రీడాశాఖ కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా అందజేయాలని కోరారు. మిగతా వివరాల కోసం 9440656162, 9912564056 నంబర్లను సంప్రదించాలని సూచించారు. సరైన ఆహారంతోనే ఆరోగ్యం కాపాడుకోవాలి పాలమూరు: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం వల్ల జీవన ప్రమాణం పెరుగుతుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర ఏర్పాటు చేసిన ర్యాలీని డీఎంహెచ్ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఆరోగ్యకరమైన ఆరంభాలు–ఆశాజనక భవితవ్యాలు అనే అంశంపై అవగాహన పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుందని తెలిపారు. తల్లి గర్భంలో ఉండే శిశువు దగ్గరి నుంచి పుట్టిన శిశువు వరకు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు తెలియ చెప్పాలన్నారు. నవజాత శిశువులకు తప్పక టీకాలు ఇప్పించాలని, పరిశుభ్రత, పోషకాహారం, ఎదుగుదల వంటి అంశాలపై వివరించాలన్నారు. దీర్ఘకాలిక రోగాల బారినపడకుండా ఉండటానికి ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి అధికంగా తీసుకోవాలన్నారు. ప్రధానంగా నిత్యం వాకింగ్ చేయడం వల్ల కొత్త రోగాలు శరీరంలోకి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు. అనంతరం క్షయ బాధితులకు పోషక కిట్లను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్ నాయక్, మంజుల, శరత్చంద్ర, ప్రవీణ్, రాజగోపాలచారి పాల్గొన్నారు. సమతుల్య ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం జడ్చర్ల: సమతుల్య ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక సీనియర్ సిటిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారంతో పాటు యోగా, వాకింగ్ అలవర్చుకోవాలని సూచించారు. ఎప్పటికప్పడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సలహాలు తీసుకుంటూ కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆత్మీయులతో కలిసి ఆహ్లాదకరంగా జీవితాన్ని గడపాలని కోరారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఇందిర, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సంపత్కుమార్, డాక్టర్ శ్వేత,డాక్టర్ సౌమ్య, పాల్గొన్నారు. అండర్–19 క్రికెట్ చాంపియన్షిప్ రద్దు? మహబూబ్నగర్ క్రీడలు: అండర్–19 క్రికెట్ చాంపియన్షిప్ రద్దయినట్లు సమాచారం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఎస్జీఎఫ్ అండర్–19 బాలుర క్రికెట్ చాంపియన్షిప్ను మహబూబ్నగర్లో ఈనెల 25వ తేదీ నుంచి 29 వరకు నిర్వహించేలా నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వల్ల టోర్నీని రద్దు చేస్తూ ఎస్జీఎఫ్ఐ సీఈఓ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. జిల్లాకేంద్రంలో వర్షం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో సోమవారం మధ్యాహ్నం అరగంట పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండ.. ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. ఒక్కసారిగా వర్షం రావడంతో వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. -
రెగ్యులర్ ‘రగడ’..!
పీయూలో జీఓ 21 లొల్లి●మాకు న్యాయం చేయాలి.. ప్రభుత్వం జీఓ నంబర్ 21ని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన హామీలో భాగంగా డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. కానీ పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించలేదు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వం ఇప్పటికై నా పీయూలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించేలా న్యాయం చేయాలి. ఆ తర్వాత మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలి. – రవికుమార్, పీయూ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.. యూనివర్సిటీ ప్రారంభం నుంచి పీయూలో లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం. అయినా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. 2016లో రెగ్యులర్ పోస్టుల్లో సీనియర్లను పక్కన బెట్టి భర్తీ చేశారు. ఉద్యోగ విరమణకు దగ్గరగా వస్తున్నాం. వెంటనే ప్రభుత్వం జీఓ 21ను రద్దు చేసి క్రమబ ద్ధీకరించాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నిరసనలు తీవ్రతరం చేస్తాం. – భూమయ్య, పీయూ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితి వస్తే కొత్త కోర్సులు, పీజీ సెంటర్లలో సర్దుబాటు చేస్తాం. ఎవరిని తొలగించాలనే ఉద్దేశం లేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ న్యాయం చేసేలా నా వంతు కృషి చేస్తా. – శ్రీనివాస్, వీసీ, పాలమూరు యూనివర్సిటీ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : పాలమూరు యూనివర్సిటీలో లొల్లి రాజుకుంది. విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల శాశ్వత భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 21 కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లలో అలజడి సృష్టిస్తుండగా.. రగడ మొదలైంది. దశలవారీగా తమను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని.. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే శాశ్వత నియామకాలు చేపట్టాలంటూ సోమవారం వారు ప్రత్యక్ష పోరుకు శ్రీకారం చుట్టారు. గత తొలగింపుల నేపథ్యంలో.. పీయూలో చివరిసారిగా 2014లో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే భర్తీ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు 2016లో రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు జరిగాయి. ఆంగ్ల విభాగంలో ఇద్దరు, తెలుగులో ముగ్గురు, కెమిస్ట్రీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, మైక్రోబయాలజీ విభాగాల్లో ఒక్కొక్కరిని చొప్పున మొత్తం తొమ్మిది మంది అధ్యాపకులను తీసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించారు. దీంతో సీనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుడు భూమయ్య తదితరులు ఆందోళనలు చేపట్టారు. అనంతరం వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రాతిపాదికన అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతుండడం.. గతంలో జరిగిన తొలగింపుల నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు అభద్రతా భావానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అనుభవానికి వెయిటేజీ ఇస్తున్నా.. నూతనంగా నియామకాలను మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో 50 మార్కులు.. వీసీ, ఉన్నత విద్యామండలి సభ్యుడు, బోర్డు ఆఫ్ స్డడీస్ చైర్మన్, హెచ్ఓడీ కన్వీనర్గా ఉండే స్క్రూట్నీ కమిటీ పలు కొలమానాల ఆధారంగా మార్కులు కేటాయించనుంది. రెండో దశలో మొత్తం 30 మార్కులు.. ఇందులో బోధనానుభవం ఉన్న వారికి ఒక్క సంవత్సరానికి ఒక్క మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు, డెమోకు 10 మార్కులు, పుస్తక రచన, రీసెర్చ్ ఫెల్లోషిప్ ఇలా మొత్తం 10 మార్కులు కేటాయించనున్నట్లు సమాచారం. మూడో దశలో ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించనున్నారు. మొత్తంగా 100 మార్కులకు సంబంధించి అత్యధిక మార్కులు సాధించిన వారికి మాత్రమే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. నియామకాల్లో అనుభవానికి వెయిటేజీ ఇస్తున్న క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే అంతా సవ్యంగా జరుగుతుందా? గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని.. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలో 22 పోస్టులకు నోటిఫికేషన్.. యూనివర్సిటీలో ప్రస్తుతం 16 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 93 మంది కాంట్రాక్ట్, 60 మంది పార్ట్టైం ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. పీయూలో మొత్తం 58 రెగ్యులర్ పోస్టులు కాగా.. గతంలో 16 భర్తీ చేశారు. ఇవి పోను 42 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో కనీసం 22 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి.. భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీయూలో ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తే.. ఆయా విభాగాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. శాశ్వత నియామకాలపై కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల్లో ఆందోళన దశల వారీగా తమను తొలగిస్తారని బెంబేలు.. పోరుబాటకు శ్రీకారం వీసీకి వినతి.. యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రభుత్వ ఉత్తర్వు కాపీల దహనం డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో క్రమబద్ధీకరణ తమకు వర్తించదా అంటూ నిరసన గళం ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ మేమెందుకు అర్హులం కాదు ? ఇటీవల డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అర్హత ఉన్న అధ్యాపకులను ప్రభుత్వం రెగ్యులర్ చేసిన విషయం తెలిసిందే. పీయూ ఏర్పాటైనప్పటి నుంచి లెక్చరర్లుగా పనిచేస్తున్నామని.. అయినా తమను క్రమబద్ధీకరించపోవడం అన్యాయమని కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమెందుకు అర్హులం కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీయూ వైస్చాన్స్లర్ శ్రీనివాస్, నూతన రిజిస్ట్రార్ రమేష్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాము ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం ప్రాతిపదికన లెక్చరర్లుగా చేస్తున్నామని.. తమను రెగ్యులర్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టుల భర్త్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పీయూలోని అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద జీఓ 21 ప్రతులను దహనం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
మినీ ట్యాంక్బండ్పై అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ వద్ద అన్ని సౌకర్యాలు కల్పి స్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ముడా ఆధ్వర్యంలో సుమా రు రూ.50 లక్షలతో ఏర్పాటుచేసే విద్యుత్ దీపాలకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మినీ ట్యాంక్బండ్ను రూ.రెండు కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందులో సైకిల్ట్రాక్, నడక దారి, గ్రీనరీకి రూ.1.50 కోట్లు కేటాయించామన్నారు. రెండు నెలలలోగా మినీ ట్యాంక్బండ్ను అన్ని హంగులతో అందుబాటులోకి తెస్తామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నగర ప్రజలకు విజిటింగ్ స్పాట్గా మారుస్తామన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో నిధుల లేమితో అభివృద్ధి మధ్యలోనే ఆగిపోయిందన్నారు. సాయంత్రం వేళ ఇక్కడికి వచ్చి సేదతీరే వారికి, రాత్రివేళ ఈ దారిలో వెళ్లే బాటసారులు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలు ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్కుమార్గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, నాయకులు సిరా జ్ఖాద్రీ, సీజే బెన్హర్, అవేజ్, అజ్మత్అలీ, శా ంతయ్యయాదవ్, ఖాజాపాషా, మునీరొద్దీన్, మోసిన్, ఉమర్ ఫరూఖ్, అంజద్, తదితరులు పాల్గొన్నారు. -
నేడు మార్కెట్లో లావాదేవీలు
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం యథావిధిగా లావాదేవీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో సెలవుల కారణంగా మార్కెట్ బంద్ చేశారు. సోమవారం మధ్యాహ్నం మార్కెట్ కార్యాలయంలో ధాన్యం టెండర్లు వేసి ధరలు నిర్ణయిస్తారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం కావడంతో రైతులు పెద్దఎత్తున వరి ధాన్యం అమ్మకానికి తెస్తున్నారు. రేపు సర్వసభ్య సమావేశం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలోని తమ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు ఎన్జీవోల కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి పద్మావతికాలనీ, శ్రీనివాసకాలనీలలో ఉంటున్న గృహ, ప్లాట్ల యజమానులు తప్పక హాజరు కావాలని ఆయన విజ్ఞపి చేశారు. హ్యాండ్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు మహబూబ్నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రంలో మంగళవారం నుంచి శనివారం వరకు జరిగే జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. సాయి వివేక్, ఎండీ నవాజ్ తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి ఎంపికపై సంఘం సభ్యులు రజనీకాంత్రెడ్డి, ఎండీ జియావుద్దీన్, ఎండీ అహ్మద్ హుస్సేన్, కోచ్ ప్రదీప్కుమార్, పీఈటీ ప్రణయ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఆరోగ్యమే.. ఆనందం ● జిల్లాలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ● 35 నుంచి 50 ఏళ్లలోపు వారే అధికం ● జీవన విధానం, ఆహారంలో మార్పులే కారణం ● నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం -
పరవశించిన పాలమూరు
స్టేషన్ మహబూబ్నగర్: శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం పాలమూరు పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ఆలయాల్లో కల్యాణ ఘట్టాలతో పాలమూరు పరవశించిపోయింది. అర్చకులు, వేదపండితులు సీతారాముల వివాహ ఘట్టాలను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తూ కల్యాణతంతు జరిపించగా భక్తులు ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలారు. ప్రధానంగా జిల్లాకేంద్రం టీచర్స్కాలనీలోని రామాలయం, బీకేరెడ్డి (శేషాద్రినగర్)లోగల శివాంజనేయస్వామి, లక్ష్మీనగర్కాలనీలోని అభయాంజనేయస్వామి, పంచముఖి ఆంజనేయస్వామి, ద్వారకామాయి షిరిడీసాయి, రాంమందిర్ చౌరస్తా, తూర్పు కమాన్ వద్ద సీతారామాంజనేయస్వామి, సింహగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణం జరిపించారు. ఏనుగొండలోని సాగర్కాలనీ, టీడీగుట్ట తిరుమలనాథస్వామి, రామాంజనేయాలయం, బాలాజీనగర్, నాగేంద్రనగర్, షాసాబ్గుట్ట, న్యూమోతీనగర్ ఆంజనేయస్వామి ఆలయాల్లో, వెంకటేశ్వరకాలనీ హయగ్రీవాలయంలో కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. సీతారాముల కల్యాణానికి హాజరైన భక్తులు -
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం
పాలమూరు: క్షేత్రస్థాయిలో పార్టీ ఎంతో బలపడటంతోపాటు తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదట ఎంపీ నివాసంలో నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డితో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి.. పార్టీ వ్యవస్థాపకుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 25 వరకు చేపట్టబోయే కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు ప్రతిఒక్కరూ పాల్గొనాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గాంవ్ చలో– బస్తీ చలో పేరుతో ఊరూరా ప్రత్యేక కార్యక్రమం, ఈ నెల 13 నుంచి 25 వరకు అంబేడ్కర్ సంయాన్ అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 13న ప్రతి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహాన్ని శుభ్రం చేయడం, 14న విగ్రహాల దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలన్నారు. దేశ చరిత్రలో కీలక ఘట్టం వక్ఫ్ సవరణ బిల్లు చట్టరూపం దాల్చడం దేశ చరిత్రలో మరో కీలక ఘట్టమని, దేశంలో వేలాది మంది వక్ఫ్ బాధితులకు న్యాయం జరుగుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ కార్యాలయం దగ్గర ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలో వక్ఫ్ పేరుతో లిటిగేషన్లో ఉన్న వేలాది ఎకరాల భూములకు రిలీఫ్ రాబోతుందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుతో మైనార్టీల ఆస్తులు, మసీద్లు, కబ్రస్తాన్లు తీసుకుంటారని జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. వక్ఫ్ పేరుతో జరిగిన మోసాలకు ఈ చట్టం చెక్ పెడుతుందన్నారు. ఇకపై అసలైన మైనార్టీ మహిళలు, వితంతువులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పద్మజారెడ్డి, జయశ్రీ, పాండురంగారెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి, రాజేందర్రెడ్డి, బాలరాజు పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు సన్నద్ధం
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. మొదట కోసిన రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు అమ్మకాలు చేస్తుండగా.. సన్నరకం వేసిన రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాల కోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వం దొడ్డు ర కం ధాన్యం కంటే సన్న రకాలకు ప్రాధాన్యం ఇస్తూ క్వింటాల్కు అదనంగా రూ.500 బోనస్ ఇస్తుండటంతో యాసంగి సీజన్లోనూ సన్నాలే సేద్యం చేశారు. అయితే ఈసారి యాసంగి ధాన్యం కొనుగోళ్లలో మహిళా గ్రూపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్ని మండలాల పరిధిలో సహకార సంఘాల మా దిరిగానే మహిళా గ్రూపులతో కొనుగోలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వారికి అవకాశం కల్పించి సంఘాలను మరింత బలోపేతం చేయనున్నారు. దీనికితోడు పీఏసీఎస్ల ద్వారా కొనుగోలు చేయడం వల్ల ప్రతి సీజన్లో ఇబ్బందులు ఎదురుకావడంతోపాటు క్వింటాల్కు ఎక్కువ మొత్తంలో తరుగు తీస్తున్నారనే ఆరోపణలు రావడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. ఈసారి కూడా.. ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వ యంత్రాంగం రైతుల వద్ద నుంచి ఏ– గ్రేడ్ ధాన్యం మద్దతు ధర క్వింటాల్కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 నిర్ణయించారు. గత సీజన్లో ప్రభుత్వం చెల్లించే ధర కంటే వ్యాపారులే అధిక ధర కల్పించడంతో వానాకాలం ధాన్యాన్ని ఎక్కువగా రైతులు వారికే విక్రయించారు. యాసంగిలో సైతం ధర ఎక్కువగా చెల్లించే వారికే రైతులు వరి ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా.. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిచి మద్దతు ధర పలకదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకూ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో అదనంగా టార్ఫాలిన్లు నిల్వ చేస్తున్నారు. కేంద్రాల్లో ఎక్కువగా ధాన్యం నిల్వలు ఉండకుండా ఎప్పటికప్పుడు రవాణా చేసేందుకు వీలుగా సరిపడా వాహనాలను ఏర్పాటు చేశారు. రైతులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే మొదలుపెట్టారు. సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లాలో 188 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. 1.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించాం. సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. అలాగే అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తాం. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. – రవినాయక్, మేనేజర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ బోనస్ కోసం.. ఆరు ఎకరాల పొలంలో ఆర్ఎన్ఆర్ సన్న రకం వరి పంట సాగు చేశా. పది రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకు చాలామంది రైతుల పొలాల్లో వరి గింజలు నేలరాలి నష్టపోయారు. అకాల వర్షాలు, మబ్బులు భయపెడుతుండటంతో రైతులు కోతలు మొదలుపెట్టారు. ఇప్పటికే కొంతమంది వ్యాపారులకు అమ్మకాలు చేస్తుండగా.. మరికొంత మంది కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు. చాలా మంది రైతులు బోనస్ కోసం కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు ఆగాం. – పెద్దబావి కుర్మయ్య, రైతు, చౌదర్పల్లి, మహబూబ్నగర్ రూరల్జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు నేటి నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం ఈసారి కొనుగోళ్లలో మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇప్పటికే మొదలైన కోతలు.. వ్యాపారులకు అమ్మకం గతేడాది అత్యధికంగా ప్రైవేట్లోనే విక్రయం -
చిన్నారులకు కంటి పరీక్షలు
పాలమూరు: జిల్లాలో 0– 6 ఏళ్లలోపు చిన్నారుల్లో కంటిచూపు సమస్యలు తెలుసుకోవడానికి సోమవారం నుంచి 70రోజుల పాటు ప్రత్యేక కంటి పరీక్షల క్యాంపులు నిర్వహించడానికి వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక బృందాలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని 1,163 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఆరేళ్లలోపు బాలబాలికలు 51,772 మంది ఉన్నట్లు నిర్ధారించారు. గుర్తించిన చిన్నారులందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయడానికి ఆరోగ్య శాఖ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆర్బీఎస్కే నుంచి ఏడు మొబైల్ హెల్త్ టీంల ద్వారా ప్రతిరోజు బృందాలు అంగన్వాడీ కేంద్రాలు సందర్శించి స్థానికంగా ఉండే చిన్నారులకు కంటి పరీక్షలు చేయనున్నారు. ఒక్కో బృందం ప్రతిరోజు 120 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయాలనే లక్ష్యం కేటాయించారు. ప్రత్యేక పీఎంఓ టెక్నీషియన్స్ పరికరాల ద్వారా చిన్నారుల కళ్లను పరీక్షించనున్నారు. దీంట్లో కంటి సమస్యలు ఉన్నవారితోపాటు కంటి ఆపరేషన్ అవసరం ఉన్న చిన్నారులను గుర్తించి హైదరాబాద్ సరోజినిదేవి రాములమ్మ ఆస్పత్రిలో చికిత్స చేయనున్నారు. గతేడాది రెండు దశల్లో.. వైద్య, ఆరోగ్యశాఖ చేస్తున్న కంటి పరీక్షల విధానం వల్ల జిల్లాలో ఉన్న నిరుపేద చిన్నారులకు ఉపయోగకరంగా మారనుంది. ఆరేళ్లలోపు బాల, బాలికల్లో సాధారణంగా కంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి చిన్నారులను గుర్తించడానికి ఈ శిబిరాలు ఉపయోగపడనున్నాయి. గతేడాది 2024లో రెండు దశల్లో కంటి పరీక్షల విధానం నిర్వహించారు. మొదటి దశలో 12,674 మందికి పరీక్షలు చేసి 786 మందికి సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఇక రెండో దశలో 46,415 మంది చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించి 1,486 మందికి కంటి సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. ఎనిమిది రకాల సమస్యలు సాధారణంగా కంటికి సోకే వ్యాధుల జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితా ఆధారంగా వ్యాధి లక్షణాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ లక్షణాలతో ఏ వ్యాధితో బాధపడుతున్నారు అనే విషయం ఈ శిబిరాలలో తెలుస్తోంది. దీంట్లో మోతిబిందు, కార్నియల్ అంధత్వం, డయాబెటిక్ రెటినోపతి, గ్లుకోమా (నీటి కాసులు), మెల్లకన్ను దృష్టి మాంధ్యం, కండ్లకలక, విటమిన్ ఏ లోపం వంటి వాటిని గుర్తించి అవసరం అయిన వారికి చికిత్స లేకపోతే ఆపరేషన్ చేస్తారు. జిల్లాలోని 1,163 అంగన్వాడీల పరిధిలో 51,772 మంది గుర్తింపు నేటి నుంచి 70 రోజుల్లో స్క్రీనింగ్ పూర్తిచేయాలని యాక్షన్ ప్లాన్ -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
నవాబుపేట: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని కాకర్లపహాడ్లో చోటుచేసుకున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన మరిపల్లి కేశవులు(47) అనే వ్యక్తి శనివారం గ్రామ సమీపంలోని ఉంగరం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు, గ్రామస్తులు చెరువులో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం అతడు చెరువులో శవమై కనిపించాడు. మృతుడి కుమారుడు వెంకటేష్ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ.. ధన్వాడ: మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గౌడపోళ్ల అంజమ్మ(45) చికిత్స పొందుతూ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మరికల్ మండలానికి చెందిన అంజమ్మ తన కుమారుడితో కలిసి బైక్పై వస్తుండగా ధన్వాడలోని మోడల్ పాఠశాల సమీపంలో ఎదురుగా ఇంకో బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక అంజమ్మ ఆదివారం సుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందిందని ఎస్ఐ రమేష్ తెలిపారు. మురుగు కాల్వలో పడి యువకుడు.. కోడేరు: మురుగు కాల్వలో పడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన హరిజన మిద్దె మహేష్(18) ఆదివారం ఉదయం బయటికెళ్తుండగా పక్కన ఉన్న మురుగు కాల్వలో ప్రమాదవశాత్తు కాలుజారి పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పేకాట రాయుళ్ల అరెస్టు కల్వకుర్తి టౌన్: పట్టణంలోని హానుమాన్నగర్లోని ఓ ఇంట్లో పేకాటాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లుగా ఎస్ఐ మాధవరెడ్డి తెలిపా రు. వివరాలు.. పట్టణంలోని హానుమాన్ నగర్లోని ఓ వ్యక్తి ఆదివారం ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం అందింది. తనిఖీలు చేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.96,250 నగదు, ఆరు సెల్ఫోన్లు, పేక ముక్కలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్స్టేషన్కు చేరిన ప్రేమ వ్యవహరం పాన్గల్: ప్రేమ వ్యవహారం పోలీసుస్టేషన్కు చేరిన ఘటన ఆదివారం రాత్రి పాన్గల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రేమద్దులకు చెందిన నందిని(22), మహేందర్(29) ఇరువురు రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటన్నారు. అమ్మాయి హైదరాబాదులో ఫామ్–డి చదువుతుండటం, అబ్బాయి డిగ్రీ పూర్తిచేసి గ్రామంలోనే ఉంటున్నాడు. ఇరువురు కులాలు వేరుకావడంతో పెద్దలు పెళ్ళికి అంగీకరించలేదు. శనివారం అమ్మాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను, గ్రామ పెద్దలను స్టేషన్కు పిలిచి మాట్లాడారు. పోలీసులు, పెద్దల సమక్షంలో వారు పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి ముహూర్తం చూసి అందరి సమక్షంలో కొల్లాపూర్ సమీపంలో సింగోటం దేవాలయంలో పెళ్లికి చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
వైభవం.. రాములోరి కల్యాణం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని రామసదనం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మహిళల మంగళ హారతులు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. ప్రత్యేక పూజల అనంతరం జీలకర్ర, బెల్లం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశేష భక్తజనావళి తిలకిస్తుండగా పురోహితుల మంత్రోచ్చరణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారి మంగళసూత్రధారణ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మన్యంకొండకు తరలిరాగా జనసంద్రమైంది. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామిదంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, దేవస్థానం చైర్మన్ ఆళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. జనసంద్రమైన మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణోత్సవం శ్రీరామకొండ క్షేత్రంలో ఘనంగా వేడుకలు పాల్గొన్న నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం దంపతులు భక్తులకు అన్నదానాలు బీచుపల్లిలో ప్రత్యేకపూజలు బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ వేడుకలను అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, అభిషేకములను నిర్వహించి సీతారాములకు ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేశారు. వేదమంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో సీతారాములకు వైభవంగా కల్యాణాన్ని జరిపారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గద్వాల జిల్లా జడ్జి కుష కుటుంబ సమేతంగా రాములోరి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మేనేజర్ సురేందర్రాజు, డీఎస్పి మొగులయ్య, సిఐ రవిబాబు, అర్చకులు, పాలక మండలి సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
వాతావరణం.. చీడపీడలు
అలంపూర్: వ్యవసాయం.. వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా నేల స్వభావం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. విత్తనం వేసే సమయం నుంచి పంట చేతికి వచ్చే వరకు వాతవరణ ప్రభావం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకాల వర్షాలు విపరీతమైన ఎండలు వర్షాభావ పరిస్థితులు వరదలు, తుఫాన్లు రావడం సర్వ సాధరణమైపోయింది. ఇటువంటి విపత్కర పరిణామాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్ రైతులు సూచించారు. వీటిని ముందుగా తెలుసుకోగలిగితే కొంత వరకై నా జాగ్రత్తలు తీసుకొని నష్టాలను తగ్గించే అవకాశం కలుగుతుంది చెబుతున్నారు. వాతవరణాన్ని బట్టి పురుగులు తెగుళ్ల తాకిడిపై ముందస్తు సమాచారం తెలుసుకోని చర్యలు చేపట్టవచ్చు. తుఫాను సమయం మబ్బులు, తేమ వాతవరణం, ఉష్ణోగ్రతలు తగ్గడం వంటివి బూజు తెగుళ్ల ఉధృతికి తోడ్పతాయి. వాతవరణం పొడిగా ఉంటే ఆకుముడత రసం పీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉధృతమయ్యే చీడపీడలు వాతావరణ పరిస్థితులు లద్దె పురుగు చురుకవుతుంది పచ్చ దీపపు పురుగులు వృద్ధి చెందుతాయి చెరకు, మిర్చి, జొన్న, పత్తిలో రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా నల్లి వరిలో కాండం తొలిచే పురుగుల ఉధృతి తగ్గుతుంది.వరి ఈగ ఉధృతి పెరుగుతుంది. వరిలో కంప నల్లి .వరిలో పొట్ట కుళ్లు తెగుళ్లు, అగ్గి తెగుళ్లు ప్యుజేరియం విల్టు, కూరగాయలు, పత్తి మొదలైన పైర్ల మీద ఆముదంపై కాయ కుళ్లు, బూజు తెగుళ్లు పత్తిలో తెల్ల దోమ పత్తిలో కాయకుళ్లు పగటి ఉష్ణోగ్రత తక్కువ..మేఘావృతమైన ఆకాశం గాలిలో తేమ అధికంగా ఉండి.. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే ఎక్కువ కాలం పొడి వాతావరణం ఎక్కువ ఉష్ణోగ్రత ఎడతెరిపి లేని వర్షాలు పడితే పూతదశలో వెచ్చని వాతావరణం.. మబ్బులు కమ్మిన ఆకాశం, తరుచు జల్లులు రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువ, గాలిలో తేమ ఎక్కువ, చల్లగా ఉండటం, మంచు పడటం. నీటి ఎద్దడి ఎక్కువ కాలం ఉంటే.. వర్షాలు ఎక్కువ పడి గాలిలో తేమ ఎక్కువగా ఉంటే.. సుదీర్ఘమైన బెట్ట, మధ్య మధ్య జల్లులు వర్షం పడుతున్నప్పుడు, తేమ అధికంగా ఉన్నప్పుడుపాడి–పంట -
విత్తనాల పండుగలో జడ్చర్ల విద్యార్థులు
జడ్చర్ల టౌన్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఎర్త్ సెంటర్లో నిర్వహించిన తెలంగాణ విత్తనాల పండుగలో జడ్చర్ల డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–3 వలంటీర్లు రవీందర్, భరత్ పాల్గొన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డా.సదాశివయ్య ఆధ్వర్యంలో 530 రకాల విత్తనాలను ప్రదర్శించారు. మూడు రోజులపాటు జరిగిన విత్తనాల పండుగలో దేశ నలమూలల నుంచి రైతులు, రైతు సంఘాలు, ఇతర సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేయగా.. ప్రభుత్వరంగం నుంచి ఒక జడ్చర్ల డిగ్రీ కళాశాల మాత్రమే పాల్గొనట్లు సదాశివయ్య తెలిపారు. అందరూ పంట మొక్కల విత్తనాలు ప్రదర్శిస్తే.. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గత మూడేళ్ల నుంచి అనేక అటవీ ప్రాంతాల్లో సేకరించిన 530 రకాల విత్తనాలను ప్రదర్శించగా.. సినీ నటుడు నాగినీడు, నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి అభినందించారు. డబ్ల్యూఈపీఎల్లో సత్తాచాటాలి మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా క్రికెట్ క్రీడాకారుడు గణేష్ ఇంగ్లాండ్లో జరిగే డబ్ల్యూఈపీఎల్ లీగ్లో పాల్గొంటుండడం సంతోషంగా ఉందని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అ న్నారు. గణేష్ను ఆదివారం జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు లోని ఎండీసీఏ మైదానంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఈపీఎల్) ప్రీమ్ 2 డివిజన్, వరిష్ట చెల్టినహమ్ ప్రీమియర్ టీ–20, డబ్ల్యూఈపీఎల్ టీ–20, నేషనల్, కంట్రీకప్ టోర్నమెంట్ల్లో ఆరునెలలపాటు గణేష్ ఆడనున్నాడని పేర్కొన్నారు. భవిష్యత్లో రంజీ జట్టుకు ఎంపికకావాలని ఆయన ఆకాంక్షించారు. ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, సభ్యులు చంద్రకుమార్గౌడ్, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు ముఖ్తార్అలీ పాల్గొన్నారు. -
లభించని ఆరుగురి ఆచూకీ
అచ్చంపేట: ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కోసం 44 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోగా.. ఇద్దరి మృతదేహాలను వెలికి తీసిన విషయం తెలిసిందే. మిగతా ఆరుగురి ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. జీఎస్ఐ, నీటిపారుదలశాఖ అధికారులు సొరంగ ప్రదేశం వద్ద ఉంటూ సహాయక సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అయితే సొరంగంలో ఎస్కవేటర్లు, సహాయక సిబ్బంది సేవలే ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి. సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్, ర్యాట్ హోల్ మైనర్స్, దక్షిణమధ్య రైల్వే, ఆర్మీ, హైడ్రా వంటి 12 రకాల సహాయక బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. వీటికి తోడు ఐదు ఎస్కవేటర్లతో మట్టి, రాళ్లు, బురద, టీబీఎం భాగాలను తొలగించే పనులను ముమ్మరం చేశారు. రోజుకు 20 మీటర్ల మట్టి తొలగింపు.. సొరంగం లోపల పైకప్పు కూలిన ప్రదేశంలో రోజు 20 మీటర్ల మేర మట్టిని తొలగిస్తున్నారు. తవ్విన మట్టి, బురద, రాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా, టీబీఎం భాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. సొరంగం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలకు ఆటంకంగా మారిన నీటి ఊటను ఎప్పటికప్పుడు బయటకు పంపింగ్ చేస్తున్నారు. నిమిషానికి 10వేల లీటర్ల చొప్పున వస్తున్న నీటి ఊటను 150 హెచ్పీ మోటార్ల సహాయంతో తోడేస్తున్నారు. ఎస్ఎల్బీసీలో 44 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు -
అక్రమంగా ఎర్రమట్టి తరలింపు
చిన్నచింతకుంట: మండలంలోని పల్లమరి గ్రామ సమీపంలోని ఎర్రగుట్ట నుంచి కొందరు ఎలాంటి అనుమతుల్లేకుండా ఎర్రమట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఆదివారం తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే టిప్పర్లు, ట్రాక్టర్లు వెళ్లిపోయాయి. అక్కడే ఉన్న హిటాచీ డ్రైవర్ భరత్రెడ్డిని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. సోమవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయనున్నట్లు ఎస్ఐ రామ్లాల్నాయక్ తెలిపారు. అక్రమార్కులు పగలు ఎర్రమట్టిని తరలిస్తూ రాత్రి సమయంలో గ్రామ సమీపంలోని ఊక చెట్టు వాగునుంచి ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అకాల వర్షానికి నేలరాలిన మామిడి కాయలు పెద్దకొత్తపల్లి : మండలంలో అదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మామిడి కాయలు నేలరాలినట్లు కౌలురైతులు తెలిపారు. మండలంలో సుమారు 1000 ఎకరాల్లో మామిడి కాయలు నేలపాలయ్యాయి. కల్వకోలు, తీరునాంపలి, చెన్నపురావు పల్లి, జోన్నలబోగుడ, పెద్దకొత్లపల్లి దేవుని తిరుమలాపూర్ ,చంద్రకల్, ముష్టిపల్లి, మరికల్ మామిడి తోటల్లో కాయలు వర్షానికి రాలిపోవడంతో రైతులు నష్టపోయారు. -
తాగునీటి వృథాను అరికట్టలేరా?
