Farm Sector
-
మిషన్ మౌసమ్తో వాతావరణ సమాచారం
కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు సేవలందించేందుకు ఉద్దేశించిన అనేక కీలక కార్యక్రమాలను ఆమె హైలైట్ చేశారు.రైతులపై దృష్టిరైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా చూడటం ద్వారా వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముర్ము తెలిపారు. వ్యవసాయ రంగానికి ఊతమివ్వడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, తద్వారా దేశ సమగ్ర ఆర్థిక వృద్ధికి దోహదపడటం ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు.యు-విన్ పోర్టల్గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే దిశగా యూ-విన్ పోర్టల్ను ప్రారంభించినట్లు రాష్ట్రపతి ప్రకటించారు. యు-విన్ పోర్టల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ను కచ్చితంగా ట్రాక్ చేయడానికి, సకాలంలో పూర్తి రోగనిరోధక శక్తిని నిర్ధారించడానికి రూపొందించినట్లు తెలిపారు. యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో భాగంగా 12 నివారించదగిన వ్యాధులకు వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.ఇదీ చదవండి: ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమామిషన్ మౌసమ్భారతదేశాన్ని వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండేలా, వాటివల్ల కలిగే ప్రభావాలను మరింత స్మార్ట్గా నిర్వహించడానికి మిషన్ మౌసమ్ పథకం తోడ్పడుతుందన్నారు. ఈ రూ.2,000 కోట్ల ప్రాజెక్టు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కచ్చితమైన, సకాలంలో వాతావరణ సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. మిషన్ మౌసమ్లో తదుపరి తరం రాడార్లు, ఉపగ్రహ వ్యవస్థలు, అధిక పనితీరు కలిగిన సూపర్ కంప్యూటర్లతో సహా అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
బ్యాంకోళ్ల జబర్దస్తీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చిలో భారత్లో ఇంధన డిమాండ్ పెరిగింది. నెల మొదటి అర్ధభాగంలో కనిపించిన మందగమనాన్ని అధిగమిస్తూ, నెల మొత్తంగా ఇంధన డిమాండ్ పెరిగినట్లు పరిశ్రమల ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. వ్యవసాయ రంగం నుండి బలమైన డిమాండ్, చలికాలం తర్వాత రవాణా పుంజుకోవడం వంటి కారణాలతో ఫిబ్రవరిలో ఇంధన అమ్మకాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. కానీ మార్చి మొదటి అర్ధభాగంలో కాలానుగుణంగా మందగమనం మొదలైంది. అయితే నెల రెండవ సగ భాగంలో తిరిగి ఎకానమీ కార్యకలాపాలు పుంజుకున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ వ్యవసాయ రంగ క్రియాశీలత మెరుగుపడ్డం మెరుగైన ఫలితానికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► గత ఏడాది మార్చితో పోలిస్తే 2023 మార్చిలో పెట్రోలు విక్రయాలు 5.1 శాతం పెరిగి 2.65 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. అమ్మకాలు నెలవారీగా 3.4 శాతం పెరిగాయి. ► డీజిల్ విషయంలో మార్చిలో వార్షిక డిమాండ్ 2.1 శాతం పెరిగి 6.81 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. 2022 మార్చిలో ఈ పరిమాణం 6.67 మిలియన్ టన్నులు. నెలవారీగా చూస్తే, డిమాండ్ 4.5 శాతం పెరిగింది. ► ఒక్క జెట్ ఫ్యూయెల్ డిమాండ్ పరిశీలిస్తే, డిమాండ్ 25.7 శాతం పెరిగి 614000 టన్నులుగా నమోదయ్యింది. ► కాగా, కుకింగ్ గ్యాస్ ఎల్పీజీ అమ్మకాలు మార్చిలో వార్షికంగా 3 శాతం పడిపోయి 2.37 మిలియన్ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే, డిమాండ్ 6.54 శాతం పడిపోయింది. ఫిబ్రవరి డిమాండ్ 2.54 మిలియన్ టన్నులు. -
ఒంటరిగా వెళ్తున్న యువతిపై లైంగిక దాడికి యత్నించిన బాలుడు.. ప్రతిఘటించడంతో..
కొచ్చి: ఒంటరిగా నడిచివెళుతున్న యువతిని బలవంతంగా పొలంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు ఓ బాలుడు. తీరా ఆమె ప్రతిఘటించడంతో రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన కేరళలోని కొండొట్టి ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం అర్థరాత్రి ఓ యువతి తన ఇంటి నుంచి కొట్టుక్కర జంక్షన్ వైపు కొండొట్టిలోని కంప్యూటర్ సెంటర్కు వెళ్తోంది. అంతలో ఓ బాలుడు ఆమెను వెంబడించి వెనుక నుంచి పట్టుకుని సమీప పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తనపై రాళ్లతో దాడి చేశాడు. అయితే నిందితుడి వద్ద నుంచి అతి కష్టం మీద తప్పించుకున్న యువతి అక్కడికి సమీపంలోని తన ఇంటికి వెళ్లి జరిగినదంతా కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తెలిపిన ఆధారాలు మేరకు పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 10వ తరగతి విద్యార్థి, రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్గా పోలీసుల విచారణలో తేలింది. మొదట్లో నిందితుడు తానీ నేరం చేయలేదని విచారణలో తెలిపాడు. అయితే పోలీసులు కాస్త గట్టిగా అడగడంతో నిజాన్ని అంగీకరించాడు. దీంతో ఆ బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరచనున్నారు. చదవండి: Online Dating: మొదట డేటింగ్..ఆపై ఇంటికి రప్పించుకుని నీళ్లలో మత్తుమందు కలిపి.. -
మీరు చేయకపోతే.. మేమే స్టే విధిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతు ప్రతినిధులతో కేంద్రం జరుపుతున్న చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తామని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం మరింత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తేల్చిచెప్పింది. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభించే వరకు ఆ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, ఆ చట్టాల అమలుపై అంత పట్టుదల ఎందుకని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆ చట్టాల అమలును నిలిపేయండి. లేదంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు మేమే స్టే విధించాల్సి వస్తుంది’అని హెచ్చరించింది. చట్టాలపై స్టే విధించాలనుకోవడం లేదని, వాటి అమలును మాత్రమే తాత్కాలికంగా నిలిపేసి, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తే.. కోర్టు ఏర్పాటు చేయనున్న కమిటీకి పరిష్కారం కనుగొనడం సులభమవుతుందని వివరించింది. కొత్త వ్యవసాయ చట్టాలు, రైతు ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు(మంగళవారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది. సమస్య పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. అమలుపై స్టే ఇవ్వలేరు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రాథమికహక్కులకు భంగం కలిగిస్తోందనో, లేక రాజ్యాంగ పరిధిలో లేదనో కోర్టు భావిస్తేనే.. చట్టాల అమలుపై స్టే విధించడం సాధ్యమవుతుందని ఆయన వాదించారు. పిటిషనర్లు తమ వాదనల్లో ఈ అంశాలను లేవనెత్తలేదని గుర్తు చేశారు. దానికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు పరిష్కారం కనుగొనడంలో విఫలమైనందువల్లనే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు చేసిన చట్టాలు రైతుల ఆందోళనలకు కారణమయ్యాయి. ఆ సమస్యను మీరే పరిష్కరించాలి’అని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే.. చట్టాలపై స్టే విధించడానికి తాము వ్యతిరేకమేనని పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం గుర్తు చేసింది. చట్టాల అమలుపై స్టే విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తమకు అందించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ను కోరింది. వ్యవసా య చట్టాలను పలు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాలు ప్రయోజనకరమని పేర్కొనే ఒక్క పిటిషన్ కూడా తమ ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది. ఆందోళనలు కొనసాగించవచ్చు ‘చట్టాల అమలును నిలిపివేసిన తరువాత కూడా ఆందోళనలను కొనసాగించుకోవచ్చు. ఆందోళనల గొంతు నులిమేశామన్న విమర్శలను మేం కోరుకోవడం లేదు’అని రైతు సంఘాల తరఫున హాజరైన న్యాయవాదులతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే కమిటీకి నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎం లోధా సహా రెండు, మూడు పేర్లను సూచించాలని ఇరువర్గాలను ధర్మాసనం కోరింది. సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందులో ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రభుత్వం, రైతు ప్రతినిధుల మధ్య జనవరి 15న మరో విడత చర్చలు జరగనున్నాయని, ఆ లోపు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ.. చర్చల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా ఉందని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. చట్టాల అమలుపై స్టే విధిస్తే.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగే అవకాశముందని పేర్కొంది. ‘స్టే’తో లాభం లేదు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం కానీ, సుప్రీంకోర్టు కానీ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. ఆ చట్టాల రద్దు కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, అయితే, చట్టాల అమలుపై స్టే విధించడం పరిష్కారం కాబోదన్నది తమ అభిప్రాయమని భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా శాఖ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చాదునీ పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమొక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. రాజ్యాంగవిరుద్ధమైన ఆ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు భోగ్ సింగ్ మాన్సా కోరారు. కొనసాగితే హింసాత్మకం.. రైతుల ఆందోళన ఎక్కువకాలం కొనసాగితే అది హింసాత్మకంగా మారే ప్రమాదముందని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ‘మనందరిపై బాధ్యత ఉంది. ఏ చిన్న సంఘటన అయినా హింసకు దారి తీయవచ్చు. అలాంటిది ఏదైనా జరిగితే మనమంతా బాధ్యులమవుతాం. ఎవరి మరణానికి కూడా మనం బాధ్యులం కాకూడదు’ అని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించేవారిని తాము కాపాడబోమని పేర్కొంది. పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఈ చట్టాలను రూపొందించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైతేనే.. సాగు చట్టాలు అన్యాయమైనవని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని, రాజ్యాంగ విరుద్ధమైనవని నిర్ధారణ అయితే చట్టాలపై కోర్టు స్టే విధించగలుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని గట్టి ఆధారాలుంటే తప్ప పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడం సాధ్యం కాదని న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేదీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వాదన వినకుండానే ఒక నిర్ధారణకు వచ్చారు. పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడానికి పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేయడం ప్రాతిపదిక కాకూడదు. ఎంపీల విజ్ఞతకు సంబంధించిన విషయమిది. కోర్టు పరిధిలో లేని అంశమిది’ అని ద్వివేదీ పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారు కాబట్టి చట్టాలను నిలిపేయాలనడం సరికాదన్నారు. -
కిసాన్ మహా ‘పంచాయితీ’
చండీగఢ్/కర్నాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన హరియాణాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కొత్త సాగు చట్టాల ప్రయోజనాలను వివరించి, రైతన్నలను శాంతింపజేసేందుకు ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. ముఖ్యమంత్రి నిర్వహించతలపెట్టిన ‘కిసాన్ మహాపంచాయత్’ను నిరసనకారులు భగ్నం చేశారు. ఇందుకోసం వారు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా కదం తొక్కారు. జల ఫిరంగులకు, బాష్ప వాయువుగోళాలకు ఎదురొడ్డి మరీ అనుకున్నది చేసి చూపించారు. హెలిప్యాడ్పై బైఠాయింపు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ఒనగూరే లాభాలను రైతులకు స్వయంగా తెలియజేయడానికి కర్నాల్ జిల్లాలోని కైమ్లా గ్రామంలో మనోహర్లాల్ ఖట్టర్ ఆదివారం కిసాన్ మహాపంచాయత్ నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని, కచ్చితంగా అడ్డుకొని తీరుతామని రైతులు ప్రతిజ్ఞ చేశారు. ముందు నిర్ణయించినట్లుగానే ఆదివారం కైమ్లాలో కిసాన్ మహాపంచాయత్ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారతీయ కిసాన్ యూనియన్(చారుణి) ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు కైమ్లాకు బయలుదేరారు. గ్రామ శివారులో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, వారిని ముందుకు సాగకుండా ఆంక్షలు విధించారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ రైతులు వినిపించుకోలేదు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. అయినప్పటికీ రైతులు లెక్కచేయలేదు. బారికేడ్లను ఛేదించుకొని కిసాన్ మహాపంచాయత్ వేదిక వద్దకు పరుగులు తీశారు. అప్పటికే అక్కడికి కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. రైతులు అక్కడున్న కుర్చీలు, పూల కుండీలు, మైకులను విరగ్గొట్టారు. వేదికను పూర్తిగా ధ్వంసం చేశారు. బీజేపీ హోర్డింగ్లు, బ్యానర్లను చించేశారు. నల్ల జెండాలు పట్టుకుని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్పై రైతులు బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చేసేది లేక కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. మహా పంచాయత్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం తమ గాయాలపై కారం చల్లేందుకు ప్రయత్నిస్తోందని రైతులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతాం.. హరియాణాలో రైతులపై వాటర్ కేనన్లు, బాష్ప వాయువు ప్రయోగించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం భూపీందర్సింగ్ హుడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తేల్చిచెప్పారు. రైతులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. హరియాణా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. శాసనసభను వెంటనే సమావేశపర్చాలని, ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. సీఎం ఖట్టర్ తలపెట్టిన మహా పంచాయత్కు ప్రజల మద్దతు లేదని హరియాణా పీసీసీ అధ్యక్షురాలు కుమారి సెల్జా చెప్పారు. మహా పంచాయత్ అసలు రంగును రైతులు బయటపెట్టారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలే బాధ్యులు: ఖట్టర్ కైమ్లా గ్రామంలో ఉద్రిక్తతకు కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులే బాధ్యత వహించాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అనుచిత ప్రవర్తనను సహించబోమని చెప్పారు. కిసాన్ మహా పంచాయత్కు అడ్డంకులు సృష్టించబోమని హామీ ఇచ్చిన కొందరు రైతు సంఘాల నేతలు మాట తప్పారని విమర్శించారు. దేశంలో బలమైన ప్రజాస్వామ్యం ఉందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. నిజానికి రైతులు అనుచితంగా వ్యవహరించరని చెప్పారు. కొందరు వ్యక్తులు రైతులను అప్రతిష్టపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మహా పంచాయత్లో తాను చెప్పాలనుకున్న విషయాలను తమ పార్టీ నాయకులు ప్రజలకు తెలిపారన్నారు. తాజా ఘటనలో నిఘా వర్గాల వైఫల్యం ఏమీ లేదన్నారు. కైమ్లాలో ఉద్రిక్తతల పరిస్థితుల దృష్ట్యా హెలికాప్టర్ను కర్నాల్లో దింపాలని తానే సూచించానన్నారు. -
దిగుబడి పెరిగినా తగ్గిన ఆదాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు రంగాలు కునారిల్లిపోయి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడమే కాకుండా వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరగడం విశేషం. ఈ ఏడాది జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయం 3.4 శాతం అభివద్ధి చెందింది. వ్యవసాయ రంగంపై కరోనా ప్రభావం ప్రత్యక్షంగా లేకపోవడం, ఈ ఏడాది వర్షాలు సమద్ధిగా కురవడం, రబీ, ఖరీఫ్ పంటలకు రిజర్వాయర్లలో నీళ్లు పుష్కలంగా ఉండడం పంటల దిగుబడికి ఎంతో కలసి వచ్చింది. కరోనా కాటుకు వలస కార్మికులు ఇళ్లకు తిరగి రావడం, జీవనోపాధికోసం వారు కూడా వ్యవసాయ కూలీలుగా మారిపోవడం కూడా రైతులకు కలసి వచ్చిందని జాతీయ వ్యవసాయ ఆర్థిక వేత్త, ఇందిరాగాంధీ అభివద్ధి, పరిశోధన సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తోన్న సుధా నారాయణన్ తెలిపారు. కరోనా కారణంగా వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరగడం, పంట దిగుబడులకు ఆశించిన ధరలు లభించ లేదని ఆమె చెప్పారు. ఈసారి కూడా చాలా చోట్ల గిట్టుబాటు ధరలు లేక టన్నుల కొద్ది టమోటా రోడ్ల పాలయింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు వారాల క్రితం రోడ్డెక్కిన రైతులు ఇంకా రోడ్లపైనే ఉన్నారు. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పుడేమో కొత్త చట్టాలతో చిన్న కారు, సన్నకారు రైతుల నోటి కాడ కూడును కొట్టేస్తుందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు హెక్టార్లకంటే తక్కువ భూమి కలిగిన చిన్నకారు రైతులే ప్రతి పది మందిలో ఎనమిది మంది ఉన్నారు. దేశం మొత్తం వర్క్ఫోర్స్లో 44.2 శాతం మంది ఒక్క వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు. ఈ ఏడాది దేశంలో 88 శాతం మంది రైతులు తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్మలేక పోయారు. 37 శాతం రైతులు అసలు పంటలే వేయలేకపోయారు. 15 శాతం మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డులకు కూడా తరలించలేక వదిలేశారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రధాని మోదీ ‘పీఎం–కిసాన్ స్కీమ్ను తీసుకొచ్చారు. దేశంలో 14 కోట్ల మంది రైతులుండగా కేవలం ఆ స్కీమ్ 8 కోట్లకు మాత్రమే పరిమితమవుతోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వ్యవసాయ చట్టాల గురించి లోతుగా అధ్యయనం చేసే స్థితిలో కూడా రైతులు లేరు -
దేశంలో ప్రజాస్వామ్యం లేదు
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గురువారం దేశ రాజధానిలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రియాంకా గాంధీ వాద్రా సహా సీనియర్ నేతలు, కార్యకర్తలు అక్బర్ రోడ్లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని మొదట భావించారు. అయితే, ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ కార్యాలయం ముందే బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాంతో, నిషేధాజ్ఞలను ఉల్లంఘించారన్న కారణంతో ప్రియాంకా గాంధీని, పలువురు ఎంపీలు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆధిర్ రంజన్చౌధురి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అనంతరం, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ దేశంలో వాస్తవానికి ప్రజాస్వామ్యం లేదని, ఊహల్లోనే అది ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజస్వామ్యం ఉందన్న ్రభ్రమల్లో బతుకుతున్నామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో దేశం ప్రమాదకర మార్గంలో వెళ్తోందని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిపై అయినా ఉగ్రవాది అని ముద్ర వేస్తారని ఆరోపించారు. ‘అది రైతులైనా, కూలీలైనా, చివరకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అయినా సరే.. మోదీని వ్యతిరేకిస్తే ఉగ్రవాది అని ముద్ర వేస్తారు’ అని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోనట్లయితే.. వ్యవసాయ రంగం, తద్వారా దేశం చాలా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘సన్నిహితులైన ముగ్గురు, నలుగురు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడం ఒక్కటే ప్రధాని మోదీ లక్ష్యం. పేదల డబ్బుతో ఆ కార్పొరేట్ల జేబులు నింపాలన్నది ప్రధాని తాపత్రయం. అందుకు అడ్డుపడే ఎవరినైనా సరే.. ఉగ్రవాదులు, దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు, నేరస్తులు అని ముద్ర వేస్తారు. అందుకు రైతులు, కూలీలు, చివరకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అయినా సరే మినహాయింపు కాదు’ అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్.. చర్చకు రా! రైతుల సంక్షేమం కోసం అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఏం చేసింది? ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందనే విషయంలో బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి బీజేపీ సవాలు చేసింది. కేంద్రంపై రాహుల్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలని తోసిపుచ్చింది. అధికారంలో ఉండగా రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర ఇవ్వలేదని, మోదీ సర్కారు వచ్చిన తరువాతనే స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేశామని, కనీస మద్దతు ధరలను భారీగా పెంచామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి శుక్రవారం ప్రధాని మోదీ రూ. 18 వేల కోట్లను జమ చేయనున్నారన్నారు. ఇప్పటివరకు రూ. 1.20 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మొత్తంగా పదేళ్లలో రూ. 7 లక్షల కోట్లు రైతులకు అందుతాయని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం చేసింది కేవలం రూ. 53 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే. అదికూడా రైతులకు ఇవ్వలేదు. బ్యాంకులకు ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ‘బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి సవాలు చేస్తున్నా. రైతుల సాధికారతకు మోదీ ఎంత కృషి చేస్తున్నారో, రైతులను కాంగ్రెస్ ఎలా నిర్లక్ష్యం చేసిందో నిరూపిస్తా’ అన్నారు. ప్రభుత్వానివి అబద్ధాలు రైతులకు అవాస్తవాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై విపక్ష పార్టీలు స్పందించాయి. ప్రధాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఒక ప్రకటన విడుదల చేశాయి. ఆందోళన మార్గం పట్టిన రైతులకు తమ సంఘీభావం కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ‘రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలను మేం పార్లమంట్లోనూ వ్యతిరేకించాం. ఓటింగ్ జరగాలని డిమాండ్ చేసిన ఎంపీలను సస్పెండ్ చేశారు’ అని కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, పీఏజీడీ, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఆరెస్పీ, ఏఐఎఫ్బీ ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకు.. సాగు చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్(లోక్శక్తి) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే విచారణలో ఉన్న కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని కోరింది. అసెంబ్లీ సెషన్ పెట్టండి నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించి, వాటిని రద్దు చేయాలని తీర్మానం చేసేందుకు వీలుగా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కు మరోసారి సిఫారసు చేయాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో సిఫారసు చేసినట్లుగా ప్రత్యేక సమావేశాలని కాకుండా, రైతుల అంశంపై చర్చ జరిపేందుకు అసెంబ్లీ 21వ సమావేశాలను డిసెంబర్ 31న ఏర్పాటు చేయాల్సిందిగా సిఫారసు చేయనున్నారు. డిసెంబర్ 23న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని గతంలో కేబినెట్ చేసిన సిఫారసును గవర్నర్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రైతులకు మళ్లీ ఆహ్వానం చర్చలకు రావాలని ఆహ్వానిస్తూ రైతు సంఘం నేతలకు ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. అయితే, కనీస మద్దతు ధర అంశానికి సంబంధించిన కొత్త డిమాండ్లేవీ చర్చల ఎజెండాలో ఉండకూడదని షరతు విధించింది. కొత్త సాగు చట్టాల పరిధిలో లేని కనీస మద్దతు ధర అంశాన్ని చర్చల్లో భాగం చేయడం అర్థం లేని పని అని వ్యాఖ్యానించింది. 40 రైతు సంఘాల నేతలను ఉద్దేశించి వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ ఈ లేఖ రాశారు. ‘రైతుల నిరసనలు ముగియాలన్న ఉద్దేశంతో వారి అన్ని అభ్యంతరాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది’ అని తెలిపారు. అరెస్ట్ సందర్భంగా మందిర్మార్గ్ పోలీస్స్టేషన్ వద్ద ప్రియాంక, రైతులు. రాష్ట్రపతికి రాహుల్ వినతిపత్రం -
అర్థంపర్థం లేని సవరణలు అక్కర్లేదు
న్యూఢిల్లీ/కోల్కతా: కొత్త వ్యవసాయ చట్టాల్లో అర్థంపర్థం లేని సవరణల అంశాన్ని ప్రస్తావించడం, తమకు ప్రేమ లేఖలు రాయడం మానుకోవాలని రైతులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలను తాము ఎప్పుడో తిరస్కరించామని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్లో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఒక సరైన ప్రతిపాదనతో చర్చలకు ముందుకు రావాలని కోరారు. సవరణలను రైతులు వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని రైతు సంఘం నేత శివకుమార్ కక్కా బుధవారం చెప్పారు. మరిన్ని సంస్కరణలు తథ్యం వ్యవసాయ రంగంలో సంస్కరణలను ప్రభుత్వం కొనసాగిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ బుధవారం చెప్పారు. ఈ రంగంలో చాలా అంశాల్లో ఇంకా సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్నారు. మూడు కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ చట్టాలపై రైతులు తదుపరి చర్చల కోసం ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని గుర్తుచేశారు. తదుపరి చర్చల కోసం తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. నూతన సాగు చట్టాలపై ప్రభుత్వం– రైతు సంఘాల మధ్య ఇప్పటిదాకా ఐదుసార్లు చర్చలు జరగ్గా, అవన్నీ విఫలమయ్యాయి. మరోవైపు కొన్ని రైతు సంఘాలు కొత్త చట్టాల విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ ఆఫ్ రూరల్ ఇండియా సదస్సులో తోమర్ పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ ఇప్పటిదాకా 3,13,363 మంది రైతుల సంతకాలతో తనకు లేఖలు వచ్చాయని తెలిపారు. వీరిలో పంజాబ్, హరియాణా రైతులు సైతం ఉన్నారని చెప్పారు. రైతన్నలకు అండగా ఉంటాం: మమతా బెనర్జీ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఐదుగురు టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓ బ్రెయిన్, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, ప్రతిమా మండల్, నదీమ్ ఉల్ హక్ ఢిల్లీలో రైతులను స్వయంగా కలిశారు. వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. నేడు రాష్ట్రపతితో కాంగ్రెస్ ఎంపీల భేటీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో నేడు భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు, నేతలు గురువారం విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం రామ్నా«థ్ కోవింద్తో సమావేశమై, కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన 2 కోట్ల సంతకాలతో పాటు మెమోరాండం సమర్పించనున్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ సంతకాలను సేకరించింది. 25న రైతులతో మోదీ సమావేశం ప్రధాని మోదీ డిసెంబర్ 25న దేశంలోని 9 కోట్ల మంది రైతులను ఉద్దేశించి ఉపన్యసించనున్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మరోమారు వెల్లడించనున్నారు. ఆన్లైన్లో జరిగే ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు పాల్గొంటారు. వారి ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
నాకు పేరొస్తుందనే.. మోదీ ధ్వజం
భోపాల్: వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానం కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం దేశంలో సాగు సంస్కరణల అవసరం ఎంతో ఉందన్నారు. కొత్త సాగు చట్టాలు ఎన్నాళ్లుగానో రాజకీయ పార్టీలు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు కోరుతున్నవేనని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఈ సంస్కరణలు తీసుకువచ్చిన పేరు మోదీకి దక్కుతుందనే బాధతోనే విపక్ష పార్టీలు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలకు గతంలో ఆయా పార్టీలు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన రైతులను ఉద్దేశించి శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు గత 23 రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన తెలుపుతున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ‘ఈ చట్టాలపై ఎవరికైనా, ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నా.. తలవంచి, చేతులెత్తి దండం పెడ్తూ చర్చలు జరిపేందుకు, వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చట్టాలు రాత్రికి రాత్రి రూపొందించినవి కావు. ఎప్పటినుంచో రైతులు, నిపుణులు, రాజకీయ పార్టీలు కోరుతున్నవే ఈ సంస్కరణలు’ అని పేర్కొన్నారు. ‘సాగు రంగం, రైతులు ఇంకా వెనకే ఉండిపోవడానికి వీల్లేదు. వారు అన్ని సదుపాయాలతో ఆధునికతను సంతరించుకోవాలి. ఈ విషయంలో ఇంకా ఆలస్యం కూడదు. సమయం ఎవరికోసం ఆగదు’ అని ప్రధాని ఉద్ఘాటించారు. గతంలో సాగు సంస్కరణలు తీసుకువస్తామని మేనిఫెస్టోల్లో పెట్టి, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని మర్చిపోయిన వారిని రైతులు ప్రశ్నించాలన్నారు. నాడు అధికారంలో ఉన్నవారికి అది ప్రధాన విషయం కాదని విమర్శించారు. ‘ఇది మోదీ ఎలా చేయగలిగారు? ఈ మంచిపేరంతా మోదీకే వస్తే ఎలా? అనేదే వారి ప్రధాన సమస్య. ఈ విషయంలో మంచిపేరు నాకు అక్కర్లేదు. ఆ క్రెడిట్ మీ మేనిఫెస్టోలకే ఇవ్వండి. ఈ సంస్కరణలు మీ మేనిఫెస్టోల్లోనే ఉన్నాయి. నాకు కావల్సింది రైతుల అభివృద్ధి మాత్రమే. ఇకనైనా రైతులను తప్పుదోవ పట్టించడం ఆపేయండి’ అని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘కొత్త చట్టాలపై మీ అభ్యంతరాలేమిటో చెప్పమని పదేపదే అడుగుతున్నాం. వారి వద్ద సమాధానం లేదు. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతున్న వారే.. ఇప్పుడు కొత్త చట్టాలతో భూమిని కోల్పోతారని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏళ్లకేళ్లు అధికారంలో గడిపారు’ అని విపక్ష కాంగ్రెస్పై మండిపడ్డారు. 25, 30 ఏళ్ల క్రితమే తీసుకురావాల్సిన సంస్కరణలను తాము ఇప్పుడు తీసుకువచ్చామన్నారు. రైతన్నలను తాము అన్నదాతలుగా భావిస్తామని, ఇప్పటికే ఎమ్మెస్పీ ద్వారా దిగుబడి వ్యయం కన్నా ఒకటిన్నర రెట్లు ఆదాయం రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చి ఆరు నెలలు గడచిపోయాయి. కోవిడ్–19 సమయంలోనూ వ్యవసాయ ఉత్పత్తులను, గతంలో వారు తమ ఉత్పత్తులను అమ్ముకునే మండీల్లోనే, కనీస మద్దతు ధరకే కొనుగోలు చేశాం’ అని గుర్తు చేశారు. ‘ఎమ్మెస్పీ విధానాన్ని రద్దు చేస్తారంటే తెలివైన వ్యక్తి ఎవరూ నమ్మరు. ఇంతకంటే పెద్ద కుట్ర, అబద్ధం ఉండదు’ అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ మార్కెట్ల విషయంలోనూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. ‘కొత్త చట్టం ప్రకారం, వ్యవసాయ మార్కెట్ సహా ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే రైతు అక్కడ తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు’ అని వివరించారు. గత ఆరు నెలల్లో ఒక్క మండీ కూడా మూతపడలేదని, మండీల ఆధునీకరణకు రూ. 500 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. సాగు చట్టాలపై 25న రైతులతో మళ్లీ మాట్లాడుతానన్నారు. -
చట్టాలకు బ్రేకులేయండి
