garden
-
వర్టికల్ టవర్ గార్డెన్ను ఇలా మీరే తయారు చేసుకోవచ్చు!
వర్టికల్ టవర్ గార్డెన్ ఇంటిపంటల సాగుదారులకు చాలా ఉపయోగకరం. మేడ మీద లేదా బాల్కనీలో, ఇంటి పెరట్లో అతి తక్కువ స్థలంలో (కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బారెల్లో 60 రకాల ఆకుకూరలు, కూరగాయలు, కషాయాల కోసం ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు. బారెల్ మధ్యలో ఉండే పీవీసీ పైపులో వంటింటి వ్యర్థాలు వేస్తూ.. వర్మీ కం΄ోస్టును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టవర్ గార్డెన్లను సేంద్రియ ఇంటిపంటలపై ఆసక్తి, ఓపిక ఉన్న వారు తమంతట తాము తయారు చేసు కోవచ్చు. అదెలాగో హైదరాబాద్కు చెందిన వర్టికల్ టవర్ గార్డెన్ నిపుణులు రవి చంద్ర కుమార్ వివరిస్తున్నారు. మార్కెట్లో దొరికే 300 లీటర్ల లేదా 250 లీటర్ల హెచ్.డి.పి.ఇ. బారెల్ తీసుకోవాలి. బారెల్ పొడవు 36 అంగుళాలు. బారెల్కు చుట్టూతా 5 అంగుళాలకు ఒక చోట కత్తిరిస్తే (దీన్నే పాకెట్ అని పిలుస్తున్నాం).. 7 వరుసల్లో పాక్లెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్డంగా ఒక్కొక్క పాకెట్ వెడల్పు 5 అంగుళాలు ఉండేలా కొలత స్కేల్తో మార్క్ చేసుకోవాలి. రెండు పాకెట్ల మధ్య 4 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక వరుసలో 8 పాకెట్ వస్తాయి. 7 వరుసల్లో మొత్తం 56 పాకెట్లు వస్తాయి. బారెల్ పై భాగాన 4 మొక్కలు పెట్టవచ్చు. అన్నీ కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. అంటే ఒక బారెల్ 60 కుండీలతో సమానం అన్నమాట! పాకెట్ ఎక్కడ పెట్టుకోవాలో మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన చోట బారెల్ను డ్రిల్ మెషిన్తో కత్తిరించి చిల్లు పెట్టాలి, జిగ్సా రంపం పట్టడం కోసం. జిగ్సా తో వరుసలల్లో మార్క్ చేసిన చోట్ల 5 అంగుళాల వెడల్పున కట్ చేయాలి. పాకెట్ మౌల్డింగ్ చేసే విధానం.. హీట్ గన్తో కట్ చేసిన ప్రదేశంలో హీట్ చేయాలి. తగిన హీట్ అయిన తరువాత ఆ ప్రదేశంలో చిత్రంలో చూపిన విధంగా సిమెంటు దిమ్మె అమర్చాలి. అలా అన్నిపాకెట్ ను తయారు చేయాలి. బారెల్ అడుగు భాగంలో మధ్యన 4 అంగుళాల రంధ్రం చేయాలి. పక్కన అర అంగుళం రంధ్రం చేయాలి. అధిక నీరు బయటకు వెళ్లడానికి అక్కడ గ్రోమేట్ పెటి టేకాహ్ అమర్చాలి. మధ్యలో 4 అంగుళాల పీవీసీ గొట్టం అమర్చాలి. గొట్టం చుట్టూ చిల్లులు పెట్టాలి. ఇదీ చదవండి: గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలుగొట్టం అమర్చే విధానం.. ఆ గొట్టాన్ని క్రింది భాగాన 6 అంగుళాలు బయటకు ఉండేలా అమర్చి.. అక్కడ ఎంసీల్తో అతకాలి. పై భాగాన జీయే వైరుతో కట్టాలి. 4 అంగుళాల గొట్టానికి పైన, కింద మూతలు అమర్చాలి. ఈ బారెల్ను నిలబెట్టడానికి ఇనుప స్టాండ్ను తయారు చేసుకోవాలి. స్టాండ్ 18 అంగుళాల పొడవు, 18 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తు ఉండాలి.వర్టికల్ గార్డెన్లో కంపోస్టు తయారు చేసే విధానం : వర్మీ కం΄ోస్టు 30%, రంపపు పొట్టు 30%, పశువుల ఎరువు 30%, వేప గింజల చెక్క 10%.. ఇవన్నీ కలిపి బారెల్లో సరిపడినంత నింపుకోవాలి. బారెల్ మధ్యలో అమర్చిన గొట్టంలో వంటింటి వ్యర్థాలు వేయాలి. అందులో చక్కటి వర్మీకంపోస్టు తయారవుతుంది. స్టాండ్ మీద వర్టికల్ గార్డెన్ను అమర్చుకున్న తర్వాత.. అందులో కం΄ోస్టు మిశ్రమాన్ని నింపుకోవాలి. బారెల్ చుట్టూ ఉన్న అరలలో విత్తనాలు నాటుకోవాలి. ఒక్కో వర్టికల్ గార్డెన్ టవర్ను తయారు చేసుకోవడానికి (బారెల్, స్టాండ్, టవర్, కం΄ోస్టు, విత్తనాలు.. అన్నీ కలిపి) రూ. 5 వేలు ఖర్చవుతుంది. వర్టికల్ టవర్కు రోజుకు కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. ఇందులో అన్ని రకాల ఆకుకూరలు, ఔషధ మొక్కలు చక్కగా పండించవచ్చని రవిచంద్ర కుమార్ తెలిపారు. -
మొక్కలు చీడపీడల్లేకుండా, పచ్చగా ఉండాలంటే, ఇవిగో చిట్కాలు!
పచ్చదనం అంటే.. ఎక్కడో పార్క్లకో, అడవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. మన పెరట్లో నాలుగు మందార, గులాబీ,చేమంతి మొక్కలో ఉంటే సరిపోతుంది. ఇంటి ముందు గుబురుగా పెరిగిన తులసి మొక్క చాలు మనసు ప్రశాంతంగా ఉండటానికి. చిన్న చిన్న మొక్కలతో ఇల్లు అందంగా కనిపించడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.అయితే మనకున్నచిన్న బాల్కనీలో, పెరట్లో మొక్కల్ని పెంచడం అంత ఈజీ కాదు సాధారణంగా మొక్కలను ఇష్టపడేవారు బయటి నుంచి మొక్కలు తెచ్చి తమ తోటల్లో లేదా ఇళ్లలోని కుండీల్లో నాటుతారు. మొక్కలకు సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వాడిపోతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఎండిపోతాయి. సరైనపోషణతో కీటకాల బెడద లేకుండాపచ్చగా ఎదగాలంటే ఏం చేయాలి?మొక్కలు జాగ్రత్తగా పరిశీలించకపోయినా,పోషణ అందకపోయినా, నీళ్లు ఎక్కువైనా చని పోతాయి. పురుగులు కీటకాలు మొక్కలను మాత్రమే కాకుండా కుండలోని మట్టిని కూడా దెబ్బతీస్తాయి. జాగ్రత్తలు, చిట్కాలుదెబ్బతిన్న, చనిపోయిన ఆకులని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. దీని వల్ల చెట్లు చక్కగా పెరుగుతుంది. కాబట్టి, వీటిని కత్తెరతో కత్తిరించడం మంచిది.మొక్కలకి నీళ్ళతో పాటు సరైన కాంతి అవసరం. మరీ ఎండలో కాకుండా సమానమైన ఎండ తగిలేలా చూసుకోవాలి. అలా అని చీకటికూడా మంచిది కాదు. కాస్తంత వెలుతురు కావాలి.మొక్కలకి ఇంట్లోనే తయారు చేసుకున్న అనేక ఎరువులు ఇస్తూ ఉండాలి. పుల్లటి మజ్జిగ ద్రావణం, బనానా పీల్ ఫెర్టిలైజర్, పంచగవ్య, ఎండిన పశువుల ఎరువు, వేపనూనె, వేపగింజలు, ఆకుల కషాయం లాంటివి మొక్క, కుండా సైజును బట్టి ఇవ్వాలి.పుల్ల మజ్జిగ ద్రావణంగ్లాసు పుల్లటి మజ్జిగలో ఐదు గ్లాసులు నీళ్లుపోసి కలపాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్లో పోసి మొక్కలపై చల్లాలి. ఉదయం సాయంత్రం ఒకసారి ఈ నీటిని మొక్కలు పోయడం వల్ల చీడపీడలు పోయి మొక్కలు చక్కగా పెరుగుతాయి.పచ్చి బఠానీతో పచ్చగా... పచ్చి బఠాణి మనకు ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. అయితే బఠాణి పిక్కలు తీసి తొక్కలను పారేస్తుంటాము. కానీ ఈ తొక్కలు మొక్కలకు చక్కని పోషకాలు అందిస్తాయి. అందుకే తొక్కలను మిక్సీజార్లో వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టులో కాసిని నీళ్లు ΄ పోసి వడగట్టాలి. ఈ నీటిని గార్డెన్లోని మొక్కలకు పోషకాలు ఈ నీరు మంచి బలవర్థకమైన టానిక్లా పనిచేసి మొక్కలు చక్కగా పెరిగేందుకు దోహదపడతాయి.తెగుళ్లు, నివారణమొక్కలు సాధారణంగా పురుగులు,తెగుళ్లు నుంచి ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకోవాలి. తెల్ల నల్లి, గొంగళి లాంటి వాటిని చేతితో తీసేయవచ్చు. పసుపు, ఉప్పు, ఇంగువ నీళ్లు చల్లినా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కనీసం రెండు రోజులకు ఒకసారైనా మొక్కల్ని పరికించి చూడాలి. లేదంటే గొంగళిపురుగులు, ఆకుతొలిచే పురుగులు ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. మట్టిలో తేమ కారణంగా, కొన్నిసార్లు చిన్న నత్తలు లేదా పాకే పురుగులు మొక్కలను పూర్తిగా నాశనం చేస్తాయి. వీటికి పొడి గుడ్డు పెంకు పొడి బాగా ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకులను పూర్తిగా శుభ్రం చేసి, పొడి చేసి మట్టిలో కలపాలి.పువ్వులపై మైనంలాగా కనిపించే తెల్లటి మీలీ బగ్స్ (మందార, గులాబీ మొక్కలపై) వాటిని వదిలించుకోవడానికి, ఒక లీటరు నీటిలో చిటికెడు బేకింగ్ సోడా, 1 టీస్పూన్ షాంపూ, 2-3 చుక్కల వేపనూనె కలిపి మొక్కలపై చల్లుకోవాలి. టొమాటో, బెండకాయ, బీన్స్, ఓక్రా మొదలైన కొన్ని కూరగాయలపై కూడా ముందుగానే చల్లుకోవాలి. దాల్చిన చెక్క పొడికూడా బాగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్కు మించి బ్యాక్టీరియా -
ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా?
చిన్న చిన్న ఎడ్లబండ్లు వాటిలో గ్రామీణ మహిళల బొమ్మలు, చెక్క కుర్చీలు వాటి ముందు చిట్టి చిట్టి బొమ్మలు, హంసలు, పక్షులు, గూళ్లు, గుడిసెలు.. ఇలా ముచ్చటైన వస్తువుల కూర్పుతో ట్రే గార్డెన్ను ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపాటి స్థలంలో కూడా వీటిని అందంగా అలంకరించవచ్చు.ఈ విషయాన్ని తన కళతో నిరూపిస్తోంది హర్యానాలోని ఫరీదాబాద్ వాసి యాభై ఐదేళ్ల శారదా గోదారా. తోటలు, పార్కులను పోలిన మినియేచర్ ట్రే గార్డెన్స్ను రూపొందిస్తోందామె. నడివయసులో ఒంటరితనం పోగొట్టుకోవడానికి చేసిన ఆలోచన ఆమెను ఇలా అందమైన లోకంలో విహరించేలా చేసింది. తన ఇంటిలో వెయ్యి మొక్కలతో మినీ జంగిల్ను క్రియేట్ చేసింది.‘మా ఇంటి బయట, మెట్లు, బాల్కనీలు, పెరడు వరకు రకరకాల అందమైన మొక్కలతో నింపేశా. ఆ తర్వాత చిన్న ట్రే గార్డెన్ల తయారీని మొదలుపెట్టాను. అభిరుచి ఉంటే చాలు ఒంటరితనానికి ఎదర్కోవడానికి, ఇంటిని అందంగా అలంకరించడానికి ఇదొక మంచి మార్గం. ఒక గంటలోపు ఒక మినీ ట్రే గార్డెన్ను రూపొందించుకోవచ్చు. రంగు రంగుల గులకరాళ్లు, చిట్టి పొట్టి మొక్కలు, చిన్న చిన్న మెట్లు, గుడిసెలు.. ఇతర అలంకరణ వస్తువులతో తయారైన ఈ మినీ ట్రే గార్డెన్లను చూస్తుంటే ఎంతో ఆనందంగా కలుగుతుంది’ అని తన గార్డెన్ పెంపకం విషయాలను ఆనందంగా చెబుతుందామె.ట్రే గార్డెన్ని మీరూ ఇలా సృష్టించుకోవచ్చు...ముందుగా గార్డెన్ థీమ్ను దృష్టిలో ఉంచుకొని, కాగితం మీద స్కెచ్ వేసుకోవాలి. పరిమాణం, ఆకారం, మట్టి, ఇతర అలంకార వస్తువులను బట్టి తగిన సిరామిక్ ట్రేని ఎంచుకోవాలి.గార్డెన్కు బేస్ను సృష్టించడానికి పాటింగ్ మిక్స్తో ట్రేని నింపాలి. సారవంతమైన మట్టిలో 15 శాతం ఆవుపేడ, 15 శాతం కోకోపిట్ కలపాలి.వీటిలో స్నేక్ప్లాంట్, స్పైడర్ వంటి చిన్న చిన్న మరుగుజ్జు మొక్కలను నాటాలి. పైనుంచి మట్టిని గట్టిగా నొక్కి, నీళ్లు పోయాలి. తర్వాత రంగు రంగుల గులకరాళ్లు, గంటలు, బొమ్మలు వంటి అలంకరణ వస్తువులతో ట్రే తోటను అలంకరించాలి. స్ప్రే బాటిల్ను ఉపయోగించి ట్రేలోని మొక్కలకు నీళ్లు పోయాలి.ఫంగల్ దాడుల నుంచి మొక్కలను కాపాడుకోవడానికి అరటి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ తొక్కలు.. వంటి వంటగది వ్యర్థాలను ఉపయోగించి చేసే ద్రవ కంపోస్ట్ను పిచికారీ చేసుకోవచ్చు..ఇవి చదవండి: ఫోటోగ్రాఫర్..! -
తెరుచుకోనున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!
జమ్మూకశ్మీర్లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు. మార్చి 19 నుండి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివల్ జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఫ్లోరికల్చర్ అధికారి జావేద్ మసూద్ మాట్లాడుతూ మార్చి 23న ఈ గార్డెన్ను ప్రారంభించనున్నారని, ఇక్కడి పూలు అందరినీ తప్పక ఆకట్టుకుంటాయని అన్నారు. తులిప్ గార్డెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యానవనమని, కశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తున్నదని అన్నారు. ఈసారి జరిగే తులిప్ ఫెస్టివల్లో ఐదు కొత్త రకాల పూలను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 17 లక్షల తులిప్ పూలను చూడవచ్చన్నారు. కాగా ఈ గార్డెన్ను సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని, ఇందుకోసం విస్తృతమైన ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యపై మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని గార్డెన్ అధికారులు తెలిపారు. -
పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..!'
'మన జీవితంలో మనం ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు చూసుంటాం. ఎన్నో అద్భుతాలను చూసుంటాం. అవి మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి ఉంటాయి. కానీ ఇలాంటి పాతాళవనాన్ని కాదు కాదు, ఉద్యానవనాన్ని మీరెప్పుడైనా చూశారా! చూడాలంటే.. పాతాళంలోకి దిగాల్సిందే.., దిగాలంటే.. అమెరికాకు వెళ్లాల్సిందే..! ఆశ్చర్యం, అద్భుతం రెండూ కలిస్తేనే ఈ వనం. మరి అదేంటో కాస్త ముందే తెలుసుకుందామా..!' ఈ పాతాళవనం అమెరికాలో ఉంది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో ఉన్న ఈ ఉద్యానవనం వెనుక కొంత చరిత్ర ఉంది. ఇటలీలోని సిసిలీ నుంచి అమెరికాకు వలస వచ్చిన బాల్డసరె ఫారెస్టీరె ఫ్రెస్నోలో 1904లో పది ఎకరాల భూమి కొన్నాడు. ఇక్కడి మట్టి నిమ్మ, నారింజ వంటి పండ్లతోటల పెంపకానికి అనుకూలంగా లేకపోవడమే కాదు, ఇక్కడి వాతావరణం కూడా వేసవిలో విపరీతమైన వేడిగా ఉండేది. వేసవి తాపాన్ని తట్టుకునే విశ్రాంతి మందిరం కోసం బాల్డసరె ఈ భూమిలో ఇరవైమూడు అడుగుల లోతున నేలమాళిగను తవ్వించాడు. నేలమాళిగలోనే గదులు గదులుగా నిర్మాణం చేపట్టి, లోపలకు గాలి వెలుతురు సోకేలా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ తవ్వకాన్ని విస్తరించి, చిన్న చిన్న మొక్కలతో ఉద్యానవనాన్ని పెంచాడు. గాలి వెలుతురు ధారాళంగా ఉండటంతో ఈ నేలమాళిగలో మొక్కలు ఏపుగా పెరిగాయి. బాల్డసరె 1946లో మరణించాడు. అమెరికా ప్రభుత్వం 1977లో దీనిని చారిత్రక ప్రదేశంగా గుర్తించింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నేలమాళిగలో పెరిగిన ఈ ఉద్యానవనం నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇవి చదవండి: చిపి చిపీ చాపా... డుబిడుబిడు -
మొక్కల సంరక్షణకు నెయ్యి ఉపయోగిస్తారని తెలుసా!
మాములుగా శరీరానికి తగు మోతాదులో నెయ్యి అవసరం. శరీరానికి కావాల్సిన మంచి కొలస్ట్రాల్ నెయ్యి అని కూడా నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇది జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచడమే గాక రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుతుంది. అలాంటి నెయ్యి మొక్కల సంరక్షణ కోసం వినియోగిస్తారని విన్నారా?. ఈ నెయ్యి వల్ల మొక్కల కుండీల్లో నేల సారవంతమై మొక్క ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే కాకుండా పురుగు, పుట్ర వంటివి దరిచేరనివ్వదని చెబుతున్నారు అగ్రికల్చర్ పరిశోధకులు. ఇంతకీ మొక్కలకు నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలా వినియోగించాలి వంటివి తెలుసుకుందామా!. ►నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నందున , దానిని పెరుగుతున్న నేలలో వేయడం వల్ల సేంద్రీయ కూర్పు పెరుగుతుంది . దీన్ని మెక్క పెరుగుతున్న భాగంలో వేసి ఆ తర్వాత నీళ్లు పోసి వృద్ధి చెందేలా చూడాలి. ► అఫిడ్స్ స్లగ్లు కాండం, ఆకులపై దాడి చేయకుండా ఈ నెయ్యి రక్షిస్తుంది. దాని కుండే మృదు స్వభావానికి అవి దాడి చేయడం కష్టమవుతుంది. అలాగే ఇబ్బందికరమైన తెగుళ్ల నుంచి రక్షించుకోవడానికి నెయ్యి గొప్ప ప్రత్యామ్నాయం. ► దూదిపై 3-4 చుక్కల కరిగించిన నెయ్యి వేసి, తెగులు సోకిన మొక్క కాండం,ఆకులను తుడిస్తే..అఫిడ్స్, స్లగ్స్ పైకి రావు. నెయ్యిలోని కొవ్వులు నేలకు ఉపయోగపడే సూక్ష్మజీవులకు ఆహార వనరును అందిస్తాయి. మొక్క పెరుగుతున్న నేలలో సేంద్రీయ పదార్థం సమృద్ధిగా ఉండేలా చేస్తుంది. దీంతో మొక్క బాగా పెరగడమే గాక పచ్చగా పెరగడానికి సహాయపడుతుంది. ►ఇలా ప్రతి రెండు నుంచి మూడు నెలలకు చొప్పున రెండు నుంచి మూడు టీస్పూన్ల నెయ్యిని వేస్తే చాలు మంచి ఫలితాలు ఉంటాయి. ►రబ్బరు మొక్క వంటి పెద్ద ఆకులు కలిగిన మొక్కలకు నెయ్యితో మంచి ప్రయోజనం ఉంటుంది. తడిగా ఉన్న కాటన్ వస్త్రాన్ని ఉపయోగించి వాటి ఆకులను శుభ్రం చేయండి. పూర్తయిన తర్వాత, ఒక దూదీలో 4 నుంచి 5 చుక్కల కరిగించిన నెయ్యి వేసి, ఆకులను తుడవండి. ఇది ఆకులను మెరిసేలా చేయడమే కాకుండా కొవ్వు పొరను కూడా జోడిస్తుంది. గమనిక: నెయ్యి అప్లై చేసిన తర్వాత ఎక్కువ ధూళిని ఆకర్షిస్తుంది కాబట్టి 3-4 రోజుల తర్వాత మళ్లీ ఆకులను తుడవడం మంచిది. ప్రత్యక్ష సూర్యకాంతికి గురయ్యే మొక్కలపై దీనిని ఉపయోగించవద్దు. (చదవండి: స్టవ్ వెలిగించకుండానే.. పండంటి వంటలు..) -
మిగిలిపోయిన అన్నం, కూరల్ని మొక్కలకు పడేయండి
అన్నం, కూరలు మిగిలిపోతే పడేస్తుంటారు. అయితే ఆ పడేసేదేదో మొక్కల దగ్గర పడేస్తే వాటికి కావాల్సిన పోషకాలు అంది, అవి ఏపుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ►మిగిలిపోయిన పప్పులో నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఈ పప్పు నీళ్లను మొక్కలకు పోయాలి. మజ్జిగ మరీ పుల్లగా అయితే తాగలేము. ఈ పుల్లటి మజ్జిగను బకెట్ నీళ్లల్లో పోసి కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. ► మిగిలిపోయిన అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు కడిగిన నీటిని సింక్లో పోయకుండా మొక్కలకు పోస్తే మంచిది. ► ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలను పడేయకుండా నీటిలో నానబెట్టాలి. పదిగంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోయాలి. ఈ నీటి నుంచి నైట్రోజన్, పొటాషియం, ఫాస్పరస్లు మొక్కలకు పుష్కలంగా అందుతాయి. చూశారుగా... మిగిలిపోయినవి మొక్కలకు ఎంత మేలు చేస్తున్నాయో. ఇంకెందుకు ఆలస్యం మీ గార్డెన్ మరింత పచ్చగా కళకళలాడించేందుకు ప్రయత్నించండి. -
అగ్గిపుల్లతో ఇలా చేస్తే..మొక్కలు పూలతో కళకళలాడతాయి!
గార్డెన్లో ఎంతో ఇష్టంగా మొక్కలు పెంచుతుంటాము. సమయానికి నీళ్లుపోసి, మొక్కల ఎదుగుదలకోసం ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ కొన్ని మొక్కలు బలహీనంగా, వాడిపోయినట్టుగా ఉంటాయి. ఇలాంటి మొక్కలను పూలతో చక్కగా కళకళలాడేలా చేయాలంటే పాదులో అగ్గిపుల్లలు గుచ్చాలి. అవును అగ్గిపుల్లలే... అగ్గిపుల్లతో ఏం చేయాలంటే.. అగ్గిపుల్లలను యాంటీమోనీ సల్ఫైడ్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్ రసాయనాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలు మొక్కలకు క్రిమిసంహారాలుగా పనిచేస్తాయి. అంతేగాక ఇవి వేర్లకు బలాన్ని ఇస్తాయి. సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్లు మొక్కలు వేళ్లనుంచి చక్కగా పెరిగేందుకు దోహద పడతాయి. ముందుగా కుండిలోని మొక్క చుట్టూ కొన్ని నీళ్లుపోయాలి. ఇప్పుడు పది అగ్గిపుల్లలను రసాయనం ఉన్నవైపు మట్టిలోకి గుచ్చాలి. పుల్ల పుల్లకు కొద్దిగా దూరం ఉండేలా .. అగ్గిపుల్ల పూర్తిగా మట్టిలోకి చొచ్చుకుపోయేలా గుచ్చాలి. ఇలా నెలకు ఒక్కసారి మాత్రమే పుల్లలను గుచ్చాలి. గుచ్చిన పుల్లలను పదిహేను రోజుల తరువాత తీసేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కల పెరుగుదలకు కావాల్సిన పోషకాలు అగ్గపుల్లల నుంచి అంది, మొక్క బలంగా పెరిగి పూలూ, పండ్లను చక్కగా ఇస్తుంది. (చదవండి: విద్యా బాలన్ కళ్ల అందం సీక్రేట్ ఇదే! అది పెట్టకుండా గడప కూడా..) -
మొక్కలు పెంచాలనుకుంటే చాలు.. అపార్ట్మెంట్లో కూడా పెంచొచ్చు!
