-
హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్లో రూ .80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాని కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేశారు.సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రాపర్టీ ధరలు ఉంటుంన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు. -
కేవలం రూ.3,400 కోట్లకే అమ్మించారు.. ఎయిర్సెల్ ఫౌండర్ ఆవేదన
రాజకీయ నాయకుల ఒత్తిడి, జోక్యంతో తన కంపెనీని కోల్పోయానని, తక్కువ మొత్తానికి అమ్మేసుకున్నానని ఎయిర్సెల్ వ్యవస్థాపకుడు చిన్నకన్నన్ శివశంకరన్ పేర్కొన్నారు. దశాబ్దం క్రితంతో పోలిస్తే నేటి భారతదేశం చాలా భిన్నంగా ఉందని చెప్పారు.అప్పట్లో వ్యాపారాలు తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయని ఒక పాడ్కాస్ట్ షోలో మాట్లాడుతూ చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా విజయవంతమైతే అదొక సమస్యగా ఉండేదన్నారు. ‘రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నారు.. నేను నా కంపెనీని కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు. తాను కేవలం రూ.3,400 కోట్లకే కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చిందని, అదే ఏటీఅండ్టీకి అమ్మి ఉంటే తనకు 8 బిలియన్ డాలర్లు ఆదాయం వచ్చేదని చెప్పారు. ఇప్పట్లా అప్పుడు లేదు. ఒక పారిశ్రామికవేత్త తన కంపెనీని ఒక నిర్దిష్ట వ్యక్తికే విక్రయించాలని ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.2010లో జరిగిన వేలంలో 3జీ స్పెక్ట్రమ్ వేలంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, కోల్కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, యూపీ ఈస్ట్, పశ్చిమబెంగాల్ వంటి 13 సర్కిళ్లలో స్పెక్ట్రమ్ కోసం ఎయిర్సెల్ రూ. 6,500 కోట్లు చెల్లించింది. 2012 నవంబర్ నాటికి ఈ సంస్థ సుమారు 5 మిలియన్ల 3G వినియోగదారులను కలిగి ఉంది. 3జీలో కీలక పాత్ర పోషించిన ఎయిర్ సెల్ 3జీ టారిఫ్ ను అప్పట్లో భారీగా తగ్గించింది. 2011లో భారతీ ఎయిర్టెల్తో కలిసి యాపిల్ ఐఫోన్ 4 లాంచ్ భాగస్వామి అయింది. ఆర్థిక సమస్యల కారణంగా ఎయిర్ సెల్ 2018 ఫిబ్రవరిలో మార్కెట్ నుంచి నిష్క్రమించింది. 2006లో మాక్సిస్ బెర్హాద్ 74 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఎయిర్ సెల్ ను స్వాధీనం చేసుకుంది. 2011లో తన వాటాను మ్యాక్సిస్ బెర్హాద్ కు విక్రయించాలని తనపై ఒత్తిడి తెచ్చారని చిన్నకన్నన్ శివశంకరన్ ఆరోపించారు. -
ఈ సీఈవో జీతం 12 రూపాయలే.. నమ్మబుద్ధి కావడం లేదా?
సాధారణంగా కంపెనీల సీఈవో వేతనం రూ.కోట్లలో ఉంటుంది. కానీ ఈ ఫిన్టెక్ యూనికార్న్ సీఈవో వార్షిక జీతం కేవలం 12 రూపాయలే. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఈ కథనం చదవండి.ప్రైవేట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ప్రైవేట్ సర్కిల్ రీసెర్చ్ యూనికార్న్ వ్యవస్థాపకుల మధ్యస్త, సగటు వేతన అంతరాలపై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఫిన్టెక్ యూనికార్న్ స్లైస్ ఫౌండర్, సీఈవో రాజన్ బజాజ్ 2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 వార్షిక వేతనం మాత్రమే తీసుకున్నారు.సీఈవో బజాజ్ జీతం నామమాత్రంగా ఉన్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు, రుణ వ్యాపార కార్యకలాపాల నుంచి స్లైస్ రూ .847 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ తన అప్పటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తి అయిన ప్రీపెయిడ్ కార్డుపై రివాల్వింగ్ క్రెడిట్ లైన్ను రద్దు చేసినప్పటికీ కంపెనీ దీనిని సాధించగలిగింది. -
‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ కన్నుమూత
దేశంలోని అగ్రశ్రేణి ఐస్ క్రీమ్ బ్రాండ్లలో ఒకటైన నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్ కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ తుది శ్వాస విడిచారు.రఘునందన్ శ్రీనివాస్ కామత్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. ఎన్నో కష్టాలు పడి దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకదానిని నిర్మించారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్క్రీమ్ను స్థాపించి ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ. 400 కోట్లు.రఘునందన్ శ్రీనివాస్ కామత్ తండ్రి పండ్ల వ్యాపారి. చిన్నతనంలో పండ్ల వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేసేవాడు. అలా పండ్ల గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని పెంచుకున్న కామత్ 14 సంవత్సరాల వయస్సులో తన గ్రామాన్ని విడిచి ముంబైకి పయనమయ్యాడు. 1984లో కేవలం నలుగురు సిబ్బంది, కొన్ని ప్రాథమిక పదార్థాలతో ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా నేచురల్స్ ఐస్క్రీమ్ పుట్టింది. -
నేను మంచి తల్లినా కాదా?! మామాఎర్త్ సీఈఓ పోస్టు వైరల్
ఒకప్పుడు ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అయ్యేవారు. అరకొర చదువులు చదివించి.. చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తరింటికి పంపిచేశారు. అమ్మాయిలకు పెద్ద చదువులు చెప్పించడం, ఉద్యోగాలకు పంపడం అన్న మాటే లేదు. కానీ రోజులు, పరిస్థితులు మారాయి. నేటి కాలంలో మగవారితో సమానంగా చదువుతున్నారు అమ్మాయి. ఇటు ఉద్యోగాలు కూడా చేస్తూ తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు పెళ్లి అయ్యాక ఓ వైపు ఇంటిని చూసుకుంటూ మరోవైపు ఉద్యోగం చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. సగటు వర్కింగ్ విమెన్కు ఉండే సవాళ్లు తాజాగా బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్ సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్కు కూడా ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ భావోద్వేగ పోస్టు నెట్టింట్లో వైరల్గా మారింది. గజల్ తన కొడుకును తొలిరోజు పాఠశాలకు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ తనకున్న పనుల వల్ల అది సాధ్యపదడలేదు. దీంతో ఆమె ఎంతో బాధపడిపోయింది. కుమారుడితో కలిసి మొదటి రోజు పాఠశాలకు వెళ్లకపోడంతో ‘నేను చెడ్డ తల్లినా?’ అనే ప్రశ్న తన మదిలో మెదిలినట్లు చెప్పుకొచ్చింది. చివరికి తన కొడుకును వాళ్ల నానమ్మతో స్కూల్కు పంపినట్లు పేర్కొంది. ‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు ను మంచి తల్లిని కాదా? అనే ప్రశ్న నా మదిలో మెదిలింది. ఆ సమయంలో చాలా ఏడ్చా. బాధ పడ్డా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్కి పంపించా. మీరు ఎంత కోరుకున్నా కొన్నిసార్లు సెలవు తీసుకోవడం కుదదు. అది ఎంత విలువైనది అయినా సరే. అలా మొదటిరోజు స్కూల్కు వెళ్లేందుకు కుమారుడు చూపిన ఉత్సాహం, చిరునవ్వు, కన్నీళ్లు, పాఠశాల్లో అడుగు పెట్టగానే ఉపాధ్యాయులు, పిల్లల్ని చూసి కలిగే ఆందోళన.. ఇవన్నీ చూడలేకపోయా’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. అదేవిధంగా తన కుటుంబ సపోర్ట్ను కూడా అలఘ్ ఈ పోస్టులో వివరించారు. నేను, వరుణ్ అలగ్, కుమారుడు అగస్త్య, మా అత్త ఐదేళ్ల కిత్రం ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నాలుగుతరాల వాళ్లంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. సొంతవాళ్లే కావాలనేం లేదు. దగ్గరి బంధువులు, అర్థం చేసుకునే స్నేహితులున్నా పర్లేదు. అయితే, ప్రతీ విషయంలోనూ లాభాలు, నష్టాలు ఉంటాయి. అయినప్పటికీ ఉమ్మడి కుటుంబం అనేది పిల్లలకు అద్భుతమైన వాతావరణం. తల్లులు కెరీర్ లక్ష్యాలను పక్కనపెట్టకుండా.. ప్రేమ, రక్షణ అందించే ప్రదేశం’ అంటూ సుదీర్ఘ మైన పోస్ట్ రాసుకొచ్చారు. -
బంధన్ బ్యాంక్కు సీఈవో గుడ్బై
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో సీఎస్ ఘోష్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుత సర్వీసు 2024 జూలై9తో ముగియనుండటంతో పదవీవిరమణ చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. వరుసగా మూడుసార్లు ఎండీ, సీఈవోగా దాదాపు దశాబ్ద కాలం బ్యాంకుకు నాయకత్వం వహించిన తాను బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బోర్డుకు రాసిన లేఖలో ఘోష్ పేర్కొన్నారు. -
‘‘పేటీఎంపై సీబీఐ, ఈడీల మౌనం అందుకేనా’’
న్యూఢిల్లీ: పేటీఎం సబ్సిడరీ కంపెనీ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై మనీలాండరింగ్ ఆరోపణల తర్వాత కూడా సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎందుకు మౌనంగా ఉన్నాయో చెప్పాలని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేసింది. ‘పేటిఎం వ్యవస్థాపకుడు ప్రధాని మోదీ భక్తుడు. ప్రధానితో సెల్ఫీలు దిగడమే కాకుండా ప్రధానికి అనుకూలంగా ప్రకటనలు కూడా ఇచ్చాడు. ఎన్నికల ర్యాలీల్లోనూ పేటీఎంకు అనుకూలంగా మోదీ మాట్లాడారు. ఏడేళ్లుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సహకారం అందింది. ఇప్పుడు కంపెనీపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పేమెంట్ బ్యాంకులో అక్రమాలు జరుగుతున్నాయని ఆర్బీఐ ఆంక్షలు విధించిన తర్వాత కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు మౌనంగా ఉంది. పీఎం మోదీకి సంబంధించిన వాళ్లపై దర్యాప్తు సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా షినేట్ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. నిబంధనలు పాటించడం లేదన్న కారణంగా ఈ నెల 29 తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంకు ఎలాంటి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని, వాలెట్లలో డబ్బు రీఫిల్ చేయడం కుదరదని ఆర్బీఐ ఇటీవల ఆంక్షలు విధించింది. దీంతో పేటీఎం షేరు స్టాక్మార్కెట్లలో కుప్పకూలుతూ వస్తోంది. ఈ నాలుగైదు రోజుల్లో ఆ షేరు సుమారు 50 శాతం మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. #WATCH | On RBI's restrictions on Paytm Payments Bank, Congress leader Supriya Shrinate says, "RBI has restricted Paytm payments bank & there will be no existence of it after 29 February...There are very serious charges levelled by the RBI. The irregularities started in… pic.twitter.com/VFJph2tU2s — ANI (@ANI) February 5, 2024 ఇదీచదవండి.. భారీగా తగ్గుతున్న పేటీఎం షేర్ -
Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత
పదిహేడు సంవత్సరాల వయసులో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చాలా తక్కువమందికి ఆసక్తి ఉంటుంది. జిందాల్ మాత్రం అలా కాదు. హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన పదిహేడు సంవత్సరాల కశ్వీ జిందాల్కు ఆర్థిక విషయాలు అంటే బోలెడు ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను ఆర్థికరంగానికి సంబంధించిన అనేకానేక విషయాల గురించి తెలుసుకునేలా, ‘ఇన్వెస్ట్ ది చేంజ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. ఈ స్వచ్ఛందసంస్థ ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలలో డిజిటల్ అక్షరాస్యత పెరిగేలా కృషి చేస్తోంది. రకరకాల ప్రభుత్వ పథకాల గురించి తన బృందంతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది కశ్వీ జిందాల్... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సకీనా బతుకుదెరువు కోసం దిల్లీకి వచ్చిన కశ్వీ జిందాల్ ఇంట్లో చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడిందామె. ఇక అప్పటి నుంచి ఆమెకు భయం పట్టుకుంది. ‘ఒకవేళ నాకు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి?’ ఆ భయంలో ఆమెకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. అలాంటి రోజుల్లో ఒకరోజు ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరైంది. ఆ సమావేశంలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన గురించి తెలుసుకుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైనా, చనిపోయినా రక్షణగా నిలిచే పథకం ఇది. సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకున్న సకీనా ‘ఇప్పుడు నిశ్చింతగా ఉంది’ అంటుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకోవడానికి ముందు సకీనాకు బ్యాంకు ఎకౌంట్ లేదు. దీంతో కశ్వీ బృందం సకీనాకు బ్యాంక్ ఎకౌంట్ రిజిస్టర్ చేయించింది. తండ్రి ఫైనాన్షియల్ రంగంలో పనిచేస్తుండడంతో జిందాల్కు ఫైనాన్షియల్ మార్కెట్స్కు సంబంధించిన విషయాలు ఆసక్తిగా తెలుసుకునేది. తండ్రి విసుక్కోకుండా ఓపిగ్గా చెప్పేవాడు. దీంతో జిందాల్కు ఎకనామిక్స్ అనేది ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. ఫైనాన్స్ రంగంలోనే తన కెరీర్ ఏర్పాటు చేసుకోవాలనే భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తమ అపార్ట్మెంట్లో హౌస్కీపింగ్ పనిచేసే వ్యక్తి మరణించాడు. అతడి వయసు 31 సంవత్సరాలు మాత్రమే. అతడి మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్లో పనిచేసే ఇతర వర్కర్లతో మాట్లాడుతున్నప్పుడు వారికి ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఏమీ తెలియదు అని అర్థం అయింది. ఈ నేపథ్యంలో జిందాల్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన...మొదలైన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత స్వచ్ఛంద సంస్థ ‘ఇన్వెస్ట్ ది ఛేంజ్’ ప్రారంభించింది. తొలిరోజు నుంచి ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ నిర్వహించిన అవగాహన సదస్సులకు అద్భుత స్పందన లభించింది. ఆ సదస్సుల తరువాత ‘ఫలానా స్కీమ్లో చేరుతాము’ అంటూ ఫోన్లు వెల్లువెత్తేవి. వారు స్కీమ్లో చేరేలా ఆన్లైన్ అప్లయింగ్, ఫామ్–ఫిల్లింగ్ వరకు జిందాల్ బృందం ప్రతి పని దగ్గరుండి చూసుకునేది. ఏదైనా అప్లికేషన్ ఆమోదం పొందకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించేది. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’లో పదిహేనుమంది వాలంటీర్లు ఉన్నారు. ‘రోటరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ భాగస్వామ్యంతో ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఎన్నో ప్రాంతాలలో ఎన్నో వర్క్షాప్లు నిర్వహించింది జిందాల్. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ఎంతోమందిని ప్రభావితం చేసింది. మార్పు తీసుకు వచ్చింది. ఆఫీస్ బాయ్గా పనిచేసే ప్రకా‹ష్ మండల్... కోవిడ్ కల్లోలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. అతడికి ఉపయోగపడే గవర్నమెంట్ పాలసీల గురించి తెలియజేసి సహాయపడింది జిందాల్ బృందం. ‘ఎన్నో స్కీమ్లు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నాకు నచ్చాయి. దీనికి కారణం సంవత్సరానికి చాలా తక్కువ మొత్తం కడితే సరిపోతుంది. స్కీమ్లో చేరాలనుకున్నప్పుడు ఫామ్స్ నింపడం, ఇతరత్రా విషయాలలో ఇబ్బంది పడ్డాను. ఇలాంటి సమయంలో జిందాల్ బృందం నాకు సహకరించింది’ అంటున్నాడు ప్రకాష్. భవిష్యత్లో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలనుకుంటుంది జిందాల్. ‘ఆర్థిక అక్షరాస్యత అనేది మనల్ని స్వతంత్రులను చేస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ప్రభుత్వ పథకాలతో పాటు పొదుపు మార్గాల గురించి కూడా తెలియజేస్తున్నాం’ అంటుది కశ్వీ జిందాల్. వారి నమ్మకమే మన బలం గొప్ప లక్ష్యాలతో ముందుకు వచ్చినప్పటికీ ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం అనేది అతి పెద్ద సవాలు. వారి నమ్మకాన్ని గెలుచుకుంటే సగం విజయాన్ని సాధించినట్లే. వ్యక్తిగత విషయాలు కూడా మనతో పంచుకుంటారు. నా వయసు అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది... అంటూ నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే నా ఉపన్యాసాల ద్వారా వారిని ఆకట్టుకొని వారికి నా పట్ల నమ్మకం కుదిరేలా చేసేదాన్ని. – కశ్వీ జిందాల్, ఇన్వెస్ట్ ది చేంజ్–ఫౌండర్ -
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు బద్రీనాథ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కంటి చికిత్స లతో ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్.బద్రీనాథ్(83) వయోభారంతో చెన్నైలో మంగళవారం కన్ను మూశారు. 1978లో శంకర నేత్రాలయ పేరిట స్వచ్ఛంద సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. చెన్నై నుంగంబాక్కం కేంద్రంగా శంకర నేత్రాలయ ద్వారా అనేక బ్రాంచీలతో ఉచితంగా పేదలకు సేవలు అందించారు. రోజుకు కనీసం తన బృందం ద్వారా 1,200 మందికి చికిత్సలు, వంద మందికి ఆపరేషన్లు చేసే వారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో పద్మభూషణ్తో కేంద్రం సత్క రించింది. అలాగే బీసీ రాయ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. చెన్నై ట్రిప్లికేన్లో 1940 ఫిబ్రవరి 24న బద్రీనాథ్ జన్మించారు. 1962లో మద్రాస్ వైద్యకళాశా లలో వైద్య కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఆమెరి కాలో ఉన్నత విద్య ను అభ్యసించారు. 1970లో చెన్నై అడయార్లో వాలంటరీ హెల్త్ సర్వీస్ పేరిట సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన మృతి నేత్ర వైద్య వర్గాల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
చైనా నుంచి నిధులు.. న్యూస్క్లిక్ ఫౌండర్కు రిమాండ్
ఢిల్లీ: ఊపా(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిషేధిత) చట్టం కింద అరెస్టైన న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలకు న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించింది. న్యూస్క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ పోలీసులు వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 37 మంది అనుమానిత జర్నలిస్టులను విచారించారు. తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులను కూడా ప్రశ్నించారు. న్యూస్క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్, ప్రబీర్ పుర్కాయస్థ, రచయితలు పరంజోయ్ గుహా ఠాకుర్తా, ఊర్మిళేష్లను దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలోని ప్రత్యేక సెల్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. అనంతరం న్యూస్క్లీక్తో సంబంధాలు ఉన్న జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేశారు. ల్యాప్ట్యాప్లు, మొబైల్స్తో సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 30 స్థావరాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. చైనా నిధులు.. న్యూస్క్లిక్ సంస్థకు ప్రముఖ అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ ఆగష్టు 10న ఓ కథనం వెలువరించింది. సోషలిస్టు భావాలను ప్రచారం చేయడం, తద్వారా చైనా అనుకూల వార్తలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వారి ప్రధాన ఉద్దేశమని న్యూయార్క్ పోస్టు ప్రచురించింది. ఈ నెట్వర్క్లో భాగంగానే న్యూస్క్లిక్ సంస్థకు కూడా నిధులు అందుతున్నాయని స్పష్టం చేసింది. సింఘమ్కు చైనా ప్రభుత్వంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. దీని ఆధారంగా ఆగష్టు 17న న్యూస్క్లిక్పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మంగళవారం సోదాలు నిర్వహించి చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. భారీగా విదేశీ నిధులు న్యూస్ క్లిక్ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల విదేశీ నిధులను మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ద్వారా రూ. 9.59 కోట్లు, సేవల ఎగుమతి ద్వారా రూ. 28.46 కోట్లు విదేశీ రెమిటెన్స్ వచ్చినట్లు గుర్తించినట్లు తేలింది. అలా వచ్చిన నిధులను గౌతమ్ నవ్లాఖా, హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహా పలువురు వివాదాస్పద జర్నలిస్టులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. ఢిల్లీలో న్యూస్క్లిక్ జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు -
లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్!
