Indian Oil Corporation
-
ఇండియన్ ఆయిల్ చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొత్త చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 54 సంవత్సరాల సాహ్నీ ప్రస్తుతం ఐఓసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్– పెట్రోకెమికల్స్)గా విధులు నిర్వహిస్తున్నారు.ఆగస్టులోనే ఈ బాధ్యతలకు ఎంపికైన ఆయన, అటు తర్వాత కొద్ది నెలల్లోనే సంస్థ చైర్మన్గా నియమితులు కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా పదవీ విరమణ పొందే వరకూ లేదా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ (ఏది ముందైతే అది) సాహ్నీ ఐఓసీ చైర్మన్గా ఉంటారు. శ్రీకాంత్ మాధవ్ వైద్య తన పొడిగించిన పదవీకాలాన్ని ఈ ఏడాది ఆగస్టు 31న పూర్తి చేసుకున్న నాటి నుంచి ఈ ఫారŠూచ్యన్ 500 కంపెనీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. 2014 జూలైలో బీ అశోక్ తర్వాత బోర్డు అనుభవం లేకుండానే కంపెనీ ఉన్నత ఉద్యోగానికి పదోన్నది పొందిన రెండవ వ్యక్తి సాహ్ని. -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా 'సతీష్ కుమార్'
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇండియన్ ఆయిల్) చైర్మన్గా 'సతీష్ కుమార్ వడుగిరి' ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థకు అధిపతిగా నేడు బాధ్యతలు చేపట్టారు. శనివారం పదవికి రాజీనామా చేసిన ఎస్ఎం వైద్య స్థానంలో సతీష్ కుమార్ను నియామకమైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది.2021 అక్టోబరు నుంచి డైరెక్టర్ (మార్కెటింగ్)గా పనిచేస్తున్న సతీష్ కుమార్.. తన ప్రస్తుత పాత్రను కొనసాగిస్తూనే ఛైర్మన్గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. ఈయన 2022 అక్టోబర్ నుంచి ఒక సంవత్సరం పాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా కూడా పనిచేశారు.35 సంవత్సరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అభివృద్ధికి సతీష్ కుమార్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయనకు ఇండియన్ ఆయిల్ మారిషస్ లిమిటెడ్తో జాయింట్ వెంచర్ అయిన ఇండియన్ ఆయిల్ పెట్రోనాస్ ప్రైవేట్ లిమిటెడ్కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, బహుళజాతి చమురు కంపెనీలతో పనిచేసిన విస్తృత అనుభవం ఉంది.సతీష్ కుమార్ నాయకత్వంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గత మూడు సంవత్సరాలలో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. సంస్థ తన రిటైల్ అవుట్లెట్లను ఆధునీకరించింది, కొత్త బాట్లింగ్ ప్లాంట్లు, టెర్మినల్లను ప్రారంభించింది. హైవే రిటైల్ ప్రదేశాలలో సౌకర్యాలను ప్రవేశపెట్టింది.మార్కెటింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సతీష్ కుమార్.. మధ్యప్రదేశ్ & ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మార్కెటింగ్ నెట్వర్క్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్గా పనిచేశారు. తన కెరీర్లో LPG వినియోగదారుల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY), బీఎస్-6 ఫ్యూయల్ ఇంప్లిమెంటేషన్ మొదలైన కీలక వ్యాపార కార్యక్రమాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. -
ఎల్ఐసీ, ఐవోసీ భారీ డివిడెండ్లు
కేంద్రానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డివిడెండ్లను అందించాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఎల్ఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎండీ సిద్ధార్థ మొహంతి రూ.3,662.17 కోట్ల డివిడెండ్ చెక్కును అందించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఎల్ఐసీ రూ.2,441.45 కోట్ల మధ్యంతర డివిడెండ్ను అందించింది. తాజాగా అందజేసిన డివిడెండ్తో కలిసి 2023–24లో సంస్థ మొత్తం రూ.6,103.62 కోట్ల డివిడెండ్ను అందించినట్లైంది. ఇక ఐవోసీ రూ.5,091 కోట్ల డివిడెండ్ను కేంద్రానికి సమరి్పంచింది. 2024–25లో ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.10,604.74 కోట్ల డివిడెండ్ అందింది. 2023–24లో డివిడెండ్లు రూ.50,000 కోట్లుకాగా, 2024–25లో ఈ విలువ అంచనాలు రూ.56,260 కోట్లు. -
ఐవోసీ లాభం సగానికి డౌన్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) నికర లాభం సగానికి పైగా క్షీణించింది. రూ. 4,838 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.21 లక్షల కోట్లకు తగ్గింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ. 7 తుది డివిడెండ్ ప్రకటించింది. రూ. 5 మధ్యంతర డివిడెండ్కు ఇది అదనం. పూర్తి సంవత్సరానికి రికార్డు లాభాలు.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ చరిత్రలోనే అత్యధిక లాభాలను ఐవోసీ ప్రకటించింది. రూ. 39,619 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇక ఆదాయం రూ. 9.41 లక్షల కోట్ల నుంచి రూ. 8.71 లక్షల కోట్లకు తగ్గింది. ముడి చమురు శుద్ధికి సంబంధించి ప్రతి బ్యారెల్పై వచ్చే స్థూల రిఫైనింగ్ మార్జిన్ 19.52 డాలర్ల నుంచి 12.05 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినా దేశీయంగా ఇంధనాల ధరలను తగ్గించకుండా దాదాపు రెండేళ్ల పాటు అదే స్థాయిలో కొనసాగించడమనేది ఐవోసీ వంటి కంపెనీలకు లాభించింది. -
లక్షద్వీప్లో రూ.15 మేర తగ్గిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: లక్ష ద్వీప్లో శనివారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.15 మేర తగ్గాయి. దూరంగా ఉన్న దీవులకు ఇంధనం రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు గాను వసూలు చేస్తున్న ప్రత్యేక సెస్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తొలగించడంతో ఈ మేరకు ద్వీప వాసులకు ఊరట లభించింది. లక్షద్వీప్ సముదాయంలోని అండ్రోట్, కల్పెనీ దీవుల్లో పెట్రోల్, డీజిల్ లీటరుపై రూ.15.3 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో రూ.5.2 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో గతంలో లీటరు పెట్రోల్ ధర రూ.105.94 కాగా రూ.100.75కి తగ్గింది. అండ్రోట్, కల్పెనీ దీవుల్లో రూ.116.13గా ఉన్న పెట్రోల్ ధర రూ.100.75కి చేరింది. కవరట్టి, మినికాయ్ దీవుల్లో డీజిల్ ధర 110.91 నుంచి రూ.95.71కి, అండ్రోట్, కల్పెనీల్లో రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గింది. -
మెడ్టెక్ జోన్లో ఎల్సీఎన్జీ స్టేషన్
సాక్షి, విశాఖపట్నం: సౌత్ ఈస్ట్రన్ రీజియన్ పైప్లైన్ (ఎస్ఈఆర్పీఎల్) పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొట్టమొదటి లిక్విఫైడ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (ఎల్సీఎన్జీ) స్టేషన్ను విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్లో ఏర్పాటు చేసింది. ఈ గ్యాస్ స్టేషన్ను ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) బృందం శుక్రవారం ప్రారంభించింది. ఏపీ మెడ్టెక్ జోన్లోని ఎల్సీఎన్జీ హబ్ ద్వారా ఏపీ రీజియన్కు సంబంధించిన సీఎన్జీ అవసరాలను తక్షణమే తీర్చడంతోపాటు నేచురల్ గ్యాస్ లభ్యత, నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు అవకాశం ఉంటుంది. -
ఐవోసీ.. లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్లో నష్టాలను వీడి దాదాపు రూ. 12,967 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. వెరసి ఒక ఏడాదికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఆర్జించిన లాభాల్లో సగానికిపైగా తాజా త్రైమాసికంలో సాధించింది. ఇక గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. చమురు శుద్ధి మార్జిన్లతోపాటు మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడటంతో లాభదాయకత పుంజుకుంది. ఈ కాలంలో ముడిచమురు ధరలు క్షీణించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం ఇందుకు సహకరించింది. దీంతో పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాల ద్వారా రూ. 17,756 కోట్ల పన్నుకుముందు లాభం సాధించింది. గత క్యూ2లో రూ. 104 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది. ఆదాయం డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐవోసీ ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.02 లక్షల కోట్లకు క్షీణించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఐవోసీ రూ. 26,718 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 2021–22 ఏడాదికి సాధించిన రికార్డ్ నికర లాభం రూ. 24,184 కోట్లకంటే అధికంకావడం విశేషం! తొలి ఆరు నెలల్లో ఒక్కో బ్యారల్ స్థూల చమురు శుద్ధి మార్జిన్లు(జీఆర్ఎం) 13.12 డాలర్లుగా నమోదైంది. ఈ కాలంలో ఎగుమతులతో కలిపి మొత్తం 47.65 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించినట్లు కంపెనీ చైర్మన్ ఎస్ఎం వైద్య వెల్లడించారు. క్యూ2లో ఐవోసీ ఇంధనాల ఉత్పత్తి 16.1 ఎంటీ నుంచి 17.72 ఎంటీకి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 90 వద్ద ముగిసింది. -
ఇంధన ఉత్పత్తిలో భారత్ కీలక ముందడుగు.. ఇకపై దిగుమతి అక్కర్లేదు!
ఇంధన ఉత్పత్తిలో భారత్ ముందడుగు వేసింది. ఆటోమొబైల్ పరిశ్రమకు కీలకమైన సూచన ఇంధనాన్ని (రెఫరెన్స్ ఫ్యూయల్) ఆవిష్కరించింది. ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సహకారంతో తన మొదటి రెఫరెన్స్ ఇంధనాన్ని ప్రారంభించింది. రెఫరెన్స్ ఫ్యూయల్ను దేశీయంగా ఉత్పత్తి చేయనున్న మూడవ దేశంగా భారత్ అవతరించింది. దీంతో ఇక రెఫరెన్స్ ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధాపడాల్సిన అవసరం ఉండదు. మనం సాధారణంగా 1,000 కిలోలీటర్ల రెఫరెన్స్ ఇంధనం దిగుమతి చేసుకుంటున్నామని, కానీ వినియోగం కేవలం 150 కిలోలీటర్లు మాత్రమేనని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. త్వరలో ఈ ఇంధనం దిగుమతులను ఆపివేసి, మనం కూడా ప్రధాన ఎగుమతిదారుగా మారనున్నామని ఆయన పేర్కొన్నారు. ఏమిటీ రెఫరెన్స్ ఫ్యూయల్? రెఫరెన్స్ ఫ్యూయల్ అనేది ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా కీలకం. వాహన తయారీదారులు, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు వాహనాలను క్రమాంకనం చేయడానికి, పరీక్షించడానికి 'రిఫరెన్స్' ఇంధనాలను ఉపయోగిస్తాయి. చాలా డబ్బు ఆదా రెఫరెన్స్ ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ పారాదీప్ , పానిపట్ రిఫైనరీలు ఉత్పత్తి చేయనున్నాయి. దిగుమతి చేసుకున్న రిఫరెన్స్ ఫ్యూయల్ లీటరు ధర రూ. 800 నుంచి రూ.850 ఉంటోంది. అదే మన దేశంలోనే ఉత్పత్తి చేయడం వల్ల లీటరు దాదాపు రూ. 500 లోపే వచ్చే అవకాశం ఉంటుంది. -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టర్న్అరౌండ్.. దశాబ్ద కాలంలోనే అత్యధిక లాభం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 13,750 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యధికంకాగా.. పెట్రోల్, డీజిల్పై లాభదాయకత(మార్జిన్లు) మెరుగుపడటం లాభాలకు కారణమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 10,059 కోట్లతో పోల్చినా తాజా లాభం 37 శాతం జంప్చేసింది. వెరసి ఇంతక్రితం 2021–22లో ఆర్జించిన రికార్డ్ వార్షిక లాభం రూ. 24,184 కోట్లలో సగానికిపైగా క్యూ1లో సాధించింది. కాగా.. గతంలో అంటే 2012–13 క్యూ4లో అధిక ఇంధన సబ్సిడీని అందుకోవడం ద్వారా రూ. 14,153 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది క్యూ1లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను నిలిపిఉంచడంతో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సైతం నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 2 శాతం నీరసించి రూ. 2.21 లక్షల కోట్లకు పరిమితమైంది. ప్రతీ బ్యారల్ చమురుపై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 8.34 డాలర్లకు చేరాయి. ఇంధన అమ్మకాలు 0.6 మిలియన్ టన్నులు పెరిగి 21.8 ఎంటీని తాకాయి. ఈ కాలంలో 18.26 ఎంటీ చమురును ప్రాసెస్ చేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 95 వద్ద ముగిసింది. -
భారత్తో రాస్నెఫ్ట్ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఇంధన దిగ్గజం రాస్నెఫ్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మాజీ డైరెక్టర్ జీకే సతీష్ (62)ను బోర్డులో నియమించింది. రాస్నెఫ్ట్ బోర్డులో ఒక భారతీయుని నియా మకం ఇదే తొలిసారి. భారత్తో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని సంస్థ భావిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా నియామకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఓసీలో బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్గా 2021లో జీకే సతీష్ పదవీ విరమణ చేశారు. 11 మంది డైరెక్టర్ల బోర్డులో నియమితులైన ముగ్గురు కొత్తవారిలో జీకే సతీష్ ఒకరని రష్యన్ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. రష్యాలోని చమురు, గ్యాస్ క్షేత్రాలకు సంబంధించి రాస్నెఫ్ట్కు సతీష్ గతంలో పనిచేసిన ఐఓసీతో భాగస్వామ్యం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇతర సంస్థలకు రాస్నెఫ్ట్ క్రూడ్ ఆయిల్నూ విక్రయించింది. ఇటీవలి కాలంలో సంస్థ గుజరాత్ రిఫైనరీలకు నాఫ్తా విక్రయాలనూ ప్రారంభించింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) అమ్మకంసహా భారత్ సంస్థలతో భాగస్వామ్యం విస్తృతం చేసుకోడానికి రాస్నెఫ్ట్ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. -
ఐవోసీ రైట్స్కు బోర్డు ఓకే
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) రైట్స్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 22,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలియజేసింది. ఇటీవల రైట్స్ ఇష్యూకి వెళ్లేందుకు మరో చమురు పీఎస్యూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) బోర్డు సైతం అనుమతినివ్వగా.. నంబర్ వన్ కంపెనీ ఐవోసీ తాజాగా జత కలిసింది. వెరసి రెండు సంస్థలూ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా భారీగా పెట్టుబడులను సమకూర్చుకోనున్నాయి. రైట్స్ జారీ ద్వారా వివిధ ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయాలకు నిధులు సమకూర్చుకోనున్నట్లు ఐవోసీ పేర్కొంది. వెరసి కంపెనీలో ప్రమోటర్గా కేంద్ర ప్రభుత్వం సైతం రైట్స్కు సబ్ర్స్కయిబ్ చేయడం ద్వారా పెట్టుబడులు సమకూర్చనుంది. కర్బన ఉద్గారరహిత ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చమురు పీఎస్యూలకు పెట్టుబడులు అందించే ప్రణాళికల్లో ఉన్న నేపథ్యంలో రైట్స్ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. రూ. 18,000 కోట్లకు సై పీఎస్యూ దిగ్గజం బీపీసీఎల్ బోర్డు గత నెల (జూన్) 28న రైట్స్ ఇష్యూకి అనుమతించింది. తద్వారా కంపెనీ రూ. 18,000 కోట్లు సమీకరించేందుకు గ్రీన్సిగ్నల్ లభించింది. ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో ఇంధన రంగ పీఎస్యూలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్పీసీఎల్లకు మొత్తం రూ. 30,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకునేందుకు ప్రతిపా దించిన సంగతి తెలిసిందే. తద్వారా కర్బన ఉద్గార రహిత సన్నాహాలకు మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. ఇక ఓఎన్జీసీకి మెజారిటీ వాటా గల మరో పీఎస్యూ హెచ్పీసీఎల్.. ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ప్రభుత్వ పెట్టుబడులు సమకూర్చుకునే వ్యూహాల్లో ఉంది. కాగా.. గత నెలలో ఐవోసీ అధీకృత వాటా మూలధనాన్ని రెట్టింపునకు అంటే రూ. 30,000 కోట్లకు పెంచుకున్న సంగతి తెలిసిందే. జేవీ బాటలో దేశీయంగా బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్ నిర్వహించేందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ పేర్కొంది. ఇందుకు బోర్డు తాజాగా అనుమతించినట్లు వెల్లడించింది. సన్ మొబిలిటీ పీటీఈ లిమిటెడ్, సింగపూర్తో సమాన భాగస్వామ్యాన(50:50 శాతం వాటా) ప్రయివేట్ రంగ జేవీకి తెరతీయనున్నట్లు వివరించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంవరకూ రూ. 1,800 కోట్ల ఈక్విటీ పెట్టుబడులతో జేవీని ఏరా>్పటు చేయనున్నట్లు తెలియజేసింది. సొంత అనుబంధ సంస్థ ఐవోసీఎల్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, సింగపూర్లో ఫ్రిఫరెన్స్ షేర్లు, వారంట్ల ద్వారా 78.31 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు సైతం బోర్డు ఓకే చెప్పినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 0.8 శాతం బలపడి రూ. 99.40 వద్ద ముగిసింది. 13న ఎన్ఎస్ఈలో త్రిధ్య లిస్టింగ్ ఐపీవోతో రూ. 26 కోట్లు సమీకరణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థ త్రిధ్య టెక్ ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ నెల 13న లిస్ట్కానుంది. కంపెనీ షేరుకి రూ. 35–42 ధరలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 26.41 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా 62.88 లక్షల షేర్లను విక్రయించింది. జూన్ 30– జూలై 5 మధ్య చేపట్టిన ఇష్యూకి 72 రెట్లు అధిక స్పందన లభించింది. ప్రధానంగా సంస్థాగతేతర, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు కంపెనీ వెల్లడించింది. నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 183 రెట్లు, రిటైలర్ల నుంచి 68 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలైనట్లు కంపెనీ వెల్లడించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 16 రెట్లు అధిక స్పందన నమోదైంది. కాకా ఇండస్ట్రీస్ ఐపీవో 10న షేరుకి రూ. 55–58 ధరల శ్రేణి న్యూఢిల్లీ: పాలిమర్ ఆధారిత ప్రొఫైల్స్ తయారీ కంపెనీ కాకా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 10న(సోమవారం) ప్రారంభంకానుంది. 12న (బుధవారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రే ణి రూ. 55–58కాగా.. చిన్న, మధ్యతరహా సంస్థ ల కోసం ఏర్పాటైన బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫా మ్ ద్వారా లిస్ట్కానుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 36.6 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ.21.23 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. -
దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. తాజాగా ఏవియేషన్ గ్యాస్ (ఏవీ గ్యాస్) ఎగుమతులు ప్రారంభించింది. 80 బ్యారెళ్ల తొలి కన్సైన్మెంట్ను (ఒక్కో బ్యారెల్ 16 కిలోలీటర్లు) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి పపువా న్యూ గినియాకు పంపినట్లు సంస్థ తెలిపింది. నికరంగా ఇంధనాలను దిగుమతి చేసుకునే భారత్ .. ఇలా ఏవీ గ్యాస్ను ఎగుమతి చేయడం ఇదే ప్రథమం. దీనితో అంతర్జాతీయంగా 2.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఏవీ గ్యాస్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు సంస్థ తెలిపింది. మానవరహిత ఏరియల్ వాహనాలు (యూఏవీ), ఫ్లయింగ్ స్కూల్స్ నడిపే చిన్న విమానాలు మొదలైన వాటిల్లో ఏవీ గ్యాస్ను ఉపయోగిస్తారు. పెద్ద వాణిజ్య విమానాల్లో ఉపయోగించే ఇంధనాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)గా వ్యవహరిస్తారు. ఏవీ గ్యాస్ను దేశీయంగా ఉత్పత్తి చేయడం వల్ల విదేశీ మారకం ఆదా కావడంతో పాటు ఔత్సాహిక పైలట్లకు ఫ్లయింగ్ స్కూల్స్లో శిక్షణ వ్యయభారం కూడా తగ్గుతుందని ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య చెప్పారు. అలాగే రక్షణ బలగాలు ఉపయోగించే యూఏవీల నిర్వహణ వ్యయాలు కూడా భారీగా తగ్గగలవని పేర్కొన్నారు. దీన్ని దేశీయంగా ఐవోసీ మాత్రమే తయారు చేస్తోంది. గుజరాత్లోని వడోదరలో గత సెప్టెంబర్లో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ప్లాంటు సామర్థ్యం 5,000 టన్నులుగా ఉంది. చదవండి: ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: 7.1 మిలియన్ల వ్యూస్తో మహిళ వైరల్ స్టోరీ -
నష్టాల్లోనే ఐవోసీ క్యూ2లో రూ. 272 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లోనూ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 272 కోట్లకుపైగా నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,360 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఉత్పత్తి వ్యయాలకంటే తక్కువ ధరల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. ఏప్రిల్–జూన్(క్యూ1)లోనూ కంపెనీ దాదాపు రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి వరుసగా రెండో క్వార్టర్లలో నష్టాలు నమోదు చేసిన రికార్డు సొంతం చేసుకుంది. కాగా.. ప్రస్తుత క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం రూ. 1.69 లక్షల కోట్ల నుంచి రూ. 2.28 లక్షల కోట్లకు ఎగసింది. కాగా.. ప్రభుత్వం ఈ నెల 12న వన్టైమ్ గ్రాంట్కింద మూడు పీఎస్యూ ఇంధన దిగ్గజాలకు ఉమ్మడిగా రూ. 22,000 కోట్లు కేటాయించింది. వీటిలో ఐవోసీకి రూ. 10,081 కోట్లు లభించాయి. ఈ సబ్సిడీని తాజా త్రైమాసికంలో పరిగణించినప్పటికీ నష్టాలు ప్రకటించడం గమనార్హం! మార్జిన్లు అప్ క్యూ2లో బ్యారల్కు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 6.57 డాలర్ల నుంచి 25.49 డాలర్లకు ఎగశాయి. ఇన్వెంటరీ ప్రభావాన్ని మినహాయిస్తే 22.19 డాలర్లుగా నమోదయ్యాయి.పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాలు 18.93 మిలియన్ టన్నుల నుంచి 21.56 ఎంటీకి పుంజుకున్నాయి. అయితే ఎగుమతులు 1.24 ఎంటీ నుంచి 0.86 ఎంటీకి తగ్గాయి. ఈ కాలంలో 16.09 ఎంటీ ముడిచమురును శుద్ధి చేసింది. గత క్యూ2లో ఇవి 15.27 ఎంటీ మాత్రమే. -
కేంద్రం కీలక నిర్ణయం, దేశీ విమానయాన సంస్థలకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై చేస్తున్న వ్యయాలకు అనుగుణంగా విదేశీ సర్వీసులు నడిపే దేశీయ విమానయాన సంస్థల వ్యయాలూ ఉండే కీలక నిర్ణయాన్ని ఆర్థికశాఖ తీసుకుంది. చమురు మార్కెటింగ్ కంపెనీల నుండి కొనుగోలు చేసే ఏటీఎఫ్పై ఎక్సైజ్ సుంకం చెల్లింపుల నుంచి (బేసిస్ ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) దేశీయ విమానయాన సంస్థలను కేంద్రం మినహాయించింది. వివరాల్లోకి వెళితే, జూలై 1వ తేదీన కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ, పెట్రోల్, డీజిల్తోపాటు ఏటీఎఫ్పై 11 శాతం సుంకాన్ని విధించింది. దీనివల్ల అంతర్జాతీయ సర్వీసులు నడిపే విమానయాన సంస్థలపై భారం పడుతుందని పరిశ్రమ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. దీనితో కేంద్రం నుంచి తాజా నిర్ణయం వెలువడింది. అయితే దేశీయంగా నడిపే విమానాలకు ఉపయోగించే ఏటీఎఫ్పై విమానయాన సంస్థలు 11 శాతం ఎక్సైజ్ సుంకం చెల్లింపులు కొనసాగుతాయి. -
రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు
న్యూఢిల్లీ: భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) రెండు మిలియన్ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్కు చెందిన ట్రేడరు విటోల్ ద్వారా రష్యన్ ఉరల్స్ క్రూడాయిల్ను హెచ్పీసీఎల్ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్పీఎల్) కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఉక్రెయిన్ మీద దాడుల కారణం గా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంటుకు లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్కు 20–25 డాలర్ల డిస్కౌంటుతో ఐవోసీ గత వారమే మూడు మిలియన్ బ్యారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యన్ క్రూడాయిల్కు దూరం గా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డాలర్లలో సెటిల్మెంట్.. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాపరంగా ఇంకా ఆంక్షలేమీ విధించనందున.. రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మారకంలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏదీ ప్రస్తుతం లేదు. ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చే సేందుకు, అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది. 2020 నుంచే ఒప్పందాలు.. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో.. భారత్ తన అవసరాలకు సంబంధించి 85% క్రూడ్ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి కూడా భారత్ సరఫరా పెంచుకుంటోంది. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతులపరంగా రష్యా రెండో స్థానంలో ఉంది. యూరప్లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. కానీ, రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో కేవలం 45,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి.. దాదాపు 2 మిలియన్ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ ఆయిల్ కంపెనీతో 2020 ఫిబ్రవరిలోనే ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్లో చమురుకు డిమాండ్ 8% అప్ ఈ ఏడాది 5.15 మిలియన్ బీపీడీకి చేరొచ్చని ఒపెక్ అంచనా న్యూఢిల్లీ: మహమ్మారి ప్రభావాల నుండి ఎకానమీ నెమ్మదిగా పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ఏడాది చమురుకు డిమాండ్ 8.2 శాతం మేర పెరగనుంది. రోజుకు 5.15 మిలియన్ బ్యారెళ్లకు (బీపీడీ) చేరనుంది. ఆయిల్ మార్కెట్ నివేదికలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ ఈ విషయాలు వెల్లడించింది. భారత్లో 2020లో చమురు డిమాండ్ రోజుకు 4.51 మిలియన్ బ్యారెళ్లుగా (బీపీడీ) ఉండగా.. 2021లో 5.61 శాతం పెరిగి 4.76 మిలియన్ బీపీడీకి చేరింది. కరోనా పూర్వం 2018లో ఆయిల్ డిమాండ్ 4.98 మిలియన్ బీపీడీగా, 2019లో 4.99 మిలియన్ బీపీడీగా నమోదైంది. ‘2022లో ఆర్థిక వృద్ధి పటిష్టంగా 7.2 శాతం స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు తోడు సమీప భవిష్యత్తులో ఒమిక్రాన్ను వేగంగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నందున ఆయిల్కు డిమాండ్ మెరుగుపడవచ్చని భావిస్తున్నాం‘ అని ఒపెక్ నివేదిక పేర్కొంది. డీజిల్, నాఫ్తాకు పరిశ్రమల తోడ్పాటు.. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షలను సడలించడంతో దేశీయంగా ప్రయాణాలు, రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం మెరుగుపడుతుండటంతో డీజిల్, ఎల్పీజీ, నాఫ్తాకు డిమాండ్ పెరగగలదని నివేదిక వివరించింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా..?
న్యూఢిల్లీ: రష్యా ఆఫర్కు భారత్ వేగంగా స్పందించడమే కాదు, చౌక చమురుకు ఆర్డర్ కూడా చేసేసింది. అంతర్జాతీయ ధర కంటే చాలా చౌకగా 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఆర్డర్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒక ట్రేడర్ ద్వారా ఈ డీల్ జరిగినట్టు చెప్పాయి. మే నెలకు సంబంధించి ఉరల్స్ క్రూడ్ను.. బ్రెంట్ క్రూడ్ ధర కంటే 20–25 డాలర్లు తక్కువకు ఐవోసీ కొనుగోలు చేసింది. ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో మిత్రదేశమైన భారత్కు మార్కెట్ ధర కంటే తక్కువకు ముడి చమురు సరఫరా చేస్తామంటూ కొన్ని రోజుల క్రితం రష్యా స్వయంగా ఆఫర్ చేయడం గమనార్హం. దీంతో ఐవోసీ మొదటి ఆర్డర్ ఇచ్చింది. దీని కింద విక్రయదారు భారత తీరం వరకు రవాణా చేసి డెలివరీ చేయాల్సి ఉంటుంది. దీంతో రవాణా పరంగా సమస్యలు ఏర్పడినా ఆ బాధ్యత ఐవోసీపై పడకుండా చూసుకుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆరంభించగా..పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించినా, ఆయిల్, ఇతర ఇంధనాలను మినహాయించారు. కనుక ఇంధన కొనుగోలు డీల్స్ ఆంక్షల పరిధిలోకి రావు. -
పట్టణాల్లో గ్యాస్ పంపిణీ, కేంద్ర ప్రభుత్వ సంస్థతో పోటీ పడుతున్న అదానీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), దేశంలో రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ టోటల్ గ్యాస్.. పట్టణ గ్యాస్ పంపిణీ లైసెన్స్ల్లో అత్యధిక ప్రాంతాలకు బిడ్లు దాఖలు చేశాయి. 11వ విడత గ్యాస్ లైసెన్సింగ్లో భాగంగా 61 భౌగోళిక ప్రాంతాలకు (జీఏ) లైసెన్స్ల కోసం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. బిడ్ల వివరాలను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ) గురువారం విడుదల చేసింది. అదానీ టోటల్ గ్యాస్లో అదానీ, ఫ్రాన్స్కు చెందిన టోటల్కు సమాన వాటా ఉంది. 61జీఏలకు గాను ఐవోసీ 53 ప్రాంతాలకు బిడ్లు దాఖలు చేసింది. అదానీ టోటల్ గ్యాస్ 52 జీఏలకు బిడ్ వేసింది. పట్టణ గ్యాస్ పంపిణీలో ఐవోసీతో కలసి అదానీ టోటల్ గ్యాస్కు జాయింట్ వెంచర్ కూడా ఉంది. కానీ, ఈ విడతలో అదానీ–ఐవోసీ సంయుక్తంగా బిడ్లు వేయలేదు. ఛత్తీస్గఢ్లోని నాలుగు జీఏలకు ఒక్క బిడ్ కూడా రాలేదు. ఐస్క్వేర్డ్ క్యాపిటల్కు చెందిన థింక్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ 44జీఏలకు బిడ్లు వేసింది. భారత్ పెట్రోలియం 43 జీఏలకు, గెయిల్కు చెందిన గెయిల్గ్యాస్ 30 ప్రాంతాలకు, హెచ్పీసీఎల్ 37జీఏలకు బిడ్లు సమర్పించింది. ఐవోసీ రూ. 9,028 కోట్ల పెట్టుబడులు ఐవోసీ తాజాగా గుజరాత్లోని ముంద్రా నుంచి హర్యానాలోని పానిపట్ వరకూ క్రూడాయిల్ పైప్లైన్ నిర్మించనుంది. ఇందుకోసం రూ.9,028 కోట్లు వెచ్చిం చనుంది. దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ను గుజరాత్ తీరం నుంచి హర్యానాలో ఉన్న తమ రిఫైనరీకి తరలించడానికి ఈ పైప్లైన్ ఉపయోగపడుతుందని ఐవోసీ తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద ముంద్రాలో ఒక్కోటి 60,000 కిలోలీటర్ల సామర్థ్యం ఉండే 9 క్రూడాయిల్ ట్యాంకులను కూడా ఐవోసీ నిర్మించనున్నట్లు ఐవోసీ వివరించింది. నిర్వహణ అవసరాలతో పాటు దేశీయంగా ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. చదవండి: ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ -
‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లపై ఆయిల్ కంపెనీల దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) చార్జింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మూడు కలసి రానున్న 3–5 ఏళ్లలో 22,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి.. 2070 నాటికి నెట్ జీరో (కాలుష్యం విడుదల పరంగా తటస్థ స్థితికి)కు చేరుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చమురు కంపెనీలు ఈ ప్రణాళికలతో ఉన్నాయి. ఇందులో ఒక్క ఐవోసీనే 10,000 పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ సదుపాయాలను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 7,000 స్టేషన్లలో ఈవీ చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్టు బీపీసీఎల్ ప్రకటించింది. హెచ్పీసీఎల్ 5,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది కాలంలోనే ఐవోసీ 2,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందని.. బీపీసీఎల్, హెచ్పీసీఎల్ చెరో 1,000 స్టేషన్లను ప్రారంభిస్తాయని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి మంగళవారం ప్రకటించారు. ఇటీవలే జరిగిన కాప్26 సదస్సులో భాగంగా నెట్జీరో లక్ష్యాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం తెలిసిందే. -
ఇండియన్ ఆయిల్ మెగా ప్లాంట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ స్థాయిలో మలీక్ అన్హైడ్రైడ్ ప్లాంట్ను రూ.3,681 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. పాలిస్టర్ రెసిన్స్, సర్ఫేస్ కోటింగ్స్ ప్లాస్టిసైజర్స్, అగ్రోకెమికల్స్, లూబ్రికెంట్ అడిటివ్స్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకై హర్యానాలోని పానిపట్ వద్ద ఉన్న సంస్థకు చెందిన రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్ వద్ద ఈ కేంద్రాన్ని స్థాపించనుంది. 54 నెలల్లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఏటా 1,20,000 టన్నుల తయారీ సామర్థ్యంతో ఇది రానుంది. -
ఇండేన్ గ్యాస్ ఫైబర్ సిలిండర్లు
సాక్షి, హైదరాబాద్: తక్కువ బరువుతో తేలికగా, దృఢంగా ఉండే ఫైబర్ గ్యాస్ సిలిండర్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందుబాటులోకి తెచ్చింది. ఫైబర్తో తయారయ్యే ఈ సిలిండర్లు 10, 5 కిలోల గ్యాస్ వేరియంట్లలో ప్రవేశపెట్టింది. సాధారణ సిలిండర్లు ఇనుముతో తయారై, చాలా బరువుగా ఉంటాయి. వాటిలో 14.5 కిలోల గ్యాస్ ఉంటుంది. బరువు ఎక్కువకావడంతో వాటిని తరలించడం ఇబ్బందికరం. పైగా చిలుము పట్టడం, వంట గదిలో నేలపై మరకలు పడటం వంటి సమస్యలు ఉంటాయి. అదే ఫైబర్ సిలిండర్లు తేలికగా ఉంటాయి. మోసుకెళ్లడం సులభం. చిలుము, మరకలు వంటివి ఉండవు. మహిళలు కూడా సులువుగా మార్చుకోవచ్చు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ ఫైబర్ సిలిండర్ను.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ అక్షిత చెన్నంకుట్టి శనివారం హైదరాబాద్లో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందచేశారు. -
టెక్నాలజీ సాయంతో చమురు చోరీ, నిఘాకు ఐవోసీ డ్రోన్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న చమురు పైప్లైన్ల భద్రతకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) డ్రోన్లను రంగంలోకి దింపింది. ఢిల్లీ– పానిపట్ మార్గంలో 120 కిలోమీటర్ల పైప్లైన్పై నిఘా కోసం డ్రోన్ సేవలను ప్రారంభించింది. చమురు దొంగతనాలను నిరోధించడమే కాకుండా, ప్రమాదాలను అరికట్టడం కోసం టెక్నాలజీ వినియోగం అవసరమని సంస్థ భావిస్తోంది. 15,000 కిలోమీటర్ల పరిధిలో సంస్థకు పైపులైన్లు విస్తరించి ఉండగా.. వీటిల్లో లీకేజీలను గుర్తించేందుకు ఇప్పటికే ఎంతో అత్యాధునిక టెక్నాలజీలను వినియోగిస్తోంది. ఇప్పుడు పైపులైన్ల పర్యవేక్షణకు డ్రోన్ల సేవలను కూడా వినియోగించుకోనున్నట్టు ఐవోసీ అధికారులు తెలిపారు. టెక్నాలజీ సాయంతో చమురు చోరీకి సంబంధించి 2020–21లో 34 ప్రయత్నాలను అడ్డుకున్నట్టు, 53 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరోవైపు ఆప్టికల్ఫైబర్ ఆధారిత పైపులైన్ ఇంట్రూజర్ డిటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్ (పీఐడీడబ్ల్యూఎస్)ను ఐవోసీ 5,474 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తోంది. చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
ఇంటి వద్దకు డీజిల్ బల్క్ డెలివరీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) తాజాగా ముంబై, పరిసర ప్రాంతాల్లో ఇంటి వద్దకే బల్క్గా డీజిల్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఇందుకోసం యాప్ ఆధారిత డీజిల్ డోర్ డెలివరీ సేవల సంస్థ హమ్సఫర్ ఇండియా, ఒకారా ఫ్యూయెలాజిక్స్తో చేతులు కలిపింది. త్వరలో మహారాష్ట్రలోని పుణె, నాగ్పూర్, నాసిక్ తదితర నగరాలకు ఈ సర్వీసులు విస్తరించనున్నట్లు ఐవోసీ చీఫ్ జనరల్ మేనేజర్ (మహారాష్ట్ర ఆఫీస్) రాజేశ్ సింగ్ తెలిపారు. డీజిల్ పంపిణీలో ఇదొక వినూత్న విధానమని ఆయన వివరించారు. వ్యవసాయ రంగం, ఆస్పత్రులు, హౌసింగ్ సొసైటీలు, భారీ యంత్రాల కేంద్రాలు, మొబైల్ టవర్లు మొదలైన వాటికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇప్పటిదాకా భారీ మొత్తంలో డీజిల్ కొనుక్కునే (బల్క్) వినియోగదారులు బ్యారెళ్లలో రిటైల్ అవుట్లెట్ల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేదని సింగ్ తెలిపారు. దీని వల్ల గమ్యస్థానానికి చేరేలోగా డీజిల్లో కొంత భాగం కారిపోవడం తదితర సమస్యల వల్ల నష్టపోవాల్సి వచ్చేదని ఆయన వివరించారు. డీజిల్ డోర్ డెలివరీతో ఇలాంటి సమస్యలను పరిష్కరించవచ్చని, బల్క్ కస్టమర్లకు చట్టబద్ధంగా డీజిల్ సరఫరా సాధ్యపడుతుందని సింగ్ పేర్కొన్నారు. -
Indian Oil Corporation: టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 8,781 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అధిక రిఫైనింగ్ మార్జిన్లు దోహదం చేశాయి. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 5,185 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1.39 లక్షల కోట్ల నుంచి రూ. 1.63 లక్షల కోట్లకు ఎగసింది. క్యూ4లో 21.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించింది. గతంలో 20.69 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 1.5 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. జీఆర్ఎం ప్లస్: క్యూ4లో ఐవోసీ ఒక్కో బ్యారల్పై 10.6 డాలర్ల స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) సాధించింది. అంతక్రితం ఏడాది బ్యారల్కు 9.64 డాలర్ల నష్టం నమోదైంది. ఇందుకు ప్రధానంగా చమురు నిల్వల ధరలు ప్రభావం చూపింది. నిల్వల లాభాలను పక్కనపెడితే నికరంగా 2.51 డాలర్ల జీఆర్ఎం సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 21,386 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. మొత్తం ఆదాయం రూ. 5,14,890 కోట్లను తాకింది. 2019–20లో రూ. 5,66,354 కోట్ల అమ్మకాలు సాధించింది. రుణ భారం రూ. 1.16 లక్షల కోట్ల నుంచి రూ. 1.02 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రూ. 28,847 కోట్ల పెట్టుబడి వ్యయాలకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం ఎగసి రూ. 107 వద్ద ముగిసింది. క్యూ4లో అధిక నిల్వలకుతోడు, మెరుగైన రిఫైనింగ్ మార్జిన్లు సాధించడంతో భారీ లాభాలు ఆర్జించాం. గతేడాది క్యూ4లో నిల్వల కారణంగానే నష్టాలు నమోదయ్యాయి. ముడిచమురును ఇంధనంగా మార్చేకాలంలో ధరలు పెరిగితే మార్జి న్లు బలపడతాయి. ఇదేవిధంగా ధరలు క్షీణిస్తే నష్టాలకు ఆస్కారం ఉంటుంది. ఈ క్యూ4లో బ్రెంట్ చమురు ధరలు 23% బలపడ్డాయి. ఏప్రిల్, మే నెలల్లో 50–67 శాతానికి మందగించిన రిఫైనరీల ఉత్పత్తి జూన్ నుంచి 90 శాతానికి ఎగసింది. –ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య చదవండి: గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ -
ఐవోసీ పైప్లైన్ ఆస్తుల విక్రయం!
