Idea Cellular
-
వొడాఫోన్ ఐడియాకు వెరిజాన్, అమెజాన్ దన్ను!
మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియాలో విదేశీ దిగ్గజాలు వెరిజాన్, అమెజాన్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వొడాఫోన్ ఐడియాలో వాటా కొనుగోలుకి ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. సంబంధిత కథనం ప్రకారం ఏజీఆర్ బకాయిల కేసుపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో చర్చలు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, యూఎస్ వైర్లెస్ సేవల దిగ్గజం వెరిజాన్ కమ్యూనికేషన్స్ 400 కోట్ల డాలర్లు(సుమారు రూ.29,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. పదేళ్లలోగా ఏజీఆర్ బకాయిలను చెల్లించమంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తిరిగి వొడాఫోన్ ఐడియాలో వాటా కొనుగోలుకి విదేశీ దిగ్గజాలు చర్చలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ. 50,000 కోట్లు బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ భాగస్వామ్య సంస్థ వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 50,000 కోట్లమేర ఏజీఆర్ బకాయిలను చెల్లించవలసి ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. సుప్రీం ఆదేశాలమేరకు ఇప్పటికే కంపెనీ రూ. 7,850 కోట్లను చెల్లించిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. షేరు జోరు అమెజాన్, వెరిజాన్ ఇన్వెస్ట్మెంట్ యోచనలో ఉన్న అంచనాలతో ఇటీవల వొడాఫోన్ ఐడియా కౌంటర్కు డిమాండ్ పెరిగింది. దీంతో మూడు రోజులుగా ఈ షేరు దూకుడు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్చేసి రూ. 10.70 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 11.30 వరకూ ఎగసింది. -
మళ్లీ జియోనే టాప్!!
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 4జీ డౌన్లోడ్ స్పీడ్ ఛార్ట్లో మళ్లీ రిలయన్స్ జియోనే ముందంజలో నిలిచింది. ఆగస్టు నెలలో 22.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడుతో, అత్యంత వేగవంతమైన 4జీ ఆపరేటర్గా జియో నిలిచినట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. జియో డౌన్లోడ్ పరంగా దూసుకెళ్లగా.. ఐడియా సెల్యులార్ కంపెనీ హయ్యస్ట్ అప్లోడ్ స్పీడు నెట్వర్క్గా నిలిచినట్టు ట్రాయ్ రిపోర్టు తెలిపింది. జియో సగటు 4జీ డౌన్లోడ్ స్పీడులో, తన ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్టెల్ కంటే రెండింతలు ముందంజలో ఉంది. సెకనుకు 10 మెగాబిట్స్ డౌన్లోడ్ స్పీడ్ను జియో నమోదు చేసినట్టు ట్రాయ్ తన మైస్పీడ్ పోర్టల్లో ప్రచురించింది. అదేవిధంగా ఐడియా 4జీ నెట్వర్క్ డౌన్లోడ్ స్పీడ్ ఫ్లాట్గా 6.2 ఎంబీపీఎస్గానే ఉంది. వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్ జూలై నెలలో 6.4 ఎంబీపీఎస్గా ఉండగా.. ఆగస్టు నెలలో 6.7 ఎంబీపీఎస్కు పెరిగింది. ఐడియా 4జీ అప్లోడ్ స్పీడ్లో 5.9 ఎంబీపీఎస్తో అగ్రస్థానంలో ఉంది. వీడియోలను చూడటానికి, నెట్ బ్రౌజ్ చేయడానికి, ఈమెయిల్స్ను యాక్సస్ చేసుకోవడంలో డౌన్లోడ్ స్పీడ్ కీలక పాత్ర పోషిస్తోంది. -
మెగా టెల్కో ఆవిర్భావం..
న్యూఢిల్లీ: దేశీయంగా నంబర్వన్ టెల్కో ఆవిర్భావం దిశగా.. టెల్కో దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ భారత విభాగం విలీనం పూర్తయ్యింది. ఇకపై వొడాఫోన్ ఐడియాగా వ్యవహరించే ఈ సంస్థకు 40.8 కోట్ల మంది యూజర్లు, 35 శాతం మార్కెట్ వాటా ఉంటుంది. సుమారు 23.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు) విలువ చేసే ఈ డీల్తో వొడాఫోన్ ఐడియా నంబర్వన్ టెల్కోగా ఆవిర్భవించగా.. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న భారతి ఎయిర్టెల్ రెండో స్థానానికి పరిమితమవుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ (ఐడియా సెల్యులార్ ప్రమోటర్) అధిపతి కుమార మంగళం బిర్లా కొత్త సంస్థకు చైర్మన్గా వ్యవహరిస్తారు. దీనికి 12 మంది డైరెక్టర్ల బోర్డు ఉంటుందని ఇరు సంస్థలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఐడియా సెల్యులార్ ఎండీగా హిమాంశు కపానియా తప్పుకున్నారని, అయితే విలీన సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతారని పేర్కొన్నాయి. వొడాఫోన్ ఐడియాకు బాలేశ్ శర్మ సీఈవోగా ఉంటారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని నియమించే అధికారాలు వొడాఫోన్కు ఉంటాయి. తాజా డీల్తో మూడు ప్రైవేట్ టెల్కోలు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ (బీఎస్ఎన్ఎల్) మాత్రమే మార్కెట్లో మిగిలినట్లవుతుంది. రూ. 14,000 కోట్లు ఆదా.. వ్యయాలు తగ్గించుకునేందుకు, ప్రత్యర్థి సంస్థ రిలయన్స్ జియోను మరింత గట్టిగా ఎదుర్కొనేందుకు ఐడియా, వొడాఫోన్లకు ఈ విలీన డీల్ తోడ్పడనుంది. ఈ ఒప్పందంతో సుమారు రూ. 14,000 కోట్ల మేర వ్యయాలు ఆదా కాగలవని అంచనా వేస్తున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. డీల్ ప్రకారం వొడాఫోన్ ఇండియా సంస్థాగత విలువను రూ. 82,800 కోట్లుగాను, ఐడియా విలువను రూ. 72,200 కోట్లుగాను పరిగణించారు. కొత్త సంస్థలో వొడాఫోన్కి 45.1 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్నకు 26 శాతం వాటాలు ఉంటాయి. విలీన సంస్థ వొడాఫోన్ ఐడియాకు దేశవ్యాప్తంగా 32.2 శాతం మార్కెట్ వాటా, 9 సర్కిళ్లలో నంబర్ వన్ స్థానం లభిస్తుంది. ఐడియా రూ. 6,750 కోట్లు, వొడాఫోన్ రూ. 8,600 కోట్లు ఈక్విటీని సమకూర్చనున్నాయి. అటు రెండు కంపెనీల స్టాండెలోన్ టవర్ల వ్యాపార విక్రయంతో మరో రూ. 7,850 కోట్లు లభించనున్నాయి. ఇందులో టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ. 3,900 కోట్లు పోగా నికరంగా రూ. 19,300 కోట్ల మేర నగదు నిల్వలతో కంపెనీ పటిష్ట స్థానంలో ఉంటుంది. సంయుక్త ప్రకటన ప్రకారం కావాలనుకుంటే ఇండస్ టవర్స్లో 11.15 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కూడా విక్రయించవచ్చు. విలీన సంస్థకు రూ. 1,09,200 కోట్ల నికర రుణం ఉంటుంది. బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్కు ఈ డీల్ భారీ ఊరటనివ్వనుంది. 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి వొడాఫోన్ ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంది. అప్పట్లో హచిసన్ ఎస్సార్ నుంచి భారత టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్ 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, దీనికి సంబంధించి 2.5 బిలియన్ డాలర్ల పన్నులు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ అయిదేళ్ల తర్వాత నోటీసులు ఇచ్చింది. ఈ వివాదంపై అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ జరుగుతోంది. మరోవైపు తీవ్రమైన పోటీ కారణంగా కంపెనీ ఏకంగా 6.6 బిలియన్ డాలర్ల మేర నష్టాలు రైటాఫ్ చేయాల్సి వచ్చింది. టెలికంలో కన్సాలిడేషన్.. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఏకంగా 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారీగా ఆరంగేట్రం చేసినప్పట్నుంచీ టెలికం రంగంలో కన్సాలిడేషన్ జరుగుతోంది. నార్వే సంస్థ టెలినార్కి చెందిన భారత విభాగాన్ని కొనుగోలు చేయడం ద్వారా భారతి ఎయిర్టెల్ ఈ స్థిరీకరణకు తెరతీసింది. ఆ తర్వాత టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్ఎల్), టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర మొబైల్ వ్యాపారాలను కొనుగోలు చేసింది. ‘భారత్లో అగ్ర స్థాయి టెలికం సంస్థ నేడు ఆవిర్భవించింది. ఇది నిజంగానే చారిత్రక ఘట్టం. ఇది కేవలం ఒక వ్యాపార దిగ్గజ ఆవిర్భావం మాత్రమే కాదు. నవభారత నిర్మాణానికి, యువత ఆకాంక్షల సాధనకు తోడ్పడాలన్నది మా లక్ష్యం’ – కుమార మంగళం బిర్లా మైలురాయి డీల్: టెలికం శాఖ ఐడియా, వొడాఫోన్ ఇండియాల విలీనం దేశీయంగా అతి పెద్ద కార్పొరేట్ మైలురాయిగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. ‘ఆరోగ్యకరమైన పోటీతత్వ’ ధోరణులకు ఇది దోహదపడగలదని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ వ్యాఖ్యానించారు. ‘టెలికం మార్కెట్ స్థిరత్వ దిశగా సాగుతోంది. ఆ క్రమంలో ఈ అతి పెద్ద కార్పొరేట్ విలీన ఒప్పందం ఒక మైలురాయిలాంటిది’ అని అరుణ తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతీసేలా టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలు లేవన్నారు. -
విలీనం దిశగా మరో అడుగు
న్యూఢిల్లీ: టెలికం సంస్థలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్... తమ మొబైల్ వ్యాపార విభాగాల విలీన ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా టెలికం శాఖ (డాట్) నిర్దేశించినట్లుగా రూ.7,248 కోట్లు చెల్లించాయి. నిర్దిష్ట షరతులపై తమ నిరసనను తెలియజేస్తూ.. టెలికం శాఖకు చెల్లింపులు జరిపినట్లు ఐడియా వర్గాలు చెప్పాయి. విలీనానికి డాట్ డిమాండ్ ప్రకారం రూ.3,926.34 కోట్లు నగదు రూపంలో, మరో రూ.3,322.44 కోట్లు బ్యాంక్ గ్యారంటీ రూపంలో ఇచ్చినట్లు తెలిపాయి. ఇరు సంస్థల విలీనానికి జూలై 9న డాట్ షరతులతో అనుమతులిచ్చింది. 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు) విలువ, 35% మార్కెట్ వాటా, 43 కోట్ల యూజర్లతో విలీన సంస్థ దేశీయంగా అతి పెద్ద టెల్కోగా ఇది ఆవిర్భవించనుంది. విలీన సంస్థ రుణభారం రూ.1.15 లక్షల కోట్ల మేర ఉంటుంది. ఈ కంపెనీలో వొడాఫోన్కి 45.1%, ఆదిత్య బిర్లా గ్రూప్నకు 26%, ఐడియా షేర్హోల్డర్లకు 28.9% వాటాలుంటాయి. -
వొడాఫోన్, ఐడియా విలీనానికి నేడు డాట్ ఆమోదం!
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ల విలీనానికి టెలికం శాఖ (డాట్) సోమవారం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అవసరమైన బ్యాంకు గ్యారంటీలను ఐడియా సమర్పించడంతోపాటు వొడాఫోన్ ఇండియా రుణాల చెల్లింపుల బాధ్యత తలెత్తితే తాను తీసుకునేందుకు హామీ ఇవ్వడంతో వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారి పేర్కొన్నారు. వొడాఫోన్ ఇండియా, ఐడియా కలసి విలీనం ద్వారా వొడాఫోన్ ఐడియా లిమిటెడ్గా ఏర్పడనున్నాయి. దాంతో దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీగా ఇది మొదటి స్థానంలో ఉంటుంది. జియో ప్రవేశం తర్వాత మార్కెట్లో మనుగడ కష్టంగా మారడంతో ఈ రెండు సంస్థలు కలసి ఒక్కటవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
భారీగా కుప్పకూలిన ఐడియా
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లాకు చెందిన ఐడియా సెల్యులార్ కంపెనీ మరోసారి భారీగా కుప్పకూలింది. కంపెనీ కన్సాలిడేట్ నికర నష్టాలు మూడింతలు మేర ఎగిశాయి. నేడు ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర నష్టాలు రూ.962.20 కోట్లగా ఉన్నట్టు ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ నికర నష్టాలు రూ.327.70 కోట్లగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది కంటే ఈ ఏడాది ఐడియాకు నష్టాలు మరింతగా పెరిగాయి. క్వార్టర్ సమీక్షలో కంపెనీ మొత్తం ఆదాయం ఏడాది ఏడాదికి 22 శాతం తగ్గి రూ.6387.70 కోట్లగా రికార్డైంది. గతేడాది ఇది రూ.8,194.50 కోట్లగా ఉంది. ఏడాది వ్యాప్తంగా కంపెనీ నష్టాలు రూ.4168.20 కోట్లగా ఉన్నట్టు ఐడియా ప్రకటించింది. ఐడియా ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్) కూడా 114 రూపాయల నుంచి 105 రూపాయలకు తగ్గింది. ఇతర టెలికాం కంపెనీల ఆర్పూలతో పోలిస్తే ఐడియాదే తక్కువ. జియో ఆర్పూ 137 రూపాయలుండగా.. భారతీ ఎయిర్టెల్ ఆర్పూ 116 రూపాయలుగా ఉంది. ఐడియా సెల్యులార్ ఇలా నష్టాలు ప్రకటించడం వరుసగా ఇది ఆరోసారి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎంటీసీ సెటిల్మెంట్ రేటు భారీగా తగ్గడం, ఎక్కువ ఆర్పూ అందించే కన్జ్యూమర్లు, తక్కువ ధర కలిగిన అపరిమిత వాయిస్ డేటా ప్లాన్ల వైపు తరలివెళ్లడం ఐడియా స్థూల రెవెన్యూలపై ప్రభావం చూపినట్టు కంపెనీ ప్రకటించింది. కాగ, టెలికాం మార్కెట్లో నెలకొన్న తీవ్ర పోటీకర వాతావరణ నేపథ్యంలో ఐడియా, వొడాఫోన్లు జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఈ ఏడాది ప్రథమార్థంలో ఒకటి కాబోతున్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఐడియా కంపెనీ స్టాక్ 0.66 శాతం పెరిగి రూ.68.80 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్కు పోటీ : ఐడియా కొత్త ప్లాన్
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ రూ.249 ప్యాక్కు పోటీగా ఐడియా సెల్యులార్ సరికొత్త ప్రీపెయిడ్ ప్యాక్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎయిర్టెల్ మాదిరి ప్రయోజనాలతో ఎయిర్టెల్ టారిఫ్ మాదిరిగానే 249 రూపాయలతో ఐడియా ఈ కొత్త ప్యాక్ను తీసుకొచ్చింది. ఈ ప్యాక్ కింద ఐడియా రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటాను, అపరిమిత వాయిస్ కాల్స్ను(రోమింగ్ కలిపి), ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తంగా ఐడియా తన కస్టమర్లకు 56జీబీ డేటాను అందించనుంది. వాయిస్కాల్స్లో రోజుకు 250 నిమిషాలను, వారానికి 1000 నిమిషాలను మాత్రమే వెసులుబాటును ఐడియా కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ప్యాక్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఎయిర్టెల్ తాజాగా లాంచ్ చేసిన ఈ రూ.249 ప్యాక్లోనే ఐడియా మాదిరి ప్రయోజనాలనే లభిస్తున్నాయి. రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. దీని వాలిడిటీ కూడా 28 రోజులే. రిలయన్స్ జియో ఇవే ప్రయోజనాలను రూ.198కే అందిస్తోంది. అయితే ఐడియా తన రూ.249 ప్యాక్పై రోజువారీ, వారం వారీ కాలింగ్ పరిమితులను విధించగా.. ఎయిర్టెల్, జియోలు మాత్రం ఎలాంటి పరిమితులు విధించకుండా అపరిమిత కాల్స్ను ఆఫర్ చేస్తున్నాయి. వొడాఫోన్ కూడా వీటికి పోటీగా తన ప్యాక్ను తీసుకు రావాల్సి ఉంది. ఐడియా తన ప్రీపెయిడ్ యూజర్లు ఇటీవలే రోజుకు 5జీబీ డేటా అందించేలా రూ.998 ప్యాక్ను ప్రకటించింది. -
జియో దుమ్మురేపుతోంది...
