Karnataka Assembly Floor Test
-
చిచ్చుపెట్టిన కేబినెట్ కూర్పు
బెంగళూరు: కర్ణాటకలో కేబినెట్ విస్తరణతో రేగిన అసంతృప్తి సెగలు మరింత పెరిగాయి. కేబినెట్లో చోటు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్తో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు శాఖల కేటాయింపుపై జేడీఎస్ మంత్రులు అసహనంతో ఉన్నారు. జేడీఎస్ మంత్రులు జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య, సీఎస్ పుట్టరాజుకు చిన్న నీటి పారుదల శాఖల కేటాయింపు చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరి నుంచి మాజీ సీఎం సిద్దరామయ్యను జీటీ దేవెగౌడ ఓడించారు. పుట్టరాజు లోక్సభకు రాజీనామా చేసి మెల్కొటే అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. వారిద్ద్దరు రవాణా వంటి కీలక శాఖను ఆశించారు. ఆ శాఖను తమకు కేటాయించకుడా.. జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ బంధువు డీసీ తమ్మన్నకు ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్నారు. తమ నేతలకు కీలక శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆ ఇద్దరు మంత్రుల మద్దతుదారులు మైసూరు, మాండ్యల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజాసేవకు ఏ శాఖ అయితే ఏంటి?: సీఎం జేడీఎస్ మంత్రుల అసమ్మతిపై సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసేందుకు ఏ శాఖ అయితే ఏంటని ప్రశ్నించారు. 8వ తరగతి చదువుకున్న జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య శాఖ కేటాయించడంపై స్పందిస్తూ.. నేనేం చదువుకున్నాను? ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదా? అని ప్రశ్నించారు. కుమారస్వామి బీఎస్సీ డిగ్రీ చదివారు. ఢిల్లీలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు ఎంబీ పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు ఢిల్లీలో రాహుల్తో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం పాటిల్ మాట్లాడుతూ.. ‘రాహుల్తో నా అభిప్రాయాల్ని పంచుకున్నాను. ప్రత్యేకంగా ఏమీ డిమాండ్ చేయలేదు. సమావేశ వివరాలపై మిగతా 15–20 మంది ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. రాహుల్తో భేటీలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండూరావుతో పాటు కర్ణాటక మంత్రి కృష్ణ బైరే గౌడ పాల్గొన్నారు. ‘విభేదాల్ని పరిష్కరించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’ అని గౌడ చెప్పారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంబీ పాటిల్, దినేష్ గుండూరావు, ఆర్.రామలింగారెడ్డి, రోషన్బేగ్, హేచ్కే పాటిల్, శివశంకరప్ప, జర్కిహోళి వంటి వారికి కేబినెట్లో చోటు దక్కలేదు. వారంతా కుమారస్వామి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బీజేపీలో చేరేందుకు పలువురు సిద్ధం: యడ్యూరప్ప కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప చెప్పారు. బెంగళూరులో పార్టీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘జేడీఎస్, కాంగ్రెస్ల్లో అసంతృప్తిగా ఉన్నవారిని చేర్చుకోవడం మన బాధ్యత’ అని అన్నారు. అసమ్మతిని ఎదుర్కొనేందుకు కొత్త ఫార్ములా పార్టీలో, ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసమ్మతిని అధిగమించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కొత్త ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మంత్రులుగా తీసుకున్న వారిని రెండేళ్ల పాటు కొనసాగించి ఆ తర్వాత కొత్త వారికి అవకాశం కల్పించడం అందులో ఒకటి. మంత్రుల పనితీరుపై ఆరునెలలకోసారి సమీక్ష నిర్వహించి సరిగా పనిచేయని వారికి ఉద్వాసన పలికి కొత్తవారికి చాన్స్ ఇవ్వడం. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోవడం, ఆరు కేబినెట్ పోస్టుల్ని భర్తీ చేయకుండా అవసరమున్నప్పుడు విస్తరించడం వంటివి కూడా ఫార్ములాలో ఉన్నాయి. -
కొలువుదీరిన కుమారస్వామి కేబినెట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్ నేతలతో విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం రూపొందించిన తన కేబినెట్లో మొత్తం 25 మందికి చోటు కల్పించారు. బుధవారం రాజ్భవన్లో గవర్నర్ వాజూభాయ్ వాలా కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. జేడీఎస్ నుంచి 8 మందికి, కాంగ్రెస్ నుంచి 15 మందికి, బీఎస్పీ, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పక్ష(కేపీజేపీ)లకు ఒక్కోటి చొప్పున పదవులు కల్పించారు. జేడీఎస్తో బీఎస్పీ ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకోగా, సంకీర్ణ సర్కారుకు కేపీజేపీ మద్దతు పలికింది. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఎంబీ పాటిల్, దినేశ్ గుండూ రావు, రామలింగ రెడ్డి, ఆర్.రోషన్ బైగ్, హెచ్కే పాటిల్, శ్యాంనూర్ శివశంకరప్ప, తన్వీర్ సేఠ్, సతీశ్ జార్ఖిహోలిలకు ఈసారి అవకాశం దక్కలేదు. సీఎం వర్గానికి పెద్దపీట.. కుమారస్వామి సామాజికవర్గం ఒక్కలిగలకు మంత్రివర్గంలో పెద్దపీట దక్కింది. మొత్తం 9 మంది ఒక్కలిగలు, నలుగురు లింగాయత్లు, ముగ్గురు దళితులు, ముగ్గురు మైనార్టీలు, ఇద్దరు– కురుబలు, ఈడిగ, ఉప్పర, గిరిజన తెగ, బ్రాహ్మణ కులాల నుంచి ఒక్కొక్కరికి స్థానం లభించింది. చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్దరామయ్యను ఓడించిన జేడీఎస్ నాయకుడు జీటీ దేవెగౌడ, కుమారస్వామి సోదరుడు రేవణ్ణలకు కేబినెట్లో చోటు దక్కింది. కాంగ్రెస్ నుంచి ప్రమాణం చేసిన వారిలో డీకే శివకుమార్, కేజే జార్జ్, ఆర్వీ దేశ్పాండే, ప్రియాంక్ ఖర్గే, ఆర్బీ పాటిల్ తదితరులున్నారు. బీఎస్పీ, కేపీజేపీలకు ఉన్న ఏౖకైక ఎమ్మెల్యేలు వరసగా ఆర్ఏ మహేశ్, ఆర్. శంకర్లకు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఈ కేబినెట్లో అలనాటి నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జయమాల ఏకైక మహిళా మంత్రి కాగా, 83 ఏళ్ల మనాగుళి(జేడీఎస్) అత్యంత పెద్ద వయస్కులు. కొత్త మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది. అసంతృప్తుల నిరసనలు.. మంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హెచ్కే పాటిల్ బెంగళూరులోని చాళుక్య సర్కిల్లో 200 మంది మద్దతుదారులతో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్‡ అభిమానులు కూడా మైసూరులో నిరసనకు దిగారు. దీనిపై సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. సంకీర్ణ ప్రభుత్వంలో కేబినెట్ కూర్పు చేసేటప్పుడు ఇలాంటి అసంతృప్తులు రావడం సహజమేనని అన్నారు. సంయమనంతో ఉండాలని, అందరికీ న్యాయం చేస్తాననని హామీ ఇచ్చారు. -
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఆలస్యం?
బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నా పదవుల పంపకంలో ఏకాభిప్రాయం రాలేదు. సీఎంగా కుమారస్వామి, ఉపముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణంచేయడం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ తమ కోటా కింద ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పట్టుబడుతోందని తెలుస్తోంది. ఆర్థిక శాఖ కాంగ్రెస్ తమకే కావాలంటోంది. అయితే ఈ విషయంలో జేడీఎస్ బెట్టుగా ఉంది. సీఎం పదవిని త్యాగం చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖతో పాటు పీడబ్ల్యూడీ, ఇంధన శాఖలు కూడా తమకే ఇవ్వాలని, మొత్తంగా 22 మందికి మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే ఈ విషయాన్ని తేల్చేస్తాం’ అని కుమారస్వామి మీడియాకు తెలిపారు. -
మాఫీ చేయకుంటే రాజీనామా
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: రైతు రుణమాఫీకి తాను కట్టుబడి ఉన్నానని, అలా చేయని పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక సీఎం కుమారస్వామి చెప్పారు. ఢిల్లీలో ప్రధానితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల రుణాల్ని మాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పాను. అధికారంలోకి వచ్చిన 24గంటల్లో రుణమాఫీపై సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాను. అయితే కొన్ని పరిమితులున్నందున సమయం అవసరం’ అని పేర్కొన్నారు. రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించామని.. బుధవారం బెంగళూరులో వాటిని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని, ప్రజలు వాటిని నమ్మొద్దని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ప్రజలను అవమానించలేదు కాంగ్రెస్ దయతోనే ముఖ్యమంత్రిని అయ్యానని.. ప్రజల దయతో కాదంటూ తను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండటంపై కుమారస్వామి వివరణ ఇచ్చారు. ప్రజలను అవమానించాలని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని.. భాగస్వామ్య కూటమి కారణంగానే సీఎం అయ్యానని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. ‘నేను సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాను. కాంగ్రెస్ మద్దతున్నన్ని రోజులు సీఎంగా ఉంటాను. ఏ కార్యక్రమం చేయాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. ఆ విషయాన్నే చెప్పా. నా వ్యాఖ్యలను మీరెందుకు (మీడియా) వక్రీకరించారో అర్థం కావడం లేదు’ కుమారస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్సే సీఎం పదవి ఇచ్చింది: దేవెగౌడ రైతు రుణమాఫీపై తామిచ్చిన హామీని నిలబెట్టుకోవడం కష్టమని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ చెప్పారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. ‘మాకు 37 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వేరే పార్టీ మద్దతుతో మేం ప్రభుత్వాన్ని నడపాలి. వారి పథకాలను అమలు చేయాలి. వారి మద్దతు లేకుండా రుణమాఫీ హామీ అమలు సాధ్యం కాదు’ అని అన్నారు. కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఇచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీని తాను కోరానని.. అయితే కుమారస్వామి సీఎం అవ్వాలనేది తమ హైకమాండ్ నిర్ణయమని ఆ పార్టీ నేతలు ఆజాద్, అశోక్ గెహ్లాట్లు చెప్పారన్నారు. శాఖలపై తేలని చర్చలు ఐదురోజులుగా మంత్రిత్వ శాఖల పంపకాల విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య జరుగుతున్న చర్చలు ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. ఇరు పార్టీలు కీలక మంత్రిత్వ శాఖలపై పట్టుబడుతుండటంతోనే ఎటూ తేలడం లేదు. రాహుల్, సోనియాలు విదేశాలకు వెళ్లడంతో సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, గెహ్లాట్, కేసీ వేణుగోపాల్, సిద్దరామయ్య, డీకే శివకుమార్లతో కుమారస్వామి, జేడీఎస్ నేత డానిష్ అలీ చర్చలు జరిపారు. ఢిల్లీలో తమ పార్టీ పెద్దలతో కుమారస్వామి చర్చలు జరిపారని.. త్వరలోనే ఈ విషయం పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు. కర్ణాటకలో రైతులకు రుణమాఫీ చేయాలని సోమవారం ప్రతిపక్ష బీజేపీ నిర్వహించిన రాష్ట్ర బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్కు పిలుపునిచ్చినప్పటికీ ప్రజల్నుంచి పెద్దగా స్పందన లభించలేదు. రాష్ట్రంలో బొగ్గు కొరత తీర్చాలని ప్రధానిని కోరా కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కుమార స్వామి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరతపై మోదీతో చర్చించారు. ‘రాయ్చూర్, యరమర, బళ్లారి ప్లాంట్లకు డిమాండ్ మేరకు బొగ్గును సరఫరా చేయాలని ప్రధానిని కోరాను. ఇతర సమస్యలపై కూడా చర్చించాం. ఈ సందర్భంగా సీఎంగా, పీఎంగా తన పాలనా అనుభవాల్ని ప్రధాని నాతో పంచుకున్నారు’ అని కుమార స్వామి చెప్పారు. -
ఎస్పీ–బీఎస్పీ పొత్తు మాకు సవాలే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఎస్పీ–బీఎస్పీ మధ్య పొత్తు కుదిరితే 2019 ఎన్నికల్లో బీజేపీకి సవాలే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా అంగీకరించారు. అయితే అమేథీ, రాయ్బరేలీలో ఏదో ఒక సీటులో కాంగ్రెస్ను కచ్చితంగా బీజేపీ ఓడిస్తుందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమిత్షా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేసుకోవాలనే ఆలోచన తమకు లేదని శివసేనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2019లో ఎన్డీఏను ఓడించలేమని అర్థమయ్యే ప్రతిపక్షాలు అన్నీ ఏకమై లేనిపోని విమర్శలు చేస్తున్నాయన్నారు. గత ఎన్నికల్లో గెలుపొందని ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలోని 80 సీట్లను వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సాధిస్తుందన్నారు. రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో సీఎంలను మార్చబోమన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా 22 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందని అమిత్షా చెప్పారు. ప్రభుత్వ విజయాలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు ‘సరైన ఉద్దేశాలు, సరైన అభివృద్ధి(సాఫ్ నియత్, సాహీ వికాస్) అనే సరికొత్త నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యం విఫలమైందనే ఆలోచనలు ప్రజల మదిలోకి వస్తున్న సమయంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు కొత్త ఆశను కలిగించిందని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ ఆచరణయోగ్యమైన, స్పష్టమైన చర్యలు తీసుకుందని, దీని ద్వారా తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, అదే సమయంలో పరిశ్రమలకు సహాయకారిగా ఉందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుందని చెప్పారు. -
కర్ణాటకం ముగిసింది!
బెంగళూరు: కర్ణాటకలో దాదాపు పది రోజులుగా సాగిన రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య సీఎం పీఠం అధిరోహించిన సీఎం కుమారస్వామి అసెంబ్లీ బలపరీక్షలో సునాయాసంగా విజయం సాధించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి సాగుతున్న ఉత్కంఠకు ముగింపు పలుకుతూ శుక్రవారం ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ సర్కారు మూజువాణి ఓటుతో నెగ్గింది. బీజేపీ ఎమ్మెల్యేలు ముందే వాకౌట్ చేయడంతో అవాంతరాలు లేకుండా బలపరీక్ష ఘట్టం ముగిసింది. కాంగ్రెస్కు చెందిన 78, జేడీఎస్కు చెందిన 37, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కలసి మొత్తం 117 మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో కుమారస్వామి ప్రభుత్వం గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ కుమార్ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చివరి నిమిషంలో తమ స్పీకర్ అభ్యర్థిని బీజేపీ ఉపసంహరించుకోవడంతో పోటీ లేకుండానే ఎన్నిక పూర్తయింది. పార్లమెంటరీ సంప్రదాయాల్ని అనుసరించి తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించినట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు తన పట్ల నమ్మకం చూపనందుకు బాధగా ఉన్నా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని కుమారస్వామి అన్నారు. బలపరీక్షలో కుమారస్వామిని ఓడించాలంటే 104 మంది సభ్యులున్న బీజేపీకి మరో 7గురు ఎమ్మెల్యేలు అవసరం. అయితే ఆ పార్టీ ముందే వాకౌట్ చేయడంతో అసెంబ్లీలో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోలేదు. వారం రోజుల వ్యవధిలో కర్ణాటక అసెంబ్లీలో ఇది రెండో బలపరీక్ష. మే 17న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో 19న రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్– జేడీఎస్ కూటమి తరఫున కుమారస్వామి మే 23న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నమ్మకం చూపనందుకు బాధగా ఉంది అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా నా పట్ల ప్రజలు నమ్మకం ఉంచనందుకు బాధగా ఉంది. ఐదేళ్లు సుస్థిర పాలనను అందిస్తాం. మా సొంత ప్రయోజనాలను తీర్చుకునేందుకు అధికారంలోకి రాలేదు’ అని చెప్పారు. తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడూ అధికారం కోసం అర్రులు చాచలేదని, ఎక్కువ సమయం ప్రతిపక్షంలోనే ఉన్నామని పేర్కొన్నారు. ‘2006లో బీజేపీతో నేను సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడపై అపనింద పడింది. ఇప్పుడు కాంగ్రెస్తో లౌకిక ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దానిని తొలగించాను’ అని చెప్పారు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లుగానే రైతు రుణాలు మాఫీ చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్లను దుర్వినియోగం చేస్తోందని కుమారస్వామి ఆరోపించారు. మంత్రిత్వ శాఖల పంపకంపై చర్చలు బలపరీక్ష పూర్తవ్వడంతో మంత్రిత్వ శాఖల పంపకంపై జేడీఎస్–కాంగ్రెస్లు దృష్టిపెట్టాయి. శాఖల పంపిణీపై చర్చించేందుకు బలపరీక్ష పూర్తయిన కొద్దిసేపటికే ఇరు పార్టీల నేతలూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎల్పీ నేత సిద్దరామయ్య నివాసంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, జేడీఎస్ నేత హెచ్డీ రేవణ్న తదితరులు హాజరయ్యారు. మంత్రి పదవులపై అధిష్టానంతో చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. రైతురుణాల్ని మాఫీ చేయాలి సభ నుంచి వాకౌట్కు ముందు ప్రతిపక్ష నేత యడ్యూరప్ప సీఎం కుమారస్వామిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్కు సీఎం పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు. తన పోరాటం కాంగ్రెస్పై కాదని, కుమారస్వామిపైనే అన్నారు. కుమారస్వామి నమ్మక ద్రోహం గురించి అందరికీ తెలుసని, కుమారస్వామి, దేవెగౌడలు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తారని ఆ పార్టీ సభ్యుల్ని హెచ్చరించారు. కుమార స్వామి సీఎంగా ఉండడం నచ్చకనే సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ. 53 వేల కోట్ల రుణాల్ని మాఫీ చేస్తానని కుమారస్వామి ప్రకటించారని, ప్రస్తుత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోనే దానిపై ప్రకటన చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
కర్ణాటక స్పీకర్గా రమేష్ కుమార్ ఏకగ్రీవం
-
కర్ణాటక స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, బెంగళూరు : గత కొన్ని రోజులుగా రిసార్టుల్లోనే ఉంటున్న కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. కాగా, బలపరీక్ష నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 12 గంటల అనంతరం కర్ణాటక అసెంబ్లీ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ స్పీకర్ అయ్యారు. స్పీకర్గా సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థి రమేష్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది.తొలుత స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ పేరును సిద్దరామయ్య ప్రతిపాదించారు. ఆ వెంటనే రమేష్ కుమార్ పేరును కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర బలపరిచారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే సురేష్ కుమార్ పోటీ నుంచి తప్పుకున్నారు. సంఖ్యాబలం లేదని చర్చించుకున్న అనంతరం బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ నేత రమేష్ కుమార్ మరోసారి స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. 18 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి స్పీకర్ అయ్యారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం. నూతన స్పీకర్ రమేష్ కుమార్ దగ్గరికెళ్లి మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో కుమారస్వామి సర్కార్ బలపరీక్ష ఎదుర్కోనుంది. -
బలపరీక్షలో కుమారస్వామి విజయం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బల పరీక్షలో విజయం సాధించారు. విధానసౌధలో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో 117 మంది ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో బలం నిరూపించుకుంది. తమ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో విజయం సాధించడంతో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కాగా, బలపరీక్షకు ముందే బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా కుమారస్వామి ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ 111ను దాటేసింది. అంతా అనుకున్నట్టు జరగడంతో కాంగ్రెస్, జేడీఎస్ నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. కుమారస్వామి ప్రభుత్వం బలం నిరూపించుకోవడంతో గత కొన్నిరోజులుగా కర్ణాటకలో కొనసాగిన రాజకీయ అనిశ్చితికి తెర పడింది. సభలో అంతకుముందు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కన్నడ ప్రజలు ఎవరికీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్-జేడీఎస్లు కలిశాయని కుమారస్వామి చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బీజేపీ వ్యవహరించిందని అన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ కొత్తేమీ కాదని, 2004లో ఇలానే జరిగిందని గుర్తు చేశారు. -
కర్ణాటక: నాకేం టెన్షన్ లేదు!