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీరు వృథాగా రోడ్లపై పారుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకవైపు పలు చోట్ల పైపులైన్, గేట్వాల్వ్ల వద్ద లీకేజీలు ఉన్నా మున్సిపల్ అధికారులు మరమ్మతు చేయించడం లేదు. మరోవైపు కొందరు ఇంటి యజమానులు తమ అవసరాలకు సరిపడా వాడుకున్నాక నల్లాలను బంద్ చేయకుండా పైపులతో ఆవరణలను కడగడం, మోరీలలో వదలడం వంటి పనుల కారణంగా వృథా అవుతోంది. వాస్తవానికి జిల్లా కేంద్రంలో రెండు రోజుల కోసారి మొత్తం 28 ఓవర్హెడ్ ట్యాంకుల నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారాతాగునీరు సరఫరా అవుతోంది. అసలే వేసవికాలం కావడంతో వినియోగం అధికంగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో సుమారు గంట పాటు, మరికొన్ని ప్రాంతాల్లో అరగంట మాత్రమే అందుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలో ఇదీ పరిస్థితి.. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల పరిధిలో 3,36,647 మంది జనాభా ఉన్నారు. అందరికీ కలిపి తాగునీరు కనీసం 40 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) అవసరం. అయితే ప్రస్తుతం 33.5 ఎంఎల్డీ మాత్రమే సరఫరా అవుతోంది. ఇక ఒక్కొక్కరికి కనీసం 135 ఎల్పీసీడీ (లీటర్ పర్ కెపాసిటీ డైలీ) నీరు అవసరం. కాగా, మిషన్ భగీరథ పథకం ద్వారా 100 ఎల్పీసీడీ మాత్రమే అందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తాగునీటిని పట్టుకున్నాక చాలా వరకు ఇంటి యజమానులు తమ ఆవరణను శుభ్రం చేసేందుకని, వాహనాలు కడగడానికి పైపులతో వృథాగా వదులుతున్నారు. ఇది కాస్తా రోడ్ల వెంట ఏరులై పారుతూ ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దాదాపు అన్ని గల్లీలలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరోవైపు వివిధ చోట్ల పైపులైన్లు, గేట్వాల్వ్ల వద్ద లీకేజీలున్నా మున్సిపల్ అధికారులు మరమ్మతు చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా జడ్చర్ల–రాయచూర్ రోడ్డు (ఎన్హెచ్– 167)పై డిస్లేరిగడ్డ (హనుమాన్పురా) వద్ద, హెచ్పీ పెట్రోల్ పంపు సమీపంలో, న్యూటౌన్చౌరస్తాలో, జీజీహెచ్కు ఎదురుగా, మెట్టుగడ్డ వద్ద, అలాగే తెలంగాణ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు రెండు చోట్ల, కలెక్టర్బంగ్లా చౌరస్తా నుంచి బోయపల్లిగేట్ (నవాబుపేట రోడ్డు వెంట) మోతీనగర్ వరకు మూడు చోట్ల, పద్మావతికాలనీలోని ఓ ఫంక్షన్ హాలు వద్ద, భూత్పూర్ రోడ్డులో మైత్రీనగర్ వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాంతాల్లో రోడ్ల వెంట తాగునీరు వృథాగా పారుతోంది. అసలే వేసవి కాలం.. వినియోగం అధికం నగరంలో రెండు రోజులకోసారి సరఫరా ఎక్కడబడితే అక్కడ పైపులైన్ లీకేజీలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు -
ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం
మహబూబ్ నగర్ న్యూటౌన్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ సొసైటీ భవన్లో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ మోదీ సర్కార్ రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా కల్పించబడిన చట్టబద్ధ హక్కులను హరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మిక కర్షక ఫాసిస్ట్ విధానాలపై మే రెండో వారంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను చిన్న చూపు చూస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. నూతన కమిటీ ఎన్నిక మహబూబ్నగర్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా భాగి కృష్ణయ్యయాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కోట కదిర నరసింహ, జిల్లా ప్రధానకార్యదర్శిగా పి.సురేష్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా ఆంజనేయులు, కోశాధికారిగా ఎం.మధుసూదన్ రెడ్డి. మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులుగా అమరజ్యోతి, బి.చెన్నయ్య, రంగన్న, పద్మ, జిల్లా సహాయ కార్యదర్శులుగా జి.మొగులన్న, దేవానంద్, జే.నరసింహ, యాదయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులుగా నరసింహ, గోపాల్నాయక్, సాయి ప్రకాష్, శ్రీనివాసులు, రాములు, నరసింహ, ఆంజనేయులు, హరితో పాటు మరో ఏడుగురు సభ్యులను ఎన్నుకున్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ ముగిసిన 12వ జిల్లా మహాసభలు -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చిన్నచింతకుంట: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతాదయాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దమగ్నాపురంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం రేషన్ లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యం వండించి భోజనం చేశారు. జైబాపు, జైబీమ్, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీ లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతాదయాకర్రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం సీఎం రేవంత్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్కుమార్రెడ్డి, నాయకులుు నరేందర్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, పశాంత్కుమార్, కథలప్ప, సురేందర్రెడ్డి, వట్టెం శివ, రవికుమార్గౌడ్ ఉన్నారు. రేషన్ డీలర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ మహబూబ్నగర్ రూరల్: జిల్లాలోని హన్వాడ, కౌకుంట్ల, మహబూబ్నగర్ అర్బన్, రూరల్, మిడ్జిల్ మండలాల్లో ఖాళీగా ఏర్పడిన ఆరు రేషన్ డీలర్ భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఆర్డీఓ నవీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యావంతులైన నిరుద్యోగులు 18–40 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ప్రభుత్వ పని దినాలలో సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అయితే రిజర్వేషన్ల ప్రకారం చూస్తే హన్వాడ మండలం గొండ్యాల–2 బీసీ–ఈ, చిన్నదర్పల్లి బీసీ–ఈ, కౌకుంట్ల మండలం అప్పంపల్లి బీసీ, మహబూబ్నగర్ అర్బన్ మండలం అస్లాంఖాన్ స్ట్రీట్ ఓసీ, మహబూబ్నగర్ రూరల్ మండలం ఫతేపూర్ఎస్టీ, మిడ్జిల్ మండలం సింగందొడ్డి ఓసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో ఇప్పటి వరకు ఉగాది, రంజాన్ పండుగలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగిందని, రాబోయో అన్ని మతాల పండుగలను అదే పద్ధతిలో జరుపుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో అన్ని మతాల పెద్దలతో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మతాల మధ్యన స్నేహాభావం పెంపొందించి శాంతి భద్రతలను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సంఘంలో సమగ్ర అభివృద్ధికి శాంతి అవసరమని, పోలీస్శాఖ ఎప్పుడూ ప్రజల కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య పాల్గొన్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై చర్యలు తీసుకోవాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని మూసాపేట మండలంలో ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ల సంఘం నాయకుడు ఘన్సిరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ, టీఎన్జీఓ, టీజీఓ, తహసీల్దార్ల సంఘం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మూసాపేట తహసీల్దార్ రాజునాయక్, కార్యాలయంలో విధులు నిర్వహిస్తు న్న రికార్డ్ అసిస్టెంట్పైన అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన ఇసుక మాఫియా నాయకుడిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి సంఘటనలు జరిగితే విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంటుందన్నారు. ఇలాంటి వాటిని మొగ్గలోని తొలగించాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్, జిల్లా కార్యదర్శి వరప్రసాద్, టీజీఎస్ఏ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, దేవేందర్, చైతన్య, సుదర్శన్రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు. -
మహనీయుల ఆశయసాధనకు కృషి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహనీయుల ఆశయసాధనకు కృషిచేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం బాబు జగ్జీవన్రాం 118వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ చౌరస్తాలో ఎస్పీ డి.జానకి, అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్లతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జగ్జీవన్రాం కేంద్ర మంత్రిగా కార్మిక, రవాణా, ఆహార, వ్యవసాయ, రక్షణ, రైల్వే శాఖ, భారత ఉప ప్రధానిగా కీలక పదవులు నిర్వహించారన్నారు. ఎస్సీ కుల సంఘాలు నాయకులు సమావేశంలో తెలిపిన సమస్యలను ఎస్పీ, జిల్లా యంత్రాంగం ద్వారా పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు. విద్యార్థులు జగ్జీవన్రాం, మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని వారి జీవిత చరిత్రలు, సాహిత్యం, మంచి పుస్తకాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. సమాజ నిర్మాణానికి కృషి... బాబు జగ్జీవన్రాం సమ సమాజ నిర్మాణానికి కృషి చేసిన సామాజిక విప్లవ నాయకుడు అని రాష్ట్ర మైనార్టీ ఆర్థిక సంస్థ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగ్జీవన్రాం అడుగుజాడల్లో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, పీసీసీ కార్యదర్శి వినోద్కుమార్, సంజీవ్ ముదిరాజ్, మంత్రి నరసింహయ్య, మల్లెపోగు శ్రీనివాస్, నరసింహులు, గోపాల్మాదిగ, శామ్యూల్, లక్ష్మణ్, కుర్మయ్య, యాదయ్య, డీఆర్డీఓ నర్సింహులు, షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ ఇన్చార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల అభివద్ధి అధికారి సుదర్శన్, ఆర్డీఓ నవీన్ పాల్గొన్నారు. బాబు జగ్జీవన్రాంను ఆదర్శంగా తీసుకోవాలి కలెక్టర్ విజయేందిర బోయి తెలంగాణచౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి -
పెరుగుతున్న ఆదరణ
రెండేళ్ల క్రితం బాక్స్ క్రికెట్ కోర్టును ఏర్పాటు చేశాం. మొదట్లో కొన్ని నెలలు చాలా తక్కువ మంది వచ్చేవారు. ఆరేడు నెలలుగా బాక్స్ క్రికెట్కు మంచి స్పందన ఉంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి ఆడేందుకు ఇష్టపడుతున్నారు. వేసవిలో, వీకెండ్స్ సెలవు రోజుల్లో ఎక్కువ మంది వస్తున్నారు. – షేక్ వజాహత్ అలీ, బ్రదర్ హుడ్ బాక్స్ క్రికెట్ ఏరినా, నిర్వాహకుడు వారంలో ఒకసారి క్రికెట్ ఆడుతా.. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి క్రికెట్ ఆడడానికి తీరిక లేకుండా పోయింది. అయితే జిల్లాకేంద్రంలో బాక్స్ క్రికెట్ కోర్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి సమయం చూసుకొని క్రికెట్ ఆడుతాను. ఫిట్నెస్ కోసం వారంలో ఒకసారి బాక్స్ క్రికెట్ ఆడుతా. – ఇంతియాజ్ ఇసాక్, రాష్ట్ర ఎంఎఫ్సీ మాజీ చైర్మన్, మహబూబ్నగర్ ఫిట్నెస్ కోసం.. ఫిట్నెస్ కోసం స్నేహితులతో కలిసి బాక్స్ క్రికెట్ ఆడుతాం. ఏడాదిన్నర నుంచి వీకెండ్స్, సెలవుల్లో బాక్స్ క్రికెట్ ఆడుతాం. ఫ్లడ్లైట్ల వెలుతురులో బాక్స్ క్రికెట్లో ఆడుతుంటే చాలా సరదాగా ఉంటుంది. పని ఒత్తిడి ఉండే మాకు ఈ బాక్స్ క్రికెట్ ఆడితే ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. – రాజేష్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, మహబూబ్నగర్ సౌకర్యంగా ఉంది.. స్నేహితుల మధ్య అనుబంధానికి బాక్స్ క్రికెట్ ఒక వేదికలా నిలుస్తుంది. ఎంత బిజీగా ఉన్న వారంలో రెండుసార్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో బాక్స్ క్రికెట్ ఆడుతాం. చిన్నపాటి మైదానంలో ఎక్కువ దూరం పరుగెత్తాల్సిన అవసరం ఉండదు. బ్యాటింగ్, బౌలింగ్ చేయడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అందువల్ల బాక్స్ క్రికెట్ ఆడటానికి నేను ఎక్కువ ఆసక్తి కనబరుస్తాను. – ఎండీ రియాజ్, ఐటీ ఉద్యోగి, మహబూబ్నగర్ -
రారండోయ్.. వేడుక చూద్దాం
స్టేషన్ మహబూబ్నగర్: శ్రీరామ నవమి పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలో సీతారామ కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయాలతో పాటు పలు వీధుల్లో కల్యాణ వేడుకలు జరగనున్నాయి. లక్ష్మీనగర్కాలనీలోనిల శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయం, న్యూగంజ్లోగల శ్రీలక్ష్మినరసింహస్వామి దేవాలయం, బస్టాండ్ సమీపంలోని ద్వారకామాయి షిరిడీసాయి ఆలయం, టీచర్స్ కాలనీ శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం (రామాలయం), రామమందిరం, తూర్పుకమాన్ వద్దనున్న సీతారామాంజనేయస్వామి దేవాలయం, శ్రీనివాస కాలనీలోని పంచముఖాంజనేయస్వామి దేవాలయం, టీడీ గుట్ట తిరుమలనాథస్వామి ఆలయం, గణేష్నగర్లోని షిరిడీసాయిబాబా దేవాలయం, రామాంజనేయస్వామి ఆలయం, సంజయ్నగర్లోని వీరాంజనేయస్వామి ఆలయం, బాలాజీనగర్, నాగేంద్రనగర్, న్యూమోతీనగర్ ఆంజనేయాలయాల్లో, బీకే రెడ్డి కాలనీలోని శివాంజనేయస్వామి ఆలయం, వెంకటేశ్వరకాలనీ హయగ్రీవాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ మహోత్సవానికి హాజరు కావాలని ఆయా ఆలయాల కమిటీ నిర్వాహకులు పిలుపునిచ్చారు. -
ప్రెషర్ తక్కువగా వస్తుంది..
మా వీధికి నాలుగుగైదు రోజులకోసారి మిషన్ భగీరథ పథ కం ద్వారా తాగునీరు వదులుతున్నారు. ఈ ప్రాంతం ఎత్తుగా ఉన్నందున ప్రెషర్ తక్కువగా వస్తుండటంతో సరపోవడం లేదు. సీడబ్ల్యూసీ గోదాం చౌర స్తా నుంచి బోయపల్లి రోడ్డులో కొన్ని చోట్ల నల్లాలకు ఆన్ఆఫ్ లేకపోవడంతో వృథాగా పోతోంది. ఇక్కడి మెకానిక్ షాపు వద్ద పైపు లీకేజీ ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. – కిశోర్కుమార్, మోతీనగర్ రోడ్డు వెంట వృథా అవుతోంది మా కాలనీలోని మ హేంద్రనగర్ వైపు వెళ్లే మార్గంలో గేట్వాల్వ్ వద్ద కొన్ని నెలలుగా లీకేజీ ఉన్నా మున్సిపల్ సిబ్బంది మరమ్మతు చేయడం లేదు. దీంతో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు వదిలినప్పుడు కొన్ని గంటల పాటు సుమారు 200 మీటర్ల వరకు రోడ్డు వెంట వృథాగా పారుతోంది. ముఖ్యంగా బైక్లు, కార్లు వెళ్తున్నప్పుడు ఈ నీరు మొత్తం పాదచారులపై పడుతోంది. – పగడం మల్లేష్, పద్మావతికాలనీ -
కంచె సమీపంలో తవ్వకాలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో పనులు వేగవంతమయ్యాయి. అధికారులు అదనంగా మరో మూడు ఎస్కవేటర్లు ఏర్పాటు చేసి పనులు చేపడుతున్నారు. సొరంగం లోపల కట్ చేసిన టీబీఎం భాగాలు, మట్టి, బురద, రాళ్లను బయటకు తరలిస్తున్నారు. కన్వేయర్ బెల్టు పనులు వంద మీటర్ల ముందుకు పొడిగించడంతో సొరంగంలో తవ్విన మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు పంపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 రకాల బృందాలు మూడు షిఫ్ట్లలో 24 గంటలపాటు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కంచె ఏర్పాటు చేసిన నిషేధిత ప్రదేశం సమీపంలో సహాయక సిబ్బంది పనులు చేపడుతున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశం నుంచి భారీగా వస్తున్న నీటి ఊటను 150 హెచ్పీ మోటార్లతో 2.5 కిలోమీటర్లకు ఒకటి, రెండు ఏర్పాటు చేసి నీటిని బయటకు తోడేస్తున్నారు. నీటి పారుదల, జీఎస్ఐ అధికారులు నిరంతరం సొరంగం ప్రమాద ప్రదేశం వద్ద ఉంటూ తగిన సలహాలు, సూచనలు చేస్తున్నారు. మట్టి తవ్వకాలు వేగవంతం సొరంగం లోపల మట్టి తవ్వకాలు వేగవంతం చేశామని, వెంటిలేషన్ పనులు కొనసాగిస్తున్నామని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. శనివారం సొరంగం జేపీ కార్యాలయం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించి సొరంగం లోపల చేపడుతున్న సహాయక చర్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, సొరంగంలో చిక్కుకున్న ఆరుగురి కోసం సహాయక సిబ్బంది నిర్విరామంగా గాలింపు చేస్తూ అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతున్నారని వివరించారు. సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న అన్ని పరిస్థితులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు 43 రోజులుగా చిక్కని కార్మికుల ఆచూకీ -
కల్యాణం చూతము రారండి
చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సిర్సనగండ్ల నుంచి భక్తులు, గ్రామస్తులు ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగింపుగా గుట్టపైనున్న ఆలయానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సీతారాముల మాస కల్యాణం ప్రారంభం కాగా.. ఈ వేడుక 3 గంటల పాటు అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ కొనసాగింది. వివిధ ప్రాంతాల భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి వేడుకను తిలకించారు. ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి దంపతులు, మాజీ ఎంపీ రాములు, తహసీల్దార్ సునీత దంపతులు, బీజేపీ నాయకులు భరత్ప్రసాద్, మండల నాయకులు వెంకట్గౌడ్, బాల్రాంగౌడ్, కల్లు సురేందర్రెడ్డి, నర్సింహారెడ్డి, సందీప్రెడ్డి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కల్యాణం అనంతరం భక్తులకు సిర్సనగండ్లకు చెందిన పిన్నపురెడ్డి వెంకట్రెడ్డి అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు లక్ష్మణ్శర్మ, వేణుశర్మ, మురళీధర్శర్మ, కోదండరామశర్మ, రఘుశర్మ తదితరులు పాల్గొన్నారు. కల్యాణ వేడుకకు సర్వం సిద్ధం.. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం తరుఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి వేడుకలో పాల్గొననున్నారు. వేడుకకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చలువ పందిళ్లు, అవసరమైన చోట టెంట్లు, నీటివసతి, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు. అలాగే కల్యాణ మండపం ఎదురుగా సుమారు 10 వేల మంది భక్తులు కూర్చొనేల, కల్యాణ మండపం చుట్టూ 20 వేల మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్కు గుట్టపై స్థలాలు చదును చేశారు. వృద్ధులు, మెట్లపై నుంచి రాలేని వారి కోసం ఆలయం ఆధ్వర్యంలో గుట్టపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చైర్మన్ ఢేరం రామశర్మ చెప్పారు.సిర్సనగండ్లలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు సీతారాముల కల్యాణ వేడుక మొదటిరోజు ముగిసిన మాస కల్యాణం ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు -
‘కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల మద్దతు’
భూత్పూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల తరుఫున ప్రత్యేక ధన్యవాదాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో దేవరకద్ర నియోజకవర్గస్థాయి యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయరంగాల్లో యాదవుల వాటా కోసం ఉద్యమిస్తామని, ఇందుకు వేదిక రాష్ట్రస్థాయిలో పని చేస్తుందని వివరించారు. జనాభాలో 10 నుంచి 15 శాతం ఉన్న అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్ పేరన 10 శాతం రిజర్వేషన్లు తీసుకోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకుడు వెంకటనర్సయ్య, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు అంజన్నయాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జుర్రు నారాయణ యాదవ్, బత్తుల మల్లేష్ యాదవ్, ఊషన్న యాదవ్, కృష్ణయ్య యాదవ్, రెడ్డికుంట వెంకటేష్ యాదవ్, చందు యాదవ్, నరేందర్ యాదవ్, మందడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఈద్మిలాప్తో సోదరభావం పెంపు
స్టేషన్ మహబూబ్నగర్: ఈద్మిలాప్లతో సోదరభావం పెంపొందుతుందని టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జమాతే ఇస్లామి హింద్ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో స్థానిక అల్మాస్ ఫంక్షన్హాల్లో శనివారం రాత్రి ఘనంగా ఈద్మిలాప్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల్ మాట్లాడుతూ ఈద్మిలాప్ కార్యక్రమం మనలోని ఐక్యతను చాటుతుందన్నారు. రంజాన్ ఈదుల్ ఫితర్ పండుగ తర్వాత ఈద్మిలాప్ నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోందన్నారు. జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్ల నుంచి ఈద్మిలాప్ నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఎంపీజే తెలంగాణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మౌలానా అబ్దుల్ నాసర్ మజహరి తదితరులు ప్రసంచి ఈద్మిలాప్ ప్రాముఖ్యతను వివరించారు. -
కార్మికులు హక్కుల కోసం పోరాడాలి
నారాయణపేట: కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మెట్రో గార్డెన్లో జరిగిన తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్(టీయూసీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి అధ్యక్షతన రాష్ట్ర రెండో మహసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడకుండా ఏ హక్కులు సాధించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్నా సమ్మె అప్పుడు కార్మికులను ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. నాయకులు హనుమేష్, అరుణ్కుమార్, కిరణ్, నర్సిములు, కాశీనాథ్, ఎదిరింటి నర్సిములు, బోయిన్పల్లి రాము, వెంకట్ రాములు, సాంబశివుడు. ఎదుట్ల కుర్మయ్య, బోయిన్పల్లి గణేష్. చంద్రం, కృష్ణ, వెంకట్ ప్రసంగించారు. అనంతరం మెట్రో గార్డెన్ నుంచి కార్మిక ప్రదర్శన ప్రారంభమై అంబేడ్కర్ చౌక్, కొత్త బస్టాండ్ మీదుగా నర్సిరెడ్డి చౌక్కు చేరుకున్నారు. టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం -
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో బీసీల స్థానం ఎక్కడ?
