nallamala forest
-
ఆంధ్రప్రదేశ్ : ఏడాదిలో రెండు రోజులు మాత్రమే దేవాలయ దర్శనం
ఆత్మకూరు : ప్రముఖ శైవక్షేత్రాల్లో బండి ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అడవిలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరక్షేత్రం ప్రసిద్ధి చెందింది. కాకతీయ, విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. దక్షిణ భారత నిర్మాణశైలిని ఆలయంలో గమనించవచ్చు. ఈ క్షేత్రాన్ని చూడాలంటే ఏడాదికి రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. శివరాత్రి వరకు ఈ క్షేత్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఆలయంలో మహాశివుడే బ్రహ్మేశ్వరుడి రూపంలో కొలువై ఉన్నారు. ద్వాపరయుగంలో మహాభారత కురుక్షేత్ర సంగ్రామం అనంతరం అశ్వత్థామ.. శ్రీకృష్ణుడి ఆదేశానుసారంతో గుండ్లకమ్మ నది జన్మస్థానతీరాన శివలింగాన్ని ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. ఆలయంలో గుండ్లబ్రహ్మేశ్వరస్వామితో పాటు రాజరాజేశ్వరిదేవి, అశ్వత్థామ, వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు కొలువై ఉన్నాయి. శివరాత్రి మినహా మరొకరోజు మాత్రమే ఆలయాన్ని దర్శించుకునేందుకు అటవీశాఖ అధికారులు అనుమతిస్తారు.ప్రకృతి రమణీయత..గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఎన్నో వృక్షాలు, జంతువులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో 353 వృక్షజాతులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పులులు, మచ్చలపిల్లి, ఉడతలు తదితర జంతువులు, దుప్పులను చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 23 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దేవాలయం సమీపంలో గుండ్లకమ్మ నది నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాలో ప్రవహిస్తుంది. ఈ నదిపై కందుల ఓబుళరెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ జలాశయంతో ప్రకాశం జిల్లా పరిధిలో అనేక గ్రామాలకు తాగు, సాగునీరు అందుతోంది.ఇలా చేరుకోవచ్చు..వెలుగోడు మీదుగా గట్టుతండా నుంచి నేరుగా ఈ క్షేత్రాన్ని ట్రాక్టర్లు, వివిధ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. గతంలో ఆర్టీసీ బస్సులు, అన్ని వాహనాల్లో ఈ క్షేత్రానికి వెళ్లేవారు. తెలుగుగంగ రిజర్వాయర్ను నిర్మించడం, పులుల సంరక్షణ కేంద్రంగా ఈ క్షేత్రాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించి.. ఈ రహదారిని మూసి వేశారు. ఈ రహదారిని ఈ యేడాది మహాశివరాత్రి సందర్భంగా అనుమతించాలని అటవీశాఖ అధికారులకు భక్తులు విన్నవించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి దృష్టికి కూడా భక్తులు తీసుకెళ్లారు. ప్రస్తుతం నంద్యాల, వెలుగోడు, ఆత్మకూరు నుంచి సంతజూటూరు గ్రామం నుంచి పెద్దదేవలాపురం గ్రామం మీదుగా ఈ క్షేత్రానికి వెళ్లవచ్చు. నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు సమీపంలోని దిగువమెట్ట వద్ద దిగి నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. నంద్యాల నుంచి దిగువమెట్ట మీదుగా గుండ్ల బ్రహ్మేశ్వరానికి అన్నిరకాల వాహనాలు వెళ్తాయి. దూరం 42 కి.మీ ఉంటుంది. ఈ కేత్రానికి చేరాలంటే అటవీశాఖ అధికారులు అనుమతి తీసుకోవాలి. వారు కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. వాహనాలు ఉదయం 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తిరిగి రావాల్సి ఉంటుంది.ప్రతి ఒక్కరూ సందర్శించాలినల్లమల అటవీ పరిధిలోని గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిందే. ఈ క్షేత్రంలో వెలిసిన రాజరాజేశ్వరిమాతను పూ జించాలి. ఈ క్షేత్రానికి ఒకప్పుడు వెలుగోడు, సంతజూటూరు, గిద్దలూరు మీదుగా వేలాది మంది భక్తులు కార్తీకమాసం, మాఘమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో వెళ్లేవారు. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్ పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడంతో మహాశివరాత్రి సందర్భంగా రెండు రోజులు మాత్రమే అనుమతిస్తున్నారు. దేవాలయం అభివృద్ధి చెందాలంటే భక్తులను అనుమతించాలి. ఇక్కడ గుండ్ల బ్రహ్మేశ్వరస్వామిని దర్శిస్తే అనేక జన్మల పుణ్య ఫలితం ఉంటుంది.– కృష్ణశర్మ, ఆలయ పురోహితుడురెండు రోజులు మాత్రమేనల్లమల అభయారణ్యంలో గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది పులుల సంరక్షణ కేంద్రం కావడంతో ఎవరినీ అనుమతించం. కేవలం మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే ప్రకాశం, కర్నూలు జిల్లాల భక్తులను రెండు రోజులు మాత్రమే అనుమతిస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.– ఉదయ్దీప్,గుండ్ల బ్రహ్మేశ్వరం రేంజ్ ఆఫీసర్ -
హరిణి.. హరివిల్లులా!
తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల (Nallamala) అడవులంటేనే జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఏనుగు, సింహం (Lion) తప్ప తక్కిన జంతువులన్నింటికీ ఈ అడవి ఆవాసప్రాంతంగా నిలిచింది. 17 రకాల కార్నివోర్స్ (మాంసాహార జంతువులు), 8 రకాల హెర్బీవోర్స్ (శాకాహార జంతువులు)తో పాటు పలు రకాల పక్షులు, సరీసృపాలు, చేపలు, ఉభయచర జీవులు, కీటకాలు తదితర జంతుజాలం ఈ అడవిలో సహజీవనం చేస్తూ బయోడైవర్సిటీకి (Biodiversity) ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. 8 రకాల హెర్బీవోర్స్లో ఏడు రకాలు జింకలే ఉండటం విశేషం. వీటిల్లో 300 కేజీల బరువు తూగే కణితి (సాంబర్), నీల్గాయ్ వంటి భారీ జింకలతో పాటు కుందేలు కంటే కాస్త చిన్నదిగా కనిపించే మౌస్డీర్ సెతం ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నాగార్జున సాగర్– శ్రీశైలం (Srisailam) అభయారణ్యం పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్లో ఇవి అధిక సంఖ్యలో సంచరిస్తున్నాయి. – ఆత్మకూరు రూరల్ప్రమాదం అంచున.. కొండ గొర్రె కంటే కాస్త భారీగా, కణుతుల కంటే కాస్త చిన్నగా ఉండే మరో ఆంటిలోప్.. బుర్రజింక. చింకారా అనికూడా పిలిచే ఈ జింక తలపై రెండు కొమ్ములు కృష్ణజింకను పోలి పురి తిరిగి ఉంటాయి. కానీ వాటి అంత పొడవు పెరగవు. నల్లమలలో వీటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అరుదుగా మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. రైతులు వ్యవసాయ ఉపకరణాలలో చింకారా కొమ్ములను అందంగా వినియోగిస్తుంటారు. చర్నాకోల పిడిగా, మోకులు, పగ్గాలు తయారు చేసేందుకు ఉపయోగపడే పరికరంగా కూడా వీటి కొమ్ములను రైతులు సేకరించే వారు. సాంబర్ డీర్..జింకలలో అతి పెద్దది కణితి(సాంబర్ డీర్). దట్టమైన అటవీ ప్రాంతంలోని పర్వత ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తుంటాయి. ఇవి పెద్ద పంగల కొమ్ములు కలిగి ఉంటాయి (మగవాటికి మాత్రమే కొమ్ములుంటాయి). ఈ కొమ్ములను అవి నిర్ణీత సమయంలో విసర్జిస్తుంటాయి. కొన్ని సార్లు ఆడ కణితి కోసం జరిగే పోరాటంలో అవి ఊడి పోతుంటాయి.నల్లమలలో ప్రధాన రక్షిత వన్యప్రాణి అయిన పెద్దపులికి ఆహార జంతువులుగా జింకలు పర్యావరణ సమతుల్యానికి తమవంతు కృషి చేస్తున్నాయి. జింకలతో పాటు అడవి పంది, ముల్ల పంది, కుందేలు వంటి జంతువులు కూడా పులి ఆహార మెనూలో ఉన్నాయి. కణుతులు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని పెద్ద పులులకు చక్కటి ఆవాసంగా గుర్తిస్తారు. నేనూ జింకనే..జింకకాని జింక ఈ మౌస్ డీర్. నిజానికి ఇది జింకజాతి వన్యప్రాణి కాదు. కాని రూపం బట్టి దీన్ని మూషిక జింకగా చెబుతారు. ఇది పంది జాతికి చెందిన ప్రాణి. వెనక కాళ్లు కాస్త బలహీనంగా కనిపించే ఈ జింక పూర్తిగా దట్టమైన వర్షారణ్యాలను పోలిన అడవుల్లో కనిపిస్తుంది. పెద్ద కుందేలు పరిమాణంలో ఉండే మూషిక జింక నల్లమలలోని గుండ్లబ్రహ్మేశ్వరం, రుద్రకోడు, పెచ్చెర్వు వంటి దట్టమైన పర్వతప్రాంత అడవుల్లో కనిపిస్తుంది. ఇది సాధారణంగా రాత్రుళ్లు మాత్రమే తిరుగాడుతుంది. చెట్టు తొర్రల్లో నివాసముంటుంది. నల్లమలలో ఇది అంతరించి పోయింది అనుకున్న సమయంలో తిరిగి కనిపిస్తుండటం శుభపరిణామం. కొమ్ములతోకుమ్మేస్తూ..తలపై రెండు, పనపై మరో రెండు చిన్న కొమ్ములు కలిగి ఉండడమే కొండ గొర్రె ప్రత్యేకత. ఈ కారణంగానే కొండగొర్రెను చౌసింగా అని కూడా పిలుస్తారు. నల్లమలలోని కొండ తిప్పలపై నివసించే ఈ వన్యప్రాణి ఉనికి దట్టమైన పచ్చటి అడవికి గుర్తుగా చెప్పుకోవచ్చు. కొండగొర్రె తనను తాను మాంసాహార జంతువుల నుంచి రక్షించుకునేందుకు కొండకొమ్ముల ఏటవాలును వీలుగా ఉపయోగించుకుంటుంది. కొండగొర్రె మాంసం రుచిగా ఉంటుందన్న కారణంగా ఇవి ఎక్కువగా వేటగాళ్ల చేతిలో బలి అవుతుంటాయి. అడవికే అందం..పొడ దుప్పి (స్పాటెడ్ డీర్).. దీనిని చుక్కల దుప్పి అని కూడా అంటారు. జింకలలో అత్యంత అందమైనది. బంగారు వర్ణం చర్మంపై తెల్లటి మచ్చలతో అత్యంత లావణ్యంగా కనిపిస్తుంది. వీటిలో కూడా మగ వాటికి పంగలతో కూడిన కొమ్ములు ఉంటాయి. దుప్పులు కూడా తమ కొమ్ములను వదులుతుంటాయి. మగ దుప్పి అరిచే శబ్దాన్ని బట్టి వర్లుపోతు అనికూడా పిలుస్తారు. ఇవి అడవుల్లో అన్ని ప్రదేశాల్లో సంచరిస్తుంటాయి. పులి ఆహారంలో ఇది కూడా ఉంది.మనిమేగం.. ప్రత్యేకం నల్లమలలో ప్రధానంగా కనిపించే మరో ఆంటిలోప్ మనిమేగం (నీల్గాయ్). ఇది కూడా భారీ శరీరాన్ని కలిగి ఉంటుంది. కొంతమేర గుర్రాన్ని పోలి ఉండే మగ మనిమేగాలు వయస్సుకు వచ్చాక నల్లటి పైకప్పుతో కనిపిస్తాయి. అందుకే వీటిని నల్లపోతు అనికూడా అంటారు. కృష్ణజింకలు, మనిమేగాలు ఎక్కువగా సంచరిస్తున్నాయంటే అది అటవీ క్షీణతకు సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రెండు జింకలు పెద్దపెద్ద గడ్డి మైదానాల్లో మాత్రమే మనగలుగుతాయి. జంగిల్ మే సవాల్.గడ్డి మైదానాల్లో గుంపులుగా జీవించే జింకల్లో కృష్ణజింక (బ్లాక్ బక్) ప్రధానమైనది. మగ జింకలకు పొడవాటి కొమ్ములు ఉంటాయి. పురి తిరిగినట్లుండే ఈ కొమ్ములపైన ఉన్న పురులను బట్టి వాటి వయస్సును నిర్ధారిస్తారు. ఇవి బాగా వయస్సుకు వచ్చాక వాటి చర్మం నల్లటి కప్పును కలిగి అందంగా తయారవుతుంది. ఇలా బలంగా నల్లటి కప్పుతో కనిపించే కృష్ణజింక.. జింకల గుంపుకు నాయకత్వం వహిస్తుంది. చదవండి: లైవ్లో కోడిపందేలపై బెట్టింగ్లు...అత్యంత వేగంగా పరిగెత్తే వీటిని వేటాడే మాంసాహార జంతువు నల్లమలలో లేదు అంటే అతిశయోక్తి కాదు. గంటకు 100 కి.మీ పైగా వేగంతో పరిగెత్తే చీతాలు దేశంలో కనుమరుగు కావడంతో వీటికి పోటీపడి పరిగెత్తే జంతువులు లేకుండా అయ్యాయి. తోడేల్లు, హైనాలు మాటువేసి వీటిని చంపుతుంటాయి. కృష్ణ జింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక జంతువుగా ఉంది.జీవవైవిధ్యంలో జింకలు కీలకం నల్లమలలో ముఖ్య రక్షిత వన్యప్రాణి పెద్దపులి, ఆతరువాతి స్థానాల్లో ఉన్న చిరుత వంటి మాంసాహార జంతువులకు ఆహార సమృద్ధి కలిగిస్తూ మొత్తం పర్యావరణ సంరక్షణలో జింకలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పెద్దపులికి నల్లమల ఆవాసంగా మారడంలో ఈ జింకలు కూడా ప్రధాన కారణం. నల్లమలలో జీవ వైవిధ్యంలో ఇవి కీలకంగా ఉన్నాయి. – పట్టాభి, ఎఫ్ఆర్వో, ఆత్మకూరు రేంజ్ -
అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి చిరుతలు
-
రేపటి నుంచి పులుల గణన
రాష్ట్రవ్యాప్తంగా జనవరి1 నుంచి 45 రోజులపాటు పులుల లెక్కింపు జరుగనుంది. నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతమైన మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, ఆత్మకూరు అటవీశాఖ ప్రాంతాలతోపాటు పల్నాడు, తిరుపతి, రాజంపేట, కడప అటవీ ప్రాంతాల్లో ఉన్న పులుల సంఖ్యను లెక్కించనున్నారు. ఇందుకోసం ప్రతి 2 చదరపు మీటర్లకు రెండు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఏకైక టైగర్ రిజర్వు ఫారెస్టు అయిన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టు సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. పులుల గణన కోసం సుమారు 2.15 లక్షల ఎకరాల్లో 400పైగా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో 86 నుంచి 88 వరకూ పులులు సంచరిస్తున్నట్లు అంచనా. – మార్కాపురం బేస్ క్యాంపులు..ప్రస్తుతం నల్లమలలో గంజివారిపల్లి సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంపు, పాలుట్ల, వెదురుపడియ, నారుతడికల, ఇష్టకామేశ్వరి, పాలుట్ల, దొరబైలు, తుమ్మలబైలు, చిన్నమంతనాల, రోళ్లపెంట, కొర్రపోలు, కొలుకుల తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంపులున్నాయి. రాత్రి 9 దాటితే దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెద్దపులుల సంచారం ఉన్నందున రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పులుల గణన..రాష్ట్రంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో జనవరి 1 నుంచి 45 రోజుల పాటు పులుల గణన జరుగుతుంది. ఇవి శేషాచలం బయోస్పియర్ రిజర్వులో కూడా సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులుల సంరక్షణలో లంకా మల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, పెంచల నరసింహ అభయారణ్యం, వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, పులుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. – సందీప్కృపాకర్, అటవీశాఖ డెప్యూటీ డైరెక్టర్, మార్కాపురం -
నన్నారి @ నల్లమల
ఆత్మకూరు: నల్లమల అంటేనే వృక్ష సంపదకు ప్రసిద్ధి. వివిధ వృక్ష జాతులు, ఔషధ మొక్కలకు పెట్టింది పేరు. అలాంటి ఈ అభయారణ్యంలో గిరిజనులకు ఎంతగానో ఉపాధినిస్తున్న నన్నారి (షరబత్) మొక్కలు కనుమరుగవుతున్నాయి. గిరిజనులు ప్రధానంగా నన్నారి, కుంకుడు, చింతపండు, ఇతర జిగురు లాంటి ఫల సేకరణ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అయితే నల్లమల అరణ్య పరిధిలో ఒకప్పుడు నన్నారి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా కనిపించేవి. గిరిజనులు వాటిని సేకరించి, విక్రయించగా వచ్చిన సొమ్ముతో జీవనోపాధి పొందేవారు. ప్రస్తుతం నల్లమలలో వీటి ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం గిరిజనులు గూడెం దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లి నన్నారి తీగజాతి మొక్కను గుర్తించి, భూమిలో ఉన్న వేర్లను పెకిలించి తీసుకురావాల్సి వస్తోంది. ఎక్కువగా వేసవి సమీపించే ముందు గిరిజనులు నన్నారి వేర్ల సేకరణపై దృష్టి పెడతారు. కిలోల చొప్పున వాటిని విక్రయిస్తారు. వీటితో తయారైన నన్నారి పానీయాన్ని కొన్ని ప్రాంతాల్లో షర్బత్గా, మరికొన్ని ప్రాంతాల్లో సుగంధపాలుగా పిలుస్తారు. నన్నారి వేర్లు రెండు రకాలు. నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. నల్లమల పరిధిలో నల్ల రంగులో ఉన్నాయి. కేరళ, కర్ణాటకలోని మైసూరు, ఇతర రాష్ట్రాల్లో తెలుపు రంగులో దొరుకుతాయి. అయితే నల్లమలలో దొరికే వాటికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నన్నారి చాలా రుచికరంగా ఉంటుంది. పోషక పదార్థాలు కూడా ఎక్కువే. అందువల్ల ఇక్కడి నన్నారి వేర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. పెంపకానికి కేంద్రం ప్రోత్సాహం నల్లమల అటవీ పరిధిలో అంతరిస్తున్న నన్నారి మొక్కలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నన్నారి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. నల్లమల పరిధిలో నన్నారి మొక్కల జాతి అంతరిస్తోందన్న విషయం రాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో.. ఈ పంటను ఎలాగైనా కాపాడాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి వందన యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వార శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో తొలిసారిగా నన్నారి మొక్కల పెంపకానికి ఐటీడీఏ అధికారులు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి, ఆత్మకూరు గ్రామాల్లో గిరిజనుల ఆధ్వర్యంలో నన్నారి మొక్కల పెంపకాన్ని (నర్సరీ) ప్రారంభించారు. మొక్క నాటిన రెండేళ్లలో భూమిలోకి వేర్లు బలంగా దిగుతాయి. ఆ తర్వాత వాటిని బయటకు పెకలించి, శుభ్రం చేసి విక్రయిస్తారు. కిలో నన్నారి వేర్లను ఉడికించడం ద్వారా 25 లీటర్ల నన్నారిని తయారు చేయవచ్చు. లీటర్ రూ.130 నుంచి రూ.200 చొప్పున మార్కెట్లో డిమాండ్ ఉంది. ఒక లీటర్ నన్నారికి.. సోడా లేదా నీరు, కాస్త నిమ్మరసం కలపడం ద్వారా 20 గ్లాసుల పానీయం తయారవుతుంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనుల నుంచి నన్నారి వేర్లను సేకరించి, రాష్ట్రంలోని వైజాగ్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.షుగర్ ఫ్రీ నన్నారి నన్నారి అంటేనే రుచికి ప్రతీక. పిల్లలైనా, పెద్దలైనా నన్నారికి దాసోహమే. అలాంటి నన్నారిని చూసిన షుగర్ పేషెంట్లు ఎలాగైనా సరే తాగాలని ఉబలాట పడతారు. అయితే గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందని కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతుంటారు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా సేవించేలా ఐటీడీఏ ఆధ్వర్యంలో నన్నారి తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇప్పటికే ఆత్మకూరు ప్రాంతంలోని చెంచు, గిరిజనులకు శిక్షణ సైతం ఇచ్చారు. మొక్కల నర్సరీ కూడా ప్రారంభించారు. ఒక్కొక్క గ్రూపు నందు 30 మంది చొప్పున చెంచు గిరిజనులు ఉండేలా గ్రూపులను ఏర్పాటు చేశారు. నల్లమల నన్నారి ఉపయోగాలు వేసవిలో దాహార్తి తీరుతుంది. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలకు మందుగా పని చేస్తుంది. వ్యాధి నిరోధకత పెంచుతుంది. హోర్మోన్ల సమతుల్యతను పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగేలా చేస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉండేలా ఉపకరిస్తుంది.నన్నారి పెంపకం వల్ల ఆర్థికంగా లబ్ధిఎండాకాలం వ నన్నారి గడ్డల కోసం పారా, పలుగు పట్టుకుని కొండల్లోకి వెళ్లాలి. ఆ మొక్క కనిపించేంత వరకు వెతికి, వెతికి కొండల వెంబడి తిరగాలి. మొక్క కనిపించకపోతే ఇంటికి రావాలి. ఆ మొక్క కనిపిస్తే గడ్డలను తీసుకుని రావాలి. ఇందుకు కొండలో తిరిగేందుకు కూడా పొద్దు పోతుంది. ప్రస్తుతం మొక్కలను ప్రభుత్వం గూడేల్లోనే ఏర్పాటు చేయడంతో మాకు కొండల వెంట తిరిగే ఇబ్బంది ఉండదు. ఆ గడ్డలను అమ్ముకుని జీవనం సాగిస్తాం. గడ్డలు ఎక్కువగా వస్తే ఆర్థికంగా ఎదుగుతాం. -శివలింగమ్మ, చెంచు మహిళ, ఎర్రమఠం గూడెంతిరిగే కష్టం తప్పుతుందిఐటీడీఏ ఆధ్వర్యంలో మా గూడేల్లో నన్నారి నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడ్డలను అమ్ముకుని బతికే అవకాశం పెరుగుతుంది. తద్వారా మాకు ఎంతగానో ఆరి్థకంగా ఉపయోగం ఉంటుంది. లేదంటే కొండల వెంట తిరిగి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడచి వెతకాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ గడ్డల కోసం ఎంతో దూరం వెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గూడెం దగ్గరలోనే నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు జీవనోపాధి లభిస్తుంది. – ఈదమ్మ, బైర్లూటీ గూడెం -
బెబ్బులి బెదురుతోంది!
దేశంలోనే విస్తీర్ణంలో అతి పెద్దదైన పెద్దపులుల అభయారణ్యం శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్). అలాంటి చోటే వాటికి పెను ముప్పు ఎదురవుతోంది. పెరుగుతున్న పులుల సంతతికి తగ్గట్టు ఆవాసం, ఆహార లభ్యత దొరకడం లేదు. వీటి ప్రధాన ఆహార జంతువులైన దుప్పులు, కణుతుల సంఖ్య పెరగకపోగా రోజురోజుకు వాటి సంఖ్యలో తరుగుదల కనిపిస్తోంది. ఇందుకు అటవీ పరిధిలో వేటగాళ్లు మాటు వేయడం.. వారిని కట్టడి చేసే స్థాయిలో సిబ్బంది సంఖ్య లేకపోవడంతో ఎంతో భద్రమైనదిగా భావించే నల్లమలలోనే వాటి సంరక్షణ గాలిలో దీపంలా మారింది.ఆత్మకూరు రూరల్: అటవీ ఆవరణ వ్యవస్థలో అగ్రభాగాన ఉండే పెద్దపులులు అధికారిక లెక్కల ప్రకారం శ్రీశైలం– నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో 87 ఉన్నాయి. అయితే, పులులు పెరిగే కొద్ది వాటి ఆవాస ప్రాంతం, ఆహార లభ్యత పెరగడం లేదు. ఇందుకు తగినన్ని గడ్డి మైదానాలు అభివృద్ధి కాలేదు. పులుల ప్రధాన ఆహార జంతువుల సంఖ్య పెరగడమూ లేదు. నల్లమలలోని ఆత్మకూరు, నంద్యాల , గిద్దలూరు,మార్కాపురం డివిజన్లలో వేటగాళ్ల కదలికలు రోజురోజుకు పెరుగుతుండడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ సమీప గ్రామాల్లో తిష్టవేసిన కొందరు వేటగాళ్లు గడ్డితినే జంతువులు సంచరించే నీటివనరుల వద్ద, జేడ (సాల్ట్ లిక్)మైదానాల వద్ద ఉచ్చులు వేసి మాటు గాస్తున్నారు. ఆ ఉచ్చులకు చిక్కిన వన్యప్రాణులను మాంసంగా మార్చి పట్టణాల్లో పెద్ద మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రమాదకర స్థితిలో పులి ఎంతో భద్రమైనదని భావించే ఎన్ఎస్టీఆర్ లో ప్రాణాంతక వైరస్లా వేటగాళ్ల చొరబాటు పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం సిబ్బంది కొరతేనన్నది విస్పష్టం.ఎన్ఎస్టీఆర్ సర్కిల్లో మొత్తం నాలుగు డివిజన్లలో 750 (ఇది పాత లెక్క)మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 250 మందే ఉన్నారు. ఈ అరకొర సిబ్బందితో వేటగాళ్లను నియంత్రించ లేని పరిస్థితి. ఫలితంగా పులి సంరక్షణ ప్రమాదకర స్థితిలో పడింది. ఫుట్ పెట్రోలింగ్కు అదే సమస్య అటవీ సంరక్షణలో రోజువారి ఫుట్ పెట్రోలింగ్ ( కాలి నడకతో ప్రదేశాన్ని చుట్టి రావడం)కు కూడా సిబ్బంది కొరతే ప్రధాన అడ్డంకిగా ఉంది. సుమారు 3,750 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఎన్ఎస్టీఆర్లో ఫుట్ పెట్రోలింగ్కు ఉన్న వనరులు కేవలం బేస్ క్యాంప్ సిబ్బంది మాత్రమే. పులి సంరక్షణలో మేటి అని చెప్పుకునే ఆత్మకూరు అటవీ డివిజన్లో ఉన్న 23 బేస్ క్యాంపుల్లో సుమారు వంద మంది ప్రొటెక్షన్ వాచర్లు పని చేస్తుంటారు.అయితే, వీరిలో కొందరు వీక్లీ ఆఫ్లో ఉంటారు. మిగతా వారిని ప్రత్యేకించి ఫుట్ పట్రోలింగ్కు కేటాయించలేని పరిస్థితి. ప్రొటెక్షన్వాచర్లను పర్యవేక్షించేందుకు ఒక్కో బేస్ క్యాంపులో ఒక రెగ్యులర్ అటవీ సిబ్బంది ఉండాలి. ఈ రూల్ పుస్తకాలకు మాత్రమే పరిమితమైంది. వేధిస్తోన్న ఆహార కొరత .. శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో ఉన్న ఆహార లభ్యతను బట్టి ఒక్కో పెద్దపులి తన అధీన ప్రాంతం (టెరటరీ)గా సుమారు 40 చ.కిమీ పరిధిని ఉంచుకుంటోంది. పులి సాధారణంగా ఆరు సార్లు దాడులు చేస్తే ఒకసారి వేట సాఫల్యమవుతుంది. ఇందుకోసం అది ఆరు రోజులు కూడా ఆకలితో నకనకలాడాల్సి ఉంటుంది. కనీసం వారానికో జంతువును వేటాడినా ప్రస్తుతం నల్లమలలో ఉన్న పులులకు వారానికి సుమారు 90 ఆహార జంతువులు అవసరమవుతాయి. నెలకు 360, సంవత్సరానికి దరిదాపుగా నాలుగు వేలకు పైగా జంతువులు అందుబాటులో ఉండాలి. ఇది కనిష్ట అవసర స్థితి. ఈ నిష్పత్తిలో ఆహార లభ్యత లేక పోతే పులుల ఆధీన ప్రాంతం క్రమేపీ పెరుగుతుంది. దీంతో పులుల మధ్య ఆహారం కోసం యుద్ధాలు జరుగుతాయి. ఈ పోరులో ఎన్నో పులులు మరణించే అవకాశం ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పులి ఆహారం వేటగాళ్ల చౌర్యానికి గురైతే జరిగే నష్టం లెక్కకట్టలేనిది. అడపాదడపా కేసులు... శిక్షలు శూన్యం? అటవీ అధికారులు అడపాదడపా ఎవరో ఒకరిని వన్యప్రాణి వేట కేసుల్లో పట్టుకుని కేసులు పెడుతున్నారు. అయితే, వారిలో ఏ ఒక్కరికీ కఠిన శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఇందుకు ప్రధాన కారణం కూడా సిబ్బంది కొరతే. కనీసం పీఓఆర్ను కాని చార్జ్ షీట్ను కాని ముద్దాయిలకు శిక్ష పడేలా రాసుకోలేని పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో ఆత్మకూరు రేంజ్ లోని గుమ్మడాపురం కు చెందిన కొందరు దుప్పి తలతో అధికారులకు చిక్కారు.ఇదే రేంజ్ లోని శివపురం సమీపంలో ఏప్రిల్ నెలలో ఇద్దరు ఎలుగు బంటి మాంసంతో చిక్కారు. ముసలమడుగు సమీపంలో అక్టోబర్ నెలలో కొందరు అడవి పంది మాంసంతో పట్టుబడ్డారు. వీరందరిపై పీఓఆర్ నమోదు అయి కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే వారిపై సరైన సెక్షన్లు పెట్టకపోవడంతో నిందితులు 24 గంటల్లో బెయిల్పై తిరిగి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఉచ్చులతో పులికీ ప్రమాదంవేటగాళ్లు పులి ఆహార జంతువులైన జింకల కోసం నీటి వనరుల వద్ద ఉచ్చులు పన్ని ఉంచు తారు. అయితే ఈ ఉచ్చులలో ప్రమాదవశాత్తు అప్పుడప్పుడు పెద్ద పులులు కూడా చిక్కు కుని మరణిస్తుంటాయి. గతంలో సిద్దాపురం చెరువులో పన్నిన ఉచ్చులకు ఓ పెద్దపులి చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా రెండేళ్ల కిందట ఆత్మకూరు డివిజన్ లోని నల్లకాల్వ సెక్షన్ లో ఓ పులి కళేబరం గాలేరు ప్రవాహంలో కొట్టుకు వచ్చింది. దాని మెడలో ఒక ఉచ్చు బిగిసి ఉంది. ఇలా వేటగాళ్ల వల్ల పులుల ఆహార జంతువులు తగ్గిపోవడంతో పాటు కొన్నిసార్లు అవి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. అదే పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటే వేటగాళ్లను నియంత్రిచవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాగా దీనిపై ఎన్ఎస్టీఆర్ ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా వివరణ కోరగా ప్రస్తుతం సిబ్బంది కొరత ఉందని, కింది స్థాయిలో రిక్రూట్మెంట్ జరగడం లేదని, తమ వరకు పులుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఎవరీ వేటగాళ్లు... నల్లమల పులి ఆహారానికి పీడగా మారిన వేటగాళ్ల గురించి ఆరా తీస్తే కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పడుతున్నాయి. ప్రధానంగా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో వేటగాళ్ల కదలికలను గమనిస్తే అవి ఎక్కువగా మండలంలోని వెంకటాపురం, నల్లకాల్వ, కొత్తరామాపురం,సిద్దాపురం పరిధిల్లోనే కనిపిస్తున్నాయి. మండలంలోని మాజీ నేరస్తుల ఆవాస గ్రామానికి చెందిన కొందరు దాదాపు ప్రతి గ్రామంలోనూ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ అక్రమ మద్యం దుకాణాలు నడుపుతున్నారు. ఆయా గ్రామాల్లో ఉండే లుంపెన్ తరగతులకు చెందిన యువకులను తమ వెంట తిప్పుతూ ఇటు నాటుసారా అక్రమ రవాణాకు, అటు వన్యప్రాణుల వేటకు వినియోగించుకుంటున్నారు. -
నల్లమలలో అతివేగం.. వన్యప్రాణులకు శాపం
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు..వన్యప్రాణుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అ మ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి నుంచి హైదరాబాద్–శ్రీశైలం రహదారి వెళుతోంది. దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండే వన్యప్రాణులు రహదారి దాటుతుండగానే వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొని అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. నిషేధం ఉన్నా.. తగ్గని వేగం హైదరాబాద్–శ్రీశైలం హదారిపై మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు సుమారు 70 కి.మీ. నల్లమల అటవీ ప్రాంతం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి రాగానే నిబంధనల మేరకు వాహనాలు గంటకు కేవలం 30 కి.మీ. వేగంతోనే ప్రయాణించాలి. ఇక్కడి వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అడవిలోని రహదారి గుండా ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. అయితే అడవిలో గరిష్ట వేగం 30 కి.మీ. కాగా, వాహనదారులు మితిమీరిన వేగంతో వెళుతున్నారు. అడవిలో ఏదైనా వన్యప్రాణి అడ్డుగా వచ్చినప్పుడు అదుపు చేయలేకపోవడంతో వాహనాల కింద పడి అవి మరణిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు ఐదేళ్లలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో సుమారు 800కు పైగా వన్యప్రాణులు వాహనాల కిందపడి మరణించాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రిపోర్టు కాని వన్యప్రాణుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. సూచిక బోర్డులకే పరిమితం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి నిత్యం వేలసంఖ్యలో వాహనాలు వెళుతున్నాయి. శని, ఆదివారాలతో పాటు ఇతర సెలవురోజుల్లో వాహనాల రద్దీ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. నల్లమలలో ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు అటవీమార్గంలో సూచిక బోర్డులతో పాటు 35 చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడక్కడా సూచిక బోర్డులు ఉన్నా వాహనాల వేగానికి బ్రేక్ పడటం లేదు. నిర్ణీత వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తుండటం నల్లమలలోని పులులు, చిరుతలు, జింకలు, అరుదైన మూషికజింకలు, మనుబోతులు, సరీసృపాలు తదితర అమూల్యమైన జంతుసంపదకు ముప్పుగా పరిణమిస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు వాహనదారులకు వి్రస్తృతంగా అవగాహన కలి్పంచడంతో పాటు, వేగానికి కళ్లెం వేసేందుకు స్పీడ్గన్లను ఏర్పాటుచేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాహనాల వేగం తగ్గించేందుకు చర్యలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులు తరచుగా రహదారులు దాటే ప్రాంతాల్లో 35 చోట్ల సూచికబోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుచేశాం. వాహనాలు అటవీమార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు నెమ్మదిగా ప్రయాణించేలా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ -
మాయమయింది మళ్లీ వచ్చింది
అనుకోని అతిథి నల్లమలకు చేరింది. జీవ వైవిధ్యంతో అలరారుతున్న ఆత్మకూరు అటవీ డివిజన్లో అడవి దున్న ప్రత్యక్షమైంది. ఇక్కడి అడవుల్లో 150 ఏళ్ల క్రితం అదృశ్యమైన మహిషం తిరిగి కనిపించడం అటవీ అధికారులను ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. తలచిందే తడవుగా.. అడవి దున్న వలచి రావడంతో వన్యప్రాణి ప్రేమికులు ఉప్పొంగిపోతున్నారు.ఆత్మకూరు రూరల్: నల్లమల అడవుల్లో 1870 కాలంలో అదృశ్యమైన అడవి దున్న నల్లమలలో తిరిగి కనిపించడం అటవీ అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. భారత అడవి దున్న (ఇండియన్ బైసన్)గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు నల్లమల అడవుల్లో ఒకప్పుడు విస్తారంగా సంచరించేవి. అనూహ్యంగా 1870 ప్రాంతంలో అదృశ్యమైపోయిన అడవి దున్న వన్యప్రాణి ప్రేమికులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు డివిజన్లో బైర్లూటి, వెలుగోడు నార్త్ బీట్లలో కనిపించింది. ప్రస్తుతం నల్లమలకు తూర్పున ఉండే పాపికొండలు (పోలవరం అటవీ ప్రాంతం).. çకర్ణాటకలోని పశి్చమ కనుమలలో మాత్రమే ఉండే అడవి దున్న వందల కిలోమీటర్ల దూరాన్ని దాటుకుని నల్లమల చేరడం అద్భుతమైన విషయమే. నెల క్రితమే కనిపించినా.. నెల రోజుల కిందట సాధారణ విధుల్లో భాగంగా ఆత్మకూరు అటవీ డివిజన్లోని బైర్లూటి రేంజ్ తలమడుగు అటవీ ప్రాంతంలో ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి అడవి దున్న కనిపించింది. ఆ వెంటనే వీడియో, ఫొటోలు తీసిన సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అయితే.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు రహస్యంగా ఉంచారు. ఆ తరువాత ఇదే అటవీ డివిజన్లోని వెలుగోడు రేంజ్లో గల నార్త్ బీట్ జీరో పాయింట్ వద్ద సిబ్బందికి మరోమారు అడవి దున్న కనిపించి నల్లమలలో తన ఉనికిని చాటింది.అప్రయత్నంగానే సాకారం ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించి అదృశ్యమైన అడవి దున్నలను తిరిగి నల్లమలలోకి తీసుకొచ్చేందుకు అటవీ శాఖ ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్(డబ్లూడబ్ల్యూఎఫ్) సంస్థ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ రెడ్డీస్ ల్యాబ్ ఈ మహత్తర కార్యక్రమం కోసం రూ.కోటి విరాళం ఇచ్చేందుకు అంగీకరించింది. అటవీ అధికారులు అడవి దున్నల తరలింపు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ మహిషం తనంతట తానే పూర్వ ఆవాసానికి చేరుకోవడంతో వన్యప్రాణి ప్రేముకులలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. నల్లమలలో అడవి దున్న ప్రత్యక్షమవడం శుభసూచకంగా భావిస్తున్నారు. ఆశ్చర్యమే కానీ.. అసాధ్యం కాదు ఆత్మకూరు అటవీ డివిజన్లో అడవి దున్నను మా సిబ్బంది రెండు ప్రాంతాల్లో గుర్తించారు. ఇది కొంత ఆశ్చ్యర్యం కలిగించే విషయమే. కానీ.. అసాధ్యమైనదేమీ కాదు. పెద్ద పులులు, ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తరలివెళ్లడం సాధారణమే. ఈ అడవి దున్న కూడా అలా మైదాన ప్రాంతాలను దాటుకుని నల్లమల చేరి ఉంటుంది. ఇది పాపికొండలు అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నాం. – సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు, నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం -
చెంచుల అడ్డాలో లక్ష్మీగడ్డ
పెద్దదోర్నాల: భూచక్ర గడ్డ.. ఇది నల్లమల అభయారణ్యంలో దొరికే ఓ దుంప. లక్ష్మీగడ్డ.. లచ్చిగడ్డ.. మాగడ్డ పేర్లతోనూ పిలిచే ఈ మధుర దుంపలో ఎనలేని ఔషధాలు ఉన్నాయని చెబుతారు. తీగ జాతి మొక్క కాండంగా భూమి అడుగు భాగంలో ఇది పెరుగుతుంది. కేవలం అడవుల్లో మాత్రమే.. తక్కువ ఎత్తులో పెరిగే అరుదైన తీగ జాతి మొక్క. దీని పూలు ఆకర్షణీయంగా తెల్లగా, మంచి సువాసన కలిగి ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలంలోని నల్లమల అభయారణ్యంతోపాటు భద్రాచలం అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క భూమి అంతర్భాగంలో సుమారు 6 నుంచి 15 అడుగుల లోతులో 10 అడుగుల నుంచి 15 అడుగుల మేర పెరుగుతుంది. దుంప పైభాగమంతా ఎర్రగా ఉండి.. లోపలంతా తెల్లగా, అత్యంత రుచి కలిగి ఉంటుంది. భూచక్ర గడ్డ ఉన్న ప్రాంతంలో భూమి పైభాగంలో తెల్లపూలు కలిగిన ఓ రకమైన తీగ ఉంటుందని, ఇది ఓ రకమైన మత్తుతో పాటు మంచి సువాసన కలిగి ఉంటుందని ఈ గడ్డను సేకరించే చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ వాసనను పసిగట్టిన చెంచు గిరిజనులు గడ్డ కోసం వేట మొదలు పెడతారు. తీగ ఆధారంగా గడ్డ ఇక్కడే ఉంటుంది అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే గడ్డ కోసం తవ్వకం మొదలు పెడతారు.చెంచులకు అవినాభావ సంబంధం చెంచు గిరిజనులకు భూచక్ర గడ్డతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చెంచులు ఈ గడ్డను లచ్చిగడ్డ, లక్ష్మీగడ్డగా పిలుచుకుంటారు. భూచక్ర గడ్డతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ గడ్డ వాడకం వల్ల బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి, మధురంగా ఉండే ఓ దుంప జాతి గడ్డ. – మంతన్న, కో–ఆర్డినేటర్, ఆర్ఓఎఫ్ఆర్, పెద్దదోర్నాలఎన్నో ఔషధ గుణాలు భూచక్ర గడ్డలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ గడ్డను ఫ్రిజ్లో నిల్వ పెట్టుకుని ఔషధంలా వాడుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా తింటే మంచిదని, దాహం అనిపించినప్పుడు ఇది ఎక్కువగా తినటం వల్ల దప్పిక వేయదని వారు పేర్కొంటున్నారు. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి దీనిని తినటం వల్ల వేడి, వాతం, కడుపులో మంట, కడుపులో గడ్డలు, రాళ్లు ఉన్నా కరిగిపోతాయని స్పష్టం చేస్తున్నారు. అరికాళ్ల మంటలు, తిమ్మిర్లు, షుగరు, బీపీ వ్యాధులకు ఈ గడ్డ బాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఈ గడ్డను వారం రోజులు పరగడుపున తింటే కడుపులో గ్యాస్ సమస్యలు ఉండవని, క్రమం తప్పకుండా నెల రోజులు తింటే బీపీ, షుగర్ లాంటి వ్యాధులు పూర్తిగా నయం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ గడ్డను శ్రీశైలంతోపాటు పెద్దదోర్నాలలోని శ్రీశైలం రహదారిలో విక్రయిస్తుంటారు. -
అడవి ఒడికి పులి కూనలు
పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్లో ఆశ్రయం పొందుతున్న పులి పిల్లలు అతి త్వరలో నల్లమల అభయారణ్యంలో అడుగిడనున్నాయి. తల్లినుంచి తప్పిపోయి జనారణ్యంలో దొరికిన పులి కూనలకు నల్లమల అభయారణ్యంలోని ఇతర జంతువులను వేటాడటం నేర్పించేందుకు భారీ టైగర్ ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సుమారు 14 నెలల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడ పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో ప్రజల కంటపడిన విషయం విదితమే. తల్లి జాడ లేకపోవటంతో పులి పిల్లలను అటవీ శాఖ సిబ్బంది తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు. ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల మృతి చెందగా.. మిగిలిన పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. మూడు పిల్లలు పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని అటవీ వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీ శాఖ నిర్ణయం తీసుకోవటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి ప్రయోగం తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా పులి పిల్లల సంరక్షణ కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో ఏర్పాటు చేశారు. తిరుపతి జూలో పెరుగుతున్న పెద్దపులులు సహజసిద్ధంగా వాటి ఆహారాన్ని అవి వేటాడగలిగేలా చేయటంతోపాటు అనాథలైన, తీవ్ర గాయాల పాలైన పెద్దపులులను ఇక్కడి నర్సరీ ఎన్క్లోజర్లలో పెట్టి సంరక్షిస్తారు. పులుల సంరక్షణకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో 15 హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పులులను సంరక్షించేందుకు ఎల్లవేళలా వెటర్నరీ వైద్యులు ఎన్క్లోజర్ల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో ఉన్న పులి పిల్లలు వేటాడే సహజసిద్ధ గుణాన్ని మరిచిపోయి జూ అధికారులు అందజేసే ఆహారంతోనే జీవిస్తున్నాయి. వాటిని జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి ప్రమాదాల బారినపడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటిని ఎన్క్లోజర్లలో ఉంచుతారు. స్వతహాగా కొన్ని వన్యప్రాణులను వేటాడి ఆహారాన్ని అవి సేకరించుకోగలిగేలా చూస్తారు. పులి పిల్లలు వేట నేర్చుకోవటం కోసం కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ జూ పార్కు నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులను నల్లమలకు తరలించి వాటిని ఎన్క్లోజర్లలో సంరక్షిస్తున్నారు. కొద్దిరోజుల అనంతరం వీటిని పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. అవి వ్యక్తిగతంగా 50 వన్యప్రాణులను వేటాడిన తరువాత వాటి శక్తి యుక్తులను గుర్తించి తదుపరి చర్యలను తీసుకుంటారు. చారల దుప్పుల కోసం ప్రత్యేక ఎన్క్లోజర్ కాకినాడ నుంచి ప్రత్యేకంగా రప్పించిన చారల దుప్పుల కోసం కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో 20 మీటర్ల పొడవు, వెడల్పుతో ప్రత్యేకంగా ఓ ఎన్క్లోజర్ను ఏర్పాటు చేశారు. వీటికోసం ఎన్క్లోజర్ బయట రూ.2.50 లక్షలతో సోలార్ బోరు అమర్చారు. దానినుంచి ఎన్క్లోజర్లోకి ప్రత్యేకంగా పైప్లైన్ను ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నారు. వీటి అవసరాలను తీర్చేందుకు సాసర్పిట్లు, నీటి గుంతలను ఏర్పాటు చేశారు. వేసవిని తట్టుకునేలా ఎన్క్లోజర్ చలువ పందిళ్లు వేసి నీటిని వెదజల్లేలా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. వీటి ఆహారం కోసం వినుకొండ, మార్కాపురం ప్రాంతాల నుంచి సుబాబుల్, బుల్ ఫీడ్ను రప్పించి ఆహారంగా వేస్తున్నారు. చారల దుప్పులు సంతానోత్పత్తి చేసేలా పెద్దదోర్నాల రేంజి పరిధిలోని తుమ్మలబైలు వద్ద ఒక ఎన్క్లోజర్, నెక్కంటి రేంజి పరిధిలో మరో రెండు ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ఎన్క్లోజర్ల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన టైగర్ ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నాం. కాకినాడ నుంచి ఇక్కడకు రప్పించిన చారల దుప్పుల కోసం కూడా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి సోలార్ బోర్ ద్వారా నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పులి పిల్లలకు వేటాడటంలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ప్రసన్నజ్యోతి, ఫారెస్ట్ రేంజి అధికారి, కొర్రప్రోలు -
పెద్దపులికి రూట్ క్లియర్
తిరుమల: నల్లమల అడవుల నుంచి శేషాచల కొండల్లోకి పెద్దపులులు రానున్నాయి. ఆ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అహోబిలం నుంచి తిరుపతి వరకు 4,759 కిలోమీటర్ల మేర విస్తరించి శేషాచల కొండలు అపురూపమైన వృక్ష సంపదకే కాదు, వన్య మృగాలకూ నెలవు. ప్రపంచంలో మరెక్క డా కనిపించని ఎర్రచందనం చెట్లు ఒక్క శేషాచలం అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులకు అడ్డాగా శేషాచలం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతమైనా.. పెద్ద పులులు నివసించేందుకు అనువైన ప్రదేశమైనా.. ఇప్పటివరకు ఆ సందడి లేదు. కాగా శేషాచలం అటవీ ప్రాంతంలోకి పెద్ద పులులు వచ్చేలా అటవీశాఖ కారిడార్ ఏర్పాటు చేయనుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కు వగా ఉంటుంది. ఇవి అప్పుడప్పుడు తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గాల్లో భక్తులకు కనిపిస్తూ ఉంటాయి. వారిపై దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. 2008లో శ్రీవారి మెట్టు నడకమార్గంలో బాలికపై చిరుత దాడి చేయగా.. రెండేళ్ల కిందట రెండో ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. 2008లో మాత్రం బాలికపై దాడికి పాల్పడిన చిరుతను పట్టుకుని తిరిగి వైఎస్సార్ జిల్లా చిట్వేల్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వదిలిపెట్టారు. అనంతరం వారం కిందట బాలుడిని తీసుకెళ్లి 500 మీటర్ల దూరంలో చిరుత వదిలిపెట్టి వెళ్లింది. టీటీడీ ఈ ఘటనపై వెంటనే స్పందించింది. 24 గంటల వ్యవధిలోనే చిరుతను బంధించి భాకరాపేట అటవీ ప్రాంతంలో వదిలిపెట్టింది. నల్లమలలో ఎక్కువైన పెద్ద పులులు ప్రస్తుతం నల్లమల అడవుల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో పెద్ద పులులున్నాయి. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులుల సంచారం పెరుగుతూ ఉండటంతో వాటిని శేషాచల కొండల వైపు మళ్లించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. నల్లమల నుంచి బద్వేలు మీదుగా సిద్దవటం నుంచి తిరుమలకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తిరుమల నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్న అటవీశాఖ అధికారులు.. శేషాచల కొండలు పెద్ద పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని గుర్తించి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని మూడు వేల హెక్టార్లు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాన్ని రిజర్వుడ్æ ఫారెస్టుగా పేర్కొంటారు. ఇక్కడ మనుషుల కన్నా జంతువులకే ఎక్కు వ ప్రాధాన్యం ఉంటుంది. మనుషులపై దాడిచేసే అలవాటు లేని చిరుతలే అప్పుడప్పుడు అటవీ ప్రాంతాన్ని దాటి వచ్చి తిరుమల నడకదా రులు, ఘాట్ రోడ్లపైకి వచ్చి భక్తులపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత దాడుల వల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండే అవకాశం లేకపోవడంతో భక్తులు సురక్షితంగా వాటి నుంచి బయటపడుతున్నారు. కానీ పెద్ద పులుల వ్యవహారం అలా ఉండదు. మరి చిరుతల తరహాలో పెద్ద పులులు అటవీ ప్రాంతాన్ని దాటి వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. బద్వేల్ మీదుగా శేషాచలానికి కారిడార్ పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా బద్వేల్ మీదుగా శేషాచల కొండలకు కారిడార్ను ఏర్పాటు చేస్తాం. శ్రీశైలం, నాగార్జునసాగర్లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం శేషాచల కొండల్లో పెద్దపులి సంచారం లేదు. తిరుమల నడకమార్గంలో ఇబ్బందుల్లేకుండా చర్యలు. – మధుసూదన్ రెడ్డి, పీసీసీఎఫ్ -
బాబోయ్.. పులి!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న మండలాల్లో పులులు సంచరిస్తున్నాయని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దుర్గి మండలం గజాపురం అటవీ ప్రాంతంలో వారం కిందట ఓ ఆవును అడవి జంతువులు వేటాడి చంపాయి. ఆవుపై దాడి చేసిన విధానం, ఆ ప్రదేశంలో ఉన్న పాద ముద్రల ఆధారంగా రెండు పులులు దాడి చేసినట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పల్నాడు జిల్లా అడవులకు ఆనుకుని ఉన్న నల్లమల టైగర్ జోన్ నుంచి ఆ రెండు పులులు దారి తప్పి వచ్చాయని వారు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజల్లో గుబులు మొదలైంది. ఏ సమయంలో పులులు దాడులు చేస్తాయోనని ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం అయితే ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆహారం దొరక్క వచ్చాయా!? శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల మధ్య ఉన్న నల్లమల అభయారణ్యంలో పులుల సంతతి గత రెండు మూడేళ్లుగా బాగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 73 దాకా ఉందని అటవీశాఖ అధికారిక లెక్కల ప్రకారం చెబుతున్నా.. అనధికారికంగా మరో పది పులులు ఉండొచ్చని భావిస్తున్నారు. టైగర్ జోన్లో ఆహారం లభించక వేట కోసమో, నీటి లభ్యత తగ్గడం వల్లనో పులులు పల్నాడు జిల్లా వైపు వచ్చి ఉంటాయంటున్నారు. ఈ పులులు దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండల పరిధిలోని నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉందని, ఆ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, దారి తప్పి వచ్చిన రెండు పులులను తిరిగి అభయారణ్యంలోకి సురక్షితంగా పంపేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ, వేట నిరోధక దళాలు, వనమిత్రల సాయంతో పులుల జాడ తెలుసుకుని, వాటి మార్గాలను టైగర్ జోన్ వైపు మళ్లించే యత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా అభయారణ్యంలో నుంచి నీటి కోసం పులులు వచ్చే అవకాశం ఉండటంతో మంచి నీటి కుంటలు ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పొలాల చుట్టూ వేసే విద్యుత్ కంచెల బారిన పడి మరణించకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో రాత్రి పూట విద్యుత్ను నిలుపుదల చేయాలని విద్యుత్ శాఖను కోరారు. అప్రమత్తంగా ఉండండి..దుర్గి మండల పరిసరాల్లో రెండు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించాం. ప్రస్తుతం పులులకు ఎటువంటి ఆపద రాకుండా సురక్షితంగా తిరిగి అభయారణ్యంలోకి పంపడం, ప్రజలను అప్రమత్తం చేసి వాటికి దూరంగా ఉంచడం మా కర్తవ్యం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు అటవీ సమీప ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే గుంపులుగానే వెళ్లాలి. – రామచంద్రరావు, పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి. రెండు పులులను చూశా.. నాలుగు రోజుల కిందట అర్ధరాత్రి పూట పొలానికి వచ్చిన సమయంలో రెండు పులులను చూశాను. ఒకటి పెద్దది, రెండోది చిన్నది. పొలంలోని గుంతల్లో నీటిని తాగి వెళ్లాయి. ఇటీవల మా పొలం సమీపంలోనే ఆవును చంపి లాక్కెళ్లాయి. రాత్రి పూట పొలానికి రావాలంటే భయంగా ఉంది. – గోవింద, పులిని చూసిన ప్రత్యక్ష సాక్షి, గజాపురం, దుర్గి మండలం. -
పొలం గట్టున పొంచిన గండం.. రక్తపింజర, కొండచిలువలు కోకొల్లలు
మార్కాపురం డివిజన్లోని నల్లమల సమీప గ్రామాల్లో పాముల బెడదతో రైతులు వణికిపోతున్నారు. అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్న సర్పాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాములను చంపకుండా వాటిని జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలేసేందుకు అటవీశాఖ స్నేక్ వాచర్లను నియమించి.. వందల సంఖ్యలో పాముల్ని రక్షించి వాటి ఆవాసాలకు చేరుస్తోంది. మార్కాపురం(ప్రకాశం జిల్లా): పాము అంటే ప్రతి ఒక్కరికీ భయం. దేశంలో ఉన్న పాముల్లో అత్యంత విషపూరితమైన వాటిలో మొదటిది రక్తపింజర, తరువాత తాచుపాము, కట్లపాము. రక్తపింజర ఇటీవల కాలంలో మార్కాపురం ప్రాంతంలో ఎక్కువగా సంచరించటంతో ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిర్చి, పత్తి పొలాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. అత్యధికంగా నవంబర్ నెలలో మార్కాపురం ప్రాంతంలో అధికారికంగా స్నేక్ రెస్క్యూ టీం 103 పాములు పట్టుకోగా అందులో ఎక్కువగా ప్రమాదకరమైన రక్తపింజరలు ఉన్నాయి. మార్కాపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో స్నేక్ వాచర్ నిరంజన్ 10 రోజుల వ్యవధిలో 8 రక్తపింజర పాములను పొలాల్లో పట్టుకున్నాడు. వేములకోటలో 4, కొండేపల్లి బ్రిడ్జి కింద 1, శివరాంపురం పొలాల్లో 1, ఎస్కొత్తపల్లిలో 1, పట్టణంలోని పీఎస్ కాలనీలో ఒక రక్తపింజర పామును పట్టుకున్నాడు. 5 అడుగుల పొడవుండే రక్తపింజర పాముల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైంది. కాటేసిన 40 నిమిషాల్లోపు వైద్య చికిత్స అందకపోతే చనిపోతారు. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఒళ్లంతా చమటలు పట్టి రక్తాన్ని పలుచన చేస్తుంది. దీంతో గుండె బలహీన పడుతుంది. ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉంది. ఎక్కువగా గడ్డి, పొదలు, పత్తి, మిరప, పొగాకు, కంది చేలల్లో రక్తపింజరలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కొండచిలువలు కూడా మార్కాపురం ప్రాంతంలో జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 18 అడుగుల పొడవు, 90 నుంచి 100 కిలోల బరువు ఉండే కొండచిలువలు 10 రోజుల వ్యవధిలో 3 ప్రాంతాల్లో పట్టుకుని అడవుల్లో వదిలేశారు. బుడ్డపల్లిలో 2, పొదిలి దగ్గర ఒక కొండచిలువను పట్టుకున్నారు. నల్లమల అడవుల్లో నుంచి సమీప గ్రామాల్లోకి కొండ చిలువలు వస్తున్నాయి. కోళ్లు, మేకలు, కుందేళ్లు, జింకలను తింటున్నాయి. మనిషిని చుట్టేస్తే కొండచిలువ నుంచి బయటపడటం చాలా కష్టం. పాముల పట్టివేత ఇలా: నవంబర్ నెలలో నల్లమల పరిధిలోని శ్రీశైలంలో 15, సున్నిపెంటలో 27, మార్కాపురంలో 103, వైపాలెంలో 55, దోర్నాలలో 14, విజయపురి సౌత్లో 23 కలిపి మొత్తం 237 పాములను పట్టుకున్నారు. డిసెంబర్ నెలలో 163 పాములను పట్టుకున్నారు. పాముకాటు సంఘటనలు అక్టోబర్ 23న కొనకనమిట్ల మండలం గనివెనపాడులో యద్దనపూడి మరియమ్మ పాటుకాటుతో మృతిచెందింది. సిద్దవరంలో ఆగస్టులో ఒకేసారి 8 మంది పాముకాటుకు గురై చికిత్స పొందారు. విషపూరితమైనవే కాదు..మేలు చేసేవీ ఉన్నాయి నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన పాములు సంచరిస్తున్నాయి. ఇందులో అత్యంత విషపూరితమైన నాగుపాము, రక్తపింజర, కట్లపాము, చిన్నపింజర, కొండ చిలువలతో పాటు రైతులకు మేలు చేసే పాములు కూడా ఉన్నాయి. జర్రిపోతు, నీరుకట్టు పాము, చెక్డ్కిల్ బ్యాక్, బ్రౌన్జి, పసిరిక పాములు ఉన్నాయి. ఇవి పొలాల్లో పంటలను నాశనం చేసే ఎలుకలు, పందికొక్కులు, తొండలు, బల్లులను తిని జీవిస్తుంటాయి. కొండ చిలువ మాత్రం కుందేళ్లు, పక్షులు, కోళ్లు, చిన్న మేకలను తింటుంది. పసిరికపాము చెట్లపైనే ఉండి తొండలను, పిట్టలను తింటుంది. అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర, నాగుపాము, కట్లపాము పట్ల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -
సఫారీకి జీవకళ...రూ.కోటితో సరికొత్త హంగులు
ప్రకృతి అందాలు, రమణీయ, కమనీయ దృశ్యాలకు నెలవైన నల్లమల అభయారణ్యం సరికొత్త సొబగులు దిద్దుకుంటోంది. రూ.కోటితో పర్యావరణ ప్రేమికులకు మరో కొత్త లోకాన్ని చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది. ఓపెన్ టాప్ జీపుల్లో విహరిస్తూ సాగే జంగిల్ సఫారీ ఇకపై సరికొత్త అనుభూతులు నింపనుంది. తుమ్మలబైలు సమీపంలో రూపుదిద్దుకుంటున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రం సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనుంది. వన్యప్రాణుల శిలాప్రతిమల్లో ఉట్టిపడుతున్న జీవకళ ప్రకృతిని ప్రేమించే మనసులను కట్టిపడేస్తోంది. పెద్దదోర్నాల(ప్రకాశం): నల్లమల అభయారణ్యం.. ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. అక్కడ సాగే జంగిల్ సఫారీని ఆస్వాదించేందుకు ఆరాటపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ పర్యటిస్తుంటే కలిగే ఆనందమే వేరు. నల్లమలలో ఇలాంటి అనుభూతులను సొంతం చేసుకోవాలని అనుకుంటున్న పర్యాటకులకు అటవీశాఖ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తోంది. తాజాగా సుమారు కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది. వన్యప్రాణుల ఆకృతులతో కూడిన పర్యావరణ విజ్ఞాన కేంద్రంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు పగోడాలు, క్యాబిన్లో అధునాతనంగా రూపుదిద్దుకున్న టాయిలెట్లు, ఆరు బయట పచ్చిక బయళ్లతో ఆకట్టుకునే రీతిలో జంగిల్ సఫారీ ప్రాంగణం రూపుదిద్దుకుంటోంది. ఎకో టూరిజం పర్యాటకులకు కొత్త అనుభూతి కల్పించేందుకు సరికొత్త వాటిని సిద్ధం చేస్తోంది. శరవేగంగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం పనులు... జంగిల్ సఫారీలో భాగంగా పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు సమీపంలో పర్యావరణ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేంద్రంలో పెద్దపులి, చిరుతపులి, జింకలు, కృష్ట జింక, నీల్గాయ్, సాంబార్, హనీబ్యాడ్జర్, మూషిక జింకలతో పాటు రెడ్ జంగిల్ పౌల్, గ్రే జంగిల్ పౌల్, హార్న్బిల్ పక్షులు, గుడ్లగూబ, నెమలి, ఎన్నో రకాల పక్షుల అందమైన ఆకృతులను ప్రతిష్ఠించారు. ఆయా ఆకృతులకు సంబంధించి విద్యుద్ధీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. సరికొత్త టెక్నాలజీతో ఒక్కో వన్యప్రాణి ఆకృతి వద్ద నిలబడినప్పుడు ఆ వన్యప్రాణి గాండ్రింపుతో పాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు లౌడ్ స్పీకర్లో వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వన్యప్రాణుల శిలాప్రతిమల్లో జీవకళ... పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల ఆకృతులు జవకళను సంతరించుకుని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పులుల ప్రతిమలు చూస్తుంటే.. మన కళ్ల ముందే సజీవంగా ఉన్నాయన్న అనుభూతి కలుగుతోంది. సహజసిద్ధ వాతావరణంలో రాజసంగా నిలుచుని ఉండే పెద్దపులి ప్రతిమ సందర్శకులను కట్టిపడేసేలా ఉంది. చెట్టుపై కూర్చున్న చిరుతపులితో పాటు పెద్ద పులులను సైతం ఎదిరించే మొండితనం, ధైర్యం ఉన్న బుల్లి జీవి హనీబ్యాడ్జర్, ప్రపంచంలోని జింకలలో కెల్లా అత్యంత చిన్న జింకగా ప్రసిద్ధి గాంచిన మూషిక జింకలు సైతం జీవకళతో అబ్బురపరుస్తున్నాయి. గడ్డి మైదానంలో కూర్చుని సేదతీరుతున్న కణితి, పర్యావరణ విజ్ఞాన కేంద్రం గోడలపై ఏర్పాటు చేసిన నల్లమల అభయారణ్యంలోని పక్షి జాతుల ఆకృతులు కనువిందు చేస్తున్నాయి. జంగిల్ సఫారీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి సరస్సు, పచ్చిక బయళ్లు, చిన్నారులు కూర్చునేందుకు చెక్కతో తీర్చిదిద్దిన సీతాకోక చిలుక, తాబేలు, తదితర ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. ఇవే కాకుండా జంగిల్ సఫారీకి అధునాతన వాహనాలు ఏర్పాటు చేశారు. నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల నెలవైన పులిచెరువు రహదారిలో ఏర్పాటు చేసిన ముఖద్వారంతో పాటు 14 కిలోమీటర్లు జంగిల్ సఫారీ కొనసాగే రహదారిని అందంగా తీర్చిదిద్దారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పలు ప్రత్యేకతలతో జంగిల్ సఫారీని అందంగా తీర్చిదిద్ది పర్యాటకులకు గొప్ప అనుభూతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోటి రూపాయలతో పనులు నల్లమల జంగిల్ సఫారీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో వన్యప్రాణుల ప్రతిమలను తీర్చిదిద్దుతున్నాం. విద్యుద్ధీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. జంగిల్ సఫారీ రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఆద్యంతం పచ్చని పచ్చిక బయళ్లతో అందంగా తయారు చేస్తున్నాం. పులిచెరువు ముఖద్వారం ఆర్చిని ఆకర్షణీయంగా మారుస్తున్నాం. వన్యప్రాణుల ప్రతిమలు జీవకళతో సందర్శకులను ఆకట్టుకుంటాయి. – విశ్వేశ్వరరావు, ఫారెస్టు రేంజి అధికారి -
అడవిలో అగ్నిశిఖ
పెద్దదోర్నాల (ప్రకాశం): ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని వివిధ ప్రాంతాల్లో కనువిందు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని పులిచెరువు, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో ఈ తీగజాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. అందమైన పుష్పాలతో ఆకట్టుకునే అగ్నిశిఖ మొక్కలు అత్యంత విషపూరితమైనవి. ఇందులో విషపూరితమైన కోల్చీసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని ఇంగ్లిష్లో ఫ్లేమ్ లిల్లీ, ఫైర్ లిల్లీ, గ్లోరియసా లిల్లీ అని.. వాడుకలో నాగేటిగడ్డ, నీరుపిప్పిలి అని పిలుస్తుంటారు. ఇవి పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. వీటి పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు రంగు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి. ఆయుర్వేదంలో దివ్యౌషధం ఆయుర్వేదంలో దీనిని దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలు అన్నీ విషపూరితమైనవే. పాముకాటు, తేలు కాటుకు విరుగుడుగా, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలు, గాయాలకు మందులుగా వాడతారు. ఉదర క్రిములను బయటకు పంపించే మందుగాను, దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టువల్ల కలిగే గాయాలు, మొలలు, పొత్తి కడుపు నొప్పి నివారణకు వినియోగిస్తారు. శరీరానికి బలవర్ధకమే కాక వీర్యవృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. ఆత్మన్యూనత లాంటి మానసిక రోగాలతో పాటు, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక రోగ నివారణకు దీనిని వినియోగిస్తారు. సుఖవ్యాధుల చికిత్సలోనూ అడవినాభి ఉపయోగపడుతుంది. గర్భధారణ అవకాశాలను పెంచటంలో ఇది బాగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అడవినాభి అద్భుతమైన ఔషధి నల్లమల అభయారణ్యంలోని కొన్ని ప్రాంతాల్లో లభించే అడవినాభి అరుదైన ఔషధ గుణాలు ఉన్న మొక్క. దీన్ని పలు పేర్లతో పిలుస్తుంటారు. పాముకాటు, తేలుకాటు, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలకు సంబంధించిన మందుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. – ఎం.రమేష్, సైంటిస్ట్, బయోడైవర్సిటీ, శ్రీశైలం ప్రాజెక్టు -
శేషాచలం.. నల్లమల.. అడవి ఏదైనా జల్లెడ పట్టడమే వారి విధి
సాక్షి, రాయచోటి: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు అడవిబాట పడుతున్నారు. ఇంతకుమునుపు మావోయిస్టుల ప్రాబల్యం నేపథ్యంలో అనునిత్యం అరణ్యంలో గడుపుతూ వచ్చారు. అయితే కాలక్రమేణా మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడం.. ఎర్రచందనం స్మగ్లర్ల బెడద పెరిగిపోవడంతో వారిని ఎదుర్కొనేందుకు ఖాకీలు శ్రమిస్తున్నారు. ఒక వైపు స్మగ్లర్లు, మరోవైపు ఎర్రచందనం కూలీల చర్యలు తిప్పికొట్టేందుకు అడవిలోనే మకాం వేస్తున్నారు. అడవిలో అనేక రకాల సవాళ్లు.. కష్టాలు ఎదురవుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఇష్టంగా ముందుకు వెళుతున్నారు. ఒక్కరోజులో పదుల సంఖ్యలో కొండలు, గుట్టలు..వాగులు, వంకలు దాటుకుంటూ ఎర్రచందనం చెట్ల రక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. సుమారు 20 మందితో కూడిన కూంబింగ్ దళం ప్రతినెల మూడు వారాలపాటు అడవిలోనే తిరుగుతోంది. అరణ్యంలో కిలోమీటర్ల మేర నడక అన్నమయ్య జిల్లాలో నల్లమలతోపాటు ఎర్రమల, శేషాచలంతోపాటు ఇతర పలు రకాల అడవులు విస్తరించాయి. ప్రధానంగా ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్న కొండల్లోకి బృందం అడుగు పెట్టిందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నడకే సాగుతుంది. ఆహారం తీసుకునే సమయం మినహా మిగతా సమయంలో అడవినంతా జల్లెడ పడతారు. తెల్లవారుజామున 4 గంటలకే లేవడం, ఒక ప్రాంతంలో టిఫెన్ చేసుకుని ఉదయాన్నే 6 గంటలకు అలవాటు ఉన్న వారు తినడం, లేని వారు పార్సిల్ కట్టుకుని నడక మొదలు పెడతారు. అక్కడి నుంచి అటవీశాఖ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపడతారు. నడిచే సమయంలో మాట్లాడకుండా, సెల్ఫోన్లు చూడకుండా తుపాకీ భుజాన పెట్టుకుని కూంబింగ్లో భాగంగా వేట కొనసాగుతుంది. అలా మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం వరకు తిరగడం, రాత్రికి సమీప ప్రాంతంలోనే టెంటు వేసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. అందులోనూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కాకుండా బయట ప్రాంతాలను ఎంచుకుంటారు. అడవిలో నీరు నిల్వ ప్రాంతాలకు జంతువులు వచ్చే అవకాశం ఉండడంతో కూంబింగ్ దళం సమీప ప్రాంతాల్లో ఎక్కడా టెంట్లు వేసుకోరు. దుంగలు దొరికితే ‘అడవంత కష్టం’ అడవిలో కొండలు, రాళ్లు, చెట్ల పొదలను దాటుకుని నడవడమే కష్టం. అలాంటిది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసుకున్న దుంగలు కూడా ఒక్కోసారి కనబడతాయి. ఈ తరుణంలో వాటిని అటవీ ప్రాంతం నుంచి బయటికి తీసుకు రావాలన్నా...అడవిలో మోయాలన్నా అడవంత కష్టముంటుంది. ఎందుకంటే ఒకవైపు బ్యాగు, మరోవైపు తుపాకీ, ఇంకోవైపు ఎర్రచందనం దుంగలను ఎత్తుకుని కాలిబాటగా రావాల్సిందే. కనీసం బయటికి సమాచారం ఇవ్వడానికి సెల్ఫోన్లు పనిచేయవు.. సిగ్నల్స్ ఉండవు. కేవలం భుజానికి ఎత్తుకుని కిలోమీటర్ల మేర నడవడమే మార్గం. అనుక్షణం అప్రమత్తం అడవిబాట పట్టిన పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే నీరు నిల్వ ఉన్నచోట, మధ్యాహ్న సమయంలో స్వయంగా ఈ బృందమే వంట సిద్ధం చేసుకుని తిని వెళతారు. అయితే ఒకవైపు స్మగ్లర్లు, ఎర్రచందనం కూలీలతో ముప్పు పొంచి ఉంటుంది. మరోవైపు అడవి జంతువులతోనూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో ప్రధానంగా విష సర్పాలు, పురుగులతో సహవాసం తప్పదు. రాత్రి సమయంలో సెల్ఫోన్ల లైటింగ్ కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రాత్రి పూట ఒక సెంట్రీ అడవిలో కూంబింగ్ నిర్వహణకు వెళ్లిన పోలీసులు నిద్రపోయే సమయంలో కూడా ఒక సెంట్రీ పహారా కాస్తారు. రాత్రంతా రెండు గంటలకు ఒకరు చొప్పున మారుతూ డ్యూటీలు చేస్తారు. పగలంతా నడక చేసినా రాత్రి పూట కూడా వారందరికీ రక్షణగా ఒకరు మేలుకుని విధులు నిర్వర్తిస్తారు. ఎందుకంటే రాత్రిపూట స్మగ్లర్లు, కూలీలు, అడవి జంతువుల దాడుల నేపథ్యంలో కచ్చితంగా ఒక పోలీసు నిద్ర మేల్కొని సెంట్రీ డ్యూటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. జోరు వానలో.. ఎముకలు కొరికే చలిలో.. కూంబింగ్ దళానికి సంబంధించి ఒక ఆర్ఎస్ఐతోపాటు ఒక లోకల్ ఎస్ఐ, పది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు అటవీశాఖ సిబ్బందితో కలిసి అడవిలోకి వెళితే వర్షం వణికిస్తున్నా.. చలి చంపేస్తున్నా.. మంచు కమ్మేస్తున్నా.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవమే లక్ష్యంగా అడుగు మాత్రం ముందుకు పడాల్సిందే. ఒక్కోసారి అడవిలోకి బృందం వెళ్లిందంటే మూడు రాత్రులతోపాటు నాలుగు పగళ్లు అక్కడే ఉండి ఇంటికి చేరుకుంటారు. జిల్లా కేంద్రం నుంచి చుట్టు పక్కల అటవీ ప్రాంతం సమీపం వరకు వాహనం వదిలి వస్తుంది. నాలుగు రోజుల తర్వాత అడవి నుంచి బయటికి రాగానే మళ్లీ వాహనం వెళ్లి తీసుకు వస్తుంది. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకే కూంబింగ్ అన్నమయ్య జిల్లాలోని అడవుల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. అయితే కొంతమంది స్మగ్లర్లు, తమిళ కూలీలు అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దుంగల అక్రమ రవాణా వ్యవహారంలో కఠినంగా ముందుకు వెళుతున్నాం. – వి.హర్షవర్దన్రాజు, జిల్లా ఎస్పీ, అన్నమయ్య జిల్లా రోజుకు 40 కిలోమీటర్ల మేర నడక అడవిలోకి కూంబింగ్ వెళ్లిన దళం ఉదయం 6 గంటలకు నడక మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు సాగుతూనే ఉంటుంది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అడవిలో నడుస్తూనే ఉంటాం. ఒకరినొకరు మాట్లాడుకోకుండా గ్రూపులుగా అడవి అంతా జల్లెడ పడతాం. అడవినంతా గాలిస్తూ ముందుకు వెళతాం. ఎక్కువ యుక్త వయస్సు వారే ఉంటుండడంతో ఎక్కువ కిలోమీటర్లు నడవగలగడంతోపాటు వంట కూడా మేమే చేసుకుంటాం. – తులసిరామ్, కానిస్టేబుల్, రాయచోటి అక్రమ రవాణాను అడ్డుకోవడమే సవాలుగా తీసుకుని.. అడవిలోకి వెళుతున్నామంటే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్న సంకల్పంతో ముందుకు వెళతాం. ఎలాంటి సవాళ్లు ఎదురైనా కూడా భయపడం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురైనా వారిని అదుపులోకి తీసుకునేందుకు అడవినంతా గాలిస్తాం. అడవిలో ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఉన్నా అడుగు మాత్రం వెనక్కి పడదు. – రెడ్డిశేఖర్, కానిస్టేబుల్, రాయచోటి -
