janmabhoomi maa vooru programme
-
ముగిసిన జగడాల జన్మభూమి!
నిరసనలు..నిలదీతలు..బహిష్కరణల నడుమ ఆరో విడత జన్మభూమి–మాఊరు కార్యక్రమం ముగిసింది. తిత్లీ తుపాను నష్ట పరిహారం అందలేదని బాధితులు..గత జన్మభూమిలో అందించిన వినతులు పరిష్కారం కాలేదని సామాన్యులు.. రేషన్కార్డులు, పింఛన్లు అర్హులకు అందలేదని దరఖాస్తుదారులు అధికారులు, ప్రజా ప్రతినిధులను సభల్లో నిలదీశారు. సమస్యలను పరిష్కరించలేని గ్రామసభలు ఎందుకని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు ఇబ్బంది పడ్డారు. జన్మభూమి ప్రారంభం రోజు నుంచి ముగింపు వరకూ ఇదే పరిస్థితి. ఈ నెల రెండో రెండో తేదీన ప్రారంభమైన గ్రామ సభలు శుక్రవారంతో ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఈసారి జిల్లా వ్యాప్తంగా సుమారు 20,609 వినతులు అధికారులకు అందాయి. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆరో విడత జన్మభూమి కార్యక్రమం అట్టర్ఫ్లాప్ అయిందనే అభిప్రాయం జనం నుంచి వ్యక్తమవుతోంది. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన గ్రామ సభలతో ఎలాం టి ప్రయోజనం లేకపోవడంతో నామమాత్రంగా నే ముగిశాయి. గత ఐదు విడతుల్లో జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో పలు విభాగాలకుసంబంధించి 2,96,856 వినతులు రాగా.. ఆరో విడతలో 45 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 20,609 వినతులు వచ్చాయి. తాజాగా ముగి సిన కార్యక్రమంతో కలిపి 3,17,465 వినతలు వచ్చాయి. గత వినతులే పరిష్కారానికి నోచుకోలేదు. ఈ పరి స్థితిలో తాజాగా వచ్చిన వినతుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమే. ఆరో విడత జరిగిన గ్రామ, వార్డు సభల్లో ప్రజలకంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులే ఎక్కు వ కనిపించారు. అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు జన్మభూమిలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చదువులు గాలికి వదలి సభల్లో కూర్చున్నారు. ఈసారి జరిగిన కార్యక్రమంలో ఒక్క పింఛను కూడా ఎవరికీ అందజేయలేదు. అలాగే ఒక్క రేషన్కార్డు కూ డా జారీ చేయలేదు. కొత్తగా ఇళ్లు కూడా మంజూ రు చేయలేదు. దీంతో లబ్ధిచేకూరని సభలెందుక ని చాలచోట్ల అధికారులను ప్రజలు నిలదీశారు. మరికొన్ని చోట్ల సభలను అడ్డుకొన్నారు. దీంతో పోలీసుల జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని చాలా సభలను ప్రజలు బహిష్కరించా రు. కొన్ని సభల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు ఇబ్బందులు పడ్డా రు. జిల్లావ్యాప్తంగా 1098 గ్రామ పంచాయతీ లు, 161 నగర, పురపాలక సంఘాల పరిధిల్లోని వార్డుల్లో ఆరో విడత గ్రామ సభలు జరిగాయి. వీటిలో చాలా సభల్లో నిరసనలు, నిలదీతలు, బహిష్కరణలు చోటుచేసుకున్నాయి. వచ్చిన వినతులు.. ఈసారి జరిగిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో చివరిరోజు మినహా తొమ్మిది రోజులకు గాను 18,609 వినతులు వచ్చాయి. వీటిలో పేదరికానికి సంబంధించిన సమస్యలే ఎక్కువగా నమోదయ్యాయి. చివరి రోజున మరో రెండు వేలు వరకు వినతులు అందాయి. అయితే ఇవి ఇంకా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. మొత్తం 20,609 వరకూ వినతులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో పేదరికానికి సంబంధించి–8060 వినతులుండగా, సివిల్ సప్లై విభాగం (రేషన్కార్డు)– 4781, గృహనిర్మాణం –2566, పురపాలక సంఘాల్లో సమస్యలపై –834, ఉద్యానవన శాఖ – 575, భూ సమస్యలు 386, పశు వర్ధక శాఖ 293, వ్యవసాయం 238, మత్స్యశాఖ 213, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ వింగ్ 109, గ్రామీణ నీటి సరఫరా 99, గిరిజన సంక్షేమ శాఖ 92, పంచాయతీరాజ్ 80, బీసీ కార్పొరేషన్ 79, విద్యుత్ శాఖ 35, గ్రామీణాభివృద్ధి 30, రైతు సాధికార సంస్థ 23, రోడ్లు భవనాల విభాగం 21, పాఠశాల విద్య 18, మహిళా భివృద్ధి శాఖ 9, ఆరోగ్య శ్రీ 9, చేనేత శాఖ 8, ఉపాధి కల్పన, శిక్షణకు సంబంధించి –8, ఇరిగేషన్ 7, ఎస్ఎస్ఏ 5, ఎస్సీ కార్పొరేషన్ 4, సాంఘిక సంక్షేమ శాఖ, పరిశ్రమలు శాఖలకు మూడేసి, కమర్షియల్ టాక్సు, వికలాంగుల శాఖ, ఆర్టీవో, అగ్నిమాపక శాఖలకు సంబంధించి రెండేసి, ఫైనాన్స్, పోలీస్, ఎండోమెంట్, క్రీడలు, అటవీ, నైనిక సంక్షేమం, మైక్రో ప్రాజెక్టులు, కార్మిక శాఖ, భూ గర్భజలాలు, బీమా విభాగం, పరిశ్రమలు, వెనుకబడి తరగతుల శాఖలకు సంబంధించి ఒక్కో వినతి అధికారులకు అందాయి. -
హమ్మయ్య... ముగిసింది
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం ముగిసింది. గడచిన ఐదు విడతల కంటే ఈ సారి కార్యక్రమం రసాభాసగానే సాగింది. జనవరి 2వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం శుక్రవారంతో ముగిసింది. తక్కువ గ్రామపంచాయతీలు, వార్డులు ఉన్న పురపాలకసంఘాల్లో ఒకటి, రెండురోజులు ముందే గ్రామసభలు ముగియగా మిగతా చోట్ల శుక్రవారంతోపూర్తయ్యాయి. మొత్తం 920 గ్రామపంచాయతీలు, ఆరు మున్సిపాల్టీల్లో 149 వార్డుల్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. బహిష్కరణతో నిరసన ఐదు విడతల్లో లేని విధంగా ఈ సారి జన్మభూమి గ్రామసభలను జనం బహిష్కరించారు. అధికారులు అన్ని సభలు జరిగాయని చెబుతున్నా కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో సభలను జనం బహిష్కరించారు. సభలు జరిపేందుకు అధికారుల బృందాలు గ్రామానికి రాకుండా ఆయా మండలాలతోపాటు మైదాన ప్రాంత మండలాల్లో కూడా అడ్డుకున్నారు. ఇలా 50వరకు సభల్లో జరగ్గా అధికారం అండ, పోలీసు బందోబస్తు మధ్య సభలు సాగించారు. అయినా జిల్లాలో సుమారు 10 గ్రామాల్లో సభలు అసలు జరగలేదు. నిరసనలు... నిలదీతలు నిరసన, నిలదీతలతో జిల్లాలో మరో 200కు పైగా సభలు అసంపూర్తిగా ముగించినట్లు సమాచారం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిపోయింది. అయినా అనేక సమస్యలు అలాగే ఉన్నాయి. గత జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన వినతులు పరిష్కరించలేదని, చేస్తామన్న పనులు కూడా చేయలేదని పలుచోట్ల ప్రజలు అధికారపార్టీ నాయకులు, అధికారులను నిలదీశారు. జిల్లాలో 10 రోజుల్లో మొత్తం సభలు చూస్తే జిల్లాలో ఉన్న మంత్రి సుజయ్కృష్ణ రంగారావుతోపాటు జెడ్పీ ఛైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఆరుగురు ఎమ్మెల్యేలను, ఇతర అధికారపార్టీ ప్రజాప్రతినిధులను ఏదో సందర్భంలో ఏదో ఒక గ్రామసభలో నిలదీయడం చెప్పుకోదగ్గ విషయం. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వివక్ష చూపుతున్నారని, జన్మభూమి కమిటీల పేరుతో అధికారపార్టీ వారికే పెన్షన్లు, ఇళ్లు, రేషన్కార్డులు, రుణాలు మంజూరు చేస్తున్నారని కడిగేశారు. ప్రభుత్వ పథకాల మంజూరులో రాజకీయాలేమిటని ప్రశ్నించారు. ఇతర సమస్యలు ఏమి పరిష్కరించారని మండిపడ్డారు. ఇక అధికారులకు ఎక్కడికక్కడ నిరసనలు, నిలదీతలు తప్పలేదు. దాదాపు 70శాతం సభల్లో అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నించడం, నిలదీయడం, నిరసన వ్యక్తం చేయడం విశేషం. జనం లేక వెలవెల ఇక గ్రామసభలకు జనం హాజరు కూడా తక్కువగానే ఉంది. జన్మభూమి కార్యక్రమం విజయవంతమైందని అధికారులు చెబుతున్నా వాస్తవానికి పది, పదిహేనుశాతం మినహా మిగతా సభలకు చెప్పుకోదగ్గ జనం లేరు. అధికారపార్టీ కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగులు ఈ విషయాన్ని చెప్పుకోవడం విశేషం. తొలిరోజు నుంచి చివరి రోజు వరకు చూస్తే 10శాతం సభలకు జ నం కాస్తా వచ్చారు. 70శాతం సభలకు 30 నుంచి 80 మంది వరకు మాత్రమే హాజరయ్యారు. మరో 10 శాతం గ్రామసభలు అధికారులు, అధికారపార్టీ కార్యకర్తలకే పరిమితమయ్యాయనడంలో అతిశయోక్తి లేదు. నెరవేరని లక్ష్యం జన్మభూమి కార్యక్రమం ద్వారా నాలుగున్నరేళ్లలో ఎంతో చేశామని ప్రచారం చేసుకుందామనుకున్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ముద్రించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లు వృథా అయ్యాయి. జనం రాకపోవడం, వచ్చిన చోట వినే కంటే తిరిగి ప్రశ్నించడం, నిలదీయడంతో అధికారులు ఏమీ చెప్పలేకపోయారు. అధికారులు కూడా తమకెందుకు వచ్చిన గొడవ అంటూ నామమాత్రంగా కార్యక్రమం చేసి ముగించారు. నిలదీతలు, నిరసనలు, అడ్డుకోవడంతో వ్యతిరేకత మరింత పెరిగిందన్న వాదన వినిపిస్తోంది.సీతానగరం మండలం -
హమ్మయ్య...గండం గడిచింది
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికారులకు గండం గడిచింది. ఆరో విడత జన్మభూమి ఎట్టకేలకు ముగిసింది. ఆద్యంతం నిరసనల మధ్య సాగింది. మొత్తానికి నెట్టుకొచ్చామని అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మునుపెన్నడూలేని విధంగా జన్మభూమి గ్రామసభల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిలదీశారు. పలుచోట్ల సభలను ఏకంగా బహిష్కరించారు. మరికొన్నిచోట్ల అధికారులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. గతంలో వచ్చిన అర్జీలకు సమాధానం చెప్పలేక అధికారులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం నుంచి పరిష్కారం కాక, అర్జీదారులకు నచ్చచెప్పలేక నలిగిపోయారు. ఎంపీపీల దగ్గరి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు నిలదీతకు గురయ్యారు. చేతి చమురు వదిలించుకున్న అధికారులు జన్మభూమి కార్యక్రమానికి అరకొర నిధులు విడుదల చేసి చేతులు దులుపుకొంది. అవి ఏమాత్రం సరిపోలేదు. అట్టహాసంగా నిర్వహించాలని, భారీగా జన సమీకరణ చేయాలని అధికారుల మెడపై కత్తి పెట్టింది. కానీ, ఆ స్థాయిలోనిధుల్లేక అధికారులు ప్రస్తుతానికి చేతి చమురు వదిలించుకున్నారు. మున్ముందు వాటి కోసం ఏ అడ్డదారులు తొక్కుతారో చూడాలి. ఒక్కో పంచాయతీకి రూ. 2 వేలు చొప్పున కేటాయించింది. అవి కూడా ఎంపీడీఓల ఖాతాల్లోనే ఉన్నాయి. క్షేత్రస్థాయికి చేరలేదు. వాస్తవానికైతే, ఒక్కో గ్రామసభ నిర్వహణకు రూ. 33వేలు ఖర్చయింది. మంత్రులు హాజరైతే దానికి రెట్టింపు ఖర్చయింది. దీనిబట్టి మిగతా సొమ్ము ఎవరు పెట్టుకున్నారన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతానికైతే ఆ భారమంతా క్షేత్రస్థాయి అధికారులపైనే పడింది. భవిష్యత్తులో వాటిని ఏ రకంగా సమకూర్చుకుంటారో చూడాలి. చివరి రోజూ తప్పని నిరసనలు ఆరో విడత జన్మభూమి కార్యక్రమం చివరి రోజునా నిరసనలు తప్పలేదు. ఎంత వేగంగా ముగిసిపోతుందా అని అధికారులు ఆత్రుత కనబరిచారు. ఎక్కడికక్కడ నిలదీత, ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మరుగుదొడ్ల అవినీతిపై నిలదీత కిర్లంపూడి మండలం జగపతినగరంలో అధికారులను సమస్యలపై స్థానిక ప్రజలు నిలదీశారు. గ్రామ పంచాయతీలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగింది. దీనిపై విచారణ చేపట్టి మధ్యలో ఆపేశారు. దీనిలో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉండడంవల్లే ఆపేశారా? అని స్థానికులు ప్రశ్నించారు. టీడీపీ నాయకుడు, కిర్లంపూడి ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఎడ్ల కృష్ణ ఎన్జీవో పేరుతో ఎటువంటి మరుగుదొడ్లు నిర్మించకుండానే ఎలా నిధులు మంజూరు చేశారని జెడ్పీటీసీ వీరంరెడ్డి కాశిబాబును నిలదీయడంతో చాలాసేపు జన్మభూమి సభ నిలిచిపోయింది. కొంత సమయం తరువాత జెడ్పీటీసీ మాట్లాడుతూ విచారణ చేయిస్తామని హామీ ఇవ్వడంతో జన్మభూమి సభ సజావుగా సాగింది. కాకినాడ రూరల్లో చిన్నారులకు తిప్పలు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలోని స్పందన ఫంక్షన్ హాలులో జన్మభూమి సభను నిర్వహించారు. ఈ సభలో పంచాయతీ కార్యదర్శులకు, అధికారులకు మెమెంటోలను పంపిణీ చేస్తుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని, అధికారులను నిలదీశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ఇది ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పారు. దీంతో రావూరి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమమైతే ఈ మెమెంటోలు హడావుడి ఏమిటంటూ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు రావూరి వెంకటేశ్వరరావును బయటకు గెంటుకుంటూ తీసుకుపోయారు. ఈ కార్యక్రమమంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్తిబాబుల మాస్క్లను స్కూల్ పిల్లలకు అలంకరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింప చేయడం విమర్శలకు దారితీసింది. మంత్రి లోకేష్కు చేదు అనుభవం మంత్రి నారా లోకేష్ను ‘మంచినీటి సమస్యను పరిష్కరించరా?’ అంటూ జన్మభూమి గ్రామసభలో మహిళలు నిలదీశారు. పెద్దాపురం మండలం కట్టమూరులో నిర్వహించిన జన్మభూమి గ్రామసభకు హాజరైన మంత్రిలోకేష్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను తెలియజేస్తుండగా, సభకు హాజరైన మహిళలు, స్థానికులు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో ఏళ్లతరబడి తాగునీరు అందడంలేదని, గుక్కెడు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి రోడ్లు ఛిద్రమై ఉన్నా పట్టించుకునేవారే లేరంటూ మంత్రి లోకేష్ను నిలదీశారు. అయినా మంత్రి లోకేష్ సర్దిచెప్పి మాట్లాడదామని చూసినప్పటికీ మహిళలు, స్థానిక యువకులు సమస్యలను ఏకరవుపెట్టడంతో మధ్యలో ప్రసంగాన్ని ఆపి కూర్చుండిపోయారు. దీంతో అధికారులు సమస్యలు పరిష్కరిస్తామంటూ సర్దిచెప్పినప్పటికీ మహిళలు వినకుండా సభ నుంచి వెనుతిరిగారు. -
అంతటా ఆగ్రహమే!?
సాక్షి, గుంటూరు: ఆరో విడత జన్మభూమి–మా ఊరు చివరి రోజు కార్యక్రమాలు జిల్లాలో రసాభాసగా సాగాయి. స్థానిక సమస్యలపై అధికార పార్టీ నేతలు, అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. ఆఖరి రోజు కావడంతో అధికారులు, అధికార పార్టీ నేతలు సన్మానాలు, రాజకీయ ప్రసంగాలు, ప్రభుత్వ గొప్పలు చెప్పుకోడానికే సభల్లో సమయం కేటాయించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు గ్రామంలో జన్మభూమి సభలను నాయకులు మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలు పెట్టారు. ప్రతిజ్ఙ కూడా చేయకముందే టీడీపీ నాయకులు సన్మానాలు ప్రారంభించారు. దీంతో సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలు నాయకులు, అధికారుల తీరుపై మండిపడ్డారు. తాడికొండ నియోజకవర్గం తాడికొండ గ్రామంలో టీడీపీ నాయకులు జన్మభూమి సభలో బహిరంగంగా గొడవకు దిగారు. అధికారులు తమ మాట వినడం లేదంటూ జెడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు వర్గానికి చెందిన ఎడ్డూరి హనుమంతరావు, సభ వేదిక కింద అనుచరులతో బల ప్రదర్శనకు అధికారులను దూషించారు. ఇంతలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే వర్గానికి చెందిన మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి మధుసుదనరావు కలుగజేసుకోవడంతో వారి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అధికార పార్టీ నేతలు వాగుద్ధానికి దిగి తమను ఇబ్బంది పెట్టడంతో అధికారులు వారి ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికార పార్టీ నాయకులే బహిరంగంగా జన్మభూమి సభల్లో వాగ్వాదానికి దిగడంతో ప్రజలు వారి తీరుపట్ల మండిపడ్డారు. ఈ పరిణామంతో అధికార పార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు.. గోదావరి–పెన్నా నదుల అనుసంధానానికి తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోబోమని, ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని నకరికల్లులో నిర్వహించిన జన్మభూమి సభలో రైతులు స్పష్టం చేశారు. గతంలో అద్దంకి–నార్కట్పల్లి హైవే విస్తరణలో నిర్వాసితులైన వారికి నేటికీ ఇళ్ల స్థలాలు కేటాయించలేదని, మళ్లీ ఇప్పుడు భూములు ఇవ్వలేమని అన్నారు. ఆ సమస్యలపై అధికారులను నిలదీస్తూ ప్లకార్డులతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా సత్తెనపల్లి పట్టణంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ 27, 30వ వార్డుల కౌన్సిలర్లు షేక్ నాగూర్మీరాన్, ఆకుల స్వరూపాలు బహిష్కరించారు. నిలదీతలు.. నీరు–చెట్టు పథకం పేరుతో చెరువులో మట్టిని అక్రమంగా తవ్వుకుని అమ్ముకున్నారు, గ్రామంలో అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశారని ప్రత్తిపాడు నియోజకవర్గం ఓబులనాయుడుపాలెంలో అధికారులను ప్రజలు నిలదీశారు. అదే విధంగా పెదపలకలూరు గ్రామంలో నిర్వహించిన సభలో సైతం స్థానిక సమస్యలపై అధికారులను ప్రజలు ప్రశ్నించారు. దీంతో ఆయా గ్రామాల్లో సభలు రసాభాసగా సాగా యి. గుంటూరు తూర్పు, పశ్చిమ, మాచర్ల, నరసరావుపేట సహా జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో అధికారులు, అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీశారు. ఐదు జన్మభూముల్లో ఇచ్చిన సమస్యలు బుట్టదాఖలయ్యాయని, ఈ సారైన సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అని ప్రశ్నించారు. చివరి రోజు కావడంతో పలు ప్రాంతాల్లో పింఛన్లు, రేషన్ కార్డులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రసంగాలపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. -
జన్మభూమిలో..సమస్యల జాతర
ఒంగోలు సిటీ:మళ్లీ మళ్లీ అవే సమస్యలు.. మొక్కుబడిగా పరిశీలిస్తున్న అర్జీలు.. ఆర్థికేతర సమస్యలైలే సరి.. లేదంటే అధికారులు ఆ అర్జీలను ముట్టుకోవడం లేదు. ఇదీ జిల్లాలో జరిగిన ఆరోవిడత జన్మభూమి–మాఊరు అర్జీల పరిష్కారం తీరు. మండల కార్యాలయాల్లో, మీకోసంలో, ఇప్పుడు జన్మభూమి గ్రామసభల్లో అవే సమస్యలపై అర్జీలు వచ్చాయి. ఏళ్ల తరబడి ఒకే సమస్యపై తిరిగిన జనం ప్రభుత్వవిసిగి పోయారు. జన్మభూమి మాఊరు కార్యక్రమంలోనైనా సమస్య తీరుతుందని బావించి భంగపాటుకు గురయ్యారు. జనం దగ్గర అర్జీలను తీసుకోవడం.. వాటిని పక్కన పడేయడం.. ఇది జరిగిన తంతు. ఈనెల 2వ తేదీ నుంచి శుక్రవారం వరకు జిల్లాలో పది రోజుల పాటు జరిగిన జన్మభూమి మాఊరు కార్యక్రమంలో ప్రజలకు వనగూరిన ప్రయోజనం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 1028 పంచాయతీలు, 225 వార్డుల్లో ఆరో విడత జన్మభూమి మాఊరు కార్యక్రమం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం గ్రామసభలు పేలవంగా జరిగాయి. ప్రభుత్వం నుంచి ఏదో ఒక లబ్ధి అందుతుందని బావించిన బాధితులకు నిరాశ మిగిలింది. అర్జీలను తీసుకొని చూస్తాం.. చేస్తామని అర్జీదారుల్ని పంపించేశారు. అత్యధిక భాగం వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ సభలకు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు గ్రామసభల్లో పాల్గొన్నారు. జన్మభూమి–మాఊరు కార్యక్రమం తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల్లో ఐఏఎస్ అధికారి ఎం.రామారావు ఎస్ఎన్పాడు మండలంలోని చండ్రపాలెం గ్రామంలో పాల్గొన్నారు. చుట్టూ ముసిరిన జనం సమస్యలు.. జన్మభూమి గ్రామసభల్లో జనం సమస్యలు చుట్టూ ముసిరాయి. అన్నీ వ్యక్తిగత సమస్యలే. అత్యధికంగా తమకు ఫించన్లు కావాలని అర్జీలు వచ్చాయి. ఇంటి నివేశన స్థలాలు కావాలని అంతే మోతాదులో అర్జీలు వచ్చాయి. ఎన్టీఆర్ గృహనిర్మాణం కింద పెద్ద ఎత్తున ఇళ్లను నిర్మించామని ప్రభుత్వం చెబుతున్నా ఇల్లు కావాలని పెద్ద సంఖ్యలోనే అర్జీలను సమర్పించారు. తర్వాత స్థానంలో తెల్ల రేషన్కార్డులు కావాలని కోరారు. ఇక తర్వాత స్థానాల్లో భూమి వివాదాలు, తమ భూములకు కొలతలు వేయడం లేదని, రెవెన్యూ సమస్యలు,అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని, తహసీల్దార్లు అందుబాటులో ఉండం లేదని, వైద్య సేవలు మెరుగ్గా లేవని రకరకాల సమస్యలపై పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయి.వచ్చిన వాటిలో ఆర్థికపరమైన అంశాలే అధికంగా ఉన్నందున ఇప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుపడదని అధికారులు అర్జీదారులకు తేల్చిచెప్పారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలిస్తే సరే ఇక పదండి అంటూ తిరుగు జవాబు కూడా చెప్పే పరిస్థితి లేకపోవడం గమనార్హం. 23 శాతమే పరిష్కారం.. జిల్లాలో జన్మభూమి మాఊరు కార్యక్రమం చివరి రోజు శుక్రవారం సుమారు 1000 అర్జీలు వచ్చాయి. మిగిలిన రోజుల్లో జరిగిన గ్రామసభలకు 32,233 మంది అర్జీలను ఇచ్చారు. వీటిలో 98 శాతంగా వ్యక్తిగత సమస్యలపైనే జనం అర్జీలిచ్చారు. చేతికి తీసుకున్న అర్జీల్లో పింఛను కావాలని కోరితే నిర్థాక్షిణ్యంగా తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్లు మంజూరు లేదు. మీరు పింఛన్కు అర్హులు కాదంటూ పక్కన పెట్టేశారు. వచ్చిన అర్జీల్లో 4049 అర్జీలను తిరస్కరించారు. ఇంకా 726 అర్జీలను పరిశీలించకుండానే.. అందులో అర్జీదారుడు ఏం కోరుతున్నాడో చూడకుండా పక్కన పెట్టేశారు. పరిశీలన పూర్తయినా 19661 అర్జీలకు ఎలాంటి మంజూరు ఉత్తర్వులు ఇవ్వలేదు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలే పై అధికారుల నుంచి ఆదేశాలు రాక వాటిని పక్కనపెట్టారు. 1,540 అర్జీలను పరిష్కరించినట్లుగా నమోదు చేశారు. ఈ అర్జీలకు సంబంధించిన ఎలాంటి మంజూరు ఉత్తర్వులు గానీ, ఎండార్సుమెంట్లు కాని అర్జీదారునికి ఇవ్వలేదు. మొత్తంగా జన్మభూమి మాఊరు గ్రామసభల్లో వచ్చిన అర్జీల్లో 22 శాతంగా పరిష్కరించినట్లుగా చెబుతున్నారు. అర్జీదారుల్లో ఒక్కరికైనా మంజూరు ఉత్తర్వులు గానీ, ఇతర ప్రొసిడింగ్స్ ఉత్తర్వుల ప్రతులను కాని ఇవ్వలేదు. గిద్దలూరు మున్సిపాలిటీ 14 శాతం, మార్కాపురం 22 శాతం, చీమకుర్తి 23 శాతం, ఒంగోలు అర్బన్ 6 శాతం, అద్దంకి 17 శాతం, చీరాల అర్బన్ 13 శాతం, కనిగిరి 16 శాతం ఈ రకంగా పరిష్కరించినట్లుగా నమోదు చేశారు. అర్జీదారులకు మాత్రం తమ అర్జీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాచారం లేకపోవడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలా ముగిసిన గ్రామసభలు అధికార పార్టీ ఎన్నికల ప్రచార సభల్లా గ్రామసభలు ముగిశాయన్న విమర్శలు నెలకున్నాయి. రాష్ట్ర స్థాయిలో నియమించిన అధికారులు గ్రామసభలకు జనం వస్తున్న తీరు, వారి నుంచి స్పందనలు, పార్టీ నాయకుల్లో సఖ్యత, గ్రామసభలో వస్తున్న ఫిర్యాదులు వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం. గ్రామసభలకు వచ్చిన అధికారులు పాలకుల బలాబలాలను బేరీజు వేసి వివరాలను పైవారికి చెప్పాల్సి ఉంది. ఆ కోణం నుంచే గ్రామసభల నిర్వహణ పరిశీలన జరిగిట్లుగా సమాచారం. అధికారిక నివేదిక ప్రకారం గ్రామసభలకు 1,03,622 మంది హాజరయ్యారు. విద్యార్థులు 3,97,985 మంది, ఫ్యాకల్టీ 34,266 మంది, ఉపాధ్యాయులు 48,990 మంది, గ్రామస్తులు 18 లక్షల మంది హాజరైట్లుగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని పలు చోట్ల గ్రామసభలు పేలవంగా జరిగాయి. ఒంగోలులోనూ అలాగే జరిగాయి. ఎండ్లూరులో తెలుగుదేశం శ్రేణుల్లోనే సమస్యలు వచ్చాయి. పార్టీ పెద్దలు పంచాయితీ చేయాల్సి వచ్చింది. తర్లుపాడు మండలం మంగలిపాలెంలో భూమి సమస్యను అధికారులు పరిష్కరించనందుకు ఆ గ్రామ సభను జనం బహిష్కరించారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినా స్థానికంగా నాయకులు సర్థుబాటు చేశారు.రానున్నది ఎన్నికల కాలం ఇçప్పుడు విభేదాలు వద్దని నచ్చచెప్పారు. గ్రామసభలు ఆగకుండా చర్యలు తీసుకున్నారు. కొన్ని చోట్ల జనం లేకుండా అధికారులు, యంత్రాంగంతోనే సభలు ముగిశాయి. అడుగడుగునా నిర్బంధాలు.. నిలదీతలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జన్మభూమి–మావూరు కార్యక్రమంలో అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులకు ్రçపజల నుండి నిలదీతలు, నిర్బంధాలు తప్పలేదు. పలుచోట్ల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను, అధికారులను జనం తీవ్ర స్థాయిలో నిలదీశారు. కొన్ని చోట్ల నిర్బంధించారు. మరి కొన్ని చోట్ల సభలను బహిష్కరించారు. మొత్తంగా జన్మభూమి కార్యక్రమం రసాభాసగా సాగింది. తొలిరోజు యర్రగొండపాలెం ఆమని గుడిపాలెంలో జరిగిన జన్మభూమి–మావూరులో అధికార పార్టీ కార్యకర్తలు, ప్రజలు కలిసి జన్మభూమి అధికారులను పంచాయతీ కార్యాలయంలో రెండుగంటల పాటు నిర్బంధించారు. గ్రామంలో చేపట్టిన 500 ఇంకుడు గుంటలు, 200 మరుగుదొడ్లకు ప్రభుత్వం బిల్లులు ఇచ్చేంత వరకు జన్మభూమిని జరగనివ్వమంటూ గొడవకు దిగారు. అధికారులను పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. త్రిపురాంతంకం మండలం అన్న సముద్రంలో జరిగిన జన్మభూమిలో తాను పక్కా గృహం ఇస్తామని చెప్పడంతో ఉన్న గుడిసెను పీకేసుకుని 8 నెలలుగా రోడ్డున పడ్డానని, అయినా పక్కాగృహం మంజూరు కాలేదని వెంకటమ్మ అనే మహిళ ఎమ్మెల్యే డేవిడ్ రాజును నిలదీసింది. గ్రామానికి స్మశాన స్థలం కేటాయిస్తామని ఏళ్ళ తరబడి చెబుతున్నా ఇప్పటి వరకు స్థలం ఇవ్వలేదని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎమ్మెల్యేను, అధికారులను నిలదీశాడు. జిల్లాలోని అద్దంకి, గిద్దలూరు, పర్చూరు, చీరాల, కందుకూరు, కనిగిరి, కొండపి, సంతనూతలపాడు, ఒంగోలు, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో సమస్యలపై ప్రజలు అధికారులను నిలదీశారు. చివరకు తాగునీరు కూడా అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని జనం ధ్వజమెత్తారు. రెవెన్యూ సమస్యలపైనా జనం అధికారులను నిలదీశారు. సమస్యలు పరిష్కరించలేని జన్మభూములు ఎందుకంటూ పలు చోట్ల సభలను బహిష్కరించారు. ఈ జన్మభూమిలో సమస్యలు పరిష్కరిస్తారని ఇబ్బడి ముబ్బడిగా రేషన్ కార్డులు, పించన్లు ఇస్తారని అందరూ ఆశించినా ప్రభుత్వం మాత్రం జన వినతులను పరిష్కరించక ఈ జన్మభూమిని కూడా ప్రచారానికే వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 6వ విడత జన్మభూమిలో వచ్చిన అన్ని వినతులను పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి సభల్లో చెప్పినా క్షేత్ర స్థాయిలో అది జరగలేదు. గత 5 విడతల జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన వినతులు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ఇక కొత్త వినతులకు ఎప్పటికీ మోక్షం లభిస్తుందో తెలియని పరిస్థితి. ఏమి చేయకుండానే ఎంతో చేశామని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకునేందుకే జన్మభూమిని ఉపయోగించుకున్నట్లు కనపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పదిరోజులూ ప్రజాగ్రహమే
అనంతపురం అర్బన్: ప్రచార ఆర్భాటం కోసం ఈనెల 2వ తేదీ నుంచి జిల్లాలో చేపట్టిన ‘జన్మభూమి– మా ఊరు’ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. తొలిరోజు నుంచి చివరి రోజు వరకు సమస్యల పరిష్కారానికి ప్రజలు అధికారులను నిలదీశారు. సమస్యల పరిష్కారానికంటే ప్రజాప్రతినిధుల ఊకదంపుడు ఉపన్యాసాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో జనం సభలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో అధికారులు పింఛను తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులతో సభలు నడిపించారు. చాలాచోట్ల సభలు అధికారపార్టీ కార్యక్రమాలను తలపించాయి. సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఎందుకీ కార్యక్రమాలు... సభలు అంటూ కొన్ని చోట్ల రైతులు, ప్రజలు ‘జన్మభూమి’ సభలను బహిష్కరించారు. ఇక సమస్యలపై నిలదీసిన ప్రజలపై అ«ధికారపార్టీ నాయకులు తమ ప్రతాపం చూపారు. బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంటలో జరిగిన సభలో సమస్యలపై నిలదీసిన వారిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఏకంగా తిట్ల దండకం అందుకున్నారు. తనను ప్రశ్నించిన వారిని మెడ పట్టి గెటించారు. ఇక శింగనమల ఎమ్మెల్యే యామినీబాలను, కదిరి ఎమ్మెల్యే అత్తార్చాంద్బాషాను పలు సభల్లో జనం సమస్యలపై నిలదీశారు. శుక్రవారం ఉరవకొండలో జరిగిన సభ రసాభాసగా సాగింది. నిరుపేదలకు ఇంటి పట్టాలివ్వాని వైఎస్సార్ సీపీ నేతలు జన్మభూమి సభను అడ్డుకునేందుకు ప్రయత్నించగా..పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సమస్యలపై 23,921 అర్జీలు జిల్లావ్యాప్తంగా 10 రోజులపాటు జరిగిన జ న్మభూమి సభల్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 23,921 అర్జీలు అందాయి. అర్జీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తి చేస్తే ఈ సంఖ్య మరికొద్దిగా పెరిగే అవకాశం ఉం ది. ఇక వీటితో సంబంధం లేకుండా అనంతపురం అర్బన్లో 934, రూరల్లో 3,476 అర్జీ లు అందాయి. అందిన అర్జీల్లో అప్పటికప్పు డు 1,105 పరిష్కరించామనీ, 14,693 అర్జీలను పరిశీలన పూర్తి చేశామనీ, 6,239 అర్జీ లు పరిశీలన చేయాల్సి ఉందని ఆన్లైన్లో నమోదు చేశారు. అందిన అర్జీల్లో 1,884 అర్జీలను తిరస్కరించారు. నియోజకవర్గాల వారీ గా చూసుకుంటే రాప్తాడు నియోజకవర్గంలో అత్యధికంగా 4,867 అర్జీలు రాగా పుట్టపర్తిలో అత్యల్పంగా 903 అర్జీలు అందాయి. -
