Rajiv Vidya Mission
-
బడా వస్త్రవ్యాపారులకే వత్తాసు
అధికారుల తీరు సరికాదు ► చున్నీ వస్త్రం కొనుగోళ్లలో పక్షపాతం ► మ్యాక్స్ సంఘాలకు చెప్పకుండానే నిర్ణయం ► ఒకే వస్త్రవ్యాపారిపై జౌళిశాఖ అమిత ప్రేమ ఏమిటి? ► జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగిన నేతకార్మికులు సిరిసిల్ల : చేనేత, జౌళిశాఖ అధికారులు వస్త్రం కొనుగోళ్లలో బడా వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని నేతకార్మికులు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వస్త్రం కొనుగోళ్ల గోదాం వ ద్ద ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులకు యూ నిఫామ్స్ అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ద్వారా నేతకార్మికుల నుంచి 1.14 కోట్ల మీటర్ల వ స్రా్తన్ని చేనేత జౌళిశాఖ అధికారులు కొనుగోలు చేశారని తెలిపారు. ఇందులో బాలికలకు అవసరమైన ఓనీ(చు న్నీ) బట్ట సుమారు 51వేల మీటర్లు తక్కువ పడడంతో మళ్లీ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చిందన్నారు. కానీ, సంఘాలకు సమాచారం ఇవ్వకుండా ఓ ప్రముఖ వస్త్రవ్యాపారి ఒక్కరికే అవకాశం ఇవ్వడం ఏమిటని మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులు ప్రశ్నించారు. ఒక్కో మీటర్ ఓనీ వస్రా్తనికి రూ.31 చెల్లిస్తున్నారని, ఈ లెక్కన 51 వేల మీటర్ల వస్రా్తన్ని రూ.15.81 లక్షలతో కొనుగోలు చేస్తున్నారని అన్నా రు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అయిన ఆ వస్త్రవ్యాపారి వద్దనే ఓనీ బట్టను కొనుగోలు చేయడం సరికాదన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆసాములు కోరారు. ఈసందర్భంగా గోదాములో వస్త్రం కొనుగోళ్లను అడ్డుకున్నారు. మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులు మంచికట్ల భాస్కర్, చిమ్మని ప్రకాశ్, పోలు శంకర్, మూషం రాజయ్య, వెల్దండి శంకర్, గౌడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ చెప్పాం.. ఎవరూ స్పందించలేదు – వి.అశోక్రావు, చేనేత, జౌళిశాఖ ఏడీ ఓనీ వస్త్రం ఉత్పత్తి చేయాలని మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులదరికీ చెప్పాం. ఎవరూ స్పందించలేదు. కొన్ని సంఘాల ద్వారా కొనాలని భావించాం. కానీ 51 సంఘాలకు ఈఆర్డర్లు ఇస్తే ఒక్కో సంఘం వెయ్యి మీటర్లు ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. అవుతుంది. ఒక్క బీము రెండు వేల మీటర్లు ఉంటుంది. ఎవరికీ సరిగా పని సాధ్యం కాదు. ఇప్పటి వరకు 20వేల మీటర్ల ఓనీ బట్టను కొన్నాం. ఇంకా ఎవరైనా ఇస్తే కొనుగోలు చేస్తాం. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. -
ఆర్వీఎం నిధులు వెనక్కి
నిలిచిన టాయ్లెట్ల నిర్మాణం మోర్తాడ్: రాజీవ్ విద్యా మిషన్ (సర్వ శిక్ష అభియాన్) కింద పాఠశాలలకు కేటాయించిన నిధులను రాష్ట్ర విద్యాశాఖ వెనక్కు తీసుకుంది. దీంతో పాఠశాలల్లో ప్రతిపాదించిన టాయ్లెట్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. విద్యార్థులకు ఒంటికి, రెంటికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఆర్వీఎం ద్వారా కేటాయించిన నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ యోగితారాణా గతంలో ఆదేశించారు. దీంతో మూడు నెలల కింద టాయ్లెట్ల నిర్మాణాలకు అధికార యంత్రాంగం పాఠశాలలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయ్లెట్ల సంఖ్య పెంచాలని.. ఒక్కో పాఠశాలలో ఎనిమిది నుంచి 15 వరకు టాయ్లెట్లు నిర్మించాలని నిర్ణయించారు. జిల్లాలో 267 ఉన్నత, 144 ప్రాథమికోన్నత, 804 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో టాయ్లెట్ల నిర్మాణం అవసరం లేదు. అయితే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ముఖ్యంగా మారుమూల గ్రామాలలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో టాయ్లెట్ల నిర్మాణం అత్యవసరమైంది. ఒక్కో పాఠశాలకు రూ.1.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ఆర్వీఎం నిధులను కేటాయించారు. అయితే రాష్ట్ర విద్యాశాఖ గత నెలలో పాఠశాల ఖాతాల్లో నిలువ ఉన్న అన్ని రకాల నిధులను వాపసు తీసుకుంది. ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, టాయ్లెట్ల నిర్మాణం కోసం జిల్లా అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వడం, రాష్ట్ర విద్యాశాఖ నిధులను వాపసు తీసుకోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నిధులు వెనక్కు వెళ్లడంతో నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా నిలిపి వేశారు. నిర్మాణాలు పూర్తయిన తరువాత బిల్లులు చెల్లించడానికి నిధులు రాకపోతే తమకు ఇబ్బందిగా ఉంటుందని కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో నిర్మాణాలు సగం దశలో ఉండగా పనులను నిలిపి వేయగా మరికొన్ని పాఠశాలల్లో ఇసుక, కంకర పోయించి గుంతలు తవ్విన తరువాత పనులు నిలిపి వేశారు. -
ఖర్చు చేశారు... లెక్కచెప్పరు
శ్రీకాకుళం: శ్రీకాకుళం రాజీవ్ విద్యా మిషన్(ప్రస్తుత సర్వశిక్షా అభియాన్)లో నిధుల ఖర్చుకు సంబంధించి ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా గత అధికారులు ఇప్పటికీ లెక్కలు చెప్పడం లేదు. గత పీవో రామచంద్రారెడ్డి, అప్పటి ఇన్చార్జి ఎఫ్ఏఓ, ప్రస్తుత అసిస్టెంట్ ఎఫ్ఏఓ అయిన సురేష్ రూ. 2.5 లక్షలను సొంతం పేరిట విత్డ్రా చేసి వాటికి తగిన బిల్లులు సమర్పించకపోవడంతో ఆడిట్ అధికారులు కొద్ది నెలల క్రితం అభ్యంతరం తెలిపారు. దీనిపై తక్షణం బిల్లులు సమర్పించాల్సి ఉండగా ఇప్పటివరకు అటువంటి దాఖలాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా శిక్షణకు గాని, మరేదైనా పనులకు గాని నిధులను సొంతం పేరిట విత్డ్రా చేసి, అటు తర్వాత బిల్లులను సమర్పించుకునే సౌలభ్యం ఆర్వీఎంలో ఉంది. దీనిని వినియోగించుకునే వీరిద్దరూ నిధులను విత్డ్రా చేశారు. అయితే ఇప్పటికీ లెక్కలు చెప్పకపోవడం పలువురి సందేహాలకు కారణమైంది. అప్పటి పీవో రామచంద్రారెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఓ సమావేశానికి ఇతడు పూర్తి సమాచారంతో రాలేదన్న కారణంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాతృ శాఖకు సరెండర్ చేసిన విషయం పాఠకులకు విదితమే. అయితే ఏ కారణంగానో తెలియకపోయినా మంత్రి ఆదేశాలు సుమారు రెండు నెలలు అమలుకు నోచుకోలేదు. ఈ రెండు నెలల్లో మరిన్ని ఆరోపణలు రావడంతో కలెక్టర్ రిలీవ్ చేసేశారు. అప్పట్లో ఎఫ్ఏఓగా పనిచేసిన రాజు మాతృ సంస్థకు వెళ్లిపోవడంతో సురేష్ ఇన్చార్జి ఎఫ్ఏఓగా వ్యవహరించారు. ఈ సమయంలోనే రూ. 2.5 లక్షలు విత్డ్రా చేశారు. ఈ మొత్తంతో కేజీబీవీ సిబ్బంది, ఎంఐఎస్ కోర్డినేటర్లకు శిక్షణ ఇచ్చినట్టు మౌఖికంగా చెబుతున్నా బిల్లులు మాత్రం దాఖలు చేయలేదు. ఆడిట్ అధికారుల అభ్యంతరం తర్వాత కూడా బిల్లులు దాఖలుకు ప్రయత్నాలే జరగలేదు. ఈ కారణంగానే పలువురు వ్యక్తం చేస్తున్న అనుమానాలను బలం చేకూరుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రస్తుత ఆర్వీఎం అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారనే ఆక్షేపణలు వినిపిస్తున్నారుు. ఇదే శాఖలో అసిస్టెంట్ ఎఫ్ఏఓగా పనిచేస్తున్న సురేష్కు ఇప్పటికి రెండు మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాగా సురేష్ను ప్రస్తుత పీఓ కూడా సుమారు 6 నెలల పాటు రాష్ట్ర అధికారుల ఉత్తర్వులు కాదని ఇన్చార్జి ఎఫ్ఏఓగా కొనసాగించడం, ఎఫ్ఏఓగా రాష్ట్ర అధికారుల ద్వారా నియమించబడిన మోహనరావును విధుల్లో చేర్చుకోకుండా గాలిలో ఉంచడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తక్షణం యూసీలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్వీఎం పీఓ త్రినాథరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా రెండు రోజుల క్రితమే యూసీలు ఇచ్చారన్నారు. యూసీలు ఇవ్వకపోవడంతో గతంలో ఆడిట్ అభ్యంతరం చెప్పడం నిజమేనని తెలిపారు. -
బడి బాట.. కాలి బాటే..!
- అరకొరగా రవాణా భత్యం - గతేడాది విద్యార్థులకే అందలేదు - ఈ ఏడాది ఇంకా ఊసేలేదు - తెరపైకి వచ్చిన సైకిళ్ల పంపిణీ..! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశిం చిన బడిబాట పథకం అమలులో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆర్థిక భారం కారణంగా దూరప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు మధ్యలో బడి మానకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి రవాణాభత్యం అందజేస్తోంది. అయితే, ఏటా అరకొర కేటాయింపులు, నామమాత్రపు పంపిణీతో విద్యాశాఖ నెట్టుకోస్తోంది. గతేడాది నిధులు విడుదలై విద్యాసంవత్సరం గడిచినా విద్యార్థులకు రవాణా భత్యం అందలేదు. అయితే, రవాణా భత్యం సొమ్ముతో సైకిళ్లు కొనుగోలు చేద్దామనే రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారుల ఆలోచనకు ఇంతవరకు క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. అంతేకాక రవాణాభత్యం పంపిణీ పారదర్శకంగా జరగడానికి విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో నేరుగా భత్యం సొమ్ము వేద్దామనే ఆలోచనకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల సొమ్ము రాజీవ్ విద్యామిషన్ ఖాతాలో మూలుగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో ని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ల్లో వందలాది మంది విద్యార్థులకు భత్యం అంద క చదువులు భారంగా సాగుతున్నాయి. ఈ ఏడాదైనా మొత్తం ఇచ్చేరా.... తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ అధికారులు సెప్టెంబర్లోనే రూ. 2 కోట్ల వరకు సొమ్ము విడుదల చేశారు. కానీ విద్యాసంవత్సరం పూర్తయినా విద్యార్థులకు ఇప్పటి వరకు భత్యం మాత్రం అందలేదు. నిజామాబాద్ జిల్లాలో గతేడాది 480 విద్యార్థులకు రూ.10.01 లక్షల సొమ్ము రావాలి. అలాగే 2012-13 సంవత్సరంలో 143 మందికి, 2013-14 , 2014 సంవత్సరానికి 191 మందికి ఒక్కొక్కరికి రూ.300 చొప్పున 10 నెలల భత్యం అందింది. జిల్లాలో మారుమూల గ్రామాల్లో అర్హులైన విద్యార్థులకు అందలేదు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది 213 పాఠశాలలకు చెందిన 2,672 మంది విద్యార్థులకు అందాల్సి ఉంది. జిల్లాకు రూ.80 లక్షలు విడుదలైనా రాజీవ్విద్యామిషన్ ఖాతాలో మూలుగుతున్నాయి. 2013-14కు సంబంధించి ఈ జిల్లాలో నిధులు విడుదల చేయలేదు. కరీంనగర్ జిల్లాలో 723 మంది విద్యార్థులకు గత విద్యాసంవత్సర భత్యం అందించాల్సి ఉంది. దీనికిగాను జిల్లాకు రూ. 21.69 లక్షలు విడుదలయ్యాయి. కానీ, ఇంత వరకు విద్యార్థుల ఖాతాలలోకి చేరలేదు. సైకిళ్ల పంపిణీ పేరుతో జరుగుతున్న జాప్యం ఉన్నత తరగతుల విద్యార్థులకు ప్రయాణ భత్యం కింద వచ్చే నిధులతో సైకిళ్లను అందించాలని ఐదు నెలల క్రితం రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులు నిర్ణయించారు. కానీ వాటికి ఇంతవరకు అతీగతీలేదు. -
రా...రా...రాజీవ్ విద్యామిషన్
శ్రీకాకుళం టౌన్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన రాజీవ్ విద్యామిషన్లో లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది. అధికారుల ఆగడాలు శ్రుతి మించడంతో మహిళా ఉద్యోగులు ధైర్యం చేసి ముందుకు వచ్చారు. ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరవు పెట్టారు. తమను లైంగిక వేధింపుల నుంచి విముక్తుల్ని చేయాలంటూ వారు కలెక్టరు లక్ష్మీనృసింహాన్ని వేడుకున్నారు. వివరాలు పరిశీలిస్తే.. రాజీవ్ విద్యామిషన్, ప్రాజెక్టు పరిధిలో చాలాకాలంగా కొందరు ఉద్యోగులు పాతుకుపోయారు. వారు చెప్పిందే వేదమక్కడ. ఆఖరుకు పీవోను సైతం తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తురన్నారనే ఆరోణలున్నాయి. ఈ శాఖలో అవుట్సోర్సింగ్ విభాగంలో మహిళలు ఎక్కువ. వీరిని ఇక్కడి అధికారులు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. పెదవి విప్పితే ఏం జరుగుతుందోనని వీరంతా తమ ఆవేదనను భరిస్తూ వస్తున్నారు. కొన్నిసార్లు ఉన్నతస్ధాయిలో ఫిర్యాదులు చేసినా తమ ఉద్యోగానికి ముప్పు వస్తుందని మళ్లీ వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల పీవో బాధ్యతలు స్వీకరించిన త్రినాథరావు దృష్టికి ఈ విషయం వచ్చింది. ఆయన భరోసా ఇవ్వడంతో కొంతమంది మహిళా ఉద్యోగులు ధైర్యం చేశారు. వేధింపుల పర్వం చిట్టాను విప్పారు. అకాడమిక్ మోనటరింగ్ ఆఫీసర్ జగదీష్బాబుపై వీరంతా బుధవారం కలెక్టరును కలిసి లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఎనిమిది మంది కస్తూరిబా విద్యాలయాల ప్రత్యేకాధికారులు జిల్లా కలెక్టర్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వెంటనే ఏసీబీ డీఎస్పీ రంగరాజుతో పాటు జాయింట్ కలెక్టర్-2 రజనీకాంతరావులు వీరిని విచారించారు. ఎఎంఓ జగదీష్బాబుపై లైంగిక వేదింపు ఆరోపణలు: జగదీష్బాబు బొంతలకోడూరు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ డిప్యుటేషన్పై ఆర్వీయం ఏఎంవోగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఐసీపీఎస్లో కూడా ఈయనపై కేసు నమోదైంది. ఈ కేసులో సీడబ్ల్యుసీ కోర్టుకు కూడా హాజరుకాలేదు. తాజాగా జగదీష్బాబు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ భామిని, రణస్థలం, ఎచ్చెర్ల, సింగుపురం, పలాసలకు చెందిన ఎనిమిది కేజీబీవీ సంస్థల ప్రత్యేకాధికారులు ఫిర్యాదు చేసారు. కలెక్టర్ తీవ్రంగా స్పందించి క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఓ మహిళ నుంచి భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ జగదీష్బాబు రూ.లక్ష వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని కలెక్టరు స్పష్టం చేశారు. -
అధికారాలు కత్తిరించినా ఆర్థిక లావాదేవీలు
శ్రీకాకుళం: రాజీవ్ విద్యా మిషన్లో రాష్ట్రస్థాయి అధికారులు ఓ ఉద్యోగికి ఎఫ్ఏసీ అధికారాలను కత్తిరించినా అదే వ్యక్తితో ఇప్పటికీ ఆర్థిక లావాదేవీలు జరిపిస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రాజీవ్ విద్యా మిషన్లో ఎఫ్ఏఓగా మోహనరావును నియమించినప్పటికీ బాధ్యతలు అప్పగించకుండా కింది ఉద్యోగి సురేష్ ఎఫ్ఏఓ పోస్టులో కొనసాగుతున్న విషయం విదితమే. డిసెంబర్ 15న మోహనరావుకు ఎఫ్ఏఓగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేరోజున ఆయన రాష్ట్ర ఆర్వీఎం కార్యాలయంలో బాధ్యతలు తీసుకొని 23న శ్రీకాకుళం వచ్చారు. ఇప్పటివరకు ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు ఆర్వీఎం అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించినా ఫైలు కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉందని చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారాన్ని కలెక్టర్కు నివేదించాల్సిన అవసరమే ఉండదు. డిసెంబర్ 27న జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఆర్వీఎం అధికారులకు ఓ లేఖ రాస్తూ సురేష్ను ఎఫ్ఏఓగా ఎఫ్ఏసీ బాధ్యతలతో కొనసాగించాలని కోరారు. దీనికి తిరస్కరిస్తూ జనవరి 19న ఆర్వీఎం రాష్ట్ర అధికారులు మరో ఉత్తర్వును వెలువరించారు. సురేష్కు ఎఫ్ఏఓ అధికారాలను తొలగిస్తున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోహనరావుకు తక్షణం బాధ్యతలు అప్పగించి ఆ వివరాలను రాష్ట్ర కార్యాలయానికి తెలియజెప్పాలని ఆదేశించారు. తరువాత జనవరి 20, 21 తేదీల్లో విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో కూడా ఇదే విషయమై రాష్ట్ర అధికారులు జిల్లా ఆర్వీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తక్షణం బాధ్యతలు అప్పగించాలని కూడా చెప్పినట్లు భోగట్టా. ఇంత జరిగినా ఇప్పటికీ మోహనరావుకు బాధ్యతలు అప్పగించకపోగా ఎఫ్ఏసీ అధికారాల్లో కోత విధించిన సురేష్తోనే ఆర్థిక లావాదేవీలు జరిపిస్తున్నారు. దీని ద్వారా నిత్యం లక్షలాది రూపాయిలు విలువైన చెక్కులు రాయిస్తున్నారు. ఇందులో కేజీబీవీ ల బిల్లులు, ఉద్యోగుల జీతాలతోపాటు స్కూలు భవనాల బిల్లులు కూడా ఉంటున్నాయి. ఇంతగా ఎందుకు రాష్ట్ర అధికారుల ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారన్నది, ఆర్వీఎం అధికారులకు అంత అండగా ఉన్న నేతలెవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విషయాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం వద్ద సాక్షి ప్రస్తావించగా ఇటువంటి ఉత్తర్వులు వచ్చిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్వీఎం అకౌంట్స్ కంట్రోలర్ వద్ద ప్రస్తావించగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. విషయం కలెక్టర్ వద్దే పెండింగ్లో ఉన్నట్టు జిల్లా ఆర్వీఎం అధికారులు చెబుతున్నారని, అది వాస్తవం కాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఏసీబీకి చిక్కిన రాజీవ్ విద్యా మిషన్ డీఈ
నెల్లూరు : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ కావలి రాజీవ్ విద్యా మిషన్ డీఈ సాంబశివారెడ్డి ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు... కావలి రాజీవ్ విద్యామిషన్కు చెందిన సర్వశిక్ష అభియాన్ డీఈగా పనిచేస్తున్న సాంబశివారెడ్డి బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ నాగరాజు వద్ద నుంచి రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. బిల్లుల మంజూరుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని నాగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పట్టణంలోని కోర్టు సమీపంలో రూ. 15 వేల లంచం తీసుకుంటుండగా మాటువేసిన అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సాంబశివారెడ్డి నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకుని కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరు ఏసీబీ ఇన్చార్జ్ డీఎస్పీ మూర్తి ఆధ్వర్యంలో అధికారులు ఈ దాడిచేశారు. అలాగే సాంబశివారెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
బడుగుజీవుల కడుపుకొట్టి...
టీడీపీ నేతకు విద్యార్థుల యూనిఫాం కుట్టు కాంట్రాక్ట్ రాజీవ్ విద్యా మిషన్ ఎస్పీడీ లేఖతో చర్యలు చేపట్టిన అధికారులు స్థానిక టైలర్లను కాదని ఆ నేతకే ఇవ్వాలంటూ పరోక్ష ఆదేశం అదే పనిలో కిందిస్థాయి వర్గాలు..ఉపాధి కోల్పోతున్న జిల్లాలోని టైలర్లు రడీమేడ్ దుస్తులరంగప్రవేశంతో పనిలేక అల్లాడుతున్న టైలర్లకు స్కూల్ యూనిఫాంలు ఓ వరంగా మారాయి. జిల్లాలో నాలుగు లక్షల జతలు కుట్టేందుకు అవకాశం ఉండడంతో చాలా మంది టైలర్లకు నాలుగు నెలలపాటు పని లభిస్తోంది. అయితే ఇప్పుడు వారి ఉపాధిని ఓ పచ్చనేత తన్నుకుపోతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన నేతకు దుస్తులు కుట్టే పని అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. కొన్ని మండలాల కాంట్రాక్ట్ను ఇప్పటికే ఆయనకు అప్పగించినట్టు తెలిసింది. బడుగుజీవుల కడుపుకొట్టి... సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకిచ్చే యూనిఫాంల్ని కుట్టే బాధ్యతను జిల్లాలోని టైలర్లకు కాకుండా గుంపగుత్తగా చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గానికి చెందిన నరేంద్ర చౌదరి అనే టీడీపీ నేతకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కట్టబెడుతున్నారు. ఈమేరకు జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. అధికారులు సైతం తూ.చా తప్పకుండా ఎంఈఓలను ఆదేశించారు. ఇంకేముంది సదరు నేతకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు చర్యలు చకచకా సాగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రెండేసి జతలు యూనిఫాంలు కుట్టించి ఇస్తుంది. ముందుగా యూనిఫామ్ వస్త్రాన్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)లకు పంపించాలి. అలా వచ్చిన వస్త్రాన్ని స్థానికంగా ఉన్న టైలర్ల ద్వారా కుట్టించి విద్యార్థులకు అందజేయాలి. ఒక్కొక్క జతకు రాజీవ్ విద్యా మిషన్ ద్వారా రూ.40 చొప్పున టైలర్లకు చెల్లిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల టైలర్లకు, వారి వద్ద పనిచేసే వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. కానీ ఈసారి విద్యార్థుల యూనిఫాంలపై చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఆర్సీ పురం మండలం ఎస్ఆర్ కమ్మపల్లికి చెందిన నరేంద్ర చౌదరి కన్ను పడింది. ఆయన సీఎం చంద్రబాబు నాయుడిని కలియడంతో లైన్క్లియర్ అయింది. ముందుగా ఆ నేత రాజీవ్ విద్యామిషన్ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్కి రిక్విజేషన్ పెట్టుకోగా, ఆ మేరకు జిల్లాలకు ఉత్తర్వులొచ్చాయి. నరేంద్రచౌదరి రిక్వెస్ట్ను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని సదరు లేఖలో పేర్కొన్నారు. దీంతో రాజీవ్ విద్యా మిషన్ అధికారులు కలెక్టర్కు ఫైలు పెట్టారు. ఆ ఫైలుపై కలెక్టర్ కూడా నరేంద్ర చౌదరి రిక్వెస్ట్ను పరిశీలించాలని నోట్ రాశారు. దీంతో ఇటీవల ఎంఈఓలతో జరిగిన సమావేశంలో రాజీవ్ విద్యా మిషన్ పీఓ...విషయం చెప్పడమే కాకుండా కుట్టు కాంట్రాక్ట్ను అప్పగించాలని పరోక్షంగా సూచించారు. దీంతో ఎంఈఓలు ఇరకాటంలో పడ్డారు, స్థానిక టైలర్లకు కాకుండా చిత్తూరు జిల్లాకు చెందిన వారికిస్తే ఎలా అని, స్థానికులేమైపోవాలని, వారికేం సమాధానం చెప్పాలని, కుట్టడంలో తేడా వస్తే ఎవరు బాధ్యులని ఆంతర్మథనంలో పడ్డారు. అయినప్పటికీ అధికారులు చెప్పినట్టు వినక తప్పదని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అదే తరహాలో ఆదేశాలిస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచే సూచన ప్రాయ డెరైక్షన్ రావడంతో ఏ స్థాయిలోనూ అధికారులు అడ్డు చెప్పడం లేదు. దీంతో చిత్తూరు టీడీపీ నేత నరేంద్ర చౌదరికి యూనిఫాంలు కుట్టే కాంట్రాక్ట్ను అప్పగించే పనిలో సంబంధిత వర్గాలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కొన్ని మండలాల యూనిఫాంల కాంట్రాక్ట్ను ఇచ్చేసినట్టు తెలిసింది. మరికొన్ని ఒకటి రెండు రోజుల్లో అప్పగించనున్నాయి. మొత్తానికి ఉన్నత స్థాయి ఆదేశాలు కావడంతో స్థానిక టైలర్ల కడుపు కొడుతున్నారు. జిల్లాలో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రెండేసి జతలు చొప్పున నాలుగు లక్షల జతల యూనిఫాంలు కుట్టించి అందజేయాలి. ఇవన్నీ స్థానిక టైలర్లకు ఇచ్చినట్టయితే వారికి నాలుగైదు నెలల పాటు జీవనోపాధి లభిస్తుంది. యూనిఫాంల కుట్టే సీజనొచ్చినప్పుడు సంబంధిత కుటుంబాలన్నీ టైలరింగ్ పనిలో నిమిగ్నమవుతాయి. ఇప్పుడేకంగా బల్క్లో టీడీపీ నేతకు అప్పగించడంతో వీరంతా ఉపాధిని కోల్పోయే పరిస్థితి నెలకోనుంది. స్థానికంగా వదిలేసి ఎక్కడో ఉన్న నేతకు ఇవ్వడమేంటని సంబంధిత వర్గాలు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ అడుగుతున్న నేతకు ఈ విషయంలో ఏమాత్రం అనుభవం లేదని, అలాంటి వ్యక్తికి ఎలా అప్పగిస్తారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోమవారం జరిగిన గ్రీవెన్సెల్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై రాజీవ్ విద్యా మిషన్ పీఓ నాగమణిని ’సాక్షి’ వివరణ కోరగా ఎస్పీడీ నుంచి రిక్విజేషన్ వచ్చిందని, దాన్ని కలెక్టర్కు పంపించామని, ఆయన కూడా పరిశీలించమని సూచించారని, ఆ మేరకు ఎంఈఓలకు మౌఖికంగా చెప్పానని తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను అడిగి తీసుకోవాలని రిక్వెస్ట్ పెట్టిన వారికి చెప్పడం జరిగిందన్నారు. ఇందులో తన ప్రమేయమేది లేదన్నారు. తనకొచ్చిన ఎస్పీడీ లేఖ ప్రకారమే నడుచుకున్నానని తెలిపారు. -
‘అదనపు’ అవినీతి..
* ఆర్వీఎంలో విద్యుద్దీకరణ పేరుతో అక్రమాలు * రూ.అరకోటికి పైగా నిధులు పక్కదారి * పనులు చేయకుండానే బిల్లులు డ్రా.. * సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వివాదాలకు నిలయంగా మారిన ఆర్వీఎం (రాజీవ్ విద్యామిషన్)లో మరో అక్రమం వెలుగు చూసింది. అదనపు గదుల విద్యుద్దీకరణ పనుల పేరుతో భారీగా నిధులు పక్కదారి పట్టాయి. పలు పాఠశాలల భవనాలకు నామమాత్రంగా పనులు చేసి రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేశారు. కొన్ని చోట్ల అసలు పనులు చేయకుండానే డబ్బులు దిగమింగారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ అక్రమాలపై కలెక్టర్ ఎం.జగన్మోహన్ కొరడా ఝలిపిస్తున్నారు. ఈ పనుల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సుమారు రూ. అరకోటికి పైగా పక్కదారి పట్టిన ఈ వ్యవహారం నిగ్గు తేల్చాలని విద్యుత్ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పనులు చేయకుండానే బిల్లులు.. నిరుపేద విద్యార్థులు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రాజీవ్ విద్యా మిషన్కు ఏటా పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో నిర్మించిన సుమారు 420 అదనపు గదులకు విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది. ఒక్కో గదికి వైరింగ్, స్విచ్బోర్డులు, సర్వీసు వైర్లు, మెయిన్లు, ఇతర ఎలక్ట్రిసిటీ సామాన్లు, ట్యూబులు, ఫ్యాన్లు అమర్చాలని నిర్ణయించారు. ఇది అక్రమార్కులకు కలిసొచ్చింది. ఇష్టారాజ్యంగా పనులు చేసి అందినకాడికి దండుకున్నారు. ఒక్కో గదికి సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు బిల్లులు డ్రా చేశారు. ఇలా సుమారు 420 గదులకు పైగా జరిగిన విద్యుద్దీకరణ పనులకు సుమారు రూ.1.26 కోట్ల మేరకు నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ పనుల్లో సుమారు రూ.అరకోటికి పైగా పక్కదారి పట్టినట్లు ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. చాలా చోట్ల అసలు పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అలాగే అనేక చోట్ల నామమాత్రంగా పనులు చేశారు. బిల్లులు మాత్రం వేలల్లో కాజేశారు. మరికొన్ని చోట్ల నాసిరకం వైర్లు, ఇతర సామగ్రీని ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం.. నాసిరకంగా జరిగిన ఈ వైరింగ్ పనులు చాలా చోట్ల అస్తవ్యస్థంగా తయారయ్యా యి. అనేక చోట్ల స్విచ్బోర్డులు పగిలిపోయి వైర్లు తేలాయి. వీటిని ముట్టుకుంటే చిన్నారులు విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదాలు అనేక పాఠశాలల్లో పొంచి ఉన్నాయి. అలాగే నాసిరకం ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు అసలు పనిచేయడం లేదు. ఎస్ఎంసీల ఇష్టారాజ్యం : విద్యుద్దీకరణ పనుల కోసం వచ్చిన నిధులను అధికారులు ఆయా పాఠశాలల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ)లకు అప్పగించారు. అ నేక చోట్ల ఈ క మిటీల్లో సభ్యులుగా ఉన్న చోటా మోటా నేతలు, కొందరు హెఎంలు కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తూతూ మం త్రంగా పనులు చేసి, కొన్నిచోట్ల అసలు చేయకుండానే నిధులు పంచుకున్నారు. ఆర్వీఎం ఎస్పీడీ దృష్టికి.. : ప్రాథమికంగా దృష్టికి వచ్చిన ఈ అక్రమాల విషయాలను కలెక్టర్ రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్కు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలిసింది. మరోవైపు ఈ పనులపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ట్రాన్స్కో పర్యవేక్షక ఇంజినీర్ను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మ తయారు చేసినట్లు సమాచారం. -
పస్తులే నేస్తాలు!
