Satwik Sairaj
-
సాత్విక్ సాయిరాజ్కు పితృవియోగం
సాక్షి, అమలాపురం: ఇది విధి రాసిన విషాదవార్త! తనయుడి అవార్డుని చూసి మురిసిపోదామనుకుంటే... తండ్రి భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యే పరిస్థితి! ‘ఖేల్రత్న’తో విజయోత్సవ వేడుకలు చేసుకోవాల్సిన ఇంట విషాదం అలుముకున్న దుస్థితి! ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథం గురువారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. ఆయనకు భార్య రంగమణి, ఇద్దరు కుమారులు రాంచరణ్, సాత్విక్ ఉన్నారు. 65 ఏళ్ల కాశీ విశ్వనాథం గురువారం సాయంత్రం దేశ రాజధానిలో తనయుడు సా త్విక్కు ‘ఖేల్రత్న’ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం సొంతూరు అమలాపురం నుంచి కారులో రాజమండ్రి విమానాశ్రయానికి బయలుదేరిన ఆయన పట్టణం దాటిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురై మృతి చెందారు. ఊహించని విషాద వార్త అక్కడి కుటుంబసభ్యుల్ని, ఢిల్లీలో ఉన్న సా త్విక్ సాయిరాజ్ను కన్నీటి సంద్రంలో ముంచేసింది. అమెరికాలో ఉన్న సాత్విక్ సోదరుడు రాంచరణ్ స్వస్థలం చేరుకున్నాక శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తి కనబరిచిన సాత్విక్కు తొలి కోచ్గా ఓనమాలు నేరి్పన తండ్రి తదనంతరం అతని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ షట్లర్గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. డబుల్స్లో అసాధారణ ప్లేయర్గా ఎదిగిన సాత్విక్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అంతర్జాతీయ టోర్నీల్లో, ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. అనతికాలంలోనే ఎన్నో పతకాలు, ట్రోఫీలు నెగ్గిన సా త్విక్ ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం సా త్విక్తోపాటు అతని డబుల్స్ భాగస్వామి చిరాగ్ శెట్టిని 2023 సంవత్సరానికిగాను ‘ఖేల్రత్న’ పురస్కారానికి ఎంపిక చేసింది.2024 జనవరిలో ఢిల్లీలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా... సా త్విక్–చిరాగ్ మలేసియా ఓపెన్ టోర్నీ లో ఆడుతుండటంతో హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం పెట్రోలియం స్పోర్ట్స్ ఇంటర్ యూనిట్ టోర్నీ ఆడేందుకు సాత్విక్, చిరాగ్ ఢిల్లీలో ఉన్నారు. దాంతో కేంద్ర క్రీడా శాఖ ‘ఖేల్రత్న’ అందజేయాలని భావించి కార్యక్రమం ఏర్పాటు చేసింది. -
తాప్సీ భర్త మథియాస్ సంచలన ప్రకటన.. ఇకపై
భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి కోచ్ మథియాస్ బో కీలక ప్రకటన చేశాడు. కోచింగ్ విధుల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో సాత్విక్- చిరాగ్ వైఫల్యం నేపథ్యంలో మథియాస్ బో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మథియాస్ శిక్షణలో సాత్విక్- చిరాగ్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో నంబర్ వన్గా ఎదిగారు. కొన్నాళ్లుగా అద్భుత ఫామ్లో ఉన్న ఈ జంట.. విశ్వ క్రీడల్లో కనీసం కాంస్యమైనా సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న సాత్విక్- చిరాగ్.. మలేషియా ద్వయం ముందు తలవంచారు.ప్యారిస్లో గురువారం నాటి మ్యాచ్లో ఆరోన్ చియా- వూయీ యిక్ చేతిలో 21-13, 14-21, 16-21తో ఓడి పతక రేసు నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి లోనుకాగా.. సాత్విక్- చిరాగ్లను మథియాస్ బో ఓదార్చాడు. ఈ క్రమంలో శనివారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు మథియాస్ బో.అలసిపోయిన ముసలి వ్యక్తిని‘‘కోచ్గా నా ప్రస్థానం ముగిసిపోయింది. భారత జోడీ కోచ్గా కొనసాగలేను. ఇక్కడే కాదు.. ప్రస్తుతానికి ఎక్కడా పనిచేయలేను. ఇప్పటికే బ్యాడ్మింటన్లో ఎక్కువ సమయం గడిపేశాను. అయినా కోచ్గా ఉంటే తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.నేనేమో అలసిపోయిన ముసలి వ్యక్తిని. మనం ఊహించిన ఫలితాలు రాకపోతే కచ్చితంగా నిరాశచెందుతాం. మీరు కష్టపడే తత్వం ఉన్న ఆటగాళ్లు. పతకంతో ఇండియాకు తిరిగి రావాలని ఎంతగా ఆకాంక్షించారో.. అందుకోసం ఎంతగా శ్రమించారో నాకు తెలుసు. అయితే, ఈసారి ఆ కల నెరవేరలేదు.గర్వపడేలా చేశారుగాయాలు వేధించినా.. వెనకడుగు వేయలేదు. నొప్పిని భరించేందుకు ఇంజక్షన్లు తీసుకున్నారు. అంకితభావంతో ఇక్కడిదాకా వచ్చారు. ప్రతీ మ్యాచ్ మనసు పెట్టి ఆడారు. నన్ను గర్వపడేలా చేశారు’’ అంటూ మథియాస్ బో.. సాత్విక్- చిరాగ్ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. భారత్లో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయంటూ సహచరుల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.మథియాస్ వచ్చిన తర్వాతేకాగా మథియాస్ బో వచ్చిన తర్వాతే తాము ఆటలో మరింతగా రాటుదేలామని సాత్విక్- చిరాగ్ గతంలో పలు సందర్భాల్లో పేర్కన్నారు. తమ విజయాల వెనుక బో కష్టం కూడా ఉందని పేర్కొన్నారు. డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ మథియాస్ బో మరెవరో కాదు.. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను భర్త అన్న సంగతి తెలిసిందే. పదేళ్ల ప్రేమపదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఇక ఒలింపిక్స్ కోసం భర్తతో కలిసి ప్యారిస్ వెళ్లిన తాప్సీ.. డెన్మార్క్లో తాము ఇల్లు కొనుగోలు చేశామని.. కొన్నాళ్లు అక్కడే ఉంటామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల మథియాస్ బో రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Mathias Boe (@mathias.boe) -
గ్రూప్ ‘టాపర్’గా సాత్విక్–చిరాగ్ జోడీ
భారీ అంచనాలతో విశ్వక్రీడల బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట.. అందుకు తగ్గట్లే వరుస విజయాలతో గ్రూప్ టాపర్గా నిలిచింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ ‘సి’మ్యాచ్లో మూడో సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 38 నిమిషాల్లో 21–13, 21–13తో ఫజర్–రియాన్ (ఇండోనేసియా) జంటపై విజయం సాధించింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్త్లు ఖరారు చేసుకున్న ఈ రెండు జోడీలు గ్రూప్ విజేత స్థానం కోసం పోటీపడ్డాయి. గ్రూప్ దశలో మిగిలిన మ్యాచ్లు ముగిసిన అనంతరం బుధవారం క్వార్టర్ ఫైనల్ ‘డ్రా’ విడుదల కానుంది. ఇక మహిళల డబుల్స్ గ్రూప్ ‘సి’లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంట వరుసగా మూడో పరాజయంతో ఒలింపిక్స్ నుంచి విజయం లేకుండానే ని్రష్కమించింది. చివరి లీగ్ మ్యాచ్లో అశి్వని–తనీషా జంట 15–21, 10–21 తో మాపసా–ఏంజెలా (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడింది. కాగా, ఇవే తన చివరి ఒలింపిక్ క్రీడలని 34 ఏళ్ల అశ్విని పొన్నప్ప ప్రకటించింది. -
క్వార్టర్స్లో సాత్విక్–చిరాగ్ జోడీ
పారిస్: పతకమే లక్ష్యంగా పారిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తొలి లక్ష్యాన్ని పూర్తి చేసింది. గ్రూప్ ‘సి’ నుంచి సాత్విక్–చిరాగ్...ఫజర్–అర్దియాంతో (ఇండోనేసియా) జోడీలు క్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. గాయం కారణంగా గ్రూప్ ‘సి’లోని మార్క్ లమ్స్ఫుస్–మార్విన్ సిడెల్ (జర్మనీ) జోడీ వైదొలిగింది. ఇదే గ్రూప్లో ఉన్న లుకాస్ కోరి్వ–రొనాన్ లాబర్ (ఫ్రాన్స్) జంట ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. దాంతో ఒక్కో మ్యాచ్లో నెగ్గిన భారత్, ఇండోనేసియా జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. గ్రూప్ విజేతను నిర్ణయించే మ్యాచ్లో నేడు ఫజర్–అర్దియాంతోలతో సాతి్వక్–చిరాగ్ తలపడతారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో సాతి్వక్–చిరాగ్ జోడీ గ్రూప్ దశలోనే ని్రష్కమించింది. అశ్విని–తనీషా అవుట్ మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం వరుసగా రెండో మ్యాచ్లో ఓడి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్లో అశి్వని–తనీషా జోడీ 11–21, 12–21తో నామి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎల్’ రెండో మ్యాచ్లో లక్ష్య సేన్ (భారత్) 21–19, 21–14తో జూలియన్ కరాగి (బెల్జియం)పై గెలిచాడు. గ్వాటెమాలాకు చెందిన కెవిన్ కార్డన్ గాయంతో వైదొలిగాడు. ఫలితంగా కార్డన్పై లక్ష్య సేన్ గెలిచిన ఫలితాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గితేనే లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంటాడు. బోపన్న జోడీ ఓటమి పారిస్ ఒలింపిక్స్లో భారత వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న నిరాశ పరిచాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–శ్రీరామ్ బాలాజీ జంట 5–7, 2–6తో వాసెలిన్–మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడింది. మ్యాచ్ అనంతరం బోపన్న మాట్లాడుతూ దేశం తరఫున ఇదే తన చివరి పోరు అని పేర్కొన్నాడు. ఇప్పటికే డేవిస్ కప్కు వీడ్కోలు పలికిన బోపన్న ఇకపై జాతీయ జట్టు తరఫున ఆడబోనని ప్రకటించాడు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో బోపన్నకు ఒలింపిక్ పతకం అందని ద్రాక్షలాగే మిగిలింది. 2016 రియో ఒలింపిక్స్ మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జాతో కలిసి నాలుగో స్థానంలో నిలిచిన బోపన్న.. ఇంత సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఆనందించానని అన్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్కు టెన్నిస్లో ఏకైక పతకం 1996 అట్లాంటా క్రీడల్లో (లియాండర్ పేస్–కాంస్యం) దక్కింది. -
Paris Olympics: సాత్విక్- చిరాగ్ మ్యాచ్ రద్దు.. కారణం ఇదే!
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి రెండో మ్యాచ్ రద్దైంది. ప్రత్యర్థి ద్వయంలోని ఓ షట్లర్ గాయపడటంతో సోమవారం జరగాల్సిన మ్యాచ్ మొదలుకాకుండానే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో తమ తదుపరి మ్యాచ్లో సాత్విక్- చిరాగ్ జోడీ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.పురుషుల డబుల్స్ విభాగంలో నంబర్ వన్గా ఎదిగిన సాత్విక్- చిరాగ్ ఒలింపిక్స్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్యారిస్ వేదికగా గ్రూపు దశలో తమ మొదటి మ్యాచ్లో గెలిచిన ఈ జోడీ శుభారంభం అందుకున్నారు. గ్రూపు-సి పోటీల్లో భాగంగా ఫ్రాన్స్కు చెందిన లుకాస్ కోర్వీ- రొనాన్ లాబార్ ద్వయాన్ని 21-17, 21-14తో ఓడించి శనివారం తొలి గెలుపు నమోదు చేశారు.మ్యాచ్ రద్దు.. కారణం ఇదేఈ క్రమంలో సోమవారం నాటి రెండో మ్యాచ్లో సాత్విక్- చిరాగ్ జంట జర్మనీ జోడీ మార్విన్ సీడెల్- మార్క్ లామ్స్ఫస్తో తలపడాల్సింది. అయితే, మార్క్ మోకాలి గాయం కారణంగా ఈ జోడీ పోటీ నుంచి తప్పుకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రద్దైపోయింది. ఈ విషయాన్ని నిర్వాహకులు నిర్ధారించారు.‘‘గ్రూప్-సిలో మ్యాచ్లో లామ్స్ఫస్- మార్విన్ సీడెల్ ఆడాల్సిన మ్యాచ్లు రద్దైపోయాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్లు రీషెడ్యూల్ చేయాల్సి ఉంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం.. గ్రూప్-సి దశలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల ఫలితాలు, మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ డిలీట్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.తప్పక గెలవాలికాగా సాత్విక్- చిరాగ్ తమ తదుపరి మ్యాచ్లో ఇండోనేషియా జంట ఫజర్ అల్ఫియాన్- మహమ్మద్ రియాన్ ఆర్టియాంటోతో మంగళవారం పోటీ పడనున్నారు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సాత్విక్- చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్ మార్గం సుగమమవుతుంది. ఇక ఫజర్- రియాన్ మాజీ నంబర్ వన్ జోడీ. ప్రస్తుతం ఏడో ర్యాంకులో కొనసాగుతున్నారు.గతంలో సాత్విక్- చిరాగ్ - ఫజర్ రియాన్ జోడీలు ఐదుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. భారత జోడీ మూడుసార్లు గెలవగా.. ఇండోనేషియా జంట రెండుసార్లు విజయం సాధించింది. చివరగా కొరియన్ ఓపెన్-2023లో పోటీపడ్డ ఈ జోడీల్లో సాత్విక్- చిరాగ్ పైచేయి సాధించారు. ప్యారిస్ ఒలింపిక్స్లోనూ మన జోడీ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగింది.చదవండి: Paris Olympics: నిరాశపరిచిన బోపన్న-బాలాజీ జోడీ.. తొలి రౌండ్లోనే ఔట్ -
సాత్విక్–చిరాగ్ జోడీకి చుక్కెదురు
సింగపూర్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి అనూహ్య పరాజయం ఎదురైంది. సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన సాత్విక్– చిరాగ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 34వ స్థానంలో ఉన్న డానియల్ లుండ్గార్డ్– మాడ్స్ వెస్టెర్గార్డ్ (డెన్మార్క్) ద్వయం 22–20, 21–18తో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీని బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ పలు దశల్లో సాత్విక్–చిరాగ్ ఆధిక్యంలో ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ టోర్నీకి ముందు సాత్విక్–చిరాగ్ సీజన్లో ఆరు టోర్నీలు ఆడి ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో, థాయ్లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్స్ నెగ్గారు. మలేసియా సూపర్–1000, ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీల్లో రన్నరప్గా నిలిచి, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. -
మళ్లీ ప్రపంచ నంబర్వన్ జోడీగా...