స్టేషన్ మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో బీసీలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్సాగర్ అన్నారు. స్థానిక బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇప్పటివరకు బీసీలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి అగ్రవర్ణాల వారే కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో బీసీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఉమ్మడి జిల్లాలో బీసీలు దాదాపు 65 శాతం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీలను పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా మంది బీసీలకు కాస్త అయినా న్యాయం జరుగుతుందని భావించిన బీసీ సమాజానికి అన్యాయమే జరిగిందన్నారు. సమావేశంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మికాంత్, నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు అశ్విని సత్యం, బీసీ సమాజ్ భూత్పూర్ మండల కన్వీనర్ ఆంజనేయులు, నవీన్గౌడ్, భీమేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. -
డబ్ల్యూఈపీఎల్ లీగ్కు గణేష్
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్కు చెందిన గణేష్ క్రికెట్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నాడు. వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఈపీఎల్) ప్రేమ్ 2 డివిజన్, వరిష్ట చెల్టినహమ్ ప్రీమియర్ టీ–20, డబ్ల్యూఈపీఎల్ టీ–20, నేషనల్, కంట్రీకప్ టోర్నమెంట్ల్లో అతడు ఆడనున్నాడు. గణేష్ ప్రతిభను గుర్తించిన అక్కడి నిర్వాహకులు టోర్నీల్లో ఆడడానికి అవకాశం కల్పించారు. మంగళవారం ఇంగ్లాండ్కు బయలుదేరుతున్న అతడు ఆరునెలల పాటు అక్కడి క్రికెట్ పోటీల్లో పాల్గొననున్నాడు. డబ్ల్యూఈపీఎల్ క్రికెట్ టోర్నీలకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని గణేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. హెచ్సీఏ టోర్నీల్లో సత్తా గణేష్ ఎండీసీఏ, హెచ్సీఏ క్రికెట్ అసోసియేషన్ టోర్నీల్లో సత్తా చాటుతున్నాడు. హెచ్సీఏ అండర్–16, అండర్–19, అండర్–23 జట్లకు పలుసార్లు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించాడు. హెచ్సీఏ కంబైన్ జిల్లా జట్టుకు ఎంపికై రాణించాడు. 2019–20లో హైదరాబాద్లో జరుగుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎ–2 డివిజన్ లీగ్ మ్యాచ్లో గణేష్ అద్భుతమైన బ్యాటింగ్తో తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. రాజు క్రికెట్ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గణేష్ ట్రిపుల్ సెంచరీ చేసి సీజన్లో తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్లో 200 బంతుల్లో 42 ఫోర్లు, 7 సిక్స్లతో 318 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇదే సీజన్లో మరో ట్రిపుల్ సెంచరీ (329పరుగులు) చేశాడు. జింఖానా మైదానంలో జరిగిన సీనియర్ జోనల్ క్రికెట్ టోర్నీలో కంబైన్డ్ జట్టు తరపున రెండు మ్యాచుల్లో కలిపి 350 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్లో నాలుగు టోర్నీల్లో పాల్గొననున్న జిల్లా క్రీడాకారుడు 8న ఇంగ్లాండ్కు పయనం సన్మానించిన జితేందర్రెడ్డి, ఎండీసీఏ ప్రతినిధులు గణేష్కు సన్మానం డబ్ల్యూఈపీల్ టోర్నీలకు వెళ్తున్న గణేష్ను హైదరాబాద్లో శనివారం రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు, ఎండీసీఏ అధ్యక్షులు ఏపీ జితేందర్రెడ్డి శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందించారు. టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరచి జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్కుమార్, కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు ఆబిద్ అలీ పాల్గొన్నారు. -
గట్టి బందోబస్తు..
ఉత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సీఐలు, ఎస్ఐలు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 17 మంది ఎస్ఐలు, 350 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆలయ ఆవరణలో 22 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సమావేశంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ శంషోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు హైందవ భక్తి కళా సమ్మేళనం
మహబూబ్నగర్ రూరల్: సంకీర్తన సాంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరనే లక్ష్యంతో సోమవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద హైందవ భక్త కళా సమ్మేళనం నిర్వహించనున్నామని.. భజన కళాకారులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామిజీ కోరారు. శనివారం మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉమ్మడి పాలమూరు జిల్లా భజన కళాబృందం గురువులు, ప్రతినిధుల హరినామ సంకీర్తనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సమ్మేళనానికి సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయ సన్నిధిలో నిత్య అఖండ హరినామ సంకీర్తన జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో వేల సంఖ్యలో జానపద, భజన కళాబృందాలు, కళాకారులు ఉన్నారని.. హరినామ సంకీర్తనలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. భజన గురువులకు గుర్తింపు కార్డులిచ్చి కళారంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు, దేవాదాయశాఖ ముందుకురావాలని కోరారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల కళాకారులు రెండుగంటల పాటు ఆలపించిన భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి. సంకీర్తన అనంతరం స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్ సంకీర్తనలో పాల్గొన్న భజన గురువులను అభినందించారు. ప్రత్యేక దినాలు, ఉత్సవాల సమయంలో భజన గురువులు పాల్గొని హనుమద్దాసుని సంకీర్తన చేయాలని కోరారు. కార్యక్రమంమలో హిందూ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ ప్రతినిధి మల్లికా వల్లభ, జై భారత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరామా.. నీ నామం ఎంతో రుచిరా
గద్వాల టౌన్: పుస్తకాల్లో రామకోటి రాయాలంటేనే ఎంతో ఓపిక కావాలి.. కానీ, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన భక్తురాలు ఇల్లూరి శ్రీలక్ష్మి బియ్యపు గింజలపై శ్రీనామనామం రాస్తూ రికార్డు సృష్టిస్తున్నారు. పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన ఇల్లూరి శ్రీలక్ష్మి 15,116 బియ్యపు గింజలపై జెల్ పెన్నుతో ‘శ్రీరామ’ అనే అక్షరాలు రాశారు. ఈ బియ్యపు గింజలలో అయోధ్యకు 5 వేలు, భద్రాచలానికి 3 వేలు, బీచుపల్లికి 5 వేలు, స్థానికంగా రామాలయాలకు 2 వేల బియ్యపు గింజలు అందజేశారు. రామనామం జపిస్తూ భక్తితో రాసిన ఈ బియ్యపు గింజలను ఆయా ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు అక్షింతలుగా పంపినట్లు పేర్కొన్నారు. 2015 నుంచి శ్రీరామ నామాలు రాస్తూ శ్రీరామ నవమి వేడుకలకు తలంబ్రాలుగా అందిస్తున్నారు. ఈమె గతంలోనూ మహాశివరాత్రి సందర్భంగా కూడా బియ్యపు గింజలపై ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం రాసి భక్తిని చాటుకున్నారు. ఇల్లూరి శ్రీలక్ష్మి భక్తిని జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. 15,116 బియ్యపు గింజలపై రామనామం అయోధ్య, భద్రాచలం ఉత్సావాలకు అక్షింతలు -
నిర్మాణంలో ఉన్న రోడ్డుపై పడి వ్యక్తి మృతి
గట్టు: దారితప్పి వచ్చిన ఓ వ్యక్తి నిర్మాణంలో ఉన్న భారత్ మాల రోడ్డుపై పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కర్ణాటకలోని యరగెరకు చెందిన వికలాంగుడు కర్లీ శ్రీనివాసులు(55) శుక్రవారం గద్వాలలో శుభకార్యానికి హాజరై సాయంత్రం ఆరగిద్దలో ఉన్న కూతురికి దగ్గరకు బయలుదేరాడు. మూడు చక్రాల ద్విచక్రవాహనంపై తాటికుంట, తప్పెట్లమొర్సు మీదుగా ఆరగిద్దకు వెళ్తుండగా.. గొర్లఖాన్దొడ్డి– ఆరగిద్ద గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న భారత్మాల రోడ్డుపైకి దారి తప్పి వెళ్లాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత అదుపు తప్పి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన గొర్లఖాన్దొడ్డి గ్రామానికి చెందిన ఓ రైతు శ్రీనివాసులు మొబైల్ ఫోన్లోని కాల్ లిస్టు ఆధారంగా ఆరగిద్దకు చెందిన కూతురు, అల్లుడికి సమాచారం అందించారు. ఆరగిద్ద గ్రామస్తుల సహకారంతో 108లో గద్వాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాసులుకు భార్య లక్ష్మితోపాటు నలుగురు కుమార్తెలున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు గట్టు పోలీసులు తెలిపారు. యువకుడి బలవన్మరణం గద్వాల క్రైం: తల్లిదండ్రులు మందలించడంతో కుమారుడు ఉరేసుకొని మృతిచెందిన ఘటన శనివారం ఉదయం మండలంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ కథనం మేరకు.. మండలంలోని చేనుగోనిపల్లికి చెందిన ఖాజా (20) హైదరాబాద్లో ఓ ప్రవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. రంజాన్ పండుగకు గ్రామానికి వచ్చి తిరిగి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి దౌలత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. బస్సు ఎక్కబోయిన మహిళకు తీవ్ర గాయాలు మహమ్మదాబాద్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు ఎక్కబోయిన మహిళ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని జూలపల్లికి చెందిన సత్యమ్మ(48) తన కూతురు రాధికతో కలిసి శనివారం జుంటిపల్లిలో జరిగే రామస్వామి ఉత్సవాలకు వెళ్లేందుకు బయలు దేరింది. సాయంత్రం నంచర్ల బస్టాండుకు చేరుకున్న వారు బస్సు కోసం చాలాసేపు వేచి చూశారు. ఎట్టకేలకు వచ్చిన బస్సు రద్దీగా ఉండటంతో ముందుగా కూతురు రాధిక బస్స ఎక్కింది. తల్లి సత్యమ్మ బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడటంతో ఆమె అదుపు తప్పి కిందపడింది. ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. దీంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారమిచ్చారు. అంబులెన్సు అక్కడికి చేరుకొని ఆమెను మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. ఫోన్పే నుంచి నగదు చోరీ నాగర్కర్నూల్ క్రైం: గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ పే నుంచి నగదును చోరీకి పాల్పడినట్లు ఎస్ఐ గోవర్దన్ తెలిపారు. వివరాలు.. మండలంలోని వెంకటాపూర్కి చెందిన బాషమోని భాస్కర్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు ఈనెల 4న హైదరాబాద్లో మిర్చి విక్రయించేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఫోన్ పడిపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి భాస్కర్ ఫోన్ ద్వారా ఫోన్పే నుంచి రూ.లక్షను విడతలవారీగా చోరీ చేశాడు. బాధితుడు బ్యాంక్ అకౌంట్ను చెక్ చేసుకోవడంతో నగదు చోరీ జరిగిట్లు గుర్తించాడు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థి కిడ్నాప్నకు యత్నం అచ్చంపేట రూరల్: పట్టణంలోని ఓ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్నకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ రవీందర్ కథనం ప్రకారం... శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో హాస్టల్ బయట ఉన్న 8వ తరగతి చదువుతున్న మహేష్ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుని వెళ్లారు. తోటి విద్యార్థులు విషయాన్ని హాస్టల్ వార్డెన్కు చెప్పడంతో సిబ్బందితో పట్టణంలో వెతికారు. పట్టణంలోని లింగాల రోడ్డులో విద్యార్థిని గమనించి వెంటనే హాస్టల్కు తీసుకొచ్చారు. శనివారం ఉదయం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించి హాస్టల్ వద్దకు పిలిపించారు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి కుర్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యార్థితో గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఇసుక డంపు స్వాధీనం
కోస్గి: అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును శుక్రవారం రెవెన్యూ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కడంపల్లి వాగులో 100 ట్రిప్పులకు పైగా ఇసుక నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో తహసీల్దార్ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పట్టుబడిన ఇసుకను చంద్రవంచలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తరలించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. సిబ్బందికి షిఫ్టుల వారీగా విధులు కేటాయించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని వివరించారు. ఆర్ఐలు సుభాష్రెడ్డి, లింగారెడ్డి, జేఏ హన్మంతు, సిబ్బంది వెంకట్రాములు, బుగ్గప్ప, వెంకటయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ప్రేమించాడని యువకుడిపై దాడి నవాబుపేట: యువతిని ప్రేమించాడన్న కారణంతో యువకుడిపై యువతి కుటుంబీకులు దాడిచేసి గాయపర్చిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విక్రమ్ కథనం మేరకు.. మండలంలోని పల్లెగడ్డకు చెందిన అరవింద్ జిల్లాకేంద్రంలోని పాత పాలమూర్కు చెందిన యువతిని ప్రేమిస్తున్నట్లు యువతి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు తెలిసింది. దీంతో శుక్రవారం యువతికి సంబంధించిన వ్యక్తులు పల్లెగడ్డకు వచ్చి మాట్లాడదాం రమ్మంటూ అరవింద్ను గ్రామం బయటకు తీసుకొచ్చి మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో స్పృహతప్పి పడిపోగా అక్కడ ఉన్న కొందరు డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో పోలీసు వాహనం అక్కడికి చేరుకోగా దాడిచేసిన వ్యక్తులు పరారయ్యారు. వాహనాలను ఘటన స్థలంలో వదిలిపోవడంతో పోలీస్స్టేషన్కు తరలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. -
డీసీఎం ఢీకొనడంతో లారీ బోల్తా
కొత్తకోట రూరల్: ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి డీసీఎం ఢీకొనడంతో లారీ బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారి 44పై చోటుచేసుకొంది. లారీ డ్రైవర్ శివ తెలిపిన వివరాలు.. బెంగుళూర్ నుంచి ద్రాక్ష పండ్లను లోడ్ చేసుకొని కశ్మీర్కు వెళ్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట సమీపంలోకి రాగానే కర్నూల్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. లారీ రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవర్లు శివ, కృష్ణతో పాటు ద్రాక్షపండ్ల యజమాని స్వామికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసునని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ఆనంద్ తెలిపారు. -
6 క్వింటాళ్ల నల్లబెల్లం, 30 కిలోల పటిక స్వాధీనం
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల, చారకొండ, అగ్రహారం తండా, ఎకై ్సజ్ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు శుక్రవారం సారా స్థవరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో అగ్రహరంతండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తాలు దాదాపుగా 6 క్వింటాళ్ల నల్లబెల్లం, 30 కిలోల పటిక, 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ వెంకట్రెడ్డి తెలిపారు. అదే తండాకు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ సిర్సనగండ్ల జాతర సందర్భంగా గ్రామాల్లో కాని, జాతర సమీపంలో నాటుసారా, మద్యం నిషేధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్ఫొర్స్మెంట్ సీఐ శారద, సిబ్బంది రామకృష్ణ, రఘు, మహేష్, భీమమ్మ, నార్య ఉన్నారు. -
ఫిల్టర్ ఇసుక రీచ్ పరిశీలన
ఖిల్లాఘనపురం: మండలంలోని మామిడిమాడ శివారులో జరుగుతున్న ఫిల్టర్ ఇసుక తయారీ ప్రదేశాన్ని తహసీల్దార్ సుగుణ, పంచాయతీరాజ్ ఏఈ రమేష్నాయుడు పోలీసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారు చేసి విక్రయిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. మామిడిమాడ శివారులోని నేరెడు చెరువులో పెద్ద ఎత్తున ఫిల్టర్ ఇసుక దందా జరిగినట్లు అక్కడి పరిస్థితులను చూస్తే తెలుస్తుందని తెలిపారు. అధికారుల హెచ్చరికలు బేఖాతర్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు ఫిల్టర్ ఇసుక ఉపయోగిస్తున్నట్లు సమాచారం రావడంతో తహసీ ల్దార్, పీఆర్ ఏఈ రమేష్నాయుడు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అది ఫిల్టర్ ఇసుకగా గుర్తించి దానిని ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించరాదని అక్కడ నిర్మాణాలు చేస్తున్న వారిని ఆదేశించారు. అధికారులు అ క్కడి నుంచి వెళ్లిన కొంతసేపటికే యథావిధిగా ఫి ల్టర్ ఇసుకతోనే ఇళ్ల నిర్మాణాలు సాయంత్రం వరకు కొనసాగించారు. ఈ విషయమై పీఆర్ ఏఈ రమేష్నాయుడును వివరణ కోరగా ఫిల్టర్ ఇసుకతో నిర్మాణాలు చేపట్టొదని సూచించామని, వారు అలాగే ని ర్మాణాలు చేపడితే ఎంబీ చేయకుండా నిలిపివేస్తామన్నారు. -
ఇసుక డంపు స్వాధీనం
కోస్గి: అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును శుక్రవారం రెవెన్యూ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కడంపల్లి వాగులో 100 ట్రిప్పులకు పైగా ఇసుక నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో తహసీల్దార్ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పట్టుబడిన ఇసుకను చంద్రవంచలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తరలించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. సిబ్బందికి షిఫ్టుల వారీగా విధులు కేటాయించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని వివరించారు. ఆర్ఐలు సుభాష్రెడ్డి, లింగారెడ్డి, జేఏ హన్మంతు, సిబ్బంది వెంకట్రాములు, బుగ్గప్ప, వెంకటయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ప్రేమించాడని యువకుడిపై దాడి నవాబుపేట: యువతిని ప్రేమించాడన్న కారణంతో యువకుడిపై యువతి కుటుంబీకులు దాడిచేసి గాయపర్చిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విక్రమ్ కథనం మేరకు.. మండలంలోని పల్లెగడ్డకు చెందిన అరవింద్ జిల్లాకేంద్రంలోని పాత పాలమూర్కు చెందిన యువతిని ప్రేమిస్తున్నట్లు యువతి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు తెలిసింది. దీంతో శుక్రవారం యువతికి సంబంధించిన వ్యక్తులు పల్లెగడ్డకు వచ్చి మాట్లాడదాం రమ్మంటూ అరవింద్ను గ్రామం బయటకు తీసుకొచ్చి మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో స్పృహతప్పి పడిపోగా అక్కడ ఉన్న కొందరు డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో పోలీసు వాహనం అక్కడికి చేరుకోగా దాడిచేసిన వ్యక్తులు పరారయ్యారు. వాహనాలను ఘటన స్థలంలో వదిలిపోవడంతో పోలీస్స్టేషన్కు తరలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. -
అలంపూర్ పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
స్థానికంగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని పరిశీలించిన కలెక్టర్.. అక్కడ ఆలయాలకు వచ్చే వాహనాల పార్కింగ్తోపాటు భక్తుల వసతుల కల్పన కోసం, పబ్లిక్ టాయిలెట్లు, సమాచార కేంద్రంగా మార్చాలని, స్థలంలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి, పచ్చదనాన్ని పెంపొందించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేయాలని మున్సిపల్ కమిషనర్కు చెప్పారు. అనంతరం సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించి పరిసరాల్లో పచ్చదనాన్ని పెంచాలని, మొక్కల సంరక్షణ కోసం నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థాన ప్రవేశ ద్వారాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. భక్తులు పరిశుభ్రమైన వాతావరణంలో దైవదర్శనం చేసుకునేలా, స్థానిక వీధుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, పార్కింగ్ నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం పాపనాశనం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి, దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఆర్కిటెక్టు సూర్యనారాయణమూర్తి, శ్రీలేఖ, కేంద్ర పురావస్తు శాఖ అధికారి రోహిణి పాండే, ఆర్కియాలజీ ఏడీ నాగలక్ష్మి, ఈఓ పురేందర్, డీపీఓ నాగేంద్రం, తహసీల్దార్లు ప్రభాకర్, మంజుల, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ను మరింత సుందరంగా తీర్చిదిద్ది.. పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అలంపూర్ ఆలయాలను సందర్శించారు. పరిసరాలు, పర్యాటకరంగంగా చేయాల్సిన అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు, వసతి కల్పన తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానానికి దిశానిర్దేశంగా జాతీయ రహదారి నుంచి ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను ఆయన పరిశీలించారు. జాతీయ రహదారిపై గల ఇటిక్యాలపాడు, మానవపాడు, అలంపూర్ క్రాస్రోడ్ల వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను పరిశీలించి.. వాటి ఎత్తును పెంచడంతోపాటు, బోర్డులను ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా రూపకల్పన చేయాలని సూచించారు. హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి, ఎర్రవల్లి నుంచి అలంపూర్ మార్గంలోని కీలక ప్రదేశాల్లో సూచిక బోర్డులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయా బోర్డుల్లో అలంపూర్ చరిత్ర, ఆలయ విశిష్టతను తెలియజేసే విధంగా చిత్రలేఖనాలు, ఆలయ సంస్కృతి ప్రతిబింబించేలా బొమ్మలు గీయించాలన్నారు. అలంపూర్ అండర్పాస్ ఫ్లైవర్ను పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మార్గంలోనే ఆధ్యాత్మిక భావన వచ్చేలా ప్రధాన కూడళ్లలో ఆకర్షణీయమైన చిత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అలంపూర్ రైల్వే గేట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఆలయ ఆర్చిని పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. 20 ఎకరాల్లో పార్కింగ్.. జోగుళాంబ ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి 20 ఎకరాల్లో పార్కింగ్, ఇతర వసతుల ఏర్పాటుకు చర్యలు ఆలయ విశిష్టత, చరిత్ర తెలియచేసే విధంగా చిత్రాలు గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ వెల్లడి -
నేటికీ చిక్కని ఆచూకీ
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ)సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రమాదవశాత్తు చిక్కుకోగా ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. 42 రోజులుగా మిగిలిన ఆరుగురు కార్మికుల కోసం సొరంగంలో అణువణువునా వెతుకులాట కొనసాగిస్తున్నారు. సొరంగం లోపల త్వవకాలు చేపడుతూ టీబీఎం భాగాలు స్టీల్, మట్టి, బురద, రాళ్లును వెలికితీసి బయటకు తరలిస్తున్నారు. టీబీఎం భాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది ప్లాస్మా కట్టర్తో కట్చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. నాలుగు ఎస్కవేటర్లు సహాయంతో మట్టిని తవ్వి కన్వేయర్ బెల్టు ద్వారా బయటికి తీసుకువస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం సహాయక బృందాలకు కేటాయించిన పనిని పూర్తిస్థాయిలో చేపడుతూ సహాయక చర్యలు వేగవంతం చేశామని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. శుక్రవారం జేపీ కంపెనీ కార్యాలయంలో ఉన్నతాధికారులు, ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, ిహైడ్రా అధికారి సుదర్శన్రెడ్డి, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేటి చంద్రం, జేపీ కంపెనీ ప్రతినిధులతో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ కన్వేయర్ బెల్టు పనులు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. సొరంగం లోపల 24గంటలు ఐదు ఎస్కవేటర్ల స్టీల్ భాగాలను, ప్రమాద ప్రదేశంలో భారీగా ఉన్న రాళ్లను లోకో ట్రైన్ ప్లాట్ ఫాం పైకి తరలించి మట్టి త్వవకాలు చేపడుతున్నామన్నారు. సొంరగం లోపల నీటిఊటను నిరంతరం బయటకు పంపింగ్ చేస్తున్నామని చెప్పారు. సహాయక బృందాలకు అవసరమైన వసతులు కల్పిస్తూ ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 42 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు టీబీఎం భాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటికి పూర్తైన కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ పనులు -
ఉరేసుకొని యువకుడు బలవన్మరణం
నాగర్కర్నూల్ క్రైం: ఇంట్లో ఉరేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక బీసీ కాలనీకి చెందిన సాయికుమార్(20) డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మృతిచెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి లింగాల: మండలంలోని కొత్తకుంటపల్లికి చెందిన సౌడమోని మధు(22) చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఈ నెల 2వ తేదీన ద్విచక్ర వాహనంపై వరికోత మిషన్ కోసం అంబట్పల్లి వైపు తమ్ముడు సాయితో కలిసి వెళ్లాడు. ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో మధు తలకు బలమైన గాయం కాగా, సాయికి స్వల్ప గాయాలయ్యాయి. మధును నిమ్స్కు తరలించగా కోలుకోలేక చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం మృతుడి తండ్రి సౌడమోని శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రైలు నుంచి పడి వ్యక్తి.. ఎర్రవల్లి: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు రైల్వే కానిస్టేబుల్ అశోక్కుమార్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఇటిక్యాల మండలం పూడూరు–ఇటిక్యాల రైల్వేస్టేషన్ మధ్యలో కి.మీ. 204/2–3 వద్ద 45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి గురువారం రాత్రి రైలులో నుంచి కిందపడి మృతి చెందినట్లు చెప్పారు. గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గద్వాల మార్చురీకి తరలించినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు గద్వాల రైల్వే పోలీస్ నంబర్ 83412 52529 సంప్రదించాలని సూచించారు. డిగ్రీ విద్యార్థి బలవన్మరణం బల్మూర్: మండలంలోని తుమ్మెన్పేట గ్రామంలో అరవింద్(20) అనే డిగ్రీ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తోకల తిరుపతయ్య కుమారుడు అరవింద్ హైదరా బాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఉగాది పండుగకు ఇంటికి వచ్చిన అరవింద్ ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. కాగా విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎలాంటి ఫి ర్యాదు అందలేదని ఎస్ఐ రమాదేవి తెలిపారు. చెరువులో మృతదేహం లభ్యం పాన్గల్: మండల కేంద్రంలోని పొల్కి చెరువులో శుక్రవారం 40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మూడురోజుల కిందట చనిపోయి ఉంటాడని.. ఘటన స్థలంలో చెప్పులు, శాలువా, కల్లు ప్యాకెట్ కనిపించినట్లు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని.. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 87126 70616, 87125 83613 సంప్రదించాలని సూచించారు. వృద్ధురాలిపై దాడిలో ఇద్దరిపై కేసు నమోదు పాన్గల్: వృద్ధురాలిపై దాడిచేసి గాయపర్చిన ఘటనపై శుక్రవారం ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు.. మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన ఆవుల బాలమ్మ అనే వృద్ధురాలికి కూతురు, కుమారుడు ఉన్నారు. వీరిద్దరికి పెళ్లిళ్లు కావడంతో వృద్ధురాలు ఆమె భర్త బాలస్వామి ఇద్దరు వేరుగా నివాసం ఉంటున్నారు. కుమారుడితో కుటుంబ విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదేక్రమంలో గతనెల 29వ తేదీన ఇంటి దగ్గరిలోని నల్లా వద్ద వృద్ధురాలు నీళ్లు పడుతున్న క్రమంలో కోడలు అనిత బిందెను పక్కకు తోసేసి దుర్భాషలాడింది. కుమారుడు ఆంజనేయులు వచ్చి ఇనుప రాడ్తో వృద్ధురాలి తలపై దాడి చేయగా రక్తగాయాలయ్యాయి. అనిత, ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని బాలమ్మ శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అపర భద్రాద్రి సిర్సనగండ్ల
చారకొండ: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రస్వాముల బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి 11వ తేదీ వరకు వారం పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ పుణ్యక్షేత్రం నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిర్సనగండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని అయోధ్యనగర్ (గుట్ట)పైన 300 అడుగుల ఎతైన ఏకశిలపై సుమారు 60 ఎకరాల్లో ఉంది. బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కు లు తీర్చుకుంటారు. శ్రీరామనవమి రోజున భద్రాచలం మాదిరిగానే ఇక్కడ కూడా ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణం జరగనుంది. ఆలయ చరిత్ర.. సిర్సనగండ్ల గుట్టపై సీతారామచంద్రస్వామి ఆలయం ఏర్పడకముందే ముక్కిడి పోచమ్మ, దత్తాత్రేయ దేవాలయాలు ఉండేవని.. గ్రామానికి చెందిన ఢేరం రామయాజ్వీ నిత్యం పోచమ్మకు పూజలు చేసి అనంతరం దత్తాత్రేయ దేవాలయంలో తపస్సు చేసేవాడని చరిత్ర చెబుతోంది. ఒకరోజు అతనికి కలలో స్వామివారు దర్శనమిచ్చి ఖమ్మం జిల్లా పాల్వంచ రావిచేడు గ్రామంలో భాస్కరుడు అనే బ్రహ్మణుడి ఇంటి పేరటిలో కాకార పాదుకింద విగ్రహాలు ఉన్నాయని.. తీసుకొచ్చి రోకలి శబ్ధం కూడా వినిపించని పవిత్ర స్థలం సిర్సనగండ్ల గుట్టపై ప్రతిష్టించాలని చెప్పారని ప్రతీతి. ఆయనతో పాటు గ్రామపెద్దలు ఎద్దుల బండ్లపై అక్కడికి వెళ్లి రాజుగారికి వివరించి భటులతో కలిసి కాకరపాదులో తవ్వగా సీతారామచంద్రస్వామి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు బయటపడ్డాయని.. వాటిని తీసుకొస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆంజనేయస్వామి విగ్రహాన్ని అప్పజెప్పి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తీసుకొచ్చారని పెద్దలు చెబుతారు. వాటిని గుట్టపై ప్రతిష్టించే సమయంలో పోచమ్మ తల్లి ప్రత్యక్షమై వద్దని చెప్పడంతో సీతారామచంద్రస్వామి ప్రత్యక్షమై అమ్మవారిని శాంతించి భక్తులు నీ దర్శనం చేసుకున్న తర్వాతే మమ్ముల్ని దర్శించుకుంటారని అభయం ఇవ్వడంతో అభయ రాముడిగా, క్షత్రీయ వంశానికి చెందినవారు కావడంతో రాజా రాముడిగా భక్తులకు దర్శనమిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. నైరుతి భాగంలో పోచమ్మతల్లి, తూర్పుదిశలో సీతారామచంద్రస్వామి నిత్యం భక్తులకు దర్శనమిస్తున్నారు. 14వ శతాబ్దంలో రాచకొండ పద్మనాయకుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు దేవాలయంలోని ఒక స్తంభంపై అప్పటి లిపిలో చెక్కినట్లు నేటికీ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రత్యేక బస్సులు.. బ్రహ్మోత్సవాలకు మహబూబ్నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నేటి నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఏకశిలపై వెలిసిన సీతారామచంద్రస్వామి దేవాలయం ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణం ఏర్పాట్లు పూర్తిచేసిన పాలక వర్గం కార్యక్రమాలు ఇలా.. మొదటిరోజు శనివారం మధ్యాహ్నం మాస కల్యాణం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణం సోమవారం ఉదయం కుంకుమార్చన, రాత్రి చిన్న రథం (పూల తేరు) మంగళవారం శివదత్తాత్రేయ పరశురామ, పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు బుధవారం ప్రత్యేక పూజలు, రాత్రి పెద్ద తేరు (రథోత్సవం) గురువారం పల్లకీసేవ, ఏకాంతసేవ తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ చైర్మన్ ఢేరం రామశర్మ, ఈఓ స్వర్గం ఆంజనేయులు తెలిపారు. వెండి కిరీటం బహూకరణ సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలోని సీతమ్మ తల్లికి శుక్రవారం చారకొండ గ్రామానికి చెందిన బొడ్డు స్వాతి, నవీన్ దంపతులు రూ.40 వేల విలువైన 40 తులాల వెండి కిరీటాన్ని బహూకరించారు. -
నేటికీ చిక్కని ఆచూకీ
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ)సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రమాదవశాత్తు చిక్కుకోగా ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. 42 రోజులుగా మిగిలిన ఆరుగురు కార్మికుల కోసం సొరంగంలో అణువణువునా వెతుకులాట కొనసాగిస్తున్నారు. సొరంగం లోపల త్వవకాలు చేపడుతూ టీబీఎం భాగాలు స్టీల్, మట్టి, బురద, రాళ్లును వెలికితీసి బయటకు తరలిస్తున్నారు. టీబీఎం భాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది ప్లాస్మా కట్టర్తో కట్చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. నాలుగు ఎస్కవేటర్లు సహాయంతో మట్టిని తవ్వి కన్వేయర్ బెల్టు ద్వారా బయటికి తీసుకువస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం సహాయక బృందాలకు కేటాయించిన పనిని పూర్తిస్థాయిలో చేపడుతూ సహాయక చర్యలు వేగవంతం చేశామని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. శుక్రవారం జేపీ కంపెనీ కార్యాలయంలో ఉన్నతాధికారులు, ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, ిహైడ్రా అధికారి సుదర్శన్రెడ్డి, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేటి చంద్రం, జేపీ కంపెనీ ప్రతినిధులతో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ కన్వేయర్ బెల్టు పనులు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. సొరంగం లోపల 24గంటలు ఐదు ఎస్కవేటర్ల స్టీల్ భాగాలను, ప్రమాద ప్రదేశంలో భారీగా ఉన్న రాళ్లను లోకో ట్రైన్ ప్లాట్ ఫాం పైకి తరలించి మట్టి త్వవకాలు చేపడుతున్నామన్నారు. సొంరగం లోపల నీటిఊటను నిరంతరం బయటకు పంపింగ్ చేస్తున్నామని చెప్పారు. సహాయక బృందాలకు అవసరమైన వసతులు కల్పిస్తూ ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 42 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు టీబీఎం భాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటికి పూర్తైన కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ పనులు -
నిఘానేత్రాల వినియోగంలో మొదటి స్థానం
అమరచింత/గద్వాల క్రైం: సీసీ కెమెరాలను వినియోగించి నేరాలను ఛేదించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, నిఘా నేత్రాల ఏర్పాటుపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముందున్నామని డీజీపీ డా.జితేందర్ అన్నారు. శుక్రవారం ఆయన జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో పర్యటించారు. అమరచింత మండలంలోని మస్తీపురంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను, వనపర్తిలోని సాయుధదళ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు పలు పోలీస్ష్టేషన్ల భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో పోలీసు అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. జూరాలప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో పోలీస్ అవుట్పోస్టు ఏర్పాటుతో అంతర్రాష్ట్ర అక్రమ రవాణాను నియంత్రించే అవకాశం ఉందని తెలిపారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో ఆన్లైన్ బెట్టింగ్ కేసులపై ప్రత్యేక బృందం విచారణకు శ్రీకారం చుట్టిందన్నారు. యువ త బెట్టింగ్ యాప్ల ద్వారా తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్న ఘటనలు ప్రతి చోట వెలుగులోకి వస్తున్నాయని.. ఈ కేసుల విచారణకు సీట్ దర్యాప్తు చేస్తుందన్నారు. నడిగడ్డలో నమోదైన బెట్టింగ్ కేసుల నివేదికలను అందించాలని డీజీపీ ఆదేశించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో నిషేధిత మత్తు పదార్థాలు, ఇసుక, రేషన్ బియ్యం, మట్టి, నకిలీ విత్తనాలు, గంజాయి, గుట్కా తదితర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. కృష్ణా, తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు నిఘా పెంచాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం.రమేష్, ఐజీ సత్యనారాయణ, జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీలు పాల్గొన్నారు. డీజీపీ డా.జితేందర్ -
ఫిర్యాదులు లేకుండా సన్నబియ్యం పంపిణీ చేయాలి
మహబూబ్నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీని చౌకధర దుకాణాల ద్వారా పేద కుటుంబాల కార్డుదారులకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం ధర్మాపూర్లో చౌకధర దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నాయి.. ఇప్పటి వరకు ఎంత మందికి బియ్యం పంపిణీ పూర్తయింది.. తదితర వివరాలను రేషన్డీలర్ను అడిగి తెలుసుకున్నారు. చౌకధర దుకాణంలోని బియ్యం నిల్వలు, వాటి నాణ్యతను పరిశీలించారు. సన్నబియ్యం లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి సన్న బియ్యం పంపిణీపై వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ప్రభుత్వం పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేషన్దుకాణాల్లో సమయపాలన పాటించాలని, రైతులు పనులకు వెళ్లి ఉదయం రాలేని వారికి సాయంత్రం కూడా పంపిణీ చేయాలని డీలర్కు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సుందర్రాజ్ ఉన్నారు. సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రేషన్షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆయన కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, పేదలు బియ్యాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి బియ్యం రవాణాపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రేషన్ దుకాణాల్లో అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం రవినాయక్ తదితరులు పాల్గొన్నారు -
‘ఆఫీసుకు వచ్చి మీ అందరినీ తంతా..’