అడ్డుకుంటే అంతు చూస్తాం
కర్నూలు సీక్యాంప్: రోడ్డు సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన కర్నూలు మండలం పడిదెంపాడు, పూడూరు గ్రామస్తులపై పోలీస్, రెవెన్యూ అధికారులు శివాలెత్తారు. జన్మభూమి సభలను అడ్డుకుంటే అంతు చూస్తామని, కేసుల నమోదుతో పాటు ప్రభుత్వ పథకాలను సైతం తొలగిస్తామంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా గ్రామాల్లోకి ప్రవేశించి సభలు నిర్వహించారు. అయితే..అటువైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. పడిదెంపాడు, పూడూరు గ్రామస్తులు దశాబ్ద కాలంగా రోడ్డు సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతమున్న రోడ్డు ప్రయాణాలకు ఏమాత్రమూఅనువుగా లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక 20 మందికి పైగా చనిపోయారు. రోడ్డు బాగు చేయాలంటూ కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుతున్నా..ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో గత జన్మభూమిలో భారీఎత్తున నిరసనలు తెలియజేశారు. రోడ్డు నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకుంటామని కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే..ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ నేపథ్యంలో ఆరోవిడత జన్మభూమిని కూడా బహిష్కరించడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఈ రెండు గ్రామాల్లో శుక్రవారం సభలు ఏర్పాటు చేయగా..అధికారులెవరూ రాకుండా ముందుగా పడిదెంపాడు ఊరిబయటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఆందోళన చేపట్టారు. తాలూకా సీఐ వెంకటరమణ వచ్చి గ్రామస్తులను భయాందోళనకు గురిచేశారు. సమస్య చెప్పిన వారితో పాటు వాహనాల వీడియోలు, ఫొటోలు తీసుకుని.. కేసులు పెడతామంటూ బెదిరించారు. దీంతో గ్రామస్తులు వెనక్కి తగ్గగా..అధికారులు ఊళ్లోకి వెళ్లి సభ నిర్వహించారు. గ్రామస్తులెవరూ సభకు రాలేదు. ఆ తర్వాత పూడూరులో సభ నిర్వహణకు వెళ్లిన అధికారులకు ఊరిబయటే ప్రతిఘటన ఎదురైంది. గ్రామస్తులు టైర్లు అంటించి, ఆటోలు, ఇతర వాహనాలు అడ్డంపెట్టి ఆందోళన చేపట్టారు. ఇక్కడ తాలూకా ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి రెచ్చిపోయారు. గ్రామస్తులను తోసివేశారు. అడ్డుకునేవారిని వాహనాలతో తొక్కిస్తానంటూ బెదిరించారు. అక్కడే ఉన్న జర్నలిస్టులపైనా చిందులు వేశారు. ఈ దృశ్యాలను కొందరు కెమెరాలు, సెల్ఫోన్లలో చిత్రీకరిస్తుండగా వాటిని లాక్కున్నారు. అధికారులు బలవంతంగా గ్రామంలోకి వెళ్లి జన్మభూమి సభ నిర్వహించగా.. ఇక్కడ కూడా గ్రామస్తుల నుంచి చుక్కెదురైంది. -
నిరసనలదే పైచేయి
కర్నూలు(అగ్రికల్చర్)/సాక్షి నెట్వర్క్: జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో నిరసనలదే పైచేయి అవుతోంది. పలు గ్రామాల్లో ప్రజల ప్రశ్నలకు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురు వారం జరిగిన గ్రామ సభల్లో పలు చోట్ల నిరసనలు చోటుచేసుకున్నాయి. 9వ రోజు జిల్లా వ్యాప్తంగా 112 సభలు జరిగాయి. పలుచోట్ల జనాలు లేక సభలు వెలవెలబోయాయి. కాగా జన్మభూమి కార్యక్రమం శుక్రవారం ముగియనుంది. చివరి రోజు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ♦ ఓర్వకల్లో గురువారం జరిగిన సభలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ వ్యవహరించిన తీరుపై ముస్లీం మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్లా అనే వ్యక్తి మాట్లాడుతూ ఓర్వకల్లో షాదీఖానా నిర్మాణానికి రెవెన్యూ, విద్యుత్ అధికారులు సహకరించడం లేదని, రెండేళ్లుగా తిరుగుతున్నా విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ♦ కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నీటి సమస్యపై ప్రజలు అధికారులపై ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పక్కా ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరులో అర్హులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ♦ ఆదోని మండలం ఇస్వి గ్రామంలో ఇప్పటి వరకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేయకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీశారు. సభకు హాజరైన రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణా రెడ్డి డీలర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్ను సస్పెండ్ చేయాలని జేసీతో మాట్లాడారు. ఒక్క రోజులో కార్డుదారులందరికీ కానుకలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ♦ పాములపాడు మండలం మిట్టకందాలలో ప్రజలు అధికారులను నిలదీశారు. తాగునీటికి అల్లాడుతున్నాం... టీడీపీ నాయకులు అసైన్ల్యాండ్లో ఎర్రమట్టి కోసం అడ్డుగోలుగా తవ్వుకొని తరలిస్తున్నా చర్యలు లేవరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించనందుకు కింద కూర్చొని నిరసన తెలిపారు. ♦ బేతంచెర్ల మండలం సీతారాంపురం గ్రామంలో సమస్యలపై ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడం లేదని, పింఛన్లు, పక్కా ఇళ్లు అనర్హులకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ♦ వెల్దుర్తి మండలం బోగోలులో వివిధ ప్రాంతా లకు చెందిన వారికి పక్కా ఇళ్లు మంజూరు కావడంపై అధికారులను నిలదీశారు. తమ రేషన్ కార్డులతో కర్నూలులో ఉన్న వారికి ఇళ్లు మంజూరు కావడమేంటని ప్రశ్నించారు. ♦ కర్నూలు నగరపాలకసంస్థలోని 44వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సీపీఎం నేతలు వివిధ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భగత్సింగ్ నగర్ నుంచి వెళ్లే ప్రధాన రోడ్డులో మమతానగర్, ప్రేమ్నగర్ల మధ్యనున్న అసంపూర్తి రోడ్డుపై సీపీఎం నాయకులు రాముడు, అంజిబాబు, ఉస్మాన్బాషా తదితరులు ధ్వజమెత్తారు. -
నిరసన మంటలు.. ఖాళీ కుర్చీలు
జన్మభూమి గ్రామ సభల్లో ప్రజల నిరసనలు మిన్నంటుతున్నాయి.. గత సభల్లో ఇచ్చిన అర్జీల పరిష్కారానికే ఇప్పటి వరకూ దిక్కులేదు.. మళ్లీ ఎందుకు వచ్చారంటూ గ్రామగ్రామానా అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. సీఎం నివసిస్తున్న ఉండవల్లిలో గురువారం జన్మభూమి కార్యక్రమం రసాభాసగా సాగింది. స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చి ప్రజలను అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. సాక్షి, గుంటూరు: జిల్లా అంతటా జన్మభూమి గ్రామ సభల్లో అధికారులు, అధికార పార్టీ నేతలకు ప్రజల నుంచి నిరసన సెగలు, నిలదీతల ఎదురవుతున్నాయి. గత జన్మభూమి సభల్లో ఇచ్చిన ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయని జనాలు అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తునారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి, గ్రామ సభల్లో గురువారం ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం వెల్లటూరులో స్థానిక సమస్యలు పరిష్కరించండం లేదంటూ జన్మభూమి సభలో ఓ యువకుడు అధికార పార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును నిలదీశాడు. గ్రామంలోని ప్రా«థమిక వైద్యశాలలో సిబ్బంది లేక జనం ఇబ్బందులు పడుతున్నారని సిబ్బందిలేని పీహెచ్సీ ఎందుకని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎమ్మెల్యేను యువకుడు నిలదీయడంతో పక్కనే ఉన్న పోలీసులు కలుగజేసుకుని నువ్వు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడివి సభలో గందరగోళం సృష్టించడానికి వచ్చావని పక్కకు లాక్కెళ్లారు. దీంతో ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుడని ముద్ర వేస్తారా అంటూ యువకుడు పోలీసులు అధికారులపై మండిపడ్డాడు. నిలదీతలు.. ఎదురీతలు మాచర్ల మండలం తాళ్లపల్లిలో నిర్వహించిన జన్మభూమిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ గోపిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్థానిక సమస్యలపై అ«ధికారులను నిలదీశారు. నాలుగున్నరేళ్ల పాలనలో గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏమి లేదని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. మాచర్ల పట్టణం 25,26,27 వార్డుల్లోని జన్మభూమి సభల్లో జనం లేక వెలవెలబోయాయి. నరసరావుపేట ప్రకాష్నగర్ నిర్వహించిన జన్మభూమి సభలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ ఎం రమణారెడ్డి అధికారులను నిలదీశారు. దరఖాస్తులు బుట్టదాఖలవుతున్నాయే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. సత్తెనపల్లి పట్టణం 28వ వార్డులో జన్మభూమి సభలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ గని ప్రజా సమస్యలపై పాలకులు, అధికారులను నిలదీశారు. నకరికల్లు మండలం చేజర్లలో అధికారులపై రైలు మండిపడ్డారు. పంటలకు నీరివ్వడం లేదని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఫిర్యాదు చేశారు. వాడవాడలా ఆగ్రహం సత్తెనపల్లి 26వ వార్డు, పాకాలపాడులో జన్మభూమి సభలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకాలపాడు చెరువు అక్రమాలపై విచారణ జరిపించాలని రైతులు స్పీకర్ కోడెలకు వినతి పత్రం అందజేశారు. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు వినతి పత్రం ఇచ్చారు. పట్టణంలోని 25వ వార్డులో నిర్వహించిన జన్మభూమి సభలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు ప్రజా సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పెట్టి తమ వార్డుల్లో చాలా సమస్యలు నెలకొన్నాయన్నారు. అనంతవరంలో.. అనంతవరం(తుళ్లూరురూరల్): సమస్యలను పరిష్కరించలేని సభలు నిర్వహించడం ఎందుకు అని అనంతవరం ప్రజలు అధికారులను నిలదీశారు. గురువారం తుళ్లూరు మండలం అనంతవరం, వడ్డమాను గ్రామాలలో జన్మభూమి సభ నిర్వహించారు. వడ్డమాను రహదారిలోని కాలువ అస్తవ్యస్తంగా ఉందన్నారు. శ్మశాన వాటికకు నిధులు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు. గ్రామంలో క్వారీల నిర్వహణతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. -
ఉయ్యూరు జన్మభూమి సభలో ఉద్రిక్తత
కృష్ణాజిల్లా, ఉయ్యూరు(పెనమలూరు): ఉయ్యూరులో జన్మభూమి సభ రసాభాస అయ్యింది. ప్రజల సమస్యలపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్లు రగడ సృష్టించారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అసభ్యపదజాలంతో నోరుపారేయడంతో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావుతోపాటు పార్టీ శ్రేణులు ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. జవాబు చెప్పలేక.. గొడవ సృష్టించి.. పట్టణంలోని 15, 16,17 వార్డులకు సంబంధించి కాటూరు రోడ్డులోని ఓ పాఠశాల క్రీడా మైదానంలో గురువారం జన్మభూమి సభ నిర్వహించారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తాను కేవలం ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి వెళ్లిపోతానని, ఎలాంటి వివాదం ఉండదని అధికారులతోపాటు సీఐ కాశీవిశ్వనాథంతో పేర్కొన్నారు. అధికారులు, చైర్మన్లు పార్థసారథిని వేదికపైకి ఆహ్వానించి మాట్లాడాలని కోరారు. ఆయన జనం మధ్య నుంచే టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, డ్వాక్రా రుణ మాఫీ, పంట నష్టం, అంశాలపై ప్రశ్నలు సంధించారు. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సహనం కోల్పోయి రామచంద్రరావుతోపాటు పార్టీ శ్రేణులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో అసభ్యపదజాలంతో దూషించారు. రాయడానికి వీలులేని పదజాలంతో ధూషించారు. మాజీ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మంచి పద్ధతి కాదంటూ సూచిస్తున్నా పట్టించుకోకుండా దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో కుర్చీలు పైకిలేచాయి. పోలీసులు ఇరువర్గాలను నెట్టి పార్థసారథితోపాటు వైఎస్సార్ సీపీ శ్రేణులను సభా ప్రాంగణం నుంచి బయటకు పంపారు. ఎమ్మెల్యే రాకతో రగడ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వేదికపైకి రావడంతోనే మైక్ తీసుకుని పార్థసారథిని ఉద్దేశిస్తూ ఎద్దేవాగా మాట్లాడారు. అయినా సంయమనం పాటించి పార్థసారథి జీ+3 నిర్మాణాలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను, అవినీతిని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో వాదన మొదలైంది. ఈస్ట్ ఏసీపీ విజయభాస్కర్తోపాటు పోలీసులు వైఎస్సార్ సీపీ శ్రేణులను వేదికకు దూరంగా నెట్టివేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. పార్థసారథి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులు వేదికపైకి ఎక్కి నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావు మంచి పద్ధతి కాదంటూ హెచ్చరించారు. టీడీపీ శ్రేణులను కూడా వేదిక దింపి దూరంగా పంపాలని రామచంద్రరావు సూచించడంతో ఎమ్మెల్యే ఎద్దేవాగా వ్యాఖ్యానించడంతో వాదులాట చోటుచేసుకుంది. -
జన్మభూమిలో ఎమ్మెల్యేకు చేదు అనుభవం
పశ్చిమగోదావరి, ఆకివీడు: ఇళ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని మహిళలు, బాధితులు ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజును చుట్టుముట్టారు. జన్మభూమి సభ ముగిసిన తర్వాత వెళ్లిపోతున్న ఎమ్మెల్యేకు తమ గోడు వినిపించేందుకు జనం చుట్టుముట్టి, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, డ్వాక్రా రుణమాఫీ, ఉపాధి హామీ కూలి డబ్బులు అందలేదని ఆందోళన వ్యక్తంచేశారు. సమస్య పరిష్కరిస్తానని, ఇళ్ల çస్థలాల మంజూరుకు కృషి చేస్తానని చెప్పి పోలీసుల సహాయంతో ఎమ్మెల్యే చల్లగా జారుకున్నారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు కేటాయింపులో అవకతవకలు జరిగాయని మహిళలు ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలు, స్థానిక యువకులు నిలబడి ఇళ్ల పట్టాలు అనర్హులకు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేయడంతో సభ రసాభాసగా మారింది. ఎంపీడీఓ ఎంఎస్ ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఇళ్ల స్థలాల మంజూరు, పట్టాల పంపిణీపై తహసీల్దార్ వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతుండగా గ్రామ మహిళ ముత్యాన లక్ష్మి, బేతాళ్ల మార్తమ్మ, సంతకాని శారమ్మ తదితరులు పట్టాలు అనర్హులకు ఇస్తున్నారని, ఏళ్ల తరబడి దరఖాస్తులు చేసుకున్నా తమకు అన్యాయం చేశారని వాపోయారు. అద్దెలు కట్టుకుని జీవించలేకపోతున్నామని, ఎన్నాళ్లు అద్దె ఇళ్లలో నివసించాలని నిలదీశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తమ గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం భూమిని కొనుగోలు చేశారని, ఆ భూమిని పంపిణీ చేయడానికి పదేళ్లు పట్టిందన్నారు. అయితే పదేళ్లుగా ఎదురుచూస్తున్న తమకు భూమి కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెవెన్యూ అధికారులు అండార్స్మెంట్ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినా పట్టించుకోకుండా అనర్హులకు పట్టాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఉపాధి కూలీల గోడు ఉపాధి హామీ పనులు చేసినా కూలి డబ్బులు ఇవ్వడంలేదని, ఏడాదిగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయతీ చెరువు తవ్వించుకుని కూలి సొమ్ము చెల్లించలేదని మరికొంత మంది మహిళలు ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం సభకు హాజరైన ఎమ్మెల్యే వీవీ శివరామరాజు మాట్లాడుతూ ప్రస్తుతం స్థలం ఉన్న ప్రాంతంలో అర్హులకు పట్టాలిస్తామని, మిగిలిన వారికి భూమి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. సభలో ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి ప్రసాద్, జెడ్పీ వైస్ చైర్మన్ మన్నే లలితాదేవి, ఎంపీపీ పి.వాణి, వడ్డి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రచ్చ రచ్చ
జన్మభూమి సభలంటేనే జనం మండిపడిపోతున్నారు. ఎక్కడి కక్కడే అడ్డుకుని పాలకపక్ష నాయకులు, అధికారులనునిలదీస్తున్నారు. సమస్యలుపరిష్కరించని సభలెందుకంటూ నిరసిస్తున్నారు.మరికొన్ని చోట్ల ఏకంగా సభలు నిర్వహించవద్దంటూబహిష్కరించడం...అధికారులు ఊళ్లోకి రాకుండాముళ్లకంపలు అడ్డంగావేయడం వంటి నిరసనలుచోటు చేసుకున్నాయి. విజయనగరం గంటస్తంభం: జన్మభూమి కార్యక్రమం చివరి దశకు చేరుకునే సరికి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోం ది. జిల్లాలో గురువారం నిర్వహించిన సభల్లో ఎక్కువగా నిలదీతలు.. నిరసనలు కనిపించాయి. గ్రామసభలకువెళ్లే నేతలను, అధికారులను అడ్డుకోవడం, జన్మభూమి మాకొద్దంటూ బహిష్కరించడంతో నిరసన తెలిపారు. సభ జరిగిన చోట గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఎందుకు చేయలేదని నిలదీతలు చోటు చేసుకున్నాయి. జెడ్పీ ఛైర్మన్, చీపురుపల్టి, గజపతినగరం ఎమ్మెల్యేలకు ఈ పరాభవం తప్పలేదు. గంట్యాడ మండలం కిర్తుబర్తిలో అర్హులకు పింఛన్లు అందలేదని, సంక్షేమ పథకాలు కొంత మందికే అందజేస్తున్నారని ఎమ్మెల్యే కె.ఎ.నాయుడును గ్రామస్తులు నిలదీశారు. దత్తిరాజే రు మండలం టి.బూర్జవలసలో నాలుగేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా అర్హులైన వితంతువులకు, వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయలేదని, పంటలు పోయి రైతులు కొట్టు మిట్టాడుతున్నా కరువు మండలంగా ప్రకటించలేదని , గోకులాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన రైతులకు ఇవ్వడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు మంత్రి అప్పలనాయుడు మండల ప్రత్యేక అధికారి పాండు రంగారావు దృష్టికి తెచ్చారు. ♦ గుర్ల మండలం చింతపల్లిపేటలో జన్మభూమిలో అర్హులకు పింఛన్లు ఇవ్వడం లేదని అధికారులను గ్రామ మాజీ సర్పంచ్ జమ్ము అప్పలనాయుడు నిలదీశారు. మెరకముడిదాం మండలం చినబంటుపల్లిలో ఆంధ్రా పెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణిని అక్కడి ఉద్యోగి కె.కె.ఎం.నాయుడు నిలదీశారు. ♦ బొబ్బిలి మున్సిపాలిటీ మల్లంపేటలో రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తూనిక, తేమ కొలిచే విధానంలో రైతులను మోసం చేస్తున్నారని ప్రత్యేక అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. రేషన్ కార్డులు, పింఛన్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మహిళలు ఆరోపించారు. ♦ పార్వతీపురం మునిసిపాలిటీ 14వ వార్డులో ప్రతిపక్ష కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహించడంతో ఒక్క ప్రజా ప్రతినిధికూడా హాజరుకాలేదు. వార్డు ప్రజలు సమస్యలపై నిలదీస్తారనే భయంతోనే పాలకులు ఎవరూ ఈ వార్డుకు హాజరుకానట్లు తెలిసింది. ♦ కురుపాం నియోజకవర్గంలో వనకాబడి గ్రామంలో జరిగిన జన్మభూమిని గ్రామస్తులు బహిష్కరించారు. ఆ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించలేని జన్మభూమి ఎందుకని కార్యక్రమాన్ని బహిష్కరించారు. అలాగే గోడివాడ పంచాయతీలో కూడా సమస్యలు పరిష్కరించలేని జన్మభూమి కార్యక్రమాలు ఎందుకంటూ గ్రామస్తులు కార్యక్రమానికి హాజరైన అధికారులను అడ్డుకున్నారు. మరో దారి లేక అధికారులంతా వెనుదిరిగారు. సాలూరు మండలం నెల్లిపర్తి గ్రామంలో సమస్యలపై అధికారులను నిలదీయడంతో పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ♦ వేపాడ మండలం పి.కె.ఆర్.పురం గ్రామంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు మాకు గ్రామసభలొద్దంటూ గ్రామస్తులు అధికారులను గ్రామంలోకి రాకుండా ట్రాక్టరు, ఆటో, ముళ్లకంచెలు వేసి అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించని సభలు వద్దని మొండికేశారు. శంగవరపుకోట మండలం దారపర్తిలో రోడ్డు పేరుతో గిరిజనులను ఎన్నాళ్లు మోసం చేస్తారంటూ దారపర్తి గిరిశిఖర పంచాయతీ గ్రామాల గిరిజనులు, యువకులు జన్మభూమి సభలో అధికారులను నిలదీశారు. -
జన్మభూమి గ్రామసభల్లో రచ్చరచ్చ
శ్రీకాకుళం, భామిని: తమ కష్టాలు, నష్టాలపై నిలదీస్తున్న ప్రజలకు అధికారులు సమాధానం ఇవ్వకుండా, టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేదా టీడీపీ సమావేశమా? అధికారులు సమాధానం చెప్పాలని నిలదీశారు. వీరికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. తహసీల్దారు జేబీ జయలక్ష్మి ఆధ్వర్యంలో మండలంలోని బాలేరులో గురువారం నిర్వహించిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో తిత్లీ తుఫాన్ పంట నష్టాలపై గ్రామస్తులు నిలదీశారు. తుఫాన్ ధాటికి ఎగిరిపోయిన ఇళ్లు, పశువుల పాకల నష్టాలను గుర్తించి పలుమార్లు జియోట్యాగింగ్ చేసిన అధికారులు పరిహారాలు ఇవ్వడంలో వైఫల్యం చెందారని వైఎస్సార్సీపీ నాయకులు మేడిబోయిన చలపతిరావు, కొత్తకోట చంద్రశేఖర్, రొక్కం రామారావు, దామోదర జగదీష్ మండిపడ్డారు. ఈ క్రమంలో పక్కా గృహాల బిల్లులు కోసం ప్రశ్నించిన లబ్ధిదారులకు టీడీపీ నాయకుడు జయకృష్ణను కలవాలని ప్రత్యేకాహ్వానితులు ఎం జగదీశ్వరరావు అని సూచించడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన సమాధానం ఇవ్వడమేమిటని, అధికారులే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వివాదం రేగింది. వీరికి మద్దతు పలికిన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంతో తోపులాట సాగింది. రెండు వర్గాల కోట్లాటకు చేరుకునే దశలో ఏఎస్సై అప్పలనాయుడు జోక్యం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, ప్రజలను బయటకు పంపించారు. ఇంతలో బత్తిలి ఎస్సై ముదిలి ముకుందరావు, కొత్తూరు సీఐ మజ్జి నాగేశ్వరరావు పోలీసు బృందాలతో వేర్వేరుగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో ప్రజా సమస్యలపై అధికారులు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మీనక భారతి, వెలుగు ఏపీఎం వై రమణ, వాటర్షెడ్ ఏపీవో బీ శంకరరావు, ఆర్ఐ కొల్ల వెంకటరావు పాల్గొన్నారు. మూగజీవాలపై కనికరం లేదా? వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని నగరంపల్లి గ్రామంలో గురువారం జన్మభూమి– మాఊరు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. గ్రామస్తుల నిలదీతలతో రెండు గంటలపాటు నిలిచిపోయిన ఈ కార్యక్రమాన్ని పోలీసుల పహరా మధ్య నిర్వహించారు. ‘తిత్లీ తుఫాన్కు పశువుల శాలలు నేలమట్టం కావడంతో మూగజీవాలకు తాత్కాలిక రక్షణగా ప్రభుత్వం ఇచ్చిన టార్పాలిన్లు అనర్హుల చేతిలో చేరాయి, దీంతో ప్రస్తుతం అవి చలికి వణుకుతున్నాయి, ఏమాత్రం వీటిపై మీకు కనికరం లేదా’ అంటూ అధికారులను బాధితులు నిలదీశారు. ఈ టార్పాలిన్లు ఎవరికీ ఇచ్చారో లెక్క చెప్పాలని వారితోపాటు పీఏసీఎస్ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు దువ్వాడ మధుకేశ్వరావు, మాజీ సర్పంచ్ దువ్వాడ జయరాంచౌదరి పట్టుబట్టడంతో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. ఇదేక్రమంలో మానసిక దివ్యాంగురాలికి పదేళ్లుగా పింఛను ఇవ్వడంలేదని, ఈ పాప ఏ పాపం చేసిందని చిన్నారి తల్లి ఎల్ హేమలతతోపాటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ఎస్సై నర్సింహులు అక్కడకు హుటాహుటిన చేరుకుని పరిస్థితి సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ శాంతించని బాధితులు సభ నిర్వహణకు అడ్డుతగిలారు. పోలీసుల పహరా ఏర్పాటు చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరికి టార్పాలిన్లు లబ్ధిదారుల జాబితాను పలాస నుంచి వీఆర్వో తీసుకొచ్చి బహిర్గతం చేయడంతో సభ ముగిసింది. అదేవిధంగా పెదబాడంలోనూ తుఫాన్ బాధితులు నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జీ వసంతరావు, వజ్రపుకొత్తూరు పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ దువ్వాడ వెంకటకుమార్ చౌదరి, డిప్యూటీ తహసీల్దారు అప్పలస్వామి, వివిధ శాఖాధికారులు మెట్ట పాపారావు, గోపి, గౌతమి పాల్గొన్నారు. జన్మభూమిని బహిష్కరించిన బెంతొరియాలు కంచిలి: మండలంలోని కొన్నాయిపుట్టుగ పంచాయతీ కేంద్రంలో గురువారం జన్మభూమి– మాఊరు గ్రామసభను గ్రామస్తులు బహిష్కరించారు. ప్రజాసాధికార సర్వేలో బెంతొరియా సామాజిక వర్గాన్ని విస్మరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు తహసీల్దారు డీ రామ్మోహనరావుకు వినతి పత్రం అందజేశారు.– మోసాలకు పాల్పడుతున్న మిల్లర్లు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు మోసాలకు పాల్పడుతున్నారని జన్మభూమిలో కుత్తుం గ్రామానికి చెందిన రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తేమ ఎక్కువగా ఉందనే కారణంతో బస్తా వద్ద 3 నుంచి 4 కిలోల వరకు కొలతలో తక్కువగా లెక్కిస్తున్నారని వాపోయారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, ఎంపీడీవో చల్లా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
సభలెందుకు దండగ
తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి సభలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గత గ్రామ సభల్లో ఇచ్చిన అర్జీల గురించి పట్టించుకోకుండా మళ్లీ ఎందుకు వచ్చారంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే అర్జీలు కూడా బుట్టదాఖలు కావాల్సిందేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు గ్రీవెన్స్లో ఇచ్చిన అర్జీలకే దిక్కు లేనప్పుడు ఈ సభలెందుకు దండగని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ తీరు కారణంగా తాము మాటలు పడాల్సి వస్తోందని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, గుంటూరు: ఏళ్ల తరబడి జన్మభూమి సభల్లో ఇచ్చిన అర్జీలు, ఫిర్యాదులకు మోక్షం లభించలేదు..మళ్లీ జన్మభూమి సభలెందుకంటూ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి గ్రామ సభల్లో అధికారులు, అధికార పార్టీ నేతలను నిలదీస్తున్నారు. పలు ప్రాంతాల్లో మంగళవారం జన్మభూమి సభలు రసాభాసగా మారాయి. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి మండలం కాజ గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ పునేఠా పాల్గొన్నారు. గత జన్మభూమి సభల్లో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాలేదని వృద్ధులు సీఎస్కు చెప్పుకునే ప్రయత్నం చేయగా అధికారులను వారిని అడ్డుకున్నారు. సీఎస్ కేవలం అర్ధగంట సేపు మాత్రమే సభలో ఉన్నారని, కనీసం తమ బాధలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని ప్రజలు వాపోయారు. అధికారులను నిలదీసిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు... అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని, పచ్చ కండువా కప్పుకుంటేనే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులను నిలదీశారు. సత్తెనపల్లి పట్టణం 20వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ కూకుట్ల లక్ష్మి అధికారులపై మండిపడ్డారు. పొన్నూరు 22, 23వ వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగమవుతున్నాయని మండిపడ్డారు. ఎన్ని పంటల పొలాలు లాక్కుంటారు... ప్రభుత్వం అభివృద్ధి, పథకాల పేరుతో పంట పొలాలను లాక్కుంటోందని మేడికొండూరు మండల పరిధిలో నిర్వహించిన సభలో నీరు చెట్టు పథకం పేరుతో అధికార పార్టీ నేతలు తమ పంట పొలాలు లాక్కున్నారని మహిళా రైతులు అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేశారు. రోడ్డు విస్తరణల పేరుతో ఇంకా ఎన్ని పొలాలు లాక్కుంటారని అధికారులను రైతులు నిలదీశారు. తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురంలో శ్మశానం లేక ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయరా ? దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో ఇళ్ల స్థలాలు, పట్టాల కోసం ప్రజలు ఆందోళన చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అధికార పార్టీ నేతలకు ప్రజలు గుర్తుకు వస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 29, 40, 28 డివిజన్లలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కేవలం నెల్లూరు జిల్లాకు మాత్రమే మంత్రా.. అధికారులు, మంత్రి తమషాలాడుతున్నారా? గుంటూరు నగరపాలక సంస్థ రెగ్యులర్ ఎస్సీ నియమించకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాధికారక సర్వే ఓ పెద్ద బోగస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకూరపాడు, మాచర్ల, నరసరావుపేట, తెనాలి సహా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజలు సమస్యల పరిష్కారంపై నిలదీశారు. పూలు ప్రాంతాల్లో పాఠశాలలు జరిగే రోజుల్లోనే జన్మభూమి సభలు పాఠశాలల్లో ఏర్పాటు చే యడంతో పాటు జనాలు లేని ప్రాంతాల్లో విద్యార్థులను కూర్చోబెట్టి సభలు నిర్వహించారు. -
సమస్య పరిష్కరించకుండా మీరెందుకు..?
