VIP Reporter
-
వసతుల కల్పనకు కృషి
తణుకు : తణుకు పట్టణంలోని అజ్జరం రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ వాసులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు. వారి అవస్థలను తెలుసుకునేందుకు మునిసిపల్ ఇన్చార్జి కమిషనర్ పి.శ్రీకాంత్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మారారు. కాలనీలోని వీధుల్లో తిరుగుతూ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ : ఇక్కడ ఇబ్బందులైమైనా ఉన్నాయా. వెంకటరమణ: మంచినీటి సమస్య ఉంది సార్. బోరు వేసినప్పటికీ ఈ నీళ్లు తాగేందుకు పనికి రావడం లేదు. నాలుగు కిలోమీటర్లు వెళ్లి నీళ్లు కొనుక్కుని తెచ్చుకుంటున్నాం. కమిషనర్ : గోదావరి జలాలను తరలించే క్రమంలో పైప్లైన్ల విస్తరణకు రూ.2 కోట్లు కేటాయించాం. పట్టణానికి ఈ ప్రాంతం చాలాదూరంగా ఉండటంతో విస్తరణకు కొన్నాళ్లు సమయం పడుతుంది. వెంకటరమణ : ఇక్కడ దాదాపు 600 కుటుంబాల వారుంటున్నారు. రేషన్ డిపో ఇక్కడ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. కమిషనర్ : ఈ విషయం ఎమ్మెల్యే దృష్టిలో ఉంది. త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. అక్కడి నుంచి మరో వీధిలోకి వెళ్లిన కమిషనర్ రమేష్ అనే వ్యక్తితో మాట్లాడారు. రమేష్ : కరెంటు సమస్య ఉంది సార్. సామర్థ్యానికి సరిపడా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి సమయాల్లో లైట్లు కాలిపోతున్నాయి. కమిషనర్ : రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. దుర్గాప్రసాద్ : బైపాస్ రోడ్డు నుంచి కాలనీ వరకు వీధి దీపాలు లేవు. రాత్రి సమయాల్లో రావడానికి భయపడుతున్నాం. కమిషనర్ : విద్యుత్ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. అన్నపూర్ణ : ఇటీవల దోమల ఉధృతి పెరిగిపోవడంతో చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కమిషనర్ : దోమల నివారణకు తక్షణమే చర్యలు తీసుకుంటాను. రూ. 2 కోట్లతో పైప్లైన్ విస్తరణ ఇందిరమ్మ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాం. ప్రధానంగా తాగునీటి సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకుంటాం. గోదావరి జ లాలు సరఫరా చేసేందుకు పైపులైన్ల విస్తరణకు రూ.2 కోట్లు కేటాయించాం. ఇందులో భాగంగా ఇంది రమ్మ కాలనీకి గోదావరి జలాలు తరలించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. దూరం అయినప్పటికీ ఇక్కడకు కూడా పైపులైన్లు విస్తరించి గోదావరి జలాలు అందిస్తాం. కాలనీలో రూ.28 లక్షలతో బీటీ రోడ్లు నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు చేశాం. ప్రస్తుతం రూ.10 లక్షలు వెచ్చించి గ్రావెల్తో మెరక చేయిస్తున్నాం. - పి.శ్రీకాంత్, ఇన్చార్జి కమిషనర్, తణుకు -
రోడ్డు భద్రతకే ప్రాధాన్యం
ఇటీవలి కాలంలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం జరగడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ప్రజలు చూస్తూనే ఉన్నారు. అలాంటి వార్తలు చదివిన ప్రతిసారీ ప్రజలకు రవాణా శాఖ పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలు ప్రజలకే కాదు మరో ముఖ్య వ్యక్తికీ ఉన్నాయి. ఆయనే జిల్లా ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) జే రమేష్కుమార్. తమ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలతో వ్యవహరించే తీరు, ప్రజలకు తమ శాఖ అందిస్తున్న సేవలు, అవి సక్రమంగా అందుతున్నాయా లేదా వంటి సందేహాలు ఆయన మనసును తొలుస్తున్నాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు ఆయనకు ఒక చక్కటి మార్గం దొరికింది. అదే ‘సాక్షి’ దినపత్రిక నిర్వహిస్తున్న వీఐపీ రిపోర్టర్. ఈ కార్యక్రమం ద్వారా ఆయన ఒక విలేకరిగా మారిపోయారు. స్థానిక ఫైర్స్టేషన్ సెంటర్కు చేరుకుని వాహన చోదకులు నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా ఆరా తీశారు. తొలుత ఆయన తన కార్యాలయంలోని కౌంటర్ల వద్ద ఉన్న వ్యక్తులతో ఇలా సంభాషించారు.. డీటీసీ : మీ పేరేమిటి, ఏ పని మీద వచ్చారు. స్వర్ణ వెంకటేశ్వరరావు : సర్ నేను లెసైన్స్ రెన్యువల్ కోసం వచ్చాను. రెన్యువల్ చేశారు కానీ అన్ని పేర్లూ తప్పు వచ్చాయి. సరిచేయమంటే ఆ కాగితాలు తీసుకురా, ఈ కాగితాలు తీసుకురా అంటూ ఇప్పటికి ఎనిమిది సార్లు తిప్పారు. డీటీసీ : ఒకసారి మా ఏఓ గారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పండి, ఆయన పరిష్కరిస్తారు. అక్కడి నుంచి మెట్ల మీదుగా కి ందకి దిగి సిగ్నల్ వ్యవస్థపై అవగాహన కలిగించే ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక యువతితో డీటీసీ : ఏమ్మా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. డీ సునీత : ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేశాను సార్. టెస్ట్ పెట్టారు అది కూడా పూర్తి చేశాను. అక్కడే ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండీ అలీతో డీటీసీ : మీరు ఇక్కడ ఏ విధులు నిర్వహిస్తున్నారు ఎండీ అలీ : లెర్నింగ్ లెసైన్స్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ సిగ్నల్స్పై అవగాహన కల్పిస్తాం సార్ అలాగే లెసైన్స్లు ఇచ్చే ముందు వారికి పరీక్షలు నిర్వహించి సంతృప్తి చెందిన తరువాతే లై సెన్స్లు ఇస్తున్నాం సార్. అక్కడి నుంచి హెల్ప్ డెస్క్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కిరణ్కుమార్ వద్దకు వెళ్లి డీటీసీ : ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులోనే ఉన్నాయి కదా..వారికి సౌకర్యాలు కలిగించడానికి ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయాల్సి ఉందా అని ప్రశ్నించారు. పీఆర్ కిరణ్కుమార్ : ఇక్కడ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి సార్. ఏ పనిమీద వచ్చిన ప్రజలను ఆ పనికి సంబంధించిన సెక్షన్కు పంపుతున్నాం, వారి నుంచి ఫిర్యాదులేమీ లేవు. అక్కడి నుంచి నంబర్ ప్లేట్లు ఇస్తున్న కాంట్రాక్టర్ తాలూకు వ్యక్తి వద్దకు వచ్చి డీటీసీ : నంబర్ ప్లేట్లు ఎన్నిరోజులకు వస్తున్నాయి. మోహన్ : ప్లేట్లు 10 రోజులకు వస్తున్నాయి సార్. మామూలుగా నాలుగు రోజులకే రావాలి. ఆలస్యమౌతోంది. అక్కడే ఉన్న కానిస్టేబుల్తో ఇక్కడ అంతా సజావుగానే సాగుతోంది కదా అని ప్రశ్నించిన డీటీసీతో కానిస్టేబుల్ రామారావు : బాగానే ఉంది కానీ నంబర్ ప్లేట్ల లో నాణ్యత ఉండడం లేదని ఆరోపణలు వస్తున్నాయి సార్. డీటీసీ : మీరు ఏ పనిమీద వచ్చారు. వెంకటేశ్వరరావు : నేను ట్రాన్స్పోర్టు వాహనం జంగారెడ్డిగూడెం కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. నంబర్ ప్లేటు కోసం ఇక్కడికి రావలసి వచ్చింది. ట్రాన్స్పోర్టు వాహనాలకు కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగితే అక్కడే నంబర్ ప్లేటు వచ్చేలా ఏర్పాటు చేయండి సార్ అని అడిగాడు. అక్కడి నుంచి స్థానిక ఫైర్స్టేషన్ సెంటర్ వద్దకు చేరుకున్న డీటీసీ ఆయన సిబ్బంది ఒక ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురు విద్యార్థులను ఆపారు. డీటీసీ : ఏమయ్యా బైక్ ఎవరిది, లెసైన్స్ ఉందా, ముగ్గురు వెళ్లడం నేరమని తెలియదా? రాజేష్ : బైక్ మా నాన్నగారిది సార్ కాలేజీలో చిన్న పని ఉంటే చూసుకుని వెళదామని వచ్చాను. అక్కడ స్నేహితులు కలిస్తే వారిని ఎక్కించుకు వెళుతున్నాను. లెసైన్స్కు దరఖాస్తు చేసుకున్నాను. ఇంకా రాలేదు. అని చెప్పాడు. ఈ లోపు అటుగా వెళుతున్న మరో విద్యార్థిని డీటీసీ : ఆపి నీ వయసెంత, లెసైన్స్ ఉందా, మీ నాన్నగారు ఏమి చేస్తారు అని ప్రశ్నించారు. ప్రదీప్ : నేను ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాను సార్. మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. డీటీసీ : అటుగా వెళుతున్న జి.లహరి అనే బిఫార్మసీ విద్యార్థిని ఆపి ఏమ్మా మీకు లెసైన్స్, సీ బుక్, ఇన్సూరెన్సు ఉన్నాయా అని ప్రశ్నించగా ఆమె తన బండిలోని కాగితాలన్నీ చూపడంతో వెరీ గుడ్ మేము ఇప్పటి వరకూ చూసిన వాటిలో మొత్తం రికార్డులున్నది మీ ఒక్కరి దగ్గరే అందరూ మీలాగే ఉంటే మా పని తేలికౌతుంది. అంటూ ప్రశంసించారు. అనంతరం ఎం.బిందు అనే మహిళను ఆపి డీటీసీ : ఏమ్మా మీ బండి రికార్డులు, లెసైన్స్ చూపండి అని అడిగారు. దానికి ఆమె తనవద్ద ఏ రికార్డులూ లేవని తెలపడంతో మీరు ఏమి చేస్తారు అని ప్రశ్నించారు. తాను కాలేజిలో లెక్చరర్గా పనిచేస్తానని చెప్పడంతో విద్యార్థులకు అవగాహన కలిగించాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అని సున్నితంగా మందలించారు. ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలి : డీటీసీ రవాణా శాఖ రహదారి భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. రోడ్డుపై తిరిగే ప్రతి వాహనం కండిషన్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాలు జరగకుండా ప్రజల నుంచి కూడా సహకారం అవసరం. నిబంధనలకు విరుద్ధంగా వెళితే మహిళలకూ మినహాయింపు ఉండదు. మైనర్లు కూడా వాహనాలు నడిపేస్తున్నారు. లెసైన్సులు లేకుండా వాహనాలు నడిపితే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చాలామంది ఉన్నతోద్యోగులు, పోలీసుల పిల్లలు కూడా లెసైన్సులు లేకుండా రోడ్లపైకి వాహనాలను తీసుకువస్తున్నారు. ఇటువంటివి మరోసారి మా దృష్టిలో పడితే అటువంటి ఉద్యోగులకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగులిస్తాం. మైనర్లు ప్రమాదాలకు కారణమైతే తల్లిదండ్రులకు శిక్షపడేలా చట్టాలు రూపొందించాలి. లెసైన్స్లు తీసుకోవడంలో ఇబ్బందులుంటే నేరుగా నన్నే కలవవచ్చు. నంబర్ ప్లేట్ల విషయంలో నాణ్యత లేని విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఏజెన్సీని మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రవాణా వాహనాలు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అక్కడే నంబర్ ప్లేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. -
క్షీరా రామం..భక్తిధామం
పొలకొలనుగా.. క్షీరపురిగా విలసిల్లిన పాలకొల్లు పట్టణంలోని శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం (పెదగోపురం) పంచారామ క్షేత్రాల్లో ఒకటి భాసిల్లుతోంది. క్షీరా రామలింగేశ్వరుడి పేరుతో ఇక్కడ కొలువైన పరమ శివుణ్ణి దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. కార్తీక మాసంలో లక్షలాది మంది ఇక్కడి శివలింగాన్ని దర్శించి పునీతులవుతారు. గోదావరి నది సముద్రంలో సంగమించే నరసాపురం పట్టణం పాలకొల్లుకు అతి సమీపంలో ఉండటంతో పుష్కర యాత్రికులు క్షీరా రామలింగేశ్వరుడిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ పెదగోపురాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85 లక్షలను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో క్షీరపురిలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయ అర్చకులు, ఆలయ పరిధిలోని దుకాణాల యజమానుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చల్లపు సూర్యచంద్రరావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మారారు. భక్తులు, అర్చుకులు, దుకాణాల యజమానులతో మాట్లాడారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్ ఇలా సాగింది. ఈవో : అమ్మా.. నా పేరు సూర్యచంద్రరావు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా వచ్చాను. మీ సమస్యలేమిటో చెప్పండి. విజయలక్ష్మి, భక్తురాలు : ప్రతి సోమవారం స్వామికి ఇచ్చే పంచ హారతులను దర్శించుకునే భాగ్యం కేవలం ముందు వరుసలో భక్తులకు మాత్రమే కలుగుతోంది. ఆలయానికి వచ్చే వారందరికీ పంచహారతులు దర్శించుకోవడానికి అవకాశం కల్పించండి. ఈవో : మంచి సూచన చేశారు. వచ్చే సోమవారం నుంచి భక్తులందరికీ పంచహారతుల దర్శన భాగ్యం కల్పిస్తాం. ఆదిమూల నాగేశ్వరరావు, భక్తుడు : నమస్కారమండీ. ఆలయం ముందు దుకాణాలు పెట్టడం వల్ల భక్తులకు ఇబ్బందిగా ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. అయినా స్పందన లేదు. ఈవో : నిజమే కొద్దిరోజులుగా సమస్య తీవ్రమైంది. దుకాణాలున్న ప్రాంతం మునిసిపాలిటీది కావడం వల్ల మునిసిపల్ కమిషనర్కి లేఖ రాశాం. ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే. లింగం సత్యనారాయణ, భక్తుడు : మాది పూలపల్లి. పొరుగూరు నుంచి వచ్చే భక్తులకు వాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం ఆలయ పరిసరాల్లో లేదు. గుడికి దగ్గరలో పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. ఈవో : పుష్కరాల నేపథ్యంలో దేవుని హాలును అభివృద్ధి చేస్తున్నాం. రూ.35 లక్షలతో నిర్మించే అభిషేకాల మండపం దిగువ భాగంలో పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తాం. నీలకంఠేశ్వరి, భక్తురాలు : పొరుగూరు నుంచి వచ్చే భక్తులకు విశ్రాంతి తీసుకోవడానికి సరైన సదుపాయం లేదు. దూర ప్రాంత భక్తులు స్వామి దర్శనానంతరం కొద్దిసేపు సేదతీరే అవకాశం ఆలయ పరిసరాల్లో కల్పించాలి. ఈవో : పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా అభిషేకాల మండపం నిర్మిస్తున్నాం. దీంట్లో భక్తులు సేదతీరే వీలుంటుంది. మార్కండేయులు, భక్తుడు : నిత్యం గుడిలోనే ఉంటా. గర్భగుడిలో వీఐపీల పేరుతో కొంతమందికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. దీనివల్ల సామాన్య భక్తులు దర్శన భాగ్యం కోసం గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. ఈవో : కార్తీక మాసం, పర్వ దినాల్లో ఈ సమస్య తలెత్తుతోంది. గర్భగుడి లో అభిషేకాలను ఇకనుంచి చేయని వ్వం. అభిషేకాల కోసం పుష్కర నిధులతో ప్రత్యేక మండపం నిర్మిస్తున్నాం. ఎస్.గణపతి, భక్తుడు : ఈవో గారూ. పుష్కరాల సందర్భంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్నసమారాధన చేయాలి. అవసరమైతే మైకుల్లో ప్రచారం చేయండి. భక్తుల నుంచి విరాళాలు వసూలు చేయండి. సాధారణ రోజుల్లో ప్రతి సోమవారం భక్తులకు అన్నసమారాధన చేయించండి. ఈవో : మంచి సూచన చేశారు. ఇకనుంచి ముందు పట్టణేతరులకు టోకెన్లు ఇచ్చి ఆ తరువాత మిగిలితే స్థానికులకు భోజనం పెట్టే ఏర్పాటు చేస్తాం. అనంతరం ఈవో సూర్యచంద్రరావు పురోహితుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈవో : అర్చక స్వాములూ.. మీ సమస్యలేమిటో చెప్పండి. కోట నాగబాబు, పురోహితుడు : మాకంటూ ప్రత్యేకంగా సమస్యలు లేవు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నివిధాలా సేవలందిస్తాం. పుష్కర సమయాల్లో అరగంట మాత్రమే విశ్రాంతి ఇస్తాం. మద్దూరి సూర్యనారాయణమూర్తి, పురోహితుడు : గత పుష్కరాల్లో పురోహితులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఈ పుష్కరాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కోరుతున్నాం. ఈవో : ఈ విషయమై శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశాం. తప్పనిసరిగా పురోహితులందరికీ గుర్తింపు కార్డులిచ్చే ఏర్పాట్లు చేస్తాం. అనంతరం ఆలయానికి చెందిన షాపులను లీజుకు తీసుకు వ్యాపారాలు చేస్తున్న వారితో ఈవో మాట్లాడారు. వివిధ సమస్యలను వ్యాపారులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఆలయానికి సంబంధించి 42 షాపులు ఉన్నాయని, తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో షాపుల్లో పనిచేసే గుమాస్తాలు, యజమానులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. వీటిలో నీటి సౌకర్యం లేదని, ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. పుష్కర నిధులతో మరుగుదొడ్లకు మరమ్మతులు చేస్తున్నామని ఈవో సమాధానమిచ్చారు. స్థలాభావం వల్ల అదనపు మరుగుదొడ్లు నిర్మించే అవకాశం లేదన్నారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పుష్కర యాత్రికులకు సమస్యలు రానివ్వం పుష్కర యాత్రికులకు ఎలాంటి సమస్యలు రానివ్వం. దూర ప్రాంతాల నుంచి వచ్చే పుష్కర యాత్రికుల కోసం 12 రోజులపాటు పట్టణంలోని అన్నసమారాధన సత్రాల సహకారంతో మెయిన్ రోడ్డులోని రేపాక వారి సత్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. భక్తుల విశ్రాంతి కోసం అన్నదాన సత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు భక్తుల సౌకర్యాల కోసం ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు రూ.85 లక్షలు మంజూరు చేయించారు. రూ.50 లక్షలతో ఆలయానికి రంగులు, వైరింగ్ మరమ్మతులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు చేయిస్తున్నాం. మరో రూ.35 లక్షలతో అభిషేక మండపాల నిర్మిస్తున్నాం. ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తవుతాయి. - చల్లపు సూర్యచంద్రరావు, ఈవో -
ఆత్మస్థైర్యమే వజ్రాయుధం
పి.సౌమ్యలత. డీఎస్పీగా నరసాపురంలో తొలి పోస్టింగ్. పోలీస్ సబ్ డివిజన్ అధికారిగా శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన కీలక బాధ్యతలు ఆమెపైనే ఉన్నాయి. విధుల్లో చేరినప్పుడే మహిళల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పిన ఆమె అక్కడితో ఆగిపోలేదు. ఆ దిశగా ఆచరణ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ‘సాక్షి’ వీఐపీగా రిపోర్టర్గా నరసాపురం మండలం సీతారామపురంలోని లేసు పార్కులో పనిచేస్తున్న మహిళల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. సుమారు రెండు గంటలపాటు లేసు పార్కులో పనిచేసే మహిళలతో మమేకమై వారి బాధలను, కష్టాలను, సమస్యలను తెలుసుకున్నారు. చట్టాలపై వారికి అవగాహన ఉందా లేదా, కష్టమొస్తే పోలీసులు ఉన్నారన్న విషయం తెలుసా లేదా అన్న విషయాలను ఆరా తీశారు. మహిళలకు ఆత్మస్థైర్యమే వజ్రాయుధమని, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే అందలం ఎక్కవచ్చని సాటి మహిళగా అక్కడి మహిళలకు బోధించారు. వీఐపీ రిపోర్టర్ విశేషాలు ఇలా... డీఎస్పీ : నా పేరు సౌమ్యలత. నరసాపురం డీఎస్పీగా ఈ మధ్యనే బాధ్యతలు చేపట్టాను. మిమ్మల్ని కలుసుకోవాలని, మీ ఇబ్బందులు తెలుసుకోవాలని.. పోలీస్ శాఖ పరంగా ఏదైనా సహాయం చేయగలనా అనే విషయాలను తెలుసుకోవడానికి వచ్చాను. లేస్ పార్క్ విశేషాలు చెబుతారా. పడవల మంగతాయారు, ఇన్స్ట్రక్టర్ : నమస్తే మేడమ్. నేను ఇక్కడ కుట్టు అల్లికలకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్న వారికి ఇన్స్ట్రక్టర్గా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం మా సెక్షన్లో 40 మంది శిక్షణ పొందుతున్నారు. రెండు నెలల పాటు శిక్షణ ఉంటుంది. లేసు అల్లికలు, డిజైన్లలో శిక్షణ ఇస్తాం. డీఎస్పీ : శిక్షణ అనంతరం ఎలాంటి ఉపాధి దొరుకుతుంది. పి. కరుణకృప, కె.అనూష, కె.లక్ష్మీ సరస్వతి : మేడమ్. మేం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాం. శిక్షణ అనంతరం లేసు అల్లికల్లో నైపుణ్యత వస్తుంది. విదేశాలకు ఎగుమతి అయ్యే లేసులను అల్లుతాం. మాకు నెలలో ఒక్కొక్కరికీ రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేల వరకు ఆదాయం వస్తుంది. డీఎస్పీ : మీరంతా ఎక్కడెక్కడినుంచి వచ్చారు. దూరం నుంచి వచ్చే సందర్భంలో మీకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా దేశింశెట్టి రమాదుర్గ, పులపర్తి లక్ష్మీకాంతం, సీహెచ్ విజయలక్ష్మి : బస్సుల్లోను, ఆటోల్లోను ప్రయాణం చేసి రావాలి. కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు. అయితే ఈప్రాంతంలో మరీ ఇబ్బందికర పరిస్థితులు లేవు. సమాజంలో మహిళల విషయంలో ఇంకా మార్పు రావాలి. డీఎస్పీ : మహిళల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలు గురించి మీకేమైనా అవగాహన ఉందా. హేమలత : మహిళల కోసం ఏవో కొన్ని చట్టాలు ఉన్నాయని మాత్రం తెలుసు. కానీ అవేమిటో పూర్తిగా తెలియదు. ఏదైనా కష్టమొస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలుసు. దీంతో డీఎస్పీ సౌమ్యలత మహిళల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలను గురించి వారికి వివరించారు. ఇటీవల అమల్లోకి వచ్చిన నిర్భయ చట్టంపై అవగాహన కల్పించారు. గృహహింస, ఈవ్టీజింగ్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలన్నది వివరించారు. నరసాపురం డివిజన్ పరిధిలోని మహిళలకు ఏమైనా ఇబ్బందులుంటే.. పోలీస్ శాఖ ద్వారా పరిష్కరించగలిగేవి అయితే వెంటనే తనకు చెప్పాలని సూచించారు. సమస్యలొచ్చినప్పుడు ఏ సమయంలోనైనా తన సెల్ నంబర్ 94407 96615కు ఫోన్ చేయాలని సూచించారు. -
అద్దె భవనాలు...ఇరుకు గదులు
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించే ధ్యేయంతో జిల్లాలో ఏర్పాటైన 3,700(మినీ కేంద్రాలతో కలిపి) అంగన్వాడీ కేంద్రాల్లో చాలా కేంద్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తోంది. చాలా కేంద్రాలు ఇరుకు గదుల్లోను, 80 శాతం అద్దె భవనాల్లోనూ నడుస్తున్నాయి. కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ ఎఈ.రాబర్ట్స్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మారారు. పట్టణంలోని పలు కేంద్రాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతో ఆటలాడించి, పాటలు పాడించారు. కేంద్రాల్లో సమస్యలు గురించి తెలుసుకున్నారు. పీడీ ఏమన్నారంటే సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్గా పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించాను. వాటిలో కొన్ని సమస్యలను గుర్తించాను. ప్రధానంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం, గర్భిణుల్లో రక్తహీనత ఉన్నట్టు అర్థమైంది. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారికి అదనపు ఆహారాన్ని ఇస్తున్నాం. రక్తం తక్కువగా ఉన్న గర్భిణులను గుర్తించి వారికి కూడా అదనపు పౌష్టికాహారాన్ని , ఐరన్ మాత్రలను అందిస్తున్నాం. అధిక శాతం కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న భవనాల్లోకి మార్చడానికి కృషి చేస్తాను. మొదట పట్టణంలోని కొణిసి వీధిలో గల అంగన్వాడీ కేంద్రాన్ని పీడీ సందర్శించారు. అక్కడ సంభాషణ ఇలా సాగింది. పీడీ రాబర్ట్స్: అమ్మా మీపేరేంటి, ఇక్కడకు ఎందుకు వచ్చారు? ఏఎన్ఎం సత్యవతి: సార్ నాపేరు సత్యవతి నేను ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. ఇమ్యునైజేషన్ చేయడానికి వచ్చాను. రాబర్ట్స్: ఎవరెవరికి టీకాలు వేస్తారు? సత్యవతి: గర్భిణులు, పిల్లలకు టీకాలు వేస్తాం. పీడీ రాబర్ట్స్: అమ్మా నీ పేరేంటి, ఎన్ని సంవత్సరాలు నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు ? అంగన్వాడీ కార్యకర్త: సార్ నాపేరు ప్రసన్న. నేను ఐదు సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తున్నాను. పీడీ రాబర్ట్స్: ఎంతమంది పిల్లలు మీ కేంద్రంలో నమోదు అయ్యారు, ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ప్రసన్న: మా కేంద్రంలో 29 మంది పిల్లలు నమోదు అయ్యారు సార్, ప్రస్తుతం 20 మంది పిల్లలు వచ్చారు పీడీ రాబర్ట్స్: పిల్లలకు ఏం పెడుతున్నారు?, పిల్లల బరువు తూస్తున్నారా ? ప్రసన్న: ప్రతీ రోజు భోజనం, వారంలో నాలుగు పర్యాయాలు గుడ్లు పెడుతున్నాం, పిల్లలు అందరికీ బరువు తూస్తున్నాం పీడీ రాబర్ట్స్: పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలు ఎంతమంది ఉన్నారు?, వారికి అదనంగా ఆహారం అందచేస్తున్నారా ? ప్రసన్న: ఒకరే ఉన్నారు. సాధారణ పిల్లలు కంటే అదనంగా పౌష్టికాహారం అందజేస్తున్నాను. సాధారణ పిల్లలకు నాలుగు గుడ్లు ఇస్తే, వీరికి ఆరు గుడ్లు ఇస్తాం. పీడీ రాబర్ట్స్: మీకేమైనా సమస్యలున్నాయా? ప్రసన్న: అద్దె భవనం కావడం వల్ల ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వ భనవం గాని, స్కూలు భవనం గాని ఇప్పించాలి. పీడీ రాబర్ట్స్: మునిపల్ కమిషనర్తో మాట్లాడి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న భవనాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. పీడీ రాబర్ట్స్: సీడీపీఓ, సూపర్వైజర్ పర్యవేక్షణకు వస్తున్నారా?, బాల్యవివాహాలపై ప్రచారం చేస్తున్నారా ? ప్రసన్న: వస్తున్నారు సార్, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వాటి వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నాం సార్ పీడీ రాబర్ట్స్: ఏమ్మా నీపేరేంటి,అంగన్ వాడీ కేంద్రానికి ఎందుకు వచ్చావు? బాలింత : సార్ నాపేరు గాయత్రి. మా బాబుకి టీకాలు వేయించడానికి వచ్చాను. పీడీ రాబర్ట్స్ : మీ బాబు బరువు తూస్తున్నారా ? , మీ బాబు పుట్టినప్పుడు ఎన్ని కేజీలు ఉన్నాడు? గాయత్రి: తూనిక వేస్తున్నారు. మా బాబు పుట్టినప్పుడు రెండున్నర కేజీలు ఉన్నాడు సార్. పీడీ రాబర్ట్స్ : పాప నీపేరేంటి, నీకు గుడ్లు ఇస్తున్నారా, రుచికరంగా ఉంటున్నాయా ? అంగన్వాడీ సెంటర్ విద్యార్థిని: నాపేరు నందిని సార్. గుడ్లు పెడుతున్నారు. గుడ్డు బాగుంటుంది. పీడీ రాబర్ట్స్: ఆటలు ఆడిస్తున్నారా? నందిని: ఆడిస్తున్నారు సార్ పీడీ రాబర్ట్స్: ఏమ్మా నీపేరేంటి , ఎందుకు వచ్చావు? గర్భిణి: సార్ నాపేరు అమీబి. టీకాలు వేయించుకోవడానికి వచ్చాను. పీడీ రాబర్ట్స్: ఎంసీహెచ్ కార్డు ఇచ్చారా, కార్డులో ఏఏ వివరాలు ఉన్నాయి? అమీబి: ఇచ్చార్ సార్. కార్డులో ఏ నెలలో ఏ టీకాలు వేసుకోవాలి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న వివరాలు ఉన్నాయి. పీడీ రాబర్ట్స్: అమ్మా మీపేరేంటి, ఏం చేస్తుంటారు ? పట్టణ సీడీపీఓ : సార్ నా పేరు రాజరాజేశ్వరి. నేను పట్ణణ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓగా పనిచేస్తున్నాను. పీడీ రాబర్ట్స్: నెలలో ఎన్నిసార్లు కేంద్రాలను పర్యవేక్షిస్తారు, మీ పరిధిలో ఎంతమంది సూపర్వైజర్లు ఉన్నారు? రాజరాజేశ్వరి: నెలలో 20 రోజులు కేంద్రాలను పర్యవేక్షిస్తాం సార్, నా పరిధిలో నలుగురు సూపర్వైజర్లు ఉన్నారు. పీడీ రాబర్ట్స్: పట్టణ పరిధిలో పౌష్టికాహార లోపంతో ఎందమంది బాధపడుతున్నారు? రాజరాజేశ్వరి : 154 మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు సర్. పీడీ రాబర్ట్స్: వీరిని సాధారణ స్థితికి తేవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాజరాజేశ్వరి: పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలును సాధారణ స్థితికి తేవాడానికిఅదనపు పౌష్టికాహారాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా ఐరన్ మాత్రలు అందిస్తున్నాం,. పీడీ రాబర్ట్స్: అమ్మా నీ పేరేంటి, అంగన్వాడీ కేంద్రానికి ఎందుకు వచ్చావు? బాలింత : సార్ నాపేరు షకీనా. మా పాపకు టీకాలు వేయించడానికి వచ్చాను. పీడీ రాబర్ట్స్: పుట్టిన ఎంత సేపటికి తల్లిపాలు తాగించాలి? షకీనా: పుట్టిన గంట లోపు తల్లిపాలు తాగించాలి. పీడీ రాబర్ట్స్: మీపేరేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? సూపర్వైజర్ : సార్ నాసేరు కుసుమకుమారి. నేను 11 సంవత్సరాలుగా సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. పీడీ రాబర్ట్స్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు తీసుకున్నారు కదా, ఏయే సేవలకు అవార్డు ఇచ్చారు? కుసమకుమారి: బాల్య వివాహాలను నిలుపుదల చేసినందుకుగాను, పౌష్టికాహారలోపాన్ని నివారించినందుకు గాను అవార్డు ఇచ్చారు పీడీ రాబర్ట్స్: మరుగుదొడ్ల వినియోగం ఏవిధంగా ఉంది? కుసమకుమారి: మరుగుదొడ్ల వినియోగం బాగానే ఉంది. అనంతరం బూడివీధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని పీడీ సందర్శించారు పీడీ రాబర్ట్స్: అమ్మా నీపేరేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు? అంగన్వాడీ కార్యకర్త : సార్ నాపేరు రమాదేవి. నేను 11 సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తున్నాను. పీడీ రాబర్ట్స్: ఎంతమంది పిల్లలు నమోదయ్యారు, ఎంతమంది వచ్చారు? రమాదేవి: 22 మంది పిల్లలకు గాను 18 మంది పిల్లలు వచ్చారు సార్. పీడీ రాబర్ట్స్: మిగతా నలుగురు పిల్లలు ఎందుకు రావడం లేదు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారా? రమాదేవి: ఒకో రోజు వస్తున్నారు. ఒకోరోజు రావడం లేదు. పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడాను. పీడీ రాబర్ట్స్: గృహ సందర్శనకు వెళుతున్నారా ? రమాదేవి: గృహ సందర్శనకు వెళుతున్నాను సార్, గర్భస్థ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నాం. పీడీ రాబర్ట్స్: అమ్మా నీపేరేంటి, మీ వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని రోజూ తెరుస్తున్నారా ? బాలింత : సార్ నాపేరు సునీత, మా వీధిలో అంగన్వాడీ కేంద్రం రోజూ తీస్తున్నారు సార్. పీడీ రాబర్ట్స్: పౌష్టికాహారాన్ని పూర్తి స్థాయిలో ఇస్తున్నారా, లేక కోత విధిస్తున్నారా? సునీత: పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. కోత విధించడం లేదు. పీడీ రాబర్ట్స్: మీపేరేంటి టీకాలు సకాలంలో వేస్తున్నారా? గర్భిణి : సార్ నాపేరు రమాదేవి. టీకాలు సకాలంలో వేస్తున్నారు పీడీ రాబర్ట్స్: పౌష్టికాహారం కేంద్రంలో ఇస్తున్నారా, ఇంటికి ఇస్తున్నారా? రమాదేవి: కేంద్రంలోనే పెడుతున్నారు. -
పాల ఉత్పత్తి పెంచుతాం..
పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, దూడల సంరక్షణ, కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి దూడల అభివృద్ధికి కృషి చేయడం పశు సంవర్ధక శాఖ విధి. ఆ శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ముత్యాల వేణుగోపాల్రెడ్డి వీటితో పాటు పశుగ్రాసాల సాగు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు దరి చేరకుండా ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నారు. పథకాల అమలును పారదర్శకంగా నిర్వహిస్తూ.. పశు సంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. పశువైద్య శాలలకు సొంత భవనాలు నిర్మించడంలో విజయవంతం అయ్యారు. ఆయన ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్గా మారి పశు సంపదకు, పాల ఉత్పత్తికి పెట్టింది పేరైన కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో పశుపోషణ, పాల ఉత్పత్తిలో మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పశు సంపదను రక్షించడం, పాల ఉత్పత్తిని పెంచడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. జేడీ: ఏమ్మా..! అందరూ బాగున్నారా.. పశు పోషణ, పాల ఉత్పత్తి ఎలా ఉంది ? మహిళలు : బాగున్నాం సార్.. పశుపోషణ బాగుంది. ఇప్పటి వరకు పాల ఉత్పత్తి ఆశాజనకంగానే ఉంది. మాకు ప్రధాన ఆధారం పాడి పరిశ్రమనే. జేడీ : అమ్మా నీ పేరు ఏమిటి? సమస్య ఉందా? మహిళ: సార్ నా పేరు సకినాబీ. కొద్ది రోజులుగా మా దూడల కళ్ల నుంచి ఒకటే నీళ్లు కారుతున్నాయి. ఏమైనా అనారోగ్యమా? జేడీ : వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కళ్లలో నీరు కారుతాయి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ చికిత్స చేయిస్తాం. ధనలక్ష్మి : సార్.. మేము రెయిన్బో రకం కోళ్లు పెంచుకుంటున్నాం. గుడ్లు బాగా పెడుతున్నాయి. కోళ్లు గుడ్లను పొదగడం లేదు. జేడీ : రెయిన్బో కోళ్లు గుడ్లు ఎక్కువగా పెడతాయి. అయితే అవి పొదగవు. వాటిని నాటుకోళ్ల ద్వారా పొదిగించవచ్చు. ఈ కోళ్లు ఎక్కువ బరువు వస్తాయి. మాంసానికి, గుడ్లకు రెండింటికి ఉపయోగపడుతాయి. ధనలక్ష్మి : కోళ్లకు ఏఏ రోగాలు వస్తాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? జేడీ : ప్రతి కుటుంబంలో పాడి-పంట ఉండాలి. దీనికి కోళ్ల పెంపకం ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. కోళ్లకు మసూచి, కొక్కెర తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. వీటికి కూడా టీకాలు వేస్తాం. పెరటి కోళ్ల పెంపకం లాభసాటిగా ఉంటుంది. పద్మావతమ్మ : సార్ పాల ప్రగతి కేంద్రాల కింద తమిళనాడు నుంచి పాడి గేదెలు తెచ్చి ఇచ్చారు. ఇవి చూలు కట్టడం లేదు.. జేడీ : చూలు కట్టకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. గర్భకోశ సమస్యలతో చూలు కట్టకపోయే ప్రమాదం ఉంది. మీ గ్రామంలో ప్రత్యేకంగా ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించి గర్భకోశ వ్యాధులకు చికిత్స చేయిస్తాం. మహిళ : సార్..నా పేరు లతీఫాబీ. దూడ చనిపోయింది. ఇందువల్ల పాల ఉత్పత్తి తగ్గిపోయింది. కంతులు కట్టడం కష్టంగా ఉంది. జేడీ : దూడ లేకపోయినా పశు పోషణకు ఇబ్బంది లేదు. అయితే పచ్చిమేత, దాణా తగినంత ఇవ్వాలి. అప్పుడు యథావిధిగా పాలు ఇస్తాయి. దూడల పరిరక్షణకు సునందిని పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనివల్ల దూడల మరణాలను తగ్గించవచ్చు. తిప్పన్న : సార్, మా గ్రామంలో గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలంలో ఎక్కువగా చనిపోతున్నాయి. గొర్రెలకు రాత్రి బస షెడ్లు ఏర్పరచాలి. జేడీ : వర్షాకాలంలో గొర్రెలు తడుస్తుండటం, కలుషితమైన మేత తినడం, నీరు తాగడం వల్ల మరణాలు ఎక్కువగా ఉంటాయి. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించుకోవాలి. అప్పుడు చనిపోయినా పరిహారం లభిస్తుంది. గొర్రెలకు సామూహిక బీమా పథకం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. గొర్రెలకు రాత్రి బస షెల్టర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. రాముడు : సార్, గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఈ దిశగా చర్యలు తీసుకోండి. జేడీ : గొర్రెలకు అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నాం. ప్రస్తుతం పీపీఆర్ వ్యాక్సిన్ వేయడం జరుగుతోంది. కొత్తగా పుట్టిన జీవాలు, ఆరు నెలల క్రితం వేయని జీవాలకు ఈ వ్యాక్సిన్ వేయించాలి. నట్టల నివారణ మందు కూడా ఉచితంగా తాపుతున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీటీసీ సభ్యుడు శేఖర్ : సార్.. మా గ్రామం పశు సంపదకు నిలయం. కానీ గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. పాడి పశువు పేయి కడగడానికి, వాటికి నీళ్లు తాపడానికి దూరం మంచినీళ్లు తెచ్చుకోవాల్సి ఉంది. నీటి సమస్యను తీర్చాలి. జేడీ: పశు పోషణలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. పశువులు పరిశుభ్రంగా ఉంటేనే పాలు పరిశుభ్రంగా ఉంటాయి. అయితే నీటి సమస్య పరిష్కారం మా చేతిలో లేదు. అయినప్పటికీ నీటి సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఎంపీటీసీ సభ్యుడు : సార్.. మహిళలకు పాడి గేదెలు ఇచ్చి వారి అభ్యున్నతికి దోహదపడ్డారు. ఎద్దుల బండ్లు ఇస్తే సౌకర్యంగా ఉంటుంది. చెరువులో నీళ్లు ఉన్నాయి. ఎద్దుల బండ్ల ద్వారా డ్రమ్ముల్లో తెచ్చుకోవచ్చు. జేడీ : ఎద్దుల బండ్లు ఇవ్వడం కూడా పశుసంవర్ధక శాఖ చేపట్టడం లేదు. వీటిని సబ్సిడీపైన వ్యవసాయ శాఖ పంపిణీ చేస్తోంది. అవసరమైన వారికి ఎద్దుల బండ్లను వ్యవసాయ శాఖ జేడీ దృష్టికి తీసుకెళ్లి పంపిణీ చేసే విధంగా చూస్తాం. జేడీ : ఏమ్మా.. పాల ఉత్పత్తి అధికంగా ఉంది కదా.. వీటికి మార్కెటింగ్ ఉందా ? జుబేదాబీ : సార్.. గ్రామం పాలకోవకు ప్రసిద్ధి. ఇక్కడ ఉత్పత్తి చేసిన కోవాను వివిధ ప్రాంతాలకు తరలిస్తాం. ఉత్పత్తి అయిన పాలను బయటికి అమ్మం. కోవకు వినియోగిస్తాం. వచ్చిన పాలకోవకు వినియోగిస్తుండటం వల్ల పాలకు మంచి ధర వచ్చినట్లు అవుతోంది. జేడీ : పాడి పశువులకు అజొల్లా మంచి పోషక విలువతో కూడిన దాణాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల దాణా ఖర్చు తగ్గుతుంది. అజొల్లా యూనిట్లను సబ్సీడీపై ఇస్తున్నాం. వినియోగించుకున్నారా ? ధనలక్ష్మి : సార్... చిన్న టేకూరు పశువైద్యాధికారి నాగరాజు అజొల్లా యూనిట్ల గురించి చెప్పారు. వాటిని వినియోగించుకున్నాం. ఇదిగో అజొల్లాను చూడండి. దీనిని దాణాలో కలిపి పాడి పశువులకు ఇస్తాం. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతోంది. వెన్నశాతం కూడా పెరిగింది. జేడీ : ఏమ్మా నీ పేరేంటి?ఈ బర్రెలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎలా పోషిస్తున్నారు? మహిళ : సార్, నా పేరు జుబేదాబేగం. మేము స్వయం సహాయక సంఘాల్లో రాణిస్తున్నాం. మా గ్రామానికి డీఆర్డీఏ ద్వారా 15 గ్రూపులకు పాల ప్రగతి కేంద్రాలు మంజూరు చేశారు. ఒకసారి 5, మరోసారి 3 గ్రేడెడ్ ముర్రా జాతి పాడి గేదెలు మంజూరు చేశారు. జేడీ : మరి వీటి ఆరోగ్య సంరక్షణపై అవగాహన ఉందా? పచ్చిమేత ఇస్తున్నారా? గేదెలకు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారా? జూబేదాబేగం : సార్.. ఈ గేదెలను తమిళనాడులో కొని మాకు పంపిణీ చేశారు. మొదట ఇవి ఈ వాతావరణానికి అనువుగా ఉంటాయో లేదోనని భయపడ్డాం. కానీ కొద్ది రోజుల్లోనే అలవాటు పడ్డాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఏపీబీఎన్ గడ్డిని పెంచుతున్నాం. అజొల్లాను కూడా పెంచుతూ దాన్ని దాణాలో కలిపి ఇస్తున్నాం. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నాం. పశువుల్లో ఏమైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే చిన్న టేకూరు పశువైద్యాధికారికి చెబుతాం. వెంటనే వచ్చి చికిత్స చేస్తున్నారు. జేడీ : పశుగ్రాసం వృథా చేసుకోకుండా ఉండేందుకు చాప్ కట్టర్లు ఇస్తున్నాం. మీరు తీసుకున్నారా ? చంద్రకళ : తీసుకున్నాం సార్... యూనిట్ కాస్ట్ రూ.26 వేలు అయితే 50 శాతం సబ్సిడీతో తీసుకున్నాం. పశుగ్రాసాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి వినియోగిస్తున్నాం. ఇందువల్ల పశుగ్రాసం దుర్వినియోగం కావడం లేదు. ధనలక్ష్మి : కొన్ని పాడి గేదెల్లో ఎద లక్షణాలు కనిపించడం లేదు. ఇందువల్ల ఈతకు ఎడం పెరుగుతోంది. జేడీ : గేదెల్లో ఎద లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు దాదాపు 48 గంటలు ఉంటాయి. కొన్ని పశువులో మూగ ఎద లక్షణాలు ఉంటాయి. వీటిని గుర్తించడం కష్టం. ఎద లక్షణాలు కనిపించిన 12 గంటల తర్వాత కృత్రిమ గర్భధారణ సూది వేయించాలి. జేడీ : సునందిని, క్షీర సాగర్ పథకాల గురించి తెలుసా...? మహిళలు : తెలుసు సార్.. మా డాక్టరు వీటి గురించి చెప్పారు. జేడీ: సునందిని పథకం దూడలకు ఉద్దేశించింది. యూనిట్ కాస్ట్ రూ.5 వేలు. ఇందులో లబ్ధిదారుని వాటా రూ.950 ఉంటుంది. దూడలకు మూడు విడతలుగా 237 కిలో దాణా ఇస్తాం. దూడలకు బీమా సౌకర్యం ఉంది. దీనివల్ల దూడలు త్వరగా పెరుగుతాయి. అదే విధంగా క్షీరసాగర్ పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనివల్ల చాల ఉపయోగలు ఉన్నాయి. వీటిని వినియోగించుకోవాలి. మహిళలు : జీవనాధారం కోసం పొట్టేళ్లు, గొర్రెల యూనిట్లు కావాలి. సార్.. ఇప్పించండి.? జేడీ : పొట్టేళ్ల యూనిట్ల గొర్రెల యూనిట్ పంపిణీ చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇది అమలులోకి వచ్చినప్పుడు తప్పకుండా ప్రాధాన్యం ఇస్తాం. మిహ ళలు: సార్ ఈ గ్రామం పాలకోవాకు ప్రసిద్ధి చెందింది. దీనిని మరింత లభివృద్ధి చేసేందుకు ప్రొత్సాహం లేదు. తగిన చేయూత ఇవ్వాలి. జేడీ : పాలకోవా తయారీని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి బ్యాంకుల ద్వారా చేయూత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. -
పెద్దాస్పత్రి.... సమస్యలతో కుస్తీ !
జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అది. నిత్యం వైద్య సేవలు కోసం వందలాది మంది ఇక్కడకు వస్తారు. పేరుకు పెద్దాస్పత్రి అయినప్పటికీ ఇక్కడ అనేక సమస్యలు నెలకొన్నాయి. పరికరాలు లేక కొన్ని సేవలు అందడం లేదు. ఉన్నా...కొన్ని పరికరాలు మూలకు చేరడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళ స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతారామరాజు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మారారు. ఆస్పత్రిలో పలు వార్డులను, ఓపీ విభాగాలను పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. సూపరింటెండెంట్: అమ్మా నాపేరు సీతారామరాజు. నేను సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను, సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్గా వచ్చాను. మీపేరేంటి, ఏసమస్యతో ఎక్కడకు వచ్చారు? రోగి: నాపేరు లెంక రమణమ్మ సార్. మాది గజపతినగరం గ్రామం. బీపీ ఉందని ఇక్కడకు వచ్చాను సూపరింటెండెంట్: డాక్టర్గారు వచ్చారా ?, బాగా చెక్ చేశారా? రోగి రమణమ్మ: డాక్టర్గారు వచ్చారు. బాగానే చూశారు. సూపరింటెండెంట్: డాక్టర్ గారు కసురుకుంటున్నారా ?, ప్రేమగా మాట్లాడుతున్నారా? రమణమ్మ : బాగానే మాట్లాడుతున్నారు. కసురుకోవడం లేదు. సూపరింటెండెంట్: ఏమ్మా మీదేఊరు? ఏసమస్యతో వచ్చారు? రోగి : నాపేరు భవాని. మాది అయ్యన్నపేట గ్రామం సార్. కడుపునొప్పిగా ఉండడంతో వచ్చాను. సూపరింటెండెంట్: చికిత్స ఏ విధంగా చేస్తున్నారు? భవాని: చికిత్స బాగానే చేస్తున్నారు. మందులు కూడా ఇచ్చారు. సూపరింటెండెంట్: బాబు మీదే గ్రామం. ఆస్పత్రికి ఎందుకు వచ్చారు? రోగి: నాపేరు కె.రమేష్. మాది బీజే పాలెం గ్రామం. బీపీ ఉందని వచ్చాను. సూపరింటెండెంట్: పారిశుద్ధ్యం ఏవిధంగా ఉంది. మరుగుదొడ్లులో నీటి సరఫరా ఉందా, సిబ్బంది ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? రమేష్: ఎవరూ డబ్బులు అడగలేదు. మరుగుదొడ్లలో నీరు వస్తోంది. పారిశుద్ధ్యం బాగానే ఉంది సూపరింటెండెంట్ : ఏమ్మా మీది ఏ ఊరు. ఏ సమస్యతో ఇక్కడకు వచ్చావు? రోగి : బాబు నా పేరు రెడ్డి కమలమ్మ. మాది చింతలవలస గ్రామం. పాము కరవడంతో ఇక్కడకు వచ్చాను. సూపరింటెండెంట్: ఎప్పుడు కరిచింది, ఎన్ని గంటల్లోగా చేరారు, ఏవిధంగా వచ్చారు? కమలమ్మ : గురువారం రాత్రి 7 గంటలకు పాము కరిచింది. రాత్రి 2 గంటలకు కేంద్రాస్పత్రికి వచ్చాను. 108 ద్వారా ఆస్పత్రికి వచ్చాను. సూపరింటెండెంట్ : సిస్టర్ మీపేరేంటి, వార్డులో సమస్యలు ఏవైనా ఉన్నాయా? సునీత స్టాఫ్ నర్స్ : సార్ నాపేరు సునీత. ఎమర్జెన్సీ వార్డులో ఏసీలు నెలరోజులుగా పనిచేయడం లేదు సార్. మెమోలు రాశాం. అయినా బాగు చేయలేదు. సూపరింటెండెంట్ : రెండు మూడు రోజుల్లో ఏసీలు బాగు చేయిస్తాం. రోగులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. సూపరింటెండెంట్ : డాక్టర్ మీ పేరేంటి. క్యాజువాలీటీలో సేవలు ఏవిధంగా అందిస్తున్నారు. డాక్టర్: సార్ నాపేరు శర్మ. క్యాజువాలీటికి వచ్చిన వారికి సకాలంలో సేవలు అందిస్తున్నాం, సేవలు అందించడంలో ఏమాత్రం అలసత్వం వహించడం లేదు. సూపరింటెండెంట్: బాబు ఆస్పత్రికి ఎందుకు వచ్చావు? రోగి: సార్ డయాలసిస్ చేసుకుని ఇంటికి వెళుతుండగా బస్సు దిగినప్పుడు కాలు విరిగింది. చికిత్స చేయించుకోడానికి వచ్చాను. సూపరింటెండెంట్ : ఇప్పుడే వచ్చావా. ఇంతకు మందు ఎప్పుడైనా వచ్చావా. వైద్యులు బాగాచూస్తున్నారా? రోగి: ఇప్పటికి రెండు సార్లు వచ్చాను సార్. హెచ్ఐవీ ఉందని చెప్పి ముట్టుకోకుండా మందులు రాసి పంపిస్తున్నారు. బాధ భరించ లేకపోతున్నాను సార్. సూపరింటెండెంట్: బాధపడుకు నీకు వైద్యం జరిగేలా చూస్తాను. హెచ్ఐవీ రోగులకు కూడా వైద్యం జరిగేలా చర్యలు తీసుకుంటాం. సూపరింటెండెంట్ : డాక్టర్గారు మీపేరేంటి, మీ దగ్గరకు ఎంతమంది రోగులు వస్తారు. ఏయే వ్యాధులతో ఎక్కువ మంది వస్తారు? డాక్టర్ సౌజన్య : సార్ నాపేరు సౌజన్య. రోజుకు 30 నుంచి 40 మంది వరకు పిల్లలు వస్తారు. ఎక్కువగా జ్వరాలు, జలుబు, దగ్గు, మరీ ముఖ్యంగా రక్తహీనతతో ఎక్కువ మంది వస్తున్నారు. సూపరింటెండెంట్ : రక్తహీనతతో వచ్చే వారికి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? డాక్టర్ సౌజన్య: అందుబాటులో ఉన్న ఆకుకూరలు, కాయగారులు, పండ్లు వంటి ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నాను. సూపరింటెండెంట్ : డాక్టర్ గారు మీ పేరేంటి, నెలకు మీ దగ్గరకు ఎంతమంది మందుల కోసం వస్తుం టారు. మెరుగైన సేవలు అందించడానికి సౌకర్యాలు అదనంగా కావాలా? డాక్టర్ : సార్ నా పేరు సత్యనారాయణ. నా దగ్గరకు మానసిక సమస్యలతో నెలకు 300 మంది వరకు వస్తారు. మరొక మానసిక వైద్యుడు, సోషల్ వర్కర్ కావాలి. మానసిక రోగులకు ప్రత్యేక వార్డు, ఎంఆర్ఐ స్కాన్, ఈసీటీ పరికరం కావాలి. సూపరింటెండెంట్ : మానసిక వైద్యుడు, సోషల్ వర్కర్ నియామకం కోసం, ఎంఆర్ఐ స్కాన్ పరికరం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తాం. సూపరింటెండెంట్: బాబు నీ పేరేంటి ఎక్కడ నుంచి వచ్చాం. నీ సమస్య ఏంటి? రోగి : సార్ నాపేరు మహేష్, మాది పద్మనాభం గ్రామం. నాకు సుగర్ వ్యాధి ఉంది. గత ఎనిమిదేళ్లుగా బాధపడుతున్నాను. నీరసంగా ఉంటుంది. నడవడానికి ఇబ్బందిగా ఉంది సూపరింటెండెంట్ : పిల్లలో సుగర్ వ్యాధి రావడం చాలా అరుదు. ఇటువంటి పిల్లలకు చికిత్స అందించడానికి అవసరమైన అన్ని మందులు ఆస్పత్రిలో ఉన్నాయి. సూపరింటెండెంట్ : మీపేరేంటి, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారా? జూనియర్ అనలిస్టు భువనేశ్వరావు : సార్ నాపేరు భువనేశ్వరరావు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నాం. సూపరింటెండెంట్ : మీకు ఏవైనా సౌకర్యాలు కావాలా? భువనేశ్వరావు : మరుగుదొడ్లు, గదలు చాలక ఇబ్బంది పడుతున్నాం. సూపరింటెండెంట్ : అదనంగా గదులు, మరుగుదొడ్లు నిర్మిస్తాం. సూపరింటెండెంట్ : మీపేరేంటి, రోగులకు మెరుగైన సేవలు అందించడానికి మీకు ఏమైనా సౌకర్యాలు కావాలా? ల్యాబ్ టెక్నీషయన్ : సార్ నాపేరు ఆచారి. ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. సెల్కౌంటర్, ఎలక్ట్రకల్ ఎనలేజర్ వంటి ఆధునాతన సౌకర్యాలు ఉంటే మెరుగైన వైద్య సేవలు అందించగలిగాం. సూపరింటెండెంట్ : లేబరేటరీలో మెరుగైన సేవలు అందించడానికి అధునాతన పరికరాలు ఏర్పాటు చేస్తాం. సూపరింటెండెంట్ : మీపేరేంటి, నెలకు ఎంత రక్తం సేకరిస్తున్నారు, డాక్టర్ : సార్ నాపేరు సత్యశ్రీనివాస్. బ్లడ్బ్యాంక్లో నెలకు 300 యూనిట్ల వరకు రక్త సేకరణ చేస్తున్నాం. 600 యూనిట్ల వరకు రక్తం అవసరం పడుతుంది. రక్తదానంపై ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది సూపరింటెండెంట్ : మీపేరేంటి, ఇక్కడకు ఎందుకు వచ్చారు? సామాజిక కార్యకర్త: సార్ నాపేరు రవూఫ్. నేను సామాజిక కార్యకర్తను. సూపరింటెండెంట్: రక్తం కొరత తీర్చడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? రవూఫ్ : రక్తదానం ప్రస్తుతం జిల్లా కేంద్రానికే పరమితమైంది. అలా కాకుండా జిల్లాలో ఉన్న 34 మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి సూపరింటెండెంట్ : 34 మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాను. సూపరింటెండెంట్ : సిస్టర్ మీపేరేంటి, రాత్రి వేళల్లో ఆస్పత్రిలో అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి? స్టాఫ్ నర్స్ : నాపేరు అనురాధ సార్, రాత్రి వేళల్లో అత్యవసర కేసులు గురించి మాట్లడానికి క్యాజువాలీటికి వెళతాం. ఆ తర్వాత వచ్చేస్తాం సూపరింటెండెంట్ : కొంతమంది స్టాఫ్నర్స్లు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండడం లేనట్టు తెలిసింది. ప్రతీ స్టాఫ్ నర్స్ వారికి కేటాయించిన వార్డుల్లో అందుబాటులో ఉండాలి. సూపరింటెండెంట్ : బాబు నీపేరేంటి, ఎప్పుడు జాయిన్ అయ్యావు. ఏసమస్యతో వచ్చావు? రోగి: సార్ నాపేరు మహేష్, కాలు విరగడంతో జనవరి నెలలో జాయిన్ అయ్యాను. ఇంతవరకు ఆపరేషన్ చేయలేదు. సూపరింటెండెంట్: ఆపరేషన్ రెండు, మూడు రోజు ల్లో అయ్యేలా చర్యలు తీసుకుంటాం. -
ఐనాడా.. ఐనా వస్తా..
ఉమెన్సడే స్పెషల్ vip రిపోర్టర్ నాటు పడవలో సాహస ప్రయాణం మరో గంటపాటు కాలినడక దారీతెన్నూ లేని ఐనాడను సందర్శించిన తొలి ఎమ్మెల్యే ఈశ్వరి పాడేరు మండలంలోని మారుమూల ప్రాంతమైన ఐనాడ పంచాయతీ అనేక ఏళ్ళుగా ప్రజాప్రతినిధులు, అధికారుల అలక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ పంచాయతీలోని 32 గ్రామాల్లో సుమారు 5 వేల మంది గిరిజనులు సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. ఒక్క గ్రామానికి కూడా రహదారి సౌకర్యం లేదు. మండల కేంద్రానికి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పంచాయతీ గ్రామాలు దారి, తెన్ను లేని అడవి ప్రాంతంలో ఉన్నాయి. గిరిజనులు మండల కేంద్రానికి 6 మైళ్ళు అరణ్యంలో కాలిబాటలో నడిచి వస్తుంటారు. లేదంటే కోనాం రిజ ర్వాయర్లో నాటు పడవపై ప్రయాణించి చీడికాడ, వి.మాడుగుల మండలాల మీదుగా చుట్టూ తిరిగి పాడేరు చేరుకుంటారు. వర్షాకాలంలో రాకపోకలు చాలా కష్టం. 4 దశాబ్దాల క్రితమే ఐనాడ పంచాయతీ కేంద్రమైంది. కోనాం రిజర్వాయర్ ఒడ్డున ఉన్న ఐనాడకు రోడ్డు లేదు. మట్టిరోడ్డున్నా రవాణా యోగ్యంగా లేదు. ఆటోలు తిరగవు. అ త్యవసర పరిస్థితుల్లో నాటు పడవే వీరికి రవాణా సాధనం. లేదంటే నడిచి రావాల్సిందే. ఐటీడీఏ ఐనాడుకు ‘‘అభివృద్ధి బాట’’ వేయలేకపోయింది. అత్యవసర వైద్యసేవలు అందని పరిస్థితుల్లో గిరి జనులు మృత్యువాత పడుతున్న సంఘటనలను సాక్షి అనేకసార్లు వెలుగులోకి తెచ్చింది. ఇక్కడి గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ‘సాక్షి’ చేసిన ప్రయత్నంలో భాగంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పందించి ఐనాడ పంచాయతీకి నాటుపడవలో సాహసంగా వచ్చారు. సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి కాస్సేపు సాక్షి రిపోర్టర్గా మారిపోయారు. ఐనాడలో గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి కదిలిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోనాం రిజర్వాయర్లో సాహసోపేతంగా నాటు పడవలో ప్రయాణం సాగించారు.ృఆమె వెంట వెళ్ళిన వారు కూడా పడవలో వెళ్ళడానికి భయపడ్డారు. కొందరు ఒడ్డునృ ఉండి పోయారు. ఈశ్వరి మాత్రం నాటు పడవలో ప్రయాణించి తెగువను ప్రదర్శించారు. 40 నిమిషాల పాటు నాటు పడవలో ప్రయాణం సాగించిన ఎమ్మెల్యే మరో గంటసేపు కాలినడకన కొండలెక్కి ఐనాడ వెళ్ళారు. అక్కడ గిరిజనుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఐనాడ సందర్శించిన ఈ నియోజకవర్గంపు తొలి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కావడం విశేషం. గిరిజనులతో వారి సమస్యలపై ఎమ్మెల్యే సంభాషణ ఈ విధంగా సాగింది! ఈశ్వరి: అవ్వా ఎలా ఉన్నావు? నీ పేరేంటి? మీ గ్రామంలో సమస్యలేమిటి? ఎం.లక్ష్మమ్మ: రోడ్డు లేక ఊరుదాటి ఎక్కడికి వెళ్ళ లేకపోతున్నాం. మందు, మాకు అవసొరమొచ్చినా కదల్లేకపోతున్నాం. బోటు ఎక్కలేం. నడక సాల్లేక పోతున్నాం. నువ్వే .. ఏదైనా సెయ్యాలి. ఈశ్వరి: నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా? అశ్విని: వాటి కోసం కోనాం వెళుతున్నాం. గ్రామంలో డిఆర్ డిపో భవనం పునాదులతోనే ఆపేశారు. ఊరికి రోడ్డు లేకపోవడమే అన్నింటికి సమస్యగా ఉంది. మా ఊరొచ్చిన ఎమ్మెల్యే మీరొక్కరే. రోడ్డు వేయిస్తే రుణపడి ఉంటాం. ఈశ్వరి: వైద్యసేవలు అందుతున్నాయా? గ్రామానికి వైద్యసిబ్బంది వస్తున్నారా? సిరగం చెల్లమ్మ: నెలకోసారి వస్తున్నారు. జొరాలొచ్చినప్పుడు చూసేవాళ్ళే లేరు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈశ్వరి: గర్భిణులను కాన్పుకోసం ఆస్పత్రులకు తీసుకెళుతున్నారా? సిరగం చెల్లమ్మ: డోలికట్టి చీడికాడ మండల కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు! గతేడాది నన్ను కాన్పుకోసం ఆస్పత్రికి తీసుకెళ్ళే సరికి నా కడుపులో మగబిడ్డ చనిపోయింది. అవసరానికి వైద్యసాయం అందడం లేదు. ఈశ్వరి: మంచినీటి సౌకర్యం ఉందా? వి.నారాయణమ్మ: తాగడానికి మంచినీరు దొరకడం లేదు. గెడ్డల్లో గాతలు, చెలమలు తవ్వి తాగునీళ్ళు తెచ్చుకుంటున్నాం. ఈశ్వరి: ఇందిరమ్మ గృహాలు నిర్మించుకున్నారా? కాసులమ్మ: డబ్బుల్లేక ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోలేకపోయాం. కొందరు పునాదులు వేసుకొని బిల్లు రాకపోవడంతో ఆపేసారు. చినబోయిన దేవి శ్లాబ్ వరకూ ఇల్లు పూర్తి చేసినా బిల్లు రాలేదు. కొంత మందికి ఇళ్ళు మంజూరు కాలేదు. తుపాను దెబ్బతిన్న ఇళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఈశ్వరి: దీపం గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారా? చిన్నాలమ్మ: మాకెవరికి గ్యాస్ కనెక్షన్లు లేవమ్మా! ఇప్పుడు మంజూరు చేస్తే తీసుకుంటాం. ఈశ్వరి: కరెంట్ ఉంటుందా? చిన్నాలమ్మ: కరెంట్ ఉంది. ఎప్పుడైనా రిపేరైతే కొన్ని రోజులుండదు. ఈశ్వరి: ఏం పంటలు పండిస్తున్నారు. వాటిని ఎక్కడ అమ్ముతున్నారు? పి.రామారావు: సీతాఫలాలు, జీడిమామిడితోపాటు ఉసిరి, కరక్కాయ, కొండచీపుర్లు, కోవెల జిగురు సేకరిస్తున్నాం. మాడుగుల, కోనాం సంతలకు తీసుకు వెళుతున్నాం. రోడ్డు లేకపోవడం, వర్షాలు పడితే చాలా అవస్థలు పడుతున్నాం. గిట్టుబాటు రావడం లేదు. ఈశ్వరి: పంచాయతీ సమస్యలను ఎప్పుడైనా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తారా? గెమ్మెలి నవరాజు: చాలాసార్లు చెప్పామమ్మా. ఒకసారి గ్రామంలోని కొంత మందిని కలిసి రోడ్డుకోసం అప్పటి మంత్రిని కోరాం. ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం గ్రామంలో మూడేళ్ళుగా పంచాయతీ భవనం, డిఆర్ డిపో, సబ్సెంటర్ల భవనాల నిర్మాణం మూడేళ్ళుగా పునాదులతోనే ఆగిపోయాయి. వీటిని పూర్తి చేయించాలి. ఈశ్వరి: ఐనాడ సమస్యలను కళ్ళారా చూశారు కదా! మీరేం చేస్తారు? పి.నూకరత్నం(జెడ్పీటీసీ): చాలా సమస్యలతో గిరిజనులు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మండలంలో ఐనాడ పంచాయతీ అభివృద్ధి ప్రాధన్యతనిచ్చి జెడ్పీ నిధులు మంజూరు చేయించి, కొన్ని సౌకర్యాలైనా కల్పించేందుకు కృషి చేస్తాను. -
ఫోన్ చేస్తే చాలు
జంగారెడ్డిగూడెం : మధ్యాహ్నం 3.45 గంటలైంది. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తరగతులు ముగిసి విద్యార్థులు బయటకొచ్చే సమయమది. అక్కడేమైనా ర్యాంగింగ్ జరుగుతోందా.. విద్యార్థినులు ఆకతాయిల బెడదను ఎదుర్కొంటున్నారా.. అనే విషయాలను తెలుసుకునేందుకు డీఎస్పీ జె.వెంకటరావు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా విద్యార్థులు, విద్యార్థినులు, అధ్యాపకులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. డీఎస్పీ వెంకటరావు వీఐపీ రిపోర్టింగ్ ఇలా సాగింది. డీఎస్పీ : ఏమ్మా.. ఏం చదువుకుంటున్నారు. సీహెచ్ ఉష, విద్యార్థిని : డీసీఈ ఫైనలియర్ చదువుతున్నా సార్. డీఎస్పీ : మీది ఏ ఊరు. ఎం.సుధావలి : మేమంతా విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం సార్. డీఎస్పీ : మరి ఎక్కడ ఉంటున్నారమ్మా. ఎం.కల్యాణ్దుర్గ : హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం. డీఎస్పీ : మీకేమైనా ఇబ్బందులున్నాయా. విద్యార్థినులు : లేవు సార్. అంతా బాగానే ఉంది. డీఎస్పీ : మీ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతోందా. ఎ.అనూష : లేదు సార్. డీఎస్పీ : ర్యాగింగ్ నివారణ కమిటీలు ఉన్నాయా టి.స్నేహ : ఉన్నాయండి. ఆ కమిటీ పెద్దలు సమస్యలు లేకుండా చూస్తున్నారు. డీఎస్పీ : మీరు కాలేజీకి వచ్చేప్పుడు.. హాస్టల్ వెళ్లేప్పుడు ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారా. సీహెచ్.ఉమ : లేదు సార్. డీఎస్పీ : మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా 100కు లేదా నా నంబర్ 94407 96626కు ఫోన్ చేసి చెప్పండి. పోలీసులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు. పి.రాజేశ్వరి : థాంక్యూ సార్. మాకు ఎలాంటి సమస్య వచ్చినా మీ దృష్టికి తీసుకువస్తాం. డీఎస్పీ : మీ హాస్టల్లో సమస్యలున్నాయా. అక్కడకు వచ్చి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారా. పి.రాజేశ్వరి : లేవండి. అక్కడ సంరక్షకులు సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీఎస్పీ : మాస్టారూ.. మీ ఈ కాలేజీలో ఏ బాధ్యతలు చూస్తున్నారు. ఎన్జేకే నరేంద్రకుమార్ : నేను ఈ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నాను. డీఎస్పీ : కళాశాల లోపల, బయట ఆకతాయిల బెడద ఉంటున్నట్టు మీ దృష్టికి వచ్చిందా. ప్రిన్సిపాల్ : లేదండి. తరగతులు ప్రారంభమయ్యే సందర్భంలోనే విద్యార్థులకు ఈవ్టీజింగ్ వల్ల కలిగే అనర్థాలను, మంచి స్నేహితులుగా ఉంటే కలిగే లాభాలను వివరిస్తున్నాం. ఈ విషయాలను తరచూ గుర్తు చేస్తుంటాం. యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉంచుతున్నాం. ఇప్పటివరకు మా కాలేజీలో ఎటువంటి ఇబ్బంది రాలేదు. డీఎస్పీ : విద్యార్థినుల విషయంలో మీరు తీసుకుంటున్న చర్యలేమిటి. ఎం.ఉషారాణి, రసాయన శాస్త్ర అధ్యాపకులు: మా కాలేజీ విద్యార్థినులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అప్పుడప్పుడూ పోలీ సు శాఖ అధికారులు కూడా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. నిర్భయంగా ఫిర్యాదు చేయండి కళాశాలలకు వచ్చి చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులకు చక్కని వాతావరణం అవసరం. ముఖ్యంగా చాలామంది ర్యాగింగ్ భూతానికి భయపడుతుంటారు. ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం. అవసరమైతే కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. ఈ విషయాలను తెలుసుకుని విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలి. చదువుపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత చదువుల వైపు సాగాలి. కళాశాలకు వచ్చే సమయంలో బయట వ్యక్తుల నుంచి ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఎవరూ భయపడొద్దు. నిర్భయంగా విద్యార్థులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలి. బాధితులకు అన్నివిధాలుగా సహకారం అందిస్తాం. ప్రతి ఒక్క విద్యార్థి చట్టంపై అవగాహన పెంచుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. - జె.వెంకటరావు, డీఎస్పీ, జంగారెడ్డిగూడెం -
కొంచెం బాగు.. కాస్త జాగు!