సాక్షి, బెంగళూరు : తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, బల పరీక్షలో కచ్చితంగా తాము నెగ్గి తీరుతామని కర్ణాటక సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు సంఖ్యా బలం ఉన్నందున అంతిమ విజయం తమదేనన్నారు. మెజార్టీ లేకున్నా బీజేపీ అధికారం కోరుకున్నందున వారికి పరాభవం తప్పలేదన్నారు. నేటి బలపరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ నెగ్గి గత కొన్ని రోజులుగా కర్ణాటకలో ప్రజాస్వామ్యానికి విరుద్దంగా జరుగుతున్న పరిణామాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించారు. కాగా, నేటి మధ్యాహ్యం 12:15 గంటలకు కర్ణాటక అసెంబ్లీ సమావేశం కానుంది. ముందుగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ్యులు ఎన్నుకుంటారు. స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి కేఆర్ రమేష్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా సురేష్ కుమార్ నామినేషన్ వేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనంతరం కుమారస్వామి సర్కార్ బలపరీక్షను ఎదుర్కోనుంది. స్పీకర్ ఎన్నిక, బలపరీక్షల నేపథ్యంలో శుక్రవారం కూటమి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సభకు హాజరు కానున్నారు. విశ్వాస పరీక్షకు 111 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 104 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. దీంతో కుమారస్వామి ఈ బలపరీక్షలో సులువుగా నెగ్గుతారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇంకా బెంగళూరులోని రిసార్టుల్లోనే కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. -
బల పరీక్షకు రంగం సిద్ధం..
-
నేడు కుమారస్వామి బలనిరూపణ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇరు పార్టీల ఎమ్మెల్యేలను కలిపితే కూటమి వద్ద 117 ఎమ్మెల్యేలున్నారు. స్పీకర్ ఎంపిక తర్వాత ఈ ఎన్నిక జరగనున్నందున సభలో ఉండే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బలపరీక్షలో గెలిచేందుకు 111 మంది మద్దతు అవసరం. దీంతో చివరి నిమిషంలో రాజకీయాలు చోటుచేసుకుంటేతప్ప కూటమి సర్కారు ‘పరీక్ష’లో నెగ్గటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. కుమారస్వామితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు. బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కన్నడ అసెంబ్లీలో శుక్రవారం విశ్వాస పరీక్ష జరగనుంది. విశ్వాస పరీక్షను ‘సంకీర్ణం’ సీరియస్గా తీసుకుంది. మొత్తం బలనిరూపణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ‘ఆపరేషన్ కమల’ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటోంది. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా హోటల్ గదుల్లోనే ఉన్నారు. మే 15న ఫలితాలు వెల్లడైనప్పటినుంచీ కాంగ్రెస్ రిసార్టు రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలు కూటమికే ఓటేస్తామని, ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పినప్పటికీ వారిని హోటల్ నుంచి పంపేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా నగరంలోని మరో హోటల్లోనే ఉన్నారు. వారిని కూడా ఇళ్లకు పంపేందుకు ఆ పార్టీ నేతలు అంగీకరించనట్లు తెలిసింది. బీజేపీ మరో ప్రయత్నం సరైన బలం లేక విశ్వాస పరీక్షకు ముందే వెనక్కు తగ్గిన బీజేపీ.. స్పీకర్ ఎన్నికకు మాత్రం తమ అభ్యర్థిని బరిలో దించింది. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎంపికైన సీనియర్ నేత ఎస్. సురేశ్ కుమార్తో నామినేషన్ వేయించింది. శుక్రవారం మధ్యాహ్నం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి తరపున మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ స్పీకర్గా ఖరారు కాగా, డిప్యూటీ స్పీకర్గా జేడీఎస్ ఎమ్మెల్యే ఒకరికి అవకాశం దక్కనుంది. యడ్యూరప్ప, ఇతర ముఖ్యనేతల ఆదేశాలతోనే నామినేషన్ వేసినట్లు సురేశ్ కుమార్ తెలిపారు. ‘అసెంబ్లీలో మా సంఖ్య, వివిధ అంచనాలతో నేను విజయం సాధిస్తానని మా పార్టీ బలంగా నమ్ముతోంది. ఆ ధైర్యంతోనే నేను నామినేషన్ వేశాను. ఫలితం మీరే చూస్తారు’ అని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య వెంటరాగా రమేశ్ గురువారం నామినేషన్ వేశారు. తమ అభ్యర్థి విజయం సాధించటం తథ్యమని, అందుకని ముందే బీజేపీ తమ నామినేషన్ వెనక్కు తీసుకోవడమే మంచిదని సిద్దరామయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, కర్ణాటక సీఎం కుమారస్వామిపై మాజీ సీఎం, అసెంబ్లీలో బీజేపీ పక్షనేత యడ్యూరప్ప తీవ్ర విమర్శలు చేశారు. సంకీర్ణ భాగస్వామి అయిన కాంగ్రెస్పై స్వామికి నమ్మకం లేదన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. తన డిప్యూటీ పరమేశ్వరకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. లింగాయత్ల గురువు పండితారాధ్య శివాచార్య స్వామీజీపై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు (రాజకీయాల్లో తలదూర్చవద్దంటూ) ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ఇలాంటి అపవిత్ర కూటమిపై ప్రజలకు పెద్దగా ఆశల్లేవన్నారు. ‘ఐదేళ్ల’పై చర్చించలేదు! డిప్యూటీ సీఎం పరమేశ్వర బెంగళూరు: కుమారస్వామే ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పరమేశ్వర స్పష్టంచేశారు. ‘జేడీఎస్కు ఏయే మంత్రిత్వ శాఖలు ఇవ్వాలి. కాంగ్రెస్కు ఏయే శాఖల బాధ్యతలు ఇస్తారనేదానిపైనా ఎలాంటి నిర్ణయం జరగలేదు’ అని అన్నారు. మరి ఐదేళ్లు జేడీఎస్కే ఈ బాధ్యతలు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందా అని ప్రశ్నించగా.. ‘పార్టీలో చర్చిస్తాం. రాష్ట్రానికి సుపరిపాలన ఇవ్వాలనేదే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల మధ్య డిప్యూటీ సీఎం విషయంలో వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఆయన ఖండించారు. ఇదంతా మీడియా సృష్టేనని ఆయన కొట్టిపడేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని తనకు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో పార్టీ ఓటమికి ఈవీఎంలే కారణమని పరమేశ్వర తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 70–80% ఓట్లున్న బూత్లలోనూ బీజేపీ మెజారిటీ సాధించటంపై విచారణ జరుపుతామన్నారు. -
రేపు స్పీకర్ ఎన్నిక తర్వాత బలపరీక్ష
-
రేపు బలపరీక్ష, స్పీకర్ ఎన్నిక
బెంగళూరు: జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అదే రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక కూడా జరగనుంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీలో సమావేశమవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. కాంగ్రెస్కు చెందిన రమేశ్ కుమార్ పేరును స్పీకర్ పదవికి ఇప్పటికే ఖరారు చేయగా, డిప్యూటీ స్పీకర్గా జేడీఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. -
లవ్ ఇన్ బెంగళూరు..!
కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం.. ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీల ఐక్యతకు వేదికగా మారింది. సంకీర్ణ కూటమి భాగస్వామిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియాలు హాజరైనా.. వేదికపై ప్రాంతీయ పార్టీల అధినేతల సందడి ప్రధానంగా కనిపించింది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు, బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. కన్నడనాట బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలకంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ని ఏపీ సీఎం చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. కాసేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. సోనియా, మాయావతిల ఆత్మీయ ఆలింగనం అందరి దృష్టిని ఆకర్షించింది. సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యకూటమి వేసిన తొలి అడుగుగా భావిస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. కన్నడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ప్రాంతీయ పార్టీల మేళాను తలపించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పక్షంలో ఉన్న దాదాపు అన్ని పార్టీల నేతలు వేదికపై కనిపించారు. కర్ణాటక విధానసౌధ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సైద్ధాంతిక వైరుధ్యాలను పక్కనపెట్టి వీరంతా ఒకే వేదికను పంచుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నాను. సోనియా, మమతలు ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం, తేజస్వీ యాదవ్ మమత, మాయావతి, సోనియాల పాదాలకు నమస్కరించటం అందరి దృష్టిని ఆకర్షించాయి. రాహుల్ను ప్రశంసించిన బాబు ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక రాహుల్ దగ్గరికెళ్లిన చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. సాధారణంగా రెండు వేళ్లు పైకెత్తి విక్టరీ సింబల్తో అభివాదం చేసే చంద్రబాబు.. ఈ వేదికపై మాత్రం చెయ్యి ఊపుతూ అభిమానులను పలకరించటం ఆసక్తిరేపింది. మమత, మాయావతి, అఖిలేశ్లతోనూ కబుర్లు చెప్తూ కనిపించారు. కార్యక్రమంలో చంద్రబాబు ఎక్కువసేపు మమతా బెనర్జీతో మాట్లాడుతూ కనిపించారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ వేదికపైకి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. హాజరైన ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, పంజాబ్ సీఎం అమరీందర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐల ప్రధాన కార్యదర్శులు ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి, శరద్ యాదవ్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, డీఎంకే నేత కనిమొళి, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రమే కుమారస్వామిని కలిసి అభినందించి వెళ్లారు. వేదికపై అపురూప దృశ్యాలు శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీతారాం ఏచూరి వేదిక చివర్లో కూర్చుని మాట్లాడుకోవటం, అఖిలేశ్, మాయావతిల కబుర్లు, మాయావతి, సోనియా ఆత్మీయ ఆలింగనం వంటి ఆసక్తికర దృశ్యాలన్నీ వేదికపై కనిపించాయి. ఈ ప్రాంతీయ పార్టీల నేతలంతా కార్యక్రమానికి ముందు.. ప్రమాణస్వీకారం తర్వాత ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘అన్ని ప్రాంతీయ పార్టీలతో మేం టచ్లో ఉంటాం. తద్వారా దేశాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి మేం కలిసి పనిచేసేందుకు వీలుంటుంది’ అని మమత అన్నారు. ముభావంగా వజూభాయ్! కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించటం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గవర్నర్ వజూభాయ్ వాలా కార్యక్రమంలో ముభావంగా కనిపించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే వేదిక దిగి వెళ్లిపోయారు. కుమారస్వామి గవర్నర్కు వీడ్కోలు చెప్పలేదు. వర్షంతో ఇబ్బందులు ప్రమాణ స్వీకారోత్సవానికి వర్షం ఇబ్బంది కలిగించింది. మధ్యాహ్నం 1.30 నుంచే బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. అక్కడే ప్రమాణ స్వీకారం జరుగుతుందా? అన్న అనుమానం కలిగింది. ఒక దశలో విధానసౌధ లోపల కార్యక్రమం నిర్వహించాలని ఆలోచించారు. సాయంత్రంకల్లా వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రాంగణంలోనే ప్రమాణం నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు రావడంతో విధానసౌధ ఎదుట భారీగా ట్రాఫిక్జామ్ అయింది. విధానసౌధ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెట్రో స్టేషన్లో ప్రయాణికుల రద్దీతో తీవ్ర గందరగోళం నెలకొంది. నేతలకు ట్రాఫిక్ చిక్కులు ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న సోనియా, రాహుల్లు ఎయిర్పోర్టునుంచి వస్తుండగా ట్రాఫిక్లో చిక్కుకున్నారు. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జామ్ అయ్యాయి. నివాసం నుంచి విధానసౌధకు బయల్దేరిన జేడీఎస్ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు కూడా ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత సోనియా, రాహుల్ నేరుగా తమ ఎమ్మెల్యేలున్న హిల్టన్ హోటల్కు వెళ్లారు. వారందరితోనూ మాట్లాడారు. వారిని అభినందించారు. బలపరీక్ష పూర్తయ్యేంతవరకు ఎమ్మెల్యేలు హోటల్లోనే ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. కన్నడ ప్రజల సాక్షిగా.. గవర్నర్ వజూభాయ్ కుమారస్వామితో ప్రమాణం చేయించారు. సంప్రదాయ దుస్తులైన ధోతీ, తెల్లని షర్టు ధరించిన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, దళిత నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. బుధవారం ఉదయమే కేపీసీసీ చీఫ్గా పరమేశ్వర రాజీనామా చేశారు. ఈ సంకీర్ణ సర్కారు శుక్రవారం విశ్వాస పరీక్ష ఎదుర్కొనుంది. ఆ తర్వాతే మిగిలిన మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం కుమారస్వామి కూడా ఒక్కొక్క నాయకుడి దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన తన తల్లి చెన్నమ్మ పాదాలకు నమస్కారం చేశారు. కుమారస్వామి, డీకే శివకుమార్లు చేయిచేయి కలిపి కార్యకర్తలకు అభివాదం చేశారు. విధానసౌధ ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన వేలాదిమంది కార్యకర్తలు ప్రమాణస్వీకార వేదికపై నుంచి అభివాదం చేస్తున్న పవార్, సోనియా, మాయావతి, రాహుల్, ఏచూరి, కుమారస్వామి, అఖిలేశ్ తదితరులు. ఆప్యాయంగా పలకరించుకుంటున్న మాయావతి, సోనియా. కుటుంబ సభ్యులతో కుమారస్వామి -
కుమారస్వామికి మోదీ ఫోన్.. బలపరీక్ష!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వజుభాయ్ వాలా వీరిద్దరి చేత విధాన సౌదలో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. కర్ణాటక నూతన సీఎం కుమారస్వామికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కుమారస్వామికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాన్ని సజావుగా నడిపించాలని ట్విటర్లో ఆకాంక్షించారు. కుమారస్వామి, పరమేశ్వరలకు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అతిపెద్ద పార్టీగా అవతరరించిన బీజేపీ బలపరీక్షకు వెనకడుగు వేయడం, యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్లకు మార్గం సుగమమైంది. I congratulate Shri @hd_kumaraswamy Ji and @DrParameshwara Ji on taking oath as Chief Minister and Deputy Chief Minister of Karnataka. My best wishes for their tenure ahead. — Narendra Modi (@narendramodi) 23 May 2018 సీఎం అయ్యాక తొలిసారి మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశం నలుదిశల నుంచి వచ్చిన నేతలు 2019 ఎన్నికల్లో మేమంతా ఒకటిగా నిలుస్తామని సంకేతాలు పంపారు. రాజకీయాల్లో ఇదో అతిపెద్ద పరిణామం. కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నూతనంగా ఏర్పాటుకానున్న ప్రభుత్వాన్ని రక్షించుకుంటారు. ఏకైక పార్టీ ప్రభుత్వాలనున్న ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో అత్యుత్తమ పాలన అందించడానికి సిద్దంగా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని కుమారస్వామి పేర్కొన్నారు. బలపరీక్ష.. తొలుత అతిపెద్ద పార్టీ బీజేపీ బలపరీక్షకు ముందు చేతులెత్తేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి రంగంలోకి దిగింది. గవర్నర్ వజుభాయ్ వాలాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. బుధవారం సాయంత్రం దేశంలోని కొందరు కీలక నేతల సమక్షంలో జేడీఎస్ నేత కుమారస్వామి రెండో పర్యాయం కర్ణాటక సీఎంగా ప్రమాణం చేశారు. సీఎం అయితే 24 గంటల్లో బల పరీక్షకు వెళ్లి, అనంతరం కేబినెట్ గురించి ఆలోచిస్తామని కుమారస్వామి ప్రస్తావించారు. కానీ, ఇటీవల చెప్పినట్లుగా కాకుండా రెండో రోజు (ఈ నెల 25న) కుమారస్వామి సర్కార్ బల పరీక్షకు వెళ్లనుంది. వారం రోజుల్లో కేబినెట్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే తమ పార్టీల నేతలను బల పరీక్ష ముగిసేవరకు కాపాడుకునేందుకు హోటళ్లలోనే బస చేయిస్తూ వారిని ఇంటికి సైతం దూరం పెట్టిన విషయం విదితమే. -
ఆ ఆడియో టేపులు బూటకమే!
బెంగళూరు: కర్ణాటకలో విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుంటూ కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో టేపులు బూటకమేనంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే శివరామ్ హెబ్బార్ సోమవారం స్పష్టం చేశారు. హెబ్బార్ భార్యతో బీజేపీ నేతలు మాట్లాడిన ఆడియోటేపులు ఇవేనంటూ విశ్వాస పరీక్షరోజు ఉదయం కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, అతని మిత్రుడు పుత్తుస్వామిలు హెబ్బార్ భార్యకు డబ్బులు, మంత్రి పదవిని ఇస్తామని ప్రలోభపెట్టినట్లుగా ఉంది. దీనిపై హెబ్బార్ మండిపడ్డారు. తన ఫేస్బుక్ పోస్టులో ఆ ఆడియోటేపుల విశ్వసనీయతను ప్రశ్నించారు. ‘ఈ టేపులో ఉన్నది నా భార్య గొంతు కాదు. అసలు ఆమెకు బీజేపీ నేతల నుంచి ఫోన్లు రాలేదు. ఆ ఆడియో టేపులు బూటకం. దీన్ని నేను ఖండిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకుండా ఉండేందుకే కాంగ్రెస్ బూటకపు ఆడియో టేపులతో విషప్రచారం చేసిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. కాగా, ‘మీడియాకు మేం విడుదల చేసిన ఆడియో టేపు నిజమైందే. మా ఎమ్మెల్యే (హెబ్బార్) చెప్పింది నిజమే. అందులో మాట్లాడింది ఆయన భార్య కాదు. కానీ మిగిలినవి మాత్రం విజయేంద్ర, పుత్తుస్వాముల గొంతులే. ఈ ఇద్దరికీ నిజంగా ధైర్యముంటే.. ఫోరెన్సిక్ వాయిస్ టెస్టుకు హాజరవ్వాలి’ అని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా కూటమి: సంతోష్ హెగ్డే హైదరాబాద్: కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగానే ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ సంతోష్ హెగ్డే అభిప్రాయపడ్డారు. ఏదో ఒక పార్టీకి సరైన మెజారిటీ ఇవ్వడంలో కన్నడ ప్రజలు విఫలమయ్యారన్నారు. ఏదో ఒక పార్టీకి అధికారం కట్టబెట్టడం ద్వారా వైఫల్యాలు వస్తే నిందించేందుకు, విజయాలు సాధిస్తే ప్రశంసించేందుకు వీలుంటుందన్నారు. బీజేపీని దూరంగా ఉంచేందుకు జేడీఎస్కు కాంగ్రెస్ మద్దతివ్వడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏమీ జరగలేదు. వారి అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, కొందరిని సంతోషపెట్టేందుకే ఈ కూటమి ఏర్పడింది’ అని అన్నారు. -
బీజేపీపై బాంబు పేల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!
సాక్షి, బెంగళూరు : ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టిందని, వారికి మంత్రి పదవులతో పాటు రూ.100 కోట్ల మేర ఆశ చూపినట్లుగా కాంగ్రెస్ టేపులు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవనగౌడ చన్నబసవనగౌడ పాటిల్ (బీసీ పాటిల్) స్పందించారు. బలపరీక్షలో బీజేపీకి ఓటేస్తే మంత్రి పదవితో మరెన్నో ఇస్తామని బీజేపీ తనకు ఆశ చూపింది నిజమేనని పేర్కొన్నారు. తనను సంప్రదించి మామూలు నేతలు కాదని, అందులో యడ్యూరప్ప కూడా ఉన్నారని చెప్పి బీజేపీని మరింత ఇరకాటంలోకి నెట్టారు. తమ పార్టీ ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్ గురించి తనకేమీ తెలియదన్నారు. కానీ, తన విషయం గురించి వెల్లడిస్తునన్న పాటిల్ ప్రలోభాలు నిజమనేనన్నారు. బీజేపీ కీలక నేతలు యడ్యూరప్ప, శ్రీరాములు, మురళీధర్ రావు తనను సంప్రదించారని, తమకు ఓటేస్తే మంత్రి పదవి ఇస్తామని ప్రలోభాలకు గురి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ బలపరీక్ష నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ నేతలు బీజేపీ ప్రలోభాల ఆడియో టేపులను విడుదల చేయడం తెలిసిందే. మరోవైపు జేడీఎస్ నేత కుమారస్వామి నేడు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్-జేడీఎస్ కేబినెట్కు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. -
కర్నాటకలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు?
-
పూజలు చేసి.. ఢిల్లీకి కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగాలని భావిస్తున్నారు. అందుకు ఏ అడ్డంకులు తనకు ఎదురుకావొద్దని హసన్లోని లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు ఢిల్లీకి వెళ్లి కేబినెట్పై కాంగ్రెస్ చర్చలు జరపనున్న నేపథ్యంలో ఆయన ఆలయాన్ని సందర్శించడం గమనార్హం. కాగా, కర్ణాటక రాజకీయాలు నేటి మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకోనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి సమావేశం కానున్నారు. అనంతరం 4:30 గంటలకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయన భేటీ అవుతారు. కర్ణాటక మంత్రిమండలి కూర్పు, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, సమన్వయ కమిటీ ఏర్పాటుపై చర్చిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ స్థిరత్వంపై కుమారస్వామి దృష్టి సారిస్తున్నారు. అయిదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని ఆయన ఇదివరకే కుండబద్దలుకొట్టారు. మరోవైపు రొటేషన్ సీఎంకు జేడీఎస్ కూడా నో చెబుతోంది. కీచులాటలు, విభేదాలతో కూటమిని విచ్ఛిన్నం చేయవద్దన్న భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. బీజేపీని నిలువరించడం కోసం ఐదేళ్ల పాటు కూటమికి బీటలు వారకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు సీనియర్ నేతలు కసరత్తులు చేస్తున్నారు. -
దేశంలో కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద అవినీతి పార్టీ
-
ఆ పొత్తే.. కాంగ్రెస్ అవినీతికి నిదర్శనం!
