Kamalanathan Committee
-
రాహుల్.. మేం చెప్పింది శ్రద్ధగా విన్నారు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఘోర ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీని ఆ పార్టీ ముఖ్యమంత్రులు సోమవారం బుజ్జగించే ప్రయత్నం చేశారు. గుజరాత్ సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలో ముఖ్యమంత్రులు కమల్నాథ్ (మధ్యప్రదేశ్), కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్గఢ్), వీ నారాయణస్వామి (పుదుచ్చేరి) తదితరులు రాహుల్ను ఆయన నివాసంలో కలిశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అభిమతాన్ని ఆయనకు వివరించిన ముఖ్యమంత్రులు.. రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆయనను మరోసారి కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అశోక్ గహ్లోత్.. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల మనోభావాలను రాహుల్గాంధీకి వివరించామని, తమ వాదనను శ్రద్ధగా ఆయన ఆలకించారని, రాజీనామా విషయంలో ఆయన ‘సరైన నిర్ణయం’ తీసుకుంటారని నమ్మకముందని వివరించారు. పార్టీని రాహుల్ గాంధీ ముందుండి నడిపించాలని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారని, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ముక్తకంఠంతో చెప్తున్నారని గహ్లోత్ వివరించారు. ఇక, మధ్యప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఫలితాల నేపథ్యంలో సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు కమల్నాథ్ మరోసారి సిద్ధపడినట్టు వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. -
ప్రభుత్వాస్పత్రిలో ముఖ్యమంత్రికి శస్త్రచికిత్స
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్కు శస్త్రచికిత్స జరిగింది. భోపాల్లోని హమిదియా హాస్పటల్లో ఆయన వేలుకు (ట్రిగ్గర్ ఫింగర్) వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది,. కొన్ని గంటలపాటు ముఖ్యమంత్రిని అబ్జర్వేషన్లో ఉంచి సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘కమల్ నాథ్ శనివారం ఉదయం 9 గంటలకు హమీదియా ఆసుపత్రిలో చేరారు. అతని కుడి చేతి ట్రిగ్గర్ వేలికి ఆస్పత్రి వైద్య బృందం శస్త్రచికిత్స చేసింది’ అని గాంధీ మెడికల్ కాలేజీ డీన్ అరుణ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సీఎంకు కొన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు శనివారం ఉదయం శస్త్రచికిత్స చేశారు. మరోవైపు హాస్పటల్లో ఇతర రోగులు, సిబ్బందికి అసౌకర్యం కలిగించవద్దని, తనను కలిసేందుకు ఎవరూ రావద్దంటూ కమల్నాథ్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమల్నాథ్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. -
‘ఆ ముఖ్యమంత్రి జైలుకెళ్లడం ఖాయం’
చండీగఢ్: మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్పై శిరోమణి అకాలీదళ్ నేత మంజీందర్ సింగ్ సిర్సా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్లా ఆయన కూడా జైలుకెళ్లడం ఖాయమని సిర్సా పేర్కొన్నారు. 1984 సిక్కుల ఊచకోత కేసును మళ్లీ తెరిచి తాజాగా విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ సిట్ను ఆదేశించిన నేపథ్యంలోనే సిర్సా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజా విచారణ పూర్తై, ఈ కేసులో కమల్నాథ్ నిందితుడని తేలితే ఆయన కటకటాలు లెక్కించడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్నాథ్ను నియమించడంపై గతంలోనే సిర్సా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిక్కులను చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తిని సీఎంగా ఎలా నియమిస్తారని ఆయన బహిరంగంగానే విమర్శించారు. ఇందిర మరణాంతరం జరిగిన ఘటనతో కమల్నాథ్ హస్తం కూడా ఉందని ఎంతోకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును మరోసారి విచారించాలంటూ కేంద్ర హోంశాఖ తాజాగా సిట్ను ఆదేశించడంతో మరోసారి తెరపైకి వచ్చింది. కాగా సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు విధిస్తూ డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
‘ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోండి’
భోపాల్: ఆరు నెలల క్రితం జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్సింగ్ ప్రభుత్వాన్ని మట్టికరిపించిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొవాల్సి వస్తోంది. కేంద్రంలో భారీ మెజార్టీ దక్కించుకున్న బీజేపీ మధ్యప్రదేశ్లోని కమల్నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సరైన మెజార్టీ లేకపోవడంతో బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో సీఎం పిఠాన్ని అధిష్టించిన కమల్నాథ్కు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం దినదిన గండంగా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకత్వం భారీగా ఆఫర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్నాథ్ మంత్రులకు పలు ఆదేశాలు జారీచేశారు. ఎమ్మెల్యే జారిపోకుండా ప్రతి మంత్రి బాధ్యత తీసుకోవాలని.. ఒక్కో మంత్రి కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలపై కన్నేసి ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తున్నందున వాటిని తిప్పికొట్టాలని, సభ్యులను కాపాడకునే బాధ్యత మీదేనని సూచించారు. ముఖ్యంగా బీఎస్పీ, స్వతంత్ర ఎమ్యెల్యేలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అసెంబ్లీలో కమల్నాథ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన వెంటనే భాజపా నాయకులు సవాల్ విసిరిన నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందోనన్న అభద్రతా భావంలో కాంగ్రెస్ ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. కాగా 230 మంది శాసన సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 114 మంది కాంగ్రెస్, 109 మంది బీజేపీ సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది కావడంతో ఇద్దరు బీఎస్పీ, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలావుండగా.. తమకు భారీ మొత్తంలో డబ్బుతో పాటు, మంత్రిపదవులు ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర్ చేస్తున్నారంటూ బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కమల్నాథ్ మంత్రులను అలర్ట్ చేశారు. -
‘50 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేశారు’
భోపాల్: తమ పార్టీలో చేరితే రూ.50 కోట్లతో పాటు మంత్రి పదవినీ కట్టబెడుతామని బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తున్నదని మధ్యప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరమని ఆ నేతలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇస్తున్నారని ఆమె వెల్లడించారు. డబ్బుకు ఆశపడ్డ వాళ్లు బీజేపీ ప్రలోభాలకు లొంగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. తాను మాత్రం కమల్నాథ్ ప్రభుత్వానికే మద్దతు ఇస్తానని, బీజేపీ గూటికి చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘మంత్రి పదవితో పాటు డబ్బు ఇస్తామని నాకు ఫోన్ కాల్ వచ్చింది. కానీ, నేను తిరస్కరించా. వారి నెంబర్స్ బ్లాక్ చేశాను’’ అని అన్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులను ఎరగా చూపుతూ బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న తెలిసిందే. బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతుతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఒక్కసీటు మినహా మిగతా వాటన్నింటినీ బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా రాంబాయి సంచలన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను అస్థిరపరిచి ప్రభుత్వాలను ఏర్పాటుచేయాలని బీజేపీ ఆపరేషన్ కమల్కు శ్రీకారం చుడుతోన్న విషయం తెలిసిందే. దీంతో రెండు రాష్ట్రల్లో రాజకీయం ఉత్కంఠంగా మారింది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గోడ దూసుతారోనని పార్టీ నేతలకు భయం పట్టుకుంది. -
రాజకీయ సంక్షోభం దిశగా మధ్యప్రదేశ్
-
కమల్నాథ్కు బీజేపీ చెక్?
భోపాల్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం పూర్తిస్థాయి మెజారిటీ లేదనీ, అసెంబ్లీలో బలపరీక్ష కోసం తాము గవర్నర్ను కలుస్తామని ప్రకటించింది. ఈ విషయమై మధ్యప్రదేశ్ విపక్ష నేత గోపాల్ భార్గవ మాట్లాడుతూ..‘రుణమాఫీ, శాంతిభద్రతలు, తాగునీటి సమస్య వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించడంతో పాటు ప్రభుత్వ మెజారిటీ విషయంలో బలపరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మేం గవర్నర్ ఆనందీబెన్ పటేల్కు ఇప్పటికే లేఖ రాశాం. ముఖ్యమైన అంశాలపై చర్చించకుండా ముఖం చాటేస్తున్న కమల్నాథ్ ప్రభుత్వం గుట్టలకొద్దీ కాగితాలను మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఇంటికి పంపుతోంది. రాష్ట్రంలోని 21 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసేశామని చెబుతోంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ బలహీన కాంగ్రెస్ ప్రభుత్వానికి సభలో మెజారిటీ ఉందా? లేదా? అని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయంలో మేం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా, స్థిరంగా కొనసాగడంపై ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి’ అని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మరోసారి కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్పోల్స్ వెలువడ్డ మరుసటి రోజే మధ్యప్రదేశ్లో కమలనాథులు బలపరీక్ష కోరడం గమనార్హం. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 109 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు అవసరమైన నేపథ్యంలో బీఎస్పీ(2), ఎస్పీ(1)ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. బీజేపీ కుట్ర పన్నుతోంది: కాంగ్రెస్ అవినీతి పద్ధతుల ద్వారా కమల్నాథ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దీపక్ బబరియా ఆరోపించారు. మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. విశ్వాస పరీక్షకు సిద్ధం: కమల్నాథ్ విశ్వాసపరీక్షను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమల్నాథ్ చెప్పారు. గడిచిన ఐదు నెలల్లో నాలుగు సార్లు తమ సంకీర్ణ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నామనీ, అవసరమైతే మరోసారి కూడా సిద్ధమేనని పేర్కొన్నారు. -
చింద్వారాలో చిందేస్తున్న వారసుడు
మధ్యప్రదేశ్లో మొదట్నించీ కాంగ్రెస్ కంచుకోట చింద్వారా లోక్సభ స్థానం. 1957లో అవతరించిన చింద్వారాలో పోలింగ్ ఈ నెల 29న జరుగుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ 1980 నుంచి 2014 ఎన్నికవరకూ ఇక్కడ తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయన కొడుకు నకుల్నాథ్ పోటీచేస్తున్నారు. 1996లో ఓ కోర్టు కేసు కారణంగా కమల్నాథ్ పోటీ చేయలేదు. భార్య అల్కానాథ్ కాంగ్రెస్ టికెట్పై పోటీచేసి విజయం సాధించారు. ఈ కేసులో క్లీన్చిట్ రావడంతో 1997లో తన భార్యతో రాజీనామా చేయించగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన పోటీచేసి బీజేపీ మాజీ సీఎం సుందర్లాల్ పట్వా చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి ఇదే మొదటిసారి. మళ్లీ 1998 నుంచీ కమల్నాథ్ గెలుస్తూ వచ్చారు. 44 ఏళ్ల నకుల్నాథ్ ఎన్నికల్లో పోటీచేయడం ఇదే తొలిసారి. 1996లో తన తల్లి అల్కా గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఆయన ఎంబీఏ చదివారు. ఎన్నికల అనుభవం లేకున్నా చింద్వారాలో కమల్నాథ్ వేసిన పునాదులు నకుల్కు ఉపయోగపడతాయి. కిందటి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి బదులు నాథన్ షా కర్వేటీకి బీజేపీ టికెట్ ఇచ్చారు. ఆరెసెస్ నేపథ్యం ఉన్న యువ ఆదివాసీ నేత నాథన్ షా. తొలి నుంచీ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడం, ఢిల్లీలో వారి కోసం 24 గంటలూ పనిచేసే ఆఫీసు ఏర్పాటు చేయడం ద్వారా చింద్వారా ప్రజల్లో కమల్నాథ్ తిరుగులేని ఆదరణ సంపాదించారు. కాంగ్రెస్ గెలుపు సునాయాసమే! చింద్వారా సీటుకు నకుల్ పేరు ఒక్కటే ప్రతిపాదించడం, తండ్రి ముఖ్యమంత్రి పదవిలో ఉండడం, బలహీనమైన బీజేపీ ప్రత్యర్థి బరిలో ఉండడం వంటి కారణాల వల్ల నకుల్ గెలుపు నల్లేరుపై నడకగా వర్ణిస్తున్నారు. చిన్న వయసు నుంచీ తండ్రితోపాటు చింద్వారాలో జరిగే సమావేశాల్లో పాల్గొనడం, సెలవులు ఇక్కడే గడపడంతో నకుల్కు ఈ ప్రాంతం కొత్త కాదు. కిందటి డిసెంబర్లో తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచీ నకుల్ చింద్వారా వచ్చి కాంగ్రెస్ నాయకులతో సమావేశం కావడం ఎక్కువైంది. నకుల్కే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వచ్చింది. తండ్రికి సీఎం పదవి దక్కినప్పుడు కొడుకుకు లోక్సభ టికెట్ ఇవ్వడం కాంగ్రెస్లో కొత్తేమీ కాదు. -
మధ్యప్రదేశ్లో 281 కోట్ల అక్రమ నిల్వలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన సోదాల్లో రూ.281 కోట్ల విలువైన నగదును అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించామని ఐటీ అధికారులు చెప్పారు. ఈ నిధుల్ని సేకరించేందుకు విస్తృతంగా వ్యవస్థీకృత రాకెట్ ఒకటి నడుస్తోందని తెలిపారు. ఆదివారం నాటి దాడుల్లో లెక్కల్లో చూపని రూ.14.6 కోట్ల నగదు, మధ్యప్రదేశ్–ఢిల్లీ మధ్య జరిగిన అనుమానిత లావాదేవీలకు సంబంధించిన కంప్యూటర్ ఫైల్స్ను జప్తు చేసినట్లు వెల్లడించారు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో నివాసముంటున్న ఓ నాయకుడి ఇంటి నుంచి నుంచి ప్రముఖ రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయానికి రూ.20 కోట్లు తరలించినట్లు గుర్తించామని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) తెలిపింది. నకిలీ బిల్లుల ద్వారా రూ.242 కోట్లను దోచుకున్నట్లు కనిపెట్టామని పేర్కొంది. -
కమల్నాథ్ సంబంధీకులపై ఐటీ దాడులు
భోపాల్/న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ సంబంధీకుల ఇళ్లు, ఆఫీస్లపై ఆదాయ పన్ను శాఖ దాడుల చేసింది. ఐటీ ఎగవేత, నగదు అక్రమ చలామణి ఆరోపణలపై 200 మంది ఐటీ అధికారులు, పోలీసులు ఢిల్లీ, మధ్యప్రదేశ్లో 50 చోట్ల సోదాలు చేశారు. దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 14 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులకు భద్రతగా సీఆర్పీఎఫ్ బలగాల్ని మోహరించారు. ఇండోర్, భోపాల్, ఢిల్లీలో సోదాల్లో కమల్నాథ్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) ప్రవీణ్ కక్కడ్, మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లానీ ఇళ్లలో సోదాలు చేశారు. సీఎం బావమరిది సంస్థ మోసర్ బేయర్, మేనల్లుడు రతుల్ పూరి సంస్థల ఎగ్జిక్యూటివ్ల ఇళ్లలో సోదాలు చేశారు. మాజీ కేంద్ర మంత్రి కాంతిలాల్ భూరియాకూ ఓఎస్డీగా ఉన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో భూరియా రాట్లాం–జాబువా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో గత వారం ఈడీ ఢిల్లీలో రతుల్ పూరిని విచారించింది. కోల్కతాకు చెందిన వ్యాపారి పరాస్ మల్ లోధా కార్యాలయంలో కూడా దాడులు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐటీ దాడులపై కమల్నాథ్ స్పందిస్తూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే బీజేపీ రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు. భోపాల్లో ‘కోల్కతా’ డ్రామా ఐటీ దాడుల సందర్భంగా భోపాల్లో కోల్కతా తరహా ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ప్రవీణ్ కక్కడ్ సన్నిహితుడు ప్రవీణ్ ఇంటికి పోలీసులొచ్చాక సీన్ సీరియస్గా మారింది. పోలీసులను చూడగానే ఐటీ అధికారులు సీఆర్పీఎఫ్ సాయంతో ఇంటి తలుపులు మూసేశారు. దీంతో కొద్ది సేపు ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. లోపల సోదాలు కొనసాగుతున్నందునే బయటి వారికి అనుమతించలేదని అన్నారు. తమ చర్యను భోపాల్ పోలీసులు సమర్థించుకున్నారు. ఐటీ దాడులతో తమకేం సంబంధం లేదని, ప్రవీణ్ కుమార్ నివాసంలో ఒకరికి అత్యవసరంగా వైద్యం అందించాలని సమాచారం అందిందని, అందుకే అక్కడికి తమ సిబ్బంది వెళ్లారని భోపాల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. -
కమల్నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు
ఇండోర్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇండోర్లోని సీఎం ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 15మంది ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అలాగే సీఎం అడ్వైజర్ రాజేంద్ర కుమార్ ఇంట్లో (ఢిల్లీ) కూడా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు రూ.9కోట్లు నగదు లభించినట్లు సమాచారం. ఢిల్లీ, మధ్యప్రదేశ్తో పాటు మొత్తం ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ఈ ఇద్దరు అధికారులు ...తమ పదవుల నుంచి తప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఇద్దరు అధికారులు హవాలా రూపంలో నగదును తరలిస్తున్నట్లు ఆరోపణలు నేపథ్యంలో ఐటీ దాడులు జరిపినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
‘ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రూ.100 కోట్ల ఆఫర్’
భోపాల్ : కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు.. బీజేపీ వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి... సబల్ఘర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ నేత బాజీనాథ్ కుశ్వాహను కలిశారు. అనంతరం ఆయనను ఓ దాబాకు తీసుకువెళ్లారు. అక్కడే బీజేపీ మాజీ మంత్రులు నరోత్తమ్ మిశ్రా, విశ్వాస్ సారంగ్ బాజీనాథ్తో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆయనకు ఆశ జూపారు. అలాగే వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెడతామని ఆయనకు చెప్పారు. కానీ బాజీనాథ్ వీటిని తిరస్కరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఇలా దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది’ అని డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు. కాగా దిగ్విజయ్ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. అబద్ధాలు ప్రచారం చేయడం దిగ్విజయ్కు అలవాటేనని, ఆయనో ‘గాసిప్ మాంగర్’ అని విమర్శించారు. ఈ విషయానికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఉంటే తప్పకుండా విచారణ జరిపించాలని, అధికారంలో ఉన్నది వాళ్ల పార్టీయే కాబట్టి మీటింగ్ జరిగిందని చెబుతున్న దాబాకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీలు తెచ్చి వీటిని నిరూపించాలని సవాల్ విసిరారు. తమకు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో కమల్నాథ్ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో 15 సంవత్సరాల సుదీర్ఘ బీజేపీ పాలనకు తెరపడింది. -
కాంగ్రెస్ సీఎంల వివాదాస్పద నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కొలువుతీరిన కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రులు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరవు తీస్తున్నాయా? రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను అవి దెబ్బతీయనున్నాయా? అసలు ఆ వివాదాస్పద నిర్ణయాలు ఏమిటీ? మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్లో వెలువడగానే ముఖ్యమంత్రి పదవికి జ్యోతిరాదిత్య సింధియాకు బదులుగా కమల్నాథ్ను రాహుల్ గాంధీ ఎంపిక చేయడమే మొట్టమొదట వివాదాస్పదమైంది. 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్నాథ్ పాత్రను తప్పుపట్టిన నానావతి కమిషన్, ఆయన నుంచి వివరణ కోరింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2015లో సిక్కుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. అలాంటప్పుడు సీఎం పదవికి ఆయన్ని దూరంగా పెట్టి ఉంచాల్సింది. పార్టీకి అతి తక్కువ మెజారిటీ ఉన్నందున ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి కమల్నాథ్ వంటి అనుభవజ్ఞులు ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. పంజాబ్లోని గురుదాస్పూర్లో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ సిక్కుల ఊచకోతతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని సీఎంను చేశారంటూ ఆరోపించడం ఇక్కగ గమనార్హం. ఇక కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. యూపీ, బీహార్ నుంచి వస్తున్న వలసదారులు స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని కూడా ఆయన చెప్పారు. ఇక రాష్ట్ర సచివాలయంలో గత 13 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ‘వందేమాతరం’ గీతాలాపనను నిలిపివేయడం. పైగా ఆ ఆనవాయితీని మరింత మెరుగ్గా అమలు చేద్దామనే ఉద్దేశంతోనే రద్దు చేశానంటూ సమర్థించకున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసు బ్యాండ్తోని వందేమాతర గీతాలాపన పునరుద్ధరిస్తున్నట్లు కమల్నాథ్ ప్రకటించాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రం నుంచి జైలుకెళ్లిన వారికి బీజేపీ ప్రభుత్వం 2008లో ప్రవేశపెట్టిన నెలకు పాతిక వేల రూపాయల పింఛన్ పథకాన్ని నిలిపివేయడం కమల్ నాథ్ సర్కార్ తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం. చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అంతే చత్తీస్గఢ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కూడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. 2014 నుంచి 2017 వరకు బస్తర్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచే సిన ఎస్ఆర్పీ కల్లూరిని రాష్ట్ర అవినీతి వ్యతిరేక బ్యూరో, ఆర్థిక నేరాల విభాగంకు అధిపతిగా నియమించడం వివాదాస్పదమైంది. ఆ మూడేళ్ల కాలంలో ఆయన అనేక బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడ్డారని, ప్రజలపై దౌర్జన్యం చేయడంతోపాటు రేప్లు చేశారన్న ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. అప్పుడు కల్లూరిని జైల్లో పెట్టాలని చత్తీస్గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో డిమాండ్ చేసిన భూపేష్ ఆయన సీఎం హోదాలో పదవిలోకి తీసుకోవడం వివాదాస్పదమైంది. ఇలాంటి నిర్ణయాలు మొత్తం కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయకపోయినా ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం
భోపాల్: మధ్యప్రదేశ్ సచివాలయంలో ‘వందేమాతరం’ ఆలపించకపోవడం కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ సచివాలయంలో ప్రతినెల మొదటి పని దినం రోజున వందేమాతర గేయాన్ని ఆలపించాలని అప్పట్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, జనవరి 1వ తేదీన మాత్రం సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ట్విటర్ వేదికగా కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన చౌహాన్.. వందేమాతరం కేవలం జాతీయ గేయం మాత్రమే కాదని.. అది దేశభక్తిగా ప్రతీక అని తెలిపారు. సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించే ఆనవాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వందేమాతర గేయం ప్రజల హృదయాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ దేశం, దేశభక్తి కన్నా ఏది ఎక్కువ కాదనే విషయాన్ని కాంగ్రెస్ మరచిపోరాదని వ్యాఖ్యానించారు. అదే విధంగా క్యాబినేట్ మీటింగ్ ప్రారంభానికి ముందు కూడా వందేమాతరాన్ని ఆలపించాలని కోరారు. ప్రభుత్వం దీనిపై స్పందించని పక్షంలో జనవరి 6వ తేదీ ఉదయం 11 గంటలకు దేశభక్తులతో కలిసి సచివాలయ ప్రాంగణంలో తను వందేమాతర గేయాన్ని ఆలపిస్తానని తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలపై స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్.. వందేమాతర గేయం ఆలపించని వారికి దేశభక్తి ఉండదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా మాట్లాడుతూ.. ఎస్సార్ మొహంతి మంగళవారం రోజున సీఎస్గా బాధ్యతలు చేపట్టారని.. అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉండటం వల్ల వందేమాతరాన్ని ఆలపించే కార్యక్రమం నిర్వహించలేకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వందేమాతర గేయంపై బీజేపీ ఎందుకు రాద్ధాంతం చేస్తుందని నిలదీశారు. -
వలసల భారతం ఏం చెబుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్ నాథ్ మాట్లాడుతూ స్థానికుల ఉద్యోగావకాశాలను ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. ఇక నుంచి స్థానికులకు 70 శాతం ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు తన ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని కూడా హామీ ఇచ్చారు. ఆయన మాటల్లో నిజమెంత ? అబద్ధం ఎంత ? అసలు వాస్తవం ఎంత ? వాస్తవానికి మధ్యప్రదేశ్కు వలసవస్తున్న వారి కన్నా మధ్యప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. 1991–2001 దశాబ్దంతో పోలిస్తే 2001 నుంచి 2011 దశాబ్దానికి రాష్ట్రం నుంచి వలసపోతున్న వారి సంఖ్య 461 శాతం పెరిగింది. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకన్నా వలసపోతున్న వారి సంఖ్య తక్కువే. మధ్యప్రదేశ్ నుంచి ఒక్కరు వలసపోతే బీహార్ నుంచి 3.5, ఉత్తరప్రదేశ్ నుంచి 7.6 శాతం మంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. బీహార్ నుంచి వలసపోతున్నవారి కన్నా వలసవస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ అంటే యూపీ నుంచి బీహార్ నుంచి ఆ రాష్ట్రానికి వలస పోతున్నవారి సంఖ్య మరీ తక్కువనే విషయం అర్థం అవుతోంది. యూపీ, బీహార్ నుంచి గతంలో ఎక్కువ మంది మహారాష్ట్రకు వెళ్లగా ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ పట్టణాలకు ఎక్కువగా వెళుతున్నారు. గతంతో పోలిస్తే యూపీ నుంచి వలసపోతున్న వారి సంఖ్య దశాబ్ద కాలంలో 197 శాతం పెరగ్గా, బీహార్ నుంచి 237 శాతం పెరిగింది. భారత దేశంలోని ప్రజలు ఉద్యోగావకాశాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం కొత్త విషయం కాదు. స్వాతంత్య్రానికి ముందునుంచి ఉన్నదే. అయితే స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఎక్కడికైనా వెళ్లి స్థిర నివాసం ఏర్పరుచుకునే హక్కు ప్రతి భారతీయుడికి రాజ్యాంగ పరంగా సంక్రమించింది. ఈ వలసలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి. కొన్ని రాష్ట్రాలు కూడా విడిపోవాల్సి వచ్చింది. 1960వ దశకంలో తమిళనాడులో హిందీ భాషకు, హిందీ మాట్లాడే వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆ తర్వాత అస్సాంలో బెంగాలీ, హిందీ, నేపాలీ భాషలు మాట్లాడే వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఇక మహారాష్ట్రలో 1960 దశకం నుంచి ఇప్పటికీ ఉత్తర భారతీయులతోపాటు దక్షిణ భారతీయులు కూడా స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ మరాఠీ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. 2017లో కర్ణాటకలో కూడా హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. మొన్న అక్టోబర్ గుజరాత్లో హిందీ మాట్లాడేవారిపై దాడులు జరగ్గా వేలాది మంది గుజరాత్ నుంచి పారిపోయారు. హిందీ మాట్లాడే వారు తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ ఇతర రాష్ట్రాల వారు ఇంతవరకు ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తుండగా, తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ ఓ హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ఆరోపించడం ఇదే తొలిసారి. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన 2017 నాటికి దేశంలో వలసపోయిన వారి సంఖ్య 45.36 కోట్లు. ఈ సంఖ్య మరింత పెరిగితే చైనాలోలాగా వలసల నియంత్రనకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి రావచ్చు. -
ముగ్గురు సీఎంల పట్టాభిషేకం