పాలమూరు: మూసాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టిశేఖర్ ఇటీవల రెవెన్యూ ఉద్యోగితో ఫోన్లో మాట్లాడిన తిట్ల దండకం ఆడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారం క్రితం నిజాలాపూర్లో సీసీరోడ్లు వేయడానికి ట్రాక్టర్లతో స్థానిక పెద్దవాగు నుంచి ఇసుకను తరలించుకోవడానికి కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ద్వారా అనుమతి పొందారు. 10 ట్రిప్పులకు అనుమతి ఉండటంతో సమయం దాటిపోయిన తర్వాత అదే గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి చందు అక్కడికి వెళ్లి ట్రాక్టర్లను ఆపాడు. గ్రామస్తులు పార్టీ మండల అధ్యక్షుడు శెట్టిశేఖర్కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో ఆయన చందుకు ఫోన్ చేసి తిట్టాడు. వాహనాలను ఆపడానికి నువ్వెవరు అంటూ బూతు పురాణం అందుకున్నాడు. అంతటితో ఆగకుండా నౌకరి చేయాలనుకుంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు. ‘తహసీల్దార్ ఆఫీసుకు వచ్చి మీ అందరినీ లోపల వేసి తంతా..’ అంటూ తిట్టిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఘటన జరిగిన మరుసటి రోజు దీనిపై మండల అధికారులు రాజీ చేశారని తెలిసింది. తాజాగా ఆడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తహసీల్దార్ రాజును ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. రెవెన్యూ ఉద్యోగిపై కాంగ్రెస్ నాయకుడి తిట్ల దండకం సోషల్ మీడియాలో వైరల్ -
పెట్టుబడికి అప్పు తెచ్చిన
ఉన్న 1.34 ఎకరాల పొలంలో వరి వేసిన. ఇప్పటి దాక దుక్కులు, దమ్ము, నాట్లకు, మందులకు రూ.40 వేల వరకు పెట్టుబడి ఖర్చులయ్యాయి. రైతు భరోసా డబ్బులు రాగానే ఇస్త అని చెప్పి తెలిసిన కాడ అప్పు తెచ్చిన. రెండునెలల నుంచి ఎదురుచూస్తున్న. రూపాయి రాలే. రైతు భరోసా డబ్బుల కోసం రోజుల బ్యాంకుల చుట్టూ తిరుగుడైతున్నది. మూడెకరాలు ఉన్నోళ్లకు రైతు భరోసా డబ్బులు పడ్డాయట. నాకు 1.34 ఎకరాలే ఉంది. మరి మేమేం పాపం చేసినం. మేము కూడా రైతులమే కదా. మాకెందుకు సాయం చేస్తలేరు. గతంలో గిట్ల లేకుండే. అందరిని సమానంగా చూసిండ్రు. – నరేష్, రైతు, మాచన్పల్లి, మహబూబ్నగర్ రూరల్ -
భరోసా లేదు.. రుణమాఫీ కాలేదు
ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా డబ్బులు నేటికీ బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. మా గ్రామంలో సొంతంగా ఎకరా భూమి ఉంది. అందులో వరి పంట వేసిన. ఇంతవరకు రైతు భరోసా పడలేదు.. రుణమాఫీ కూడా కాలేదు. రైతు భరోసా ఎప్పుడు పడుతుందోనని బ్యాంకు చుట్టూ.. అధికారుల చుట్టూ తిరుగుడు అవుతుంది. నా లాంటి రైతులకు భరోసా డబ్బులు జమ చేస్తే కోతలకు పనికి వస్తాయి. – హరిజన ఆశన్న, రైతు, కోడూర్, మహబూబ్నగర్ రూరల్ రైతులందరికీ పెట్టుబడి సాయం ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతు భరోసాను రైతుల బ్యాంకు ఖాతాల్లో అవుతున్నాయి. ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 1.88,905 మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.160.81 కోట్లు జమ చేసింది. మిగిలిన రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం త్వరలో అందుతుంది. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
మూడు రూపాయల వడ్డీకి తెచ్చి..
నాకు రెండెకరాల 28 గుంటల భూమి ఉంది. ఆ పొలంలో వరి సాగు చేశాను. ప్రభుత్వం సీజన్ ప్రారంభంలో రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారితో నూటికి మూడు రూపాయల చొప్పున అప్పు తెచ్చి పంట సాగు చేసుకున్నాం. ఎకరాకు రూ.35 వేల పెట్టుబడి అయింది. యాసంగి సీజన్ ముగింపు దశకు వచ్చినా ఇంకా పెట్టుబడి డబ్బు పడలేదు. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తే కోతలు, కూలీల అవసరాలకు ఉపయోగపడతాయి. – బొక్క దేవన్న, రైతు, తాటికొండ, భూత్పూర్ మండలం -
7 నుంచి చిన్నారులకుకంటి పరీక్షలు
పాలమూరు: జిల్లాలో ఈ నెల 7 నుంచి 0–6 ఏళ్ల ఉన్న చిన్నారులకు కంటి పరీక్షలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామని, మొత్తం 1,163 అంగన్వాడీల పరిధిలో 51,772 మంది చిన్నారులను గుర్తించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ వెల్లడించారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్కుమార్ సింగ్తో కలిసి ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి చిన్నారికి కంటి పరీక్ష నిర్వహించి ఏదైనా సమస్య ఉంటే చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2024లో 12,674మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేసి 786 మందికి సమస్య ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రెండో దశ 2024 ఆగస్టులో 46,415 మందికి పరీక్షలు చేయగా 1,486 మందికి కంటి సమస్య ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఎంపిక చేసిన లక్ష్యంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి సర్జరీ అవసరమైన చిన్నారులతో పాటు చికిత్స కావాల్సిన వారికి అందించనున్నట్లు పేర్కొన్నారు. డీఐఓ డాక్టర్ పద్మజ, జిల్లా మాస్మీడియా అధికారిని మంజుల, ప్రవీణ్కుమార్, సుభాష్ చంద్రబోస్, దేవిదాస్ పాల్గొన్నారు. -
పెట్టుబడికి అప్పు తెచ్చిన
ఉన్న 1.34 ఎకరాల పొలంలో వరి వేసిన. ఇప్పటి దాక దుక్కులు, దమ్ము, నాట్లకు, మందులకు రూ.40 వేల వరకు పెట్టుబడి ఖర్చులయ్యాయి. రైతు భరోసా డబ్బులు రాగానే ఇస్త అని చెప్పి తెలిసిన కాడ అప్పు తెచ్చిన. రెండునెలల నుంచి ఎదురుచూస్తున్న. రూపాయి రాలే. రైతు భరోసా డబ్బుల కోసం రోజుల బ్యాంకుల చుట్టూ తిరుగుడైతున్నది. మూడెకరాలు ఉన్నోళ్లకు రైతు భరోసా డబ్బులు పడ్డాయట. నాకు 1.34 ఎకరాలే ఉంది. మరి మేమేం పాపం చేసినం. మేము కూడా రైతులమే కదా. మాకెందుకు సాయం చేస్తలేరు. గతంలో గిట్ల లేకుండే. అందరిని సమానంగా చూసిండ్రు. – నరేష్, రైతు, మాచన్పల్లి, మహబూబ్నగర్ రూరల్ -
7 నుంచి చిన్నారులకుకంటి పరీక్షలు
పాలమూరు: జిల్లాలో ఈ నెల 7 నుంచి 0–6 ఏళ్ల ఉన్న చిన్నారులకు కంటి పరీక్షలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామని, మొత్తం 1,163 అంగన్వాడీల పరిధిలో 51,772 మంది చిన్నారులను గుర్తించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ వెల్లడించారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్కుమార్ సింగ్తో కలిసి ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి చిన్నారికి కంటి పరీక్ష నిర్వహించి ఏదైనా సమస్య ఉంటే చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2024లో 12,674మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేసి 786 మందికి సమస్య ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రెండో దశ 2024 ఆగస్టులో 46,415 మందికి పరీక్షలు చేయగా 1,486 మందికి కంటి సమస్య ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఎంపిక చేసిన లక్ష్యంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి సర్జరీ అవసరమైన చిన్నారులతో పాటు చికిత్స కావాల్సిన వారికి అందించనున్నట్లు పేర్కొన్నారు. డీఐఓ డాక్టర్ పద్మజ, జిల్లా మాస్మీడియా అధికారిని మంజుల, ప్రవీణ్కుమార్, సుభాష్ చంద్రబోస్, దేవిదాస్ పాల్గొన్నారు. -
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మెల్బోర్న్లోని బియాండ్ యువర్ మైండ్స్ సంస్థ వ్యవస్థాపకురాలు సరోజ గుల్లపల్లి పేర్కొన్నారు. శుక్రవారం పీయూలో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పక్షుల ఎదుగుదల, జీవితంతో పోరాటం తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు వివరించారు. వ్యక్తి అభిరుచికి అనుగుణంగా స్వేచ్ఛను అనుభవించాలని, ఎంత కష్టపడితే అంత పైకి ఎదుగుతారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని, సామాజిక నిబంధనలతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో కొత్త అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవికుమార్, సిద్ధరామాగౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర రూ.2,259 దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,259, కనిష్టంగా రూ.1,809గా నమోదయ్యాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,800, కనిష్టంగా రూ.1,666గా ధరలు లభించాయి. సీజన్ ప్రారంభం కావడం వల్ల మార్కెట్కు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. మార్కెట్కు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయని మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. తిరిగి సోమవారం మార్కెట్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం అవుతుందని, రైతులు ఈ విషయం గుర్తించుకొని సహకరించాలని కోరారు. స్థానిక ఎన్నికలపై కార్యాచరణ సిద్ధం చేయండి పాలమూరు: జిల్లాలో ఈనెల 6 నుంచి 13 వరకు ప్రతి బూత్స్థాయిలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్కుమార్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14 నుంచి 25 వరకు అంబేద్కర్ జయంతి వేడుకలు చేపట్టాలన్నారు. వక్ఫ్బోర్డు సవరణ, జనగణన అంశాలను ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకెళ్లాలన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఎక్కడిక్కడ ఘనంగా చేపట్టాలన్నారు. వచ్చే స్థానిక ఎన్నికలపై కార్యాచరణ తయారు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. బూత్ కమిటీలు, మండల కమిటీలు లేని చోట్ల కొత్తగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, వీర బ్రహ్మచారి, బాలరాజు, ఎగ్గని నర్సింహులు, రవీందర్రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల జీతాలు పెంచకపోవడం సిగ్గుచేటు మహబూబ్నగర్ న్యూటౌన్: దేశ సంపదకు కారకులైన కార్మికులు, శ్రామికుల జీతాలు పెంచకుండా ఎంపీల జీతాలు పెంచుకోవడం సిగ్గుచేటని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యండీ యూసుఫ్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా 12వ మహాసభల సందర్భంగా సీపీఐ కార్యాలయం ఎదుట జెండా ఎగురవేసి, అక్కడి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ భవన్లో మహాసభలను ప్రారంభించి, మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రపూరిత విధానాల ఫలితంగా దేశ కార్మిక వర్గం తీవ్రమై న శ్రమదోపిడీకి గురవుతుందన్నారు. బ్రిటీష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను సవరణల పేరుతో పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మికుల సంక్షేమానికి సమాధి కడుతున్నారని ఆరోపించారు. అసంఘటిత కార్మికుల సంక్షేమ నిధికి భారీగా కోత లు విధించారని మండిపడ్డారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ మాట్లాడుతూ కార్మిక వర్గం లేకుంటే దేశ అభివృద్ధి శూన్యమన్నారు. కార్మికులు రాజకీయ చైతన్యవంతులు మారా లని పిలుపునిచ్చారు. నాయకులు సత్యనారాయణ, పి.సురేష్, బాగి కృష్ణయాదవ్, కోటకదిర నర్సింహ, ఆంజనేయులు పాల్గొన్నారు. -
భరోసా కోసం నిరీక్షణ
పెట్టుబడి సాయం రాకపోవడంపై రైతన్నల అసంతృప్తి ● ఎకరా భూమి ఉన్న రైతులకు కూడా జమకాని డబ్బులు ● కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వైనం ● ప్రభుత్వం ప్రకటించిన గడువు సైతం పూర్తి ● జిల్లాలో 25,895 మంది రైతులకు అందని రైతు భరోసా రైతు భరోసా వివరాలు కేటాయించిన బడ్జెట్ (రూ.కోట్లలో) 229.732,14,800 -
మూడు రూపాయల వడ్డీకి తెచ్చి..
నాకు రెండెకరాల 28 గుంటల భూమి ఉంది. ఆ పొలంలో వరి సాగు చేశాను. ప్రభుత్వం సీజన్ ప్రారంభంలో రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారితో నూటికి మూడు రూపాయల చొప్పున అప్పు తెచ్చి పంట సాగు చేసుకున్నాం. ఎకరాకు రూ.35 వేల పెట్టుబడి అయింది. యాసంగి సీజన్ ముగింపు దశకు వచ్చినా ఇంకా పెట్టుబడి డబ్బు పడలేదు. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తే కోతలు, కూలీల అవసరాలకు ఉపయోగపడతాయి. – బొక్క దేవన్న, రైతు, తాటికొండ, భూత్పూర్ మండలం -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే
● టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం తప్పదని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక టీఎన్జీఓ భవన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు రావల్సిన బిల్లులు అందక ఉద్యోగులు ఆయోమయంలో ఉన్నారన్నారు. తమ జీతం డబ్బు నుంచి నెలనెల దాచుకున్న జీపీఎఫ్ అకౌంట్ నుంచి తమ అవసరం కోసం లోన్ రూపంలో దరఖాస్తు చేసుకొని ఏడాది గడుస్తున్నా బిల్లులు పాస్ కాకపోవడం భాదాకరమన్నారు. మెడికల్ బిల్స్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శ చంద్రనాయక్, జిల్లా కోశాధికారి కృష్ణమోహన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
7వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు తెరవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వ్యవసాయశాఖ అధికారులతో పాటు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, ఏపీఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 7వ తేదీ నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాలను తెరవాలని అన్నారు. ఈ యాసంగిలో వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరను ప్రకటించాయన్నారు. సన్నధాన్యానికి ప్రోత్సాహకంగా క్వింటాల్కు రూ.500లు ప్రభు త్వం బోనస్ ప్రకటించినట్లు తెలిపారు. గత ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో గుర్తించిన లోపాలను రబీ ధాన్యం సేకరణ సందర్భంగా సరి చేసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో సన్నరకం ధాన్యం నింపే గోనె సంచులను ఎర్ర దారంతో, దొడ్డు రకం ధాన్యం నింపు సంచులను ఆకు పచ్చదారంతో కుట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, డీఎస్ఓ వెంకటేష్, డీఆర్డీఓ నర్సింహులు, అడిషనల్ డీఆర్డీఓ జోజప్ప, అధికారులు, ఐకేపీ మహిళలు హాజరయ్యారు. రూ.4 లక్షల వరకు రుణాలు రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు కలెక్టర్ విజయేందిర తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిందని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఆన్లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 14వ తేదీలోగా సమర్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని సూచించారు. ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కాస్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డ్ తప్పనిసరి అని తెలిపారు. దరఖాస్తు హార్డ్ కాపీని ఎంపీడీఓ కార్యాలయంలో లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఛత్రునాయక్, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది అందుబాటులోఉండాలి కలెక్టర్ విజయేందిర బోయి -
పిడుగు పడి ఇద్దరు కూలీలు..
అచ్చంపేట: పదర గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం పిడుగు పడి ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన 10 మంది కూలీలు పదర గ్రామానికి చెందిన రైతు పోగుల వినోద్ పొలంలో వేరుశనగ పంట తీసేందుకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో కూలీలు కొంత మంది చెట్ల కింద తలదాచుకోగా.. చెట్ల కింద పిడుగులు పడుతాయనే ఉద్దేశంతో వర్షంలోనే ఒకే దగ్గర నిల్చున్న సుంకరి సైదమ్మ(45), గాజుల వీరమ్మ(55), సుంకరి లక్ష్మమ్మలపై అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ ఘటనలో సైదమ్మ, వీరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మను వెంటనే పదర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందడంతో కోడోనిపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. పదర ఎస్ఐ సర్దామ్, ఆర్ఐ శేఖర్ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. గేదెలు మేపేందుకు వెళ్లి.. మానవపాడు: పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందిన సంఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చంద్రశేఖర్నగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు(41) గేదెలను మేపేందుకు గురువారం వెళ్లాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా అదే సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లుకు భార్య లక్ష్మీదేవి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ చంద్రకాంత్ను సంప్రదించగా ఫిర్యాదు అందలేదని చెప్పారు. తుంగభద్ర తీరంలో మరొకరు.. శాంతినగర్: వడ్డేపల్లి మండలంలోని బుడమర్సు గ్రామానికి చెందిన మాదిగ రాజు, తిమ్మక్కల చిన్న కుమారుడు మహేంద్ర(21) గురువారం గేదెలు మేపడానికి తుంగభద్ర నదీతీరానికి వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు మహేంద్ర సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా మహేంద్ర రాకపోవడంతో కుంటుంబ సభ్యులు తుంగభద్ర నదితీరానికి వెళ్లి చూడగా విగతజీవుడై కనిపించడంతో బోరున విలపించారు. -
యువజన కాంగ్రెస్ను బలోపేతం చేయాలి
స్టేషన్ మహబూబ్నగర్: పాలమూరు జిల్లాలో యువజన కాంగ్రెస్ విభాగాన్ని బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి అరవింద్కుమార్ యాదవ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ దేశవ్యాప్తంగా జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నదని, దీనిని యువజన కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి విజయవంతం చేయాలని కోరారు. హెచ్సీయూ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ● అంతకుముందు పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అవేజ్ అహ్మద్ అధ్యక్షతన జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు శివంత్రెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి, మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వాసుయాదవ్, ఆయా అసెంబ్లీ అధ్యక్షులు సల్మాన్, శ్రీకాంత్రెడ్డి, లక్ష్మికాంత్రెడ్డి, నాయకులు శ్రీనివాస్యాదవ్, సంజీవరెడ్డి, సలావుద్దీన్ ఫైజాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ యాదవ్ -
చర్యలు తీసుకోవాలి..
ప్రభుత్వం కళాశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. అన్ని తెలిసి ఇంటర్మీడియట్ శాఖ అధికారులు ఎందుకు అటువైపు వెళ్లడం లేదు. కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. – సతీష్, ఏబీవీపీ, జిల్లా కన్వీనర్ కళాశాలలు మూసివేయాలి.. జిల్లాలోని అన్ని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని, ఎలాంటి తరగతులు నిర్వహించరాదని కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. నేటి నుంచి ఏ కళాశాలలో అయినా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. ఓ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. – కౌసర్ జహాన్, డీఐఈఓ, మహబూబ్నగర్ గుర్తింపు రద్దు చేయాలి.. జిల్లాకేంద్రంలోని తిరుమల హిల్స్లో ఉన్న ప్రైవేటు కళాశాలలు ఎలాంటి గుర్తింపు లేకుండా ఎంసెట్, నీట్ వంటి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి. అన్ని తెలిసి తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న డీఐఈఓ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. కళాశాల యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తుంటే ఇంటర్మీడియట్ అధికారులు ఏం చేస్తున్నారు. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి● -
బోరు మోటారు సరిచేస్తుండగా ఇద్దరు యువ రైతులు..
అచ్చంపేట రూరల్: వ్యవసాయ పొలంలోని పాంపాండ్లో ఉన్న బోరు మోటారును సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువరైతులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని చేదురుబావితండాకు చెందిన కాట్రావత్ లోక అలియాస్ లోకేష్(30) తన వ్యవసాయ పొలంలో (పాంపాండ్) బోరు మోటారు రెండు రోజుల నుంచి పనిచేయడం లేదు. దీంతో సమీప పొలంలోని ముడావత్ కుమార్(28) విషయం చెప్పి బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సాయంగా తీసుకెళ్లాడు. బోరు మోటారు సరి చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు యువ రైతులు పొలం వద్ద మృతి చెందిన సంఘటన ఎవరికీ తెలియలేదు. బుధవారం సాయంత్రం అయినా ఇళ్లకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు.. అర్ధరాత్రి వరకు ఇద్దరికి ఫోన్ చేయగా రింగ్ అయినప్పటికీ ఎత్తలేదు. దీంతో కుటుంబసభ్యులు, తండావాసులు తండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో లోకేష్ పొలం వద్ద ఓ చెట్టు కింద బైక్ను గమనించారు. అక్కడికి వెళ్లిన కొందరు ఫోన్ చేయగా పాంపాండ్ వద్ద సెల్ఫోన్ రింగ్ కాగా అక్కడికి వెళ్లి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పాంపాండ్ నుంచి ఇద్దరి మృతదేహాలను తండాకు తరలించారు. ఈ ఘటనపై లోక తండ్రి హన్యా ఫిర్యాదు మేరకు సిద్దాపూర్ ఎస్ఐ పవన్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లోకకు భార్య సరితతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే కుమార్కు భార్య వినోజితో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాధిత కుటుం సభ్యులను పలువురు నాయకులు పరామర్శించారు. -
బాలల సంరక్షణపై నిర్లక్ష్యం వీడాలి
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర హన్వాడ: బాలల సంరక్షణపై నిర్లక్ష్యం వీడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. గురువారం స్థానిక కేజీబీవీలో చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి బాల్యవివాహాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాలపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఉచిత న్యాయ సహాయంతో పాటు బాలలు, మహిళలకు ప్రాథమిక హక్కులను తెలియజేసేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ పని చేస్తుందన్నారు. బాలలు ఏదైనా సమస్య వస్తే 1098కు ఫోన్ చేయాలని సూచించారు. తహసీల్దార్ కిష్ట్యనాయక్, పారా లీగల్ వలంటీర్ యాదయ్య, నాగభూషణం, శివన్న పాల్గొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్లో ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ బీసీ యువతకు స్కూల్ ఆఫ్ బ్యాకింగ్ అండ్ ఫైనాన్స్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ అధికారి మైత్రి ప్రియ గురువారంఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 12వ తేదీన ఉమ్మడి జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర సమాచారం కోసం 040–29303130 నంబర్ను సంప్రదించాలని సూచించారు. పదోన్నతి పొందినఉపాధ్యాయులకు శిక్షణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇటీవల ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాలలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఇటీవల పాఠశాలల్లో ఏఐ ఆధారిత కంప్యూటర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని, వాటిని కూడా విద్యార్థులకు పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రీసోర్స్పర్సన్లు చక్రవర్తి గౌడ్, గిరిజారమణ, బాలుయాదవ్, దుంకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాగర్కర్నూల్ కలెక్టరేట్కు బాంబు బెదిరింపు ● తనిఖీ చేసి.. ఫేక్ మెసేజ్ అని తేల్చిన పోలీసులు నాగర్కర్నూల్: జిల్లా కలెక్టరేట్కు బాంబు బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేగింది. గురు వారం ఉదయం 7:24 గంటలకు జిల్లా కలెక్టర్ మెయిల్కు ఈడీ బేస్డ్ పైప్ బాంబ్తో సాయంత్రం 3.20 గంటలకు కలెక్టర్ కార్యాలయాన్ని పేల్చేస్తామని మెసేజ్ వచ్చింది. ప్రతి రోజు ఉద్యోగులు వచ్చిన వెంటనే కలెక్టర్కు వచ్చిన మెయిల్స్ చెక్ చేయడం సర్వసాధారణం. కాగా గురువారం వచ్చిన ఈ బెదిరింపు మెసేజ్ను గమనించిన సెక్షన్ ఉద్యోగులు విషయాన్ని కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన ఏఓ ఈ విషయాన్ని ఉదయం 11 గంటలకు ఎస్పీ వైభవ్ గైక్వాడ్, అదనపు ఎస్పీ రామేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కనకయ్యలు బాంబ్స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో అక్కడికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు లేకపోవడంతో ఫేక్ మెసేజ్గా పోలీసులు తేల్చారు. అయితే ముప్పల లక్ష్మణ్రావు పేరుతో వచ్చిన ఈ మెసే జ్ చివరి అల్లాహూ అక్బర్ అని రాయడం గమ నార్హం. బాంబు బెదిరింపు రావడంతో ఉద్యోగులు సైతం బయటికి వెళ్లిపోయారు. విచారణ చేస్తున్నాం: శ్రీనివాసులు, డీఎస్పీ కలెక్టరేట్కు బాంబు బెదిరింపు విషయంలో విచారణ చేస్తున్నాం. ఇది ఫేక్ మెసేజే. కలెక్టరేట్లో తనిఖీలు కూడా చేపట్టాం. మెయిల్ ఐడీ ఎక్కడి నుంచే వచ్చిందనే విషయం కనుగోనేందుకు ఐపీ అడ్రస్ కోసం ఐటీ సిబ్బంది ద్వారా విచారణ చేస్తున్నాం. -
సూరాపూర్లో మరో రైతు..