శ్రీకాకుళం : జిల్లాలో విద్యా వలంటీర్లు పండుగ వేళ కూడా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి నియామకం జరిగి నాలుగు నెలలు కావస్తున్నా ఒక్కనెల జీతాన్ని కూడా అందుకోలేదు. ఫలితంగా ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సంక్రాంతి నాటికైనా తమకు జీతాలు అందుతాయని ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ వారి కోరిక నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వస్తున్నార. ఏటా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు రాజీవ్ విద్యామిషన్, తొమ్మిది, 10 తరగతులకు విద్యాశాఖ వలంటీర్లను నియమించేది. ఈ బాధ్యతలను ఈసారి అన్ని తరగతులకు విద్యాశాఖకే అప్పగించారు. జిల్లా విద్యాశాఖాధికారులు నియామకపు బాధ్యతలను మండల విద్యాశాఖాధికారుల చేతిలో పెట్టారు. ఈ నియామకపు ప్రక్రియను కూడా తీవ్ర జాప్యం చేసిన మండల విద్యాశాఖాధికారులు ఆ విషయాన్ని ఁసాక్షి*లో కథనంగా ప్రచురితం అయితేగానీ పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టలేదు. జిల్లాకు 900 మంది వలంటీర్లను నియమించాలని సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అరుుతే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చాలా గ్రామాల్లోని పాఠశాలలకు వలంటీర్లను కూడా నియమించలేదు. మిగిలిన చోట నియామకపు ప్రక్రియ పూర్తయి నాలుగు నెలలు కావస్తున్నా ఎవరెవరిని ఏఏ పాఠశాలకు కేటారుుంచారన్న వివరాలను మండల విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ కార్యాలయానికి ఇప్పటికీ అందజేయలేదు. ఎంఈవోలు సరైన సమయంలో వివరాలు నివేదించి ఉంటే రాజీవ్ విద్యామిషన్ ద్వారా నిధులు మంజూరై వలంటీర్లకు జీతాలు ఇచ్చేందుకు వీలు కలిగేది. మండల విద్యాశాఖాధికారులు ఇంతటి నిర్లక్ష్యంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అరకొర జీతాలతో విద్యా వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు అవ్వలేదంటే సమంజసంగా ఉండేది. నిధులుండీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జీతాలకు నోచుకోలేదని తెలుసుకొని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులైనా తక్షణం స్పందించి సంక్రాంతి పండుగలోగా జీతాలు అందేలా చూడాలని విద్యా వలంటీర్లు వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి అరుణకుమారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మండల విద్యాశాఖాధికారుల నుంచి వివరాలు రాకపోవడం నిజమేనని అంగీకరించారు. ఇప్పటికే రెండు దఫాలు ఎంఈవో నుంచి వివరాలు అడిగామని, వారి నుంచి అందక పోవడంతో నివేదించలేక పోయినట్టు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో వివరాలను తెప్పించుకుని జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్వీఎంలో అక్రమం
అటవీ శాఖలో బోగస్ కొలువుల బాగోతం ఇంకా సద్దుమణుగక ముందే రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) ఉద్యోగాల్లో ఇలాంటి అక్రమమే మరొకటి వెలుగు చూసింది. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్రమార్కులు అమాయక నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నారు. కొలువుల ఆశ చూపి నిరుద్యోగుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు తెరలేపారు. రూ.లక్షల్లో దండుకున్నారు. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాజీవ్ విద్యామిషన్ పరిధిలో జిల్లాలో 52 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న 54 పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరైంది. అకౌంటెంట్లు, ఏఎన్ఎంలు, అటెండర్లు(ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్), వాచ్మెన్లు, స్వీపర్లు ఇలా వివిధ రకాల నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. అనుకున్నదే తడువుగా పెద్ద ఎత్తున వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఒక్కో పోస్టుకు సుమారు రూ.30 నుంచి రూ.50వేల వరకు వసూలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువులు.. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటూ అమాయక అభ్యర్థులను మభ్య పెట్టారు. సర్కారు కొలువు వస్తుందని.. ఎప్పటికైనా పర్మినెంట్ ఉద్యోగులమయ్యే అవకాశాలున్నాయని భావించిన అమాయక అభ్యర్థులు అక్రమార్కుల బుట్టలో పడ్డారు. ఇలా వసూలు చేసిన సొమ్ములో పైస్థాయి అధికారులకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి మరీ వసూళ్ల దందాకు తెరలేపారు. ఔట్సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టాల్సిన ఈ పోస్టులకు కొందరు అభ్యర్థుల వద్ద ఆర్వీఎం కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం గమనార్హం. అడ్డదారిలో ఔట్ సోర్సింగ్ ఎంపిక.. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఈ ఏజెన్సీ ఎంపిక కోసం టెండరు నోటిఫికేషన్ విడుదల చేయాలి. దాంతోపాటుగా బహిరంగ ప్రదేశాల్లో, పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై ఈ నోటిఫికేషన్ను ఉంచాలి. అలా చేస్తేనే వివిధ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు టెండర్లలో పాల్గొంటాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఎలాంటి టెండర్లు పిలవకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఈ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీనీ ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమకు అనుకూలమైన వారికి ఏజెన్సీని కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ఆధ్వర్యంలో ఉండే జిల్లా మహిళా సమాఖ్యనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీగా ఎంపిక చేశారు. ఇప్పుడు అలా కాకుండా కొన్ని ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంపిక చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మాకు ఎలాంటి సంబంధం లేదు - పి.యాదయ్య, ఆర్వీఎం పీవో కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించాం. ఉద్యోగాలిప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ఈ అక్రమాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. డబ్బులు ఇచ్చిన, ఉద్యోగాలిపిస్తామని చెప్పి డబ్బులు పుచ్చుకున్న వారే బాధ్యులవుతారు. ఔట్సోర్సింగ్ ఎంపిక ఇంకా పూర్తికాలేదు. -
నిధులిచ్చినా నీరసమే
ఏలూరు సిటీ :ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ విద్యామిషన్ పథకం పదేళ్లుగా అమలవుతున్నా.. అవసరమైన నిధులు అందజేస్తున్నా.. ఆశించిన ఫలితాలు ఇవవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లలో గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.93 కోట్లు నిధులు మంజూరైనా ఇప్పటికీ 300కు పైగా అదనపు గదుల నిర్మాణాన్ని అసలు ప్రారంభించనే లేదు. అలాగే కిచెన్ షెడ్ల నిర్మాణం కోసం రూ.15.64 కోట్లను మంజూరు చేసినా ఎస్ఎస్ఏ చేపట్టిన వాటిలో 50 శాతం పూర్తి కాగా, హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో 470 కిచెన్ షెడ్లను నిర్మించాల్సి ఉండగా, ఒక్కటీ నిర్మాణానికి నోచుకోలేదు. అంతేకాక భారీగా నిధులు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ శాఖ తీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవుతుందనే విమర్శలు సైతం ఉన్నాయి. మరోవైపు భారం తగ్గించుకునే సాకుతో ప్రస్తుత ప్రభుత్వం కొన్ని చోట్ల పిల్లలు లేరనే కారణంగా పాఠశాలలను మూసివేస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముందుచూపు కరువు ప్రాథమిక విద్యను బలోపేతం చేయటం, ఈ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ , విద్యార్థులున్నా పాఠశాలలు లేని ప్రాంతాల్లో స్కూళ్ల ఏర్పాటు తదితర బృహత్తర కార్యక్రమాలను రాజీవ్ విద్యామిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలో గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో నాలుగేళ్లలో (2011-12 నుంచి 2014- 15) సుమారు 1,447 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.93 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో 1,166, అర్బన్ ప్రాంతంలో 281 తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. అయితే వీటిలో ఇప్పటివరకు 300పైగా అదనపు తరగతి గదుల నిర్మాణ మే ప్రారంభమే కాలేదు. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికారులు ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో వందల కోట్ల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు నిరుపయోగంగా మారుతున్నాయి. పాఠశాలలో విద్యార్థులే లేనప్పుడు తరగతి గదుల నిర్మాణం ఎందుకు చేపట్టారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ నేతల ఒత్తిడి, ప్రలోభాలతోనే అవసరంలేని చోట్ల కూడా అదనపు తరగతి గదులు నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. అవసరం ఉన్న చోట్ల పట్టించుకోని అధికారులు విద్యార్థులు లేని ప్రాంతాల్లో భవనాల నిర్మాణానికి అత్యుత్సాహం చూపారని విమర్శిస్తున్నారు. కిచెన్షెడ్ల నిర్మాణంలో అలసత్వం వీటితోపాటు బాలికలకు మరుగుదొడ్లు, ప్రహరీగోడల నిర్మాణం, ఫర్నిచర్, ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక గదుల నిర్మాణం, కిచెన్షెడ్లు వంటివాటికి రూ.150 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 2014-15లో 1,043 కిచెన్షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణం కోసం రూ.15.64 కోట్లు నిధులు ఖర్చు చేసేందుకు అనుమతులు వచ్చాయి. అయితే అక్టోబర్ మాసాంతానికి కిచెన్షెడ్లు పూర్తిచేసింది 218 మాత్రమే. నిర్మాణ దశలో మరో 44 ఉన్నాయి. 781 కిచెన్షెడ్ల నిర్మాణ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఈ కిచెన్షెడ్లలో సర్వశిక్ష అభియాన్ నిర్మించాల్సినవి 488 కాగా వీటికి రూ.7.32 కోట్లు, గృహనిర్మాణ సంస్థ 470 కిచెన్షెడ్లకు రూ.7.05 కోట్లు నిధులు మంజూరు చేశారు. మునిసిపాలిటీల్లో కిచెన్షెడ్ల నిర్మాణాన్ని విస్మరించారు. వర్షాలు పడితే పిల్లలకు భోజనం వండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, త్వరితగతిన కిచెన్షెడ్లు నిర్మించాలని అధికారులు ఆదేశించినా చర్యలు కరువయ్యాయి. -
వేటు పడినా..సీటులోనే
భానుగుడి (కాకినాడ) :సర్వశిక్షాభియాన్ను ‘సర్వభక్షాభియాన్’గా మార్చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) పీఓ వెన్నపు చక్రధరరావుపై వేటు వేస్తూ ఎట్టకేలకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్వీఎం ప్రవేశపెట్టిన పలు పథకాల అమలులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను విధుల నుంచి తొలగించి, విచారణ జరిపించాలని ఆ శాఖ డెరైక్టర్ ఉషారాణి ఆదేశించారు. వెన్నపు అవినీతి, అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఆధారాలు మాయం కావడంపై ‘సాక్షి’ ‘సర్వ‘భక్ష’ అభియాన్’, ‘వాటి మాయం వెనుక మర్మమేమిటో’ పేరిట ప్రచురించిన కథనాలతో ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. అయితే ఈనెల 4న జారీ అయిన ఆదేశాలపై ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడంతో వెన్నపు తన స్థానంలో కొనసాగుతూనే ఉన్నారు. ఇవీ ఆరోపణలు బడుగు విద్యార్థులకు స్కూల్బ్యాగ్ల పంపిణీ, ఏకరూప దుస్తులు, కార్ల వినియోగంలో, అధికారులకు టీఏ, డీఏ కేటాయింపులో, కేజీబీవీ ఉద్యోగ నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారని, 2013లో రిపబ్లిక్డే శకటాల తయారీలో కలెక్టర్ ఆదేశాల్ని బేఖాతరు చేశారని, 2010 ఆర్ఎస్టీసీ నిధుల బడ్జెట్ విషయంలో తప్పుడు గణాంకాలు చూపారని వెన్నపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 13-5-2013 మే 13న ఉద్యోగంలో చేరినా ఆలనెల నాలుగు నుంచి వేతనం తీసుకున్నారన్న ఆరోపణా ఉంది. జూలైలోనే మంత్రికి ఫిర్యాదు వెన్నపు అవినీతిపై స్వచ్ఛంద సంస్థలు మంత్రి గంటా శ్రీనివాసరావుకు జులై 7న ఫిర్యాదు చేయగా విచార ణ జరిపించాలని కలెక్టర్ ను ఆదేశించారు. కలెక్టర్ ఏజేసీ మార్కండేయులు ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ఫిర్యాదులోని 9 అంశాల్లో ఏడింటికి ఆధారాలు ఉన్నాయని తేల్చింది. ఈ నివేదికను కలెక్టర్ ఆగస్టు 13న వి ద్యాశాఖ డెరైక్టర్కు అందించిన నేపథ్యంలో ఆర్వీఎం డెరైక్టర్ వెన్నపును తక్షణం విధుల నుంచి తొలగించి, విచారణ జరిపించాలని ఈనెల 4న ఆదేశించారు. రెండు వారాలు కావస్తున్నా.. ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం, ఆయన పీఓగా కొనసాగడం గమనా ర్హం. వెన్నపుపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన స్వచ్ఛంద సంస్థలే కాక ఆర్వీఎం ఉద్యోగులూ కోరడం విశేషం. -
విద్యాభివృద్ధికి కృషి చేస్తా
రేగొండ : విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి హామీ ఇచ్చారు. రేగొండ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ హైస్కూల్లో అదనపు గదుల నిర్మాణానికి రాజీవ్ విద్యామిషన్ నుంచి రూ.35 లక్షలు మంజూరయ్యూరుు. ఈ మేరకు గదుల నిర్మాణానికి మంగళవారం స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగాంగా నాగరికతకు దూరంగా ఉన్న చెంచుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. చెంచు విద్యార్థులు ఆంగ్ల భాష ఉచ్చరించేలా కమ్యూనికేట్ విద్యనందించేందుకు నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. గవర్నర్, సీఎంతో చెంచు విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడే విధంగా ఆరు నెలల్లో వారిని తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గేయూన్ని స్పీకర్ ఆలపించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ మోడెం ఆదిలక్ష్మి, ఎంపీపీ ఈర్ల సదానందం, ఎంపీటీసీ సభ్యుడు పట్టెం శంకర్, ఎంఈఓ కె.రఘుపతి, పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం వి.హేమ, ఎస్ఎంఎస్ చైర్మన్ కిషన్, కుంచాల సదావిజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీల భర్తీ ఎన్నడో?
సాక్షి, మంచిర్యాల : రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ మూడున్నర నెలలుగా అభ్యర్థుల ఓపికను పరీక్షిస్తోంది. పాఠశాలల పనిగంటలు పెరిగిన నేపథ్యంలో ఆ బరువును తామెల భరించాలో అర్థం కావడం లేదని ఉపా ధ్యాయులు పేర్కొంటున్నారు. జిల్లాలోని హైస్కూళ్లలో ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం కోసం ఈ ఏడాది జూలైలో ఆర్వీఎం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా ఉపాధ్యాయులను కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక చేస్తామని, సంబంధిత విభాగంలో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఆర్ట్ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు చిత్రకళా నైపుణ్యం, క్రాఫ్ట్ ఉపాధ్యాయులు కుట్లు, అల్లికలు, వ్యాయామ ఉపాధ్యాయులు సంబంధిత అంశంలో పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. ఆది నుంచి.. నోటిఫికేషన్ విడుదల నుంచి గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. స్థానికతపై స్పష్టత ఇవ్వలేదు. మండలం యూ నిట్గా స్థానికతను ఆధారం చేసుకొని కొందరు, స్కూల్ కాంప్లెక్స్ యూనిట్గా స్థానికతను ఆధారం చేసుకొని కొన్నిచోట్ల ఎంపిక పూర్తిచేశారు. సదరు అభ్యర్థుల వివరాలు జిల్లా ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఈ ప్రక్రి య ముగిసి నెలలు గడుస్తున్నా నియామకం గురించి అభ్యర్థులకు సమాచారం ఇవ్వలేదు. పెరిగిన పనిగంటల బాధ్యతలను ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులతో సర్దుబా టు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఉపాధ్యాయులే లేనప్పుడు విధులు ఎలా పంచుకుంటారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. తమకు నియామకం విషయంలో అధికారిక ప్రకటన చేస్తే ఈ ఎంపిక కోసం ఆగి ఉండాలో లేక మరేదైనా మార్గం చూసుకోవాలో నిర్ణయిం చుకుంటామని అభ్యర్థులు వాపోతున్నారు. నియామకాలు చేపట్టి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆదేశాలు వస్తే నియామకాలు.. ఈ విషయమై రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ యాదయ్యను సంప్రదించగా.. ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియను హోల్డ్లో ఉంచాలని రాష్ర్ట కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో ప్రక్రియను నిలిపి వేశాం. తదుపరి ఆదేశాల ప్రకారం ముందుకువెళ్తామని స్పష్టం చేశారు. -
ప్రభుత్వ పాఠశాలలు ప్రమాదకరం
- రక్షణ లేని ‘చదువు’ - పాఠశాల భవనాలలో సౌకర్యాలు కరువు - దుర్వినియోగమవుతున్న నిధులు - విద్యార్థులకు తప్పని తిప్పలు - నామమాత్రంగా మారిన నిర్వహణ కమిటీలు నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు ప్రమాదకరంగా మారాయి. అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాజీవ్ విద్యామిషన్ నుంచి ఏటా కోట్లాది రూపాయలు మంజూరవుతు న్నా, క్షేత్రస్థాయిలో మాత్రం మార్పులు రావడం లేదు. ఫలితంగా ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వర్ని మండలం రుద్రూర్ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి చాకలి శ్రీను పాము కాటుతో మృతి చెందడం ఇందుకు నిదర్శనం. ఇదీ పరిస్థితి జిల్లాలో 1,576 ప్రాథమిక పాఠశాలలు, 265 ప్రాథమికోన్నత పాఠశాలలు, 465 ఉన్నత పాఠశాలలు, ఉన్నాయి. దాదాపు రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఇందు లో చదువుకుంటున్నారు. వారితోపాటు అక్కడ సమస్యలూ సహవాసం చేస్తున్నాయి. 211 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేవు. మరికొన్ని పాఠశాలలు ఊరికి చివర గా ఉండడంతో, సరైన దారులు లేక విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వానాకాలంలో చెట్లు, ముళ్లపొదలు పెరగడంతో పరిసరాలు పమాదకరంగా మారుతు న్నాయి. కాలినడక దారులు కనడబడకుండా పోతున్నాయి. పాఠశాలలలో కనీస సౌకర్యాల కల్పన కోసం రాజీవ్ విద్యా మిషన్ నుంచి కోట్లాది రూపాయలు విడుదలవుతున్నాయి. కానీ, అది సక్రమంగా వినియోగం కావడం లేదు. ప్రజాప్రతినిధుల సహకారంతో, కొందరు కాంట్రాక్టర్లు అవసరం లేని చోట అదనపు గదులు, ప్రహరీలు నిర్మిస్తున్నారు. అవసరం ఉన్న ప్రాంతాలలో ఈ పనులు కొనసాగడం లేదు. జిల్లాలోని 484 పాఠశాలల భవనాలు అసౌకర్యాలకు నిలయంగా ఉన్నాయి. ఎప్పుడో నిర్మిం చినవి కావడంతో దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పులకు రంధ్రాలు, తరగతి గదుల గోడలకు పగుళ్లు ఏర్పడినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. వర్షం పడితే పరిస్థితి ప్రమాదకరమే. కొన్ని చోట్ల సరిపడినన్ని తరగతి గదులు లేక ఆరుబయటనే విద్యాబోధనను కొనసాగిస్తున్నారు. మూత్రశాలలు నిర్మించి ఉన్న ప్రాంతం లో ముళ్ల పొదలు, చెట్లు ఏపుగా పెరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. మరి నిధులు ఏమవుతున్నాయి పాఠశాల అభివృద్ధికి సంబంధించి (ఎస్ఎంసీ) పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల కమిటీలో 23 మంది, ఉన్నత పాఠశాలల కమిటీలో 17 మంది సభ్యులు ఉంటారు. వీటికి ఏటా పాఠశాల నిధులు రూ. ఏడు వేలు, నిర్వహణ కోసం రూ. ఐదు వేలు, అలాగే 6,7 తరగతులకు మూడు గదుల కం టే ఎక్కువ ఉంటే పది వేల రూపాయలు మంజూరు అవుతాయి. వీటిని పాఠశాల అభివృద్ధికి, వివిధ మరమ్మతులు, పరిశుభ్రతకు వినియోగించాలి, ఎక్కడ కూడా ఈ నిధులకు సక్రమంగా వినియోగించడం లేదు. ఫలితంగా పాఠశాలల పరిసరాలు దుర్గంధంగా మారుతున్నాయి. ముళ్లపొదల మధ్య, బురదనీటితో కునారిల్లుతున్నాయి. -
మదర్సాల నిధులు స్వాహా
సిబ్బంది విద్యార్హతలపై గందరగోళం మార్గదర్శకాల్లో అస్పష్టత ఆసరాగా నిధుల దుర్వినియోగం నిలిచిన జీతాలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిబంధనల్లో ఉన్న అస్పష్టతను అడ్డం పెట్టుకుని రాజీవ్ విద్యామిషన్ కింద వచ్చిన నిధులను దిగమింగారు. మైనారిటీలకు ఉర్దూలో విద్యాబోధన కోసం ఏర్పాటు చేసిన మదర్సాల పేరుతో భారీగా డబ్బులు స్వాహా చేశారు. విద్యాశాఖకు, రాజీవ్ విద్యామిషన్లోని ఉద్యోగులకు మధ్య డబ్బు పంపిణీలో వచ్చిన విభేదాల కారణంగా నాలుగు నెలల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్గా వచ్చిన వల్లభనేని శ్రీనివాస్ మార్చి నెల నుంచి మొత్తం అన్ని మదర్సాలకు చెల్లించే నిధులను నిలిపేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఒక అదనపు కార్యదర్శిని విచారణకు ఆదేశించారు. ఆయన త్వరలో జిల్లాకు వచ్చి విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే శుక్రవారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ వీ ఉషారాణి దీనిపై పీడీ శ్రీనివాస్ను విచారణ చేసి పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే... 2012-13కు జిల్లా వ్యాప్తంగా 86 మదర్సాలుండగా, 2013-14కి వచ్చేసరికి వాటి సంఖ్య 45కి పడిపోయింది. అందులో ఒకటి రద్దు చేయగా 44 నడుస్తున్నాయి. మదర్సాల పనితీరుకు, విద్యార్హతలకు సంబంధించిన నిబంధనల్లో స్పష్టత లేకపోవడం, ఒక్కోసారి ఒక్కో నిబంధన అమలు చేయడం వల్ల దీన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అసలు మదర్సా లేకుండానే అది నడుపుతున్నట్లు ఎంఈవోతో సర్టిఫికెట్ తెచ్చుకుని ప్రతినెలా డబ్బులు డ్రా చేసుకున్నారు. ఒక్కో మదర్సాకు ఒక నజీమ్, మరో విద్యావలంటీర్ను కేటాయించారు. విద్యార్హతలు బీఈడీ గానీ, డీఈడీగానీ ఉండాలి. అయితే నాలుగేళ్లుగా వాటికి మినహాయింపు ఇస్తున్నారు. దీంతో అసలు ఉర్దూ రానివారు కూడా మదర్సాల పేరుతో డబ్బులు దిగమింగేశారు. దీనిపై ఒంగోలు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(ఉర్దూ రేంజ్) తనిఖీలు నిర్వహించి రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్కు ఒక నివేదిక పంపారు. అందులో కొన్ని చోట్ల కనీసం మదర్సా బోర్డులు కూడా లేవని, విద్యార్థులు లేరని పేర్కొన్నారు. కొత్తపట్నం, సంతమాగులూరు, కందుకూరు, వేటపాలెం, రాచర్ల, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, పొదిలితో సహా పలు మదర్సాలు కాగితాల మీదే పని చేస్తున్నాయని నివేదిక ఇచ్చారు. వారి విద్యార్హతలు కూడా బోగస్ అని, అర్హత లేనివారు పనిచేస్తున్నారని తేల్చారు. అసలు పనిచేయని మదర్సాల పేరుతో డబ్బులను కొందరు అధికారులే తినేస్తున్నారని నివేదిక ఇచ్చారు. ప్రత్యామ్నాయ స్కూల్స్ కో-ఆర్డినేటర్ (ఏఎల్ఎస్) 40 బోగస్ మదర్సాల్లో వందమందికి పైగా వలంటీర్లను నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకున్నట్లు చూపించారని పేర్కొన్నారు. నిజంగా పనిచేస్తున్న మదర్సాల నుంచి ఐదు వేల రూపాయలు, బోగస్ మదర్సాల నుంచి 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. బోగస్ మదర్సాల్లో ఇద్దరు వలంటీర్లు ఉన్నట్లు చూపించి ఒకరి వేతనం నజీమ్, మరో వేతనం ఏఎల్ఎస్ తీసుకున్నట్లు తేలిందని డీఐ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే రాజీవ్ విద్యామిషన్ ప్రత్యామ్నాయ స్కూల్స్ కో-ఆర్డినేటర్ మాత్రం నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, దానికి సంబంధించిన గైడ్లైన్స్పై అవగాహన లేక డీఐ తన నివేదిక ఇచ్చారని చెబుతున్నారు. దీనిపై ఆరోపణలు వచ్చిన వెంటనే మొత్తం మదర్సాల వేతనాలు నిలిపేసినట్లు ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాస్ సాక్షికి తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి ఆదేశాల మేరకు పదిరోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తానని ఆయన పేర్కొన్నారు. -
‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదం
- రాజీవ్ విద్యామిషన్లో కాంట్రాక్టు ఉద్యోగుల పునరుద్ధరణపై ప్రభుత్వం తాత్సారం - ఆందోళనలో 425 మంది ఉద్యోగులు ఏలూరు సిటీ : ‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సంగతి అటు ఉంచితే ఉన్న ఉద్యోగులను తొలగిస్తోంది. వివిధ శాఖల్లో ఏళ్ల తరబ డి పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ వారి కుటుంబాలను రోడ్డుపైకి నెడుతోంది. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్లో భాగంగా 425 మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. పాఠశాలల క్లస్టర్ల పరిధిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లుగా 243 మంది, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్లు 46, మానసిక, శారీరక వికలాంగుల శిక్షణకు సంబంధించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్(ఐఈఆర్టీఎస్) 36 మంది, డివిజన్ లిమిట్ మానిటరింగ్ టీమ్స్(డీఎల్ఐఎంటీఎస్)లో 10 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 44 మంది, మండల విద్యాధికారుల కార్యాలయాల్లో వికలాంగులకు ఉపాధి కల్పిస్తూ మెసెంజర్లుగా 46 మందిని గతంలో నియమించారు. వీరిని పరీక్షలు, ఇంటర్య్వూల ఆధారంగా గతంలో ఉన్నతాధికారులు నియమించారు. సర్వీస్ పునరుద్ధరణైపై తాత్సారం కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును ఏటా ప్రభుత్వం పునరుద్ధరిస్తూ వస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో సర్వీస్ పునరుద్ధరణకు ఉద్యోగుల పనితనాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. అయినా ఆర్వీఎంలో ఇంతవరకు ఏ ఉద్యోగి సర్వీస్ను పునరుద్ధరించలేదు. ప్రభుత్వం కావాలనే ఉద్యోగుల సర్వీస్ను పునరుద్ధరించకుండా తాత్సారం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని శాఖలకు చెందిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిం చడంతో తమను కూడా తొలగిస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. మండల విద్యాధికారుల కార్యాలయాల్లో పనిచేస్తున్న వికలాంగులైన మెసెంజర్లను విధుల నుంచి తొలగించటంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగాలు లేకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, అధికారులు సత్వరమే పునరుద్ధరించాలని కాంట్రాక్టు ఉద్యోగులు కోరుతున్నారు. -
కొను‘గోల్మాల్’