న్యూఢిల్లీ/చండీగఢ్ : అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు గురువారం ఉద్ఘాటించింది. రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో ‘నిష్పాక్షిక, స్వతంత్ర’ కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. రైతుల నిరసన తెలిపే హక్కును హరించకూడదని సూచించింది. అయితే, నిరసన ప్రదర్శన అనేది ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదని, ఎవరికీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగరాదని పేర్కొంది. పౌరులు స్వేచ్ఛగా తిరుగాడే, ఇతర సదుపాయాలు పొందే హక్కులకు అడ్డంకి కాకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది. నిరసన తెలిపే హక్కు అంటే అర్థం నగరంలోని రోడ్లన్నీ మూసివేయడం కాదని తేల్చిచెప్పింది. ఇప్పటికిప్పుడు వ్యవసాయ చట్టాల ప్రామాణికత ప్రధానం కాదని స్పష్టం చేసింది. రైతులు చర్చలకు ముందుకు రాకుండా ఆందోళన కొనసాగిస్తున్నంత మాత్రాన ఫలితం ఉండదని, రైతాంగం డిమాండ్లు నెరవేరాలంటే చర్చలు తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే పేర్కొన్నారు. ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా నిరసనలను నిరోధించే హక్కు పోలీసులకు, అధికారులకు ఉందని గుర్తు చేశారు. జరుగుతున్న పరిణామాలు బాధాకరం రైతు ఆందోళనలకు సంబంధించిన అన్ని వాదనలు, రైతు సంఘాల అభిప్రాయాలను విన్న తరువాత, అలాగే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేసిన తరువాత మాత్రమే రైతు సమస్య పరిష్కారానికి కమిటీ నియమిస్తామని జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మేము కూడా భారతీయులమే. రైతుల దయనీయ స్థితి గురించి ఆందోళన చెందుతున్నాం. జరుగుతున్న పరిణామాల పట్ల కలవర పడుతున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తే రైతులు చర్చలకు ముందుకు రారని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేయాలని తాము కోరడం లేదని, రైతులు చర్చలకు ముందుకు వచ్చేందుకు వీలుగా తాత్కాలికంగా వాటి అమలును వాయిదా వేయాలని కోరుతున్నట్టు ధర్మాసనం తెలిపింది. రైతు సంఘాలు, నిపుణులతో కమిటీ భారీ సంఖ్యలో రైతులను నగరంలోకి అనుమతిస్తే వారు హింసకు పాల్పడరని ఎవరు హామీ ఇవ్వగలరు? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ హింస జరిగితే కోర్టు అడ్డుకోలేదని, అది కోర్టు పనికాదని గుర్తుచేసింది. పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ఇతర అధికారులపై ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంతో చర్చలు జరపకపోతే నిరసన ఉద్దేశం నెరవేరదని భారతీయ కిసాన్ యూనియన్(భాను)ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రతినిధులు, రైతు సంఘాలతో పాటు పాలగుమ్మి సాయినాథ్ లాంటి నిపుణులను కమిటీలో నియమించనున్నట్లు వెల్లడించింది. ఆగిన మరో అన్నదాత గుండె సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న మరో రైతు గుండె ఆగిపోయింది. టిక్రీ బోర్డర్లో పంజాబ్కు చెందిన 38ఏళ్ల రైతు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. మరణించిన రైతును భటిండా జిల్లాకు చెంది న జై సింగ్గా గుర్తించారు. జై సింగ్ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉ ద్యోగం ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. నరేంద్రసింగ్ తోమర్ బహిరంగ లేఖ రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని కేం ద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ఆయన తాజాగా రైతులకు బహిరంగ లేఖ రాశారు. చిన్న, సన్నకారు రైతాంగం ప్రయోజనాల కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు పునరుద్ఘాటించారు. అభ్యంతరాలుంటే చర్చలకు ముందుకు రావాలని కోరారు. తోమర్ లేఖను అందరూ చదవాలని ప్రధాని మోదీ కోరారు. చట్టాల ప్రతులు చింపిన కేజ్రీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. తాను రైతాంగానికి ద్రోహం చేయలేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కొత్త చట్టాల ప్రతులను అసెంబ్లీలో చించివేశారు. ఈ చట్టాలు బీజేపీ ఎన్నికల నిధుల కోసమే తప్ప రైతుల ప్రయోజనం కోసం కాదని ఆరోపించారు. ‘‘గడ్డకట్టే చలిలో, కేవలం రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య రోడ్లపైనే నా దేశ రైతాంగం నిద్రిస్తుంటే, వారికి నేను ద్రోహం చేయలేను. తొలుత నేను ఈ దేశ పౌరుడిని, ఆ తరువాతే ముఖ్యమంత్రిని’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరసన ఉద్యమంలో ఇప్పటికే 20 మంది రైతులు మరణించారని, ఇంకెప్పుడు మేల్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు. మంత్రులతో అమిత్ భేటీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం పలువురు సహచర మంత్రులతో భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్లతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రైతుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహనా కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.బీజేపీ శ్రేణులు ఎంతవరకు రైతాంగాన్ని చేరగలిగారనే అంశంపై సమీక్షించినట్టు తెలుస్తోంది. -
మేమే కమిటీ వేస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: గత 20 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తోన్న రైతాంగం సమస్యల పరిష్కారానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేంగా గడ్డకట్టే చలినిసైతం లెక్కచేయకుండా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తోన్న రైతాంగం సమస్య పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కోర్టు ఎత్తిచూపింది. రైతుల సమస్య పరిష్కారం కాకపోతే ఇది జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఇదే నేపథ్యంలో యావత్ దేశంలోని రైతు సంఘాలతో కలిపి తామే ఒక కమిటీని నియమించనున్నట్టు తేల్చి చెప్పింది. సమస్య పరిష్కారం విషయంలో ఇరు పక్షాలకు చిత్తశుద్ధి అవసరమని చెప్పకనే చెప్పింది. చర్చలు ఫలవంతం కావాలన్న అభిలాశ ఇరుపక్షాలకూ ఉండాలని, అప్పుడే చర్చలు ఫలవంతం అవుతాయని కోర్టు అభిప్రాయపడింది. అటువంటి సంస్థల పేర్లను తెలియజేయాల్సిందిగా కోర్టు, ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ని కోరింది. రేపటిలోగా చెప్పండి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తోన్న రైతాంగాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారించిన ధర్మాసనం రైతుల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఇది ఇలాగే కొనసాగితే ఇది జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉన్నదని అభిప్రాయపడింది. సంబంధిత రైతాంగం వాదనలను వినేందుకు సైతం కోర్టు సమ్మతిని తెలియజేసింది. అలాగే ప్రజాప్రయోజన వ్యాజ్యంపై రేపటిలోగా సమాధానమివ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ చర్యలు చేపట్టలేదని సొలిసిటర్ జనరల్ విచారణ సందర్భంగా కోర్టుకి వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా రైతులకు సూచించాలని ఆయన కోర్టుని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జరిపిన చర్చలు సత్ఫలితాలనివ్వలేదని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించారు. -
నిరసన గళం వారిదే
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వారి గళం దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. కేంద్రం బుజ్జగించినా వినడం లేదు, కరుకు లాఠీ దెబ్బలకి వెరవడం లేదు. 20 రోజులు దాటిపోయింది. ఢిల్లీ వీధుల్లో నిరసనలు హోరెత్తిపోతున్నాయి. ఈ రైతు పోరాటంలో పంజాబ్ రైతులే ఎందుకు ముందున్నారు? వారే ఎందుకు ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు ? హరిత విప్లవం వెల్లువెత్తిన రాష్ట్రం అది. దేశంలో ఆర్థిక సరళీకరణలు ప్రారంభమవడానికి ముందే అర్బన్ ఇండియా పురోగతికి బీజాలు వేసిన రాష్ట్రం అది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు అత్యధికంగా పెట్టే రాష్ట్రంలోనూ పంజాబే ముందుంటుంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో దేశం మొత్తమ్మీద ఎక్కువగా లబ్ధి పొందేది పంజాబ్ రైతులే. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) దేశం మొత్తమ్మీద పండే పంటలో 10శాతాన్ని కొంటే పంజాబ్లో పండే పంటలో 90% శాతాన్ని కొనుగోలు చేస్తుంది. కొత్త సాగు చట్టాలు ఒకే దేశం ఒకే మార్కెట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్రాలు ఎలాంటి సెస్లు, పన్నులు విధించడానికి వీల్లేదు. దీంతో మండీ వ్యవస్థ నీరు కారిపోయి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కే ఎసరొస్తుందన్న ఆందోళనలు రైతుల్లో ఉన్నాయి. దేశంలోని వ్యవసాయ ఉత్పాదకతలో 70శాతం పంజాబ్, ఏపీ, కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హరియాణా, మహారాష్ట్రల నుంచి వస్తోంది. ఆ 8 రాష్ట్రాల్లో సాగు భూమి, వ్యవసాయ ఉత్పత్తుల వాటా, వ్యవసాయ రంగంలో పెట్టే పెట్టుబడులు, చేసే ఆదా, ఎరువుల వినియోగం వంటి గణాంకాలన్నీ పంజాబ్ రైతులు ఈ పోరాటాన్ని ఎందుకంత ఉధృతంగా చేస్తున్నారో తేటతెల్లం చేస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న రైతు నిరసనల్లో మహిళలు అంతగా కనిపించడం లేదు. దీనికి కారణం పంజాబ్లో భూమిపై హక్కులు కలిగిన మహిళల సంఖ్య చాలా తక్కువ. దేశంలోని మహిళల్లో సగటున 12.9% మంది మాత్రమే భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారు. ఈ అంశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కాస్త మెరుగ్గా ఉన్నాయనే చెప్పాలి. దక్షిణాదిన 15.4% మంది మహిళలకి భూమిపై హక్కులు ఉంటే, ఉత్తరాదిన 9.8 శాతంగా ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం వంటివి సాధించాలంటే మహిళలకు భద్రమైన జీవితం, భూమిపై హక్కులు ఉండాలి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం వ్యవసాయ కూలీల్లో 32% ఉన్న మహిళలు ఉత్పత్తి విషయానికొచ్చేసరికి 55–66శాతం వాటా ఇస్తున్నారు. -
రైతన్న నిరశన విజయవంతం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం రైతులు చేపట్టిన ఒక రోజు నిరశన దీక్ష విజయవంతమైంది. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద 32 రైతు సంఘాల నాయకులు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లోనూ నిరశన దీక్షలు జరిగాయని రైతు నేతలు తెలిపారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత 18 రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. గత 18 రోజుల్లో ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలో పాల్గొంటున్న 20 కి పైగా నిరసనకారులు మరణించారు. వారికి నివాళిగా సోమవారం ఉదయం రైతు నేతలు, నిరసనకారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతు నిరశన దీక్షలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి ఆప్ కార్యాలయంలో ఆయన నిరాహార దీక్ష చేశారు. కొత్త సాగు చట్టాలు కొందరు కార్పొరేట్లకే ప్రయోజనకరమని, వాటి వల్ల ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదముందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ చట్టాలు రైతులకు, సామాన్యులకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో రైతులు జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలిపారని రైతు నేతలు తెలిపారు. ‘ఇది కేవలం పంజాబ్ రైతుల నిరసన కాదు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నిరసన ప్రదర్శన అన్న సందేశాన్ని ఇవ్వాలనుకున్నాం’ అని సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘం నేత శివ కుమార్ కక్కా పేర్కొన్నారు. నిరశన దీక్ష ముగిసిన తరువాత కూడా సింఘు సహా నిరసన కేంద్రాల్లో నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన కొనసాగాయి. ‘అన్నదాత ఇప్పుడు ఆకలితో నిరసనలో పాల్గొంటున్నాడన్న సందేశం దేశ ప్రజలకు ఇవ్వడానికే ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టాం’ అని మరో రైతు సంఘం నేత హరిందర్ సింగ్ లోఖావాల్ తెలిపారు. మహిళలతో పాటు, మరింత మంది రైతులు నిరసనల్లో పాల్గొనేందుకు ఢిల్లీ సరిహద్దులకు రానున్నారని, వారి వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మరోవైపు, వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్పై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించామని సోమవారం ‘ఫిక్కీ’ సదస్సులో వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగం తల్లిలాంటిదని వ్యాఖ్యానించారు. చర్చలు కొనసాగించేందుకు, మరో విడత చర్చల తేదీని నిర్ణయించేందుకు రైతు నేతలను సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కచ్చితంగా మళ్లీ చర్చలు ప్రారంభమవుతాయన్నారు. చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు అంశాలవారీగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. అంతకుముందు, తోమర్ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం, సాగు చట్టాలకు మద్దతిస్తున్న ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేసీసీ) ప్రతినిధులను కలుసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి పనిపై వచ్చి.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమంపై వస్తున్న నకిలీ వార్తలను అడ్డుకోవడానికి వీలుగా ట్విట్టర్ ఖాతా పని చేస్తోంది. ‘ట్రాక్టర్2ట్విట్టర్’ అనే పేరుతో ఉన్న ఈ అకౌంట్ను ఆస్ట్రేలియాలో పని చేసే ఓ ఐటీ నిపుణుడు క్రియేట్ చేసి రైతులకు మద్దతుగా పోస్టులు చేస్తున్నాడు. పంజాబ్లోని లూధియానాకు చెందిన భావ్జిత్ సింగ్ ఆస్ట్రేలియాలో ఐటీ నిపుణుడిగా పని చేస్తున్నారు. గత అక్టోబర్లో వ్యక్తిగత పనిపై ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమించడం ప్రారంభమైంది. అయితే ఆ ఉద్యమంపై నకిలీ వార్తలు పుట్టుకొస్తుండటంతో వాటిని తిప్పి కొట్టాలని భావ్జిత్ నిర్ణయించుకున్నారు. అనంతరం ట్రాక్టర్2ట్విట్టర్ అకౌంట్ను ప్రారంభించారు. నవంబర్ 28న ప్రారంభించిన ఈ ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం 10 వేల మందికి పైగా ఫాలోవర్లతో పాటు, 2.5 మిలియన్ల ఇంప్రెషన్లు దక్కాయని ఆయన వెల్లడించారు. హిందీ, ఇంగ్లీషు, పంజాబీ భాషల్లో ఫొటోలు, వీడియోలు, న్యూస్ పోస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ఘాజీపూర్ బోర్డర్లో రైతుతో నిరాహార దీక్ష విరమింపజేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికీయత్ -
ఇక మహా పోరాటమే
న్యూఢిల్లీ/చండీగఢ్/మథుర: తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని రైతు సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే మహా పోరాటం తప్పదని తేల్చిచెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 14న సింఘు బోర్డర్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్ వద్ద రైతు సంఘం నాయకుడు, సంయుక్త కిసాన్ ఆందోళన్ ప్రతినిధి కన్వల్ప్రీత్ సింగ్ పన్నూ మీడియా సమావేశంలో మాట్లాడారు. వేలాది మంది రైతులు ట్రాక్టర్లపై ఆదివారం రాజస్తాన్లోని షాజహాన్పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారని చెప్పారు. వారు ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధిస్తారని అన్నారు. ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. తమ తల్లులు, సోదరీమణులు, బిడ్డలు సైతం త్వరలో ఈ పోరాటంలో భాగస్వాములవుతారని తెలిపారు. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి రైతులు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వారు గమ్య స్థానానికి చేరుకుంటారని అన్నారు. చట్టాల రద్దుపై చర్చించిన తర్వాతే ఇతర అంశాలపై ప్రభుత్వంలో చర్చలు సాగిస్తామని స్పష్టం చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. అదే రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట రైతన్నలు ధర్నాలు చేస్తారని వెల్లడించారు. రైతు సంఘాల మధ్య చిచ్చుపెట్టి, ఉద్యమాన్ని బలహీనపర్చాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, సర్కారు ఎత్తులు సాగవని కన్వల్ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ నగరంతోపాటు సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లో శనివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. రద్దు చేస్తే ఉద్యమిస్తాం కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు వీధుల్లోకి వస్తున్నారు. మరోవైపు ఈ చట్టాలను సమర్థించే వారు కూడా తమ వాదనకు పదును పెడుతున్నారు. హరియాణాకు చెందిన 29 మంది రైతులు శనివారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను కలిశారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని, వీటిని రద్దు చేస్తే సహించబోమని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. టోల్ప్లాజాల ముట్టడి తమ పోరాటంలో భాగంగా హరియాణా రైతులు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రంలోని టోల్ ప్లాజాలను ముట్టడించారు. వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయకుండా అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్లో: రైతుల పోరాటానికి మద్దతుగా బీకేయూ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్లోని యమునా ఎక్స్ప్రెస్ వే పై ఉన్న మాంత్ టోల్ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. కొంత సేపు టోల్ రుసుములు వసూలు చేయనివ్వలేదు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. టోల్ రుసుములు వసూలు చేయొద్దంటూ డిమాండ్ చేశారు. ఘాజీపూర్ వద్ద పోలీసులు బ్లాక్ చేసిన రోడ్డుపై నిద్రిస్తున్న రైతు -
రైతుల ఆదాయం పెంచడానికే
న్యూఢిల్లీ: దేశంలో రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి నూతన వ్యవసాయ చట్టాలకు రూపకల్పన చేశామని తెలిపారు. అడ్డంకులను తొలగించడంతోపాటు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను పెంచడానికి సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆ దిశగానే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చామని పేర్కొన్నారు. తన విధానాలు, చర్యల ద్వారా అన్నదాతల ప్రయోజనాలను కాపాడడానికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ శనివారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) 93వ వార్షిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కొత్త సాగు చట్టాలపై రైతుల భయాందోళనలను దూరం చేసే ప్రయత్నం చేశారు. రైతాంగం సందేహాలను నివృత్తి చేస్తూ ఆయన ఇంకా ఏమన్నారంటే.. రైతులకు డిజిటల్ వేదికలు వ్యవసాయ రంగంలో మరిన్ని పెట్టుబడులు రావడానికి, రైతులకు లబ్ధి చేకూరడానికి సంస్కరణలు దోహదపడతాయి. అన్నదాతలను సంపన్నులను చేయడమే ప్రభుత్వ సంస్కరణల ప్రధాన లక్ష్యం. ఈ చట్టాలతో రైతులకు ఎన్నో లాభాలు ఉంటాయి. వారు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి నిర్దేశిత మార్కెట్లలోనే కాకుండా వెలుపల కూడా అదనపు వెసులుబాటు లభిస్తుంది. రైతులు ప్రస్తుతం మార్కెట్లలో లేదా దళారులకు పంటలను విక్రయించుకోవాల్సి వస్తోంది. కొత్త చట్టాలతో మార్కెట్లను ఆధునీకరిస్తారు. రైతులకు డిజిటల్ వేదికలు అందుబాటులోకి వస్తాయి. విక్రయం, కొనుగోలు మరింత సులభ తరం అవుతుంది. ఇవన్నీ రైతుల ఆదాయం పెంచడం కోసమే. ఆదాయం పెరిగితే రైతులు ధనవంతులవుతారు. తద్వారా ఇండియా ధనిక దేశంగా మారుతుంది. కొత్త మార్కెట్లు... కొత్త అవకాశాలు నూతన సంస్కరణల అమలుతో రైతాంగానికి కొత్త మార్కెట్లు, కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారు. కోల్డ్ స్టోరేజీల్లో సదుపాయాలు మెరుగవుతాయి. వీటన్నింటితో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. ఈ సంస్కరణలో చిన్న, సన్నకారు రైతులు గరిష్ట ప్రయోజనాలు పొందుతారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రంగం వెలుగులీనుతోంది. రైతులకు మేలు చేకూర్చే చర్యలు ప్రారంభించాం. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. ఇథనాల్ను పెట్రోల్లో కలుపుతున్నారు. దీంతో విదేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోగలుగుతున్నాం. చెరకు పండించే రైతులకు మంచి ధర లభిస్తోంది. అడ్డుగోడలను కూల్చేస్తున్నాం... వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ వంటివి వేర్వేరుగా పని చేస్తున్నాయి. ఈ విధానం సరైంది కాదు. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానం కావాలి. వివిధ రంగాల మధ్య వారధులు ఉండాలి తప్ప అడ్డుగోడలు కాదు. ఈ అడ్డుగోడలను కూల్చడానికి కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మారుమూల పల్లెల్లోనూ ప్రజలకు బ్యాంకు ఖాతా, విశిష్ట గుర్తింపు సంఖ్య, తక్కువ ధరకే మొబైల్ డేటా అందుతున్నాయి. వీటితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థ మన దేశంలో అవతరించింది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం వ్యవసాయ రంగంలో పారిశ్రామికవేత్తల పాత్ర పరిమితంగానే ఉంది. వారు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి. కోల్డ్ స్టోరేజీలు, ఎరువుల తయారీలో ప్రైవేట్ రంగం పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి. పెట్టుబడిదారులకు గ్రామీణ ప్రాంతాలు మంచి ఎంపిక. ఇంటర్నెట్ వినియోగం నగరాల కంటే గ్రామాల్లో అధికంగా ఉంది. 98 శాతం గ్రామాలు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనతో అనుసంధానం అయ్యాయి. వారు సామాజిక, ఆర్థిక చైతన్యం కోరుకుంటున్నారు. పల్లె ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలకు వైఫై సేవలు అందించేందుకు ఇటీవల ‘ప్రధానమంత్రి వాణి’ ప్రాజెక్టును ప్రారంభించాం. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచడానికి ఉద్దేశించిన ఈ వేదికను పారిశ్రామిక రంగం ఉపయోగించుకోవాలి. 21వ శతాబ్దపు పురోగతికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అందించే సహకారమే కీలకం. అందుకే ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి. ఈ అవకాశం వదులుకోవద్దు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు గ్రామాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే ధ్యేయంగా ప్రభుత్వ విధానాలను రూపొందించాం. కనిష్ట స్థాయికి సర్కారు నియంత్రణలు కరోనా మహమ్మారి అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనే సంకేతాలను ఆర్థిక సూచికలు ఇస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ నియంత్రణలను కనిష్ట స్థాయికి తగ్గించి, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం. కరోనా మహమ్మారి మొదలైన ఫిబ్రవరితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎంతో మెరుగయ్యాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించడానికి గత ఆరేళ్లుగా పలు కార్యక్రమాలు చేపట్టాం. వీటి ఫలితంగా కరోనా సమయంలోనూ రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇతర పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, తయారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో ఎన్నో కీలక మార్పులు వచ్చాయి. పన్నుల్లోనూ సంస్కరణలు తెచ్చాం. దీంతో ట్యాక్స్ టెర్రరిజం, ఇన్స్పెక్టర్రాజ్ అంతమయ్యాయి. 20–20 క్రికెట్ మ్యాచ్లో పరిణామాలు శరవేగంగా మారుతుండడం మన చూస్తుంటాం. అదే తరహాలో 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. -
సుప్రీం మెట్లెక్కిన రైతులు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన మరో మలుపు తిరిగింది. ఈ చట్టాల రద్దుకు బదులుగా కొన్ని సవరణలు చేస్తా మంటూ కేంద్రం ప్రకటించడం, పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. మూడు కొత్త సాగు చట్టాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ భాను(బీకేయూబీ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. బీకేయూబీ అధ్యక్షుడు భాను ప్రతాప్సింగ్ శుక్రవారం ఈ విషయం తెలిపారు. మూడు చట్టాల రాజ్యాంగబద్ధతను, చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి రవి, ఛత్తీస్గఢ్ కిసాన్ కాంగ్రెస్ నేత రాకేశ్ వైష్ణవ్ తదితరులు గతంలో సుప్రీంకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం అక్టోబర్ 12న కేంద్ర ప్రభుత్వానికి జవాబు చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ చట్టాల అమలుపై స్టే విధించాలని కోరుతూ భారతీయ కిసాన్ పార్టీ నవంబర్లో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లన్నింటిపై డిసెంబర్ చివరి వారంలో సుప్రీంకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ఏకపక్షంగా ఆమోదించారు.. పార్లమెంట్లో పూర్తిస్థాయిలో చర్చ జరపకుండానే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లులను ఆమోదించి, సాగు చట్టాలను తీసుకొచ్చిందని భాను ప్రతాప్సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రైతు సంఘాల వాదనలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సర్కారు నిర్ణయం వల్ల రైతులు కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు ముమ్మాటికీ ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం, రైతు వ్యతిరేకమని తెలిపారు. తిరుచ్చి రవి దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు కూడా ఇంప్లీడ్ కావాలని భాను ప్రతాప్సింగ్ అభ్యర్థించారు. చర్చలకు సిద్ధం: ఏఐకేఎస్సీసీ రైతుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్సీసీ) స్పష్టం చేసింది. చర్చల నుంచి రైతు సంఘాల నేతలు అర్ధాంతరంగా వెళ్లిపోయారంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఢిల్లీ శివారులోని సింఘు, టిక్రీ, గాజీపూర్, పల్వాల్లోని ధర్నా ప్రాంతాలకు దేశవ్యాప్తంగా రైతులు తరలి వస్తున్నారని తెలి పింది. డిసెంబరు 15న ముంబైలో, 16న కోల్కతా లో నిరసనలు నిర్వహించనున్నట్లు ఏఐకేఎస్సీసీ తెలిపింది. సంఘ వ్యతిరేక శక్తులతో జాగ్రత్త సాగు చట్టాలపై పోరు సాగిస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. సంఘ వ్యతిరేక, వామపక్ష, మావోయిస్టు శక్తులు చొరబడి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రమాదముందని పేర్కొంది. వేర్వేరు ఆరోపణల కింద అరెస్టయిన హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలంటూ టిక్రి వద్ద జరుగుతున్న నిరసనల్లో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడంపై వ్యవసాయ మంత్రి తోమర్ ఈ మేరకు అప్రమత్తం చేశారు. 14న పంజాబ్లో కాంగ్రెస్, ఆప్ నిరసనలు సాగు చట్టాల రద్దు కోసం పోరాడుతున్న రైతులకు అండగా నిలుస్తామని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించాయి. రైతులకు మద్దతుగా 14వ తేదీన పంజాబ్లో రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపాయి. రైతుల డిమాండ్ల విషయంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. వారికి సంఘీభావంగా 14న ఉత్తర ప్రదేశ్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుతంగా బైఠాయింపులు నిర్వహిస్తామని వెల్లడించారు. 11వ రోజుకు చేరిన ఆందోళనలు కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ–నోయిడా సరిహద్దులో రైతులు సాగిస్తున్న ఆందోళన శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ను కలిపే ఈ సరిహద్దు వద్ద రైతుల నిరసనల కారణంగా అధికారులు వాహనాల రాకపోకలను పాక్షికంగా నిలిపివేశారు. ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. 700 జిల్లాల్లో ప్రచారం.. 100 ప్రెస్మీట్లు.. వాస్తవాల వివరణకు బీజేపీ నిర్ణయం న్యూఢిల్లీ: వ్యవసాయరంగంలో తీసుకువచ్చిన మూడు కొత్త చట్టాలతో ఒనగూరే లాభాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ చట్టాలతో రైతన్నలకు లబ్ధి కలుగుతుందే తప్ప ఎలాంటి నష్టం ఉండబోదని తెలియజేయనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనుంది. త్వరలో 100 మీడియా సమావేశాలు, 700కు పైగా జిల్లాల్లో ప్రజలతో భేటీలు, ప్రచార కార్యక్రమాలు తలపెట్టింది. ఈ ప్రచార పర్వంలో కేంద్ర మంత్రులు సైతం పాల్గొంటారని, కొత్త చట్టాల గురించి ప్రజలకు సవివరంగా తెలియజేస్తారని, సందేహాలను నివృత్తి చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళన ఉధృతం అవుతుండడం, ప్రతిపక్షాలు సైతం ఒక్కతాటిపైకి వస్తుండడంతో బీజేపీ అప్రమత్తమైంది. సాగు చట్టాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించి, వాస్తవాలను వివరించాలని నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే ఈ చట్టాల ప్రయోజనాలపై ప్రధాని సహా పార్టీ నేతలు పలుమార్లు ప్రజలకు వివరణలు ఇచ్చారు. సాగు చట్టాల విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. -