న్యూఢిల్లీ: నెల రోజుల తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మళ్లీ వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ను అందుకున్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో సాత్విక్–చిరాగ్ ద్వయం రెండు స్థానాలు మెరుగు పర్చుకొని మూడో ర్యాంక్ నుంచి టాప్ ర్యాంక్కు ఎగబాకింది. గత ఆదివారం థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సాత్విక్–చిరాగ్ జంట విజేతగా నిలవడంతో వారి ర్యాంక్లో మార్పు వచ్చింది. గత ఏడాది అక్టోబర్లో తొలిసారి నంబర్వన్ ర్యాంక్ను అందుకున్న భారత జోడీ రెండు వారాలపాటు అగ్రస్థానంలో కొనసాగి ఆ తర్వాత ఐదో ర్యాంక్కు పడిపోయింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 23న నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకొని ఏప్రిల్ 15వ తేదీ వరకు టాప్ ర్యాంక్లో కొనసాగి మూడో ర్యాంక్కు పడిపోయింది. -
థాయ్లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతగా భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన చెన్ బో యాంగ్, లియు యిపై 21-15 21-15 తేడాతో విజయం సాధించిన ఈ భారత ద్వయం.. తొమ్మిదవ వరల్డ్ టూర్ టైటిల్ తమ ఖాతాలో వేసుకున్నారు.వరుస గేమ్లలో ప్రత్యర్ధి జోడీని ప్రపంచ నం.3 సాత్విక్ ద్వయం చిత్తు చేసింది. ఏ దశలోనూ ప్రత్యర్ధికి కోలుకునే అవకాశం సాత్విక్, చిరాగ్ జంట ఇవ్వలేదు. పారిస్ ఒలింపిక్స్కు ముందు టైటిల్ను సొంతం చేసుకోవడం ఈ జోడికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇక ప్రస్తుత బీడబ్ల్యూఎఫ్ సీజన్లో ఈ జోడికి ఇది రెండువ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ టైటిల్ను ఈ జోడీ సొంతం చేసుకుంది. అదేవిధంగా మలేషియా సూపర్ 1000,ఇండియా సూపర్ 750 టోర్నీల్లో రన్నరప్గా నిలిచారు. -
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబు ల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం మరో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–11తో జి సావో నాన్–జెంగ్ వె హాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ మైస్నం మిరాబా లువాంగ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ మణిపూర్ ఆటగాడు 21–14, 22–20తో మాడ్స్ క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అశ్విని–తనీషా ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–19, 21–17తో హంగ్ ఎన్ జు–లిన్ యు పె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అష్మిత (భారత్) 15–21, 21–12, 12–21తో హాన్ యువె (చైనా) చేతిలో ఓడిపోయింది. -
పారిస్ ఒలింపిక్స్కు ఏడుగురు భారత షట్లర్లు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుసగా మూడో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన సింధు...ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ కూడా అర్హత సాధించింది.సోమవారంతో ఒలింపిక్ క్వాలిఫయింగ్ గడువు ముగిసింది. భారత్ నుంచి ఏడుగురికి బెర్త్లు లభించాయి. నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్లో టాప్–16లో నిలిచిన క్రీడాకారులకు ఒలింపిక్ బెర్త్లు అధికారికంగా ఖరారవుతాయి.ర్యాంకులు ఇలా..ప్రస్తుతం సింధు 12వ ర్యాంక్లో ఉంది. పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్లు ప్రణయ్ (9వ ర్యాంక్), లక్ష్య సేన్ (13వ ర్యాంక్) తొలిసారి ఒలింపిక్స్లో పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండోసారి ఒలింపిక్స్కు అర్హత పొందారు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీకి ఒలింపిక్ బెర్త్ దక్కింది. అశ్వినికిది మూడో ఒలింపిక్స్కాగా, తనీషా తొలిసారి విశ్వ క్రీడల్లో పోటీపడనుంది. -
వైదొలిగిన సాత్విక్-చిరాగ్ జోడీ
భుజం గాయం నుంచి సాత్విక్ పూర్తిగా కోలుకోకపోవడంతో... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ వైదొలిగింది. గత ఏడాది దుబాయ్లో జరిగిన ఈ మెగా టోర్నీలో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. థామస్ కప్లో మాత్రం సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగుతుందని భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. ఆసియా చాంపియన్షిప్ ఈనెల 9 నుంచి 14 వరకు చైనాలో జరుగుతుంది. -
శరత్ కమల్ ఓటమి
సింగపూర్: సంచలన విజయాలతో సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో అదరగొట్టిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ జోరుకు బ్రేక్ పడింది. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన ప్రపంచ 88వ ర్యాంకర్ శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శరత్ కమల్ 9–11, 2–11, 7–11, 11–9, 8–11తో ప్రపంచ 6వ ర్యాంకర్ ఫెలిక్స్ లెబ్రున్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శరత్ మొత్తం 37 పాయింట్లు సాధించాడు. ఇందులో 24 పాయింట్లు తన సర్వీస్లో నెగ్గగా... తన సరీ్వస్లో మరో 22 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శరత్ కమల్కు 14,000 డాలర్ల (రూ. 11 లక్షల 60 వేలు) ప్రైజ్మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్ బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్లో ప్రపంచ నంబర్వన్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి చుక్కెదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 16–21, 15–21తో 2022 డబుల్స్ చాంపియన్ షోహిబుల్ ఫిక్రీ–మౌలానా బగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. గతంలో ఫిక్రీ–మౌలానా ద్వయంపై నాలుగుసార్లు గెలిచిన సాతి్వక్–చిరాగ్ ఈసారి ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ వాటరింజెన్ (నెదర్లాండ్స్): డచ్ ఇంటర్నేషనల్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్గా అడుగుపెట్టిన తరుణ్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–16, 23–21తో భారత్కే చెందిన శుభాంకర్ డేపై గెలుపొందాడు. తొలి రౌండ్లో తరుణ్ 18–21, 21–10, 23–21తో ఆరో సీడ్ మథియాస్ కిక్లిట్జ్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 21–18, 21–14తో 2019 చాంపియన్ జోడీ మొహమ్మద్ అసన్–హెండ్రా సెతియావాన్ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2022 విజేత జోడీ మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రి–బగాస్ మౌలానా (ఇండోనేసియా)తో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. లక్ష్య సేన్ బోణీ మరోవైపు పురుషుల సింగిల్స్లో 2022 రన్నరప్, భారత స్టార్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 21–14తో ప్రపంచ 33వ ర్యాంకర్ మాగ్నస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో భారత ప్లేయర్ ప్రియాన్షు రజావత్కు నిరాశ ఎదురైంది. చికో ఔరా ద్వి వర్దాయో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్లో ప్రియాన్షు 19–21, 21–11, 9–21తో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ ముందంజ వేయగా... గత ఏడాది సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట ఈసారి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. అశి్వని–తనీషా ద్వయం 21–13, 21–18తో యెంగ్ ఎన్గా టింగ్–యెంగ్ పుయ్ లామ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గింది. గాయత్రి–ట్రెసా జోడీ 18–21, 12–21తో అప్రియాని రహాయు–సితీ ఫాదియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
All England Badminton 2024: సాత్విక్–చిరాగ్ జోడీపైనే ఆశలు!
బర్మింహమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత ప్లేయర్కు చివరిసారి 2001లో టైటిల్ లభించింది. ఆనాడు పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత 2015లో మహిళల సింగిల్స్లో సైనా నెహ్వల్... 2022లో పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. అయితే ఈసారి పురుషుల డబుల్స్లో ప్రపంచ నంబర్వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలపై భారత బృందం భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో వీరిద్దరు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఆడిన మూడు టోరీ్నల్లోనూ (మలేసియా మాస్టర్స్, ఇండియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఫైనల్ చేరారు. రెండింటిలో రన్నరప్గా నిలిచారు. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్లో టైటిల్ కూడా దక్కించుకున్నారు. అంతా సవ్యంగా సాగితే... నేడు మొదలయ్యే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో భారత బృందం 23 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించే అవకాశాలున్నాయి. కానీ ఈసారి అన్ని విభాగాల్లోనూ భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్ దాటాక ప్రతి మ్యాచ్లో మేటి ప్రత్యర్థులు సిద్ధంగా ఉండనున్నారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మాజీ చాంపియన్ మొహమ్మద్ అహ్సాన్–హెండ్రా సెతియవాన్ (ఇండోనేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. సాత్విక్ ద్వయం ఈ అడ్డంకి దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా) జోడీ.. క్వార్టర్ ఫైనల్లో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జంట ఎదురయ్యే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సాత్విక్–చిరాగ్ జోడీ ప్రతి మ్యాచ్లో విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో టాప్ సీడ్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కిడాంబి శ్రీకాంత్; సు లి యాంగ్ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; ఎన్జీ జె యోంగ్ (మలేసియా)తో లక్ష్య సేన్; వర్దాయో (ఇండోనేసియా)తో ప్రియాన్షు తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వ్యోన్ లి (బెల్జియం)తో పీవీ సింధు ఆడుతుంది. ఈ మ్యాచ్లో సింధు గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె ప్రత్యరి్థగా ప్రపంచ చాంపియన్, వరల్డ్ నంబర్వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో ఉండనుంది. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ; అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు బరిలో ఉన్నాయి. -
సింధు పరాజయం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు క్వార్టర్ ఫైనల్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ నంబర్వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లగా, రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధుకు క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 24–22, 17–21, 18–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యూ ఫె (చైనా) చేతిలో పోరాడి ఓడింది. గంటా 32 నిమిషాల పాటు భారత స్టార్ తుదికంటా పోరాడినా ఫలితం దక్కలేదు. ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యూ ఫెకు దీటుగా కోర్టులో శ్రమించడంతో ర్యాలీలు సుదీర్ఘంగా సాగాయి. దీంతో తొలిగేమ్ హోరాహోరీగా సాగింది. 22–22 వద్ద సింధు క్రాస్కోర్టు షాట్లతో విరుచుకుపడి తొలిగేమ్ నెగ్గింది. తర్వాత రెండో గేమ్లో సరీ్వస్ వైఫల్యంతో వెనుకబడిన సింధు గేమ్ను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్లోనూ ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. కానీ చైనా ప్రత్యర్థి పైచేయి సాధించడంతో మ్యాచ్లో ఓటమి తప్పలేదు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–13తో థాయ్లాండ్కు చెందిన సుపక్ జొమ్కొ–కిటినుపాంగ్ కెడ్రెన్ జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ కూడా సెమీస్ చేరుకున్నాడు. క్వార్టర్స్ మ్యాచ్లో లక్ష్య 19–21, 21–15, 21–13 స్కోరుతో లో కీన్ యూ (సింగపూర్)ను ఓడించాడు. -
మనోళ్ల కోచ్.. వరల్డ్ నంబర్ 1: తాప్సితో ప్రేమ.. మథియస్ బ్యాగ్రౌండ్ ఇదే!
ప్రేమకు సరిహద్దులు ఉండవు.. మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడితే పరిచయాన్ని పరిణయం దాకా తీసుకువెళ్లడమే తరువాయి అన్నట్లు.. ఇప్పటికే ఎన్నో సెలబ్రిటీ జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి. తాప్సి పన్ను- మథియస్ బో కూడా ఆ జాబితాలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉదయ్పూర్ వేదికగా ఈ లవ్ బర్డ్స్ మార్చిలో ఏడడుగులు వేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి పన్ను బాలీవుడ్లో పింక్, థప్పడ్ వంటి సినిమాలో నటిగా తనను తాను నిరూపించుకుంది. ఇటీవల షారుఖ్ ఖాన్తో కలిసి డంకీ సినిమాలో కనిపించింది ఈ ఢిల్లీ సుందరి. ఎల్లలు దాటిన ప్రేమ హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలోనే తాప్సి.. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో ప్రేమలో పడింది. 2014లో బో ఇండియా ఓపెన్ ఆడేందుకు వచ్చినపుడు స్టాండ్స్లో కూర్చుని అతడిని చీర్ చేసింది తాప్సి. అప్పటికే వీరి బంధం గురించి గుసగుసలు వినిపించగా.. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో సాధించిన విజయాలను పరస్పరం సెలబ్రేట్ చేసుకుంటూ తాము ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పారీ సెలబ్రిటీ పీపుల్. తాప్సీనే ఓ అడుగు ముందుకేసి.. రాజ్ షమాని పాడ్కాస్ట్లో తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించింది. పదేళ్లుగా మథియస్ బోతో తాను రిలేషన్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడిక ప్రేమను పెళ్లిపీటలు ఎక్కించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాప్సి మాత్రం వీటిని ఖండించడం గమనార్హం. ఏదేమైనా మథియస్ పేరు నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరీ మథియస్ బో? జూలై 11, 1980లో డెన్మార్క్లో జన్మించాడు మథియస్ బో. 1998లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ వన్ స్థాయికి చేరుకున్నాడు. యూరోపియన్ చాంపియన్షిప్స్-2006లో పురుషుల డబుల్స్ విభాగంలో రజతం గెలిచిన మథియస్ బో.. 2010లో డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లునెగ్గాడు. 2011లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లోనూ చాంపియన్గా అవతరించాడు. ఒలింపిక్ మెడల్ విన్నర్ ఈ ఆ తర్వాత సహచర ఆటగాడు కార్స్టన్ మొగెన్సన్తో కలిసి మెన్స్ డబుల్స్ విభాగంలో 2012 లండన్ ఒలింపిక్స్లో రజత పతకం గెలిచాడు. చైనాలోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ.. 2013 వరల్డ్ చాంపియన్షిప్స్లోనూ సిల్వర్ మెడల్ అందుకుంది ఈ జోడీ. ఇక 2015లో యూరోపియన్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన మథియస్ బో.. 2012, 2017లో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ విజేతగానూ నిలిచాడు. భారత బ్యాడ్మింటన్ మెన్స్ జట్టు కోచ్గా.. దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయవంతమైన ఆటగాడిగా కొనసాగిన మథియస్ బో.. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి అభ్యర్థన మేరకు కోచ్గా అవతారమెత్తాడు. మనోళ్లను నంబర్ వన్గా నిలిపి 2021 నుంచి చిరాగ్ శెట్టి- ఆంధ్రప్రదేశ్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి సహా భారత బ్యాడ్మింటన్ డబుల్స్ టీమ్కు మార్గదర్శనం చేస్తున్నాడు మథియస్ బో. చిరాగ్- సాత్విక్ వరల్డ్ నంబర్ వన్ జోడీగా ఎదగడంలో కీలక పాత్ర పోషించాడు. తమ విజయాలకు మథియస్కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని ఈ ఇద్దరు ప్లేయర్లు ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా! ఇక ప్రస్తుతం మథియస్ బో చిరాగ్- సాత్విక్ను 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. సేవలోనూ ముందే.. తన ప్రేయసి తాప్సితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మథియస్కు అలవాటు. ఇటీవలే వీరిద్దరు నన్హీ కాలి ప్రాజెక్టులో భాగమై.. బాలికా విద్య ఆవశ్యకతను చాటిచెప్పే బాధ్యత తీసుకున్నారు. -
ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీకి సాత్విక్ జోడీ దూరం
-
ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీకి సాత్విక్ జోడీ దూరం
జకార్తాలో నేటి నుంచి జరిగే ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ వైదొలిగింది. ఈ టోర్నీలో సాత్విక్ –చిరాగ్లకు టాప్ సీడింగ్ దక్కింది. ఈ నెలలో ఆడిన రెండు టోర్నీల్లోనూ (మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్) సాత్విక్ –చిరాగ్ జంట రన్నరప్గా నిలిచింది. ఇండోనేసియా ఓపెన్లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు ప్రణయ్, శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ బరిలో ఉన్నారు. -
సాత్విక్ – చిరాగ్ జోడీకి నిరాశ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక టోర్నీలో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్శెట్టిలకు చుక్కెదురైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ – సూపర్ 750 టోర్నీ ఇండియా ఓపెన్లో భారత జోడి రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన వరల్డ్ చాంపియన్ జంట కాంగ్ మిన్ హ్యూక్ – సియో సంగ్ జె 15–21, 21–11, 21–18 స్కోరుతో సాత్విక్ – చిరాగ్పై విజయం సాధించింది. 65 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్ను సునాయాసంగానే గెలుచుకున్న భారత జోడి ఆ తర్వాత తడబడింది. ముఖాముఖీ పోరులో కొరియా ఆటగాళ్లతో ఈ మ్యాచ్కు ముందు 4–1తో సాతి్వక్–చిరాగ్లదే పైచేయిగా ఉంది. అదే తరహాలో చక్కటి ర్యాలీలతో దూసుకుపోయిన వీరిద్దరు తొలి గేమ్ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్లో 1–5తో ఆరంభంలో వెనుకబడిన మన ఆటగాళ్లు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. ఒక దశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన కొరియా టీమ్ 15–5తో ముందంజలో నిలిచి ఆపై గేమ్ను గెలుచుకుంది. మూడో గేమ్ పోటాపోటీగా సాగింది. గేమ్ తొలి అర్ధభాగాన్ని కొరియా ఆటగాళ్లు 11–6తో ముగించారు. అయితే ఆ తర్వాత భారత ద్వయం కోలుకొని మళ్లీ నిలిచారు. 15–16కు, ఆపై 18–19 వరకు స్కోరు వెళ్లింది. అయితే సాత్విక్ బయటకు కొట్టిన షాట్తో, అనంతరం చిరాగ్ నెట్కు కొట్టిన షాట్తో కొరియా విజయం ఖాయమైంది. తైజుకు మహిళల టైటిల్ వరల్డ్ నంబర్ 3 ప్లేయర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) మహిళల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో నాలుగో సీడ్ తై జు 21–16, 21–12తో రెండో సీడ్ చెన్ యు ఫిపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ టైటిల్ను షి యు కి (చైనా) సొంతం చేసుకున్నాడు. -
ఫైనల్లో సాత్విక్ –చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ఈ సీజన్లో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి వరుసగా రెండో టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతవారం మలేసియా ఓపెన్లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ –చిరాగ్ ద్వయం... తాజాగా ఇండియా ఓపెన్లోనూ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ –చిరాగ్ జంట 21–18, 21–14తో ఆరోన్ చియా–సో వు యిక్ (మలేసియా) జోడీని ఓడించింది. ఆరోన్–సో వు యిక్లతో ఇప్పటి వరకు 11 సార్లు ఆడిన సాత్విక్ –చిరాగ్ మూడోసారి మాత్రమే గెలిచారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణయ్ 15–21, 5–21తో షి యు కీ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
India Open 2024: క్వార్టర్స్లో సాత్విక్ జోడీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–14, 21–15తో చింగ్ యావో లు–పో హాన్ యాంగ్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. భారత్కే చెందిన ప్రియాన్షు రజావత్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 20–22, 21–14, 21–14తో గెలుపొందాడు. -
Malaysia Open 2024: రన్నరప్ సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: కొత్త ఏడాదిని టైటిల్తో ప్రారంభించాలని ఆశించిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంక్లో ఉన్న సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్గా నిలిచింది. ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో ఉన్న లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జంటతో ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–9, 18–21, 17–21తో ఓడిపోయింది. 58 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో నిర్ణాయక మూడో గేమ్లో సాత్విక్–చిరాగ్ 10–3తో ఏకంగా 7 పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. కానీ ఒత్తిడికిలోనై, అనవసర తప్పిదాలు చేసి భారత జంట చైనా జోడీకి పుంజుకునే అవకాశం ఇచి్చంది. రన్నరప్గా నిలిచిన సాత్విక్–చిరాగ్లకు 45,500 డాలర్ల (రూ. 37 లక్షల 71 వేలు) ప్రైజ్మనీతోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఆరు గేమ్ పాయింట్లు కాపాడుకొని...