ఖమ్మం: అక్రమాల పుట్టగా పేరున్న రాజీవ్ విద్యామిషన్ అధికారులు మరోసారి తమ నిజ స్వరూపం బయటపెట్టారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు వంటపాత్రలు, ఇతర వస్తువుల సరఫరాలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లలో చూపించినట్టుగా కాకుండా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నాసికరం వస్తువులు సరఫరా చేసినట్లు తెలిసింది. ఇందులో షాపుల యజమానులతో ఆర్వీఎం అధికారులు కుమ్మక్కయ్యారనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా నియమితులైన పలువురు కేజీబీవీ ప్రత్యేకాధికారులు దీనిపై ప్రశ్నిస్తే.... ‘ఇది షరా మామూలే.. దీనిపై మీరు ఎక్కువగా మాట్లాడితే ఉన్నతాధికారుల దృష్టిలో పడుతారు’ అని ఆర్వీఎంలో పనిచేస్తున్న ఓ అధికారి బెదిరించడంతో వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. చేసేది లేక ఆ వస్తువులనే వినియోగిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం తెలిసిన జిల్లా ఉన్నతాధికారులు ఆర్వీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నెలకొల్పింది. ఈ క్రమంలో జిల్లాలో మైదాన ప్రాంతంలో 21, ఐటీడీఏ పరిధిలో 12 కేజీబీవీలు మంజూరు చేశారు. మైదాన ప్రాంతంలో 15 కేజీబీవీలకు అన్ని వసతులతో కూడిన సొంత భవనాలు నిర్మించారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వంట చేసి పెట్టేందుకు ప్రభుత్వం రూ. 35,09,854 మంజూరు చేసింది. ఈ డబ్బులతో ఐరన్ స్టవ్లు, అల్యూమిలియం వంటపాత్రలు, గ్రైండర్, ఇడ్లీపాత్రలు, చపాతీ, దోశ పాత్రలు, 10, 5 కేజీల బొగ్నాస్, స్టీల్ బకెట్లు, స్టీల్ బేసిన్లు, రైస్ స్పూన్లు, చెంచాలు, టీ మగ్గులు, ఐరన్ క్యాబ్గిర్, మంచినీటి డ్రమ్ములు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంక్ బాక్సులు, కార్పెట్లు, బెడ్షీట్లు మొదలైనవి కొనుగోలు చేయాలి. ఇందుకోసం ఆయా వస్తువులు సరఫరా చేసే షాపు యజమానుల నుంచి టెండర్లు పిలిచారు. ఏ వస్తువు ఎన్ని కేజీలు ఉండాలి, ఎన్ని లీటర్లు ఉండాలి, ఏ కంపెనీకి చెందినవి సరఫరా చేయాలి అనే వివరాలను టెండర్ నోటీసులో పేర్కొన్నారు. దీనికి సమ్మతించి టెండర్లు వేసిన షాపులను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. అయితే వస్తువుల సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు తెలియజేసేందుకు షాంపిల్గా కొన్ని వస్తువులను తీసుకొచ్చి అధికారులకు చూపించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. తీరా వస్తువులు సరఫరా చేసేటప్పటికి జిల్లా అధికారులకు టోకరా ఇచ్చి పలు నాసిరకం వస్తువులు సరఫరా చేసినట్లు సమాచారం. వీటిలో గ్రైండర్, తాగునీటి డ్రమ్ములు టెండర్లలో పేర్కొన్నవి కాకుండా వేరే కంపెనీవి సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో ఆర్వీఎంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అధికారులకు, షాపు యజమానులకు మధ్యవర్తిత్వం చేసి కమీషన్లు కాజేసినట్లు సమాచారం. కాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారి ఆర్వీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడంతా షరా మామూలే... నిధుల దుర్వినియోగం, బిల్లులు పెట్టడం, ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, వస్తువుల కొనుగోలులో అవకతవకలు షరా మామూలే అని ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులు చెపుతుండడం విశేషం. ఏళ్ల తరబడి ఆర్వీఎంలో కీలక శాఖలో పనిచేసే ఉద్యోగులు, అక్కడ పనిచేసే ఔట్ సోర్సింగ్ అధికారులను అనుకూలంగా మల్చుకొని నిధులు కాజేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా కృత్రిమ అవయవాల కొనుగోలు, ఫిజియోథెరఫీ సెంటర్లలో ఏర్పాటు చేసిన బల్లలు, కంటిచూపు లోపం గల విద్యార్థులకు సరఫరా చేసిన కళ్లజోళ్లు మొదలైన వాటిల్లో అవకతవకలు జరిగాయని, వాటిని పట్టించుకున్న నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆర్వీఎం ద్వారా కొనుగోలు చేసే వస్తువులు, నిధుల వ్యయంపై దృష్టి సారిస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు దృష్టి సారించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆర్వీఎంకు ఊరట
- రూ.192.69 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సుముఖత - పెండింగ్ పనుల పూర్తి, కొత్త కార్యక్రమాలు చేపట్టనున్న యంత్రాంగం సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిధుల కొరతతో సతమతమవుతున్న రాజీవ్ విద్యామిషన్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఊరట కలిగింది. ఆ శాఖ రూపొందించిన వార్షిక ప్రణాళికకు కొంత మెరుగులు దిద్దిన కేంద్రం ప్రభుత్వం.. నిధుల మంజూరుకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా రాజీవ్ విద్యామిషన్కు 2014-15 వార్షిక సంవత్సరంలో రూ.192.69 కోట్ల బడ్జెట్ విడుదల కానుంది. దీంతో గతంలో పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక కొత్త కార్యక్రమాలు... రాజీవ్ విద్యామిషన్ నిధుల విడుదలలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన పాత నిధులను ఖర్చు చేస్తేనే కొత్తగా బడ్జెట్ ఇస్తామని స్పష్టం చేయడంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆర్వీఎం నిధులకు భారీగా కోత పడింది. ఫలితంగా గతేడాది కేవలం రూ.124.54 కోట్లు విడుదల కాగా.. ఇందులో రూ.80కోట్లు ఉద్యోగుల వేతనాలకే ఖర్చు చేశారు. తాజాగా బడ్జెట్ పరిమితి పెరిగింది. ఈ ఏడాది రూ.192.69 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంతో.. అధికారులు కొత్త కార్యక్రమాల కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ పనులకు సైతం నిధులు సంతృప్తికరంగా రావడంతో పల్లె బడులకు అదనపు గదులు నిర్మించేందుకు ఆర్వీఎం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పనితీరులో వెనకబడితే నిధుల్లో కోత.. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆర్వీఎంకు నిధుల విడుదల మెరుగుపడినప్పటికీ.. పనితీరును బట్టి నిధులు విడుదల కానున్నాయి. ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఆర్వీఎం లక్ష్యాలు, సాధించిన పురోగతి ఆధారంగా తదుపరి త్రైమాసికానికి నిధులు విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనితీరులో వెనకబడితే నిధుల విడుదలలో కోతపెట్టనుంది. దీంతో ఆర్వీఎం అధికారుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలలు ఎన్నికల హడావుడిలో కొన్ని కార్యక్రమాలు వెనకబడ్డాయి.అయితే తొలి త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల చేయకుండా నిల్వ ఉన్న నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే జిల్లా ఆర్వీఎంలో అంతంతమాత్రంగా నిధులుండగా.. ప్రస్తుత నిధులు వినియోగించుకుని ఉద్యోగులకు వేతనాలు అందించారు. ఇందుకు సంబంధించి నివేదికను కేంద్రానికి పంపితే.. రెండో త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల కానున్నాయి. కొత్త ప్రణాళికలో ముఖ్యాంశాలివీ.. - 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా ఆర్వీఎంకు రూ.192.69కోట్ల బడ్జెట్కు కేంద్రం ఆమోదం తెలిపింది. - ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాం, పుస్తకాలకు రూ.11 కోట్లు ఖర్చు చేయనున్నారు. - ఉపాధ్యాయులు, కాంట్రాక్టు సిబ్బంది వేతనాల కోసం రూ.80.55 కోట్లు ఖర్చు చేయనున్నారు. - పాఠశాల గ్రాంట్లు, టీచర్ల గ్రాంట్లతో పాటు శిక్షణల కోసం రూ.10 కోట్లు వెచ్చించనున్నారు. - పాఠశాల్లో మౌలికవసతుల కల్పనకు రూ.55కోట్లు ఖర్చు పెట్టనున్నారు. -
260 యూపీ స్కూళ్లలో 8వ తరగతి
శ్రీకాకుళం: జిల్లాలోని 260 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతిని ప్రవేశ పెడుతున్నారు. ఈ మేరకు గురువారం రాజీవ్ విద్యామిషన్ అధికారులకు ఆదేశాలు అం దాయి. అయితే ఉపాధ్యాయ పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. రేషన్లైజేషన్ జరపాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో భవిష్యత్తులో అకడమిక్ ఇనస్ట్రక్టర్లను నియమిం చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 579 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 8వ తరగతి వరకు ప్రాథమిక విద్యగానూ, 9 నుంచి ఇంటర్మీడియె ట్ ద్వితీయ సంవత్సరం వరకు ప్రాథమికోన్నత విద్యగానూ నిర్ణయించారు. ఆర్వీఎంకు ప్రాథమిక, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్కు ప్రాథమికోన్నత విద్య బాధ్యతలను అప్పగిం చారు. దశలవారీగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని, కొత్తగా నెలకొల్పుతున్న ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది 260 యూపీ స్కూళ్లలో 8వ తరగతిని ప్రవేశపెట్టడం ఆనందదాయకమే అయినప్పటికీ ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయకపోవడం ఆందోళన కలి గిస్తోంది. దీనివల్ల తమపై పనిభారం పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధికారులు మాత్రం తొలుత ఉపాధ్యాయ పోస్టులను రేషనలైజ్ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మార్గదర్శకాలను జారీ చేయకపోవటంతో ఈ ప్రక్రియ మొదలు కాలే దు. దీనివల్ల ఏకోపాధ్యాయ, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు తరచూ మూతపడే పరిస్థితి నెలకొంది. విద్యావలంటీర్ల స్థానంలో గత ఏడా ది నుంచి ప్రవేశపెట్టిన అకడమిక్ ఇనస్ట్రక్టర్ పోస్టులను ముందే మంజూరు చేసే అధికారం జిల్లా విద్యాశాఖాధికారులకు లేదు. రేషనలైజేషన్ జరిపితేగానీ ఏ మేరకు ఇనస్ట్రక్టర్ పోస్టులు అవసరమవుతాయో గుర్తించడం కష్టం. ఈ ప్రక్రియను చేపడదామన్నా ప్రభుత్వం నియమ నిబంధనలను వెల్లడించకపోవడంతో అధికారు లు చర్యలు చేపట్టలేకపోతున్నారు. ప్రజాప్రతిని దులు జోక్యం చేసుకొని రేషనలైజేషన్ జరి పించటంతోపాటు ఉపాధ్యాయ పోస్టులు మం జూరు చేయించకపోతే విద్యార్థులు నష్టపోక తప్పదు. -
జీతాలు రాక అల్లాడుతున్న ఆర్వీఎం సిబ్బంది
రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న 294మంది సి.ఆర్.పిలకు (క్లస్టర్ రిసోర్స్ పర్సన్) గడచిన 2 నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్నారు. ఏప్రిల్, మే నెల జీతాలు రాకపోగా, జూన్ నెలలో ఇప్పటికే సగం రోజులు గడచిపోయాయి. సి.ఆర్.పీలతో పాటు జిల్లా వ్యాప్తంగా 50మంది ఎం.ఐ.ఎస్ కో-ఆర్డినేటర్లు, 50మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 50మంది మెసెంజర్లు మొత్తం 444మంది పనిచేస్తున్నారు. వీరందరూ జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి రీజాయినింగ్ ఆర్డరు ఇవ్వకపోవటంతో జీతాలు రావడటం లేదని ఆర్.వి.ఎం ప్రాజెక్టు అధికారిణికి మొరపెట్టుకుంటున్నారు. రాజీవ్ విద్యామిషన్లో ఇటీవల పరిపాలనలో నెలకొన్న కొన్ని సంఘటనలు కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాకుండా చేశాయని వాపోతున్నారు. ఐ.ఆర్.టి టీచర్లకూ తప్పని కష్టాలు... రాజీవ్ విద్యామిషన్లో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలకు (వికలాంగులు) విద్య నేర్పేందుకు శిక్షణ కలిగిన 72మంది ఐ.ఆర్.టి టీచర్లు జిల్లాలోని భవిత కేంద్రాలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు. వీరికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి రీజాయినింగ్ ఆర్డర్లు ఇచ్చే వారు. ఈ సంవత్సరం ఇంతవరకూ ఆర్డరు ఇవ్వని కారణంగా వీరికి మే నెల జీతం చేతికందలేదు. అంతేగాక భవిత కేంద్రాల్లో బాలలకు అందించాల్సిన ఉపకరణాలు (చంక కర్రలు, కాలిపర్స్, వినికిడి యంత్రాలు తదితరాలు) ఇంతవరకూ ఆ కేంద్రాలకు చేరలేదు. దీంతో ప్రత్యేకావసరాలు కావలసిన బాలలు ఉసూరుమంటున్నారు. రాజీవ్ విద్యామిషన్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సి.ఆర్.పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎం.ఐ.ఎస్ కో-ఆర్డినేటర్లు, మెసెంజర్లు, ఐ.ఆర్.టి టీచర్లుకు వెంటనే రీజాయినింగ్ ఆర్డర్లు అందించి, వారికి వెంటనే జీతాలు చెల్లింపులు చేయాలని సి.ఆర్.పీల సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎస్.వెంకట్ డిమాండ్ చేశారు. జీతాల్లేక ఉద్యోగులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితుల పై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. -
సర్కార్ స్కూళ్లలో మెరుగైన విద్య
ఒంగోలు వన్టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య బోధించేందుకు రాజీవ్ విద్యా మిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి జూలై 31వ తేది వరకు సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ వీ ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా విద్యార్థుల్లో మాతృభాష(తెలుగు), గణితంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. బడి ఈడు బాలబాలికలందరినీ పాఠశాలలకు ఆకర్షించేలా స్కూళ్లను సిద్ధం చేయాలని చెప్పారు. పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు చివరి తరగతి వరకు కొనసాగేలా కృషి చేయాలన్నారు. నాలుగు భాషా నైపుణ్యాలు(వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం), గణితంలో చతుర్విద ప్రక్రియల(కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం)పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలల్లో ఉదయం పూట సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి తెలుగు, గణితంలో కనీసం ఏ లేదా బీ గ్రేడు సాధించేలా తీర్చిదిద్దాలని చెప్పారు. విద్యార్థులతో రోజూ హోమ్ వర్క్ చేయించడంతో పాటు క్రమశిక్షణను పెంపొందించాలన్నారు. పాఠశాల, తరగతి సంసిద్ధత కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు జిల్లా, మండలస్థాయిల్లో మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రాజెక్టు అధికారులను ఉషారాణి ఆదేశించారు. జిల్లా స్థాయిలో డైట్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉప విద్యాధికారులు, రాజీవ్ విద్యామిషన్ ఏఎంఓలు, ఏఏఎంఓలు, డీఆర్పీలు, జిల్లా స్థాయి మానిటరింగ్ టీం సభ్యులతో బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎమ్మార్పీలు, సీఆర్పీలతో కమిటీలు వేయాలని చెప్పారు. రాష్ట్రస్థాయి బృందాలు పాఠశాల సంసిద్ధత కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయని తెలిపారు. సంసిద్ధత కార్యక్రమాలను పక్కాగా నిర్వహించండి జిల్లాలో పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని ఎంఈఓలు, హెచ్ఎంలను రాజీవ్ విద్యామిషన్ పీడీ వీ శ్రీనివాసరావు ఆదేశించారు. పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల అమలుకు సంబంధించి గత ఏడాది సరఫరా చేసిన మాడ్యూల్స్నే ఉపయోగించాలని చెప్పారు. విద్యాపరంగా వెనుకబడిన విద్యార్ధుల కోసం వేసవి సెలవుల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల కోసం పంపిణీ చేసిన వర్క్బుక్లను ప్రతి పాఠశాలకు ఒకటి చొప్పున సరఫరా చేసి అందులోని అంశాలను విద్యార్థులకు వివరించాలని పీడీ శ్రీనివాసరావు సూచించారు. -
టీచర్ల తాత్కాలిక సర్దుబాటుకు గ్రీన్సిగ్నల్
చిత్తూరు(టౌన్): పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు రాజీవ్ విద్యామిషన్ చర్యలు చేపట్టింది. టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు (రేషనలైజేషన్) చేసేందుకు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాష్ట్ర ఆర్వీఎం అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో దీని వివరాలను జిల్లా విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులకు వివరించారు. జిల్లాను యూనిట్గా తీసుకొని సర్దుబాటు చేయాలని అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో టీచర్లు సరిగ్గా లేనందున విద్యార్థులకు చదువు చెప్పలేకపోతున్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తే గానీ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీరదు. ప్రస్తుతం డీఎస్సీ నిర్వహించే పరిస్థితి లేనందున తాత్కాలిక సర్దుబాటు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లోగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటుచేసి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. రెండు రోజులు సరిపోతుందా? సర్దుబాటు పూర్తి చేయడానికి రెండు రోజులు సరిపోదని, వారం రోజులైనా గడువిస్తే పూర్తి చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఎక్కువగా సబ్జెక్టు టీచర్లు ఉం డే పాఠశాల నుంచి వీరిని సర్దుబాటు ప్రాతిపదికన వేరే పాఠశాలకు పంపాల్సి ఉంటుంది. సెలవుల్లో అధికారులే సర్దుబాటు చేసేందుకు పూనుకొని వివరాలు తెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే క్షేత్ర స్థాయి నుంచి దీనికి పెద్దగా స్పందన రాలేదు. అధికారుల వద్ద జిల్లాలో ఎన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి? టీచర్లు లేని పాఠశాలలు ఎన్ని? ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఎంత ఉంది? అనే వివరాలు పూర్తి స్థాయిలో లేవు. పాఠశాలలు పునఃప్రారంభమైనందున పిల్లల ఎన్రోల్మెంట్పై దృష్టి పెట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంఈవోల నుంచి వివరాలు తెప్పించుకొని సర్దుబాటు చేయడమనేది కత్తిమీద సామేనని చెప్పొచ్చు. అధికారులకు తలనొప్పులు తప్పవా? తాత్కాలిక సర్దుబాటు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు తలనొప్పులు తీసుకొచ్చేలా ఉంది. కిరణ్కుమార్రెడ్డి హయాంలో కొంత మంది ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న చోటు నుంచి వేరే చోటుకు వెళ్లేందుకు జీవోలు తెచ్చుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక సర్దుబాటు కార్యక్రమం వీరికి వరంలా దొరికింది. కొత్తగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీరిని పట్టుకొని తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒత్తిళ్లు ఎక్కువైతే నిబంధనలకు అధికారులు తిలోదకాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇటీవల నిర్వహించిన ఎంఈవోల సమావేశంలో తాత్కాలిక సర్దుబాబు చేయాలని డీఈవో ఆదేశాలు ఇవ్వడంతో చాలా మంది తాము కోరుకున్న చోటుకి వెళ్లేందుకు ఒత్తిళ్లు తెచ్చారు. ఇప్పుడు ఉన్నతాధికారులు అధికారికంగా అనుమతి ఇవ్వడంతో అధికార పార్టీ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. -
రోడ్డున పడేశారు
కంబాలచెరువు (రాజమండ్రి): రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం)లో పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లుగా పనిచేస్తున్న వారు రోడ్డున పడ్డారు. ఆర్ట్, క్రాప్ట్, పీఈటీలుగా జిల్లాలో సుమారు 300 మంది వరకు, రాజమండ్రి అర్బన్లో 15 మంది రెండేళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి రూ. 4,500 జీతం ఇస్తున్నారు. పేరుకు పార్ట్ టైం అయినా తాము ఫుల్టైం సేవలు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. జీతం పెంపుదలకోసం పోరాటం చేయగా రూ. 6 వేలు చేశారు. జీతం పెంచినట్టే పెంచి మా అందర్నీ ఇప్పుడు రోడ్డున పడేశారని వారు వాపోతున్నారు. ఈ విద్యాసంవత్సరంనుంచి తిరిగి ఆ ఉద్యోగాలకు వారిని దరఖాస్తు చేసుకోమంటున్నారు. కొత్తవారితో కలసి వారు ఆ పోస్టుకోసం పోటీపడాలి. అతి తక్కువ జీతంతో పనిచేసిన తమను ఇలా వీధిపాలు చేయడం సబబు కాదని వారందరూ ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. తెలంగాణాలో గతంలో పనిచేసిన ఇన్స్ట్రక్టర్లను యథావిధిగా విధుల్లో కొనసాగుతున్నారని, ఆంధ్రాలో దీనికి వ్యతిరేకంగా ఉందన్నారు. తాము చేసిన ఉద్యోగాలను ఇప్పించి ఆ తర్వాతే కొత్తవారిని విధుల్లోకి తీసుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు. ఇంత అన్యాయమా.. రెండేళ్లుగా తక్కువ జీతంతో పనిచేయించుకుని జీతాలు పెరి గిన తర్వాత మమ ల్ని పక్కకు నెట్టేయడం చాలా అన్యా యం. మాకు పని అనుభవం ఎంతో ఉంది. తిరిగి కొత్తవారితో దరఖాస్తు చేసుకోమంటున్నారు. అది దారుణం. - పి.దుర్గాప్రసాద్ మమ్మల్ని ఆదుకోవాలి మాతో ఇప్పటివరకు వెట్టిచాకిరీ చేయించుకుని కూరలో కరివేపాకులా ఇప్పుడు తొలగించారు. ఇన్నాళ్లూ మేం చేసిన సేవను గుర్తించరా? ఇదెక్కడిన్యాయం. మేం ఎక్కడికి వెళ్లాలి. ఈ ఉద్యోగంపైనే నమ్మకం పెట్టుకుని బతుకుతున్నాం. - డి. సలోమి -
సర్కారీ స్కూళ్లు..శిథిల గూళ్లు!
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలలు సమస్యల నిలయాలుగా మారాయి. విద్యార్థులకు నరకం చూపుతున్నాయి. జిల్లాలో అన్ని వసతులున్న ప్రభుత్వ పాఠశాలలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. విద్యారంగంలో దినదినప్రవర్ధమానం కావాల్సిన జిల్లా..ఏడాదికేడాది వెనకబడుతోంది. గురువారం నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. నూతనోత్సాహంతో బడిబాట పట్టే పిల్లలకు అధ్వాన స్థితిలో ఉన్న పాఠశాలలు స్వాగతం పలకనున్నాయి. కిందటేడాది పశ్చిమ మండలాల్లో ఉన్న పాఠశాలల పురాతన భవనాల శ్లాబ్లు పెచ్చులూడి విద్యార్థులపై పడిన సందర్భాలూ ఉన్నాయి. = మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఇంకా చెట్ల కింద చదువులే కొనసాగుతున్నాయి. = ఏటా అదనపు తరగతి భవనాలకు నిధులు మంజూరు చేస్తున్నా..కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో తరగతి గదుల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. = మంచినీరు, మరుగుదొడ్లు తదితర కనీస వసతులు కల్పించాల్సిన రాజీవ్ విద్యామిషన్ ఆచరణలో చతికిల పడుతోంది. = జిల్లాలో 699 ఉన్నత పాఠశాలలు, 572 ప్రాథమికోన్నత పాఠశాలలు, 3,186 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో గతేడాది 2.5 లక్షల మంది పిల్లలు చదివారు. = సరిపడా విద్యార్థులు లేకపోవడంతో కిందటేడాది కొన్ని మండలాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. = ఈ ఏడాది అంతకంటే ఘోరమైన పరిస్థితి తలెత్తే అవకాశాలున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. = ఇవి కాకుండా ఎయిడెడ్, అన్ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలలు 240కిపైగా ఉన్నాయి. అయితే ఆయా పాఠశాలల పరిస్థితి విద్యార్థుల బోధనకు అంత అనువుగా లేదనే చెప్పాలి. = మినీ గురుకుల పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలల భవనాల పరిస్థితి కొంత బాగానే ఉన్నా..అక్కడ చదివే విద్యార్థులకు మంచినీరు, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఏర్పాటు చేయాల్సిన వంట షెడ్లు కూడా దాదాపు అన్ని చోట్లా పాతబడిపోవడంతో పిల్లలకు ఆరుబయటే వంట తయారు చేస్తున్నారు. జిల్లా పరిస్థితి ఇదీ.. = జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలల సంఖ్య మొత్తం 4822 ఉండగా, వాటిల్లో 3126 పాఠశాలలకు మాత్రమే ప్రహరీలున్నాయి. మిగతా 1696 పాఠశాలల చుట్టూ రక్షణ ఏర్పాట్ల గురించి పట్టించుకున్న నాథుడులేరు. = అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణాలు 6,426 వినియోగంలో ఉన్నప్పటికీ, 2299 మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. మంచినీటి పంపులు సైతం అన్నిచోట్లా మరమ్మతులకు గురయ్యాయి. = పభుత్వ పాఠశాలల్లో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ పై ప్రతీ ఏడాది విద్యాశాఖ ప్రణాళికలో పొందుపరిచిన వాటిని ఆచరణలో పెట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. = ఈ సంవత్సరం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే బడిబాట కార్యక్రమం జరగలేదు. విద్యాసంబరాలకు ముందుగానే విద్యాశాఖ ప్రత్యేక కమిటీని జిల్లాలో అన్ని గ్రామాలకు పంపి శిథిలావస్థ పాఠశాలలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, వసతుల కల్పనపై నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపేది. పాఠశాలలకు రంగులు వేయడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, గదులకు మరమ్మతులు చేయించడం.. = అన్ని కార్యక్రమాలు బడిబాట కార్యక్రమంలో భాగంగానే పూర్తిచేసేవారు. 2008 సంవత్సరం నుంచి ఈవిధానం అమలవుతున్నా.. ఈఏడాది విద్యాశాఖాధికారులు మిన్నకున్నారు. -
సమస్యల వలయం
భానుగుడి (కాకినాడ) :బోధించడానికి అయ్యవార్లు లేరు.. శ్రద్ధగా చదువుదామనుకుంటే తరగతి గదులు లేవు.. ఉన్నచోట కూడా శిథిల భవనాలే దిక్కు.. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు అసలే లేవు.. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే దుస్థితి. ఇటువంటి అసౌకర్యాల నడుమ గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇవీ సమస్యలు.. జిల్లాలో వెయ్యికి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిపై డీఈవో ఉన్నతాధికారులకు నివేదించారు.జిల్లాలో ఉపాధ్యాయులు లేని పాఠశాలలు 105 ఉండగా, 670 పాఠశాలలు ఒకే ఒక్క ఉపాధ్యాయునితో నడుస్తున్నాయి.తరగతి గదుల నిర్మాణానికి రాజీవ్ విద్యామిషన్ దండిగా నిధులు మంజూరు చేసినా, ఇప్పటికీ 300 పాఠశాలలకు తరగతి గదులే లేవు. ప్పటికీ 202 పాఠశాలలకు తాగునీరు, 332 పాఠశాలలకు విద్యుత సౌకర్యాలు లేవు. 3,377 పాఠశాలల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండగా, 822 పాఠశాలల్లో లేవు. ఉన్నవాటిలో కూడా 2,865 పాఠశాలలకు నీటి సౌకర్యం లేదు.3,111 పాఠశాలల్లో బాలికలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండగా, వీటిల్లో 2,418 చోట్ల నీటి సౌకర్యం లేదు.ఇప్పటికీ 3,506 పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ లేదు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా ఇప్పటి వరకూ 127 పాఠశాలల్లోను, దాతల సహకారంతో మరో 500 పాఠశాలల్లోను కంప్యూటర్లు ఏర్పాటు చేశారు.ఇప్పటికీ 1976 పాఠశాలల్లో వికలాంగ విద్యార్థుల కోసం ర్యాంపులు నిర్మించలేదు. మారిన సిలబస్పై శిక్షణేది? ఈ ఏడాది 8, 9, 10 తరగతుల సిలబస్ పూర్తిగా మారిపోయింది. దీనిపై ఈ నెల 16 నుంచి 26 వరకూ బ్యాచ్లవారీగా ఒక్కో రోజు శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలలు ప్రారంభం కాకముందు ఇవ్వాల్సిన శిక్షణ ఇప్పుడు ఇవ్వడమేమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క కొత్త సిలబస్పై ఒక రోజు శిక్షణ సరిపోదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. కాగా, ఇప్పటివరకూ జిల్లాకు 29.80 లక్షల పుస్తకాలు రాగా, వీటిల్లో 15.80 లక్షల పుస్తకాలు విద్యార్థులకు అందించారు. అన్ని ఏర్పాట్లూ చేశాం పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. సమస్యలున్న పాఠశాలలను గుర్తించి తగిన సౌకర్యాలు కల్పించాం. 96 శాతం పాఠశాలలకు ఎటువంటి సమస్యలూ లేకుండా చేశాం. ఎంఈవోల నుంచి నివేదికలు రప్పించుకుని సమీక్షించి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశాం. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు తదితర ఇబ్బందులు ఉంటే రాజీవ్ విద్యామిషన్ ద్వారా మంజూరైన రూ.15 వేలు వినియోగించాలని ఆదేశించాం. - కేవీ శ్రీనివాసులురెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి -
బడిబాట.. ఉత్తుత్తి మాట..!