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తూ... మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో, అంతకంటే శరవేగంగా మార్కెట్ షేరును తన సొంతం చేసుకుంటోంది. కేవలం 16 నెలల్లోనే దేశీయ మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది. ఆర్థిక సంవత్సరం 2017-18 డిసెంబర్ క్వార్టర్లో రిలయన్స్ జియో మార్కెట్ షేరు 19.7 శాతానికి విస్తరించినట్టు వెల్లడైంది. ఇది ఐడియా సెల్యులార్ లిమిటెడ్ కంటే అత్యధికం. రిలయన్స్ జియోకు చెక్ పెట్టడానికే ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు జతకట్టబోతుండగా... వారికి మరింత షాకిస్తూ ఐడియా సెల్యులార్ కంటే అత్యధికంగా మార్కెట్ షేరు రిలయన్స్ జియో తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం రిలయన్స్ జియో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించాలంటే కేవలం 90 బేసిస్ పాయింట్లే అవసరమని బ్లూమ్బర్గ్ క్వింట్ రిపోర్టు చేసింది. గత క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో రిలయన్స్ జియో రెవెన్యూ మార్కెట్ షేరు 584 బేసిస్ పాయింట్లు పెరిగిందని తెలిసింది. సబ్స్క్రైబర్ బేస్ కూడా 16 కోట్లను తాకింది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో జియో 23 బిలియన్ డాలర్లను మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టనుందని టెలికాంటాక్ రిపోర్టు చేసింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో మరింత వేగంగా మార్కెట్లో దూసుకుపోతుందని తెలిపింది. -
రూ . 500కే 4జీ స్మార్ట్ ఫోన్
సాక్షి, ముంబయి : మొబైల్ ఫోన్ యూజర్లకు అతితక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. నెలకు కేవలం రూ 60 రూపాయలకే వాయిస్, డేటా ప్లాన్స్తో రూ 500కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్ ఫోన్ల తయారీ కోసం టాప్ టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లు హ్యాండ్సెట్ కంపెనీలతో ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి. రిలయన్స్ జియో వంటి ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్న వాయిస్, డేటా ప్లాన్స్తో లోకాస్ట్ స్మార్ట్ఫోన్ల వైపు మళ్లుతున్న యూజర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తరహా స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు టాప్ 3 టెలికాం ఆపరేటర్లు సన్నాహాలు చేస్తున్నాయి. స్మార్ట్ఫోన్ ధరలు తగ్గుముఖం పడుతున్నందున హ్యాండ్సెట్ కంపెనీలతో ఒప్పందాల ద్వారా అత్యంత చౌకైన డేటా, వాయిస్ ప్లాన్లను అందిస్తామని టెలికాం కంపెనీల ప్రతినిధి పేర్కొన్నారు. ఫీచర్ ఫోన్ల తరహాలో స్మార్ట్ఫోన్ల ధరలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని చెప్పారు. రిలయన్స జియో నుంచి విపరీతమైన పోటీని తట్టుకుని యూజర్లను నిలుపుకునేందుకే భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. -
ఎయిర్సెల్ యూజర్లకు ఐడియా షాక్
న్యూఢిల్లీ : ఎయిర్సెల్ యూజర్లకు ఐడియా సెల్యులార్ షాకిచ్చింది. బకాయిలు చెల్లించని కారణంగా ఎయిర్సెల్తో ఉన్న ఇంటర్కనెక్ట్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు ఆ కంపెనీకి నోటీసులు పంపించినప్పటికీ స్పందించలేదని ఐడియా పేర్కొంది. ఎయిర్సెల్ ఈ బకాయిలన్నింటినీ చెల్లించిన తర్వాత ఇంటర్కనెక్ట్ సర్వీసులను పునరుద్ధరిస్తామని, అప్పటివరకు తాము ఈ సర్వీసులను అందజేయమని వెల్లడించింది. అయితే ఎంతమొత్తంలో ఎయిర్సెల్ బాకీ పడి ఉందో ఐడియా తెలుపలేదు. '' బకాయిలు చెల్లించని కారణంగా ఎయిర్సెల్ లిమిటెడ్తో మా ఇంటర్కనెక్ట్ సర్వీసులను రద్దు చేస్తున్నాం'' అని ఐడియా ఓ ప్రకటన విడుదల చేసింది. 2017 నవంబర్ నుంచి పలుమార్లు ఈ బకాయిలు చెల్లించాలని ఎయిర్సెల్ను కోరామని, కానీ ఆ ఆపరేటర్ బకాయిలు చెల్లించడంలో విఫలమైనట్టు పేర్కొంది. ఇంటర్కనెక్ట్ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్సెల్ ఈ పేమెంట్లను చెల్లిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ విషయంపై ఎయిర్సెల్ వెంటనే స్పందించలేదు. -
టవర్ల విక్రయానికి ఓకే!
న్యూఢిల్లీ: త్వరలోనే విలీనం కానున్న టెలికం దిగ్గజాలు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు దేశీయంగా తమ తమ టవర్ల వ్యాపారాలను ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విక్రయించాలని నిర్ణయించాయి. ఈ డీల్ విలువ సుమారు రూ. 7,850 కోట్లు. ఈ ఒప్పందాల కింద వొడాఫోన్ ఇండియాకి రూ.3,850 కోట్లు (592 మిలియన్ డాలర్లు), ఐడియాకి రూ.4,000 కోట్లు (615 మిలియన్ డాలర్లు) లభిస్తాయని ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. రెండు కంపెనీలకు కలిపి మొత్తం 20,000 టవర్లున్నాయి. డీల్పై ఐడియాకు డీఎస్పీ మెరిల్ లించ్, వొడాఫోన్కి మోర్గాన్ స్టాన్లీ సంస్థలు అడ్వైజర్లుగా ఉన్నాయి. ఈ డీల్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పూర్తి కాగలదని అంచనా. రెండో అతిపెద్ద టవర్స్ అపరేటర్గా ఏటీసీ.. తాజా కొనుగోలుతో ఏటీసీ భారత్లో ఇండస్ టవర్స్ తర్వాత రెండో అతిపెద్ద టవర్ ఆపరేటింగ్ సంస్థగా నిలుస్తుంది. డీల్ అనంతరం ఏటీసీ వద్ద దాదాపు 70,000 టవర్లుంటాయి. వొడాఫోన్, ఐడియా (11.15 శాతం వాటా), టాటా టెలీ సంస్థల జాయింట్ వెంచర్ అయిన ఇండస్ టవర్స్కి ప్రస్తుతం 1.25 లక్షల టవర్లున్నాయి. రెండు సంస్థల విలీనంపై ఈ టవర్ డీల్ ప్రభావమేమీ ఉండదని కంపెనీలు పేర్కొన్నాయి. ‘ఈ డీల్ పూర్తిగా నగదు రూపంలో ఉండనుంది. మా 9,900 టవర్లకు గాను సుమారు రూ. 4,000 కోట్లు లభిస్తుంది. వొడాఫోన్తో విలీనమయ్యే దాకా ఈ మొత్తాన్ని వేరే ప్రత్యేక ఖాతాలో ఉంచుతాం‘ అని ఐడియా ఎండీ హిమాంశు కపానియా తెలిపారు. ‘20,000 టవర్లలో వొడాఫోన్, ఐడియాకి చెందిన 6,300 టవర్లు దాదాపు ఒకే దగ్గర ఉన్నాయి. దీంతో వీటిని విక్రయిస్తే ప్రతి నెలా ప్రతి టవర్పై రూ.50,000 నుంచి రూ. 55,000 దాకా మిగులుతుంది. ఆ ప్రకారం చూస్తే భారీగా ఆదా అయినట్లే లెక్క‘ అని ఆయన వివరించారు. దాదాపు రూ. 54,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిధులు వెచ్చిస్తారా అన్న ప్రశ్నకు లేదని సమాధానమిచ్చారు. విలీన ఒప్పంద ప్రక్రియలో ఈ డీల్ కూడా భాగమేనని.. ప్రధాన వ్యాపారేతర అసెట్స్/టవర్స్ విభాగాలను మెర్జర్ ముందుగా లేదా విలీన సమయంలోనైనా విక్రయించాలని ఇరు సంస్థలు నిర్ణయించినట్లు ఆయన వివరించారు. కన్సాలిడేషన్ తప్పని పరిస్థితి.. కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో... సంచలన ఆఫర్లతో టెల్కో దిగ్గజాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో టెలికంలో కన్సాలిడేషన్ తెరతీస్తూ.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న వొడాఫోన్ ఇండియా, ఐడియా సంస్థలు కొన్నాళ్ల క్రితమే విలీన నిర్ణయం తీసుకున్నాయి. ఇది పూర్తయితే సుమారు 35% మార్కెట్ వాటాతో ఏకంగా 23 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే దిగ్గజ టెల్కో ఏర్పాటవుతుంది. అగ్రస్థానంలో కొనసాగుతున్న ఎయిర్టెల్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. -
ఐడియా నష్టాలు రూ.1,107 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన టెలికం కంపెనీ ఐడియా సెల్యులార్కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,107 కోట్ల నికర నష్టాలొచ్చాయి. ధరల విషయమై పోటీ తీవ్రంగా ఉండటం, జీఎస్టీ అమలు గట్టి ప్రభావమే చూపించాయని ఐడియా తెలిపింది. కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.92 కోట్ల నికర లాభం రాగా... ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో మాత్రం రూ.815 కోట్ల నికర నష్టాలు నమోదయ్యాయి. గత క్యూ2లో రూ.9,300 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 20 శాతం క్షీణించి రూ.7,466 కోట్లకు పడిపోయింది. 4జీ నెట్వర్క్ కోసం భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో వడ్డీ వ్యయాలు రూ. 1,183 కోట్లకు, తరుగుదల వ్యయాలు రూ.2,114 కోట్లకు పెరిగాయని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి నికర రుణ భారం రూ.54,100 కోట్లుగా ఉంది. 7 శాతం తగ్గిన ఏఆర్పీయూ: పోటీ కారణంగా టారిఫ్ల విషయంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నదని ఐడియా తెలిపింది. గతంలో 15 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉందని, ఇప్పుడు 18 శాతం జీఎస్టీ అదనపు భారమని వివరించింది. ‘‘ఈ జూన్ క్వార్టర్లో రూ.141గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి (ఏఆర్పీయూ) ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 7 శాతం తగ్గి రూ.132కు పరిమితమయింది. వచ్చే ఏడాది మొదట్లోనే అత్యంత వేగవంతమైన వాయిస్ ఓవర్ లాంగ్–టర్మ్ ఇవొల్యూషన్ను (ఓల్ట్) అందుబాటులోకి తేనున్నామని ఐడియా వెల్లడించింది. ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండడంతో బీఎస్ఈలో ఐడియా షేర్ 3 శాతం క్షీణించి రూ.94 వద్ద ముగిసింది. -
రిలయన్స్ రికార్డ్స్.. టెల్కోలు బేజారు
సాక్షి, ముంబై : ట్రాయ్ మంగళవారం ఇచ్చిన షాక్తో టెల్కోలు భారీగా దెబ్బతిన్నాయి. భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు బుధవారం మార్కెట్లో 7 శాతం పైగా నష్టపోయాయి. కాల్ టర్మినేషన్ ఛార్జీలను 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గిస్తూ టెలికాం రెగ్యులేటరీ ప్రకటించింది. ఈ ప్రకటన టెల్కోలకు తీవ్ర షాకింగ్కు గురిచేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలవుతాయని ట్రాయ్ పేర్కొంది. 2020 జనవరి నుంచైతే ఏకంగా ఈ ఛార్జీలను జీరోకి తీసుకురానున్నట్టు కూడా తెలిపింది. టర్మినేషన్ చార్జీ అన్నది ఒక నెట్ వర్క్ నుంచి వచ్చిన కాల్కు తన నెట్వర్క్ పరిధిలో అనుసంధానం కల్పించినందుకు వసూలు చేసే చార్జీ ఇది. దీంతో ప్రధాన టెల్కోలన్నీ తమ రెవెన్యూలను భారీగా కోల్పోనున్నాయి. ఈ నిర్ణయం జియోకు అనుకూలంగా ఉందని ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లు ఆరోపిస్తున్నాయి. దీన్ని కనీసం 30–35 పైసలుగా నిర్ణయించాలని టెల్కోలు కోరుతున్నాయి. ట్రాయ్ నిర్ణయంతో ఐడియా 7 శాతం నష్టపోయి రూ.76.85 వద్ద, ఎయిర్టెల్ 6 శాతం పడిపోయి రూ.370 వద్ద ట్రేడైంది. ట్రాయ్ తాజా నిర్ణయంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ పండుగ చేసుకుంటోంది. ఈ కంపెనీ షేర్లు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. రిలయన్స్ షేర్లు, ట్రాయ్ నిర్ణయంతో జియోకు వార్షికంగా రూ.3,800 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశముందని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. ఇదే సమయంలో ఎయిర్టెల్ రూ.1500-2000 కోట్లు, వొడాఫోన్ రూ.1500 కోట్లు, ఐడియా సెల్యులార్ రూ.1200 కోట్లు నష్టపోనున్నట్టు అంచనా వేస్తున్నాయి. జియో రాకతో ఇప్పటికే పతనమైన టెలికాం ఇండస్ట్రి, మరింత కుదేలు కానున్నట్టు ఎయిర్టెల్ ఆరోపిస్తోంది. -
జియోకు చెక్: రూ.32వేల కోట్లతో ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు చెక్ పెట్టడానికి దిగ్గజ కంపెనీలన్నీ భారీ ఎత్తున్న ప్లాన్లు వేస్తున్నాయి. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అయితే ఏకంగా రూ.32వేల కోట్లను వెచ్చించబోతుంది. తమ నెట్వర్క్ను విస్తరించుకోవడానికి వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.32వేల కోట్లకు పైగా వెచ్చించాలని చూస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా రెవెన్యూ మార్కెట్ షేరులో 3-4 శాతం పాయింట్లను అధికంగా ఇది దక్కించుకోవాలనుకుంటోంది. మిగతా కంపెనీలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు కూడా జియోకు అడ్డుకట్ట వేయడానికి విలీన ప్రక్రియకు తెరతీశాయి. ఇలా జియో దెబ్బకు అల్లాడుతున్న కంపెనీలన్నీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి పలు వ్యూహాలను రచిస్తున్నాయి. జియో గతేడాది సెప్టెంబర్లో లాంచ్ చేసిన కమర్షియల్ సర్వీసులతో టెలికాం ఇండస్ట్రిలోని ఇంక్యుబెంట్లు భారీ ఎత్తున్న నష్టపోతున్నాయి. జియోను తట్టుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేసినా.. అవి వర్క్వుట్ కావడం లేదు. కానీ ఈ సారి ఎయిర్టెల్ పెద్ద ఎత్తునే ప్లాన్ వేస్తోంది.ఈ టెలికాం దిగ్గజం ఆర్పూ(ఒక్కో యూజర్పై ఆర్జించే కనీస రెవెన్యూ)ను కాపాడుకోవడం కోసం ధరలను మరింత తగ్గించుకోవాలనుకోవడం లేదని కూడా తెలుస్తోంది. ఎయిర్టెల్ ప్రస్తుతం పెడుతున్న పెట్టుబడులతో డేటా నెట్వర్క్ను భారీగా విస్తరించనుంది. అంతేకాక వీటిని స్పెక్ట్రమ్ కొనుగోలుకు వెచ్చించనుంది. ఈ ఏడాది రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు మూలధన ఖర్చు రూపంలో వెచ్చించనున్నామని, వచ్చే రెండేళ్లలో కూడా అంతేమొత్తంలో ఇన్వెస్ట్ చేయనున్నట్టు కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ కంపెనీకి క్యాష్ఫ్లోస్ కూడా వార్షికంగా రూ.20వేల కోట్లు మేర ఉన్నట్టు తెలిసింది. గతేడాది కూడా ఎయిర్టెల్ తన నెట్వర్క్లను అప్గ్రేడ్ చేసుకోవడానికి భారీగానే వెచ్చించింది. వీటికోసం రూ.15వేల కోట్లను ఖర్చుచేసింది. వొడాఫోన్ రూ.8300 కోట్లను, ఐడియా రూ.8000 కోట్లను తమ నెట్వర్క్ల అప్గ్రేడ్ కోసం ఖర్చు చేసినట్టు తెలిసింది. -