వాషింగ్టన్డీసీ: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్-బీజేపీ మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. బీజేపీకి బలం లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించి భంగపడిందని, అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసింది. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఖండించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద అవినీతి పార్టీ అని ఆయన విమర్శించారు. కర్ణాటకలో ప్రజాతీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ.. జేడీఎస్తో అపవిత్ర పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కాంగ్రెస్ అవినీతికి ఇది తాజా నిదర్శనమని ఆయన అన్నారు. వాషింగ్టన్డీసీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మొదలుకొని, రాజీవ్గాంధీ, గత యూపీఏ ప్రభుత్వాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని అన్నారు. గత నాలుగేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతిరహిత పారదర్శక పాలన అందిస్తోందని చెప్పారు. -
సీఎం సీటు పంచుకోం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి.. సీఎం సీటును జేడీఎస్–కాంగ్రెస్ కొంతకాలం పాటు పంచుకుంటాయంటూ వస్తున్న వార్తలను ఖండించారు. కూటమి భాగస్వామి కాంగ్రెస్తో ఇలాంటి ఒప్పందాలేమీ లేవని ఆయన ఆదివారం బెంగళూరులో స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లనున్న కుమారస్వామి.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలతో సమావేశమై మంత్రిమండలి కూర్పుపై చర్చిస్తామన్నారు.‘రేపు ఢిల్లీ వెళ్తున్నాను. సోనియా, రాహుల్తో భేటీ అవుతాను. కేబినెట్ విస్తరణతోపాటుగా ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వం నడిపేందుకు అవసరమైన అంశాలపై చర్చిస్తాను.సీఎం సీటు పంపకంపై ఎలాంటి ఒప్పందం జరగలేదు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవం’ అని స్వామి పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత 24 గంటల్లోనే బలనిరూపణ చేసుకుంటానని ఆయన వెల్లడించారు. కుమారస్వామితోపాటుగా సిద్దరామయ్య, జి. పరమేశ్వరన్, డీకే శివకుమార్లుకూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, ఆదివారం కాంగ్రెస్ నేతలతో కుమారస్వామి భేటీ అయ్యారు. విశ్వాస పరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. అయితే డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నుంచి దళిత నేతను ఎన్నుకోవటం దాదాపు ఖాయమైంది. అది పీసీసీ చీఫ్ జి. పరమేశ్వరే అని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ బలం ఆధారంగా.. 34 మంత్రులను ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, జేడీఎస్, కాంగ్రెస్ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం జేడీఎస్ సీఎం, 13 కేబినెట్ బెర్తులు, కాంగ్రెస్కు డిప్యూటీ సీఎం సహా 20 కేబినెట్ బెర్తులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామి తనవద్దే ఆర్థిక శాఖను అంటిపెట్టుకోవచ్చని సమాచారం. డిప్యూటీ సీఎంగా పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరన్ ఎంపిక దాదాపు ఖాయంగానే తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలను కాపాడటంతో కీలకపాత్ర పోషించిన డీకే శివకుమార్కు కీలక శాఖను అప్పజెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్తో విభేదాల్లేవ్! ముఖ్యమంత్రి సీటుతో పాటు పలుఅంశాల్లో కాంగ్రెస్తో విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కుమారస్వామి తెలిపారు. రాజరాజేశ్వరినగర్, జయనగర్ అసెంబ్లీ స్థానాల ఎన్నికల విషయంపై ప్రస్తుతానికి చర్చించడం లేదన్నారు. ‘ఈ రెండుచోట్ల గెలవటం మాకు చాలా ముఖ్యం. ముందు ప్రభుత్వ ఏర్పాటు. ఆ తర్వాతే వీటిపై చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం.. బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే క్యాంపులో ఉండాలా లేక ఇంటికెళ్లి బుధవారం ప్రమాణస్వీకారానికి రావాలా అన్న విషయంలో నిర్ణయించుకునే పూర్తి హక్కును ఎమ్మెల్యేలకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తమిళనాడులోని ఓ దేవాలయ సందర్శనకు స్వామి బయలుదేరారు. రజనీ వర్సెస్ స్వామి తమిళనాడుకు వచ్చి ఇక్కడి రైతుల పరిస్థితి చూస్తే.. కుమార స్వామి మనసు మార్చుకుని కావేరీ నీటిని విడుదల చేసే అవకాశం ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కుమారస్వామి తిప్పికొట్టారు. ‘కర్ణాటకలో నీరుంటే వారికి విడుదల చేయగలం. రజనీకాంత్ ఇక్కడికొచ్చి మా డ్యాముల పరిస్థితి, రైతుల దీనస్థితి చూడాలని ఆహ్వానిస్తున్నా. ఇవన్నీ చూశాక కూడా మీరింకా నీరు కావాలంటే మనం చర్చిద్దాం’ అని పేర్కొన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు! కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉందని కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి సోమవారం కలిసిన అనంతరం తుది నిర్ణయం వెలువడుతుందని ఆయన వెల్లడించారు. కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్–జేడీఎస్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జేడీఎస్కు ముఖ్యమంత్రి, కాంగ్రెస్కు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాల్సి ఉంది. డిప్యూటీ సీఎంగా పరమేశ్వరతో పాటు జేడీఎస్ నుంచి కూడా మరో ఉపముఖ్యమంత్రి ఉండొచ్చని తాజా సమాచారం. రిసార్టులోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప రాజీనామా తర్వాత జరిగే ప్రతి పరిణామాన్ని కాంగ్రెస్, జేడీఎస్ కూటమి జాగ్రత్తగా గమనిస్తూ ముందుకెళ్తోంది. ఏ విషయంలోనూ తప్పటడుగుల్లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే కుమారస్వామి బలనిరూపణ చేసుకోవాలని భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా బెంగళూరు శివార్లలోని రిసార్టులోనే ఉన్నారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం సోమవారం కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ.. జేడీఎస్ బుధవారానికి వాయిదా వేసింది. సోమవారం (మే 21) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి కారణంగా దీన్ని రెండ్రోజులు వెనక్కు జరిపారు. ప్రస్తుతానికి 221 మంది సభ్యులున్న సభలో ఈ కూటమికి 117 మంది ఎమ్మెల్యేలున్నారు. కుమారస్వామి తాను ఎన్నికైన రెండో స్థానానికి (రామనగర) రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అయితే మొదట కంఠీరవ స్టేడియంలోప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించినప్పటికీ.. దీన్ని విధానసౌధకే మార్చే అవకాశం ఉంది. -
రజనీ వ్యాఖ్యలపై మండిపడ్డ కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాలతో పాటు కావేరీ జల వివాదంపై దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తీవ్ర స్థాయిలో స్పందించారు. కావేరీ జల వివాదంపై రజనీ చేసిన వ్యాఖ్యలను తాను స్వీకరించలేనన్నారు. కుమారస్వామి ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి రజనీకాంత్, తాను ఏ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులం కాదన్నారు. సాధారణ పౌరుడిగా నేను రజనీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓసారి ఇక్కడికి వచ్చి రిజర్వాయర్లలో నీటి నిల్వను పరిశీలించండి. మా రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో గమనిస్తే రజనీకాంత్ తన మనసు మార్చుకుంటారని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించి మంత్రి మండలిపై నిర్ణయం తీసుకోవడంతో పాటు ఐదేళ్లపాటు ప్రభుత్వం కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కుమారస్వామి చర్చించనున్నారు. రజనీ మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో ఆదివారం భేటీలో రజనీ మాట్లాడుతూ.. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. బలపరీక్షకు 15 రోజులు గడువు ఇవ్వడం జోక్ అన్న రజనీ.. కావేరీ జలాల బోర్డును కర్ణాటక ఆధీనంలో కాకుండా.. సీనియర్ ఐఏఎస్ పర్యవేక్షణలో ఉంటేనే తమిళనాడుకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో రజనీ కర్ణాటకలో తమ పరిస్థితులు అర్థం చేసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. -
కర్ణాటకలో తెలుగువాళ్లు మాకే అండగా నిలిచారు!
సాక్షి, విజయవాడ : కర్నాటకలో తెలుగువాళ్లు బీజేపీకి అండగా నిలిచారని ఆ పార్టీ నేత రమేశ్నాయుడు తెలిపారు. బెంగళూరు నగరంలోని పద్మనాభ నగర్లో తెలుగువారు అధికంగా ఉంటారని, అక్కడ బీజేపీ అభ్యర్థి అశోశ్ను ఓటర్లు గెలిపించారని తెలిపారు. బీజేవైఎం ఈసీ సభ్యుడిగా ఉన్న రమేశ్ నాయుడు ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మహాదేవపూర్లోనూ బీజేపీ గెలిచిందని, కానీ టీడీపీ నేతలు తెలుగువాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చూసిన చంద్రబాబుని ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ను ఓడించి బీజేపీకి ప్రజలు మెజారిటీ సీట్లు కట్టబెట్టారని, అయినా, మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో వాజపేయి తరహాలో విలువలకు నిలబడి.. యడ్యూరప్ప గౌరవంగా రాజీనామా చేశారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా.. నైతిక విలువలను బీజేపీ కట్టుబడిందని అన్నారు. కర్ణాటక ఎన్నికల కోసం చంద్రబాబు ఇక్కడ నుంచి డబ్బు తరలించారని ఆరోపించారు. అయినా బీజేపీనే గెలిచిందని, నైతిక విజయం తమ పార్టీదేనని చెప్పారు. -
కర్ణాటక: చంద్రబాబు సెల్ఫ్ డబ్బా..!
సాక్షి, విజయవాడ : కర్ణాటకలో అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నించిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. కర్ణాటకలో బలపరీక్ష విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని అన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే.. సీఎం చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ చేత్తో పట్టుకొని రెడీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో తన సలహాలు, సూచనలు వల్లే కాంగ్రెస్-జేడీఎస్ అధికారంలోకి వచ్చాయని సీఎం చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయమని మండిపడ్డారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యకు టీటీడీలో బోర్డులో సభ్యత్వం ఎందుకు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. సూర్యుడు, చంద్రుడు ఉదయించేది, అస్తమించేది తన వల్లేనని చంద్రబాబు చెప్పుకుంటారని, తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిన చంద్రబాబుతోపాటు కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులపైనా సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని అన్నారు. -
కర్ణాటక కేబినెట్: కాంగ్రెస్-జేడీఎస్ ఫార్మూలా ఇదే!
సాక్షి, బెంగళూరు: హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిన నేపథ్యంలో మంత్రిమండలి కూర్పుపై ప్రస్తుతం జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రిమండలి విషయంలో రెండు పార్టీలు ఆమోదయోగ్యమైన నిర్ణయానికి వచ్చేందుకు ప్రస్తుతం తీవ్రస్థాయిలో మేథోమథనాన్ని జరుపుతున్నాయి. మంత్రిమండలి కూర్పుపై శనివారం సాయంత్రం కాంగ్రెస్-జేడీఎస్ నేతల మధ్య చర్చలు జరిగాయి. ఆదివారం కూడా ఈ చర్చలు కొనసాగనున్నాయి. ఇరుపార్టీలకు ఆమోదయోగ్యమైన ఫార్మూలా తెరపైకి వచ్చేవరకు చర్చలు కొనసాగనున్నాయి. 20-13 ఫార్మూలా ప్రకారం కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల మధ్య కేబినెట్ బెర్తులు పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు ఈ చర్చలను దగ్గర నుంచి గమనిస్తున్న సన్నిహిత వర్గాలు తెలిపాయి. 78 ఎమ్మెల్యేలను గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి గరిష్టంగా 20 కేబినెట్ బెర్తులను ఇవ్వాలని, ఇక, జేడీఎస్కు 13 బెర్తులను అప్పగించాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు. ముఖ్యమంత్రి పదవితోపాటు ఆర్థిక మంత్రిత్వశాఖను కూడా కుమారస్వామి తనతోపాటు ఉంచుకునే అవకాశముందని అంటున్నారు. అధిక ఎమ్మెల్యే సీట్లు ఉన్నప్పటికీ సీఎం సీటును వదులుకున్న కాంగ్రెస్ పార్టీ.. కేబినెట్ బెర్తుల విషయంలో గట్టిగా పట్టుబట్టాలని భావిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ జీ పరమేశ్వరకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని భావిస్తున్నారు. ఇక, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్కు కూడా కీలక కేబినెట్ బెర్తు ఖాయమని వినిపిస్తోంది. కేబినెట్ బెర్తుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ‘కేబినెట్ కూర్పు విషయంలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. మాది జాతీయ పార్టీ అయినప్పటికీ రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్కు మద్దతునిచ్చాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేబినెట్ కూర్పులో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబిస్తాం’ అని ఖర్గే అన్నారు. బుధవారం కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రిమండలి కూడా ప్రమాణస్వీకారం చేయనుందని తెలుస్తోంది. -
రేపు ఢిల్లీకి.. 24 గంటల్లో బలనిరూపణ చేసుకుంటా!
సాక్షి, బెంగళూరు: బలపరీక్షకు ముందే బీఎస్ యడ్యూరప్ప రాజీనామా నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా జేడీఎస్ నేత కుమారస్వామి చకచకా అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఆయన.. తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా నేతలను స్వయంగా ఆహ్వానించబోతున్నారు. ఇందులో భాగంగా కుమారస్వామి సోమవారం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని కుమారస్వామి ఆదివారం మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 24 గంటల్లో బలనిరూపణ చేసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ‘అవును, రేపు నేను ఢిల్లీకి వెళ్లబోతున్నాను. ఢిల్లీలో రాహుల్గాంధీ, సోనియాగాంధీని కలుస్తాను. ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోగా బలనిరూపణ చేసుకుంటాను’ అని ఆయన చెప్పారు. విశ్వాస పరీక్షకుముందే యడ్యూరప్ప రాజీనామా చేయడంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. యడ్యూరప్ప రాజీనామా చేసిన వెంటనే గవర్నర్ ఆహ్వానం మేరకు జేడీఎస్-కాంగ్రెస్ నేతలు ఆయనను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీతోపాటు పలు ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కొలువుదీరనుంది. ప్రస్తుతం సంకీర్ణ సర్కారు మంత్రిమండలి కూర్పు ఈ విధంగా ఉండాలి, ఇరు పార్టీల నేతలకు ఎంతమేరకు ప్రాధాన్యమివ్వాలని ఇరుపార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. -
దేవుని సాక్షిగా
అధికార పక్షం, విపక్షం, కొద్దిసేపట్లో ఎవరు అటు ఇటు అవుతారో తెలియని ఉత్కంఠ, అధికారం నిలుపుకోవాలని ఒకరు, చేజిక్కించుకోవాలని మరొకరి ఆరాటం. అందరి మనసుల్లోనూ ఒకటే కలవరం, ఈ పరిస్థితుల్లో కర్ణాటక అసెంబ్లీ శనివారం తొలిసారిగా కొలువు తీరింది. నూతన సభ్యులు దేవుని సాక్షిగా, రైతుల సాక్షిగా, ఒకరిద్దరు సత్యం సాక్షిగా ప్రమాణం గావించారు. సాక్షి, బెంగళూరు: ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో శనివారం కొత్త ఎమ్మెల్యేలతో శాసనసభ సమావేశం అయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఎంతో ఉద్వేగంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు సమయానికే అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ ప్రారంభమైన 10 నిమిషాలకు హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష„ý స్థానంలో, బీజేపీ ఎమ్మెల్యే అధికారపక్షం వైపు కూర్చొన్నారు. సభలో హెచ్డీ రేవణ్ణ మాట్లాడుతూ ఐదుగురు చొప్పున ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించాలని ప్రొటెం స్పీకర్ను కోరగా, ఆ మేరకు అనుమతించారు. మధ్యాహ్నం కల్లా ప్రధాన నేతలు సిద్ధరామయ్య, పరమేశ్వర్, జమీర్ అహ్మద్ తదితరులు ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఎమ్మెల్యేలు ఆనంద్సింగ్, సోమశేఖర్రెడ్డి, ప్రతాప్గౌడలు మధ్యాహ్నం వరకు శాసనసభకు హాజరు కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంటలోపల చాలా మంది ఎమ్మెల్యేలు ప్రమాణం పూర్తి చేశారు. మీడియా గ్యాలరీలో కూర్చొని జాతీయ నేతలు అనంత్కుమార్, శోభ, గులాంనబీ ఆజాద్, మునియప్ప తదితరులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. ఎమ్మెల్యేలందరూ దేవుడు, రైతుల సాక్షిగా ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకల్లా దాదాపు 195 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం పూర్తి చేశారు. అనంతరం తాత్కాలిక స్పీకర్ గోపయ్య సభను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు. ఇక మధ్యాహ్నం వరకు కూడా ఆనంద్సింగ్, ప్రతాప్ గౌడ ఆచూకీ లభించకపోవడంతో వారు అసెంబ్లీకి వస్తారా లేదా అనే అనుమానం అందరిలో వ్యక్తమయింది. గత బడ్జెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీ సమావేశమవడంతో ఎమ్మెల్యేలందరితో శాసనసభ కళకళలాడింది. ఎమ్మెల్యేల ముఖాల్లో ఉత్సాహంతో పాటు ఉద్విగ్నత కూడా కనిపించింది. యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గుతారా?, ఓడిపోతారా?అనే సందిగ్ధం అందరిలోనూ వ్యక్తమైంది. యడ్యూరప్ప దేవునిపై, సిద్ధరామయ్య సత్యంపై సభ ప్రారంభమైన కొద్దిసేపటికి ‘ముఖ్యమంత్రి’ యడ్యూరప్ప మొదటగా ఎమ్మెల్యేగా.. దేవుని పేరిట ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య సత్యప్రమాణంగా ప్రమాణ స్వీకారం గావించారు. కొత్త ఎమ్మెల్యేలతో విధానసభ కార్యదర్శి ఎస్.మూర్తి ప్రమాణం చేయించారు. సాయంత్రం నాలుగు గంటలకు బలనిరూపణ పరీక్ష ముగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో మధ్యాహ్నం 03.30గంటలకు 221 మంది ఎమ్మెల్యేలు చకచకా ప్రమాణం చేశారు. కనిపించకుండా పోయి కాంగ్రెస్ను కలవరపెట్టిన ఎమ్మెల్యేలు ఆనంద్సింగ్, ప్రతాప్గౌడ పాటిల్లు సభ ప్రారంభమవడానికి అర్ధగంట ముందు విధానసౌధలో ప్రత్యక్షమవడంతో హమ్మయ్య అనుకున్నారు. కుమార, డీకే ఒకేసారి జేడీఎస్ నుంచి కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత డీకే శివకుమార్లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయగా, అందరూ ఆసక్తిగా గమనించారు. గత మూడు రోజులుగా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారు. డీకే శివకుమార్ పేరిట ప్రమాణం అసెంబ్లీలో అందరూ దైవం, సత్యం, రైతుల సాక్షిగా ప్రమాణం చేస్తే ఒక్క ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ పేరు మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కుణిగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్. డీకేకు అత్యంత ఆప్తునిగా పేరు పొందిన రంగనాథ్ ఆయన పేరు మీద ప్రమాణం చేయడంతో అందరు ఆసక్తిగా చూశారు. మొదటి సారి ఎన్నికల్లో గెలుపొందిన కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపా శశిధర్ ఎవరి పేరు మీద ప్రమాణం చేయాలో తెలియక కాసేపు సందిగ్ధంలో పడ్డారు. -
ఏ నిమిషానికి ఏమౌనో
సాక్షి, బెంగళూరు: బలనిరూపణ సందర్భంగా శనివారం విధానసౌధలోని అధికార, ప్రతిపక్షాల శిబిరాల్లో ఎటు చూసినా చర్చోపచర్చలే దర్శనమిచ్చాయి. ఎమ్మెల్యేలు గుంపులు గుంపులుగా చేరి చెవులు కొరుక్కోవడంలో బిజీ అయ్యారు. 15వ విధానసభ సమావేశాల్లో మొదటిరోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయా పార్టీల ఎమ్మేల్యేలు తమ శిబిరాల్లో బలనిరూపణపై ఆసక్తిగా చర్చించుకున్నారు. తమ ఎమ్మెల్యేలందరూ సభకు హాజరు కావడంతో కాంగ్రెస్–జేడీఎస్ శిబిరంలో ఉత్సాహం నెలకొంది, పథకాలు పారలేదని బీజేపీ ఎమ్మెల్యేల మోములు వాడిపోయాయి. పరీక్షలో తమదే విజయమంటూ బీజేపీ నేతలు శనివారం ఉదయం కూడా ధీమా వ్యక్తం చేయడంతో అటు కాంగ్రెస్–జేడీఎస్ శిబిరంలో కొంత ఆందోళన మొదలైంది. అద్భుతమేమీ జరగదని తెలిసి బీజేపీ శిబిరంలో నైరాశ్యత నెలకొంది. ఒకవేళ కాంగ్రెస్–జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా ఎన్ని రోజులు ఉంటుందోనంటూ నేతలు చర్చించుకున్న సన్నివేశాలు కూడా దర్శనమిచ్చాయి. ఓటింగ్ జరిగే సమయానికి బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందనే భయంతో కాంగ్రెస్ నేతలు భోజనాలు కూడా చేయకుండా తమ ఎమ్మేల్యేలను రక్షించుకునే పనిలో పడ్డారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్రమంత్రులు అనంత్కుమార్, సదానందగౌడ, బీజేపీ నేత మురళీధరరావులు విధానసౌధలోని తమ శిబిరంలోను భుజించగా జేడీఎస్ ఎమ్మేల్యేలు తాము బసచేసిన హోటళ్లకు వెళ్లారు. -
ఎమ్మెల్యేలకు యడ్డి ఆఫర్?