ప్రకాశం, తర్లుపాడు: ‘మా సమస్యను పరిష్కరించాకే గ్రామానికి రండి. సమస్యను పరిష్కరించకుండా గ్రామసభ నిర్వహించి ఏం ఉపయోగం’ అని మండలంలోని మంగళకుంట గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు. జన్మభూమి గ్రామసభలో భాగంగా అధికారులు మంగళవారం మంగళకుంటకు వచ్చారు. అయితే గ్రామసభ నిర్వహించకుండా గ్రామస్తులు అడ్డుకొని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయకుండా అధికారుల ఎదుట నిరసన తెలియజేసి గ్రామసభను బహిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మంగళకుంట రెవెన్యూ ఇలాకాలో 208 సర్వే నంబర్లో 15 ఏళ్ల క్రితం మంగళకుంట, కొత్తూరు గ్రామాలకు 350 ఎకరాల పొలాన్ని ప్రతి ఇంటికి 5 ఎకరాలు చొప్పున పట్టాలు మంజూరు చేశారు. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి అదే నంబర్లో సబ్ డివిజన్లు చేసి మండల, మండలేతరులకు, ధనికులకు ఆన్లైన్ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన గ్రామస్తులు మంగళవారం గ్రామసభను అడ్డుకున్నారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించకుండా సహాయ నిరాకరణ చేశారు. గ్రామానికి వచ్చిన అధికారులకు కుర్చీలు ఇవ్వకుండా నిరసన తెలియజేశారు. అధికారులు బయట నుంచి కుర్చీలు తెప్పించుకున్నా వాటిని కూడా తీసేసి గ్రామం నుంచి వెళ్లిపోవాలని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించినప్పుడే మా ఊరికి రండని తేల్చి చెప్పారు. ఎన్నో ఏళ్లుగా గ్రామాన్ని కనిపెట్టుకుని ఉన్న గ్రామస్తులను కాదని రెవెన్యూ అధికారుల ఇష్టప్రకారం పొలాలు పంపిణీ చేసే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. అక్రమంగా భూములను ఆన్లైన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకుని పేదలకు పంపిణీ చేసిన తర్వాత గ్రామానికి రావాలని తెలిపారు. అధికారులు ఎంత ప్రాధేయపడినా గ్రామస్తులు జన్మభూమి సభకు హాజరుకాలేదు. దీంతో అధికారులు చేసేది లేక గ్రామం నుంచి తిరుగుముఖం పట్టారు. వృద్ధులతో గ్రామసభ నిర్వహణ: సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధుడు కందుకూరు రూరల్: జన్మభూమి గ్రామ సభలకు ప్రజల స్పందన కరువైంది. సభలకు ప్రజలెవ్వరూ హాజరుకాకపోవడంతో వృద్ధులు, పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చి సభను ముగిస్తున్నారు. మండలంలోని బలిజపాలెం, కమ్మవారిపాలెం గ్రామాల్లో మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. బలిజపాలెంలో జరిగిన గ్రామసభకు ఎమ్మెల్యే పోతుల రామారావు హాజరయ్యారు. గ్రామసభలో ప్రజలను చూపించేందుకు నాయకులు, అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, వితంతువులకు గ్రామసభ వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పడంతో వారంతా గ్రామసభకు వచ్చారు. పింఛన్ తీసుకున్న వారంతా గ్రామ సభలోనే ఉండాలని అధికారులు చెప్పడంతో వారంతా గంటల తరబడి వేచి ఉన్నారు. దీంతో గ్రామసభ జరుగుతున్న సమయంలోనే జి.నరసింహం అనే వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతన్ని వెంటనే ఇంటికి తీసుకెళ్లి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. గ్రామసభలో బలవంతంగా వృద్ధులను కూర్చోబెట్టడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నించారు. -
జన్మభూమి సభలో దళిత నేతకు అవమానం
సాక్షి, విశాఖపట్నం: దళితులపై టీడీపీ ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రజాసమస్యల పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న జన్మభూమి - మా ఊరు సభల్లో దళితులకు అడగడుగునా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మరో దళిత నాయకుడికి జన్మభూమి సభలో తీవ్ర అవమానం ఎదురయింది. గోలుగుండ మండలం జోగంపేట జన్మభూమి సభలో స్థానిక ఎంపీటీసీ నూకరత్నంకు చేదు అనుభవం చోటుచేసుకుంది. కక్ష సాధింపుల్లో భాగంగా స్థానిక దళితులను పిలవకుండానే సభను నిర్వహించడం పట్ల నూకరత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులమైనందునే తమను జన్మభూమి సభకు ఆహ్వానించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుల వివక్ష ఎందుకని అధికారులను ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించకుండా సభను నిర్వహించిన అధికారులపైన, మండల నాయకులపైన స్థానిక మంత్రికి, కలెక్టర్కు పిర్యాదు చేస్తానని నూకరత్నం తెలిపారు. -
దోచుకుంటే తప్పేంటన్న ఎమ్మెల్యే ఉన్నం
అనంతపురం అర్బన్: సమస్యల పరిష్కారానికంటే ప్రభుత్వం సొంత బాకా ఊదుకునేందుకే జన్మభూమి–మా ఊరు కార్యక్రమం పరిమితమైంది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా గ్రామసభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీశారు. వెల్లువలా ఎదురైన నిరసనలతో అధికారులకు భంగపాటు తప్పలేదు. ఐదో రోజు జిల్లాలో ఆదివారంనిర్వహించిన జన్మభూమి సభల్లో పలు చోట్ల సమస్యలపై అర్జీలు స్వీకరించడం, ఉపన్యాసాలతో తూతూ మంత్రంగా సభలను ముగించారు. ప్రభుత్వ పథకాల అవినీతిపై కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనుములదొడ్డిలో నిర్వహించిన సభలో వైఎస్సార్సీపీ నాయకులు బొమ్మలింగ, బీజప్ప, తిప్పేస్వామి తదితరులు నిలదీశారు. వేదిక మీద ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి అసహనానికి గురవుతూ ‘మా ప్రభుత్వంలో మేము దోచుకుంటే తప్పేంటి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మడకశిర మండలం ఆర్.అనంతపురం, మెళవాయిలో జన్మభూమి సభల్లో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పాల్గొని ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నిరసనలు ఇలా... ♦ కళ్యాణదుర్గం నియోజకవర్గం రాంపూరం సమీపంలోని పెన్నానదిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కంబదూరులో జరిగిన సభలో అధికారులను మాజీ సర్పంచ్ తిరుపాలు, వైఎస్సార్సీపీ నాయకులు వెంకటేశులు, మారెన్న తదితరులు నిలదీశారు. టీడీపీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతున్నాయన్నారు. ♦ పింఛన్లు, మరుగుదొడ్ల బిల్లులు, పక్కా ఇళ్ల మంజూరులో అవినీతి జరిగిందని బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప గ్రామంలో సభలో వైఎస్సార్సీపీ నాయకులు లోకేష్, మంజునాథ్, లింగన్న తదితరులు నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొంది. మా గ్రామంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు ఏం మేలు చేశారో చెప్పాలని తిమ్మసముద్రంలో జరిగిన జన్మభూమిలో అధికారులను వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. ♦ శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన సభలో ఎమ్మెల్సీ శమంతకమణిని ఎంఆర్పీఎస్ నాయకులు నిలదీశారు. గ్రామంలో నీటి సమస్య ఉందని, వాటర్ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దానిని ఇంతవరకూ అమలు చేయలేదని ఆగ్రహించారు. గ్రామంలోకి వచ్చిన ప్రతిసారీ బీసీ కాలనీలోకే వెళతారు. ఎస్సీ కాలనీ ప్రజలు కనిపించరా? , నాలుగున్నరేళ్లలో ఒక్కసారైన ఎస్సీ కాలనీకి వచ్చారా? సమస్యలు విన్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండుతున్నాయహే.. కాలువలకు నీళ్లొదలండి వానలు లేక పంటలు ఎండుతున్నాయహే.. కాలువలకు నీళ్లొదలండి’ అంటూ అధికారులను రైతు క్రిష్ణయ్య నిలదీశారు. రాప్తాడు మండలం హంపాపురంలో ఆదివారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు తొలుత ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రభుత్వానికి బాకా ఊదుతుంటే అసహనానికి గురైన రైతు క్రిష్ణయ్య ఒక్కసారిగా పైకి లేచి అలా విరుచుకుపడ్డాడు. ఇంత కాలం మీరు చెప్పిన సోదంతా విన్నాం. కనీసం ఇప్పుడైనా మేము చెప్పేది వినండి. బోరు బావి కింద నాలుగు ఎకరాల్లో తాను సాగు చేసిన చీనీ తోట, ఎకరా విస్తీర్ణంలో వరి ఎండిపోతోందని వివరించారు. ధర్మవరం కుడి కాలువకు నీరు వదిలితే భూగర్భ జలాలు పెరిగి పంట సాగుకు అనుకూలమవుతుందని వివరించారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని క్రిష్ణయ్యను కూర్చోబెట్టారు. – రాప్తాడు రేషన్కార్డు ఒకరిది.. లబ్ధి మరొకరికి ఇతని పేరు దామోదర్, గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం. తల్లిదండ్రులతో పాటు కలిసి ఉంటున్నాడు. సొంతింటి కోసం లెక్కకు మించి చాలా సార్లు అర్జీలు ఇచ్చాడు. అయినా మంజూరు కాలేదు. ఇటీవల మరోసారి అర్జీ ఇస్తే హౌసింగ్ అధికారులు పరిశీలించి.. అతని రేషన్కార్డుపై ఇల్లు మంజూరైందని తెలపడంతో అవాక్కయ్యాడు. తాను ఇంత వరకూ ఇల్లు కట్టలేదని, అయితే బిల్లులు ఎవరు తీసుకున్నారంటూ వాకాబు చేస్తే పెనకచెర్లకు చెందిన వ్యక్తి పేరు ఆన్లైన్లో ఉన్నట్లు తేలింది. తనకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆదివారం జన్మభూమి గ్రామసభలో మరోసారి అధికారులకు అర్జీ ఇచ్చాడు. – గార్లదిన్నె -
నిరసనల సంగ్రామాలు
సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి–మా ఊరు కార్యక్రమం అధికారుల పాలిట శాపంగా మారింది. వారికి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. జనం ఆగ్రహజ్వాలలధాటికి అధికారులు తాళలేకపోతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక అవస్థలకు గురవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వరుసగా నాల్గో రోజు కూడా నిరసనలు ఎదురయ్యాయి. నక్కపల్లి మండలం ఉద్దండపురం, వేంపాడు గ్రామసభలు రసాభాసగా జరిగాయి.అధికార పార్టీ నేతల చిల్లర రాజకీయాలు అంగన్వాడీ కేంద్రాలపై వారు పాల్పడుతున్న కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్సీపీ నేతలు నిలదీశారు. గ్రామ సభలను అడ్డుకుని నిరసన వ్యక్తంచేశారు. ఉద్దండపురంలో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు శ్రీలక్ష్మి ప్రారంభించారన్న కారణంగా అక్కడ టీడీపీ నాయకులు, అధికారులు కుమ్మక్కై నూతన భవనంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు బచ్చలరాజు, పొడగట్ల వెంకటేష్, దోని గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదినుంచి చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. నూతన భవనం విషయంలో అధికారులు,రాజకీయ నాయకులు తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఏడాది నుంచి ఇరువర్గాల ఒత్తిళ్లు తట్టుకోలేక పోతున్నామని గ్రామసభలో అంగన్వాడీ కార్యకర్త భర్త పొడగట్ల అప్పారావు కన్నీటి పర్యంతమయ్యారు. ఇళ్ల మంజూరుకు అర్హులే లేరా..? కె.కోటపాడు మండలం సూర్రెడ్డిపాలెం గ్రామసభలో అధికారులను నిరసన సెగ తగిలింది. నాలుగున్నరేళ్లుగా గ్రామంలో ఒక్కరికి కూడా గృహనిర్మాణ పథకంలో ఇల్లు మంజూరు చేయకపోవడం ఏంటని జన్మభూమిలో పాల్గొన్న అధికారులను మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు ఈర్లె గంగునాయుడు(నాని) ప్రశ్నించారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయన్న కారణంగా పథకాల ఎంపికలో గ్రామంపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. అక్రమ చేపల చెరువులపై నిలదీత దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామసభలో నిరసనలు హోరెత్తాయి.అక్రమ చేపలు నిర్వహించడంతో పాటు చికెన్, పశుమాంస వ్యర్థాలను మేతగా వేస్తున్నారని, వీటి వల్ల కలుషితమైన నీటిని తాగిన పశువులు ఇప్పటికే మృత్యువాత పడ్డాయని, రోగాలతో బాధపడుతున్నాయని గ్రామస్తులు అధికారులకు వివరించారు. చుట్టుపక్కల ప్రజలు సైతం అంతు చిక్కని వ్యాధులు బారిన పడుతున్నారని, పలుమార్లు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు అధికారులకు ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. వెంటనే ఈ సమస్యపై జన్మభూమి సదస్సులో తీర్మానం చేయాలని లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని, సదస్సును సైతం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. అయితే శాఖల వారీగా సభ జరుగుతున్నందున సంబంధిత శాఖ వచ్చినప్పుడు సమస్య చెప్పుకోవాలని అధికారులు చెప్పినా వినకుండా ఆందోళన చేయడంతో అసహనానికి గురైన మండల ప్రత్యేక అధికారి జి. మహలక్ష్మీ బాధిత రైతులు అందించిన వినతి పత్రాన్ని వారిపైకే విసిరేయడంతో వివాదం రేగింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అరుపులు కేకలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. వికలాంగ పింఛన్ పునరుద్ధరించండి చీడికాడ (మాడుగుల): వికలాంగుడిగా గుర్తిం చి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వం పింఛన్ ఇవ్వగా, చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే తొలగించారని చీడికాడకు చెందిన గాలి శ్రీరామమూర్తి అనేదివ్యాంగుడు చెప్పాడు. నాలుగున్నరేళ్లుగా పింఛన్ పునరుద్ధరించాలని పలుమార్లు దరఖాస్తు చేశానని, పలువురు అధికారులను కోరారని అయినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలలోకి వెళితే... శ్రీరామమూర్తి 15 సంత్సరాల క్రితం ప్రమాదవాశాత్తు చింత చెట్టుపై నుంచి పడిపోవడంతో వెన్నెముకపై,కుడికాలికి తీవ్రగామైంది. కేజీహెచ్ వైద్యులు వికలాంగ ధ్రువీకరణ పత్రం అందించారు.దీంతో 200 పింఛన్ మంజూరైంది.తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి రెండవసారి సీఎం అయిన తరువాత రూ.500 పింఛన్ అందింది. చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత పింఛన్ రూ.1000కి పెంచిన సమయంలో పాత వికలాంగ ధ్రువీకరణ ప త్రాలు పనిచేయవని, సదరంలో తీసుకోవాలని చెప్పి, తన ఫించన్ను నిలుపుదల చేశారని శ్రీరామమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్ని సార్లు సదరం క్యాంపునకు వెళ్లినా ధ్రువీకరణపత్రం ఇవ్వలేదని, కలెక్టర్కు, నాలుగు విడతల జన్మభూమి సభల్లో అర్జీలిచ్చి వేడుకున్నా ప్రయోజనం లేకపోయిందని చెప్పాడు. సోమవారం చీడికాడలో జరిగే జన్మభూమిలో మరో మారు దరఖాస్తు ఇస్తానని, ఇప్పటికైనా అధికారులు కరుణించాలని కోరాడు. -
పాఠాలు వదలి ప్రచారాలా?
తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): ప్రభుత్వ పథకాల ప్రచారానికి ప్రభుత్వ ఉపాధ్యాయులను వినియోగించడం విమర్శలకు తావిస్తోంది. జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ‘సామాజిక స్పృహ’ పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయులను భాగస్వాములను చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. విద్యా సంవత్సరం కీలక దశలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రచారం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల్లో జవాబుదారీతనం తీసుకొచ్చి ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా జన్మభూమి–మా ఊరు నిర్వహిస్తోంది. చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నిర్వహించిన తొలి జన్మభూమి కార్యక్రమంలోనే సమస్యల పరిష్కారానికి ప్రజలు నిలదీశారు. పలుచోట్ల జన్మభూమి సభలను సైతం బహిష్కరించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించి ప్రశ్నించే వారిపై కఠినంగా వ్యవహరించింది. ఆ తర్వాత నుంచి జన్మభూమి సభల్లో పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భాగస్వామ్యాన్ని అనధికారికంగా తప్పనిసరి చేసిందనే విమర్శలు తల్లిదండ్రులనుంచి వినిపిస్తోంది. గతానికి భిన్నంగా జన్మభూమి కార్యక్రమ నిర్వహణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్థ్ధిష్టమైన నిబంధనలు విధించింది. ఆయా సమీప ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో కమిటీలు వేసింది. ప్రభుత్వ పథకాలపై ప్రచారం, మూఢ నమ్మకాలపై గ్రామీణులకు అవగాహన పేరుతో విద్యార్థులతో నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించే బాధ్యతలను అప్పగించింది. వీరితో పాటు సమీప ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులను వలంటీర్ల పేరుతో నియమించింది. ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి సెలవులను సైతం జనవరి 8 నుంచి 12వ తేదీకి వాయిదా వేసింది. విద్యా సంవత్సరం కీలక దశలో ఉంది. గురువారం నుంచి జిల్లా అంతటా ఫార్మేటివ్–3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులకు ఈ అదనపు బాధ్యతలు, విధుల వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జన్మభూమిలో ఉపాధ్యాయులు, విద్యార్థులను భాగస్వాములను చేయడం వల్ల వారి విలువైన బోధనా సమయం కోల్పోతారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను మినహాయించాలి. దీన్ని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.– డీవీ రాఘవులు,జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడమే జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి ఉపాధ్యాయులు వ్యతిరేకం కాదు. జన్మభూమిలో విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించే ఏడో తేదీ ఒక రోజు పాల్గొనడానికి అభ్యంతరం లేదు. ప్రతి రోజు ఉపాధ్యాయులను భాగస్వాములను చేయడమంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే.– కవి శేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, ఎస్టీయూ -
మా ఊరు.. నిరసనల హోరు
కడప అగ్రికల్చర్ : జిల్లాలో ఆరో విడత జన్మభూమి–మా ఊరు కార్యక్రమం మూడోరోజు అధికారులు నిర్వహించారు. గ్రామసభలకు వృద్ధులు, విద్యార్థులే దిక్కయ్యారు. వృద్ధులకు పింఛన్లు ఇస్తుండడంతో తప్పని పరిస్థితుల్లో వారు సభలకు వస్తున్నారు. పాఠశాలల ఆవరణలోనూ, సమీప గ్రామాల్లో సభలు ఉండడంతో వెలవెలపోకుండా విద్యార్థులను తీసుకొచ్చి కూర్చొబెడుతున్నారు. రైల్వేకోడూరు మండలంలోని చియ్యవరం పంచాయతీ ముత్తరాచుపల్లెలో పాఠశాల ప్రహారీకి కొందరు అడ్డుతగులుతున్నారని ఆరోపిస్తూ ఎంపీటీసీ రవి, పాఠశాల చైర్మన్ నేలపై బైఠాయించారు. దీంతో అధికారులు సర్దిచెప్పి ప్రహారీని తప్పకుండా నిర్మిస్తామని చెప్పారు. రాజంపేటలో కేవలం పింఛన్లు, చంద్రన్న కానుకలను పంపిణీ చేశారు. మైదుకూరు మండలం మిట్టమానుపల్లె గ్రామసభలో ప్రజలు రాక వెలవెలబోవడంతో అధికారులు ఆగమేఘాలపై బాలశివ జూనియర్ కళాశాల విద్యార్థులను పిలుచుకుని వచ్చి సభలో బలవంతంగా కూర్చొబెట్టారు. ప్రొద్దుటూరులోని 10, 11 వార్డుల్లోని శ్రీరాములుపేటలో సభ నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సమయపాలన పాటించే తీరు తెలియదా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సభలో మాజీ కౌన్సిలర్ గరికెపాటి లక్ష్మిదేవి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు ఇదే వార్డులో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చారని, అప్పుడు ఎమ్మెల్యేగా వరదరాజులరెడ్డి ఉన్నారన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇళ్ల పేరుతో పేదలను దోచుకోవడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేయగా, టీడీపీ నాయకులు అనవసర రాద్దాంతం చేశా>రు. జమ్మలమడుగులో రేషన్కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు ఇచ్చారు. కడపలో నిర్వహించిన సభల్లో విద్యార్థులు, వృద్ధులే కనిపించారు. పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించిన సభల్లో శ్వేతపత్రాలను అధికారులు చదివారు. పింఛన్లు, చంద్రన్న కానుకలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. బద్వేలులో నిర్వహించిన సభలో జేసీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొండలు, గుట్టలమీద ఇచ్చారని, అవి ఎందుకూ పనికి రావని ప్రజలు అధికారులను నిలదీశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పాల్గొని గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదని ఆరోపించారు. కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పెన్షన్లు, కానుకల పంపిణీతో సరిపెట్టారు. -
ఆశ చచ్చి.. ఆత్మహత్యాయత్నం
కర్నూలు, ఆస్పరి: ప్రభుత్వం నుంచి పక్కాగృహం, కుమార్తెకు పింఛన్ మంజూరు కాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆస్పరి మండలం హలిగేర గ్రామానికి చెందిన రైతు గొల్ల నరాల జలపతి అధికారుల ముందే పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆరో విడత జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హలిగేరలో నిర్వహించిన గ్రామసభలో ఈ ఘటన చోటుచేసుకుంది. గొల్ల నరాల జలపతి, సుజాతమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె శ్రుతి మూగ, చెవిటి కావడంతో పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేశాడు. అలాగే హౌసింగ్ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలంటూ నాలుగేళ్లుగా అర్జీలు ఇస్తూనే ఉన్నాడు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. జన్మభూమి సభలో మరోమారు అర్జీలు ఇవ్వడానికి కుమార్తె శ్రుతిని వెంటబెట్టుకుని వచ్చాడు. అయితే.. అధికారులు దరఖాస్తులు మధ్యాహ్నం ఇవ్వాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘నేను చచ్చిన తరువాతైనా ఇస్తారా?’’ అంటూ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగాడు. గ్రామస్తులు పురుగు మందు డబ్బాను లాక్కునేలోపు మందు తాగేయడంతో అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గ్రామస్తులు మోటారు బైక్పై ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన జలపతి అపస్మారకస్థితిలో పడిపోయినా చికిత్స కోసం అధికారులు తమ వాహనంలో ఆస్పత్రికి తరలించకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు. ఇల్లు మంజూరు కాలేదు జలపతి ఆన్లైన్లో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, మంజూరైన వెంటనే బిల్లు ఇస్తామని మండల హౌసింగ్ ఏఈ సత్య భాస్కర్రావు తెలిపారు. జలపతి కుమార్తె శ్రుతికి గత డిసెంబర్ 26న సదరం సర్టిఫికెట్ ఇచ్చారని, అయితే డిసెంబర్ 25న ఆన్లైన్ చేసే వెబ్సైట్ను ప్రభుత్వం బంద్ చేసిందని మండల పరిషత్ జూనియర్ క్లర్క్ దస్తగిరి చెప్పారు. బాధితుడికి న్యాయం చేయాలి నరాల జలపతికి ప్రభుత్వం న్యాయం చేయాలి. టీడీపీ ప్రభుత్వంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు మంజూరు కావడం లేదు. టీడీపీ నాయకులకు డబ్బులిస్తేనే ఇల్లు, పింఛన్లు మంజూరవుతాయి. అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఇది కనికరం లేని ప్రభుత్వం. – గుమ్మనూరు జయరాం, ఆలూరు ఎమ్మెల్యే -
ఎమ్మెల్యే కల్పనపై మహిళాగ్రహం
సాక్షి,కృష్ణాజిల్లా, మచిలీపట్నం: జన్మభూమి కార్యక్రమం ‘రణ’ భూమిగా మారుతోంది. సమస్యలను ప్రస్తావించకుండా టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. తాము చెప్పిందే వినాలి.. తిరిగి ప్రశ్నించకూడదన్న ధోరణి అవలంబిస్తున్నారు. వెరసి ప్రజల్లో రోజు రోజుకూ అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఐదేళ్లుగా అర్జీలు ఇస్తున్నా నేటికీ పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తారని ఎక్కడికక్కడ టీడీపీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. వాళ్లు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సభలు తూతూ మంత్రంగా ముగించేసి జారుకుంటున్నారు. ♦ పెడన పట్టణం 6వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా సాగింది. సమస్యలు ప్రస్తావించేందుకు సభకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్పై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. మున్సిపాలిటీలో నెలకొన్న పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించగా టీడీపీ జన్మభూమి కమిటీ నాయకులు, వైస్చైర్మన్ అబ్దుల్ఖయ్యూం, వహెబ్ఖాన్, హామీదుల్లా, యక్కల శ్యామలయ్య తదితరులు చైర్మన్పై తీవ్ర పదజాలంతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో చైర్మన్ను నెట్టేశారు. ఆ సమయంలో ఆయన చేతికి ఉన్న వాచి సైతం విరిగిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను సర్దుమణిగేలా చేశారు. ♦ కృత్తివెన్ను మండలం పల్లెపాలెం జన్మభూమి మాఊరు సభ రసాభాసగా మారింది. ఐదేళ్ల పాలనలో మా గ్రామానికి చేసిందేమీ లేదని, అలాంటప్పుడు మాకెందుకీ సభలు అంటూ పల్లెపాలెం వాసులు జన్మభూమి సభను అడ్డుకున్నారు. కనీసం ప్రతిజ్ఞ, సీఎం సందేశం కూడా చదవడానికి వీలులేదంటూ పట్టుపట్టారు. దీంతో పోలీసులు పహారాలో అధికారులు తూతూ మంత్రంగా సభను నిర్వహించారు. నాలుగున్నరేళ్ల పాలనలో మా పంచాయితీకి ఇచ్చింది కేవలం రెండు లక్షల రూపాయలే, దీనిపై ఎమ్మెల్యేని అడుగుతుంటే జెడ్పీటీసీని అడగమంటున్నారు. అసలు మాకు ఎమ్మెల్యే ఉన్నట్టా లేనట్టా అంటూ స్థానికులైన దావీదు, వరదరాజులతో పాటు కొందరు వేదికపై ఉన్న జెడ్పీటీసీ తులసీరావును నిలదీశారు. ♦ విజయవడ నగరంలోని 29వ డివిజన్ పరిధిలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జన్మభూమి కార్యక్రమంలో వినూత్న నిరసన తెలిపారు. దీంతో పక్కనే ఉన్న పోలీసులు అరెస్టు చేశారు. ♦ విజయవాడ నగరంలో శ్మశానానికి స్థలం కేటాయించాలని దళితులు జన్మభూమి కార్యక్రమంలో ప్రశ్నించారు. సమస్య పరిష్కరించాల్సిన పాలకులు దళితుల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఒక్క సారిగా దళిత నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ♦ కంకిపాడు మండలం కుండేరులో తమకు రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని ప్రజలు తహసీల్దార్ను నిలదీశారు. ఐదేళ్లుగా అర్జీలు సమర్పిస్తున్నా.. వాటి పరిష్కారం మాత్రం లభించడం లేదని ఆవేదన చెందారు. ♦ నందివాడ మండలం పెద్ద లింగాల గ్రామంలో గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. పలు మార్లు అధికారులకు అర్జీలు పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. దీంతో జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యను ప్రజలు నిలదీశారు. దళితులు ఎక్కువ నివసిస్తున్న గ్రామంలో తాగునీటి సైతం తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కల్పనపై మహిళాగ్రహం మంత్రిపాలెం(మొవ్వ): ‘జన్మభూమి–మా ఊరు’ గ్రామసభలలో భాగంగా మూడో రోజైన శుక్రవారం మంత్రిపాలెం గ్రామంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన మహిళలు సభను స్తంభింపచేశారు. మొవ్వ మండలం మంత్రిపాలం పంచాయతీ పరిధిలోని సూరసాని మాలపల్లిలో అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులు నిర్మించని అధికారులపై, రోడ్డు అభివృద్ధికి కృషి చేయని ఎమ్మెల్యే కల్పన నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ దళితవాడ మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దళితవాడ అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చిన కనీసం దాని వైపు కన్నెత్తి చూడని ఎమ్మెల్యే, మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏ మొఖం పెట్టుకుని గ్రామానికి వచ్చావంటూ గ్రామస్తులు నిలదీశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ఎంపీపీ కిలారపు మంగమ్మ, తహసీల్దార్ బి రామానాయక్, ఎంపీడీవో వి ఆనందరావు పాల్గొన్నారు. -
జన్మభూమికి జనం కరువు