ఐడియా సెల్యులర్...ఫ్యూచర్స్ సిగ్నల్స్
బుధవారం అధిక ట్రేడింగ్ పరిమాణంతో పెరిగిన షేర్లలో ఐడియా సెల్యులర్ ఒకటి. ఈ షేరు 4.9 శాతం ఎగిసి రూ. 82.60 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో 3.16 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో ఇంతటి భారీ ట్రేడింగ్ పరిమాణం నమోదుకావడం గత 7 వారాల్లో ఇదే ప్రధమం. ఈ సందర్భంగా ఐడియా ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 23.73 లక్షల షేర్లు (3.69 శాతం) కట్ అయ్యాయి. మొత్తం ఓఐ 6.19 కోట్ల షేర్లకు తగ్గింది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 40 పైసల మేర స్థిరంగా వుంది. ఫ్యూచర్లో జరిగిన షార్ట్ కవరింగ్ను ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. ఆప్షన్స్ విభాగంలో రూ. 80 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగాయి. కాల్ ఆప్షన్ నుంచి 12.8 లక్షల షేర్లు కట్కాగా, మొత్తం బిల్డప్ 13.65 లక్షలకు తగ్గింది. పుట్ ఆప్షన్లో 6.30 లక్షల షేర్లు యాడ్కాగా, బిల్డప్ 19.95 లక్షల షేర్లకు పెరిగింది. రూ. 85 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ ఫలితంగా 5.74 లక్షల షేర్లు యాడ్కాగా, బిల్డప్ 34.72 లక్షల షేర్లకు చేరింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు క్షీణిస్తే రూ. 80 సమీపంలో మద్దతు పొందవచ్చని, క్రమేపీ రూ. 85 స్థాయిని చేరవచ్చని ఆప్షన్ రైటర్ల యాక్టివిటీ వెల్లడిస్తున్నది. -
ఛార్జీల బాదుడు.. ఐడియాకు ఫైన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద టెలికాంగా పేరున్న ఐడియా సెల్యులార్కు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ రూ.2.97 కోట్ల జరిమానా విధించింది. మహారాష్ట్ర, తమిళనాలడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ వినియోగదారులపై ఎక్కువ ఛార్జీలు విధించిందనే కారణంతో ట్రాయ్, ఐడియా సెల్యులార్కు ఈ జరిమానా వేసింది. 2005 మే నుంచి 2007 జనవరి మధ్యకాలంలో బీఎన్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్వర్క్స్ కాల్స్ను టర్మినేట్ చేసేటప్పుడు ఐడియా ఈవిధంగా భారీమొత్తంలో ఛార్జీలు విధించింది. ప్రస్తుతం వొడాఫోన్ ఇండియాతో విలీనం కాబోతున్న ఐడియా, 15 రోజుల్లో టెలికాం కన్జ్యూమర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ వద్ద ఈ మొత్తాన్ని జమచేయాల్సి ఉంటుంది. ట్రాయ్ యాక్ట్ 1997 లోని అధికారాలతో ఈ అథారిటీ ఐడియాకు రూ.2,97,90,173 మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. 2005 మే నుంచి 2007 జనవరి మధ్యకాలంలో సబ్స్క్రైబర్లపై ఎక్కువ ఛార్జీలు వేసిన కారణంతో ఈ ఆదేశాలు జారీచేసినట్టు ట్రాయ్ పేర్కొంది. ఒకే రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి ఐడియా పలు టారిఫ్లను విధిస్తుంది. 2005 మేలో టెలికాం డిపార్ట్మెంట్ సవరించిన లైసెన్స్ షరతులకు ఈ టారిఫ్లు వివక్షతతో, అస్థిరంగా ఉన్నాయి. -
బుల్ రన్కు రెస్ట్.. నష్టాల్లో మార్కెట్లు
ముంబై : గత నాలుగు సెషన్లుగా దూసుకెళ్తూ.. రికార్డు గరిష్టాలను తాకుతున్న బుల్ రన్కు స్టాక్ మార్కెట్లు రెస్ట్ ఇచ్చాయి. బ్యాంకు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ ఫలితాల్లో నిరాశపరచడంతో, ఆ కంపెనీల షేర్లు నష్టాలు పాలయ్యాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంలో 32,309.88 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంలో 10,014.50 వద్ద క్లోజయ్యాయి. నష్టాలు పాలైనప్పటికీ, నిఫ్టీ తన కీలకమైన మార్కు 10వేల నుంచి కిందకి దిగలేదు. మొట్టమొదటిసారి ఈ మార్కును మంగళవారం సెషన్లో తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ తనకు ఎంతో కీలకమైన మార్కును ఛేదించడంతో, లాభాల స్వీకరణ చోటుచేసుకోవడం సాధారణమని విశ్లేషకులంటున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లలో కొంత ధర కరెక్షన్కు గురైందని చెప్పారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ నేటి మార్కెట్లో అత్యధికంగా 6.5 శాతం నష్టపోయింది. మే 30 తర్వాత ఇదే అత్యంత కనిష్టస్థాయి. ఈ కంపెనీ ఫలితాల్లో నిరాశపరచడంతో, షేర్లు నష్టాలు పాలయ్యాయి. ఐసీఐసీఐ కూడా లాభాల్లో 8 శాతం డౌన్ కావడంతో, ఈ బ్యాంకు షేర్లు కూడా 3 శాతం పడిపోయాయి. వరుసగా మూడు క్వార్టర్లోనూ ఐడియా సెల్యులార్ తీవ్ర నష్టాలను నమోదుచేసింది. దీంతో ఈ కంపెనీ స్టాక్ 5.6 శాతం డౌన్ అయింది. కానీ సిగరెట్ల నుంచి బిస్కెట్ల వరకు తయారీచేస్తున్న ఐటీసీ లిమిటెడ్ మంచి ఫలితాలను ప్రకటించడంతో, షేర్లు 2 శాతం పెరిగాయి. నేటి సెషన్లో రెండు సూచీల్లోనూ హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, యస్ బ్యాంకు మంచి లాభాలను ఆర్జించగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లుపిన్, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 64.16గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 53 రూపాయల నష్టంతో 28,423వద్ద ఉన్నాయి. -
ఐడియాకు జియో దెబ్బ
► వరుసగా మూడో క్వార్టర్లోనూ నష్టాలే ► క్యూ1లో రూ. 816 కోట్ల నష్టం న్యూఢిల్లీ: రిలయన్స్ జియో చౌక ఆఫర్ల దెబ్బ నుంచి ఐడియా సెల్యులార్ కోలుకోలేకపోతోంది. వరుసగా మూడో త్రైమాసికంలోనూ నష్టాలే చవిచూసింది. మార్చి త్రైమాసికంలో రూ.326 కోట్లు నష్టపోయిన ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకంగా రూ.816 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. గతేడాది క్యూ1లో కంపెనీ నికర లాభం రూ. 217 కోట్లు. ఇక తాజాగా ఐడియా ఆదాయం సైతం 14% క్షీణించి రూ. 9,552 కోట్ల నుంచి రూ. 8,182 కోట్లకు పడిపోయింది. రిలయన్స్ జియో తమ ఉచిత 4జీ సర్వీసులను మార్చిలోనే నిలిపివేసినప్పటికీ.. ఐడియా ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం కొనసాగింది.‘కొత్త సంస్థ ఉచిత సేవల నుంచి పెయిడ్ సర్వీసులకు మళ్లినా.. అన్లిమిటెడ్ వాయిస్కాల్స్, డేటా ప్లాన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తుండటంతో దేశీ వైర్లెస్ పరిశ్రమపై ఆ ప్రతికూల ప్రభావాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ కొనసాగాయి’ అని ఐడియా పేర్కొంది. డేటా వినియోగం పెరిగింది .. దీటుగా పోటీనిచ్చే క్రమంలో తామూ అన్లిమిటెడ్ ప్లాన్లను ప్రవేశపెట్టడంతో పరిశ్రమ ఆదాయాలు మరింత తగ్గే అవకాశం ఉందని ఐడియా తెలిపింది. అయితే, రేట్లు తగ్గించినప్పటికీ.. వినియోగ పరిమాణం పెరగడం వల్ల మొబైల్ వాయిస్, డేటా సెగ్మెంట్లలో నష్టం కొంత భర్తీ అయినట్లు ఐడియా తెలిపింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన మొబైల్ డేటా పరిమాణం ఏకంగా 99.1% ఎగిసిందని, 252.8 బిలియన్ మెగా బైట్స్ మేర డేటా వినియోగం అయ్యిందని వివరించింది. ఇక, జూన్ చివిరికి కంపెనీ రుణభారం రూ. 53,920 కోట్లు. ఇందులో సింహభాగం స్పెక్ట్రం చెల్లింపుల కోసం తీసుకున్న రుణాలే ఉన్నాయి. గురువారం బీఎస్ఈలో ఐడియా షేరు 2 శాతం క్షీణించి రూ. 92.65 వద్ద ముగిసింది. -
జియో దెబ్బ: ఐడియాకి భారీగా తగిలింది
ముంబై : టెలికాం మార్కెట్లోకి సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో దెబ్బ నుంచి టెలికాం దిగ్గజాలు కోలుకోలేకపోతున్నాయి. దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఇటీవలే భారీగా తన లాభాలను కోల్పోగా.. మరో టెలికాం అగ్రగామి ఐడియా సెల్యులార్ కూడా జియో తాకిడిని తట్టుకోలేక కుదేలైంది. గురువారం ప్రకటించిన 2017-18 తొలి క్వార్టర్ ఫలితాల్లో ఐడియా సెల్యులార్ నికర నష్టాలు రూ.815 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ కంపెనీ లాభాలు రూ.220 కోట్లగా ఉన్నాయి. గత మార్చి క్వార్టర్లో కూడా కంపెనీ రూ.325.60 కోట్ల నష్టాలను నమోదుచేసింది. ఈ క్వార్టర్లో ఐడియా నష్టాలు మరింత ఎగిశాయి. కంపెనీ ఆదాయం కూడా 14 శాతం మేర పడిపోయి రూ.8,182 కోట్లగా ఉన్నట్టు ఐడియా తెలిపింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఐడియా రూ.671 కోట్ల నష్టాలను మాత్రమే ఎదుర్కొంటుందని భావించారు. కానీ వారి అంచనాలకు మించిపోయి మరింత నష్టాల్లోకి ఐడియా కూరుకుపోయింది. జియో ఆఫర్ చేస్తున్న అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్స్ వల్ల తాము కుదేలవుతున్నట్టు ఐడియా చెప్పింది. జియోకు తగ్గ ప్లాన్స్ను అమలుచేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంటుందని తెలిపింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియోతో, దేశీయ టెలికాం మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అప్పటి నుంచి కంపెనీలు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. జియో ధరల యుద్ధంతో కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి. కాగ, మొత్తం రెవెన్యూలు ఐడియా కంపెనీవి క్వార్టర్ క్వార్టర్కు 0.5 శాతం పెరిగాయి. కానీ ఏడాది ఏడాదికి 13.9 శాతం తగ్గాయి. జియోను దెబ్బతీయడానికి ఐడియా, వొడాఫోన్ ఇండియాతో విలీనం కాబోతుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించబోతున్నాయి. -
ఫ్రెషర్ల కంటే తక్కువగా బిర్లా వేతనం
టెలికాం మార్కెట్ లో రిలయన్స్ జియో దెబ్బ అంతా ఇంతా కాదు. టెలికాం దిగ్గజాల రెవెన్యూలు భారీగా తుడిచిపెట్టుకుపోవడమే కాక, ఆ కంపెనీ చైర్మన్ ల వేతనాలకు భారీగా గండికొడుతోంది. ఐడియా సెల్యులార్ కు చైర్మన్ గా ఉన్న కుమార్ మంగళం బిర్లా 2017 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల కంటే తక్కువగా వేతనాన్ని ఆర్జించారని తెలిసింది. 2017 ఆర్థికసంవత్సరంలో ఆయన కేవలం రూ.3.30 లక్షల వేతనాన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్లారని కంపెనీ వార్షిక రిపోర్టులో వెల్లడించింది. గతేడాది ఈయన వేతనం రూ.13.15 కోట్లు. 2017లో చైర్మన్ కు లేదా ఇతర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు కంపెనీ ఎలాంటి కమిషన్లను చెల్లించలేదు. దశాబ్దం క్రితం ఐపీఓకు వచ్చిన తర్వాత తొలిసారి ఈ టెలికాం ఆపరేటర్ వార్షిక నికర నష్టాలను నమోదుచేసింది. రెవెన్యూలను పడిపోయినట్టు పేర్కొంది. కన్సాలిడేటెడ్ బేసిస్ లో ఐడియా రెవెన్యూలు 0.8 శాతం పడిపోవడంతో రూ.404 కోట్ల నష్టాలను మూటకట్టుకుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి ప్రవేశించిన అనంతరం టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జియో ఉచిత ఆఫర్ల తాకిడి తట్టుకోవడానికి ఈ కంపెనీలు సైతం భారీగా డేటా ధరలను తగ్గించాయి. ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకోవడానికి ఐడియా, వొడాఫోన్ లు కలిసి అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించబోతున్నాయి. ఈ డీల్ ఇంకా పూర్తికావాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగం కోలుకుంటుందని బిర్లా ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో సంజీవ్ ఆగా పారితోషికం కూడా రూ.16.7 లక్షల నుంచి రూ.5.90 లక్షలకు పడిపోయింది. అయితే మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా వేతనం మాత్రం 13 శాతం పెరిగింది. ఆయనతో పాటు ఫైనాన్స్ చీఫ్ అక్షయ మూన్ద్రా వేతనం కూడా రూ.2.23 కోట్ల నుంచి రూ.2.33 కోట్లకు ఎగిసింది. దీనిలో స్టాక్ ఆప్షన్లను కలుపలేదు. కంపెనీలో సగటున ఉద్యోగుల వేతనం 8 శాతం పెరిగింది. -
ఐడియా, ఫ్లిప్కార్ట్: 4జీ స్మార్ట్ఫోన్లలో భారీ ఆఫర్
న్యూఢిల్లీ: దేశీయ మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులర్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం ఆన్లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్లిప్కార్ట్లో ప్రత్యైకంగా కొనుగోలు చేసిన 4 జీ స్మార్ట్ ఫోన్లపై ప్రీపెయిడ్ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను గురువారం ప్రకటించింది. 4 జీ స్మార్ట్ఫోన్లకు అప్ గ్రేడ్ చేసుకునే ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 356 తో రీఛార్జి చేసుకున్న ఐడియా వినియోగదారులకు 30 జిబి 4 జి డేటాను ఉచితంగా అందిస్తోంది. రోజువారీ డేటా పరిమితి లేకుండా ఈ డేటా ఉచితం. అలాగే అపరిమిత స్థానిక మరియు జాతీయ వాయిస్ కాలింగ్ సదుపాయం. రూ .191 రీఛార్జిపై 10 జిబి డేటా ఉచితంగా అందించనున్నామని సంస్థ ఒక ప్రకనటలో తెలిపింది. . రూ .4 వేల నుంచి రూ .25 వేల మధ్య కొన్న లెనోవో, మైక్రోమ్యాక్స్, మోటరోలా,పానాసోనిక్ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసినవారికి మాత్రమే ఈ ఆఫర్ ప్రత్యేకం. అలాగే కొత్త ఐడియా వినియోగదారులకు కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఐడియా పేర్కొంది. ఈ అసోసియేషన్ ద్వారా మరింతమంది భారతీయులకు భారీ డేటా వినియోగం, మొబైల్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులో ఉంటుందని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ అన్నారు. ఈ భాగస్వామ్యం కీలకమనీ, తమ వినియోగదారులకు మెరుగైన డేటా ప్రణాళికలను అందించడానికి, తమ స్మార్ట్ఫోన్ వినియోగదారుల బేస్ను పెంచుకోవడానికి ఇది సాయపడుతుందని ఫ్లిప్కార్ట్ మొబైల్స్ సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్, చెప్పారు. కాగా ఆదిత్య బిర్లా గ్రూపు ఐడియా సెల్యులార్ దేశవ్యాప్తంగా 200 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోంది. -
జియోకు భారీగా షాకిస్తున్నారు!