న్యూఢిల్లీ: ముడిచమురు, పెట్రోలియం ప్రొడక్టుల పైప్లైన్లలో ఒకటి లేదా రెండింటిలో మైనారిటీ వాటాను విక్రయించే వీలున్నట్లు పీఎస్యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఫైనాన్స్ డైరెక్టర్ సందీప్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. అయితే నియంత్రిత వాటాను విక్రయించబోమని స్పష్టం చేశారు. ఆస్తుల విక్రయానికి ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)ను ఒక మార్గంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. పైప్లైన్ మానిటైజేషన్ చేపట్టినప్పటికీ నిర్వాహక కంపెనీగా కొనసాగనున్నట్లు వివరించారు. ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజాలు ఐవోసీ, గెయిల్ ఇండియా, హెచ్పీసీఎల్కు చెందిన పైప్లైన్ ప్రాజెక్టులలో వాటాల విక్రయానికి తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన విషయం విదితమే. తమకుగల భారీ పైప్లైన్ నెట్వర్క్లో ఇన్వెస్ట్ చేసేందుకు పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు గుప్తా చెప్పారు. వెరసి కంపెనీ ఆస్తులకు తగిన విలువ లభించగలదని అభిప్రాయపడ్డారు. ఐవోసీ 14,600 కిలోమీటర్లకుపైగా పైప్లైన్లను కలిగి ఉంది. తద్వారా ముడిచమురును రిఫైనరీలు, ఇంధనంగా వినియోగించే కంపెనీలకు రవాణా చేస్తుంటుంది. కంపెనీ నిర్వహణలో ఇవి కీలకంకావడంతో మైనారిటీ వాటాలు మాత్రమే విక్రయించనున్నట్లు గుప్తా తెలియజేశారు. -
ఇంటి వద్దకే పెట్రోల్, సీఎన్జీ: ప్రధాన్
న్యూఢిల్లీ: డీజిల్ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, పెట్రోల్, సీఎన్జీలను కూడా కస్టమర్ల ఆర్డర్పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించే ప్రతిపాదన ఉన్నట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అన్ని రకాల ఇంధనాలు.. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎల్పీజీ ఒకే చోట లభించే విధంగా నూతన ఇంధన రిటైల్ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలో 56 నూతన సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించే కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో వినియోగదారులు ఇంటి వద్దకే ఇంధనాలను తెప్పించుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 2018 సెప్టెంబర్ నుంచే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో డీజిల్ను మొబైల్ వ్యాన్ ద్వారా ఐవోసీ డెలివరీ చేస్తోంది. అయితే, పెట్రోల్, సీఎన్జీలకు మండే స్వభావం ఎక్కువ కనుక వీటి డోర్ డెలివరీలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. -
మనకు పెట్రో ఊరట లేనట్టే!
న్యూఢిల్లీ: అమెరికాలో ఒకపక్క క్రూడ్ ధర మైనస్లోకి పడిపోయినప్పటికీ... దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రం భారీగా దిగొచ్చే పరిస్థితి లేదా? ప్రభుత్వ రంగ చమురు రిటైలర్లు(ఓఎంసీ) ఇదే మాట చెబుతున్నారు. ఎందుకంటే మనం కేవలం అమెరికా క్రూడ్ను మాత్రమే దిగుమతి చేసుకోమని.. దేశీ ధరలను బ్రెంట్ క్రూడ్(ప్రస్తుతం బ్యారెల్ 25 డాలర్ల స్థాయిలో ఉంది) ఇతరత్రా విభిన్న ప్రామాణిక రేట్ల ప్రకారం నిర్ణయించడమే దీనికి కారణమనేది వారి వాదన. ఇప్పటికే రిఫైనరీలన్నీ భారీ నిల్వలతో నిండిపోయాయని కూడా చెబుతున్నారు. కాగా, కేవలం ఫ్యూచర్స్ ట్రేడింగ్లో మే నెల కాంట్రాక్టులకు డెలివరీ స్టోరేజీ లేకపోవడం వల్లే ఇలా అమెరికా క్రూడ్ ధర మైనస్లోకి కుప్పకూలిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ పేర్కొన్నారు. చమురు ధర ఇలా కనిష్ట స్థాయికి పడిపోవడం స్వల్పకాలంలో ప్రయోజనకరమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో మాత్రం ఆయిల్ ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రూడ్ ఉత్పత్తిదారులకు పెట్టుబడులకు నిధుల్లేక అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలు దిగజారుతాయన్నారు. అయితే, అంతర్జాతీయంగా క్రూడ్ ధర భారీగా పడిపోయినప్పటికీ మార్చి 16 నుంచి ఇప్పటిదాకా మనదగ్గర రిటైల్ చమురు ధరల్లో ఎలాంటి తగ్గింపూ ఎందుకు లేదన్నదానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నిజానికి ధరలు తగ్గించకపోగా, రూ.3 ఎక్సైజ్ సుంకం, బీఎస్–6 ప్రమాణాలంటూ మరో రూ.1 చొప్పున అదనపు భారాన్ని ఈ నెల 1 నుంచి ప్రజలపై ఓఎంసీలు వడ్డించాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ప్రస్తుతం రూ.69.59, డీజిల్ రూ.62.29 రేటుకు విక్రయిస్తున్నారు. -
షట్లర్లకు ఐఓసీ పరీక్షలు
న్యూఢిల్లీ: ఆటలన్నీ అటకెక్కాయి. లాక్డౌనే ముందంజ (పొడిగింపు) వేస్తోంది. స్టేడియాలు మూతపడ్డాయి. రాకెట్స్ ఓ మూలన పడ్డాయి. ఆటగాళ్లు గడపదాటే పరిస్థితి లేదాయే! దీంతో క్రీడల కోటాలో ఉద్యోగాలిచ్చిన సంస్థలు తమ ఆటగాళ్లకు ఆన్లైన్ పరీక్షలు పెడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సంస్థ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ ఖాళీ సమయంలో ఆన్లైన్లో కోర్సు చదివి పరీక్షలు రాయాల్సిందిగా కోరింది. సైబర్ సెక్యూరిటీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మెయింటెనెన్స్ తదితర కోర్సులు చదివి (ఆన్లైన్లో) అసెస్మెంట్ పరీక్షలు రాయాలని సూచించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్లో మహిళల డబుల్స్ కాంస్య పతక విజేత సిక్కి రెడ్డి, సింగిల్స్ ఆటగాడు పారుపల్లి కశ్యప్, డబుల్స్ ప్లేయర్ చిరాగ్ షెట్టి తదితరులు ఐఓసీ సూచించిన అసెస్మెంట్ టెస్టులు రాసే పనిలో పడ్డారు. దీనిపై తెలుగమ్మాయి సిక్కి రెడ్డి మాట్లాడుతూ ‘మాకు కొన్ని కోర్సులు చదివి ఆన్లైన్లో పరీక్షలు రాయాలని ఐఓసీ మెయిల్ చేసింది. నిజంగా ఈ కోర్సులు చాలా ఆసక్తిగా, ఉపయోగకరంగా ఉన్నాయి. రాకెట్తో కసరత్తు, ఫిట్నెస్ కోసం వార్మప్ చేసే నేను ఇప్పుడైతే కోర్సు పూర్తిచేసే పనిలో ఉన్నాను. ఈ నెల 4న కోర్సు మొదలుపెట్టాను. ఇందులో సుమారు 40 నుంచి 50 టాపిక్స్ ఉంటాయి. కొన్ని 15 నిమిషాల్లో పూర్తయితే మరికొన్నింటికి 45 నిమిషాలు పడుతుంది. ఆ వెంటే పరీక్షలు కూడా రాయాలి. ఇందులో పాస్ కావాలంటే 80 శాతం మార్కులు రావాలి’ అని వివరించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ మాట్లాడుతూ ‘ఈ కోర్సు మెటీరియల్ చదివి తీరాలన్నంతగా ఆసక్తిగా ఉంది. ఐఓసీ కంపెనీ చేసే ప్రాసెసింగ్పై మాకు అవగాహన కల్పించేలా ఉంది. ఇంధన వనరుల ఉత్పాదకత, దీనికోసం తీసుకునే భద్రత చర్యలు, పెట్రోల్ బంకుల నిర్వహణ తీరు తెలిసింది. ఈ కోర్సుల ఆలోచన చాలా మంచి నిర్ణయం. పూర్తిస్థాయి అథ్లెట్లమైన మాకు ఇది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల తెలియని విషయాలు నేర్చుకునే వీలు దొరికింది’ అని అన్నాడు. చిరాగ్ షెట్టి కూడా కోర్సులోని పాఠ్యప్రణాళిక, ఆన్లైన్ పరీక్షలు చాలా బాగున్నాయని చెప్పాడు. మహ మ్మారి విలయతాండవంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అన్ని టోర్నీలను జూలై వరకు రద్దు చేసింది. -
షాకింగ్ : వంటగ్యాస్ ధరకు రెక్కలు..
సాక్షి, న్యూఢిల్లీ : సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర బుధవారం వరసగా ఆరోసారి ఎగబాకింది. మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు వరుసగా రూ 144.5, రూ 145 వరకూ పెంచినట్టు ఇండేన్ బ్రాండ్ నేమ్తో వంటగ్యాస్ను సరఫరా చేసే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. తాజా పెంపుతో సబ్సిడీయేతర ఎల్పీజీ రేట్లు ఢిల్లీలో రూ 858, ముంబైలో రూ 829, చెన్నైలో రూ 881, కోల్కతాలో రూ 896కు పెరిగాయి. కాగా ఏటా 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీకి అందచేస్తుండగా, అదనపు సిలిండర్ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు, రూపాయి మారకం రేటు ఆధారంగా ప్రభుత్వం నెలవారీ సబ్సిడీలను వినియోగదారులకు అందిస్తోంది. -
నాన్ సబ్సిడీ సిలిండర్పై రూ.100 తగ్గింపు
న్యూఢిల్లీ: సబ్సిడీయేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ఆదివారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ రేట్లు తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో రూ. 737.50గా ఉన్న సిలిండర్ ఇప్పుడు రూ. 637కు తగ్గనుంది. ఢిల్లీలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 494.35గా ఉంది. ఇలా ఉండగా, జూన్ 22న పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన బీజేపీ మళ్లీ ప్రజలను మోసం చేయడం ప్రారంభించిందని కాంగ్రెస్ ఆరోపించింది. -
సిటీ గ్యాస్ బిడ్డింగ్లో ఐవోసీ టాప్
న్యూఢిల్లీ: నగరాల్లో గృహాలకు పైపుల ద్వారా వంట గ్యాస్, వాహనాలకు సీఎన్జీ సరఫరా కోసం నిర్వహించిన పదో విడత లైసెన్సుల వేలంలో ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) అత్యధిక స్థాయిలో బిడ్లు దాఖలు చేసింది. అదానీ గ్రూప్, హిందుస్తాన్ పెట్రోలియం, ఇంద్రప్రస్థ గ్యాస్ మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పెట్రోలియం, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ (పీఎన్జీఆర్బీ) వెల్లడించిన వివరాల ప్రకారం ఐవోసీ మొత్తం 35 నగరాల్లో సొంతంగా, అదానీ గ్యాస్ భాగస్వామ్యంతో మరో ఏడు నగరాల్లో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకుంది. అదానీ గ్యాస్ సొంతంగా 19 నగరాలకు, ఐవోసీ భాగస్వామ్యంతో ఏడు నగరాలకు బిడ్లు వేసింది. ప్రభుత్వ రంగ గెయిల్ గ్యాస్ ప్రాంతాలకు బిడ్స్ దాఖలు చేసింది. పదో విడతలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు సహా మొత్తం 50 నగరాలకు బిడ్డింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 7–9 మధ్యలో బిడ్లు తెరిచారు. 14 రాష్ట్రాల్లో 124 జిల్లాలకు ఈ లైసెన్సుల ద్వారా సేవలు అందించవచ్చు. -
150 కోట్ల డాలర్లు సమీకరించనున్న ఐఓసీ
ముంబై: దేశీయ అతి పెద్ద ఆయిల్ మార్కెటింగ్, రిఫైనింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అంతర్జాతీయ బాండ్ మార్కెట్ నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనుంది. ఈ కంపెనీ అమెరికా డాలర్ డినామినేషన్ నోట్ల ద్వారా 75 కోట్ల డాలర్ల నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనున్నదని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ బాండ్ల కాలపరిమితి వెల్లడి కాలేదు. అయితే ఈ బాండ్లకు మూడీస్ సంస్థ బీఏఏ2 రేటింగ్ను, ఫిచ్ రేటింగ్స్ సంస్థ ట్రిపుల్ బి మైనస్ రేటింగ్ను ఇచ్చాయి. వాటాదారుల రాబడులు, మూలధన పెట్టుబడులు అధికంగా ఉన్నా, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ రుణాత్మకంగా ఉన్నప్పటికీ, ఐఓసీకి మంచి రేటింగే ఇచ్చామని మూడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ హలన్ చెప్పారు. ఇటీవలే ఈ కంపెనీ రూ.12,300 కోట్ల షేర్ల బైబ్యాక్ను ప్రకటించిందని, నికర రుణాలను మరింతగా పెంచిందని ఆయన గుర్తు చేశారు. ఐఓసీకి ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో తోడ్పాటు అందుతోందని ఫిచ్ రేటింగ్స్ సంస్థ పేర్కొంది. -
సబ్సిడీ సిలిండర్పై రూ.5.91 కోత
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు ఎల్పీజీ వినియోగదారులకు మరోసారి ఊరటనిచ్చాయి. సబ్సిడీ ఉన్న సిలిండర్పై రూ.5.91, సబ్సిడీలేని సిలిండర్పై రూ.120.50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ధరల తగ్గుదల నేపథ్యంలో ఢిల్లీలో 14.2 కేజీల బరువున్న సబ్సిడీ సిలిండర్ రూ.494.99కు, సబ్సిడీలేని సిలిండర్ రూ.689కు అందుబాటులోకి రానుంది. ఈ తగ్గింపు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం ధరల్లో తగ్గుదలతో పాటు రూపాయి మారకం విలువ బలపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. -
12 శాతం తగ్గిన ఐఓసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.3,246 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,696 కోట్లతో పోలిస్తే 12.6 శాతం తగ్గిపోయింది. విదేశీ మారక నష్టాలు, చమురు రిఫైనరీ మార్జిన్లు తగ్గుదల నికర లాభానికి చిల్లు పెట్టాయి. షేరు వారీ ఆర్జన రూ.3.90గా ఉంది. అమ్మకాలపై ఆదాయం ఏకంగా 48 శాతం పెరిగి రూ.1,32,357 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.89,499 కోట్లుగా ఉంది. ఫారెక్స్ నష్టాలు రూ.2,600 కోట్లు రూపాయి విలువ పడిపోవడం వల్ల ఈ త్రైమాసికంలో తాము రూ.2,600 కోట్లను విదేశీ ఎక్సేంజ్ రూపంలో నష్టపోయినట్టు ఐవోసీ చైర్మన్ సంజీవ్ సింగ్ మీడియాకు తెలిపారు. చమురు ధరలు పెరగడం, రుణాలను తిరిగి చెల్లించడం కూడా దీనికి తోడయ్యాయని చెప్పారు. విదేశీ ఎక్సేంజ్ నష్టం అన్నది... ఓ కంపెనీ తాను ఒక డాలర్ను రుణంగా తీసుకున్నప్పుడు రూపాయి మారకం విలువ రూ.70 ఉందనుకుంటే, తిరిగి చెల్లించే సమయానికి అంతకంటే దిగజారితే అధికంగా చెల్లించడం వల్ల ఎదురయ్యే నష్టం. అలాగే, ముడి చమురును కొనుగోలు చేసి, ఆ తర్వాత 15–30 రోజులకు చెల్లింపులు చేసే సమయానికి కరెన్సీ విలువ దిగజారినా గానీ నష్టం ఎదురవుతుంది. రిఫైనరీ మార్జిన్ 6.79 డాలర్లు ప్రతీ బ్యారెల్ ముడి చమురు శుద్ధి చేసి ఇంధనంగా మార్చడంపై 6.79 డాలర్ల మార్జిన్ను కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్లో ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మార్జిన్ 7.98 డాలర్లుగా ఉంది. ఇన్వెంటరీ రూపంలో రూ.4,408 కోట్ల లాభం రావడంతో ఫారెక్స్ నష్టాలను కంపెనీ అధిగమించగలిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇన్వెంటరీ లాభాలు కేవలం రూ.1,056 కోట్లుగానే ఉన్నాయి. ఇన్వెంటరీ లాభాలు అంటే... ముడి చమురును కొన్న ధర నుంచి... దాన్ని ఇంధనంగా మార్చి విక్రయించే ధర ఎక్కువ ఉంటే వచ్చే లాభం. అయితే, క్వార్టర్ వారీగా (క్రితం క్వార్టర్తో) చూసుకుంటే ఇన్వెంటరీ లాభాలు 44 శాతం తగ్గడం గమనార్హం. క్యూ2లో బ్రెంట్ క్రూడ్ సగటున 75.89 డాలర్లుగా ఉంది. క్రితం క్వార్టర్తో పోలిస్తే ఒక శాతం ఎక్కువ. ఆరు నెలల్లో రూ.10,078 కోట్లు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్ధ సంవత్సరంలో చూసుకుంటే ఐవోసీ నికర లాభం రూ.10,078 కోట్లు, ఆదాయం రూ.3,01,313 కోట్లుగా ఉన్నాయి. స్థూల రిఫైనరీ మార్జిన్ 8.45 డాలర్లు కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.08 డాలర్లే. -
ఆల్టైమ్ గరిష్టానికి పెట్రోల్
న్యూఢిల్లీ: సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్ ధరలు సోమవారం ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.91 మార్క్ను దాటింది. ముంబైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఔట్లెట్లలో లీటర్ పెట్రోల్ రూ.91.08 ఉండగా, డీజిల్ రూ.79.72కు చేరుకుంది. ఇక, భారత్ పెట్రోలియం లిమిటెడ్ (బీపీఎల్) ఔట్లెట్లలో పెట్రోల్ రూ.91.15 కాగా, డీజిల్ రూ.79.79గా ఉంది. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవటంతో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగటంతో ఆయిల్ కంపెనీలు సోమవారం లీటర్ పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 30 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.73, డీజిల్ రూ.75.09కు చేరుకొని రికార్డు సృష్టించాయి. గడచిన 6 వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.6.59, డీజిల్ 6.37 రూపాయలు పెరగటం గమనార్హం. -
ఫార్చ్యూన్–500లో ఏడు భారత కంపెనీలు
న్యూయార్క్: ఫార్చ్యూన్–500 తాజా జాబితాలో భారత్ నుంచి ఏడు కంపెనీలకు చోటు లభించింది. భారత్ నుంచి అత్యంత విలువైన కంపెనీగా (ఆదాయం పరంగా) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మరోసారి నిలిచింది. 2017లో 168వ స్థానంలో ఉన్న ఐవోసీ 65.9 మిలియన్ డాలర్ల ఆదాయం ఉన్న కంపెనీగా ఈ ఏడాది జాబితాలో 137కు చేరుకుంది. భారతదేశ సంపన్న పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన ఆర్ఐఎల్ గతేడాది 203వ ర్యాంకులో ఉండగా, 62.3 బిలియన్ డాలర్ల ఆదాయంతో 53 స్థానాలను మెరుగుపరుచుకుని 148వ స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్మార్ట్ ఉంది. 47.5 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఓఎన్జీసీ మరోసారి ఫార్చ్యూన్ జాబితాలో చోటు సంపాదించుకుంది. 197 ర్యాంకు సొంతం చేసుకుంది. 47.5 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన ఎస్బీఐకి 216వ ర్యాంకు కేటాయించింది. టాటా మోటార్స్ గతేడాది 247వ స్థానంలో ఉంటే కాస్త మెరుగుపడి 232కు వచ్చింది. బీపీసీఎల్ 314వ స్థానంలో (గతేడాది 360వ ర్యాంకు), రాజేష్ ఎక్స్పోర్ట్స్ 405వ ర్యాంకు (గతేడాది 295వ స్థానంలో)లో ఉన్నాయి. ఈ జాబితాలో అత్యంత లాభదాయకత కలిగిన భారతీయ కంపెనీగా ఆర్ఐఎల్ అగ్ర స్థానంలో ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా అధిక లాభాలు కలిగిన కంపెనీల జాబితాలో ఆర్ఐఎల్ 99వ స్థానంలో ఉంది. చైనాకు చెందిన స్టేట్గ్రిడ్, సినోపెక్ గ్రూపు, చైనా నేషనల్ ప్రెటోలియం కార్ప్ టాప్–10లో నిలిచాయి. -