- కనిపించని సర్కారు పాఠశాలల ప్రచారం - తూతూ మంత్రంగా అధికారుల ప్రకటనలు - ఒక్క రూపాయి కూడా విదల్చని విద్యా శాఖ - బడి బాటకెళ్లని ఉపాధ్యాయులు జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు పాత బస్టాండ్ సర్కిల్లోని ఓ టీ బంకు వద్ద శనివారం సాయంత్రం ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయుల మధ్య జరిగిన సంభాషణ ఇది. ఈ సంభాషణ ప్రభుత్వ అయ్యవార్ల బాధ్యతా రాహిత్యాన్ని బయట పెడుతున్నా.. ఈ యేడాది బడి బాట పూర్తిగా విఫలం కావడానికి విద్యాశాఖ నిర్లక్ష్యం కారణమనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో గత వారం రోజులుగా బడి బాట అంటూ అధికారులు హడావిడి చేస్తున్నా క్షేత్ర స్థాయిలో ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా స్పందించడం లేదు. అధికారిక ఉత్తర్వులేవీ ఇవ్వకుండా ఉత్తుత్తి ప్రకటనలు చేస్తుండటంతో ఆ ప్రకటనలను ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు. లేదనకుండా కొన్ని చోట్ల మండల విద్యాశాఖాధికారులు ఒకరిద్దరు టీచర్లు, నలుగురైదుగురు విద్యార్థులను వెంట బెట్టుకొని నామమాత్రంగా ఫొటోలకు ఫోజులిచ్చి బడి బాట కార్యక్రమం చేపట్టామంటూ నివేదికలు పంపుతున్నారనే విమర్శలున్నాయి. ఇక పల్లెల్లో ర్యాలీలు, ప్రచారాలు ఏమాత్రం కనిపించలేదు. మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య నానాటికీ పెరిగి పోతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఈ యేడాది బడి బాట విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. గత ఏడాది బడి బాటను మూడు విడతలుగా చేపట్టారు. జూన్ 2 నుంచి 11వ తేదీ వరకు మొదటి విడత, 12 నుంచి 20 వతేదీ వరకు రెండవ విడత, 21 నంచి 30 వ తేదీ వరకు మూడవ విడత... ఇలా పక్కా ప్రణాళికతో బడి బాటను చేపట్టారు. ఈ మూడు విడతల్లో కూడా ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లి ఇంటింటి ప్రచారం, కర పత్రాల పంపిణీ, పెద్ద పెద్ద బ్యానర్లతో ర్యాలీలు నిర్వహించారు. జూన్ నెలంతా బడి బయటి పిల్లలను బడిలో చేర్చుకునేందుకు, చదువులో వెనుకబడిన విద్యార్థులకు సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించిన ఉపాధ్యాయులు జులై నెల నుంచి బోధన మొదలు పెట్టారు. కానీ ఈ విద్యా సంవత్సరం ఆదిలోనే హంసపాదు ఎదురైంది. విద్యాశాఖ నిర్లక్ష్యం.. గత ఏడాది మే నెలలో బడి బాటకు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ ఆ మేరకు కావాల్సిన కరపత్రాలు, బ్యానర్లను ముద్రించి ఇతర ఖర్చుల కోసం నిధులు కూడా సమకూర్చి జూన్ మొదటి నాటికి క్షేత్ర స్థాయికి చేర్చింది. బడిబాటపై తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేసింది. అయితే ఈ యేడాది కరపత్రాలు, బ్యానర్ల మాట అటుంచితే బడి బాట కార్యక్రమానికి ఒక్క రూపాయి కూడా విదిలించలేదు సరికదా రాష్ట్ర స్థాయి ప్రణాళికను కూడా విడుదల చేయలేదు. దీనికితోడు అధికారులు ప్రకటనలకే పరిమితం కావడంతో అధికారులు స్పందించలేదు. వెరసి బడిబాట కార్యక్రమం విఫలమైందని చెప్పవచ్చు. జూన్నెలలో బడిబాట పూర్తి చేయాలి వేసవి సెలవులు ముగియకముందే బడి బాట కార్యక్రమం పూర్తి కావాలి. విద్యాశాఖ రాష్ట్ర స్థాయి షెడ్యూల్ విడుదల చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా తాజా షెడ్యూల్ విడుదల చేసి జూన్ నెల లోపు బడి బాటను పూర్తి చేయాలి. లేదంటే రాజీవ్ విద్యా మిషన్ ద్వారా వచ్చే కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. - సి.వి.ప్రసాద్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఆర్వీఎం.. అస్తవ్యస్తం
ఖమ్మం, న్యూస్లైన్ : పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, వెనకబడిన విద్యార్థులు, బడి మానేసిన, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన వంటి అంశాల్లో కీలక భూమిక పోషించే రాజీవ్ విద్యామిషన్ జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. వందల కోట్ల రూపాయల నిధులు వచ్చే ఈ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల మధ్య పంపకాల గొడవను పరిష్కరించే నాథుడే కరువయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల మధ్య గ్రూపు తగాదాలతో అయిన వారికి అందలం.. కాని వారిపై వేటు వేసే ధోరణి కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కోట్లాది రూపాయల నిధుల వినియోగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే కీలకం కావడం, అన్నింటా వారికే ప్రాధాన్యత ఇవ్వడం పలు సందేహాలకు తావిస్తోంది. జీసీడీవో సరెండర్పై అనుమానాలు... బాలికల విద్యా అభివృద్ధి అధికారిణి సంధ్యశ్రీని తొలగించి, ఆమె స్థానంలో మరొకరిని నియమించడం ఆర్వీఎంలో దుమారం రేపుతోంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ) నిర్వహణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయడం లేదనే నెపంతో జీసీడీవో సంధ్యశ్రీని, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ను విద్యాశాఖకు సరెండర్ చేశారు. అయితే కొత్తగా జీసీడీవో, ఇతర సెక్టోరియల్ అధికారి నియామకానికి సంబంధిత ఉద్యోగుల సీనియారిటీ, సర్వీసు, ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ అదేమీ చేయకుండా ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా పదోన్నతి పొందిన శివకుమారికి జీసీడీవో బాధ్యతలు అప్పగించడం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆర్వీఎం పీవో శ్రీనివాస్కు, జీసీడీవో సంధ్యశ్రీకి మధ్య సమన్వయం లేదని, అందుకే కావాలనే పీవో జీసీడీవోను సరెండర్ చేసి కొత్తవారిని నియమించారని ప్రచారం జరుగుతోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత... ఏటా వందల కోట్ల రూపాయల నిధులు వచ్చే ఆర్వీఎంలో కీలకమైన అకౌంట్ సెక్షన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే కీలకంగా మారడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్వీఎం పీవోకు, ఆశాఖ ఫైనాన్స్ అధికారికి మధ్య సమన్వయం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కావాలనే పీవో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వారిపై వేటు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ శాఖలో అక్రమాలు జరిగాయని భావించిన గత కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆర్వీఎం నిధుల వినియోగంపై ప్రత్యేక బృందంతో ఆడిట్ చేయాలని అప్పటి పీవో వెంకటనర్సమ్మను ఆదేశించారు. కానీ ఆ తర్వాత వెంకటనర్సమ్మ, సిద్ధార్థజైన్ ఇద్దరూ జిల్లా నుంచి బదిలీ కావడంతో ఆ శాఖలో ఉన్న అధికారులతోనే ఆడిట్ చేయించారని, దీంతో అంతా అనుకూలంగానే బిల్లులు సృష్టించి ఆడిట్ను మమ అనిపించారనే విమర్శలు వస్తున్నాయి. ఆడిట్ సెక్షన్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా.. వారిని కాదని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన వారి పనులకు బదులుగా బిల్లులు, ఇతర ఆర్థిక లావాదేవీల పనులు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో అవకతవకలు జరిగితే బాధ్యులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఆర్వీఎంపై ప్రత్యేక దృష్టి సారించి అస్తవ్యస్తంగా ఉన్న ఈ శాఖను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. -
మళ్లీ తెరపైకి జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టు
ఎవరికి వారే ముమ్మర యత్నాలు ఊపందుకోనున్న రాజకీయ పైరవీలు కలెక్టర్కు కత్తిమీద సామే! కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్లైన్ : జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి పోస్టుకు పైరవీలు ప్రారంభమయ్యాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా కొంతమంది అధికారులను మూడు సంవత్సరాల పైబడి ఒకే ప్రాంతంలో ఉన్న వారిని బదిలీ చేశారు. దీనిలో భాగంగా డెప్యూటీ సీఈవోగా పనిచేసిన జీవీ సూర్యనారాయణ ఎంపీడీవోల బదిలీల్లో భాగంగా ఫిబ్రవరిలో బదిలీ అయ్యారు. దీంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. అయితే తిరిగి బందరు మండల ఎంపీడీవోగా బదిలీ అయ్యి జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టును దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇన్చార్జ్ జెడ్పీ సీఈవోగా పనిచేస్తున్న చింతా కళావతి ఎన్నికల ముందు ఎంపీడీవోల బదిలీల్లో ఇతర జిల్లాకు బదిలీ అయ్యారు. అయితే ప్రస్తుతం బందరు ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు ఈమె బంధువు కావటంతో ఆమె కూడా ఈ పోస్టుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వీరు ఇరువురి ప్రయత్నాలు ఇలా ఉంటే... మరో పక్క రాజీవ్ విద్యామిషన్ ఎఫ్ఏవోగా పనిచేస్తున్న వి.జ్యోతిబసు న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. గతంలో చింతా కళావతి ఇన్చార్జ్ జెడ్పీ సీఈవోగా, డెప్యూటీ సీఈవోగా జీవీ సూర్యనారాయణ విధులు నిర్వర్తించిన సమయంలో 2013 అక్టోబరు 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం చింతా కళావతి, జీవీ సూర్యనారాయణ కంటే ఎక్కువ సీనియార్టీ ఉన్న వి జ్యోతిబసును ఇన్చార్జ్ జెడ్పీ సీఈవోగా అప్పట్లో ఉయ్యూరు మండలం ఎంపీడీవోగా పనిచేస్తున్న ఎం.కృష్ణమోహన్ను ఇన్చార్జ్ డెప్యూటీ సీఈవోగా నియమించాలని తీర్పు వెల్లడైంది. ఈ తీర్పు ఆధారంగా అప్పటి నుంచి వీరు ఇరువురు న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు జెడ్పీ సీఈవోగా నియమితులైన దాసరి సుదర్శనం జిల్లాపరిషత్ డెప్యూటీ సీఈవో, ఏవో పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్రావు వద్దకు ఇన్చార్జ్ డెప్యూటీ సీఈవోగా బందరు మండలం ఎంపీడీవోగా పనిచేస్తున్న సుబ్బారావును, రాజీవ్ విద్యామిషన్ కార్యాలయంలో ఎఫ్ఏవో పనిచేస్తున్న జ్యోతిబసును ఏవోగా నియమించాలని ప్రతిపాదనలు తీసుకువెళ్లారు. అయితే కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం సుబ్బారావు కంటే జ్యోతిబసు సీనియర్ కదా ఆయనను ఎలా నియమిస్తారని సీఈవోను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే జెడ్పీ సీఈవో వి జ్యోతిబసు జిల్లా వాసి అయినందున ఆయన నియామకం ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా నియామకం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పడంతో కలెక్టర్కు ఈ ఫైల్ను పక్కన పెట్టి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత చూద్దామని సీఈవోకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తికావటంతో జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టును దక్కించుకునేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బందరు ఎంపీడీవోగా పనిచేసిన జీవీ సూర్యనారాయణ రాష్ట్ర నాయకత్వాన్ని నమ్ముకోగా, చింతా కళావతి రాజకీయపరంగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. జ్యోతిబసు మాత్రం న్యాయపరంగా తనకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా డెప్యూటీ సీఈవోగా పోస్టు తనకే దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అయితే జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టు ఎవరికి దక్కుతుందో, ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో త్వరలోనే తేలనుంది. -
రాజీవ్ మిథ్యా మిషన్ మొక్కుబడులు
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్లైన్ : అందరూ చదవాలి-అందరూ ఎదగాలి.. అనే లక్ష్యసాధనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 1-5 తరగతుల్లో ‘సీ’ గ్రేడు విద్యార్థులను గుర్తించి, వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఏ, బీ గ్రేడు విద్యార్థులతో సమానంగా ‘సీ’ గ్రేడు పిల్లలు కూడా చదువుకునేలా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) ఆధ్వర్యంలో మే 11 నుంచి సమ్మర్ క్యాంపులు (వేసవి బడులు) ప్రారంభమయ్యాయి. తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో విద్యార్థులు పట్టు సాధించాలనే ఉద్దేశంతో 1, 2 తరగతులకు ఒక అభ్యాసదీపిక, 3, 4, 5 తరగతులకు మరొక అభ్యాసక దీపికను నిపుణులైన ఉపాధ్యాయులతో తయారు చేయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా...సమ్మర్ క్యాంపుల నిర్వహణ మాత్రం జిల్లా వ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాల్లో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో 343 క్యాంపులు జిల్లాలో 356 క్లస్టర్లకు గాను 343 క్లస్టర్లలో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ‘సీ’ గ్రేడు విద్యార్థులను క్లస్టర్ల వారీగా గుర్తించారు. ఒక్కో పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉండేలా చూడాలని అధికారులు సూచించారు. వారికి అభ్యాసదీపికలు పంపిణీ చేశారు. ప్రారంభంలో విద్యార్థులు కాస్త ఆసక్తి చూపినా తర్వాత రావడమే మానేశారు. వారిని రప్పించడంలో ఆయా క్లస్టర్ సీఆర్పీలు విఫలమయ్యారు. కనీసం 10 మంది కూడా హాజరుకాని పాఠశాలలే అధికంగా ఉన్నాయి. క్యాంపులకు హాజరయ్యే విద్యార్థుల నమోదు కూడా మొక్కుబడిగా ఉంటోంది. ‘సీ’ గ్రేడ్ విద్యార్థులను మాత్రమే క్యాంపులకు రప్పించాల్సి ఉండగా.. గ్రేడ్లతో సంబంధం లేకుండా కొందరు పిల్లలను పోగేసి తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు సమ్మర్ క్యాంపుల నిర్వహణపై ఆర్వీఎం అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఫలితంగా సీఆర్పీలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులు జూన్ 11 వరకు నెల రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లా అధికారులు ఉండే అనంతపురం నగరంలోని కేంద్రాల్లోనే అనధికారిక సెలవులు ప్రకటించారంటే ఈ కార్యక్రమ నిర్వహణపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. -
అక్రమాల అడ్డా
రచ్చకెక్కిన ఇంటి పోరు ఆర్వీఎం పీవో పద్మావతిపై వేటు రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జీవో జారీ చేసినవిద్యాశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని రాజీవ్ విద్యామిషన్లో గతం నుంచీ అడ్డూ అదుపు లేకుండా అక్రమాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అదనపు తరగతి గదుల భవనాలను నిర్మించిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోవటం, కమీషన్ల కోసం బిల్లులు ఆలస్యం చేయటం వంటి ఆరోపణలు గత అధికారుల పనితీరుపై అనుమానాలు రేకెత్తించేలా చేశాయి. ఆర్వీఎం శాఖ నిర్వహణలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం, బిల్లుల్లో లెక్కాపత్రాలు సరిగ్గా ఉండకపోవటం వంటి ఆరోపణలు గతం నుంచి ఆర్వీఎం అధికారులు, సిబ్బందిని వెంటాడుతూనే ఉన్నాయి. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీ), ఎంఐఎస్ కోఆర్డినేటర్ల నియామకాల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు గతం నుంచి వినవస్తున్నాయి. కొత్త పీవోపై విచారణ... రెవెన్యూ శాఖలో తహశీల్దార్గా బాధ్యతలు నిర్వహించిన పద్మావతి డెప్యూటీ కలెక్టర్గా పదోన్నతి రావటంతో విద్యాశాఖకు డెప్యుటేషన్పై వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెవెన్యూ విభాగంలో పనిచేసిన ఆమె కృష్ణాజిల్లాలో రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత కొంతకాలం ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా కూడా ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహించారు. ఆర్వీఎం పీవోగా ఆమె పనితీరుపై పలు ఫిర్యాదులు వెళ్లటంతో గత నెలలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ నిర్వహించారు. రచ్చకెక్కిన ఇంటి పోరు... రాజీవ్ విద్యామిషన్ కార్యాలయంలో కీలక అధికారులు, సిబ్బంది నడుమ నెలకొన్న అంతర్గత పోరు రచ్చకెక్కటం పీవోను ఈ శాఖ నుంచి సాగనంపేవరకు దారితీసిందని తెలిసింది. పీవోతో పాటు ఇక్కడ కీలక బాధ్యతలు నిర్వహించే మరో వ్యక్తి నడుమ శాఖాపరమైన కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తటం, వాటికి ఆర్థిక లావాదేవీలు, వివాదాలు తోడుకావటంతో అది కాస్తా చినికి చినికి గాలివానగా ఇంటిపోరు రచ్చకెక్కింది. ఇక్కడ ప్రాజెక్టు అధికారి వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఆమె చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఇదే శాఖలోని ఓ ఉద్యోగి ఉన్నతాధికారులకు చేరవేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో ఆయన బంధువు ఉన్నతాధికారి కావటంతో ఆ పరిచయాలను ఉపయోగించుకుని పీవోను లక్ష్యంగా చేసుకుని పావులు కదిపినట్లు తెలిసింది. హైదరాబాదుకు పిలిచి.. ఆపై చర్యలు... రాజీవ్ విద్యామిషన్లో ఉద్యోగుల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరటంతో గత నెల 30, 31 తేదీల్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాలోని ఆర్వీఎం ముఖ్య అధికారులను హైదరాబాదుకు పిలిచారు. అదే సమయంలో విద్యాశాఖ ఉన్నతాధికారుల సమక్షంలోనూ ఆర్వీఎం కీలక అధికారుల వాదులాట తప్పలేదు. అదే సమయంలో పీవో చేసిన లోపాలను ఆధారాలతో సహా ఒక ఉద్యోగి ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ అక్రమాల్లో విచారణాధికారి సైతం ఇప్పటివరకు నివేదిక సమర్పించకపోవడాన్ని కూడా విద్యాశాఖాధికారులు గుర్తించారు. దీంతో ప్రాజెక్టు అధికారిణిగా ఉన్న బి.పద్మావతిని రెవెన్యూ శాఖకు అప్పగిస్తూ విద్యాశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ నెల ఒకటిన జీవో నంబరు 182 జారీ చేశారు. పీవో పద్మావతిపై అనేక ఆరోపణలు వచ్చాయని, వాటికి సంబంధించిన అంశాలపై విచారణ చేసేందుకు అధికారులను నియమించారని, విచారణాధికారి సైతం ఇంతవరకు నివేదిక సమర్పించలేదని ఆ జీవోలో ఎత్తి చూపారు. ఈ జీవో తక్షణం అమలులోకి వస్తుందని, పద్మావతి ఆర్వీఎం పీవోగా రిలీవై రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రస్తావించటం గమనార్హం. ఆర్వీఎంకు పీవోగా ఎవరినైనా నియమిస్తారో లేక మరే అధికారికైనా అదనపు బాధ్యతలు అప్పగిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
వేసవి శిబిరాలు అస్తవ్యస్తం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్లైన్ : చదువులో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల స్థాయిని పెంచేందుకు రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) రాష్ట్ర అధికారులు వేసవి సెలవుల్లో శిబిరాలు ప్రారంభించారు. లక్ష్యం మంచిదే అయినా జిల్లాలో తరగతులు నామమాత్రంగా సాగుతున్నాయి. ఆచరణలో అమ లు కాకపోవడంతో లక్ష్యం సాధించడం అనుమానంగానే ఉంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు ఈ వేసవిలో తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 275 క్లస్టర్ పాఠశాలల్లో వేసవి శిబిరాలు జరగాలి. సీఆర్పీలు విద్యాబోధన చేయాలి. ప్రస్తుతం జిల్లాలో 252 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. మిగిలిన 23 క్లస్టర్ పాఠశాలల్లో ఐఈడీ రిసోర్స్ పర్సన్స్తో విద్యాబోధన చేయించాలని అధికారులు నిర్ణయించారు. వీరు వారం రోజులు తరగతులు బోధించారు. వీరికి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సర్వే చేయించాలని ఎస్పీడీ నుంచి ఆదేశాలు రావడంతో ఐఈడీ రిసోర్స్ పర్సన్స్ వెళ్లారు. కానీ, వీరు శిబిరాలకు వెళ్లకపోవడంతో తెరుచుకోవడం లేదు. ఆర్వీఎం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆ దిశగా ఆలోచించడం లేదు. నామాత్రంగానే తరగతులు జిల్లాలో వేసవి శిబిరాలకు 11,158 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 1,2 తరగతుల విద్యార్థులు 4,852 మంది, 3,4,5 తరగతుల విద్యార్థులు 6,306 మంది వేసవి శిబిరాలకు హాజరుకావాలి. కానీ, కనీసం సగం మంది విద్యార్థులు కూడా తరగతులకు హాజరుకావడం లేదు. విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితంతోపాటు ఆటాపాటాలు నేర్పాలి. వర్క్పుస్తకాల ఆధారంగా వారికి కృత్యాలు నేర్పాలి. ‘సీ’ గ్రేడ్ విద్యార్థులను ‘ బీ’గాని ‘ఏ’ గ్రేడ్ విద్యార్థులుగా తయారు చేయాలి. కానీ, తరగతులు అంతంతా మాత్రంగానే జరగడంతో విద్యార్థులకు ప్రయోజనం శూన్యం. కాగా, శిబిరాలు ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు తరగతులు జరగాలి. సీఆర్పీలు సమయపాలన పాటించకపోవడం, కొన్ని చోట్ల కేంద్రాలు తెరుచుకోవడంలేదు. ఈ శిబిరాలకు విద్యార్థులు రాకపోవడంతోనే పాఠశాలలను తెరవడం లేదని కొంత మంది సీఆర్పీలు పేర్కొంటున్నారు. సీఆర్పీలు వచ్చిన చోట విద్యార్థులు రావడం లేదు. విద్యార్థులు వచ్చిన చోట సీఆర్పీలు కానరావడం లేదు. దీంతో పరిస్థితి భిన్నంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కరువు వేసవి శిబిరాలను రాజీవ్ విద్యామిషన్ అధికారులతోపాటు మండల విద్యాధికారులు పర్యవేక్షించాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో తరగతులు సక్రమంగా జరగడం లేదు. కొంత మంది సీఆర్పీలు వేసవి శిబిరాలకు రావడం లేదు. ఈ విషయమై ఆర్వీఎం ఏఎంవో గంగయ్యను అడుగగా.. శిబిరాలు సక్రమంగానే నిర్వహిస్తున్నామని, సీఆర్పీలు లేని చోట విద్యావలంటీర్లను నియమించాలని మండల విద్యాధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు. -
ఆరుగురుఎంఈవోలు సస్పెన్షన్
ఆదిలాబాద్ టౌన్, న్యూస్లైన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం)లో తవ్విన కొద్దీ అక్ర మాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటు న్నా ఆ శాఖలోని అధికారుల తీరు మారడం లేదు. పేద పిల్లల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆరుగురు మండల విద్యాశాఖ అధికారుల(ఎంఈవో)ను, రాజీవ్ విద్యామిషన్ ప్రత్యాన్మయ(అలెస్కో) పాఠశాల కో-ఆర్టినేటర్ను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. నిధుల దుర్వినియోగ ఫలితం 2011-12, 2012-13 విద్యాసంవత్సరంలో ఆర్ఎస్టీసీ(బాల కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాల) నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్స్మెంట్ అధికారులు గతేడాది విచారణ చేపట్టారు. ఇందులో నిధుల దుర్వియోగం అయినట్లు తేలింది. విచారణ రిపోర్టులు ప్రభుత్వానికి అందజేశారు. రిపోర్టును ఆర్వీఎం అధికారులకు ప్రభుత్వం పంపింది. దీంతో ఆర్వీఎం అధికారులు కలెక్టర్కు నివేదికలు అందజేశారు. ఎంఈవోలుగా పనిచేసిన వారిపైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అహ్మద్బాబు ఆర్జేడీకి నివేదించారు. ఆర్జేడీ స్పందిస్తూ ఆరుగురు ఎంఈవోలను, ఒక అలస్కోను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆర్ఎస్టీసీలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థలు, అధికారులు అక్రమాలకు పాల్పడటంతో అధికారులపై చర్యలు చేపట్టారు. -
మొక్కు‘బడులు’
నిజాంసాగర్, న్యూస్లైన్: రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి ప్రారంభించిన వేసవి బడులు నామమాత్రం గా కొనసాగుతున్నాయి. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం వేసవి బడులను తెరచినా ఆదరణ కరువైంది. ప్రాథమిక స్థాయిలో అక్షరాభ్యాసానికి దూరమతున్న విద్యార్థుల్లో నెపుణ్యతను పెంపొందించడంతో పాటు వారిని ముందుకు తీసుకురావడానికి చేపట్టిన ప్రణాళిక నీరుగారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న వేసవి బడుల్లో వెనుకబడిన విద్యార్థులు కనిపించడం లేదు. జిల్లాలో.. జిల్లావ్యాప్తంగా 229 క్లస్టర్లకు గాను ప్రస్తుతం 228 క్లస్టర్లలో వే సవి బడులను ఆర్వీఎం సహకారంతో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోని 1, 2, 3, 4, 5 తరగతుల్లో వెనుకబడిన (సీ గ్రేడ్) విద్యార్థులను క్లస్టర్ల వారీగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుర్తించారు. వేసవి సెలవుల్లో వీరు అభ్యసనకు దూరం కాకుండా ఉండేందుకు ఆటపాటల ద్వారా చదువు నేర్పించేందుకు వేసవి బడులను ప్రారంభించారు. అభ్యసన పుస్తకాలను ఆర్వీఎం అధికారులు మండలాల వారీగా పాఠశాలలకు పంపిణీ చేశారు. ఒక్కో వేసవి బడిలో 30 మంది విద్యార్థుల చొప్పున గుర్తించారు. వేసవి బడుల నిర్వహణ కోసం ఆయా క్లస్టర్ల వారీగా ఉన్న సీఆర్పీలు బడులను నిర్వహిస్తున్నారు. బడులు ప్రారంభమైన వారం రోజుల పాటు సీ గ్రేడ్ విద్యార్థులు ఆసక్తి చూపారు. కాని గడిచిన వారం రోజుల నుంచి కొన్ని బడులకు విద్యార్థులు రావడం లేదు. ఆయా క్లస్టర్ల వారీగా కొనసాగుతున్న వేసవి బడుల నిర్వహణపై ఆర్వీఎం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సీఆర్పీలు మొక్కుబడిగా వాటి ని నిర్వహిస్తున్నారు. ఏ గ్రేడ్ విద్యార్థులు హాజరు వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రారంభించిన వేసవి బడుల్లో ఏ గ్రేడ్ విద్యార్థులు ఉం టున్నారు. సోమవారం మహమ్మద్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని వేసవి బడిలో పలువురు ఏ గ్రేడ్ విద్యార్థులు కనిపించారు. ఇక్కడ తొమ్మిది మంది సీ గ్రేడ్ విద్యార్థులుండగా.. వారు వేసవి బడికి రాకుండా వీధుల్లో ఆడుకోవడానికే ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. -
సంపూర్ణ గిరిజన విద్యాభివృద్ధే లక్ష్యం
పాడేరు, న్యూస్లైన్ : వచ్చే విద్యా సంవత్సరంలో సంపూర్ణ గిరిజన విద్యాభివృద్ధి లక్ష్యంతో ఉపాధ్యాయులంతా చిత్తశుద్ధితో పని చేయాలని గిరిజన సంక్షేమ డీడీ, ఇన్చార్జి ఏజెన్సీ డీఈఓ బి.మల్లికార్జునరెడ్డి ఆదేశించారు. తలారిసింగి ఆశ్రమ పాఠశాల భవనంలో అరకులోయ, అనంతగిరి మండలాలకు చెందిన అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మంగళవా రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్య పటిష్టానికి ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. మెరుగైన ప్రాథమిక విద్యతోపాటు పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్ఎస్ఏ నిధులతో చేపట్టిన అదనపు భవనాల నిర్మాణాలను కూడా వేగవంతం చేస్తామన్నారు. పాఠశాలల అభివృద్ధికి రాజీవ్ విద్యామిషన్, ఎస్ఎస్ఏ నిధులను పారదర్శకంగా ఖ ర్చు పెట్టాలన్నారు. అన్ని పాఠశాలల కు గత విద్యా సంవత్సరంలో మంజూ రైన నిధులతో రంగులు వేయించాలని ఆదేశించినా కొన్ని పాఠశాలల్లోనే పనులు జరిగాయని చెప్పారు. మిగతా పాఠశాలల్లో పనులను కూడా విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పూర్తి చేయాలన్నారు. రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 5 నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. అన్ని పాఠశాలలకు తరగతుల వారీగా పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ఉపాధ్యాయులు తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులకు యూని ఫాం పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని, కుట్టుకూలి నిధులు కూడా ఆర్వీఎం పథకం కింద మంజూరయ్యాయన్నారు. సమావేశంలో అరకులోయ ఎంఈఓ సువర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అర్జీదారులకు న్యాయమైన పరిష్కారం
ప్రజావాణిలో అధికారులకు ఏజేసీ సూచన 130 దరఖాస్తుల రాక కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్లైన్ : ప్రజావాణిలో అర్జీదారులు పేర్కొన్న సమస్యలకు న్యాయమైన పరిష్కారం చూపాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు అధికారులకు సూచించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని దాదాపు రెండు నెలల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎ.ప్రభావతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 130 అర్జీలు దరఖాస్తుదారుల నుంచి వచ్చి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ ఎన్నికల విధులు ముగిశాయని, ఇకపై ప్రజావాణి అర్జీలపై అధికారులు దృష్టిసారించాలని చెప్పారు. వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని అధికారులు కిందిస్థాయి సిబ్బందికి అప్పగించకుండా అర్జీదారు ఇచ్చిన సమస్యను పరిష్కరించాలన్నారు. అర్జీదారుడికి న్యాయమైన పరిష్కారం చూపి వారిలో నమ్మకం కలిగించాలని సూచించారు. పరిష్కరించిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఖరీఫ్ సీజన్, విద్యాసంవత్సరం ప్రారంభం కావస్తున్నాయని, ఇకపై అర్జీలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని ఏజేసీ తెలిపారు. ఆలస్యంగా వచ్చిన అధికారులు... రెండు నెలల తరువాత నిర్వహించిన ప్రజావాణి తొలి కార్యక్రమానికి అధికారులు ఆలస్యంగా హాజరుకావడం గమనార్హం. సాధారణంగా ప్రజావాణి కార్యక్రమానికి 60 నుంచి 70 మంది అధికారులు, సిబ్బంది హాజరవుతారు. సోమవారం మాత్రం 11.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజావాణి కార్యక్రమానికి తొలుత కేవలం పది, పదిహేను మంది అధికారులు మాత్రమే వచ్చారు. 11.30 నుంచి 12 గంటలలోపు ఒక్కొక్క అధికారి రావటం ప్రారంభించారు. కలెక్టర్ రఘునందనరావు ప్రజావాణి కార్యక్రమానికి హాజరైతే అధికారులు 10 నిమిషాలు ముందుగానే సమావేశపు హాలుకు చేరుకునే అధికారులు.. కలెక్టర్, జేసీ రారని తెలియటంతో ఆలస్యంగా హాజరవటం గమనార్హం. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, బీసీ సంక్షేమ శాఖాధికారి లక్ష్మీదుర్గ, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, రాజీవ్ విద్యామిషన్ పీవో డి.పద్మావతి, డీఈవో దేవానందరెడ్డి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి దృష్టికి వచ్చిన పలు సమస్యలివీ... గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న తమకు గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించటం లేదని 104 కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి వి.శాంతికుమార్ అర్జీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించి 24 రోజుల పని దినాలను అమలు పరచాలని అర్జీలో కోరారు. రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణాజిల్లాకు నందమూరి తారకరామారావు జిల్లాగా నామకరణం చేయాలని ప్రముఖ న్యాయమూర్తి కంచర్లపల్లి శివరామప్రసాద్ అర్జీ ఇచ్చారు. జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించిన నందమూరి తారక రామారావును గుర్తించి జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలని ఆయన అర్జీలో కోరారు. వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన ఎస్.మోహనరెడ్డి తన వ్యవసాయ భూములకు సంబంధించి అడంగల్లో తప్పుగా నమోదైందని, ఆ వివరాలను సరిచేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. తమ భూముల సరిహద్దుల్లో అక్రమంగా చేపల చెరువులు సాగు చేస్తున్నారని, వాటిని నియంత్రించాలని కోరుతూ అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయిందని మండవల్లి మండలం లోకుమూడి గ్రామానికి చెందిన బొందలపాటి గిరిధరవరప్రసాద్, గ్రామస్తులు అర్జీ అందజేశారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెడన పట్టణం 22వ వార్డులో ఇళ్ల మధ్యలో కలంకారీ ఉడుకుల పొయ్యిను ఏర్పాటు చేయటం వల్ల దట్టమైన పొగతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని యర్రా బాలసుబ్రమణ్యం అర్జీ అందజేశారు. కాలనీవాసులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇళ్ల మధ్యలో ఉన్న పొయ్యిను తొలగించాలని ఆయన కోరారు. మోపిదేవి మండలం కోసూరివారిపాలేనికి చెందిన కోసూరి వెంకటేశ్వరరావు 2014 ఏప్రిల్ 22న విద్యుత్షాక్కు గురై మరణించారని, కుటుంబ సభ్యులకు లోకాయుక్త ఆదేశాల మేరకు సహాయం అందజేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ అందజేశారు. ఆపద్బందు పథకం కింద రూ.50 వేలు, విద్యుత్ శాఖ ఎస్ఈ లక్ష రూపాయలు మంజూరు చేయాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసిందని ఆయన అర్జీలో పేర్కొన్నారు. కృత్తివెన్ను మండలంలోని ఇంతేరు గ్రామంలో చౌకధరల దుకాణం యజమాని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గ్రామానికి చెందిన తమ్ము ఆంజనేయులు అర్జీ ఇచ్చారు. చనిపోయిన రేషన్కార్డుదారుల రేషన్ను అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నారని, షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
లెక్క తేలేనా..?