అటవీశాఖ.. సరికొత్తగా
జిల్లాల పునర్విభజన తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం అటవీ శాఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. వివిధ ఫారెస్టు రేంజ్ల మార్పులతో పాటు సెక్షన్లు, బీట్ల విభజన కూడా చేశారు. మార్కాపురం, గిద్దలూరు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలను పులుల అభయారణ్యం కిందకు మార్చారు. ఇప్పటి వరకు డీఎఫ్వో కేడర్ పోస్టులు ఉండగా.. వారి స్థానంలో డిప్యూటీ డైరెక్టర్లను కేటాయించారు. ఆ మేరకు అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖను పునర్ వ్యవస్థీకరించింది. అందులో భాగంగా రెగ్యులర్ ఫారెస్ట్ (రిజర్వు), వన్యప్రాణి సంరక్షణ విభాగాలుగా ఉన్న వాటిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఫారెస్ట్ విభాగాన్ని మొత్తం జిల్లాలోని 28 మండలాలతో కూడిన పరిధిని ఏర్పాటు చేస్తూ కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయాన్ని గిద్దలూరు నుంచి జిల్లా కేంద్రం ఒంగోలుకు మార్చారు. ఒంగోలు డీఎఫ్ఓగా కే.మోహనరావును ప్రభుత్వం నియమించింది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగానే రెగ్యులర్ అటవీ శాఖ విభాగాన్ని మూడు రేంజ్లుగా, వాటి పరిధిలో 13 సెక్షన్లు, 31 బీట్లు ఉండేలా విభజించారు. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయం పరిధిలో మొత్తం 28 మండలాల పరిధిలో 1,11,834.140 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్ భూములు ఉన్నాయి. డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డులోని గతంలో ఒంగోలు రేంజ్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సామాజిక అటవీ విభాగానికి (సోషల్ ఫారెస్ట్) ఎలాంటి మార్పులు చేయలేదు. డీఎఫ్ఓ కార్యాలయం యధావిధిగా ఒంగోలులోనే ఉంటుంది. సామాజిక వన విభాగం డీఎఫ్వోగా ఉన్న మహబూబ్ బాషాను బదిలీ చేసి ఆయన స్థానంలో సునీతను నియమించారు. గిద్దలూరు, గిద్దలూరు డీడీలు శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలోకి... అటవీ విభాగాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మార్కాపురం, గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయాలు శ్రీశైలంలోని డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయం పరిధిలోకి వెళ్లిపోయాయి. గతంలో వన్యప్రాణి సంరక్షణ డివిజన్గా ఉన్న మార్కాపురాన్ని శ్రీశైలం పులుల అభయారణ్యంలోకి విలీనం చేశారు. ఇప్పటి వరకు మార్కాపురం డీఎఫ్వో కేడర్లో ఉండేది. దానికి డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించారు. దాంతో పాటు గిద్దలూరులో రెగ్యులర్ ఫారెస్ట్ (అటవీ డివిజన్)ను డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలుకు తరలించటంతో గిద్దలూరు ప్రాంతాన్ని పులుల అభయారణ్యం పరిధిలో చేర్చారు. గిద్దలూరు కార్యాలయాన్ని కూడా డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించి శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలోకి మార్చారు. గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు పరిధిలో కొన్ని మండలాలతో పాటు, నల్లమల అభయారణ్యం ఉంటుంది. ఒంగోలు కార్యాలయంలో సేవలు అందుబాటులో ఒంగోలు నగరంలోని డీఎఫ్ఓ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. గతంలో ఏ పని కావాలన్నా జిల్లాలోని నలుమూలల నుంచి గిద్దలూరు డీఎఫ్ఓ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ప్రజలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ఒంగోలు డీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. – కే.మోహన రావు, డీఎఫ్ఓ, రెగ్యులర్ ఫారెస్ట్ -
నల్లమలలో పెరిగిన పులులు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 21
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోర్ ఏరియా విస్తీర్ణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో ఇప్పటివరకు 21 పులులు కెమెరాకు చిక్కాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎనీ్టసీఏ) నాలుగేళ్లకు ఒకసారి పులుల గణన చేపడుతుంది. 2018లో విడుదల చేసిన నివేదికలో అమ్రాబాద్ రిజర్వ్లో 12 పులులు ఉండగా, గతేడాది నాటికి వాటి సంఖ్య 16కి పెరిగింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో 21 పులులు చిక్కాయి. పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పెరుగుతున్న ఆడ పులులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మొత్తం విస్తీర్ణం 2,611.39 చ.కి.మీ. కాగా, ఇందులో కోర్ ఏరియా 2,166.37 చ.కి.మీ. కోర్ ఏరియాపరంగా ఏటీఆర్ దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇక్కడ సుమారు 200 వరకు పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పులులు రెండున్నర ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అమ్రాబాద్ రిజర్వ్లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడ పులుల సంఖ్య పెరిగిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఆడపులులు ఏడు ఉండగా, మరో ఆరు పులి పిల్లలు ఉన్నాయి. ప్రజల మద్దతుతో... ఎనీ్టసీఏ మార్గదర్శకాల ప్రకారం పులుల సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. పులుల వేటను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంతోపాటు స్థానిక ప్రజల్లో పులుల ఆవశ్యకతపై క్షేత్రస్థాయిలో అవగాహన కలి్పస్తోంది. తద్వారా పులుల సంరక్షణ కోసం స్థానిక ప్రజల మద్దతు పొందుతోంది. పులులకు ఆహారమయ్యే వన్యప్రాణుల సంతతి పెంచేందుకు ప్రత్యేకంగా 300 ఎకరాల్లో గడ్డిని పెంచుతున్నారు. నల్లమలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరప్రాంతాల్లో పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆడ పులులు, పిల్లల సంరక్షణ కోసం కృష్ణానది దాటి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కృష్ణాతీరంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే వారితో పులులకు ముప్పు పొంచి ఉండటంతో అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాయింట్ రివర్ పెట్రోలింగ్ ద్వారా సుమారు 30 కి.మీ. పరిధిలో పులులు ఇరురాష్ట్రాల సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించేందుకు అవకాశం కలి్పస్తున్నారు. పులుల ఆవాసాలకు ఇబ్బంది లేకుండా.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జాయింట్ రివర్ పెట్రోలింగ్ చేపట్టాం. దీనిని ఇంకా విస్తరిస్తాం. పులుల ఆవాసాలకు ఇబ్బంది కలగకుండా స్థానికులకు అవగాహన కలి్పస్తున్నాం. ప్రజలు సైతం ఎంతగానో సహకరిస్తున్నారు. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
నల్లమల వన్యప్రాణులకు ప్లాస్టిక్ ముప్పు
సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లోని వన్యప్రాణులు ప్లాస్టిక్ ప్రభావానికి గురవుతున్నాయి. ప్లాస్టిక్ కారణంగా ఈ అటవీ ప్రాంతంలోని జంతువుల ప్రవర్తనలో మార్పులు వస్తున్నట్లు అటవీ శాఖ అధ్యయనంలో తేలింది. వాటి శరీరాల్లోను మార్పులు వస్తున్నట్లు స్పష్టమైంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో శ్రీశైలంలో ఉన్న బయోడైవర్సిటీ రీసెర్చి సెంటర్ నల్లమల అడవుల్లో పర్యావరణం, జీవావరణానికి సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతం (నల్లమల అడవులు) పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు వంటి అనేక జంతువులకు ఆలవాలం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలానికి వెళ్లే మార్గం ఈ అడవిలోంచే ఉంది. లక్షలమంది యాత్రికులు వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు యాత్రికులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ప్లాస్టిక్ పెట్ బాటిళ్లు, పాలిథిన్ కవర్లు వంటి వాటిని అటవీ ప్రాంతంలో రోడ్డు వెంబడి పడేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఆకర్షిస్తుండడంంతో వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చి ప్రమాదాల పాలవుతున్నాయి. తెలియకుండా ప్లాస్టిక్ను తింటున్న అడవి జంతువులకు అనారోగ్యాలు వస్తున్నాయి. వన్యప్రాణుల శరీరంలో బయో–అక్యుమ్యులేషన్, బయో–మాగ్నిఫికేషన్ జరిగి ప్లాస్టిక్ కెమికల్స్ ఎక్కువగా పోగుపడుతున్నాయి. దీంతో అడవి జంతువుల సహజ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. వాటి శరీర హార్మోన్లలో మార్పులు వచ్చి అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఆకలి తగ్గిపోవడంతో తినడం తగ్గి శక్తిహీనం అవుతున్నాయి. వాటి ఆహారపు అలవాట్లలోను తేడాలు కనిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ఎస్టీఆర్)కు చెందిన అటవీ బృందం సాంకేతిక, శాస్త్రీయ పద్ధతుల ద్వారా నల్లమలలోని విభిన్నమైన పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. నల్లమల పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడమే అత్యంత కీలకమైన అంశం కావడంతో అక్కడి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ‘మన ఎన్ఎస్టీఆర్–క్లీన్ అండ్ గ్రీన్ ఎన్ఎస్టీఆర్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. స్థానికంగా ఉండే చెంచు గిరిజనులను ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేయడానికి స్వచ్ఛ సేవక్లుగా నియమించింది. తద్వారా వారికి ఉపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వేరు చేయించడంతోపాటు ప్రామాణిక పద్ధతుల్లో వాటిని రీసైక్లింగ్ చేస్తోంది. ప్రతి స్వచ్ఛ సేవక్కు అడవిలో జనసంచారం ఉండేచోట కొంత ప్రాంతాన్ని కేటాయించి ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసే బాధ్యతను అప్పగించింది. ఘాట్రోడ్డు పక్కన చెత్తకుండీలు ఏర్పాటు చేసి యాత్రికులు ప్లాస్టిక్ వ్యర్థాలను వాటిలో వేసేలా సూచికలు పెట్టింది. ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న నష్టాలను తెలిపేలా పలుచోట్ల హోర్డింగ్లు ఏర్పాటు చేసింది. ఈ చర్యల ద్వారా అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల సమస్యలు రాకుండా చేసేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వచ్ఛ సేవక్ల ద్వారా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను ఏరివేయించి రీసైక్లింగ్కు పంపుతున్నాం. ప్లాస్టిక్ అడవి జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాíస్టిక్ను శ్రీశైలం ప్రాంతానికి తీసుకురాకూడదు. యాత్రికులు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలి. – వై.శ్రీనివాసరెడ్డి, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్, శ్రీశైలం -
జంగిల్ సఫారీ కొత్త కొత్తగా..!
నల్లమల పర్యావరణ ప్రేమికులకు శుభవార్త..సరికొత్త హంగులతో జంగిల్ సఫారీ కనువిందు చేయనుంది. పులుల సంతానోత్పత్తి కోసం మూడు నెలల పాటు జంగిల్ సఫారీ, ఇష్టకామేశ్వరి యాత్రలకు అధికారులు బ్రేక్ వేశారు. తిరిగి శనివారం నుంచి ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయి. విరామ సమయంలో రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం, లక్షలాది రూపాయలతో విద్యుద్దీకరణ, ఫన్ ఆర్చరీ క్లబ్, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు కొత్తగా పగోడాలు ఇలా పర్యాటకులకు కనువిందు చేసేలా పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రయాణం సరికొత్త అనుభూతులను నింపనుంది. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా):నల్లమల అభయారణ్యం ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనస్సు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన పర్వతాలు, సుందర మనోహర లోయలు, ఆకాశాన్ని అందేలా మహా వృక్షాలు కనువిందు చేస్తాయి. తుమ్మలబైలు వద్ద ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ ఎన్నో వింతలు విశేషాలను పంచుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ వాహనాలలో అభయారణ్యంలో పర్యటిస్తుంటే ఆ ఆనందమే వేరు. పులుల సంతానోత్పత్తి కాలంలో అవి అడవిలో ప్రశాంతంగా సంచరించేందుకు వీలుగా పర్యాటకానికి మూడు నెలలు బ్రేక్ పడింది. తిరిగి శనివారం నుంచి సఫారీ ప్రారంభం కానుంది. ఈ మూడు నెలల్లో పర్యాటకుల కోసం అడవిలో ముఖ్య ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం: రోబోటిక్ టెక్నాలజీతో సరికొత్త మ్యూజియాన్ని సిద్ధం చేస్తున్నారు. పెద్దపులులు, చిరుత పులులు, జింకలు, నీల్గాయ్లు, తోడేళ్లు, రైలు ఎలుగులు, వేటకుక్కలు, పాములు ఇలా ఎన్నో వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేయనున్నారు. ఏ వన్యప్రాణి ప్రతిమ ముందు నిలబడితే ఆ వన్యప్రాణికి సంబంధించి పూర్తి వివరాలు, విశేషాలు మనకు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా స్పీకర్లలో వినేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా విశాఖపట్నం, హైదరాబాద్ల్లో తయారు చేస్తున్నారు. దీంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సరికొత్తగా పగోడాలను ఏర్పాటు చేశారు. అందులో యాత్రికులు పలహారాలను, మధ్యాహ్న భోజనాలు చేసే అవకాశం ఉంది. సీతాకోక చిలుకలు, తాబేళ్ల ఆకారాల్లో కూర్చునేందుకు ప్రత్యేక సీట్లు, చిన్నారులను ఆకట్టుకునే కొత్త కొత్త ఆకృతులు, అధునాతన టాయిలెట్లు ఇలా ఎన్నో నూతన సొగబులు సిద్ధం చేశారు. జంగిల్ సఫారీలో భాగంగా పులి చెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులితో పాటు, చిరుతలు, కృష్ణ జింకలు, దుప్పులు, నెమళ్లు జిప్సీలలో ప్రయాణించే పర్యాటకులకు అనీర్వచనీయమైన అనుభూతికి ఇస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పాటు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన ఇష్టకామేశ్వరి యాత్రను సైతం అధికారులు శనివారం ప్రారంభించనున్నారు. జంగిల్ సఫారీలో ప్రయాణం కొనసాగుతుంది ఇలా.. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలోమీటరు వద్ద నున్న గొర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి రెండు విలాసవంతమైన వాహనాల్లో ఈ ప్రయాణం మొదలవుతుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూపాయింట్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో పర్యటన ముగుస్తుంది. సుమారు 14 కిలోమీటర్ల మేర 1.30 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అడవిలో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా జిప్సీ ఏర్పాటు చేశారు. ఆరుగురు మాత్రమే కూర్చునే వీలుంటుంది. జిప్సీకి ఒక ట్రిప్పునకు రూ.2400 వసూలు చేస్తారు. సఫారీకి అధునాతన హంగులు జంగిల్ సఫారీకి అధునాతన హంగులను సమకూరుస్తున్నాం. రోబోటిక్ టెక్నాలజీతో కూడిన వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాం, సందర్శకుల విశ్రాంతికి పగోడాలు, టాయిలెట్లు సిద్ధం చేశాం. చిన్నారుల కోసం ఆకట్టుకునేలా ఎన్నో ఏర్పాట్లు చేశాం. – విశ్వేశ్వరరావు, రేంజి అధికారి, పెద్దదోర్నాల -
ఎలుక మూతి.. సౌండ్ వింటే గుండె ఆగి చస్తాయ్!!
సాక్షి, నాగర్ కర్నూల్: జానెడు పొడవు.. 2,3 కిలోల బరువు.. ఎలుకలాంటి ముఖం.. జాతి మాత్రం జింక. మన దేశంలో అరుదైన మూషిక జింకలు అవి. జింకల జాతిలో అతి చిన్నవి అయిన ఈ మూషిక జింకలకు నల్లమల అభయారణ్యం కేంద్రంగా మారుతోంది. అంతరించిపోయే దశలో ఉన్న మూషిక జింకలను సంరక్షించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రత్యేకంగా ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బరువు తక్కువ.. భయం ఎక్కువ! భారత ఉప ఖండంలో మాత్రమే విరివిగా కనిపించే మూషిక జింకలు నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల కిందే అంతరించిపోయినట్టు అంచనా. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జింకలను అంతరించిపోతున్న జాతిగా గుర్తించి వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1లో చేర్చింది. మూషిక జింకలకు భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు, జంతువులు దాడి చేసినప్పుడు వాటి గుండె ఆగి మరణిస్తాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మూషిక జింకలు రాత్రివేళల్లో ఎక్కువగా సంచరిస్తాయి. అడవిలో నేలరాలిన పండ్లు, పూలు, ఆకులను తింటాయి. మారేడు, ఉసిరి, పరక, గొట్టి, మంగకాయలు, పుట్టగొడుగులు, చిన్నచిన్న పొదల లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింక గర్భాధారణ కాలం ఆరునెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. అయితే వెంటనే మళ్లీ సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. వీటిని చిరుత పులులు, అడవి కుక్కలు, గద్దలు, అడవి పిల్లులు వేటాడుతాయి. వీటికితోడు వేట, అడవుల నరికివేత, కార్చిచ్చుల వంటివి మూషిక జింకల ఉనికికి ముప్పుగా మారుతున్నాయి. మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 2017 నుంచి మౌస్డీర్ సాఫ్ట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నల్లమలలో అంతరించిపోయిన మూషిక జింకల జాతిని తిరిగి పెంచేందుకు అటవీ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రమంగా మూషిక జింకల సంఖ్య పెరుగుతోంది. నిత్యం 50 ట్రాప్ కెమెరాలతో వాటి కదలికలను గమనిస్తున్నాం. ::: రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ 3 దశల్లో.. ప్రత్యేక జాగ్రత్తల మధ్య.. అటవీశాఖ హైదరాబాద్లోని జూపార్క్, సీసీఎంబీ సంస్థలతో కలసి మూషిక జింకల సంతతిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. మొదట 2008లో శేషాచలం అడవుల నుంచి నాలుగు ఆడ, రెండు మగ మూషిక జింకలను తీసుకొచ్చి హైదరాబాద్ జూపార్క్లోని బ్రీడింగ్ కేంద్రంలో ఉంచారు. వాటి సంఖ్య పెరిగిన తర్వాత 2017 సెప్టెంబర్ 12 నుంచి ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’ప్రోగ్రాం కింద అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ► ఒక్కో బ్యాచ్లో ఆరు ఆడ, రెండు మగ మూషిక జింకలను వదులుతున్నారు. ఇది మూడు దశలుగా జరుగుతుంది. ఇందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ సమీపంలో మూడు కంపార్ట్మెంట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ► తొలిదశలో క్యారెట్, దానిమ్మ, అరటి వంటి బయటి ఆహారాన్ని అందించి పరిరక్షిస్తారు. ► రెండో దశలో బయటి ఆహారాన్ని తగ్గిస్తూ.. అడవిలో సహజంగా లభించే ఆహారాన్ని అందజేస్తారు. ► మూడో దశలో అడవిలోకి వదిలి బయటి నుంచి నీరు, ఆహారం ఇవ్వకుండా సహజ వాతావరణంలో అవే వెతుక్కుని తీసుకునేలా అలవాటు చేస్తారు. ► మొత్తంగా 30 రోజుల పరిశీలన అనంతరం పూర్తిగా అడవిలో వదిలేస్తారు. అయితే వాటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు అడవిలో అక్కడక్కడా 50 వరకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 144 మూషిక జింకలను విడుదల చేశారు. -
నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు.. చెంచులదే కీలకపాత్ర
అది దట్టమైన నల్లమల అడవి.. అందులో నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు వ్యక్తులు ఏవో పాదముద్రలు చూసి ఆగిపోయారు. అవేమిటని నిశితంగా పరిశీలించారు. పెద్దపులి అడుగులుగా (పగ్ మార్క్) నిర్ధారించారు. అంటే దగ్గర్లోనే పులి ఉన్నట్లు గ్రహించారు. ఇంకా ముందుకెళ్తే ప్రమాదమని భావించి అక్కడే ఆగిపోయారు. ఆ అడుగుల ముద్ర చుట్టూ చిన్నచిన్న రాళ్లు పెట్టి వాటిపైన ఒక పారదర్శక అద్దం పెట్టారు. దానిపై స్కెచ్తో ఆ అడుగుల్ని గీశారు. అలాగే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కూడా ఆ పాదముద్రను సేకరించి వెనుదిరిగారు. – నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి ఆ ఐదుగురు ఎవరో కాదు.. పులుల రక్షకులు. నల్లమలలో జీవించే చెంచులు వారు. వన్యప్రాణుల మధ్యే వారి జీవనం. వాటితో తరతరాల అనుబంధం వారిది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని రోళ్లపెంట బేస్ క్యాంపు వద్ద వాళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేర్లు.. దంసం గురవయ్య, దాసరి నాగన్న, దంసం మొగిన్న, దార బయన్న, అంజి నాయక్. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులుల సంఖ్య ఏటా పెరుగుతుండటంలో అటవీ శాఖతోపాటు నల్లమల చెంచుల పాత్ర ఎంతో కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా పులుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఇక్కడ అవి సురక్షితంగా ఉండడానికి ఈ చెంచులే ప్రధాన కారణం. 4 జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో పులుల రక్షణ బాధ్యత వారిదే. ఏడేళ్ల క్రితం అక్కడ 37 మాత్రమే పులులుండగా, ఇప్పుడవి 73కి పెరిగాయి. అటవీ శాఖ తాజా పులుల గణనలో ఈ విషయం తేలింది. 63 బేస్క్యాంపుల బాధ్యత వీరికే.. అడవిలోనే పుట్టి పెరిగే చెంచులకు అక్కడి దారులు, నీటి చెలమలు, పులులు, మిగిలిన వన్యప్రాణులు, వాటి జీవన విధానం గురించి పూర్తిగా తెలుసు. పులుల్ని వారు పెద్దమ్మ గా భావిస్తారు. అందుకే వాటిని సంరక్షిస్తారు. ఆంధ్రా ప్రాంతంలో ద్రవిడుల కంటే ముందు నుంచి చెంచులు నివసిస్తున్నారనే వాదన ఉంది. అనాదిగా నల్లమలలో వన్యప్రాణులతో కలిసి వారు జీవిస్తున్నారు. అడవి ఉంటేనే తమ మనుగడ ఉంటుందని వారు నమ్ముతారు. అందుకే అడవిని, అందులోని వన్యప్రాణుల్ని సంరక్షిస్తారు. వీరికి అడవి ఆనుపానులు తెలుసు కనుకే వారి ద్వారానే అటవీ శాఖ పులుల సంరక్షణను చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మకూరు, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల అటవీ డివిజన్లలోని 63 బేస్ క్యాంపుల బాధ్యతను వారికే అప్పగించింది. అక్కడి నుంచే పులులు, ఇతర వన్యప్రాణులు, అటవీ సంరక్షణ చేపడుతున్నారు. ప్రతి బేస్ క్యాంపులో ఐదుగురు చెంచులతో ఒక బృందం ఏర్పాటుచేశారు. వీరిని పంచ పాండవులుగా పిలుస్తారు. అనేక తరాలుగా పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణలో చెంచులు భాగమయ్యారు. ఫ్రంట్లైన్లో ఉండి దట్టమైన అడవుల్లో పులులు, ఇతర జంతువులను ట్రాక్ చేయడంతోపాటు వాటి రక్షణ, అడవిలో పెట్రోలింగ్, సమాచారం సేకరించడానికి పనిచేస్తున్నారు. బేస్ క్యాంపులు వచ్చాక అంతకుముందు కూడా అటవీ శాఖాధికారులు వీళ్ల ద్వారానే నల్లమలలో పెట్రోలింగ్ చేస్తున్నారు. చెంచులు ఏం చేస్తారంటే.. ►చెంచులకు అటవీ శాఖ శిక్షణనిచ్చింది. మొబైల్లో జీపీఎస్ ద్వారా అడవిలో తిరగడం, చెట్లకు కెమెరా ట్రాప్లు అమర్చడం, పులుల అడుగులు గుర్తించి ఆ ముద్రలను సేకరించడం వీరి ప్రధాన విధులు. ►ప్రతిరోజు తమ బేస్ క్యాంపు పరిధిలో 5 నుంచి 7 కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ చేస్తారు. ►ఎం–స్ట్రైప్ అప్లికేషన్ ద్వారా జంతువుల ఫొటోలు తీస్తారు. వాటిని ప్రతి 10 రోజులకు అటవీ శాఖాధికారులకు ఇస్తారు. ►బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా? పులులు, ఇతర జంతువులకు ఏమైనా ఉచ్చులు వేశారా? స్మగ్లింగ్ వంటి సమాచారాన్ని సేకరించి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైర్లెస్ సెట్లో అధికారులకు సమాచారమిస్తారు. ►అడవిలో జరిగే ప్రతి కదలిక తెలిసేలా ఈ చెంచుల ఫ్రంట్లైన్ టీమ్ పనిచేస్తుంది. ►మొత్తం 300 మంది ఈ టీముల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ప్రతి క్యాంపులో మరో ముగ్గురు చెంచుల్ని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల ఏరివేతకు నియమించారు. ►ఈ పని ద్వారా అడవులు, పులుల సంరక్షణతోపాటు వారికి అటవీశాఖ ఉపాధి కల్పిస్తోంది. ►ఇక వీరి సేవలను గుర్తించిన నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్టీఎస్ఏ) గతంలోనే బెస్ట్ ఎక్స్లెన్స్ అవార్డు ఇచ్చింది. ►ఆ తర్వాత దేశంలోని మిగిలిన అటవీ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో స్థానిక గిరిజన జాతుల్ని అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వామ్యం చేస్తున్నారు. పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర ముఖ్యమైనది. తాజా లెక్కల ప్రకారం 73 పులులు ఉన్నాయి. ఇది ఏడేళ్లలో ఊహించని పెరుగుదల. తమ శాఖ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇది సాధ్యమైంది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టులో విస్తీర్ణపరంగా దేశంలోనే ఇది అతిపెద్దది. ఇక్కడ పులుల సంఖ్య పెరుగుదలను బట్టి ఈ అభయారణ్యం ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. –శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ కన్జర్వేటర్–డైరెక్టర్, టైగర్ ప్రాజెక్టు చెంచులది కీలకపాత్ర పులుల సంరక్షణలో చెంచులు కీలకంగా ఉన్నారు. బేస్ క్యాంపుల్లో వాళ్లు ఐదుగురు చొప్పున ఉంటారు. వారు పెట్రోలింగ్ చేస్తూ పులుల్ని ట్రాక్ చేస్తారు. పులుల గురించి అన్నీ తెలిసిన వారికే వాటి సంరక్షణలో భాగస్వాముల్ని చేశాం. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం. – సందీప్రెడ్డి, సబ్ డీఎఫ్ఓ, ఆత్మకూరు ఫారెస్టు డివిజన్ పులి కనపడితే నిశ్శబ్దంగా ఉండిపోతాం ప్రతిరోజు 5–7 కిలోమీటర్ల మేర అడవిలో తిరుగుతాం. పులి, ఇతర జంతువుల్ని గమనిస్తూ ఉంటాం. అడుగుల్ని బట్టి అవి ఎటు వెళ్తున్నాయో తెలుసుకుంటాం. ఒకవేళ పులి ఎదురైతే నిశ్శబ్దంగా ఉండిపోతాం. దీంతో అది మా వైపు చూసినా వెళ్లిపోతోంది. హడావుడి చేస్తే దాడిచేస్తుంది. – దార బయన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ మంచినీటి కోసం సాసర్ పిట్లు కడతాం మా క్యాంపు చుట్టూ నాలుగైదు రూట్లలో తిరుగుతాం. ఒక్కో రోజు ఒక్కో రూట్లో వెళ్తాం. ఎండాకాలం జంతువులు నీటి కోసం అలమటిస్తాయి. వాటికోసం అడవిలో ఆఫీసర్లు చెప్పినట్లు సాసర్ పిట్లు కట్టి అందులో నీళ్లు నింపుతాం. పులులు, ఇతర జంతువులు వచ్చి ఆ నీటిని తాగుతాయి. – దంసం మొగిన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ పులుల క్రాసింగ్ టైమ్లో జాగ్రత్తగా ఉంటాం పులుల క్రాసింగ్ టైమ్ లో చాలాజాగ్రత్తగా ఉంటాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ల్లో అవి కలిసే(మేటింగ్) సమయం. అప్పుడు ఎవరైనా కనపడితే విరుచుకుపడిపోతాయి. వేటాడే ట ప్పుడూ పులికి కనపడకూడదు. తనను అడ్డుకుంటున్నారని దాడి చేస్తుంది. మిగిలిన సమయాల్లో మనుషుల్ని చూసినా వెళ్లిపోతుంది. – అంజి నాయక్, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ -
సర్పాలతో మేలే.. ఏపీలో విషపూరిత సర్ప జాతులు నాలుగే
నల్లమల అభయారణ్యం ఎన్నో జీవజాతులకు ఆలవాలం. వందల రకాల పక్షులు, జంతువులతో పాటు పాములు కూడా ఎక్కువగా సంచరిస్తుంటాయి. విషపూరితమైన వాటితో పాటు విష రహిత పాములూ ఎక్కువే. ఈ నేపథ్యంలో సర్పాలపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీ తయారు చేసి రైతులకు అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. పెద్దదోర్నాల: సర్పాలంటే ప్రతి ఒక్కరికీ అంతు లేని భయం. విష పూరితమైన సర్పాలంటే గుండెల్లో దడ. పాము కనబడగానే దాన్ని మట్టుబెట్టడమో లేదా దానిని పట్టుకోవటానికి శిక్షణ పొందిన వారిని ప్రేరేపించటమో చేస్తుంటాం. అయితే మనకు ఎదురు పడిన పాములన్నీ మానవాళికి కీడు చేసేవి కావన్న నిజాన్ని గ్రహించాలని జీవశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. పాములలో ఎన్నో రకాల జాతులు విషం లేనివే. వాటికి కోరలే ఉండవు. కాటు వేస్తే గాయమవడమే తప్ప ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. దీంతో పాటు కొన్ని పాముల వల్ల మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పాము కాటుకు విరుగుడుగా ఉపయోగపడే యాంటీ వీనమ్ను తయారు చేయాలంటే దానికి పాము విషమే కావాలి. పర్యావరణ పరిరక్షణలో ఎన్నో రకాల సర్పాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రైతులకు పరోక్షంగా సర్పరాజులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వరి, గోధుమ లాంటి పంటలను నాశనం చేయటంలో మూషికాలదే ప్రధాన పాత్ర. అటువంటి మూషికాలను పాములు వేటాడి, వెంటాడి భక్షించటం వల్లనే పంటలకు మేలు జరుగుతుంది. దేశ వ్యాప్తంగా సుమారు 300 రకాలకు పైగా సర్పాలుంటే, వాటిలో కొన్ని రకాల పాములు మాత్రమే ప్రమాదభరితమైనవిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వాటిల్లో కూడా ఎక్కువగా సముద్ర జలాల్లోనే జీవిస్తుంటాయి. చదవండి: (AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి) విషపూరితమైన పాములతో అప్రమత్తంగా ఉండాలి నల్లమలలో సంచరించే విషపూరితమైన పాముల్లో ప్రధానంగా చెప్పుకునే సర్పజాతులు నాలుగు రకాలు ఉన్నాయి. వాటిలో నాగుపాము, రక్త పింజర, కట్లపాము, చిన్న పింజర పాములు ఉన్నాయి. నాగుపాము పడగ విప్పుకొని మనుషులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. నాగుపాములకు ఎలుకలు మంచి ఆహారం. ఎలుకల కోసమే నాగుపాములు పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. దీంతో పాటు ఆకారంలో ఎంతో చిన్నదిగా ఉండేవి చిన్న పింజర పాములు. ఎంత ఆకారంలో చిన్నదైనా దీని విషం మాత్రం చాలా భయంకరమైంది. అది మనుషులపై మెరుపు వేగంతో దాడి చేస్తుంది. ఖాళీ ప్రాంతాలు, బీడు ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనబడుతుంది. గడ్డి లోపల, కాలిన ఆకుల మధ్య ఎక్కువగా ఉంటుంది. కట్లపాము రాత్రి పూట మాత్రమే ఆహారాన్ని వెతికే పనిలో ఉంటుంది. ఈ క్రమంలో నేల మీద పడుకుని ఉన్న వారిని కాటు వేసే ప్రమాదం ఉంది. రాత్రి వేళల్లో తిరిగేటప్పుడు ఎక్కువగా దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. దాని పెద్ద ఆకారం, పెద్ద కోరలు, భయంకరమైన విషం. పాము కాట్ల మరణాలకు ఎక్కువ కారణం రక్తపింజరే. రాలిపోయిన ఆకుల మధ్య ఎక్కువగా దాక్కుని ఉంటుంది. చదవండి: (టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్ఆర్టీసీకి రాబడి) విషరహితమైన పాములతో ప్రమాదమే లేదు నల్లమల అభయారణ్యంలో సంచరించే విషరహిత పాముల్లో పసిరిక పాము, జెర్రిపోతు, రెండు తలల పాములు, మట్టిపాములు లాంటివి ఎక్కువగా ఉంటాయి. వాటిలో చెట్లపై ఉండే పసిరిక పాములు ఆకుల రంగులో ఉండి పక్షుల గుడ్లు, చిన్న చిన్న పురుగులను తిని జీవిస్తుంటాయి. జెర్రిపోతు పాములకు భయం ఎక్కువగా ఉంటుంది. మానవాళికి వీటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. భూమి లోపల ఉండే పాముల్లో రెండు తలల పాములు ఒకటి. దాని వల్ల ఏ ప్రమాదం ఉండదు. అవి వేగంగా పరిగెత్తలేవు. దగ్గరలో ఉన్న బొరియల్లో ఎక్కువగా ఉంటాయి. మరో పాము మట్టిపాము. దీని వల్ల కూడా ఎవరికీ ప్రమాదం ఉండదు. ఇవి ఎక్కువగా ఎలుకలను తిని జీవిస్తుంటాయి. -
తల్లిని దారుణంగా చంపి.. అంతే కిరాతకంగా హతమై..