నితిన్ సలూజా.. టీ కేఫ్ చైన్ ‘చాయోస్’ వ్యవస్థాపకుడు. నితిన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పూర్వ విద్యార్థి. చదువు పూర్తయ్యాక అమెరికా చేరుకున్నాడు. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. లక్షల్లో ప్యాకేజీ అందుకున్నాడు. అయినా నితిన్ సంతృప్తి చెందలేదు. సొంతంగా ఏదైనా చేయాలని భావించి, ఇండియా వచ్చాడు. నితిన్ తన ఆలోచనలను అమలు చేసే పనిలో పడ్డాడు. అనతికాలంలోనే అతని కంపెనీ కోట్లకు పడగలెత్తింది. నితిన్ సలూజా ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గట్టి పట్టుదల, సంకల్పబలంతో.. నితిన్ తన స్టార్టప్ బిజినెస్లో మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. గట్టి పట్టుదల, సంకల్పబలంతో తన సంస్థను విజయ శిఖరాలకు తీసుకెళ్లాడు. స్టార్బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా లాంటి కాఫీ షాపుల ఆధిపత్యం ఉన్న మనదేశంలో ‘కెయోస్’ తనకంటూ ఒక పేరు తెచ్చుకునేలా నితిన్ నిరంతర కృషి చేశాడు. ఇది భారతదేశంలోని ప్రముఖ టీ కేఫ్ కంపెనీగా అవతరించింది. నితిన్ సలుజా స్థాపించిన ‘కెయోస్’ అనతికాలంలోనే రూ. 100 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీగా నిలిచింది. ఉద్యోగం వదిలేసి ఇండియాకు.. నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. చదువు పూర్తయ్యాక ఆయన ఒక అమెరికన్ కంపెనీకి కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశారు. అమెరికా కంపెనీలో నితిన్ జీతం లక్షల్లో ఉండేది. నితిన్, అతని భార్యకు అమెరికాలో టీ అమ్మే వారెవరూ కనిపించలేదు. దీంతో నితిన్ కేఫ్ను తెరవాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చాడు. సొంతంగా టీ వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో పని చేయడం మొదలుపెట్టాడు. గురుగ్రామ్లో మొదటి కేఫ్ భారతదేశంలో కాఫీ అందించే అనేక కేఫ్లు ఉన్నాయని, అయితే అవి టీ అందించడం లేదని అతను భావించాడు. భారతదేశంలో టీ తాగే ప్రత్యేక సంస్కృతి ఉంది. ప్రజలు అనేక రకాల టీలను ఆస్వాదిస్తుంటారు. దీనిని ఆధారంగా చేసుకున్న నితిన్ భారతదేశంలోని టీ తాగేవారి అవసరాలను తీర్చగల టీ కేఫ్ను ప్రారంభించాలని అనుకున్నాడు. 2012లో నితిన్, అతని స్నేహితుడు రాఘవ్ సంయుక్తంగా ‘చాయోస్’ని స్థాపించారు. వారు గురుగ్రామ్లో మొదటి కేఫ్ని ఏర్పాటు చేశారు. కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం ప్రారంభించారు. నితిన్ మొదట్లో తానే స్వయంగా ఆర్డర్లు తీసుకుని, టీ తయారుచేసి అందించేవాడు. 200కు మించిన ‘చాయోస్’ కేఫ్లు కోవిడ్ సమయంలో ‘చాయోస్’ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. 2020లో తిరిగి ట్రాక్లో పడింది. నితిన్ కష్టానికి సరైన ఫలితం దక్కింది. 2020లో కంపెనీ 100 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ముంబై, బెంగళూరు, చండీగఢ్, పూణేలలో నితిన్ చాయోస్ స్టోర్లు నెలకొల్పారు. నేడు భారతదేశం అంతటా 200కు మించిన చాయోస్ కేఫ్లు ఉన్నాయి. చాయోస్ మన దేశంలో ప్రీమియం టీని అందించే కేఫ్. ఇది భారతీయులు తాము కోరుకునే అన్ని రుచుల టీలను అందిస్తుంది. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది? -
తీవ్ర విషాదం: సులభ్ ఫౌండర్ ఇకలేరు!
Sulabh founder Bindeshwar Pathak passed away సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు స్వచ్ఛ రైలు మిషన్కు బ్రాండ్ అంబాసిడర్ బిందేశ్వర్ పాఠక్ (80) ఇక లేరు. ఆగస్టు 15, మంగళవారం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూసారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం బిందేశ్వర్ పాఠక్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆ వెంటనే గుండెపోటుతో కుప్పకూలిపోవడం విషాదాన్ని నింపింది. సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ను బిందేశ్వర్ పాఠక్ 1970లో స్థాపించారు. మాన్యువల్ స్కావెంజర్ల కష్టాలను తీర్చేందుకు బిందేశ్వర్ పాఠక్ విస్తృతంగా ప్రచారం చేశారు. మూడు దశాబ్దాల క్రితం తాను రూపొందించిన సులభ్ టాయిలెట్లను ఫెర్మెంటేషన్ ప్లాంట్లకు అనుసంధానం చేయడం ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తిని వినూత్నంగా వినియోగించేందుకు నిర్ణయిచారు. అలాగే అప్పటి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ఆధ్వర్యంలో రైలు ప్రాంగణంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ను స్వచ్ఛ రైలు మిషన్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఎవరీ బిందేశ్వర్ పాఠక్ మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, సాంప్రదాయేతర ఇంధన వనరులు, వ్యర్థాల నిర్వహణ ,విద్య ద్వారా సామాజిక సంస్కరణల నిమిత్తం పనిచేసిన సామాజిక వేత్త. భారతదేశంలోని స్కావెంజర్లందరూ 13 మిలియన్ల బకెట్ ప్రైవీలను మాన్యువల్గా శుభ్రపరిచే పని నుండి విముక్తి పొందాలని భావించిన వ్యక్తి. మురికివాడల్లో పబ్లిక్, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలలో 7,500 కంటే ఎక్కువ పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి, ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా పే-అండ్ యూజ్ ప్రాతిపదికన వాటిని నిర్వహిస్తున్న భారతదేశంలో తొలి వ్యక్తి డాక్టర్ పాఠక్. ప్రతిరోజూ 10 మిలియన్లకు పైగా ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. బయోగ్యాస్ మానవ విసర్జనల ఆధారంగా 60 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఘనత బిందేశ్వర్ సొంతం. వీటిని హౌసింగ్ కాలనీలు, ఎత్తైన భవనాలు ,పబ్లిక్ టాయిలెట్లలో అమర్చవచ్చు. అలాంటి ప్రాంతాల్లో మురుగు కాలువలు లేకుంటే, టాయిలెట్లను సెప్టిక్ ట్యాంక్కు కాకుండా బయోగ్యాస్ డైజెస్టర్కు అనుసంధానించాలనే ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు. బిందేశ్వర్ పాఠక్ 1964లో సోషియాలజీలో పట్టభద్రుడయ్యాడు. పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1980లో మాస్టర్స్ డిగ్రీని, 1985లో పీహెచ్డీని పొందారు. డాక్టర్ పాఠక్ మంచి రచయిత వక్త కూడా. ది రోడ్ టు ఫ్రీడమ్ సహా అనేక పుస్తకాలను రచించారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశుద్ధ్యం, ఆరోగ్యం, సామాజిక పురోగతిపై జరిగే సమావేశాలలో తరచుగా పాల్గొనేవారు. 1991లో భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ లభించింది. -
ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్ బ్రేక్లా ఫుట్పాత్పై పడ్డాడు అదే..