పట్టణాల్లోని చిన్న అపార్ట్మెంట్వాసుల నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మొక్కలు అంటే మాకు చాలా ఇష్టం. కాని స్థలం ఎక్కడిది?’ ‘స్థలం పెద్దగా అక్కర్లేదు. పెంచాలనే సంకల్పం ఉంటే చాలు’ అంటుంది బిహార్కు చెందిన కమల్సింగ్. ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో ఉంటున్న కమల్సింగ్ తన చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచుతుంది. ‘వంటగది వ్యర్థాలతో కంపోస్ట్ను ఎలా తయారుచేయాలి?’ అనే విషయం నుంచి ఏ మొక్కలను ఎలా పెంచాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వరకు... ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ ‘అర్బన్ హోమ్ వైబ్స్’కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘స్టార్ట్ వేర్ యూ ఆర్ విత్ వాటెవర్ యూ హ్యావ్’ అంటున్న కమల్సింగ్ స్ఫూర్తితో ఎంతో మంది పట్టణ వాసులు తమ బాల్కనీలో మొక్కల పెంపకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చి ‘మేము సైతం’ అంటున్నారు. (చదవండి: వెరైటీగా బనానా ఆమ్లెట్ ట్రై చేయండిలా!) -
చెన్నైలో ఆటో డ్రైవర్ సృజన.. అతని ఆటోనే ఓ మినీ గార్డెన్
అవడానికి అది ఓ చిన్న ఆటో మాత్రమే. కానీ అందులో ఏకంగా ఒక మినీ గార్డెన్నే సృష్టించాడతను. చెన్నైకి చెందిన కుబేందిరన్ అనే ఆటో డ్రైవర్ మది నుంచి పుట్టుకొచి్చన ఈ సృజనాత్మక ఆలోచన నెటిజన్ల మది దోచుకుంటోంది. ఇంటర్నెట్ నిండా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది... కుబేందిరన్. చెన్నైలోని దాదాపు లక్ష మంది ఆటో డ్రైవర్లలో ఒకడు. కానీ పర్యావరణం మీది ప్రేమ అతన్ని మిగతా వారికంటే ఎంతో ప్రత్యేకంగా నిలిపింది. దేశమంతటా అతని పేరు మారుమోగేలా చేసింది. రకరకాల మీనియేచర్ మొక్కలు తదితరాలతో ఆటోను కదిలే తోటగా తీర్చిదిద్దాడు. ముందు, వెనక సీట్ల మధ్య, వెనక వైపు, సీలింగ్ మీద మాత్రమే గాక సీలింగ్ లోపలి వైపు కూడా పచ్చని మొక్కలతో నింపి ఆకట్టుకుంటున్నాడు. ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ప్రయాణికులు మైమరచిపోతున్నారు. అందుకే ఇప్పుడు కుబేందిరన్ ఆటోను చెన్నైవాసులు ప్రయాణించే పార్కుగా అభివరి్ణస్తూ మురిసిపోతున్నారు. అందులో ప్రయాణించిన వాళ్లు ’గ్రీన్ ఆటో’, ’మూవింగ్ పార్క్’, ఇంకా రకరకాలుగా ప్రశంసిస్తున్నారు. ఇంత చక్కని ఆలోచన చేసినందుకు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు కూడా. మరెన్నో విశేషాలు: ఇది మాత్రమే కాదు, ఆటో ఎక్కే వారు చదువుకోవడం కోసం ఎన్నెన్నో స్ఫూర్తిదాయక పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచాడు కుబేందిరన్. అంతేగాక వారికి స్వచ్ఛమైన చల్లని మంచినీరు కూడా ఇస్తాడు. వీటికి తోడు చక్కని సూక్తులు, నినాదాలతో కూడిన బ్యానర్లు కూడా ఆటో నిండా కనువిందు చేస్తుంటాయి. వాటిని తరచూ మారుస్తూ మరింత ఆకట్టుకుంటాడతను. రోడ్డు భద్రత గురించి కూడా అందరికీ వీలైనంత వరకూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తనవంతు సామాజిక బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఆటోపై రూఫ్ గార్డెన్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి చెందిన మహేంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ కూడా ఇలాగే తన ఆటో రూఫ్ టాప్ మీద గార్డెన్ పెంచి వార్తల్లో నిలిచాడు. ఈ గార్డెన్ 2020 నుంచీ అందరినీ అలరిస్తోంది. కుమార్తో పాటు అతని ఆటో ఎక్కేవాళ్లు కూడా మండే ఢిల్లీ ఎండల్లో కూడా చక్కని చల్లదనం అనుభవిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. అతన్నీ, అతని ఆటో రూఫ్ టాప్నూ అంతా ఎప్పుడు చూసినా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు! – నేషనల్ డెస్క్, సాక్షి -
"ట్రావెలింగ్ పార్క్" డ్రైవర్ క్రియేటివిటీకి..నెటిజన్లు ఫిదా!
కొద్ది దూరంలోని గమ్యస్థానాలకు చేరడానికి వినియోగించే ఆటోల గురించి తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో ప్రయాణీకులను అట్రాక్ట్ చేసేలా ఆటోలను డెకరేట్ చేస్తున్నారు కూడా. అయితే ఈ డ్రైవర్ మాత్రం మరింత విభిన్నంగా ఆలోచించి మరీ వైరైటీగా తీర్చిద్దిదాడు. అతడి ఆటోని చూస్తే.. ఆశ్చర్యపోవడం ఖాయం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో..ఆ ఆటో మొత్తం గ్రీన్గా ఓ పార్క్ మాదిరి కనిపిస్తుంది. చూడగానే ఇది ఆటోనేనా అనిపిస్తుంది. ఆటోలో మొక్కలను ఏర్పాటు చేసిన సందర్భాలు చూశాం. ఇది మాత్రం అంతకు మించి అన్నట్లు ఉంది. ఏకంగా మొత్తం గ్రీనరీనే..ఏకంగా ఆటోలోని పైనంతా పూల మొక్కలు అలిమేసి ఉన్నాయి. ఇక సైడ్స్ పూలకుండీలు ఇవేగాక తాగునీరు, మోటివేషనల్ బుక్స్, మోటివేషనల్ ప్టోసర్లతో ఎంతో అట్రాక్టివ్గా మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఆటోలో మిని గార్డెన్నే ఏర్పాటు చేశాడు ఆ డ్రైవర్. అతడి క్రియేటివిటీని ప్రశంసిస్తూ..అది జంగిల్ ఆటో అని ఒకరు, గ్రీన్ ఆటో మరొకరూ, కాదు కాదు ట్రావెలింగ్ పార్క్ అని ఇంకొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by thoughts♡ (@depthoughtsz._) (చదవండి: ఆ పురాతన గోడ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!) -
రైతులకు మేలు చేసేలా..పురుగులకు కుటుంబ నియంత్రణ!
వ్యవస్థాపకుడు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పంట పొలాల్లో, పండ్ల తోటల్లో పురుగుల నియంత్రణకు పురుగుమందులు/కషాయాలు చల్లటం కన్నా.. అసలు ఆయా ప్రత్యేక జాతి పురుగుల సంతతినే పెరగకుండా అరికట్టగలిగితే రైతులకు శ్రమ, ఖర్చు తగ్గటంతో పాటు, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా మేలు జరుగుతుందంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు. వివిధ శాస్త్రవిభాగాల్లో పరిశోధనలు పూర్తిచేసిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే వినూత్నమైన ఫెరమోన్ ఆధారిత అప్లికేషన్లు, ఆవిష్కరణలను వెలువరించారు. కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ పురస్కారాన్ని అందుకున్న ఈ సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తేవడానికి శాస్త్రవేత్తలు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఎటిజిసి బయోటెక్ అనే కంపెనీని నెలకొల్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇటీవల నిర్వహించిన ‘ఎట్హోమ్ రిసెప్షన్ ’లో ఈ సంస్థ సహ–వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, హెచ్సియూ పూర్వ విద్యార్థి డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అందించిన వివరాల ప్రకారం ఈ వినూత్న సాంకేతికత వివరాలను పరిశీలిద్దాం.. పురుగుల సంతతిని అరికట్టే వ్యూహం ఆడ రెక్కల పురుగు సంతానోత్పత్తి దశలో మగ రెక్కల పురుగును ఆకర్షించడానికి ప్రత్యేకమైన వాసనతో కూడిన హార్మోన్ వంటి రసాయనాన్ని గాలిలోకి విడుదల చేస్తుంది. మగ పురుగు ఆ ఫెరమోన్ వాసనను బట్టి ఆడ పురుగు ఉన్న చోటుకు వెళ్లి కలుస్తుంది. ఈ కలయిక సజావుగా జరిగితే ఆడ పురుగు గుడ్లు పెడుతుంది. ఆ విధంగా పురుగుల సంతతి పంట పొలంలో స్వల్ప కాలంలోనే పదులు వందలుగా, వందలు వేలుగా పెరిగిపోయి పంటను ఆశించి దిగుబడిని నష్ట పరచటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఆడ–మగ రెక్కల పురుగుల కలయికే జరగకుండా చూడటం ద్వారా సంతతి పెరుగుదలను అరికట్టడం ఇక్కడ వ్యూహం. ఈ వ్యూహాన్ని అమలుపరచడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న పద్ధతి ఏమిటంటే.. కృత్రిమ ఫెరమోన్తో కూడిన ప్రత్యేక పేస్ట్ను రూపొందించటం. ఈ పేస్ట్ను పంట పొలంలో మొక్కలకు అక్కడక్కడా అంటిస్తే.. ఆ వాసనకు మగ రెక్కల పురుగు ఆడ పురుగు ఉందనుకొని మొక్కపై ఉన్న పేస్ట్ దగ్గరకు వస్తుంది. తీరా లేకపోయే సరికి తికమకకు గురవుతుంది. ఆడ రెక్కల పురుగులను కలిసే ప్రయత్నంలో నూటికి 90 సార్లు విఫలమవుతుంది. దాంతో ఆ పురుగు సంతానోత్పత్తి ఆ మేరకు పరిమితమవుతుంది. ఈ టెక్నిక్ను ఉపయోగించి పురుగు తొలి దశలోనే పేస్ట్ను పొలంలో అక్కడక్కడా మొక్కలకు పూస్తే చాలు. పురుగుల్ని నిర్మూలించకుండానే వాటి సంఖ్యను చాలా వరకు అదుపులోకి తేవటం ద్వారా పంట దిగుబడికి పెద్దగా నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఇది సరిగ్గా చేస్తే ఆ పురుగు నిర్మూలనకు రైతులు పురుగుమందు కొట్టే శ్రమ, ఖర్చు, కాలుష్యం ఉండదు. అయితే, పురుగుల తీవ్రతను తెలుసుకునేందుకు లింగాకర్షక బుట్టలు చాలా కాలంగా రైతులు వాడుతున్నారు. ఫెరమోన్ ఎర వాసనతో వచ్చి లింగాకర్షక బుట్టల్లో పడే మగ రెక్కల పురుగుల సంఖ్యను, పొలంలో అప్పుడు ఆ పురుగు తీవ్రతను గుర్తించి, పురుగు మందులు/కషాయాలు చల్లటం వంటి నియంత్రణ చర్యలను రైతులు చేపడుతున్నారు. ఈ లోగా పురుగుల సంతతి పెరిగిపోతోంది. అయితే, ఈ కొత్త పద్ధతి ద్వారా ఈ పురుగుల సంతతి పెరగకుండా ముందు నుంచే వాటి కలయికను నివారించవచ్చు. పురుగు ఉధృతిని ఎర ఉపయోగించి గమనించవచ్చు. పత్తిలో గులాబీ పురుగుకు చెక్ గులాబీ రంగు పురుగు వలన పత్తి రైతులు సగటున ఎకరానికి 6–7 క్వింటాళ్ల పత్తిని నష్టపోతున్నారు. పురుగులను సమర్థవంతంగా అరికట్టడానికి ఫెరొమోన్ పర్యవేక్షణ మాత్రమే సరిపోదు. ఇప్పుడు పర్యవేక్షణే కాకుండా ఫెరొమోన్ ఆధారిత నియంత్రణ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇది ఎరను ఉపయోగించకుండా ఫెరొమోన్ పేస్ట్ ద్వారా పురుగులను అరికట్టే సరికొత్త పద్ధతని డాక్టర్ విజయభాస్కర్రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ప్రస్తుతం బీటీ పత్తి పొలాల్లో విజృంభిస్తున్న గులాబీ లద్దె పురుగును అరికట్టేందుకు ప్రత్యేకమైన పేస్ట్ను తమ కంపెనీ రూపొందించిందన్నారు. పేటెంట్ కలిగిన ఈ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత రైతులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. పత్తి పంటలో 3 సార్లు.. ఎకరం పత్తి చేనులో అన్ని మొక్కలకూ పేస్ట్ను పెట్టక్కర లేదు. 400 మొక్కల (పొలంలో 7–8% మొక్కల)కు ఈ పేస్ట్ను బఠాణీ గింజంత అంటించాలి. మొక్క పై నుంచి 10–15 సెం.మీ. కిందికి, కాండం నుంచి కొమ్మ చీలే దగ్గర పెట్టాలి. ఒక సాలులో 4 మీటర్లకు ఒక మొక్కకు పెడితే చాలు. ఒక సాలులో మొక్కలకు పెట్టి, రెండు సాళ్లు వదిలేసి మూడో సాలుకు పెడితే సరిపోతుంది. ఎకరం మొత్తానికి 125 గ్రాముల పేస్ట్ సరిపోతుందని డా. రెడ్డి వివరించారు. ఒక్కో మొక్క కాండంపై 250 నుంచి 300 మిల్లీ గ్రాముల మేరకు పెట్టాలి. పత్తి పంట కాలంలో మొత్తం 3 సార్లు పేస్ట్ పెట్టాలి. విత్తనాలు వేసిన తర్వాత (పువ్వు/ గూడ ఏర్పడటానికి ముందు) ఇంచుమించుగా 30–35 రోజులకు మొదటిసారి, విత్తిన 60–65 రోజుల తర్వాత రెండోసారి, విత్తిన 90–95 రోజుల తర్వాత మూడవ సారి పెట్టాలి. తుది పంట కోసే వరకు ప్రతి 30–35 రోజుల వ్యవధిలో ఉపయోగించాలి. ఇలా చేస్తే పంట ఖర్చు తగ్గి, దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. ఎకరానికి పేస్ట్ ఖర్చు మూడు సార్లకు రూ. 4 వేలు అయినప్పటికీ, రైతు రూ. 30 వేల వరకు అధికాదాయం పొందగలుగుతారని ఆయన అన్నారు. మిత్రపురుగులు సురక్షితం ఈ సాంకేతికతలో పురుగుమందులు /హానికరమైన రసాయనాలు లేనందున పర్యావరణానికి హాని కలిగించదని డా. విజయభాస్కర్రెడ్డి వివరించారు. నేల, గాలి, నీరు పురుగు మందుల అవశేషాలతో కలుషితం కావు. మిత్ర పురుగులకు, పరాన్న జీవులు వంటి సహజ శత్రువులకు సురక్షితంగా ఉంటాయి. తేనెటీగలు నశించవు. సహజ పరాగ సంపర్కం బాగుంటుంది. రైతుకు, కూలీలకు సురక్షితమైనది. మొక్కకు హాని కలిగించదు. పత్తి నాణ్యత, రంగు మెరుగ్గా ఉంటుంది. మంచి ధరను పొందే అవకాశం కలుగుతుంది అన్నారాయన. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రయోగాల్లో 90% పైగా పత్తిలో గులాబీ పురుగును ఈ పేస్ట్ నియంత్రిస్తున్నట్లు నిరూపితమైందని ఆయన తెలిపారు. (ఇతర వివరాలకు.. టోల్ఫ్రీ నంబర్ 1800 121 2842) త్వరలో వంగకు కత్తెర పురుగుకు కూడా.. ప్రస్తుతానికి పత్తిలో గులాబీ పురుగును నియంత్రించేందుకు పేస్ట్ను రైతులకు అందుబాటులోకి తెచ్చాం. వంగ తోటల్లో కాయ/కాండం తొలిచే పురుగుల నియంత్రణకు ప్రత్యేక పేస్ట్ను కేంద్ర ప్రభుత్వ అనుమతుల తర్వాత 2–3 నెలల్లో విడుదల చేయబోతున్నాం. ఇది అందుబాటులోకి వస్తే వంగ రైతులకు పురుగు మందుల ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక వినియోగదారులు పురుగుమందు అవశేషాలు లేని వంకాయలను తినటం సాధ్యమవుతుంది. ఇప్పటికే పండ్లు/కూరగాయ తోటల్లో నష్టం చేస్తున్న పండు ఈగను ఆకర్షించి చంపే జెల్ ల్యూర్ అందుబాటులో ఉంది. శ్రీ కొండా లక్షణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ దీనిపై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మొక్కజొన్న సహా అనేక పంటలకు నష్టం చేస్తున్న కత్తెర పురుగు నియంత్రణకు వినూత్న పద్ధతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. వీటి తయారీలో ఎలాంటి జన్యుమార్పిడి సాంకేతికతను వాడటం లేదు. రైతులు ఈ సాంకేతిక పద్ధతిని పురుగు ఉదృతి పెరిగినాక కాకుండా ముందు జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలో రైతులు కలసి వాడితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. – డా. విజయ భాస్కర్ రెడ్డి, ఎటిజిసి బయోటెక్ సహ–వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్. (చదవండి: -
సంస్కారవంతమైన నగరం!
మెక్సికో దేశపు రాజధాని మెక్సికో నగరం. కిక్కిరిసిన కాంక్రీట్ జంగిల్. అధిక జనసాంద్రత. మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 2.3 కోట్లు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన నగరం. వలస పాలనకు ముందు ఇది అజ్టెక్ సామ్రాజ్యపు రాజధాని. నగరం చుట్టూతా లోతు తక్కువ మంచినీటి సరస్సులు, చిత్తడి నేలలు ఉన్నాయి. వీటి మధ్యలో మానవ నిర్మిత ద్వీపాలలో అనాదిగా సంప్రదాయ వ్యవసాయం జరుగుతోంది. ఈ వ్యవసాయక ద్వీప క్షేత్రాలను ‘చినాంపాస్’ అని పిలుస్తారు. వీటిని 2014లో మెక్సికో మెట్రోపాలిటన్ నగర పరిధిలోకి చేర్చారు. నగరం మొత్తం భూభాగంలో సుమారు 27.7%లో వ్యవసాయం విస్తరించింది. ఇందులో 99% విస్తీర్ణం చినాంపాస్లే ఆక్రమిస్తాయి. 5.10 లక్షల టన్నుల ఆహారోత్పత్తులను రైతులు పండిస్తున్నారు. నగరం లోపల జనావాసాల మధ్య ఇంటిపంటలు, కమ్యూనిటీ గార్డెన్లు, గ్రీన్ హౌస్లు, హైడ్రోపోనిక్ వ్యవస్థలు, మిద్దె తోటలు, నిలువు తోట(వర్టికల్ గార్డెన్స్)లు సాగవుతున్నాయి. వీటిలో నగరవాసులు 24.7 టన్నుల కూరగాయలు, పండ్లను ఏటా ఉత్పత్తి చేస్తున్నట్లు గత ఏడాది జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, ఈస్ట్ చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్వాటెమాలా స్కూల్ ఆఫ్ సోషల్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు ఉమ్మడిగా గత ఏడాది 75 అర్బన్ గార్డెన్లపై విస్తృత అధ్యయనం చేశారు. అర్బన్ గార్డెన్లలో పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆహారాన్ని మెరుగుపరచి ఆహార భద్రతను పెంపొందించాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచాయి. కొందరు అర్బన్ రైతులకు ఈ పంటల అమ్మకాలే జీవనాధారంగా మారాయి. ఔషధ, సుగంధ మూలికలు మెక్సికో ప్రజల సంప్రదాయ వైద్యంలో, ఆహార సంస్కృతిలో అంతర్భాగం. ఇప్పటి ఇంటిపంటల్లోనూ వీటికి పెద్ద పీట ఉందని అధ్యయనవేత్తలు తెలిపారు. సేంద్రియ ఇంటిపంటల సాగును వ్యాప్తిలోకి తేవటంలో ఇతర దేశాల్లో మాదిరిగానే మెక్సికో నగరంలో కూడా దశాబ్దాలుగా అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఈ కోవలోకి చెందినదే ‘కల్టివా సియుడాడ్’ కూడా. ఈ స్పానిష్ మాటలకు అర్థం ‘సంస్కారవంతమైన నగరం’. పేరుకు తగ్గట్టుగానే ఇది పనిచేస్తోంది. సేంద్రియ ఇంటిపంటలు, సామూహిక ఇంటిపంటల సంస్కృతిని వ్యాపింపజేయడానికి కృషి చేస్తోంది. ఆకాశ హర్మ్యాల నడుమ 1,650 చదరపు మీటర్ల స్థలంలో కల్టివా సియుడాడ్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ పచ్చగా అలరారుతోంది. పట్టణ వ్యవసాయాన్ని విద్య, ఉత్పత్తి/ఉత్పాదక, చికిత్సా సాధనంగా ఉపయోగించడం దీని లక్ష్యం. సృజనాత్మకత ఉట్టిపడే ఎతైన మడుల్లో ఆకుకూరలు, కూరగాయలతో పాటు 135 జాతుల పండ్లు, ఇతర చెట్లతో ఈ ఆహారపు అడవి నిర్మితమైంది. పండించిన ఉత్తత్తుల్లో.. తోట పనిలో సాయపడిన వాలంటీర్లకు 30% ఇచ్చారు. 28% పొరుగువారికి తక్కువ ధరకే అమ్మారు. 34% రెస్టారెంట్లకు అమ్మారు. పేదలకు ఆహారాన్నందించే కమ్యూనిటీ సూప్ కిచెన్లకు కూడా కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ విధంగా స్వీయ సహాయక ఉద్యాన తోటల పెంపకం ద్వారా మెక్సికో ‘సంస్కారవంతమైన నగరం’గా రూపుదాల్చింది! సామాజిక పరివర్తన సాధనం అర్బన్ అగ్రికల్చర్ ప్రభావశీలమైన సామాజిక పరివర్తన సాధనం. ఆహార సార్వభౌమాధికారం, ఆహార భద్రతల సాధనకు.. అలాగే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికీ ఇదొక వ్యూహం. 12 ఏళ్లుగా మా కమ్యూనిటీ కిచెన్ గార్డెనింగ్ అనుభవం చెబుతోంది ఇదే. వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి సారవంతమైన మట్టిని ఉత్పత్తి చేయడానికి, పోషకాల సాంద్రత కలిగిన కూరగాయలను పండించడం.. పంటలు, జంతువులు, పక్షుల జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఉష్ణోగ్రతలను తగ్గించడంతో పాటు అంతస్తులకు అతీతంగా భుజం భుజం కలిపి పనిచేసేందుకు నగరవాసులకు సేంద్రియ ఇంటిపంటలు ఉపయోగపడుతున్నాయి. – గాబ్రిలా వర్గాస్ రొమెరో, ‘కల్టి సియుడాడ్’ డైరెక్టర్, మెక్సికో నగరం -
జాడలేని జిల్లేడు.. కానరాని తంగేడు
సాక్షి, హైదరాబాద్: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది నానుడి. నాగజెముడు..తంగేడు..కుంకుడు.. జిల్లేడు..ఉమ్మెత్త.. తిప్పతీగ..మునగ.. కరివేపాకు..వేప.. ఇవి కూడా మనిషికెంతో మేలు చేస్తాయి. ఇప్పుడంటే ఆధునిక వైద్యం అంతటా అందుబాటులోకి వచ్చింది కానీ ఒకప్పుడు ప్రతి ఇంటి పెరట్లో ఉండే ఇలాంటి మొక్కలు, చెట్లపైనే ఆధారపడి పల్లె ప్రజలు ప్రాణాలు కాపాడుకునేవారు. ప్రాణం మీదకొచ్చే జబ్బైతే తప్ప ఓ మోస్తరు అనారోగ్యం నుంచి బయటపడేందుకు ఆకు పసర్లే ఉపయోగించేవారు. వాటి మీదే ఆధారపడి జీవించేవారంటే అతిశయోక్తి కాదు. రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు పెరట్లో ఈ తరహా ఔషధ గుణాలున్న మొక్కలు, చెట్లు కన్పించేవి. ఇప్పుడు పల్లెల్లో కూడా జీవనశైలి మారిపోయింది. సంప్రదాయంగా వైద్యానికి వాడే పెరటి మొక్కల పెంపకం 80 శాతం పడిపోయింది. ఏ ఇంటి పెరట్లో అయినా ఇలాంటి మొక్క ఒకటి కన్పిస్తే అది నిజంగా వింతే. పెరటి వైద్యం అంటే ఏమిటో కూడా నేటి యువతరానికి తెలియని దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నాగజెముడు, తంగేడు, జిల్లేడు, కుంకుడు, ఉమ్మెత్త లాంటివి ఎక్కడో తప్ప కన్పించకుండా పోయాయి. అయితే కోవిడ్ తదనంతర కాలంలో మొక్కలపై కాస్త మక్కువ పెరిగింది. కుండీల్లోనైనా ఇతర మొక్కలతో పాటు ఒకటో రెండో ఔషధ మొక్కలు పెంచాలనే ఆరాటం మొదలైంది. ఈ మక్కువ విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. మాయమైన మన పెరటి మొక్కల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ‘ఊపిరిపోసే’ నాగజెముడు పెరట్లో ముఖ్యంగా పొలాల వెంట ముళ్ళ పొదల్లా ఉండే నాగజెముడు ఇప్పుడు మచ్చుకైనా కన్పించడం లేదు. పల్లె జనం ఆధునిక వైద్యానికి అలవాటు పడి దీని ప్రాధాన్యతను గుర్తించడం లేదు. నిజానికి ఈ తరానికి ఈ మొక్క ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాగజెముడు పూలను ఆస్తమా తగ్గించేందుకు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు వాడతారు. చర్మ వ్యాధులకు ఉమ్మెత్త ఉమ్మెత్త పరిస్థితి కాస్త నయం. ముళ్ళ కాయలతో పెరట్లో కన్పించే దీన్ని ప్రజలింకా పూర్తిగా మరిచిపోలేదు. ఇప్పటికీ అక్కడక్కడా గ్రామాల్లో కన్పిస్తోంది. కానీ ఈ మొక్కను కార్పొరేట్ ఆయుర్వేద వైద్యం విస్తృతంగా అభివృద్ధి చేస్తోంది. ఔషధ రూపంలో ప్రతి ఊరూ వెళ్ళిన ఈ మొక్క.. పెరట్లో ఉన్నా పల్లె జనం దీని విలువ తెలుసుకోవడం లేదు. ఉమ్మెత్త ఆకులు, కాయలను చర్మవ్యాధులకు బాగా వాడతారు. దీర్ఘకాల చర్మ వ్యాధులను సైతం తగ్గించే గుణం దీని సొంతం. ఇంత మంచి గుణాలున్న మొక్క మరో ఆరేళ్ళ తర్వాత పల్లెల్లో కన్పించదని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కెర స్థాయి తగ్గించే తంగేడు తంగేడు తాతల కాలం నుంచి తెలిసిన మొక్క. చిన్న చిన్న పసుపు వన్నె పూలు దీని ప్రత్యేకత. బ్రష్లు, పేస్టులు లేని రోజుల్లో వేపతో పాటు తంగేడు పుల్లలతో కూడా పళ్లు తోముకునేవారు. మధుమేహం వ్యాధికి దీన్ని మించిన మందులే లేవని పరిశోధనల్లో తేలింది. బతుకమ్మ పండుగొచ్చి తంగేడును కాస్త బతికించింది కానీ.. లేకపోతే ఈ చెట్టూ మనకు కన్పించనంత దూరంగా వెళ్ళేది. ఆయుర్వేద వనమూలికల్లో తంగేడు కీలక పాత్ర పోషిస్తోంది. దీన్ని మళ్ళీ పల్లె దరికి చేర్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. షాంపూలు రాకముందు కుంకుడే.. కుంకుడు కాయ.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో అందమైన ప్యాకెట్గా కన్పించే వస్తువైంది. కానీ ఒకప్పుడు ప్రతి ఊళ్ళో విరివిగా ఈ చెట్లు ఉండేవి. షాంపూలు రాకముందు వరకు కుంకుడు రాజసానికి ఏ మాత్రం దెబ్బ తగల్లేదు. కుంకుడు రసం వాడినంత వరకు కేశాల వన్నె తగ్గలేదు. మంచి ఔషధ గుణాలున్న చెట్టును కార్పొరేట్ కంపెనీలు ఆయుర్వేదం పేరుతో అభివృద్ధి చేస్తున్నాయి. పల్లెల్లో ఎవరికీ పట్టని కుంకుడు క్రమంగా పల్లె వాకిటి నుంచి కార్పొరేట్ ఫామ్లకు వెళ్తోంది. పొలాలకు ‘రక్షణ కంచె’ మంగళగిరి కంచె.. ఈ మొక్క గురించి చాలామందికి తెలియదు. సుమారు ఇరవై ఏళ్ళ క్రితం వరకు చాలా పల్లెల్లో ఇంటి పెరట్లో, పొలం గట్టుపై కన్పించిన మొక్క ఇది. కార్బన్–డై–ఆక్సైడ్ను నియంత్రించడంలో దీనికో ప్రత్యేకత ఉంది. పంట పొలాల్లో మొక్కలకు హాని చేసే క్రిమి కీటకాలను అదుపు చేస్తుంది. చిన్న మొక్క వేస్తే చాలు పొలం చుట్టూ రక్షణ కవచంలా అల్లుకుపోయే ఈ మొక్క... ఇనుప కంచెల ఆవిర్భావంతో కనుమరుగైంది. ఈ మొక్కపై విస్తృత పరిశోధనలు జరిగి దీని ప్రాధాన్యత విశ్వవ్యాప్తమైనా.. మన దగ్గర ఎవరికీ తెలియనంతగా కనుమరుగైపోయింది. ఇతర దేశాల్లో మాత్రం ఈ మొక్క పెంపకాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. కాల గర్భంలో ఎన్నో.. విరిగిన ఎముకలు కట్టుకోవడానికి వాడే నల్లేరు.. కఫంతో ఊపిరి ఆగిపోయే పరిస్థితి నుంచి కాపాడే కరక్కాయ.. ప్రాణం పోయేలా అన్పించే తలనొప్పిని తగ్గించే సొంఠి.. కురుపు ఏదైనా ఆకుతోనే నయం చేసే జిల్లేడు.. చర్మవ్యాధుల పనిబట్టే మారేడు.. సర్వ రోగ నివారిణి తులసి..ఇలాంటివెన్నో మనకు కన్పించకుండా పోతున్నాయి. ఇవీ నిజాలు.. ►వృక్ష శాస్త్రవేత్తలు ఇప్పటివరకు 3.5 లక్షల మొక్క జాతులను గుర్తించారు. ఇందులో 2.78 లక్షల మొక్కలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. వాటి ఔషధ గుణాలు గుర్తించారు. ఇప్పటికే 1.26 లక్షల మొక్క జాతులను వివిధ రూపాల్లో వాడుకుంటున్నారు. ►30 ఏళ్ళ క్రితం గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల మొక్క జాతులు ఉన్నాయి. ఇవి ఇప్పుడు 80 వేల లోపే ఉన్నాయి. ►పెరటి వైద్యం 30 ఏళ్ళ క్రితం వరకూ 92 శాతం ఉండేది. ఏదో ఒక మొక్కతో వ్యాధిని నయం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కేవలం 12 శాతమే పెరటి వైద్యాన్ని నమ్ముతున్నారు. అయితే కరోనా వచ్చిన తర్వాత ఇది 21 శాతానికి పెరిగింది. ►పల్లెల్లో పెరటి వైద్యంగా వాడిన మొక్కల్లో 20 జాతులు ప్రస్తుతం ఆయుర్వేద ముందుల రూపంలో విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు దాదాపు రూ.2 వేల కోట్లతో వీటిని పెంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలోని 82 రకాల ఔషధ మొక్కల ను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తున్నారు. -
‘సోలో స్టవ్ టవర్’..చలి భయమే అక్కర్లేదు
‘సోలో స్టవ్ టవర్’.. ఇది ఔట్డోర్ హీటర్. చలికాలంలో ఆరుబయట పిక్నిక్లు వంటివి జరుపుకోవాలంటే, వణికించే చలికి జంకుతారు చాలామంది. ‘సోలో స్టవ్ టవర్’ వెంట ఉంటే ఆరుబయట చలి భయమే అక్కర్లేదు. ఎక్కడికైనా దీనిని తేలికగా తీసుకుపోవచ్చు. ఆరుబయట పిక్నిక్ పార్టీలు చేసుకునే చోట దీనిని వెలిగించుకుంటే చాలు, నిమిషాల్లోనే పరిసరాలను వెచ్చబరుస్తుంది. దీనిని వెలిగించిన మూడు నిమిషాల్లోనే పదడుగుల వ్యాసార్ధం పరిధిలోని పరిసరాలను వెచ్చబరుస్తుంది. దీనిలోకి ఇంధనంగా కలప పొట్టుతో తయారైన ‘వుడెన్ పెల్లెట్స్’ వాడాల్సి ఉంటుంది. అమెరికన్ కంపెనీ ‘సోలో స్టవ్’ ఈ టవర్ హీటర్ను ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 1000 డాలర్లు (రూ.82 వేలు) మాత్రమే! -
Miniature Garden: టీ కప్పులో వనాలు పెంచండిలా!