ఎల్పీజీ ధరలకు మళ్లీ రెక్కలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఎల్పీజీ ధరల్ని పెంచాయి. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న ఒక్కో ఎల్పీజీ సిలిండర్పై రూ.2.71 పెంచినట్లు ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) శనివారం తెలిపింది. ఒక్కో సబ్సిడీయేతర సిలిండర్పై రూ.55.50 పెంచింది. తాజా పెంపుతో ఢిల్లీలో సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.493.55కు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. సవరించిన ఎల్పీజీ(సబ్సిడీలేని) ధరలపై జీఎస్టీ విధించడంతోనే తాజాగా గ్యాస్ ధరలు పెరిగాయని ఐవోసీ తెలిపింది. అంతర్జాతీయంగా సహజవాయువు ధరల పెంపు, డాలర్తో రూపాయి విలువ బలహీనపడటం ఇందుకు మరో కారణం. -
పెట్రోల్ ధరలపై అతిపెద్ద తగ్గింపు నేడే
న్యూఢిల్లీ : 16 రోజుల పాటు వరుసగా వినియోగదారులకు వాత పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు... గత 10 రోజుల నుంచి మెల్లమెల్లగా తగ్గింపు బాట పట్టాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ తగ్గింపు గత 10 రోజుల్లో పెట్రోల్ ధరలపై చేపట్టిన తగ్గింపులో అతిపెద్ద తగ్గింపని తెలిసింది. లీటరు పెట్రోల్పై 21 పైసలు, లీటరు డీజిల్పై 15 పైసలు తగ్గించినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో 21 పైసలు తగ్గి 77.42గా... లీటరు డీజిల్ ధర 15 పైసలు తగ్గి 68.58గా నమోదైంది. నేడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్లో నమోదైన డేటాలో లీటరు పెట్రోల్ ధర ముంబైలో రూ.85.45గా, కోల్కతాలో రూ.80.28గా, చెన్నైలో రూ.80.59గా ఉన్నాయి. అదేవిధంగా డీజిల్ ధరలు కూడా ముంబైలో రూ.73.17గా, కోల్కతాలో రూ.71.28గా, చెన్నైలో రూ.72.56గా ఉన్నాయి. కాగ, గత 10 రోజుల్లో మొత్తం పెట్రోల్ ధర రూపాయి మేర తగ్గింది. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఇదే అతిపెద్ద కోత అని తెలిసింది. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకి తీసుకురావాలని, దీంతో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులను తేలికగా గమనించవచచ్చని కేంద్ర ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చెప్పిన ఒక్కరోజులోనే, ఆయిల్ కంపెనీలు పెట్రోల్పై భారీగా కోత పెట్టాయి. మరోవైపు అంతర్జాతీయంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుండటంతో, దేశీయంగానూ ఆ ప్రభావం కనిపిస్తోంది. తొలుత ఒక్క పైసా, ఐదు పైసలు అలా తగ్గించిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కాస్త పెంచి, రెండకెల్లో ధరలను తగ్గించాయి. కర్ణాటక ఎన్నికల అనంతరం వరుసగా 16 రోజుల పాటు ఎడతెరపి లేకుండా పెరుగుతూనే పోయిన పెట్రోల్, డీజిల్ ధరలు, గత 10 రోజుల నుంచి మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. -
అత్యంత లాభదాయక పీఎస్యూ ఐవోసీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోకెల్లా (పీఎస్యూ) అత్యంత లాభసాటి కంపెనీగా చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) అగ్రస్థానంలో నిల్చింది. దీంతో ప్రభుత్వ రంగ చమురు ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీని అధిగమించి వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిల్చినట్లయింది. టర్నోవరుపరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీగా ఉంటున్న ఐవోసీ.. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 21,346 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఓఎన్జీసీ రికార్డు లాభాలతో చాన్నాళ్ల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. ఒక దశలో ప్రభుత్వ రంగానికి చెందిన మొత్తం మూడు చమురు మార్కెటింగ్ కంపెనీల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) నికర లాభాలన్నింటినీ మించిన స్థాయిలో ఓఎన్జీసీ లాభాలు ఉండేవి. కానీ మూడేళ్ల క్రితం అత్యంత లాభసాటి కంపెనీ హోదాను రిలయన్స్, టీసీఎస్లకు సమర్పించుకుంది. వరుసగా మూడోసారి రిలయన్స్.. ఇక దేశీయంగా అన్ని కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటే ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానం దక్కించుకుంది. ఈ సంస్థ ఏకంగా రూ. 36,075 కోట్ల నికర లాభం ప్రకటించింది. అటు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. రూ. 25,880 కోట్ల నికర లాభంతో దేశంలో అత్యంత లాభదాయక కంపెనీల జాబితాలో రెండో స్థానంలో నిల్చింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి
న్యూఢిల్లీ : వరుసగా 16 రోజుల నుంచి వినియోగదారులకు వాతలు పెడుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త ఉపశమనం కల్పించాయి. దేశంలో అతిపెద్ద ఫ్యూయల్ రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇంధన ధరలను తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర బుధవారం 60 పైసలు తగ్గి, రూ.77.83గా నమోదైంది. డీజిల్ ధర కూడా 56 పైసలు తగ్గి రూ.68.75గా రికార్డైంది. మిగతా నగరాల్లో కూడా లీటరు పెట్రోల్ ధర.. కోల్కత్తాలో రూ.80.47కు, ముంబైలో రూ.85.65కు, చెన్నైలో రూ.80.80కు, హైదరాబాద్లో రూ.82.45కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్ ధర కోల్కతాలో రూ.71.30గా, ముంబైలో రూ.73.20గా, చెన్నైలో రూ.72.58గా, హైదరాబాద్లో రూ.74.73గా రికార్డయ్యాయి. స్థానిక పన్నుల నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోనూ ఈ ధరలు వేరువేరుగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగుస్తూనే సరికొత్త స్థాయిలను తాకుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ ధరలు రికార్డు గరిష్టాలకు కూడా చేరకున్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్తబ్ధుగా ఉన్న ఈ ధరలు, గత 16 రోజుల నుంచి మళ్లీ చుక్కలు చూపించడం ప్రారంభించాయి. ఇంధన ధరలు పెరగడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ ధరల పెంపుకు అడ్డుకట్ట వేసేందుకు తాము దీర్ఘకాలిక పరిష్కారాన్ని వెతుకుతామని ఓ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా కూడా ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ధరలు తగ్గించినట్టు తెలిసింది. ఇంధన సరఫరాపై విధించిన ఆంక్షలను తొలగించి, సరఫరాను పెంచుతామని రష్యా చెప్పడంతో, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. 60 పైసలు కాదా? ఒక్క పైసా మాత్రమేనా..! అయితే నిన్నటికీ నేటికి పెట్రోల్ ధర 60 పైసలు, డీజిల్ ధర 56 పైసలు తగ్గిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తొలుత చూపించిన డేటాలో మార్పులు చోటు చేసుకున్నట్టు తెలిసింది. గంటల వ్యవధిలోనే ఈ ధర తగ్గింపు కేవలం 1 పైసా మాత్రమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. 1 పైసా అయినా.. 60 పైసలు అయినా.. ధరలు మాత్రం అవేనని తెలిపింది. -
17 రోజుల్లో 14 సార్లు పెంపు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పైపైకి ఎగుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పైకి ఎగిశాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర నాలుగేళ్ల గరిష్టానికి చేరగా.. డీజిల్ ధర కూడా రికార్డు స్థాయికి చేరింది. గత 17 రోజుల్లో ఇప్పటి వరకు 14 సార్లు ఈ ధరలు పెరిగినట్టు తెలిసింది. 2018 మార్చి 18 నుంచి కొనసాగింపుగా ఈ ధరలు పెరుగుతూనే ఉన్నాయని వెల్లడైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం నేడు పెట్రోల్ ధరలు ఢిల్లీలో లీటరు రూ.73.95 ఉండగా.. కోల్కత్తాలో రూ. 76.66గా, ముంబైలో రూ.81.8గా, చెన్నైలో రూ.76.72గా రికార్డయ్యాయి. డీజిల్ ధరలు కూడా ఢిల్లీలో లీటరుకు రూ.64.82గా, కోల్కత్తాలో రూ.67.51గా, ముంబైలో రూ.69.02గా, చెన్నైలో రూ.68.38గా నమోదయ్యాయి. 2017 జూన్లో రోజువారీ సమీక్ష చేపట్టినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా.. పెరుగుతూనే ఉన్నాయి.క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాటు, రూపాయి-డాలర్ ఎక్స్చేంజ్ రేటు, దేశీయంగా పెట్రోల్, డీజిల్పై ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని తెలిసింది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 70 డాలర్లకు చేరుకుంది. మంగళవారం కూడా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశీయంగా పెట్రల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలను చేరుకున్నాయని వెల్లడైంది. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు గరిష్టాలను చేరుతుండటంతో, వెంటనే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వెనువెంటనే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై విముఖత వ్యక్తం చేస్తోంది. గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య కాలంలో తొమ్మిది సార్లు ఎక్సైజ్ డ్యూటీలు పెంచిన ప్రభుత్వం, ధరలు పెరుగుతున్నప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రమే ఎక్సైజ్ డ్యూటీను తగ్గించింది. దీంతో ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించకుండా... వినియోగదారులపై భారం మోపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నేటి నుంచి ఢిల్లీలో అల్ట్రా క్లీన్ పెట్రోల్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అన్ని పెట్రోల్ బంకుల్లో అల్ట్రా క్లీన్ యూరో–6 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ను ఆదివారం (ఏప్రిల్ 1) నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశ రాజధానిలో పెరిగిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అల్ట్రా క్లీన్ పెట్రోల్ను సాధారణ ధరలకే విక్రయించనున్నారు. నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్తోపాటు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి 13 పెద్ద నగరాల్లో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2020 ఏప్రిల్ నుంచి అల్ట్రా క్లీన్ ఇంధనం అందుబాటులోకి రానుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ బీవీ రమ గోపాల్ మాట్లాడుతూ.. బీఎస్–6 (యూరో–6కు సరిసమానమైన) పెట్రోల్ను రాష్ట్రంలోని 391 బంకుల్లో విక్రయించనున్నట్లు వెల్లడించారు. అల్ట్రా క్లీన్ కోసం సాధారణ పెట్రోల్ కంటే 50 పైసలు ఎక్కువగా కంపెనీలు ఖర్చు చేయాల్సి వస్తోందని, వినియోగదారులపై ఇప్పటికిప్పుడు ఆ భారం మోపే ఉద్దేశం లేదని చెప్పారు. ఢిల్లీలో ఏడాదికి 9.6 లక్షల టన్నుల పెట్రోల్, 12.65 లక్షల టన్నుల డీజిల్ వినియోగమవుతోంది. ఉత్తరప్రదేశ్లోని మథుర, హర్యానాలోని పానిపట్, మధ్యప్రదేశ్లోని బినా, పంజాబ్లోని భటిండా రిఫైనరీలు ఇప్పటికే యూరో–6 పెట్రోల్ ఉత్పత్తిని ప్రారంభించాయి. -
ఆయిల్ బంకుల ఆకస్మిక సమ్మె
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై విధించిన అదనపు వ్యాట్ తగ్గింపుపై జరుగుతున్న జాప్యం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు, పెట్రో డీలర్లకు మధ్య గొడవకు దారితీసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) కొనుగోళ్లకు సంబంధించి అధిక టార్గెట్లను విధిస్తోందంటూ ఐవోసీ పెట్రోల్ బంకు డీలర్లు బుధవారం రాత్రి నుంచి ఆకస్మిక సమ్మెకు దిగారు. లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేయనందుకు ఐవోసీ ఒకటో తేదీన డీలర్లకు ఆయిల్ సరఫరా నిలిపివేసిందని, దీనికి నిరసనగా తాము ఐవోసీ పెట్రోల్ బంకులను మూసివేసి సమ్మెకు దిగినట్లు నారాయణ ప్రసాద్ తెలిపారు. రంగంలోకి దిగిన ఐవోసీ అధికారులు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు డీలర్లు చెప్పారు. ఆయిల్ కంపెనీల సవరణలపై న్యాయపోరాటం సాక్షి, హైదరాబాద్: కనీస వేతనాల చెల్లింపు, సౌకర్యాలు లేకుంటే జరిమానాల విధింపుపై ఆయిల్ కంపెనీలు తెచ్చిన సవరణలను సవాల్ చేస్తూ ఉభయ రాష్ట్రాల పెట్రోల్ డీలర్ల సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఇరు రాష్ట్రాలతో పాటు కేంద్రం, ఆయిల్ కంపెనీలను ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులిచ్చింది. -
ఐవోసీకి ఇన్వెంటరీ నష్టాలు
► క్యూ1లో లాభం 45 శాతం క్షీణత ► రూ.4,548 కోట్లు న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) జూన్ త్రైమాసికంలో లాభం 45 శాతం తగ్గింది. ఇన్వెంటరీ నష్టాలు రిఫైనరీ మార్జిన్లను మింగేయడంతో లాభం 4,548 కోట్లకు పరిమితమైంది. షేరువారీ ఆర్జన రూ.9.60గా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.8,269 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం మాత్రం 1,07,671 కోట్ల నుంచి రూ.1,29,418 కోట్లకు పెరిగింది. లాభంలో ఈ వ్యత్యాసం ఇన్వెంటరీ నష్టాల వల్లనేనని ఐవోసీ చైర్మన్ సంజీవ్సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనం కావడంతో, దేశీయంగా చమురు నిల్వలపై రూ.4,042 కోట్లను నష్టపోవాల్సి వచ్చింది. క్రూడ్ ఆయిల్పై రూ.2,033 కోట్లు, ఉత్పత్తులపై రూ.2,009 కోట్ల నష్టాలు వచ్చాయి. చమురును కొనుగోలు చేసిన తర్వాత, దాన్ని శుద్ధి చేసి మార్కెటింగ్ చేసే సమయంలో ధర తగ్గితే ఏర్పడే నష్టాలను ఇన్వెంటరీ నష్టాలుగా పేర్కొంటారు. ఒకవేళ కొనుగోలు చేసిన తర్వాత విక్రయించే ధర అధికంగా ఉంటే ఇన్వెంటరీ లాభాలుగా చూపుతారు. ఇక ఒక్కో బ్యారెల్ చమురు శుద్ధిపై 4.32 డాలర్లను మార్జిన్గా పొందింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో మార్జిన్ 9.98 డాలర్లు కావడం గమనార్హం. 20.736 మిలియన్ టన్నుల ఇంధనాన్ని జూన్ క్వార్టర్లో దేశీయ మార్కెట్లో విక్రయించినట్టు సంజీవ్సింగ్ తెలిపారు. విదేశీ మార్కెట్లలో 1.772 మిలియన్ టన్నుల విక్రయాలు జరిగినట్టు చెప్పారు. కిరోసిన్ను మార్కెట్ ధరకంటే తక్కువకు విక్రయించడం వల్ల ప్రభుత్వం నుంచి రూ.876 కోట్ల సబ్సిడీ భారం పడింది. కంపెనీ రుణభారం జూన్ క్వార్టర్లో రూ.54,820 కోట్ల నుంచి రూ.34,922 కోట్లకు తగ్గడం సానుకూలాంశం. -
ఐఓసీ లాభం రూ.3,995 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొ.(ఐఓసీ). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.3,995 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో సాధించిన నికర లాభం(రూ. 3,096 కోట్లు)తో పోల్చితే 29 శాతం వృద్ధి సాధించామని ఐఓసీ తెలిపింది.రిఫైనరీ మార్జిన్లు, ఇన్వెంటరీ లాభాలు అధికంగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ స్థాయి నికర లాభం సాధించామని కంపెనీ డైరెక్టర్(ఫైనాన్స్) ఏ.కె. శర్మ చెప్పారు. ఒక్కో షేర్కు రూ.13.5 (135 శాతం) మధ్యంతర డివిడెండ్ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. తమ కంపెనీలో ప్రభుత్వానికి 58.28 శాతం వాటా ఉండటంతో రూ.3,821 కోట్ల డివిడెండ్ ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుందని తెలిపారు. 7.79 డాలర్లకు జీఆర్ఎమ్ ఒక్కో బ్యారెల్ ముడి చమరును ఇంధనంగా మార్చే విషయంలో 7.79 డాలర్ల స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎమ్) సాధించామని శర్మ వివరించారు. గత క్యూ3లో జీఆర్ఎమ్ 5.96 డాలర్లని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్వెంటరీ లాభాలు కూడా పెరిగాయని వివరించారు. గత క్యూ3లో రూ.4,485 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని, అయితే ఈ క్యూ3లో మాత్రం రూ.3,050 కోట్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయని పేర్కొన్నారు. మొత్తం అమ్మకాలు రూ.96,783 కోట్ల నుంచి రూ.1,15,161 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఓసీ షేర్ 3 శాతం క్షీణించి రూ.366 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి దూకిన ఇండియన్ ఆయిల్
దేశీయ చమురు, సహజవాయువుల సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నష్టాలకు చెక్ పెట్టి, లాభాలోకి దూకింది. దలాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ తో ముగిసిన క్వార్టర్లో రూ.3,122 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ రూ.450 కోట్ల నికర నష్టాలను మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రథమార్థంలో మొత్తం ఆదాయాలను కూడా రూ.101,128 కోట్లగా నమోదుచేసింది. 2015 ఆర్థికసంవత్సరం ప్రథమార్థంలో ఈ ఆదాయాలు రూ.97,771.6 కోట్లగా ఉన్నాయి. కాగ, గతేడాది ప్రథమార్థంలో ఉన్న రూ.6,141 కోట్ల నికరలాభాలను ఏకంగా రూ.11,391 కోట్లకు ఇండియన్ ఆయిల్ పెంచుకోగలిగింది. అయితే గత క్వార్టర్ కంటే కంపెనీ లాభాలు 62 శాతం తక్కువగానే నమోదయ్యయి. ఏప్రిల్-సెప్టెంబర్ క్వార్టర్లో సగటు స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎమ్) లేదా రిఫైనింగ్ క్రూడ్ ఆయిల్పై రాబడులను బ్యారెల్కు 7.19డాలర్లు ఆర్జించింది. 2015 ఇదే క్వార్టర్లో ఇవి 5.76 డాలర్లుగా నమోదయ్యాయి. మార్కెట్ సమయంలో ఈ ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ స్టాక్ కొంత క్షీణించింది. 9.65 పాయింట్లు పడిపోయి 312.40 రూపాయలుగా నమోదైంది. -
ఎల్ పీజీ సిలిండర్ ధర ఎంత తగ్గిందో తెలుసా?