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో జరుగుతున్న జన్మభూమి గ్రామసభలకు జనం కరువవుతున్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతున్నా ప్రజల భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. జన్మభూమి ప్రారంభమైన తొలిరోజు పింఛన్దారులను, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను యంత్రాంగం తరలించింది. పింఛన్లు ఇప్పిస్తామంటూ చెప్పి ఎమ్మెల్యే సభ ముగిసే వరకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను కూర్చోపెట్టారు. సాయంత్రం నాలుగు గంటల తరువాత రావాలంటూ పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది చెప్పడంతో వారు ఉసూరుమంటూ అక్కడే చతికిలబడ్డారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఒంగోలు పీజీ క్యాంపస్కు చెందిన ఎన్ఎస్ఎస్ మహిళా వాలంటీర్లను జన్మభూమి సభకు తరలించారు. దాదాపు 20 మంది మహిళా వాలంటీర్లతోపాటు వారితో కూడా సంబంధిత అ«ధ్యాపకులను జన్మభూమికి గ్రామసభలకు రప్పిస్తున్నారు. శుక్రవారం కబాడీపాలెంలో జరిగిన సభకు హాజరు కావాల్సిన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సభ జనం లేక వెలవెలబోవడం చూసి, పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఎక్కడి సమస్యలు అక్కడే.. జన్మభూమి గ్రామ సభల్లో ప్రజలు తమ సమస్యలపై అధికారులను నిలదీస్తున్నారు. గత ఐదు విడతలుగా జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో తమ సమస్యలను విన్నవించుకున్నప్పటికీ పరిష్కారానికి నోచుకోవడంలేదని యంత్రాంగాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యుడు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తుండటాన్ని ప్రజలు తూర్పార పడుతున్నారు. స్థానిక కమ్మపాలెంలో జరిగిన జన్మభూమి గ్రామసభలో తమ పార్టీకి ఈ ప్రాంతమంతా గట్టిగా పట్టు ఉండటంతో ఇక్కడ ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నానంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్రావు ఒంగోలుకు శాసనసభ్యుడా లేకుంటే కమ్మపాలెంకు శాసనసభ్యుడా అంటూ కొంతమంది గ్రామ సభ జరుగుతున్న సమయంలోనే వ్యాఖ్యానించడం విశేషం. నాలుగున్నరేళ్లుగా అదేమాట.. ఒంగోలు నగర ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తామంటూ గత నాలుగున్నరేళ్ల నుంచి దామచర్ల చెబుతూనే ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తనను గెలిపించిన వెంటనే నగర ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీల వర్షం కురిపించారు.అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత కూడా ఇంతవరకు ప్రతిరోజూ తాగునీరు వాగ్దానం కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి గ్రామసభల్లో కూడా ఎమ్మెల్యే స్వయంగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒకటి రెండు నెలల్లో తాగునీటి పైపులైన్ల పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత ప్రతిరోజూ తాగునీరు అందిస్తామంటూ మరోసారి ప్రకటనలు చేయడంపట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీ శాసనసభ్యునిగా ఉంటున్న దామచర్ల తాను ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. మరో ఒకటి రెండు నెలల్లో ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతోందని, ఎన్నికల నోటిఫికేషన్ను సాకుగా చూపించి తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిరోజూ తాగునీటి సరఫరా వాగ్దానాన్ని తిరిగి తెరపైకి తీసుకువస్తారంటూ కొంతమంది వ్యాఖ్యానించడం గమనార్హం. జన్మభూమి సభను బాయ్కాట్ చేసిన టీడీపీ కార్యకర్తలు పాదర్తి (కొత్తపట్నం): ఎన్ని సార్లు ఎమ్మెల్యేకు చెప్పాలి.. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకోవాలి.. ఎన్ని సార్లు అర్జీలు ఇవ్వాలి.. మాకు ఇదే పనా? ఈ జన్మభూమి–మా ఊరు గ్రామ సభలో కూడా ఇంతేగా అని టీడీపీ నాయకులు మండిపడ్డారు. కొత్తపట్నం మండలం పాదర్తిలో శుక్రవారం జరిగిన జన్మభూమి–మా ఊరు గ్రామ సభలకు బాయ్కాట్ చేశారు. ‘ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్లో అర్జీలు ఇచ్చాం. ఎమ్మెల్యే అధికారులతో అనేక సార్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు కావస్తోంది, ఇంత వరకు మా సమస్యలు పరిష్కరించలేదు. అధికారులు వచ్చి సభలు జరుపుకుంటే సరిపోతుందా? ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ముఖ్యంగా భూమి ఆన్లైన్లు, శ్మశానికి బట, నీటి సమస్యలు గత జన్మభూమి–మా ఊరు గ్రామ సభలో అర్జీలు ఇచ్చాం, చర్చించారు. ఇంత వరకు పరిష్కరించ లేదు’ అంఊ పాదర్తి, రంగాయపాలెం గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు గ్రామ సభను బాయ్కట్ చేశారు. టీడీపీ పార్టీ పెట్టిన సమావేశాలకు, గ్రామ సభలకు వచ్చేదే లేదని తెగేసి చెప్పారు. టీడీపీ కార్యకర్తలు కలిసి ఒక తోటలో సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామ సభ అయిపోయిన తరువాత గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. గ్రామస్తుల సహకారంతో గ్రామ సభ ముగించారు. -
జన్మభూమిలోమూడవరోజూ కొనసాగిన నిరసనలు
సాక్షి నెట్ వర్క్ : సమస్యలు పరిష్కరించని జన్మభూమి సభలు ఎందుకని జనం మండి పడుతున్నారు. ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్నారు. ♦ చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నాని ఆగడాలు ఎక్కువవు తున్నాయి. జన్మభూమి గ్రామ సభల వేదికలపైకి అనుచరవర్గాన్ని తీసుకెళ్లి కూర్చోబెడుతుండడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం భాకరాపేట జన్మభూమి గ్రామసభలోనూ ఇదే తీరుగా వ్యవహరిం చడం వివాదాస్పదమైంది. ♦ నాలుగున్నరేళ్ల కాలంలో తిరుచానూరు ప్రజలకు ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదని తిరుచానూరు ఎంపీటీసీ నరేష్ రెడ్డి, తాజా మాజీ వార్డు సభ్యుడు మునేంద్ర రాయల్, వైఎస్సార్సీపీ నాయకురాలు యశోద అన్నా రు. ఐదు జన్మభూమి కార్యక్రమాల్లో అర్జీలు తీసుకుంటున్నారే తప్పా ఒక్కటీ పరిష్కరిం చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. ♦ తన రేషన్ కార్డును యాక్టివేషన్ చేయమని అడిగితే తిరుపతి రూరల్ డీటీ రోశయ్య రూ.3వేలు లంచం అడిగారని తిరుచానూరు నేతాజివీధికి చెందిన గోపాల్ జన్మభూమిలో అధికారుల వద్ద వాపోయాడు. కార్డును ఎందుకు నిలిపేశారో చెప్పాలని గోపాల్తో పాటు స్థానికులు అధికారులను నిలదీశారు. ♦ గంగవరం మండలం పత్తికొండ, మామడుగు పంచాయతీల్లో జన్మభూమి కార్యక్రమాల్లో విద్యార్థులతో డ్యాన్స్లు చేయించారు. ♦ గుర్రంకొండలో తాగునీటి సమస్య పరిష్కరించాలని పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న జన్మభూమి గ్రామసభ ఎదురుగా మహిళలు ధర్నా చేశారు. ♦ ప్రోటోకాల్ సమస్య రావడంతో కల్లూరు జన్మభూమి కార్యక్రమంలో అధికారులందరూ కిందనే కూర్చుని సభలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్రావు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి అనీషా రెడ్డి వస్తారని చెప్పినా వారు హాజరుకాలేదు. ♦ తాగునీటి సమస్య పరిష్కరించాలని చౌడేపల్లె మండలం పందిళ్లపల్లె, ఆమినిగుంట గ్రామ పంచాయతీల మహిళలు జన్మభూమి సభల్లో అధికారులను నిలదీశారు. ♦ విజయపురం మండలం ఆలపాకం, మాధవరం గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో జనం కంటే అధికారులు ఎక్కువగా ఉండడం విమర్శలకు తావిచ్చింది. ♦ బుచ్చినాయుడుకండ్రిగ మండలం వీఎస్ పురం గ్రామంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై అధికారులను నిలదీశారు. ♦ పెద్దతిప్పసముద్రం మండలం మడుమూరులో అంగన్వాడీ పిల్లలను కూర్చోబెట్టారు. ♦ రామసముద్రం మండలం కాంపల్లె పంచా యతీలో అర్హులైన వారికి ఇళ్లు మంజూరు కాకపోవడంపై మహిళలు అధికారులను నిలదీశారు. మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రప్పనాయుడు కలుగజేసుకోవడంపై ఎమ్మెల్యే దేశాయ్తిప్పారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి, సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ లేని వ్యక్తులు జోక్యం చేసుకోవడం సభ్యత కాదని మండిపడ్డారు. ఆయ న్ను బయటకు పంపాలని ధర్నా చేశారు. -
వివాదాస్పద ‘కొఠియా’లో.. ‘జన్మభూమి’
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితిలోని వివాదాస్పద కొఠియా పంచాయతీ గ్రామల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమం ‘జన్మభూమి’ పేరిట మళ్లీ ఆ రాష్ట్ర అధికారులు కొఠియాలో పర్యటనలు ప్రారంభించారు. వివా దాస్పద ఉపరసంచి, నేరేడివలస, గంజయిపొదర్ గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ జన్మభూమి కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలను వ్యాన్లతో జన్మభూమి కార్యక్రమానికి సమీకరించారు. వారికి జన్మ భూమి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పింఛన్ల బట్వాడా వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఒడిశా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వివాదాస్పద గ్రామ ప్రజలను ఆకర్షించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలుగా స్థానికులు చెబుతున్నారు. కొద్ది మాసాల క్రితం ఆంధ్రప్రదేశ్ అధికారులు కొఠియా ప్రజలకు రగ్గులు, సోలార్లైట్లు పంపిణీ చేయడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామ ప్రజల అసౌకర్యాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పేదలకు ఉచిత సంక్షేమ పథకాలు సమకూర్చేందుకు హామీలు ఇచ్చారు. మేలుకున్న కొరాపుట జిల్లా యంత్రాంగం ఇటువంటి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొఠియా పంచాయతీ గ్రామాల ప్రజలను మచ్చిక చేసుకుంటున్న కథనాలు తెలుసుకుని కొరాపుట్ జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు మేలుకుని, ఆయా గ్రామాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ అక్కడ అభివృద్ధి పనులకు నడుం బిగించారు. రహదారుల పనులు వేగవంతం చేస్తున్నారు. సీమగుడ నుంచి నువగాం వరకు, మనరేగ, ఘాటర్గుడ,మడ్కర్ గ్రామం వరకు, ఫగుణసినారి–డలియంబ నుంచి కొఠియా వరకు రోడ్ల పనులు వేగవంతం చేశారు. రహదారులలో నిర్మించవలసిన 11 వంతెనల టెండర్ ప్రక్రియ పూర్తిచేశారు. పంచాయతీలోని మతలమ, గుమెల్పొదర్, తొలకండి, కొడియంబ, సులియమరి, సలీంపొదర్, కటర్గడ వంటి గ్రామాల్లో విద్యుదీకరణ పనులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొఠియా పంచాయతీ సమగ్రాభివృద్ధికి రూ.150 కోట్ల ప్రత్యేక నిధులను ప్రకటించి ప్రజలకు అన్ని మౌలిక సౌకర్యాలు సమకూర్చేందుకు సన్నద్ధమవుతోంది. కొఠియా వివాదాస్పద గ్రామ ప్రజలు మాత్రం ప్రస్తుతానికి ఉభయ రాష్ట్రాలు అందజేసే సేవలు అందుకుంటున్నారు. -
అయ్యన్న ‘మందు’పురాణం
సాక్షి, విశాఖపట్నం: విసిగివేసారిన ప్రజలకు జన్మభూమి మావూరు అందివచ్చిన అస్త్రంగా మారింది. నాలుగున్నరేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలనే కాదు.. గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని ఎండగట్టే వేదికైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ జన్మభూమి గ్రామసభల వేదికగా ఉతికారేస్తున్నారు. ఆక్రో శం పట్టలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలపై నోరుచేసుకోవడమే కాదు.. ఖాకీలను ఉసిగొల్పి అరెస్టులు చేయిస్తున్నారు. దీంతో గ్రామసభలు రసాభాసగా మారుతున్నాయి.æ జీవీఎంసీ 34వ వార్డు తాటిచెట్లపాలంలో జరిగిన గ్రామసభలో గందరగోళం చోటు చేసుకుంది. స్థానికులను కాదని స్థానికేతరులకు ఇక్కడ ప్రాధాన్యతనిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు ఎదుట టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ♦ జీవీఎంసీ 4వ వార్డు పీఎంపాలెం జరిగిన గ్రామసభలో జన్మభూమి కమిటీ పెత్తనంపై వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు గాదె రోశి రెడ్డి, జె.ఎస్.రెడ్డి, పార్టీ వార్డు అధ్యక్షుడు బొట్టా అప్పలరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దరఖాస్తులు ఇవ్వడం తప్పా తమకు పథకాలు మంజూరు కావడం లేదని స్థానికులు, వృద్ధులు అధికారులతో వాగ్వాదం చేశారు. ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన దరఖాస్తులను బుట్టదాఖలు చేశారని వాపోయారు. మళ్లీ దరఖాస్తులు ఇవ్వండి పరిశీలిస్తాం అని అనగా.. ఎందుకు మళ్లీ మూలన పడేయడానికా అంటూ మండిపడ్డారు. ♦ ప్రభుత్వ పథకాలు గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప, ప్రజలకు చేసిందేమిటని ఆనందపురం మండలం గంభీరం గ్రామసభలో ప్రజలు అధికారులను నిలదీశారు. సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ గొప్పలు చెబుతుండగా స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు బొట్టా రామకృష్ణ, ఉప్పాడ రామిరెడ్డి, గోవింద్ తదితరులతో పాటు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ♦ చెప్పిన మాటలకు ఇచ్చిన హామీలకు పొంతన లేకుండా పథకాలు అందిస్తున్నారని ఎస్.రాయవరం మండలం పి.ధర్మవరం గ్రామస్తులు మండిపడ్డారు. మహిళలు ఎమ్మేల్యే చుట్టుముట్టి నిలదీశారు. ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి పట్టాలు మంజూరు చేయలేదని, ఇప్పుడు పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు వీలు కుదరడం లేదని వాపోయారు. ♦ ఏళ్ల తరబడి ఉన్న కాలనీసమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోలేదు.. ఇకచేయలేమంటే చెప్పండి ఊరు వదిలి వెళ్లిపోతాంఅంటూ యాతపేటకాలనీ వాసులు చోడవరం మండలం నర్సాపురం గ్రామసభలో అధికారులను నిలదీశారు. పక్క కాలనీకి వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని, వీధిలైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కె.కోటపాడు మండలం కింతాడ గ్రామసభ రసాభాసగా మారింది. వేదికపై కూర్చున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడును గొల్లలపాలెంవాసులు చుట్టుముట్టి తమ సమస్యలను ఎకరవుపెట్టారు. ఏడాదిగా మంచినీటి పథకం మూలకు చేరిందని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రావికమతం మండలం టి. అర్జాపురం సభలో సమస్యలపై వైఎస్సార్సీపీ శ్రేణులు నిలదీశాయి. దీంతో టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు వారించారు. ♦ మత్స్యగుండం రోడ్డు అభివృద్ధిలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హుకుంపేట మండలం మఠం పంచాయతీ గిరిజనులు జన్మభూమి సభను అడ్డుకున్నారు. మఠం జంక్షన్లో పెద్ద సంఖ్యలో మూడు గంటల పాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ పీవో కూడా రోడ్డు అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. అధి కారులంతా రోడ్డుపైనే గంటల తరబడి నిరీక్షిం చారు. ఐటీడీఏ పీవో మధ్యాహ్నం 12గంటలకు అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో చర్చలు జరిపారు.శివరాత్రి పండగ సమయానికి రోడ్డు నిర్మిస్తామన్న హమీ తో గిరిజనులు ఆందోళన విరమించారు. అరకులోయ మండలం సుంకరమెట్టలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎంనాయకులు, ఇతర గిరిజనులు డిమాండ్ చేశారు. ముంచంగిపుట్టు మండలం లక్ష్మిపురంలో నిర్వహించిన జన్మభూమి సభలో ఉపాధి కూలి బకాయిలు వెంటనే చెల్లించాలని గిరిజనులు అధికారులను నిలదీశారు. బరడలో నిర్వహించిన జన్మభూమిలోనూ తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజనులంతా ఆందోళన చేపట్టారు. సింహాచలం(పెందుర్తి): ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి పంచగ్రామాల భూసమస్య సెగ తగిలింది. అడవివరంలో జరిగిన జన్మభూమి సభలో ఆయనను బాధిత ప్రజలు నిలదీశారు. దేవస్థానం భూసమస్యను అధి కారంలోకి వచ్చిన వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లు దాటినా పట్టించుకోలేదని, అబద్ధాలు చెబుతూ రైతులను, ప్రజ లను మోసం చేస్తున్నారని ఆయనను సమైక్య రైతు సంక్షేమ సంఘం నాయకులు నిలదీశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు గడిచిన ఐదు జన్మభూమి కార్యక్రమాలకు హాజ రవ్వకుండా తప్పించుకున్నారని దుయ్యబట్టా రు. ఉదయం 11 సమయంలో ప్రారంభమైన జన్మభూమి వేదికపై బండారు మాట్లాడే సమయానికి సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం నాయకులు, రైతులు, బాధితులు ప్లకార్డులతో లేచి నినా దాలు చేశారు. భూసమస్య పరిష్కారం అవుతుందని హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, అబద్ధాలు ఆడుతున్నారని రైతు సం ఘం ప్రధాన కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.రమణి ఎమ్మెల్యేను నిలదీశా రు. ఎమ్మెల్యే బండారు డౌన్ డౌన్.. మంత్రి గంటా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జన్మభూమి ప్రాంగణం రసాభాసగా మారింది. అసలు సమస్యకు కారణమే కమ్యూనిస్టులని, సమస్య పరి ష్కారం కాకుండా శారదాపీఠం స్వామీజీ, జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ అడ్డుపడుతున్నారని, వారి ని ప్రశ్నించాలని ఎమ్మెల్యే బండారు అనేసరికి.. రైతు సంఘం నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మె ల్యే తీరును ఎండగట్టారు. భూసమస్యను పరి ష్కరిస్తామని మోసం చేసిన ఎమ్మె ల్యే బండారు అంటూ సభాప్రాంగణాన్ని నినా దాలతో హోరెత్తించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బండారు వారిని బయటకు పం పించండంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు రైతు సంఘం నాయకులను ఈడ్చుకుంటూ సభాప్రాంగణం నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం సభా ప్రాంగణానికి సమీపంలోనే ఉన్న ఎమ్మెల్యే కారు దగ్గరకు చేరుకుని నినాదాలు చేశారారు. ఎమ్మెల్యే కారు ఎక్కకుండా అడ్డుకుందామని ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే కారును రెండు, మూడు ప్రదేశాలకు పోలీసులు పంపిం చగా.. అక్కడికి కూడా పరుగులు తీస్తూ రైతు సంఘం నాయకులు చేరుకుని నిరసన తెలిపా రు. చేసేదిలేక పోలీసులు ఎమ్మెల్యేను బందోబస్తు మధ్య తీసుకెళ్లి కారు ఎక్కి పంపించేశారు. -
పసలేని ప్రసంగం ... జనంలో అసహనం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సీఎం చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం పేలవంగా ముగిసింది. కాకినాడ జేఎన్టీయూ మైదానంలో శుక్రవారం జరిగిన జన్మభూమి సభలో బాబు చెప్పిందే చెప్పి విసుగు తెప్పించడంతో ప్రసంగం అవుతుండగానే జనం జారిపోవడం ప్రారంభించారు. మరోవైపు అంతా తానై వ్యవహరించి వేదికపై మరొకరికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. స్థానిక కార్పొరేటర్కు, మేయర్కు, ఎమ్మెల్యేకు, మంత్రులకు ఏ ఒక్కరికీ ప్రాధాన్యత కల్పించలేదు. చంద్రబాబే సుదీర్ఘంగా ప్రసంగం చేయడంతో వచ్చిన జనం లేవడం ప్రారంభించారు. కుర్చీలన్నీ ఖాళీ అయిపోవడంతో సభా ప్రాంగణం వెలవెలబోయింది. వెళ్లిపోతున్న జనాన్ని ఆపేందుకు గేట్లు మూసి, నిలువరించేందుకు యత్నించినా ఫలించలేదు. ఆద్యంతం భజనే... సభా ప్రారంభం దగ్గరి నుంచి సీఎంను పొగడ్తలతో ముంచెత్తించారు. ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరిని రప్పించుకుని పొగిడించుకున్నారు. అంతటితోఆగకుండా మళ్లీ మీరే సీఎం కావాలని అనిపించారు. గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదనో మరేంటో తెలియదు గాని కాకినాడలో జరిగిన ఆరో విడత జన్మభూమి సభలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న స్మార్ట్సిటీ అభివృద్ధి పనులనే తన ఘనతగా చెప్పుకుని, మరింత అభివృద్ధి చేస్తానని చెప్పుకున్నారు. జనాలను నిలబెట్టేందుకు అధికారుల హైరానా సీఎం హాజరైన జన్మభూమి గ్రామ సభకు అధికారులు ఆపసోపాలు పడి జన సమీకరణ చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశారు. డ్వాక్రా, ఐసీడీఎస్, ఆశా, సాధికార మిత్ర కార్యకర్తలకు లక్ష్యాలు నిర్ధేశించి జనాన్ని తీసుకొచ్చారు. కళాశాలల యాజమాన్యాలకు చెప్పి వందల సంఖ్యలో విద్యార్థుల్ని అతి కష్టం మీద రప్పించి సీఎం వచ్చేంతవరకూ నిలబెట్టారు. సీఎం పర్యటన ఆలస్యం కావడంతో జనాలను నిలువరించడం అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. ఉదయం 11.20 గంటలకు ప్రారంభం కావల్సిన జన్మభూమి గ్రామసభ మధ్యాహ్నం 1.05 వరకు సీఎం రాకపోవడంతో ప్రారంభం కాలేదు. ఆ తర్వాత సీఎం వచ్చారనేసరికి ఆయన ప్రసంగం వినలేక జనం వెళ్లిపోవడం ప్రారంభించారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీ అయిపోయాయి. కలెక్టర్కు షాకిచ్చేందుకు నేతల వ్యూహాత్మక వైఖరా... సీఎం సభ విజయవంతానికి టీడీపీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అంతా తానై జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఏర్పాట్లు చేయడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ప్రభుత్వ నిధులే ఖర్చు పెడుతున్నప్పుడు వ్యక్తిగతంగా తాము సొమ్ము ఖర్చు పెట్టి జనాన్ని తీసుకురావడమెందుకని వదిలేయడంతో అనుకున్నంతగా సీఎం సభకు జన సమీకరణ జరగలేదు. వచ్చిన వారు కూడా సగంలోనే వెళ్లిపోవడంతో వెలవెలబోయింది. అధికారులపై ఆధారపడితే ఎలాఅని...జన సమీకరణలో నేతలు చొరవచూపించాలి కదా అని సీఎం మందలించినట్టు తెలిసింది. బయటపడిన షాడోల నీడ... సీఎం ఎదురుగా ఒక మహిళ మాట్లాడుతూ తనకు ఇల్లు మంజూరైందని, ఆ ఇల్లు ఎమ్మెల్యే వనమాడి సత్యనారాయణ ఇచ్చారని సభా వేదికగా చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వనమాడి కొండబాబు సోదరుడు సత్యనారాయణ ప్రభుత్వ పథకాల్లో విపరీత జోక్యం చేసుకుంటున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సీఎం ఎదుటే కొండబాబు బదులు ఎమ్మెల్యే సత్యనారాయణ అని చెప్పడం ఆ వాదనలకు బహిరంగ సభ వేదికగా బలం చేకూర్చినట్టయిందని అంతా చర్చించుకున్నారు. అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తున్న సమయంలో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మికి బదులు ఆమె భర్త సత్తిబాబు పేరుతో ముందుగా ఆహ్వానం పలికారు. కాసేపటికి తప్పు తెలుసుకుని అనంతలక్ష్మి పేరు చదివారు. సత్తిబాబును ఇదే వేదికపై ముందు వరసలో కూర్చోబెట్టి, సూపర్ ఎమ్మెల్యే వాదనకు బలం చేకూర్చారు. -
ప్రథమ మహిళకు అవమానం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ నగర మేయర్ సుంకరి పావనికి అవమానం జరిగిందా? సీఎం పర్యటన సందర్భంగా ఆమె అసంతృప్తికి గురయ్యారా? అంటే అవుననే చెబుతోంది ఈ చిత్రం. జిల్లా పరిషత్ శతవసంతాల పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా జెడ్పీలోకి వెళ్లకుండా ఆమె బయట రోడ్డుపై ట్రాఫిక్ ఐలాండ్పై కూర్చొనడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్కు అవమానం జెడ్పీ వ్యవహారం పక్కన పెడితే జన్మభూమి గ్రామసభలో మేయర్ పావనికి అవమానం ఎదురైంది. సభ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రులతో పాటు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ ఫొటోలు పెట్టారు కానీ మేయర్ సుంకర పావని ఫొటో పెట్టలేదు. వాస్తవానికి సభ జరిగిన ప్రాంతం కార్పొరేషన్ పరిధిలోనిదే. ఈ లెక్కన చూస్తే నగర ప్రథమ మహిళగా మేయర్కే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత స్థానిక కార్పొరేటర్కు ఇవ్వాలి. వారిద్దరి ఫొటోలను ఫ్లెక్సీలో పెట్టలేదు. దీనివెనక నియోజకవర్గ కీలక నేత హస్తం ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే కార్పొరేషన్లో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నీ తానై వ్యవహరించి, ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే తన మాటే నెగ్గించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన జన్మభూమి గ్రామసభ వేదిక ఫ్లెక్సీలో మేయర్ పావని ఫొటో కన్పించకపోవడం మరింత అనుమానాలకు తావిచ్చింది. దీని వెనక ఎమ్మెల్యే హస్తం ఉందా? లేకుంటే అధికారులు ఉద్దేశపూర్వకంగా ఫొటో లేకుండా చేశారా? అన్నది తెలియాలి. విశేషమేమిటంటే సీఎం పర్యటనకు ఆద్యంతం నగరకార్పొరేషన్ సిబ్బంది సేవలే వినియోగించారు. ఇలాగైనా మేయర్ ఫొటో తప్పనిసరిగా ఫ్లెక్సీలో ఉండాలి. కారణమేంటో తెలియదుగానీ జెడ్పీలో జరిగిన సీఎం కార్యక్రమానికి మేయర్ వెళ్లకుండా బయటే ఉండిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
నిరసన.. నిలదీత
కడప అగ్రికల్చరల్ : జిల్లాలో రెండవరోజు గురువారం నిర్వహించిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమం నిరసనల మధ్య ముగిసింది. ఐదు విడతలుగా జరిగిన జన్మభూమిలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదని....మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సభలు నిర్వహిస్తారని అటు టీడీపీ నాయకులను, ఇటు అధికారులను ప్రజలు నిలదీశారు. అధికారులు చాలాచోట్ల సమాధానాలు చెప్పలేకపోయారు. జిల్లాలో నిర్వహించిన అన్ని సభల్లో నిరసనలు, నిలదీతలు కనిపించాయి. రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండలం కొండ్రెడ్డిగారిపల్లెలో సీసీ రోడ్డుకు శిలాఫలకం ఆవిష్కరించడానికి వచ్చిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీసీరోడ్లు, తాగునీరు, వీధిలైట్లు తదితర సమస్యలు నాలుగేళ్లుగా పరిష్కారం కాలేదని, ఇప్పుడొచ్చి ఏం చేస్తారని నిలదీశారు. రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లె మండలం కుర్నూతల అగ్రహారంలో తాగునీటి విషయమై గ్రామసభను ప్రజలు అడ్డుకున్నారు. పెన్షన్లు ఇవ్వలేదని అధికారులను నిలదీశారు. మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం లక్ష్మిపేట, సీతాపురంలలోనిర్వహించిన కార్యక్రమంలో రుణమాఫీ కాలేదని రైతులు అధికారులను నిలదీశారు. తువ్వపల్లె సభలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్యాదవ్, టీడీపీ నాయకులు కుర్చీలో కూర్చోగా, అధికారులు కింద కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలం ఉరుటూరులో సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు, గ్రామస్తులు నిలదీశారు. చెన్నూరు మండలం కొండపేటలో నిర్వహించిన గ్రామసభలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన గొప్పలను చెబుతుండగా, ఎంపీటీసీ సభ్యుడు కుప్పిరెడ్డి భాస్కర్రెడ్డి కల్పించుకుని ఈ వృద్ధుడికి పింఛన్ ఇప్పటికీ రాలేదని ప్రశ్నించారు. ప్రజలందరూ అర్హులకు పింఛన్లు ఇవ్వలేదని నిలదీయడంతో మిన్నకుండిపోయారు. బద్వేలులో పోలీసు బందోబస్తు మ«ధ్య జన్మభూమి సభలు జరిగాయి. రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లె సభను ప్రజలు బహిష్కరించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని డివిజన్లలో నిర్వహించిన సభల్లో కాలువల్లో పూడికతీత విషయమై మహిళలు అటు చైర్మన్ను, ఇటు కమిషనర్లను నిలదీశారు.జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు వేర్వేరు గ్రామసభల్లో పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం మల్లేలలో వైఎస్సార్సీపీ నాయకులు అధికారులు సమస్యలను పరిష్కరించలేదని నిలదీశారు. -
చీప్‘ట్రిక్స్’!