రైతన్నలూ.. చర్చలకు రండి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. రాతపూర్వకంగా ఇస్తామన్న హామీలను పరిశీలించాలని కోరారు. చర్చల తేదీని వారే నిర్ణయించవచ్చని అన్నారు. వ్యవసాయ చట్టాల్లోని కొన్ని నిబంధనలను సవరిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని తిరస్కరిస్తూ రైతు సంఘాలు తదుపరి ఆందోళనకు కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తోమర్ గురువారం ఢిల్లీలో రైల్వే, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘రైతులకు అభ్యంతరాలు ఉంటే కొత్త చట్టాల్లో ఏవైనా నిబంధనలను విశాల దృక్పథంతో పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల అనుమానాలను నివృత్తి చేస్తాం. వారి సమస్యలను పరిష్కరించడానికి రైతు సంఘాల నాయకుల సలహాల కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, కొత్త చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో వారు మళ్లీ మొదటికొస్తున్నారు’’ అని తోమర్ వ్యాఖ్యానించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్ను తోసిపుచ్చారు. ‘‘తీవ్రమైన చలి వాతావరణంలో, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తుండడం పట్ల ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని తోమర్ చెప్పారు. సమస్య పరిష్కారంపై తాను అశాభావంతో ఉన్నానన్నారు. చర్చలు పురోగతిలో ఉండగానే రైతు సంఘాలు తదుపరి దశ పోరాట కార్యాచరణను ప్రకటించడం సరైంది కాదని తోమర్ ఆక్షేపించారు. కొత్త చట్టాలతో ఎంఎస్పీకి ఢోకా లేదు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) అమలు కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై రాతపూర్వక హామీ ఇస్తామని బుధవారం ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. రైతుల భయాందోళనలు తొలగించడానికి కనీసం 7 సమస్యలపై అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటికి రైతు సంఘాలు ససేమిరా అనడంతో చర్చలకు విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు తదుపరి చర్చలకు పిలుపునిచ్చారు. కొత్త చట్టాలు ఎంఎస్పీని ప్రభావితం చేయవని, పైగా రక్షణగా ఉంటుందని పీయూష్ గోయెల్ అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేట్ మార్కెట్లలో విక్రయించడానికి అదనపు ఎంపికను మాత్రమే ఈ చట్టం ఇస్తుందని వివరించారు. సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేసుకోవచ్చు రైతుల అభ్యంతరాలపై ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదనను పంపుతుందని 13 యూనియన్ నాయకులతో మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో హోం మంత్రి అమిత్ షా చెప్పగా.. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. కొత్త చట్టాల తరువాత వ్యవసాయ మార్కెట్లు బలహీనపడతాయన్న రైతుల ఆందోళనకు పరిష్కారంగా.. సవరణలు చేయవచ్చని, రాష్ట్ర ప్రభుత్వాలు మండీల వెలుపల పనిచేసే వ్యాపారులను నమోదు చేయవచ్చని కేంద్రం ప్రతిపాదించిందని తాజాగా మంత్రులు గుర్తుచేశారు. రాష్ట్రాలు వాటిపై కూడా ఏపీఎంసీ మండీల తరహాలో పన్ను, సెస్ విధించవచ్చని వివరించారు. వివాదాల పరిష్కారం కోసం సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేసే హక్కు రైతులకు లభించకపోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. అందుకే సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేయడానికి వీలుగా నిబంధనల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు చెప్పారు. కార్పొరేట్ సంస్థలు సాగు భూములను స్వాధీనం చేసుకుంటాయన్న భయాన్ని తొలగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద సాగు భూములను అటాచ్ చేయడంపై ఇంకా స్పష్టత ఇస్తామన్నారు. ప్రస్తుత కనీస మద్దతు ధర అమలు ప్రక్రియ కొనసాగుతుందని లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమేనన్నారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. రైతుల విషయంలో ప్రస్తుత విద్యుత్ బిల్లు చెల్లింపు విధానంలో ఎటువంటి మార్పు ఉండదని మంత్రులు వెల్లడించారు. రైతుల వెనుక ఎవరున్నారో తేల్చండి ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల వెనుక ఏయే శక్తుల ఉన్నాయో నిగ్గు తేల్చాలని నరేంద్ర సింగ్ తోమర్, పీయూస్ గోయెల్ ప్రసార మాధ్యమాలను కోరారు. ‘‘మీడియా కళ్లు చురుగ్గా ఉంటాయి. మీ దర్యాప్తు నైపుణ్యాలను ఉపయోగించండి. రైతుల ఆందోళన వెనుక ఉన్న శక్తులు ఏమిటో బయటపెట్టండి. చర్చల కోసం రైతులు ముందుకు రాకుండా వెనక్కి లాగుతున్న అంశమేమిటో గుర్తించండి’’ అని పేర్కొన్నారు. కార్పొరేట్ల కోసమే.. కొత్త చట్టాలను రైతులు స్వాగతిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి తోమర్ చేసిన ప్రకటనను అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్సీసీ) తప్పుపట్టింది. ఈ చట్టాల విషయంలో కేంద్ర మంత్రులు తప్పుడు వాదనలు వినిపిస్తున్నారని, బహిరంగంగా అసత్యాలు వల్లెవేస్తున్నారని విమర్శించింది. బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే కొత్త చట్టాలు తెచ్చారని ఆరోపించింది. ఈ విషయాన్ని సామాన్య ప్రజలు సైతం అర్థం చేసుకుని రైతుల పోరాటానికి మద్దతు ఇస్తున్నారని గుర్తుచేసింది. 14 రోజుల్లో 15 మంది.. చండీగఢ్: సాగు చట్టాలపై ఢిల్లీలో, నగర శివార్లలో 14 రోజులుగా ఉద్యమిస్తున్న రైతుల్లో 15 మంది వేర్వేరు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను సహచర రైతులు పంజాబ్లోని స్వస్థలాలకు చేరుస్తున్నారు. ప్రతి రోజూ ఒక్క మృతదేహమైనా ఢిల్లీ నుంచి పంజాబ్కు చేరుకుంటోందని వారు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. గుండెపోటుతో 10 మంది రైతన్నలు తనువు చాలించారు. చలిని తట్టుకోలేక మరో రైతు మరణించాడు. మృతుల్లో మహిళలూ ఉన్నారు. రైలు పట్టాలపై పోరాటం! సా గుచట్టాలను తక్షణమే రద్దు చేయాలనే తమ డిమాండ్ను నెరవేర్చకపోతే ఇకపై దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమ కార్యాచరణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సింఘు వద్ద ఆందోళన కొనసాగిస్తున్న రైతులు గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దిగి రాకపోతే ఢిల్లీకి దారితీసే అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధిస్తామని పేర్కొన్నారు. సర్కారు మొండి వైఖరి అవలంబిస్తే రైల్వే ట్రాక్లపై పోరాటం తప్పదని, ఇది పంజాబ్, హరియాణాల్లోనే కాదు, దేశమంతటా జరుగుతుందని రైతు సంఘం నాయకుడు బూటా సింగ్ స్పష్టం చేశారు. -
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్ బంద్ జరగనుంది. ఈ దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు బంద్లో చురుగ్గా పాలుపంచుకోనున్నారు. బంద్లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ను పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు, రైతులు ప్రకటించిన భారత్ బంద్నకు నైతిక మద్దతు తెలుపుతున్నామని పది కార్మిక సంఘాల ఐక్య కమిటీ సోమవారం ప్రకటించింది. బంద్కు మద్దతు తెలుపుతూనే, కార్మికులు విధుల్లో పాల్గొంటారని పేర్కొంది. డ్యూటీలో ఉండగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని, విధుల్లోకి వెళ్లేముందు కానీ విధులు ముగిసిన తరువాత కానీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపింది. కార్మికులు స్ట్రైక్ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని హిందూ మజ్దూర్ సభ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ వివరించారు. కాగా, బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. ఢిల్లీ–మీరట్ ఎక్స్ప్రెస్ హైవేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు కోవిడ్–19 ముప్పు పొంచి ఉన్న కారణంగా, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని పలు సరిహద్దుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసిన విషయం తెలిసిందే. మరో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి. వేలాదిగా రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సందర్శించారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ‘తాత్కాలిక జైళ్లుగా ఢిల్లీలోని స్టేడియంలను వాడుకునేందుకు అనుమతించాలని మాపై భారీగా ఒత్తిడి వచ్చింది. మేం వారి ఒత్తిడికి తలొగ్గలేదు. అది ఉద్యమానికి సహకరించింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. రైతులకు కష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సేవకుడిలా మీ వద్దకు వచ్చాను’ అని రైతులతో పేర్కొన్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్దతివ్వండి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్లో పాల్గొనేలా ఎవరినీ ఒత్తిడి చేయవద్దని తమ మద్దతుదారులను కోరాయి. శాంతియుతంగా బంద్ జరపాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్ ఏక్తా సంఘటన్ అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దాలేవాలా కోరారు. ‘మేం పిలుపునిచ్చిన బంద్ రాజకీయ పార్టీలిచ్చే బంద్ లాంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే ప్రతీకాత్మక బంద్. ఈ నిరసనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం’ అని రైతు సంఘం నేత రాకేశ్ తికాయిత్ వివరించారు. ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగు తుందని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు. తాజా చట్టాలు రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఇన్నాళ్లు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి సవరణలు చేసేందుకు సిద్ధమని ఎందుకు చెప్తోందని మరో రైతు నేత దర్శన్ పాల్ ప్రశ్నించారు. బంద్కు మద్దతుగా మంగళవారం అన్ని రవాణా కార్యకలాపాలను నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రకటించింది. ఏఐఎంటీసీ దేశవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది ట్రక్కు యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో, దేశవ్యాప్తంగా నిత్యావసరాల రవాణాపై ప్రతికూల ప్రభావం పడనుంది. అతిపెద్ద రైల్వే కార్మిక విభాగాలైన ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి. బంద్కు మద్దతుగా రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తారని తెలిపాయి. కాగా, తమ కార్యకలాపాలు మంగళవారం కూడా కొనసాగుతాయని వాణిజ్యవేత్తల సంఘం సీఏఐటీ, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేశాయి. బంద్లో నేరుగా పాల్గొనబోవటం లేదని బ్యాంక్ యూనియన్లు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. విరామ సమయాల్లో బంద్కు మద్దతుగా బ్యాంక్ బ్రాంచ్ల ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తారని తెలిపింది. ప్రతిపక్షాల ద్వంద్వ నీతి రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం విపక్షాల ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. సాగు చట్టాల్లోని నిబంధనలను కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్షాలు గతంలో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తామని 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్ర చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతూ.. ఉనికి కోసం రైతు ఉద్యమాన్ని వాడుకుంటున్నాయని, రైతుల్లోని కొన్ని వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. 16 రాష్ట్రాలపై ప్రభావం బంద్ వల్ల 16 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించింది. బంద్లో పాల్గొనే వామపక్ష అనుకూల అతివాదులు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని జోనల్ మేనేజర్లకు సూచించారు. సైకిల్పై 300 కి.మీ. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ఇద్దరు యువకులు సైకిల్ మీద ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించారు. జోవన్ ప్రీత్ సింగ్ (24), గురిందర్ జీత్ (26)లు పంజాబ్లోని బర్నాలా నుంచి రెండు రోజుల క్రితం ప్రయాణమై సోమవారానికి ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ట్రాక్టర్లలో ప్రయాణించాలంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, అందుకే సైకిళ్లపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దారిపొడవునా అప్పటికే రైతులు ఉండటంతో తిండికేమీ లోటు లేదని, రాత్రి వేళ ట్రాక్టర్లలో పడుకున్నామని చెప్పారు. ఆ చట్టాలు మంచివే.. కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి చెప్పారు. ఈ చట్టాలను సమర్ధిస్తున్న రైతుల బృందంతో తోమర్ సోమవారం సమావేశమయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హరియాణాకు చెందిన రైతు కన్వల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ బృందం తోమర్ను కలిసింది. ఈ బృందంలో భారతీయ కిసాన్ యూనియన్(అత్తార్) జాతీయ అధ్యక్షుడు అత్తార్ సింగ్ సంధూ కూడా ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయవద్దని, అవసరమైతే కొన్ని సవరణలు చేయాలని ఈ బృందం మంత్రిని కోరింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని తోమర్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం వైఫై.. ఢిల్లీ–హరియాణా సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ ముందుకు వచ్చింది. ఢిల్లీ సరిహద్దు వద్ద ఓ రూటర్ ఏర్పాటు చేశామని, అలాగే హరియాణా సరిహద్దు వద్ద పోర్టబుల్ డివైజ్ల నుంచి వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు తమ ఇంట్లో ఉన్నవారితో మాట్లాడుకుంటారని, రైతుల పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరువుతారని ఎన్జీవో సభ్యులు తెలిపారు. అర్జున, పద్మ అవార్డులను వెనక్కు ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్న మాజీ క్రీడాకారులు రైతుల డిమాండ్లు ► ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలి. ► మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలి. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలి. రైతుల అనుమానాలు ► సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ► ఒకే దేశం –ఒకే మార్కెట్ విధానంతో భవిష్యత్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. ► మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాలను సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి రావడం. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్తో భూములకు రక్షణ కరువవుతుంది. ► నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమంటోంది? ► సాగు చట్టాలకు రైతు సంఘాలు కోరిన మేరకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం. ► కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. ► రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం. ► రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ► కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాలను సూచనలు కోరుతున్నాం. పీటముడి ఎక్కడ? ► వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. -
మద్దతు ధరకు ఢోకా లేదు
సాక్షి, న్యూఢిల్లీ: మద్దతు ధర ప్రధాన అంశంగా వ్యవసాయ బిల్లుల రద్దు డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల ఆందోళనను పరిష్కరించేందుకు కేంద్రం స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైతులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జరగనున్న ఆరో విడత చర్చల్లో మరింత స్పష్టతతో రైతులకు భరోసా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రైతుల ప్రతినిధి బృందం, కేంద్ర మంత్రుల మధ్య విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన ఐదో విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మళ్లీ డిసెంబర్ 9న సమావేశం కానుంది. 12 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)ను క్రమంగా తొలగించేందుకు ఈ చట్టాలు ఊతమిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ అంశంపై ఆందోళన అవసరం లేదని చెబుతూ వస్తోంది. ఈ చట్టాలు చేసిన అనంతరం కూడా పలు పంటలకు మద్దతు ధర ప్రకటించినట్టు వివరిస్తోంది. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా మద్దతు ధరలు పెంచుతూ, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ముందుకు వెళుతున్నామని వాదిస్తోంది. గతంలోనూ చట్టరూపం లేదు.. ‘వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్’ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా మొత్తం 22 వ్యవసాయ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను(ఎమ్మెస్పీ) నిర్ణయిస్తుంది. పంటలకు ఎమ్మెస్పీని సిఫారసు చేస్తున్నప్పుడు సీఏసీపీ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఉత్పత్తి వ్యయంపై ఎమ్మెస్పీ ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండాలని 2018–19 బడ్జెట్లోనే ప్రకటించామని, దీని ప్రకారమే అన్ని ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటల కనీస మద్దతు ధరలను పెంచినట్టు కేంద్రం వాదిస్తోంది. 2018–19, 2019–20 సంవత్సరాల్లో దేశపు సగటు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం మార్జిన్ తిరిగి వచ్చేలా ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొంది. ఇదే సూత్రానికి అనుగుణంగా 2020–21 మార్కెటింగ్ సీజన్ కోసం అన్ని ఖరీఫ్ పంటలకు, రబీ పంటలకు మద్దతు ధర ప్రకటించామని తెలిపింది. మద్దతు ధరకు చట్టరూపం గతంలోనూ లేదని, ఇప్పుడు కూడా అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి కొనసాగింపుగా ఐదో విడత చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ‘ఎమ్మెస్పీ కొనసాగుతుందని మేం చెప్పాం. ఎమ్మెస్పీపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. అయితే రైతుల మనస్సులో ఏమైనా సందేహాలు ఉంటే, వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఏపీఎంసీ చట్టం రాష్ట్రాలకు చెందినది. రాష్ట్రానికి చెందిన మండీలను ఏ విధంగానైనా ప్రభావితం చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ఎవరికైనా అనుమానాలు ఉంటే, వాటినీ నివృత్తి చేస్తాం. ఈ 9వ తేదీన జరగనున్న చర్చల్లో అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నాం’ అని తోమర్ తెలిపారు. రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెనక్కి తగ్గని రైతు సంఘాలు.. మద్ధతు ధరపై భరోసా ఇస్తే సరిపోదని, అది చేతల్లో కూడా ఉండాలని, చట్టబద్ధత తప్పని సరిగా కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెస్పీకి చట్టరూపం అవసరం లేదని, అది కార్యనిర్వాహక నిర్ణయమని ప్రభుత్వం చెబుతుండగా.. ఉపాధి హామీ, ఆహార భద్రత వంటివి కూడా చట్టరూపం దాల్చకముందు కార్యనిర్వాహక నిర్ణయంగానే ఉండేవని రైతు సంఘాలు గుర్తుచేస్తున్నాయి. 9వ తేదీన జరిగే చర్చల్లో ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి, ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాలు చెబుతున్నాయి. ముందు ఈ మూడు చట్టాలు రద్దు చేస్తేనే కేంద్రం చెప్పేది ఏదైనా వింటామని స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం సవరణలు తెస్తామని చెబుతున్నప్పటికీ ఈ మూడు చట్టాల మౌలిక స్వరూపం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నది తమ ఆందోళన అని వివరిస్తున్నాయి. అందుకే రేపు 8వ తేదీన జరిగే భారత్ బంద్ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. -
భారత్ బంద్కు విపక్షాల మద్దతు
న్యూఢిల్లీ/ముంబై: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో రైతు సంఘాలు ప్రకటించిన రేపటి ‘భారత్ బంద్’కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ దేశవ్యాప్త బంద్కు ఆదివారం కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్ పార్టీలు తమ మద్దతు తెలిపాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10 కార్మిక సంఘాల ఐక్య కమిటీ బంద్కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సత్వరం పరిష్కారం చూపనట్లయితే.. ఈ ఉద్యమం ఢిల్లీ నుంచి దేశం నలుమూలలకు విస్తరిస్తుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిసెంబర్ 9న పవార్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి రైతు ఉద్యమ తీవ్రతను వివరించి, జోక్యం చేసుకోవాలని కోరుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ వెల్లడించారు. పవార్తో పాటు రాష్ట్రపతిని కలిసే ప్రతినిధి బృందంలో సీతారాం ఏచూరి (సీపీఎం), డీ రాజా (సీపీఐ), టీఆర్ బాలు(డీఎంకే) ఉంటారన్నారు. రైతు ఆందోళనలపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించే విషయం కూడా పరిగణిస్తోందని తెలిపాయి. మరోవైపు, రేపటి(డిసెంబర్ 8, మంగళవారం) బంద్లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి 250 మందికి పైగా రైతులు ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్నారని తెలిపాయి. ‘ఇది కేవలం పంజాబ్ రైతుల నిరసన కాదు. ఇది దేశవ్యాప్త నిరసన. కేంద్రం త్వరగా స్పందించనట్లయితే.. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. మేం భారత్ బంద్కు పిలుపునివ్వడంపై నిన్నటి(శనివారం) చర్చల సందర్భంగా మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు’ అని రైతు నేత బల్దేవ్ సింగ్ యాదవ్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. బంద్ నుంచి అంబులెన్స్లకు, అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇచ్చామన్నారు. బంద్లో అంతా శాంతియుతంగా పాల్గొనాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాత్మక చర్యలకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. బంద్కు మద్దతుగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపింది. నటుడు కమల్హాసన్ పార్టీ ‘ఎంఎన్ఎం’ కూడా బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ..తదితర 10 కార్మిక సంఘాలు కూడా బంద్కు మద్దతు తెలిపాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సహా పలు బ్యాంక్ యూనియన్లు భారత్ బంద్కు మద్దతు తెలిపాయి. ఎన్ఆర్ఐ కుటుంబాల మద్దతు ఈ ఉద్యమంలో అన్ని విధాలుగా సాయం చేసేందుకు విదేశాల్లోని తమ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని కొందరు రైతులు వెల్లడించారు. దీర్ఘకాలం ఉద్యమం సాగించేందుకు వీలుగా రైతులు సిద్ధమై వచ్చిన విషయం తెలిసిందే. పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను వారు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఢిల్లీ శివార్లకు భారీగా చేరుకున్న రైతులకు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక గురుద్వారా సభ్యులు కూడా ఇతోధిక సాయం అందిస్తున్నారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ సహా పలు యూరోప్ దేశాల్లో పంజాబ్ మూలాలున్న ప్రవాస భారతీయులున్నారు. వారు వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. విపక్ష నేతల ఉమ్మడి ప్రకటన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్కు మద్దతుగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పీఏజీడీ చైర్మన్ ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రైతుల న్యాయబద్ధ డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని అందులో వారు కోరారు. ఈ ప్రకటనపై తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), అఖిలేశ్యాదవ్(ఎస్పీ), డీ రాజా(ఆర్జేడీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదతరులు సంతకాలు చేశారు. లండన్లోని భారత దౌత్య కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ఎన్ఆర్ఐల నిరసన -
ఢిల్లీతో ఢీకి టీఆర్ఎస్ రెడీ
ఈ నెల 8న రైతులు తలపెట్టిన ‘భారత్ బంద్’కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బంద్కు మద్దతుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. రాజకీయంగా టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేలా బీజేపీ ఇటీవల రాష్ట్రంలో అనుసరిస్తున్న వైఖరిని తిప్పికొట్టేలా వ్యూహరచన చేయడంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. సాక్షి, హైదరాబాద్: తాజా రాజకీయ పరిస్థితుల్లో బీజేపీపై దూకుడుగా వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయిం చింది. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, కేంద్ర ప్రభుత్వ ఇతర ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగనుంది. భావసారూప్య పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకూ సిద్ధమవు తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని తాజా సమీకరణాలతో భిన్న వైఖరి తీసుకోనుంది. ఓ వైపు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ యంత్రాంగాన్ని క్రియాశీలం చేస్తూనే... మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. విపక్షనేతలతో టచ్లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటానికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఉందనే విషయాన్ని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో హైదరాబాద్లో భారీ సదస్సును నిర్వహిస్తామని గత నెలలో కేసీఆర్ ప్రకటించారు. రైతు సమస్యలపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల ఫలితాన్ని చూసిన తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, అఖిలేశ్ యాదవ్, స్టాలిన్ వంటి నేతలతో కేసీఆర్ ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల సందర్భంగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా తనతో టచ్లో ఉన్నట్లు కేటీఆర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మరింత బలంగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తూ... రాజకీయ పార్టీలు, విమర్శల జోలికి పెద్దగా వెళ్లకపోవడం కూడా తమకు నష్టం చేసిందని టీఆర్ఎస్ భావిస్తోంది. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఇటీవలి కాలంలో విమర్శలు పెంచినా తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ విఫలమైందనే భావన నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ యంత్రాంగంలో కదలిక తేవడంతో పాటు, ప్రజల్లోకి దూకుడుగా వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ వ్యూహంలో భాగంగా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, శిక్షణ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల క్షేత్రస్థాయి పర్యటనలు వీలైనన్ని ఎక్కువగా ఉండేలా చూడనుంది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం నిరంతరం ప్రజల్లో ఉండేలా చూడాలని నిర్ణయించింది. భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రైతులు ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటాయని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని భారత్ బంద్ను కేసీఆర్ సమర్థించారు. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తుచేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని, బంద్కు సంఘీభావం తెలిపి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. -
చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు
న్యూఢిల్లీ : ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్రం జరుపుతున్న చర్చలు మరోసారి ఎటూ తేలకుండానే ముగిశాయి. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా పట్టుబట్టారు. అయితే, నిర్దుష్ట ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం 9వ తేదీ వరకు సమయం కోరింది. దీంతో 11 రోజులుగా దేశ రాజధాని కేంద్రంగా చేపట్టిన రైతు సంఘాల ఆందోళన మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 గంటలపాటు జరిగిన చర్చలకు కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాయకత్వం వహించారు. చర్చల్లో రైల్వేలు, వాణిజ్యం, ఆహారం శాఖల మంత్రి పీయూష్ గోయల్, పంజాబ్కు చెందిన ఎంపీ, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు. గత సమావేశాల్లో చర్చల సందర్భంగా హామీ ఇచ్చిన అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలను వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వారికి వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చర్చల ప్రారంభం సందర్భంగా పంజాబీలో మంత్రి సోమ్ ప్రకాశ్ వారికి తెలిపారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు గట్టిగా పట్టుబడ్డారు. స్పష్టమైన హామీ లభించకుంటే బయటకు వెళ్లిపోతామంటూ తెగేసి చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందనీ, వారి సమస్యలను పరిష్కరిస్తామని దీంతో మంత్రులు వారికి సర్దిచెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు విషయం తేల్చాలంటూ రైతు ప్రతినిధులు గంటపాటు మౌనవ్రతం సాగించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు, అంతర్గతంగా చర్చలు జరిపి నిర్దిష్ట ప్రతిపాదనలు తయారు చేసేందుకు ఈ నెల 9 వరకు సమయం కావాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరారు. దీంతో చర్చలు ఎటూ తేలకుండానే వాయిదా పడ్డాయి. ఆహారం, టీ వెంట తెచ్చుకున్న రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సింఘూ వద్ద ఆందోళన సాగిస్తున్న ప్రాంతం నుంచి చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు ఆహారం, టీ తమతోపాటు తెచ్చుకున్నారు. గురువారం కూడా రైతులు ఆహారం, టీతోపాటు మంచినీరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రైతు ప్రతినిధుల సూచనలు కోరాం: తోమర్ చర్చల అనంతరం మంత్రి తోమర్ మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాల నేతల నుంచి నిర్దిష్ట సూచనలను కోరాం. అయితే, చలి తీవ్రత దృష్ట్యా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధులు, మహిళలు, పిల్లల్ని ఇళ్లకు పంపించాలని కోరాం’అని తెలిపారు. వివిధ పార్టీలు..సంఘాల మద్దతు 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్తోపాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. బంద్కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది. రైతులకు మద్దతుగా పంజాబ్కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు. రహదారులే గ్రామాలుగా... ఢిల్లీకి వెళ్లే కీలక రహదారులపై రైతులు నిరసలు తెలుపుతుండటంతో గడిచిన 10 రోజులుగా ఈ మార్గాల్లో ట్రాపిక్ జాంలు పెరిగిపోయాయి. దీంతో పోలీసులు కొన్ని మార్గాలను మూసివేసి, మరికొన్ని రోడ్లలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తం అవుతుండటంతో కొన్ని రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి. రైతులు రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి, వాటిపై టెంట్లు వేసుకున్నారు. అక్కడే వంటావార్పూ చేపట్టారు. అవసరమైన సరుకులు, కాయగూరలు వంటివి అక్కడికి అందుతున్నాయి. సెల్ఫోన్లకు సోలార్ ప్యానళ్లతో చార్జింగ్ చేసుకుంటున్నారు. ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధుల కోసం కొందరు వైద్యులు వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేశారు. వృద్ధులు హుక్కా పీలుస్తూ కాలం గడుపుతున్నారు. చర్చలకు ముందు ప్రధానితో భేటీ రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలకు వెళ్లేముం దు మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్లు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రైతుల ముందుంచబోయే ప్రతిపాదనలపై వారంతా కలసి చర్చించినట్లు సమాచారం. రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చలు జరపడం ఇదే మొదటి సారి. రైతు ప్రతినిధుల మౌనవ్రతం చర్చల సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతు సంఘాల ప్రతినిధులంతా మౌనవ్రతం పాటించారు. ప్రధానమైన ఈ డిమాండ్ కేంద్రానికి సమ్మతమా కాదా స్పష్టం చేయాలని కోరుతూ ప్రతినిధులు అవును/ కాదు అని రాసి ఉన్న కాగితాలను వారు నోటికి అతికించుకున్నారని పంజాబ్ కిసాన్ యూనియన్ నేత రుల్ధు సింగ్ తెలిపారు. ప్రభుత్వం వారిని మాట్లాడించేందుకు మౌనంతోనే సమాధానం చెప్పారని మరో నేత కవితా కురుగంటి వెల్లడించారు. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. సాగు చట్టాలకు ప్రభుత్వం పలు సవరణలు చేస్తామంటూ ముందుకు వచ్చిందనీ, తాము మాత్రం పూర్తిగా రద్దు చేయాలని కోరామని బీకేయూ ఏక్తా అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రహన్ చెప్పారు. శనివారం సింఘూ వద్ద జరిగిన ధర్నాలో నినదిస్తున్న రైతుల పిల్లలు చర్చల విరామ సమయంలో వెంట తెచ్చుకున్న ఆహారం తింటున్న రైతు సంఘాల ప్రతినిధులు -
8న భారత్ బంద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతులు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే డిసెంబర్ 8న భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని మిగిలిన రహదారులను సైతం అడ్డుకునే ప్రణాళిక రూపొందించినట్లు రైతు నాయకుడు హర్విందర్ సింగ్ లఖ్వాల్ తెలిపారు. మోడీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల దిష్టిబొమ్మలను నేడు దేశవ్యాప్తంగా దగ్ధం చేయాలని నిర్ణయించారు. గణతంత్ర దినోత్సవ కవాతులో రైతులు పాల్గొనాలని ఢిల్లీ –ఘజియాబాద్ సరిహద్దులో ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మరోవైపు భారత ప్రభుత్వ సవరణను అంగీకరించే ప్రసక్తిలేదని, సింఘు సరిహద్దులో ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిసాన్ సభ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లాహ్ తెలిపారు. రైతు ఉద్యమాన్ని పంజాబ్ ఉద్యమం అని మాత్రమే ప్రచారం చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. అయితే ఈ ఉద్యమం భారతదేశం అంతటా జరుగుతోందని, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించని పరిస్థితుల్లో, ఉద్యమం మరింత దూకుడుగా జరుగుతుందని మొల్లాహ్ హెచ్చరించారు. కెనడాకు వార్నింగ్ గురువారం అసంపూర్తిగా ముగిసిన చర్చలను మరోసారి కొనసాగించేందుకు రైతులు సంఘాల నాయకులు, కేంద్రం సిద్ధమయ్యారు. రైతులు చేస్తున్న నిరసనలు పది రోజులకు చేరుకున్న నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో కేంద్రంతో రైతులు మరో దఫా చర్చలు జరుపనున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర విదేశాంగ శాఖ భారత్లో కెనడా హైకమిషనర్ నాదిర్ పటేల్ను శుక్రవారం హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అనంతరం కెనడా ప్రధాని, కేబి నెట్ మంత్రులు భారత్లో జరుగుతున్న నిరసనలపై స్పందించడాన్ని తప్పుబడుతూ.. అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇరు దేశాల మధ్య బంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. -
‘మద్దతు’ కోసం మట్టిమనుషుల పోరాటం!!