శ్రీకాకుళం అర్బన్:గతంలో మాదిరిగా తపాలా శాఖ సేవలు ప్రజలకు చేరువ కాలేకపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలపై ప్రచారం కొరవడుతోంది. దీంతో ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం పెరిగి తపాలా ఆదాయానికి గండి పడుతోంది. ప్రజలు కూడా అధిక చార్జీల భారాన్ని మోయాల్సి వస్తోంది. జిల్లాలో తపాలాశాఖకు సంబంధించి మూడు ప్రధాన తపాలా కార్యాలయాలు, 65 సబ్ పోస్టాఫీసులు, 424 బ్రాంచి ఆఫీసులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 1300 మంది పనిచేస్తున్నారు. తక్కువ చార్జీలకే పోస్టాఫీసుల సేవలు అందుబాటులో ఉన్నా ప్రజలు ఎందుకు అటువైపు మొగ్గు చూపడంలేదన్నది తెలుసుకునేందుకు శ్రీకాకుళం తపాలాశాఖ సూపరింటెండెంట్ జనపాల ప్రసాద్బాబు ఒక ప్రయత్నం చేశారు. ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా వినియోగదారులను, ఏజెంట్లను, సిబ్బందిని కలుసుకొని లోపాలు తెలుసుకున్నారు. వివిధ వర్గాలతో ఆయన సంభాషణ యథాతథంగా.. సూపరింటెండెంట్ : తపాలాశాఖ అందిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి రామారావు(నిరుద్యోగి, లోలుగు): సేవలు బాగున్నాయి. అయితే కొంత జాప్యం జరుగుతోంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చాను. సూపరింటెండెంట్ : తపాలాశాఖలో సీనియర్ సిటిజన్స్కు సేవలు ఎలా ఉన్నాయి పి.వీరభద్రరావు: సీనియర్ సిటిజన్స్కు సేవలు బాగానే అందుతున్నాయి. సిబ్బంది కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. సూపరింటెండెంట్ : ఆన్లైన్ సేవలు ఎలా ఉన్నాయి ఎన్.వి.శేషాచ లం(ఏజెంట్): ఆన్లైన్ సేవలు బాగున్నాయి. అయితే కొన్ని సమయాల్లో మాత్రం ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా ఎస్బీ, ఆర్డీ, సేవింగ్స్ పథకాలకు సంబందించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని తొలగించాలి. సూపరింటెండెంట్ : తపాలాశాఖ సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? శేషాచలం: సిబ్బంది ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు. సూపరింటెండెంట్ : ఏజెంట్ల పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఎస్.వైకుంఠరావు(ఏజెంట్): మూడు నెలల క్రితం వరకూ ఖాతాదారులు కట్టిన డిపాజిట్లు కాలపరిమితి ముగిసిన వెంటనే నగదు చెల్లించేవారు. ఇపుడు నెల రోజులు ఆలస్యం అవుతోంది. సూపరింటెండెంట్ : ఏజెంట్లు, ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారా? హెచ్.సత్తిబాబు(ప్రధాన తపాలాశాఖ పోస్ట్మాస్టర్): ఖాతాదారులు, ఏజెంట్లు పడుతున్న ఇబ్బందులను గుర్తించాం. సమస్యను తపాలాశాఖ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురాలేదు. సూపరింటెండెంట్ : సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? పోస్ట్ మాస్టర్: సిబ్బందికి ఎటువంటి సమస్యలూ లేవు. సూపరింటెండెంట్ : ఖాతాదారులకు మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? పోస్ట్మాస్టర్: అన్ని సదుపాయాలు కల్పించాం. కూర్చునేందుకు కుర్చీలు, మంచినీటి సౌకర్యార్థం లయన్స్ క్లబ్ సహకారంతో తాగునీటి కులాయి ఏర్పాటు చేశాం. సూపరింటెండెంట్ : కొత్త పథకాలు గురించి చెప్పండి? పోస్ట్మాస్టర్: తపాలాశాఖ సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టింది. కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. సూపరింటెండెంట్ : ఈ పథకం గూర్చి ప్రజలకు, ఖాతాదారులకు తెలియదనే విమర్శ ఉంది. ఏమైనా ప్రచారం కల్పించారా? పోస్ట్మాస్టర్: ప్రచారం కల్పిస్తున్నాం. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. సూపరింటెండెంట్ : ఆర్డీ కాలపరిమితి ముగిసిన తరువాత నగదు చెల్లింపులో ఒక నెల ఆలస్యం జరుగుతోందని ఖాతాదారులు చెబుతున్నారు. దీనిపై మీ సమాధానం? ఎ.కృష్ణారావు(అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్): ఆర్డీ కాలపరిమితి ముగిసిన తరువాత ఒక నెల ఆలస్యం అయిన మాట వాస్తవమే. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తా. మెరుగైన సేవలకు కృషి తపాలాశాఖ సేవల గురించి ఖాతాదారులు, సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకున్నాను. కొన్ని విభాగాల్లో చిన్న చిన్న పొరపాట్లను గుర్తించాను. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేస్తా. తపాలాశాఖ పలు కొత్త పథకాలను అందుబాటులోకి తెస్తోంది. వీటిపై ప్రజలకు మరింత లోతుగా అవగాహన కల్పిస్తాం. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తా. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత చేరువై సేవలందిస్తాం. తపాలాశాఖ ఆదాయం కంటే సేవలకే ప్రాధాన్యత ఇస్తుంది. ఆర్డీ(రికరింగ్ డిపాజిట్) కాలపరిమితి ముగిసిన తరువాత నెలరోజులు ఆలస్యంగా ఖాతాదారులకు నగదు ఇస్తున్నట్లు గుర్తించాను. ఇక ముందు ఆలస్యం కాకుండా చూస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన, పీఎల్ఐ పథకాలు ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. వీటిపై పూర్తి అవగాహన కల్పిస్తాం. అదేవిధంగా టీటీడీ దర్శనం కోసం రూ.300 టికెట్లను అన్ని ప్రధాన తపాలా కార్యాలయాల వద్ద విక్రయిస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. అమ్మకాలు బాగున్నాయి. తపాలాశాఖలో 16 ప్రింటర్లకు మరమ్మతు చేయించాం. కొత్తగా 24 కంప్యూటర్లను కొనుగోలు చేశాం. జిల్లా వ్యాప్తంగా 76 కొత్త కంప్యూటర్లు, 54 ప్రింటర్లు కావాల్సి ఉండగా వాటికి ఆర్డర్ ఇచ్చాం. - జె.ప్రసాద్బాబు, తపాలాశాఖ సూపరింటెండెంట్ -
విఐపి రిపోర్టర్ - ఎమ్మెల్సీ పూల రవీందర్
-
విఐపి రిపోర్టర్ - రంపచోడవరం ఏఎస్పీ విజయారావు
-
విఐపి రిపోర్టర్ - పార్వతిపురం ఏఎస్పి రాహుల్ దేవ్
-
విఐపి రిపోర్టర్ -రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
-
విఐపి రిపోర్టర్ - ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
-
అవస్థలెన్నో...!
తహశీల్దార్ కార్యాలయం... ఇక్కడికి నిత్యం వందల సంఖ్యలో అర్జీ దారులు వస్తుంటారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాళ్లరిగేలా తిరిగే వారు కొందరైతే....తన సమస్య ఎలా పరిష్కారమవుతుందో తెలియక సిబ్బంది కాళ్లావేళ్లా పడేవారు మరికొందరు. అందులోనూ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం పరిస్థితి అయితే మరి చెప్పనక్కరలేదు. నిత్యం పట్టాదారు పాసుపుస్తకాలు, రేషన్ కార్డులు, మీ సేవలో సర్టిఫికెట్లకు అప్రూవల్, భూముల వివాదాలు , రేషన్ కార్డులో పేర్ల నమోదు, మరణ ధ్రువీకరణ పత్రాలు అన్నింటికీ ఇక్కడికే రావాలి. సిబ్బంది రేపు రా.., మాపు రా.. అని పలుమార్లు తిప్పుతున్నా... పనైతే చాలురా భగవంతుడా అంటూ తిరుగుతూనే ఉంటారు. ఈ అవస్థలను పరిష్కరించేందుకు, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు స్వయంగా ఆర్డీఓ జే. వెంకటరావు రంగంలోకి దిగారు. సాక్షి వీఐపీ రిపోర్టర్గా మారారు. తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు వచ్చిన సందర్శకులను ప్రశ్నించారు. వారి సమస్యలు అడిగి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావును ఆదేశించారు. అంతే కాకుండా రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వేచి ఉన్న వివిధ కోర్టు కేసుల కక్షిదారులను ప్రశ్నించి వారి కేసుల విచారణకు, సత్వర పరిష్కారానికి చొరవ చూపించారు. శనివారం సందర్శకులతో ఆర్డీఓ సంభాషణ ఇలా సాగింది... పింఛన్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, రేషన్కార్డులు, గ్యాస్కనెక్షన్ ఇలా పలు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ పత్రాల జారీ ఇలా అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. పింఛన్లు పార్టీ పరంగా నిలిపివేయడం ఉండదు, తగిన ఆధారులు చూపితే అర్హులందరికీ తప్పని సరిగా పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటాం. స్థానిక తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావుతో చర్చించి పరిష్కారం చూపుతాను. నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు వేరే అధికారులు పరిష్కరించవలసి ఉంది. వారికి సమాచారం అందజేసి ఆ సమస్యలకు పరిష్కారమార్గాన్ని కనుగొంటాం. ఒక వేళ ఏ కారణం చేతనైనా సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి నన్ను కలవచ్చు. ఆర్డీఓ: మీ పేరేంటి..? సందర్శకుడు: నా పేరు పతివాడ రామారావు. మాది 24వ వార్డు ఆర్డీఓ : ఎందుకొచ్చారు..?నీ సమస్య ఏమిటి..? పతివాడ రామారావు: నాకు వృద్ధాప్య పింఛను వచ్చేది. రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెన్షన్ పెంచాక అసలు రావడం లేదు. పార్టీ ప్రకారంగా నా పెన్షన్ తొలగించారు. ఆర్డీఓ: అలాంటిదేమీ ఉండదు. అర్హత ఉంటే తప్పనిసరిగా పింఛను వచ్చేలా సిఫార్సు చేస్తాం. పతివాడ రామారావు: నాకు వయస్సు ధ్రువీకరణ పత్రాలన్నీ ఉన్నాయి. రేషన్ కార్డులో తప్పులున్నాయన్న సాకుతో పింఛను తొలగించారు. ఆర్డీఓ : మీ దరఖాస్తు, అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వండి. మీ ఇంటికి వచ్చి విచారణ చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. పతివాడ రామారావు: కృతజ్ఙతలు సార్! ఆర్డీఓ : మీ పేరేంటి? ఏంటి మీ సమస్య! సందర్శకురాలు: అయ్యా! నా పేరు మొండి కామేశ్వరి. నాకు వితంతువు పింఛను ఇవ్వడం లేదు. ఆర్డీఓ: ఎందుక పింఛన్ నిలిపేశారు ? కామేశ్వరి: భర్త మరణ ధ్రువీకరణ పత్రం తెమ్మంటున్నారు. ఎన్నో ఏళ్ల కిందట చనిపోయిన భర్త ధ్రువీకరణ పత్రాన్ని ఇప్పుడెలా తెచ్చేది.? ఆర్డీఓ: మరేం పర్వాలేదు. నీ అడ్రస్కు తహశీల్దార్ వ స్తారు. అక్కడ విచారణ చేసి మీకు ధ్రువీకరణ పత్రం ఇస్తారు. మీరు ఇంటివద్దే ఉండండి. కామేశ్వరి: నేను ఇంటి వద్దనే ఎలా ఉంటాను? పొలం పనికి వెళ్లిపోతాను. ఎన్ని సార్లు వచ్చినా నాకు పిం ఛను ఇవ్వడం లేదు. ఆర్డీఓ: తప్పనిసరిగా మీకు పింఛను ఇస్తారు ఆర్డీఓ: మీ పేరు? సందర్శకుడు: నా పేరు సూర్యనారాయణ. మాది బొంకుల దిబ్బ. ఆర్డీఓ: మీ సమస్య ఏంటి ? సూర్యనారాయణ: నా భార్య పేరున గ్యాస్ కనెక్షన్ ఉంది. నా భార్య ఇప్పుడు లేదు. నాకు గ్యాస్ కనెక్షన్ కావాలి. ఆర్డీఓ: ప్రస్తుతం దీపం గ్యాస్ కనెన్షన్లు డ్వాక్రామహిళల పేరున ఇస్తున్నారు. మీ పేరున ఇవ్వరు. మీ పేరున దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారులను సం ప్రదించి గ్యాస్ కనెక్షన్ ఇవ్వవచ్చే లేదో పరిశీలిస్తాం. లేకుంటే మీరు ప్రైవేటుగా గ్యాస్ కనెక్షన్ను కొనుగోలు చేసుకోవాలి. ఆర్డీఓ: మీ పేరేంటి? ఎందుకొచ్చావు? సందర్శకుడు: నా పేరు అప్పల రామయ్య. నా రేషన్ కార్డులో అప్పస్వామి, ఆధార్కార్డులో అప్పలరామ య్య అని కరెక్ట్గా పడింది. అయితే రేషన్ కార్డులో పే రు తప్పుగా పడిందని విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదు. పేరు మార్పించేందుకు వచ్చాను. ఆర్డీఓ: పక్కనే తహశీల్దార్తో... మీరు ఈ అడ్రస్కు వెళ్లి విచారణ చేయండి! రెండు పేర్లూ ఒకరివే అయితే ఏ పేరు ఖరారు చేయాలో నిర్ణయించి ధ్రువీకరణ పత్రం ఇచ్చేయండి! అప్పలరామయ్య: వస్తానయ్యా! ఆర్డీఓ: మీ సమస్య ఏంటి ? సందర్శకుడు: సార్! నా పేరు మీసాల శంకరరావు. మేం గ్రామ కంఠమని తెలియక ఓ ఇల్లు కొన్నాం. దా నిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదన్నారు. ఆర్డీఓ: ఏవేని ఆస్తులు, భూములు కొన్నప్పుడు అవి ఎవరి పేరున ఉన్నాయో ముందుగా ఒకటికి రెండుసా ర్లు విచారించి కొనుగోలు చేయాలి. అనంతరం దా నిని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీసాల శంకరరావు: ఇటీవల గ్రామకంఠం భూముల ను కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఇచ్చారని పేపర్లో చదివాం సార్ ! ఆర్డీఓ: అవును..! జీఓ నంబర్ 100 ను రద్దు చేశారని ప్రకటనలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా రాలేదు. వస్తే అమలు చేస్తాం. ఆర్డీఓ: మీ పేరేంటి? ఎందుకొచ్చారు? సందర్శకుడు: నా పేరు అడపా నారాయణరావు. రేషన్ కార్డులో పేరు మార్పు కోసం వచ్చాను. ఆర్డీఓ: ఏంటి సమస్య? నారాయణరావు: రేషన్ కార్డులో పేరు మార్పు కోసం రెండు నెలలుగా తిరుగుతున్నాను. ఇక్కడకొస్తే పరి ష్కారం కావడం లేదు. ఆర్డీఓ: తహశీల్దార్గారూ! ఏమిటీ సమస్య..? తహశీల్దార్ శ్రీనివాసరావు: సార్! రేషన్ కార్డుల్లో స భ్యుల పేర్ల చేర్పులో కొన్ని సాంకేతిక సమస్యలున్నా యి. వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆర్డీఓ: కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీలత గారిని అడిగి పరిష్కారం కనుగొనండి! ఇతని సమస్యను పరిష్కరించి చేర్పులకు అవకాశమివ్వండి! నారాయణ రావు: థ్యాంక్యూ సార్ ఆర్డీఓ: మీరెవరు? ఎందుకొచ్చారు? సందర్శకుడు: నా పేరు పకీర్ రావు సార్! నేను తోటపాలెంలో ఉంటున్నాను. నాకు ఓటు హక్కు స్థల మార్పిడికోసం వచ్చాను. ఆర్డీఓ: దీనికి దరఖాస్తు చేశారా? ఫకీర్రావు: ఫారం 8లో దరఖాస్తు చేశాను. ఆర్డీఓ: ఒకే నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్ కావాలంటే ఫారం 8 కాదు. ఫారం 8ఏ లో దరఖాస్తు చేయాలి. దీనికి సంబంధించి మరో సారి దరఖాస్తు చేయండి. ఇంకేమయినా సమస్యలున్నాయా? ఫకీర్ రావు: ఓటరు నమోదు శిబిరాలను దూరంగా పెడుతున్నారు. శిబిరాలు ఎక్కడున్నాయో కూడా చా లా మందికి తెలియడం లేదు. ఆర్డీఓ: ప్రతీ కేంద్రంలో బూత్లెవెల్ అధికారి ఉండే విధంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాం. మీరు ఆన్లైన్లోనూ నిత్యం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగైతే మీరిచ్చిన అడ్రసుకు బృందం వచ్చి ధ్రువీకరించుకుంటుంది. అనంతరం మీకు ఓటరు కార్డు ఇస్తారు. ఆర్డీఓ: మీరెవరు? ఎందుకొచ్చారు.? సందర్శకుడు: అయ్యా! నాపేరు అప్పారావు. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీలు ఆధార్ నంబర్లేని గ్యాస్ కనెక్షన్ మార్పిడి కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. ఆర్డీఓ : తహశీల్దార్ గారూ మీరు ఈ విషయమై పరి శీలన చేసి చర్యలు తీసుకోండి! ఏమ్మా..? మీరెందుకు వచ్చారు. ఏ కాలనీ మీది? సందర్శకురాలు: మాది వైఎస్సార్ నగర్ కాలనీ. నా పేరు జగదీశ్వరి.. ఆర్డీఓ: సమస్య ఏమైనా ఉందా? జగదీశ్వరి: సార్! మా కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదు. రహదారులు కూడా సరిగా లేవు. ఆర్డీఓ: దీనిపై మున్సిపల్ కమిషనర్తో మాట్లాడాలి. ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు? మీ పేరేటి? సందర్శకుడు: అయ్యా నాపేరు పాసి అప్పారావు. మా అమ్మ ఆదిలక్ష్మి డెత్ సర్టిఫికెట్ కోసం వచ్చాను సార్! ఆర్డీఓ:ఏమైంది.? తహశీల్దార్ : విచారణలో ఉంది. ఆర్డీఓ: నీ పేరంటయ్యా? ఎందుకొచ్చావు? సందర్శకుడు: నా పేరు కె. రాములు బాబుగారూ! నేను వీటీ అగ్రహారం తలయారీని. ఆర్డీఓ: సమస్య ఏమిటీ? రాములు: మూడు నెలలుగా జీతాల్లేవు బాబూ! ఆర్డీఓ: మీ వేతనాలు పెరిగాక బడ్జెట్ రూపంలో ఇస్తున్నారు. నిన్ననే చూశాను. మీ బడ్జెట్ వచ్చింది. రాములు : అయ్యా! మూడు నెలలు జీతాల్లేకపోతే మే మెలా బతకాలి? బిల్లు గుమస్తా పెట్టడం లేదు. ఆర్డీఓ: నీకేం పరవాలేదు. బిల్లు గుమస్తా తప్పు లేదు. జీతాలు వచ్చేశాయి. ఇచ్చేస్తాం. ఆర్డీఓ కార్యాలయంలో.... ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు. ? మీపేరు? సందర్శకుడు: నా పేరు పూసపాటి వెంకటపతిరాజు. మాది డెంకాడ. పట్టాదారు పాసు పుస్తకాల కోసం వ చ్చాను. మా అన్నదమ్ములతో పాటు నాకు కూడా వా టా వస్తుంది. ఆ వాటా పుస్తకాలు ఇవ్వాలి. ఆర్డీఓ: అంటే మీరు కోర్టు పనిమీద వచ్చారా? వెంకటపతిరాజు: అవును సార్! ఆర్డీఓ: మీరు కూర్చోండి వాయిదాకు పిలుస్తాం. విచారణ చేస్తాను. ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు? ( ఓ బృందంతో..) సందర్శకుల బృందం: అయ్యా! మేం గరివిడి ఫేకర్ కార్మికులం. మా సమస్య కోర్టులో ఉంది. ఆర్డీఓ: మీ కేసు కూడా ఈ రోజే విచారిస్తాం. ఆర్డీఓ: మీది ఏ ఊరమ్మా? ఎందుకొచ్చావు? సందర్శకురాలు: అయ్యా ! నాపేరు వల్లి బంగారమ్మ మాది కోడూరు గ్రామం. ఆర్డీఓ: ఏంటి సమస్య? బంగారమ్మ: అయ్యా! 30 ఏళ్లుగా ఉన్న నా భూమి వేరొకరి పేరున ఉన్నది. అందుకే వచ్చాను. ఆర్డీఓ: మీ అందరి కేసులూ విచారిస్తాం. సత్వర న్యా యం అందిస్తాం. -
వీఐపీ రిపోర్టర్ : అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు
-
వీఐపీ రిపోర్టర్ : రిమ్స్ డైరెక్టర్ టి. జయరాజ్
-
విఐపి రిపోర్టర్ - సోమారపు సత్యనారాయణ
-
విఐపి రిపోర్టర్ -హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు
-
భయం.. భయంగా..
పాశిగామ... గోదావరి తీరంలో చిన్న గ్రామం. 1994లో వచ్చిన గోదావరి వరదలతో పంటలు, ఇళ్లు మునిగిపోయాయి. ఆ బాధ ఇప్పటికీ వాళ్ల క ళ్ల ముందు కదలాడుతూనే ఉంది.. ఆ చేదు జ్ఞాపకాలనుంచి తేరుకోకముందే మళ్లీ ఎల్లంపెల్లి ప్రాజెక్టు బ్యాక్వాటర్ రూపంలో భయపెడుతోంది. ప్రాజెక్టు నిండినప్పుడు 500 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. తమను ముంపు గ్రామం జాబితాలోకి చేర్చాలంటూ ధర్మపురి మండలం పాశిగామ గ్రామస్తులు కొన్నాళ్లుగా కోరుతున్నారు. వారి బాధలు తెలుసుకోవడానికి ప్రభుత్వ చీఫ్ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా మారారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొప్పుల ఈశ్వర్ : అందరికీ నమస్కారం.. మీ ఊళ్లో ఉన్న సమస్యలేంటి? అత్తె వెంకన్న : ఎల్లంపెల్లి ప్రాజెక్టు నీళ్లు చేరి మా గ్రా మం మునిగిపోతుందని సర్వేలు చేసిండ్రు. సుమారు 500 ఎకరాలు ముంపులో పోతున్నయ్. ఈ ఊరు మొత్తాన్ని ముంపు కింద తీసుకుని ఆదుకోవాలి. కొప్పుల ఈశ్వర్ : అమ్మా.. నీపేరేంటి ? నీ బాధ ఏంటి చెప్పమ్మా? కంటెం లక్ష్మి : మూణ్ణెళ్ల నుంచి మంచి నీళ్లు దొరకక క ట్టపడుతున్నం. ఊళ్లె చేద బావులు, బోరింగులు ఎం డిపోయాయి. మంచినీళ్లు దొరకక బాధపడుతున్నం. గ్రామపంచాయతీ వాళ్లు ఇస్తున్న నీళ్లు సగం ఊరికి కూడా సరిపోతలేవు. బోరింగ్ వేసి ఆదుకోవాలి. కొప్పుల ఈశ్వర్ : తాతా.. నీకు పింఛన్ అత్తుందా? శంకరయ్య : పింఛన్ అత్తలేదు బాంచెన్. మా ఊళ్లె నాతోటోళ్లకు పింఛన్ అత్తుంది. నాకు అత్తలేదు. నాకు పింఛన్ ఇప్పియ్యాలె సారు. కొప్పుల ఈశ్వర్ :అవ్వా.. నీ సమస్యేంటి ? లక్ష్మీనర్సవ్వ : ఎల్లంపెల్లి నీళ్లు మా ఊరికి దగ్గరగా అచ్చినయి. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకుతున్నం. పాములు, తేళ్లు ఇండ్లళ్లకు చేరుతున్నయ్. పాములు కుట్టి ఇప్పటికి నలుగురు మనుషులు, ఎడ్లు, బర్రెలు సచ్చిపోతున్నయ్. ముంపుకింద మా ఊరును తీసుకోవాలె బాంచెన్. కొప్పుల ఈశ్వర్ : ఏం.. ఎంపీటీసీ బాగున్నావా .. మీ ఊరు సమస్యలేంటి ? ఈర్ల మొండయ్య, ఎంపీటీసీ : ఇంతకుముందు ప్రభుత్వాలు మా గ్రామాన్ని పట్టించుకోలేదు. అందుకే ఎండాకాలం రాక ముందే నీళ్లకు క ట్టపడుతున్నాం. రోడ్లు లేవు. ఇన్ని రోజులు కరెంటు గురించి పట్టించుకునేటోళ్లు లేరు. తెలంగాణా గవర్నమెంటులోనైనా ప్రజల బాధలను పట్టించుకోవాలె. కొప్పుల ఈశ్వర్ : బాబూ.. ఏం పని చేస్తన్నవ్? నీ సమస్యేంటి? కంటెం తిరుపతి : మాఊర్లో కరెంటు వైర్లతో భయంగా ఉంది. ఇండ్లమీది నుంచి పెద్ద లైను పోయింది. దాంతో దినదినం భయంగా ఉంది. గాలి బాగా వచ్చినప్పుడు తీగలు తెగి మా ఇండ్ల పైన పడేట్టు ఉన్నయ్. లైను ఊరి నుంచి పక్కకు మార్చాలి. కొప్పుల ఈశ్వర్ : రోడ్ల వసతులు ఎట్లున్నయ్? కంటెం మల్లయ్య : గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి రావాంటే నరక యాతన పడుతున్నం. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి. పెద్దరోడ్డు నుంచి కోటిలింగాల ఎక్స్రోడ్డు వరకు పంట పొలాల్లో నుంచి రోడ్డును మంజూరు చేయాలె. కొప్పుల ఈశ్వర్ : మేడమ్.. పాఠశాలలో సమస్యలున్నాయా ? రమాదేవి, ప్రభుత్వ టీచర్ : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీలేదు. పలువురు స్కూల్ పరిసరాల్లోకి మూత్రవిసర్జన చేస్తున్నారు. బోధనకు ఇబ్బంది అవుతోంది. కంపౌండ్ వాల్కు నిధులు మంజూరు చేయాలి. కంపౌండ్ లేక పాఠశాలలో మద్యం సేవిస్తూ ఇబ్బందులు కల్గిస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ : బాబూ... నీబాధేంటి ? ఎంబటి శంకరయ్య : మా గ్రామాన్ని ముంపుకింద చేర్చుతామని, నష్టపరిహారం ఇప్పిస్తామని కొందరు ఇంటికి పదివేల నుంచి ముప్పై వేల రూపాయలు దాకా వసూల్ చేసిండ్రు. ఆరు నెలల్లో పనవుతుందన్నారు. వసూలు చేసి రెండేండ్లరుుతంది. పైసలు ఇత్తలేరు. పని జేత్తలేరు. మా పైసలు మాకు ఇప్పించాలి. మమ్మల్ని ముంపు గ్రామం కింద చేర్చాలె. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా.. అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్న పాశిగామను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. గత పాలకుల నిరంకుశ నిర్లక్ష్యపు ధోరణి తో నేడు చాలా గ్రామాలు తాగునీ టికి అల్లాడుతున్నాయి. స్థానికులు మూడునెలలు గా అవస్థలు పడుతున్నారు. సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. అత్యవసరమైన చోట బోర్వెల్స్ వేసి తాగునీటి అవసరాన్ని తీరుస్తాం. గ్రామంలో ఎల్లంపెల్లిప్రాజెక్టు కింద 400ఎకరాల భూమి ము ంపునకు గురై ప్రజలు ఉపాధిని కోల్పోయి ఇబ్బం దులు పడుతున్నారు. వారి సమస్యలు తీరుస్తా. ఎల్లంపెల్లి నీటితో ముంపునకు గురవుతున్నందున ముంపు గ్రామాల జాబితాలో చేర్చడానికి కృషిచేస్తా. జాతీయరహదారి నుంచి గ్రామంలోకి రోడ్డు సౌకర్యం కల్పిస్తా. తాగునీటి వసతుల కోసం సత్వరం బోరింగులు ఏర్పాటు చేసి తాగునీరందిస్తాం. అర్హులందరికీ పింఛన్లు అందించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతా. -
విఐపి రిపోర్టర్ - సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
-
గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా..
