corporate colleges
-
ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల పేరిట ‘ముందస్తు’ దోపిడీ
హలో సార్... మీ పాప మౌనిక పదవ తరగతి చదవుతున్నది కదా..!. ఇంటర్కు ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? మాది ఫలనా కార్పొరేట్ కాలేజీ. ఐఐటీ, ఈపీసెట్ కోచింగ్, ఏసీ, నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్లు ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు జాయిన్ అయితే ఫీజులో కొంత డిస్కౌంట్ ఉంటుంది. పరీక్షల తర్వాత సీట్లు కష్టం. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫీజులు పెరుగుతాయి. ముందుగా సీటు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కాలేజీ క్యాంపస్కు విజిట్ చేసి చూడండి.సార్ గుడ్ ఈవెనింగ్, కార్తీక్ ఫాదరేనా? మీ అబ్బాయి ఇంటర్మీడియట్ (Intermediate) చదువుతున్నాడు కదా. బీటెక్ (BTECH) కోసం ఏం ప్లాన్ చేశారు. తమిళనాడు, కేరళలోని ఫలానా యూనివర్సిటీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంల్, డేటాసైన్స్, మెకానికల్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి ఉంటే చెప్పండి.. రాయితీలు ఇప్పిస్తాం... ...టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఇలాంటి ఫోన్ల బెడద రిగింది. కనీసం బోర్డు పరీక్షలు కూడా కంప్లీట్ కాకముందే కార్పొరేట్ కాలేజీలు (Corporate Colleges) బేరసారాలు ప్రారంభించాయి. అడ్డగోలు ఫోన్లు, ఆఫర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నాయి. పరీక్షలు కూడా రాయకుండా అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి..తీసుకోకుంటే ఫీజులు ఇంకా పెరుగుతాయేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాకుండానే.. ముందస్తు అడ్మిషన్లతో కార్పొరేట్ కళాశాలలు హడావుడి చేస్తున్నాయి. అనుమతి లేకుండా విద్యార్థుల డేటాను సంపాదించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ వల విసురుతున్నారు. ఫోన్లే కాకుండా వాట్సాప్లకు అడ్మిషన్ల మెసేజ్లు పంపుతున్నారు. వీటికి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. ముందుగా మేల్కోకుంటే ఫీజులు ఎక్కడ పెంచుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్ ఇంటర్, ఇంజనీరింగ్ కళాశాలలు గాలం వేస్తున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి మంచి భవిష్యత్తు అంటూ ఆశల పల్లకిలో విహరింపజేస్తూ రూ.లక్షల్లో ఫీజులు బాదేస్తున్నారు. మరోవైపు పీఆర్ఓలు... వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం పలు విద్యాసంస్థల పీఆర్ఓలు కూడా రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిగా ఆసక్తి కనబర్చినా చాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. నామినల్ రోల్ ద్వారా విద్యార్థుల వివరాలు ఫోన్ నెంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వాటి కోసం సంబంధిత విభాగాల ఇన్చార్జిలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కింది స్థాయి సిబ్బంది కొందరు విద్యార్థుల సమాచారం అందిస్తున్నారు. దీంతో పీఆర్ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం.. కళాశాలల గురించి వివరిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్ అవకాశం ఉండటంతో పోటీపడుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా సాధారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాతనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఈసారి గతేడాది కంటే ఫీజులు అధికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 20 శాతం అధికంగా ఫీజుల దోపిడీకి కళాశాలలు సిద్ధమయ్యాయి. ఇంటర్కు సంబంధించి ‘సూపర్, స్టార్, సీఓ’ బ్రాంచ్ల పేరిట కొన్ని కళాశాలలు ఏడాదికి రెండున్నర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సులకు రూ.ఐదు నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదీ చదవండి: బడి బయటే బాల్యం -
సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు
నాంపల్లి (హైదరాబాద్): రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు కళ్లెం వేయాలంటూ విద్యార్థులు కదం తొక్కారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఫ్ల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు వేర్వేరుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ప్రసంగిస్తూ.. కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు కార్యాల యం గేట్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు రజనీకాంత్, ఇతర నాయకులతో కూడిన ప్రతినిధి బృందం ఇంటర్మీడియెట్ బోర్డ్ కమిషనర్ శృతి ఓజాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కాగా, రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలల అక్రమాలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు నాగరాజు తెలిపారు. ఏఐఎస్ఎఫ్ నేతల అరెస్టు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇంటర్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగిన ఏఐఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి బేగంబజార్ పోలీసు స్టేషన్కు తరలించారు. సాయంత్రం వరకు పీఎస్ వద్ద ఉంచి వదిలిపెట్టారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని, అనుమతులు లేని కళాశాలల జాబితాను బహిర్గతం చేయాలని కోరుతూ ముట్టడి నిర్వహించారు. -
ఫలించిన ప్రభుత్వ కృషి.. దుమ్ములేపిన ప్రభుత్వ కళాశాలలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలను మించిన ఫలితాలను సాధించి ఔరా అనిపించాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించిన ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలను కూడా అభివృద్ధి చేసింది. వాటిలో చదువుకుంటున్న విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకాన్ని అందించింది. ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ హైస్కూళ్లను హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేసి వాటిలో ఇంటర్మీడియెట్ కోర్సులను ప్రవేశపెట్టింది. దీంతో గతంలో మండల కేంద్రాల్లో కళాశాలలు లేక చదువుమానేసే విద్యార్థులకు తమ నివాసాలకు సమీపప్రాంతాల్లోనే కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇంటర్మీడియెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక తరగతులు సైతం నిర్వహించింది. ఈ చర్యలన్నీ ఫలించి కార్పొరేట్ కళాశాలలు బిత్తరపోయేలా ప్రభుత్వ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో రికార్డులు సృష్టించారు. టాపర్గా తహురా అన్నమయ్య జిల్లా మదనపల్లె రాజీవ్నగర్కు చెందిన షేక్ రియాజ్ అలీ, షేక్ నూర్భాను కుమార్తె షేక్ తహురా స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివింది. తాజా ఫలితాల్లో 979 మార్కులతో టాపర్గా నిలిచింది. ♦ కృష్ణా జిల్లా మొవ్వలో క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల జనరల్ కోర్సుల్లో 91.26 శాతం, వృత్తి విద్యా విభాగంలో 92.9 శాతం ఉత్తీర్ణతను సాధించింది. కళాశాల విద్యార్థులు ఎన్.హర్షిత (ఎంఈటీ)968, శ్రీవిద్య(ఎంపీసీ) 963, పి.శ్రావ్య (బైపీసీ) 953 మార్కులతో సత్తా చాటారు. అలాగే అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి ని ఎం.శ్వేత ఎంపీసీలో 951 మార్కులతో టాపర్గా నిలిచింది. చల్లపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 92 శాతం, ఫస్టియర్ విద్యార్థి నులు 87.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. ♦ పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలసకు చెందిన బర్ల లలిత ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440కు 435 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె తల్లిదండ్రులు సుశీల, సంగమేష్ భవన నిర్మాణ కూలీలు. లలిత విజయనగరంలోని నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ ఈ ఫలితాలను సాధించింది. ♦ ఏలూరు జిల్లా నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి హెచ్.అజయ్ రాజు సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 985 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచాడు. అలాగే పెదపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ని జి.కళ్యాణి ఎంపీసీలో 975 మార్కులతో ఏలూరు జిల్లాలో సెకండ్ ర్యాంక్ దక్కించుకుంది. బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎస్. కళ్యాణి ఎంఎల్టీలో 961 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది. నూజివీడు, కలిదిండి, ఆగిరిపల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా మంచి ఫలితాలను సాధించాయి. ♦ చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న దీక్షిత 975 మార్కులతో సత్తా చాటింది. చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం సీఈసీలో నందిని 966, ఎంపీసీలో నందిని 945 మార్కులతో దుమ్ములేపారు. అలాగే పలమనేరు ఏపీఎస్డబ్ల్యూఆర్ గురుకుల కళాశాల, రామకుప్పం కళాశాల, చిత్తూరు ఏపీఎస్డబ్ల్యూఆర్, కుప్పం ఏపీఎస్డబ్ల్యూఆర్ కళాశాలల విద్యార్థులు కూడా అత్యుత్తమ మార్కులు సాధించారు. ఏపీ మోడల్ స్కూల్స్ అదుర్స్.. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో ఏపీ మోడల్ స్కూళ్ల విద్యార్థులు సంచలనాలు సృష్టించారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు అధిక మార్కులు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 162 ఏపీ మోడల్ స్కూల్స్ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం 10,121 మంది పరీక్షలకు హాజరవగా 6,244 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ సెకండియర్ 9,896 మంది పరీక్షలకు హాజరవగా 7,017 మంది (71 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. నంద్యాల జిల్లా మిడ్తూరు, అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా నందవరం, శ్రీకాకుళం జిల్లా రాజపురం మోడల్ స్కూళ్లు సంచలన ఫలితాలను సాధించాయి. కేజీబీవీలు కేక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సైతం ఈసారి ఇంటర్ ఫలితాల్లో దుమ్ములేపాయి. కర్నూలు జిల్లా గూడూరు కేజీబీవీలో ఫస్టియర్ విద్యార్థి ని జి.విజయలక్ష్మి(ఎంపీసీ) 462/470 మార్కులతో సత్తా చాటింది. సీఈసీలో వి.నాగేశ్వరి 459, అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్లో యు.మానస 495, కంప్యూటర్ సైన్స్లో ఎం.యమున 494, ఎస్.హజీరాభాను 490 మార్కులు సాధించారు. సెకండియర్ ఫలితాల్లో మార్కాపురం కేజీబీవీ విద్యార్థి జి.లక్ష్మి అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్లో 980, విజయనగరం జిల్లా వేపాడ విద్యార్థి ని కంప్యూటర్ సైన్స్ డిప్లొమాలో 978, పల్నాడు జిల్లా నకరికల్లు విద్యార్థి ని జె.లక్ష్మీప్రసన్న (ఎంపీసీ) 978, శ్రీకాకుళం కేజీబీవీ విద్యార్థి ని బి.హేమలత (ఎంపీసీ) 973, నర్సీపట్నం కేజీబీవీ విద్యార్థిని వి.నాగలక్ష్మి (బైపీసీ) 973 మార్కులతో రికార్డు సృష్టించారు. శాంతిపురం కేజీబీవీలో సీఈసీ ప్రథమ సంవత్సరం మాధవి 500కు 480, కేజీబీవీ కుప్పంలో జయంతి 500కు 473 మార్కులు సాధించారు. హైస్కూల్ ప్లస్ల్లో పెరిగిన ఉత్తీర్ణత రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఉండాలన్న ప్రభుత్వ ప్రణాళికతో గతేడాది రాష్ట్రంలో 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్గా మార్చారు. అయితే, వాటిలో 249 స్కూల్స్లో మాత్రమే గతేడాది ప్రవేశాలు కల్పించారు. వాటిలో ఈ ఏడాది 4,542 మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా 1,262 మంది ఉత్తీర్ణులయ్యారు. బాల్య వివాహం నుంచి బయటపడి టాపర్గా.. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440కి 421 మార్కులు సాధించిన ఎస్.నిర్మల సమాజంతో పోరాడి గెలిచింది. ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. ఆదిత్య ప్రతిభ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులు ఏడుగురు, 464 మార్కులు 20 మంది పొందారని పేర్కొన్నారు. బైపీసీలో 435, 434 మార్కులు, ఎంఈసీలో 489 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే సీనియర్ ఎంపీసీలో 990, 989, బైపీసీలో 986, ఎంఈసీలో 978 మార్కులు పొంది తమ విద్యార్థులు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి దీపక్రెడ్డి, వైస్ చైర్మన్ సతీ‹Ùరెడ్డి, కో–ఆర్డినేటర్ లక్ష్మీకుమార్, డైరెక్టర్లు గంగిరెడ్డి, రాఘవరెడ్డి, ప్రిన్సిపాల్ మెయినా అభినందించారు. శ్రీచైతన్య విజయకేతనం విజయవాడ: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ బొప్పన తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో చింటు రేవతి రాష్ట్రస్థాయిలో 467 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీలో 440 మార్కులకు గాను టి.దివ్య రాష్ట్రస్థాయిలో 436 మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. అలాగే సీనియర్ ఎంపీసీలో ఎ.వి.దుర్గామధులిక 1000 మార్కులకు గాను 992 మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చారని తెలిపారు. అలాగే బైపీసీలో ఎస్.పావని 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ సాధించినట్లు చెప్పారు. శ్రీప్రకాష్ విజయభేరి తుని: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో శ్రీప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ప్రకాష్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎంపీసీ ద్వితీయ ఏడాది విద్యార్థి ని టి.వెన్నెల 982/1000, డీడీ సాయి శ్రీనివాస్ 980/1000, బైపీసీలో కె.లాస్య నందిని 979/1000 మార్కులతో అగ్రస్థానం సాధించారని పేర్కొన్నారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరం డీవీఎల్ సాయి నిహారిక 464/470, ఎస్.మేఘన 463/470, బైపీసీలో జి.వర్షిణి 428/470 మార్కులు పొందారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత నరసింహారావు, కార్యదర్శి విజయ్ప్రకాష్ అభినందించారు. నారాయణ జయకేతనం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను పి.మేఘన 467, కె.ప్రసన్న 466 మార్కులు పొందారని పేర్కొన్నారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 435 మార్కులు 14 మంది సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో 1000 మార్కులకు గాను 991, 991 టాప్ మార్కులు సాధించినట్లు చెప్పారు. బైపీసీలో 988 మార్కులతో అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. సత్తా చాటిన శశి ఉండ్రాజవరం: ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శుక్రవారం తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు ఎం.నవ్యశ్రీ 990, బి.పార్వతి, కె.లిఖిత 989 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు కేఎస్ సాయి శివాని 987, ఎండీ అబ్దుల్ జాఫర్ 985 మార్కులు పొందారని తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను ఎం.లీలాకృష్ణారెడ్డి, డి.దుర్గా కౌసల్య 466, ఎస్కే ఇర్పాత్, బి.సహస్ర, బి.షన్మిత, టి.మనోజ్ఞ 465 మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. బైపీసీలో 440 మార్కులకు టి.కీర్తి, పీవీ హసని, వి.ఖ్యాతి, ఎం.నిస్సి, సీహెచ్ తేజస్వి 435 మార్కులు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శశి విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ అభినందించారు. తిరుమల విద్యాసంస్థల ప్రభంజనం రాజమహేంద్రవరం రూరల్: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తిరుమల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 466 మార్కులు 12 మంది సాధించారని చెప్పారు. బైపీసీలో 440కి 436 మార్కులు నలుగురు తెచ్చుకున్నారని తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఇద్దరికి 990 మార్కులు వచ్చాయని తెలిపారు. బైపీసీలో 1000 మార్కులకు గాను నలుగురు 989 మార్కులు పొందారని నున్న తిరుమలరావు వివరించారు. ‘విజ్ఞాన్’ విజయభేరి చేబ్రోలు: ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్ విద్యా సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్స్ జె.మోహనరావు, వై.వెంకటేశ్వరరావు తెలిపారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు కె.లీలావతి (989), జి.వైశాలి (988), ఎం.స్నేహ (987), ఎస్కే.మీరావలి (987), కె.వంశీక్రిష్ణ (987), టి.సంజయ్ తేజ (986), సీహెచ్ మనస్వి (986), టి.సంజయ్ తేజ (986) మార్కులు సాధించారని తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో వి.కౌశిక్ (466), జీవీఏ తేజస్వి(464), వై.పార్థసారథి(464), జె.హేమంత్ సందీప్(464), కె.విష్ణువర్ధన్(464), ఆర్.శ్రీకాంత్(464), ఎం.అఖిలేష్ (464), ఎం.హర్ష వర్ధన్(464) మార్కులు సాధించారని చెప్పారు. సత్తా చాటిన భాష్యం గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో భాష్యం ఐఐటీ–జేఈఈ అకాడమీ విద్యార్థులు ఎం. హేమ ప్రియ హాసిని, జి సాయి మనోజ్ఞ 470 మార్కులకు 466 సాధించారని పేర్కొన్నారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో జి.చంద్రలేఖ్య వెయ్యి మార్కులకు గాను 990 మార్కులు, బి.అభిజ్ఞ, ఎం.లహరి పి.సాయి మనోజ్ఞ, కె.వినోదిని 988 మార్కులు సాధించినట్లు చెప్పారు. జూనియర్ బైపీసీలో భాష్యం మెడెక్స్ విద్యార్థులు ఎల్.నవ్య, షేక్ నసీమా 440కి 436 మార్కులు సాధించారని పేర్కొన్నారు. సీనియర్ బైపీసీలో ఎం.హాసిని లాలిత్య, ఇంటూరి యోషిత వెయ్యి మార్కులకు 985, శ్రీషా 984 మార్కులు సాధించినట్లు తెలిపారు. శ్రీగోసలైట్స్ విద్యార్థుల ప్రతిభ భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇంటర్ ఫలితాల్లో శ్రీ గోసలైట్స్ జూనియర్ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి తమ ప్రతిభను కనబరిచారు. సీనియర్ ఇంటర్ విద్యార్థి ని ఆలూరు కిరణ్మయి 990/1000 మార్క్లతో రాష్ట్రంలో సెకండ్ టాప్, కృష్ణాజిల్లాలో సెకండ్ టాప్లో నిలిచింది. అలాగే జూనియర్ ఇంటర్ విద్యార్థి ని ఇంజమూరి హరిచందన 435/440 మార్కులతో రాష్ట్రంలో సెకండ్ టాప్లో, కృష్ణాజిల్లాలో సెకండ్ టాప్లో నిలిచింది. ఈ సందర్భంగా శ్రీ గోసలైట్స్ చైర్మన్ నరేంద్ర బాబు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. శ్రీవిశ్వశాంతి విజయం భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇంటర్ ఫలితాల్లో కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన శ్రీవిశ్వశాంతి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు అత్యధికంగా 988, 984, 984, 982, 982, 981 మార్కులను సాధించారు. అదే విధంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 465, 464, 464, 463, 463, 463, 463, 462, 462, 462, 462, 462 మార్కులు పొందారు. ఈ ఘన విజయాలు సాధించిన విద్యార్థులను శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థల అధినేత మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు, డైరెక్టర్ మాదల సూర్యశేఖర్ అభినందించారు. -
నోటికొచ్చిందే ఫీజు!
హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆయన కుమారుడు ధీరజ్ ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ధీరజ్ను ఇంటర్మీడియట్లో చేర్చేందుకు శ్రీనివాస్ ఎల్బీనగర్ వైపున్న ఓ కార్పొరేట్ కాలేజీని (రెసిడెన్షియల్) సంప్రదించారు. ఏడాదికి రూ.2.10 లక్షల ఫీజు అని చెప్పడంతో నోరెళ్లబెట్టాడు. చేసేదేం లేక సమీపంలోని మరో కార్పొరేట్ యాజమాన్యానికి చెందిన కాలేజీలో సంప్రదించారు. అక్కడ ఏడాదికి రూ.2.20 లక్షలని చెప్పడంతో అవాక్కయ్యారు. డిసెంబర్, జనవరి సమయంలోనే వస్తే రూ.1.90 లక్షలకే సీటు ఇచ్చేవారమని, ఇప్పుడు సీట్లు నిండిపోతుండటంతో ఫీజు పెరిగిందని సదరు కళాశాలల సిబ్బంది చెప్పడం గమనార్హం. కరీంనగర్ జిల్లాకు చెందిన సుబ్రమణ్యం సింగరేణిలో చిన్న ఉద్యోగి. తన కుమార్తె మీనాక్షి కోసం షామీర్పేట ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో సంప్రదించగా.. ఫస్టియర్కు రూ.2.40 లక్షలు, సెకండియర్కు రూ.2.60 లక్షలు ఫీజు ఉందని చెప్పారు. ఆలోచించుకొని రెండు రోజుల్లో వస్తానని సుబ్రమణ్యం చెప్పివచ్చారు. రెండు రోజుల తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లేసరికి సీట్లు లేవన్నారు. వస్తానని చెప్పాను కదా ఎలాగైనా సీటు కావాలని కోరగా.. సిబ్బంది సార్తో మాట్లాడతామని చెప్పి వెళ్లారు. కాసేపటికి వచ్చి ఫస్టియర్కు రూ.2.60 లక్షలు, సెకండియర్కు రూ.2.80 లక్షలు ఫీజుకు ఓకే అంటే సీటు ఇస్తామని తెగేసి చెప్పారు. -సాక్షి ప్రతినిధి, నల్లగొండ .. ఇది ఆ రెండు, మూడు కాలేజీల్లోనో, ఇద్దరు ముగ్గురు తల్లిదండ్రుల పరిస్థితి మాత్రమేనో కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్, ప్రముఖ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల బాగోతం, లక్షల కొద్దీ ఫీజులు కట్టడం కోసం సతమతం అవుతున్న తల్లిదండ్రుల ఆందోళన. ఆశనే బలహీనతగా మార్చుకొని.. ఫలానా కాలేజీలోని ఫలానా బ్రాంచీలో ఇంటర్మీడియట్ చదివిస్తే జేఈఈలో, ఎంసెట్లో మంచి ర్యాంకులు వస్తాయని.. తద్వారా బీటెక్ సీటు మంచి కాలేజీలో వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్, ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆశను కాలేజీలు సొమ్ము చేసుకుంటున్నాయి. నోటికే వచ్చిందే ఫీజు అన్నట్టుగా అడ్డగోలుగా నిర్ణయించి, రూ.10వేలు అడ్వాన్స్గా తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నాయి. అసలు పదో తరగతి పరీక్షలైనా జరగకముందే.. సీట్లు అయిపోతున్నాయంటూ తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేసి, అధిక ఫీజులను దండుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా అడిగేవారు లేరని, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడమే లేదని విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లోనే అత్యధిక కాలేజీలు రాష్ట్ర ఇంటర్ విద్యాశాఖ పరిధిలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సంక్షేమ శాఖల పరిధిలోని 850 వరకు ఉన్న గురుకుల కాలేజీలతోపాటు 1,550 వరకు ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఐదు కార్పొరేట్, ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన కాలేజీలే 300 వరకు ఉండగా.. వీటిలో 220 కాలేజీల దాకా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఏటా ఇంటర్ చదివే దాదాపు 5లక్షల మంది విద్యార్థుల్లో సగం మంది ఈ కాలేజీల్లోనే చేరుతున్నారు. ఆయా కాలేజీల్లో చదివిస్తే తమ పిల్లలకు మంచి చదువు వస్తుందని, మంచి ర్యాంకు వస్తుందన్న ఆశలతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. ఫీజు విధానం ఊసే లేక.. ఇంటర్ బోర్డు నిర్ణీత ఫీజుల విధానాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ వ్యవస్థ ఏర్పాటైనప్పుడు నిర్ణయించిన ఫీజు రూ.3 వేలలోపే. ఆ తర్వాత దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం సాధారణ ప్రైవేటు కాలేజీలు స్థాయిని బట్టి రూ.20 వేల వరకు వసూలు చేస్తుండగా.. కార్పొరేట్ కాలేజీలు హాస్టల్ వసతి కలుపుకొని రూ.1.50 లక్షల నుంచి రూ.2.70 లక్షలవరకు తీసుకుంటున్నాయి. 2009లో లవ్ అగర్వాల్ ఇంటర్ విద్య కమిషనర్గా ఉన్న సమయంలో ఫీజుల విధానానికి చర్యలు చేపట్టినా ముందుకు సాగలేదు. 2013లో ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ కమిటీ.. గ్రామీణ ప్రాంతాల్లో కనీసంగా రూ.3,500, పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా రూ.6,500 ఫీజు నిర్ణయించాలని సూచించింది. ఆ సిఫార్సులు ఆచరణలోకి రాలేదు. తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ నేతృత్వంలోని కమిటీ కూడా ఇంటర్మీడియట్ ఫీజుల విధానాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వానికి నివేదించినా స్పందన లేదు. -
చెలరేగిపోతున్న కార్పొరేట్ కళాశాలలు ..అధికంగా ఫీజుల వసూలు
హితేష్ అనే విద్యార్థి నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ‘చైనా’ బ్యాచ్ అని, 24 గంటలూ ఏసీ అని రూ.90 వేలు ఫీజు కట్టించుకుంటున్నారు. పుస్తకాలకు మరో రూ.15 వేలు వసూలు చేశారు. హాస్టల్కు నెలకు రూ.5 వేల చొప్పున కట్టించుకున్నారు. నారాయణ కళాశాలలో నర్మద అనే విద్యార్థినికి ఐఐటీ కోచింగ్ పేరుతో ఏడాదికి రూ.75 వేలు, హాస్టల్కు నెలకు రూ.5 వేలు చొప్పున కట్టాలని చెప్పారు. పుస్తకాలు, ప్రాక్టికల్స్ పేరుతో మరికొంత చెల్లించాలని ఒత్తిడి చేశారు. తలకు మించిన భారం కావడంతో తల్లిదండ్రులు రెండు నెలల క్రితం నారాయణ కళాశాలలో టీసీ తీసుకుని.. కూతురిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్చారు. నారాయణ విద్యా సంస్థల్లో ముందస్తుగా అడ్మిషన్లు చేయడానికి పీఆర్వోలను నియమించుకున్నారు. ముందుగా చేరితే ఫీజుల రాయితీ ఇస్తామని అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. జెడ్ఎఫ్బీ, ఎన్120, కోస్పార్క్ అని ఆకర్షణీయమైన పేర్లు పెట్టి స్టడీ మెటీరియల్పై అమాంతంగా ఫీజులు పెంచుతున్నారు. అనంతపురం నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ ఇటీవల కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఫీజు మొత్తం కడితేనే రికార్డులు ఇస్తామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. ఫీజు కట్టలేదని అందరి ముందు అవమానించడం, క్యాంపస్ బయట నిల్చోబెట్టడం, రికార్డులు, హాల్టికెట్లు ఇవ్వబోమని బెదిరించడం కార్పొరేట్ కళాశాలల్లో షరామామూలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవ్యశ్రీ లాంటి విద్యార్థినులు ఎంతోమంది అర్ధంతరంగా చదువులు మానేయడం.. ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తున్నారు. అనంతపురం: కార్పొరేట్ కళాశాలలు అడ్డగోలు సంపాదనకు తెరలేపాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కన్నా అదనంగా వసూలు చేస్తున్నాయి. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కళాశాలల్లో అధిక ఫీజులు, వసూళ్ల కోసం వేధింపులు పరాకాష్టకు చేరుతున్నాయి. సూపర్ –20, ఐఐటీ తదితర కోర్సుల పేరుతో విచ్చలవిడిగా వసూలు చేస్తూ తల్లిదండ్రులపై విపరీతమైన భారం మోపుతున్నారు. విద్యార్థుల్లోనూ మానసిక ఒత్తిడి పెంచుతున్నారు. దీని నుంచి విద్యార్థులు బయటపడలేక అర్ధంతరంగా చదువు మానేయడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి విపరీతమైన పరిస్థితులకు దారితీస్తోంది. కళాశాలలపై పర్యవేక్షణ చేయాల్సిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిమ్మను నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ ఫీజు ఏడాదికి రూ.60 వేలట! నారాయణ కళాశాలలో ఒక్కో విద్యార్థికి హాస్టల్ ఫీజు రూ.60 వేలుగా నిర్ధారించారు. నెలకు రూ.5 వేల చొప్పున వసూలు చేస్తూ ఒక్కో గదిలో 10 మందిని కేటాయించారు. నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదు. ఇదే విషయం ఇటీవల తనిఖీలో వెలుగు చూడటంతో జాయింట్ కలెక్టర్ జరిమానా విధించారు. ఒక్కో విద్యార్థికి ఇంటర్మీడియెట్లో ఫీజు రూ.20 వేలు దాటకూడదు. కానీ కార్పొరేట్ కళాశాలలు రూ.65 వేల నుంచి రూ.80 వేల దాకా వసూలు చేస్తున్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రమే చదవాల్సి ఉన్నప్పటికీ సొంత మెటీరియల్ పేరుతో మరో రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. ఏడాదికి హాస్టల్ ఫీజు, కళాశాల ఫీజు మొత్తం రూ.1.50 లక్షలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. అంత డబ్బు చెల్లించుకోలేని వారు తమ పిల్లలను చదువు మాన్పిస్తున్నారు. అన్నీ అద్దె భవనాలే.. నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఏ ఒక్క బ్రాంచ్కూ సొంత భవనాలు ఉండవు. అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల హవా నడిచినన్నాళ్లూ తల్లిదండ్రులను ముక్కుపిండి వసూలు చేసి.. అద్దె భవనాలు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చుననే ఎత్తుగడతోనే కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులకు నివేదించాం నారాయణ కళాశాల ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్న అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ సురేష్బాబు, ఆర్ఐఓ, అనంతపురం -
కళాశాలలకు కార్పొరేట్ కళ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కార్పొరేట్ కళను సంతరించుకోనున్నాయి. నాడు–నేడు పనులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడులకు కార్పొరేట్ సొబగులు అద్దిన ప్రభుత్వం తాజాగా జూనియర్ కళాశాలలపై దృష్టి సారించింది. డిసెంబరు నాటికి పూర్తి స్థాయిలో సకల వసతులు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అవసరమైన చోట్ల అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. నెల్లూరు (టౌన్): ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టింది. జిల్లాలో తొలి విడతలో 1,059, రెండో విడతలో 1,112 పాఠశాలలను అభివృద్ధి చేసిన ప్రభుత్వం తాజాగా జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కళాశాలల్లో 9 రకాల వసతులను కల్పించనున్నారు. వీటి అభివృద్ధికి రూ.13.44 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పనులను బట్టి విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నారు. త్వరలో పనులు ప్రారంభించి డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కళాశాల డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆధునిక వసతులు ఏర్పాటు కానుండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 9 రకాల వసతుల ఏర్పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 9 రకాల వసతులు కలి్పంచనున్నారు. అవసరమైన కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, మేజర్, మైనర్ రిపేర్స్, రన్నింగ్ వాటర్, ఆర్వో ప్లాంట్లు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ పనులు, ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు, బెంచీలు, టేబుల్స్, గ్రీన్ చాక్బోర్డు, పెయింటింగ్, కాంపౌండ్ వాల్ తదితర వసతులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ విభాగం అధికారులు కళాశాలల్లో మౌలిక వసతులు పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కళాశాల డెవలప్మెంట్ కమిటీ ప్రతిపాదనల మేరకు తీర్మానాలు చేశారు. వీటికి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ఆమోదముద్ర వేశారు. డిసెంబరు నాటికి పూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను బట్టి విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నారు. వారం రోజుల్లో తొలుత ఆయా కళాశాలలకు 15 శాతం నిధులు విడుదల చేయనున్నారు. పనులు ఆయా కళాశాల డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. నాడు–నేడు పనులు పూర్తతే కళాశాలలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనున్నాయి. – ఎ. శ్రీనివాసులు, డీవీఈఓ 22 కళాశాలల ఎంపిక జిల్లాలో మొత్తం 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు మరో 4 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 25 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటరీ్మడియట్ చదువుతున్నారు. ప్రస్తుతం నాడు–నేడుకు జిల్లాలో 22 జూనియర్ కళాశాలలు ఎంపిక చేశారు. వీటి అభివృద్ధికి రూ.13,44,95,539 ని«ధులు మంజూరు చేశారు. -
ప్రాణాలు తీస్తున్న ఫీజులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: అడ్డూ అదుపూ లేని కార్పొరేట్ కాలేజీల దోపిడీ, ధనదాహం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఫీజులు చెల్లించలేని నిస్సహాయ పరిస్థితుల్లో, ప్రైవేటు కాలేజీల వేధింపులు భరించలేక, తల్లిదండ్రుల ఆవేదన చూడలేక బలవన్మరణాలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫీజు చెల్లించలేదని ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో శుక్రవారం హైదరాబాద్ రామాంతపూర్ నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. మాదాపూర్లోని మరో కాలేజీలో కొన్ని నెలల క్రితం విద్యార్థి ఆందోళనకు దిగే వరకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో ఫీజు చెల్లించే వరకు క్లాసులకు రావొద్దంటూ ఓ విద్యార్థిని వేధించడంతో, విద్యార్థి తీవ్ర మానసిక వేదనకు గురై మీడియాను ఆశ్రయించాడు. ఇలాంటి సంఘటనలెన్నో జరుగుతున్నా ఇంటర్ బోర్డు కానీ, విద్యామంత్రిత్వ శాఖ కానీ స్పందించిన దాఖలాల్లేవని, కిందిస్థాయి సిబ్బంది మొదలు ఉన్నతాధికారుల వరకు ముడుపులు అందడం వల్లే కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహణ రాష్ట్రంలో 1,606 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటన్నింటికీ ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు (అఫ్లియేషన్) ఇస్తుంది. ఇప్పటివరకు 1480 కాలేజీలు అఫ్లియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో 643 కాలేజీలకు అనుమతులిచ్చారు. వీటిల్లో సింహభాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్న కార్పొరేట్ కాలేజీలే కావడం విశేషం. అఫ్లియేషన్ ఇచ్చేటప్పుడు అనేక అంశాలను ఇంటర్ బోర్డు పరిశీలించాల్సి ఉంటుంది. కాలేజీకి 8 వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆటస్థలం తప్పనిసరి. లేబొరేటరీతో పాటు సెక్షన్కు ఇద్దరు అధ్యాపకులుండాలి. 9 సెక్షన్లకు మించి ఉండకూడదు. ప్రతి సెక్షన్లో 88 సీట్లు అనుమతిస్తారు. భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా అదనపు సెక్షన్లు నడుపుతున్నారు. ప్రాక్టికల్స్ చేయించిన పాపాన పోవడం లేదు. సైన్స్ గ్రూపులతో పాటు, ఆర్ట్స్, కామర్స్ గ్రూపులూ ఉండాలి. కానీ కార్పొరేట్ కాలేజీల్లో అసలీ గ్రూపులే ఉండటం లేదు. ఇక ఒకటీ అరా కాలేజీల్లో మినహా ఆటస్థలం అనేదే ఉండటం లేదు. కొన్ని కాలేజీలకు ఒకచోట పర్మిషన్ ఉంటే మరోచోట నిర్వహిస్తున్నారు. అరకొరగా ఉండే అధ్యాపక సిబ్బందికి అతి తక్కువ వేతనాలిస్తూ, ఫీజుల విషయంలో విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తూ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఆలస్యమైతే అంతే.. ప్రైవేటు జూనియర్ కాలేజీల ఫీజులపై కచ్చితమైన చట్టం లేకపోవడం కార్పొరేట్ కాలేజీల పాలిట వరంగా మారింది. ఐఐటీ, నీట్ ఫౌండేషన్ అంటూ భారీయెత్తున ప్రచారంతో కాలేజీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తుపై ఆశతో అనేక కష్టాలు పడుతూ ఆయా కాలేజీల్లో చేర్పిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కాలేజీలు ఫీజులు పిండేస్తున్నాయి. కాలేజీని బట్టి కనీస వార్షిక ఫీజు రూ.60 వేలుంటే, గరిష్టంగా రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చేరిన వెంటనే ఫీజులో సగం కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మిగతా మొత్తం రెండు నెలల్లో చెల్లించాలంటున్నారు. వారం రోజులు ఆలస్యమైనా విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఫీజు చెల్లించకపోతే క్లాసులో నిలబెడుతున్నారని, క్లాసు నుంచి బయటకు వెళ్లిపొమ్మంటూ అందరిలో అవమానిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు పదేపదే మెసేజ్లు పెడుతూ వేధిస్తున్నారు. క్లాసులకు హాజరుకానివ్వడం లేదు. చివరి అస్త్రంగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు.. ఉన్నత తరగతుల్లో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు. ఆ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి కార్పొరేట్ కాలేజీల ధన దాహం పేద విద్యార్థులకు శాపంగా మారింది. రామంతాపూర్ నారాయణ కాలేజీ ఉదంతమే దీనికి నిదర్శనం. చాలా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఇంటర్ బోర్డు తక్షణమే స్పందించాలి. ఈ తరహా దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలి. నారాయణ కాలేజీలో ఆత్మహత్య ప్రయత్నంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. నారాయణ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి. – ప్రవీణ్రెడ్డి (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నారాయణ సంస్థలతో పాటు ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం దారుణం. రామంతాపూర్ నారాయణ కళాశాల వేధింపులు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాయి. వేధింపులకు పాల్పడుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు.. కార్పొరేట్ కాలేజీల దోపిడీని అడ్డుకోవాలి. – టి. నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) ముడుపుల ఆరోపణలపై విచారణ జరపాలి నారాయణ, చైతన్య కాలేజీలు నడిపే హాస్టళ్ళకు అనుమతుల్లేవని ఇంటర్ బోర్డే తేల్చి చెప్పింది. అయినా ఆ కాలేజీలు య«థేచ్ఛగా హాస్టళ్లు నడుపుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. బోర్డు అధికారులకు వారినుంచి ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి. – మాచర్ల రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ కమిటీ కన్వీనర్) చదవండి: అగ్గి రాజేసిన ఫీజు -
ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కాలే.. ఫీజులు కట్టమని బెదిరిస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో : కరోనా కష్టకాలంలో సైతం కార్పొరేట్ కాలేజీలు ముందస్తు ఫీజుల పేరిట బాదుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆన్లైన్ తరగతులకు శ్రీకారం చుట్టి పట్టుమని పదిరోజులు గడవక ముందే ఫీజుల ఒత్తిళ్లకు పాల్పడుతున్నాయి. పదో తరగతి పరీక్షల కంటే ముందే ఇంటర్మీడియట్లో సీటు బుకింగ్ రిజర్వ్డ్ పేరిట అడ్మిషన్ల సంఖ్యను పూర్తి చేసుకున్న కార్పొరేట్ కాలేజీలు.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షల రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే ఆన్లైన్ ద్వారా తరగతులు ప్రారంభించాయి. వాస్తవంగా పదో తరగతి పరీక్షలు రద్దయినా గ్రేడింగ్ ఇంకా వెలువడలేదు. కానీ.. కార్పొరేట్ కాలేజీలు సీటు రిజర్వ్డ్ చేసుకున్న విద్యార్థుల సెల్ఫోన్లకు ఆన్లైన్ ఐడీ పంపించి గత నెల 29 నుంచే ఆన్లైన్ బోధన సాగిస్తున్నాయి. కోర్సు ఫీజులో ముందస్తుగా రూ.20 వేలు, పాఠ్యపుస్తకాల కోసం మరో రూ.10 వేలు చెల్లించాలని విద్యార్థుల పేరెంట్స్ సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు అందుతున్నాయి. సోమవారం నుంచి ఫీజు వసూలు కౌంటర్లు తెరిచి ఉంటాయని సమాచారం అందించాయి. తక్షణమే చెల్లించడంతో పాటు పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేసేలా విద్యార్థులపై ఒత్తిళ్లకు దిగుతున్నాయి. ఆది నుంచీ అదే వైఖరి.. చదువుల కోసం ఆది నుంచీ కార్పొరేట్ కాలేజీల బాదుడు మొదలవుతోంది. సీటు రిజర్వ్డ్ పేరిట రూ.2000, దరఖాస్తు ఫారం పేరిట రూ 300 వసూలు సర్వసాధారణమైంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కోర్సును బట్టి రూ.70 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అదే కార్పొరేట్ విద్యా సంస్థలో పదో తరగతి చదివి ఉంటే మాత్రం కన్వర్షన్ పేరిట కొంత ఫీజులో తగ్గింపు ఇస్తున్నా.. మిగిలిన వారికి మాత్రం ఇష్టానుసారం ముక్కుపిండి వసూలు చేయడం మామూలుగా మారింది. అది కూడా రెండు మూడు విడతల్లోనే పూర్తి ఫీజు చెల్లించే విధంగా కార్పొరేట్ విద్యా సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్న కారణంగా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. విద్యా సంవత్సరానికి ముందే ఆన్లైన్ తరగతులు ప్రారంభమైనా విద్యాశాఖ ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయానికి గురి చేస్తోంది. చెల్లింపులన్నీ నగదు రూపంలోనే.. వైరస్ కట్టడిలో భాగంగా నగదు కాకుండా డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు జరపడం మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నప్పటికీ కార్పొరేట్ కాలేజీలు మాత్రం నగదు చెల్లింపు మాత్రమే అంగీకరిస్తామంటున్నాయి. కనీసం సీటు రిజర్వ్డ్ దరఖాస్తుకు చెల్లించే ఫీజునూ నగదు రూపంలోనే తీసుకోవడం విస్మయపరుస్తోంది. తాజాగా ఫీజులు, పాఠ్యపుస్తకాలకూ నగదు చెల్లించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
కార్పొ‘రేటు’.. 'తల్లిదండ్రులకు పోటు'
నవీన్చంద్ అనే విద్యార్థి విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో 2019–20లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్లో చేరాడు. హాస్టల్, కాలేజీ ఫీజులన్నీ కలిపి రూ.1.70 లక్షలు చెల్లించాడు. ఇప్పుడు సెకండియర్కు వచ్చేసరికి ఆ ఫీజు రూ.2 లక్షలకు పెరిగింది. వంశీకృష్ణ విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి. గత ఏడాది ఫస్టియర్ ఫీజు రూ.1.80 లక్షలు. ఈ ఏడాది సెకండియర్లో అది కాస్తా 2.30 లక్షలకు పెరిగింది. లైబ్రరీ, ల్యాబ్, బుక్స్ కోసం అదనంగా డబ్బు వసూలు చేశారు. హాస్టల్లో ఉండే వారికి దోబీ చార్జీల కింద రూ.7 వేల వరకు వీటికి అదనం. కరోనా సమయంలో కాలేజీలు, హాస్టళ్లు నడవనప్పుడు ఇంతలా ఫీజులు అన్యాయం అని తల్లిదండ్రులు అడిగితే, నచ్చితేనే మీ పిల్లాడిని ఉంచండి.. లేదంటే తీసుకుపోండి.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు తగ్గించమని చెప్పింది కదా.. అంటే మాకు హెడ్డాఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు కనుక పూర్తి ఫీజు కట్టాల్సిందేనంటూ కాలేజీల సిబ్బంది సమాధానమిస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీల తీరు విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు.. ఇలా ఎక్కడ చూసినా ఈ కాలేజీల వ్యవహారం ఇదే రీతిలో ఉంది. ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలోని పరిస్థితులపై చేపట్టిన పరిశీలనలో అనేక అంశాలు వెలుగు చూశాయి. కమిషన్ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ విభాగానికి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నందున గత ఏడాది ఫీజులను 30 శాతం మేర తగ్గించి, మిగతా మొత్తం మాత్రమే ఈ ఏడాది వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ప్రయివేటు కార్పొరేట్ కాలేజీలు దీన్ని అమలు చేయడం లేదని కమిషన్ సభ్యుల పరిశీలనలో తేలింది. ఫీజులు తగ్గించకపోగా కొన్ని కాలేజీలు గత ఏడాది కన్నా భారీగా పెంచి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్ని ఫీజులు పెంచి ఆపై 30 శాతం తగ్గిస్తున్నట్లు డ్రామాలకు తెర తీశాయి. కొన్ని ఏడాదికి కొంత మంది నుంచి 1.50 లక్షలు తీసుకొంటే, మరికొంత మంది నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలైతే రెండేళ్లకు కలిపి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని కమిషన్ వైస్ చైర్పర్సన్ విజయ శారదా రెడ్డి వెల్లడించారు. వసూళ్లకు లెక్కాపత్రాల్లేవు ► ఆయా కార్పొరేట్ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులకు ఎక్కడా లెక్క పత్రాలు, ఫీజుల వివరాలు, అకౌంట్సు బుక్స్ ఆ విద్యా సంస్థల్లో ఉండడం లేదు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా, ఆ ఫీజులో దేనికెంత అనే వివరాలు లేవు. ► ఆయా సంస్థల్లో పరిశీలనకు వెళ్తున్న కమిషన్ బృందాలు ఫీజులు, ఇతర వివరాల రికార్డుల గురించి అడిగితే అవన్నీ సెంట్రల్ ఆఫీసులో ఉంటాయని, కేవలం తాము అకడమిక్ వ్యవహారాలే చూస్తామంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కమిషన్ బృందాలు పరిశీలనకు వచ్చినప్పుడు అకౌంట్సు సిబ్బందిని అందుబాటులో లేకుండా చేస్తూ కార్పొరేట్ సంస్థలు ఫీజుల లెక్కలు చూపకుండా తప్పించుకుంటున్నాయి. ► కరోనా సమయంలో కాలేజీలు, హాస్టళ్లు నడవలేదు. పాఠాల బోధన లేనేలేదు. నిర్వహణ ఖర్చులు కూడా చాలా తగ్గాయి. అయినా సరే కాలేజీలు గత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆన్లైన్ తరగతుల కోసం ప్రతి విద్యార్థికి నెలకు రూ.10 వేలు ఖర్చంటూ లెక్క చెబుతున్నాయి. ఈ ఏడాదిలో సెకండియర్లోకి వచ్చిన విద్యార్థుల ఫీజులను భారీగా పెంచాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురు దాడికి దిగడం, విద్యార్థులను తీసుకుపొమ్మని చెబుతుండడంతో పిల్లల భవిష్యత్తు దెబ్బ తింటుందేమోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సి వస్తోంది. ల్యాబ్లు, లేబ్రరీలు లేకున్నా అదనపు ఫీజులు ► ఇటీవల కమిషన్ బృందాలు వరుసగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని కార్పొరేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాయి. కాలేజీల్లో లైబ్రరీ, ల్యాబ్ వంటి వసతులు లేకపోయినా వాటి పేరిట అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలింది. ► హాస్టళ్లలో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. అయినా హాస్టల్ విద్యార్థుల ఫీజులను భారీగా పెంచారు. గతంలో ఒక్కో గదిలో ఆరుగురు విద్యార్థులను ఉంచే వారమని, ఇప్పుడు ముగ్గురు లేదా నలుగురినే ఉంచుతున్నందున అదనంగా కొంత మొత్తం వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ► హాస్టళ్లలో పిల్లలకు సరైన సదుపాయాలు కూడా లేవని కమిషన్ తనిఖీల్లో బయట పడింది. పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండడంతో వాటిని తినలేక వారు నానా అవస్థలు పడుతున్నారు. మరోపక్క కరోనాతో ఇళ్లలోనే ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా హాస్టల్లోని పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రుద్దుడే.. ► కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలతో విద్యార్థుల చదువులు తాపీగా సాగాయి. కాలేజీలు, హాస్టళ్లను తెరచిన యాజమాన్యాలు సిలబస్ను పూర్తి చేసేందుకు తొందర తొందరగా బోధన సాగిస్తున్నాయి. పిల్లలకు అర్థమవుతోందా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదు. ► ఉదయం ఏడు గంటల నుంచి తరగతులు ప్రారంభించి.. రాత్రి 9 గంటల వరకు పాఠాలు చెబుతున్నారని, లంచ్ ఇతర విరామ సమయాలు కొద్ది నిముషాలు కూడా ఉండడం లేదని విద్యార్థులు కమిషన్ సభ్యుల దృష్టికి తెచ్చారు. స్టడీ అవర్లో కనీసం మూత్ర విసర్జనకూ అనుమతించడం లేదని విద్యార్థులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. కరోనా సమయంలో కార్పొరేట్ కాలేజీలు అనేక మంది సిబ్బందిని తొలగించాయి. వారికి వేతనాలు కూడా చెల్లించలేదు. గత్యంతరం లేక వారంతా వేర్వేరు ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు. ఇప్పుడు కాలేజీలు తెరచినా వారెవ్వరూ తిరిగి రాక యాజమాన్యాలు అరకొర సిబ్బందితోనే నడిపిస్తున్నాయి. ► పలు కాలేజీల్లో సరైన బోధనా సిబ్బంది కూడా లేరు. ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ కాకుండా, వారు రూపొందించిన మెటీరియల్తో బోధన సాగిస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా వారికి ఆటపాటలు కూడా ఉండాలని ప్రభుత్వం సూచించినా ఏ ఒక్క యాజమాన్యమూ పట్టించుకోవడం లేదు. ► 30 మంది పట్టే తరగతి గదిలో ఏకంగా 80 మందిని కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న దృశ్యాలు అన్ని కార్పొరేట్ కాలేజీల్లో మామూలైపోయింది. దీంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. -
అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
సాక్షి, విజయవాడ: మూడు రోజులుగా కార్పొరేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు తెలిపారు. ఇప్పటివరకు 360 విద్యాసంస్థలు తనిఖీ చేశామని.. 50 కాలేజీలు, 25 స్కూళ్లపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేశామని పేర్కొన్నారు. ‘‘ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. గతేడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించి మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష) ప్రభుత్వాదేశాలను కొన్ని కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోలేదు. కనీస సౌకర్యాలు కూడా లేకుండా అధిక ఫీజులు వసూలు చేశారు.అధిక ఫీజు వసూలు చేసిన కాలేజీలు తిరిగి డబ్బును విద్యార్థులకు ఇచ్చేయాలి. అలా చేస్తే చర్యలు తీసుకోకుండా ఆలోచిస్తామని’’ ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తే 91502 81111 కాల్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అధిక ఫీజుల వసూలుపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంతారావు హెచ్చరించారు. చదవండి: కదిలిన సంక్షేమ రథ చక్రాలు -
కార్పొరేట్ కక్కుర్తి..!
శ్రీధర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. తన కూతురును ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివిస్తున్నారు. ప్రథమ సంవత్సరంలో రూ. 1.2 లక్షల ఫీజు చెల్లించారు. ఇప్పుడు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. అందుకోసం ఇప్పటికే రూ. 50 వేలు చెల్లించారు. ఈ నెలాఖరులోగా మిగతా ఫీజు చెల్లించాలని యాజమాన్యం స్పష్టం చేసింది. కాలేజీల్లో ప్రత్యక్ష బోధన లేదు.. ప్రాక్టికల్స్ లేవు. అయినా మొత్తం ఫీజు చెల్లించాలనడంతో గత్యంతరం లేక తన కూతురు భవిష్యత్తు కోసం అప్పు వేటలో పడ్డారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు ఫీజుల దందా కొనసాగిస్తున్నాయి. రాయితీ ఇస్తామని ఆశపెట్టడం లేదా పిల్లలకు పాఠాలు చెప్పబోమని బెదిరించి మొత్తం ఫీజును వసూలు చేసుకుంటున్నాయి. ప్రత్యక్ష బోధన, ప్రాక్టికల్స్ లేకపోయినా కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. యాజమాన్యాలు చెప్పినంత ఫీజు చెల్లించాలనే డిమాండ్లతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గడువులోగా ఫీజు చెల్లించకుంటే ఆన్లైన్ క్లాసులు నిలిపేస్తామని హెచ్చరిస్తూ తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. అప్పుడెంతో.. ఇప్పుడూ అంతే రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404 ఉంటే ప్రైవేటు కాలేజీలే 1,550కుపైగా ఉన్నాయి. అందులో 18 కార్పొరేట్ మేనేజ్మెంట్లకు చెందిన కాలేజీలు 193 ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు వేసింది. వాటిల్లోనే ఏకంగా 3.4 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. సాధారణ కాలేజీల్లో ఫీజులు రూ. 20–30 వేలు ఉండగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం కాలేజీని బట్టి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. బ్యాచ్ను బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.85 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాయి. ఎంసెట్, ఐఐటీ కోచింగ్ అంటూ ప్రత్యేక బ్యాచ్ల పేరుతో అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్నాయి. గతేడాది నిర్ణయించిన ఫీజునే ఇప్పుడూ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఆన్లైన్ తరగతులు కావడంతో కొంత రాయితీ ఇవ్వాలని కోరినా కాలేజీలో చేర్చినప్పుడు ఖరారు చేసుకున్న మొత్తాన్నే చెల్లించాలని పట్టుపడుతున్నాయి. ఇక ఫీజు చెల్లించని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను నిలిపేస్తున్నాయి. ప్రతి వారం నిర్వహించే స్లిప్ టెస్టులకు దూరం చేస్తున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. చదవండి: (బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా) కాలేజీలకు భారీ లాభం.. ఓ వైపు ఫీజులను తగ్గించట్లేదు. నిర్దేశిత ఫీజులనే వసూలు చేస్తున్నాయి. ఇంకోవైపు ఖర్చు భారీగా తగ్గింది. ఉన్న సిబ్బందిని 10 శాతం కంటే తక్కువకు కుదించాయి. వంద మంది లెక్చరర్లు బోధించాల్సిన క్యాంపస్లలో ఆరేడు మంది లెక్చరర్లతో నడిపిస్తున్నాయి. వారితోనే వేల మంది విద్యార్థులకు ఆన్లైన్ బోధన కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఒక్కో క్యాంపస్లో ఆరేడు వందల మంది విద్యార్థులు ఉంటారు. వారికి 50 మందికిపైగా లెక్చరర్లు అవసరం. వారికి గతంలో వేతనాల రూపంలోనే నెలకు సగటున రూ.12.5 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఐదుగురు లెక్చరర్లకు రూ.లక్ష లోపు చెల్లిస్తూ ఆన్లైన్ బోధన కొనసాగిస్తున్నాయి. ఇలా ఒక్కో కాలేజీలో 90 శాతం మంది బోధనా సిబ్బందిని (మొత్తంగా 10 వేల మందికి పైగా) రోడ్డున పడేసి, వారికి చెల్లించాల్సిన వేతనాల మొత్తాన్ని మిగుల్చుకుంటున్నాయి. అంతేకాదు ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బందిలో ఒక్క శాతం మందికే పూర్తి వేతనాలు చెల్లిస్తుండగా, 2 శాతం మందికి 60 శాతం వేతనాలు, మిగతా వారికి 40 శాతం నుంచి 50 శాతం లోపే వేతనాలు చెల్లిస్తూ.. లెక్చరర్లను అర్ధాకలికి గురి చేస్తున్నాయి. ఇతర ప్రైవేటు కాలేజీల్లో బోధించే మరో 10 వేల మందికి పైగా లెక్చరర్లు రోడ్డున పడ్డారు. పట్టించుకోని విద్యా శాఖ కార్పొరేట్ కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా విద్యా శాఖ పట్టించుకోవట్లేదు. స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చేపట్టాలన్న డిమాండ్ ఉన్నా దానిపై దృష్టి సారించట్లేదు. గతంలో ఒకసారి ఫీజుల నియంత్రణకు కసరత్తు ప్రారంభించినా ఆ తర్వాత గాలికి వదిలేశారు. దీంతో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు ఆకర్షణీయ పేర్లతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తొమ్మిది నెలలుగా ఉద్యోగం లేదు: దుబ్బాక జానకిరెడ్డి, రాష్ట్ర లెక్చరర్స్ జేఏసీ ఉపాధ్యక్షుడు ఓ కార్పొరేట్ కాలేజీలో పని చేశాను. కరోనా దెబ్బతో ఉద్యోగానికి దూరమయ్యాను. ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచింది. తెలిసిందల్లా టీచింగే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సెకండ్ వేవ్ అంటున్నారు. అదే పరిస్థితి వస్తే జీవనోపాధి ఇంకా కష్టంగా మారుతుంది. ట్యూషన్లు చెబుతున్నా: మారోజు చంద్రశేఖర్, రాష్ట్ర లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు కరోనాతో కాలేజీ మూత పడినప్పటి నుంచి నో వర్క్– నో పేలోనే ఉన్నాను. ఇకనైనా పిలుస్తారని ఆశిస్తున్నాం. ఇన్నాళ్లూ పని లేదు. ఇకనైనా ఉంటుందో లేదో అర్థం కావట్లేదు. అందుకే హోం ట్యూషన్స్ చెప్పి జీవనం కొనసాగిస్తున్నా. నాకు తెలిసిన అనేక మంది లెక్చరర్లు కూలీలుగా మారిపోయారు. -
కార్పొరేట్ కాలేజిల ఆగడాలకు అడ్డుకట్ట..
కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఉన్నత విద్యకు ఇంటర్ ప్రామాణికం కావడంతో కార్పొరేట్ యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేదు. కళాశాలల్లో కనీస వసతులు కల్పించకుండానే ఇంటర్ విద్యకు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒకరిద్దరికి వచ్చిన ర్యాంక్లను ప్రచారం చేసుకుంటూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని బురిడీ కొట్టిస్తూ పరిమితికి మించి అడ్మిషన్లు చేసుకుని అందిన కాడికి కాసులు దండుకుంటున్నాయి. ఈ పరిస్థితులపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లో వసతులపై జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సెక్షన్కు విద్యార్థుల సంఖ్యను పరిమితం చేసే చర్యలు చేపట్టింది. అడ్మిషన్లు ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. నెల్లూరు (టౌన్): కార్పొరేట్, ప్రైవేట్ ఇంటర్ కళాశాలల అడ్డగోలు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటర్ అడ్మిషన్లకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఆయా కళాశాలల్లో వసతులు, బోధన, క్రీడా ప్రాంగణం, ఫర్నీచర్, బాత్రూంలు తదితర సౌకర్యాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఇప్పటికే ఆయా కళాశాలలను ఆదేశించింది. వారం రోజుల క్రితం కళాశాలల్లో వసతులు, అధ్యాపకుల వివరాలను జిల్లా ఇంటర్ బోర్డు ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. ♦జిల్లాలో మొత్తం 208 ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 157 కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండగా 26 ప్రభుత్వ, 8 ఎయిడెడ్, మిగిలిన 17 కేజీబీవీ, మోడల్, బీసీ వెల్ఫేర్, ఏపీటీడబ్ల్యూఆర్, ఎపీఎస్డబ్ల్యూఆర్కు చెందిన కళాశాలలు ఉన్నాయి. ♦వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 60 వేల మందికి పైగా చదువుతున్నారు. ♦అయితే విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు పేరుతో ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ♦ఇప్పటికే వీటికి సంబంధించి అంచనా వివరాలను జిల్లా వృత్తి విద్యాశాఖ కార్యాలయం ద్వారా ఇంటర్ బోర్డుకు పంపించారు. వసతులు అధ్వానం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు అధ్వానంగా ఉన్నాయి. ♦మెజార్టీ కళాశాలలు అపార్ట్మెంట్లలో ఇరుకు గదుల్లో తరగతులు ¯నిర్వహిస్తున్నాయి. వాటిల్లో నిబంధనల మేరకు తరగతి గదులు, ల్యాబ్లు, క్రీడా మైదానాలు, ఫైర్ అనుమతులు లేవు. ♦కొన్ని అనుమతులు పొందినా వాటికి అనుబంధంగా మరోక చోట అనుమతి లేని బ్రాంచ్లు ఏర్పాటు చేసి బోధన సాగిస్తున్నాయి. ♦అయితే క్వాలిఫైడ్ అధ్యాపకులను నియమించకుండా డిగ్రీ చదివిన వారితో బోధన సాగిస్తున్నారు. ♦విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ♦ర్యాంక్ల కోసం ఓ పది మంది మెరిట్ విద్యార్థులను ఎంచుకుని వారికి ప్రత్యేక బోధన సాగిస్తూ మిగిలిన విద్యార్థులను నామమాత్రపు బోధనతో నెట్టుకువస్తున్నారు. వసతులపై జియో ట్యాగింగ్ ఈ ఏడాది నుంచి కార్పొరేట్ వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. కళాశాలకు సంబంధించి భవనం, గదులు, టాయ్లెట్స్, క్రీడా మైదానం, ల్యాబ్, గ్రంథాలయం తదితర వసతులను ఫొటోలు ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. ♦వీటితో పాటు కళాశాలకు సంబంధించి గుర్తింపు సర్టిఫికెట్, ఫైర్, ఎన్ఓసీ తదితర అనుమతుల కాపీలను కూడా అందులో ఉంచాల్సి ఉంది. ♦ఇక అధ్యాపకులు, వారి క్వాలిఫికేషన్, జీతాల వివరాలు, నాన్ టీచింగ్ సిబ్బంది, వారి జీతాల వివరరాలను apbie.gov.in వెబ్సైట్లో ఉంచాలని కళాశాలల యాజమాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ♦వెబ్సైట్లో పెట్టిన వసతులను కళాశాలల యాజమాన్యాలు జియో ట్యాగింగ్ చేయాలని నిర్దేశించింది. ♦కళాశాలల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు, వసతులపై వారం రోజుల క్రితం జిల్లా ఇంటర్బోర్డు అధికారులు వివరాలు సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఈ ఏడాది నుంచి ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు వి«ధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ బోర్డు సూచించిన వెబ్సైట్లో విద్యార్థులు తాము చేరదల్చుకున్న కళాశాల, కోర్సులను ఆప్షన్గా నమోదు చేయాలి. ఇప్పటి వరకు ఒక్కో గదిలో 80 నుంచి 100 మంది విద్యార్థులను కుక్కి బోధన సాగిస్తున్నారు. ఇక నుంచి కళాశాలలో ఒక్కో సెక్షన్కు 40 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చుకోవాలి. ఈ లెక్కన గరిష్టంగా 9 సెక్షన్లకు 360 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మంచి విద్యార్థులు ఉంటే అదనపు సెక్షన్ ఏర్పాటుకు ఇంటర్బోర్డు అనుమతి తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరగతి గదులు, ల్యాబ్ తదితర వసతులను ధ్రువీకరించిన తర్వాతే బోర్డు అనుమతిని మంజూరు చేస్తోంది. వివరాలు పంపించాం వారం రోజుల క్రితం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు, సౌకర్యాలు, అధ్యాపకులు తదితర వివరాలను రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యాలయానికి పంపించాం. బోర్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి్సందే. కళాశాలలో వసతులు, ల్యాబ్ తదితర సౌకర్యాలు జియో ట్యాగింగ్ చేయాల్సిందే. సెక్షన్కు 40 మందికి మాత్రమే అనుమతి. ఆన్లైన్ అడ్మిషన్లపై ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు. – మాల్యాద్రి చౌదరి, ఆర్ఐఓ -
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఝలక్..
కరోనా వైరస్ విపత్తు కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. పదో తరగతి పరీక్షలతోపాటు, అన్ని పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యా సంవత్సరం ప్రారంభంపై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ యాజమాన్యాలు అడ్వాన్స్ దోపిడీకి తెరతీశాయి. పది పరీక్షలే జరగలేదు.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరడానికి ముందే అడ్వాన్స్ చెల్లిస్తే.. ఫీజు రాయితీలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరో పక్క ఆయా కళాశాలల్లో చదివి ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు అడ్వాన్స్ మొత్తం చెల్లిస్తేనే.. ద్వితీయ సంవత్సరం క్లాస్లకు ఆన్లైన్ లింక్ ఇస్తామని ఝలక్ ఇస్తున్నాయి. నెల్లూరు (టౌన్): కరోనా కష్టకాలంలోనూ జిల్లాలో ప్రైవేట్ కళాళాలలు అడ్వాన్స్ దోపిడీకి పాల్పడుతున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణపై కమిటీని కూడా నియమించింది. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇప్పటికే ఆన్లైన్లో తరగతులు ప్రారంభమయ్యాయని, వెంటనే 25 శాతం ఫీజు చెల్లించినట్లయితే సంబంధిత ఆన్లైన్ లింక్ ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపకులతో ఫోన్లు చేయిస్తున్నాయి. ♦ జిల్లాలో 208 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిల్లో 173 ప్రైవేట్, 35 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులకు 60 వేల మందికి పైగా ఉంటారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండేళ్లు కలిపి 12 నుంచి 14 వేల మంది చదువుతున్నారు. ♦ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో జూలై వరకు తరగతులు నిర్వహించే పరిస్థితి లేదు. అప్పటికి కూడా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే మరికొన్ని రోజులు తరగతుల నిర్వహణను వాయిదా వేసే అవకాశం ఉంది. ♦ అయితే ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, ఐఐటీ, నీట్ కోర్సులకు సంబంధించి తరగతులు ప్రారంభించినట్లు తెలిసింది. ♦ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్చేసి ఫీజులో 25 శాతం చెల్లించాలని చెబుతున్నారు. ఫీజు చెల్లించకుంటే ఆన్లైన్ లింక్ ఇవ్వబోమని హెచ్చరిస్తున్నారు. సిలబస్ మిస్ అయితే తమకు సంబంధం లేదని చెబుతున్నారు. ♦ ఫీజులు కూడా గతేడాదికి అదనంగా 10 నుంచి 20 శాతం ఫీజు పెంచేశారు. కార్పొరేట్ యాజమాన్యాలు అడిగిన ఫీజులు చెల్లించకుంటే తమ పిల్లలు చదువులో ఎక్కడ వెనకబడతారోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే కొంత మంది ఫీజు చెల్లించి ఆన్లైన్ తరగతులకు హాజరువుతున్నట్లు తెలిసింది. ఇంటర్లో చేరబోయే విద్యార్థులదీ అదే పరిస్థితి పదో తరగతి పరీక్షలే ఇంకా జరగలేదు. అయితే వారి ఫోన్ నంబర్లను సేకరించిన కార్పొరేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ కళాశాలలో చేరాలని అడుగుతున్నారు. ♦ ముందుగా అడ్మిషన్ తీసుకుంటే మొత్తం ఫీజులో 20 నుంచి 25 శాతం రాయితీ కల్పిస్తామని చెబుతున్నారు. ఆ తర్వాత అడ్మిషన్ తీసుకుంటే మొత్తం ఫీజు చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. ♦ కార్పొరేట్ యాజమాన్యాల ఫోన్లతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఫీజు కట్టాలా లేకుంటే పది ఫలితాలు వచ్చిన తర్వాత చెల్లించాలన్న సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. ♦ మరో పక్క కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఆన్లైన్ తరగతులు కొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని, ముందు అడ్మిషన్ పొందితే ఆన్లైన్ తరగతులకు లింక్ ఇస్తామంటున్నారు. ♦ అయితే ఇప్పటికీ పదో తరగతి పరీక్షలు జరగలేదు. ఇప్పుడే ఇంటర్ తరగతులపై దృష్టి పెడితే పదో తరగతి పరీక్షలకు సంసిద్ధంగా ఉన్న విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా మారుతుందని అంటున్నారు. ♦ ఈ పరిణామాలపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సైతం ముందస్తు ఇంటర్కు ప్రిపేర్ కావడానికి సిద్ధంగా కనిపించడం లేదు. ఇంకో పక్క క్లాసులు జరిగిపోతే ఎలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫీజుపై ఒత్తిడి తెస్తే ఫిర్యాదు చేయొచ్చు ఇంటర్ ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. గతేడాది ఉన్న ఫీజులనే వసూలు చేయాలని, త్రైమాసిక ఫీజును 45 రోజుల వ్యవధిలో రెండుసార్లు తీసుకోవాలని ఆదేశించింది. ఫీజులపై ఏ యాజమాన్యమైనా ఒత్తిడి తీసుకువస్తే ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది. విద్యా సంవత్సర ప్రారంభం విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై పరిశీలించిన తర్వాత ఆన్లైన్ తరగతులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అప్పటి వరకు ఇంటర్లో ఆన్లైన్ తరగతులకు అనుమతి లేదు. ఆన్లైన్ తరగతులకు అనుమతి లేదు ఇంటర్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి లేదు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేంత వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించకూడదు. ఇంటర్కు సంబంధించి విద్యా సంవత్సర ప్రారంభం కంటే ముందుగానే ఫీజు వసూలు చేయరాదు. ఎవరైనా ఫీజు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తే 99486 63982 నంబరుకు ఫిర్యాదు చేయాలి. కోచింగ్ సెంటర్లకు సైతం అనుమతి లేదు. క్లాసు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఆర్ఐఓ -
వసూళ్ల మధ్య.. ప్రయోగం మిథ్య!
కర్నూలు బిర్లా గేటు దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సం చదువుతున్న విద్యార్థులకు ఇంతవరకు ప్రాక్టికల్ క్లాస్లు చెప్పలేదు. ఈ కాలేజీకి చెందిన మరో బ్రాంచ్ కర్నూలు కొత్త బస్టాండ్కు వెళ్లే దారిలో ఉంది. అక్కడ వారం రోజుల నుంచి ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. కర్నూలులోని ఓ కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం అడ్మిషన్ తీసుకునే సమయంలో ప్రాక్టికల్ పరీక్షలు పాస్ చేయించేందుకు బైపీసీ విద్యార్థుల నుంచి రూ. 2 వేలు, ఎంపీసీ విద్యార్థుల నుంచి వెయ్యి రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. కర్నూలు సిటీ: ఇంటర్లో సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎంతో కీలకం. అందులో మార్కులు తగ్గితే ఎంసెట్, నీట్, ఐఐటీ–జేఈఈలో వెయిటేజీ తగ్గిపోతుంది. అయితే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు కాగితాలపైనే కనిపిస్తున్నాయి. ప్రాక్టికల్స్ గడువు ముంచుకొస్తుండగా అభ్యసనంపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. కొన్ని జూనియర్ కళాశాలల్లో వసతులు లేవు. మరికొన్ని చోట్ల వసతులు ఉన్నా అవసరమైన పరికరాలు, రసాయనాలు లేవు. ప్రయోగ పరీక్షల్లో ఆయా సెంటర్ల ఎగ్జామినర్లను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు మేనేజ్ చేస్తూ అత్యధిక మార్కులు వేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు నాలుగు విడతల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను జబ్లింగ్ పద్ధతిలో జరిపేందుకు బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. ప్రయోగశాలలేవీ? జిల్లాలో మొత్తం 299 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 265 కాలేజీలు మాత్రమే పని చేస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 44, ఏపీ మోడల్ స్కూళ్ల కాలేజీలు 35, ఎయిడెడ్ కాలేజీలు10, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు 14, రెసిడెన్షియల్ కాలేజీలు 2, ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలు 3, కో–ఆపరేటివ్ కాలేజీలు 1, ఇన్సెంటివ్ కాలేజీలు 4, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు 113, ఒకేషనల్ కాలేజీలు 14, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొత్తగా ఇంటర్ విద్య అమలు చేస్తున్న కళాశాలలు 23 ఉన్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర బైపీసీ 13,177, ఎంపీసీ 9,449 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇందుకు బోర్డు నిబంధనల ప్రకారం వారానికి రెండు పీరియడ్లు కేటాయించాలి. ఎంపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బైపీసీ విద్యార్థులైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో ప్రయోగాలు చేయాలి. ఎంపీసీలో 60కి, బైపీసీలో 120 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. అయితే అధిక శాతం ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రయోగ శాలలు లేవు. కొన్నిచోట్ల మొక్కుబడిగా దర్శనమిస్తుండగా, మరికొన్ని చోట్ల అసలు గదులు కేటాయింపే జరగలేదు. ఫలితంగా అధికశాతం విద్యార్ధులు ప్రాజెక్ట్ రికార్డులు కూ డా తయారు చేయలేని దుస్థితిలో ఉన్నారు. సాధారణంగా సైన్సు విద్యార్థులకు ప్రతి ఏడాది బొటానికల్ టూర్కు తీసుకుపోవాలి. క్షేత్ర స్థాయిలో వివిధ మొక్కలను సేకరించి, వాటిని భద్రపరిచి హెర్బిరియంను విద్యార్థులతో తయారు చేయించాలి. అయితే ఏ ఒక్క ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీ విద్యార్థులను బొటానికల్ టూర్కు తీసుకపోవడం లేదు. అధ్యాపకులే రెడీమేడ్ హెర్బేరియంను విద్యార్థులతో కొనుగోలు చేయిస్తున్నారు. రికార్డులను సైతం ఇతరులతో రాయించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రాక్టికల్ పరీక్షల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఇంటర్ బోర్డు జంబ్లింగ్ విధానం అమల్లోకి తెచ్చినా..కొందరు అధికారులతో కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు లోపాయికారీ ఒప్పందాలు చేసుకొని గట్టెక్కుతున్నాయి. చర్యలు తీసుకుంటాం.. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షల కోసం అదనంగా ఫీజులను వసూళ్లు చేసినట్లు మా దృష్టికి రాలేదు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ల్యాబ్లు పని చేస్తున్నాయని చెబుతున్నారు. మరోసారి కాలేజీలను తనిఖీలు చేస్తాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. – సాలాబాయి, ఇంటరీ్మడియట్ ప్రాంతీయ కార్యాలయ అధికారి -
50 ప్రైవేటు కాలేజీలపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు ఇంటర్మీడియేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝళిపించింది. దసరా సెలవుల్లో నిబంధనలను అతిక్రమించి తరగతులు నిర్వహించిన 50 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు భారీగా జరిమానా విధించింది. రోజుకు రూ.లక్ష చొప్పున కొన్ని కాలేజీలకు రూ.7 లక్షల వరకు జరిమానా విధించింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహించిన ఆ 50 కాలేజీల్లో 2, 3 మినహా మిగతావన్నీ శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలే ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఆయా కాలేజీలు జరిమానా చెల్లించేందుకు నవంబర్ 2 వరకు గడువు ఇచ్చింది. ఆలోగా యాజమాన్యాలు జరిమానా చెల్లించకపోతే ఆ కాలేజీల అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామని, ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల నుంచి పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. బోర్డుకు ఫిర్యాదులు.. రాష్ట్రంలో గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల 20 వరకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది. అయితే ఆ నిబంధనలను కొన్ని కాలేజీలు అమలు చేసినా, కొన్ని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు అమలు చేయలేదు. వాటిపై తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి సంఘాలు బోర్డుకు ఫిర్యాదు చేశాయి. దీంతో బోర్డు అధికారులు సెలవు దినాల్లో తరగతులు నిర్వహించవద్దని సూచించినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు నోటీసులు జారీ చేసినా కార్పొరేట్ యాజమాన్యాలు స్పందించలేదు. దీంతో ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు సీరియస్గా తీసుకుని ఆయా కాలేజీలకు జరిమానా విధించింది. -
ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. వేసవి సెలవుల సమయంలోనూ కొన్ని కార్పొరేట్ కళాశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు, శ్రేణులు ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు కలిసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. ఎస్ఎఫ్ఐ నేతలను, శ్రేణులను అడ్డుకున్నారు. అధికారులను వారు కలువకముందే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘం నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్న పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా ఆర్ఐవోపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేట్ కళాశాలకు ఇంటర్ బోర్డు అధికారులు అమ్ముడు పోయారంటూ ఆరోపించారు. -
ఇంటర్లో ప్రవేశాలకు కార్పొరేట్ వల..!
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్లో ప్రవేశాలకు తెరలేపాయి. పదో తరగతి ఫలితాలు వెల్లడికాకుండానే విద్యార్థులకు వల విసురుతున్నాయి. తల్లిదండ్రులకు మాయమాటలుచెబుతూ విద్యార్థులను ‘బుక్’ చేసుకుంటున్నాయి. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు భారీగా ముడుపులు ముట్టజెప్తున్నాయి. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పిస్తున్నా.. జిల్లా ఇంటర్మీయట్ విద్యా పర్యవేక్షణ శాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. విజయనగరం అర్బన్: పదోతరగతి ఫలితాలు వెల్లడికాకుండానే ఇంటర్లో ప్రవేశాలంటూ ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు జిల్లాలో హడవుడి చేస్తున్నాయి. తమ పీఆర్వోలను పల్లె, పట్టణాల్లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇళ్లకు పంపిస్తున్నాయి. వారి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రవేశ దరఖాస్తులను నింపిస్తున్నాయి. ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు రాయితీల పేరుతో ముందుగానే 60 శాతం ఫీజును వసూలు చేస్తున్నాయి. లేందంటే ఐడీ నంబర్రాదని భయపెడుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 22, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు 72 ఉన్నాయి. మొత్తం కళాశాలల్లో మొదటి సంవత్సరానికి 26 వేల మంది విద్యార్థుల ప్రవేశం జరుగుతుంది. వీటిలో ప్రభుత్వ కళాశాలలను మినహాయించి చూస్తే 16 వేల మంది ప్రైవేటు, కార్పొరేట్ కళా శాలల్లోనే చదువుతున్నారు. వీరి ప్రవేశాల కోసం బేరసారాలు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ ఫీజులు... ఐఐటీ ప్రత్యేకం పేరుతో ఎంపీసీలో ప్రవేశాలకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఏడాదికి రూ. 90 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అదే గ్రూప్లో ఏసీ క్యాంపస్ (రాష్ట్రంలో ఎక్కడి బ్రాంచ్ల్లోనైనా)లో చదువుకోదలిస్తే రూ.1.75 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిందే. సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూప్ల్లో సివి ల్స్ ఫౌండేషన్ పేరుతో కొత్త కోర్సులను పరిచ యం చేస్తున్నాయి. సుమారు రూ. 1.75 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నా యి. సీఈసీ, ఎంఈసీ గ్రూప్తో సీఏ, సీసీటీ పేర్లు జోడించి రూ.2.25 లక్షల డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనలకు పాతర... వాస్తవంగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక జూన్లో ప్రవేశాలు తీసుకోవాలి. అప్పటివరకు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పీఆర్వోలతో నియామకాలు చేసుకోకూడదు. ఇం టర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ నిబంధనలు అమలు కావడం లేదన్న వాదన విని పిస్తోంది. జిల్లాలోని పలు విద్యాసంస్థలు విచ్చల విడిగా ప్రవేశాలు చేస్తున్నా పట్టించుకునేవారే లేరని విద్యావేత్తలు చెబుతున్నారు. తిరిగొస్తే డబ్బులు గోవిందా... కార్పొరేట్ కళాశాలల్లో చేరే విద్యార్థులు చాలా మందికి అక్కడి పరిసరాలు నప్పవు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కళాశాలను విడిచి పెట్టేందుకు సిద్ధమవుతారు. అలాంటి పరిస్థితుల్లో ఫీజులో 30 శాతం చెల్లించాల్సి వస్తోందంటూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పొరపాటున మొత్తం ఫీజు ఒకేసారి చెల్లిస్తే తిరిగి తెచ్చుకునేందుకు చుక్కలు చూడాల్సిందేనంటున్నారు. పాఠశాలల నిర్వాహకులకు తాయిలాలు.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నిర్వాహకులకు భారీ తాయిలాలు ముట్టజెప్పి అందులో చదివే విద్యార్థులను తమ కళాశాలలో చేర్పించేందుకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ముందస్తుగా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పాఠశాలల నిర్వాహకులకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మేర ముడుపులు, లేదా ఆ స్థాయి బహుమతులు అందించేందుకు జిల్లాలో 100కు పైగా ఉన్నతపాఠశాలలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు అదే కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి విద్యార్థుల ప్రవేశాల విషయంలో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసిన వారికే వేసవి సెలవుల్లో వేతనాలిచ్చే నిబంధనలు విధించాయి. దీంతో ఆయా కళాశాలల్లోని సిబ్బంది తీవ్రఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నట్టు భోగట్టా. అన్ని చోట్లా పీఆర్వోలు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు జిల్లా కేంద్రంతోపాటు పార్వతీపురం, సాలూరు, గజపతినరం, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో పీఆర్వో (పబ్లిక్ రిలేషన్ అధికారులు)లను నియమించుకున్నాయి. ఎల్ఐసీ ఏజెంట్లు, సిబ్బంది, ఉపాధ్యాయులను కళాశాలలకు ఏజెంట్లుగా నియమించి వీరికి నెలకు రూ.8వేల వరకు ఏడాది పొడువునా జీతం రూపంలో చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. పార్ట్టైం పీఆర్వోలకు ఒక్కో విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు కట్టిస్తే 10 శాతం వరకు గిట్టుబాటవుతోంది. ఆ తాయిలాల కు ఆకర్షితులైన చాలామంది పీఆర్వోలుగా చేరి వివిధ ప్రాంతాల్లో రోజుకు వంద దరఖాస్తులు కార్పొరేట్ కళాశాలలకు పంపుతున్నారు. -
కార్పొరేట్ కళాశాలల దందా!
ప్రకాశం ,పర్చూరు: రాష్ట్రంలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. కానీ కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల కోసం అప్పుడే వేట మొదలు పెట్టాయి. ఫలితాలు వచ్చేందకు ఇంకా సమయం పడుతుంది. అయినా ప్రైవేటు కళాశాలల మధ్య నెలకొన్న తీవ్ర పోటీతో సాధ్యమైనంత వరకు అడ్మిషన్లు ముందే పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభించాయి. అందుకనుగుణంగా తమ సిబ్బందిని ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల మీదకు వదిలారు. విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్న ఆయా కొర్పొరేట్ సంస్థల పీఆర్ఓలు.. అడ్మిషన్ల సమయంలోనే ఎంబీబీఎస్ ర్యాంకులు, ఐఏఎస్, ఐపీఎస్ అంటూ మభ్యపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 42,343 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. 2018 అక్టోబర్, నవంబర్ నెలల నుంచే పదో తరగతి విద్యార్థుల జాబితా సేకరించిన కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్లను అడ్వాన్స్ బుక్ చేసుకుంటున్న వైనం విస్తుగొలుపుతోంది. జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం పీఆర్ఓలను దించేసి నిర్ణయించిన మేరకు అడ్మిషన్లు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో పీఆర్ఓలు తల్లిదండ్రుల దగ్గర అడ్మిషన్ ఫీజు కింద రూ.2 వేలు కట్టించుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థల పీఆర్ఓలు చేరే ముందు ఒక ఫీజు, చేరిన తర్యాత ఇంకో విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్షలు విడుదలయ్యాక జూన్లో ఇంటర్ ప్రవేశాలు ఉంటాయి. ఇందుకోసం ఎలాంటి ప్రచారం చేయకూడదు. కానీ పలు సంస్థల పీఆర్ఓల ద్వారా ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ తల్లిదండ్రులను విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యంతో నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇక తమ పాఠశాలల్లో పది చదివి పాసైన వారిని ఉపాధ్యాయులు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తే రూ.2 నుంచి 5 వేలు వరకు కమీషన్ ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
రండి..బాబూ రండి!
సాక్షి,సిటీబ్యూరో:‘సార్ మీ ఇంట్లో ఎవరైనా పదో తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లలున్నారా? ఉంటే మా కాలేజీలో చేర్పించండి. ఫలితాలు వచ్చిన తర్వాత అయితే ఫీజు ఎక్కువగా ఉంటుంది. ముందే రిజర్వు చేసుకుంటే ఫీజులో 20 నుంచి 30 శాతం రాయితీ లభిస్తుంది. ఎంసెట్, నీట్లో ఉచిత శిక్షణ ఇస్తాం’.. పదోతరగతి పరీక్షలు రాస్తున్న తల్లిదండ్రులకు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీల పీఆర్ఓలు, అధ్యాపకులు ఇస్తున్న ఆఫర్ ఇది. పదోతరగతి పరీక్షలు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో అప్పుడే ఆయా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల వేట ప్రారంభించాయి. ఇందుకోసం కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా పీఆర్ఓలను నియమించుకోగా, ఇంకొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్పించే బాధ్యతను ఇప్పటి వరకుఆయా కాలేజీల్లో పనిస్తున్న అధ్యాపకులకు అప్పగించాయి. విద్యార్థులను చేర్పించే విషయంలో ఒకొక్కరికీ ఒక్కోరకమైన టార్గెట్ ఇస్తున్నారు. టార్గెట్ పూర్తి చేసిన వారికే వేతన పెంపు, కొలువు పదిలంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఇంటర్ పరీక్షలు పూర్తి అయిపోయినా అధ్యాపకులకు ఆయా కళాశాలలు సెలవులు ఇవ్వలేదు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు అధ్యాపకులు వెళ్లి కరపత్రాలు చూపించి విద్యార్థులను ఆకర్షించే పనిలో పడ్డారు. సాయంత్రం, ఉదయం సమయాల్లో కళాశాల సమీప ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ‘సార్, ఇంట్లో పదో తరగతి పరీక్ష రాసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా..? వారిని మా కళాశాలలో చేర్పించండి’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. గ్రేటర్లోని పలు జూనియర్ కళాశాలల్లో పనిచేసే ఉద్యోగులు, అధ్యాపకులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. గురుకుల జూనియర్ కళాశాలలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రైవేటు కళాశాలల్లో చాలా సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని ముందు గుర్తించిన వాటి యాజమాన్యాలు ఫీజు డిస్కౌంట్లు.. పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రంగులు వేసి..ముస్తాబు చేసి.. ప్రస్తుతం ప్రైవేటు కళాశాలలు ఉన్న సమీప ప్రాంతాల్లోని విద్యార్థులను ఆకర్షించేందుకు వాటి యాజమాన్యాలు తమ కాలేజీల భవనాలకు మెరుగులు దిద్దుతున్నాయి. శివారు ప్రాంతాల్లో మైదానాలు ఉన్నాయని అందులో పేర్కొంటున్నాయి. పదో తరగతి చదివే పిల్లల జాబితాలను, ఫోన్ నంబర్లు సేకరించి వారి ఇళ్లకు మధ్యవర్తులను, దళారులను పంపి ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఫీజు ఎక్కువగా ఉంటుందని, అదే ముందే సీటు రిజర్వు చేయించుకున్న వారికి ఫీజులో రాయితీ ఉందంటూ ఆశ చూపుతున్నారు. ప్రవేశాల కోసం రాయితీల ఎర గ్రేటర్ పరిధిలో కొన్ని కళాశాలలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. ఇంటర్లో చేరేటప్పుడు ఫీజులో 20 శాతం నుంచి 30 శాతం రాయితీ ఇస్తున్నారు. పదిలో మార్కుల ఆధారంగా రాయితీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. కానీ విద్యార్థి సదరు కళాశాలలో చేరిన తర్వాత ఏడాది పూర్తి ఫీజు గుంజుతున్నారు. ఎంసెట్, నీట్ అంటూ అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కసారి విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరాక ఏదో రూపంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మధ్యవర్తులతో బేరసారాలు ప్రచారం చేసి విద్యార్థులను ఆకర్షించడంలో కొన్ని కళాశాలలు ఆరితేరాయి. విద్యార్థులకు గాలం వేయడం కోసం రూ.లక్షలు వెచ్చించి మధ్యవర్తులను నియమించుకున్నాయి. వీరు విద్యార్థుల కుటుంబ యోగక్షేమాలు తెలుసుకొని మాట కలపడంలో నేర్పరులు. వీరి మాటల్లో పడి విద్యార్థులను ఆ కళాశాలల్లో చాలామంది తల్లిదండ్రులు చేర్పించేస్తున్నారు. ఆ మాటలు నమ్మి కళాశాలలను ఎంపిక చేసుకుంటే తర్వాత ఇబ్బందులేనని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు కట్టి మోసపోవద్దు అనుమతులు ఉన్న కాలేజీల జాబితాను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో ఉంచుతాం. ఏ కాలేజీలో యే విధమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయో కూడా పొందుపరుస్తాం. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే అడ్మిషన్ తీసుకోవాలి. తల్లిదండ్రులు ముందే డబ్బులు కట్టి మోసపోవద్దని మా విజ్ఞప్తి. – జయప్రద, హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,27,761 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు నాలుగు దశల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 1,733 ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోని (జనరల్ కాలేజీలు 1,561, ఒకేషనల్ 172 కాలేజీలు) ఎంపీసీ విద్యార్థులు 1,59,429 మంది, బైపీసీ విద్యార్థులు 89,496 మంది, జాగ్రఫీ విద్యార్థులు 261 మంది, ఒకేషనల్లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 42,749 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 35,925 మందికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కోసం 6,314 మంది అనుభవం కలిగిన జూనియర్ లెక్చరర్లను నియమించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. గతేడాది నుంచే ఆన్లైన్లో ప్రశ్నపత్రం పంపించే చర్యలను బోర్డు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ సారి కూడా అరగంట ముందుగా ఆన్లైన్లో ప్రశ్నపత్రం పంపిస్తామని తెలిపింది. ఎగ్జామినర్ మొబైల్ నంబరుకు వన్టైం పాస్వర్డ్ పంపిస్తామని దాని ఆధారంగా ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేసుకుని పరీక్షలు నిర్వహించాలని సూచించింది. పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల మార్కులను కూడా ఆ రోజు సాయంత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని బోర్డు స్పష్టంచేసింది. ఎగ్జామినర్ల జంబ్లింగ్లో పొరపాట్లు ప్రాక్టికల్ పరీక్షల విధులను అప్పగించిన ఎగ్జామినర్ల జంబ్లింగ్లో పొరపాట్లు దొర్లినట్లు తెలిసింది. ముఖ్యంగా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు చెందిన లెక్చరర్లను ప్రాక్టికల్ ఎగ్జామినర్లుగా జంబ్లింగ్ చేసినప్పటికీ వారివారి కాలేజీల్లోనే సెంటర్లు పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన బోర్డు అధికారులు గురువారం సాయంత్రం దాన్ని సవరించే పనిలో పడినట్లు తెలిసింది. మరోవైపు ఈ నెల 28న జరిగిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు ఇంకా ఇంటర్ బోర్డుకు అందలేదు. ఆన్లైన్లో మార్కులను అదే రోజు అప్లోడ్ చేయాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల వల్ల కుదరలేదు. -
ఫీ'జులుం' భరించలేం
ఓ కార్పొరేట్ స్కూల్ అయితే పుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు కూడా వారి దగ్గరే కొనాలంటోంది.బయట మార్కెట్లో రూ.800 ఉన్న బ్యాగ్కు స్కూల్ లోగో తగిలించి ఏకంగా రూ.2,000కి అమ్ముతున్నారు. పుస్తకాల ధరలు అయితే మరీ దారుణం. అన్యాయంగా దోచుకుంటున్నారని తెలిసినా సరే.. చదువుకున్న వారు సైతం పిల్లల కోసం మాట్లాడకుండా వచ్చేస్తున్నారు. ‘రాజధాని అమరావతిలోని ఓ ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో మా అబ్బాయి ఏడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్తే రూ.2,000 పెంచారు. మరో రూ.4,000 కడితే చిప్తో కూడిన పాఠాల సిలబస్ ఇస్తామన్నారు. దీని ద్వారా రోజూ చదవాల్సిన పాఠాలు, టెస్టులతో ఎప్పటికప్పుడు ఫెర్ఫామెన్స్ను మీకు తెలియజేస్తామన్నారు. అయితే.. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడి ఉంటే ప్రత్యేక శిక్షణ ఇస్తారా అని అడిగితే అలాగేమీ ఉండదన్నారు. అయితే, చిప్ అక్కర్లేదు అని చెప్పి వచ్చేశాను. తీరా చూస్తే మా అబ్బాయిని ఏ1 గ్రూపు నుంచి ఏ4 గ్రూపులోకి మార్చారు. మర్నాడు స్కూల్కి వెళ్లి గ్రూపు ఎందుకు మార్చారు అని అడిగితే చిప్ తీసుకున్న వాళ్లని ఏ1, ఏ2 గ్రూపుల్లో.. చిప్ తీసుకోని వాళ్లని ఏ3, ఏ4ల్లోకి మార్చామన్నారు. మా అబ్బాయి మానసికంగా ఎక్కడ కుంగిపోతాడోనన్న ఉద్దేశంతో.. వాళ్లతో వాదించలేక రూ.4,000 కట్టి వచ్చేశాను.’ – కార్పొరేట్ స్కూళ్లలో పరిస్థితిపై ఇదీ ఓ విద్యార్థి తండ్రి ఆవేదన సాక్షి, అమరావతి : ఏటా ఏదో ఒక పేరు చెప్పి వేలకు వేలు ఫీజులు పెంచేసి.. తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్నారు. టెన్త్లోపు పిల్లలకు ఏటా ఏదో రూపంలో రూ.2,000 తక్కువ కాకుండా ఫీజులు పెంచేసి పిండేస్తున్నారు. అదే పెద్దస్థాయి కార్పొరేట్ స్కూళ్లలో అయితే ఈ మొత్తం రూ.5,000 పైనే దాటుతోంది. ఇంటర్కు వచ్చేసరికి ఈ దోపిడీ మరీ దారుణంగా ఉంటోంది. ఏటా కనీసం రూ.10,000 తక్కువ కాకుండా ఫీజులు పెంచేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. డే స్కాలర్గా అయితే ఏడాదికి సుమారు లక్ష రూపాయలు అవుతుంటే అదే హాస్టల్లో ఉండి చదివిస్తే రూ.2.25 లక్షలు తక్కువ కావడంలేదని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఏటా ఫీజులు పెంచేస్తుండడంతో తల్లిదండ్రులు బడ్జెట్ సమకూర్చుకోలేక అప్పుల పాలవుతున్నారు. మరీ ఇంత దారుణమా? ఈ ఒక్క ఏడాదిలోనే ఇంటర్, స్కూల్ విద్యార్ధుల తల్లిదండ్రులు రూ.5,068 కోట్లు అదనంగా చెల్లించారంటే నమ్ముతారా? ఈ ఏడాది పెరిగిన ఫీజులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాదితో పోలిస్తే టెన్త్లోపు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యా వ్యయం సగటున 18 శాతం పెరిగితే ఇంటర్ విద్యార్థులకు 27 శాతం వరకు పెరిగింది. ఫీజులతో పాటు ఈ ఏడాది పుస్తకాలు, రవాణా వ్యయం, యూనిఫాం, బూట్లు వంటి వాటి ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే వారికి ఫీజుల పెంపు లేకపోయినా పెరిగిన పుస్తకాలు, రవాణా, యూనిఫాం వంటి వాటివల్ల వారికి కూడా అదనపు ఖర్చులు తప్పడంలేదు. పాఠశాలల్లో.. ప్రతీ పాఠశాలలో గత ఏడాది ఫీజులు సగటున రూ.30,000 వరకు ఉండగా ఈ ఏడాది రూ.35,000 వరకు పెరిగాయి. అలాగే, పుస్తకాల వ్యయం రూ.3,200 నుంచి రూ.4,000 వరకు చేరుకున్నాయి. యూనిఫాం (మూడు జతలు) రూ.1,800 నుంచి రూ.2,750, బూట్లు (రెండు జతలు) రూ.3,000 నుంచి రూ.4,000కు పెరిగాయి. ఇక రవాణా, బ్యాగులు వంటి ఇతర ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే గతేడాది కంటే రెట్టింపయ్యాయి. ఈ విధంగా చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక్కో విద్యార్థిపై సగటున రూ.7,350 వరకు భారం పెరిగింది. అదే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.2,350 వరకు ఖర్చు పెరిగినట్లు అంచనా. స్కూల్ విద్యార్థులపై పెరిగిన భారం రూ.3,167కోట్లు పైనే 2017–18 సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో 69,61,058 మంది విద్యార్ధులు స్కూళ్లలో చదువుతున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 30.62 లక్షల మంది చదువుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో 38.98 లక్షల మంది చదువుతున్నారు. ఈ లెక్కన చూస్తే ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులపై ఈ ఏడాది రూ.2,251.20 కోట్లు భారం పడినట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న వారికి రూ.916.2 కోట్లు అదనపు భారమైంది. ఈ విధంగా చూస్తే మొత్తం రూ.3,167.4 కోట్లు తక్కువ కాకుండా భారం పెరిగిందని లెక్కగా తేలింది. అదే పెద్దస్థాయి కార్పొరేట్ స్కూల్స్లో ఉన్న ఫీజులను లెక్కలోకి తీసుకుంటే ఈ మొత్తం పెరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. కాలేజీల్లో... ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారం ఇలా ఉంటే.. కార్పొరేట్ కాలేజీల తీరు మరోలా ఉంది. ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఆన్లైన్ టెస్టుల పేరుతో ఫీజులు గుంజడం ఎక్కువైందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సామాన్య స్థాయి పైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఫీజులు గతేడాది పోలిస్తే సగటున రూ. 55,000 నుంచి రూ.65,000కు పెరిగాయి. అలాగే పుస్తకాలు, రవాణా, బ్యాగ్లు వంటి ఇతర ఖర్చులు తీసుకుంటే రూ.24,800 నుంచి రూ.36,200 పెరిగాయి. 2017–18 సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న ఇంటర్ విద్యార్థుల సంఖ్య 10,05,958గా ఉంది. ఇందులో ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న వారు సుమారుగా 7,54,530 గా ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో 2,51,428 చదువుతున్నారు. ఇలా పెరిగిన ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న తల్లిదండ్రులపై ఈ ఏడాది సుమారు రూ.285 కోట్ల అదనపు భారం పడితే ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న వారు రూ.1,900.7 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇది కేవలం డేస్కాలర్స్ కింద పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తేనే ఇలా ఉందని, అదే రెసిడెన్షియల్ విద్యార్థుల భారాన్ని కూడా తీసుకుంటే ఈ మొత్తం మూడు రెట్లు అవుతుందంటున్నారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఇలా వేల రూ. కోట్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థపై నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
‘కార్పొరేటు’ సేవలో ఇంటర్ బోర్డు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల సేవలో ఇంటర్మీడియెట్ బోర్డు తరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది బోర్డు అధికారులు కార్పొరేట్ కాలేజీలకు తొత్తులుగా మారారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే అనేక మినహాయింపులను బోర్డు ఇస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా సంతృప్తి చెందని సదరు యాజమాన్యాలు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు బోర్డు అధికారులపై ఇంకా ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. కాలేజీల అనుబంధ గుర్తింపు వ్యవహారంలో బోర్డు తీరుపై అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకోని అధికారులు.. హాస్టళ్ల గుర్తింపు విషయంలోనూ అదే ధోరణి తో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 50 కాలేజీలే దరఖాస్తు: రాష్ట్రంలో 600 వరకు కాలేజీల్లో విద్యార్థులకు హాస్టళ్లు ఉండగా, అందులో రెండుసార్లు అవకాశం ఇచ్చినా 50 లోపు కాలేజీలే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా హాస్టళ్ల ఇన్స్పెక్షన్ ఫీజు, అనుమతి ఫీజు, ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఓ విధానం అంటూ లేకుండా, శాస్త్రీయ అంచనాలు లేకుండా, యాజమాన్యాల ఒత్తిడికి ఇంటర్ బోర్డు తలొగ్గుతూనే ఉంది. ఆ ఫీజుల విషయంలో యాజమాన్యాల డిమాండ్లకు ఇప్పటికే ఓసారి తలొగ్గిన బోర్డు మరోసారి తలొగ్గి ఫీజులను భారీగా తగ్గించింది. అయినా ఫీజులను ఇంకా తగ్గిస్తేనే తాము కోర్టులో ఉన్న కేసును విత్డ్రా చేసుకుంటామంటూ ఒత్తిడి చేస్తుండటంతో ఏం చేయా లో తెలియని గందరగోళంలో బోర్డు పడింది. నెలాఖరుకు ముగియనున్న గడువు రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల హాస్టళ్లలో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. వాటిలో సరైన సదుపాయాలు ఉండేలా చేసేందుకు, వాటిని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హాస్టళ్లను బోర్డు పరిధిలోకి తెచ్చి నియంత్రించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా బోర్డు అధికారులు ఇన్స్పెక్షన్, అనుమతి, ఫిక్స్డ్ డిపాజిట్ ఫీజులను నిర్ణయించారు. అంత మొత్తం తాము చెల్లించబోమంటూ యాజమాన్యాలు మొండికేయడం, పైగా బోర్డుకు ఆ అధికారం లేదంటూ కోర్టును ఆశ్రయించడంతో ఫీజులను తగ్గించాల్సి వచ్చి ంది. ఆ తగ్గింపు కూడా సరిపోదని, మరింత గా తగ్గించాలని డిమాండ్ చేశాయి. ఆ మేరకు తాజాగా కూడా ఫీజులను తగ్గించినా.. హాస్టళ్ల గుర్తింపు కోసం కాలేజీలు దరఖాస్తు చేసుకోవడం లేదు. మరింతగా తగ్గించాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది. కాలేజీల హాస్టళ్లకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేందుకు బోర్డు ఈనెల 6 నుంచి అవకాశం కల్పించింది. కానీ ఇప్పటివరకు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 20తోనే దరఖాస్తు గడువు ముగియగా, రూ.5 వేల ఆలస్య రుసుముతో బుధవారంతో గడువు ముగిసింది. రూ.10 వేల ఆలస్య రుసుముతో ఈనెల 31తో గడువు ముగియనుంది. ఇంకా తగ్గించాల్సిందే.. ♦ ఫిక్స్డ్ డిపాజిట్లను భారీగా తగ్గించినా ఇంకా తగ్గించాలంటూ యాజమాన్యాలు పట్టుపడుతున్నాయి. 200 మంది వరకు ఉంటే రూ.లక్ష, 201 నుంచి 500 లోపు ఉంటే రూ.2 లక్షలు, 501 కంటే ఎక్కువ మంది ఉంటే రూ.3 లక్షలు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్గా చెల్లిస్తామని పట్టుపడుతున్నాయి. ♦ కార్పొరేషన్ పరిధిలో ఇన్స్పెక్షన్ ఫీజు ఏటా రూ.80 వేలుగా, అనుమతి ఫీజు రూ.లక్షగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. యాజమాన్యాల డిమాండ్ మేరకు తర్వాత వరుసగా రూ.55 వేలు, రూ.65 వేలకు తగ్గించింది. అయినా యాజమాన్యాలు ఒప్పుకోకపోవడంతో తాజాగా ఇన్స్పెక్షన్కు రూ.30 వేలుగా, అను మతికి రూ.40 వేలు ఫీజుగా నిర్ణయించింది. అయినా తగ్గించాలని, ఇన్స్పెక్షన్కు రూ.25 వేలు, అనుమతి ఫీజు రూ.30 వేలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ♦ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొదట ఇన్స్పెక్షన్కు రూ.60 వేలు, అనుమతి ఫీజు రూ.80 వేలు ఉండగా తర్వాత దాన్ని రూ.40 వేలు, రూ.50 వేలకు బోర్డు తగ్గించింది. తాజాగా ఇన్స్పెక్షన్కు రూ.25 వేలు, అనుమతికి రూ.30 వేలుగా నిర్ణయించింది. వాటిని వరుసగా రూ.20 వేలు, రూ.25 వేలుగా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ♦ గ్రామ పంచాయతీల్లో ఇన్స్పెక్షన్కు రూ.50 వేలు, అనుమతికి రూ.60 వేలుగా నిర్ణయించగా తర్వాత ఇన్స్పెక్షన్కు రూ.30 వేలు, అనుమతికి రూ.40 వేలకు తగ్గించింది. తాజా గా ఇన్స్పెక్షన్కు రూ.20 వేలుగా, అనుమతి ఫీ జు రూ.25 వేలుగా నిర్ణయించింది. వాటిని రూ.10 వేలు, రూ.15 వేలకు తగ్గించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కమీషన్ కాదు.. అంతకుమించి!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో కార్పొరేట్ కాలేజీల వ్యవహారం పూర్తిగా బట్టబయలైంది. ఆ కాలేజీ యాజమాన్యాలకు చెందిన ఓ కీలక వ్యక్తి నేతృత్వంలో మొత్తం వ్యవహారం నడిచినట్లు సీఐడీ గుర్తించింది. శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా సోమవారం కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వాంగ్మూలాలను సీఐడీ నమోదు చేసింది. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి పూర్తిస్థాయిలో లింకు బయటపడినట్లేనని, అయితే ఆ వివరాలు ఇప్పుడే బయటకు వెల్లడించబోమని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సీనియర్ అధికారి చెప్పారు. లీకేజీకి కుట్ర పన్నినట్లు భావిస్తున్న కార్పొరేట్ కాలేజీల ప్రముఖుడిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు. యాజమాన్యం పేరు బయటపెట్టకుండా.. ప్రశ్నపత్రంపై శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది రెండు కార్పొరేట్ కాలేజీలకు చెందిన వారు కావడంతో సీఐడీ వ్యూహాత్మకంగా దర్యాప్తు చేస్తోంది. సోమవారం 22 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాంగ్మూలాలు సేకరించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వాసుబాబు చెప్పినట్లు, శివనారాయణ వాదిస్తున్నట్లు.. కేవలం కమీషన్ కోసం విద్యార్థులను తరలించలేదని, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల ప్రమేయం ఉన్నట్లు తల్లిదండ్రుల నుంచి సేకరించిన ఆధారాల ద్వారా తెలిసిందని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. యాజమాన్యం పేరు బయటపెట్టకుండా వాసుబాబు, ఏజెంట్ శివనారాయణ ద్వారా తతంగం నడిపినట్లు గుర్తించామన్నాయి. అలాగే మాజీ విద్యార్థులు సందీప్, గణేశ్ ప్రసాద్ లాంటి కొంత మందితో లీకేజీ బ్రోకర్లు, కీలక పాత్రధారులతో కలసి కుట్రకు పాల్పడ్డారని సీఐడీ అనుమానిస్తోంది. ప్రశ్నపత్రం లీకేజీ, క్యాంపుల వ్యవహారం బిహార్కు చెందిన కమిలేశ్కుమార్ సింగ్, కర్ణాటకలోని బెంగళూర్కు చెందిన రాజగోపాల్రెడ్డి నేతృత్వంలో జరిపినట్లు భావిస్తోంది. ఆ వ్యక్తి ద్వారానే.. కేసుకు సంబంధించి కార్పొరేట్ విద్యాసంస్థకు చెందిన ఓ కీలక వ్యక్తిపై సీఐడీ దృష్టి సారించింది. ఏళ్ల నుంచి మంచి ర్యాంకులు సాధిస్తూ భారీ స్థాయిలో ఫీజులు దండుకున్న సంబంధిత కాలేజీలో ఆ వ్యక్తి కీలక హోదాలో ఉన్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. తన పేరు బయటపెట్టకుండా వాసుబాబు, శివనారాయణలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశాకే సీఐడీ అరెస్టు చేసేలా వ్యవహారం నడిపినట్లు తెలిసిందన్నారు. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు.. బ్రోకర్లు, సూత్రధారుల ద్వారా ఆ వ్యక్తి బండారం బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో బృందాలున్నాయని, కేసు ముందు నుంచి ఇప్పటివరకు దొరకని కొంత మంది బ్రోకర్లు దొరికితే మొత్తం వ్యవహారం వెలుగులోకి వస్తుందంటున్నారు. ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చేవరకు అన్ని ప్రాంతాల్లో ఈ కీలక వ్యక్తి తన ఏజెంట్లను అందుబాటులో ఉంచినట్లు భావిస్తున్నారు. దీంతో ప్రశ్నపత్రం తయారు చేసిన వారి వివరాలూ ఇవ్వాలని జేఎన్టీయూకు లేఖ రాసే ఆలోచనలో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. వారి విచారణలో ఆ కీలక వ్యక్తికి సంబం ధించి బలమైన ఆధారాలు బయటపడే అవ కాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ 16 మంది కోసం ఇంటెలిజెన్స్ లీకేజీ కేసు 90 శాతం పూర్తయినట్లు భావిస్తున్న సీఐడీ.. ఇందులో కీలక సూత్రధారులు, కుట్రదారుల లింకు తేల్చేందుకు 16 మంది బ్రోకర్ల పాత్ర కీలకమని అనుమానిస్తోంది. వీరి కోసం ఇప్పటివరకు వెతికిన సీఐడీ అధికారులు.. తాజాగా ఇంటెలిజెన్స్లోని కౌంటర్ వింగ్ పోలీసులను రంగంలోకి దింపారు. బ్రోకర్ల కోసం 4 ప్రత్యేక బృందాలతో కలసి బిహార్, కర్ణాటక, ఢిల్లీ, పుణేల్లో వేటసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో మృతిచెందిన కమిలేశ్ లింకు, కార్పొరేట్ కాలేజీల లింకు వీరిలోని కొంత మంది ద్వారా బయటపడుతుందని, వారికోసం తీవ్రంగా గాలిస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. వారు దొరికితే కేసు, మొత్తం వ్యవహారం ఛేదించినట్లేనని చెప్పారు. -
కార్పొరేట్ గుప్పిట్లో కన్వీనర్ ఆఫీసు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: విద్యను వ్యాపారమయం చేసిన కార్పొరేట్ కాలేజీలు.. ఆ దందాను విస్తృతం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కాయి. ఎంసెట్ మెడికల్ ర్యాంకుల కోసం దొడ్డిదారిలో ప్రశ్నపత్రాలను సంపాదించేందు కు ఆరాటపడ్డాయి. ఇందుకు కార్పొరేట్ శక్తులు చేసిన లాబీయింగ్ అంతా ఇంతా కాదు. 2 దశాబ్దాలకు పైగా ఎంసెట్ నిర్వహించిన చరిత్ర ఉన్న జేఎన్టీయూ, ఆ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసే కన్వీనర్ కార్యాలయాన్నీ వదల్లేదు. ఈ ఆఫీసులో సీనియర్ అధికారి మొదలు నాలుగో తరగతి ఉద్యోగి దాకా ప్రతి ఒక్కరికీ లంచాల ఎర చూపారు. సంవత్సరాల తరబడి సొమ్ము ముట్టజెప్పి సమాచారం కాజేసే యత్నాలకు ఒడిగట్టారు. దరఖాస్తులు స్వీకరించడం మొదలు, ఫలితాలు ప్రకటించేదాకా ఏ నిర్ణయం తీసుకున్నా మొదట తెలిసేది కార్పొరేట్ కాలేజీలకే! పేపర్ సెట్టింగ్ నుంచి మొదలు.. వేలాది మంది పోటీ పడే ఎంసెట్లో ప్రశ్నపత్రాల రూపకల్పన అత్యంత కీలకం. ప్రశ్నపత్రాలకు ఎవరు రూపకల్పన చేయాలన్నది కన్వీనర్కు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. అందుకే కార్పొరేట్ కాలేజీల ఏజెంట్లు కన్వీనర్ కార్యాలయంలోనే తిష్ట వేసేవారు. కన్వీనర్ ఎవరితో మాట్లాడుతున్నారు? అవతలి వ్యక్తి ఫోన్ నంబర్ ఎంత? ఆయన ఏ మెడికల్ కాలేజీలో పని చేస్తున్నారు? వంటి విషయాలకు అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించేవారు. కన్వీనర్ ఆఫీసులో మామూలుగా విశ్వసనీయత కలిగిన వారినే నియమిస్తారు. అయినా భారీ స్థాయిలో సొమ్ము ఆశ జూపి వారిని ప్రలోభపెట్టేందుకు యత్నించేవారు. కన్వీనర్ అనేక విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నా కొన్నిసార్లు ఇతర సిబ్బందికి కొన్ని పనులు అప్పగించేవారు. కార్పొరేట్ శక్తులు దీన్నే తమకు అనుకూలంగా మలుచుకునేవి. మొదట ప్రశ్నపత్రాలను సెట్ చేసేవారిని గుర్తించి, తర్వాత వారి నుంచి ప్రశ్నలు సేకరించడానికి కోట్లలో ఖర్చు చేసేవారని జేఎన్టీయూలో పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆయన జేఎన్టీయూలో పని చేసిన సమయంలో తన దృష్టికి వచ్చిన అనేక విషయాలను సీనియర్ పోలీసు అధికారి ఒకరికి లేఖ ద్వారా తెలియజేశారు. ప్యానల్ నుంచి ప్రశ్నలు బయటకు.. ప్రశ్నపత్రం రూపొందించేందుకు జేఎన్టీయూకు ఒక ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్లో ఉన్న వారు రూపొందించే ప్రశ్నల్లో కొన్నింటిని మాత్రమే తీసుకుంటారు. అయితే ప్యానల్ తయారు చేసే వెయ్యి ప్రశ్నలు లీక్ అయితే చాలు కొంచెం తెలివైన విద్యార్థి 160కి 150కి పైగా మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. దీన్ని కార్పొరేట్ కాలేజీలు సొమ్ము చేసుకున్నాయి. ‘‘నాకు తెలిసి ఈ కాలేజీలు పేపర్ సెట్టింగ్ ప్యానల్ నుంచే ప్రశ్నలు సంపాదించేవి. అందుకు కోట్లు ఖర్చు చేసేవారు. గతంలో చాలాసార్లు ఇలా జరిగినా బయటకు రాలేదు. ఒకవేళ ఎవరైనా బయటకు చెప్పే ప్రయత్నం చేస్తే భారీగా డబ్బు ముట్టజేప్పేవారు’’ అని ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. ‘‘ఇదేం మామూలు స్కాం కాదు. ఇది ఇప్పుడే జరిగిందని అనుకోవడం కూడా పొరపాటే. ప్యానల్ నుంచి ప్రశ్నలు సేకరించడం ఇబ్బంది అనుకున్న ప్రతీసారి వారు ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం సంపాదించేవారు. మెడికల్ కోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తే, ఇంజనీరింగ్ కోసం తక్కువ ఖర్చుతో ప్యానల్ నుంచి ప్రశ్నలు అందేవి’’ అని ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ వివరించారు. తెలివైన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో సహా అన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఉంటారు. కానీ రెండు కాలేజీలకే ర్యాంక్లు ఎందుకు వస్తున్నాయన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని, పట్టించుకొని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కావని ఆయన వ్యాఖ్యానించారు. వారంతా ఆ రెండు కాలేజీల విద్యార్థులే..! లీకైన ఎంసెట్ ప్రశ్నపత్రం అందుకున్న విద్యార్థులు ఆ రెండు కాలేజీలకు చెందినవారేనని సీఐడీ విచారణలో బయటపడింది. పేపర్ లీకేజీలో అరెస్టయిన శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణలను విచారిస్తున్న సీఐడీ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటివరకు అధికారులు 136 మంది విద్యార్థులను విచారించారు. వీరిలో 86 మంది ఒక కార్పొరేట్ కాలేజీకి చెందిన వారు కాగా, ఇంకో 28 మంది మరో కార్పొరేట్ కాలేజీకి చెందిన వారే! దీంతో స్కాం పూర్తిగా ఈ రెండు కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లోనే జరిగి ఉంటుందా అన్న కోణంలో సీఐడీ విచారణ వేగవంతం చేస్తోంది. ఈ కేసులో అరెస్టయిన బ్రోకర్లు సైతం ఇదే కార్పొరేట్ కాలేజీల్లో చదువుకొని ప్రస్తుతం మెడిసిన్ చేస్తుండటం గమనార్హం. తెరపైకి మరో 13 మంది బ్రోకర్లు ఎంసెట్ కేసులో అరెస్టయిన వాసుబాబు, శివ నారాయణ, శ్రీచైతన్య మాజీ విద్యార్థి గణేశ్ ప్రసాద్ల విచారణలో తెరపైకి మరికొన్ని కొత్త ముఖాలు వచ్చినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 90 మందిని నిందితులుగా గుర్తించిన దర్యాప్తు అధికారులు తాజాగా మరో 13 మంది బ్రోకర్లు కూడా స్కాంలో పాలుపంచుకున్నట్టు గుర్తించారు. వీరు రెండు కార్పొరేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులను బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్, పుణె క్యాంపులకు తరలించి శిక్షణ ఇచ్చినట్టు తేలింది. అటు డాక్టర్ ధనుంజయ్, సందీప్లకు ప్రశ్నపత్రం ఇచ్చిన బ్రోకర్ల లింకుపై కూడా క్లారిటీ రావాల్సి ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన 13 మంది బ్రోకర్లలో ఎనిమిది మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని, మిగిలిన ఐదుగురిలో ఇద్దరు యూపీ, ఒకరు ఢిల్లీ, మరో ఇద్దరు కర్నాటకకు చెందిన వారున్నారని సీఐడీ అనుమానిస్తోంది. వీరిలో కొందరు స్కాం ప్రధాన సూత్రధారి కమిలేష్కుమార్ సింగ్తో పదేపదే టచ్లో ఉన్నారని, అక్కడ్నుంచి వీరి ద్వారానే కార్పొరేట్ కాలేజీలకు ప్రశ్నపత్రం అందినట్టు సీఐడీ గుర్తించింది. దీంతో వాసుబాబు, శివనారాయణ, గణేష్ ప్రసాద్ను కస్టడీలోకి తీసుకోవాలని సీఐడీ యోచిస్తోంది. ఈ ముగ్గురిని ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లిలోని సీఐడీ ప్రత్యేక కోర్టులో దర్యాప్తు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల్లో ఈ పిటీషన్పై వాదనలు జరుగనున్నాయని తెలిసింది. మొత్తంగా చార్జిషీట్ దాఖలుకు రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉందని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. -
ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో వంద కోట్ల కుంభకోణం
-
ఎంసెట్ ‘ప్రశ్నపత్రం లీకేజీ’లో ట్విస్ట్
-
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు
సాక్షి, గుంటూరు/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని హైదర్గూడలో ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు విడిచాడు. హాస్టల్ పైనుంచి దూకి ప్రాణాలు వదిలాడు. ఇటు గుంటూరు పిడుగురాళ్లలో ఎనిమిదో తరగతి విద్యార్థి పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. హైదరాబాద్లో.. కూకట్పల్లి హైదర్నగర్లోని చైతన్య కాలేజ్లో రెండో సంవత్సరం చదుతువుతున్న అభికుమార్ రెడ్డి అనే విద్యార్థి హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి అతను దూకేశాడు. అతని స్వస్థలం కృష్ణా జిల్లా కే.రామచంద్రాపురం. అభికుమార్ ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది. అభికుమార్ మృతి పట్ల అతని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదో అంతస్తు నుంచి దూకినా.. కాలి మీద చిన్న దెబ్బ తప్ప.. గాయాలు కాలేదని అంటున్నారు. చదువు చెప్పమని పంపిస్తే తన కొడుకును శవంగా మార్చేసారని కాలేజీ యాజమాన్యం తీరుపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ వేధింపుల కారణంగానే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గుంటూరులో.. జిల్లాలోని పిడుగురాళ్ల మండలం లెనిన్ నగర్లో విషాదం చోటుచేసుకుంసది. లెనిన్ నగర్లో ఉన్న మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్ కుమార్ అనే విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతను ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. శనివారం తాను చదువుతున్న పాఠశాలలోనే అతను ఉరేసుకొని కనిపించాడు. ఈ ఘటనతో అశోక్కుమార్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్రాణం తీస్తున్న పోటీ!
ప్రచండమైన పోటీ... పరిమితమైన అవకాశాలు... మార్కుల్ని తప్ప మరిదేన్నీ పరిగణించని విధా నాలు లేలేత హృదయాలపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతున్నాయో హైదరాబాద్ నడిబొడ్డున మంగళవారం ఉదయం తనువు చాలించిన జస్లిన్ కౌర్ ఉదంతం తేటతెల్లం చేసింది. ఆబిడ్స్లో పదంతస్తుల భవనం ఎక్కి ఆత్మహత్యకు పాల్పడ్డ కౌర్ వయసు కేవలం పద్దెనిమిదేళ్లు. ఒకప్పుడు ఆ వయసు పిల్లలకు బాధ్యతలు పెద్దగా పట్టేవి కాదు. సవాళ్ల బాదరబందీ ఉండేది కాదు. జీవితం రంగులమయ ప్రపంచంగా దర్శనమిచ్చేది. కష్టమంటే పెద్దగా తెలియకపోయేది. దేన్నయినా సునాయాసంగా గెలవగలమన్న ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉండేది. నిజానికి ఆ ఆత్మవిశ్వాసమే వారికి సగం విజయాన్ని అందించేది. కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి. బాల్యం నుంచే మన విద్యావ్యవస్థ పిల్లల్లో పోటీ తత్వాన్ని నూరిపోస్తోంది. తమపై ఆశలు పెట్టుకున్నవారి కోసం, తమ గెలుపు ఖచ్చితమని నమ్ముతున్నవారికోసం, తాము దేన్నయినా అవలీలగా జయించ గలమని విశ్వసిస్తున్నవారికోసం బడికెళ్లే వయసులోనే పిల్లలు లక్ష్య నిర్దేశం చేసుకుంటున్నారు. జీవి తాలను పరుగు పందెంగా మార్చేసుకుంటున్నారు. ఈ పందెంలో ఎక్కడ నిర్లక్ష్యం ప్రదర్శించినా... ఎక్కడ ఏమరుపాటుగా ఉన్నా నలుగురిలో నగుబాటు పాలవుతామని బెంగ పెట్టుకుంటున్నారు. ఇంట్లోనూ, బయటా తమపై ఆశలు పెట్టుకున్నవారి కోసం, అంచనాలను పెంచుకుంటున్నవారి కోసం మర మనుషులుగా మారిపోతున్నారు. సమూహంలో ఒంటరిగా మారుతున్నారు. శర సంధానం చేసిన అర్జునుడి దృష్టంతా చిటారు కొమ్మనున్న పక్షిపై నిలిచినట్టు లక్ష్యం తప్ప మరిదేన్నీ వారు పరిగణించలేకపోతున్నారు. ఒత్తిళ్ల ఊబిలో కూరుకుపోయి దాన్నే సర్వస్వమనుకుంటున్నారు. ఓటమి ఎదురయ్యేసరికి తట్టుకోవడం వారివల్ల కావడం లేదు. ఈ తరగతి దాటితే పోటీ ముగు స్తుందనిగానీ, ఈ పరీక్ష పూర్తయితే పీడ విరగడవుతుందనిగానీ గ్యారెంటీ లేదు. మళ్లీ కొత్త తర గతిలో కొత్త పోటీలు, కొత్త లక్ష్యాలు తప్పవు. ఈ అమానుషమైన పరుగుపందెంలోనే జస్లిన్ కౌర్ ఓడిపోయింది. జీవితం వృథా అనుకుంది. కన్నవారికి, తోడబుట్టినవారికి శోకాన్ని మిగిల్చి లోకాన్ని విడిచింది. ఈ విషయంలో జస్లిన్ కౌర్ ఒంటరి కాదు. నీట్ ఫలితాలు వెల్లడైన 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా దాదాపు నలుగురైదుగురు ప్రాణాలు తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. అసలు నీట్ కోచింగ్ సమయంలోనే విద్యార్థులు ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ర్యాంకు సాధించలేమోనన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. సోమవారం వెల్లడైన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో మంచి ర్యాంకు రాలేదన్న మనో వ్యథతో జస్లిన్ కౌర్ ప్రాణాలు తీసుకుంది. ఈసారికి ర్యాంకు సాధించలేకపోయినా మళ్లీ ప్రయ త్నించి విజయం సాధించవచ్చునన్న ఆత్మవిశ్వాసం ఆమెలో కొరవడటానికి కారణముంది. నీట్ పరీక్ష సాధారణమైనది కాదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలన్నిటిలో ఉన్న 54,000 సీట్లను భర్తీ చేయడం కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈసారి 13,26,725 మంది ఆ పరీక్షకు హాజరయ్యారు. ఈ సంఖ్య నిరుటితో పోలిస్తే 2 లక్షలకన్నా ఎక్కువ. ఇలా ఏటికేడాదీ పెరిగే అభ్యర్థుల సంఖ్య వల్ల పోటీ రాను రాను మరింత జటిలంగా మారుతుందని, ఎంబీబీఎస్ సీటు రావడం దుర్లభమని జస్లిన్ కౌర్ బెంగ పెట్టుకుని ఉండొచ్చు. పర్సంటైల్ ఆధారంగా విజే తలను నిర్ణయిస్తారు గనుక నీట్లో అర్హత సాధించినంత మాత్రాన సీటు గ్యారంటీ లేదు. అలా అర్హు లైనవారి జాబితాలో అగ్రభాగాన ఉండాలి. ఈసారి ఫలితాలను విశ్లేషిస్తే ఈ సంగతి తేటతెల్లమవు తుంది. ఉన్నవి 54,000 సీట్లయితే 7.14 లక్షలమంది అర్హత సాధించారు. అంటే సగటున ఒక సీటుకు 13మంది పోటీ పడుతున్నట్టు లెక్క. కనుక గెల్చినవారు సైతం చివరివరకూ నిస్స హాయంగా ఎదురుచూస్తూ కూర్చోవాలి. గుండెలు చిక్కబట్టుకుని ఉండాలి. నిరుడు కాస్త నయం. అప్పుడు 6.11 లక్షలమంది విద్యార్థులు అర్హత సాధించగా 64,000 సీట్లున్నాయి. అంటే సగటున ఒక సీటుకు 10మంది పోటీ పడ్డారు. కానీ తగిన మౌలిక సదుపాయాలు సరిగా లేవన్న కారణంతో కేంద్రం 82 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లను నిషేధించింది. పర్యవసానంగా ఈ ఏడాది 10,000 సీట్లు తగ్గిపోయాయి. పైగా అర్హుల సంఖ్య బాగా పెరిగింది. అసలు సీట్ల సంఖ్య పరిమితంగా ఉన్నప్పుడు అంతమందిని ‘అర్హులు’గా ప్రకటించడంలోని సహేతుకత ఏమిటో ఎవరికీ బోధç³డని విషయం. ఈ విధానం వల్ల ఎవరికి వారు చివరివరకూ తమకు సీటొస్తుందన్న భ్రమలో ఉండిపోతారు. ఆ భ్రమ బద్దలైనప్పుడు ఎంతటి తీవ్రమైన నిర్ణయానికైనా వెనుకాడని స్థితికి చేరుకుంటారు. ఇంటర్మీడియెట్ పూర్తవుతున్న దశలో విద్యార్థుల్లో ఒత్తిళ్ల స్థాయి అత్యధికంగా ఉంటున్నదని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్మీడియెట్లోకి వచ్చినప్పుడే భవిష్యత్తులో ఫలానా డిగ్రీలో చేరి జీవితంలో స్థిరపడాలన్న ఆలోచన స్థూలంగా ఉంటుంది కనుక అందుకోసం తపన మొదలవు తుంది. ఏమాత్రం విఫలమైనా భవిష్యత్తు శూన్యమవుతుందన్న భయం, పోటీలో తోటివారు తనని మించిపోతున్నారన్న ఆందోళన, కన్నవారు తనపై పెట్టుకున్న ఆశల్ని అందుకోలేకపోతున్నానన్న చింత నానాటికీ అధికమవుతుంటుంది. దానికితోడు కార్పొరేట్ కళాశాలల్లో బట్టీకొట్టించే విధానం, వ్యక్తిత్వాలను కించపరిచేలా ఉండే పద్ధతులు వారి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. పర్యవసానంగా మానసికంగా బలహీనపడి తీవ్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఆ వయసు పిల్లల్లో మానసిక ఆరోగ్యం ఎలా ఉంటున్నదన్న ఆరా అటు తల్లిదండ్రులకూ, ఇటు అధ్యాపకులకూ లేకుండా పోతోంది. నిండైన ఆత్మవిశ్వాసంతో మెలగాల్సిన వయసులో పిల్లల్లో బేలతనం ఎందుకు ముసురుకుంటున్నదో ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అర్ధంలేని పోటీని పెంచు తున్న ప్రస్తుత విద్యా విధానాన్ని సమూలంగా ప్రక్షాన చేయాలి. -
విలువైన విద్యా.. విలువల విద్యా?
లక్షలు ఖర్చుపెట్టి కార్పొరేట్ కాలేజీల్లో అధిక శాతం మార్కులు, ర్యాంకులు సాధించడం అవసరమా? నైతిక విలువలు, మానవీయ వ్యక్తిత్వం, సృజనాత్మకతతో కూడిన విద్య అవసరమా అంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నేటి సగటు విద్యార్థిది. కేవలం ర్యాంకులు, మార్కులు, ఆంగ్ల భాషా నైపుణ్యాలుంటే ఐదంకెల ఉద్యోగం దొరుకుతున్న ఈ రోజుల్లో వ్యక్తిత్వం, విలువల గురించి మాట్లాడటం అమాయకత్వమే అవుతుందేమో! మనందరం మర్చిపోతున్న విషయమిది. తెలివి తేటలకు, ప్రతిభకు కొలమానం ఏంటి? సంపన్నులైన తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి అంతర్జాతీయ పాఠశాలలు/కళాశాలల్లో చదివిస్తూ, ట్యూషన్లు, పాఠ్య పుస్తకాలు, మెటీరియల్ వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తే చదివి అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థి ప్రతిభావంతుడా? ఏ అవకాశాలు లేకుండా.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అరకొర వసతులతో, ఓ మోస్తరు మార్కులతో ఉత్తీర్ణులైన వారు ప్రతిభావంతులా? దేశంలో రెండో వర్గపు దురదృష్టవంతులే ఎక్కువ. ఈ ర్యాంకుల గొడవ ఈనాటిది కాదు. బ్రిటిష్ వారు మన దేశంలో విద్యావ్యవస్థను స్థాపించినప్పటినుంచి కేవలం రెండు తరగతులే ఉండేవి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాసులో పాసవ్వాలంటే ఆంగ్లేయ వలస విధానాలకు అనుగుణమైన పాఠ్యాంశాలను బట్టీపట్టాలి. ఈ విధానాలను అందుకోలేక వెనుకబడిన భారతీయుల కోసం ధర్డ్ క్లాస్ అనే మరో తరగతిని సృష్టించారు. చదువుకునే కూలీలను తయారు చేసి వారి అవసరాలకు అనుగుణంగా వాడుకోవడానికే ఈ మూడో తరగతి పనికొచ్చేది. నేటికీ ఇదే విధానం కొనసాగుతూ చదువుకున్న కూలీల సంఖ్యే దేశంలో ఎక్కువగా ఉంది. వీరెవ్వరికీ సృజనాత్మకత, స్వీయ ఆలోచనా సామర్థ్యం, విలువలు, నైతికత, నిజాయితీ, సామాజిక బాధ్యత వంటివి తెలీవు. అందుకే మనలో లేని విలువలను, నైతికతను, నిజాయితీని, మానవీయ గుణాలను మనపిల్లల్లో చూడాలనుకోవడం అవివేకం కాదా? ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను చూశాం. అత్యధిక ర్యాంకులను సాధించిన విద్యా సంస్థలను చూశాం. అత్యున్నత బోధనతో అత్యధిక మార్కుల సాధనకు కృషి చేసే ఉపాధ్యాయులను చూశాం. కానీ మంచి వ్యక్తిత్వం, విలువలు, సృజన, బాధ్యత గల విద్యార్థులను రూపొందించే ఉపాధ్యాయులూ, విద్యాసంస్థలూ, తల్లిదండ్రులు నేడు అరుదుగా కనబడుతున్నారు. ఇవాళ సమాజంలో జరుగుతున్న అనేక అకృత్యాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులే ఎక్కువగా దోషులుగా నిలబడుతున్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలలో అధికశాతం వీరిదే. మన పిల్లల్లో నేర, హింసా ప్రవృత్తి పెరగడానికి కారణం వీరికెక్కడా విలువలు గురించి ఆలోచించే సమయం, అవసరం లేకపోవడమే. ఉమ్మడి కుటుం బాలు కనుమరుగవడంతో పిల్లలను కనిపెట్టుకుని సరైన దారిలో నడిచేటట్టు చూసేవారు లేకుండా పోయారు. నేడు పిల్లలు తప్పుదోవ పట్టడానికి ప్రధాన కారణం పెద్దల పర్యవేక్షణ లేకపోవడమే. ఇటీవల హర్యానాలో 16 ఏళ్లున్న ఇంటర్మీడియట్ విద్యార్థి.. పాఠశాల ప్రిన్సిపల్ని తుపాకీతో కాల్చి చంపాడు. కారణం హాజరు తక్కువగా ఉన్నం దుకు ప్రిన్సిపల్ హెచ్చరించటంవల్ల, అందరి ముందూ పరువు పోయిందని భావించటం. గుర్గావ్కు చెందిన 7వ తరగతి విద్యార్థి తన తరగతి ఉపాధ్యాయురాలిపై లైంగిక దాడికి ప్రయత్నించి, ఆ మొత్తం సంఘటనను ఫేస్బుక్లో ఉంచటం అతనిలో భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నేటి తరం విద్యార్థుల్లో పెద్దవారి పట్ల గౌరవ భావం, ఉపాధ్యాయులపట్ల భక్తిశ్రద్ధలు, తోటివారితో సంతోషంగా మెలగటం వంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియక పోవటం దురదృష్టం. స్మార్ట్ఫోన్ల శకంలో తామొక మానవ సమూహంలో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. నేటి తరానికి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి రావటంవల్ల చూడకూడనివి చూస్తున్నారు. నేర్వకూడనివి నేర్చుకుంటున్నారు. ఇటువంటి పరిణామాలను నియంత్రించటం భౌతి కంగా అయ్యే పని కాదు. కేవలం విలువల ప్రాధాన్యత తెలియ చెప్పటం ద్వారా పరిణతి చెందిన ఆలోచనలతో స్వీయ నియంత్రణను అలవర్చుకుంటారు. ముఖ్యంగా నేటి తరానికి కష్టం అంటే ఏమిటో తెలియదు. విలాసవంతమైన, సుఖమయ జీవనం వీరి సొంతం. ఒకసారి సౌకర్యవంతమైన జీవన పరిధి దాటి బయటకొచ్చినప్పుడు విలువల్ని కాపాడుకోవటం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఓర్చుకోవాలంటే గొప్ప వ్యక్తిత్వ నిర్మాణం అవసరం. విలువలు లేని విద్యతో వాటిని నాశనం చేసుకుంటే మున్ముందు మనిషనేవాడు కనపడడు. ఇప్పటికే ఎటు చూసినా మృగయా వినోదపు ఘీంకారాలు నలుదిశలా మ్రోగుతున్నాయి. వాటికి చరమగీతం పాడాలంటే విలువలతో కూడిన విద్యను మన ముందు తరాలకు అందించటానికి నడుం బిగించాలి. వ్యాసకర్త ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొబైల్ : 78931 11985 -
ఉచితంగా కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్య
పశ్చిమగోదావరి, నిడమర్రు: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో పైసా ఖర్చులేకుండా చదివేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ద్వారా శనివారం నుంచి 2018–19 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2018 మార్చి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ గ్రేడ్ పాయిట్స్ సాధించిన విద్యార్థులు ఇంటర్ విద్యను కార్పొరేట్ కళాశాలల్లో చదివేందుకు ఈ ‘కార్పొరేట్ కాలేజీ’ స్కీమ్లో అవకాశం ఉందన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ రెండేళ్ల చదువుకు, వసతికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వ విద్యార్థులు మాత్రమే ♦ ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, పురపాలక, ఆదర్శ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, నవోదయ విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమశాఖ వసతిగృహాల్లో ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు. ♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యం ఉంటుంది. ♦ వీరు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే 10వ తరగతి విద్యనభ్యసించి ఉండాలి. ♦ 2018 మార్చిలో టెన్త్ ఫలితాల్లో కనీసం జీపీఏ 7 పాయిట్స్ సాధించి ఉండాలి. ♦ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.2 లక్షలు మించి ఉండరాదు. మిగిలిన వర్గాల విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.లక్షకు మించి ఉండకూడదు. ♦ పదో తరగతిలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీట్ల కేటాయింపు ఇలా.. జిల్లావ్యాప్తంగా 255 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 50 శాతం సంక్షేమ వసతి గృహాల్లో ఉండి పదో తరగతి చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు. మరో 25 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు, గురుకుల పాఠశాలల్లో నివాసం ఉండి చదివినవారికి 20 శాతం, బెస్ట్ ఎవైలబుల్ పాఠశాలల్లో చదివిన వారికి 5 శాతం సీట్లు కేటాయిస్తారు. ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరణ http://jnanabhumi.ap.gov.in వెబ్సైట్లో కార్పొరేట్ అప్లికేషన్స్ అనే కాలం క్లిక్ చేసి అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో ఈ నెల12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ♦ ఎంపిక చేసిన కళాశాలల్లో ప్రాధాన్యతాక్రమంలో నాలుగు కళాశాలల వరకూ విద్యార్థి ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చు. ♦ మెరిట్ ప్రాతిపాదికన ఎంపికైన విద్యార్థులకు ఆన్లైన్లో నమోదు చేసిన సెల్ఫోన్ నంబర్లకు సంక్షిప్త సమాచారం (ఎస్ఎంఎస్) పంపుతారు. ♦ వేల మంది దరఖాస్తుదారుల్లో నుంచి ప్రతిభావంతులైన వారిని రిజర్వేషన్ కోటా మేరకు కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలతో కలసి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. విద్యార్థులు కోరుకున్న కళాశాలలో చదివే అవకాశం కల్పిస్తారు. ♦ ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 17వ తేదీన ధ్రువీకరణ పత్రం అందిస్తారు. ♦ ఈ నెల 21వ తేదీలోపు కేటాయించిన కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులు తప్పకుండా చేరాలని అధికారులు తెలిపారు. లేని పక్షంలో వెయింటింగ్ లిస్టులో ఉన్నవారికి ఇస్తామన్నారు. ఏడాదికి రూ.35 వేలు ♦ ప్రముఖ కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఏడాదికి రూ.35 వేల చొప్పున విద్య, వసతి, భోజనం, ఇతర అన్ని ఖర్చులకు కళాశాలలకు నేరుగా ఆ నగదును అందజేస్తారు. ఇంటర్ రెండేళ్లకు కలిపి రూ.70 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. విద్యార్థికి ప్యాకెట్ మనీగా రూ.3 వేలు మంజూరు చేస్తారు. దరఖాస్తుతోపాటు జతపరచవల్సినవి ♦ మీసేవ ద్వారా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు(గతంలో విద్యార్థి ప్రీ మెట్రిక్ ఉపకార వేతనం పొందేందుకు మీసేవ నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ ఉంటే సరిపోతుంది. కొత్తగా తీసుకోవల్సిన అవసరంలేదు) ♦ విద్యార్థి ఫొటో సైజ్ పొడవు 4.5, వెడల్పు 3.5 సెంటీమీర్లు ఉండాలి ♦ వికలాంగ విద్యార్థి అయితే సంబంధిత అధికారిచే జారీ చేసిన వికలాంగ ధ్రువీకరణ పత్రం ♦ మొబైల్ నంబర్, ఈ–మెయిల్ తప్పు లేకుండా నమోదు చేసుకోవాలి ♦ విద్యార్థి కుటుంబానికి రేషన్ కార్డు ఉంటే జతపరచాలి -
షరా మామూలే!
సాక్షి,సిటీబ్యూరో: వేసవి సెలవుల్లోనూ పలు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు గుట్టుచప్పుడు కాకుండా పాఠాలు బోధిస్తున్నాయి. పొటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న సెకండియర్ విద్యార్థులను సాకుగా చూపించి ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీ చేసిన అధికారులు ఇప్పటికే ఆయా కాలేజీలకు షోకాజు నోటీసులు అందజేయడం విశేషం. హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో 323 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. అధికారులు ఇటీవల 27 కాలేజీల్లో తనిఖీ చేసి వీటిలో నిబంధనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న 12 కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 200పైగా ఉన్న కాలేజీలు ఉండగా, వీటిలో 20 కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత రెండుమూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి.. ఆ తర్వాత షరామా మూలుగా తరగతులు నిర్వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇప్పటికే సెకండియర్ పూర్తై.. ఎంసెట్, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించుకునేందుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని కాలేజీలు ఇటీవలే ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకూ గుట్టుచప్పుడు కాకుండా పాఠాలు బోధిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి ఒత్తిడి నుంచి విద్యార్థులకు విముక్తి కల్పించాల్సిన అధికారులు అటువైపు వెళ్లడానికి కూడా వెనుకాడుతున్నారు. ఫలితాలు రాకముందే ప్రవేశాలు.. టెన్త్ ఫలితాలు ఇంకా వెలువడక ముందే నగరంలోని పలు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఫస్టియర్ అడ్మిషన్ల పక్రియను అప్పుడే చేపట్టాయి. ప్రభుత్వ గురుకులాల్లో ఇంటర్మీడియట్ తరగతులను కూడా కొనసాగిస్తుండటంతో ప్రైవేటులో సీట్లు భారీగా మిగిలిపోయే అవకాశం లేకపోలేదు. ఈ అంశాన్ని ముందే పసిగట్టిన పలు యాజమాన్యాలు ఆయా కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులకు టార్గెట్లు ఇచ్చాయి. అడ్మిషన్ల కోసం ప్రత్యేకంగా పీఆర్ఓలను నియమించుకున్నాయి. వీరంతా బస్తీల్లో పర్యటించి ఇటీవల టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం, సాయంత్రం ఇదే పనిలో ఉంటున్నారు. టెన్త్ ఫలితాలు వెలువడిన తర్వాత యాజమాన్యాలు ఫీజులు పెంచే అవకాశం ఉందని, ప్రస్తుతం అడ్మిషన్ చేసుకున్న వారికి ఫీ జులో 20 నుంచి 30 శాతం రాయితీ కూడా ఇస్తుందని ప్రకటిస్తున్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న విద్యార్థులను ఆకర్షించేందుకు ఆయా కాలేజీ, హాస్టల్ భవనాలను అందగా తీర్చిదిద్దుతుండటం విశేషం. తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు వేసవి సెలవుల్లో ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించే యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. హైదరాబాద్ జిల్లాల్లో ఇప్పటికే 12 కాలేజీలకు నోటీసులు కూడా ఇచ్చాం. రెండోసారి పట్టుబడిన కాలేజీలను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. అంతేకాదు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం దళారులకు, వాటిలో పనిచేసే ఉద్యోగులకు ముందస్తుగా డబ్బులు కట్టి మోసపోవద్దు. ప్రవేశాలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. 2018–19 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కళాశాలల్లోని వసతులు, సౌకర్యాలు గుర్తించి అన్నీ సక్రమంగా ఉన్న వాటికే గుర్తింపు ఇవ్వనున్నారు. ఈ జాబితాను ఆన్లైన్లో పొందుపరిచే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏ కళాశాలలో ఎలాంటి వసతులున్నాయి.. అనుమతి తీసుకున్న భవనం.. తరగతి గదులు..అధ్యాపకుల అర్హ తలు.. తదితర సమగ్ర సమాచారాన్ని ఆ వెబ్సైట్లో పొందుపరుస్తారు. వీటిని విద్యార్థుల తల్లిదండ్రులు సమగ్రంగా పరిశీలించి ప్రవేశాలు చేసుకుంటే మంచిది. – జయప్రద, డీఐఈఓ -
చితుకుతున్న చిన్న కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: 2014–15లో రాష్ట్రంలో 2,560 ప్రైవేటు జూనియర్ కాలేజీలుండేవి.. 2015–16 వాటి సంఖ్య 2,259కి తగ్గిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే 301 కాలేజీలు మూత పడ్డాయి! 2016–17 విద్యా సంవత్సరంలో వాటి సంఖ్య 1,842కు తగ్గింది. ఏకంగా 417 కాలేజీలు మూతపడ్డాయి. 2017–18 విద్యా సంవత్సరం నాటికి 1,733కు తగ్గిపోయాయి. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం వచ్చేస్తోంది. ఈసారి కూడా పెద్దసంఖ్యలో ప్రైవేటు కాలేజీలు మూతపడే పరిస్థితే కనిపిస్తోంది. కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడలేకపోవడమే ఇందుకు కారణం. నాలుగేళ్లలో 827 కాలేజీలు.. ఆకర్షణీయ ప్రకటనలు, ర్యాంకుల ప్రచార హోరులో సాధారణ ప్రైవేటు కాలేజీలు బడా కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడలేకపోతున్నాయి. ఆ సంస్థల దెబ్బకు మూత పడుతున్నాయి. నాలుగేళ్లలో 827 కాలేజీలు మూతపడినట్లు ఇంటర్మీడియట్ బోర్డు లెక్కలు చెబుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం మరిన్ని మూతపడే పరిస్థితి నెలకొంది. కొంత ఆర్థిక స్తోమత కలిగిన తల్లిదండ్రులంతా కార్పొరేట్ కాలేజీలు ప్రచారం చేసే ఎంసెట్, జేఈఈ, ఐఐటీ ర్యాంకుల ఆకర్షణకు లోనై లక్షలు వెచ్చించి పిల్లలను వాటిల్లో చేర్చుతున్నారు. ఐఐటీ ర్యాంకుల కోసం అప్పులు చేసి మరీ కార్పొరేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రచార హోరును తట్టుకోలేక, పిల్లల తల్లిదండ్రులను ఆకర్షించలేక సాధారణ, చిన్న గ్రామీణ కాలేజీలు క్రమంగా మూత పడుతున్నాయి. కార్పొరేట్ కాలేజీల కోసం పీఆర్వోలు కార్పొరేట్ వ్యవస్థలో విద్యార్థులను ఆకర్షించేందుకు కొత్తగా పీఆర్వో విభాగం మొదలైంది. పట్టణాల వారీగా పీఆర్వోలను నియమించుకుంటున్నాయి. ఈ పీఆర్వోలు పదో తరగతి పరీక్షలకు ముందే ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల వివరాలను సేకరించి నేరుగా తల్లిదండ్రులతో మాట్లాడి కాలేజీల్లో చేర్పించేలా ఒప్పిస్తున్నారు. ఐఐటీ, నిట్ విద్యాసంస్థల మోజులో ఉన్న తల్లిదండ్రులు ఆ కార్పొరేట్ కాలేజీల్లో కనీస వసతులు ఉన్నాయా? లేదా? అన్నది కూడా చూసుకోకుండా పిల్లల్ని చేరుస్తున్నారు. వారి ఆశలను ఆసరాగా చేసుకుంటున్న యాజమాన్యాలు అనుమతులు తీసుకోకుండానే కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేస్తూ.. ఒకే క్యాంపస్లో రెండేసి కాలేజీలను నడుపుతున్నాయి. దీంతో కార్పొరేట్ దందా ఏటే పెరిగిపోతూనే ఉంది. వాటిల్లో ఎన్నో లోపాలు: ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల తనిఖీల్లో కార్పొరేట్ కాలేజీల లోపాలు అనేకం బయటపడ్డాయి. రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలకు చెందిన 146 కాలేజీల హాస్టళ్లు (రంగారెడ్డిలో 35, మేడ్చెల్లో 51, హైదరాబాద్లో 60) జైళ్లలా ఉన్నాయని తనిఖీల్లో తేల్చారు. ఆయా కాలేజీలు, హాస్టళ్లలో అకడమిక్ క్యాలెండర్ అమలు చేయడం లేదు. సమయపాలన లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే బోధన చేపట్టాల్సి ఉన్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పిల్లలతో చదివిస్తున్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ఈసారి మిగిలేవెన్నో... 2018–19 విద్యా సంవత్సరంలో అనుబంధ గుర్తింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,684 కాలేజీలు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నా అందులో 760 కాలేజీలు ఇంకా ఫీజు చెల్లించలేదు. 924 ప్రైవేటు కాలేజీలే దరఖాస్తు చేసుకొని ఫీజులు చెల్లించాయి. ఆలస్య రుసుంతో ఈ నెల 20 వరకే గడువు ముగిసింది. ఇపుడు ఫీజు చెల్లించని ఆ 760 కాలేజీల పరిస్థితి ఏంటన్నది తేలాల్సి ఉంది. అందులో 350 కాలేజీలకు పక్కా భవనాలు లేవని ఇదివరకే ఇంటర్ బోర్డు తనిఖీల్లో వెల్లడైంది. అవన్నీ రేకుల షెడ్డుల్లో కొనసాగుతున్నట్లు తేలింది. గతేడాది అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ నవంబర్ వరకు కొనసాగింది. దీంతో వాటిలో చదువుతున్న విద్యార్థులు ఇబ్బందుల్లో పడతారన్న ఉద్దేశంతో.. ఆ కాలేజీలకు బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈసారి మాత్రం ఇచ్చేది లేదని డిసెంబర్లోనే స్పష్టం చేసింది. దీంతో ఆ 350 కాలేజీలు ఆన్లైన్ అఫిలియేషన్కు దరఖాస్తు చేసినా.. వాటిలోని విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలకు వెళ్లిపోతుండటంతో ఫీజును చెల్లించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆ కాలేజీలు మూత పడే పరిస్థితి నెలకొంది. -
రాయితీలిస్తాం.. మా కాలేజీలో చేర్చండి
వజ్రపుకొత్తూరు: పదో తరగతి చదువుతున్న విద్యార్థులను తమ కాలేజీలో చేర్చుకునేందుకు కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు అప్పుడే వల విసురుతున్నాయి. రాయితీలు ఇస్తామంటూ ఫోన్లు చేస్తూ తల్లిదండ్రులపై పీఆర్వోలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. పదోతరగతిలో మంచి గ్రేడ్ పాయింట్లు తెచ్చుకుంటే మరింత రాయితీ ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరి ఆగడాలు పెరుగుతున్నాయి. జిల్లాలో 469 ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో 20 కేజీబీవీ, 14 మున్సిపల్ హైస్కూల్స్, మరో 14 ఆంధ్రప్రదేశ్ మోడల్ హైస్కూల్స్ ఉన్నాయి. ఇదికాక 193 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది దాదాపు 63,000 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం వీరి వివరాలు సేకరించి పీఆర్వోలను రంగంలోకి దింపి ఇళ్లకి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలైతే ఇప్పటికే తమ వద్ద ఉన్న విద్యార్థులు ఎటూ చేజారిపోకుండా 10వ తరగతి ఫీజు కట్టినపుడే.. ఇంటర్కు అడ్వాన్స్ ఫీజు చెల్లిస్తే అప్పటి ధరలో పదో వంతు రాయితీ ఇస్తామంటూ ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏరియాకు ఒకరు చొప్పున కమీషన్ పద్ధతిలో పీఆర్ఓలను నియమించి విద్యార్థుల కోసం గ్రామాల్లో జల్లెడ పడుతున్నారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల మార్కుల లిస్ట్, టీసీ ఇచ్చేది లేదని తమ కళాశాలలోనే పిల్లలను ఉంచాలని ఒత్తిడి చేస్తున్నాయి. కళాశాలలో పని చేసే ఉపాధ్యాయుల నుంచి అటెండర్ల వరకు ప్రతి ఒక్కరూ నెలకు కచ్చితంగా ఇద్దరిని చేర్చాలని కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు కండీషన్లు పెట్టినట్లు సమాచారం. దీంతో వీరు కూడా ఆదివారం పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్లు, రాయితీలు వివరిస్తున్నారు. పదోతరగతిలో అర్థ సంవత్సరం (సమ్మెటివ్–2) పరీక్షలు జరగక ముందే ఇంటర్ ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కాకినాడ ఆర్ఐఓ కార్యాలయం సైతం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ కళాశాలలను పాఠశాలలకు వచ్చి విద్యార్థులను పలోభ పెడితే ప్రధానోపాధ్యాయులు తీవ్రంగా పరిగణించి వారిని నిరోధించాలని వజ్రపుకొత్తూరు విద్యాశాఖాధికారి పి.కృష్ణప్రసాద్ అన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురయితే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ణిర్యాదు చేయవచ్చని తెలిపారు. -
కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలపై హైకోర్టుకు లేఖ
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు, ఐఐటీల్లో ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయ విచారణకు ఆదేశించడంతో పాటు ఆయా కాలేజీల యాజమా న్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తమకు అందిన లేఖపై హైకోర్టు స్పందించింది. ప్రకాశం జిల్లాకు చెందిన లోక్సత్తా అజిటేషన్ సొసైటీ జిల్లా కన్వీనర్ దాసరి ఇమ్మాన్యుయేల్ రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజ న వ్యాజ్యం (పిల్)గా పరిగణిం చింది. ఇందులో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, హోం, విద్యాశాఖ ల ముఖ్య కార్యదర్శులు, ఇంటర్ బోర్డు కార్యదర్శు లు, నిమ్స్, స్విమ్స్ డైరెక్టర్లతో పాటు, కార్పొరేషన్ కాలేజీలైన నారాయణ, శ్రీచైతన్య కాలేజీల యాజమాన్యాలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిల్పై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. -
అసెంబ్లీలో ఒప్పుకోక తప్పలేదు!
-
ఒప్పుకోక తప్పలేదు!
సాక్షి, అమరావతి: విద్యార్థుల ఆత్మహత్యలపై కార్పొరేట్ కాలేజీలను రక్షించేలా ప్రభుత్వపు ఉల్టాపల్టా వ్యవహారం బుధవారం అసెంబ్లీలో బట్టబయలైంది. విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చ చేపట్టాలని.. దానిపై ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఇంతకు ముందు నిర్ణయించి అజెండాలో చేర్చించింది. నారాయణ తదితర కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుల ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు రేగడం, కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందంటూ విమర్శలు వస్తుండడంతో.. గత కొంతకాలంగా ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన సంగతి తెలిసిందే. నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండగా ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా ఉండడంతో కార్పొరేట్ కాలేజీలను ప్రభుత్వం రక్షిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా బయటకూడా నిలదీస్తోంది. ప్రస్తుత శీతాకాల సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించడంతో తమ వాదనను ఏకపక్షంగా వినిపించవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో ఆ అంశాన్ని చర్చకు అజెండాలో చేర్చింది. ఈ అంశంపై ఈనెల 13వ తేదీనే సభలో చర్చ జరిపి సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. అప్పట్లో అలా.. ఇప్పుడిలా.. అప్పట్లో ఆత్మహత్యలకు కారణం విద్యార్థులు, తల్లిదండ్రులే కారణమని విద్యాశాఖ నోట్ రూపొందించింది. ఆ నోట్లో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల పేరును కూడా కనీసం ప్రస్తావించకుండా విద్యాశాఖ జాగ్రత్త పడింది. అయితే అంతకు ముందురోజు ఆదివారం కృష్ణానదిలో బోటు మునిగి 22 మంది యాత్రికులు మరణించారు. దీంతో మరునాడు ప్రభుత్వం నిర్ణయించిన అజెండా ప్రకారం అసెంబ్లీ కార్యకలాపాలు సాగలేదు. దీంతో విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చ వాయిదా పడింది. ఆ రోజున అసెంబ్లీలో చర్చలో చెప్పేందుకు విద్యాశాఖ రూపొందించిన నోట్ ‘సాక్షి ’కి చేరగా ఆ మరునాడే దాని ఆధారంగా ‘ఆత్మహత్యలకు విద్యార్థులు, తల్లిదండ్రులే కారణమట’ శీర్షికతో వార్తను ప్రచురించింది. ఈ వార్తతో ప్రభుత్వ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కంగుతిన్న ప్రభుత్వం ఆరోజున జరగాల్సిన చర్చ జరగకపోవడంతో అప్పటి నోట్లో మార్పులు చేసింది. పాత నోట్లో ఆత్మహత్యలకు కారణాల్లో యాజమాన్యాలు అన్న పదం లేకపోగా తాజాగా రూపొందించిన నోట్లో యాజమాన్యాలను చేర్చింది. ఈ కొత్తనోట్తో బుధవారం జరిగిన చర్చలో మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం చెప్పారు. ఈ ఆత్మహత్యలకు కారణాల్లో యాజమాన్యాలూ ఉన్నాయన్నారు. -
'ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ఆరాటపడొద్దు'
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థుల ఆత్మహత్యలపై మాట్లాడారు. ' రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ఆరాట పడుతున్నారు. ఎక్కడ టాప్ ర్యాంకులు వస్తాయో అక్కడే చేర్పిస్తున్నారు. పిల్లలను రోబోల మాదిరిగా చేస్తున్నారు. విద్యార్థులకు శారీరక వ్యాయామం అసలు లేకపోవడం వల్ల ఒత్తిడి ఎక్కువైపోతోంది. వారిని యంత్రాల్లాగా మార్చవద్దు. ఒత్తిడి తగ్గించాలని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించాము. చదువు చెప్పమంటే పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. అసెంబ్లీ ద్వారా కాలేజీల యాజమాన్యాలను హెచ్చరిస్తున్నాను. ఎక్కడ విద్యార్థుల ఆత్మహత్య జరిగినా సీరియస్ గా తీసుకుంటా.. ఇలాంటి విషయాల్లో కాలేజ్ మేనేజ్మెంట్ తప్పుంటే కఠినంగా శిక్షిస్తా' మని చంద్రబాబు తెలిపారు. -
'నారాయణ, చైతన్య’కు భారీ జరిమానా'
సాక్షి, అమరావతి: విద్యా సంస్థల్లో తీవ్ర ఒత్తిడి ఉంటున్న మాట వాస్తవమేనని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నిబంధనలు పాటించని పలు జిల్లాల్లోని నారాయణ, చైతన్య కాలేజీలకు రూ. 50 లక్షల చొప్పున జరిమానా విధించామని.. తగిన చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని కళాశాలల్లో పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు చేస్తామన్నారు. లోటు బడ్జెట్లోనూ విద్యారంగానికి అధిక నిధులు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ప్రైవేటు కళాశాలల్లో ఆత్మహత్యల నివారణకు రెండు కమిటీలు వేశామని వెల్లడించారు. రోజుకు 18 గంటలపాటు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని, ఆత్మహత్యల నివారణ కోసం సీఎం స్వయంగా యాజమాన్యాలతో చర్చించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని హెచ్చరించారని వివరించారు. ఒక్క ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కచ్చితంగా ఆత్మహత్యలు తగ్గిస్తామని, వచ్చే ఏడాది నుంచి 100 శాతం నిబంధనలు పాటించే కళాశాలలకే అనుమతులిస్తామని మంత్రి చెప్పారు. -
'నారాయణ' లో లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల్లో అరాచకాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఆరోపించారు. ఆయనిక్కడ మంగళవారం మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ.. నారాయణ కాలేజీల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. యాజమాన్యంపై ఉద్యోగిని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నారాయణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య గాడిన పడిందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ర్టాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులు జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ వంటి సంస్థల్లో ప్రవేశాలు పొంది ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారని చెప్పారు. వైద్య, వ్యవసాయ విద్యాసంస్థలు రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడ అవకాశాలు రాని విద్యార్థులు ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారని తెలిపారు. కొన్ని ప్రత్యేక విద్యాసంస్థల్లో నేరుగా వెళ్లి ప్రవేశాలు పొందుతున్నారని చెప్పారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి తెలంగాణలో చదువుతున్నారని గుర్తు చేశారు. నాణ్యమైన విద్య అందించడం వల్ల ఇతర రాష్ర్టాల నుంచి విద్యార్థులు వస్తున్నారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలు.. కారణాలు!
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు వారు, వారి తల్లిదండ్రులే కారణం. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు ఎలాంటి సంబంధమూ లేదు..’ అని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. హాస్టళ్లలో ఉండటం ఇష్టం లేని విద్యార్థులను హాస్టళ్లలోనే ఉండా ల్సిందిగా తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం, ఎక్కువ మార్కులు, టాప్ ర్యాంకులు తెచ్చుకోవాలని బలవంత పెట్టడం, మొదటి సంవత్సరంలో ఫెయిల్ కావడం, కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్లే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తన నివేదికలో స్పష్టం చేసింది. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీ శీతాకాల సమా వేశాల్లో కొందరు సభ్యులు చర్చను కోరుతుండడంతో ప్రభుత్వం ఈ నివేదికను రూపొందించింది. అయితే కనీస నిబంధనలు పాటించకుండా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపట్టా ల్సిన ప్రభుత్వం.. వారికి వత్తాసుగా నివేదిక తయారు చేసింది. ఆత్మహత్యల విషయంలో కార్పొరేట్ కాలేజీలకు కొమ్ము కాసే ప్రయత్నంలో.. విద్యార్థుల ఆత్మహత్యలకు అసలు కారణాలను తొక్కిపెడుతోంది. కార్పొరేట్ కాలేజీలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నా ప్రభుత్వం ఎక్కడా ఆ అంశాలను ప్రస్తావించలేదు. గతంలో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలు.. ఆయా కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నాయని, అక్రమంగా హాస్టళ్లను నిర్వహిస్తూ విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయని తేల్చినా ప్రభుత్వం ఆ అంశాలను విస్మరించింది. అయితే విద్యార్థుల నుంచి కళాశాలలపై టోల్ఫ్రీ నంబర్కు రోజూ 41 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వమే పేర్కొనడం.. కార్పొరేట్ కళాశాలల్లో పరిస్థితిని కళ్లకు కడుతుంది. కమిటీల సూచనలు పరిగణనలోకి.. ఆత్మహత్యల నివారణకు ఆయా కమిటీలు చేసిన సూచనలు ప్రభుత్వం తన నివేదికలో పొందుపరిచింది. ఆదివారాలు, సెలవు రోజుల్లో పరీక్షలుండరాదని, ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యార్థులను స్వేచ్ఛగా తిరగనివ్వాలని, ఉదయం 7 గంటలకు ముందు, సాయంత్రం 7 తర్వాత హాస్టల్ విద్యార్థులను ఇబ్బంది పెట్టరాదని, ఆటలు ఆడించాలని, ప్రతిభ ఆధారిత గ్రేడింగ్ చేయరాదని, మానసిక నిపుణులను (సైక్రియాట్రిస్టులు) నియమించాలని, నైతిక, మానవ విలువలపై అవగాహనకు ఒక పేపర్ పెట్టాలని పేర్కొంది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు అన్ని కాలేజీలకు సర్క్యులర్లు జారీ చేసిందని నివేదికలో సర్కారు తెలిపింది. 13 బృందాల ద్వారా 706 కాలేజీలను తనిఖీలు చేయగా అనేక లోపాలు గుర్తించినట్లు పేర్కొంది. 237 కాలేజీల గుర్తింపును రద్దుచేశామని, మరో 31 కాలేజీల గుర్తింపు రద్దుకు నిర్ణయించినట్లు వివరించింది. అనేక కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, అనధికార హాస్టళ్లను నడుపుతున్న 194 కాలేజీలకు నోటీసులు ఇవ్వగా 37 కాలేజీలు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు పేర్కొంది. టోల్ఫ్రీ నంబర్కు రోజూ 41 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని, అదనపు సమయం తరగతుల నిర్వహణ, సెలవు రోజుల్లోనూ క్లాసులు పెట్టడం వంటి అంశాలను విద్యార్థులు పేర్కొంటున్నారని వివరించింది. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం నివేదికలో పేర్కొన్న కారణాలివే... – హాస్టళ్లలో ఉండడానికి ఇష్టం లేకపోవడం – హాస్టళ్లలోనే ఉండమని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం – అత్యధిక మార్కులు/మొదటి ర్యాంకు రావాలని తల్లిదండ్రులు బలవంతపెట్టడం – ఐఐటీ/నీట్ పరీక్షలకు కావాల్సిన ఉన్నత ప్రమాణాలను చేరుకోలేకపోవడం – ఆరోగ్యం, కుటుంబ, వ్యక్తిగత కారణాలు – సెక్షన్ల వారీగా గ్రేడింగ్ చేయడం – మొదటి సంవత్సరం సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాకపోవడం ఆత్మహత్యల సంఖ్య కుదింపు రాష్ట్రంలో గత మూడేళ్లలో 70 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా ప్రభుత్వం ఆ సంఖ్యను భారీగా కుదించింది. 2012 నుంచి 2017 వరకు ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య 37 అని పేర్కొంది. నారాయణ కళాశాలలో 10, శ్రీచైతన్యలో 15, ఎన్ఆర్ఐలో 4, ఇతర యాజమాన్యాల్లో 8 జరిగినట్లు తెలిపింది. రాష్ట్రంలో 3,361 కాలేజీలుండగా ఇందులో 1,143 ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు కాగా తక్కిన 2,218 కాలేజీలు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు చెందినవి. మొత్తం 9,18,211 మంది విద్యార్థుల్లో 2,26,388 మంది ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల వారు కాగా మిగతా వారంతా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల వారే. -
మెరిట్ విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట
-
‘క్యాష్’ చేసుకుంటున్న కార్పొరేట్ కాలేజీలు!
కూకట్పల్లికి చెందిన ఓ ఉపాధ్యాయుడి కుమారుడు యావరేజ్ విద్యార్థి. కార్పొరేట్ కాలేజీలో వేస్తే బాగా చదువుతాడని ఆశించారు. ఏటా రూ.90 వేలు కట్టి ఓ కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు. కానీ అక్కడి టీచర్లు ఈ విద్యార్థిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో లక్షలు ఖర్చుపెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆ తండ్రి ఆందోళనలో పడ్డారు. హబ్సిగూడకు చెందిన రాంరెడ్డి తన కుమార్తెను ఏసీ సదుపాయమున్న ఓ కాలేజీ హాస్టల్లో చేర్పించారు. ఏటా రూ.1.5 లక్షల ఫీజు కడుతున్నారు. కానీ అక్కడ సరైన వసతులకే దిక్కులేదు. పోతే పోనీ చదువు బాగా వస్తే చాలనుకున్నారు. కానీ ఆ ప్రయోజనమూ లేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడ్డారు. సాక్షి, హైదరాబాద్ : ఐఐటీ, ఏఐఈఈఈ ప్రత్యేక కోచింగ్ అంటూ ఆకర్షణీయ పేర్లతో ఊదరగొడుతున్న కార్పొరేట్ కాలేజీల ప్రచారం మాయలో పడి.. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి మరీ పిల్లలను చేర్చుతున్నారు. కాలేజీలు ఆ కోచింగ్, ఈ ప్రత్యేకత, ఏసీ సౌకర్యాలు అంటూ ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాయి. కానీ చాలా మంది విద్యార్థులకు తగిన బోధన అందడం లేదు. యాజమాన్యాలు అప్పటికే ‘మెరిట్’గా ఉండి, ర్యాంకులు తెచ్చిపెట్టగలిగిన విద్యార్థులపైనే ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నాయి. మిగతా విద్యార్థులకు బలవంతపు చదువులే తప్ప నాణ్యమైన బోధన అందించడం లేదు. వాళ్లను చూపుతూ.. వీరిపై దోపిడీ.. వేలాది మంది విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. అందరికీ సమాన విద్య అందించడం లేదు. తీసుకుంటున్న సొమ్ముకు న్యాయం చేయడం లేదు. కేవలం తమకు ర్యాంకులను తెచ్చిపెట్టే విద్యార్థులపైనే ప్రత్యేక దృష్టి సారిస్తూ.. వారికి విడిగా నాణ్యమైన బోధన, శిక్షణ ఇస్తున్నాయి. ఇందుకోసం లక్షల రూపాయలు ఎదురు చెల్లించి మరీ ‘మెరిట్’విద్యార్థులను కొనుగోలు చేస్తున్నాయి. వారు సాధించిన మార్కులు, ర్యాంకులను ప్రచారం చేసుకుంటూ.. వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. అధికారులు ఇంటర్ బోర్డుకు అందజేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు కూడా. రాష్ట్రవ్యాప్తంగా 1,550 వరకు ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. అందులో 18 కార్పొరేట్ మేనేజ్మెంట్లకు చెందిన కాలేజీలు 193 ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు వేసింది. వీటిల్లోనే ఏకంగా 3.4 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అయితే కార్పొరేట్ యాజమాన్యాలు ఈ 3.4 లక్షల మందిలో.. తమకు టాప్ ర్యాంకులు తెచ్చిపెట్టే 10 వేల మంది విద్యార్థులపైనే దృష్టి సారిస్తున్నాయని, మిగతా వారికి అన్యాయం జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. తాము చెప్పిందే ఫీజు రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీల్లో అడ్డగోలు ఫీజుల దందా కొనసాగుతోంది. పిల్లలను బాగా చదివించాలన్న తల్లిదండ్రుల ఆశను ఆసరాగా చేసుకుని.. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ సొమ్ముకు లెక్కా పత్రం లేదు, చెల్లించిన మొత్తానికి రసీదులు ఉండవు. కేవలం కాలేజీ అధికారిక ఫీజు మేరకు నామమాత్రపు మొత్తానికి రసీదులు ఇస్తున్నాయి. ఇంటర్ బోర్డు నిర్దేశించిన ప్రకారం.. డేస్కాలర్కు గరిష్ట ఫీజు రూ.1,940 మాత్రమే. నాలుగేళ్ల కింద నిర్ణయించిన ఈ ఫీజు సరిపోదని, పెంచాలని ప్రైవేటు కాలే జీలు కోరుతున్నాయి. సాధారణ ప్రైవేటు కాలేజీలు ఈ ఫీజుకు అదనంగా రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఆ మొత్తాన్ని చెల్లించలేని విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్షిప్ సొమ్మును తీసుకుంటున్నాయి. అదే కార్పొరేట్ కాలేజీలు మాత్రం సదుపాయాలను, ప్రత్యేకతలను బట్టి రూ.40 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అదే హాస్టల్ వసతి కూడా కలిపితే రూ.65 వేల నుంచి రూ. 2.20 లక్షలదాకా దండుకుంటున్నాయి. కార్పొరేట్ యాజమాన్యాలకు చెందిన స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి. టెక్నో, ఈ–టెక్నో వంటి ఆకరణీయ పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పట్టించుకోని ఇంటర్ బోర్డు కార్పొరేట్ కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా ఇంటర్ బోర్డు పట్టించుకున్న దాఖలాలు కానరావడం లేదు. జూని యర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణను చేపట్టాలన్న డిమాండ్ ఉన్నా దానిపై దృష్టి సారించడం లేదు. గతంలో ఒకసారి ఫీజుల నియం త్రణకు కసరత్తు ప్రారంభించినా అలాగే వదిలేశారు. ఫీజుల నియంత్రణ అమలుచేస్తే తమకు నష్టం వాటిల్లుతుందన్న ఆలోచనతో కార్పొరేట్ యాజమాన్యాలు ఇంటర్ బోర్డుపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సాధారణ ప్రైవేటు కాలేజీలు మాత్రం.. కొత్తగా ఫీజులను నిర్ణయించి, నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి. రకరకాల పేర్లతో.. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు అనేక ఆకర్షణీయ పేర్లతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంటర్లో ఏఐఈఈఈ, ఏఐఈఈఈ (ఫాస్ట్ ట్రాక్–ఎఫ్టీ) ఐఐటీ, ఏఐఈఈఈ (ఇంటెన్సివ్ జెడ్గ్రూప్), ఏసీ క్యాంపస్లు, సెంట్రల్ ఆఫీస్, రెండు యాజమాన్యాల భాగస్వామ్యంతో కూడిన బ్యాచ్లు, ఐపీఎల్ (ఐఐటీ), నియాన్ (ఏఐఈఈఈ), ఎంపీఎల్, సూపర్–60 వంటి పేర్ల తో ఫీజులు నిర్ణయిస్తున్నాయి. ఇంత భారీగా వసూలు చేస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. మండలానికో పీఆర్వోను పెట్టి.. పదో తరగతి ఫలితాలు వస్తున్నాయంటే చాలు.. కార్పొరేట్ కాలేజీల ప్రతినిధులు వాలిపోతారు. వారిలో మండలానికో పీఆర్వో, రెవెన్యూ డివిజన్కో ఏజీఎం, జిల్లాకో డీజీఎం (డీన్) ఉంటారు. వారంతా టెన్త్లో మంచి గ్రేడ్లు వచ్చిన పిల్లల తల్లిదండ్రులను కలుస్తారు. ఫీజు మినహాయింపు ఇస్తామని, హాస్టల్ కోసం తక్కువ ఫీజు తీసుకుంటామని, ఐఐటీలకు పంపుతామని గాలం వేస్తారు. మరోవైపు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రతిభావంతులైన పిల్లలను తమ కాలేజీలో చేర్పించేలా ఒప్పందాలు చేసుకుంటారు. ఇందుకోసం పాఠశాల యాజమాన్యానికి, ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు సొమ్ము చెల్లిస్తారు. ఈ మెరిట్ విద్యార్థులను ప్రత్యేక బ్రాంచీల్లో పెట్టి చదివిస్తారు. వారికి ప్రథమ సంవత్సరంలో టాప్ మార్కులు వస్తే సరే.. లేకపోతే రెండో ఏడాది నుంచి మొత్తం ఫీజు వసూలు చేస్తారు. -
కార్పొరేట్ కారాగారాలు..
సాక్షి, హైదరాబాద్: అదో కార్పొరేట్ కాలేజీ.. కట్టుదిట్టమైన పహారా మధ్య స్టడీ అవర్ జరుగుతోంది.. పిల్లలంతా ‘పుస్తక కుస్తీ’లో మునిగిపోయారు.. ఓ విద్యార్థికి అర్జెంట్.. కానీ ధైర్యం చేసి అడగలేడు.. కారణం.. అడిగితే ఎక్కడ కొడతారోనన్న భయం! చేసేది లేక ఉగ్గబట్టుకొని అలా కూర్చుండిపోయాడు!! అది పేరుమోసిన మరో బడా కళాశాల.. ప్రాంగణంలోనే హాస్టల్.. అమ్మానాన్నను చూసి ఆ విద్యార్థిని రెండు నెలలైంది.. ఫోన్లో మాట్లాడాలన్నా సవాలక్ష ఆంక్షలు.. సెలవు రోజు వచ్చింది.. అమ్మానాన్న వచ్చారు.. కానీ ‘రేపు పరీక్షలున్నాయి.. ఇప్పుడు కలవడం కుదరదు’ అంటూ వారిని వెనక్కి పంపేశారు కాలేజీ సిబ్బంది.. దూరంగా ఉన్న కిటికీలోంచి పేరెంట్స్ను చూసి కన్నీళ్లు పెట్టుకొని పుస్తకాలు పట్టుకుంది ఆ అమ్మాయి!! ఇంకో కాలేజీ.. అందులో వివేక్ ఇంటర్ చదువుతున్నాడు.. చదువుల్లో సాధారణ విద్యార్థి.. క్లాస్కు వెళ్లగానే ముందురోజు చెప్పిన పాఠంలోని ప్రశ్నలడిగారు లెక్చరర్.. ఇంకేముంది.. బెత్తాలు విరిగాయి.. విద్యార్థి చేయిపై వాతలు తేలాయి..!..మార్కులు, ర్యాంకుల గోల తప్ప విద్యార్థులు, ఆటలు పాటలు, వారి సమగ్ర వికాసం పట్టని కార్పొరేట్ కాలేజీలు, హాస్టళ్లలో జరుగుతున్న అరాచకాలివీ. ఒక్క మాటలో చెప్పాలంటే అవి పిల్లలపాలిట జైళ్లలా మారాయి. చదువుల సంగతి సరే.. లక్షలు పోస్తున్నా.. సదుపాయాలున్నాయా అంటే అవీ అంతంత మాత్రమే. వాష్రూమ్, టాయిలెట్ల ముందు కూడా లైన్లు కట్టాల్సిన దుస్థితి. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లో ఇబ్బందులతో సావాసం.. వారికి తెలిసిందల్లా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చదువే చదువు. ఆట లేదు.. పాట లేదు.. మానసిక ఉల్లాసం అంత కంటే లేదు. చివరకు కంటినిండా నిద్ర కూడా లేదు. కార్పొరేట్ కాలేజీల్లో ఇలాంటి నిర్బంధ పరిస్థితులు, ఒత్తిళ్ల మధ్య విద్యార్థులు చిత్తవుతున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. తమ సమస్యలను చెప్పుకునే అవకాశం లేక.. తల్లిదండ్రులతో మాట్లాడే సమయం లేక చివరకు జీవితాలపైనే విరక్తిని పెంచుకుంటున్నారు. ఒకవేళ సమస్యలను తల్లిదండ్రులకు చెబితే రెడ్ మార్కు వేస్తామంటూ బెదిరిస్తుండటంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటి విద్యార్థులకు సకాలంలో కౌన్సెలింగ్ ఇచ్చే కౌన్సెలర్లు లేకపోవడంతో ఆత్మహత్యల వైపు మళ్లుతున్నట్లు బోర్డు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీల్లో ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నారాయణ, శ్రీచైతన్య, శ్రీగాయత్రి తదితర విద్యాసంస్థలకు చెందిన 146 కాలేజీలు, హాస్టళ్లలో తనిఖీలు చేశారు. హెదరాబాద్ జిల్లాలో 60 హాస్టళ్లు, రంగారెడ్డి జిల్లాలోని 35, మేడ్చల్ జిల్లాలో 51 హాస్టళ్లలో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యల నేపథ్యంలో గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 15 రోజుల్లో చెప్పాలంటూ ఆ కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. కార్పొరేట్ కాలేజీలు, హాస్టళ్లలో సమస్యలపై నివేదిక రూపొందించిన ఆర్జేడీలు దాన్ని ఇంటర్ బోర్డుకు అందజేశారు. గంటల తరబడి చదువే.. ఏకధాటిగా పాఠాలు, వారానికి 4 పరీక్షలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనతున్నట్లు అధికారులు గుర్తించారు. హాస్టళ్లు.. కాలేజీల్లో అకడమిక్ కేలండర్ అమలు చేయడం లేదు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే (మధ్యలో గంట పాటు బ్రేక్) పాఠాలు బోధించాల్సి ఉన్నా దాన్ని ఒక్క కాలేజీ అమలు చేయడం లేదు. రెండో శనివారం, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లోనూ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఒక్కో సబ్జెక్టును ఏకధాటిగా మూడు గంటలపాటు బోధిస్తుండటంతో విద్యార్థులు తీవ్రంగా అలసిపోతున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకునే అవకాశం లేక.. విద్యార్థులు తమ సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకునే అవకాశం ఇవ్వడం లేదు. ఒకవేళ ఎవరైనా చెబితే టీసీపై రెడ్ మార్కు వేస్తామని బెదిరిస్తున్నారు. నెలకోసారి నిర్వహించాల్సిన పేరెంట్–టీచర్ సమావేశాలను నిర్వహించడం లేదు. పిల్లలకు వారానికి ఒకసారి 10 నిమిషాలు మాత్రమే తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. సెలవు రోజుల్లో తల్లిదండ్రులు వచ్చినా గంట మాత్రమే మాట్లాడేందుకు వీలు కల్పిస్తున్నారు. అదీ ఎప్పుడో ఒకసారి మాత్రమే. చాలాసార్లు పరీక్షలున్నాయంటూ వెనక్కి పంపేస్తున్నారు. ఇక కాలేజీలు, హాస్టళ్లలో ఎలాంటి ఫిర్యాదుల బాక్సులు లేవు. నాణ్యతలేని ఆహారం.. హాస్టళ్లలో ఆహారం నాణ్యత సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు జీర్ణ సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారు. హాస్టల్లో భోజనం చేయని విద్యార్థులు క్యాంటీన్లో ఏదైనా తినాలనుకుంటే అక్కడ అడ్డగోలు ధరలు పెట్టారు. సాధారణ ధరల కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టి విద్యార్థుల సొమ్మును దండుకుంటున్నారు. బ్రేక్ఫాస్ట్ ఉదయం ఐదున్నర గంటలకే పెడుతుండటంతో తినలేకపోతున్నట్లు విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. యావరేజ్ విద్యార్థులు గాలికి.. కార్పొరేట్ కాలేజీలు, హాస్టళ్లలో ఉండి చదువుకునే లక్షల మంది విద్యార్థుల్లో మెరిటోరియస్ విద్యార్థులకే ప్రాధాన్యం ఉంటుంది. సాధారణ విద్యార్థులను లెక్చరర్లు పట్టించుకోరు. వారి అనుమానాలను నివృత్తి చేయడం లేదు. సాధారణ విద్యార్థులను బాగా చదివే విద్యార్థులతో ఉంచరు. వారిని మరో సెక్షన్కు మార్చేస్తారు. దీంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. చాలాచోట్ల పేరుకే ఏసీ క్యాంపస్లు. ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదు. చెప్పినా చూస్తాం.. చేస్తామంటూ కాలం వెళ్లదీస్తున్నారు. హాస్టళ్లలో పేపర్లు, టీవీలను చూడనీయడం లేదు. -
విద్యార్థుల భవిష్యత్తో కార్పొరేట్ ‘గేమ్స్’
సాక్షి, హైదరాబాద్ : నేను కొట్టినట్టు చేస్తా... నువ్వు ఏడ్చినట్టు చెయ్ అన్నట్టుగా ఉంది నారాయణ, శ్రీచైతన్య కాలేజీలతో ఇంటర్మీడియెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు! నిబంధనల ప్రకారం లేనందున ఆ యాజమాన్యాలకు చెందిన 10 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని గొప్పగా ప్రకటించిన బోర్డు.. వాటిని కొనసాగించేందుకు మాత్రం తల ఊపేసింది. ఆ కాలేజీల్లోని విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసేందుకు లాగిన్ ఐడీ ఇచ్చేసింది. ఆ కాలేజీలకు గుర్తింపు లేదన్న సంగతి అటు నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలకు తెలుసు. ఇటు ఇంటర్మీడియెట్ అధికారులకు తెలుసు. అయినా ఇద్దరూ కుమ్మక్కై వాటిలో చదువుతున్న 8 వేల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. గుర్తింపు లేని కారణంగా.. ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సమయంలో హాల్టికెట్లు రాకపోతే వారంతా రోడ్డున పడే ప్రమాదం ఉంది. గుర్తింపు లేని ఈ 10 కాలేజీల్లో నారాయణ కాలేజీలు 5, శ్రీచైతన్య కాలేజీలు మరో 5 ఉన్నాయి. ఒకే క్యాంపస్లో రెండేసి కాలేజీలను నడుపుతూ తల్లిదండ్రుల నుంచి కోట్లు దండుకుంటున్నా.. బోర్డు అధికారులు మూముళ్ల మత్తులో జోగుతూ కళ్లు మూసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరుగుతోంది..? రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనే శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలకు చెందిన 146 కాలేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని, వారికి నోటీసులు జారీ చేశామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఇటీవల గొప్పగా ప్రకటించారు. కానీ అవే యాజమాన్యాలకు చెందిన 10 కాలేజీలకు గుర్తింపు లేకున్నా ఆన్లైన్ లాగిన్ ఇచ్చారు. అంటే బోర్డు అనుబంధ గుర్తింపు లేకపోయినా ఆ కాలేజీలు కొనసాగించేందుకు పరోక్షంగా అనుమతి ఇచ్చినట్టే. ఇప్పుడు లాగిన్ ఇచ్చి హాల్టికెట్లు ఇచ్చే సమయంలో భారీగా దండుకోవచ్చన్న ప్లాన్తోనే ఇలా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇది బెడిసికొడితే ఆ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. గతేడాది వనస్థలిపురంలోని శ్రీవాసవి కాలేజీ విషయంలో ఇలాగే జరిగింది. మరో ‘శ్రీవాసవి’అయితే.. వనస్థలిపురంలోని శ్రీవాసవి కాలేజీకి ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. కానీ ముడుపులు పుచ్చుకొని బోర్డు అధికారులు ఇలాగే లాగిన్ ఇచ్చేశారు. కానీ పరీక్ష సమయంలో... ఆ కాలేజీకి గుర్తింపు లేనందున విద్యార్థుల హాల్టికెట్లు జనరేట్ కాలేదు. బోర్డు అధికారులకు ముడుపులు ఇవ్వనందునే తమ పిల్లలకు హాల్టికెట్లు ఇవ్వలేదని ఆ కాలేజీ కరస్పాండెంట్ మీడియా ముందు చెప్పారు. ఏకంగా బోర్డు కార్యదర్శి అశోక్పైనే ఆరోపణలు చేశారు. గుర్తింపు లేనపుడు ముందుగా లాగిన్ ఎందుకు ఇచ్చారని కూడా ప్రశ్నించారు. తీరా ఆ కాలేజీ విద్యార్థులను వార్షిక పరీక్షలకు అనుమతించలేదు. చివరికి హయత్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో వారు మంచి మార్కులు సాధించినా ఎంసెట్లో తీవ్రంగా నష్టపోయారు. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మొదట ర్యాంకులు కేటాయించి.. చివరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాస్ అయిన వారికి ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థులంతా చివరి ర్యాంకుల్లో నిలిచి మంచి కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పొందలేకపోయారు. ఈ విద్యార్థులకు అదే పరిస్థితా? ప్రస్తుతం నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన ఆ 10 కాలేజీల్లో 8 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. నారాయణ విద్యా సంస్థలకు చెందిన రెండు కాలేజీలు తార్నాకాలో, మరో రెండు కాలేజీలు కూకట్పల్లిలో, ఇంకో రెండు కాలేజీలు మెహిదీపట్నంలోని ఒకే క్యాంపస్లలో కొనసాగుతున్నట్లు బోర్డు అధికారులు తేల్చారు. ఈ మూడు చోట్ల ఒక్కో కాలేజీకి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. అలాగే మరో రెండు కాలేజీలను కూకట్పల్లి నుంచి దిల్సుఖ్నగర్కు మార్చారు. అయితే వాటి రికార్డులను అధికారులకు ఇవ్వకపోవడంతో ఆ రెండింటికి కూడా గుర్తింపు ఇవ్వలేదు. ఇలా మొత్తం ఐదు కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు. ఇక కూకట్పల్లిలో శ్రీచైతన్య విద్యా సంస్థకు చెందిన రెండు కాలేజీలు ఒకే క్యాంపస్లో నడుస్తున్నాయి. దిల్సుఖ్నగర్లోనూ ఒకే క్యాంపస్లో రెండు నడుస్తున్నాయి. వీటిలో రెండింటికి అనుమతి ఉంది. మరో రెండింటికి లేదు. అలాగే నిబంధనల ప్రకారం కాలేజీ భవనాలు లేకపోవడంతో మరో మూడు కాలేజీలకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇలా నారాయణ కాలేజీలు ఐదు, శ్రీచైతన్య కాలేజీలు ఐదింటికి గుర్తింపు లేవు. గతేడాది శ్రీవాసవి కాలేజీ మాదిరే జరిగితే వీటిలో చదివే 8 వేల మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయలేని పరిస్థితి ఏర్పడనుంది. అదే జరిగితే ఆ విద్యార్థులను ఏదో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించాల్సి వస్తుంది. దాంతో వారంతా ఎంసెట్లో నష్టపోయే ప్రమాదం ఉంది. ముందే చర్యలు చేపడితే సమస్యేంటి? అనుబంధ గుర్తింపు లేని కాలేజీలు ఏంటనేది బోర్డు అధికారులకు తెలుసు. అలాంటపుడు గుర్తింపు లేకపోయినా వాటికి లాగిన్ ఇవ్వడం కంటే.. ఆ విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి పరీక్షల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తే సమస్య ఉండదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
'కాలేజ్ పేరు చూసి మోసపోకండి'
సాక్షి, హైదరాబాద్ : కార్పొరేట్ కళాశాలల పేర్లు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. సోమవారం ఉదయం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కడియం మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా కాలేజీలకు గుర్తింపు ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 150 కార్పొరేట్ కాలేజీ హాస్టళ్లలో ప్రభుత్వం తనిఖీలు జరిపిందన్నారు. ఆ కళాశాలల్లో నెలకొన్న పరిస్థితులపై ఆ కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చామన్నారు. 2018 మార్చిలోగా ప్రైవేటు విద్యాసంస్థల అప్లికేషన్లు, గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2018-19 ఏడాదికి కళాశాలలు ప్రవేశాలు జరపవద్దని నోటీసులు ఇచ్చాం. ఇప్పటికే ప్రవేశాలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటువంటి కళాశాలలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో పరిస్థితులపై కమిటీ ఏర్పాటు చేశాం. నవంబర్లో కమిటీ నివేదిక ఇవ్వగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజులు నియంత్రిస్తామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. -
చదువులా ? చావులా ?
-
కాసులు కొట్టే కాలేజీలు
సాక్షి, అమరావతి: నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు నిబంధనలకు పాతరేస్తూ దశాబ్దాల తరబడి విద్యార్ధులను నిలువునా దోపిడీ చేస్తున్నాయి. ఎడ్యుకేషనల్ ట్రస్టుల మాటున ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. చదువును వ్యాపార వస్తువుగా మార్చి ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేస్తూ ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్తో విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. మరోపక్క ఎడ్యుకేషన్ ట్రస్టు మాటున సేవా కార్యక్రమమంటూ ఆదాయ పన్నుతో సహా ఇతర పన్నులు ఎగవేస్తున్నాయి. ఇదేదో బయటి నుంచి వినిపించే విమర్శలు కాదు. ఈ రెండు సంస్థల వ్యవహారాలపై విచారణ జరిపిన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్విభాగం తేల్చిన నిజాలు. అక్రమాలకు పాల్పడుతున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీల గుర్తింపును రద్దుచేయాలని కొద్దికాలం క్రితం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. గత ఏడాదికి సంబంధించి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని కాలేజీలను క్షుణ్నంగా తనిఖీలు చేసి ఈ నివేదిక అందించింది. ఈ రెండు సంస్థల కాలేజీలలో తనిఖీలు జరిపిన తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా రీజనల్ ఇన్స్పెక్షన్ నిర్వహించి నివేదిక తయారు చేసింది. విజిలెన్స్ తనిఖీ నివేదికలోని ముఖ్యాంశాలు... అడుగడుగునా అక్రమాలే... లాభాపేక్షలేని విద్యా సంస్థలుగా రిజిస్టరైన నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలు ట్యూషన్ ఫీజు, కోచింగ్ ఫీజు, హాస్టల్ ఫీజు... ఇలా లక్షల్లో దండుకుంటూ విద్యార్ధులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. చారిటబుల్ ట్రస్టులుగా పేర్కొంటున్నా ఈ రెండు సొసైటీల్లో ప్రెసిడెంట్లు, సభ్యులంతా ఆ రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. సొసైటీ బైలాల్లో పేద విద్యార్ధులకు ఫ్రీ కోచింగ్ తరగతులు, కమ్యూనిటీ డెవలప్మెంటు ప్రాజెక్టులు, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం, పేదలను ఆదుకొనేందుకు చేతి వృత్తుల కేంద్రాలు, బాల్వాడీ కేంద్రాలు, వయోజన విద్యాకేంద్రాల ఏర్పాటు అంటూ వల్లెవేసిన సంస్థలు ఇందులో ఏ ఒక్కటీ ఆచరించకపోగా విద్యను డబ్బులమయం చేశాయి. ⇒ ఈ రెండు సంస్థలు ఏటా ఫీజులు, ఇతరాల పేరిట రూ.వందల కోట్ల మేర వసూలు చేస్తున్నా ఇన్కమ్టాక్స్ రిటర్నులలో మాత్రం ఎలాంటి ఆదాయమూ లేనట్లుగా చూపుతున్నాయి. ఎడ్యుకేషనల్ సొసైటీ, కమిటీల పేరిట పన్నులు ఎగవేస్తున్నాయి. ⇒ శ్రీచైతన్య విద్యాసంస్థ 2010–11, 2011–12కు సంబంధించిన ఐటీ రిటర్నులు, ఆడిట్ రిపోర్టు కాపీలను విజిలెన్సుకు అందించింది. వాటిని పరిశీలించిన విజిలెన్సు అధికారులు నివ్వెరపోయారు. ఆడిట్ రిపోర్టులో 2010–11లో రూ.200 కోట్ల మేర టర్నోవర్ ఉన్నట్లు చూపి ఆదాయపు పన్ను రిటర్నులలో మాత్రం ఎలాంటి ఆదాయమూ లేదని చెబుతూ పన్నులను చెల్లించలేదు. పన్నుల ఎగవేత వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ⇒ విద్యా వ్యాపారంలో లాభాలకోసం కాలేజీలకు శాశ్వత అఫ్లియేషన్ కాకుండా తాత్కాలిక అఫ్లియేషన్లు తీసుకుంటున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులపై ఇంటర్ బోర్డు స్పష్టమైన నిబంధనలు విధించినా ఈ కాలేజీలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నాయి. ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజులుంటున్నాయి. లైబ్రరీ, లాబొరేటరీ లాంటి ఏర్పాట్లు మచ్చుకైనా లేకుండా ఇరుకైన గదుల్లో ప్రధాన రహదారుల పక్కన అపార్టుమెంట్లలో ఈ కాలేజీలను నెలకొల్పారు. ⇒ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజుల కింద పెంచిన ప్రకారం చూసినా రూ.3 వేల లోపే తీసుకోవాలి. కానీ ఈ కాలేజీలు రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు పిండుతున్నాయి. హాస్టల్, ఇతర కోచింగ్లంటూ అదనంగా మరో 2 లక్షలకు పైగా దండుకొంటున్నాయి. ⇒ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఈ రెండు కాలేజీలు విక్రయించిన దరఖాస్తుల సమాచారం, అడ్మిషన్లు పొందిన విద్యార్ధుల వివరాల రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదు. అడ్మిషన్లు పూర్తయ్యాక కంప్యూటర్ ద్వారా తీసిన కాపీలపై ఆర్ఐఓలతో సంతకాలు చేయించుకుంటున్నాయి. ⇒ ప్రైవేట్ కాలేజీల్లో కూడా అడ్మిషన్లను రిజర్వేషన్ల ప్రకారం చేపట్టాలి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, వికలాంగులకు 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం ఇవ్వాల్సి ఉన్నా ఈ సంస్థలు దీన్ని పాటించడం లేదు. ⇒ లాభదాయకంగా ఉండే ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండానే తప్పుడు కోడ్ నెంబర్లతో కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ⇒ ఒక భవనంలో కాలేజీకి అనుమతి పొంది వేరే చోటుకు మార్చేస్తున్నారు. కొన్ని కాలేజీలను తనిఖీ చేయగా అక్కడ రిజిస్టర్లో పేర్లున్న విద్యార్ధుల్లో కొందరు వేరేచోట చదువుతున్నట్లు గుర్తించారు. ⇒ ఎంపీసీ, బైపీసీ తరగతులు తప్పించి ఆర్ట్స్ తరగతులను ఈ కాలేజీలు నిర్వహించడం లేదు. అవి అంత లాభదాయకం కాకపోవటమే కారణం. కొన్ని చోట్ల ఆర్ట్స్ తరగతులకు అనుమతులు తీసుకొని వాటిని ఎంపీసీ, బైపీసీ సెక్షన్లుగా మార్పు చేస్తున్నాయి. ⇒ విద్యార్ధులకు ఎలాంటి వ్యాయామ విద్యను బోధించడం లేదు. అందుకు సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం లేదు. ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధం. ⇒ అద్దె భవనాల్లో కాలేజీలను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక అనుమతులు పొందుతున్నాయి. ఇది కేవలం అయిదేళ్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆలోపు అవి సొంత భవనాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా అద్దె భవనాల్లోనే దశాబ్దాల తరబడి కొనసాగుతున్నాయి. ఫీజులపై కమిటీ వేయాలి... కార్పొరేట్ కాలేజీలు ఫీజులు అడ్డగోలుగా వసూలు చేయకుండా నియంత్రించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మండల, పట్టణ, తదితరాల వారీగా అధ్యయనం చేసి ఫీజులను నిర్ణయించాలి. ఆయా సంస్థలకు వస్తున్న ఆదాయం, జీతాల చెల్లింపు, ఖర్చులను బేరీజు వేసి ఫీజులను నిర్ణయించాలి. విద్యాశాఖలో వియ్యంకుల వారి సంస్థ మాటే వేదవాక్కు నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల మూలాలు ఏపీలోనే ఉన్నాయి. ఈ రెండు సంస్థలు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పలు బ్రాంచీలు నెలకొల్పి ఫీజుల పేరిట రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ విద్యార్ధులను పీల్చిపిప్పిచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. విద్యార్ధుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నా ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోంది. నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఏకంగా తన కేబినెట్ సహచరుడిగా చేసుకోవడంతో నారాయణ విద్యాసంస్థ ఆగడాలపై అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ స్వయానా వియ్యంకులు కూడా కావడంతో విద్యాశాఖలో నారాయణ సంస్థలు చెప్పిందే వేదంగా మారిపోయింది. -
ఆ కాలేజీలు మూసేస్తాం: మంత్రి
సాక్షి, విశాఖ సిటీ: శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల్లో తాను ఇటీవల తనిఖీలు నిర్వహించానని, అక్కడ పిల్లలు పడుతున్న ఇబ్బందులు చాలా భయంకరంగా ఉన్నాయని మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కళాశాలల్లో ఉదయం 4.30 గంటలకు మొదలు అర్ధరాత్రి 11.00 గంటల వరకూ విద్యార్థులు ఉండటం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. స్టడీ అవర్స్ను నాలుగు గంటలు తగ్గించడంతోపాటు ఆదివారం ఒంటిపూట మాత్రమే క్లాసులు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇంటర్ బోర్డు నిబంధనలను ప్రతి కళాశాలలో తప్పనిసరిగా పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారని చెప్పారు. సరైన సౌకర్యాలు లేని హాస్టళ్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని, నెల రోజుల్లో విద్యార్థులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకపోతే వాటిని మూసివేస్తామని మంత్రి గంటా హెచ్చరించారు. -
ప్రైవేటు కాలేజీలే కాదు.. హాస్టళ్లలోనూ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు పక్కా కార్యాచరణను అమలు చేయనున్నట్లు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య వెల్లడించారు. ఇందుకు వెంటనే మార్గదర్శకాలను జారీ చేస్తామని తెలిపారు. ఇంటర్ బోర్డు జారీ చేసిన అకడమిక్ కేలండర్ను ప్రతి కాలేజీ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ప్రతినిధులు, తల్లిదండ్రుల సంఘాలతో ఆమె సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అకడమిక్ అంశాలే కాకుండా ఇతరత్రా విషయాలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని, వాటిపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తామని, తరచూ రాష్ట్రస్థాయి వర్క్షాపులు నిర్వహిస్తామని చెప్పారు. తమ అకడమిక్ షెడ్యూలును మరోసారి పరిశీలించి మార్పులు చేస్తామ ని యాజమాన్యాలు హామీ ఇచ్చాయని రంజీవ్ ఆచార్య తెలిపారు. ఉదయం 4 నుంచి 11 వరకు కాకుండా.. 6 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు ఉండేలా చర్యలు చేపతామని యాజమాన్యాలు చెప్పినట్లు వెల్లడించారు. సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు కచ్చితంగా 2 గంటలు సహ పాఠ్య కార్యక్రమాలకు వెచ్చించాలని, విద్యార్థులకు ఇష్టమున్న గేమ్స్ ఆడుకునేలా, యోగా, మెడిటేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు చెప్పారు. సైకాలజిస్టును కౌన్సెలర్గా నియమించాలని చెప్పామని, కౌన్సెలర్లు విద్యార్థుల వారీగా తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నాలుగైదు గంటలు కూడా నిద్ర పోవడం లేదు.. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు రోజుకు నాలుగైదు గంటలకు మించి నిద్రపోవడం లేదని గుర్తించినట్లు రంజీవ్ ఆచార్య చెప్పారు. మధ్య మధ్యలో కొద్దిసేపు బ్రేక్ తప్ప మిగతా సమయం అంతా చదువుకే కేటాయిస్తుండటంతో విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోందన్నారు. విద్యార్థులకు ఎథిక్స్కు సంబంధించిన పాఠాలు నేర్పించాలని, నిపుణులను పిలిపించి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందేలా తరగతులు నిర్వహించాలన్నారు. యాజమాన్యాలు నెలకోసారి తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రు లు ఇతర విద్యార్థులతో పోల్చి తక్కువ మార్కు లు వచ్చాయంటూ తమ పిల్లల మానసిక స్థైర్యా న్ని దెబ్బతీయవద్దని సూచించారు. మహిళా కాలేజీల్లో మహిళా లెక్చరర్లు, మహిళా కౌన్సెలర్లను నియమించాలని స్పష్టం చేశారు. హాస్టళ్లలో రూమ్లో నలుగురు విద్యార్థులకు మించి ఉంచడానికి వీల్లేదన్నారు. కార్పొరేట్ కాలేజీలు, హాస్టళ్లలో పరిస్థితులపై తనిఖీలు చేసేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతోనూ కమిటీ వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ, సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మొత్తంగా 15 అంశాలపై మార్గదర్శకాలను జారీ చేస్తామని, వాటిని ప్రతి కాలేజీ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. బోర్డు పరిధిలోకి హాస్టళ్లు! కాలేజీలతోపాటు హాస్టళ్లను అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. హాస్టళ్లలో వసతులు లేకపోవడం, తరగతిలో నిర్ణీత సంఖ్యకు మించి విద్యార్థులు ఉండటమూ ఒత్తిడికి కారణం అవుతోందని పేర్కొన్నారు. దీంతో హాస్టళ్లను బోర్డు పరిధిలోకి తెచ్చి, బోర్డు ఆధ్వర్యంలో వాటిలో తనిఖీలు జరిపి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ఇంటర్లో మార్కులు కాకుండా గ్రేడింగ్ విధానం తేవాలని తల్లి దండ్రులు సూచించారని, దాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పదో తరగతి తర్వాత పిల్లలను తమ కాలేజీల్లో చేర్పించే మార్కెటింగ్, పీఆర్వోల వ్యవస్థలు, ప్రకటనలను నియంత్రించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లోనూ ఎంసెట్, జేఈఈ వంటి శిక్షణ ఇస్తామన్నారు. తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించే అవకాశం ఉంటుందన్నారు. -
కార్పొరేట్ వేధింపులతోనే ఆత్మహత్యలు
కర్నూలు సిటీ: కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల వేధింపుల వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్ ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సోమవారం జిల్లా విభాగం అధ్యక్షుడు అనిల్కుమార్ ఆధ్వర్యంలో కర్నూలులోని పలు కార్పొరేట్ కాలేజీలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం విద్యార్థులకు తీవ్రమైన ఒత్తిళ్లు తెస్తున్నాయన్నారు. ఫలితంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదువుతున్న వారే ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ప్రేమ వ్యవహారాలే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమని మంత్రి గంటా వ్యాఖ్యానించడం దారుణమన్నారు. «బంద్లో ఆ విద్యార్థి సంఘం నాయకులు శాలీ, ఇమ్రాన్, చైతన్య, అమర్, మహేష్, సుధీర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ, శ్రీచైతన్యను సీజ్ చేయాలి కర్నూలు సిటీ: విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న నారాయణ, శ్రీచైతన్య జూనియర్ కాలేజీలను సీజ్ చేయాలని పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు కె.భాస్కర్, కె.ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కర్నూలు కొత్త బస్టాండ్ ఎదుట ఆ విద్యాసంస్థల యాజమాన్యాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఆత్మహత్యలపై వేసిన కమిటీ ఇంత వరకు యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు శ్రీదేవి, శశి, ప్రసన్నకుమార్, ఇమామ్, బడెసాహెబ్, ఆనంద్, దావీద్, తదితరులు పాల్గొన్నారు. సీబీఐతో విచారణ చేయించాలి కర్నూలు(న్యూసిటీ): నారాయణ విద్యాçసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సీబీఐతో విచారణ చేయించాలని ఏబీవీపీ , ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట కార్పొరేట్ యాజమాన్యాల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి సంఘాల నాయకులు మహేంద్ర, ప్రతాప్ మాట్లాడుతూ... నారాయణ విద్యాసంస్థలో ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు కారణమైన మంత్రి నారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏబీవీపీ కర్నూలు రూరల్ భాగ్ కన్వీనర్ కార్యదర్శి జయసింహ, నగర కార్యదర్శి హర్ష, రాజు, సుధాకర్, బాబ్జీ, హరి, ఏఐఎస్ఎఫ్ నగర నాయకులు ఈశ్వర్, మనోజ్, రమేష్, షేక్షావలి, సాయితేజ, అబ్దుల్లా, కుమార్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
అక్షరాలా హత్యలే!
పొట్టలోంచి అక్షరాలను తీసుకుని.. తాడుగా పేని.. ఆ కొసను ఫ్యానుకు, ఈ కొసను గొంతుకు బిగించి పుస్తకాలను ఒక్క తన్ను తన్నేస్తే.. అది సూయిసైడ్ ఎలా అవుతుంది?! అక్షరాలు చేసిన హత్య అవుతుంది. అక్షరాలా... హత్య అవుతుంది! ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే పాటను వినే ఉంటారు. ‘నేను పోను అమ్మా.. కార్పోరేట్ కాలేజీలకు’ అని ఇప్పుడు పాడుతున్న పిల్లల గోడు ఎవరు వినాలి? ప్రభుత్వాల్లో ఉన్న మంత్రులే చదువు మాఫియాను నడుపుతుంటే... ఈ ‘హత్య’లను ఎవరు ఆపాలి?! ఛీ.. ఈ ఉసురు ఊరికే పోదు. పాపమై చుట్టుకుంటుంది. అమ్మానాన్నలను తప్పెక్కడుందో ఆలోచించమంటుంది. ఒక చిలుక ఉండేది. చక్కగా పాడేది. స్వేచ్ఛగా ఎగిరేది. కానీ చదవలేకపోయేది. అది రాజుగారి తోటలోని చిలుక. ఓ రోజు అది ఆయన కంట్లో పడింది. వెంటనే మంత్రిని పిలిచి ‘ఎడ్యుకేట్ ఇట్’ అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజుగారి మేనల్లు మీద ఉంచాడు మంత్రి. ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చెయ్యడం? విద్యావేత్తలు కూర్చొని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే.. మొదట అది కుదురుగా ఉండాలి. అంటే.. ఎగరకూడదు. వెంటనే ఒక మంచి పంజరం చేయించారు. చిలకను అందులో కూర్చోబెట్టారు. కోచింగ్ ఇవ్వడానికి ఒక పండితుడు వచ్చాడు. చిలకను చూశాడు. ‘ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు’ అన్నాడు. గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయ్ గంటల కొద్దీ చదువు మొదలైంది. పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లెవ్వరూ ‘అబ్బ.. భలే చిలక’ అనడం లేదు. ‘అబ్బ ఏం పంజరం!’ అంటున్నారు. లేదంటే.. ‘అబ్బ.. ఎంత చదువు!’ అంటున్నారు. రాజుగారిని మెచ్చుకుంటున్నారు. మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు. రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారు చేసిన ఆస్థాన కంసాలీని, చదువు చెప్పడానికి వచ్చిన పండితుడిని ‘ఆహా.. ఓహో’ అని కీర్తిస్తున్నారు. రాజుగారు మంత్రిగారికి మళ్లీ ఒకసారి చెప్పారు.. ఎన్ని లక్షల వరహాలు ఖర్చయినా పర్వాలేదు. చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్ కూడా రావాలని. ‘అలాగే’ అని లక్షల వరహాలు దఫాలు దఫాలుగా కోశాగారం అకౌంట్లోంచి తెప్పించాడు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి. ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతోందో చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. ‘చిలకను చూడ్డానికి రాజుగారో వస్తున్నారహో’ అని తప్పెట్లు, తాళాలు, పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు. రాజపరివారం అంతా రాజు కన్నా ముందే చిలక దగ్గరికి చేరుకుంది. అయితే పంజరంలోని చిలకను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరూ దాని వైపే చూడడం లేదు. పండితుడు ఒక్కడే చూస్తున్నాడు. ఆయనైనా చిలక సరిగ్గా చదువుతోందా లేదా అని చూస్తున్నాడు తప్ప, చిలకెలా ఉందో చూడ్డం లేదు. చిలక బాగా నీరసించి పోయింది. మానసికంగా బాగా నలిగిపోయి ఉంది. ఆ రోజైతే.. రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది! ఆ సంగతి ఎవరికీ తెలియదు. తెలిసినవాళ్లు ఎవరికీ చెప్పలేదు. ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు. రాజుగారు మళ్లీ మేనల్లుడిని పిలిచి, ‘చిలక ఎలా చదువుతోంది?’ అని అడిగాడు. ‘చిలక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి’ అన్నాడు మేనల్లుడు. రాజుగారు సంతోషించారు. తన కృషి ఫలించిందన్నమాట. ‘ఇప్పటికీ అల్లరి చిల్లరిగానే ఎగురుతోందా?’ ‘ఎగరదు’ ‘ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా?’ ‘పాడదు’ ‘సరే, ఒకసారి చిలకను నా దగ్గరికి తీసుకురా’ తీసుకొచ్చాడు మేనల్లుడు. చిలక నోరు తెరవడం లేదు. ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదు. చిలక కడుపు ఉబ్బెత్తుగా ఉంది. చిలక అసలు కదలనే కదలడం లేదు. ‘‘ఆ కడుపులోనిది ఏమిటీ!’ అని అడిగాడు రాజుగారు. ‘జ్ఞానం మామయ్యా’ అని చెప్పాడు మేనల్లుడు.‘చిలక చనిపోయినట్లు ఉంది కదా’ అన్నారు రాజుగారు. చిలక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు. నూరేళ్ల క్రితం విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ రాసిన చిలక కథ ఇది. కథ పేరు ‘చిలక చచ్చిపోయింది’. ఇప్పుడు ఇంకో చిలక కథ. ఈ కథ పేరు ‘చిలక పారిపోయింది’. పారిపోయిన చిలక పేరు సాయి ప్రజ్వల. ఆ చిలకను ఉంచిన పంజరం పేరు..‘నారాయణ కాలేజ్’. పంజరంలోంచి ఎగిరి పోతూ పోతూ ప్రజ్వల ఒక లేఖ కూడా రాసింది. ‘... సారీ మమ్మీ.. సారీ డాడీ.. ఐ మిస్ యు సో మచ్. నా కోసం వెతకొద్దు ప్లీజ్. నారాయణ కాలేజ్ కిల్లింగ్ ద స్టూడెంట్. సో ప్లీజ్ హెల్ప్ ద స్టూడెంట్స్. దే ఆర్ సఫరింగ్ ఇన్ దిస్ కాలేజ్..’ సాయి ప్రజ్వల అమ్మానాన్నల గురించే కాదు, మిగతా అమ్మాయిల గురించి కూడా ఆలోచించింది. అమ్మానాన్నలే పిల్లల గురించి ఆలోచించడం లేదు. ఆలోచించి ఉంటే.. ఈ మూడేళ్లలో ఇప్పటివరకు 60 మంది కార్పోరేట్ కాలేజీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ఉండేవారా? ఎక్కడైతే భయం ఉండదో.. అక్కడ చైతన్యం వెల్లివిరుస్తుందన్నాడు విశ్వకవి టాగోర్. అందుకే ఆయన శాంతినికేతన్ పెట్టి చదువు చెప్పారు. కార్పోరేట్ కాలేజీలు ఇందుకు రివర్స్లో ఉన్నాయి. చైతన్యం వెల్లివిరియడం కోసం విద్యార్థులను భయపెట్టి మరీ చదివిస్తున్నాయి. సరస్వతీదేవిని వాళ్ల అమ్మానాన్న భూమ్మీదికి తీసుకొచ్చి వీళ్లకు అప్పగించి వెళ్లలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఉంటే అమెకూ.. ‘సరస్వతీ నమస్తుభ్యం’ స్తోత్రంతో కాకుండా.. ఫిజిక్సు, మేథ్స్, కెమిస్ట్రీలతో మేల్కొలుపు పాడేవారు. మేల్కొలుపా?! అసలు ఆమెను నిద్రపోనిచ్చేవారే కాదేమో! ‘నువ్వు నిద్రపోతే, పిల్లలకూ నిద్రవచ్చేస్తుంది కూర్చో’ అని ఏ లెక్చరర్ కమ్ వార్డెనో కర్ర పట్టుకుని ఆమె ఎదురుగా నిలుచునేవాడేమో! సాయి ప్రజ్వల కరీంనగర్ జిల్లా అమ్మాయి. హైదరాబాద్లోని బండ్ల గూడ నారాయణ కాలేజ్లో బైపీసీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. కాలేజి స్ట్రెస్ను తట్టుకోలేకపోతున్నానని కొద్ది రోజుల క్రితమే తల్లిదండ్రులకు ఉత్తరం కూడా రాసింది. ఈ విషయం ఆదివారం బయటికి వచ్చింది. ఈ మధ్య ఇలాగే కడప నారాయణ కాలేజీలో పావన అనే విద్యార్థిని స్ట్రెస్తో ఆత్మహత్య చేసుకుంది. గత పదిరోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 మంది కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. స్టడీతో స్ట్రెస్, స్టడీ అవర్స్తో స్ట్రెస్. కాలకృత్యాలు కూడా తీర్చుకునే టైమ్ దొరక్క స్ట్రెస్. ఇవే కాదు.. ఫుడ్డు బాగుండదు, ఉండే గదులు బాగుండవు. వారానికో, నెలకో వచ్చే అమ్మానాన్నలతో నింపాదిగా మాట్లాడే వీలుండదు. మరెందుకు పిల్లల్ని చేర్పిస్తున్నారు? మంచి భవిష్యత్తు కోసం. ‘మంచి భవిష్యత్తు కోసం అయితే ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా?’ అన్నది కాలేజీ యాజమాన్యాల వాదన. ‘నిజానికి బాగా చదవమని మేము పెట్టే స్ట్రెస్ కన్నా, చదివించడానికి మేము పడే స్ట్రెస్సే ఎక్కువ’ అనే కాలేజీలూ ఉన్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా.. చదువు కన్నా ప్రాణం ముఖ్యమైనది. కేవలం చదువుల ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారంటే మన చదువుల విధానాలు ఎంత క్రూరంగా ఉన్నాయో ప్రతి తల్లీతండ్రీ ఆలోచించాలి. ఇటీవలి కాలంలోనే నారాయణ, చైతన్య, ఎన్.ఆర్.ఐ. ఇంకా ఇతర కార్పోరేట్ కళాశాలల్లో 45 మందికిపైగా విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పిల్లల తల్లిదండ్రుల వేదన.. శోక సముద్రపు ఉప్పెన. లక్షలు ఖర్చుపెట్టి కార్పోరేట్ కాలేజీలలో చేర్పించేది పిల్లల కోసమే కావచ్చు. పిల్లలకు ఇష్టం లేకుండా చేర్పించి, ఆ ఒత్తిడిని భరించలేక వారు ఆత్మహత్య చేసుకుంటే లక్షలు కాదు, ఎన్ని కోట్లు పోసినా వారిని తెచ్చుకోలేం. డియర్ పేరెంట్స్.. ‘అమ్మా నేను వచ్చేస్తా’ అని ఫోన్ చేస్తే, ‘నాన్నా నన్ను తీసుకెళ్లు’ అని ఉత్తరం రాస్తే ‘కష్టపడరా బంగారం’ అనకండి. వారికి కష్టమేంటో అడిగి తెలుసుకోండి. అప్పుడు మీకు కడుపుకోత ఉండదు. మన చిలకలు పారిపోవు. మన చిలకలు చచ్చిపోవు. తల్లిదండ్రులూ... ఇవి గుర్తుంచుకోండి... పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. వారు ఓపెన్ అయి మాట్లాడేందుకు ఆస్కారమివ్వాలి. పిల్లల వైపు వాదననూ, వారు చెప్పేది వినే ఓపిక కలిగి ఉండాలి. ఈ మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదనే ఆలోచనను వారిలో ఎప్పుడూ కలిగిస్తూ ఉండాలి. వారిని మార్కులు, ర్యాంకుల దిశగా పరిగెత్తించకూడదు. ఇష్టపడి చదివేలా చేయాలి. హార్డ్వర్క్ కూడా ఇష్టంగా చేసేలా వారిని ప్రోత్సహించాలి. అలా స్ఫూర్తినింపాలి తప్ప... హార్డ్వర్క్ చేయాలంటూ ఒత్తిడి చేయకూడదు. వారి అపజయాలకు ఎప్పుడూ వారిని అవమానించకూడదు. చిన్నబుచ్చకూడదు. ఈసారి కాకపోతే మరోసారి ఉత్తీర్ణత సాధించగలమనే భరోసా నింపాలి. హాయిగా ఆడుకోవడానికి, వినోదం పొందడానికి అవకాశం ఇవ్వాలి. చదువుకోవాలంటూ లేకపోతే జీవితంలో వెనకబడిపోతారంటూ బెదిరించడం, మీరు చదవకపోతే మేము చచ్చిపోతామంటూ తల్లిదండ్రులు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం వంటి ధోరణులు సరికాదు. పిల్లలు తల్లిదండ్రులతో ఏదైనా చెప్పబోతుంటే, వారు చెప్పే అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేగానీ... తాము చెప్పేదానికంటే, తమ లెక్చరర్లు చెప్పేదానికే తమ తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తున్నారనే ఆలోచనను పిల్లల్లో కలిగించేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండకూడదు. ►జీవితం ఎంతో విలువైనదనీ, ఈ మార్కులు, ర్యాంకులూ జీవితం ముందు చాలా చిన్నవనే ఆలోచన పిల్లల్లో నింపేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. ►తమ పిల్లల చదువుకంటే తమ పిల్లల నిండు జీవితమే చాలా ప్రధానమని తమ తల్లిదండ్రులు భావిస్తున్నారనే ఆలోచనను తమ పిల్లలకు కలిగేలా తల్లిదండ్రుల మాటలు, చేష్టలు ఉండాలి. ►జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయనీ, ఎప్పుడూ ఉంటాయని... వాటిలోని దేనిలోనైనా ఉన్నత స్థానం అధిరోహిస్తే చాలనీ, ఒక స్థాయి తర్వాత అన్నీ రంగాల్లోని ఉన్నత స్థానం ఒకేలా ఉంటుందనే తల్లిదండ్రులు పిల్లలకు చెబుతూ ఉండాలి. ఇక అవకాశాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి పరంపరగా వస్తుంటాయనీ, ఫలానా అవకాశం మాత్రమే గొప్పదనే ఆలోచన సరికాదని కూడా తల్లిదండ్రులే పిల్లలకు చెబుతూ ఉండాలి. ►పిల్లలను ఎప్పుడూ మరొకరితో పోల్చనే కూడదు. ఏ పిల్లవాడికి ఆ పిల్లవాడే ప్రత్యేకం. ►చదువుతోపాటు పిల్లలు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండటానికి కావాల్సినవీ చేయాలి. అలా ఉండే పిల్లలే మొదటిర్యాంకునైనా... ఇంకదేన్నైనా సాధించగలరు. ఈ విషయాన్ని అటు కాలేజీల యాజమాన్యాలు, ఇటు పిల్లల తల్లిదండ్రులు గుర్తించాలి. – డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నస్టిక్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ నూజివీడులో ట్రిపుల్ ఐటీలో ఇటీవల మృతిచెందిన సాగిరెడ్డి పూర్ణ లక్ష్మీ నర సింహమూర్తి(16) తల్లి సత్యవతి, బం«ధువు (రాజోలు, తూర్పు గోదావరి జిల్లా) విజయవాడ శ్రీచైతన్యలో ఈ నెల 12న మృతిచెందిన అరమాటి భార్గవ రెడ్డి తల్లిదండ్రులు నారాయణ రెడ్డి, మల్లమ్మ, చిన్న కుమారుడు భానుప్రసాద్ రెడ్డి (రాయచోటి, వైఎస్ఆర్ జిల్లా) నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని డబ్బాడ రమాదేవి తల్లిదండ్రులు వరలక్ష్మి, అప్పలనాయుడు (రేగిడి, శ్రీకాకుళం జిల్లా) -
కార్పొరేట్ చావులు !
-
విద్యను వ్యాపారంగా మార్చేశాయి
కార్పొరేట్ కళాశాలలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్య సాక్షి, గుంటూరు: కార్పొరేట్ కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయని, ఫలితంగా మట్టిలో మాణిక్యాల్లాంటి ఎందరో పేద విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారని, ఇది దురదృష్టకర పరిణామమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్లో డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.మాతృభాషను, గ్రామీణ క్రీడలను, సంప్రదాయాలను విస్మరించకూడదని హితవు పలికారు. గతంతో పోలిస్తే ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు పెరిగాయని, అదే సమయంలో దురదృష్టవశాత్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని చెప్పారు. వారు పాఠశాలలకు సమయం కేటాయించకుండా ఇతర పనుల్లో ఉండటమే కారణమన్నారు. -
కార్పొరేట్ హవా!
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సర వార్షిక ఫలితాలలో జిల్లాకు చెందిన వివిధ కార్పొరేట్ కళాశాలలు ఎప్పటిమాదిరిగానే తమ హవా కొనసాగించాయి. నారాయణ కళాశాలలో ఎంపీసీ గ్రూప్లో చదివిన వారణాసి రోష్ని అత్యధిక మార్కులు (992/1000) సాధించి రాష్ట్రస్థాయిలోనే ప్రధమ స్థానా న్ని కైవసం చేసుకుంది. శ్రీచైతన్య కళాశాలకు చెందిన భలబద్రుని శివప్రగతి 990/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలలో టాప్టెన్లో నిలిచింది. ప్రధమ ఇంటర్ ఎంపీసీలో బెజవాడ దుర్గాప్రసాద్(నారాయణ) 465/470, కలగర్ల హారిక(నారాయణ) 464/470, ఆల్తి యశ్వంతకుమార్(శ్రీచైతన్య) 464/470, దాసరి హర్షిత (శ్రీచైతన్య) 464/470 మార్కులు తెచ్చుకొని రాష్ట్రస్థాయిలో టాప్ టెన్లో నిలిచారు. అదేవిధంగా శ్రీచైతన్య కళాశాల బైబీసీ గ్రూప్ చదివిన ఎం.కీర్తిలక్షిసాయిచంద్రిక జిల్లాస్థాయిలో అత్యధికమార్కులు 986/1000 మార్కులు తెచ్చుకుంది. ప్రధమ ఇంటర్ ఎంపీసీలో పార్వతీపురం భాస్కర జూనియర్ కళాశాల విద్యార్ధిని పి.వి.డి.ఎస్.సత్యవాణి ఆత్యధిక మార్కుల(466/470)తో రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచింది. బైపీసీలో పి.సారాసృజన(శ్రీచైతన్య) 434/440మార్కులతో జిల్లాలో ప్రధమస్థానంలో నిలిచిం ది. నారాయణ, శ్రీచైతన్య కళాశాలలో కలిపి సెకెంట్ ఇంటర్ ఎంపీసీలో 989 మార్కులతో ఇద్దరు, 980 మార్కులకు పైపడి 41 మంది, బైపీసీలో 985 మార్కులతో ఒకరు, 980 పై మార్కులతో 6 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. -
'ఆ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి'
కార్పొరేటర్ కళాశాలలు ఇంటర్బోర్డు నిబంధనలను తుంగలో తోక్కుతూ వేసవి తరగతులను నిర్వహిస్తున్నాయని తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లింగస్వామి అన్నారు. ఎల్బీనగర్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ... కార్పొరేట్ కళాశాలలు ఎంసెట్ పేరుతో వేసవి తరగతును నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. నిబంధనలు పాటించని కళాశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘కార్పొరేట్’ వల
ఇంటర్లో ప్రవేశాలకు కసరత్తు పీఆర్వోల హల్చల్.. తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. ఆదిలాబాద్ టౌన్ : పదో తరగతి పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు.. ఫలితాలు కూడా వెలువడలేదు. కానీ.. ఇప్పటికే జిల్లాలో కార్పొరేట్ కళాశాల ప్రచారం జోరుగా సాగుతోంది. పదో తరగతి విద్యార్థుల వివరాలను సైతం సేకరించారు. విద్యార్థుల ఇంటికి రాజకీయ నాయకులుచేసే ప్రచారం తలదన్నేలా ఉంది. ఫోన్ చేయడం.. ఎస్సెమ్మెస్లు ఇంటికి వచ్చి కళాశాలల గురించి వివరించి కళాశాలల్లో చేర్పించుకునేందుకు వల పన్నుతున్నారు. పిల్లలను తమ కళాశాలల్లో చేర్పించేందుకు ఆయా మండలాలో పీఆర్వోలను నియమించుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నజరానాలు ప్రకటిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలే టార్గెట్... జిల్లాలో 40 వేల వరకు పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లిలలో ప్రైవేటు కళాశాలల్లో డేస్కాలర్స్కు రూ.10 వేల నుంచి 12 వేల ఫీజు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్, చుట్టు పక్కల జిల్లాల్లో ఏడాదికి 60 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు ఉన్నాయి. అయితే.. తమ కళాశాలల్లో చేరితే ఫీజుల్లో రాయితీ ఇస్తామంటూ విద్యార్థులకు వల వేస్తున్నారు. 9 గ్రేడింగ్ పైన వచ్చిన వారికి డిస్కౌంట్ ఇస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. కాగా.. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రైవేటు పాఠశాలలనే టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతున్నాయి. దీనికి ప్రిన్సిపాళ్లను మచ్చిక చేసుకొని విద్యార్థుల పేర్లు, వారి అడ్రస్లు సేకరించి తల్లిదండ్రులకు కళాశాలలకు సంబంధించిన సమాచారాన్ని మేసేజ్ ద్వారా, పోస్టు ద్వారా పంపిస్తున్నారు. పిల్లలను చేర్చుకునేందుకు మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. పీఆర్వోలకు ఆఫర్లు.. కార్పొరేట్ కళాశాలలు మండలాల వారీగా పీఆర్వోలను నియమించాయి. హైదరాబాద్ వంటి నగరాలకు చెందిన వారితోపా టు స్థానికంగా ఉండే ప్రైవేటు పాఠశాలల టీచర్లు, కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎల్ఐసీ ఏజెంట్లకు కమీషన్లు అంది స్తూ విద్యార్థులను చేర్చడానికి పావులు కదుపుతున్నాయి. ఒక్క విద్యార్థిని చేర్పిస్తే రూ.3,500 నుంచి రూ.7 వేల వరకు అందిస్తున్నాయి. టార్గెట్ పూర్తి చేసిన వారికి టూర్స్, వారి దగ్గరి బంధువుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఆఫర్లు ఇస్తున్నాయి. స్థానిక కళాశాలలదీ అదేతీరు.. ప్రైవేటు కళాశాలలు ఆదిలాబాద్ పట్టణంతోపాటు ఆయా మండలాల్లోని విద్యార్థులకు వల వేస్తున్నాయి. కళాశాలలో బోధించిన లెక్చరర్లకు టార్గెట్ విధిస్తున్నారు. 9.5 గ్రేడింగ్ నుంచి 9.9 గ్రేడింగ్ వచ్చిన విద్యార్థులకు ఫ్రీ సీట్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి ఫీజు రాయితీ, స్కాలర్ షిప్ వచ్చే విద్యార్థులకు కేవలం రూ.500తో తమ కళాశాలల్లో అడ్మిషన్ కల్పిస్తామని అంటున్నారు. గతేడాది కూడా ఇదే విధంగా చేర్పించుకొని పరీక్షల సమయంలో విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు పదో తరగతి ఫలితాలు రాక ముందు అడ్మిషన్లు తీసుకొవద్దు. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేయిస్తాం. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వ కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అనుభవజ్ఞులైన లెక్చర ర్లు విద్యాబోధన చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో వేల ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరితే మంచి విద్యతోపాటు ఉచితంగా చదుకునే అవకాశం ఉంది. - ప్రభాకర్, ఆర్ఐవో ఆదిలాబాద్ -
విద్యార్థులపై కార్పొరేట్ వల
అప్పుడే మొదలైన ఇంటర్ ప్రవేశాలు రంగంలోకి దిగిన పీఆర్వోలు ఫోన్లలో ‘బుక్’ చేసుకుంటున్న వైనం ‘పది’ పరీక్షలు కాకముందే హడావుడి అడ్డగోలు దోపిడీకి రంగంనిబంధనలకు పాతర పట్టించుకోని అధికారులు ‘‘హలో.. నమస్తే సార్.. మల్లేశం గారా.. మీ అబ్బారుు పదో తరగతే కదా.. ఇంటర్ ఏ కాలేజీలో చదివిద్దామనుకుంటున్నారు. మాకు తెలిసిన మంచి కాలేజీ ఉంది.. అందులో చేర్పించండి. ఫీజులో 30 నుంచి 50 శాతం వరకు రారుుతీ ఇప్పిస్తా. అదనపు చార్జీలేమీ ఉండవు’’ కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు విద్యార్థుల తల్లిదండ్రులను వలలో వేసుకుంటున్న తీరిది. కరీంనగర్ ఎడ్యుకేషన్ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ఐదు నెలల ముందే కార్పొరేట్ కళాశాలలు ఇంటర్లో ప్రవేశాలకు తెరలేపాయి. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ముందుగానే ‘బుక్’ చేసుకుంటున్నారుు. కార్పొరేట్ కళాశాలలు జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ పీఆర్వోలను నియమించుకుని ప్రవేశాలు పెంచుకుంటున్నారుు. వీరి ద్వారా పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారుు. ఫిబ్రవరి 25లోపు ప్రవేశాలకు మాత్రమే ఫీజులో రాయితీ ఉంటుందని నమ్మబలుకుతూ కనీసం 60 శాతం ఫీజును ముందే తీసేసుకుంటున్నారుు. భారీగా ఫీజుల దోపిడీ ఎంపీసీ ట్రిపుల్ఈ పేరుతో ఏడాదికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నారుు. ఇదే గ్రూప్ విద్యార్థులు ఎయిర్కండీషన్డ్ క్యాంపస్లో చదువుకోదలిస్తే రూ.1.25 లక్షల వరకు ఖర్చవుతుంది. సీఈసీ, ఎంఈసీ,హెచ్ఈసీ గ్రూప్ల్లో సివిల్స్ ఫౌండేషన్ పేరుతో కొత్త కోర్సును పరిచయం చేస్తూ రూ.1.65 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారుు. సీఈసీ, ఎంఈసీ గ్రూప్తో సీఏ, సీపీటీ పేర్లు జోడించి రూ.2.25 లక్షలు డిమాండ్ చేస్తున్నారుు. నిబంధనలకు పాతర పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక జూన్ లో ఇంటర్ ప్రవేశాలు తీసుకోవాలి. ఇందుకు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పీఆర్వోల ద్వారా నియామకాలు చేసుకోకూడదు. పదో తరగతి పరీక్షల ప్రారంభానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. అయినా నిబంధనలను తుంగలో తొక్కి కార్పొరేట్ సంస్థలు అడ్డగోలు ప్రచారానికి తెరలేపుతున్నాయి. తిరిగొస్తే డబ్బులు గోవిందా కార్పొరేట్ కళాశాలల్లో నిర్ణీత మొత్తాన్ని చెల్లించి ముందస్తు ప్రవేశాలు తీసుకున్న విద్యార్థుల్లో కనీసం 30 శాతం మంది విద్యార్థులు అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. పరిసరాలకు అలవాటు పడక అనారోగ్యం పాలవడంతో చాలా మంది ఇంటికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో కళాశాల మానేసినఫీజు తిరిగి ఇవ్వడం లేదు. పాఠశాలల నిర్వాహకులకు తాయిలాలు విద్యార్థులు చదువుతున్న పాఠశాల నిర్వాహకులకు భారీ తాయిలాలు ముట్టజెప్పేలా ముంద స్తు ఒప్పందాలు చేసుకుంటున్నారుు. వందకు పైగా పదో తరగతి విద్యార్థులు చదువుకుంటు న్న పాఠశాలల నిర్వాహకులకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ముడుపులు, లేదా ఆ స్థా యి బహుమతులు అందజేస్తూ.. ఆయూ పాఠశాలల్లోని పిల్లలను తమ కళాశాలలో చేర్పించేలా చూస్తున్నారుు. పీఆర్వోలే కీలకం జిల్లా కేంద్రం, అన్ని డివిజన్ కేంద్రాలతోపాటు జమ్మికుంట, కోరుట్ల, మెట్పల్లి, గోదావరిఖ ని, వేములవాడ తదితర ప్రాంతాల్లో పీఆర్వోలను నియమించుకున్నట్లు సమాచారం. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులను తమ పీఆర్వోలుగా నియమించుకుంటున్నారు. వీరి కి నెలకు రూ.8 వేల వరకు ఏడాది పొడవునా జీతం రూపంలో చెల్లిస్తున్నారు. పార్ట్టైమ్ పీఆర్వోలకు ఒక్కో విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు చెల్లిస్తే 10 శాతం వరకు గిట్టుబాటు అవుతోంది. ఈ తాయిలాలకు ఆకర్షితులైన చాలా మంది పీఆర్వోలుగా చేరి వివిధ ప్రాంతాల్లో రోజుకు మంద మందిని కార్పొరేట్ కళాశాలలకు పంపుతున్నారు. -
వేధింపులతోనే విద్యార్థుల ఆత్మహత్య
కార్పొరేట్ కళాశాలల బంద్ విజయవంతం నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలి వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఏబీవీపీ డిమాండ్ తిరుచానూరు/తిరుపతి క్రైం : కార్పొరేట్ కళాశాలలు పేరుకోసం విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేయడంతోనే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జే. విశ్వనాథ్ అన్నారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలో చేపట్టిన కార్పొరేట్ జూనియర్ కళాశాలల బంద్ విజయవంతమైంది. విద్యార్థి సం ఘాల నాయకులు జిల్లాలోని కార్పొరేట్ జూనియర్ కళాశాలలను మూ యించి వేశారు. కొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించాయి. విద్యార్థి విభాగం నాయకులు తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద మానవహారం చేపట్టారు. ఉప్పరపల్లి నారాయణ కళాశాల వద్ద మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. హరిప్రసాద్రెడ్డి, జే.విశ్వనాథ్ మాట్లాడుతూ చదువు పేరుతో విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. కార్పొరేట్ కళాశాలలకు తలొగ్గిన ప్రభుత్వం వారి అరాచకాలకు అడ్డుకట్ట వేయడం లేదని దుయ్యబట్టారు. విద్యార్థుల ఆత్మహత్మకు కారకుడైన మంత్రి నారాయణపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న మనీష, నందిని కుటుం బాలకు రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ఆ కుటుం బాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైఎస్సార్ విద్యార్థి నాయకులు కిషోర్, హేమంత్కుమార్రెడ్డి, మౌలాలి, ఏఐఎస్ఎఫ్ నాయకులు నరేష్, శివారెడ్డి, చాముతి, దాము, చలపతి పాల్గొన్నారు. 13మందిపై కేసు నమోదు.. బంద్లో భాగంగా కాలేజీలపై దాడులకు పాల్పడిన 13మంది విద్యార్థి సంఘ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎంఆర్పల్లి ఎస్ఐ ఆదినారాయణ తెలిపారు. వీరు తిరుపతి ఎమ్మార్ పల్లి పరిధిలోని నారాయణ మెడికల్ జూని యర్ కళాశాలలో అద్దాలు పగులగొట్టారని, కుర్చీలు విరగ్గొట్టారని, కళాశాల ఇన్చార్జ్ ఫిర్యాదు మేరకు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. -
అధిక ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోరా?
హైదరాబాద్ : కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. అధిక ఫీజులను నియంత్రించాల్సిన ఏఎఫ్ఆర్సీ బాధ్యతలను విస్మరించిందని ఆయన శనివారమిక్కడ అన్నారు. ప్రభుత్వ పెద్దలే కొందరు కార్పొరేట్ వ్యక్తులతో కుమ్మక్కయారనే అనుమానాలు ఉన్నాయని పొంగులేటి వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రంలోని ఇంజినీరింగ్, మెడికల్ వంటి వృత్తి విద్యా కాలేజీలలో ప్రవేశాలు, ఫీజులను నియంత్రించే అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) ఏర్పాటుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
నో హాలిడే..!
ఆదివారమూ క్లాసులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలు సాక్షి ప్రతినిధి, కర్నూలు : కార్పొరేట్ కాలేజీల్లో సెలవు రోజు ఆదివారం కూడా మళ్లీ క్లాసులు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేయడంతో గత నెలలో బందైపోయిన ఆదివారం క్లాసులు.. మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న ఈ క్లాసులు.. రాత్రి ఏడున్నర వరకూ ఉంటున్నాయి. ఒకవైపు తరగతులు నడుస్తున్నప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. వారంలో అన్ని రోజులూ తరగతులు నడుస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న ఈ సమయంలో విద్యార్థులు అదనపు ఒత్తిడికి గురవుతూ చదివిన చదువు కాస్తా మరచిపోయే దుస్థితి ఏర్పడుతోంది. ఇష్టారాజ్యంగా నిర్వహణ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యాబోధనలో ప్రభుత్వం జారీచేసిన అకడమిక్ కేలండర్ను ప్రైవేటు కాలేజీలేవీ పాటించడం లేదు. తరగతుల నిర్వహణతో పాటు సిలబస్ బోధనలోనూ వారిదే ఇష్టారాజ్యం. జనవరి, ఫిబ్రవరిలో పూర్తికావాల్సిన సిలబస్ను ఆగస్టు, సెప్టెంబరులోనే పూర్తి చేస్తున్నారు. అప్పటి నుంచి పరీక్షల సమయం వరకూ రెండు, మూడుసార్లు బట్టీ పట్టిస్తున్నారు. సిలబస్ పూర్తైప్పటికీ ఇప్పుడ కూడా ఆదివారాలు తరగతుల నిర్వహణ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం విద్యార్థి సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గిన కార్పొరేట్ కాలేజీలు.. కుక్క తోక వంకర అన్నట్టుగా మళ్లీ తమ విధానాన్నే అనుసరించడం మొదలు పెట్టాయి. మరోవైపు ఈ ఒత్తిడికి తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘కార్పొరేట్ కాలేజీల తీరు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యార్థులు ఒత్తిడికి తట్టుకోలేక రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా వెన్ను నొప్పి, చేతులు, కాళ్లు లాగడం వంటి నరాల వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘నా వద్దకు ప్రతీ రోజూ ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు చూయించుకునేందుకు వస్తున్నారు. వీరంతా కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులే’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక న్యూరో ఫిజీషియన్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ తరహా విద్యాబోధన విద్యార్థులకు ఏ మాత్రమూ మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఆదివారం తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అనుమతి పొందిన కాలేజీలకు క్యాలెండర్ విడుదల చేస్తాం. దీని ప్రకారం ఆదివారాలు తరగతులు నిర్వహించకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం. కాలేజీలను తనిఖీలు కూడా చేస్తున్నాం. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా నడిస్తే చర్యలు తీసుకుంటాం. - సుబ్రమణ్యేశ్వరరావు, ఆర్ఐవో, కర్నూలు -
పిల్లలంటే రేసుగుర్రాలు కాదు..
తాము కన్న కలలు తమ పిల్లలు తీర్చాలనుకునే తల్లిదండ్రులు.. మార్కుల వేటలో తమ విద్యార్థులు రికార్డులు బద్దలు కొట్టాలనుకునే కార్పొరేట్ కళాశాలు.. నేటి విద్యార్థిని మరమనిషిలా మార్చేస్తున్నాయి. అందుకే ఇప్పటి స్టూడెంట్స్ ఆల్జీబ్రా సూత్రాలు వంట బట్టించుకున్నంత ఈజీగా జీవిత సూత్రాలు గ్రహించలేకపోతున్నారు. కెమికల్ ఈక్వేషన్స్లో బ్యాలెన్సింగ్ చూపుతున్న ప్రతిభ.. ప్రాక్టికల్ లైఫ్ను బ్యాలెన్స్ చేయడంలో చూపలేకపోతున్నారు. ఈ మాట చెబుతున్నది ఎవరో కాదు ఈ తరం భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న అధ్యాపకులే. ఆ తరం విద్యార్థులుగా, ఈ తరం అధ్యాపకులుగా ఉన్న పలువురు లెక్చరర్లను సాక్షి సిటీప్లస్ తరఫున సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పలకరించారు. - స్టార్ రిపోర్టర్ పరుచూరి గోపాలకృష్ణ: గతంలో 11 ఏళ్లు లెక్చరర్గా పనిచేసిన నేను ఈ రోజు మిమ్మల్ని పలకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అమ్మానాన్నలు జన్మనిస్తే...ఆ జన్మ సార్థకానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేది గురువు. అలాంటి వృత్తిని ఎంచుకోవడం వెనకున్న కారణాలు చెప్పండి? అజిత సురభి: మన పిల్లల్ని మనం చూసుకోవడంలో గొప్పలేదండి. ఇతరుల పిల్లల్ని మన పిల్లలుగా భావించి వారి భవిష్యత్తుకి పునాదులు వేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ దొరకదు కదా. గోపాలకృష్ణ: గొప్పగా చెప్పావు తల్లీ! రామచంద్రరావు: నా దృష్టిలో హీరో అంటే గురువే. అంతకు మించిన స్థానం మరొకటి ఉండదు. చిన్నప్పుడే టీచర్ కావాలనుకున్నా. అధ్యాపకుడిగా 20 ఏళ్ల అనుభవం సాధించాను. ప్రస్తుతం విజ్ఞాన్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నాను. గోపాలకృష్ణ: అవును. గురువు మాట్లాడుతుంటే ఎంతటి వారైనా చేతులు కట్టుకుని వినాల్సిందే. సత్యలత: ఈ వృత్తిలో ఉన్నంత సంతృప్తి మరెందులోనూ ఉండదు. పరమశివం: 23 ఏళ్లుగా లెక్చరర్గా పని చేస్తున్నాను. మనిషికి తల్లి గర్భం ఎంతో క్లాస్ రూమ్ కూడా అంతే. గోపాలకృష్ణ: శభాష్.. భలేగా చెప్పారు. హేమలతారెడ్డి: నేను 15 ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో ఉన్నాను. ప్రస్తుతం జాహ్నవి కాలేజీ ప్రిన్సిపాల్ చేస్తున్నాను. పిల్లల్లో ఉండే టాలెంట్ గుర్తించి ఎంకరేజ్ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తాను. గోపాలకృష్ణ: ఒకే.. మీరంతా ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లు. ఫ్రాంక్గా చెప్పండి. గవర్నమెంట్ కాలేజీలో విద్య నాణ్యత బాగుంటుందా, ప్రైవేట్లోనా..? పడాల: రెండింటిలో బాగుంటుందండి. చిన్న తేడా, ప్రభుత్వ కళాశాలల్లో పిల్లలే చదువుకుంటారు. ప్రైవేట్ కాలేజీల్లో తల్లిదండ్రులు, లెక్చరర్లు దగ్గరుండి చదివిస్తారు. రామచంద్రరావు: అవును సార్. చదువు పేరుతో తల్లిదండ్రులు, కార్పొరేట్ కాలేజీలు మూకుమ్మడిగా వేధిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పటి పేరెంట్స్ పిల్లల్ని పెరగనివ్వడం లేదు, పెంచుతున్నారు. వాళ్లకు నచ్చినట్టుగా.. ప్రణాళికలు రూపొందించుకుని మరీ పిల్లలపై రుద్దుతున్నారు. గోపాలకృష్ణ: అవును...ఏం చదవాలో, ఎలా చదవాలో, ఎంత చదవాలో.. అన్నీ తల్లిదండ్రులే నిర్ణయిస్తున్నారు. హేమలతారెడ్డి: ఈ తరం పిల్లలు.. ఇలా, అలా అంటూ జనరేషన్ పేరుతో వారిని దూషించడం కరెక్ట్ కాదండి. పిల్లలెప్పుడూ బంగారాలే. మనం ట్రీట్ చేసే విధానంలోనే ఉంటుంది. గోపాలకృష్ణ: మా తరం చదువుకునే రోజుల్లో టీచర్లేమిటి, లెక్చరర్లేమిటి తేడా వచ్చినా ఊరుకునేవారు కాదు. ఒక తిట్టు మాలో పౌరుషం నింపి వెంటనే మార్కుల్లో మార్పు వచ్చేలా చేసింది. ఇప్పుడెలా ఉంది ? అజిత సురభి: ఇప్పుడలా లేదు సార్. పిల్లలు చాలా సెన్సిటివ్గా మారిపోయారు. ఒకమాట అనాలన్నా భయమేస్తోంది. జ్యోతిరాజు: తల్లిదండ్రులే భయపడుతున్నారు. ఒక్కగానొక్క బిడ్డ వాడేమైనా చేసుకుంటే ఎలా అని గాబ రా పడుతున్నారు. గోపాలకృష్ణ: ఫలానా విద్యార్థి భవిష్యత్తులో ఏం సాధించగలడు? అన్న విషయం వాడికి పాఠం చెప్పేవాడికే తెలుస్తుంది. పూర్వం తల్లిదండ్రులు కాలేజీకొచ్చిమరీ అడిగేవారు...‘మావాడు దేనికి పనికొస్తాడని...?’ సత్యలత: ఇప్పుడు పేరెంట్సే డిసైడ్ చేసేస్తున్నారు. ఏ ర్యాంకు రావాలో కూడా ముందే చెబుతున్నారు. గోపాలకృష్ణ: పూర్వం తల్లిదండ్రులు సరిగ్గా చదవకపోతే ఇరగ్గొడతామని బెదిరించేవారు. ఇప్పడంతా రివర్స్ అయిపోయింది కదా ! హేమలతారెడ్డి: పిల్లలు అడక్కుండానే ఆఫర్లు ఇచ్చేస్తున్నారండి. నీకు మొదటి ర్యాంకు వస్తే.. ఐఫోన్ కొనిస్తానని, అబ్బాయిలకైతే బైక్ కొనిస్తానని ఆశ చూపించి చదివిస్తున్నారు. రాజేశ్వరి: దానికి తోడు ఉద్యోగాల వల్ల తల్లిదండ్రులూ పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నారు. అది కూడా వారిపై ప్రభావం చూపుతోంది. గోపాలకృష్ణ: కాస్త తీరిక దొరికితే సెల్ఫోన్లలతో బిజీ అయిపోయే విద్యార్థుల మనసుని చదువుపైకి మళ్లించడానికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? రామచంద్రరావు: సెల్ఫోన్ అంటే ఫోన్ చేసుకోవడం ఒక్కటే కాదు కదా! ఎంతసేపు ఫేస్బుక్, వాట్సప్ వాటితోనే గడుపుతున్నారు. అలాంటి వారి చేతుల్లో చూస్తే చాలా కోపం వస్తుంటుంది. ఒకటికి రెండుసార్లు చెబుతుంటాం. గోపాలకృష్ణ: ఈ మధ్యనే విన్నాను.. పేరున్న కార్పొరేట్ కాలేజీల్లో లెక్చరర్లు తెల్లవారకుండా పిల్లలకు చదవమంటూ మేసేజ్లు పంపుతున్నారట? జ్యోతిరాజు: ఉదయం నాలుగున్నరకే మొదలవుతున్నాయట. స్వప్న: వారంతా ర్యాంకర్స్కి సెలక్ట్ అయిన వారై ఉంటారు. గోపాలకృష్ణ: అంటే? రామచంద్రారావు: అంటే క్లాస్లో బాగా చదివే ఓ ఐదుగురు స్టూడెంట్స్ని సెలక్ట్ చేసి వారికి స్పెషల్ టీచింగ్ చేస్తుంటారు. నాకు తెలిసి ఆ విద్యార్థుల స్టడీ అవర్స్ 15 గంటల వరకూ ఉంటాయి. గోపాలకృష్ణ: అంటే వారంతా రేసుగుర్రాలా? సత్యలత: అంతేగా సార్. వారంతా తిండి, నిద్ర, విశ్రాంతి, పండుగలు, సరదాలు వదులుకుని ర్యాంకులు సంపాదిస్తే ఆయా కాలేజీ వాళ్లు టీవీల్లో యాడ్స్ వేసుకుని ప్రచారానికి దిగుతారు. గోపాలకృష్ణ: చూస్తున్నాను.. వన్, టు, త్రి, ఫోర్ అన్నీ ర్యాంకులు మావే అంటూ తెగ వాయించేస్తుంటాయి? నాకు తెలియక అడుగుతున్నాను. గవర్నమెంట్ కాలేజీ పిల్లలకు ర్యాంకులు రావా? విజయసుధ: బ్రహ్మాండంగా వస్తాయి సార్. కానీ పబ్లిసిటీ ఉండదు. గోపాలకృష్ణ: మరి వేయాలి కదా! లేదంటే గవర్నమెంట్ కళాశాలలో విద్య లేదు, ర్యాంకులు లేవనుకుంటారు కదా. పడాలా: నేను ఒకటి చెబుతాను సార్. గవర్నమెంట్ కాలేజీలో 70 శాతం మార్కులు తెచ్చుకున్న విద్యార్థి ప్రైవేటు కాలేజీలో 99 శాతం మార్కులు తెచ్చుకున్నవాడితో సమానం సార్. గోపాలకృష్ణ: అంతేగా.. మనకు మనం చదువుకుంటే నాలెడ్జ్ అవుతుంది. ఒకరి కోసం చదువుకుంటే ర్యాంకు అవుతుంది. ఓకే.. విద్యార్థులు మారలేదు... తల్లిదండ్రులే మారారంటున్నారు, ప్రభుత్వ కళాశాలల విద్య ముందు కార్పొరేట్ కళాశాలల విద్య ఎక్కువ కాదు, పిల్లల్ని పెరగనివ్వాలి కానీ, పెంచకూడదు.. అంటూ నాతోటి లెక్చరర్లు చెప్పిన మాటలు విన్నారు కదా! ఈ గురువులు చెప్పిన మాట పిల్లలకు కాదు, తల్లిదండ్రులకు అర్థమవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ. గోపాలకృష్ణ: సరే.. ఇంకా..? అజితసురభి: మేం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం సార్. గోపాలకృష్ణ: ఓ.. తప్పకుండా. అజితసురభి: సినిమాల్లో లెక్చరర్ని చూపించే పద్ధతిని మీరెంత వరకూ సమర్థిస్తారు? గోపాలకృష్ణ: నేను అస్సలు సమర్థించను. నా స్టూడెంట్ అయిన ఎమ్మెస్ నారాయణకు కూడా చాలాసార్లు చెప్పాను. లెక్చరర్ని కించపరుస్తూ పాత్రలు చేయవద్దని. నేను మాత్రం ఇప్పటి వరకూ గురువుని తక్కువ చేస్తూ ఒక్క డైలాగ్ కూడా రాయలేదు. హేమలతారెడ్డి: గురువుని గొప్పగా చూపించకపోయినా ఫర్వాలేదు సార్. కామెడీ క్యారెక్టర్ని చేయడం మాత్రం సిగ్గుచేటు. ప్రజెంటేషన్: భువనేశ్వరి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్య
ఉట్నూర్ : పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య అందిస్తున్న విషయం తెలిసిందే. 2014-15 విద్యా సంవత్సరానికి గాను ఐటీడీఏ పరిధిలో 92 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత వి ద్య అందించడానికి ప్రభుత్వం అనుమతించింది. దీం తో గిరిజన సంక్షేమ శాఖ పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించడానికి చర్యలు చేపట్టింది. కార్పొరేట్ కళాశాలలకు ఎంపికైన విద్యార్థులకు రెండేళ్లపాటు ఇంటర్మీడియెట్ ఉచిత విద్య, ఇతర సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అర్హులెవరంటే.. ఎస్టీ(గిరిజన) విద్యార్థులై ఉండాలి. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.రెండు లక్షలలోపు ఉండాలి. పదో తరగతలో సాధించిన ప్రతిభ ఆధారంగా కార్పొరెట్ కళాశాలల్లో ఎంపిక విధానం ఉంటుంది.ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీల్లో చదివిన వారికి 50 శాతం, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి 20శాతం, జెడ్పీఎస్ఎస్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం, బెస్టుఅవైలబుల్ పాఠశాలల్లో చదివిన వారికి 5 శాతం చొప్పున సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడం ఇలా.. కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థులు ఈ-పాస్ అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ తెరువగానే కార్పొరేట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది. అందులో విద్యార్థి పదో తరగతి హాల్టికెట్ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీంతో సదరు విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారం వస్తుంది. దరఖాస్తు ఫారంలో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, విద్యార్థి పదో తరగతిలో సాధించిన గ్రేడింగ్, కులం, ఉప కులం, తల్లిదండ్రుల వృత్తి, చిరునామా వంటి వివరాలు పొందుపర్చాలి. దరఖాస్తులో విద్యార్థి ఫొటో ముందుగానే ఉంటుంది. దానికి ముందు ఆధార్ కార్డు(యూఐడీ), ఈఐడీ, రేషన్కార్డు నంబర్లు జత చేయాలి. మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు స్కానింగ్ చేసి అంతర్జాలంలో అప్లోడ్ చేయాలి. గడువు.. జూన్ 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి ఉప సంచాలకులు భీమ్ తెలిపారు. జిల్లాలో ఉన్న కళాశాలలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఉన్న కార్పొరేట్ కళాశాలల వివరాలు అంతర్జాలంలో కనిపిస్తాయి. విద్యార్థులు ఏ కళాశాలలో చదవాలనుకుంటున్నారో దరఖాస్తులో ఆ కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. విద్యార్థులో పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా అధికారులు 23వ తేదీన ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి కళాశాలలు కేటాయిస్తారు. ఉపకార వేతన దరఖాస్తు కోసం.. కార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో సీటు రాని విద్యార్థుల దరఖాస్తు ఉపకార వేతన దరఖాస్తుగా మారిపోతుంది. ఇంటర్మీడియెట్లో విద్యార్థి ఏ కళాశాలలో చేరినా అందుకోసం మళ్లీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉపకార వేతనం పొందే అవకాశం ఉంది. -
ఇంటర్ ప్రశ్నపత్రాల లీకు!
-
ఇంటర్ ప్రశ్నపత్రాల లీకు!
* నారాయణ కళాశాలలో వారం రోజులుగా ఉన్న ప్రశ్నపత్రాల బాక్సులు * ఈనెల 22నే ప్రశ్నపత్రాల బాక్సులు తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ * అదనపు ప్రశ్నపత్రాల కోసం బోర్డు అధికారి రావడంతో వెల్లడి * క్రమపద్ధతిలో ఉండాల్సిన తాళాలతో తెరుచుకోని బాక్సులు * ప్రశ్నపత్రాలు లీకై ఉంటాయని బలపడుతున్న అనుమానాలు సాక్షి, హైదరాబాద్/ గుడివాడ (కృష్ణ్లా): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు లీక్ చేశారనే వార్త కృష్ణాజిల్లా గుడివాడలో సంచలనం సృష్టించింది. పోలీసుస్టేషన్లో ఉన్న ప్రశ్నపత్రాలను వారం ముందే గుడివాడలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తీసుకువెళ్లటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రశ్నపత్రాల కోసం మంగళవారం జిల్లా ఇంటర్ బోర్డు అధికారి రావటంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్రముఖ కార్పొరేట్ కళాశాలకు ప్రమేయమున్న ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా.. మీడియాకు తెలియడం తో బట్టబయలైంది. ఈ ఏడాది మార్చిలో గుడివాడలో ఐదు సెంటర్లలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. వీటిలో నారాయణ జూనియర్ కాలేజీ కూడా ఒక సెంటర్గా ఉంది. పోలీసు స్టేషన్లో ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు పరీక్షలు నిర్వహించే కాలేజీల వారే ఇనుప ట్రంకు పెట్టెలు ఇవ్వాలి. ఇందులో భాగంగా 12ప్రశ్నపత్రాలు భద్రపరిచేందుకు నారాయణ జూనియర్ కళాశాల వారు 12 ట్రంకు పెట్టెలను ఇచ్చారు. ఒక్కో ట్రంకుపెట్టెలో మూడు సెట్ల ప్రశ్నపత్రాలను సీలువేసి భద్రపరుస్తారు. పరీక్ష సమయంలో ఇంటర్మీడియెట్ బోర్డువారు జంబ్లింగ్ పద్ధతిలో వాటిలో ఒక సెట్ను ఎంపిక చేస్తారు. మిగిలిన రెండుసెట్లును పెట్టెలోనే ఉంచి సీలువేసి పోలీసు స్టేషన్లోనే భద్రపరుస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు బాక్సుల్లో మిగిలిన రెండు సెట్లలో ఒకదాన్ని వాడతారు. ఈనెల 25నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షలకు గుడివాడ లో విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉండటంతో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు వారు గుడివాడకు నాలుగు సెంటర్లు మాత్రమే ఇచ్చారు. దీంతో గుడివాడ నారాయణ జూనియర్ కాలేజీకి సెంటర్ లేకుండా పోయింది. దీంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యశాస్త్రి ఈనెల 22న స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్కు వచ్చి తమ కళాశాలకు పరీక్షా కేంద్రం లేదని తమ ట్రంకు పెట్టెలు ఇవ్వాలని లేఖరాసి తీసుకెళ్లారు. అయితే రెండేసి సెట్లు ప్రశ్నపత్రాలున్న ఆ 12 ట్రంకుపెట్టెలనూ ఖాళీ బాక్సులు పేరుతో కార్పొరేట్ కళాశాలవారు తీసుకెళ్లడం అనుమానాస్పదంగా మారింది. ఇలా బయటకు వచ్చింది: సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లాలోని ఒక కేంద్రంలో బోటనీ ప్రశ్నపత్రాలు తక్కువయ్యాయి. గుడివాడలోని నారాయణ కాలేజీ సెంటర్ లేకపోవటంతో దానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు పెట్టెల్లోనే ఉంటాయి కాబట్టి తీసుకెళ్లేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి వెంకట్రామారావు గుడివాడ పోలీసు స్టేషన్కు వచ్చారు. అయితే ఆ పెట్టెలను నారాయణ కళాశాలవారు 22వ తేదీనే తీసుకెళ్లారని చెప్పటంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాలేజీ ప్రిన్సిపాల్ను పిలిపించగా 27వతేదీ బాక్సులన్నీ తెచ్చి స్టేషన్లో పెట్టారు. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా చూడాలని అధికారులు ప్రయత్నించినా మీడియాకు తెలియటంతో బట్టబయలైంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రఘునందనరావు స్పందించి జిల్లా జేసీ మురళీని విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని తెలిసిన జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు కూడా గుడివాడకు చేరుకున్నారు. గుడివాడ ఆర్డీఓ ఎస్.వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ పద్మావతిల సమక్షంలో పెట్టెలు తీసి పరిశీలించారు. తాళాలు తెరుచుకోలేదు: ప్రశ్నపత్రాలు భద్రపరిచే పెట్టెలు తాళాలు తీయటంలో ప్రత్యేక విధానాన్ని పాటిస్తారు. మొత్తం 12 ట్రంకుపెట్టెల్లో ఒకటో నెంబరు బాక్సు తాళం మాత్రమే బయట ఉంటుంది. ఒకటో నెంబరు బాక్సులో రెండో నెంబరు బాక్సు తాళం, రెండో నెంబరు బాక్సులో మూడో నంబర్ బాక్సు తాళం... ఇలా 12 పెట్టెల తాళాలను భద్రపరుస్తారు. అయితే ఆయా బాక్సుల్లో ఉన్న తాళాలతో తర్వాతి నంబరు బాక్సులు తెరుచుకోలేదు. దీంతో ఆర్ఐఓ వద్ద ఉన్న డూప్లికేట్ తాళంచెవులు ఉపయోగించి తాళాలు తెరవాల్సివచ్చింది. ట్రంకుపెట్టెలు వారం రోజులపాటు నారాయణ కళాశాలలో ఉండటం, బాక్సుల్లో ఉన్న తాళంచెవులతో తర్వాతి నంబరు బాక్సులు తెరుచుకోకపోవడంతో ప్రశ్నపత్రాలు లీకయ్యి ఉంటాయనే అనుమానాలు నెలకొన్నాయి. ట్రంకు పెట్టెల సీళ్లన్నీ బాగానే ఉన్నాయని, అయితే బాక్సులు నిబంధనలకు విరుద్ధంగా బయటకు వెళ్లటం నేరమని జేసీ మురళి, ఎస్పీ ప్రభాకర్ చెప్పారు. పూర్తిస్థాయి విచారణ జరిగాక కారకులపై చర్యలు ఉంటాయని వారు తెలిపారు. ప్రశ్నపత్రం బయటకు వెళ్లినట్లు రుజువైతే, ఆ పరీక్షను మళ్లీ నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టనున్నామని వారు పేర్కొన్నారు. -
బాలికలదే పైచేయి
జూనియర్ ఇంటర్లో 51 శాతం ఉత్తీర్ణత - గత యేడాది కంటే తగ్గిన ఫలితాలు - సత్తాచాటిన ప్రైవేట్ కళాశాలలు కర్నూలు(విద్య), న్యూస్లైన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జిల్లా 51 శాతం ఉత్తీర్ణత సాధించింది. గత యేడాది కంటే ఇది ఒక శాతం తక్కువ. ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోనూ ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఎప్పటిలానే ఈసారి కూడా బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. సోమవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 35,147 మంది పరీక్ష రాయగా 17,818 మంది ఉత్తీర్ణత (51 శాతం) సాధించారు. ఇందులో బాలురు 19,428 మందికి గాను 8,762 మంది (45 శాతం), బాలికలు 15,712 మందికి గాను 9,056 (58 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలల్లో 2,312 మందికి గాను 894 మంది ఉత్తీర్ణత (39 శాతం) సాధించారు. ఇందులో బాలురు 1,833 మందికి గాను 658 (36 శాతం), బాలికలు 479 మందికి గాను 236 (49 శాతం) మంది పాసయ్యారు. రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. గత యేడాది సైతం జిల్లా ఇదే స్థానంలో ఉండటం గమనార్హం. పాములపాడు జూనియర్ కళాశాల టాప్ జిల్లాలోని 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 7,872 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,993 మంది ఉత్తీర్ణత (38.02శాతం) సాధించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పాములపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల (90.67 శాతం), డోన్లోని ఏపీఎస్డబ్ల్యుఆర్ జూనియర్ బాలికల కళాశాల (77.33 శాతం), గోనెగండ్లలోని ప్రభుత్వ జూనియృుర్ కళాశాల (73.44 శాతం) నిలిచాయి. గత సంవత్సరం 84.28 శాతం ఉత్తీర్ణత సాధించిన కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈసారి 55.38 శాతంతో సరిపెట్టుకుంది. చివరి స్థానాల్లో చిప్పగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల(10.14 శాతం), ఓర్వకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల(14.29 శాతం) నిలిచాయి. కాగా కర్నూలులోని ఏపీ ఉర్దూ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల 74.32 శాతం, బనవాసిలోని ఏపీ రెసిడెన్సియల్ బాలికల కళాశాల 95.31 శాతం, మహానందిలోని ఏపీటీడబ్ల్యుఆర్ ఎస్టీ బాలికల క ళాశాల 86.55 శాతం, శ్రీశైలం డ్యామ్ ఏపీటీడబ్ల్యుఆర్జేసీ 45.90, ఏపీటీడబ్ల్యుఆర్ ఇన్సిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ 89.55 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్లో 29.11 శాతం ఉత్తీర్ణత జిల్లాలోని మొత్తం 9 ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 2,027 మందికి గాను 590 మంది (29.11 శాతం) ఉత్తీర్ణత సాధించారు. చాగలమర్రిలోని ఎస్వీఎంవీఎస్ఆర్ జూనియర్ కళాశాల(48.25 శాతం), కర్నూలులోని సెయింట్ మెరీస్ జూనియర్ కళాశాల(34.90 శాతం), నంద్యాలలోని నేషనల్ జూనియర్ కళాశాల (35.41 శాతం)తో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. కర్నూలులోని కోల్స్మెమోరియల్ జూనియర్ కళాశాల (6.88 శాతం), శ్రీబాలశివ జూనియర్ కళాశాల (9.25శాతం), ఆదోనిలోని టీజీ ప్రహ్లాదచెట్టి జూనియర్ కళాశాల (16.43 శాతం) చివరి స్థానాల్లో నిలిచాయి. మోడల్ స్కూళ్లలో 51.77 శాతం ఉత్తీర్ణత జిల్లాలో ఈ యేడాది కొత్తగా ప్రారంభమైన 30 మోడల్ స్కూళ్ల (ఆదర్శ పాఠశాలలు)లో 1,273 మందికి గాను 659 మంది(51.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో పాములపాడు 97.78 శాతం, ఆత్మకూరు 94.74 శాతం, గోనెగండ్ల 88.46 శాతంతో టాప్లో నిలిచాయి. జూపాడుబంగ్లా 12.50 శాతం, బనగానపల్లి 15.38 శాతం, కొలిమిగుండ్ల 16.67 శాతంతో చివిరి స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల హవా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో కర్నూలులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని నిఖిల యాదవ్ ఎంపీసీలో 464 మార్కులు, సాయిప్రియాంక బైపీసీలో 435 మార్కులు సాధించారు. కర్నూలులోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపీసీలో అఫ్రోజ్ షేక్, పి.చిత్ర 465 మార్కులు, ఇండ్ల వెంకటసాయి శ్రీనిత్య, వి.భార్గవి, యు.ప్రశాంతి, ఇ.సాయిఅనురాగసుధ, హెచ్. సౌమ్య, డి.స్వాతిరెడ్డి, ఐ.వెంకటసాయిశ్రీనిత, షేక్ హజీరా తబస్సుమ్ 464 మార్కులు సాధించారు. బైపీసీలో ఎస్.మెహనాజ్ షర్ఫా 434, షేక్ జొహరా ఫాతిమా 433 మార్కులు సాధించారు. శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపీసీలో ఎం. గురుప్రియాంక 462, బైపీసీలో పి.ప్రణీత్ 430, శ్రీ సాయియుక్త జూనియర్ కళాశాల విద్యార్థి ఎంపీసీలో ఎస్. వినోద్కుమార్ 462, రవీంద్ర, శ్రీ కృష్ణ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ విభాగంలో ఎస్.షాహినా 458, బైపీసీలో ఇ.షీమా ఈరమ్ 430 మార్కులు, నలందలో ఎంపీసీ విభాగంలో డి.నుజహత్ ఫర్హానా 461, శ్రీ సాయియుక్త జూనియర్ కళాశాల విద్యార్థి ఎస్.వినోద్కుమార్ ఎంపీసీలో 462, మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఎంఈసీలో బమ్మిడి పృథ్వీరాజ్ 491 మార్కులు సాధించారు. -
రండిబాబు.. రండి!
విద్య వ్యాపారమైపోయింది. డిస్కౌంట్లు.. ఆఫర్లు.. ఇలా రకరకాల ప్రలోభాలతో విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలు గాలం వేస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాక మునుపే తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాయి. బాగా చదివే విద్యార్థుల వివరాలు కనుక్కొని వారి తల్లిదండ్రుల చుట్టూ యాజమాన్యాలు తిరుగుతున్నాయి. కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి. కర్నూలు(విద్య), న్యూస్లైన్: జిల్లాలో గత ఏడాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పది విద్యార్థుల ఫలితాల శాతం బాగా మెరుగయ్యింది. ఈ ఏడాది సైతం ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని మెరికల్లాంటి విద్యార్థులను వలలో వేసుకునేందుకు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ మేరకు పీఆర్వోలను రంగంలోకి దింపాయి. వారి ద్వారా ఆయా ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల సబ్జక్టు టీచర్లతో పాటు పలువురు హెచ్ఎంలనూ ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి రూ.2వేల నుంచి రూ.4వేల వరకు నజరానా ప్రకటిస్తున్నాయి. పీఆర్వోలతో పాటు ఆయా ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు సైతం విద్యార్థుల వేటలో పడ్డారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తీసుకుని కలుస్తున్నారు. తమ కళాశాల గొప్పతనమిదంటూ మాయమాటలు చెబుతున్నాయి. ఇప్పుడే సీటు రిజర్వు చేసుకుంటే అడ్మిషన్ సమయంలో ఫీజు రూ.5వేల నుంచి రూ.10వేల దాకా తగ్గుతుందని బుకాయిస్తున్నారు. డే స్కాలర్కింత, రెసిడెన్సియల్కు అయితే ఇంత అంటూ రేట్లను వివరించి బుట్టలో వేసుకుంటున్నాయి. దీంతో కాస్త ఆర్థిక స్తోమత ఉండే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులను చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేటులో కనీస వసతులు కరువు జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో 90 శాతం ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న కళాశాలు వారికి సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మంచి మార్కులు, ర్యాంకుల పేరుతో విద్యార్థులను తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని ఏ ఒక్క కాలేజీల్లో క్రీడల ఊసేలేదు. ప్రభుత్వ ఆటస్థలాలనే క్రీడామైదానాలుగా చూపుతూ అనుమతులు తెచ్చుకుంటున్నాయి. విశాలమైన ప్రాంగణాలలో క ళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అపార్ట్మెంట్ వంటి భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ సబ్జక్టులకు విడివిడిగా ల్యాబ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికశాతం కాలేజీలో అన్నీ ఒకే చోట నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే ల్యాబ్ల్లో విద్యార్థులచే ప్రాక్టికల్స్ నిర్వహించాలి. విద్యాసంవత్సరం మొత్తంగా థియరీకి ప్రాధాన్యం ఇస్తూ పరీక్షల ముందు మాత్రమే ప్రాక్టికల్స్ చేయిస్తున్నాయి. ఈ కారణంగా విద్యార్థులకు ప్రాక్టికల్స్పై కనీస అవగాహన ఉండటం లేదు. భారీ ఫీజు వసూలుకు రంగం సిద్ధం ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో భారీగా ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ గ్రూపులకు డిమాండ్ అధికంగా ఉంది. బైపీసీ చేస్తే డాక్టర్ అవుతారని, ఎంపీసీ చేస్తే ఐఐటీ ర్యాంకుతో ఇంజనీరై లక్షలాది రూపాయలు సంపాదించవచ్చని, ఎంఈసీ చేస్తే సీఏగా మారి కంపెనీలకు వెన్నుదన్నుగా ఉండేలా మారతారని ఆయా కాలేజీలు ఊదరగొడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వారి కళాశాలల్లో వచ్చిన ర్యాంకులను చూపుతూ పబ్లిసిటీ చేసుకుంటున్నాయి. గత సంవత్సరం కార్పొరేట్ కాలేజీల్లో డే స్కాలర్కు బైపీసీ, ఎంపీసీ గ్రూపులకు రూ.28వేల నుంచి రూ.35వేల వరకు వసూలు చేశారు. ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.30వేల నుంచి రూ.40వేలకు పెంచారు. ఇక రెసిడెన్సియల్(హాస్టల్) విద్యార్థులకైతే రూ.60వేల నుంచి రూ.70వేల వరకు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటిలకు కేవలం కొన్ని కార్పొరేట్ కాలేజీలు మాత్రమే కోచింగ్ ఇస్తున్నాయి. అడ్మిషన్ సమయంలోనే ఈ కోచింగ్కు కలిపి ఫీజులు వసూలు చేస్తున్నా పరీక్ష ప్రారంభంలో షార్ట్టర్మ్ కోచింగ్ అంటూ మరో రూ.5వేల దాకా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. అనుమతి లేకున్నా హాస్టల్ నిర్వహణ రెసిడెన్సియల్(హాస్టల్) విధానంలో ఇంటర్ మీడియట్ బోధించేందుకు జిల్లాలోని ఏ ఒక్క కాలేజికి అనుమతి లేదు. అయినా హాస్టల్ పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలే కాదు స్థానిక ప్రైవేటు కాలేజీలు సైతం ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ఇంటిని మరిపించే భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని ఊదరగొట్టే ప్రకటనలు ఇచ్చే కళాశాలలు తీరా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నాయి.