ఆ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు ప్రమాణ స్వీకారం చేయడం ఆనంద డోలికల్లో ముంచితే, మరోవైపు ఆ పార్టీని వెంటాడుతున్న సిక్కుల ఊచకోత కేసులో తీర్పు ఇరకాటంలో పడేసింది. 1984 నాటి ఈ కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్కుమార్ను హైకోర్టు దోషిగా తేల్చింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ను విజయతీరాలకు చేర్చిన గహ్లోత్, కమల్నాథ్, బఘేల్ సీఎంలుగా ప్రమాణం చేయగా.. సజ్జన్కుమార్కు యావజ్జీవ శిక్ష పడింది. సిక్కుల ఊచకోతలో పాపం మూటగట్టుకున్న కమల్నాథ్ను మధ్యప్రదేశ్ సీఎంగా ఎలా ఎంపిక చేస్తారని బీజేపీ నిలదీసింది. ఈ ఘటనలన్నీ ఒకే రోజు జరగడం గమనార్హం. సోమవారం ఉదయం రాజస్తాన్ సీఎంగా అశోక్ గహ్లోత్ జైపూర్లో, మధ్యాహ్నం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్నాథ్ భోపాల్లో, సాయంత్రం రాయ్గఢ్లో ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేశ్ బఘేల్ ప్రమాణం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఆడంబరంగా జరిగిన ఈ మూడు కార్యక్రమాలకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్, ఆర్జేడీ తదితర ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్నాథ్ రైతుల రుణమాఫీ ఫైల్పై తొలి సంతకం చేశారు. తర్వాత ఛత్తీస్గఢ్ కొత్త సీఎం బఘేల్ రైతుల స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తానని చెప్పారు. గహ్లోత్ ముచ్చటగా మూడోసారి.. జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ రాజస్తాన్కు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సోమవారం ఉదయం జైపూర్లోని ఆల్బర్ట్ హాల్లో కన్నులపండువగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కల్యాణ్సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రిగా యువనేత సచిన్ పైలట్ ప్రమాణం చేశారు. రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి అయిన నాలుగో నేతగా గహ్లోత్ రికార్డు సృష్టించారు. గహ్లోత్ మొదటి సారిగా 1998లో, ఆ తర్వాత 2008లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆల్బర్ట్హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, మాజీ సీఎం వసుంధరా రాజే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముక్తిమోర్చా నేత హేమంత్ సోరేన్, జార్ఖండ్ వికాస్ మోర్చా నేత బాబూలాల్ మరాండీ, కర్ణాటక, ఏపీ సీఎంలు కుమారస్వామి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. దాదాపు 11వేల మంది కూర్చునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో ఆల్బర్ట్ హాల్ కిటకిటలాడింది. చాలా మంది కుర్చీల పైకెక్కి తమ అభిమాన నేతల ప్రమాణ స్వీకారాన్ని ఆసక్తిగా తిలకించారు. దీంతో కొందరు నేతలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు హైరానా పడాల్సి వచ్చింది. గహ్లోత్, పైలట్ ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరు నేతల అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు చేపట్టింది. రాజధానికి వచ్చే రోడ్లన్నిటిలోనూ సోమవారం ట్రాఫిక్ స్తంభించింది. సఫా ధరించిన పైలట్ సచిన్ పైలట్(41) ప్రమాణ స్వీకారం సందర్భంగా తెల్లటి కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్తోపాటు తలపై రాజస్తానీ స్టయిల్ ఎర్రటి తలపాగా ‘సఫా’ ధరించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు ‘సఫా’ ధరించబోనంటూ 2014లో ఆయన శపథం చేశారు. గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన పైలట్..ఈసారి అసెంబ్లీకిఎన్నికయ్యారు. గహ్లోత్కు అభినందనలు చెబుతున్న మాజీ సీఎం వసుంధరా రాజే తలపాగాతో పైలట్ రుణమాఫీపై తొలి సంతకం మధ్యప్రదేశ్ 18వ సీఎంగా కమల్నాథ్ భోపాల్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్(72) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్లోని లాల్పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులెవరూ లేకుండా ఆయన ఒక్కరే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీకి ఘన స్వాగతం లభించింది. రాహుల్కు ఎదురెళ్లిన కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఆయన్ను వేదికపైకి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేష్ త్రివేది, కర్ణాటక, పుదుచ్చేరి సీఎంలు కుమారస్వామి, నారాయణస్వామి, పంజాబ్ మంత్రి నవ్జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు.. కాంగ్రెస్కు చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాశ్ జోషి, బాబూలాల్గౌర్ హాజరయ్యారు. అయితే, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. రూ.2 లక్షల రుణమాఫీ.. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నూతన సీఎం కమల్నాథ్ రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. దీంతో రాహుల్ గాంధీ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అవుతాయి. సీఎం సంతకం అయిన వెంటనే రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్ అరోరా ‘మధ్యప్రదేశ్లోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో స్వల్ప కాలిక రుణాలు తీసుకున్న అర్హులైన రైతులకు చెందిన రూ.2 లక్షల లోపు రుణాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. భోపాల్లో సింధియా, కమల్నాథ్లతో చేతులు కలిపిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజకీయ లబ్ధి కోసమే అల్లర్ల అంశం 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటనలకు సంబంధించి తనపై ఎటువంటి కేసులు లేవని, చార్జిషీట్లు కూడా దాఖలు కాలేదని మధ్యప్రదేశ్ కొత్త సీఎం కమల్నాథ్ స్పష్టం చేశారు. ఈ అల్లర్లలో తన ప్రమేయం ఉందంటూ వెలువడుతున్న వార్తలు రాజకీయ లబ్ధి కోసం లేవనెత్తినవేనన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కమల్నాథ్ మీడియాతో మాట్లాడా రు. ‘గతంలో పలుమార్లు ప్రమాణ స్వీకారం చేశాం. ఈ రోజు కూడా చేశా. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జిగా కూడా పనిచేశా. అప్పట్లో నాపైన ఎలాంటి కేసులు లేవు. చార్జిషీటు కూడా లేదు. ఇప్పుడే ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది? దీని వెనుక రాజకీయ కారణాలున్నాయన్న విషయం మీకు తెలుసు’ అని కమల్నాథ్ అన్నారు. ఛత్తీస్గఢ్ సీఎం బఘేల్ రాయ్పూర్: కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్పూర్లోని బల్బీర్ జునేజా ఇండోర్స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, భారీ వర్షం రాకతో ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం సైన్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి మార్చాల్సి వచ్చింది. పెథాయ్ తుపాను ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ముందుగా సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కురియడంతో కార్యక్రమ వేదికను హడావుడిగా బల్బీర్ జునేజా ఇండోర్ స్టేడియంలోకి మార్చారు. బఘేల్తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ టీఎస్ సింగ్దేవ్, తామ్రధ్వజ్ సాహు కూడా ఈ కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, మాజీ సీఎం రమణ్సింగ్, పంజాబ్ మంత్రి నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రమాణం అనంతరం సీఎం బఘేల్ చెప్పారు. రాష్ట్రంలో 2018, నవంబర్ నాటికి 16.65 లక్షల మంది రైతులు సహకార, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ.6,100 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారని, వీటన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పారు. బఘేల్తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఐక్యతా రాగం...: సోమవారం జైపూర్లో అశోక్ గహ్లోత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఐక్యత తెలుపుతున్న నేతలు..ఎంకే స్టాలిన్, చంద్రబాబు, కమల్నాథ్, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి, రాహుల్, శరద్యాదవ్, జ్యోతిరాదిత్య సింథియా, మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ అందరూ కలిసి ఒకే బస్సులో...: గహ్లోత్ ప్రమాణస్వీకార వేదిక వద్దకు బస్సులో వెళ్తున్న రాహుల్, మన్మోహన్, శరద్ పవార్, శరద్ యాదవ్, స్టాలిన్ తదితరులు మేనల్లుడికి అభినందనలు..: జ్యోతిరాదిత్యను ఆప్యాయంగా హత్తుకున్న మేనత్త, రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే -
మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్.. 17న ప్రమాణస్వీకారం
-
17న కమల్నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన గవర్నర్ ఆనందీబెన్ పటేల్ను కలిశారు. ఆయన వెంట సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, సురేశ్ పచౌరీ, వివేక్ తన్ఖా, అరుణ్ యాదవ్ తదితరులున్నారు. వారి భేటీ సుమారు 50 నిమిషాలపాటు సాగింది. ఈ సందర్భంగా గవర్నర్..‘రాజ్యాంగంలోని ఆర్టికల్–164 ప్రకారం అసెంబ్లీలోని అతిపెద్ద పార్టీ నేతగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను’ అంటూ కమల్నాథ్కు ఆమె ఓ లేఖ అందజేశారు. అనంతరం రాజ్భవన్ వెలుపల కమల్నాథ్ మీడియాతో మాట్లాడుతూ..భోపాల్లోని లాల్పరేడ్ గ్రౌండ్లో 17వ తేదీ మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కేంద్ర కేబినెట్లో పలు మంత్రిత్వశాఖలు నిర్వహించిన అనుభవమున్న కమల్నాథ్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అసెంబ్లీలోని 230 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా ఎస్పీ(1), బీఎస్పీ(2), స్వతంత్రులు(4) కలిపి 121 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 109 స్థానాలను మాత్రం గెలుచుకుంది. అపార అనుభవం, ఆర్థిక బలం కమల్నాథ్ను సీఎంగా ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణాలు ఇవి.. ► రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో అపార అనుభవం. ఆయా రంగాల్లో కీలక భూమికలను విజయవంతంగా నిర్వహించిన దక్షత. ► నిధుల సమీకరణలో దిట్ట. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీ రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీర్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. దశాబ్దానికి పైగా అధికారంలో లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ దివాళా స్థితిలో ఉంది. ఈ స్థితి నుంచి ఆర్థికంగా పార్టీని గట్టెక్కించారు. ► 9 సార్లు లోక్సభకు ఎన్నిక. మోదీ హవాను తట్టుకుని ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగా పలు కీలకపదవుల్లో పనిచేశారు. ► దేశంలోని వ్యాపార దిగ్గజాలతో సత్సంబంధాలు. ► రాష్ట్ర రాజకీయాలపై పట్టు. అన్ని వర్గాలతో సంబంధాలు. కార్యకర్తల్లో సింధియాపై ఉన్నది ఆకర్షణ అని, కమల్ నాథ్పై ఉన్నది అభిమానమని అంటుంటారు. పార్టీలో అంతర్గత వర్గ పోరాటాలపై అవగాహన, వాటిని చక్కదిద్దే సామర్ధ్యం. పీసీసీ చీఫ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు వర్గ కుమ్ములాటలను విజయవంతంగా అదుపు చేశారు, అందరిని ఒక్కటి చేశారు. ► గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం. డూన్ స్కూల్లోనే సంజయ్ గాంధీతో స్నేహం. ఇందిరతో కొడుకులాంటి అనుబంధం. సోనియా, రాహుల్లకు విశ్వసనీయ సలహాదారు. ► ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్(114), బీజేపీ(109)ల స్థానాల్లో పెద్ద తేడా లేదు. మిత్ర పక్షాల మద్దతుతో మేజిక్ మార్క్ అయిన 116 సాధించింది కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారును బీజేపీ పడగొట్టకుండా కాచుకోవడం కమల్నాథ్ వల్లనే సాధ్యమన్న నమ్మకం. ► లోక్సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకోవాలంటే అనుభవం, ఆర్థిక బలం, వ్యూహ నైపుణ్యం ఉన్న కమల్ సీఎంగా ఉండటం పార్టీకి అవసరం. ► 72 ఏళ్ల వయస్సు మరో కారణం. రాజకీయాల్లో మరి ఎన్నాళ్లో కొనసాగకపోవచ్చు. సింధియా యువకుడు. బోలెడంత రాజకీయ భవిష్యత్తు ఉంది. -
మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్
-
మధ్యప్రదేశ్కు కమలనాథుడే
సాక్షి, ప్రతినిధి, న్యూఢిల్లీ: సుదీర్ఘ చర్చల అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడింది. ఫలితాలు విడుదలైన దాదాపు 24 గంటల అనంతరం కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్ పీఠంపై కూర్చోనున్నది ఎవరో తేలింది. తీవ్ర ఉత్కంఠ అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత కమల్నాథ్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఊహాగానాలకు తెరదించుతూ గురువారం అర్ధరాత్రి సమయంలో పార్టీ ట్వీటర్ హ్యాండిల్లో మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథేనంటూ స్పష్టత ఇచ్చింది. దాంతో భోపాల్, తదితర మధ్యప్రదేశ్ నగరాల్లో కమల్నాథ్ అభిమానాలు బాణాసంచాతో సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందే కమల్ నాథ్, యువ నేత జ్యోతిరాదిత్య సింధియాలు భోపాల్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కమల్నాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ను కలవనున్నారు. మరోవైపు, రాజస్తాన్ విషయంలోనూ పార్టీ అగ్ర నాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. సీఎం రేసులో ఉన్న సీనియర్ నేత అశోక్ గహ్లోత్, యువ నాయకుడు సచిన్ పైలట్ తమ పట్టు వీడకపోవడంతో నిర్ణయం తీసుకోవడం పార్టీ చీఫ్ రాహుల్కి కత్తి మీద సాములా మారింది. ఈ రెండు రాష్ట్రాల సీఎం ఎంపికే ఒక కొలిక్కి రాకపోవడంతో.. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి ఎంపికను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, తమ అభిమాన నేతనే సీఎంగా ప్రకటించాలంటూ పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో రాజస్తాన్లో స్వల్ప హింస చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడి దాదాపు 2 రోజులు గడుస్తున్నా సీఎం ఎంపిక పూర్తి కాకపోవడంపై బీజేపీ నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. సీఎం పదవికి రేసు ఏదీ లేదు: సింధియా ప్రజలకు సేవ చేసేందుకే తాము ఉన్నామనీ, సీఎం పదవి కోసం పరుగుపందెం ఏదీ జరగడం లేదని రాహుల్తో చర్చల అనంతరం జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రాహుల్తో సింధియా, కమల్నాథ్లు విడివిడిగా భేటీ అయిన అనంతరం ఇరువురితో కలిసి రాహుల్ ఫొటో తీసుకుని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కాలం, ఓరిమి.. ఇవే అత్యంత శక్తిమంతమైన యోధులు’ అనే ప్రఖ్యాత రచయిత లియొ టాల్స్టాయ్ వ్యాఖ్యను ట్వీట్తో జతపరిచారు. రాజస్తాన్ నిరసనల్లో హింస తమ అభిమాన నాయకుడినే సీఎంగా ప్రకటించాలంటూ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయాలు సహా పలుచోట్ల ఆందోళనలకు దిగారు. సచిన్ మద్దతుదారులు ఢిల్లీలో రాహుల్ నివాసం బయట నినాదాలు చేశారు. రాజస్తాన్లో పార్టీ కార్యకర్తల నిరసనల్లో స్వల్ప హింస చెలరేగింది. దౌసా, అజ్మీర్, కరౌలీ ప్రాంతాల్లో సచిన్ పైలట్ మద్దతుదారులు రోడ్లపై వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. సంయమనంతో ఉండాలని సచిన్తోపాటు గెహ్లోత్ కార్యకర్తలను కోరారు. రాహుల్, సోనియాలపై నమ్మకం ఉందనీ, కార్యకర్తలు సంయమనంతో ఉండాలని పైలట్ తన వర్గం వారిని కోరారు. ఛత్తీస్గఢ్పై నిర్ణయం నేడు ఛత్తీస్గఢ్ సీఎం ఎంపిక నేటికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రుల ఎంపికలో తలమునకలైన కాంగ్రెస్ అగ్రనేతలు.. చత్తీస్గఢ్ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారని సమాచారం. అయితే, రాష్ట్రంలో పార్టీ పరిశీలకుడు మల్లిఖార్జున్ ఖర్గే పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను, రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితిని వివరిస్తే రూపొందించిన తన నివేదికను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందించారు. చత్తీస్గఢ్లో పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ బఘేల్, ఓబీసీ నేత తామ్రధ్వజ్ సాహు, సీనియర్ నేతలు టీఎస్ సింగ్ దేవ్, చరణ్సింగ్ మహంత్లు సీఎం రేసులో ఉన్నారు. 15 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసిన బఘేల్కే సీఎం పీఠం దక్కే చాన్సుంది. 1984 అల్లర్లలో పాత్రపై ఆరోపణలు మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్ను ఎంపిక చేయడం ద్వారా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితులను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని శిరోమణి అకాలీదళ్ నేత మంజీందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. ‘గాంధీ కుటుంబం అధికారంలో ఎప్పుడొచ్చినా 1984 అల్లర్ల నిందితులను కాపాడుతుంది. ఇప్పుడు కమల్నాథ్ను మధ్యప్రదేశ్కు సీఎంను చేయడం ద్వారా ఆయనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కానుక ఇస్తున్నారు’ అని మంజీందర్ అన్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్నాథ్ పాత్ర కూడా ఉందని అకాలీదళ్ గతం నుంచీ ఆరోపిస్తోంది. ‘సిక్కు వ్యతిరేక అల్లర్లలో అమాయకుల ప్రాణాలు తీసినవారు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ సందేశమిస్తున్నారు. ఆ ఘాతకుల వెనుక తాము ఉన్నామనీ, సిక్కులను చంపినందుకు బహుమతులు ఇస్తామని ఆయన అంటున్నారు’ అని మంజీందర్ అన్నారు. గతంలో కమల్నాథ్ను పంజాబ్, హరియాణాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పుడూ పలువురు సిక్కులు వ్యతిరేకించడంతో ఆయనను అప్పట్లో పంజాబ్ బాధ్యతల నుంచి తప్పించారు. అలాగే సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేత కమల్నాథ్ హస్తం ఉందనేందుకు తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు లాయర్ హెచ్ఎస్ ఫూల్కా కూడా తెలిపారు. ‘కమల్నాథ్కు వ్యతిరేకంగా అవసరమైనన్ని సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయి. అయితే, చట్టం ముందు ఆయన నిలబడాల్సిన సమయం ఇంకా ఆసన్నం కాలేదు. కానీ, ఇటువంటి వ్యక్తిని మధ్యప్రదేశ్ సీఎంగా నియమించాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది రాహుల్ గాంధీనే’ అని అల్లర్ల బాధితుల పక్షాన వాదిస్తున్న ఫూల్కా అన్నారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం 1984లో ఢిల్లీలో సిక్కులు ఊచకోతకు గురవడం తెలిసిందే. ఉదయం నుంచి ఉత్కంఠ మధ్యప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రుల ఎంపిక కోసం చర్చలు, సంప్రదింపుల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం ఉదయమే ప్రారంభించారు. ఇందుకు గాను ఆయా రాష్ట్రాల సీఎం ఆశావహులతో పాటు, పార్టీ పరిశీలకులు, సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించారు. రాహుల్కు సహాయంగా ఆయన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా కూడా చర్చల్లో పాల్గొన్నారు. రాహుల్ నివాసంలో జరిగిన ఈ చర్చల్లో మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థులుగా ఉన్న కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలతో.. రాజస్తాన్ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లతో ఉమ్మడిగా, వేర్వేరుగా చర్చలు జరిపారు. యువ నేతలైన సింధియా, పైలట్ల వైపు రాహుల్, ప్రియాంక మొగ్గుచూపగా..అనుభవాన్ని, 2019 లోక్సభ ఎన్నికల అవసరాన్ని పరిగణనలోకి తీసుకున్న సోనియా గాంధీ సీనియర్లైన కమల్ నాథ్, గహ్లోత్లకు మద్దతిచ్చినట్లు సమాచారం. మధ్యప్రదశ్ విషయంలో కమల్నాథ్ను సీఎంగా అంగీకరించేలా జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్, ప్రియాంకలు ఒప్పించారని, సచిన్ పైలట్ మాత్రం గహ్లోత్ను ముఖ్యమంత్రిగా నియమించడాన్ని తీవ్రంగా నిరసించాడని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ఎంపికను ఖరారు చేసిన రాహుల్.. రాజస్తాన్ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. ఉదయం నుంచి పలు దఫాలుగా జరిగిన చర్చల్లో రాజస్తాన్కు కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్, ఆ రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జ్ అవినాశ్ పాండే, మధ్యప్రదేశ్ కేంద్ర పరిశీలకుడు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్ ఖర్గే తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
కమల్నాథ్ X సింధియా
భోపాల్: మధ్యప్రదేశ్లో అధికారం చేపట్టేదెవరో ఇంకా తేలనప్పటికీ ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడినా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గనుక ఇతర పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకుంటే ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరవుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్లో యువనాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న జ్యోతిరాదిత్య సింధియాతోపాటు మరో సీనియర్ నేత కమల్ నాథ్ కూడా కాంగ్రెస్ తరఫున మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్నారు. అనుభవజ్ఞుడికే బాధ్యతలు ఇస్తారా? చింద్వారా లోక్సభ నియోజకవర్గం నుంచి కమల్నాథ్ 9 సార్లు ఎంపీగా గెలిచారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఓ సారి ఇందిర చింద్వారాకు ఎన్నికల ప్రచారానికి వచ్చి, నా మూడో కొడుకు కమల్నాథ్ను గెలిపించండి అని ప్రజలను కోరారు. ఇవి చాలు రాజకీయాల్లో కమల్నాథ్కు ఉన్న అనుభవమేమిటో చెప్పడానికి. ఇప్పుడు అనుభవజ్ఞుడైనందున కమల్నాథ్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపొచ్చనే అంచనాలున్నాయి. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కాస్త ముందు పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కమల్నాథ్ సీఎం రేసులో ముందున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కమల్నాథ్ అంతా తన భుజస్కం«ధాలపైనే నడిపించారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత ధనవంతుడైన పార్లమెంటేరియన్ కమలనాథ్కు ఏరికోరి ఎన్నికల వేళ పీసీసీ పగ్గాలు అప్పగించిందనే విశ్లేషణలైతే ఉన్నాయి. కానీ మాస్ ఫాలోయింగ్లో ఆయన వెనుకబడే ఉన్నారు. మాస్ ఫాలోయింగ్ జ్యోతిరాదిత్యకే మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న మరో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా. గ్వాలియర్ రాచ కుటుంబానికి చెందిన సింధియా జనాకర్షణ కలిగిన నేత. గత కొన్నేళ్లుగా గ్రామ స్థాయి పర్యటనలు చేస్తూ తన పట్టు పెంచుకున్నారు. 32 శాతం మంది ప్రజలు జ్యోతిరాదిత్య సీఎం కావాలని కోరుకున్నారంటే ఆయనకు ఏ స్థాయిలో ప్రజల్లో ఆదరణ ఉందో అర్థమవుతోంది. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఆయన మధ్యప్రదేశ్లో విస్తృతంగా పర్యటించారు. కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలతో ఎల్లప్పుడూ విభేదిస్తూనే వచ్చారు. కాంగ్రెస్ మాజీ నేత మాధవరావు సింధియా కుమారుడు కావడం, రాహుల్ గాంధీకి కుడి భుజంగా ఉండడం జ్యోతిరాదిత్యకు కలిసొచ్చే అంశాలు. మరో నాలుగు నెలల్లోనే లోక్సభ సాధారణ ఎన్నికలున్నందున ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సింధియాకు కాంగ్రెస్ సీఎంగా అవకాశం ఇవ్వొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. -
90% ముస్లిం ఓట్లు పడేలా చూడండి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కమల్నాథ్ ఇబ్బందుల్లో పడ్డారు. ఈసారి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో 90 శాతం ఓట్లు కాంగ్రెస్కు పడేలా చేయాలని ఆ పార్టీ ముస్లిం నేతలను కమల్నాథ్ కోరుతున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని ఓ ప్రాంతంలో గత నెలలో రికార్డు చేసినట్లు భావిస్తున్న ఈ వీడియోలో ‘నరేంద్ర మోదీకి ఓటు వేయడమంటే హిందువులకు ఓటేయడమేనని బీజేపీ, ఆరెస్సెస్లు ప్రజలకు సందేశాన్ని పంపుతున్నాయి. నిజంగా ముస్లింలకు ఓటేయాలని మీకు ఉంటే కాంగ్రెస్కు ఓటేయండి. వాళ్లు మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. కానీ పోలింగ్ అయ్యేంతవరకూ ఓపిక పట్టండి. గత ఎన్నికల సందర్భంగా నమోదైన ఓటింగ్ సరళిని ఓసారి గమనించాలని మిమ్మల్ని కోరుతున్నా. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కేవలం 50–60 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 90% పోలింగ్ ఎందుకు జరగలేదు? ఒకవేళ ముస్లింలు ఈ ఎన్నికల్లో 90 శాతం ఓటు హక్కును వినియోగించుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో మతం ఆధారంగా ఓట్లడిగిన కమల్నాథ్ తో పాటు కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ నేతృత్వంలో బీజేపీ బృందం ఎన్నికల సంఘానికి వినతిపత్రాన్ని సమర్పించింది. -
కమల్ వర్సెస్ కమలం
సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలపై చెరగని ముద్ర వేసి మామా అంటూ ప్రజలతో ఆప్యాయంగా పిలిపించుకునే కమలనాథుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకవైపు, ఇందిరాగాంధీకి కుడి భుజంగా పేరుతెచ్చుకొని సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న కమల్నాథ్ మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ప్రజల మనసు దోచుకునే ‘నాథు’డెవరు? పేదల ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ను ధనిక పార్లమెంటేరియన్ కమల్నాథ్ ఢీ కొనగలరా? త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అత్యంత కీలకం. 29 లోక్సభ స్థానాలున్న మధ్యప్రదేశ్పై పట్టు సంపాదించడం కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత ఆవశ్యకం. అంతకుముందు అంధకారంలో ఉన్న రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన నేత చౌహానే. సంక్షేమ పథకాలతోనే ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే 13ఏళ్లు సీఎంగా ఉండటం, వ్యాపమ్ సహా వివిధ కుంభకోణాలు, రైతు సమస్యలు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఇతరులతో పోలిస్తే వెనకబడడం వంటికి చౌహాన్కు ఈ ఎన్నికల్లో సవాల్గా మారాయి. రాష్ట్రంలో ఇంకా 70% మంది ప్రజల ఆదాయ వనరు వ్యవసాయమే. నెలవారీ రూ.1300 తలసరి ఆదాయంతో వీరి పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ సగటుకంటే ఇది 7% తక్కువ. గతేడాది మందసౌర్లో రైతుల ఆందోళనలు, పోలీసుల కాల్పులు, ఆరుగురు రైతులు చనిపోవడం శివ్రాజ్ మెడకు చుట్టుకున్నాయి. ఇన్ని సమస్యల మధ్య చౌహాన్ సంక్షేమ కార్యక్రమాలు, హిందుత్వ కార్డు, మోదీ ఇమేజ్ను నమ్ముకొని ఎన్నికల బరిలో దిగారు. అయితే.. ఇప్పటికీ 46% మంది చౌహాన్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. శివరాజ్ వ్యూహాలు రైతు సమస్యలు, నిరుద్యోగమే ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి. వీటినుంచి బయటపడేందుకు చౌహాన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. జనాశీర్వాద్ యాత్ర, జనాదేశ్ యాత్రల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రైతులకోసం తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొస్తున్నారు. గత ఏడాదిలో రూ.32,701 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. రాష్ట్రంలో 90% హిందువులే ఉండడంతో.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే గో సంరక్షణకు ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామంటున్నారు. మామ ఇమేజ్ శివరాజ్ సింగ్ చౌహాన్ది రైతు కుటుంబం. విద్యార్థి దశలోనే ఆరెస్సెస్తో అనుంబధం ఏర్పడింది. ఏబీవీపీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో తొలిసారిగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎంపీగా నాలుగు సార్లు వరసగా లోక్సభకు ఎన్నికయ్యారు. 2003లో రాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టారు. అప్పట్లో ఆయనపై పప్పు అనే ముద్ర ఉండేది. కానీ తనకున్న నాయకత్వ పటిమ, పాలనా సామర్థ్యాలతో ఆ ఇమేజ్ను చెరిపేసుకుని అందరితో మామ అని పిలిపించుకునే స్థితికి ఎదిగారు. 2008 ఎన్నికల్లో చౌహాన్ 143 స్థానాల్లో, 2013లో 165 చోట్ల పార్టీని గెలిపించుకున్నారు. కమల్నాథ్ ప్లానింగ్.. మధ్యప్రదేశ్లో పదిహేనేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్ష పగ్గాలను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కమల్నాథ్కు అప్పగించింది. కమల్నాథ్ రాజకీయాల్లో తిరుగులేని వ్యూహకర్త. పారిశ్రామిక, ఆర్థిక రంగాలపై మంచి పట్టు ఉంది. తొమ్మిదిసార్లు మధ్యప్రదేశ్ నుంచి లోక్సభకు ఎన్నికైన కమల్నాథ్కు రాష్ట్రంలో ప్రతి నాయకుడి పాజిటివ్, నెగటివ్ అంశాలు బాగా తెలుసు. నాయకులతోపాటు, కార్యకర్తలతోనూ మంచి అనుబంధం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా కమల్నాథ్ను ఎంపిక చేయడంపై కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. చౌహాన్ ‘మామ’ ఇమేజ్ మసకబారేలా, ప్రజల్లో ఆయన విశ్వసనీయత దెబ్బ తీసేలా కుంభకోణాలపైనే దృష్టి సారించారు. హిందూత్వ కార్డునీ ప్రయోగిస్తున్నారు. ‘మేము కూడా మతాన్ని గౌరవిస్తాం. మతాన్ని రాజకీయాల్లోకి వాడుకోం. చింద్వారాలో 101 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. కానీ దానిని ప్రచారం చేసుకోలేదు’ అంటూ పదే పదే చెబుతున్నారు. రాజకీయ ప్రస్థానం కమల్నాథ్ సంజయ్గాంధీకి సమకాలికుడు. ఇందిర నుంచి రాహుల్ వరకు మూడు తరాల గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. 1980 నుంచి చింద్వారా లోక్ సభ స్థానానికి తొమ్మిది సార్లు గెలిచారు. 16వ లోక్సభలో కమలనాథే సీనియర్ సభ్యుడు. కమల్నాథ్కు ఏవియేషన్ రంగంలో వ్యాపారాలతో పాటు ఎన్నో రెస్టారెంట్లకు అధినేత. 187 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్లో ప్రకటించుకున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మాయావతి నిర్ణయం రాహుల్కు దెబ్బే!