కౌలాలంపూర్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై మరో టైటిల్ సాధించేందుకు భారత ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి అడుగు దూరంలో నిలిచారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ –1000 టోర్నీ మలేసియా ఓపెన్లో ఈ జోడి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆరు గేమ్ పాయింట్లు కాపాడుకోవడంతో పాటు ఆపై మరో రెండు పాయింట్లు గెలుచుకొని విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ 21–18, 22–20 స్కోరుతో ఆరో సీడ్, కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్ – సియో స్యూంగ్ జాను చిత్తు చేశారు. 47 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ సాగింది. తొలి గేమ్ ఆరంభంలో భారత ఆటగాళ్ల ఆధిక్యం సాగింది. చక్కటి ర్యాలీలతో వీరిద్దరు 9–5తో ముందంజ వేయగా వరుసగా నాలుగు పాయింట్లతో కొరియా ద్వయం స్కోరును సమం చేసింది. అయితే 11–9తో, ఆపై 13–12తో మన జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. వరుస పాయింట్లతో 17–13 వరకు దూసుకెళ్లిన చిరాగ్ – సాత్విక్ దానిని కొనసాగించారు. రెండో గేమ్ మాత్రం హోరాహోరీగా సాగింది. అనంతరం 9–4తో...11–6తో ఆధిక్యం చూపించిన కొరియా ఆటగాళ్లు ఒక దశలో 17–11తో గేమ్పై పట్టు బిగించారు. ఈ సమయంలో భారత్ కోలుకునే ప్రయత్నం చేసినా 20–14తో గేమ్ గెలిచే స్థితికి కొరియా చేరింది. అయితే ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ఒకటి కాదు రెండు కాదు...వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించిన సాత్విక్ – చిరాగ్ సంచలనం సృష్టించారు. నేడు జరిగే ఫైనల్లో చైనాకు చెందిన టాప్ సీడ్ జంట లియాంగ్ వి కెంగ్ – వాంగ్ చాంగ్తో సాత్విక్ – చిరాగ్ తలపడతారు. గతంలో ఈ రెండు జోడీల మధ్య 4 మ్యాచ్ల జరగ్గా...భారత ద్వయం 1 మ్యాచ్లో గెలిచి 3 మ్యాచ్లలో ఓడింది. -
సాత్విక్–చిరాగ్ జోరు
కౌలాలంపూర్: గత ఏడాది అద్భుతమైన ఫలితాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కొత్త సీజన్లో కూడా తమ జోరు కొనసాగిస్తోంది. ప్రతిష్టాత్మక మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్లో ఉన్న సాత్విక్–చిరాగ్ 21–11, 21–8తో ప్రపంచ 32వ ర్యాంక్లో ఉన్న హి జి టింగ్–రెన్ జియాంగ్ యు (చైనా)లపై విజయం సాధించారు. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించారు. తొలి గేమ్లో వరుసగా ఏడు పాయింట్లు గెలిచిన సాత్విక్–చిరాగ్ అదే ఊపులో గేమ్ను దక్కించుకున్నారు. రెండో గేమ్లోనూ భారత జంట దూకుడు కొనసాగించింది. స్కోరు 7–3 వద్ద సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 14–3తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ జంట కాంగ్ మిన్ హైక్–సియో సెయుంగ్ జే (దక్షిణ కొరియా)తో సాత్విక్–చిరాగ్ జంట తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సాత్విక్–చిరాగ్ 3–1తో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో అశి్వని–తనీషా జంట 15–21, 13–21తో రిన్ ఇవనాగ–కీ నకనిషి (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. అశ్విని–తనీషా జోడీకి 8,125 డాలర్ల (రూ. 6 లక్షల 73 వేలు) ప్రైజ్మనీతోపాటు 6,600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సాత్విక్ –చిరాగ్ ద్వయం 21–18, 21–19తో మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రి–మౌలానా బాగస్ (ఇండోనేసియా) జంట పై గెలిచింది. పురుషుల సింగిల్స్లో భారత్కు నిరాశ ఎదురైంది. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 14–21, 11–21తో ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్) చేతిలో... లక్ష్య సేన్ 15–21, 16–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. -
‘ఖేల్ రత్నా’లు సాత్విక్, చిరాగ్
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్చంద్ ఖేల్ రత్న’ లభించింది. 2023 సంవత్సరానికిగాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే ‘అర్జున’ అవార్డు 26 మందిని వరించింది. ఉత్తమ కోచ్లకు అందించే ‘ద్రోణాచార్య’ అవార్డును రెగ్యులర్ విభాగంలో ఐదుగురికి... లైఫ్టైమ్ విభాగంలో ముగ్గురికి ప్రకటించారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి క్రీడా పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ‘ఖేల్ రత్న’ అందుకోనుండగా... ఆంధ్రప్రదేశ్కే చెందిన అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్) ‘అర్జున’ పురస్కారం పొందాడు. తెలంగాణకు చెందిన బాక్సర్ హుసాముద్దీన్, మహిళా షూటర్ ఇషా సింగ్లకు కూడా ‘అర్జున’ అవార్డు దక్కింది. జనవరి 9న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలు అందజేస్తారు. ♦ ‘ఖేల్ రత్న’ అవార్డీలకు మెడల్, ప్రశంస పత్రంతోపాటు రూ. 25 లక్షలు... ‘అర్జున’ విజేతలకు రూ. 15 లక్షలు... ‘ద్రోణాచార్య’ అవార్డీలకు రూ. 15 లక్షలు... ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డీలకు రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారం లభిస్తుంది. ♦గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన 33 ఏళ్ల అజయ్ 2010 నుంచి భారత అంధుల క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2016లో టీమిండియాకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అజయ్ సారథ్యంలోనే భారత్ 2017 టి20 వరల్డ్ కప్, 2018 వన్డే వరల్డ్కప్, 2022 టి20 వరల్డ్కప్ టైటిల్స్ గెలిచింది. ♦ నిజామాబాద్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల హుసాముద్దీన్ ఈ ఏడాది తాషె్కంట్లో జరిగిన ప్రపంచ చాంపియన్షి ప్లో కాంస్య పతకం గెలిచాడు. ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా విధులు నిర్వ హిస్తున్న హుసాముద్దీన్ 2022 ఆసియా చాంపియన్షి ప్లో... 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకాలు నెగ్గాడు. ♦ హైదరాబాద్కు చెందిన 18 ఏళ్ల పిస్టల్ షూటర్ ఇషా సింగ్ ఈ ఏడాది అజర్బైజాన్లో జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్షి ప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో, 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు గెలిచింది. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఒక స్వర్ణం, మూడు రజత పతకాలు నెగ్గింది. గత ఏడాది జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది. నిలకడగా... మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ సాయిరాజ్ గత ఐదేళ్లలో పలు అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది మొత్తం సాత్విక్–చిరాగ్ జోడీ సూపర్ ఫామ్లో ఉంది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్షి ప్లో... చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ ఈ జంట స్వర్ణ పతకాలు సాధించింది. స్విస్ ఓపెన్ సూపర్–300, ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000, కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీల్లోనూ విజేతగా నిలిచింది. చైనా మాస్టర్స్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో రన్నరప్ ట్రోఫీ దక్కించుకుంది. దాంతోపాటు డబుల్స్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. ఇక 2022లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్ కప్ టోర్నీలో తొలిసారి భారత్ విజేతగా నిలువడంలో సాత్విక్–చిరాగ్ శెట్టి కీలకపాత్ర పోషించారు. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో సాత్విక్–చిరాగ్ ద్వయం పసిడి పతకాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఇండియా ఓపెన్ సూపర్–500, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీల్లోనూ టైటిల్స్ కైవసం చేసుకుంది. 2018లో హైదరాబాద్ ఓపెన్, 2019లో థాయ్లాండ్ ఓపెన్ టోర్నీల్లోనూ సాత్విక్–చిరాగ్ జంట విజేతగా నిలిచింది. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో భారత జట్టుకు మిక్స్డ్ టీమ్లో స్వర్ణం రావడానికి సాత్విక్–చిరాగ్ ముఖ్యపాత్ర పోషించారు. అవార్డు గ్రహీతలు... ‘ఖేల్ రత్న’ (2): సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్). అర్జున అవార్డీలు (26): ఒజస్ ప్రవీణ్ దేవ్తలే, అదితి స్వామి (ఆర్చరీ), శ్రీశంకర్, పారుల్ చౌధరీ (అథ్లెటిక్స్), హుసాముద్దీన్ (బాక్సింగ్), వైశాలి (చెస్), షమీ (క్రికెట్), అనూష్ అగర్వల్లా, దివ్యాకృతి సింగ్ ( ఈక్విస్ట్రి యన్), దీక్షా డాగర్ (గోల్ఫ్), క్రిషన్ బహదూర్ పాఠక్, సుశీలా చాను (హాకీ), పవన్ కుమార్, రీతూ నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో–ఖో), పింకీ (లాన్ బాల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, ఇషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ (స్క్వాష్), అహిక ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్, అంతిమ్ పంఘాల్ (రెజ్లింగ్), రోషిబీనా (వుషు), అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్), ప్రాచీ యాదవ్ (పారా కనోయింగ్). ద్రోణాచార్య అవార్డీలు (రెగ్యులర్ కేటగిరీ–5): లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్బీ రమేశ్ (చెస్), మహావీర్ ప్రసాద్ (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేశ్ ప్రభాకర్ (మల్లఖంబ్). ద్రోణాచర్య అవార్డీలు (లైఫ్టైమ్–3): జస్కీరత్ సింగ్ గ్రెవాల్ (గోల్ఫ్), భాస్కరన్ (కబడ్డీ), జయంత కుమార్ (టేబుల్ టెన్నిస్). ధ్యాన్చంద్ అవార్డీలు (లైఫ్టైమ్ అచీవ్మెంట్–3): మంజూషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ శర్మ (హాకీ), కవితా సెల్వరాజ్ (కబడ్డీ). మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (అత్యుత్తమ యూనివర్సిటీలు–3): 1. గురునానక్ దేవ్ యూనివర్సిటీ (అమృత్సర్), 2. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (పంజాబ్), 3. కురుక్షేత్ర యూనివర్సిటీ (కురుక్షేత్ర, హరియాణా). -
షమీకి అర్జున.. చిరాగ్, సాత్విక్లకు ఖేల్రత్న అవార్డులు
జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ ఏడాది వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు, బ్యాడ్మింటన్లో అత్యుత్తమంగా రాణించిన ఇద్దరికి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డులు దక్కాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్లో అత్యుత్తమంగా రాణించిన మొహమ్మద్ షమీని అర్జున అవార్డు వరించగా.. చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్లకు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డులు దక్కాయి. అర్జున, ఖేల్రత్న అవార్డులతో పాటు కేంద్రం ద్రోణాచార్య (రెగ్యులర్, లైఫ్టైమ్), ధ్యాన్చంద్ (లైఫ్టైమ్ అఛీవ్మెంట్) అవార్డులను కూడా ప్రకటించింది. అవార్డు పొందిన వారందరూ వచ్చే ఏడాది (2024) జనవరి 9న భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటారు. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డులు 2023: చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి (బ్యాడ్మింటన్) రాంకిరెడ్డి సాత్విక్సాయిరాజ్ (బ్యాడ్మింటన్) అర్జున అవార్డులు 2023: ఓజాస్ ప్రవీణ్ దియోటలే (ఆర్చరీ) అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ) ఎం శ్రీశంకర్ (అథ్లెటిక్స్) పారుల్ చౌదరీ (అథ్లెటిక్స్) మొహమ్మద్ హుస్సాముద్దీన్ (బాక్సింగ్) ఆర్ వైశాలీ (చెస్) మొహమ్మద్ షమీ (క్రికెట్) అనూషా అగర్వల్లా (ఈక్వెస్ట్రియన్) దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్) దీక్షా దాగర్ (గోల్ఫ్) కృషణ్ బహదూర్ పాఠక్ (హాకీ) పుఖ్రంబం సుశీల చాను (హాకీ) పవన్ కుమార్ (కబడ్డీ) రీతు నేగి (కబడ్డీ) నస్రీన్ (ఖోఖో) పింకీ (లాన్ బౌల్స్) ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్) ఈషా సింగ్ (షూటింగ్) హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్) అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్) సునీల్ కుమార్ (రెజ్లింగ్) అంటిమ్ (రెజ్లింగ్) నౌరెమ్ రోషిబినా దేవి (ఉషు) శీతల్ దేవి (పారా ఆర్చరీ) ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్) ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్) ద్రోణాచార్య అవార్డులు 2023 (రెగ్యులర్): లలిత్ కుమార్ (రెజ్లింగ్) ఆర్ బి రమేష్ (చదరంగం) మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్) శివేంద్ర సింగ్ (హాకీ) గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లఖాంబ్) ద్రోణాచార్య అవార్డులు 2023 (లైఫ్టైమ్): జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్) ఈ భాస్కరన్ (కబడ్డీ) జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్) ధ్యాన్చంద్ అవార్డులు 2023 (లైఫ్టైమ్): మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్) వినీత్ కుమార్ శర్మ (హాకీ) కవిత సెల్వరాజ్ (కబడ్డీ) మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023: గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్సర్ (విజేత) లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ (మొదటి రన్నరప్) కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర (రెండో రన్నరప్) -
ఖేల్ రత్న అవార్డుకు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి నామినేట్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కూడా ప్రతిష్టాత్మక ‘ఖేల్రత్న’ అవార్డు కోసం రేసులో నిలిచారు. మరోవైపు.. భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు అతని పేరును అవార్డు కోసం బీసీసీఐ సిఫారసు చేసింది. ఇటీవలి వన్డే ప్రపంచకప్లో షమీ 24 వికెట్లతో చెలరేగాడు. ముందుగా నామినేట్ చేసిన జాబితాలో షమీ పేరు లేకపోయినా... బీసీసీఐ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో అతని పేరును చేర్చారు. షమీ కాకుండా మరో 16 మంది ఆటగాళ్లు అర్జున అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ఇందులో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్, తమిళనాడు చెస్ ప్లేయర్ వైశాలి తదితరులు ఉన్నారు. -
పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్ (చైనా): ఈ ఏడాది ఆరో టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్గా నిలిచింది. 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 19–21, 21–18, 19–21తో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో ఉన్న లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. విజేతగా నిలిచిన లియాంగ్–వాంగ్ చాంగ్లకు 85,100 డాలర్ల (రూ.70 లక్షల 92 వేలు) ప్రైజ్మనీ, 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సాత్విక్–చిరాగ్లకు 40,250 డాలర్ల (రూ. 33 లక్షల 54 వేలు) ప్రైజ్మనీ, 9350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్లలో టైటిల్స్ సాధించడంతోపాటు ఆసియా చాంపియన్íÙప్లో, హాంగ్జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచింది. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్
షెన్జెన్: భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ మరో టైటిల్కు కేవలం అడుగు దూరంలో ఉంది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ భారత ద్వయం టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–15, 22–20తో హి జి తింగ్– రెన్ జియాంగ్ యు (చైనా) జోడీపై విజయం సాధించింది. 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ నుంచే రెండు జోడీలు చెమటోడ్చాయి. ప్రతి పాయింట్కు భారత జంట సమన్వయంతో శ్రమించింది. రెండో సెట్లో చైనా ఆటగాళ్లు దూకుడుగా ఆడటంతో హోరాహోరీ పోరు జరిగింది. స్కోరు 20–20 వద్ద సమంకాగా సాత్విక్–చిరాగ్ జోడీ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్తో పాటు మ్యాచ్ను గెలిచింది. -
China Masters: సెమీస్లో సాత్విక్–చిరాగ్..