న్యూఢిల్లీ : రాయితీ లేని కుకింగ్ గ్యాస్(ఎల్ పీజీ) సిలిండర్ ధర తగ్గిందట. అంతర్జాతీయ పరిణామాలతో ఒక్కో సిడిండర్ పై రూ.11 కోత పడిందని తెలిసింది. రూ.548.50 లభ్యమయ్యే సిలిండర్, ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.537.50 లకే అందుబాటులో ఉంటుందట. ఇంధన రిటైలర్లు జరిపిన జెట్ ఇంధన, రాయితీ లేని ఎల్ పీజీ ధరల సమీక్షలో ఈ విషయం వెల్లడైంది. రాయితీకి లభించే ఎల్ పీజీ ధర ఢిల్లీలో రూ. 421.16గా ఉంది. అయితే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు మాత్రం 5.5శాతం పెరిగాయని ఆయిల్ కంపెనీ శుక్రవారం వెల్లడించాయి. జెట్ ఫ్యూయల్ ధర ఢిల్లీలో కిలో లీటర్ కు రూ.2,557.7 పెరిగి, రూ.49,287.18గా నమోదైందని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. వరుసగా ఐదో నెల ఈ ధరలు పెరిగినట్టు వెల్లడించాయి. ఈ ఐదు సార్ల పెరుగుదలతో ఏటీఎఫ్ రేట్లు 25 శాతం లేదా రూ.9,985.87 ఎగబాకాయని తెలిపాయి. కానీ విమానాల్లో వాడే ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ కంటే తక్కువగానే లభ్యమవుతుందని పేర్కొన్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.64.76గా, లీటర్ ఢీజిల్ ధర రూ.54.70గా ఉన్నట్టు... అయితే ఈ ధరలు లీటర్ ఏటీఎఫ్ ధర(రూ.49.28) తక్కువేనని వెల్లడించాయి. ఆటో ఇంధనాలపై కేంద్రప్రభుత్వం పెంచుతూ వస్తున్న ఎక్సేంజ్ డ్యూటీల ప్రభావంతో ఈ ధరలు ఎగబాకినట్టు తెలిపాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పడిపోయినా... భారత్ లో ఈ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏటీఎఫ్ ధరల్లో పెరుగుదల, ప్యాసెంజర్ టిక్కెట్ ధరలపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందో అనేదానిపై మాత్రం విమాన కంపెనీలు వెంటనే స్పందించలేదు. మూడు ఇంధన రిటైలర్లు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ప్రతి నెలా మొదటిరోజు జెట్ ఇంధనం, రాయితీ లేని ఎల్ పీజీ ధరలపై సమీక్ష నిర్వహిస్తాయి. ఈ సమీక్షలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -
పెరిగిన పెట్రో ధరలు
పెట్రోల్పై రూ.1.06, డీజిల్పై రూ. 2.94 పెంపు న్యూఢిల్లీ: శనివారం అర్ధ రాత్రి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు రూ.1.09, డీజిల్పై లీట రుకు రూ. 2.94 పెంచినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. డాలర్తో రూపాయి మారకవిలువలో మార్పుల వల్ల ధరలు పెరిగాయంది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 61.13 నుంచి రూ. 62.19, డీజిల్ రూ.48.01 నుంచి రూ. 50.95కి పెరిగింది. ఏప్రిల్ 16న స్వల్పంగా పెట్రో ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. -
నాగార్జునా ఆయిల్ లో వాటా కొంటున్న ఐఓసీ?
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాగార్జునా గ్రూప్నకు చెందిన నాగార్జునా ఆయిల్ కార్పొరేషన్ (ఎన్ఓసీఎల్)లో వాటా కొనుగోలుచేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తమిళనాడులోని కడ్డలూర్లో ఎన్ఓసీఎల్ 60 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో ఒక రిఫైనరీని నెలకొల్పుతోంది. దేశంలో మిగులు రిఫైనరీ ఉత్పాదక సామర్థ్యం వుందన్న కారణంతో 2002లో ఈ నాగార్జునా గ్రూప్ కంపెనీలో వాటా తీసుకునేందుకు ఐఓసీ విముఖత చూపింది. అయితే తాజాగా వాటా కొనుగోలుకు ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. సంవత్సరాలు గడిచినా.... రూ. 25,000 కోట్ల పెట్టుబడి వ్యయంతో తొలిదశలో 60 లక్షల టన్నుల రిఫైనరీని ఏర్పాటుచేసి, మలిదశలో సామర్థ్యాన్ని 120 లక్షల టన్నులకు పెంచాలన్న ప్రణాళికతో రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టును నాగార్జునా గ్రూప్ మొదలుపెట్టింది. అప్పటి నుంచీ ఈ ప్రాజెక్టును ఆర్థిక సమస్యలు వెంటాడటంతో రిఫైనరీ పూర్తికాలేదు. కొద్ది సంవత్సరాల క్రితం తీవ్ర తుపాను కారణంగా ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగడం, అటుతర్వాత ప్రపంచవ్యాప్త సంక్షోభంతో నిధుల కొరత వంటివాటితో రిఫైనరీ పట్టాలకెక్కలేదు. ఈ ప్రాజెక్టును రూ. 3,600 కోట్లకు కొనుగోలుచేసేందుకు సింగపూర్కు చెందిన నెట్ఆయిల్ చర్చలు జరిపినప్పటికీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ చర్చలు విఫలమయ్యాయి. కాగా, తాజా వార్తలతో కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 20 శాతం ఎగబాకి రూ.4.30 వద్ద ముగిసింది. -
2022కల్లా చమురు దిగుమతులు...
10 శాతానికి తగ్గింపే లక్ష్యం * ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి.. * ఐఓసీ పారాదీప్ రిఫైనరీ జాతికి అంకితం పారాదీప్: విదేశాల నుంచి ముడిచమురు దిగుమతులను భారత్ భారీగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2022లో మనం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నామని.. అప్పటికల్లా క్రూడ్ దిగుమతులను 10 శాతానికి తగ్గించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం భారత్ ముడి చమురు అవసరాల్లో 79 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడుతుండటం గమనార్హం. 2014-15లో 112.7 బిలియన్ డాలర్ల విలువైన 189.4 మిలియన్ టన్నుల ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఆదివారమిక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) పారాదీప్లో నిర్మించిన రిఫైనరీని జాతికి అంకితం చేసిన సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన రంగంలో భారత్ను స్వయం సమృద్ధి దేశంగా నిలబెట్టేందుకు ఆయిల్ కంపెనీలు కృషిచేయాలని, దీన్ని ఒక సవాలుగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఐఓసీ పారాదీప్ రిఫైనరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15 మిలియన్ టన్నులు. 2000 సంవత్సరం మే 24న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దీనికి శంకుస్థాపన చేశారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇది అందుబాటులోకి వచ్చింది. దీని ఏర్పాటు కోసం ఐఓసీ రూ.34,555 కోట్లను పెట్టుబడిగా వెచ్చిం చింది. కాగా, పారాదీప్ రిఫైనరీ జతకావడంతో ఇప్పటిదాకా దేశంలో నంబర్ వన్ రిఫైనరీ సంస్థగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ను వెనక్కినెట్టి ఐఓసీ ఆ స్థానాన్ని చేజిక్కించుకోనుంది. ప్రపంచంలో అత్యంత అధునాతన రిఫైనరీల్లో ఒకటిగా ఇది నిలవనుంది. అధిక సల్ఫర్ మోతాదు ఉన్న హెవీ క్రూడ్ ఆయిల్ను సైతం శుద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఇక్కడ ఏడాదికి 5.6 మిలియన్ టన్నుల డీజిల్, 3.79 మిలియన్ టన్నుల పెట్రోలు, 1.96 మిలియన్ టన్నుల కిరోసిన్/ఏటీఎప్ను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు 7,90,000 టన్నుల వంటగ్యాస్(ఎల్పీజీ), 1.21 మిలియన్ టన్నుల పెట్కోక్ కూడా ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం 2.8 లక్షల టన్నుల స్టీల్ను వినియోగించామని.. ఇది 30 ఈఫిల్ టవర్లు/350 రాజధాని రైళ్లతో సమానమని ఆయన వివరించారు. అంతేకాదు ఇక్కడ వాడిన 11.6 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు.. ప్రపంచంలోనే ఎత్తయిన దుబాయ్ బుర్జ్ ఖలీఫా టవర్కు మూడింతలతో సమానమని కూడా పేర్కొన్నారు. ఇంకా ఇక్కడ వాడిన పైపుల పొడవు 2,400 కిలోమీటర్లు(దాదాపు గంగా నది అంత పొడవు) కావడం విశేషం. రూ. లక్ష కోట్ల ముద్రా రుణాల మంజూరు... ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద చిన్న ఎంట్రప్రెన్యూర్లకు ఇప్పటివరకూ దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసినట్లు మోదీ తెలిపారు. చాలా తక్కువ కాలంలోనే ఇంత భారీ స్థాయిలో రుణాలివ్వడం సామాన్యమైన విషయం కాదన్నారు. దేశంలో యువతను ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారిగా కాకుండా వాళ్లే మరింత మందికి ఉద్యోగాలను కల్పించేవిధంగా చేయాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంతో పాటు పర్సనల్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిద్వారా యువత సొంతంగా వ్యాపారాలను ప్రారంభించి, ఉద్యోగావకాశాలను కల్పించే స్థాయికి ఎదుగుతారని చెప్పారు. -
గ్యాస్ ధర పెరిగింది.. విమాన ఇంధనం తగ్గింది
సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ల ధరను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెంచింది. ఒక్కో సిలిండర్ ధర దాదాపు రూ. 50 వరకు పెరిగింది. ఈ పెరుగుదల శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. స్థానిక పన్నులతో కలుపుకొని 14.4 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 657.50, కోల్కతాలో రూ. 686.50, ముంబైలో రూ. 671, చెన్నైలో రూ. 671.50 చొప్పున ఉండనున్నాయి. గడిచిన రెండు నెలల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. ఇంతకుముందు సిలిండర్ ధరను దాదాపు రూ. 60 చొప్పున పెంచారు. అలాగే, పన్ను విధించదగ్గ వార్షిక ఆదాయం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్నవాళ్లకు గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ ఇవ్వబోమని కేంద్రం చేసిన ప్రకటన కూడా శుక్రవారం నుంచే అమలులోకి రానుంది. అయితే.. క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు దాదాపు 30 డాలర్ల మేర తగ్గడంతో ఏటీఎఫ్ (విమాన ఇంధనం) ధరను ఒకేసారి 10 శాతం తగ్గించారు. దాంతో ఢిల్లీలో ఇంతకుముందు కిలోలీటర్ ఏటీఎఫ్ దర రూ. 44,320 ఉండగా, అదిప్పుడు రూ. 39,892 అయ్యింది. ఈ తగ్గింపుతో ఎయిర్లైన్స్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. -
హైదరాబాద్ మహిళకు ఐసిస్తో సంబంధాలు!
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన మహిళకు ఉగ్రవాద సంస్థ ఐసిస్తో సంబంధాలున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అరెస్టయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ సిరాజుద్దీన్తో సంబంధముందని భావిస్తున్న ఆ మహిళపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ‘ఆమె.. ఆన్లైన్లో ఐసిస్ సానుభూతిపరులతో నిత్యం సంభాషిస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యుల సాయంతో ఆమెను ఆ ప్రభావం నుంచి తప్పించడానికి కృషి చేస్తున్నామని’ ఓ అధికారి ఒకరు తెలిపారు. -
ఐసిస్తో సంబంధాలున్నాయని..
జైపూర్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మార్కెటింగ్ మేనేజర్ మహమ్మద్ సిరాజుద్దీన్కు ఈ నెల 21 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్టు జైపూర్ పోలీసులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అతడిని గురువారం జైపూర్లో రాజస్థాన్ పోలీసులు, తీవ్రవాద నిరోధక విభాగ అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ లో చేరేందుకు అతడు ఇటీవల హైదరాబాద్ యువతితో చాటింగ్ చేసినట్టు తెలిసింది. దాంతో రంగంలోకి దిగిన జైపూర్ పోలీసులు, తీవ్రవాద నిరోధక విభాగం చట్ట వ్యతిరేక కార్యకలాపాల కింద సిరాజుద్దీన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన సిరాజుద్దీన్ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ.. సామాజిక వెబ్సైట్లలో ఫోటోలు, వీడియోలను పోస్టు చేసినట్టు పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఐసిస్కు సంబంధించిన ఓ మ్యాగజైన్ను కూడా డౌన్లోడ్ చేసినట్టు తెలిపారు. మహమ్మద్ సిరాజుద్దీన్ భారత్ సహా ఇతర దేశాలలో ఆన్లైన్ ద్వారా తీవ్రవాద సంస్థతో సంబంధాలను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
ఐవోసీలో జాబ్.. ఐఎస్ఐఎస్కు మార్కెటింగ్!