ముంబై : రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో మార్చి వరకు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి రిలయన్స్ జియో ఇక టారిఫ్ బాదుడు ప్రారంభించింది. అప్పటిదాక జియో వైపు మొగ్గుచూపిన కస్టమర్లందరూ ఆ నెట్ వర్క్ కు భారీగా షాకిస్తూ ఇతర నెట్ వర్క్ లవైపుకు మరలడం ప్రారంభించారట. అంతేకాక తగ్గుతున్న రేట్ల ఛార్జీలు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియోకు మరలిన డేటా కస్టమర్లందరూ ఇప్పటికే భారీగా తమ నెట్ వర్క్ వైపుకు వచ్చేస్తున్నారంటూ టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులార్ ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో 2017లో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కుతామని ఐడియా అంచనావేస్తోంది. ఛార్జీలు బాదుడు ప్రారంభించిన తర్వాత నుంచే డేటా కస్టమర్లందరూ జియో నెట్ వర్క్ కు గుడ్ బై చెబుతున్నారంటూ ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా చెప్పారు. ద్వితీయార్థంలో రేట్లు స్థిరీకరణ జరుగుతుందని ఆయన అంచనావేశారు. '' ఇండస్ట్రీకి, తమకు ఈ రెవెన్యూ వృద్ధిని మేము ముందే అంచనావేశాం. ఏడాది బేసిస్ తో స్వల్ప వృద్ధితో ఇండస్ట్రీ ఫ్లాట్ గా ఉంటుందని అనుకున్నాం. 2017 క్యూ 4 నష్టాల నుంచి ఇండస్ట్రీ వచ్చే ఏడాది క్యూ 4 వరకు 15 శాతం రికవరీ అవుతుంది'' అని పేర్కొన్నారు. 2016 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2017 ఆర్థిక సంవత్సరంలో ఇండస్ట్రీ 14-15 శాతం నష్టపోయినట్టు తెలిపారు. మార్కెట్లోకి సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు 75 మిలియన్ కస్టమర్లు చేరడం, మూడు టాప్ టెలికాం దిగ్గజాలకు నష్టాలు చేకూర్చడం స్వల్పమేనని, తాము సబ్ స్క్రైబర్లు జోడించుకుంటూనే ఉన్నామని కపానియా చెప్పారు. వాయిస్ వాడక వృద్ధి రెండంకెలు నమోదవుతుందని అంచనావేస్తున్నట్టు తెలిపారు. డేటా వృద్ధిలో రెండంకెలు, వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లో మూడింతలు వృద్ధిని నమోదుచేసే దిశగా ఇండస్ట్రీ పయనిస్తుందని పేర్కొన్నారు. -
రిజల్ట్స్ ఎఫెక్ట్ : ఐడియా షేర్లు ఢమాల్
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఐడియా సెల్యులార్ కంపెనీ షేర్లు నేటి మార్కెట్లో భారీగా నష్టపోతున్నాయి. ఇప్పటికే ఈ షేర్లు 8 శాతం మేర పడిపోయాయి. శనివారం ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాలతో కంపెనీ షేర్లు ఈ నష్టాలను చవిచూస్తున్నాయి. రిలయన్స్ జియో దెబ్బకు ఐడియా సెల్యులార్ కంపెనీ వరుసగా రెండో క్వార్టర్ లోనూ నష్టాలనే నమోదుచేసింది. 2017 మార్చితో ముగిసిన మూడు నెలల వ్యవధిలో కంపెనీ కన్సాలిడేటెడ్ నష్టాలు 325.6 కోట్ల రూపాయలుగా ఉన్నట్టు ప్రకటించింది. గత ఆర్థికసంవత్సరం ఇదే క్వార్టర్ లో కంపెనీ రూ.449.2 కోట్ల లాభాలను నమోదుచేసింది. ఈ క్వార్టర్ కు ముందు క్వార్టర్ 2016 డిసెంబర్ లోనూ కంపెనీకి రూ.383.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టాలే ఉన్నాయి.. ఇలావరుసగా ఐడియా నష్టాలను నమోదుచేస్తుండటం షేర్లపై తీవ్రప్రభావాన్ని చూపుతోంది. బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో కంపెనీ స్టాక్ 8.28 శాతం పడిపోయి, రూ.84.65 వద్ద ట్రేడవుతోంది. -
ట్రాయ్ ఎఫెక్ట్: ఎయిర్టెల్, ఐడియా షేర్లు రయ్
ముంబై: ఉచిత ఆఫర్లతో సునామిలా దూసుకొచ్చిన రిలయన్స్ జియోకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ అనూహ్యంగా చెక్ పెట్టడం దేశీయ టెలికాం ఆపరేటర్లకు బాగా కలిసి వచ్చింది. జియో తాజా సమ్మర్ సర్ప్రైజ్ ఉచిత ఆఫర్లను నిలిపివేయాలంటూ ట్రాయ్ ఆ దేశించడంతో ప్రత్యర్థి సంస్థలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా భారతి ఎయిర్ టెల్, ఐడియా తదితర మేజర్ కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. శుక్రవారం నాటిమార్కెట్లో మదుపర్లు టెలి కాం ఇండెక్స్ లో కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు. ఒకవైపు దలాల్ స్ట్రీట్ నష్టాల పాలవుతుండగా టెలికాం షేర్లు మాత్రం లాభాలనార్జించడం విశేషం. భారతి ఎయిర్ టెల్ దాదాపు 3 శాతంపైగా జంప్చేసిటాప్ గెయినర్గా నిలిచింది. ఇదే బాటలో ఐడియా సెల్యులర్ పయనిస్తూ 2 శాతానికిపైగా పుంజుకుంది. మరోవైపు ఇటీవలి రికార్డ్స్తాయి లాభాలను పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతానిపైగా నష్టపోయింది. కాగా ఇటీవల టారిఫ్లలోకి ఎంట్రీ ఇచ్చిన జియో తన ప్రైమ్ మెంబర్షిప్ పథకంలో ఉచిత ఆఫర్ను మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించి ప్రత్యర్థి కంపెనీలపై బాంబు వేసింది. అయితే జియో తాజా ఆఫర్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తక్షణమే నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
జియో సమ్మర్ ఎఫెక్ట్: టెలికాం స్టాక్స్ ఢమాల్
ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పి, ఇక టారిఫ్ లు అమలు చేయబోతుందనుకున్న రిలయన్స్ జియో ఇచ్చిన సమ్మర్ సర్ప్రైజ్ ఎఫెక్ట్ టెలికాం దిగ్గజాలను తాకింది. జియో ప్రైమ్ ఆఫర్ గడువును మరో 15 పొడిగింపుతో పాటు, ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారికి రూ.303 రీఛార్జ్ తో మరో మూడు నెలల పాటు కాంప్లిమెంటరీ సర్వీసుల కింద ఉచితంగా సేవలందించనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించడంతో ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లలో ఆందోళన ప్రారంభమైంది. దీంతో టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలో 3 శాతానికి పైగా పడిపోయాయి. సంచలనకరమైన జియో డేటా ఆఫర్లతో, ఉచిత కాల్స్ పై తమ బిజినెస్ అవుట్ లుక్ ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో జియోలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు మంచి లాభాలు చేకూరుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో జియో షేర్లు 52 వారాల గరిష్టంలో 4.5 శాతం పైకి ఎగిసి రూ.1,380.50 వద్ద నమోదవుతోంది. ప్రైమ్ మెంబర్ షిప్ లో ఇప్పటికే 7 కోట్ల మంది కస్టమర్లను ఛేదించామని కంపెనీ ప్రకటించేసింది. ఈ ప్రకటన రిలయన్స్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ గా.. ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లకు ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 3.60 శాతం పైగా లాభాల్లో ట్రేడవుతుండగా.. ఐడియా సెల్యులార్ షేరు ధర 0.82 శాతం, ఎయిర్ టెల్ షేరు ధర 2.87 శాతం, వొడాఫోన్ 0.33 శాతం, భారతీ ఇన్ఫ్రాటెల్ 1.47శాతం నష్టాల్లో రన్ అవుతున్నాయి. -
ఐడియా సెల్యులార్ షేర్లలో రివర్స్ ట్రెండ్
ముంబై : ఒక్కసారిగా భారీగా ఎగిసిన ఐడియా సెల్యులార్ షేర్లు కిందకి పడిపోయాయి. ఇంట్రాడేలో 15 శాతం లాభాలు కురిపించిన షేర్లు, 14.57 శాతం ఢమాల్ మన్నాయి. వొడాఫోన్ ఇండియా విలీనానికి ఐడియా సెల్యులార్ బోర్డు ఆమోదం తెలిపినట్టు కంపెనీ మార్నింగ్ ట్రేడింగ్ అవర్స్ ప్రకటించింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలో కంపెనీ ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. కానీ ప్రస్తుత మార్కెట్ ధర కంటే స్టాక్ వాల్యు తక్కువుగానే డీల్ కుదిరినట్టు తెలియడంతో స్టాక్ రూ.92 వద్ద ట్రేడవుతోంది. ఐడియా వాల్యుయేషన్స్ తో అనుమానం వ్యక్తమవుతున్నట్టు ట్రేడర్స్ చెప్పారు. మరోవైపు రికార్డులు సృష్టిస్తూ ట్రేడైన స్టాక్ మార్కెట్లో నేడు లాభాల స్వీకరణ చోటుచేసుకోవడం కూడా ఈ కంపెనీ షేర్ల పతనానికి కారణమైంది. విలీనం పూర్తయిన తర్వాత వొడాఫోన్ ఆ సంస్థలో 45.1 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉండనుంది. ఐడియా 26 శాతం స్టాక్ ను పొందుతోంది. మిగతదంతా పబ్లిక్ షేర్ హోల్డర్స్ చేతిలో ఉంటుంది. విలీనం అనంతరం ఏర్పడబోయే అతిపెద్ద టెలికాం దిగ్గజానికి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లానే చైర్మన్ గా ఉండనున్నారు. -
జియోపై దిగ్గజాల కౌంటర్ అటాక్
డేటా రేట్ల కోత దిశగా అడుగులు కోల్ కత్తా : దాదాపు దశాబ్దం తర్వాత టెలికాం పరిశ్రమలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో దిగ్గజాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. తాజాగా జియో టారిఫ్ ప్లాన్స్ అమల్లోకి వస్తాయని ప్రకటించినప్పటికీ, ప్రైమ్ మెంబర్ షిప్ పేరుతో మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో టెల్కోలు తమ హై ఎండ్ కస్టమర్లను అలానే అట్టిపెట్టుకోవడానికి, జియోకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లు వెంటనే డేటా రేట్ల కోతకు పిలుపు ఇవ్వబోతున్నాయని ఇండస్ట్రి విశ్లేషకులు చెబుతున్నారు. రూ.99 ప్రైమ్ మెంబర్ షిప్ ఫీజుతో పాటు, నెలకు మరో రూ.303లు చెల్లిస్తే హ్యాపీ న్యూఇయర్ కింద ప్రస్తుతం లభిస్తున్న ఉచిత డేటా, ఉచిత కాలింగ్ వంటి అన్ని ప్రయోజనాలను ఏడాదిపాటు పొందవచ్చని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం ప్రకటించారు. ఈ తాజా ప్రకటనతో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా టాప్-ఎండ్ కస్టమర్లు, ఇప్పటికే జియోను రెండో సిమ్ గా వాడుతున్న వారిని అంబానీ టార్గెట్ చేసినట్టు తెలిసింది. దీంతో తమ టాప్-ఎండ్ కస్టమర్లను కాపాడుకోవడంలో టెల్కోలు సిద్ధమయ్యాయి. ఈ టాప్-ఎండ్ కస్టమర్లే టెల్కోలకు 60 శాతం రెవెన్యూలకు పైగా అందిస్తున్నాయని ఓ సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రస్తుతం టెల్కోలు అందిస్తున్న డేటా ఛార్జీలు ఎయిర్ టెల్ : రూ.345కు అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 1జీబీ 4జీ డేటా రూ.1495కు 90రోజుల పాటు 30జీబీ డేటా వొడాఫోన్ : రూ.349కు అపరిమిత కాలింగ్, 50ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ 4జీ డేటా రూ.1500కు 30రోజుల పాటు 35 జీబీ డేటా ఐడియా : రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటా 4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటా బీఎస్ఎన్ఎల్ : రూ.339కు అపరిమిత కాలింగ్, 28రోజుల పాటు 1జీబీ డేటా వీటన్నింటికీ ఝలకిస్తూ జియో రూ.303కే నెలకు అపరిమిత కాలింగ్ ను, రోజుకు 1జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రస్తుత కస్టమర్లకే అందనుంది. 2018 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు రిలయన్స్ అధినేత ప్రకటించారు. దీంతో దిగ్గజాలు సైతం పైన పేర్కొన్న డేటా రేట్లను మరింత తగ్గించేందుకు యోచిస్తున్నాయి. -
జియో దెబ్బ: భారీగా కుప్పకూలిన ఐడియా
మరో టెలికాం దిగ్గజం ఐడియాకు రిలయన్స్ జియో దెబ్బ భారీగా తగిలింది. టెలికాం ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో వల్ల ఇప్పటికే దిగ్గజ కంపెనీ ఎయిర్టెల్ తన లాభాలను భారీగా చేజార్చుకోగా, ఐడియా ఏకంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఐడియా సెల్యులార్ శనివారం విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో కన్సాలిడేటెడ్ నికర నష్టాలు రూ.383.87 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరంలో కంపెనీకి రూ.659.35 కోట్ల నికరలాభాలు ఉన్నాయి. జియో అందిస్తున్న ఉచిత వాయిస్, డేటా ఆఫర్లే వీటి లాభాలకు భారీగా గండికండుతుందని తెలిసింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.9032.43 కోట్ల నుంచి రూ.8706.36 కోట్లకు పడిపోయిననట్టు బీఎస్ఈ ఫైలింగ్లో నమోదుచేసింది. ''అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నడిచిన త్రైమాసికంలో దేశీయ మొబైల్ ఇండస్ట్రి ఊహించని అంతరాయాలను ఎదుర్కొంది. ముఖ్యంగా టెలికాం సెక్టార్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఎంట్రీ అందించే ఉచిత వాయిస్, మొబైల్ డేటా ఆఫర్లే దీనికి కారణం'' అని ఐడియా సెల్యులార్ ప్రకటించింది. చరిత్రలోనే మొదటిసారి భారత వైర్లెస్ సెక్టార్ వార్షిక రెవెన్యూలు 3-5 శాతం పడిపోయాయని పేర్కొంది. రెవెన్యూలు రికవరీ కావడానికి కేవలం ఆ కొత్త ఆపరేటర్ తమ ప్యాన్-ఇండియా మొబైల్ సర్వీసులపై ఛార్జీలు విధించడమే పరిష్కారమని తెలిపింది. ఇటీవలే ఐడియా తన ప్రత్యర్థి వొడాఫోన్ను తనలో విలీనం చేసుకోవాలని ప్లాన్స్ చేస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే టెలికాం ఇండస్ట్రీలో త్రిముఖ పోటీ తెరలేవనుంది. ఎయిర్టెల్, జియో, ఐడియా, వొడాఫోన్ల విలీన సంస్థ తీవ్రంగా పోటీపడనున్నాయి. -