ఖమ్మం, న్యూస్లైన్: ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయలు విడుదలయ్యే రాజీవ్ విద్యామిషన్ నిధుల లెక్కలు తేలడం లేదు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా నిధులు మంజూరు చేయడమే తప్ప వాటి ఖర్చు వివరాలు తెలుసుకోవడంపై ఆ శాఖ అధికారులు ఏనాడూ దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే తీసుకున్న డబ్బుల వివరాలు చెప్పేందుకు పలువురు ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముందుకు రావడం లేదు. దీంతో ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు విడుదలయ్యాయనే విషయంపై జిల్లా అధికారులు ఏళ్ల తరబడి కుస్తీపట్టినా సరైన వివరాలు తెలియడం లేదు. ఆర్వీఎం ద్వారా విడుదలైన సుమారు రూ. 1.70 కోట్లకు లెక్కలు తేలాల్సి ఉండగా వీటికి ఖర్చుల వివరాలు చెప్పేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. దీనిపై రాష్ట్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏ శాఖలో ఎంత ఖర్చు చేశారు.. నిల్వ ఎంత ఉంది..అనే లెక్కలు తేల్చేందుకు రాష్ట్ర ఆడిట్ బృందాన్ని జిల్లాకు పంపించారు. ఎంఈవోల ఖాతాల్లో రూ. 31.44 లక్షలు... ఆర్వీఎం ప్రారంభం నుంచి ఖర్చు చేయగా మిగిలిన డబ్బుతోపాటు 2013-14 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన గ్రాంట్స్ మొత్తం కలిసి జిల్లాలోని 46 మండలాల విద్యాశాఖాధికారుల ఖాతాల్లో ఉన్న రూ. 31,44, 640లకు అక్విటెన్సీలు సమర్పించాల్సి ఉంది. విడుదల చేసిన గ్రాంట్ల ఖర్చులు, మిగులు వివరాలు ఆయా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఉన్నతాధికారులకు సమర్పించాలి. కానీ ఆర్వీఎం ద్వారా విడుదల చేసిన నిధుల వివరాలు సంవత్సరాలు గడిచినా చెప్పకపోవడంతో జాతీయ మానవ వనరుల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో వివరాలు తెలిపితే తప్ప కొత్త గ్రాంట్స్ విడుదల చేయమని అధికారులు తేల్చి చెప్పారు. దీనికి తోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని శాఖల నిల్వ బడ్జెట్ వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గత వారం రోజులుగా జిల్లాలోని పలు మండల కేంద్రాలు, డివిజన్ సెంటర్లలో ఆడిట్ బృందాలు దిగి పాఠశాలల్లో లెక్కలు పరిశీలిస్తున్నాయి. ఇది ముగిస్తేనే ఎంఈవోల ఖాతాల నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విడుదల చేసిన గ్రాంట్స్, ఖర్చులు, నిల్వ వివరాలు తేలే అవకాశం ఉంది. ఇతర శాఖల పరిధిలో రూ.1.14 కోట్లు... విద్యాశాఖతోపాటు, అనుబంధ శాఖలు, సంక్షేమ శాఖల పరిధిలో రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదల చేసిన రూ. 1,14,92,116 లకు సంబంధించిన అక్విటెన్సీలు సమర్పించాల్సి ఉంది. ఇందులో బీసీ వెల్ఫేర్ పరిధిలో రూ. 3.4 లక్షలు, డీఈవో పరిధిలో రూ. 3,90,758, ఖమ్మం డిప్యూటీ ఈవో పరిధిలో రూ. 24,65,380, కొత్తగూడెం డిప్యూటీ ఈవో పరిధిలో రూ.18,00,589, బోనకల్ ఎంపీడీవో పరిధిలో రూ. 7,301, చింతకాని ఎంపీడీవో పరిధిలో రూ. 13,093, ఖమ్మం రూరల్ ఎంపీడీవో పరిధిలో రూ. 49,151, కూసుమంచి ఎంపీడీవో పరిధిలో 1,14,635, ఎర్రుపాలెం ఎంపీడీవో పరిధిలో రూ. 7,424, పీడీ డీడబ్ల్యూ అండ్ సీడీఏ రూ. 20 వేలు, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రాం ద్వారా రూ.1,05,970, బాలవెలుగు ప్రాజెక్టు ద్వారా రూ. 16 వేలు, ఐటీడీఏ భద్రాచలం నుంచి రూ. 15,19,489 కు సంబంధించిన ఖర్చుల వివరాలు తెలియడం లేదు. వీటితోపాటు రెండవ ఫేస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో రూ. 1.5 లక్షలు విడుదల చేసినట్లు అధికారుల లెక్కల్లో ఉన్నాయి. అయితే ఈ కార్యాలయం ఎక్కడ ఉందో.. ఆ డబ్బులు ఎందుకు ఖర్చు చేశారో అనేది అధికారులకే అంతుపట్టడం లేదు. అందరికి నోటీసులు పంపించాము: ఆర్వీఎం పీవో రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదల చేసిన నిధులకు సంబంధించి అక్విటెన్సీలు ఇవ్వని అన్ని శాఖల అధికారులకు నోటీసులు పంపించామని ఆర్వీఎం పీవో బాలె శ్రీనివాస్ తెలిపారు. ఎంఈవోల పరిధిలో ఉన్న డబ్బుల వివరాలు అడిట్ తర్వాత వస్తాయని, మిగిలిన ఇతర శాఖల అధికారులకు నోటీలు పంపించామని, అప్పటికీ స్పందించకపోతే ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పాఠశాలకు ‘మురిపాలు..’
కాకినాడ రూరల్, న్యూస్లైన్: ‘మురిపాలు, మురుగుపాలు’ అనే శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు స్పందించారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశాల మేరకు రాజీవ్ విద్యామిషన్ జిల్లా ప్రాజెక్టు అధికారి వెన్నపు చక్రధరరావు పర్యవేక్షణలో అధికారులు చిన్నారుల ఆచూకీ తెలుసుకునేందుకు ఇంద్రపాలెం, కాకినాడ ప్రాం తాల్లో శుక్రవారం ఉదయం నుంచి పర్యటిం చారు. వారిలో ఓ బాలుడిని గుర్తించి పట్టుకున్నారు. అతడి తల్లి మేడిపాటి గౌరి, తండ్రి మహ్మద్ నజీర్ విజయవాడ నుంచి 15 ఏళ్ల క్రితం కాకినాడకు వచ్చారు. వీరు కాగితాలు ఏరుకొని, వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాఉండగా గౌరి కుటుంబం కాకినాడ పీఆర్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన చిన్న గుడిసెలో ఉంటున్నారని, వీరి చిన్న అబ్బాయి మహమ్మద్ పాఠక్గా గుర్తిం చి, బాలుడిని సూర్యారావుపేట మున్సిపల్ ఎలిమెం టరీ పాఠశాలలో జాయిన్ చేసినట్టు పీఓ చక్రధరరావు ‘న్యూస్లైన్’కు తెలిపారు. ఈ చిన్నారి అన్నయ అన్నామణిని గత జూన్ నెలలో నాలుగో తరగతిలో చేర్చినట్టు చెప్పారు. ఇలాఉండగా మరొక బాలుడి కోసం ఉపాధ్యాయులు, అధికారులు ఇంద్రపాలెం పరి సర ప్రాంతాల్లో వెతుకుతున్నారని, గ్రామస్తుల సాయం కూడా తీసుకున్నట్టు చక్రధరరావు తెలిపారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ తాడి సుబ్బారావు ఆయన వెంట ఉన్నారు. -
మూతదిశగా 46 పాఠశాలలు!
జిల్లాలో 3957 ప్రాథమిక పాఠశాలలు 46 పాఠశాలల్లో 10 మందిలోపే విద్యార్థులు వీటి మనుగడ అనుమానమే చిత్తూరు(టౌన్), న్యూస్లైన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాపక్షోత్సవాలు, స్పెషల్ డ్రైవ్లంటూ హడావుడి చేస్తుంటారు రాజీవ్ విద్యామిషన్ అధికారులు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. మొత్తం 46 ప్రాథమిక పాఠశాలలు మూతదిశగా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 3,957 ప్రాథమిక పాఠశాలలు ఉన్నా యి. వీటిలోని 4 6పాఠశాలల్లో 10 మం దిలోపు విద్యార్థులున్నారు. ఇటీవల నిర్వహించిన యూడైస్ సర్వేలో ఈ విషయం తేలింది. గత విద్యాసంవత్సరం ప్రారంభంలో జిల్లాలో సుమారు 320 పాఠశాలల్లో 10 మందిలోపు విద్యార్థులు ఉన్నారు. వీరిని సమీపంలోని పాఠశాలలకు పంపి 320 పాఠశాలలను మూసేశారు. ఏ మండలంలో ఎన్ని? మొత్తం 31 మండలాల్లోని 46 పాఠశాలల్లో 10 మందిలోపు విద్యార్థులున్నట్లు సర్వే ద్వారా తేలింది. బి.కొత్తకోటలో- 1, బంగారుపాళంలో-1, చంద్రగిరిలో- 1, చిన్నగొట్టిగల్లులో-1, చిత్తూరులో- 3, గంగాధరనెల్లూరులో-3, గుడిపాల లో-1, గుడుపల్లెలో-1, గుర్రంకొండలో -1, ఐరాలలో-2, కేవీపల్లెలో-1, కలికిరిలో-2, కార్వేటినగరంలో-1, మదనపల్లెలో-1, పలమనేరులో-1, పాలసముద్రంలో-1, పీలేరులో-1, పులిచెర్లలో- 2, పూతలపట్టులో-2, రామకుప్పంలో -2, రొంపిచెర్లలో-2, శాంతిపురంలో- 1, సదుంలో-1, సోమలలో-2, శ్రీకాళహస్తిలో-1, తంబళ్లపల్లెలో-2, తవణంపల్లెలో-2, వి.కోటలో-1, వాయల్పాడులో-2, విజయపురంలో-1, ఎర్రావారి పాళెంలో-3 పాఠశాలలున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధ్యాయుల్లో శ్రద్ధ లేని కారణంగానే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. -
చిన్న‘చూపు’
సాక్షి, మంచిర్యాల : చిన్నారి చూపు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం గతేడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దృష్టి లోపమున్న విద్యార్థినీవిద్యార్థులకు నేత్ర పరీక్షలు చేసి కళ్లజోడు, అవసరముంటే శస్త్రచికిత్సలు చేయించాలన్నది పథకం ఉద్దేశం. గ తేడాది పథకం కింద చిన్నారులకు కంటి స్క్రీనింగ్ చేశారు. దృష్టి లోపమున్న వారిలో కొందరికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. తీవ్ర సమస్య ఉన్న 98 మందికి శస్త్ర చికిత్సలకు రెఫర్ చేశారు. 50 మంది విద్యార్థులకు మించి శస్త్రచికిత్సలు జరగలేదు. ఈ సారైనా కళ్లజోళ్లు అందుతాయని, శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చని ఇప్పటివరకు ఎదురుచూసిన చిన్నారుల ఆశలపై రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) నీళ్లు చల్లింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా విద్యార్థులకు కంటి స్క్రీనింగ్, శస్త్ర చికిత్సలు చేయించలేదు. చిన్నారి చూపు.. ఈ విద్యా సంవత్సరంతోనే రద్దయిందని చెప్పి చేతులు దులుపుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు కంటి వైద్య సేవలకు దూరమయ్యారు. పథక విశేషాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఐదు నుంచి పదిహేనేళ్ల వయస్సు ఉన్న విద్యార్థులు, బడిబయట చిన్నారుల కోసం ప్రభుత్వం అక్టోబర్ 29, 2012న ‘చిన్నారి చూపు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్వహణ బాధ్యతను ఆర్వీఎంకు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పర్యటించి, కంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోడు పంపిణీ, ఆపరేషన్లు చేయించాలని ఆర్వీఎంను ఆదేశించింది. కొందరికే లబ్ధి కంటి సమస్యతో బాధపడుతున్న ఐదు వేల మంది విద్యార్థులను గుర్తించిన ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు వారిని శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారు. దీంతో రాజీవ్ విద్యామిషన్, జిల్లా కేంద్రంలోని రిమ్స్, వెస్ట్మరెడ్పల్లి(సికింద్రాబాద్)లోని విశ్వగిరి కంటి ఆస్పత్రిలో సుమా రు 50 మంది విద్యార్థులకు శస్త్ర చికత్సలు నిర్వహించింది. పలువురు విద్యార్థులకు హైపవర్ క ళ్లజోళ్లు పంపిణీ చేసింది. ఇదిలా ఉంటే.. నార్నూర్, తిర్యాణి, కోటపల్లి, బెజ్జూరు ఇంకా చాలా మండలాల్లోని వందలాది పాఠశాలలకు ఐఆర్టీ, ఐఐటీ, విద్యావలంటీర్లు వెళ్లలేదు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థుల ఎదురుచూపులు జిల్లాలో 4,500 ప్రాథమిక, 2,700 ప్రాథమికోన్నత, 572 ఉన్నత పాఠశాలలున్నాయి. సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. బడిబయట ఉన్న వారి సంఖ్య వేలలోనే ఉంటుంది. పథకం ప్రారంభంలో కొన్ని పాఠశాలల్లోనే పర్యటించిన సిబ్బంది 5వేల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో దృష్టి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 70 వేలపైనే ఉండే అవకాశం ఉంది. కనీసం ఈ విద్యా సంవత్సరమైనా ఆయా స్కూళ్లలో కంటి స్క్రీనింగ్ చేపడితే శస్త్ర చికిత్సలు చేయించుకోలేని నిరుపేద విద్యార్థులకు ఆపరేషన్ చేసుకునే వీలుంటుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పథకం విషయమై ఆర్వీఎం చిన్నారిచూపు పథక ఇన్చార్జి సంతోష్ను అడుగగా.. ఈ విద్యా సంవత్సరం పథక నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాలేదన్నారు. -
ఆశలన్నీ కొత్త ప్రణాళికపైనే
కొత్త ప్రణాళిక ఇలా.. 2014-15 సంవత్సర వార్షిక ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలిలా ఉన్నాయి. వీటితో పాటు సాధారణ అంశాలైన ఉద్యోగుల వేతనాలు, కేజీబీవీల నిర్వహణ, పాఠశాలల గ్రాంట్లు తదితర ఇతర అంశాలు కూడా ఉంటాయి. 1,114 విద్యార్థులను కవర్ చేసేందుకు కొత్తగా 23 ప్రాథమిక పాఠశాలలు 142 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడం 1,635 మంది పిల్లలకు ఇంటి నుంచి బడికి, తర్వాత ఇంటికి తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం 705 అదనపు తరగతి గదుల ఏర్పాటు రెండు పట్టణ, రెండు గ్రామీణ రెసిడెన్షియల్ హాస్టళ్లు అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలకు ఫర్నీచర్ ప్రత్యేక పిల్లలకు ఫ్రెండ్లీ టాయిలెట్స్ 716 ఎస్జీటీ పోస్టులు, 785 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల మంజూరు రూ.315 కోట్లతో 2014-15 ఆర్వీఎం వార్షిక ప్రణాళిక ఖరారు కొత్త అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన అధికారులు గత ప్రణాళిక రూ.213 కోట్లు.. ఇచ్చింది రూ.126కోట్లే! పూర్తిస్థాయి నిధుల రాకపై ఈసారీ అనుమానమే సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా రాజీవ్ విద్యామిషన్ కొత్త వార్షిక ప్రణాళిక ఖరారైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రణాళికకు సర్కారు భారీగా కోతలు పెట్టడంతో కుదేలైన ఆర్వీఎం.. 2014-15 వార్షిక ప్రణాళికపైనే గంపెడాశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సరికొత్త అంశాలను జోడిస్తూ వార్షిక ప్రణాళికను తయారు చేసింది. తాజా ప్లాన్లో పెండింగ్ పనులు పూర్తి చేయడంతోపాటు కొత్తగా అదనపు తరగతి గదులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, పాఠశాలల అప్గ్రెడేషన్, ఇంటి నుంచి బడికి విద్యార్థుల రవాణా, ఫర్నీచర్ తదితర కీలకాంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. గాడిన పెట్టేందుకు.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు రూ.213 కోట్లతో ప్రణాళిక తయారు చేశారు. అయితే ఇందులో కేవలం రూ.126కోట్లకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో కీలకంగా చేపట్టే కార్యక్రమాలకు నిధులు కొరత ఏర్పడింది. దీంతో ఈ ఏడాది వ్యూహాత్మకంగా ప్రణాళికను తయారు చేశారు. ప్రాధాన్య అంశాలనే ప్రస్తావిస్తూ రూ.315కోట్లతో పక్కాగా ప్రణాళిక తయారు చేశారు. అయితే ప్రభుత్వం ఏమేరకు ఆమోదిస్తుందో వేచి చూడాలి. -
‘బడిఈడు’ సర్వేల్లో లోపాలు
నిజామాబాద్అర్బన్, న్యూస్లైన్ : బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలకు పంపి, చదివించాల్సిందేనని విద్యాహక్కు చట్టం ద్వారా ప్రభుత్వం స్పష్టంచేసింది. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి, పిల్లలను బడిబాట పట్టించాలనీ చెప్పింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, పర్యవేక్షణ లోపంతో ఈ లక్ష్యం నీరుగారుతోంది. లెక్కింపులో నిర్లక్ష్యం జిల్లాలో బడిఈడు పిల్లల లెక్కింపులో అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతోంది. పిల్లల సంఖ్యకు తగ్గట్లు ఏర్పాట్లు చేసి, వారికి సరైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అధికారులు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పిల్లల లెక్కింపు కోసం తూతూమంత్రంగా సర్వేలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టు అధికారులు, రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) అధికారులు సర్వే లోపాలపై తమ తప్పు లేదని, మరోసారి చేపడతామని చెబుతున్నారు. తూతూ మంత్రంగా జిల్లాలో బడిబయట ఉన్న పిల్లలను గుర్తించడానికి ఆర్వీఎం అధికారులు మూడు నెలలుగా సర్వేచేయించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో లెక్కింపును మూడు స్వచ్ఛంద సంస్థలకు, మున్సిపాలిటీలను మెప్మా అధికారులకు అప్పగించారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల్లో సర్వే చేపట్టారు. ఈ సర్వే లెక్కల ప్రకారం 1401 మంది బాల కార్మికులు జిల్లాలో ఉన్నట్లు తేలింది. ఇందులో 123 మంది చిన్నారులు అతి పేదరికంలో ఉన్న బాలలుగా గుర్తించారు. ఈ సర్వే ఫలితాలపై ఆర్వీఎం అధికారులే నివ్వెరపోయారు. గతంలోనే జిల్లాలో రెండువేల వరకు బాల కార్మికులు ఉండగా, ప్రస్తుత సర్వేలో తక్కువ రావడంపై అనుమానాలు వ్యక్తంచేశారు. దీంతో ఈ సర్వే సక్రమంగా లేదంటూ మళ్లీ చేపట్టాలని ఆర్వీఎం పీఓ భిక్షునాయక్ నిర్ణయించారు. ఈ లెక్కింపులో భాగస్వామంగా ఉన్న బాలకార్మిక నిర్మూలన అధికారులు సర్వేలో తమ తప్పు లేదని చెబుతున్నారు. అసంపూర్తి సర్వేతోనే బడిబయట పిల్లల లెక్కింపునకు సంబంధించిన అసంపూర్తి సర్వే ఆధారంగానే జిల్లాలో మూడు ఆర్బీసీ సెంటర్లను ప్రారంభించారు. నిజామాబాద్ మండలం మోపాల్, డిచ్పల్లి మండలం నడిపల్లి, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి , మాక్లూర్ మండలం మామిడిపల్లి, సక్రినాయక్తండాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఇటుక బట్టీల్లో పనిచేసే బాల కార్మికుల కోసం ఈ సెంటర్లను ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు, విద్యాబోధనకు సంబంధించి అతి తక్కువ ఆర్థికమొత్తం అందిస్తున్నారు. నెలకు 600 మాత్రమే ఒక్కో విద్యార్థిపై ఖర్చు చేస్తున్నారు. ఇందులోనే టీచర్ మెటీరియల్, వేతనం అందించాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు మరిన్ని నిధుల కోసం ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నారు. -
పనిలో బాల్యం
సాక్షి, కడప: 14 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలను ఏరకమైన పనిలో పెట్టకూడదు. వారు ఖచ్చితంగా బడిలో ఉండాలని కేంద్రం సమగ్ర విద్యా పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా బాల కార్మికులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలను చేపట్టింది. పలు కీలక శాఖల సమన్వయంతో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రయత్నిస్తోంది. ఇందులో కార్మిక, రాజీవ్ విద్యామిషన్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంత కసరత్తు జరుగుతున్నా కొందరు అధికారుల నిర్లక్ష్యంతో అనేక చోట్ల బాలకార్మికులు దర్శనమిస్తూనే ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం లేదు బాలకార్మికులు ఎక్కడ కనపడినా 1098కు వెంటనే తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే కార్మిక,రాజీవ్ విద్యామిషన్, సాంఘిక సంక్షేమ శాఖ,రెవిన్యూ, పోలీసు శాఖలు బాలకార్మికులు ఉన్న ప్రదేశానికి చేరుకుని వారిని విముక్తి చేయాలి. వారితో పని చేయించుకుంటున్న యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి. వెంటనే వారికి పునరావాసం కల్పించాలి. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో పిల్లలను స్కూల్లో చేర్పించాలి. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వసతి కల్పించాలి. చిన్న పిల్లలైతే ఐసీడీఎస్ పునరావసం కల్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రణాళిక పక్కగా ఉన్నా క్షేత్ర స్థాయిలో ఆ దిశగా కసరత్తు జరగడంలేదు. 1098కు దాదాపుగా ఎటువంటి సమాచారం ందడం లేదని తెలుస్తోంది. నామమాత్రపు దాడులు : కార్మిక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు జరిపి బాలకార్మికులను గుర్తించి వెంటనే పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది కేవలం 94 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. చెత్త పేపర్లు ఏరుకుంటూ అనేక మంది పిల్లలు నిత్యం కనిపిస్తునే ఉంటారు. హోటళ్లు, మెకానిక్ షాపులు, భవన నిర్మాణాలలో అనేక మంది బాలకార్మికులు పనిచేస్తున్నా రాజీవ్ విద్యామిషన్, కార్మిక శాఖ అధికారులకు కనపడకపోవడం గమనార్హం. మూతపడిన బాలకార్మిక పాఠశాలలు బాలకార్మికులకు చదువు సంధ్యలు నేర్పించడానికి బాలకార్మిక పాఠశాలలు నడిచేవి. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వీటిని నడుపుతుండేవారు. గత ఏడాది జనవరిలో జిల్లాలో 30కి పైగా బాలకార్మిక పాఠశాలలకు అనుమతి ఇచ్చారు. అయితే బడ్జెట్ లేని కారణంగా గత జులైలో వీటిని మూసేశారు. -
బడికెళ్లని బాల్యం
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్లైన్: బడి ఈడు పిల్లలు పాఠశాలలకు వెళ్ళకుండా ఎక్కడ ఏపనిలో ఉన్నా వారిని బాలకార్మికులుగా పరిగణించాలని నిర్బంధ విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తోంది. ప్రతియేటా జూన్లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించి, విద్యా పక్షోత్సవాలు, వారోత్సవాల పేరుతో హడావుడి చేస్తుండటం మినహా తల్లిదండ్రులకు ఉపాధి చూపి తద్వారా బాలకార్మికులను పాఠశాలలకు పంపాలనే కనీస బాధ్యతను విస్మరిస్తోంది. జిల్లాలో ఆరు నుంచి 14 ఏళ్ళలోపు వయసు కలిగిన బడిఈడు బాలలు 2,598 మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో దీనికి రెట్టింపు సంఖ్యలో చిన్నారులు బాల కార్మికులుగా మగ్గుతున్నారని తెలుస్తోంది. గ్రామాల్లో పనులు లేక ఉపాధిని వెతుక్కుంటూ పేద కుటుంబాలు పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్న కారణంగా వారి పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. మరి కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మరణించడంతో కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సి రావడం వల్ల చిన్నారులు బడికివెళ్లలేక పోతున్నారు. ఒక్కో మండలంలో ఒక్కో విధంగా జిల్లాలో మండలాల వారీగా ఎంఈవోలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సేకరించిన వివరాల ప్రకారం 2,598 మంది బాలలు బడికి దూరంగా మగ్గుతున్నారని తెలుస్తోంది. గత ఏడాది జూన్లో పాఠశాలలు తెరిచే సమయానికి జిల్లాలో 2881 మంది బాలలు బడికి దూరంగా ఉన్నట్టు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) లెక్క తేల్చింది. అనంతరం నిర్వహించిన విద్యా పక్షోత్సవాల్లో వారిలో 2362 మందిని పాఠశాలల్లో చేర్పించామని అధికారులు చెబుతున్నారు. వీరిలో దాదాపు వెయ్యి మంది బాలికలను కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో చేర్పించగా, మిగిలిన వారిని సమీప ప్రాంతాల్లోని పాఠశాలల్లో చేర్పించారు. అయితే తాజా లెక్కల ప్రకారం బడి ఈడు పిల్లలు 2,598 మంది ఉన్నారు. వీరిలో ఒక్కో మండలంలో ఒక్కో విధంగా ఉన్నారు. ఉదాహరణకు అత్యధికంగా బొల్లాపల్లిలో 154 మంది, చిలకలూరిపేటలో 142, రాజుపాలెంలో 134, నరసరావుపేటలో 132 ఉండగా, అత్యల్పంగా మాచర్లలో ఎనిమిది మంది, వట్టిచెరుకూరులో ఆరుగురు, తుళ్ళూరు, గురజాల, వేమూరులో నలుగురేసి చొప్పున ఉన్నారని ఆర్వీఎం లెక్కలు చెబుతున్నాయి. అమ్మానాన్మలతో పాటే కూలిపనులకు.. అమ్మానాన్నలిద్ధరూ కూలిపనులకు వెళతున్నారు. వారితో పాటే నేనూ బేల్దారి పనికి వెళుతున్నా. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్లనే పాఠశాలకు వెళ్ళడం లేదు. చిన్నప్పుడు ఒకటో తరగతి చదివినా ఇంట్లో సరిగా లేక మరలా స్కూల్ మానేశా. ఇప్పుడు మళ్ళీ చదవాలని లేదు. - యు. శ్రీను, గుంటూరు పనికి వెళుతున్నా.. నాన్న ఆటోడ్రైవర్ అమ్మ ఇం ట్లోనే ఉంటుంది. నాన్న ఒక్క డి వల్ల ఇల్లు గడవదని, నేనూ పని కి వెళుతున్నా. తమ్ముడిని చదువుకోమని హాస్టల్కు పంపాం. - టి. ప్రదీప్, గుంటూరు -
రాజీవ్ ‘వృథా’మిషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని పాఠశాలలు 50 వేలు... ఉన్నా వాడటానికి అనువైన స్థితిలో ఉన్న స్కూళ్లు 30 వేలు మాత్రమే.. బాలికలు అధికంగా ఉన్న స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించడానికి వుహాఅరుుతే రూ. 100 కోట్లు అవసరం అవుతాయి. అయితే నిధుల కొరతవల్ల ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారంటే పొరబడ్డట్లే! రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) కింద రూ.2,500 కోట్లున్నారుు. కానీ ఈ నిధులను అవసరమైనవాటికోసం కాకుండా ముఖ్యమంత్రి పర్యటనలకు, కలెక్టర్ల క్యాంపు ఆఫీసుల్లో టీవీలకు, సెల్ఫోన్ల కొనుగోలుకు, వాహనాల అద్దెలకు, విలాసాలకు వృథాగా ఖర్చు చేస్తున్నారు. చివరకు మినరల్ వాటర్ కొనుగోలుకూ పిల్లల విద్యానిధుల్నే తాగేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్వీఎం నిధులు ఏతీరుగా దుర్వినియోగం అయ్యాయో తెలిపే నివేదికను ‘సాక్షి’ సంపాదించింది. ఆర్వీఎంకు సంబంధంలేని కార్యకలాపాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆ నివేదిక లో వెల్లడైంది. శాఖాపరమైన సమీక్షలోనే కళ్లుతిరిగే ‘ఖర్చు లు’ బయటపడితే ఇక ... స్వతంత్ర విచారణ జరిగితే భారీ కుంభకోణాలు బయటకువస్తాయని అధికారులంటున్నారు. నిధుల దుర్వినియోగంలో మచ్చుకు కొన్ని.. ప్రకాశం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం మరమ్మతులు, టీవీలు, కంప్యూటర్ల కొనుగోలుకు ఆ జిల్లా ఆర్వీఎం ప్రాజెక్టు ఆఫీసర్ (పీవో) రూ. 70 లక్షలు విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కారు ఇంధనానికి రూ. 2 లక్షల ఆర్వీఎం నిధులను వాడారు. ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కోసం డీఆర్డీఏ పీడీ ఖాతాకు రూ. 5 లక్షలు జమ చేశారు. కిందిస్థాయి అధికారుల వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులు మళ్లించకూడదని నిబంధన ఉన్నా.. ఇదే జిల్లాలో ఒక అధికారి ఖాతాకు రూ. 7 లక్షలు బదిలీ చేశారు. విశాఖ జిల్లాలో పలువురు సెక్టోరియల్ అధికారులకు రూ. 40 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో సంబంధిత శాఖ మంత్రి ప్రొటోకాల్ చార్జీల కోసం రూ. 5.50 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించారు. విజయనగరం జిల్లా పీవో ఆర్వీఎం నిధులతో ఖరీదైన సెల్ఫోన్ కొన్నారు. ఉన్నతాధికారులు గుర్తించి అడిగినా లక్ష్యపెట్టలేదు. బదిలీ అయినప్పుడు ఆ ఫోన్ను అప్పగించనూలేదు. వైఎస్సార్ జిల్లాలో ఓ మంత్రి (ఇప్పుడు మాజీ) ఆఫీస్లో ఉద్యోగులకు ఆర్వీఎం నిధుల నుంచి జీతాలు చెల్లించారు. ఇదే జిల్లా పీవో తన పేరిట రూ. 4 లక్షలు తీసుకొని తిరిగి చెల్లించలేదు. వరంగల్ జిల్లాలో వివిధ బిల్లులను కలెక్టర్ అనుమతి లేకుండా పీవో సొమ్ము చేసుకున్నారు. రూ. లక్ష దాటిన బిల్లులనే కలెక్టర్కు పంపించాలనే నిబంధన ఉండటంతో, బిల్లులను విభజించి గరిష్ట పరిమితి దాటకుండా జాగ్రత్తపడ్డారు. నల్లగొండ పీవో కూడా ఇదే విధంగా సొమ్ము చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పీవో అనుమతి లేని పనులకు రూ. 18 లక్షలు ఖర్చు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రికా ర్డు రూమ్ మరమ్మతుల కోసం 3 లక్షలు కేటాయించారు. జనాల సమీకరణ కోసం చిత్తూరు పీవో రూ. 4 లక్షలు ఖర్చు పెట్టారు. ఆర్వీఎంలో ఇలా నిధులు ఖర్చు చేయడానికి అవకాశం లేదు. అన్ని జిల్లాల్లో కలిపి జన సమీకరణ కోసం రూ. 2 కోట్లకుపైగా ఖర్చు చేశారు. గుంటూరు జిల్లాలో బోయపాలెం డైట్ ప్రిన్సిపాల్ వాహన అద్దె కోసం ఏకంగా రూ. 4 లక్షలు ఆర్వీఎం నిధులను చెల్లించారు. పలు జిల్లాల్లో కలెక్టర్, పీవో కార్యాలయాల్లో మినరల్ వాటర్ కొనుగోలుకు ఆర్వీఎం నిధుల నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. -
ఇరుకిరుకుగా ఇంకెన్నాళ్లు..?