రైతే ఒక పారిశ్రామికవేత్తగా మారేలా వ్యవసాయ రంగంలో చరిత్రాత్మక చట్టాల్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెప్పుకున్నారు. కానీ ఆ చట్టాలను రద్దు చేయాలంటూ గత పది రోజులుగా ఢిల్లీ వీధుల్లో బైఠాయించిన రైతన్నలు చరిత్ర సృష్టిస్తున్నారు. ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువగా ఉండే పంజాబ్, హరియాణా రైతులు పోరాటానికి తొలి అడుగు వేస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల రైతులు వారి అడుగులో అడుగు వేసి కదం తొక్కారు. ఈ చట్టాల అమలుతో వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ జరుగుతుందన్న ఆందోళన అన్నదాతల్ని వెంటాడుతోంది. అందుకే నిత్యావసర సరుకుల సవరణ చట్టం.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక చట్టం... రైతుల సాధికారత, రక్షణ ధరల హామీ సేవల ఒప్పంద చట్టాలను వెనక్కి తీసుకోవాలని, మద్దతు ధరను చట్టంలో చేర్చాలని రేయింబగళ్లు నిరసన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాల లక్ష్యంలోనే తప్పులు ఉన్నాయని రైతు ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ‘ఏదైనా చట్టం లక్ష్యమే తప్పుగా ఉంటే దానిలో సవరణలు చేసినా అవి తప్పుదారి పడతాయి. దాని వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు’’ అని 40 మంది రైతులున్న ప్రతినిధి బృందంలోని ఏకైక మహిళా కవితా కురుగంటి తెలిపారు. పీట ముడి ఎక్కడ ? సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. ఎంఎస్పీపై రైతులను విపక్షాలు పక్కదారి పట్టిస్తున్నాయనీ, అందుకే రైతులు ఆందోళన తీవ్ర చేస్తున్నారన్నది కేంద్రం ఆరోపిస్తోంది. రైతుల అభ్యంతరాలు, డిమాండ్లు.. వ్యవసాయ రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఒకే దేశం ఒకే మార్కెట్ విధానం వల్ల భవిష్యత్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుందంటున్నారు. అందుకే ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. కేంద్రం ఏమంటోంది ? ► వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ససేమిరా కుదరదని తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్ట సవరణలకు అంగీకరించింది. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా బడా కంపెనీలు రైతులు భూములు తీసుకోవడానికి వీల్లేకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ► మండీల్లో ప్రైవేటు వ్యక్తులు వస్తే పోటీ ఉండి రైతులకే ప్రయోజనమని వాదిస్తున్న కేంద్రం రాష్ట్రాల పరిధిలో నడిచే మండీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒప్పుకుంది. ప్రైవేటు మార్కెట్లు, ప్రభుత్వ మార్కెట్ యార్డుల్లో పన్నులు సమానంగా వసూలు చేయడానికి అంగీకరించింది. ► ప్రైవేటు వ్యాపారులు పాన్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి బదులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ► కనీస మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందని, దానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని పదే పదే చెబుతూ వస్తోంది. -
పీఎఫ్ఐ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా ఆరోపణలకు సంబంధించి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు చెందిన 26 కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. దాదాపు 9 రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. పీఎఫ్ఐ చైర్మన్ ఓఎం అబ్దుల్ సలాం, కేరళ రాష్ట్ర పీఎఫ్ఐ చీఫ్ నసారుద్దీన్ ఎల్మరామ్, పీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అబ్దుల్ వాహిద్ల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిపారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడులు చేశారని పీఎఫ్ఐ పేర్కొంది. చెన్నై, బెంగళూరు, కోల్కతా, ముర్షీదాబాద్, లక్నో, ఔరంగాబాద్, జైపూర్, కొచ్చి, మలప్పురం తదితర నగరాలతోపాటు ఢిల్లీలోని షహీన్బాగ్లో దాడులు చేసింది. నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి సాక్ష్యాలను సంపాదించేందుకు సోదాలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో పీఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్, బెంగళూరులో పోలీస్ స్టేషన్లపై దాడి, హాథ్రస్ హత్యాచారం తరువాత నిధుల లావాదేవీలు.. తదితర నేరాల వెనుక పీఎఫ్ఐ హస్తం ఉందన్న ఆరోపణలపై కూడా ఈడీ విచారణ చేస్తోంది. -
పద్మవిభూషణ్ వాపస్
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై 8 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ రైతులే ప్రముఖంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఒత్తిడి కారణంగా శిరోమణి అకాలీదళ్ బీజేపీతో పొత్తును తెంచుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రైతులు అకాలీదళ్ వైపు ఏమాత్రం మొగ్గు చూపలేదు. కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న రైతుల్లో విశ్వసనీయతను కాపాడేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్సింగ్ బాదల్ గురువారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతుగా పద్మవిభూషణ్ గౌరవాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ఈరాజకీయ కురు వృద్ధుడు ప్రకటించారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు. రైతుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వానికి బలమైన సందేశం పంపేందుకే ప్రకాశ్ సింగ్ తన అవార్డును తిరిగి ఇచ్చినట్లు ఆయన కుమారుడు, అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. కాగా, శిరోమణి అకాలీ దళ్ డెమొక్రటిక్ పార్టీని ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యుడు సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా సైతం రైతులకు మద్దతుగా 2019లో అందుకున్న పద్మ భూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ విశ్వసనీయతను కాపాడేందుకు... మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ తరువాత, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ఏకైక నేత ప్రకాశ్ సింగ్ బాదల్. ఆయన పంజాబ్కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. పడిపోతున్న పార్టీ విశ్వసనీయతను నిలబెట్టడంతోపాటు, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పటికీ బాదల్పైనే ఉంది. అందుకే 73 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన బాదల్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
చర్చలు అసంపూర్ణం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు, కేంద్ర మంత్రులకు మధ్య గురువారం జరిగిన నాలుగో విడత చర్చలు ఎలాంటి నిర్ణయాత్మక ఫలితం రాకుండానే, అసంపూర్తిగా ముగిశాయి. రేపు(శనివారం) మరో విడత చర్చలు జరగనున్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు, దాదాపు 40 మంది రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా ప్రభుత్వం నుంచి మంచినీరు కూడా రైతు ప్రతినిధులు స్వీకరించలేదు. ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, లంచ్ను వారు తిరస్కరించారు. హడావుడిగా తీసుకువచ్చిన సాగు చట్టాల్లోని లోటుపాట్లను ప్రస్తావించి, వాటిని రద్దు చేయాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ విషయంలో అపోహలు వద్దని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. ఆ విధానాన్ని టచ్ కూడా చేయబోమని హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ‘చర్చించాల్సిన అంశాలను నిర్ధారించాం. వాటిపై శనివారం చర్చ జరుగుతుంది. అదే రోజు రైతుల నిరసన కూడా ముగుస్తుందని ఆశిస్తున్నా’ అని చర్చల్లో పాల్గొన్న వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ‘చర్చల సందర్భంగా కొన్ని అంశాలను రైతు ప్రతినిధులు లేవనెత్తారు. కొత్త చట్టాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లు మూత పడ్తాయేమోనని వారు భయపడ్తున్నారు. ప్రభుత్వానికి పట్టింపులేవీ లేవు. సానుకూల దృక్పథంతో రైతులతో చర్చలు జరుపుతున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత బలోపేతం చేయడానికి, ఆ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ‘కొత్త చట్టాల ప్రకారం.. ఏపీఎంసీ పరిధికి వెలుపల ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి. రెండు విధానాల్లోనూ ఒకే విధమైన పన్ను వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. ‘రైతులు తమ ఫిర్యాదులపై ఎస్డీఎం(సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్) కోర్టులకు వెళ్లవచ్చని చట్టంలో ఉంది. అది కింది కోర్టు అని, పై కోర్టుల్లో దావా వేసే వెసులుబాటు ఉండాలని రైతు ప్రతినిధులు కోరారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని తోమర్ తెలిపారు. రైతులు కోరుతున్నట్లు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు తాను భవిష్యత్తును చెప్పేవాడిని కాదని తోమర్ బదులిచ్చారు. తోమర్, సోమ్ ప్రకాశ్లతో పాటు రైల్వే, వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పియూష్ గోయల్చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. ‘మా వైపు నుంచి చర్చలు ముగిశాయి. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపనట్లయితే.. తదుపరి చర్చలకు రాకూడదని మా నేతలు నిర్ణయించారు’ అని ఏఐకేఎస్సీసీ(ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ) సభ్యురాలు ప్రతిభ షిండే తెలిపారు. ‘ఎమ్మెస్పీ సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై శుక్రవారం రైతు సంఘాల ప్రతినిధులు చర్చిస్తారు’ అని మరో నేత కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. ‘చట్టాల్లో సవరణలు చేయడం కాదు.. ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మా ప్రధాన డిమాండ్’ అని ఏఐకేఎస్సీసీ ప్రధాన కార్యదర్శి హన్నన్ మోలా స్పష్టం చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు శుక్రవారం సమావేశమై, త్రదుపరి చర్చలపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మీ ఆతిథ్యం మాకొద్దు చర్చల సందర్బంగా ప్రభుత్వ ఆతిథ్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. తమకోసం సింఘు నుంచి వ్యాన్లో వచ్చిన భోజనాన్ని స్వీకరిం చారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన టీ, మంచినీరును కూడా వారు తీసుకోలేదు. ‘సహచర రైతులు రోడ్లపై ఉంటే, మేం ఇక్కడ ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఎలా తీసుకుంటాం’ అని చర్చల్లో పాల్గొన్న రైతు నేత షిండే వ్యాఖ్యానించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు -
సాగుచట్టాలతో రైతులకు మేలెంత?
దేశంలో 86 శాతంగా ఉన్న సన్నకారు రైతులు మార్కెట్ యార్డులకు కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లి తమకు గిట్టుబాటు ధర వచ్చేలా చేసుకోగలరా అన్నది ప్రశ్నార్థకమే. కొత్త విధానం ప్రకారం పెద్ద, పెద్ద వ్యవసాయ సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్లు ధరతో సహా రైతులతో ఒప్పందానికి వచ్చి పంటలు వేయించి, ఆ ఉత్పత్తులకు ఆ సంస్థలే మార్కెటింగ్ బాధ్యత తీసుకుంటాయి. మార్కెట్ యార్డులు మూతపడకుండా, కనీస మద్దతు ధర కొనసాగితే, ఈ బిల్లుల వల్ల రైతులకు నష్టం కలగకపోవచ్చు. అటు మార్కెట్ యార్డులు దెబ్బతిని, ఇటు రైతు తన ఉత్పత్తిని ఎక్కడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వాలు తిరిగి రైతుల్ని ఆదుకోవలసి ఉంటుంది. కేంద్రం తీసుకు వచ్చిన చట్టాల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరకపోతే, ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయదు. దేశంలో కొత్తగా తీసుకు వస్తున్న వ్యవసాయ చట్ట సవరణలు రైతులకు ఏ మేరకు మేలు చేస్తాయన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇది రైతులకు సాధికారిత ఇస్తుందని, వారి ఉత్పత్తులకు వారే ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇస్తుందని, మధ్య దళారుల వ్యవస్థను అంతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు. అంతేకాక ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లు మార్కెట్ యార్డులు మూత పడబోవని, అవి యథాతథంగా ఉంటాయని, కాకపోతే రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ పొందుతారని, అలాగే ప్రభుత్వం కనీస మద్దతు ధర యథాప్రకారం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుందని, టెక్నాలజీ వ్యవసాయ రంగంలోకి రావడం ద్వారా స్టార్టప్స్కు అవకాశాలు ఏర్పడతాయని, యువత సేద్యం వైపు ఆసక్తి కనబరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కానీ, మిత్రపక్షంగా ఉండి వ్యవసాయ బిల్లులకు నిరసనగా మంత్రి పదవి వదులుకోవడమే కాకుండా, ఎన్డీఏ నుంచి వైదొలగిన అకాలీదళ్తోపాటు, టీఆర్ఎస్ వంటి విపక్షాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. చిన్న రైతులు నష్టపోతారని, మార్కెట్ యార్డులు మూత పడతాయని, ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర బాధ్యత నుంచి తప్పించుకునే యత్నంచేస్తోందని, ప్రభుత్వపరంగా వ్యవసాయం ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా పోయే పరిస్థితి రావచ్చని, రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లి తమ ఉత్పత్తులను అమ్ముకోలేరని, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకోసమే ఈ బిల్లులు అని ఈ పక్షాలు వాదిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్, మరి కొన్ని పక్షాలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం విశేషం. (చదవండి: అగ్రి చట్టాలను చెత్తబుట్టలో పారేస్తాం) ఈ వాదోపవాదాలు విన్న తర్వాత విశ్లేషణ చేసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ రంగంలో ఒక కొత్త మార్పునకు ప్రయత్నిస్తున్నారన్న భావన కలుగుతుంది. సాధారణంగా ఎక్కడైనా ఒక మార్పు తేవాలంటే అది అంత తేలిక కాదు. అందులోను సంప్రదాయబద్ధంగా జీవనం సాగించే భారత్లో సంస్కరణలకు చాలా సమయం పడుతుంది. దేశంలో 86 శాతం మంది రైతులు చిన్నకారు రైతులే. మరి ప్రధాని మోదీ చెబుతున్నట్లు ఈ రైతులు మార్కెట్ యార్డులకు కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లి తమకు గిట్టుబాటు ధర వచ్చేలా చేసుకోగలరా అన్న ప్రశ్నకు సహజంగానే సాధ్యం కాదు అని సమాధానం వస్తుంది. అయితే మరి దీనికి మార్గం ఏమిటి? కొత్త విధానం ప్రకారం పెద్దపెద్ద వ్యవసాయ సంస్థలు, కార్పొరేట్లు అనండి, స్టార్టప్లు అనండి .. అవి రైతులతో ధరతో సహా ఒప్పందానికి వచ్చి పంటలు వేయించి, ఆ తర్వాత ఆ ఉత్పత్తులకు ఆ సంస్థలే మార్కెటింగ్ బాధ్యత తీసుకుంటాయి. దీనిని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనవచ్చు. నిజానికి ఈ తరహా ప్రతిపాదనలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి. ఉమ్మడి ఏపీలోని కొన్ని ప్రాంతాలలో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాక కొన్ని సంస్థలు తమకు కావల్సిన పంటలను సాగు చేయించి, తమ పరిశ్రమలకు వాటిని వినియోగించుకునే అవకాశం వస్తుంది. ఉదాహరణకు కాగితం పరిశ్రమవారు యూకలిప్టస్ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు. అలాగే పామాయిల్ పరిశ్రమలు రైతులతో పామాయిల్ తోటల పెంపకానికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తుంటాయి. దీనివల్ల చిన్న రైతులకు పెట్టుబడి ఇబ్బంది ఉండదు. దేశంలో ఎక్కువ కమతాలు అర ఎకరం, ఎకరం ఉన్నప్పుడు వారు పెట్టుబడి పెట్టలేక, ట్రాక్టర్ తదితర ఆధునిక టెక్నాలజీ వాడలేకపోతున్నారు. అలాంటి సమయంలో కాంట్రాక్ట్ పార్మింగ్ వారికి మేలు చేసే అవకాశం ఉండవచ్చు. అయితే వారి పొలాల్లో వారే కూలీలు అవుతారన్నది ఒక విమర్శ. నిజానికి ఇప్పుడు అంత చిన్న మొత్తంలో భూములు ఉన్నవారు ఎటు తిరిగి కూలీకి వెళ్లక తప్పని స్థితి కూడా ఉందన్న సంగతి మర్చిపోకూడదు. ఏ ఏ పంటలు ఎలా వేయాలన్నదానిపై కంపెనీల నియంత్రణ ఉంటుందా అన్నది చర్చనీయాంశం కావచ్చు. కానీ తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే నియంత్రిత సాగు విధానం అమలు తెచ్చి, వారు సూచించిన పంట లనే వేయిస్తున్నారు. అపుడు పెద్ద తేడా ఉండకపోవచ్చు. ప్రధాని చెబుతున్నట్లుగా మార్కెట్ యార్డులు మూతపడకుండా, కనీస మద్దతు ధర కొనసాగితే, ఈ బిల్లుల వల్ల రైతులకు నష్టం కలగకపోవచ్చు. అటు మార్కెట్ యార్డులు దెబ్బతిని, ఇటు రైతు తన ఉత్పత్తిని ఎక్కడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడితే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వాలు తిరిగి రైతులను ఆదుకోవలసి ఉంటుంది. నిజంగానే రైతులకు ఈ బిల్లుల వల్ల ఏమీ నష్టం లేనప్పుడు పంజాబ్ వంటి రాష్ట్రంలో ఎందుకు వ్యతిరేకత వచ్చిందన్న చర్చ వస్తుంది. దానికి ఒక కథనం ఏమిటంటే అక్కడ మొత్తం రైతుల వ్యవసాయం అంతా కమిషన్ దారులపై ఆధారపడి నడుస్తోందట. సుమారు 28 వేల మంది కమీషన్దారులు అటు రైతులపైన ప్రభావం చూపుతూ, ఇటు రాజకీయాలను కూడా కొంతమేర శాసించే స్థితిలో ఉన్నారట. ఆ కమీషన్ దారులకు నష్టం జరిగి, రైతుకు నేరుగా పంట అమ్మకం డబ్బు వస్తుంది కనుక, వారు రైతులలో లేనిపోని అనుమానాలు రేపి ఆందోళన చేయిస్తున్నారన్నది బీజేపీ నేతల వాదనగా ఉంది. ఏపీ, తెలంగాణలకు సంబంధించి ఈ బిల్లు పెద్దగా నష్టం చేయకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాలలో ప్రగతిశీల రైతులు ఎక్కువ మంది ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో దేశంలో ఏదైనా రంగం మరీ తీవ్రంగా ప్రభావితం కాకుండా ఉందంటే అది వ్యవసాయ రంగమే అని చెప్పాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రైతులు తమ పనులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. 2014లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంతో పండ్లు, కూరగాయల సాగుదారులు లాభపడగా, ఇప్పుడు ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగినంత స్వేచ్ఛ లభించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కూడా రైతుల వల్లే వ్యవసాయ రంగం బలోపేతమైందని, స్వయంసమృద్ధ భారత్కు అన్నదాతలు కీలకంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో కొంతవరకు వాస్తవం ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కరోనా సంక్షోభ సమయంలో ఏపీ, తెలంగాణలలో పెద్ద ఎత్తున ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనుగోలు చేశాయి. ఏపీలో అరటి, నిమ్మ వంటి ఉత్పత్తులకు ఎప్పుడు ధర గిట్టుబాటుగా లేదన్న సమాచారం వచ్చిన వెంటనే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి నుంచి డబ్బు ఖర్చు చేసి పంటలు కొనుగోలు చేసింది. రాజంపేట వద్ద ఒక రైతు తన అరటి ఉత్పత్తి అమ్ముకునే పరిస్థితి లేకపోవడం వల్ల నష్టం జరుగుతోందని సోషల్ మీడియాలో పెట్టగానే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వెంటనే ఆ పంటను కొనుగోలు చేసింది. అలాగే ఆయా చోట్ల టమాటా పంట విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల సమస్యలు వచ్చి ఉండవచ్చు. కొన్ని ఉత్పత్తులనైతే ఢిల్లీ మార్కెట్కు తరలించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకున్నాయి. ఇలాంటి సమయంలో రైతులు ఎక్కడకు వెళ్లకుండా ఆయా వాణిజ్య, వ్యాపార సంస్థలు ముందుకు వస్తే రైతులకు ఉపయోగం జరగవచ్చు. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు నిర్దిష్టంగా ఉండాలి. నిజంగానే కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్లు ముందుకు వచ్చి రైతులతో ఒప్పందాలు చేసుకుని, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు, స్టోరేజీ సదుపాయాలు, పుడ్ ప్రోసెసింగ్ ప్లాంట్లు వంటివి ఏర్పాటు చేస్తే రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుంది. అలాగే మధ్య దళారుల వ్యవస్థ తగ్గితే వినియోగదారులకు కూడా సహేతుకమైన ధరలకు ఆహార పదార్థాలు లభించే అవకాశం ఉంటుంది. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం కనుక, ఈ రంగంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావల్సిన అవసరం ఉంది. వాటి ద్వారా కొత్త తరహా పరిశ్రమలు వచ్చినప్పుడే రైతులకుకాని, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. అయితే టీఆర్ఎస్ వ్యవసాయ విద్యుత్ సంస్కరణలతో పాటు, అగ్రి బిల్లులను వ్యతిరేకించింది. (చదవండి: స్కామ్లపై కేసులు వద్దంటే ఏంటర్థం?) నిజానికి కేంద్రం తీసుకు వచ్చిన కొత్త చట్టాలు అమలు కావడానికి చాలా సమయం పట్టవచ్చు. ఈలోగా ఇప్పుడు ఉన్న పద్ధతులే అమలు అవుతాయి. నిజంగానే కేంద్రం తీసుకు వచ్చిన చట్టాల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరకపోతే, ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయదు. ఒక వేళ అవి రైతులకు ఉపయోగపడేవి అయితే, రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే వారు ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. ఏది ఏమైనా ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందన్నట్లుగా దేశ వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు వచ్చి రైతుల జీవితాలు బాగుపడితే సంతోషించవచ్చు. వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అగ్రి చట్టాలను చెత్తబుట్టలో పారేస్తాం
మోగా: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ మన రైతన్నల వెన్ను విరుస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ చట్టాలను చెత్తబుట్టలో పారేస్తామని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆదివారం పంజాబ్లో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ తీరుపై విరుచుకుపడ్డారు. ఒకవైపు కరోనా వైరస్ పంజా విసురుతుండగా, ఇప్పుడే హడావుడిగా వ్యవసాయ చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), ఆహార ధాన్యాల సేకరణకు స్వస్తి పలకడమే వారి(కేంద్రం) లక్ష్యమని ఆరోపించారు. రైతులకు ఏమాత్రం నష్టం జరగనివ్వబోమని అన్నారు. తాము వారికి అండగా ఉంటామన్నారు. రైతులకు న్యాయం చేసే విషయంలో ఒక్క అంగుళమైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కార్పొరేట్ల చేతుల్లో మోదీ సర్కారు కీలుబొమ్మ ట్రాక్టర్ ర్యాలీ పంజాబ్లోని మోగా, లూథియానా జిల్లాల మీదుగా సాగింది. అనంతరం బద్లీకలాన్లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 4 నుంచి 6వ తేదీ వరకు ట్రాక్టర్ ర్యాలీలను తలపెట్టింది. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీల చేతిలో కీలుబొమ్మ అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆరేళ్లుగా ప్రజలను దగా చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ర్యాలీలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు, రైతులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ దగ్ధం : పంజాబ్ యూత్ కాంగ్రెస్ చీఫ్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్ను దగ్ధం చేసిన ఘటనలో పంజాబ్ యూత్ కాంగ్రెస్ చీఫ్ బృందర్ ధిల్లాన్ను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ట్రాక్టర్ దగ్థం కేసులో దర్యాపు కొనసాగుతోందని, ఈ ఘటనలో పాల్గొన్న ఇతరులను గుర్తిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేసి వీరిపై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు నాన్బెయిలబుల్ సెక్షన్లతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఇండియా గేట్ వద్ద ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఆందోళనలో భాగంగా వారు ట్రాక్టర్కు నిప్పంటించడం కలకలం రేపింది. చదవండి : భగ్గుమన్న దేశ రాజధాని.. ఉద్రిక్తం -
బిల్లులపై రైతుల ఆందోళన ఎందుకు ?!
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కార్పొరేట్ వ్యాపారుల సముచిత పాత్రకు వీలు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడం పట్ల రైతు లోకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కార్పొరేట్ వ్యాపారుల లాభాపేక్షకు వ్యవసాయ ఉత్పత్తులకు ప్రస్తుతం ఇస్తోన్న ‘కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)’ కనుమరగవుతుందన్నదే వారి ఆందోళనకు అసలు కారణం. కనీస మద్దతు ధరపై కేంద్రం తీసుకొచ్చిన ఈ మూడు బిల్లులపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు. పైగా కనీస మద్దతు ధరను కొనసాగిస్తామంటూ మోదీ ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసింది. అయినప్పటికీ దేశంలోని రైతులు మోదీ ప్రభుత్వాన్ని నమ్మక పోగా, ఎందుకు వ్యవసాయ బిల్లులను శంకిస్తున్నారు ? పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు? ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు నిర్వహించే మార్కెట్లలోనే కాకుండా దేశంలో ఎక్కడైన బయటి ప్రైవేటు మార్కెట్లలో లేదా మండీల్లో రైతులు తమ వ్యవసాయోత్పత్తులను విక్రయించుకునేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ది పార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్’ బిల్లు వీలు కల్పిస్తోంది. దీని వల్ల ప్రభుత్వ హయాంలోని మార్కెట్ కమిటీలు కనీస మద్దతు ధరకు గోధమలు, బియ్యం సేకరించడం తగ్గిపోతుందని, ఆమేరకు తాము నష్టపోతామన్నది రైతుల ఆందోళనని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సీరజ్ హుస్సేన్ తెలిపారు. కాలక్రమంలో ప్రభుత్వ వ్యయసాయ మార్కెట్ కమిటీలు కూడా రద్దు కావచ్చని వారు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. (చదవండి: రబీ పంటల ‘మద్దతు’ పెంపు) ప్రైవేటు మార్కెట్ శక్తుల వల్ల వ్యవసాయోత్పత్తుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందన్నది రైతుల భయం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులే ఎక్కువ ఆందోళన చెందడానికి ప్రధాన కారణం ఆ రెండు రాష్ట్రాల నుంచే 80–90 శాతం వరకు కనీస మద్దత ధరపై ప్రభుత్వం వరి, గోధుమలను కొనుగోలు చేస్తుండడం. కేంద్ర ప్రభుత్వం డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన గోధమలు, వరిలో 52 శాతం వాటా ఈ రెండు రాష్ట్రాలకు చెందినదే. కేంద్రం ఈ రెండు రాష్ట్రాలకే ప్రధానంగా ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణం 1960లో కేంద్రం ‘హరిత విప్లవం’ ఈ రెండు రాష్ట్రాల నుంచే ప్రారంభించడం. హరిత విప్లవం కారణంగా ఈ రెండు రాష్ట్రాలో అధిక దిగుబడి ఎక్కువగా వచ్చింది. ఫలితంగా గోధుమలు, వరి రేట్లు పడిపోవడంతో కేంద్రం ‘కనీస మద్దతు ధర’ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత రైతుల డిమాండ్పై ఈ విధానాన్ని కేంద్రం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. కనీస మద్దతు ధర వల్ల ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాలే లాభ పడుతున్నాయా? కనీస మద్దతు ధర ఎత్తివేయాలా? ఈ విధానాన్ని ఎత్తివేయాలా ? వద్దా ? అన్న అంశంపై గత కొన్నేళ్లుగా చర్చలు జరగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం 5.8 శాతం మంది రైతులే ఎంఎస్పీ కింద తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని, ఈ విషయంలో పంజాబ్, హర్యానా రైతుల తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల రైతులే ఎంఎస్పీ కింద లబ్ధి పొందుతున్నారని 2015లో శాంత కుమార్ కమిటీ ఓ నివేదికలో తెలియజేసింది. ప్రభుత్వ ఏజెన్సీలు ఎక్కువగా పెద్ద రైతుల నుంచే కొనుగోళ్లు ఎక్కువ చేస్తున్నాయి. కేంద్రం 23 రకాల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరలను ప్రకటించగా, వాటిలో వరి, గోధుమలనే ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎంఎస్పీ కింద పప్పు దినుసల కొనుగోళ్లు పెరిగాయి. ఒకప్పుడు దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నప్పుడు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందని, ఇప్పుడు ఆ అవసరం లేదని, ఎంఎస్పీ కన్నా మార్కెట్ ధరలు తక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ఎంఎస్పీ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని శాంత కుమార్ కమిటీ సిఫార్సు చేసింది. ఎంఎస్పీ స్కీమ్ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పిస్పూ కేంద్రం 1997లో చట్టంలో సవరణ తీసుకొచ్చింది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఎంఎస్పీ అమలు చేయడం వల్ల ప్రభుత్వాలపై అధిక ఆర్థిక భారం పడుతోందని, ఈ విధానాన్ని ఎత్తివేయాలంటూ అధికార వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చోప చర్చలు జరగుతున్నాయి. కొత్త వ్యవసాయ బిల్లులో ఎంఎస్పీ విధానానికి తగిన రక్షణలు కల్పించక పోవడంతో ఎప్పుడైనా ఆ విధానానికి కేంద్రం చెల్లు చీటి చెప్పవచ్చన్నది రైతులకు వీడని శంక. (చదవండి: సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే) -
విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం
-
వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య రెండు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లులకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ బిల్లులపై చర్చ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలను విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎమపీలు నినాదాలు చేశారు. బిల్లు ప్రతులను పలువురు సభ్యులు చించివేశారు. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులను సభ ఆమోదం తెలిపిందని ప్రకటించిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇక అంతకుముందు రాజ్యసభలో బిల్లు ఓటింగ్ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు. టీఎంసీ, ఆమ్ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకులు విరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది. కాగా లోక్సభలో వ్యవసాయ బిల్లులు గురువారం రాత్రి ఆమోదం పొందాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు నిరసనగా పంజాబ్, హరియాణ సహా పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు. చదవండి : రసవత్తరంగా రాజ్యసభ.. గట్టెక్కేదెలా! -
రైతన్నల కోసం రూ.1.5 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం రైతులకు ఊరట కల్పించేలా కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్డీయే ప్రభుత్వం రైతులను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.50 లక్షల కోట్ల మేర వ్యవసాయ ప్యాకేజీని ప్రకటించే అవకాశమున్నట్లు వెల్లడించాయి. అన్నదాతల ఆదాయం పెంపు, చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే విషయాన్ని కేంద్ర కేబినెట్ అజెండాలో చేర్చినట్లు పేర్కొన్నాయి. సోమవారం జరగాల్సిన ఈ భేటీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. పరిశీలనలో ‘రైతు బంధు’.. పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు వడ్డీని మాఫీ చేయడం ఈ సిఫార్సుల్లో మొదటిది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.15వేల కోట్ల భారం పడనుంది. అలాగే ఆహార పంటలను సాగుచేసే రైతన్నలు చెల్లించే బీమా ప్రీమియంను పూర్తిగా మినహాయించాలని వ్యవసాయ శాఖ సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ‘రైతు బంధు’ ఒడిశా సర్కారు తెచ్చిన ‘కాలియా’ పథకాల తరహాలో రైతుల బ్యాంకు ఖాతాలకే నగదును నేరుగా బదిలీ చేసే అంశాన్నీ కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రైతులను ఆదుకునేందుకు కేంద్రం తీసుకురానున్న ప్యాకేజీ రూ.1.50 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్ని మూడు రెట్లు పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయి తే ఈ సిఫార్సులపై ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమైన తర్వాతే స్పష్టత రానుందని భావిస్తున్నారు. 2019–20 బడ్జెట్ çసమర్పణకు చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో త్వరితగతిన అమలు చేసేలా, లోక్సభ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేలా ఎన్డీయే ప్రభుత్వం ఈ కొత్త పథకానికి తుదిరూపు ఇవ్వనుంది. -
కందకాలు తవ్వితే చెట్లు పచ్చబడ్డాయి
కోనేరు సురేశ్బాబు విజయనగరం జిల్లా ఆలూరు మండలం కందుల పదం గ్రామపరిధిలో 13 ఎకరాల్లో పామాయిల్ తోటను పదిహేనేళ్లుగా సాగు చేస్తున్నారు. పామాయిల్ చెట్టుకు రోజుకు 200 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. వెంగళ్రావు సాగర్ డ్యామ్ దగ్గర్లోనే సురేశ్బాబు వ్యవసాయ క్షేత్రం ఉంటుంది. గుడ్డవాగు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్ అందుబాటులో ఉండటం వల్ల బోర్ పుష్కలంగా నీరు పోస్తూ ఉంటుంది. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు కరెంటు ఉన్న సమయంలో గతంలో డ్రిప్ ద్వారా అనుదినం నీరందించేవారు. అయితే, భూమి తేలిక నేల కాకపోయినప్పటికీ ఎత్తుపల్లాలుగా ఉండటం వల్ల కొన్ని చోట్ల చెట్లకు సరిగ్గా నీరందక ఇబ్బందులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో కందకాలు తీయిస్తే ఎక్కడి వర్షపు నీరు అక్కడే ఇంకి, వేసవిలోనూ చెట్లకు, దిగుబడికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న భావనతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి(99638 19074)లను సంప్రదించి గత మేలో కందకాలు తీయించారు. పామాయిల్ చెట్ల మధ్య 9 మీటర్ల దూరం ఉంటుంది. చెట్లకు సమాన దూరంలో మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. కందకాలు తవ్విన తర్వాత డ్రిప్ వాడటం మానేశారు. కందకాల ద్వారానే బోరు నీటిని పారిస్తున్నారు. పామాయిల్ చెట్ల మట్టలను కందకాల్లో వేశారు. అవి క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారుతున్నాయి. నీటికి కొరత లేకపోయినా ముందు చూపుతో సురేశ్బాబు వాన నీటి సంరక్షణ కోసం కందకాలు తవ్వించడం విశేషం. కందకాలు తవ్విన తర్వాత చెట్లు మరింత పచ్చగా, కళగా ఉంటున్నాయని ఆయన గుర్తించారు. ఇరుగు పొరుగు రైతులు కూడా ఈ మార్పును గుర్తించారని ఆయన తెలిపారు. భూమిలో తేమ ఉంటుంది కాబట్టి, ఎండాకాలంలో నీరు వెనకా ముందు అయినాæచెట్లకు ఇబ్బందేమీ ఉండబోదని సురేశ్బాబు (97017 50189) ఆశాభావంతో ఉన్నారు. -
యూరియా.. లేదయా..!