సాక్షి, న్యూఢిల్లీ : 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు వివిధ ప్రాంతీయ పార్టీలతో కలసి మహా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్ పార్టీ వ్యూహానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. చత్తీస్గఢ్లో అజిత్ జోగి నాయకత్వంలోని చత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ పార్టీతోని ఎన్నికల పొత్తు పెట్టుకున్నామంటూప బీఎస్పీ నాయకురాలు మాయావతి ప్రకటించడమే కాకుండా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి 22 మంది పార్టీ సభ్యుల జాబితాను కూడా విడుదల చేయడం అనూహ్య పరిణామం. ఓ పక్క మధ్యప్రదేశ్లో సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం శోచనీయమే. 2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతుడై చత్తీస్గఢ్ జనతాపార్టీని ఏర్పాటు చేసిన అజిత్ జోగితో తన పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని మాయావతి ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకని అది అంత ఆశ్చర్యకరమైన విషయం కాకపోవచ్చు. కానీ మధ్యప్రదేశ్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్నాథ్తో ఓ పక్క చర్చలు కొనసాగుతుండగానే 22 మంది పార్టీ సభ్యుల పేర్లను ప్రకటించడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మాయావతి తన పార్టీ కోసం 50 సీట్లను డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ 30 సీట్లకు మించి ఇవ్వనని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మాయావతి జాబితాను విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చత్తీస్గఢ్లో మాయావతిని జట్టులో నుంచి పోనీయకుండా చూడాల్సిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉండి ఉంటే అలా జరగనిచ్చే వారు కాదని, ఆమె కుమారుడైన రాహుల్ గాంధీకి అంత రాజకీయ పరిణతి లేకపోవడం వల్ల అలా జరిగిందని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. దీని ప్రభావం మధ్యప్రదేశ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని, ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, కచ్చితంగా ఆ రాష్ట్రంలో పొత్తు కుదురుతుందని కమల్నాథ్ లాంటి సీనియర్ నాయకులే విశ్వసిస్తున్నారు. అది నిజమే కావచ్చుకానీ వివిధ సామాజిక వర్గాల మద్దతును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పలు ప్రాంతీయ పార్టీల బలాలపై ఆధారపడాల్సిన అవసరం ఉంది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతోని కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదరకుండా ఆయా పార్టీలపై పాలకపక్ష బీజేపీ అన్ని రకాలుగా ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో చత్తీస్గఢ్ పరిణామం కాంగ్రెస్కు ప్రతికూలమే. పాలకపక్ష బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు తేడా ఉన్న చత్తీస్గఢ్లో తృతీయ ఫ్రంట్ రావడం అంటే పాలకపక్షం బీజేపీకీ మేలు చేయడమే. మూడవ పర్యాయం ముఖ్యమంత్రి రామన్ సింగ్కు మళ్లీ పట్టం కట్టడమే! -
విభజన తంటాలు.. ఇంకెన్నాళ్లు?
సాక్షి, హైదరాబాద్: పోలీస్శాఖలో విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీలు రెండు రాష్ట్రాల మధ్య నాలుగేళ్లుగా నలిగిపోతున్నారు. డీఎస్పీ విభజన ఎప్పుడో జరగాల్సి ఉన్నా ఇప్పటివరకు సీనియారిటీ పంచాయితీ తేలలేదు. దీనిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెండింగ్ పెట్టాయి. అధికారులను విభజించాల్సిన కమల్నాథన్ కమిటీ తాత్కాలిక కేటాయింపులకు ఓకే చెప్పినా తుది కేటాయింపులపై హైకోర్టు స్టే ఉండటంతో ఏం చేయాలో తెలియక పోలీస్ శాఖకే వదిలేసింది. దీనితో రెంటికి చెడ్డ రేవడిలాగా పోలీస్ అధికారుల పరిస్థితి తయారైందన్న వాదన ఉంది. ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. పెండింగ్లో ఉన్న విభజన పనులను పూర్తి చేసుకోవాలని, మధ్యేమార్గంగా వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డీఎస్పీల విభజనపై ఓ నిర్ణయానికి వచ్చినా ఇప్పటివరకు అందులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్రానికి లేఖ రాసి తెలంగాణలో పనిచేస్తున్న డీఎస్పీలను ఇక్కడే కొనసాగించాలని, ఏపీలో పనిచేస్తున్న అధికారులను అక్కడే కొనసా గేలా చర్యలు చేపట్టాలని కోరాలని నిర్ణయించారు. ఇప్పటివరకు లేఖ రాయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సీనియారిటీ వ్యవహారంపై రెండు రాష్ట్రాల పోలీస్ పెద్దలు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇంటిగ్రేటెడ్ డీఎస్పీ సీనియారిటీ రూపొందించడంపై దృష్టి పెట్టలేదు. సీనియారిటీ జాబితా సమీక్ష పేరుతో మూడున్నరేళ్ల ఏపీ పోలీస్శాఖ కాలం గడిపింది. ఇంతవరకు జాబితా రివ్యూ చేసి హైకోర్టులో దాఖలు చేయకపోవడంతో విభజన, పదోన్నతులు, పదవీ విరమణ సెటిల్మెంట్లు అన్నీ పెండింగ్లో పడిపోయాయని తెలంగాణ పోలీస్ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో రూపొందించిన జీవో 108, 54 సీనియారిటీ జీవోలను రివ్యూ చేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉండటంతో ఆ అంశం ఏపీలోకి వెళ్లింది. దీనితో తమ చేతిలో ఎలాంటి అధికారం లేదని తెలంగాణ అధికారులు తేలికగా తీసుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయా అధికారులు వినతిపత్రాలిచ్చి ఏళ్లు గడుస్తున్నాయే తప్పా విభజన పని ముందుకు సాగడం లేదు. కేంద్ర హోంశాఖ హెచ్చరించినా.. రెండు రాష్ట్రాల్లో కలిపి 36 మందికి కన్ఫర్డ్ కోటా కింద ఐపీఎస్లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉండగా రెండు రాష్ట్రాల హోంశాఖలు నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా హెచ్చరిస్తూ వస్తూనే ఉంది. కన్ఫర్డ్ జాబితా కింద వేకెన్సీ ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదిత జాబితా పంపాలని కోరినా బుట్టదాఖలు చేస్తూ వస్తున్నాయని లేఖలో స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా ప్యానల్ జాబితా పంపకపోవడంతో కన్ఫర్డ్ ఆశావహ అధికారులు నిరాశలో మునిగిపోయారు. గ్రూప్ వన్ డీఎస్పీగా సెలక్ట్ అయిన నాటి నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే ఐపీఎస్ పదోన్నతి రావాల్సి ఉంది. 11 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్యానల్ జాబితా ఫైలు కదలకపోవడం తమ సర్వీసుపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ జాబితా పేరుతో నాలుగేళ్లుగా పెండింగ్లో పెట్టడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల అధికారులు మధ్యేమార్గ నిర్ణయం తీసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని కోరుతున్నారు. -
ఎంపీలో ‘ఐ’క్యతా రాగం!
సాక్షి, భోపాల్ : నగరంలో మంగళవారం ప్రచండ భానుడు మండిపోతున్నాడు. 42 డిగ్రీల ఎండలో కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకుడు కమల్నాథ్కు ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఏమాత్రం వెరవలేదు. నాయకుడితోపాటు ఆరు గంటల రోడ్ షోలో అలుపెరగకుండా పాల్గొన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా నియమితులై రాష్ట్రానికి తిరిగొస్తున్న తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎగబడ్డారు. ‘స్లమ్డాగ్ మిలియనీర్’ సినిమాలోని ‘జయహో’ ట్రాక్లో పార్టీ పాట హోరెత్తుతుండగా, అందంగా అలంకరించిన ఒంటెలు, గుర్రాలతో పార్టీ కార్యకర్తలు మేళతాళాల మధ్య డాన్సులు చేశారు. ఛింద్వారా నియోజకవర్గానికి తొమ్మిదోసారి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న కమల్ నాథ్ మోటార్ వాహనంపై వస్తుండగా, ఆయన పక్కన పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను స్వీకరించనున్న కాంగ్రెస్ యువ నాయకుడు జ్యోతిరాదిత్య వెన్నంటి వచ్చారు. కార్యకర్తలు అందించిన కొబ్బరి బోండంను ఆయన స్వయంగా కమల్నాథ్తో తాగించారు. విమానాశ్రయం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ఈ స్వాగత యాత్ర సాగింది. సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో దారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ అభిమానులు పూల వర్షం కురిపిస్తూ వచ్చారు. ఎంతో మంది రైతులు కూడా తమ ఎండ్ల బండ్లతో ర్యాలీలో భాగంగా కదిలి వచ్చారు. బీజేపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రైతులు రాష్ట్రంలో పలుసార్లు సమ్మెలు చేసిన విషయం తెల్సిందే. కమల్నాథ్ ర్యాలీ పార్టీ కార్యాలయానికి చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత కమల్నాథ్కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య ప్రసంగించారు. తామంతా ఐక్యంగానే ఉన్నామన్న సందేశం ఇచ్చారు. కాంగ్రెస్లో ఇంకా నాయకత్వం కోసం గొడవలు ఉన్నాయంటే నమ్ముతారా? అని ఓ కాంగ్రెస్ నాయకుడు ప్రేక్షకులనుద్దేశించి ప్రశ్నించగా, ‘లేదు లేదు. అదంతా గతం’ అంటూ ప్రజలు స్పందించారు. ఈ ముగ్గురు నాయకుల మధ్యనున్న కుమ్ములాటల వల్ల రాష్ట్రంలో అధికారానికి కాంగ్రెస్ 15 ఏళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఐక్యత పైకి కనిపించేదేనా, నిజంగా వారిమధ్య ఐక్యత కుదిరిందా అన్నది ఇప్పుడే స్పష్టం చేయలేం గానీ, ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న కాంక్ష వారిలో కనిపించింది. ‘హమ్ ఆపస్ మే లడ్ గయేతో దేశ్కు ఖౌన్ బచాయేగా!’ నినాదాల మధ్య సమావేశం ముగిసింది. -
‘సీఎం’ కోసం స్వాముల చుట్టూ ప్రదక్షణలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఇద్దరు కాంగ్రెస్ నాయకులు పోటీ పడి గుళ్లూ గోపురాలతోపాటు స్వాముల చుట్టూ తిరుగుతున్నారు. ఛింద్వారా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కమల్నాథ్ ఏప్రిల్ 13వ తేదీన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వద్దకు హెలికాప్టర్లో వెళ్లి ఆయన్ని సందర్శించుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే సింధియా వెళ్లి స్వరూపానంద దీవెనలు తీసుకున్నారు. ప్రస్తుతం కమల్నాథ్ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏప్రిల్ తొమ్మిదవ తేదీనే తన ఆరు నెలల నర్మదా యాత్రను ముగించుకొని వచ్చారు. ఇక మధ్యప్రదేశ్లోని బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌవాన్ ఇటీవలనే ఐదుగురు మహంతులకు సహాయ మంత్రి హోదా కల్పించారు. నర్మదా నది పక్కన ప్రభుత్వం మొక్కలు నాటే పథకంలో అవినీతి ఉందని, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని మహంతులు హెచ్చరించడంతో చౌహాన్ వారికి ఈ హోదా కల్పించారు. దాంతో వారు ఆందోళన ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇలా రాజకీయాలను, మతాలను కలిపేయడం దేశంలో రాజకీయ నాయకులకు కొత్తేమి కాదుకానీ, ఈ మధ్య ప్రజలకు తెలిసేలా బహిరంగ ప్రదర్శనకు దిగారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా వివిధ మతాలకు చెందిన గుళ్లూ గోపురాలు తిరిగిన రాహుల్ గాంధీ ఇప్పుడు 12వ తేదీన ఎన్నికలు జరుగనున్న కర్ణాటక రాష్ట్రంలో గుళ్లూ గోపురాలతోపాటు వివిధ కులాల దైవాలను సందర్శించుకుంటున్నారు. బీజేపీ నాయకులు అదే చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తనకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం తనకు అవసరం లేదని, అది రెండు దిక్కుల పదునున్న కత్తి లాంటిదని దిగ్విజయ్ సింగ్ ఇటీవలనే ప్రకటించన నేపథ్యంలో సీఎం అభ్యర్థిత్వం కోసం కమల్నాథ్, సింధియా శిబిరాలు పోటీ పడుతున్నాయి. ఈ విషయాన్ని త్వరగా తేల్చుకోవాల్సిందిగా శిబిరాల నుంచి నాయకులపై ఒత్తిడి కూడా పెరగడంతో కమల్ నాథ్ ఇటీవల రాహుల్ గాంధీని కలుసుకున్నారు. సమయం వచ్చినప్పుడు తానే అభ్యర్థి పేరును ప్రకటిస్తానని చెప్పి పంపించినట్లు తెల్సింది. ఈ దశలో ఎవరి పేరును ప్రకటించిన పార్టీలో కుమ్ములాటలు మొదలవుతాయని, ఫలితంగా రానున్న ఎన్నికలో నష్టపోతామని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. పార్టీలో ఐకమత్యం లేకపోతే మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని పార్టీని ఎదుర్కోవడం కష్టం. ఈలోగా రాహుల్ మెదడును ప్రభావితం చేయడం కోసం కమల్నాథ్, సింధియాలు స్వాముల చుట్టూ తిరుగున్నారు. -
అటు నుంచి ఇటు... ఇటు నుంచి అటు
తెలంగాణ–ఏపీల మధ్య ఉద్యోగుల పంపకానికి అంగీకారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల్లోని ఉద్యోగుల పరస్పర మార్పిడిపై కసరత్తు మొదలైంది. రాష్ట్ర విభజన అనంతరం కమలనాథన్ కమిటీ అధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ ముగిసింది. దామాషా పద్ధతి, పోస్టుల సంఖ్య, ఉద్యోగుల ఆప్షన్లు, స్థానికతను పరిగణనలోకి తీసుకోవటంతో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు ఏపీకి, ఏపీ స్థా నికతకు చెందినవారు తెలంగాణ కు పంపిణీ అయ్యారు. కమలనాథన్ కమిటీ ఇచ్చిన తుది కేటాయింపులు కావటంతో రెండు రాష్ట్రాలు ఆమోదించినా స్థానికేతర రాష్ట్రాలకు పంపిణీ అయిన ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. తమను సొంత రాష్ట్రానికి పంపాలని కమిటీకి అర్జీలు పెట్టుకున్నారు. ఇటీవల రెండు రాష్ట్రాలు మంత్రుల ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలు గవర్నర్ సమక్షంలో జరిపిన చర్చల్లో ఈ అంశం చర్చకొచ్చింది. తుదిసమావేశ నిర్ణయం వే ురకు ఏపీ నుంచి ఎంతమంది ఉద్యోగులొస్తే.. తెలంగాణ నుంచి అంతమందిని పంపాలని ఇరు రా ష్ట్రాలు ఓ అంగీకారానికొచ్చాయి. అంటే సమాన సంఖ్య లో పరస్పర మార్పిడి. సంబంధిత విధివిధా నాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 13 మంది గెజిటెడ్ అధికారుల మార్పిడి.. వచ్చిన అర్జీల ప్రకారం.. ప్రస్తుతం ఏపీ స్థానికత ఉండి తెలంగాణలో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారుల్లో 117 మంది ఏపీకి వెళ్లేం దుకు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో పని చేస్తున్న గెజిటెడ్ అధికారుల్లో తెలంగాణకు చెందిన వారు 13 మంది. సమాన సర్దుబాటు ప్రకారం ఏపీలో ఉన్న 13మం దిని తెలంగాణకు పంపి, తెలంగాణలోని 117 మందిలో 13 మందిని ఏపీ తీసుకోవాల్సి ఉంటుంది. నాన్ గెజిటెడ్ అధికారుల్లో 61 మంది ఏపీకి చెందిన వారు తెలంగాణలో పనిచేస్తుండగా, 240 మంది తెలంగాణ వాళ ్లు ఏపీలో పనిచేస్తున్నా రు. 61 మందిని తీసుకుని 240 మందిలో 61 మందిని ఏపీకి పంపించాలి. నాలుగో తరగతి ఉద్యోగుల్లో ఏపీవాళ్లు నలుగురే తెలంగాణలో పనిచేస్తుండగా, 800 మంది తెలంగాణ స్థానికతున్నవారు ఏపీలో ఉన్నారు. ఆ 800 మందిలో ఎవరిని పంపాలన్న విషయంలో సినియారిటీని పరిగణనలోకి తీసుకునే అవకా శాలున్నాయి. కొత్తగా రెండు రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆ వైద్యుల విభజనపై పీటముడి
వైద్య విద్య సంచాలక విభాగంలో డాక్టర్ల కేటాయింపుపై ప్రతిష్టంభన ఏపీ స్థానికతగల వైద్యుల కేటాయింపుపై తెలంగాణ అభ్యంతరం తెలంగాణ ఆప్షన్ ఇచ్చుకున్న వారిని వెనక్కి తీసుకునేందుకు ఏపీ ససేమిరా ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన కమలనాథన్ కమిటీ సమావేశం హైదరాబాద్: వైద్య విద్యా సంచాలక విభాగంలోని 171 మంది వైద్యుల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య పీటముడి పడింది. సోమవారం సచివాలయంలో కమల్నాథన్ నేతృత్వంలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినా తుది నిర్ణయం తీసుకోకుండానే భేటీ ముగి సింది. స్థానికత ప్రకారం ఏపీకి చెందిన 171 మంది వైద్యులు తమకిచ్చిన ఆప్షన్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంత రం వ్యక్తం చేసింది. ఏపీలో వైద్య పోస్టులు ఖాళీగా ఉండగా వారిని తెలంగాణకు కేటాయించడం సరికాదని వాదించింది. అయితే ఉద్యోగుల ఆప్షన్ల ప్రకారమే విభజన చేపట్టినందున వారిని వెనక్కి తీసుకోబోమని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీంతో తదుపరి సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కమిటీ నిర్ణయించింది. మరోవైపు నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధించి ఏపీ నుంచి ఎంత మంది తెలంగాణకు వస్తే.. అంత మంది ఏపీకి వెళ్లేందుకు వీలుగా పరస్పర బదిలీలకు కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఇప్పటికే గవర్నర్ సమక్షంలో జరి గిన త్రిసభ్య కమిటీల చర్చల్లో ఈ విషయమై ఏకాభిప్రాయం వ్యక్త మైంది. కాగా, కోర్టుల్లో కేసులున్న కారణంగా ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీఎఫ్) అసిస్టెంట్ కమాం డెంట్లు, కార్మిక శాఖ అదనపు కమిషనర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీల విభజన అంశాలపై ఈ సమావేశంలో చర్చించలేదు. ఈ భేటీలో తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ తరఫున ఐఏఎస్ అధికారి ప్రేమ్చంద్రారెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏపీ సీఎస్ ఎస్పీ టక్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. మార్చితో ముగియనున్న కమిటీ గడువు... కమల్నాథన్ కమిటీ గడువు మార్చి నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆలోగా వీలైనంత వరకు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన ఇరు రాష్ట్రాల అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ నెలలోనే మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. -
‘విజయ’ మాదంటే.. మాదే!
►విజయ పాలు , తెలంగాణ ఆంధ్రప్రదేశ్ , కమలనాథన్ కమిటీ ►రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విజయ బ్రాండ్ కోసం వివాదం ►తెలంగాణ విజయ అమ్మకాలపై రాష్ట్రానికి ఏపీ నోటీసులు ►వివాదాలతో పడిపోయిన తెలంగాణ విజయ పాల అమ్మకాలు ►అనాలోచిత నిర్ణయంతో కాలం తీరుతున్న 3 లక్షల టెట్రాప్యాక్లు సాక్షి, హైదరాబాద్: ‘విజయ’బ్రాండ్పై రెండు తెలుగు రాష్ట్రాలు పేచీపడు తున్నాయి. అది తమదంటే తమదంటూ గొడవ పడుతున్నాయి. విభజన నేపథ్యంలో విజయ బ్రాండ్ ఎవరికి చెందాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నాయి. బ్రాండ్ అనేది వ్యాపారానికి సంబంధించిన అంశం కాబట్టి రెండు రాష్ట్రాలూ తమ రాష్ట్రం పేరును ముందు తగిలించి విజయ బ్రాండ్తో పాలు అమ్ముకోవాలని కమలనాథన్ కమిటీ సూచించింది. కానీ అది అమలు కావడంలేదు. ప్రస్తుతం ‘తెలంగాణ విజయ’, ‘ఆంధ్రప్రదేశ్ విజయ’పాల పేరుతో మార్కెట్లో రెండు రకాల పాల విక్రయాలు జరుగుతున్నా ఏపీ మాత్రం తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. తన బ్రాండ్తో ఎలా అమ్ముకుంటున్నారంటూ తెలంగాణను నిలదీసింది. దీంతో సమస్య కొలిక్కి రావడంలేదు. ఇదిలావుంటే తెలంగాణలోనూ ‘ఆంధ్రప్రదేశ్ విజయ’పాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలా అనేకానేక వివాదాల కారణంగా రాష్ట్రంలో విజయ పాల అమ్మకాలు ఢమాల్ అయ్యాయి. దాదాపు 40 వేల లీటర్ల పాల విక్రయాలు పడిపోయాయి. కాలం చెల్లుతున్న టెట్రాప్యాక్ పాలు.. తెలంగాణ విజయ డెయిరీలో అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉన్నతాధికారులకు, కిందిస్థాయి అధికారులకు మధ్య దూరం పెరిగింది. దీంతో కిందిస్థాయి అధికారుల ఆలోచనలను పట్టించుకోకుండా ఉన్నతస్థాయిలో నిర్ణయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఎలాంటి ఇండెంట్ లేకుండా రెండు నెలల క్రితం దాదాపు 15 లక్షల లీటర్ల విజయ టెట్రాప్యాక్ పాలను ప్యాకింగ్ చేశారు. వాటి నిల్వ కాలం 90 రోజులు. కానీ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో అవి అమ్మకానికి నోచుకోలేదు. ఎలా విక్రయించాలో అర్థంగాక చివరకు ఒక కాంట్రాక్టర్ను పిలిపించి కొన్ని అమ్మి పెట్టమని కోరినట్లు సమాచారం. అయినా 2 లక్షల లీటర్ల పాలు వృథా అయ్యే ప్రమాదముందని అంటున్నారు. వాటి గడువు 20 రోజుల లోపే ఉందని, దీంతో రూ.40 లక్షల విలువైన పాలు గంగలో పోసినట్లేనంటున్నారు. -
త్వరగా పరిష్కరించండి
- ‘ఉద్యోగుల పంపిణీ’పై హైకోర్టును కోరాలని ఏపీ, తెలంగాణ నిర్ణయం - కమలనాథన్ కమిటీ భేటీలో ఇరు రాష్ట్రాలు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ కేసులు.. ప్రధానంగా డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలంటూ ఉమ్మడి హైకోర్టును అభ్యర్థించాలని తెలంగాణ, ఏపీ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని రెండు రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్(ఏజీలు)కు ఆయా రాష్ట్రాల సీఎస్లు లేఖలు రాయనున్నారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన కమలనాథన్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో ఏపీ సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో పాటు రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. డిప్యూటీ కలెక్టర్ల తాత్కాలిక పంపిణీపై గతంలో ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. అయితే స్టే సంగతి తెలియని కమలనాథన్ కమిటీ.. రెండు రాష్ట్రాలకు డిప్యూటీ కలెక్టర్లను తాత్కాలికంగా పంపిణీ చేసింది. పంపిణీ తర్వాత స్టే సంగతి తెలియడంతో.. నోటిఫై చేయకుండా నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీకి స్టే అడ్డంకిగా ఉన్నందున.. త్వరగా కేసును పరిష్కరించాలని ఇరు రాష్ట్రాలు ఏజీల ద్వారా ఉమ్మడి హైకోర్టుకు విజ్ఞప్తి చేయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. డీఎస్పీల తుది పంపిణీపై స్టేను కూడా త్వ రగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఆ లోగా అభ్యంతరాలు లేని డీఎస్పీలను రిలీవ్ చేసేందుకు ఆస్కారం ఉం టుందేమో న్యాయ పరిశీలన చేయాలని ఇరు రాష్ట్రాల ఏజీలకు సీఎస్లు సూచించారు. ఇప్పటికే ఏపీలో తెలంగాణకు చెందిన 41 మంది ఎస్వోలుండటంతో.. తెలంగాణ నుంచి రిలీవ్ అయిన వారిని చేర్చుకోవడానికి ఏపీలో పోస్టులు లేవు. ఈ నేపథ్యంలో అభ్యంతరాలను త్వరగా పరిష్కరించి తుది కేటాయింపులు పూర్తి చేయాలని కోరుతూ కేంద్రానికి ఫైలు పంపించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా కమలనాథన్ కమిటీ గడువు ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. -
‘స్పౌస్’ కోటాలో గుర్తించరా?