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్కు మంత్రి పదవి ఆశ చూపించి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపు విడుదల చేసింది. కొచ్చికి వెళ్లవద్దని, తనపై నమ్మకం లేదా అంటూ యడ్యూరప్ప అందులో మాట్లాడారు. బీజేపీకి మద్దతిస్తే తనకొచ్చే లాభం ఏమిటని పాటిల్ ప్రశ్నిస్తూ, తనతో పాటు మరో ముగ్గురు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వారిని కూడా తీసుకు రమ్మని యడ్యూరప్ప కోరారు. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే మంత్రి పదవి ఇస్తానని, ఒక్కసారి కొచ్చికి వెళితే తిరిగి రావడం కుదరదని యడ్యూరప్ప చెబుతారు. మంత్రి పదవితో పాటు ఏ సహాయం కావాలన్నా చేసి పెడతామని హామీ ఇచ్చారు. యడ్యురప్ప కుమారుడు విజయేంద్ర కూడా తమ ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు డబ్బు, మంత్రి పదవి ఆశ చూపించారని కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు విజయేంద్ర మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపులను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. -
అంకెల గారడీలో విఫలమైన కమలదళం..!
-
ముఖ్యమంత్రిగా మూడురోజులే
సాక్షి, బెంగళూరు: ‘ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించినా కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు అధికారం కోసం ప్రజాతీర్పును అవమాన పరుస్తూ అనైతిక మైత్రి చేసుకున్నాయి. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే నేను రాజీనామా చేయాల్సి వస్తోంది’ అని ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. విధానసభలో బల నిరూపణకు ముందే ఆయన పదవిని వీడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. విధానసభ ప్రారంభమైన కొద్దిసేపటికి ఎమ్మేల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యడ్యూరప్ప భావోద్వేగంతో ప్రసంగించారు. ఏ పార్టీ ప్రకటించని విధంగా ఎన్నికలకు మూడేళ్ల ముందే తనపై నమ్మకంతో బీజేపీ అధిష్టానం తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిందన్నారు. అప్పటి నుంచి ఎన్నికల ప్రచారాలు ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పర్యటనలు చేసి రైతుల, ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్నామన్నారు. ఎన్నికల్లో 104 స్థానాల్లో విజయాన్ని అందించారు. గత ఎన్నికల్లో 40 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం నుంచి నేడు అతిపెద్ద పార్టీగా నిలబెట్టారని అన్నారు. ‘ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో అధికారాన్ని చేపట్టాం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల్లోనే రైతుల రుణమాఫీ నిర్ణయం తీసుకున్నాం. అయితే ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించినా కాంగ్రెస్–జేడీఎస్ అధికారం కోసం ప్రజల తీర్పును అవమానపరుస్తూ అపవిత్ర సంధి చేసుకున్నాయి. దాని ఫలితమే నా రాజీనామా’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు, కష్టాల్లో మరింత కుంగిపోతున్న రైతులు, పేదలను ఆదుకోవడానికి ఎన్నో పథకాలు రూపొందించుకున్నామని, అయితే కాంగ్రెస్ కుటిల బుద్ధి, అధికారం దాహంతో అవన్నీ ధ్వంసమైనట్లు మండిపడ్డారు. రాజీనామా సమర్పణ రాజీనామా చేసి అధికారం కోల్పోయినంత మాత్రానే తాము ఊరికే కూర్చోబోమని రైతులు, పేదలు, ప్రజా సమస్యలపై తమ పోరాటాలు, ఉద్యమాలు కొనసాగిస్తామని యడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లలో మెజారిటీని అప్పగించడం ద్వారా అనైతిక కాంగ్రెస్–జేడీఎస్లకు ప్రజలు తగినరీతిలో బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఆయన నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ వజూభాయ్వాలాకు రాజీనామాపత్రం సమర్పించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు అనంత్కుమార్, సదానందగౌడ, బీజేపీ సీనియర్లు ఉన్నారు. పదవిలో 55 గంటలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు కూడా పూర్తవ్వక ముందే యడ్యురప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి పదవి మూడు రోజుల ముచ్చటగా మారింది. 17వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు రాజ్భవన్లో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మూడు రోజులు తిరగక ముందే శనివారం సాయంత్రం 5 గంటలకు రాజీనామా చేసేశారు. యడ్యురప్ప ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి కాగా, ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిలో కూర్చోలేని నేతగా పేరు పొందారు. ప్రభుత్వం రద్దవడమో, లేక రాజకీయ కారణాల వల్ల మూడుసార్లూ అర్ధాంతరంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. యడ్డి సభ నుంచి నిష్క్రమించడంతో కాంగ్రెస్– జేడీఎస్ ఎమ్మెల్యేల్లో ఉత్సాహం పెల్లుబికింది. జేడీఎస్ పక్ష నేత కుమారస్వామి, కాంగ్రెస్ నేత డీకే శికుమార్లు చేయిచేయి కలిపి సంబరాలు చేసుకున్నారు. -
‘పరీక్ష’లో విఫలమైన ప్రధాన మంత్రులు..!
కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజులు కూడా కొనసాగకుండానే శాసనసభలో బలపరీక్షకు ముందే రాజీనామా చేసిన బీఎస్ యడ్యూరప్ప మాదిరిగానే దేశంలో పదవి నుంచి వైదొలిగిన ప్రధానులు ఉన్నారు. లోక్సభలో అతి పెద్ద పార్టీ నేతగా ప్రధాని పదవి చేపట్టిన అటల్ బిహారీ వాజ్పేయి 1996 మే చివరి వారంలో విశ్వాసం తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందే రాజీనామా చేశారు. మెజారిటీ నిరూపణకు అప్పటి రాష్ట్రపతి రెండు వారాలు గడువిచ్చినా అవసరమైన 272 మంది సభ్యుల మద్దతు కూడగట్టలేకపోయారు. విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాక వాజ్పేయి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. బీజేపీకి తగినన్ని సీట్లు రాలేదంటే మాతృభూమికి తక్కువ సేవ చేసినట్లు కాదని అన్నారు. ప్రసంగం చివరిలో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మొరార్జీ దేశాయి అలాగే.. 1977 మార్చి 24న జనతాపార్టీ తరఫున తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ప్రమాణం చేసిన మొరార్జీ దేశాయి రెండేళ్లు గడిచాక పార్టీలో చీలిక కారణంగా పదవి కోల్పోయారు. ఆ పార్టీ నుంచి ఎంపీలు భారీ సంఖ్యలో రాజీనామా చేసి చరణ్సింగ్ నాయకత్వాన ఏర్పడిన జనతాపార్టీ–ఎస్లో చేరిపోయారు. ఫలితంగా మెజారిటీ నిరూపించుకోవడం అసాధ్యమని భావించిన మొరార్జీ దేశాయ్ అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తికాకుండానే 1979 జులై 12న రాజీనామా చేశారు. -
ఇది ప్రాంతీయ, లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల విజయం
కోల్కతా / న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం యడ్యూరప్ప మూడ్రోజుల ప్రభుత్వం కూలిపోవడం ప్రాంతీయ శక్తుల విజయమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యం విజయం సాధించింది. కర్ణాటక ప్రజలకు, దేవెగౌడకు, కుమారస్వామికి, కాంగ్రెస్ సహా ఇతర నేతలకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు. యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోవడం లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల విజయమని సీపీఐ నేత డి.రాజా తెలిపారు. కర్ణాటకలో శనివారం ప్రజాతీర్పు ధన బలంపై విజయం సాధించిందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు. కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయిన ఘటనతో బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సూచించారు. బీజేపీ ప్రభుత్వం కూలిపోవడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ‘అబద్ధాలు, అబద్ధాలకోరును సత్యమే ఓడిస్తుంది’ అని ట్వీట్ చేశారు. -
ఎప్పుడు.. ఏంటీ...
న్యూఢిల్లీ: మే 12 నుంచి శనివారం వరకు థ్రిల్లర్ను తలపించిన కర్ణాటక రాజకీయ పరిణామాల క్రమం.. ► మే 12: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ► మే 15: వెలువడిన ఎన్నికల ఫలితాలు. 104 మంది సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, కాంగ్రెస్కు 78, జేడీఎస్కు 37 సీట్లు. ► ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీతోపాటు కాంగ్రెస్–జేడీఎస్ కూటమి సంసిద్ధత. ► మే 16: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని కోరిన గవర్నర్ వజూభాయ్ వాలా. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని యడ్యూరప్పకు ఆహ్వానం. ► దీనికి వ్యతిరేకంగా అదే రోజు సాయంత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ► మే 16, 17: అర్ధరాత్రి తర్వాత కాంగ్రెస్ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ► యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ ► సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం ► మే 18: మే 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు బలం నిరూపించుకోవాలని యడ్యూరప్పకు సుప్రీంకోర్టు ఆదేశం ► ప్రొటెం స్పీకర్గా బోపయ్య నియామకంపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్–జేడీఎస్. ► మే 19: విశ్వాస పరీక్ష కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు. బోపయ్య నియామకానికి సమర్థన. ► సాయంత్రం 4 గంటలకు: ‘విశ్వాస పరీక్ష ఎదుర్కోలేను. రాజీనామా చేస్తా..’ అని ప్రకటించిన యడ్యూరప్ప. -
కాంగ్రెస్ ఆపద్బాంధవుడు శివకుమార్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ దగ్గర్నుంచి.. శనివారం బలపరీక్ష జరిగేంతవరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. శివకుమార్ ఒక్కళిగ సామాజికవర్గానికి చెందినవారు. కననపుర ఎమ్మెల్యే అయిన శివకుమార్ గతంలో ఇంధనశాఖ మంత్రిగా చేశారు. విలాస్రావ్ ప్రభుత్వానికి అండ మహారాష్ట్రలో 2002లో అప్పటి కాంగ్రెస్ సీఎం విలాశ్రావ్ దేశ్ముఖ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ కొలువుదీరి ఉంది. దీంతో ఎస్ఎం కృష్ణ కేబినెట్లో మంత్రిగా ఉన్న శివ మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్కు తరలించి కాపాడారు. శివ తొలిసారిగా 1989లో సాతనూరు నియోజకవర్గంలో దేవెగౌడను ఓడించి సంచలనం సృష్టించారు. దీంతో 1990లో అప్పటి సీఎం బంగారప్ప ఆయన్ను జైళ్లు, హోంగార్డుల శాఖమంత్రిగా నియమించారు. 2002 లోక్సభ ఎన్నికల్లో దేవెగౌడ మీద పోటీచేసి ఓడిపోయిన శివకుమార్.. రెండేళ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేవెగౌడపై తేజస్వినీ అనే జర్నలిస్టును గెలిపించి ప్రతీకారం తీర్చుకున్నారు. గుజరాత్ ఎమ్మెల్యేల క్యాంప్కు నేతృత్వం 2017 చివర్లో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ను ఓడించాలని బీజేపీ ప్రయత్నించిన నేపథ్యంలో శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్లో దాచిఉంచారు. ఈ సమయంలో శివతో పాటు ఆయన సన్నిహితులపై ఐటీ శాఖ భారీఎత్తున దాడులు నిర్వహించింది. తాజాగా కర్ణాటక సంక్షోభం నేపథ్యంలోనూ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం శివకే అప్పగించింది. -
కర్ణాటక: బీజేపీకి అసలు సవాలు ఇదే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో గత నాలుగు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశ రాజకీయాలపై పెను ప్రభావాన్నే చూపనున్నాయి. ఇవి రాజకీయ శక్తుల పునరేకీకరణకు అవకాశం కల్పించాయి. లోక్సభ ఎన్నికలు దాదాపు 10 నెలలున్న ప్రస్తుత తరుణంలో కర్ణాటక పరిణామాలు కాంగ్రెస్, బీజేపీల్ని ఆలోచనలో పడేశాయి. తనను ఏకాకిని చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని బీజేపీకి, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు చాలా అవసరమని కాంగ్రెస్కు కర్ణాటక రాజకీయం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. గత వారం రోజుల పరిణామాలతో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య వైరం మరింత తీవ్రమవడం ఖాయంగా కన్పిస్తోంది. కుమారస్వామి ప్రమాణంతో బీజేపీకి సవాలు బుధవారం జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి బీజేపీకి అసలు సవాలు మొదలవుతుంది. ప్రమాణస్వీకారం వేదికగా ప్రతిపక్ష పార్టీల నేతలు కలిసే అవకాశముంది. రాహుల్ గాంధీతో పాటు.. బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులతో పాటు సైద్ధాతికంగా కలిసివచ్చే పార్టీల నేతల్ని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఇదే వేదికగా బీజేపీ ఏకాకిని చేసేందుకు వీరంతా ముందడుగు వేయవచ్చు. ప్రాంతీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల మేరకు ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోతుందని.. 11 పెద్ద రాష్ట్రాల్లో తమను ఢీకొట్టే సత్తా ఆ పార్టీకి లేదని బీజేపీ సమర్ధించుకుంటోంది. ప్రస్తుతం పంజాబ్, మిజోరం, పుదుచ్చేరిల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. తాము కర్ణాటకలో మంచి పనితీరు కనపర్చామని, ఉత్తరాది పార్టీ అన్న ముద్ర చెరిపేసుకున్నామనేది ఆ పార్టీ వాదన. ప్రాంతీయ పార్టీలతో కలిసి... మరోవైపు బీజేపీని నేరుగా ఢీకొట్టాల్సిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. సైద్ధాంతికంగా కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగాలని 84వ ప్లీనరీలో తీర్మానించిన విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి ఒకరు గుర్తు చేశారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులతో ముందుకు వెళ్లకపోతే ఆ పార్టీకి నిరాశే మిగులుతుందని, కర్ణాటకను లౌకిక శక్తులు నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. కర్ణాటకలో కొత్తగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని, ఇరు పార్టీల మధ్య విభేదాలతో కూలిపోతుందని, ఆ పరిస్థితి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమకు సాయపడుతుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాల స్పందిస్తూ.. ప్రస్తుతం బీజేపీని నిలువరించకపోతే.. లౌకిక శక్తులకు అతి పెద్ద దెబ్బగా మారుతుందని, నరేంద్ర మోదీ నేతృత్వంలో సమాజం మరింత చీలిపోతుందని అన్నారు. -
కర్ణాటకంలో కాంగ్రెస్ దూకుడు
కర్ణాటక రాజకీయ క్రీడలో ప్రస్తుతానికి కాంగ్రెస్ విజయం సాధించింది. గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా.. అధికారం చేపట్టలేకపోయిన వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకున్న కాంగ్రెస్.. కర్ణాటకలో తమ వ్యూహాలను పకడ్బందీగా అమల్లో పెట్టింది. ప్రచారంలోనూ దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్.. విజయంపై తొలి నుంచి ధీమాగానే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందే ప్రచార రంగంలోకి దూకింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు దఫాలుగా రాష్ట్రాన్ని చుట్టేశారు. మరోవైపు సిద్దరామయ్య ఇమేజ్, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అంతగా లేని వ్యతిరేకత తమకు కలసి వస్తాయని కాంగ్రెస్ ఆశించింది. రాహుల్ దేవాలయాల సందర్శన, లింగాయత్లకు మైనారిటీ హోదా.. తదితరాలు కూడా ఓట్లు కురిపిస్తాయనుకుంది. కానీ ఫలితాలు వేరుగా వచ్చాయి. సాధారణంగా అయితే, ఓటమిని అంగీకరించి, మౌనంగా ఉండే కాంగ్రెస్.. ఈసారి ఊహించని దూకుడును ప్రదర్శించింది. ఫలితాలు వెలువడుతుండగానే రంగంలోకి దిగింది. రాహుల్ ఇంట్లో జరిగిన ‘లంచ్ మీట్’లో ప్లాన్ బీని సిద్ధం చేసింది. ఫలితాలకు ముందు రోజే బెంగళూరు చేరుకున్న ఆజాద్ ద్వారా జేడీఎస్తో రాయబారం నడిపింది. ప్రభుత్వ ఏర్పాటులో కలసి నడుద్దామని, జేడీఎస్కు మద్దతిచ్చేందుకు సిద్దమని సమాచారం పంపింది. సీఎంగా కుమారస్వామి ఉంటారన్న డిమాండ్ సహా జేడీఎస్ నుంచి వచ్చిన డిమాండ్లకు వెంటనే ఆమోదం తెలిపింది. సీనియర్ నేతలు ఆజాద్, అశోక్ గెహ్లాట్లు స్వయంగా కాంగ్రెస్ ప్రణాళికను దగ్గరుండి మరీ అమలు చేసేలా చూసింది. ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో గవర్నర్ వద్దకు కుమారస్వామితో పాటు ఆజాద్నూ పంపించింది. లాస్ట్ ‘రిసార్ట్’..: ఇప్పుడు తమ ఎమ్మెల్యేలతో పాటు జేడీఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాంగ్రెస్కు ప్రధాన సమస్యగా మారింది. ఎమ్మెల్యేలు చేజారకుండా రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. ఇలాంటి విషయాల్లో అనుభవజ్ఞుడైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్కు ఈ బాధ్యతను అప్పగించింది. తొలుత బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్లో ఎమ్మెల్యేలను భద్రంగా దాచిన శివకుమార్, మరింత భద్రత కోసం అనూహ్యంగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తరలించి, బలపరీక్ష రోజే(శనివారం) అసెంబ్లీకి చేరుకునేలా ప్రణాళిక రచించారు. అంతకుముందు, వారిని కొచ్చికి తరలిస్తున్నట్లుగా లీకులిచ్చి, గందరగోళం సృష్టించారు. ‘మిస్’ అయిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప గౌడను కూడా మళ్లీ సొంత గూటికి తెచ్చారు. ఇలా అనూహ్యంగా దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్ మొత్తానికి బీజేపీకి చెక్ పెట్టింది. ఈ మొత్తం వ్యూహాన్ని సోనియా గాంధీ, రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా కూడా స్వయంగా పర్యవేక్షించారు. కోర్టులోనూ క్రియాశీలకంగా.. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన తరువాత కూడా కాంగ్రెస్ శీఘ్రంగా స్పందించింది. పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖ న్యాయవాదులైన అభిషేక్ మను సింఘ్వీ, చిదంబరంలను రంగంలోకి దింపింది. యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని, బలనిరూపణకు 15 రోజుల గడవు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. బుధవారం అర్ధరాత్రే సుప్రీంకోర్టు తలుపు తట్టి, తమ పిటిషన్ను విచారించాలని కోరింది. దాంతో అప్పటికప్పుడు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన వాదనలు తెల్లవారే వరకు నడిచాయి. కానీ యెడ్డీ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆ తరువాత ఇరుపక్షాల వాడీవేడి వాదనల అనంత రం ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును పక్కనబెట్టి, శనివారం సాయంత్రం 4 గంటలకు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని యడ్యూరప్పను ఆదేశించింది. ఈ తీర్పు కాంగ్రెస్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. – సాక్షి నేషనల్ డెస్క్ -
23న కుమారస్వామి ప్రమాణం
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి మే 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడు రోజులకే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో.. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి శాసనసభా పక్ష నేతగా ఉన్న కుమారస్వామిని శనివారం రాత్రి గవర్నర్ వజుభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ‘గవర్నర్ ఆహ్వానం మేరకు ఆయనను కలుసుకున్నాను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం మే 15న సమర్పించిన వినతిపత్రం మేరకు మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు’ అని కుమార స్వామి చెప్పారు. గవర్నర్ను కలిసిన అనంతరం రాజ్భవన్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15 రోజుల్లో సభలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారని, అంతకంటే ముందుగానే బలపరీక్షకు వెళ్తామని తెలిపారు. మే 21న కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉండవచ్చని తొలుత చెప్పిన ఆయన.. కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం మే 23న ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. అందుకు కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. మే 21న రాజీవ్ గాంధీ వర్ధంతి నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని మే 23కు మార్చారని జేడీఎస్ నాయకుడొకరు చెప్పారు. ‘మే 24న బలపరీక్షకు వెళ్లాలన్న అంశంపై కాంగ్రెస్తో చర్చించాం’ అని కుమారస్వామి పేర్కొన్నారు. మే 21న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి ధన్యవాదాలు చెపుతానని, అలాగే కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన ఎంత మంది మంత్రులుగా ఉండాలన్న అంశంపై వారితో చర్చిస్తానని ఆయన తెలిపారు. విపక్ష నేతలకు ఆహ్వానం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించామని కుమారస్వామి చెప్పారు. యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాయావతి, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర, పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్–జేడీఎస్లు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాయని తెలిపారు. మరోసారి బీజేపీ తమ ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన కుమార స్వామి.. ‘వారు ఇబ్బందులు సృష్టిస్తారన్న విషయం తెలుసు. వాటిని తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. -
జస్టిస్ ఏకే సిక్రీ (సుప్రీంకోర్టు) రాయని డైరీ
యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం నుంచి యడ్యూరప్ప రాజీనామా వరకు గత రెండు రోజులుగా రాజకీయాలపై క్షణక్షణానికీ నాకు ఉత్కంఠభరితంగా గౌరవభావం పెరిగిపోతోంది! పాలిటిక్స్లోని గొప్పదనం ఇదేనేమో. బలం లేనివాళ్లు బలం చూపిస్తామంటారు. బలం అసలే లేనివాళ్లు ‘చూస్తాం. ఎలా చూపిస్తారో’ అంటారు! ఆ రోజు.. బాబ్డే, భూషణ్, నేను.. బెంచి మీద ఉన్నాం. ముకుల్ రొహత్గీ మా ఎదురుగా ఉన్నాడు. యడ్యూరప్ప లాయర్ అతను. ‘‘మిస్టర్ రొహత్గీ.. మీ క్లయింట్ తన బలాన్ని ఎలా నిరూపించుకుంటారు?’’ అని జస్టిస్ భూషణ్ ప్రశ్నించారు. అదే ప్రశ్న నన్నూ తొలుస్తోంది. బహుశా బాబ్డేని కూడా తొలుస్తూ ఉండాలి. రొహత్గీ అనాసక్తిగా చూశాడు. ప్రశ్న అడగడంలో మాకున్న కుతూహలం.. సమాధానం చెప్పడంలో అతడికి కొంచెం కూడా లేనట్లుంది! ‘‘బలాన్ని ఎలా నిరూపించుకుంటారని ప్రశ్నిస్తున్నారా? లేక, ఎలా బలాన్ని నిరూపించుకుంటారని ప్రశ్నిస్తున్నారా మిస్టర్ జస్టిస్’’ అన్నాడు రొహత్గీ. ‘‘ఏమిటి మీరనుకుంటున్న తేడా ఆ రెండింటికీ మిస్టర్ రొహత్గీ?!’’ అని భ్రుకుటి ముడిచారు జస్టిస్ బాబ్డే. ‘‘బలాన్ని ఎలా నిరూపించుకుంటారు? అంటే.. నిరూపణకు మీకేం అర్హత ఉందని ప్రశ్నించినట్లు. ‘ఎలా బలాన్ని నిరూపించుకుంటారు?’ అంటే నిరూపణకు అంత బలం మీకుందా అని ప్రశ్నించినట్లు’’ అన్నాడు రొహత్గీ. రాజకీయాల మీద మళ్లీ నాకు గౌరవం పెరిగిపోయింది.రొహత్గీ లాంటి లాయర్ని యడ్యూరప్ప పెట్టుకున్నందుకు! ‘‘నిరూపణకు.. అంత బలం మీకుందా అని అడగడమే నా ఉద్దేశం మిస్టర్ రొహత్గీ. ఎక్కడి నుంచి వస్తారు మీ క్లయింటుకు ఆ పదీ పరకా ఎమ్మెల్యేలు!’’ అన్నారు జస్టిస్ భూషణ్. రొహత్గీ నవ్వుతూ చూశాడు. కాన్ఫిడెన్స్ పీక్స్లోకి వెళ్లిపోతే కనిపించే నవ్వు అది. ‘‘ఎక్కడి నుంచైనా వస్తారు మిస్టర్ జస్టిస్. గాలిలోంచి నేరుగా ఫ్లోర్లోకే వచ్చేస్తారు’’ అన్నాడు రొహత్గీ! అంతే తప్ప, కాంగ్రెస్ నుంచి, జేడీఎస్ నుంచి అనలేదు!! మళ్లీ నాకు పాలిటిక్స్ మీద ఉత్కంఠభరితంగా గౌరవం పెరిగిపోయింది. ఆ రెండు పార్టీల్లోంచి ఎమ్మెల్యేలు ‘గాలి’కి కొట్టుకొచ్చేస్తారని ఎంత భావయుక్తంగా చెప్పాడు! రొహత్గీ తర్వాత సింఘ్వీ టర్న్ వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ల లాయర్ అతను. ‘‘మీ వాదన ఏమిటి మిస్టర్ సింఘ్వీ?’’ అని అడిగారు జస్టిస్ బాబ్డే. ‘‘గవర్నర్ గాల్లోంచి చూసి భూమ్మీద బీజేపీ ఎమ్మెల్నేల్ని లెక్కేస్తున్నారు మిస్టర్ జస్టిస్. ఆయన్ని ఎవరైనా కిందికి దింపగలిగితే బాగుంటుంది’’ అన్నాడు సింఘ్వీ! అతడు కూడా రాజకీయాలపై నాకు ఏర్పడుతున్న గౌరవ భావాన్ని విపరీతంగా పెంచేశాడు. -మాధవ్ శింగరాజు -
గెలుస్తాననుకున్నా..!