‘చేసేది గోరంత... చెప్పుకునేది కొండంత’ అన్నట్లుగా టీడీపీ సర్కార్ వైఖరి కన్పిస్తోంది. ప్రచారానికి... కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రతి చర్యలను అనువుగా మలుచుకుంటున్నారు. తుదకు వృద్ధులను సైతం వదిలిపెట్టడం లేదు. సీఎం చంద్రబాబు ఫొటోతో ముద్రించిన స్టిక్కర్ మీ ఇంటి తలుపు ఉండాల్సిందే! లేదంటే పెన్షన్ కట్ అంటూ బలవంతంగా అప్పగిస్తున్నారు. జన్మభూమి కార్యక్రమంలో పెన్షన్దారులకు ప్రచార స్టిక్కర్లు అందజేస్తున్నారు. ఏవరైనా వద్దంటే మీ ఇష్టం... మీకు పెన్షన్ సక్రమంగా అందాలంటే, జాబితా నుంచి మిమ్మల్ని తొలగించకూడదంటే ఇంటికి తగిలించుకోండని సుతిమెత్తని బెదిరింపులకు పాల్పడుతున్నారు. సాక్షి ప్రతినిధి కడప : జన్మభూమి కార్యక్రమానికి ప్రజాదరణ కొరవడింది. టీడీపీ కార్యకర్తలు మినహా ప్రజానీకం హాజరు కావడం లేదు. గ్రామాల్లో, పట్టణ వార్డుల్లో అర్హులైన పెన్షనర్లు మాత్రం తప్పకుండా హాజరవుతున్నారు. అందుకు కారణం జమ్మభూమిలో పెన్షన్ డబ్బులు ఇస్తుండడమే. జన్మభూమి ద్వారా ప్రభుత్వ చర్యలను ప్రచారం చేసుకోవాలని తలిస్తే ఆశించిన మేరకు ప్రజలు హాజరు కావడం లేదు. ఈక్రమంలో వృద్ధుల ద్వారా ప్రచారం చేసుకోవాలనే తలంపు ఏర్పడింది. సీఎం చంద్రబాబు ఫొటోతో ముద్రించిన ‘మా ఇంటి పెద్దకొడుకుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇస్తున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు’ అన్న స్టిక్కర్ అందిస్తున్నారు. ఇదెందుకని ఎవరైనా ప్రశ్నిస్తే మీ ఇంటి తలుపుకు ఈ స్టిక్కర్ ఉంటేనే తర్వాత నెల పింఛన్ వస్తుందని అధికారులు బదులిస్తుండడం విశేషం. జిల్లాలో 2,84,685 మంది వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీరందరి ఇళ్లకు జన్మభూమిలో సీఎం ఫోటోతో ముద్రించిన స్టిక్కర్ ఉండాలంటూ హుకుం ప్రదర్శిస్తున్నారు. ఇదే విషయమై సాక్షి ప్రతినిధి పలువురు వృద్ధాప్య పింఛనుదారులతో ప్రశ్నిస్తే ‘మొన్నటిదాకా జన్మభూమి కమిటీ పేరుతో వేధించారు, వాళ్లు కడుపుకాళ్లు పట్టుకొని పింఛన్ తొలగించకుండా చూసుకున్నాం. ఇప్పుడేమో మీ ఇంటి గుమ్మానికి ఈ ఫోటో లేకుంటే మా పెన్షన్ తీసేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోన్నారని’ పలువురు పెన్షన్దారులు వాపోయారు. మాఇట్లా మాట్లాడినట్లు చెప్పోద్దు నాయనా...ఆ దుర్మార్గులు ఇంకెన్నాళ్లుంటారో... అంటూ పేరు చెప్పేందుకు ఇష్టపడని వృద్దులు మండిపడడం విశేషం. -
బుడ్డా తీరుపై తిరుగుబాటు
ఆత్మకూరురూరల్/ కర్నూలు సీక్యాంప్: జన్మభూమి సాక్షిగా అధికార పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీ శ్రేణులు వర్గాలుగా విడిపోయి గొడవలకు దిగుతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీరుపై సొంత పార్టీలోని మైనార్టీ నేతలు రగిలిపోతున్నారు. తమను ఎమ్మెల్యే అవమానిస్తున్నారంటూ గురువారం జన్మభూమి సాక్షిగా సాక్షాత్తు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సమక్షంలోనే ఆందోళనకు దిగారు. ఆత్మకూరు పట్టణ శివారులో రూ.2.20 కోట్లతో నిర్మించనున్న షాదీఖానకు శంకుస్థాపన చేయడానికి మంత్రి ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్ ముఖ్యఅతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు మైనార్టీలు మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారు. తమకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తున్నారని, మైనార్టీ కాలనీని సర్వే చేయించేందుకు వెళితే సర్వేయర్లను రానివ్వడం లేదని, తమ స్థలాలను వేరే పనులకు వినియోగించేందుకు పూనుకున్నారని వాపోయారు. అలాగే రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అహమ్మద్ హుసేన్ను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానిస్తున్నారన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా అధికారులను సైతం బెదిరిస్తున్నారన్నారు. ఆందోళన నేపథ్యంలో సుమారు గంట సేపు ఉద్రిక్తత నెలకొంది. ఇన్చార్జ్ డీఎస్పీ వినోద్ కుమార్, సీఐ కృష్ణయ్య తమ సిబ్బందితో కలిసి ఆందోళనకారులను పక్కకు తొలగించి.. మంత్రి కాన్వాయ్కి దారి చూపే యత్నం చేశారు. అయినప్పటికి వారు పట్టు వీడలేదు. చివరకు మంత్రి తన వాహనం దిగి.. వారిని సముదాయించారు. కాగా.. తనకు ఆహ్వానాలు అందకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని అహమ్మద్ హుసేన్ టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో అధిష్టానం నుంచి ఎమ్మెల్యేకు ఫోన్ రావడంతో ఆయన స్వయంగా అహమ్మద్ హుసేన్కు ఫోన్ చేసి జన్మభూమి కార్యక్రమానికి ఆహ్వానం పలికినట్లు సమాచారం. ఉల్చాలలో గొడవ కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని ఉల్చాల గ్రామంలో జన్మభూమి సభలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలు విడిపోయి గొడవ పడ్డారు. గురువారం ఉదయం కర్నూలు డిప్యూటీ తహసీల్దార్ చంద్రకళ ఆధ్వర్యంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. వేదికపై ఒకవైపు ఎమ్మెల్యే మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్రెడ్డి, మరోవైపు కర్నూలు ఎంపీపీ రాజవర్ధన్రెడ్డి కూర్చున్నారు. మూడేళ్లుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించుకోవడానికి మామూళ్లు తీసుకుంటున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే బదులు కొత్తకోట ప్రకాశ్రెడ్డి వివరణ ఇచ్చారు. దీంతో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్ధన్రెడ్డి వర్గీయులు కొత్తకోట ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మణిగాంధీనా లేక కొత్తకోట ప్రకాశ్రెడ్డా? అంటూ గొడవకు దిగారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టమొచ్చినవారిని మాట్లాడించడమేంటని అధికారులను ప్రశ్నిస్తూ కర్నూలు వైస్ ఎంపీపీ వాసు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అనంతరం జన్మభూమిని బహిష్కరించి వెళ్లారు. -
సీఎం సందేశం వినలేం బాబూ! చెవులు మూసుకొని నిరసన
జన్మభూమి..మా ఊరు గ్రామసభల్లో రెండో రోజూ గురువారంనిరసనలు..ఆందోళనలూ కొనసాగాయి. పలుచోట్ల గ్రామసభలను బహిష్కరించడంతో పాటు అధికారులను నిలదీశారు. పలు ప్రాంతాల్లో సభలకు ప్రజలు రాకపోవడంతో వెలవెలబోయాయి. ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లకోసం నిలదీస్తుంటే సమాధానాలు చెప్పలేక అధికారులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి ప్రసంగానికే అధికారులు ఎక్కువ సమయం కేటాయించి సభకు వచ్చిన వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. ముత్తుకూరు మండలం దువ్వూరువారిపాళెంలో చెవులు మూసుకొని నిరసన వ్యక్తం చేశారు. గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీలు ఏమయ్యాయి.. ఏడాది తర్వాత మళ్లీ ఎలా వచ్చారని ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామ ప్రజలుజెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆర్డీఓ సువర్ణమ్మలను నిలదీశారు. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం ఏడాది కిందటే అర్జీలు పెట్టుకున్నా ఇప్పటికీ మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రిపాడు మండలం కేతిగుంటలో గ్రామసభను బహిష్కరించారు. కరువుతో అల్లాడుతున్నాం.. సాగు, తాగునీరు ఇప్పించాలంటూ ప్రజలునిలదీశారు. నెల్లూరు(పొగతోట): ప్రభుత్వం ప్రచారం కోసం నిర్వహిస్తున్న 6వ విడత జన్మభూమి – మా ఊరు గ్రామసభల బహిష్కరణలు, నిరసనలు, అధికారులను నిలదీయడం కొనసాగుతున్నాయి. పలుచోట్ల ప్రజలు గ్రామసభలను బహిష్కరించారు. సంక్షేమ పథకాలు అందడం లేదని, రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ప్రజలు అధికారులను నిలదీశారు. రైతు రథాలు పచ్చనేతలకే అందిస్తున్నారంటూ రైతులు వ్యవసాయశాఖ అధికారులను నిలదీశారు. పలు ప్రాంతాల్లో జన్మభూమి సభలకు ప్రజలు రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జన్మభూమి సభల బహిష్కరణ జిల్లాలో గురువారం రెండో రోజు జన్మభూమి – మాఊరు గ్రామసభలను అధికారులు నిర్వహించారు. మర్రిపాడు మండలం పొంగూరు పంచాయతీ కేతిగుంట గ్రామంలో జన్మభూమి సభను ప్రజలు బహిష్కరించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కావడం లేదంటూ అధికారులను నిలదీసి సభను బహిష్కరించారు. ఆత్మకూరు మండలం బోయలచిరివేల్లలో ఇచ్చిన వారికి ఇళ్లు ఇస్తున్నారని అర్హులైన కొత్త వారికి ఇవ్వడంలేదని ప్రజలు అధికారులను నిలదీశారు. చేజర్ల మండలం ఎన్వీ కండ్రిక గ్రామంలో జన్మభూమి గ్రామసభలో వ్యవసాయశాఖ అధికారులను రైతులు తమ సమస్యలపై నిలదీశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. సంక్షేమ పథకాలు అనర్హులకు ఎందుకు అమలు చేస్తున్నారంటూ ప్రజలు అధికారులను నిలదీశారు. సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అర్హులైన వారికి అమలు చేయాలని ప్రజలు అధికారులను కోరారు. వాకాడు మండలం మొలగనూరు గ్రామంలో అర్హులకు పింఛన్లు, రేషన్కార్డులు అందజేయడం లేదని ప్రజలు అధికారులను నిలదీశారు. దుత్తలూరు మండలం వెంగనపాళెం జన్మభూమి గ్రామసభకు అధికారులు ఆలస్యంగా హాజరయ్యారు. మండల ఉపాధ్యక్షురాలు అధికారుల కోసం నిరీక్షించాల్సివచ్చింది. జన్మభూమి గ్రామసభల్లో ప్రచారం చేసుకోవడానికి అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం, పథకాల ప్రచారానికి అధిక సమయం కేటాయిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మొక్కుబడిగా సభలు నిర్వహిస్తున్నారు. జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే పింఛన్లు, రేషన్కార్డులు, ఇళ్లు కేటాయించారు. ఈ విషయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి సభల్లో అధికారులను నిలదీస్తున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేక నీళ్లునములుతున్నారు. జన్మభూమి సభను అడ్డుకున్న గ్రామస్తులు జలదంకి: మండలంలోని గోపన్నపాలెంలో గురువారం ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు గ్రామసభను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో చిప్పలేరు వద్ద, పోలేరమ్మ గుడి వద్ద, వడ్లమూడి వెంకటేశ్వర్లు పొలం వద్ద బాటలు ఆక్రమణలకు గురై ఉన్నాయని రెవెన్యూ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. అలాగే గ్రామంలో 400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకుండా మోసం చేశారంటూ ప్రజలు గ్రామసభలో నిరసన వ్యక్తం చేశారు. చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 5వ నంబర్ తూము ద్వారా సాగునీరు ఇవ్వకుండా చేశారని జన్మభూమి సభకు హాజరైన టీడీపీ మండల అధ్యక్షుడు పూనూరు భాస్కర్రెడ్డి, సోమశిల ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ వంటేరు జయచంద్రారెడ్డిలను నిలదీశారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీడీఓ ఆక్రమణలకు గురైన బాటలను గ్రామస్తులతో కలిసి పరిశీలించి ఆక్రమణలను తొలగిస్తామని వారికి చెప్పడంతో వారు శాంతించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గ్రామసభ ప్రారంభమైంది. జన్మభూమిని పక్కాగా నిర్వహించకపోతే చర్యలు జలదంకి మండలం ఎల్ఆర్అగ్రహారం, గోపన్నపాలెంలలో గురువారం జరిగిన జన్మభూమి సభలను కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ తనిఖీ చేశారు. ఎల్ఆర్ అగ్రహారంలో గ్రామ సందర్శనను అధికారులు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువైద్య సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసి జన్మభూమి సభలను సక్రమంగా నిర్వహించకపోతే సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనూరాధ, పీఆర్ ఏఈ శ్రీనివాసులు, ఆర్డబ్లూఎస్ ఏఈ మసూద్, హౌసింగ్ ఏఈ ఏఎస్ఎన్ సింగ్, వ్యవసాయాధికారిణి లక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం సందేశం వినలేం బాబూ!చెవులు మూసుకొని నిరసన నెల్లూరు ముత్తుకూరు: అభూత కల్పనలతో నిండిన ముఖ్యమంత్రి సందేశాన్ని వినలేకపోతున్నామంటూ చెవులు మూసుకొని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ముత్తుకూరు మండలంలోని దువ్వూరువారిపాళెంలో 6వ విడత జన్మభూమి–మా ఊరు గ్రామసభలో వైఎస్సార్సీపీ నాయకులు ఈ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వెటర్నరీ ఏడీ సోమయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్న ఈ గ్రామసభలో ఎంఈఓ మధుసూదన లేచి సీఎం సందేశాన్ని వినిపిస్తుండగా దువ్వూరు చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు చెవులు మూసుకుని నిరసన వ్యక్తం చేశారు. సందేశం పూర్తిపాఠం ముగిసే వరకు వినకుండా నిరసన వెలిబుచ్చారు. వ్యవసాయాధికారి హరికరుణాకర్రెడ్డి, సీడీపీఓ ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజూ నిరసనల హోరు
జిల్లాలో ఆరో విడత జన్మభూమి సభలు నిరసనలు,నిలదీతల మధ్య సాగుతున్నాయి. తొలిరోజే ప్రతికూల పరిస్థితుల్లో సాగగా రెండో రోజు గురువారం కూడా అధికారులు, ప్రజాప్రతినిధులకు జనాగ్రహమే ఎదురైంది. ఎక్కడికక్కడ నిలదీతలు, అడ్డగింతలు, సభల బహిష్కరణలతో రచ్చరచ్చగా మారాయి. దాదాపు ప్రతి చోటా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జన్మభూమి గ్రామ సభలను ప్రజలు అడ్డుకున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జన్మభూమి–మా ఊరు కార్యక్రమం రెండో రోజు గురువారం కూడా నిరసనల మధ్య సాగింది. సమస్యలు పరిష్కరించని జన్మభూమి ఎందుకంటూ ప్రజలు నిలదీస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే సభలు జరగనిస్తున్నారు. తాగు, సాగునీటితోపాటు పెన్షన్లు, రేషన్ కార్డులు లాంటి సమస్యలు పరిష్కరించాలంటూ సభల్లో అధికారులను నిలదీస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం చవటపాలెంలో కనపర్తి ఎత్తిపోతల పథకానికి రెండేళ్లుగా నీరివ్వడం లేదని అధికారులను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు అధికారులను నిలదీసి గ్రామ సభను అడ్డుకున్నారు. నీరిస్తామంటేనే సభ జరగనిస్తామంటూ డిమాండ్ చేశారు. దీంతో మధ్యాహ్నం వరకు జన్మభూమి ఆగిపోయింది. అధికారులు జాయింట్ కలెక్టర్, ఆర్డీఓతో మాట్లాడి ఈ సీజన్లో ఆరుతడి పంటలకు నీటిని ఇస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం తర్వాత జన్మభూమిని నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోనూ జన్మభూమి సభను గ్రామస్థులు అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన వినతులను పరిష్కరించకుండా ఇప్పుడు జన్మభూమిని నిర్వహించడమెందుకంటూ స్థానిక ప్రజలు అధికారులను నిలదీశారు. దీంతో రెండుగంటల పాటు సభ నిలిచి పోయింది. ♦ మద్దిపాడు మండలం గడియపూడిలో జనం రాక జన్మభూమి సభ నిలిచి పోయింది. అధికారులు స్కూలు పిల్లలను కూర్చోపెట్టి మొక్కుబడిగా సభ జరిపించుకున్నారు. ♦ టంగుటూరు మండలం వల్లూరులో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు మిడ్ డే మీల్స్ బాగోలేదని మంత్రి శిద్దా రాఘవరావుకి వినతిపత్రం అందించారు. ఇంటి నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుని తింటున్నామని, మంచినీరు కూడా లేదని మంత్రి దృష్టికి తెచ్చారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ♦ తాళ్లూరు మండలం విఠలాపురంలో జరిగిన సభలో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులను ప్రభుత్వం ఇంత వరకు చెల్లించలేదని తక్షణం బిల్లులు ఇవ్వాలని ఎంపీపీ మోషే అధికారులను నిలదీశారు. దీనిని టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు. ♦ చీరాల మున్సిపాలిటి 8వ వార్డులో ఇంటి స్థలాలు, రేషన్కార్డులు మంజూరు చేయలేదంటూ స్థానికులు అధికారులను నిలదీశారు. రూరల్ పరిధిలోని విజయనగర వాసులు జన్మభూమిలో సమస్యలపై అధికారులను నిలదీశారు. ♦ కొనకనమిట్ల మండలంలోని నాగంపల్లి జన్మభూమి సభలో గ్రామస్థులు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామంటూ అధికారులను నిలదీశారు. ♦ హెచ్ఎంపాడు మండలం దాసరిపల్లి జన్మభూమి సభలో అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెన్షన్లు మంజూరు చేయలేదంటూ ప్రజలు అధికారులను నిలదీశారు. – వెలిగండ్ల మండలం తందువ గ్రామంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, తక్షణం నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి సమస్యతో అల్లాడి పోతున్నామని, గతంలో నీటిని సరఫరా చేసిన ప్రభుత్వం ఇప్పుడు అది కూడా మానుకుందని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఉపాధి పనులు పూర్తిస్థాయిలో కల్పించడం లేదని, కూలి తక్కువ పడుతుందని గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ♦ కందుకూరు మండలం జి.మేకపాడులో గ్రామంలో పింఛన్లు, రేషన్కార్డులు, మంచినీటి సరఫరా వంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు రెండు గంటలపాటు జన్మభూమి సభను అడ్డుకున్నారు. -
నిరసన సెగలు
ధర్మవరం పట్టణానికి చెందిన లక్ష్మమ్మ వయస్సు 75ఏళ్లు. నా అనే వాళ్లు ఎవ్వరూ లేరు. ఉన్న ఆశ అంతా ప్రభుత్వం అందించే పింఛన్పైనే. మందులు కొనాలన్నా.. పూట గడవాలన్న ఇదే ఆధారం. ఎప్పటిలానే పింఛన్ కోసం 1వ తేదీన వెళ్లింది. అయితే పంపిణీ సిబ్బంది వేలిమద్ర వేయించుకొని చిన్నపాటి చీటీ ఇచ్చి జన్మభూమి కార్యక్రమంలో ఇస్తామని మెళిక పెట్టారు. దీంతో ఈ అవ్వ నిస్సహాయ స్థితిలో వెనక్కి వెళ్లింది. అనంతపురం అర్బన్: జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలకు నిరసన సెగ తగులుతోంది. సమస్యలను పరిష్కరించలేని సభలు మాకొద్దంటూ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రెండు రోజు గురువారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పుట్లూరు మండలం శనగలగూడూరులో గ్రామసభలో ప్రభుత్వం ఐదేళ్లుగా పంట నష్ట పరిహారం, బీమా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. రైతులను పట్టించుకోని ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామంటూ లిఖితపూర్వకంగా అధికారులకు తెలియజేశారు. కూడేరు మండలం కలగళ్ల గ్రామసభలో తాగునీరు, పక్కా గృహాల కోసం ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు అధికారులను నిలదీశారు. పాత మరుగుదొడ్లకు బిల్లులు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పలు చోట్ల గ్రామసభలను మొక్కుబడిగా నిర్వహించారు. ఏమిటయ్యా.. మాకీ కష్టాలు రాయదుర్గం టౌన్ : పట్టణంలో నిర్వహిస్తున్న జన్మభూమి వార్డు సభల్లో పండుటాకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సభలు ముగిసేదాకా పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో భోజనం కూడా లేక నీరసిస్తున్నారు. గురువారం పట్టణంలోని 3వ వార్డులో జన్మభూమి సభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు సాగింది. మంత్రి రాకకోసం ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సి వచ్చింది. సభ ముగిసిన తర్వాత కూడా పింఛన్లు పంపిణీ చేయలేదు. 4 గంటలకు రావాలని మున్సిపల్ సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. జన్మభూమికి వస్తేనే పింఛను ‘‘కొత్తపల్లిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమానికి వస్తేనే పింఛను ఇస్తామన్నారు. మేమంతా పొద్దునే ఆటో తీసుకొని రాజమోల్లపల్లి నుంచి ఇక్కడికి వచ్చినాం. ఈ మీటింగ్ ఎప్పుడు అయిపోతాదో, మాకు పింఛను ఎప్పుడు ఇస్తారో. తిండీతిప్పలు లేకుండా సంపుతున్నారు.’’– నల్లచెరువు మండలం రాజమోల్లపల్లి తండాకు చెందినఈశ్వరమ్మ, పార్వతమ్మ, వెంకటమ్మ ఆవేదన సభల తీరు ఇలా.. ♦ గుంతకల్లు మండలం గుండాల తండా గ్రామంలో ప్రజలు సమస్యలపై అధికారులును నిలదీశారు. గడిచిన జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన ఫిర్యాదులు ఇంతవరకు పరిష్కరించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ♦ కదిరి అర్బన్ పరిధిలోని మోటుకుపల్లిలో ఎన్టీఆర్ ఇల్లు మంజూరు చేయలేదని లక్ష్మీబాయ్ అనే మహిళ ఆగ్రహించింది. హౌసింగ్ ఏఈ ఖాజామోద్దీన్తో వాగ్వాదానికి దిగింది. పశుగ్రాసం, పశువులకు మందులు ఇవ్వలేదంటూ తనకల్లు మండలం బాల సముద్రంలో రైతులు రమణ, గోవిందు, శివన్న, కొండలరావ్ నిరసన వ్యక్తం చేస్తూ అధికారులతో వాదనకు దిగారు. ♦ గాండ్లపెంట మండలం మద్దివారిగొంది పంచాయతీలోని కమతంపల్లిలో జనం లేక గ్రామసభ వెలవెలబోయింది. తలుపుల మండలం ఓదులపల్లిలో రేషన్ కార్డులు, సీసీరోడ్లు మంజూరు చేయాలని జన్మభూమి సభను గొల్ల పల్లి తండావాసులు అడ్డుకున్నారు. ♦ మడకశిర మండలం రొళ్ల మండలం హులికుంట గ్రామసభలో సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులను ప్రజలు నిలదీశారు. మడకశిర పట్టణంలోని 3, 8 వార్డుల్లో, రూరల్ మండలం అమిదాలగొంది, కదిరేపల్లి పంచాయితీల్లోనూ, అగళి మండలం ఇరిగేపల్లి, గుడిబండ మండలం చిగతుర్పి, నాగేపల్లి పంచాయితీల్లో జన్మభూమి గ్రామసభలు మొక్కుడిగా సాగాయి. ♦ పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం ఇనగలూరులో సమస్యలపై అధికారులను గ్రామస్తులు నిలదీశారు. కొద్ది సేపు సభను అడ్డుకున్నారు. బుక్కపట్నం, పుట్టపర్తి పట్టణంలో మొక్కుబడిగా సాగాయి. ♦ శింగనమల నియోజకవర్గం ఉల్లికల్లు గ్రామ సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. ♦ తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం నగరూరులో సమస్యల పరిష్కారానికి అధికారులను గ్రామస్తులు నిలదీశారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలంటూ కొద్దిసేపు సభను అడ్డుకున్నారు. ♦ రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలంలోని గలగల గ్రామంలో ప్రజలు సమస్యలపై అధికారులను నిలదీశారు. -