ఓ సాధారణ పట్టణంలో పుట్టి పెరిగాడతడు. కంప్యూటర్ కోర్సు కోసం హైదరాబాద్ వచ్చాడతడు. నేర్చుకున్నాడు... తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పించేపనిలో మునిగిపోయాడు. ఎదుగుతున్నాననుకున్నాడు... అగాధంలోకి జారిపోయాడు. ఫుట్ పాత్ మీదే నిద్ర... అతడిని మార్చిన రోజది. సంజీవకుమార్ పుట్టింది, పెరిగింది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో. పాలిటెక్నిక్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకునే నాటికి సమాజంలో సాంకేతికంగా మరో విప్లవం మొదలైంది. అదే కంప్యూటర్ ఎడ్యుకేషన్. రాబోయే కాలంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేమని తెలుసుకున్నాడు సంజీవ్కుమార్. హైదరాబాద్కు వచ్చి డీటీపీతో మొదలు పెట్టి డీసీఏ, పీజీడీసీఏ, పీజీ డీఎస్ఈ వరకు అప్పటికి అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చేశాడు. తన మీద నమ్మకం పెరిగింది. సైబర్టెక్ పేరుతో నల్లకుంటలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. కంప్యూటర్స్లో ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తిన వైటూకే సమస్య సద్దుమణిగింది. కానీ అంతకంటే పెద్ద ఉత్పాతం సంజీవకుమార్ జీవితాన్ని ఆవరించింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నాడతడు. అప్పు మిగిలింది! ‘‘నా మీద నాకున్న నమ్మకం, దానికితోడు అందరినీ నమ్మడం నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నా మీద నమ్మకంతో కంప్యూటర్ సెంటర్లు ప్రారంభించాను. స్నేహితుల మీద నమ్మకంతో పదకొండు బ్రాంచ్లకు విస్తరించాను. కొన్ని బ్రాంచ్ల నిర్వహణ స్నేహితులకప్పగించాను. కొందరు స్నేహితులు పెట్టుబడి కోసం డబ్బు అప్పు ఇచ్చి సహకరించారు. నా పెళ్లి కోసం ఒకటిన్నర నెలలు మా ఊరెళ్లాను. పెళ్లి చేసుకుని హైదరాబాద్కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారుగా ఉంది. ఫ్రాంచైసీలు తీసుకున్న స్నేహితులు మోసం చేశారు. నా కళ్ల ముందు తొంబై ఐదు లక్షల అప్పు. నా భార్య బంగారం, నేను నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్లను అమ్మేసి కూడా ఆ అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. నా భార్యను పుట్టింట్లో ఉంచి హైదరాబాద్కొచ్చాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ నాకు ఒక్కరోజు అన్నం కూడా పెట్టలేదు. ఆకలితో ఫుట్పాత్ మీద పడుకున్న రోజును నా జీవితంలో మర్చిపోలేను. డబ్బులేని మనిషికి విలువ లేదని తెలిసి వచ్చిన క్షణాలవి. మరి ఫుట్పాత్ మీదనే బతికేవాళ్ల పరిస్థితి ఏమిటి... అనే ఆలోచన మొదలైన క్షణం కూడా అదే. వైద్యం... ఆహారం! నేను స్కై ఫౌండేషన్ స్థాపించింది 2012లో. అప్పటి నుంచి వీధుల్లో బతికే వాళ్లకు ప్రతి ఆదివారం అన్నం పెట్టడం, మందులివ్వడం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఆఫీస్లోనే వండి రెండు వందలకు పైగా పార్సిళ్లతో మా వ్యాన్ బయలుదేరుతుంది. వాటిని ఫుట్పాత్ మీద, చెట్టుకింద పడుకున్న వాళ్లకు ఇస్తాం. అలాగే ప్రతి బిడ్డా పుట్టిన రోజు పండుగనూ, కేక్ కట్ చేసిన ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలకు సామూహికంగా పుట్టిన రోజులు చేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లల చేత జెండావందనం చేయిస్తాను. కోఠీలో పాత పుస్తకాలు తెచ్చి పంచుతాను. వీటన్నింటికంటే నేను గర్వంగా చెప్పుకోగలిగిన పని వీళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడం. ఫుట్పాత్ల మీద బతుకీడ్చే వాళ్లకు ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు. కరోనా వ్యాక్సిన్ వేయాలంటే ఈ రెండూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ప్రత్యేక అనుమతి తీసుకుని వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించాను. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశాను. ఒక్క అవకాశమివ్వండి! వీధుల్లో బతుకు వెళ్లదీసే వాళ్లకు తాత్కాలికంగా అన్నం పెట్టడం, దుస్తులివ్వడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ బతుకులు రోడ్డు పక్కనే ఉండిపోకూడదంటే వాళ్లకు బతుకుదెరువు చూపించాలి. ప్రభుత్వాలు వాళ్లను షెల్టర్ హోమ్లో ఉంచి ఆహారం పెట్టడంతో సరిపెట్టకూడదు. చిన్న చిన్న పనుల్లో శిక్షణ ఇచ్చి సమాజంలోకి పంపించాలి. వడ్రంగం, బుక్ బైండింగ్, అగరుబత్తీల తయారీ, విస్తరాకుల కటింగ్ వంటి చిన్న పనులు నేర్పించినా చాలు. వాళ్లకు ఒక దారి చూపించినవాళ్లమవుతామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి బాధ్యత ఇవ్వండి. విజయవంతం చేసి చూపిస్తానని కూడా తెలియచేశాను. అలా చేయగలిగినప్పుడు వీధి జీవితాలు ఇంటివెలుగులవుతాయి’’ అన్నారు సంజీవకుమార్. ఫుట్పాత్ మీద కొత్త ఉపాధి! కంప్యూటర్ సెంటర్లను అమ్మేసిన తర్వాత కన్సల్టెంట్గా మారాను. తార్నాకలోని సన్మాన్ హోటల్ ముందున్న ఫుట్ పాతే నా వర్క్ ప్లేస్. నా భుజాన ఒక్క బ్యాగ్తో పాన్ కార్డ్ సర్వీస్ రూపంలో జీవితం కొత్తగా మొదలైంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వచ్చేవి. నెలకు రెండు వేల అద్దెతో ఒక గదిలో ‘స్కై క్రియేషన్స్’ పేరుతో సర్వీస్ను రిజిస్టర్ చేశాను. పాన్ కార్డు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్లు, ప్లేస్మెంట్ల వరకు సర్వీస్లను విస్తరించాను. పద్మారావు నగర్లో ఓ చిన్న ఫ్లాట్ కొనుకున్న తర్వాత స్కై ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ మొదలు పెట్టాను. అద్దె ఇంట్లో ఫౌండేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇంటి యజమాని అనుమతించరు. కాబట్టి సొంత గూడు ఒకటి ఏర్పరుచుకునే వరకు ఆగి అప్పటి నుంచి వీధి పాలైన జీవితాల కోసం పని చేయడం మొదలుపెట్టాను. – సంజీవకుమార్, ఫౌండర్, స్కై ఫౌండేషన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!
Headspace Founder Story: వాస్తవ ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. ఒకటి గొప్ప వాణ్ణి చేస్తుంది.. లేదా పనికిరాకుండా పోయేలా కూడా చేస్తుంది. కన్నీటి సంద్రం నుంచి బయటపడి కోట్లు సంపాదనకు తెర లేపిన ఒక సన్యాసి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఆత్మీయుల మరణం.. ఆండీ పూడికోంబే (Andy Puddicombe) అనే వ్యక్తి తాగి డ్రైవింగ్ చేసిన సంఘటనలో స్నేహితులను, సైక్లింగ్ ప్రమాదంలో అతని సోదరిని కోల్పోయి జీవితం మీద విరక్తి పొందాడు. దుఃఖంతో నిండిన యితడు కాలేజీకి స్వస్తి పలికి నేపాల్ చేరుకున్నాడు. బౌద్ధ సన్యాసం స్వీకరించి ఆసియా అంతటా ఒక దశాబ్దం పాటు సంపూర్ణత, ధ్యానం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. హెడ్స్పేస్ మెడిటేషన్ యాప్.. ధ్యానంతో జీవితాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చనే సత్యాన్ని గ్రహించి అందరికి పంచాలనే ఉద్దేశ్యంతో 2005లో యూకే నుంచి తిరిగి వచ్చిన తరువాత లండన్లో ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఎప్పుడూ బిజీ లైఫ్ గడిపే ఎంతోమందికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఆ తర్వాత రిచర్డ్ పియర్సన్తో కలిసి 2010లో 'హెడ్స్పేస్' (Headspace) అనే మెడిటేషన్ యాప్ స్థాపించారు. ఈ యాప్ అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది ఎంతో మంది ప్రజలకు ధ్యానం ప్రయోజనాలను గురించి వెల్లడిస్తుంది. మానసిక ఆరోగ్యం పట్ల వైఖరిని మార్చడంలో హెడ్స్పేస్ విస్తృత ఆదరణ పొందింది. జీవితంలోని గందరగోళాల మధ్య ప్రశాంతమైన అభయారణ్యంగా మారింది, మానసిక క్షేమం కోరుకునే వినియోగదారులను ఎంతోమందిని ఈ యాప్ ఆకర్షిస్తుంది. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) వేల కోట్ల సామ్రాజ్యం.. ఆధునిక కాలంలో నేడు ఈ యాప్ 4,00,000 మంది సబ్స్క్రైబర్లను 50 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంది. కేవలం బౌద్ధ సన్యాసి అయినప్పటికీ 250 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 2040 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. కష్టతరమైన సమయాల్లో కూడా ఎలా విజయాలు అసాధించాలో తెలుసుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ. మొత్తం మీద వ్యక్తిగత విషాదం అతన్ని వేల కోట్లకు అధిపతిని చేసింది. -
ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఎలా అంటే?