వేసవి అనగానే పచ్చదనంతో నిండిన చల్లదనాన్ని ఆస్వాదించాలనుకుంటాం. అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక అందుకు తగినట్టు ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ ప్రాముఖ్యం పెరిగింది. ఒకే విధంగా ఉండే ప్లాంట్స్ కళను కొంచెం భిన్నంగా మార్చాలనుకునేవారికి కప్పులో మొక్కల పెంపకం బెస్ట్ ఐడియా అవుతుంది. ఇంటి అలంకరణలో కొత్తదనం నింపుతుంది. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. టీ కప్పుతో ఇంటి అలంకరణ మినియేచర్ గార్డెన్గానూ అలరారుతోందిప్పుడు. రీ సైక్లింగ్ కప్స్: రకరకాల డిజైన్లలోని పింగాణీ కప్పులు చూడగానే ఆకట్టుకుంటాయి. వాడి వాడి కొన్ని డిజైన్స్ కళ మారుతాయి. మరికొన్ని కప్పులు విరిగిపోతాయి. అప్పుడు వీటిని పడేయకుండా గ్లూతో అతికించి, మట్టి పోసి, మొక్కలను పెట్టొచ్చు. తక్కువ ఎండ తగిలే చోట ఈ కప్పు ప్లాంట్ను సెట్ చేస్తే చూడటానికి ఆకర్షణీయంగానూ ఉంటుంది. గది అలంకరణలో కొత్త మార్పూ చోటుచేసుకుంటుంది. ఫ్రేమ్ కప్ ప్లాంట్: రీస్లైకింగ్ కప్స్ని ఒక ఫ్రేమ్కి సెట్ చేసి గోడకు హ్యాంగ్ చేయొచ్చు. లేదంటే ఆ కప్పుల్లో చిన్న చిన్న మొక్కలను అలంకరించి, అప్పుడప్పుడు నీళ్లు స్ప్రే చేస్తే.. పచ్చదనంతో నిండిన వాల్ మనసును ఆహ్లాదపరుస్తుంది. మినియేచర్ గార్డెన్: పెద్ద పెద్ద వనాల్ని ఇలా చిన్న చిన్నకప్పుల్లో సృష్టించడమే మినియేచర్ గార్డెన్. ఈ క్రియేషన్ కోసం ఆర్ట్ లవర్స్ ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటుంటారు. టేబుల్ డెకొరేషన్ కప్స్: డైనింగ్ టేబుల్ని అందంగా అలంకరించడానికి çపువ్వులతో నిండిన ఫ్లవర్వేజ్ని ఉంచుతారు. కొత్త ట్రెండ్.. కప్ ప్లాంట్ని టేబుల్ అలంకరణకు వాడచ్చు. డైనింగ్ టేబుల్పైనే కాదు సెంటర్ టేబుల్స్, రీడింగ్ టేబుల్స్పై కూడా టీ కప్–సాసర్ ప్లాంట్స్ చూడముచ్చటగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్: టీ కప్పుల్లో మొక్కలను పెంచేంత ఓపికలేని వారు ఆర్టిఫీషియల్ లేదా కాగితం పూల తయారీతోనూ అలంకరించవచ్చు. పర్యావరణహితంగా ఆలోచించేవారు నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు రీసైక్లింగ్ పద్ధతిలో కొత్త మెరుగులు దిద్దవచ్చు. ఇది పిల్లలకు వేసవి క్లాస్గానూ ఉపయోగపడుతుంది. Upma Bonda Recipe In Telugu: ఉప్మా మిగిలిపోయిందా.. ఇలా రుచికరమైన బోండాలు చేసుకోండి! -
పెరటింట..ప్రకృతి తోట
సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయ పంటలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇటు కూరగాయల పంటలకు అంతే ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఒక సెంటు నుంచి ఐదు సెంట్ల ఖాళీ జాగాల్లో కిచెన్ గార్డెన్స్, ఇంటి ఆవరణలో న్యూట్రి గార్డెన్స్, ఇంటిపైన టెర్రస్ గార్డెన్స్ పేరుతో పలు రకాల కూరగాయల పంటలను ప్రోత్సహిస్తోంది. దీనిపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ఇందుకోసం నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తోంది. ప్రకృతి వ్యవసాయంలో పెరటి తోటలు హైబ్రీడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకానికి స్వస్తి పలికి ప్రభుత్వ సూచనలతో ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గుచూపుతున్న రైతులు అదే సమయంలో ఈ విధానంలో కూరగాయల పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. రైతులే కాకుండా భూములు లేని ప్రజలు సైతం తమ ఇళ్ల వద్దనే కొద్దిపాటి స్థలంలో ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు విభాగం సలహాలు, సూచనలతో ఈ తరహా వ్యవసాయానికి వేలాది మంది ఇప్పటికే ›శ్రీకారం చుట్టారు. కొందరు పంట పొలాల్లోనే ఇతర పంటలతోపాటు కూరగాయలు పండిస్తుండగా చాలామంది ఇళ్ల వద్దనే కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు 75,452 కిచెన్ గార్డెన్స్ ఏర్పాటయ్యాయి. ఇందులో భూమి లేని పేదలు 24,399 మంది తమ ఇళ్ల వద్దనే ఉన్న ఖాళీ స్థలంలో నేచురల్ ఫార్మింగ్ ద్వారా పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇక నూట్రిగార్డెన్స్ 274 ఉండగా, 186 టెర్రస్ గార్డెన్స్ ఉన్నాయి. ఇవన్నీ కేవలం పకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేస్తున్న ప్లాంట్లు కావడం గమనార్హం. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని బద్వేలు, కమలాపురం, పులివెందుల, మైదుకూరు, రాయ చోటి, రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలతోపాటు పలు నియోజకవర్గాల్లో గ్రామగ్రామాన నేచురల్ ఫార్మింగ్ కిచెన్ గార్డెన్స్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగ ప్రాజెక్టు కృషి చేస్తోంది. ఈ విభా గం పరిధిలోని మాస్టర్ ట్రైనర్స్, ఇంటర్నల్ కమ్యూనిటీ సోర్స్ పర్సన్స్, నేచురల్ ఫార్మింగ్ అసోసియేట్స్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న వారు గ్రామాల్లోని గ్రామ సంఘాల ద్వారా అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కిచెన్ గార్డెన్స్, న్యూట్రి గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గార్డెన్స్ ఏర్పాటు చేసిన వారు 15–30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయలు తదితర వాటిని ఈ తరహా వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా పురుగు మందులు ఇక పంటలకు సోకిన తెగుళ్లను నివారించేందుకు నీళ్లలో వేపాకు పిండి, పేడ, కుంకుడు కాయల పొడి తదితర వాటిని కలిపి వడగట్టి దోమపోటుతోపాటు ఇతర తెగుళ్లకు పిచికారీ చేస్తున్నారు. రసాయనిక ఎరువులు,పురుగు మందులు లేకుండా.. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా కిచెన్గార్డెన్స్ను నిర్వహిస్తున్నారు.పోషకాహారం ఎరువు స్థానంలో ఘన జీవామృతం పేరుతో పేడ, పప్పుదినుసులు పిండి, నల్లబెల్లం, పుట్టమట్టి, ఆవు లేదా ఇతర పశువుల మూత్రం కలిపి ఘన జీవామృతాన్ని, ఇదే వస్తువులను నీటిలో కలిపి జీవామృతం పేరుతో డ్రిప్ లేదా స్ప్రింకర్ల ద్వారా ఎరువుగా పంటకు అందజేస్తున్నారు. ఆరోగ్యమే ప్రధానం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల విటమిన్స్, మినరల్స్ అధికంగా పొందే అవకాశం ఉంటుంది. తద్వారా అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేని కలుషిత రహిత ఆహారం తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని గార్డెన్స్ ఏర్పాటు చేసిన వారు పేర్కొంటున్నారు. కిచెన్ గార్డెన్స్లో పండించిన ఉత్పత్తులను అమ్ముకుంటూ ఇంటి ఖర్చులను పూడ్చుకుంటున్నట్లు పలువురు పేర్కొంటుండడం గమనార్హం. విటమిన్స్, మినరల్స్ లభ్యమవుతాయి ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రతి ఒక్కరూ కూరగాయల పంటలు పండించేలా చూస్తున్నాం. ఇంటిపైన ఖాళీ స్థలంలోనూ టెర్రస్ గార్డెన్స్ పేరుతో కూరగాయలు సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే కూరగాయలు తినడం వల్ల విటమిన్స్, మినరల్స్ లభ్యమవుతాయి. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అందుకే అందరినీ ప్రోత్సహిస్తున్నాం. – సంధ్య, మాస్టర్ ట్రైనర్, హెల్త్, న్యూట్రిషియన్, కడప ప్రకృతి వ్యవసాయంతోనే కూరగాయలు పండిస్తున్నాం మా ఇంటి వద్ద ఐదు సెంట్ల ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు, క్యారెట్, ఇతర వాటిని కూడా పండిస్తున్నాం. తోట పెట్టి నాలుగు నెలలైంది. మేము ఆరోగ్యకరమైన కూరగాయ లు తినడమే కాకుండా మిగిలిన వాటిని అమ్ముతున్నాం. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఎరువులు, జీవామృతం తదితర వాటితో కూరగాయలు పండిస్తున్నాం. –సునీత, సింగరాయపల్లె, కలసపాడు మండలం పెద్ద ఎత్తున పెరటి తోటల పెంపకం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పెద్ద ఎత్తున పెరటి తోటల పెంపకాన్ని చేపట్టారు. ఇప్పటివరకు 75 వేలకు పైగా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేశాం. రైతులతోపాటు ఇళ్ల వద్ద తోటల పెంపకానికి మొగ్గుచూపే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు, పండించుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగకరం. – రామకృష్ణరాజు, డీపీఎం,ప్రకృతి వ్యవసాయం,కడప -
ఉద్యానకేంద్రంగా అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లాలో విస్తారంగా పండ్లతోటలు సాగవుతున్నాయి. మామిడి,చీనీ, అరటి,టమాట,బొప్పొయి, కర్బూజ సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. పండ్లతోటల పెంపకానికి ఉపాధినిధులు తోడ్పాటు అందిస్తున్నాయి. ఉద్యానకేంద్రంగా జిల్లా విరాజిల్లనుంది. బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా పండ్లతోటలకు కేరాఫ్గా మారనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యానపంటల సాగుతో ప్రత్యేక గుర్తింపు కూడా దక్కించుకోనుంది. రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఉద్యానవన పంటల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులో జిల్లాకు రెండో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 75,731 హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగులో ఉన్నాయి. ఇందులో మామిడి, టమాట ఒకటి, రెండుస్థానాల్లో ఉండగా అన్ని ఉద్యాన పంటల సాగు సమాహారంగా జిల్లాకు గుర్తింపు వచ్చింది. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజక వర్గాల్లో టమాట సాగు ప్రథమస్థానంలో ఉంది. మామిడి జిల్లా అంతటా విస్తరించింది. అరటి, పసుపు, బత్తాయి, నిమ్మ తోటలు రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరులో సాగులో ఉన్నాయి. మొత్తమ్మీద అన్ని రకాల పంటలు జిల్లాలో సాగవుతున్నాయి. టమాట కేరాఫ్ తంబళ్లపల్లె టమాట సాగులో తంబళ్లపల్లె నియోజకవర్గానిదే అగ్రస్థానం. దశాబ్దాలుగా దీనిపైనే రైతులు ఆధారపడ్డారు. ప్రత్యామ్నయ పంటలవైపు వెళ్లడం లేదు. తంబళ్లపల్లె తర్వాత మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో టమాట సాగువుతోంది. ఉద్యానవన పంటల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో టమాటనే అధికం. రాయచోటి, చిన్నమండెం, గాలివీడు ప్రాంతాల్లో కొద్దిపాటి కనిపిస్తుంది. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో టమాట సాగు కనిపించదు. ఈ ప్రాంతాల్లో కట్టెలతో టమాటను సాగు చేస్తారు. దిగుబడి ఎలా ఉన్నా వీటి ధరలు నిలకడగా ఎప్పుడూ ఉండవు. అయినప్పటికీ రైతులు దీని సాగును వదలరు. ఇదే పంటతో కోట్లకు పడగలెత్తిన రైతులు లేకపోలేదు. తర్వాత మామిడితోటల పెంపకం ఉంది. పండ్లతోటలకు అందే ఉపాధి సహయం మామిడికి రూ.1,02,756, జీడిమామిడికి రూ.94,019, బత్తాయికి రూ.1,05,521, అసిడ్లైమ్కి రూ.1,41,515, నాటుజామకి రూ.1,41,784, తైవాన్జామకి రూ.2,30,023, సపోటకి రూ.88,255, కొబ్బరికి రూ.88,821, సీతాఫలంకి రూ.1,70,603, దానిమ్మకి రూ.2,48,845, నేరేడుకి రూ.18,124, చింతకి రూ.89,120, ఆపిల్బేర్కి రూ.1,06,962, డ్రాగన్ప్రూట్కి రూ.1,79,626, గులాబీకి రూ.1,92,500, మల్లెకి రూ.1,09,672, మునగకు రూ.1,01,541లు ప్రభుత్వం పూర్తి రాయితీగా అందిస్తోంది. ఈ పండ్లతోటలకు మంజూరైన ఉపాధి నిధుల రాయితీ సొమ్మును పంటల సాగునుబట్టి రెండు, మూడేళ్లపాటు అందించడం జరుగుతుంది. పోలాల్లో గుంతలు తవ్వి, మొక్కలు నాటి, సంరక్షణ, పంటల దిగుబడి వచ్చే వరకు రాయితీని విడతల వారీగా అందిస్తారు. ఇది పండ్ల రైతాంగానికి ఎంతో ప్రయోజనకరం. అరటికి కేరాఫ్ ఇవే జిల్లాలో అత్యధికంగా సాగయ్యే మూడో పంట అరటి. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, చిట్వేలి, రాజంపేటలో మాత్రమే ఈ పంట సాగు చేస్తున్నారు. బొప్పాయిని పెనగలూరు కలుపుకొని పై ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగులో 95శాతం వాటా ఈ ప్రాంతాలదే. పసుపు అక్కడక్కడ సాగవుతోంది. మామిడితోటల పెంపకం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతోంది. రెండోస్థానంలో జిల్లా పండ్లతోటల పెంపకంలో అన్నమయ్య జిల్లా రెండోస్థానంలో ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో సాగులోని ఉద్యానవన పంటల సాగు వివరాలను సేకరిస్తున్నారు. అనంతపురంజిల్లా మొదటిస్థానంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. జిల్లాకు రెండవ స్థానం దక్కితే పండ్లతోటలకు నిలయంగా మారినట్టే. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అధికంగా ఉంటుంది. –రవీంద్రనాధ్రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి, రాయచోటి ఐదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు రాయితీ పండ్లతోటల పెంపకం కోసం ఉపాధి రాయితీని ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఒక మొక్కకు నీరుపోసినందుకు రూ.17, సంరక్షణకు రూ.10 చొప్పున నెలకు రూ.27 చెల్లిస్తాం. జాబ్కార్డు, ఐదెకరాలోపు భూమి కలిగిన ప్రతి రైతు రాయితీ పొందడానికి అర్హులు. రైతులు సద్వినియోగం చేసుకొని పండ్లతోటల పెంపకంతో ఆదాయం పొందాలి. ఈ పంటలసాగుతో కొన్నేళ్లపాటు ఆదాయం పొందవచ్చు. –ఎస్.మధుబాబు, డ్వామా ఏపీడీ, ములకలచెరువు -
రిక్షాలో మినీ గార్డెన్...ఫోటోలు వైరల్
Man Converts Rickshaw Into Mini Garden: పర్యావరణ కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సైతం ముందుకు వచ్చి రకరకాలుగా విన్నూతన పద్ధతుల్లో మొక్కలు పెంచే కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాకుండా స్థలం లేకపోయిన ప్రజలు మొక్కలు ఎలా పెంచుకోవచ్చు వంటివి చెప్పి మరీ పంచేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు కూడా మిద్దే తోటని, వాల్ గార్డినింగ్ అని తమకు తోచిన రీతిలో మొక్కలను పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వాటన్నింటిని కాలదన్నేలా ఇక్కడొక వ్యక్తి విన్నూతన రీతిలో మొక్కలను పెంచి ఔరా అనిపించుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక వ్యక్తి తన రిక్షానే మినీగార్డెన్గా మార్చేశాడు. రిక్షాని చక్కని పూల మెక్కలు, పచ్చదనంతో నింపేశాడు. అంతేకాదు రిక్షాలో చిన్న చిన్న పూలకుండీలను కూడా ఏర్పాటు చేశాడు. ఈ మేరకు ఆ వ్యక్తి రిక్షాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి కాస్త యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హీమ్ని తెగ ఆకర్షించాయి. ఆయన ట్విట్టర్లో ...ఈ భారతీయుడు ఎండలో కూడా చల్లగా ఉండేందుకు తన రిక్షా మీద గడ్డిని పెంచాడు. నిజంగా చాలా బాగుంది!. ఈ వేసవి వేడి తట్టుకునేందుకు ఇలా పచ్చటి మొక్కలతో రిక్షాని ఏర్పాటు చేసుకున్నాడు కాబోలు. అని అన్నారు. అంతేకాదు నెటిజన్లు కూడా ఆ రిక్షా డ్రైవర్ సృజనాత్మకతను మెచ్చుకోవడమే కాకుండా కస్టమర్లను ఆకర్షించేందకు ఇది చాల చక్కటి మార్గం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. This Indian 🇮🇳 man grew grass on his rickshaw to stay cool even in the heat. Pretty cool indeed! pic.twitter.com/YnjLdh2rX2 — Erik Solheim (@ErikSolheim) April 4, 2022 (చదవండి: అమ్మాయి పుట్టిందని తండ్రి సంతోషం.. హెలికాప్టర్లో స్వాగతం) -
మనుషులే కాదు శునకం కూడా దెయ్యం అవుతుందా?
Dog Playing With Ghost Dog in Australia: నిజంగా దెయ్యాలు ఉన్నాయంటే ఎవరు కచ్చితంగా చెప్పలేరు. ఒకవేళ ఎవరైన తమ అనుభవాలు గురించి ప్రస్తావిస్తే అదంతా ఒట్టి బూటకం అని, అది కేవలం భయం కారణంగా వారికి అలా జరిగిందంటూ చాలామంది కొట్టిపారేస్తారే తప్ప ఎవరు నమ్మరు. పైగా వారిని పిచ్చివాళ్లగా చూస్తారు. నిజానికి ఈ ఆధునిక టెక్నాలజీ కారణంగా కొన్ని వీడియోల్లో రికార్డు అయ్యి ఉన్న ఆధారాలను చూస్తే గానీ ఎవ్వరూ అంత తేలికగా నమ్మరు. అచ్చం అలాంటి దెయ్యం వీడియోని చూసి ఇక్కడొక యజమాని షాక్కి గురవుతాడు. (చదవండి: టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..) అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియాలోని డిమార్కో అనే వ్యక్తి పెరటి తోటలో తన పెంపుడు కుక్కపిల్ల మరో కుక్కతో ఆడుతున్నట్లు సీసీపుటేజ్లో చూశానని చెబుతున్నాడు. పైగా మెల్బోర్న్కు చెందిన డిమార్కో, తన పెరటి తోట పూర్తిగా కంచెతో లాక్ చేసి ఉంటుందని. ఏ జంతువు లోపలకి వచ్చే ఆస్కారమే ఉండదని గట్టిగా చెబుతున్నాడు. అంతేకాదు ఆ సీసీపుటేజ్లో పారదర్శకంగా కనిపిస్తున ఒక దెయ్యం కుక్కతో తన పెంపుడు కుక్క ఆడుతున్నట్లు కనిపించదని తను చాలా భయభ్రాంతులకు గురయ్యానని చెప్పాడు. పైగా తన కుక్క వద్దకు పరుగెత్తుకుని వెళ్లి చూసినప్పుడు అదొక్కటే ఉందని అన్నాడు. ఆ సమయంలో తన కుక్క ఒక్కత్తే పెరట్లో ఉన్నట్లు తాను చూశానని అంతేకాక ఆ వీడియోలో ఒక నిమిషం వ్యవధిలోనే ఆ దెయ్యం కుక్క అదృశ్యంగా వచ్చి తన పెంపుడు కుక్కతో ఆడుతోందని చెబుతున్నాడు. (చదవండి: వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!) -
అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే..
సువిశాలమైన ఉద్యానవనాల్లో విహరించడం ఒక అద్భుతమైన అనుభూతి. తోటల్లో తిరుగుతూ ఉంటే, ప్రకృతికి దగ్గరగా సంచరిస్తున్నట్లుంటుంది. తోటల్లోని మొక్కలకు పూచే పువ్వులను చూస్తే పూజ కోసమో, సరదాగా తలలో తురుముకోవడం కోసమో కోయాలనిపిస్తుంది. తోటల్లోని చెట్లకు కాసే కాయలను, పండే పండ్లను కోసుకు తినాలనిపిస్తుంది. ప్రభుత్వాల అధీనంలో ఉండే కొన్ని తోటల్లో పూలు, పండ్లు కోయడంపై ఆంక్షలుంటాయి. ముచ్చటగా పెంచుకునే ప్రైవేటు తోటల్లో అలాంటి ఆంక్షలేమీ ఉండవు. మనసుకు నచ్చిన మొక్కలను పెంచుకోవచ్చు. వాటికి పూసిన పూలు, కాసిన కాయలు యథేచ్ఛగా కోసుకోవచ్చు. కానీ, బ్రిటన్లోని ఆ తోటలో పూలు, కాయలు కోసుకోవడం సంగతి అటుంచితే, అక్కడి మొక్కలను తాకినా ప్రమాదమే! తాకితే శిక్షలు ఏవైనా పడతాయని కాదు గానీ, అవి అత్యంత విషపూరితమైనవి. ప్రపంచంలోని అత్యంత అరుదైన, విషపూరితమైన వృక్షజాతులన్నీ ఈ తోటలో కనిపిస్తాయి. ఈ తోట బ్రిటన్లో నార్త్అంబర్లాండ్లోని ఆన్విక్ కేసిల్లో ఉంది. ఈ తోటకు ఏర్పాటు చేసిన నల్లని ఇనుప ప్రవేశ ద్వారంపైన ప్రమాద సంకేతాలుగా పుర్రె, ఎముకల గుర్తులు కనిపిస్తాయి. తోట లోపల కూడా ఇలాంటి ప్రమాద సంకేతాలు దాదాపు అడుగడుగునా కనిపిస్తాయి. నిపుణులైన గైడ్ల పర్యవేక్షణలో మాత్రమే సందర్శకులు దీని లోపలకు వెళ్లవలసి ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణ లేకుండా యథేచ్ఛగా వెళితే, లేనిపోని అనర్థాలు తప్పకపోవచ్చు. ఈ తోటలోని మొక్కలు, పొదలు, చెట్లు, వాటికి పూసే రంగు రంగుల పూలు, కాయలు, పండ్లు కళ్లను కట్టిపడేస్తాయి. అలాగని, వాటిని తాకడానికి ప్రయత్నించినా, మొక్కలకు పూసే పూలను కోయకుండానే, వాటిని వాసన చూసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో ఊహించడం కష్టం. గైడ్ల సూచనల మేరకు సురక్షితమైన దూరంలో నిలుచుని వీటిని చూడటమే అన్నివిధాలా క్షేమం. నార్త్అంబర్లాండ్ డ్యూషెస్ జేన్ పెర్సీ 2005లో ఈ తోటను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో పదకొండో శతాబ్దినాటి కేసిల్ శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పునరుద్ధరించి, ప్రపంచంలోని అరుదైన విషపు మొక్కలను ఏరికోరి తీసుకొచ్చి ఈ తోటను పెంచారు. ఇందులోని విషపు మొక్కలు కొన్ని ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. అందుకే ‘మీ ప్రాణాలు తీసేసే మొక్కలే మీ ప్రాణాలను కాపాడతాయి’ అంటారు పెర్సీ. ఈ తోటలో బెల్లడోనా, పాయిజన్ ఐవీ, హెన్బేన్, జెయింట్ హాగ్వీడ్ సహా వందలాది విషపు మొక్కలు ఉన్నాయి. వీటిలో కొన్నింటి పూల వాసన చూస్తే కళ్లు బైర్లు కమ్మడం, వాంతులవడం వంటి లక్షణాలు మొదలవుతాయి. కొన్ని మొక్కలను తాకితే చాలు ఒళ్లంతా దద్దుర్లు రేగి, చర్మం మంట పెడుతుంది. కొన్నింటి కాయలు, పళ్లు తింటే మైకం కమ్ముకు రావడమే కాకుండా, ప్రాణాంతక పరిస్థితులు సైతం ఎదురవుతాయి. ఈ తోటలోని మొక్కలు ప్రకృతిలోని జీవవైవిధ్యానికి అద్దంపడతాయి. చదవండి: ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు -
తోటలో పనిలో ఉండగా.. విమానంలోంచి, యాక్!!