బెంగళూరు: రాజీనామా చేసే ముందు, సీఎం యడ్యూరప్ప అసెంబ్లీలో ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. రాజీనామా చేయడం తథ్యమని నిర్ణయించుకున్న తరువాత చేసిన ఈ వీడ్కోలు ప్రసంగంలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిపై విమర్శలు గుప్పించారు. అధికారంలో కొనసాగితే రైతు సంక్షేమం కోసం పాటు పడ్తామనుకున్నానని, అది సాధ్యం కాకపోతున్నందుకు బాధపడ్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు అతిపెద్ద పార్టీగా బీజేపీకే పట్టం కట్టారని, కాంగ్రెస్, జేడీఎస్ కుట్రపూరితంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడి ప్రజాతీర్పును కాలరాశాయన్నారు. అయినా, రాష్ట్రాభివృద్ధికోసం కలసి వస్తారన్న ఆశతో కొందరు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడానని ఆయన వెల్లడించారు. విశ్వాసపరీక్షలో విజయం సాధిస్తాననుకున్నానన్న యడ్యూరప్ప.. ఆశించినవన్నీ జరగవు కదా! అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేసిన ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కాంగ్రెస్–జేడీఎస్ అవకాశవాద కూటమి. కుట్ర చేసి ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కారు. మీరు ఎమ్మెల్యేలను బంధించారు. పాపం వారు తమ కుటుంబసభ్యులతోనూ మాట్లాడుకోకుండా చేశారు. మీ ఎమ్మెల్యేలంతా వాళ్ల కుటుంబ సభ్యులను చూసుకునే అవకాశం దక్కినందుకు ఇవాళ సంతోషంగా ఉండుంటారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడాను. ఇది వాస్తవం. ఆత్మ ప్రబోధం మేరకే ఓటేయాలని వారిని కోరాను. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం ఉన్న పార్టీ. అందుకే ఆ ఎమ్మెల్యేలు నేటి రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకుంటారనుకున్నాను. కేంద్రంలో మోదీ ప్రభుత్వ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని వారితో అన్నాను. కొందరు ఇందుకు అంగీకరించారు కూడా. కాంగ్రెస్కు గానీ, జేడీఎస్కు గానీ ప్రజామోదం దక్కలేదనేది వాస్తవం. అతిపెద్ద పార్టీగా నిలిచినందునే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించారు. నావి ప్రజా రాజకీయాలు. ఇకపైనా నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఈ విశ్వాస పరీక్షను అగ్నిపరీక్షలా భావించాను. ఇదేం తొలిసారి కాదు. నా జీవితమంతా అగ్నిపరీక్షే. ఇద్దరు సభ్యులున్న బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో అడుగడుగునా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మనం అనుకునేది వేరు. దేవుడి ఆలోచన వేరు’ అని వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు ‘నా చివరి శ్వాస వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటా. ఇక కర్ణాటక రాష్ట్రమంతా పర్యటిస్తా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్సభ స్థానాలను, అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలను బీజేపీ గెలుచుకోవటంలో చిత్తశుద్ధితో పనిచేస్తా. ఈ సీట్లను ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇస్తా. నేను పోరాడుతూనే పైకొచ్చాను. నాకు అధికారం ఇవ్వకపోతే చనిపోతానని ఒకరు (కుమారస్వామి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ)చెప్పారు. నాకు అధికారం దక్కినా, దక్కకపోయినా నేను మాత్రం అలా అనను. మన కాంగ్రెస్ మిత్రుల కుట్ర కారణంగా ప్రజాతీర్పు, ప్రజాస్వామ్యం ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో నేను విశ్వాస పరీక్షకు పట్టుబట్టడం లేదు. నేను రాజీనామా చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై ప్రజల వద్దకు వెళ్లి న్యాయం అడుగుతాను. గవర్నర్ దగ్గరికెళ్లి రాజీనామా సమర్పించబోతున్నాను’ అని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సందర్శకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్తో కరచాలనం చేసి సభ నుంచి యడ్యూరప్ప బయటకెళ్లారు. నాడు వాజ్పేయి..నేడు యడ్యూరప్ప! అది 1996.. కేవలం 13రోజుల పాటు ప్రధానిగా ఉన్న వాజ్పేయి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే రాజీనామాకు ముందు ఆయన చేసిన ఉద్వేగభరిత ప్రసంగం దేశ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలిచిపోయింది. నాటి ప్రసంగాన్ని డీడీ ప్రత్యక్ష ప్రసారంలో అందించటంతో దేశ ప్రజల మనసుల్లో అది చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈ సుదీర్ఘ, ఉద్వేగపూరిత ప్రసంగంతో సభ్యుల విశ్వాసాన్ని పొందలేకపోయినా.. దేశ ప్రజల నమ్మకాన్ని వాజ్పేయి చూరగొన్నారు. ‘నేను పదవి కోసం పాకులాడుతున్నానని అంటున్నారు. ప్రజలు మా పార్టీకి అత్యధిక సంఖ్యలో సీట్లు కట్టబెడితే నేను అధికారానికి ఎందుకు దూరంగా ఉండాలి? ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు’ అంటూ వాజ్పేయి విపక్షాలకు చురకలు అంటించా రు. శనివారం నాడు అసెంబ్లీలోనూ యడ్యూరప్ప ఇదే రీతిలో మాట్లాడారు. ‘ప్రజలు మాకు 104 సీట్లు వరంగా ఇచ్చారు. ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంది. అధికారం లేకపోయినా నా జీవితం ప్రజలకు అంకితం. నేను యోధుడ్ని.. చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాను’ అని అన్నారు. -
ఢీ కొట్టని యెడ్డీ..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాల్లో ఐదురోజుల సస్పెన్స్కు తెరపడింది. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప.. కీలకమైన విశ్వాసపరీక్షకు ముందు బల నిరూపణ చేసుకోలేకపోతున్నానంటూ రాజీనామా చేశారు. గవర్నర్ వజూభాయ్ వాలా బలనిరూపణ కోసం యెడ్డీకి 15 రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్–జేడీఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు శనివారం సాయంత్రమే విశ్వాసపరీక్ష జరపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి నిరసనలు, ఆందోళనలు లేకుండానే.. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగింది. సభలో ఉద్వేగ భరిత ప్రసంగం చేసిన యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని బీజేపీయేతర విపక్ష నేతలు పేర్కొన్నారు. అనంతరం మమతా బెనర్జీ సహా వివి ధ పార్టీల అధ్యక్షులు కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు ఫోన్లో అభినందనలు తెలిపారు. కాగా, కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు రావాలంటూ.. జేడీఎస్ నేత కుమారస్వామిని గవర్నర్ ఆహ్వానించారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ సోనియా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మమత, కేసీఆర్, చంద్రబాబు తదితరులను కుమారస్వామి ఆహ్వానించారు. ఉదయం నుంచీ ఉత్కంఠ శనివారం ఉదయం నుంచీ బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం హైదరాబాద్లో బసచేసిన రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఉదయమే వేర్వేరు బస్సుల్లో బెంగళూరులోని ఓ హోటల్కు చేరుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల సమయంలో వీరిని పటిష్టమైన భద్రత నడుమ అసెంబ్లీకి తీసుకొచ్చారు. అక్కడ ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్య.. ఎన్నికైన అందరు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదంతా జరుగుతుండగానే.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ మిత్రులైన బీజేపీ సభ్యులతోనూ మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ హోటల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక భద్రత నడుమ అసెంబ్లీకి తీసుకొచ్చారు. అనంతరం సిద్దరామయ్య కాంగ్రెస్ సభ్యులకు విప్ జారీ చేశారు. మరోవైపు, వీలైనంత ఎక్కువ మందిని లాగేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే సాయంత్రం 4 గంటలకు విశ్వాస పరీక్ష జరగాల్సి ఉండగా.. ఓ గంటముందు నుంచీ బీజేపీలో విశ్వాసం సన్నగిల్లటం ప్రారంభమైంది. యడ్యూరప్పే రంగంలోకి దిగినా.. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినప్పటినుంచీ విశ్వాస పరీక్షలో గెలుస్తామంటూ యడ్యూరప్ప ధీమాగా కనిపించారు. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన గానీ, బీజేపీ నేతలు గానీ పరీక్షలో నెగ్గటంపై నమ్మకంగా కనిపించలేదు. బలపరీక్షలో నెగ్గేందుకు ఏడుగురు అదనపు ఎమ్మెల్యేల బలం అవసరం ఉండగా.. జేడీఎస్, కాంగ్రెస్ కూటమిలోని ఎమ్మెల్యేలను ఒప్పించటంలో యడ్యూరప్ప బృందం విఫలమైంది. యడ్యూరప్పే స్వయంగా రంగంలోకి దిగి పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడినా పెద్దగా లాభం లేకపోయింది. కూటమి ఎమ్మెల్యేల్లో యెడ్డీ సహా పలువురు బీజేపీ నేతలు మాట్లాడిన ఆడియో టేపులను కాంగ్రెస్ విడుదల చేయటం సంచలనం రేపింది. వారికి మంత్రి పదవులు ఇస్తామని యడ్యూరప్ప స్వయంగా భరోసా ఇవ్వడంతో బలనిరూపణలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ను బీజేపీ బంధించిందని ఆరోపణలు రాగా.. ఈయన సరిగ్గా యడ్యూరప్ప ప్రసంగానికి ముందు సభలో ప్రవేశించారు. అసెంబ్లీలో ప్రకటన అనంతరం రాజ్భవన్ చేరుకున్న యడ్యూరప్ప.. గవర్నర్ వజూభాయ్ వాలాకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. యెడ్డీ రాజీనామాతో జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రి బాధ్యతలు (కాంగ్రెస్ మద్దతుతో) చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికైన 221 సీట్లలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి 117 ఎమ్మెల్యేల బలముంది. న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు: ఆజాద్ గులాంనబీ ఆజాద్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ‘గవర్నర్ మా రెండు పార్టీలను (జేడీఎస్, కాంగ్రెస్) చీల్చేందుకు యడ్యూరప్పకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ.. ఎమ్మెల్యేల బేరసారాలు జరగకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా న్యాయవ్యవస్థ వ్యవహరించినందుకు కృతజ్ఞతలు’ అని ఆజాద్ పేర్కొన్నారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన యడ్యూరప్ప 2007లో ఏడు రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అనంతరం 2008లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాక దాదాపు మూడేళ్లపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదురోజుల సస్పెన్స్ మే 15న వెల్లడైన ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో కన్నడ నాట అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఫలితాలు వెలువడుతుండగానే జేడీఎస్కు సంపూర్ణ మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవటంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. కూటమి కంటే ముందే యడ్యూరప్ప గవర్నర్ను కలసి అతిపెద్ద పార్టీగా నిలిచిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరారు. అటు, మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువమందే తమకు మద్దతుగా ఉన్నారంటూ జేడీఎస్, కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలసి తమ ఎమ్మెల్యేల జాబితాను ఇచ్చారు. కొంత సమయం తీసుకున్న గవర్నర్ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం, బల నిరూపణకు 15 రోజుల గడువు ఇవ్వడంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అర్ధరాత్రి కోర్టు తలుపులు తట్టి.. మరునాడు జరగాల్సిన యెడ్డీ ప్రమాణస్వీకారాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించింది. తమ అభ్యర్థులు చేజారకుండా బౌన్సర్లతో పటిష్టమైన భద్రత నడుమ రిసార్టులు, హోటళ్లలో వారిని ఉంచింది. అయితే.. యెడ్డీ ప్రమాణస్వీకారానికి అడ్డుతగలబోమన్న సుప్రీంకోర్టు.. శనివారం సాయం త్రం 4కు బలనిరూపణ జరగాల్సిందేనని ఆదేశించింది. దీంతో రాత్రికి రాత్రి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్కు తరలించారు. శుక్రవారమంతా వీరితో సమావేశమై విశ్వాస పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. అయినా ఇరు పార్టీల నేతలకు మనస్సులో ఎక్కడో శంక. తమ ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో చేజారతారన్న అనుమానం వెంటాడా యి. కానీ శనివారం అసెంబ్లీలో ఎలాంటి నిరసనలు లేకుండానే యడ్యూరప్ప రాజీనామాను ప్రకటించటంతో ఐదురోజుల థ్రిల్లర్ ప్రస్తుతానికి ముగిసినట్లే కనబడుతోంది. -
అందరూ అందరే!