మనం ఇప్పటి వరకు చాలా సక్సెస్ స్టోరీలు చదువుకున్నాం. పేదరికం నుంచి కుబేరులైన వ్యక్తుల గురించి.. ఉన్నత చదువులు వదిలి సక్సెస్ సాధించినవారు గురించి ఇలా ఎన్నెన్నో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ కొడుకు వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించి ఔరా అనిపించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతడు సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జన్మించిన 'విజయ్ శేఖర్ శర్మ' (Vijay Shekhar Sharma) స్కూల్ టీచర్ అయిన 'సులోమ్ ప్రకాష్' మూడవ కుమారుడు. చిన్నప్పుడు అలీఘర్ సమీపంలోని హర్దుగాంజ్ అనే చిన్న ప్రాంతంతో పాఠశాల విద్యను ప్రారంభించి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి బిటెక్ పూర్తి చేసాడు. కంప్యూటర్ పట్ల ఆకర్షణ.. చదువుకునే రోజుల్లోనే విజయ్ను కంప్యూటర్ బాగా ఆకర్శించింది. దీంతో చాలా సమయం కంప్యూటర్లతోనే కాలం గడిపేవాడు. అయితే మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న టెక్నాలజీ అతన్ని ఎంతగానో ఆకర్శించింది. ఇది అతన్ని ఒక కొత్త ఆలోచనలోకి తీసుకెళ్లింది. తత్ఫలితంగా 'పేటీఎమ్' (Paytm) యాప్ సృష్టించి కోట్లు సంపాదించడం మొదలుపెట్టాడు. ఆన్లైన్ పోర్టల్ ప్రారంభం.. అసాధారణ విజయాలన్నీ సాధారణ వ్యక్తుల నుంచి పుట్టుకొస్తాయనే మాట నిజం చేస్తూ.. విజయ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఎన్నెన్నో ఆటంకాలు, అపజయాలు చవి చూసిన తరువాత ఈ రోజు గొప్ప స్థాయికి చేరినట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. చదువు పూర్తయిన తరువాత తన క్లాస్మేట్తో కలిసి ఒక ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించి దాన్ని అతి తక్కువ కాలంలోనే ఇతరులకు విక్రయించారు. ఆ తరువాత 'వన్97 కమ్యూనికేషన్' పోర్టల్ ప్రారంభించారు. ప్రారంభంలో ఇది క్రికెట్ రేటింగ్ వంటి సమాచారం అందించేది. ఈ వెబ్సైట్ అనుకున్నంత సక్సెస్ పొందలేకపోయింది. తద్వారా.. తీవ్ర నష్టాలను మిగిల్చింది. దెబ్బతో అప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తం పోయింది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) రూ. 10 వేలకు ఉద్యోగం & పేటీఎమ్ స్థాపన.. అప్పటి వరకు సంపాదించిన మొత్తం డబ్బు పోవడంతో అప్పుడు చేయాల్సి వచ్చింది. రోజువారీ అవసరాలకు చిన్న చిన్న ఉద్యోగాలు రూ. 10 వేల జీతానికి పనిచేసినట్లు తెలిసింది. అయితే టెక్నాలజీని ఏ మాత్రం వదలకుండా 2011లో పేటీఎమ్ స్థాపించాడు. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఇది భారీ సక్సెస్ సాధించింది. కేవలం ఏడాది కాలంలో లక్షల సంఖ్యలో పేటీఎమ్ వ్యాలెట్స్ క్రియేట్ అయ్యాయి. అంతే కాకుండా మొదటి సారి జరిగిన పెద్ద నోట్ల ఈ యాప్కి మరింత గిరాకీ పెంచింది. (ఇదీ చదవండి: భారత్లో విడుదలైన హ్యుందాయ్ ఎక్స్టర్ - టాటా పంచ్ ప్రత్యర్థిగా నిలుస్తుందా?) కొన్ని నివేదికల ప్రకారం, భారతదేశంలో పేటీఎమ్ ఉపయోగిస్తున్న భారతీయులు సుమారు 30 కోట్లు కంటే ఎక్కువ. అంతే కాకుండా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్కు కూడా విపరీతమైన ఆధారణ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర యూపీఐ యాప్లతో పేటీఎమ్ పోటీ పడుతోంది. ఈ యాప్ స్థాపించిన తరువాత విజయ్ ఆస్తులు విలువ రూ. 8,222 కోట్లకి చేరినట్లు, సంస్థ విలువ రూ. 55 వేల కోట్లు అని తెలుస్తోంది. -
రూ. 300 లక్షల కోట్ల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ స్థాపకుడు ఈయనే..
భారతదేశ ఆర్థిక రాజధాని మొదటి వ్యాపార దిగ్గజాలలో ప్రేమ్చంద్ రాయ్చంద్ జైన్ ఒకరు. ఆయన్ను ముంబైలో (అప్పట్లో బొంబాయి) బిగ్ బుల్, బులియన్ కింగ్, కాటన్ కింగ్ ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. జమ్సెట్జీ టాటా, డేవిడ్ సాసూన్, జమ్సెట్జీ జెజీబోయ్లతో పాటు నలుగురు బాంబే వ్యాపార యువరాజులలో ఒకరిగా పేరు పొందారు. ప్రేమ్చంద్ తన కాలంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. నేటివ్ షేర్ & స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ స్థాపనతో అందరికీ గుర్తుండిపోయారు. అదే ఆ తర్వాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్గా మారింది. బీఎస్ఈ దేశంలో రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. దాంట్లోని అన్ని లిస్టెడ్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాప్ రూ. 300 లక్షల కోట్లకు మించి ఉంది. 1865లో దీనిని స్థాపించినప్పుడు, దక్షిణ బొంబాయిలోని ఒక మర్రిచెట్టు కింద 22 మంది బ్రోకర్లు, ఒక్కొక్కరి నుంచి కేవలం రూపాయి మూలధనంతో ఇది ఏర్పడింది. మొదటి స్టాక్ బ్రోకర్ రాయ్చంద్ 1832లో సూరత్లో రాయ్చంద్ డిప్చంద్ అనే కలప వ్యాపారికి జన్మించారు. ఆయన చిన్నప్పుడే వారి కుటుంబం బొంబాయికి వచ్చేసింది. ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో రాయ్చంద్ విద్యాభ్యాసం సాగింది. అదే ఆయన ఇంగ్లిష్లో మాట్లాడగల, చదవగల, రాయగల మొదటి భారతీయ బ్రోకర్గా అవతరించడానికి సహాయపడింది. రాయ్చంద్ 1852లో ఓ విజయవంతమైన స్టాక్ బ్రోకర్కు సహాయకుడిగా వృత్తిని ప్రారంభించారు. అసమాన్య జ్ఞాపకశక్తి అసమానమైన జ్ఞాపకశక్తి ప్రేమ్చంద్ సొంతం. ఆయన ఎప్పుడూ పెన్ను, పేపర్ వాడలేదు. రాసుకోవడానికి బదులు తన వ్యాపారాలన్నింటినీ కంఠస్థం చేసిన ఆయన కేవలం 6 సంవత్సరాలలో 1858 నాటికి దాదాపు రూ. 1 లక్ష సంపదను ఆర్జించారు. 1861లో జరిగిన అమెరికన్ సివిల్ వార్ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పత్తి వ్యాపారానికి భారత్ హాట్స్పాట్గా మారింది. దీన్ని ఆయన మరింత విస్తృతం చేశారు. దాతృత్వంలోనూ.. భారీ లాభాలను చవిచూసిన ప్రేమ్చంద్ రాయ్చంద్, అంతర్యుద్ధం ముగిశాక 1865లో పత్తి వ్యాపార ప్రాభవం తగ్గడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత తిరిగి పుంజుకుని దాతృత్వం వైపు నడిచారు. ఇందులో భాగంగా బాంబే విశ్వవిద్యాలయంలో రాజాబాయి క్లాక్ టవర్కు నిధులు అందించారు. బాలికా విద్యను ప్రోత్సహించారు. అవార్డులు, స్కాలర్షిప్లు అందించేందుకు ఆర్థికంగా సహకరించారు. ప్రేమ్చంద్ 1906లో మరణించారు. అతని కుటుంబంలోని నాలుగో తరం ఇప్పుడు ప్రేమ్చంద్ రాయ్చంద్ అండ్ సన్స్ సంస్థను నడుపుతోంది. వ్యాపార పరంగా ఒక చిన్న సంస్థే అయినా గొప్ప చరిత్ర దీనికి ఉంది. బైకుల్లాలోని ప్రేమ్చంద్ నివసించిన బంగ్లాను తరువాత అనాథాశ్రమం, పాఠశాలగా మార్చారు. -
ఒక శకం ముగిసింది: ప్రముఖ పారిశ్రామికవేత్త కన్నుమూత