షెన్జెన్: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి–చిరాగ్ శెట్టి జోడీ ఈ ఏడాది మరో టైటిల్పై కన్నేసింది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్సీడ్ భారత ద్వయం సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే సింగిల్స్లో హెచ్.ఎస్.ప్రణయ్కి క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–16, 21–14తో ఇండోనేసియాకు చెందిన లియో రాలీ కార్నడో–డానియెల్ మారి్టన్ జంటపై అలవోక విజయం సాధించింది. ప్రపంచ ఐదో ర్యాంకు జోడీ అయిన సాత్విక్–చిరాగ్ వరుస గేముల్లో 46 నిమిషాల్లో మ్యాచ్ను ముగించింది. తొలి గేమ్లో 14–14 స్కోరు దాకా ఇండోనేసియన్ జోడీ నుంచి కొంతవరకు పోటీ ఎదురైనా... ఆ తర్వాత భారత షట్లర్ల ధాటికి ప్రత్యర్థి జంట చతికిలబడింది. తర్వాత రెండో గేమ్ను సాత్విక్–చిరాగ్లు రెట్టించిన ఉత్సాహంతో మొదలుపెట్టారు. 5–2తో ఆధిక్యంలోకి వెళ్లారు. నెట్వద్ద పొరపాట్లతో కొన్ని పాయింట్లు కోల్పోయినప్పటికీ వెంటనే పుంజుకొని ఆడటంతో మళ్లీ ఆధిక్యం 11–6కు పెరిగింది. ఇండోనేసియన్ షట్లర్లు ఆ తర్వాత కోలుకోలేదు. 17–10తో గేమ్ను చేతుల్లోకి తెచ్చుకున్న భారత అగ్రశ్రేణి జంట నిమిషాల వ్యవధిలోనే 21–14తో మ్యాచ్ను మగించేశారు. ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న భారత జంట ఇండోనేసియా సూపర్–1000, కొరియా సూపర్–500, స్విస్ సూపర్–300 టైటిళ్లను సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనాకు చెందిన జి తింగ్–రెన్ జియాంగ్ యు జంటతో సాత్విక్–చిరాగ్ జోడీ తలపడుతుంది. పురుషుల సింగిల్స్ ప్రపంచ 8వ ర్యాంకర్ ప్రణయ్కి క్వార్టర్స్లో ఏదీ కలిసిరాలేదు. 31 ఏళ్ల భారత షట్లర్ 9–21, 14–21తో జపాన్ ఆటగాడు, మూడో సీడ్ కొడయ్ నరవొక చేతిలో సులు వుగానే ఓడిపోయాడు. తొలిగేమ్లో నరవొకకు 9–8తో పోటీ ఇచ్చిన భారత ఆటగాడు తర్వాత వరుసగా అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ చాంపియన్షిప్ రన్నరప్ నరవొక తొలిగేమ్లో తన రాకెట్ను నెట్పై పరిధి దాటిరావడంతో చైర్ అంపైర్ అతని పాయింట్ను తిరస్కరించాడు. అయితే ప్రణయ్ అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టలేక పదేపదే పొరపాట్లు చేసి మ్యాచ్ను అప్పగించాడు. -
బీడబ్ల్యూఎఫ్ వార్షిక అవార్డు రేసులో సాత్విక్–చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వార్షిక అవార్డు రేసులో నిలిచారు. 2023 సంవత్సరానికిగాను సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిని ‘పెయిర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం కోసం బీడబ్ల్యూఎఫ్ నామినేట్ చేసింది. భారత ద్వయంతోపాటు చెన్ కింగ్ చెన్–జియా ఇ ఫాన్ (చైనా), జెంగ్ సి వె–హువాంగ్ యా కియాంగ్ (చైనా), సియో సెంగ్ జే–చె యు జంగ్ (దక్షిణ కొరియా) జోడీలు కూడా ఈ అవార్డు కోసం బరిలో ఉన్నాయి. డిసెంబర్ 11న అవార్డు విజేతను ప్రకటిస్తారు. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ ద్వయం అంచనాలకు మించి రాణించి అద్భుత విజయాలు సాధించింది. ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఇండోనేసియా సూపర్–1000 టోర్నీలో, కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీలో, స్విస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో డబుల్స్ టైటిల్స్ గెలిచింది. -
తొలి రౌండ్లోనే సాత్విక్–చిరాగ్ జోడీకి చుక్కెదురు
కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–16, 18–21, 16–21తో ప్రపంచ 21వ ర్యాంక్ జంట లూ చింగ్ యావో–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాత్విక్, చిరాగ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకున్నారు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో మూడో సీడ్ కొడాయ్ నరోకా (జపాన్)తో లక్ష్య సేన్; లీ చెయుక్ యి (హాంకాంగ్)తో హెచ్ఎస్ ప్రణయ్; లిన్ చున్యి (చైనీస్ తైపీ)తో ప్రియాన్షు రజావత్ తలపడతారు. -
అమలాపురంలో ఆఖరి బెంచీలో కూర్చునే అబ్బాయి.. ఆటలో సత్తా చాటినవాడే మొనగాడు!
ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ను చూస్తూ పెరిగాడు. ముందుగా తండ్రి ఆట అతడిని ఆకట్టుకుంది. ఆపై సోదరుడి ఆట తనలో మరింత స్ఫూర్తిని పెంచింది. ఏదో సరదా కోసం ఆడుతున్నామని గానీ లేదంటే మరో క్రీడ గురించి గానీ అతని మనసులో ఏనాడూ కనీసం ఆలోచన కూడా రాలేదు. బ్యాడ్మింటన్ తనను ప్రత్యేకంగా పిలిచినట్లే అతను భావించాడు. అందుకే ఓనమాలు నేర్చుకున్ననాటి నుంచి అదే లోకంగా బతికాడు. కఠోర సాధన కారణంగా ఆటలో పదును పెరగడమే కాదు అన్ని రకాల అండ కూడా లభించింది. దాంతో అద్భుతమైన ఆటతో దూసుకుపోయాడు. వరుస విజయాలు, టైటిల్స్ తన ఖాతాలో వేసుకోవడమే కాదు, ఇప్పుడు వరల్డ్ నంబర్వన్గా భారత బ్యాడ్మింటన్ డబుల్స్లో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. ఆ కుర్రాడే రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్. సహచరుడు చిరాగ్ శెట్టితో కలసి వరల్డ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని అందుకున్న సాత్విక్ 23 ఏళ్ల వయసులోనే తన సంచలన ప్రదర్శనతో ప్రపంచ ఖ్యాతినార్జించాడు. చాలా మంది కోచ్లు చెప్పే మాటే ‘కొద్ది రోజుల్లోనే మీ అబ్బాయి భారత్ తరఫున ఆడతాడు’... మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్లో అడుగుపెట్టి అడ్మిషన్ కోసం అకాడమీకి వెళ్లినప్పుడు సాత్విక్ తండ్రి విశ్వనాథ్తో అక్కడి కోచ్ చెప్పిన మాట. అయితే సహజంగానే ఒక టీనేజర్ను నిరాశపరచకుండా ఉత్సాహం పెంచేందుకు చాలా మంది కోచ్లు చెప్పే మాటే అది. కాబట్టి దానిని వర్ధమాన ఆటగాళ్లకు సంబంధించి భవిష్యవాణిగా భావించనవసరం లేదు. సాత్విక్ తండ్రి కూడా అలాగే అనుకున్నారు. కోచ్ మాటలకు ఉప్పొంగిపోకుండా ఆటలో.. తమ అబ్బాయి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదగాలని కోరుకున్నారు. కానీ సాత్విక్ వారందరి అంచనాలకు మించి రాణించాడు. ఊహించిన దానికంటే వేగంగా దూసుకుపోయి కొద్ది రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరాగ్ శెట్టితో జత కలసిన తర్వాత అయితే అతని ఖాతాలో అన్నీ ఘనతలే వచ్చి చేరాయి. సరిగ్గా చెప్పాలంటే వీరిద్దరూ ఎక్కడ విజయం సాధించినా అది భారత్ తరఫున కొత్త రికార్డుగా, ‘తొలి విజయం’గా నమోదవుతూ వచ్చింది. ఇంత తక్కువ వ్యవధిలో ప్రపంచ బ్యాడ్మింటన్లో తమదైన ముద్ర వేసి ప్రత్యర్థులకు సవాల్ విసరడం ఈ జోడీకే చెల్లింది. అండర్–13 నుంచే.. అమలాపురానికి చెందిన సాత్విక్ తండ్రి.. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. తల్లి రంగమణి కూడా ఉపాధ్యాయినే. వారిద్దరి ప్రోత్సాహం కారణంగా క్రీడల్లోకి రావడం సాత్విక్కి ఏం ఇబ్బంది కాలేదు. తండ్రి ఏపీ బ్యాడ్మింటన్ సంఘం పరిపాలనా వ్యవహారాల్లో కూడా పని చేస్తుండటంతో సరైన మార్గనిర్దేశనమూ లభించింది. అయితే నేపథ్యం ఎలా ఉన్నా ఆటలో సత్తా చాటినవాడే మొనగాడు. బేసిక్స్ నేర్చుకున్న తర్వాత సాత్విక్ వరుసగా స్థానిక, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాడు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లోనూ అతనికి వరుసగా విజయాలు దక్కాయి. దాంతో తర్వాతి దశకు చేరడంపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. స్వస్థలంలో ఉంటే అది సాధ్యం కాదని, అత్యుత్తమ శిక్షణ అవసరమని సాత్విక్ తల్లిదండ్రులు గుర్తించారు. ఆ ప్రయత్నంలోనే వారి ప్రయాణం పుల్లెల గోపీచంద్ అకాడమీ వరకు సాగింది. అదే సాత్విక్ కెరీర్లో కీలక మలుపుగా మారింది. పదునెక్కిన ఆట.. సాత్విక్ కెరీర్కు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయం పూర్తిగా డబుల్స్పైనే దృష్టి పెట్టడం. సాధారణంగా కొత్త ఆటగాళ్లు ఎవరైనా సింగిల్స్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారు. గెలిచినా, ఓడినా అదే ఈవెంట్లో పోరాడటం కనిపిస్తుంది. కానీ సాత్విక్ కెరీర్లో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారత ఆటగాళ్లలో సింగిల్స్లో తీవ్రమైన పోటీ ఉంది. అలాంటి సమయంలో మళ్లీ సింగిల్స్లో ప్రయత్నించడం కంటే డబుల్స్ వైపు మళ్లడమే సరైందని అతను భావించాడు. చివరకు అదే అతడిని అగ్రస్థానానికి చేర్చింది. ఇండియా ఇంటర్నేషనల్ జూనియర్లో జి.కృష్ణప్రసాద్తో కలసి వరుసగా రెండేళ్లు రన్నరప్, విన్నర్గా నిలిచిన సాత్విక్ సీనియర్ స్థాయికి వచ్చేసరికి భాగస్వామిని మార్చాల్సి వచ్చింది. ఇష్టం లేకపోయినా వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా టీమ్ అవసరాల కోసం అది తప్పలేదు. పురుషుల డబుల్స్లో భారత్ నుంచి ఒక అత్యుత్తమ జోడీని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్న గోపీచంద్ కోచింగ్ బృందానికి సాత్విక్ రూపంలో సరైన ఆటగాడు లభించాడు. అతనికి మరో మెరుపులాంటి చిరాగ్ శెట్టి తోడైతే ఫలితాలు బాగుంటాయని భావించి కొత్త ద్వయం కోర్ట్లో బాల్ వేశారు. అది అద్భుతమైన ఫలితాలను అందించింది. సాత్విక్–చిరాగ్ జంట ఆరు ఇంటర్నేషనల్ చాలెంజర్ టోర్నీలను గెలిచి తమపై పెట్టుకున్న అంచనాలకు తగిన న్యాయం చేసింది. ఆ తర్వాత చాలెంజర్ దశను దాటి పెద్ద విజయాలు సాధించడమే మిగిలింది. గోల్డ్కోస్ట్తో మొదలు.. సాధారణంగా డబుల్స్ జోడి మ్యాచ్ అంటే ఇద్దరూ దాదాపు సమ ఉజ్జీలుగా ఉండి మంచి సమన్వయంతో ఆడటం కనిపిస్తుంది. డబుల్స్ ఆడినా కూడా ఆ జంటలో ఒక ప్లేయర్ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకోవడం అరుదు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లో సాత్విక్ ప్రదర్శన అందుకు చక్కటి ఉదాహరణ. ఈ టోర్నీ మూడో సీజన్లో హైదరాబాద్ హంటర్స్ టైటిల్ గెలవడంతో సాత్విక్ కూడా కీలక పాత్ర పోషించాడు. డబుల్స్ మ్యాచ్లలో తనదైన ప్రభావం చూపించడంతో అతని ఆట ఏమిటో బ్యాడ్మింటన్ ప్రపంచానికి బాగా తెలిసింది. ఆ తర్వాతే అందరి దృష్టి సాత్విక్పై పడింది. అయితే 2018.. అతని కెరీర్కు కావాల్సిన ఊపునిచ్చింది. సొంతగడ్డపై హైదరాబాద్ ఓపెన్ గెలిచి ఈ జంట తమ ఖాతాలో తొలి టైటిల్ వేసుకుంది. అదే ఏడాది అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ కూడా వీరి చెంతకే చేరింది. అనంతరం గోల్డ్కోస్ట్లో జరిగిన కామన్వెల్త్ క్రీడలు వీరి స్థాయిని అమాంతం పెంచేశాయి. ఈ ఈవెంట్లో పురుషుల డబుల్స్లో రజతం నెగ్గిన సాత్విక్–చిరాగ్ జోడి స్వర్ణం సాధించిన మిక్స్డ్ టీమ్లో కూడా భాగంగా ఉంది. ఆ తర్వాత నుంచి ఈ ద్వయం వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అన్నీ ఘనతలే.. ఐదేళ్ల క్రితం జరిగిన కామన్వెల్త్ క్రీడల తర్వాత సాత్విక్–చిరాగ్ల విజయ ప్రస్థానం జోరుగా సాగిపోయింది. గతంలో పురుషుల డబుల్స్లో భారత ఆటగాళ్లు ఎవరికీ సాధ్యం కాని ఘనతలన్నీ వీరు అందుకుంటూ పోయారు. ఎక్కడ గెలిచినా అది మన దేశం తరఫున తొలి ఘనతగానే నమోదైంది. సూపర్ 500, సూపర్ 750, సూపర్ 1000.. ఇలా ప్రతిసారీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకుంటూ పోయారు. థాయిలాండ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్.. బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్లో సాత్విక్ అత్యుత్తమ విజయాలు నమోదయ్యాయి. 2022లో జరిగిన బర్మింగ్హమ్ కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణం, తాజాగా ఆసియా క్రీడల్లో స్వర్ణం వారి స్థాయిని తెలియజేశాయి. గత ఏడాది వరల్డ్ చాంపియన్ షిప్లో కాంస్యం దక్కడం కూడా సాత్విక్–చిరాగ్ అద్భుతమైన విజయాల్లో ఒకటి కాగా, ఇప్పుడు వరల్డ్ నంబర్వన్ కిరీటం కూడా వచ్చి చేరింది. ఇక మిగిలింది ఒలింపిక్స్లో స్వర్ణమే. వచ్చే ఏడాది అదీ సాధిస్తే 24 ఏళ్ల వయసులోనే సాత్విక్ కెరీర్ పరిపూర్ణం కావడం ఖాయం. కొడితే కొట్టాలిరా.. సాత్విక్ స్వయంగా చెప్పుకున్నట్లు అమలాపురంలో ఆఖరి బెంచీలో కూర్చునే అబ్బాయి ఇప్పుడు ప్రధానమంత్రి పక్కన కూర్చోవడం చాలా పెద్ద ఘనత. అదేమీ ఒక్కరోజులో సాధ్యం కాలేదు. దాని వెనుక ప్రతిభతో పాటు కఠోర శ్రమ, సంకల్పం, పట్టుదల ఉన్నాయి. సాధనలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా సుదీర్ఘ సమయం పాటు పడిన కష్టం ఉంది. సాత్విక్ ఫిట్నెస్ లెవెల్స్ అద్భుతం. అతని ఆట శైలిలో స్మాష్ ఒక ప్రధాన ఆయుధం. ఎగిరి స్మాష్ కొడితే ఎంతటి ప్రత్యర్థి అయినా రిటర్న్ చేయలేక తలవంచాల్సిందే. ఇదే స్మాష్తో అతను ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పడం విశేషం. యోనెక్స్ ఫ్యాక్టరీలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలో అతను కొట్టిన స్మాష్ గంటకు 565 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించడం విశేషం. ఇది గిన్నిస్ బుక్ రికార్డుగా నమోదైంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్స్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీకి ప్రిక్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో వైదొలిగింది. డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 23–25, 21–19, 19–21తో మొహమ్మద్ అహసాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సుపనిద కటెథోంగ్ (థాయ్లాండ్)తో జరిగిన మ్యాచ్లో సింధు తొలి గేమ్ను 21–18తో సొంతం చేసుకుంది. రెండో గేమ్లో స్కోరు 1–1 వద్ద సింధు మోకాలికి గాయం కావడంతో ఆమె మ్యాచ్ నుంచి వైదొలిగింది. -
‘ఆడుదాం ఆంధ్రా’.. క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరం: సాత్విక్ సాయిరాజ్