మన్ననూర్/ సాక్షి, హైదరాబాద్: పెంచి పెద్ద చేసిన తల్లిని స్నేహితులతో కలిసి కిరాతకంగా హత్య చేసిన దత్తపుత్రుడు సాయితేజ (27) అంతే కిరాతకంగా హతమయ్యాడు. తల్లిని చంపేందుకు సాయితేజకు సహకరించిన స్నేహితుడే అతడినీ హత్యచేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి.. తలపై రాయితో కొట్టి.. ముఖమంతా ఛిద్రం చేసి చంపాడు. కానీ భయపడి పోలీసులకు లొంగిపోయాడు. పెంచి పెద్ద చేసిన తల్లిని చంపి.. హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జంగయ్య యాదవ్, భూదేవి (58) దంపతులు.. 1995లో బంధువుల నుంచి నెల రోజుల మగబిడ్డను దత్తత తెచ్చు కున్నారు. సాయితేజ అని పేరు పెట్టి పెంచుకున్నారు. మతిస్థిమితం సరిగా లేని సాయితేజకు స్థానికంగా ఉన్న ఓ యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇం ట్లో నగదు, బంగారం ఉన్నాయని తెలుసు కున్న సాయితేజ.. వాటిని తన ప్రేయసికి ఇవ్వాలనుకున్నాడు. తల్లి అడ్డువస్తుందన్న ఉద్దేశంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడైన డ్రైవర్ నర్సింహను సాయం చేయాలని కోరాడు. కొంత డబ్బు కూడా ఇస్తానని చెప్పడంతో నర్సింహ ఒప్పుకున్నాడు. తర్వాత నర్సింహ ఈ విషయాన్ని తన స్నేహితులైన చంపాపేటకు చెందిన వట్టికోటి శివ, చింటు, అంజి, సాయిగౌడ్లకు తెలిపాడు. అందరూ కలిసి ఈనెల 6న అర్ధరాత్రి సాయితేజ ఇంటికి వెళ్లారు. నిద్రలో ఉన్న భూదేవిని చంపి.. 10 లక్షల నగదు, 30 తులాల బంగారంతో పరారయ్యారు. బయటపెడ్తాడని భయపడి.. ఎత్తుకెళ్లిన నగలు, నగదును అంతా పంచు కున్నారు. కానీ మతిస్థిమితం సరిగా లేని సాయితేజ.. ఈ విషయాన్ని ఎక్కడ బయట పెడతాడేమోనని శివ, నర్సింహ, ఇతర స్నేహి తులు భయపడ్డారు. సాయితేజను చంపేస్తే సమస్య తీరుతుందని నిర్ణయించు కున్నారు. ఈ నెల 7న మధ్యాహ్నం శ్రీశైలం వెళ్తున్నామ ని, అక్కడ తన ప్రేయసిని కలవచ్చని సాయితేజకు చెప్పారు. అంతా కలిసి బస్సులో శ్రీశైలం వెళ్లారు. ఆ రోజు రాత్రి సత్రంలో గడిపారు. తర్వాతిరోజు ఉదయం దైవ దర్శనం చేసుకొని, గుండు కొట్టించుకున్నారు. రాత్రికి వట్టె్టవారిపల్లికి చేరుకుని నిద్రించారు. ఈనెల 10న ఉదయం అమ్రాబాద్ మండల పరిధిలోని మల్లెలతీర్థం జలపాతానికి వెళ్లారు. ముఖం గుర్తుపట్టకుండా.. మల్లెలతీర్థం ప్రాంతంలో శివ, సాయితేజ మద్యం తాగారు. శివ ఈ క్రమంలో సాయితేజతో గొడవ పెట్టుకుని దాడికి దిగాడు. సాయితేజ కాళ్లు, చేతులు కట్టేసి.. తలపై రాయితో కొట్టి చంపాడు. అదే రాయితో ముఖం గుర్తు పట్టకుండా ఛిద్రం చేశాడు. తర్వాత బ్యాగులో రాళ్లునింపి మృతదేహానికి కట్టి.. మల్లెలతీర్థం కింది భాగంలో ఉన్న నీటి గుండంలో పడేశాడు. మత్తు దిగాక తీవ్ర భయాందోళనకు గురైన శివ.. బస్సులో నేరుగా హైదరాబాద్కు వచ్చాడు. సరూర్నగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ఉదయం 10:30 గంటలకు అమ్రాబాద్ పోలీసులు, అటవీ అధికారుల సహకారంతో మల్లెల తీర్థం జలపాతం వద్దకు చేరుకుని సాయి తేజ మృతదేహాన్ని వెలికితీశారు. శివ వద్ద రూ.1.40 లక్షల నగదు, బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతను చెప్పిన వివరాల మేరకు మిగతా నిందితులు నర్సింహా, చింటు, అంజి, సాయిగౌడ్లను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. చదవండి: కల్యాణ మండపంలో నవ వధువు మృతి కేసులో ట్విస్ట్ -
పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు..
సాక్షి, ఆత్మకూరురూరల్: తూర్పు కనుమల్లో విస్తరించిన నల్లమల అడవులు జీవ వైవిధ్యానికి ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగా నిలిచాయి. సింహం, ఏనుగు మినహా అన్ని రకాల జంతువులు ఇక్కడ జీవిస్తున్నాయి. మాంసాహార, గడ్డి తినే జంతువులతో పాటు పలు సరీసృపాలు, ఉభయచరాలు, కీటకాలు, పక్షులు ఉన్నాయి. అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం, వన్యప్రాణి వేటగాళ్లను కట్టడి చేయడంతో అడవిలో జంతుజాలం అలరారుతోంది. ఏటా జంతువులసంఖ్య క్రమేణా పెరుగుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. మాంసాహార జంతువులలో ప్రముఖమైన పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు మొత్తం 17 రకాలు, తొమ్మిది రకాల గడ్డి తినే జంతువులు ఉన్నాయి. అంతరించి పోయే దశలో ఉన్న పెద్దపులులతో పాటు అరుదైన జీవజాలానికి నెలవుగా ఉన్న కొండగొర్రెలు (చౌసింగా) తన ఉనికిని చాటుతూ నల్లమల అటవీ సాంద్రతను నిరూపిస్తున్నాయి. అలాగే నిశాచరి అయిన హనీబాడ్జర్ కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. అటవీ పరిధిలోని కృష్ణానది, పలు కొండవాగుల్లో, నీటిదొరువుల్లో సరీ సృపాలకు చెందిన మొసళ్లు జీవిస్తున్నాయి. అలాగే భారీ తాబేళ్లు (టోలిలు) కూడా ఉన్నాయి. నెమలి, కొండ కోడి (గ్రే జంగిల్ పౌల్), హార్న్బిల్ వంటి 200 రకాల అరుదైన పక్షుల కిలకిలరావాలతో నల్లమల పులకిస్తోంది. ఇవే గాక 13 రకాల గబ్బిలాలు, బెట్టుడత లాంటి ఉడుత జాతి జంతువులు, ఎలుక జాతులు, సాలెపురుగు, చెదపురుగులు వంటి లెక్కలేని కీటకాలు ఉన్నాయి. అయితే వెదురు తోపులు పచ్చిక బయళ్లను ఆక్రమించడంతో జింకలు ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరులుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు నల్లమలలో తరచూ కనిపించే జింకలు ఇప్పుడు సమీపంలోని రోళ్లపాడు అటవీ ప్రాంతంలో అధికంగా సంచరించడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. విఫలమైన గడ్డి పెంపకం.. నల్లమలతో పాటు చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాల్లో కూడా పశువుల సంఖ్య గణనీయంగానే ఉంది. 2001 లెక్కల ప్రకారం అడవిలో 5.81 లక్షల వన్యప్రాణులు ఉండగా సమీప గ్రామాల్లో (3 కిమీ లోపు) 6.24 లక్షల పెంపుడు జంతువులు ఉన్నాయి. వీటిల్లో గడ్డితినే జంతువులన్నింటికీ నల్లమలనే ఆధారం. నల్లమలలో 1,33,122 హెక్టార్ల గడ్డి లభించే ప్రాంతం ఉండగా.. ఏటా సుమారు 3,86,053 టన్నుల గడ్డి లభ్యమవుతోంది. ఇప్పుడున్న జంతువులకు 6.934 లక్షల టన్నుల గడ్డి అవసరం కాగా 3.073 టన్నుల కొరత ఉంది. వేసవిలో గడ్డి సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీంతో సమస్య పరిష్కారానికి అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ల వద్ద గడ్డి పెంచే చర్యలు చేపట్టారు. అయితే నాటిన గడ్డి మొక్కలను జంతువులు వేర్లతో సహా పెకిలించడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. దేశంలోని కొన్ని అభయారణ్యాలలో గడ్డి మైదానాలను పెంచేందుకు వెదురు పొదలను తొలగించిన సందర్భాలున్నాయి. గడ్డి తినే, మాంసాహార జంతువుల మధ్య సమతుల్యం లోపిస్తే పర్యావరణ సమస్య తలెత్తే అవకాశం ఉంది. మాంసాహార జంతువులు.. పెద్దపులి, చిరుతపులి, జంగం పిల్లి, ఆకుచిరుత, చేపలుపట్టే పిల్లి, రస్టీస్పాటెడ్ క్యాట్, పునుగు పిల్లి, కామన్ పామ్సివిట్, ముంగీస, నీటికుక్క(ఆటర్), హానీబాడ్జర్, ఎలుగు బంటి, నక్క, గుంటనక్క, చారల హైనా (దొమ్ములగొండి), తోడేలు, రేచుకుక్క (వైల్డ్డాగ్). గడ్డి తినే జంతువులు: దుప్పి (స్పాటెడ్ డీర్), కణితి (సాంబర్ డీర్), మనిమేగం (నీల్గాయ్), కృష్ణజింక (బ్లాక్బక్), బుర్ర జింక (మౌస్డీర్), కొండగొర్రె(చౌసింగా), చింకారా, అడవి పంది (వైల్డ్బోర్), ముళ్ల పంది (మిశ్రమ ఆహార జంతువు. చెద పురుగులు తిని జీవిస్తుంది.) కొండ గొర్రె కొండ గొర్రెలు మైదాన ప్రాంతాల్లో కాక దట్టమైన అడవుల్లో పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి జింక జాతికి చెందినవైనప్పటికీ మూషిక జింకకు, కృష్ణజింకకు మధ్యరకం పరిమాణంతో ఉంటాయి. రెండు కొమ్ములు నిటారుగా మరో రెండు చిన్న కొమ్ములు ముందుకు ఉంటాయి. మొత్తం నాలుగు కొమ్ములు ఉండటంతో దీనికి చౌసింగా అన్న పేరు వచ్చింది. దీని మాంసం రుచికరంగా ఉంటుందన్న అపోహతో వేట గాళ్ల దృష్టి వీటిపై ఎక్కువగా ఉండేది. అధికారులు నిఘా పెంచడంతో వీటి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. హనీబాడ్జర్ వన్యప్రాణుల టీవీ చానల్స్లో తరుచూ కనిపించే హనీబాడ్జర్ను ఆఫ్రికా జంతువుగా చాలా మంది భావిస్తారు. ఇది రాత్రి పూట మాత్రమే సంచరించడంతో నల్లమల ప్రాంత ప్రజలకు దీని గురించి పెద్దగా తెలియలేదు. అందుకే దీనికి తెలుగు పేరు కూడా లేకుండా పోయింది. బిలకారి జీవనం చేసే హనీబాడ్జర్లు మానవ సామాజిక వ్యవహారానికి దగ్గరగా తమ జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. భూమి లోపల నివాసం ఏర్పరుచుకుని పెద్దవి, పిల్లలు వేర్వేరు గదుల్లో నిద్రిస్తాయి. అలాగే తమ నివాసం వెలుపల మల విసర్జనకు ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి అవసరమై సమయంలో పెద్దపులికి కూడా ఎదురుతిరిగే సాహసం చేస్తాయి. -
బెబ్బులి కోట.. పులుల ఆవాస కేంద్రంగా నల్లమల
పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే మానవాళితో పాటు జంతువుల నివాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ప్రభుత్వాలు వీటికి లెక్కలు వేసి, అవసరమైన చోట ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తుంటాయి. మనదేశంలో పర్యావరణ పిరమిడ్లో పెద్ద పులిని అగ్ర సూచిగా గుర్తించారు. అలాంటి పులులకు నల్లమల ఫారెస్ట్ సురక్షిత ఆవాస కేంద్రంగా మారింది. వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, కర్నూలు: ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గి పోతుండడంతో వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రపంచంలో బతికి ఉన్న పెద్ద పులుల సంఖ్య 4000 వరకు ఉండగా అందులో ఒక్క భారత దేశంలోనే వాటి సంఖ్య యాభై శాతానికి పైగా అంటే 2,226 గా ఉండడం గమనార్హం. ఇటీవల ప్రకటించిన అరుణాచల్ ప్రదేశ్ లోని కమలంగ్ టైగర్ రిజర్వ్తో కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 50 పెద్ద పులుల అభయారణ్యాలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్– శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) దేశంలోనే అతి పెద్దది(3,568 చ.కిమీ). నల్లమలలో ఏర్పాటు చేసిన ఇన్ఫ్రా రెడ్ కెమెరా నల్లమల పులి సంరక్షణకు దుర్గం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవులు పులి సంరక్షణకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాయి. పులి సంతతి వృద్ధికి ఈ ప్రాంతం అత్యంత అనుకూల పర్యావరణాన్ని కలిగి ఉంది. గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యం (జీబీఎం)లో కూడా పులులు క్రమేపి విస్తరిస్తూ కడప జిల్లా వరకు చేరుకుంటున్నాయి. నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యంలో సిబ్బంది పర్యవేక్షణ, మానవవనరులను అత్యంత ప్రతిభావంతంగా వినియోగించుకోవడం ద్వారా పులుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిని గుర్తించిన ఎన్టీసీఏ 2014లో అత్యున్నత ప్రతిభా అవార్డుతో అభినందించింది. సుదీర్ఘ ఆకలి తర్వాతే వేటపులి ఎప్పుడంటే అప్పుడు వేటాడదు. ఎంతో ఆకలి వేస్తేనే వేట మొదలుపెడుతుంది. సంవత్సరానికి ఒక పులి 50 నుంచి 60 జంతువులను తన ఆహారానికి వినియోగించుకుంటుందని అటవీ అధికారులు తెలిపారు నల్లమలలో పులుల ఉనికి పెరుగుతుందిలా.. సంవత్సరం ఎన్ఎస్టీఆర్ జీబీఎం మొత్తం 2016 23 17 40 2017 25 21 46 2018 50 పైగా ఉండొచ్చని అంచనా 100 పైగానే పెద్ద పులులు ఉన్నట్లు అంచనా పులి సామ్రాజ్యం ప్రత్యేకం పులుల తమ కోసం ఓ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాయి. సాధారణంగా ఒక మగ పులి తన ఆహార లభ్యతను బట్టి తన విహార ప్రాంతాన్ని గుర్తిస్తుంది. నల్లమలలో ఒక పులి సాధారణంగా తన ఆధీన ప్రాంతం (టెరిటరీ) 50 చ.కిమీ గా ఉంచుకుంటుంది. అయితే తన భాగస్వామి, ఆహారం కోసం 200 చ.కి.మీ. పరిధి వరకు విహరిస్తుంది. అదే రాజస్థాన్లోని రణతంబోర్ పులుల అభయారణ్యంలో అది ఇందులో సగం మాత్రమే ఉంటుంది. పులి తన మూత్రం వెదజల్లడం ద్వారా తన టెరిటరీ సరిహద్దులను నిర్ణయించుకుంటుంది. నల్లమల అడవిలో పులులు లెక్కింపులో ప్రామాణికం స్టాండర్డ్ పగ్ మార్క్ పెద్ద పులుల పాద ముద్రలు సేకరించి వాటి ఆధారంగా పులుల సంఖ్యను అంచనా వేస్తారు. దీనినే స్టాండర్డ్ పగమార్క్ ఎన్యూమరేషన్ పద్ధతి అని అంటారు. ప్రస్తుతం జాతీయ జంతువుల అంచనాకు పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటున్నారు. అడవుల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిల్లో పడే చిత్రాల ఆధారంగా పులుల చారలను విశ్లేషిస్తారు. వాటి చారలు మనుషుల వేలిముద్రలలాగే దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. పులి సంరక్షణ కఠినతరం పులి అత్యంత సున్నితమైన జంతువు. పులి సౌకర్యంగా జీవించడానికి తగిన పర్యావరణాన్ని ఏర్పరచడం ఎంతో క్లిష్టతరంగా ఉంటుంది. నల్లమల అడవులు ఆకురాల్చు అడవులు కావడంతో పులికి ఆహారమైన జంతువులకు సంవత్సరం పొడవునా గడ్డి లభించదు. దీంతో పులికి కావాల్సిన ఆహారపు జంతువుల సంఖ్య అడవిలో తగ్గకుండా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నల్లమలలో పులుల పెరుగుదల కనిపించడం సిబ్బంది పనితనానికి గుర్తుగా చెప్పవచ్చు. – అలాన్ చోంగ్ టెరాన్, డీఎఫ్ఓ, ఆత్మకూరు -
అడవి 'పులి'కిస్తోంది
సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: పెరుగుతున్న పులి గాండ్రిపులతో అడవి పులకిస్తోంది. జీవ వైవిధ్యం పరిమళిస్తోంది. నడకలో రాజసం.. వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వెరసి పెద్ద పులులు ఊపిరి తీసుకుంటూ సంతానాన్ని పెంచుకుంటున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. పశ్చిమ గోదావరి జిల్లా పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ వాటి కదలికలు మెరుగుపడ్డాయి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3,900 పులులు మాత్రమే మిగిలి ఉండగా.. మన దేశంలో 2,967 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని 80 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయి. వాటి సంఖ్య మన రాష్ట్రంలో క్రమంగా పెరుగుతుండటం విశేషం. నల్లమలలో రెట్టింపైన వ్యాఘ్రాలు మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశంలోనే అతి పెద్దది. ప్రస్తుతం ఇక్కడ 63 పులులను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించారు. దీనిని బట్టి వీటి సంఖ్య 80 వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2014లో కేవలం 40 పులులు మాత్రమే ఉండగా.. ఏడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వరకు పులులు విస్తరించాయి. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు భద్రాచలం వరకు విస్తరించి ఉన్న పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ పులుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతంలో నాలుగు పులులు, ఐదు చిరుత పులులను అధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు పెరగడంతో.. కేంద్ర ప్రభుత్వం 1973 నుంచి ‘ప్రాజెక్ట్ టైగర్’ పేరుతో వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టింది. ఫలితంగానే దేశంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న పులులకు మన రాష్ట్రంలోని పాపికొండల అభయారణ్యం ఆవాసంగా మారింది. అభయారణ్యం పరిధిలోని ఉభయ గోదావరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలో 1,012.86 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 1,01,200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని అభయారణ్యంగా 2008లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో జాతీయ పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మరోవైపు వన్యప్రాణుల సంరక్షణపై అటవీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలోని గోగులపూడి, పోలవరం మండలం టేకూరు ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. అభయారణ్యం సంరక్షణ, జంతువుల జాడ కోసం ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవగాహన పెంచుకోవాలి పులుల సంరక్షణ అందరి బాధ్యత. పర్యావరణానికి అవి ఎంతో మేలు చేస్తాయి. వాటిపై అవగాహన పెంచుకుని పరిరక్షణకు నడుం బిగించాలి. మన రాష్ట్రంలో పులుల సంఖ్య బాగా పెరుగుతోంది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వాటికి బాగా అనుకూలంగా ఉంది. అందుకే పులుల ఆవాసాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. – రాహుల్ పాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) పులులను రక్షించాలి పర్యావరణ పిరమిడ్లో అగ్రసూచిగా ఉండేది పెద్ద పులి. ఆ తర్వాత చిరుత పులులు వంటి టాప్ కార్నివోర్స్ జీవ వైవిధ్యాన్ని కాపాడే గురుతర బాధ్యతతో ఉంటాయి. వాటి సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం. వన్య ప్రాణులు కనిపిస్తే అటవీ శాఖ దృష్టికి తీసుకు రావాలి. పులులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – సి.సెల్వమ్, వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, రాజమండ్రి ట్రాప్ కెమెరాల్లో పులుల జాడ పాపికొండల అభయారణ్యంలో పులుల సంచారం బాగుంది. మేం గ్రామాల్లో పర్యటించిన సమయంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు పులుల గాండ్రింపులు విన్నట్టు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. గత నెల, ఈ నెలలో చిరుత పులులు, ఇతర జంతువుల జాడ కెమెరాకు చిక్కింది. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, పాపికొండలు వైల్డ్లైఫ్ మేనేజ్మెంట్ అధికారి -
కరోనా 'చింత' లేని గిరిజనగూడెం
పెద్దదోర్నాల: పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తోన్న కరోనా మహమ్మారి ఆ గిరిజన గూడెం దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. దీనికి కారణం నల్లమల అభయారణ్యంలో లభించే ఔషధ మొక్కలే కారణమంటున్నారు.. ఆ గూడెం వాసులు. చిన్ననాటి నుంచి వివిధ వ్యాధులకు ఆకుపసర్లే వాడామని.. అవే తమలో రోగనిరోధకశక్తిని పెంచాయని చెబుతున్నారు. ఇప్పటివరకు తమకు మాస్కు వాడే అవసరం కూడా రాలేదని పేర్కొంటున్నారు. ఇలా ప్రకాశం జిల్లా నల్లమల అభయారణ్యం పరిధిలో చింతల గిరిజనగూడెం గ్రామస్తులు కరోనా చింత లేకుండా జీవిస్తున్నారు. ఎన్నో ఔషధ మొక్కల నిలయం.. చింతల గిరిజనగూడెంలో సుమారు 710 మంది జీవిస్తున్నారు. వీరికి వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, గొర్రెల పెంపకమే ఆధారం. అటవీ ప్రాంతంలోని ఔషధ మొక్కల నుంచి వీచే చల్లటి గాలులు, ప్రశాంత వాతావరణం కరోనా వైరస్ను ఆ గూడెం దరిదాపులకు రాకుండా చేశాయి. గ్రామస్తుల్లో ఎవరికైనా సుస్తీ చేస్తే ఔషధ మొక్కల ద్వారా వారికి వారే నయం చేసుకుంటున్నారు. అశ్వగంధి, కొండగోగు, నరమామిడి, సరస్వతి ఆకు, నేలవేము, పొడపత్రి, అడవిచింత, మయూరశిఖ, తెల్లగురివింద, నల్లేరు, అడవి ఉల్లి, సుగంధ మొక్కలు, చిల్లగింజలు, నాగముష్టి, విషముష్టి, అడవి తులసి, గడ్డిచేమంతి, ఉసిరి, కరక్కాయ ఇలా ఎన్నో ఔషధ మొక్కలను వివిధ వ్యాధులకు వాడుతున్నారు. అటవీ వాతావరణమే కాపాడుతోంది.. పుట్టినప్పటి నుంచి కొండల్లోనే మా ఆవాసం. అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కల గురించి అవగాహన ఉంది. చిన్నచిన్న జబ్బులకు ఆకులు, అలములతోనే మేమే మందులు తయారు చేసుకుంటాం. కరోనాలాంటి జబ్బులు మా గూడెం వాసులకు రానే రావు. – భూమని అంజమ్మ, గూడెం వాసి గూడెంలో ఒక్క కేసూ నమోదు కాలేదు.. గూడెంలో ఇంతవరకు ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు. అటవీ వాతావరణం, ఆహారమే మాకు రక్షణగా నిలుస్తోంది. తేలుకాటు, పాము కాట్లకు కూడా మాకు ఆకుపసరే మందు. – భూమని వెంకటయ్య, సర్పంచ్, చింతల చెంచుగూడెం ఏ రోగానికైనా అడవి మందులే మాకు ఏ రోగమొచ్చినా అడవి మందులే వేసుకుంటాం. ఎప్పుడో గాని ఆస్పత్రికి వెళ్లం. మొదటి నుంచి పాత అలవాట్లనే పాటిస్తున్నాం. బయటి వ్యక్తులు వస్తే మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటాం. – భూమని రామయ్య, గూడెం వాసి -
ఆ అడవిలో ఎన్ని పులులు ఉన్నాయో?
సాక్షి, పెద్దదోర్నాల: నడకలో రాజసం.. వేటలో గాంభీర్యం వెరసి అడవిలో రారాజుగా వెలుగొందుతోంది పెద్దపులి. దట్టమైన అడువులతో పాటు విస్తారమైన వర్షాలు కురిసే చోటే పెద్దపులి ఆవాసం. ప్రస్తుతం ప్రభుత్వాల కఠిన చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వెరసి పులులు కాస్త ఊపిరి తీసుకుంటున్నాయి. కొద్ది కొద్దిగా తమ సంఖ్యను పెంచుకుంటూ మనుగడ కోసం పోరాడుతున్నాయి. అటువంటి పెద్దపులుల లెక్క తేల్చే పని ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ నుంచి సర్వే ప్రారంభమైంది. జాతీయ జంతువు పెద్దపులులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు అటవీశాఖ గణన మొదలు పెట్టింది. అధునాతన కెమెరాలు ఉపయోగించి పులుల సర్వే చేస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పక్రియ పూర్తి కావస్తోంది. నల్లమలకు రాజసం పెద్దపులి అడవికి రారాజు పెద్దపులి, అడవిలో ఎన్ని పులులు ఉన్నా వాటి పరిధి వాటివే. దేని రాజసం దానితే. దేని రాజ్యం దానిదే. మగ పులి 150 నుంచి 200 చదరపు కిలో మీటర్ల పరిధిని తన ఏలికలో ఉండాలని గట్టిగా కోరుకుంటుంది. అదే ఆడపులి 70 నుంచి 80 కిలో మీటర్లను తన సామ్రాజ్యంగా భావిస్తుంది. ఓ మోస్తరు అడవి లేకుంటే అస్సలు సహించవు. రాజులు రాజ్యాలు ఏలినట్లుగా పులులు కూడా తమ తమ సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని తమ ఆదీనంలో ఉంచుకుంటాయి. ఇది పలానా పులి ఏరియా..అంటూ తన శరీరం నుంచి ప్రత్యేక రసాయనాన్ని విడుదల చేస్తుంది. లేదంటే అక్కడి చెట్లపై గోళ్లలో గీకుతుంది. పులుల సంభోగ సమయంలో ఈ పక్రియ ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం నల్లమలలో 60 వరకు పులులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు పులుల గణన ఎందుకంటే..? అభయారణ్యాల్లో పులుల గణనను ఏటా చేపడతారు. గణన ముఖ్య ఉద్దేశం అభయారణ్యాల్లో పెద్ద పులులు ఎన్ని ఉన్నాయో ఏటా గుర్తిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కొత్త పులులు అభయారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయా? గతేడాది గుర్తించిన పులులు మళ్లీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయా.. లేదా? సంచరిస్తుంటే వాటి కదలికలు ఎలా ఉన్నాయి? దీంలో పాటు వాటి అభివృద్ధి ఎలా ఉంది? సంతానోత్పత్తి జరుగుతుందా? ఆవి ఆరోగ్యంగా ఉన్నాయా? అనే విషయాలు గుర్తించేందుకు పులుల గణనను చేపడతారు. గతంలో కెమెరాల్లో చిత్రీకరించిన పులులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కొత్త పులులు వస్తే వాటిని అవలీలగా గుర్తించవచ్చు. లేదా మిస్ అయిన పులులను సైతం గుర్తించేందుకు వీలుగా గణనను పకడ్బందీగా నిర్వహిస్తారు. పులుల గణన కోసం శాస్త్రీయ పద్ధతులు పులుల గణనలో శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తున్నారు. ఫేస్ పోర్ మానిటరింగ్లో భాగంగా ఏటా పులుల గణన చేపడతారు. దీని కోసం ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పులుల లెక్కింపు గతంలో వాటి పాదముద్రలు ఆధారంగా జరిగేది. దాని వల్ల కచ్చితమైన లెక్క తేలేది కాదు. ఏ రెండు పులుల పాదముద్రలు ఒకేలా ఉండవు. పులికి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచే చారికలు కూడా ఒకేలా ఉండవు. మనుషుల వేలిముద్రలు మాదిరిగానే పులి చారికలు కూడా వేటికవే ప్రత్యేకం. ఇదే పులుల లెక్కింపులో కీలకం. అన్ని పులుల చిత్రాలు కెమెరాలో నిక్షిప్తం అయ్యాక కెమెరాలకు చిక్కిన పులుల లెక్కను సరి చూసుకుంటారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్న పులులు, ఇతర జీవులు ఎన్ని ఉంటాయో లెక్క చూసుకుంటారు. ఇలా సేకరించిన పులుల డేటాను బయోలాజికల్ రీసెర్చి సెంటర్కు పంపుతారు. అక్కడి నుంచి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు తరలించి ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. -
నల్లమలలో గుర్తించిన కొత్త జీవరాశులివే..
సాక్షి, పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో జీవ వైవిధ్యంపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. సున్నిపెంటలోని బయోడైవర్సిటీ డివిజన్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న జీవవైవిధ్య పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న పులుల సంతతిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించడంతోపాటు అరుదైన కొత్త జీవులను సైతం గుర్తిస్తున్నారు. నాగర్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు వేలాది జీవరాశులకు నిలయంగా ఉంది. అటవీశాఖ చేపడుతున్న విప్లవాత్మక చర్యలతో నల్లమలలో గత పదేళ్లుగా వన్యప్రాణుల సంతతి పెరగడమేకాదు దట్టమైన అడవులు విస్తరిస్తున్నాయి. నల్లమలలో ఉన్న జీవజాతులు మరో చోట కనిపించడం అరుదు. నల్లమలలో 55 జాతుల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. ఇక వీటికి అదనంగా వివిధ జాతుల కీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ పరిధిలో బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్తరకం జీవరాశులను కనుగొన్నారు. ఎస్టీఆర్ పరిధిలో ఉండే ల్యాబ్లో వన్యప్రాణులు, సరీసృపాలు, క్షీరదాలు, కీటకాలు, వృక్షజాతుల ఫొటో లైబ్రరినీ ఏర్పాటు చేశారు. 2001 డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో ఆయా జాతులకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరిచారు. నల్లమల అభయారణ్యంలో శాస్త్రవేత్తలు కనుగొన్న గద్ద 2014–15లో నల్లమల అభయారణ్యంలో కనుగొన్న జీవరాసులను పరిశీలిస్తే.. మెటోక్రొమాస్టిస్ నైగ్రోఫి యొరేటో, మారస్ శ్రీశైల యెన్సిస్(సాలీడు), నాగార్జునసాగర్ రేజర్(పాము), స్లెండర్ కోరల్ స్నేక్ (పాము), ఫ్రీనికస్ ఆంధ్రాయెన్సిస్(సాలీడు), పోయిసిలోథీరియా నల్లమలైయెన్సిస్(సాలీడు), సిరాప్టిరస్ లాటిప్స్(కీటకాలు), డారిస్తీన్స్ రోస్ట్రాటస్(గొల్లభామ), శ్రీలంకన్ ఫ్లైయింగ్ స్నేక్, స్యాండ్ స్నేక్, వీటితో పాటు కృష్ణానది జలాల్లో టు స్పాటెడ్బార్బ్ అనే అరుదైన చేపను కూడా కనుగొన్నారు. వర్షాకాలంలోనూ, వరదలు వచ్చే సమయాన మాత్రమే కృష్ణా జలాల్లో కనిపించే నీటిì æపిల్లులపై కూడా పరిశోధన చేస్తున్నారు. ఆ సమయం వాటి సంతానోత్పత్తికి సంబంధించినదిగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. జింకలకు ప్రసిద్ధి నల్లమలలో వివిధ రకాల జింకలు ఉన్నాయి. జింకల్లో అతి చిన్నది మూషిక జింక. దీనిని బుర్ర జింకగా, మౌస్ డీర్గా అభివరి్ణస్తారు. నల్లమలలో అతి పెద్ద జింక కణితి. దీనిని సాంబార్ డీర్గా పిలుస్తారు. కొమ్మలుగా విస్తరించిన భారీ కొమ్ములతో ఉండే కణితులు సుమారు 150 కేజీల బరువు తూగుతాయి. పొడ దుప్పులు.. అందానికి ఇవి ప్రతి రూపాలు. బంగారు వర్ణంలో ఉన్న చర్మంపై నల్లమచ్చలతో ఉండే ఈ జింకలు నల్లమలలో విస్తారంగా ఉన్నాయి. పెద్ద పులి ఆహార మెనూలో ఇవి ప్రధానమైనవి. నిటారు కొమ్ములు కలిగిన జింకల్లో మనిమేగం(నీల్గాయ్) భారీ జంతువు. శ్రీలంకన్ ఫ్లైయింగ్ స్నేక్ పురి తిరిగిన కొమ్ములతో కాల్లలో స్ప్రింగ్లున్నాయా అన్నట్లుగా గెంతుతూ స్వేచ్ఛకు ప్రతిరూపంగా కనిపించే కృష్ణజింకలకూ నల్లమలలో కొదవలేదు. ఉత్తర భారతదేశంలో చౌసింగా పేరుతో పిలుచుకునే కొండ గొర్రె(బార్కింగ్ డీర్) అడవి సాంద్రతను కొలిచే జింకగా చెప్పుకుంటారు. కొండ గొర్రె ఏ అటవీ ప్రాంతంలో కనిపించిందంటే ఆ ప్రాంతంలో అడవి దట్టంగా ఉందని అర్థం. నల్లమల అడవుల్లో లోతట్టు అటవీ ప్రాంతంలో కనిపించే కొండ గొర్రె ఈ మధ్య కాలంలో అటవీ ప్రాంత సరిహద్దుల్లో కూడా దర్శనమివ్వడం విశేషం. జీవ వైవిధ్యంతోనే మానవుల మనుగడ జీవ వైవిధ్యంతోనే మానవుల మనుగడ కొనసాగుతోంది. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడుతున్నాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ప్రకృతిలో ప్రతి జీవరాశి ఒక దాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. వీటిలో ఎక్కడ లోపం కనిపించినా జీవ వైవిధ్యం దెబ్బతిని మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. – మందా రమేశ్, సీనియర్ రీసెర్చి అసిస్టెంట్, బయోడైవర్సిటీ సెంటర్ -
నల్లమలలో ‘యురేనియం’ అంకానికి తెర!