ఎల్లుండే బడ్జెట్: ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
ఆర్థిక సర్వేతో రేపటి నుంచి కేంద్రప్రభుత్వ బడ్జెట్ సెషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దలాల్స్ట్రీట్ అప్రమత్తంగా వ్యవహరించింది. సోమవారం సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 32.90 పాయింట్ల నష్టంలో 27,849.56వద్ద, నిఫ్టీ 5.60 పాయింట్ల నష్టంలో 8635.65 వద్ద క్లోజ్ అయ్యాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఏషియన్ పేయింట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, హీరోమోటార్ కార్ప్ నష్టాలు గడించాయి. 2017-18కి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. పెద్ద నోట్లను రద్దుచేసి ఎకానమీకి షాకిచ్చిన కేంద్రప్రభుత్వం వచ్చే ఆర్థికసంవత్సరంలో ఏ మేర వ్యయాలను వెచ్చించనుందోనని దలాల్ స్ట్రీట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నోట్ల రద్దుతో ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి ఆర్థికవ్యవస్థల్లో కెల్లా భారత్ కొంతమేర మందగించింది. ఆర్థికవ్యవస్థపై చూపిన ఈ ప్రభావం నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం ఆర్థికవ్యవస్థకు ఊతంగా బడ్జెట్ను ప్రవేశపెట్టనుందని పెట్టుబడిదారులు అంచనావేస్తున్నారు. ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్వహిస్తున్న కార్యకలాపాలతో ఆసియన్ షేర్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇమ్మిగ్రేషన్పై కొరడా ఝుళిపిస్తూ తీసుకున్న ట్రంప్ ఆదేశాలతో దేశీయ ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగించింది. బ్యాంకింగ్, ఆటో, పవర్, రియాల్టీ స్టాక్స్ కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిష్టీ బాస్కెట్లో ఐడియా సెల్యులార్ షేర్లు మంచి ప్రదర్శనను కనబర్చాయి. ఐడియాలో వొడాఫోన్ ఇండియాను విలీనం చేసేందుకు చర్చలు సాగుతున్నట్టు బ్రిటీష్ దిగ్గజం ధృవీకరించింది. దీంతో ఐడియా షేర్లు 25 శాతం మేర జంప్ అయ్యాయి. ఇతర టెలికాం స్టాక్స్కు డిమాండ్ నెలకొంది. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్లు 6, 11 శాతం పెరిగాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.11 పైసలు బలపడి 67.95 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 17 రూపాయల లాభంతో 28,370గా నమోదయ్యాయి. -
ఆ కంపెనీ కూడా ఏడాదంతా ఫ్రీ 4జీ డేటా
4జీలోకి అప్గ్రేట్ అయ్యే కస్టమర్లకు టెలికాం సంస్థలు పోటాపోటీగా ఉచిత డేటా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తమ 4జీ నెట్వర్క్లోకి అప్గ్రేడ్ అయ్యే కస్టమర్లకు ఏడాదంతా ఉచిత 4జీ డేటాను అందించనున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించిన వారం రోజుల్లోనే ఐడియా కూడా అదేతరహాలో 4జీ నెట్వర్క్పై తన ప్లాన్స్ను వెల్లడించింది. ఎంపికచేసిన అపరిమిత కాలింగ్ ప్లాన్స్లో డేటా వాడుక పరిమితిని పెంచుతున్నట్టు తెలిపింది. కొత్త 4జీ హ్యాండ్సెట్లలోకి అప్గ్రేడ్ అయ్యే కస్టమర్లకు అదనంగా 3జీబీ మొబైల్ బ్రాండ్బాండ్ ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. దీంతో ఐడియా కస్టమర్లందరూ తమ ప్లాన్స్పై ఉచిత డేటాను పొందవచ్చని ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త ప్లాన్స్పై 4జీ హ్యాండ్సెట్లు మరిన్ని డేటా ప్రయోజనాలు పొందనున్నారని పేర్కొంది. కొత్త ఐడియా 4జీ డేటా ఆఫర్ కింద రూ.348తో రీచార్జ్ చేసుకుంటే 1జీబీ డేటాను, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్లను ప్రస్తుత ప్రీపెయిడ్ 4జీ హ్యాండ్ సెట్లు కస్టమర్లు పొందవచ్చు. అదే కొత్త 4జీ హ్యాండ్సెట్ల కస్టమర్లయితే అదనంగా 3జీబీ డేటాను పొందుతారని ఐడియా పేర్కొంది. 28 రోజుల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 13 రీచార్జ్లలో ఏడాదంతా ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. ఐడియా పోస్టు పెయిడ్ కస్టమర్లయితే రూ.499 రెంటల్ ప్లాన్పై సబ్స్క్రైబ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్తో 4జీ హ్యాండ్సెట్ కస్టమర్లు అపరిమిత లోకల్, నేషనల్, ఇన్కమింగ్ రోమింగ్ కాల్స్తోపాటు 3జీబీ ఉచిత డేటాను పొందవచ్చు. 4జీ హ్యాండ్సెట్ యూజర్లు కానివారు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు 1జీబీ ఉచిత డేటాను ఐడియా అందిస్తోంది. రూ.999 రెంటల్ ప్లాన్ను యాక్టివేట్ చేసుకునే ఐడియా పోస్టు పెయిడ్ కస్టమర్లు రూ.499 ప్లాన్పై ఉన్న అన్నీ ప్రయోజనాలనూ పొందవచ్చు. అంతేకాక, రోమింగ్పై ఉచిత కాల్స్, 4జీ హ్యాండ్సెట్ కస్టమర్లకు 8జీబీ మొబైల్ బ్రాండ్బాండ్, ఇతర కస్టమర్లకు 5జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. కొత్త, పాత కస్టమర్లందరికీ 2017 డిసెంబర్ 31 వరకు ఈ రెంటల్ ప్లాన్స్పై అదనపు 3జీబీ డేటాను తాము అందించనున్నామని ఐడియా తెలిపింది. -
టెలినార్ను కొంటున్నది ఎవరు?
న్యూఢిల్లీ : చౌకైన ఆఫర్లతో తక్కువ కాలంలోనే ఎక్కువమంది టెలికాం ఖాతాదారులను ఆకర్షించుకునేందుకు భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టెలినార్ ప్రస్తుతం పూర్తిగా అయోమయంలో పడిపోయింది. భారత్ యూనిట్లో తమకొచ్చే నష్టాలు తట్టుకోలేక, ఇక ఇక్కడ తమ వ్యాపారాలు కొనసాగించలేక, ఎలాగైనే భారత్ బిజినెస్ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికోసం మూడో టెలికాం దిగ్గజగా ఉన్న ఐడియా సెల్యులార్తో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తమ భారత్ యూనిట్ను నగదు రహితంగా ఐడియా సెల్యులార్కు విక్రయించేందుకు చర్చలు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే దేశంలో మూడో అతిపెద్ద టెలికాం దిగ్గజంగా ఉన్న ఐడియా చేతికి నార్వేకు చెందిన ఈ టెలికాం ఆపరేటర్ స్థానిక వ్యాపారాలన్నీ దక్కనున్నాయని సమాచారం.. ఎలాంటి వాస్తవ చెల్లింపులు లేకుండా టెలినార్ రుణాలను, ఆస్తులను మార్పిడి చేసుకునేలా ఈ రెండు కంపెనీలు చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ చర్చలు సఫలీకృతం కాకపోవచ్చని కంపెనీకి సంబంధించిన మరో వ్యక్తి చెప్పారు. మరో రూ.36,000కోట్లను తన రుణభారంగా మార్చుకునేందుకు ఐడియా సెల్యులార్ సిద్ధంగా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే అక్టోబర్ ఆక్షన్లో స్పెక్ట్రమ్ కొనుగోలుకు అదనంగా రూ.13,000 కోట్లను ఐడియా సెల్యులార్ వెచ్చించిన సంగతి తెలిసిందే. టెలినార్ ఇండియాకు ఇప్పటికే రూ.1,900 కోట్లను స్పెక్ట్రమ్ చెల్లింపులుగా కేంద్రానికి చెల్లించాల్సి ఉంది. అంతేకాక ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్కు రూ.1,800 కోట్లు బాకీ పడి ఉంది. అయితే ఇటు టెలినార్, ఐడియా సెల్యులార్ రెండు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు. ఒకవేళ ఐడియా చేతికి టెలినార్ దక్కితే కొన్ని కీలక సర్కిళ్లలో 1800 ఎంహెచ్జడ్ బ్యాండ్లో 4జీ స్పెక్ట్రమ్ ఈ కంపెనీకి ప్రయోజనంగా మారనుంది. మరోవైపు టెలినార్ కంపెనీ తన ఇండియా బిజినెస్ల నుంచి వైదొలగుతుందని ఓ సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పారు. -
25 నిమిషాల ఆ స్పీచ్కు రూ.3000 కోట్లు ఆవిరి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 25 నిమిషాల స్పీచ్కు మేజర్ టెలికాం స్టాక్స్ అన్నీ గజగజలాడాయి. రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత సేవల ఆఫర్ మరో మూడు నెలల పాటు అంటే వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించగానే దిగ్గజ టెలికాం స్టాక్స్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో టెలికాం దిగ్గజాల మార్కెట్ విలువ రూ.3000 కోట్లు ఆవిరైపోయింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 1.66 శాతం, ఐడియా సెల్యులార్ 5.93 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 5.05 శాతం కుదేలయ్యాయి. ఈ సమయంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతం లాభపడింది. ఒకటిన్నర మధ్యలో రూ.324గా ట్రేడ్ అయిన ఎయిర్టెల్ షేర్లు, ముఖేష్ స్పీచ్ ప్రారంభం కాగనే రూ.318.3కు దిగొచ్చాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.2,276 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. అదేవిధంగా 76.60గా ట్రేడ్ అయిన ఐడియా సెల్యులార్ షేర్లు కూడా ముఖేష్ స్పీచ్తో రూ.74.20కి పడిపోయాయి. ఈ కంపెనీ కూడా రూ.792 కోట్లను మార్కెట్ విలువను పోగొట్టుకుంది. నేడు దేశీయ మార్కెట్లో భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ భారీగా నష్టపోయినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమవుతుందని వారు పేర్కొన్నారు. సంచలమైన ఆఫర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు(సెప్టెంబర్1న) కూడా ఎయిర్టెల్, ఐడియా షేర్ల మార్కెట్ విలువ భారీగా కోల్పోయినట్టు, రూ.16,000కోట్లు తుడిచిపెట్టుకుపోయినట్టు వెల్లడించారు. మరోసారి హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద జియో సేవలను పొడిగించనున్నట్టు సంచలనమైన ప్రకటనను వాటాదారుల సమావేశంలో గురువారం రిలయన్స్ అధినేత వెల్లడించడంతో ఈ కంపెనీలు భారీగా నష్టపోయాయి. రూ.3000 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి. -
ఐడియా కు రిలయన్స్ జియో భారీ ఎఫెక్ట్
-
స్టాక్ మార్కెట్పై ‘టాటా' ఎఫెక్ట్..
దేశ పారిశ్రామిక రంగాన్ని ఒక కుదుపు కుదిపిన టాటా గ్రూప్ తాజా వ్యవహారం నేపథ్యంలో మంగళవారం భారత స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సరస్ మిస్త్రీను తొలగించడంతో టాటా గ్రూప్ షేర్లపై ఆ ప్రభావం ఉండొచ్చునని, ఈ షేర్లు పలు ఒడిదుడుకులకు లోను కావొచ్చునని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం 19.99 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ప్రస్తుత సమాచారం ప్రకారం వందపాయింట్లకుపైగా నష్టపోయింది. 19.99 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 28159.09 పాయింట్ల వద్ద ప్రారంభమవ్వగా.. నిఫ్టీ కూడా 4.35 పాయింట్ల నష్టంతో 8,704 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఐడియా సెల్యూలర్ షేరు విలువ 2.08శాతం మేర పడిపోవడం, టాటా గ్రూప్ షేర్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుండటంతో ఉదయం పదిగంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 128.23 పాయింట్లు నష్టపోయి.. 28,050.58 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 26.80 పాయింట్లు నష్టపోయి.. 8682.15 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజీ మిస్త్రీని తొలగించడంతో ఆ ప్రభావం టాటా గ్రూప్ షేర్ విలువపై కనిపిస్తోంది. దీంతో ఈ షేర్ విలువ నష్టాలు ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తున్నదని పరిశీలకులు చెప్తున్నారు. -
వొడాఫోన్, ఐడియా మెగా మెర్జర్?