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, హెచ్ఎస్ ప్రణయ్లను భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభినందించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్లేయర్స్తో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సాత్విక్ సాయిరాజ్ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏషియన్ గేమ్స్లో మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు బాగుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ కార్యక్రమం క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సాత్విక్ పేర్కొన్నారు. ఇక.. సాత్విక్ సాయిరాజ్ తల్లితండ్రులు కాశి విశ్వనాథ్, రంగమణి సైతం తమ కుమారుడి ఘనత పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సాత్విక్ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కాగా చైనాలో జరిగిన 19వ ఆసియా క్రీడల సందర్భంగా.. అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టితో కలిసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో భారత్ ‘పసిడి’ కల నెరవేరుస్తూ... పురుషుల డబుల్స్ విభాగంలో ఈ జోడీ స్వర్ణం సాధించింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్కు తొలిసారి గోల్డ్ మెడల్ అందించి సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. హోంగ్జూలో జరిగిన ఫైనల్లో 21–18, 21–16తో చోయ్ సోల్గు–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంటను ఓడించి ఈ మేరకు చాంపియన్గా అవతరించింది సాత్విక్- చిరాగ్ జోడీ. అంతేగాక ఈ అద్భుత విజయంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) డబుల్స్ ర్యాంకింగ్స్లో తొలిసారి సాత్విక్–చిరాగ్ జంట నంబర్వన్ ర్యాంక్ను అందుకోవడం విశేషం. చదవండి: ‘ఆడుదాం ఆంధ్ర’కు సన్నద్ధం -
‘ఒలింపిక్ సవాల్కు సిద్ధం’
సాక్షి, హైదరాబాద్: ‘మేం వరుస విజయాలు సాధిస్తున్నా చాలా మంది ప్రత్యర్థులు కొంత కాలం వరకు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మా ఆటపై అందరి దృష్టీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇకపై మా ఆటను విశ్లేషించి మాపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు’... భారత డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్, వరల్డ్ నంబర్వన్ సాత్విక్ సాయిరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్లో స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. టీమ్ ఈవెంట్లో కూడా భారత పురుషుల జట్టు రజతం సాధించగా... పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ కాంస్యం గెలిచాడు. ఈ నేపథ్యంలో బుధవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో ఆటగాళ్లతో పాటు చీఫ్ కోచ్ గోపీచంద్ పాల్గొన్నారు. వాళ్లని పడగొట్టగలిగాం... గత ప్రపంచ చాంపియన్షిప్లో పతకం సాధించకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందామని, ఆ తర్వాత మరింత పట్టుదలగా సాధన చేసి ఆసియా క్రీడలకు వెళ్లినట్లు సాత్విక్ వెల్లడించాడు. చాలా కాలంగా తమకు కొరకరాని కొయ్యగా ఉన్న మలేసియా జోడీ సొ వుయి యిక్–ఆరోన్ చియాలను ఆసియా క్రీడల సెమీఫైనల్లో ఓడించడం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని అతను అన్నాడు. వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ కోసం తాము అన్ని విధాలా సిద్ధమవుతామన్న సాత్విక్... అన్నింటికంటే ఫిట్నెస్ కీలకమని వ్యాఖ్యానించాడు. ‘ఇప్పుడు మాకు ప్రత్యేకంగా ప్రత్యర్థులు ఎవరూ లేరు. మా శరీరమే మాకు ప్రత్యర్థి. రాబోయే రోజుల్లో గాయాలు లేకుండా పూర్తి ఫిట్గా ఉంటే చాలు. కోర్టులో ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్కు ముందు కొన్ని టోరీ్నలలో మేం ఓడినా పర్వాలేదు. అన్నింటిలోనూ గెలిస్తే అసలు సమయానికి సమస్య రావచ్చేమో’ అని సాత్విక్ అన్నాడు. ఇలాంటి అవకాశం రాదని... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తీవ్ర గాయంతో బాధపడుతూనే ప్రణయ్ పతకం కోసం పోరాడాడు. చివరకు అతను విజయం సాధించినప్పుడు కోచ్ గోపీచంద్ సహా సహచరులంతా భావోద్వేగానికి గురయ్యారు. అయితే గాయం ఉన్నా ఆడేందుకు సిద్ధం కావడం అందరం కలిసి తీసుకున్న నిర్ణయమని ప్రణయ్ చెప్పాడు. ‘నా శరీరం ఎంత వరకు సహకరించగలదో ఫిజియో కొన్ని సూచనలు ఇచ్చారు. దాని ప్రకారమే కోచ్ గోపీ సర్తో పాటు అందరితో చర్చించాక నేను ఆడేందుకు సిద్ధమయ్యా. నొప్పి ఉన్నా సరే పట్టుదలగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఆసియా క్రీడల్లో పతకం విలువేంటో తెలుసు. గతంలో ఎన్నోసార్లు గాయాలతో బాధపడి కీలక సమయాల్లో అవకాశం కోల్పోయా. ఈ జీవితకాలపు అవకాశాన్ని పోగొట్టుకోరాదని భావించా. అయితే గాయం తీవ్రత వల్లే టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఆడలేదు’ అని ప్రణయ్ చెప్పాడు. నిజానికి తమ స్వర్ణంకంటే ప్రణయ్ కాంస్యం గెలుచుకోవడం తమకు ఎక్కువ ఆనందాన్నిచ్చిందని సాత్విక్ అన్నాడు. అతను పతకం కోసం ఎంత కష్టపడ్డాడో, కీలక సమయాల్లో వెనుకబడి పుంజుకునేందుకు ఎంత పోరాడాడో తమకు తెలుసు కాబట్టి అతను పతకం సాధించాని జట్టంతా కోరుకుందని సాత్విక్ వెల్లడించాడు. ‘వారి వల్లే ఈ ఉత్సాహమంతా’ గోపీచంద్ భారత కోచ్గా మారి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక చాలనుకొని తప్పుకోవాలని చాలా సార్లు భావించానని, అయితే యువ ఆటగాళ్ల విజయాలు తనకు ప్రేరణ అందిస్తున్నాయని గోపీచంద్ చెప్పారు. సింగిల్స్, టీమ్ ఈవెంట్లలో పతకాలు రావడం ఎంతో ఆనందం కలిగించిందని గోపీచంద్ అన్నారు. ‘నా దృష్టిలో ఆసియా క్రీడల మెడల్ అంటే ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్ పతకాలతో సమానం. అందుకే ఈ ఆనందమంతా. జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. శ్రీకాంత్, లక్ష్య సేన్లకు ప్రత్యేక అభినందనలు. ఇక ప్రణయ్ పతకం కోసం ప్రార్థించినంతగా నేను ఎప్పుడూ ప్రార్థించలేదు. ఈ ఒక్కసారి అతడిని గెలిపించమని దేవుడిని కోరుకున్నా. ఒలింపిక్స్కు ఇంకా సమయముంది. అయితే దానికి తగిన విధంగా సిద్ధమవుతాం’ అని గోపీచంద్ అన్నారు. అధికారికంగా ఇప్పుడు సాత్విక్–చిరాగ్ నంబర్వన్ ర్యాంక్ అందుకున్నా... గత ఏడాది కాలంగా వారి ఆటను చూస్తే అప్పటి నుంచే వారిని తాను నంబర్వన్గా భావించినట్లు ఆయన వెల్లడించారు. -
ప్రపంచ నంబర్వన్ జోడీగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో పురుషుల డబుల్స్లో నంబర్వన్ ర్యాంక్కు చేరుకున్న తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. మంగళవారం విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో సాత్వి క్–చిరాగ్ ద్వయం 92,411 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. గతవారం హాంగ్జౌలో ముగిసిన ఆసియా క్రీడల్లోసాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ స్వర్ణ పతకం సాధించింది. దాంతో ఈ జంట ఒక స్థానం పురోగతి సాధించి రెండు నుంచి టాప్ ర్యాంక్కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ ఈ సీజన్లో స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్íÙప్లో, ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్లలో విజేతగా నిలిచారు. గతంలో భారత్ నుంచి పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2018లో), మహిళల సింగిల్స్లో సైనా నెహా్వల్ (2021లో) ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో నిలిచారు. -
Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. బ్యాడ్మింటన్లో తొలి స్వర్ణం
ఏషియన్ గేమ్స్-2023 పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. పతకాలకు సంబంధించి ఇవాళ ఉదయమే సెంచరీ మార్కు తాకిన భారత్ తాజాగా మరో స్వర్ణం సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో భారత జోడీ చిరాగ్ షెట్టి, సాత్విక్ సాయిరాజ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. సౌతా కొరియా జోడీ కిమ్-చోయ్పై 21-18, 21-16 వరుస సెట్లలో విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. FIRST BADMINTON GOLD FOR INDIA🇮🇳🇮🇳😭😭❤️❤️ History has been scripted in Hangzhou as @Shettychirag04 and @satwiksairaj become the first ever badminton players from India to win gold at the #AsianGames 🥇💯 The 'Brothers of Destruction' defeated South Korea's Kim-Choi in the… pic.twitter.com/X87O5owODf — The Bridge (@the_bridge_in) October 7, 2023 #AsianGames2023 #AsianGames #Cheer4India #IndiaAtAG22 #India 🇮🇳 #SatwiksairajRankireddy and #ChiragShetty after their historic #Badminton gold 🥇 FOLLOW LIVE: https://t.co/38IQLKfS9H@WeAreTeamIndia pic.twitter.com/80fk2YpHIX — TOI Sports (@toisports) October 7, 2023 ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. గతంలో భారత్ ఎన్నడూ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ సాధించలేదు. ప్రస్తుత ఏషియన్ గేమ్స్లో భారత్కు ఇది (బ్యాడ్మింటన్లో) మూడో పతకం. పురుషుల టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్, పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ కాంస్య పతకం సాధించారు. బ్యాడ్మింటన్ గోల్డ్తో భారత్ పతకాల సంఖ్య 101కి (26 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు) చేరింది. India creates history at the #AsianGames in winning Gold in the men’s doubles in badminton! Congratulations to @satwiksairaj and @Shettychirag04 for their spectacular performance! Kudos to our very our very own @satwiksairaj for making me, all of Andhra Pradesh and India proud!… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2023 అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏషియన్ గేమ్స్ బ్యాడ్మింటన్లో స్వర్ణ పతకం నెగ్గిన సాత్విక్సాయిరాజ్-చిరగ్ షెట్టి ద్వయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. సాత్విక్సాయిరాజ్ను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. సాత్విక్ నాతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేశాడని కొనియాడాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీ కొత్త చరిత్ర
ఈ ఏడాది తమ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా రికార్డు నెలకొల్పింది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–12తో మాజీ ప్రపంచ చాంపియన్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలిచింది. 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ కళ్లు చెదిరే స్మాష్లతో, చక్కటి డిఫెన్స్తో ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు. నేడు జరిగే ఫైనల్లో చోయ్ సోల్ జియు–కిమ్ వన్ హో (దక్షిణ కొరియా) జంటతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. తాజా ప్రదర్శనతో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ వచ్చే మంగళవారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో తొలిసారి నంబర్వన్ ర్యాంక్కు చేరుకునే అవకాశముంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ ప్రణయ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పూర్తి ఫిట్నెస్తో లేకుండానే సెమీఫైనల్ ఆడిన ప్రణయ్ 16–21, 9–21తో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
41 ఏళ్ల నిరీక్షణకు తెర
ఈ సీజన్లో తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ... 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.... భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఆసియా క్రీడల్లో పతకాలను ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో చివరిసారి బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత్కు పతకాలు లభించాయి. 1982 ఆసియా క్రీడల పురుషుల సింగిల్స్లో దివంగత సయ్యద్ మోడీ... పురుషుల డబుల్స్లో లెరాయ్ ఫ్రాన్సిస్–ప్రదీప్ గాంధె సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెలిచారు. ఆ తర్వాత తొమ్మిదిసార్లు ఆసియా క్రీడలు జరిగినా పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులెవరూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయారు. చైనా గడ్డపై ఎట్టకేలకు ఈ నిరీక్షణకు ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ముగింపు పలికారు. సింగిల్స్లో ప్రణయ్... డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–16, 21–23, 22–20తో లీ జి జియా (మలేసియా)పై గెలుపొందాడు. 78 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో కేరళకు చెందిన 31 ఏళ్ల ప్రణయ్ రెండో గేమ్లోనే గెలవాల్సింది. తొలి గేమ్ను సొంతం చేసుకొని, రెండో గేమ్లో 20–18తో ఆధిక్యంలో నిలిచిన ప్రణయ్ రెండు మ్యాచ్ పాయింట్లను వదులుకున్నాడు. స్కోరును సమం చేసిన లీ జి జియా అదే జోరులో రెండో గేమ్ను నెగ్గి మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్ కూడా నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరకు ప్రణయ్ 18–20తో ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే సంయమనం కోల్పోకుండా ఆడిన ప్రపంచ ఏడో ర్యాంకర్ ప్రణయ్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో ప్రణయ్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 3–0తో లీ షి ఫెంగ్పై ఆధిక్యంలో ఉన్నాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–7, 21–9తో ఎన్జీ జూ జియి–జాన్ ప్రజోగో (సింగపూర్) జంటపై గెలిచి సెమీఫైనల్ చేరింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఆరోన్ చియా–సూ వుయ్ యిక్ (మలేసియా) జంటతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. సింధుకు నిరాశ మరోవైపు మహిళల సింగిల్స్లో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో ఫైనల్లో ఓడి రజత పతకం సాధించిన సింధు ఈసారి మాత్రం క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో సింధు 16–21, 12–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి.. ముగిసిన పోరాటం