ఎటు చూసినా ఎత్తై కొండలు.. చుట్టూ దట్టమైన అడవి.. మధ్యన ఓ కుగ్రామం. దానిపేరు నాగన్నగూడెం. బుట్టాయగూడెం మండలంలోని ఈ గ్రామంలో కొండరెడ్ల తెగకు చెందిన 26 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు ఈ గ్రామానికి రహదారి, విద్యుత్ సౌకర్యం లేవు. కేఆర్ పురం ఐటీడీఏ ద్వారా ఈ రెండూ సమకూరారుు. అయినా గ్రామంలో సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. అక్కడ ఇంకా ఎలాంటి సమస్యలున్నాయి.. గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటనే విషయూలను స్వయంగా తెలుసుకునేందుకు కోటరా మచంద్రపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్వీ సూర్యనారాయణ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మారారు. మారు మూలన ఉన్న ఆ గ్రామానికి వెళ్లారు. ఇంటింటికీ తిరిగారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆ వివరాలివీ. పీవో : ఏమయ్యూ.. ఏం పనులు చేస్తున్నారు. మాండ్రు శ్రీరామమూర్తి : కూలి పనులు చేసుకుంటున్నామండి. కూరగాయల పంటలు వేశాం. ఆ పనులకు వెళ్లి వచ్చాం. పీవో : మీ గ్రామంలో ఎన్ని కుటుంబాల వారు నివసిస్తున్నారు. మాండ్రు శ్రీరామమూర్తి : 25 కుటుంబాలు ఉంటున్నాయండి. పీవో : మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా. కట్ల బాబుల్రెడ్డి : ఉన్నాయండి. మేం ఇప్పటికీ తాటాకింట్లోనే ఉంటున్నాం. మాకు పట్టాలు ఇప్పించండి. ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలండి. పీవో : మీ ఇళ్లకు ఇప్పటివరకు పట్టాలివ్వలేదా మనుగుల రామిరెడ్డి : 1999లో అడవిని నరికి.. భూమిని చదును చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నాం. అప్పటి నుంచి ఇదే తాటాకింట్లో ఉన్నాం. పట్టా కోసం తహసిల్దార్కు దరఖాస్తు చేసుకున్నాం. కానీ ఇవ్వలేదు. పీవో : మీ పిల్లలను చదివిస్తున్నారా. కట్ల సీత : మా పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ పాఠశాలలు లేవండి. 10మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. వీరి కోసం ఒక అంగన్వాడీ కేంద్రం పెట్టించండి. పీవో : మీ అందరికీ వ్యవసాయ భూములున్నాయా మాండ్రు వెంకటరెడ్డి : ఉన్నాయండి. అయితే భూములకు పట్టాలు లేవు. అటవీ హక్కుల చట్టం కింద పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నాం. కొంతమందికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన వారికి కూడా పట్టాలిప్పించండి. పీవో : అలాగే. దరఖాస్తులను పరిశీలించి పట్టాలిప్పించేందుకు కృషిచేస్తాం. కెచ్చెల చిన్నారెడ్డి : అయ్యూ.. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అందులో బెండ తోట, మొక్కజొన్న పంట వేసుకున్నాం. సాగునీరు లేదు. పక్కనే ఉన్న కొవ్వాడ కాలువలోంచి రోజుకు రెండొందల అద్దె కట్టి అయిల్ ఇంజిన్తో నీటిని తోడుకుంటున్నాం. ఐటీడీఏ ద్వారా ఆయిల్ ఇంజిన్ ఇప్పించండి. పీవో : ట్రైకార్ పథకంలో అవసరమైన రైతులందరికీ ఆయిల్ ఇంజిన్లు ఇప్పించేందుకు కృషిచేస్తా. కోండ్ల శ్రీరామమూర్తి : నేను జీడిమామిడి తోట వేశాను. పూత సమయంలో స్ప్రేయింగ్ చేసేందుకు మెషిన్ లేదు. దాన్ని ఇప్పించండి. పీవో : అలాగే. దరఖాస్తు పెట్టుకో. పట్ల ముత్యాలమ్మ : సార్. మా ఊళ్లో కమ్యూనిటీ హాలు కట్టించండి. పండగలు, పబ్బాల సమయంలో అందరూ అక్కడ కూర్చుని మాట్లాడుకుంటాం. పీవో : ప్రతిపాదనలు తయారు చేయించి నిర్మాణానికి కృషిచేస్తాం. నక్కా దేవమణి : సార్. మేం డ్వాక్రా సంఘాల్లో ఉన్నాం. బ్యాంకు ద్వారా ఇచ్చిన సొమ్ము ఎటూ సరిపోలేదు. మాకు మళ్లీ రుణాలు ఇప్పించాలి. పీవో : వివరాలివ్వండి. బ్యాంకులు, ఐకేపీ వారితో సంప్రదించి రుణ సదుపాయం కల్పించేందుకు కృషిచేస్తా. మాండ్రు పోశమ్మ : అయ్యూ. మా ఊళ్లో రోడ్లు వేయించండి. పీవో : ముందు ఇళ్లు కట్టించే ఏర్పాటు చేసి.. ఆ తరువాత రోడ్డు నిర్మాణం చేపడదాం. పీవో : మీరు టీవీ చూస్తారా? అన్ని విషయాలు తెలుసుకుంటున్నారా? ఎం.రామిరెడ్డి : మా ఊళ్లో ఒక్క టీవీ కూడా లేదండి. టీవీ చూడాలంటే 4 కిలోమీటర్ల దూరంలోని రెడ్డిగూడెం వెళ్తాం. ఈ మధ్యనే కరెంటొచ్చింది. టీవీలు పెట్టుకుంటాం. పీవో : సరే.. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి బుధవారం ఐటీడీఏలో జరిగే గిరిజన దర్బార్కు రండి. ఏ సమస్య ఉన్నా చెప్పండి. పరిష్కారానికి కృషిచేస్తాం. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తాం బుట్టాయగూడెం మండలం నాగన్నగూడెంలో నెలకొన్న సమస్యలపై నాకు పూర్తి అవగాహన వచ్చింది. ప్రాజెక్టు అధికారిగా నా పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తాను. సాగు భూములున్న వారికి అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు వచ్చేలా చూస్తాం. ఇళ్ల స్థలాలకు సంబంధించి రెవెన్యూ అధికారులతో మాట్లాడతాం. గృహ నిర్మాణ అధికారులతో మాట్లాడి ఇళ్లు నిర్మించే ఏర్పాటు చేస్తాం. గ్రామంలో 10మంది పిల్లలు మాత్రమే ఉండటం వల్ల అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసే విధంగా చూస్తా. ఈ గ్రామానికి విద్యు త్ సౌకర్యం లేని సమయంలో ఐటీడీఏ ద్వారా సోలార్ లైట్లు పెట్టాం. ఇప్పుడు రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు వచ్చారుు. ప్రస్తుతం గుర్తించిన సమస్యలు పరిష్కరిస్తే గిరిజనులు సంతోషంగా జీవిస్తారు. కొవ్వాడ రిజర్వాయర్ పక్కనే ఉన్నందున గిరిజనులకు ట్రైకార్ పథకంలో ఆయిల్ ఇంజిన్లు మంజూరు చేస్తాం. సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం. - ఆర్వీ సూర్యనారాయణ, పీవో, ఐటీడీఏ -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే పువ్వాడ అజయ్
-
వీఐపీ రిపోర్టర్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-
విఐపి రిపోర్టర్ -నర్సాపురం ఆర్డీఓ పుష్పమణి
-
విఐపి రిపోర్టర్ - గ్రేటర్ విశాఖ కమీషనర్ ప్రవీణ్
-
విఐపి రిపోర్టర్ - ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
-
స్వచ్ఛ విశాఖే లక్ష్యం
రోజూ నగరంలో పర్యటిస్తున్నా నేడు ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్గా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కొత్తగా ఉంది. దీని వల్ల ప్రజలకు మరిం త సన్నిహితమవడం ఆనందంగా ఉంది. స్వచ్ఛ విశాఖే మనందరి ధ్యే యం కావాలి. అందుకోసం పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. నగరంలో పెద్ద ఎత్తున టాయిలెట్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొం దిస్తు న్నాం. నగరం అంతా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నాం. రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్య తదితర అన్ని రంగాల్లోనూ విశాఖను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకు ప్రజల సహకారం కావా లి. అధికారులు, ప్రజలు కలసి పనిచేస్తే విశాఖను మరింత సుందరనగరంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేయగలం. అందుకు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను.’ కమిషనర్ ప్రవీణ్: ఏమ్మా ఇక్కడ ఎవరికీ టాయిలెట్లు లేనట్టున్నాయి. ఎక్కడికి పోతున్నారు మీరంతా..! శారద: సార్.. ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. టాయిలెట్లు కట్టుకోవడానికి స్తోమత లేదు. ఇళ్లలో అంత చోటూ లేదు. మున్సిపల్ సులాభ్ కాంప్లెక్స్కు వెళ్తే అక్కడ నీరుండదు. మోటార్ పని చేయదంటారు. రెండు నెలలుగా మోటారు పనిచేయడం లేదు. ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నాం. మా ఆడోళ్ల బాధలు చెప్పుకుంటే సిగ్గేస్తాదండి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రోడ్డు మీదకే పోతున్నాం. నేవీ ఉద్యోగులు ఒప్పుకోరని వారికంట పడకుండా అర్ధరాత్రి, వారు లేని వేళల్లో వెళ్లాల్సిన పరిస్థితి.. (కమిషనర్ వెంటనే అక్కడే వున్న జోనల్ కమిషనర్ నాగ నర్సింహారావు, చీఫ్ ఇంజనీర్ దుర్గా ప్రసాద్లను పిలిచారు.) కమిషనర్: మున్సిపల్ సులాభ్ కాంప్లెక్స్లో మోటారు పనిచేయడం లేదా? రెండు నెలలుగా పనిచేయకుండా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? జోనల్ కమిషనర్: మోటారు కోసం ప్రపోజల్ పెట్టాం సర్. ఇంకా శాంక్షన్ ఆర్డర్స్ రాలేదు. కమిషనర్: నేను ఇప్పుడు ఆ సులాభ్ కాంప్లెక్స్ పరిశీలిస్తాను. మోటారు కోసం వెంటనే రూ. 2 లక్షలు శాంక్షన్ చేస్తున్నా. వెంటనే కొత్త మోటారు వేయించండి. అనంతరం కమిషనర్ ప్రవీణ్ ఆ సమీపంలోని పేదల ఇళ్లలోకి వెళ్లారు. ఓ చిన్న గదిలో అద్దెకు ఉంటున్న జి.మాధవిని పలకరించారు. కమిషనర్: ఏమ్మా.. ఎలా ఉన్నారు.. మీకు మరుగుదొ డ్డి ఉందా? మాధవి: లేదండి. కమిషనర్: లేకపోవడం ఏంటమ్మా.. మ రి కాలకృత్యాలు ఎక్కడ తీర్చుకుంటున్నారు? మాధవి: అలా రోడ్డు పక్కకు వెళ్లాల్సి వస్తోందండి (ఒకింత ఇబ్బంది పడుతూ) కమిషనర్: డబ్బులిస్తాం కట్టుకుంటారా? మాధవి: మాకు ఇల్లే లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇక మరుగుదొడ్డి ఎక్కడ కట్టుకోవాలండీ? (ఇంటి యజమాని సత్యనారాయణని పిలిచి మాట్లాడుతూ..) కమిషనర్: మీకు కార్పొరేషన్ తరపున డబ్బులిస్తాం. మరుగుదొడ్డి కట్టించండి. ఇంటి యజమాని:అలాగే సార్. అనంతరం కమిషనర్ మహిళా సంఘాల ప్రతినిధులను పలకరించారు. కమిషనర్: అంగన్వాడీ కేంద్రం ఉందా..! మహిళలు: ఉందండి. కమిషనర్: పిల్లలకు పౌష్టికాహారం పెడుతున్నారా.. మహిళలు: ఆ! పెడుతున్నారండి. కమిషనర్: స్కూల్ ఉందా..పిల్లలందర్నీ చదివిస్తున్నారా.. మహిళలు: ఎలిమెంటరీ బడి మాత్రమే వుందండి. 6వ తరగతి దాటితే కంచరపాలెమో, మర్రిపాలెమో పోవాలి సర్.. కమిషనర్: ఆస్పత్రి వుందా..! మహిళలు: లేదండి..కేజీహెచ్కే పోతున్నాం. అక్కడి నుంచి మరో రెండడుగులు వేశారు. అక్కడున్న వృద్ధులు పోలాకి గిరి, ఉడుంబిల్లి పోతురాజులను పలకరించారు. కమిషనర్: ఏమండీ బాగున్నారా... పోలాకి గిరి: బాబూ పింఛన్ ఆపేశారు.. కమిషనర్: ఎప్పుడు... పోలాకి గిరి: ఈ నెలే.. కమిషనర్: ఈ నెల నుంచి పోస్టాఫీసుకు మార్చడం వల్ల చిన్న సమస్య ఏర్పడింది. వచ్చే నెల నుంచి ఆ సమస్య ఉండదు. అందరికీ సమాయానికి పింఛన్ వచ్చేస్తుంది. ఉడుంబిల్లి పోతురాజు: పోస్టాఫీస్ చుట్టూ తిరగడానికి రోజుకి వందవుతోంది. ఎలా సర్..ఎన్ని రోజులు తిరగాలి.. కమిషనర్ యూసీడీ అధికారులను పిలచి అన్ని పోస్టాఫీస్లకు సిబ్బందిని పంపించి సమస్య రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. మార్గమధ్యంలో ఓ దుకాణం వ్యక్తితో కమిషనర్ మాట్లాడుతూ పాన్పరాగ్, ఖైనీలు అమ్ముతున్నావా.. అనడిగారు. లేదనడంతో ఇరుకు రోడ్డు గుండా రోడ్డుపైనే పుల్లలతో వంటలు చేస్తున్న వారందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. అక్కడ జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు కనిపించారు. వారితో సంభాషిస్తూ.. కమిషనర్: ఏమండీ మీ పేరు..! పారిశుద్ధ్య కార్మికులు: పల్లా నాగయమ్మ...బొమ్మ రమణండీ..! కమిషనర్: ఎన్ని గంటలకు డ్యూటీకొచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు: పొద్దున్నే అయిదో గంటకే వచ్చేస్తామండి.. కమిషనర్: జీతమెంత ఇస్తున్నారు? పారిశుద్ధ్య కార్మికులు: ఆరు వేలండి.. కానీ సరిగా ఇవ్వడం లేదు. గత రెండు నెలలది మొన్న ఇచ్చారు. ఈ నెలది ఇంకా రాలేదండి. ఇలా అయితే మా బోటోళ్లం ఎలా బతకాలి సారూ.. కమిషనర్ వెంటనే అక్కడే ఉన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.ఎం.ఎస్.రాజు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డా.మురళీమోహన్ను అడిగారు. ఇంకా జీతాలు చెల్లించకపోతే ఎలా అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఈ నెల కొంత ఆలస్యమైందని వారిద్దరూ చెప్పారు. రికార్డుల పరిశీలన, ఇతరత్రా పనుల వల్ల ఆలస్యమైం దన్నారు. ఇక నుంచి త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల నుంచి 7వ తేదీ లోగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశించారు. ఇంతలోనే పారిశుధ్య కార్మికులు నాగాయమ్మ, రమణలు కమిషనర్తో మాట్లాడుతూ... నాగాయమ్మ, రమణ: మాకు గ్లౌజులు ఇవ్వలేదు సార్. ఆరు నెలలుగా వట్టి చేతులతోనే చెత్త చెదారం ఎత్తాల్సి వస్తోంది. చేతుల్లో గాజు పెంకులు గుచ్చుకుంటున్నాయి. కొత్తవి ఇప్పించండి సారూ. కమిషనర్: గ్లౌజులు ఇస్తున్నారు కదా.. అంటూ జోనల్ కమిషనర్ వైపు చూశారు. మొన్ననే ఇచ్చామండీ అంటూ ఆయన సమాధానం ఇస్తుండగానే.. మరో అధికారి కల్పించుకుని రెండు మూడు మాసాలై వుంటుందండీ అని చెప్పారు. బొమ్మా రమణ: అబ్బే ఆర్నెల్లు అయ్యిందండి.. జోనల్ కమిషనర్: మరి అంతే.. అస్తమానూ ఎక్కడ నుంచి తెచ్చిస్తాం.. దాన్నే జాగ్రత్తగా దాచుకోవాలి. బొమ్మా రమణ: ఏంటండీ ఆర్నెల్లు దాచుకోవాలా.. రోజూ ఉతికి ఆరేసుకుంటుంటే ఆర్నెల్లు మన్నుతుందా? కమిషనర్ అందరికీ ప్రొక్యూర్చేసి ఇవ్వాలని సూచించారు. ఇలా సాక్షి రిపోర్టర్ అవతారమెత్తిన కమిషనర్ ప్రవీణ్కుమార్ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆశవానిపాలెంలో విసృ్తతంగా పర్యటించారు. ప్రతి వీధిని కలియదిరిగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణం పరిష్కరిం చగలిగే వాటిపై అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలపై నివేదిక సమర్పించాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజ ల్లో అవగాహన కల్పించారు. ప్రజల ఫిర్యాదు మేరకు సులాభ్ కాంప్లెక్స్ను పరిశీలించారు. వెంటనే రూ.2 లక్షలతో మోటారు మంజూరు చేశారు. ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. విద్యుత్తు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
అందరికీ ఉపాధి
ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా లక్ష కుటుంబాలకు 100 రోజుల పనిదినాలు పని ప్రదేశాల్లో పూర్తి స్థాయిలో వసతులు వేతనం రూ 169 వచ్చేలా కొలతలు ఎండలో మాడిపోతూ... రక్తాన్ని చెమటగా మార్చి చిందిస్తున్న కూలీలకు దక్కుతున్నది ఎంత...?, వారి శ్రమకు తగిన వేతనం అందుతోందా...? కావలసిన వారికి పనులు లభిస్తున్నాయా ? వేతన దారుల సొమ్ము పరుల జేబుల్లోకి వెళుతోందా...? అంటే ఇవన్నీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాయి. సమున్నత లక్ష్యంతో అమలవుతున్న ఈ పథకం కొందరు అక్రమార్కుల కారణంగా అబాసుపాలవుతోంది. కోట్లకు కోట్లు పథకం నిధులు ఖర్చవుతున్నా...లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. జిల్లా నుంచి వలసలు ప్రతి ఏడాదీ పెరుగుతున్నాయి. వేతనదారుల సమస్యలను తెలుసుకునేందుకు డ్వామా ఏపీడీ ఎస్.అప్పలనాయుడు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా మారారు. నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామ పంచాయతీ శివారుల్లో జరుగుతున్న ఉపాధి పనుల వద్దకు వెళ్లి ప్రతి వేతనదారునితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వేతనదారులతో ఏపీడీ సంభాషణ ఇలా సాగింది.... ఏపీడీ : ఏమ్మా మీ పేరేంటి..? ఎప్పుడు నుంచి ఉపాధి పనులకు వస్తున్నారు..? దుర్గాభవాని(మేట్) : నా పేరు దుర్గాభవానీ సార్. మూడేళ్లుగా పనిలోకి వస్తున్నాను. నేనే మా జట్టుకి మేట్ని. ఏపీడీ: ప్రతి రోజు ఎన్ని గంటల పాటు పనులు చేస్తారు..? మేట్: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మళ్లీ మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాం. ఏపీడీ: రోజుకు ఎంత కూలి గిట్టుబాటవుతోంది..? మేట్: జట్టులో ఉన్న వారందరికీ ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట వేత నం వచ్చేలా కొలతలు ఇస్తున్నాం. రెండు మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు , అరమిటరు లోతును రోజుకు తవ్వితే రూ.160 వరకు వస్తుంది. ఏపీడీ: మీ గ్రూపులో ఎంత మంది కూలీలు ఉన్నారు...? మేట్: ఈ రోజు 10 మంది వచ్చారు. ఏపీడీ : ఏమమ్మా నీ పేరు..? బోర విజయ (ఉపాధి వేతనదారు): నా పేరు బోర విజయ అండి. ఏపీడీ: ప్రతి రోజు ఉపాధి పనులకు వస్తారా..? విజయ: ఔనండి. నాతో పాటు మా యజమాని అప్పుడప్పుడు వస్తారు. వ్యవసాయ పనులు ఉంటే రాడు. ఏపీడీ: ఉపాధి పనితో వచ్చే డబ్బులతో ఏం చేస్తుంటారు..? విజయ: పిల్లల్ని చదివించుకుంటున్నామండి ఏపీడీ: గునపాం పట్టుకుని నువ్వు పని చేస్తున్నావేంటి.? సంతోషి (ఉపాధి వేతనదారు): నా పేరు బోర.సంతోషి . మా జట్టు లో ఈ రోజు మగవాళ్లు రాలేదు . అందుకే గునపాం పని మేమేం చేసుకుంటాం. ఏపీడీ: నీ పేరేంటమ్మ..? ఇక్కడ నువ్వు ఏం చేస్తుంటావు..? చంద్రకళ(ఫీల్డ్అసిస్టెంట్): నా పేరు బి.చంద్రకళ. ఈ గ్రామానికి నేనే ఫీల్డ్ అసిస్టెంట్ని సార్. ఏపీడీ: ఉపాధి పనులు ప్రారంభం కాకముందు ఏం చేసేవారు..? ఎఫ్ఏ : ఇంటి దగ్గరే ఉండేదాన్ని. ఉపాధి హమీ పథకం వచ్చిన తరువాత ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తున్నా. ఏపీడీ: నువ్వు చేసే పని ఏంటి..? ఎఫ్ఏ: పని కోసం వచ్చే వారికి పనులు కల్పించడం, కొలతలు ప్రకారం పనులు చేయించి, గరిష్ట వేతనం వచ్చేలా చూస్తాను సర్. ఏపీడీ: గరిష్ట వేతనాలు రావాలంటే ప్రత్యేక కార్యాచరణ ఏమైనా పాటిస్తున్నారా..? ఎఫ్ఏ: ప్రణాళిక ప్రకారం పనులు చేస్తుంటాం. ఉదయం పనిలోకి రాగానే ఎంత మంది కూలీలు వచ్చారో చూసుకుని వారికి గరిష్ట వేతనం గిట్టుబాటు అయ్యేలా కొలతలు ఇస్తాం. ఏపీడీ : మీ గ్రామంలో ఎంత మంది 100 రోజుల పాటు పనులు పూర్తి చేసుకున్నారు..? మిగిలిన వారి విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నావు..? ఎఫ్ఏ: మా గ్రామంలో ఇప్పటి వరకు 36 కుటుంబాల వారు 100 రోజుల పనులు పూర్తి చేసుకున్నారు. మరి కొంతమంది 80 నుంచి 90 రోజులకు దగ్గరల్లో ఉన్నారు. ముందుగా వారికి పని కల్పించడంతో పాటు 60 నుంచి 70 రోజులు పనులు పూర్తి చేసుకున్న వారికి ప్రాధాన్యతా క్రమంలో పనులకు హాజరుకావాలని సూచిస్తా. ఏపీడీ: ఏమయ్యా నీ పేరు..? ఇంతకు ముందు నువ్వు ఏం పని చేసేవాడివి? తౌడు (ఉపాధి కూలి): నా పేరు తౌడు అండి. గతంలో ఉంటే వ్యవసాయం పనులు చేసే వాడిని. లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చునే వాడ్ని. ఐదు సంవ త్సరాలుగా ఉపాధి పనులు చేస్తున్నా. ఏపీడీ: నీకు రోజుకు ఎంత కూలి గిట్టుబాటు అవుతోంది..? తౌడు: రోజుకు రూ 150 వరకు వస్తంది. జట్టులో అందరూ వస్తే పని బాగా జరుగుతుంది. ఏపీడీ : ఏమమ్మా నీ పేరు..? మీకు పని ప్రదేశంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా..? లెంకగౌరి(ఉపాధి వేతనదారు): నా పేరు లెంక గౌరి. ప్రతి రోజు పనికి వస్తా. ఇక్కడ ఎండైతే కూర్చువటానికి టెంటు ఉంది. మంచి నీళ్లు మేమే తెచ్చుకుని తాగుతాం. ఏపీడీ: మంచినీటికిప్రభుత్వండబ్బులుఇస్తుంది .. తెలుసా..? గౌరి: అవున ండి ఎవరి నీరు వారే తెచ్చుకుంటాం. అందుకు ప్రభుత్వం రోజుకు రూ 5 ఇస్తుంది. అదేవిధంగా గునపానికి రూ10 , తట్టకు రూ10 చొప్పున ఇస్తోంది. ఏపీడీ: ఇవన్నీ మీకు ఇచ్చే వేతనం స్లిప్పులో ఉంటుంది .. చూస్తారా..? గౌరి: చూస్తానండి. నేనే పదోతరగతి చదివా.. ఏపీడీ : నీ పేరేంటి ? ఎన్ని రోజు లు పని చేశావు..? కె.జయమ్మ (ఉపాధి వేతనదారు) : నాపేరు కె.జ యమ్మ. ఈ సంవత్సరం నేను ఇప్పటికి 80 రోజులు పని చేశాను. ఏపీడీ: ప్రభుత్వం ఏడాదిలో 100 రోజులు పనులు కల్పిస్తోంది..అవి సరిపోతున్నాయా..? జయమ్మ: ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పనులకు వస్తే వంద రోజులు చాలవు. అప్పుడప్పుడు వ్యవసాయం పనులు ఉంటే వాటికే వెళిపోతాం. ఏపీడీ: కిందటి సంవత్సరం 100 రోజులు పనులు పూర్తి చేసుకున్నారా..? జయమ్మ: పూర్తి చేసేశాం. ఏపీడీ: ప్రతి రోజు పనిలోకి ఎన్ని గంటలకు వస్తారు..? జయమ్మ: ఉదయం 7.30 గంటలకు వచ్చి 11.00 గంటల వర కు చేస్తాం. మళ్లీ మధ్యాహ్నం వచ్చి ఆ రోజు పని పూర్తి చేస్తాం. ఏపీడీ: రాబోయేది వేసవి కాలం కదా.. అప్పుడు ఎలా పనులు చేస్తారు..? జయమ్మ: అప్పుడు తెల్లారే వచ్చేస్తామండి. ఏపీడీ: ఏమమ్మానీపేరేంటి..?ఎవరెవరుపనులకు వస్తారు..? రవణమ్మ : నా పేరు రెల్లి.రవణమ్మ అండి. నేను నా భర్తా పనులకు వస్తాం. ఏపీడీ: నీ పేరేంటమ్మ ..? నీకు రోజు కూలి ఎంత వస్తోంది ? విజయ ( మేట్) నా పేరు విజయ. రోజుకు రూ140 వరకు కూలి వస్తోంది. ఏపీడీ: మీ జట్టులో సభ్యులు ఎంత మంది ఉన్నారు ? మేట్: జట్టులో ఏడుగురు మగాళ్లు, నలుగురు ఆడవారు ఉన్నారు. ఉదయం రాగానే కొలతలు ఇచ్చి పనిప్రారంభిస్తా. వారితో పాటు నేనూ పని చేస్తా. ఏపీడీ: నీ పేరేంటమ్మ..? ఇక్కడ నువ్వు ఏంటి..? రేణుక(మేట్): నా పేరు రేణుక. పది వరకు చదివా.. నేనే మా జట్టుకు మేట్ని. ఏపీడీ: మీ జట్టులో వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారు ఎంత మంది ఉన్నారు..? మేట్: ఇప్పటికే నాలుగు కుటుంబాలు 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నాయి. మిగిలిన కుటుంబాల వారు 60 నుంచి 70 రోజులు పనులు పూర్తి చేసుకున్నారు. ఏపీడీ : నీ పేరేంటమ్మ..?ఎన్ని సంవత్సరాలు నుంచి పనిలోకి వస్తున్నావు..? రమణమ్మ: నాపేరు మండల.రమణమ్మ. మూడు సంవత్సరాల నుంచి పనిలోకి వస్తున్నా. ఏపీడీ:గతంలోఎంతకూలివచ్చేది..?ఇప్పుడుఎంత వస్తోంది..? రమణమ్మ: గతంలో రూ120 వరకు వచ్చేది... ఇప్పుడు రూ140 నుంచి రూ150 వరకు వస్తోంది. ఏపీడీ:నీపేరు..?ఉపాధిపనులుఎలాఉపయోగపడుతున్నాయి...? మంగ : నా పేరు మంగ. నాలుగు సంవత్సరాలుగా ఉపాధి పనులకు వస్తున్నా. మాకు ఇద్దరు పిల్లలు . విజయనగరంలో చదువుకుంటున్నారు. మాకు వచ్చే డబ్బులతో వారిద్దరిని బాగా చదివించాలనుకుంటున్నాం. ఏపీడీ: నీ పేరేంటమ్మా ? మీ పిల్లలు ఏం చేస్తుంటారు..? లక్ష్మి : నా పేరు లక్ష్మి. నేను నా భర్త ఇద్దరం పనిలోకి వస్తాం. ఇద్దరిదీ ఒకే సంఘం. మా పిల్లలు బొప్పడాం హైస్కూల్లో చదువుతున్నారు. ఏపీడీ: మీ భర్తపేరు..?ఉపాధి లేని రోజుల్లో ఏంచేసేవారు..? లక్ష్మి: నా భర్త పేరు దుర్గాప్రసాద్. నాయీ బ్రాహ్మణుడు. గతంలో కులవృత్తి చేసుకునే వాళ్లం .ఇప్పుడు ఉపాధి పనులు చేసుకుంటూ రోజుకు రూ150 సంపాదిస్తున్నాం. ఏపీడీ: నీ పేరు...? ఇక్కడ ఏం చేస్తుంటావు.. రమణమూర్తి (టెక్నికల్ అసిస్టెంట్) : నా పేరు శ్రీను. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నా. ఏపీడీ: నీ బాధ్యతలు ఏంటి..? టీఏ: గ్రామంలో పనులు కావాలని వచ్చే వారందరికీ పనులు కల్పించటం. ప్రతి వారం వచ్చే దరఖాస్తులను స్వీకరించడంతో పాటు, నా పరిధిలో ఉన్న గ్రామాలకు వారంలో రెండు సార్లు వెళ్లి పనులు పరిస్థితిని పరిశీలిస్తాను. పని చేసే నైపుణ్యం లేని వారికి నైపుణ్యం కల్పించి వారితో పనులు చేయిస్తున్నాం. ఏపీడీ: ఎంపీడీఓగారూ...మండలంలో పరిస్థితి ఎలా ఉంది...? రాజకుమార్(ఎంపీడీఓ) ః మా మండలంలో ఏడాదికి సరాసరిన 10 నుంచి 12 వేల కుటుంబాల వారు ఉపాధి పనులకు హాజరవుతుంటారు. మారుతున్న విధి విధానాలకు అనుగుణంగా ప్రతి బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్లకు మండల స్థాయిలో అవగాహన కల్పిస్తాం. మేట్లకు ఏడాదికి ఒక సారి శిక్షణా తరగుతలు నిర్వహించి చట్టం నిర్ధేశించిన మేర వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. -
వీఐపీ రిపోర్టర్ : వికారాబాద్ సబ్ కలెక్టర్ వర్షిణి
-
విఐపి రిపోర్టర్ -ద్వారకా తిరుమల ఇఓ త్రినాధరావు
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే గొంగిడి సునీతా రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : డాక్టర్ వెంకటేశ్వరరావు
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే సంజీవరావు
-
విఐపి రిపోర్టర్ - పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
-
విఐపి రిపోర్టర్ -రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు
-
సౌకర్యాల స్థాయి పెరగలేదు!