సాక్షి,యాదాద్రి : యూరియా కొరతతో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పది రోజులుగా కురుస్తున్న చెదురుమదురు వర్షాలకు పంటలకు యూరియా పెట్టేందుకు రైతులు ఎరువుల దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే కంపెనీల నుంచి సరఫరా తగ్గడంతో కొరత ప్రారంభమైంది. ఆడపాదడపా వస్తున్నప్పటికీ ఏమూలకు సరిపోవడం లేదు. దీంతో రైతులు పొరుగున గల జనగామ, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాలకు వెళ్తున్నారు. యూరియా వాడకం ఎక్కువ ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన తొలకరి వానలకు రైతులు పత్తి, వరి విత్తనాలు నాటారు. ఆ తర్వాత కరువు పరిస్థితులు కనిపించడంతో రైతులు ముందస్తుగా ఎరువులను కొనుగోలు చేయలేదు. అయితే పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎరువులు పెట్టడానికి రైతులందరూ ఒక్కసారిగా దుకాణాలకు వెళ్తున్నారు. దుకాణాల్లో అధిక నిల్వలు లేకపోవడం, కంపెనీల నుంచి దిగుమతి తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. అందులో కాంప్లెక్స్ ధరలు అధికంగా ఉండడంతో యూరియా వాడకంపై ఎక్కువ దృష్టి సారించారు. ఒక్క బస్తాకు బదులుగా రెండు బస్తాల యూరియాను వినియోగిస్తున్నారు. దీంతో యూరియా కొరత అధికమైంది. అడ్డొచ్చిన సెలవులు యూరియా ఇతర కాంప్లెక్స్ ఎరువులు మిర్యాలగూడెం, హైదరాబాద్ నుంచి రైల్వే రాక్ల ద్వారా ఉమ్మడి జిల్లాలకు సరఫరా అవుతాయి. మిర్యాలగూడెం స్టాక్ పాయింట్కు రైల్ వ్యాగన్లలో వచ్చిన యూరియాను దుకాణాలకు చేరవేసేందుకు రెండో శనివారం, ఆదివారం కావడంతో లోడిం గ్లు కాలేదు. సోమవారం, మంగళవారాల్లో లోడింగ్ అయినప్పటికీ అతి తక్కువ లారీల్లో ఎక్కించారు. ట్రాన్స్పోర్ట్ నుంచి దుకాణాల్లోకి చేరడానికి సమస్య ఎదురైంది. బుధవారం స్వాతం త్య్ర దినోత్సవ సెలవు కావడంతో, యూరియా లోడింగ్ కాలేదు. కేంద్రంనుంచి అందే సబ్సిడీ ఇలా.. కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం యూరియా అమ్మకం మీదనే సబ్సిడీ విధానం(డీబీటీ) ప్రవేశపెట్టింది. ప్రతి ఎరువుల దుకాణానికి పీలోఎస్ మిషన్ ద్వారా అమ్మకం చేస్తోంది. విక్రయించిన యూరియాకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. 50 కిలోల యూరియా బస్తాకు రైతు రూ.295 చెల్లిస్తుండగా, కేంద్రం అందించే సబ్సిడీ రూ.923.74. 45కిలోల యూరియా బస్తాకు రూ.266.53 రైతు ధర కాగా, కేంద్రం రూ.850 వరకు సబ్సిడీ చెల్లిస్తుంది. అందని సబ్సిడీతో ఇబ్బందులు డీలర్లు, వివిధ వర్గాల ద్వారా తెలుస్తున్న సమచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాకపోవడంతో కంపెనీలు యూరియా తయారీని నిలిపివేశాయి. ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసిన యూరియాను తమ కంపెనీల బస్తాల్లో ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నారు.ఈ యూరియా కూడా డీలర్కు సరఫరా ఇవ్వకుండా ట్రాన్స్పోర్ట్ చార్జి పేరుతో వసూలు చేస్తున్నాయి. మిర్యాలగూడెం, హైదరాబాద్ ల్యాబ్లనుంచి అదనంగా కిరాయి బస్తాకు రూ.20 నుంచి రూ.30వరకు వసూలు చేస్తుండడంతో డీలర్కు చేరే సరికే అది ఎమ్మార్పీ ధర కంటే మించి అవుతుంది. జిల్లాలో కోరమాండల్, నాగార్జున, ఉజ్వల, ఇప్కో, క్రిబ్కో, స్పీక్ యూరియా కంపెనీలు ఉమ్మడి జిల్లాలో సరఫరా చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర కంపెనీలు కూడా యూరి యా సరఫరా చేస్తున్నాయి. 50వేల టన్నులు అవసరం ప్రస్తుతం జిల్లాలో సాగైన పంటల అవసరాల కోసం సుమారు 50వేల టన్నుల యూరియా కావాలి.అంటే సుమారుగా 20వ్యాగన్ల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. కానీ ఒక్క వ్యాగన్ మాత్ర మే జిల్లాకు రావడంతో ఉమ్మడి జిల్లా అవసరం మొత్తానికి సరఫరా చేయలేకపోతున్నారు.దీంతో తీవ్రమైన కొర త ఏర్పడుతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే పంటలకు యూరియా అధికంగా అవసరం ఉంటుంది. ఈసమయంలోనే యూరి యా సరిపోను లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళనలో రైతులు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఓ వైపు ఆనందం వ్యక్తమవుతుండగా మరో వై పు ఆందోళన నెలకొంది. అదునుకు యూరి యా పెడితే చేను ఏపుగా పెరిగేదని, అధికా రులు వెంటనే స్పందించి సరిపడా ఎరువులు తెప్పించాలని రైతులు కోరుతున్నారు. -
కేంద్ర రైతు పథకాలపై బీజేపీ వాల్పోస్టర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఈ నాలుగేళ్లలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ వాల్ పోస్టర్ను రూపొందించింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నాలుగేళ్లలో ప్రధాని మోదీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, భూసార పరీక్షలు వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ ఏడాది పెంచిన మద్దతు ధరల వల్ల రైతులకు ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ.12 వేల వరకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ఈ నెల 17 నుంచి 26 వరకు చేపట్టనున్న ‘మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం– మార్పు కోసం బీజేపీ’నినాదంతో గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నికల హామీలు, ప్రధాని మోదీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నర్సింహారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు జైపాల్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్ పాల్గొన్నారు. -
సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకోవాలి
ఒంగోలు టౌన్: సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద రైతు పోరాట దీక్ష చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై దీక్షలో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య ప్రారంభించి ప్రసంగించారు. జీఓ నం. 31 ప్రకారం సుబాబుల్ రూ.4200, జామాయిల్ రూ.4400లకు కొనుగోలు చేయాల్సి ఉండగా, ఎక్కడా ఈ ధర అమలు కావడం లేదన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారానే కర్ర కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ దళారులు ప్రవేశించి రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జాయింట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జీఓ నం. 31ప్రకారం కర్ర మార్కె ట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాభావం వల్ల ఎండిపోయిన తోటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో 2లక్షల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతులు సాగు చేస్తున్నారన్నారు. కర్ర కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రాక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఐటీసీ కంపెనీ ప్రోత్సాహంతో రైతులు పెద్దఎత్తున సాగు చేపట్టారని, అయితే కొనుగోళ్ల రంగంలోకి పూర్తి స్థాయిలో దిగకుండా రైతులను దగా చేసిందన్నారు. సుబాబుర్కు రూ.4200ల ధర రావల్సి ఉండగా రూ.2600కు మించి రావడం లేదన్నారు. జామాయిల్కు రూ.4400ల ధర రావల్సి ఉండగా, రూ.2000లకు మించి రావడం లేదన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దళారీల దోపిడీ పెరిగి పోయిందన్నారు. సుబాబుల్, జామాయిల్ రైతుల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. కమిటీలో సభ్యుడైన జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. శనివారం ఒంగోలుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలను తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.హనుమారెడ్డి, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు టి. గోపాల్రెడ్డి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అబఞ్బరి వెంకటేశ్వర్లు, జే జయంత్బాబు, కే వెంకటేశ్వర్లు, కే పెద్దబ్బాయి, ఏ శంకరరావు, బి.లక్ష్మీనారాయణ, ఎన్ సుబ్బారావు, వి.సుబ్బారావు పాల్గొన్నారు. -
జాడలేని వాన.. రైతన్న హైరానా!
సాక్షి, హైదరాబాద్ : నిర్ణీత సమయానికి ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి.. మొదట్లో సాధారణస్థాయికి మించి వానలు కురిశాయి.. అన్నదాతల్లో ఆనందం పొంగింది.. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఆవిరైంది! రుతుపవనాలు బలహీనపడటంతో వానలు ముఖం చాటేశాయి. వారం రోజులుగా వాన జాడలేక రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. వానల్లేక వేసిన విత్తనం భూమిలో ఉండిపోయింది. కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తినా ఎండలకు మాడిపోతున్నాయి. ఇంకొన్నిచోట్ల దుక్కులు దున్నిన రైతన్నలు ఆశగా నింగి వైపు చూస్తున్నారు. ఆగిన సాగు ఈసారి నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంతో పోలిస్తే 97 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ లెక్కన తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్ వర్షపాతం 755 మి.మీ. కాగా.. 97 శాతం లెక్కన 732 మి.మీ.లు కురిసే అవకాశముంది. అయితే ఈ నెల 15 నుంచి వర్షాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గత రెండ్రోజుల్లోనైతే పరిస్థితి ఘోరంగా ఉంది. ఏకంగా 84 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ పంటల సాగు నిలిచిపోయింది. నార్లు పోసే దిక్కు కూడా లేదు. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 4 లక్షల ఎకరాల్లో పత్తి ఈ ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు పైనే ఉంది. అందులో 45 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేస్తారు. పైపెచ్చు ఖరీఫ్పై ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. రుతుపవనాల ఆరంభ సమయంలో వర్షాలు కురుస్తాయన్న ఆశతో అనేక మంది రైతులు పత్తి, మెట్ట పంటల విత్తనాలను చల్లారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసి ఉంటారని అంచనా. అందులో పత్తి విత్తనాలు దాదాపు 4 లక్షల ఎకరాల్లో చల్లి ఉండొచ్చని చెబుతున్నారు. కొన్నిచోట్ల పెసర, కంది వంటి విత్తనాలను చల్లారు. వర్షాలు నిలిచిపోయి ఎండలు మండిపోతుండటంతో మొలకెత్తిన విత్తనాలు వాడిపోతుంటే, కొన్నిచోట్ల భూమిలోనే మాడిపోతున్నాయని రైతులు అంటున్నారు. ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తినా ప్రయోజనం కనిపించటం లేదు. ఆ మొలకలు కూడా వాలిపోతున్నాయి. దాదాపు 2 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు భూమిలోనే మగ్గుతున్నాయి. ఇంకొన్ని చోట్ల పొడి దుక్కుల్లోనే రైతులు పత్తి విత్తనాలను నాటుతున్నారు. నేలలో తగిన తేమ ఉన్న సమయంలోనే పంటలను సాగు చేయాలని అధికారులు చెబుతున్నా రైతులు పట్టించుకోవడం లేదు. 60 మి.మీ. వర్షం కురిసినప్పుడే పత్తి విత్తనాన్ని నాటుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ? ప్రస్తుతం రైతు బీమా పథకంపై తప్ప వ్యవసాయశాఖ దేనిపైనా దృష్టి సారించడం లేదు. మండలాల్లో వ్యవసాయాధికారులు అంతా ఎల్ఐసీ ఫారాలను ముందేసుకొని రైతులను బీమాలో చేర్పించే పనుల్లోనే నిమగ్నమయ్యారు. అలాగే వ్యవసాయశాఖ ఇప్పటికీ 2018–19 ప్రణాళిక విడుదల చేయలేదు. అందులో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తెలియజేయాలి. కానీ ఆ ప్రణాళిక విడుదలపై ఇంకా దృష్టి సారించడం లేదు. రైతులను చైతన్యపరిచేందుకు యాత్రలు కూడా నిర్వహించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 22 నుంచి వర్షాలు: రాజారావు, సీనియర్ అధికారి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ నెల 22 లేదా 23వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో మళ్లీ పుంజుకుంటాయి. ఈ నెలాఖరుకు అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యం
పరకాల రూరల్ : తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ పలువురు రైతులు ఆదివారం పురుగు మందు డబ్బాలతో మండలంలోని సీతారాంపురం పరకాల–కంఠాత్మకూర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు మేల్ ఫిమేల్ వరి రకాన్ని 60 ఎకరాల్లో సాగు చేశారు. పంట పూర్తయిన అనంతరం 25 మందికి చెందిన 28 ఎకరాల వరి పంటను హార్వెస్టింగ్ చేసి మిగిలిన 32 ఎకరాల పంట విషయంలో రేపు, మాపు అంటూ కంపెనీ ఆర్గనైజర్ కాలం గడిపాడు. ఈ క్రమంలో ఈనెల మూడో తేదీన కురిసిన అకాల వర్షంతో 32 ఎకరాల్లో ధాన్యం గింజలు పూర్తిగా రాలిపోయాయి.ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను అడగితే పట్టించుకోవడంలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ ఆర్గనైజర్ రఘుపతి తమ మిషన్తోనే హార్వెస్టింగ్ చేసుకోవాలని షరతు పెట్టడంతోపాటు కోతకు వచ్చిన తమ పంటలను వదిలి అధిక రేట్లతో ఇతర గ్రామాల్లో హార్వెస్టింగ్ చేశాడని, దీంతో తాము నష్టపోయామని వాపోయారు. -
ఇదేం ‘దారి’ణం
ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో నూతన రోడ్డు నిర్మాణాలు రైతుల పాలిట శాపంగా మారాయి. కొత్త రోడ్ల ఏర్పాటు స్వాగతించాల్సిన విషయమే అయినా.. అనుసరిస్తున్న విధానం వికృతంగా ఉంది. రైతుల పొలాల్లో రోడ్డు వేస్తున్న విషయాన్ని కనీసం వారికి చెప్పకుండా, పచ్చని పంటపొలాల మీదుగా రహదారులు నిర్మిస్తున్నారు. అడ్డుకుంటే స్థానిక టీడీపీ నాయకులు పోలీసుల అండదండలతో దాడులకు దిగుతున్నట్లు సమాచారం. దిక్కుతోచని రైతులు చేసేది లేక హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. స్టే తెచ్చుకుని పనులు ఆపిస్తున్నారు. కొన్నిచోట్ల కోర్టు స్టేలను కూడా బేఖాతరు చేస్తున్నారు. కుప్పం రూరల్ : కుప్పం నియోజకవర్గంలో నాలుగేళ్లుగా రూ.610 కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆర్ అండ్ బీ పరిధిలో రూ.300 కోట్లతో 300 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాలు చేపట్టారు. పంచాయతీ రాజ్ పరిధిలో మరో 310 కోట్ల రూపాయలతో 280 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 175 కిలో మీటర్ల తారురోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ పనుల్లో రైతుల అనుమతి లేకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా చేసేవే అధికం. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రోడ్లు మచ్చుకు కొన్ని.. కుప్పం – గుడ్లనాయనపల్లి మార్గం నుంచి ఒంటూరు(చింపనగల్లు) గ్రామానికి రోడ్డు మంజూరైంది. పొలంలో రోడ్డు నిర్మాణం చేపడతామని పొలం యజమాని నారాయణప్రసాద్కు కాంట్రాక్టరు చెప్పాడు. రైతు నారాయణప్రసాద్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, పొలంలో రోడ్డునిర్మాణం చేయరాదని చెప్పారు. చేయాల్సి వస్తే తనకు పరిహారం ఇవ్వాలని భీష్మించారు. ఇదే సమయంలో రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని స్థానిక టీడీపీ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కుప్పం – గుల్లేపల్లికి తారురోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టరు జేసీబీలతో రైతుల పొలాల్లో మట్టిని తొలగించేందుకు ప్రయత్నించాడు. తంబిగానిపల్లి, కమతమూరు గ్రామాలకు చెందిన 10 మంది రైతులు ‘ఇదేమి దౌర్జన్యం ? మా అనుమతి తీసుకోకుండా రోడ్డు నిర్మాణం ఎలా చేపడతారు’ అని ప్రశ్నించారు. సదరు కాంట్రాక్టరు, అధికారులు పోలీసుల సమక్షంలో రోడ్డునిర్మాణానికి ఉపక్రమించారు. కాపాడాల్సిన పోలీసులే కాపలా కాస్తున్నప్పుడు రైతులు చేసేది లేక హైకోర్టును ఆశ్రయించారు. స్టే తెచ్చుకుని నిర్మాణాలు ఆపారు. నష్టపరిహారం తరువాత ఇప్పిస్తాం.. కోర్టు కేసు వాపసు తీసుకోవాలని రైతులపై స్థానిక టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఉర్లవోబనపల్లి రోడ్డు నుంచి పేటగుట్టమీదుగా గోనుగూరుకు తారురోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. అధికారులు ఓ వైపు సర్వే చేస్తే.. అటువైపు టీడీపీ నాయకుల పొలం పోతుందని మరోవైపు ఉన్న నిరుపేద పొలంలో నిర్మాణాలకు సిద్ధమయ్యారు. రైతు వైఎస్సార్సీపీ నాయకుల సహకారంతో రోడ్డుకు అడ్డంగా రాళ్లు నాటి నిర్మాణాలను నిలుపుదల చేశారు. స్థానిక నాయకులు నష్టపరిహారం ఇప్పిస్తామని రైతు అబ్బును మభ్యపెట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత పట్టించుకోలేదు. నూలుకుంట నుంచి దెయ్యాలవంకకు వేస్తున్న తారురోడ్డును రైతులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా, పరిహారం ఇవ్వకుండా రోడ్డు వేస్తుండడంతో నలుగురు రైతులు హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారు. అయితే స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు రైతులకు రేషన్, పెన్షన్ వంటి పథకాలు తొలగిస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం. రామకుప్పం – బందార్లపల్లి మార్గంలో తారురోడ్డు నిర్మాణాలు చేపట్టారు. ఇందులో రామకుప్పం గ్రామానికి చెందిన శివశంకర్, నాగరాజుకు చెందిన 13 సెంట్ల భూమి పోయింది. వారికి మాటమాత్రమైనా చెప్పకనే రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రైతులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా అధికారులు ఖాతరు చేయలేదు. దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం చేసేశారు. కుప్పం మండలం తిర్లావానిబండ నుంచి ఫిరోజ్ కొటాలు వరకు తారురోడ్డు నిర్మాణాన్ని చేతికొచ్చిన వరిపొలంపై చేపడుతున్నారు. నాలుగు రోజులు సమయమిస్తే పంటను కోసుకుంటామని రైతులు కాళ్లావేళ్లా పడినా.. జేసీబీలతో పంటను తొక్కించి మరీ నిర్మాణాలు చేస్తున్నారు. అడ్డొచ్చిన నాపై దళిత మహిళని చూడకుండా టీడీపీ నాయకులు మంగళవారం దాడి చేశారంటూ తిర్లావానిబండకు చెందిన పద్మ వాపోయింది. ఒకటి రెండు ఇళ్లకోసం రోడ్ల నిర్మాణం చేపట్టరాదని కలెక్టర్ ఆదేశాలున్నా, నాలుగు ఇళ్ల కోసం రూ.10 లక్షలు ఖర్చుపెట్టి తారురోడ్డు నిర్మిస్తున్నారు. -
ప్రకటన సరే..కొనేదెప్పుడు?
వెల్దుర్తి/కృష్ణగిరి : ఆరుగాలం కష్టపడ్డా, ప్రకృతి అనుకూలించక దిగుబడి తగ్గి, మార్కెట్లో ధర పతనమై అప్పుల ఊబిలో కూరుకుపోయిన వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లోని శనగ రైతులపై ప్రభుత్వం కనికరం చూపడంలేదు. రబీ సీజన్లో వర్షాధారంగా ఇరు మండలాల్లో (వెల్దుర్తిలో 823హెక్టార్లు, కృష్ణగిరిలో 500హెక్టార్లలో) 1,323 హెక్టార్లలో శనగ సాగు చేశారు. ఎకరాకు దాదాపు రూ.20వేలు ఖర్చు చేశారు. కౌలు రైతులకు అదనంగా రూ.5వేలు ఖర్చు వచ్చింది. మార్కెట్లో ధరలేకున్నా అప్పులు తాళలేక కొందరు రైతులు దిగుబడులను ఇప్పటికే నష్టానికి అమ్ముకున్నారు. మరికొందరు గిట్టుబాటు ధరకు ప్రభుత్వం ఎప్పుడు కొంటుందా అని ఎదురు చూస్తూ దిగుబడులను ఇళ్లల్లోనే దాచుకున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. రెండు నెలలుగా మద్దతు ధరకు కొనాల్సిందిగా రైతులు అధికారులను కోరుతూనే ఉన్నా వారి చెవికెక్కడంలేదు. గత ఏడాది మార్కెట్లో రూ.8వేలకు మించి పలికిన క్వింటం శనగ ధర ప్రస్తుతం రూ.3,200ల నుంచి రూ.3,600లు మాత్రమే పలుకుతోంది. మరో రెండు నెలల్లో ఖరీఫ్ వచ్చే సమయమైందని, వెంటనే తమ దిగుబడులను మద్దతు ధర రూ.4,500కు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధర ప్రకటించినా ఫలితం లేదు ప్రభుత్వం శనగలకు మద్దతు ధర ప్రకటించి నెలలు గడుస్తున్నా అన్నదాతలకు ఫలితం లేదు. పంటలకు పెట్టిన పెట్టుబడులు కట్టుకుందామంటే పంటను అమ్ముకునేందుకు దిక్కే లేదు. మార్కెట్లో ధర పూర్తిగా పతనం కావడంతో మద్దతు ధర కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పర్మిట్లు రాసిచ్చినా కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదు. మరో నెల రోజులుంటే ఖరీఫ్ ప్రారంభం కాబోతుంది. అధికారుల శనగ రైతులపై కనికరం చూపాలి. -
ఇలా వచ్చి.. అలా వెళ్లారు
అనంతపురం అగ్రికల్చర్ : రబీలో నెలకొన్న కరువు పరిస్థితుల అంచనా వేయడానికి మంగళవారం ముఖేష్కుమార్ నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం(కేంద్ర బృందం) జిల్లా పర్యటన కంటితుడుపుగా సాగింది. జిల్లాకు తక్షణ సాయంగా రూ.699.45 కోట్లు అవసరమని కలెక్టర్ జి.వీరపాండియన్ కేంద్ర బృందానికి కరువు నివేదిక అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు జాబితాలో మొదట 15, తర్వాత 8 మొత్తం 23 మండలాలు ఉన్నాయి. అవన్నీ కూడా తీవ్ర కరువు కాకుండా సాధారణ కరువు (మాడరేట్) జాబితా కింద ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎఫ్సీడీ ఫైనాన్స్ డైరెక్టర్ ముఖేష్కుమార్, నీతి అయోగ్, అగ్రికల్చర్ ఇన్పుట్స్ రీసెర్చ్ ఆఫీసర్ అనురాధాబటనా, ఎఫ్సీఐకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డీజీఎం (లీగల్) జీవీ విజయకుమార్, హైదరాబాద్కు చెందిన డీఓడీ డైరెక్టర్ శ్రీవాస్తవల బృందం జిల్లాకు వచ్చింది. ఊరూరా కరువు కథలే... జాయింట్ కలెక్టర్–2 సుబ్బరాజు ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, డీఆర్డీఏ అధికారులతో కలిసి 11.30 గంటలకు గోరంట్లకు వెళ్లారు. అక్కడ తాగునీటి కష్టాలు తెలుసుకుని ఎండిపోయిన బోరుబావిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప, జెడ్పీ చైర్మన్ పూలనాగరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ కేంద్ర బృందాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర బృందం ఏటా వచ్చివెళుతున్నా...కరువుకు శాశ్వత పరిష్కారం చూపించడంలో ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా శంకరనారాయణ విమర్శించారు. వస్తున్న అరకొర నిధులు కూడా టీడీపీ కార్యకర్తలకే సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. అక్కడి నుంచి అదే మండలం బెల్లాలపల్లికి చేరుకున్న కేంద్రం బృందం.. అక్కడ నిర్మిస్తున్న ఫారంపాండ్ చూసి ఉపాధి కూలీలతో మాట్లాడారు. తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు పెనుకొండ మండలం అడదాకులపల్లి గ్రామానికి చేరుకుని పంట పొలాలు పరిశీలించారు. పప్పుశగన రైతులు కొండారెడ్డి, జగన్నాథరెడ్డితో మాట్లాడారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి పంట ముగిసేదాకా వర్షంజాడ లేకపోవడంతో వేసిన పప్పుశనగ దారుణంగా దెబ్బతినడంతో నష్టాలపాలైనట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ 20 నిమిషాలు గడిపిన కేంద్రబృందం సభ్యులు ఆ తర్వాత 2.15 గంటలకు చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఎండిపోయిన 4 ఎకరాల చీనీతోటను చూసి బాధిత రైతు లక్ష్మమ్మతో మాట్లాడారు. గ్రామ శివార్లలో ఉపాధికూలీలతో సమావేశమై కష్టనష్టాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మామిళ్లపల్లి, కనగానపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు కంబదూరు మండలం తిప్పేపల్లి గ్రామంలో ఎండిపోయిన తాగునీటి బోరుబావిని పరిశీలించి సర్పంచ్ నరసింహులుతో మాట్లాడారు. 500 అడుగులకు పైగా బోర్లు వేస్తున్నా చుక్క నీరు పడటం గగనంగా మారిందని ఈ సందర్భంగా పలువురు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ సరిగ్గా 15 నిమిషాలు గడిపారు. పక్కనే ఎండిపోయిన టమాట, కర్భూజా పంటలను పరిశీలించాలని కోరినా సమయం లేదని.. కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి రాత్రి 7 గంటలకు అనంతపురం ఆర్అండ్బీ అతిథిగృహానికి చేరకున్నారు. రూ.699.45 కోట్లతో నివేదిక జిల్లాకు తక్షణ సాయంగా రూ.699.45 కోట్లు అవసరమని కలెక్టర్ ఆధ్వర్యంలో కేంద్ర బృందానికి కరువు నివేదిక అందజేశారు. అందులో ఇప్పటికే రూ.53.94 కోట్లు ఖర్చు చేశామని, మిగతా రూ.645.51 కోట్లు జూన్లోపు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో వ్యవసాయశాఖ పరిధిలో రూ.42.40 కోట్లు, ఉద్యానశాఖ పరిధిలో రూ.13.20 కోట్లు, పశుసంవర్ధఖశాఖకు రూ.49.65 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్కు రూ.10.57 కోట్లు, డ్వామాకు రూ.274.71 కోట్లు, మైనర్ ఇరిగేషన్శాఖకు రూ.274.71 కోట్లు అవసరమని నివేదించారు. 11 గంటలకు ప్రారంభం, 6 గంటలకు ముగింపు క్షేత్రస్థాయి పర్యటన ఉదయం 11 గంటలకు చిలమత్తూరు మండలం రక్షా ఆకాడమీ నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అనంతరం స్థానిక ఆర్అండ్బి అతిథిగృహంలో అధికారులతో సమీక్ష 9.30 గంటల వరకు నిర్వహించారు. ఇందులో కరువు పరిశీలన కన్నా ప్రయాణం, అధికారులతో సమీక్షకే ఎక్కువ సమయం తీసుకోవడం విశేషం. పంట పొలాలు, ఎండిన బోరుబావులు, పండ్లతోటల పరిశీలించడం.. రైతుల కష్టాలు వినేందుకు కనీసం మూడు గంటలు కూడా కేటాయించలేదు. అధికారులపై అసంతృప్తి వ్యవసాయ, అనుబంధశాఖలు, డ్వామా, డీఆర్డీఏ తదితర శాఖల పరిధిలో నెలకొన్న కరువు పరిస్థితులకు సంబంధించి సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించారు. అనంతరం జిల్లా కరువు పరిస్థితుల గురించి కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో పవర్పాయింట్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. జిల్లా స్థాయి అధికారులతో కేంద్ర బృందం సభ్యులు సమీక్షించారు. పర్యటన సమయంలో కరువు పరిస్థితులు చూసిన కేంద్ర బృందం సభ్యులు కరువు నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరువు తీవ్రంగా ఉన్నా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు గానీ, కరువు నివారణ ప్రతిపాదనలు కాని పంపకపోవడంతో వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ, ఉద్యానశాఖ అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఉప్పు రైతుల్లో..కలవరం
బరంపురం : గంజాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శుక్రవారం జారీ చేసిన హెచ్చరికలతో జిల్లాలోని ఉప్పు రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే వారం రోజులుగా పడుతున్న అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాతావరణ శాఖ హెచ్చరికలతో ఉప్పు రైతులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఉరుములు, మెరుపులతో కురిసిన తేలికపాటి వర్షాలకే చాలా నష్టపోయాం. ఇప్పుడు ఐఎండీ(ఇండియన్ మెట్రాలజీ డివిజన్) జారీ చేసిన హెచ్చరికలతో భయాందోళనకు గురవుతున్నామని వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతామని వాపోయారు. పదివేల కుటుంబాలకు ఆధారం జిల్లాలో సుమారు 10వేల ఉప్పు రైతుల కుటుంబాలున్నాయి. రెండువేలకు పైగా ఎకరాల్లో ఉప్పు పంటను సాగుచేస్తున్నారు. వీరికి ఉప్పు పంట తప్ప ఇంకో జీవనాధారం లేదు. వాతావరణ హెచ్చరికల ప్రకారం వర్షాలు పడితే పంట మొత్తం నీట మునిగి నాశనమైతే జీవనం సాగించడం కూడా కష్టతరంగా మారుతుంది. రెండువేల ఎకరాల్లో పండించిన పంటలో సుమారు 40 శాతం పంటను తీశామని రైతులు చెబుతున్నారు. ఇంకా 60 శాతం ఉండిపోవడంతో తీవ్ర అందోళనకు గురవుతున్నామన్నారు. గతంలో వచ్చిన ఫైలీన్ తుఫాన్ ప్రభావానికి రెండు వేల ఎకరాల్లో పంట మొత్తం నీట మునగడంతో తీవ్ర నష్టపోయామని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలి జనవరి మొదటి వారంతో ప్రారంభమయ్యే ఉప్పు సీజన్ జూన్ మొదటి వారంతో ముగుస్తుంది. ప్రస్తుతం ఎండ అధికంగా తగలితే ఉప్పు పంట దిగుబడి మరింతగా వస్తుంది. ధర కూడా ఆశాజనకంగా ఉన్న తరుణంలో వారం రోజులుగా పడిన వర్షాలకు పంట నష్టంతో పాటు ధర కూడా తగ్గిపోయింది. దీనికి తోడు సోమవారం నుంచి వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం దృష్టి సారించి తగు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. జరగబోయే నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి ఉప్పు రైతులను ఆదకోవాలని ఉప్పు సహకార సమితి కార్యదర్శి బొటొ కృష్ణ రెడ్డి విజ్ఙప్తి చేస్తున్నారు. -
విషాదం నింపిన ఈత సరదా
గొల్లపల్లి (వెల్గటూర్): ఈత సరదా ఇద్దరు చిన్నారులను బలిగొన్నది. ఈ ఘటన బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురం (బీ–జోన్)కు చెందిన వాసాల లక్ష్మణ్–స్వరూప దంపతులకు ఛత్రపతి(10), కూతురు ఉన్నారు. ఛత్రపతి నాలుగో తరగతి చదువుకుంటున్నాడు. పైడిపల్లిలోని అమ్మమ్మ పెరుక పోచమ్మ ఇంటికి పది రోజుల క్రితం వచ్చాడు. ఇతనికి పైడిపల్లికే చెందిన పెరుమాండ్ల నర్సయ్య–మరియ దంపతుల కుమారుడు హర్షవర్ధన్(8)తో స్నేహం పెరిగింది. బుధవారం సాయంత్రం గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి వద్దకు ఈతకని వెళ్లారు. ఈత రాకపోవడంతో బావిలోకి దిగిన వెంటనే నీటిలో మునిగి చనిపోయారు. -
రోడ్డెక్కిన రైతులు
సారంగపూర్(నిర్మల్) : మండలకేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. నిర్మల్–స్వర్ణ ప్రధాన రహదారిపై భైఠాయించి రెండుగంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 20రోజులుగా మండలకేంద్రంలోని మార్కెట్యార్డుకు మొక్కజొన్న తరలిస్తున్నా కోనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. దిగుబడి నిలువలు ఎక్కడికక్కడ పేరుకుపోయి కనీసం ఆరబెట్టుకునే స్థలం కూడాలేకుండా పోయిందన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో నష్టపోయే ప్రమాదముందని వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్యాంసుందర్, నిర్మల్ రూరల్ సీఐ జీవన్రెడ్డి, ఎస్సై రాజు అక్కడికి చేరుకున్నారు. వారు రైతులకు నచ్చజెప్పే యత్నం చేయగా.. వారు ఎంతకు వినకపోగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. రూరల్ సీసీ మార్కెటింగ్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతుల సమస్యను, తాజా పరిస్థితిని వివరించారు. ఈమేరకు స్పందించిన అధికారులు వారం లోపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, రెండుగంటల పాటు సాగిన ఆందోళనతో రహదారికిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు తదితరులు ఉన్నారు. -
ఆయనతోనే..బంగారు తెలంగాణ సాధ్యం
చింతపల్లి (దేవరకొండ) : బంగారు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమని తెలంగాణరాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధిదిశగా తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నారన్నారు.రైతులకు 24 గంటల విద్యుత్, పేద ప్రజల సంక్షేమానికి షాదిముబారక్, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు సన్న బియ్యం భోజనం తదితర సంక్షేమ పథకాలుప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. తెలంగాణరాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం ఏ రాజకీయపార్టీ తరం కాదన్నారు. రాష్ట్రంలో రైతులకు విద్యుత్ సమస్య లేకుండాతీర్చిన ఘనతతో పాటు అనేక సంక్షేమ పథకాలుప్రవేశ పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం ఖాయమని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి ఈ ప్రభత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, మాజీ ఎంపీపీ సర్వయ్య, సుధీర్రెడ్డి, నట్వ గిరిధర్, ఎల్లంకి అశోక్, ఎండి. ఖాలెక్, చంద్రశేఖర్, నరేందర్రావు, బిజె.యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చందంపేట (దేవరకొండ) : సీఎం కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్రహోంశాఖ, కార్మిక శాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. డిండి నుంచి నేరెడుగొమ్ము మండల కేంద్రానికి కాలువల ద్వారా చెరువులు నింపేందుకు వారం రోజుల క్రితం నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా శనివారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రమావత్ రవీంద్రకుమార్తో కలిసి జల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కృషితో 70 ఏళ్లుగా పూడుకుపోయిన కాలువలకు పుర్వ వైభవం వచ్చిందన్నారు. చందంపేట, నేరెడుగొమ్ము మండలంలోని సుమారు 40 చెరువులు, కుంటలు డిండి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో జలకళను సంతరించుకున్నాయని, గ్రామాల్లో ప్రజ లు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏరాష్ట్రం అందించని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముక్కమల పరుశురాములు, ఎంపీటీసీ గిరియాదగిరి, గడ్డం వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు నాయిని సుధీర్రెడ్డి, రాంరెడ్డి, ఆలంపల్లి నర్సింహ, మేకల శ్రీను, ముత్యాల సర్వయ్య, బోయపల్లి శ్రీను, ఆరెకంటి రాములు, బాలు తదితరులు పాల్గొన్నారు. -
పోరుగడ్డ నుంచే పోరాటం మొదలు
సాక్షి, జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా జనగామ పోరుగడ్డ నుంచే పోరాటం మొదలు పెడతామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడుతామన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం రైతులు ఆనందంగా ఉంటున్నారని చెప్పడం దారణమన్నారు. రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో పెంబర్తి రైతులను వచ్చి అడగాలన్నారు. భూములు లేని వారిని రైతు సమన్వయ సమితుల్లో నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లోనే రూ.14వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు.. సక్రమంగా చెల్లించిన రైతులకు రూ.5వేల చొప్పున ప్రోత్సాహకం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. పెట్టుబడి పథకంలో కౌలు రైతులకు అవకాశం కల్పించక పోవడం సిగ్గుచేటన్నారు. జనగామ నియోజకవర్గంలోని ఆదర్శరైతులతో సమావేశమై రైతుల సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. అనంతరం వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో చెంచారపు శ్రీనివాస్రెడ్డి, బుచ్చిరెడ్డి, ఎండీ అన్వర్, రంగరాజు ప్రవీణ్కుమార్, కొత్త కరుణాకర్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, మేడ శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్, మేకల రాంప్రసాద్, ఎండీ నాజీజ్, క్రాంతికుమార్, నాంపల్లి చందన, లింగాజీ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్ చరిత్ర హీనుడు
టేకుమట్ల : కొట్లాడి సాధించుకున్న ఉద్యమ రాష్ట్రంలో రైతులను పట్టించుకోకుండా నియంత పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రహీనుడయ్యాడని ప్రభుత్వ మాజీ చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని వెల్లంపల్లి, దుబ్యాల గ్రామాల్లో శుక్రవారం చేపట్టిన రైతు భరోసాయాత్రలో భాగంగా ఆయన రైతుల ఇంటికి, పంట పొలాల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గండ్ర మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర నిరంకుశ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రాజ్యాన్ని తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ఇంతకుముందు, ఇకపై కూడా రైతు రాజ్యాన్ని తీసుకొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని సకాలంలో చేయకపోవడంతో రైతులకు మాఫీ అయిన వడ్డీల పేరుతో బకాయిలు పేరుకుపోతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దొమ్మటి సాంబయ్య, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మండల అధ్యక్షులు రెడ్డి మల్లారెడ్డి, ఎంపీపీ బందెల స్నేహలత, వైస్ ఎంపీపీ సట్ల కొంరయ్య, ఎంపీటీసి భీంపెల్లి సంధ్యారామస్వామి, మండల ప్రధాన కార్యదర్శి బిక్కినేని సంపత్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పెరుమాండ్ల మొగిళి, ఉపాధ్యక్షులు బాబురావు, వైనాల రవీందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సట్ల రవిగౌడ్, కోండ్ర ఓదెలు, గువ్వాడి లక్ష్మణ్, తోడేటి రవిందర్, పిన్నింటి విజేందర్రెడ్డి, దాసారపు సతీష్, యూత్ మండల అధ్యక్షుడు ఎండీ అక్రం, ఆడెపు సంపత్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోటగిరి సతీష్గౌడ్, నానవేని కుమార్యాదవ్, నానవేని శ్రీకాంత్, రామస్వామి, పోషిని శ్రీని వాస్, నల్లబెల్లి పాల్గొన్నారు. కేసీఆర్ గద్దె దిగడం ఖాయం మొగుళ్లపల్లి: పంటలు పండక అప్పులపాలై అవస్థలు పడుతున్న రైతులను ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని రైతుల ఉసురు, తగిలి రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని మాజీ చిఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇప్పలపల్లి, అకినపల్లి, పోతుగల్లు, కోర్కిశాల గ్రామాలలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో మాజీ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాలలోని రైతుల ఇంటికి, పంట పొలాల్లోకి నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
రైతు సమస్యల పరిష్కారానికే పాదయాత్ర బీజేపీ
సారంగపూర్(నిర్మల్) : రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే దిశగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నుంచి బీజేపీ పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఒడిసెల శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పాదయాత్ర సందర్భంగా ప్రజలు, రైతులతో సమావేశాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ యాంత్రీకరణ పేరిట రైతులకు అందాల్సిన సబ్సిడీ ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకే కేటాయించి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. స్వర్ణ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణ పనులు పూర్తి చేయకుండా మధ్యలోనే పనులు నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో పాటు రైతు ప్రభుత్వమని చెప్పుకుతిరుగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అడుగడుగునా అన్యాయం చేస్తోంద ని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగైదు విడతలుగా రుణమాఫీ చేసి రైతులకు రూపాయికూడా మిగలకుండా చేశారని దుయ్యబట్టారు. ఈవిషయాలన్నీ ప్రజలకు వివరించి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని వారికి వివరించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే పాదయాత్ర చేపడుతున్నామన్నారు. రైతు సోదరులు అధికసంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ మండలాధ్యక్షుడు మైస శేఖర్, నాయకులు అర్జున్, గంగయ్య, ఉమేశ్రాథోడ్, సుభాష్చౌహాన్, రాకేశ్ తదితరులున్నారు. -
మార్కెట్ యార్డు లేక రైతుల విలవిల
ఆళ్లపల్లి : ప్రవేట్ దళారుల చేతిలో మోసపోవద్దని ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశ్యంతో పండించిన పంటలకు మార్కెట్ యార్డు,కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేస్తుందనుకుంటే అతి తక్కువ రోజులు మార్కెట్ యార్డులను కేటాయించి, రైతులకు సమాచారం అందే లోపే మార్కెట్ యార్డులను మూసివేయడం ద్వారా మండలానికి సంబంధించిన కందులను పండించిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు.ఎంతో కష్టంతో ఆరుగాలం పండించిన పంట అటు మార్కెట్ యార్డులు మూసివేయడంతో ఇంట్లో నిల్వ ఉన్న కందులను ప్రవేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకొని పండించిన పంట అతి తక్కువ ధరలకు దళారులకు అమ్ముకుంటే చాలా నష్టపోతామని,ఎలాగైనా ప్రభుత్వం మార్కెట్ యార్డులను తెరిపించి మమ్ములను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించారు. –గొగ్గెల రమేష్,మైళారం మార్కెట్ యార్డులను పునఃప్రారంభించాలి మాకు సమాచారం అందేలోపే ప్రభుత్వం కేటాయించిన గడువు పూర్తి కావడంతో చాలా మనోవేధనకు గురయ్యానని,ఎలాగైనా మార్కెట్ యార్డులను పునఃప్రారంబించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. –గొగ్గెల సత్యనారాయణ,మైళారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..మండల వ్యవసాయాధికారి ఆర్.శంకర్ రైతుల సమస్యని ఉన్నతాధికారుల దృష్టికి దృష్టికి తీసుకెళ్తానని, మార్కెట్ యార్డును పునః ప్రారంభించాలాఆ కృషి చేస్తానని అన్నారు.పై అధికారుల నుంచిఆడర్ లేకుండా నేనేమీ చేయలేనని ఆయన అన్నారు. -
రైతులపై పూనమ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: తమ హక్కుల కోసం అనేక కష్టనష్టాలకోర్చి 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి విజయం సాధించిన మహారాష్ట్ర రైతులపై బీజేపీ యూత్ వింగ్ చీఫ్, ఎంపీ పూనమ్ మహాజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆ రైతులంతా మావోయిస్టులు.. వారిని సమర్థించేవారంతా పట్టణాల్లో నివసించే మావోయిస్టులంటూ’ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించిన వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఆమెపై బీజేపీ చర్యలుతీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. బీజేపీ నైజమే అంత: జయంత్ పాటిల్(ఎన్సీపీ ఎమ్మెల్యే) పూనమ్ మహాజన్ వ్యాఖ్యల ద్వారా ప్రజల పట్ల బీజేపీకి ఉన్న వైఖరేంటో మరోసారి బయటపడిందని ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ అన్నారు. ఎవరైనా తమ హక్కుల కోసం పోరాటం చేస్తే వారిని మావోయిస్టులు, నక్సలైట్లుగా చిత్రీకరించడం ఆ పార్టీకి కొత్తేమీ కాదని విమర్శించారు. కులం, మతం, సిద్ధాంతాల పేరిట ప్రజలను విభజించడం బీజేపీ నైజమని, దేశానికి స్ఫూర్తినిచ్చిన మహా రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి వారిని అవమానించడం పార్టీ విధానాన్ని మరోసారి స్పష్టం చేసిందన్నారు. అన్నం పెట్టే రైతులను అవమానిస్తారా..?: అశోక్ చవాన్ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ పూనమ్ వ్యాఖలపై స్పందిస్తూ... దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానించడం అమానుషమని విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం వివాదాలకే ప్రాధాన్యమిస్తున్న ఇటువంటి ప్రభుత్వాన్ని తానెక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. పూనమ్ వెంటనే ఆమె వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ముంబైకి చేరిన కిసాన్ మహా ర్యాలీ
మహారాష్ట్ర : అఖిల భారతీయ కిసాన్ సభ (ఏబీకేఎస్) ఆధ్వర్యంలో మహారాష్ట్ర రైతులు చేపట్టిన మహాధర్నా ఆదివారం ముంబైకి చేరింది. సుమారు 35 వేల మంది రైతులు పాల్గొంటున్న ఈ ర్యాలీకి అన్ని రాజకీయ పక్షాలూ మద్దతు పలికాయి. రైతులంతా సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడించనున్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ 35 వేల మంది రైతులు నాసిక్ నుంచి ముంబైకి పాదయాత్రగా బయలుదేరిన సంగతి తెలిసిందే. రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలుచేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. వీటితోపాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 40 వేల రూపాయల పరిహారం అందజేయాలని, గుజరాత్కు నీటి విడుదల వెంటనే నిలిపివేయాలనే డిమాండ్లూ ఉన్నాయి. రైతులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, వృద్ధులు ర్యాలీలో పాల్గొనడం విశేషం. కిసాన్ సభ మహార్యాలీకి శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు సీపీఎం పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని ఏబీకేస్ కార్యదర్శి తెలిపారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి.. ‘రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకొచ్చారు. ఇకపై బీజేపీ ప్రభుత్వం వారిని మోసం చేయలేదంటూ’ ట్వీట్ చేశారు. నాసిక్లో మంగళవారం ప్రారంభమైన రైతు యాత్ర రోజుకు సగటున 35 కిలో మీటర్ల మేర కొనసాగుతూ సోమవారం దక్షిణ ముంబైకి చేరనుంది. గతంలో కూడా సుమారు లక్ష మంది రైతులు ఒకేచోటికి చేరి నిరసన వ్యక్తం చేసిన విషయం విదితమే. -
వ్యవసాయ మార్కెట్ గోదాం ‘మమ’
మధిర మార్కెట్ యార్డుకు అనుసంధానంగా రైతుల సౌకర్యార్థం మండల కేంద్రంలో నిర్మించిన వ్యవసాయ గోదాం నిరుపయోగంగా మారింది. 2010లో నాటి డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన సబ్మార్కెటింగ్ యార్డుకు ప్రారంభోత్సం చేశారు. దీంతోపాటు రూ.2లక్షల వ్యయంతో పంటను ఆరబెట్టుకునేందుకు ప్లాట్ఫాం కూడా నిర్మించారు. కానీ ప్రారంభానికే పరిమితమైంది. ఈ మార్కెట్ గోదాం ఉపయోగంలోకి రాలేదు. రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పట్టించుకునే వారు లేరు. బోనకల్ : మార్కెట్ గోదాం ఆవరణం ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండి చిట్టడవిని తలపిస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్ శాఖ అధికారులు ఆ పని చేయకపోవడంతో గోదాం మూత పడింది. దీంతో మండలంలోని అన్ని గ్రామాల రైతులు పంటలను మధిర, ఖమ్మం తరలిస్తున్నారు. మండలంలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సబ్మార్కెట్ యార్డులోనే కొనుగోలు చేసి గోదాంలో నిల్వచేయాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా ప్లాట్ఫాం పగుళ్లు వచ్చి శిథిలావస్థకు చేరింది. మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభిస్తే రైతులు ధాన్యాన్ని, మార్కెట్కు తీసుకొచ్చే పంటలను ప్లాట్ఫాంపై ఆరబెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఉగయోగించని మార్కెట్ యార్డ్కు ఇటీవల రూ.1లక్షతో ఖర్చు ఆర్చి నిర్మించారు. సబ్ మార్కెట్యార్డును ప్రారంభిస్తే రైతులకు సౌకర్యంగా ఉండటంతోపాటు, నిరుపయోగంగా ఉన్న గోదాం, ప్లాట్ఫాం వినియోగంలోకి వస్తుందని రైతులు అంటున్నారు. కొనుగోళ్లు ప్రారంభించాలి... బోనకల్లో నిర్మించిన సబ్మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించాలి. పండించిన పంటలను దూరప్రాంతాలకు వెళ్లి విక్రయించాల్సి వస్తోంది. ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోదాం కూడా ఉందని, కానీ సిబ్బంది లేకపోవడంతో రైతులు ఎవరు తమ పంటలను దాచుకోవడం లేదు. – బందం అచ్చయ్య, రామాపురం, రైతు మార్కెట్ లేక రైతుల అవస్థలు... రైతుల కోసం నిర్మించిన సబ్మార్కెట్ యార్డులో కొనుగోళ్లు జరుపకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మార్కెట్ యార్డు నిర్మించారే తప్ప, కొనుగోళ్లు లేకపోవడంతో గోదాం నిరుపయోగంగా మారింది. ముళ్లపొదలు, చెట్లతో నిండి ఉంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. –హనుమంతరావు, రైతు ముష్టికుంట్ల -
రోడ్డెక్కిన కంది రైతు
మద్నూర్(జుక్కల్) : కంది రైతులు కన్నెర్ర చేశారు. కంది పంట కొనుగోలు కేంద్రం పునః ప్రారంభిచాలంటు రైతులు రోడెక్కారు. మండలంలోని మేనూర్లో జాతీయ రహదారిపై మంగళవారం బీజేపీ నాయకులు, రైతులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మండలంలోని డోంగ్లీ సహకార సంఘంలో గత రెండు రోజుల క్రితం కంది కొనుగోలు కేంద్రం మూసివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డోంగ్లీలో కొనుగోలు కేంద్రం మూసివేస్తున్నామని రైతులు మద్నూర్ మార్కెట్లోని కంది కొనుగోలు కేంద్రానికి పంటను తరలించాలని అధికారులు సూచించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీటీసీ రాములు అన్నారు. డోంగ్లీ చుట్టూ పక్కల ప్రాంతాల రైతులు మద్నూర్కు పంటను తరలించాలంటే రవాణ ఖర్చులు తడిసిమోపెడవుతాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు వెంటనే డోంగ్లీలో కంది కొనుగోలును ప్రారంభిచాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై మహమ్మద్ సాజిద్, తహసీల్దార్ ధన్వాల్ సంఘటన స్థలానికి చేరుకోని రైతులు, రైతునాయకులతో మాట్లాడారు. త్వరలో ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేౖసామని చెప్పడంతో వారు రాస్తారోకోను విరమించారు. శనగ పంటను తీసుకోవాలి రబీ సీజన్కు సంబందించి రైతులు పండించిన శనగ పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎంపీటీసీ రాములు డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్లో శనగ క్వింటాలుకు రూ.3400 నుంచి రూ.3600 వరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. కేంద్రప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్కు రూ.4400 ప్రకటించిందని ఇక్కడ శనగకొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు క్వింటాల్కు వెయ్యి రూపాయాలు నష్టపోతున్నారని పేర్కోన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించాలని ఆయన కోరారు. అలాగే మండలంలో అక్రమంగా కందులను రైతుల పేరిట విక్రయించిన దళారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆయనతో పాటు నాయకులు, స్థానిక రైతులు ఉన్నారు. కందులు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జేసీ సత్తయ్య దళారులు అక్రమంగా మహారాష్ట్ర నుంచి కందులను తీసుకచ్చి విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ సత్తయ్య వ్యవసాయాధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనసాగుతున్న కంది కోనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. దళారులు రైతుల వద్ద నుంచి పట్టాపాస్ పుస్తకాలు సేకరించి వారి పేరున కందులు తూకం వేస్తున్నారనే ఆరోపణలు రావడంతో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రతి రోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామానికి చెందిన రైతుల కందులను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయాధికారులు గ్రామాలను ఎంపిక చేసి రైతులకు సమాచారం అందించాలని, రైతులు తమ పట్టాపాసు పుస్తకాలను ఇతరులకు ఇవ్వవద్దని సూచించారు. అక్రమ కంది కొనుగోళ్లపై పూర్తి విచారణ జరుపుతామని, దళారులను ఆరికట్టెందుకు మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పిట్లం ప్రాంతంలో టాస్క్ఫోర్స్ అధికారులను నియమించామన్నారు. భూ ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ సిబ్బంది ఆన్లైన్ పనులను వేగవంతం చేయాలన్నారు. మేనూర్లో రైతులు రాస్తారోకో విషయం ప్రస్తావిస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మార్కెట్ యార్డులలోనే కంది కొనుగోలు కేంద్రాలు ఉండాలన్న నిబంధనలతోనే డోంగ్లీ సోసైటీలో కంది కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేశారని దీనికి రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జేసీతో పాటు తహసీల్దార్ ధన్వాల్, సిబ్బంది ఉన్నారు. -
ఫార్మా ఎగుమతులకు కష్టకాలమే!
ముంబై: అంతర్జాతీయంగా బలహీన ఆర్థిక పరిస్థితులు దేశీ ఫార్మా ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. మధ్యకాలికంగా వృద్ధి దెబ్బతినే అవకాశం ఎక్కువే ఉంది. తాజా నివేదికలో రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఈ అంశాలు వెల్లడించింది. ‘ఆఫ్రికాలో బలహీన ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, లాటిన్ అమెరికాలో కరెన్సీ ఒడిదుడుకులు తదితర అంశాలతో ఫార్మా ఉత్పత్తుల వినియోగంపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఫలితంగా భారత ఫార్మా ఎగుమతులపై మధ్యకాలికంగా ఒత్తిడి ఉండొచ్చు‘ అని తెలిపింది. 2014 ఆర్థిక సంవత్సరం దాకా ఒక మోస్తరు నియంత్రణలు గల మార్కెట్లకు భారీగా పెరిగిన దేశీ సంస్థల ఫార్మా ఫార్ములేషన్స్ ఎగుమతులు గత కొన్నాళ్లుగా బలహీన గణాంకాలను నమోదు చేస్తున్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో స్థానిక కరెన్సీలు బలహీనపడటంతో ఆయా మార్కెట్లకు ఎగుమతులు తగ్గాయని ఇండ్–రా తెలిపింది. మధ్యప్రాచ్య దేశాల్లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో పాటు గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో బీమాను తప్పనిసరి చేస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో మధ్యప్రాచ్యానికి ఎగుమతులు 33 శాతం వృద్ధి చెందాయి. ఎగుమతుల క్షీణత..: ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో బలహీన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎగుమతుల్లో తగ్గుదల కొనసాగుతుందని, స్వల్ప..మధ్యకాలికంగా ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు ఒక మోస్తరుగా వృద్ధి ఉండొచ్చని ఇండ్–రా వివరించింది. చాలా మటుకు దేశీ ఎగుమతి సంస్థలు.. సెమీ రెగ్యులేటెడ్ మార్కెట్లలో తమ కార్యకలాపాల్ని క్రమబద్ధీకరించుకుంటున్నాయని, అవకాశాల కన్నా రిస్కులు ఎక్కువగా ఉన్న మార్కెట్లకు దూరంగా ఉంటున్నాయని పేర్కొంది. వెనిజులన్ బొలివర్ మారకం విలువను 2014 మార్చి నుంచి 32 శాతం మేర తగ్గించేసిన నేపథ్యంలో వెనిజులాకు ఎగుమతులు పరిమితంగా ఉంటున్నా యి. అటు రష్యా రూబుల్ కూడా భారీగా క్షీణించడంతో అక్కడికి కూడా ఎగుమతుల విషయంలో ఎగుమతిదారులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కాంతి రేఖలు.. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు అంతంతమాత్రంగానే ఉన్నా.. సెమీ–రెగ్యులేటెడ్ మార్కెట్లకు సంబంధించి దీర్ఘకాలిక ఫండమెంటల్స్ పటిష్టంగానే ఉన్నాయి. అంతగా అభివృద్ధి చెందని ఆఫ్రికా, లాటిన్ అమెరికా.. ఆసియా దేశాల్లో మొండి వ్యాధుల చికిత్స వ్యయాలు భారీగా ఉంటున్నందున.. జనరిక్స్ ఔషధాల వాడకానికి డిమాండ్ పెరుగుతుందని ఇండ్–రా తెలిపింది. అలాగే వర్ధమాన ఆసియా మార్కెట్లు, జీసీసీ దేశాల్లో సార్వత్రిక ఆరోగ్య బీమాకు ఆదరణ పెరుగుతుండటం వంటి అంశాలతో జనరిక్స్ వాడకం పెరిగి, ఆయా ఔషధాల తయారీ సంస్థలకు మధ్య, దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరనుందని పేర్కొంది. -
సమస్యల బజార్లు
♦ రైతులున్నా..వసతులు సున్నా .. ♦ అధ్వానంగా రైతుబజార్లు ♦ ఏడింట రెండు భేష్ ..ఐదు తుస్... ♦ హైస్పీడ్తో ‘కోట’ రైతుబజార్ శృంగవరపుకోట: రైతుకు దన్ను దొరకాలి.. దళారీ వ్యవస్థ పోవాలి.. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కాలి.. వినియోగదారుల ఆకలి తీరాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతుబజార్ల పరిస్థితి నేడు అధ్వానంగా తయారయ్యాయి. రైతులున్న చోట వసతులు లేక.. వసతులున్న చోట రైతులు రాక.. జిల్లా అధికారులకు వాస్తవాలు çకనబడక.. నేతలకు ప్రజల పాట్లు పట్టక రైతు బజార్లు కునారిల్లుతున్నాయి. వివరాల్లోకి వెళితే... జిల్లా కేంద్రంలో మూడు రైతుబజార్లు ఉండగా చీపురుపల్లి, కొటారుబిల్లి, ఎస్.కోట, పార్వతీపురంలో మరో నాలుగు రైతుబజార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఏడు రైతు బజార్లో రెండు భేషుగ్గా నడుస్తుండగా, మరో ఐదు రైతులు రాక, వసతులు లేక, అధికారులు పట్టించుకోక సమస్యల బజార్లుగా మారాయి. జిల్లా కేంద్రంలో ఆర్అండ్బీ వద్ద ఉన్న రైతుబజార్ రైతులు, వినియోగదారులతో కిటకిటలాడుతోంది. ఎస్.కోటలో ఇటీవల ఏర్పాటైన రైతుబజార్ అంతే వేగంతో అద్భుతంగా నడుస్తూ అందరి అభిమానం చూరగొంటోంది. మిగిలిన రైతుబజార్లు మాత్రం అధికారుల నిర్లక్ష్యానికి, పాలకుల వైఫల్యానికి సాక్ష్యాలుగా మిగిలాయి టాప్ గేర్లో ‘ఎస్’ కోట బజార్ ప్రారంభించిన నెలకే ఎస్.కోట రైతుబజార్ దూసుకుపోతోంది. ప్రస్తుతం 22 స్టాల్స్లో ఇద్దరు, ముగ్గురు కూర్చుని 60 మంది రైతులు అమ్మకాలు చేస్తున్నారు. మరో 100 మంది రైతులు కార్డులు కావాలని దరఖాస్తు చేయగా, పరిశీలించి పెండింగ్లో ఉంచారు. ఎమ్మెల్యే లలితకుమారి ప్రత్యేక శ్రద్ధ ఈఓ సతీష్ చొరవతో నిత్యం 2000 మంది వినియోగదారులకు 100 క్వింటాళ్ల కూరగాయలను రైతులు విక్రయిస్తున్నారు. పెరుగుతున్న అవసరాల మేరకు ఎస్.కోట రైతుబజార్లో షెడ్లు నిర్మించి తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఆర్అండ్బీ బజార్ అదుర్స్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ రైతుబజార్లో 80 స్టాల్స్ ఉండగా 107 మంది రైతులు వ్యాపారాలు చేస్తున్నారు. ప్రతి రోజూ ఈ బజార్లో సుమారు 400 క్వింటాళ్ల వరకు విక్రయాలు జరుగుతుండగా, సుమారు 4000 మంది వినియోగదారులు వస్తున్నట్లు సమాచారం. రైతులు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చినా అమ్మకాలు సాగించేందుకు తగినన్ని స్టాల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మరిన్ని స్టాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కమ్మల పాకల్లో.. మహారాజ పాత ఆస్పత్రి వద్ద ప్రభుత్వ స్థలం లేకు మాన్సాస్ స్థలంలో రైతు బజార్ ఏర్పాటు చేశారు. స్టాల్స్ లేకపోవడంతో కమ్మల పాకల్లో విక్రయాలు చేపడుతున్నారు. ఈ బజార్ పందుల నిలయంగా మారింది. ఈఓ కార్యాలయం, బాత్రూమ్లు లేవు. ప్రహరీ ఒక పక్క పూర్తిగా పోయింది. తాగునీరు, మరుగుదొడ్లు లేక వినియోగదారులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 82 స్టాల్స్ ఉన్నా 30 మంది రైతులు మాత్రమే వస్తున్నారు. నిత్యం సుమారు 800 మంది కొనుగోలుదారులకు 120 క్వింటాళ్ల మేర అమ్మకాలు చేస్తున్నారు. రింగ్రోడ్ బజార్ పరిస్థితీ అంతే.. దాసన్నపేట రింగ్రోడ్డులో రూ.79 లక్షలతో నిర్మించిన రైతుబజార్లో 108 స్టాల్స్ ఉండేవి. రోడ్లు విస్తరణ పుణ్యమాని 52 స్టాల్స్ కూల్చేశారు. ఉన్న 56 స్టాల్స్లో 48 మంది రైతులు రోజుకు 250 క్వింటాళ్ల మేర అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రహరీ, ఈఓ కార్యాలయం, స్టోర్రూమ్లు లేవు. మరుగుదొడ్లు శిథిలమై వినియోగానాకి దూరంగా ఉన్నాయి. నెల రోజుల్లో స్టాల్స్ పునర్నిర్మాణం చేస్తామన్న అధికారులు తర్వాత బజార్వైపే చూడలేదు. చీపురుపల్లిపై చిన్నచూపు.. చీపురుపల్లిలో 2016లో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన రైతుబజార్లో 47 స్టాల్స్ ఉన్నా 19మంది రైతులకు మాత్రమే కార్డులిచ్చారు. వీరిలో కేవలం పదిమంది మాత్రమే బజార్కు వచ్చి రోజుకు సుమారు 150 కిలోల మేర కూరగాయల విక్రయాలు చేపడుతున్నారు. వినియోగదారులు కూడా 30 లోపే ఉంటున్నారు. రైతులను గుర్తించి అమ్మకాలు పెంచడంలో అధికార యంత్రాంగం విఫలమయ్యింది. అన్ని హంగులున్నా అదే తీరు.. పార్వతీపురంలో 2000 సంవత్సరంలో రూ.15 లక్షలతో అన్ని హంగులతో రైతుబజార్ ఏర్పాటు చేశారు. బజార్లో 40 స్టాల్స్ ఉన్నా కేవలం 9 మంది రైతులు మాత్రమే ఉన్నారు. సుమారు 400 మంది కొనుగోలుదారులతో 40 క్వింటాళ్ల మేర అమ్మకాలు సాగిస్తున్నారు. రైతుల్ని గుర్తించి వారిని రైతుబజార్కు రప్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కొటారుబిల్లి తెరిచేదెప్పుడు ...? గంట్యాడ మండలం కొటారుబిల్లిలో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన రైతుబజార్లో సరైన సౌకర్యాలు, వసతుల్లేక ప్రారంభించకుండా వదిలేశారు. రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తికాక రైతుబజార్ నిర్మాణం జరిగి ఏడాది కావస్తున్నా దాన్ని ప్రారంభించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు గాని, అధికారురులు గాని చొరవ చూపక పోవడం విశేషం. స్పందించాలి రైతులు, వినియోగదారుల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన రైతుబజార్ల అభివృద్ధిపై పాలకులు, అధికారులు దృష్టి సారించాల్సిన అభిప్రాయం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతుల సంఖ్య పెంచడంతో పాటు రైతుబజార్లలో సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
వ్యవసాయ మోటార్ల దొంగలు అరెస్ట్