త్రికాలమ్ కర్ణాటకలో సంభవిస్తున్న పరిణామాలు ప్రజాస్వామ్యప్రియులకు పెద్దగా సాంత్వన కలిగించవు. సంఖ్యాబలం లేకపోయినా జబర్దస్తీగా అధికారం హస్తగతం చేసుకోవడానికి బీజేపీ నాయకత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు వమ్ము చేయడం సంతోషించదగినదే. ముఖ్యమంత్రిగా 55 గంటల క్రితం యడ్యూరప్ప ప్రమాణం చేసినప్పటి నుంచీ రాజీనామా చేసేవరకూ ఉత్కంఠ కలిగించే అనేక ఘటనలు జరిగాయి. 222 మంది సభ్యులు ఉండే కొత్త శాసనసభలో 104మంది సభ్యులు మాత్రమే కలిగిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ వజూభాయ్ ఆహ్వానించడం అంటే ఎంఎల్ఏల ఫిరాయింపులకూ, బేరసారాలకూ అవకాశం ఇవ్వడమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. బెంగళూరు నుంచి కొచ్చికి శుక్రవారం సాయంత్రం ప్రయాణమైన కాంగ్రెస్, జేడీ (ఎస్) ఎంఎల్ఏలు తెల్లవారే సరికి హైదరాబాద్లో తేలారు. ఐదారు నక్షత్రాల హోటళ్ళలో బస చేశారు. వారితో సమాలోచనలు జరపడానికి బెంగళూరు నుంచి గులాంనబీ ఆజాద్, సిద్ధరామయ్య, కుమారస్వామి ప్రభృతులు వచ్చారు. సుప్రీం తీర్పుతో హుటాహుటిన బెంగళూరు తిరిగి వెళ్ళారు. శనివారం ఉదయం శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతూ ఉండగానే ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల ఆచూకీ తెలియడం లేదనీ, ఎనిమిది మంది బీజేపీకి మాట ఇచ్చేశారనీ బ్రేకింగ్న్యూస్ రూపంలో టీవీ చానళ్ళు ఊదరగొట్టాయి. బెంగళూరులో, ఢిల్లీలో సర్వాత్రా ఉద్వేగభరితమైన దృశ్యాలు. జాతి యావత్తూ కర్ణాటక రాజధానిపైన దృష్టి నిలిపిన సందర్భం. భోజన విరామం తర్వాత ప్రమాణాలు తిరిగి ప్రారంభమైనప్పుడు ఉదయం అదృశ్యమైన ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులూ ప్రత్యక్షమైనారు. అంతలోనే యడ్యూరప్ప ఉద్వేగభరితమైన ప్రసంగం చేసి, పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించి సభ నుంచి విసవిసా వెళ్ళిపోయారు. తాత్కాలిక సభాపతి సైతం జాతీయగీతం ఆలపించే వరకూ వేచి ఉండకుండానే నిష్క్రమించారు. న్యాయవ్యవస్థ పట్ల ద్వంద్వ వైఖరి న్యాయస్థానాలు, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానం ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం జేడీ (ఎస్), కాంగ్రెస్ల పిటీషన్లపైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బీజేపీకి అశనిపాత సదృశమైన నిర్ణయాలు వెలువరించింది. బీజేపీ అడిగిన వరాలలో ఒక్కటీ మంజూరు చేయకుండా యడ్యూరప్ప ఆశలు అడియాసలు చేసింది. యడ్యూరప్పను ఆహ్వానిం చాలన్న గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టకపోయినా బలనిరూపణకు రెండువారాల వ్యవధి ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించలేదు. ఒక్క వారమైనా గడువు ఇవ్వాలంటూ బీజేపీ చేసిన వేడుకోలునూ అంగీకరించలేదు. కేవలం 24 గంటల వ్యవధి ఇచ్చింది. సీక్రెట్ బ్యాలట్ నిర్వహించాలన్న కోర్కెకు సైతం ససేమిరా అన్నది. గతంలో యడ్యూరప్పకు అనుకూలించే విధంగా వ్యవహరించాడంటూ న్యాయస్థానం మొట్టికాయలు తిన్న బోపయ్య చేత తాత్కాలిక సభాపతిగా గవర్నర్ ప్రమాణం చేయించడాన్ని కాంగ్రెస్, జేడీ(ఎస్)లు శనివారం ఉదయం సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. న్యాయమూర్తులు బోపయ్య నియామకాన్ని రద్దు చేయలేదు కానీ అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం చేయాలని ఆదేశించారు. బీజేపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. తమ ఎంఎల్ఏలను ప్రభావితం చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపులను విడుదల చేసింది. ఇదంతా చూసిన ప్రజలకు రాజకీయాలంటే వెగటు పెరిగి ఉంటుంది. గోవాలో దిగ్విజయ్సింగ్ నిర్వాకంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ఈసారి ఆజాద్నీ, గెహ్లాట్నీ బెంగళూరు పంపించి బీజేపీ ఆటకట్టించింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారికి అండగా నిలిచారు. జేడీ (ఎస్), కాంగ్రెస్లకు చెందిన శాసనసభ్యులు బీజేపీకి ఓటు వేసే అవకాశం లేదని గ్రహించిన యడ్యూరప్ప రాజీనామా చేయాలనుకోవడం సముచి తమే. ఈ నిర్ణయం యడ్యూరప్పదైనా, ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలది అయినా అభినందనీయమే. ప్రజాస్వామ్యాన్ని మరింత అపహాస్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించినందుకు సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఇతర నాయకులు ధన్యవాదాలు చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలంటూ రాజ్యసభలో నోటీసు ఇచ్చి, అందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనుమతించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసి, చివరికి పరిస్థితులు అనుకూలించక దాన్ని ఉపసంహరించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడిందంటూ స్తుతించడం విడ్డూరం. కర్ణాటక వ్యవహారంలో నిక్కచ్చిగా వ్యవహరించడం వల్ల సర్వోన్నత న్యాయస్థానం పట్ల ప్రజలకు గౌరవం పెరిగింది. అందులో సందేహం లేదు. కానీ తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు మెచ్చుకోవడం, ప్రతికూలంగా వచ్చినప్పుడు పక్షపాతం ఆపాదించడం రాజకీయ నాయకులకు తగదు. అలాగే రాజ్యాంగాన్ని అదే పనిగా ఉల్లంఘించిన నాయకులు కర్ణాటక పరిణామాలపై వ్యాఖ్యానించడం, పార్టీ ఫిరాయింపులను నిరోధించినందుకు సుప్రీంకోర్టును అభినందించడం మరో వింత. 23 మంది ప్రతిపక్ష ఎంఎల్ఏలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి రాజ కీయ నాయకుడికి రాజ్యాంగబద్ధతపైనా, రాజకీయ విలువలపైనా మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? 1996లో 13 రోజులు అధికారంలో ఉండి బలం నిరూపించుకోలేక రాజీనామా చేసిన వాజపేయితో యడ్యూరప్పను ఒకందుకు పోల్చవలసి వస్తున్నది. ఇద్దరి వ్యక్తిత్వాలూ, నైతిక స్థాయీ, దృక్ప«థాలూ వేరైనప్పటికీ లోక్సభలో నాటి పరిస్థితులకీ, కర్ణాటక శాసనసభలో నేటి వాతావరణానికీ ఎంతో కొంత సామ్యం ఉంది. నాడు వాజపేయి లోక్సభలో బలం నిరూపించుకోలేక వైదొలిగిన తర్వాత ప్రధానమంత్రిగా దేవెగౌడ అందలం ఎక్కారు. ఇప్పుడు యడ్యూరప్ప రాజీనామా అనంతరం ముఖ్యమంత్రిగా దేవెగౌడ కుమారుడు కుమారస్వామి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అప్పుడు దేవెగౌడ 46 మంది ఎంపీల బలంతో ప్రధాని కాగలిగితే ఇప్పుడు కుమారస్వామికి తనతో సహా 37 మంది జేడీ (ఎస్) ఎంఎల్ఏలు ఉన్నారు. ఇద్దరూ కాంగ్రెస్ మద్దతు స్వీకరించినవారే. దేవెగౌడ సంవత్సరం తిరగకుండానే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న కారణంగా పదవీచ్యుతులైనారు. కుమారస్వామికి కాంగ్రెస్ మద్దతు ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రశ్న. అనిశ్చితికీ, అస్థిరతకూ దారితీసే అంశాలు అనేకం కర్ణాటక రాజకీయాలలోనే నిక్షిప్తమై ఉన్నాయి. రాహుల్ తప్పిదం సమాజాన్నీ, పార్టీలనూ విభజించే ప్రమాదభూయిష్టమైన రాజకీయాన్ని అన్ని పార్టీలూ బాధ్యతారహితంగా ప్రోత్సహించాయి. కావేరీ నీటి కంటే విరివిగా ఎన్నికలలో డబ్బు ఖర్చు చేశాయి. చుట్టుపక్కల రాష్ట్రాలలో ఏటీఎంలలో డబ్బులు లేకుండా, రెండువేల రూపాయల నోట్లు మచ్చుకైనా కనిపించకుండా చేశాయి. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు యధేచ్ఛగా చేసుకున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత దూషణలతో, నిందారోపణలతో ప్రచారపర్వాన్ని వేడెక్కించారు. ఎన్నికలలో గెలుపొందేందుకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తారనీ, గెలిచినవారిని వెంటనే కొనుగోలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరనీ, అందుకు గవర్నర్ ఎంత వ్యవధి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారనీ ప్రజలకు అర్థమైపోయింది. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికల పట్లా, ప్రజాస్వామ్యం పట్లా సాధారణ ప్రజలకు విశ్వాసం ఏముం టుంది? కర్ణాటకంలో ఒక అంకానికి తెర పడింది. రెండో అంకానికి తెర లేవబోతున్నది. జేడీ(ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా సోమవారం కంఠీరవ స్టేడియంలో పదవీబాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్కు చెందిన దళిత నాయకుడు జి. పరమేశ్వర ఉంటారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్యను సంపూర్ణంగా బలపరిచే ప్రయత్నంలో రాహుల్గాంధీ ఒకానొక రాజకీయ తప్పిదం చేశారు. 2006లో జేడీ(ఎస్) నుంచి వైదొలిగి కాంగ్రెస్లో చేరినప్పటి నుంచీ సిద్ధరామయ్యకూ, దేవెగౌడ కుటుంబానికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య దాన్ని ప్రదర్శించడమే కాకుండా రాహుల్తో కూడా దేవెగౌడ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. జేడీ (ఎస్)లో ‘ఎస్’అంటే సంఘ్ పరివారమనీ, జేడీ (ఎస్) బీజేపీకి ‘బీ–టీమ్’అనీ రాహుల్ నిందాస్త్రాలు సంధించారు. తన బొందిలో ప్రాణం ఉండగా బీజేపీతో పొత్తు పెట్టుకోనంటూ దేవెగౌడ పలుమార్లు ప్రకటించినా రాహుల్ వినిపించుకోలేదు. బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ అధినేత మాయావతితో ప్రచారం చేయించినా జేడీ (ఎస్) నాయకత్వాన్ని విశ్వసించలేదు. లోగడ దేవెగౌడ బీజేపీ పట్ల ఇదే విధమైన ప్రతికూలత వెలిబుచ్చారనీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కుమారస్వామితో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటానని ప్రకటించారనీ, తీరా కుమారస్వామి అదే బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆనందించారనీ విమర్శకులు గుర్తు చేస్తారు. రాహుల్ కాంగ్రెస్ అధినేతగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలనీ, ప్రతి లోక్సభ స్థానంలోనూ బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా అత్యంత యోగ్యుడైన అభ్యర్థిని ప్రతిపక్షాలు అన్నీ కలిసి నిలబెట్టాలనీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదిస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత పెంపొం దించవలసిన రాహుల్ దేవెగౌడ కుటుంబంపైన మితిమీరి దాడి చేయడం అవివేకం. ఆ స్థాయిలో విరుచుకుపడకుండా ఉంటే నేటి మైత్రి అంత కృతకంగా కనిపించేది కాదు. మొత్తం మీద జేడీ (ఎస్), కాంగ్రెస్లు దక్షిణ కర్ణాటకలో హోరాహోరీ పోరాడాయి. అక్కడ బీజేపీ ఉనికి తక్కువ. ఆ విధంగా ద్వేషం పంచుకున్న రెండు పక్షాలు కేవలం బీజేపీని నిలువరించడంకోసం ఒకే తాటిమీదికి రావడం అవకాశవాదం అనాలో, సమయజ్ఞత అనాలో తేల్చుకోవడం కష్టం. రేపటి నుంచి ఈ సంకీర్ణం అంతర్గత విభేదాలను ఎట్లా పరిష్కరించుకుంటుందో, ప్రతిపక్ష బీజేపీని ఎట్లా ఎదుర్కొంటుందో మరి. కుమారస్వామి సారథ్యం విభజన రేఖలు స్పష్టంగా ఉన్నప్పటికీ సమైక్యంగా ఉంటామనీ, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనీ నమ్మబలికే నాయకులను నమ్మడం ఎట్లా అన్నది కర్ణాటక ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. ఒక వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరోవైపు సోనియా, రాహుల్ అత్యవసర సమాలోచన జరిపి జేడీ (ఎస్)కు షరతులు లేని మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. ఇదే ప్రాప్తకాలజ్ఞత. ఢిల్లీలో నిర్ణయించినంత మాత్రాన స్థానికంగా నిన్నటి వరకూ ఒకరిపైన ఒకరు పోరాడుకున్నవారు సఖ్యతతో ఉండగలరా? తమ శాసనసభ్యులు నైతిక విలువలను కాపాడారనీ, బీజేపీ ప్రలోభాలకు లొంగలేదనీ కాంగ్రెస్ అధినాయకత్వం కితాబు ఇచ్చింది. తెలంగాణలో ఫిరాయించిన కాంగ్రెస్ శాసనసభ్యులూ, శాసనమండలి సభ్యులూ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను వీడి టీడీపీ పంచన చేరిన శాసనమండలి సభ్యులూ నిక్షేపంగా ఉన్నారు. వారిపై అనర్హత వేటు వేయమని రాజ్యాంగ వ్యవస్థలపైన ఒత్తిడి తేవడంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ఇలా గొప్పలు చెప్పుకోవడం ఆత్మవంచన. యడ్యూరప్ప అధికారంలో కొనసాగి ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్, జేడీ (ఎస్)కు కర్ణాటకలో విజయావకాశాలు అధికంగా ఉండేవి. ఇప్పుడు అధికారం పంచుకుంటున్నాయి కనుక సంకీర్ణ భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తడం సహజం. ఆ మేరకు ప్రతిపక్షంలో ఉండే బీజేపీకి సానుకూల వాతావరణం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలకు గడువు ఏడాది మాత్రమే ఉన్నది కనుక కర్ణాటకలో ఎన్నికల వాతావరణం కొనసాగుతుంది. అప్పటి వరకైనా సంకీర్ణ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలన్న తాపత్రయం రెండు పార్టీలకూ ఉంటుంది. అదొక్కటే ఊరట. కె. రామచంద్రమూర్తి -
నాడు వాజపేయి..నేడు యడ్యూరప్ప....
అప్పుడు పార్లమెంటులో, ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీలో... అవే సన్నివేశాలు. అదే ఉద్వేగభరిత వాతావరణం..13 రోజుల పాటు ప్రధాని పదవిలో ఉండి విశ్వాస పరీక్షకుముందే భావోద్వేగ ప్రసంగం చేసి మరీ వాజపేయి రాజీనామా చేస్తే, ఇప్పుడు సరిగ్గా వాజపేయి బాటలోనే యడ్యూరప్ప నడిచే ప్రయత్నం చేశారు. ముచ్చటగా మూడురోజుల్లోనే బలపరీక్ష ఎదుర్కోకుండానే రాజీనామా చేయడమే కాదు అసెంబ్లీలో కంటతడి పెట్టుకున్నారు. నేను రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించి సభ నుంచి బయటకువెళ్లిపోతూ వెళ్లిపోతూ విజిటర్స్ గ్యాలరీలో ఉన్న కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్తో కరచాలనం చేసి మరీ వెళ్లిపోయారు. ఉద్వేగ భరితం వాజపేయి ప్రసంగం సరిగ్గా ఇరవై రెండేళ్ల క్రితం 1996 సంవత్సరంలో లోక్సభలో తీవ్ర భావోద్వేగానికి లోనైన నాటి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే పదవికిరాజీనామా చేశారు. సహజంగానే మంచి వక్త అయిన వాజపేయి అధికారానికి దూరమైనప్పటికీ తన ఉద్వేగ పూరితమైన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. కేవలం 13రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగిన వాజపేయి గద్దె దిగిపోతూ చేసిన ప్రసంగం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఒక కీలక ఘట్టం. నాటి ప్రసంగాన్ని దూరదర్శన్ లైవ్టెలికాస్ట్ చేయడంతో వాజపేయి ప్రసంగం ఇప్పటికీ ఎందరినో వెంటాడుతోంది. ఇలా చట్టసభల సమావేశాలను లైవ్ ఇవ్వడం కూడా అదే తొలిసారి. దీంతో వాజపేయి సభవిశ్వాసాన్ని పొందలేకపోయినప్పటికీ తన ప్రసంగం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. నాటి ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ, ఇతర పార్టీలమద్దతు కూడగట్టడంలో విఫలమైంది. దీంతో అప్పటి రాజకీయ పరిస్థితులపై వాజపేయి సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘నా మీద అందరూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.పదవి కోసం పాకులాడుతున్నానని అంటున్నారు. ప్రజలు మా పార్టీకి అత్యధిక సంఖ్యలో సీట్లు కట్టబెడితే నేను అధికారానికి ఎందుకు దూరంగా ఉండాలి. ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని అడిగే హక్కు మాకు ఉండదా ? ప్రజలు మాపై ఎంతో విశ్వాసంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీని చేస్తే, వారిని మోసగించాలా? ఈ యుద్ధభూమి నుంచి పారిపోవాలా ?‘అనిప్రశ్నించారు. ‘మీకు ఎంత శాతం ఓట్లు వచ్చాయని నన్ను అందరూ అడుగుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు ముఖ్యమా ? సీట్లు ముఖ్యమా ? మన పార్లమెంటరీవ్యవస్థలో నెగిటివ్ ఓట్లను ఎవరూ లెక్కపెట్టరు. అలాంటప్పుడు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు‘ అంటూ వాజపేయి విపక్షాలకు చురకలు అంటించారు.యడ్యూరప్ప కూడా సరిగ్గా వాజపేయి ప్రసంగాన్ని తలపించేలా ‘ప్రజలు మాకు 104 సీట్లు వరంగా ఇచ్చారు. ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంది. అధికారం లేకపోయినానా జీవితం ప్రజలకు అంకితం. నేను యోధుడ్ని.. చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాను‘ అని అన్నారు. ఇక వాజపేయి తన ప్రసంగం చివర్లో ‘నన్ను ఫాసిస్ట్ అని అంటున్నారు. కానీ నేను ప్రజాస్వామ్య యుతంగానే పోరాడుతున్నాను. ఎన్నికల్లో గెలుస్తున్నాను. అధికారం లేకపోయినా మాకున్న మార్గాల్లో మేము దేశ సేవ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మాకు మెజార్టీ లేనంత మాత్రానా, మేము మా మాతృభూమికి చేసిన సేవ ఏ మాత్రం తగ్గదు‘ అంటూ ఉద్వేగంగా ప్రసంగించి ఎందరినో కదిలించారు. ఇక యడ్యూరప్ప తన ప్రసంగంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో 28 లోక్సభ స్థానాలు గెలుచుకొని తామేమిటో చూపిస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. అచ్చంగా వాజపేయిని తలపించేలా యడ్యూరప్ప పదవి నుంచి వైదొలిగినప్పటికీ, వాజపేయి ఆ నాడు ప్రజలపై వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. వాజపేయి భావోగ్వేదానికి అప్పట్లో జాతి యావత్తు కదిలిపోయింది. ఆనాటి వాజపేయి ప్రసంగం చిరస్మరణీయం. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
కుమారస్వామి ప్రమాణ స్వీకారం: ఆ నేతలందరికి ఆహ్వానం
-
బీజేపీకి నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్!