మానవ వ్యర్థాలు ఈ మాట వింటేనే జనం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మరి అలాంటిది ఆకాశం నుంచి కుప్పలు, కుప్పలుగా వచ్చి మీద పడితే .. భయంకరంగా ఉంటుంది కదా. బ్రిటన్లో ఒక వ్యక్తికి ఇలాంటి ఘోరమైన అనుభవం ఎదురైంది. గార్డెన్లో పనిచేసుకుంటున్న మనిషి అటుగా వెళ్తున విమానం నుంచి మానవ వ్యర్థాలు గుమ్మరించిన వ్యవహారం కలకలం రేపింది. (TV Channel : షాకింగ్ వెదర్ రిపోర్ట్లో.. ఆ క్లిప్పింగ్) తోటలో హాయిగా పనిచేసుకుంటున్న తరుణంలో విమానంలో నుంచి జారవిడిచిన వ్యర్థాలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. అలాగే అతని గార్డెన్లో ఉన్న పలు మొక్కలు, పైకప్పులపై కూడా పడ్డాయి. దీంతో వ్యర్థాలు పడిన వెంటనే అతడు గార్డెన్ నుంచి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. 2021 ఏడాది జూలైలో ఇంగ్లండ్లోని విండ్సర్ సమీపంలో హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. కారెన్ డావిస్ జోక్యం ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రూట్ ట్రాకింగ్ యాప్ ద్వారా ఆ విమానం ఎటు వెళ్లిందో బాధితుడు కనిపెట్టడం విశేషం. మరోవైపు ఆ విమానం పేరును బయటపెట్టడానికి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా బాధితుడు విముఖత వ్యక్తం చేయడం గమనార్హం. (kidney transplantation: సంచలనం) విండ్సర్ అండ్ మేడెన్ హెడ్కి చెందిన ది రాయల్ బోరో ఏవియేషన్ ఫోరమ్తో కారెన్ డావిస్ ఈ భయంకరమైన అనుభవాలను షేర్ చేశారు. విమానంలో నుంచి పడిన వ్యర్థాలు మొత్తం తోటంతా చాలా అసహ్యకరమైన రీతిలో పడ్డాయని వివరించారు. ఇలాంటి అనుభవం మరెవ్వరికీ రాకూడదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే విమానంలోంచి జారవిడిచే మానవ వ్యర్థాలకు సంబంధించి ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు నమోదవుతూ ఉంటాయన్నారు. సాధారణంగా విమానాల నుంచి వదిలినపుడు ఎత్తైన ప్రదేశాల్లోని ఉష్ణోగ్రతకు తక్షణమే గట్ట కట్టి, కింత పడతాయని డావిస్ చెప్పారు. కానీ తాజా ఘటనలో మాత్రం దీనికి భిన్నంగా జరగడం అరుదైనదని చెప్పారు. కాగా సాధారణంగా విమానాల్లో టాయిలెట్స్ వ్యర్థాలను ప్రత్యేక ట్యాంకుల్లో స్టోర్ చేసి విమానం ల్యాండ్ అయిన తర్వాత వాటిని తొలగిస్తారు. ఆధునిక విమానాలలో వాక్యూమ్ టాయిలెట్లు సాధారణంగా విమానాలతో పోలిస్తే చాలా సురక్షితమైనవి భావిస్తారు. -
పండంటి పొదరిల్లు.. ఎంత బాగుందో!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మనకు కావాల్సిన పళ్లు, కూరగాయలను మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం. కానీ అవన్నీ మన ఇంటి వద్దే పండించుకుంటే.. ఆ ఆనందమే వేరు కదా. ఓ మాజీ సైనికుడు అదే చేస్తున్నాడు. డాబా పైనే రకరకాల పండ్లను పండిస్తూ తన ఇంటినే ఓ పండ్ల తోటల వనంగా మార్చేశాడు. ఆ మొక్కలకు వర్మీ కంపోస్ట్ ఎరువునే వినియోగిస్తూ పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడటంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆన్లైన్ నుంచి మొక్కల కొనుగోలు విశాఖ జిల్లా కొత్తపాలెం దుర్గానగర్కు చెందిన పూజారి శ్రీనివాసరావు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. 2017లో రిటైర్డ్ అయిన ఆయన ప్రస్తుతం ఆర్సీసీవీఎల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు మొక్కల పెంపకంపై మక్కువ. మరీ ముఖ్యంగా పండ్ల తోటలు పెంచడం అంటే చాలా ఇష్టం. ముందుగా 2018 నుంచి ఇంటి చుట్టూ పూల మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆన్లైన్ నుంచి మొక్కలు తెప్పించి మేడపై పెంచడం మొదలెట్టారు. ఇప్పుడు ఆ ఇల్లు పలు రకాల పండ్ల మొక్కలకు కేరాఫ్గా మారిపోయింది. ఫైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, తీపి బత్తాయి, ద్రాక్ష, మిరియాలు, లిచి, మామిడి, దొండ, అరటి చెట్లు, తైవాన్ జామ తదితర మొక్కలతో పాటు, బోన్సాయ్ మొక్కలనూ పెంచుతున్నారు. ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ తయారీ.. పాడైపోయిన ప్లాస్టిక్ బకెట్లను మొక్కల పెంపకానికి అనువుగా తీర్చిదిద్దడం విశేషం. మొక్కలకు వర్మీ కంపోస్టునే ఎరువుగా వినియోగిస్తున్నారు. పొడి వ్యర్థాలను మాత్రమే జీవీఎంసీ సిబ్బందికి ఇచ్చేసి తడి వ్యర్థాల సాయంతో ఇంట్లోనే వర్మీ కంపోస్టును తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు శ్రీనివాసరావు ఇల్లు పచ్చదనంతో కళకళలాడిపోతోంది. ఎంతో ఆనందంగా ఉంది.. మా ఇంటి మేడపైనే పండ్ల మొక్కలు పెంచడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంటిల్లిపాదీ తినగా మిగిలిన పండ్లను స్నేహితులు, బంధువులకు ఇస్తుంటాను. తెలంగాణకు చెందిన ఓ స్నేహితుడి వద్ద వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయడం నేర్చుకుని మరీ మొక్కలకు వినియోగిస్తున్నాను. – పూజారి శ్రీనివాసరావు, కొత్తపాలెం దుర్గానగర్, విశాఖ జిల్లా -
వక్క తోటలో ఆరు అడుగుల కొండచిలువ
శివమొగ్గ: శివమొగ్గ నగరంలోని ఎన్టీ రోడ్డు ఆస్పత్రి సమీపంలో ఉన్న ఓ వక్క తోటలో భారీ కొండ చిలువ కనిపించింది. మంగళవారం ఉదయం తోటకు వెళ్లిన యజమానికి కొండచిలువ కనిపించడంతో ఆయన వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్కు సమాచారం ఇవ్వడంతో ఆయన దానిని పట్టుకుని సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు. కొండ చిలువ ఆరు అడుగులకు పైగా ఉందని తెలిపారు. కొండచిలువ హల్చల్ వంగర: ఎం.సీతారాంపురం గ్రామంలో మంగళవారం కొండచిలువ హల్చల్ చేసింది. పాఠశాల సమీపంలో ఉన్న చెరువును ఆనుకొని పొదల్లో చిలువను గుర్తించిన స్థానికులు.. సమీపంలో పశువులు మేతకు రావడంతో ఆందోళన చెందారు. దీంతో దానిని హతమర్చారు. -
వైరల్ ఎవరికి కనపడకుండా బీర్లను ఎక్కడ దాచాడో తెలుసా..
సాధారణ వ్యక్తులతో పోలిస్తే మందుబాబుల తెలివి మాములుగా ఉండదు. ఎప్పుడూ రాని ఆలోచనలు చుక్క దిగితే ఉప్పెనల తన్నుకస్తుంటాయి. ఏ పని చేసినా చేయకున్నా.. టైమ్కు నోట్లోకి మందు పడాల్సిందే. లేదంటే ఉక్కిరిబిక్కిరవుతుంటారు. అసలే ఇప్పుడు కరోనా ముంచుకొస్తుంది. ఒకవేళ లాక్డౌన్ పెడితే మాత్రం మందుబాబుల కష్టాలు అంతా ఇంతా కాదు. అందుకే ముందు జాగ్రత్తగా ఇప్పుడే మందు బాటిళ్లను కొని తెచ్చుకుని ఫుల్గా స్టాక్ పెట్టుకుంటున్నారు. కరోనాను కూడా లెక్క చేయకుండా, భౌతిక దూరం పాటించకుండా కలబడి మరీ మందును సాధిస్తున్నారు. కష్టపడి లిక్కర్, బీర్లు తెచ్చుకోవడం ఒక సవాల్ అయితే వాటిని ఇంట్లో కుటుంబికులకు, స్నేహితులకు తెలియకుండా దాయడం మరో పెద్ద టాస్క్. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తికి కత్తిలాంటి ఆలోచన వచ్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే తెలుసేమో.. తన బుర్రకు టెక్నాలజీతో పదును పెట్టి .. బీర్లు దాచేందుకు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. పూల కుండీల అడుగున కనీసం పాతిక బీర్లు పట్టేలా కంపార్ట్మెంట్ తయారు చేశాడు. బయటకు చూసేందుకు అది పూల కుండీలాగే కనిపిస్తుంది. కానీ, చిన్న బటన్ నొక్కితే.. పూల కుండీ పైకి లేచి.. దాని అడుగున ఉన్న మందు బాటిళ్ల కంపార్ట్మెంట్ పైకి వస్తుంది. ఎంతైనా వీడి తెలివిని ప్రశంసించాల్సిందే. చదవండి: మహిళ పాడు పని.. యాక్ థూ అంటున్న జనాలు -
ఇంటిపంటల మాస్టారు!
పంటలు పండించే తీరు ఆసాంతమూ రసాయనాల మయం అయిపోయిన తర్వాత ఆహారం కూడా రసాయనాల అవశేషాలతో అనారోగ్యకరంగా మారిపోయింది. ఈ ముప్పు నుంచి మానవాళి తప్పించుకోవాలంటే.. పంటల ఉత్పత్తిదారులైన రైతుల అలవాటు మారాలి, వారితోపాటు సహ ఉత్పత్తిదారులైన వినియోగదారులూ మారాలి. రసాయనాల మకిలి లేని మంచి ఆహారాన్ని ఇష్టపడే ప్రజలు ఎవరైనా ముందు చేయాల్సింది వారి ఇంటిపైన, ముందు, వెనుక ఉన్న కొద్ది పాటి స్థలంలోనైనా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి తక్షణం శ్రీకారం చుట్టటమే. ఈ చైతన్యాన్ని అందిపుచ్చుకోవటంలో, జనబాహుళ్యంలో ప్రచారంలోకి తేవటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఈ బాధ్యతను గుర్తెరిగి ఏడాది కాలంలో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నారు బొర్రా ప్రదీప్. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన జెడ్పీ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. పెనమలూరు మండలం పోరంకి గ్రామంలోని సాలిపేట శ్రీవెంకటేశ్వర గార్డెన్స్లో 4 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. ఉన్న కొద్ది పాటి స్థలాన్ని సద్వినియోగం చేసుకుని ఏడాది కాలంగా మిద్దె తోటలను పెంచుతున్నారు ప్రదీప్. ఎర్రమట్టి, నల్లమట్టి, బాగా చివికిన పశువుల ఎరువు, ఇసుక, కొబ్బరి పీచు తగు పాళ్లలో కలిపిన మిశ్రమం ప్లాస్టిక్ డబ్బాలు, బక్కెట్లతో ధర్మోకోల్ బాక్సుల్లో వేసి మొక్కలు నాటారు. డబ్బాలు, బక్కెట్ల కింద ఇనుప స్టాండ్లను అమర్చి శ్లాబు సంరక్షణకు చర్య తీసుకున్నారు. వివిధ రకాల వంగ, టమోట, బెండ, తీగ బచ్చలి, తోటకూర, పాలకూర, గోంగూర, చిక్కుడు, బీర, కాకర, దోస, పొట్ల మొక్కలను పెంచుతున్నారు. మామిడి, తీపి నారింజ, గులాబి, జామ, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, ప్యాషన్ ఫ్రూట్, బ్లూ బెర్రీ, అంజూర, స్ట్రాబెర్రీ, జామ, యాపిల్ బెర్, స్టార్ఫ్రూట్, నిమ్మ, ఆల్ సస్పైసిస్, మెక్సికన్ అవకాడో వంటి అరుదైన మొక్కలను సేకరించి వాటిని మిద్దెపై పెంచుతున్నారు. సహజసిద్ధమైన పద్ధతిలో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఆరోగ్యదాయక ఆహారాన్ని ఇంటిల్లపాది భుజిస్తున్నారు. ఈ విషయాలను సామాజిక మాథ్యమాల్లో ప్రచారం సాగిస్తున్నారు. టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ పేరిట వాట్సాప్ గ్రూప్ను నిర్వహిస్తున్నారు. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు ఆహ్లాదం.. ఆరోగ్యం.. సుమారు సంవత్సర కాలంగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నాను. ప్రతి రోజూ మొక్కలను సంరక్షిస్తూ వాటితో గడపటం వల్ల ఆహ్లాదంతో పాటు రుచికరమైన కూరగాయలు, పండ్లు ఇంటి అవసరాలకు సమకూర్చుకోవచ్చు. పిల్లలకు కూడా సేంద్రియ పంటల ప్రాధాన్యం తెలిస్తే.. తామూ పండిస్తారు. వాటిని పండించే రైతులపై గౌరవమూ పెరుగుతుంది. – బొర్రా ప్రదీప్ (80749 73382), తెలుగు ఉపాధ్యాయుడు -
పెరట్లో పోషకాహార గని!
ఇంటి పరిసరాల్లోనే ఒకటికి పది రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు.. ఉంటే ఇక ఆ ఇంట్లోని పిల్లలు, పెద్దలు, వృద్ధులకు పౌష్టికాహార లోపం ఉండనే ఉండదు. గ్రామాల్లో ప్రతి ఇంటి ఆవరణలోనూ కూరగాయలు, పండ్ల చెట్లు పెంచుకోవటం ఆనవాయితీగా వస్తుండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు ఎంత మారిపోయాయీ అంటే.. పెరటి తోటలు దాదాపుగా కనుమరుగైపోయాయి. ఇతర వృత్తులు చేసుకునే వారితోపాటు వ్యవసాయ కూలీల కుటుంబాలే కాకుండా రైతు కుటుంబాలు కూడా కూరగాయలకు పూర్తిగా దుకాణాలపైనే ఆధారపడే దుస్థితి వచ్చింది. ఫలితంగా గ్రామీణుల్లో పౌష్టికాహార లోపం పెచ్చుమీరి పోయింది. పట్టణాల్లో పేద, మధ్యతరగతి వారి పరిస్థితీ ఇంతే. పెరటి తోటలు, మేడలపైన ఇంటిపంటల సాగు వైపు దృష్టి సారించడం ద్వారానే ఏడాది పొడవునా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందుబాటులోకి తేవటం సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిటీ బేస్డ్ ప్రకృతి వ్యవసాయ విభాగం (ఏపీసీఎన్ఎఫ్) పెరటి తోటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నది. రైతు కుటుంబాలు, వ్యవసాయ కూలీల కుటుంబాల కోసం వారి ఇళ్ల పరిసరాల్లోనే ‘సూర్యమండలం’ నమూనాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, తీగజాతి కూరగాయలు, పండ్లను ఏడాది పొడవునా సాగు చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. ‘సూర్యమండలం’ పంటల నమూనా అంటే? సౌరవ్యవస్థను పోలినరీతిలో.. అంటే గుండ్రని ఆకారంలో ఎత్తు మడులను తయారుచేసి.. వాటిల్లో వేర్వేరు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లచెట్లు, ఔషధ మొక్కలు సాగు చేసే పద్ధతి ఇది. ఎంత స్థలంలోనైనా సూర్య మండలం నమూనాలో పెరటితోటను ఏర్పాటు చేసుకోవచ్చు. విస్తీర్ణం పెరిగే కొద్దీ పంటల వైవిధ్యాన్ని పెంచువచ్చు. పండ్ల మొక్కలను నడి మధ్యలోనే కాకుండా సూర్యమండలం చుట్టూ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉండాలంటే కనీసం రెండు సెంట్ల స్థలంలో సూర్య మండలం ఏర్పాటు చేసుకోవటం బాగుంటుంది. అరసెంటు – సెంటు స్థలంలో సూర్య మండలం నమూనాలో ఎత్తు మడులు ఏర్పాటు చేసుకుంటే.. కుటుంబానికి ప్రతిరోజూ కిలో వరకు కూరగాయలు, ఆకుకూరలు వస్తాయి (అంతస్తుల మాదిరిగా, అన్ని పంటలూ కలిపి)మడులను సిద్ధం చేసుకునేటప్పుడు మట్టిలో ఒక సెంటు స్థలంలో సుమారు 50 కిలోల చొప్పున ఘన జీవామృతాన్ని కలపాలి. ప్రతి 15 రోజులకొకసారి మడులలో మొక్కలు పూర్తిగా తడిసేటట్లు ద్రవజీవామృతాన్ని పిచికారీ చేయాలి. ఒక వేళ పంటలపై చీడపీడల బెడద ఎక్కవగా ఉంటే అవసరాన్ని బట్టి కషాయాలను పిచికారీ చేసుకోవాలి. సూర్య మండలంలో (నమూనా చిత్రంలో చూపినట్లు) 15 ఎత్తు మడులు ఉంటాయి. రోజుకు ఒక మడిలో పెరిగే కూరగాయలు, ఆకుకూరలు వాడుకునే విధంగా ఏడు మడులను డిజైన్ చేశారు. ఏడు పెద్ద మడులు, ఏడు చిన్న మడులు ఉంటాయి. ప్రతి మడికి మధ్య కాలి బాటలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మడిలో కూరగాయ మొక్కలను అంతర పంటల పద్ధతిలో, అంతస్తుల మాదిరిగా వేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ రకాల పంటలు వేసుకోవాలి. పంటలను కాలానుగుణంగా మార్పిడి చేసుకోవాలి. అంటే.. ఒక మడిలో వేసిన పంటల కాపు పూర్తయ్యాక అక్కడ మళ్లీ అవే పంటలు వేయకూడదు. అంతర పంటలను ఎన్నుకునేటప్పుడు మిత్రపంటలు పక్క పక్కన ఉన్నట్లయితే మొక్కల ఎదుగుదల బాగుంటుంది. సూర్య మండలం మడుల్లో 365 రోజులూ పంటలు ఉండేలా.. కొద్ది వారాల వ్యవధిలో విత్తనాలు/మొక్కలు నాటుకునేలా.. ప్రణాళిక వేసుకోవాలి. కాలానుగుణమైన పంటల సరళి ఎంపిక ముఖ్యం. ప్రతిమడిలో పంటల వైవిధ్యం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మొక్కల మధ్య సంబంధాలు, సూక్ష్మజీవులతో సహజీవనం అనే ప్రకృతి వ్యవసాయ ప్రాథమిక సూత్రాలను ఇక్కడ అనుసరించాలి. సూర్య మండలం మధ్యలో వలయాకారంలో ఉన్న మడిలో తక్కువ నీడనిచ్చే పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు (ఉదా: అరటి, బొప్పాయి). సూర్యమండలం మధ్యలో నీటి పంపు వచ్చేలా బాగుంటుంది. మధ్యలో నుండి చివరి మడుల వరకు వాలు ఉన్నట్లయితే, నీరు అన్ని చోట్లకు సులువుగా చేరుతుంది. ఎక్కువ అయిన నీరు బయటకు పోయే ఏర్పాటు చేసుకోవాలి. ఎత్తు మడులు చేసుకొని, చుట్టూ ఇటుకలతో నిర్మాణం చేసుకొంటే ఎక్కువ కాలం మడులు చెదిరిపోకుండా ఉంటాయి. మడుల మధ్య కాలి బాటలపై పందిరి వేసుకొంటే తీగ జాతి మొక్కలను ఎగ పాకించుకోవచ్చు. సూర్యమండలం చుట్టూ కంచే ఉంటే పశువుల నుంచి రక్షణగా ఉంటాయి. అంతే కాకుండా తీగ జాతి మొక్కలను కంచెకు పాకించవచ్చు. మడుల అంచులలో దుంప జాతి మొక్కలు, ప్రతి మడిలో ఒక వరుసలో ఒక కాయ కూర పంట, రెండు కాయ కూర మొక్కల మధ్యలో ఆకు కూరలు విత్తుకొని పండించుకోవచ్చు. ప్రతీ మడి మధ్యలో ఎర పంటలు (బంతి వంటి పూల మొక్కలు) వేసుకోవటం తప్పని సరి. అవసరాన్ని బట్టి ఔషధ మొక్కలను కూడా చేర్చాలి. కషాయాలు తాగడానికి అవసరమైన మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సూర్యమండల నమూనాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏడాది పొడవునా పెరటి కూరగాయ తోటల సాగుపై ఇతర వివరాలకు.. రైతు సాధికార సంస్థ సైన్స్ విభాగం అధికారి డాక్టర్ గోవిందుల వెంకట రామన్ (94405 22885)ను సంప్ర దించవచ్చు. ‘సూర్యమండలం’ ప్రయోజనాలు ♦ ఏడాది పొడవునా తాజా కూరగాయల లభ్యత. దూరప్రాంతాల నుంచి ఇంధనం ఖర్చు చేసి కూరగాయల రవాణా చేయాల్సిన అవసరం ఉండదు. ♦ పెరటితోట ఉన్న కుటుంబానికి ఏడాది పొడవునా సమతుల ఆహారం అందుతుంది. ♦ పౌష్టికాహార లభ్యత వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. వైద్య ఖర్చులు తగ్గుతాయి. ♦ గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహార భద్రత పెరుగుతుంది. ♦ కుటుంబానికి రోజుకు ఒక కిలో కూరగాయలు, పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. ♦ సొంతంగా తయారు చేసుకునే ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలతోనే పంటల సాగు చేసుకోవచ్చు. ♦ రకరకాల దేశవాళీ కూరగాయ వంగడాల పరిరక్షణ సాధ్యమవుతుంది. ♦ చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు కూరగాయలు, ఔషధాలు కొనే ఖర్చు తగ్గి డబ్బు ఆదా అవుతుంది. ఆరోగ్యమూ చేకూరుతుంది. ♦ అయితే, ఇంటి దగ్గర తగినంత చోటు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇటువంటి వారికి ప్రభుత్వ స్థలంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెనింగ్ ప్లాట్స్ కేటాయించి, సూర్యమండల నమూనాలో కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఏపీ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు టి. విజయకుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ఈ ఏడాది ఏపీలో 7 లక్షల గ్రామీణ కుటుంబాల (భూమి లేని 3.5 లక్షల వ్యవసాయ కార్మిక కుటుంబాలు సహా)తో పెరటి తోటల సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ♦ గ్రామ రైతు భరోసా కేంద్రం వద్ద కూడా ఈ నమూనాను ప్రదర్శిస్తుండటం విశేషం. ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలను, సలహా ఇచ్చే నిపుణులనూ అందుబాటులో ఉంచుతున్నారు. గమనించాల్సిన విషయాలు 1 తీగ జాతి పాదులు పాకడానికి పందిళ్లు వేయాలి. సూర్యమండలం చుట్టూ కంచెకు కూడా పాకించవచ్చు. 2 పందిళ్లకు తీగ జాతి మొక్కలను తొలి దశలో జాగ్రత్తగా పాకించాలి. 3 కూరగాయ మొక్కల మధ్యలోనూ నేలపై పాకే గలిజేరు వంటి ఆకుకూర మొక్కలను పెంచుకోవచ్చు. సజీవ ఆచ్ఛాదనగా కూడా పనికివస్తాయి. -
తోటకు నిప్పు ..నటి కన్నీరు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: నెలమంగల తాలూకా సోలదేనహళ్లిలో సీనియర్ నటి లీలావతికి చెందిన తోటకు బుధవారం నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న లీలావతితోపాటు ఆమె కుమారుడు, కన్నడ హీరో వినోద్రాజ్ కూలీలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చినప్పటికీ తోట గేట్ ఇరుకుగా ఉండడంతో ఫైరింజన్ లోపలకు రావడానికి వీలుకాలేదు. ఆకతాయిలు సిగరెట్ తాగి వేయడంతో మంటలు వ్యాపించి ఉంటాయని వినోద్రాజ్ అభిప్రాయపడ్డారు. తోటలో పూలు,పండ్ల చెట్లు పెంచుతున్నారు. పశుపక్ష్యాదులకు ఆశ్రయం కల్పించారు. ప్రాణంగా చూసుకుంటున్న తోట కళ్లముందే కాలిపోవడంతో లీలావతి కన్నీరుమున్నీరయ్యారు. -
ఈ వనాన్ని తప్పక చూడాల్సిందే !