వాకాడు(గూడూరు) : మండలంలోని కొండాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో రైతులకు చెందిన వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను బుధవారం వాకాడు పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 13 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వాకాడు సీఐ ఉప్పల సత్యనారాయణ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. కొండాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా పలువురు మెట్ట రైతులకు సంబంధించిన టెక్స్మో కంపెనీ వ్యవసాయ మోటార్లు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన డేగా సుబ్రమణ్యం అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓజిలి ఎస్సై విజయకుమార్, వాకాడు హెడ్కానిస్టేబుల్ రమణయ్య, ఏఎస్సై శ్రీనివాసులురెడ్డి, పీసీలు అనిల్, గోవర్ధన్లను టీంగా ఏర్పటుచేశారు. వీరు నిందితులైన కొడవలూరు వంశీకృష్ణారెడ్డి, అతని స్నేహితుడైన అంబడి నరేష్లను విద్యానగర్లో అదుపులోకి తీసుకుని 13 మోటార్లును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పగలంతా పొలాల్లో తిరుగుతూ మోటార్లను గుర్తించి రాత్రి సమయాల్లో బాడుగ ఆటో తీసుకెళ్లి దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ తెలిపారు. దొంగలించిన మోటార్లను విద్యాగనర్లోని వంశీకృష్ణారెడ్డి నివాసంలో దాచిపెట్టడం జరిగిందన్నారు. నిందితులను బుధవారం కోట కోర్టుకి హాజరుపరిచినట్లు తెలిపారు. -
కాసులు కురిపిస్తున్న క్యాప్సికం
కరువు నేలలో బంగారం పండిస్తున్న రైతు ఎకరా ఫాలిహౌస్లో రెడ్, ఎల్లో క్యాప్సికం ప్రతివారం రెండు టన్నుల దిగుబడి అనంత రైతుకు ఆదర్శంగా నిలుస్తోన్న లోకేష్ కరువుకు చిరునామాగా మారిన జిల్లా... వేలమీటర్లు తవ్వినా నీటిచెమ్మ కనిపించని పరిస్థితి. అయినా రైతులంతా చెనక్కాయలే వేయడం...తీవ్రంగా నష్టపోతూ అప్పుల పాలవడం..ఏటా ఇదే దుస్థితి. అందుకే ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. సంప్రదాయ పంటలను పక్కనపెట్టి వాణిజ్య పంటలవైపు దృష్టి సారించాడు. కేవలం ఎకరాలో పొలంలోనే క్యాప్సికం పండిస్తూ సిరులు కురిపిస్తున్నాడు. రత్నగిరి(రొళ్ల): మారుతున్న కాలానికి అనుగుణంగా ‘అనంత’ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వాణిజ్య పంటసాగు చేస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తూ ఇతర రాష్ట్రాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవలోకే వస్తాడు రొళ్ల మండలం రత్నగిరికి చెందిన రైతు లోకేష్. అందరిలాగే సంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాలు చవిచూసిన లోకేష్...ఈసారి మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఉన్న కొద్దిపాటి నీటితోనే ఆధునిక పద్ధతులతో క్యాప్సికం సాగు చేశాడు. వారానికి రూ.2 లక్షల చొప్పున లాభాలను ఆర్జిస్తున్నాడు. బెంగళూరు నుంచి నారు సరఫరా క్యాప్సికం గురంచి బాగా అధ్యయనం చేసిన లోకేష్ ముందుగా రూ. 42 లక్షలు ఖర్చు చేసి ఎకరా స్థలంలో పాలీహౌస్ నిర్మించాడు. ఇందుకు ఉద్యానశాఖ రూ.16 లక్షల సబ్సిడీ ఇచ్చింది. ఆ తర్వాత బెంగళూరులోని ఏకలవ్య నర్సరీల్లో ఒకటిన్నర నెలల లేత నారు తీసుకువచ్చాడు. ఇందులో రెడ్ క్యాప్సికం కోసం రూ.6 వేలు, ఎల్లో క్యాప్సికం కోసం రూ.5 వేలు ఖర్చు చేశాడు. అర మీటర్ విస్తీర్ణంలో ఫాలిహౌస్లో సాగు చేపట్టాడు. నీటిని ఆదా చేసుకునేందుకు డ్రిప్పు పద్ధతికి శ్రీకారం చుట్టాడు. 9 నెలల వరకూ దిగుబడి క్యాప్సికం సాగు చేసిన 70 రోజుల నుంచి ప్రారంభమై 9 నెలల వరకు దిగుబడి వస్తుంది. మొక్కలు ఆరోగ్యంగా ఉంటే ఒకటిన్నర సంవత్సరం వరకు దిగుబడి వస్తుందని రైతు లోకేష్ చెబుతున్నాడు. దిగుబడి ప్రారంభమైన తర్వాత 10 రోజుల ఒకసారి కాయలను కోయల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం తనకు ప్రతి కోతకు రెండు టన్నుల వరకు దిగుబడి వస్తోందని వెళ్లడించారు. మార్కెట్లో మంచి రేటు ప్రస్తుతం మార్కెట్లో కిలో క్యాప్సికం రూ.30 నుంచి రూ.35 వరకు ధర పలుకుతోందనీ, ప్రస్తుతానికి తాను రూ.2 లక్షల వరకు ఆదాయం పొందానని లోకేష్ తెలిపారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో సమీపంలోని చిక్కబళ్లాపురం, దొడ్డబళ్లాపురం, బెంగళూరు, కోలారు, తుమకూరు మార్కెట్లకు క్యాప్సికంను తరలిస్తున్నానని వెళ్లడించాడు. ‘ఖోఖో’సాగులోనూ లాభాలే తాను క్యాప్సిక్సంతో పాటు వక్కతోటలో అంతర పంటగా 2.5 ఎకరాల్లో ఖోఖో పంటను కూడా సాగు చేశానని లోకేష్ తెలిపారు. ఖోఖో విత్తనాలను ప్రస్తుతం ఏలూరుకు తరలిస్తున్నాననీ, అక్కడ కిలో ఖోఖో విత్తనాలు రూ.150 నుంచి 200 వరకు ధర పలుకుతున్నాయని వెళ్లడించారు. క్యాడ్బరీ చాక్లెట్ కంపెనీ వారే నేరుగా ఖోఖో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారనీ, ఐదేళ్లుగా ఖోఖో పంట సాగులోనూ అధిక లాభాలు గడిస్తున్నానని లోకేష్ చెబుతున్నారు. వాణిజ్య పంటలపై మక్కువతోనే... ఏటా సంప్రదాయ పంటలు వేసి నష్టపోవడంతో వాణిజ్య పంటలు పండించాలనుకున్నాను. ఎకరా విస్తీర్ణంలో ఫాలీహౌస్ ఏర్పాటు చేసి రెడ్, ఎల్లో క్యాప్సికం పంటను సాగు చేశాను. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. ఇప్పటికే నాలుగు సార్లు కోత కోశాం. ప్రతి కోతకు రెండు టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. స్థానికంగా మార్కెట్ సౌకర్యం ఉంటే ఇంకా బాగుండేది. - లోకేష్, రైతు రత్నగిరి గ్రామం, రొళ్ల మండలం -
ఏడాది చివరికల్లా రైతు సమాఖ్యలు
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సంఘాలపై సన్నాహాలు - ఈ సంఘాల ద్వారానే ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి పథకం - మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ - ఆదర్శ రైతులతో సీఎం మూడు విడతల భేటీ సాక్షి, హైదరాబాద్: రైతు సమాఖ్యలను ఈ ఏడాది చివరి నాటికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఏర్పాటు చేయనున్న సమాఖ్యలకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి రైతుకు ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి ప్రోత్సాహకం ఇవ్వాలన్న నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం ఈ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రైతు సమగ్ర సర్వే పూర్తి చేసి, వాటి వివరాలను విశ్లేషిస్తోంది. సన్నచిన్నకారు, మధ్య తరగతి, ధనిక రైతుల వివరాలను ఈ సర్వే ద్వారా గుర్తించి.. ఆ వివరాల ఆధారంగా ఆర్థికంగా ఎంతెంత కేటాయించాల్సి ఉంటుందో కచ్చితమైన నిర్ణయానికి వస్తారు. అలాగే జిల్లాకు 100 మంది చొప్పున ఆదర్శ రైతులను సర్కారు గుర్తించింది. అలా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది రైతులతో త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేస్తారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. అయితే 3 వేల మందితో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా ఆయన సమావేశమవుతారు. 3 వేల మందితో ఒకేసారి ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించడానికి వీలుకాదని, అందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం ‘సాక్షి’కి తెలిపారు. భేటీల తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఎన్నికలు లేకుండానే సమాఖ్యలు వచ్చే ఏడాది మే 15వ తేదీ నాటికి రైతులకు ప్రోత్సాహకం అందజేయాలంటే.. గ్రామ, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమాఖ్యలను త్వరగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సమాఖ్యలను ఈ ఏడాది చివరి నాటికల్లా ఏర్పాటు చేస్తామని పోచారం తెలిపారు. వాటికి తోడుగా సమన్వయ కమిటీలు కూడా ఉంటాయని అంటున్నారు. దీనికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే రైతు సమాఖ్యలకు ఎలాంటి ఎన్నికలూ ఉండబోవని పోచారం స్పష్టంచేశారు. సంఘాల ఏర్పాటుతోపాటు వాటి అధ్యక్షులను కూడా ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. మరోవైపు వాటిని రిజిస్ట్రేషన్ చేసే అవకాశమూ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలన్నీ రైతు సంఘాల ద్వారానే జరుగుతాయి. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పాటయ్యే సమాఖ్యల వల్ల వ్యవసాయ యంత్రాంగంపై అధ్యక్షుల పెత్తనం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయనే వాదనలున్నాయి. ‘సీఎం అంత పవర్ఫుల్గా రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు ఉండాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే కిందిస్థాయి నుంచి కూడా వీరు చాలా కీలకంగా ఉంటారు. దీనివల్ల తమపై రైతు సంఘాల అధ్యక్షులు పెత్తనం చెలాయిస్తారనే ఆందోళన వ్యవసాయ ఉద్యోగుల్లో నెలకొంది. -
రైతు ఆందోళనలు మరింత హింసాత్మకం
- మంద్సౌర్ నుంచి ఇతర జిల్లాలకు పాకిన నిరసనలు - చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.కోటి పరిహారం మంద్సౌర్: మధ్యప్రదేశ్ బుధవారం కూడా రైతుల ఆందోళనలతో అట్టుడికింది. పరిస్థితులు మరింత హింసాత్మకంగా మారాయి. రైతుల నిరసనలు మంద్సౌర్ నుంచి దేవాస్, నీముచ్, ఉజ్జయిని, ధార్, ఖర్గోనే జిల్లాలకు కూడా పాకాయి. మిగిలిన రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంది. ఆందోళనల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 1,110 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మధ్యప్రదేశ్కు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను శాంతింపజేసే చర్యలను ప్రారంభించింది. మంగళవారం నాటి ఆందోళనల్లో ఐదుగురు రైతులు మృతిచెందగా, పోలీసులు జరిపిన కాల్పుల వల్లే వారు చనిపోయారని ఆరోపణలు ఉన్నాయి. మంద్సౌర్ జిల్లాలో బుధవారం కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ రైతులు ఆందోళనలు చేపట్టి ఓ గోదాము, పలు దుకాణాలను తగులబెట్టారు. మౌ–నీముచ్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దేవాస్ జిల్లాలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతోపాటు నాలుగు బస్సులు, 8 ఇతర వాహనాలను తగులబెట్టారు. నీముచ్ జిల్లాలో పోలీస్ ఔట్పోస్ట్కు కూడా నిప్పు పెట్టారు. రైతులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం మంగళవారం నాడు చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వోద్యోగం ఇస్తామని ప్రకటించింది. గాయపడ్డ రైతులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామనీ, రుణ ఎగవేత దారులుగా ముద్రపడ్డ రైతులు అప్పును తీర్చుకునేందుకు పథకం తీసుకొస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కిందకు దాదాపు 6 లక్షల మంది రైతులు వస్తారనీ, వారి మొత్తం అప్పుల విలువ రూ.6 వేల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. -
పీఎంకేఎస్వై కింద జిల్లాకు రూ.10.14 కోట్లు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో ప్రధానమంత్రి క్రిషి సించాయ్ యెజన(పీఎంకేఎస్వై) పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేయనున్నారు. వివిధ యూనిట్ల గ్రౌండింగ్కు రూ.10.14 కోట్లు మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని సబ్సిడీగా ఇస్తోంది. ఈ నిధులతో 4,414 యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ అధికార వర్గాలు తెలిపాయి. పథకం కింద 2,061 ఫాంపాండ్స్ తవ్వాలని లక్ష్యంగా తీసుకున్నారు. దీంతో పాటు నీళ్లు ఇంకిపోకుండా పాలిథిన్ షీట్ కూడా పరుస్తారు. ఫాంపాండ్కు సబ్సిడీ రూ.25 వేలు.. బోర్ వెల్ వద్ద వాటర్ రీచార్జి స్ట్రక్చర్(సోక్పిట్) నిర్మాణానికి రూ.37,500 సబ్సిడీ ఇస్తారు. మూడు గోదాములు(స్టోరేజి స్ట్రక్చర్లు) నిర్మించ తలపెట్టారు. గోదాముల నిర్మాణంతో పాటు రహదారి సదుపాయం కల్పిస్తారు. ఒక్కో దానికి రూ.10 లక్షలు సబ్సిడీ ఇస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
నత్తనడకన..
- జిల్లాకు మంజూరైనవి 2,922.. - పూర్తయినవి 133 మాత్రమే - సేద్యపు కుంటలతో లాభాలెన్నో - అవగాహన కల్పించని అధికారులు - ముందుకు రాని రైతులు ఇందూరు (నిజామాబాద్ అర్బన్): వర్షాధారిత పంటలు సాగు చేయడమంటే రైతు నష్టాలను మూట గట్టుకోవడమే. సరైన సమయంలో వర్షాలు లేక వేసిన పంటలు చేతికి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగపడేలా రైతు జల నిధుల (ఫాం పాండ్స్)ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే మన జిల్లాలో అధికారుల ప్రచార లోపం కారణం వల్ల నిర్దేశిత లక్ష్యం నెరవేరలేదు. జలనిధి అవశ్యకతను రైతులకు అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. వర్షం వచ్చినప్పుడు ఆ నీరంతా పల్లపు ప్రాంతాలలో ప్రవహించి వృథాగా బయటలకు పోతుంది. వాటిని ఒడిసిపట్టుకుంటే అవసరమైన సమయాల్లో పంటలకు నీటిని అందించవచ్చనేది జలనిధి (ఫాం పాండ్స్) ముఖ్య ఉద్దేశం. ప్రతికూలతలను అధిగమించి పంటకు అవసరమైన సమయంలో నీరందించే జల నిధుల నిర్మాణాలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి 19 మండలాల్లో 394 గ్రామ పంచాయతీల పరిధిలో 2922 ఫాం పాండ్స్ మంజూరయ్యాయి. అయితే, ఇప్పటివరకు పూర్తయిన వాటి సంఖ్య 133 మాత్రమే. పూర్తయిన ఫాం పాండ్స్ నిర్మాణాలకు రూ.71.32 లక్షలు ఖర్చు చేయగా, ఇంకా క్షేత్ర స్థాయిలో 209 ఫాం పాండ్స్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటికి ఇప్పటివరకు రూ.16.03 లక్షలు ఖర్చు చేశారు. వేల్పూర్ మండలంలో అత్యధికంగా 93 నిర్మాణాలు పూర్తి చేశారు. ఇక, భీమ్గల్ మండలంలో అత్యధికంగా 373 ఫాం పాండ్స్కు గాను రెండు మాత్రమే పూర్తయ్యాయి. అవగాహన కల్పించడంలో విఫలం.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న నీతిఅయోగ్ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పెట్టడానికి రైతులకు ఉపయోగపడే పనులను నిరుడు ప్రారంభించింది. చెక్ డ్యాంల నిర్మాణం, బావుల తవ్వకం, వర్మి కంపోస్టు తయారీ, వరద కట్టల ఏర్పాటు, ఇంకుడు గుంతలతో పాటు రైతు జల నిధుల నిర్మాణాలను వేగవంతం చేసింది. కానీ మన జిల్లాలో రైతులకు ఉపయోగపడే పనులు వేగిరం కావడం లేదు. రైతుజల నిధుల వల్ల కలిగే ఉపయోగాలను రైతులకు వివరించడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు. చిన్న, సన్న కారు రైతులకు కూడా తగినంత భూమి అందుబాటులో లేక జలనిధులను నిర్మించుకోవడానికి మందుకు రావడం లేదు. రైతు జల నిధుల వల్ల కలిగే దీర్ఘకాలిక లాభాలను రైతులకు వివరిస్తే నిర్మించుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. భూములలో పల్లపు ప్రాంతాల్లో జలనిధి నిర్మించుకోవడం వల్ల చుట్టు పక్కల ప్రవహించే నీరు ఎలా దానిలో చేరుతుందో పశువులకు, పంటలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అధికారులు విడమరిచి చెప్పితే రైతులు చైతన్యవంతులయ్యే అవకాశం ఉంది. -
ప్రావీణ్యం..అ‘ద్వితీయం’
► ఎస్ఐ సెలక్షన్లలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు ► పెద్ద దేవలాపురం యువకుడి ప్రతిభ ► తల్లిదండ్రుల ఆనందోత్సాహం నంద్యాల: సామాన్య రైతు చిన్న లక్ష్మన్న కుమారుడు పెద్దినేని ప్రవీణ్ కుమార్ ఎస్ఐ సెలక్షన్లలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును సాధించారు. దీంతో స్వగ్రామం పెద్దదేవలాపురం ఆనందోత్సవంలో మునిగింది. ఎస్ఐ సెలక్షన్లకు సంబంధించి రాత పరీక్ష నిర్వహించాక ఎంపిక జాబితాను గురువారం రాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ప్రవీణ్ కుమార్ రెండో ర్యాంకును సాధించారు. బండి ఆత్మకూరు మండలం పెద్దదేవలాపురం గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్.. స్వగ్రామంలో ప్రాథమిక, సంతజూటూరులో హైస్కూల్ విద్యను పూర్తిచచేశాడు. నంద్యాలలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివి ఎంసెట్లో ఇంజనీరింగ్ సీటును సాధించాడు. చిత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్లో పూర్తి చేశాడు. ఎస్ఐ కావాలనే పట్టుదలతో హైదరబాద్ వెళ్లి శిక్షణ తీసుకున్నాడు. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ రిక్రూట్మెంట్లో సివిల్, మెయిన్ పరీక్షల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకును సాధించాడు. ఫలితాలను చూసిన చిన్నలక్ష్మన్న కుటుంబం సంబరాలు చేసుకుంది. గ్రామస్తులంతా ఆయనను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేయాలనే పట్టుదలతో బీటెక్ పూర్తి చేసినా ఎస్ఐ రిక్రూట్మెంట్ రాశానన్నారు. తొలిసారే తనకు రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఎస్ఐ రిక్రూట్మెంట్లో మంచి మార్కులు వచ్చి ఎంపికయ్యానని చెప్పారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్లనే తాను ఈ ఘనత సాధించానన్నారు. నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి ఆయనను ఫోన్లో అభినందించారు. -
వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి
ఆత్మకూరు(ఎం): వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్లోని జీడిమెట్ల ప్రాంతానికి చెందిన వాకిటి శివకుమార్రెడ్డి(19) రెండు రోజుల క్రితం తన బంధువైన మండల కేంద్రంలోని యాస వెంకట్రెడ్డి ఇంటికి వచ్చాడు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన సత్తిరెడ్డి వ్యవసాయ బావి వద్ద స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలోనే మూత్ర విసర్జన చేసేందుకు శివకుమార్రెడ్డి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో కాసేపటికే నీటిలో మునిగిపోయాడు. అయితే శివకుమార్రెడ్డి బావిలో పడిన విషయం గుర్తించిన స్నేహితులు ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడ అంతా చీకటిగా ఉండడం.. సహాయం అందించేందుకు తాడు కూడా అందుబాటులో లేదు. కాసేపటికి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బావిలో గాలించగా అప్పటికే శివకుమార్రెడ్డి మృతిచెందాడు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తల్లి వాకిటి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి. శివనాగప్రసాద్ తెలిపారు. -
సహకారం ఇదేనా?
బుచ్చిరెడ్డిపాళెం (కోవూరు) : రాష్ట్రంలో మూతపడిన ఆరు చక్కెర కర్మాగారాలను విక్రయించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ పావులు కదుపుతున్నట్లు సమాచారం. సహకార రంగంలో రాష్ట్రవ్యాప్తంగా 10 చక్కెర కర్మాగారాలున్నాయి. వాటిలో విజయనగరం, చోడవరం, ఏటికొప్పాక, తాండవ ప్రాంతాల్లోని కర్మాగారాలు నడుస్తున్నాయి. అనకాపల్లి, రేణిగుంట, చిత్తూరు, కడప, గుంటూరు కర్మాగారంతో పాటు జిల్లాలోని కోవూరు సహకార చక్కెర కర్మాగారం మూతపడింది. ఫ్యాక్టరీ వివరాలను పంపాలని ఆదేశం మూతపడిన ఆరు సహకార చక్కెర కర్మాగారాల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా కర్మాగారాల అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా కోవూరు సహకార చక్కెర కర్మాగారానికి ఆదేశాలు అందాయి. ఫ్యాక్టరీ స్థలం, కార్మికులు, బకాయిలు, సామగ్రి తదితరాల వివరాలను పంపాలని కోరింది. హామీలు తప్ప ఆచరణ ఏదీ..? మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి హయాంలో మూతపడిన కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని అధికారంలోకి రాగానే పునఃప్రారంభిస్తానన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆ విషయాన్నే మరిచారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి జన్మభూమి– మాఊరుకు తొలిసారి వచ్చిన చంద్రబాబు కమిటీలు వేసి నివేదిక తెప్పించి, కర్మాగారాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. కర్మాగారానికి వచ్చిన కమిటీలు ఫ్యాక్టరీని నిలుపుకుంటే రైతులకు, ప్రభుత్వానికి మేలు అని నివేదికలు సైతం ఇచ్చాయి. అయితే ప్రభుత్వం వాటిని బయటకు రానీయకుండా , ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది. ఫ్యాక్టరీ స్థలంపైనే కన్ను కోవూరు సహకార చక్కెర కర్మాగారానికి 124 ఎకరాల స్థలం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే, మంత్రులకు అంతా స్థలంపైనే కన్నుపడింది. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సైతం స్థలం అమ్మి బకాయిలు తీరుస్తామని ³లుమార్లు ప్రకటించారు. ఎంతో విలువ ఉన్న భూమిని తన అనుచరులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 2003లో చంద్రబాబునాయుడు హయాంలో ఫ్యాక్టరీని తన అనుయాయులకు కట్టబెట్టే యత్నం జరిగింది. దీంతో రైతులు కోర్టును ఆశ్రయించి ఫ్యాక్టరీని కాపాడుకున్నారు. మళ్లీ నేడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం రైతులను అన్యాయం చేసే దిశగా ఫ్యాక్టరీని అమ్మాలని చూస్తున్నట్లు రైతులు చర్చించుకుంటున్నారు. రూ.20 కోట్ల గ్రాంటుతో ఫ్యాక్టరీకి పూర్వవైభవం కోవూరు సహకార చక్కెర కర్మాగారంలోని కార్మికులు, ఉద్యోగులు 1500 మందికి పైగా ఉన్నా రు. వీరికి సంబంధించి 45 నెలలుగా రూ.12 కోట్లు వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉంది. దీంతో పాటుగా ఫ్యాక్టరీలోని పనిముట్లు తదితరాలకు మరో రూ.8 కోట్లు కావాల్సి ఉంది. రూ.20 కోట్ల గ్రాంటును ప్రభుత్వం మంజూరు చేస్తే కోవూరు సహకార చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం వస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానంటున్న చంద్రబాబు రైతులకు ఉపయోగపడే సహకార రంగాన్ని నిర్వీర్యం చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని, అమ్మాలని చూస్తే ఆందోళనకు దిగుతామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఫ్యాక్టరీ లేకపోవటంతో నష్టాలు చవిచూస్తున్నాం కోవూరు సహకార చక్కెర కర్మాగారం మూతపడటంతో బయట ఫ్యాక్టరీలకు పంపి గిట్టుబాటు కాక నష్టాలు చవిచూస్తున్నాం. ఫ్యాక్టరీ లేకుండా చెరకు సాగు కష్టం. ఫ్యాక్టరీని ప్రారంభించి రైతులకు అండగా నిలవాలి. వెంకటస్వామి, రైతు, రేబాల కర్మాగారాన్ని అమ్మితే ఊరుకోం సహకార చక్కెర కర్మాగారాన్ని రైతుల అనుమతి లేనిదే అమ్మడానికి లేదు. గతంలో తెచ్చిన స్టే అమల్లో ఉంది. పారిశ్రామిక అభివృద్ధి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు సహకార రంగాన్ని పట్టించుకోకపోవడం దారుణం. కమిటీలు వేయడం మినహా చేసిందేమీ లేదు. కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలి. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళనకు దిగుతాం. జొన్నలగడ్డ వెంకమరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చెరకు రైతుల సంఘం ప్రగల్భాలు పలకడం తప్ప పనులేవీ పరిశ్రమలు నెలకొల్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటున్న చంద్రబాబు రైతులు ఉపయోగపడే కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని పట్టించుకోకపోవడం దారుణం. అబద్ధపు హామీలు చెప్పి రైతులను నిలువునా ముంచాడు. ఫ్యాక్టరీ ప్రారంభిస్తానని నేటికీ చర్యలు తీసుకోలేదు. నేడు మళ్లీ అమ్మేదిశగా ప్రయత్నాలు చేయడం చంద్రబాబునాయుడు రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. మావులూరు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ రైతు విభాగం -
వక్కతోటకు నిప్పు
అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం తమ్మడేపల్లిలో రైతు నాగరాజుకు చెందిన వక్కతోటకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. శుక్రవారం ఉదయం తోటలోకి వెళ్లి చూడగా 25 వక్కచెట్లు, 25 సెంట్ల భూమిలోని తమలపాకు తీగ, ఐదు కొబ్బరి చెట్లు, అరిటి చెట్లు కాలిబూడిదైనట్లు బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. దానిమ్మ చెట్లకు నిప్పు మడకశిర రూరల్ : తడకలపల్లి సమీపంలో రైతు మురళీకృష్ణ సాగు చేసిన దానిమ్మతోటకు శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దానిమ్మ, మామిడి, కొబ్బరి, చింతచెట్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. దాదాపు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ఉద్యాన అధికారులు పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరాడు. -
సేకరణ కారాదు గుదిబండ
భూమిని వదులుకున్న వ్యక్తే ఆ ప్రాజెక్టు వల్ల తక్కువ లబ్ధిని పొందేవాడు కారాదు. మీ భూమి వల్ల ప్రాజెక్టు వస్తే, అ తర్వాత కలిగే లాభాలు ఇతరులకు వస్తాయి. కాబట్టి వారు మీకు కూడా ఆ లాభాల్లో ఓ వాటా లభించాలి. భూ యాజమాన్యం, ప్రత్యే కించి వ్యవసాయ భూమిపైన యాజమాన్యం రైతుకు సంబంధించి తన సొంత అస్తి త్వంగాను, తన మూలాధారం గాను కూడా ఉంటుంది. ఆ భూమికి దూరమై బతకడం రైతుకు కష్టం. అందువల్లే ఒక ప్రాజెక్టును ప్రారంభించిన ప్రతిసారీ అక్కడి రైతాంగంలో అసంతృప్తి నుంచి ఆందోళన వరకు రేగుతుంటుంది. భూసేకరణ అంటే భూయజమానులు దరిద్రులు కావడంగా ఉన్నంత కాలం ఆ ఆగ్రహం సమంజసమైనది. పోచంపాడు ప్రాజెక్టు లేదా నర్మద డామ్ వంటి పాతవేగానీ లేదా ఏదైనా ప్రధాన రహదారి లేదా సింగూరు లేదా మరేదైనా గానీ... భూమిని అందించిన యజమానులకు విదిలిస్తున్నది స్వల్ప మొత్తాలే. అవి కూడా అధికార యంత్రాంగానికి అలవాటైన అలసత్వం ఫలితంగా ఎన్నో జాప్యాల తర్వాత అందేవే. అంతేగాని వారు సదరు ప్రాజెక్టు లబ్ధిదారులు కావడం మాత్రం జరగడం లేదు. దీని వల్ల కలిగే బాధ ఎలాంటిదో భూమిని కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది. రైతు అంటే ఒక అమూర్త భావన, సర్వనామం, మహా అయితే ఒక గణాంకం అంతే. ఒక డ్యామ్ రిజార్వాయర్ వల్ల మీ భూమి ముంపు నకు గురికాగా, మరెక్కడో సుదూరంలో మీకు తెలియ నైనా తెలియనివారు లబ్ధిని పొందుతున్నçప్పుడు ఆ బాధ మరింత దుర్భరం. ఇంతటి బాధకు గానూ వారికి దక్కేది వారి అమూల్యమైన భూమికి బదులుగా ఇచ్చే కొన్ని చిల్లర కాసులు. లాభం తక్కువ అనే దానితో సంబంధం లేకుండా ఆస్థికి అంటిపెట్టుకుని ఉండటం భారత వ్యవసాయపు ప్రామాణిక లక్షణం. అది అస మానతలను అధ్వానంగా దిగజార్చకపోయినా పెంపొం దేట్టు చేస్తుంది. సింగూరులో టాటాలకు కేటాయించిన భూమిని వారు కోల్పోయినప్పుడు... ఇది వారి వ్యాపారాన్ని దెబ్బ తీస్తుందని వారి పట్ల ఎంతో సానుభూతి వ్యక్తమైంది. కానీ రైతుల బాధను వ్యక్తం చేసిన ఒక రాజకీయ పార్టీని మాత్రం విచ్ఛిన్నకరమైనదిగా చూశారు. ఆ సమయంలో నేను రైతులను తోసి పారేసే కన్నా ఆ ప్రాజెక్టులో వ్యాపార భాగస్వాములను చేయాలని వాదించాను. ఏ ప్రాజెక్టునయినాగానీ భూమి లేకుండా నిర్మించలేం. ‘ప్రజా ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకోడానికి’ ప్రభుత్వానికి ఉన్న పాత హక్కు భూయాజమాన్య హక్కును పరిహాసాస్పదంగా మార్చింది. అదృష్టవ శాత్తూ ఆ దృక్పథం మారుతోంది. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టిన తదుపరి మహారాష్ట్ర కూడా భూయజమాని అమ్ముతున్న భూమికి ఎకరానికి... మాగాణి అయితే రూ. 45,000, మెట్టయితే రూ. 30,000 వార్షిక రాబడికి హామీ ఉండేలా చేస్తోంది. అలాగే ముంబై–నాగపూర్ల మధ్య 750 కిలోమీటర్ల ‘సమృద్ధి కారిడార్’ నిర్మాణం కోసం సేకరిం చనున్న భూమికి ఈ వార్షిక రాబడిని రూ. 60,000గా నిర్ణయించింది. ఈ రహదారి పొడవునా వృద్ధి కేంద్రాలు (చిన్న పట్టణాలు) ఉంటాయి. పది జిల్లాల గుండా సాగే ఆ భారీ రహదారి వెంబడి ఏర్పడే వృద్ధి కేంద్రాలకు ఆనుకుని ఉన్న అభివృద్ధి పరచిన ప్లాట్లను ప్రభుత్వం భూములను సేకరించిన వ్యక్తులకు ఇస్తుంది. అలా ఇచ్చే ప్లాటు విస్తీర్ణం ఇచ్చిన భూమిలో 25 శాతంగా నిర్ణయిం చారు. ప్రస్తుత చట్టాన్ని, పద్ధతులను అనుసరించి ఇచ్చే పరిహారం కాక ఇది పదేళ్లపాటు లభిస్తుంది. దీంతో పరిస్థితి మొత్తంగా మారిపోయిందని దీని అర్థం కాదు. మారుతూ ఉన్నది అనేదే నేను చెబుతు న్నది. ఒక వ్యక్తిని బంధించి ఉంచే అనుబంధాలు, అతని జీవితాన్ని అర్థవంతం చేస్తున్న వ్యక్తిగత సంబంధాలు, సామాజిక అనుసంధానాలు ఉన్న చోటి నుంచి పెళ్లగించి వేస్తున్నప్పుడు.. దీనిని ఇప్పటికైతే పరిపూర్ణమైన ప్యాకేజీ అనొచ్చు. ఈ నమూనాలను మరింత సంపూర్ణమైనవిగా మార్చే పని సాగుతూనే ఉండాలి. ఆ దిశగా కొన్ని సూచనలు. ప్రాజెక్టు వ్యవస్థాపకుడు (ప్రమోటరు) మదుపరు లకు షేర్లను జారీ చేసినట్టుగానే భూ యజమానిని కూడా తమ భాగస్వామిని చేసుకోవాలి. భూ యజమా నికి ఇచ్చే వాటా అతనికి చెల్లించాల్సిన మార్కెట్ ధరకు బదులుగా ఇచ్చేది కారాదు. దానికి అదనంగా, ఒక విలువైన అస్తిని సమకూరుస్తున్నందుకుగానూ అతనికి చెల్లించేది కావాలి. అతడు సహ వ్యాపారి కాబట్టి అతడు చేకూర్చేదాని ధరకు విభిన్నమైనదైన కొంత విలువ అత నికి లభించాలి. ఇది, పారిశ్రామిక రంగం భూమిని చౌకగా లభించే వనరుగా చూడటాన్ని అంతం చేస్తుంది. సేకరించిన భూమిలో నిర్మించే ప్రాజెక్టు వల్ల దాని చుట్టుపక్కల భూముల ధరలు కొంత కాలానికి పెరి గినప్పుడు... ముందుగా భూభాగాన్ని సమకూర్చిన భూయజమానికి ఆ సూచీని అనుసరించి అదనపు పరిహారం లభించాలి. భూమిని వదులుకున్న వ్యక్తే ఆ ప్రాజెక్టు వల్ల తక్కువ లబ్ధిని పొందేవాడు కారాదు. మీ భూమి వల్ల ప్రాజెక్టు వస్తే, అ తర్వాత కలిగే లాభాలు ఇతరులకు వస్తాయి. కాబట్టి వారు మీకు కూడా ఆ లాభాల్లో ఓ వాటా లభించడానికి హామీని కల్పించాలి. నిజమే, ఇది సంక్లిష్టమైనదే. కానీ ఆచరణసాధ్యం కానిది మాత్రం కాదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, మహేష్ విజాపృకర్ ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
డబ్బుల్లేవ్..!