తొలి తరం వ్యవస్థాపకుడు, రసాయనాల తయారీ కంపెనీ దీపక్ నైట్రేట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ చిమన్లాల్ కె మెహతా (సీకె మెహతా) సోమవారం కన్నుమూశారు. మౌలిక్ మెహతా కంపెనీకి సీఈవోగా ఉన్నారు.దీంతో పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర పరిశ్రమ వర్గాలు సంతాపాన్ని ప్రకటించాయి. ఒక శకం ముగిసింది అంటూ ఆయనకు నివాళులర్పించారు. 1972-73లో దీపక్ నైట్రేట్ తయారీని ప్రారంభించిన చిమన్లాల్ రెండేళ్లలోనే లాభాల బాట పట్టించారు. అనేక కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలను ప్రారంభించడంలోనూ, దీపక్ ఫౌండేషన్ను స్థాపించడంలోమెహతాది కీలకపాత్ర. 1971లో దీపక్ నైట్రేట్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వచ్చింది. ఈ సందర్భంగా 20 రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ చేయడం విశేషం. దీపక్ నైట్రేట్ 1984లో మఫత్లాల్ ఇండస్ట్రీస్ నుండి సహ్యాద్రి డైస్టఫ్స్, కెమికల్స్ యూనిట్ను కొనుగోలు చేసింది. కంపెనీ 1995లో మహారాష్ట్రలోని తలోజాలో హైడ్రోజనేషన్ ప్లాంట్ను స్థాపించింది. ప్రస్తుతం, కంపెనీ గుజరాత్లోని నందేసరి , దహేజ్, మహారాష్ట్రలోని తలోజా అండ్ రోహా తెలంగాణలోని హైదరాబాద్లో ప్లాంట్స్ ఉన్నాయి. దీపక్ నైట్రేట్ 100కి పైగా ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలను ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయ రసాయనాలు, రంగులు, రబ్బరు, ఫార్మాస్యూటికల్స్, స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ లాంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో కెమికల్స్లో ఆరో అతిపెద్ద సంస్థగా ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా రెట్లు పెరిగి, పదేళ్ల నాటి 24వ స్థానంతో పోలిస్తే దీపక్ నైట్రేట్ అయిదో అతిపెద్ద లిస్టెడ్ కెమికల్ ప్లేయర్గా ఉంది. ఏప్రిల్, 2023 నాటికి రూ. 25,208 కోట్లు. -
బెలూన్ బొమ్మలమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ
భారతీయ స్టాక్మార్కెట్ చరిత్రలో ఆటోమొబైల్ టైర్ మేజర్ ఎంఆర్ఎఫ్ స్టాక్ మరో సారి తన ప్రత్యేకతను చాటుకుంది, టైర్ పరిశ్రమలో అగ్రస్థానంలోఉన్న ఎంఆర్ఎఫ్ షేరు (జూన్ 13, 2023)న తొలిసారి లక్ష మార్క్ను టచ్ చేసింది. ఈ ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్గా రికార్డు క్రియేట్ చేసింది. అసలు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఫౌండర్ ఎవరు? ఈ కంపెనీ విజయ ప్రస్థానం ఏమిటి? ఒకసారి చూద్దాం. ఎంఆర్ఎఫ్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. దేశంలోని అతిపెద్ద టైర్ కంపెని ఫౌండర్ కేఎం మామ్మెన్ మాప్పిళ్లై . ఆయన అంకితభావం, కృషి పట్టదలతో ఈ రోజు ఈ స్థాయికి ఎగిసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, 1946 సంవత్సరంలో, కేఎం మమ్మెన్ మాప్పిళ్ళై మద్రాసు వీధుల్లో బెలూన్లు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచారు.తొమ్మిది మంది తోబుట్టువులతో, కేరళలో సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన మమ్మన్కు ఈ బెలూన్ల వ్యాపారమే తన విజయానికి సోపానమని ఊహించి ఉండరు. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) మామెన్ తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. అయితే మామెన్ మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్న సమయంలోస్వాతంత్ర్య పోరాటంలో తండ్రిని రెండేళ్లపాటు జైలులో ఉంచారు. 1946లో మామెన్ చిన్న తయారీ యూనిట్లో బొమ్మల బెలూన్లను తయారీతో పారిశ్రామిక జీవితాన్ని షురు చేశారు. ఇది సుమారు 6 సంవత్సరాల పాటు కొనసాగింది. 1952లో టైర్ రీట్రేడింగ్ ప్లాంట్కు ఒక విదేశీ కంపెనీ ట్రెడ్ రబ్బర్ సరఫరా చేస్తోందని గమనించడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. అలా రబ్బరు వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) గ్లోబల్ కంపెనీలు అవుట్ తర్వాత మద్రాసులోని చీటా స్ట్రీట్లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించారు. 1956 నాటికి రబ్బరు వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంది. నాలుగేళ్లలో మార్కెట్ వాటా 50 శాతానికి చేరుకుంది. పలితంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు భారత మర్కెట్నుంచి తప్పుకున్నాయి. అయితే మామెన్ ఇక్కడితో ఆగలేదు టైర్ల తయారీ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రబ్బరు ఉత్పత్తులనుంచి టైర్ పరిశ్రమలోకి మారారు. 1960లో రబ్బర్, టైర్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. అలా అమెరికాకు చెందిన మాన్స్ఫీల్డ్ టైర్, రబ్బర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్ఎఫ్)గా ఆవిష్కరించింది. ట్రెడ్స్, ట్యూబ్లు, పెయింట్స్, బెల్ట్లు, బొమ్మలు వంటి అనేక ఇతర ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. 1961లో మద్రాస్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. అమెరికాకు రబ్బరు ఉత్పత్తులను ఎగుమతి చేసిన ఘనత 1967లో కంపెనీ అమెరికాకు టైర్లను ఎగుమతి చేసిన భారతదేశంలో మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో వివిధ ప్లాంట్లను ప్రారంభించింది. 1973 సంవత్సరంలో దేశంలో నైలాన్ ట్రావెల్ కారును వాణిజ్యపరంగా తయారు చేసి మార్కెట్ చేసిన తొలి కంపెనీగా అవతరించింది. అలా 1979 నాటికి కంపెనీ పేరు కంపెనీ పేరు విదేశాలకు ఎగబాకింది. ఆ తరువాత అమెరికన్ కంపెనీ మాన్స్ఫీల్డ్ సంస్థలో తన వాటాను విక్రయించడంతో ఎంఆర్ఎఫ్ లిమిటెడ్గా మారింది. ఇండియన్ రోడ్లకు సరిపోయే టైర్లు తయారు అంతా బాగానే ఉంది కానీ మాన్స్ఫీల్డ్ టెక్నాలజీ భారతీయ రహదారి పరిస్థితులకు తగినది కాదని మామెన్ గ్రహించాడు. మరోవైపు డన్లప్, ఫైర్స్టోన్,గుడ్ఇయర్ వంటి బహుళజాతి కంపెనీల ఆధిపత్యంతో నిలదొక్కుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సొంతంగా,భారతీయ రోడ్లకు అనుగుణం టైర్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టిన మామెన్ ప్రభుత్వ సాయంతో 1963లో తిరువొత్తియూర్లోని రబ్బరు పరిశోధనా కేంద్రం తిరువొత్తియూర్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. మార్కెటింగ్పై దృష్టి, ఐకానిక్ మజిల్మేన్ ఆవిష్కారం అంతేకాదు మార్కెటింగ్పై దృష్టి పెట్టారు. అనేక పరిశోధనల తర్వాత, ధృఢమైన మన్నికైన టైర్లకు ప్రతిరూపంగా అలిక్ పదమ్సీ ఐకానిక్ పవర్ఫుల్ ఎంఆర్ఎఫ్ మజిల్ మేన్ చిత్రం వచ్చింది. భారతీయ ప్రకటనల ముఖచిత్రాన్ని మార్చివేసి 1964లో మజిల్మేన్ జనాన్ని విపరీతంగా ఆకర్షించింది. టీవీ వాణిజ్య ప్రకటనలు, బిల్బోర్డ్లలో ఇలా ఎక్కడ చూసినా ఈ పిక్ దర్శనమిచ్చింది. వివిధ ట్రక్ డ్రైవర్ల సర్వే చేసి మరీ పదంశీ దీన్ని రూపొందించారు. అందుఆయనను రాక్స్టార్ లేదా గాడ్ ఆఫ్ మార్కెటింగ్ అని పిలుస్తారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతినార్జించింది ఎంఆర్ఎఫ్. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా మొదలు విరాట్ కోహ్లీ వరకు పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్గా మారారు. 80 ఏళ్ల వయసులో 2003లో మాప్పిళ్ళై కన్నుమూశారు. అనంతరం అతని కుమారులు వ్యాపారాన్ని చేపట్టారు. 1992లో మాప్పిళ్లై పరిశ్రమకు చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డును అందుకున్నారు . అతని సోదరులు, KM చెరియన్, KM ఫిలిప్ , KM మాథ్యూ మేనల్లుడు మామెన్ మాథ్యూ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతలే. పెద్ద సోదరుడు కెఎమ్ చెరియన్ కూడా పద్మభూషణ్ గ్రహీతలు కావడం విశేషం. ఈ ఏడాది కంపెనీ ఆదాయం రూ. 23,261.17 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఇది రూ. 19,633.71 కోట్లుగా ఉంది. కంపెనీ నికర లాభం రూ.768.96 కోట్లు నమోదైంది. ఎంఆర్ఎఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.42,000 కోట్లు. -