న్యూఢిల్లీ: దేశ టెలికం రంగంలో భారీ విలీనం దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది.! అగ్రగామి కంపెనీలు ఐడియా సెల్యులర్, వొడాఫోన్ విలీనానికి ఉన్న అవకాశాలపై ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియా సంస్థ ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదే నిజమైతే ఐడియా, వొడాఫోన్ విలీనంతో మార్కెట్ పరంగా దేశ టెలికం రంగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భవించనుంది. ఒకపక్క సేవల పరంగా టెలికం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నడుస్తుండగా... మరోవైపు రిలయన్స్ జియో అత్యంత వేగంతో కూడిన 4జీ సేవలను అతి తక్కువ ధరలకే అందించడం ద్వారా మార్కెట్ను కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న క్రమంలో తాజా విలీన వార్తలు రావడం ఆసక్తికి దారితీసింది. విలీనానికి అడ్డంకులు... వొడాఫోన్ ఐపీవోకు రావాలని గత కొంత కాలంగా ఆలోచన చేస్తోంది. ఈ సంస్థ విలువ 11 బిలియన్ డాలర్లుగా ఉంటుందని... ఐడియా సెల్యులర్ విలువ 5 బిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. రెండు కంపెనీలు విలీనమైతే సంయుక్త సంస్థ మార్కెట్ విలువ 16 బిలియన్ డాలర్లు అవుతుందని తెలుస్తోంది. ఐడియా సెల్యులర్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉండడంతో వొడాఫోన్ ఐపీఓకు రావాల్సిన అవసరం తప్పుతుంది. అయితే, సంయుక్త కంపెనీ మార్కెట్ వాటా కొన్ని సర్కిళ్లలో 50 శాతానికి మించనుండడంతో నియంత్రణపరమైన అనుమతులు కష్టతరం కావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. వొడాఫోన్ గతంలో టాటా టెలీసర్వీసెస్ వంటి ఇతర సంస్థలతోనూ విలీనంపై చర్చలు సాగించినా కార్యరూపం దాల్చలేదు. కాగా, తాజా విలీన వార్తలపై స్పందించేందుకు వొడాఫోన్ నిరాకరించగా... ఐడియా మాత్రం ఆధార రహితం, తప్పుడు కథనంగా పేర్కొంది. మూడు సంస్థల వద్దే మూడొంతుల వాటా 2015-16 ఆర్థిక సంవత్సరాంతానికి భారతీ ఎయిర్టెల్ 31.7 శాతం వాటాతో అగ్రగామిగా ఉంది. వొడాఫోన్ 22.7 శాతం, ఐడియా 20.2 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ మూడు సంస్థల చేతుల్లోనే 74.6 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా టాటా టెలీ, ఎయిర్సెల్, టెలినార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ తదితర సంస్థలు పంచుకున్నాయి. -
ఐడియా సెల్యులర్కు వ్యయాల దెబ్బ
♦ రూ.217 కోట్ల నికర లాభం ♦ మొబైల్ రంగ మందగమన వృద్ధి మరికొంత కాలం ♦ ఐడియా అంచనాలు న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం ఐడియా సెల్యులర్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ. 217 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.852 కోట్ల నికర లాభం వచ్చిందని ఐడియా సెల్యులర్ పేర్కొంది. ఇండియన్ అకౌంట్ స్టాండర్డ్(ఇండ్ యాస్) ఆధారంగా ఈ క్యూ1 ఫలితాలను రూపొం దించామని, అందుకని గత క్యూ1 ఫలితాలతో పోల్చడానికి లేదని వివరించింది. స్పెక్ట్రమ్ చార్జీలు లాభాలపై ప్రభావం చూపాయని పేర్కొంది. వడ్డీ వ్యయాలు రెట్టింపు: వడ్డీ వ్యయాలు రెట్టిం పయ్యాయని ఐడియా తెలి పింది. గత క్యూ1లో రూ.442 కోట్లుగా ఉన్న వడ్డీ వ్యయాలు ఈ క్యూ1లో రూ.988 కోట్లకు పెరిగాయని తెలిపింది. తరుగుదల రూ.1,412 కోట్ల నుంచి రూ.1,919 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.8,792 కోట్ల నుంచి రూ.9,487 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,500-7,000 కోట్ల మేర మూలధన పెట్టుబడులు పెట్టాలన్న లక్ష్యానికి అనుగుణంగానే ఈ క్యూ1లో రూ.1,080 కోట్ల పెట్టుబడులు పెట్టామని పేర్కొం ది. మొబైల్ రంగంలో మందగమన వృద్ధి మరికొంత కాలం కొనసాగుతుందని భావిస్తున్నట్లు తెలిపింది. -
'ఐడియా' ఫ్లాప్: లాభాలు పతనం
ముంబై : దేశంలో మూడో అతిపెద్ద టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులార్ విశ్లేషకుల అంచనాలను మిస్ చేసింది. సోమవారం ప్రకటించిన 2016-17 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో తన కన్సాలిడేటెడ్ నికర లాభాలు 74శాతం పతనమై రూ.220 కోట్లగా నమోదుచేసినట్టు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభాలు రూ.851.6 కోట్లగా ఉన్నాయి. స్పెక్ట్రమ్ ధరలు, తక్కువ వాయిస్ రెవెన్యూలు వల్ల తమ ఆదాయాల పడిపోయినట్టు తెలిపింది. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారం ఐడియా రూ.435 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని అంచనావేశారు. స్పెక్ట్రమ్ కొనుగోలు చేయడానికి ఒక ఆఫ్ ఖర్చులు లాభాలు పతనమవడానికి దోహదం చేశాయని పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కమర్షియల్ గా ఆవిష్కరించబోయే జియో సేవల నేపథ్యంలో టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా యూనిట్లతో పాటు ఐడియా సైతం తన 3జీ,4జీ సర్వీసులపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టి, తన డేటా రేట్లలో కోత విధించింది. దీంతో గతేడాది ఒక యూజర్కు రూ.147 లుగా ఉన్నమొబైల్ డేటా సగటు రెవెన్యూ, ఈ ఏడాది రూ.142లకు పడిపోయినట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఐడియా 4జీ నెట్ వర్క్కు 1.8 మిలియన్ కస్టమర్లు ఉన్నారు. అదేవిధంగా రిలయన్స్కు 1.5 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నట్టు తాజా వార్షిక రిపోర్టులు పేర్కొన్నాయి. మరోవైపు ఐడియా సెల్యులార్ షేర్లు నేటి మార్కెట్లో 2.83 శాతం పతనమై రూ.103.1వద్ద నమోదైంది. -
ఐడియా బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : ఇంటర్నెట్ వాడకానికి దూరంగా ఉంటున్న యూజర్లను ఆకట్టుకోవడానికి ఐడియా సెల్యులార్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. "ఇంటర్నెట్ ఫర్ ఆల్" అనే ఆవిష్కరణతో ఇంటర్నెట్ వాడని యూజర్ల ముందుకు వచ్చింది. ఐడియా ప్రీపైడ్ కస్టమర్లు, రిటైలర్లకు నెలకు 100 ఎంబీ డేటా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. *756# కు డయల్ లేదా ఐఎఫ్ఏ అని 56756కు మెసేజ్ పంపినా ఈ సర్వీసు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్, ఇతర యాక్సస్ లకు ఓ టూల్ లా వాడుతున్న ఇంటర్నెట్ గురించి యూజర్లు తెలుసుకునేలా ప్రోత్సహించడంలో ఈ ఆవిష్కరణ ఎంతో ఉపకరిస్తుందని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇంటర్నెట్ సేవలు వినియోగం పెంచడానికి ఇది దోహదంచేస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఇంటర్నెట్ లో కనెక్టు కాని స్నేహితుల, కుటుంబసభ్యులకు, ఇంటర్నెట్ యూజర్లు ఈ సర్వీసులను పరిచయం చేస్తారని వెల్లడించారు. దీంతో వారి జీవితాలను కొత్తపథంలో నడుస్తాయన్నారు. ఇంటర్నెట్ వరల్డ్ గూటికిందకు తన కస్టమర్లలందరినీ చేర్చాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. నాన్ ఇంటర్నెట్ యూజర్లు ఎలా ఈ ఉచిత డేటా సర్వీసులను అందిపుచ్చుకోవాలో పిరియాడిక్ గా యూజర్లకు సమాచారం పంపుతుంటామని ఐడియా చెప్పింది. -
ఐడియాకు వడ్డీ వ్యయాల భారం
♦ రెండు రెట్లకు పైగా పెరిగిన వడ్డీవ్యయాలు ♦ 39 శాతం తగ్గిన నికర లాభం న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం ఐడియా సెల్యులర్ నికర లాభంపై వడ్డీ వ్యయాలు ప్రభావం చూపాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ కంపెనీ నికర లాభం 39 శాతం తగ్గింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.942 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.576 కోట్లకు పడిపోయిందని ఐడియా సెల్యులర్ తెలిపింది. అయితే కంపెనీ ఆదాయం రూ.8,423 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.9,484 కోట్లకు పెరిగిందని వివరించింది. వడ్డీ వ్యయాలు రూ.292 కోట్ల నుంచి రెండు రెట్లకు పైగా పెరిగి రూ. 808 కోట్లకు చేరాయని పేర్కొంది. డేటా సర్వీస్ ఆదాయం ఒక్కో మెగాబైట్కు 44.8 పైసల నుంచి 22.9 పైసలకు, అలాగే వాయిస్ కాల్స్ ఆదాయం 33.9 పైసల నుంచి 33.3 పైసలకు తగ్గాయని తెలిపింది,. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలతో సహా తమ నికర రుణ భారం ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.38,750 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,193 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) 4 శాతం క్షీణించి రూ.3,080 కోట్లకు తగ్గిందని ఐడియా సెల్యులర్ తెలిపింది. ఆదాయం రూ.31,571 కోట్ల నుంచి 14 శాతం వృద్ధి చెంది రూ.35,981 కోట్లకు పెరిగిందని వివరించింది. -
మార్చికల్లా 121 కేంద్రాల్లో ఐడియా 4జీ
♦ ప్రస్తుతం ఏపీ సర్కిల్లో 37 పట్టణాల్లో సేవలు ♦ లక్షకు చేరువలో 4జీ కస్టమర్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఐడియా సెల్యులార్ 4జీ ఎల్టీఈ సేవలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో విస్తరిస్తోంది. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్సహా 37 పట్టణాల్లో సర్వీసులను ప్రారంభించింది. మొత్తంగా మార్చి చివరినాటికి 21 జిల్లా కేంద్రాలు, 100 తాలూకాల్లో సేవలను పరిచయం చేస్తామని సర్కిల్ సీవోవో టి.జి.బి.రామకృష్ణ మంగళవారం తెలిపారు. వీటిలో కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం వంటి పట్టణాలున్నాయని వెల్లడించారు. 4జీ ఎల్టీఈ సర్వీసులను అధికారికంగా ప్రకటించిన సందర్భంగా చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజత్ ముఖర్జీతో కలిసి మీడియాతో మాట్లాడారు. 4జీ సేవలకుగాను సర్కిల్లో 1,350 టవర్లను కంపెనీ ఏర్పాటు చేసింది. మార్చికల్లా ఈ సంఖ్య 2,250కి చేరుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సుమారు 1 లక్ష మంది 4జీ కస్టమర్లు ఉన్నారన్నారు. 4జీ ఎల్టీఈ సర్వీసులను 10 సర్కిళ్లలో ఈ ఏడాది జూన్లోపే 750 పట్టణాలకు విస్తరిస్తామని ముఖర్జీ వెల్లడించారు. టెలికం మార్కెట్లో ఈ 10 సర్కిళ్ల వాటా 50 శాతముందని వివరించారు. వచ్చే నెలలో మహారాష్ట్ర/గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. రూ.25 నుంచే 4జీ ప్యాక్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. -
తగ్గిన ఐడియా లాభం..
♦ 12 శాతం పెరిగిన నికర అమ్మకాలు ♦ 3 రెట్లు పెరిగిన నికర రుణం న్యూఢిల్లీ: టెలికం సర్వీసులందించే ఐడియా సెల్యులర్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో స్వల్పంగా తగ్గింది. గత క్యూ3లో రూ.767 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.764 కోట్లకు పడిపోయిందని ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన ఈ కంపెనీ వెల్లడించింది. నికర అమ్మకాలు రూ.8,017 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.9,010 కోట్లకు పెరిగాయని వివరించింది. మొబైల్ డేటా(2జీ, 3జీ, 4జీ) 76 శాతం, వాయిస్ మినిట్స్ 17 శాతం చొప్పున వృద్ధి సాధించాయని తెలిపింది. తాజా డిసెంబర్ క్వార్టర్లో 13 టెలికం సర్కిళ్లలో 3జీ సర్వీసులును, నాలుగు దక్షిణాది టెలికం సర్వీస్ ఏరియాల్లో 4జీ సర్వీసులను ప్రారంభించామని పేర్కొంది. 3జీ డేటాకు సంబంధించి ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి(ఏఆర్పీయూ) ఆరోగ్యకరమైన స్థాయిలో రూ.196గా ఉందని వివరించింది. గత క్యూ3లో రూ.11,089 కోట్లుగా ఉన్న నికర రుణ భారం ఈ క్యూ3లో మూడు రెట్లు పెరిగి రూ.37,690 కోట్లకు చేరిందని ఐడియా సెల్యులర్ వివరించింది. గత ఏడాది కాలంలో 3జీ డేటా వినియోగదారుల సంఖ్య 82 లక్షల నుంచి 2.12 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి మొత్తం వినియోగదారుల సంఖ్య 18.2 కోట్లకు పెరిగిందని తెలిపింది. హైదరాబాద్లో ఐడియా 4జీ సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ కంపెనీ ఐడియా సెల్యులార్ భాగ్యనగరిలో 4జీ ఎల్టీఈ సేవలను ప్రారంభించింది. కంపెనీ గతేడాది డిసెంబరు 23 నుంచి 4జీ సర్వీసులను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో హైదరాబాద్ మినహా కరీంనగర్, నిజామాబాద్, కడప, విజయవాడ, వైజాగ్ తదితర పట్టణాల్లో ఈ సర్వీసులను ప్రారంభించింది. దేశంలో మొత్తం 10 సర్కిళ్లలో జూన్ నాటికి 750 నగరాల్లో 4జీ సేవలను విస్తరించాలన్నది సంస్థ లక్ష్యం. -
త్వరలో ఐడియా 4జీ సర్వీసులు
డిసెంబరులో ట్రయల్ ప్రాజెక్ట్ * వచ్చే జనవరి నుంచి వాణిజ్యపరంగా సేవలు... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో ఉన్న ఐడియా సెల్యులార్ త్వరలో 4జీ ఎల్టీఈ సర్వీసులను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తోంది. డిసెంబరులో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం కంపెనీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రస్తుతం నెట్వర్క్ పనితీరుపై సాంకేతిక పరీక్షలు జరుపుతోంది. 4జీ వస్తోందంటూ కస్టమర్లకు కంపెనీ సందేశాలను కూడా పంపుతోంది. వాస్తవానికి నవంబరులోనే 4జీ ఎల్టీఈ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. ముందుగా 1,800 మెగాహెట్జ్ బ్యాండ్లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు), హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ టెలికం సర్కిళ్లలో కంపెనీ 4జీ సేవల రంగంలోకి అడుగిడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో... ఐడియా సెల్యులార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో హైదరాబాద్తోపాటు వైజాగ్, విజయవాడ, వరంగల్ తదితర నగరాల్లో 4జీ ఎల్టీఈ సర్వీసులను ప్రారంభిస్తోందని సమాచారం. వాణిజ్యపరంగా 4జీ ఎల్టీఈ సేవలు జనవరిలో ప్రారంభం అవుతాయని ఐడియా ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు ముంబై నుంచి ఫోన్లో తెలిపారు. దేశంలో 10 సర్కిళ్లలో జూన్కల్లా 750 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మ్యూజిక్, గేమ్స్, మూవీస్, డిజిటల్ వాలెట్స్ వంటి డిజిటల్ సేవలను సైతం కంపెనీ సొంత బ్రాండ్లో 2016-17లో ప్రారంభిస్తోంది. వీటిని ప్రాంతీయ భాషల్లో తీసుకురానుండడం ఐడి యాకు కలిసి వచ్చే అంశం. దీనికోసం స్టార్టప్స్తోపాటు యాప్ డెవలపర్స్తో ఇప్పటికే చేతులు కలిపింది. డేటా వినియోగం పెరిగేం దుకు కస్టమర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో హాట్స్పాట్స్ను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. 4జీ మార్కెట్లో పోటీ.. ఎయిర్టెల్ ఇప్పటికే 4జీ సేవలను ప్రారంభించి నగరాలను జోడించుకుంటూ పోతోంది. ఈ రంగంలోకి వొడాఫోన్ డిసెంబరులో ప్రవేశిస్తోంది. అటు రిలయన్స్ జియో నేడో రేపో అన్నట్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. తాజాగా ఐడియా సెల్యులార్ కూడా పోటీలోకి దిగుతోంది. మౌలిక వసతులకుగాను 2015-16లో ఐడియా సుమారు రూ.6,500 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో సగం మొత్తాన్ని ఇప్పటికే వ్యయం చేసిందని మార్కెట్ వర్గాల సమాచారం. సేవలపరంగా 4జీ మార్కెట్లో పోటీనిస్తామని కంపెనీ ఎండీ హిమాన్షు కపానియా ఇటీవల వెల్లడించారు. కాగా, బండిల్ ఆఫర్లను ప్రకటించేందుకు ఐడియా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఐడియా బ్రాండ్ 4జీ ఎల్టీఈ స్మార్ట్ఫోన్లతోపాటు వైఫై గాడ్జెట్స్ను ఆవిష్కరించేందుకు దిగ్గజ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. -