రాజమహేంద్రవరం : రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ వైద్యుల పంపకంలో తమకు అన్యాయం జరుగుతోందని వేరే రాష్ట్రాలకు చెందిన వైద్య దంపతులు వాపోతున్నారు. వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న వైద్యులందరికీ ఆరు నెలల కిందట తమ తమ రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో నియమించేందుకు కౌన్సెలింగ్ జరిపారు. ఆమేరకు దంపతులైన వైద్యులు తమను ఒకే ప్రాంతంలో నియమించేలా దరఖాస్తులు చేసుకున్నారు. దీనిపై శుక్రవారం జీవో విడుదల చేశారు.ఆప్రకారం ఏపీ, తెలంగాణలకు చెందిన వైద్య దంపతులనే ‘స్పౌస్’ కోటాకు అర్హులుగా పరిగణించారు. దంపతుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే తప్ప పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇద్దరిలో ఒకరు మరో రాష్ట్రానికి చెందిన వారైతే ‘స్పౌస్’ వర్తించదని ఆ జీవోలోచెప్తోంది. వైద్యవిధాన పరిషత్లో సుమారు 900 మంది వైద్యులుండగా వారిలో ‘స్పౌస్’ కోటా వర్తించని 42 జంటలున్నారుు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య వైద్యులను విభజించే పక్రియలో దరఖాస్తుదారుల విన్నపాలు సరైనవేనా, ఎవరెవరిని ఎక్కడ నియమించాలనే దానిపైసోమవారం హైదరాబాదులోని సెక్రటేరియెట్లో భేటీ కానున్న కమల్నాథన్ కమిటీ తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
కమల్నాథన్ కమిటీ మరోసారి భేటీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్నాథన్ కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉద్యోగుల విభజన అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. -
నాథ్ నియామకం ఆత్మహత్యా సదృశ్యమే!
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్ర పార్టీ రాజకీయ కార్యకలాపాల విషయంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసిన తప్పే పదే పదే చేస్తోంది. వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో ఇక్కడి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పార్టీ సీనియర్ నాయకుడు కమల్నాథ్కు అప్పగించడం కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ఇందిరాగాంధీ మరణానంతరం సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లతో ప్రత్యక్ష సంబంధం ఉందన్న ఆరోపణలను ఎదుర్కోవడమే కాకుండా నానావతి కమిషన్ ముందు విచారణకు హాజరైన కమల్నాథ్ను నియమించడం అంటే సిక్కుల గాయంపై ఉప్పుచల్లడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా నానావతి కమిషన్ ఆయన్ని దోషిగా తేల్చకపోవచ్చుగానీ సిక్కులు మాత్రం ఆయన్ని ఉపేక్షించలేరు. అందుకనే ఆయన తాజా నియామకాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్లో పలుచోట్ల సిక్కులు కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలు జరిపారు (పంజాబ్, హర్యానా పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా కమల్నాథ్ను నియమిస్తూ కాంగ్రెస్పార్టీ అధిష్టానం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే). డ్రగ్స్, ప్రభుత్వ అవినీతి, బలహీనమైన ఆర్థిక పరిస్థితి లాంటి రాష్ర్ట సమస్యలపై జరుగుతున్న చర్చ కాస్త కమల్నాథ్ నియామకంతో ఒక్కసారిగా సిక్కుల ఊచకోత సంఘటన వైపు మళ్లింది. సిక్కులకు వ్యతిరేకంగా 1984లో జరిగిన అల్లర్లలో మూడువేల మందికి పైగా సిక్కులు మరణించడాన్ని సిక్కులు అంత తొందరగా మరిచిపోతారనుకుంటే అంతకన్నా తెలివిమాలిన పని మరోటి ఉండదు. ఒకవేళ వాళ్లు మరచి పోదామనుకున్న అధికార శిరోమణి అకాలీ దళ్, దానితో తాజాగా జతకట్టిన భారతీయ జనతా పార్టీలు మరచిపోనిస్తాయా ? మూసివేసిన 75 కేసులను తిరగతోడేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలోనే కమల్నాథ్ను నియమించడం ఎంత వివాదాస్పదం అవుతుంది? కమల్నాథ్ను నానావతి కమిషన్ను దోషిగా తేల్చకపోయినా రకాబ్గంజ్లో ఓ అల్లరిమూకకు ఆయన నాయకత్వం వహించారని, ఆయన కనుసన్నల్లోనే అక్కడి గురుద్వార్ను కూల్చేశారని అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. సంఘటన జరిగిన స్థలంలో కమల్నాథ్ను తాము చూశామని అప్పటి ఢిల్లీ పోలీసు కమిషనర్ సుభాష్ టాండన్, అదనపు పోలీసు కమిషనర్ గౌతమ్ కౌల్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా నిజమంటూ అప్పడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న సంజయ్ సూరి నానావతి కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. ఇవన్ని విషయాలను సిక్కు ప్రజలు అంత త్వరగా మరచిపోతారని భావించడం తొందరపాటే. ఒకప్పుడు స్వర్ణ దేవాలయంపై బ్లూస్టార్ ఆపరేషన్ను తీవ్రంగా వ్యతిరేకంచిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత రాష్ర్ట నాయకుడు అమరిందర్ సింగ్ సమర్థించడం కూడా సమస్యను మరింత జఠిలం చేస్తోంది. 30 ఏళ్ల క్రితం సంఘటనను ప్రజలు అప్పుడే మరిచిపోయారని అనడం రాజకీయ పరిపక్వత లేకపోవడమని భావించలేం. స్థానిక పార్టీలో నెలకొన్న కలహాల దృష్టితోనే ఆయన వ్యాఖ్యానించి ఉండవచ్చు. 30 ఏళ్లక్రితమే ప్రజలు మరచిపోయి ఉంటారనుకుంటే పాత కేసులను తిరగతోడేందుకు కేంద్రం అనుమతిచ్చేది కాదు. అమరిందర్ సింగ్, మాజీ పార్టీ రాష్ట్ర చీఫ్ ప్రతాప్ సింగ్ భజ్వా మధ్యనున్న కలహాలు మనకు తెలియనికావు. -
మానవ మృగం వికృత క్రీడ
తండ్రి బాధ్యత మరచి వదిలివెళ్లిపోతే.. తల్లే అన్నీ తానై పోషించింది. ఆ తల్లీబిడ్డకు ఏ అండా లేదని తెలుసుకున్న ఓ మృగం బాలికపై కన్నేశాడు. సమయం దొరికినప్పుడల్లా అనుభవించాడు. ఆపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. * బాలికతో వివాహేతర సంబంధం * ఆపై అనుమానించి చితకబాదిన వైనం * అడ్డుకోబోయిన తల్లిపైనా విచక్షణారహితంగా దాడి * అవమానం తట్టుకోలేక బాధితురాలి బలవన్మరణం * కేసు నుంచి బయటపడేందుకు ఆత్మహత్యాయత్నం గుమ్మఘట్ట : అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం బీటీపీ గ్రామానికి చెందిన ఆషాబీ(15) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన తల్లిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత సోదరుడు బెస్త రఘు దాడి చేసి కొట్టడాన్ని అవమానంగా భావించిన ఆ బాలిక చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. తన బిడ్డ చావుకు కారణమైన రఘుపై చర్యలు తీసుకోవాలని ఆషాబీ తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె కథనం ప్రకారం... భర్త నిరాదరణకు గురై... బీటీపీకి చెందిన గోరీబీ వివాహం రాయదుర్గానికి చెందిన నజీర్తో 18 ఏళ్ల కిందట అయింది. వారికి ఆషాబీ పుట్టింది. ఆమె పుట్టిన కొన్నాళ్లకే భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి గోరీబీ తన కుమార్తెతో కలసి పుట్టింట్లోనే ఉంటోంది. తల్లీ కూలి పనులకు వెళ్తుండగా, కుమార్తె కూడా కుట్టు పని నేర్చుకుంది. వచ్చిన బొటాబొటీ డబ్బులతో ఇద్దరు ఉన్నదాంట్లోనే తిని బతుకున్నారు. కన్నేసిన కామాంధుడు తల్లీబిడ్డలకు మగ దిక్కు లేదని గ్రహించిన బెస్త రఘు అనే కామాంధుడు ఆషాబీపై కన్నేశాడు. కొంతకాలంగా తల్లి లేని సమయంలో ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఆ విధంగా ఆ బాలికను లొంగదీసుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా ఆమెను వదిలేవాడు కాదు. మేనమామ ఇంటికి వెళ్లడంతో... సోమవారం రాత్రి ఆషాబీ తన మేనమమా ఇంటికి వెళ్లింది. రాత్రి 10 గంటలకు రఘు గోరీబీ ఇంటికెళ్లాడు. ఆ సమయంలో తల్లీబిడ్డ లేకపోవడంతో ఆవేశానికి లోనయ్యాడు. అరగంట తరువాత వారిద్దరూ ఇంటికి రాగానే వారితో పాటు లోనికెళ్లాడు. గడియపెట్టి ‘ఎవర్నడిగి వెళ్లావ్. అంతా నీ ఇష్టమేనా? అంటూ గద్దించాడు. దీంతో గోరీబీ అభ్యంతరం తెలిపింది. మా ఇష్టం. నువ్వెరు చెప్పడానికంటూ ఆమె నిలదీసింది. ఫస్ట్ ఇక్కడి నుంచి బయటకెళ్లంటూ హెచ్చరించింది. మగ దిక్కు లేదని మాపై ఏమిటీ నీ దౌర్జన్యమంటూ ప్రశ్నించింది. ఆమె మాటలు ఆ మృగంలో మరింత ఆక్రోశాన్ని పెంచాయి. అంతే ఆవేశంతో ఊగిపోయాడు రఘు. తల్లీ ఎదుటే ఆషాబీని గొడ్డును బాదినట్లు బాదాడు. అడ్డుకోబోయిన తల్లినీ చితకబాదాడు. రాత్రి వేళ రాద్ధాంతం చేయడంతో ఇరుగు పొరుగు వారు పోగయ్యారు. అవమానభారం తట్టుకోలేక.. దీంతో అవమానభారంతో కుంగిపోయిన ఆషాబీ విషపు గుళికలు మింగింది. వెంటనే ఆమెను గుమ్మఘట్ట పీహెచ్సీకి, అక్కడి నుంచి రాయదుర్గం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించేలోపే ఆషాబీ ప్రాణం విడిచింది. భయంతో ఆత్మహత్యాయత్నం ఆషాబీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న రఘు మంగళవారం తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇదే అనుమానంతో భార్యను కూడా చంపుకున్నాడనికేసు తనకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో బెస్త రఘు మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇలాంటి అనుమానాలతోనే భార్యను కూడా చంపుకున్నాడని, తన కూతురు చావుకు కారణమైన రఘుపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘుపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
కమలనాథన్ .. అదో తికమక కమిటీ!
ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన కమలనాథన్ కమిటీ.. కమాల్(తికమక) కమిటీ మాదిరిగా తయారైందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శనివారం టీజీవోల సంఘం కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కమలనాథన్ కమిటీ విభజన తీరును ఆయన తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల స్థానికత వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అలా వచ్చిన ఉద్యోగులు స్వచ్ఛందంగా వారి రాష్ట్రానికి వెళ్లాలని సూచించారు. సమావేశం లో టీజీవోల సంఘం ప్రతినిధులు మమత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
216 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు
♦ రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల పంపిణీ పూర్తి ♦ ఏపీలో పోస్టుల్లేక 216 మంది తెలంగాణకు కేటాయింపు ♦ సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేస్తే వారు ఏపీకి ♦ ఇప్పటి వరకూ 17,473 మంది ఉద్యోగుల పంపిణీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు లేకపోవడంతో ఏపీ స్థానికత కలిగిన 216 మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్లాల్సి వస్తోంది. వీరంటా ఆంధ్రప్రదేశ్కు ఆప్షన్ ఇచ్చినప్పటికీ పోస్టు లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల పంపిణీ శుక్రవారం పూర్తయింది. జనాభా నిష్పత్తి ఆధారంగా మొత్తం 43 వేల పోస్టులను ఇరు రాష్ట్రాలకు కమలనాథన్ కమిటీ పంపిణీ పూర్తి చేసింది. ఇది పూర్తి అయిన తరువాత ఏపీలో సూపర్ న్యూమరరీ పోస్టులు 216 ఏర్పాటు చేయాల్సి ఉందని తేలింది. అయితే ఆ 216 మంది ఉద్యోగుల్లో కొంత మంది 58 ఏళ్లకు దగ్గర్లో ఉన్నారు. వారు తెలంగాణకు వెళితే త్వరలోనే పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్లో ఉంటే 60 ఏళ్ల వరకూ వారు కొనసాగవచ్చు. అంటే ఏపీకి వెళితే మరో రెండేళ్లకు పైగా ఉద్యోగం చేయవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేస్తే తెలంగాణకు వెళ్లిన ఉద్యోగులు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం పరిశీలనలో ఉంది. న్యాయ శాఖ అభిప్రాయం తీసుకున్న తరువాత సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి వరకు ఫైలు వెళ్లాల్సి ఉంది. సూపర్ న్యూమరరీ పోస్టుల ఏర్పాటునకు సీఎస్ టక్కర్ సుముఖంగా ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఏపీకి 8,673 మంది.. ఇప్పటి వరకు కమలనాథన్ కమిటీ ఇరు రాష్ట్రాలకు 17,473 మంది రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల తుది పంపిణీని పూర్తి చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 8,673 మంది ఉద్యోగులను, తెలంగాణకు 8,800 మంది ఉద్యోగులను పంపిణీ చేసింది. తెలంగాణ స్థానికత గల 1,071 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ స్థానికత గల 488 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపిణీ చేశారు. రెండు రాష్ట్రాలకు చెందని నాన్లోకల్ 162 మందిని ఆంధ్రప్రదేశ్కు, 131 మందిని తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ స్థానికతకు చెందిన ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కే 85.78 శాతం మందిని, తెలంగాణ స్థానికతకు చెందిన 12.35 శాతం ఆంధ్రప్రదేశ్కు, నాన్లోకల్కు చెందిన 1.87 శాతం మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. అలాగే తెలంగాణ స్థానికత కలిగిన 92.97 శాతం మందిని తెలంగాణకు, అలాగే ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన 5.55 శాతం, నాన్లోకల్కు చెందిన 1.31 శాతం మందిని తెలంగాణకు కేటాయించారు. -
58-42 దామాషాలోనే ఎస్వో, ఏఎస్వోల విభజన
* కమల్నాథన్ కమిటీ సూచనను అంగీకరించిన ఇరు రాష్ట్రాల సీఎస్లు * తెలంగాణకు కేటాయించిన వైద్యుల స్థానికత వివరాలు ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల సచివాల యాల్లో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల విభజన ఓ కొలిక్కి వచ్చినట్టయింది. ఎస్వో, ఏఎస్వోలను 58-42 దామాషాలోనే విభజించాల్సిందిగా కమల్నాథన్ సూచించినట్టు తెలిసింది. శనివారం సచివాలయంలో కమల్నాథన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్లు ఎస్పీ టక్కర్, రాజీవ్శర్మతో పాటు కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. కొంతకాలంగా ఉద్యోగుల విభజన జాప్యం కావడం, ఏపీలో పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రం విభజించి రెండేళ్లు కావస్తున్నా ఇలాంటి సమస్యలు కొలిక్కి రాలేదు. మరీ ముఖ్యంగా ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లాల్సిన తరుణంలో ఉభయ సచివాలయ శాఖల్లో పనిచేస్తున్న ఎస్వో, ఏఎస్వోల విభజన ప్రధానంశంగా మారింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఎస్వో, ఏఎస్వోల విభజన 58-42 దామాషాలోనే పంచుకోవాలని, ఇబ్బందులు తలెత్తితే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించుకోవాలని సూచించారు. దీనికి ఇరు రాష్ట్రాల సీఎస్లు అంగీకరించినట్టు తెలిసింది. దీంతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల విభజనపైనా చర్చ జరిగినట్టు సమాచారం. పదిరోజుల్లో లోకల్ స్టేటస్ తేల్చండి ఏపీకి చెందిన 300 మంది వైద్యులను అన్యాయంగా తెలంగాణకు కేటాయించారని తెలంగాణ వైద్యుల సంఘం వ్యతిరేకించిన నేపథ్యంలో.. అలా కేటాయిం చబడిన వారి స్థానికత వివరాలు పదిరోజుల్లో ఇవ్వాలని కమల్నాథన్ కమిటీ ఆదేశించింది. ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో శనివారం కమల్నాథన్ కమిటీ సమావేశం జరిగింది. 4 నుంచి 10వ తరగతి వరకూ చదివిన స్టడీ సర్టిఫికెట్లుగానీ, లేదా నివా స ధృవపత్రాలుగానీ పొందు పరచాలని, ఈ ఆధారాలు ఉంటేనే తెలంగాణకు కేటాయింపు వర్తిస్తుందని అన్నట్టు తెలిసింది. దీంతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివరాలు పదిరోజుల్లోగా ఆన్లైన్లో పెడతామని హామీ ఇచ్చారని సమాచారం. -
సచివాలయ ఉద్యోగుల ధర్నా
♦ ఎస్వో, ఏఎస్వోల విభజన అర్ధంతరంగా వాయిదా ♦ నినాదాలతో హోరెత్తించిన ఉద్యోగ సంఘాలు సాక్షి, హైదరాబాద్: సచివాలయ సెక్షన్ అధికారులు (ఎస్వో), సహాయ సెక్షన్ అధికారుల (ఏఎస్వో) విభజన కోసం బుధవారం కమల్నాథన్ కమిటీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారి అర్ధంతరంగా ముగిసింది. టీఎన్జీవోలు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) నేతలు ఆందోళనకు దిగి నినాదాలతో హోరెత్తించడంతో సచివాలయంలోని డి-బ్లాక్ దద్దరిల్లింది. కమల్నాథన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమావేశం ప్రారంభంలోనే ఎస్వోలకు సంబంధించిన సమాచారం అసమగ్రంగా ఉందని టీఎన్జీవోల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 23 ఎస్వో ఖాళీలతో పాటు అత్యంత రహస్య విభాగంలోని మరో 14 ఎస్వో పోస్టుల ఖాళీలను చూపకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ ఖాళీలను ప్రకటించిన తర్వాతే సెక్షన్ అధికారుల విభజన జరపాలని, అప్పటి వరకు వాయిదా వేయాలని కోరారు. అయితే, కమల్నాథన్ కమిటీ ఎస్వోలతో పాటు ఏఎస్వోల విభజనను సైతం వాయిదా వేయడం వివాదానికి దారితీసింది. తక్షణమే ఏఎస్వోల విభజన పూర్తి చేయాలి అంటూ టీఎన్జీవోలు, అప్సా నేతలు, ఏఎస్వోలు ఆందోళనకు దిగారు. తెలంగాణ సచివాలయంలో 145 ఏఎస్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఏపీలో పనిచేస్తున్న 79 మంది తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఏపీకి కేటాయించిన నాలుగో తరగతి తెలంగాణ ఉద్యోగులు, డ్రైవర్లు తమను తిరిగి తెలంగాణకు కేటాయించాలని ఆందోళనకు దిగారు. ఏఎస్వోలకు నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తోడు కావడంతో డి-బ్లాక్ కమిటీ హాల్ దద్దరిల్లింది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి శాంతింపజేశారు. ఎస్వో ఖాళీలను ప్రకటించాలి రాష్ట్ర విభజన నాటికి ఖాళీగా ఉన్న 23 ఎస్వో పోస్టులతో పాటు రహస్య విభాగంలోని 14 ఎస్వో పోస్టుల ఖాళీలను సైతం ఆన్లైన్లో ఉంచాలని టీఎన్జీవోల నేతలు డిమాండు చేశారు. భార్యభర్తలిద్దరికీ ఏపీ స్థానికత ఉంటే స్పౌజ్ కేటగిరీ కింద అలాంటి వారిని తెలంగాణకు కేటాయించవద్దని కోరారు. ఆరోగ్య కారణాలను సైతం పరిగణనలోకి తీసుకోకూడదని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్తో సమానంగా విజయవాడ, గుంటూరులో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీలో పనిచేస్తున్న 79 మంది ఏఎస్వోలను తెలంగాణకు కేటాయించే విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నా కమల్నాథన్ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. త్వరలో మళ్లీ కమల్నాథన్ కమిటీ భేటీ ఎస్వో, ఏఎస్వోల విభజన పూర్తి అయితే సచివాలయ ఉద్యోగుల విభజన పూర్తికానుంది. ఈ రెండు కేడర్లు మినహా సచివాలయంలోని మిగిలిన 8 కేడర్ల ఉద్యోగుల విభజనను ఇప్పటికే కమల్నాథన్ కమిటీ పూర్తి చేసింది. కోర్టు కేసులతో చాలా కాలంపాటు ఎస్వో, ఏఎస్వోల విభజనకు బ్రేక్ పడింది. ఇటీవల న్యాయపర ఇబ్బందులు తొలగిపోవడంతో ఈ రెండు కేడర్ల ఉద్యోగుల విభజన ప్రక్రియను కమల్నాథన్ కమిటీ చేపట్టింది. తాజా సమావేశం రసాభాసగా మారడంతో త్వరలో మళ్లీ సమావేశం నిర్వహించే అవకాశముంది. -
కమల్నాథన్ కమిటీపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల విభజనలో కమల్నాథన్ కమిటీ పనితీరు సరిగా లేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యు.మురళీకృష్ణ విమర్శించారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన చేయాల్సిన కమల్నాథన్ కమిటీ కాలయాపన చేస్తోందన్నారు. జూన్ ఆఖరు నాటికి ఆంద్రప్రదేశ్ సచివాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిస్తున్నా.. కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను పూర్తి చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా కమల్నాథన్ కమిటీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల విభజనలో పునర్విభజన చట్టాన్ని తుంగలోతొక్కుతోన్న కమల్నాథన్ కమిటీపై గవర్నర్, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
'కమల్నాథన్ కమిటీపై సీఎంకి ఫిర్యాదు చేస్తాం'
హైదరాబాద్ : కమల్నాథన్ కమిటీ తీరు సరిగా లేదని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఆరోపించారు. దీనిపై సీఎం చంద్రబాబు, సీఎస్ ఎస్పీ టక్కర్కి ఫిర్యాదు చేస్తామన్నారు. బుధవారం హైదరాబాద్లో మురళీకృష్ణ మాట్లాడుతూ... ఓ వైపు జూన్లో తరలి వెళ్లమంటున్నారు...కానీ ఇప్పటి వరకు తుది కేటాయింపులు పూర్తి కాలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఏపీ ఉద్యోగుల అభ్యంతరాల నేపథ్యంలో కమల్నాథన్ కమిటీ ఈ రోజు సమావేశం అర్థాంతరంగా వాయిదా పడింది. -
సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ
హైదరాబాద్: ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్ నాథన్ కమిటీ బుధవారం హైదరాబాద్ లో సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ విభజనలపై కమిటీ చర్చించనుంది. -
వైద్యుల విభజన వివాదంపై సీఎం దృష్టి
♦ నేడు సచివాలయంలో ప్రత్యేక సమావేశం ♦ హాజరుకానున్న కమలనాథన్,వైద్య మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: కమలనాథన్ కమిటీ విభజన జాబితాలో తమకు తీరని అన్యాయం జరిగిందంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యులు చేస్తున్న ఆందోళనలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. రెండు నెలలుగా రగులుతున్న ఈ వివాదానికి తెర పడకపోవడంతో సీఎం స్వయంగా జోక్యం చేసుకున్నారు. విభజనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని వైద్యులు సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంను కలసి విన్నవించారు. న్యాయం చేస్తానని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. కమలనాథన్ కమిటీ చైర్మన్ కమలనాథన్ సహా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రభుత్వ వైద్యుల స్టీరింగ్ కమిటీ చైర్మన్ లాలూప్రసాద్, ఇతర నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఆందోళనలు.. చర్చలు... తెలంగాణకు ఆంధ్రా వైద్యులను కేటాయించారనేది ప్రభుత్వ వైద్యుల ప్రధాన ఆరోపణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని బోధనాసుపత్రుల్లో 5,824 మంది ప్రభుత్వ వైద్యులున్నారు. విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిన ఏపీకి 3,370, తెలంగాణకు 2,446 పోస్టులు కేటాయించాలి. అయితే కమలనాథన్ కమిటీ ఏపీకి 3,651, తెలంగాణకు 2,173 మందిని కేటాయిస్తూ జాబితా ఇచ్చింది. ఫలితంగా తెలంగాణ నష్టపోయిందని వైద్యులు అంటున్నారు. అలాగే తెలంగాణకు కేటాయించిన 2,173 పోస్టుల్లో 130 మంది వైద్యులు తమను ఏపీకి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నా వారిని తెలంగాణకు కేటాయించారని ‘తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం’ ఆరోపించింది. ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్ల్లో పనిచేసే 6,310 మంది ప్రభుత్వ వైద్యుల విభజనలోనూ తప్పులు దొర్లాయని లాలూప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కమలనాథన్ కూడా ఒప్పుకున్నందున డీహెచ్ పరిధిలోని వైద్యుల విభజన జాబితానూ పునఃపరిశీలించాలని కమిటీని వారు కోరుతున్నారు. -
ప్రభుత్వ వైద్యుల విభజనలో తప్పులు
* కమలనాథన్ కమిటీ అంగీకరించిందన్న టీ వైద్యుల జేఏసీ * జాబితా రద్దుపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం! * కమలనాథన్తో తెలుగు రాష్ట్రాల సీఎస్ల సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ప్రభుత్వ వైద్యుల విభజనలో తప్పులు దొర్లినమాట వాస్తవమేనని కమలనాథన్ కమిటీ అంగీకరించిందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ లాలూప్రసాద్ చెప్పారు. విభజన జాబితాపై వివాదం నెలకొన్న నేపథ్యంలో బుధవారం తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు రాజీవ్శర్మ, ఎస్పీ ఠక్కర్లు కమలనాథన్ కమిటీతో సమావేశమయ్యారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వివిధ విభాగాల అధిపతులు, ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులతోపాటు కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పాల్గొన్నారు. జాబితాలో తప్పులు జరిగినట్లు కమలనాథన్ అంగీకరించారని డాక్టర్ లాలూప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో జాబితా రద్దుకు సంబంధించిన అంశంపై ప్రకటన చేస్తామని కమలనాథన్ తమకు హామీయిచ్చారని చెప్పారు. జాబితాలో అక్రమాలు జరిగాయని డీఎంఈ రమణి కూడా అంగీకరించారని తెలిపారు. ఏపీకి చెందిన చాలామంది వైద్యులు ఒకటి నుంచి నాలుగో తరగతి సర్టిఫికెట్లను మాత్రమే ఇచ్చారని, కానీ ఐదు నుంచి పదో తరగతి వరకు సర్టిఫికెట్లను జత చేయలేదని తాము కమలనాథన్కు వివరించామన్నారు. భార్యాభర్తలు ఏపీలో ఉన్నా తెలంగాణకే కేటాయించారని, దీనిని అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేశారని లాలూ ప్రసాద్ ఆరోపించారు. -
9న కమల్నాథన్ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉద్యోగుల విభజనకు కేంద్రం నియమించిన కమల్నాథన్ కమిటీ ఈ నెల 9న సచివాలయంలో భేటీ కానుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కమిటీ ఏర్పడ్డప్పటి నుంచి వరుసగా ఇది 16వ సమావేశం. ఈ నెలాఖరుతో కమిటీ కాల పరిమితి ముగియనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం 153 విభాగాలకుగాను 111 విభాగాల్లో విభజన పూర్తయింది. 6 విభాగాల ఉద్యోగుల కేటాయింపు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. మరో 32 విభాగాల్లో తాత్కాలిక కేటాయింపులు పూర్తయినప్పటికీ తుది కేటాయింపులకు మరో నెల సమయం పట్టే అవకాశముంది. ప్రధానంగా కమిటీ భేటీలో ఉద్యోగుల విభజన పూర్తి కాని శాఖలపైనే చర్చ జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
కామాంధుడి వృషణాలు కోసేశారు..!