చాంగ్జౌ: చైనా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 17–21, 21–11, 17–21తో షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ జంట 15–21, 16–21తో చెన్ టాంగ్ జియె–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. Asia TT Championship 2023: Indian Mens Team Won Bronze Medal: భారత జట్టుకు కాంస్యం ప్యాంగ్చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు మరోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయింది. ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ , హర్మీత్ దేశాయ్ తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. 2021 ఆసియా చాంపియన్షిప్లోనూ భారత జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకం దక్కించుకుంది. తొమ్మిదో స్థానంలో అర్జున్ టాటా స్టీల్ ఇండియా చెస్ ఓపెన్ ర్యాపిడ్ టోర్నీలో ఆరు రౌండ్లు ముగిశాక తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ 2.5 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. కోల్కతాలో 10 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం 3 రౌండ్లు జరిగాయి. నాలుగో గేమ్లో గ్రిష్చుక్ (రష్యా) చేతిలో 55 ఎత్తుల్లో ఓడిన అర్జున్... ఐదో గేమ్లో 67 ఎత్తుల్లో విదిత్ (భారత్)పై గెలిచాడు. గుకేశ్ (భారత్)తో జరిగిన ఆరో గేమ్ను అర్జున్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. విదిత్, ప్రజ్ఞానంద, గుకేశ్ 3 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
క్వార్టర్స్లో సాత్విక్ జోడీ
కోపెన్హాగెన్ (డెన్మార్క్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్కు చేరింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 19–21, 21–9తో లియో రాలీ కార్నండొ–డానియెల్ మారి్టన్ (ఇండోనేసియా) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 14–21, 9–21తో టాప్ సీడ్ చెన్ క్వింగ్ చెన్–జియా యి ఫ్యాన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ ప్రణయ్ (భారత్) 21–18, 15–21, 21–19తో 2021 ప్రపంచ చాంపియన్ లో కియాన్ యూ (సింగపూర్)పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరగా... లక్ష్య సేన్ (భారత్) 14–21, 21–16, 13–21తో మూడో సీడ్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
BWF Championships: సింధుకు క్లిష్టమైన డ్రా.. ఆ రెండు అడ్డంకులు దాటితేనే
కౌలాలంపూర్: ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన భారత స్టార్ పీవీ సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 21 నుంచి 27 వరకు డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన ‘డ్రా’ కార్యక్రమం గురువారం జరిగింది. మహిళల సింగిల్స్లో భారత్ నుంచి సింధు మాత్రమే బరిలో ఉంది. 16వ సీడ్గా బరిలోకి దిగనున్న సింధుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ఆ తర్వాత సింధుకు ప్రతి రౌండ్లో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. రెండో రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడే చాన్స్ ఉంది. మూడో రౌండ్లో మరో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) సిద్ధంగా ఉండవచ్చు. ఈ రెండు అడ్డంకులు దాటితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడే అవకాశముంది. ఆన్ సెయంగ్తో ఇప్పటి వరకు సింధు ఆరుసార్లు ఆడగా ఆరుసార్లూ ఓడిపోయింది. ఇక పురుషుల సింగిల్స్లో భారత్ నుంచి ప్రణయ్, లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో రెండో సీడ్ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీకి... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
తొమ్మిదో ర్యాంక్కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం..
BWF world rankings: గతవారం జపాన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ప్రణయ్, సెమీఫైనల్లో ఓడిన లక్ష్య సేన్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్లో పురోగతి సాధించారు. పురుషుల సింగిల్స్లో ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంక్కు... లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 19వ ర్యాంక్లో నిలిచాడు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు 17వ ర్యాంక్లో, పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండో ర్యాంక్లో కొనసాగుతున్నారు. సాకేత్–మార్టినెజ్ జోడీ శుభారంభం మిఫెల్ టెన్నిస్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. తన భాగస్వామి మార్టినెజ్ (వెనిజులా)తో కలిసి సాకేత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మెక్సికోలో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–మారి్టనెజ్ ద్వయం 6–3, 2–6, 10–5తో ఎర్నెస్టో ఎస్కోబెడో–రోడ్రిగో మెండెజ్ (మెక్సికో) జోడీపై గెలిచింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ జంట మూడు ఏస్లు సంధించింది. -
వరుస విజయాలు.. కెరీర్ బెస్ట్ అందుకున్న సాత్విక్-చిరాగ్ జోడి
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం ఆదివారం కొరియా ఓపెన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో నాలుగో సూపర్ బ్యాడ్మింటన్ టైటిల్ దక్కించుకున్న ఈ జోడి ప్రస్తుతం సూపర్ ఫామ్ కనబరుస్తోంది. తాజాగా మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లోనూ సత్తా చాటారు. సాత్విక్-చిరాగ్ జోడి డబుల్స్ విభాగంలో తమ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ అందుకోవడం విశేషం. ఆదివారం జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన వరల్డ్ డబుల్స్ నెంబర్వన్ జోడి ఫజర్ అల్పయాన్- ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయం సాధించింది. కొరియా ఓపెన్ కంటే ముందు ఇదే సీజన్లో స్విజ్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్, ఆసియన్ చాంపియన్స్ గెలిచిన ఈ జోడి ఖాతాలో 87,211 ర్యాంకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో భాగంగా వీరిద్దరూ ఈ సీజన్లో ఆడిన 10 ఫైనల్ మ్యాచ్ల్లో ఒక్కదానిలో కూడా ఓటమిపాలవ్వలేదు. కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న సాత్విక్-చిరాగ్ జోడి జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీపై కన్నేసింది. మంగళవారం నుంచి ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఇక తెలుగుతేజం పీవీ సింధు వరుస పరాజయాలతో ర్యాంకింగ్స్లో మరింత దిగజారుతూ వస్తోంది. కొరియా ఓపెన్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సింధు ర్యాంకింగ్స్లో ప్రస్తుతం 17వ స్థానంలో ఉంది. గాయంతో దూరంగా ఉన్న సైనా నెహ్వాల్ 37వ స్థానంలో ఉండగా.. పరుషుల సింగిల్స్ విభాగంలో భారత టాప్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ 10వ స్థానాన్ని నిలుపుకోగా.. కొరియా ఓపెన్కు దూరంగా ఉన్న లక్ష్యసేన్ ఒక స్థానం కోల్పోయి 13వ స్థానంలో ఉన్నాడు. ఇక కిడాంబి శ్రీకాంత్ 20వ స్థానంలో నిలిచాడు. చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. తొలి రెండు మ్యాచ్లకు కెప్టెన్ దూరం ఎంబాపెకు బంపరాఫర్.. ఏకంగా రూ. 2,716 కోట్లు! -
ఎదురులేని సాత్విక్–చిరాగ్ జోడీ
యోసు (కొరియా): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ తమ ఖాతాలో నాలుగో టైటిల్ను జమ చేసుకుంది. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) చాంపియన్గా అవతరించింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 17–21, 21–13, 21–14తో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ జోడీ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, మహారాష్ట్ర ఆటగాడు చిరాగ్ తొలి గేమ్లో తడబడినా వెంటనే తేరుకొని తర్వాతి రెండు గేమ్లను దక్కించుకున్నారు. తొలి గేమ్లో ఒకదశలో 2–10తో వెనుకబడ్డ భారత జోడీ ఆ తర్వాత అంతరాన్ని తగ్గించినా గేమ్ను సొంతం చేసుకోలేకపోయింది. అయితే రెండో గేమ్ నుంచి సాత్విక్, చిరాగ్ ఆట మారింది. ముఖ్యంగా సాత్విక్ తిరుగులేని స్మాష్లతో చెలరేగాడు. ఫలితంగా స్కోరు 15–11 వద్ద భారత జోడీ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 20–15తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు పాయింట్లు చేజార్చుకున్నా వెంటనే మరో పాయింట్ నెగ్గి గేమ్ను దక్కించుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్లో సాత్విక్–చిరాగ్ ఆరంభంలోనే 7–3తో ఆధిక్యంలోకి వెళ్లి ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నారు. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 33,180 డాలర్ల (రూ. 27 లక్షల 20 వేలు) ప్రైజ్మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘వరుసగా టైటిల్స్ గెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ వారం మాకెంతో అద్భుతంగా గడిచింది. ఈ టోర్నీ మొత్తం గొప్పగా ఆడాం. మా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం. మంగళవారం నుంచి జరిగే జపాన్ ఓపెన్లో మా జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాం’ అని సాత్విక్, చిరాగ్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందన సాక్షి,అమరావతి: కొరియా ఓపెన్లో డబుల్స్ టైటిల్ నెగ్గిన ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. భవిష్యత్లో జరిగే టోర్నీల్లోనూ వీరిద్దరూ విజయ పరంపర కొనసాగించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. 4 ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ నెగ్గిన టైటిల్స్. స్విస్ ఓపెన్ సూపర్–300, ఆసియా చాంపియన్షిప్, ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000, కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీలలో టైటిల్స్ గెలిచారు. -
టైటిల్కు అడుగు దూరంలో సాత్విక్–చిరాగ్ జోడీ
యోసు (కొరియా): గత నెల ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి వరుసగా రెండో టైటిల్కు చేరువయ్యారు. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అగ్రశ్రేణి భారత జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకు జంట సాత్విక్–చిరాగ్ 21–15, 24–22తో రెండో సీడ్ లియాంగ్ వే కెంగ్– వాంగ్ చాంగ్ (చైనా) ద్వయంపై గెలుపొందింది. ప్రపంచ రెండో ర్యాంకులో ఉన్న చైనీస్ ప్రత్యర్థులపై భారత షట్లర్లకు ఇదే తొలి విజయం! గతంలో తలపడిన రెండు సార్లూ సాత్విక్–చిరాగ్లకు నిరాశే ఎదురైంది. తాజా సెమీస్లో భారత ద్వయం జోరుకు చైనీస్ జంటకు ఓటమి తప్పలేదు. వరుస గేముల్లో గెలిచినప్పటికీ మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగింది. 3–3 నుంచి 5–5 ఇలా స్కోరు పోటాపోటీగా కదిలింది. సాత్విక్–చిరాగ్ 7–5 స్కోరు వద్ద ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ చైనా స్టార్లు స్మాష్లతో మళ్లీ సమం చేశారు. అయితే నెట్ వద్ద లియాంగ్ అనవసర తప్పులు చేయడంతో భారత్ 14–8తో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సంపాదించి తొలి గేమ్ను చేజిక్కించుకుంది. ఇక రెండో గేమ్లో పోటీ మరింత పెరిగింది. ఆరంభం నుంచి 2–2, 8–8 వద్ద వరుస విరామాల్లో స్కోర్లు సమం కావడంతో ఇరు జోడీలు పైచేయి సాధించేందుకు శ్రమించారు. సాత్విక్ స్మాష్లతో రెచ్చిపోయాడు. వరుస పాయింట్లతో 11–8తో ఆధిక్యంలోకి వచ్చిన భారత జోడీ దీన్ని 14–9తో పెంచుకుంది. కానీ లియాంగ్, వాంగ్ క్రాస్కోర్టు షాట్లకు పదునుపెట్టడంతో పోటాపోటీ మళ్లీ మొదటికొచ్చింది. ఇక్కడినుంచి ఆఖరి దశ దాకా హోరాహోరీ కొనసాగడంతో 20–20, 22–22 వద్ద స్కోర్లు సమమయ్యాయి. తర్వాత నాలుగోసారి దక్కిన మ్యాచ్ పాయింట్ను ఈ సారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా సాత్విక్ తెలివిగా స్మాష్లతో ముగించాడు. నేడు జరిగే తుదిపోరులో భారత జోడీ టాప్ సీడ్ ఫజర్ అలి్పయాన్–ముహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) జంటతో తలపడుతుంది. -
సెమీఫైనల్లో సాత్విక్ జోడీ
యోసు (కొరియా): భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకు జంట వరుస సెట్లలో ఐదో సీడ్ టకురో హొకి–యుగొ కొబయషి (జపాన్) ద్వయంపై అలవోక విజయం సాధించింది. 40 నిమిషాల్లో ముగిసిన ఈ క్వార్టర్స్ పోరులో సాత్విక్–చిరాగ్ జోడీ 21–14, 21–17తో జపాన్ ద్వయంపై గెలుపొందింది. గత నెల ఇండోనేసియా ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గి జోరు మీదున్న భారత షట్లరు ఈ టోరీ్నలోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. తొలి గేమ్ ఆరంభంలోనే వరుసగా ఆరు పాయింట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన సాత్విక్–చిరాగ్ ద్వయం గేమ్ గెలిచేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. రెండో గేమ్లో భారత జోడీ 3–6తో కాస్త వెనుకపడినట్లు కనిపించింది. అయితే అక్కడి నుంచి సాత్విక్–చిరాగ్లిద్దరు తమ షాట్లకు పదునుపెట్టడంతో వరుసగా 6 పాయింట్లు గెలిచారు. అక్కడి నుంచి ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయారు. ఇటీవలే ‘యోనెక్స్’ ఫ్యాక్టరీలో ల్యాబ్లో ఫాస్టెస్ట్ స్మాష్తో గిన్నిస్ రికార్డు నమోదు చేసిన సాత్విక్ సాయిరాజ్ కోర్టులోనూ ఈ సారి అలాంటి ఫీట్ను మళ్లీ సాధించడం విశేషం. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సాత్విక్ రికార్డు వేగంతో స్మాష్ బాదాడు. అతను కొట్టిన స్మాష్కు షటిల్ గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ ముందుకు...