బడి పిల్లలతో నాగినీ డ్యాన్స్లు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని అధికారులందరూ జన్మభూమి– మాఊరు కార్యక్రమానికి ఓ నమస్కారం అనే పరిస్థితి నెలకొంది. కారణం టీడీపీ నేతల ఒత్తిళ్లతో సమస్యలు పరిష్కరించలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఉద్యోగులు అడకత్తెరలో పోక చెక్కలా నలుగుతున్నారు. ఫలితంగా వారికి జన్మభూమి కార్యక్రమం అంటేనే ముచ్చెమటలు పడుతున్నాయి. జిల్లాలోని అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు తమకున్న అధికారాలను విని యోగించి పేద ప్రజలకు న్యాయం చేద్దామని ప్ర యత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలను టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అడ్డుకుం టున్నారు. వారిని సక్రమంగా విధులు నిర్వహించనీయకుండా సమస్యలు సృష్టిస్తున్నారు. దీంతో జన్మభూమి– మాఊరు గ్రామసభల్లో ప్రజలిచ్చే అర్జీలకు అధికారులు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అలా నిర్ణయం తీసుకునే కొందరి అధికారులపై అక్కడి టీడీపీ ప్రజాప్రతినిధులు తమ అక్కసు ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నేతల ఆమోదం తప్పనిసరి ఉద్యోగులు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్న పేదలను గుర్తించి, వాటిని వారి చెంతకు చేర్చే బాధ్యత నిర్వహించాల్సి ఉంది. అయితే జిల్లాలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఏ శాఖలోనైనా ప్రభుత్వ పథకాల మంజూరుకు సంబంధించి టీడీపీ ప్రజాప్రతినిధుల ఆమోదం తీసుకోవాల్సి వస్తుందని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు సూచించే కార్యకర్తలకు మాత్రమే పథకాలు మంజూరు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల ఆశయం నిర్వీర్యం కావడమే గాక పేదలకు ఆ పథకాలు చేరడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చౌడేపల్లె మండలం చారాలలో ప్రోటోకాల్ వివాదంతో నెలకొన్న ఉద్రిక్తత పోలీసు బందోబస్తు నడుమ జన్మభూమి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ఆరో విడత జన్మభూమి– మా ఊరు కార్యక్రమ నిర్వహణకు వెళ్లిన అధికారులకు ఛీత్కారాలు, ప్రజల తిరుగుబాటు, ఆగ్రహజ్వాలలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం పోలీసు బందోబస్తు నడుమ కొనసాగాల్సిన దుస్థితి నెలకొంది.అయితే జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ద్వారా ప్రజల చెంతకే అధికారుల వచ్చి, ప్రజా సమస్యలు విని పరిష్కరిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఇందుకోసం రూ.కోట్ల ఖర్చు పెడుతోంది. కాగా ఇప్పటివరకు జరిగిన ఐదు విడతల జన్మభూమి–మా ఊరు కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలకు న్యాయం జరగలేదు. దీంతో గతంలో ఇచ్చిన అర్జీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారిని ప్రభుత్వం పోలీసులతో బెదిరిస్తోంది. ఈ క్రమంలో జన్మభూమి సభల్లో అధికార పార్టీ నాయకులు, నేతలు మాట్లాడే ప్రసంగాలను ప్రజలు మౌనంగా వినడం తప్ప, మరో మార్గాంతరం లేకుండాపోతోంది. ప్రజలిచ్చే అర్జీలను తామైనా పరిష్కారం చేద్దామని అధికారులు భావిస్తున్న ఉద్యోగులపై టీడీపీ నేతలు ఒత్తిడి పెంచి, ఇబ్బందులు సృష్టిస్తున్నారు. సీఎం సభకు వచ్చిన అర్జీలే నిదర్శనం గత ఐదు విడతల జన్మభూమిలో ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదనడానికి గురువారం కుప్పంలో జరిగిన సీఎం చంద్రబాబు పర్యటనలో వచ్చిన అర్జీలే నిదర్శనం. సీఎం కుప్పంలో జరిగిన జన్మభూమిలో పాల్గొన్న సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 875 మందికి పైగా పాల్గొని, అర్జీలు అందజేసినట్లు అధికారులే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కా రం కాకపోవడంతోనే ప్రజలు నేరుగా సీఎంకైనా తమ ఆవేదనను చెప్పుకుందామని వచ్చి, వినతులు ఇచ్చారనడానికి సాక్షం. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, టీడీపీ నేతలు అధికారులను బెదిరించడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడి పిల్లలతో నాగినీ డ్యాన్స్లు జన్మభూమిలో నిర్వాకం గంగవరం: మండలంలోని గండ్రాజుపల్లెలో జరిగిన జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో బడిపిల్లలతో నాగినీ డ్యాన్సులు వేయించారు. గురువారం గండ్రాజుపల్లె, కీలపల్లె పంచాయతీల్లో జన్మభూమి నిర్వహించారు. గండ్రాజుపల్లిలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభానికి ముందు బడి పిల్లలతో నాగినీ డ్యాన్స్లు వేయించారు. ఇలా సభా ప్రాంగణం మధ్యలో బాల, బాలికలతో డ్యాన్స్లు వేయించడం విమర్శలకు దారితీసింది. బడిలో చక్కగా చదువుకోవాల్సిన పిల్లలను ఇలా జన్మభూమికి రప్పించి వారితో డ్యాన్సులు వేయించడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వెలుగు మహిళలను రప్పించడానికి అధికారులు ముప్పుతిప్పలు పడ్డారు. ఆగ్రహజ్వాలలు.. ఆందోళనలు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరో విడత జన్మభూమి– మాఊరు కార్యక్రమంలో రెండో రోజైన గురువారం కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు చేశారు. అధికారులను నిలదీశారు. గత ఐదు విడతల్లో ఇచ్చిన అర్జీల మాటేమిటని? వాటికే దిక్కులేదని, మళ్లీ ఇప్పుడు జన్మభూమి ఎందుకు నిర్వహిస్తున్నారని సభలను అడ్డుకున్నారు. జనాగ్రహం, నిలదీతలు, ఆందోళనలు ఎదుర్కొని, వారికి సంజాయిషీ చెప్పుకోలేక అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ♦ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలకు స్థలాలు చూపకుంటే చంద్రగిరి మండలంలో జరిగే జన్మభూమిని అడ్డుకుంటామని మామండూరు గ్రామస్తులు అధికారులను హెచ్చరించారు. ♦ ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు ప్రోటోకాల్ పాటిం చడం లేదని టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు గీతాయాదవ్ ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కార్వేటినగరం మండలం కేఎం పురంలో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు సభలో అధికారకంగా స్టేజీపై కూర్చోవారిని పక్కనపెట్టి ఎలాంటి అర్హత లేని వారిని వేదికపై కూర్చోపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ♦ నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజాపాలనను విస్మరిం చింది. గతంలో జరిగిన ఐదు జన్మభూమి–మా ఊరు సభల్లో ఇచ్చిన ఫిర్యాదులకు ఇప్పటికీ పరిష్కారం చూపలేదు. మళ్లీ ఆరో విడత ఏం వెలగబెట్టడానికని జన్మభూమి గ్రామసభలు జరుపుతున్నారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి నిలదీశారు. ♦ చౌడేపల్లె మండలం చారాలలో ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు, టీడీపీ ఇన్చార్జి అనూషారెడ్డి, శ్రీనాథరెడ్డి గోబ్యాక్ అంటూ ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు నినాదాలు చేశారు. అయినా వారు వేదికపైనే కూర్చోని ఉండడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ♦ సమస్యలుంటే జన్మభూమి కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్ష్యంలోనే చెప్పమంటారు... తర్వాత అధి కారులు ఏమీ పట్టించుకోరు. ఇదేమిటని తవణంపల్లె మండలం చెర్లోపల్లె గ్రామ సభలో అధికారులపై డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ♦ కుశస్థలి నది కుడి, ఎడమ కాలువలు దురాక్రమణకు గురవుతున్నాయని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందిం చడం లేదని సీపీఐ నాయకులు నగరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అధికారులను నిలదీశారు. ♦ నాగలాపురం మండలం కడివేడులో జరిగిన జన్మభూమి– మా ఊరు గ్రామ సభను ఆ గ్రామ దళితులు బహిష్కరించారు. జన్మభూమి ప్రారంభంలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ మండల కన్వీనర్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో దళితులు జన్మభూమి గ్రామసభను అడ్డుకున్నారు. ♦ తంబళ్లపల్లె మండలంలోని వేమారెడ్డిగారిపల్లె, పంచాలమర్రి గ్రామాల్లో జరిగిన గ్రామ సభలు రసాభాసగా సాగాయి. సమస్యలపై ప్రజలు అధికారులను నిలదీశారు. ప్రజలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ♦ జన్మభూమి సభల్లో దరఖాస్తు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. తిరుపతి నగరంలోని 2, 12, 22, 32, 42 వార్డుల్లో జన్మభూమి సభల్లో ఎమ్మెల్యే సుగుణమ్మకు ఈ అనుభవం ఎదురైంది. -
మరో మోసానికి తెర
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జన్మభూమి–మాఊరు కార్యక్రమం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మోసానికి తెరలేపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. 2014 ఎన్నికల్లో అనేక అబద్ధపు హామీలిచ్చి.. అధికారం చేపట్టాక వాటన్నింటిని విస్మరించి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరన్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు, నిరుద్యోగభృతి పేరుతో యువతను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మాన మాట్లాడారు. సమర్ధవంతమైన పాలన అందిస్తున్నానని, దేశంలో ఎక్కడ ఏంజరిగినా అది నేనే చెప్పానని.. నా ఆలోచనే అని డబ్బాలు కొట్టుకుంటున్న బాబు రాష్ట్రానికి ఏమి చేశాడో చెప్పాలని ధర్మాన ప్రశ్నించారు. అవినీతిలో ఏపీనే నంబర్ వన్! చంద్రబాబు చేసిన మోసాలకు, అవినీతికి, అన్యాయానికి గత నాలుగేళ్లుగా అడ్డేలేకుండా పోయిందని ప్రసాదరావు అన్నారు. అవినీతిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నంబర్వన్గా తీర్చిదిద్దిన ఘనత బాబుకే దక్కిందన్నారు. అవినీతిని అంతమొందించడం అంటేరెవెన్యూ, ఇతర శాఖల అధికారులు రూ. రెండు వేలు, మూడు వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టించమే అవినీతిని నిర్మూలించడం కాదన్నారు. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకొని దుబారా చేయడం వంటివి కూడా అవినీతిలోకే వస్తాయన్నారు. టీడీపీ నేతల దోపిడీ టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులు నింపడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిధులను 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పేరుతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి రూ. లక్షల కోట్లు దోచుకున్నారన్నారని ఆరోపించారు. నీరు–చెట్టు పేరుతో చెరువులు, గెడ్డల పనులను నామినేషన్ పద్ధతిలో పైపైన చేపట్టి బిల్లులు చేసుకుని కోట్లాది రూపాయిలు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలంతా కేంద్రం ఇచ్చే నిధులన్నీ బొక్కేసి తీరా ఏమి ఇవ్వలేదని చెబుతున్నారన్నారు. చీఫ్ సెక్రటేరియెట్లు, సెక్రటేరియెట్లు, చెప్పినా వారిని సైతం వ్యతిరేకించి తమకు అనుకూలంగా జీవోలు తయారు చేసుకుని గ్రామీణస్థాయి నుంచి కేబినెట్ స్థాయి వరకు అన్ని నిర్ణయాలు దోపిడీ, స్వార్ధపూరితంగానే టీడీపీ నేతలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో హడావుడి దేశ వ్యాప్తంగా 10 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయని, ఏపీలో రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ధర్మాన అన్నారు. మరో 45 రోజుల్లో ఎన్నికల నగరా మోగనుందని.. ఈ సమయంలో హడావుడి చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం వల్ల చేసేదేముండదన్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు పూర్తయవుతాయని ఆ తరువాత టీడీపీ ఉంటుందా... ఊడుతుందా అని ప్రశ్నార్ధకంగా ఉన్న సమయంలో ఈ హడావుడి ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ రంగు బయటపడిందన్నారు. ఎన్ని కల ఫలితాల అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా చంద్రబాబు సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయారన్నారు. బీజేపీతో స్నేహం వల్ల ఒరిగేది శూన్యం చంద్రబాబు బీజేపీతో జతకట్టడం వల్ల రాష్ట్రానికి పైసా ఉపయోగం లేకుండాపోయిందన్నారు. నాలుగున్నరేళ్ల పాటు ప్రధానమంత్రి మోదీని చంద్రబాబు తన భుజాలపై మోసుకుని ప్రపంచంలో ఇటువంటి ప్రధాని లేరని, రాష్ట్రానికి అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారంటూ కితాబిచ్చారన్నారు. ఇప్పుడు అదే నోట ఏమి ఇవ్వలేదు.. రాష్ట్రానికి మోసం చేశారని ఊసరవల్లి మాటలు ఆడటం సరికాదన్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడం లేదని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని వైఎస్సార్సీపీ 2014 నుంచే ధర్నాలు చేపడుతున్నా కనీసం పట్టించుకోకుండా కేసులు బనాయించి భగ్నం చేసి ఇప్పుడు ఎన్ని చెప్పినా పట్టించుకున్న నాథుడే లేడన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ తినేసి కాంగ్రెస్తో చేతులు కలిపి ‘ధర్మ పోరాట దీక్ష’ పేరుతో కొంగ దీక్షలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. 13 జిల్లాలో కలిపి దాదాపుగా రూ.91 కోట్లు వృథా చేశారని సాక్షాత్తు టీడీపీ నాయకులే చెబుతున్నారన్నారు. ప్రజల బాధలను తెలుసుకోవడానికి ప్రజాసంకల్పయాత్ర రాజ్యాంగ సంస్థలు పనిచేయనప్పుడు, దోపిడీని ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా రాక్షస పాలన కొనసాగిస్తున్న టీడీపీకి చెక్ చెప్పేందుకు వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టాల్సి వచ్చిందన్నారు. 2003లో రాష్ట్రంలో కరువు, జంతువుల కళేబరాలు, రైతు ఆత్మహత్యలు, ఆకలికేకలు వినిపిస్తున్న సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టారన్నారు. అందరి సమస్యలు తెలుసుకుని ప్రజల అవసరాలకు తగినట్లుగా సంక్షేమ పథకాలు రూపొందించి.. ఆ హామీలతో గెలుపొందాక అందరి మనసులు దోచుకుని ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయారన్నారు. తండ్రి బాటలో నడుచుకొని, ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తే జగన్మోహన్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గొంతెత్తకుండా చేయడం వల్లే నేరుగా ప్రజల్లోకి వచ్చి ఏడాదిగా ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నారన్నారు. ఈ నెల 9వ తేదీన ఇచ్ఛాపురంలో ప్రజాసంకల్పయాత్ర ముగియనుందని ధర్మాన వెల్లడించారు. సమావేశంలో పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, జెడ్పీ మాజీ చైర్మన్ వై.వి సూర్యనారాయణ, సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం.వి.పద్మావతి, పార్టీ నాయకులు కె.ఎల్. ప్రసాద్, అంబటి శ్రీనివాసరావు, చల్లా రవికుమార్ పాల్గొన్నారు. -
‘రణ’భూమి
జన్మభూమి కాస్తా రణభూమిగా మారుతోంది. ఎక్కడికక్కడే నిలదీతలు... నిరసనలతో సభలు కాస్తా రసాభాసగా తయారవుతున్నాయి. ప్రభుత్వ సొమ్ముతో సొంత పార్టీ ప్రచారంకోసం తలపెట్టినఈ కార్యక్రమానికి అదుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్నాళ్ల పాలనలో ఏ సమస్యా పరిష్కారం కాలేదంటూ అధికారులు, పాలకపక్ష నాయకులను నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా సభలను బహిష్కరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రం ఈ వేదికలను పార్టీ ప్రచారానికి చక్కగా వాడుకుంటున్నారు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి–మా ఊరు సభలు రసాభాసగా మారుతున్నాయి. టీడీపీ నేతలు మాత్రం ఈ వేదికలను తమ సొంత ప్రచారానికి వాడుకుంటున్నారు. ప్రభుత్వ ఖర్చుతో తమ పార్టీకి ప్రయోజనం చేకూరేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాఠశాలల ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తున్నారు.బొబ్బిలిలో మంత్రికి చేదు అనుభవంబొబ్బిలి మున్సిపాలిటీలోని 15వ వార్డులో నిర్వహించిన జన్మభూమి సభలో మంత్రి రంగారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ రూ.15 లక్షలతో చేపల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించేందుకు మత్స్యశాఖ, పీఆర్ అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ఈ భవనానికి జీఎస్టీ నిబంధనల వల్ల రూ.2.50 లక్షల నష్టం వచ్చిందని కాంట్రాక్టర్ సాయి అక్కడున్న గదులకు అంతకు ముందే తాళం వేసి వెళ్ళిపోయాడు. రిబ్బన్ కట్చేసి లోపలకి వెళ్లిన మంత్రి రంగారావు అక్కడున్న గదులకు తాళం చూసి అవాక్కయ్యారు. తాళం తీయమని అధికారులను కోరారు. దీనికి పీఆర్ డీఈఈ కె.శ్రీనివాసరావు సమాధానమిస్తూ కాంట్రాక్టర్ వద్ద తాళాలున్నాయని ఇక్కడే ఎక్కడో ఉంటాయని సమాధానమివ్వడంతో మంత్రి చిన్నబుచ్చుకున్నారు. చివరకు తాళం తీయకపోవడంతో ఆయన వెనుతిరిగి సభా వేదిక వద్దకు వెళ్ళిపోయారు. అలాగే అప్పయ్యపేటలో జరిగిన గ్రామసభలో పీస గౌరి అనే మహిళ తన బుద్ధిమాంద్యంగల కుమారుడు గణేష్ను చూపించి ఇతనికి పింఛన్ కోసం సంవత్సరాలుగా తిరుగుతున్నా అధికారులు, కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదని అడగ్గా అయ్యో అంటూనే ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని మంత్రిని అడుగుదామన్నా వెంటనే వెళ్ళిపోయారని అప్పయ్యపేట వాసులు నిరుత్సాహంతో వెనుతిరిగారు. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం: చీపురుపల్లి నియోజకవర్గంలో మెరకముడిదాం మండలంలోని యాడిక గ్రామంలో అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బొత్స మోహనరావు తదితరులు అధికారులను నిలదీశారు. దీనికి స్పందించిన ఆ గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ సాంబ కలుగజేసుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గుర్ల మండలంలో పున్నపురెడ్డిపేటలో వ్యవసాయానికి సంబంధించి జింకు, బోరాన్ ఎరువులు అందుతున్నాయా లేదా అని కలెక్టర్ ప్రశ్నించగా ఓ రైతు అందడం లేదని చెప్పడంతో వ్యవసాయ శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గరివిడి మండలంలోని బొండపల్లి గ్రామంలో ఇళ్లు బిల్లులు అందడం లేదని, పింఛన్లు మంజూరు కావడం లేదని పలువురు లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. ప్రతిపక్షాల ఆగ్రహం: పార్వతీపురం పట్టణం 19వ వార్డులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నాయకులు పాలకులను నిలదీశారు. వైకేఎం కాలనీలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. శ్మశాన వాటిక, రేషన్ డిపో కావాలని నాలుగేళ్లుగా ప్రజలు అడుగుతున్నా నేటి వరకు సమస్యను ఎందుకు పరిష్కరించలేదని అధికారులను ప్రశ్నించారు. కురుపాం మండలంలోని లడ్డంగి గ్రామంలో గిరిజనులు కనీస సౌకర్యాల కోసం, రహదారులు పక్కా ఇళ్లు మంజూరు కోసం, అలాగే 130 జీఓను రద్దు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో అధికారులను అడ్డుకున్నారు. కొమరాడ మండలంలో దుగ్గి గ్రామంలో నిర్వాసిత సమస్యలు పరిష్కరించలేదని, ఇప్పుడు ఈ సభలెందుకంటూ గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు బొండపల్లి మండలం గొట్లాం, గజపతినగరం మండలంలోని తుమ్మికాపల్లి సభల్లో ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు పాల్గొన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, గోశాలలు మంజూరు చేయడం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రాపురం, ఎస్బూర్జివలసలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించకుండా ఊకదంపుడు ప్రసంగాలకా వచ్చారంటూ గ్రామస్తులు ఆగ్రహిం చారు. పాచలవలసలో జరిగిన సభలో పొదుపు మహిళలకు రూ.10వేలు డిపాజిట్ చేస్తే దానికి డబుల్గా పేపెంట్ చేస్తామని సొమ్ము కట్టించుకుని ఇప్పటికీ మహిళలకు అందించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమల గోవిందు అధికారులను నిలదీశారు. సాలూరు, జగన్నాథపురంలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు పసుపు,కుంకుమ, ఉపాధి బిల్లులు ఇవ్వలేదని అధికారులను నిలదీస్తుంటే టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. నెల్లిమర్ల నగరపంచాయతీ జరజాపు పేటలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సీపీఎం నేతలు కిల్లంపల్లి రామారావు, కె.రాము తదితరులు పలు సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. సమస్యలను పరిష్కరించలేని జన్మభూమి సభలెందుకు అని ప్రశ్నించారు. శ్వేత పత్రం చదవటమే అభివృద్ధా ‘శ్వేతపత్రాలు, కరపత్రాలు చదవటం కాదండి... గ్రామాన్ని సందర్శించి అభివృద్ది చూపండి’ అంటూ వేపాడ మండలం ఆకుల సీతంపేట ఎంపీటీసీ అడపా ఈశ్వర్రావు, మాజీ ఉప సర్పంచ్ కేదారి వీరన్నదొర అధికారులను నిలదీశారు. 2014లో గ్రామంలో నాలుగు ఇళ్లు అగ్నిప్రమాదంలో కాలిపోతే ఇద్దరికే ఇళ్లు మంజూరుచేశారని, నేటికీ రామదాసు సుభద్రమ్మ, దబ్బి అప్పారావులకు ఇళ్లు మంజూరుచేయలేదని, కొన్ని నిర్మాణాలు జరిగిన ఇళ్లకు పేమెంట్లు ఇవ్వలేదంటూ అధికారులను నేరుగా తీసుకెళ్లి చూపించారు. దీంతో మాజీసర్పంచ్ అప్పలసూరికి వీరితో వాగ్వివాదానికి దిగారు. లక్కవరపుకోట మండలం గంగుబూడి గ్రామంలో గత జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన వినతులకు కనీసం స్పందన లేనప్పుడు ఈ సభలు ఎందుకు అని గ్రామస్తులు అధికారులను కడిగిపారేశారు. సభను 12 గంటల వరకు జరగకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తులను సముదాయించడంతో సభ కాస్త ఆలస్యంగా ప్రారంభించి తూతూ మంత్రంగానే ముగించేసారు. ప్రచార సభలుగా... విజయనగరం మండలం పినవేమలిలో జన్మభూమి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంగా సాగింది. పట్టణంలో మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ను కాదని ఉదయాన్నే నిర్వహించేశారు. మధ్యాహ్నం సభ జరుగుతుందని భావించిన వార్డు ప్రజలంతా అధికార పార్టీ నేతల తీరుతో కంగుతిన్నారు. లంకవీధిలో గల మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీకి సంబంధించిన పాటలు వేస్తూ హడావుడి చేశారు. పాఠశాల జరుగుతున్న సమయంలో అదే ప్రాంగణంలో సభను ఏర్పాటు చేయటంతో పాటు ఇలా పాటలు వేయటంతో విద్యార్ధులు తరగతులు వదిలి ఆటపాటలకే పరిమితమయ్యారు. -
మా ఊరు.. నిరసనల హోరు
సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి–మావూరులో నిరసనలు హోరెత్తుతున్నాయి. రెండో రోజైన గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను ఎక్కడికక్కడ ప్రజలు నిర్బంధించారు. పిం ఛన్లు, రేషన్కార్డులు, గృహాలు, మరుగు దొడ్ల బి ల్లులు చెల్లింపులపై నిలదీశారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించలేనప్పుడు జన్మభూమి సభలెందుకంటూ మండిపడ్డారు. రాష్ట్రమంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో పాల్గొనగా, మరోమంత్రి కిడారి శ్రావణ్కుమార్ పాడేరు, హుకుంపేట మండలాల్లో కలెక్టర్ ప్రవీణ్కుమార్తో కలిసి ఈ సభల్లో పాల్గొన్నారు. తొలిరోజు నిరసన సెగను ఎదుర్కొన్న మరో మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం రెండ రోజు సభలకు దూరంగా ఉన్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బండారు సత్య నారాయణమూర్తి, వంగలపూడి అనిత తదితరులకు రెండోరోజు కూడా నిరసన సెగలు తప్పలేదు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్కుమార్లు సభలకు వచ్చిన అర్జీదారులపై అసహనం ప్రదర్శించారు. సభలకు డ్వాక్రా సంఘాలు, విదా ్యర్థులను బలవంతంగా తరలించారు. మరోవైపు జన్మభూమి సభలకు వచ్చిన సిబ్బందికి మధ్యా హ్న భోజన పథకం కింద పిల్లలకు తయారు చేసిన భోజనాలు పెడుతున్నారు. ఇది వార్డెన్లు, ఏజెన్సీ నిర్వాహకులకు భారమవుతోంది. భీమిలిలో రసాభాస భీమిలి జోన్ ఒకటోవార్డు బంగ్లామెట్టపై జరిగిన గ్రామసభలో మహిళలు తాగునీటి కోసం అధి కారులను నిలదీయడంతో రసాభాసగా మారిం ది. బంగ్లామెట్టపై కుళాయిల ద్వారా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేక పోయిందన్నారు. బోరు బావులు కూడా లేనందున మహిళలు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. మెట్టపై తాగునీటి పథకం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో గంటపాటు సభకు ఆటంకం కలిగించారు. ఇళ్ల సమస్య తేల్చండి పదేళ్లుగా కాలనీలో ఇళ్ల సమస్యను తేల్చకుండా నాన్చుతున్నారని, ఈ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో తెలపాలని ఆనందపురం మండలం వెల్లంకిలో జరిగిన గ్రామసభలో అధికారులను స్థానికులు నిలదీశారు. గొలగాని చిన్నమ్మ అనే అంధురాలు కాలనీ కోసం ఐదేళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆర్డీవో తేజ్ భరత్కు వివరించారు. ఎనిమిదేళ్ల కిందట 440 మందికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జాబితాను విడుదల చేశారని, కానీ నేటి వరకు అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 70 మందికి రూ.25 లక్షల వరకు రుణమాఫీ అయిందని అధికారులు సభలో ప్రకటించగా.. వివరాలను వెల్లడించాలని గ్రామస్తులు పట్టుబట్టారు. దరఖాస్తులు బుట్టదాఖలు పద్మనాభం మండలం ఐనాడలో జరిగిన జన్మభూమి సభ రసాభాస అయింది. అసంపూర్తిగా మరుగుదొడ్లు నిర్మించిన అధికార పార్టీకి చెందిన వారికి బిల్లులు మంజూరు చేశారని, వైఎస్సార్ సీపీకి చెందిన వారు పూర్తిగా మరుగుదొడ్లు నిర్మించినా బిల్లులు మంజూరు చేయలేదని ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మామిడి శివరామకృష్ణ ఆరో పించారు. హుద్హుద్ బాధితులకు ఇళ్లు, ఒంటరి మహిళలకు ఎందుకు పింఛన్లు మంజూరు చేయడం లేదని అధికారులను మహిళలు నిలదీశారు. జన్మభూమి సభల్లో చేసుకున్న దరఖాస్తులను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా.? గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో 64వ వార్డు సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ నేత పల్లా చినతల్లి, నాయకుడు పల్లా పెంటారావు కోరారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నాయకులు కార్యక్రమం ఆఖరులో అవకాశం ఇస్తామని చెప్పడంతో.. చివ ర్లో అవకాశం ఇస్తే ప్రయోజనం ఏముందని వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఐ కె.రామారావు ఆదేశాలతో ఎస్ఐలు వారిని వేదిక కిందకు దింపేశారు. దీంతో వారు వేదిక ముందే నిరసన తెలిపారు. వార్డులో భూ కబ్జాలు పెరిగిపోయానని, ఇళ్లు మంజూరు కావాలంటే రూ.50 వేలు లంచం కావాలని జన్మభూమి కమిటీ డిమాండ్ చేస్తోందని వారు ఆరోపించారు. జిల్లాలోనూ నిరసనల పర్వం ఏజెన్సీలోని జి.మాడుగుల–సొలభం రోడ్డు పనులు చేపట్టాలని సొలభం, గడుతూరు, వంతాల, పెదలోచలి పంచాయతీల గిరిజనులు, మహిళా సంఘం, గిరిజన సంఘం, వైఎస్సార్సీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అధికారులను అడ్డుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖమంత్రి కిడారి శ్రావణ్కుమార్, కలెక్టర్ ప్రవీణ్కుమార్ హుకుంపేట, అడ్డుమండ గ్రామాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరిజనులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకోవడంతో మాట్లాడలేకపోయారు. అరకులోయ మండలం చొంపిలో జరిగిన గ్రామసభను గిరిజనులు అడ్డుకున్నారు. ఖాళీ బిందెలతో గిరిజనులు నిరసన తెలిపారు. ముంచంగిపుట్టు మం డలం సుజనకోట పంచాయతీ కేంద్రంలో జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. పాడేరు మండలం ఇరడాపల్లిలో సబ్సెంటర్ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ను డిమాండ్ చేశారు. కె.కోటపాడు మండలం వారాడలో జరిగిన జన్మభూమి సదస్సును రైతులు అడ్డుకున్నారు. -
ఇదేమి జన్మభూమి?