స్టార్ హెల్త్ ఫౌండర్ జగన్నాథన్ రాజీనామా
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటసామి జగన్నాథన్ కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు రాజీనామా చేశారు. జగన్నాథన్ కంపెనీ బోర్డు నుంచి తక్షణమే వైదొలుగుతూ తన రాజీనామాను సమర్పించారని స్టార్ హెల్త్ జూన్ 10న రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. 79 ఏళ్ల జగన్నాథన్ నెల రోజుల కిందటే కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఆనంద్ రాయ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కాగా జూన్ 10న కంపెనీ బోర్డుకు రాజీనామా చేసే వరకు జగన్నాథన్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్సూరెన్స్ పరిశ్రమలో విశేష అనుభవం ఇన్సూరెన్స్ పరిశ్రమలో జగన్నాథన్కు విశేష అనుభవముంది. ఆయన నాయకత్వంలో స్టార్ హెల్త్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 619 కోట్ల లాభాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 1,041 కోట్ల నష్టాన్ని చవిచూసిన కంపెనీకి ఆయన తర్వాత సంవత్సరంలో ఏకంగా రూ. 619 కోట్ల లాభాన్ని ఆర్జించిపెట్టారు. స్టార్ హెల్త్ని ప్రారంభించే ముందు జగన్నాథన్ ప్రభుత్వ రంగ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లో పని చేశారు. 2001లో నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థకు ఆయన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 2004 నాటికి ఆటుపోట్లను తిప్పికొట్టి రూ. 450 కోట్ల లాభాన్ని సాధించగలిగారు. 2006లో జగన్నాథన్ స్థాపించిన స్టార్ హెల్త్ దేశంలోని ప్రముఖ స్టాండ్-అలోన్ మెడికల్ ఇన్సూరెన్స్లో ఒకటిగా అవతరించింది. -
వయసు 60, డీల్ చేసే వ్యాపారాలు 100, అట్లుంటది హైదరాబాదీ అంటే!
Kalaari Capital founder Vani Kola: భారతదేశంలో బిజినెస్ చేస్తూ గొప్ప సక్సెస్ సాధించిన అతి తక్కువ మందిలో 'వాణి కోలా' (Vani Kola) ఒకరు. అమెరికాలో చదివి, అక్కడే అనే సంవత్సరాలు విజయవంతమైన కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత ఇండియా వచ్చి ఇప్పుడు 100 వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్న 'వాణి కోలా' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్లో జన్మించిన వాణి 16 సంవత్సరాల వయస్సులో పోస్ట్-సెకండరీ విద్య, ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదవడానికి 1980 చివరలో అమెరికా వెళ్ళింది. యునైటెడ్ స్టేట్స్లోని అరిజోనా స్టేట్ యూనివర్శిటీ మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. నిజానికి వాణి కోలా సిలికాన్ వ్యాలీలో 22 ఏళ్ల విజయవంతమైన కెరీర్ తర్వాత వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించేందుకు 2006లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత 'వెంచర్ కాపిటల్'లో వివిధ కంపెనీల భాగస్వామ్యంతో 'కలారి కాపిటల్' అనే సంస్థను స్థాపించింది. (ఇదీ చదవండి: యాపిల్ కంపెనీ కొత్త ఉత్పత్తులు - విజన్ ప్రో, మాక్బుక్, ఐఓఎస్ 17 ఇంకా..) కలారి కాపిటల్ 2012లో 150 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైంది. అయితే ఆ తరువాత వాణి అధ్యక్షతన కేవలం నాలుగు సంవత్సరాల్లోనే.. అంటే 2017 నాటికి సంస్థ ఆదాయం 650 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ కామర్స్, మొబైల్ సర్వీసులు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో పెట్టుబడులకు నాయకత్వం వహించింది. ఆ తరువాత డ్రీమ్11, ర్బన్ లాడర్తో సహా అనేక వ్యాపారాలలో పెట్టుబడి పెట్టింది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?) వీటితో పాటు ఎంప్రోస్ అండ్ కంట్రోల్ డేటా కార్పొరేషన్ వంటి సంస్థలతో సాంకేతిక రంగంలో పనిచేయడం ప్రారంభించింది. ఈ రంగంలో సుమారు 12 సంవత్సరాల తరువాత రైట్వర్క్స్ను స్థాపించింది. నాలుగు సంవత్సరాలు సెర్టస్ సాఫ్ట్వేర్ సీఈఓగా కూడా ఉన్నారు. వాణి కోలా కేవలం వ్యాపారవేత్తగ మాత్రమే కాకుండా, ఆసక్తిగల పాఠకురాలు కూడా. ఈ కారణంగానే ఆమె ఆలోచనలను వ్రాయడం & పంచుకోవడం వంటివి చేసేదని చెబుతారు. -
రూ. 1000 కోట్ల సామ్రాజ్యం సృష్టించిన పేదవాడి సక్సెస్ స్టోరీ..!!
ఇది వరకు మనం చాలా సక్సెస్ స్టోరీలను గురించి తెలుసుకున్నాము. ఇందులో కొంత మంది డబ్బున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి సక్సెస్ కొట్టిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు పేదరికం నుంచి వచ్చి రూ. 1000 కోట్లు సామ్రాజ్యం సృష్టించిన 'విజయ్ సుబ్రమణియమ్' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు 'రాయల్ ఓక్' (Royal Oak) ఫర్నిచర్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు, కానీ దాన్ని స్థాపించిన విజయ్ గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే సుమారు ఇరవై సంవత్సరాలు కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఒక ప్రభుత్వ కళాశాలలో బీకామ్ చేశారు. కుటుంబాన్ని పోషిచే ఒకే వ్యక్తి విజయ్ కావడంతో మాస్టర్ డిగ్రీ చేయలేకపోయాడు. బీకామ్ పూర్తయిన తరువాత సింగపూర్లో ఉద్యోగం ఇప్పిస్తానని వారి బంధులలోనే ఒకరు తనని మోసం చేసారని ఒక సందర్భంలో వెల్లడించారు. ఆ తరువాత కేరళలోని మున్నార్కు వెళ్లి అక్కడ క్రెడిట్ కార్డు ఏజెంట్గా పని చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత 1997లో చెన్నై వెళ్లి ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం ప్రారంభించి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 10 రోజులలో రూ.2800 విలువైన వస్తువులను విక్రయించగలిగాడు. (ఇదీ చదవండి: బిర్యాని అమ్ముతూ రూ. 10 కోట్లు టర్నోవర్.. బెంగళూరు యువతి సక్సెస్ స్టోరీ!) విజయ్ సుబ్రమణియమ్ 2001లో బెంగళూరులోని సఫీనా ప్లాజాలో స్టాల్ ప్రారంభించడం ఆయన జీవితానికి పెద్ద మలుపుగా మారింది. ఆ తరువాత బిగ్ బజార్ తమ అవుట్లెట్లో స్టోర్ను ఏర్పాటు చేయమని కోరింది. ఆ తరువాత కారు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. (ఇదీ చదవండి: రోజుకి రూ. 1.6 లక్షల సంపాదిస్తున్న 34 ఏళ్ల యువతి.. ఈమె చేసే పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!) విజయ్ సుబ్రమణియమ్ 2004లో మొదటి షాప్ ఓపెన్ చేసాడు. 2005 నాటికి చైనీస్ ఫర్నిచర్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. 2010 నాటికి మరొక షాప్ ఏర్పాటు చేసాడు. ఇదే రాయల్ ఓక్ ప్రారంభానికి నాంది పలికింది. ప్రస్తుతం ఈ సంస్థ కింద 150 స్టోర్లు ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 280 కర్మాగారాల నుంచి తాను ఉత్పత్తులను పొందుతున్నట్లు తెలిపాడు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో మరో 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎదగాలనే సంకల్పం ఉన్న వాడికి విజయం దాసోహమవుతుందని చెప్పడానికి ఇదో చక్కని నిదర్శనం. -
పాతవి అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు
-
కేన్స్లో గర్ల్ఫ్రెండ్తో బెజోస్ గ్రాండ్ ఎంట్రీ.. వారు వచ్చిన బోట్ ఖరీదు తెలుసా?