విద్యారణ్యపురి, న్యూస్లైన్ : జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు, ఉ పాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను తీ ర్చేందుకు అధికారులు చేస్తున్న కృషి ఫలించ డం లేదు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అదనపు తరగతి గదులు మంజూరు చేయగా, వాటి నిర్మాణం నత్తనడకన సాగుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. 2012-13 విద్యాసంవత్సరంలో రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) రాష్ట్ర ప్రాజెక్టు అధికారులు జిల్లాకు 934 అదనపు గదుల నిర్మాణానికి మం జూరు ఇచ్చారు. ఒక్కో గదికి రూ.5.30లక్షల చొప్పున రూ.52.46కోట్లు మంజూరు చేశారు కూడా. నిధుల మంజూరైన ఆరు నెలల్లోనే గదుల నిర్మాణం పూర్తిచేయాలనే ఆదేశాలు ఉండగా, ఏడాది పూర్తయినా అరకొరగానే గదుల నిర్మాణం పూర్తయింది. ఫలితంగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా గదులు లేక వరండాలతో పాటు ఒక్కో గదిలో రెండు తరగతులకు బోధన చేస్తున్నారు. నిర్మాణ దశలో 360 గదులు జిల్లావ్యాప్తంగా పలు పాఠశాలల్లో 934 అదనపు గదులు మంజూరుకాగా, ఇందులో ఇప్ప టి వరకు 519 గదుల నిర్మాణాలే పూర్తయ్యా యి. ఇక 360 గదుల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కాగా, ఆర్థిక సంవత్సరం ముగింపు అయిన మార్చి 31వ తేదీ సమీపిస్తుండడంతో అప్పటిలోగా గదుల నిర్మాణం పూర్తిచేయకపో తే నిధులు వెనక్కి మళ్లే ప్రమాదముంది. దీం తో మార్చి 31వ తేదీలోగా నిర్మాణాలు పూర్తిచేయాలని ఆర్వీఎం అధికారులు ఇటీవల ఎస్ఎంసీలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు పారంభించనివి 55 పలు పాఠశాలలకు మంజూరైన 55 అదనపు గదుల నిర్మాణం ఇంతవరకు ప్రారంభమే కాలే దు. ఇందులో వరంగల్ అర్బన్లోని వివిధ పాఠశాలల్లో సరిపడా స్థలం లేకపోవడంతో 24 గదులకు సంబంధించి సందిగ్దత నెలకొంది. ఈమేరకు అవసరమున్న వేరే పాఠశాలలకు వీటిని కేటాయించాలని జిల్లా అధికారులు తా జాగా ఆర్వీఎం రాష్ట్ర పీడీకి ప్రతిపాదించారు. మచిలీబజార్ పాఠశాలలది మరో కథ.. హన్మకొండలోని మచిలీబజార్ పీఎస్, హై స్కూల్ విద్యార్థుల కోసం ఆరు గదులే మంజూ రై ఏడాది గడిచినా స్థలం లేక నిర్మాణాలు ప్రా రంభం కాలేదు. మచిలీబజార్లోని అద్దె భవనంలో ఈ పాఠశాల కొన్నాళ్లు కొనసాగగా, అక్కడి నుంచి మునిసిపల్ గెస్ట్హౌస్కు సంబంధించి పురాత గదుల్లోకి తరలించారు. ఉర్దూ, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇక్కడ బోధన సాగగా, గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని చెబుతూ కూల్చివేశారు. ఆ సమయంలో తమ కు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా.. వేయిస్థంబాల గుడి ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాలకు మచిలీబజార్ హైస్కూల్ ను, పీఎస్ను హన్మకొండలోని ప్రభుత్వ ఉన్న త పాఠశాలకు షిఫ్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మచిలీబజార్ పాఠశాలకు మంజూరైన అదన పు గదుల నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థ లం చూపాలని ఆర్వీఎం అధికారులు నాలుగు నెలల క్రితం కలెక్టర్ను కోరినా స్పందన రాలే దు. దీంతో ఈ గదుల నిర్మాణానికి మంజూరైన నిధులను మరో పాఠశాలకు కేటాయించాలనే యోచనకు అధికారులు వచ్చారు. ఇక జూబ్లీ మార్కెట్, లంబాడీ తండా, పోలీస్ గ్రౌండ్ పీ ఎస్లతో పాటు కొత్తూరు హైస్కూల్, మాసుం అలీ, బాంబే ఆర్ఎం పీఎస్, నానామియా తో ట, పీఎస్టీ కుంట, సీఆర్ నగర్, కీర్తినగర్ పీ ఎస్లకు మంజూరైన గదుల నిర్మాణం కూడా స్థల సమస్యతో ప్రా రంభం కాలేదు. వెంటనే పనులు ప్రారంభించకపోయినా.. ఆర్వీఎం అ ధికారులు ప్రతిపాదించినట్లుగా ఈ నిధులను వేరేచోటకు మళ్లిం చినా ఆయా పాఠశాలలకు అదనపు గదులు మళ్లీ ఎప్పుడు మంజూరవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. -
ఆర్వీఎం ఉద్యోగుల్లో గుబులు
విజయనగరం అర్బన్, న్యూస్లైన్ : రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర పథక సంచలకురాలు (ఎస్పీడీ) ఉషారాణి రెండుమూడు రోజుల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఆమె పర్యటన ఖరారైందని ఐదురోజుల కిందటే తెలియడంతో ఒక్కసారిగా ఆర్వీఎం శాఖలో కదలిక వచ్చింది. జిల్లాలోని సంబంధిత శాఖాధికారులు రెండు రోజులుగా హడావుడి మొదలుపెట్టారు. సంక్రాంతి పండుగ సరదాలు మానుకొని అభివృద్ధి, నిధుల ఖర్చుల లెక్కలు, జమలు సిద్ధం చేయడంలో అందరూ నిమగ్నమయ్యారు. ఆకస్మికంగా ఏ పాఠశాలకైనా తనిఖీకి వచ్చే అవకాశం ఉందని, పూర్తి రికార్డులు, సిబ్బందితో ఉండాలని ఉపాధ్యాయులను ఆర్వీఎం అధికారులు సూచిస్తున్నారు. పథకానికి వచ్చిన నిధులతో చేపట్టిన అరకొర అభివృద్ధి పనులను చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇంతవరకూ ని ధులు వెచ్చించి చేపట్టిన వివిధ పనుల నివేదికలను తయారు చేయాలని సూచించారు. దీంతో ఆయా నివేదికల తయారిలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తలమునకలయ్యారు. అదేవిధంగా రెండురోజుల పాటు ఏ ఒక్క ఉపాధ్యాయుడూ సెలవు పెట్టడానికి వీల్లేదని అనధికార ప్రకటన కూడా జారీ చేశారని తెలుస్తోంది. అభివృద్ధి పనులు అంతంతమాత్రమే.. ఆర్వీఎం పథకం ద్వారా చేపట్టాల్సిన విద్యాభివృద్ధి పనులు జిల్లాలో అంతంత మాత్రంగానే సాగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా బడిబయట ఉన్న పిల్లలను అందుబాటులోని పాఠశాలలకు పంపించడం, యూనిఫారంల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. అదే విధంగా అవసరమున్న పాఠశాలలకు అదనపు గదుల నిర్మాణం, బాలికలకు వ్యక్తిగత ఆరోగ్యం కోసం శానటరీ నేప్కిన్స్ పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఈ పనులేవీ పెద్దగా చేయకపోవడంతో ఫలితాలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 06-14 మధ్య వయస్సు గల బడి బయట పిల్లలు కేవలం 2,614 మంది ఉన్నారని ఆర్వీఎం శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే నిజానికి బయబయట పిల్లల సంఖ్య వేలల్లో ఉంటుందని ఉపాధ్యాయులే స్వయంగా చెబుతుండడం విశేషం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వినికిడి సాధనాలు, చేయూత పరికరాలు అందజేయడంలో గందరగోళం ఏర్పడింది. గతేడాది గుర్తించిన లబ్ధిదారులకు కేవలం 400 మందికి మాత్రమే పరికరాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఇటీవల చేపట్టిన అంగవైకల్యం గుర్తింపు కార్యక్రమం తుది జాబితా ఇంకా ఖరారు కాలేదు. ‘సివిల్ వర్క్డే’ పేరుతో దినోత్సవాలు నిర్వహించినప్పటికీ అదనపు తరగతి గదులు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు లక్ష్యాలను దాటలేదు. గతేడాదిలో మంజూరైన 719 అదనపు భవన నిర్మాణాలకు గాను కేవలం 99 భవనాలు మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. జిల్లాలోని కేజీబీవీ వసతి గృహాల్లో 25,581 మంది బాలికలుంటే ఈ ఏడాది ఇప్పటికీ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయలేదు. అమలుకు దూరంగా ‘విద్యాహక్కు’ ‘విద్యాహక్కు చట్టం’ అమలులో భాగంగా పాఠశాల స్థాయిలోని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీల (ఎస్ఎంసీ)కు చట్టంపై అవగాహన కల్పించడం, ర్యాలీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఆలస్యంగానైనా ఇటీవల ఎస్ఎంసీ కమిటీల ఎన్నిక ప్రక్రియలను పూర్తిచేసుకున్నప్పటికీ విద్యాహక్కు చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించిన పాపాన పోలేదు. నెలకు ఒక్కో సమావేశం కూడా నిర్వహించడం లేదు. ‘సీట్ల’కోటా ఈ ఏడాదికి లేనట్టే విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ప్రతి తరగతిలోనూ కేటాయించాల్సి ఉంది. దీనికోసం ముందుగా జిల్లా స్థాయిలో ప్రైవేటు పాఠశాలలు, సమీప ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, తదితర అంశాలపై సర్వే చేపట్టి ఇప్పటికే నివేదికలు సిద్ధం చేయాలి. అయితే ఆ పనులు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది కూడా ఈ అవకాశం పేద విద్యార్థులకు అందదు. రవాణా చార్జీల ఊసేలేదు... విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా రవాణా ఇబ్బందులున్న పాఠశాలలకు రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంది. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ‘నైబర్హుడ్’ పాఠశాలలుగా గుర్తించి, వాళ్లకు రవాణా సదుపాయాన్ని కల్సించాల్సి ఉంది. వాహన సౌకర్యంలేని వాళ్ల సంఖ్యను బట్టి వాహనాన్ని ఏర్పరచాలి, లేకపోతే రవాణా చార్జీలను విద్యార్థులకు మంజూరుచేయాల్సి ఉంటుంది. అయితేజిల్లాలో నై బర్హెడ్ స్కూళ్లను ఇంతవరకూ గుర్తించే ప్రక్రియను మం డల విద్యాశాఖ అధికారులు పూర్తి చేయలేదు. ఇటువం టి తరుణంలో ఎస్పీడీ పర్యటన ఉండడంతో ఏమి చే యాలో తోచక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. -
డీఈఓ బదిలీ..?
ఖమ్మం, న్యూస్లైన్: జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాధ్రెడ్డి బదిలీ అవుతున్నట్లు తెలిసింది. ఆయనను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రాజీవ్ విద్యామిషన్ పీఓగా నియమించేందుకు రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జిల్లా విద్యాశాఖ అధికారిగా రాష్ట్ర విద్యాశాఖలో డిప్యూటీ డైరక్టర్గా పని చేస్తున్న బుచ్చన్నను నియమిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం కావడం, ఏలూరు ఆర్వీఎం పీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో తనను అక్కడికి బదిలీ చేయాలని డీఈఓ నెల రోజుల క్రితం ఉన్నతాధికారులకు విన్నవించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. -
ప్రోగ్రెస్ కార్డులకు స్వస్తి
దండేపల్లి, న్యూస్లైన్: పాఠశాల విద్యార్థులు పరీక్షల్లో సాధించిన మార్కులను ఇప్పటిదాకా ప్రోగ్రెస్ కార్డుల్లో నమోదు చేసేవారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలుకుతూ రాజీవ్ విద్యామిషన్ ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రోగ్రెస్ కార్డులకు బదులు ‘విద్యార్థి సంచిత సమగ్ర ప్రగతి నివేదిక’ పుస్తకాన్ని తయారు చేసింది. వాటిని ఇటీవలే పాఠశాలలకు సరఫరా చేసింది. ఐదు తరగతుల వరకు.. గతంలో విద్యార్థికి తరగతికొక ప్రోగ్రెస్ కార్డు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా ప్రాథమిక పాఠశాలలో చేరిన విద్యార్థికి మొదటి సంవత్సరం అందించిన సమగ్ర సంచిత ప్రగతి నివేదిక పుస్తకం ఐదో తరగతి పూర్తయ్యే వరకు పనిచేస్తుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థి సాధించిన ప్రగతి వివరాలు ఈ పుస్తకంలో నమోదు చేయనున్నారు. ప్రగతి, మూల్యంకన వివరాలు, విద్యార్థిలో తరగతి వారీగా వచ్చే శారీరక, మానసిక మార్పులతోపాటు ఎత్తు, బరువు, కుటుంబ సభ్యుల వివరాలనూ ఇందులో పొందుపరుస్తారు. పరీక్షల్లో పొందిన మార్కులు, గ్రేడ్లనూ నమోదు చేస్తారు. ఇప్పటి వరకు పాఠ శాలల్లో అమలులో ఉన్న బాల ఆరోగ్య రక్ష కార్డులను పక్కన ఉంచి విద్యార్థుల ఆరోగ్య వివరాలను సంచిత సమగ్ర నివేదికలో పొందుపర్చనున్నారు. విద్యార్థులకు పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు తల్లిదండ్రులకు చూపించేందుకు మాత్రమే వీటిని అప్పుడప్పుడు విద్యార్థులకు ఇస్తారు. ఇలా విద్యార్థి సమగ్ర సమాచారం పొందుపరిచిన ఈ సమగ్ర సంచిత నివేదికను ఐదేళ్ల తర్వాత విద్యార్థులకు అందిస్తారు. ఆలస్యంగా పాఠశాలలకు... ఆర్వీఎం రూపొందించిన సంచిత సమగ్ర ప్రగతి నివేదిక పుస్తకాలు పాఠశాలలకు ఆలస్యంగా చేరాయి. త్రైమాసిక పరీక్షలు ముగిసి అర్ద సంవత్సరం పరీక్షలు ప్రారంభ సమయంలో సరఫరా అయ్యూరుు. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల మార్కులు మళ్లీ ఈ నివేదికలో పొందుపర్చాల్సి ఉండడంతో ఉపాధ్యాయులకు కొంత పనిభారం పెరిగింది. -
చేయి తడపాల్సిందే!
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: ప్రభుత్వ శాఖల్లో కీలకమైన రెవెన్యూ విభాగం అవినీతి ఊబిలో కూరుకుపోతోంది. గత ఏడాది అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల్లో ఈ శాఖ మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. భూములకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో రెవెన్యూ శాఖ కీలకం. ఈ యంత్రాంగం చేయి తడపనిదే ఫైళ్లు కదలవనే అపవాదు ఉంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు.. వాణిజ్య పన్నులు.. మైనింగ్.. రవాణా శాఖల్లోనూ అవినీతి వేళ్లూనుకుంది. అయితే రెవెన్యూ శాఖతో అన్ని వర్గాలకు అవసరాలు పెరిగిపోవడంతో అవినీతి కూడా అదే స్థాయిలో ఉంటోంది. ఏసీబీ అధికారులు గత సంవత్సరం 15 కేసులు నమోదు చేయగా.. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎనిమిది ఉండటం గమనార్హం. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కేసులు 2, ఏపీసీపీడీసీఎల్ శాఖ సిబ్బందిపై 2.. రవాణా, వ్యవసాయం, రాజీవ్ విద్యా మిషన్ సిబ్బందిపై ఒక్కో కేసు నమోదయ్యాయి. రెవెన్యూ శాఖలో వీఆర్వో మొదలుకొని తహశీల్దార్ వరకు వసూళ్లపర్వం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు, భూముల పట్టాలు, వారసత్వపు సర్టిఫికెట్, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం.. ఇలా ఎన్నో ధ్రువపత్రాలు రెవెన్యూ శాఖ ద్వారానే జారీ అవుతున్నాయి. వీటి జారీలో కీలకమైన వీఆర్ఓలు, తహశీల్దార్లు అధిక శాతం అందినంత దండుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ప్రధానంగా పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూకు కాసుల పంట పండిస్తున్నాయి. భూముల వివాదాలు, భూ విలువలను బట్టి పట్టాదారు పాస్ పుస్తకం జారీలో రూ.50 లక్షల వరకు చేతులు మారిన సందర్భాలు లేకపోలేదు. ఎలాంటి ఫీజు లేకుండా ఇవ్వాల్సిన పాస్ పుస్తకాలకు అన్నీ సవ్యంగా ఉన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. జూపాడుబంగ్లా తహశీల్దారుగా పని చేస్తున్న వెంకటేష్ నాయక్ పట్టాదారు పాస్ పుస్తకం జారీకి రూ.2 లక్షలు డిమాండ్ చేసి డబ్బు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల దాడుల్లో అత్యధికంగా లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి ఈయనే. నందవరం డిప్యూటీ తహశీల్దారు కూడా పట్టాదారు పాస్ పుస్తకం జారీకి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. రుద్రవరం మండలంలో ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, వీఆర్ఓలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. తహశీల్దార్ల నేతతృ్వంలో పని చేయాల్సిన సర్వేయర్లు కొందరు భూముల కొలతల్లో అడ్డుగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. దళారీలతో సంబంధం లేకుండా, తహశీల్దారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే అవసరం లేకుండా.. మీసేవ కేంద్రాల ద్వారా వివిధ ధ్రువ పత్రాలు పొందే అవకాశం కల్పించామని పాలకులు చెబుతున్నా అవినీతికి అడ్డుకట్ట పడని పరిస్థితి నెలకొంది. మీసేవ కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ యంత్రాంగం కుమ్మక్కై పథకం ప్రకారమే ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. -
విద్యార్థులకు విషమ పరీక్ష
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్లైన్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో మూడు రోజులుగా అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి. పాఠశాలల్లో జరిగే యూనిట్ పరీక్షలన్నింటికీ అవసరమైన ప్రశ్నపత్రాలు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) ద్వారానే రూపొందిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిధిలో యూనిట్ పరీక్షల బాధ్యతను రాజీవ్ విద్యామిషన్ చూస్తుండగా, ప్రభుత్వ హైస్కూళ్లతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో డీసీఈబీ ముద్రించిన ప్రశ్నపత్రాలతోనే యూనిట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్రైమాసిక పరీక్షల నిర్వహణకు రాజీవ్ విద్యామిషన్ రూపొందించిన ప్రశ్నపత్రాలను డీసీఈబీ ద్వారానే ముద్రిస్తున్నారు. ఇటీవల జరిగిన త్రైమాసిక పరీక్షలకు ఉన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతులకు ప్రశ్నపత్రాలను సరఫరా చేసిన డీఈసీబీ తాజాగా అర్ధ సంవత్సర పరీక్షలకు అవసరమైన పత్రాలను గత నవంబర్లోనే సిద్ధం చేసింది. ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అర్ధ సంవత్సర పరీక్షలు డిసెంబర్లోనే నిర్వహించాల్సి ఉండగా, సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యంలో ప్రభుత్వం జనవరి రెండో తేదీకి వాయిదా వేసింది. ఇందుకోసం ముందుగానే ప్రశ్నపత్రాలను ముద్రించి పెట్టిన డీసీఈబీ వాటిని మండలాల వారీగా పాఠశాలలకు పంపింది. దీంతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సీనియర్ ఉపాధ్యాయులతో ఏళ్ల తరబడి ప్రశ్నపత్రాలను డీసీఈబీ ముద్రిస్తుండగా, ఆర్వీఎం ద్వారా ముద్రించిన ప్రశ్నపత్రాల్లో ప్రమాణాలు ఏ మేరకు ఉంటాయన్నది అనుమానమేనని స్వయంగా ఉపాధ్యాయులే చెబుతున్నారు. ఆర్వీఎం ద్వారా ప్రశ్నపత్రాల సరఫరా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ యూనిట్ పరీక్షల నిర్వహణకే పరిమితమైన రాజీవ్ విద్యామిషన్ విద్యాహక్కు చట్ట ప్రభావంతో 6, 7, 8 తరగతుల బాధ్యతను తల కెత్తుకుంది. దీంతో ఆర్వీఎం జిల్లా అధికారులు విద్యాశాఖకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధ సంవత్సర పరీక్షల కోసం 6, 7, 8 తరగతులకు ప్రశ్నపత్రాలను ముద్రించి పాఠశాలలకు పంపారు. ఇవి కేవలం తెలుగు మీడియంవే కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు డీసీఈబీ పంపిన పత్రాలే దిక్కయ్యాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఇటు ఆర్వీఎం, అటు డీసీఈబీ వేర్వేరుగా ప్రశ్నపత్రాలను పంపడంతో పరీక్షలు వేటితో నిర్వహించాలనే విషయమై ప్రధానోపాధ్యాయులు గందరగోళమవుతున్నారు. ఆర్వీఎం పంపిన పత్రాలు పూర్తిస్థాయిలో అన్ని మండలాలకు చేరకపోవడం, ఇంగ్లిష్ మీడియంలో పంపకపోవడంతో ప్రధానోపాధ్యాయులు మూడు రోజులుగా డీసీఈబీ పంపిన పత్రాలతోనే పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్వీఎం పంపిన ప్రశ్నపత్రాలతో మరలా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఆర్వీఎం నిర్వాకంతో ప్రస్తుతం అర్ధ సంవత్సర పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మరోసారి పరీక్షలు రాయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల డీసీఈబీ పంపిన ప్రశ్నపత్రాలతో అర్ధ సంవత్సర పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. -
సజావుగా ‘పరీక్ష’
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మెటివ్-2 (అర్ధసంవత్సర) పరీక్షల ప్రశ్నపత్రాల కొరతపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించారు. ఈ నెల రెండున పరీక్షలు ప్రారంభం కాగా, తొలిరోజే ప్రశ్నపత్రాల కొరత ఏర్పడటం, దీనివల్ల గందరగోళం నెలకొనడాన్ని ‘ఇదేం పరీక్ష’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు లోపాలను సరిదిద్ది, పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే సమైక్య ఉద్యమం కారణంగా సిలబస్ పూర్తికాక, అక్టోబర్లో జరగాల్సిన సమ్మెటివ్-2 పరీక్షలు ఆలస్యంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు ఈ ఏడాది ప్రశ్నపత్రాలను హైదరాబాద్ నుంచి పంపించడం, అవీ అరకొరగానే ఇవ్వడంతో సమస్య వచ్చింది. 9, 10 తరతగతులకు ప్రశ్నపత్రాలు సక్రమంగానే అందాయి. రాజీవ్ విద్యామిషన్ ద్వారా 6 నుంచి 8వ తరగతి చదివే 2 లక్షల 74 వేల 115 మంది విద్యార్థుల్లో చాలామంది ప్రశ్నపత్రాల కొరత, పరీక్షలు ఆలస్యం కావడం వంటి సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. సమస్యను గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగి గత రెండు రోజుల్లో ప్రశ్నపత్రాల కొరత ఎక్కడెక్కడ ఉందో గుర్తించారు. ప్రతి పాఠశాలకు ఉండే సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధుల నుంచి అవసరమైతే ప్రశ్నపత్రాలు జిరాక్స్ (ఫొటోస్టాట్) తీయించి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో తెలుగు పరీక్ష రోజున వచ్చిన ఇబ్బంది శుక్రవారం జరిగిన హిందీ పరీక్షకు కొంత తీరింది. శనివారం జిల్లాలో జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు ప్రశ్నపత్రాల కొరత లేకుండా రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ప్రాజెక్టు అధికారిణి బి.పద్మావతి చర్యలు చేపట్టారు. మిగిలిన పరీక్షలన్నీ సజావుగా జరిగేలా అవసరమైన ప్రశ్నపత్రాలు సకాలంలో అందించేలా చర్యలు తీసుకున్నట్టు ఆమె తెలిపారు. -
దేశంలో 29 రాష్ట్రాలట!