‘అది ఒక నందన వనము, దేవతలు విహరించే స్వర్గ ధామము’ అని వర్ణించినా ఆ వనం అందాలు తక్కువ చేసినట్లే. రంగురంగుల పూలు, ఆకులతో ఇంద్ర ధనుస్సును నేలపై పరిచినట్లుగా కనిపించే ఆ వనం ప్రకతి సిద్ధమైనది కాదు. మానవ నిర్మితమైనది. కేవలం ఇద్దరు భార్యా భర్తలు కలిసి ఆ వనాన్ని తీర్చి దిద్దిన తీరు అమోగం. అద్భుతం. ఇది మనం చెబుతున్న మాటలు కాదు. ఇప్పటి వరకు 48 దేశాల నుంచి వచ్చి సందర్శించిన దాదాపు 14 వేల మంది చెప్పిన అభిప్రాయాలు. ఇంగ్లాండ్కు చెందిన వెస్ట్ మిడ్లాండ్స్లోని వాల్సల్ పట్టణంలో ఈ వనం ఉంది. నీ దంపతులు తమ ఇంటి వెనక పెరట్లో ఈ వనాన్ని అభివృద్ధి చేశారు. టోనీ దంపతులు తమ ఇంటి వెనక పెరట్లో ఈ వనాన్ని అభివద్ధి చేశారు. ఆ వనానికి ఇంత వన్నెలొచ్చాయంటే మేరీ, టోని న్యూటన్ అనే ఇద్దరు దంపతులు చేసిన కృషే.. ఒకటి, రెండు ఏళ్లు కాదు, వారు 37 సంవత్సరాలు కషి చేస్తే ఈ వనం తయారయింది. ఇందులో అన్నీ 35 ఏళ్లున్న చెట్ల గుబుర్లే. ఆ భార్యా భర్తలిద్దరు 1982లో ఈ వనాన్ని పెంచడం మొదలు పెట్టగా ఇటీవల పూర్తయింది. అప్పుడు 40 ఏళ్లున్న వాళ్లకు ఇప్పుడు 71 ఏళ్లు. ఇద్దరిది ఒకే వయస్సు ఆ రంగుల వనంలో నివసిస్తున్నందున తాము ఇప్పటికీ ఆయురారోగ్యాలతో ఉన్నామని వారు చెబుతున్నారు. వాని వనంలో వివిధ దేశాల నుంచి తెచ్చిన మొక్కలు ఉన్నాయి. 450 రకాల అజాలీస్ (ముదురు రంగుల పూల మొక్కలు. ఎప్పుడూ చిన్నగానే ఉంటాయి), 120 జపనీస్ మాపుల్స్ (వివిధ రంగుల్లో చీలినట్లు హస్తం లాగా ఆకులు కలిగిన జపనీస్ జాతి మొక్కలు), 15 జూనిపర్ బ్లూస్టార్ (నీలి రంగు పూలు కలిగిన గుబురు చెట్లు) ఉన్నట్లు దంపతులు వివరించారు. ఈ వనానికి మరో విశేషం ఉంది. అన్ని రుతువుల్లో ఈ వనం ఇలాగే కనిపిస్తుందట. ఓ చెట్టు ఒక రంగు ఆకులు లేదా పూలు సీజన్లో రాలిపోతే మరో జాతి మొక్కకు అదే రంగు పూలు లేదా ఆకులు మొలవడం వల్ల అలా కనిపిస్తుందట. అయితే ఈ విషయం తెలిసిన బ్రిటన్ రాణి టోనీ దంపతులను పిలిచి సముచితంగా సత్కరించినట్లు తెలిసింది. ఈ వనం అభివద్ధికి మరీ ఎక్కువ కాకుండా 15 వేల పౌండ్లు (దాదాపు 14 లక్షల రూపాయలు) ఖర్చు అయ్యాయట. -
మనవరాలికి ప్రేమతో.. మిద్దె తోట
మనవలు, మనవరాండ్రకు నానమ్మలు ఎన్నో విలువైన బహుమతులు అందిస్తుంటారు. ఆట వస్తువులు, బొమ్మలు ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసి వారికి అందిస్తుంటారు. వారి మోములో ఆనందాన్ని నింపుతుంటారు. కానీ ఇక్కడ ఓ నానమ్మ విభిన్న ప్రత్యేకతను చాటుకున్నారు. ఏకంగా తన మనవరాలి కోసం మిద్దె తోటనే పెంచుతున్నారు. తన సంతానం ఎలాగూ వ్యవసాయ క్షేత్రాలు, మొక్కల మధ్య జీవితాన్ని గడపకపోవడాన్ని గమనించిన ఆమె తన ముద్దుల మనవరాలి కోసం ముద్దుముద్దుగా మిద్దె తోట పెంపకానికి ఉద్యుక్తులయ్యారు. బంజారాహిల్స్:బంజారాహిల్స్ రోడ్నంబర్ 13లోని శ్రీ సాయినగర్లో నివసిస్తున్న ప్రభా పొనుగోటి ఇంటి మిద్దెపైకి వెళ్లి చూస్తే అక్కడ ఏపుగా పొరుగుతున్న కూరగాయల మొక్కలతో పాటు బోన్సాయ్ వృక్షాలు, పాతకాలం నాటి కలెక్షన్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇదంతా ఆమె తన మనవరాలి కోసం తయారు చేయడం విశేషం. సాయినగర్లో నివసించే ప్రభా పొనుగోటి తల్లిదండ్రులతో పాటు అత్తామామలది వ్యవసాయ నేపథ్య ఉన్న కుటుంబాలు. తండ్రి, మామ ఇద్దరూ రైతులు కావడంతో ఆమెకు తోటలన్నా, వ్యవసాయ క్షేత్రాలన్నా ఇష్టంగా ఉండేది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత పంటలు చూడటం, కూరగాయల మొక్కలు కానరాకపోవడం ఆమెను ఒకింత ఇబ్బందికి గురి చేసింది. తన పిల్లలు ఎలాగూ వీటిని చూడలేదు. కనీసం తన మనవళ్లు, మనవరాళ్లైనా తోటలు చూడాలనే ఉద్దేశంతో తన ఇంటినే తోటగా మార్చేశారు. మనవరాలు ఇనారా కోసం ఆమె టెర్రస్పై ఏకంగా పెరటి తోట పెంచుతున్నారు. ఇందులో కూరగాయల మొక్కలతో పాటు తనకిష్టమైన బోన్సాయ్ వృక్షాలను కూడా పెంచుతున్నారు. ఆమె పెంచుతున్న కూరగాయల మొక్కలన్నీ ఆర్గానిక్వే కావడం విశేషం. ప్రస్తుతం చిక్కుడు, వంకాయ, బీన్స్, బెండకాయ, టమాట, పచ్చిమిర్చితో పాటు నాలుగు రకాల ఆకు కూరలు కూడా పండిస్తున్నారు. చూడచక్కని బోన్సాయ్ వృక్షాలు ప్రభా పొనుగోటి ప్రతిరోజూ మనవరాలు ఇనారాను తీసుకొని ఉదయం మిద్దె తోటలోకి అడుగు పెడతారు. వాటి సాగును పరిశీలిస్తారు. నీరు పోసి కలుపు తీస్తారు. ఇలా గంటపాటు మనవరాలితో కలిసి ఇక్కడే గడుపుతారు. ఇక సాయంత్రం మరో రెండు గంటలు ఈ తోటలోనే గడుపుతారు. ఇదంతా తన మనవరాలి కోసమే చేసినట్లు ఆమె వెల్లడించారు. కొడుకులు, కోడళ్లు ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో ప్రభ ఒంటరితనం నుంచి దూరం కావడానికి ఈ మిద్దె తోటను వేదికగా మార్చుకున్నారు. ఒక వైపు తోటను పెంచుతూనే ఇంకోవైపు ఇళ్లంతా బోన్సాయ్ వృక్షాలతో నింపేశారు. వాటి ఆలనాపాలనా కూడా చూస్తుంటారు. ఇటీవలే ఈ తోటలోకి కొత్తగా పునాస మామిడి, జామ, లక్ష్మణ్ సీతాఫలం, అవకాడ్ మొక్కలు వచ్చి చేరాయి. వీటిని పెంచేందుకు వర్మీ కంపోస్టు కూడా తయారు చేస్తున్నారు. మట్టివాసన..ఆస్వాదన కుటుంబ సభ్యులందరూ పెరటి తోటను ఆస్వాదించేందుకు, మట్టి వాసన చూసేందుకు వీలుగా మిద్దె మొత్తం మొక్కలతో నింపేశారు. మనవరాలి కోసం ఏకంగా మినీ గార్డెన్ను తయారు చేశారు. ప్రస్తుతం ఇనారా 14 నెలల చిన్నారి. ఆమె పేరుతో ప్రతినెలకు ఒక మొక్క చొప్పున ఈ గార్డెన్లో పెంచుతున్నారు. వీటికి తోడు గ్రామీణ ఇళ్లలోని ఉండే కాగులు, ఇసుర్రాయి కూడా ఆమె కలెక్ట్ చేశారు. మొక్కల కోసం వాడిపారేసిన బకెట్లు, వాష్ బాక్స్లు సేకరించి అందులోనే వాటిని పెంచుతున్నారు. టైర్లు, కొబ్బరిపీచు ఇలా పడేసిన వ్యర్థాలన్నీ కూరగాయలు, మొక్కల పెంపకం కోసం వినియోగిస్తున్నారు. ప్రతిరోజూ మూడు, నాలుగు గంటలు ఈ తోటలో గడపడం వల్ల తను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, ఇంటిల్లిపాది చక్కని గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని ప్రభ వెల్లడించారు. -
అంగన్వాడీ వంట.. ఇంటి పంట!
కంకిపాడు: అదొక అంగన్వాడీ కేంద్రం. అద్దె భవనంలో నడుస్తోంది. అయినా అక్కడ ఉన్న పెరడును సద్వినియోగం చేసుకుని నూట్రీ గార్డెన్ను ముచ్చటగా తీర్చిదిద్దారు. అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కూరగాయలను స్థానికంగానే సమకూర్చుకుంటున్నారు. న్యూటీ గార్డెన్ నిర్వహణతో మిగతా అంగన్వాడీ కేంద్రాలకూ ఆదర్శంగా నిలుస్తోంది కంకిపాడులోని ఐదో నంబరు అంగన్వాడీ కేంద్రం. స్థలం చిన్నదే.. ఈ అంగన్వాడీ కేంద్రం పట్టణంలోని రజక రామాలయం సమీపంలో నడుస్తోంది. ఈ కేంద్రానికి టీచరుగా వై.నళినీకుమారి, ఆయాగా బి.రజని విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రానికి ఎదురుగా సుమారు అర సెంటు స్థలం ఉంది. ఈ స్థలంలో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయాలని అంగన్వాడీ సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఆలోచన వచ్చిందే తడువుగా విజయవాడ నుంచి కూరగాయల విత్తనాలను కొనుగోలు చేశారు. ఉన్న కొద్ది స్థలంలోనే బెండ, వంగ, మిర్చి, గోరుచిక్కుడు, వీటితో పాటు ఆకుకూరల విత్తనాలు చల్లారు. పోషకాలతో కూడిన ఆహారం కొద్ది రోజులుగా ఈ గార్డెన్లో పండిన ఆకుకూరలు, ఇతర కూరగాయలనే అంగన్వాడీ కేంద్రంలో కూరలు సిద్ధం చేసేందుకు వినియోగిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నారు. ప్రతి రోజూ వంటలో ఆకుకూరలు, బెండకాయలు, వంకాయలు, చిక్కుడు వినియోగిస్తున్నారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి పెరడును శుభ్రం చేస్తూ అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను సమకూర్చుకుంటున్నారు. అన్ని అంగన్వాడీకేంద్రాల్లోనూ గార్డెన్లు అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద న్యూట్రీ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేంద్రంలో నిర్వహణ చాలా బావుంది. ప్రతి ఒక్కరూ గార్డెన్ల నిర్వహణపై శ్రద్ధ వహించి చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు బాధ్యతగా పనిచేయాలి.– జి.ఉమాదేవి, సీడీపీవో,కంకిపాడు -
మండు వేసవిలో ఈ ఆటో కూల్..
కోల్కతా : వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న క్రమంలో కోల్కతాలో ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. తన ఆటో పైన ఏకంగా ఓ గార్డెన్నే ఏర్పాటు చేశాడు. కోల్కతాకు చెందిన విజయ్ పాల్ తన ఆటో టాప్పై పచ్చని గడ్డిని పరిచి దానిపై పలు రకాల మొక్కలను పెంచాడు. తన ఆకుపచ్చని ఆటోపై రూఫ్టాప్ గార్డెన్తో విజయ్ పాల్ వెళుతున్న చిత్రాలు ట్విటర్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఆటో ఆకుపచ్చని రంగులో ఉండటమే కాకుండా పర్యావరణ హితమైన ఎల్పీజీతో దీన్ని నడిపిస్తున్నానని పాల్ చెబుతున్నాడు. రూఫ్టాప్ గార్డెన్లో ‘చెట్లను కాపాడండి...జీవితాలను కాపాడండి’ అనే నినాదాలను గార్డెన్ మధ్యలో బెంగాలీలో ఆయన రాయించాడు. ఆటోపైన ఏర్పాటు చేసిన గార్డెన్పై పాల్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాడు..గార్డెన్కు రోజూ నీరు పెట్టడంతో పాటు తన సంపాదనలో ఎక్కువ మొత్తం దీనిపై వెచ్చిస్తున్నాడు. తన ఆటోను వినూత్నంగా ప్రజల్లోకి తేవడం ద్వారా ప్రయాణీకులకు పాల్ అమూల్యమైన సందేశాన్నీ అందిస్తున్నాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. -
పుష్పకయాత్ర
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరం ఒకే ద్వారం గుండా విమానం ఎక్కే చోటికి చేరుకున్నాం.ఎంత గొప్పవాళ్ళు అయినా కూడా ఈ పుష్పకవిమానంలో ఎక్కాలంటే మాత్రం రాసి పెట్టి ఉండాలి. కొంతమంది విమానం వరకూ వచ్చినా సరే, వారిని తిరిగి వెనక్కి పంపుతున్నారు ద్వారం దగ్గర ఉన్న విచిత్ర వేషధారులు. పాపం దురదృష్టవంతులు. మామూలువిమానం కంటే ఇది ఏంతో భిన్నంగా ఉంది, బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. పూల మీద కాలు పెట్టామా అన్నట్లున్న మెట్లెక్కి విమానంలోకి చేరుకున్నాము. లోపల ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు ఉండేటట్లు ఉంది మరి! కొంతమందిని ఎందుకు వెనక్కి పంపారో అర్ధం అవటంలేదు. చుట్టూ ఇనుప రేకుల బదులు అద్దాలు బిగించినట్టు బయట పరిసరాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అద్దాలు కూడా లేవేమో, బయట నుండి మంచి సువాసనలతో కూడిన గాలి వీస్తూ ఉంది. దాని రెక్కలు ఏవో పక్షి రెక్కల లాగా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉంది. మేము మొత్తం ముప్పై ఆరుమందిమి పుష్పక ట్రావెల్స్ వారి విమానంలో యాత్రకు బయలుదేరాము. వాళ్ళలో ఇరవై మంది వరకూ నాకు తెలిసిన వాళ్ళే అవడం కాస్త విచిత్రంగా ఉంది. అందరం కూర్చున్నాము. ఉన్నట్టుండి విమానం సమాంతరంగా కాకుండా నిట్టనిలువుగా గాలిలోకి లేచింది. విమానం ముందుకు వెళ్ళే కొద్ది మేఘాలు కిందకు వెళుతున్నాయి. అయినా కూడా దారంతటా కొత్త మేఘాలు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ ఒక్కో ఆకారంలో ఉన్నాయి. విమానం అందమైన ఉద్యానవనంలోకి ప్రవేశించి ఆగింది. అందరు కిందికి దిగి చూడవచ్చని ఒక కంఠం ప్రకటించింది. ఆగొంతు ఎవరిదో? ఎవరూ కనబడలేదు. ఆకాశంలో ఉద్యానవనం ఏమిటా అని అందరం ఆశ్చర్యంగా చూస్తూ విమానం నుండి కిందికి దిగాము. ఆ వనంలో మరలా ఆకాశానంటుతున్నాయా అన్నట్టుగా ఏపైన చెట్లు,రంగురంగుల పూలు, పూల పుప్పొడిని గ్రోలుతున్నఅందమైనసీతాకోకచిలుకలు, పక్షులు, భారీ ఆకారం గల జంతువులూ తిరుగాడుతున్నాయి. మేము తప్ప ఎక్కడా మనుషులు కనిపించలేదు. అద్భుతపరిమళంతోట అంతటా పరుచుకుని ఉంది. అందరూ ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరితో నాకు పరిచయం లేదు. పరిచయం ఉన్న కొద్దిమంది మాత్రం కచ్చితంగా అంత ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు. మొదటగా చూసింది ఈ విమానం ఎక్కక ముందు, బస్సులో మేము చేసిన చార్ధామ్ యాత్రలో మాకు వంట చేసిపెట్టిన అరవవాడు. నేను ఎన్నో సార్లు వాడితో వంటల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడినా, వాడి పేరు నాకు తెలియదు. లేదు నేనడగలేదు. ముతక లుంగీ, మాసిపోయిన బనీను కట్టుకొని ఉండే వాడు కాస్తా, అందమైన తెల్లని దుస్తులు ధరించి ఉన్నాడు. ఎన్నో సార్లు వాడి మీద ఆధారపడి ఉండే కుటుంబం గురించి చెప్పేవాడు. నెలలో సగం రోజులు వారికి దూరంగా ఉంటున్నందుకు బాధపడుతూ ఉండే వాడు. ఇప్పుడు వాడి ముఖంలో అటువంటి ఛాయ లేమీ లేవు. కులాసాగా తిరుగుతూ చుట్టూ ఉన్న వాళ్ళతో కబుర్లు చెబుతున్నాడు. నాకేసి చూసి నవ్వాడు. అదే వాణ్ని నవ్వుతూ చూడటం. హటాత్తుగా నాకో అనుమానం వచ్చింది, వాడు ఇక్కడ ఉంటే మాకు వంట చేసే వాళ్ళు ఎవరు? చుట్టూ చూశాను అటువంటి ఏర్పాట్లు ఏమీ చేసినట్టు కనిపించలేదు. గంటకోసారి ఏదో ఒకటి తినే నాకు ఆశ్చర్యంగా అస్సలు ఆకలే అనిపించలేదు. ఎవరికీ ఆ ఆలోచన లేనట్టుంది. పాన్పు కంటే మెత్తగా ఉన్న గడ్డి మీద లేడి పిల్లలా గెంతుతూ అగుపడ్డాడు మా బస్సుకు క్లీనర్గా వచ్చిన అబ్బాయి. ఇంటి నుండి దూరంగా వచ్చానని ఎప్పుడూ ఉలుకూపలుకూ లేకుండా నత్తలాగుండే పద్నాలుగేళ్ళ కుర్రాడు. వాడు అంత ఆనందంగా ఉండటంచూసి నాకు ఆశ్చర్యమేసింది. మరో వైపున ఉన్న జనాలలో నవ్వుతూ, తుళ్ళుతూ సరదాగా కబుర్లు చెప్తూ కనబడింది ఆమె. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకోవడంతో ఎప్పుడూ కోపంగా, దిగులుగా, అకారణంగా పోట్లాడుతూ ఒంటరిగా ఉండేది. అలాంటి ఆమె ఇలా అందరితో కలిసి ఉల్లాసంగా కబుర్లాడుతూ ఉండటం నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆనందమే సుమా అసూయ మాత్రం కాదు, నిజంగా. ఒకచోట కొందరు చుట్టూ చేరి ఆశ్చర్యంగా చూస్తున్నారు. బస్సులో కదలకుండ గంట కూర్చుంటే కాళ్ళు ఉబ్బిపోయి, గట్టిగా నాలుగు అడుగులు వేస్తే ఆయాసపడే అతడు పూనకం వచ్చిన వాడిలా గాల్లో ఎగిరెగిరి చిందులు వేస్తున్నాడు. ఒకప్పుడు తన ఆటపాటలతో జనాలను ఓలలాడించిన అతనికి, అప్పటి జవసత్వాలు తిరిగి వచ్చినట్టున్నాయి. మైమరిచి ఆడుతున్నాడు అతను. విమానంలోకి తిరిగి రమ్మని గొంతు వినిపించేసరికి అందరూ వచ్చి విమానం లోనికి ఎక్కుతున్నారు. నిన్నటి దాకా నేను చూసిన వాళ్ళలా అగుపించలేదు ఎవరూ. కర్మ ఫలాన్ని రోగాల రూపంలో అనుభవిస్తూ, కడుపున పుట్టిన వారి ఆదరణకు నోచుకోక నిరాశా పూరిత వదనాలతో, ఇష్టమైనది తినలేక, కనీసం ఏదో ఒకటి తినడానికి కూడా సహకరించని వణికే శరీరాలతోఉండేవారు కాస్తా ఇప్పుడు ధవళ వర్ణదుస్తులు ధరించి, వెలిగే కండ్లతో, నిటారుగా నిలిచిన శరీరాలతో, అంతులేని ప్రశాంతత గలిగిన వదనాలతో ఉన్నారు. ఇంత మార్పు ఎలా సాధ్యమైందో తెలియలేదు. కనీసం విమానం వాళ్ళు తాగడానికి కూడా ఏమీ ఇవ్వలేదు, దాని వల్ల ఇలా మారాము అనుకోవడానికి. నేను కూడా అలాగే మారానా? నా శరీరంలో కూడా మార్పు తెలుస్తోంది. ఒకసారి నన్ను నేను అద్దంలో చూసుకుందామని అనుకున్నా. విమాన సహాయకులను అద్దం అడుగుదామని చుట్టూ చూశాను. అటువంటి వారు ఎవరూ కనబడలేదు. అసలు విమానాన్ని నడుపుతున్నట్టు కూడా ఎవరూ కనబడలేదు. కంగారు కలిగిందా, లేదు అస్సలు కలగలేదు. విమానం తిరిగి బయలుదేరి ఎంతో సేపు అయింది. ఇంకా గమ్యం రాలేదు. అయినా చిరాకు కలగలేదు. ఇంత ప్రశాంతత నాలో ఎలా కలిగింది. నాకే ఆశ్చర్యంగా ఉంది. చుట్టూ చూశాను, అందరూ అలాగే ఉన్నారు. ఎవరూ అలిసిపోయినట్టు, నిద్రపోతున్నట్టు అనిపించలేదు. గమ్యస్థానం చేరుకున్నాము, అందరూ దిగవలసిందిగా కోరుతున్నాం అంటూ మరోసారి ఆ కంఠం వినబడింది.అందరం కిందికి దిగాం. ఇక్కడ ఎటు చూసినా జనమే కనబడుతున్నారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. దూరంగా కొన్ని కౌంటర్లు, ప్రతి కౌంటర్ ముందు పెద్ద వరుసలో చాలా మంది నిలబడి ఉన్నారు. మేమూ ఆ లైన్లో నిలబడ్డాము. ఆకౌంటర్లలో ఉన్న వ్యక్తులు లైన్లో నిలబడి ఉన్న వాళ్ళను ఏదో అడుగుతూ, లైన్లో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాక తన దగ్గర ఉన్న కంప్యూటర్ లాంటి దాంట్లో ఏదో రాసుకుంటున్నారు. సమాధానం చెప్తున్న వాళ్ళ ముఖాలు కాసేపు ఆనందంతో, కాసేపు బాధతో రకరకాలుగా మారుతున్నాయి. సమాధానం చెప్పిన తర్వాత పక్కకు వచ్చిన వాళ్ళు రెండు వేరువేరు ద్వారాల గుండా వెళుతున్నారు. కొంతమంది విచిత్ర వేషధారులు వాళ్ళను దగ్గర ఉండి లోపలి తీసుకెళ్తున్నారు. మొదటి ద్వారం గుండా వెళ్తున్న వాళ్ళు ఆనందంగా వెళుతుంటే, రెండో ద్వారం గుండా వెళ్తున్నవాళ్ళు వడలిన ముఖాలతో వెళుతున్నారు. రెండో ద్వారం గుండా వెళ్తున్న వాళ్ళలో మళ్ళీకొంతమంది నిర్భయంగా వెళ్తుండటం ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. మా ముప్పై ఆరు మంది వంతు వచ్చింది. మెల్లగా ఒక్కొక్కరు కౌంటర్ దగ్గరకు చేరుకుంటున్నారు. నా వంతు వచ్చింది. నేను కౌంటర్ లోని వ్యక్తి వైపు చూశాను. అత్యంత గంభీరంగా ఉన్న అతని వదనంలో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది. అతను నా పేరు అడిగాడు. నేను కథకుడు అని చెప్పాను. అతను కథకుడు జననం 1963, మరణం 2019 అని రాసుకున్నాడు. మరణం, మరణమా, అంటే నేను మరణించానా అని ఆశ్చర్యంగా అడిగాను అతన్ని. అతను నా చేతిని అతని దగ్గర ఉన్న పుస్తకంపై ఉంచాడు.అప్పటివరకు నా జీవితంలో జరిగిన ప్రతి విషయం కండ్ల ముందు మెదలసాగాయి. మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుండి ప్రతి సంఘటన కనపడుతున్నది. ఆయా సంఘటనలు నాకు మిగిల్చిన అనుభూతులకు అనుగుణంగా ముఖంలోని రంగులు మారుతున్నాయేమో. పెదవులు నవ్వుతున్నాయి, బిగుసుకుంటున్నాయి, కండ్ల నుండి నీళ్ళు కారుతున్నాయి. చివరగా నేను బస్సులో నిద్రలో ఉన్నాను, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ చీకట్లో చిన్న వెలుగు దగ్గర బస్సు ఆగింది. బస్సు దిగి వెళ్ళిన డ్రైవర్ కాసేపటికి తూలుతూ వచ్చాడు. ఇంకాసేపటికి బస్సు కూడా తూలడం మొదలుపెట్టింది. దాదాపు ఎదురుగా వస్తున్న వాహనాన్నిఢీ కొట్టబోయి తృటిలో తప్పించుకుంది. డ్రైవర్ ఊగుతూ చివరికి స్టీరింగ్ మీదకు ఒరిగిపోయాడు. బస్సు అదుపుతప్పింది. వందల అడుగుల లోతున్న లోయలోకి దొర్లింది. అందరం నిద్రలో ఉండగానే చనిపోయాము. ఎలా చనిపోయామో కూడా ఎవరికీ తెలియదు. చెయ్యి పుస్తకం పైనుండి తీశాను. మరి విమానం దగ్గరి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిన వారు ఎవరు అని అడిగాను. ఓ అదా వాళ్లు చావు అంచుల దాకా వచ్చి, భూమి మీద ఇంకా నూకలు ఉండి తప్పించుకున్నవారు. అంటే వాళ్లు దురదృష్టవంతులు కారు, అదృష్టవంతులు అని గ్రహించాను. అందరితో పాటూ నేను ద్వారాల వైపు నడవసాగాను.