బెంగళూరు: గత కొన్ని నెలలుగా ఎన్నో అంశాల్లో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న నటుడు ప్రకాష్ రాజ్.. తాజాగా బీజేపీకి మరో కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టకుండానే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయగా.. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ స్పందించారు. ‘ఆట మొదలు పెట్టకముందే అయిపోయింది. కర్ణాటక కాషాయ రంగు పులుకోవడానికి ఇష్ట పడటం లేదు. అయినా ఎంతో రంగులమయంగా ఉంది. ఆట అప్పుడే ముగిసింది. 56వ గంట గురించి ఆలోచించొద్దు. 55వ గంటకే వాళ్ల ఆట ముగిసింది. జోక్స్ను పక్కనపెట్టి చూడండి. మరిన్ని చెత్త రాజకీయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ’ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మరోవైపు యడ్యూరప్ప రాజీనామాతో కాంగ్రెస్-జేడీఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కేబినెట్ కూర్పుపై ఆదివారం కాంగ్రెస్ నేతలతో కాబోయే సీఎం కుమారస్వామి చర్చించనున్నారు. సోమవారం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన శనివారం రాత్రి గవర్నర్ను కలుసుకుని పరిస్థితి వివరించారు. KARNATAKA is not going to be SAFFRON...but will continue to be COLOURFUL....Match over before it began...forget 56 couldn’t hold on for 55 hours..jokes apart...dear CITIZENS now get ready for more muddy politics..will continue to stand for the CITIZENS and CONTINUE #justasking.. — Prakash Raj (@prakashraaj) 19 May 2018 -
ఆ నేతలందరూ వస్తున్నారు: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం సోమవారం (ఈ 21న) కొలువు తీరునుందని కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి తెలిపారు. రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ వజుభాయ్ వాలాను కలుసుకుని పలు అంశాలపై కుమారస్వామి చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెజార్టీ ఉందని చెప్పిన బీజేపీ బలం నిరూపించుకోలేక పోయిందన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందిందని తెలిపారు. ముందు అనుకున్నట్లుగానే తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్కు వివరించినట్లు చెప్పారు. కర్ణాటక కేబినెట్ ఏర్పాటుపై ఆదివారం కాంగ్రెస్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు విచ్చేయనున్నారని వెల్లడించారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాల కీలకనేతలు, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్ యాదవ్, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావులను ఆహ్వానించినట్లు తెలిపారు. కాగా, అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం బలపరీక్షకు వెళ్లకుండానే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆపై రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామా లేఖను సమర్పించారు. -
సోమవారం సీఎంగా కుమారస్వామి..ప్రమాణ స్వీకారం
-
కుమారస్వామికి దిమ్మతిరిగే సవాల్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ఓడిపోలేదని, అసెంబ్లీలో యడ్యూరప్ప అత్యుత్తమ ప్రజాస్వామ్యస్ఫూర్తిని ప్రదర్శించి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రజాతీర్పుకు విరుద్ధంగా ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకున్న జేడీఎస్-కాంగ్రెస్లు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్న ఆయన.. కాబోయే సీఎం కుమారస్వామికి దిమ్మతిరిగేరీతిలో సవాల్ విసిరారు. దమ్ముంటే..: ‘‘ఎన్నికల ముందు కాకుండా.. ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకున్న జేడీఎస్-కాంగ్రెస్ల మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. నిన్నటిదాకా సాగిన కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపించకూడదనేదే ఆ రహస్య ఒప్పందం. నేను ముఖ్యమంత్రినైతే కాంగ్రెస్ అవినీతిపై దర్యాప్తు చేయిస్తానని ఎన్నికల ప్రచారంలో కుమారస్వామి అన్నారు. ఇప్పుడు మేం ఆయనకు సవాలు విసురుతున్నాం.. దమ్ముంటే చెప్పిన మాట(కాంగ్రెస్ అవినీతిపై దర్యాప్తు) మీద నిలబడండి. జేడీఎస్-కాంగ్రెస్ది ఫక్తూ అవకాశవాద పొత్తేకానీ సైద్ధాంతిక పొత్తు కానేకాదు’’ అని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. (చదవండి:బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) ఒక్కడికి భయపడి..: ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపైనా కేంద్ర మంత్రి జవదేకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.‘‘బీజేపీ వ్యవస్థలను నాశనం చేస్తున్నదని రాహుల్ ఆరోపించారు. కానీ వాస్తవానికి ఈ దేశంలో వ్యవస్థలను భ్రష్టుపట్టించిందే కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ను జరగనీయకుండా అడ్డుకోవడం, కాగ్ను విపరీతంగా నిందించడం, సుప్రీంకోర్టును ప్రభావితం చేయడం, ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. నిజంగా మేము ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిఉంటే వాళ్లు మా వెంట వచ్చేవాళ్లేకదా, తప్పుడు ఆడియోలతో కాంగ్రెస్ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. ఎన్నికల్లో ఓడిపోతే తప్పు ఈవీఎంలపై నెడతారు. యడ్యూరప్పను సీఎంగా ప్రమాణం చేసియిస్తే గవర్నర్ను నిందిస్తారు. మరి వీళ్ల సీఎంతో ప్రమాణం చేయిచేటప్పుడు మాత్రం గవర్నర్ మంచోడే అంటారు. మోదీ ఒక్కడికి భయపడి, ఆయనకు వ్యతిరేకంగా కూటములు నిర్మించడం నిజమైన రాజకీయం కానేకాదు. ఆ కూటములు ఎప్పటికీ నిలబడలేవు’’ అని జవదేకర్ వివరించారు. (చూడండి: అసెంబ్లీలో బీజేపీ ఘోరతప్పిదం) -
ట్విస్ట్: యెడ్డీ రాజీనామా.. అధిష్టానమే చెప్పింది!!
సాక్షి, న్యూఢిల్లీ: బలపరీక్షకు కొన్ని క్షణాల ముందు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన యడ్యూరప్ప అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటివరకు తాము బలపరీక్షలో గెలిచితీరుతామని, 101శాతం విజయం తమదేనని పదేపదే చెప్పిన యడ్యూరప్ప.. అసెంబ్లీలో మాత్రం విశ్వాస పరీక్షను ఎదుర్కోలేదు. తమకు తగినంత సంఖ్యాబలం లేదని స్పష్టం చేశారు. నిజానికి ఇది ఆకస్మిక ప్రకటనేనని బీజేపీ వర్గాలు అంటున్నాయి. యడ్యూరప్ప చివరినిమిషంలో చేసిన ఈ ప్రకటన అటు కాంగ్రెస్-జేడీఎస్ వర్గాలనే కాదు.. ఇటు బీజేపీ శ్రేణులను విస్మయ పరిచింది. అందుకు కారణం లేకపోలేదు.. చివరిక్షణం వరకు బీజేపీ నేతలు బలపరీక్షలో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్టాన దూతగా కర్ణాటకకు వచ్చిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సైతం తమదే గెలుపు అంటూ నొక్కి వక్కాణించారు. ఈ క్రమంలో కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి.. తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ బేరసారాలను ముమ్మరం చేసిందని కథనాలు వచ్చాయి. బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఫోన్ కాల్స్ ఆడియో టేపులు వెలుగుచూశాయి. అటు కాంగ్రెస్-జేడీఎస్ కూడా అప్రమత్తమై.. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరిని బీజేపీ నేతలు బంధించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ పరిణామాల నడుమే బీజేపీ అధిష్టానం వ్యూహం మారినట్టు కనిపిస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటలకు అసెంబ్లీకి రావడానికి ముందు యడ్యూరప్ప బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రులు జవదేకర్, జేపీ నడ్డా, అనంతకుమార్, సదానంద గౌడ, పార్టీ నేతలు శ్రీరాములు, జగదీశ్ షెట్టర్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ తర్వాత గవర్నర్ వజుభాయ్ వాలాను కలిశారు. అనంతరం అసెంబ్లీకి వచ్చిన యడ్యూరప్ప భావోద్వేగంగా ప్రసంగించి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ అధినాయకత్వం యడ్యూరప్పకు తెలిపినట్టు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష గురించి యావత్ దేశం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూడటం.. కర్ణాటక రాజకీయ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్న నేపథ్యంలో విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే తప్పుకోవడం మంచిదనే నిర్ణయానికి బీజేపీ అధినాయకత్వం వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బేరసారాలు నెరిపి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందనే మచ్చ పార్టీకి రాకూడదనే ఉద్దేశంతోనే యెడ్డీని హుందాగా దిగిపొమ్మని బీజేపీ అధిష్టానం సూచించిందని ఆ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుకు అధిష్టానం ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మరోవైపు గవర్నర్ ఇచ్చినవిధంగా బలపరీక్షకు 15రోజులు గడువు ఉండివుంటే అలవకోగా యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గేవారని, కానీ సుప్రీంకోర్టు 24 గంటల గడువు (శనివారం 4 గంటలలోపు) ఇవ్వడంతో విశ్వాస పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని ఆ పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు.. ఆ తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలపై బీజేపీ నేతలు ఇప్పుడు దృష్టిపెట్టారు. -
అతి తక్కువ కాలం సీఎంలు వీరే!
సాక్షి, హైదరాబాద్: చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన కర్ణాటక రాజకీయాలకు క్లైమాక్స్లో బీజేపీ నేత యడ్యూరప్ప అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసందే. అనంతరం గవర్నర్ వజుభాయ్ వాలాకు రాజీనామా లేఖ సమర్పించారు. తద్వారా భారతదేశ ముఖ్యమంత్రులలో అతి తక్కువ రోజులు సీఎంగా ఉన్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత జగదాంబికా పాల్ సరసన చేరారు. ఈ నెల 17న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప 19న (శనివారం) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భారతదేశ రాజకీయాల్లో గతంలో కొన్ని పార్టీల నేతలు రాజకీయ సంక్షోభాల కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గకపోవడం, ఇతర పార్టీల మద్దతు లభించకపోవడంతో పలువురు ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు. అతి తక్కువ రోజులు సీఎంగా చేసిన నేతలు వీరే.... 1) జగదాంబికా పాల్ (ఉత్తర ప్రదేశ్) : మూడో రోజు రాజీనామా (1998లో ఫిబ్రవరి 21 నుంచి 23వరకు) 2)యడ్యూరప్ప (కర్ణాటక) : మూడో రోజు రాజీనామా (2018లో మే 17 నుంచి 19వరకు (58 గంటల పాటు)) 3)సతీశ్ ప్రసాద్ సింగ్ (బిహార్) : ఐదో రోజు రాజీనామా (1968లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వరకు) 4)ఓం ప్రకాష్ చౌతాలా (హరియాణా) : 6వ రోజు రాజీనామా (1990లో జులై 12 నుంచి 17వరకు) 5)నితీష్ కుమార్ (బిహార్) : 8వ రోజు రాజీనామా (2000లో మార్చి 3 నుంచి 10వరకు) 6)యడ్యూరప్ప (కర్ణాటక) : 8వ రోజు రాజీనామా (2007లో నవంబర్ 12 నుంచి 19వరకు) 7)ఎస్.సీ మరాక్ (మేఘాలయ) : 12వ రోజు రాజీనామా (1998లో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10వరకు) 8)ఓం ప్రకాష్ చౌతాలా (హరియాణా) : 17వ రోజు రాజీనామా (1991లో మార్చి 21 నుంచి ఏప్రిల్ 6వరకు) 9)జానకీ రామచంద్రన్ (తమిళనాడు) : 24వ రోజు రాజీనామా (1988లో జనవరి 7 నుంచి 30వరకు) 10)బీపీ మండల్ (బిహార్) : 31 రోజులు (1968లో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2వరకు) -
సోమవారం సీఎంగా కుమారస్వామి.. కేబినెట్ ఇదేనా !
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ ఎల్పీనేత కుమారస్వామి ఈనెల 21న (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో కుమారస్వామి సోమవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే బెంగళూరులోని హిల్టన్ హోటల్లో జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ కూర్పు, ఇతర పదవుల పంపకాలకు సంబంధించి చర్చ జరిగింది. మంత్రులు వారి శాఖలను కూడా ప్రకటించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి దేశం నలుమూలల నుంచి వివిధపక్షాల నాయకులను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అందిన సమాచారం మేరకు మంత్రులు వారి పదవులు ఇలా ఉండవచ్చు ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి : కుమారస్వామి ఉప ముఖ్యమంత్రి : జి పరమేశ్వర్ ప్రజా పనుల శాఖ : హెచ్ డీ రేవణ్ణ విద్యుత్ శాఖ : డీకే శివకుమార్ నీటిపారుదల శాఖ : హెచ్కే పాటిల్ భారీ పరిశ్రమల శాఖ : ఏటీ రామస్వామి రవాణా శాఖా : రామలింగారెడ్డి చిన్న నీటిపారుదల శాఖ : కేఎం శివలింగే గౌడ్ రెవెన్యూ శాఖ : శివ శంకరప్ప ఆరోగ్య శాఖ : యూటీ ఖదీర్ మహిళా సంక్షేమ శాఖ : లక్ష్మీ హెబ్బల్కర్ వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ : సీఎస్ పుత్తరాజు విద్యాశాఖ : హెచ్ విశ్వనాథ్ గ్రామీణాభివృద్ధి శాఖ : సతీష్ జరకిహోలి పట్టనాభివృద్ధి : కేజే జార్జ్ క్రీడల శాఖ : కృష్ణప్ప సమాచార శాఖ : కృష్ణ బైరేగౌడ సాంఘీక సంక్షేమ శాఖ : హెచ్కే కుమారస్వామి కోపరేటివ్ శాఖ : జీటీ దేవెగౌడ టెక్స్టైల్ శాఖా : బండెప్ప కశంపూర కార్మిక శాఖ : డీసీ తమ్మన్నా ఎక్సైస్ శాఖ : దినేష్ గుండు రావు వైద్య, విద్య శాఖ : తన్వీర్ సైత్ ఉన్నత విద్య శాఖ : కే సుధాకర్ అటవీ శాఖ : రోషణ్ బైగ్ ఆహార, పౌర సరఫరా శాఖ : శరణబసప్ప గౌడ దర్శణాపూర్ న్యాయశాఖ : ఆర్వీ దేశ్పాండే చిన్న తరహ పరిశ్రమలు : అజయ్ సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ : ప్రియాంక్ ఖర్గే -
ఆపరేషన్ లోటస్.. అట్టర్ ఫ్లాప్
సాక్షి, బెంగళూరు: బల నిరూపణ కంటే ముందే యెడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వేళ.. కాంగ్రెస్-జేడీఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బీజేపీ అప్రజాస్వామిక ప్రయత్నాలు విఫలం అయ్యాయని, మెజార్టీ కోసం వాళ్లు చేసిన ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ విభాగం ట్వీట్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమి.. ఇక తటస్థ ప్రభుత్వంతో అభివృద్ధిపై దృష్టిసారిస్తుందని పేర్కొంది. మరోపక్క సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. ‘బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ దారుణంగా విఫలం అయ్యింది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న వాళ్ల ప్రయత్నాలు బెడిసి కొట్టింది. అసమర్థుడినని ఒప్పుకున్న యెడ్యూరప్ప సభ నుంచి పరారయ్యారు. కర్నాటకలో ప్రజాస్వామ్యం వర్థిల్లింది’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు. ‘బీజేపీ కుట్ర ఫలించలేదు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాలనుకుని నిండా మునిగిపోయారు’ అని సిద్ధరామయ్య ఓ ట్వీట్ కూడా చేశారు. ‘ప్రజలే స్పీకర్లుగా మారి అసెంబ్లీలో జరిగిన మొత్తాన్ని వీక్షించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యానిదే గెలుపు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ట్వీట్ చేశారు. బీజేపీ ‘హైజాక్ కర్ణాటక అసెంబ్లీ ఫెయిల్’ అయ్యిందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణ్ దీప్ సింగ్ సుజ్రేవాలా పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గెహ్లట్, దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ లు పరిణామాలపై హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులు స్పందిస్తూ... బీజేపీ కుయుక్తులు ఫలించలేదని పేర్కొన్నారు. -
జేడీఎస్-కాంగ్రెస్ అత్యవసర భేటీ
సాక్షి, బెంగళూరు: బలపరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించిన దరిమిలా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు జేడీఎస్-కాంగ్రెసలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఇరుపార్టీలు ఉమ్మడిగా లెజిస్లేటివ్ భేటీని నిర్వహించాయి. బెంగళూరులోని హిల్టన్ హోటల్లో జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ కూర్పు, ఇతర పదవుల పంపకాలకు సంబంధించి చర్చ జరిగింది. ఆయా శాఖల మంత్రులు వీరేనంటూ కొన్నిపేర్లు కూడా వెల్లడయ్యాయి. మరోవైపు సోమవారం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వివిధపక్షాల నాయకులను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. (చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) -
యడ్యూరప్ప మూడో 'సారీ'..
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం యడ్యూరప్ప చివరి వరకూ విశ్వప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే సీఎం కుర్చీ ఆయనకు ఏ మాత్రం కలిసి రానట్టే ఉంది. కర్ణాటకలో చక్రం తిప్పుదామనుకున్న ప్రతిసారి ఆయన్ను విధి వెక్కిరించింది. పూర్తిస్థాయిలో ప్రజలను పాలించే అదృష్టం యడ్డీకి ఏమాత్రం కలగలేదు. అధికారంలో ఐదేళ్లు ఉండాలని ఆయన ఈరోజు వరకూ గజినీ మహ్మద్ తరహాలో దండయాత్ర చేస్తూనే ఉన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీ అందినట్టే అంది చేజారి పోయింది. 2007 నవంబర్ 12న యడ్యూరప్ప తొలిసారి సీఎం కుర్చీ అధిష్టించారు. అయితే ఆ ఆనందం పట్టుమని పదిరోజులు కూడా మిగల్లేదు. కేవలం 8 రోజులు మాత్రమే ఆయన సీఎంగా కొనసాగారు. అయితే పలు వివాదాలు చెలరేగిన నేపథ్యంలో నవంబర్ 12న ఆయన పదవి నుంచి దిగిపోయారు. అనంతరం అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన అనంతరం 2008 మే 30న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ సారి దాదాపు మూడేళ్ల, రెండు నెలల రెండు రోజులు పాటు పదవిలో కొనసాగారు. కుదురుగా ఐదేళ్లు పరిపాలన అందిస్తారనుకున్న సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2011 జులై 31న యడ్యూరప్ప రాజీనామా చేశారు. చివరగా 2018లో జరిగిన ఈ ఎన్నికల్లో 104 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద మెజారిటీ పార్టీగా అవతరించింది. దీంతో గవర్నర్ వజుభాయ్ వాలా ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 111 సీట్లు లేవంటూ కాంగ్రెస్, జేడీఎస్లు సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. నేడు (శనివారం) విశ్వాస పరీక్ష పెట్టకముందే తన సీఎం పదవికి రాజీనామా చేశారు అయితే తగిన సంఖ్యాబలం లేని కారణంగా ఆయన మూడో సారి తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 55 గంటలు మాత్రమే సీఎంగా విధులు నిర్వర్తించారు. ఏడుగురు సభ్యులు బీజేపీలో చేరి ఉంటే యడ్యూరప్ప సీఎంగా కొనసాగేవారు. -
యడ్యూరప్ప.. ఆ ఊహాగానాలే నిజమయ్యాయి!
సాక్షి, బెంగళూరు : ముందుగా ఊహాగానాలు వెలువడినట్టే.. బలపరీక్షకు ముందు బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. వారం రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్లా సాగుతూ.. క్షణక్షణానికి అనూహ్య మలుపులు తిరుగుతున్న కన్నడ రాజకీయ కథకు తెరదించారు. నాటకీయ పరిణామాల నడము తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ.. ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటున్నట్టు యడ్యూరప్ప ప్రకటించారు. అనంతరం నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ వజుభాయ్ వాలాకు రాజీనామా సమర్పించారు. దీంతో కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. యడ్యూరప్ప రాజీనామాతో ప్రజాస్వామ్యం విజయం సాధించిందంటూ కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అసెంబ్లీలో జేడీఎస్ నేత కుమారస్వామి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పరస్పరం చేతులు పట్టుకొని సంఘీభావం తెలుపుతూ.. హర్షధ్వానాలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీ తమకు ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు. ముందుగానే ఊహించిందే! కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 104 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 222 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 112. కానీ జేడీఎస్ నేత కుమారస్వామి రెండుచోట్ల ఎమ్మెల్యేగా గెలుపొందినా.. ఆయనకు ఒకే ఓటు హక్కు ఉండటంతో మ్యాజిక్ ఫిగర్ 111కు చేరింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏడుగురు ఎమ్మెల్యలేను తనవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా బేరసారాలు సాగించినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీ నేతలు యడ్యూరప్ప, శ్రీరాములు తదితరులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఫోన్లో బేరసారాలు జరిపారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆడియో టేపులను విడుదల చేసింది. ఒక స్వతంత్రఎమ్మెల్యేను బీజేపీ తనవైపు తిప్పుకున్నప్పటికీ మిగతా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించలేకపోయిందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. అటు కాంగ్రెస్-జేడీఎస్ అగ్రనేతలు కూడా మొదటి నుంచి తమ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడకుండా, ప్రలోభాలకు లోనవ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలను రిస్టార్ట్లకు తరలించి.. క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. చివరకు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్కు తరలించి.. చివరిక్షణంలో వారిని బెంగళూరు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ నడిపించిన రిసార్ట్ క్యాంపులు ఫలించినట్టు కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా.. ఆ యత్నాలు సఫలం కాలేదన్న విషయం శనివారం మధ్యాహ్నం నాటికి స్పష్టమైపోయింది. దీంతో బీజేపీకి అంతకుముందు ఓటేస్తామన్న ఇద్దరు ‘మిస్సింగ్’ ఎమ్మెల్యేలు సైతం తిరిగి ప్రత్యక్షమై కాంగ్రెస్ క్యాంప్నకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నంనాటికే బీజేపీ శాసనసభా పక్ష నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం ఊపందుకుంది. బలపరీక్షకు తగిన మెజారిటీ లేకపోవడంతో గతంలో వాజ్పేయి కూడా విశ్వాస పరీక్షకు ముందే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా అదే దారిలో సాగుతూ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు బీజేపీ వర్గాల్లో తీవ్రమయ్యాయి. ఈ ఊహాగానాలు నిజం చేస్తూ.. మధ్యాహ్నం 3.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే.. ఉద్వేగభరితంగా యడ్యూరప్ప ప్రసంగిస్తూ.. బీజేపీకి ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమకు 104 సీట్లు మాత్రమే ఇచ్చారని, పూర్తి మెజారిటీ ఇచ్చి ఉంటే.. కర్ణాటకను స్వర్గధామంగా చేసి ఉండేవాడినని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్లను ప్రజలు తిరస్కరించినా.. ఆ పార్టీలు అనైతిక పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాజీనామా చేయడంతో ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న బలపరీక్ష మొదలుకాకముందే.. టెన్షన్కు తెరపడింది. -
అసెంబ్లీలో బీజేపీ ఘోరతప్పిదం..