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : ‘ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం విద్యార్థుల్ని వాడుకోండి. జన్మభూమి కార్యక్రమం జరిగేంతవరకు వారినిగ్రామాలకు పంపించండి. బృందాలుగా విభజన చేసి ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయించడమే కాకుండా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయించండి’ కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాలివీ.... ఇప్పుడా ఆదేశాల ఆధారంగా నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్కు కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలిచ్చారు. యూనివర్సిటీ పరిధిలోని ఎన్ఎస్ఎస్ విద్యార్థులందర్నీ జన్మభూమి అయిపోయేంతవరకు గ్రామాల్లోకి పంపించి, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయించాలని లిఖిత పూర్వక ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించారు. ఇంకేముంది నన్నయ యూనివర్సిటీ పరిధిలోని 450 కళాశాలలకు వైస్ చాన్సలర్ తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాలల్లో ఉన్న ఎన్ఎస్ఎస్ విద్యార్థుల్ని తప్పనిసరిగా జన్మభూమి కార్యక్రమానికి పంపించండని ఆదేశించారు. ప్రస్తుతం కళాశాల యాజమాన్యాలు అదే పనిలో ఉన్నాయి. ఎన్ఎస్ఎస్ విద్యార్థులందర్నీ జన్మభూమికి పంపించే పనిలో పడ్డారు. అధికార పార్టీకి ఉపయోగపడే ప్రచారంలో తమల్ని భాగస్వామ్యం చేయడమేంటని విద్యార్థులు మదనపడుతున్నారు. ఒక్క ఎన్ఎస్ఎస్ విద్యార్థుల్నే కాదు వైస్ చాన్సలర్, ప్రొఫెసర్లు, అధ్యాపకులు కూడా భాగస్వామ్యం కావాలని ఆదేశించడంతో జన్మభూమి ముగిసేవరకు వారంతా గ్రామాల్లో ఉండాల్సిందే. అధికారికంగా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం, దాని ఆధారంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్కు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం, ఆమేరకు కళాశాలలకు వైస్ చాన్సలర్ ఆదేశాలివ్వడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. నన్నయ యూనివర్సిటీ పరిధిలోఇలా చేయాలట...! నన్నయ యూనివర్సిటీ పరిధిలో 450 కళాశాలలున్నాయి. కళాశాలకు ఒక యూనిట్ చొప్పున 120 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులుంటారు. వారిలో 60 మందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి కళాశాల దత్తత గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేయాలట. మిగతా 60 మందిని 12 యూనిట్లుగా విభజించి యూనిట్కు ఐదుగురు చొప్పున విద్యార్థుల్ని నియమించి, వారికొక ఉపాధ్యాయుడ్ని అప్పగించి, మండలమంతా ప్రచారం చేయాలి. ఇప్పడదే పనిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు నిమగ్నమయ్యారు. రెండో రోజూ నిరసన సెగ... ఆరో విడత జన్మభూమి రెండో రోజు కార్యక్రమాలకూ నిరసన సెగ తగిలింది. జిల్లావ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున అధికారులను, ప్రజా ప్రతినిధులను నిలదీశారు. సమస్యలు పరిష్కారం కావడం లేదని, గ్రామాలకు రావడమెందుకని నిరసనలు తెలియజేశారు. కొన్నిచోట్ల ఏకంగా గ్రామసభలను బహిష్కరించారు. దీంతో పలుచోట్ల జన్మభూమి సభలు రసాభాసగా మారాయి. అమలాపురంలో... ఉప్పలగుప్తం మండలం నంగవరం జన్మభూమి గ్రామసభలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలుగుదేశం నాయకులు చెప్పారు. దీనిపై గ్రామసభకు హాజరైన మాజీ సర్పంచి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇందలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి కేవలం 10 శాతం నిధులు మాత్రమేని, మిగిలినవి కేంద్ర ప్రభుత్వ నిధులంటూ చెప్పారు. దీంతో ఆగ్రహించిన గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గుర్లింక చిన్న వాగ్వివాదానికి దిగి పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఈ పరిణామంతో మాజీ ఎంపీపీ శిరంగు సత్తిరాజు, మాజీ సర్పంచి జున్నూరి వెంకటేశ్వరరావు గ్రామసభను బహిష్కరించారు. పెద్దాపురంలో... ప్రభుత్వ సంక్షేమ పథకాలు జన్మభూమి కమిటీ సభ్యులకేనా.. ప్రజలకు కాదా అంటూ పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలోని జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో గ్రామ రైతులు గురువారం అధికారులు, ప్రజా ప్రతినిధులను నిలదీశారు. గ్రామంలో అమలు కావాల్సిన సంక్షేమ పథకాలు ఒక వర్గానికి సంబంధించినవిగా ఉంటున్నాయని, ఏమైనా అడిగితే జన్మభూమి కమిటీల పెత్తనంతో అర్హులకు సంక్షేమ పథకాలు రాకుండా చేస్తున్నారంటూ గ్రామ రైతులు మండిపడ్డారు. కాకినాడరూరల్లో అనర్హులకు ఇళ్ళపట్టాలు ఎలా ఇస్తారని కరప మండలం అరట్లకట్టలో జేడ్పీటీసీ బుంగా సింహాద్రి, ఎంపీపీ బుల్లిపల్లి శ్రీనివాసరావులను గ్రామస్తులు నిలదీశారు. భర్తచనిపోయి ఏడాది అవుతున్నా వింతంతు పింఛన్లు ఇవ్వడంలేదంటూ సమస్యలను ఎకరువు పెట్టారు, గొడ్డటిపాలెం గ్రామసభలో స్థానికులు మాట్లాడుతూ గతంలో ఇళ్ళ స్థల పట్టాలను ఇచ్చినవారికి రద్దు చేసి వేరొకరికి ఇవ్వడంపై నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామసభకు ప్రజలు రాకపోవడంతో పాఠశాల పిల్లలను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దీంతో గ్రామసభ వెలవెలబోయింది. ప్రత్తిపాడులో... శంఖవరం మండలం అన్నవరంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో సమస్యలు పరిష్కరించడంలేదంటూ గ్రామస్తులునిరసనలు తెలిపారు. రంపచోడవరంలో... రహదారి సౌకర్యం, మౌలిక సదుపాయాలు లేవని ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదని విలీన మండలమైన ఎటపాకలో జన్మభూమి గ్రామభను గ్రామస్తులు బహిష్కరించారు. మోతుగూడెం ఎస్సీకాలనీకి వాటర్ సదుపాయం కల్పించలేదని, శివారు గిరిజన ప్రాంతాలకు సీసీరోడ్లు వేయలేదని, ఉపాధి హామీ పనులు, మరుగుదొడ్లు అసంపూర్తిగా నిలిచిపోవడంపై అధికారులను, ప్రజాప్రతినిధులును గ్రామస్తులు నిలదీశారు. దీంతో సభ రసాభాసగా సాగింది. -
నిలదీస్తే బెదిరింపులు.. అరెస్టులు
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: నాలుగున్నరేళ్లుగా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు ప్రశ్ని స్తున్నారు. ప్రజలు ప్రశ్నించడాన్ని సహిం చలేని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జన్మభూమి రెండోరోజు బెదిరింపులకు దిగారు. ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏం తమాషా చేస్తున్నావా ‘ఏం తమాషా చేస్తున్నావా.. వైఎస్సార్సీపీ కార్యకర్తవా జీవితంలో రూపాయి లబ్ధి రాకుండా చేస్తా... ఏమనుకున్నావు? అంటూ ఓ మహిళపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక 28వ డివిజన్ అశోక వర్ధన పాఠశాలలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఓ మహిళ మైక్ తీసుకొని ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నా.. మంజూరు చేయలేదని, పావలా వడ్డీకి డ్వాక్రా రుణాలు సక్రమంగా అందడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చింది. దీంతో ఎమ్మెల్యే నువ్వు ఆగు ఇంకా అనడంతో ఒక్కసారిగా స్థానిక కార్పొరేటర్ ఆ మహిళ వద్ద నుంచి మైక్ లాక్కున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్య చెప్పుకుంటే డబ్బు వస్తుంది. నువ్వు వైఎస్సార్ సీపీ కార్యకర్తలా అరిస్తే, జీవితంలో రూపాయి రాకుండా చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏ ఆగు నీకు మైక్ ఇచ్చింది.. సమస్యలు చెప్పుకోవడానికి మీటింగ్లు చెప్పడానికి కాదు’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. పావలా వడ్డీకి రుణాలు అందడం లేదని చెబుతున్నా వినకుండా ఆగ్రహించడం సరికాదని ఆ మహిళ చెబుతుండగా టీడీపీ నేతలు ఆమెను పక్కకు తీసుకువెళ్లి బుజ్జిగించారు. ప్రశ్నిస్తే అరెస్టులే... చాగల్లు మండలంలో ఊనగట్లలోనూ మంత్రి జవహర్ను సమస్యలపై ప్రశ్నిం చిన మట్టా శివ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మీ సమస్యలు తెలపండి అని అడగడంతో గ్రామానికి చెత్త ట్రాక్టర్ రావటం లేదని, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, డ్రెయినేజీ వ్యవస్థ బాగో లేదని మట్టా శివ మంత్రి జవహర్కి వివరించారు. ఈ సమస్యలపై 1100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని జవహర్ చెప్పడంతో వెంటనే శివ తన ఫోన్ నుంచి 1100కు ఫోన్ చేసి ఫోన్ కలవడం లేదని మంత్రికి చెప్పాడు. దీంతో మంత్రి ఆగ్రహించారు. శివను పోలీసులు అదుపులోకి తీసుకుని చాగల్లు పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లారు. జనాలు కరువు జిల్లావ్యాప్తంగా జన్మభూమి సభలు ప్రజాప్రతినిధుల ప్రసంగాలకే పరిమితమయ్యాయి. ప్రజల నుంచి అర్జీల స్వీకరణ మినహా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి అందించడం లేదు. నిడదవోలులో సభకు జనాలు రాకపోవడంతో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళా శాల విద్యార్థులను సభకు తరలించి, వారిని ముందు వరుసలో కూర్చొబెట్టి సభను మమ అనిపించారు. వచ్చిన కొద్దిపాటి జనం కూడా మధ్యలోనే విసుగు చెంది వెళ్లిపోయారు. వారిని బతిమలాడి కూర్చో బెట్టడానికి టీడీపీ నేతలు అవస్థలు పడ్డారు. గ్రామసభను అడ్డుకున్న టీడీపీ నాయకులు అధికార పార్టీలోని విభేదాలు జన్మభూమి గ్రామసభను అడ్డుకొనే వరకూ వచ్చాయి. భీమోలులో టీడీపీ మండల అధ్యక్షుడు మేణ్ణి సుధాకర్ అభివృద్ధి పనులను అడ్డుకుంటూ తమలో మాకు తగాదాలు పెడుతున్నారని టీడీపీ యూత్ మండల అధ్యక్షుడు బెజవాడ మోహన్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు, ఇంటి పట్టాలకు గ్రామ పెద్దలు పెట్టిన జాబితాలు బయట పెట్టాలని, అప్పటి వరకూ గ్రామసభను జరగనివ్వబోమని పట్టుబట్టారు. తొక్కిరెడ్డిగూడెం, భీమోలు గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీలు చెప్పిన వారికి ఇళ్లు కేటాయించకుండా ఇంటికి రూ.10వేల నుంచి రూ. 20వేల వరకూ తీసుకుని కేటాయించారని మేణ్ణి సుధాకర్పై ఫిర్యాదు చేశారు. అల్లరి చేయడానికి వచ్చారా!ఆగ్రహించిన ఎమ్మెల్యే శివ పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గరగపర్రు గ్రామాల్లో జరిగిన జన్మభూమి సభల్లో ప్రజలు ఎమ్మెల్యే శివను ఐదేళ్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిలదీశారు. ఇళ్లస్థలాల కోసం ప్రశ్నించిన వారితో ఎమ్మెల్యే పండగ వెళ్లాక చూద్దాం అంటూ చెప్పడంతో ఎన్ని పండగలు వెళ్లాయంటూ వారు నిలదీయడంతో అల్లరి చేయడానికి వచ్చారా అంటూ ఎమ్మెల్యే శివ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత ఇంటి ముంగిట జన్మభూమి పాలకొల్లు గవరపేటలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభ టీడీపీ నేత ఇంటి ముంగిట్లో నిర్వహించడం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆ టీడీపీ నేతకు వ్యతిరేకంగా ఉన్న గ్రామస్తులు, అలాగే వైఎస్సార్ సీపీ శ్రేణులు సభను బహిష్కరించారు. తాజా మాజీ సర్పంచ్ యల్లపు వెంకటరమణ అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. జనం కోసం లక్కీడిప్ పాలకొల్లు మండలంలో గ్రామ సభలకు జనం రాకపోవడంతో జనాలను రప్పించేందుకు తహసీల్దార్ దాసి రాజు జన్మభూమి లక్కీడిప్ అంటూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. లక్కీడిప్ తీసి అందులో వచ్చిన నంబర్కి చీరలు బహూకరిస్తున్నారు. రోజూ ఐదుసార్లు లక్కీడిప్ తీసి ఐదు చీరలు పంచుతున్నారు. -
నిరసన జ్వాల
కర్నూలు(అగ్రికల్చర్): ‘ఇది వరకు ఐదు సార్లు జన్మభూమి నిర్వహించారు. అది చేస్తాం, ఇది చేస్తామంటూ హామీలు గుప్పించారు. వివిధ సమస్యలపై వినతులు ఇచ్చాం. ఏ ఒక్కటీ పరిష్కరించలేదు. అలాంటప్పుడు ఈ సభలెందుకు’ అంటూ ప్రజలు మండిపడ్డారు. ఆరో విడత జన్మభూమి – మాఊరు కార్యక్రమం బుధవారం ప్రజల నిరసనల మధ్య ప్రారంభమైంది. మొదటి రోజు 96 గ్రామ పంచాయతీలు, 27 వార్డుల్లో.. మొత్తంగా 123 సభలు నిర్వహించారు. గూడూరు మండలం కె.నాగులాపురం, కోడుమూరు, కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని 19 వార్డులో జరిగిన సభల్లో కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. కోడుమూరు, నాగలాపురం గ్రామాల్లో మార్గదర్శకాలను పాటించకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్రావును కలెక్టర్ ఆదేశించారు. జన్మభూమిలో ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని చదవడం, గ్రామంలో ఇంతవరకు చేసిన అభివృద్ధి పనుల వివరాలను చదివి వినిపించడానికే పరిమితమయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పర్యాటక శాఖ మంత్రిభూమా అఖిలప్రియ మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొనలేదు. నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా నోడల్ అధికారులుగా నియమితులైన ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు జిల్లాలో పర్యటించారు. పలుచోట్ల జనాలు లేక సభలు వెలవెలబోయాయి. పింఛన్లు పంపిణీ చేస్తామని వృద్ధులు, వికలాంగులు, వితంతువులను రప్పించి సభలను మమ అనిపించారు. కొన్ని గ్రామాల్లో అయితే విద్యార్థులను పిలుచుకొని వచ్చి కార్యక్రమాన్ని కానిచ్చారు. అన్నవరంలో బహిష్కరణ... ♦ అవుకు మండలం అన్నవరం గ్రామ ప్రజలు జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఉన్నారనే కారణంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. అలాంటప్పుడు జన్మభూమి దండగ అంటూ బహిష్కరించారు. గ్రామస్తుల మూకుమ్మడి నిరసనతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ♦ గడివేముల మండలం బిలకలగూడూరులో గ్రామసభ నిర్వహణకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఇచ్చిన వినతులకే దిక్కులేదు.. ఇప్పుడిచ్చే దరఖాస్తుల పరిష్కారానికి ఎంతకాలం పడుతుందోనని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ♦ కల్లూరు మండలం తడకనపల్లిలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మర్రి గోపాల్ వివిధ సమస్యలపై అధికారులను నిలదీశారు. విద్యుత్ పోల్ లేకపోవడం వల్ల కర్రలపై లైన్ వేసుకున్నామని, దీనిపై గతంలో మూడు సార్లు వినతులు ఇచ్చినా అతీగతీ లేదని అన్నారు. ♦ కర్నూలు 19వ వార్డులో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొని.. వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 19వ వార్డుకు మీసేవ కేంద్రం కేటాయించాలని, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ సదుపాయం కల్పించాలని కోరారు. ♦ ఆలూరు మండలం కురవెల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప ప్రజలు కనిపించలేదు. అప్పటికప్పుడు విద్యార్థులను రప్పించి మమ అనిపించారు. ♦ హాలహర్వి మండలం విరుపాపురం, దేవనకొండ మండలం కుంకనూరు, అలారుదిన్నె, ఆస్పరి మండలం నగరూరు గ్రామాల్లో అధికారులను నిలదీశారు. నగరూరులో తీవ్ర నీటి సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని ధ్వజమొత్తారు. కుంకనూరు, అలారుదిన్నె గ్రామాల్లో ఉపాధి కూలీలకు వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ♦ నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు, జూపాడుబంగ్లా, నందికొట్కూరు మండలాల్లో జన్మభూమి కార్యక్రమానికి స్పందన కరువైంది. ఆత్మకూరు, కోవెలకుంట్ల, ఓర్వకల్లు, డోన్ తదితర మండలాల్లోనూ సభలు తూతూ మంత్రంగా జరిగాయి. సీఎం ప్రసంగాన్ని పట్టించుకోని ప్రజలు బుధవారం సాయంత్రం రాష్ట్ర విభజన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈ ప్రసంగాన్ని ప్రజలు వినేలా అధికారులు అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రజలు నామమాత్రంగా కూడా రాలేదు. ప్రతి రోజు ఒక అంశాన్ని ఎంపిక చేసి దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి పంచాయతీకి ఒక టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్లు 10 రోజుల పాటు గ్రామాల్లోనే ఉండాల్సి ఉంది. ప్రతి రోజు ఒక అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. దీన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రసారం చేస్తారు. అయితే.. మొదటి రోజే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వినిందుకు ప్రజలు రాకపోవడం గమనార్హం. -
నిలదీతలు.. నిరసనలు
సాక్షి, అమరావతిబ్యూరో: జన్మభూమి సభలు తొలిరోజు ప్రజలు లేక వెలవెలబోయాయి. పలు చోట్ల తమ సమస్యలు పరిష్కారం కాలేదని అధికారపార్టీ నేతలను ప్రజలు నిలదీశారు. గత నాలుగేళ్లుగా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు గ్రామసభలు ఎందుకంటూ అధికార పార్టీ నేతలను ప్రశ్నించి, నిరసన తెలిపారు. మొత్తం మీద జన్మభూమి – మా ఊరు సభలకు జనాలు రాకపోవడంతో పింఛన్లు ఇస్తామంటూ వృద్ధులను, డ్వాక్రా మహిళలను పిలిపించి మమా అనిపించారు. పలు చోట్ల జరిగిన జన్మభూమి సభలు కాస్త టీడీపీ నాయకుల రాజకీయ ప్రచార సభలుగా మారాయి. ♦ గుంటూరు నగరంలోని నల్లచెరువులోని 18, 19 డివిజన్లలో జరిగిన జన్మభూమి సభల్లో ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, రేషన్ కార్డులు, గత మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్నా ఇవ్వడం లేదంటూ మహిళలు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డిని నిలదీయడంతో జన్మభూమి సభ రసభాసగా మారింది. ♦ రేపల్లె నియోజకవర్గంలో ధూళిపూడి గ్రామంలో జనాలు లేక జన్మభూమి సభలు వెలవెలబోయాయి. చెరుకుపల్లి మండలం కుంచలవానిపాలెం పంచాయతీలో జెడ్పీటీసీ సభ్యుడు టి.శ్రీనివాసరెడ్డి అంగన్వాడీ న్యూట్రీషిన్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ. 2.50 లక్షలు తీసుకున్నాడని, ప్రస్తుతం ఆపోస్టులో రద్దు కావడంతో జెడ్పీటీసీ సభ్యుడు డబ్బులు ఇవ్వకపోవడంతో తమ కోడలు శివలక్ష్మి మతిస్థిమితం లేకుండా పోయిందంటూ ఆమె బంధువులు గ్రామసభలో ఎమ్మెల్యేను నిలదీశారు. ♦ ప్రత్తిపాడు నియోజకవర్గంలో జొన్నలగడ్డ, నల్లపాడు ప్రాంతాల్లో రేషన్, పింఛన్లు రావడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పెందనందిపాడు మండలం అబ్బినేని గుంటపాలెంలో రైతురథం ట్రాక్టర్లు అధికార పార్టీ నేతలకే ఇస్తున్నారని, మిగతా రైతులను పట్టించుకోవడంలేదని నిరసన తెలిపారు. ♦ తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో పెథాయ్ తుపానుకు తడిచి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలంటూ భారతీయ కిసాన్ సంఘ సభ్యులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ♦ మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ కాలేదంటూ నిలదీశారు. మంగళగిరి మండలంలో రామచంద్రాపురంలో సైతం అదే పరిస్థితి నెలకొంది. జన్మభూమి సభలు టీడీపీ ప్రచార సభలుగా మారాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. n వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఈపూరు గ్రామంలో మరుగుదొడ్లకు బిల్లులు చెల్లించడం లేదని పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును నిలదీశారు. బిల్లులు ఇప్పిస్తామని మరుగుదొడ్లకు సంబంధించిన పత్రాలు తీసుకుని వాటి బిల్లులను కొంత మంది కాజేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ♦ సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి, రొంపిచర్ల మండలాల్లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. జన్మభూమి సభల్లో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల మాట్లాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని, రాజకీయ ప్రసంగానికి తెరలేపారు. ♦ మాచర్ల పట్టణంలో బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి పట్టణానికి తాగునీరందించే పథకం పనులు పూర్తి కాలేదంటూ బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. పలు మండలాల్లో తమ సమస్యలు పరిష్కారం కాలేదంటూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ♦ తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం వెంకటగ్రామంలో మూడేళ్ల నుంచి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని, అధికారులను నిలదీశారు. కంతేరు గ్రామంలో జెడ్పీవైస్చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావును విద్యార్థులకు స్కాలర్షిప్పులు రావడం లేదంటూ తల్లిదండ్రలు ఆందోళన వ్యక్తం చేశారు. ♦ పెదకూరపాడు నియోజకవర్గంలోని 75 త్యాళ్లూరులో బుడగజంగాల కాలనీకి వెళ్లేందుకు కనీసం రోడ్డు కూడా లేదంటూ కాలనీ వాసులు అధికారులను అడ్డుకున్నారు. ♦ చిలకలూరిపేట నియోజకవర్గంలో కుక్కపల్లెవారిపాలెం గ్రామంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా భూ విస్తీర్ణం వెబ్ల్యాండ్లోకి ఎక్కించడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. యడ్లపాడు మండలంలో డ్వాక్రా మహిళలకు రుణాలు అందడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పెసర్లంకలో అధికారుల నిర్బంధం వేమూరు నియోజకవర్గంలోని పెసర్లంకలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ‘జన్మభూమి – మా ఊరు’లో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హద్దులు తేల్చాలని గత విడత జన్మభూమి కార్యక్రమంలో అర్జీలు అందించినా, జిల్లా కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం లేదని వాపోయారు. ఈ క్రమంలో అ«ధికారులను అడ్డుకుని గ్రామస్తుల సమస్యను పరిష్కరించిన తర్వాత గ్రామ సభ నిర్వహించుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళలు, పిల్లలు, పెద్దలు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అధికారులను రిజిస్టర్లలో సైతం సంతకాలు పెట్టనీయలేదు. ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన అధికారులు 10 గంటలకు రాగా, సాయంత్రం వరకు వారిని నిర్బంధించారు. -
సభలెందుకు దండగ!
ఐదేళ్లుగా పెడుతున్న అర్జీలకు అతీగతి లేదన్న ఆవేదన.. పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాలేదన్న ఆక్రోశం.. కష్టాలు తీర్చని సభలు ఎందుకన్న ప్రశ్నలు.. చుట్టపు చూపుగా వచ్చేందుకా మిమ్మల్ని ఎన్నుకున్నది అని అధికార పార్టీ ప్రతినిధులకు నిలదీతలు.. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన ఎమ్మెల్యేలు, అధికారులు.. మరో వైపు సమస్యలు పక్కనబెట్టి ఆటల పాటలతో కాలక్షేపం.. ఇవి తొలి రోజు జిల్లాలో నిర్వహించిన ‘జన్మభూమి–మాఊరు’ కార్యక్రమంలోకనిపించిన దృశ్యాలు. సాక్షి, మచిలీపట్నం: ప్రజా సమస్యల పరిష్కారమే ధేయ్యంగా ప్రభుత్వం బుధవారం నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా తొలి రోజు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సభలు ఏర్పాటు చేసింది. అయితే కొన్ని చోట్ల సభలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయనిఎమ్మెల్యేలు, అధికారులను ప్రజలు నిలదీశారు. ♦ నూజివీడు 2వ వార్డులో మహిళలు మున్సిపల్ అధికారులను నిలదీశారు. ఐదేళ్లుగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో అర్జీలు ఇస్తున్నా ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, అసలు తాము ఇస్తున్న అర్జీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ♦ పెనుగంచిప్రోలులో ఉదయం 11 గంటలకు కూడా గ్రామసభ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. గుమ్మడిదూరులో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను ప్రజలు ప్రశ్నించారు. ♦ జి.కొండూరు మండలం చెవుటూరు కార్యక్రమం రసాభాసగా మారింది. టీడీపీ పార్టీకి చెందిన వారమైనా.. తమ ఇళ్ల స్థలాలు కబ్జాకు గురయ్యాయని అర్జీలు పెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, ఇలాంటి సభలతో ప్రయోజనం ఎంటని ప్రశ్నించారు. కబ్జా దారులు స్థలాలు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని మహిళలు అధికారులను నిలదీశారు. ♦ కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో జరిగిన కార్యక్రమంలో సుబాబుల్ కర్రను రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను రైతులు నిలదీశారు. ♦ ఇబ్రహీంపట్నం మండలం దామలూరులో జరిగిన కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్కార్డులు మంజూరు చేయాలని దరఖాస్తులు వెల్లువెత్తాయి. ♦ తిరువూరు ఒకటో వార్డులో కొలికపోగు నారాయణ మృతి చెంది 4 నెలలైనా ఇంతవరకు చంద్రన్న బీమా సొమ్ము రాలేదని అతని కుటుంబసభ్యులు జన్మభూమి గ్రామసభలో ఆందోళన వ్యక్తం చేశారు. ♦ కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో కార్యక్రమాన్ని స్థానికులు కనీసం సీఎం సందేశం కూడా చదవనివ్వకుండా అడ్డుకున్నారు. పెథాయ్ తుపాను నష్టపరిహారం మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఆర్డీఓ, ఎమ్మెల్యే కాగిత ఫోన్లో మాట్లాడినా వినలేదు. దీంతో చేసేది లేక అధికారులు సభ జరపకుండానే వెనుదిరిగారు. సమస్యలు పక్కనబెట్టి.. స్టెప్పులేయించి.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన జన్మభూమి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కాలక్షేపానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులతో స్టెప్పులేయించి ఎంజాయ్ చేశారు. పెడన 2వ వార్డు, మొవ్వ మండలంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నారులతో డ్యాన్స్ చేయించి కాలక్షేపం చేశారు. కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చల్లపల్లి మండలం నడకుదురు జరిగిన జన్మభూమి కార్యక్రమంలో రాయుడుపాలెంకు చెందిన కౌలు రైతు బడుగు వెంకటేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాను ఎకరం పొలం కౌలుకు తీసుకుని సాగు చేశానని, ఇటీవల సంభవించిన పెథాయ్ తుపాను ప్రభావానికి పనలపై ఉన్న పంట తడిసిపోయిందన్నారు. ఈ విషయమై జన్మభూమి సభలో పంటనష్టంపై ప్రస్తావించారు. అధికారులు నష్టపరిహారంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకుని ఆయనకు నచ్చజెప్పారు. -
సెజ్ గ్రామంలో టీడీపీ హైడ్రామా..!
తూర్పుగోదావరి, పిఠాపురం: అక్కడ గ్రామ సభ జరపాలంటే అధికారపార్టీ నేతలకు హడల్... జరపకపోతే అభాసుపాలవుతామపుకున్నారో ఏమో సినీ ఫక్కీలో డ్రామాకు తెర లేపారంటున్నారు స్థానికులు. జన్మభూమి గ్రామ సభ జరిగితే తమకు న్యా యం చేయాలంటూ అధికార పార్టీ నేతలను నిలదీయాలని అక్కడి సెజ్ బాధిత రైతులు – మిగతా 2లోu ఎదురు చూస్తుంటే టీడీపీ నేతలు మాత్రం వారందరినీ బురిడీ కొట్టించి తమలో తామే గొడవ పడినట్లు నాటకమాడి గ్రామ సభను లేదనిపించేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆరో విడత జన్మభూమి గ్రామ సభలో భాగంగా కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలో బుధవారం నిర్వహించారు. అయితే ఆ గ్రామం సెజ్ బాధిత గ్రామం కావడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని ముందుగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతలో పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ గ్రామ సభకు వచ్చారు. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా కొత్తపల్లి ఎంపీపీ (టీడీపీ) పిర్ల సత్యవతి, ఆమె భర్త గంగాధర్ ఎమ్మెల్యేకు అడ్డుతగులుతూ తమకు మండలంలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, దానికి సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. అయితే సమాధానం చెప్పే సమయం ఇది కాదని సభ అయిన తరువాత చెబుతానంటూ ఎమ్మెల్యే వర్మ సభను జరుపుతుండగా ఎంపీపీ దంపతులు ఇద్దరు సభ నుంచి వెళ్లిపోయి ఎమ్మెల్యే కారుకు అడ్డంగా కూర్చుని సమాధానం చెప్పే వరకు వెళ్లనిచ్చేది లేదని ఆందోళనకు దిగారు. తూతూమంత్రంగా సభను ముగించేసిన ఎమ్మెల్యే వర్మ తన కారులో బయలుదేరగా ఎంపీపీ దంపతులు కారుకు అడ్డంగా ఉండిపోవడంతో పోలీసులు కలగజేసుకుని సర్దిచెప్పడంతో ఆందోళన విరమించేసి కారుకు తోవిచ్చేశారు. వారిలో వారు ఇలా గొడవ పడినట్లు కావాలనే హైడ్రామా ఆడారని, ఇన్నాళ్లూ లేని ప్రాధాన్యం గొడవ ఇప్పుడెందుకు తెరపైకి తెచ్చారని, ఇదంతా కావాలని అధికార పార్టీ నేతలు ఆడిన హైడ్రామాగా స్థానికులు చెప్పుకుంటున్నారు. నిజంగా వారికి అన్యాయం జరిగితే పోలీసులు చెబితే విరమించడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
రచ్చ రచ్చ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఆరో విడత జన్మభూమి కార్యక్రమం తొలి రోజే రచ్చరచ్చయింది. అత్యధిక చోట్ల అధికారులకు, ప్రజాప్రతినిధులకు నిరసనలు ఎదురయ్యాయి. దాదాపు ప్రతిచోటా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జన్మభూమి గ్రామ సభలను ప్రజలు పెద్ద ఎత్తున అడ్డుకున్నా రు. ఎక్కడికక్కడ తమ సమస్యలపై నిలదీశారు. పరిష్కారం కాని జన్మభూమి సభలెందుకని ఏకంగా జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పోలీసు బందోబస్తు మధ్య తొలి రోజు ‘మమ’ అనిపించేశారు. తొలి రోజే ఇలాఉందంటే మున్ముందు ఎలా ఉంటుందోనని అధికార వర్గాలు భయపడుతున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మరింత బందోబస్తు మధ్య నిర్వహించకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయేమోనని అభిప్రాయపడుతున్నాయి. ఆ మేరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఐదు విడతలుగా జరిగిన జన్మభూమిలో ఇచ్చిన అర్జీలకు అతీగతీ లేదు, వాటిని కనీసం పట్టించుకోలేదని, పరిష్కారం చేయకుండా ఇప్పుడు మళ్లీ అర్జీలు తీసుకోవడం ఎందుకని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. పలుచోట్ల అధికారులు, అధికార పార్టీ నేతలతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. రుణమాఫీ చేయలేదు... పింఛను ఇవ్వలేదు...రేషన్కార్డు మంజూరు చేయలేదు...కొత్త ఇళ్లు ఊసే లేదు...కొత్తగా పట్టాలు ఇవ్వలేదు...నాలుగున్నరేళ్ల కాలంలో ఏం చేశారని ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నించారు. చేసిందేమీ లేకపోయినా జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువైందని, దోపిడీకి దిగుతున్నాయని సభల్లో ఏకరవుతు పెడుతున్నారు. కొన్నిచోట్లయితే నిలదీయడమే కాకుండా సభలు జరక్కుంగా అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల ఫలితం లేని సభలెందుకని ఏకంగా బహిష్కరించారు. ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని పి.వెంకటాపురంలో గ్రామస్తులు గ్రామసభలో సమస్యలు పరిష్కరించలేదని ,ప్రధాన రహదారిలో మురికి కాలువల్లేవని, స్థానిక మాజీ సర్పంచుకు వరసకు సోదరైన మహిళ ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని నిలదీశారు. ఇళ్లు, పింఛన్లు అర్హులైన వారికి ఇవ్వకుండా మాజీ ప్రజాప్రతినిధి బంధువులకే కట్టబెట్టారంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. సరైన సమాధానం చెప్పలేక అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరిగారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఎలా జరిగిందే.... ♦ రౌతులపూడి మండలం దిగువ శివాడలో జన్మభూమి సభను బహిష్కరించారు. గ్రామంలో సుమారు 30 మంది అర్హులైన వృద్ధులకు పింఛన్లు ఇవ్వడంలేదని, ఎన్నిసార్లు అర్జీలిచ్చినా పట్టించుకోలేదని గ్రామస్తులంతా ఒక్కటై జన్మభూమి సభను బహిష్కరించారు. . ♦ కరప మండలం పెనుగుదురు జన్మభూమి గ్రామసభలో ఇళ్ళ స్థలాలు, పింఛన్లు ఇవ్వాలంటూ అధికారులను నిలదీశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ సర్థిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కాకినాడరూరల్ మండలం నేమం తాజా మాజీ సర్పంచ్ కాటూరి కొండబాబు గ్రామసభను బహిష్కరించారు. తనను ఆహ్వానించలేదనే కారణంతో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ♦ చింతూరు మండలం ముగునూరులో నిర్వహించిన జన్మభూమి సభలో అధికారుల అలసత్వంపై ఐటిడిఏ పీవో అభిషిక్త్కిషోర్ అధికారులపై మండిపడ్డారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా వాటిని ఎన్నాళ్ళు సాగదీస్తారని ప్రశ్నించారు.? ♦ కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలో ఎమ్మెల్యేపై తెలుగుదేశం ఎంపీపీ పిర్ల సత్యవతి తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని నిరసన తెలిపింది. -
నిరసనల హోరు..
జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి మొదటిరోజే నిరసనలు ఎదురయ్యాయి. చాలాచోట్ల జనం లేక సభలు బోసిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పలుచోట్ల ప్రజలు ప్రజాప్రతినిధులను నిలదీశారు. అధికార పార్టీ నేతలు కూడా నిరసన తెలిపే పరిస్థితి చాలాచోట్ల కనపడింది. పింఛన్లు ఇవ్వకుండా సభకు రప్పించి చివరివరకూ కూర్చోపెట్టడం పట్ల వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో మేం ఏం పాపం చేశామని ఎస్సీ ఏరియాలో రోడ్లు వేయడం లేదని మంత్రి కేఎస్ జవహర్ను గ్రామస్తులు నిలదీశారు. ప్రతి జన్మభూమి కార్యక్రమంలో చెబుతున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ♦ పెరవలి మండలం అజ్జరం గ్రామంలో కొండా శ్రీలక్ష్మి అనే మహిళా డ్వాక్రా రుణమాఫీ జరగలేదని, వడ్డీలేని రుణాలు సక్రమంగా ఇవ్వడంలేదని అధికారులను ప్రశ్నించింది. పసుపు, కుంకుమ కింద ప్రతి సభ్యురాలికి రూ.10 వేలు ప్రభుత్వం ఇస్తోందని అధికారులు, అధికారపార్టీ నేతలు సర్దిచెప్పే యత్నం చేశారు. ♦ గ్రామంలోని సమస్యలపై స్పందించని జన్మభూమి కార్యక్రమాలు ఎందుకని పెదకాపవరం ఎంíపీటీసీ సభ్యుడు మందలంక జాన్వెస్లీ నిలదీశారు. గ్రామంలోనూ, శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు బిందెలతోనూ, క్యాన్లతోనూ ఇతర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవలసి వస్తోందని అవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన మాజీ సర్పంచ్ లంబాడ మురళీ వెంకటలక్ష్మిని పిలవలేదని ఆమె వేదిక పైకి వెళ్లలేదు. ♦ తాడేపల్లిగూడెంలో 1, 2, 3, 4, 5 వార్డులలో ప్రజలు స్థానిక సమస్యలపై నిలదీశారు. వీకర్స్కాలనీలో జరిగిన సభలో అగ్రిగోల్డ్ బాధితురాలు కె.జయసుధ తాను ఏజెంట్గానేకాకుండా సొంత సొమ్ములు లక్షలాది రూపాయలు నష్టపోయానని, జన్మభూమి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని అభ్యర్థించారు. దీనిపై ఆ మహిళకు, మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్కు మధ్య చాలా సేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. జగ్గన్నపేటగ్రామ పంచాయితీలో జరిగిన సభలో తెలుగుదేశం ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని చెప్పుకుంటున్నారని, ఎక్కడ, ఎవరికి చేశారో చెప్పాలని జెడ్పీ చైర్మన్ బాపిరాజును స్థానికులు నిలదీశారు. ♦ కామవరపుకోట మండలం ఉప్పలపాడు, రామన్నపాలెం పంచాయతీ పరిధిలో జన్మభూమి కమిటీ సభ్యులే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును వీరు తప్పు పట్టారు. పంచాయతీ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్లకు సంబంధించి 67 మంది లబ్ధిదారులకు రూ.1.34 కోట్లు మంజూరు చేసినట్లు సభలో పేపర్లు పంచడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అధికారులను ప్రశ్నించారు. నాలుగేళ్లుగా 15 మందికి కూడా రుణాలు మంజూరు చేయలేదని జన్మభూమి కమిటీ సభ్యులు చవల శ్రీనివాసరావు, ఉప్పలపాటి రాధాకృష్ణ పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సబ్సిడీ లోన్లు మంజూరైనట్లు చెబుతున్నా, బ్యాంకర్లు లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. పంచాయతీ పరిధిలో అర్హులైన వారికి రేషన్కార్డులు మంజూరు, చంద్రన్న పెళ్లికానుక కూడా ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. ♦ నిడదవోలు పట్టణం 7వ వార్డు విద్యానగర్లో జన్మభూమి సభల పేరుతో పింఛన్ ఇవ్వడానికి సిబ్బంది లేకపోవడంతో రాత్రి వరకూ వృద్ధులు వేచి ఉండాల్సి వచ్చింది. ♦ పాలకొల్లు మండలం తిల్లపూడిలో తాము పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకూ మంజూరు కాలేదంటూ వృద్ధులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడ్ని నిలదీశారు. ♦ పాలకొల్లు ఒకటో వార్డు సభలో ఇళ్లు కేటాయించిన వారు నెలకు మూడు వేల రూపాయలు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతారని వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ యడ్ల తాతాజీ ప్రశ్నించడంతో స్థానిక తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ♦ బుట్టాయగూడెం, కొమ్ముగూడెంలో జరిగిన సభలలో గిరిజనేతర పేదలు, మహిళలు అధికారులను నిలదీశారు. అయ్యా.. మేము ఓట్లు వేయడానికేనా? మా సమస్యలు ఎవ్వరూ పరిష్కరించరా అంటూ ప్రశ్నించారు. బడిపిల్లలతో పని! నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో జరిగిన జన్మభూమి మాఊరు కార్యక్రమం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. గ్రామ ప్రత్యేకాధికారి, ఈఓపీఆర్డీ ఇ.లక్ష్మికాంతం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వినతులు అందజేసేందుకు వచ్చిన గ్రామస్తులకు పాఠశాల విద్యార్థులతో టీ, తాగునీరు పంపిణీ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఎ.ఆంజనేయులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఎందుకొచ్చారు!