కొందరు విచిత్రవేషధారులు వచ్చి ఒక ద్వారం వైపు నన్ను తీసుకుని వెళ్లి అక్కడి వరుసలో నిలబెట్టారు. అదిఏం ద్వారం అని అడిగాను. స్వర్గానికి వెళ్ళే ద్వారం అని చెప్పాడు. అటు వైపుది నరకానికి వెళ్లే ద్వారం అని చెప్పాడు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే నేను నిలబడింది స్వర్గ ద్వారానికి ఎదురుగా. నిలబడి అందరి వైపు చూడసాగాను. ఇప్పుడువాళ్ళ మనసులో విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇంతకూ ఆత్మలకు మనసు ఉంటుందా ఏమో తెలియదు. కాని వాళ్ళు అనుకునే విషయాలు కూడా తెలియసాగాయి.మోకాళ్ళనొప్పులతో బాధ పడే కళాకారుడు,బాధ, నొప్పి నుండి విముక్తి లభించిందని ఆనందంగా ఉన్నాడేమో.పెద్దకొడుకు దగ్గర ఒకరు, చిన్న కొడుకు దగ్గర ఒకరు ఉంటూ యాత్రకు కలిసి వచ్చిన ఆ దంపతులు ఇక ఒకరికిఒకరు దూరంగా ఉండక్కర్లేదని భావిస్తున్నారేమో. పిల్లలకు భారం అవలేదని, ఛీత్కారాలు పడక్కర లేదని ఆ పండు ముదుసలి అనుకుంటుందేమో. దేవుణ్ణి దగ్గర నుంచి చూసేంత దరికి చేరానని, కైవల్యం ప్రాప్తించిందని ఆ పంతులు భావిస్తున్నాడేమో. నరకపు ద్వారం వైపు చూశాను.. అనవసరంగా డబ్బు సంపాదనలో పడి పాపాలు చేసి, కనీసం కడుపుకు కూడు కూడా సరిగా తినలేకపోయానని ఆ వ్యాపారి వగరుస్తున్నాడేమో, నలుగురు మరణించిన ప్రమాదానికి కారణమైన అతను ఫోన్ మాట్లాడుతూ కారు నడపకుండ ఉండాల్సిందని భావిస్తున్నాడేమో, ఇక నుంచి తన సంపాదన గురించి తల్లిదండ్రులు, భార్య వాదులాడుకోనక్కర లేదని ఆ కుర్రాడు సంతోషిస్తున్నాడేమో. అనయాస మరణం లభించిందని ఆ రోగిష్టి వాడు నవ్వులు చిందిస్తున్నాడేమో, నరకప్రాయమైన ఆ జీవితం కంటే ఈ నరకమే మేలేనేమోనని ఆ అతివ స్థిమితంగా ఉందేమో, అంతమంది జీవితాలను నాశనం చేశానని మా బస్సు డ్రైవర్ దుఃఖిస్తున్నాడో. లేక బాధల నుండి అందరికి ముక్తి చేకూర్చానని ఉప్పొంగిన గుండెలతో ఉన్నాడో...అందరూ ఎలా ఉన్నా నాలో ఉన్న కథకుడు మాత్రం నేను చూసిన, చేసిన ఈ మరణాంతర ప్రయాణాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కాంక్ష మొదలయింది. ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఆ కోరిక తీవ్రమైంది. ద్వారం దగ్గరి అద్దాలలో నన్ను చూసుకున్నాను. నా ముఖంలో ఆందోళన ప్రస్పుటంగా కనబడుతోంది. ద్వారం దగ్గర ఉన్న భటుడు నన్ను ఆపాడు. నా ముఖం వైపు చూసి తీవ్రమైన కోరికలతో ఉన్న వాళ్ళు స్వర్గప్రవేశానికి అనర్హులు. కోరికలను తీర్చుకోవడానికి మరొక జన్మ ఎత్తుపో అంటూ తన శూలంతో నన్ను నెట్టి వేశాడు. భూమి మీద మళ్ళీజన్మెత్తాను. నాకు తెలిసిన కథనంతా ప్రపంచమంతా ఎలుగెత్తి చాటుతున్నాను. బతికుండగానే మంచి పనులు చేయండి,మరణిస్తే మీతో పాటూ ఏదీ రాదు అని గొంతు చించుకుని అరుస్తున్నాను. అరిచీ అరిచీ అలిసిపోయి చుట్టూ చూశాను. నన్ను ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. తిరిగి మళ్ళీ అరవాలని గొంతెత్తాను. ఛీ ఎదవ కుక్క ఊరికే అరుస్తా ఉంది అంటూ ఎవడో రాయి విసిరాడు. కుయ్ మనుకుంటూ అక్కడి నుండి పరిగెత్తాను నా నాలుగు కాళ్ళ మీద. - శ్రీకాంత్ రెడ్డి -
ప్రేమే సృష్టి
సరే, పిల్లలంతా ఆరుబయట చెట్లు నాటారు, మేము అనుకునేదేమంటే, ఇదంతా కూడాను చదువులో భాగమే, వాటి వేర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం, అలాగే ఒకదాని గురించి బాధ్యతగా ఉండటం, ఒకదాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. చెట్లు అన్నీ చచ్చిపోయాయి. అవి ఆరెంజ్ చెట్లు. అవి ఎందుకు చనిపోయాయో నాకు తెలీదు, కానీ చనిపోయినై. భూమి మట్టితోనే ఏదైనా సమస్య ఉందో, నర్సరీలోంచి వచ్చినవే మంచివి కాదో. దాని గురించి ఫిర్యాదైతే చేశాం. మొత్తం ముప్పై మంది పిల్లలున్నారు, ప్రతి చిన్నారి ఒక్కో మొక్క నాటాలి, చూస్తే ముప్పై చెట్లూ చనిపోయినై. ఆ ఎండిపోయిన కట్టెలను పిల్లలు చూస్తూవుంటే, డిప్రెసింగ్గా ఉండింది. మరీ అంత బాధేం ఉండేది కాదుగానీ, ఈ చెట్ల వ్యవహారం జరగడానికి కొన్ని వారాల ముందు పాములన్నీ చచ్చిపోయినై. కనీసం అవి చనిపోవడానికి ఓ కారణం అయితే కనబడింది, బాయిలర్ నాలుగు రోజులు ఆగిపోయింది సమ్మె వల్ల. కనీసం ఇదీ అని పిల్లలకు వివరించి చెప్పొచ్చు. అందుకే పరిస్థితులు మామూలైన తర్వాత పాములను చూసినప్పుడు పిల్లలు మరీ కలత చెందలేదు. ఔషధ మొక్కల గార్డెన్ విషయంలో అయితే అది నీళ్లు మరీ ఎక్కువ పెట్టడం అయివుండాలి, కనీసం పిల్లలకు ఇప్పుడు తెలుసు నీళ్లు ఎక్కువ పోయకూడదని. పిల్లలు ఆ గార్డెన్ మీద మరీ ఎక్కువ పట్టింపుతో ఉండి, అందులో ఎవరైనా మేము చూడనప్పుడు కొన్ని నీళ్లు ఎక్కువ పోసివుంటారు. అనుకోగూడదుగానీ ఎవరైనా కావాలని చేసిందా అన్న ఆలోచన కూడా మాకు రాకపోలేదు. అలా ఎందుకు అనుకున్నామంటే, దీనికంటే ముందు ఎడారి ఎలుకలు చనిపోయినై, తెల్ల చిట్టెలుకలు చనిపోయినై, నలికండ్లపాములు చనిపోయినై... సరే, ఇప్పుడు వాళ్లకు తెలుసు వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకుపోవద్దని. ఉష్ణమండల చేపలు చనిపోతాయని మాత్రం ఊహించాం, అదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. పెద్ద సంఖ్యలో, ఉపరితలానికి వచ్చి, మెలి తిరిగి వెల్లకిలా పడిపోయినాయి. ఆ సమయంలోనే మా పాఠ్య ప్రణాళికలో ఉష్ణమండల చేపలు చూపాలని ఉండింది, కానీ మేము ఏమీ చేయలేకపోయాం. మేము కనీసం ఓ కుక్కపిల్లను ఉంచుకునే వీలు లేకపోయింది. అది చిన్న కుక్కపిల్ల, దాన్ని మర్డోక్ చిన్నారి గ్రిస్టెడె ట్రక్కు కింద చూసింది, ఆ డ్రైవరు అప్పుడే డెలివరీ పూర్తిచేసుకున్నాడు, ఆ ట్రక్కు దాని మీద ఎక్కడ ఎక్కేస్తుందేమో అని తెగ భయపడిందట, వెంటనే దాన్ని తన బ్యాగులో పెట్టుకుని స్కూలుకు తెచ్చేసింది. కానీ దాన్ని చూసిన మరుక్షణం, దేవుడా, అది రెండు వారాలకు మించి బతకదేమో అనిపించింది... చివరకు అదే జరిగింది. నిజానికి అది తరగతి గదిలో ఉండకూడదు కూడా, అట్లా అని పాఠశాల నిబంధనలు ఏవో ఉండినాయి, కానీ పిల్లలతో మీరు కుక్కపిల్లను క్లాసులోకి తేవొద్దని చెప్పలేరు, అది అప్పటికే వచ్చి మీ కళ్లముందు కనబడుతూ, ఈ మూల నుంచి ఆ మూలకు గెంతుతూ కుయ్యికుయ్యిమంటూ ఉన్నప్పుడు. దానికి వాళ్లు ఎడ్గర్ అని పేరు పెట్టారు, నా పేరు మీదుగానే! ఇంక చూడండి, దానితో వాళ్లు చేసే తమాషా, ‘బాగుంది ఎడ్గర్!’, ‘ఇటు చూడు ఎడ్గర్!’ అంటూ ఒకటే అరవడం, ఒకటే నవ్వడం. నేను కూడా సంతోషపడ్డాను, నన్ను ఆటపట్టిస్తుంటే నాకు బానేవుంటుంది. వాళ్లు సామానుల గదిలో దానికో చిన్న ఇల్లు అదీ కూడా కట్టారు. అదెందుకు చనిపోయిందో అంతుపట్టలేదు, కుక్కలకు తగిలే ఏదైనా అంటువ్యాధి అయివుండాలి. బహుశా దానికి టీకాలు వేయించివుండరు. పిల్లలు స్కూలుకు వచ్చేలోపలే దాన్ని తీయించేశాను. ప్రతిరోజు పొద్దుటే నేను ఆ సామాన్ల గదిని చూస్తూ వచ్చాను, ఓ దినచర్యలాగా, ఏం జరిగే ప్రమాదముందో ఒక అంచనావుంది కాబట్టి. దాన్ని కస్టోడియన్కు అప్పగించాను. ఆ తర్వాత ఈ కొరియన్ అనాథ, హెల్ప్ ద చిల్డ్రెన్ కార్యక్రమంలో భాగంగా క్లాస్ తరఫున దత్తత తీసుకున్నాం, ప్రతి చిన్నారీ నెలకో పావలా డాలర్ చొప్పన ఇవ్వాలనేది ఆలోచన. ఆ పిల్లాడి పేరు కిమ్, మేము దత్తత తీసుకోవడమే ఆలస్యమైందో ఏమోగానీ దురదృష్టకరమైన సంగతి. అతడి మరణానికి కారణం ఏమిటో మాకు వచ్చిన ఉత్తరంలో పేర్కొనలేదు, కానీ మేము ఇంకో దత్తతకు వెళ్లమని సలహా అయితే ఇచ్చారు, కొన్ని ఆసక్తికరమైన కేసు హిస్టరీలు కూడా పంపారు, కానీ మాకు అప్పటికే గుండెలు జారివున్నాయి. అందరూ మరీ డీలా పడిపోయారు, నాతో ఎవరూ నేరుగా ప్రస్తావించలేదుగానీ, అసలు స్కూలులోనే ఏదో దోషం ఉందని అనుకోసాగారు. నాకేమీ ప్రత్యేకంగా స్కూలులో ఏదో దోషం ఉన్నట్టు కనిపించలేదు, నేను మంచి చూసినవాణ్ని, చెడు చూసినవాణ్ని. ఏదో అదృష్టం బాగాలేదంతే. చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూడా చనిపోయారు, ఆ మాటకొస్తే. రెండు గుండెపోట్లు, రెండు ఆత్మహత్యలు, ఒకరు నీటమునిగి, ఇంకో నలుగురు కారు ప్రమాదంలో. ఒకరికి స్ట్రోక్ వచ్చింది. ప్రతి ఏడాదీ తాతలు, బామ్మల మరణాలు మామూలుగానే ఎక్కువే సంభవిస్తుంటాయి, ఈ సంవత్సరం మరీ ఎక్కువున్నట్టున్నాయి. చివరకేమో ఈ దారుణం. దారుణం ఎలా జరిగిందంటే– ఈ మాథ్యూ వెయిన్, టోనీ మావ్రోగార్డో ఇద్దరూ ప్రభుత్వ కార్యాలయ భవనం కోసం తవ్వుతున్న పునాదుల దగ్గర అడుకుంటున్నారు. అక్కడే పెద్ద పెద్ద దూలాలు కుప్పవేసి వున్నాయి. వాటిని సరిగ్గా పెట్టలేదని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు, దానిమీద కోర్టు కేసు అయితే రానుంది. ఏది సత్యమో ఏది కాదో నాకైతే తెలీదు, కానీ ఈ సంవత్సరం మాత్రం బాలేదు. ఇంకోటి మరిచిపోయాను, బిల్లీ బ్రాంట్ వాళ్ల నాన్నను ఎవడో ముసుగు తొడుక్కున్న అగంతకుడు కత్తితో దారుణంగా పొడిచాడు, ఇంట్లో జొరబడినప్పుడు వాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు. ఒకరోజు క్లాసులో చర్చ జరిగింది. ఇవన్నీ ఎటు పోయాయని వాళ్లు ప్రశ్నించారు, ఆ చెట్లు, ఆ నలికండ్లపాములు, ఆ ఉష్ణమండల చేపలు, ఎడ్గర్, నాన్నలు, అమ్మలు? మాథ్యూ, టోనీ, వీళ్లు ఎటు పోయారు? నాకు తెలీదు, తెలీదు అని జవాబిచ్చాను. మరి ఎవరికి తెలుసని అడిగారు. ఎవరికీ తెలియదని జవాబిచ్చాను. అప్పుడు వాళ్లు, అంటే ఈ జీవితానికి అర్థాన్ని ఇచ్చేది ఈ మరణమా అని అడిగారు. లేదు, లేదు, జీవితానికి అర్థం కల్పించేది జీవితం మాత్రమే అని చెప్పాను. తర్వాత వాళ్లు ఏమన్నారంటే, కానీ ఈ చావు అనేది లౌకిక ప్రపంచంలో రోజువారీ భరించి తీరవలసిన రొష్టును అధిగమించే దిశలో మనని కొనిపోయే మూలసూత్రంగా పరిగణిస్తారు కదా–– అవును, కావొచ్చు, అన్నాను. మాకు నచ్చలేదు, అన్నారు వాళ్లు. ఊమ్ బాగుంది, అన్నాను. ఎంత సిగ్గుమాలిన విషయం, అన్నారు. ఒప్పుకున్నాను. అయితే మీరు ఇప్పుడు హెలెన్(మా టీచింగ్ అసిస్టెంట్)ను మా ముందు ప్రేమించండి, ఎలా చేయాలో మేము చూస్తాం. మాకు తెలుసు మీకు హెలెన్ అంటే ఇష్టమని అన్నారు వాళ్లు. నాకు హెలెన్ అంటే ఇష్టమే, కానీ అలా చేయలేనని చెప్పాను. మేము దాని గురించి చాలా విన్నాం, కానీ మేము ఎప్పుడూ చూడలేదు అన్నారు వాళ్లు. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు, పైగా అది ఎవరూ, ఎక్కడా ఇంతకుముందు ప్రదర్శించి చూపలేదని చెప్పాను. హెలెన్ కిటికీలోంచి చూసింది. ప్లీజ్ ప్లీజ్, మీరు హెలెన్ను ప్రేమించండి, మాకో విలువ ఉందని నమ్మకం కలిగించండి, మాకు భయమేస్తోంది, అన్నారు వాళ్లు. ఆ విలువ అంతటా ఉందనీ, (నాకూ భయమేస్తున్నప్పటికీ) మీరు భయపడనవసరం లేదనీ చెప్పాను. హెలెన్ వచ్చి నన్ను కౌగిలించుకుంది. ఆమె కనుబొమ్మలను నేను కొన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాను. పిల్లలు కేరింతలు కొట్టారు. ఇంతలో తలుపు దగ్గర ఏదో చప్పుడైంది, వెళ్లి తీశాను, కొత్త ఎడారి ఎలుక లోనికి వచ్చింది. పిల్లలు ఆనందంతో అరిచారు. నాతో ఎవరూ నేరుగా ప్రస్తావించలేదుగానీ, అసలు స్కూలులోనే ఏదో దోషం ఉందని పిల్లలంతా అనుకోసాగారు. సుప్రసిద్ధ అమెరికన్ కథకుడు, నవలాకారుడు డోనాల్డ్ బార్తెల్మె (1931–1989) రాసిన ‘ద స్కూల్’ కథ ఇది. 1974లో న్యూయార్కర్ లో ప్రచురించబడింది. నిరాశామయ, విధ్వంసకర ప్రపంచంలో ఇంకా ప్రేమ అనే ఆశ ఉందని ప్రతీకాత్మకంగా చెప్పిన కథ ఇది. ముగింపు అసభ్యకరంగా ఉందని విమర్శించినవాళ్లున్నారు. అయినప్పటికీ క్లాసిక్గా గుర్తింపు వచ్చింది. సంక్షిప్త అనువాదం: సాక్షి సాహిత్యం డెస్క్. -
చెక్క పెట్టెల్లో ఎంచక్కా ఇంటిపంటలు!
హైదరాబాద్ మియాపూర్లో సొంత భవనంలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ వక్కలెంక శ్రీనివాసరావు కుటుంబం గత కొన్నేళ్లుగా టెర్రస్పై సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యదాయకమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వాడేసిన చెక్క పెట్టెలను స్వల్ప ధరకే కొనుక్కొచ్చి గార్డెన్కు అనుగుణంగా పెట్టెలను తనంతట తానే తయారు చేసుకొని, ప్లాస్టిక్ షీట్ వేసి మట్టి మిశ్రమం నింపి ఇంటిపంటలు పండిస్తుండటం శ్రీనివాసరావు ప్రత్యేకత. 5% ఎర్రమట్టి + 40% కొబ్బరి పొట్టు + 45% ఆవు, గేదె, గుర్రం, గొర్రెల ఎరువులు ఎన్ని రకాలు దొరికితే అవి, వర్మీకంపోస్టు కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నారు. చెక్క పెట్టెల వల్ల ఎండ దెబ్బ నుంచి మొక్కలను సులభంగా పరిరక్షించుకుంటున్నారు. తమ కుటుంబానికి అవసరమైన ఆకుకూరలను 100%, కూరగాయలను 60–70% మేరకు ఇంటిపైనే పండించుకుంటున్న శ్రీనివాసరావు (91829 71978) అభినందనీయులు. -
మొక్కనైనా కాకపోతిని
మొక్కల్తో పెనవేసుకున్న బంధం ఆమెను కదలనివ్వడం లేదు. కానీ భర్త రిటైర్ అయితే క్వార్టర్స్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలి! తప్పదు. పుణెలోని ‘మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ క్యాంపస్. అందులో ఓ విశాలమైన ఇల్లు. ఇంటి వెనుక అంతకంటే విశాలమైన తోట. ఆ తోటలో వందల యేళ్ల నాటి మహావృక్షాలు. వాటిల్లో ఒక మర్రి చెట్టు కొమ్మలకు, ఊడలతో పాటుగా ఒక ఊయల కూడా వేలాడుతుంటుంది. రోజూ ఉదయాన్నే 97 ఏళ్ల పెద్దాయన ఆ ఊయలలో కూర్చుని పేపర్ చదువుకుంటారు. సూర్య కిరణాలు ఒంటిని తాకింది ఇక చాలనిపించే వరకు అక్కడే కూర్చుని, కూతురు పెంచిన తోటను మురిపెంగా చూసుకుంటారు. ఆ పక్కనే మరో మర్రి చెట్టు చుట్టూ నేలపై వంద అడుగుల మేర రాళ్లు పరిచి, తొమ్మిది సిమెంట్ స్టూళ్లు వేసి ఉంటాయి. సాయంత్రం ఇరుగుపొరుగు క్వార్టర్ల వాళ్లు వచ్చి అక్కడ కూర్చుంటారు. గార్డెన్లో పెరిగిన క్రోటన్స్, గులాబీలు, వంకాయలు, టమాటాలు, బ్రోకలీ, కాకరకాయ తీగలు, గుమ్మడి పాదు, పాలకూర మడి, క్యాలిఫ్లవర్ తోపాటు అప్పుడెప్పుడో కాసిన నాలుగు అడుగుల సొరకాయ కూడా చర్చకు వస్తూనే ఉంటుంది. ఆవు పేడ, టీ డికాక్షన్తో పెరిగిన ఆర్గానిక్ గార్డెన్ అది. ఇవన్నీ.. 60 ఏళ్ల మంజు బెహెన్ చేతితో పెరిగిన తోట విశేషాలు. క్యాంపస్లో మంజు బెహెన్ భర్తకు కేటాయించిన క్వార్టర్ చుట్టూ ఉన్న 15 వందల చదరపు అడుగుల నేలలో ఒక్క అడుగును కూడా వృథాగా వదల్లేదామె. మర్రిచెట్ల నీడన మరే మొక్కా మొలవదు కదాని మర్రి చెట్లనూ వదల్లేదు. చెట్ల నీడను సిట్టింగ్ ఏరియాగా మలిచింది. మంజు బెహెన్ది ఎం.పి.లోని జబల్పూర్. తొమ్మిదేళ్ల వయసులో తల్లి ఆమెకు రోజూ రెండు పూటలా మొక్కలకు నీరు పోసే బాధ్యత అప్పగించింది. అలా మొదలైన అలవాటు ఆమెకు ఆరు పదులు నిండుతున్నా కొనసాగుతూనే ఉంది. ‘మొక్కకు నీరు పోయని రోజు ఒక్కటీ లేదు’ నా జీవితంలో అంటోందామె. అంత చక్కగా గార్డెన్ పెరిగితే పక్షులు ఊరుకుంటాయా? చిలుకలు ఆకుల్లో కలిసి తొంగి చూస్తుంటాయి. ఉడుతలు కిచకిచమంటూ కొమ్మల మధ్య విహరిస్తుంటాయి. ‘పిల్లి, ఉడుత కలిసి పెరిగేది నా తోటలోనే’ అంటుంది మంజు బెహెన్ గర్వంగా. ఆమె ఇరుగుపొరుగు వాళ్లు బయటి ఊళ్లకు వెళ్లేటప్పుడు వాళ్ల పెంపుడు కుక్కలు, పిల్లుల్ని ఈ తోటలోనే వదిలిపెడతారు. ‘మా నాన్నకు, కూతురు, కోడలు, కొడుకు, మనుమలు, మనుమరాళ్లకు తోటలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైన ప్లేస్ ఉంది. ఇప్పుడు నా భర్త రిటైర్ అయితే క్వార్టర్ను ఖాళీ చేయాలి. ఈ తోటను వదిలి వెళ్లక తప్పదు’ అంటోంది మంజు బెహెన్. అదే ఇప్పుడామె బెంగ. -
నా తోటే నాకు ముఖ్యం!
సంతమాగులూరు: ఎవరేమైపోతే మాకేంటి.. మా తోటలకు నీరు కట్టుకుంటే చాలు అన్న చందంగా ఉంది కొందరు రైతుల పరిస్థితి. కాలువ తూముల ద్వారా పొలాలకు, నీరు కడితే ఆలస్యం అవుతుందనుకున్నారేమో ఏమో, ఏకంగా ఫత్తేపురం సమీపంలోని సంతమాగులూరు మేజరుకు గండి కొట్టి సుబాబుల్ తోటలకు నీరు కడుతున్నారు. దీంతో నీటి కోసం ఎదురు చూస్తున్న కంది, శనగ, మిరప, పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. ఫత్తేపురం సమీపంలోని సంతమాగులూరు మేజరుకు ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు గండి కొట్టి సుబాబుల్ తోటలకు నీరు తరలిస్తున్నాడు. దీంతో మేజరు నుంచి వెళ్లే నీరు రహదారిపైగా ప్రవహిస్తుండడంతో, రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అధికారుల అండదండలతోనే? ఏకంగా సాగరు మేజరు కాలువకు గండి కొట్టి, సుబాబుల్ తోటలకు నీరు కడుతున్నరంటే, దాని వెనుక అధికారుల అండదండలు లేకుండా ఉన్నాయా? అని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు కల్పించుకుని మేజరుకు కొట్టిన గండిని పూడ్పించాలని కోరుతున్నారు. దీనిపై ఎన్స్పీ జేఈ తేజశ్వనిని వివరణ కోరగా ఈ విషయం తనకు తెలియదని వెంటనే సిబ్బందిని పంపించి గండిని పూడ్చుతామని వివరించారు. -
విద్యార్థులపై పైశాచికత్వం
టీ.నగర్: తోటలోని కర్బూజా పండును తిన్నారని పాఠశాల విద్యార్థులను చెట్టుకు కట్టి దాడి చేసిన డీఎండీకే నేతపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాలు.. తిరుపూర్ జిల్లా ధారాపురం కరుంగాలివలసు గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం ఉదయం నల్లతంగాల్ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లిన వీరు సాయంత్రం ఇళ్లకు రాలేదు. వారి తల్లిదండ్రులు, స్థానికులు ఊరంతా గాలించారు. ఇలా ఉండగా కాలువ పక్కన ఉన్న రామస్వామికి చెందిన తోటలో చెట్టుకు ఈ ముగ్గురిని తాళ్లతో బంధించారు. గమినంచిన స్థానికులు వారి తాళ్లను విప్పి విచారించారించగా తోటలో ఉన్న కర్బూజా పండును తిన్నామని ఆతోట యజమాని రామస్వామి(50) తమను తాళ్లతో చెట్టుకు బంధించినట్లు తెలిపారు. అంతేకాకుండా తమపై రబ్బర్ పైప్, పాదరక్షలతో దాడి చేసినట్లు చెప్పారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అతని కోసం గాలించగా పరారైనట్లు తెలిసింది. రామస్వామి డీఎండీకే పట్ట ణపంచాయితీ కార్యదర్శిగా ఉన్నాడు. ఆకలిదప్పులతో ఉన్న ముగ్గురు విద్యార్థులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రామస్వామి కోసం గాలిస్తున్నారు. -
మల్లె తోట తొలగించిన సీఆర్డీయే అధికారులు
అమరావతి: రాజధాని ప్రాంతంలోని నిడమర్రులో సీఆర్డీయే అధికారులు పొక్లయిన్లతో మల్లె తోటను తొలగించారు. పాతికేళ్లుగా తోటను నమ్ముకుని బతుకుతున్నామని, తొలగించవద్దంటూ రైతు రామిరెడ్డి వేడుకున్నా అధికారులు కనికరించలేదు. భూమి యజమాని రాజధానికి భూమి ఇచ్చాడంటూ తోటను ధ్వంసం చేశారు. -
సేంద్రియ ‘స్ఫూర్తి’ వనం!