రాయ్పూర్: బలపరీక్ష సందర్భంలో ప్రొటెం స్పీకర్ సహా బీజేపీ ఎమ్మెల్యేలంతా జాతీయగీతాన్ని అవమానించి ఘోరతప్పిదం చేశారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ‘‘మీరంతా టీవీల్లో గమనించే ఉంటారు.. జాతీయగీతం ఆలపించడానికి ముందే ప్రొటెం స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యేలు అసహనంగా సీట్లలో నుంచి లేచిపోవడాన్ని చూసేఉంటారు. ఆ చర్యతో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తమ దేశవ్యతిరేక నైజాన్ని బయటపెట్టుకున్నాయి’’ అని అన్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ పర్యటనలో ఉన్న ఆయన.. కర్ణాటక బలపరీక్షలో బీజేపీ ఓటమిపై స్పందించారు. పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలాతో కలిసి శనివారం రాయ్పూర్లో మీడియాతో మాట్లాడారు. (చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) ‘‘ఇదే..దీని గురించే మా పోరాటమంతా. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు జాతీయగీతం పట్ల గౌరవంలేదు. ప్రజాస్వామ్యమంటే అసలే గిట్టదు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. కాబట్టే మేం జనంతో కలిసి మేము గట్టిగా పోరాడుతున్నాం. బలం లేకపోయినా యడ్యూరప్పను సీఎం చేయడం ద్వారా ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకునే వ్యవహారానికి తెరలేపారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారమంతా నడిచిందని చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటకలోగానీ, మొన్న గోవా, మణిపూర్లలోగానీ వీళ్లు ప్రజాతీర్పును గౌరవించకుండా అడ్డదారుల్లో అధికారం కైవసం చేసుకునేందుకు యత్నించారు. జాతిని కల్లోలం వైపునకు నెడుతోన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ బారి నుంచి దేశాన్ని కాపాడుకుందాం. కర్ణాటక పరిణామం వాళ్లకొక గుణపాఠం కావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో విజయంసాధించిన జేడీయూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, దేవేగౌడ గారికి, ప్రత్యేకించి కన్నడిగలకు నా అభినందనలు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. (చూడండి: కుమారస్వామికి పిలుపు.. నేడే సీఎంగా ప్రమాణం!) ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న బలపరీక్ష.. యడ్యూరప్ప నిష్క్రమణతో ఊహించని మలుపు తిరిగినట్లైంది. డివిజన్ ఓటింగ్కు ఆదేశించకముందే యడ్డీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కసరత్తు ప్రారంభించారు. -
అయ్యో.. యడ్యూరప్ప!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన పదవికి సీఎం బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందే ప్రకటన చేసి ట్విస్ట్ ఇచ్చారు. సభ వాయిదా పడిన యడ్యూరప్ప రాజ్భవన్కు చేరుకుని గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించారు. దీంతో మూణ్నాళ్ల ముచ్చటగానే యడ్యూరప్ప ప్రభుత్వం ముగిసింది. కేవలం మూడు రోజుల్లోనే.. అంటే 58 గంటల్లోనే యడ్యూరప్ప సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయామని గ్రహించిన యడ్యూరప్ప సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మరోవైపు సీఎం రాజీనామాతో ప్రజాస్వామ్యం నెగ్గిందంటూ కాంగ్రెస్-జేడీఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. గతంలోనూ యెడ్డీ ఇలాగే.. 2007లో నవంబర్ 12న సీఎంగా బాధ్యతలు చేపట్టిన యడ్యూరప్ప కేవలం 8 రోజులపాటు పదవిలో కొనసాగి అదే నెల 19న రాజీనామా చేశారు. 2008-2011లో మూడేళ్లపాటు యడ్యూరప్ప సీఎంగా కొనసాగారు. కీలకంగా మారిన సుప్రీంకోర్టు తీర్పు ఏ పార్టీ మెజార్టీ సాధించని పక్షంలో అత్యధిక సీట్లు 104 గెలుపొందిన బీజేపీ వైపు గవర్నర్ వజుభాయ్ వాలా మొగ్గు చూపారు. గురువారం రాత్రి యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణం స్వీకరించి.. బలపరీక్షకు 15 రోజుల గడువిచ్చారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని బీజేపీని ఆదేశించిన విషయం తెలిసిందే. తక్కువ సమయం దొరకడంతో బీజేపీ నేతలు ‘ఆపరేషన్ కమలం’ ను విజయవంతం చేసుకోలేకపోయారు. జగదాంబిక పాల్ను మర్చిపోలేం! గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే కొన్ని రాష్ట్రాలు న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది 1998లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు ఘటన. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత జగదాంబిక పాల్ ఫిబ్రవరి21న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మూడు రోజుల్లోనే ఫిబ్రవరి 23న ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఒక్క రోజు సీఎంగా ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ జగదాంబిక పాల్ను స్థానికులు చెప్పుకుంటుంటారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన బీజేపీ నేత కళ్యాణ్ సింగ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడం అప్పట్లో యూపీలో వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు జగదాంబిక పాల్ను ఆహ్వానించిన గవర్నర్ రోమేష్ భండారీ బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. విశ్వాస పరీక్ష సమయంలో అసెంబ్లీలో హింస చెలరేగి రక్తపాతం జరగడంతో రాష్ట్రపతి పాలన విధించాలని భండారీ కేంద్రానికి సూచించారు. చివరికి ఇతర పార్టీల మద్దతుతో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. -
యడ్డి రాజీనామా...తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక బలపరీక్షలో ఓటింగ్ జరగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. తమ దగ్గర 104 మంది ఎమ్మేల్యేలు మాత్రమే ఉన్నారని, అందుకే బలపరీక్షలో ఓడిపోయామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. యడ్యూరప్ప రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా జేడీఎస్ చీఫ్ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసేందుకు మార్గం సుగుమం అయింది. కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమర్థిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సంతకాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యమే గెలిచిందని, బీజేపీకి సరైన గుణపాఠం అని హర్షం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ వద్ద బాణసంచి కాల్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయం...ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన సుప్రీంకోర్టు, మీడియా వారికి ధన్యవాదాలు. నియంతలా వ్యవహరించిన బీజేపీకి సరైన బుద్ది వచ్చింది. 2019 లో జరిగే ఎన్నికలకు ఈ ఫలితాలు పునాది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. - గీతారెడ్డి, పీఏసీ ఛైర్మెన్ ఇది ప్రజాస్వామ్య విజయం. - రఘువీరారెడ్డి ఏపీసీసీ చీఫ్. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. యడ్యూరప్ప రాజీనామా కాంగ్రెస్ విజయం, ప్రజాస్వామ్య విజయం. ఎట్టకేలకు ప్రజాస్వామ్యమే గెలిచింది. 2019 నాటి ఎన్నికలకు ఇది పునాది. - ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది.15రోజులు అవకాశం ఇచ్చి ఉంటే గొర్లను కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొనేవారు.కర్ణాటక ఎమ్మెల్యేలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. - వీహెచ్, కాంగ్రెస్ నేత న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు. గవర్నర్ వ్యవస్థలో మార్పులు రావాలి. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే సాధ్యాసాధ్యాలను గవర్నర్ పరిశీలించాలి.కర్ణాటక గవర్నర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకం కావాలి. - మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టు లేకపోతే ప్రజాస్వామ్యం కూని అయ్యేది. సుప్రీమ్ న్యాయమూర్తులకు ధన్యవాదాలు. మోడీ అమిత్ షా విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ కు అధికారదాహం లేదు. అందుకే జేడీఎస్ కు మద్దతు ఇచ్చింది.కర్ణాటకలో బీజేపీకి పట్టిన గతి ఇక్కడ టీఆర్ఎస్కు పడుతుంది. - సర్వే సత్యనారాయణ ప్రజాస్వామ్యం గెలిచి నిలిచింది. ప్రజాస్వామ్య పునాదులు పెకిలించే శక్తులకు అడ్డుకట్ట పడింది. గవర్నర్ను రీ కాల్ చేయాలి. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు. మా ఫోన్ లు ట్యాపింగ్ చేస్తున్నారు. దీని పై కూడా విచారణ జరిపించాలి. - పొన్నాల లక్ష్మయ్య -
ఇది వారి విజయమే.. ధన్యవాదాలు: ఆజాద్
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపాయి. ప్రచారం నుంచి మొదలు పెడితే ఫలితాలు, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం వరకు గంటకో మలుపు తిరిగాయి. శనివారం ఎట్టకేలకు వాటికి ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి యడ్డీ అవిస్వాస తీర్మానానికి ముందుగానే రాజీనామా చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు. అధికారం దక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ సామభేదదండోపాయాలను ప్రయోగించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ సభ్యులను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వందల కోట్లు, పదవులను బీజీపీ ఎరగా వేసినా.. తమ పార్టీల ఎమ్మెల్యేలు 117 మంది ఒకేతాటిపై ఉన్నారని ఆజాద్ తెలియచేశారు. 15 రోజుల నుంచి రెండు రోజులకు బలనిరూపణ వ్యవధి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీం కోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రెండు వారాల సమయంలో బీజేపీ నేతలు ఫిరాయింపులను ప్రోత్సహించేవారిని ఆరోపించారు. బీజేపీకి బలం లేని కారణంగానే గవర్నర్ రెండు వారాల గడువు ఇచ్చారని విమర్శించారు. ప్రస్తుతం ఇది ప్రజాస్వామ్య, రాజ్యాంగం, సుప్రీంకోర్టు విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గవర్నర్ నుంచి కుమారస్వామి పిలుపు కోసం ఎదురుచూస్తున్నామని, గవర్నర్ ముందున్న కర్తవ్యం అదేనని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజల విజయమని అని చెప్పిన ఆజాద్, వారికి సోనియా, రాహుల్ గాంధీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా
-
ఇది కన్నడ ప్రజల విజయం
-
కుమారస్వామికి పిలుపు.. నేడే సీఎంగా ప్రమాణం!
సాక్షి, బెంగళూరు: బల నిరూపణ పరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించడంతో కర్ణాటక రాజకీయం ఊహించని మలుపుతిరిగింది. బలపరీక్ష తీర్మానంపై మాట్లాడిన సందర్భంలోనే సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనివార్యమైంది. ఇప్పటికే జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమర్థిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సంతకాలు సమర్పించిన దరిమిలా గవర్నర్ వజుభాయ్ వాలా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారమే కుమారస్వామికి గవర్నర్ నుంచి పిలుపు రానున్నట్లు తెలిసింది. ఈ రోజే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని కన్నడ రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఇటు కుమారస్వామి సైతం మీడియాతో మాట్లాడుతూ ‘గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. (చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) -
బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు: బలపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్ జరుగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన సభలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష తీర్మానంపై ప్రసంగిస్తూ.. మా దగ్గర 104 మంది ఎమ్మెల్యేల మాత్రమే ఉన్నారు కాబట్టి బలపరీక్షలో విఫలమయ్యామని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఇది నిజంగా అగ్నిపరీక్ష. ఇలాంటి పరీక్షలు ఎన్నో నా జీవితంలో ఎదుర్కొన్నాను. గతంలో రాష్ట్రం కోసం ఎంతో చేశాను. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు. కాంగ్రెస్, జేడీఎస్లను ఓటర్లు విశ్వసించలేదు. కానీ ఇవాళ వారు అపవిత్రపొత్తుతో ముందుకొచ్చారు. అవును. మాదగ్గర 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి బలపరీక్షలో మేం విఫలమయ్యాం అని చెప్పడానికి చింతిస్తున్నాం. అయితే నా ఆఖరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పాటుపడతా. 2019లో 28కి 28 లోక్సభ స్థానాలను గెలుచుకుంటాం’’ అని యడ్యూరప్ప చెప్పారు. అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజనీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస 78, జేడీఎస్ 38, బీఎస్పీ 1, ఇతరులు 2 సీట్లను గెలుచుకోవడం, అతిపెద్ద పార్టీ అయిన కారణంగా బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం, ఆ వెంటనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం లాంటి పరిణామాలు చకచక జరిగిపోయాయి. సరిగ్గా 60 గంటలు కూడా గడవకముందే యడ్డీ బలపరీక్షలో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. -
ఓ వైపు హైడ్రామా.. మరోవైపు అద్భుతం
సాక్షి, బెంగళూరు : బీజేపీ నాయకురాలు శోభా కరంద్లజ్ అన్నట్టే జరిగింది. నిజంగానే అద్భుతం. ఎన్నో నాటకీయ పరిస్థితులు, మరెన్నో ఎత్తులకు పైఎత్తులు జరిగినప్పటికీ ఎట్టకేలకు కాంగ్రెస్-జేడీయూలే అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. బలపరీక్షలో బలం నెగ్గించుకుంటామంటూ చివరి వరకు చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ, చివరికి చేతులెత్తేసింది. బలపరీక్షకు ముందే తన ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసేశారు. తమకు బలం లేదంటూ చెప్పకనే చెప్పేసి, బలపరీక్షకు వెళ్లకుండానే బయటికి వచ్చేశారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకురాలు శోభా ముందే ఊహించి ఉన్నారేమో. రాజకీయాల్లో ప్రతి నిర్ణయం అద్భుతం, సంతోషమంటూ ఆమె చెప్పారు. నిజంగానే చివరి క్షణంలో యడ్యూరప్ప అద్భుతం చేసి చూపించారు. మరోవైపు బీజేపీ ప్రలోభాలకు ఆకర్షితులైనట్టు భావించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతాప్ గౌడ పాటిల్, ఆనంద్ సింగ్లు కూడా చివరి నిమిషంలో తమ సొంత పార్టీలోకి వచ్చేశారు. వీరు శాసనసభలోకి ప్రవేశించేటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ చుట్టుముట్టారు. బలపరీక్షలో కాంగ్రెస్కే ఓటు వేసేలా వీరిని సన్నద్ధం చేశారు. కానీ చివరికి బలపరీక్షే జరుగలేదు. ఏది ఏమైనప్పటికీ నిజంగానే ఇది కాంగ్రెస్-జేడీఎస్లకు అద్భుతమనే చెప్పవచ్చు. ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించి కర్ణాటక అసెంబ్లీ పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హైడ్రామాకు చెక్ పడింది. యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే నిలిచింది. యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్-జేడీఎస్ నేతల్లో సంబురాలు నెలకొన్నాయి. యడ్యూరప్పకు సభలో ప్రతి ఒక్కరూ షేక్ హ్యాండు ఇచ్చారు. -
బలనిరూపణ: అసెంబ్లీలో అనూహ్య దృశ్యం!
సాక్షి, బెంగళూరు : బలపరీక్ష నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రమాణం చేయని ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మైసూర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. అనంతరం యడ్యూరప్ప విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి.. సభను ఉద్దేశించి ప్రసంగించారు. తిరిగి ప్రారంభమైన తర్వాత అసెంబ్లీలో అనూహ్య దృశ్యం కనిపించింది. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు అసెంబ్లీ గ్యాలరీలో పక్కపక్కనే కూర్చొని కనిపించారు. కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్, బీజేపీ నుంచి సదానందగౌడ, అనంతకుమార్, శోభా కర్లందాజే పక్కపక్కనే కూర్చొని.. సరదాగా మాట్లాడుతూ.. నవ్వులు చిందించడం కనిపించింది. ఇక కాంగ్రెస్ ‘మిస్సింగ్’ ఎమ్మెల్యే ఆనంద్సింగ్ ఆ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ పక్కన కూర్చోవడం గమనార్హం. -
క్షణక్షణం ఉత్కంఠ: కాంగ్రెస్ క్యాంప్నకు ఆ ఇద్దరు...
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో పరిణామాలు, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరికాసేపట్లో అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో వేగంగా పార్టీల బలాబలాలు మారుతున్నాయి. కాంగ్రెస్ గూటి నుంచి జారిపోయి బీజేపీ వైపు ఆకర్షితులైనట్టు భావించిన ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ అసెంబ్లీ చేరుకున్నారు. మరో ‘మిస్సింగ్’ ఎమ్మెల్యే ఆనంద్సింగ్ కూడా గోల్డ్ఫించ్ హోటల్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. గతంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీకే ఓటేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పటిష్టమైన పోలీసుల భద్రత మధ్య ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాగానే.. వారిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్యలోనే వారు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్సింగ్, ప్రతాపగౌడ కాంగ్రెస్కు ద్రోహం చేయబోరని ఆ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ తెలిపారు. ఇటు బలపరీక్ష దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ శిబిరంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీఎల్పీ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయి మంతనాలు జరుపుతున్నారు. కేంద్రమంత్రులు జవదేకర్, జేపీ నడ్డా, అనంతకుమార్, సందానంద గౌడ, పార్టీ నేతలు యడ్యూరప్ప, శ్రీరాములు, జగదీశ్ షెట్టర్ ఈ భేటీలో పాల్గొని.. బలపరీక్షలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు బేరసారాలు జరిపిన వీడియోలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో బీజేపీ నేత శ్రీరాములు బేరసారాలు ఆడిన ఫోన్ సంభాషణను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నాలుగు ఆడియో టేపులను విడుదల చేసినట్టు అయింది. -
కర్ణాటక అప్డేట్స్: గవర్నర్తో కుమారస్వామి భేటీ
సాక్షి, బెంగళూరు : తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ విశ్వాసపరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. తమకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణ జరగకముందే ఆయన తప్పుకున్నట్టయింది. 55 గంటలపాటు సీఎంగా ఉన్న యెడ్డీ.. నేరుగా రాజ్భవన్కు వెళ్లి రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై లైవ్ అప్డేట్స్ ఇవి.. లైవ్ అప్డేట్స్: రాజ్భవన్కు చేరుకున్న కుమారస్వామి. గవర్నర్తో భేటీ అయిన కుమారస్వామి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు సాయంత్రం 7.30 గంటలకు గవర్నర్ వజుభాయ్ వాలాను కలువనున్న కుమారస్వామి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్న కుమారస్వామి.. కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం.. మంత్రిమండలి కూర్పును సిద్ధం చేస్తున్న ఇరుపార్టీల నేతలు యడ్యూరప్ప రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్న కుమారస్వామి.. గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నాం.. పిలుపు అందగానే ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ను కలుస్తాం: జేడీఎస్ ఎల్పీ నేత కుమారస్వామి గవర్నర్ వజుభాయ్ వాలాకు రాజీనామా లేఖ సమర్పించిన యడ్యూరప్ప యడ్యూరప్పతో పాటు ఇతర బీజేపీ నేతలు కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్న గులాం నబీ ఆజాద్. కొందరు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసే యత్నం కూడా జరిగిందని ఆరోపణలు. రాజ్భవన్కు చేరుకున్న యడ్యూరప్ప. గవర్నర్ వజుభాయ్ వాలాతో భేటీ కానున్న యెడ్డీ. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ నినాదాలు చేసిన కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు యడ్యూరప్ప రాజీనామా ప్రకటన అనంతరం వాయిదా పడిన కర్ణాటక అసెంబ్లీ భావోద్వేగంతో ప్రసంగిస్తూ సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన యడ్యూరప్ప. గవర్నర్ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తాని చెప్పిన యడ్యూరప్ప. విశ్వాసపరీక్షకు ముందే వెనక్కి తగ్గిన యెడ్డీ ప్రజాస్వామ్యంపై నాకు నమ్మకం ఉందన్నారు యడ్యూరప్ప. ప్రజలు మాకు అత్యధిక సీట్లు అప్పగించారు. కానీ కర్ణాటక ప్రజలకు సేవచేసే భాగ్యం కలగక పోవడం మా దురదృష్ణం. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సీఎం యడ్యూరప్ప ఆనంద్సింగ్తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ బోపన్న. అనంతరం ఆనంద్ సింగ్ పక్కనే కూర్చున్న డీకే శివకుమార్ అసెంబ్లీ గ్యాలరీలో బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు. కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, గెహ్లాట్. బీజేపీ నుంచి సదానందగౌడ, అనంతకుమార్. వాయిదా అనంతరం 3:30 గంటలకు మళ్లీ ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ. నేతలతో ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రొటెం స్పీకర్ బోపన్న అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్లతో కాంగ్రెస్ పార్టీ నేతల చర్చలు. ఆనంద్, ప్రతాప్లు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయరని అభిప్రాయపడ్డ శివకుమార్ గవర్నర్ వజుభాయ్ వాలను కలిసేందుకు రాజ్భవన్కు వెళ్లిన యడ్యూరప్ప. గవర్నర్తో సమావేశమైన యెడ్డీ. అయితే గవర్నర్ను కలిసే ముందు అమిత్ షాతో ఫోన్లో మాట్లాడిన యెడ్డీ. విశ్వాస పరీక్షకు ముందు కర్ణాటకలో బీజేపీలో జోరుగా మంతనాలు కాంగ్రెస్ మిస్సింగ్ ఎమ్మెల్యే ఆనంద్సింగ్ గోల్డ్ఫించ్ హాటల్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ఆనంద్సింగ్ ఉదయం ప్రమాణ స్వీకారం సమయంలో కనిపించకుండా పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు డీకే సురేష్, దినేష్ గుండు రావుతో కలిసి భోజనం చేసిన ప్రతాప్ గౌడ ప్రతాప్ గౌడ పాటిల్