పేదల వైద్యానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా సమన్వయం, పర్యవేక్షణ లోపంతో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి రాజాం ఏరియా ఆస్పత్రి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆస్పత్రిని 60 పడకల నుంచి 100 పడకల స్థాయికి రెండేళ్ల క్రితం మార్చారు. సుమారు రూ.4 కోట్లు వెచ్చించి కొత్త భవనాలు నిర్మించారు. అయితే వైద్య పరీక్షలు, చికిత్సలకు అవసరమైన ఆధునిక పరికరాలు సమకూర్చడంలో మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్థాయి పెరిగినా.. ఆ స్థాయి వైద్యసేవలు అందక పేద రోగులు నానా అవస్థలు పడుతున్నారు. పెద్ద జబ్బులు చేస్తే వేరే ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో సకాలంలో మెరుగైన చికిత్స అందక రోగులు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుంటున్నారు. ఈ సమస్యలను స్వయంగా తెలుసుకొనేందుకు రాజాం ఎమ్మెల్యేల కంబాల జోగులు ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ప్రజాప్రతినిధిగా కాకుండా ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా ఆస్పత్రిలోని పలు వార్డుల్లో పర్యటించి రోగుల సమస్యలు తెలుసుకున్నారు. వైద్యాధికారులను, ఇతర సిబ్బందితో మాట్లాడి ఇక్కడ అందుతున్న వైద్యసేవలు, అవసరాలపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి తన స్థాయిలో ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. వివిధ వర్గాలవారితో ఆయన జరిపిన సంభాషణ యథాతథంగా.. రోగులతో.. ఎమ్మెల్యే జోగులు(గైనిక్ వార్డులో): మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఆపరేషన్ చేశారా లేక సాధరణ డెలివరీయా? ఎంత ఖర్చు అయింది? స్టాఫ్కు డబ్బులు ఏమైనా ఇచ్చారా? మడ్డు దుర్గ(రోగి): రాజాం మండలం బొద్దాం నుంచి జనవరి 29న వచ్చి జాయిన్ అయ్యాను. సాధారణ డెలివరీ చేశారు. రూ.200 ఖర్చు అయ్యింది. స్టాఫ్ ఎవరూ డబ్బులు అడగలేదు. ఎమ్మెల్యే : మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? మీ సమస్య ఏంటి? ఆస్పత్రి పనితీరుపై మీ అభిప్రాయమేంటి? ముగడ నరిశింహులు(రోగి సహాయకుడు) : నా పేరు ముగడ నరిశింహులు. సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామం. పేషెంట్తో వచ్చా. జ్వరం, జలుబు, ఒళ్లుపీకులు ఉన్నాయని డాక్టర్కు చెప్పాం. మందులు ఇచ్చారు. గవర్నెమెంట్ మందులు కావడం వల్ల తగ్గడం లేదని చెప్పాం. మరి అవే ఉన్నాయని డాక్టర్ చెప్పారు. బయట మందులు కొనలేం. ఏం చేయాలో తోచడం లేదు. ఎమ్మెల్యే: ఏమమ్మా.. ఏంటి ప్రాబ్లమ్? ఎప్పుడు జాయిన్ అయ్యావ్? బాత్రూంలు బాగున్నాయా? నీటి సౌకర్యం ఉందా? జి.అప్పలనరసమ్మ(రోగి): విరేచనాలు, కడుపునొప్పితో వచ్చి జాయిన్ అయ్యాను. బాతరూంలు కంపు కొడుతున్నాయి. నీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. తాగునీరు కూడా లేక ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే: ఏమయ్యా.. ఏం జరిగింది? కాలుకి ఎలా దెబ్బ తగిలింది? వైద్యులు ఏమన్నారు? మందులు ఇస్తున్నారా? గురవాన లక్షుం(రోగి): పొలంలో కాలు జారి పడ్డాను. ఎముక విరిగింది. వైద్యులకు చూపిస్తే కట్టు కట్టారు. మందులు ఇస్తున్నారు. పరవాలేదనిపిస్తోంది. ఆపరేషన్ చేయడానికి షుగర్ ఉందన్నారు. ఎమ్మెల్యే: ఆస్పత్రిలో జాయిన్ అయ్యావు, ఏమైంది బాబూ? ఏంటి నీ సమస్య? నాగళ్ల దుర్గారావు(రోగి): కడుపు నొప్పితో జాయిన్ అయ్యాను. మందులు ఇచ్చారు. గ్యాస్ట్రిక్ ఉందని చెప్పారు. ఇప్పుడు బాగుంది. సూపరింటెండెంట్తో.. ఎమ్మెల్యే: ఆపరేషన్లు ఎందుకు చేయటం లేదు? అవసరమైతే ఎలా మరీ? గార రవిప్రసాద్(సూపరింటెండెంట్): ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడు ఉన్నారు. కానీ ఆయనకు ఆరోగ్యం బాగులేకపోవడటంతో విధులకు హాజరుకావడం లేదు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఇంకా రెస్పాండ్ కాలేదు. ఎమ్మెల్యే: ఓపీ, ఇతర వైద్య సేవలకు ఎంతమంది వైద్యులు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఎంతమంది అవసరం? రవిప్రసాద్: ప్రతి రోజూ ఓపీకి 350 నుంచి 400 కేసులు వస్తాయి. ఐపీకి మరో 30 వరకు ఉంటాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 8 మంది వైద్యులు పనిచేస్తున్నారు. జనరల్ మెడిసన్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, జనరల్ సర్జన్, గైనకాలజిస్టు, ఎముకలు, మానసిక వైద్య నిపుణులు సాయిరాం, డెంటిస్టు, అనస్థసిస్ట్ ఉన్నారు. మరో ఆరుగురు వైద్యులు అవసరం. ఎమ్మెల్యే: కనీస అవసరాలకు కావల్సిన సిబ్బంది ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఏఏ సమస్యలు ఉన్నాయి? రవిప్రసాద్: బెడ్షీట్లు ఉతకడానికి దోబీ లేడు. పోస్టు మంజూరు చేయాలని ఉన్నతాధికారులను కోరినా స్పందించడం లేదు. దీంతో మంచాలపై బెడ్షీట్లు వేయలేకపోతున్నాం. ఎలక్ట్రీషియన్ లేడు. కరెంటు సమస్యలు ఎదుర్కొంటున్నాం. సొంత డబ్బులు పెట్టి ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నాం. చాలా కష్టంగా ఉంది. ఎమ్మెల్యే: ప్రస్తుతం స్వైన్ఫ్లూ వ్యాధి ప్రబలుతోంది కదా.. దాని నివారణకు ఏమైనా సౌకర్యాలు కల్పించారా? కేసులు ఏమైనా నమోదు అయ్యాయా? ప్రత్యేక నిధులు ఏమైనా మంజూరు అయ్యాయా? రవిప్రసాద్: స్వైన్ఫ్లూ లక్షణాలు కలిగిన రోగులు ఇంతవరకు రాలేదు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సౌకర్యాలు ఏమీ కల్పించలేదు. నిధులు కూడా మంజూరు కాలేదు. ఇక్కడికి వచ్చే రోగుల్లో అటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రిమ్స్కు తరలిస్తాం. ఎమ్మెల్యే: ఆస్పత్రి నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం లేదు కదా!.. ఎలా మేనేజ్ చేస్తున్నారు? రవిప్రసాద్: ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. అవసరమైతే హెచ్డీఎఫ్సీ నిధులు ఖర్చు చేయమని చెప్పారు. కానీ ఇంతవరకూ కమిటీ ఏర్పాటు కాలేదు. మీటింగ్ కూడా జరగలేదు. విధిలేని పరిస్థితుల్లో సొంత డబ్బులు నెలకు సుమారు రూ. 15వేల వరకు ఖర్చు చేస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్న వైద్యుల్లో సగం మంది ఈ ప్రాంతం వారమే కాబట్టి.. సొంత ఊరిపై మమకారంతో ఆస్పత్రి నిర్వహణకు అయ్యే ఖర్చు భరిస్తున్నాం. చిన్నపిల్లల వైద్యనిపుణుడితో.. ఎమ్మెల్యే: చిన్న పిల్లల ఓపీ ఎంత ఉంటుంది? మందులు పూర్తి స్థాయిలో ఉన్నాయా? కరణం హరిబాబు(చిన్నపిల్లల వైద్యనిపుణుడు): ప్రతి రోజూ ఓపీ 50 నుంచి 60 వరకు ఉంటుంది. కొన్ని మందులు ఆస్పత్రిలోనే లభిస్తాయి. మరికొన్ని బయట మందులు షాపుల్లో దొరుకుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటి మందులు రాస్తాం. నర్సులతో.. ఎమ్మెల్యే: ఆస్పత్రిలో దుర్వాసన వస్తోంది. రోగులు ఉండలేక పోతున్నామంటున్నారు. పారిశుధ్ధ్య సిబ్బంది పనులు చేయటం లేదా? కాంట్రాక్టర్ రావటం లేదా? సోఫియా(హెడ్ నర్సు): దోబీ లేకపోవటంతో బెడ్షీట్లు ఉతకటం కుదరడం లేదు. దీంతో మంచాలపై బెడ్షీట్లు వేయటం లేదు. పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. కాంట్రాక్టర్ మాత్రం రావటం లేదు. సూపర్వైజరే అన్నీ చూస్తున్నారు. గదులు శుభ్రంగా ఉంచుతున్నాం. ఎమ్మెల్యే: ఏమమ్మా.. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందా? పని విషయంలో భద్రత దొరుకుతుందా? విజయలక్ష్మి(స్టాఫ్ నర్స్): పదో పీఆర్సీ అమలు చేయటం లేదు. పనిలో భద్రత దొరకడం లేదు. పనికి తగ్గ జీతాలు ఇవ్వడం లేదు. పని పెరిగింది. సిబ్బంది తక్కువగా ఉన్నారు. మరో 14 మంది స్టాఫ్ నర్సులను నియమించాల్సి ఉంది. ఎమ్మెల్యే(ముక్తాయింపు): మీ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా.. పరిష్కారానికి చొరవ చూపుతా.. -
వీఐపీ రిపోర్టర్ : ఎస్కేయూ వీసీ లాల్కిషోర్
-
విఐపి రిపోర్టర్ - విద్యాసాగర్ రావు
-
విఐపి రిపోర్టర్ - విజయనగరం రైల్వే స్టేషన్ మాస్టర్ చంద్రశేఖర్రాజు
-
అర్హులందరికీ ఉపాధి
అడిగిన వారందరికీ ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తామని డ్వామా పీడీ చేరెడ్డి పుల్లారెడ్డి హామీనిచ్చారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా మారిఓర్వకల్లు మండలం కేతవరం గ్రామంలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లిమాట్లాడారు. వారు ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. ఉపాధి పనులు పెడుతున్నారా, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా... ఎంత కూలి పడుతోంది.. ఇంకా ఏమి కోరుకుంటున్నారు.. తదితర విషయాలను ఆరా తీశారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. వెలుగులోకి వచ్చిన సమస్యలు... ఒక్కో కుటుంబంలో ఐదుగురు ఉన్నా ఒకే జాబ్ కార్డు ఉంది. దీంతో ఒక్కొక్కరు 20 నుంచి 35 రోజు పని చేసినా 100 రోజులు పూర్తి అవుతున్నాయి. తర్వాత ఉపాధి కరువు అవుతోంది. భూముల్లో వేసిన రాతికత్వలు వ్యవసాయానికి ఇబ్బందిగా మారాయి. సత్వరం వీటిని తొలగించాల్సి ఉంది. పొలాలకు వెళ్లేందుకు రోడ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మట్టి రోడ్లు వేయాలి. ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, కాల్వలు లేవు. దీంతో మురుగునీరు ఇళ్ల ముందే నిలుస్తోంది. ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచాలి. పీడీ : గ్రామస్తులందరూ బాగున్నారా... గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్నాయా... మీ రు ఉపాధి పనులకు వెళ్తున్నారా? పాపన్న : సార్.. నేను గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్నాను. అందరికీ అవసరమైన పనులు ఇంకా కల్పించలేదు. ఉపాధి పనులు కల్పిస్తే గ్రామంలో దాదాపు 120 కుటుంబాలకు మేలు జరుగుతుంది. పీడీ : అందరికీ పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని కుటుంబాలు ఈ పనులను వినియోగించుకోవాలి. సిద్ధయ్య : సార్.. గ్రామానికి దాదాపు 100 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 30 పూర్తి అయ్యాయి. మిగిలినవి కూడా వివిధ దశలో ఉన్నాయి. ఉపాధి పథకం కింద మొక్కలు నాటడం, పండ్ల తోటల అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వ్యవసాయ కూలీలకు కూడా పనులు కల్పిస్తున్నారు. పీడీ : ఇంతవరకు ఎన్ని రోజులు పని లభించింది, ఇంకా ఎలాంటి పనులు కోరుకుంటున్నారు? మద్దిలేటి : సార్.. మా కుటుంబానికి ఇప్పటికే 100 రోజుల పని లభించింది. పనిదినాలను 150 రోజులకు పెంచితే బాగుంటుంది. పీడీ: అందరికీ ఉపయోగకరమైన పనులు కల్పిస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పీడీ : ఏమ్మా.. నీ పేరు ఏమిటి? ఉపాధి పనులకు వెళ్తున్నావా... ఏ గ్రూపులో ఉన్నావు, ఎంత కూలీ పడుతోంది? మహిళ : నమస్కారం సార్.. నా పేరు సుబ్బమ్మ. వెన్నెల గ్రూపులో పనిచేస్తున్నాను. ఇప్పటికే 100 రోజుల పనిదినాలు పూర్తి అయ్యాయి. కూలీ రోజుకు సగటున రూ.120 నుంచి రూ.140 పడింది. పీడీ: అమ్మా.. వచ్చిన డబ్బులు ఏమి చేసుకుంటున్నావు? నాగమ్మ : మొన్నటివరకు పిల్లలు చిన్నగా ఉన్నారు. ఇప్పుడు వారిని చదివించుకోవడానికి ఉపాధి వేతనాలు వినియోగిస్తున్నాం. అదే విధంగా పొలం అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఉపాధి పథకంతో వల్ల మాకు ఎంతో మేలు జరిగింది. పీడీ : ఏమయ్యా నీ పేరు ఏమిటి? ఉపాధి పనులకు వెళ్తున్నావా.. ఇంతవరకు ఎన్ని రోజులు పనిచేశావు? కూలీ : సార్.. నా పేరు బాలన్న. ఈ సంవ త్సరంలో ఇప్పటివరకు మా కుటుంబం 70 రోజులు పనిచేసింది. ప్రస్తుతం పనులు లేవు. పనులు పెడితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఇంట్లో ఇద్దరం ఉపాధి పనులపైనే ఆధార పడివున్నాం. పీడీ : అందరికీ పనులు కల్పిస్తాం.. సరైన విధంగా పనిచేసుకుంటే గిట్టుబాటు వేతనం కూడా లభిస్తుంది. నీ పేరు ఏమిటి, నీకు ఏమైనా సమస్య ఉందా? కూలీ : సార్.. నా పేరు మౌలాలి. ఇంతవరకు 30 రోజులు పనిచేశాను. పొలం పనులు ఉండటం వల్ల ఉపాధి పనులు చేయలేదు. మా గ్రామంలో గతంలో పొలాల్లో రాతికత్వలు కట్టారు. ఇవి అడ్డంగా మారిపోయాయి. వీటిని ఎత్తివేసే విధంగా పనులు చేపట్టాలి. అడ్డంగా ఉన్న రాతికత్వలను ఎత్తివేయడం వల్ల రైతులకు సౌకర్యంగా సాగుకు అనువుగా ఉంటుంది. పీడీ : పొలంలో ఉన్న రాతికత్వలను ఎత్తివేసేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఉందో లేదో చూస్తాను. అవకాశం ఉంటే కచ్చితంగా ఆ పనులకు అవకాశం ఇస్తాం. సర్పంచ్ : సార్.. గార్గేయపురం నుంచి కేతవరం వరకు రోడ్డు అధ్వానంగా ఉంది. ఉపాధి పథకం కింద రోడ్డు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందా..? అదే విధంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మురుగునీరు పోవడం లేదు. ఇళ్ల మధ్యనే నిలుస్తోంది. కాల్వలు నిర్మించడానికి చొరవ తీసుకోవాలి. పీడీ: రోడ్డు అభివృద్ధి చేసే పనులకు ఉపాధి పథకంలో అవకాశం ఉండదు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు మాత్రం అవకాశం ఉంది. ఎస్సీ కాలనీ సీసీ రోడ్లు వేయడానికి చర్యలు తీసుకుంటాం. మాణిక్యమ్మ : సార్.. రేండేళ్లుగా మేము ఉపాధి పనులపైనే ఆధారపడి బతుకుతున్నాం. మా ఇంటికి ఒక్క జాబ్ కార్డు ఉంది. ఇద్దరం పనిచేస్తాం. ఒక్కొక్కరం 50 రోజులు పనిచేయడంతో 100 రోజుల పనిదినాలు పూర్తి అయ్యాయి. ఇక మాకు ఉపాధి లేదంటున్నారు. పనిదినాలను 150 రోజులకు పెంచాలి. అప్పుడే మాకు ఉపయోగంగా ఉంటుంది. పీడీ : ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచడం మా చేతిలో లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పనిదినాలను 150 రోజులకు పెంచే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. అవసరమైతే మీ కుటుంబానికి మరో జాబ్ కార్డు ఇచ్చి 100 రోజుల పని కల్పిస్తాం. మహిళ : సార్... నా పేరు కళ్యాణి. జయంతి గ్రూపులో మేటిగా పనిచేస్తున్నాను. మాకు ఒక జాబ్ కార్డు ఉంది. ఇందులో నలుగురం పనిచేస్తున్నాం. ఒక్కొక్కరం 25 రోజులు పనిచేయడంతోనే 100 రోజు పనిదినాలు పూర్తి అయ్యాయి. ఇక పని లేదంటున్నారు. మా పరిస్థితి ఏమిటి? పీడీ : మీ ఇంటికి ఉన్న జాబ్ కార్డులో నలుగురు సభ్యులుగా ఉన్నారా... అయితే మీ కుటుంబానికి అదనంగా మరో జాబ్ కార్డు మంజూరు చేస్తాం. అర్హత కల్గిన అన్ని కుటుంబాలకు అదనపు జాబ్ కార్డులు ఇస్తాం. మీరు ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్లి జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి... మంజూరు చేస్తాం. పీడీ : అమ్మా.. మీకు ఇప్పుడు ఎంత కూలి పడుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా...? మహిళలు : సార్.. మాకు ఇప్పటివరకు కూలి బాగానే పడుతోంది. రూ.120 నుంచి రూ.140 వరకు పడుతోంది. మాకు ఈ కూలి రూ.160 వరకు వచ్చే విధంగా చూడాలి. అప్పుడు మాకు ఉపాధి పనులు గిట్టుబాటు అవుతాయి. పీడీ : రోజుకు ప్రభుత్వం గరిష్ట కూలి రూ.169గా నిర్ణయించింది. ఈ మేరకు కూలి రావాలంటే రోజుకు కనీసం 8 గంటలు, కొలతల ప్రకారం పని చేయాలి. గోవర్ధన్ : సార్... ఉపాధి పథకం వ్యవసాయ కూలీలకు ఎంతో తోడ్పడుతోంది. గ్రామంలోని పొలాలకు వెళ్లేందుకు రోడ్లు వేయిస్తే బాగుంటుంది. పీడీ : వ్యవసాయ భూములకు వెళ్లడానికి వీలుగా మట్టి రోడ్లు వేసేందుకు ఉపాధి హామీ పథకం కింద ప్రొవిజన్ ఉంది. -
సమస్యల స్టేషన్ !
ఈస్ట్కోస్ట్ రైల్వే డివిజన్లో ప్రధాన జంక్షన్గా విజయనగరానికి పేరుంది. నిత్యం వందలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. అటు ఒడిశా, ఇటు రాయపూర్ వెళ్లాలన్నా వ్యాపారులు విజయనగరం రైల్వేస్టేషన్లోనే ట్రైన్ మారాల్సి ఉంటుంది. అందువల్లే జిల్లా వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇటువంటి స్టేషన్లో సమస్యలు కూత పెడతున్నాయి. రిజర్వేషన్ దగ్గర నుంచి డస్ట్బిన్ల ఏర్పాటు వరకూ పలు సమస్యలతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రైల్వేస్టేషన్లో టిఫిన్, టీ, తదితర స్టాల్స్ నిర్వహకులు ఎమ్ఆర్పీకి మించి అమ్ముతున్నారని, రైళ్లలో టాయిలెట్లు సక్రమంగా లేకపోవడ ం వంటి ఫిర్యాదులున్నాయి. విజయనగరం రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలను కనుగొనేందుకు విజయనగరం రైల్వే స్టేషన్ మేనేజర్ బి.చంద్రశేఖర రా జు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ గా మారారు. స్టేషన్ పరిసరాలతో పాటూ, ఫ్లాట్ఫామ్స్, రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు, పారిశుద్ధ్య కార్మికులు, రైల్వే హమాలీలు, సీనియర్ టికెట్ కలెక్టర్లను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో ఆయన సంభాషణ ఇలా సాగింది స్టేషన్ మేనేజర్ : నమస్తే.. నా పేరు చంద్రశేఖర రాజు. నేను రైల్వే స్టేషన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మీ సమస్యలు తెలుసుకోడానికి ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా మీ వద్దకు వచ్చాను. మీ పేరేంటి ? మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ప్రయాణికురాలు: నమస్తే సార్.. నా పేరు అరుణ. పండగకు ఊరొచ్చాం. మేము బెంగుళూరు వెళ్తున్నాం. స్టేషన్ మేనేజర్: రైల్వేస్టేషన్లో మీకేమైనా సమస్యలు ఎదురయ్యాయా ? స్టేషన్పై మీ అభిప్రాయమేంటి ? అరుణ: విజయనగరం రైల్వేస్టేషన్ గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గానే ఉంది. అప్పట్లో ఇరుగ్గా ఉండేది. ప్రస్తుతం విశాలంగా, సౌకర్యంగానే ఉంది. పెద్ద పెద్ద స్టేషన్లను బాగా డెవలప్ చేయాలి. స్టేషన్ మేనేజర్ : హలో సార్... నమస్తే, మీ పేరేంటి , సమస్యలు ఏమైనా ఉన్నాయా? రాజన్న: నాపేరు రాజన్న, స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగానే ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం గమనించాం. చెత్తా, చెదారాలు కిందపడేయకుండా మరికొన్ని డస్ట్బిన్లను ఏర్పాటుచేస్తే బావుంటుంది. స్టేషన్ మేనేజర్ : మరో ప్రయాణికుడి దగ్గరకు వెళ్తూ... మీ దగ్గర టికెట్ ఉందా? ఆన్లైన్లో తీశారా, రిజర్వేషన్ కౌంటర్ ద్వారానా? ఈజీ టికెటింగ్ పట్ల అభిప్రాయం? వంశీ: ఆన్లైన్లోనే టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాను. మొబైల్ టికెటింగ్ రావడం రైల్వేస్లో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. పని సులభంగా అయిపోతుంది. భువనేశ్వర్ వెళ్తున్నాను. స్టేషన్ మేనేజర్: ప్రయాణికుల దగ్గర నుంచి ఎంఆర్పీని మించి అమ్ముతున్నారంట? ఇప్పుడే నా దృష్టికి వచ్చిం ది. ఏంటి విషయం ? వెంకటరావు, వ్యాపారి: లేదు సార్... అటువంటిదేమీ లేదు.. ఎక్కడో జరిగి ఉండవచ్చు. మన స్టేషన్లో ఎంఆర్పీకే అమ్మకాలు చేస్తున్నాం. స్టేషన్ మేనేజరు: నీ పేరేంటి, ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నావు? జీతం సక్రమంగా వస్తుందా? పారిశుద్ధ్య కార్మికుడు: నాపేరు అప్పలరాజు సార్, నాలుగేళ్ల నుంచి కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నాను. ఎనిమిది గంటల సమయం పనిచేస్తాను. పీఎఫ్ కట్ అవుతోంది. రూ.5వేల వరకూ జీతమిస్తారు. ఈ లోపు బెంగుళూరు నుంచి భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ రానే వచ్చింది. ఒక వ్యక్తి నడుస్తున్న రైల్లోంచి దూకడం గమనించిన స్టేషన్ మాస్టర్ ఆయన దగ్గరకు వెళ్లి సార్ నమస్తే, అలా దూకితే ప్రమాదమని తెలీదా ? రన్నింగ్ ట్రైన్లోంచి దిగడం కరెక్ట్ కాదు గదా? అశోక్ నాయక్ : ఆకలికి తట్టుకోలేక ఏదో తినేద్దామన్న ఆత్రుతతో గెంతేశాను. అంతేనండి. పొరపాటైంది. ఇంకెప్పుడూ ఇలా చేయను. స్టేషన్ మేనేజర్ : రైల్వే ప్రాంగణంలో మార్కింగ్ ప్రకారం పార్కింగ్ చేస్తున్నారా? కారు, జీపు తదితర పార్కింగ్లు చేయడంలో మీకేమైనా సమస్యలు వస్తున్నాయా? సీహెచ్ రాజా (డ్రైవర్) : లేదు సర్.. గత కొన్నాళ్లుగా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం. మార్కింగ్ మేరకు ఇచ్చిన స్థలంలో చక్కగానే పార్కింగ్ జరుగుతోంది. అదనపు రుసుం వసూలు చేయడం లేదు. కానీ పార్కింగ్ పక్కన ఖాళీస్థలాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నాం. స్టేషన్ మేనేజర్ : పార్కింగ్ పక్కన ఖాళీ స్థలంలో సులబ్కాంప్లెక్స్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది. స్టేషన్ మేనేజర్ : ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ప్రయాణికులతో మాట్లాడుతూ.. రైలు ప్రయాణంలో ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా? బోగీలను క్లీన్గా ఉంచుతున్నారా? మంచి ఆహారాన్ని అందిస్తున్నారా ? డి.ఎస్. పాడి(ప్రయాణికుడు) : రైల్లో క్లీనింగ్ చేస్తున్నప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నవారికి కాస్త ఇబ్బందిగానే ఉంటోంది. బాత్రూమ్లు సక్రమంగా లేవు. నీటి సౌకర్యం లేదు. చెత్తా, చెదారాలు పడేస్తున్నారు. ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద క్లీనింగ్, వాటరింగ్ చేయించే విధంగా చర్యలు చేపట్టాలి. స్టేషన్ మేనేజర్ : తప్పకుండా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరిస్తాం. అలా రైల్లోనే నడుస్తూ... క్యాంటిన్ బోగీలోకి వెళ్లి వండుతున్న ఆహారాపదార్థాలను పరిశీలించారు. రైస్ ఎప్పుడు వండారు? పన్నీరు ప్రెష్గా కనబడటం లేదు? ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంట? నిల్వ ఆహార పదార్థాలు ఇస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు ? ఏమిటి విషయం? రాజీవ్ గుప్త ( క్యాంటిన్ కార్ నిర్వహకుడు) : రైస్ ఇప్పుడే దించాము సార్.. లంచ్ టైమ్కి ప్యాకింగ్ చేసేందుకు పక్కన పెట్టాం. పన్నీరు ప్రెష్దే , ఎప్పటికప్పుడు ఆర్డర్ ప్రకారమే వంట చేస్తాం. వెజ్మీల్స్, బిర్యానీ, కాఫీ, టీ అన్నీ ఐఆర్సీటీసీ ఇచ్చిన ధరల ప్రకారమే విక్రయిస్తున్నాం. స్టేషన్ మేనేజర్ : రైలు దిగిన తర్వాత రైల్వే కూలీలతో మాట్లాడుతూ జీతం సక్రమంగా వస్తోందా? బేరాలు వస్తున్నాయా ? లక్ష్మణరావు(హమాలీ) : ప్రయాణికులు చక్రాల బ్యాగులు వాడుతుండడంతో వారే తమతో పాటు తీసుకువెళుతున్నారు. ఇంకా మేము మోసేది ఎక్కడ సార్. ప్రభుత్వం రూ.2,415 ఇస్తుంది. అది కూడా 30 మందికే వస్తుంది. ఇంకా 140 మంది వరకూ కార్మికులు ఉన్నారు. బయట కూలికెళితే రోజుకు రూ.300 వరకూ వస్తుంది. ఇక్కడ అది కూడా రావడంలేదు. పీఎఫ్ లే దు. పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నాం. స్టేషన్ మేనేజర్ : మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను. స్టేషన్ మేనేజర్ : స్టేషన్లో టికెట్ చెకింగ్ ఎలా ఉంది? టికెట్ తీసే ప్రయాణాలు చేస్తున్నారా ? ఎవరైనా టికెట్లేని ప్రయాణికులు దొరికారా ? బీరేంద్ (సీనియర్ టీసీ) : లేదు సర్.. ప్రయాణికులు టికెట్ తీస్తున్నారు. స్టేషన్ మేనేజర్ : రైల్వే రిజర్వేషన్ కౌంటర్లోకి వెళ్తూ... స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికురాలికి సూచించారు. అనంతరం ఆమె దగ్గర ఉన్న చీపురును తీసుకుని రిజర్వేషన్ కౌంటర్లో ఒక భాగాన్ని పరిశుభ్రం చేశారు. అనంతరం ఆమెతో మాట్లాడుతూ సక్రమంగా జీతాలు వస్తున్నాయా ? ఫినాయిల్, బ్లీచింగ్ తదితర వాటిని సక్రమంగా అందజేస్తున్నారా ? లక్ష్మి (పారిశుద్ధ్య కార్మికురాలు): పారిశుద్ధ్య కార్మికులంతా ఒకరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాం. రిజర్వేషన్ కౌంటర్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే చెత్తా,చెదారాలు పేరుకుపోతుంటాయి. అందుకే నిత్యం ఒకరు పనిచేస్తూనే ఉంటాం సార్.. ఫినాయిల్, బ్లీచింగ్ తదితర సామాగ్రిని సక్రమంగానే అందజేస్తున్నారు సర్. -
పేదల సేవే పరమావధిగా..
ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే పై ప్రాణాలు పైనే పోతాయనే భయం వెన్నాడుతుంటుంది. అక్కడి అపరిశుభ్ర వాతావరణం వల్ల కొత్త రోగాలు అంటుకుంటాయని జనం బెంబేలెత్తిపోతుంటారు. అక్కడ సిబ్బంది నుంచి వైద్యుల వరకూ అందరి చేతులూ తడిపితేనే గానీ వైద్యం అందదనే అవినీతి మరక ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్కు దీటుగా చేసేందుకు, సిబ్బందిలో క్రమశిక్షణ పెంచడంతోపాటు అవినీతిని పారదోలడం వంటి అంశాలపై దృష్టిపెట్టిన సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ ఆసుపత్రిలోని ఏ విభాగంలో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా పరిశీలించాలనుకున్నారు. అందుకు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మారారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను పలకరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ మోహన్ : ఏమ్మా.. ఈ ఆసుపత్రిలో మీరు గుర్తించిన ఇబ్బందులేమైనా ఉన్నాయూ. కె.జ్యోతి : దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల కోసం ఓపీ సమయాన్ని పెంచితే బాగుంటుంది. డాక్టర్ మోహన్ : ఏమండీ.. మీ పేరేంటి. మీరు గుర్తించిన సమస్యలేమిటి. ఆర్.భవానీ, పాలకొల్లు : ఆసుపత్రిలోకి రావాలంటే ఆటోలు అడ్డుగా ఉంటున్నాయి. ఎప్పుడు ఎటు తిప్పుతారో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్నాం. ఓపీ టికెట్లు ఇచ్చే ప్రాంతానికి వెళ్లిన సూపరింటెండెంట్ మోహన్ అక్కడి మహిళలతో ఓపీ టికెట్లు తీసుకోవడంలో ఏమైనా ఇబ్బం దులు ఎదురౌతున్నాయా అని ప్రశ్నిం చారు. లేవని సమాధానం రావడంతో డయాగ్నోస్టిక్స్ విభాగానికి వెళ్లారు. డాక్టర్ మోహన్ : ఏపని మీద వచ్చారు. అందరూ నిలబడే ఉన్నారేంటి. ఎం.దుర్గ, గుడివాకలంక : రక్తం, కఫ పరీ క్షలు చేయించుకోవడానికి వచ్చాం సార్. ఇక్కడ కూర్చోవడానికి ఏమీ లేకపోవడంతో నిలబడ్డాం. డాక్టర్ మోహన్ : మీరూ పరీక్షలకే వచ్చారా. కాగిత మంగాపట్నం : ఔనండి. నమూనాలు ఇచ్చాం. ఫలితం రావడానికి సమయం పడుతుందన్నారు. కొన్ని రేపు ఇస్తామంటున్నారు. అన్ని ఫలితాలూ ఈ రోజే ఇచ్చేలా చూడండి. పరీక్షా కేంద్రం లోనికి వెళ్లిన సూపరింటెండెంట్ను రక్త, మూత్ర తదితర పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతోంది, త్వరగా ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా అని ప్రశ్నించారు. డి.వెంకట్రావు, ల్యాబ్ టెక్నీషియన్ : చాలా పరీక్షల ఫలితాలు కొంతసేపటిలోనే ఇస్తున్నాం సార్. కొన్ని పరీక్షలకు సమ యం పడుతుంది. వాటిని త్వరగా ఇవ్వడానికి సాధ్యపడదు. అక్కడి నుం చి నవజాత శిశువుల విభాగానికి వెళ్లిన మోహన్ అక్కడి మహిళలతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న ఎముకల విభాగానికి వెళ్లారు. డాక్టర్ మోహన్ : చికిత్స బాగా జరిగిం దా. ఏమైనా ఇబ్బందులున్నాయా. వి.శ్యామలాదేవి : వైద్యం బాగానే చేశారు. భోజనంలో నాణ్యత లేదు. డాక్టర్ మోహన్ :మీరు చెప్పండి. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి. కాట్రు సురేష్, ధర్మాజీగూడెం : శ్లాబ్ నుంచి నీరు కారి మంచాలపై పడుతోంది. చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడి నుంచి ప్రధాన డ్రగ్ స్టోర్స్కు వెళ్లిన డాక్టర్ మోహన్ ‘రోగు లకు అవసరమైన మందులన్నీ ఉన్నా యా. స్వైన్ ఫ్లూ నివారణ మందులున్నాయా’ అని ప్రశ్నించారు. ఎం.ఇందిర : అన్ని మందులూ అందుబాటులో ఉన్నాయ్ సార్. స్వైన్ ఫ్లూ మందులు ప్రస్తుతం మనవద్ద లేవు. ప్రసూతి వార్డుకు వెళ్లిన మోహన్ ‘ఇక్కడ సిబ్బంది ఎలా చూస్తున్నారు. ఆపరేషన్ చేయడానికి ఎవరికైనా డబ్బులిచ్చారా’ అని అడిగారు. ఎం.రేవతి : బాగానే చూస్తున్నారు. ఎవరూ డబ్బు అడగలేదు. అక్కడి నుంచి మొదటి అంతస్తులోని ఆపరేషన్ థియేటర్కు వెళ్లిన సూపరింటెండెంట్ ‘ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఇంకా ఏమైనా చేయాలా’ని సిబ్బందిని ప్రశ్నించారు. బి.సుందరబాబు : సిబ్బంది బాగా తగ్గిపోయారు సార్. ఎంఎన్వోలు, స్ట్రెచర్ బేరర్లు లేకపోవడంతో వారి పనులు కూడా మేమే చేయాల్సి వస్తోంది. దీని వల్ల ఆపరేషన్లు సమయానికి పూర్తి చేయలేకపోతున్నాం. డాక్టర్ మోహన్ : అది సరే.. ఇక్కడ ఆపరేషన్లు చేస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయ్. ఎం.సత్యనారాయణ : అలాంటిందేం లేదు సార్. ఎవరైనా సంతోషం కొద్దీ ఇస్తే తీసుకుంటున్నాం. డాక్టర్ మోహన్ : సంతోషంగా ఇచ్చినా తీసుకోవద్దు. అదే అలవాటై ఇవ్వని వా ళ్లను అడిగే పరిస్థితికి దిగజార్చుతుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సిబ్బందితో మాట్లాడుతూ ‘ఎక్కడైనా లోటు జరుగుతోందా’ అని అడిగారు. జి.రంగమణి : ఇక్కడ చేరిన వారందరికీ అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయ్ సార్. సెక్షనింగ్ (అన్ని బెడ్లకు ఆక్సిజన్) సౌకర్యం కల్పిస్తే మరింత త్వరగా సేవలందించే వీలవుతుంది. ట్రామా కేర్ సెంటర్ను సందర్శించి సేవలపై ఆరా తీశారు. ఏఎన్ఎంలతో మాట్లాడుతూ.. డాక్టర్ మోహన్ : మీకేమైనా సమస్యలున్నాయా. ఏఎన్ఎంలు : వైద్య సేవలందించే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తున్న మాకు 5 నెలలుగా జీతాలు అందలేదు. పిల్లలతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. వెంటనే జీతాలు విడుదల చేయించడానికి చర్యలు తీసుకోండి సార్. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే జలీల్ ఖాన్
-
విఐపి రిపోర్టర్ - ఏలూరు డిఎస్పీ సరిత
-
వీఐపీ రిపోర్టర్ : మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే sv మోహన్రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే శ్యామసుందర శివాజీ
-
వీఐపీ రిపోర్టర్ : అన్నవరం ఈఓ జగన్నాథరావు
-
విఐపి రిపోర్టర్ - దపేధర్ రాజు
-
విఐపి రిపోర్టర్ - ఆళ్ల రామకృష్ణారెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే గాదరి కిషోర్
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే జయరాములు
-
కౌన్సిల్లో మీ గొంతుకనవుతా..
నల్లగొండ: ‘విద్య’తోనే ప్రగతి... అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం.... ఉమ్మడి సర్వీసు రూల్స్ లేక పదేళ్లుగా నిలిచిపోయిన కీలకపోస్టుల పదోన్నతులు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు ‘కల్పన’గానే మిగిలిపోతున్నది. హెల్త్కార్డుల జారీకి స్పష్టమైన నిబంధనల కోసం ఎదురుచూపులు.... ఆశల లోకంలో విహరింపజేస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటన, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.... పాఠశాలల పనివేళల మార్పుతో ఇబ్బందులు.. ఇలా ఎన్నో హామీలపై గత పాలకుల వాగ్దానాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నల్లగొండలో పలువురు ఉపాధ్యాయులు, సంఘ నేతలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలుసుకున్నారు. ‘సాక్షి’ తరఫున రిపోర్టర్గా మారి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కౌన్సిల్లో మీ గొంతుకనవుతానని భరోసా ఇచ్చారు. నల్లగొండ నుంచి పూల రవీందర్ వీఐపీ రిపోర్ట్... పూల రవీందర్ : ఏమండీ నర్సింహారెడ్డి గారు.. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులెదురవుతున్నాయి? కోమటిరెడ్డి నర్సింహారెడ్డి : సీఎం కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనడం సంతోషమే. పాఠశాలల్లో నీళ్లున్నా తెచ్చే వారు లేరు. అటెండర్లు, స్వీపర్లను నియమించాలి. మౌలిక వసతులు కల్పించాలి. పూల : హెల్త్కార్డులు ఎలా ఉండాలనుకుంటున్నారు? అలుగుపల్లి పాపిరెడ్డి : హెల్త్కార్డ్స్పై స్పష్టమైన నిబంధనలివ్వాలి. ఎయిడెడ్ వారికీ కార్డులివ్వాలి. వారికి 010 పద్దు కింద జీతాలివ్వాలి. 2013 జూలై నుంచి పీఆర్సీని వర్తింపజేస్తూ వెంటనే ప్రకటించాలి. పూల :ప్రభుత్వం నుంచి ఏం కావాలనుకుంటున్నారు? జెల్లా చంద్రమౌళి : ఉమ్మడి సర్వీసురూల్స్ సమస్య పరిష్కారం కాకపోవడంతో గత పదేళ్లుగా ప్రమోషన్లు నిలిచిపోయాయి. వెంటనే డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులివ్వాలి. పూల : తెలంగాణ పునర్నిర్మాణానికి మీ సూచన? మునగాల సోమయ్య : కామన్ స్కూల్ విధానాన్ని అమలుపర్చాలి. వేర్వేరు యాజమాన్యాల పరిధి నుంచి అన్ని స్కూళ్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. పూల : మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం బాగున్నాయా? నంద్యాల మోహన్రెడ్డి : మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం సరఫరా ముదావహం. పిల్లలు ఇష్టంగా తింటున్నారు. వారికి సరిపడే రీతిలో బియ్యం కోటా పెంచాలి. పాఠశాలల పనివేళలను సవరించాలి. పూల ః పీఈటీల సమస్యలున్నాయా? పి.కృష్ణమూర్తిగౌడ్ : హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ స్థాయి పీఈటీలను, ప్రైమరీ స్కూళ్లలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలి. గ్రౌండ్ ఉంటేనే ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలి. పూల ః పండిట్లు ఏం ఆశిస్తున్నారు? ఎండీ. యూసుఫుద్దీన్ : 2009 నుంచి పండిట్ల సమస్యను పాలకులు నాన్చుతున్నారు. తెలుగు, ఉర్ధూ, హిందీ పండిట్ల పోస్టుల అప్గ్రేడేషన్ ఫైల్కు మోక్షం కల్పించాలి. పూల ః మీకున్న సమస్యలేమిటి? కె.రాజారామ్: జీఓ 342 ఎస్సీ, ఎస్టీలు వేతనంతో కూడిన రెండేళ్ల ఉన్నత చదువులకున్న అవకాశాన్ని తొలగించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇలాంటివి పునరుద్ధరించాలి. పూల:ఎలాంటి వేతన సవరణను కోరుకుంటున్నారు? సుంకరి భిక్షంగౌడ్ : 63 శాతం ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణను అమలు చేయాలి. 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, 1996 డి.యస్సీలో నియమితులైన ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి. పూల : హెడ్మాస్టర్ల సమస్యల పరిస్థితి ఏమిటి? సీహెచ్.చంద్రశేఖర్ : పాఠశాలల్లో కంప్యూటర్లు ఇతర విలువైన పరికరాలుంటున్నాయి. వాచ్మన్లను నియమించాలి. నాన్టీచింగ్, పరిశుభ్రత సిబ్బందిని రిక్రూట్ చేయాలి. పూల ఃనాలుగో తరగతి ఉద్యోగుల ఇబ్బందులేమిటి? మర్రి యాదయ్యగౌడ్ : 112 జీఓను సవరించాలి. చాలాకాలం నుంచి పనిచేస్తున్న కాంటింజెంట్ స్వీపర్లు, పార్ట్టైమ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి. పూల : వృత్తి విద్య ఉపాధ్యాయులేమంటున్నారు? ఎండీ.కరీం : 8వ తరగతి వరకే రెగ్యులర్ కోర్సులు బోధించాలి. ఆ తర్వాత ఉపాధి యోగ్యమైన వృత్తి వి ద్యా కోర్సులను అందరు విద్యార్థులకు అందించాలి. పూల : హెల్త్కార్డులపై ఏం సూచనలిస్తారు? వెంకులు : హెల్త్ స్కీమ్ కోసం ఉపాధ్యాయుల నుంచి ప్రతి నెలా కంట్రిబూషన్ స్వీకరించి నాణ్యమైన వైద్య సేవలందించే విధంగా హెల్త్కార్డులు జారీ చేయాలి. పూల :ప్రభుత్వ విద్యా రంగాన్ని ఎలా బలోపేతం చేద్దాం? ఎస్ఎం అలీం : ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం సీఎం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచే మంచి విద్యనందించేందుకు తరగతికో ఉపాధ్యాయుడిని నియమించాలి. పూల : సెల్ఫోన్ల నిషేధంపై మీ అభిప్రాయం? వెంకటేశ్వర్లు : సెల్ఫోన్లను నిషేధించినంత మాత్రాన పాఠశాలలో ఉదో పెద్ద మార్పును ఆశించలేం. దుర్వినియోగం కాకుండా నిఘా ఉంచితే చాలు. పూల: మహిళా ఉపాధ్యాయుల సమస్యలను వివరిస్తారా? కాలం నారాయణరెడ్డి : పాఠశాలల్లో మహిళా టీచర్లకు టాయిలెట్లు లేవు. మౌలిక వసతులను కల్పించాలి. పాఠశాలల పనివేళలను సవరించాలి. విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా.. విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధి చూపుతున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్రెడ్డిల సహకారంతో సమస్యలను అధిగమించి అభివృద్ధి పథంలో నడిపిస్తా. గత 60 సంవత్సరాల్లో పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. కామన్ సర్వీస్ రూల్స్కు త్వరలోనే సానుకూల ఫలితం రానున్నది. మధ్యాహ్న భోజన పధకంలో సన్నబియ్యం పట్ల విద్యార్థులు ఆకర్శితులవుతున్నారు. కడుపు నిండా భోజనం అందించేందుకు బియ్యం కోటా పెంచేందుకు కృషి చేస్తాం. విద్యార్థుల నమోదును పెంచితే తరగతులు పెరుగుతాయి. టీచర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. పీఆర్సీ, హెల్త్కార్డుల జారీ, అందరినీ మెప్పించే విధంగా సీఎంతో చర్చిస్తాం. ఇంకా పలు సమస్యలను కౌన్సిల్లో చర్చించి ప్రభుత్వంతో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. పూల రవీందర్ హామీలు.. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి, త్వరలోనే ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ ఏర్పాటు. విద్యార్థుల సంఖ్య పెరిగితే తరగతికో ఉపాధ్యాయుడి నియామకానికి ప్రత్యేక కృషి. పండిట్లు, పీఈటీల అప్గ్రెడేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తి 398 టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు, 1996 డీ.ఎస్సీ నియమిత టీచర్లకు జరిగిన నష్టం భర్తీ. పాఠశాలల పనివేళల మార్పు, మధ్యాహ్న భోజనంలో బియ్యం కోటా పెంచడం. మెరుగైన పీఆర్సీ, కార్పొరేట్ వైద్యం అందే హెల్త్కార్డులు. -
వెతలు తీరుస్తా..
రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడ ప్రాంతం మెదక్ జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పట్టణం. భిన్న సంస్కృతులకు నిలయం. వలస జీవుల ఆవాసం. మినీ భారత్ను తలపించే నియోజకవర్గ కేంద్రం. జనాభాకు తగ్గట్టుగానే ఇక్కడి సమస్యలూ ఎక్కువే. అందుకే ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించే వారికి క్షణం తీరిక ఉండదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ తలమునకలై ఉంటారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మహిపాల్రెడ్డిది కూడా అదే పరిస్థితి. కానీ ఆదివారం ఆయన ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కొత్త అవతారం ఎత్తారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మారి స్థానిక మార్కెట్ సమస్యలు తెలుసుకున్నారు. ఇటు వ్యాపారులు, అటు వినియోగదారుల ఇబ్బందులను వారి ద్వారానే తెలుసుకున్నారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి: ఏమయ్యా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి. వ్యాపారి అల్తాఫ్ : సార్ నమస్కారం (లేచి నిలబడేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే వారించి కూర్చోబెట్టారు) సార్ ధరలు మండి పోతున్నాయి. ఏమాత్రం తగ్గడం లేదు. ఎమ్మెల్యే: తెలంగాణ రాష్ట్రం వచ్చిన త ర్వాతకూడ ధరలు తగ్గలేదా? (నవ్వుతూ) అల్తాఫ్: అలా అని కాదు సార్.. కాలం సరిగ్గా లేక కూరగాయల ధరలు పెరిగాయి. ఎమ్మెల్యే: పటాన్చెరుకు కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అల్తాఫ్: సిటీ నుంచి సార్. అలాగే శంకర్పల్లి, పటాన్చెరు మండలం నుంచి కూడా వస్తున్నాయ్. ఎమ్మెల్యే: కూరగాయల మార్కెట్లో ఉన్న సమస్యలేంటి ? అశోక్ (స్థానికుడు): చాలా సమస్యలున్నాయి సార్. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈ మార్కెట్ను పట్టించుకో లేదు. మీరైనా దయతో దీన్ని బాగు చేయండి. పారిశ్రామిక వాడ పెద్దగా ఉన్నా, మార్కెట్ ప్రత్యేక ప్రదేశం లేదు. దీంతో రోడ్డుపైనే మార్కెట్ జరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే : మున్సిపాలిటీ వాళ్లు రోజు మార్కెట్ను శుభ్రం చేస్తున్నారా? అర్షాద్ (స్థానికుడు): లేదు సార్... మార్కెట్లో కంపువాసన వస్తోంది. మురిగిపోయిన కూరగాయలను ఇక్కడి నుంచి తొలగించడం లేదు. వర్షాకాలంలో అమ్మేటోళ్లు, కొనేటోళ్లు శాన ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటోళ్లు సరిగ్గా పట్టించుకుంట లేరు. మార్కెట్ను షిఫ్టు చేయాలి. రోడ్డు మీద కూరగాయలు అమ్మకుండా సూడాలి. (సమస్యలన్నీ సావదానంగా విన్న మహిపాల్రెడ్డి స్పందిస్తూ) ఎమ్మెల్యే: పట్టణంలోని తిమేసియా ఫ్యాక్టరీ ఆవరణలో 12 ఎకరాల జాగా ఉంది. అక్కడికి మార్కెట్ను తరలిస్తాం. అన్ని రకాల వసతులు కల్పిస్తాం. ఇదే విషయమై సీఎం కేసీఆర్తో మాట్లాడాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఒక్కటిన్నర నెలలో కూరగాయల మార్కెట్ను అక్కడికి తరలిస్తాం. దశాబ్దాల మార్కెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. (ఒక్కొక్కొ దుకాణాన్ని చూస్తూ ముందుకు సాగిన మహిపాల్రెడ్డి మహిళా వ్యాపారి వద్ద ఆగారు) ఎమ్మెల్యే : ఏమమ్మా మార్కెట్ యార్డును తిమేసియా ఫ్యాక్టరీ దగ్గరలోని స్థలంలోకి బదిలీ చేస్తే బాగుంటదా? వ్యాపారి నర్సమ్మ : ఇక్కడైతే ఏం బాగాలేదు పటేలా. మార్కెట్ను మంచి జాగలో పెటుండ్రి. ఇప్పుడైతే సానా కష్టాలు పడుతున్నాం. ఏండ్ల నుంచి ఈడనే అమ్ముతున్నాం. కొనేటోళ్లకు, మాకు శాన ఇబ్బంది ఐతాంది. ఎమ్మెల్యే: ఇక ఈ సమస్యలన్నీ పోతయి తల్లీ.. త్వరలోనే మార్కెట్ కమిటీని కూడా ఏర్పాటు చేయిస్తా. (మార్కెట్కు వచ్చిన ప్రజలతో మాట్లాడిన మహిపాల్రెడ్డి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు) ఎమ్మెల్యే: పింఛన్లు అందరికి వస్తున్నాయా? లక్ష్మమ్మ: సారూ...మాకు పింఛన్లు రావడం లేదు. ఎవరికి అడిగినా సమాధానం లేదు. ఎమ్మెల్యే: ఏం బాధపడొద్దమ్మా...పింఛనే కాదు..అన్ని సంక్షేమ పథకాలను అర్హులందరికీ దక్కేలా చూస్తా. పింఛన్ పోయిందని ఆందోళనొద్దు. నీను నేనేం జెప్తున్నా తప్పకుండా నీకు పింఛన్ వస్తుంది. (పక్కనే ఉన్న శ్రీనివాస్ అనే స్థానికుడు కల్పించుకుని..) శ్రీనివాస్: వృద్ధులు, వికలాంగులు పింఛన్ కోసం ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇచ్చే రూ. 200లే అందరికీ ఇస్తే బాగుండేది. ఎమ్మెల్యే: అర్హులందరికీ రూ. వెయ్యి పింఛన్లు వస్తాయి. గతంలో రూ. 200 ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. అర్హులై ఉండీ ఇంతవరకూ పింఛన్లు రాని వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోండి. తప్పకుండా వస్తుంది. ఎమ్మెల్యే: సర్కార్ భూముల్లో నివాసముంటున్న పేదోళ్లకు ఉచితంగానే పట్టాలిస్తున్నారు తెలుసా? (అక్కడున్న వాళ్లంతా అనుమానంగా మొహాలు చూసుకున్నారు..వారి అనుమానం అర్థం చేసుకున్న మహిపాల్రెడ్డి మాట్లాడుతూ..) ఎమ్మెల్యే: అవునయ్యా..సర్కార్ స్థలంలో ఉన్న పేదోళ్లందరికీ సర్కార్ పట్టాలిస్తుంది. అయితే నివాసముంటున్న భూమి 125 గజాల్లోపు ఉండాలి. అర్హులంతా 18వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకుంటే ప్రభుత్వం ఉచితంగానే పట్టాలిస్తుంది. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు వీఐపీ రిపోర్టర్ను చేయడంతో పాటు ప్రజల వద్దకు తీసుకువచ్చి వారి సమస్యలను స్వయంగా తెలుసుకునే చేసిన ‘సాక్షి’ ప్రత్యేక కృతజ్ఞతలు. విలేకరిగా మారి జనం సమస్యలను రిపోర్ట్ చేయడం మంచి అనుభూతిని మిగిల్చింది. స్వాతంత్య్రం రాక ముందునుంచీ పట్టణంలో కూరగాయల సంత ఇక్కడే జరిగేది. జనాభా పెరిగినా సౌకర్యాలు ఆమేరకు పెరగలేదు. తెలంగాణ సర్కార్ దశాబ్ధాల మార్కెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. -మహిపాల్రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్చెరు -
వీఐపీ రిపోర్టర్ : కలెక్టర్ రఘునందన్ రావు
-
వీరికి కష్టం.. వారికి నష్టం
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖవంతం.. అన్న నినాదం ప్రచారానికే పరిమితమవుతోంది. కాలం చెల్లిన బస్సులు.. అరకొర సర్వీసులతో ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. కండీషన్లో లేని బస్సుల వల్ల ప్రాణాలకు భద్రత లేకుండాపోతోంది. బస్టాండ్లు, కాంప్లెక్సుల్లో వసతుల కొరత, సమయానికి రాని బస్సులు, పలు రూట్లలో అందుబాటులో లేని సర్వీసులతో ప్రైవేట్ వాహనాలపై ఆధారపడక తప్పని పరిస్థితిని ఆర్టీసీయే కల్పిస్తోంది. జిల్లాలో శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2, పాలకొండ, టెక్కలి, పలాస డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 462 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతిరోజూ సుమారు లక్షన్నర మంది ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కాగా సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో వారి సమస్యలు, ఆర్టీసీ పనితీరును తెలుసుకునేందుకు ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ సమస్యలను ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ను సందర్శించారు. ప్రయాణికులు, సిబ్బంది, అధికారులతో మాట్లాడి పలు సమస్యలు తెలుసుకున్నారు. వసతులను పరిశీలించారు. వివిధ వర్గాలతో ఆయన జరిపిన సంభాషణ యథాతథంగా.. స్టేషన్ మాస్టర్తో.. సత్యనారాయణ(డీసీటీఎం) : ఆర్టీసీ కాంప్లెక్స్లో సరైన సౌకర్యాలు కల్పించారా? బీఎల్పీరావు(స్టేషన్మాస్టర్): ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. కాంప్లెక్స్ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చేస్తున్నాం. కాంప్లెక్స్లోని దుకాణాల్లో వస్తువులు ఎంఆర్పీ రేట్లకే అమ్మేలా చర్యలు చేపడుతున్నాం. డీసీటీఎం: కాంప్లెక్స్లో బిచ్చగాళ్ళు ఎక్కువయ్యారని, పందులు, పశువులు సంచరిస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? స్టేషన్ మాస్టర్: బిచ్చగాళ్ళు లేకుండా చూస్తున్నాం. పందులు, పశువుల సంచారానికి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీసీటీఎం: పచ్చదనంపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? స్టేషన్ మాస్టర్: ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పోర్టికోకు ఇరువైపులా మొక్కలు పెట్టాం. కాంప్లెక్స్ వెనుక మొక్కలు నాటాం. ఇటీవల తుపానుకు చాలా చెట్లు విరిగిపోయాయి. వీటి స్థానంలో కొత్త మొక్కలు నాటాం. ప్రయాణికులతో.. డీసీటీఎం: ఆర్టీసీ బస్సులు సకాలంలో నడుస్తున్నాయా? జి.చైతన్య(విద్యార్థి): కళాశాలకు వెళ్లేందుకు నేను ప్రతిరోజూ రణస్థలం నుంచి శ్రీకాకుళం వస్తుంటాను. సకాలంలో బస్సులు రావు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపితే బాగుంటుంది. డీసీటీఎం: కాంప్లెక్స్లో మరుగుదొడ్ల పరిస్థితి ఏవిధంగా ఉంది? టి.డి.రాజు(ప్రయాణికుడు): మరుగుదొడ్ల వసతి బాగానే ఉంది. డీసీటీఎం: బస్సులు సకాలంలో నడుస్తున్నాయా? కండక్టర్, డ్రైవ ర్ల ప్రవర్తన ఎలా ఉంటోంది? పలువురు ప్రయాణికులు: చాలా వరకు సకాలంలో నడుస్తున్నా. కొన్ని సందర్భాల్లో రెండు మూడు బస్సులు ఒకేసారి వస్తున్నాయి. తర్వాత చాలా సేపటి వరకు అసలు ఉండటం లేదు. కొందరు కండక్టర్లు, డ్రైవర్ల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటోంది. చిల్లర విషయంలో, బస్సులు నిలిపే విషయంలో వారి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనిపై అధికారులు దృష్టి సారించాలి. డీసీటీఎం: ఆర్టీసీ బస్సులు సౌకర్యవంతంగా ఉన్నాయా? మరికొందరు ప్రయాణికులు: ప్రైవేటు వాహనాల కంటే కొంత నయం. అయితే ఆర్టీసీ బస్సు డిపోల నుంచి వచ్చేటపుడే బ్రేకులు, లైట్లు, టైర్లు వంటివి ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. డీసీటీఎం: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. లాభాల బాట పట్టాలంటే ఏం చేయాలి? ఈశ్వరరావు(ప్రయాణికుడు): లోపాలు ఎక్కడ ఉన్నాయో ముందు గుర్తించాలి. బస్సులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ఆదాయం అధికంగా వచ్చే రూట్లను గుర్తించాలి. ఆయా రూట్లలో బస్సులు సకాలంలో నడిపితే ఫలితం బాగుంటుంది. దుకాణదారులతో.. డీసీటీఎం: కాంప్లెక్స్లోని దుకాణాల్లో వస్తువులను ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి? మీ సమాధానం ఏంటి? వి.జనార్ధన్(దుకాణదారుడు): వస్తువులను అధిక రేట్లకు విక్రయించడం లేదు. ధరల పట్టికను కూడా పెడుతున్నాం. డీసీటీఎం: తినుబండారాలు, పళ్లు, రసాలపై ఈగలు, దోమలు వాలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కుటుంబరావు(దుకాణదారుడు): నెట్లు, అద్దాలతో కూడిన అల్మరాల్లో తినబండారాలను పెడుతున్నాం. సిబ్బందితో.. రిపోర్టర్: విచారణ కేంద్రం వద్ద ప్రయాణికులకు ఏవిధమైన సమాచారం ఇస్తున్నారు? విష్ణుమూర్తి(విచారణ కేంద్ర ఉద్యోగి): ప్రయాణికులు అడిగే బస్సుల వివరాలు తెలుపుతాం. ఫోన్ ద్వారా కూడా బస్సుల వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. మా కేంద్రం ఫోన్ నెంబరు 08942-223188. డీసీటీఎం: రూట్లో తిరిగేటపుడు ప్రయాణికుడు ఆపమన్నచోట ఆపడం లేదనే విమర్శ ఉంది? దీనిపై ఏం చెబుతారు? పి.సిమ్మయ్య(డ్రైవర్): అదేం లేదు.. వారు ఆపమన్నచోటే ఆపుతున్నాం. డీసీటీఎం: వికలాంగులు, వృద్ధులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిస్తున్నారా? డ్రైవర్: చాలా సందర్భాల్లో ఇతర వ్యక్తులు కూర్చుంటున్నారు. దీనిపై ప్రయాణికుల్లో అవగాహన అవసరం. డీసీటీఎం: ఏ రూట్లో విధులు నిర్వహిస్తున్నారు? చిన్నబాబు(డ్రైవర్): బందరువానిపేట రూట్లో వెళుతున్నాను. ఈ రూట్లో సుమారు 15 బస్సుల వరకూ నడుస్తున్నాయి. డీసీటీఎం: ఎంతకాలం నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నారు? ఎం.రావు(డ్రైవర్): 29 ఏళ్లుగా పని చేస్తున్నాను. 18సార్లు బెస్ట్ డ్రైవర్గా అవార్డులు అందుకున్నాను. గ్యారేజీ నుంచి బస్సు బయటకు తీసేటపుడు కండిషన్ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటాం. డీసీటీఎం: ప్రయాణికులకు రిజర్వేషన్ సౌకర్యం ఉందా? మోహనరావు(ఓపీఆర్ఎస్): ఆర్టీసీలో ప్రయాణించే వారికి రిజర్వేషన్ సౌకర్యం ఉంది. సుదూర ప్రయాణాలు చేసే వారు ముందుగానే రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాం. శ్రీకాకుళం-1 డిపో మేనేజర్తో.. డీసీటీఎం: శ్రీకాకుళం ఒకటవ డిపోలో ఎన్ని బస్సులు ఉన్నాయి? ఎం.సన్యాసిరావు(డిపో డీఎం): మా డిపోలో 77 ఆర్టీసీ, 29 అద్దె బస్సులు ఉన్నాయి. డీసీటీఎం: అత్యధిక ఆదాయం వచ్చే శ్రీకూర్మం రూట్లో బస్సులు తక్కువగా ఉన్నాయని ప్రయాణికుల నుంచి విమర్శ ఉంది. దీనిపై మీ సమాధానం ఏమిటి? డిపో డీఎం: శ్రీకూర్మం రూట్లో బస్సులు అధికంగానే ఉన్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఇంకా రద్దీ ఉండి, అధిక ఆదాయం వస్తుందనుకుంటే అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాం. డీసీటీఎం: అనంతపురం దుర్ఘటన నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డిపో డీఎం: ఆర్టీసీలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ఇతర వాహనాలను ఓవర్టేక్ చేసేటపుడు తీసుకోవలసిన జాగ్రత్త గురించి చెబు తున్నాం. డీసీటీఎం: మీ డిపో పరిధిలో ప్రమాదకర రూట్లు ఏమైనా ఉన్నాయా? డిపో డీఎం: మా డిపో పరిధిలో కేదారిపురం రూట్ ఒక్కటే కొద్దిగా ప్రమాదకరం. ఈ రూట్లో ప్రస్తుతం రెండు బస్సులు తిరుగుతున్నాయి. అవగాహన, అనుభవం ఉన్న డ్రైవర్లను పంపుతున్నాం. -
ట్రా‘ఫికర్’,పోకిరీలకు చెక్
రెండు లక్షలకుపైగా జనాభా... మూడు వేల ఆటోలు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవి అదనంగా మరో మూడు వేలు... భారీస్థాయిలో ద్విచక్ర వాహనాలు, లెక్కకు మించి కార్లు... కానీ, సన్నని రోడ్లు... ఇరుకు సందులు.. విస్తరించని జంక్షన్లు.. సీసీ కెమెరాలు, సిగ్నలింగ్ వ్యవస్థ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ వంటివి పెద్దగా కనిపించని కూడళ్లు. ఫలితం... నిత్యం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుని ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఏడాదికి వాహనాల నుంచి జరిమానా కింద రూ.38 లక్షల వసూలవుతున్నా.. ట్రాఫిక్ మెరుగుకు చర్యలు తీసుకోవడం లేదు. విజయనగరం పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణ కోసం నిధులు వెచ్చించాలంటే మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం అవసరం. ఆ దిశగా కౌన్సిల్ తీసుకున్న చర్యలు శూన్యం. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాతంలో కళాశాలలు ఎక్కువగా ఉండడం వల్ల ఈవ్టీజింగ్, అసభ్యకర ప్రవర్తన వంటి సంఘటనలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు, పోకిరీల సమస్యకు పరిష్కార మార్గాలు కనుగొనేందుకు విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ సాక్షి వీఐపీ రిపోర్టర్గా మారారు. పలు కూడళ్లు, కళాశాలలకు వెళ్లి ప్రజలు, విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. విజయనగరం పట్టణంలోని ట్రాఫిక్, ఈవ్టీజింగ్ సమస్య నియంత్రణకు చర్యలు తీసుకుంటాను. పట్టణంలో 2.50 లక్షల మంది జనాభా ఉన్నారు. మూడు వేల ఆటోలు, ఇతర ప్రాంతాల నుంచి అనేక ఆటోలు, ఇతర వాహనాలు, ఆర్టీసీ కాంప్లెక్స్లోకి 2600 బస్సులు వస్తున్నాయి. ఇరుకైన రోడ్ల వల్ల కూడా ట్రాఫిక్ సమస్యకు ఏర్పడుతోంది. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మున్సిపల్ పాలకమండలి సభ్యులతో కూడా మాట్లాడాం. మయూరీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, కొత్తపేట నీళ్లట్యాంకు వద్ద సిగ్నల్ లైట్లు, జిల్లా ఎస్పీకార్యాలయం వద్ద ప్రమాదాల నిరవార ణకు బ్లింకర్స్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. పోకిరీలు, ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. స్పెషల్ పార్టీలను నియమించి ఈవ్టీజింగ్ను నిరోధిస్తాం. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద, ఆటో యూనియన్, కాంప్లెక్స్లో విద్యార్థినీవిద్యార్థులతో ఆయన సంభాషణ ఇలా సాగింది... డీఎస్పీ: సమస్కారమండి, నా పేరు శ్రీనివాస్, నేను డీఎస్పీగా పనిచేస్తున్నాను మీపేరేంటి ? అప్పలరెడ్డి: నమస్తే సార్, నాపేరు అప్పలరెడ్డి, ఆటో యూనియన్ అధ్యక్షుడిని సార్. డీఎస్పీ: మీ సమస్యలేంటి ? అప్పలరెడ్డి: పట్టణంలో పార్కింగ్ స్థలా లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ట్రాఫిక్ పోలీసులు రాంగ్ పార్కిం గ్కు అప్పుడప్పుడు కేసులునమోదు చేస్తున్నారు. పార్కింగ్ స్థలాలు ఉంటే నలబైశాతం ట్రాఫిక్ సమస్య తీరుతుంది. డీఎస్పీ:ట్రాఫిక్ పోలీసులువేధిస్తున్నారా? అప్పలరెడ్డి: అటువంటిదేమీ లేదండి. ట్రాఫిక్ పోలీసులు సహకరిస్తున్నారు. డీఎస్పీ: అమ్మాయిలూ మీ పేర్లేంటి? అమ్మాయిలు: నాపేరు కె.ప్రమీల, నాగమణి డీఎస్పీ : ఏ కాలేజీలో చదువుతున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు ? ప్రమీల,నాగమణి: శ్రీచైతన్యంలో కళాశాలలో సార్, లక్కిడాం నుంచి వస్తున్నాం. డీఎస్పీ: ఏ వాహనంలో ప్రయాణం చేస్తున్నారు? ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారా? ప్రమీల,నాగమణి: ఆర్టీసీ బస్సులో వస్తున్నాం సార్, ఇబ్బందులు లేవు సార్. డీఎస్పీ: ప్రయాణికులను అధికంగా ఎక్కించుకున్న ఆటో డ్రైవరువద్దకు వెళ్లి... నీపేరేంటి? నాగరాజు: నాపేరు నాగరాజు సార్. డీఎస్పీ: ఆటోలో ఎంతమందిని ఎక్కిం చాలి? నాగరాజు: 4+1సార్ డీఎస్పీ: మరి ఎంతమందిని ఎక్కించారు నాగరాజు : ఎక్కువ మందిని సార్. డీఎస్పీ: ఎక్కించకూడదని తెలియదా? నాగరాజు: లోకల్లో ఎక్కిస్తాం. దూరప్రాం తాలకు వెళ్లే సమయంలో తక్కువగా ఎక్కిస్తాం డీఎస్పీ(ఆటోలో ప్రయాణికుడిని ఉద్దేశించి): నీపేరేంటి ? మూర్తి: నా పేరు మూర్తి. డీఎస్పీ: ప్రమాదాలు జరిగితే ఎవరి మీద నిందలువేస్తారు? మూర్తి: ఎవరి మీద నిందలు వేయం సార్, మాకు తెలియక రద్దీగా ఉన్న ఆటోలు ఎక్కుతున్నాం. మీరు వద్దంటే మానేస్తాం డీఎస్పీ: మీ పేరేంటమ్మా? వెంకటలక్ష్మి: నా పేరు వెంకటలక్ష్మి డీఎస్పీ : ఎక్కడ నుంచి వస్తున్నారు? వెంకటలక్ష్మి: సాలూరు నుంచి వస్తున్నాం. డీఎస్పీ: ఆటోలో ఇంతమంది ప్రయాణం చేస్తే ప్రమాదమని తెలియదా? వెంకటలక్ష్మి: సాలూరు నుంచి బస్సులో వచ్చాను. లోకల్ కదాని తప్పక ఆటోలు ఎక్కుతున్నాం డీఎస్పీ: తల్లీ నీపేరేంటి? ఎక్కడ నుంచి వస్తున్నావు, ఏ కళాశాలలో చదువుతున్నావు? కుమారి: నాపేరు కుమారి, మాది వేం డ్రం. ఊరి నుంచి బస్సులో వస్తున్నాను. ఎం.ఆర్ కళాశాల చదువుతున్నాను డీఎస్పీ: బస్సులో వచ్చే సమయంలో పోకిరీలు వేధిస్తున్నారా? కుమారి: అటువంటిదేమీ లేదుసార్ ఎన్ఆర్ఐ కళాశాల్లోకి వెళ్లి.. డీఎస్పీ: మీపేర్లేంటి ? ఎక్కడనుంచి వస్తున్నారు? ఎలా వస్తున్నారు? అమ్మాయిలు: మా పేర్లు మౌనిక, అనురాధ, కీర్తి, మౌనిక, కీర్తి : మేం విజయనగరంలోనే ఉంటున్నాం సార్ అనూరాధ : నేను గజపతి నగరం నుంచి వస్తున్నాను సార్. డీఎస్పీ: కాలేజీకి వచ్చే సమయంలో ఎవరైనా ఈవ్టీజింగ్కు పాల్పడుతున్నారా? అమ్మాయిలు: అటువంటిదేమీలేదు సార్ డీఎస్పీ: నీపేరేంటమ్మా ? ఎక్కడ నుంచి కాలేజీకి వస్తున్నారు? సరళప్రియ: నాపేరు సరళ ప్రియ. కామాక్షినగర్ నుంచి వస్తున్నాను. మమ్మీ తీసుకువస్తారు. డీఎస్పీ: పోకిరీలు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా? సరళప్రియ: సూపర్ మార్కెట్ వద్ద పోకిరీలు ఎక్కువగా ఉన్నారు, వారు వేధిస్తున్నారు. పేరెంట్స్ని చూడకుండా బండ బూతులు తిడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని మమ్మీ చెప్పింది. డీఎస్పీ: నేను టౌన్ డీఎస్పీని, మీకు ఎలాంటి సమస్యలువచ్చినా వెంటనే నాకుగాని, సీఐలకు గాని, ప్రభుత్వం ప్రకటించిన 100 నంబర్ ఫోన్చేస్తే నిమిషాల్లో మీదగ్గర ఉంటాం. ఆకతాయిల ఆట కట్టిస్తాం. ఏ సూపర్ మా ర్కెట్ వద్ద వేధిస్తున్నార మ్మా... సరళప్రియ: మయూరీ హొటల్ కిందనున్న సూపర్ మార్కెట్ వద్ద సార్ డీఎస్పీ: మీపేరేంటి? ఎక్కడ నుంచి కాలేజీ వస్తున్నారు? చాందిని: నాపేరు చాందిని. నేను బా బామెట్టనుంచి ఆటోలో వస్తున్నాను. కళాశాల నుంచి ఆటోలో వెళ్లి రింగురో డ్డు వద్దకు దిగుతాం. అక్కడ నుంచి బాబామెట్టకు వెళ్లేవరకు పోకిరీలుం టున్నారు. నిత్యం వేధిస్తున్నారు సార్. డీఎస్పీ: వేధిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి, లేదా పోకిరీల బైకు నంబర్లను నోట్చేసి పోలీసులకు అందించండి? చాందిని: అలాగే సార్. డీఎస్పీ: మీ పేరేంటి? మీరేం చేస్తుం టారు? నాగు: నాపేరు నాగు సార్, నేను శ్రీరాజా డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నాను. ఇక్కడ పార్కింగ్ స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల ఆస్పత్రికి వెళ్లే రోడ్డుగుండా అనేకమంది ఆస్పత్రికి వ స్తూ వెళ్తుంటారు. ఇక్కడి మయూరీ హొటల్కు వచ్చే వారు రోడ్డుమీద వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీఎస్పీ: టీఎస్ఆర్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు. ? నాగు: కాంప్లెక్స్ నిర్వహణను నేనే చూస్తున్నాను సార్. డీఎస్పీ: అయితే మీకు బాధ్యత లేదా? నాగు: ఎవరి షాపుల ముందు, వారి వా హనాలు పార్కింగ్ చేసుకోవచ్చు సార్. డీఎస్పీ: పోకిరీలు ఎవరైనా అమ్మాయిలను వేధిస్తారా? పోలీసులు ఇక్కడ బందోబస్తు నిర్వహించడం లేదా? నాగు: అమ్మాయిలను యువకులు ర్యాగింగ్ చేస్తుంటారు సార్, మేము అడిగితే మాపై దాడిచేసే అవకాశం ఉందని భయపడుతున్నాం. గతంలో పోలీసులు కాపలాకాసేవారు. ప్రస్తుతం రావడంలేదు డీఎస్పీ: నీ పేరేంటమ్మా ? ఏమి చదువుకున్నావు ? అలేఖ్య: నాపేరు అలేఖ్య, ఆంధ్రా యూనివర్సిటిలో చదువుతున్నాను. డీఎస్పీ: పట్టణంలో ట్రాఫిక్ ఎలా ఉందని భావిస్తున్నారు? అలేఖ్య: పట్టణంలో ట్రాఫిక్ గజిబిజిగా ఉంది సార్. ఉదయం, సాయంత్రం సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. పెద్దచెరువు గట్టు చు ట్టూ ఆహ్లాదకర వాతావరణంలో కూర్చోడానికి వీలుగా బల్లలు వేస్తే బాగుంటుం ది. కనీస సదుపాయాలు కూడా లేవు డీఎస్పీ : మీ పేరేంటి? మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? ఏం చేస్తున్నారు ? వరలక్ష్మి: నాపేరు వరలక్ష్మి. నేను సిద్దార్థనగర్ నుంచి వస్తున్నారు. నేను ఎంఆర్ ఉమెన్స్ కాలేజీలో జువాలజీ లెక్చరెర్గా పనిచేస్తున్నాను. డీఎస్పీ: పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉందా? వరలక్ష్మి: పట్టణంలోని మయూరీ హొట ల్ నుంచి ఎత్తుబ్రిడ్జి వరకు ట్రాఫిక్ సమస్యగా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతం దా టాలంటే చాలా సమయం పడుతోంది. అలాగే సింహచలం మేడనుంచి కోట జం క్షన్ వరకు వాహనాలతో రద్దీతో ఇబ్బం ది ఎదుర్కొంటున్నాం. డీఎస్పీ: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మీ సలహాలు, సూచనలు ఏంటి ? వరలక్ష్మి: ట్రాఫిక్ సమస్య పరిష్కారం కా వాలంటే పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. రోడ్లను వెడల్పు చేయాలి. అందుకు ప్ర జలు సహకరించాలి డీఎస్పీ: నీపేరేంటి? సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని తెలియదా? ఈశ్వరరావు: నాపేరు ఈశ్వరరావు, నేను ప్రైవేటు అకౌంట్స్ చూస్తాను. ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చిందని ఫోన్ ఎత్తి పక్కకు వెళ్లి మాట్లాడుదామని చెప్పి పక్కకు వెళ్తున్నాను. డీఎస్పీ: ప్రమాదానికి గురైతే ఎవరూ బాధ్యత వహిస్తారు? ఈశ్వరరావు: లేదుసార్ సెల్ఫోన్ డ్రైవిం గ్ చేయను సార్. డీఎస్పీ: నీపేరేమిటి? ఎన్ని సంవత్సరాల నుంచి సిలిండర్లు తీసుకువెళుతున్నారు ? ఆదినారాయణ: నా పేరు ఆదినారాయణ సార్. పది సంవత్సరాల నుంచి సిలిండర్లను టూ వీలర్పై తెస్తూ ప్రజలకు అం దిస్తున్నాను. రోజుకు 10 సిలిండర్లు తెస్తాను సార్. డీఎస్పీ: గ్యాస్ సిలిండర్లు టూ వీలర్పై తేవడంవల్ల ప్రమాదాలు జరిగితే ప్రజ ల కు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందికదా? ఆదినారాయణ: వాహనాన్ని తక్కువ స్పీ డులో నడుపుతాను సార్, నెమ్మదిగా ప్ర యాణం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. డీఎస్పీ: మీపేరేంటి, మీరేం చేస్తున్నారు? నాగార్జున: నా పేరు నాగార్జున, నేను ఎం.ఆర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను డీఎస్పీ: ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయా? నాగార్జున: గురజాడ అప్పారావు రోడ్డు నుంచి మూడులాంతర్లు రోడ్డు వరకూ నిరంతరం ట్రాఫిక్ సమస్య ఉంటోంది. రోడ్డు వెడల్పు చేయడానికి మొదటి సం తకం పెట్టిన వాడిని నేనే. డీఎస్పీ: గురజాడ అప్పారావు రోడ్డును వన్వే చేస్తే మంచిదేనా? నాగార్జున : కచ్చితంగా సమర్థిస్తాను. చాలా మంచిది కూడా. డీఎస్పీ: మీపేరేంటి? ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు? హనుమాన్శెట్టిరాజు: నాపేరు హనుమాన్ శెట్టిరాజు, ఇరవై సంవత్సరాలుగా మెడికల్ వ్యాపారం చేస్తున్నాను. డీఎస్పీ: ట్రాఫిక్ సమస్య ఎలా ఉందని భావిస్తున్నారు? రాజు: నేను అరవై ఏళ్ల నుంచి పట్టణంలో ఉంటున్నాను. ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య ఎక్కువగానే ఉంది. డీఎస్పీ: అప్పట్లో సమస్యలు లేవా? రాజు: అప్పట్లో సైకిళ్లు తప్ప బళ్లు ఎక్కడివి. ఇప్పడు వాహనాలు ఎక్కువగా ఉం డడం వల్ల సమస్యలు వస్తున్నాయి. డీఎస్పీ: గురజాడ అప్పారావు రోడ్డును వన్వే చేయడం వల్ల వ్యాపారానికి నష్టం ఉంటుందా? రాజు: ఎటువంటి నష్టం ఉండదు. వన్వే చేస్తే చాలా మంచిది. డీఎస్పీ: నీపేరేంటిబాబూ? ఓనర్వా? సాయికుమార్: నా పేరు సాయికుమార్, నేను ఓనర్వాళ్ల అబ్బాయిని డీఎస్పీ: రోడ్డు పక్కన పకోడీలు తయారుచేస్తే ప్రజలకు ఇబ్బంది కలగదా? సాయికుమార్: వేరే ప్రాంతంలో తయా రు చేసి తెస్తున్నాను సార్, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. డీఎస్పీ: రోడ్డుమీదే కాగిన నూనె ఉంది, ఎవరైనా స్పీడ్గా వచ్చి నూనెను ఢీకొడి తే పరిస్థితి ఏంటి. ప్రమాదం జరిగే అవకాశం ఉందికదా? సాయికుమార్: వంట నూనె కొంచెం లో పలిగా ఉంది సార్. డీఎస్పీ: నీ పేరేంటి? ఎప్పటి నుంచి హెల్మెట్ వాడుతున్నారు? ఏ పని చేస్తున్నారు? తిరుపతిరావు: నా పేరు తిరుపతిరావు, నేను సోషల్ మాస్టర్గా పనిచేస్తున్నాను. హెల్మెట్ అనేది రక్షణ కవచంలా, వెపన్గా పనిచేస్తుంది. స్పీడ్గా వెళ్లాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. డీఎస్పీ: హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అవగాహన కల్పిస్తున్నారా? తిరుపతిరావు: సోషల్ రెస్పాన్స్ బులిటీ, రవాణా భద్రతాలో భాగంగా ట్రాఫిక్పై సోషల్ సబ్జెక్టు ఉంది. కుటుంబ సభ్యుల తోపాటు బయట వ్యక్తులకు హెల్మెట్ వాడాలని చెబుతున్నాను. -
సమస్యల చెంతకు..