దేవరకొండ మండలం శాఖవల్లి గ్రామం నుంచి దళితులైన ఏడుగురు లబ్ధిదారులకు భూ పంపిణీ చేయాలనుకున్నారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు పట్టాదారుల నుంచి 14.35 ఎకరాలు సేకరించారు. భూమి కొనుగోలుకు రూ.46.11 లక్షలుS కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాలేదు. డబ్బులు విడుదలై భూములు రిజిస్ట్రేషన్ చేద్దామనుకునే సమయానికి పట్టాదారులు తన భూములను మరొకరికి అమ్మేశారు. దీంతో మళ్లీ భూముల కోసం అధికారులు అన్వేషించాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా దళితుల భూపంపిణీ పథకం తీరు ఇది. నల్లగొండ : భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఉచితంగా మూడెకరాల భూ పంపిణీ చేయాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. 2016– 17కు గాను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 747 ఎకరాలు కొనుగోలు చేసి 249 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనికి గాను బడ్జెట్లో జిల్లాకు రూ.37.35 కోట్లు కేటాయించారు. దీంట్లో 85 మంది లబ్ధిదారులకు 225.18 ఎకరాలకుగాను మంజూరీ ఇచ్చారు. నిబంధనల మేరకు భూములు అమ్మేందుకు ముందుకు వచ్చిన యజమానుల నుంచి హామీ తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 48 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ చేశారు. మిగిలిన 37 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో భూ పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. భూ యజమానులకు చెల్లించాల్సిన రూ.4.82 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదలైతే గానీ లబ్ధిదారులకు భూములు పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. నిధుల విడుదలలో జాప్యమవు తుండటంతో భూ యజమానులు మరొకరికి భూములు అమ్మేసుకుంటున్నారు. మొదట్లో భూపంపిణీకి అవసరమయ్యే నిధులు కలెక్టర్ ఖాతాలోనే ఉంచేవారు. ఆ తర్వాత కలెక్టర్ ఖా తాల నుంచి నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి జిల్లా నుంచి వచ్చే ప్రతిపాదనల మేరకే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వస్తోంది. ప్రహసనంగా మారిన భూ పంపిణీ భూ పంపిణీ కార్యక్రమం గ్రామాల్లో పెద్ద ప్రహసనంగా మారింది. లబ్ధిదారులు ఎంపిక చేయడం దగ్గరి నుంచి భూములు కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయడం వరకు అధికారులు ముప్పుతిప్పలు పడుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరుతో భూ పంచాయితీలు తార స్థాయికి చేరాయి. గడిచిన రెండు వార్షిక ప్రణాళికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,214 ఎకరాలు సేకరించి 738 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనికిగాను రెండేళ్లలో కేవలం 215 మంది లబ్ధిదారులకు 514.15 ఎకరాలు మాత్రమే పంపిణీ చేయగలిగారు. దీంట్లో 15 మందికి 34.6 ఎకరాల ప్రభుత్వ భూ మి పంపిణీ చేయగా, మిగిలిన 480 ఎకరాలు ప్రైవేట్ పట్టాదారుల నుంచి కొనుగోలు చేసిందే. కొన్ని మండలాల్లో పరిశీలిస్తే... తిప్పర్తి మండలం రాజాపేటలో ఇద్దరు లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. అదే గ్రామానికి చెందిన ఒక పట్టేదారు నుంచి ఆరు ఎకరాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. భూములు రిజిస్ట్రేషన్ చేద్దామనుకునే సమయానికి ఆ పట్టాదారుకు బ్యాంకులో రుణ బకాయి ఉన్నట్లు తేలింది. దీంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. మోత్కూరు మండలం గట్టుసింగారంలో ఇద్దరు లబ్ధిదారులకు మూడెకరాలు పంపిణీ చేద్దామనుకున్నారు. దీనికి ముగ్గురు పట్టాదారుల నుంచి 3.35 ఎకరాలు సేకరించారు. ఒక పట్టాదారు ఆకస్మికంగా చనిపోవడంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. రెండు ఎకరాలు ఉన్న పట్టాదారు భూమి స్వార్జితం కాదని ప్రభుత్వ భూమి అని రిజిస్ట్రేషన్ ఆఫీసులో బయటపడింది. పట్టాదారులు పాస్ పుస్తకాలు కలిగి ఉండటంతో సొంత ఆస్తిగా భావించిన అధికారులు రిజిస్ట్రేషన్కు సిద్ధపడ్డారు. నిడమనూరు మండలం గోపాలపురంలో ఇద్దరు లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున భూమి పంపిణీ చేయాలనుకున్నారు. దీంట్లో ఒకరికి ప్రభుత్వ భూమి, మరొకరికి ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు చేసిన భూమి ఇవ్వాలని నిర్ణయించారు. ఇద్దరు లబ్ధిదారులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు కావడంతో భూముల విషయంలో వివాదం చోటుచేసుకుంది. ప్రై వేటు పట్టాదారు భూమి అధికార పార్టీకి చెందిన వ్యక్తికి ఇవ్వా లని, ప్రభుత్వ భూమి ప్రతిప క్ష పార్టీకి చెందిన వ్యక్తికి ఇవ్వాలని అధికారుల పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో భూ వివాదం ప్రస్తుతం జిల్లా మంత్రి పరిశీలనలో ఉంది. దీని పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. -
ఇంట్రెస్ట్ ఉందా? మీ పంట పండిందే!
వావ్ ఫ్యాక్టర్ కొంచెం భూమి ఉండి, అనుభవం లేకున్నా.. వ్యవసాయం చేయాలన్న ఆసక్తి ఉన్నవాళ్ల కోసం కొత్తగా టూల్ బాక్స్ ఒకటి వచ్చింది! ‘కిట్’ లాంటిదన్నమాట! పొలంలో దాన్నో మూల బిగించుకుని 150 మందికి ఏడాదికి సరిపడా తిండిగింజల్ని, కాయగూరల్ని పండించవచ్చు. మార్కెటింగ్ చేసుకునే వరకు నిల్వ ఉంచుకోవచ్చు. విత్తనాలు నాటడానికి, నీళ్లు పెట్టడానికి, ఎరువు వెయ్యడానికి, కలుపు తియ్యడానికి, కోత కొయ్యడానికి అవసరమైన పరికరాలన్నీ ఈ కిట్లోనే ఉంటాయి. అవన్నీ కూడా సోలార్ శక్తితోనే నడుస్తాయి. ఈ పరికరాలను ఎలా ఉపయోగించాలి, పొలంలో ఎలా బిగించాలి, ఎలా సమన్వయం చేసుకోవాలి, అధిక దిగుబడులను ఎలా సాధించాలి, చీడపీడల్ని ఎలా నివారించాలి.. అనే విషయాల్నీ క్షుణ్ణంగా తెలుసుకోవడానికి కిట్ లోపల సూచనలు, సలహాల సిస్టమ్ ఉంటుంది. కిట్ అంటే చేతిలో పట్టేలా ఉండదు. అదొక పెద్ద షిప్పింగ్ కంటెయినర్. కాలం తీరిన నౌకల బాడీ పార్ట్ల జోడింపే ఈ పంటల కంటెయినర్. పొలంలో ఓ మూల ఈ కంటెయినర్ను గూడులా అమర్చుకోవచ్చు. అందులో నివాసం ఉంటూ, పొలం పనులు, బాగోగులు చూసుకోవచ్చు. గూడు లోపలి నుంచి పొలంలోకి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో మొక్కల కుదుళ్లకు మాత్రమే నీరు అందేలా పైపులు ఏర్పాటు చేసుకోవచ్చు. వైఫై సదుపాయం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు బయటి నుంచే రిమోట్ ద్వారా పంటను పర్యవేక్షించుకోవచ్చు. సంరక్షించుకోవచ్చు. కాపు కాసుకోవచ్చు. బ్రాండీ డికార్లీ, స్కాట్ థాంప్సన్ అనే కాలిఫోర్నియా యువ టెక్నో రైతులు ఇద్దరు కలసి ఈ కిట్ను రూపొందించారు. కెన్యాలో ఓ యూత్ సెంటర్లో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి ఒక కిట్ను కనిపెడితే మానవాళికి ఇంత ముద్ద పెట్టిన వాళ్లమవుతామన్న ఆలోచన వచ్చిందట వీళ్లకు. ఫలితమే ఈ కిట్ ఆవిర్భావం. ప్రపంచంలో దాదాపు 100 కోట్ల జనాభా ఆకలితో, పేదరికంతో అలమటిస్తోందని అంచనా. ఈ పంట కిట్ల వాడకం వల్ల భూమి సస్యశ్యామలమై అందరికీ ఆహారం అందుతుందని ఈ ఇద్దరు మిత్రులు అంటున్నారు. కిట్ ఖరీదు 50 వేల డాలర్లు. సుమారు 34 లక్షల రూపాయలు! -
మాజీ మావోయిస్టు దారుణ హత్య
విశాఖపట్నం: జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమర్చారు. ఈ సంఘటన విశాఖ కాంతిహిల్స్ అటవీ ప్రాంతంలో శుక్రవారం వెలుగుచూసింది. మావోయిస్టు ఇంటిలీజెన్స్ చీఫ్గా పని చేసిన టి. అనిల్ అలియాస్ చందు ఏడాదిన్నర క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా.. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు అతనిని దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టులే చందును హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
‘మేనేజ్మెంట్’ సీట్ల భర్తీ అంతంతే!
ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిన 15,744 యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయిన సీట్ల సంఖ్య 14,794కే పరిమితం బీఫార్మసీలోనూ అదే పరిస్థితి.. 60 శాతం సీట్లే భర్తీ ప్రభుత్వానికి నివేదించిన ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్-డీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ అయిన సీట్ల లెక్క తేలింది. యాజమాన్య కోటాలో కాలేజీల్లో చేరిన విద్యార్థుల ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ర్యాటిఫికేషన్లను పూర్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లెక్కలు అందజేసేందుకు నివేదికలు సిద్ధం చేసింది. గతేడాది మేనేజ్మెంట్ కోటాలో దాదాపు 55 శాతం సీట్లు భర్తీ కాగా ఈసారి మాత్రం కేవలం 48.44 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ప్రవేశాల కోసం యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్లు కూడా మొత్తం భర్తీ కాలేదు. 2016-17 విద్యా సంవత్సరంలో 219 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,04,598 సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. అందులో 74,060 సీట్లను (ప్రభుత్వ కాలేజీల్లోని 2,805 సీట్లు వంద శాతం కలుపుకొని) 70 శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ చర్యలు చేపట్టగా, అందులో 54,172 సీట్లు భర్తీ అయ్యాయి. 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో 30,538 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా అందులో 14,794 సీట్లే భర్తీ అయ్యాయి. 15,744 సీట్లు మిగిలిపోయాయి. అలాగే 123 బీఫార్మసీ కాలేజీల్లో 9,226 సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టగా మేనేజ్మెంట్ కోటాలోని 2,714 సీట్లలో 1,592 సీట్లే భర్తీ అయ్యాయి. ఇక ఫార్మ్-డీలో 54 కాలేజీల్లోని 1,620 సీట్లలో మేనేజ్మెంట్ కోటా పరిధిలో ఉన్న 486 సీట్లలో 384 సీట్లు భర్తీకాగా 102 సీట్లు మిగిలిపోయాయి. -
పారాలింపిక్స్ విజేతలకు వైఎస్ జగన్ కంగ్రాట్స్
హైదరాబాద్: రియో పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. దీపా మలిక్, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భటిలకు ఆయన అభినందనలు చెప్పారు. తృటిలో కాంస్య పతకం కోల్పోయినప్పటికీ పవర్ లిఫ్టర్ ఫర్మాన్ భాషా మంచి ప్రయత్నం చేశాడని ప్రశంసించారు. ‘దీపా మలిక్, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భటిలకు అభినందనలు. ఫర్మాన్ మంచి ప్రయత్నం చేశాడు. పారాలింపిక్స్ లో మన అథ్లెట్లు చూపిన దృఢత్వం, అంకితభావం మనందరికీ గర్వకారణమ’ని వైఎస్ జగన్ మంగళవారం ట్వీట్ చేశారు. ఇప్పటివరకు రియో పారాలింపిక్స్లో భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల హైజంప్లో మరియప్పన్ తంగవేలు స్వర్ణం, వరుణ్ సింగ్ భటి కాంస్యం నెగ్గారు. మహిళల షాట్పుట్ (ఎఫ్-53) ఈవెంట్లో భారత క్రీడాకారిణి దీపా మలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఫర్మాన్ నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయాడు. Congrats DipaMalik,Thangavelu,Bhati. Good attempt Farman. Proud of the grit & determination shown by all our athletes #ParalympicsRio2016 — YS Jagan Mohan Reddy (@ysjagan) 13 September 2016 -
రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం
పోడు భూమిలో మొక్కలు నాటడానికి అధికారులు రావడంతో ఘటన నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స్చ ఖానాపురం : పోడు భూమిని సాగు చేసుకుంటున్న దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని చిలుకమ్మనగర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకమ్మనగర్ గ్రామానికి చెందిన కాసాని ఐలయ్య–కోమల దంపతులు తొమ్మిది సంవత్సరాల క్రితం 2 ఎకరాల పోడు భూమిని కొనుగోలు చేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం అటవీశాఖ అధికారులు మొక్కలు నాటడానికి గ్రామ శివారులో ఉన్న పోడు భూమి వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న ఐలయ్య–కోమల దంపతులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 9 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నామని, ఈ భూమిపైనే తమ ఇద్దరు కుమార్తెల జీవితం ఆధారపడి ఉందని వారు అధికారులతో వా పోయారు. కానీ, ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటుతామని చెప్పడంతో ఆందోళనకు గురై న కోమల భూమి వద్ద ఉన్న మోనోక్రోటోపాస్ మందును తాగడానికి ప్రయత్నిస్తుండటంతో పక్కనే ఉన్న భర్త చేయితో కొట్టడంతో కింద పడిపోయింది. అదే మందు డబ్బాను తీసుకుని ఐలయ్య సైతం తాగే ప్రయత్నం చేయడంతో అప్పటికే అక్కడకు చేరుకున్న చుట్టుపక్కల రైతులు లాక్కునే క్రమంలో ఒంటిపై పడింది. వెంటనే రైతులు.. ఆ దంపతులను నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో సుధీర్ను వివరణ కోరగా మొక్కలు నాటడానికి తమ సిబ్బంది ఎవరూ రాలేదని, మందు తాగిన విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. -
రాజకీయ విభేదాలతో నష్టం
హుస్నాబాద్ : ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్కుమార్ మధ్య గల రాజకీయ విభేదాలతో హుస్నాబాద్ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించకపోతే సహించేదిలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. హుస్నాబాద్కు రెవెన్యూ డివిజన్ తేలేని పరిస్థితిలో ఎమ్మెల్యే సతీశ్కుమార్ రాజీనామా చేయాలని కోరారు. జోనల్ వ్యవస్థను ముట్టుకోవద్దన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు హుస్నాబాద్ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ కరీంనగర్లోనే కొనసాగించాలన్నారు. తోటపల్లి భూ నిర్వసితులు తమ భూములు దున్నుకోవాలని, ఎవరైనా అడ్డొస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, సింగిల్విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్కుమార్, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్నయాదవ్, కాంగ్రెస్ నాయకులు కోమటి సత్యనారాయణ, చిత్తారి రవీందర్, ఎండీ హస్సేన్, బొల్లి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, పచ్చిమట్ల సంపత్, సీపీఎం నాయకులు జాగిరి సత్యనారాయణ, బీజేపీ నాయకులు వేముల దేవేందర్రెడ్డి, అనిల్కుమార్, టీడీపీ మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, వరయోగుల శ్రీనివాస్, ముప్పిడి రాజు పాల్గొన్నారు. -
ఆదుకున్న ఫార్మా, స్వల్ప లాభాల్లో మార్కెట్లు
ముంబై: రోజు మొత్తం ఒడిదుడుకుల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 28,060 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 8650 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 28 వేలకు ఎగువన, నిఫ్టీ గట్టి మద్దుతు స్థాయి వద్ద స్థిరపడ్డాయి. అయితే నేటి ట్రేడింగ్లో హెల్త్కేర్ సెక్టార్ దూకుడు మార్కెట్ ను ఆదుకొంది. ముఖ్యంగా అరబిందో ఫార్మా ప్ఫలితాల నేపథ్యంలో భారీగా లాభపడింది. సీక్వెంట్ సైంటిఫిక్, జేబీ కెమ్, హైకాల్, టొరంట్, ఇప్కా, ఇండొకో, గ్రాన్యూల్స్, వీనస్ రెమిడీస్, దివీస్, శిల్పా మెడి షేర్లు మెరుపులు మెరిపించాయి. టాటా పవర్, మారుతీ, సిప్లా, జీ 2.5-1.6 శాతం మధ్య లాభపడగా, ఐడియా, లుపిన్, అంబుజా, టాటా మోటార్స్ డీవీఆర్, టాటా స్టీల్ నష్టపోయాయి. కాగా రేపు(25న) ఆగస్ట్ నెల డెరివేటివ్స్ ముయనుంది. అలాగే శుక్రవారం ఫెడ్ ఛైర్ పర్సన్ జానెట్ ఎల్లెన్ వార్షిక సెంట్రల్ బ్యాంక్ సమావేశంలో ప్రసగించనున్నారు. ఈ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించనున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. అటు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. ఎంసీఎక్స్ లో 10 గ్రా. పుత్తడి రూ. 49 నష్టంతో 31,321 వద్ద ఉంది. రూపాయి కూడా 0.05 పైసల నష్టంతో 67.11 దగ్గర ఉంది. -
పంటనష్ట పరిహారం అందజేయాలి
తాడూరు: రైతులకు పంటనష్ట పరిహారాన్ని అందించి ఆదుకోవాలని సింగిల్విండో చైర్మన్ ఎండీ. సమద్పాష ప్రభుత్వాన్ని కోరారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నెలరోజుల నుంచి వర్షాలు ముఖం చాటేయడం వల్ల మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయిందని, వారంరోజుల వ్యవధిలో వర్షాలు కురవకపోతే పత్తిపంట కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను గ్రామాలకు పంపించి పంటనష్టాన్ని అంచనా వేసి పంటనష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. రెండు విడతల రుణమాఫీని ఒకేసారి చేసి రైతులకు కరువు నుంచి విముక్తి కల్పించాలంటే కొత్త రుణాలను వెంటనే ఇచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. -
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
అచ్చంపేట రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ ఇండస్ట్రీయల్ జిల్లా కన్వీనర్ పర్వతాలు ఆరోపించారు. గురువారం పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక చట్టాలను సవరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, నిత్యావసర ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు గోపాల్, మల్లేష్, అల్వాల్రెడ్డి, గఫార్, శ్రీను, కలీం, మల్లయ్య, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకుపచ్చని సేద్య సౌధం!
నీటి వనరులు బాగా తక్కువగా ఉన్న చోట అందుకు తగిన చిరుధాన్య పంటలు పండించడం.. రసాయనిక సేద్యానికి బదులు ప్రకృతి వ్యవసాయం చేయడం.. పండించిన చిరుధాన్యాలను అలాగే అమ్మేకంటే అటుకులు చేయించి అమ్మడం.. ఇవన్నీ ఆరుగాలం చెమటను చిందించే రైతన్నకున్న విజ్ఞతకు నిదర్శనాలు. అటువంటి విజ్ఞత కలిగిన రైతు దంపతులు తలమంచి నరసారెడ్డి, శారద. పంట పొలంతో పశువులకు అనుసంధానం చేయడం ద్వారా తమ వ్యవసాయ క్షేత్రాన్ని కరువు కాలాల్లోనూ సస్యశ్యామలంగా మార్చుకున్న మార్గదర్శకులు ఈ ఆదర్శ రైతు దంపతులు.. ♦ మామిడి తోటలో చిరుధాన్యాల సాగు.. ♦ చిరుధాన్యాల కన్నా అటుకులు తినడం సులభం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామంలో తలమంచి నరసారెడ్డి, శారద దంపతులు 21 ఎకరాల్లో ఆకుపచ్చని ఆశాసౌధాన్ని నిర్మించుకున్నారు. కాంట్రాక్టులు, వివిధ వ్యాపారాల్లో ఆటుపోట్లను చవిచూసిన నరసారెడ్డి పదిహేనేళ్ల క్రితం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లోనే నాలుగు ఆవులు, దూడలను తెచ్చి పెంచడం ప్రారంభించారు. ఇప్పుడు వాటి సంఖ్య ఏభైకి చేరింది. ఆరు ఎద్దులు ఉన్నాయి. సొంత అరకలతోనే దుక్కి పనులు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్న దగ్గరి నుంచి వీరి క్షేత్రం పచ్చగా మారిపోయింది. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న నరసారెడ్డి, శారద మక్కువతో ప్రకృతి సేద్య జీవనం సాగిస్తున్నారు. 12 ఎకరాల్లో 18 ఏళ్ల నాటి సుమారు 500 మామిడి చెట్లున్నాయి. వాటి మధ్య చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల మిశ్రమ సేద్యం చేస్తున్నారు. సజీవ ఆచ్ఛాదన ద్వారా భూమిని సారవంతం చేస్తున్నారు. కొర్రలు, ఆరికలు, ఒరగలు, వివిధ రకాల జొన్నలు, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని అందిస్తున్నారు. సిమెంటు తొట్లను ఏర్పాటు చేసుకొని జీవామృతం తయారు చేసి.. మినీ ట్రాక్టర్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ఎకరంలో ఆర్ఎన్ఆర్15048, మరో ఎకరంలో సోనా మసూరితోపాటు ఇంకో అరెకరంలో నవర రకం సంప్రదాయ వరి వంగడాన్ని సాగు చేస్తున్నారు. సోనామసూరి నాట్లు వేశారు. మిగతా రెండు వరి వంగడాలను వెద పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఏ యే పంటల పెరుగుదల తీరు, దిగుబడి తీరుతెన్నులను నిశితంగా పరిశీలించే నరసారెడ్డి ప్రయోగశీలి. రాగులు ఒక మడిలో ఏక పంటగా సాగు చేస్తూనే, మరో మడిలో నాట్లు వేసే పద్ధతిలో వేశారు. చిరుధాన్య పంటల సాగులో రాలిన విత్తనాలు మొలకెత్తుతుండటంతో వరుసగా 2-3 పంటలు తీస్తున్నారు. ఉదాహరణకు.. 2015 ఖరీఫ్లో 2 కిలోల కొర్రలు చల్లారు. అక్టోబర్లో పంట నూర్చారు. అదే పొలంలో విత్తనాలు చల్లకుండానే రాలిన కొర్రలే మళ్లీ మొలిచాయి. 2016 జనవరిలో కొర్ర పంట కోశారు. అదే భూమిలో ఏప్రిల్లో మళ్లీ కొర్ర పంటను కోశారు. బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేశారు. రోజుకు 40 కిలోల పేడ నీటిని పోస్తూ ఉంటారు. గ్యాస్ను వంటకు వాడుకోవడంతోపాటు 25 హెచ్పి డీజిల్ ఇంజిన్ను పాక్షికంగా గోబర్ గ్యాస్తో నడుపుతున్నారు. భూగర్భ జలవనరులు తక్కువగా ఉన్న ప్రాంతం అది. వర్షాలు కూడా తక్కువే. అటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల క్రితం జియాలజిస్టును తీసుకొచ్చి బోర్లు ఎక్కడ వేయాలో చెప్పమన్నారు. ఆయన పొలమంతా కలియదిరిగి ఇక్కడ బోరు వేసినా నీటి చుక్క పడదు. సాగు మానెయ్యడం మేలని చెప్పి వచ్చిన దారినే వెళ్లిపోయాడు. అయితే, నరసారెడ్డి పొలం మధ్యలో నుంచి వెళ్తున్న చిన్న వాగుపై చెక్ డ్యాం నిర్మించి.. వాననీటిని ఒడిసిపడుతున్నారు. చెక్డ్యాం వద్దే బోరు వేశారు. ఒక బోరు రెండించుల నీరు పోస్తోంది. మరోచోట కూడా బోరు వేస్తే కొద్దిగా నీరు వస్తోంది. పరిమిత నీటి వనరులతోనే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం. అనేక అవరోధాలను అధిగమించి సాగు చేసే చిరుధాన్యాలను హైదరాబాద్లో మిల్లుకు తీసుకెళ్లి అటుకులు పట్టించి, ప్యాకెట్లలో నింపి అమ్ముతున్నారు. చిరుధాన్యాలు తినడం అలవాటు లేని వారు సైతం ఈ అటుకులను సులభంగా తినగలుగుతున్నారని, తమకు మంచి ఆదాయంతో పాటు చిరుధాన్యాల వాడకాన్ని పెంచుతున్నందుకు ఆనందంగా ఉందని నరసారెడ్డి, శారద తెలిపారు. తాము కూడా చిరుధాన్యాల అటుకులు, రాగి ముద్ద తింటున్నామన్నారు. ధాన్యాన్ని ముడిబియ్యం పట్టించి అమ్ముతున్నారు. తద్వారా రెట్టింపు ఆదాయం పొందుతున్నామని తెలిపారు. ఆవులతోపాటు కొన్ని గొర్రెలు, మేకలు, కోళ్లను సైతం పెంచుతున్నారు. పశువుల పేడ, మూత్రాన్ని వ్యవసాయానికి వాడుకుంటూనే అధికాదాయం పొందుతున్నారు. అన్నిటికన్నా మిన్నగా రసాయన రహిత ఆహారాన్ని పండించుకుని తింటూ.. నలుగురికీ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని అందుబాటులోకి తెస్తున్న నరసారెడ్డి, శారద (98480 25089) దంపతుల కృషి ప్రశంసనీయం. - సాగుబడి డెస్క్