పెద్ద అడిశర్లపల్లి: కోరిక తీర్చమంటూ కొంతకాలంగా మహిళను వేధిస్తున్న ఓ కామాంధుడి వృషణాలు కోసేశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం గ్రామ పంచాయతీ పరిధి ఎల్లాపురం గ్రామానికి చెందిన కలకుంట్ల రాంబాబు ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన మహిళపై కన్నేశాడు. గత నెలలో సదరు మహిళ రాత్రి వేళ బహిర్భూమికి వెళ్లగా మార్గమధ్యలో అటకాయించాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో గ్రామస్తులు రాగా పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి జైలుకు పంపారు. 15 రోజుల క్రితమే జైలు నుంచి బయటికి వచ్చినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం అర్ధరాత్రి రాంబాబు ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న అతడి వృషణాలు కోసేసి పారిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే రాంబాబును 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిసింది. నిందితులంతా పరారీలో ఉన్నారు. -
అభ్యంతరాలకు 24వరకు గడువు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల వైద్యుల విభజన తీవ్ర వివాదానికి దారితీసిన నేపథ్యంలో వైద్యుల నుంచి వచ్చే అభ్యంతరాలకు కమల్నాథన్ కమిటీ ఈ నెల 24 వరకూ గడువిచ్చింది. గత నెల 29న రాష్ట్ర కేడర్ పోస్టులైన వైద్యులను ఆయా రాష్ట్రాలకు విభజించి.. వివరాలను జనవరి 30న రీఆర్గనైజేషన్ వెబ్సైట్లో పెట్టిన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన 218 మంది, మరో 118 మంది స్థానికేతర వైద్యులను తెలంగాణకు కేటాయించడంపై తెలంగాణ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. వైద్య సంఘాలు సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డినీ కలిశాయి. మొత్తం 2,928 మంది వైద్యుల విభజన జరిగితే తెలంగాణకు 1,184 మందిని, ఏపీకి 1,744 మందిని కేటాయించారు. అయితే 18ఎఫ్ క్లాజ్(అవసరాల మేరకు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం) ప్రకారం చాలామంది తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారని, ఇది సరికాదని ఆరోపించారు. ఏపీలో 1,536 మంది వైద్యుల ఖాళీలు ఉండగా, 218 మందిని తెలంగాణకు కేటాయించడంపై కూడా వివాదం నెలకొంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వైద్యశాఖ మంత్రితో పాటు, ముఖ్య కార్యదర్శి నుంచి కమల్నాథన్ కమిటీకి వినతులు వెళ్లాయి. వీటిని పరిశీలించిన కమిటీ...గురువారం వైద్యుల అభ్యంతరాలకు ఈనెల 24 వరకూ గడువిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో వైద్యుల అవసరం గుర్తించలేదు ఆంధ్రప్రదేశ్లో 1,500కు పైగా వైద్యుల ఖాళీలు ఉన్నాయి. అక్కడి డాక్టర్లను ఇక్కడ కేటాయించడం ఏమిటి? అంటే చాలామంది వైద్యులు ఉన్నతాధికారులను మేనేజ్ చేసుకున్నారు. న్యాయబద్ధంగా స్పౌజ్ కేసులను తాము కాదనలేం. కానీ వందలాది మంది వైద్యులు ఇక్కడకు రావడమేంటి? -తెలంగాణ రీఆర్గనైజేషన్ జేఏసీ అధ్యక్షుడు డా.ఉమాశంకర్, కో చైర్మన్ డా.రమేష్రెడ్డి -
కలిసేగా కల్లోలం ప్లాన్ చేశాం
పార్లమెంటులో ఏం జరిగింది-36 (నిన్నటి తరువాయి) సుష్మాస్వరాజ్: మీ పార్టీ వాళ్లెవరు, ఎలా ఓటే స్తారో మీకు తెలియదు. అసెంబ్లీకి బిల్లు పంపేట ప్పుడు ‘పాస్’ అవుతుందో లేదో మీకు తెలియదు. మీ పార్టీ వాళ్లే మీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టినా మేమే ఆదుకోవాలి. అవిశ్వాస తీర్మానం ఉన్నప్పుడు అన్నిటికన్నా ముందు దాన్ని బలపరిచే వారి సంఖ్య లెక్క పెట్టకుండా, ఇంకే అంశమూ చేపట్టకూడదని రూల్! 13వ తారీకున ఏం చేశారు? అవిశ్వాస తీర్మానం స్పీకర్ చదవగానే 70 మంది సపోర్టు చేస్తూ నిలబడటానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి, ముందే ‘బిల్లు’ ప్రవేశపెట్టించేశారు. మొత్తం మీ సభ్యులందర్నీ ‘వెల్’లో నిలబెట్టి లోక్ సభని యుద్ధభూమిగా మార్చేశారు. ‘పెప్పర్స్ప్రే’ వాడిన సభ్యుడు ఒక్కడైతే, మొత్తం సీమాంధ్ర సభ్యులు పదిహేను మందిని సస్పెండ్ చేసేస్తారా?! కమల్నాథ్: అమ్మా అదే చెప్తున్నా...! 13వ తారీకున అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తూ డెబ్బై మంది నిలబడతారని, మీ ఎన్డీఏలోని శివసేన వారు కూడా అవిశ్వాసాన్ని బలపర్చబోతున్నారని మీరు చెప్తేనే గదా... అల్లకల్లోలం చేయాలని ప్లాన్ చేశాం. పదిహేను మందిని సస్పెండ్ చెయ్యకపోతే, మళ్లీ మధ్యాహ్నం అవిశ్వాస తీర్మానం ‘అడ్మిట్’ అయి పోతుంది. 12 గంటలకి అల్లకల్లోలం అవుతుందని మీకు తెలియదా... మీతో సంప్రదించకుండానే జరిగిందా..? జైపాల్రెడ్డి: జరిగిందేదో జరిగిపోయింది... ఇక జరగాల్సింది చూడండి! ఇప్పటిదాకా ఇద్దరూ కలిసి ‘పాస్’ చేస్తాం అంటూ చెప్పిన వారు ఈ ఆఖరి నిమిషంలో ఏమిటీ గొడవ... అర్థం లేకుండా!! సుష్మాస్వరాజ్: జైపాల్జీ... బిల్లు ఓటింగ్కి పెట్టగానే మీ సీమాంధ్ర సభ్యులు ‘నో’ బటన్ నొక్కుతారు... వెంటనే ‘డిస్ప్లే’ బోర్డు మీద కాంగ్రెస్ వాళ్లు ఎంత మంది ‘నో’ అన్నారో కనబడిపోతుంది... జైపాల్రెడ్డి: సీమాంధ్ర వాళ్లు ‘నో’ అంటారని అందరికీ తెలిసిందేగదా... ఇప్పుడేదో కొత్తగా తెలిసినట్లు చెప్తారేం... వాళ్లు ఉన్నది పది మందే... పదిహేను మంది సస్పెండ్ అయిపోయారు... పది మంది ‘నో’ అన్నా బిల్ పాస్ అవ్వటానికి మెజార్టీ సరిపోతుంది గదా... సుష్మాస్వరాజ్: సవరణల మీద ఓటింగ్ మొదలయ్యాక అసలు గొడవ మొదలవుతుంది... అందుకే చెప్పాను... సవరణలు లేకుండా చెయ్యమని! అలాగే అన్నారు... ఇప్పుడు చూడండి ఎన్ని సవరణలో!! మా వాళ్లెవ్వరూ సవరణలు పెట్టకుండా ఆపగలిగాం... మీరాపని చెయ్యలేకపోయారు. కమల్నాథ్: మా వాళ్లెవ్వరూ సవరణలు ప్రతి పాదించలేదు. అసదుద్దీన్ ఒవైసీ, సౌగత్రాయ్... ఒకరు ఎంఐఎం, మరొకరు తృణమూల్! మా మాటెందుకు వింటారు. సవరణల మీద ‘ఓటింగ్’ అడగవద్దని ఎంత ప్రాథేయపడ్డా అంగీకరించలేదు. సుష్మాస్వరాజ్: అదే చెప్తున్నాను. ‘‘సవరణల మీద ఓటింగ్ ప్రారంభమవ్వగానే, తెలంగాణ సభ్యులు ‘క్లాజు’కు వ్యతిరేకంగా, సవరణకు అనుకూలంగా ఓటు వెయ్యటం ప్రారంభిస్తారు. ఎంపీలు: మేమెందుకు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తాం!? లేదమ్మా... మీరలా అనుకోకండి. మేము కచ్చితంగా బిల్లుకు అనుకూలంగానే ఓటు వేస్తాం, ప్రతి ‘క్లాజ్’ను గెలిపిస్తాం... ఆఖరి నిమిషంలో మీరిలా మాట్లాడితే ఎలాగమ్మా!! సుష్మాస్వరాజ్: అర్థం చేసుకోండి. నేను తెలం గాణకు వ్యతిరేకం కాదు. మీరు ఆ సవరణలు చూడ లేదు. అసదుద్దీన్ ఒవైసీ పెట్టిన అన్ని సవరణలూ మీరు సమర్థిస్తారు. తప్పదు! ఒక ఎంపీ: ఒవైసీ సవరణలకి మేమెందుకు మద్దతిస్తాం... ముందు నుంచీ అతను సమైక్యవాది. ఆఖరి వరకు కనీసం రాయల్ తెలంగాణ కోసం పోరాడాడు. అతనితో మేం కలిసే ప్రశ్నే లేదు. కమల్నాథ్: ప్రతీ విషయం ‘ఎమోషనల్’గా ఆలోచించకండి. సుష్మాస్వరాజ్ అనుమానమే నాది కూడా... అందుకే తెలంగాణ బిల్లు పెట్టి గెలిపించుకో లేకపోవటం కన్నా... మరో ఎంపీ: మీరు కూడా ఆమెలాగే మాట్లాడితే ఎలాగన్నా... మేము కాంగ్రెసోళ్లం. కాంగ్రెస్ బిల్లు ఆమోదించి తీరతాం... అన్ని సవరణలూ వ్యతి రేకిస్తాం. సుష్మాస్వరాజ్: జైపాల్గారూ... వీళ్లు సవరణలు ఏమిటో చూడలేదు. తెలంగాణ హైకోర్టు తెలంగాణకి కావాలి అన్నాడు ఒవైసీ, అక్కర్లేదు అని వీళ్లు ఓటేయగలరా... పోలవరంతో పాటు ప్రాణహిత చేవెళ్లను కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి అన్నాడు ఒవైసీ ఆ సవరణను ఓడించగలరా. పోలవరం మీద సవరణకు అనుకూలంగా మీరు ఓటేస్తే... అసలు పోలవరమే ఒప్పుకోమని ఒడిశా, ఛత్తీస్గఢ్లకు చెందిన మావాళ్లు వ్యతిరేకంగా ఓటెయ్యరా...!? ఒకసారి స్క్రీన్ మీద కాంగ్రెస్ వైపు నుంచి అందరూ ఒకలాగ ఓటు వేయటం లేదని చూశాక, ఇక మావాళ్లని మేమెలా కంట్రోల్ చెయ్యగలం... ఎవరి ష్టమొచ్చినట్లు వారు ‘బటన్’ నొక్కుతారు. అందుకే ప్రభుత్వంతో అనేకసార్లు చెప్పాం... మీరు ఒకటిగా రండి, మేమూ ఒకటిగా బలపరుస్తాం... అని. కమల్నాథ్: ఇదే వద్దంటాను... మీరంతా ఒక టిగా ఉన్నట్టు... కాంగ్రెస్ మాత్రం చీలి పోయినట్లు..! సాక్షాత్తూ అద్వానీగారే బిల్లు పెట్టవద్దు అని మీడియాకి చెప్పేస్తుంటే, ఇంక బీజేపీ సమర్థనను ఎవరు నమ్ముతారు? సుష్మాస్వరాజ్: గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సభ్యుడు, మొత్తం బిల్లు డ్రాఫ్ట్ చేసినవాడు జైరాం రమేష్ అనలేదా... నిన్న కరణ్ థాపర్తో ఇంట ర్వ్యూలో, గొడవగా ఉంటే బిల్లు పెట్టడం నాకిష్టం లేదు అన్నాడు. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com - ఉండవల్లి అరుణ్కుమార్ -
ఈ రాజకీయమే ఒప్పుకోం
(పార్లమెంటులో ఏం జరిగింది-35) జైపాల్జీ... మమ్మల్ని ‘కార్నర్’ చెయ్యాలనుకోవటమే తప్పు... బిల్లు పాసవ్వటానికి అవసరమైనంత మంది సభ్యులు లేకపోతే మాదా తప్పు... బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టే బిల్లు పాసవ్వలేదని అప్పుడే మొదలు పెట్టేశారు... చిరాగ్గా చూశారు జైపాల్రెడ్డి. ‘‘కాళ్లు పట్టుకుని వదలకండి... వచ్చేదాకా వదలకండి. తెలంగాణ కోసం ఏమి చేసినా... ఇంకొక గంట టైముందంతే! వెళ్లండి’’ అంటూ స్పీకర్ చాంబర్స్ వైపు కదిలారు. ***** స్పీకర్ చాంబర్స్లో స్పీకర్ ఎదురుగా కూర్చున్నారు జైపాల్, కమల్నాథ్, సుష్మాస్వరాజ్. ఎంపీలంతా నిలబడి ఉన్నారు. చర్చ మొదలైంది. కమల్నాథ్: ప్రభుత్వం స్పష్టంగా ఉంది. మూడు గంట లకి సభ మొదలవగానే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రవేశపెడ్తాం. పాస్ చేయించే బాధ్యత మాదే అన్నారు గదా బీజేపీ వారు! పాస్ చేయించండి. సుష్మాస్వరాజ్: మీ మంత్రులే ‘వెల్’లోకి వచ్చి గొడవ చేస్తుంటే, మీకు మద్దతిచ్చిన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ సభ్యులు అరుస్తుంటే - మీకే బాధ్యత లేదా! జైపాల్రెడ్డి: నా మాట వినండి. ప్లీజ్ స్పీకర్: ఇంత ప్రధానమైన బిల్లు. ఇంతటి వివాదాస్పద మైన బిల్లు. ‘డివిజన్’ చేయాలంటే... ఎలా చెయ్యమంటారు. ‘వెల్’లో వాళ్లు వాళ్ల స్థానాలకి వెళ్లాలి గదా... కమల్నాథ్: మీరు ‘డివిజన్’ అంటూ ఆటోమేటిక్ ఓటు రికార్డర్ ‘ఆన్’ చెయ్యగానే అందరూ ఎవరి స్థానాల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. వాళ్లు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు రికార్డు అవ్వాలి గదా. వాళ్ల నియోజకవర్గంలో తెలియాలి గదా... వాళ్లెలా ఓటు వేశారో... స్పీకర్: మరింక ఇబ్బందేముంది. 3 గంటలకి మొదలు పెట్టేద్దాం! కమల్నాథ్: అదే, నేనూ అంటున్నాను. బిల్లుపెడ్తాం, డివి జన్ జరుగుతుంది. బిల్లు పాసవ్వకపోతే ఆ బాధ్యత ఎవరిది? మీరు పెట్టండి, మేము పాస్ చేస్తాం అనేవాళ్లదే గదా?! సుష్మాస్వరాజ్: బిల్లు పాసయితే కాంగ్రెస్ గొప్పతనం. అవ్వకపోతే బీజేపీ అసమర్థత...! ఈ రాజకీయాన్నే మేము ఒప్పుకోవటం లేదు. జైపాల్రెడ్డి: అనవసరంగా టెన్షన్ పెంచుకుంటున్నారు నా మాట వినండి. కమల్నాథ్: అంతే సుష్మాజీ... 21 మంది పార్లమెంట్ సభ్యులున్న సీమాంధ్ర కాంగ్రెస్ కంచుకోటని పణంగా పెట్టి ఇంతటి రిస్కు తీసుకుంటే, బిల్లు ఓటింగ్కి వస్తుందని తెలిసీ, ఇవ్వాళ మీ సభ్యులు 30 మంది గైర్హాజరైతే ఏమనుకోవాలి? మీకొక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు... సీమాంధ్రలో మీకే నష్టమూ జరగదు. మీ ఎన్డీయే సభ్యులెవ్వర్నీ ఒప్పించలేక పోయారు మీ పార్టీ సభ్యులంతా హాజరు అయ్యేలా చూడొద్దా?! సుష్మాస్వరాజ్: మీ మంత్రుల్ని మీరు ఒప్పించుకోలేకపో యారు. 15 మంది సీమాంధ్ర ఎంపీల్ని సస్పెండ్ చేశారు. మిగిలిన పది మందీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారా... చెప్పండి. మీ పార్టీకి 21, టీడీపీకి 4 స్థానాలున్న సీమాంధ్రలో ముగ్గురు కేబినెట్ మంత్రులు, నలుగురు స్టేట్ మంత్రులూ ఉన్నారు. ఒక్కరైనా బిల్లుకు మద్దతిస్తారా? మీ ముఖ్యమంత్రినే మీరు ఒప్పించలేకపోయారు. మీ మంత్రులకూ, ఎంపీలకూ నచ్చచెప్పలేకపోయారు... మమ్మల్ని అంటారా? జైపాల్రెడ్డి: కమల్! సుష్మాజీ! ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి... నేను పిలిస్తేనేగా వచ్చారిక్కడికి... నాకు అవకాశం ఇవ్వకుండా మీరిలా కీచులాడుకోవటం ఏం బాగాలేదు. సుష్మాస్వరాజ్: నిజమే జైపాల్జీ... మమ్మల్ని ‘కార్నర్’ చెయ్యాలనుకోవటమే తప్పు... బిల్లు పాసవ్వటానికి అవసర మైనంత మంది సభ్యులు లేకపోతే మాదా తప్పు... రెండ్రో జుల్లో పార్లమెంట్ గడువే పూర్తయిపోతోంది. కొంతమంది వెళ్లి పోయారు... బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టే బిల్లు పాసవ్వ లేదని అప్పుడే మొదలు పెట్టేశారు... జైపాల్ రెడ్డి: ఎందుకమ్మా- మీ వాళ్లు 30 మంది ఆబ్సెంట్ అయినంత మాత్రాన బిల్లు పాసవ్వదని అనుకుంటున్నారు? మా వాళ్లు 200 మందికిపైగా ఉన్నారు, యూపీఏలో మొత్తం 17 మంది సస్పెండయిపోయినా లెక్క సరిపోతుంది. మొత్తం 544 మంది సభ్యులూ హాజరైపోరుగదా- బిల్లు పాసే అవ్వ దని ఎలా నిర్ణయానికొచ్చేశారు? కమల్: జైపాల్గారూ... ఇదిగో అటెండెన్స్ రిజిస్టర్. కొంత మంది సంతకం పెట్టిన వాళ్లు వెళ్లిపోయి ఉండవచ్చు గాని సంతకం పెట్టకుండా ఉన్నవాళ్లెవ్వరూ సభలో ఉంటారని నేననుకోను. దీని ప్రకారం 30 మంది బీజేపీ సభ్యులైనా, కనీసం, గైర్హాజరయ్యారు. సుష్మాస్వరాజ్: కాంగ్రెస్ వాళ్లెంత మంది గైర్హాజరయ్యారో కూడా చెప్పండి. కమల్నాథ్: కాదంటంలేదు. కాంగ్రెస్ వాళ్లు కూడా కొం దరు రాలేదు. మీ పార్టీని నమ్ముకునే కదా మేము బిల్లు పెడ్తున్నాం... సుష్మాస్వరాజ్: జైపాల్జీ! మీ పార్టీకి చెందిన 106 మంది సంతకాలున్నాయి అటెండెన్స్ రిజిస్టర్లో...! మీకే గాదు మాకూ లెక్కలు తెలుసు!! మా వాళ్లొక 80 మంది. మొత్తం 186 మంది సభ్యులు... వీరుగాక మీ మంత్రులు. వాళ్లు హాజరుపట్టీలో సంతకాలు పెట్టరు గాని ఓటు వేస్తారు. 354లో మీరూ మేమూ కలిపి 186 మందిమి ఉన్నాం! అయినా బిల్లు పాసవ్వదనే అనుమానానికి కారణం... కాంగ్రెస్వారు అందరూ ఓటు వెయ్యరని... తప్పు బీజేపీ మీదకు నెట్టడానికి చూస్తున్నారు. కమల్నాథ్: బిల్లు పాసవ్వకపోతే మా బాధ్యత కన్నా మీ బాధ్యతే ఎక్కువ సుష్మాజీ... మేము ఏకాభిప్రాయం సాధించు కోలేకపోయాం, అందరికీ తెలుసు! ప్రెసిడెంట్ పంపిన ‘బిల్లు’ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించింది. అది కూడా అందరికీ తెలుసు. బిల్లు ఓటింగ్కి పెట్టినప్పుడు ఎవరెలా ఓటేస్తారో మాకైతే తెలీదు. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com - ఉండవల్లి అరుణ్కుమార్ -
బిల్లు ఈ రోజే పాసై తీరాలి
పార్లమెంటులో ఏం జరిగింది-34 18-2-2014 సమయం 12.47 మధ్యాహ్నం. (లోక్సభ మళ్లీ వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమ యం జరగకుండా అడ్డుపడిన సీమాంధ్ర సభ్యులు, మరికొందరు తృణమూల్ కాంగ్రెస్ వంటి ఇతర పార్టీల సభ్యులూ మళ్లీ నినాదాలు చేస్తూ సభ జరగనివ్వలేదు. పదిహేను మంది సీమాంధ్ర సభ్యుల్ని ‘సస్పెండ్’ చేసినా, ఇంకా ‘వెల్’లో గొడవ మాత్రం అలాగే జరుగుతోంది! చిదంబరం, ఫైనాన్స్ బిల్లు కాగి తాలతో సిద్ధంగా ఉన్నారు. ఇక తెలంగాణ బిల్లు 15వ లోక్సభలో పాసయ్యే అవకాశాలు లేనట్టే కనబడుతు న్నాయి.) పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ హడావుడిగా స్పీకర్ చాంబర్స్లోకి వెళ్లారు. వెనకాలే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా వెళ్లారు. కమల్నాథ్ స్పీకర్తో రెండు నిమిషాలు మాట్లాడి బైటికొచ్చారు. చుట్టూ చేరిన తెలంగాణ ఎంపీలతో క్లుప్తంగా ‘‘కష్టం... ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పాసవ టం కష్టం! బీజేపీ సహకరించటం లేదు!!’’ అని చెప్పి వెళ్లిపోయారు. హతాశులైన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, అక్కడే లోక్సభ మొదటి వరసలో కూర్చుని, ఎవరితోనో ముచ్చటిస్తున్న జైపాల్రెడ్డిగారి దగ్గరకు వెళ్లారు. ‘‘సార్ తెలంగాణ బిల్లు పక్కన పెట్టేశారట’’ అని చెప్పారు. ‘ఎందుకని’ అని ప్రశ్నించారు జైపాల్! ‘‘ఏమో, కమల్నాథ్, బీజేపీ కలిసిరావటం లేదంటూ’’ చెప్పి వెళ్లిపోయాడు ‘‘కమల్నాథ్ చాంబర్స్కి వెళ్లి ఉన్నా రేమో చూడండి... ‘నేనొస్తాను’ అన్నారు జైపాల్. కమల్నాథ్ ఉన్నారో లేదో చూద్దామని వెళ్లిన ఎంపీలు, లోక్సభ పక్కనే ఉండే ఆయన ఆఫీసు రూం నుంచి ఆయనను వెంటబెట్టుకుని వచ్చేశారు. ఎప్పుడైతే జైపాల్రెడ్డి మీ దగ్గరకు వస్తారట’ అన్నారో... కమల్నాథే ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, లోక్సభలోకి వచ్చే శారు. జైపాల్రెడ్డి, కమల్నాథ్ని తన పక్కనే కూర్చో బెట్టుకుని, మిగతా ఎంపీలందర్నీ కొంచెం దూరంగా కూర్చోమన్నారు. ‘‘ఇలాగైతే కష్టం జైపాల్రెడ్డిగారూ, ఎన్డీఏలో బీజేపీ తప్ప మరే పార్టీ ఈ తరహా విభజనకి ఒప్పుకోవటం లేదు. యూపీఏకు మద్దతునిచ్చే పార్టీలూ వ్యతిరేకిస్తు న్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ మద్దతిస్తూనే ఉత్తర ప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలు చెయ్యటానికి అంగీకరించా లంటూ మెలిక పెడుతోంది. అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మేమెలా సహకరిస్తామంటు న్నాయి ప్రాంతీయ పార్టీలు. బిల్లు పాసవ్వటానికి కావా ల్సిన బలం, అనుమానమే! బిల్లు పాసవటమే అను మానంగా ఉంటే, గవర్నర్కి ‘లా అండ్ ఆర్డర్’ అప్ప చెప్పాలంటే, రాజ్యాంగ సవరణ చేయాల్సిందే అంటోంది బీజేపీ... కష్టం జైపాల్జీ... ‘పెప్పర్స్ప్రే’ను అడ్డం పెట్టుకుని పదిహేనుమంది ఆంధ్రావాళ్లని సస్పెండ్ చేసి బైట పెట్టేసినా లెక్క సరిపోవడం లేదు...’’ అన్నారు కమల్ నాథ్. ‘‘లెక్క సరిపోకపోవటమేమిటి కమల్... కాంగ్రెస్ వాళ్లమే రెండొందలు దాటి ఉన్నాం. బీజేపీ నూట పది హేను అనుకుంటా...! ఇదిగాక ఎన్సీపీ, మాయావతి పార్టీ ఇంకా చిన్న చిన్న పార్టీలూ... ముందునుంచి లెక్క పెట్టుకుంటూనే ఉన్నాంగా...!! రాజ్యాంగ సవరణ చెయ్యాలంటే మూడింట రెండొంతులు మెజార్టీ ఉండాలి గానీ సింపుల్ మెజారిటీకి సరిపోకపోవటమేమిటి. రా... నేను సుష్మాస్వరాజ్తో మాట్లాడతా! అన్నారు జైపాల్. ‘‘స్పీకర్తో మరో గొడవ. ‘వెల్’లో సభ్యుల్ని సస్పెం డ్ చేసి, రేపు పెట్టండి బిల్లు అంటోంది ఆవిడ. సభ సజా వుగా జరక్కపోతే ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ తీసుకోవటం ఎలా సాధ్యం... అంటోంది. సభ సజావుగా నడపటం, రూల్స్ ప్రకారం స్పీకర్ బాధ్యత. ఈ రోజు ‘వెల్’లో ఉన్నవాళ్లని సస్పెండ్ చేసి రేపు ఈ బిల్లు పెడ్దామంటే, రేపింకో పది మంది ‘వెల్’లోకి వస్తారు. ఈలోగా సస్పెన్షన్ గడువు ముగిసి ఆ పదిహేను మంది కూడా మళ్లీ వచ్చేస్తారు’’ కమల్నాథ్. ‘‘ఏం కంగారు పడకయ్యా... నేను చెప్తా. ఏం చెయ్యాలో’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను పిలిచి ‘‘సుష్మాస్వరాజ్ని నేను పిలుస్తున్నానని చెప్పి స్పీకర్ చాంబర్స్కి తీసుకురండి’’ అన్నారు జైపాల్. ‘‘కమల్... నేను నాలుగు దశాబ్దాలుగా రాజకీ యాల్లో ఉన్నాను. ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు చేసె య్యటమే... చెయ్యకూడదనుకున్నప్పుడు, రూల్స్ చట్టాలు, రాజ్యాంగం మాట్లాడి చెయ్యకుండా ఎగ్గొట్ట వచ్చు! మనకి మంచిదనే గదా ఒక పని చేద్దామను కుంటాం... దానికి కూడా రూల్స్ అడ్డం వస్తే, ఇక ఆ రూల్స్కి ఎందుకు విలువివ్వాలి? నడు... స్పీకర్తో, సుష్మతో నేను మాట్లాడతా! బిల్లు ఈ రోజే పాసయి తీరాలి... లేకపోతే, ఇక ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కాదు. నడు... స్పీకర్ చాంబర్స్కి వెడదాం’’ అంటూ లేవటానికి ఉపక్రమించారు జైపాల్. ఇంతలో సుష్మా స్వరాజ్ దగ్గరకు వెళ్లిన ఎంపీలు పరుగెత్తుకుంటూ వచ్చారు.‘‘సార్, మీతో మాట్లాడటానికి అభ్యంతరం లేదు గానీ స్పీకర్ చాంబర్స్కి మాత్రం రానంటోంది సుష్మా స్వరాజ్. కాంగ్రెస్ పార్టీ కావాలనే డ్రామా ఆడుతోందని, ఇప్పుడు బిల్లు పాసయితే ఆ పేరు కాంగ్రెస్కి, అవ్వకపోతే ఆ చెడ్డ పేరు బీజేపీకి వచ్చేలా వ్యూహరచన చేశారని ఏదేదో మాట్లాడుతోంది ఆమె’’ అంటూ వాపోయారు. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com - ఉండవల్లి అరుణ్కుమార్ -
మరోసారి భేటీ అయిన కమలనాథన్ కమిటీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపుకోసం ఏర్పాటుచేసిన సీఆర్ కమలనాథన్ కమిటీ మరోసారి భేటీ అయింది. ఈ భేటీని సోమవారం ఏపీ సెక్రటేరియట్ లో నిర్వహించగా దీనికి కమిటీ చీఫ్ కమలనాథన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఆర్ కృష్ణారావు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ కమిటీ ఏర్పాటయినప్పటి నుంచి ఇలా భేటీ కావడం ఇది 15వసారి. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనపై కమిటీ సంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతోపాటు, ఇరు రాష్ట్రాల అధికారులు ఇచ్చిన నివేదనలు స్వీకరించింది. ఎస్పీఎఫ్, మెడికల్ డిపార్ట్ మెంట్ ఉద్యోగుల విభజన విషయంలో ఉన్న ఫిర్యాదులను ఇరు రాష్ట్రాల కార్యదర్శులు త్వరలోనే పరిష్కరించుకోనున్నట్లు తెలిపారు. -
ఏపీలో నో వేకెన్సీ!