ఐడియా ప్రి-పెయిడ్ యూజర్లందరికీ సెకన్ ప్లాను
న్యూఢిల్లీ: టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ తాజాగా తమ ప్రి-పెయిడ్ కస్టమర్లందరికీ సెకను ప్లాను పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే చాలా మంది ప్రి-పెయిడ్ యూజర్లు పర్ సెకను బిల్లింగ్నే ఉపయోగిస్తున్నట్లు.. పర్ మినిట్ బిల్లింగ్ ప్లాన్లో ఉన్న కోటిన్నర మంది యూజర్లను కూడా వచ్చే 30 రోజుల్లో పర్ సెకన్ ప్లాన్కు మారుస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం 16.6 కోట్ల మంది యూజర్లలో 15.7 కోట్ల మంది ప్రి-పెయిడ్ ప్లాన్లను ఉపయోగిస్తున్నట్లు ఐడియా సెల్యులార్ వివరించింది. ఇప్పటిదాకా పర్ మినిట్, పర్ సెకన్ ప్లాన్లు రెండింటినీ అందిస్తూ వచ్చామని .. ఇకపై మొత్తం 15.7 కోట్ల మంది ప్రి-పెయిడ్ యూజర్లకు పూర్తిగా పర్ సెకన్ ప్లాన్ అమలవుతుందని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. ఇటీవలి కాలంలో కాల్ డ్రాప్ సమస్య వివాదాస్పదమైన నేపథ్యంలో టెలికం కంపెనీలు ఒక్కొక్కటిగా ప్రి-పెయిడ్ యూజర్లకు పర్ సెకను ప్లాన్ అందించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. భారతీ ఎయిర్టెల్ ఇటీవలే ఇటువంటి ఆఫర్ ప్రకటించింది. పర్ మినిట్ ప్లాన్లో ఉన్న యూజర్లు .. కాల్ మధ్యలోనే అంతరాయం ఏర్పడినప్పటికీ పూర్తిగా నిమిషానికి చార్జీ కట్టాల్సి వచ్చేది. తాజాగా సెకను ప్లాన్లో ఎన్ని సెకన్లు మాట్లాడితే అంతే సమయానికి మాత్రమే కట్టే వెసులుబాటు ఉంటుంది. -
ఐడియా నికర లాభం రూ.931 కోట్లు
వచ్చే ఏడాది నుంచి 4జీ సేవలు న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులర్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.931 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్కు రూ.728 కోట్ల నికర లాభం సాధించామని వివరించింది. గత క్యూ1లో రూ.7,561 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ ఆదాయం ఈ క్యూ1లో రూ.8,798కు పెరిగిందని పేర్కొంది. ఇంటర్కనెక్టెడ్ నిబంధనల్లో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మార్పులు చేసినందువల్ల ఈ ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. 44 లక్షల మంది యాక్టివ్ వినియోగదారులు, వాయిస్ మినిట్స్ 5.8 శాతం పెరగడం, మొబైల్ డేటా వినియోగం(2జీ, 3జీ) 15 శాతం వృద్ధి చెందడం వంటి కారణాల వల్ల స్థూల ఆదాయం వృద్ధి చెందిందని పేర్కొంది. ఐయూసీ రేట్ల మార్పు వల్ల రూ.317 కోట్ల ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, ఆదాయంలో మంచి వృద్ధి సాధించామని వివరించింది. 16.58 కోట్ల మంది వినయోగదారులకు సేవలందిస్తున్నామని తెలిపింది. గత క్యూ1లో రూ.181గా ఉన్న ఒక్కో వినియోగదారుడికి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ)ఈ క్యూ1లో రూ.182కు పెరిగిందని వివరించింది. -
ఐడియా డేటా రేట్లు అప్
ఢిల్లీలో 2జీ రేట్లు రెట్టింపు, 3జీ ప్లాన్లు 33% అధికం త్వరలో మిగతా సర్కిల్స్లోనూ పెంపు న్యూఢిల్లీ : ఇటీవలి వేలంలో భారీ మొత్తం వెచ్చించి స్పెక్ట్రం దక్కించుకున్న టెలికం కంపెనీలు టారిఫ్లు పెంచడం మొదలుపెట్టాయి. అన్నింటికన్నా ముందుగా ఐడియా సెల్యులార్ ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్లో (ఎన్సీఆర్) ప్రీపెయిడ్ కస్టమర్లకు మొబైల్ డేటా రేట్లను దాదాపు 100 శాతం దాకా పెంచేసింది. దీంతో కొన్ని 2జీ ప్లాన్ల రేట్లు రెట్టింపు కాగా, 3జీ ప్లాన్లు సుమారు 33% మేర పెరిగాయి. రాబోయే రోజుల్లో మిగతా సర్కిల్స్లో కూడా డేటా టారిఫ్లను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చిలో జరిగిన వేలంలో ఐడియా అత్యధికంగా రూ. 30,300 కోట్లు బిడ్ చేయడం తెలిసిందే. ఇంత మొత్తం వెచ్చించినందున దీని వల్ల డేటా రేట్లు పెంచక తప్పకపోవచ్చని కంపెనీ ఎండీ హిమాంశు కపానియా గతంలో వ్యాఖ్యానించారు కూడా. కొత్త మార్పుల ప్రకారం ప్రీపెయిడ్ కస్టమర్లు ఇకపై రూ.255 కడితే 3జీబీ డేటా (2జీ) కాకుండా 1.5 జీబీ మాత్రమే లభిస్తుంది. 28 రోజుల కాల పరిమితి ఉండే 1జీబీ 3జీ ప్యాక్ టారిఫ్ రూ.249 నుంచి రూ.295కి పెరిగింది. 2జీలో ఇప్పటిదాకా ఇస్తున్న 3జీబీ ప్లాన్ను తొలగించింది. -
ఐడియా లాభం 60 శాతం జంప్
క్యూ4లో రూ.942 కోట్లు... న్యూఢిల్లీ: టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (2014-15, క్యూ4)లో కంపెనీ రూ.942 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదుచేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.590 కోట్లతో పోలిస్తే లాభం దాదాపు 60% వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం రూ.7,044 కోట్ల నుంచి రూ.8,423 కోట్లకు పెరిగింది. 19.5% వృద్ధి నమోదైంది. కాగా, క్యూ4లో ఒక్కో యూజర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం(ఏఆర్పీయూ) రూ.179కి పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.173గా ఉంది. పూర్తి ఏడాదికి ఇలా...: 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐడియా కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,193 కోట్లకు ఎగబాకింది. 2013-14లో నమోదైన రూ.1,968 కోట్లతో పోలిస్తే లాభం 62 శాతం మేర దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం వృద్ధితో రూ.26,519 కోట్ల నుంచి రూ.31,571 కోట్లకు పెరిగింది. కాగా, 2014-15లో 3జీ డేటా యూజర్ల సంఖ్య రెట్టింపై 1.45 కోట్ల మందికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది.మెరుగైన ఫలితాల నేపథ్యంలో ఐడియా షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 2.79 శాతం లాభపడి రూ.192 వద్ద స్థిరపడింది. -
మైక్రోసాఫ్ట్తో ఐడియా జట్టు
విండోస్ స్టోర్ నుంచి యాప్లు, గేమ్స్ కొనుగోలు లక్ష్యం న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు తయారు చేసే మైక్రోసాఫ్ట్ డివెసైస్ సంస్థ ప్రముఖ టెలికం కంపెనీ ఐడియా సెల్యులర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఐడియా వినియోగదారులు విండోస్ స్టోర్ నుంచి ప్రీమియం యాప్లు, గేమ్స్ను కొనుగోలు చేయవచ్చు. వీటికి చెల్లింపులు వినియోగదారుడి ప్లాన్ను అనుసరించి ఉంటాయి. పోస్ట్ పెయిడ్ అయితే వీటికి నెలవారీ బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రిపెయిడ్ వినియోగదారులైతే, బ్యాలె న్స్ నుంచి తగ్గించబడుతుంది. మైక్రోసాఫ్ట్ ద్వారా సమగ్రమైన బిల్లింగ్ను ఆఫర్ చేస్తున్న తొలి భారత టెలికం సంస్థ ఐడియా అని, మరిన్ని సంస్థలతో ఈ తరహా ఒప్పం దాలు కుదుర్చుకోనున్నామని నోకియా ఇండియా (మైక్రోసాఫ్ట్ డివెసైస్ సబ్సిడరీ) సేల్స్ డెరైక్టర్ నిఖిల్ మాధుర్ చెప్పారు. ఈ విధానం క్రెడిట్ కార్డులు లేనివారికి ప్రయోజనకరమని పేర్కొన్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లకు గట్టిపోటీనిస్తున్న విండోస్ స్టోర్లో ప్రస్తుతం 5,50,000 యాప్లు ఉన్నాయి. ఇప్పటివరకూ 800 కోట్ల క్యుమిలేటివ్ డౌన్లోడ్లు జరిగాయి. -
స్టాక్స్ వ్యూ
ఐడియా సెల్యులార్ బ్రోకరేజ్ సంస్థ: షేర్ఖాన్ ప్రస్తుత ధర: రూ. 160 టార్గెట్ ధర: రూ.190 ఎందుకంటే: వేగంగా వృద్ధి చెందుతున్న భారత టెలికం కంపెనీ ఇది. మార్కెట్ వాటా 17 శాతంగా ఉంది. 2010-14 కాలానికి టెలికం పరిశ్రమ రాబడి 6 శాతంగా ఉండగా, ఈ కంపెనీ రాబడి 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఇదే కాలానికి కంపెనీ మార్కెట్ వాటా 12 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. 12కు పైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రమైన పోటీ ఉన్న టెలికం పరిశ్రమలో నాలుగేళ్లలోనే మార్కెట్ వాటాను, రాబడులను చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుకోవడం కంపెనీ పనితీరును ప్రతిబింబిస్తోంది. కంపెనీ బ్రాండ్ బిల్డింగ్ సామర్థ్యానికి, పటిష్టమైన నిర్వహణ తీరుకు ఇదే నిదర్శనం. 2014 ఆర్థిక సంవత్సరంలో నాలుగో క్వార్టర్లో 2.4గా ఉన్న రుణ, ఇబిటా నిష్పత్తి 2014-15 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ కల్లా 1.32కు తగ్గింది. పుష్కలంగా ఉన్న నగదు నిల్వలు, ఈక్విటీ పెరగడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కంపెనీలు టారిఫ్లను పెంచుతున్నాయి. రెండేళ్లలో ఈ టారిఫ్లు 7% వరకూ పెరుగుతాయని అంచనా. భారత్లో వాయిస్, డేటా మార్కెట్ మరింతగా వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఫలితంగా పటిష్టమైన ఆర్థిక స్థితి ఉన్న ఈ కంపెనీకి మంచి ప్రయోజనాలు అందనున్నాయి. అందుకని ప్రస్తుతమున్న ధర స్థాయి నుంచి ఈ కంపెనీ షేర్ 15-18 శాతం రేంజ్లో పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ. 970 టార్గెట్ ధర: రూ.1,100 ఎందుకంటే: వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీ వ్యాపారం క్రమక్రమంగా పుంజుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్ రికవరీ అధికంగా ఉంది. ఆఫ్రికా, నైజీరియా, దక్షిణాఫ్రికాల్లో వ్యాపారం మందగమనంగా ఉన్నా ఇండోనేసియాలో జోరుగా ఉంది. ముడిపదార్థాల ధరలు తగ్గుతుండటంతో ఉత్పత్తి వ్యయాలు తగ్గుతున్నాయి. వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో ఆయా దేశాల కరెన్సీ మారక విలువల కారణంగా ప్రస్తుతం ఈ షేర్ డిస్కౌంట్కే ట్రేడవుతోంది. ముడిచమురు ధరలు తగ్గుతుండడంతో ముడి పదార్థాల ధరలు తగ్గి ఉత్పత్తి వ్యయాలు తగ్గనున్నాయి. ఉత్పత్తి వ్యయాలు 50 శాతం వరకూ తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. దీంట్లో కొంత భాగాన్ని వినియోగదారులకు డిస్కౌంట్/ఉచిత వస్తువుల రూపంలో అందించాలని యోచిస్తోంది. ఫలితంగా అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయి. కుదుటపడుతున్న ఆర్థిక ఫలితాల కారణంగా మరోవైపు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. డెంగ్యూ జ్వరంపై ఆందోళనల కారణంగా కంపెనీ హోమ్ ఇన్సెక్టిసైడ్స్ వ్యాపారం జోరుగా ఉంది. కంపెనీ అందిస్తున్న దోమలకు సంబంధించిన ఫాస్ట్కార్డ్ ఉత్పత్తి ఏడాది కాలంలోనే వంద కోట్ల రూపాయల అమ్మకాలు సాధించింది. సబ్బుల వ్యాపారం కూడా పుంజుకుంది. -
ఐడియా లాభం 57 శాతం అప్
న్యూఢల్లీ: ఐడియా సెల్యులార్ ఈ ఏడాది జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం(2013-14, క్యూ1)లో రూ.728 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.463 కోట్లతో పోలిస్తే.. లాభం 57 శాతం ఎగబాకింది. ప్రధానంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసుల ఆసరాతో మొబిలిటీ వ్యాపారానికి డిమాండ్ పుంజుకోవడం, నెట్వర్క్ విస్తరణ, విభిన్న స్పెక్ట్రం పోర్ట్ఫోలియో, తమకున్న బ్రాండ్ ఇమేజ్లే లాభాల జోరుకు దోహదం చేశాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం క్యూ1లో 16 శాతం వృద్ధితో రూ.7,485 కోట్లకు పెరిగింది. గతేడాఇ ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.6,471 కోట్లు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 1 శాతం మేర లాభంతో రూ.139.75 వద్ద స్థిరపడింది. -
ఐడియా.. మరో 3జీ ఫోన్
హైదరాబాద్: ఐడియా సెల్యులర్ కంపెనీ మరో కొత్త 3జీ స్మార్ట్ఫోన్... ఐడీ 4000ను గురువారం ఆవిష్కరించింది. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ.4,999 అని ఐడియా సెల్యులర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ ఫోన్లో 4 అంగుళాల డిస్ప్లే, 3.2 మెగా పిక్సెల్ కెమెరా, 1 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, మైక్రో ఎస్డీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ, 21.1 ఎంబీపీఎస్ 3జీ స్పీడ్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. డేటా ఆఫర్లతో ఈ ఫోన్ను అంది స్తామని ఆయన వివరించారు. ప్రస్తుత 3జీ వినియోగదారులకు రూ.259 ప్యాకేజీలో 1.6 జీబీ డేటాను, మూడు నెలలు ఐడియా టీవీ ఉచితమని పేర్కొన్నారు. కొత్త వినియోగదారులకు ఈ డేటా ప్యాకేజీని రూ.261కు అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 17వ ఫోన్...: ఐడియా సెల్యులర్ అందిస్తున్న 17వ 3జీ స్మార్ట్ఫోన్ ఇదని శశి శంకర్ తెలిపారు. ఇప్పటిదాకా 7 లక్షల 3జీ ఫోన్లను విక్రయించామని పేర్కొన్నారు. మొత్తం 11 టెలికం సర్కిళ్లు-ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, తూర్పు, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ల్లో ఈ ఫోన్ను విక్రయించనున్నామని శశి శంకర్ వివరించారు. -
నచ్చిన రంగంలోనే సక్సెస్: మహేష్బాబు