ఏలూరు.. జిల్లాలోనే ఏకైక నగరం. కలెక్టర్తోపాటు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ఇక్కడే ఉంటారు. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ వంటి ముఖ్య ప్రజాప్రతినిధులు ఉండేది ఈ నగరంలోనే. అలాంటి ప్రాంతం జిల్లాకే తలమానికంగా.. అభివృద్ధిలో మార్గదర్శకంగా ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ.. ఈ నగరంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడి ప్రధాన సమస్యలను తెలుసుకునేం దుకు నగరపాలక సంస్థ కమిషనర్ యర్రా సాయి శ్రీకాంత్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మారారు. కబాడీ గూడెం, ప్రధాన చేపల మార్కెట్లో పర్యటించారు. వీధుల్లో సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. పేదలు ఎదుర్కొం టున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కమిషనర్ నిర్వహించిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం ఇలా సాగింది. నగరంలోని మురికివాడల్లో ఒకటైన కబాడీ గూడెంలో అడుగుపెట్టిన కమిషనర్కు రోడ్డు పక్కన పాత దుస్తులతో ఏర్పాటు చేసుకున్న స్నానపు గదులు కనిపించాయి. అక్కడ ఉన్న యందం మార్తమ్మను ‘ఏంటమ్మా.. పాత బట్టలతో ఇలా కట్టుకున్నారు’ అని కమిషనర్ ప్రశ్నించారు. యందం మార్తమ్మ: మాకు మరుగుదొడ్లు లేవు సార్. స్నానాలు చేయడానికి వీటిని కట్టుకున్నాం. కమిషనర్ : ఏమ్మా.. ఇక్కడ మంచినీళ్లు వస్తున్నాయా. మాండ్రు మార్తమ్మ : వస్తున్నాయ్ సార్. అందరికీ ఒకే కుళాయి ఉంది. కమిషనర్ : రూ.200 కడితే కుళాయి మంజూరు చేస్తాం. అందరూ దరఖాస్తు చేసుకోండి. ప్రతి ఇంటికీ కుళాయి వచ్చే ఏర్పాటు చేస్తాను. అక్కడి నుంచి ముందుకెళ్లిన కమిషనర్కు రోడ్డుమీదే పొరుు్య కనిపించింది. అక్కడి ఇంట్లో ఉంటున్న మహిళను పిలిచిన కమిషనర్ ‘ఏమ్మా.. ఇలా రోడ్ల మీదే పొరుు్య పెడితే ఎలా. ఇలా చేయడం మంచిది కాదు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. ఇకనుంచి ఇలా చేయకండి’ అని సూచించి ముందుకు కదిలారు. తేళ్ల ప్రసాదరావు : సార్.. వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయ్. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మురుగు ఎక్కువగా ఉండటంతో దోమలు పట్టపగలే చంపేస్తున్నాయ్. కమిషనర్ : మురుగు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకుంటాం. మీరు కూడా డ్రెరుునేజీల్లో చెత్తాచెదారం వేయకుండా సహకరించాలి. కమిషనర్ : ఏమ్మా.. మీ సమస్యలేంటి. చౌటపల్లి కుమారి : పందులు ఎక్కువగా తిరుగుతున్నాయి. వాటివల్ల పిల్లలు రోగాల బారిన పడుతున్నారు. కమిషనర్ : తగిన చర్యలు తీసుకుంటాం. దోమల బారినుంచి రక్షించుకోవడానికి దోమ తెరలు వాడండి. కమిషనర్ : ఇక్కడ కమ్యూనిటీ హాలు ఉంది కదా. వాడుతున్నారా. దాసరి వెంకటేశ్వరమ్మ : వాడటం లేదు. ఎప్పుడూ మూసే ఉంటోంది. దానిలో కూడా ఎటువంటి సౌకర్యాలూ లేవు. కమిషనర్ : ఏమ్మా.. మీకూ మరుగుదొడ్లు లేవా. చౌటపల్లి సువర్ణ : లేవు సార్. కట్టించుకోవడానికి స్థలం కూడా లేదు. కమిషనర్ : అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తాం. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. వి.రత్నకుమారి : ఉన్నాయి సార్. వాటినే వినియోగిస్తున్నాం. కమిషనర్ : మీ ఇల్లు బాగానే ఉందా. నాగమణి : లేదు సార్. వర్షం నీరు కారుతోంది. కమిషనర్ : ఇల్లు కట్టుకోవడానికి రుణాలు వచ్చే ఏర్పాటు చేస్తాం. మీరంతా మీ పిల్లలను బాగా చదివించి అభివృద్ధిలోకి తీసుకురావాలి. అక్కడి నుంచి కమిషనర్ పక్కవీధిలోకి వెళ్లారు. పలువురు మహిళలు ఆయన వద్దకు వచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. సావధానంగా విన్న కమిషనర్ వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దాసరి వెంకటేశ్వరమ్మ : మాకు ఇళ్లు లేవండి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలిప్పిస్తే ఇళ్లు కట్టుకుంటాం. కమిషనర్ : తప్పకుండా. మీరంతా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారా.. రుణాలు తీసుకున్నారా. దాసరి వెంకటేశ్వరమ్మ : ఎన్నికలకు ముందే రుణాలకు కాయితం పెట్టుకున్నాం సార్. ఓట్లు అడగడానికి వచ్చిన వారంతా రుణాలిప్పిస్తామన్నారు. ఇప్పటివరకూ మా మొహాలు చూసిన వారే లేరు. ఖాజా : ఇళ్ల మీదుగా కరెంటు తీగలు వెళుతున్నాయ్. అప్పుడప్పుడూ తెగి ఇళ్లపై పడుతున్నాయ్. స్థానిక చేపల మార్కెట్ను సందర్శించిన కమిషనర్ వ్యాపారులు, వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ : ఏమ్మా.. ఇక్కడ ఇన్ని షాపులు కట్టాం. నువ్వు బయట చేపలు అమ్ముతున్నావేంటి. నీలం వరలక్ష్మి : వాటిలో నాకు షాపు ఇవ్వలేదు సార్. అందుకే బయట అమ్ముతున్నాను. కమిషనర్ : ఏమ్మా.. నీకు షాపు ఉందా.. లేదా నూతిపిల్లి దుర్గమ్మ: దుకాణాలు బాగా ఎత్తుగా కట్టారు సార్. పైగా లైట్లు లేవు. నీరు రాదు. అసలు ఎటువంటి సౌకర్యాలూ లేవు. కమిషనర్ : కొనుగోలు చేయడానికి వచ్చేవారికి ఇబ్బందులు కలిగించవద్దు. మీకు సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తా. అక్కడి నుంచి ముందుకెళ్లిన కమిషనర్ను అరటి పండ్లు అమ్ముకుంటున్న మహిళలు ‘నమస్తే సార్’ అంటూ పలకరించారు. కమిషనర్ : బాగున్నారా. మీ సమస్యలేంటి. లొట్టి లక్ష్మి : మాకెవరికీ దుకాణాలు లేవు సార్. ఇక్కడ వ్యాపారం చేసుకుంటేనే నాలుగు డబ్బులొస్తాయ్. ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒక చోట వ్యాపారాలు చేసుకుంటాం. ఇక్కడివారంతా మమ్మల్ని వెళ్లిపొమ్మని గదమాయిస్తున్నారు. మేమెలా బతకాలి సార్. కమిషనర్ : సమగ్ర సర్వే చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం పథకం ప్రవేశ పెట్టింది. ఆ పథకం మీకు వర్తింప చేయడానికి కృషి చేస్తా. అనంతరం పి.వెంకటేశ్వరరావు అనే వినియోగదారునితో మాట్లాడుతూ ‘ఈ మార్కెట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయ్. ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పించాల్సి అవసరం ఉందా’ అని అడిగారు పి.వెంకటేశ్వరరావు : సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి సార్. సైకిళ్లు, మోటార్ సైకిళ్లపై వచ్చేవారికి పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. కమిషనర్ : ఓకే.. దృష్టి పెడతా. ఇంతలో ఉండవల్లి జయలక్ష్మి అనే మహిళ ఇంటిపన్ను కాగితాలతో వచ్చింది. కమిషనర్ : ఏమ్మా.. ఇంటిపన్ను కాగితాలు పట్టుకుని తిరుగుతున్నారేమిటి. ఉండవల్లి జయలక్ష్మి : నా భర్త మిలటరీలో పనిచేసి రిటైరయ్యారు. కొంతకాలానికి చనిపోయారు. మాజీ సైనికుల కుటుంబాలకు ఇంటి పన్ను మినహాయింపు వస్తుందని తెలిసి మీ ఆఫీసుకే వస్తున్నాను. ఈలోపు మీరే ఇక్కడ కనిపించారు. కమిషనర్ : మాజీ సైనికుల కుటుంబాలకు ఇంటిపన్ను మినహాయింపు ఉంటుంది. మా కార్యాలయ సిబ్బందిని కలవండి. మురికి వాడల అభివృద్ధికి కృషి చేస్తాం నగరంలోని మురికివాడల్లో నివశిస్తున్న ప్రజల జీవనం ఎంతో దుర్భరంగా ఉండటాన్ని గమనిం చాం. మురికి వాడల్లో సౌకర్యాల కల్పన, అభివృ ద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తాం. అక్కడి ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిం చాలి. మరుగుదొడ్లు లేనివారికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం. ఖాళీ స్థలం లేనిపక్షంలో పబ్లిక్ టాయిలెట్స్ కట్టిస్తాం. అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వృత్తి విద్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. మురికివాడల్లో నివాసాన్ని ఆనందమయం చేసుకోవడానికి అనువైన జీవన విధానాలపై అవగాహన కల్పించడానికి అక్కడి ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తాం. పందులు, కుక్కల బెడద నివారణకు చర్యలు చేపడతాం. రూ.3 కోట్లతో నిర్మించిన చేపల మార్కెట్లో సౌకర్యాలు లేవు. సౌకర్యాలు మెరుగుపరిచి మార్కెట్ను వ్యాపారులకు అందుబాటులోకి తీసుకువస్తాం. వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మార్కెట్ను తీర్చిదిద్దుతాం. - యర్రా సారుుశ్రీకాంత్, కమిషనర్ -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే వెంకటరమణ
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే పుట్టా మధు
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే రెడ్యానాయక్
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే కాలె యాదయ్య
-
రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
సామర్లకోట : సామర్లకోట ఇరిగేషన్ విభాగం పరిధిలోని రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ఆ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. శనివారం ఈ ప్రాంతంలో రైతుల సమస్యలపై ఇరిగేషన్ ఎస్ఈ సుగుణాకరరావు శనివారం సాక్షి వీఐపీ రిపోర్టర్గా వ్యవహరించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సమస్యలను సావధానంగా విన్న ఆయన సోమవారం సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ ఈఈ విజయకుమార్, డీఈ నరసింహారావు సోమవారం వీకే రాయపురం, సామర్లకోటల్లో పర్యటించారు. సామర్లకోట లాకుల వద్ద పెరిగిపోయిన గుర్రపుడెక్కను పరిశీలించారు. అలాగే వ్యవసాయ క్షేత్రం నుంచి వీకే రాయపురం శివారులోని సత్యవరపు పేటకు వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. ఆ మార్గాన్ని వ్యవసాయక్షేత్రం అధికారులు మూసివేయడంతో దానిపై సర్వే చేయాలని ఈఈ విజయకుమార్ జేఈ సునీతను ఆదేశించారు. తూటేరు డ్రెయిన్ మూసుకుపోవడం వల్ల పొలాలకు నీరు అందడం లేదని అన్నదాతలు వివరించారు. దీంతో గోదావరి కాలువ ఆధునికీకరణలో భాగంగా తూటేరు డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తామని ఈఈ హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ క్షేత్ర ముఖద్వారం నుంచి రామేశ్వరం ఎగువ, దిగువ కాలువకు నీరు వచ్చే తూము గుర్రపుడెక్క పేరుకుపోవడంతో మూసుకుపోయిందని రైతులు వివరించారు. ఆ ప్రదేశాన్ని అధికారులకు చూపించారు. డెక్కను తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం వీకే రాయపురంలో అధికారులు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వీకేరాయపురంలో ఎగువ, దిగువ కాలువలకు పుష్కలంగా నీరు వచ్చేలా చూడాలని, ఏలేరుకాలువపై వంతెన నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే బోయనపూడి వద్ద ఏలేరు కాలువకు పడిన గండి వద్ద రిటెయినింగ్ వాల్ నిర్మించాలని కోరారు. ఈ సమస్యలపై ఎస్ఈకి నివేదిక అందించి, పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఈలు సునీత, అజహర్, వీకే రాయపురం సర్పంచ్ కుర్రా శ్రీనివాసు, రైతు సంఘ నేతలు పాల్గొన్నారు. -
వీఐపీ రిపోర్టర్ : మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి
-
అండగా ఉంటా
మొన్నటివరకు తెలంగాణ ఉద్యమంలో కాలికి బలపం కట్టుకుని ఊరూవాడా తిరిగిన మహిళా నేత.. నిన్నటికి నిన్న ప్రజాభిమానంతో ప్రత్యర్థులను మట్టికరిపించి అసెంబ్లీలో అడుగుపెట్టిన మెతుకుసీమ ధీరవనిత.. ఇపుడు తెలంగాణ తొలిఉప సభాపతిగా సభను సమర్థవంతంగా, హుందాగా నడుపుతూ అందరి మన్ననలు చూరగొంటున్న మహిళా నేత.. ఆమే పద్మాదేవేందర్రెడ్డి. ప్రజాప్రతినిధిగా నిత్యం బిజీగా ఉండే ఆమె, ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా మారారు. రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి వెళ్లి ‘సాక్షి’ విలేకరిగా జనం గుండెను తడిమి చూశారు. డిప్యూటీ స్పీకర్ గ్రామానికి వస్తున్న విషయం తెలుసుకున్న పల్లె జనం పిల్లా పాపలతో కలిసి ఊరు పొలిమేర వద్ద ఆమెకు ఘనస్వాగతం పలికారు. డప్పుల దరువు...పల్లె నాట్యాలతో గ్రామంలోకి తీసుకు వెళ్లారు. గ్రామం ముంగిట్లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పద్మాదేవేందర్రెడ్డి...అక్కడి నుంచి చౌకధర దుకాణం వద్దకు చేరుకుని ‘సాక్షి’ విలేకరిగా జనం సమస్యలు తెలుసుకున్నారు. ‘కూడు గింజలకు ఇగ రంది లేదమ్మా’ అని వెంకటలక్ష్మి అనే గృహిణి చెప్పినప్పుడు ఆత్మసంతృప్తితో పద్మాదేవేందర్రెడ్డి కళ్లు చెమ్మగిల్లాయి. డిప్యూటీ స్పీకర్: ఏమ్మా బాగున్నారా? డి.ధర్మారం ప్రజలు : బాగున్నాం మేడం... డిప్యూటీ స్పీకర్: అందరికీ రేషన్ అందిందా? డి.ధర్మారం ప్రజలు : ఎవరి నోటి నుంచి మాట రాలేదు. డిప్యూటీ స్పీకర్: ఏం మాట్లాడరు? డీలర్ బియ్యం ఇవ్వటం లేదా? డి.ధర్మారం ప్రజలు :: అయ్యో... అట్టేమీ లేదమ్మా. డిప్యూటీ స్పీకర్: నీ పేరు చెప్పమ్మా? నీ సమస్య ఏమిటి? ఎనబోయిన సత్తెవ్వ: అమ్మా... ఎనిదేళ్ల నుంచి కారట్ల నా మొగని పేరు లేదు. కారటు దిగినప్పుడు ఆయన పట్నం బతకబోయిండు.తల్లి మగ్గురు పేరే ఉంది. నెలకు 12 కిలోల బియ్యమొస్తే ఏం సరిపోతాయమ్మ. పిట్ల నర్సమ్మ: నాకు కూడా అట్నే అయిందమ్మా. నాకు ఇద్దరు పిల్లలు. చిన్నోనికి 12 ఏండ్లు. ఆధార్ లేదని కారట్ల పేరెక్కియలేదు. రామాయంపేటకు తీసుకపోయి దింపుకొచ్చిన. ఇప్పుడు పేరు ఎక్కిత్తమని సార్ చెప్పిండు. డిప్యూటీ స్పీకర్: ఇంతకు ముందు ఎన్ని కిలోల బియ్యం వచ్చేవి? మీకు సరిపోయేదా? సరస్వతి: అమ్మా..! ఒళ్లలువ కట్టం చేసుకుంటం. కడపునిండా తింటం. రెండు పూటల తింటే నెలకు ఎట్టా లేదన్నా ఇంటిళ్లిపాదికి కలిపి 40 కిలోల బియ్యం పడుతయి. సార్కారోళ్లు ఇన్నాళ్లు ఎంత మంది ఉన్నరు అని సూడకుండ 20 కిలోల బియ్యం ఇస్తే 15 రోజులకే సరిపోయేవి. సుట్టపోడు అస్తే 10 రోజులకు కూడా సరిపోవు. బయట కొందామంటే కిలో బియ్యం (దొడ్డు బియ్యం) రూ.25 ..రూ.30 పలుకుతోంది. ఆలుమగలం కట్టపడితే రోజు రెండు, మూడోందలు దొరుకుతయి. దాంట్లెనే మొగొళ్లు ఇంత ఏసుకుంటరా..! ఇంకేం ఉంటమయ్మ. సెప్పుకుంటే అమ్మలక్కలు సెప్పుకున్నది అంటరు గానీ...తినీ, తినక పస్తులు పండుకునేదాన్ని. (ఆమెను డిప్యూటీ స్పీకర్ ఆప్యాయం దగ్గరకు తీసుకున్నారు. ఇక నుంచి ఆ కష్టాలుండవని భరోసా ఇచ్చారు) డిప్యూటీ స్పీకర్: ఇప్పుడు ప్రభుత్వం ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తుంది కదా? ఇప్పుడెలా ఉందమ్మా? వెంకటలక్ష్మి: ఇప్పుడు జర నయమే నమ్మా... గంజిలకు ఉప్పుగల్లు తోడయినట్టు. మనిషికి ఆరు కిలోల బియ్యం ఇత్తన్రు. ఎంత మంది ఉంటే అన్ని ఆర్లు ఇత్తున్నరు. కూడు గింజలకు రంది లేకుంటయిదమ్మా. రేషన్ కింద ఇస్తున్న ఉప్పు, నూనె, పప్పు, మిరపకాయలు అసలు సరిపోట్లేదమ్మా... బియ్యం పెంచినట్టే వాటిని పెంచితే మీకు పుణ్ణెం వస్తదమ్మా. మీ పేరు చెప్పుకొని పేదోళ్లం రెండు పూటలైనా కడుపు నిండా తింటాం. డిప్యటీ స్పీకర్: నీ సమస్య ఏమిటో చెప్పమ్మా? ఉడుత యశోద: బీడీ కంపెనోళ్లు నెలల 10 రోజులు కూడా పనిత్తలేరు. ఉప్పు, పప్పుకు శానా ఇబ్బందైతంది. బయట కైకిలి కూడా దొరుకుత లేదు. పిల్లలను బతుకు ఏంగావాలే.. మా బతుకు ఎట్టా ఎల్లదీసుకోవాలే. మాకట్టం మీకు తెలుసుకదమ్మా..మీరు కంపెనోళ్లతో మాట్టాడి మాకు దారి సూపించురి. కార్డున్న బీడీ కార్మికులకు రూ 1,000 పింఛన్ ఇస్తే బాగుంటదమ్మా. డిప్యూటీ స్పీకర్: నువ్వు ఏదో మాట్లాడాలను కుంటున్నావు? నర్సయ్య: మేడం గారు.. నాకు అసలే రేషన్ కార్డు లేదమ్మా.. ఊళ్లె ఆధార్ కారటు దింపుకున్నప్పుడు నా కుటుంబం అంతా బీదర్ల బతుకుతున్నాం. మాకెవ్వలు సెప్పలేదు. ఊళ్లె మాకు ఆధార్ కారటు లేదు. ఊళ్లె సర్వే జేత్తున్నరు....కేసీఆర్ సారు అందరిని రమ్మన్నడు అని జెప్తే అప్పుడు ఊళ్లకొచ్చినం. అప్పటి నుంచి ఊళ్లనే ఉంటున్న. రేషన్ కారటుకు కూడా దరఖాస్తు పెట్టుకుంటే ఆధార్ కార్డు ఉందా? అని సారోళ్లు అడిగిండ్రు. ఆదేదో తెల్వక నోరెళ్లబెట్టిన. కుటుంబంమంతా కలిసి నెల రోజుల కింద రామాయంపేటకు పోయి మీ సేవల ఆధార్ దిగినం గానీ..ఇంత వరకు రాలే. నాకు రేషన్ బియ్యం ఇయ్యరని చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్: ఆహార భద్రత కార్డుకు నువ్వు అర్హుడవే. నువ్వు ఎలాగు మీసేవలో ఆధార్ దిగానని చెప్తున్నావు కాబట్టి, అది రాగానే అధికారులు నీకు ఆహార భద్రత కార్డు అందిస్తారు. అంత వరకు నీ పాత కార్డు మీదనే నువ్వు బియ్యం తీసుకోవచ్చు. (అక్కడే ఉన్న ఓ విద్యార్థితో డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ..) డిప్యూటీ స్పీకర్: ఏం తమ్ముడు ఎలా ఉన్నావు. చదువు ఎలా సాగుతోంది? వినోద్ : మేడం.. మా ఊరి పేరు మీకు తెలుసు కదా..! దొంగల ధర్మారం. మీది ఏ ఊరంటే సెప్పుకుంటానికి ఇబ్బందిగా ఉంది. ఊరు పేరుతో కాలేజీలో ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నరు. పేరు మార్పించురి. డిప్యూటీ స్పీకర్: అవును మీకు ఆ సమస్య ఉందని నాకు తెలుసు. మీరు గమనిస్తూనే ఉంటారు.. మీ మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అని మీ ఊరు పేరును డి. ధర్మారం అని పలుకుతున్నా. జిల్లా కలెక్టర్కు చెప్పాను తమ్ముడూ. త్వరలోనే మీ ఊరు పేరును సర్వోదయ నగర్ అని మార్చబోతున్నారు. (గ్రామస్తులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.) ఆ ముచ్చటా తీరింది... ‘‘ఎమ్మెల్యేగా...డిప్యూటీ స్పీకర్గా...ఇంత చేసినా... జర్నలిస్టుగా పనిచేయలేకపోయానే అనే అసంతృప్తి ఏదో మూల ఉండేది. ‘సాక్షి’ కల్పించిన వెసులుబాటుతో ఆ ముచ్చటా తీరింది. వీఐపీ రిపోర్టర్గా జనం మధ్యకు తీసుకువచ్చి..వారి సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించిన ‘సాక్షి’కి ధన్యవాదాలు’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రజెంటేషన్: వర్ధెల్లి వెంకటేశ్వర్లు ఫొటోలు: కె.సతీష్ -
సదా మీ సేవలోనే..
పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే అజయ్కుమార్ : అమ్మా బాగున్నారా? ఏం సాహెబ్గారు..మీ కాలనీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చా..ఏమైనా ఉంటే చెప్పండి? అల్లం నర్సమ్మ : ఏమి బాగు బిడ్డా.. ముసలోళ్లం బతులు ఇలా అయ్యాయి. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పింఛన్ ఇచ్చేటోడు..నెలకు 200 వస్తే మందులు కొనుక్కునే దాన్ని.. గిప్పుడు గా పింఛన్ కూడా వస్తలేదు. ముసలోళ్లమైన మాకే పింఛన్ రాకుంటే ఎవరికిస్తరు బిడ్డా..జర నువ్వైనా ఇప్పించరాదే. అజయ్కుమార్ : ఏమి అవ్వా..నీ బాధేంటి? తిరుపతమ్మ : ఏం చేయాలి బిడ్డా..రోజంతా పనిచేసుకొని బతుకేటోళ్లం. మాకు ఉండటానికి ఇళ్లు లేవు. ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టిస్తమంటుంది. మా బతుకులకేసి చూసినోళ్లు లేరు. మీరైనా ఇంటిస్థలం ఇప్పించడయ్యా. అజయ్కుమార్ : బుచ్చమ్మా బాగున్నావా..? నీకు పింఛన్ వస్తుందా? బుచ్చమ్మ : లేదు దొరగారు.. మాకు పింఛన్ ఇవ్వట్లేదు. గిదిగో..నా ఆధార్కార్డు చూడండి..68 ఏళ్లు ఉన్నయ్..నాకు పింఛన్ ఇస్తలేరు. మీరు ధర్నా చేసిన కాడికి కూడా వచ్చిన. కాగితం ఇచ్చిన..జర పింఛన్ వచ్చేలా చూడండయ్యా. అజయ్కుమార్ : సలాం మాలేకోం..మీ బాధలు చెప్పండమ్మా.. మదార్బీ : వాలేకుం సలాం..గీ పార్శీబంధంలో 20 ఏళ్లుగా ఉంటున్నం. ఇరుకుదారులు, రోడ్లులేవు, వర్షాకాలంలో మోకాళ్లలోతు బురద, పొయినేడు రోడ్లు పోస్తమని కంకర పోసిండ్రు. రెండురోజుల తర్వాత దాన్ని తీసుకుపోయిం డ్రు..ఇప్పటి వరకు రోడ్లు వేస్తమని చెప్పినోళ్లు లేరు. అజయ్కుమార్ : అమ్మా..మున్సిపాలిటీ వాళ్లు వస్తున్నారా? రహీంబీ : ఎక్కడ మున్సిపాలిటోళ్లు సారు..ఇటువైపు వచ్చినోళ్లే లేరు. నెలల తరబడి కాల్వలు సాపు చేయరు. మురుగునీరు వాసన వస్తోంది..దోమలు విపరీతంగా ఉన్నాయి. పట్టించుకున్నోళ్లు లేరు. అజయ్కుమార్ : అంగన్వాడీ కేంద్రం ఎలా ఉండమ్మా? వన్ఫుల్ మీల్స్ పెడుతున్నారా? కృష్ణకుమారి (అంగన్వాడీ టీచర్): ఇక్కడున్న వాళ్లంతా పనిచేసుకునే వాళ్లే సార్. 40 మంది పిల్లలు రోజూ వస్తారు. సొంతభవనం లేక ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం ఇచ్చే కిరాయి చిన్నగదులకు మాత్రమే వస్తోంది. జనవరి 1 నుంచి గర్భిణులు, బాలింతలకు వన్ఫుల్ మీల్స్ పెడుతున్నాం సార్. అజయ్కుమార్ : ఏంటమ్మా..? బస్తాలు కట్టుకొని ఉంటున్నారు.. ? ఇల్లు లేదా.? సరిత : పేదోళ్లం సారు.. ఏం చేస్తాం.. పది సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని ప్రభుత్వ స్థలం కాల్వపై కట్టినమని కూటగొట్టిండ్రు. వేరేచోట ఇస్తమన్నరు..ఇంతవరకు జాడలేరు. ఏం చేస్తాం మా కర్మ. కిరాయి ఇంట్లో ఉండే స్తోమతలేక ఇదిగో ఇలా బస్తలు కట్టుకొని ఉంటున్నాం. అజయ్కుమార్ : ఏం తమ్ముడు.. ఏం చదువుతున్నావ్? వంశీ కృష్ణ : బీటెక్ ఫస్టియర్ చదువుతున్నా సార్..ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందని బీటెక్లో చేరా. గత సంవత్సరం డబ్బులే ఇప్పటికీ రాలేదట! రీయింబర్స్ రాకపోతే చదువు మధ్యలో ఆపేయాల్సి వస్తుందని భయంగా ఉంది సార్. అజయ్కుమార్ : మీరేరా ఈ స్కూల్ టీచర్? పిల్లలు స్కూల్కు బాగా వస్తున్నారా? భోజన పథకం మంచిగా అమలవుతోందా? రవికుమార్ : నేనే సార్. పిల్లలు బాగానే వస్తున్నార్సార్. మధ్యాహ్నభోజనం కూడా బాగానే వండిపెడుతున్నాం సార్. అంతాబాగానే ఉంది సార్. కానీ బడి చుట్టూ కాంపౌండ్వాల్ లేదు సార్. మంజూరయ్యేలా చూడండి. అజయ్కుమార్ : ఏం అమ్మా..ఏంటి నీ సమస్య? వంగాల లలిత : నాభర్త చనిపోయి ఐదేళ్లయిందయ్యా. ఇద్దరు పిల్లలు. ఆయన డెత్ సర్టిఫికెట్ ఇచ్చినా..ఆధారాలన్నీ సమర్పించినా నాకు పింఛన్ ఇవ్వట్లేదయ్యా. అజయ్కుమార్ : ఏంటమ్మా ఆ కాగితం.. ఎందుకు తెచ్చావు..? వాణి : మాకు ఇందిరమ్మ రెండో విడతలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని అధికారులు చెప్పారు. ఇదిగో సార్.. ఇంటిపట్టా కూడా ఇచ్చారు. ఆరేళ్లయినా స్థలం చూపించలేదు. ఇస్తరో..ఇవ్వరో కూడా చెప్పట్లేదు సార్. అజయ్కుమార్ : ఏం పెద్దాయనా..బాగున్నావా? హుస్సేన్ : ఏం బాగండి.. మా ముసలి దాని కాళ్లు పడిపోయినై..నెలనెలా వచ్చే పింఛన్ ఐదునెలల నుంచి రావట్లేదు. మీరైనా పింఛన్ ఇప్పించండయ్యా. అజయ్కుమార్ : ఏం అన్నపూర్ణమ్మ బాగున్నారా? మీ సమస్యలేమిటి? అన్నపూర్ణమ్మ : బాగున్నాం సార్..మంచినీరు రావట్లేదు. గీ పంపే అందరికీ దిక్కు. దీని పక్కనే మురుగునీరు చేరుతోంది. మంచినీళ్లు, మురికి నీళ్లు కలిసిపోతున్నాయి. మీరే చూడండి ఎలా ఉందో.. (పంపు చూసిన ఎమ్మెల్యే కార్పొరేషన్ కమిషనర్ వేణుమనోహర్కు ఫోన్ చేశారు. పార్శిబం ధం ప్రాంతంలో మురుగుకాల్వలు తీయాలని, పంపుల పరిసరాలు శుభం చేయాలని, ఉదయంకల్లా పనిపూర్తి చేయాలని ఆదేశించారు.) అజయ్కుమార్ : ఏం నాగేశ్వరరావు (మాజీ కౌన్సిలర్) బాగున్నారా? పాలకుర్తి నాగేశ్వరరావు : ఏం బాగు సారు. మా వార్డుల్లో అర్హులైన వారి పెన్షన్లు తీసివేశారు. ఏ వీధికి వెళ్ళినా ముసలోళ్ల గోడు వినాల్సి వస్తోంది. రోడ్లు వేస్తమని ప్రతిసారీ అంచనాలు వేస్తున్నారు. కానీ పనులు చేపట్టడం లేదు. వీధి దీపాలు సక్రమంగా వెలగవు..కాల్వలు తీయ రు. అర్హులకు పింఛన్ అందేలా చూడండి. -
ఫణిగిరిని అభివృద్ధి చేస్తా
ఫణిగిరి..బౌద్ధం పరిఢవిల్లిన నేల..వంద ఏళ్లనాటి చర్రితకు ఎన్నో ఆనవాళ్లు....తవ్వకాల్లో వెలుగుచూసిన నిర్మాణాలు, చిహ్నాలు, శాసనాలు ఎన్నెన్నో... కానీ గత పాలకుల నిర్లక్ష్యం, పురావస్తు శాఖ అధికారుల అలసత్వంతో ఈ ప్రాచీన సంపదకు రక్షణ కరువైంది. పర్యాటక కేంద్రంగా మార్చుతామనే పాలకుల హామీలు నీటిమీద రాతలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఫణిగిరి గ్రామాన్ని పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ సందర్శించారు. సాక్షి తరఫున రిపోర్టర్గా మారి..అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. గాదరి కిషోర్: మీపేరేమిటి..ఇక్కడి బౌద్ధారామం పరిస్థితి ఎలా ఉంది. పానుగంటి నర్సింహారెడ్డి: మా ఊరిలోని బౌద్ధారామానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే దీనిని పర్యాటక కేంద్రంగా మార్చుతామని పాలకులు గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంత వరకు ఎలాంటి అభివృద్ది జరగలేదు. గాదరి: అన్నా...ఏం సమస్యలు ఉన్నాయె..? ఉప్పలయ్య: ఫణిగిరిలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో ఎంతో విలువైన ప్రాచీనసంపద బయల్పడింది. కానీ దీనికి రక్షణ లేదు. ఈ సంపదనంతా ఓ పాతభవనంలో పడవేశారు. గాదరి : ఈ భవనంలో ఎప్పడి నుంచి పనిచేస్తున్నావు. వీరయ్య (సెక్యూరిటీగార్డు) : నేను పది సంవత్సరాలుగా ప్రాచీన సంపదను ఉంచిన భవనానికి కాపలాగా ఉంటున్నాను. నాకు నెలకు మూడు వేల రూపాయల జీతం ఇస్తున్నారు. తెలంగాణ వచ్చింది కదా...ఈ ప్రభుత్వంలోనైనా నా ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలి. గాదరి : అన్న సమస్య ఎందో చెప్పు.. యాదయ్య: మా ఊర్లోన్ని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి వందల ఎకరాల భూములు ఉన్నాయి. అయినా ఆలయం ధూపదీపనైవేద్యాలకు దూరమైంది. గుడిలో గుప్తనిధుల కోసం విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు. గాదరి : మండలంలో ఉన్న సమస్యలేమిటి ? కొమ్మినేని సతీష్: గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బోర్లలో ఫ్లోరిన్ అధికంగా ఉండడంతో ఆ నీటిని ప్రజలు తాగి రోగాల పాలవుతున్నారు. గాదరి : అవ్వా... పింఛన్ వస్తుందా ? యాదమ్మ: సారూ...మూడు నెలల సంది పింఛన్లు రావడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. గాదరి: ఏం తాత.. నీసమస్య ఏంటి ? గుగులోతు కాలు: నేను ముసలివాడిని అయ్యా. మాకుటుంబానికి భూమి లేదు. వ్యవసాయానికి ప్రభుత్వ భూమి ఇప్పించాలి. గాదరి: అమ్మా నీ సమస్య... యాదమ్మ: నాకు 65 ఏళ్ల వయస్సు ఉన్నా పింఛన్ రావడం లేదు. రేషన్కార్డులో తక్కువ వయస్సువేశారు. మీరైనా పింఛన్ ఇప్పించండి. గాదరి: అన్నా మీ ప్రాంత సమస్యలు ఏంటో చెప్పండి. దాయం విక్రంరెడ్డి: తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయింది. ఎలాంటి సాగునీటి వసతి లేదు. ఎస్సారెస్పీ కాలువలు తీసినా నీళ్లు రావడం లేదు. గాదరి : అక్కా సమస్యలేంటి. పేరాల పూలమ్మ: తండాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సమస్య పరిష్కారానికి ముందస్తుగా నిధులు మంజూరు చేయించాలి. గాదరి: సార్ బాగున్నారా...అంతా కులాసేనా.. ఓరుగంటి సత్యనారాయణ: ఈ ప్రాంతంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉంది. లోఓల్టేజీతో పంటలు ఎండిపోతున్నాయి. గాదరి : జనార్దన్గారు చెప్పండి మీసమస్య సుంకరి జనార్దన్: తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఈవిద్యా సంవత్సరం నుంచే ప్రారంభిచేలా చూడాలి. గాదరి : ఆ వీరప్రసాద్ ఇక్కడ పరిస్థితి ఏమిటో... దావుల వీరప్రసాద్: అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనారసింహస్వామి దేవాలయ భూముల సమస్యలు పరిష్కరించాలి. 750 ఎకరాల భూములున్నా ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు కష్టమవుతుంది. రైతులకు ఆమోదయోగ్యమైన ధరకు భూమిని అమ్మి పట్టాలు ఇవ్వాలి. దర్గాను కూడా అభివృద్ధి చేయాలి. గాదరి : అశోకన్న నీ సమస్య చెప్పు మూల అశోక్రెడ్డి: తిరుమలగిరి మండల కేంద్రంలో బస్డిపో ఏర్పాటు చేయాలి. గాదరి : మీ ఊరు సమస్య లేమిటి ఎ. మధుసూదన్రెడ్డి: రైతులకు పంట రుణాలు పూర్తిగా మాఫీ చేసి ఒకేసారి ఎక్కువ మొత్తంలో రుణాలందజేయాలి. తుంగతుర్తిని జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతా గత పాలకుల నిర్లక్ష్యంతో తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయింది. ఫణిగిరి బౌద్ధక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా, సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని రెండో భద్రాద్రిగా మార్చడానికి పక్క గ్రామానికి చెందిన మంత్రి జగదీష్రెడ్డి సహకారంతో ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. ఎస్సారెస్పీ రెండో దశ కాలువ పనులు పూర్తి చేయించి ఈప్రాంతానికి సాగు, తాగు నీరందిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు, ఆహార భద్రతా కార్డులు వందశాతం ఇప్పిస్తాం. ఒంటరి, మహిళలు, అభయహస్తం పింఛన్దారుల సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుని నెలకు రూ. 1000 పింఛన్ ఇస్తుంది. ఫణిగిరిలో తవ్వకాల్లో బయల్పడిన ప్రాచీన సంపద కోసం మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరుస్తాం. తాగునీటి అవసరాలకు గ్రామాగ్రామానికి కృష్ణాజలాలు అందించడానికి కృషి చేస్తా. నియోజకవర్గంలోని రోడ్లను బీటీగా మార్చడానికి రూ. 229 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తాం. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
-
యంత్ర సాయం...సాగు లాభం
ఆరుగాలం కష్టించి సాగుచేసిన రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. గత కొన్నేళ్లుగా పంటలు కలిసిరాకపోవడంతో అన్నదాతలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటనష్టపోతున్నారు. పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. రైతన్నల సమస్యలు తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ (జేడీ) దమ్ము ప్రమీల సాక్షి వీఐపీ రిపోర్టర్గా మారారు. కొండ కరకాం గ్రామంలో పొలాల్లోకి వెళ్లి రైతులు పండిస్తున్న వరి, టమాటా, మిరప, వంగ వంటి పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని, తగిన సూచనలు చేశారు. ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే అధికలాభాలు పొందవచ్చని చెప్పారు. కొండకరకాం గ్రామాంలో పలు పంటలను పరిశీలించి రైతులను సమస్యలను తెలుసుకున్నాను. వరి ఒక్కటే అయితే గిట్టుబాటు కాదని, ఇక్కడ రైతులు వరితోపాటు టమాటా, మిరప, వంగవంటి పంటలు కూడా సాగు చేస్తున్నారు. ఈ విధానాన్ని మిగతా రైతులు కూడా పాటించాలి. కూరగాయలను విజయనగరం రైతు బజార్లో విక్రయిస్తే మంచిధర వస్తుంది. రైతులకు యంత్ర పరికరాలను 50 శాతం రాయితీపై అందిస్తున్నాం. యంత్ర పరికరాలు కావాల్సిన వారు మీసేవద్వారా దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుని వెళ్లడంలో ఇబ్బందుల పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళతాను. నష్టపోయిన రైతులందరికీ పరి హారం అందేలా కృషి చేస్తాను. రైతులతో జాయింట్ డెరైక్టర్ ప్రమీల సంభాషణ ఇలా సాగింది. వ్యవసాయశాఖ జేడీ: నాపేరు ప్రమీల, నేను వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ను. మీ సమస్యలు తెలుసుకోడానికి వచ్చాను. మీ పేరేంటి, ఏపంట వేశారు? రైతు సత్యం: అమ్మా నాపేరు సత్యం. వరి వేశాను జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు? సత్యం: ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్నానమ్మ. జేడీ: ఏరకం విత్తనాలు వేశారు ? సత్యం: హెబ్రీడ్ రకం రకాన్ని వేశాను జేడీ: ఎన్ని రోజుల్లో పండుతుంది. పంట వేసిఎన్ని రోజులయింది? సత్యం: 120 రోజుల్లో పండుతుంది. పంట వేసి 25 రోజులయింది. జేడీ: కలుపు మందు ఏమైనా వేశారా? సత్యం: స్వాతి అనే కలుపు మందు వేశాను జేడీ: హైబ్రీడ్ రకాన్నే ఎందుకు వేశారు? సత్యం: మా గ్రామంలో ఓ రైతు ఖరీఫ్లో వేశారు. పంట బాగుంది. అందుకే నేనూ వేశాను . జేడీ: హైబ్రీడ్ రకాలను ఏకాలంలోనైనా వేసుకోవచ్చు. అయితే రబీలో వేసుకోవడం మంచిది. ఎందుకంటే తక్కువ రోజుల్లో పంట పండుతుంది. రబీలో నీటి వసతి అన్ని వేళలా అందుబాటులో ఉండదు కాబట్టి ఇటువంటి సల్వకాలిక రకాలను వేసుకోవడం మంచిది. అంతేకాకుండా దిగుబడి కూడా పెరుగుతుంది. పంటకు అవసరమైన ఎరువులను అందిస్తాం. జేడీ: మీ పేరేంటి? రైతు రాములప్పడు : నాపేరు రాములప్పుడమ్మ జేడీ:మీరేపంట వేశారు ? రాములప్పడు : వరి వేశానమ్మ. జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏ రకం సాగు చేస్తున్నారు? రాములప్పడు : ఖరీఫ్లో ఏడు ఎకరాల్లో హైబ్రీడ్ రకాన్ని వేశాను జేడీ: ఎంతదిగుబడి వస్తుందనుకుంటున్నారు? రాములప్పడు: ఎకరాకు 40 బస్తాలు వరకు వస్తాదని అనుకున్నాను. అయితే హుద్హుద్ తుపాను వల్ల పంట దెబ్బతింది. 25 నుంచి 30 బస్తాలు మాత్రమే దిగుబడి రావచ్చు జేడీ: పరిహారం వచ్చిందా? రాములప్పడు : రాలేదమ్మా జేడీ: పంటకు ఇన్సూరెన్స్ కట్టారా? రైతు: ఇన్సూరెన్స్ గురించి తెలియదమ్మా జేడీ: పంటలు బీమా ఇన్సూరెన్స్ ప్రతీ రైతు కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ కడితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటలకు బీమా వర్తిస్తుంది. పరిహారం ఎందుకు రాలేదో విచారణ జరిపి, చర్యలు తీసుకుంటాను. జేడీ: మీ పేరేంటి రైతు సూర్యనారాయణ : నాపేరు సూర్యనారాయణమ్మ. జేడీ: ఏ పంట వేశారు? సూర్యనారాయణ : టమాటా వేశాను జేడీ: టమాటా ఎందుకు వేశారు ? సూర్యనారాయణ : వరి పంట కొంత వేశాను, అదనపు ఆదాయం వస్తుందని మరికొంత మేర టమాటా వేశాను. జేడీ: ఎక్కడ అమ్ముతారు? సూర్యనారాయణ : విజయనగరం మార్కెట్లో అమ్ముతాను జేడీ: కూరగాయాలను మార్కెట్లో కంటే రైతుబజార్లలో నేరుగా అమ్ముకుంటే మంచి ధర వస్తుంది. రైతు బజార్లో కూరగాయాలు అమ్ముకుంటానంటే ఏడీతో మాట్లాడి కార్డులు ఇప్పిస్తాను. టమాటా సాగులో కలుపు లేకుండా చూసుకోవాలి. ఏదైనా తెగులు సోకితే తక్షణమే ఉద్యానశాఖ అధికారినిగాని, శాస్త్రవేత్తను గాని అడిగి నివారణ చర్యలు చేపట్టాలి. జేడీ : బాబూ నీపేరేంటి? మరో రైతు : నా పేరు సూర్యనారాయణ జేడీ: రుణమాఫీ ఏమైనా అయిందా? సూర్యనారాయణ: తొలివిడతలో అవలేదు. రెండో విడతలో అవుతుందన్నారు. జేడీ: పాసుపుస్తకాలు, రేషన్కార్డు, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతాలు వివరాలను జన్మభూమి కమిటీకి అందిస్తే సమస్య పరిష్కారమవుతుంది . రైతు: నా పేరు బాబారావు మేడమ్. జేడీ: ఏ పంట వేశారు, పంటనూర్పును సాధారణ పద్ధతిలో చేపడుతున్నారా, లేక యంత్రంతో చేస్తున్నారా? బాబారావు: వరి వేశానమ్మ, సాధారణ పద్ధతిలోనే నూర్పు చేస్తున్నాం. జేడీ: 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలను అం దిస్తున్నాం. మీసేవ ద్వారా దరఖాస్తు చేస్తే పరికరాలను అందజేస్తాం. యంత్ర పరికరాలతో పనులు చేయడం వల్ల కూలీల ఖర్చు, సమయం ఆదా అవుతుంది. జేడీ: బాబు నీ పేరేంటి ? రైతు గోపాల్రావు: మేడమ్ నాపేరు పడాల గోపాల్రావు. జేడీ: మీరే పంట పండిస్తున్నారు , మీసమస్య ఏంటి? గోపాల్రావు: నేను కూరగాయలు పండిస్తున్నాను. నాకు కూరగాయల సాగులో కలుపుతీసే పరికరం కావాలి జేడీ: కూరగాయల సాగును కూడా కొన్ని పరికరాలతో చేపట్టవచ్చు. వాటిని రాయితీపై అందిస్తాం. జేడీ? ఏమండీ మీ పేరేంటి, మీసమస్య ఏంటి? రైతు కోటేశ్వరరావు: అమ్మా... నాపేరు కోటేశ్వరావు. నేను రబీలో మూడు ఎకరాల్లో చోడి పంట వేశాను. యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నాను జేడీ: ప్రస్తుతం యూరియా కొరత ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు జిల్లాకు 600 టన్నుల యూరియా వచ్చింది. అన్ని సొసైటీలకు అందిస్తాం. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం. జేడీ ధాన్యం: కొనుగోలు కేంద్రాల వల్ల ఉపయోగం ఉందా? కోటేశ్వరరావు: ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల ప్రయోజనం కంటే, ఖర్చు అదనంగా అవుతోంది జేడీ: ఎందుకు అదనంగా ఖర్చువుతోంది? కోటేశ్వరరావు: ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రానికితీసుకుని వెళ్లడానికిట్రాక్టర్కు అద్దె ఇవ్వాలి. అదే విధంగా ధాన్యం బస్తాల ఆన్లోడింగ్, లోడింగ్కు రూ.1000 వరకు ఖర్చువుతోంది జేడీ: మీకు కావాల్సిందేంటి? కోటేశ్వరరావు : మా కళ్లాల దగ్గరకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తే బాగుంటింది. దీని వల్ల రైతులకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా తూనిక యంత్రాలు ఇవ్వాలి. జేడీ: దరఖాస్తు చేసుకుంటే తూనిక యంత్రాలను రాయితీపై అందిస్తాం. ధాన్యం తరలించడానికి అవుతున్న అదనపు ఖర్చు గురించి ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరానికి కృషి చేస్తాను. జేడీ : మీ పేరేంటమ్మా ? మహిళారైతు రాజమ్మ: అమ్మా నా పేరు రాజమ్మ. జేడీ: నీకు పొలం ఉందా, ఉంటే ఏపంట వేశావు? రాజమ్మ: నాకు ఎకరం పొలం ఉంది. వరి వేశాను జేడీ : హుద్హుద్ తుపానుకు పంట దెబ్బతిందా?, పరిహారం వచ్చిందా ? రాజమ్మ : పంటంతా పోయిందమ్మ. పరిహారం రాలేదు జేడీ: పరిహారం ఎందుకు రాలేదో విచారణ చేసి చర్యలు తీసుకుంటాను జేడీ :బాబూ నీ పేరేంటి ? రైతు రమణ: నా పేరు రమణ మేడమ్. నేను కూరగాయలు సాగు చేస్తున్నాను జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏఏ పంటలవేశారు? రమణ: ఒక ఎకరంలో ముల్లంగి, గోంగూర, మొక్కజొన్న, టమాటా వేశాను మేడమ్ జేడీ: ఎక్కడ విక్రయిస్తారు ? రమణ: విజయనగరం మార్కెట్లో విక్రయిస్తాను జేడీ: ఎవరుతీసుకు వెళాతారు? రమణ : నేనే తీసుకుని వెళాతాను. జేడీ: ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది? రమణ: ఎకరానికి 20 వేలు వరకూ వస్తుంది మేడమ్. జేడీ : కూరగాయాలను రైతు బజారులో విక్రయిస్తే మంచి గిట్టుబాటు అవుతుంది. మార్కెట్లో అయితే దళారులు బెడద వల్ల నష్ట పోవలసి వస్తుంది. -
పీహెచ్సీలపై ప్రత్యేక శ్రద్ధ
జలుబు లేదా జ్వరమొస్తే రూ.వందలు.. ఇంకొంచెం పెద్ద ఆరోగ్య సమస్య అరుుతే రూ.వేలకు వేలు.. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అయ్యే ఖర్చులివి. ఇంత ఖర్చుకు మధ్య తరగతి ప్రజలే కాదు.. సంపన్నులూ వెనుకాడే పరిస్థితి. ఈ నేపథ్యంలో నిరుపేదలు, సామాన్యులకు మొదట గుర్తుకువచ్చేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. అక్కడ వైద్య పరీక్షలే కాదు మందులూ ఉచితం. అయితే పీహెచ్సీల నిర్వహణ, వైద్యులు, సిబ్బంది ప్రవర్తనపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని పీహెచ్సీల తీరు ఎలా ఉంది.. ప్రజలకు ఏం కావాలి, ఇంకా ఏయే సౌకర్యాలు కల్పించాలి వంటి అంశాలను తెలుసుకోవాలనుకున్నారు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కేఎం సునంద. ఇందుకు ‘సాక్షి’ని వేదికగా చేసుకున్నారు. వీఐపీ రిపోర్టర్గా నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్ను, స్కానింగ్ సెంటర్ను ఆమె పరిశీలించారు. తొలుత తంగెళ్లమూడిలోని అర్బన్ హెల్త్ సెంటర్ను పరిశీలించడానికి వెళ్లిన డాక్టర్ సునంద అక్కడి పరిస్థితులను గమనించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల తీరు, వైద్యులు, సిబ్బంది వైఖరిపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సునంద : ఈ కేంద్రానికి రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు. గర్భిణులను ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారా డాక్టర్ కె.మిద్దేశ్వరరావు : రోజుకు 30 నుంచి 50 మంది రోగులు వస్తుంటారు మేడమ్. గర్భిణుల వివరాలతో రికార్డులు నిర్వహిస్తున్నాం. ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. సునంద : గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుళ్లు పోస్తున్నారా.. బయటకు పంపుతున్నారా మిద్దేశ్వరరావు : మా కేంద్రానికి వచ్చే గర్భిణులందరినీ 9 నెలలపాటు జగ్రత్తగా పరిశీలిస్తూ ఇక్కడే కాన్పులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసరమైతే జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రికి తరలిస్తున్నాం. సునంద : ఇక్కడ అన్నిరకాల మందులూ అందుబాటులో ఉంచుతున్నారా. కె.విజయ, నర్సు : అన్ని మందులూ ఉన్నాయి మేడమ్. ఈ ప్రాంతం మురికివాడ కావడంతో ఎక్కువ మంది కుక్క కాటుకు గురై వైద్యం కోసం వస్తున్నారు. యూంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు మేడమ్. సునంద : అర్బన్ హెల్త్ సెంటర్లలో యూంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడం కష్టం. వాటిని శీతల ప్రదేశంలో ఉంచాల్సి ఉన్నందున్న ఫ్రిజ్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రభుత్వ ఆసుపత్రులకు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి బాధితులను అక్కడికి పంపించాలి. అనంతరం టాయిలెట్స్ ఉన్న ప్రాంతానికి వెళ్లిన డీఎంహెచ్వో ఆ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ స్వీపర్ ఎవరని ప్రశ్నించారు. కొప్పుల రామలక్ష్మి : నేను ఇక్కడ స్వీపర్గా పనిచేస్తున్నాను మేడమ్. సునంద : టాయిలెట్లు ఇంత మురికిగా ఉన్నాయేంటి. నీరుకూడా వృథాగా పోతోంది. రామలక్ష్మి : ఎప్పుడూ కడుగుతూనే ఉంటానండి. రోగులు వచ్చి వినియోగించుకుంటారు కదాండి. అందుకే మురికిగా ఉన్నాయి. మరింత శుభ్రంగా ఉంచుతాను మేడమ్. సునంద : నీరు వృథాగా పోతోంది కదా. పంపులను జాగ్రత్తగా వాడాలి. ఎప్పుడూ పరిశీలిస్తుండాలి. రామలక్ష్మి : అలాగేనండి. ఆ తర్వాత అక్కడున్న కమ్యూనిటీ ఆర్గనైజర్తో డీఎంహెచ్వో మాట్లాడారు. ఎంబీ విజయసత్యకళ, సీవో : ప్రతినెలా జీతాలు అందడం లేదు మేడమ్. ఏ నెల జీతాలు ఆ నెలలో ఇచ్చేలా ఏర్పాట్లు చేయండి. సునంద : ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావాలి. బడ్జెట్ విడుదల కాగానే జీతాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడి నుండి నగరం నడిబొడ్డులోని రామచంద్రరావు పేటలో గల వంశీ స్కానింగ్ సెంటర్కు వెళ్లిన సునంద ఆ సెంటర్ నిర్వాహకురాలిని అక్కడ ఏయే పరీక్షలు చేస్తున్నారు, బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఎన్.మృణాళిని : మేడమ్. ఇక్కడ నేను కన్సల్టెంట్ రేడియాలజిస్ట్గా వ్యవహరిస్తున్నాను. సునంద : అందుకు సంబంధించి మీ అర్హత ఏమిటి. బయట బోర్డు పెట్టారా. మీ పత్రాలు చూపండి. మృణాళిని : రిజిస్ట్రేషన్ చేయించాం మేడమ్. బయట బోర్డు కూడా ఉంది. సునంద : ఇక్కడ స్కానింగ్లు చేస్తున్నారా. ఎంత వసూలు చేస్తున్నారు. మృణాళిని : అన్నిరకాల స్కానింగ్లూ చేస్తున్నాం మేడమ్. లింగ నిర్థారణ ప్రకటించడం లేదు. సునంద : రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారు. మృణాళిని : గర్భస్థ శిశు పరీక్షలు కాకుండా ఇతర స్కానింగ్లు సుమారు 30 నుంచి 40 వరకూ చేస్తాం. సునంద : మీరు చేసే అన్ని పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు మాకు నివేదిక పంపాలి. వైద్యుల సూచనల మేరకు వస్తున్న రోగులకే పరీక్షలు నిర్వహిస్తున్నారా లేక స్వచ్ఛందంగా వచ్చేవారికి కూడా పరీక్షలు చేస్తున్నారా. మృణాళిని : లేదు మేడమ్. డాక్టర్లు పంపిన వారికే పరీక్షలు నిర్వహిస్తున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చిన డీఎంహెచ్వో పరీక్షల కోసం వేచి ఉన్న వారితో మాట్లాడారు. సునంద : ఏమ్మా.. ఏ పరీక్ష కోసం వచ్చారు. ఫాతిమా : కడుపునొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన స్కానింగ్ చేయించుకు రమ్మని పంపారు. సునంద : ఏ వైద్యుడు పంపారు. ఆ చీటీ ఏది. ఫాతిమా : చీటీ నా దగ్గర లేదండి. నా భర్త వద్ద ఉంది. ఆయన బయటకు వెళ్లారు. -
సజావుగా ‘సాగ’నివ్వండి
మార్చి నెలాఖరుకల్లా రబీ సాగు పూర్తి చేయకుంటే క్లోజర్లో ఆధునికీకరణ పనులు చేయలేమని నీటిపారుదల శాఖ అంటుంటే.. కనీసం ఏప్రిల్ 15 వరకు నీరిస్తేనే సాగు సజావుగా పూర్తవుతుందని రైతులంటున్నారు. రబీకి నీటి సరఫరా, సాగు పరిస్థితులపై రైతులు, నీటిపారుదలశాఖ భిన్న వాదనలతో ఉన్న నేపథ్యంలో సాగుకు పలు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించే దిశగా రైతులకు అవగాహన కల్పించి, సాగు సమస్యలను ఆ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువెళ్లే బాధ్యతను ‘సాక్షి’ మీడియా చేపట్టింది. ‘సాక్షి’ అభ్యర్థన మేరకు ఎస్ఈ ఎస్. సుగుణాకరరావు శనివారం వీఐపీ రిపోర్టర్గా సామర్లకోట గోదావరి కెనాల్, పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలో రైతుల సమస్యలను పొలాల్లోకే వెళ్లి తెలుసుకున్నారు. పూడుకుపోయిన డ్రైన్లు, కాలువలు, గట్లకు గండ్ల వంటి సమస్యలను రైతులు ఎస్ఈ దృష్టికి తీసుకువచ్చారు. ఆ రిపోర్టింగ్ ఎస్ఈ సుగుణాకరరావు : ఏం పెద్దాయనా.. నీ పేరేమిటి? రబీ సాగులో ఏమైనా ఇబ్బందులున్నాయా? రైతు : వెలమర్తి బులిరాజండీ. మా ఊరు వి.కె.రాయపురం. నీలం తుపానప్పుడు సామర్లకోట కెనాల్కు రెండుచోట్ల పడ్ల గండ్లను పూడ్చకున్నారు. పొలాలు మునిగిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. మీరైనా కాస్త దయచూపండయ్యా! ఎస్ఈ: ఆ తుపాన్తో రెండుచోట్ల గండ్లు పడితే పూడ్చడానికి రూ.95 లక్షలతో అంచనాలు రూపొందించాం. వచ్చే మార్చి, ఏప్రిల్ లోపు పనులు మొదలు పెట్టించి మీకు సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. నిశ్చింతగా ఉండు పెద్దాయనా. మరో రైతు: నా పేరు రేలంగి రామారావు. వెస్ట్ ఏలేరు కెనాల్ కాలువపై ఫుట్పాత్ వంతెన ఉన్నా ధాన్యం తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందవుతోంది సారూ. (మరో రైతు వి.శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ) ఒక ధాన్యం బస్తా తేవాలంటేనే రూ.50 నుంచి వంద రూపాలు ఎగస్ట్రా అయిపోతోందండి. ఇంతవరకు మా బాధ ఎవరూ పట్టించుకోలేదండి. ఎస్ఈ: మీకు దగ్గర్లో మరో వంతెనేమైనా ఉందా? రైతులు: ఎక్కడా లేకపోబట్టే కదా సారూ.. పండించిన గింజలు తెచ్చుకోవాలన్నా కష్టమైపోతోంది. ఎస్ఈ: డ్రైనేజీ ఆధునికీకరణకు నిధులు పుష్కలంగా ఉన్నాయి. మా ఈఈని పంపిస్తాను. అన్నీ పరిశీలించి ప్రతిపాదనలు తయారుచేసి పనులు చేపట్టే ప్రయత్నం చేస్తాను నన్ను నమ్ముతారు కదా! మీరేదో చెపుదామనుకుంటున్నారు చెప్పండి మీ సమస్య. రైతు: నా పేరు బేతిన బాబ్జీ సార్. జగ్గమ్మగారిపేటలో తరచు కాలువకు గండ్లు పడుతున్నాయి. ఆ సమస్యను పరిష్కరిస్తారని. ఎస్ఈ: ఆధునికీకరణ పనులు చేయడానికి కనీసం రెండు నెలలు కావాలి. డిసెంబరు ఫస్ట్ నుంచి నీరు ఇచ్చాం. ఇప్పటికీ ఇంకా నాట్లు పూర్తికాలేదు. ఇలా అయితే పనులు ఎలా చేపట్టగలమో మీరే మావైపు ఆలోచించండి. మీరు సహకరిస్తేనేమేం ఏమైనా చేయడానికి ఉంటుంది. రైతు: సార్ నా పేరు చుండ్రు శ్రీరామచంద్రమూర్తి సర్, మీరేమనుకున్నా కానీ పిఠాపురం, ఏలేరు కింద సాగు కొంత ఆలస్యమవుతుంది. మార్చి నెలాఖరుకు కాలువలు కట్టేస్తామంటే కరెక్టు కాదండి. ఏప్రిల్ వరకు నీరివ్వాల్సిందే. ఎస్ఈ: లేదంటే డెరైక్ట్ సోయింగ్(వెదజల్లు) వేయొచ్చు కదా, వాటర్ లేకా, లేబర్ దొరక్కా.. ఎందుకు లేటవుతుందో చెప్పండి. మీరు నారుమడి ముందుగా వేసుకోవాలి కదా! రైతు: నా పేరు సత్తిబాబండీ, లేబర్ దొరక్క ఆలస్యమవుతోంది, మీరే కాస్త మా పక్కనుంచి ఆలోచించండి సారూ. ఎస్ఈ: మా సమస్య మాకుంది. ఆధునీకరణకు ఆరుకోట్లున్నా మీరు సహకరించకపోతే పనులు చేయలేం. మీరంతా వచ్చారు కాబట్టి ఒకసారి ఆలోచించండి మరి. రైతు: సర్ నా పేరు ఇంటి వెంకట్రావండీ. మేం అడుగుతుంది ఏప్రిల్ 15 దాకానే కదా. మూడేళ్లుగా పంటలు పోయాయి. అప్పుల్లో ఉన్నాం. ఏదో భగవంతుడు కరుణించాడు కాబట్టే కొద్దిగా గుక్కతిప్పుకున్నాం. నీరు ఇచ్చేది కాస్త పొడిగించండి బాబూ. మరో రైతు: నా పేరు రాజబాబు సార్. సామర్లకోట లాకులు ఓపెన్ చేయడం లేదండి. ఎస్సీ పేట మొత్తం మునిగిపోతోంది. 20 వేల ఎకరాల్లో వ్యవసాయం ఉత్తినే ఇస్తామన్నా చేయడానికి కూడా ఎవరూ రావడం లేదు. ఎస్ఈ: సరే మా డీఈని సోమవారం మీ దగ్గరకు పంపిస్తాను. మీరంతా దగ్గరుండి ఆ సమస్యను పరిశీలించండి. ఆధునికీకరణ పనుల్లో చేపట్టేలా చర్యలు తీసుకుంటాను. రైతు: నా పేరు సత్తిరాజు. సారూ నేను కూడా ఏదైనా చెప్పొచ్చా? (మరోరైతు) నా పేరు శ్రీనివాసండీ. మేమంతా సమస్యలన్నింటినీ కలిసే చెబుతామండీ. కల్వర్టులు పోయాయి. తమరు మాయందు దయుంచి మాకు గిఫ్ట్గా ఇవ్వండి సర్, మీకు రుణపడి ఉంటాం. 28/4 నంబర్ పైపు కింద వాటర్ రావడం లేదండీ.గోడ కూలగొట్టేశారు. నీరు మెరకకు రావడం లేదు. తూటేరుడ్రైన్ మొత్తం మూసుకుపోయింది. వీకే రాయపురం, హుస్సేన్పురం వంటి గ్రామాలు ముంపులో ఉంటున్నాయి. డ్రైన్ తవ్వి పాతికేళ్లయ్యిందయ్యా. ఎస్ఈ: మా నోటీసుకు తీసుకువచ్చారు కదా. ఐదు లక్షల లోపు అంచనాలుంటే మీరంతా కలిసి ఆయకట్టు కమిటీగా ఏర్పడితే మీ ద్వారానే పనులు పూర్తి చేస్తాం. 28/4 నంబర్ పైపు కింద వాటర్ వచ్చేలా చూస్తా. మరో విషయం కూడా చెబుతాను. తుల్యభాగ, టేకి డ్రైన్లు చేపట్టాం. సోమవారం ఈఈని పంపించి అంచనాలు తయారు చేయిస్తాను. రైతు: నేను రైతు సంఘం అధ్యక్షుడినండీ. నా పేరు కంటే బాబు. లెహెర్ తుపాన్తో గట్లన్నీ కుంగిపోయాయి. వెస్ట్ ఏలేరు పరిధిలో ఒకపక్క వీకే రాయపురం, మరోపక్క సత్యవరపుపేటలకు కనీసం రోడ్డు కూడా లేదండి. రైతులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఈ: సామర్లకోట పరిధిలో రూ.92 కోట్ల పనులు మంజూరైతే రూ.16 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన పనులు ఆగిపోవడానికి కారణమైన ఏజెన్సీల అగ్రిమెంట్ రద్దు చేస్తాం. గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేయిస్తాను. సహకార సంఘం అధ్యక్షుడు: సర్ నా పేరు ఊటా వాసండీ. రామేశ్వరం రిటైనింగ్వాల్ పోయింది. రైతులు చాలా ఇబ్బందులుపడుతున్నారు. ఎస్ఈ: వాటిని పరిశీలించి ఈ ఏడాది కచ్చితంగా పనులు చేపట్టి పూర్తి చేద్దాం. మీరు కొంత సహకారం అందించాలి, ఇస్తారు కదా. మరో ఇద్దరు రైతులు: సాగో ఫ్యాక్టరీలు, సుగర్ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కలుషితమైన మురుగుతో దూడలు కూడా చచ్చిపోతున్నాయి. దోమలు పెరిగిపోతున్నాయి. పంటలు పోతున్నాయి. మీరే ఏదైనా ఆలోచించండి. సీఎం దాకా వెళ్లింది. ఎస్ఈ: నేను వచ్చి ఆరునెలలే అయింది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళతాను. రైతు: నా పేరు ప్రభాకరండీ. గుర్రపుడెక్క చాలా ఇబ్బందిపెడుతోంది. లాకుల వద్ద తీసేసి రోడ్డుపై పడేశారు. వాటర్ రావడం లేదు. ఎస్ఈ: ఖరీఫ్లోవేసిన డెక్క ఎండిపోయాక తీసేస్తారు. కాంట్రాక్టర్కు చిల్లిగవ్వ పేమెంట్ చేయలేదు. సంక్రాంతి వెళ్లాక తీయించేస్తాను. రైతు: నా పేరు ఎలిశెట్టి భీమన్నదొరండి. పీబీసీ-1 కాలువ పరిధిలో కండికాలువ వద్ద అక్రమ లేఅవుట్లు వేశారు. కలెక్టర్ వరకు వెళ్లింది. ఆక్రమణలతో నీరు పోవడం లేదు. ఎస్ఈ: కలెక్టర్గారు చెప్పారు.. వెరిఫై చేశాను. 15 వరకు అనధికారిక భవనాలున్నాయి. వాటిని తొలగించాలంటే లక్షన్నర కావాలి. వాటికి మంజూరు రాగానే తొలగించేస్తాము. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
-
విఐపి రిపోర్టర్ - మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు
-
విఐపి రిపోర్టర్ - గంగుల కమలాకర్
-
వీఐపీ రిపోర్టర్ : ఐఏఎస్ అధికారి రజత్కుమార్