సాక్షి, హైదరాబాద్: నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీత అంకానికి తెరపడింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో యురేనియం నిల్వలపై సర్వే చేపట్టే విషయంలో అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) సమర్పించిన ప్రతిపాదనలను తాజాగా రాష్ట్ర వన్యప్రాణి మండలి తిరస్కరించింది. దీంతో గత నాలుగేళ్లుగా యురేనియం సర్వేతో ముడిపడి సాగుతున్న చర్చ ముగిసినట్టయింది. సోమవారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. చదవండి: యురేనియం అన్వేషణకు నో.. కేంద్ర వన్య›ప్రాణి మండలి, కేంద్ర అటవీ శాఖకు ఈ తీర్మానాన్ని పంపాలని ఈ సమావేశం నిర్ణయించింది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల వెలికితీతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలంటూ కేంద్రం గత మే నెలలో కోరింది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ సలహా మండలి సమావేశంలో ఏటీఆర్ పరిధిలో ప్రతిపాదిత యురేనియం నిల్వల సర్వే, వెలికితీత అంశం చర్చకు వచ్చింది. దీనిపై రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయమేమిటో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమావేశం కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశమై యురేనియం సర్వే సాధ్యం కాదని పేర్కొంటూ గతంలోని ప్రతిపాదనలను తిరస్కరించడంతో ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్స్టాప్ పడింది. చదవండి: మినిట్స్ వచ్చేదాకా... వేచిచూద్దాం ఇదీ జరిగిందీ.. అటవీ ప్రాంతం, చెట్లకు నష్టం వాటిల్లకుండా యంత్రాలను వాడకుండా సర్వే నిర్వహిస్తామని ఏఎండీ సమర్పించిన ప్రతిపాదనలను 2016లో జరిగిన రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం ఆమోదించింది. అడవికి ఎలాంటి నష్టం కలిగించరాదని, ఉన్న రోడ్లు, బండి, కాలినడక మార్గాలనే ఉపయోగించాలని, కేవలం సర్వేకే పరిమితం కావాలని, నిల్వలను వెలికి తీయొద్దని, చెట్లకు, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం కలిగించొద్దంటూ ఈ సమావేశంలో మినిట్స్ను రికార్డ్ చేశారు.. దీనికి భిన్నంగా గతేడాది మళ్లీ సవరించిన ప్రతిపాదనలు ఏఎండీ పంపించింది. అడవిలోపలికి భారీ యంత్రాలు, వాహనాలు తీసుకెళ్తామని, అందుకు రోడ్డు, చెట్లు, పొదలను తొలగించాలని 200, 300 మీటర్ల లోతున 4 వేల బోర్లు వేస్తామని, నల్లమల అటవీ ప్రాంత వ్యాప్తంగా ఈ బోరింగ్ పాయింట్లు ఉంటాయని, దాదాపు ఐదేళ్ల పాటు ఈ సర్వే ప్రక్రియ సాగించేందుకు అనుమతినివ్వాలంటూ ఈ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. గతంలో ఆమోదించిన ప్రతిపాదనలకు భిన్నంగా ఉన్న కొత్తగా అనుమతులివ్వలేమని, కొత్త ప్రతిపాదనలను ఫారమ్–సీలో.. అంటే ఎన్ని బోర్లు వేస్తారు, ఎలా వేస్తారు, భారీ యంత్రాలు ఎలా తీసుకెళ్తారు, చెట్లకు ఎంత నష్టం వాటిల్లుతుంది, జీవవైవిధ్యంపై ప్రభావం, దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, వివరాలు అందజేయాలని ఏఎండీకి రాష్ట్ర అటవీశాఖ సూచించింది. ఈ పరిణామాలపై ఇటు అక్కడి గిరిజనులు, పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీతకు అనుమతించబోమంటూ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఫీల్డ్ డైరెక్టర్ నుంచి నివేదిక.. ఏఎండీ పంపించిన కొత్త ప్రతిపాదనలను ఏటీఆర్ పరిధిలోని ఫీల్డ్ డైరెక్టర్కు పంపించగా, పార్ట్–3 ఫార్మాట్లో వాటిని తిరస్కరిస్తూ అటవీశాఖకు నివేదిక అందింది. ఏటీఆర్లో యురేనియం నిల్వలపై సర్వే, వెలికితీత ప్రతిపాదనల పరిశీలన సాధ్యం కాదంటూ క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ పంపించింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించలేమని, వీటి వల్ల అడవికి, జంతువులు, వృక్షాలకు నష్టం వాటిల్లుతుందని ఈ నివేదికలో ఫీల్డ్డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ డ్రిల్లింగ్ వల్ల ఇక్కడి ప్రాంతం కలుషితమై ఆ నీళ్లు కృష్ణానదిలో కలసి, హైదరాబాద్కు సరఫరా అయ్యే నీటిలో కూడా యురేనియం కలుషితాలు చేరితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నివేదికను రాష్ట్ర వన్యప్రాణి మండలి సమక్షంలో ఉంచడంతో పాటు ఏఎండీ తాజా ప్రతిపాదనలను పరిశీలించి ఇవి ఆచరణ సాధ్యం కాదంటూ ఈ సమావేశం తిరస్కరించింది. ఏఎండీ ప్రతిపాదనలను రాష్ట్ర వన్యప్రాణి బోర్డు తిరస్కరించినందు వల్ల కేంద్ర బోర్డు కూడా దీన్ని తిరస్కరించడం లాంఛనమే కానుంది -
యురేనియం కలకలం!
అమ్రాబాద్: నల్లమలలో మళ్లీ యురేనియం తవ్వకాల కలకలం మొదలైంది. గతేడాది మూడు నెలల పోరాటం అనంతరం నల్లమలలో యురేనియం సర్వేకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రోడ్లు, బోర్లు వేస్తూ యురేనియం తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పరిశీలన అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని అడవిని, అడవిలో వేసిన రోడ్లను పరిశీలించేందుకు మంగళవారం అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ ఏకే సిన్హా, జిల్లా అటవిశాఖ అధికారి జోజీ వచ్చారు. వీరిని నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలు అమ్రాబాద్ సమీపంలోని ఎల్మపల్లి స్టేజీ వద్ద వారిని అడ్డుకున్నారు. అంతకుముందు నల్లమల యురేనిం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకుడు నాసరయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా యురేనియం తవ్వకాలకు అనుమతిస్తే ఊరుకోమని నిలదీశారు. తవ్వకాలకు అనుమతులిచ్చి నల్లమలోని ప్రజలు, వన్యప్రాణులు, నదీ జలాలను నాశనం చేయొద్దని కోరారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ బీసన్న, ఎస్ఐ పోచయ్య అక్కడికి వచ్చి జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు. అటవీశాఖ అధికారులతో కలిసి ముగ్గురిని పంపే ప్రయత్నం చేశారు. అటవీశాఖ అధికారులు కొద్దిసేపు అమ్రాబాద్ అటవీశాఖ కార్యాలయంలో వేచి ఉండి తిరిగి వెళ్లిపోయారు. అధికారులు ఎవరూ మాట్లాడకుండా తిరిగి వెళ్లిపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. పదిహేనుమందిపై కేసు అధికారులను అడ్డుకున్న నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకులు నాసరయ్యతో నాటు మరో పద్నాలుగు మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులను అడ్డగించడం సరైంది కాదని కౌన్సెలింగ్ ఇచ్చారు. -
కరోనా: జంతువులకు కరోనా రాకుండా..
సాక్షి, మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, ఇతర వన్యప్రాణులకు కరోనా వైరస్ సోకకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలానికి వెళ్లే ఘాట్రోడ్డు, నడకమార్గం, ఇష్టకామేశ్వరి గుడి, ఎకో టూరిజం మూసేశారు. ప్రస్తుతం వాహనాల రద్దీ పూర్తిగా లేకపోవడంతో వన్యప్రాణులన్నీ రోడ్లపైకి వస్తున్నాయి. నల్లమలలో సుమారు 48 పెద్ద పులులు, 60కి పైగా చిరుత పులులు ఉన్నాయి. వేల సంఖ్యలో జింకలు, దుప్పులు, వందల సంఖ్యలో ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటికి కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటవీ సమీప గ్రామాలలోని ప్రజలకు సిబ్బంది ద్వారా కరపత్రాలు పంచి అవగాహన కలి్పస్తున్నారు. ఇష్టకామేశ్వరి, ఎకోటూరిజం ప్రాంతాలను మూసివేయడంతో భక్తులు, సందర్శకుల రాక నిలిచిపోయింది. వేసవి కాలం కావడంతో నీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 24 బేస్ క్యాంప్లను ఏర్పాటు చేసి 120 మంది టైగర్ ట్రాకర్లను నియమించి పులుల కదలికపై నిఘాపెట్టారు. చెక్పోస్టుల వద్ద సిబ్బందిని ఎక్కువగా నియమించి ఎవ్వరినీ అటవీ ప్రాంతంలోకి పంపకుండా చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జంతువులకు నీటిని అందించేందుకు సాసర్పిట్లను ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతూ జంతువులకు నీటి సమస్య లేకుండా చేస్తున్నారు. పట్ట్టణాల్లో ఉన్న కోతులను ఇటీవల అటవీ ప్రాంతానికి తరలించారు. వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటూ పండ్లను అందిస్తున్నారు. చిన్న మంతనాల, చింతల, పెద్ద మంతనాల ప్రాంతాల్లో కోతుల కోసం స్టాల్ఫీట్స్ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక చర్యలు తీసుకున్నాం వన్య ప్రాణులకు కరోనా వైరస్ సోకకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. అడవిలోకి ఎవరినీ పంపడంలేదు. సిబ్బందిని అలర్ట్ చేశాం. కరపత్రాల ద్వారా అటవీ సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కలి్పస్తున్నాం. – ఖాదర్బాషా, డీఎఫ్ఓ -
పులుల సంరక్షణపై దృష్టి
కర్నూలు(అగ్రికల్చర్): కోవిడ్–19 (కరోనా) వైరస్ బారిన పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు పడకుండా అటవీ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్లో పులులకు కూడా కరోనా సోకినట్లు తెలియడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పులులు, చిరుతలతో పాటు ఇతర వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అటవీ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. నల్లమలలో 48 పెద్ద పులులు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో 48 పెద్ద పులులు ఉన్నాయి. వీటి సంరక్షణ చర్యల్లో భాగంగా 300 వరకు కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశారు. పులులు నీటిని తాగడానికి వచ్చే కొలనులు, వాగులు తదితర ప్రాంతాల్లో వీటిని అమర్చారు. పులులు, చిరుతలతో పాటు అన్ని వన్యప్రాణుల కదలికలు, వాటి శబ్దాలు సైతం ఇందులో రికార్డు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పులులతో పాటు ఇతర వన్య ప్రాణుల ఆరోగ్య పరిస్థితిని కెమెరా ట్రాప్ల ద్వారా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా పులులు చలాకీగా ఉన్నాయా, లేదా? దగ్గు, తుమ్ములు వంటి అనారోగ్య లక్షణాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించనున్నారు. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే తగిన జాగ్రత్తలు చేపడతారు. తాగే నీళ్లలో మందు కలపడం వంటి చర్యల ద్వారా రోగ నివారణకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలోనూ అంచనా వేసేందుకు నల్లమల అటవీ ప్రాంతంలోకి ఫారెస్ట్ సిబ్బంది టీమ్లుగా వెళుతున్నట్లు ఆత్మకూరు డీఎఫ్ఓ వెంకటేశులు తెలిపారు. ఇదే సమయంలో సాధారణ వ్యక్తులెవరూ వెళ్లకుండా చూస్తున్నామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే వన్య ప్రాణులకు దూరంగా ఉండటంతో పాటు మాస్క్లు కూడా ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
నల్లమల ముస్తాబు
అచ్చంపేట: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో జరిగే బౌరాపూర్ చెంచుల పండుగ ఆదివాసీ చెంచుల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. భ్రమరాంబిక, మల్లిఖార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి నల్లమల ముస్తాబైంది. ఏటా శివరాత్రికి నల్లమలలోని బౌరాపూర్ భ్రమరాంబ ఆలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘చెంచుల పండుగ’ ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈనెల 20 నుంచి 22వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. పురాతన ఆలయంలో కొలువుదీరిన భ్రమరాంబిక, మల్లిఖార్జున స్వామికి చెంచులు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో జరిగే ఉత్సవాల తరహాలోనే ఇక్కడ స్వామికి కల్యాణం నిర్వహిస్తారు. కొన్నేళ్లుగా ఉత్సవాలకు దూరంగా ఉన్న చెంచుల పండుగను ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ నుంచి అధికారికంగా నిర్వహిస్తుండటంతో పూర్వవైభవం సంతరించుకుంటుంది. ప్రభుత్వం ఈఉత్సవాలకు రూ.12లక్షలు విడుదల చేసింది. అడవులు, కొండలు, వణ్యప్రాణుల మధ్యన ప్రకృతి ఒడిలో జీవనాన్ని కొనసాగిస్తున్న ఆదివాసీల పండగతో అడవితల్లి పులకించనున్నది. ఉత్సవాల కార్యక్రమాలు ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా స్టాల్స్ ఏర్పాటు, అభివద్ధి కార్యక్రమాలపై అవగాహన, 20న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు స్వాగతోపన్యాసం కార్యక్రమాలు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 12గంటల వరకు చెంచుల సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు, చెంచుల ఆట–పాట సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి. 21న 11గంటలకు భ్రమరాంబ, మల్లిఖార్జునస్వామి కల్యాణం, 22న ప్రత్యేక పూజలు ఉంటాయి. నల్లమల చెంచులతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబా ద్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చెంచులు అధిక సంఖ్యలో వస్తారు. జాతరకు వెల్లేదిలా జాతరకు ఆర్టీసీ బస్సులు నడుపుతారు. బౌరాపూర్లో జరిగే జాతరకు అమ్రాబాద్ మండలం మన్ననూర్ నుంచి 15కిలో మీటర్ల దూరంలో పర్హాబాద్ చౌరస్తా అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్దకు చేరుకోగానే ప్రధాన రహదారి నుంచి పదిహేను కిలోమీటర్లు అడవిలోనూ ప్రయాణం చేయాలి. ఏపీ నుంచి వచ్చేవారు శ్రీశైలం నుంచి పర్హాబాద్ చౌరస్తా చెక్పోస్టు వద్దకు వచ్చి బౌరాపూర్ చేరుకోవచ్చు. ఐటీడీఏ పీఓ వెంకటయ్య అధికారుల సహకారంతో ఈవేడుకలు నిర్వహిస్తున్నారు. అప్పాపూర్ సర్పంచ్ బాల గురువయ్య, ఆలయ కమిటీ ఉత్సవ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. -
చిరుతల కలకలం
ప్రకాశం, పెద్దదోర్నాల: నల్లమల ఘాట్ రోడ్డులో చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. వాహనాలకు అడ్డువస్తుండటంతో అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈనెల 4వ తేదీ నల్లమల అభయారణ్యంలోని ఎకో టూరిజం వద్ద ఓ చిరుత రోడ్డుపై సంచరిస్తుండటంతో వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో వారు వెంటనే ఈ విషయాన్ని పెద్దదోర్నాల మండల కేంద్రంలోని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మండల పరిధిలోని ఆర్.చెలమ బావి వద్ద కోతులను వేటాడుతూ రోడ్డును దాటుతున్న ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో సంఘటనా స్థలంలోనే ఆ చిరుత మృతి చెందింది. ఈ సంఘటన కర్నూలు– గుంటూరు రోడ్డులో జనవరి 23వ తేదీన చోటు చేసుకుంది. అనంతరం అటవీశాఖ అధికారులు చిరుతను పోస్టుమార్టం నిర్వహించి నల్గమలలో దహనం చేశారు. జనవరి 13వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో శ్రీశైలం వెళ్తున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనానికి ఓ చిరుత అడ్డుగా రావటంతో వాహనం కొద్ది నిమిషాల పాటు రోడ్డుపైనే నిలిచిపోయింది. ఈ సంఘటన శ్రీశైలం రోడ్డులోని తుమ్మలబైలుసమీపంలో చోటు చేసుకుంది. దీంతో పాటు రోళ్లపెంట బేస్ క్యాంపు ఎదుట తరచూ ఓ చిరుత సంచరిస్తుండటంతో బేస్ క్యాంపు సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తుమ్మల బైలు, శ్రీశైలం ముఖ ద్వారం వద్ద చిరుత పులులు రోడ్డును దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మృత్యువాతపడ్డాయి. చిరుతలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించటానికి కారణం నల్లమలలో నీటి కొరతే అని అని పలువురు పేర్కొంటున్నారు. కాగా ఈ సంఘటనలపై అటవీశాఖాధికారులు మాత్రం వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా పెరగటం వల్ల అవి విచ్చల విడిగా సంచరిస్తున్నాయని, అందు వల్లే ప్రమాదాలు జరుగుతుగున్నాయని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఇలా క్రమం తప్పకుండా వన్యప్రాణులు రోడ్లపై సంచరిస్తూ వాహన ప్రమాదాలలో మృత్యువాత పడుతుండటంపై పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వన్యప్రాణులకు పొంచి ఉన్న నీటి ఎద్దడి: వేసవి ఆరంభంలో ఎండలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వన్యప్రాణులతో పాటు పెద్ద పులులకూ నీటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి. అరణ్యంలోని కొన్ని చోట్ల జంతువులు పగటి వేళల్లోనూ రోడ్డు దాటుతున్నాయి. నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు తదితర ఎన్నో జంతువులు ఉన్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంపై అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ఎకో టూరిజం వద్ద చిరుతపులి రోడ్డుపై సంచరిస్తూ కనబడటంపై వాహనదారుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. మూడు జిల్లాలకు ప్రధాన కార్యాలయంగా ఉన్న శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోనే కొన్నేళ్లుగా చిరుత పులులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రతి వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ చిన్నపాటి చెక్డ్యాంలు, నీటి తొట్టెలు, కుంటలు, సాసర్ పిట్స్లను నిర్మించింది. వీటి నిర్వహణ కోసం వేసవి సీజన్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి మొబైల్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోంది. అయితే ప్రస్తుతం చెక్డ్యాంలలో నీరులేకపోవటంతో అవి చాలా చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. దీంతో తాగునీరు లేకపోవడంతో జంతువులు పలు చోట్ల రోడ్లను దాటుతూ మృత్యువాత పడుతున్నాయన్న విమర్శలు వినపడుతున్నాయి. సంరక్షణ చర్యలపై దృష్టి సారించాలి: వేసవి కాలంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యామ్నాయ చర్యలపై సమగ్ర దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అభయారణ్యం పరిధిలో అగ్నిప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే రేంజ్ల వారీగా పెద్దపులులు, చిరుత పులుల సంచారం అధికంగా ఉంటే ఏరియాల్లో నీటి నిల్వలను పెంచాలి. వన్యప్రాణులకు దాహార్తి తీర్చే టెస్టింగ్ సాల్ట్ వంటి ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచాలి. దీంతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలో నీటి నిల్వల కోసం సోలార్తో నడిచే మోటార్లను సిద్ధం చేసుకోవాలి. విభజనతో అభయారణ్యంఏపీలోనే అధికం తెలుగు రాష్ట్రాల విభజన నేపథ్యంలో పెద్ద పులులు అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోకే అధికంగా చేరింది. మొత్తం విస్తీర్ణం 2,444 చ.కి.మీ. అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లో కలిసింది. ఫలితంగా పులులు, చిరుతల సంఖ్య కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ. మార్కాపురం, ఆత్మకూరు అటవీ డివిజన్ల పరిధిలో పెద్దపులులు, చిరుత పులుల సంఖ్య అధికంగా ఉంది. ఏటా జనవరిలో దేశవ్యాప్త (కేంద్ర స్థాయి) అభయారణ్యాల్లోనూ పులుల గణన జరుగుతుండగా ఏటా మే నెలలో రాష్ట్ర స్థాయి అభయారణ్యంలో పులుల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో గణన ఆధారంగా పులుల సంఖ్య పెరుగుతోందని అటవీశాఖ పేర్కొంటోంది. ఈ క్రమంలో మన రాష్ట్రంలోని అభయారణ్యంలో 50 కు పైగా, చిరుతలు లెక్కకు మించి ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
నల్లమల టు జపాన్, ఉత్తర కొరియా
కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న నల్లమలలో మళ్లీ ‘ఎర్ర’ దొంగల అలజడి మొదలైంది. గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే డాన్గా పేరుగాంచిన చాగలమర్రి మండల టీడీపీ నేత, మాజీ ఎంపీపీ మస్తాన్వలి, ఓ ఫారెస్టు అధికారి సోదరుడు అనిల్కుమార్ ఈ నెల 15న అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో స్మగ్లింగ్ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. సాక్షి, చాగలమర్రి: ప్రపంచంలో అరుదైన ఎర్రచందనం వృక్ష సంపద రాయలసీమ జిల్లాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఎర్రచందనానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉండంతో కొన్నేళ్లుగా స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. ఎర్రచందనం వృక్షాలను అడ్డంగా నరికేస్తూ..కలపను అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు. రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని పాములేటయ్య, బోత్సనిబండ, ఊట్ల, రాచపల్లెబీటు, అహోబిలం, డి.వనిపెంట, పెద్దవంగలి, ఆవుగోరి, మోత్కమానిబావి తదితర ప్రాంతాలతో పాటు వైఎస్సార్ జిల్లాలోని కె.వనిపెంట రేంజ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. వీటితో పాటు అరుదైన మూలికా వృక్షాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎర్రచందనం వృక్షాలను కొందరు నరికించి, దుంగలుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. కొన్ని నెలల కిందట కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. కొందరు తమిళ కూలీలను గుర్తించారు. అరెస్టు చేసేందుకు వెళ్లడంతో వారు తెచ్చుకున్న సామగ్రి, ఆహార పదార్థాలు వదలి పారిపోయారు. తర్వాత టాస్క్ఫోర్స్ అధికారులు నల్లమలలోని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎర్రచందనం జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా స్మగ్లర్ల తీరు మాత్రం మారడం లేదు. కొన్ని రోజుల నుంచి అహోబిలం, వనిపెంట, గండ్లేరు, ఆలమూరు తదితర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో వృక్షాలను నరికేస్తున్నారు. దుంగలను భుజంపై మోసుకుంటూ తీసుకొచ్చి.. రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో దాస్తున్నారు. ఎవరూ లేని సమయంలో పచ్చిమిర్చి సంచుల్లో దాచి వాహనాల్లో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చాగలమర్రి మండలంలోని చిన్నవంగలి ప్రాంతంలో నీటి కుంటలో దాచిన దుంగలను డి.వనిపెంట సెక్షన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గత నెల 19న డి.వనిపెంట సెక్షన్ పరిధిలోని ఓజీ తండా సమీపంలో దాచి ఉంచిన రూ.లక్ష విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. నల్లమల టు జపాన్, ఉత్తర కొరియా నల్లమల అడవుల నుంచి ఎర్రచందనాన్ని వాహనాల్లో చెన్నై తీసుకెళ్లి.. అక్కడి నుంచి సముద్ర మార్గం గుండా జపాన్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, చైనా తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాల్లో ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉంది. రుద్రవరం రేంజ్ పరిధిలో నల్లమల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాలో డాన్గా పేరుగాంచిన టీడీపీ నేత మస్తాన్ వలిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతనిపై గతంలో అటవీ అధికారులు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. ఏళ్ల తరబడి జైళ్లలో గడిపి.. టీడీపీ నాయకుల సహకారంతో బయటకు వచ్చాడు. తర్వాత కొన్ని నెలల పాటు అక్రమ రవాణాకు దూరంగా ఉన్న అతను మళ్లీ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఈ నెల 15న తాడిపత్రి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనితో చాగలమర్రికి చెందిన ఓ ఫారెస్టు అధికారి సోదరుడు అనిల్కుమార్ కూడా పట్టుబడడం గమనార్హం. వీరి నుంచి పోలీసులు రూ 2.70 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, రూ 24,500 నగదు, స్కార్పియో, వెర్నా హుందాయ్, ఐషర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 66 కేసుల నమోదు రుద్రవరం రేంజ్ పరిధిలో 2015 నుంచి 2019 వరకు ఫారెస్టు అధికారులు 66 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదు చేశారు. అలాగే 117 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులలో 215 ఎర్రచందనం దుంగలతో పాటు 45 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గస్తీ నిర్వహిస్తున్నాం డి.వనిపెంట సెక్షన్ పరిధిలోని నల్లమలలో గస్తీ ముమ్మరం చేశాం. స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను అక్రమ రవాణా కోసం ఎంచుకుంటున్నారు. గిద్దలూరు, కడప, బద్వేల్ తదితర ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ గస్తీ ముమ్మరం చేశాం. స్మగ్లర్ల ఆట కట్టిస్తాం. – శ్రీనివాసులు, డి.వనిపెంట అటవీ సెక్షన్ అధికారి -
నల్లమలలో అలర్ట్
సాక్షి, మార్కాపురం(ప్రకాశం) :విశాఖ మన్యంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదే సమయంలో నల్లమలలో యూరేనియం నిక్షేపాల కోసం సర్వేలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో వారం రోజుల కిందట మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులపై నిఘా పెట్టాలని, అన్ని పోలీసుస్టేషన్ల ఎస్ఐలకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ మన్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. ముందు జాగ్రత్తగా నల్లమల పరిధిలోని పోలీసుస్టేషన్ సిబ్బందిని అలర్ట్ చేసి మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరించాలని ఆదేశించారు. గతంలో నల్లమల అటవీ ప్రాంతం, మావోయిస్టులకు నిలయంగా ఉండేది. పలువురు రాష్ట్ర స్థాయి అగ్రనేతలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. ప్రధానంగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే నల్లమలలోనే ఉంటూ తన కార్యకలాపాలు కొనసాగించే వారు. పలు సార్లు పోలీసుల ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లలో అప్పటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్తో పాటు మరో ఏడుగురు మావోయిస్టులు, కేంద్ర కమిటీ సభ్యులు శాఖమూరి అప్పారావు, తదితరులు మృతి చెందారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోవడం, మరికొందరు లొంగిపోవటంతో నల్లమల అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. గత నెల నుంచి యూరేనియం నిక్షేపాల కోసం సర్వేలు జరుగుతున్నాయని, దాన్ని వ్యతిరేకించాలంటూ గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లో సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని పోలీసులు సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ ఉద్యమం ద్వార మళ్లీ మావోయిస్టులు ప్రవేశిస్తారా, ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ మద్దతు ఇస్తున్నారా అనే అంశాలను ఆరా తీస్తున్నారు. పనిలో పనిగా లొంగిపోయిన మాజీ మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే అంశాలపై సంబంధిత స్టేషన్ల ఎస్ఐలు సమాచారాన్ని సేకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో మార్కాపురం డివిజన్లోని పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, అర్ధవీడు, కంభం, రాచర్ల, గిద్దలూరు పోలీసుస్టేషన్ల పరిధిలో మావోయిస్టులు కార్యకలాపాలు, ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మళ్లీ నల్లమలలో మావోయిస్టుల కదలికలపై నిఘా పెడుతున్నారు. మరో వైపు మావోయిస్టులు ఏవోబీలో కార్యకలాపాలు చేస్తూ నల్లమలను షెల్టర్ జోన్గా వాడుకుంటున్నారా అనే అంశంపై కూడా సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉద్యమం లేకున్నా పోలీసులు మాత్రం ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ విషయమై మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నల్లమలలో మావోయిస్టుల కదలికలు లేవని, అయినా సిబ్బందిని అలర్ట్ చేశామని స్పష్టం చేశారు. -
ప్రకటనలు కాదు తీర్మానం చేయాలి: సీతక్క
సాక్షి, హైదరాబాద్: నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అసెంబ్లీ, మండలిలో తీర్మానం చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఆదివారం అసెంబ్లీ ఆవరణలో ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే అధిక సంఖ్యలో పులులు సంచరించే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతానికి యురేనియం తవ్వకాలతో ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా టీఆర్ఎస్ సర్కార్ ఎందుకు మౌనం వహించిందో చెప్పాలని నిలదీశారు. ఈ తవ్వకాల వల్ల నల్లమల నాశనమవుతుందని, తద్వారా పరిసర నదులు ప్రభావితమై ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. -
‘యురేనియం’ పాయింట్లను మీరే చూపండి
సాక్షి, హైదరాబాద్: నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి తదుపరి చర్యల విషయంలో సందిగ్ధం నెలకొంది. యురేనియం నిక్షేపాల అన్వేషణలో భాగంగా అమ్రాబాద్, ఉడుమిల్ల, నారాయణపూర్ల్లోని 4 బ్లాక్లలో 83 చ.కి.మీ. పరిధిలో 4 వేల బోర్లు వేసేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్ర అటవీశాఖకు నెలరోజుల క్రితం అటామిక్ మినరల్ డైరెక్టరేట్(ఏఎండీ) ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలను పరిశీలించి వాస్తవ పరిస్థితులపై నివేదికలు పంపించాలని అచ్చంపేట, దేవరకొండ డివిజన్ల అధికారులకు ఈ ప్రతిపాదనలను మూడువారాల క్రితం అటవీశాఖ పంపింది. నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలోని అటవీప్రాంతంలో ఎక్కడెక్కడ యురేనియం నిల్వల వెలికితీతకుగాను 4 వేల బోర్లు వేసి పరీక్షలు జరుతారో యూజర్ ఏజెన్సీ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి చూపాలని ఏఎండీకి అటవీశాఖ ఇటీవల లేఖ రాసింది. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ బోర్లు వేస్తారన్న దానికి సంబంధించిన మార్కింగ్లను చూపిస్తే తమవైపు నుంచి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఏఎండీకి ఈ ప్రాంతాల ఫీల్డ్ డైరెక్టర్ లేఖ ద్వారా తెలియజేశారు. -
యురేనియంపై యుద్ధం రగులుకుంది..!