జైపూర్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూప్ భావజాలాన్ని వ్యాప్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మార్కెటింగ్ మేనేజర్ ఒకరిని జైపూర్లో అరెస్టు చేశారు. ఇంటర్నెట్ను ఉపయోగించుకొని ఐఎస్ఐఎస్లో చేరేందుకు ప్రజలను పోత్సహిస్తున్న మహమ్మద్ సిరాజుద్దిన్ను రాజస్థాన్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అరెస్టుచేసింది. వాట్సప్, ఫేస్బుక్ ద్వారా ఐఎస్ఐఎస్ గ్రూప్ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద ఆయనను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని ఏటీఎస్ అదనపు డీజీపీ అలోక్ త్రిపాఠి తెలిపారు. కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన సిరాజుద్దిన్ దేశంలో ఐఎస్ఐఎస్ తరఫున సభ్యులను చేర్చుకోవడానికి ప్రయత్నించాడని ఆయన చెప్పారు. అతని ఇంటర్నెట్ కార్యకలాపాలను పరిశీలించడం ద్వారా అతను ఐఎస్ఐఎస్ భావజాలానికి తీవ్రంగా ప్రభావితమయ్యాడని తెలుస్తున్నదని, ముస్లిం యువతను ఆ గ్రూపు వైపు మళ్లించేందుకు అతను ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. ఐఎస్ఐఎస్ కోసం అతను వాట్సప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వీడియోలు, ఫొటోలు పోస్టుచేసేవాడని, అంతేకాకుండా ఆన్లైన్లో ఐఎస్ఐఎస్ మ్యాగజీన్ను డౌన్లోడ్ చేసుకునేవాడని చెప్పారు. భారత్లో, విదేశాల్లో ఉన్న ఐఎస్ఐఎస్ సభ్యులతో సంబంధాలు పెట్టుకోవడానికి అతను ప్రయత్నించినట్టు అలోక్ త్రిపాఠి వివరించారు. -
ఐఓసీకి నిల్వ నష్టాల భారం
రెండో త్రైమాసికంలో రూ.329 కోట్ల నష్టం న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.329 కోట్ల నష్టాలు వచ్చాయి. రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉండడం, నిల్వ నష్టాలు భారీగా ఉండడం, విదేశీ మారక ద్రవ్య నష్టాలు.. ఈ అంశాలన్నింటి కారణంగా నష్టాలు వచ్చాయని ఐఓసీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్కు నష్టాలు రూ.898 కోట్లుగా ఉన్నాయని ఐఓసీ చైర్మన్ బి. అశోక్ చెప్పారు. అమ్మకాలు, సామర్థ్య నిర్వహణ, ఇతర రంగాల్లో మంచి పనితీరు కనబరిచామని, కానీ నిల్వ నష్టాలు ప్రభావం చూపాయని వివరించారు. తాము ముడి చమురు కొనుగోలు చేసినప్పుడు ఒక ధర ఉండేదని, దానిని ఇంధనంగా ప్రాసెస్ చేసిన తర్వాత ధర తగ్గిపోయేదని తెలియజేశారు. దీనికి రవాణా, ప్రాసెసింగ్ వ్యయాలు కూడా కలుపుకుంటే నిల్వ నష్టాలు మరింత పెరిగాయని వివరించారు. ప్రధానంగా ఈ కారణాల వల్లే క్యూ2లో రూ.5,137 కోట్ల నిల్వ నష్టాలు వచ్చాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్కు ఈ నిల్వ నష్టాలు రూ.4,272 కోట్లన్నారు. పెరిగిన ఫారెక్స్ నష్టాలు... గత క్యూ2లో రూ.672 కోట్లుగా ఉన్న విదేశీ మారకద్రవ్య నష్టాలు ఈ క్యూ2లో రూ.1,100 కోట్లకు పెరిగాయని, గత క్యూ2లో రూ.1,039 కోట్లుగా ఉన్న వడ్డీ వ్యయాలు ఈ క్యూ2లో రూ.729 కోట్లకు తగ్గాయని అశోక్ తెలియజేశారు. ఒక్కో బ్యారెల్ చమురును ఇంధనంగా మార్చడానికి అయిన స్థూల రిఫైనింగ్ మార్జిన్ గత క్యూ2లో మైనస్ 1.95 డాలర్లుగా ఉండగా, ఈ క్యూ2లో 90 సెంట్లుగా ఉందని చెప్పారు. నిల్వ నష్టాలు లేకపోతే ఈజీఆర్ఎం ఈ క్యూ2లో 6.92 డాలర్లుగా ఉండేదని వివరించారు. గత క్యూ2లో రూ.1,11,664 కోట్లుగా ఉన్న టర్నోవర్ చమురు ధరలు తగ్గడం వల్ల ఈ క్యూ2లో రూ.85,385 కోట్లకు తగ్గిందని తెలిపారు. -
చిత్తూరులో ఐఓసీ స్మార్ట్టెర్మినల్ ప్రారంభం
హైదరాబాద్ : చమురు పరిశ్రమలోనే మొట్టమొదటి స్మార్ట్టెర్మినల్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)చిత్తూరులో ప్రారంభించింది. రూ.127 కోట్ల అంచనా వ్యయంతో చిత్తూరులోని యాదమరి గ్రామంలో ఈ స్మార్ట్టెర్మినల్ను అందుబాటులోకి తెచ్చామని ఐఓసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్మార్ట్టెర్మినల్ పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్ అని దీనిని ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ చైర్మన్ బి. అశోక్ పేర్కొన్నారు. ఉత్పత్తుల ఆర్డర్ మొదలుకొని ఉత్పత్తుల డెలివరీ వరకూ ఇక్కడ మొత్తం ఆటోమేషన్ పద్ధతిలో జరుగుతుందని వివరించారు. వంద శాతం పైప్లైన్ ద్వారా ఇంధన సరఫరా పొందే ఈ టెర్మినల్ చెన్నై, హైదరాబాద్ మార్కెట్లకు ఉత్పత్తులనందిస్తుందని వివరించారు. -
ఐవోసీ ఓఎఫ్ఎస్ ధర రూ.387
న్యూఢిల్లీ : ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో సోమవారం విక్రయించ బోయే షేర్లకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) కనీస ధరను రూ.387గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంటు పోను... ఐవోసీలో 24.28 కోట్ల షేర్ల విక్రయం ద్వారా ఖజానాకు సుమారు రూ. 9,302 కోట్లు రాగలవని అంచనా. శుక్రవారం బీఎస్ఈలో ఐవోసీ స్టాక్ ముగింపు ధర రూ. 394.45తో పోలిస్తే ఓఎఫ్ఎస్కి నిర్ణయించిన రేటు సుమారు 1.8 శాతం తక్కువ. డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఐవోసీలో కేంద్రం తనకున్న 68.6 శాతం వాటాల్లో 10 శాతం వాటాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 9.15 గం.లకు మొదలయ్యే ఆఫర్ ఫర్ సేల్ అదే రోజు సాయంత్రం 3.30 గం.లకు ముగుస్తుంది. ఆఫర్లో దాదాపు 20 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించడం జరిగింది. -
ఐఓసీ లాభం రెండున్నర రెట్లు జంప్
♦ క్యూ1లో రూ.6,436 కోట్లు ♦ ఏడేళ్ల గరిష్ట స్థాయికి రిఫైనింగ్ మార్జిన్లు న్యూఢిల్లీ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రెండున్నర రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.2,523 కోట్లు(ఒక్కో షేర్కు రూ.10.39)గా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.6,436 కోట్లకు(ఒక్కో షేర్కు రూ.26.51) పెరిగిందని ఐఓసీ చైర్మన్ బి. అశోక్ తెలిపారు. రిఫైనింగ్ మార్జిన్లు ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరడం, అధిక పెట్రోకెమికల్ మార్జిన్ల వల్ల ఈ స్థాయి లాభాలు సాధించామని వివరించారు. ఒక బ్యారెల్ ముడిచమురును ఇంధనంగా మార్చడానికయ్యే స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) ఈ క్యూ1లో 10.77 డాలర్లు ఆర్జించామని పేర్కొన్నారు. గత క్యూ1లో ఈ జీఆర్ఎం బ్యారెల్కు 2.25 డాలర్లుగా ఉందని తెలిపారు. ఇప్పటివరకూ ఈ జీఆర్ఎం 2008-09 ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లోనే అధికంగా(16.81 డాలర్లు) ఉందని వివరించారు. రిఫైనరీ మార్జిన్ రూ.706 కోట్ల నుంచి రూ.6,521 కోట్లకు, పెట్రోకెమ్ మార్జిన్ రూ.719 కోట్ల నుంచి రూ.1,875 కోట్లకు పెరిగాయని వివరించారు. గత క్యూ1లో రూ.426 కోట్ల నిల్వ నష్టాలు రాగా, ఈ క్యూ1లో నిల్వ లాభాలు రూ.2,395 కోట్లని (ఒక్కో బ్యారెల్కు నిల్వ లాభాలు 4.78 డాలర్లు) పేర్కొన్నారు. నిర్వహణ పనితీరు కూడా బాగా ఉండడం వల్ల జీఆర్ఎం పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31నాటికి రూ.55,247 కోట్లుగా ఉన్న మొత్తం రుణాలు ఈ జూన్ 30 నాటికి రూ.52,519 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఇక మొత్తం ఆదాయం 19 శాతం క్షీణతతో (సీక్వెన్షియల్గా 7 శాతం వృద్ధి) రూ.1.01 లక్షల కోట్లకు తగ్గిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ షేర్ 1.5 శాతం వృద్ధితో రూ.394కు పెరిగింది. ఐఓసీ వాటా విక్రయానికి బ్యాంకర్ల నియామకం కాగా ఐఓసీలో 10 శాతం వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఐదు మర్చంట్ బ్యాంకర్లను షార్ట్లిస్ట్ చేసింది. సిటీ బ్యాంక్, నొముర, డాయిష్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్.. ఈ ఐదు సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా కేంద్రం నియమించింది. ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి గురువారం నాటి ముగింపు ధరను పరిగణనలోకి తీసుకుంటే రూ.9,500 కోట్ల నిధులు లభిస్తాయి. -
సెంట్రల్ జైళ్లలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలి
ఐఓసీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం రాజప్ప అమలాపురం టౌన్ : రాష్ట్రంలోని సెంట్రల్ జైళ్లలో పెట్రోల్ బంక్ల ఔట్లెట్లు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రతినిధులను ఆదేశించారు. ఐఓసీ విశాఖ డివిజన్ రిటైల్ సేల్స్ చీఫ్ మేనేజర్ కె.జానప్రసాద్, కాకినాడ రిటైల్ సేల్స్ ఏరియా మేనేజర్ కేవీపీ కిరణ్కుమార్లు రాజప్పను అమలాపురంలోని ఆయన నివాసంలో గురువారం కలుసుకున్నారు. కేంద్ర కారాగారాల అభివృద్ధిలో భాగంగా జైళ్లవద్ద ఐఓసీ ఔట్లెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాజమండ్రి సెంట్రల్ జైలువద్ద అదనపు ఔట్లెట్ల ఏర్పాటు ఎంతవరకూ వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. త్వరలో రెండు ఔట్లెట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్టు చీఫ్ మేనేజర్ ప్రసాద్ వివరించారు. అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న నూతన రాజధాని ప్రాంతంలో ఐఓసీ కార్యకలాపాల విస్తరణ, రిటైల్ ఔట్లెట్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. -
తెలుగు రాష్ట్రాల ఇండియన్ ఆయిల్ బిజినెస్ హెడ్గా సింగ్
హైదరాబాద్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్గా వ్యవహరిస్తున్న యూ.పి.సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బిజినెస్ హెడ్గా బాధ్యతలను చేపట్టారు. ఆయనకు సంస్థ వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో అపార అనుభవం ఉంది. సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బిజినెస్ హెడ్గా పనిచే శారు. ఆయన రాంచీలోని బిట్స్లో మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబీఏ (మానవ వనరులు) పూర్తిచేశారు. -
ఆయిల్ కార్పొరేషన్ ట్యాంకర్ బోల్తా
విశాఖపట్టణం: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు చెందిన గ్యాస్ ట్యాంకర్ గాజువాక సమీపంలో జాతీయరహదారిపై బోల్తా పడింది. సోమవారం తెల్లవారుజామున నాపయ్యపాలెం వద్ద ఈ సంఘటన జరిగింది. నాపయ్యపాలెంలో ట్రాన్స్పోర్టు ఆఫీస్ ముందు ఆగి ఉన్న లారీని ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పూల్ గ్యాస్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. విషయం తెలిసిన ఐఓసీ అగ్నిమాపక సిబ్బంది, జాతీయ రహదారుల భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ట్యాంకర్ను పరిశీలించారు. రోడ్డుపై అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తరలించారు. గ్యాస్ లారీ కావడంతో చుట్టుపక్కల ప్రజలు భయపడ్డారు. కాగా, ఈ ప్రమాదానికి కారణం ట్యాంకర్ డ్రైవర్ మద్యమత్తులో వాహనం నడపడమేనని పోలీసుల సమాచారం. (గాజువాక) -
ఇండియన్ ఆయిల్కు భారీగా నిల్వ నష్టాలు
క్యూ3లో రూ.2,637 కోట్ల నష్టం న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,637 కోట్ల నష్టాలు వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గడంతో నిల్వ నష్టాలు బాగా పెరిగాయని, దీంతో నికర నష్టం అధికమైందని కంపెనీ చైర్మన్ బి. అశోక్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నికర నష్టాలు రూ. 961 కోట్లుగా ఉన్నాయని వివరించారు. గత క్యూ3లో నిల్వ లాభాలు రూ.2,454 కోట్లుగా ఉండగా, ఈ క్యూ3లో నిల్వ నష్టాలు రూ.12,842 కోట్లుగా ఉన్నాయని వివరించారు. ముడి చమురును కొనుగోలు చేసినప్పటి ధర కాకుండా ప్రాసెస్ చేసినప్పుడు ఉన్న ధర ఆధారంగా పెట్రో ఇంధనాల ధరలను నిర్ణయిస్తామని, ఈ కాలంలో ముడిచమురు ధరలు మరింతగా పతనమయ్యాయని, ఈ విధంగా నిల్వ నష్టాలు భారీగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. విక్రయాల ద్వారా వచ్చిన నష్టాలకు ప్రభుత్వం రూ.2,866 కోట్లు నగదు సబ్సిడీని, ఓఎన్జీసీ వంటి చమురు వెలికితీత కంపెనీలు రూ.6,116 కోట్ల తోడ్పాటునందించాయని వివరించారు. ఇక గత క్యూ3లో రూ.1,17,672 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో రూ.1,07,074 కోట్లకు తగ్గాయని తెలిపారు. వడ్డీ భారం రూ.1,262 కోట్ల నుంచి రూ.929 కోట్లకు తగ్గిందని వివరించారు. -
భారత్లో అతిపెద్ద కంపెనీ ఐఓసీ
న్యూఢిల్లీ: ఆదాయాలపరంగా భారత్లో అతిపెద్ద కంపెనీగా ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) నిలిచింది. ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజీన్ ఫార్చూన్ రూపొందించిన 2014 ఏడాది టాప్-500 భారతీయ కంపెనీల జాబితాలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. పూర్తి ఏడాదికి కంపెనీ రూ.5,00,973 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ఫార్చూన్ పేర్కొంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.4,44,021 కోట్ల వార్షిక ఆదాయంతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత్ పెట్రోలియం(బీపీసీఎల్) మూడో ర్యాంకు(ఆదాయం రూ.2,67,718 కోట్లు), హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్పీసీఎల్) నాలుగు(రూ.2,67,718 కోట్లు), టాటా మోటార్స్(రూ.2,36,502 కోట్లు) ఐదో ర్యాంకును చేజిక్కించుకున్నాయి. కాగా, ఐఓసీ, రిలయన్స్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు గతేడాది(2013) ర్యాంకులను నిలబెట్టుకోవడం గమనార్హం. టాప్-10లో ఎస్బీఐ (రూ.2,26,944 కోట్లు- 6వ ర్యాంకు), ఓఎన్జీసీ(రూ.1,82,084 కోట్లు, 7వ ర్యాంకు), టాటా స్టీల్(రూ.1,49,663 కోట్లు, 8వ స్థానం), ఎస్సార్ ఆయిల్(రూ.99,473 కోట్లు, 9వ స్థానం), హిందాల్కో(రూ.89,175 కోట్లు, 10వ ర్యాంకు) నిలిచాయి. -
లీటరుకు రూపాయి తగ్గిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటరుకు రూపాయి తగ్గింది. స్థానిక పన్నుల్లోనూ తగ్గింపు కలుపుకుంటే ప్రాంతాల వారీగా మరికొంత తగ్గనుంది. తగ్గించిన ధర మంగళవారం అర్ధరాత్రి అమల్లోకి వస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. పెట్రోల్ ధర తగ్గించడం ఈనెలలో ఇది రెండోసారి. అక్టోబర్ 1న లీటర్ పెట్రోల్ ధరపై 54 పైసలు తగ్గింది. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.66.65కు, ముంబైలో రూ.74.46 చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గడంతో ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్ ధర తగ్గించాయి. -
పెట్రోల్ బంక్ను ఖాళీ చేయండి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ను ఆదేశించిన హైకోర్ట వరంగల్ లీగల్ : చట్టబద్దమైన అగ్రిమెంట్ లేకుండా భూయజమానుల స్థలాన్ని వినియోగించుకోవడం సరికాదని, మూడు నెలల్లో పెట్రోల్బంక్ ఖాళీ చేసి స్థలాన్ని యజమానులకు అప్పగించాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ను ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై నెలకొల్పిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవుట్లెట్ పెట్రోల్ బంక్ 1973 నుంచి కొనసాగుతుంది. 20 ఏళ్లకు లీజు అగ్రిమెంటును స్థల యజమానురాలు వినోదరెడ్డితో కార్పొరేషన్ వారు కుదుర్చుకున్నారు. మొదటి ఐదేళ్లకు నెలకు 180 రూపాయలు అద్దె, మరో ఐదేళ్ల సమయానికి నెలకు రూ.200, చివరి 10 సంవత్సరాల కాలానికి నెలకు రూ.235 అద్దె చెల్లించేలా లీజు అగ్రిమెంట్ చేసుకున్నారు. కార్పొరేషన్ వారు ఒప్పందం మేరకు అద్దెలు చెల్లించడం లేదని, వారు స్థలాన్ని ఖాళీ చేయమని గతంలో కోర్టులో దావా వేసింది. కానీ అగ్రిమెంట్ కాలం మధ్యలో ఖాళీ చేయమని చెప్పడం సరికాదని అప్పట్లో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 20 ఏళ్ల కాలపరిమితి 1992 వరకు ముగిసినా ఆయిల్ కార్పొరేషన్ వారు ఖాళీ చేయలేదు. యజమానురాలు మృతిచెందడంతో ఆమె కుమారుడు వారసుడిగా దావాలో చేరాడు. లీజు స్థల విస్తీర్ణం 1135 గజాలకు తక్కువగా నెలకు రూ.235 చెల్లించడం సరికాదని, అదే ఆయిల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఇతర బంకులకు నెలకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారని, ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా 21 సంవత్సరాలుగా అక్రమంగా స్థలాన్ని వినియోగించుకుంటున్నారని యజమానులు కోర్టును ఆశ్రయించగా, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వరంగల్ వారు ఖాళీ చేయమని గతంలో తీర్పు ఇచ్చారు. దీంతో ప్రతివాది అయిన ఆయిల్ కార్పొరేషన్ వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు జడ్జి జస్టిస్ ఆర్. కాంతారావు న్యాయపరమైన విషయాలు విచారించి ఎలాంటి అగ్రిమెంటు లేకుండా కొనసాగడం న్యాయబద్దమైనది కాదని తీర్పు ఇచ్చారు. మూడు నెలల్లో పెట్రోల్ బంకు ఖాళీ చేసి స్థలాన్ని యజమానులకు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. -
పెట్రోల్పై 54 పైసల తగ్గింపు
మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి.. డీజిల్ తగ్గింపుపై మోదీ తిరిగొచ్చాక నిర్ణయం న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటరుకు స్వల్పంగా 54 పైసలు తగ్గింది. స్థానిక పన్నుల్లోనూ తగ్గింపు కలుపుకుంటే ప్రాంతాల వారీగా మరికొంత తగ్గనుంది. తగ్గింపు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో లీటరు ధర 65 పైసలు తగ్గి రూ.67.86కు, ముంబైలో 68 పైస లు దిగి రూ. 75.73కు చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గడంతో ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్ ధర తగ్గించాయి. దీని ధర గత నెల 31న రూ.1.50 తగ్గడం తెలిసిందే. కాగా, 14.2 కేజీల సబ్సిడీయేతర గృహోపయోగ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 21 తగ్గింది. ఢిల్లీలో దీని ధర రూ. 901 నుంచి రూ.880కి చేరుకుంది. విమాన ఇంధన ధర కిలోలీటరు3శాతం తగ్గి, రూ.67,525కు చేరింది. లీటరు డీజిల్పై రూపాయి లాభం.. కాగా, ఐదేళ్లలో తొలిసారి కిందికి దిగనున్న డీజిల్ ధర తగ్గింపుపై నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నుంచి స్వదేశానికి తిరిగొచ్చేంతవరకు వాయిదా వేశారు. చమురు కంపెనీలకు నష్టాలు పూడ్చుకోవడానికి లీటరు డీజిల్పై ప్రతినెలా 40 నుంచి 50 పైసలు పెంచుకునేందుకు కేంద్ర కేబినెట్ 2013 జనవరిలో అనుమతించినప్పటినుంచి ధర తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని చమురు శాఖ భావిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల తగ్గుదల కారణంగా ఈ కంపెనీలకు సెప్టెంబర్ 16 నుంచి లీటరు డీజిల్ అమ్మకంపై వస్తున్న 35 పైసల లాభం ప్రస్తుతం ఒక రూపాయికి పెరిగింది. ధరల స్థితిగతులపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. మోదీకి లేఖ రాసినట్లు సమాచారం. మహారాష్ట్ర, హర్యా నా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధర తగ్గింపునకు అనుమతి కోసం ఆ శాఖ ఎన్నికల కమిషన్కు లేఖ రాసిందని, తగ్గింపుపై మోదీ వచ్చాక నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు చెప్పాయి. ప్రైవేటు చమురు కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా డీజిల్, పెట్రోల్ రేట్లను నిర్ధారిస్తున్నందున,ప్రభుత్వ కంపెనీల రక్షణ కోసం డీజిల్ ధర తగ్గించాలని చమురు శాఖ కోరుతోంది. -
వేగంగా వంటగ్యాస్ సరఫరా
చెన్నై, సాక్షి ప్రతినిధి: వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో తరచూ ఏర్పడుతున్న జాప్యానికి చెక్పెట్టబోతున్నారు. బుక్ చేసుకున్న వారం రోజుల్లోనే ఇంటికి సిలిండరు సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సిద్ధమవుతోంది. రాష్ట్రం మొత్తం మీద 1.12 కోట్ల గ్యాస్ సిలిండర్లు సరఫరాలో ఉండగా, ఒక్క చెన్నైలోనే రూ.12 లక్షలు ఉన్నాయి. అట్టడుగు వర్గాలు సైతం వంటగ్యాస్ వినియోగానికి అలవాటుపడిన తరుణంలో సక్రమంగా సరఫరా జరగని పక్షంలో సతమతమవుతున్నారు. వంటగ్యాస్ కంపెనీల నిబంధనల ప్రకారం బుక్ చేసుకున్న వారం రోజుల్లోగా గ్యాస్ సిలిండర్ చేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 20 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటున్నారు. చెన్నైలో ఇటీవల ఒక మహిళ ఎంతకూ గ్యాస్ సరఫరా జరగక పోవడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీస్ జోక్యంతో సిలిండరు పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ జాప్యానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్య పెరిగిపోవడం, వాటి స్థానంలో కొత్త సిలిండర్లు లేకపోవడం వంటివి కొన్ని కారణాలు. అయితే కొన్ని ఏజన్సీల్లోని ఉద్యోగులు సిలిండర్ల సరఫరాలో గోల్మాల్కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లోడు రాలేదు, ఇంకా జాప్యం కావచ్చు వంటి మాటలతో గ్యాస్ కంపెనీలపై నిందలు మోపి తమకు నచ్చిన వారికి సిలిండర్లు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. సిలిండర్ల సంఖ్యలో తగ్గుదల ఏజెన్సీలకు అవకాశంగా మారకుండా ఐవోసీ దృష్టి సారించింది. పదేళ్ల వినియోగకాలాన్ని దాటిన సిలిండర్లను ముందుగా తనిఖీ చేసే పనిలో పడింది. ఐవోసీ చెన్నై మండలం పరిధిలోని తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోని పాత సిలిండర్లను సేకరించి రోజుకు 5 వేల నుంచి 10 వేల చొప్పున తనిఖీలు నిర్వహిస్తోంది. సరఫరాలో జాప్యానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఒక వైపు కాలం చెల్లిన సిలిండర్లను లెక్కకడుతూనే రెండు లక్షల కొత్త సిలిండర్లను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంపై ఐఓసీ అధికారి ఒక మీడియాతో మాట్లాడుతూ, వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఏర్పడిన డిమాండ్ మరో రెండు వారాల్లో సర్దుకుంటుందన్నారు. బుక్ చేసిన వారంలోగా సిలిండర్లు చేరేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్యాస్ ఏజెన్సీలు మోసానికి పాల్పడుతున్నట్లు రాతపూర్వక ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెన్నై ఆళ్వారుపేటకు చెందిన ఒక గృహిణి ఇటీవల ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి గ్యాస్ ఏజన్సీపై క్రమశిక్షణ చర్యను చేపట్టామని అన్నారు. -
ఉద్యోగాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కు చెందిన పారాదీప్ రిఫైనరీ ప్రాజెక్ట్ 113 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: కెమికల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఇన్స్ట్రుమెంటేషన్ అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా. రిజిస్ట్రేషన్కు చివరి తేది: సెప్టెంబరు 10 వెబ్సైట్: www.paradiprefinery.in పీడీఐఎల్ నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ (పీడీఐఎల్), కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * చీఫ్ ఇంజనీర్ * అడిషనల్ చీఫ్ ఇంజనీర్ * డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ * డిప్యూటీ మేనేజర్ * సీనియర్ ఆఫీసర్ * సీనియర్ ఇంజనీర్ అర్హతలు తదితర పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. చివరి తేది: సెప్టెంబరు 10 వెబ్సైట్: http://careers.pdilin.com ఐఐటీ, హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ తాత్కాలిక పద్ధతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్, అకౌంట్స్, ఇంగ్లిష్, అడ్మినిస్ట్రేషన్లో పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా పంపాలి. చివరి తేది: సెప్టెంబరు 1 ఇ-మెయిల్: teqip@iith.ac.in వెబ్సైట్: www.iith.ac.in -
రెండు రూపాయలు తగ్గనున్న లీటర్ పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: స్వాతంత్రదినోత్సవ కానుకగా వాహన వినియోగదారులకు ఊరట కలిగించే విధంగా పెట్రోల్ ధరను తగ్గించాలని దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.18 పైసలు తగ్గిస్తున్నట్టు దేశీయ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని వివిధ పట్టణాల్లో పెట్రోల్ ధరలు సుమారు 2 రూపాయలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. 14 తేది అర్ధరాత్రి నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీలు వెల్లడించాయి. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత పెట్రోల్ ధర తగ్గించడం ఇది రెండవసారి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు దిగి రావడం, అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి బలపడటం లాంటి అంశాలు పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణమయ్యాయని కంపెనీలు తెలిపాయి. -
పెట్రోల్ ధర తగ్గింది, డీజిల్ రేటు పెరిగింది
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గింది. లీటర్ ధరపై రూ.1.09 తగ్గింది. మూడున్నర నెలల కాలంలో పెట్రోల్ ధర తగ్గడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇదే సమయంలో డీజిల్ ధర లీటర్ కు 56 పైసలు పెంచారు. సవరించిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.51, డీజిల్ లీటర్ రూ. 58.40 కానున్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూపాయిన్నర తగ్గే అవకాశముంది. డీజిల్ ధర 72 పైసలు పెరగనుంది. -
చాందీ ప్రసాద్కు 2013 గాంధీ శాంతిబహుమతి
వార్తల్లో వ్యక్తులు సిరియా అధ్యక్షుడు అసాద్ సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసాద్ జూలై 16న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మరో ఏడేళ్లపాటు ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతారు. జూన్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 88.7శాతం ఓట్లతో అసాద్ విజయం సాధించారు. ఐఓసీ చైర్మన్గా బి.అశోక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్గా బి. అశోక్ జూలై 16న బాధ్యతలు చేపట్టారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కమిటీ ఉత్తర్వులు జారీచేసింది. చాందీ ప్రసాద్కు 2013 గాంధీ శాంతిబహుమతి 2013 సంవత్సరానికిగాను గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని ప్రముఖ గాంధేయవాది, పర్యావరణవేత్త చాందీ ప్రసాద్కు జూలై 15న రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ప్రదానం చేశారు. చాందీ ప్రసాద్ చిప్కో ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. కొండ ప్రాంతాల ప్రజలకు కొయ్య, గడ్డి సేకరణ, అడవులు అంతరించడం వల్ల తలెత్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే చట్టబద్ధమైన హక్కుల కోసం 1973లో చిప్కో ఉద్యమం చేపట్టారు. ఇందుకు ఆయనకు 1982లో రామన్ మెగసెసె అవార్డు లభించింది. 2005లో పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా గాంధీ శాంతి బహుమతిని 1995లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డును గాంధేయ సిద్ధాంతాలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మార్పు కోసం కృషి చేసే వ్యక్తులు, సంస్థలకు బహుకరిస్తారు. ఈ పురస్కారం కింద ప్రశంసాపత్రంతోపాటు కోటి రూపాయల నగదు అందజేస్తారు. రె హ్మాన్కు బర్క్లీ గౌరవ డాక్టరేట్ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్కు అమెరికాకు చెందిన బర్క్లీ సంగీత కళాశాల గౌరవ డాక్టరేట్తో సత్కరిం చింది. ఈ గౌరవాన్ని రెహ్మాన్ అక్టోబర్ 24న అందుకోనున్నారు. ఫిక్కీ సెక్రటరీ జనరల్కు బ్రిటన్ గౌరవ డాక్టరేట్ ఫిక్కీ సెక్రటరీ జనరల్ అల్విన్ దిదార్ సింగ్ బ్రిటన్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం నుంచి జూలై 16న గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. భారత్లో ఈ-కామర్స్కు సంబంధించి ఇది తొలి డాక్టరేట్. 2014 ప్రేమ్ భాటియా అవార్డు ప్రముఖ జర్నలిస్టు ప్రేమ్ భాటియా పేరుతో నెలకొల్పిన అవార్డుకు స్మితా గుప్తా (హిందూ), నితిన్ సేథ్ (బిజినెస్ స్టాండర్డ్) ఎంపికయ్యారు. రాజకీయ అంశాల రిపోర్టింగ్ విభాగం నుంచి స్మితాగుప్తా, పర్యావరణం అంశాల రిపోర్టింగ్లో నితిన్సేథ్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. జాతీయం జూన్లో 5.4 శాతానికి తగ్గిన ద్రవ్యోల్బణం వార్షిక టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్లో 5.4 శాతానికి తగ్గింది. ఇది మే నెలలో 6.01గా ఉండేదని జూలై 14న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. వినియోగధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 8.23 శాతం నుంచి 7.31 శాతానికి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం గత 30 నెలలో కనిష్ట స్థాయికి చేరింది. కూరగాయలతో పాటు కొన్ని ఆహార ఉత్పత్తుల ధరల తగ్గుదలే దీనికి కారణం. జాతీయ ఆకృతి సంస్థ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం జాతీయ ఆకృతి సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్) బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 17న ఆమోదముద్ర వేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక పార్లమెంట్ చేసిన తొలి చట్టం ఇదే . ఈ చట్టంతో జాతీయ ప్రాధాన్యమున్న సంస్థగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే జాతీయ ఆకృతి సంస్థకు గాంధీనగర్లో శాఖ, బెంగళూర్లో శాటిలైట్ కేంద్రం ఉంది. దీంతోపాటు పోలవరం బిల్లుకు సంబంధించి ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలకు చెందిన 200కుపై గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసేందుకు కూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. న్యూఢిల్లీ వేదికగా ఐబీఎస్ఏ సదస్సు 2015లో నిర్వహించే ఏడో ఐబీఎస్ఏ (ఇండియా,బ్రెజిల్, దక్షిణాఫ్రికా) సదస్సుకు న్యూఢిల్లీ వేదిక కానుంది. వివిధ ఖండాలకు చెందిన ఈ మూడు దేశాల కూటమి ఏర్పాటుపై 2003 జూన్లో బ్రెజిల్ రాజధాని బ్రెసీలియాలో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేశారు. అభివృద్ధి చెందుతున్న ఈ మూడు దేశాలు పరస్పర సహకారం, రాజకీయ, ఆర్థికాంశాలలో చేయూత, ఐబీఎస్ఏ ఫండ్ ద్వారా ప్రాజెక్టులు చేపట్టి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు తోడ్పాటు వంటి కీలకాంశాలపై సహరించుకుంటాయి. ఖనిజాన్వేషణకు సాంకేతిక పరిజ్ఞానం భూగర్భంలోని ఖనిజాల అన్వేషణకు జాతీయ భూభౌతిక పరిశోధనా కేంద్రం (ఎన్జీఆర్ఐ) ఆధునిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. భూమిలోపల ఉన్న సహజ వనరులను గుర్తించాలంటే ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ విధానం డ్రిల్లింగే. ఈ విధానం వ్యయప్రయాసలతో కూడింది. దీనికి పరిష్కారంగా 3-డీ హై రిజల్యూషన్ సిస్మిక్ సర్వే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఖర్చు తగ్గటంతోపాటు వనరులను సమర్థంగా గుర్తించవచ్చు. ఈ తరహా పరిజ్ఞానం ఆస్ట్రేలియా,ఇంగ్లండ్లలో మాత్రమే ఉంది. ఈ పరిజ్ఞానానికి అవసరమైన పరికరాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా వినియోగించే ఈ విధానంతో పదిరెట్లకు పైగా ఖర్చు తగ్గటంతోపాటు అనేక ప్రయోజనాలున్నాయి. అంతర్జాతీయం ప్రపంచంలోని 1/3 వ వంతు పేదలు భారత్లోనే ప్రపంచంలో 1.2 బిలియన్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారు. వారిలో మూడోవంతు భారత్లోనే ఉన్నారని ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల-2014 నివేదిక పేర్కొంది. ఈ నివేదికను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా జూలై 16న న్యూఢిల్లీలో విడుదల చేశారు. రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ ఆదాయంతో నివసిస్తున్న వారిని అత్యంత పేదవారిగా నివేదిక పేర్కొంది. భారత్లో 1994లో 49.4 శాతంగా ఉన్న పేదరికం 2010 నాటికి 32.7 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. భారత్లో 1.4 మిలియన్ల మంది పిల్లలు ఐదేళ్ల వయసు దాటకుండానే మరణిస్తున్నారని నివేదిక తెలిపింది. బ్రిక్స్ ఆరో సదస్సు భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా దేశాల కూటమి (బిక్స్)్ర ఆరో సదస్సు బ్రెజిల్లోని ఫోర్టలెజాలో జూలై 15-16 తేదీల్లో జరిగింది. సమ్మిళిత వృద్ధి, సుస్థిర పరిష్కారాలు అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించారు. సదస్సు అనంతరం 72 అంశాలతో ఫోర్టలెజా నివేదికను వెల్లడించారు. ఇందులో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పేరుతో బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటును ప్రకటించారు. 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసే ఈ బ్యాంక్ షాంఘై (చైనా) ప్రధాన కేంద్రంగా పని చేస్తుంది. ఈ బ్యాంక్కు తొలుత భారత్ అధ్యక్షత వహిస్తుంది. కరెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ) ఒప్పందంపై కూడా సభ్యదేశాలు అవగాహనకు వచ్చాయి. 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయనున్న ఈ నిధి సభ్యదేశాల స్వల్పకాల లిక్విడిటీ ఒత్తిడులను తట్టుకోవడానికి తోడ్పడుతుంది. సదస్సులో భారత్ ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పాల్గొన్నారు. 2015లో జరిగే ఏడో సదస్సుకు రష్యాలోని ఊఫా నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్, బ్రెజిల్ ఒప్పందాలు పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారం, దౌత్య వ్యవహారాల్లో సంప్రదింపుల యంత్రాంగం ఏర్పాటుకు సంబంధించి మూడు ఒప్పందాలపై జూలై 16న భారత్, బ్రెజిల్లు సంతకాలు చేశాయి. బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఆ మేరకు అవగాహనకు వచ్చాయి. అంతేకాకుండా వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, రక్షణ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 500మంది మృతి హమాస్ ఆధీనంలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో 500 మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఘర్షణ తలెత్తడంతో జూలై 8 నుంచి ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. బాల కార్మిక వ్యవస్థపై బొలీవియా సంచలన నిర్ణయం బొలీవియా ప్రభుత్వం పదేళ్లు దాటిన పిల్లలను పనిలో పెట్టుకోవచ్చంటూ చట్టం తీసుకువచ్చింది. దీంతో బాలకార్మిక వ్యవస్థను చట్టబద్ధం చేసిన తొలిదేశంగా బొలీవియా నిలిచింది. జూన్లో చట్టసభ కాంగ్రెస్లో జరిగిన సమావేశంలో ఈ బిల్లును ఆమోదించింది. ఇది జూలై 17 నుంచి అమల్లోకి వచ్చింది. పనిచేసే వయసును 14 ఏళ్ల నుంచి పదేళ్లకు తగ్గించడం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉందని, దేశంలోని పేద కుటుంబాలకు పిల్లలను పనిలో పెట్టడం తప్ప మరో అవకాశం లేనందున ఆమోదించాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం పదేళ్లు దాటిన పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పని చేస్తూ పాఠశాలకు వెళ్లవచ్చు. కాంట్రాక్టు కింద పనిచేయించే వారి వయసు కనీసం 12 సంవత్సరాలు నిండాలి. అయితే పిల్లలను పనిలో చేర్పించే క్రమంలో తగు రక్షణ చర్యలు పాటించాలని, లేని పక్షంలో 30ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తారని హెచ్చరించింది. నకిలీ కరెన్సీలో రూపాయికి మూడో స్థానం స్విట్జర్లాండ్లో అధికారులు స్వాధీనం చేసుకున్న నకిలీ విదేశీ కరెన్సీ నోట్లలో యూరో, అమెరికన్ డాలర్ తర్వాత భారత రూపాయి మూడో స్థానంలో ఉంది. స్విస్ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ పోలీస్ (ఫెడ్ పోల్) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం 2013లో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో యూరో నోట్లు 2,394, అమెరికా డాలర్ నోట్లు 1,101 ఉన్నాయి. భారత రూపాయి నోట్లు 403. కాగా వీటిలో రూ.500 విలువైనవి 380, రూ. 1000 నోట్లు 23 ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2012లో నకిలీ కరెన్సీ జాబితాలో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. మలేిషియా విమానం కూల్చివేత మలేిషియా విమానం బోయింగ్-777ను ఉక్రెయిన్- రష్యా సరిహద్దులో ఉగ్రవాదులు జూలై 17న కూల్చివేయడంతో 295 మంది మరణించారు. ఆమ్స్టర్డ్యామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రష్యా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని గ్రాబోవో ప్రాంతంలో 33వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని ఉగ్రవాదులు క్షిపణి ప్రయోగించి కూల్చివేశారని ఉక్రెయిన్ హోంశాఖ తెలిపింది. క్రీడలు లార్డ్స్ టెస్టులో భారత్ విజయం ఇంగ్లండ్లో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో లార్డ్స్ వేదికగా సాగిన రెండో టెస్టులో ధోనీసేన చారిత్రక విజయాన్ని సాధించింది. లార్డ్స్లో టీమిండియా ఆడిన 16 టెస్టుల్లో ఇది రెండో విజయం. 28 ఏళ్ల క్రితం 1986లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలి విజయం నమోదయింది. ఏడు వికెట్లు తీసిన ఇషాంత్శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియామీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాను రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసింది. తెలంగాణ వికాసానికి విశిష్ట వ్యక్తులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెన్నిస్లో మరింతగా ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ నిమిత్తం కోటిరూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. జర్మన్ గ్రాండ్ప్రి విజేత రోస్బర్గ జర్మన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్బర్గ్ విజయం సాధించాడు. జూలై 20న జరిగిన పోటీలో బొటాస్(విలియమ్స్ జట్టు) రెండో స్థానంలో నిలిచాడు. -