► నాలుగు ఎకరాల్లో ఎన్నో రకాల పంటలు ∙ ►పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు ►పండ్ల మొక్కలు.. పప్పు ధాన్యాలు, కూరగాయల పంటలు.. ►జీవవైవిధ్యం వెల్లివిరుస్తున్న శౌరిరెడ్డి వ్యవసాయ క్షేత్రం స్ఫూర్తి వనం... నాలుగున్నర ఎకరాల విస్తీర్ణం. నాలుగేళ్ల క్రితం అంతా బీడు. ఇప్పుడు అంతా పచ్చదనం. సుమారు 50 జాతుల పండ్ల మొక్కలు.. వాటి మధ్యన పప్పు దినుసుల పంటలు.. కనువిందు చేస్తున్నాయి. ఇది ఎక్కడో మారుమూల పల్లెలో కాదు. గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కుమ్మరిగూడెంలో ఉంది. బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి నాలుగేళ్ల కృషితో స్ఫూర్తి వనం అభివృద్ధి చెందుతోంది. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో ఈ తోట సాగవుతోంది. సేంద్రియ సాగు ఆవశ్యకతపై రైతులను ఒప్పించడానికి ‘స్ఫూర్తి వనం’ బాగా ఉపయోగపడుతున్నది. ఈ సేంద్రియ ప్రదర్శన క్షేత్రం గురించి శౌరిరెడ్డి మాటల్లోనే.. నాలుగేళ్ల క్రితం బాల వికాస స్వచ్ఛంద సంస్థ తరపున సేంద్రియ సాగు విస్తరణ కార్యక్రమాలు నిర్వహించే వాళ్లం. గ్రామాల్లో రైతుల సమావేశాలు నిర్వహించి.. సేంద్రియ సాగుతో కలిగే ఉపయోగాలను తెలియజేసేవాళ్లం. సేంద్రియ సాగులో దిగుబడుల గురించి చెప్పే సందర్భాల్లో చాలా మంది రైతులు నమ్మలేకపోయే వాళ్లు. అలాంటి సందర్భాల్లో రైతుల చూపులు మమ్మల్ని ప్రశ్నించినట్లుగా ఉండేవి. రైతులకు సేంద్రియ సాగు గురించి చెప్పే ముందు స్వయంగా ఆచరించి చూపితే ఈ సమస్య తీరుతుందని భావించాం. ఆ క్రమంలోనే ‘స్ఫూర్తి వనం’ ఆలోచన పుట్టింది. మొదట మనం సేంద్రియ పంటలు పండించి చూపితే ఎక్కువ మంది రైతులకు నమ్మకం కుదురుతుందని అనిపించింది. మాది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం. ఇప్పటి తరం పిల్లల మాదిరిగా నా కూతురు స్ఫూర్తి... ‘వరి చెట్లు’ అంటే నా పరువు పోయినట్లే. అందుకే.. రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, పిల్లలకు వ్యవసాయాన్ని గురించి తెలియజెప్పడానికి నా కూతురు ‘స్ఫూర్తి’ పేరుతో సేంద్రియ సాగు మొదలుపెట్టా. వీలు చిక్కినప్పుడల్లా అక్కడికి వెళ్తుంటా. ప్రతి వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి స్ఫూర్తి వనానికి వెళ్తా. అక్కడి వాతావరణంలో ఉండే అనుభూతి ఎక్కడా ఉండదు. సేంద్రియ సాగు ఆవశ్యకతపై రైతులను ఒప్పించడానికి స్ఫూర్తి వనంలో సాగు పద్ధతులు బాగా ఉపయోగపడుతున్నాయి. వంద జాతులు లక్ష్యం.. స్ఫూర్తి వనాన్ని ఆదర్శవంతమైన సేంద్రియ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే 100 జాతుల పండ్ల మొక్కలు నాటాలనుకుంటున్నా. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా విభిన్న జాతుల పండ్ల మొక్కలు తెప్పిస్తున్నా. ప్రస్తుతం 49 రకాల పండ్ల మొక్కలు నాటాను. మరో 33 రకాల పండ్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. నాటిన పండ్ల మొక్కల్లోనూ వేర్వేరు రకాలున్నాయి. కేవలం మామిడిలోనే 16 రకాల మొక్కలున్నాయి. నాలుగు రకాల జామ, మూడు రకాల సపోట, మూడు రకాల చెర్రీ ఉన్నాయి. సీతాఫలాల జాతికి చెందిన రామాఫలం, లక్ష్మణఫలం, సీతాఫలం, హనుమాన్ ఫలం ఉన్నాయి. అరటి, ద్రాక్ష, జీడిపప్పు, సీమచింత, కొబ్బరి, నిమ్మ, బత్తాయి, నారింజ, దానిమ్మ, చింత, పుచ్చ, అనాస, బొప్పాయి, స్టార్, లిచ్చి, మిరకిల్ ఫ్రూట్, ఇండియన్ ఫిగ్, ఫాషన్ , డ్రాగన్, అమ్లా, ఆపిల్, ఆపిల్ బేర్, అవకాడో, బేల్, బెంతామెస్కార్నెల్, డెటెల్నట్, బిగ్నె, బిలిమ్బి, బ్రీడ్, జాక్, కొకుమ్, లొంగాన్, నోని, ఓలి, పీర్, ప్లమ్స్, పమ్మేలో, జుబుటికబ, సైసమ్, సాండల్, వెట్టి, గర్చిన, మూటి, బరబ, లోవిలోవి వంటి రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. ఖర్జూర, ఇప్ప, తాటి చెట్లు ఉన్నాయి. మొదట తెచ్చిన మొక్క తెచ్చినట్లు నాటుతూ పోయా. తర్వాత ఓ విషయం గమనించా. చాలా రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. ఏ మొక్క ఏ సీజనులో పూత, కాత వస్తోందో గమనిస్తున్నా. సీజన్ల వారీగా పండ్లు వచ్చే మొక్కలను గుర్తించి వేరు చేస్తున్నా. వేసవి కాలంలో పండ్లు వచ్చే మొక్కలన్నీ ఒక చోట, శీతాకాలంలో కాసే మొక్కలన్నీ ఒకచోట నాటుతున్నా. దీని వల్ల సాగు సులభమవుతోంది. మిశ్రమ పంటలతో మేలు... బాల వికాస స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమాలలో రైతులను ఎక్కువగా కలుస్తుంటాం. ఎక్కువ మంది రైతులు... ‘కష్టపడి సాగు చేశా. పంట బాగా పండింది. ధర తక్కువగా ఉండడంతో అనుకున్నట్లు ఆదాయం రాలేదు’ అని చెబుతుంటారు. సాగు భూమిలో మొత్తం ఒకే పంట వేయకుండా మిశ్రమ పంటలు వేస్తే లాభం ఉంటుంది. ముఖ్యంగా రైతు కుటుంబాలకు కావాల్సిన అవసరాలు తీరతాయి. మా స్ఫూర్తి వనంలో వేరుశనగ, పెసర, కందులు, శనగలు, మినుములు పంటలు వేశాను. మా ఇంటి అవసరాలు తీరుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకు వరి పండించాను. గత ఏడాది కరువుతో బోరులో నీరు లేక నాట్లు వేయలేదు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సాగు కుంట(ఫామ్ పాండ్) నిర్మిస్తున్నా. కూరగాయలు సాగు చేస్తున్నా. టమాటాలు కాస్తున్నాయి. తీగ జాతి కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నా. వ్యవసాయానికి ఆధారమైన రెండు ఆవులు ఉన్నాయి. జీవామృతం, ఘన జీవామృతం, కషాయాలు తయారు చేసి వాడుతున్నాం. సేంద్రియ పద్ధతిలో పండించే ఆహారోత్పత్తులను మిత్రులకు, బంధువులకు పంపించినప్పుడు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్ -
వనం.. జనం
-
ఔషధ వనం
⇒ ‘దివిస్’లో 109 రకాల ఔషధ మొక్కల పెంపకం ⇒ హిమాలయాల్లో మాత్రమే పెరిగే మెుక్కలు సైతం లభ్యం ⇒ కశ్మీర్ ప్రాంతంలో లభించే రుద్రాక్ష చెట్లు కూడా.. ⇒ సంరక్షణ, వాటి ప్రత్యేకతలు వివరించడానికి ప్రత్యేక నిపుణులు హిమాలయాల్లో మాత్రమే పెరిగే మెుక్కలు.. కశ్మీర్ ప్రాంతంలోనే లభించే రుద్రాక్షలు.. భద్రాద్రి రాముడు, శివుడికి ఇష్టమైన పుష్పం.. సుగంధద్రవ్యాల తయారీకి వినియోగించే అరుదైన ప్లాంట్స్.. ఇలా 109 రకాల ఔషధ మెుక్కలు. ఇవన్నీ లభించేది మరెక్కడో కాదు.. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివీస్ లాబోరేటరీస్ కంపెనీలో. పరిశ్రమకు చెందిన 5 ఎకరాల్లో 109 రకాల ఔషధ మెుక్కలు పెంచుతున్నారు. ‘జగదేకవీరుడు.. అతిలోకసుందరి’ సినిమా చూసే ఉంటారు. ఓ చిన్నారి కాలిలో చలనం పోతుంది. బాలికను పరీక్షించిన ఓ ఋషి హిమాలయాల్లో మాత్రమే లభించే ఓ అరుదైన మొక్కను తెచ్చి, దాని పత్రాల నుంచి రసం తీసి రాస్తే ఫలితం ఉంటుందని చెబుతాడు. దీంతో హీరో అక్కడికి వెళ్లడం.. ఆకు తేవడం.. పసరు తీసి రాయడం.. ఆ తర్వాత బాలిక యథాస్థితికి రావడం తెలిసిందే. అటువంటి అరుదైన మొక్క కావాలంటే ఇప్పుడు ఏ హిమాయాలకు వెళ్లనక్కర్లేదు. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివీస్ లేబోరేటరీస్లోని ఔషధ వనానికి పోతే అలాంటి మెుక్క లభిస్తుంది. హిమాలయాల్లో మాత్రమే పెరిగే మొక్క ఒక్కటే కాదు.. అలాంటి అరుదైన 109 రకాల మొక్కలకు దివీ ఔషధ వనంలో జీవం పోస్తున్నారు. చౌటుప్పల్: ఆయుర్వేదం దివ్య ఔషధం. మన సాంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని రకాల చెట్లు, మొక్కలు, ఆకులు, కాయలు, పండ్లు, బెరడు, కాండం ఇలా ప్రతి భాగం ఒక్కో రకమైన ఔషధ విలువలను కలిగి ఉంటాయి. వాటిని వినియోగించి రోగాల నుంచి విముక్తి పొందడమే ‘ఆయుర్వేద’ వైద్యం. వాటిని కొన్ని రసాయనిక పదార్థాలతో మేళవించి, ప్రత్యేక పదార్థాలను తయారు చేసే, వినియోగించడమే ‘అల్లోపతి’ వైద్యం. అటువంటి వివిధ రకాల ఔషధాలు, సుగంధద్రవ్యాల తయారీకి వినియోగించే అరుదైన మొక్కలను చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివీస్ లాబోరేటరీస్ కంపెనీలో పెంచుతున్నారు. కంపెనీ 500ఎకరాల్లో ఉండగా, ఇందులో 250ఎకరాల్లో చెట్లను పెంచుతున్నారు. ఇందులో రావి, యూకలిప్టస్, కానుగ, ఫిల్టోఫామ్, ఉసిరి, నేరేడు, గుల్మోహర్, బాదం, వేప, సుబాబుల్, గన్నేరు, పూల మొక్కలు పెంచుతున్నారు. 5 ఎకరాల్లో... కంపెనీ ఆవరణలోని 5ఎకరాల్లో దివి ఔషధ వనం పేరుతో 109రకాల ఔషధ మొక్కలను గత రెండున్నరేళ్లుగా పెంచుతున్నారు. ప్రస్తుతం 300లకుపైగా ఔషధ మొక్కలు వనంలో జీవం పోసుకుంటున్నాయి. దేశం నలుమూలల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, మొక్కలను కొనుగోలు చేసి తెచ్చి ఇక్కడ పెంచుతున్నారు. మొక్కల సంరక్షణకు, వాటి పేర్లు, పండ్లు, ఆకుల ప్రత్యేకతలను వివరించడానికి ఔషధ మొక్కలపై అవగాహన ఉన్న నిపుణులను కూడా నియమించారు. ఇందులో హిమాలయాల్లో మాత్రమే లభించే 9రకాల సుగంధ ద్రవ్యాల మొక్కలతో పాటు, కశ్మీర్ ప్రాంతంలో మాత్రమే లభించే రుద్రాక్ష చెట్లను కూడా ఇక్కడ పెంచుతున్నారు. కృష్ణతులసి, జమ్మి, బిలంబి, లవంగ, కర్పూర, సబ్జతులసి, రుద్రజడ, మెంతి వంటి అరుదైన రకాలతో పాటు కూరల్లో వినియోగించే బిర్యాని ఆకు, లవంగ ఆకువంటి మొక్కలను కూడా పెంచుతున్నారు. -
శ్రీమతికి పచ్చల హారం!
♦ కాంక్రీట్ నగరంలో పచ్చని పొదరిల్లు ♦ ప్రకృతిపై ప్రేమతో వినూత్న గృహానికి రూపం ♦ ఇంటిని వనంలా తీర్చిదిద్దిన వైనం... తాము ఎంతగానో ఇష్టపడేవారిపై తమ ప్రేమను వ్యక్తపరచవలసిన సందర్భం వచ్చిన ప్రతిసారి చరిత్రలో ఒక గొప్ప కళాఖండమో, నిర్మాణమో రూపుదిద్దుకున్నాయి. తరాలు గడిచినా వారి ప్రేమను చరిత్రలో అజరామరంగా నిలుపుతున్నాయి. లియోనార్డో మోనాలిసా పెయిటింగ్ నుంచి షాజహాన్ తాజ్మహల్ వరకు ఇలా రూపుదిద్దుకున్నవే. వారి ప్రేమతో జీవకళను సంతరించుకున్న కళాఖండాలు భవిష్యత్ తరాలకు తమ వసివాడని ప్రేమ విలువను చాటిచెపుతున్నాయి. ఆ కోవకే చెందిన ఈ కాలపు ఓ భర్తగారి ‘ఆకుపచ్చని’ ప్రేమగాథ ఇది. శ్రీమతి కోరిందే తడవుగా ఓ అందమైన ఆకుపచ్చని పొదరిల్లును తీర్చిదిద్ది ఆమెకు కానుకగా ఇచ్చిన ఆ భర్త పర్యావరణ ప్రేమికుడు..అంతకు మించి అందరికీ ఆదర్శనీయుడు. ఆ వివరాలు నేటి సండే స్పెషల్లో మీకోసం.... సాక్షి, సిటీబ్యూరో: భార్యపై ప్రేమను మాటల్లో కాక చేతల్లో చూపాలనుకునే భర్త ఆయన. భార్య భర్తల మధ్య అన్యోనత ఉండాలే గాని పూరిల్లయినా మేడతోనే సమానం అని నమ్మే భార్య ఆవిడ. చిలకా గోరింకల్లాంటి ఆ దంపతులు విహార యాత్ర కోసం ఓసారి కుటుంబ సభ్యులతో కలసి కేరళకు వెళ్లారు. రిసార్ట్లో పచ్చని ప్రకృతి నడుమ చెక్కతో నిర్మించిన కుటీరంలో విడిది చేశారు. ప్రకృతి శోభతో అలరారే కుటీరం అందం శ్రీమతి మది దోచింది. భర్తతో మనకు హైదరాబాద్లో ఇలాంటి ఇల్లుంటే ఎంత బాగుంటుందో కదా అంది. అప్పటికి భర్త గారి మౌన మే సమాధానమైంది. ఇంటికి తిరిగొచ్చాక ఏడాది పాటు కష్టపడి కేరళ సంప్రదాయ శైలిలో ఫ్లైవుడ్తో ఇంటిని నిర్మించారు ఆ భర్త. దాంతోపాటు చుట్టూ అందమైన ఇంటి పంటల క్షేత్రాన్ని సృష్టించి తన గృహలక్ష్మికి బహుమతిగా సమర్పించారు. హైదరాబాద్, ఎల్బీనగర్లోని బీఎన్రెడ్డి నగర్కు చెందిన ఆ అన్యోన్య దంపతులు చింగిరెడ్డి శ్రీధర్రెడ్డి, లక్ష్మి. శ్రీధర్రెడ్డి ప్రైవేట్ కంపెనీలో రీజినల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. లక్ష్మి గృహిణి. ఆరు సెంట్ల స్థలంలో అపార్ట్మెంట్ నిర్మిస్తే అద్దెల ద్వారా లభించే ఆదాయాన్ని ఆయన దీని కోసం వదులుకోవటం విశేషం. రెండేళ్లపాటు శ్రమించి వంద గజాల స్థలంలో చెక్క ఇంటిని నిర్మించారు శ్రీధర్రెడ్డి. ఇంటి బయట వసారా. చుట్టూ పండ్ల మొక్కలు. కింద తివాచి పరచినట్టు కాళ్లను మెత్తగా తాకే పచ్చిక. ఉదయాన్నే తమ కిలకిలరావాలతో నిద్రలేపే పక్షులు. ఒక్క రోజు అక్కడ గడిపిన వారికి ఉషోదయం వారి జీవిత పుస్తకంలో ప్రత్యేక పుటగా నిలుస్తుంది. వివిధ రకాల కాయగూర, పండ్లు, పూలు, అలంకరణ మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతున్నారు. దీనికోసం తొలుత ఇంటి ఆవరణలో 10 ట్రక్కుల ఎర్రమట్టిని తోలించారు. దొండ, సొర వంటి తీగజాతి మొక్కలు వంగ , మిర్చి, క్యాబేజీ వంటి కాయగూర పంటలు, దానిమ్మ, చిన్న ఉసిరి, అడవి ఉసిరి, ద్రాక్ష, బొప్పాయి, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, పాషన్ ఫ్రూట్, ఎర్రజామ, అరటి, అంజూర, గంగరేగి, మామిడి వంటి పండ్ల మొక్కలు...బ్రహ్మకమలం, అడవి సంపెంగ వంటి పూల మొక్కలను పెంచుతున్నారు. ఏడాది వయసున్న ఆపిల్ చెట్టు కూడా ఉందిక్కడ. ముగ్గురు సభ్యులు గల తమ కుంటుంబానికి వారంలో మూడు రోజులకు సరిపడా కూరగాయలను పండించుకుంటున్నారు. శ్రీధర్రెడ్డి రోజూ మూడు గంటల పాటు రెండేళ్లు శ్రమించి ఈ హరితవనానికి జీవం పోశారు. ఇప్పటికీ వాటికి ఎరువులు వేయటం, కలుపు తీయటం వంటి పనుల కోసం ప్రతిరోజూ ఉదయం రెండు గంటల సమయం కేటాయిస్తారు. ఇంటికి వచ్చిన బంధువులు మా అభిరుచిని మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు అపార్ట్మెంట్లో కన్నా ఈ ఇంటిలో ఉండేందుకే వారు ఇష్టపడుతుండటం సంతోషం కలిగిస్తోంది. - శ్రీధర్రెడ్డి (97011 11754) -
ఇంట్లో నుంచే ఎగిరే విమానం
విమానంలో ప్రయాణించాలంటే విమానాశ్రయాలకు వెళ్లాల్సిన పనిలేదు. కేవలం 15 మీటర్ల స్థలం ఉంటే చాలు ఇంట్లో నుంచే ఎక్కడికైనా ఎగిరిపోవొచ్చు, తిరిగి ల్యాండ్ అవ్వొచ్చు. విమానాలకు ఎంతో ఖర్చుతో కూడిన ఇంధనం అవసరమౌతుంది, ఇదంతా సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా?..ఇంట్లో మనం సాధారణంగా వాడే కరెంట్ సాకెట్ నుంచే ఛార్జింగ్ చేస్తే చాలు గాల్లో హాయిగా చక్కర్లు కొట్టి రావొచ్చు. నలుగురు జర్మన్ ఇంజనీర్లు కలిసి ఇంట్లో నుంచే గమ్యస్థానాలకు చేరే కొత్త రకం మినీ విమానం 'లిలియం' డిజైన్ను చూస్తే 2018 వరకు ఇది సాధ్యమయ్యేదిలానే కనిపిస్తుంది. రెండు సీట్ల సామర్థ్యం ఉన్న కొత్త ఆల్ట్రాలైట్ చిన్న విమానం లిలియం. ఇది ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి కేవలం 15 మీటర్ల స్థలం ఉంటే చాలు. లిలియం స్టార్టప్ను మునిచ్ యూనివర్సిటీ విద్యార్థులు..డానియల్ వీగాండ్, పాట్రిక్ నాథన్, సెబాస్టియన్ బోర్న్, మాథియాస్ మీనర్లు కలిసి ప్రారంభించారు. యూరోపియన్ స్పెస్ ఏజెన్సీలో(ఈఎస్ఏ) బిజినెస్ ఇంక్యుబేటర్లో లిలియం ప్రాజెక్టును హోస్ట్ చేశారు. 'వీగాండ్ తమ కాన్సెప్ట్ను ప్రాక్టికల్గా వివరించారు..వాతావరణానికి కలిగే లాభాలను వివరించారు. ఎలక్ట్రిక్ ఇంజిన్లను వాడటం వల్ల తక్కువ శబ్ధం ఉద్గారమవ్వడంతో పాటూ వాతావరణానికి ఎలాంటి హానీ జరగదు' అని ఈఎస్ఏ తెలిపింది. రోజూ వారి అవసరాల కోసం ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేస్తున్నట్టు దీని డిజైనర్లలో ఒకరు డానియల్ వీగాండ్ తెలిపారు. ఎంతో ఖర్చుతో కూడిన భారీ ఎయిర్ పోర్టుల అవసరం లేకుండానే ఈ విమానం సునాయాసంగా ఎగిరిపోతుంది. ఇంట్లోనే విమానానికి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇంకా నిర్మాణదశలోనే ఉన్న ఈ గుడ్డు ఆకారంలో ఉండే లిలియం విమాన అమ్మకాలు 2018 ఏడాది వరకు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని దీని డిజైనర్లు చెబుతున్నారు. గరిష్టంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ విమానం.. గంటకు 400కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని ఇంజనీర్లు తెలిపారు. 'లిలియం ఇంజన్లలో ఉపయోగించే టెక్నాలజీతో జెట్ విమానాలు, హెలీకాప్టర్లలో వచ్చే శబ్ధాలకన్నా చాలా రెట్లు తక్కువ వస్తుంది. దీనికి ఇంట్లో వాడే సాకెట్తోనే ఛార్జింగ్ చేయోచ్చు. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయాల్లో మాత్రమే దీంట్లో ప్రయాణించొచ్చు' అని వీగాండ్ తెలిపారు. లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కేటగిరికి చెందిన దీన్ని నడపడానికి పైలెట్ లైసెన్స్ ఉండి కేవలం 20 గంటల ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది. దీని ధర విషయంలో ఇంకా ఓ స్పష్టత రాకపోయినా..ఇప్పటికే ఉన్న మినీ విమానాలకంటే తక్కువకే ఇది లభిస్తుందని ఈఎస్ఏ తెలిపింది. -
ఆర్మీ వైద్యుడి కారు దొంగతనం
-
మోడు వారిన జీడి
గుబురుగా పెరిగిన చెట్లు, గుత్తులుగా వేలాడే జీడిమామిడి కాయలతో కళకళలాడిన సాగరతీరం నేడు ఎడారిని తలపిస్తోంది. పచ్చని తోటలతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం మోడువారిన చెట్లతో వెలవెలబోతోంది. చూద్దామన్నా కాపు కనిపించని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ తీరంలోని జీడిమామిడి తోటలను గాలికి వదిలేడంతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే అటవీ సంపద వేరుపురుగు సోకి అంతరించిపోతోంది. పర్యావరణ సమతుల్యతకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న ఈ తోటల పరిరక్షణకు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. పిట్టలవానిపాలెం : గుంటూరు జిల్లాలో ప్రధాన తీరప్రాంతమైన బాపట్ల సమీపంలో ముత్తాయపాలెం, కర్లపాలెం, పేరలి తదితర గ్రామాలు, ప్రకాశం జిల్లాలోని చినగంజాం మండలం కడవకుదురు ప్రాంతంలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో రిజర్వు ఫారెస్టు భూములున్నాయి. ఈ భూముల్లో అటవీ శాఖ 1956, 57, 58 సంవత్సరాల కాలంలో జీడి మామిడి సాగు చేపట్టింది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే జీడిమామిడి తోటల పరిరక్షణకు 1980లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. బాపట్ల ఫారెస్టు రేంజ్ పరిధిలోని జీడిమామిడి తోటలను నెల్లూరు అటవీ అభివృద్ధి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసి బాపట్ల ఫారెస్టు రేంజ్ విభాగాన్ని కావలి నార్త్ డివిజన్గా ఏర్పాటు చేసింది. జీడి మామిడి తోటలను ఆసంస్థ పర్యవేక్షణలోకి చేర్చింది. 2000 సంవత్సరం వరకు ఈ ప్రాంతాల్లో జీడి మామిడి తోటల పరిస్థితి బాగానే ఉంది. తర్వాత కాలంలో చెట్లను వేరు పురుగు ఆశించి సమూలంగా నాశనం చేస్తోంది. నాడు 5,000.. నేడు 150.. తోటలు అంతరించిపోతున్నప్పటికీ అటవీ అభివృద్ధి సంస్థ మాత్రం మొద్దు నిద్ర వీడకపోవడంతో జీడిమామిడి ద్వారా ప్రభుత్వానికి అందాల్సిన రాబడి పూర్తిగా పడిపోయింది. ఆయా ప్రాంతాలలో తోటలపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దెబ్బతింది. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంలో 65 హెక్టార్లలో విస్తరించి ఉన్న జీడిమామిడి చెట్లు 15 ఏళ్ల క్రితం ఐదు వేల చెట్లు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య కేవలం 150 చెట్లకు చేరుకుంది. దీన్ని బట్టి జీడి మామిడి తోటల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంలో 65 హెక్టార్లు, పేరలిలో 1000 హెక్టార్లు, బాపట్ల మండలం ముత్తాయపాలెంలో 2000 హెక్టార్లు, ప్రకాశం జిల్లా కడవకుదురులో 100 హెక్టార్లు విస్తీర్ణంలో జీడిమామిడి తోటలు ఉన్నాయి. గణనీయంగా తగ్గిన ఆదాయం.. గడచిన పదేళ్లుగా జీడిమామిడి ధరలు పెరుగుతున్నాయి. కానీ ఆదాయం తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం తోటల్లో చెట్లు సంఖ్య తగ్గి, ఫలసాయం తగ్గిపోవడమే. వేలంపాటల ద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడి గణనీయంగా తగ్గిపోతుంది. గతేడాది బాపట్ల సెక్షన్ పరిధిలోని జీడిమామిడి తోటలకు రూ.80 లక్షల ఆదాయం సమకూరగా ఈ ఏడాది రూ.40 లక్షలకు పడిపోయింది. దిద్దుబాటు చర్యలతో పూర్వ వైభవం.. అంతరించిపోతున్న జీడిమామిడి తోటలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. తిరిగి తోటలను అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు, అవి పెరిగి ఫలసాయం అందించే వరకు ఆయా అటవీ భూముల్లోని రైతులకు నామమాత్రపు లీజుకు ఇవ్వాలి.దీని వలన మొక్కల పెంపకానికయ్యే ఆర్థిక భారం తగ్గడంతో పాటు రైతులకు ఉపాధి కలుగుతుంది. గతంలో చాలా బాగుండేది.. గతంలో జీడిమామిడి తోటలు చాలా గుబురుగా ఉండేవి. గత పదేళ్లుగా చెట్లు ఎండిపోతున్నాయి. ఈ ప్రాంతమంతా ఎడారిగా మారింది. ఈసంవత్సరం అసలు చూద్దామన్నా కాపు కన్పించడం లేదు. అధికారులు పరిశీలించి మొక్కలు నాటి పూర్వవైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. - శ్రీనివాసరెడ్డి, తోట కాపలాదారు, కొత్త నందాయపాలెం, కర్లపాలెం మండలం తిరిగి మొక్కలు నాటితే బాగుంటుంది.. నిరుడు చూసిన చెట్లు ఈఏడు ఎండిపోతున్నాయి. దాదాపుగా 65 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నందాయపాలెం తోట పూర్తిగా ఎండిపోయే స్థితికి చేరుకుంది. పచ్చని తోటల దగ్గర ఉండే మాలాంటి వారం చల్లదనం కోల్పోయా. తోట ఎండిపోవడం వలన పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుంది. తిరిగి మొక్కలు నాటితే బాగుంటుంది. - వెంకట్రామిరెడ్డి, కొత్త నందాయపాలెం, కర్లపాలెం మండలం -
ఒక రాత్రి ఆ తోటలో..!