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి(నల్గొండ) : పీఏపల్లి మండల పరిధిలోని ‘లంబాపూర్–పెద్దగట్టు’ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు ఉంటాయా.. ఉండవా.. ఇన్నాళ్లు దీనిపై కొన్ని అనుమానాలు ఉన్నా తాజా ఘటనతో పటాపంచలయ్యాయి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ప్రతినిధులు మంగళవారం నీటి నమూనాల కోసం రావడంతో గ్రామస్తులు వారిని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయని, తాము పోరుబాట పట్టక తప్పదన్న నిర్ణయానికి ఇక్కడి గిరిజనులు వచ్చారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీప్రాంతంలోనే యురేనియం తవ్వకాలు ఉంటాయని ఇప్పటివరకు అనుకున్నారు. అక్కడ ‘సేవ్ నల్లమల’ అంటూ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. కానీ పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టు, లంబాపూర్ తదితర గ్రామాల అటవీప్రాంతంలోనూ తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారన్న విషయం బట్టబయలైంది. ఈ ప్రాంత ప్రజల్లో యురేనియం భయం వెంటాడుతుందన్న సమాచారం మేరకు ‘సాక్షి’ ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించింది. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుని వరుస కథనాలను ప్రచురించింది. కథనాలను చదివిన ఈ ప్రాంతవాసులు యురేనియంపై పోరుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. పెద్దగట్టు గ్రామస్తులతో ప్రజా సంఘాల సమావేశం యురేనియంపై ప్రజలు చైతన్యవంతులను చేసేందుకు ప్రజా సంఘాలైన తెలంగాణ విద్యావంతుల వేదిక, ప్రజా సైన్స్ వేదిక, ఆదివాసీ హక్కుల జాతీయ హక్కుల వేదిక, తెలంగాణ గిరిజన సంఘాల ప్రతినిధులు మండలంలోని పెద్దగట్టు గ్రామస్తులతో మంగళవారం సమావేశం అయ్యారు. యురేనియంపై పోరుకు తాము అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తవ్వకాలను ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. అనంతరం పలు ప్రజా సంఘాల సభ్యులు యురేనియం వ్యతిరేక పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల జాతీయ వేదిక అధ్యక్షులు మిడియం బాబురావు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవినాయక్, ధర్మానాయక్, తెలంగాణ ప్రజాసైన్స్ వేదిక అధ్యక్షుడు మువ్వ రామారావు, విద్యావంతుల జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పాపానాయక్, శంకర్నాయక్, రైతు సంఘం నాయకులు కంబాలపల్లి ఆనంద్, పెరికె విజయ్కుమార్, విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, డేగ వి.టి., నామ శ్రీనివాస్, హరికృష్ణ, రమేశ్, సుదర్శన్, కొండల్రెడ్డి, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోబ్యాక్ యూసీఐ... యురేనియంపై ప్రజలను జాగృతం చేసేందుకు ప్రజా సంఘాలు ప్రజలతో సమావేశం ముగించుకొని వెళ్తున్న క్రమంలో పెద్దగట్టు గ్రామానికి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ప్రతినిధులు వస్తుండడాన్ని గమనించిన ప్రజా సంఘాలు, ప్రజలు వారి జీపును అడ్డుకున్నారు. అడ్డంగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. గో బ్యాక్ యూసీఐ అంటూ నినాదాలు చేశారు. చాలాసేపు వరకు ఆందోళన చేపట్టడంతో అధికారులు చేసేదిలేక వెనుదిరిగారు. యూసీఐఎల్ ప్రతినిధుల వాహనంలో అప్పటికే వేరే గ్రామాల్లో సేకరించిన నీటి నమూనాలతో పాటు ఖాళీ క్యాన్లు దర్శనమిచ్చాయి. ఇదిలా ఉంటే యూసీఐఎల్ ప్రతినిధులు ప్రజా సంఘాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా గ్రామస్తులు, ప్రజా సంఘాలు వారిని నిలువరించి జీపును వెనుకకు తోశారు. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. యురేనియం వెలికితీయడం ప్రజలకు మరణశాసనం యురేనియం వెలికి తీయడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతాయని, తాగునీరు కలుషితం కావడంతో పాటు ఇక్కడి ప్రజలపై పెను ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కడపలోని తుమ్మలపల్లి, జార్ఖండ్లోని తొలుగల్ ప్రాంతాల్లో యురేనియం ప్లాంట్లు ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉన్న యురేనియం ప్లాంట్ను జనవావాసాలకు మధ్య, కృష్ణా తీరంలో ఏర్పాటు చేయడం సమంజసం కాదు. యురేనియం వెలికితీయడం వల్ల జీవరాశులకు ప్రమాదం వాటిల్లుతుంది. ఒక విధంగా ప్రజలకు మరణశాసనం. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరోసిస్తో ఇబ్బందులు పడుతున్న తరుణంలో యురేనియం వెలికితీయడం ఎంతవరకు సమంజసం. – మిడియం బాబురావు, ఆదివాసీ హక్కుల జాతీయ హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అభివృద్ధి పేరుతో ఆధిపత్యమా? నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితులుగా బతుకీడుస్తున్న పెద్దగట్టు ప్రాంత ప్రజలను మరోసారి యురేనియం పేరుతో బయటికి గెంటివేయొద్దు. అభివృద్ధి పేరుతో గ్రామాలపై ఆధిపత్యం చెలాయించడం అన్యాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని ఉపసంరించుకోవాలి. ఖనిజాల పేరుతో ఆదివాసులను ఆగంచేసే నిర్ణయాలు మంచివి కావు. – అంబటి నాగయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు యురేనియం వెలికితీతను నిలిపివేయాలి మానవ మనుగడతో పాటు జీవజాలానికి హానికరమైన యురేనియం వెలికితీతను ప్రభుత్వాలు విరమించుకోవాలి. యురేనియం వెలికితీతతో ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ప్రజల జీవితాలపై పెనుప్రభావం చూపే యురేనియం వెలికితీయడాన్ని ఆపివేయాలి. – రామారావు, ప్రజా సైన్స్ వేదిక అధ్యక్షుడు గిరిజనుల జీవితాలో చెలగాటం ఆడొద్దు యురేనియం వెలికి తీసే చర్యలతో గిరిజనుల జీవితాలో చెలగాటం ఆడొద్దు. యురేనియం వెలికి తీయడం వల్ల ప్రజలు, జీవరాశులకు ప్రమాదం వాటిల్లుతుంది. కృష్ణా తీరం పరిసర ప్రాంతాల్లో యురేనియం వెలికి తీయడం వల్ల నీరు కలుషితం అవుతుంది. జనసంచారం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్ట్ను పచ్చటి పంట పొలాల నడుమ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదు. – రవినాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
‘నల్లమల సందర్శనకు అనుమతించండి’
సాక్షి, హైదరాబాద్: యురేనియం మైనింగ్ ప్రతిపాదిత మండలాల్లో పర్యటనకు అనుమతించాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్).. డీజీపీ మహేందర్రెడ్డికి విన్నవించింది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, అధికార ప్రతినిధి వెంకట్రెడ్డిలు మంగళవారం డీజీపీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈనెల 3వ తేదీన మావోయిస్టు అమరుల వారోత్సవాల పేరిట, 14వ తేదీన అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించలేమన్న సాకుతో తమను, తమపార్టీ సభ్యుల్ని అడ్డుకుని సెక్షన్ 151 సీఆర్పీసీ కింద అరెస్టు చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. యురేనియం మైనింగ్ నిక్షేపాలు గుర్తించిన అమ్రాబాద్, పడర మండలాల్లో పర్యటించి, ప్రజలను కలుసుకునేందుకు అనుమతించాలని కోరారు. -
‘నల్లమలను లూటీ చేయాలని చూస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు ఊటీ లాంటి నల్లమల ప్రాంతాన్ని పాలకులు లూటీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో తామంతా ఉద్యమిస్తే తవ్వకాలు నిర్ణయంపై వెనక్కు తగ్గారని, కానీ కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయని మళ్లీ తవ్వకాలు మొదలు పెట్టాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీభవన్లో నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టు. చెంచులు, ఆదివాసీలు బతుకుతున్న ప్రాంతం. ఇక్కడ తవ్వకాలను మేం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. బహుళ జాతి కంపెనీలకు కోట్ల రూపాయలు కట్టబెట్టడానికి ఇక్కడి ప్రజలను, అటవీ సంపదను బలి చేస్తారా. విదేశాల్లో, కడపలో కూడా యురేనియం తవ్వకాలను ఆపేశారు. యురేనియం తవ్వకాల వల్ల పుట్టబోయే బిడ్డలకు కూడా అంగవైకల్యం ఏర్పడుతుంది. ప్రకృతి పూర్తిగా నాశనమవుతుంది. శ్రీశైలం నదీ జలాలు కలుషితం అవుతాయి. నాగార్జునసాగర్ నీరు తాగే హైదరాబాద్ ప్రజలపై కూడా ఈ ప్రభావం పడనుంది. గతంలో కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటాలు చేస్తాం. ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం. తవ్వకాల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా ఉద్యమం ఆగదు’అన్నారు. -
కర్నూలు జిల్లాలో పెద్దపులి అలజడి
సాక్షి, కర్నూలు : నల్లమల అడవి పరిసర గ్రామాల్లో మరోసారి పెద్దపులి ఉందంటూ అలజడి మొదలైంది. ఆవుపై దాడి చేసి చంపేసిన ఆనవాళ్లు కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం సింగవరం గ్రామం నల్లమల అడవికి సమీపంలో ఉంది. గ్రామ సమీపంలోని పొలాల వద్ద మేత మేస్తున్న ఆవు అనుమానస్పదంగా చనిపోయింది. పెద్దపులి దాడిచేసినట్లుగా గుర్తించిన గ్రామస్తులు భయంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పులివిగా భావిస్తున్న పాదముద్రలను, చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్తులు నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. సమీపంలో అడవి ఉండటంతో ఇటీవల తరచూ అడవి జంతువులు గ్రామాపరిసరాలలో కనిపిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామానికి పక్కనే ఉన్న ప్రసిద్ధ క్షేత్రం ఓంకారం ఆలయానికి వేల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. -
నల్లమలలో 25 రకాల పాము జాతులు
ప్రకాశం, మార్కాపురం:పాము అంటే ఎవరికైనా భయమే. అయితే అందులో కొన్ని పాములు మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయి. ఆ పాములు కాటేస్తే మృత్యువు ఖాయం. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో 25 రకాల పాములు ఉన్నాయి. ఇందులో 5 జాతుల పాములు అత్యంత ప్రమాదకరమైనవని పరిశోధకులు గుర్తించారు. నాగుపాము, కట్ల పాము, రక్త పింజర, తాచుపాము, సముద్రపు పాము.. ఇవి కాటేస్తే తక్షణమే చికిత్స పొందాలి. లేకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. నల్లమలలో ఇంకా జర్రిపోతు, కొండ చిలువ, మట్టిపాము, దాసరి పాము, పసిరిక పాము ఇలా అనేక రకాల జాతుల పాములు ఉన్నాయి. ఇటీవల కాలంలో పాము కాటుకు పలువురు గురవుతున్నారు. ముఖ్యంగా కృష్ణాజిల్లా ఆవనిగడ్డ ప్రాంతంలో పాములు విజృంభిస్తున్నాయి. సుమారు 70 మందికిపైగా పాము కాటుకు గురయ్యారు. నల్లమల అటవీ ప్రాంతంలోని సమీప గ్రామాలైన చినారుట్ల, పెదారుట్ల, తుమ్మలబైలు, పాలుట్ల, బంధంబావి, పణుకుమడుగు, చెర్లోపల్లె, నల్లగుంట్ల తదితర గిరిజన గూడేల్లో సంచరిస్తుంటాయి. కొండచిలువ ప్రధానంగా గొర్రెలు, మేకలు, కుందేళ్లు, తదితర జంతువులను తింటుంది. పసిరిక పాము చెట్లపైనే ఉంటూ తనపై దాడి చేస్తారని తెలిస్తే మనిషి కంటిపై కాటు వేస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలో చెట్లపై ఎగిరే పాములు కూడా ఉన్నాయని డీఎఫ్ఓ జయచంద్రారెడ్డి తెలిపారు. పాములను చంపొద్దు: పాము కనిపించగానే చాలా మంది చంపుతున్నారు. అన్ని పాముల్లో విషం ఉండదు. తమను చంపుతారనే తెలిస్తేనే అవి కాటేస్తాయి. శబ్ధం ఆధారంగానే పాము కదలికలు ఉంటాయి. నల్లమలలో 25 జాతుల పాములు ఉన్నాయి. రాష్ట్రంలో 300 రకాల పాములు ఉన్నాయి. ఇందులో కొండ చిలువలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పాములతో రైతులకు ఉపయోగాలు ఉన్నాయి. పొలాల్లో ఎలుకలు, తొండలను తింటూ జీవిస్తుంటాయి. పాములపై పరిశోధనలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ వద్ద స్నేక్ సొసైటీని స్థాపించి ప్రజలకు అవగాహన కల్పించాం. ఇక్కడ కూడా అలాంటి సొసైటీని ఏర్పాటు చేస్తాం. పది రోజుల కిందట విజయపూరి సౌత్ వద్ద 40 పాములు కనిపిస్తే వాటిని చంపకుండా అడవుల్లోకి వదలి పెట్టాం. పాము కాటు వేయగానే ఆ ప్రాంతంలో రక్తాన్ని వెంటనే బయటకు తీయాలి. వైద్యుడి వద్దకు వెళ్లి ఇంజెక్షన్ చేయించుకోవాలి. -జయచంద్రారెడ్డి, డీఎఫ్ఓ -
నల్లమలలో పెద్దపులి మృతి
ఆత్మకూరురూరల్: నల్లమలలో ఒక పెద్ద పులి మరణించింది. ఆత్మకూరు అటవీ డివిజన్లోని శ్రీశైలం రేంజ్ పరిధిలో నరమామిడి చెరువు ప్రాంతంలో మంగళవారం చనిపోయింది. వృద్ధాప్యం మీదపడిన పెద్దపులి తన పాలిత ప్రాంతంలోకి చొరబడ్డ యువ పులిని తరిమివేసే యత్నంలో దానితో పోరాడుతూ మరణించినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. పులి మరణించిందన్న సమాచారం మేరకు ఆత్మకూరు నుంచి డీఎఫ్ఓ సెల్వం, శ్రీశైలం – నాగార్జున సాగర్ ఫీల్డ్ డైరెక్టర్ శర్వణన్, ఎఫ్ఆర్వో జయరాములు, శ్రీశైలానికి చెందిన అదనపు సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. సంఘటన జరిగిన ప్రాంతం అత్యంత లోతట్టు అటవీ ప్రాంతం కావడంతో పాటు అక్కడ ఎలాంటి సెల్ సిగ్నల్స్ అందవు. కావున రాత్రి 10 గంటల వరకు స్పష్టమైన సమాచారం బయటపడలేదు. వృద్ధాప్యం.. ఓ శాపం నల్లమలలో రారాజులా తిరిగే జాతీయ జంతువు పెద్దపులికి వృద్ధాప్యం మాత్రం పెద్ద శాపంగా ఉంటోంది.అడవిలో సుమారు 16 ఏళ్లు మాత్రమే జీవించే పెద్దపులి.. జంతు ప్రదర్శనశాలలో మాత్రం 20 ఏళ్ల వరకు బతుకుతుంది. ఒంటరిగా తన ఆహార జంతువులను వేటాడే పులులకు వయసు పెరిగే కొద్దీ వేటలో నైపుణ్యం తగ్గుతుంది. దీంతో ఆహార సేకరణ కష్టమవుతుంది. తద్వారా అవి తొందరగా చనిపోతాయి. సాధారణంగా ఒక ప్రౌఢ వయసు పులి నల్లమలలో సుమారు 40 చ.కి.మీ ప్రాంతాన్ని తన పాలిత ప్రాంతంగా(టైగర్ టెరిటరీ) చేసుకుని తిరుగుతూ ఉంటుంది. మరో పులిని ఆ ప్రాంతంలోకి అనుమతించదు. అయితే.. వయసు మీద పడే కొద్దీ వృద్ధ పులులకు యువ పులుల నుంచి సవాళ్లు ఎదురవుతాయి. యువ పులి.. వృద్ధపులిని పోరాటంలో ఓడించి చంపివేసి.. దాని పాలిత ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుంది. ఈ పరిస్థితి అన్ని పులులకూ ఎదురు కాకపోవచ్చు. కొన్ని పెద్దపులులు వృద్ధాప్యం కారణంగా వేటాడే శక్తి కోల్పోయి ఆహారం లభించక ఆకలి చావులకు గురవుతుంటాయి. ఈ సమయంలో పులి ఎత్తయిన ప్రదేశానికి వెళ్లి ఏరాతి గుట్ట మాటునో ప్రాణాలు విడుస్తుంది. -
నల్లమల దారిలో..
ఆత్మకూరు: నల్లమల అభయారణ్యం శివ నామస్మరణతో మారుమోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కాలినడకన నల్లమల దారిలో శ్రీగిరికి చేరుకుంటున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం, జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున శివ భక్తులు రోడ్డు మార్గంలో వెంకటాపురం చేరుకుని అక్కడి నుంచి నాగలూటి, పెచ్చుర్వు మఠం బావి, భీముని కొలను మీదుగా కైలాసద్వారం చేరుకుని శ్రీశైలానికి చేరుకుంటున్నారు. అడుగడుగునా కష్టాలు ఎదురైనా స్వామి మీద ఉన్న అపారమైన భక్తివారిని ముందుకు నడిపిస్తోంది. నాగలూటి క్షేత్రం నుంచి మొదలయ్యే మెట్ల మార్గంలో అవస్థలు పడుతున్నారు. శిథిలమైన దారిలో రాళ్లు భయపెడుతున్నాయి. ఓ వైపు పిల్లలు, మరో వైపు లగేజీతో బొబ్బలెక్కిన కాళ్లతో అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. కత్తులకొండ ప్రాంతంలో మొనదేలిన రాళ్లపై నడవలేక పోతున్నారు. శ్రీశైల దేవస్థానం సౌకర్యాలను విస్మరించడంతో వైద్యం అందక, మంచినీటి వసతి లేక భక్తులు కష్టాలు అన్నీఇన్నీ కావు. అక్కడక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు రెండు, మూడు గంటలు మాత్రమే పని చేస్తున్నాయి. దీంతో భక్తులు అస్వస్థతకు గురైన దేవుడిపై భారం వేసి ముందుకు సాగుతున్నారు. -
నల్లమలలో మావోయిస్టుల డంప్
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కలకలం రేగింది. జిల్లాలోని నాగలూటీ చెంచు గూడెం వద్ద మావోయిస్టుల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డంప్లో గ్రనేడ్, జిలెటిన్ స్టిక్సను గుర్తించారు. మావోయిస్టుల డంప్ లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. -
నల్లమలలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
ఆత్మకూరురూరల్: నల్లమల మరొక్కసారి ఉలిక్కి పడింది. ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగలూటి చెంచు గూడెం, వీరభద్రాలయం మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి మావోయిస్టులకు చెందినదిగా భావిస్తున్న టెక్నికల్ డంప్ ఒకటి బయటపడింది. ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నమ్మకమైన సమాచారం మేరకు డీఎస్పీ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు సీఐ బత్తల క్రిష్ణయ్య, ఎస్ఐ వెంకట సుబ్బయ్య, స్పెషల్ పార్టీ పోలీసులు నాగలూటి చెంచు గూడెం ప్రాంతంలో గాలింపు చేపట్టారు. నాగలూటి సమీపంలో భూమిలో పాతిపెట్టిన ప్లాస్టిక్ డ్రమ్ కనపడింది. దీన్ని వెలికి తీసి పరిశీలించగా అందులో పేలుడు సామర్థ్యం కలిగిన గ్రనేడ్ ఒకటి, 38 ఖాళీ గ్రనేడ్లు, గ్రనేడ్లలో ఉపయోగించే స్ప్రింగ్లు, బోల్టులు, కొన్ని జిలిటెన్ స్టిక్లు, ఒక వైర్ బండిల్, సమాచారం కోసం వినియోగించే వీహెచ్ఎఫ్ సెట్ ఒకటి కనిపించాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్ను విలేకరుల ఎదుట ప్రదర్శించారు. కాగా మంగళవారం రాత్రి డీఎస్పీ మాధవరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నల్లమల అడవుల్లో మావోయిస్టుల ఉనికి లేదని వివరించారు. నిరుపయోగమైన డంప్! 2006 తరువాత నల్లమలలో మావోయిస్టుల ఉనికి లేదు. 2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో మావోయిస్టుల చర్చలు విఫలం కావడంతో నల్లమల నుంచి మావోయిస్టులు పూర్తిగా రిట్రీట్ అయ్యి దండకారణ్యం, ఆంధ్రా ఒడిశా బోర్డర్కు తరలివెళ్లారు. ఇన్నేళ్ల అనంతరం ఒక ఆయుధ డంప్ బయటపడడం కొంత ఆందోళన కలిగించే అంశమే. అయితే.. ఆరేళ్ల కిందట బైర్లూటీ రేంజ్లోని తిరుమల దేవుని కొండ సమీపంలో కూడా ఇలాంటి ఆయుధ డంపు ఒకటి బయటపడింది. అందులో కూడా నిరుపయోగమైన ఆయుధ సామగ్రి మాత్రమే పోలీసులకు లభించింది. దీన్ని బట్టి చూస్తే మావోయిస్టులు నల్లమలను ఖాళీ చేసినపుడు తమకు ఉపయోగం లేని వస్తువులను డంపుల్లో వదలివెళ్ళినట్లు తెలుస్తోంది. -
నల్లమలలో తగ్గుతున్న పులుల సంఖ్య
ఒంగోలు క్రైం: నల్లమల అభయారణ్యం దట్టమైన వృక్ష సంపదకు ఆలవాలం. తిరుమల శేషాచలం కొండల నుంచి మొదలయ్యే అరణ్యం నల్లమలతో అనుసంధానం అయిఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎర్రచందనం మొదలు కొని ఎన్నో లక్షలాధి ఔషధ మొక్కలు, వృక్ష సంపద నల్లమల అభయారణ్యం సొంతం. వృక్ష సంపదతోపాటు వన్య ప్రాణులకూ కొదువలేదు. ఇక అభయారణ్యానికి రాజసాన్నిచ్చే పెద్ద పులులు, చిరుతలకూ కొదువలేదు. పులులు ఉన్నాయంటేనే అభయారణ్యాల వృద్ధి వాటంతట అదే సొగిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ ఫారెస్ట్ ఒకటిగా ఉండేది. రాష్ట్రం విడిపోయిన తరువాత అభయారణ్యం కాస్తా రెండుగా చీలిపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్కు కొంత అటు తెలంగాణకు కొంత చీలిపోయింది. ఏదేమైనా నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు రెండు రాష్ట్రాల్లో కలుపుకొని ఏకైక పులుల సంరక్షణ కేంద్రం. అభయారణ్యంలో పులుల సంఖ్య ఏటికేడాదికి తరుగుతోంది. అందుకు వాటి సంరక్షణ చర్యల్లో లోపమే ప్రధాన కారణం. దానికి తోడు వేటగాళ్లు, స్మగ్లర్ల నుంచి ముప్పు ఏర్పడింది. వన్యప్రాణులను పులులను వేటాడి వాటి చర్మాలను ఇతరప్రాంతాలకు తరలించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నించారు. నాలుగేళ్ల క్రితం రెండు పులుల చర్మాలు ఒకే చోట లభించాయి. ఆ సంఘటన అటవీ శాఖాధికారులను విస్మయానికి గురిచేసింది. గత ఏడాది శ్రీశైలం రూటులో బొమ్మలాపురం–దేవలూరు ప్రాంతంలో ఒక చిరుత పులిని వేటగాళ్లు మట్టుబెట్టారు. మరో చిరుత రోడ్డు ప్రమాదంలో వాహనం ఢీ కొని మృత్యువాత పడింది. నల్లమలలో వన్యప్రాణుల గణన మొదటి విడత గణన జనవరి 28వ తేదీతో ముగిసింది. నల్లమలలో తరుగుతున్న సంఖ్య.. దేశ వ్యాప్తంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్లు్యఏఐఐ)నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ)లు సంయుక్తంగా వన్య ప్రాణుల గణన చేస్తుటాయి. అందులో ప్రధానమైనది పులుల గణన. పులుల గణన ఎందుకు ప్రాధాన్యతను సంతరించుకుంటుందంటే.. పులులు ఉంటే అరణ్యాలు విస్తరిస్తాయి. జలపాతాలు, నదులు కోతకు గురికాకుండా ఉంటాయి. శాఖాహార వన్యప్రాణుల సంతతి పెరగకుండా చేస్తాయి. అరణ్యాలు తరిగిపోయి, శాఖాహార జంతువుల సంఖ్య పెరిగితే గ్రామాల మీదకు, పంటలను నాశనం చేయటం లాంటి ఎన్నో నష్టాలు లేకుండా చేస్తాయి. పులుల గణాంకాలను బట్టి చూస్తే గత ఎనిమిదేళ్లలో 27 పులుల తగ్గాయి. 2006 సంవత్సరంలో అభయారణ్యంలో 95 పులులు ఉన్నాయి. 2010 గణాంకాల ప్రకారం వాటి సంఖ్య 72కు పడిపోయాయి. 2014లో నిర్వహించిన గణాంకాల ప్రకారం వాటి సంఖ్య 68కి పడిపోయింది. నల్లమల అభయారణ్యంలో పులుల సంఖ్య తగ్గుతుంటే ఇతర అభయారణ్యాల్లో వాటి సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే 2006లో 1,411 ఉంటే 2010లో వాటి సంఖ్య 295 పులులు పెరిగి 1,706కు చేరుకున్నాయి. 2014లో నిర్వహించిన పులుల సర్వేలో ఆశ్చర్యం కలిగించే గణాంకాలు వెలుగుచూశాయి. ఏకంగా నాలుగేళ్లలో 520 పులుల సంతానం పెరిగి అధికారుల సైతం ఆశ్యర్యానికి గురిచేశాయి. అక్కడ చేపడుతున్న పులుల రక్షణ కోసం చేపడుతున్న చర్యలు, ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. చట్టాలు కఠినంగా ఉన్నా ఆగని మరణమృదంగం.. వన్య ప్రాణులు, అటవీ సంరక్షణకు కేంద్రప్రభుత్వం 1972లో ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టింది. 1973 మార్చి 1న దానిని అమలులోకి తెచ్చింది. అప్పటి నుంచి శిక్షలను కఠినతరం చేస్తూ ప్రత్యేక చట్టాలు అనుసంధానిస్తూ వస్తున్నా, వన్యప్రాణుల మరణాలు మాత్రం ఆగడం లేదు. వన్యప్రాణులను వేటాడితే నాన్బెయిలబుల్ కేసు నమోదు, అభయారణ్యంలో అనుమతి లేకుండా ప్రవేశిస్తే ఎన్నో రకాలుగా క్రిమినల్ కేసులు ఉంటాయి. పులుల అభయారణ్యంలోని వన్య ప్రాణులను వేటాడితే 2006–యాక్టు ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. దీంతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి అరణ్యంలోకి ప్రవేశించడం, వన్యప్రాణుల ప్రశాంతతకు విఘాతం కలిగించినా సైతం కేసులు నమోదు చేసి శిక్షలు విధిస్తారు. మొదటిసారి అరణ్యంలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్లలోపు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా ఉంటుంది. రెండోసారి అదే ముద్దాయి వన్యప్రాణులకు వేటాడితే ఏడేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. 2002 జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ప్రకారం అరుదైన, సంరక్షక వృక్ష, జంతుజాలాలు సంచరించే ప్రాంతాల్లోకి అనుమతులు లేకుండా వెళ్లినా, వాటికి హాని కలిగించినా శిక్షలు తప్పవు. నాన్బెయిలబుల్ వారెంట్తోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. అయితే యింతటి కఠిన తరమైన చట్టాలు అమలులో ఉన్నా వన్య ప్రాణులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మూగ జీవాలు వేటగాళ్ల వలలో.. అడవి అంటే ఒకప్పుడు భయం. అడవిలో స్వేచ్చగా, రాజసం ఉట్టిపడేలా తిరిగే పులులు అంటే మరీ భయపడే ఉండేవారు. వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని అంతరించి పోతున్నాయి. కుందేళ్లు, దుప్పులు, కణితులు, జింకలు, కొండగొర్రెలు, అడవి పందులు, వేటగాళ్లకు ఆహారంగా మారుతుండగా పులుల వంటి వన్య ప్రాణులు కొందరు స్వార్ధపరుల ధనదాహానికి బలవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు నల్లమలలో గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. అభయారణ్యంలో పెద్ద పులులు, చిరుతలు ఉండేవి. పులుల చర్మాలకు, గోళ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో స్మగ్లర్ల కన్ను వన్యప్రాణులపై పడింది. ఇందులో భాగంగా గతంలో కొనేళ్ల కిందట బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి కట్ని, బహిలియా జాతివారు పులులను వేటాడేందుకు రంగం ప్రవేశం చేసిన సంఘటనలు జరిగాయి. -
నల్లమల పులికించేనా!
ఆత్మకూరు రూరల్: నాలుగు సంవత్సరాలకో సారి దేశ వ్యాప్తంగా జరిగే పెద్దపులుల అంచనా కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. జాతీయ పులుల సంరక్షణా సాధికార సంస్థ (ఎన్టీసీఏ) పర్యవేక్షణలో మొత్తం దేశంలో 16 రాష్ట్రాలలో ఈ అంచనా సాగుతుంది.పెద్ద పులులు, చిరుత పులుల అంచనాకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఈ ఏడాది ఇతర మాంసాహార జంతువులు, శాఖాహార వన్యప్రాణులు, వృక్ష సంపదపై కూడా సమగ్ర అంచనాకు ఎన్టీసీఏ ఆదేశాలిచ్చింది. జిల్లా పరిధిలోని ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లలో సోమవారం నుంచి జరగబోవు జాతీయ పులుల అంచనా కోసం అటవీ శాఖ తమ సిబ్బందిని అన్నిరకాలుగా సంసిద్ధం చేసింది. ఈ రెండు డివిజన్లతో పాటు నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్య పరిధిలోని మార్కాపురం, నాగార్జునసాగర్ డివిన్లలో కూడా ఈ లెక్కింపు జరగనుంది. కర్నూలు పరిధిలో మొత్తం 9 రేంజ్లలో ఈ అంచనా సాగనుంది. ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లో ఉన్న సుమారు 60 బీట్లలో 60 బృందాలను లెక్కింపునకు సిద్ధం చేశారు. కాగా ఎన్టీసీఏ ప్రకటించిన వివరాల మేరకు నాలుగేళ్లకో సారి నిర్వహించే గణనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పులల సంఖ్య తగ్గుతూ కనిపిస్తోంది. అయితే గణన శాస్త్రీయంగా లేకపోవడంతో లెక్క పక్కాగా రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సారి శాస్త్ర సాకేంతిక పద్ధతిని ఉపయోగిస్తుండటంతో నల్లమల ‘పులి’కించవచ్చుననే భావన పలువురిలో నెలకొంది. అందుబాటులోకి శాస్త్రీయత: ♦ పులుల అంచనాలో కూడా శాస్త్రీయ ప్రగతిని ఉపయోగించుకుంటున్నారు. గతంలో కేవలం పులి పాదముద్రల ఆధారంగా మాత్రమే పులుల అంచనా వేసేవారు. ♦ ప్రస్తుతం ఇన్ఫ్రారెడ్ కిరణాలను వెలువరిస్తు వాటికి అడ్డుగా వచ్చే ప్రతి జంతువును ఫొటో తీసే కెమెరా ట్రాప్ పద్ధతిలో కూడా పులుల గణన చేపడుతున్నారు. ఈ చిత్రాలలో కనిపించే పులుల చర్మంపై ఉండే చారల ఆధారంగా ఆయా పులులకు మార్కింగ్ ఇస్తారు (ఒక పులి చారలు ఇంకో పులి చారలతో కలవవు). ♦ పులులు చెట్ల మొదళ్లను రుద్దుకోవడం ద్వారా ఆ చెట్టు బెరడులో ఇరుక్కు పోయే పులి వెంట్రుకలను సేకరించడాన్ని బార్కింగ్ పద్ధతి అంటారు.ç ఇలా సేకరించిన వెంట్రుకలు, పులి విసర్జకాలను సెంటర్ పర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ హైదరాబాద్కు పంపి ఆయా పులుల డీఎన్ఏలను విశ్లేషిస్తారు. పులుల అంచనా సాగుతుందిలా.. ♦ ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే పులుల అంచనా ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ♦ నిర్ణీత కొలతలతో అడవిలో పొడవుగా ట్రాన్సెక్ట్ లైన్ల ఏర్పాటుకు గడ్డి పొదలు తొలగించి శుభ్ర పరుస్తారు. ఆయా బీట్లలో ముందస్తుగా ప్రతి బీట్లో రెండు ట్రాన్సెక్ట్ లైన్లను ఏర్పాటు చేస్తారు. ♦ అలాగే బీట్లో మూడు ట్రైల్ పాత్లు (నిర్ణీత కొలతలతొ మెత్తటి ఇసుక పరుపులు) కూడా ఏర్పాటు చేస్తారు. ట్రైల్ పాత్ల మార్గంలో నడిచే పులి అడుగు జాడలను సులభంగా సేకరించేందుకు ఉపకరిస్తుంది. ♦ ఉదయం 5 గంటల నుంచే సిబ్బంది పులుల అంచనాకు బయలు దేరుతారు. ♦ వీరు మొదటి నాలుగు రోజులు ట్రాన్సెక్ట్ లైన్లలో, ట్రయల్ పాత్లలోను పులుల అడుగు జాడలు సేకరిస్తారు. ♦ పులి అడుగు జాడలతో పాటు చిరుత, ఎలుగుబంటి, అడవి కుక్క, తోడేళ్లు, హైనాలు, నక్కలు తదితర మాంసాహార జంతువుల పాద ముద్రలు కూడా సేకరిస్తారు. ♦ పులుల నేరుగా కనిపించిన దృశ్యాలను నమోదు చేస్తారు. పులి విసర్జకాలను, చెట్లను గీరిన ఆనవాళ్లను, వెట్రకలను కూడా సేకరిస్తారు. ♦ తర్వాత నాలుగు రోజులలో ఆయా ప్రాంతాల్లో కనిపించే శాఖాహార వన్యప్రాణుల అంచనాను నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ఆయా ట్రాన్సెక్ట్ లైన్ల పరిధిల్లోని వృక్ష సంపదను కూడా గుర్తిస్తారు. కిట్లలో ఏమున్నాయి..? నల్లమలలో పులి గణనకు ఏర్పాటు చేసిన బృందాలకు ప్రత్యేక కిట్లను అందజేశారు. ఈ బృందాలకు ఎఫ్డీపీటీ శర్వణణ్ ఆధ్వర్యంలో ముందస్తు శిక్షణ ఇచ్చారు. పులుల అంచనా బృందంలో ఒక్కొక్కరికి కిట్ బ్యాగ్ను ఇచ్చారు. అందులో చార్జింగ్ లైట్, టార్చ్, టేపు, 5 లీటర్ల క్యాన్, వాటర్ బాటిళ్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, 20 మీటర్ల విద్యుత్ వైరు, కెమెరా, రేంజ్ ఫైండర్, జీపీఎస్ పరికరం, కంపాస్ ఉంటుంది. అలాగే ఒక రోజుకు సరిపడ ఆహారం వెంట ఉంచుకుంటారు. -
సఫారీకి సై!
పెద్దదోర్నాల: దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని అబ్బురపరిచే ప్రకృతి సోయగాలు, వింతలు విశేషాలను తిలకించే అద్భుత అవకాశం పర్యాటకులకు కలుగబోతోంది. పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు సమీపంలో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగాయి. ఈ ఆదివారం ఎకో టూరిజాన్ని ప్రారంభించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయి ఏడాది దాటినా ప్రభుత్వ పెద్దల నిర్లిప్త ధోరణితో ఎప్పుడు ప్రారంబానికి నోచుకుంటుందోనన్న సంశయం కొంత కాలంగా అటు పర్యాటకులు, ఇటు అటవీశాఖాధికారుల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం అనంతరం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు ఎకో టూరిజాన్ని ఫ్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏర్పాట్లు వేగవంతం.. పర్యావరణ నల్లమల అభయారణ్యం ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పర్వతాలు, లోయలు, ఆకాశాన్ని తాకే మహా వృక్షాలు కనువిందు చేస్తాయి. ఇవి నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే పర్యాటకులకు కనిపించే నల్లమల సోయగాలు. పర్యాటకులను నల్లమలలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా చేపడుతున్నారు. ముఖద్వారం, టికెట్ కౌంటర్ గది, సిబ్బంది, మ్యూజియం గదులను నల్లమల అటవీ ప్రాంతంలోని సహజత్వానికి దగ్గరగా ఉండేలా తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రయాణం కొనసాగేదిలా.. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలో మీటరు వద్ద నున్న గోర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి రెండు ఓపెన్ టాపు జిప్సీలలో ప్రయాణం మొదలవుతుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వెదురు పడియ బేస్ క్యాంప్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో ఈ ప్రయాణం ముగుస్తుంది, నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టులోని శీతోష్ణస్థితి ప్రాంతమైన పులిచెరువు ప్రాంతం వన్య ప్రాణులకు మంచి ఆవాసం, సహజ సిద్దంగా ఉండే ఈ ప్రాంతంలో ఎన్నో వన్య ప్రాణులు స్వేచ్ఛాయుత వాతావరణంలో సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడే వన్య ప్రాణులను వీక్షించేందుకు వాచ్ టవర్ను నిర్మించారు. సాధారణంగా ఈ ప్రాంతానికి వెళ్లే అవకాశం కేవలం అటవీశాఖ అ«ధికారులకు మాత్రమే ఉండేది. గతంలో ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సామాన్యులకు అనుమతి లేదు. కానీ, ఎకో టూరిజం ఏర్పాటుతో సామాన్యులకు సైతం ఈ ప్రాంతంలో పర్యటించే అవకాశం దక్కనుంది, సుమారు 14కిలో మీటర్ల మేర 1.30 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం పర్యాటకుల మనసును దోచనుంది. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అటవీశాఖ చేపట్టిన ఈ ప్రాజెక్టుతో పర్యావరణ ప్రేమికులకు సరికొత్త అనుభూతిని మిగల్చనుంది. జంగిల్ సఫారీ వివరాలు ప్రయాణ దూరం : 17 కి.మీ సమయం : 1.30 గంటలు జిప్సీ చార్జి : రూ.800 ఒక్కొక్కరికి : రూ.150 (ఒక్కో జీప్సీలో ఆరుగురికి అనుమతి) -
ఆ ఐదుగురు యువతులను బలి ఇచ్చారా?