లింగాల: నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని సూరాపూర్కు చెందిన రైతు దేశ పర్వతాలు(40) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తన సొంత వ్యవసాయ పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి గురువారం తెల్లవారుజామున పొలం దగ్గరకు వెళ్లాడు. అయితే బోరు మోటార్ ఆన్ చేసే సమయంలో స్టార్టర్ దగ్గర తేలి ఉన్న వైరు తగిలి షాక్తో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. పర్వతాలుకు భార్య చిట్టెమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
విద్యార్థి సంఘాల నిరసన..
జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాల్లో సైతం కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ, నీట్ తరగతులు నిర్వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. గతంలో పలు కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని, ఇవ్వాల్సిన మెటీరియల్ ఇవ్వలేదని, సరిగా తరగతులు చెప్పలేదని పలువురు విద్యార్థులు విద్యాశాఖతో పాటు పోలీస్ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. -
కొత్త పరిశ్రమలకు ఎంఎస్ఎంఈలు సహకరిస్తాయి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కొత్త పరిశ్రమలకు ఎంస్ఎంఈ(మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్)లు ఎంతో సహకరిస్తాయని పీయూ రిజిస్త్రార్ మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ఆర్థికవృద్ధిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమ పాత్ర అవకాశాలు మరియు సవాళ్లు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఒక్కరోజు జాతీయ సెమినార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈలు ఉపాధి కేంద్రాలుగా వ్యవహరించొవచ్చన్నారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటుపై విద్యార్థి దశ నుంచి పూర్తిస్థాయిలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రిన్సిపాల్ పద్మావతి మాట్లాడుతూ ఉద్యోగం కోసం వేచి చూడకుండా ఎంస్ఎంఈలలో ఒక పరిశ్రమను స్థాపించడంతో పలువురకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకుడు కేశవరెడ్డి, ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనర్ సుధీర్, మంజూల, కల్వకోల్ భాస్కర్, నాగరాజు, వినోద్కుమార్, ఆరీఫ్ పాల్గొన్నారు. బంగారు దుకాణంలో చోరీ కొత్తకోట రూరల్: పట్టణంలోని హనుమాన్ జ్యువెలరీ దుకాణంలో మహిళలు చోరీకి పాల్పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. దుకాణ యజమాని మధ్యాహ్న భోజనానికి వెళ్లగా అందులో పనిచేసే అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. దీనిని గమనించిన ఐదుగురు మహిళలు దుకాణంలోకి వచ్చి బంగారు వస్తువులు చూపాలంటూ మాటల్లో పెట్టగా.. అందులో ఓ యువతి బంగారు బిస్కెట్ను దొంగిలించింది. యజమాని వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి వచ్చి బిస్కెట్ కావాలని అడగగా కనిపించకపోవడంతో అవాకై ్క వెంటనే సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. వచ్చిన వారిలో ఓ యువతి బంగారు బిస్కెట్ దొంగిలించిందని నిర్ధారించుకొని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బిస్కెట్ 6 తులాల బరువు ఉంటుందని, దాని విలువ సుమారు రూ.5 లక్షలని యజమాని వివరించారు. పీయూ రిజిస్త్రార్ మధుసూదన్రెడ్డి -
జీపీఓలు అభద్రతకు గురికావొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఆప్షన్ల ద్వారా రెవెన్యూశాఖలోకి వస్తున్న జీపీఓ (గ్రామ పరిపాలన అధికారి)లు సర్వీసుపరమైన అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామస్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం 10,954 మంది గ్రామ పాలన అధికారులను వ్యక్తిగత ఆప్షన్ల ద్వారా నియమిస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులకు భారీఎత్తున పదోన్నతులు ఉంటాయని చెప్పారు. భూ భారతి ద్వారా రాష్ట్ర రాజధానిలోని సీసీఎల్ఏ నుంచి గ్రామ పరిపాలన అధికారి వరకు అధికారాల వికేంద్రీకరణ జరగడంతో భూ సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయన్నారు. జీఓ నంబర్ 317 ఉద్యోగులను చిన్నాభిన్నం చేసిందని.. ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలకు సైతం చెట్టుకొక్కరికి, పుట్టకొక్కరికి పోస్టింగ్లు ఇచ్చారన్నారు. పదేళ్ల తర్వాత 330 మందిని అధికారికంగా అవుట్ సోర్సింగ్ టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లుగా గుర్తించిందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, నారాయణపేట అడిషనల్ కలెక్టర్ బెంజ్శాలం, ఆర్డీఓ నవీన్, డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణ, వెంకట్రెడ్డి, రాములు, రమేశ్ పాక, రాంరెడ్డి, బిక్షం, రాధ, పాల్సింగ్, ఉపేందర్రావు, డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు
మహబూబ్నగర్ క్రైం: దివిటిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం లారీ డివైడర్ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డుగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దివిటిపల్లి దగ్గర బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో వాహనాలు ఒక వైపు నుంచి పంపిస్తున్నారు. ఈక్రమంలో కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ బ్రిడ్జి సమీపంలో డివైడర్కు ఢీకొట్టి రోడ్డుకు అడ్డుగా నిలిచిపోయింది. దీంతో పోలీసులు దాదాపు రెండుగంటల పాటు కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను భూత్పూర్ బ్రిడ్జి దగ్గర దారి మళ్లించారు. మహబూబ్నగర్ బైపాస్ మీదుగా జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు డైవర్షన్ చేశారు. దీంతో భూత్పూర్ నుంచి బైపాస్ మీదుగా వాహనాలు అధికంగా రావడంతో మహబూబ్నగర్ పిస్తాహౌజ్ సమీపంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. దాదాపు రెండు గంటల తర్వాత రోడ్డుకు అడ్డుగా ఉన్న లారీ తొలగించడంతో వాహనాలను జాతీయ రహదారిపై అనుమతి ఇచ్చారు. తలుపులు పగలగొట్టి ఇంట్లో చోరీ వెల్దండ: మండలంలోని చల్లపల్లికి చెందిన బండ్ల రాములు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసి బంగారం అభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు గురువారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్ల రాములు గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఇళ్లు కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు. చల్లపల్లిలో బుధవారం రాత్రి సోదరుడి ఎంగేజ్మెంట్ ఉండడంతో వెళ్లి, అక్కడే భోజనం చేసి తిరిగి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చారు. అప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు ధ్వంసం చేసి ఉండడాన్ని చూశారు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. బంగారు నల్లపూసలదండ, గొట్టాలు, మ్యాట్నీలు కలిపి రెండున్నర తులాల బంగారం, కేజీ వెండి, సుమారు రూ.30వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. గురువారం బాధితుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఎదురుచూపులే..
అద్దె వాహనదారులకు అందని బిల్లులు ●ఇళ్లకు పోలేకుపోతున్నాం.. నెలల తరబడి బిల్లులు రాలేకపోవడంతో ఇళ్లకు పోలేకపోతున్నాం. అఽధికారులను ఎన్ని సార్లు కలిసినా బిల్లులు చేశామని చెబుతున్నారే తప్ప బిల్లులు మాత్రం రావడం లేదు. రెండు మూడు నెలలంటే ఏమో కాని 12, 15 నెలల నుంచి బిల్లులు రాకుంటే ఎట్ల బతకాలి. ఉన్నతాధికారులు చొరవ చూపి జిల్లా వ్యాప్తంగా ఉన్న బిల్లులను వెంటనే చేయించాలి. – అబ్దుల్ ఖాదర్, జిల్లా అధ్యక్షుడు, ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ హైర్ వెహికిల్స్ అసోసియేషన్, మహబూబ్నగర్ వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేదు బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. రెండేళ్ల నుంచి బిల్లులు రాకుంటే బతికేది ఎలా. – సయ్యద్ సలీం హుసేనీ, కార్యవర్గ సభ్యుడు, మహబూబ్నగర్ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాం పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. బిల్లులు నెల నెల రాకపోవడంతో వాహనాలు నడిపిచేందుకు అప్పులు చేస్తున్నాం. నెలల తరబడి వాహనాలకు చెందిన బిల్లులు రాకపోవడంతో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాం. –ధర్మానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి 34 నెలలుగా పెండింగ్... నా వాహనానికి చెందిన 34 నెలల నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క నెల బిల్లు రాకపోతేనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏకంగా 34 నెలలుగా బిల్లులు రాకపోతే మేము ఎలా జీవించాలి. అధికారులు స్పందించి నా తోపాటు పెండింగ్లో ఉన్న వాహనదారులు బిల్లులను వెంటనే చెల్లించాలి. – నిరంజన్, వాహనదారుడు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వివిధ ప్రభుత్వ శాఖల్లో నడుస్తున్న అద్దె వాహనదారులకు బిల్లుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావడంతో తమకు బిల్లులు రావేమోననే ఆందోళన అద్దె వాహనదారుల్లో నెలకొంది. 12 నెలలుగా వారికి రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండటంతో వారు ఆర్థికంగా నలిగిపోతున్నారు. బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అద్దె వాహనాలను సమకూర్చుకోవాలి.. మండల స్థాయి నుంచి ఆపై స్థాయి అధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె వాహనాలను సమకూర్చుకోవాలి. దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వం ప్రతి నెలా ఒక్కో వాహనానికి రూ.33 వేలు చెల్లిస్తుంది. ఇదిలా ఉండగా చాలా మంది అధికారులు అద్దె వాహనాల స్థానంలో తమ సొంత వాహనాలను వాడుకుంటూ అడ్డదారిలో బిల్లులు నొక్కేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా చేయడం ద్వారా ఎంతో యువత ఉపాధిని కోల్పోతున్నారు. కొందరికే ప్రభుత్వ అధికారుల వద్ద వాహనాలు పెట్టుకునే అవకాశం దొరుకుతోంది. వారికి సైతం బిల్లులు సకాలంలో రావడం లేదు. సొంత పనులకు ఈ వాహనాలే దిక్కు.. కేవలం ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాల్సిన వాహనాలను కొంత మంది అధికారులు సొంత పనులకు సైతం వాడుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఇది ఏమిటని ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందని, ప్రశ్నిస్తే తమ వాహనాలను తొలగిస్తారేమోనని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం వాహనదారులకు సుమారుగా రూ. 40 లక్షల దాకా బిల్లులు రావాల్సి ఉంది. బిల్లులు చెల్లించాలని ఇటీవల పంచాయతీ రాజ్, గ్రామీణాబివృద్ధి శాఖ డైరెక్టర్ సృజనను కలిసి వినతిపత్రం సమర్పించారు. రూ.40 లక్షలకు పైగా పెండింగ్ ఇబ్బందులు పడుతున్న వాహన యజమానులు సొంత వాహనాలను వాడుతున్న పలువురు అధికారులు ఉపాధి కోల్పోతున్న యువత ఎన్నో నెలల నుంచి పెండింగ్.. నిబంధనల ప్రకారం నిరుద్యోగులు ఆయా సంక్షేమ శాఖల ద్వారా కొనుగోలు చేసే వాహనాలను ప్రభుత్వ అధికారుల వద్ద అద్దెకు పెట్టుకోవాలి. ఇలా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో మండల, డివిజన్, జిల్లా అధికారుల వద్ద దాదాపు 150 వరకు వాహనాలు నడుస్తున్నాయి. వాటికి సంబంధించి 15 నెలలుగా బిల్లులు రావడం లేదని వాహనాల యజమానులు చెబుతున్నారు. జిల్లాకు సంబంధించి రూ.40 లక్షలకు పైగా ఉన్న బకాయిలు విడుదల కావాల్సి ఉంది. డీఆర్డీఓ శాఖలో 26 నెలలు, సమాచార పౌర సరఫరాల శాఖ 9 నెలలు, మత్స్య శాఖ 4 నెలలు, గిరిజన సంక్షేమ శాఖ 24 నెలల నుంచి, జిల్లా పరిశ్రమల 5 నెలలు, ఆర్అండ్బీ 12 నెలలు, ఇరిగేషన్ 10 నెలలు, హెల్త్ డిపార్ట్మెంట్ 10 నెలలు, ఎస్సీ అభివృద్ధి శాఖలో ఏకంగా 34 నెలలు, మిషన్భగీరథ (ఇంట్రా) లో 16నెలల నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో పాటు వివిద ప్రభుత్వ శాఖల్లో కూడా నెలల తరబడి బిల్లులు రాక అద్దెవాహనదారులు ఇబ్బందులు పతున్నారు. 16 నెలలుగా పెండింగ్లో బిల్లులు... నా వాహనం మిషన్ భగీరథ శాఖలో నడుస్తుంది. 16 నెలలకు చెందిన బిల్లులు రావాల్సి ఉంది. ఏమిటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారోచేసుకోండని అధికారులు తేల్చి చెబుతున్నారు. మీరు కాకుంటే వేరే వాళ్ల వాహనం పెట్టుకుంటామని బెదిరిస్తున్నారు. – చెన్నయ్య, వాహనదారుడు -
హార్వెస్టర్లో పడి బాలుడు దుర్మరణం
మల్దకల్: పంట పొలంలో మొక్కజొన్న కోసే హార్వెస్టర్లో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడి మృతి చెందినట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. వివరాలు.. మండలంలోని నీలిపల్లికి చెందిన అఖిల, రాజు దంపతుల కొడుకు జీవన్కుమార్(7). తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాజు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను కోసేందుకు హార్వెస్టర్ రావడంతో కుటుంబసభ్యులతో కలసి వెళ్లాడు. అక్కడ హార్వెస్టర్ డ్రైవర్ సుభాష్రెడ్డి మొక్కజొన్న కోసే క్రమంలో అక్కడే ఆడుకుంటున్న జీవన్కుమార్ను గమనించలేదు. బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. గమనించిన డ్రైవర్ హార్వెస్టర్లో పడిన బాలుడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అప్పటికే బాలుడు మృతిచెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వ్యక్తి బలవన్మరణం మల్దకల్: ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అడివిరావల్చెర్వులో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయ నాగరాజు (34) ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవల కడుపునొప్పితో పాటు ఆర్థిక ఇబ్బందులు అధికం కావడంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాగరాజుకు భార్య జయలక్ష్మి, ఇద్దరు సంతానం ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి మహమ్మదాబాద్: రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గండేడ్ మండలంలోని కొంరెడ్డి గ్రామానికి చెందిన వెంకటయ్య(58) పొలం పనులు ముగించుకుని రోడ్డు పక్కన నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన గ్రామస్తులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై వెంకటయ్య కుమారుడు మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ వైర్లకు నిచ్చెన తాకడంతో.. వనపర్తి రూరల్: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని చిమనగుంటపల్లిలో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చిమనగుంటపల్లికి చెందిన శివయ్య(50) శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలోని రామాలయంలో పనులు చేస్తున్నాడు. ఇనుప నిచ్చెనను తీసుకెళ్తున్న క్రమంలో ఆలయంలో వేలాడుతున్న కరెంట్ వైర్లకు నిచ్చెన తాకడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ విషయంపై వనపర్తి రూరల్ ఎస్ఐ జలెందర్రెడ్డిని వివరణ కోరగా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఆలయంలో కరెంటు వైర్లు కిందికి వేలాడుతున్నాయని అధికారులకు గ్రామస్తులు విన్నవించగా కొత్త కరెంటు స్తంభాలు నిలబెట్టారు. కానీ వైర్లు పైకి లాగకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చికిత్స పొందుతూ మరొకరు.. అచ్చంపేట రూరల్: పట్టణంలోని ప్రభు త్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువా రం గుర్తు తెలియని వ్యక్తి(65) మృతిచెందాడు. అచ్చంపేట ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. గత నెల 31న పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని గమనించిన ప్రయాణికులు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. వ్యక్తిని ఎవరైనా గుర్తు పడితే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. రూ.1.50 లక్షలు చోరీ మక్తల్: గుర్తుతెలియని వ్యక్తులు రూ.1.50 లక్షలు చోరీ చేసిన ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి కథనం మేరకు.. మాగనూర్ మండలం నేరెడుగాం గ్రామానికి చెందిన సంకానూర్ నాగప్ప పట్టణంలోని బ్యాంకులో రూ.1.50 లక్షలు డ్రా చేసుకొని తన సొంత ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంకు కవరులో పెట్టాడు. పక్కనే ఉన్న జిరాక్స్ సెంటర్కు వెళ్లి వచ్చేలోగా డబ్బులు కనిపించపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిశీలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
మహబూబ్నగర్ రూరల్: కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆరు దశాబ్దాలుగా బీసీలు పోరాడుతున్నా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎంని చేస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బీసీ జాగృతి సేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంకటేష్యాదవ్, నాయకులు తిరుమలేష్, అంజిలప్ప, రవి, తిమ్మయ్య పాల్గొన్నారు. బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ -
సహాయక చర్యలు వేగవంతం
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో ప్రమాదం జరిగి 41 రోజులు అవుతున్నా.. ఇంకా ఆరుగురు కార్మికుల జాడ లభించలేదు. ప్రమాదంలో రూ.కోట్ల విలువైన టీబీఎం ధ్వంసం కావడంతో పాటు ఎనిమిది మంది కార్మికులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ కనుగొనేందుకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కన్వేయర్ బెల్టు పొడిగింపు, వెంటిలేషన్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఆర్మీకి చెందిన బాబ్కాట్ మెషిన్లు, నాలుగు ఎస్కవేటర్లతో మట్టిని తొలగించి కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు. నిమిషానికి 10 వేల లీటర్ల నీటి ఊటను 150 హెచ్పీ మోటార్ల సాయంతో బయటకు పంపుతున్నారు. 15 రోజుల్లో పూర్తయ్యేనా.. సొరంగంలో కూరుకుపోయిన టీబీఎం శకలాలు, మట్టి, బురద, రాళ్లు ఇతర శిథిలాల తొలగింపు 15 రోజుల్లో పూర్తవుతుందని ప్రభుత్వం గడువు విధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 560 మంది సహాయక సిబ్బంది మూడు, ఐదు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన డీ1, డీ2 ప్రదేశంలోని 30 మీటర్ల వరకు శిథిలాలను తొలగించారు. మరో 110 మీటర్ల మేర మట్టి, బురద, రాళ్లను తొలగిస్తే కార్మికుల ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా పనులు పూర్తవడం గగనమే అనిపిస్తోంది. ఎస్ఎల్బీసీలో కార్మికుల కోసం 41 రోజులుగా గాలింపు -
భూమి కేటాయించాలి
డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటుకు పాలమూరు: మహబూబ్నగర్ రెడ్క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో నూతనంగా డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడానికి భూమి కేటాయించడంతో పాటు భవనం నిర్మాణానికి సహకరించాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్ గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్వర్మను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి ఎలాంటి లాభాపేక్ష లేకుండా అపత్కాలంలో పేదలకు సేవ చేస్తున్న రెడ్క్రాస్కు డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల పేదలకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆధునాతన భవన నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు చేయడానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు
నాగర్కర్నూల్ రూరల్: రాష్ట్రంలో కాగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం నాగర్కర్నూల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కీలకమైన పదవులు సీఎం వద్ద ఉన్నప్పటికీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందన్నారు. తక్షణమే రాష్ట్రంలో హోంమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. కమీషన్లపై ఉన్న ఆశ శాంతిభద్రతలను కాపాడటంలో లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, ఫలితంగా యువకులు వ్యసనాలకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి నిద్రావస్థలో ఉన్నారని, అగ్రకుల కబంధ హస్తాల్లో రాష్ట్రం నాశనం అవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. భూముల పరిరక్షణ కోసం విద్యార్థి నాయకులు చేస్తున్న పోరాటాలకు బీఎస్పీ అండగా ఉంటుందని, ప్రత్యక్ష పోరాటాలకు తాము సహకరిస్తామన్నారు. సమావేశంలో నాయకులు రామచందర్, దయానంద్, శివరామకృష్ణ, ధర్మేంద్ర, చంద్రశేఖర్, పృథ్వీరాజ్, నాగన్న, యూసుఫ్, కుమార్, హర్ష కల్యాణ్ పాల్గొన్నారు. -
పోటెత్తిన వినియోగదారులు
దేవరకద్ర: స్థానిక మార్కెట్కు బుధవారం వినియోగదారులు పోటెత్తారు. వివిధ గ్రామాల నుంచి వందలాది మంది వినియోగదారులు ఉల్లిని కొనడానికి పోటీ పడ్డారు. మార్కెట్లో ఎక్కడ నాణ్యంగా ఉన్న ఉల్లి కుప్ప కనిపిస్తే అక్కడ వినియోగదారులు గుమికూడి ఉల్లిని కొనుగోలు చేశారు. ఉగాది తరువాత దిగుబడిగా వచ్చే ఉల్లి నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండడంతో చాలా మంది వినియోగదారులు ఉల్లిని కొనడానికి రావడంతో మార్కెట్ అంతా సందడిగా కనిపించింది. మార్కెట్కు దాదాపు ఆరు వేల బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. మధ్యాహ్నం వరకు వచ్చిన ఉల్లిలో సగం కుప్పలకు కూడా వేలం జరగలేదు. దీంతో వ్యాపారులే వేలం వేయని మిగతా ఉల్లి కుప్పలకు నేరుగా ధరలు నిర్ణయించి కొనుగోలు చేశారు. కొందరు రైతులు వ్యాపారులను మధ్యవర్తులుగా చేసుకొని ఉల్లి బస్తాలు చేసి అమ్ముకున్నారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలం ద్వారా ఉల్లిని కొనుగోలు చేయగా చిరు వ్యాపారులు కూడా స్థానిక వ్యాపారుల నుంచి ఉల్లిని కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్లో ఉల్లి వ్యాపారమే కొనసాగింది. ఒక పక్క వినియోగదారులు, మరో పక్క వ్యాపారులతో మార్కెట్ కళ కళలాడింది. ఆర్ఎన్ఆర్ ధర రూ. 2139.. దేవరకద్ర మార్కెట్లో మధ్యాహ్నం జరిగిన ఈ టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ. 2139, కనిష్టంగా రూ.1869 గా ధరలు లభించాయి. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ. 1809, కనిష్టంగా రూ. 1739 గా ధరలు నమోదు అయ్యావి. అముదాల ధర గరిష్టంగా రూ. 6011 గా ఒకే ధర లభించంది. కోయిల్సాగర్ ఆయకట్టు కింద యాసంగిలో వేసిన వరి పంటలు కోతకు రావడంతో రైతులు వరి ధాన్యం అమ్మకానికి తెస్తున్నారు. బుధవారం మార్కెట్కు దాదాపు మూడు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. దేవరకద్ర మార్కెట్లో జోరుగా ఉల్లి వ్యాపారం దాదాపు ఆరు వేల బస్తాల అమ్మకం నిలకడగా ఉల్లి ధరలు.. దేవరకద్ర మార్కెట్లో బుధవారం జరిగే వేలంలో ఉల్లి ధరలు నిలకడగానే ఉన్నాయి. రెండు వారాలుగా దిగి వచ్చిన ధరలే ఈ వారం వచ్చాయి. ఉదయం 10గంటలకే ఉల్లి వేలం ప్రారంభం కాగా క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.1800 వరకు పలికింది. కనిష్టంగా రూ.1200 వరకు ధర వచ్చింది. మార్కెట్ నిబంధనలు సడలించిన తరువాత ఉల్లి బస్తా 50 కేజీలుగా నిర్ణయించారు. బస్తా ధర గరిష్టంగా రూ.900 వరకు విక్రయించగా, కనిష్టంగా రూ.600 వరకు అమ్మకాలు సాగించారు. మధ్యస్త ధరలు పలికిన ఉల్లి బస్తా ధర రూ.700 నుంచి రూ.800 వరకు విక్రయించగా చిన్నసైజు ఉల్లి బస్తా ధర రూ. 500 వరకు పలికింది. -
వేరుశనగ క్వింటాల్ రూ.6,739
జడ్చర్ల/ నవాబుపేట: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.6,739, కనిష్టంగా రూ.4,891 ధరలు లభించాయి. అలాగే కందులు గరిష్టంగా రూ.6,895, కనిష్టంగా రూ.5,200, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,289, కనిష్టంగా రూ.1,951, జొన్నలు గరిష్టంగా రూ.4,201, కనిష్టంగా రూ.3,600, ఆముదాలు రూ.6,331, పెబ్బర్లు గరిష్టంగా రూ.5,301, కనిష్టంగా రూ.4,851, ధాన్యం హంస గరిష్టంగా రూ.2,151, కనిష్టంగా రూ.1,869, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,080, కనిష్టంగా రూ.2,041, రాగులు రూ.3,777, చింతగింజలు రూ.3,319 చొప్పున వచ్చాయి. చింతపండు క్వింటాల్ రూ.12,308 నవాబుపేట మార్కెట్ యార్డుకు బుధవారం 82 క్వింటాళ్ల చింతపండు రాగా గరిష్టంగా రూ.12,308, కనిష్టంగా రూ.6,680 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రమే్ష్ తెలిపారు. కాగా వేరుశనగ 220 క్వింటాళ్లు రాగా.. క్వింటాల్ సరాసరిగా రూ.6,265 పలికిందని వివరించారు. వరకట్న వేధింపులపై కేసు నమోదు అచ్చంపేట రూరల్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తామామలపై బుధవారం అచ్చంపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. అచ్చంపేటకు చెందిన ఈశ్వరమ్మకు మండలంలోని నడింపల్లికి చెందిన మల్లేష్తో వివాహమైంది. గత కొన్ని రోజులుగా అదనపు కట్నం తీసుకురావాలని ఈశ్వరమ్మను భర్తతోపాటు అత్త, మామ, మరిది వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన కార్మికుడు మృతిచెందిన ఘటన మండలంలోని వీరాపురంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెంకటోనిపల్లికి చెందిన నవీన్(35) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం వీరాపురంలో ఓ ప్రైవేటు భవన నిర్మాణానికి కొంత మంది కార్మికులతో కలసి సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా ఐరన్ రేకులు విద్యుత్ వైర్లపై పడ్డాయి. అక్కడే పనులు చేస్తున్న నవీన్కు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపేసి రక్షించే ప్రయత్నం చేయగా ఫలితం లేకుండాపోయింది. మృతుడి భార్య జయశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.విద్యుత్ మోటార్ నాచును తొలగిస్తుండగా..పాన్గల్: విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన సంఘటన బుధవారం పాన్గల్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం రేమద్దుల గ్రామానికి చెందిన కిల్లె పర్వతాలు(47)కు ఐదు ఎకరాల పొలం ఉంది. ఆ పొలం అంచున కేఎల్ఐ డీ–8 కాల్వ ఉండగా.. ఆ కాల్వలో విద్యుత్ మోటార్ వేసి పొలానికి సాగునీరు పారిస్తున్నాడు. ఇదే క్రమంలో మంగళవారం రోజు సాయంత్రం పొలానికి వెళ్లి కరెంట్ లేదనుకొని కాల్వలోని విద్యుత్ మోటార్కు పట్టిన నాచు తొలగిస్తుండగా.. విద్యుదాఘాతంతో కాల్వలోనే పడిపోయాడు. పరిసరాల రైతులు గమనించి.. కాల్వలో పడిపోయిన పర్వతాలను బయటికి తీయగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బాలపీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.నీటి సంపులో పడి బాలుడు మృతిమద్దూరు: ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఏర్పాటుచేసిన నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని దమ్గాన్పూర్లో బుధవారం చోటుచేసుకున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన ఎర్రి మానస్(4) బాలుడు ఇంటి ముందు అడుకుంటూ నీటి సంప్లో పడిపోయాడు. ఇంట్లో పనిలో ఉన్న తల్లి, నాయనమ్మ ఆలస్యంగా బాలుడు సంపులో పడిపోయిన విషయం గ్రహించి వెంటనే మద్దూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఎర్రి మహిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎస్ఐ తెలిపారు.అవసరాలకు డబ్బు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్యఅడ్డాకుల: మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి శివారులో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ ఎం.వేణు కథనం ప్రకారం.. అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన గొల్ల శివ(32) కూలీ పనులు చేసి జీవనం సాగించేవాడు. అప్పుడప్పుడు తన అవసరాల కోసం తల్లితో డబ్బులు తీసుకునేవాడు. ఈక్రమంలో ఇదే విషయంలో మంగళవారం రాత్రి తల్లితో గొడవపడి మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు రాత్రి 44వ నంబర్ జాతీయ రహదారి సమీపంలోని సోలార్ గేట్ వద్ద క్షణికావేశంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో మృతదేహాన్ని జిల్లాకేంద్రంలోని మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు.సారా స్థావరాలపై దాడిఊర్కొండ: మండలంలోని ఠాగూర్తండా, అమ్మపల్లితండా, మఠంతండాల్లో సారా తయారీ, అమ్మకం స్థావరాలపై బుధవారం ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. ఈ క్రమంలో సుమారు 300 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం చేసి, 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని ఠాగూర్ తండాకు చెందిన రమావత్ రవిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా సారా తయారు చేసినా, అమ్మినా, అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ బాలకృష్ణారెడ్డి, సిబ్బంది యాదగిరి, రఘు, నార్య, మాధవి, పరశురాం తదితరులు పాల్గొన్నారు. -