-
ఏపీలో నో వేకెన్సీ!
* ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీ లేదు.. ఇది ఏపీపీఎస్సీ లెక్క * ఖాళీ పోస్టుల సమాచారం పంపని చంద్రబాబు ప్రభుత్వం * ఒక్క నోటిఫికేషన్ కూడా వద్దని పరోక్షంగా ఆదేశాలు * 1.42లక్షల ఖాళీపోస్టులున్నాయన్న కమల్నాథన్ కమిటీ * ప్రభుత్వ తీరుతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశా నిస్పృహలు సాక్షి, హైదరాబాద్: ‘రాష్ర్టంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమూ ఖాళీగా లేదు..’ వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చెబుతున్నమాట. సర్వీస్ కమిషన్ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అదేంటి.. ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకపోవడమేమిటి.. అని ఆశ్చర్యపోతున్నారా? రాష్ర్ట ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు ఇస్తే ఆ వివరాల ప్రకారం ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఆయా పోస్టులను భర్తీ చేస్తుంది. ఆ పరీక్షల కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడుగారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం భర్తీ చేయాలని కూడా ఏపీపీఎస్సీని కోరకపోతే ఆ సంస్థ మాత్రం ఏం చేస్తుంది? అందుకే ఎప్పుడు సమావేశం జరిగినా... అప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలూ రానందున ఉద్యోగ ఖాళీలేవీ లేవని ఏపీపీఎస్సీ తన నివేదికలలో రాసుకుంటోంది. తాము చెప్పేవరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయవద్దని అధికారంలోకి వచ్చిన తొలిరోజే తెలుగుదేశం ప్రభుత్వం ఏపీపీఎస్సీకి స్పష్టం చేసిందని అధికారవర్గాల సమాచారం. నిజానికి చంద్రబాబు విధానమే అది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయన బద్ధ వ్యతిరేకి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ శుద్ధ దండగమారి వ్యవహారమని ఆయన తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు... ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎపుడు విడుదలవుతాయా అని లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీకి రాష్ర్ట ప్రభుత్వం కొత్త చైర్మన్గా పి.ఉదయభాస్కర్ను నియమించడంతో నోటిఫికేషన్లు వెలువడడమే తరువాయి అని నిరుద్యోగులు భావించారు. అయితే వారి ఆశలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులను టీడీపీ ప్రభుత్వం తొలగించిం ది. మరింత మందిని తొలగించే ఆలోచనలో ఉంది. అలాంటిది ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి జాబితాలను పంపిస్తుందని భావించడం అత్యాశేనని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పగ్గాలు చేపట్టి 18 నెలలవుతున్నా ఉద్యోగాల ఖాళీల వివరాలను చంద్రబాబు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి ఇంతవరకు పంపించలేదు. అందువల్ల ఏపీపీఎస్సీ లెక్కల్లో మాత్రం రాష్ర్టంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమూ ఖాళీ లేనట్లే. ఈ ఏడాది మే 28న ఇన్ఛార్జి ఛైర్మన్ నేతృత్వంలో జరిగిన సర్వీస్ కమిషన్ సమావేశపు నివేదికలో అదే విషయాన్ని స్పష్టంగా రాసుకున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ‘ప్రైవేటు’ సలహా! రాష్ట్ర విభజనకు ముందు వివిధ ఖాళీల భర్తీకోసం వివిధ శాఖలనుంచి ఏపీపీఎస్సీకి నివేదికలు వచ్చాయి. వాటి ప్రకారం 16వేల పోస్టులకు నోటిఫికేషన్లు సిద్ధమయ్యాయి. అయితే ఆ తరుణంలో ఎన్నికలు రావడంతో అవి నిలిచి పోయాయి. తరువాత ఖాళీల భర్తీకి సంస్థ ముందుకు వెళ్లకుండా ప్రభుత్వం కళ్లెం వేసింది. ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఉదయభాస్కర్.. ప్రభుత్వంతో మాట్లాడి నోటిఫికేషన్లు జారీచేస్తామంటూనే ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేటు రంగంలోనే మంచి అవకాశాలున్నాయని సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాకున్నా నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఏపీపీఎస్సీ పరీక్షలకోసం అయ్యే ప్రిపరేషన్ ప్రైవేటు ఉద్యోగాలకు పనికివస్తుందని పేర్కొన్నారు. ఈ మాత్రానికి ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్ను నియమించడమెందుకని, ఆయన్ను నియమించడం గుర్రానికి కాళ్లు కట్టేసి రౌతును ఎక్కించినట్లుగా ఉందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. నోటిఫికేషన్లకు బదులు ఊస్టింగ్లు జాబు కావాలంటే బాబు రావాలన్నారు. కానీ బాబు వచ్చాక జాబులకు కోత పెడుతున్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలే లేవు. కొత్తగా నోటిఫికేషన్లు వస్తాయని ఎదురుచూస్తున్న నిరుద్యోగులు చంద్రబాబు సర్కారు తీరు చూసి ఉసూరుమంటున్నారు. ఇప్పటికే 15వేల మంది ఆదర్శ రైతులను తొలగించారు. 7వేల మంది గృహనిర్మాణ వర్క్ ఇన్స్పెక్టర్లను ఇంటికి పంపించారు. 2వేల మంది ఉపాధి హామీ కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. వైద్య ఆరోగ్యశాఖలో 1,500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. బాబు అధికారంలోకి వచ్చాక మొత్తంగా 25వేల మందికి ఉద్యోగాలు కోల్పోయారు. ఏతావాతా ఉద్యోగాల భర్తీపై పెట్టుకున్న ఆశలు మొత్తం నీరుగారిపోతుండడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. త్రిశంకు స్వర్గంలో డీఎస్సీ! డీఎస్సీ ఫలితాలు వెల్లడై ఐదు నెలలు దాటుతున్నా ప్రభుత్వం మెరిట్ జాబితాను ప్రకటించకపోవడంతో టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులు నిరాశా నిస్పృ హల్లో ఉన్నారు. 2014 నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదలైంది. 10,313 పోస్టుల భర్తీకి 2015 మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 3,97,294 మంది పరీక్షకు హాజరయ్యారు. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచేలోగానే ఫలితాలు ప్రకటించి నియామకాలు పూర్తిచేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. చివరకు ఫలితాలను జూన్ 3న ప్రకటించారు. ప్రశ్నల్లోని తప్పులపై చాలా మంది ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. కొం దరు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. అసలు టెట్ను టీచర్ రిక్రూట్మెంటును కలిపి నిర్వహించడం(జీవో38)పైనా కొందరు పిటిషన్లు వేశారు. ట్రిబ్యునల్లో ఉన్న కేసులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నియామకాల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే అవకాశమున్నా ఆ కేసులనే సాకుగా చూపి వాయిదాలు వేసుకుంటూ వెళ్తోంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో డీఎస్సీలోని కొన్ని కేటగిరీ పోస్టుల భర్తీపై ఇలాగే కోర్టు కేసులు పడ్డాయి. అయితే ఆ కేసులున్న కేటగిరీలను మినహాయించి తక్కిన పోస్టులన్నిటినీ అప్పటి ప్రభుత్వం భర్తీచేసింది. ప్రస్తుతం 10,313 పోస్టుల్లో 7వేలకు పైగా పోస్టులు ఎస్జీటీ కేటగిరీకి చెందినవే. వీటిపై ఎలాంటి వివాదమూ లేదు. స్కూల్ అసిస్టెంటు తదితర పోస్టులకు కొన్ని న్యాయపరమైన అభ్యంతరాలు ట్రిబ్యునల్లో ఉన్నాయి. ట్రిబ్యునల్లో అభ్యంతరాలున్నప్పటికీ స్టే ఉత్తర్వులు లేనంతవరకు ప్రభుత్వం నియామకాలకు నిరభ్యంతరంగా ముందుకెళ్లవచ్చు. కానీ ప్రభుత్వం చిన్న కారణాలను సాకుగా చూపి నియామకాలను జాప్యం చేస్తోంది. రాష్ర్టంలో ఖాళీ పోస్టులు 1.42 లక్షలు రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగ ఖాళీలు 1.42 లక్షలు ఉన్నాయని కమలనాథన్ కమిటీ గుర్తించింది. విభజన సమయంలో నాటి ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వమే తెలంగాణ, ఏపీల్లో ఉన్న వివిధ పోస్టులు, వాటి వివరాలను కమలనాథన్ కమిటీకి అందించింది. ఆ వివరాలు కావాలని ఇప్పటివరకు ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఉలు కూ పలుకూ లేకుండా పోయిందని ఏపీపీఎస్సీ వర్గాలంటున్నాయి. -
విద్యుత్ ఉద్యోగుల సమస్య పైనా చర్చలు
-
కమలనాథన్ కమిటీ ఏర్పాటు తప్పిదమే
రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటిపోయింది. కానీ ఉద్యోగుల విభజన ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఇంకో ఏడాది గడిచినా ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందన్న గ్యారెంటీ ఏదీలేదు. ప్రభుత్వ వాదోపవాదాలు, ఒక్కొక్క ఉద్యోగిది ఒక్కో ప్రత్యేక మైన నేపథ్యం, ప్రభుత్వ నిబంధనలు, ఉద్యోగ సంఘాల వైఖర్లతో సమస్యకు అంతిమ పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం కలగడంలేదు. అసలు విభజన చట్టంలోనే లోపాలున్నాయి. హడావిడిగా ఆగమేఘాల మీద చేసి ఈ చట్టం అతి ముఖ్యమైన ఉద్యోగుల విభజనకు సంబంధించి దూరదృష్టితో వ్యవ హరించలేదు. తెలంగాణ ఉద్యమం బలపడటానికి నీళ్లు, నిధులతోపాటు నియామకాలలో జరిగిన వ్యత్యాసాలే కారణమన్నది తెలిసిందే. విభజన అనివార్యమైనప్పుడు జరిగిన హడావుడి, ఆందోళనల మధ్య భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై ఎవరూ పట్టించుకోలేదు. విభజన బిల్లులో ఉద్యోగులకు సంబంధించిన అంశాలలో ఇరు ప్రాంతాలలోని ఏ ఒక్కరూ దృష్టి సారించలేదు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరగాలన్నది తెలంగాణ ఉద్యోగుల వాదన. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవా లన్నది సీమాంధ్ర ఉద్యోగుల వాదన. పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవ హరించాలన్నది కమలనాథన్ కమిటీ అభిప్రాయం. నిజానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇరుప్రాంతాల ఉద్యోగులకు ఉండి ఉంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. అసలు కమలనాథన్ కమిటీ ఏర్పాటే పెద్ద తప్పు. దాని పరిధి చాలా చిన్నది. అది కేవలం సచివాలయం, కొన్ని డెరైక్టరేట్లకే పరిమితమైన కమి టీయే తప్ప యావత్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన కమిటీ కాదు. ఏడాదికి పైగా ఈ కమిటీ చేసిన పనేమిటంటే 56 వేల మంది రాష్ట్ర స్థాయి అధికారులలో ఇప్పటివరకు 15 వేలమంది ఉద్యోగులను మాత్రమే రాష్ట్రానికి కేటాయించింది. అతి ముఖ్యమైన శాఖలను మర్చిపోయింది. ఉద్యోగ కేటా యింపుల అనంతర చేదు పరిణామాల పట్ల కమిటీ మౌనం పాటించింది. తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పడినా కూడా ఆప్షన్ల పేరిట ఇక్కడ తెలంగాణేతరులు కొనసాగడం ఇక్కడి ఉద్యోగులు, నిరుద్యోగులకు నచ్చని అంశం. భవిష్యత్తులో మరిన్ని వైషమ్యాలు తలెత్తకుండా ఉండా లంటే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో పని చేసుకుంటేనే బాగుంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని కమలనాథన్ కమిటీ పరిధి పెంచడమో, లేదా మరొక కమిటీని వెంటనే నియమించడమో చేసి, రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగులలో ప్రాంతేతరులపై దృష్టి సారించాలి. అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే పని చేసే విధంగా నిబంధనలు రూపొందించాలి. ఉద్యోగుల విభజన సమస్యలకు శాశ్వత పరిష్కా రం కనుగొనకుండా తాత్సారం వహిస్తే అది ఏ ఒక్కరికీ క్షేమకరం కాదు. కాలేరు సురేష్ రాష్ట్ర సహాధ్యక్షులు తెలంగాణ ఉద్యోగుల సంఘం. మొబైల్: 9866174474. -
అందరిలాగే పోలీసుల విభజన
* రెండు రాష్ట్రాలు సమన్వయంతో మార్గదర్శకాలు రూపొందించుకోవాలి * కమలనాథన్ కమిటీ సూచన సాక్షి, హైదరాబాద్: సాధారణ ఉద్యోగుల తరహాలోనే సివిల్ పోలీస్ సిబ్బందిని విభజించాలని కమలనాథన్ కమిటీ సూచించింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, బెటాలియన్లు, గ్రేహౌండ్స్ తదితర ప్రత్యేక విభాగాల విభజనకు సంబంధించి చర్చించాల్సి ఉందని.. రెండు రాష్ట్రాలు సమన్వయంతో మార్గదర్శకాలు రూపొందించుకోవాలని చెప్పింది. ఉద్యోగుల విభజనపై చర్చించేందుకు కమలనాథన్ కమిటీ గురువారం తెలంగాణ సచివాలయంలో సమావేశమైంది. తాత్కాలిక విభజన జాబితాలపై ఉద్యోగుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి.. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు ఇచ్చే నివేదికల ఆధారంగా పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు పదో షెడ్యూల్లో ఉన్న సంస్థలకు సంబంధించి ఉద్యోగుల విభజనపై చర్చ జరిగింది. నిర్బంధంగా ఆయా సంస్థల్లోని ఉద్యోగులను బదిలీ చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పదో షెడ్యూలు సంస్థలన్నీ భౌగోళికంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నందున ఇవన్నీ తమ రాష్ట్రానికే చెందుతాయని.. ఉద్యోగుల బదిలీల్లో తప్పేమీ లేదని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఉద్యోగుల విషయంలో రెండు రాష్ట్రాలు సామరస్యంతో పరిష్కరించుకోవాలని కమిటీ సభ్యులు సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర సిబ్బంది శిక్షణ, వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావులు పాల్గొన్నారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సమావేశంలో పాల్గొన్నప్పటికీ సెలవులో ఉన్న ఏపీ డీజీపీ జేవీ రాముడు హాజరు కాలేదు. దీంతో పోలీసు ఉద్యోగుల విభజనపై చర్చించేందుకు మరోసారి సమావేశం కావాలని ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. అనంతరం రెండు రాష్ట్రాలకు చెందిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, కో ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం, పే అండ్ అకౌంట్స్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఐజీలతో సమావేశమయ్యారు. ఇప్పటికే ఆయా విభాగాల ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లను పరిశీలించి.. రెండు రాష్ట్రాలకు కేటాయించారు. అందుకు సంబంధించి తాత్కాలిక విభజన జాబితాలను సిద్ధం చేశారు. -
'ఆలస్యం చేస్తే మరో ఉద్యమానికి సిద్ధం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బందిని రిలీవ్ చేయాలని కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ తెలిపారు. గురువారం వారు కమలనాథన్ కమిటీని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ ఉద్యోగుల ఆకాంక్షలు మేరకు విభజన జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల విభజనలో ఇప్పటికే ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల విభజనను కమలనాథన్ కమిటీ ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. త్వరగా ఉద్యోగుల విభజన పూర్తి చేయకుంటే మరో ఉద్యమానికి సిద్ధమని కోదండరాం, దేవీ ప్రసాద్ తెలిపారు. -
22, 23 తేదీల్లో కమలనాథన్ కమిటీ భేటీ
మరో పది శాఖల్లో ఉద్యోగుల పంపిణీ, అభ్యంతరాల పరిష్కారంపై చర్చ సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ 22, 23 తేదీల్లో సమావేశం కానుంది. 22న మరో పది శాఖలకు చెందిన విభాగాల్లో ఉద్యోగులను పంపిణీ చేయనుంది. 23న ఉద్యోగుల అభ్యంతరాల పరిష్కారంపై చర్చించనుంది. కమిటీ ఇప్పటికే 94 శాఖలకు చెందిన 14,229 మందిని పంపిణీ చేసింది. ఇంకా పోలీసు శాఖలో 22 వేల మంది, వైద్య ఆరోగ్య శాఖలో 7 వేల మంది, ఇతర చిన్న శాఖల్లో మరో 6 వేల మంది ఉద్యోగులను పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తం రాష్ట్ర స్థాయి కేడర్కు చెందిన 50 వేల మంది ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. పోలీసు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగులను పంపిణీ చేస్తే ప్రక్రియ చివరి దశకు చేరుకుంటుంది. -
'తెలంగాణ ఒత్తిడికి కమల్ నాథన్ కమిటీ తలొగ్గింది'
హైదరాబాద్: ఉద్యోగుల విభజనపై కమల్నాథన్ కమిటీ సమర్పించిన జాబితాలో అవకతవకలున్నాయని ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. శుక్రవారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులు కమిటీ జాబితాపై చర్చించడానికి సీఎస్ ను కలిశారు. తెలంగాణ ఉద్యోగుల ఒత్తిడికి కమల్నాథన్ కమిటీ తలొగ్గినట్టుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన పలువురు సీనియర్ అధికారులను తెలంగాణకు కెటాయించారని మురళీకృష్ణ ఆరోపించారు. ఆ కమిటీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నారు. ఇద్దరు డిప్యూటీ సెక్రటరీలు, ఇద్దరు అదనపు సెక్రటరీలు, ఓ అసిస్టెంట్ సెక్రటరీని తెలంగాణకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని విమర్శించారు. దీనిపై కోర్టుకు వెళతామని మురళీకృష్ణ పేర్కొన్నారు. -
మా వాళ్లను మాకే కేటాయించండి
కమలనాథన్ కమిటీకి టీసీటీజేఏసీ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని, ఆప్షన్ల విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని తెలంగాణ వాణి జ్య పన్నుల శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ (టీసీటీజేఏసీ) ఆరోపించింది. తెలంగాణకు చెందిన అధికారులను తెలంగాణకే కేటాయించాలని శుక్రవారం కమలనాథన్ కమిటీని టీసీటీజేఏసీ కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా టీసీటీజేఏసీ చైర్మన్ వివేక్, టీసీటీజీఓఏ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏపీలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని అక్కడి వారితో భర్తీ చేయకుండా జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి వారిని, ఇతర ఉద్యోగులను చివరికి డ్రైవర్లను కూడా తెలంగాణకు కేటాయిస్తున్నారన్నారు. కమిటీ స్పందించి ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఉద్యోగుల విభజన వేగవంతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ వేగవంతమైంది. శాఖల వారీగా తాత్కాలిక కేటాయింపుల జాబితాలను కమలనాథన్ కమిటీ ఎప్పటికప్పుడు ప్రచురిస్తోంది. మొత్తం 117 శాఖల్లో ఇప్పటివరకు 99 శాఖలకు చెందిన విభజన తొలి దశ పూర్తయింది. త్వరలోనే ఈ తాత్కాలిక పంపిణీ వివరాల నివేదికను కేంద్రానికి పంపించనుంది. తాత్కాలిక కేటాయింపులపై ఉద్యోగులు తమ అభ్యంతరాలు తెలిపేందుకు రెండు వారాల గడువు ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాతే తుది కేటాయింపుల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. ఈ కసరత్తు ఇదే వేగంతో సాగితే జూలై నెలాఖరుకు తుది జాబితాలు వెలువడుతాయని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని విభాగాలన్నింటా రాష్ట్రస్థాయి పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజిస్తున్నారు. సచివాలయంతో పాటు విభాగాల ఉన్నతాధికారుల వారీగా (హెచ్వోడీలు) ఉద్యోగుల పంపిణీ జరుగుతోంది. వైద్యారోగ్యం, పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఆక్టోపస్, టీబీ హాస్పిటల్కు సంబంధించిన విభజన ఆలస్యమవుతోంది. ఒక్కో విభాగం వారీగా ఆన్లైన్లో ఉద్యోగుల ఆప్షన్లు స్వీకరించిన కమలనాథన్ కమిటీ ప్రతి వారం సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమవుతోంది. ఆ శాఖలో ఉన్న పోస్టులు, అందులో ఉన్న ఉద్యోగుల స్థానికత... వారు కోరుకున్న ఆప్షన్లు ఏ రాష్ట్రానికి కేటాయించాలనే అంశంపై దాదాపు వారానికోసారి సమావేశమవుతోంది. తాత్కాలిక జాబితాలను ఎప్పటికప్పుడు కమిటీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తోంది. ఇప్పటివరకు ఆప్షన్లు నమోదు చేసుకున్న 10,156 మంది ఉద్యోగుల్లో 5,379 మందిని ఏపీకి, 4,786 మందిని తెలంగాణకు కేటాయించింది. ఈ జాబితాల ప్రకారం తెలంగాణకు చెందిన 689 ఉద్యోగులు ఏపీకీ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 300 మంది తెలంగాణకు అలాట్ అయ్యారు. రెండు రాష్ట్రాలకు చెందని స్థానికేతరులు 119 ఉన్నారు. వీరిలో 66 మందిని ఏపీకి, 53 మందిని తెలంగాణకు కేటాయించారు. ఎక్కడైనా ఫర్వాలేదు.. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల్లో 47 మంది ‘ఏ రాష్ట్రమైనా పర్వాలేదు’ అని ఆప్షన్ నమోదు చేసుకోవటం గమనార్హం. తాత్కాలిక పంపిణీలో వీరిలో 29 మందిని ఏపీకి, 18 మందిని తెలంగాణకు కేటాయించారు. ఏపీకి ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగుల్లో 170 మందిని కమిటీ తమ పరిశీలన అనంతరం తెలంగాణకు, తెలంగాణ కోరుకున్న 632 మందిని ఏపీకి కేటాయించింది. కొత్త పోస్టులు లేకుంటే సర్దుబాటే.. స్థానికతను ఆధారంగా విభజన ప్రక్రియను చేపడుతున్నప్పటికీ ఆయా శాఖల్లో కేడర్ల వారీగా పోస్టులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. లేని కారణంగానే కొందరిని అటు ఇటు సర్దుబాటు చేయక తప్పని పరిస్థితి నెలకొందని ఇటీవలే రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కమలనాథన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రెండు ప్రభుత్వాలు ఎక్కడికక్కడ సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాల్సి ఉంటుంది. -
51 విభాగాల్లో ఉద్యోగుల పంపిణీ పూర్తి
8,191 మంది ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంచిన కమలనాథన్ కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకు 51 విభాగాల్లోని రాష్ట్ర స్థాయి కేడర్కు చెందిన 8,191 మంది ఉద్యోగులను కమలనాథన్ కమిటీ ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. స్థానికత, ఆప్షన్లు, మార్గదర్శకాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు 4,359 మంది ఉద్యోగులను, తెలంగాణకు 3,832 మందిని కమిటీ కేటాయించింది. తెలంగాణకు చెందిన 518 మంది ఉద్యోగులను ఆప్షన్లు, ఇతర నిబంధనల మేరకు కమిటీ ఏపీకి కేటాయించింది. అలాగే ఆంధ్రాకు చెందిన 246 మందిని ఆప్షన్లు, ఇతర నిబంధనల మేరకు తెలంగాణకు కేటాయించారు. పంపిణీ పూర్తి చేసిన 51 విభాగాల్లో ఏపీకి 6,462 పోస్టుల మంజూరవ్వగా.. పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా 4,359 మందిని కేటాయించారు. అలాగే తెలంగాణకు 51 విభాగాల్లో మంజూరైన పోస్టులు 4,329కు గాను పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా 3,832 మందిని కేటాయించారు. తెలంగాణ నాల్గోతరగతి ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రాకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగుల్లో 287 మంది నాల్గోతరగతి ఉద్యోగులే ఉన్నారు. ఇలా ఉండగా మరో 17 విభాగాల్లో కూడా రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ కూడా పూర్తి అయింది. ఈ పంపిణీకి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. నెలాఖరుకు రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీ నూరు శాతం పూర్తి చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ప్రొవిజనల్ పంపిణీ జాబితాలను కేంద్రానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత ఉద్యోగుల తుది పంపిణీ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. -
నెలాఖరులోగా 90% ఉద్యోగుల పంపిణీ
కమలనాథన్ కమిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 90 శాతం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని రెండు రాష్ట్రాలను కోరింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్నందున మిగిలిన అన్ని శాఖల్లో ఉద్యోగుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల (సీఎస్లు)కు సూచించింది. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ సీఎస్ రాజీవ్శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కమలనాథన్ కమిటీతో భేటీ అయ్యారు. ఆగస్టులో విభజన ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్లో కేంద్రానికి నివేదికను అందించాల్సి ఉంటుందని కమలనాథన్ వివరించారు. 52 శాఖలకు చెందిన విభజన పూర్తవగా.. ఏ ఉద్యోగులను ఏ రాష్ట్రానికి కేటాయించారనే జాబితాలను కమిటీ ప్రచురించింది. -