సాక్షి, నాగర్కర్నూల్: హైదరాబాద్- శ్రీశైలం దారిలో నాగర్ కర్నూల్ జిల్లా వటవర్ల పల్లి గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఐదు మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. అక్క మహాదేవి గుహల సముదాయంలో పుర్రెలు, ఎముకలు, నిమ్మకాయలు, దుస్తులు, చెప్పులు ఉన్నట్లు పశువుల కాపరులు ఐదు రోజుల క్రితం చెప్పటంతో విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కపాలాలు 30 ఏళ్లలోపు మహిళలవని, వీరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీగా గుప్త నిధుల ఉన్నాయని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో మహిళలను బలి ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. నెల రోజుల క్రితం గుప్త నిధులు, తాంత్రిక శక్తుల కోసమే వారికి మత్తు మందులు ఇచ్చి బ్లేడులతో కోసి బలి ఇచ్చి ఉంటారని... మృతదేహాలను జంతువులు తినేయగా పుర్రెలు మాత్రమే మిగిలాయని అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. దట్టమైన అడవిలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పర్యాటకులు అటుగా వెళ్లేందుకు వణికి పోతున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
నల్లమలలో టెన్షన్..టెన్షన్
-
నల్లమల జల్లెడ
మార్కాపురం : నల్లమల అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ (ఏఓబీ) వద్ద జరిగిన ఎదురుకాల్పుల ఘటన నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమలలో ప్రస్తుతం గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు సరిహద్దు మండలాలుగా ఉన్న పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి, కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు ప్రాంతాల్లో సంయుక్తంగా కూంబింగ్ నిర్విహ స్తున్నట్టు సమాచారం. ఏఓబీ వద్ద మల్కన్గిరి జిల్లాలో రెండు రోజుల పాటు ఎన్కౌంటర్లో మొత్తం 28 మంది మావోయిస్టులు మృతి చెందగా వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నా అలియాస్ పృధ్వీ ఉన్నాడు. 2006 వరకు ఆర్కే కూడా నల్లమల నుంచే తన కార్యకలాపాలను కొనసాగించాడు. మావో సానుభూతిపరుల కదలికలపై నిఘా.. ఇటీవల కాలంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు మండలమైన పుల్లలచెరువు, బొల్లాపల్లి మండలాల్లోని గ్రామాల్లో మావో సానుభూతిపరుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. తెలంగాణ జిల్లాల తో పాటు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఎన్కౌంటర్లు, కిడ్నాప్లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి పోలీసులు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టులు షెల్టర్ జోన్గా నల్లమలను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ లో ఇటీవల ఎన్కౌంటర్ జరగటం, పోలీసుల కూంబింగ్ ఎక్కువగా ఉండటంతో మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణానది మీదుగా నల్లమలలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 2014 జూన్ 19న యర్రగొండపాలెం మండలం మురారికుంట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత జానా బాబురావు, కవిత, నాగమణిలు మృతి చెందారు. 2010 మార్చి 12న పుల్లలచెరువు మండలం నరజాముల తండా వద్ద కేంద్ర కమిటీ సభ్యులు శాఖమూరి అప్పారావు ఎన్కౌంటర్లో మృతి చెందారు. 2006 జూలై 23న యర్రగొండపాలెం మండలం చుక్కలకొండ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి మాధవ్తో పాటు మరో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటనలు రెండు నల్లమలలో జరిగాయి. దీనితో అప్పటి నుంచి మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్నారు. జిల్లాలో మావోయిస్టుల చరిత్ర, ప్రజా ప్రతినిధులపై కాల్పులు... 1988లో దగ్గు రాయలింగం హత్యకు నిరసనగా బస్సు దహనంతో జిల్లాలో పీపుల్స్వార్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 1989 ఏప్రిల్ 6న కారంచేడులో ప్రస్తుత బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి మామ దగ్గుబాటి చెంచు రామయ్యను హత్య చేశారు. 1991లో పెద్దదోర్నాల ఎంపీపీ కార్యాలయాన్ని పేల్చి వేశారు. 1992 ఆగస్టు 14న పెద్దదోర్నాల మండలం గటవానిపల్లెలో గజవల్లి బాలకోటయ్యను కాల్చి చంపారు. 1995 డిసెంబర్ 1న అప్పటి ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి కాల్చివేత 1997 ఆగస్టు 24న పెద్దదోర్నాల మండలం వై చెర్లోపల్లె సర్పంచ్ కుమారుడు బట్టు సంజీవరెడ్డి హత్య 2002 సెప్టెంబర్ 18న పెద్దదోర్నాల ఎంపీపీ గంటా కేశవ బ్రహ్మానందరెడ్డి హత్య 2003 జూన్ 11న పెద్దదోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రావిక్రింది సుబ్బరంగయ్య హత్య 2004 ఫిబ్రవరి 11న పెద్దదోర్నాల పీఏసీఎస్ అధ్యక్షులు అల్లు వెంకటేశ్వరరెడ్డిపై కాల్పులు 2004 ఏప్రిల్ 4న సురభేశ్వర కోన దేవస్థానం అధ్యక్షుడు ఎస్.విజయ మోహనరావు హత్య 2005 ఏప్రిల్ 25న అప్పటి పెద్దదోర్నాల ఎంపీపీ అమిరెడ్డి రామిరెడ్డి వాహనంపై కాల్పులు 2005ఏప్రిల్ 27న అప్పటి ఎస్పీ మహేష్ చంద్రలడ్హాపై హత్యాయత్నం 2006అక్టోబర్ 30న గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య సోదరుడి దారుణ హత్య 2006 ఏప్రిల్ 8న అప్పటి కంభం శాసనసభ్యుడు ఉడుముల శ్రీనివాసరెడ్డిపై దాడియత్నం ముఖ్యమైన సంఘటనలు.. 1993లో వైపాలెం గెస్ట్హౌస్ పేల్చివేత 2001 ఫిబ్రవరిలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ నుంచి వాకీటాకీ అపహరణ 2001 మార్చి 21న శ్రీశైలం-సున్నిపెంట పోలీస్స్టేషన్ల పేల్చివేత 2001 జూన్ 3న పుల్లలచెరువు ఏఎసై ్స ప్రశాంతరావు హత్య 2001 జూన్ 17న యర్రగొండపాలెం పోలీస్స్టేషన్ పేల్చివేత బాహ్య ప్రపంచంలోకి రాక.. 1980 జనవరి 22న పీపుల్స్ వార్ ఏర్పాటు 1992 మే 21న అప్పటి ప్రభుత్వం వార్పై నిషేధం 1995 జూలై 15న అప్పటి టీడీపీ ప్రభుత్వం మావోయిస్టులపై మూడు నెలలపాటు నిషేధం ఎత్తివేత 1996 జూలై 24న ప్రజా భద్రత చట్టం క్రింద పీపుల్స్ వార్పై మళ్లీ నిషేధం అమలు 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆ ఏడాది జూలై 21న నిషేధం ఎత్తివేత 2004 అక్టోబర్ 11న తొలిసారిగా పీపుల్స్వార్ అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి రాక (దోర్నాల మండలం చిన్నారుట్ల నుంచి) 2004 అక్టోబర్ 21న మళ్లీ అడవిలోకి.. 2004 అక్టోబర్లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావం 2006 ఆగస్టు 17న పీపుల్స్వార్ మావోయిస్టు పార్టీపై నిషేధం విధింపు -
కొత్తజిల్లాకు తలమానికం నల్లమల
నాగర్కర్నూల్ జిల్లాకు అతిపెద్ద టైగర్ రిజర్వు ప్రాజెక్టు అచ్చంపేట, కొల్లాపూర్లో అధిక విస్తీర్ణం భూమి అరుదైన జంతువులతో పాటు ఔషధ మొక్కలు జాలువారే జలపాతాల సోయగాలు.. పచ్చదనంతో కనువిందు చేసే గిరులు, కొండల మధ్య ప్రవహించే కృష్ణమ్మ, నదిలో మత్య్సకారుల చేపల వేట, పక్షుల రాగాలు.. వన్యప్రాణుల అరుపులు.. చూపరులను ఇట్టే ఆకట్టుకునే అందాలు.. ఇలా ఎన్నో ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం నల్లమల సొంతం. ప్రస్తుతం కొత్త జిల్లాకు నల్లమల తలమానికం కానుంది. దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు జిల్లాల పునర్విభజనలో నాగర్కర్నూల్ జిల్లాలోకి రానుంది. – అచ్చంపేట టైగర్ ప్రాజెక్టు అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో 2,484 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నల్లమల అడవి విస్తరించి ఉంది. ఇందులో 1750చదరపు కి.మీ. విస్తీర్ణాన్ని కోర్ ఏరియాగా, 445చదరపు కి.మీ.లలో బంపర్ ఏరియాగా, 289.47చదరపు కి.మీ.ల విస్తీర్ణాన్ని రిజర్వు ఫారెస్టుగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో అచ్చంపేట, నాగార్జునసాగర్ అటవీశాఖ సబ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో అచ్చంపేట సబ్డివిజన్ ఈ జిల్లాలో ఉండబోతుంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం(ఎన్టీసీఏ)పరిధిలో ఉన్న 44 టైగర్ ప్రాజెక్టుల అభయారణ్యల్లో ఇదీ ఒక్కటి. రాష్ట్ర విభజనలో నాగార్జునసాగర్–శ్రీశైలం రాజీవ్ టైగర్ ప్రాజెక్టును నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రవాహిస్తున్న కృష్ణానది ఎడమ వైపు తెలంగాణ, కుడివైపు ఆంద్రప్రదేశ్కు కేటాయించారు. ఇదీ మొత్తం ఇప్పుడు నాగర్కర్నూల్కు రావడంతో ఇక్కడి వనరులు ఉపయోగించుకొనే అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణ అటవీ పరిధిలో 15–20 వరకు పెద్ద పులులు ఉంటాయన్నది అధికారులు లెక్కలు. వివిధ రకాల వన్యప్రాణులకు నిలయంగా మారిన అభయారణ్యంలో పెద్దపులులు, చిరుతపులులు, జింకలు, ఎలుగుబంట్లు, రేసులు, లేళ్లు, దుప్పులు, కుందేళ్లు, నెమళ్లు,అడవిపందులు, అడవికుక్కలు, వంటి అనేక జంతువులు పక్షులు సేదతీరుతున్నాయి. ప్రపంచంలోనే అరుదైన 800ల రకాల ఔషధ, అలంకార మొక్కలు ఇక్కడ లభ్యమవుతాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో కొనసాగుతున్న టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయం అచ్చంపేటలో ఏర్పాటు చేయాల్సి ఉన్న ఇంత వరకు ఏర్పాటుకు నోచుకోలేదు. జలవిద్యుత్ కేంద్రం.. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు భూగర్భ పవర్హౌస్‡నాగర్కర్నూల్ జిల్లాలోకి రానుంది. భూగర్భ పవర్ హౌస్లోని రివర్స్బుల్ పంపుల ద్వారా నీటిని వెనక్కి తొక్కి కేంద్రంలోని ఆరు జనరేటర్ల ద్వారా 900మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తిని చేసే సామర్థ్యం ఉంది. ఈగలపెంట జెన్కో శక్తి సదన్లో తెలంగాణ జలవిద్యుత్ కేంద్రాల ముఖ్య ఇంజనీర్ కార్యాలయం కొనసాగుతోంది. ఈశక్తి సదన్ నుంచి జెన్కో జలవిద్యుత్ కేంద్రాల పని తీరు, కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వపైన ఉన్న 60 మెగావాట్లు కేంద్రం, సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రంలోని 815.6మెగావాట్లు, నిర్మాణంలో ఉన్న పులిచింతల 90 మెగావాట్లు, జూరాల ఎగువ, దిగువ 240 మెగావాట్ల కేంద్రాల పరిపాలన ఇక్కడి నుంచే సాగుతుంది. – కొత్త జిల్లాకు ఏపీ సరిహద్దు కలవనుంది. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిలో ఎడమగట్టు పాతాళగంగ వద్ద శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో వారధిగా ఉన్న బ్రిడ్జి అవతల ఏపీ సరిహద్దు ఉంది. ఇదీ కొత్త జిల్లా నాగర్కర్నూల్ పరిధిలోకి వస్తోంది. జాతీయ రహదారి.. హైదరాబాద్–శ్రీశైలం–తోకపల్లి (దోర్నాల, నంద్యాల) 280 కిలోమీటర్ల జాతీయ రహదారిలో నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోకి కడ్తాల్ నుంచి పాతాళగంగ వరకు సుమారు 175 కిలోమీటర్ల రహదారి ఉంటుంది. హైదరాబాద్ నుంచి మన్ననూర్ కుంచోనిమూల వరకు త్రీ వే రోడ్డు పనులు పూర్తయ్యాయి. డిండి ప్రాజెక్టు వద్ద బ్రిడ్జి పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మన్ననూర్–తోకపల్లి వరకు రోడ్డు విస్తరణ కొనసాగితే కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. -
ఆహ్లాదం.. ఆధ్యాత్మికం
ఆలయాలు, ప్రకృతి అందాలకు నెలవు నల్లమల – భక్తిభావం నింపే శైవ క్షేత్రాలు – ఆకట్టుకునే జలపాతాలు, సుందర దృశ్యాలు – కనువిందు చేస్తున్న వన్యప్రాణులు – కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే శ్రీశైలం – సోమశిల లాంచీ ప్రయాణం జాలువారే జలపాతాలు.. ఎత్తయిన కొండలు.. చూపరులను ఇట్టే ఆకట్టుకునే అందాలు.. సహజ వనరులు.. చెట్లు, చేమలు.. వన్యప్రాణుల అరుపులు.. ఆధ్యాత్మికతను పంచే ఈశ్వరాలయాలు.. వీటిని చూడడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. నల్లమలకు వస్తే చాలు ఇలాంటి ప్రకృతి రమణీయ దృశ్యాలు ఎన్నో కనువిందు చేస్తాయి. చుట్టూ దట్టమైన గిరులు.. కొండల నడుమ ప్రవహించే కృష్ణమ్మ.. నదిలో మత్య్సకారుల చేపల వేట... చెంచుల జీవనం.. సప్తనదుల సంగమం.. సోమశిల వైభవం.. చెంచు మ్యూజియం.. మల్లెలతీర్థం జలపాతం అందం.. ఇలా నల్లమలలోని ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక కేంద్రాలపై ప్రత్యేక కథనం. – అచ్చంపేట/కొల్లాపూర్ కొండపై కొలువైన ఉమామహేశ్వరుడు హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా 130 కి.మీ. ప్రయాణించిన తర్వాత హజీపూర్ నుంచి రెండు మార్గాలున్నాయి. హజీపూర్–అచ్చంపేట, హజిపూర్–బ్రహ్మణపల్లి పిరమిడ్ ధ్యాన కేంద్రం మార్గం అచ్చంపేట వైపు 9కి.మీ. వెళ్లితే ఉమామహేశ్వర క్షేత్రం వస్తోంది. మహబుబ్నగర్– శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిలో 105 కి.మీ దూరంలో అచ్చంపేట అనంతరం రంగాపూర్కు వచ్చి అక్కడి నుంచి ఉమామహేశ్వర క్షేత్రం వెళ్లాలి. ఈక్షేత్రం 500ల అడుగుల ఎతైన కొండపై ఉంటుంది. ఇక్కడ ఉమామహేశ్వరుడు, ఉమాదేవి, గణపతి, అయ్యప్ప కొలువై ఉన్నారు. కింది కొండ బోగమహేశ్వరంలో ఆంజనేయస్వామి వెలిశారు. రావణాసురుడిని చంపిన తరువాత శ్రీరాముడు శ్రీశైలం ప్రదక్షిణను ఉమామహేశ్వర క్షేత్రం నుంచి ప్రారంభించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రం కొండ బాణం ఆకారంలో వంపు తిరిగి ఉంటుంది. రెండు కొండలు ఒకదానిపై ఒకటి అమర్చినట్లు ఉండటం విశేషం. మొదటి కొండపై రెండోది 20 అడుగుల ఎత్తున ఉంటుంది. కింది కొండ విశాలంగా ఉండగా, పైన ఉన్న కొండ కేవలం ఐదు అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. రెండవ కొండపై ఉత్తర భాగాన పాపనాశి గుండం ఉంది. ఇక్కడ రాతి పొర కింది నుంచి నీరు వస్తుంది. తోడే కిద్ది నీరు రావడం విశేషం. క్రీ.శ 1232లో కాకతీయులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. కొండపై వెలసిన పిల్లల మామిడి చెట్టు కింద ఉమామహేశ్వరుడు కొలువై ఉన్నాడు. చెంచులక్ష్మి మ్యూజియం హైదరాబాద్–శ్రీశైలం రహదారిలో 130కి.మీ. దూరంలో మన్ననూరు వస్తుంది. నల్లమలలో జీవనం కొనసాగిస్తున్న చెంచుల జీవనశైలి తెలిపే చెంచులక్ష్మి మ్యూజియం ఇక్కడ ఉంది. చెంచుల కట్టుబొట్టు, చెంచుల కడుపు నింపుకోవడం కోసం అడవిలో సేకరించే తేనే, అటవీ ఉత్పత్తులు, విల్లంబులు వంటి బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. మద్దిమడుగు మన్ననూరు నుంచి 52 కి.మీ. వెళితే పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం దర్శించుకోవచ్చు. నల్లమల కొండలపై కృష్ణానది పశ్చిమ భాగంలో దుందుబీ నది సంగమించే రెండు నదుల కలయిక మధ్య 12కి.మీ. దూరంలో ప్రకృతి రమణీయ దృశ్యాలతో నిండిన ఈ ప్రదేశం శ్రీశైలం క్షేత్రానికి ఉత్తర దిశలో ఉంది. పలనాటి సీమ ప్రజలకు పిలిస్తే పలికే దైవం మద్దిమడుగు ఆంజనేయస్వామిని కొలుస్తారు. శ్రీశైలం వెళ్లి వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. వ్యూపాయింట్ మన్ననూరు నుంచి 16కి.మీ. ప్రయాణిస్తే ఫర్హాబాద్ చౌరస్తా వస్తుంది. అక్కడి నుంచి 12కి.మీ. అటవీమార్గంలో వెళితే వ్యూపాయింట్ కనిపిస్తుంది. అటవీశాఖ ఏర్పాటు చేసే వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఐదు నుంచి ఏడుగురు సభ్యులకు కలిపి రూ.800చార్జీని వసూలు చేస్తారు. రెండుగంటల పాటు నల్లమలలో అటవీ అందాలు, వన్య మృగాల సంచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. దారి పొడువున కొండలు, కోనలు, పక్షుల కిలకిలరావాలు, దట్టమైన అడవిలో అప్పుడప్పుడు కనిపించే నెమలి నాట్యాలు, జింకలు, దుప్పులు, కుందేళ్లు కనువిందు చేస్తుంటాయి. దాదాపు వెయ్యి అడుగులపైగా ఎత్తులో ఉండే వ్యూపాయింట్ నుంచి నల్లమల అందాలు ఆకట్టుకుంటాయి. మల్లెల తీర్థం హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిలో వట్టువర్లపల్లి నుంచి 8కి.మీ. దూరం వెళ్లితే మల్లెలతీర్థం జలపాతం వస్తుంది. ఎత్తయిన కొండల నుంచి జాలువారే నీటి దృశ్యాలు (వాటర్ ఫాల్స్) మళ్లీమళ్లీ చూడాలనిపిస్తాయి. సూర్య కిరణాలకు చోటివ్వని చల్లని ప్రదేశమైన ఈ తీర్థానికి మతాలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి ప్రకృతి ఒడిలో సేదతీర్చుకుంటారు. 500అడుగుల ఎత్తు నుంచి నిరంతరం హోరెత్తుతూ దూకే జలధార మూడు సరస్సులను నింపుతూ నల్లమల అడవి గుండా కృష్ణానదిలో కలుస్తుంది. మల్లెలతీర్థంలో మూడు ఈశ్వరుడడి విగ్రహాలు, ఏడు గుండాలున్నాయి. మల్లెలతీర్థం లోయలోకి వెళ్లేందుకు 270మెట్లు ఉన్నాయి. పాతాళగంగ హైదరాబాద్–శ్రీశైలం రహదారిలో 190 కి.మీ. దూరంలో ఉన్న పాతాళగంగను చేరుకోవచ్చు. పాతాళగంగ పుష్కరఘాట్ నుంచి 18కి.మీ. వెళితే శ్రీశైలం మల్లిఖార్జునస్వామిని దర్శించుకోవచ్చు. పాతాళగంగ సమీపంలో దోమలపెంట, ఈగలపెంట ఉంటాయి. దోమలపెంటలో రామాలయం, ఉమామహేశ్వర ఆలయం, అయ్యప్ప, సాయిబాబా మందిరాలు దర్శించుకోవచ్చు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇక్కడే బస ఏర్పాట్లు చేస్తున్నారు. సోమశిల కొల్లాపూర్ నుంచి 9కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిలలో ద్వాదశజ్యోతిర్లింగాలయం ఉంది. దేశంలోని 11పవిత్ర ఈశ్వరాలయాల విగ్రహరూపాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. లలితాంబికా అమ్మవారి గుడి కూడా ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కృష్ణా బ్యాక్వాటర్లో మునిగిపోయింది. అప్పటి ప్రభుత్వం నదిలో నీరు తగ్గిన తర్వాత యధాతధంగా ఆలయ రాళ్లను తీసుకొచ్చి ఏటిగట్టున పునఃప్రతిష్టించింది. సోమశిల వద్ద సప్తనదులు సంగమం అవుతాయి. ఇక్కడ స్నానమాచరిస్తే పుణ్యఫలం లభిస్తుందని పురాణంలో పేర్కొన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కృష్ణానదికి అవతలి వైపున కర్నూలు జిల్లా భూభాగంలో మహాభారత కాలం నాటిదిగా చెప్పుకునే సంగమేశ్వరాలయం ఉంది. ఈ గుడివర్షాకాలంలో నదిలో మునిగిపోతుంది. గుడిలోని శివలింగాన్ని ధర్మరాజు ప్రతిషి్ఠంచారని పురాణం చెబుతోంది. సోమశిల నుంచి నదిని దాటి గుడివద్దకు చేరుకోవచ్చు. ప్రస్తుతం నదిలో నీళ్లు తక్కువగా ఉన్నందున గుడిలో పూజలు జరుగుతున్నాయి. పుష్కరాల నాటికి కృష్ణానది నీటి మట్టం పెరిగితే గుడి నదిలో మునిగిపోతుంది. సింగోటం కొల్లాపూర్కు 8 కిలోమీటర్ల దూరంలో సింగోటం ఉంది. ఇక్కడ సురభి రాజవంశీయులు రెండు శతాబ్దాల క్రితం ప్రతిషి్ఠంచిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆలయానికి ఎదురుగా కొండపై రత్నలక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంటుంది. రెండు ఆలయాలకు మధ్యలో సురభిరాజులు శ్రీవారి సముద్రం చెరువును నిర్మించారు. వేలాది ఎకరాలకు సాగునీరందించే ఈచెరువును కేఎల్ఐ ప్రాజెక్టులో భాగంగా మినీ రిజర్వాయర్గా మార్చారు. పర్యాటకులకు సింగోటం గ్రామ వాతావరణం ఆహ్లాదంగా అనిపిస్తుంది. చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. కొల్లాపూర్ కొల్లాపూర్ పట్టణంలో సురభి రాజుల కోట ఆహ్లాదంతో పాటు, విజ్ఞానాన్ని కల్పిస్తుంది. పట్టణం మధ్యలో 150ఏళ్ల క్రితం ఈ బంగ్లాను నిర్మించారు. మాధవస్వామి దేవాలయం, ఎల్లూరుకు వెళ్లే దారిలో గల పెద్దతోట బంగ్లా, ఎల్లూరు సమీపంలోని కేఎల్ఐ ప్రాజñ క్టు, రిజర్వాయర్ ప్రాంతాలు కూడా పర్యాటకులను అలరిస్తాయి. చేరుకోవడం ఇలా... హైదరాబాద్ నుంచి కొల్లాపూర్కు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జడ్చర్ల, నాగర్కర్నూల్ మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. పెబ్బేరు నుంచి 58కి.మీ., వనపర్తి నుంచి 50కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. సోమశిల టు శ్రీశైలం లాంచీ.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో ప్రయాణించేందుకు పర్యాటకశాఖ సోమేశ్వరలాంచీని ఏర్పాటు చేసింది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు పర్యాటకులకు ఒక్కొక్కరికి రాను, పోను టికెట్ చార్జి రూ.800లుగా నిర్ణయించినట్లు పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ సైదులు తెలిపారు. శ్రీశైలం వరకు లాంచీలో వెళ్లి తిరుగు ప్రయాణంలో వాహనాల్లో వెళ్లేవారికి లేదా శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చేవారికి ఒక్కొక్కరికి రూ.500గా టికెట్ ధర నిర్ణయించారు. వీరు ఒక రోజు భోజన సౌకర్యానికి అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ పర్యాటకులకు.. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులకు రెండు రోజులు ప్యాకేజీ ధర రూ.2,900 గా నిర్ణయించారు. వీరిని తెల్లవారుజామునే హైదరాబాద్ నుంచి టూరిజం బస్సులో తీసుకొచ్చి సోమశిలలో లాంచీ ఎక్కిస్తారు. అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేశాక నదీ ప్రయాణం ప్రారంభమవుతుంది. శ్రీశైలం వరకు నదీ ప్రయాణం 6గంటలు పడుతుంది. మధ్యలో అక్కమహాదేవి గుహలు చూపిస్తారు. శ్రీశైలంలో పర్యాటకులకు భోజనం, రూమ్ వసతులు కల్పిస్తారు. మరుసటిరోజు తెల్లవారుజామున శ్రీశైల మల్లిఖార్జునస్వామి దర్శనం చేయిస్తారు. అనంతరం బ్రేక్ఫాస్ట్ చేయించాక పాలధార, పంచధార, సాక్షిగణపతి, డ్యాం సైట్ చూపిస్తారు. అక్కడి నుంచి బస్సులో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మధ్యలో మల్లెలతీర్థం, అమ్రాబాద్ వ్యూపాయింట్, ఉమామహేశ్వరం, అక్కడి నుంచి నేరుగా బస్సులో హైదరాబాద్కు తీసుకెళ్తారు. ఇదే ప్యాకేజీలో మొదట హైదరాబాద్ నుంచి నేరుగా శ్రీశైలం చేరుకునే సౌకర్యం ఉంది. ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉమామహేశ్వరంలో దైవదర్శనం చేసుకుని, అమ్రాబాద్ వ్యూ పాయింట్ తిలకించి, శ్రీశైలం డ్యాం సైట్, పాలధార, పంచధార, సాక్షిగణపతి చూస్తూ శ్రీశైలం చేరుకుంటారు. అక్కడ పర్యాటకులకు వసతులు కల్పిస్తారు. మరుసటి రోజు ఉదయం శ్రీశైలం మల్లిఖార్జునస్వామిని దర్శించుకున్నాక బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు. ఉదయం 9:30 గంటలకు పాతాళగంగ వద్ద నుంచి సోమశిలకు బోటు ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంకాలం 4 గంటల వరకూ సోమశిలకు చేరుకుంటారు. అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అనంతరం నేరుగా బస్సులో హైదరాబాద్కు తీసుకువెళ్తారు. బోటు ప్రయాణం చేయాలనుకునే వారు WWW.TELANGANA TOURISAM.GOV.INద్వారా ఆన్లైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు సెల్ నంబర్. 9010007152ను సంప్రదించవచ్చు. -
ఎర్రచందనం దొంగల అరెస్ట్
ఆళ్లగడ్డ: ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు తమిళ కూలీలతో కలిసి నల్లమల అడవిలో నుంచి ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారని తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసుల నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఈమేరకు గురువారం రాత్రి ఆళ్లగడ్డ సీఐ ఓబులేసు, ఎస్ఐలు చంద్రశేఖర్రెడ్డి, రామయ్యలు ప్రత్యేక పోలీసు బలగాలతో పాటు అటవీ సిబ్బందితో కలిసి అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేశారు. అదే సమయంలో తెలుగు గంగ కాల్వ సమీపంలో కొందరు వ్యక్తులు అడవిలో నుంచి దుంగలను తెచ్చి ముళ్ల పొదల్లో దాచే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే అక్కడే మాటేసిన పోలీసులు అహోబిలం గ్రామానికి చెందిన మోకు సంజీవ, ఓజీ తండాకు చెందిన మూడేశివనాయక్, బుక్కేవాసునాయక్, బాచేపల్లి తండాకు చెందిన మూడే శంకర్నాయక్, కోటకొండకు చెందిన షేక్షావలి, బజ్జరిరాజు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 దుంగలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని డీఎస్పీ ఈశ్వర్రెడ్డి శుక్రవారం తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
నల్లమలలో అనుమానాస్పదస్థితిలో మృతి ఇద్దరూ సమీప బంధువులు. వరుసకు బావ మరదలు అవుతారు. వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే అప్పటికే యువకుడికి మరో యువతితో పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. అయినా బావ మరదలు ప్రేమను చంపుకోలేక ఒక్కటవ్వాలనుకున్నారు. ఇద్దరూ నెల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. పెద్దలు వారిని పిలిపించి పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా మార్పు రాలేదు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి శుక్రవారం నల్లమలలో విగత జీవులుగా కనిపించారు. ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. - మహానంది మహానందిలోని ఈశ్వర్నగర్కు చెందిన నాసరి అశోక్(25)కు వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో డ్రైవర్గా జీవనోపాధి పొందుతున్నాడు. అహోబిలం గ్రామానికి చెందిన అశోక్ మేనత్త కుమార్తె రజిత(18) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వరుసకు బావమరదులు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నెల క్రి తం పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి వారు వెళ్లిపోయారు. అనంతరం విషయం తెలుసుకున్న పెద్దలు, పోలీసులు వారిని పిలిపించి అశోక్కు కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చచెప్పారు. అయితే వారు ప్రేమను చంపుకోలేక మూడు రోజుల క్రితం మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం తాము నల్లమల అడవిలోని ఎంసీ ఫారం కాశిరెడ్డినాయన ఆశ్రమం సమీపంలోని తెలుగుగంగ కాల్వ వద్ద ఉన్నామని, ఆత్మహత్యకు పాల్పడుతున్నామని అశోక్ తన పెద్దనాన్న కుమారుడు సుంకన్నకు ఫోన్ చేశాడు. వెంటనే సుంకన్న విషయాన్ని కుటుంబీకులకు చెప్పడంతో కొందరు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే రజిత, అశోక్ శవాలై కనిపించారు. శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయినట్లుగా ఉంది. కాగా ఇద్దరు బతికిఉన్నప్పుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటే మంటలు తాళలేక ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో పడి ఉండాలి. ఇద్దరి మృతదేహాలు పక్కపక్కనే ఉండటంతో ఎవరైనా చంపేసి మృతదేహాలను తగులబెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న నంద్యాల డీఎస్పీ హరినాథ్రెడ్డి, మహానంది ఎస్ఐ పెద్దయ్య నాయుడు, ఎస్ఐ గోపాల్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రజిత తల్లిదండ్రులు వీరభద్రుడు, వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులకు క్షోభ కలిగించవద్దు ఆకాశమంత పందిళ్లు వేసి పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే విడాకులకు దారి తీస్తున్న ఈ రోజుల్లో ప్రేమ పట్ల ఆకర్షితులై యువతీ యువకులు ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. యువతీ, యువకులు ప్రేమ కోసం మంచి భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలి. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోవాలి.పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే అనుమానాలు వీడుతాయన్నారు. హరినాథరెడ్డి, డీఎస్పీ, నంద్యాల -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని డీవీ పెంట మంగమ్మ బరకలు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ. 20 లక్షలు విలువ జేసే 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రుద్రవరం రేంజర్ రామ్సింగ్ స్థానిక ఫారెస్ట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వారం రోజులుగా నల్లమల అడవిలోకి కూలీలు వచ్చారని, వీరు ఎర్రచందనం దుంగలను లారీలో తరలించనున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో గస్తీ ముమ్మరం చేశామన్నారు. శుక్రవారం తెల్లవారు జామున మంగమ్మ బరకలు ప్రాంతంలో దుంగలను తరలిస్తున్న కూలీలను ప్రోటెక్షన్వాచర్ల గమనించి పట్టుకునేందుకు యత్నించేలోపు దుంగలను వదిలేసి పరారైనట్లు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పాల్గొన్న వారు రుద్రవరం అటవీ రేంజ్ ప్రాంత గ్రామాలకు చెందినవారిగా భావిస్తున్నట్లు రేంజర్ తె లిపారు. ఈ సమావేశంలో డివి పెంట సెక్షన్ అధికారి విజయలక్ష్మి, బీట్ అధికారులు పెద్దన, వెంకటన్నలతోపాటు ప్రొటె క్షన్ వాచర్లు నరసింహ, హనుమంతు, అంకయ్యపాల్గొన్నారు. -
కర్నూలు జిల్లాలో చిరుత హతం
ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల అడవుల్లో నాలుగు రోజుల క్రితం ఒక చిరుత హతమైంది. దీనిపై సమాచారం అందుకున్న అటవీ అధికారులు గాలింపు చేపట్టగా సిద్దపల్లి గ్రామ సమీపంలోని పొలంలో 14 చిరుత గోర్లు లభించాయి. ఇందుకు సంబంధించి పొలం యజమాని జిలకర దాసును అదుపులోకి తీసుకున్నారు. అయితే, పొలాన్ని మరో వ్యక్తికి లీజుకు ఇచ్చానని, తనకు చిరుత వధతో సంబంధం లేదని దాసు మొత్తుకున్నాడు. అతనికి మద్దతుగా అటవీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా కూడా జరిగింది. దీంతో అధికారులు దాసును విడిచిపెట్టారు. అసలు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, చిరుతను చంపిన ఘటనపై అటవీ అధికారులు పెదవి విప్పడం లేదు. -
నల్లమలలో భారీ డంప్ స్వాధీనం
ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులకు భారీ డంప్ దొరికింది. యర్రగొండపాలెంకు 30 కిలోమీటర్ల దూరంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు గురువారం మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా డంప్ బయటపడిందని ఎస్పీ శ్రీకాంత్ చెప్పారు. ఇందులో.. 11 రాకెట్ లాంచర్లు, ఒక ఏకే 47 బుల్లెట్ మ్యాగజిన్, తపంచా బ్యారెల్, రాకెట్ లాంచర్ విడి భాగాలతోపాటు గ్యాస్ కట్టర్లు 2, కవర్ ప్యాకింగ్ మెషిన్, 2 డ్రిల్లింగ్ బిట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. -
'నల్లమలలో కూంబింగ్ కొనసాగుతుంది'
ఎర్రగొండపాళెం: ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో మావోయిస్టుల ఉనికి లేకపోయినా కూంబింగ్ కొనసాగుతుందని మార్కాపురం డీఎస్పీ ఆర్.శ్రీహరిబాబు తెలిపారు. ఎర్రగొండపాళెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను రక్షించేందుకే ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించేలా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నామని, గురువారం నాటికి వెయ్యి కేసులు నమోదు చేశామని వివరించారు. ఎర్రగొండపాళెంలో నిఘా కెమెరాలను అమర్చామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి త్వరలో ఈ చలానాలు జారీ చేస్తామన్నారు. -
నల్లమలలో కూంబింగ్
కర్నూలు: కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. నల్లమలలో స్మగ్లర్ల కదిలిక నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. తాజాగా ఈ రోజు ఉదయం జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకున్నారు. రవాణా చేస్తున్న 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన కూలీలు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఉల్లి కోసం కుళ్లబొడిచారు సార్
కర్నూలు : అభంశుభం తెలియని తమను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీసులు కుళ్లబొడిచేస్తున్నారంటూ నల్లమల్ల అటవీ ప్రాంతానికి చెందిన చెంచులు శనివారం జిల్లా న్యాయమూర్తి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇటీవల ఉల్లి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దాంతో లారీలోని 15 టన్నుల ఉల్లిపాయలు స్థానిక చెంచులు తీసుకువెళ్లారని డ్రైవర్ ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ పరిసర ప్రాంతాలకు చెందిన 15 మంది చెంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించి...చిత్రహింసలకు గురి చేశారు. తమ వారిని విడిచిపెట్టలేదని కోపంతో ఉన్న చెంచులు శుక్రవారం భారీగా పోలీస్ స్టేషన్కి తరలి వచ్చారు. దీంతో 15 మందిని విడిచిపెట్టారు. పోలీసుల వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న చెంచులు శనివారం జిల్లా న్యాయమూర్తిని కలిశారు. తమపై అక్రమంగా కేసులు పెట్టి తమను పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. తాము ఉల్లిగడ్డలు చోరీ చేయలేదని... వాటి గురించే అసలు తమకు తెలియదని వారు పేర్కొన్నారు. ఉల్లిగడ్డల చోరీ కేసుతో చెంచులకు సంబంధం లేదని అటవీ శాఖ సిబ్బంది చెప్పినా పోలీసులు పట్టించుకోకుండా తమ వారిని కుళ్లపొడిచారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. -
నల్లమల అడవుల్లో వివాహితపై గ్యాంగ్ రేప్
ఆత్మకూరు: ఏడుగురు మృగాళ్లు ఓ వివాహితను నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో శనివారం వెలుగు చూసింది. వివరాలు.. మండలంలోని నాగలూటి గూడేనికి చెందిన ఓ వివాహితను అదే ప్రాంతానికి చెందిన ఏడుగురు ఈ నెల 6వ తేదీ అపహరించి సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. వీరభద్రస్వామి ఆలయం వద్ద ఆమెను నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం బాధితురాలి సోదరుడు మేకలు కాసుకుంటూ అటువైపు వెళ్లాడు. ఎవరో మూలుగుతున్నట్టు శబ్ధం విని ఆలయం సమీపానికి వెళ్లి చూడగా తన సోదరి నిర్బంధించి ఉండడంతో హతాశుడయ్యాడు. ఆమెను విడిపించి తీసుకుని ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలి వంటిపై గాయాలు ఉన్నాయి. అత్యాచారం చేసి ఏడుగురి నిందితుల పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఏడుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
21 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కర్నూలు: ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రేక్ పడడం లేదు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన 21 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. చిన్నవంగలి రేకుల బ్రిడ్జి సమీపంలోని అటవీ ప్రాంతంలో పొదల్లో ఈ దుంగలను నిల్వ ఉంచగా... ఫారెస్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది గాలింపు చర్యల్లో వెలుగు చూశాయి. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని అంచనా. -
వస్తున్నాం.. లింగమయ్యా!