* తోటలో యువతి... * తిరుగుతూ పాట పాడుతోంది. * నవ్వుతోంది... ఏడుస్తోంది. * మనిషా? దెయ్యమా?? ఇంగ్లండ్లోని బ్రిమింగ్హామ్ టౌన్ ఎలా ఉంటుంది? ఒకప్పుడు దానికి ఉన్న పేరు మార్కెట్ టౌన్. దీనికి సార్థకత చేకూరుస్తున్నట్లుగానే ఉంటుంది ఆ టౌన్. మార్కెట్ మాదిరిగానే గజిబిజిగా, బిజీ బిజీగా ఉంటుంది. అలాంటి పట్టణంలో ఒక తోటను ఆనుకొని ఉంది విక్టోరియా విల్లా. ‘‘ఎంత అందంగా ఉంది! ఎంత రాజదర్పంతో ఉంది!’’ అనుకుంటారు కొత్తవాళ్లు. ‘‘ఎంత క్రూరంగా ఉంది, ఎంతగా భయపెడుతోంది’’ అని వణికి పోతారు పాతవాళ్లు. ఇప్పుడు ఆ పాతభవంతికి సరికొత్త కళ వచ్చింది. ఎందుకంటే ఆ భవంతిని గ్రేగ్ క్లార్క్ అనే ప్రొఫెసర్ కొనుగోలు చేశాడు. తెలియక కాదు... తెలిసీ తెలియక కాదు... బాగా తెలిసే ఈ భవంతిని కొనుగోలు చేశాడు. దెయ్యాల సంఘం ఒకటి ప్రొఫెసర్ క్లార్క్ను కలుసుకొని ‘మేము ఉన్నాం మహాప్రభో’ అని వినతిపత్రం సమర్పించినా సరే... ఆ భవంతిని కొనడానికి వెనుకంజ వేసేవాడు కాదు. ప్రొఫెసర్కు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరు కొడుకులు. అందరిలోకెల్లా పెద్దది హన్నా బెట్స్. మిగతా పిల్లలకు తల్లి దండ్రుల కంటే అక్క దగ్గరే చనువు ఎక్కువ. విల్లాలో ఉన్న ఆరు బెడ్ రూమ్లలో పిల్లలు స్వేచ్ఛగా తిరుగు తుంటారు. ఒకరోజు మాత్రం పెద్ద తమ్ముడు టామ్ బిక్కచచ్చి వచ్చాడు. ‘‘అక్కా... ఆ గదిలో ఒక ముసలాయన ఉన్నాడు. ఏరా మనవడా, ఇప్పుడా రావడం’’ అని నా దగ్గరికి రాబోతుంటే భయంతో పరుగెత్తుకు వచ్చాను’’ అన్నాడు. నవ్వింది బెట్స్. మరో రోజు చెల్లి మేరీ గడ గడ వణుకుతూ... ‘‘అక్కా... ఆ గదిలో గెడ్డం ముసలోడు తిరుగుతున్నాడు’’ అంది. ఈసారి మాత్రం నవ్వలేదు బెట్స్. ఆలోచించింది. అమ్మతో చెబితే నాన్నకు చెప్పమంటుంది. నాన్నతో చెబితే ఏం జరుగుతుందో తనకు తెలుసు. కాబట్టి తానే ఆరోజు ఒంటరిగా ఆ గది లోకి వెళ్లి, నవల చదువుకోవడం ప్రారంభించింది. అయిదు నిమిషాల తరువాత... ఏడుస్తున్న ముసలిగొంతు వినిపించింది. ‘‘ఎవరది?’’ అని అరిచింది బెట్స్. జవాబు లేదు. కిటికీ రెక్కలు ఊగాయి. ఆ తరువాత ఏడుపు దానికదే ఆగిపోయింది. ఒకరోజు ప్రొఫెసర్ కుటుంబం సినిమాకు వెళ్లి, హోటల్లో భోజనం చేసి ఇంటికి తిరిగొచ్చింది. లోపల ఏవో గొంతులు, వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ‘‘లోపల ఎవరో ఉన్నారు’’ భయంగా అన్నారు పిల్లలు. ‘‘లోపల పిల్లులు పోట్లాడుకుంటున్నాయి. వాటి శబ్దానికి కూడా భయపడితే ఎలా?’’ అని పిల్లల భుజాల మీద చేయివేసి ధైర్యం చెప్పాడు ప్రొఫెసర్. లోపల ఎవరూ లేరా?? ఒకరోజు రాత్రి ప్రొఫెసర్ భార్య మేడపైగది కిటికీలో నుంచి తోట వైపు చూస్తోంది. ఓ యువతి వెన్నెల్లో తిరు గుతూ పిచ్చిగా నవ్వుతోంది. పాడుతోంది. అంతలోనే ఏడుస్తోంది. ‘‘కొంపదీసి దెయ్యమైతే కాదుగదా!’’ అనుకుంది ప్రొఫెసర్ భార్య. ఒకరోజు ప్రొఫెసర్ క్లార్క్ హడావుడిగా వచ్చి ‘‘ఈ ఇంటిని అమ్మేశాను. త్వరలో మనం ఒక కొత్త ఇంట్లోకి మారబోతున్నాం’’ అన్నాడు. వారం తిరిగేలోపే ఆ కుటుంబం కొత్తింటికి మారింది. ఆగమేఘాల మీద విక్టోరియా విల్లాను ఎందుకు అమ్మేశాడో ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు ప్రొఫెసర్ క్లార్క్. హన్నా బెట్స్ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి. లండన్లో ఉంటోంది. సుదీర్ఘకాలం తరువాత తన ఫ్రెండ్స్తో కలసి విక్టోరియా భవంతికి వెళ్లింది. ఆ భవంతి అప్పటిలాగే గంభీరమైన మౌనంతో ఉంది. చుట్టుపక్కల జనాల ద్వారా... ఈ భవంతి గురించి ఎన్నడూ వినని కొత్త విషయం ఒకటి తెలిసింది. విక్టోరియా విల్లాను ఒక డాక్టర్ చాలా ఇష్టంగా కట్టించుకున్నాడు. అతడి మన వడిని డబ్బు కోసం కొందరు కిడ్నాప్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశాడనో, అడిగినంత డబ్బు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాడనే కారణంతోనో పిల్లాడిని చంపేశారు. అది తట్టుకోలేక పిల్లాడి తల్లి చనిపోయింది. ‘‘కూతురు, మనవడు చనిపోయాక నేనెందుకు ఈలోకంలో...’’ అని ఆ డాక్టర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి వికోర్టియా విల్లాలో, చుట్టుపక్కలా తండ్రీకూతుళ్ల్ల ఆత్మలు సంచరిస్తున్నాయనేది ప్రచారంలో ఉన్న కథ. బెట్స్ విక్టోరియా విల్లాలోని ఆరు గదుల్లోకీ వెళ్లింది. ఆమెకు మళ్లీ ముసలి డాక్టరు అరుపు, వెన్నెల రాత్రుల్లో తోటలో యువతి ఏడుపు, నవ్వు మళ్లీ వినిపించినట్లుగా అనిపించింది! -
‘ప్రమోద్’ గార్డెన్ను ప్రారంభించిన సీఎం
- మంత్రి సుభాష్, రేఖా మహాజన్ హాజరు సాక్షి, ముంబై: దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ పేరిట దాదర్లో ఏర్పాటు చేసిన గార్డెన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. గార్డెన్ పనులన్నీ పూర్తయ్యి నాలుగు నెలలు గడుస్తున్నా పలు కారణాల వల్ల ప్రారంభం కాలేదు. ప్రమోద్ మహాజన్ వర్ధంతిని పురస్కరించుకుని ఉద్యానవనాన్ని ఆదివారం ప్రారంభించినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ప్రారంభోత్సవానికి మంత్రి సుభాశ్ దేశాయ్, ప్రమోద్ భార్య రేఖా మహాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉద్యానవన నిర్వహణ బాధ్యతలను 2014 ఆగస్టు నుంచి చూస్తూ వస్తున్న బీఎంసీకి చెందిన సేవ్రేజ్ ఆపరేషన్స్ (ఎస్వో) విభాగమే చూసుకోనుంది. కార్యక్రమంలో ఎంపీ పూనమ్ మహాజన్ మాట్లాడుతూ.. నగరవాసులకు పచ్చదనంతో కూడిన ఉద్యానవనం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సేవ్రేజ్ ఆపరేషన్స్, ఉద్యాన వన విభాగానికి మధ్య సయోధ్య లేకపోవడం వల్ల ఉద్యానవన ప్రారంభం ఆలస్యం అయిందని చెప్పారు. ఉద్యానవనంలో మామిడి, కొబ్బరి, గుల్మోహర్, బన్యన్, రావి తదితర భారీ వృక్షాలు ఉన్నాయి. పూల కుండీల్లో సమారు 2.5 లక్షల మొక్కలు ఉన్నాయి. దీని అభివృద్ధికి దాదాపుగా రూ.30 కోట్ల వ్యయం అయినట్లు సమాచారం. 75 శాతం కంటి వ్యాధులను నయం చేయొచ్చు! ‘కంటికి సంబంధించిన 75 శాతం వ్యాధులను నయం చేయవచ్చు. అయితే ప్రజల్లో వ్యాధులకు సంబంధించిన సరైన అవగాహన లేకపోవడం, తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం చాలా మందికి చికిత్స అందడం లేదు’ అని రాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య శాస్త్రం పురోగతి చెందుతోందని, సాధారణ ప్రజానీకానికి వైద్య శాస్త్ర ఫలాలు అందించాలని కోరారు. యువ వైద్యులు ప్రజాసేవకు అంకితం కావాలనే ఆకాంక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సబర్బన్ ముంబైలోని ‘అనిదీప్ కంటి ఆస్పత్రి’ని ఫడ్నవీస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో కంటి చూపు ఇవ్వడం కంటే గొప్ప దీవెన ఇంకోటి లేదు. కళ్లు లేని వారికి చూపు ప్రసాదించడం కూడా దీవెన లాంటిదే. 75 శాతం వ్యాధులను నయం చేయవచ్చు. అయితే ప్రజల్లో వ్యాధులకు సంబంధించిన సరైన అవగాహన లేకపోవడం వల్లే ఆశించనంత మేర బాధితులకు సాయం జరగలేదు’ అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి ప్రారంభోత్సవంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి దీపక్ సావంత్, ఆయన కుమారుడు ప్రముఖ సర్జన్ స్వప్నేశ్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. -
వెంకన్న నిలయం..పుష్ప సోయగం
తిరుమల: అలంకారప్రియుడు శ్రీవేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల పుణ్యక్షేత్రం పుష్పసోయగంతో కనువిందు చేస్తోంది. శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది సందర్భంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఉద్యానవనం విభాగం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 2 లక్షల కట్ పుష్పాలను అలంకరణల కోసం వినియోగించింది. ప్రత్యేకించి ఆలయ మహాద్వారం నుంచి సన్నిధి వరకు పుష్పాలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. ధ్వజస్తంభం పైభాగంలో ఏర్పాటు చేసిన మామిడికాయల పందిరి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రకాల పుష్పాలు, పండ్లు, కూరగాయలతో ధ్వజస్తంభం, బలిపీఠాన్ని అలంకరించారు. బలిపీఠం ముందు ఉంచిన వాటర్మిలాన్ కార్విన్ ఆర్ట్(కర్బుజాలతో తయారుచేసిన వివిధ దేవతామూర్తుల నమూనాలు) విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నవధాన్యాలతో తయారు చేసిన ‘శ్రీమహావిష్ణువు’, బెంగుళూరు వంకాయలతో చేసిన ‘శేషశయన’, పుష్పకలశం నమూనాలను చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. ఆలయంలోని ఉగాది ఆస్థానంలో పాల్గొన్న ఈవో ఈ అలంకరణలను స్వయంగా పరిశీలించారు. ఉద్యానవనం సూపరింటెండెంట్ శ్రీనివాసులును ప్రత్యేకంగా అభినందించారు. కోల్కతా, బెంగళూరు, సేలం, హైదరాబాద్ నుంచి వచ్చిన 120 మంది అలంకరణ నిపుణులతో పాటు మరో 120 మంది టీటీడీ ఉద్యానవనం సిబ్బంది కలసి అలంకరించారని సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఈవో సాంబశివరావుకు తెలిపారు. -
పాపం.. పసివాడు
నవమాసాలు పెంచి పురిటినొప్పులు భరించి జన్మిచ్చిన అమ్మా ఇలా వదిలేశావేమమ్మా ఏమి ముంచుకొచ్చింది ముప్పు ఏమి చేశావ్ అంత తప్పు చూశావు కదా నా రూపం అనిపించలేదా అయ్యో పాపం.. చీరాల: ఏ తల్లి కన్నబిడ్డో తెలియదు.. తెల్లగా, బొద్దుగా, అందంగా ఉన్నాడు. తల జుత్తు నల్లగా నిగనిగలాడిపోతోంది. చూస్తేనే ముద్దాడాలనిపిస్తోంది. కానీ మహరాజులా ఉన్న పండంటి బిడ్డ చీరాల బస్టాండు వద్దనున్న గార్డెన్ పక్కన మూత్ర విసర్జన చేసే ప్రాంతంలో శుక్రవారం ఏడుస్తూ కనిపించాడు. గార్డెన్ సిబ్బంది పరుగుపరుగున అక్కడకు వెళ్లారు. కన్నతల్లి కనిపిస్తుందేమో.. నాన్న వచ్చి బిడ్డను చేతుల్లోకి తీసుకుంటాడేమోనని గమనించారు. కానీ ఎంత సేపటికీ ఆ మగ బిడ్డకోసం ఎవరూ రాలేదు. ఇక విషయం అర్థం అరుుంది. ఎవరో కావాలనే బాబును అక్కడ వదిలి వెళ్లారని. బుజ్జారుుకి కనీసం బొడ్డు తాడు కూడా ఊడలేదు. ఈ దృశ్యం చూసిన కొంతమంది కళ్లలో నీళ్లు తిరిగారుు. మానవత్వం ఉన్నవారు మౌనంగా రోదించారు. పుట్టిన మూడు రోజులకే ఆ పసివాడు పడుతున్న కష్టాలకు చలించారు. చలికి వణుకుతున్న బాబును స్థానికులు అక్కున చేర్చుకొని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించి బాబు అరోగ్యంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఆ బిడ్డను పెంచుకుంటామంటూ చాలా మంది ముందుకొచ్చినా.. వైద్యులు నిరాకరించారు. ఐసీడీఎస్ ద్వారా ఒంగోలులోని చైల్డ్ సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. -
ఇదేం మాయ రోగం?
తనకల్లు : కరువు నేలలో కొందరు దుండగులు విధ్వంస కాండకు తెరలేపారు. పాడి పంటలతో ప్రశాంతంగా ఉన్న పచ్చని పల్లెల్లో చిచ్చు రేపారు. అసలే వర్షాలు లేక పంట నష్టపోయి అప్పుల పాలైన రైతన్నలు రాత్రనకా, పగలనకా కష్టపడి పండించిన అరటి తోటను రాత్రికి రాత్రే తెగనరికేశారు. బాగుపడిపోతారని కడుపుమంటో ఏమో కానీ కూలీలను పెట్టి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. కన్నబిడ్డలా కంటికి రెప్పలా పంటను కాపాడుతూ వచ్చినా.. చేతికొచ్చే సమయంలో ఇలా నేలపాలవ్వడంతో తనకల్లు మండలం సీఆర్ పల్లికి చెందిన రైతులు బాలాంజనేయరెడ్డి, దామోదర్ రెడ్డి గుండెలు అవిసేలా బోరుమని విలపించారు. కదిరి రూరల్ సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డి, నల్లచెరువు ఎస్ఐ మక్బూల్బాషా, తనకల్లు ఏఎస్ఐ బాలరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాలతో దుండగుల జాడ కోసం ప్రయత్నించారు. రూ.10 లక్షల పంట నష్టం జరిగినట్లు రెవిన్యూ, ఉద్యనశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ‘పంట కోసం రూ.లక్షలు అప్పు చేశాం.. త్వరలో పంట చేతికొస్తే అప్పు తీర్చేసి హాయిగా ఉందామనుకున్నాం. కాపు కూడా బాగా వచ్చింది. వ్యాపారులూ మంచి ధర ఇస్తామన్నారు. ఇంతలో ఎవరో ఇలా దారుణానికి ఒడిగట్టారు. ఇప్పుడు అప్పు ఎలా తీర్చాలి.. ప్రభుత్వమే ఆదుకోవాల’ని బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. -
పెరటి తోట కోసం న్యాయపోరాటం!
సాధాణంగా పెరటి తోట ఇంటి వెనుక భాగంలో ఉంటుంది. ఇంటి ముందు భాగంలో కిచెన్ గార్డెన్ ఉండడం అమెరికాలో శిక్షార్హమైన నేరం! ఇంటిపంటల ప్రేమికులు ఇంటి ముందు గార్డెన్ కన్నా కిచెన్ గార్డెన్ ఉంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఇంటి ముందున్న తమ సొంత స్థలంలో సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు పెంచుకునే హక్కు కోసం కోర్టులకెక్కుతున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండో నగరానికి చెందిన జాసన్, జెన్నిఫర్ హెల్వెన్స్టన్ దంపతులు ఇటువంటి కేసులో ఇటీవలే విజయకేతనం ఎగురవేశారు. 17 ఏళ్లుగా తమ ఇంటి ముందున్న కిచెన్ గార్డెన్ను తొలగించమని స్థానిక అధికారులు గత ఏడాది ఆదేశించడంతో వీరు కోర్టుకెళ్లారు. ‘విత్తు నాటండి.. చట్టం మార్చండి’ నినాదంతో పాట్రియాట్ గార్డెన్స్ సంస్థ సారధ్యంలో 6 వేల మంది స్థానికులు ఈ జంటకు బాసటగా నిలిచి విజయం సాధించడం విశేషం. -
అన్బిలీఫ్బుల్!
కళ రెండు సంవత్సరాల క్రితం మాంచెస్టర్లోని ఒక తోటలో భార్య ఎల్హమ్తో కలిసి విహారానికి వెళ్లాడు ఒమిద్ అసాది. ఉన్నట్టుండి గాలి వీచడం మొదలైంది. గాలికి ఆ తోటలో పెద్ద పెద్ద ఆకులు నేలరాలుతున్నాయి. వాటిని చూస్తే ఆసాదికి భలే ముచ్చటేసింది. వాటిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. పుస్తకాలలో దాచాడు. ఇక ఆ విషయం మరిచేపోయాడు. కొన్ని రోజుల తరువాత పేపర్తో తయారుచేసిన కళాకృతుల ప్రదర్శనకు వెళ్లినప్పుడు తాను దాచుకున్న పత్రాలు ఆసాదికి గుర్తుకువచ్చాయి. వాటిని కాన్వాస్గా చేసుకొని రకరకాల బొమ్మలు వేయాలనే ఆలోచన వచ్చింది. ఒక సూదితో రోజూ రెండు నుంచి మూడు గంటల వరకు ఈ పత్రాల మీద చిత్రాలను లిఖించడానికి ప్రయత్నించేవాడు. మొత్తానికైతే కొన్నిరోజుల తరువాత అసాది ప్రయత్నం గాడిలో పడింది. జంతువులు, పక్షులు, మనుషులు... కోరు కున్న చిత్రమల్లా పత్రంపై ప్రత్యక్షమయ్యేది. ఈ పత్రాలపై చెట్టు జిగురు తప్ప రసాయనాలేవీ వాడేవారు కాదు. ‘‘పత్రాల మీద చిత్రాలను చెక్కుతున్నప్పుడల్లా నా బాల్యం గుర్తుకు వస్తుంది’’ అంటున్నాడు అసాది. ఇరాన్కు చెందిన అసాది భార్యతో కలిసి మాంచెస్టర్లో స్థిరపడ్డాడు. తాను అభిమానించే వ్యక్తుల పోట్రయిట్లను పత్రాల మీద చెక్కి వారికి కానుకగా ఇస్తుంటాడు. ‘‘ఎంత టైమ్ తీసుకున్నామనే దానికంటే ఎంత అందంగా వచ్చింది అనేది ముఖ్యం’’ అంటాడు అసాది. ఇటీవల మొదటిసారిగా తన కళాకృతులను ప్రదర్శనకు పెడితే అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘చెట్టు మీది నుంచి యాపిల్ పడితేనే కాదు... ఆకు పడినా కొత్త ఆలోచనలు వస్తాయి’’ అని తరచుగా అంటుంటాడు సరదాగా అసాది. పచ్చనాకు సాక్షిగా నిజమే కదా మరి! -
తోటరాముళ్లు!
కొత్త ధోరణి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా క్లబ్ల వైపు పరుగులు తీసి ‘రిలాక్స్ అయ్యాం’ అని చెప్పుకోవడం మగరాయుళ్లకు ఉండే అలవాటు. ఇప్పుడు మాత్రం అభివృద్ధి చెందిన దేశాలలో ‘క్లబ్’ స్థానాన్ని ‘తోట’ ఆక్రమించింది. ఇదేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా! ఎక్కువశాతం మంది పురుషులు రిలాక్స్ కావడం కోసం తోట పనిచేస్తున్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? వారు కూడా తమకున్న కొద్దిపాటి తోటలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తోటపని అనేది ఇప్పుడు ఫ్యాషన్గా మారింది. ‘‘కాలంతో పాటు ప్రాధాన్యతలు మారుతాయి. ఒకప్పుడు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పడం, పార్టీలకు విరివిగా వెళ్లడం అనేది పురుష లక్షణంగా ఉండేది. ఇప్పుడు మాత్రం వంట, తోట పని ఆ స్థానాన్ని భర్తి చేశాయి’’ అంటున్నాడు బ్రిటన్కు చెందిన టామ్లిన్ అనే మానసిక విశ్లేషకుడు. ‘ఉన్నట్టుండి పురుషపుంగవులకు తోట మీద ప్రేమ పెరగడానికి కారణం ఏమిటి?’ అనేదానికి కొందరు చెప్పేదేమిటంటే బ్రిటన్లోని ఒక ఛానల్లో ప్రసారమయ్యే ‘లవ్ యువర్ గార్డెన్’ అనే కార్యక్రమం. ‘‘గార్డెనింగ్తో పాటు వంట, క్రాఫ్ట్...మొదలైనవి పాపులర్ కల్చర్లో భాగం అవుతున్నాయి’’ అంటున్నాడు ‘లవ్ యువర్ గార్డెన్’ ప్రెజెంటర్ ఫ్రాన్సిస్ టాప్హిల్. రోజుకో రకమైన సాంకేతిక సాధనాలు వెల్లువెత్తుతున్నా ఈ సాంకేతిక యుగంలో పాత అలవాట్లు మళ్లీ రావడం ఆహ్వానించదగినదే అంటున్నాడు ఫ్రాన్సిస్. -
ఇక నుంచి గజ‘రాజే’..!
అన్నే.. ఒక ఆసి యా ఏనుగు.. అదే సమయంలో బ్రిటన్లో చివరి సర్కస్ ఏ నుగు కూడా.. 50 ఏళ్లు సర్కస్లో పనిచేసింది. అక్కడ పడరాని పాట్లు పడింది. చిత్రహిం సలను ఎదుర్కొంది. ఇది గో నిదర్శనం. ఈ వీడి యో మూడేళ్ల క్రితం బయటకు వచ్చింది. దేశాన్ని కదిలించింది. అన్నేను చిత్రహింసలకు గురిచేసిన బాబీ రాబర్ట్స్ సర్కస్ యజమాని బాబీకి జైలు శిక్ష పడేలా చేసింది. జనం అంతటితో ఆగలేదు. ఇన్నేళ్లు కష్టపడ్డ అన్నేకు ఏదైనా చేయాలనుకున్నారు. విరాళాలు సేకరించారు. అన్నే గజ‘రాజు’లా బతికేలా చేయాలని.. ‘అన్నే హెవెన్’(అన్నే స్వర్గం)ను కట్టిస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుపెడుతున్నారో తెలు సా? రూ. 12 కోట్లు! అంతా జనం డబ్బే. అన్నే కోసం లాంగ్లీట్ సఫారీ పార్కులో స్విమ్మింగ్ పూల్తోపాటు విహరించడానికి 4 ఎకరాల్లో తోటను ఏర్పాటు చేస్తున్నా రు. చలికాలంలో వెచ్చగా ఉండటానికి అండర్ఫ్లోర్ హీటింగ్ సదుపాయమూ ఉంది. వచ్చే ఏడాది వీటి నిర్మాణం పూర్తి కానుంది. అన్నేకిప్పుడు 60 ఏళ్లు. అంటే రిటైర్మెంట్ ఏజ్ అన్నమాట. ఇక నుంచి గజ‘రాజే’..! అన్నే.. ఒక ఆసి యా ఏనుగు.. అదే సమయంలో బ్రిటన్లో చివరి సర్కస్ ఏ నుగు కూడా.. 50 ఏళ్లు సర్కస్లో పనిచేసింది. అక్కడ పడరాని పాట్లు పడింది. చిత్రహిం సలను ఎదుర్కొంది. ఇది గో నిదర్శనం. ఈ వీడి యో మూడేళ్ల క్రితం బయటకు వచ్చింది. దేశాన్ని కదిలించింది. అన్నేను చిత్రహింసలకు గురిచేసిన బాబీ రాబర్ట్స్ సర్కస్ యజమాని బాబీకి జైలు శిక్ష పడేలా చేసింది. జనం అంతటితో ఆగలేదు. ఇన్నేళ్లు కష్టపడ్డ అన్నేకు ఏదైనా చేయాలనుకున్నారు. విరాళాలు సేకరించారు. అన్నే గజ‘రాజు’లా బతికేలా చేయాలని.. ‘అన్నే హెవెన్’(అన్నే స్వర్గం)ను కట్టిస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుపెడుతున్నారో తెలు సా? రూ. 12 కోట్లు! అంతా జనం డబ్బే. అన్నే కోసం లాంగ్లీట్ సఫారీ పార్కులో స్విమ్మింగ్ పూల్తోపాటు విహరించడానికి 4 ఎకరాల్లో తోటను ఏర్పాటు చేస్తున్నా రు. చలికాలంలో వెచ్చగా ఉండటానికి అండర్ఫ్లోర్ హీటింగ్ సదుపాయమూ ఉంది. వచ్చే ఏడాది వీటి నిర్మాణం పూర్తి కానుంది. అన్నేకిప్పుడు 60 ఏళ్లు. అంటే రిటైర్మెంట్ ఏజ్ అన్నమాట.