51 విభాగాల్లో ఉద్యోగుల పంపిణీ
⇒ గతంలో 25 శాఖల్లో.. తాజాగా మరో 26 శాఖల్లో.. ⇒ రెండు వారాల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలి ⇒ కమలనాథన్ కమిటీ నోటిఫికేషన్ జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీని 51 శాఖలకు చెందిన విభాగాల్లో కమలనాథన్ కమిటీ పూర్తి చేసింది. గతంలో 25 శాఖలకు చెందిన విభాగాల్లో పంపిణీ పూర్తి చేసిన కమిటీ మంగళవారం మరో 26 శాఖల విభాగాల్లోనూ పంపిణీని పూర్తి చేసింది. వర్క్ టు సర్వ్ ఆర్డర్లో ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 26 శాఖలకు చెందిన విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు తాత్కాలిక పంపిణీ చేస్తూ కమలనాథన్ కమిటీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లు, స్థానికత, మార్గదర్శకాల ఆధారంగా ఏ ఉద్యోగి ఏ రాష్ట్రంలో పనిచేయాలో నోటిఫికేషన్లో పేర్లతో సహా పేర్కొంది. అలాగే ఆయా ఉద్యోగుల సీనియారిటీ ర్యాంకును పంపిణీలో కమలనాథన్ కమిటీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ స్థానికత గల ఉద్యోగులను నిబంధనల మేరకు కొంత మందిని తెలంగాణకు.. అలాగే తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను కొంత మందిని ఏపీకి కేటాయించారు. తాజాగా పంపిణీ అయిన ఉద్యోగులు ఏమైనా అభ్యంతరాలుంటే రెండు వారాల్లోగా తెలియజేసేందుకు గడువు ఇచ్చారు. నోటిఫికేషన్ జారీ అయిన 14 రోజుల్లోగా పంపిణీ చేసిన రాష్ట్రానికి వెళ్లి ఉద్యోగంలో చేరాలని స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులనూ కమిటీ పంపిణీ చేసింది. రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీ దాదాపు సగం శాఖల్లో కమలనాథన్ కమిటీ పూర్తి చేసినట్లైంది. 5వ తేదీన కమలనాథన్ కమిటీ భేటీ రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై కమలనాథన్ కమిటీ ఈ నెల 5వ తేదీన సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ సీఎస్లు రాజీవ్ శర్మ, ఐ.వై.ఆర్. కృష్ణారావు, ఇరు రాష్ట్రాల పునర్విభజన విభాగం కార్యదర్శులు ప్రేమచంద్రారెడ్డి, రామకృష్ణారావు, కేంద్ర వ్యక్తిగత సిబ్బంది వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ పాల్గొంటారు. -
నత్తనడకన ఉద్యోగుల పంపిణీ
ఏడాదైనా తాత్కాలిక పంపిణీయే పూర్తికాలేదు తుది పంపకాలకు మరో సంవత్సర కాలం! రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పంపిణీపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కమల్నాథన్ అధ్యక్షతన ఒక కమిటీని రాష్ట్ర విభజన తేదీకి ముందే ఏర్పాటు చేసింది. గత ఏడాది మార్చి 29న ఏర్పాటైన ఈ కమిటీ.. ఇప్పటివరకు 11 సార్లు సమావేశాలు నిర్వహించి... రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల సంఖ్యను నిర్ధారించింది. రాష్ట్రాల మధ్య ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ ప్రక్రియను ప్రారంభించినా... ఇంకా సగం విభాగాల్లో కూడా ఇది పూర్తి కాలేదు. ఇంకెంత కాలం పడుతుందో..? తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య 115 శాఖలకు చెందిన విభాగాల్లోని పోస్టులను పంపిణీ చేశారు. ఆయా పోస్టుల్లో ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ మాత్రం కేవలం 28 శాఖలకు చెందిన విభాగాల్లోనే పూర్తిచేశారు. కమల్నాథన్ కమిటీకి తొలుత కేంద్రం ఇచ్చిన గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిపోయింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. కానీ కమల్నాథన్ కమిటీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఈ గడువులోగా ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ కూడా పూర్తి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు తాత్కాలిక పంపిణీ పూర్తిచేసి, అభ్యంతరాలను స్వీకరించి, పరిష్కరించిన తర్వాత కేంద్రం నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే ఏడాదిపైనే పడుతుందని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. నిరుద్యోగులకు శాపం.. ఉద్యోగుల పంపిణీ పూర్తి కాకపోవడాన్ని సాకుగా తీసుకుని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని పక్కనపెట్టాయి. కమల్నాథన్ కమిటీ పంపిణీ చేసేది కేవలం 50 వేల రాష్ట్ర స్థాయి ఉద్యోగులను మాత్రమే. జిల్లా, జోనల్, మండల, గ్రామ స్థాయి ఉద్యోగులు పంపిణీ పరిధిలోకి రారు. అయినా ఆ ఖాళీ పోస్టులను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయడం లేదు. -
'కమలనాథన్ కమిటీని తక్షణం రద్దు చేయాలి'
-
మరో 15 విభాగాల్లో ఉద్యోగుల పంపిణీ
* ఇప్పటివరకు 25 శాఖల్లో పంపిణీ పూర్తి చేసిన కమలనాధన్ కమిటీ * ఉద్యోగుల ఆప్షన్లు, స్థానికత, మార్గదర్శకాల ఆధారంగా కేటాయింపులు * 14 రోజుల్లోగా కేటాయించిన రాష్ట్రంలో విధుల్లో చేరాలని స్పష్టీకరణ * అభ్యంతరాల వెల్లడికి 2 వారాల గడువు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీ మరో 15 శాఖల్లోని వివిధ విభాగాల్లో పూర్తయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల విభజన కోసం నియమించిన కమలనాధన్ కమిటీ ఇంతకు ముందు 10 శాఖలకు చెందిన ఉద్యోగుల పంపిణీని పూర్తి చేసింది. తాజా పంపిణీతో మొత్తం 25 శాఖలకు చెందిన వివిధ విభాగాల ఉద్యోగుల పంపిణీ పూర్తయినట్లయింది. వర్క్ టు సర్వ్ ఆర్డర్లో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగులను తాత్కాలికంగా పంపిణీ చేస్తూ కమిటీ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లు, స్థానికత, మార్గదర్శకాల ఆధారంగా ఏ ఉద్యోగి ఏ రాష్ట్రంలో పనిచేయాలో నోటిఫికేషన్లో పేర్లతో సహా పేర్కొంది. ఉద్యోగుల సీనియారిటీ ర్యాంకును కూడా తెలిపింది. ఏపీ స్థానికతగల ఉద్యోగుల్లో కొందరిని ఆప్షన్ల నిబంధనల మేరకు తెలంగాణకు కేటాయించారు. తెలంగాణ స్థానికత గల వారిలో కొందరిని ఆప్షన్ల నిబంధనల మేరకు ఏపీకి కేటాయించారు. 14 రోజుల్లోగా వారికి కేటాయించిన రాష్ట్రంలో ఉద్యోగంలో చేరాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు అభ్యంతరాలను తెలిపేందుకు 2 వారాలు గడువిచ్చారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కూడా పంపిణీ చేశారు. తాజా కేటాయింపుల్లో ప్రధానమైనవి పంచాయతీరాజ్ కమిషనరేట్లోని 51 మంది ఉద్యోగుల్లో 28 మందిని ఆంధ్రాకు, 23 మందిని తెలంగాణకు ఇచ్చారు. ఇందులో ఆంధ్రాకు చెందిన ముగ్గురిని తెలంగాణకు ఇచ్చారు. తెలంగాణకు చెందిన నలుగురిని ఆంధ్రాకు కేటాయించారు. మైనారిటీ సంక్షేమ శాఖలోని 12 మందిలో నలుగురిని ఏపీకి, 8 మందిని తెలంగాణకు కేటాయించారు. ఆం ధ్రాకు వెళ్లిన వారిలో ముగ్గురు తెలంగాణ వారున్నారు. సాధారణ పరిపాలన శాఖ తర్జుమా విభాగంలోని 44 మందిలో ఆంధ్రాకు 19 మందిని, తెలంగాణకు 25 మందిని పంపిణీ చేశారు. ఇదే శాఖలోని విజిలెన్స్ కమిషన్లో ఉన్న ఆరుగురిలో ఐదుగురిని తెలంగాణకు, ఒకరిని ఆంధ్రాకు పంపిణీ చేశారు. పరిశ్రమల శాఖ కమిషనరేట్లో స్థానికత, ఆప్షన్లు ఆధారంగా 31 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించారు. ఆంధ్రాకు చెందిన ఐదుగురిని తెలంగాణకు కేటాయించారు. ఔషధ నియంత్రణ విభాగంలో తెలంగాణకు చెందిన ఆరుగురిని ఆంధ్రాకు, ఆంధ్రాకు చెందిన ముగ్గురు ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. సాంస్కృతిక విభాగంలో తెలంగాణకు చెందిన ఒక ఉద్యోగిని ఆంధ్రాకు కేటాయించగా ఆంధ్రాకు చెందిన ఇద్దరిని తెలంగాణకు కేటాయించారు. ఆర్థిక శాఖలోని బీమా విభాగంలో తెలంగాణకు చెందిన 16 మందిని ఆంధ్రాకు కేటాయించగా, ఆంధ్రాకు చెందిన ఇద్దరిని తెలంగాణకు కేటాయించారు. పౌరసరఫరాల శాఖలో ఆంధ్రాకు 137 మందిని, తెలంగాణకు 158 మందిని కేటాయించారు. ఆంధ్రా, తెలంగాణకు చెందని ఇద్దరిని తెలంగాణకు... తెలంగాణకు చెందిన ముగ్గురిని ఆంధ్రాకు కేటాయించారు. -
'ఎక్కడివారు.. అక్కడే పనిచేయాలి'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పన కమిటీ, ఉద్యోగుల పంపిణీ కమిటీల చైర్మన్ కమల్నాథన్ను శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనను వెంటనే పూర్తి చేయాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తప్పుడు స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని దేవిప్రసాద్ తెలిపారు. -
మరో ‘కమిటీ’ని నియమించాలి
సందర్భం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న తర్వాత ఇక్కడి ఉద్యో గులకు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనే భావనతోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గా లన్నీ కలసి పోరాటం చేశా యి. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా తెలం గాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతోంది. విభజన బిల్లులో ఉద్యోగుల, పెన్షనర్ల విభజనలో జిల్లా జోన్, మల్టీ జోనల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కడివారు అక్కడే ఉంటారనే ప్రతిపా దనతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోం ది. పార్లమెంటు చట్టం రాష్ట్ర విభజన ఆస్తులు, అప్పు లతోపాటు ఉద్యోగుల పంపిణీ 58:42 నిష్పత్తి ప్రకా రం జరగాలన్నది చెబుతుంది. కానీ ఉద్యోగుల విభ జనలో ఈ సూత్రం పనిచెయ్యదు. కమల్నాథన్ కమిటీ/షీలాబిడే కమిటీలు కేవలం ఉన్న ఉద్యోగుల ను 58:42 శాతం విభజించడానికే పరిమితం అవు తున్నాయి. అన్ని క్యాడర్లలో 42 శాతం మంది తెలం గాణ ఉద్యోగులు లేరన్నది వాస్తవం. కానీ తెలంగా ణకు కేటాయించే 42 శాతంలో కూడా నిజమైన తెలంగాణ వాళ్లు ఉండరనేది తెలంగాణ ఉద్యోగుల వాదన. సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజన జరుగు తున్నది కేవలం సచివాలయం హెచ్ఓడీలలో మా త్రమే. కానీ అసలు సమస్య జిల్లాలో ఉన్న స్థానికేత రులతోనే! వారిని పంపించకుండా కేవలం రాష్ట్ర స్థాయిలో విభజనను చేపట్టడం వలన, ఉల్లంఘన తో దొడ్డిదారిలో వచ్చిన స్థానికేతరులను స్థానికు లుగా గుర్తించడమే అవుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయిలో 20 శాతం, జోనల్ స్థాయిలో 30 శాతంగా ఉన్న ఓపెన్ కోటాలో కేవలం స్థానికేతరులకు అవకాశాలు ఇవ్వ డంవల్ల తెలంగాణ నిరుద్యోగులకు తీరని అన్యా యం జరిగిందని గిర్గ్లానితో పాటు అనేక కమిటీలు స్పష్టంగా పేర్కొన్నాయి. పదవ తరగతి వరకు వరు సగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ వ్యక్తిని స్థానికు డిగా పరిగణించడమనే నిబంధన తెలంగాణ నిరు ద్యోగులకు గొడ్డలిపెట్టు. సమైక్య రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్లో, తెలంగాణలో ఉద్యోగాలు చేసిన ఉద్యోగులు, వ్యాపారం పేరిట ఇక్కడకు వచ్చిన వారు, వారి పిల్లలు, అందరూ స్థానికులైతే తెలం గాణ భూమిపుత్రులకు నోట్లో మట్టే. 1956 నుంచి తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అన్యాయాల పట్ల నిరుద్యోగులు పోరాటాలు చేస్తూ నే ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేసు కొన్న ప్రభుత్వమే ఈ విషయంలో చొరవ తీసుకో వాలి. హెల్త్ కార్డులు, పీఆర్సీలు, ఫిట్మెంట్లు కాదు. ముందుగా విభజనపై దృష్టి సారించాలి. పార్లమెంటు చట్టంలో మార్పులకై పట్టుబట్టాలి. స్థానికేతరులు ఉద్యోగాల్లో చొరబడకుండా కట్టుది ట్టంగా వ్యవహరించాలి. కచ్చితమైన క్యాడర్ స్ట్రెంత్ ను ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ ప్రమోషన్లు, డీపీసీలు ఏర్పాటు చేసి ఖాళీలను పూరించాలి. కమలనాథన్ కమిటీ పనిచేసే తీరులోనే అశా స్త్రీయ ధోరణులు కనబడుతున్నాయి. సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని రాష్ట్ర స్థాయిగా గుర్తించి జనాభా దామా షాలో 58.32 శాతం సీమాంధ్రకు, 41.68 శాతం తెలంగాణకు కేటాయింపులు చేస్తున్నారు. మొదట ఖాళీలను, తదుపరి వ్యక్తులను పంచుతున్నారు. అస లు (క్యాడర్ స్ట్రెంత్)ను మంజూరు అయిన పోస్టు లను పక్కనబెట్టి కేవలం పనిచేస్తున్న వారిని (వర్కిం గ్ స్ట్రెంత్)ను విభజించడం వల్ల తెలంగాణ ఉద్యోగు లు ఆంధ్రలో, ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పని చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రస్థాయి అధికారు లను జిల్లా, జోనల్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగు లను ‘ఎక్కడ వారిని అక్కడే’ ఉంచడం వల్ల సీమాం ధ్రలో కొందరు తెలంగాణ ఉద్యోగులు, తెలంగా ణలో వేలాది మంది ఉద్యోగులు చట్టబద్ధంగా ఉండి పోయే పరిస్థితి వస్తుంది. కలమనాథన్, షిలాబిడే కమిటీలతో పాటు అవసరమైతే రాజ్యాంగబద్ధత కలిగిన మరో కమిషన్ నియమించాలి. తెలంగాణ వారు తెలంగాణలో, సీమాంధ్ర ఉద్యోగులు సీమాంధ్రలో పనిచేసే విధంగా నిబంధనలు సరళతరం చేయాలి. వీటిపై దృష్టి సారించకపోతే మరిన్ని ఉద్యమాలు ఏర్పడే ప్రమాదముంది. (వ్యాసకర్త సహాధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల సంఘం) మొబైల్: 98661 74474 కాలేరు సురేష్ -
సమాచారం త్వరగా ఇప్పించండి!
శాఖాధిపతుల నుంచి స్పందన ఉండడం లేదు ఫలితంగా ఉద్యోగుల పంపిణీ జాప్యమవుతోంది ఏపీ, తెలంగాణ సీఎస్లకు కమలనాథన్ లేఖ హైదరాబాద్: ఏపీ, తెలంగాణల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారం ఆయా రాష్ట్రాల శాఖాధిపతుల నుంచి అందకపోవడంపై కమలనాథన్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల స్థానికత, ప్రత్యేక కేసుల్లో ఆప్షన్స్కు సంబంధించిన డాక్యుమెంట్లను, సీనియారిటీ సర్టిఫికెట్లను ఇరు రాష్ట్రాల శాఖాధిపతులు ఆన్లైన్లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఉద్యోగుల పంపిణీ వ్యవహారం మరింత ఆలస్యమవుతోంది. శాఖాధిపతులు ఉద్యోగుల సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. అనంతరం ఆయా పత్రాలను విభజన విభాగం వెబ్సైట్లో ఉంచుతుంది. కమలనాథన్ కమిటీ ఇప్పటికే 10 విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకూ పంపిణీ చేసిం ది. మిగిలిన విభాగాల ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారం ఆయా శాఖాధిపతుల నుంచి ఆన్లైన్లో రావడం లేదు. ఈ నేపథ్యంలో కమలనాథన్.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావులకు లేఖ రాశారు. శాఖాధిపతులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని త్వరగా ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని విభాగాలకు సంబంధించి స్థానికత, ఇతర అంశాల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అలాంటి సమాచారాన్ని సరి చేయాల్సిన బాధ్యత శాఖాధిపతులపై ఉందని, ఈ క్రమంలో ఆలస్యం జరగకుండా సమాచారం అందించాలని సూచించారు. వాటిపై ఏకాభిప్రాయానికి రావాలి ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రి, డెంటల్ కాలేజీ ఆస్ప త్రి, నర్సింగ్ కాలేజీలను రాష్ట్ర యూ నిట్లుగా పరిగణించి ఇరు రాష్ట్రాలకు ఉద్యోగులను పంపిణీ చేయాలని ఏపీ ప్ర భుత్వం కోరుతోంది. దీనిపై కమలనాథన్ స్పందిస్తూ ఇరు రాష్ట్రాల శాఖాధిపతులు ఒక అభిప్రాయానికి వస్తే అందుకు అనుగుణంగా పంపిణీ చేస్తామని పేర్కొంది. భార్య, భర్తల విషయంలో కేంద్ర ఉద్యోగి ఒక రాష్ట్రంలోను మరో ఉద్యోగి మరో రాష్ట్రంలో ఉన్నా ఇద్దరినీ ఒకే రాష్ట్రానికి పంపిణీ చేసేందుకు కమిటీ అంగీకరించింది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాల్సి ఉందని కమిటీ పేర్కొంది. సచివాలయంలో నాలుగో తరగతి ఉద్యోగులు 637 మంది ఉండగా అందులో ఏపీ స్థానికత గలవారు కేవలం 45 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 592 మంది తెలంగాణ వారేనని కమిటీ గుర్తించింది. నాలుగో తరగతి ఉద్యోగులను వారిచ్చే ఆప్షన్ల ఆధారంగా పంపిణీ చేయాలని మార్గదర్శక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల ఈ విషయంలో ఏ ఇబ్బందీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
8 విభాగాల్లో ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ పూర్తి
* అభ్యంతరాలకు రెండు వారాల గడువు * నోటిఫికేషన్ తర్వాత 14 రోజుల్లోగా కేటాయించిన చోట చేరాలి * పదవీ విరమణ చేసినవారినీ పంపిణీ చేసిన కమలనాథన్ కమిటీ సాక్షి, హైదరాబాద్: ఎనిమిది శాఖలకు చెందిన విభాగాల్లో కమలనాథన్ కమిటీ రాష్ట్రస్థాయి ఉద్యోగుల ప్రొవిజినల్ పంపిణీని పూర్తిచేసింది. వర్క్ టు సర్వ్ ఆర్డర్లో ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు తాత్కాలికంగా పంపిణీ చేస్తూ కమిటీ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా ఉద్యోగులిచ్చిన ఆప్షన్లు, స్థానికత, మార్గదర్శకాల ఆధారంగా ఏ ఉద్యోగి ఏ రాష్ట్రంలో పనిచేయాలనే విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే ఉద్యోగుల సీనియారిటీ ర్యాంకుల్నీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ స్థానికత గల ఉద్యోగుల్ని ఆప్షన్ల నిబంధనల మేరకు కొంత మందిని తెలంగాణకు పంపిణీ చేశారు. అలాగే తెలంగాణ స్థానికత గల కొంతమంది ఉద్యోగులను ఏపీకి పంపిణీ చేశారు. ఈ ఎనిమిది శాఖలకు చెందిన విభాగాల్లో పంపిణీ అయిన ఉద్యోగులు అభ్యంతరాలు తెలియజేసేందుకు రెండు వారాల గడువిచ్చారు. అభ్యంతరాలకు మే రెండో తేదీని తుది గడువుగా కమలనాథన్ కమిటీ విధించింది. నోటిఫికేషన్ జారీ అయిన 14 రోజుల్లోగా పంపిణీ చేసిన రాష్ట్రానికి వెళ్లి ఉద్యోగంలో చేరాలని స్పష్టం చేశారు. ఉన్నత విద్యా శాఖలో భాగమైన ఇంటర్మీడియెట్ డెరైక్టరేట్కు చెందిన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల్లో 38 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 35 మంది ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేశారు. పాఠశాల విద్యా శాఖలో భాగమైన వయోజన విద్య డెరైక్టరేట్కు చెందిన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల్లో 27 మందిని ఆంధ్రప్రదేశ్కు, 29 మందిని తెలంగాణకు పంపిణీ చేశారు. ఉన్నత విద్యా శాఖలో భాగమైన జిల్లా గెజిటీర్స్లో పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి ఉద్యోగుల్లో ఏపీకి 8 మందిని, తెలంగాణకు ఆరుగురిని పంపిణీ చేశారు. రవాణా శాఖ డెరైక్టరేట్లలో రాష్ట్రస్థాయి ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిలో ఏపీకి 50 మందిని, తెలంగాణకు 59 మందిని పంపిణీ చేశారు. పరిశ్రమల శాఖలో భాగమైన చేనేత జౌళి డెరైక్టరేట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తెలంగాణకు 23 మందిని, ఏపీకి 28 మందిని పంపిణీ చేశారు. గిరిజన సంక్షేమ డెరైక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏపీకి 49, తెలంగాణకు 37 మందిని పంపిణీ చేశారు. సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డు డెరైక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏపీకి 39 మందిని, తెలంగాణకు 114 మందిని పంపిణీ చేశారు. ప్రణాళికా శాఖలో భాగమైన అర్థగణాంక కమిషనరేట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏపీకి 127 మందిని, తెలంగాణకు 113 మందిని పంపిణీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్నికూడా ఇరు రాష్ట్రాలకు నిబంధనల మేరకు కమలనాథన్ కమిటీ పంపిణీ చేసింది. -
ఏపీ ఉద్యోగులపై బదిలీ అస్త్రం
తొలి విడతగా 12 మంది పీఎస్ల బదిలీ జాబితాలో మరో 115 మంది వీరిలో 70 మంది సెక్షన్ ఆఫీసర్లు దశల వారీగా బదిలీకి కసరత్తు సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో పని చేస్తున్న ఏపీ ఉద్యోగులపై తెలంగాణ సర్కారు బదిలీల అస్త్రం ప్రయోగించింది. పలువురు ఉన్నతాధికారుల వద్ద పని చేస్తున్న 12 మంది వ్యక్తిగత కార్యదర్శులను తొలి విడతగా ఇటీవలే బదిలీ చేసింది. వీరందరూ ఏపీకి చెందిన వారని... దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్ ఈ మార్పులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యతో దశలవారీగా మరో 115 మంది ఏపీ ఉద్యోగులను బదిలీ చేసేందుకు కసరత్తు మొదలైంది. వీరిలో వివిధ శాఖల్లో 70 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. తెలంగాణ సచివాలయంలో పని చేస్తున్న పీఎస్ల్లో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణ వారున్నారు. కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంది. కానీ కీలక పోస్టుల్లో ఉన్నందున వీరంతా తెలంగాణలో కొనసాగేందుకే మొగ్గు చూపుతున్నారని, ఉన్నతాధికారుల పేషీల్లో ఉండటంతో రకరకాల విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారనేది తెలంగాణ ఉద్యోగుల ఆందోళన. వరుసగా వెల్లువెత్తిన ఈ ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వం కొన్ని కీలక స్థానాల్లో ఉన్న ఏపీ ఉద్యోగుల బదిలీలకు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో జరిగిన బదిలీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మతోపాటు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్మిశ్రా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, నీటిపారుదల ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్, జీఏడీ కార్యదర్శి బూసాని వెంకటేశ్వరరావు, హోంశాఖ అదనపు కార్యదర్శి అనితా రాజేంద్ర దగ్గర పని చేస్తున్న వ్యక్తిగత కార్యదర్శులున్నారు. మరోవైపు కొందరు ఉన్నతాధికారులు ఉద్యోగుల విభజన నిబంధనలన్నీ లెక్క చేయకుండా తమ ఇష్టపూర్వకంగా ఏపీకి చెందిన పీఎస్లను నియమించుకున్నారు. మున్సిపల్ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ వద్ద పని చేస్తున్న పీఎస్ను ఇటీవలే ఆంధ్రా నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. తాము ఇష్టపూర్వకంగా నియమించుకున్న పీఎస్ను బదిలీ చేయటం సరికాదని ఒక ముఖ్య కార్యదర్శి సీఎస్ను కలసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే తన దగ్గరున్న పీఎస్ కూడా ఇదే బదిలీ జాబితాలో ఉన్నారని, ఈ వ్యవహారంలో తాను చేసేదేమీ లేదని సీఎస్ తన అశక్తతను వెలిబుచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బదిలీ అయిన వారంతా ఏపీకి చెందిన వారవటం, వీరెవరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా వెంటనే రిలీవ్ కావాలని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. బదిలీ అయిన వారి స్థానంలో తెలంగాణ ఉద్యోగులకు అవకాశం కల్పించాలని, ఆ స్థాయి ఉద్యోగులు లేకుంటే వారికి పదోన్నతులిచ్చి నియమించాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మంత్రుల పేషీల్లోనూ మాజీ పీఎస్లు తెలంగాణ మంత్రుల పేషీల్లో గతంలో మంత్రుల వద్ద పని చేసిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా సెటిలయ్యారు. కాంగ్రెస్ హయాంలో మంత్రుల వద్ద పని చేసిన పీఎస్లు, ఓఎస్డీలు, పీఏలను నియమించుకోవద్దని సీఎం కేసీఆర్ గతంలోనే మంత్రులను హెచ్చరించారు. దీంతో కొందరు మంత్రులు వారిని మార్చుకున్నా క్రమంగా పాత కథ పునరావృతమవుతోంది. మంత్రులు తుమ్మల, హరీశ్, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేషీల్లో కాంగ్రెస్ హయాంలో మంత్రుల వద్ద పని చేసిన ఉద్యోగులే హల్చల్ చేస్తున్నారు. -
పోస్టుల పంపిణీ దాదాపు పూర్తి!