- 2నుంచి 6 వరకు సలేశ్వరం ఉత్సవాలు నల్లవుల దట్టమైన అడవి.. చుట్టూ ఎత్తైన కొండలు. మధ్యలో వెయ్యి అడుగుల లోతైన లోయలో కొలువైన సలేశ్వరం లింగమయ్యను దర్శనం చేసుకోవడం ఒక మహత్తర ఘట్టం. నిటారుగా ఉన్న కొండల మీదికి రాళ్లురప్పలతో కూడిన కాలిబాటలో గంటల తరబడి వెళ్లడం గొప్ప సాహసం. ‘వస్తున్నాం.. లింగమయ్య’ అంటూ సలేశ్వరుడి శరణు వేడుతూ ముందుకు సాగడం ఓ మధురానుభవం. రెండుకొండల మధ్య కృష్ణానది పాయలో వెలిసిన శివుడిని దర్శించుకోవడం మహాభాగ్యం.. అచ్చంపేట/లింగాల: భక్తిపారవశ్యంతో కదిలే భక్తులతో నల్లమల ప్రాంతం మూడురోజుల పాటు రావులింగేశ్వర స్వామి నామస్మరణతో మార్మోగుతుంది. ఏటా ఏప్రిల్ వూసం చైత్రపూర్ణిమ రోజున సలేశ్వరం లింగమయ్యను భక్తులు సందర్శించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ దర్శనం అత్యంత సాహసంతో కూడుకున్న పని. అత్యంత ప్రమాదభరితమైన కొండచరియుల మార్గంలో కేవలం పాదం మోపే స్థలంలో ప్రమాదాలను సైతం లెక్కచేయుకుండా వయోభేదం మరిచిదర్శనం చేసుకుని ధన్యులవుతారు. ఇదీ ఇతిహాసం ద్వాపరయుగంలో పాండవవనవాసంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం సలేశ్వరం కొండల నడువు తపస్సు చేసినట్లు ప్రతీతి. ప్రకృతి నుంచి దిగొచ్చిన చందంగా వందడుగుల ఎత్తు నుంచి గలగల పారే జలపాతం కనులపండువగా ఉంటుంది. నల్లమల అటవీప్రాంతంలో లింగవుయ్యు దర్శనం ఘట్టం సుమారు రెండొందల అడుగుల లోతున్న పదుననైన రాళ్లతో కూడిన గుట్టను దిగడంతో సలేశ్వర ప్రయాణం ప్రారంభమవుతుంది. గుట్టను దిగిన తరువాత సుమారు ఐదొందల నుంచి ఆరొందల అడుగుల ఎత్తు ఉండే మరో గుట్టను దాటుకుంటూ ముందుకు సాగుతారు. సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునేందుకు వెన్నెలనీడలో కూడా వేలాదివుంది భక్తులు ఈ కారడవిలో ప్రయాణిస్తారు. పూర్ణిమ రోజున లింగమయ్య దర్శనం ఉంటుంది. మూడురోజుల పాటు లక్షలాది మందితో నల్లమల అడవి తల్లి నిండుగా కనిపిస్తుంది. దాదాపు రెండొందుల అడుగుల ఎత్తు నుంచి జలపాతం గుండంలోకి చేరుతుంది. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ జలధార కూడా ఎక్కువతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ రమణీయ ఘట్టాన్ని చూసేందుకు భక్తులు తరలొస్తారు. ఎలా వెళ్లాలి.. - సలేశ్వర క్షేత్రానికి వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి. - ఒకమార్గం.. అచ్చంపేట నుంచి మన్ననూరు, ఫరహాబాద్ ద్వారా రాంపూర్పెంట వరకు వెళ్లితే అక్కడినుంచి క్షేత్రం ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది. - రెండోమార్గం.. బల్మూర్, లింగాల నుంచి అప్పారుపల్లి ద్వారా వెళ్లొచ్చు. ఈ మార్గంలో అధికసంఖ్యలో భక్తులు కాలినడకన బయలుదేరుతారు. ప్రయాణ సౌకర్యాలు భక్తుల రద్దీని గమనించిన అచ్చంపేట ఆర్టీసీ డిపో అధికారులు ప్రత్యేకబస్సులను నడుపుతున్నారు. - అచ్చంపేట నుంచి ఫరహాబాద్ ద్వారా రాంపూర్పెంట వరకు, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, తెల్కపల్లి నుంచి లింగాల, అప్పాయిపల్లి వరకు ప్రతి అరగంటకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. - లింగాల నుంచి రూ.50, అచ్చంపేట రూ.100 ఒక్కొక్కరికీ చార్జీ అవుతుంది. ప్రత్యేక ఏర్పాట్లు సలేశ్వరంలో విద్యుత్ సౌకర్యం లేదు. మూడురోజుల పాటు జనరేటర్ల సాయంతో విద్యుత్బల్బులు వెలిగిస్తారు. మూడురోజుల పాటు ఇక్కడ వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ఉచిత భోజన ఏర్పాట్లతో పాటు తాగునీటి వసతి కల్పిస్తాయి. అలాగే రెవెన్యూ శాఖ అధికారులు భక్తులకు ఉచితంగా తాగునీటి సౌకర్యం, జిల్లా వైద్యాధికారులు ప్రత్యేకవైద్య క్యాంపులు నిర్వహిస్తున్నారు. సలేశ్వరం జాతరకు ప్రత్యేకబస్సులు ఈనెల 2నుంచి 6వ తేదీ వరకు జరిగే సలేశ్వరం ఉత్సవాలకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకబస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం వసూరాం నాయక్ తెలిపారు. అచ్చంపేట నుంచి సలేశ్వరానికి ప్రతి 20 నిమిషాలకు, తెల్కపల్లి నుంచి అప్పాయిపల్లి వరకు ప్రతి 30 నిమిషాలకు బస్సు సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకబస్సులు వేశామని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆయన కోరారు. -
నల్లమలలో అగ్ని ప్రమాదం: తగలబడుతున్న అడవి
గుంటూరు:బొల్లాపల్లి మండలం రావులాపురం వద్ద నల్లమల అడవుల్లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అడవిలో మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అయితే మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నా.. అడవి భారీగా తగులబడుతున్నట్లు తెలుస్తోంది. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. -
నల్లమలలో నాటు బాంబులు!
దేవరకొండ: నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాచి ఉంచిన 59 నాటు బాంబులను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం... మోద్గులబొంద సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు బండరాళ్ల సందులో ప్లాస్టిక్ బకెట్లలో దాచి ఉంచిన ఈ బాంబుల సమాచారం తమకు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిందన్నారు. దీంతో ఐడీ పార్టీ, స్పెషల్ పార్టీలతో వెళ్లి బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పొటాషియం, గంధకం, డిటోనేటర్లతో తయారు చేసిన ఈ బాంబులు ప్రమాదకరమైనవని, వీటిని ఎక్కువగా ఫ్యాక్షన్ సంస్కృతి ఉన్న ప్రాంతాల్లో ఉపయోగిస్తారని, వీటిని పోలీస్ పరిభాషలో డర్టీ బాంబులుగా అభివర్ణిస్తారని తెలిపారు. వీటిని గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి తరలించి ఉండొచ్చన్నారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ వెంకటయ్య, చందంపేట ఎస్ఐ నాగభూషణ్రావు, ఈ రెండు బృందాల పోలీసులు వెంకట్రెడ్డి, విజయ్శేఖర్, రాంప్రసాద్లను డీఎస్పీ అభినందించారు. -
నల్లమలలోయలో లారీ బోల్తా
-
ఫారెస్టులో 144 సెక్షన్
మహానంది: నల్లమల ఫారెస్టులో 144 సెక్షన్ విధించినట్లు నంద్యాల డీఎఫ్ఓ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. అక్రమంగా అడవిలోకి ప్రవేశిస్తే కేసు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. మహానందిలోని పర్యావరణ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీని శుక్రవారం డీఎఫ్ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణాను అరికట్టేందుకు, అటవీ సంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంలో అడవిలో ఆరునెలల పాటు 144 సెక్షన్ విధించామన్నారు. అడవుల్లో వన్యప్రాణుల దాడికి గురైతే గతంలో లాగా ప్రస్తుతం ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదన్నారు. అడవిపై ఆధారపడి జీవించేవారు ప్రత్యామ్నయం చూసుకోవాలని ఆమె సూచించారు. అటవీ ప్రాంతంలో వెదురు మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని, కడప, ప్రొద్దుటూరు పరిధిలో 10 లక్షల మొక్కలు, నంద్యాల డివిజన్ పరిధిలో 5 లక్షల మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నంద్యాల డివిజన్ పరిధిలో 50 హెక్టార్లలో మొక్కలు పెంచుతామన్నారు. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, భవిష్యత్తు తరాలకు అడవుల ద్వారా ఎన్నోప్రయోజనాలను అందించాల్సిన విషయాన్ని గుర్తుంచుకోవాలని నంద్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శివకుమార్ సూచించారు. ఆమె వెంట ఎఫ్ఆర్ఓ శివకుమార్, డీఆర్ఓ త్యాగరాజు, సిబ్బంది కృష్ణమూర్తి ఉన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా నంద్యాల అర్బన్: ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని నంద్యాల ఇన్చార్జ్ డీఎఫ్ఓ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎర్రచందనం నిల్వలపై దాడులు ముమ్మరం చేశామన్నారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ శాఖల సమన్వయంతో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అనుమానిత గ్రామాలు, ఇళ్లలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. నిందితులు, స్మగ్లర్లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బేస్ క్యాంప్, నాకాబందీ, స్ట్రెకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీలు బలోపేతం చేశామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అత్యాధునిక ఆయుధాలను అటవీ శాఖ సమకూర్చుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం గుండ్ల బ్రహ్మేశ్వరం టైగర్ ఫారెస్ట్పై దృష్టి సారించామన్నారు. డివిజన్లో 10 లక్షల వెదురు మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
నల్లమలలో అలజడి
ఆత్మకూరు: నల్లమల అడవిలో మళ్లీ అలజడి రేగింది. వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్ల సమీపంలో ఎన్కౌంటర్ జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో మావోయిస్టునేత ఆర్కే అనుచరుడు బాబురావుతో పాటు విమల, భారతి అనే ముగ్గురు హతమవ్వగా, ఒకరు తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రకాశం, కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమలలో భారీ ఎత్తున పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ముందు జాగ్రత్తగా సున్నిపెంట పోలీస్ ఔట్పోస్ట్ను శ్రీశైలానికి తరలించింది.మహబూబ్నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ జిల్లాల్లో విస్తరించిన ఉన్న నల్లమలలో గతంలో పీపుల్స్ వార్, తర్వాత మావోయిస్ట్ పార్టీ ముమ్మరంగా కార్యకలాపాలను సాగించింది. దాదాపు 15 ఏళ్ల పాటు పోలీస్, నక్సల్స్ మధ్య నల్లమలలో యుద్ధం సాగింది. గతంలో కర్నూలు పరిధిలోని నల్లమల నక్సల్స్ షెల్టర్జోన్గా ఉండేది. మహబూబునగర్ జిల్లా పరిధిలోని పోలీసుల నిఘా అధికమైతే కర్నూలు వైపు, జిల్లా పరిధిలో కూంబింగ్ జరిగితే మహబూబ్నగర్ జిల్లా వైపు తమ కార్యకలాపాలను నక్సల్స్ మార్చుకునేవారు. కర్నూలు జిల్లా పరిధిలోని కొత్తపల్లి నుంచి శ్రీశైలం అటవీ పరిధి వర కు అప్పట్లో నక్సల్స్కు షెల్టర్ జోన్గా ఉండేది. ప్రస్తుతం రాష్ట్రం విడిపోయినా భౌగోళికంగా ఒకే పరిధి కావడంతో జిల్లా మళ్లీ షెల్టర్జోన్ గా వారికి ఉపయోగ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తొలిసారిగా 1984లో అప్పటి పీపుల్స్వార్గ్రూప్ జానాల గూడెంలో జెండా ఎగురవేసి కార్యకలాపాలను ప్రారంభించింది. జిల్లాలోని కొత్తపల్లి, ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, ఆళ్లగడ్డ, అహోబిలం, రుద్రవరం మండలాల్లో పీపుల్స్వార్ అప్పట్లో కార్యక లాపాలను కొనసాగించింది. అప్పట్లో ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళరెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డిని మావోయిస్టులు హతమార్చారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్, అగ్రనేతలు శాఖమూరి అప్పారావు, మాట్టా రవికుమార్లు ఎన్కౌంటర్లో బలయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టులు నల్లమల నుంచి ఏఓ బీ, చత్తీస్ఘడ్కు మకాం మార్చారు. మావోల రిక్రూట్మెంట్: ప్రస్తుతం నల్లమల అటవీపరిధిలోని మహ బూబ్నగర్, కర్నూలు జిల్లాలో మావోయిస్టుల రిక్రూట్మెంట్ భారీగా జరుగుతున్నట్లు విశ్వనీయ సమాచారం. రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయినా మావోలు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో న ల్లమల అటవీ పరిధిలోని అన్ని జిల్లాల్లో వీరు తమ రిక్రూట్మెంట్ కార్యక్రమాలు అధికం చేసి కేడర్ బలపరుచుకుంటున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ల కేంద్రంగా ఆత్మకూరు డివిజన్: ఆత్మకూరు డివిజన్లో 2002లో భానుముక్కుల మలుపు వద్ద తొలి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో వడ్లరామాపురం గ్రామానికి చెందిన లింగస్వామి మృతి చెందారు. అలాగే 2003లో బావాపురం గ్రామం వద్ద శ్రీధర్, 2004లో నల్లకాలువ సమీపంలో వేణు అనే మావోలు మృతి చెందారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మావోల కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో మావోల కార్యకలాపాలు ఏమీ లేవని పోలీసు వర్గాలు పేర్కొంటున్నా.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్తో వారు అప్రమత్తమయ్యారు. -
నల్లమలలో మావోయిస్టులు లేనట్లేనా?
యర్రగొండపాలెం : నల్లమల అడవుల్లో మావోయిస్టులు దాదాపూ లేన ట్లేనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మండలంలోని పాలుట్లకు సమీపంలో మోకాళ్ల కురువ వద్ద గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. జానాబాబూరావు, విమల, నిర్మలతో పాటు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన విక్రమ్లు నల్లమలలో మావోయిస్టు ఉద్యమం నిర్వహిస్తున్నారు. వీరు గుంటూరు, ప్రకాశం, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటి స్తూ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్కౌంటర్లో విక్రమ్ బుల్లెట్ గాయంతో తప్పించుకుపోగా మిగిలిన ముగ్గురూ హతమయ్యారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని ఆరు జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపూ నిలిచిపోయినట్లయిందనిపోలీసు అధికారులు భావిస్తున్నారు. = 2001లో యర్రగొండపాలెం పోలీసుస్టేషన్పై దాడి సంఘటనలో ఒక మావోయిస్టు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. = 2001 జూన్ 17న యర్రగొండపాలెం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పాలకూరి సైదులు హతమయ్యాడు. = 2002 ఆగస్టు 1న యర్రగొండపాలెం మండలం ఆలాటం కోట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మహబూబ్నగర్, ప్రకాశం జిల్లాల కమాండర్ గుడ్డి శేషన్న హతమయ్యాడు. = 2003 జూలై 3వ తేదీన యర్రగొండపాలెం మండలం పాలుట్ల వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నాగమణి అనే మహిళ మావోయిస్టు మృతి చెందింది. = 2003 జూలై 4వ తేదీన యర్రగొండపాలెం మండలం నెక్కంటి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళ మావోయిస్టు మృతి చెందింది. = 2004 ఏప్రిల్ 17న అర్ధవీడు మండలం యాచారం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు మూగన్న, బయ్యన్నలు హతమయ్యారు. = 2005 జనవరి 6వ తేదీన యర్రగొండపాలెం మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో సింగా కృష్ణయ్య హతమయ్యాడు. = 2005 జనవరి 8వ తేదీన రాచర్ల మండలం గంజివారిపుల్లలచెరువు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు లతక్క హతమైంది. = 2005 జూలై 28న చీమకూర్తి మండలం దేవరపాలెం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో డెంగూ శ్రీను హతమయ్యాడు. = 2005 డిసెంబర్ 10వ తేదీన పుల్లలచెరువు మండలం మర్రివేముల వద్ద జరిగిన ఎన్కౌంటర్లో కుంకూరి వెంకటేశ్వర్లు, వింజమూరి మరియమ్మలు హతమయ్యారు. = 2005 ఏప్రిల్ 20న పుల్లలచెరువు మండలం మర్రివేముల వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టులు వంసంత, సునీతలు హతమయ్యారు. = 2006 ఏప్రిల్ 30వ తేదీన దోర్నాల మండలం పెద్దారూట్లవద్ద జరిగిన ఎన్కౌంటర్లో గాదే శ్రీను, అతని భార్య మృతి చెందారు. = 2006 మే 21వ తేదీన అర్ధవీడు మండలం మాగుటూరి తండా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మహిళ మావోయిస్టు చంద్రకళ హతమైంది. = 2006 ఫిబ్రవరి 5న రాచర్ల మండలం నెమలిగుండ్లరంగస్వామి ఆలయం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు ఈశ్వరమ్మ, రంగయ్య, ఆంజనేయులు హతమయ్యారు. = 2006 మే 17న అర్ధవీడు మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు షేక్ మీరాంబీ మృతి చెందింది. = 2006 జూన్ 16వ తేదీన పుల్లలచెరువు మండలం పీఆర్సీ తండా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో కేంద్రకమిటీ సభ్యుడు మట్టా రవికుమార్ హతమయ్యాడు. = 2006 జూన్17న రాచర్ల మండలం సంగంపేట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నారాయణనాయక్, బోయ స్వర్ణ, చాకలి ఆదెమ్మలు మృతి చెందారు. = 2006 జూలై 3న యర్రగొండపాలెం మండలం యక్కంటి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్ర కార్యదర్శి మధవ్తో పాటు మరో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. = 2007 జూలై 22న పుల్లలచెరువు మండలం రాచకొండవద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కిరణ్ హతమయ్యాడు. = 2009 జనవరి 17వ తేదీన పుల్లలచెరువు మండలం మల్లపాలెం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు గోవిందనాయక్ హతమయ్యాడు. = 2009 ఫిబ్రవరి 24న పెద్దారవీడు మండలం చింతలముడిపి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో సండ్రపాటి ప్రసాద్, గుమ్మళ్ల వెంకటేశ్వర్లు, యనిమా, శాంతిలు చనిపోయారు. = 2010 మార్చి 12న పుల్లలచెరువు మండలం మురికిమళ్లవద్ద వద్ద జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు హతమయ్యాడు. = 2007లో పుల్లలచెరువు మండలం అక్కపాలెంవద్ద జరిగిన ఎన్కౌంటర్లో చంద్రవంక దళ కమాండర్ సునీల్, అతని భార్య హతమయ్యారు. మవోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నేడు యర్రగొండపాలెం : నల్లమలలో పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురి మావోయిస్టుల మృతదేహాలకు మార్కాపురం ఏరియా ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. జానాబాబురావు అలియాస్ అశోక్ అలియాస్ చక్రవర్తి, విమల అలియాస్ భారతి, నిర్మల అలియాస్ లలిత మృతదేహాలను భారీ బందోబస్తు నడుమ ఆస్పత్రికి తెచ్చేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు శుక్రవారం వేకువ జామునే మోకాళ్ల కురువకు తరలి వెళ్లారు. అక్కడి నుంచి మృతదేహాలను కృష్ణానది ఒడ్డుకు చేర్చి లాంచీల్లో కర్నూలు జిల్లా లింగాల గట్టు వద్దకు తీసుకెళ్తారు. తొలుత సుండిపెంట వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించాలని భావించిన పోలీసులు.. చివరి క్షణంలో తమ నిర్ణయాన్ని మార్చుకుని మృతదేహాలను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలిస్తున్నారు. రాకెట్ లాంచర్ల ప్రయోగం ఇక్కడి నుంచే.. మావోయిస్టులు తయారు చేసిన రాకెట్ లాంచర్లను ఈ ప్రాంతం నుంచే ప్రయోగించారు. లాంచర్లు తయారైన తర్వాత మావోయిస్టు నాయకుడు టెక్ మధును బెంగళూరులో పట్టుకున్నారు. అందులో 98శాతం లాంచర్లు యర్రగొండపాలెం ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పుల్లచెరువు మండలం శతకోడువద్ద రాకెట్ లాంచర్ల డంపు, పాతచెరువు తండా వద్ద మరో డంపును పోలీసులు పట్టుకున్నారు. ఈ లాంచర్లను దేశంలో మొట్టమొదటి సారిగా గుంటూరు జిల్లా దుర్గి పోలీస్స్టేషన్పై ప్రయోగించారు. ఆ లాంచర్ గురితప్పి పక్కన పడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
ఎదురు కాల్పులా..? ఎన్కౌంటరా..?
యర్రగొండపాలెం: నల్లమల అడవిలో మావోయిస్టులు హతమైన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం యర్రగొండపాలెం మండలంలోని పాలుట్లకు సమీపంలో మోకాళ్లకురువ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు జానాబాబూరావు, విమల, నిర్మలలు హతమయ్యారు. పోలీసులు అడవిలో కూంబింగ్ జరుపుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురపడి కాల్పులు జరిపారని, చేసేదిలేక తమ పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని గుంటూరు ఐజీ సునీల్కుమార్ ప్రకటించారు. ఈ ప్రకటనలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియడం లేదు. = గుంటూరు జిల్లాకు చెందిన పోలీసు ప్రత్యేక దళాలు అడవిలోని సుదూర ప్రాంతంలో కూబింగ్ ఎందుకు జరిపారో అర్థం కావడం లేదు. సమాచారం మేరకు అక్కడికి వచ్చి కూబింగ్ నిర్వహించి ఉండవచ్చు. = పోలీసులు చెప్పినట్లు ఎదురు కాల్పులు జరిపిన ప్రాంతం ప్రకాశం జిల్లాలోనిది. కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాలతో ఈ ప్రాంతానికి దగ్గరి సంబంధం ఉంది. అటువంటిది ఈ జిల్లాల పోలీసులు స్పందించకుండా గుంటూరు జిల్లాకు చెందిన పోలీసులు స్పందించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. = ఎదురుకాల్పుల సమయంలో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మావోయిస్టు విక్రమ్ తప్పించుకొని పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. కూంబింగ్ సమయంలో పోలీసు ప్రత్యేక దళాలు సహజంగా వలయంగా ఏర్పడతాయి. ఇటువంటిది విక్రమ్ తప్పించుకునే అవకాశం ఎలా వచ్చిందో అర్థం కావడంలేదు. = అసలు విక్రమ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులను ముందుగానే పట్టుకొని ఆ తరువాత ఎన్కౌంటర్ చేసి ఉంటారన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. = ఈ అనుమానాలు కర్నూలు జిల్లా సున్నిపెంట ప్రాంతానికి చెందిన వారుకూడా వ్యక్తం చేస్తున్నారు. = 3, 4 నెలల నుంచి హతమైన మావోయిస్టులు సున్నిపెంటకు సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న వజ్రాలమడుగు వద్ద తలదాచుకునేవారని తెలిసింది. = వీరితోపాటు ఉంటున్న విక్రమ్ అనే మావోయిస్టు సాధారణ దుస్తుల్లో సంచరిస్తుండేవాడని, లింగాలగట్టు వద్దకు వచ్చి తమకు కావలసిన నిత్యావసర వస్తువులను తీసుకెళ్లేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు వారిని ముందుగా క స్టడీలోకి తీసుకొని ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ అధికారులపై జరిగిన దాడులతో సంబంధం ఉందా? కృష్ణానది పరివాహక ప్రాంతంలో చేపలు పట్టుకునే మత్స్యకారులపై గతనెల 29న యర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లె బీట్కు చెందిన అటవీ అధికారులు దాడులు నిర్వహించారు. మత్స్యకారులు చేపలు పట్టుకోకుండా నెక్కంటివాగులో నుంచి అడవిలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడటం, చెట్లను నరికి కలపను కృష్ణానది నుంచి అక్రమంగా తరలించడం లాంటివి చేస్తున్నారన్న ఆరోపణలపై అటవీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సమయంలో మత్స్యకారులు అటవీ అధికారులపై తిరుగుబాటు చేసి దాడి చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. అటవీ సిబ్బందిపై మత్స్యకారులు జరిపిన దాడులకు మావోయిస్టుల ఎన్కౌంటర్కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. = హతమైన మావోయిస్టులకు కొంతకాలం నుంచి మత్స్యకారులతో సంబంధం ఉన్నట్లు సమాచారం. మావోయిస్టులు రెచ్చకొట్టడం వల్లనే మత్స్యకారులు అటవీ సిబ్బందిపై దాడులకు దిగి ఉండవచ్చన్న అనుమానం లేకపోలేదు. మత్స్యకారులపై అటవీశాఖ సిబ్బంది యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మత్స్యకారులు మావోయిస్టులు తలదాచుకునే స్థావరాన్ని పోలీసులకు సమాచారం అందించి ఉంటారన్నా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మత్స్యకారులకు పోలీసులు డబ్బులు ఎందుకిచ్చారు? అటవీ సిబ్బంది దాడులు నిర్వహించి తమ జీవన భృతికి ఉపయోగపడే ఖరీదైన వలలు, బుట్ట పడవలు, గుడారాలు ధ్వంసం చేశారని మత్స్యకారులు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో నష్ట పరిహారం కింద పోలీసులు మత్స్యకారులకు పెద్ద మొత్తంలో సహాయం చేశారు. ఈ సహాయం ప్రకాశం జిల్లాకు చెందిన పోలీసులు, అటవీశాఖాధికారులు కాకుండా కర్నూలు జిల్లాకు చెందిన పోలీసులు ఎందుకు చేశారో అర్థంకావడంలేదు. కర్నూలు ఓఎస్డీ ఇటీవల కాలంలో * 50 వేలు సహాయాన్ని అందజేశారు. పరిస్థితులను బట్టి చూస్తే మత్స్యకారులను పోలీసులు ఇన్ఫార్మర్లుగా ఉపయోగించుకొని మావోయిస్టులను పట్టుకొని ఉండవచ్చని తెలుస్తోంది. -
నల్లమలలో ఎన్కౌంటర్
ముగ్గురు మావోయిస్టుల మృతి బుల్లెట్ గాయాలతో పారిపోయిన మరో సభ్యుడు సాక్షి, ఒంగోలు: నల్లమల అడవుల్లో మళ్లీ తుపాకులు పేలాయి... పోలీస్ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్లకు ఏడుకిలోమీటర్ల దూరానున్న మురారికురవ అడవిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో మావోయిస్టు జానా బాబూరావుతోపాటు మరో ఇద్దరు మహిళలు విమల, భారతి ఉన్నారు. మరో సభ్యుడు విక్రమ్ తప్పించుకున్నట్లు తెలిసింది. పక్కా సమాచారంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల క్యాట్పార్టీ, ఏఎన్ఎస్ పోలీసు బృందాలు కలిసి ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. సుమారు అర్ధగంటపాటు సాగిన కాల్పుల్లో మావోయిస్టు సభ్యులు ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఘటనాస్థలంలో నాలుగుకిట్లుతోపాటు ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఏకే 47, కొన్ని విప్లవసాహిత్య పుస్తకాలు దొరకడంతో.. మరో సభ్యుడు విక్రమ్ కాలికి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్కేకు సన్నిహితుడు మావోయిస్టు పార్టీలో కొరియర్గా ప్రారంభమైన జానా బాబూరావు ప్రస్తుత కేంద్రకమిటీ అగ్రజుడైన ఆర్కేకు అత్యంత సన్నిహితుడుగా పేరుంది. నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన జానా బాబూరావు రెండేళ్ల కిందటే మావోయిస్టు పార్టీ నుంచి బయటకువచ్చినట్లు ప్రకటించినా.. పోలీసులకు మాత్రం లొంగలేదు. అతన్ని పట్టుకునేందుకు గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పోలీసులు దాదాపు 15 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. గతంలో ఇద్దరు మహిళా మావోయిస్టులను వివాహం చేసుకున్న బాబూరావు తాజాగా మహబూబ్నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం, మందవాగిపల్లెకు చెంది న నాగమణి అలియాస్ భారతిని వివాహమాడారు. ఆమెతో పాటు విమలను కూడా తోడుచేసుకుని నల్లమలలోనే సంచరిస్తున్నారు. ఆయనపై రూ. 5 లక్షల పోలీ సు రివార్డు ఉంది. నల్లమల ఫారెస్టు డివిజన్ కమిటీ కార్యదర్శిగా, చాంద్రాయణగిరి డివిజన్ కమిటీ కార్యదర్శిగా బాబూరావు కొనసాగుతున్నట్టు తెలిసింది. -
నెత్తురోడిన నల్లమల.. ముగ్గురు మావోయిస్టుల మృతి
చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న నల్లమల అడవుల్లో మళ్లీ తుపాకీ కాల్పుల మోత వినిపించింది. మావోయిస్టులు- పోలీసుల ఎదురు కాల్పులతో నల్లమల అడవి మార్మోగింది. గుంటూరు- ప్రకాశం జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులను విమలక్క, జానా బాబురావు, సారథిగా అనుమానుమనిస్తున్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో శతకోటిలో ఈ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటన స్థలం నుంచి ఏకే-47, ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, కార్బన్ ఆయుధాలు లభ్యం, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు మావోయిస్టు నేతలు సంఘటన స్థలం నుంచి తప్పించుకున్నట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇదే తొలి ఎన్కౌంటర్ కావడం గమనార్హం. -
నల్లమలలో నకిలీ పోలీసులు.. యువ జంటలే టార్గెట్
కర్నూలు : నల్లమల అభయారణ్యంలో నకిలీ పోలీసులు హల్చల్ సృష్టిస్తున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్న మఫ్టీలో ఉన్న పోలీసుల్లా యాత్రికులను బెదిరించి దారిదోపిడీకి పాల్పడుతున్నారు. ప్రేమికుల ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ నగదు, బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు. పోలీసుల పేరిట సాగుతున్న ఈ దందాతో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో మిన్నకుండిపోతున్నారు. ఒకరిద్దరు మాత్రం మీడియా, పత్రికా ప్రతినిధులకు ఫోన్ చేసి తమ గోడు వినిపిస్తున్నారు. అయితే ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. యువ జంటలే టార్గెట్ ఆదివారం అనంతపురం నుంచి ఓ కుటుంబం శ్రీశైలం వెళ్లేందుకు కారులో వచ్చింది. ఆత్మకూరు చేరుకున్న ఆ కుటుంబం సాయంత్రం 5 గంటలకు వైఎస్సార్ స్మృతివనం చేరుకున్నారు. నకిలీ పోలీసులు వీరు ప్రయాణిస్తున్న కారును ఆపి లెసైన్స్, ఆర్సీ పుస్తకం అడిగారు. లెసైన్స్, ఆర్సీ చూపినా.. రకరకాల ప్రశ్నలు వేసి తమ నుంచి రూ. 7 వేలు వసూలు చేసినట్లు ఆ కుటుంబ యజమాని వాపోయారు. నకిలీ పోలీసుల ఆగడాలను భరించలేక ఒకసారి వచ్చిన వారు తిరిగి ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ఆసకి చూపడంలేదు. శ్రీశైలం, మహానంది క్షేత్రాల దర్శనార్థం రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో అధికశాతం ఆత్మకూరు సమీపంలోని వైఎస్సార్ స్మృతివనాన్ని సందర్శిస్తున్నారు. రోజూ వందలాది మంది వస్తుండటంతో కొందరు యువకులు పోలీసులమని చెప్పి పథకం ప్రకారం దారిదోపిడీ చేస్తున్నారు. 15 నుంచి 20 మంది యువకులు మూడు గ్రూపులుగా ఈ దందా కొనసాగిస్తున్నారు. నల్లమల మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసుల నిఘా ఉంటుంది. ఎక్కువ మంది మఫ్టీలోనే తిరుగుతుంటారు. పోలీసుల కదలికలను గమనించిన కొందరు యువకులు మఫ్టీలో ఉన్న పోలీసుల మాదిరి వారి హావభావాలతో తిరుగుతూ హంగామా చేస్తున్నారు. వారం క్రితం హైదరాబాద్ నుంచి కొత్తగా వివాహం చేసుకున్న జంట వైఎస్సార్ స్మృతివనం చూసేందుకు వచ్చారు. గమనించిన నకిలీ పోలీసులు వారిని వెంబడించారు. వీరు సరదాగా గడిపిన దృశ్యాలను ఫొటోలు, వీడియో తీశారు. ఆ తర్వాత వాటిని చూపి బెదిరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దారికి రాకపోవడంతో వీడియోలు యూటూబ్లో పెడతామని బెదిరించారు. దీంతో చేసేది లేక వారి వద్దనున్న బంగారు ఆభరణాలను తీసిచ్చి హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఆ జంట హైదరాబాద్ నుంచి సాక్షి ప్రతినిధికి ఫోన్ చేసి తమ గోడు వినిపించారు. గతంలోనూ ఓ కళాశాలకు చెందిన కొందరు నల్లమల అందాలు చూసేందుకు వచ్చారు. వారి ఫొటోలను తీసి అల్లరి చేశారు. దీంతో వారు చేసేది లేక వారి వద్దనున్న సెల్పోన్లను, నగదు ఇచ్చేసి ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా ఒకటి కాదు.. అనేకం నల్లమల ప్రాంతంలో చోటు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయం నల్లమల అటవీ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. యాత్రికులుగా వస్తున్న యువతీ యువకులు కొందరు ఈ ప్రాంతంలో మద్యం సేవిస్తూ జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. వీరిని చూసి నిజమైన యాత్రికులు, భక్తులు ఇటువైపు వచ్చేందుకు జంకుతున్నారు. వన్యప్రాణుల వేట సాగిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. జింకలు, అడవి పందులను వేటాడి ఇక్కడే వంట చేసుకుని విందు చేసుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు. -
పులుల మనుగడకు ప్రత్యేక చర్యలు
రుద్రవరం, న్యూస్లైన్ : నల్లమల్ల అడవిలో పులుల మనుగడ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా స్క్వాడ్, నంద్యాల ఇన్చార్జ్ డీఎఫ్ఓ చంద్రశేఖర్ తెలిపారు. చాగలమర్రి, అహోబిలం, రుద్రరవం అటవీ కార్యాలయాల సమీపంలోని బేస్ క్యాంపులు, చెక్ పోస్టులను సోషల్ ఫారెస్టు నర్సరీ, రుద్రవరం కార్యాలయ సమీపంలోని మరో నర్సరీని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఫారెస్టు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండ్ల బ్రహ్మేశ్వరం అడవి నుంచి రుద్రరవం మీదుగా తిరుపతి వరకు అడవిని కారిడార్గా గుర్తించాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు తెలిపారు. నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాల ద్వారా ఎనిమిది, పాదముద్రల ద్వారా మరో నాలుగు పెద్ద పులులున్నట్లు గుర్తించామన్నారు. వీటి మనుగడ కోసం రుద్రవరం, చెలిమా రేంజిలను కారిడార్లుగా గుర్తించి అడవిలోకి ఎవ రూ ప్రవేశించకుండా చర్యలు తీసుకునే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. నంద్యాల అటవీ డివిజన్ పరిధిలోని చెలిమా రేంజిలో 10 హెక్టార్లు, రుద్రవరం రేంజి పరిధిలో 30, బండి ఆత్మకూరు రేంజిలో 10 హెక్టార్లలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రశేఖర్ చెప్పారు. ఇందుకోసం నారవేపి, ఎర్రచందనం, ఊసరి, నల్లమద్ది, ఎగిసా, జుట్టేగా, రోజ్హుడ్ తదితర మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయన వెంట రేంజర్ రాంసింగ్, డీఆర్ఓ సౌదర్యరాజు, సెక్షన్ ఆఫీసర్లున్నారు. -
నల్లమలలో పర్యాటక కేంద్రాలు
ఆత్మకూరురూరల్, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నల్లమలలో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్.ప్రభాకర్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆత్మకూరు అటవీ పరిధిలోని రుద్రకోడు క్షేత్రం, స్మృతివనం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి అయిన నల్లమలలో ఎకో ఫ్రెండ్లీ టూరిజంను ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ ముందుకు వచ్చిందన్నారు. అందులో భాగంగానే రెండు రోజుల పాటు స్థలాలను పరిశీలించామన్నారు. అయితే ఇవన్నీ పర్యాటక శాఖ అనుమతులతోనే నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటి ఏర్పాటు కోసం జిల్లాకు ఎస్టీ సబ్ప్లాన్లో భాగంగా కోటి రూపాయలు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో ఆత్మకూరు ప్రాంతంలోని స్మృతివనం, రుద్రకోడు క్షేత్రం, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం, శ్రీశైలం ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పర్యాటక శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పర్యాటక ప్రదేశాల వివరాలు తెలిపేందుకు గైడ్లను నియమిస్తామన్నారు. స్మృతివనం పరిసర ప్రాంతాల్లోని సర్వే నెంబర్ 563లోని ఆరు ఎకరాల స్థలంలో పది గృహాలు, ఒక డార్మెటరీ నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం కర్నూలు నుంచి రోళ్లపాడు మీదుగా రుద్రకోడు, స్మృతివనం ప్రాంతాలను చూపిస్తామన్నారు. విద్యార్థులను బాగా చదివించండి: ఐటీడీఏ పీఓ చెంచులు తమ పిల్లలను బాగా చదివించాలని ఐటీడీఏ పీఓ ప్రభాకర్రెడ్డి సూచించారు. రుద్రకోడు గూ డెంలో పర్యటించిన ఆయన చెంచులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరి శీలించి స్వయం సహాయక సంఘాల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీఓ మురళీధర్, ఐటీడీఏ స్పెషలాఫీసర్ కేజీ.నాయక్ పాల్గొన్నారు.