యోసు (కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–17, 21–15తో ప్రపంచ 16వ ర్యాంక్ జోడీ హి జి టింగ్–జౌ హావో డాంగ్ (చైనా)పై గెలిచింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాత్విక్, చిరాగ్లకు తొలి గేమ్లో ప్రతిఘటన ఎదురైంది. పలుమార్లు ఆధిక్యం దోబూచులాడింది. 11–12తో వెనుకబడిన దశలో భారత జంట వరుసగా మూడు పాయింట్లు గెలిచి 14–12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్లో సాత్విక్, చిరాగ్ ఆరంభంలోనే వరుసగా మూడు పాయింట్లు నెగ్గి శుభారంభం చేసింది. స్కోరు 10–8 వద్ద భారత జోడీ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14–8తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 11–21, 14–21తో రెండో సీడ్ బేక్ హా నా–లీ సో హీ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 15–21, 12–21తో ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్, ప్రపంచ 32వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 15–21, 21–19, 18–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యిక్ (హాంకాంగ్) చేతిలో... ప్రియాన్షు 14–21, 21–18, 17–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
‘గిన్నిస్’లోకి సాత్విక్ స్మాష్...
సొకా (జపాన్): తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి ఇన్నాళ్లూ ఇంటాబయటా డబుల్స్ టైటిల్స్తో పతాక శీర్షికల్లో నిలిచాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ బ్యాడ్మింటన్ స్టార్ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ల్లోకెక్కాడు. చిరాగ్ శెట్టితో కలిసి అతను ఇటీవల ఇండోనేసియా ఓపెన్లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచాడు. మేటి డబుల్స్ షట్లర్గా రాటుదేలిన సాత్విక్కు టైటిళ్లు కొత్తేం కాదు. అయితే తాజాగా బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగవంతమైన స్మాష్తో సాత్విక్ రికార్డు సృష్టించాడు. జపాన్కు చెందిన ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ యోనెక్స్ తమ ఫ్యాక్టరీలో ఇటీవల నిర్వహించిన టెస్టులో సాత్విక్ రాకెట్ వేగంతో స్మాష్ కొట్టాడు. సాత్విక్ స్మాష్కు షటిల్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఫార్ములావన్ సర్క్యూట్లో రయ్ రయ్మని రాకెట్ వేగంతో దూసుకెళ్లే కారు వేగం (గంటకు 372.6 కి.మీ.) కంటే కూడా సాత్విక్ స్మాష్ వేగమే ఎక్కువ! బ్యాడ్మింటన్లో ఇది అసాధారణ వేగం. దీంతో దశాబ్దం క్రిందట మలేసియన్ షట్లర్ తన్ బూన్ హియాంగ్ (2013లో) గంటకు 493 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డును సాత్విక్ బద్దలుకొట్టాడు. తద్వారా ‘ఫాస్టెస్ట్ స్మాష్’ రికార్డును సాత్విక్ సాయిరాజ్ తన పేరిట గిన్నిస్ బుక్లో లిఖించుకున్నాడు. మహిళల విభాగంలో మలేసియా షట్లర్ తన్ పియర్లీ గంటకు 438 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డు కూడా గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశం ప్రస్తుతం కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ఆడుతున్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–16, 21–14తో సుపక్ జోమ్కో–కిటినిపోంగ్ కెద్రెన్ (థాయ్లాండ్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత్కే చెందిన ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జోడీ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. -
అపూర్వ జోడీ... అద్భుత విజయం
సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి(భారత్) జోడి ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో అపూర్వ విజయం సాధించింది. పురుషుల డబుల్స్ విభాగంలో తొలిసారి చాంపియన్గా నిలిచింది. జకార్తాలో జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–18తో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ ఆరోన్–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలుపొందింది. భారత్ జోడీకి 92,500 డాలర్ల (రూ.75 లక్షల 77 వేలు) ప్రైజ్మనీతో పాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా, విజేతలుగా నిలిచిన ఏపీ క్రీడాకారుడు సాత్విక్తో పాటు చిరాగ్ను సీఎం జగన్ అభినందించారు. జకార్తా వేదికగా ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. గతంలో ఏ భారతీయ బ్యాడ్మింటన్ జోడీకి సాధ్యంకాని ఘనతను సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం సుసాధ్యం చేసి చూపించింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ఈ భారత జంట తొలిసారి విజేతగా అవతరించింది. తద్వారా డబుల్స్ విభాగంలో ఈ ఘనత సాధించిన మొదటి జోడీగా కొత్త చరిత్ర సృష్టించింది. గత ఐదేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లో తమ విజయాలతో భారత డబుల్స్ విభాగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సాత్విక్–చిరాగ్ జోడీ తాజా గెలుపుతో తమ స్థాయిని మరింత ఎత్తుకు పెంచుకుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ జంటను ఓడించి సంచలనం సృష్టించిన సాత్విక్–చిరాగ్... ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జోడీని కూడా బోల్తా కొట్టించి ఔరా అనిపించింది. జకార్తా: నిరీక్షణ ముగిసింది. డబుల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఖాతాలో తొలిసారి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ టైటిల్ చేరింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ మరోసారి భారత్కు కలిసొచ్చింది. గతంలో సైనా నెహ్వల్, కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలువగా... పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం మొదటిసారి చాంపియన్గా అవతరించింది. తమ కెరీర్లో ఫైనల్ చేరుకున్న తొలి సూపర్–1000 టోర్నీలోనే సాత్విక్–చిరాగ్ ద్వయం టైటిల్ సాధించడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–17, 21–18తో ప్రపంచ మూడో ర్యాంక్ జంట, ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్గా ఉన్న ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలుపొందింది. ఈ మ్యాచ్కు ముందు 2017 నుంచి ఇప్పటి వరకు ఆరోన్ చియా–సో వుయ్ యిక్లతో ఎనిమిదిసార్లు తలపడిన సాత్విక్–చిరాగ్లకు ఎనిమిదిసార్లూ ఓటమి ఎదురుకాగా... తొమ్మిదో ప్రయత్నంలో తొలిసారి ఈ మలేసియా టాప్ జోడీపై గెలిచారు. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 92,500 డాలర్ల (రూ. 75 లక్షల 77 వేలు) ప్రైజ్మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ జంటకు 43,750 డాలర్ల (రూ. 35 లక్షల 84 వేలు) ప్రైజ్మనీతోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పక్కా వ్యూహంతో... గతంలో మలేసియా జోడీ చేతిలో ఎదురైన ఎనిమిది పరాజయాలను విశ్లేషించి ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో భారత జోడీ బరిలోకి దిగింది. ఎలా ఆడితే తమ ప్రత్యర్థి జంట ఆట కట్టించే అవకాశముందో అదే రకంగా సాత్విక్–చిరాగ్ ద్వయం ఆడింది. సుదీర్ఘ ర్యాలీలను ఆడుతూనూ పదునైన స్మాష్ షాట్లతో వాటికి ఫినిషింగ్ టచ్ ఇచ్చి సాత్విక్–చిరాగ్ సత్తా చాటుకున్నారు. తొలి గేమ్ ఆరంభంలో ఒకదశలో 3–7తో వెనుకబడిన సాత్విక్–చిరాగ్ నెమ్మదిగా తేరుకున్నారు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 9–7తో ఆధిక్యంలోకి వచ్చారు. అనంతరం మలేసియా జోడీ స్కోరును 9–9 వద్ద సమం చేసినా... సాత్విక్–చిరాగ్ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టి ప్రత్యర్థి జంటపై ఒత్తిడి పెంచి వరుసగా మూడు పాయింట్లతో 12–9తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు ఆ తర్వాత భారత జోడీ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్లో స్కోరు 8–7 వద్ద సాత్విక్–చిరాగ్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 11–7తో... ఆ తర్వాత స్కోరు 14–11 వద్ద ఈసారి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 18–11తో ఆధిక్యాన్ని పెంచుకున్నారు. చివర్లో 20–14 వద్ద వరుసగా సాత్విక్–చిరాగ్ వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి ఆధిక్యం 20–18కి తగ్గడంతో ఒత్తిడికి లోనయ్యారు. అయితే మలేసియా జోడీ అనవసర తప్పిదంతో భారత జోడీకి ఒక పాయింట్ రావడంతో విజయం ఖాయమైంది. వరల్డ్ టూర్ టోర్నీలు అంటే... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ను ఆరు స్థాయిలుగా విభజించారు. ఏడాదిలో నాలుగు సూపర్–1000 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్మనీ: 12 లక్షల 50వేల డాలర్లు), ఆరు సూపర్–750 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్మనీ: 8 లక్షల 50 వేల డాలర్లు), ఏడు సూపర్–500 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్మనీ: 4 లక్షల 20 వేల డాలర్లు)...11 సూపర్–300 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్మనీ: 2 లక్షల 10 వేల డాలర్లు) ఉంటాయి. వీటితోపాటు సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్ (మొత్తం ప్రైజ్మనీ: 20 లక్షల డాలర్లు) కూడా జరుగుతుంది. దాంతోపాటు సూపర్–100 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్మనీ: 1 లక్ష డాలర్లు) కూడా నిర్వహిస్తారు. టోర్నీ స్థాయిని బట్టి ర్యాంకింగ్ పాయింట్లలో, ప్రైజ్మనీలో తేడా ఉంటుంది. సూపర్–1000 టోర్నీలలో అత్యధిక పాయింట్లు, అత్యధిక ప్రైజ్మనీ లభిస్తుంది. -
సెమీస్లోనే నిష్క్రమించిన ప్రణయ్.. టైటిల్కు అడుగుదూరంలో సాత్విక్- చిరాగ్
ప్రపంచ చాంపియన్షిప్లో... ఆసియా చాంపియన్షిప్లో... కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో అతి గొప్ప టైటిల్కు విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. వరల్డ్ టూర్ సూపర్–1000 స్థాయి టోర్నీలో ఈ జంట టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. జకార్తా: అంచనాలకు మించి రాణిస్తూ భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఇండోనేసియా ఓపెన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 67 నిమిషాల్లో 17–21, 21–19, 21–18తో మిన్ హిక్ కాంగ్–సియో సెంగ్ జె (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఆరోన్ చియా–సో వుయ్ యిక్లతో ఎనిమిదిసార్లు తలపడిన సాత్విక్–చిరాగ్ జంట ఒక్కసారి కూడా గెలవలేదు. తొమ్మిదో ప్రయత్నంలోనైనా సాత్విక్–చిరాగ్ విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి. భారత కాలమానం ప్రకారం సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే అవకాశముంది. ఫైనల్ మ్యాచ్లన్నీ స్పోర్ట్స్–18 చానెల్లో, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ముగిసిన ప్రణయ్ పోరాటం మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ 15–21, 15–21తో ఓడిపోయాడు. సెమీఫైనల్లో నిష్క్రమించిన ప్రణయ్కు 17,500 డాలర్ల (రూ. 14 లక్షల 33 వేలు) ప్రైజ్మనీతోపాటు 8400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో గొప్ప ఫామ్లో ఉన్న సాత్విక్–చిరాగ్ మరోసారి మెరిశారు. కొరియా జోడీపై గతంలో రెండుసార్లు నెగ్గిన సాత్విక్–చిరాగ్కు ఈసారి గట్టిపోటీ లభించింది. తొలి గేమ్ను కోల్పోయిన భారత జంట రెండో గేమ్లో నెమ్మదిగా తేరుకుంది. ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసి ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని గేమ్ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్లో ఆరంభంలో రెండు జోడీలు ప్రతి పాయింట్కు హోరాహోరీగా పోరాడాయి. స్కోరు 5–5తో సమంగా ఉన్నపుడు సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 12–5తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే కొరియా జంట పట్టుదలతో ఆడి స్కోరును 16–16 వద్ద సమం చేసింది. ఈ దశలో సాత్విక్–చిరాగ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 19–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పో యిన భారత జోడీ వెంటనే రెండు పాయింట్లు నెగ్గి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఎనిమిదోసారి కాగా బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీలలో సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ చేరడం ఇది ఎనిమిదోసారి. ఐదు టోర్నీలలో నెగ్గిన సాత్విక్–చిరాగ్, రెండు టోర్నీలలో రన్నరప్గా నిలిచారు. చదవండి: Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..? -
సాత్విక్–చిరాగ్ సంచలనం
జకార్తా: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో సంచలన ప్రదర్శన చేసింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13, 21–13తో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)లను బోల్తా కొట్టించింది. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ ఆరంభ దశలో రెండు జోడీలు పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడాయి. అయితే మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ సాత్విక్–చిరాగ్ జోడీ పైచేయి సాధించింది. చివరిసారి 2019లో ఫజర్–అర్దియాంతోలతో తలపడిన సాత్విక్–చిరాగ్ నాడు వరుస గేముల్లో నెగ్గగా...ఈసారీ రెండు గేముల్లోనే గెలిచారు. నేడు జరిగే సెమీఫైనల్లో కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె (దక్షిణ కొరియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ సీజన్లో సాత్విక్–చిరాగ్ స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్షిప్లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్లో సెమీఫైనల్ చేరారు. వరుసగా రెండో ఏడాది... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ వరుసగా రెండో ఏడాది ఈ టోరీ్నలో సెమీఫైనల్ చేరుకోగా... కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 21–16తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)పై గెలుపొందాడు. గతంలో నరోకాతో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ ఐదో ప్రయత్నంలో ఈ జపాన్ ప్లేయర్పై నెగ్గడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 2–5తో వెనుకంజలో ఉన్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 69 నిమిషాల్లో 14–21, 21–14, 12–21తో ప్రపంచ పదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్.. తొలి భారత జోడీగా రికార్డు