ముంచుకొస్తున్న‘పెట్రో’ ముప్పు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు జిల్లాలోని వివిధ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకులకు సరఫరా చేస్తున్న స్టోరేజి పాయింట్ల మార్పు కారణంగా జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో ‘నోస్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టోరేజి పాయింట్లను మార్చడం, అక్కడి నుంచి మన జిల్లాకు మరింత దూరం పెరగడంతో పాటు స్టోరేజి పాయింట్ సామర్థ్యం కూడా తక్కువగా ఉండడంతో జిల్లాకు అవసరమైన పెట్రోల్, డీజిల్ సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలోని రెండు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు పెట్టగా, మరో రెండు, మూడు రోజుల్లో ఈ సంఖ్య పదుల్లోకి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వారం రోజుల్లో సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. 54 బంకులకు మరింత సమస్య... జిల్లాలో మొత్తం 135 పెట్రోల్ బంకులున్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీ) కంపెనీలకు చెందిన బంకుల ద్వారా రోజుకు సగటున 1.50 లక్షల లీటర్ల పెట్రోల్, 7.50 లక్షల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు. వీటిలో బీపీసీకి చెందిన 27, హెచ్పీసీకి చెందిన 54 బంకులకు ఎలాంటి సమస్యా లేకపోయినా, ఐఓసీకి చెందిన 54 బంకుల పరిస్థితి కష్టంగా మారనుంది. ఎందుకంటే ఈ బంకులకు కృష్టా జిల్లా కొండపల్లిలో ఉన్న స్టోరేజి పాయింట్ నుంచి, రాజమండ్రి నుంచి పెట్రోల్ వచ్చేది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆ పాయింట్ను కరీంనగర్ జిల్లా రామగుండానికి మార్చారు. అంటే విశాఖపట్నం రిఫైనరీలో ఉన్న ఆయిల్ కొండపల్లి స్టోరేజి పాయింట్కు కాకుండా, రామగుండం వస్తే, అక్కడి నుంచి జిల్లాకు రావాల్సి ఉంది. కొండపల్లి నుంచి వచ్చేటప్పుడు రోజుకో ట్రక్కు ఆయిల్ వచ్చే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు రామగుండం నుంచి ఒక ట్రక్కు వచ్చేసరికి మూడు రోజులు పడుతోంది. రామగుండంలో ఉన్న స్టోరేజి పాయింట్ సామర్థ్యం కూడా తక్కువేనని తెలుస్తోంది. రెండు జిల్లాలకు మాత్రమే సరఫరా చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఈ పాయింట్కు మరో మూడు జిల్లాలను అదనంగా కలపడంతో ఓవర్లోడ్ సమస్య అవుతోంది. ఇక్కడి నుంచి ఆయిల్ తెచ్చే ట్యాంకర్ల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది. ఆంధ్ర ప్రాంతం నుంచి ట్రక్కులను తెచ్చుకుని సరఫరా చేసుకునేందుకు అక్కడి కాంట్రాక్టర్లు అంగీకరించడం లేదు. దీంతో ఐఓసీ పరిధిలో ఉన్న జిల్లాలోని 54 బంకులకు తగినంత ఆయిల్ సరఫరా కావడం లేదు. దీంతో ఒకే ట్యాంకులో నాలుగైదు బంకులకు పెట్రోల్ పంపుతున్నారు. ఆ పెట్రోల్ తక్కువ సమయంలోనే అయిపోతుండడంతో మళ్లీ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఐఓసీకి చెందిన బంకులకు సూర్యాపేటలో స్టోరేజి పాయింట్ ఉన్న హెచ్పీసీ నుంచి ఆయిల్ సరఫరా చేయాలని అడుగుతున్నా, అది కూడా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. గతంలో సూర్యాపేట నుంచి కేవలం 26 హెచ్పీ బంకులకు మాత్రమే ఆయిల్ రాగా, మిగిలిన బంకులకు రాజమండ్రి నుంచి వచ్చేది. ఇప్పుడు 54 బంకులకు సూర్యాపేట నుంచే సరఫరా చేయాల్సి రావడంతో సమస్య తలెత్తుతోంది. మరోవైపు కొండపల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆయిల్ తేవాలంటే మన రాష్ట్రం అదనపు పన్ను విధించే అవకాశం ఉండడంతో డీలర్లు వెనుకంజ వేస్తున్నారు. ఇదే పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగితే జిల్లాలో పెట్రో తిప్పలు తప్పవని అధికారులు, పెట్రోల్ డీలర్లు అంటున్నారు. బంకుల వారీ వివరాలు సేకరించిన జేసీ... ఈ పరిస్థితుల్లో జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ శుక్రవారం ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో బంకుల వారీగా ఉన్న వివరాలు తెప్పించుకుని పరిశీలించారు. ఈ సమాచారాన్ని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్కు కూలకషంగా వివరిస్తూ నివేదిక పంపారు. ఈ విషయమై జేసీ ‘సాక్షి’తో మాట్లాడుతూ సమస్య ఉన్న మాట వాస్తవమేనని, అయితే, దీని పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. -
ఐఓసీ చైర్మన్గా మల్హోత్రాకు బాధ్యతలు
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) డెరైక్టర్ (ఆర్ అండ్ డీ) ఆర్.కె.మల్హోత్రాకు సంస్థ చైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నేపథ్యంలో పూర్తి కాల చైర్మన్ నియామకం జాప్యమవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ ఆర్.ఎస్.బుటోలా గత శనివారం పదవీ విరమణ చేశారు. ఆయన వారసునిగా బి.అశోక్ను ప్రభుత్వ సంస్థల ఎంపిక బోర్డు (పీఈఎస్బీ) గతేడాది అక్టోబర్లో ఎంపిక చేసినప్పటికీ ఆయన నిమామకాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఐఓసీ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగం డెరైక్టరుగా మల్హోత్రా కొనసాగుతారని సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
పెట్రోల్పై 70 పైసలు తగ్గింపు
మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: పెట్రోల్ ధర స్వల్పంగా లీటరుకు 70 పైసలు తగ్గింది. తగ్గింపు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. స్థానిక పన్నులు కూడా తగ్గనుండడంతో ధరలు ప్రాం తాలను బట్టి మరికొంత దిగివస్తాయి. పెట్రోల్ ధర తగ్గడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెల 1న 75 పైసలు తగ్గించారు. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు ధర 85 పైసలు తగ్గి రూ.71.41కు చేరుకుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతుండడంతో ధర తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ప్రతినెలా డీజిల్ ధరను సవరిస్తున్న చమురు కంపెనీలు ఈసారి దాని పెంపు జోలికి పోకపోవడంతో దాని ధరల్లో మార్పులు ఉండవు. -
ఐఓసీలో 10% వాటా విక్రయం
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీ ఐవోసీలో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా తలా 5 శాతం వాటా కొనుగోలు చేశాయి. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం ఆఫర్ చేసిన 10 శాతం వాటాను (24.27 కోట్ల షేర్లు) షేరుకి రూ.220 ధర చొప్పున టోకున సొంతం చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి రూ.5,340 కోట్లు సమకూరాయి. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్మెంట్) ద్వారా ప్రభుత్వం రూ.10,434 కోట్లను సమీకరించినట్లయ్యింది. కాగా, ఐవోసీలో ప్రభుత్వ వాటా 78.92% నుంచి 68.92%కు క్షీణించగా, ఓఎన్జీసీ వాటా 8.77% నుంచి 13.77%కు ఎగసింది. ఇక ఆయిల్ ఇండియా తొలిసారి ఐవోసీలో (5%) వాటాను కొనుగోలు చేసింది. బీఎస్ఈలో ఐవోసీ షేరు 2% క్షీణించి రూ. 269 వద్ద ముగిసింది. లక్ష్యాన్ని అందుకుంటాం ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ.16,000 కోట్ల సమీకరణను సాధించగలమని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా ఐవోసీలో వాటా విక్రయంతో ఇప్పటికే రూ.10,434 కోట్లను సమీకరించామని డిజిన్వెస్ట్మెంట్ శాఖ కార్యదర్శి అలోక్ టాండన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ) వాటాలతో ఏర్పాటు చేస్తున్న ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) ద్వారా రూ.3,000 కోట్లను సమీకరిస్తామని, తద్వారా ఈ నెలాఖరుకల్లా లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారాయన. ఇదే బాటలో యాక్సిస్ బ్యాంక్లో ప్రభుత్వానికి ఉన్న వాటా విక్రయాన్ని కూడా ఈ నెలలో ముగిస్తామన్నారు. ఎల్అండ్టీ, ఐటీసీలలోనూ ప్రభుత్వానికి కొంతమేర వాటా ఉంది. వచ్చే వారమే ఈటీఎఫ్ సీపీఎస్ఈల వాటాలతో ఏర్పాటు చేస్తున్న ఈటీఎఫ్ను ప్రభుత్వం వచ్చే వారం ప్రవేశపెట్టనుంది. ఓఎన్జీసీ, గెయిల్, కోల్ ఇండియా, ఆర్ఈసీ, కంటెయినర్ కార్పొరేషన్ తదితర 10 ప్రభుత్వ బ్లూచిప్ కంపెనీలలోని వాటాలతో ఈటీఎఫ్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఫండ్ను రూ.10 కోట్లకుపైగా ఇన్వెస్ట్చేసే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 18న ఆఫర్ చేస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లు, తదితర సంస్థలు 19 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లందరికీ 5% తొలి(అప్ఫ్రంట్) డిస్కౌంట్ లభిస్తుంది. -
ఫార్చ్యూన్ టాప్ ర్యాంక్ మళ్లీ ఐఓసీదే
న్యూఢిల్లీ: ఫార్చ్యూన్ ఇండియా-500 కంపెనీల ఈ ఏడాది జాబితాలో మళ్లీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ-ఆదాయం రూ.4,75,867 కోట్లు) అగ్రస్థానంలో నిలిచింది. ముకేశ్ అంబానీ నేతృత్వం లోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆదాయం రూ. 4,09,883 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. ప్రతి ఏటా ఫార్చ్యూన్ బిజినెస్ మ్యాగజైన్ ఆదాయాల పరంగా అగ్రశ్రేణి 500 భారతీయ కంపెనీలతో జాబితాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది టాప్ టెన్లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు, వాటిల్లో నాలుగు చమురు కంపెనీలు కావడం విశేషం. టాటా గ్రూప్కు చెందిన రెండు కంపెనీలు టాప్టెన్లో నిలిచాయి. అమ్మకాల వృద్ధి మందగించినప్పటికీ, లాభాల్లో రికవరీ సూచనలు కనిపిస్తున్నాయని ఈ ఏడాది జాబితా సూచిస్తోందని ఈ మ్యాగజైన్ పేర్కొంది. భారత కంపెనీలు పరిపక్వత చెందుతున్నాయని వివరించింది. ప్రతిభ గల ఉద్యోగుల కోసం భారీ ప్యాకేజీలు ఇవ్వడానికి వెనకాడ్డం లేదని పేర్కొంది. అందుకే ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఉద్యోగుల వేతనాలు, జీతాలు పెరిగాయని వివరించింది. టాప్ 8 కంపెనీలు గతేడాది తాము పొందిన స్థానాలనే ఈ ఏడాది కూడా నిలుపుకున్నాయి. ఇక ఈ జాబితాలో స్థానం సాధించిన ఇతర కంపెనీలు. భారతీ ఎయిర్టెల్(12వ స్థానం), ఐసీఐసీఐ బ్యాంక్(14), ఎన్టీపీసీ(15), టీసీఎస్ (18), ఇన్ఫోసిస్(27వ స్థానం). టాప్ టెన్ కంపెనీలు ర్యాంక్ కంపెనీ 1 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 భారత్ పెట్రోలియం 4 హిందూస్తాన్ పెట్రోలియం 5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 టాటా మోటార్స్ 7 ఓఎన్జీసీ 8 టాటా స్టీల్ 9 ఎస్సార్ ఆయిల్ 10 కోల్ ఇండియా -
డీజిల్కు తగ్గిన డిమాండ్: ఐఓసీ
న్యూఢిల్లీ: దశాబ్దం కాలంలో మొదటిసారి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డీజిల్కు డిమాండ్ పడిపోయింది. 3వ ప్రపంచ ఇంధన సదస్సులో పాల్గొన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్ ఆర్ఎస్ బుటోలా ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నెలవారీ పెరుగుతున్న ధరలు, విద్యుత్ వినియోగం పెరగడం ప్రధాన కారణాలని ఈ సందర్భంగా బుటోలా వివరించారు. 2003-04 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకూ వార్షిక ప్రాతిపదికన నుంచి 6 నుంచి 8% శ్రేణిలో వృద్ధిని నమోదుచేసుకుంటూ వచ్చింది. ఏ కాలంలోనూ అమ్మకాల్లో క్షీణత నమోదు కాలేదు. అయితే గత ఆర్థిక సంవత్సరం (2012-13) తొలి ఏడు నెలల కాలంతో(ఏప్రిల్-అక్టోబర్) పోల్చితే అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) ఇదే కాలంలో 0.8% తగ్గి 39.46 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయని చెప్పారు. పెట్రోలియంలో 10 శాతం వృద్ధి: కాగా ఇదే కాలంలో పెట్రోలియం వినియోగం మాత్రం 10 శాతం మేర పెరిగి 9.05 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో డిజిల్ అమ్మకాలు 6.68 శాతం వృద్ధితో 69.08 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. 2003-04లో ఈ వినియోగం 37.07 మిలియన్ టన్నులు. ఈ ఏడాది జనవరి నుంచి డీజిల్ ధరలు రూ.6.62 పెరిగాయి. మరోవైపు ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో మొత్తం ఇంధన డిమాండ్ను పరిశీలిస్తే- ఇది స్వల్పంగా 90.23 మిలియన్ టన్నుల నుంచి 90.57 మిలియన్ టన్నులకు పెరిగింది. -
డీజిల్ ధర లీటర్కు 50 పైసలు పెంపు
శనివారం అర్ధరాత్రి నుంచి డీజిల్ ధరలు పెరగనున్నాయి. టాక్స్లు మినహా లీటర్కు 50 పైసలు చొప్పున పెంచాలని నిర్ణయించారు. కాగా పెట్రోలు ధరల్లో ఎలాంటి మార్పులూ ఉండవు. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ వెల్లడించిండి. అంతర్జాతీయ చమురు ధరల్ని బట్టి పెట్రోల్ ధరల్ని సమీక్షిస్తారు. ఓఎంసీలు ప్రతి పదిహేను రోజులకోసారి పెట్రోలియం ధరల్ని సమీక్షిస్తాయి. గత నెల 31న డీజిల్ ధరను లీటర్కు 50 పైసలు చొప్పున పెంచి, పెట్రోల్ ధరను 1.15 రూపాయిలు తగ్గించారు. -
నెలాఖరుకల్లా ఐవోసీ డిజిన్వెస్ట్మెంట్!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించుకున్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యంలో భాగంగా ఆయిల్ దిగ్గజం ఐవోసీలో 10% వాటాను ఈ నెలాఖరుకల్లా విక్రయించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ ఏడాదిలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ. 40,000 కోట్లను సమీకరించాలని ఆర్థిక శాఖ బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఐవోసీలో వాటాను విక్రయించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలాఖరుకల్లా ఐవోసీలో 10% వాటాను విక్రయించడం ద్వారా ఇంజినీర్స్ ఇండియా తదితర సంస్థల డిజిన్వెస్ట్మెంట్కు ఊపుతేవాలని యోచిస్తున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే, కంపెనీ షేరు ధర కనిష్ట స్థాయి వద్ద ఉన్న నేపథ్యంలో ఇటు కంపెనీ, అటు పెట్రోలియం శాఖ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో డిజిన్వెస్ట్మెంట్ను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, గత శుక్రవారం బీఎస్ఈలో ఐవోసీ షేరు రూ. 213 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద ప్రభుత్వానికి 10% వాటాకుగాను రూ. 4,000 కోట్లకుపైగా లభించే అవకాశముంది. కంపెనీలో ప్రభుత్వానికి 78.92% వాటా ఉంది. డిజిన్వెస్ట్మెంట్ను నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే ప్రభుత్వం సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీసహా ఐదుగురు మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది కూడా. -
మళ్లీ పేలిన పెట్రో బాంబు.. లీటర్ కు 1.63 పెంపు!
మధ్య తరగతి వినియోగదారుడిపై పెట్రో బాంబు మళ్లీ పేలింది. లీటర్ పెట్రోల్ ధరను రు.1.63 పెంచుతూ దేశీయ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి హెచ్చు తగ్గులు, ఇంటర్నేషనల్ మోటార్ స్పిరిట్ ధరలు వ్యత్యాసం కారణంగానే పెట్రో ధరను పెంచడం జరిగిందని ఐఓసీ తెలిపింది. నాలుగు ప్రధాన నగరాల్లో సవరించిన పెట్రోల్ ధరలు ఐఓసీ వెల్లడించింది. గతంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 74.10 రూపాయలు ఉండగా 76.06 చేరుకుంది. కోల్ కతాలో 81.57 నుంచి 83.62కు, ముంబైలో 81.57 నుంచి 83.63 కు, చెన్నై లో 77.48 నుంచి 79.55 పెరిగింది.