బిలియనీర్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కేన్స్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్తో కలిసి బెజోస్ 500 మిలియన్ డాలర్ల (రూ.4 వేల కోట్లకుపైనే) విలువైన సూపర్యాచ్ (బోట్)లో ఫ్రాన్స్కు దక్షిణాన ఉన్న కేన్స్కు చేరుకున్నారని పేజ్ సిక్స్ అనే ఆన్లైన్ మ్యాగజైన్ నివేదించింది. ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం గ్లోబల్ సెలబ్రిటీలు ఈ రిసార్ట్ టౌన్కి చేరుకుంటున్నారు. కోరు అనే పేరుతో ఉన్న ఈ లగ్జరీ బోట్ను ప్రపంచంలోనే అతిపెద్ద సెయిలింగ్ యాచ్గా చెబుతారు. దీని తయారీని 2018లో ప్రారంభించగా ఐదు సంవత్సరాల తర్వాత ఇటీవలే పూర్తి చేశారు. గత ఏప్రిల్లోనే ఇది తన తొలి సముద్రయానం చేసింది. సూపర్యాచ్ ముందు భాగంలో లారెన్ శాంచెజ్ను పోలి ఉండే మత్స్యకన్య బొమ్మ ఉన్నట్లు ఆ మ్యాగజైన్ పేర్కొంది. ఈ సూపర్యాచ్ నిర్వహణ కోసం జెఫ్ బెజోస్కు సంవత్సరానికి 25 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని తెలిసింది. బెజోస్ కోరుతో పాటు తన మరో బోట్ అబియోనాను కూడా కేన్స్కు తీసుకువచ్చారు. కేన్స్లోని డు క్యాప్ ఈడెన్ రోక్ హోటల్లో జరిగిన మ్యాగజైన్ పార్టీలో అలాగే హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఇచ్చిన ప్రైవేట్ మాన్షన్ పార్టీలో బెజోస్ ఆయన గర్ల్ఫ్రెండ్ శాంచెజ్ కనిపించారు. ఇదీ చదవండి: Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అమన్ గుప్తా.. రెడ్ కార్పెట్పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్త! -
చదివింది బీటెక్.. చేసేది బట్టల వ్యాపారం.. రూ. కోట్లలో టర్నోవర్
AKS Co-Founder and CEO Nidhi Yadav: జీవితంలో ఎదగాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరం. చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. పది మందికి ఉద్యోగం కల్పించే పని ఏదైనా చేయవచ్చు. ఇలా ఆలోచించే వారి సంఖ్య గతంలో తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం పెరుగుతూనే ఉంది. ఈ కోవకు చెందినవారిలో ఒకరు 'నిధి యాదవ్' (Nidhi Yadav). ఇంతకీ నిధి యాదవ్ ఎవరు? ఆమె చేస్తున్న బిజినెస్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. కరణ్ సింగ్ యాదవ్ & రాజ్బాల యాదవ్లకు జన్మించిన నిధి యాదవ్ 2004లో ఇండోర్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తరువాత ఇండోర్లోని జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో బిటెక్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత కంప్యూటర్ ఇంజనీర్ ఉద్యోగానికి డెలాయిట్లో జాయిన్ అయ్యింది. అయితే ఆమెకు ఉద్యోగం చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. కాబట్టి సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో ఫ్లోరెన్స్లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్లో ఒక సంవత్సరం కోర్సును పూర్తి చేసింది. ఇది పూర్తయిన తరువాత ఇటలీలో ఉద్యోగం వచ్చినా కుటుంబానికి దూరంగా ఉండలేక అది కూడా వద్దనుకుంది. సొంత కంపెనీ ప్రారంభం.. ఆ తరువాత 2014లో రూ. 3.5 లక్షల పెట్టుబడితో AKS పేరుతో కంపెనీ ప్రారంభించింది. ఇందులో సరసమైన ధరలకే అద్భుతమైన దుస్తులను 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వారికి విక్రయించడం ప్రారభించింది. కంపెనీ స్థాపించడానికి కొంత సమయం పట్టినప్పటికీ కేవలం ఐదు సంవత్సరాల్లో టర్నోవర్ రూ. 100 కోట్లు (2019-2020 ఆర్థిక సంవత్సరం) దాటింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) నిజానికి ఆమె కంపెనీ ప్రారంభించాలనే ఆలోచనను తన కుటుంబంతో చెప్పినప్పుడు ఒక్క సారిగా ఆశ్చర్యపోయినప్పటికీ తరువాత మద్దతుగా నిలిచారు. కంపెనీ ప్రారంభించాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్న దాదాపు అన్ని బ్రాండ్స్ గురించి ఏకంగా ఆరు నెలలు పరిశోధన చేసింది. సంస్థ మొదలైన మొదటి సంవత్సరమే ఆమె రూ. 1.60 కోట్లు సంపాదించింది. ఆ తరువాత ఏడాదికి అది రూ. 8.50 కోట్లకు చేరింది. 2018 నాటికి కంపెనీ ఆదాయం ఏకంగా 48 కోట్లకు చేరడం విశేషం. (ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!) నిధి యాదవ్ AKS కంపెనీ ప్రధాన కార్యాలయం గుర్గావ్లో ఉంది. 2021 చివరినాటికి సంస్థ ఆదాయం రూ. 200 కోట్లకు చేరినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. కరోనా సమయంలో కంపెనీ కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, అలాగే అవకాశాలు కూడా ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే మాస్క్లు, పిపిఈ కిట్ల తయారీని మొదలుపెట్టారు. ఆ తరువాత పిల్లలకు కూడా దుస్తులు తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. 2023-2024 నాటికి కంపెనీ టర్నోవర్ రూ. 500 కోట్లకు పెంచాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. -
లక్షతో కంపెనీ ప్రారంభించి, రూ. 50 కోట్ల సంస్థగా.. 27ఏళ్ల యువతి సాహసమిది!
'చదువుకున్న వెంటనే ఏదో ఒక ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి, స్థిరపడాలి' ఇది చదువుకున్న చాలా మంది ఆలోచన. అయితే చదువు కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు అద్భుతాలు సృష్టించడానికని కొంత మంది నిరూపిస్తున్నారు. ఆలాంటి వ్యక్తిత్వం ఉన్న వారిలో ఒకరు 'అరుషి అగర్వాల్'. ఇంతకీ అరుషి అగర్వాల్ ఎవరు? ఈ సాధించిన ఆ అద్భుతం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఘజియాబాద్లోని నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి, యువ పారిశ్రామిక వేత్తగా.. కేవలం మూడు సంవత్సరాల్లో రూ. 50 కోట్ల కంపెనీ నిర్మించేలా చేసింది. ఇది నిజంగానే గొప్ప అద్భుతం అనే చెప్పాలి. కేవలం మూడేళ్ళలో ఒక అమ్మాయి అనుకున్నది సాధించి సక్సెస్ సాధించింది. నిజానికి అరుషి అగర్వాల్ స్వస్థలం మొరాదాబాద్. ఈమె జెపి ఇన్స్టిట్యూట్ నుంచి బి-టెక్ అండ్ ఎమ్-టెక్ పూర్తి చేసింది. ఆ తరువాత ఢిల్లీ ఐఐటీలో ఇంటర్న్షిప్ చేసింది. ఈ సమయంలోనే రెండు సార్లు కోటి రూపాయల భారీ జీతం ఆఫర్ పొందింది. అయితే ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించింది. భారీ శాలరీ ప్యాకేజి వద్దనుకుని తానే సొంతంగా కంపెనీ ప్రారంభించాలని TalentDecrypt అనే సంస్థను ప్రారంభించింది. దీని కోసం కోడింగ్ నేర్చుకుంది. అంతే కాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్ పొందని వారికి సహాయం చేయడానికి సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. మొత్తానికి అనుకున్న విధంగానే రూ. లక్ష పెట్టుబడితో కంపెనీ మొదలుపెట్టింది. (ఇదీ చదవండి: టీ షర్ట్ రూ. 2 లక్షలు, మొబైల్ కవర్ రూ. 25వేలు.. అన్ని బ్రాండెడ్ వస్తువులే!) కంపెనీ ప్రారంభించిన కేవలం మూడు సంవత్సరాల్లో ఆమె సాఫ్ట్వేర్ సహాయంతో 10 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. అంతే కాకూండా వారు యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, సింగపూర్, యుఎఇ, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్లోని 380 కంపెనీలకు సహాయం చేశారు. ఈ సాఫ్ట్వేర్ కింద, ఉద్యోగం పొందాలనుకునే వారు హ్యాకథాన్ (Hackathon) ద్వారా వర్చువల్ స్కిల్ టెస్ట్ చేస్తారు. దీని తరువాత నేరుగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలలో హాజరు కావచ్చు. (ఇదీ చదవండి: టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్లో రానుందా? ఇదిగో సాక్ష్యం..!) ఈ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఉద్యోగం పొందటానికి వీలు కల్పిస్తుంది. అరుషి అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఒకరిగా భారత ప్రభుత్వంచే పురస్కారం పొందింది. ఆమె తన తాత 'ఓం ప్రకాష్ గుప్తా'ను తన ఆరాధ్యదైవంగా భావిస్తుంది. ఆమె తండ్రి అజయ్ గుప్తా వ్యాపారవేత్త, ఆమె తల్లి గృహిణి. ప్రస్తుతం ఆమె నోయిడా కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement