Kambhampati Haribabu
-
అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్
తగరపువలస (భీమిలి): నూతన విద్య, ఆర్థిక విధానాల కారణంగా అభివృద్ధిలో దేశం దూసుకుపోతోందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. చెరకుపల్లిలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న గ్యాన్–2కే23 జాతీయ సాంకేతిక ఫెస్ట్ను శుక్రవారం ఆయన c. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అభివృద్ధిని నేటి తరం అనుభవిస్తుంటే తనకు అసూయగా ఉందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా దేశం తన అవసరాలను తీర్చుకోవడంతోపాటు విదేశాలకు అవసరమైన ఎగుమతులు చేయగలుగుతోందన్నారు. ప్రపంచానికి అవసరమైన సాంకేతికపరమైన డేటా మనదేశంలో చౌకగా లభిస్తుందన్నారు. విద్యార్థులు తన చుట్టూ ఉన్నవారికి, దేశానికి అవసరమైన వాటిని గుర్తించి ఉత్పత్తి చేయడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా విజయం సాధించాలని సూచించారు. అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కులం, డబ్బు వంటివాటితో పనిలేదన్నారు. తెలివితేటలు, కష్టపడే తత్వం అలవరచుకోవాలన్నారు. జేఎన్టీయూ–కె ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ విద్యార్థులు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్స్కిల్స్ను మెరుగుపరుచుకుంటూ నిరంతరం అభ్యాసం చేయాలన్నారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఎం.సైదులు, అవంతి విద్యాసంస్థల డైరెక్టర్ ఆకుల చంద్రశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ ఐ.శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం -
వ్యవసాయ ప్రగతిలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఈ రంగాల్లో మంచి వృద్ధిరేటు నమోదవుతోందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ సాధిస్తోన్న పురోగతి అభినందనీయమన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో మూడురోజులు నిర్వహిస్తున్న 4వ ఆర్గానిక్మేళాను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన రైతుల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతులు కష్టపడినంతగా దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ చూడలేదన్నారు. కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ దేశం 4.5 శాతం వృద్ధిరేటు సాధించడానికి ఆంధ్రప్రదేశ్లో సాధిస్తున్న పురోగతే కారణమని చెప్పారు. విదేశీమారక ద్రవ్యలోటును తీర్చగలిగే శక్తి దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఉందన్నారు. ప్రపంచ మార్కెట్లో ఎగుమతి అవకాశాలున్న పంటలన్నీ ఇక్కడ పండుతున్నాయన్నారు. బియ్యం, పత్తి, పసుపు, పప్పుధాన్యాలు, అల్లం, పొగాకు ఇలా ఇక్కడ పండేవన్నీ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. అరుకు కాఫీకి ఎగుమతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఎగుమతి చేయని స్థాయిలో ఏటా రూ.15 వేల కోట్ల విలువైన రొయ్యలు అమెరికా తదితర దేశాలకు ఎగుమతవు తున్నాయన్నారు. డెయిరీ ఉత్పత్తుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. మన భీమవరం నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలను అదే ప్యాకింగ్తో అమెరికా వాల్మార్ట్లో విక్రయిస్తున్నారని తెలిపారు. అదేరీతిలో మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులు కూడా విదేశాల్లో మన బ్రాండింగ్తో అమ్మే స్థాయికి ఎదగాలన్నారు. సేంద్రియ సాగును ప్రోత్సహించాలి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుని మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలవాలన కోరారు. జిల్లాల వారీగా లభించే ఉత్పత్తులు (డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ప్రొడక్టస్)ను గుర్తించి అవి ఇతరదేశాలకు ఎగుమతి అయ్యేలా జిల్లాల మధ్య పోటీవాతావరణం తీసుకురావాలని చెప్పారు. డిమాండ్ ఉన్న దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పుడే ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో కొనసాగడమే కాదు.. ప్రపంచపటంలో నిలబడుతుందని చెప్పారు. సేంద్రియ సాగులో కూడా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. సేంద్రియ సాగును లాభసాటి చేయాలన్నారు. విదేశీమారక ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు పామాయిల్ సీడ్ మిషన్ను ప్రారంభిస్తున్న కేంద్రం పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకునేందుకు మొక్కజొన్న తదితర ఆహార ఉత్పత్తుల నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా ప్రధానమంత్రి నరేంద్రమోది కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. సేంద్రియ రైతులు, పాత్రికేయులకు సత్కారం ఈ సందర్భంగా సేంద్రియ రైతులు తిప్పేస్వామి (అనంతపురం జిల్లా), రమణారెడ్డి (వైఎస్సార్), గంగాధరం (చిత్తూరు), పాపారావు (గుంటూరు), మలినేని నారాయణప్రసాద్ (కృష్ణా), ఝాన్సీ (పశ్చిమగోదావరి జిల్లా), తాతారావు, లక్ష్మీనాయక్ (జెడ్పీఎన్ఎఫ్), రాజ్కృష్ణారెడ్డి (ఉద్యానశాఖ ఏడీ), ధర్మజ (ఉద్యానశాఖ డీడీ), రామాంజనేయులు, సురేంద్ర (ఎన్జీవోలు), సీనియర్ పాత్రికేయులు ఆకుల అమరయ్య, మల్లిఖార్జున్, సుబ్బారావు, శ్రీనివాసమోహన్లను సత్కరించారు. ఉద్యానశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.ఎస్.శ్రీధర్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవిచౌదరి, రైతుసాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ టి.విజయకుమార్, ఆర్గానిక్మేళా నిర్వహణాధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, భారతీయ కిసాన్సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జలగం కుమారస్వామి, గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ స్థాయి నుంచి గవర్నర్ గా..
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్గా నియమితులవడంపై విశాఖలో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హరిబాబు ప్రకాశం జిల్లాలో జన్మించినప్పటికీ విద్యార్థి నుంచి విశాఖలోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయ ప్రస్థానం విశాఖ కేంద్రంగానే సాగించారు. ఏయూ విద్యార్థి నుంచి ప్రొఫెసర్ వరకు.. హరిబాబు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో 1953, జూన్ 15న జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేశారు. పీహెచ్డీ పట్టా కూడా ఏయూ నుంచే పొందారు. ఇక్కడే అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. విద్యార్థి నాయకుడిగా.. విద్యార్థి దశలోనే నాయకుడిగా అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1972–73లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి యూనియన్కు సెక్రటరీ అయ్యారు. 1975–75లో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన లోక్ సంఘర్ష సమితి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతలో భాగంగా అరెస్ట్ అయ్యారు. విశాఖ సెంట్రల్ జైలు, ముషీరాబాద్ జైలులో 6 నెలలు ఉన్నారు. జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. 1977లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనతా పార్టీలో చేరి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా సేవలందించారు. 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1991–93 మధ్యలో పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు. 1993–2003 కాలంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. విశాఖ–1 ఎమ్మెల్యేగా.. 1999లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి హరిబాబు పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2003లో శాసనసభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో కూడా అక్కడే నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. 2014 మార్చిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తన పదవీ కాలం ముగిసిన తరువాత తిరిగి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అభినందనల వెల్లువ గవర్నర్గా నియమితులైన హరిబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దసపల్లా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం సందడిగా మారింది. బీజేపీ నేతలతో పాటు అన్ని పక్షాల నేతలు, సన్నిహితులు హరిబాబు ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేస్తున్నారు. బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, బీజేపీ జిల్లా ఇన్చార్జి కోడూరి లక్ష్మీనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. -
రైల్వే జోన్పై చర్చలో రచ్చరచ్చ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీ ఎంపీలు, తెలుగుదేశం నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించడానికి టీడీపీ మంత్రులు కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సుజయ్కృష్ణా రంగారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు మంగళవారం రాత్రి ఢిల్లీలోని పీయూష్ గోయల్ కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, కంభంపాటి హరిబాబు కూడా రైల్వే జోన్ అంశంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ నేతలు ఒకరికొకరు తారసపడడంతో అందరూ కాసేపు ముచ్చటించుకున్నారు. తాము కేంద్ర మంత్రితో రైల్వే జోన్ అంశంపై చర్చించేందుకు వెళ్తున్నామని, మీరు కూడా రండి అంటూ బీజేపీ ఎంపీ హరిబాబును టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆహ్వానించారు. తాము కూడా ఇదే అంశంపై చర్చించేందుకు వచ్చామని హరిబాబు చెప్పారు. తర్వాత కేంద్ర మంత్రితో టీడీపీ నేతల సమావేశం సందర్భంగా బీజేపీ ఎంపీలు కూడా అందులో పాల్గొన్నారు. జోనూ లేదు.. గీనూ లేదు అని వీడియో టేపులో దొరికిపోయిన టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాలుగేళ్లు గడచిపోయాయని, విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలని కోరారు. జీవీఎల్ను ఎందుకు పిలిచారు? టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, సుజనా చౌదరి, రామ్మోహన్ నాయుడు మాట్లాడిన తరువాత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. ఆయన రైల్వే జోన్పై మాట్లాడుతున్న సందర్భంగా టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆయనపై మాటల యుద్ధానికి దిగారు. అసలు జీవీఎల్ను ఎందుకు పిలిచారంటూ టీడీపీ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎంపీ హరిబాబు కల్పించుకుని సుజనా చౌదరి పిలిస్తేనే ఈ సమావేశానికి వచ్చామని చెప్పారు. దీనికి సుజనాచౌదరి అంగీకరించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, జోన్ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని చెప్పారు. -
ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ ఒప్పుకుంది
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే అంగీకారం తెలిపిందనీ, తర్వాత రాజకీయ కారణాలతో యూటర్న్ తీసుకుందని విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విమర్శించారు. శుక్రవారం లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీని విభజించాలని చంద్రబాబే లేఖ ఇచ్చి, ఇప్పుడు విభజనను తప్పుపడుతున్నారు. రాష్ట్రంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ఆ పార్టీకి రాజకీయాలే ముఖ్యం. కాంగ్రెస్కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఈ రోజు చంద్రబాబు కాంగ్రెస్తో జట్టు కట్టారు. ఇది చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. అంత చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోనే ఆ విషయాన్ని ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ నాయకులు హోదాపై ఎందుకు మాట్లాడలేదు? విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలు అమలు చేసినందుకా? చట్టంలో ఇచ్చిన సంస్థలను పదేళ్ల కాలపరిమితిలో ఏర్పాటు చేయాలని ఉన్నా నాలుగేళ్లలోనే ఏర్పాటు చేసినందుకా? టీడీపీ అవిశ్వాసం పెట్టింది?’ అని నిలదీశారు. ఎస్పీవీ ఏర్పాటు చేయండి.. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిన మాట వాస్తవమే. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఆ హామీ అమలు కాలేదు. అయినా ప్రత్యేక హోదా పేరు లేకుండా హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇస్తున్న 90 శాతం నిధులను ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి రూ.17,500 కోట్ల విలువైన ఈఏపీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈఏపీ ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతున్నందున హడ్కో, నాబార్డు రుణాలిప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్బీఎం సమస్యలు తలెత్తే వీలుండడంతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ, ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్పీవీని ఏర్పాటు చేయలేదు. దీనివల్ల రాష్ట్రం రూ.17,500 కోట్లు నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేస్తే ఒక్క రోజులోనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని ఆయన తెలిపారు. -
‘ఎంపీ ప్రశ్నలు.. టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్ సభలో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంపై టీడీపీని హరిబాబు ఉక్కిరిబిక్కిరి చేశారు. తన ప్రశ్నలతో టీడీపీ ఎంపీలను నిలదీశారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు విభజన చట్టంలో చేర్చలేదని ఎంపీ ప్రశ్నించారు. అంతేకాక ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని కంబంపాటి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల దగ్గరకెళ్లి టీడీపీ నాయకులు చర్చలు జరపడంపై ఆయన మండిపడ్డారు. మీ చర్యలతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తోందని తనదైన శైలిలో బీజేపీ ఎంపీ నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ జీవితమంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడారు. మీరు నిస్సిగ్గుగా కాంగ్రెస్తో చేతులు కలిపారు. కాంగ్రెస్ నేతలతో టీడీపీ నేతలు ఫ్లోర్ కోఆర్డినేషన్ చేశారు. రాష్ట్రం విడిపోతే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ నమ్మింది. రాష్ట్ర విభజన చేయాలని టీడీపీనే లేఖ ఇచ్చింది. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. నాబార్డు, హడ్కో ద్వారా సాయం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ నుంచి వినతులను అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. మీకు హోదా అనే పేరు ముఖ్యమా లేక ఆర్థిక సాయం ముఖ్యమా? పోలవరం ప్రాజెక్ట్కు ఇప్పటి వరకు రూ. 6,374 కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రమే పూర్తి చేస్తుంది. కడప స్టీల్ ప్లాంట్నుపై కమిటీ వ్యతిరేక రిపోర్టు ఇచ్చింది. అయినా స్టీల్ ప్లాంట్పై కేంద్రం టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది’. అని ఎంపీ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. -
హరిబాబు ప్రశ్నలు.. టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి
-
మోదీ మచ్చలేని నాయకుడు
సాక్షి, విజయనగరం : ప్రధాని నరేంద్రమోదీ మచ్చలేని నాయకుడని విశాఖపట్నం ఎంపీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. శుక్రవారం విజయనగరంలో జరిగిన విసృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడానికి అవసరమైన నాయకత్వం ఉందని తెలిపారు. కేంద్రం ఎన్నో పధకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పడి ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీజేపీ ఇచ్చే స్థితిలో ఉందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో, నల్లధనాన్ని వెలికి తీయడంలో, దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం జీఎస్టీ తీసుకు రావడం జరిగిందని వెల్లడించారు. దీని వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని భావించామని, అందుకే విభజనకు అంగీకరించినట్లు తెలిపారు. విశాఖ, విజయనగరం జిల్లాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. -
బాబు దీక్ష వల్ల రాష్ట్ర ఖజానాకు 20 కోట్ల నష్టం
-
మే 15 తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి
విశాఖపట్నం : అధికార టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే నెల 15 తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు ఉంటాయన్నారు. అలాగే వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా విశాఖపట్నం వచ్చినప్పుడు తాను కూడా కలుస్తానని చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత విషయం అని విష్ణుకుమార్ రాజు తెలిపారు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి దీక్ష అయిపోయిందని, దాని వల్ల రాష్ట్ర ఖజానాకు ఇరవై కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య వ్యాఖ్యలు ఖండిస్తున్నామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి దీక్ష చేస్తున్నారే తప్ప ప్రజలకు ఏం మేలు జరుగుతుందని కాదని..సీఎం చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకుని..ఇప్పుడు మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పట్టిసీమలో జరిగిన అవకతవకలపై సీబీఐ చేత విచారణ జరిపించాలన్నారు. టీడీపీతో పొత్తు కారణంగా చాలా నష్టపోయామని వ్యాఖ్యానించారు. టీడీపీ కుటుంబ పార్టీ అని, మరలా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. కొత్తగా ఏచూరికి పదవి వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని విమర్శించారు. దోపిడీపై ఉద్యమించేవారికి కాంగ్రెస్తో పనేంటి? : విశాఖ ఎంపీ హరిబాబు దోపిడీపై ఉద్యమిస్తామంటున్న కమ్యునిస్టు పార్టీలు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి పోరాటం చేస్తామనడంలో ఆంతర్యం ఏమిటని హరిబాబు ప్రశ్నించారు. దేశంలో అట్టడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బీజేపీ పాటుపడుతుందని, ముద్రా రుణాలు కోట్ల మంది ప్రజలకు ఇస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడుతోన్న ప్రధాని మోదీపై ఎలా విమర్శలు చేస్తారని సూటిగా అడిగారు. ఇరవైకి పైగా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే లేని సీపీఎం మోదీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయని విమర్శించారు. ఒక్కప్పుడు రెండో స్థానంలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు అట్టడుగు స్థానానికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఒంటరిగా రాష్ట్రంలో బలపడడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. పదవులు ఇస్తామని ఎవరికీ చెప్పలేదని, రాజకీయ పరిణామాల దృశ్యా మార్పులు చోటు చేసుకోవడం సహజమన్నారు. ఏపీలో అధికార, ప్రతిప్రక్షాలు తమపై విమర్శలు చేస్తుంటే తమ పార్టీ ఎంత ఎదిగిందో గమనించాలని తెలిపారు. ఎక్సైజ్ సుంకాలను తగ్గించే ఆలోచనలు ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను...అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఐబీ అధికారులు రాజకీయ నాయకులను కలవడం సహజమని, కేంద్రం అనవసరంగా ఎవ్వరి మీదా కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని తేల్చిచెప్పారు. -
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
-
ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఈయనే!
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధినాయకత్వం నియమించినట్టు తెలుస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా పోరాటం ముమ్మరం కావడం, బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పడం.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి నుంచి కంభంపాటి హరిబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. హరిబాబు స్థానంలో ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. శుక్రవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. పార్టీని దూకుడుగా నడిపించే వ్యూహంలో భాగంగా సోము వీర్రాజుకు అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగి.. పార్టీ విధేయుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అనేక ఏళ్ళుగా బీజేపీలో పనిచేస్తున్న అనుభవం కూడా కలిసివచ్చినట్టు భావిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబును ఇప్పటికే జాతీయ కార్యవర్గ సభ్యునిగా అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. బీజేపీలో ఫైర్బ్రాండ్ నేత సోము వీర్రాజు పేరొందారు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ మొదటినుంచి ఆ పార్టీపై, సీఎం చంద్రబాబుపై సోము వీర్రాజు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పాలనలోని అవినీతిని, అవకతవకలను సోము వీర్రాజు ఎండగడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీని, చంద్రబాబును మరింత ఇరకాటంలో నెట్టేందుకు, ఏపీలో బీజేపీని బలమైన పార్టీగా నిలబెట్టేందుకు ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నారని కమలం వర్గాలు అంటున్నాయి. -
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా హరిబాబు
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మూడేళ్లు పనిచేసిన హరిబాబు రెండు రోజుల క్రితం ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన రాజీనామా అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీలో అంతర్గతంగా వస్తున్న విమర్శలు నేపథ్యంలో మనస్తాపం చెంది పార్టీ పదవికి హరిబాబు రాజీనామా చేసి ఉంటారనే వాదన బలంగా వినిపించింది. అయితే మిత్రపక్షం టీడీపీతో చెడిన తర్వాత అధ్యక్ష మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశారనేవి మరో వాదన. 2014 జనవరిలో పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన హరిబాబు పదవీకాలం గతేడాదితోనే ముగిసింది. అప్పటి నుంచి అధ్యక్ష మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. కాగా, ఈ రోజు సాయంత్రానికి ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం కన్పిస్తోంది. అధ్యక్ష పదవి కోసం అధిష్టానం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి నలుగురి పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. సోమువీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి పేర్లు జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు విశాఖకు చెందిన చెరువు రామకోటయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అధిష్టానం మాత్రం వీర్రాజు, పైడికొండలలో ఎవరో ఒకర్ని ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
హరిబాబు రాజీనామాపై బీజేపీ స్పందన
సాక్షి, విశాఖ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు సోమవారం సాయంత్రమే రాజీనామా లేఖను పంపించారు. ఈ అంశంపై బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. హరిబాబు రాజీనామా వెనుక రాజకీయ కోణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఆయన రాజీనామా చేశారన్నారు. ఆయన సమర్థవంతుడైన నాయకుడని కితాబిచ్చారు. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై విచారణ చేయాలన్న తన వ్యాఖ్యాలకు కట్టుబడి ఉన్నట్టు ఆయన తెలిపారు. పట్టిసీమ అక్రమాలపై ఇతర పార్టీలు స్పందించాలి ఆయన కోరారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కంభంపాటి హరిబాబును ఎవరు ఒత్తిడి తేలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిశోర్ స్పష్టం చేశారు. పార్టీ ఆలోచనకు అనుగుణంగానే హరిబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోందన్నారు. దీనికి వెసులుబాటు కల్పిస్తూనే హరిబాబు రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికలకు సన్నద్దం కావడానికి ఆయన స్వచ్ఛందంగానే రాజీనామా చేశారని పేర్కొన్నారు. త్వరలోనే అమిత్ షా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని తెలిపారు. -
ఏపీ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు
-
కంభంపాటి హరిబాబు రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. కొన్నాళ్లుగా ఉద్వాసన తప్పదనే ఊహాగానాల నడుమ హరిబాబు రాజీనామాపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, మరో వారం రోజుల్లో ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామయం ఉంటుందని తెలిసింది. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఆ పదవి అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి వైదొలగడం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏపీలో పార్టీ అధ్యక్షుడి మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మిణారాయణల పేర్లను కూడా పరిశీలించిన అధిష్టానం చివరికి పైడికొండల వైపే మొగ్గిందని, ఈ నిర్ణయంలో బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి రాంమాధవ కీలక పాత్ర పోషించారని సమాచారం. -
మళ్లీ మోదీనే ప్రధాని; చంద్రబాబు కోరిక
సాక్షి, అమరావతి: ‘‘దేశప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి మద్దతు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వం అమలుచేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగా 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఎన్డీఏని అఖండ మెజారిటీతో గెలిపింది, మళ్లీ మోదీ గారినే ప్రధానిగా చేయాలని చంద్రబాబు అనే నేను కోరుతున్నాను’’ ఇది.. 30 రాజకీయ పార్టీల ప్రతినిధుల సాక్షిగా ఎన్డీఏ సమావేశంలో ఏపీ సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానం! ఆవిధంగా మాట్లాడిన బాబుగారు నెలలు తిరిగేలోపే మళ్లీ మాటమార్చారని, కేంద్రాన్ని, మోదీని విమర్శిస్తూ వింత ప్రేలాపనలు చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ‘ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సహకారం’ పేరుతో 32 పేజీల సుదీర్ఘ బహిరంగ లేఖను ఆయన విడుదలచేశారు. పలు కీలక అంశాలతో కూడిన ఆ లేఖలో చంద్రబాబు బండారం బట్టబయలు కావడంతోపాటు బీజేపీ ద్వంద్వవైఖరి కూడా స్పష్టంగా వెల్లడికావడం గమనార్హం. ► విభజన సమయంలో నాటీ యూపీఏ ప్రభుత్వం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినా, ఆ విషయాన్ని 14వ ఆర్థిక సంఘానికి నివేదించలేదని, జాతీయ సమగ్రతా మండలిలో ఆమోదించలేదని హరిబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఆ పక్క పేజీలోనే ఏపీకి వరదాయిని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని కూడా నాటి యూపీఏ ప్రభుత్వమే చెప్పిందని, ముంపు మండలాలలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ కూడా తెస్తామని హామీ ఇచ్చినా చేయలేకపోయిందని రాసుకొచ్చారు. ►ఇక ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాల్లోనే.. గత ప్రభుత్వం హామీ ఇచ్చిన ‘ముంపు మండలాల బదలాయింపు ప్రక్రియ’ను తాము విజయవంతంగా పూర్తిచేశామని హరిబాబు గొప్పలు చెప్పారు. కానీ నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఏమేరకు జరిగాయో, నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పే సాహసం చెయ్యలేకపోయారు. అదే విధంగా హోదా హామీని ఎందుకు అమలుచేయలేకపోయారన్న దానిపై కప్పదాటువైఖరి ప్రదర్శించారు. 14వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాలను ప్రస్తావించినా.. మోదీ ప్రధాని అయిన 7 నెలల తర్వాతగానీ ఆర్థిక సంఘం రద్దైన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మర్చిపోయారు. ►పోలవరం, ప్రత్యేక హోదా హామీల్లో ఏ ఒక్కదానిని పూర్తిచేయకుండా సాకులు వెతుక్కోవడం మోసకారితనమే అవుతుందని బీజేపీ-టీడీపీలకు ముందే తెలుసు. ఇప్పుడు మాత్రం ‘కూరిమి విరసంబైనను నేరములే కానవచ్చు..’ అన్న చందంగా ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటూ మొత్తంగా ఏపీ ప్రజల కళ్లకుగంతలుకట్టే వ్యర్థప్రయత్నాలు చేస్తున్నారు. (ఏపీ దూరదర్శన్ అధికారిక ట్విటర్లో పోస్ట్ అయిన ఫొటోలివి) -
మంత్రి కామినేని వివరణ
సాక్షి, విజయవాడ: తనపై సొంత పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో బీజేపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం వివరణ ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే నిన్న జరిగిన పార్టీ పదాధికారుల సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయినట్టు వెల్లడించారు. అసలేం జరిగింది..? రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షతన ఆదివారం విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కమలనాథులు కీలక విషయాలు చర్చించారు. ఏపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మంత్రులు బయటకు వచ్చి సీఎం చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేశారు. అప్పటివరకు సమావేశంలో ఉన్న మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ అంశం ప్రస్తావనకు రాగానే బయటకు వెళ్లిపోయారు. ఆయన హడావుడిగా బయటకు వెళ్లిపోవడం పట్ల పలువురు అభ్యంతరం చేశారు. దీంతో మంత్రి కామినేని ఈరోజు వివరణయిచ్చారు. ఏ నిర్ణయానికైనా కట్టుబడతా.. బీజేపీ మంత్రుల రాజీనామాలను అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీకి పంపితే బాగుంటుందని సమావేశంలో చర్చించుకున్నారు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడతానని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జవాబిచ్చినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిదని హరిబాబు సూచించడంతో ఈ అంశంపై చర్చను ముగిసించారు. -
చంద్రబాబు సవాల్కు వీర్రాజు సై
-
చంద్రబాబు సవాల్కు వీర్రాజు సై
సాక్షి, విజయవాడ: కేంద్ర సాయంపై బహిరంగ చర్చ సిద్ధమని సీఎం చంద్రబాబు చేసిన సవాల్పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. టీడీపీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు చేయనంత సాయం కేంద్రం చేస్తోందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబును పిలిస్తే లెక్కలన్నీ చెబుతారన్నారు. హరిబాబు సినిమా స్క్రిప్టులు చదువుతారంటూ విమర్శిస్తున్నారని, ఆ అలవాటు మాది కాదు మీదంటూ టీడీపీ నాయకులపై మండిపడ్డారు. అమరావతితో పాటు విజయవాడ అభివృద్ధికి కేంద్రం ఎన్నో నిధులిచ్చిందన్నారు. విశాఖపట్నంలో రోడ్లు మెరవడానికి కేంద్రం నిధులే కారణమని వెల్లడించారు. అమరావతికి రూ. 20 వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. కావాలనే దుష్ప్రచారం.. ఏపీని కేంద్రం అన్నివిధాల ఆదుకుంటోందని, టీడీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కంభంపాటి హరిబాబు అన్నారు. రెవెన్యులోటు పూడ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీయే పాటుపడుతోందని చెప్పుకొచ్చారు. కేంద్రం సాయంపై డాక్యుమెంట్ ఆదివారం జరిగిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశానికి దగ్గుబాటి పురందేశ్వరి, గోకరాజు రంగరాజు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు హాజరయ్యారు. టీడీపీ నేతల విమర్శలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఏపీకి కేంద్రం సాయంపై డాక్యుమెంట్ రూపొందించారు. ఏపీలో ప్రాజెక్టులు, కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ఇందులో పొందుపర్చారు. -
మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు : హరిబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని విద్యాసంస్థల ఏర్పాటు వందశాతం పూర్తి చేశామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. కొన్ని సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా నివేదికలు రాలేదని అయినా ఇబ్బందులు తొలగించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై మెకా అనే సంస్థ నివేదిక ఇచ్చిందని, ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయం రాష్ట్రప్రభుత్వమే చూపించాలని హరిబాబు డిమాండ్ చేశారు. త్వరలోనే రైల్వేజోన్పై నిర్ణయం రానుందని, విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ వ్యాఖ్యానించారు. నిధుల విడుదలలో ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు వివక్ష ఉండదని తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత సాయం అందించడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొన్నారు. సంస్థల భవనాల నిర్మాణాల పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తారని తెలిపారు. ఏపీ విభజన జరిగిన ఏడాదిలోనే ప్రత్యేక దూరదర్శన్ ఏర్పాటు చేశారని, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ఘడ్లకు 17సంత్సరాల తర్వాత దూరదర్శన్ మంజూరు చేశారని గుర్తు చేశారు. కేంద్రానికి ఏపీపై ప్రత్యేక శ్రద్ధ ఉందని అందువల్లే అభివృద్ధి చెందుతోందని అన్నారు. తమని పొగడాల్సిన అవసరం లేదని, కానీ రాష్ట్రానికి చేసిన సాయాన్ని గుర్తించాలని హితవు పలికారు. నిధులు ఇస్తే మా హక్కు లేదంటే మోదీ పాపం అంటూ ప్రచారం చేయడం తప్పు అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. తాము కేంద్రం తరపున మాట్లాడుతున్నామని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అని హరిబాబు అన్నారు. ప్రత్యేక హోదాతో ఏరాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు ప్రత్యేక హోదాతో ఏరాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఇది కేవలం రాజకీయ అస్త్రమేనని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రాయితీలు ఇచ్చామని, ఏడు జిల్లాల్లో ఏం మాత్రం పెట్టుబడులు తెచ్చారో తెలుగుదేశం నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని, ప్రజలను రెచ్చగొట్టడం, మభ్యపెట్టడం, తమపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఏపీ ప్రజల గొంతు కోసిందని, హైదరాబాద్లోనే అభివృద్ధి కేంద్రీకృతం చేసినందుకు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
మీ కుట్రలు సాగనివ్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిపాలనలో ఘోర వైఫల్యం, అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తప్పంతా కేంద్రంపై నెట్టివేసి తప్పుకోవాలని చూస్తోందంటూ భారతీయ జనతా పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తూ వచ్చిన టీడీపీ ఎన్నికల సంవత్సరం దగ్గరపడుతున్న సమయంలో కుట్రలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు కేంద్రాన్ని దోషిగా చూపించి లబ్ధి పొందాలన్న ఎత్తుగడలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ అధిష్టానం సూచనలు జారీచేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీ వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత నాలుగేళ్లుగా కేంద్రం అందించిన సాయం వివరాలతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు 27 పేజీల నివేదికను ఢిల్లీలో విడుదల చేశారు. కేంద్రం సహాయం చేయడంలేదన్న టీడీపీ వాదనలకు గణాంకాలతో చెక్ పెట్టారు. పొత్తులపై తేల్చుకోవాల్సింది టీడీపీయేనంటూ కుండబద్దలు కొట్టారు. రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలను రెచ్చగొట్టవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచలేమన్నందుకే మాపై కుట్ర చేస్తున్నారా? అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. కేంద్రం ఎంతో సాయం చేస్తుందంటూ నాలుగేళ్లుగా పొగిడిన చంద్రబాబు ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయించారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో టీడీపీ ఎంపీలు ఎలా భేటీ అవుతారంటూ నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా గొడవ చేస్తున్నారంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తమను ముంచాలని చూస్తే చంద్రబాబే మునిగిపోతారని హెచ్చరించారు. కేంద్రం ఎంత ఇచ్చిందో, ఎంత ఖర్చుచేశారో బహిరంగ ప్రకటన చేయాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈవెంట్ల పేరుతో, సదస్సుల పేరుతో ఫైవ్స్టార్ హోటళ్లకు కోట్లాది రూపాయలు తగలేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఏపీకి నిధుల లోటు ఉందంటే ప్రజలు కూడా నమ్మబోరని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం దుబారాపై చర్చకు సిద్ధమా? అంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. టీడీపీ కేంద్రంలో అధికారంలో కొనసాగుతూ... ప్రభుత్వ నిర్ణయాలను ఒకవైపు ఆమోదిస్తూ... మరోవైపు ప్రజలను మభ్యపెట్టడానికి సభలో నిరసనలకు దిగుతున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బీజేపీ నేతలు అస్త్రాలను సన్నద్ధం చేసుకుంటున్నారు. రాజీనామాలు ఎందుకు చేయడం లేదు? ఇటీవల చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రెండు ఎకరాల ఆసామి రెండు వేల కోట్లకు పైగా ఆస్తులు ఎలా సమకూరాయని కూడా ఆయన పరోక్షంగా సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఆ సమయంలో టీడీపీ నేతలు వీర్రాజు ఇంటిపై దాడికి తెగబడ్డారు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలతో వీర్రాజుపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. చంద్రబాబును విమర్శించే ముందు వీర్రాజు తమ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని డిమాండ్ చేశారు. అలాగైతే కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం నేతలు కేంద్ర మంత్రి పదవులకు ఎందుకు రాజీనామాలు చేయలేకపోతున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పదవుల్లో కొనసాగుతూ ప్రశ్నించే అర్హత టీడీపీ వారికి లేనేలేదని, ఇదే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నదే తమ వ్యూహమని చెబుతున్నారు. అదే సమయంలో ఈ నాలుగేళ్లలో కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను, ఇతర ప్రాజెక్టులను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నామని పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని, అవినీతి అక్రమాలను పాల్పడిందని, వాటినీ ప్రజలకు వివరిస్తామని చెబుతున్నారు. పోలవరం, రాజధాని నిధులే కాకుండా వివిధ పథకాల కింద వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ నేతలు పక్కదారి పట్టిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నియోజకవర్గంలోనే రూ.10 కోట్లమేర ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టిన వైనాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు పేర్లు మార్చి తన సొంత పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారని, కనీసం ప్రధాని ఫొటో కూడా పెట్టడం లేదని ఇప్పటికే బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సోము వీర్రాజు ప్రకటనల తరువాత బీజేపీ రాష్ట్ర నేతల ప్రచారాలు ప్రజల్లోకి వెళ్లకుండా కట్టడికి తెలుగుదేశం నేతలు కొన్ని లీకులు ఇప్పించి సోము వీర్రాజును ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్షా మందలించినట్లు తమ మీడియాలో ప్రచారం చేయించారు. బీజేపీ నేతలు వాటిని ఖండించడమే కాకుండా మరింత ఉధృతంగా టీడీపీపై విమర్శల దాడి పెంచేందుకు సన్నద్ధమవుతున్నారు. సాక్షాత్తూ అమిత్షానే తమకు మార్గనిర్దేశం చేసినందున జిల్లా స్థాయి వరకు టీడీపీ మోసపూరిత నిరసన నాటకాన్ని ప్రజల ముందు ఎండగట్టాలని నిర్ణయించారు. బీజేపీ లేకపోతే టీడీపీకి అధికారమెక్కడిది? మిత్రపక్షంగా ఉంటూనే బీజేపీని నిర్వీర్యం చేయడానికి తెలుగుదేశం తెరవెనుక కుట్రలు చేస్తోందని ఆ పార్టీ నేతలు ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు. బీజేపీ నేతల నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తమ వారికి పనులు కూడా చేయనివ్వకుండా అధికారులకు ఆదేశాలిచ్చారని చెబుతున్నారు. ఇదంతా రాజకీయంగా దెబ్బతీసేందుకు చంద్రబాబునాయుడు తెరవెనుక ఆడిన నాటకమని పేర్కొంటున్నారు. కాకినాడ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారని గుర్తుచేస్తున్నారు. ‘బీజేపీకి రాష్ట్రంలో స్వతంత్రంగా 18% ఓట్లు సాధించుకొనే సత్తా ఉంది. గతంలో ఇది నిరూపితమైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిందంటే అది మా చలవే. టీడీపీ వైఎస్సార్సీపీకి కేవలం ఓట్ల తేడా ఐదు లక్షల ఓట్లే. మా వల్ల అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పడు మమ్మల్నే అణగదొక్కాలని చూస్తోంది’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు మండిపడ్డారు. ‘రాష్ట్ర బీజేపీ పార్టీనే కాకుండా జాతీయ పార్టీని, ప్రధాని మోడీని కూడా రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చూస్తోంది. దీనిని మేమెంత మాత్రం సహించబోము. మా తడాఖా ఏమిటో మేమూ చూపిస్తాం’ అని మరో బీజేపీ నేత చెప్పారు. లెక్కలు చెప్పడానికి భయమెందుకు? కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇచ్చిన నిధులు లెక్కలు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భయమెందుకని బీజేపీ రాష్ట్రనేత ఒకరు ప్రశ్నించారు. ‘‘టీడీపీ నేతలు నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం రాలేదని ఇప్పుడు చెబుతున్నారు. అసలు ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన వాటికి లెక్కలు కూడా చెప్పడం లేదు. పోలవరానికి ఇచ్చిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. యూసీలు ఇవ్వడానికి ఎందుకు అంత భయం? అక్కడ జరిగిన అవినీతి బయటపడుతుందని భయమా? రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధుల పరిస్థితీ అలాగే ఉంది. శాశ్వత నిర్మాణాలు కాకుండా తాత్కాలిక నిర్మాణాలంటూ ఆ నిధులు వృథా చేస్తున్నారు. తెరవెనుక లాలూచీలతో ఇవన్నీ తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించి అవినీతికి పాల్పడుతున్నారు. వీటన్నిటిలో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. నిధులు కేంద్రం నుంచి సహాయం రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన రిపోర్టులు ఉండాలి. ఇతర రాష్ట్రాలు త్వరితంగా డీపీఆర్లు పంపించి నిధులు రప్పించుకుంటుండగా ఇక్కడ మాత్రం అలా చేయడం లేదు. వారి వైఫల్యాలకు కేంద్రంపై, బీజేపీపై నిందలు వేస్తున్నారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
హరిబాబుకు 'విజయవాడ' షాక్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు విజయవాడ నగర శాఖ షాక్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా మంగళవారం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని డివిజన్ల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నగర అధ్యక్షుడు ఉమామహేశ్వరరాజును సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉమామహేశ్వరరాజునే నగర అధ్యక్షుడిగా కొనసాగిస్తూ మరో తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు నామినేటెడ్ పదవుల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సుమోటోగా ఉమామహేశ్వరరాజును సస్పెండ్ చేస్తున్నట్లు హరిబాబు ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, తనను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఉమామహేశ్వరరాజు ఆరోపించారు. -
వారంలో ఏపీ నూతన అధ్యక్షుడి ఎంపిక
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికను వారంలో పూర్తి చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. శుక్రవారం అమిత్ షా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోదీ రెండేళ్ల పాలన విజయాలపై ప్రచారం కోసం 30 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 21వ శతాబ్దం ఇండియదే అన్న లక్ష్యంగా తమ పాలన సాగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అవినీతి పాలన తర్వాత దేశానికి స్వచ్ఛమైన పాలన అందిస్తున్నామని అమిత్ షా తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని, రైతులకు ఉపయోగం కలిగేలా పథకాలు ప్రవేశపెట్టామని, దేశంలో వృద్ధి రేటును పెంచగలిగామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో సమతుల్యత పాటించినట్లు అమిత్ షా అన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపికపై టీడీపీతో చర్చలు జరుగుతున్నాయన్నారు. కాగా ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబు పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఏపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే విషయంలో తలమునకలై ఉంది. కాగా ఇప్పటికే తెలంగాణలో ఆపార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ ను నియమించిన విషయం తెలిసిందే. -
రైల్వే జోన్పై బీజేపీ-టీడీపీ డ్రామాలు
ఎంపీ హరిబాబు ప్రకటనపై సీపీఎం నిరసన డాబాగార్డెన్స్: విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు రైల్వేజోన్పై చేసిన కుట్రపూరిత ప్రకటనను సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావడానికి చాలా అవరోధాలు, సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సీపీఎం నగర కార్యదర్శి మాట్లాడుతూ మొన్నటి వరకు అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని ప్రకటనలు గుప్పించిన ఎంపీ హరిబాబు చావు కబురు చల్లగా చెప్పినట్టు విశాఖకు రైల్వేజోన్ రాదని పరోక్షంగా వెల్లడించారన్నారు. రైల్వేజోన్పై వేసిన కమిటీ విశాఖకు వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చిందని చెప్పడం వెనుక ఎంపీ కుట్ర ఉందన్నారు. చట్టంలో రైల్వేజోన్ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్న తర్వాత రైల్వేజోన్ ప్రకటించకుండా తీవ్ర జాప్యం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని భావిస్తున్నామన్నారు. ఇది బీజేపీ-టీడీపీ ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం విశాఖలో పెట్టి విశాఖకు రైల్వేజోన్ రాకుండా కుట్రకు పాల్పడినట్టు అర్థమవుతోందన్నారు. విశాఖకు అన్యాయం చేసే చర్యలను ప్రతిఘటిస్తామని, అమరావతికి రైల్వేజోన్ను తరలించే కుట్రలను బీజేపీ-టీడీపీ నాయకులు ఉపసంహరించాలని సీపీఎం డిమాండ్ చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.మణి, పార్టీ నగర కమిటీ సభ్యులు వెంకట్రెడ్డి, అప్పారావు, నరేంద్రకుమార్, డి రాజు, నూకరాజు, నాయుడు, రమణ, భూలోకరావు, కుమారి, విజయ తదితరులు పాల్గొన్నారు. -
బలమైనశక్తిగా బీజేపీ
పార్టీ సమీక్ష సమావేశంలో హరిబాబు ఎంవీపీ కాలనీ,(విశాఖపట్నం): ప్రధాని నరేంద్రమోదీ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ఇటీవల రాజమండ్రిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా బహిరంగ సభ జరిగిన తీరుపై ఆదివారం పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పార్టీ ఇన్చార్జ్ నాయకులు పాల్గొని, వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ మోదీ ప్రజారంజక పాలనకు ఆదరణ ఉందని చెప్పడానికి రాజమండ్రి బహిరంగ సభకు తరలివచ్చిన అశేష జనవాహిని నిదర్శనమన్నారు. అన్ని రాష్ట్రాలలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందనడంలో సందేహం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జ్ పి.వి.ఎన్.మాధవ్ మాట్లాడుతూ అమిత్షా సభకు ప్రతి మండలం నుంచి 50 నుంచి 100 మంది వంతున ఉత్తరాంధ్ర నుంచి సుమారు 10 వేల మంది పాల్గొన్నారని అన్నారు. నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా జరిగిన బహిరంగ సభ ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం సంతరించుకుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, మాజీ మంత్రి పెద్దింటి రామ్మోహనరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మళ్ల వెంకటరావు, ఎమ్.నాగేంద్ర, కాశీవిశ్వనాధరాజు, చెరువు రామకోటయ్య వివిధ జిల్లాలు, నియోజకవర్గంల ఇన్చార్జ్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. -
కాపుల రిజర్వేషన్లపై బీజేపీ పెద్దల ఆరా
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీలుగా గుర్తించాలంటూ రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ రెండు రోజుల కిందటే కాపుల రిజర్వేషన్ల పూర్వాపరాలపై నివేదిక పంపాలంటూ రాష్ట్ర నేతలకు సూచించారు. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఇందుకు సంబంధించిన వివరాలతో పాటు తునిలో జరిగిన పరిణామాలను వివరిస్తూ ఒక నివేదికను జాతీయ నాయకత్వానికి పంపారు. -
విశాఖ నుంచి మరో రెండు విమాన సర్వీసులు
విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, ముంబైకి జెట్ ఎయిర్వేస్ సంస్థ నూతన సర్వీసులను ప్రకటించింది. విశాఖ - ఢిల్లీ విమాన సర్వీసును ఆదివారం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు, ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. ప్రతీ రోజు ఉదయం 9.10 గంటలకు విశాఖలో విమానం బయల్దేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఢిల్లీలో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి రాత్రి 8.55 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇక, విశాఖ-ముంబై సర్వీసు ముంబైలో ఉదయం 6.25గంటలకు బయల్దేరి 8.25 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖలో రాత్రి 9.25 గంటలకు ప్రారంభమైన 11.25 గంటలకు ముంబై చేరుకుంటుంది. -
త్వరలోనే విశాఖ రైల్వే జోన్
విజయవాడ: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వేశాఖ లాంఛనాలన్నీ పూర్తి చేస్తోందని, త్వరలోనే ప్రకటన విడుదలవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జోన్ వచ్చిన తరువాత కొత్త రైళ్లు సాధించేందుకు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఎక్స్ప్రెస్ను విశాఖపట్నం నుంచి ప్రారంభించడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎక్కువ ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు. విశాఖపట్నం, తిరుపతిల నుంచి బోగీలను తెచ్చి విజయవాడలో రాజధాని ఎక్స్ప్రెస్కు కలిపి ఇక్కడ నుంచి నడపాలనే ప్రతిపాదన సరికాదని, బోగీలు రావడం ఆలస్యమైతే రైలు బయలుదేరడం ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. -
ప్రత్యేక హోదాపై బీజేపీ వెనకడుగు వేయదు
విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనకడుగు వేయలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో ప్రధాని మోదీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధిని విస్తరిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగానే ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కంభంపాటి హరిబాబు వివరించారు. -
ఏపీలో 2,184 కుటుంబాలకు ఆరోగ్య బీమా లబ్ధి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆరోగ్య బీమా పథకం కింద ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో 2,184 కుటుంబా లు లబ్ధిదారులుగా ఉన్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. బీమా పథకానికి సంబంధించి లోక్సభలో సోమవారం బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి దత్తాత్రేయ బదులిచ్చారు. అసంఘటిత రంగాల కార్మికులకు వర్తించేలా ఈ పథకం సేవలను విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. భవన, ఇతర నిర్మాణరంగ కార్మికులు, లెసైన్సు రైల్వే పోర్టర్లు, వీధి వ్యాపారులు, ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులు, బీడీ కార్మికులు, ఇళ్లలో పనులు చేసేవారు, పారిశుద్ధ్య, గని కార్మికులు, సైకిల్ రిక్షా, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఈ బీమాను అమలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. -
బీజేపీలో పలువురి చేరిక
లక్ష్మీపురం(గుంటూరు): విజయవాడలో కేంద్ర మంత్రులు ముప్పవరపు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుల సమక్షంలో ఆదివారం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కడప, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. పోరంకిలో జరిగిన సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో పార్టీలో చేరినవారిలో కృష్ణా జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.అశోక్, కడప జిల్లా 2014 ఎన్నికల అభ్యర్థి బి.ప్రభాకర్, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆర్.కృష్ణ, విజయవాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేంద్రం, గుంటూరు జిల్లాకు చెందిన నేతలు తాళ్ళ వెంకటేష్ యాదవ్, చంగలి కిషోర్కుమార్, లాలం కోటయ్య, కె.వెంకట్, కళ్యాణం శ్రీనివాసరావు, ఎ.వెంకటరత్నం, నెల్లూరు చంద్రబాబు, కొమిరిశెట్టి సాంబశివరావు, ఎన్.మధుసూదనరావు, జి.కె.నాయుడు, షేక్ గౌస్ మొహిద్దీన్, కె.శ్రీనివాసరావు, పోటిశెట్టి శివయ్య, బొందలపాటి వెంకటేశ్వరరావు, దాసరి శ్రీమన్నారాయణ, ఆకుల వీరరాఘవయ్య, వణకూరి వీరరాఘవరెడ్డి, పల్లెటి మాధవ, సాధు సాంబశివరావు, శ్రీను నాయక్, చింతా సుబ్బారావు తదితరులు ఉన్నారు. బీజేపీ సభ్యత్వం తీసుకున్న తాడిశెట్టి కార్యక్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు రసీదును కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ల నుంచి గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ అందుకున్నారు. పార్టీ అవసరాల నిమిత్తం 25 లాప్ట్యాప్లను వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు మురళి అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి. మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్రాజ్, ఆకుల సత్యనారాయణ, గుంటూరు జిల్లా పార్టీ నేతలు జమ్ముల శ్యామ్కిషోర్, యడ్లపాటి రఘునాధబాబు, ఆర్.లక్ష్మీపతి, ఆలూరు కోటేశ్వరరావు, మాదా రాధ, మాజీ కార్పొరేటర్లు రేఖా శ్రీను, ఇంకొల్లు శ్రీను, అడపా కాశీవిశ్వనాధం, బి.రాంబాబు, సంబరాసు వాసు, బి.రత్నకుమారి, భారతీ వాసు, తోట మహేష్, జ్యోతిరాజు పాల్గొన్నారు. -
భూములు లాక్కుంటే ఒప్పుకోం
రైతుల నుంచి గుంజుకుంటే వ్యతిరేకిస్తాం: కంభంపాటి హరిబాబు గుంటూరు: రాజధాని నిర్మాణానికి రైతుల భూములను బలవంతంగా లాక్కోవటాన్ని తాము వ్యతిరేకిస్తామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఒప్పించే అవసరమైన భూములను తీసుకోవాలన్నారు. గురువారం గుంటూరులో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చినట్లుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, రాజధాని నిర్మాణానికి సహకారంపై కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుందన్నారు. రాజధాని నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూములు అవసరమవుతాయో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ విధానాలు నచ్చి బీజేపీలో చేరేవారినే పార్టీలోకి ఆహ్వానిస్తామని, ఎవరినీ ప్రలోభాలు పెట్టి చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. మంత్రి పదవులు అనుభవించిన వారైనా బీజేపీలో చేరాక కార్యకర్త స్థాయి నుంచి పనిచేయాల్సిందేనని చెప్పారు. హుద్హుద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రకు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన విధంగా రూ. వెయ్యి కోట్ల సాయం పూర్తిగా అందుతుందని తెలిపారు. విశాఖలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వాటిల్లిన నష్టాన్ని కేంద్రమే భర్తీ చేస్తుందన్నారు. బాబు తీరునే పరిగణనలోకి తీసుకుంటాం.. బీజేపీతో పొత్తుల విషయంపై టీడీపీకి చెందిన మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమని, అవి వారి వ్యక్తిగతమనే భావిస్తామని హరిబాబు పేర్కొన్నారు. దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహారశైలినే తాము పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకు తరలించడంపై వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ను రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశం కల్పించాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమ, ప్రత్యేకాంధ్ర ఉద్యమ కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథ్బాబు, సీనియర్ నేత కావూరి సాంబశివరావు, నగర అధ్యక్షుడు ఆలూరి కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
రైతుల అనుమానాలు నివృత్తి చేశాకే...: హరిబాబు
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రైతుల అనుమానాలు నివృత్తి చేశాకే భూ సమీకరణ జరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. అయితే రాజధాని విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలను రాజధానిలో నిర్మించినా... అధికారుల కార్యాలయాలు ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హరిబాబు అన్నారు. పరిపాలనను వీలైనంత త్వరగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని హరిబాబు అన్నారు. టీడీపీ-బీజేపీ మైత్రిపై చంద్రబాబు స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరగా ఇంటర్ బోర్డును ఏర్పాటు చేయాలని హరిబాబు కోరారు. ఉమ్మడి ఇంటర్ బోర్డు వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
టీడీపీతో కలిసుంటామో లేదో చెప్పలేం!
నాలుగేళ్ల తర్వాత పరిస్థితిపై ఇప్పుడేమీ చెప్పలేమన్న బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఏర్పడిందని, దీన్ని భర్తీ చేయడం ద్వారా బలమైన శక్తిగా ఎదుగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. బీజేపీ-టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని, రాజకీయాల్లో ఆరు నెలల కాలమే చాలా ఎక్కువని, నాలుగేళ్ల తర్వాత ఏమి జరుగుతుందో తాను జోస్యం చెప్పలేనన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని, జేఎస్పీ, లోక్సత్తా ఇతర ప్రతిపక్ష పార్టీల్లోనూ అనిశ్చితి నెలకొందని చెప్పిన ఆయన ఆ పార్టీల నుంచి అనేక మంది నేతలు బీజేపీలో చేరడానికి ముందుకువస్తున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ కన్నా వల్ల బీజేపీ సీమాంధ్రలో మరింత బలపడుతుందని చెప్పా రు. కొత్తవారిని బీజేపీ ఇముడ్చుకోలేదనే విమర్శ ఉందని, దాన్ని పోగొట్టేలా పాత నేతలు, కార్యకర్తలు వ్యవహరించాలని సూచించారు. మోదీని వ్యతిరేకించే పార్టీలు, నాయకులంతా బీజేపీకి ప్రత్యర్థులేనని చెప్పారు. విజయవాడలో రాజ ధాని ఏర్పాటును తాము బలపరిచామని, భూసమీకరణలో ఇబ్బందులు ఏర్పడితే వాటిని తొలగించాలని ప్రభుత్వానికి సూచిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఏపీలోనే ఉండి పనిచేయాలని గతంలోనే సూచించామని, త్వరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఏపీలో 58 ఏళ్లుగా ఒక్క జాతీయ విద్యా సంస్థ కూడా రాలేదని, ఎన్డీఏ ప్రభుత్వం 11 జాతీయ సంస్థలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఐఐఎం, ఐఐటీ, ఎయిమ్స్ వంటి సంస్థను ఒక్కో జిల్లాలో పెడుతూ అధికార వికేంద్రీకరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా నిర్ణయించి రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నది తమ అభిప్రాయమని, దీన్ని ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు. బీజేపీలో కార్యకర్తగా పనిచేస్తా : కన్నా ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీజేపీలో కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. గుంటూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో గుంటూరులో ఒక సభ పెట్టి మరింత మందిని చేర్పించాలని చూస్తున్నామని, ఈ సభకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వస్తానని చెప్పారన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్షా కూడా సభకు వచ్చేలా చూడాలని ఆయన హరిబాబును కోరారు. -
నేడు బీజేపీలోకి కన్నా లక్ష్మీనారాయణ
హైదరాబాద్ : మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆయన, తన మద్దతుదారులతో ఈరోజు ఉదయం 10.30 గంటలకు కాషాయ కండువా కప్పుకోనున్నారు. వారం క్రితమే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. -
ప్రజలే లక్ష్య సారథులు
విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వఛ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రజలే సారథ్యం వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. బీజేపీ నగర నాయకులు చిన్ని చిట్టిబాబు ఆధ్వర్యాన సోమవారం 58వ డివిజన్ సుందరయ్యనగర్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. విశాఖ ఎంపీ కె.హరిబాబు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు పాల్గొని రోడ్లు శుభ్రంచేసి చెత్తను తొలగించారు. హరిబాబు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పారిశుధ్య ప్రాముఖ్యత గుర్తించాలని సూచించారు. పరిసరాలను మనం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడు సహజంగా నగరం, రాష్ట్రంతోపాటు దేశం పరిశుభ్రంగా ఉంటుందని, దీని ద్వారా అంతర్జాతీయ సమాజంలో దేశానికి గౌరవం పెరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ వారానికి 2 గంటల సమయాన్ని పరిసరాలను శుభ్రం చేసేందుకు కేటాయించాలని కోరారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, నిరక్షరాస్యులకు పారిశుధ్యంపై అవగాహన లేకపోవడంతో వారు నివశిస్తున్న ప్రాంతాల్లో అధిక శాతం ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. బహిరంగంగా చెత్తను వేయకుండా అందరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖమంత్రి పి.మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ దేహ పరిశుభ్రత ఎంత అవసరమో పరిసరాల పరిశుభ్రత అంతే అవసరమని అన్నారు. అనంతరం స్వచ్ఛ భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని మంత్రులు స్థానిక ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శులు జమ్ముల శ్యాంకిషోర్, రవీంద్రరాజు, నగర అధ్యక్షుడు డి.ఉమామహేశ్వరరావు, నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, 58వ డివిజన్ కార్పొరేటర్ పైడి తులసి, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, ఎస్.నాగేశ్వరరావు, పి.పూర్ణచంద్రరావు తదిరులు పాల్గొన్నారు. -
పొన్నూరు అభివృద్ధికి విస్తృతఅవకాశాలు
పొన్నూరు రూరల్ నవ్యాంధ్రప్రదేశ్లో పొన్నూరు అభివృద్ధికి విస్తృతఅవకాశాలు ఉన్నాయని, అందుకు బీజేపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు హామీ ఇచ్చారు. సోమవారం ప్రారంభమైన పొన్నూరు పురపాలక సంఘ స్వర్ణోత్సవాలకు ఆయన విశిష్ట అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పొన్నూరు అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయ విశ్వ విద్యాలయానికి రైతు బాంధవుడు ఎన్జి రంగా పేరు పెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. తీరప్రాంతంలో 14 ఓడరేవులు ఉన్నాయని, వాటిలో నాలుగు మాత్రమే పని చేస్తున్నాయని ఆయన చెపుతూ పొన్నూరుకు అతి సమీపంలో ఉన్న నిజాంపట్నం ఓడరేవును అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అలాగే విజయవాడ నుంచి చెన్నై వరకు బంకింగ్ హామ్ కాలువ ద్వారా జల రవాణాను అభివృద్ధి చేస్తామన్నారు. పొన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు మరో ముఖ్య అతిథి ప్రభుత్వ, చీఫ్విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని చేపట్టాలని, తద్వారా పట్టణంలో పారిశుద్ధ్యం పాటించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ పొన్నూరు పట్టణం అభివృద్ధి చెందాలంటే సక్రమంగా పన్నులు చెల్లించాలని పౌరులకు సూచించారు. ఎమ్మెల్యే నరేంద్ర మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ నడిచిన పట్టణంలో ఎందరో ప్రముఖులు ఉన్నారని, వారి గురించి వివరించారు.అనంతరం పట్టణంలోని కొందరు ప్రముఖులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత సాంసృ్కతిక కార్యక్రమాలు పదర్శించారు. మున్సిపల్ చైర్పర్సన్ సజ్జా హేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, మహిళా నాయకురాలు స్వరూపరాణి, జెడ్పీటీసీ సభ్యుడు కోటా శ్రీనివాసరావు, ఎంపీపీ బొర్రు సీతమ్మ, మున్సిపల్ కమిషనర్ అన్నవరపు వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
'విశాఖలో భూముల కొరత వాస్తవమే'
హైదరాబాద్: విశాఖపట్నంలో పెట్టుబడులకు కంపెనీలు ముందుకొస్తున్నాయని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. పరిశ్రమలు పెట్టేందుకు భూమి కొరత ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. భూమి లభ్యతపై ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఛైర్మన్ను నివేదిక కోరామని వెల్లడించారు. నిజాంపట్నం, రేపల్లె మధ్య పార్మాసిటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పర్యావరణ అనుమతుల కోసం కేంద్రానికి లేఖ రాసినట్టు హరిబాబు తెలిపారు. విశాఖను మెగా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని 'రాజధాని' ప్రకటన సందర్భంగా టీడీపీ సర్కారు హామీయిచ్చింది. -
సాక్షి మెగా ఆటో షో.. అదరహో!
విశాఖ ఎంవీపీ కాలనీలో రెండు రోజుల సంరంభం ఒకే వేదికపైకి అన్ని కంపెనీల కార్లు, బైక్లు ఉత్సాహంగా తరలివచ్చిన సిటీజనులు కలల షి‘కారు’ను నిజం చేసే వేదిక...జాలీ రైడ్ బైక్ల మేళా.....‘సాక్షి మెగా ఆటో షో’ అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ కంపెనీలకు చెందిన పలు రకాల కార్లు, బైక్లతో విశాఖ ఎంవీపీ కాలనీలో కొలువుదీరింది. సందర్శకులకు కనువిందు చేసింది. వాహనప్రియులను ఆకట్టుకుంది. తొలిరోజు కొనుగోలుదారులతో సందడి నెలకొంది. నేడు కూడా షో కొనసాగనుంది. విశాఖపట్నం: ఓవైపు హుందాగా కొలువు తీరిన అందాలకార్లు.. ఇంకోవైపు చూపు తిప్పనివ్వని సొగసులతో చూడముచ్చటైన బైక్లు. అటు వాహన యోగాన్ని వాస్తవం చేయడానికి వరుసగా వచ్చిన ప్రఖ్యాత సంస్థల డీలర్లు.. ఇటు ఒళ్లంతా కళ్లుగా వాహనాలను తిలకిస్తూ, వాటి ఫీచర్లపై ఉత్సాహంతో ఆరా తీస్తున్న విశాఖ వాసులు. ఎన్నెన్నో సంస్థలు.. మరెన్నో వాహనాలు! అన్నీ ఒకే చోట బారులు తీరడంతో ఆసక్తిగా ఆరా తీస్తున్న విభిన్న వర్గాల ప్రజలు! తెలుగువారి మనస్సాక్షి ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నగరంలో ప్రారంభమైన మెగా ఆటోషోలో అలరించిన చిత్రమిది. అన్ని విక్రయ సంస్థలనూ ఒకే చోటికి తెచ్చి వినియోగదారుడి ఆకాంక్ష నెరవేర్చాలన్న ‘సాక్షి’ సత్సంకల్పం అందమైన కలలా అవతరించింది. ఘనంగా ప్రారంభం రెండు రోజుల పాటు జరిగే సాక్షి మెగాఆటో షోను విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఉప రవాణా కమిషనర్ ఎం.ప్రభురాజ్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శన ఆరంభించారు. ఎంవీపీ కాలనీ ఉడా గ్రౌండ్స్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని తర హా వాహనాలు ఒకే వేదిక మీద కొలు వు తీరడంతో అంతా ఆసక్తిగా వాటిని తిలకించారు. వాటి వివరాలు తెలుసుకున్నారు. చిన్నపాటి మోపెడ్ నుంచి ఖరీదైన లగ్జరీ కార్ల వరకూ బారులు తీరడంతో వాహన ప్రియులు తమకు నచ్చిన వాహనాల కోసం అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు కూడా సేవలు అందించారు. తక్కువ పన్నులతో ఎక్కువ మేలు తక్కువ పన్నులతో ఎక్కువ మేలు ఒనగూరుతుందని, కేంద్ర ప్రభుత్వానిదీ అదే లక్ష్యమని విశాఖ ఎంపీ కె.హరిబాబు ప్రకటించారు. ‘సాక్షి మెగా ఆటో షో’ను ప్రారంభించి ప్రజలతో మాట్లాడారు. అధిక పన్నుల విధానంతో వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ధరలు ఎక్కువగా ఉండడంతో ఉత్పత్తులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని వ్యాఖ్యానించారు. అన్ని సౌకర్యాలు ఒకే చోట అందుబాటులోకి తెచ్చి అమ్మకాలు చేపట్టడం హర్షణీయమన్నారు. ‘మెగా ఆటో షో’ నిర్వహించిన ‘సాక్షి’ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రతీ కౌంటర్ను హరి బాబు సందర్శించి ఆయా కంపెనీల ప్రతినిధులను ఉత్సాహపరిచారు. కార్ల లో, బైకుల మీద కూర్చుని వాహనాల విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అన్ని కంపెనీల షోరూం అన్ని కంపెనీలు ఒకే షోరూంలో ఉన్నట్టుగా ఉందని ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు అన్నా రు. వినియోగదారుడికి కావాల్సిన సదుపాయాలన్నీ ఒకే చోట అందించడాన్ని కొనియాడారు. ‘ఆటో షో’ల నిర్వాహణతో కంపెనీల ప్రాముఖ్యత పెరుగుతుందని, అమ్మకాలు పుంజు కుంటాయని అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ సేవలను ప్రశంసించారు. అందరికీ లాభదాయకం ‘ఆటో షో’ల నిర్వహణతో అమ్మకందారులు, కొనుగోలుదారులు ప్రయోజనం పొందుతారని రవాణా ఉప కమిషనర్ ఎం.ప్రభురాజ్కుమార్ చెప్పా రు. అన్ని కంపెనీలు ఒకే వేదికపైకి రావడంతో వినియోగదారుడు షో రూంల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. తనకు నచ్చిన వాహ నం ఎంచుకోవడం, కొనుగోలు చేయడంతో శ్రమ తగ్గుతుందని పేర్కొన్నా రు. ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు వ ర్తించడంతో ప్రయోజనం కలుగుతుం దని చెప్పారు. ‘మెగా ఆటో షో’లో రవాణా శాఖను భాగస్వామ్యం చేయడాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీవో ఎ.హెచ్.ఖాన్,సాక్షి యాడ్స్ జనరల్ మేనేజర్ కమల్ కిషోర్రెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు వినోద్, బి.రంగనాథ్, విశాఖ బ్రాంచి మేనేజరు కోటారెడ్డి, బ్యూరో చీఫ్ వి.శ్రీనివాస్, పాల్గొన్నారు. నేడు కూడా ఆటో షో ఆటో షో ఆదివారం కూడా కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఉదయం 10 నుంచి రాత్రి 8గంటల వరకూ సందర్శించవచ్చు. కొనుగోలుపై తీసిన డ్రాలో బంపర్ బహమతి ఉంటుంది. -
బీసెంట్రోడ్డులో బజ్జీలు తినాలనుంది!
మనసులోని మాట నగరంతో విడదీయరాని అనుబంధం కార్యకర్తలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ, న్యూస్లైన్ : విజయవాడ నగరంలో తిరగాలని.. బీసెంట్రోడ్డులో బజ్జీలు తినాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తన మనసులోని మాటను బయటపెట్టారు. బాధ్యతలున్న కారణంగా అది సాధ్యం కావడంలేదన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శనివారం తొలిసారి నగరానికి వచ్చిన ఆయన స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ.. రాజకీయ రాజధానిగా పేరున్న విజయవాడ నగరంతో తనకెంతో అనుబంధం ఉందని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో జరిగిన విషయాలను గుర్తుచేసుకున్నారు. బాధ్యతలు ఉన్నప్పుడు జీవితంలో కొన్ని త్యాగం చేయాలని తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలకు హితబోధ చేశారు. సభకు అధ్యక్షత వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. దేశంలో దృఢమైన నాయకత్వం, నీతినిజాయితీ గల ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించిన ప్రజలు నరేంద్రమోడికి పట్టం కట్టారని తెలిపారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ సీమాంధ్ర హక్కుల కోసం రాజ్యసభలో వెంకయ్యనాయుడు పోరాడారని కొనియాడారు. అనంతరం శతావధాని నాగఫణిశర్మ కేంద్ర మంత్రి, ఎంపీలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా, నగర శాఖలు, ఇతర విభాగాల కార్యకర్తలు వెంకయ్యనాయుడును ఘనంగా సన్మానించారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్ధార్థ ఆడిటోరియం వద్ద వెంకయ్యకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్రాజు (విశాఖ), ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి), మాణిక్యాలరావు (తాడేపల్లిగూడెం), కామినేని శ్రీనివాసరావు (కైకలూరు), మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్కిషోర్, నాయకులు రామినేని వెంకటకృష్ణ, దాసం ఉమామహేశ్వరరాజు, పూర్ణచంద్రరావు, లక్ష్మీపతిరాజా, మాలతీరాణి, ఎర్నేని సీతాదేవి, వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
'దేశాభివృద్ది కోసమే జనసేన మద్దతు'
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి కోసమే టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్సభ సభ్యుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. శుక్రవారం విజయవాడ వచ్చిన హరిబాబు విలేకర్లతో మాట్లాడారు. విజయవాడ, తెనాలి, గుంటూరు నగరాలను కలుపుతూ మెట్రో రైలును ఏర్పాటు చేయాల్సిన అవశ్యకతను ఆయన ఈ సందర్బంగా విశదీకరించారు. గత ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్ట్ హమీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు గత ఏడెనిమిదేళ్లుగా ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర, తెలంగాణ అభివృద్ధికే కాదు, దేశం యొక్క ఆర్థిక దిశను ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వల్లే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలల్లో టీడీపీతోపాటు ప్రముఖ టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వెళ్లింది. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్లో రెండు లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ముగ్గురికీ మొండిచెయ్యే
* లోక్సభకు ఎన్నికైన ముగ్గురిలో ఎవరికీ దక్కని అవకాశం * రాష్ట్రం నుంచి అనూహ్యంగా నిర్మలా సీతారామన్కు సహాయ మంత్రి పదవి * తమిళనాడులో జననం.. రాష్ట్రానికి చెందిన పరకాల ప్రభాకర్తో వివాహం సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన తొలి మంత్రివర్గ కూర్పులో అనుభవానికి, విధేయతకే పెద్దపీట వేశారు. 44 మంది మంత్రివర్గ సభ్యులలో రాష్ట్రానికి సంబంధమున్న ముగ్గురు నేతలకు స్థానం దక్కింది. అయితే సమైక్య రాష్ట్రంలో బీజేపీ తరఫున గెలిచిన ముగ్గురు లోక్సభ సభ్యులకు ఈసారి నిరాశ మిగిలింది. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడుగా పనిచేసిన వెంకయ్యనాయుడు, ప్రస్తుత బీజేపీ జాతీయ అధికారిక ప్రతినిధిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్, ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ కోటాలో విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజులను మంత్రి పదవులు వరించాయి. ఈ ముగ్గురు నేతలు సీమాంధ్ర ప్రాంతంతో సంబంధం ఉన్నవారే. తెలంగాణకు ఈసారి చాన్స్ లేకుండా పోయింది. లోక్సభ, రాజ్యసభలో కనీసం ఎంపీ కూడా కాని నిర్మలా సీతారామన్కు అనూహ్యంగా స్వతంత్ర హోదాలో కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కడమే రాష్ట్రంలో బీజేపీ నేతలను సైతం ఆశ్చర్యపరిచింది. ఆమె జన్మస్థలం తమిళనాడు రాష్ట్రం అయినప్పటికీ, మన రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయవేత్త పరకాల ప్రభాకర్కు ఆమె సతీమణి. సీతారామన్ పార్టీకి పూర్తిగా విధేయతగా ఉండడంతో పాటు జాతీయ అధికార ప్రతినిధిగా పార్టీ భావజాలాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఆమెకు ఈ పదవిని తెచ్చిపెట్టినట్టు భావిస్తున్నారు. వెంకయ్య కోసమే వీరికి చోటు దక్కలేదా? సీమాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం లోక్సభ నుంచి కంభంపాటి హరిబాబు(పార్టీ సీమాంధ్ర ప్రాంత రాష్ట్ర శాఖ అధ్యక్షుడు), నరసాపురం లోక్సభ నుంచి గోకరాజు గంగరాజు గెలుపొందగా.. తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. తెలంగాణ ప్రాంతం నుంచి పార్టీ తరఫున గెలిచిన దత్తాత్రేయ మంత్రి పదవి ఖాయమని బాగా ప్రచారం జరిగినప్పటికీ మోడీ తొలి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. నెల్లూరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వెంకయ్య నాయుడు గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా మంత్రిపదవి ఖాయమైనట్టు తెలుస్తోంది. వెంకయ్యకు చోటు కారణంగానే సీమాంధ్రలో లోక్సభ సభ్యులుగా తొలిసారి గెలిచిన హరిబాబు, గంగరాజు పేర్లు కనీసం పరిశీలనలోకి తీసుకోనట్టు సమాచారం. రాష్ట్రం నుంచి బీజేపీకి రాజ్యసభ సీటు? ఏ సభలోనూ ఎంపీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ త్వరలో రాష్ట్రం నుంచే రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ మరణించిన నేదురుమల్లి జనార్ధన్రెడ్డి స్థానంలో సీతారామన్ను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో సీమాంధ్రలో బీజేపీకి ఐదు లోక్సభ సీట్లు కేటాయించారు. అయితే తరువాత టీడీపీ కోరిక మేరకు ఒక లోక్సభ స్థానాన్ని కుదించుకొని బీజేపీ నాలుగు స్థానాల్లోనే పోటీ చేసింది. ఎన్నికల్లో తాము ఒక లోక్సభ స్థానం వదులుకున్నందుకు ప్రతిఫలంగా ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సీటు కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మోడీ ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని బీజేపీ నేతలంటున్నారు. -
కోనసీమ రైల్వేలైన్ సాధనకు కృషి చేయాలి
అమలాపురం రూరల్ : చిరకాలవాంఛ అయిన కోనసీమ రైల్వేలైను సాధనకు కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చొరవచూపేలా చేయాలని కోనసీమకు చెందిన బీజేపీ నాయకులు విశాఖపట్నం ఎంపీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును కలసి విజ్ఞప్తి చేశారు. కోనసీమ రైల్వే లైనుకు గతంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనే పునాది రాయ పడిందని..గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ లైను ఎలాంటి ప్రగతికి నోచుకోలేదని వివరించారు. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్న తరుణంలో కోనసీమ లైను నిర్మాణం తక్షణమే చేపట్టేలా కేంద్రాన్ని ఒప్పించాలని హరిబాబును కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, సీమాంధ్ర ఉద్యమ కమిటీ కన్వీనర్ కర్రి చిట్టిబాబు, రాష్ట్ర యువమోర్చా కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, జిల్లా యువమోర్చ ప్రధాన కార్యదర్శి యల్లమిల్లి కొండ, అమలాపురం పట్టణ యువమోర్చ అధ్యక్షుడు బసవా సత్యసంతోష్ తదితరులు హరిబాబును కలిసినవారిలో ఉన్నారు. వీరు విశాఖపట్నంలో ఆదివారం హరిబాబును కలిసి శుభాకాంక్షలు తెలపడంతోపాటు కోనసీమ పెండింగ్ సమస్యలపై చర్చించారు. ఈ విషయాన్ని నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్లి కోనసీమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హరిబాబు హామీ ఇచ్చారు. -
ముఖం చాటేసిన టీడీపీ కేడర్
విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కంభంపాటి హరిబాబు నామినేషన్ ఎలాంటి హడావిడి లేకుండా సాదాసీదాగా జరిగింది. దసపల్లా హిల్స్లోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ నేతలంతా ఒకే వాహనంపై బయల్దేరగా మిగిలిన నేతలంతా కారుల్లో ఊరేగింపుగా వెళ్లారు. తమ వెంట వస్తారనుకున్న జనసేన పార్టీ కేడర్(పవన్ అభిమానులు), టీడీపీ పార్టీ నేతలు షాక్ ఇవ్వడంతో ఊరేగింపు చ ప్పగా సాగింది. హరిబాబు వెంట బీజేపీ నేతలంతా హాజరుకాగా కేడర్ కూడా ముఖం చాటేసింది. దీంతో బీజేపీ నేతల ముఖాలు చిన్నబోయాయి. రాష్ర్ట అధ్యక్ష హోదాలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తుంటే కార్యకర్తలు మరీ ఇంత పలచగా హాజరవడంపై బీజేపీలో అంతర్మథనం మొదలైంది. టీడీపీ మాత్రం తాము లేకపోతే బీజేపీ సత్తా ఇంతేనంటూ పరోక్షంగా ఓటర్లకు తెలిసేందుకే ఇలా ప్రవర్తిస్తోందని ఆ పార్టీలోని కొందరంటున్నారు. హరిబాబు వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్రావు, నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు, మాజీ మేయర్ డి.వి.సుబ్బారావు, పార్టీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి విష్ణుకుమార్రాజు, పార్టీ నేతలు ఫృధ్వీరాజ్, రామకోటయ్య, తదితరులు ఉన్నారు. -
సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు
హైదరాబాద్ : సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడుగా ఆపార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం సభ్యుడు కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గురువారం హరిబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. విశాఖపట్టణానికి చెందిన ఆయన 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న కీలక నేత. 1999 ఎన్నికల్లో విశాఖ-1 ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా సీమాంధ్రకు హరిబాబు నియాకంతో ... ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కొనసాగించవచ్చని సమాచారం. -
రథసారథి కోసం బీజేపీ అన్వేషణ
* హరిబాబు, వీర్రాజులతో పాటు మరికొందరి పేర్ల పరిశీలన * కుల సమీకరణాలు, ఆరెస్సెస్ నేతలతో సంప్రదింపులు * టీడీపీతో పొత్తు లేకుంటేనే మేలంటున్న శ్రేణులు సాక్షి, విజయవాడ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) అధ్యక్షుడి కోసం అన్వేషణ ప్రారంభించింది. ఎన్నికలకు ముందుగానే కొత్త అధ్యక్షుడ్ని ప్రకటించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. బీజేపీ జాతీయనేత ఎం.వెంకయ్యనాయుడుతో పాటు ఆ పార్టీ జాతీయ సంస్థాగత కార్యదర్శి సతీష్జీ రెండు రోజుల క్రితం నగరానికి వచ్చినప్పుడు ఈ మేరకు కసరత్తు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా 13 జిల్లాలకు చెందిన కొంతమంది ముఖ్య నేతలతో పాటు ఆరెస్సెస్ నేతలను కూడా సంప్రదించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పలు కోణాల్లో అన్వేషణ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్తో పాటు బీజేపీపై కూడా సీమాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సమర్థుడైన నాయకులు లేకపోతే ఈ ప్రాంతంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుందని, అందుకోసం కుల సమీకరణాలు, ఆరెస్సెస్కు అనుకూలంగా ఉండేవారి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జాతీయ క్రమశిక్షణ సంఘం చైర్మన్, విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యే కంభంపాటి హరిబాబు పేరును తొలుత పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వెంకయ్యనాయుడుతో కలిసి ఆంధ్రా యూనివర్సిలో విద్యార్థి సంఘనేతగా ఎదిగిన హరిబాబుకి మంచి వ్యూహాకర్తగా గుర్తింపు ఉంది. వెంకయ్యనాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా హరిబాబు ఇక్కడే ఉండి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ఆ పార్టీ జాతీయ నాయకుల దృష్టికి తీసుకు వెళ్లడంతోనూ కీలక పాత్ర పోషించారు. మరో సామాజిక వర్గానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా నేత, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పేరు కూడా పరిశీలనలో ఉంది. గతంలో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవంతో పాటు ఆరెస్సెస్ ముఖ్య నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో జరిగే ఆరెస్సెస్ కార్యక్రమాల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సామాజిక వర్గాలకు కాకుండా చిత్తూరు జిల్లా నేత నరసింహారెడ్డి లేదా నెల్లూరు జిల్లా నేత ఎస్.సురేష్రెడ్డిల పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్కిషోర్ సైతం రేస్లో ఉన్నట్లు సమాచారం. అయితే రాజకీయ రాజధాని అయిన కృషా ్ణజిల్లా నుంచి అధ్యక్ష పదవికి పోటీపడేవారు ఒక్కరూ లేకపోవడం విశేషం. ఆర్థిక వనరుల మాటేంటి? పార్టీని రాష్ట్ర స్థాయిలో నడపడం ఖర్చుతో కూడుకున్నదని నేతలందరికీ తెలుసు. ఇప్పటివరకు పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ కీలకనేతలైన బండారు దత్తాత్రేయ, కిషన్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బద్దంబాల్రెడ్డి చూసుకునేవారు. వీరంతా తెలంగాణ ప్రాంతానికి పరిమితమైపోవడంతో ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కొత్తగా వచ్చే అధ్యక్షుడిపై పడుతుంది. దీంతో పదవిపై మోజు ఉన్నప్పటికీ నేతలు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. బీజేపీకి ప్రత్యేకంగా నిధులు ఇచ్చేవారు కూడా ఈ ప్రాంతంలో తక్కువేనని, కొద్దిమంది ఉన్నా జాతీయస్థాయిలోనే అందజేస్తారని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు లేకపోతేనే లాభం టీడీపీతో పొత్తులేకుండా ఉంటేనే లాభమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దేశం లో నరేంద్రమోడీ గాలి వీస్తోందని, అందువల్ల కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారంటున్నారు. మొదటి నుంచి విభజనకు అనుకూలమని బీజేపీ చెబుతోందని, అయితే చంద్రబాబు వెళ్లి తమపార్టీ జాతీయ నేతల్ని కలిసి రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్నట్లు హడావుడి చేసి, ఇప్పుడు విభజన పాపాన్ని తమపైకి నెడుతున్నారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోఉంది. బాబుకు దూరంగా ఉండి సీమాంధ్రలో పార్టీని జాగ్రత్తగా అభివృద్ధి చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుపై దృష్టి రాష్ట్ర రాజధాని ప్రకటించేందుకు మరో ఆరేడు నెలలు పడుతుంది. అప్పటి వరకు విజయవాడలో ఉన్న పార్టీ కార్యాలయాన్నే రాష్ట్ర పార్టీ కార్యాలయంగా నడపాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ఆ పార్టీ కార్యాలయానికి సొంత భవనం ఉండటంతో పాటు విశాలంగా కూడా ఉండటంతో ఇదే సరిపోతుందని చెబుతున్నారు. -
సమైక్యంగా ఉంచమని చెప్పలేదు: కంభంపాటి
విశాఖపట్టణం: రాష్ట్ర విభజనకు మొదటి నుంచి తమ పార్టీ అనుకూలమని బీజేపీ సీనియర్ నాయకుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. బీజేపీ విధానం తెలంగాణే అని స్పష్టం చేశారు. ఏనాడు బీజేపీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని చెప్పలేదని అన్నారు. కొందరు నేతల ప్రయత్నాల వల్ల సీమాంధ్ర ప్రజలకు నిరాశ కలిగిందన్నారు. బీజేపీ ఏనాడు తన విధాన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదని గుర్తు చేశారు. మార్చి 1న విశాఖలో పీఎం ఫర్ మోడీ కార్యక్రమం జరుగుతుందని, దీనికి జాతీయ నేత వెంకయ్య నాయుడు హాజరు కానున్నారని చెప్పారు. మార్చి 20 నుంచి ఏప్రిల్ 10లోగా సీమాంధ్రలో నాలుగుచోట్ల మోడీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. -
అసంబద్ధంగా తెలంగాణ బిల్లు: హరిబాబు
నెల్లూరు: తెలంగాణ ముసాయిదా బిల్లులో సీమాంధ్ర అభివృద్ధి అంశాలు లేవని బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు అన్నారు. పూర్తి అసంబద్ధంగా తెలంగాణ బిల్లును రూపొందించారని ఆయన విమర్శించారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలని సూచించారు. సీమాంధ్రకు న్యాయం జరగకుండా ఉంటే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని తమ అధిష్టానాన్ని కోరుతామని చెప్పారు. విభజన బిల్లు సీమాంధ్రులకు అన్యాయం చేసేదిగా ఉందని అంతకుముందు హరిబాబు అన్నారు. పోలవరానికి న్యాయం జరగాలంటే కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ప్రమేయం లేకుండా ప్రాజెక్టు డిజైన్ ఉండాలన్నారు. ఇంతవరకూ ఏ రెండు రాష్ట్రాలకు ఒకే ప్రాంతం ఉమ్మడి రాజధానిగా లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఆయా పార్టీల అవసరాల మేరకు పొత్తు పెట్టుకుంటాయని స్పష్టం చేశారు.