సాక్షి, లైఫ్స్టైల్ ప్రతినిధి: ఎవరైనా తమకు నచ్చిన రంగాన్ని ఎన్నుకుంటే కెరీర్ పరంగా రాణించగలరని సూపర్స్టార్ మహేష్బాబు అభిప్రాయపడ్డారు. ఐడియా సెల్యూలర్ ఆధ్వర్యంలో బుధవారం తాజ్కృష్ణా హోటల్లో నిర్వహించిన ‘స్టూడెంట్స్ అవార్డ్’ కార్యక్రమానికి హాజరైన ఆయన విభిన్న అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్బాబు విలేకరులతో మాట్లాడుతూ తాను చిన్ననాటి నుంచి సినిమాలపై ఇష్టంతోనే పెరిగానని చెప్పారు. అదే విధంగా తన కుమారుడు గౌతమ్ని కూడా అతనికి ఇష్టమైన రంగంలోనే ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇటీవల ఓ మీడియా నిర్వహించిన సర్వేలో ఆదరణ, వ్యాపార ఒప్పందాల పరంగా మహేష్బాబు అగ్రగామిగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించగా.. సినిమాల పరంగా హార్డ్వర్క్ చేయడమే తన పని అని, దానికి ప్రతిఫలంగా లభిస్తున్న అభిమానుల ఆదరణకు తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు. ఇటీవల తన సినిమా పోస్టర్కు సంబంధించి తలెత్తిన వివాదం గురించి మాట్లాడుతూ అది వివాదాస్పదంగా ఎలా మారిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే వ్యక్తిగతంగా తాను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ‘వన్’ సినిమా పరాజయం తన ఆలోచనా ధోరణిపై ఎలాంటి ప్రభావం చూపలేదని, అది ఒక ప్రయోగాత్మక సినిమాగా భావించినట్టు చెప్పారు. భవిష్యత్తులోనూ అలాంటి ప్రయోగాలు చేస్తుంటానని తెలిపారు. తన కుమారుడు గౌతమ్తో కలిసి మరోసారి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. దర్శకుడు మణిరత్నంతో తన సినిమా ఇంకా చర్చల దశలో ఉందని, అవి పూర్తి కాగానే దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. తాజాగా నటిస్తున్న 3 చిత్రాల విశేషాలనూ వివరించారు. -
ఐడియా మంత్లీ రెంటల్స్ పెరిగాయ్
ముంబై: ఐడియా సెల్యులర్ కంపెనీ పోస్ట్-పెయిడ్ వినియోగదారుల నెలవారీ అద్దెలను రూ.50 పెంచింది. జూన్ బిల్ సైకిల్ నుంచి ఇది వర్తిస్తుందని కంపెనీ సర్వీస్ డెలివరీ హెడ్(ముంబై సర్కిల్) అమిత్ దిమ్రి పేర్కొన్నారు. కాగా ఐడియాకు ఉన్న మొత్తం 13.79 కోట్ల మంది వినియోగదారుల్లో పోస్ట్పెయిడ్ వినియోగదారుల సంఖ్య 4 శాతంగా ఉంది. టారిఫ్, కాల్ రేట్లు, రెంటల్స్ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని ఐడియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశిశంకర్ చెప్పారు. అయితే ఈ రెంటల్స్ పెంపు ముంబై సర్కిల్కేనా, లేక దేశవ్యాప్తంగా ఉన్న 22 సర్కిళ్లకు వర్తిస్తుందా అన్న విషయంలో ఆయన స్పష్టతనివ్వలేదు. తీవ్రమైన పోటీ కారణంగా టెలికం కంపెనీలు గతంలో టారిఫ్లను తగ్గించక తప్పలేదు. దీంతో ప్రపంచంలోనే అత్యంత తక్కువ కాల్ రేట్లు ఉన్న దేశంగా భారత్ అవతరించింది. ఒక దశలో కాల్ రేట్లు అర పైసకు తగ్గాయి. అయితే స్పెక్ట్రమ్ ధరలు పెరగడంతో కాల్ రేట్లను పెంచక తప్పడం లేదని టెలికం కంపెనీలు అంటున్నాయి. నిధుల కొరతతో అల్లాడుతున్న టెలికం కం పెనీలు మెల్లమెల్లగా టారిఫ్లను పెంచుతున్నాయి. -
3జీ రోమింగ్ ఒప్పందాలకు ఓకే
న్యూఢిల్లీ: దేశంలో అగ్రగామి టెలికం కంపెనీలైన ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలకు ఊరట లభించింది. 3జీ రోమింగ్ ఒప్పందాలపై టెలికం శాఖ(డాట్) విధించిన నిషేధం చెల్లదని టెలికం ట్రిబ్యునల్ టీడీశాట్ తేల్చిచెల్పింది. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా 3జీ రోమింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ డాట్ వడ్డించిన రూ.1,200 కోట్ల జరిమానాను కూడా రద్దుచేస్తూ మంగళవారం టీడీశాట్ తీర్పిచ్చింది. 2010లో టెల్కోలు 3జీ స్పెక్ట్రంను కొనుగోలు చేయడం, ఆతర్వాత తమకు స్పెక్ట్రం లెసైన్స్లేని సర్కిళ్లలో ఇతర టెల్కోలతో ఇంట్రా సర్కిల్ రోమింగ్(ఐసీఆర్) ఒప్పందాల ద్వారా 3జీ సేవలను అందించడం తెలిసిందే. కంపెనీలు స్పెక్ట్రంను కొనుగోలు చేయకుండా సేవలందించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని ఆరోపిస్తూ డాట్ ఈ నిషేధం, జరిమానాలను విధించింది. దీంతో తమకు స్పెక్ట్రం లేని సర్కిళ్లలో 3జీ సేవలను ఈ మూడు టెల్కోలూ నిలిపేయాల్సి వచ్చింది. డాట్ ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆయా కంపెనీలు టీడీశాట్ను ఆశ్రయించాయి. ఒప్పందాలు సహేతుకమే.... స్పెక్ట్రం కొరత నేపథ్యంలో మెరుగ్గా ఈ సహజవనరులను ఉపయోగించుకోవడం కోసం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రోమింగ్ ఒప్పందాలకు అనుమతించవచ్చని టీడీశాట్ పేర్కొంది. స్పెక్ట్రంను తగినవిధంగా సద్వినియోగం చేసుకోవడానికి ఇటువంటి ఒప్పందాలు దోహదం చేస్తాయని, తద్వారా వినియోగదారులకు కూడా ప్రయోజనకరమేనని టీడీశాట్ చైర్మన్ జస్టిస్ అఫ్తాబ్ ఆలం నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ‘ఐసీఆర్ 3జీ రోమింగ్ ఒప్పందాల్లో టెల్కోలు లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించాయని మేం భావించడం లేదు. పరస్పర ఒప్పందాల ద్వారా 3జీ సేవలను అందించకుండా డాట్ నిలువరించడం కుదరదు. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలకు డాట్ ఇచ్చిన నిషేధ, జరిమానా ఆదేశాల కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఎయిర్సెల్, టాటా టెలీ కంపెనీలకు డాట్ ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టివేస్తున్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఇదిలాఉండగా.. టీడీశాట్ తీర్పుపై సుప్రీంకోర్టును డాట్ ఆశ్రయించనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పందాలు ఇలా... 2010లో నిర్వహించిన 3జీ వేలంలో ఎయిర్టెల్... 13 సర్కిళ్లలో రూ.12,295 కోట్లకు స్పెక్ట్రం కొనుగోలు చేసింది. ఇక వొడాఫోన్ 11 సర్కిళ్లు(రూ.11,617 కోట్లు), ఐడియా 11 సర్కిళ్లలో(రూ.5,769 కోట్లు) 3జీ స్పెక్ట్రం దక్కించుకున్నాయి. అయితే, ఎయిర్టెల్.. వొడాఫోన్తో ఒప్పందం ద్వారా ఆ కంపెనీ సర్కిళ్లలోని మహారాష్ట్ర, కోల్కతా, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈస్ట్లలో సేవలను ప్రారంభించింది. వొడాఫోన్.. ఎయిర్టెల్కు చెందిన అసోం, బీహార్, కర్ణాటక, ఈశాన్య భారత్, రాజస్థాన్, యూపీ వెస్ట్లతో సహా ఐడియా చేతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్లలో ఒప్పందం కుదుర్చుకొని 3జీ సేవలకు తెరతీసింది. ఐడియా కూడా వొడాఫోన్కున్న ఢిల్లీ, తమిళనాడు, చెన్నై, కోల్కతా సర్కిళ్లను ఉపయోగించుకోవడానికి ఒప్పందం చేసుకుంది. అయితే, వీటిపై డాట్ ఆదేశాలతో రోమింగ్ ఒప్పందాలద్వారా ఇస్తున్న సేవలను నిలిపేయాల్సి వచ్చింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ టెల్కోలకు ఊరట లభించలేదు. దీంతో సుప్రీంను ఆశ్రయించిన టెల్కోలు... కేసును టీడీశాట్కు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఇందుకు సుప్రీం కోర్టు గతేడాది సెప్టెంబర్లో అంగీకారించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై మాత్రం నిషేధం విధించింది. అంతిమంగా ఇప్పుడు టీడీశాట్లో ఈ మూడు టెల్కోలకు అనుకూలంగా తీర్పు వెలువడింది. -
నల్లధనంపై పోరుకు కొత్త యంత్రాంగం
పారిస్/లండన్/బాసెల్: పన్ను ఎగవేతలు, విదేశాల్లో అక్రమంగా దాచుకుంటున్న నల్లధనంపై పోరాటానికి పటిష్టమైన యంత్రాంగం ఇక అమల్లోకి రానుంది. అంతర్జాతీయ సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) ఈ సరికొత్త ప్రమాణాలను గురువారం ఆవిష్కరించింది. ఈ నెల 22-23 తేదీల్లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగనున్న సమావేశంలో జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల ఆమోదముద్ర కోసం అధికారికంగా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఓఈసీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్థ విధానాలను ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాలు పాటిస్తుండటం గమనార్హం. పన్నుల విషయంలో వివిధ దేశాలు సమాచారాన్ని ఆటోమేటిక్గా ఇచ్చిపుచ్చుకునే యంత్రాంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలను రూపొందించాల్సిందిగా ఓఈసీడీని జీ20 కూటమి గతేడాది ఆహ్వానించింది. అంతర్జాతీయంగా మరింత పారదర్శక పన్ను విధానాల కోసం దీన్ని ప్రతిపాదించారు. కాగా, ఆటోమేటిక్ సమాచార మార్పిడి అంశంపై భారత్ రెండేళ్ల క్రితమే సంతకాలు చేసింది. ఇందులో తాజాగా అమలు చేయనున్న కొత్త ప్రమాణాలను కూడా భారత్తో సహా 42 దేశాలు అనుసరించనున్నాయి. బ్యాంకులు ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి సేకరించే సమాచారాన్ని వార్షిక ప్రాతిపదికన ఆటోమేటిక్గా సభ్యదేశాలన్నీ ఇచ్చిపుచ్చుకునేలా ఈ కొత్త ప్రమాణాలతో వీలవుతుందని ఓఈసీడీ వెల్లడించింది. ఎలాంటి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలి... విబిన్నమైన బ్యాంకు ఖాతాలు, పన్ను చెల్లింపుదార్లకు సంబంధించి ఆర్థిక సంస్థలు నివేదించాల్సిన వివరాలతో పాటు అవి అనుసరించాల్సిన ఉమ్మడి పరిశీలన(డ్యూ డెలిజెన్స్) విధివిధానాలను ఈ కొత్త యంత్రాంగంలో పొందుపరిచినట్లు వివరించింది. ఇవి కొత్త ఒరవడి సృష్టించగలిగే(గేమ్ చేంజర్) విధానాలని ఓఈసీడీ సెక్రటరీ జనరల్ ఏంజెల్ గురియా అభివర్ణించారు. కాగా, ఈ కొత్త ప్రమాణాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని, భారీ ఖర్చుతో కూడుకున్నవని స్విట్జర్లాండ్ బ్యాంకులు వ్యాఖ్యానించాయి. అయితే, పన్నుల ఎగవేతదార్లకు చెక్చెప్పేందుకు ఉద్దేశించిన ఈ యంత్రాంగాన్ని తాము ఆహ్వానిస్తున్నామని అక్కడి బ్యాంకింగ్ అసోసియేషన్(ఎస్బీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయులు నల్లధనాన్ని దాచుకోవడానికి స్విట్జర్లాండ్ సహా కొన్ని దేశాల బ్యాంకులు స్వర్గధామంగా మారాయంటూ దేశంలో రాజకీయంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నల్ల ధనం అంశాన్ని ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా చేసుకోనున్నాయి కూడా. -
ఐడియా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్
న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ కంపెనీ ఆకర్షణీయమైన రెండు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్లను ఆఫర్ చేస్తోంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఈ రోమింగ్ ప్యాక్లు వర్తిస్తాయని కంపెనీ మంగళవారం తెలిపింది. డేటా చార్జీలు 90 శాతం, వాయిస్ టారిఫ్ల్లో 80 శాతం డిస్కౌంట్తో ఈ రోమింగ్ ప్యాక్లను అందిస్తున్నామని ఐడియా సెల్యులర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. రూ. 599 ప్యాక్ వ్యాలిడిటీ 10 రోజులని, రూ.1,499 ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులని పేర్కొన్నారు. అమెరికా, సింగపూర్, ఇంగ్లండ్, థాయ్లాండ్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర 40 దేశాలకు ఈ రోమింగ్ ప్యాక్లు వర్తిస్తాయని వివరించారు. ఈ రెండు ప్యాక్ల్లో లోకల్, ఇంటర్నేషనల్ అవుట్ గోయింగ్ కాల్స్కు నిమిషానికి రూ.15, ఇన్కమింగ్ కాల్స్కు నిమిషానికి రూ.30 చొప్పున టారిఫ్ ఉంటుందని తెలిపారు. డేటా చార్జీల విషయానికొస్తే 1 ఎంబీకి రూ.30 చార్జ్ అవుతుందని వివరించారు. రూ.1,499 ప్యాక్లో ఇంటర్నేషనల్ రోమింగ్లో ఉన్నప్పుడు 30 నిమిషాల ఇన్కమింగ్ కాల్స్ ఉచితమని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఇంటర్నేషనల్ కాల్ రేట్లు నిమిషానికి రూ.145 నుంచి రూ.185 గానూ, డేటా చార్జీలు 1 ఎంబీకి రూ.512 గానూ కంపెనీ చార్జ్ చేసేది. -
మొబైల్ ఇంటర్నెట్ రేట్లు పెరిగాయ్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్, ఐడియా సెల్యులర్, వొడాఫోన్లు మొబైల్ ఇంటర్నెట్ రేట్లను పెంచాయి. 2జీ నెట్వర్క్లో కొన్ని నిర్దిష్ట ప్లాన్ల కింద డౌన్లోడ్ చేసుకునే డేటాను సగానికి తగ్గించాయి.ప్లాన్ల వ్యాలిడిటీ వ్యవధినీ తగ్గించాయి. దీంతో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసుల వినియోగం కొంచెం ఖరీదవుతుంది. ఉదాహరణకు, 1జీబీ డౌన్లోడ్కు వినియోగదారులు 25% అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ మూడు కంపెనీలు 1జీబీ(1024 ఎంబీ)ఇంటర్నెట్ యూసేజ్కు రూ. 125 చార్జ్ చేశాయి. ఇప్పుడు ఈ యూసేజీని 525 ఎంబీకు తగ్గించాయి. ఎయిర్టెల్ వినియోగదారులు 1 జీబీ ఇంటర్నెట్ యూసేజీకి ఇప్పుడు రూ.156 చెల్లించాల్సి ఉంటుంది. ఐడియాకు అయితే రూ.154, వొడాఫోన్కు అయితే రూ.155 చెల్లించాలి. ఇవి ఢిల్లీ ధరలు. ఇక ఎయిర్టెల్ ఢిల్లీలో రూ.98 ప్యాక్ వ్యాలిడిటీని 28 రోజుల నుంచి 14 రోజులకు తగ్గించింది. డేటా యూసేజీని కూడా సగానికి తగ్గించింది. ఈ ధరల మార్పు ఎప్పటి నుంచి వర్తిస్తుందో ఈ కంపెనీలు వెల్లడించలేదు. ఏడాదిలోపు కాలంలో 2జీ ఇంటర్నెట్ రేట్లు పెరగడం ఇది రెండోసారి. -
90 కోట్లు దాటిన ఫోన్ కనెక్షన్లు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలిఫోన్ కనెక్షన్లు మరోసారి 90 కోట్ల మార్కు ను అధిగమించాయి. ఏప్రిల్తో పోలిస్తే మే లో కనెక్షన్లు స్వల్పంగా 0.34 శాతం పెరిగి 90.005 కోట్లుగా నమోదయ్యాయి. చివరిసారిగా గతేడాది జూన్లో కనెక్షన్లు ఏకంగా 96.55 కోట్లుగా ఉండేవి. అప్పట్నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చాయి. శుక్రవారం ట్రాయ్ ఈ గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఏప్రిల్ ఆఖర్లో కనెక్షన్లు 89.70 కోట్లుగా ఉన్నాయి. మే లో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 86.7 కోట్ల నుంచి 87 కోట్లకు పెరిగింది. 12 లక్షల కొత్త కస్టమర్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ అగ్రస్థానంలో ఉండగా, 9 లక్షలతో వొడాఫోన్, 8.67 లక్షలతో ఐడియా సెల్యులార్, 8.51 లక్షలతో ఎయిర్టెల్, 2.77 లక్షల కొత్త కస్టమర్లతో ఎయిర్సెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు 9 లక్షలు తగ్గాయి. మొత్తం కనెక్షన్లపరంగా చూస్తే 18.96 కోట్ల సబ్స్క్రయిబర్స్తో ఎయిర్టెల్ అగ్రస్థానంలో ఉంది.