నెల్లూరు(పొగతోట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 6వ విడత జన్మభూమి గ్రామ సభలకు నిరసనల సెగ తగిలింది. గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదని, మళ్లీ ఎందుకొచ్చారంటూ అధికారులను నిలదీశారు. గ్రామ సభలకు వెళ్లే అధికారులను అడ్డుకుని రాస్తారోకోలు చేశారు. నిరసనలు, నిలదీతలతో గ్రామ సభలు రసాభాసగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో జనం రాక వెలవెల బోయాయి. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా 123 గ్రామ సభలు నిర్వహించారు. గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు.. మళ్లీ మోసం చేయడానికి వచ్చారా? అంటూ ప్రజలు అధికారులను నిలదీశారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు లేక అగచాట్లు పడుతుంటే నీరు ఇవ్వకుండా చోద్యం చూస్తున్న అధికారులు ఇప్పుడెందుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని సాగునీరు కోసం రైతులు నిరసన వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురయ్యాయి. రేషన్కార్డుల కోసం గతంలో వేల సంఖ్యలో అర్జీలు సమర్పించినా ఇంత వరకూ అతీగతీ లేదని ప్రజలు అధికారులను నిలదీశారు. పింఛన్లు సైతం మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారిని మాత్రమే ఎంపిక చేశారని, అర్హులను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలో అధికారులు ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదని ప్రజలు చెబుతున్నా అవేమీ పట్టనట్లు వారికి ఇచ్చిన పత్రాలను అధికారులు చదువుకుంటూ పోయారు. అనేక ప్రాంతాల్లో సభలకు ప్రజలు తక్కువసంఖ్యలో హాజరయ్యారు. దీంతో విద్యార్థులు, మహిళలను గ్రామ సభలకు తరలించారు. ఎలాంటి ఫలితాలు ఇవ్వలని ఇలాంటి సభలు నిర్వహించడం దండగని నిరసనలు వ్యక్తమయ్యాయి. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం ఉప్పలమర్తి, మల్లాం గ్రామాల్లో జన్మభూమి సభల్లో సాగునీరు లేదని, భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని ప్రజలు అధికారులను నిలదీశారు. దుత్తలూరులో మంచినీటి కోసం మహిళలు రోడ్డుపై మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు. జన్మభూమికి వెళుతున్న అధికారులు, అధికారపార్టీ నాయకులను మహిళలు అడ్డుకున్నారు. జన్మభూమి రసాభాస వెంకటగిరి: అంతా అనుకున్నట్టే అవుతుంది. రేషన్కార్డులు.. íపింఛన్లు వచ్చేస్తాయోనని ఎదురు చూసిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. సమస్యలను చెప్పుకుందామంటే అవకాశం ఇచ్చే పరిస్ధితి లేదు.. ఎవరైనా ముందుకు వచ్చి తమ ఆవేదనను ఒకింత ఆగ్రహంగా వ్యక్తం చేస్తే మధ్యం సేవించి గోడవలు సృష్టిస్తావా అంటూ పోలీసులచే అరెస్టులకు తెగబడడం. ఇదీ వెంకటగిరి మున్సిపాలిటీలో తొలిరోజు జన్మభూమి తీరు తెన్ను... సమస్య ప్రస్తావిస్తే అరెస్ట్లా.. 3 వార్డుకు చెందిన సిద్దయ్య అనే యువకుడు సంక్షేమపథకాలు అమలుతీరుపై అధికారులని, ప్రజాప్రతినిధులను నిలదీయడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే రామకృçష్ణ సమీపంలో ఉన్న పోలీసులతో అరెస్ట్ చేయించారు. దీంతో పోలీసులు సిద్ధయ్యను అరెస్ట్ చేసి సభ ముగిసే వరకు పోలీసు జీపులోనే ఉంచారు. దీంతో సిద్ధయ్య కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ దిక్కుతోచని స్థితిలోఉండిపోయారు. గంగ జలాలు ఇవ్వకుంటే జన్మభూమిని జరగనివ్వం డక్కిలి: వర్షాభావంతో సాగు, తాగు నీరులేక అల్లాడుతుంటే కండలేరు నీటిని ఎందుకు విడుదల చేయడంలేదని రైతులు జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో అధికారులను నిలదీశారు. బుధవారం ఉదయం మండలంలోని నాగవోలు పంచాయతీలో జన్మభూమి కార్యక్రమం తొలిరోజు ప్రారంభమైంది. అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే సమయంలో నాగవోలు పంచాయతీలోని నాగవోలు, మిట్టపాళెం, వడ్డిపల్లి, చెన్నసముద్రం, పీవై సముద్రం గ్రామాలకు చెందిన 100 మంది పైగా రైతులు పార్టీలకతీతంగా జన్మభూమి కార్యక్రమాన్ని మూకుమ్మడిగా అడ్డుకున్నారు. గ్రామసభను నిర్వహించేందుకు సహకరించాలని మండల ప్రత్యేకాధికారి అమరనాథ్రెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ఖాదర్లు రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పొలాలకు సాగునీరు, పశువులకు తాగునీరు తెలుగుగంగ కాలువ ద్వారా అందించే వరకు జన్మభూమిని జరగనివ్వమని అధికారులకు రైతులు తేల్చి చెప్పారు. ఇక చేసేదేమి లేక ప్రత్యేక అధికారి గూడూరు సబ్కలెక్టర్, జిల్లా కలెక్టరేట్కు ఈ సమాచారాన్ని ఫోన్ ద్వారా చేరవేశారు. దీంతో తెలుగుగంగ డీఈ వచ్చి రైతులకు త్వరలో తెలుగుగంగ ద్వారా పశువులకు తాగునీరు విడుదల చేస్తామని తెలిపారు. అయినా రైతులు శాంతించకపోవడంతో ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి నాగవోలుకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అంతేగాక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఆయన ఫోన్ చేసి సంఘటన వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే రైతులతో ఫోన్లో మాట్లాడి త్వరలో నీరు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నీరిచ్చిన తరువాతే జన్మభూమి నిర్వహించుకోవాలని రైతులు చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రసూల్, ఎంఈఓ కే వెంకటేశ్వర్లు, ట్రాన్స్కో ఏఈ జహీర్ అహ్మద్, ఎస్సై మరిడినాయుడు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సభల వల్ల ఒరిగిందేమీ లేదు! ముత్తుకూరు: నాలుగున్నరేళ్ల కాలంలో గ్రామసభల వల్ల పనులేవీ జరగలేదని మండలంలోని నారికేళపల్లి టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో భాగంగా బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద ప్రారంభించిన గ్రామసభను వారు అడ్డుకున్నారు. టాస్క్ఫోర్స్ ఆఫీసర్, వెటర్నరీ జేడీ విజయమోహన్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారుల సమక్షంలో సమస్యలు ఏకరవు పెట్టారు. డెయిరీ చైర్మన్ కోట చంద్రశేఖర్రెడ్డి, టీడీపీ నేత పబ్బారెడ్డి చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్ తదితరులు మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో ఒక్క పని కూడా జరగడంలేదన్నారు. రికార్డుల్లో రైతుల పేర్లు నమోదు చేయకపోవడం వల్ల బ్యాంకుల్లో రుణాలు లభించని దుస్థితి ఏర్పడిందన్నారు. గ్రామంలో ఒక్క ఎల్ఈడీ బల్బు అమర్చలేదని, కార్యదర్శి అందుబాటులో లేడన్నారు. గ్రామసభ జరుగుతుందని కనీసం దండోరా కూడా వేయలేదన్నారు. ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు, ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు చెబుతుంటే అధికారులు ఒక్క పనికూడా చేయడం లేదన్నారు. తాము గ్రామసభ బహిష్కరిస్తున్నామని వినతిపత్రం అందచేశారు. -
నిర్బంధాలు నిలదీతలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రజా సమస్యలు పరిష్కరించని సమావేశాలెందుకంటూ జనం నిలదీతలు.. అధికారుల నిర్బంధాల నడుమ జన్మభూమి సభలు రసాభాసగా మారాయి. జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఆరో విడత జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో పలు చోట్ల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజలు మండిపడ్డారు. అర్జీలు పరిష్కారానికి నోచుకోకపోవడంపై విరుచుకుపడ్డారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తొలిరోజు యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడులో నిర్వహించిన జన్మభూమి– మాఊరు సభలో అధికార పార్టీ కార్యకర్తలు, ప్రజలు కలిసి జన్మభూమి అధికారులను పంచాయతీ కార్యాలయంలో రెండుగంటల పాటు నిర్బంధించారు. గ్రామంలో చేపట్టిన500 ఇంకుడు గుంతలు, 200 మరుగుదొడ్లకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదంటూ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు, గ్రామస్థులు కలిసి జన్మభూమి అధికారులను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. బిల్లులు ఇచ్చేంత వరకు జన్మభూమిని జరగనివ్వమంటూ తేల్చి చెప్పారు. తహశీల్దార్ సుబ్బారావు, ప్రత్యేక అధికారులు నర్సింహారావుతో పాటు మిగిలిన అధికారులను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం ఏపీఓ వచ్చి గ్రామస్థులతో సంప్రదింపులు జరిపారు. త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ప్రజలు అధికారులను వదిలి పెట్టారు. ఉన్న గూడూ పోయింది.. త్రిపురాంతంకం మండలం అన్న సముద్రంలో జరిగిన జన్మభూమిలో ఎమ్మెల్యే డేవిడ్రాజును ప్రజలు సమస్యలపై నిలదీశారు. పక్కా గృహం ఇస్తామన్నారని ఉన్న గుడిసెను పీకేసుకుని 8 నెలలుగా రోడ్డున పడ్డానని, అయినా పక్కాగృహం మంజూరు కాలేదని వెంకటమ్మ అనే మహిళ ఎమ్మెల్యే డేవిడ్ రాజును నిలదీసింది. గ్రామానికి స్మశాన స్థలం కేటాయిస్తామని ఏళ్ళ తరబడి చెబుతున్నా ఇప్పటి వరకు స్థలం ఇవ్వలేదని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎమ్మెల్యేను, అధికారులను నిలదీశాడు. భూములకు సంబంధించి ఆన్లైన్ అక్రమాలపైనా గ్రామస్థులు అధికారులను నిలదీశారు. వీధిలైట్ల మాట ఏమైంది? అద్దంకి నియోజకవర్గంలోని కొరిశపాడు మండలం పమిడి పాడులో తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. సంతమాగలూరు మండలం మిన్నెకల్లులో గ్రామంలో ఎల్ఈడీ దీపాలు బిగిస్తామని గత జన్మభూమిలో హామీ ఇచ్చిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు కనీసం వీధిలైట్లు కూడా వేయలేదని అధికారులను నిలదీశారు. జే పంగులూరు మండలం ఆరికట్ల వారిపాలెంలో రేషన్కార్డులు ఇవ్వడం లేదంటూ అధికారులను గ్రామస్థులు నిలదీశారు. గణాంకాలు.. పలు విధాలు.. దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం రజానగరంలో జరిగిన జన్మభూమిలో అధికారులను జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకారెడ్డి నిలదీశారు. ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో ప్రభుత్వం చెబుతుందని, వెలుగు ఉద్యోగులతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం సమ్మెలు చేస్తుంటే ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని ఎలా చెబుతారని ఆయన నిలదీశారు. అధికారులు ప్రజా ప్రతినిధుల ఒకరకంగా సభల్లో చదివేందుకు మరో రకంగా ప్రభుత్వ గణాంకాలు తయారు చేయడంపై ఎంపీపీ దూళ్లపాడటి మోషే అధికారులను నిలదీశారు. నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ♦ గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు మండలం బొల్లుపల్లిలో జరిగిన సభలో తాగునీటి సమస్యతో పాటు రోడ్లలేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. ♦ కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం కొత్తపేటలో మూడు నెలలుగా ఉపాధిపనులు లేక ఇబ్బందులు పడుతున్నామని అయినా అధికారులు పనులు కల్పించడం లేదని ప్రజలు నిలదీశారు. ♦ కొండపి నియోజకవర్గం శింగరాయకొండ పాకలలో జరిగిన జన్మభూమి సభలో పాఠశాలల అభివృద్ధి నిధులు ప్రభుత్వం ఇవ్వలేదంటూ యూటీఎఫ్ నాయకుడు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆరు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులను జీతాలు అందడం లేదని చెప్పారు. టంగుటూరు మండలం ఆలకూరపాడులో డ్రైనేజీలు పూర్తిచేయాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ♦ ఒంగోలు గోపాల్నగర్లో జన్మభూమికి ఎమ్మెల్యే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తారంటూ అధికారులు చెప్పడంతో ఉదయం తొమ్మిది గంటలకే మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్యే మధ్యాహ్నం దాటినా రాకపోయే సరికి మహిళలు ఎదుచూస్తూ ఉండిపోయారు. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామంలో జన్మభూమి సభకు స్పందన కొరవడింది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ 11 గంటల వరకు గ్రామస్తులు ఎవరూ రాకపోవడంతో అధికారులు ఎదురు చూపులుచూడాల్సి వచ్చింది. ♦ కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం చౌటగోగులపల్లి సభలో అంగన్వాడీ సెంటర్ సక్రమంగా నిర్వహించడం లేదని, గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేదనిగ్రామస్తులు అధికారులను నిలదీశారు. మొత్తంగా తొలిరోజు జన్మభూమి మావూరులో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజల నుంచి నిరసనలు తప్పలేదు. -
నిరసనలు.. నిలదీతలు!
అనంతపురం అర్బన్ : జన్మభూమి–మా ఊరు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైంది. సభల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది. గత జన్మభూమిలో ఇచ్చిన సమస్యలనే పరిష్కరించలేనప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. పుట్లూరు మండలం కోమటికుంట్లలో ప్రజాగ్రహం నేపథ్యంలో అధికారులు వెనక్కు తిరగక తప్పలేదు. దాదాపుగా అన్నిచోట్లా నిరసనలు, నిలదీతలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇకపోతే ప్రజల నుంచి కూడా స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తామంటూ ప్రచారం చేసుకొని వచ్చిన లబ్ధిదారులతోనే మమ అనిపించారు. జన్మభూమి సభల్లో ప్రజాసమస్యలపై కంటే ప్రభుత్వం ప్రచార ఆర్భాటంపైనే దృష్టి సారించింది. అభివృద్ధి పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ప్రసంగాలను ఊదరగొట్టారు. ఒకవైపు కరువుతో ప్రజలు, రైతులు అల్లాడుతుంటూ జిల్లాలో సమస్యలు లేవన్నట్లుగా మాట్లాడుతూ అభివృద్ధి పథంలో జిల్లా దూసుకుపోతోందంటూ చెప్పుకొచ్చారు. రాయదుర్గం మునిసిపాలిటీ పరిధిలోని 30, 1, 2వ వార్డుల్లో గృహ నిర్మాణ శాఖమంత్రి కాలవ శ్రీనివాసులును ప్రజలు సమస్యలు పరిష్కరించాలని కోరగా అర్జీలు ఇవ్వండని సరిపెట్టారు. మడకశిర మండలం గౌడనహళ్ళి, చెందకచెర్లు, శంకరగల్లు పంచాయితీల్లో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పాల్గొనిప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు. నిలదీతల పర్వం ♦ శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలం కోమటికుంట్లలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు అడ్డుకున్నారు. గ్రామంలో తాగడానికి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం, ప్రచార ఆర్భాటానికి చేపట్టిన కార్యక్రమాన్ని జరగనివ్వబోమంటూ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి ఫ్లెక్సీని, ఫర్నిచర్ను తొలగించారు. గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీలు పరిష్కరించలేనప్పుడు ఎందుకీ జన్మభూమి అంటూ నిలదీశారు. గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలోనూ జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి స్వగ్రామంలోనే ఎలాంటి అభివృద్ధి లేదని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన అర్జీలు ఇంతవరకు పరిష్కారం కాలేదంటూ అధికారులను నిలదీశారు. ఆయకట్టుకు నీరు విడుదల చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ♦ తాడిపత్రి నియోజకవర్గం చిన్న, పెద్దవడుగూరు గ్రామసభలు రసాభాసగా మారాయి. పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు, పెద్దవడుగూరు గ్రామాల్లో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో సమస్యలపై సీపీఐ, సీపీఎం నాయకులు అధికారులను నిలదీశారు. గత గ్రామసభల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ అధికారులుపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామసభలను అడ్డుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో బుధవారం ప్రారంభమైన జన్మభూమి సభల్లో జనం రాకపోవడంతో సంక్రాంత్రి కానుకల పంపిణీ చేపట్టారు. ♦ గుంతకల్లు మండలం కసాపురం, గుత్తి మండలంలో నిర్వహించిన జన్మభూమి సభలకు ప్రజలు నుంచి స్పందన కరువైంది. కేవలం అధికారుల ఉపన్యాసాలు, ఆటపాటలు, పింఛన్ల పంపిణీతో మమ అనిపించారు. గుత్తి పట్టణం ఒకటవ వార్డులో నిర్వహించిన జన్మభూమిలో సమస్యలపై అధికారులను ప్రజలు నిలదీశారు. గత జన్మభూమిలో ఇచ్చిన ఫిర్యాదులు నేటికీ పరిష్కరించలేదని, ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకొని సభలు నిర్వహిస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు ♦ హిందూపురం నియోజకవర్గం పరిధిలో హిందూపురం అర్బన్లో నిర్వహించిన జన్మభూమి సభలు జనం లేక వెలవెలబోయాయి. చిలమత్తూరులో జరిగిన సభలో చెరువులకు నీళ్లు ఇవ్వాలని అధికారులను రైతులు నిలదీశారు. ♦ కదిరి నియోజకవర్గంలోనూ సభలు మొక్కుబడిగా సాగాయి. అధికారికంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. కదిరి పట్టణం ఒకటవ వార్డు జన్మభూమిలోనూ, కదిరి మండలం బూరుగుపల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. అర్హులైన ఎంతోమందికి పింఛన్లు ఇవ్వడం లేదంటూ తలుపుల మండలం ఉదమలకుర్తి గ్రామసభలో అధికారులను ప్రజలు నిలదీశారు. తనకల్లు మండలం డీసీ పల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో తమకు పింఛన్ రాలేదని పెద్దన్న.. అంజినమ్మ, వెంకటరమణలు రేషన్ కార్డు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు మంజూరు చేయడం లేదని తిరుపాల్, ఆదిలక్ష్మి, పుల్లయ్య, సుజాతతో పాటు పలువురు అధికారులపై మండిపడ్డారు. ♦ కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ గూబనపల్లి, దొడగట్ట, మండల పరిధిలోని గోళ్ల గ్రామాలతో పాటు శెట్టూరు, కంబదూరు మండలాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు సమస్యలపై అధికారులను నిలదీశారు. గూబనపల్లిలో కొన్నేళ్లుగా శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని గత జన్మభూమిలో విన్నవించినా నేటికీ స్థలం చూపలేదని గంట పాటు సభను అడ్డుకున్నారు. కంబదూరు మండలం నూతిమడుగు గ్రామసభలో రైతుల సమస్యలపై అధికారులను వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. ♦ రాప్తాడు నియోజకవర్గంలో జన్మభూమి సభలు జనం లేక వెలవెలబోయాయి. అధికారులు, స్థానిక ప్రజాప్రతిని«ధులు మాత్రమే హాజరయ్యారు. పింఛన్ తీసుకునేందుకు వచ్చిన పింఛన్దారులను గ్రామసభల్లో కూర్చోబెట్టుకొని కార్యక్రమాన్ని కొనసాగించారు. మీ అల్లుడు షాడో ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీ అల్లుడు శశిభూషణ్ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు. మునిమడుగు సమీపంలోని సర్వే నంబర్ 699–20లో 28 సెంట్ల స్థలాన్ని గ్రామానికి చెందిన ఎఫ్పీ షాపు డీలర్ ఆంజనేయులు కబ్జా చేసి తన భార్య కోనమ్మ పేరిట 1బీ, అడంగల్ చేయించుకున్నాడు. ఈ వ్యవహారానికంతటికీ కారణమైన మీ అల్లునిపై చర్యలు తీసుకోగలరా?– పెనుకొండ మండలం మునిమడుగులోఎమ్మెల్యే పార్థసారథిని నిలదీసిన టీడీపీ కార్యకర్త వెంకటేష్ -
జన్మభూమిలో ‘గున్నా మామిడి’
సాక్షి, శ్రీకాళహస్తి (చిత్తూరు) : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం అధికార పార్టీ నేతల చిందులకు వేదికగా మారింది. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిర్దేశించిన కార్యక్రమంలో టీడీపీ నేతలు ‘గున్నా మామిడి’ పాటకు జోరుగా డాన్స్ వేశారు. ఈలలు వేస్తూ, ఒళ్లు మరిచిపోయి నృత్యాలు చేశారు. టీడీపీ నాయకుల నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా డాన్సులు కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చబాబుల డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీకాళహస్తి నియోజవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల జోక్యం తొలినాళ్ల నుంచి తెలిసిందే. దీంతో ప్రజల పాలిట కామధేనువు కావాల్సిన జన్మభూమి అపహస్యం పాలవుతోంది. ఐదో విడత జన్మభూమి కార్యక్రమం జనవరి 2-11 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. కాగా, ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో పలు చోట్ల గ్రామ ప్రజల నుంచి ప్రభుత్వం ప్రతిఘటన ఎదుర్కొన్న విషయం తెలిసిందే. -
మా పార్టీ జోలికొస్తే సహించం
ఒంగోలు: మిత్రపక్షంగా ఉంటారో...వెళతారో అనేది మీరే తేల్చుకోండి...అంతే తప్ప మిత్రపక్షం అంటూ మా పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే మాత్రం సహించేది లేదంటూ టీడీపీ నాయకులను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులివెంకట కృష్ణారెడ్డి హెచ్చరించారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీని మిత్రపక్షంగా భావించి తాము మౌనంగా ఉంటున్నా టీడీపీ నాయకుల వ్యవహారశైలి ఆక్షేపణీయంగా ఉంటుందన్నారు. త్రిపురాంతకం ఎంపీపీ నీలం చెన్నమ్మ ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిందని, దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ సీఈవో నిర్ణయం వెలువరించారన్నారు. దీనిపై హైకోర్టులో సవాల్ చేసి తిరిగి ఆమె త్రిపురాంతకం ఎంపీపీగా కొనసాగుతున్నారన్నారు. తాజాగా జరుగుతున్న జన్మభూమి–మా వూరు కార్యక్రమంలో ఆమెను ఖాతరు చేయకుండా ఆమె మాట్లాడుతుంటే మైక్ సైతం లాక్కోవడం, ఎంపీడీఓవో మాణిక్యాలరావు అయితే ఏకంగా టీడీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే సామాజిక తనిఖీ బృందం రూ.14 కోట్ల అవినీతి జాతీయ ఉపాధిహామీ పథకంలో చోటు చేసుకుందని తేల్చిందన్నారు. అంతే కాకుండా మరుగుదొడ్లలో కూడా రూ.2 కోట్ల అవినీతి చోటుచేసుకోవడంతో దానిపై చెన్నమ్మ ప్రశ్నించారన్నారు. అక్కడి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు చెప్పినట్లుగా నడుస్తూ ఎంపీపీ పట్ల నిర్లక్ష్యంగా ఎంపీడీవో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన ఎంపీడీవో మాణిక్యాలరావును తక్షణమే సస్పెండ్ చేయాలని, అక్కడ జరిగిన అవినీతి నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో నాలుగు రోజుల్లో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, ఈ విషయమై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధిష్టానంతోపాటు, జాతీయ అధ్యక్షుడు అమిత్షా దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా హాజరవుతారని ఆశిస్తున్నామని, అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతూ త్వరలోనే కనిగిరి నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు పాదయాత్ర కూడా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎంపీపీ నీలం చెన్నమ్మ మాట్లాడుతూ అవినీతిపై గళం ఎత్తుతున్నందుకే తమను బీజేపీలో ఉన్నా హీనంగా చూస్తున్నారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రిజర్వుడు నియోజకవర్గాన్ని కేటాయిస్తే అక్కడ ఎమ్మెల్యే అయి పార్టీ మారిన డేవిడ్రాజు, దళిత ఎంపీపీ పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. కోఆప్షన్ సభ్యుడు నీలం లాజర్ మాట్లాడుతూ బీజేపీ ఉనికినే లేకుండా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే తాము జిల్లా అధ్యక్షుడ్ని కలిసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు బొద్దులూరి ఆంజనేయులు, ముదివర్తి బాబూరావు పాల్గొన్నారు. -
ఆగని నిలదీతలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో సోమవారం జరిగిన ‘జన్మభూమి–మా ఊరు’ గ్రామ సభల్లో కూడా నిలదీతల పరంపర కొనసాగింది. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామం, కొత్తపల్లి మండలం కొమరిగిరి, గోర్సల్లో తమ సమస్యలు పరిష్కరించని ఈ సభలు ఎందుకని అధికారులను నిలదీశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు మండలం చింతలూరులో సీపీఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ‘దశాబ్దాలు దాటుతున్నా ఈనాం భూముల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదంటూ నేతలను దిగ్బంధనం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు మండలం పేగ గ్రామంలో గిరిజనులు ఏకంగా సభలో నిరసన తెలిపి బహిష్కరించారు. దేవీపట్నం మండలం కూడిపల్లి, చినరమణయ్యపేటలో పోలవరం ముంపు బాధితులు తమ నిరసన గళం వినిపించారు. సభను బహిష్కరించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన సభలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. తన పట్ల టీడీపీ నేతలు అవలంబించిన తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సభను బహిష్కరించారు. సభలో తొలుత ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ అరకొరగా అమలు చేస్తున్న పథకాలను, అమలు చేయని హామీలను, ప్రభుత్వ దుబారాను ఎండగడుతుండగా టీడీపీ శ్రేణులు లేచి అడ్డుతగిలి గలాటా సృష్టించారు. దానికి ప్రతిగా వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుకు రావడంతో ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసి రసాభాసగా మారింది. దీన్ని నిరసిస్తూ జగ్గిరెడ్డి సభను బహిష్కరించి బయటకు వచ్చేశారు. -
రాజధాని నిర్మాణంలో దూసుకెళ్తా!
యజ్ఞానికి ప్రతిపక్షం ఆటంకం కలిగిస్తోంది ♦ గోదావరి-కృష్ణా అనుసంధానం చేసి తీరుతాం ♦ డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఆధ్వర్యంలో కేబుల్ ప్రసారాలు ♦ ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, కడప: ‘‘రైతులు స్వచ్ఛందంగా రాజధాని ఏర్పాటుకు భూములిస్తూ సహకరించారు. కానీ రాజధాని అనే యజ్ఞానికి ప్రతిపక్షం ఆటంకం కలిగిస్తోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని ఏర్పాటులో దూసుకెళ్తా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటలో ఆదివారం జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాజధానికోసం 33 వేల ఎకరాల భూమి అవసరంకాగా 21 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, మరో 12 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. గోదావరిలో 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, ఆ నీటిని కృష్ణా నదికి తెప్పించే బృహత్తర కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాయలసీమలోని మెట్టప్రాంతాలకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరివ్వాలనే సంకల్పంతో.. ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటున్నామని, అందులో భాగంగానే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని చెప్పుకొచ్చారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు రహిత రాయలసీమగా చేస్తామన్నారు. డిసెంబర్ నాటికి ప్రభుత్వమే కేబుల్ టీవీ సర్వీసులను ఏర్పాటు చేస్తుందన్నారు. రూ.100కే కేబుల్టీవీ, ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇదిలా ఉండగా జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సాక్షిగా పసువుమయం చేశారు. సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించాల్సిన ఈ కార్యక్రమానికి సర్పంచ్కు ఆహ్వానమే అందలేదు. స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకూ అదే పరిస్థితి. చివరకు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డికీ ఆహ్వానం అందలేదని సమాచారం. కేంద్రమంత్రి సుజనాచౌదరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ నిరసన.. : ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగుతుండగా ఒక్కమారుగా సీఎం డౌన్డౌన్ అంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎన్నికల్లో మాదిగలకిచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సుజనా.. బాబు చర్చల సారాంశమేమిటో.. ఖాజీపేట జన్మభూమి కార్యక్రమ వేదికపై కేంద్రమంత్రి సుజనాచౌదరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాసేపు గుసగుసలాడుకున్నారు. ఓ వైపు సభ జరుగుతుండగా.. మరోవైపు సుజనా చౌదరి ఫోన్లో బిజీగా గడిపారు. ఫోన్ మాట్లాడటం ముగియగానే నేరుగా చంద్రబాబు వద్దకొచ్చి ఆయన విషయం వివరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరూ ఏదో ముఖ్యమైన అంశంపై చర్చిస్తున్నారనే భావన అందరిలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వీరు హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్ను కలవడం గమనార్హం. కడప విమానాశ్రయం ప్రారంభం ⇒ ‘అన్నమయ్య’ పేరును సిఫార్సు చేస్తామన్న సీఎం కడప విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. బెంగళూరు నుంచి ఉదయం 11.22 గంటలకు తొలిసారి ఎయిర్ పెగాసెస్ విమానం కడపకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలన అమోఘమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కడప విమానాశ్రయానికి అన్నమయ్య పేరు పెట్టాలని ప్రతిపాదనలు వచ్చాయని, ఆ మేరకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఏపీలోని తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నామని, ట్రీపుల్ ఐటీ, ఐఐటీ, ఐఈఎస్ఆర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హిందూపురంలో రూ.500 కోట్లతో సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అకాడమీ ఏర్పాటు చేశామని, రక్షణశాఖ విభాగాల తయారీ కేంద్రాన్ని సీమలోనే ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. కడపలో విమానాశ్రయంతోపాటు విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చామని, వాటిని నిలుపుకోవడం మీచేతుల్లోనే ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్గజపతిరాజు అన్నారు. కడప విమానాశ్రయానికి తొలిసారిగా ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి వచ్చిన ఎయిర్ పెగాసెస్ విమానం