కర్నూలు: రాష్ట్ర విభజన జరగకముందే రాజీవ్ విద్యామిషన్ ఓ అడుగు ముందుకేసింది. అర్ధసంవత్సరం (సమ్మెటివ్-2) పరీక్షల్లో దేశంలో 29 రాష్ట్రాలున్నట్లుగా, రాష్ట్రం విడిపోయినట్లుగా చూపింది. ఈ నెల 8వ తేదీన జరగాల్సిన 7వ తరగతి ఇంగ్లీష్ మీడియం, 8వ తరగతి తెలుగు మీడియం సాంఘిక శాస్త్ర పరీక్షకు సంబంధించి పత్రాలను ఉపాధ్యాయులు పరిశీలించారు. ఇందులో 29వ ప్రశ్నగా భారత దేశ పటం ఇచ్చి కలకత్తా, చెన్నూ, ముంబై, లక్నో, ఢిల్లీ ప్రధాన నగరాలను గుర్తించాలని పేర్కొన్నారు. వీటికి అయిదు మార్కులు ఇచ్చారు. అంతా బాగానే ఉన్నా చిత్రపటంలో సీమాంధ్ర, తెలంగాణ విడివిడి రాష్ట్రాలుగా విభజించి చూపడం ఉపధ్యాయులకు ఆశ్చర్యంతోపాటు ఆగ్రహాన్ని కలిగించింది. స్పందించిన డీఈవో కె. నాగేశ్వరరావు 29వ ప్రశ్నకు మార్కులుండవని ప్రకటించారు. -
మళ్లీ ఆర్వీఎం పీవో మార్పు
ఆదిలాబాద్టౌన్, న్యూస్లైన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) పీవో యాదయ్య యథావిధిగా తన కార్యాలయంలో పని చేసుకుంటున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ నారాయణ ఆర్వీఎం కార్యాలయానికి వచ్చి పీవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ బాబు ఆదేశించారని యాదయ్యతో చెప్పారు. దీంతో యాదయ్య షాక్కు గురయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి సిబ్బంది ఏమితోచని స్థితిలో పడ్డారు. శాఖను గాడిలో పెట్టలేకపోవడం, అక్రమ ఆరోపణలే కారణమని కొంతమంది సిబ్బంది పేర్కొనడం గమనార్హం. కాగా గడిచిన 15 నెలల్లో ఎనిమిది మంది పీవోలు మారారు. రెగ్యులర్ పీవోగా పనిచేసిన విశ్వనాథ్రావు బదిలీ అయిన తర్వాత పీవోలుగా పరిశ్రమల శాఖ మేనేజర్ రవీందర్, జెడ్పీ సీఈవోగా పనిచేసిన వెంకటయ్య, ఆర్డీవో రవినాయక్లు ఇన్చార్జి పీవోలుగా పనిచేశారు. ఆ తర్వాత మెప్మా పీడీ రాజేశ్వర్ రాథోడ్, సీపీవో షేక్ మీరాలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ వారు తిరస్కరించడంతో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెర్క యాదయ్యను అప్పటి కలెక్టర్ అశోక్ నియమించారు. అవినీతి, అక్రమాలే కారణమా? ఆర్వీఎంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సివిల్ వర్క్, వివిధ పథకాల్లో కొంత మంది ఉద్యోగులు, ఉన్నతస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా వాటిని దుర్వినియోగం జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా గత డిసెంబర్లో ఓ అధికారితోపాటు ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులపై కలెక్టర్ అహ్మద్బాబు కొరడా ఝళిపించిన విషయం విధితమే. తాజాగా శుక్రవారం విధులు నిర్వర్తిస్తున్న పీవో యాదయ్యను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రెగ్యులర్ పీవో లేకపోవడంతో ఆర్వీఎం పాలన గాడి తప్పిందనే అపవాదు ఉంది. పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు శాఖ వ్యవహారాల్లో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ అక్రమాలకు తావిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. రెగ్యులర్ పీవోను నియమిస్తే బాగుంటుందని ఉద్యోగులే పేర్కొంటున్నారు. అక్రమాలకు తావులేకుండా విధులు నిర్వహిస్తా.. - నారాయణ, ఆర్వీఎం అదనపు పీవో రాజీవ్ విద్యామిషన్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా విధులు నిర్వహిస్తాను. పర్సంటేజీలకు అవకాశం లేదు. సివిల్ వర్క్పై ప్రత్యేక దృష్టి సారిస్తాను. ప్రాథమిక విద్యను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తా. విలీన విద్య, సమీకృత విద్యను పటిష్ట పరుస్తా. అనుకున్న లక్ష్యాలను నెరవేర్చేందుకు పాటుపడతాను. -
బడి బాట ‘మళ్లింపు’!
సాక్షి, సంగారెడ్డి: బడి బయటి బాలలు బడి బాట పట్టడం లేదు. విద్యా సంవత్సరం ముగింపునకు వచ్చినా ఇంత వరకు బడిలో చేరలేదు. ఏటా రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) బడీడు బాలబాలికలను గుర్తించడానికి సర్వే జరుపుతోంది. గత విద్యా సంవత్సరం సర్వే ప్రకారం జిల్లాలో 2,409 మంది బాలబాలికలు బడి బయట ఉండగా.. అందులో 613 మంది బాలలనే తిరిగి పాఠశాలల్లో చేర్పించారు. ప్రత్యేక శిక్షణ లేకుండా నేరుగా బడిలో చేర్పించడంతో ఆ విద్యార్థుల్లో కొంతమంది పారిపోయారు. ఇక అడ్డగోలు కారణాలు చూపి మిగిలిన ఏకంగా 1,796 మంది బాలలను ఆర్వీఎం యంత్రాంగం వదిలించుకుంది. ఆర్వీఎం ప్రణాళిక ప్రకారం బడి బయటి బాలలను గుర్తించిన తర్వాత వారిని రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు(ఆర్ఎస్టీఎస్), నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు(ఎన్ఆర్ఎస్టీఎస్)లో చేర్పించి కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. శిక్షణ అనంతరం ప్రధాన స్రవంతిలోని పాఠశాలల్లో చేర్పిస్తేనే ఫలితాలొస్తాయి. అయితే, ఈ విద్యా సంవత్సరంలో ఆర్ఎస్టీఎస్, ఎన్ఆర్ఎస్టీఎస్ సెంటర్లతో పాటు వర్క్ సైట్ స్కూళ్లను ఏర్పాటు చేయలేదు. ఆర్ఎస్టీఎస్, ఎన్ఆర్ఎస్టీఎస్ల ఏర్పాటుకు కేటాయించిన నిధులను దారిమళ్లించి ఇతర అవసరాల కోసం వినియోగించుకోవడంతో బడీడు బాలల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. వయస్సు మీరిపోయారని, వయస్సు తక్కువగా ఉందని, అనారోగ్యంతో ఉన్నారనే కారణాలు చూపి బడి బయట ఉండిపోయిన 1,796 మంది బాలలను గాలికి వదిలేయడంతో అసలు సర్వే ఉద్దేశం నెరవేరలేదు. ఇదిలా ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో బడి బయటి బాలలపై ఆర్వీఎం చేపట్టిన సర్వే ఇంకా పూర్తి కాలేదు. ‘విద్యా హక్కు’కు తూట్లు బడి బయటి బాలల సంక్షేమం కోసం మంజూరైన నిధులను దారిమళ్లించి ఉపాధ్యాయుల్లేని పాఠశాలల్లో నియమించిన అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు వేతనాలను చెల్లిస్తున్నారు. ఆర్ఎస్టీఎస్ల ఏర్పాటుకు మంజూరైన రూ.58 లక్షల బడ్జెట్తో 234 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు వేతనాలిస్తున్నారు. ఈ నిధులతో 201 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను ఉర్దూ మీడియం, 33 మందిని తెలుగు మీడియం బడుల్లో నియమించారు. ఇక ఎన్ఆర్ఎస్టీఎస్ కింది విడుదలైన రూ. 24 లక్షల బడ్జెట్తో తెలుగు మీడియం పాఠశాలల్లో మరో 16 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించి వేతనాలిస్తున్నారు. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడంలో తీవ్ర జాప్యం చేసిన సర్కారు.. ఆ లోటు తీర్చుకోడానికి బడి బయటి బాలల భవితవ్యంపై వేటేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ అంశంపై వివరణ కోసం జిల్లా విద్యాశాఖాధికారి గాజర్ల రమేశ్ను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. -
ఇవేం పరీక్షలు?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యార్థుల ప్రతిభను సమగ్రంగా మధింపు చేసేందుకు ప్రభుత్వం సీసీఈ విధానాన్ని రాజీవ్ విద్యా మిషన్ ద్వారా అమలు చేస్తోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షల ప్రశ్న పత్రాలను జిల్లా పరీక్షల ఉమ్మడి బోర్డు(డీసీఈబీ) ద్వారా పాఠశాలలకు పంపిణీ చేసేవారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే అర్ధవార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను రాష్ట్ర స్థాయిలో రాజీవ్ విద్యా మిషన్ రూపొందించింది. ‘ఆర్క్బర్డ్’ పబ్లికేషన్స్ అనే ప్రైవేటు సంస్థకు ముద్రణ, పంపిణీ బాధ్యతలు అప్పగించింది. సదరు సంస్థ ప్రశ్న పత్రాలను 1000, 500 కట్టలుగా కట్టి బస్తాల్లో జిల్లాకు పంపింది. మెదక్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల గోడౌన్లో సదరు ఏజెన్సీ ప్రశ్న పత్రాలు డంప్ చేసి చేతులు దులుపుకుంది. దీంతో తరగతులు, పాఠశాలల వారీగా ప్రశ్న పత్రాలను వేరు చేసి సీల్డ్ కవర్లలో పాఠశాలలకు చేరవేయాల్సిన బాధ్యత రాజీవ్ విద్యా మిషన్ అధికారులపైనే పడింది. 2023 ప్రాథమిక పాఠశాలలు, 434 ప్రాథమికోన్నత పాఠశాలలకు 2.64లక్షల ప్రశ్న పత్రాలను సకాలంలో చేరవేయ లేక విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులు, సిబ్బంది తల పట్టుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో 18, ప్రాథమికోన్నత స్థాయిలో 19 టైటిళ్లకు సంబంధించిన ప్రశ్న పత్రాలను లెక్క తప్పకుండా సర్దుబాటు చేయలేక పోతున్నారు. మండల వనరుల కేంద్రాలకు(ఎంఆర్సీ) ప్రశ్న పత్రాలు పంపినా, తిరిగి అక్కడా ప్రశ్న పత్రాలను వేరు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఆదరాబాదరాగా కొన్ని పాఠశాలలకు ప్రశ్న పత్రాలను చేరవేయగలిగారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రశ్న పత్రాలు సరఫరా కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తిరిగి మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రశ్న పత్రాలకు రక్షణ ఏదీ? భద్రంగా సీల్డ్ కవర్లలో సరఫరా చేయాల్సిన ప్రశ్న పత్రాలు ఓపెన్ కవర్లలో పాఠశాలలకు చేరవేస్తున్నారు. దీంతో ప్రశ్న పత్రాల్లో వున్న ప్రశ్నలను ఉపాధ్యాయులు ముందుగానే తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అర్ధవార్షిక పరీక్షల ఫలితాలను పాఠశాలలు, సబ్జెక్టుల వారీగా సమీక్షిస్తామని కలెక్టర్ స్మితాసబర్వాల్ హెచ్చరించారు. ప్రశ్న పత్రాలు ముందే వెల్లడవుతుండటంతో ఉపాధ్యాయులు ప్రశ్నలను విద్యార్థులకు ముందస్తుగా వెల్లడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో డీసీఈబీ ద్వారా సరఫరా చేసే ప్రశ్న పత్రాలను సీల్డ్ కవర్లలో పంపేలా తగిన ఏర్పాట్లు చేసేవారు. ప్రస్తుతం రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర స్థాయిలో ప్రశ్న పత్రాలు ముద్రించాలనే నిర్ణయం వెనుక అధికారుల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే అనుమానాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. సర్దుబాటు చేస్తున్నాం: ఎఎంఓ సత్యనారాయణ ప్రశ్న పత్రాలు కట్టలుగా సర ఫరా చేయడంతో వేరు చేయడంలో సమస్య తలెత్తిందని ఆర్వీఎం అకడమిక్ మానిటరింగ్ అధికారి సత్యనారాయణ ‘సాక్షి’కి వెల్లడించారు. ప్రశ్న పత్రాలు తక్కువ పడిన పాఠశాలలకు తక్షణమే ప్రశ్న పత్రాలు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టైటిళ్లు ఎక్కువగా వుండటంతో బండిల్స్ చేయడంలో శ్రమిస్తున్నామన్నారు. -
‘దర్జా’గా దోపిడీ..!
ఖమ్మం, న్యూస్లైన్: అక్రమాల పుట్టగా పేరున్న జిల్లా రాజీవ్ విద్యా మిషన్లో పనిచేస్తున్న అధికారులు చివరకు విద్యార్థులకు సరఫరా చేసే ఏకరూప దుస్తుల కుట్టుకూలిలోనూ కక్కుర్తి పడుతున్నారు. పొరుగు జిల్లాలోని పలు స్టిచ్చింగ్ ఏజెన్సీలతో కమీషన్ మాట్లాడుకొని జిల్లాలోని దర్జీల పొట్ట కొట్టేం దుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ‘మీతో కుట్టిస్తే మాకు ఏం ఇస్తారు?’ అని బహిరంగంగానే బేరసారాలు చేసుకుంటున్నట్లు ప్రచారం. ఈ విషయం తెలుసుకున్న జిల్లాలోని పలువురు దర్జీలు, మహిళా గ్రూపుల నాయకులు అధికారులను నిలదీయగా, వారు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల మధ్య ఆర్థిక అంతరాలు బహిర్గతమైతే అది చిన్నారుల మనసుపై ప్రభావం పడుతుందని, విద్యార్థులకు కనీస వసతులు కల్పిస్తేనే పాఠశాలకు సక్రమంగా వస్తారని ప్రభుత్వం బావించింది. ఇందుకోసం మధ్యాహ్న భోజనం సదుపాయం, ఉచిత పుస్తకాల పంపిణీతో పాటు సంవత్సరానికి రెండు జతల ఏకరూప దుస్తులు సరఫరా చేస్తోంది. ఒకటి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు సరఫరా చేస్తున్నారు. ఈ దుస్తుల పంపిణీలో ప్రతి ఏటా ఆలస్యం అవుతుందని భావించిన రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ అధికారులు.. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే మేల్కొన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందుగా నిర్వహించే బడిబాట కార్యక్రమంలోనే కొత్త దుస్తులు సరఫరా చేయాలని భావించిరు. ఇందుకోసం జిల్లాలో 1, 99, 915 మంది విద్యార్థులను గుర్తించి వారికి జతకు రూ.160 చొప్పున రెండు జతలకు రూ. 6.38 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో తొలి విడతగా రూ. 3.19 కోట్లు ఎస్ఎంసీల ద్వారా ఆప్కోకు పంపిం చారు. దీంతో గత నెలలో జిల్లా విద్యార్థులకు రెండు జతలకు కావాల్సిన వస్త్రాన్ని సరఫరా చేశారు. దాన్ని జిల్లా కేంద్రం నుండి ఎంఆర్సీలకు పంపిణీ చేశారు. ఈ వస్త్రాన్ని ఎస్ఎంసీల ద్వారా గ్రామాల్లోని దర్జీలకు అప్పగించి సకాలంలో కుట్టించి విద్యార్థులకు అందజేయాలి. కమీషన్లకు పలువురు అధికారుల కక్కుర్తి... యూనిఫాం క్లాత్ వచ్చిందని తెలుసుకున్న జిల్లాలోని పలు స్టిచ్చింగ్ సెంటర్లతో పాటు, ఇతర జిల్లాల్లోని పలువురు దర్జీలు జిల్లా అధికారులను సంప్రదించారు. దుస్తులు కుట్టేందుకు తమకు అవకాశం కల్పించాలని ఆర్జీలు పెట్టుకున్నారు. తమకు కుట్టే అవకాశం ఇస్తే కమీషన్ కూడా ఇస్తామని కొందరు అధికారులకు ఆశపెట్టినట్లు తెలిసింది. దీంతో కమీషన్లకు కక్కుర్తి పడిన పలువురు అధికారులు తాము పంపించిన ఏజెన్సీలకే అవకాశం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులను, ఎంఈవోలను ఆదేశించినట్లు తెలిసింది. ఇందుకు పలువురు అధికారులు ససేమిరా అనడంతో ‘ఇది జిల్లాలోని ఓ ఉన్నతాధికారి ఆదేశమని.. పాటించకపోతే మీ ఇష్టం’ అని బెదిరించినట్లు తెలిసింది. దీంతో తప్పని పరిస్థితిలో జిల్లా అధికారులు ఇవ్వమన్న ఏజెన్సీలకు ఇచ్చేందుకు హెచ్ఎంలు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లాలోని పలువురు దర్జీలు ఎంఈవోల వద్దకు వెళ్లి తమకే ఇవ్వాలని మొరపెట్టుకున్నా.. తమ పరిధిలో ఏమీలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కెటాయిస్తామని తేల్చి చెప్పారు. ఈ విషయంపై గిరిజన ప్రాంతాల్లో ఉన్న తమకే యూనిఫాం కుట్టే అవకాశం ఇవ్వాలని ఇటీవల భద్రాచలంలో జరిగిన అధికారుల సమావేశంలో పలువురు మహిళలు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. తమకు ఇవ్వకుండా ఇతర జిల్లాలకు చెందిన ఏజెన్సీలకు ఏలా ఇస్తారని వారు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పీవో జిల్లా ఆర్వీఎం అధికారులను మందలించినట్లు తెలిసింది. జిల్లా దర్జీలకే అవకాశం కల్పించాలి... రెడీమెడ్ దుస్తుల రాకతో జిల్లాలోని దర్జీలు పనులు లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించి ఆదుకోవాలని, ప్రభుత్వ పరంగా వచ్చే దుస్తులను జిల్లాలోని దర్జీలకే అవకాశం కల్పించాలని టైలర్స్ యూనియర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు జానీ అధికారులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరఫరా చేసే దుస్తులు ఇతర జిల్లాలకు చెందిన టైలర్లకు ఇవ్వాలనే ఆలోన విరమించుకోవాలని తెలంగాణ లేడీస్ టైలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు నహీమున్నీసా భేగం, కార్యదర్శి ఎండీ గౌస్ద్దీన్ డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల దర్జీలకు అవకాశం కల్పిస్తే ఆందోళన చేస్తామని, ఆర్వీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
4 నుంచి ఏడో విడత భూ పంపిణీ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్ : జిల్లాలో జనవరి 4వ తేదీ నుంచి ఏడో విడత భూ పంపిణీ చేపట్టనున్నట్లు కలెక్టర్ విజయకుమార్ తెలిపారు. పొదిలిలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడో విడత భూ పంపిణీకి సంబంధించి 7,716 ఎకరాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 5,766 మంది రైతులకు భూమిని పంపిణీ చేసేందుకు పట్టాదారు పాస్పుస్తకాలు కూడా సిద్ధం చేశామన్నారు. 10వ తేదీలోపు భూ పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ‘పచ్చతోరణం’కు 7,200 ఎకరాలు... ఇందిరమ్మ పచ్చతోరణం పథకానికి సంబంధించి జిల్లాలో 7,383 మందికి 7,200 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీలను గుర్తించి పచ్చతోరణం పథకం కింద మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. డ్వామా ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 2 లక్షల 4 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా, ప్రస్తుతం లక్షా 14 వేల మరుగుదొడ్లు గ్రౌండింగ్లో ఉన్నాయని, మార్చి నాటికి వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు భూసేకరణ... జిల్లాలో పరిశ్రమల స్థాపనకు భూ సేకరణ చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పామూరు-కనిగిరి రోడ్డులో 12,500 ఎకరాలు సేకరించాలని కందుకూరు ఆర్డీవోను ఆదేశించినట్లు చెప్పారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్తో మాట్లాడామన్నారు. ప్రకాశం అక్షర విజయం కార్యక్రమంలో భాగంగా 6.50 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించామని, 20 వేల మంది వలంటీర్లతో 20 వేల 30 అక్షర కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. మార్చి 21లోపు నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా చేసి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. *25.14 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ప్రతిపాదనలు... రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 25.14 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు కలెక్టర్ తెలిపారు. 39 మండలాల్లో 25,642 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. 44,633 మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోయినట్లు తెలిపారు. 1000 చేనేత కుటుంబాలకు 5 వేల రూపాయల చొప్పున సాయం అందించాలని ప్రతిపాదించామన్నారు. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో అదనపు తరగతి గదుల నిర్మాణాలను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. 654 తరగతి గదులకుగానూ 633 పూర్తిచేశామన్నారు. 8 నెలల క్రితం ప్రారంభంకాని వాటిని రద్దు చేయాలన్న యోచనలో ఉండగా, అనతికాలంలోనే మంచి పురోగతి సాధించినట్లు కలెక్టర్ వివరించారు. విలేకర్ల సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్గౌడ్, ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య, డీఆర్డీఏ పీడీ పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
అదనపు బాధ్యతలతో బోధనకు దూరం
మార్కాపురం, న్యూస్లైన్: ఇన్చార్జ్ల పాలనతో జిల్లాలో విద్యాశాఖ గాడితప్పుతోంది. 56 మండలాల్లో కేవలం 9 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన మండలాల్లో లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. జిల్లావ్యాప్తంగా 424 ఉన్నత పాఠశాలలు, 2,942 ప్రాథమిక, 419 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. ఇదే సమయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పిల్లలకు పాఠాలు చెప్పలేకపోతున్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తోంది. మధ్యాహ్న భోజన పథకం, స్కాలర్షిప్ల పంపిణీ, ఏకరూప దుస్తులు, పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంఈఓలదే. ప్రస్తుతం జిల్లాలో కొమరోలు, దోర్నాల, సంతనూతలపాడు, అద్దంకి, మర్రిపూడి, కొరిశపాడు, కారంచేడు, ఉలవపాడు తదితర మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలుండగా మిగిలిన మండలాల్లో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. పదేళ్ల నుంచి ఎంఈఓల నియామకంపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయి. జిల్లా పరిషత్ టీచర్లు, ప్రభుత్వ టీచర్ల మధ్య ఎంఈఓల పదోన్నతులు, నియామకాలపై సందిగ్ధత నెలకొంది. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ మండలాల్లో ఇన్చార్జ్ల పాలనలో విద్యాశాఖ నడుస్తోంది. ప్రధానోపాధ్యాయులు పాఠశాలల తనిఖీలు, విద్యార్థుల ప్రగతి, పాఠశాల నిధుల వినియోగం, ఎస్ఎంసీ సమావేశాలు తదితర కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. వారిని ఎఫ్ఏసీ ఎంఈఓలుగా నియమించడంతో ఓ వైపు పాఠశాల నిర్వహణ, మరోవైపు ఎంఈఓల బాధ్యతలు భారంగా మారాయి. ఇరువైపులా పర్యవేక్షణ కష్టమవుతోంది. ఇబ్బంది లేకుండా చూస్తున్నాం -రాజేశ్వరరావు, డీఈఓ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓల సమస్య ఉంది. జిల్లాలో పదేళ్ల నుంచి రెగ్యులర్ ప్రతిపాదికపై ఎంఈఓల నియామకం లేకపోవడంతో సమీపంలో ఉన్న హెచ్ఎంలను ఎఫ్ఏసీ ఎంఈఓలుగా నియమించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. -
కేజీబీవీ ఎస్ఓల భర్తీలో గందరగోళం!
విజయనగరం అర్బన్, న్యూస్లైన్: రాజీవ్ విద్యామిష న్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలిక ల విద్యాలయాల(కేజీబీవీ) ప్రత్యేకాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తున్న వారిలో కొం దరు ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకూ తమనే కొనసాగించాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పటికే ఎంపిైకై నియామకాలను పూర్తి చేసుకుని విధుల్లో జాయిన్ అయిన నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి విద్యాహక్కు చట్టంప్రకారం... ఉపాధ్యాయులు కచ్చితంగా బడిలోనే ఉండాలని ఆర్వీఎం ఎస్పీడీ ఉషారాణి కొన్ని నిబంధనలు అమలు చేశారు. ఇందులో భాగంగా ఫారెన్ సర్వీసు(సంబంధి త ఇతర శాఖల నుంచి పోస్టును తీసుకోవడం), డె ప్యూటేషన్(సర్దుపాటు)పై కేజీబీవీ స్పెషలాఫీసర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెనక్కి పంపేలా చర్య లు తీసుకున్నారు. వారి స్థానాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్ఓ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇటీవల వారికి రాత పరీక్ష నిర్వహించి, నియామాకాలు చేపట్టారు. అడ్డుపడుతున్న పాత ఎస్ఓలు జిల్లాలోని 33 కేజీబీవీలలో 14 రాజీవ్ విద్యామిషన్, 11ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ, మిగిలినవి గిరిజన సం క్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్నాయి. ఎంఈఓలు, రెసిడెన్షియల్ సొసైటీ ప్రిన్సిపాళ్లుగా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు ఫారిన్ సర్వీసు కింద డి ప్యూటేషన్ కింద పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయు లు కొందరు ప్రస్తుతం ఎస్ఓలుగా పని చేస్తున్నారు. ఈ స్థానాల్లో కొత్త ఎస్ ఓలను భర్తీ చేసే ప్రక్రియను ఇటీవల పూర్తి చేశారు. అయితే గజపతినగరం, గరి విడి, మెరకముడిదాం కేజీబీవీలలో సోమ, మంగళ వారం విధుల్లో చేరేందుకు కొత్త ఎస్ఓలు వెళ్లగా వారి కి చేదు అనుభవం ఎదురైంది. తాము కోర్టుకెళ్లాం... 2014 ఏప్రిల్ వరకు కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నాం... మీరెలా వస్తారంటూ అక్కడున్న పాత ఎస్ఓలు వారిని అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక వారు రాజీవ్ విద్యామిషన్ జిల్లా పీఓను ఆశ్రయించారు. ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ఎస్పీడీ విద్యా సంవత్సరం మధ్యలో తమను రిలీవ్ చేస్తే ఇబ్బందులు పడతామంటూ కొందరు కోర్టుకెళ్లిన వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల ని ఎస్పీడీ స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫారెన్ సర్వీసుపై ఎస్ఓలుగా వచ్చిన ఉపాధ్యాయులకు 2014 ఏప్రిల్ వరకు ఆయా కేజీబీవీల్లో 9, 10 తరగతులు బోధించేలా చర్యలు తీసుకోవాలని తెలి పారు. స్వచ్ఛందంగా రిలీవ్ కావాలనుకునే వారిని రిలీవ్ చేయాలని సూచించారు. ఇది జీర్ణించుకోని కొందరు పాత ఎస్ఓలు ఎలాగైనా కొనసాగాలనే పంథాతో కొత్తవారికి అడ్డు తగులుతున్నారు. పాతవాళ్లను టీచర్లగా కొనసాగిస్తాం కేజీబీవీలకు ఇన్చార్జి ఎస్ఓలుగా ఉన్న ఫారెన్ సర్వీ సు మీద వచ్చిన ముగ్గురిని ఆయా విద్యాలయాల్లో 9, 10వ తరగతి ఉపాధ్యాయులుగా కొనసాగిస్తామని రా జీవ్ విద్యామిషన్ పీఓ జి.నాగమణి ‘న్యూస్లైన్’కి తె లిపారు.ఎస్ఓలుగానే కొనసాగించాలంటూ కొందరు కోర్టుకెళ్లిన విషయాన్ని ఎస్పీడీకి నివేదించామన్నారు. -
వైఎస్ భిక్షతోనే రాజకీయాల్లోకి వచ్చా
సాక్షి, గుంటూరు: విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ఆరు నుంచి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు తప్పనిసరి విద్యను అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. చిన్నారులను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రుల సహకారం కూడా తప్పనిసరి. తల్లిదండ్రులకు బాధ్యతతో పాటు వారిని భాగస్వామ్యం చేసేందుకు రాజీవ్ విద్యా మిషన్ అధికారులు తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంపిక చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్గా మేనేజ్మెంటు కమిటీలను ఏర్పాటు చేసింది. వీరికి శిక్షణనిచ్చేందుకు ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. అవగాహన కల్పించేందుకు మెటీరియల్ ముద్రించి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితేఈ నిధులు అధికభాగం దుర్వినియోగమవుతున్నాయే తప్ప లక్ష్యం నెరవేరడం లేదు. ఇటు రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు స్పందన కరువైంది. జిల్లాలో 3,693 స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి తరగతికి ముగ్గురు పేరెంట్స్తో ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్లలో కలిపి మొత్తం 3,693 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు రాజీవ్ విద్యామిషన్ నుంచి ఫండ్ సమకూరుస్తున్నారు. హైస్కూల్ కమిటీకి రూ.17 వేలు, ప్రాథమికోన్నత పాఠశాల కమిటీకి రూ.10 వేలు, ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు ఇచ్చారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పేరుతో కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. గతేడాది రూ.కోటి ఖర్చు చేశారు. ఈ ఏడాది విద్యాహక్కు చట్టంపై పూర్తి అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే ఈ తరగతుల నిర్వహణకు బిల్లులు సమర్పించనందున ఖర్చు ఎంతో తేలలేదు. హాజరైన విద్యార్ధుల తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.130 వెచ్చించారు. స్కూల్ మేనేజ్మెంటు కమిటీల శిక్షణ తూతూ మంత్రంగా జరుగుతుందని విద్యా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మొక్కుబడిగా శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు నిండిన బాలబాలికలు జిల్లాలో 76,252 మంది గుర్తింపు.. ఐదేళ్లు నిండిన బాలబాలికలు జిల్లాలో 76,252 మందిని గుర్తించినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. వారిలో 76,057 మందిని పాఠశాలల్లో చేర్పించినట్లు విద్యాశాఖ అధికారుల చెప్పే లెక్కలు విస్మయం గొలుపుతున్నాయని పలువురు పేర్కొనడం గమనార్హం. బడి బయట బాలలు జిల్లాలో ఇంకా వేల సంఖ్యలోనే ఉంటారని అంచనా. ఏది ఏమైనా విద్యాహక్కు చట్టం అమలు మాత్రం బాలా రిష్టాలు దాటడం లేదనేది విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచే వినిపిస్తున్న మాట. -
పట్టాలెక్కించే యత్నం?