రాష్ట్ర స్థాయి కేడర్లోని 76 శాఖల్లోనూ కొలిక్కి ఆంధ్రాకు 22,728 పోస్టులు, తెలంగాణకు 15,922 పోస్టులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కీలకమైన రాష్ట్ర స్థాయి ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసే అంశం కొలిక్కి వచ్చింది. మెజారిటీ శాఖలకు చెందిన పోస్టులను కమలనాథన్ కమిటీ ఇప్పటికే ఇరు రాష్ట్రాలకూ పంపిణీని పూర్తి చేసింది. మొత్తం 89 శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో ఇప్పటి వరకు సచి వాలయంతో సహా 76 శాఖలకు చెందిన పోస్టులను జనాభా నిష్ప త్తి ఆధారంగా ఇటు తెలంగాణ, అటు ఏపీలకు పంపిణీ చేశారు. ఈ పోస్టుల పంపిణీలో ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఖాళీలను కూడా కలపి ఇరు రాష్ట్రాలకు పంపిణీ పూర్తి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా పోస్టుల పంపిణీ పూర్తి చేసిన 76 శాఖలకుగాను ఇప్పటికే 51 శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్లను కూడా ఇచ్చారు. మరో 25 శాఖలకు చెందిన ఆప్షన్లకు చెందిన ఫైళ్లు సర్కులేషన్లో ఉన్నాయి. ఈ నెల చివరి వారానికి ఇరు రాష్ట్రాల మధ్య పోస్టుల పంపిణీ పూర్తి అవుతుందని.. ఆప్షన్లు ఇచ్చిన శాఖల్లో ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని కమలనాథన్ కమిటీ పేర్కొంది. తగ్గిన ఉద్యోగులు.. ఇప్పటి వరకు సచివాలయంతో సహా 76 శాఖలకు చెందిన 38,650 రాష్ట్ర స్థాయి కేడర్ పోసులను ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేశా రు. అయితే ఈ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రం పోస్టుల కన్నా తక్కువగా ఉన్నారు. పంపిణీ చేసిన పోస్టులతో చూస్తే ఉద్యోగుల సంఖ్య మాత్రం 14,379 మంది తక్కువగా ఉన్నట్లు తేలింది. 76 శాఖల్లో 24,271 మంది ఉద్యోగులున్నట్లు కమలనాథన్ కమిటీ తేల్చింది. ఈ ఉద్యోగులనే ఇరు రాష్ట్రాల మధ్య నిబంధనల ఆధారంగా పంపిణీ చేశారు. సచివాలయంలోని నాలుగో తరగతి ఉద్యోగులందరినీ తామే తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి హామీ ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యం లో తాము తీసుకోబోమంటూ ఏపీ ప్రభుత్వానికి టీ సర్కార్ వెల్లడించింది. అదే కారణమా? ఏపీ విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న సంస్థల ఉద్యోగులను స్థానికత ఆధారంగా పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే, ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారమే ఉద్యోగుల పంపిణీ జరగాలని ఏపీ కోరుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగుల విషయంలో మాట మార్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
డీఎస్సీని వెంటనే నిర్వహించాలి: ఉత్తమ్ డిమాండ్
హైదరాబాద్: టీచర్ల నియామకాలు అవసరంలేదనడం అన్యాయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వం తక్షణం డీఎస్సీని నిర్వహించి ఖాళీగా ఉన్న 24000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కమల్ నాథన్ కమిటీతో ముడిపెట్టి ఉద్యోగాల నోటిఫికేషన్లలో జాప్యం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు
* నోటిఫికేషన్లపై కసరత్తు షురూ: ముఖ్యమంత్రి కేసీఆర్ * అందరూ ఒప్పుకుంటే వయోపరిమితిలో పదేళ్ల సడలింపు * ఉద్యోగుల విభజన పూర్తయితే ఖాళీలపై స్పష్టత * కొత్తగా ఉపాధ్యాయ నియామకాలకు నో * కేంద్ర నిధుల కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తాం * ఉభయ సభల్లో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి ఇద్దాం * ప్రస్తుతం కరెంట్ కోతలేదు.. మే నెల తర్వాత కనబడదు * భూములు విక్రయించే యోచనను విరమించుకున్నాం * తెలంగాణ ఇచ్చింది సోనియానే.. కాదంటే మూర్ఖత్వమే * మండలిలో డీఎస్ ప్రశ్నలకు సీఎం సుదీర్ఘ సమాధానం సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను ఇంకా పూర్తి చేయనందున ఖాళీలపై స్పష్టత రాలేదని ఆయన తెలిపారు. ఉద్యోగ ఖాళీల లెక్కతేలిన అనంతరం భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కేంద్ర నిధులకు సంబంధించిన అంశంపై శనివారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతామని.. ప్రధానిని కలిసి విజ్ఞప్తులు చేద్దామని పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను కేసీఆర్ వివరించారు. రెండేళ్లతో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. ఇక రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులతో పోలిస్తే ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారని... రేషనలైజేషన్ చేసి అవసరమైన చోట వారిని నియమిస్తామని పేర్కొన్నారు. కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉర్దూ మాధ్యమంలో కొరత ఉన్నందున ఖాళీగా ఉన్న 1,500 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసే నిరుద్యోగులకు వయో పరిమితిని ఇప్పటికే ఐదేళ్లు సడలించామని, అన్ని పక్షాలు అంగీకరిస్తే పదేళ్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. గౌరవ వేతనాల్లో మనమే టాప్ కేరళ రాష్ట్రంలో కేవలం 967 గ్రామ పంచాయతీలే ఉన్నాయని, అక్కడి ప్రభుత్వం సర్పంచులకు రూ. 6,600 గౌరవ వేతనంగా అందిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం విషయానికి వస్తే స్థానిక సంస్థల ప్రతినిధులు (సర్పంచులు, ఎంపీటీసీలు కలిపి) సుమారు 15 వేల మంది ఉన్నారని... గౌరవ వేతనాల మొత్తంలో అన్నిరాష్ట్రాల కన్నా మనమే ముందు వరసలో ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చే అంశాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. తాజాగా ప్రకటించిన రూ. 5 వేలకన్నా పెంచలేమని సీఎం స్పష్టం చేశారు. హైకోర్టు విభజన జరగకుంటే రాష్ట్ర విభజన పూర్తికానట్లేనని ప్రభుత్వం భావిస్తోందని.. ఆ విభజన జరగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయమై త్వరలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని కేసీఆర్ తెలిపారు. మే తర్వాత కోతలుండవు.. రాష్ట్రంలో ఈ రోజువరకు ఎక్కడా విద్యుత్ కోత లేదని... మే నెల తర్వాత విద్యుత్ కోతలు ఉండబోవని సీఎం చెప్పారు. విభజన చట్టం ప్రకారం ఏపీలోని కృష్ణపట్నం, హిందుజా ప్రాజెక్టుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకున్నా మనకు మేలే జరిగిందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ విద్యుత్ను ఇచ్చినట్లయితే యూనిట్కు రూ. 7.5 చొప్పున చెల్లించాల్సి వచ్చేదని... రాష్ట్రంలో సింగరేణిలో ఉత్పత్తి ధర యూనిట్కు రూ. 3.5 మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులను క్షణక్షణం పర్యవేక్షిస్తున్నందున 170 మెగావాట్ల విద్యుత్ అదనంగా లభ్యమైందని వెల్లడించారు. పీపీపీ పద్ధతిన గాయత్రి పవర్ ప్రాజెక్టు నుంచి జూన్ నెలలో సుమారు 500 మెగావాట్లు, ఫెర్టిలైజర్ సంస్థ గ్యాస్ ఇవ్వడం ద్వారా మరో 260 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి వస్తుందని సీఎం చెప్పారు. ఈ ఏడాది పవర్కట్ ఉంటే.. మార్చి 20నుంచి ఏప్రిల్ 20 మధ్య ఒకట్రెండు రోజుల పాటు ఉండవచ్చని పేర్కొన్నారు. వాటర్గ్రిడ్కు రూ. 13 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయించిన నిధులే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి కూడా భారీగా నిధులు అందనున్నాయని సీఎం చెప్పారు. వాటర్గ్రిడ్కు హడ్కో ఏడాదికి రూ. 2,500 కోట్ల చొప్పున నాలుగేళ్ళలో రూ. 10 వేల కోట్లు, నాబార్డు నుంచి రూ. మూడు వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. మిషన్ కాకతీయకు నాబార్డు రూ. వెయ్యి కోట్లు, జపాన్ ఆర్థిక సంస్థ (జైకా) రూ. 3 వేల కోట్లు ఇస్తున్నాయని సీఎం చెప్పారు. బీసీలను నిర్లక్ష్యం చేయం.. రాష్ట్రంలో బలహీనవర్గాల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయబోమని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో బీసీలు 51 శాతం ఉన్నట్లు సమగ్ర సర్వేలో వెల్లడైందని.. వారి సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. బడ్జెట్లో పేర్కొన్న రూ. 1.15 లక్షల కోట్లలో రాష్ట్ర సొంత రెవెన్యూ(ఎస్వోఆర్) రూ. 99 వేల కోట్లు ఉందని.. మిగతా రూ. 16 వేల కోట్లలో కమర్షియల్ ట్యాక్స్ బకాయిల నుంచి రూ. 5 వేల కోట్లు అందే అవకాశం ఉందని సీఎం తెలిపారు. కేంద్ర పథకాలకు నిధులు అందుతాయని ఆశిస్తున్నామన్నారు. నిధుల కోసం గతంలో భూములను అమ్మాలనుకున్న మాట వాస్తవమేనని.. ఇప్పుడు నిధులు పుష్కలంగా ఉన్నందున ఆ యోచనను విరమించుకున్నామని తెలిపారు. భూ క్రమబద్ధీకరణ ద్వారా 3.5 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా పట్టాలను అందజేయనున్నట్లు సీఎం చెప్పారు. 125 గజాలకు పైగా ఉన్న స్థలాలను తక్కువ ధరకు క్రమబద్ధీకరిస్తున్నామన్నారు. 12.5 శాతం రిజి స్ట్రేషన్ ధర ప్రకారం రూ. 133 కోట్లు వచ్చాయని.. ప్రక్రియ పూర్తయితే మరో రూ. వెయ్యికోట్లు ప్రభుత్వానికి వస్తాయని పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. రాష్ట్రానికి నిధుల గురించి కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం సబబు కాదని భావిస్తున్నామని, అమల్లో ఉన్న పలు పథకాలకు కేంద్రాన్ని నిధులు అడిగేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. నిధులకు సంబంధించి ఉభయ సభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి.. ప్రధాని మోదీకి, నీతి ఆయోగ్ చైర్మన్, వైస్ చైర్మన్లకు అందజేద్దామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం అమలుచేస్తున్న 122 పథకాలను ఇటీవల 66 కు తగ్గించిందని.. అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను భారీగా పెంచిందని సీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా గతేడాది కన్నా ఈ సారి రూ. 1.78 లక్షల కోట్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనంగా ఇస్తోందని తెలిపారు. అందులో తెలంగాణకు అదనంగా సుమారు రూ. 4 వేల కోట్లు అందనున్నాయని సీఎం చెప్పారు. ఇచ్చింది సోనియానే... తెలంగాణ ఇచ్చింది ముమ్మాటికీ సోనియాగాంధీయేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాదని ఎవరు చెప్పినా వాళ్లు మూర్ఖులేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్ర రాసేవాళ్లెవరైనా సోనియాగాంధీ పేరును తప్పక రాయాల్సిందేనన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అయితే.. తెచ్చిన ఘనత తెలంగాణ ప్రజలందరికీ దక్కుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. -
కమలనాథన్ మార్గదర్శకాలు ఒప్పుకోం
టీఆర్టీసీ ఉద్యోగుల కమిటీ సొంతంగా మార్గదర్శకాలు నేడు ఆర్టీసీ ఎండీకి నివేదిక సమర్పణ ఆప్షన్లు ఉండొద్దని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల విభజనకోసం జారీ అయిన కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను యథాతథంగా ఆర్టీసీలో కూడా వర్తింపజేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఉద్యోగ సంఘాలు సొంతంగా మార్గదర్శకాలను రూపొందిం చాయి. తెలంగాణ ఆర్టీసీ అధికారుల సంఘం, సూపర్వైజర్ల సంఘం, మజ్దూర్ యూనియన్తో కూడిన ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఈ మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఈ నివేదికను మంగళవారం సంస్థ ఎండీకి అందజేయనున్నారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఆర్టీసీకి వర్తించనందున సంస్థ సొం తంగా మార్గదర్శకాలను రూపొందించాలని గతంలోనే రెండు రాష్ట్రాల సీఎస్లు ఉమ్మడిగా ఆదేశాలను జారీ చేశారు. అయినా వాటిని పక్కనపెట్టి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల పేరు మార్చి యథాతథంగా అమలు చేయాలని సంస్థ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల హైలెవల్ కమిటీ పేరుతో సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల్లోంచి తాము విభేదించే అంశాలను తొలగించాలని, తమ నివేదికలోని అంశాలను అందులో చేర్చాలని ఉద్యోగుల కమిటీ గట్టిగా కోరుతోంది. వాటిని పరిగణనలోకి తీసుకోకుంటే ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమని హెచ్చరించింది. ఉద్యోగ సంఘాల కమిటీ నివేదికలో కొన్ని ప్రధానాంశాలు ఆర్టీసీ ఉద్యోగుల పంపిణీలో ‘ఆప్షన్లు’ వద్దు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను కేటాయించాలి. నాలుగు నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న ప్రాంతమే ప్రామాణికం ఆర్టీసీలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వారిని ఏపీకి కేటాయించాలి. ఏపీఎస్ ఆర్టీసీ పేరుతో వారు సంస్థలో చేరినందున వారు ఆ రాష్ట్రానికే చెందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో కేసును పరిశీలించి అవసరమైతే వారి కేటాయింపులో మార్పుచేర్పులు చేసుకోవాలి. రెండు ప్రాంతాల్లో వికలాంగులు ఉన్నందున ఎక్కడివారు అక్కడే పనిచేయాలి. వైకల్యం ఆధారంగా ఆప్షన్లు కోరుకోవటం సరికాదు. స్పౌజ్, తీవ్ర అనారోగ్య సమస్యలు, ఇతర ప్రత్యేక కారణాలు చూపి హైదరాబాద్లో పనిచేసేందుకు మొగ్గు చూపే ఏపీ వారికి నేరుగా అవకాశం ఇవ్వొద్దు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉన్నం దున, హైదరాబాద్లో ఉండే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ పోస్టుల్లో వారిని కేటాయించాలి. -
‘కమలనాథన్’ సిఫారసుల్లో లోపాలు
పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ సాక్షి, హైదరాబాద్: కమల్నాథన్ కమిటీ సిఫారసుల్లో లోపాలున్నాయని టీజీవో సంఘం వ్యవస్థాపకుడు, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఉద్యోగుల వినతులు అంగీకరించకపోవడం సరికాదన్నారు. తెలంగాణ మునిసిపల్ కమిషనర్ల సంఘం రూపొందించిన నూతన సంవత్సర డైరీని మంగళవారం ఆయన రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుల కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మునిసిపల్ కమిషనర్ల సేవలకు సరైన గుర్తింపు లభించలేదన్నా రు. ఉద్యోగుల విభజన ముగిసిన వెంటనే పురపాలక శాఖ ఉద్యోగులకు పదోన్నతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
పోస్టుల స్థాయిపై తేల్చుకోండి: కమలనాథన్ కమిటీ
* రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉండాలన్న కమలనాథన్ కమిటీ భిన్నాభిప్రాయం * వ్యక్తమైతే రాష్ట్ర స్థాయి సంస్థగా పరిగణన * సింగిల్ పోస్టులు.. ఖాళీలపై తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి సంస్థలా? లేదా ప్రాంత స్థాయి సంస్ధలా? అనేది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చాల్సి ఉందని కమలనాధన్ కమిటీ స్పష్టం చేసింది. సంస్థను నిర్ధారించడంతో ఏకాభిప్రాయం వ్యక్తం కాకుంటే దాన్ని రాష్ట్ర స్థాయి సంస్థగా కమలనాధన్ కమిటీ పరిగణించనుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల కింద నోటిఫై చేసిన సంస్థలను ఏదైనా ప్రాంతం గురించి ఏర్పాటు చేశారా? లేదా రాష్ట్రం మొత్తం గురించి ఏర్పాటు చేశారా? అనే విషయాన్ని ఇరు ప్రభుత్వాలు తేల్చాలని కమిటీ స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాలు రాష్ట్ర స్థాయి సంస్థగా పేర్కొంటే సంస్థలోని పోస్టులను, ఉద్యోగులను రెండిటికీ పంపిణీ చేస్తారు. ఒకే ఒక్క పోస్టు, ఖాళీ చాలా ప్రభుత్వ శాఖల్లో కొన్ని రంగాల్లో ఒకే ఒక్క పోస్టులున్నాయని, అలాగే ఒకే ఖాళీలున్నాయని కమలనాధన్ కమిటీ గుర్తించింది. వీటిని పంపిణీ చేయటం సమస్యగా మారింది. ఇప్పటివరకు నోటిఫై చేసిన శాఖల్లో పెద్ద సంఖ్యలో సింగిల్ పోస్టు లు, సింగిల్ ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక పంపిణీ ఉద్యోగులు తుది పంపిణీ వరకు వేచి చూడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సింగిల్ పోస్టులో ప్రస్తుతం పనిచేస్తున్న వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వారైతే ఆ ప్రాంతానికి పోస్టు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరో ప్రాంతానికి చెందిన రాష్ర్టం కొత్త పోస్టును ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నాయి. -
నాలుగో తరగతి ఉద్యోగులు తెలంగాణకే!
* తెలంగాణకు చెందిన మొత్తం సిబ్బందిని ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన * అంగీకారం కోరుతూ సీఎస్ రాజీవ్శర్మకు ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లేఖ * దీనిపై ఇంకా అభిప్రాయం వెల్లడించని తెలంగాణ ప్రభుత్వం * టీ సర్కార్ నిర్ణయాన్ని బట్టి ఉద్యోగులను కేటాయించనున్న కమల్నాథన్ కమిటీ సాక్షి, హైదరాబాద్: సచివాలయంతో పాటు హైదరాబాద్లోని వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులను పూర్తిగా తెలంగాణకు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు అంగీకారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మకు ఇటీవల లేఖ కూడా రాశారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సమ్మతిస్తే... సచివాలయంతో పాటు హైదరాబాద్లోని శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులందరినీ కమల్నాథన్ కమిటీ తెలంగాణకు కేటాయించే అవకాశముంది. అయితే దీనిపై ఇంకా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంపై వారంతా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చేపట్టిన ఉద్యోగులు సచివాలయంలో ధర్నా నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు స్వయంగా వారి వద్దకు వచ్చి... తెలంగాణలోనే ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కమల్నాథన్ కమిటీ మార్గదర్శకాల్లో ఈ మేరకు ఒక ప్రొవిజన్ను కూడా పేర్కొంది. ఎక్కువ శాతం ఇక్కడి వారే.. సచివాలయంలోను, ఇతర శాఖాధిపతుల కార్యాలయాల్లోను ఎక్కువగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే నాలుగో తరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. సచివాలయంలో మొత్తంగా 1,419 నాలుగో తరగతి పోస్టులు ఉండగా... అందులో 616 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా 803 మంది ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం వరకూ తెలంగాణకు చెందిన వారే. హైదరాబాద్లోని శాఖాధిపతుల కార్యాలయాల్లో మొత్తం 4,161 నాలుగో తరగతి పోస్టులుండగా... ఇందులో 1,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా 2,953 మంది ఉద్యోగుల్లో 90 శాతం వరకు తెలంగాణకు చెందినవారే ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోస్టులు, ఉద్యోగులను జనాభా నిష్పత్తి మేరకు ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి చిరుద్యోగులను ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే... అక్కడికి వెళ్లి పనిచేయడం చాలా ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో నాలుగో తరగతి ఉద్యోగుల విషయంలో ఇరు రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులను ఆ రాష్ట్రం తీసుకోవడానికి అంగీకరించిన పక్షంలో... అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కమల్నాథన్ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులందరినీ తెలంగాణకే ఇచ్చేందుకు సిద్ధమంటూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. వస్తే ఖాళీలన్నీ భర్తీ.. తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులందరినీ రాష్ట్రానికే ఇస్తే... ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నీ వారితో భర్తీ అవుతాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మంజూరై ఖాళీగా ఉన్న నాలుగో తరగతి పోస్టుల్లో.. తెలంగాణకు సచివాలయంలో 265, శాఖాధిపతుల కార్యాలయాల్లో 549 ఖాళీ పోస్టులు వస్తాయి. దీంతో రాష్ట్రానికి చెందినవారు ఎక్కువగా ఉన్నా... ఈ ఖాళీల్లో భర్తీ చేయవచ్చునని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
‘ఆప్షన్’ ఇస్తే ఉద్యమమే
* ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాలపై ఆర్టీసీ టీజేఏసీ హెచ్చరిక * ‘కమలనాథన్’ మార్గదర్శకాలనే హైలెవల్ కమిటీ అనుసరణపై ధ్వజం * దీని వెనక కుట్ర దాగుందని ఆరోపణ * ‘ఎక్కడివాళ్లక్కడే’ మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్ * అభ్యంతరాలు తెలిపేందుకు పక్షం రోజుల గడువివ్వాలని పట్టు * ఈ వ్యవహారంపై యాజమాన్యానికి నిరసన తెలపాలని నిర్ణయం * యాజమాన్యం స్పందించకుంటే ఉద్యమం చేపట్టాలని తీర్మానం సాక్షి, హైదరాబాద్: ఊరించి ఊరించి రూపొందించిన ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాలు ఇప్పుడు ఆర్టీసీలో అగ్గి రాజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను ఆర్టీసీ హైలెవల్ కమిటీ యథాతథంగా అనుసరించటంపై ఆర్టీసీ తెలంగాణ జేఏసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎక్కడివాళ్లక్కడే పనిచేసేలా ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలుండాలని మొదటి నుంచీ గట్టిగా డిమాండ్ చేస్తున్నా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉద్యోగులకు ‘అప్షన్’ అవకాశం కల్పించటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వెంటనే వాటిని బుట్టదాఖలు చేసి గతంలో తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిం చింది. ఆర్టీసీ అధికారుల సంఘం, సూపర్వైజర్స్ సంఘం, టీఎంయూలతో కూడిన జేఏసీ ప్రతి నిధులు, ఎన్ఎంయూ ప్రతినిధులు ఆదివారం నగరంలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. మూడు రోజుల క్రితం ఆర్టీసీ హైలెవెల్ కమిటీ పేరిట జారీ అయిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఆర్టీసీకి వర్తించవని స్పష్టం చేస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్లు ఆర్టీసీకి సంయుక్త లేఖ రాసినప్పటికీ అవే మార్గదర్శకాలను అనుసరించటంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవే మార్గదర్శకాలను ఆర్టీసీ హైలెవెల్ కమిటీ పేరుతో జారీ చే యటం, అందులో ఎక్కడా సీఎస్ల సంయుక్త లేఖ గురించి ప్రస్తావించకపోవటాన్ని తప్పు పట్టారు. దీని వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. భేటీలో ఏం చర్చించారంటే... # ఉద్యోగులకు ‘ఆప్షన్’ అవకాశం ఇవ్వటం వల్ల రెండు ప్రాంతాల్లో పదోన్నతులు పొందే వెసులుబాటు ఆంధ్రా ప్రాంత ఉద్యోగులకు లభిస్తుంది. అదే సమయంలో తెలంగాణ ఉద్యోగులు పదోన్నతులతోపాటు పోస్టులనూ కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో జూనియర్ స్కేల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 56 ఖాళీలు ఏర్పడనున్నాయి. ఆప్షన్ వల్ల వాటిని ఆంధ్రా ఉద్యోగులు ఆక్రమిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. # సీనియర్ స్కేల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 13 ఖాళీలు కూడా ఆంధ్రా అధికారులకే దక్కుతాయి. వెరసి రెండు ప్రాంతాల్లో వారు పదోన్నతులు పొందితే తెలంగాణకు పోస్టులు దక్కవు. # పోస్టుల కంటే ఉద్యోగుల సంఖ్య ఆంధ్రలో ఎక్కువగా ఉంటే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి భర్తీ చేసుకోవాలి. కాదంటే వేరే డిపార్ట్మెంట్లకు కూడా మారే వీలున్న కేడర్ అధికారులను వాటికి బదిలీ చేసుకోవాలి. # ఉద్యోగుల సంఖ్య మరీ అదనంగా ఉంటే... తప్పని స్థితిలో ఒకటి రెండేళ్ల కాలపరిమితితో డెప్యుటేషన్ పద్ధతిపై తెలంగాణకు రావాలి. ఆంధ్రలో పోస్టులు రాగానే తిరిగి వెళ్లిపోవాలి. # స్పౌజ్ (భార్య లేదా భర్త), వికలాంగులు తదితరులకు ఆప్షన్ అవకాశం కల్పిస్తే, పదేళ్లపాటు హైదరాబాద్ ఆంధ్రకు కూడా రాజధానిగా ఉండనుంది. హైదరాబాద్లోని ఏపీఎస్ఆర్టీసీ పోస్టుల్లో వారిని నియమించుకోవాలి. # మార్గదర్శకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే గడువు 7వ తేదీ వరకు మాత్రమే ఇచ్చారు. దాన్ని కచ్చితంగా మరో 15 రోజులు పొడగించాలి. # ప్రస్తుత మార్గదర్శకాల జారీ వల్ల తెలంగాణ నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా వాటినే జారీ చేయడం చూస్తుంటే... మరికొంతకాలం జాప్యం జరిగి ఆ రూపంలో ఆంధ్ర ఉద్యోగులకు లబ్ధి చేకూర్చవచ్చనే కుట్ర దాగుంది. # ఈ అభిప్రాయాలను ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. సానుకూలంగా స్పందించకుంటే వెంటనే ఉద్యమాన్ని ప్రారంభించాలి.