సుంకేసుల డ్యాంలో పడి తండ్రీకొడుకులు మృతి
రాజోళి: సరదాగా ఈతకు వెళ్లిన తండ్రీకొడుకులు సుంకేసుల డ్యాంలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా లక్ష్మీనగర్కు చెందిన సులేమాన్(47) కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సుంకేసుల డ్యాంకు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)తో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు సుంకేసుల డ్యాం వద్ద నదిలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో కొట్టుకుపోతుండగా.. గమనించిన తండ్రి సులేమాన్ వారిని కాపాడేందుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు. అనంతరం డ్యాంలోని 25వ గేటు సమీపంలో వారి మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకొడుకులు ఒకే ఘటనలో మృతిచెందడంతో ఘటనా స్థలంలో ఉన్న కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.రామన్పాడులో 1016 అడుగుల నీటిమట్టంమదనాపురం: రామన్పాడు జలాశయంలో బుధవారం 1,016 అడుగులకు నీటిమట్టం చేరిందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా 550 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగిందని... సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. రామన్పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వకు 22 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 83 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. -
పీయూ సిబ్బందికి ఈపీఎఫ్ సదుపాయం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ సిబ్బందికి గత కొన్నేళ్లుగా ఈపీఎఫ్ సదుపాయం లేకపోవడంతో వీసీ శ్రీనివాస్ చొరవతో ఈపీఎఫ్ సదుపాయాన్ని కల్పిస్తూ ఇటీవలి జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ నాన్టీచింగ్ సంఘం నాయకులు వీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా లేని ఈపీఎఫ్ సదుపాయాన్ని వీసీ చొరవ తీసుకుని కల్పించడం గొప్ప విషయమన్నారు. సిబ్బంది అనారోగ్యం పాలైతే రూ.లక్షల్లో ఖర్చు చేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారని, ఈ సదుపాయం కల్పించడం వల్ల ఇబ్బందులు తప్పనున్నాయని పేర్కొన్నారు. సిబ్బందికి వేతనాలు సైతం గత కొన్నేళ్లుగా పెంపుదల లేదని, వాటిని త్వరలోనే పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వీసీ చెప్పడం హర్షించదగ్గ విషయం అన్నారు. -
దేవతామూర్తుల వస్తువుల స్వాధీనం
మతిస్థిమితం లేని మహిళ నుంచి లింగాల: మతిస్థిమితం లేని ఓ మహిళ నుంచి వివిధ దేవతామూర్తుల విగ్రహాలకు సంబంధించిన వస్తువులను పోలీసులు స్వాధీనపర్చుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు కథనం ప్రకారం.. లింగాలకు చెందిన ఓ మహిళ కొన్ని నెలలుగా మతిస్థిమితం కోల్పోయి స్థానికంగా తిరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మండలంలోని కోమటికుంటలో తిరుగుతున్న ఆ మహిళలను గమనించిన గ్రామస్తులు ఆమె దగ్గర ఉన్న సంచిని పరిశీలించగా అందులో విగ్రహాలకు సంబంధించిన వస్తువులను చూసి వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో గ్రామాన్ని సందర్శించి వస్తువులను స్వాధీన పర్చుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇందులో రాతి నాగపడిగెలు, వెండి కళ్లు, మీసాలు, ఇతర పంచలోహ వస్తువులు ఉన్నాయని, మహిళను ఎంత ప్రశ్నించినా వివరాలు చెప్పడం లేదని ఎస్ఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మహిళలను పోలీసులు వెంట పెట్టుకొని పలు ప్రాంతాలను తిరిగినా వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చిందో తెలపడం లేదన్నారు. మండలంలోని ఆయా గ్రామాలు, ఇతర మండలాల్లో విగ్రహాల వస్తువులు అపహరణకు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ సూచించారు. -
‘విధి పరీక్ష పెట్టింది’
గద్వాలటౌన్ : తండ్రి మృతి చెందాడనే దుఃఖాన్ని దిగమింగి ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. ధరూర్ మండలం మార్లబీడు గ్రామానికి చెందిన శ్రీనాథ్ స్థానిక కాకతీయ టెక్నో స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాస్తున్నాడు. విద్యార్థి తండ్రి కిషోర్, తల్లి పవిత్ర, చెల్లి శిరీష సోమవారం హైదరాబాద్ నుంచి గద్వాలకు కారులో వస్తున్నారు. జడ్చర్ల సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తండ్రి కిషోర్ అక్కడిక్కడే మృతి చెందారు. తల్లి, చెల్లికి గాయాలయ్యాయి. పోస్టుమార్టం అనంతరం సోమవారం రాత్రి కిషోర్ మృతదేహాన్ని మార్లబీడు గ్రామానికి తీసుకు వచ్చారు. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి తండ్రి కిషోర్ మృతదేహం వద్ద రోదిస్తూ కూర్చిండిపోయారు. మరోపక్క గాయాలతో తల్లి, చెల్లి తల్లడిల్లిపోతున్నారు. ఒకవైపు భవిష్యత్.. మరోవైపు దుఃఖాన్ని దిగమింగుకుంటూనే బుధవారం చివరి పరీక్ష రాయాలా.? వద్దా.? అనే సందిగ్ధంలో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. విద్యార్థి శ్రీనాథ్కు బంధువులు మనోధైర్యం కల్పించారు. బాధాతప్త హృదయంతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పుట్టెడు దుఃఖంలో సాంఘికశాస్త్రం పరీక్షకు హాజరయ్యాడు. ఈ దృశ్యం బంధువులు, స్థానికులను కంటతడి పెట్టించింది. దుఃఖాన్ని దిగమింగి.. హాజరైన విద్యార్థి -
హెచ్సీయూ భూముల వేలం దారుణం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: హెచ్సీయూ భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ పాలమూరు యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ రాష్ట్రానికే తలమానికమైన హెచ్సీయూలో భూములను ప్రభుత్వం లాక్కోవడం దారుణమైన విషయమన్నారు. 1,800 ఎకరాల భూమి వందలాది రకాల పక్షులు, జంతువులకు నివాసంగా ఉందని, చెరువులు, ఇతర జీవజాతులు ఉన్నాయని, అలాంటి భూములను ప్రభుత్వం అమ్మడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్య భవిష్యత్లో విద్యను అంధకారం చేయడం ఖాయమన్నారు. వెంటనే ప్రభుత్వం భూముల అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాష్, విష్ణు, సతీష్, రవికుమార్, వేణు, నందిని తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మహనీయుల జయంతి వేడుకలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): బాబు జగ్జీవన్రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శనివారం బాబు జగ్జీవన్రాం జయంతి, ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ విషయమై బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా సంఘాల ప్రతినిధులు, అధికారులతో సమావేశమై చర్చించారు. గతేడాది కన్నా ఈసారి మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం సమావేశానికి హాజరైన పలువురు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్రాం, అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణతోపాటు ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అంబేద్కర్ విగ్రహాల పరిరక్షణ తదితర సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. బాబు జగ్జీవన్రాం విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అంబేడ్కర్ కళాభవన్లో సమావేశం ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేయాలని, బాబు జగ్జీవన్రాం విగ్రహం వద్ద మెట్లు నిర్మించాలని కోరారు. సమావేశంలో జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సుదర్శన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అగ్గి.. బుగ్గి
జిల్లాలో ఏటేటా పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు జిల్లాలో అగ్ని ప్రమాదాలు, నష్టాలు ఇలా.. మహబూబ్నగర్ క్రైం: వేసవి కాలం వచ్చేసింది.. రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి.. పెరుగుతున్న వేసవితాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యం పోసేలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఏటా వేసవిలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆయా ఘటనలు అపార నష్టాలు మిగుల్చుతున్నాయి. అసలు ప్రమాదాలకే ఆస్కారం లేకుండా అప్రమత్తమైతే నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. ఈ విషయమై జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేయడంతోపాటు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలాలకు సమయానికి చేరుకోని మంటలు ఆర్పడంపై దృష్టి పెట్టింది. ఒకవేళ జిల్లాలో ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా టోల్ ఫ్రీ నంబర్లు 101, 100 సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం అగ్రిమాపక కేంద్రాల ఏర్పాటులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడల్లా కంటితుడుపు చర్యగా నేతలు, అధికారులు పరామర్శించి వెళ్లిపోతారు. ఎంతోకొంత సాయం అందిస్తారు. త్వరలోనే ఆయా ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని హామీలు గుప్పిస్తారు. ఆ తర్వాత ఎలాంటి ఉలుకు పలుకు ఉండదు. తిరిగి ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు మళ్లీ మొదటికే వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఈ కేంద్రాల ఏర్పాటు కలగానే మిగులుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ప్రతి నియోజకవర్గానికి ఓ కేంద్రం ఏర్పాటు చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయినా కేటాయింపులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. కొత్తగా జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోటలో ఏర్పాటు చేయగా దీంతోపాటు గండేడ్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. సంభవించిన ఆస్తినష్టం ( రూ.కోట్లలో)అగ్నిమాపక అధికారులు కాపాడిన ఆస్తి ( రూ.కోట్లలో)2024లో జరిగిన అగ్ని ప్రమాదాలు ఈ ఏడాది జరిగిన ప్రమాదాలుకాపాడిన ఆస్తి (రూ.లక్షల్లో)27.163.0212885611 అపార నష్టాలను మిగిల్చుతున్న ఆయా ఘటనలు చాలా మండలాల్లో కనిపించని ఫైర్ స్టేషన్లు ప్రమాద తీవ్రత పెంచుతున్న దూరభారం 441 గ్రామాలకు నాలుగు వాహనాలే దిక్కు -
మామిడి రైతుకు.. మార్కెట్ కష్టాలు
కొల్లాపూర్: మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్లో మార్కెట్ ఏర్పాటు కలగానే మారింది. ఇక్కడ మామిడి సాగు విస్తారంగా ఉన్నప్పటికీ.. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ప్రైవేటులో విక్రయించక తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి మామిడి ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. దీంతో మామిడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొల్లాపూర్లో మార్కెట్ నిర్మాణానికి మూడేళ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి. స్థల సమస్య కారణంగా మార్కెట్ నిర్మాణం జరగడం లేదు. ఫలితంగా రైతులు హైదరాబాద్తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్లోని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకే పంటను అమ్ముకుంటున్నారు. జిల్లాలో సాగు ఇలా.. జిల్లావ్యాప్తంగా 34,712 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో అధికంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 25,237 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. కొల్లాపూర్ మామిడికి ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఇక్కడి పండ్లకు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గిరాకీ ఉంటుంది. కొల్లాపూర్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు కొన్నేళ్లుగా పాలకులను కోరుతున్నారు. గత ప్రభుత్వం కొల్లాపూర్లో మామిడి మార్కెట్ నిర్మాణం కోసం రూ. 5.45 కోట్లు మంజూరు చేసింది. అయితే స్థల సమస్య కారణంగా మార్కెట్ నిర్మాణానికి నోచుకోలేదు. వ్యాపారుల సిండికేట్తో నష్టాలు.. కొన్నేళ్ల క్రితం వరకు కొల్లాపూర్ రైతులు మామిడి పంట అమ్ముకునేందుకు హైదరాబాద్కు వెళ్లే వారు. పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్లో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులకు కొంతమేర ఉపశమనం లభించింది. అయితే స్థానిక వ్యాపారులు కూడా హైదరాబాద్ సిండికేట్తో కుమ్మకై ్క ధరలు అమాంతం తగ్గించేస్తున్నారు. ప్రతి సంవత్సరం సీజన్ ప్రారంభంలో కొన్ని రోజులు అధిక ధరలు పెట్టి.. ఆ తర్వాత ధరలను తగ్గించేస్తున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు మార్కెట్ నిర్మాణంతోనే పరిష్కారం లభిస్తుంది. స్థల పరిశీలనకే పరిమితం.. కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి శివారులోని దేవాదాయశాఖ భూమిలో మామిడి మార్కెట్ ఏర్పాటుకు మొదట అధికారులు శ్రీకారం చుట్టారు. 19 ఎకరాల విస్థీర్ణంలో మార్కెట్ ఏర్పాటుచేసి.. అందులోనే కొనుగోళ్లు, మామిడి కాయలు నిల్వ ఉంచేందుకు గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేయించారు. స్థల సేకరణ కోసం దేవాదాయశాఖకు ప్రభుత్వం ద్వారా లేఖ పంపించారు. అయితే భూ బదాలాయింపునకు దేవాదాయశాఖ అధికారులు ముందుకు రాలేదు. లీజు ప్రకారం ఇస్తామని చెప్పారు. అది కూడా రెండేళ్లకో సారి రెన్యువల్ చేసుకునేలా ప్రతిపాదనలు చేశారు. మార్కెటింగ్శాఖ అధికారులు ఇందుకు విముఖత వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి గోదాములు, కొనుగోలు కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసి.. రెండేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి అంటే ఇబ్బందికరంగా ఉంటుందని వారు దేవాదాయశాఖ ప్రతిపాదనలను తిరస్కరించారు. కనీసం 20 నుంచి 30 ఏళ్లపాటు లీజుకు ఇస్తేనే మార్కెటింగ్ నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రామాపురం శివారులోని గుట్టపై మార్కెట్ నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారు. అయితే అక్కడ మార్కెట్ నిర్మాణానికి స్థలం అనువుగా లేదని ఇంజినీరింగ్ అధికారులు నివేదిక ఇవ్వడంతో అక్కడ కూడా నిర్మాణం జరగలేదు. చివరగా కొల్లాపూర్లోని ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిలో మార్కెట్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. కొల్లాపూర్లో కలగా మారిన మార్కెట్ నిర్మాణం పండ్ల విక్రయాలకు రైతులకు తప్పని అవస్థలు ప్రైవేటు వ్యాపారుల సిండికేట్తో నష్టాలు మామిడి మార్కెట్ ఏర్పాటుతోనే రైతులకు మేలు -
ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్షపడేలా చూస్తాం
నాగర్కర్నూల్ క్రైం: ఉర్కొండ మండలం ఊర్కొండపేటలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్షపడేలా చూస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సభ్యసమాజం తలదించుకునే విధంగా మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారని అన్నారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి పలు సెక్షన్ల కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలను ఎవరు సహకరించరని.. నిందితులను సమాజం బహిష్కరణ చేస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా జిల్లాలోని ప్రముఖ దేవాలయాలతో పాటు ట్యాంక్బండ్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పోలీసు నిఘా, పహారా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే పోలీసు, ప్రభుత్వ పరంగానే కాకుండా సమాజంలోని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి మానవీయ విలువల్లో మార్పు రావాలని అన్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. బాధితురాలికి రూ.25,000 చెక్కు కందనూలు: ఊర్కొండపేటలో అత్యాచారానికి గురైన మహిళకు మహిళా, శిశుసంక్షేమ శాఖ నుంచి రూ.25,000 చెక్కు అందించినట్లు నాగర్కర్నూల్ జిల్లా వెల్ఫేర్ అధికారి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తప్పని దూరభారం..
జిల్లాలో 17 మండలాలు ఉండగా.. అందులో అన్ని కొన్ని పెద్దవి, మరికొన్ని చిన్న మండలాలు ఉన్నాయి. అలాంటి చోట్ల కనీసం ఒక ఫైర్స్టేషన్ కూడా లేదు. కొన్ని కేంద్రాలు నాలుగైదు మండలాల్లోని గ్రామాలకు సేవలందిస్తున్నాయి. గండేడ్, మహమ్మదాబాద్, కోయిలకొండ మండలాల పరిధిలోని గ్రామాలకు మహబూబ్నగర్ నుంచి ఫైర్ ఇంజిన్ వెళ్లాల్సి ఉంటుంది. జిల్లాలో చాలా మండలాల్లోని గ్రామాలకు రోడ్డు వసతి కూడా లేకపోవడంతో ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదవ్వాల్సిందే. జిల్లాలో మొత్తం 441 గ్రామాలు ఉండగా.. కేవలం నాలుగు వాహనాలే అందుబాటులో ఉన్నాయి. నీటికి కొరత లేదు.. జిల్లాకు ఇటీవల 90 వేల లీటర్ల ఫైర్ ఇంజిన్ మంజూరు కావడంతో పాటు ఎమ్మెల్యే నిధుల సహకారంతో ఫైర్ స్టేషన్లో బోరు వేయడం వల్ల ఫైర్ ఇంజిన్లలో నీటిని నింపుకోవడానికి కొరత లేదు. మూడు ఫైర్ ఇంజిన్లు, ఒక మిస్ట్ జీపు, ఒక బుల్లెట్ అందుబాటులో ఉంది. జడ్చర్లలో ఒక ఫైర్ ఇంజిన్, ఒక బుల్లెట్ ఉంది. అన్ని అడ్వాన్స్ వాహనాలు కావడం వల్ల మల్టీపర్పస్కు ఉపయోగించవచ్చు. ఇటీవల చిన్న ప్రమాదాల సంఖ్య పెరిగాయి. చిన్న వాటికి బుల్లెట్, మిస్ట్ జిప్లు వాడుతున్నాం. వేసవికాలం పూర్తయ్యే వరకు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారులు ఏ ఒక్కరు అత్యవసరమైతే తప్ప సెలవు తీసుకోకుండా పనిచేస్తాం. జిల్లాలో ఉన్న ఫైర్ ఇంజిన్స్తో బాధ్యతగా పనిచేసి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూస్తాం. ప్రస్తుతం వేసవి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. ముఖ్యంగా బహుళ అంతస్తులు ఉన్న పట్టణాలపై దృష్టిపెడతాం. అలాగే పరిశ్రమలు, ఇతర ప్రమాదకరమైన వాటిపై నిఘా ఏర్పాటు చేస్తాం. – కిషోర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ● -
రెండున్నరేళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తిచేసి తీరుతాం
అచ్చంపేట/ఉప్పునుంతల: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)ని రెండున్నరేళ్లలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గతనెల 22న ప్రమాదం చోటు చేసుకున్న దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ను బుధవారం సందర్శించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేకాఽధికారి శివశంకర్ లోతేటి, కలెక్టర్ బదావత్ సంతోష్తో మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని.. మరో 105 నుంచి 110 మీటర్ల వరకు మట్టి తవ్వకాలు పూర్తయితే సమస్య ఓకొలిక్కి వస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గడిచిన 40 రోజుల్లో వివిధ బృందాలకు చెందిన 700 నుంచి 800 మంది సహాయక సిబ్బంది, నిపుణులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం 550 నుంచి 600 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారన్నారు. సొరంగం లోపల భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర పరికరాలు అతుక్కుపోవడంతో అక్కడ బురద తొలగింపు కష్టంగా, ప్రమాదకరంగా మారిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహాయక సిబ్బందికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మరో 15 రోజుల్లో సహాయక చర్యలను పూర్తిచేస్తామన్నారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం కాగా.. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. భవిష్యత్లో సొరంగం వల్ల ఎలాంటి నష్టాలు జరగకుండా సంపూర్ణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సొరంగం పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ఉందన్నారు. సమావేశంలో డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, ఎన్డీఆర్ఎస్ అధికారి డా.హరీశ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి జయప్రకాశ్, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, నీటిపారుదలశాఖ డీఈ శ్రీనివాసులు, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిఽధి ఫిరోజ్ ఖరేషి, జీఎస్ఐ అధికారులు రాజశేఖర్, కాడవర్ డాగ్స్ ప్రతినిధి ప్రభాత్ తదితరులు ఉన్నారు. లభించని కార్మికుల ఆచూకీ.. ఎస్ఎల్బీసీ సొరంగంలో 45 రోజుల క్రితం ప్రమాదానికి గురైన కార్మికుల జాడ లభించడం లేదు. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండాపోతుంది. ఉబ్బికి వచ్చిన నీటితో కూలిన సొరంగం ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, బురద, బండరాళ్ల తొలగింపునకు మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే టీబీఎం భాగాలు, శిథిలాలు, మట్టి, రాళ్ల తొలగింపు పనులను సహాయక బృందాలు వేగవంతం చేశాయి. సొరంగంలో 10వేల లీటర్లు నీటి ఊట వస్తుండగా.. 2.5 కి.మీ. ఒకటి చొప్పున 150 హెచ్పీ సామర్థ్యం కలిగిన భారీ మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. డీ–1 ప్రాంతం వరకు మట్టి తొలగింపు పూర్తి కాగా.. మరో 105 నుంచి 110 మీటర్ల మేర తవ్వకాలు చేపడితే సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సొరంగంలో ప్రమాద ఘటన బాధాకరం 15 రోజుల్లో సహాయక చర్యలు పూర్తి మృతుల కుటుంబాలకు త్వరలో పరిహారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యల పరిశీలన -
మార్కెట్ నిర్మించాలి..
కొల్లాపూర్లో మామిడి సాగుచేసే రైతులు వేల సంఖ్య లో ఉన్నారు. ప్రభు త్వం రైతులను పట్టించుకోవాలి. మామిడి మార్కెట్ ఏర్పాటుచేస్తామని కొన్నేళ్లుగా చెబుతున్నారు. కానీ మార్కెట్ నిర్మించడం లేదు. ప్రైవేటు మార్కెట్లలోనే రైతులు పంట అమ్ముకుంటున్నారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధు లు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. రైతులందరికీ ఉపయోగపడేలా మార్కెట్ ఏర్పాటుచేయాలి. ఈ ఏడాది పంట నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – బాలచంద్రయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ అధికారులకు నివేదించాం.. మామిడి మార్కెట్ నిర్మాణం మార్కెటింగ్ శాఖ పరిధిలోనిద. మార్కెట్ నిర్మాణానికి అనువైన స్థల సేకరణ కోసం కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మామిడి సాగు, దిగుబడి, మార్కెటింగ్ అంశాలను గతంలో ఉన్నతాధికారులకు నివేదించాం. రైతులు పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్లోని ప్రైవేటు మార్కెట్లకు వెళ్తున్న విషయాలను కూడా తెలియజేశాం. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ ● -
ముగిసిన ‘పది’ పరీక్షలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా గత పదిరోజులుగా జరిగిన ఎస్సెస్సీ పరీక్షలు బుధవారం ముగిశాయి. ఈ మేరకు చివరి రోజు సోషల్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 12,776 మంది విద్యార్థులకు గాను.. 12,739 మంది హాజరవగా.. 37 మంది గైర్హాజరయ్యారు. గురువారం 9 పరీక్ష కేంద్రాల్లో ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒకేషనల్ పరీక్ష జరగనుంది. అసలు పరీక్షలు ముగియడంతో విద్యార్థులు హాస్టళ్లు, రూంలను ఖాళీ చేసి ఇంటి బాట పట్టారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. కాగా.. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకణం ప్రారంభం కాగా.. జిల్లాకేంద్రంలోని మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్లో వ్యాలువేషన్ క్యాంపును విద్యా శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం వ్యాలువేషన్కు 2.40 లక్షల పేపర్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.90 లక్షల పేపర్లు వచ్చాయి. చివరిరోజు 12,739 మంది విద్యార్థుల హాజరు -
అనుమతి మేరకే నిర్మాణాలు చేపట్టాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో ఇళ్లు, బహుళ అంతస్తులు, ఇతర వాణిజ్య సముదాయాలను మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల మేరకే అనుమతి తీసుకుని నిర్మించుకోవాలని ప్రజలకు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ సూచించారు. బుధవారం ఉదయం స్థానిక మైత్రినగర్ నుంచి ఎంవీఎస్ డిగ్రీ కళాశాల వరకు క్షేత్రస్థాయి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ నిర్మాణాలు పూర్తయి ఇంతవరకు ఆస్తిపన్ను చెల్లించని, ఇంటి నంబరు తీసుకొని వారు వెంటనే మున్సిపల్ కార్యాలయంలో అసెస్మెంట్ చేసుకోవాలన్నారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడితే బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రెయినేజీ వ్యవస్థను, తాగునీటి పైపులైన్లలో లీకేజీలను సరిచేయాలన్నారు. స్వచ్ఛ ఆటోలకు తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వని వారిని గుర్తించాలన్నారు. ఎక్కడబడితే అక్కడ వీధుల వెంట, ఓపెన్ ప్లాట్లలో చెత్తాచెదారం వేయొద్దన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, డీఈఈ నరసింహ, ఏఈఈ వైష్ణవి, టీపీఓ లక్ష్మీపతి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ -
సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం
మహబూబ్నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెల్ల కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీని మంగళవారం జిల్లావ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి పేదలకు సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టగా.. మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి బుధవారం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జిల్లాలోని 506 చౌకధర దుకాణాల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు ఒకరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దొడ్డు బియ్యం అందజేసిన ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి హామీ మేరకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేటాయింపుల్లో ఆలస్యం ప్రతినెలా 20వ తేదీ వరకే చౌకధర దుకాణాలకు రేషన్ కేటాయింపులు పూర్తవుతాయి. ఆ తర్వాత ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి లారీల్లో బియ్యాన్ని చేరవేస్తారు. అయితే ఈ నెలలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మార్చి 27న కేటాయింపుల ఉత్తర్వులు వెలువడ్డాయి. 28 నుంచి లారీల్లో సన్న బియ్యాన్ని రవాణా చేయడం ప్రారంభించారు. 30న ఉగాది, 31న రంజాన్ రావడంతో బియ్యం సరఫరా కాస్త ఆలస్యమైంది. జిల్లాలో ప్రస్తుతం 92.29 శాతం చౌకధర దుకాణాలకు సన్న బియ్యం చేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగా ఒక్కో యూనిట్కు ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యేల చేతులమీదుగా.. జిల్లావ్యాప్తంగా 506 చౌకధర దుకాణాలకు సన్న బియ్యం చేరుకుంది. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతులమీదుగా బియ్యం పంపిణీకి లాంఛనంగా శ్రీకారం చుట్టాం. అయితే మొదటి విడతలో ఒక్కో దుకాణానికి 50 శాతం మేర బియ్యాన్ని సరఫరా చేయించాం. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేలోపు మిగతా బియ్యం చేరవేస్తాం. రేషన్ కార్డుదారులందరికీ ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తాం. – వెంకటేష్, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారిమొత్తం కోటా రానప్పటికీ మొదటి విడతలో ఒక్కో చౌకధర దుకాణానికి 50 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. వీటిని పంపిణీ చేసేలోగా రెండో విడతలో బియ్యం చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. కోటా ప్రకారం ఒక్కో దుకాణానికి 100 క్వింటాళ్ల నుంచి 200 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉంది. మొత్తం కోటా పంపిణీ ప్రతినెలా 15లోగా పూర్తి చేస్తారు. ఈ నెల కూడా గడువులోగా పూర్తి చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. జిల్లాలో 92.29 శాతం దుకాణాలకు చేరిన బియ్యం -
‘ఎంఆర్ఐ’ ఏర్పాటు ఎప్పుడో?
పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉగాది నాటికి ఎంఆర్ఐ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదార రాజనర్సింహ ఇచ్చిన మాట నెరవేరడం లేదు. మంత్రి ప్రకటించి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎంఆర్ఐ మిషన్ ఏర్పాటుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం భవన పరిశీలన కానీ, ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై నిర్ణయం సైతం జరగలేదు. అసలు ఎంఆర్ఐ సేవలు ఎన్నాళ్లకు అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ సేవలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి జిల్లాలోని పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది. మరమ్మతుకు నోచుకోని సీటీ స్కాన్ మిషన్.. జనరల్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటుచేసే ఎంఆర్ఐ జాడ లేకపోయినా.. మరమ్మతుకు గురైన సీటీ స్కాన్ మిషన్ అయినా బాగు చేయించాలని రోగులు కోరుతున్నారు. సీటీ స్కాన్ మరమ్మతుకు దాదాపు రూ. 39లక్షల వరకు వెచ్చించాల్సి ఉండటంతో నిధులు లేక అలాగే వదిలేశారు. ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతస్థాయి అధికారులకు విన్నవించినా బాగు చేయడానికి నిధులు కేటాయించడం లేదు. ప్రధానంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి సీరియస్గా ఉన్న క్షతగాత్రులతో పాటు జబ్బు తీవ్రత తెలుసుకోవడానికి సీటీ స్కాన్ అవసరం పడుతుంది. అలాంటి సీటీ స్కాన్ మిషన్ కొన్ని రోజులుగా మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఫలితంగా పేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం పదుల సంఖ్యలో సీటీ స్కాన్ కోసం ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించి రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు వెచ్చిస్తున్నారు. ఇక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులకు సీటీ స్కానింగ్ అవసరమైతే వైద్యులు బయటకు రెఫర్ చేస్తున్నారు దీంతో గాయాలతో బయటకు వెళ్లి స్కానింగ్ చేసుకొని రావడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయంపై జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.సంపత్కుమార్ను వివరణ కోరగా.. ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్ తప్పనిసరిగా ఏర్పాటు అవుతుందన్నారు. అందుకు ఇంకా కాస్త సమయం పడుతుందని తెలిపారు. ఇక సీటీ స్కాన్ మరమ్మతు విషయాన్ని ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని.. ఆ వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి పేషి నుంచి ఫోన్ రావడంతో సీటీ స్కాన్ మరమ్మతుకు అయ్యే ఖర్చు వివరాలను అందించినట్లు చెప్పారు. త్వరలో మరమ్మతు చేసే అవకాశం ఉందన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉగాది నాటికి ఏర్పాటు చేస్తామన్న వైద్యారోగ్యశాఖ మంత్రి ఇప్పటి వరకు భవన పరిశీలనకు నోచుకోని వైనం -
అయితే.. రికార్డే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం నుంచి సన్నాలకు మద్దతు ధరతోపాటు ప్రోత్సాహకంగా క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో అన్నదాతలు ఈ యాసంగిలోనూ వరిసాగు వైపే మొగ్గు చూపారు. ప్రధానంగా బీపీటీ, ఆర్ఎన్ఆర్ రకాలకు చెందిన సన్న రకాల ధాన్యం సాగుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో ఈ సీజన్లో సాధారణ సాగును మించి సుమారు 20 శాతం.. గత యాసంగితో పోలిస్తే దాదాపు 25 శాతం మేర వరి సాగు పెరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో ఉమ్మడి జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు.. 11,36,660 మెట్రిక్ టన్నులు సేకరించాలనే లక్ష్యం నిర్దేశించారు. 1,61,504 ఎకరాల్లో పెరిగిన సాగు.. ఉమ్మడి జిల్లాలో గత యాసంగిలో 4,75,264 ఎకరాల్లో వరి సాగు కాగా.. ప్రస్తుతం ఇదే సీజన్లో 6,36,768 ఎకరాల్లో సాగు చేశారు. ఈ లెక్కన 1,61,504 ఎకరాల్లో వరి సాగు పెరగగా.. ఈ మేరకు అదనంగా మరో 30 కొనుగోలు కేంద్రాలను అదనంగా కేటాయించారు. రెండో వారంలో కేంద్రాలు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసంగి కోతలు ప్రారంభం కాగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సేకరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదటి వారం నుంచే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలని సూచించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు సెంటర్లను అధికారులు ఖరారు చేశారు. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో కోతలకు మరింత సమయం పట్టనుండగా.. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రయత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే నాగర్కర్నూల్ మినహా మిగతా జిల్లాల కలెక్టర్లు.. మిల్లర్లు, వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఎండాకాలం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ లక్ష్యం 11.36 లక్షల మెట్రిక్ టన్నులు గత సీజన్లతో పోలిస్తే ఈ యాసంగిలో భారీగా వరిసాగు ఉమ్మడి జిల్లాలో 30 వరకు పెరిగిన కొనుగోలు కేంద్రాలు ఈ నెల రెండో వారంలో అందుబాటులోకి సెంటర్లు ఇప్పటికే అధికారులు, మిల్లర్లతో సమీక్షించిన ఆయా జిల్లాల కలెక్టర్లు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి ఏర్పాటుకు ఆదేశాలు -
బాధితురాలికి ప్రభుత్వం అండ
ఊర్కొండ: ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో అత్యాచార ఘటన జరగడం దారుణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక ఆలయ అధికారులు, పోలీసులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆలయ సమీపంలో జరిగిన ఈ సంఘటనను సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఈ విషయమై తనతో ఫోన్లో మాట్లాడారని వివరించారు. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి విచారణ వేగవంతం చేస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. స్థానికంగా గంజాయి విక్రయాలు జరుగుతుంటే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్థానికులు దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో లైటింగ్ను మెరుగుపర్చడంతోపాటు ఆలయ ప్రాంతానికి చుట్టూ కంచె ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. అలాగే ప్రతిరోజు పోలీస్ పికెట్ నిర్వహించేలా ఎస్పీతో మాట్లాడానని చెప్పారు. -
సెలవు దినంగా ప్రకటించాలి
స్టేషన్ మహబూబ్నగర్: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్సాగర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన జీవితాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పోరాటయోధుడు మహాత్మ జ్యోతిరావుపూలే అని గుర్తుచేశారు. అలాంటి మహానుభావుని జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి కార్యక్రమాలు నిర్వహించి అతని గొప్పతనాన్ని అందరికీ తెలియజేసే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. రిటైర్డ్ డీఈఓ విజయ్కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావుపూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో సత్యశోధక్ అనే సంస్థను ఏర్పాటు చేసి అన్ని కులాలు, మతాలను భాగస్వామ్యం చేసి అణగారిన వర్గాల పక్షాన పోరాటం చేసిన మహాయోధుడు అన్నారు. సమావేశంలో ప్రముఖ కవి భీంపల్లి శ్రీకాంత్, రమేష్గౌడ్, సారంగి లక్ష్మీకాంత్, బుగ్గన్న, అశ్విని సత్యం, మహేష్గౌడ్, నరహరి పాల్గొన్నారు. -
నిర్విరామంగా ‘టీబీఎం’ భాగాల తొలగింపు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగం లోపల చిక్కుకున్న ఆరుగురు కార్మికుల ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతుండగా.. పనులకు అడ్డంకిగా మారిన టీబీఎం భాగాల తొలగింపు ప్రక్రియ మంగళవారం మరింత వేగవంతం చేశారు. 39 రోజులుగా సొరంగం లోపల మట్టి, బురద, శిథిలాలను తొలగించేందుకు బృందాలు శ్రమిస్తున్నాయి. డీ1 నుంచి డీ2 మధ్యలో ఇటాచీల సాయంతో తీసిన మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు పంపడంతోపాటు, వెంటిలేషన్తో పాటు కన్వేయర్ బెల్టును వంద మీటర్ల ముందు వరకు పొడిగించారు. సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, రైల్వే, జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ, ర్యాట్ హోల్ మైనర్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు, కేరళ కాడవర్ డాగ్స్,రోబోటిక్ వంటి 12 రకాల బృందాలకు చెందిన 600 మంది సహాయక సిబ్బంది పాల్గొంటున్నారు. సొరంగం లోపల ఎస్కవేటర్ల సహాయంతో మట్టిని బయటికి పంపిస్తూ నీటి ఊటను 150 హెచ్పీ మోటార్ల సహాయంతో డీవాటరింగ్ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరం -
రాములోరి బ్రహ్మోత్సవాలకు సిద్ధం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈనెల 3న నుంచి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు మంగళవారం తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, అంకురార్పణ, 4న ధ్వజారోహణం, లక్ష్మీహయగ్రీవ హోమం, 5న ధన్వంతరీ హోమం, సుదర్శన హోమం, 6న సీతారాముల కల్యాణోత్సవం, రథోత్సవం, 7న సామ్రాజ్య పట్టాభిషేకం, ఐశ్వర్యప్రాప్తి, మహాలక్ష్మీ హోమం, 8న చక్రస్నానం, మహా పూర్ణాహుతి, పుష్పయాగం, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు తెలిపారు. కావునా భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు హాజరై కనులారా తిలకించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. ● 3న తిరుమంజన సేవతో ప్రారంభం ● 6న సీతారాముల కల్యాణం ● 7న సామ్రాజ్య పట్టాభిషేకం -
జంటలే లక్ష్యంగా దోపిడీలు
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో మహిళపై సామూహిక అత్యాచార కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆలయ సమీపంలో కొన్నాళ్లుగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలిసింది. తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన ఏడుగురు నిందితులే ముఠాగా ఏర్పడి కొన్నాళ్లుగా ఇదే తరహాలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుత కేసులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఇప్పటికే పలుమార్లు నేరాలకు పాల్పడినట్టుగా తేల్చారు. ఆలయానికి వచ్చే ప్రేమ జంటలే లక్ష్యంగా చేసుకుని బెదిరించి, దోపిడీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గతంలో ఎన్నిసార్లు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారు.. ఇంకా బాధితులు ఎంత మంది ఉన్నారన్న కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. చట్టం తెలిసిన నేరస్తులు.. మైనర్ల జోలికి వెళ్లరు మహిళపై అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేశ్గౌడ్తోపాటు ఊర్కొండపేట గ్రామానికి చెందిన బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, సాదిక్ బాబా, హరీశ్, వాగుల్దాస్, మణికంఠ ఉన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కొన్ని రోజులుగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ దోపిడీలు చేస్తున్నారు. అయితే వీరు మైనర్లు ఎవరైనా జంటలుగా కనిపిస్తే అప్రమత్తంగా ఉంటారు. వారిపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో ద్వారా కఠిన శిక్షలు అమలు అవుతుండటంతో వారిని బెదిరించి, డబ్బులు మాత్రమే వసూలు చేస్తారు. వివాహిత మహిళలు, మేజర్లు అయితే దోపిడీ చేసి అత్యాచారానికి పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలను తీసుకున్నా బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో చాలా వరకు డబ్బులకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఈ ముఠా ఇప్పటి వరకు ఎంత మందిపై నేరాలకు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కనీస వసతులకూ దిక్కులేదు.. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి ఉమ్మడి జిల్లాతోపాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే భజన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడే రాత్రి బస చేస్తారు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో మహిళలకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. అరకొరగా ఉన్న బాత్రూంలు, టాయిలెట్లను సైతం మూసి వేస్తుండటం, నిర్వహణ లేకపోవడంతో మహిళలు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. తాగునీరు, టాయిలెట్లు, వసతి గదులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాలు లేక ఆరుబయటకు వెళ్తున్న మహిళలను బెదిరిస్తూ కొందరు అఘాయిత్యాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. నిఘా వైఫల్యమేనా..? ఊర్కొండపేట ఆలయ సమీపంలో గత కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఆలయంలోని సిబ్బంది, గ్రామానికి చెందిన కొందరు ఆటోడ్రైవర్లు, యువకులు ఆలయానికి వచ్చే ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారు ఒంటరిగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ, వారి వద్ద ఉన్న నగదును దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫొటోలు, వీడియోలు బయట పెడుతామంటూ బెదిరిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ తరహా నేరాలు చోటుచేసుకుంటున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలింగ్ పెంచుతాం: ఐజీ కల్వకుర్తి టౌన్: ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి చాలా మంది భక్తులు ఊర్కొండపేట ఆలయానికి వస్తారని, వీరి రక్షణ కోసం పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అత్యాచార ఘటన జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్తో కలిసి పరిశీలించారు. ఊర్కొండ పోలీస్స్టేషన్కు సిబ్బందిగా ఎక్కువగా కేటాయించి, ఆలయం వద్ద పికెటింగ్ నిత్యం ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. స్థానికులు, ఆలయ పాలక మండలి, ఆలయ పరిసర ప్రాంత ప్రజలతో ఐజీ మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అత్యాచార ఘటనలో పాల్గొన్న ఆలయ ఉద్యోగి గురించి తెలుసుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సహకారం అవసరమని ఐజీ పేర్కొన్నారు. ఐజీ వెంట కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో బ్లాక్మెయిల్ ముఠా వీడియోలు, ఫొటోలతో బెదిరించి డబ్బుల వసూళ్లు తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టింది ఈ ముఠానే.. ప్రముఖ ఆలయం వద్ద కరువైన పోలీసుల నిఘా -
ఎల్ఆర్ఎస్ @ రూ.73.99 కోట్లు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎల్ఆర్ఎస్తో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు రూ. 73.99కోట్ల ఆదాయం సమకూరింంది. ఇందులో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో రూ. 32.40 కోట్లు, అత్యల్పంగా జోగుళాంబ గద్వాలలో రూ.6.39 కోట్లు వసూలయ్యాయి. ఇక నాగర్కర్నూల్ జిల్లా నుంచి 15.15 కోట్లు, వనపర్తి జిల్లా నుంచి రూ.10.85 కోట్లు, నారాయణపేట నుంచి రూ.9.20 కోట్లు వచ్చాయి. కాగా, ఎల్ఆర్ఎస్కు సంబంధించి 25 శాతం రాయితీతో పూర్తి ఫీజు చెల్లించేందుకు గత నెల 31వ తేదీతో గడువు ముగిసింది. జిల్లాల వారీగా వివరాలిలా.. ● మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీలు, 422 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2020 లో ఎల్ఆర్ఎస్కు 98,165 మంది దరఖాస్తు చేసు కున్నారు. వీరిలో అర్హత కలిగిన 75,345 మందిని అధికారులు గుర్తించగా.. పూర్తిస్థాయిలో 15,098 మంది ఫీజు చెల్లించారు. ఇందులో ఇప్పటి వరకు 1,448 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. అలాగే ఇటీవల మరో 1,032 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నా పరిష్కారానికి నోచుకోలేదు. ● నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 461 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 68,151 మంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోగా.. 57,022 మంది అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరిలో 9,217 మంది ఫీజు చెల్లించగా.. ఇప్పటి వరకు 1,118 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. ఇటీవల మరో 656 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. పరిష్కారానికి నోచుకోలేదు. ● వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 258 జీపీలు ఉండగా.. ఎల్ఆర్ఎస్ కోసం 69,740 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత కలిగిన 63,546 మందిని అధికారులు గుర్తించగా.. పూర్తిస్థాయిలో 8,612 మంది ఫీజు చెల్లించారు. వీరిలో ఇప్పటి వరకు 1,843 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. ఇటీవల మరో 751 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ● నారాయణపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 280 జీపీలు ఉండగా.. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం 34,799 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత కలిగిన 23,571 మందిని అధికారులు గుర్తించగా.. 5,246 మంది ఫీజు చెల్లించారు. ఇప్పటి వరకు 491 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. అదే విధంగా ఇటీవల మరో 310 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. పరిష్కారానికి నోచుకోలేదు. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో నాలుగు ము న్సిపాలిటీలు, 255 జీపీలు ఉన్నాయి. 2020లో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 47,063 మంది దర ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 25,712 మందిని అర్హు లుగా గుర్తించగా.. 4,636 మంది ఫీజు చెల్లించారు. వీరిలో 823 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. ఇటీవల మరో 504 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖా స్తు చేసుకున్నా పరిష్కారానికి నోచుకోలేదు. ఉమ్మడి జిల్లాకు సమకూరిన ఆదాయం అత్యధికంగా మహబూబ్నగర్ నుంచి రూ. 32.40 కోట్లు అత్యల్పంగా జోగుళాంబ గద్వాలలో రూ. 6.39 కోట్లు వసూలు గతనెల 31వ తేదీతో ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీకి ముగిసిన గడువు -
అదుపు తప్పిన లారీ
చారకొండ: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకకు దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చారకొండ మండలం జూపల్లి సమీపంలోని 167వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు చక్కెర లోడ్తో వేగంగా వెళ్తున్న లారీ.. జూపల్లి సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. గుంతల్లో సైతం లారీ వేగంగా వెళ్లడంతో ఇంజన్, బాడి క్యాబిన్ విడిపొయి పక్కనున్న పొలంలో కూప్పకూలింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ లక్ష్మీనారాయణ, క్లీనర్ ఏడుకొండలుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో కల్వకర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏఎస్ఐ అంజయ్య తెలిపారు. ఇద్దరికి గాయాలు -
ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంచాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై ప్రకటించిన 25 శాతం రాయితీని ఈ నెలాఖరు వరకు పొడిగించాలని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, కార్యదర్శి నాగభూషణం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ మహేశ్వర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కారణాలతో వేలాది మంది దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. ఎంతోమంది దూర ప్రాంతాల్లో ఉండటం, మరికొందరు అందుబాటులో లేకపోవడంతోపాటు పండగలు, ఇతర సెలవు దినాలు రావడంతో పూర్తిస్థాయిలో ఫీజు చెల్లించలేకపోయారన్నారు. అంతేగాక వెంచర్లు చేస్తున్న బిల్డర్లు సంబంధిత గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయం, ముడా నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ప్లాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వెంచర్లలో పది శాతం ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టి ప్లాట్లు చేయాల్సి ఉండగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పుడు వాటికి సంబంధించిన ఫీజును సైతం ప్లాట్ల యజమానులే భరించాలనడం సరికాదన్నారు. వెంచర్లు చేసిన వ్యాపారుల నుంచే ఆ రుసుం వసూలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం నాయకులు అనంతరెడ్డి, అహమ్మద్, రాజసింహుడు తదితరులు పాల్గొన్నారు. -
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
మరికల్: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురైన భర్త తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ రాము వివరాల మేరకు.. మరికల్ మండలం తీలేర్కు చెందిన హరిజన్ సుభాష్ (32)తో నారాయణపేట మండలం పెద్దజట్రంకు చెందిన లాల్కోట భాగ్యమ్మతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో ఇటీవల భాగ్యమ్మ తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీలేర్కు రావాలని భర్త సుభాష్ ఆమెను పలుమార్లు వేడుకున్నా ఫలితం లేకపోవడంతో మనస్థాపానికి గురైన అతడు.. ఐదు రోజుల క్రితం గ్రామ శివారులోని చెరువులో దూకాడు. గమనిచ్చిన గ్రామస్తులు చెరువులో నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆదివారం అందరూ ఉగాది పండుగ జరుపుకొంటున్న సమయంలో అతడు ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి కూతురు ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదంకల్వకుర్తి టౌన్: షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించి ఆస్థినష్టం జరిగిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. పట్టణంలోని సుభాష్నగర్ కాలనీలో అప్నాబజార్ అనే గానుగ నూనె, కిరాణం దుకాణంలో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో దుకాణంలోని గానుగనూనె యంత్రంతో పాటుగా, వస్తువులు అగ్నికి ఆహుతి కాగా, అదే దుకాణంపైన ఉన్న ఎంఎస్ సొల్యూషన్స్ కంప్యూటర్ దుకాణంలో ఉన్న వస్తువులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దుకాణంలో నూనె ఉండటంతో మంటలు అధికంగా వ్యాపించి ఉంటాయని స్థానికులు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. సుమారు రూ.3 లక్షల ఆస్థినష్టం జరిగి ఉండవచ్చని బాధితులు తెలిపారు.బైక్ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తికి గాయాలుఎర్రవల్లి: జాతీయ రహదారిపై బైక్ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కొండపేటకు చెందిన తెలుగు కృష్ణమూర్తి బైక్పై నక్కలపల్లికి వెళ్తున్న క్రమంలో పొగాకు కంపెనీ స్టేజీలో జాతీయ రహదారి దాటుతుండగా కర్నూల్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్లో కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.నాలుగు ఇళ్లలో చోరీకల్వకుర్తి రూరల్: మండలంలోని తాండ్రలో సోమ వారం తెల్లవారుజా మున తాళం వేసిన నాలుగు ఇళ్లలో దొంగలు చోరీకి పా ల్పడ్డారు. మొత్తం మూడు తులాల బంగారం, రూ.85 వేల నగదుతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. వసంత ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లి మూడు తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, రూ.70 వేలు చోరీ చేశారు. అలాగే వెంకటయ్య ఇంట్లో చొరబడి రూ. 10వేల నగదు అపహరించారు. యాదమ్మ ఇంట్లో రూ.5వేలు చోరీ చేశారు. మరో వ్యక్తి కుమ్మరి పర్వతాలు ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లినా ఏమీ లభించలేదు. గ్రామానికి చెందిన బొట్టె శ్రీను ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై నిలిపి పొలంలో గేదెల పాలు పితుకుతుండగా.. దొంగలు గ్రామం నుంచి వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అయితే చోరీ ఘటన వివరాలను పోలీసులు విలేకరులకు అందించకుండా గోప్యంగా ఉంచారు.హరిత లక్ష్యం అగ్గిపాలుఉండవెల్లి: మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో రహదారి పక్కన లక్షల్లో ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కలు అగ్గిపాలవుతున్నాయి. మొ క్కలు మంటల్లో తగులబడుతున్నా అదే రహదారిలోనే అధికారులు చూస్తూ వెళ్తున్నారే తప్పా మంటలు ఆర్పే ప్రయత్నం చేయలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభు త్వ లక్ష్యాన్ని స్థానిక అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కరివేపాకు సాగు.. లాభాలు బాగు
అలంపూర్: కరివేపాగు సాగు ఎంతో సులభమని.. జిల్లా వాతావరణం అనుకూలంగా ఉంటుందని డీఏఓ సక్రియనాయక్ తెలిపారు. ఎర్ర నేలలో పంట సాగుచేస్తే అధిక దిగుబడి వస్తోందని.. లాభాలు అర్జించవచ్చని సూచిస్తున్నారు. పంట రకాలు.. సెంకంపు: ఈ రకం తమిళనాడులో అధికంగా పండిస్తారు. ఆకు ఎక్కువగా ఉండి నూనే శాతం, వాసన కలిగి ఉంటాయి. డీడబ్ల్యూడీ–1: ఈ రకం ఆకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చలిని తట్టుకోలేదు.. ఆకులను పొడిగా చేసుకొని వాడుకోవచ్చు. డీడబ్ల్యూడీ–2: విత్తనాల ద్వారా వేసిన పంట నుంచి ఎన్నుకోబడిన రకం. ఆకు లేతపసుపు రంగులో ఉండి వాసన తక్కువగా ఉంటుంది. చలిని తట్టుకుంటుంది. పెరుగుదల అధికంగా ఉంటుంది. సువాసిని: వేరు మొక్కల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. మెట్ట ప్రాంతాలకు అనుకూలం. భువనేశ్వర: నీటివసతి ప్రాంతాల్లో ఎక్కువగా సాగవుతుంది. అన్ని రకాల నేలల్లో పండిస్తారు. మురుగునీరు పారుదల సౌకర్యం ఉన్న ఎర్ర నేలలు శ్రేష్టం. ఎర్ర తువ్వ నేలల్లో పెరుగుదల బాగా ఉంటుంది. ఆకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. విత్తుట: విత్తనాలతో నారు మొక్కలను పెంచి ప్రధాన పొలాల్లో నాటాలి. నారు పెంచేందుకు బాగా పెరుగుదల కలిగిన తల్లి చెట్ల నుంచి బాగా పండించిన మంచి పండ్లు కోయాలి. జులై, ఆగస్టు నెలల్లో పండ్లు కాస్తాయి. ఆగస్టులో పండ్లు సేకరించుకొని కోసిన 3, 4 రోజుల్లో విత్తనాలు తీసి నారుమళ్లు, పాలిథిన్ సంచుల్లో విత్తాలి. ప్రతి పండులో 3, 4 విత్తనాలు ఉంటాయి. విత్తన మోతాదు: ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనాలు లేదా 25 కిలోల పండ్లు సరిపోతాయి. విత్తే పద్ధతి: మీటర్ విస్తీర్ణంలో 30 సె.మీ. ఎత్తు కలిగిన నారుమళ్లను తయారు చేయాలి. నారుమడికి తగినంత పశువుల ఎరువు వేసి తర్వాత 10 సె.మీ. దూరంలో విత్తనాలు విత్తుకోవాలి. మూడురోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. నేల తయారీ, మొక్కలు నాటుట.. ప్రధాన భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేయాలి. 30.30.30 సె.మీ. పరిమాణం గల గుంతల్లో 1.2 నుంచి 1.5 మీ దూరంలో మొక్కలు నాటాలి. మొక్కలు నాటడానికి రెండు నెలల ముందు గుంతలు తీయాలి. ఈ గుంతలను పశువుల ఎరువు కలిపి నింపాలి. గుంత మధ్యలో ఒక్కో నారు మొక్క నాటాలి. ఎరువులు: ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 28 కిలోల నత్రజని, 9 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఉన్న ఎరువును కలిపి గుంతలో సమానంగా నింపాలి. మొక్కలను నాటిన వెంటనే గుంతలను తడపాలి. మూడోరోజు మరో తడి అందించాలి. గుంతలను కలుపుతూ కాల్వలు ఏర్పాటు చేసి నీటిని అందించాల్సి ఉంటుంది. అంతర కృషి: గుంతల మధ్య ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. మొదటి సంవత్సరం గుంతల మధ్య అపరాలు పండించవచ్చు. సస్యరక్షణ చర్యలు: గొంగళి పురుగు చిన్నప్పుడు తెల్లని చారలతో నలుపు రంగులో ఉంటుంది. తరువాత ముదురు ఆకుపచ్చ రంగులో లావుగా స్థూపాకారంలోకి మారుతుంది. పురుగులను చేతితో తీసి నాశనం చేయడం శ్రేయస్కరం, వేప సంబంధిత క్రిమిసంహార మందులు ఉపయోగించాలి. తప్పని పరిస్థితుల్లో నువాన్ 1 మి.లీ. లేదా 2 మి.లీ. క్వినాల్పాస్ లీటర్ నీటితో కలిపి పిచికారి చేయాలి. ● ఆకుపచ్చ తెగులు సోకే అవకాశం ఉంది. దీని నివారణకు గ్రాము కార్బండిజం లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గంధం కలిగిన క్రిమి నాశికాలను వాడితే ఆకు రాలిపోతుంది. కాబట్టి మందును వాడరాదు. దిగుబడి: మొదటి సంవత్సరం ఎకరాకు 100 నుంచి 160 కిలోల దిగుబడి వస్తోంది. రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒక్కో కోతలో ఎకరాకు 700 కిలోల చొప్పున సంవత్సరానికి 2,100 కిలోల ఆకు వస్తుంది. 4వ సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒక కోతలో వెయ్యి కిలోల చొప్పున 4 వేల కిలోల దిగుబడి వస్తుంది. 5 సంవత్సరం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎకరాకు 2 వేల కిలోల ఆకు చొప్పున ఏడాదికి 8 వేల కిలో ఆకు దిగుబడి వస్తుంది. పాడి–పంట -
ప్లాస్టిక్కు చెక్
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో ఉన్న వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీశాఖ రెండేళ్లుగా ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలు చేస్తోంది. నల్లమల గుండా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోలకు సాగిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా వాహనదారులు, ప్రయాణికులు వేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్లాస్టిక్ కట్టడిపై చర్యలు కట్టుదిట్టం చేసింది. దట్టమైన నల్లమల అడవిలోకి రాకముందే ముఖద్వారం వద్ద వాహనదారుల నుంచి ప్లాస్టిక్ను సేకరించడంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో అడవిలో ప్లాస్టిక్ వేయవద్దని విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. అటవీశాఖ చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధంతోపాటు అవగాహన కార్యక్రమాలకు స్థానిక ప్రజలు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే ఏటా అడవిలో పోగవుతున్న చెత్తలో సుమారు 80 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించగలిగారు. 16 మంది స్వచ్ఛ సేవకులు అడవిలోకి ప్రవేశించే వాహనాల్లో అత్యవసరంగా వినియోగించే వాటర్ బాటిళ్లను 2 లీటర్లు, అంతకన్నా పెద్ద సైజులో ఉండే సీసాలనే అనుమతిస్తున్నారు. ఖాళీ అయిన బాటిళ్లను అడవిలో ఎక్కడా పడవేయవద్దని వాహనదారులకు అవగాహన కల్పించిన తర్వాతే అడవిలోకి పంపుతున్నారు. ఫలితంగా చాలావరకు అడవిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి. ఎక్కడైనా రోడ్డుకు ఇరువైపులా ఉండే వ్యర్థాలను 16 మంది స్వచ్ఛ సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. చెక్పోస్టులు, అడవిలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మన్ననూర్లోని ప్లాస్టిక్ బేయిలింగ్ కేంద్రంలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని తుక్కుగూడలో ఉన్న హైపర్ ప్లాస్టిక్ పార్క్ రీసైక్లింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 34 వేల కిలోల ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయడం గమనార్హం. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తుండగా.. ఇకముందు చిప్స్, ఇతర కవర్లను సైతం రీసైక్లింగ్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనూహ్య స్పందన.. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, వ్యర్థాలను అడవిలో పడేయకుండా ఉండేందుకు స్థానికులు, వాహనదారులకు అటవీశాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు స్థానికులు, వ్యాపారులు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నల్లమలలోని మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, వ్యాపారులు సైతం ప్లాస్టిక్ నిషేధానికి సహకారం అందిస్తున్నారు. నల్లమలలో పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధం అమలు వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ చర్యలు మన్ననూరు, దోమలపెంట చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 80 శాతం వరకు తగ్గిన వ్యర్థాలు ఇప్పటి వరకు 34 వేల కిలోల ప్లాస్టిక్ రీసైక్లింగ్ పూర్తి -
అడవిలోకి రాకముందే..