దుబాయ్: ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ఫైనల్లోకి ప్రవేశించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత జంటగా గుర్తింపు తెచ్చుకుంది. శనివారం జరిగిన సెమీస్లో ఆరో సిడ్ సాత్విక్–చిరాగ్...చైనీస్ తైపీకి చెందిన లీ యాంగ్ – వాంగ్ చిన్ లిన్పై విజయం సాధించారు. తొలి గేమ్ను 21–18తో గెలుచుకున్న భారత జంట రెండో గేమ్లో 13–14తో వెనుకబడి ఉన్న దశలో వాంగ్ చిన్ లిన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దాంతో ‘వాకోవర్’తో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. 41 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీ (మలేసియా)తో భారత జోడి తలపడుతుంది. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్
బాసెల్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి మరోసారి మేజర్ టోర్నీలో సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్–300 టోర్నీ స్విస్ ఓపెన్లో సాత్విక్ – చిరాగ్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ టోర్నీలో ఈ జంట మినహా ఇతర భారత షట్లర్లంతా ముందే నిష్క్రమించగా...వీరిద్దరు మాత్రం తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగారు. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ ద్వయం 19–21, 21–17, 17–21తో మూడో సీడ్ మలేసియా జోడి ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీపై విజయం సాధించింది. 69 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్ను కోల్పోయినా...తర్వాతి రెండు గేమ్లలో సత్తా చాటి భారత జంట విజయాన్ని అందుకుంది. నేడు జరిగే ఫైనల్లో చైనాకు చెందిన అన్సీడెడ్ జంట రెన్ జియాంగ్ యు – టాన్ ఖియాంగ్తో సాత్విక్ – చిరాగ్ తలపడతారు. -
Malaysia Open 2023: సెమీస్లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ సాత్విక్–చిరాగ్ 16–21, 21–11, 15–21తో ప్రపంచ 17వ ర్యాంక్ ద్వయం లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీకి 17,500 డాలర్ల (రూ. 14 లక్షల 22 వేలు) ప్రైజ్మనీతోపాటు 8,400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సాత్విక్–చిరాగ్ ఓటమి
సార్బ్రకెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో భారత జంట 21–17, 18–21, 21–8తో సు యా చింగ్–లిన్ వాన్ చింగ్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. అయితే పురుషుల డబుల్స్లో భారత మేటి జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టిలకు క్వార్టర్స్లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 17–21, 14–21తో బెన్ లేన్–సిన్ వెండీ (ఇంగ్లండ్) జోడీ చేతిలో కంగుతింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో కిడాంబి శ్రీకాంత్ 21–13, 21–19తో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ని వరుస గేముల్లోనే కంగు తినిపించాడు. -
సెమీస్లో సాత్విక్–చిరాగ్ జోడి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆశల పల్లకిని మోస్తున్న ఏకైక జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంటా బయటా విశేషంగా రాణిస్తోన్న భారత పురుషుల డబుల్స్ జోడీ శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్వన్ టకురొ హొకి–యుగొ కొబయషి (జపాన్) జంటను కంగు తినిపించింది. 49 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం వరుస గేముల్లో 21–12, 21–16 టాప్సీడ్ జంటకు ఇంటిదారి చూపింది. హొకి–యుగొతో తలపడిన నాలుగు మ్యాచ్లలో వీరికి ఇది మూడో విజయం కాగా... వీరిద్దరు ఫ్రెంచ్ ఓపెన్లో సెమీస్ చేరడం ఇది మూడో సారి. శనివారం జరిగే సెమీఫైనల్లో భారత జోడీ కొరియాకు చెందిన చొయ్ సొల్ గ్యు–కిమ్ వోన్ హో జంటను ఎదుర్కొంటుంది. -
సైనా నెహ్వాల్ పరాజయం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత ప్లేయర్ సైనా నెహ్వాల్ ఆట తొలి పోరులోనే ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్లో సైనా నెహ్వాల్ 21–13, 17–21, 19–21తో వ్యోనె లీ (జర్మనీ) చేతిలో ఓడింది. తొలి గేమ్ను గెలుచుకున్న సైనా, ఆ తర్వాత ప్రత్యర్థి ముందు నిలబడలేకపోయింది. మరో వైపు డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ పోరులో కామన్వెల్త్ చాంపియన్స్, ఏడోసీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్లో సాత్విక్–చిరాగ్ జోడీ 19–21, 21–9, 21–13తో క్రిస్టో పొపొవ్–తొమా జూనియర్ పొపొవ్ (ఫ్రాన్స్) జంటపై గెలుపొందింది. తొలి గేమ్ను కోల్పోయిన భారత జోడీ తర్వాతి గేమ్లలో పుంజుకొంది. రెండో గేమ్ను చకచకా ముగించగా, నిర్ణాయక గేమ్లోనూ ఇదే ఆటతీరు కొనసాగించడంతో స్థానిక ఆటగాళ్లకు పరాజయం తప్పలేదు. ఒక గంటా 8 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ జోడీ తేలిపోయింది. అయితే మిక్స్డ్, మహిళల డబుల్స్లో భారత షట్లర్లకు చుక్కెదురైంది. మహిళల డబుల్స్ మ్యాచ్లో గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జంట 21–23, 20–22తో ఆరో సీడ్ జాంగకొల్ఫన్ కిటితరకుల్–రవిండ ప్రజొంగ్జయ్ (థాయ్లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో జోడీ 13–21, 16–21తో జపాన్కు చెందిన క్యోహెయ్ యమషిత–నరు షినొయా జంట చేతిలో పరాజయం చవిచూసింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ ముందంజ
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్లు ఖరారు చేసుకున్నారు. అయితే మహిళల సింగిల్స్లో మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. డబుల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 21–19తో కాంగ్ మిన్ హ్యుక్–సియో సెయుంగ్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత జోడీ తొలి గేమ్లో 16–15తో ఆధిక్యంలో ఉన్నదశలో వరుసగా ఐదు పాయింట్లు గెలిచింది. సింగిల్స్లో ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 21–16, 21–12తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్టింగ్ (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–13, 22–20తో జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ 32వ ర్యాంకర్ సైనా 17–21, 21–19, 11–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
కాంస్యం నెగ్గిన సాత్విక్-చిరాగ్ శెట్టి.. అయినా చరిత్రే
అంచనాలకు మించి రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించింది. శనివారం(ఆగస్టు 27న) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సాత్విక్-చిరాగ్ శెట్టి జంట.. మలేషియాకు చెందిన ఆరోన్ చియా-వూయి యిక్ సోహ్లతో 22-20, 18-21, 16-21తో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్ను 22-20తో గెలిచిన సాత్విక్- చిరాగ్.. అదే టెంపోనూ తర్వాతి గేమ్స్లో కొనసాగించలేకపోయారు. తొలి గేమ్ ఓడినప్పటికి వరల్డ్ నెంబర్-7 అయిన మలేషియా జంట ఫుంజుకొని భారత ద్వయానికి మరో అవకాశం ఇవ్వకుండా వరుస గేముల్లో ఓడించి మ్యాచ్ను కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్లో భారత్కు ఇదే తొలి పతకం. ఇటీవలి కాలంలో సాత్విక్-చిరాగ్ జంట బ్యాడ్మింటన్లో అద్భుతాలు చేస్తున్నారు. ఆల్ఇంగ్లండ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ వరకు.. ఆ తర్వాత ఇండియా ఓపెన్, థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి కొత్త చరిత్ర లిఖించింది. BWF World Championships 2022 Men's Doubles - Semi Finals Aaron Chia/Soh Wooi Yik 🇲🇾 vs Satwiksairaj Rankireddy/Chirag Shetty 🇮🇳 20-22, 21-18, 21-16 Alhamdulillah they finally break the SF curse! 🤧 Huge congrats for advancing to the FINAL ChiaSoh 👏👏 #BWC2022 pic.twitter.com/uCWsJtBo3p — レディディラ (@ladydyla__) August 27, 2022 చదవండి: Rafael Nadal-Serena Williams: అద్భుత దృశ్యం.. దిగ్గజాలు ఎదురుపడిన వేళ సాత్విక్–చిరాగ్ ‘డబుల్స్’ ధమాకా -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
Asia Badminton Championship - మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–9తో అపీలుక్ గతెరాహోంగ్–నచానన్ తులమోక్ (థాయ్లాండ్) జంటపై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ (భారత్) జోడీ 10–21, 21–19, 16–21తో కాంగ్ మిన్హుక్–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంట చేతిలో... అర్జున్ –ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 16–21, 22–24తో ఫజార్ –అర్దియాంతో (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జంట 21–15, 21–17తో లా చెక్ హిమ్–యెంగ్ టింగ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గగా... వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (భారత్) ద్వయం 9–21, 13–21తో ప్రవీన్ జోర్డాన్–మెలాతి ఒక్తావియాంతి (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. చదవండి: Trolls On Virat Kohli: ఓపెనర్గా వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టాల్సిందేనా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4281444471.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన పీవీ సింధు, రజనీ
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్లో మంచి ప్రదర్శన కనబరిచిన పీవీ సింధు, రజనీ, సాయిరాజ్లు శుక్రవారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ సింధు, రజనీ, సాయిరాజ్లను ఘనంగా సన్మానించారు. ఇక టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన మహిళగా రికార్డు సాధించింది. ఇక భారత మహిళల హాకీ జట్టులో రజనీ గోల్ కీపర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్లో మహిళల జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 41 ఏళ్ల తర్వాత సెమీస్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. -
అనుకున్న దానికన్నా ఉత్తమంగా ఆడాం: సాత్విక్ సాయిరాజ్
అమలాపురం: ‘అనుకున్న దానికన్నా ఉత్తమంగా ఆడాం. క్వార్టర్స్కు వచ్చి ఉంటే పతకం సాధించేవాళ్లం. మూడు మ్యాచ్లలో రెండు గెలిచినా క్వార్టర్స్కు అవకాశం రాలేదు. మా ప్రతిభ నిరాశపరచలేదు. ఫలితం అనుకూలం రాలేనందుకు బాధగా ఉన్నా 2024లో పారిస్లో జరిగే ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తాను’ అని షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ పేర్కొన్నాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో త్రుటిలో క్వార్టర్ ఫైనల్స్ అవకాశం కోల్పోయిన సాత్విక్ శనివారం సొంత ఇంటికి చేరాడు. ఈ సందర్భంగా అమలాపురంలో ఘన స్వాగతం లభించింది. ఆయన ‘సాక్షి’తో టోక్యో అనుభవాలను పంచుకున్నాడు. సాత్విక్ మాట్లాడుతూ.. ప్రణాళికతో సిద్ధమవుతా.. ‘చిరకాల కోరిక తీరింది. ఒలింపిక్స్ వేదికపై మన వాళ్లు ఎవరైనా ఆడుతుంటే టీవీలో ఆసక్తిగా చూసేవాడిని. అలాంటిది నేనే ఆడుతున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. నిబంధన మేరకు ఏ జట్టు ఎక్కువ సెట్లు గెలిచారనే అంశం పరిగణలోకి తీసుకోవడం వల్ల క్వార్టర్స్ అవకాశం కోల్పోయాం. అయినా ప్రతిభతో క్రీడాభిమానుల మన్నననలు పొందాం. 2024లో పారిస్ ఒలింపిక్స్కు ఇప్పటి నుంచే సిద్ధమవుతాను. ప్రణాళికతో ఆడుతూ ఫిట్నెస్ పెంచుకుంటాను. డబుల్స్ కోచ్ను ఎంపిక చేసుకుని సాధన చేస్తాను. అట్టడుగు స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తే మనకు ఎక్కువ పతకాలు వస్తాయి. ఇతర దేశాల్లా లాంగ్ గోల్ పెట్టుకోవాలి. కనీసం నాలుగు, ఎనిమిదేళ్ల తరువాత జరిగే ఒలింపిక్స్కు క్రీడాకారులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి. దీటైన సదుపాయాలుండాలి. అథ్లెటిక్స్లో నిరంతరం పోటీలు జరగాలి. ఒడిశా హాకీని దత్తత చేసుకున్నట్టుగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క క్రీడను దత్తత చేసుకుంటే బాగుంటుందని భావిస్తున్నాను.’ అని సాత్విక్ సాయిరాజ్ తెలిపాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీకి చుక్కెదురు
కౌలాలంపూర్: గతేడాది అద్భుత ఆటతీరుతో ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–10లోనూ స్థానం సంపాదించిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంటకు కొత్త ఏడాది కలిసి రాలేదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీలో ప్రస్తుత ప్రపంచ 12వ ర్యాంక్ జంట సాతి్వక్–చిరాగ్ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. ప్రపంచ 19వ ర్యాంక్ ద్వయం ఓంగ్ యెవ్ సిన్–తియో ఈ యి 21–15, 18–21, 21–15తో సాత్విక్ –చిరాగ్ జంటకు షాక్ ఇచ్చింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ తొలి గేమ్లో తడబడి రెండో గేమ్లో తేరుకుంది. నిర్ణాయక మూడో గేమ్లో స్కోరు 15–17 వద్ద భారత జంట వరుసగా నాలుగు పాయింట్లు సమరి్పంచుకొని ఓటమిని ఖాయం చేసు కుంది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో శుభాంకర్ (భారత్) 15–21, 15–21తో డారెన్ ల్యూ (మలేసియా) చేతిలో... లక్ష్య సేన్ (భారత్) 21–11, 18– 21, 14–21తో విటింగ్హస్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. నేడు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్ల్లో కెంటో మొమోటా (జపాన్)తో కశ్యప్; చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్; వాంగ్చరోయెన్ (థాయ్లాండ్)తో సమీర్ వర్మ; సునెయామ (జపాన్)తో ప్రణయ్; రస్ముస్ జెమ్కె (డెన్మార్క్)తో సాయిప్రణీత్ ఆడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో లియాన్ తాన్ (బెల్జియం)తో సైనా; కొసెత్స్కాయ (రష్యా)తో పీవీ సింధు తలపడతారు.