సాక్షి, నల్లగొండ: రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) అక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అనర్హత కారణంగా ఇటీవల తొలగింపునకు గురైన మహిళా అకౌం టెంట్లను ఆర్వీఎం అధికారులు అనధికారికంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. వీరితోనే ప్రతినెలా అకౌంట్లు చేయిస్తున్నారని తెలిసింది. అంతేగాక కార్యాల యానికి సంబంధించిన ఫోన్నంబర్లు కూడా వినియోగిస్తున్నారని వినికిడి. వీరికి ఇతర రాష్ట్రాల వర్సిటీ డిగ్రీ పట్టాలిచ్చి అధికారికంగా విధుల్లోకి తీసుకునే యత్నాలు సాగుతున్నట్లు తెలిసింది. కథాకమామిషు.. జిల్లా ఆర్వీఎం పరిధిలో 19 కేజీబీవీలు న్నాయి. ఇందులో అకౌంటెంట్గా పనిచేయాలంటే అభ్యర్థికి కచ్చితంగా బీకాం డిగ్రీ ఉండాలి. ఈ అర్హత లేకపోవడంతో 9మంది మహిళా అకౌంటెంట్లను ఈ ఏడాది జూన్లో తొలగించారు. వారు హైకోర్టును ఆశ్రయించి కొంతకాలానికి పట్టాలు సాధిస్తామని, అప్పటివరకు కొనసాగించాలని వాదనలు వినిపించారు. అయితే, హైకోర్టు వీరి వాదనను తోసిపుచ్చింది. సంబంధిత సబ్జెక్టులో పట్టాలేకుండా అకౌంట్లు ఎలా చూస్తారని, ఇది సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతేగాక విధుల నుంచి తొలగించాలని ఆగస్టు 20న ఆదేశించింది. స్పందించిన జిల్లా ఆర్వీఎం అధికారి వారిని పక్కనబెట్టినట్టు చేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 28న 14 బి సర్క్యులర్ను అకౌంటెంట్లు తొలగింపునకు గురైన అన్ని కేజీబీవీలకు పంపారు. అనధికారికంగా కొనసాగింపు.. తొలగింపునకు గురైనవారు ఎట్టిపరిస్థితుల్లోనూ విధులకు హాజరు కాకూడదు. అయితే కొంతమంది అక్టోబర్, నవంబర్ నెలలో కూడా విధులకు హాజరయ్యారు. కొందరు ఈ నెల నుంచి అడపా దడపా కేజీబీవీలకు వెళ్తుండగా, ఇంకొందరు ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. అంతేగాక ఆర్వీఎంకు సంబంధించిన మొబైల్ నంబర్లనే వినియోగిస్తున్నారు. కేజీబీవీలకు సంబంధించిన బిల్లుల కోసం జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వీటన్నింటి దృష్ట్యా... విధుల నుంచి తొలగించారా? లేక కొనసాగుతున్నారా? అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ తతంగం అంతా ఆర్వీఎంలోని కొందరు దర్శకత్వంలోనే సాగుతోందని తెలుస్తోంది. పట్టా అందించి..ఆ తర్వాత విధుల్లోకి? విధుల నుంచి తొలగించినా అక్టోబర్, నవంబర్ మాసాల్లో కొంతమంది అకౌం టెంట్లు విధుల్లో కొనసాగారు. అయితే వీరి వేతనాలు చెల్లింపుల విషయంలో ఆర్వీఎం పెద్దలు చాకచక్యంగా వ్యవహరించారు. వేతనాలు చెల్లిస్తే సదరు అభ్యర్థులు అధికారికంగా విధుల్లో ఉన్నట్లే. దీంతో ఎక్కడ దొరికిపోతామోనని ముందస్తు వ్యూహంలో భాగంగా ఆ రెండు నెలలకు సంబంధించిన వేతనాలు నిలిపివేశారు. వీరికి బీకాం పట్టా అందజేసి, ఆ తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న యోచ నలో ఉన్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లోని (గుర్తింపులేని) యూనివర్సిటీల నుంచి తెప్పించి బీకాం పట్టా అప్పజెప్పేందుకు తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. తద్వారా ఈ పట్టాలు చూపెట్టి తొలగింపునకు గురైన అభ్యర్థులను విధుల్లోకి తీసుకునేలా ముందే ఒప్పందానికి వచ్చినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం అభ్యర్థుల నుంచి డబ్బులు కూడా వసూలు చేశారని సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే వేతనాలు నిలిపివేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై ఉంది. అంతేగాక ఈ తతంగ సూత్రధారి, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మా దృష్టికి రాలేదు... : బాబూ భూక్యా, ఆర్వీఎం పీఓ తొలగింపునకు గురైన అకౌంటెంట్లు అనధికారికంగా విధుల్లో కొనసాగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. అటువంటి అవకాశమే ఉండదు. దీనిపై పూర్తిగా మీరు ఎగ్జామిన్ చేయండి. వచ్చిన ఆరోపణలు నిజం కావాలని లేదుగా? ఎస్పీడీ నుంచి వచ్చిన డెరైక్షన్లనే మేం ఫాలో అవుతాం. -
నిధుల్లో కోత విద్యాశాఖపై సర్కార్ నిర్లక్ష్యం
ఆదిలాబాద్టౌన్, న్యూస్లైన్ : ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ విద్యా సంవత్సరం మండల వనరుల కేంద్రాలు(ఎమ్మార్సీ), పాఠశాల సముదాయాల(స్కూల్ కాంప్లెక్స్)కు నిధుల కేటాయింపుల్లో భారీ కోతలు విధించి విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తోంది. సర్కారు తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 50 శాతానికి.. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ప్రతీ విద్యా సంవత్సరంలో స్కూల్ కాంప్లెక్స్లు, ఎమ్మార్సీలు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ఎమ్మార్సీలు, స్కూల్ కాంప్లెక్స్లకు కేటారుుంచే నిధుల్లో 50 శాతం కోత విధించగా, ఉపాధ్యాయులకు కేటాయించే గ్రాంట్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీని ప్రభావం విద్యావ్యవస్థపై పడనుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు కృత్యధారణ బోధన చేసి విద్యార్థులకు పాఠాలు బోధించాలి. మాదిరి చిత్రాల బోధనతో విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమవుతాయి. నిధుల కోతతో పిల్లలకు నైపుణ్యత విద్య అందకుండా పోనుంది. ఎమ్మార్సీలకు.. జిల్లాలో 52 మండల రిసోర్స్ సెంటర్లు (ఎమ్మార్సీ) ఉన్నాయి. ఇదివరకు వీటికి రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించేవారు. ఈ విద్యా సంవత్సరం ఆ నిధులను రూ.50 వేలకు కుదించారు. నిధులు విడుదల చేసిన వాటిలో సంవత్సరానికి ఇంటర్నెట్ కోసం రూ.9వేలు, స్టేషనరి కోసం రూ.8,600, విద్యుత్ బిల్లు కోసం రూ.7200, ఎంఈవో ఫోన్ బిల్లు, టీఏ, ఇతర ఖర్చుల కోసం రూ.7200, మిగితా ఖర్చులు మెయింటనెన్స్ గ్రాంట్, ఎంఈవో ఎఫ్టీఎ, సమావేశాల కోసం రూ.18 వేలు చొప్పున కేటారుుంచారు. స్కూల్ కాంప్లెక్స్లకు.. జిల్లాలో 275 స్కూల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. నె లకోసారి ఆ మండల ఆవాస పరిధిలోని స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు నెలనెలా సమావేశాలు నిర్వహిస్తారు. ఆ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యే ఉపాధ్యాయులు కృత్యాధారణలతో పాఠాలు బోధించే విధానంపై మిగితా ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తారు. దీనికి సంబంధించి టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) కోసం నిధులు కేటాయిస్తారు. ఇదివరకు ఒక్కో స్కూల్ కాంప్లెక్స్కు రూ.27 వేలు చొప్పున విడుదల చేసేవారు. ఈ విద్యా సంవత్సరం రూ.10వేలు మాత్రమే విడుదల చేశారు. కాంటింజెన్సీ కోసం గతంలో రూ.10 వేలు విడుదల చేయగా, ప్రస్తుతం రూ.6500లకు కుదించారు. సమావేశాలు, టీఏ గ్రాంట్స్ కోసం రూ.12 వేలు ఉండగా రూ.2 వేలకు, కృత్యధారణ కోసం రూ.3 వేల నుంచి రూ.1500లకు తగ్గించారు. ఉపాధ్యాయులకు కేటాయించని నిధులు.. పాఠశాలలో విద్యార్థులకు కృత్యాలు తయారు చేసి బోధించేందుకు ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రతీ ఉపాధ్యాయుడికి రూ.500 చొప్పున ఇదివరకు నిధులు విడుదల చేసేవారు. ఈ విద్యా సంవత్సరం ఎలాంటి నిధులు కేటాయించలేదు. జిల్లాలో 9 వేల మంది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ నిధులు కేటాయించకపోవడంతో కృత్యాధారణ బోధన లేకుండా బోర్డుపైనే బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు గుణాత్మక బోధించాల్సిన విద్య దూరమయ్యే పరిస్థితి ఉంది. నిధు ల కోతపై మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెంచడంపోరుు తగ్గించారు.. స్కూల్ కాంప్లెక్స్లు, ఎమ్మార్సీలకు నిధులు పెంచాల్సింది పోయి సగానికి తగ్గించారు. ఉపాధ్యాయులకు ఒక్క రూపాయి కూడా గ్రాంట్ విడుదల చేయలేదు. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడనుంది. మాదిరి పాఠ్య బోధన సామగ్రి కోసం నిధులు లేకపోవడంతో నాణ్యమైన విద్య కష్టమే. - పి.సత్యనారాయణ, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేం.. కఠినతర అంశాలను సులభంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు బోధన సామగ్రి అవసరం. ఏటా ఉపాధ్యాయుల గ్రాంటు కింద రూ.500 విడుదల చేశారు. ఈ ఏడాది నిధుల్లో కోత విధించారు. దీంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కష్టంగా మారింది. నిధులు పెంచాలి. ప్రతాప్, ఉపాధ్యాయుడు, గిమ్మ పాఠశాల కుదింపుతో నష్టం లేదు.. మానవ వనరుల శాఖ నుంచి కుదించి జిల్లాకు బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్ ప్రకారం స్కూల్ కాంప్లెక్స్లు, ఎమ్మార్సీలకు నిధులు కేటాయించారు. నిధుల కుదింపుతో విద్యార్థుల ప్రగతికి ఎలాంటి నష్టం వాటిల్లదు. గతంలో ఇచ్చిన నిధులతోనే బోధన చేయవచ్చు. 50 శాతం పరికరాలు పాఠశాలలో ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. - పెర్క యాదయ్య, పీవో, ఆర్వీఎం -
విద్యార్థులకు తప్పని తిప్పలు
=అత్యధిక పాఠశాలల్లో కనిపించని మరుగుదొడ్లు =నీటి వసతి లేక కొన్నిచోట్ల మూత =ఇంకొన్ని చోట్ల అసంపూర్తి నిర్మాణాలు =విద్యార్థులకు తప్పని తిప్పలు =ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇదీ పరిస్థితి సాక్షి, చిత్తూరు: జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 3,957, ప్రాథమికోన్నత పాఠశాలలు 480, ఉ న్నత పాఠశాలలు 608 ఉన్నాయి. వీటిల్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరు రోజులో 8 గం టలు పాఠశాలల్లోనే గడుపుతున్నారు. ఆ సమయంలో మల, మూత్రవిసర్జనకు నానా అగచా ట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సమకూర్చుతున్న శానిటరీ నాప్కిన్స్ను యుక్తవయ స్సు విద్యార్థినులు ఉపయోగించుకోవాలన్నా, పరిశుభ్రమైన మరుగుదొడ్లు పాఠశాలలో అందుబాటులో లేవు. బాలురు ఆరు బయట స్థలాల్లోనే మల, మూత్రవిసర్జన చేస్తున్నారు. బా లికల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరుబ యట మల, మూత్ర విసర్జన చేయలేక గంటల కొద్దీ ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతోంది. మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాజీవ్ విద్యామిషన్ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మరుగుదొడ్లు లేని పాఠశాలలు 45 మాత్రమే. అదే ఆర్డబ్ల్యూఎస్ అధికారుల లెక్కల్లో 521 పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. నీరు లేక నిరుపయోగంగా మారిన పాఠశాలలు వెయ్యికిపైగా ఉన్నాయి. పాఠశాలల్లో బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల 700 మ రుగుదొడ్లు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నిర్మించేందుకు ఏడాది క్రితం అప్పటి కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ నిధులు మంజూరు చేశా రు. అయితే ఇంత వరకు మరుగుదొడ్ల ని ర్మాణం పూర్తి కాలేదు. సమస్య తీవ్రత ఇలా.. చిత్తూరులోని మిట్టూరు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో తలుపులు లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. డీఈవో ఆఫీసు పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలోని మరుగుదొడ్లలో చెత్త వేయడంతో అవి నిరుపయోగంగా మారా యి. చిత్తూరు రూరల్ మండలంలోని పాఠశాలలకు ఒక్కదానికీ నీటి వసతి లేదు. సత్యవేడు మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు సైతం మరుగుదొడ్లు లేక ఇబ్బం దిపడుతున్నారు. విద్యార్థినుల అవస్థలు వర్ణణాతీతం. సత్యవేడు మండలంలోని 71 పాఠశాలల్లోని 65 పాఠశాలల్లో మరుగుదొడ్లు విద్యార్థులకు అందుబాటులో లేవు. మరుగుదొడ్లు ఉన్న 35 పాఠశాలల్లో 15పాఠశాలలకు నీటి వసతి లేదు. ఉన్నత పాఠశాలలు 11 ఉన్నాయి. వీటిల్లో మూడింటికి మాత్రమే నీటి వ సతి ఉంది. మిగిలిన పాఠశాలల్లో నీటి వసతి లేక మరుగుదొడ్లు ఉపయోగంలో లేవు. పీలేరు నియోజకవర్గంలో 360 ప్రాథమిక, 41 ప్రాథమికోన్నత, 52 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పలు ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా వాటి నిర్వహణ కొరవడడంతో నిరుపయోగంగా మారాయి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో పలుచోట్ల నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నత పాఠశాలల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడున్న 52 ఉన్నత పాఠశాలల్లో సగం పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పీటీఎం లోని ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు శిథి లావస్థలో ఉన్నాయి. పెద్దమండ్యం, ములకలచెరువు, బి.కొత్తకోట మండలాల్లోని పాఠశాలల్లో కొన్నిచోట్ల మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయి. పుంగనూరు పరిధిలో 371 పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ మరుగుదొడ్లు ఉన్నాయి. నీటి సమస్య కారణంగా చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. మదనపల్లె మున్సిపాలిటీలోని ఉర్దూ మున్సిపల్ స్కూల్లో 637 మంది విద్యార్థులు చ దువుతున్నారు. ఇక్కడ బాలికలకు 8 మరుగుదొడ్లు ఉన్నాయి. అయితే నీటి వసతి లేదు. మూడురోజులకొకసారి మున్సిపాలిటీ వారు ట్యాంకర్ పంపుతున్నారు. ఈ నీళ్లు చాలడం లేదు. కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో 486 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 80 శాతం పాఠశాలలకు మరుగుదొడ్లు ఉ న్నా నీటి సమస్యతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. టైల్స్, పైపులైన్లు దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నాయి. హస్తి నియోజకవర్గంలో 400 పాఠశాలలు ఉన్నాయి. వీటిలోని 360 పాఠశాలలకు మరుగుదొడ్ల వసతి ఉంది. అయితే అత్యధిక పాఠశాలల్లో నీటి సమస్య వేధిస్తోంది. దీం తో విద్యార్థినులు మరుగుదొడ్లు ఉపయోగిం చుకోలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలల మరుగుదొడ్లకు తలుపులు లేవు. పలమనేరు నియోజకవర్గంలో 484 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 212 చోట్ల నీరు, ని ర్వహణ లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. 30 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదు. బెరైడ్డిపల్లె, వి.కోట మండలాల్లో మరుగుదొడ్లకు తలుపులు లేవు. పాఠశాల గ్రాంట్లను మరుగుదొడ్ల నిర్వహణకు ఉపయోగించడం లేదు. -
రూ.2 కోట్ల నిధులు ఖర్చు చేయని హెడ్మాస్టర్లు
ఏలూరు సిటీ, న్యూస్లైన్ : సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం రాజీవ్ విద్యామిషన్ (ఎస్ఎస్ఏ) ఏటా నిధులను సమకూర్చుతోంది. కోట్లాది రూపాయల నిధులను ఆయా గ్రాంట్ల కింద పాఠశాలలకు మంజూరు చేస్తారు. కానీ సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లు తమ నిజాయితీని నిరూపించుకోవాలనే ఆలోచనతో పిల్లల అభ్యున్నతికి వినియోగించాల్సిన నిధులను వృథా చేశారు. ఇదే విషయాన్ని విజి‘లెన్స్’ నివేదికలు తేల్చిచెబుతున్నాయి. మూడేళ్లుగా రాజీవ్ విద్యామిషన్ మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయకుండా పిల్లలకు అన్యాయం చేశారని ఉన్నతాధికారులు తేల్చారు. అసలు నిధులు ఎందుకు ఖర్చు చేయలేదో వివరణ ఇవ్వాలంటూ మెమోలు జారీ చేయాలని ఆర్వీఎం రాష్ట్ర పథక సంచాలకులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రూ.వందకోట్లు వెనక్కి ఇదేంటి నిధులు మెక్కేయకుండా బాగానే ఆదా చేశారుగా అని చూసేవారికి అనిపించినా.. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగించకుండా వృథా చేయటం ఫలితంగా మూడేళ్లుగా జిల్లాకు వివిధ గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులు భారీస్థాయిలో ఏకంగా రూ.100 కోట్ల వరకు వెనక్కి మళ్లినట్టు తెలుస్తోంది. 2008-09, 2009-10, 2010-11 విద్యాసంవత్సరాల్లో స్కూల్ గ్రాంట్స్, మెయింటినెన్స్ గ్రాంట్, స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ల రూపంలో భారీగా నిధులు విడుదల చేశారు. ఈ నిధులు ఆయా బ్యాంకు ఖాతాలకు చేరినా మురిగిపోయే వరకు చూడడం మినహా విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రూ.2కోట్ల నిధులు ఖర్చు చేస్తే విద్యార్థులకు స్కూళ్లలో మంచి జరిగేది. కానీ సొమ్ములు దాచుకుని వారికి ద్రోహం చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నిధులతో పాఠశాలల్లో మరుగుదొడ్లు, పాఠశాల మరమ్మతులు, పరికరాల మరమ్మతులు, బోధనా సామగ్రి ఇలా విద్యార్థులకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నవాటికి ఖర్చు చేయాల్సిన నిధులను వ్యర్థం చేసినట్టు విజిలెన్స్ అధికారులు తనిఖీలో గుర్తించారు. పైగా అప్పటి రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ కూడా సక్రమంగా పర్యవేక్షణ చేయలేదని నివేదికల్లో పేర్కొన్నట్టు చెబుతున్నారు. ఈఏడాది స్కూల్ మెయింటినెన్స్ గ్రాంట్, స్కూల్ గ్రాంట్గా రూ.4 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఎలిమెంటరీ పాఠశాలకు ఒక్కోదానికి రెండు గ్రాంట్లు కలిపి రూ.10వేలు, యూపీ స్కూల్కు రూ.17వేలు, ఉన్నత పాఠశాలకు రూ.17 వేలు మంజూరు చేశారు. గతంలో అయితే ఒక్కో పాఠశాలకు సుమారు రూ.27 నుంచి రూ.32వేల వరకు నిధులు మంజూరు అయ్యేవి. -
సగం పాఠాలయ్యాక శిక్షణా.. .?
=కొత్త పాఠ్య పుస్తకాలపై ఐదు నెలల తర్వాత శిక్షణ తరగతులు =రాజీవ్ విద్యామిషన్ నిర్వాకం =పెదవి విరుస్తున్న ఉపాధ్యాయులు నూజివీడు, న్యూస్లైన్ : నూతన పాఠ్యపుస్తకాలు వచ్చి, పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడిచిన తరువాత వాటిపై ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే దాదాపు సగం పాఠాలు బోధించడం పూర్తయిన తరువాత శిక్షణనిచ్చి ఏం ప్రయోజనమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రణాళిక లేకుండా రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) అధికారులు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులపై ఇటు ఉపాధ్యాయ వర్గాల్లో, అటు తల్లిదండ్రుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో పలు తరగతుల పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి మార్చింది. దీనిలో భాగంగా 4 నుంచి 8వ తరగతి వరకు నూతన పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చింది. ఈ పాఠ్యాంశాలపై ఈ నెల 18 నుంచి 20 వరకు ప్రాథమికోన్నత స్థాయిలో 6, 7, 8 తరగతులకు గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు జిల్లా వ్యాప్తంగా శిక్షణనిస్తున్నారు. ఈ పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాలపై పాఠశాలల ప్రారంభానికి ముందే శిక్షణనిచ్చి ఉంటే ఎంతో ఉపయోగం ఉండేదని ఉపాధ్యాయ వర్గాలే కాకుండా మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలు తెరిచి ఇప్పటికే ఐదు నెలలు గడిచిన తరువాత, సిలబస్ దాదాపు సగం పూర్తయ్యాక శిక్షణనివ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనేది ఆర్వీఎం అధికారులకే తెలియాలి. నూతన పాఠ్యపుస్తకాలలో అనేక కొత్త అంశాలను చేర్చారు. ముఖ్యంగా ఆంగ్ల పాఠ్యపుస్తకాలలోని అంశాలు బోధించాలంటే కొంత సంక్లిష్టంగానే ఉందనేది ఉపాధ్యాయుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో పుస్తకాలు విద్యార్థుల చేతికి రాకముందే ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించి ఉంటే విద్యార్థులకు ఉపయోగం కలిగి ఉండేది. అసలే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా విద్యార్థులకు పనిదినాలు తగ్గిపోవడంతో సెలవు దినాలలో కూడా పాఠశాలలకు వెళ్లాల్సివస్తున్న నేపథ్యంలో మరల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా ఆర్వీఎం అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, తద్వారా ఫలితాలు ఉపయోగకరంగా ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
31 మందే విద్యావలంటీర్ల నియామకం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్లైన్ : ‘ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్య అందిస్తాం.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించా లి..’ అని పాఠశాలల పునఃప్రారంభంలో రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం), విద్యాశాఖలు బడిబాట నిర్వహిం చాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారు. బోధించడానికి ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయి. కనీసం విద్యావలంటీర్లను కూడా నియమించలేదు. ఫలితంగా జిల్లాలో 200లకుపైగా పాఠశాలలు మూతపడ్డాయి. కొన్ని పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడే ఉండటంతో బోధన నామమాత్రంగానే ఉంది. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయులు లేక చదువుల చతికిల పడుతున్నాయి. కేవలం 31 వీవీల పోస్టులు మంజూరు జిల్లాలో 200 పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూతబడ్డాయి. వీటితోపాటు 1000 వరకు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది 3,638 మంది వి ద్యావాలంటీర్లు నియమించి విద్యాబోధన చేయించారు. ఈ ఏడాది సెప్టెంబర్ పూర్తయినా విద్యావాలంటీర్లు(అకాడిమిక్ ఇన్స్టక్టర్ల) నియామకం కాలేదు. ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు అధికారి జిల్లాకు కేవలం 31 మందిని నియమించుకోవాలని జిల్లా ఆర్వీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో వీవీకి నెలకు రూ.5వేలు, బీఎడ్, డీఎడ్ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. వీరితో విద్యార్థులు చదువులు ఎలా సాగుతాయని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క తిర్యాణి మండలంలోనే 30 వరకు ఒక్క రు కూడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఉన్నాయి. వీవీల కేటాయింపుపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 వేల పోస్టులు అవసరం ఉండగా తక్కువ పోస్టులు కేటాయించడంతో సర్కారు బడులు ఈ విద్యాసంవత్సరం మూతబడులుగానే ఉండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు డ్రాపౌట్గా మారే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఎన్ఆర్ఎస్టీసీ నిధులు రూ.10 లక్షలు ఉండడంతో 31 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జిల్లాలో మూతపడ్డ పాఠశాలల్లో వీవీలను నియమించి విద్యార్థుల చదువులు ఆగిపోకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
లెక్క తప్పింది..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాజీవ్ విద్యా మిషన్ను లెక్కల చిక్కులు చుట్టుముట్టాయి. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏ పద్దు కింద ఎంత మొత్తం ఉందనే లెక్క తేలకపోవడంతో వాటిని వినియోగించలేని పరిస్థితి నెలకొంది. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం దండిగా నిధులు విడుదల చేసింది. వీటిలో కొంత భాగం నేరుగా పాఠశాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, మరికొన్ని జిల్లా ప్రాజెక్టు అధికారి ఖాతాలో జమయ్యాయి. కాగా, వీటిని కూడా పాఠశాల ఖాతాకు బదిలీ చేశారు. దాదాపు పదేళ్లుగా ఈ ప్రక్రియ సాగింది. దండిగా నిధులు విడుదల చేయడం తప్ప.. ఏ పద్దు కింద ఎన్ని నిధులు ఖర్చు చేస్తుది అటు జిల్లా ప్రాజెక్టు యంత్రాంగం గానీ, ఇటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గానీ ప్రత్యేకంగా లెక్కలు రాయలేదు. ఇటీవల ప్రభుత్వం మిగులు నిధులను వెనక్కు పంపాలని ఆదేశించింది. లెక్కల్లో స్పష్టత లేకపోవడంతో చాలా నిధులు వెనక్కు రాకుండా పాఠశాల ఖాతాల్లోనూ మూలుగుతున్నాయి. ఈ లెక్కలు తేల్చే క్రమంలో భాగంగా ఆర్వీఎం అధికారులు మూడు నెలలుగా అధికారులు కుస్తీ పడుతున్నప్పకీ ఏటూ తేలకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. తిరిగొచ్చింది సగమే.. జిల్లాలో 2,314 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,640 ప్రాథమిక పాఠశాలలు, 247 ప్రాథమికోన్నత పాఠశాలలు కాగా మరో 427 ఉన్నత పాఠశాలలున్నాయి. పాఠశాల గ్రాంట్లు, నిర్మాణ పనులు, నిర్వహణ, ఉపాధ్యాయుల బోధన, అభ్యసన నిధులు తదితర దాదాపు 18 కిపైగా పద్దుల కింద ఏటా ప్రతి పాఠశాలకు నిధులు విడుదలవుతున్నాయి. నిధులు విడుదల చేసే అంశంపై యంత్రాంగం ఆదినుంచి ఉదాసీనంగా వ్యవహరించింది. దీంతో ఏ పద్దు కింద ఎంత నిధులిచ్చాం.. ఎంత ఖర్చయ్యాయి.. మిగులు నిధులెన్ని.. అనే విషయాలపై దృష్టి సారించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో వచ్చిన నిధులను అడ్డదిడ్డంగా ఖర్చు చేసి ఉపాధ్యాయులు చేతులు దులుపుకొన్నారు. ఇటీవల నిధులు వెనక్కు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా ఆర్వీఎం అధికారులు ఉపాధ్యాయుల నుంచి తెప్పించేందుకు ఉపక్రమించింది. జిల్లాలో మొత్తంగా రూ.32 కోట్లు పాఠశాలల ఖాతాల్లో ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. ఈ మేరకు చర్యలకు దిగిన యంత్రాంగానికి ఇప్పటివరకు కేవలం రూ.14 కోట్లు మాత్రమే వెనక్కు వచ్చాయి. మరో రూ.8కోట్ల మేర విద్యార్థుల యూనిఫాం బిల్లుల నేపథ్యంలో వాటిని అట్టిపెట్టినప్పటికీ.. మరో రూ.10 కోట్ల మేర లెక్కలు తేలడం లేదు. బడి నుంచే తేల్చేద్దాం.. క్షేత్ర స్థాయిలో ఏ పద్దు కింద ఎన్ని నిధుల ఉన్నాయనే విషయాన్ని తేల్చేందుకు రాజీవ్ విద్యామిషన్ ప్రత్యేక ప్రొఫార్మాను రూపొందించింది. రెండ్రోజుల క్రితం జరిగిన విద్యాధికారుల సమావేశంలో ఈ ప్రొఫార్మాలను వారికి అందించింది. వీటిని పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులకు పంపి వారం రోజుల్లో వివరాలు ఇవ్వాలని మండల విద్యాధికారులకు స్పష్టం చేసింది. ఇందులో 18 కాలమ్స్తో కూడిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాలు వచ్చిన అనంతరం వాటిని క్రోడీకరించి జిల్లా స్థాయి వివరాలను తయారు చేస్తామని జిల్లా ఆర్వీఎం ప్రాజెక్టు అధికారి కిషన్రావు ‘సాక్షి’కి వివరించారు.