హైదరాబాద్– శ్రీశైలం రహదారి మీదుగా శ్రీశైలం చేరుకునే ప్రయాణికులు సుమారు 60 కి.మీ., దట్టమైన నల్లమల అటవీప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అడవి మధ్యలో విసిరేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లతో ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు వన్యప్రాణుల మనుగడకే ముప్పుగా మారుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు రహదారి వెంట ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. పండుగలు, సెలవు రోజుల్లో వాహనాల రద్దీతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు సైతం పెరుగుతున్నాయి. అడవిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలుచేస్తూ.. అడవిలోకి రాకముందే చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ను సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను మన్ననూర్ చెక్పోస్టు వద్ద, శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలను దోమలపెంట చెక్పోస్టు వద్ద ఆపి తనిఖీ చేస్తున్నారు. అందరి సహకారంతో.. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పూర్తిస్థాయిలో ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలుచేస్తున్నాం. అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలతో అడవిలో ఏటా పోగవుతున్న ప్లాస్టిక్ చెత్తలో 80 శాతం తగ్గింది. స్థానిక ప్రజలు, వ్యాపారులతోపాటు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ప్రయాణిస్తున్న వాహనదారుల నుంచి సహకారం లభిస్తోంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీ శాఖ అధికారి● -
కళాశాలకు గర్వకారణం..
జిజ్ఞాసలో వృక్షశాస్త్ర విద్యార్థులు చేసిన పరిశోధనలకు గుర్తింపు దక్కడం కళాశాలకు గర్వకారణం. బొటానికల్ గార్డెన్ వల్ల అంతర్జాతీయ స్థాయిలో కళాశాలకు గుర్తింపు దక్కింది. డిగ్రీ స్థాయిలో ఎక్కడ జరగని పరిశోధనలు మా వద్ద జరగడం ఆనందంగా ఉంది. మరిన్ని పరిశోధనలకు అవార్డు స్ఫూర్తి కానుంది. వృక్షశాస్త్ర మెంటర్తో పాటు విద్యార్థులకు అభినందనలు. – డా.సుకన్య, ప్రిన్సిపాల్, బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజి కళాశాల, జడ్చర్ల ● -
పండుగలు సైతం లెక్కచేయక..
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఆరుగురి ఆచూకీ కోసం సహాయక బృందాలు పండుగలు సైతం లెక్కచేయక గాలింపు చేపడుతున్నాయి. సొరంగంలోని మట్టి, బురద, బండరాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా, టీబీఎం శకలాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన సమీప ప్రదేశం నుంచి లోకో ట్రైన్ ఇంజన్, క్యాబిన్ను బయటకు తరలించడంతో రాకపోకలకు మార్గం సుగమమైంది. సహాయక చర్యల్లో అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సామగ్రిని వినియోగిస్తున్నారు. కొనసాగుతున్న కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ.. సహాయక చర్యలు మరింత వేగవంతం చేసేందుకు కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం 13.630 కి.మీ. నుంచి 13.73 కి.మీ. వరకు వంద మీటర్లు పునరుద్ధరించారు. దీంతో ఎస్కవేటర్ల సాయంతో సొరంగం లోపలి మట్టిని బయటకు తరలించడానికి అవకాశం లభించింది. ఎస్ఎల్బీసీలో నిర్విరామంగా కొనసాగుతున్న సహాయక చర్యలు మట్టి, బురద, రాళ్ల తొలగింపు వేగవంతం నీటిఊట ఎప్పటికప్పుడు తోడివేత -
ఊర్కొండపేటలో కలకలం
సాక్షి, నాగర్కర్నూల్: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో మహిళపై ఏడుగురు కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊర్కొండ మండలంలో ప్రసిద్ధిగాంచిన ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. గంజాయి, మద్యం మత్తులో.. జిల్లాలో పలుచోట్ల గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, బహిరంగంగా మద్యం తాగుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టారీతిగా అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఊర్కొండపేట ఆలయ పరిసరాలతోపాటు జిల్లాలో పలుచోట్ల ఇతర దర్శనీయ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగంపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నా, పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల ఫిర్యాదు చేసినా, తరచుగా ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా ఆయా చోట్ల పోలీసుల నిఘా ఉండటం లేదు. తాజాగా మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో గంజాయి, మద్యం మత్తులో నిత్యం జోగుతున్న స్థానిక యువకులు, పలువురు ఆటోడ్రైవర్ల పాత్ర ఉందని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా.. ఇంకా ఎవరికై నా ఈ ఘటనతో సంబంధం ఉందా.. అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. వేగంగా విచారణ చేస్తున్నాం.. బాధితురాలి నుంచి సోమవారం ఉదయం ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ, సీఐ అధికారులు స్పందించి కేసు నమోదు చేశారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. కేసుపై వేగంగా విచారణ కొనసాగుతోందన్నారు. ఏడుగురు నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధితురాలిపై నిందితులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మహిళపై కామాంధులు దాడికి తెగబడ్డారు. శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, పిల్లలు ఆలయ పరిసరాల్లో పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లింది. అక్కడ కనిపించిన బంధువుతో మాట్లాడుతుండగా, అక్కడే కాచుకుని ఉన్న ఏడుగురు కామాంధులు వారిపై దాడిచేసి, ఆమె బంధువును చెట్టుకు కట్టేశారు. మహిళపై అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ వెనకడుగు వేసినట్టు తెలిసింది. తర్వాత కుటుంబ సభ్యుల భరోసా మేరకు ఎట్టకేలకు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టం జడ్చర్ల టౌన్: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నాగర్కర్నూల్ ఎస్పీని కోరానని వెల్లడించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారు ఓ పార్టీకి చెందిన నాయకులు అని తన దృష్టికి వచ్చిందని, అయితే ఈ ఘటనలో తాను రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని, యువతికి అండగా ఉంటామన్నారు. దాడి చేసి.. చెట్టుకు కట్టేసి ఆలయానికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం ఒళ్లు జలదరించే రీతిలో చిత్రహింసలు జిల్లాలోని దర్శనీయ ప్రదేశాల్లో కొరవడిన భద్రత యథేచ్ఛగా మద్యపానం, గంజాయి వినియోగం ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని వైనం -
స్వయం ఉపాధికి ఊతం
స్టేషన్ మహబూబ్నగర్: రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమం కింద నిరుపేద మైనార్టీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు ఇవ్వనున్నారు. మూడు నెలల క్రితం ఆన్లైన్ ద్వారా కుట్టుమిషన్ల పథకానికి దరఖాస్తులు స్వీకరించగా.. ఇప్పుడు వీటిని పంపిణీ చేయనున్నారు. 15 వేలకుపైగా దరఖాస్తులు రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఫేజ్–1 కింద 10,490 కుట్టుమిషన్లు మంజూరయ్యాయి. కాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 2,400 కుట్టుమిషన్లను మైనార్టీ మహిళలకు పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపు 15 వేలకుపైగా దరఖాస్తులు చేసుకున్నారు. గత నెల 2న వనపర్తి జిల్లాకేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. త్వరలోనే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కుట్టుమిషన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. కాగా.. సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలో 2 వేల మిషన్లను లబ్ధిదారులకు ప్రత్యేకంగా పంపిణీ చేయనున్నారు. నిరుద్యోగులకు రాజీవ్ యువవికాసం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం గత నెల 11న ప్రభుత్వం రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల బ్యాంకు లింకేజీ ద్వారా సబ్సిడీ రుణాలు అందించనున్నారు. దీనికోసం ఈ నెల 5 వరకు దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ జరగనుంది. 6 నుంచి 31 వరకు లబ్ధిదారుల ఎంపిక, జూన్ 2న ఎంపికై న వారికి మంజూరు పత్రాలు అందజేయనున్నారు. బ్యాంకు లీంకేజీ ద్వారా నిరుద్యోగ యువతకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు మైనార్టీ నిరుద్యోగ యువతకు దాదాపు 3 వేలకుపైగా యూనిట్లు మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా కుట్టుమిషన్ల కేటాయింపు ఇలా.. జిల్లా కుట్టుమిషన్లు మహబూబ్నగర్ 700 నాగర్కర్నూల్ 700 నారాయణపేట 350 వనపర్తి 350 జోగుళాంబ గద్వాల 300 మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ ఉమ్మడి జిల్లాకు 2,400 మిషన్లు కేటాయింపు త్వరలో అర్హులకు అందజేయనున్న ఎమ్మెల్యేలు మైనార్టీల సంక్షేమానికి కృషి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుంది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్వహిస్తున్నాం. ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీల్లోని నిరుపేద వర్గాలకు స్వయం ఉపాధి కోసం బ్యాంకు లింకేజీ ద్వారా 80 శాతం, 60 శాతం, 70 శాతం సబ్సిడీతో రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు అందిస్తాం. రాజీవ్ యువ వికాసం కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు ప్రభుత్వం రూ.850 కోట్లు కేటాయించింది. – ఒబేదుల్లా కొత్వాల్, టీజీఎంఎఫ్సీ చైర్మన్ -
పోలీసులకు ప్రజలు సహకరించాలి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: రంజాన్ పండగ సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని వానగుట్ట సమీపంలో ఉన్న ఈద్గాను ఎస్పీ జానకి సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. స్థానికంగా విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. శాంతిభద్రతలతోపాటు ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. జిల్లాలో పండగ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవడానికి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశామన్నారు. ఈద్గా, మసీదులు, ప్రధాన చౌరస్తాలలో అదనపు సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, ఎలాంటి సమస్య ఉన్న డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాములు, సురేష్కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, సీఐలు వెంకటేష్, ఇజాజుద్దీన్ పాల్గొన్నారు.నేషనల్ హ్యాండ్బాల్ పోటీలకు గిరిజమహబూబ్నగర్ క్రీడలు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్లో సోమవారం నుంచి ప్రారంభమైన సీనియర్ మహిళా జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారిణి కె.గిరిజ ఎంపికయ్యారు. తెలంగాణ మహిళా జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. క్రీడాకారిణి ఎంపికపై సంఘం సభ్యులు రజనికాంత్రెడ్డి, ఎండీ జియావుద్దీన్, ప్రదీప్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటి జిల్లాకు పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఉత్తరాది మఠంలోపీఠాధిపతి పూజలుస్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రం ప్రమోదగిరిలోని ఉత్తరాది మఠంలో సోమవారం పీఠాధిపతులు శ్రీసత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం, మూల రామచంద్రస్వామికి పూజలు, మహాభారత తాత్పర్య నిర్ణయ మంగళ మహోత్సవ పూజలు నిర్వహించారు. నెలరోజుల నుంచి మహాభారత ప్రవచనం చేసిన ఆనందాచార్యులను అభినందించారు. -
పరిశోధనకు పట్టం
జడ్చర్ల డిగ్రీ కళాశాల వృక్షశాస్త్రం విద్యార్థులకు అరుదైన గౌరవం రాష్ట్రంలోనే ప్రథమం.. డిగ్రీ కళాశాల స్థాయి విద్యార్థులు చేసిన పరిశోధన రాష్ట్రంలోనే ప్రథమం కావడం విశేషం. రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, హైదరాబాద్ మొత్తం 7 యూనివర్సిటీలు ఉండగా.. ఏ ఒక్క యూనివర్సిటీలోనూ డిగ్రీ స్థాయిలో ఇలాంటి పరిశోధనలు జరగలేదంటే అతిశయోక్తి లేదు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ, ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిసిట్యూట్ (ఈపీటీఆర్ఐ)లలో మాత్రమే చెట్లు కార్బన్ డయాకై ్సడ్ తీసుకునే దానిపై పరిశోధనలు జరిగాయి. అయితే రెండు చోట్ల డా.సదాశివయ్య శిష్యులే పరిశోధనలు చేయడం గమనార్హం. జడ్చర్ల టౌన్: మొక్కలు కార్బన్ డయాకై ్సడ్ ఎంత గ్రహిస్తాయనే అంశంపై జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పరిశోధనలకు అరుదైన గౌరవం లభించింది. రాష్ట్రస్థాయిలో కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ (సీసీఈ) నిర్వహించే జిజ్ఞాసలో వృక్షశాస్త్ర విభాగం విద్యార్థులకు తృతీయ స్థానం దక్కింది. రాష్ట్రంలోని 134 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి 13 విభాగాల్లో 16 అంశాలపై పోటీలు నిర్వహించగా.. జిజ్ఞాసకు జడ్చర్ల కళాశాల నుంచి వివిధ విభాగాల నుంచి 5 అంశాలు పంపించారు. సీసీఈ జిజ్ఞాస ఫలితాలు గతనెల మూడవ వారంలో విడుదల చేయగా.. జడ్చర్ల డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. ఏప్రిల్ 9న హైదరాబాద్ రూసా కార్యాలయంలో జరిగే వేడుకల్లో ప్రదానంచేసే అవార్డును డా.సదాశివయ్య బృందం స్వీకరించనుంది. జిజ్ఞాస లక్ష్యం.. డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులను చదువుతో పాటు పరిశోధనల వైపు మళ్లించడం.. వారిచే నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేందుకు గాను కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ 2016–17లో జిజ్ఞాసను ప్రారంభించింది. ఒక్కో విభాగంలో పరిశోధన చేసే అంశం కోసం ఐదుగురు విద్యార్థులు, ఒక మెంటర్ (అధ్యాపకుడు) ఉంటారు. రాష్ట్రంలోని 134 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రూపొందించిన అంశాలను నేరుగా సీసీఈకి పంపిస్తున్నారు. అలా పంపించిన అంశాలను రూసా కార్యాలయంలో ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నారు. ఆరు నెలలపాటు పరిశోధనలు.. చెట్లు కార్బన్ డైయాకై ్సడ్ గ్రహిస్తాయని అందరికీ తెలిసిందే. అయితే అవి ఎంత గ్రహిస్తాయని మాత్రం తెలియదు. ఈ విషయం తెలుసుకుందామని వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా. సదాశివయ్య ఆధ్వర్యంలో ఆ విభాగం విద్యార్థులు రవీందర్, ఇందు, మేఘన, శివసాయి, సహిస్త ఆజ్మి ఆరు నెలలపాటు పరిశోధనలు చేశారు. కళాశాల బొటానికల్ గార్డెన్లో ఉన్న 105 జాతులకు చెందిన 1,228 చెట్లపై వారు పరిశోధనలు జరిపారు. చెట్టు ఎత్తు, కాండం కొలతలతో వాటి సాంద్రత విలువలు కనుక్కుని, ఒక్కొక్క చెట్టు ఎంత కార్బన్ డయాకై ్సడ్ తీసుకుంటుందో లెక్కగట్టారు. గార్డెన్లో 6వేలకు పైగా మొక్కలు, చెట్లు ఉండగా.. 1,228 చెట్లు ఒక్కొక్కటి 30 సెం.మీ. కన్నా ఎక్కువ చుట్టు కొలత ఉన్నవి గుర్తించారు. ఈ చెట్లు ఏడాదికి 282 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ తీసుకుంటాయని ప్రాజెక్ట్ ద్వారా వెల్లడైంది. ఇదే అంశాన్ని వీడియో, ఆడియో రూపంలో పంపగా తృతీయస్థానం దక్కింది. మొక్కలు కార్బన్ డయాకై ్సడ్ ఎంత గ్రహిస్తాయనే అంశంపై పరిశోధన బొటానికల్ గార్డెన్లో 1,228 చెట్లపై ఆరు నెలలపాటు రీసెర్చ్ విద్యార్థుల జిజ్ఞాసకు దక్కిన తృతీయ స్థానం 9న హైదరాబాద్లో అవార్డు స్వీకరణ పరిశోధన ప్రయోజనాలు.. సాధారణంగా ఏగిస, నారేపి, రావి, మర్రి, మామిడి వంటి చెట్లు కార్బన్ డయాకై ్సడ్ ఎక్కువగా తీసుకుంటాయని తేలడంతో.. వాటిని కాలుష్య ప్రాంతాల్లో ఎక్కువగా పెంచేలా ప్రభుత్వం సిఫార్సులు చేయవచ్చు. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గే అవకాశాలు పెరుగుతాయి. కళాశాలలోని 1.228 చెట్లు 282 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ స్వీకరిస్తున్నందున.. వాటికి కాలుష్య పరిశ్రమలు ఏడాదికి రూ. 5లక్షలు చెల్లించాల్సి వస్తుందని తేలింది. భవిష్యత్లో జడ్చర్ల కళాశాల బొటానికల్ గార్డెన్కు ఈ రూపంలో భారీగా ఆదాయం సమకూరనుంది. -
ఎల్ఆర్ఎస్కు స్పందన అంతంతే
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్తోపాటు జడ్చర్ల (బాదేపల్లి), భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల పరిధిలో ఎల్ఆర్ఎస్కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. వాస్తవానికి 2020 ఆగస్టు 26 నాటికి ముందు డీటీసీపీ అనుమతులు లేకుండా వెంచర్లు వేసి విక్రయించిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చేపట్టింది. దీంతో అప్పట్లోనే ప్లాట్లు కొనుగోలు చేసిన వారు రూ.వెయ్యి చొప్పున, అలాగే వెంచర్దారులు మిగిలిపోయిన ప్లాట్లకు సంబంధించి రూ.10 వేల చొప్పున ఆయా మున్సిపాలిటీలలో చెల్లించారు. వివిధ కారణాలతో అదే ఏడాది అక్టోబర్ 15 వరకే దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఆ తర్వాత 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికోసం మార్చి నెల 31లోగా చెల్లించేవారికి మొత్తం ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించారు. ఈ విషయమై క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించినప్పటికీ దరఖాస్తుదారులు ఎక్కువగా ముందుకు రాకపోవడం గమనార్హం. కాగా, ఈ ప్లాట్లను క్రమబద్ధీకరించుకుంటే చట్టబద్ధతతోపాటు అలాంటి వాటికే మార్కెట్లో విలువ పెరుగుతుందని, డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, బ్యాంకర్లు సైతం హౌసింగ్ లోన్స్ వెంటనే ఇస్తారన్నది వారు గుర్తించడం లేదు. జిల్లావ్యాప్తంగా 43,562 దరఖాస్తులకు అనుమతి 7,335 మంది మాత్రమే ఫీజు చెల్లింపు ప్రభుత్వానికి సమకూరిన రూ.20.99 కోట్ల ఆదాయం అవగాహన కల్పించినా ముందుకు రాని ప్లాట్ల యజమానులు -
సహాయక చర్యలు వేగవంతం..
సొరంగంలో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. సోమవారం జేపీ కంపెనీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, ిహైడ్రా అధికారి సుదర్శన్రెడ్డి, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేటిచంద్రం, జేపీ కంపెనీ ప్రతినిధులతో సహాయక చర్యలపై సమీక్షించారు. సహాయక బృందాలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా 24 గంటలు శ్రమిస్తున్నారని చెప్పారు. సహాయక బృందాలు, నిపుణులు సమన్వయంతో పనిచేస్తున్నారని.. మైనింగ్ ప్రమాదాల్లో నిష్టాతులైన వారి సేవలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. నీటి ఊటను అత్యధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నామని వివరించారు. సహాయక సిబ్బందికి ఎలాంటి సమస్యలు రాకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. -
మానవాళికి మేలు..
బొటానికల్ గార్డెన్లో విద్యార్థులు చేసిన పరిశోధనలు మానవాళికి ఎంతో ఉపయోగం కానున్నాయి. ఏ చెట్టు ఎంత కార్బన్ డయాకై ్సడ్ గ్రహిస్తుందో తెలియడం వల్ల.. అలాంటి చెట్లను ఎక్కువగా నాటడానికి అవకాశం దక్కుతుంది. ఇలాంటి పరిశోధన రాష్ట్రంలోనే ఇదే ప్రథమం. మా పరిశోధనలకు జిజ్ఞాసలో తగిన గౌరవం దక్కింది. బొటానికల్ గార్డెన్లోని 1,228 చెట్లు 282 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ గ్రహిస్తున్నాయి. మొత్తం మొక్కలను లెక్కిస్తే రెట్టింపు కార్బన్ డయాకై ్సడ్ గ్రహిస్తాయని గుర్తించవచ్చు. దీన్ని ద్వారా భవిష్యత్లో భారీగా ఆదాయం సమకూరనుంది. – డా.సదాశివయ్య, పరిశోధనల మెంటర్, గార్డెన్ సమన్వయకర్త -
స్వర్ణాభరణాలంకరణలో వేంకటేశ్వరుడు
స్వర్ణాభరణాలంకరణలో మన్యంకొండ వేంకటేశ్వరస్వామి ధగధగా మెరిసిపోతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. విశేషోత్సవాల్లో మాత్రమే స్వామివారికి స్వర్ణాభరణ అలంకరణ చేస్తుండగా.. ప్రతి ఏడాది ఉగాది పండుగ రోజు స్వామివారిని స్వర్ణాభరణ అలంకరణ చేస్తారు. శ్రీరామ నవమి వరకు స్వామివారికి ఈ అలంకరణ ఉంటుంది. దీంతో వారం రోజుల పాటు స్వామివారు స్వర్ణాభరణ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే స్వామివారిని పల్లకీలో గర్భగుడి నుంచి హనుమద్దాసుల మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సన్నిధిలో పూజలు చేసి తరించారు. – మహబూబ్నగర్ రూరల్ -
ఈద్గాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ జానకి
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో రంజాన్ పండగ నేపథ్యంలో ఈద్గాల వద్ద భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ జానకి ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులతో ఆదివారం ఎస్పీ టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముస్లింలు రంజాన్ పండగ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈద్గాలతోపాటు మసీదుల దగ్గర సైతం బందోబస్తు ఉండాలని సూచించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. జిల్లాలో పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారని, ఎవరూ కూడా భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక నమాజ్లు చేసే ఈద్గాల దగ్గర అదనపు బలగాలను బందోబస్తుకు కేటాయించినట్లు వివరించారు. ట్రాఫిక్ కట్టడి, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ, క్యూఆర్టీ మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని బందోబస్తు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా అత్యవసరం అయితే పోలీస్ కంట్రోల్ రూంను సంప్రదించాలని సూచించారు. -
రామలింగేశ్వరస్వామికి విశేషాలంకరణ
అడ్డాకుల మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శివలింగానికి ఆదివారం విశేషాలంకరణ చేశారు. అర్చకులు వివిధ రకాల పూలతో గర్భగుడిని, శివలింగాన్ని శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. ఉగాది పండుగ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. తర్వాత ఆలయ ఆవరణలో ఉన్న కల్పవృక్షం చుట్టు ప్రదక్షిణలు చేశారు. ఆలయం బయట ఉన్న దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. – అడ్డాకుల -
తగ్గుతున్న నీటి నిల్వలు..
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్వాటర్పై ఆధారపడి పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. శ్రీశైలం బ్యాక్వాటర్ ఫుల్గేజ్ లెవెల్ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 837 అడుగుల దిగువకు నీటిమట్టం చేరింది. డ్యాంలో నీటి నిల్వ 58 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బ్యాక్వాటర్ డెడ్ స్టోరేజీ 30 టీఎంసీలు. అప్పటి వరకు ప్రాజెక్టుల ద్వారా బ్యాక్వాటర్ను వినియోగించుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తమ వాటాకు సంబంధించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో.. శ్రీశైలం డ్యాంలో ఉన్న 28 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం కేఎల్ఐ ద్వారా రోజూ ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం బ్యాక్వాటర్ డెడ్ స్టోరేజీకి చేరేలోగా పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని ఎత్తిపోసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు. -
కమణీయం..శ్రీనివాసుడి కల్యాణం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని సింహగిరిలో వెలసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కల్యాణోత్సవాన్ని తిలకించారు. కల్యాణ ఘట్టాలతో ఆలయాలు, పరిసర ప్రాంతాలు పులకించిపోయాయి. స్వామివారి కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి సంపూర్ణ కటాక్షం మహబూబ్నగర్ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది మీ అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, సీహెచ్ కృష్ణయ్య, భాస్కర్, సంజీవ, మల్లేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలతోపాటు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో ఏ వేడుకలైనా భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో కలసిమెలసి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన 12 మందిని ఘనంగా సన్మానించారు. వీరిలో మనోహర్రెడ్డి (న్యాయవాది), లయన్ నటరాజ్ (రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్), డా.శామ్యూల్ (వైస్ చైర్మన్), పాండురంగం (యోగా గురువు), చెన్నవీరయ్య (రిటైర్డ్ పీడీ), నాయిని భాగన్నగౌడ్ (స్వరలహరి కల్చరల్ అకాడమీ కార్యదర్శి), శ్రీనయ్యశెట్టి (రిటైర్డ్ ప్రిన్సిపాల్), రామచందర్ నాయక్ (రిటైర్డ్ పీడీ), సిర్రా నారాయణ (రిటైర్డ్ టీచర్), రఫీఅహ్మద్ పటేల్ (క్వామీ ఏక్తా కమిటీ వ్యవస్థాపకుడు), డా.మురళీధర్రావు (వైద్యుడు), వేణుగోపాల్ (జర్నలిస్టు) ఉన్నారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు ఎన్పీ వెంకటేశ్, సంజీవ్ ముదిరాజ్, సత్తూర్ చంద్రకుమార్గౌడ్, సిరాజ్ఖాద్రీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కురుమూర్తిస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
చిన్నచింతకుంట: రాష్ట్ర ప్రజలందరిపై కురుమూర్తిస్వామి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం ఉగాది పండగను పురస్కరించుకొని జెడ్పీ మాజీ చైర్పర్సన్లు స్వర్ణసుధాకర్రెడ్డి, సీతాదయాకర్రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా కురుమూర్తిస్వామిని దర్శించుకొని.. అనంతరం ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కురుమూర్తిస్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి అరవింద్కుమార్రెడ్డి, కురుమూర్తిస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, దేవరకద్ర, మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రశాంత్కుమార్, కథలప్ప తదితరులు పాల్గొన్నారు.