Syrian civil war
-
సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత
రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐసిస్) చేసిన అమానవీయ దాడి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. రష్యాపై దాడులు ఐసిస్కు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కింద రష్యా పౌరులే లక్ష్యంగా విమానాన్నే బాంబుతో పేల్చేసి 244 మందిని బలి తీసుకున్న చరిత్ర దానిది! కాబూల్లోని రష్యా రాయబార కార్యాలయంపైనా దాడులకు తెగబడింది. సిరియా అంతర్యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పుతిన్ జోక్యం రష్యాపై ఐసిస్ ఆగ్రహానికి ప్రధాన కారణం. రష్యాలోని ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్న వార్తలు దాని విద్వేషాన్ని మరింతగా పెంచి పోషించాయి. ఫలితంగా రష్యాకు, ఐసిస్కు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నిత్యం నిప్పుల కుంపటి రాజేస్తూనే ఉంది... అలా మొదలైంది... ఐసిస్ అరాచకం 2015లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఐసిస్ను అణిచే ప్రయత్నాల్లో అధ్యక్షుడు బషీర్ అల్ అసద్కు పుతిన్ దన్నుగా నిలిచారు. దాంతో రష్యాపై ఐసిస్ తీవ్ర ద్వేషం పెంచుకుంది. మాస్కోలో తాజా మారణహోమానికి తెగబడింది ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్–కె). ఇది అఫ్గానిస్థాన్లో ఐసిస్ అనుబంధ సంస్థ. 2022లో అఫ్గాన్ రాజధాని కాబూల్లోని రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసి ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది ఐసిస్–కెనే. దీన్ని పాకిస్థానీ తాలిబాన్ ముఠా సభ్యులు 2015లో ప్రారంభించారు. అఫ్గాన్లో భద్రతా దళాలతో పాటు మంత్రులపై, మైనారిటీలపై వరుస దాడులతో ప్రాచుర్యంలోకి వచి్చంది. 2018కల్లా ప్రపంచంలోని నాలుగు అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఉగ్ర శిక్షణ నిమిత్తం ఇరాక్, సిరియాల్లోని అగ్ర నాయకత్వం నుంచి కోట్లది డాలర్లు అందకుంటూ వచి్చంది. తర్వాత అమెరికా సైన్యం, అఫ్గాన్ కమెండోలు, అఫ్గాన్ తాలిబన్ల ముప్పేట దాడితో ఐసిస్–కె ఆగడాలకు కళ్లెం పడింది. అమెరికా వైమానిక దాడులు దాని అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ నుంచి వైదొలగడంతో ఐసిస్–కె మళ్లీ పుంజుకుంది. అదే ఏడాది కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసి 13 మంది అమెరికా సైనికులతో పాటు ఏకంగా 170 మంది పౌరులను బలి తీసుకుంది. కొన్నేళ్లుగా అఫ్గాన్ ఆవల కూడా విస్తరిస్తోంది. గత జనవరిలో ఇరాన్లో దివంగత మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ స్మారక ర్యాలీపై ఆత్మాహుతి దాడికి తెగబడి 84 మందిని పొట్టన పెట్టుకుంది. ఇస్తాంబుల్లో ఓ చర్చిపైనా దాడి చేసింది. పుతిన్ను, ఆయన విధానాలను ఐసిస్–కె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెగలపరంగా తమ ప్రబల శత్రువులైన తాలిబన్లతో పుతిన్ సాన్నిహిత్యం రష్యాపై విద్వేషాన్ని మరింత ఎగదోసింది. దీనికి తోడు రష్యాలో ముస్లింలపై అణచివేత పెరుగుతోందని ఆమ్నెస్టీతో పాటు పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో ముస్లింలు 2 కోట్ల దాకా ఉంటారని అంచనా. మతపరమైన ప్రార్థనలు కూడా చేసుకోలేనంతగా వారిపై తీవ్ర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని, విద్య, ఉపాధి తదితరాల్లో నూ వివక్ష కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియాలో కూడా ముస్లింలపై రష్యా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ ఐసిస్–కెకు మరింత కంటగింపుగా మారాయి. హిజాబ్ ముస్లిం సంప్రదాయం కాదంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు రష్యాపై దాని ద్వేషాన్ని మరింతగా పెంచాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కుర్దు ఉగ్రవాదులను తరిమికొట్టాం’
అఫ్రిన్, సిరియా : సిరియాలోని ఆఫ్రిన్ నగరంలో టర్కీ సేనలు పాగా వేశాయి. దేశానికి ఆఫ్రిన్ నగరంలోని కుర్దులను టర్కీ దన్నుతో సిరియాలో పోరాటం సాగిస్తున్న సేనలు వెళ్లగొట్టాయి. అనంతరం ప్రముఖ కుర్దు నాయకుడి విగ్రహాన్ని సేనలు నేలకూల్చాయి. టర్కీ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్ మిలిటెంట్లను అంతమొందించేందుకు గత రెండు నెలలుగా సిరియాలో టర్కీ సేనలు వరుసగా దాడులు చేస్తున్నాయి. అయితే, ఈ దాడుల్లో ఇప్పటివరకూ 280 సాధారణ పౌరులు మరణిచారని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా ఆ ఆరోపణలను టర్కీ ఖండించింది. అంతకుముందు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ ఫ్రీ సిరియా ఆర్మీ సేనలు ఆఫ్రిన్ను ఆదివారం ఉదయం స్వాధీనం చేస్తున్నాయని ప్రకటించారు. సేనల దెబ్బకు ఉగ్రవాదులు ఒట్టి చేతులతో పారిపోతున్నారని అన్నారు. -
ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 7వేల మంది సిరియన్ వలస వాదులను అమెరికాలో కొనసాగేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘ప్రస్తుతం సిరియా అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వారిక్కడే(అమెరికాలో) నివసించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. మానవత్వ కోణంలో వారికిక్కడ తాత్కాలిక రక్షణ హోదాను (టీపీఎస్) కల్పిస్తున్నాం. దానిని మరికొంత కాలం కొనసాగించబోతున్నాం’’ అంటూ ట్రంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అయితే కొత్తగా వచ్చే శరణార్థుల దరఖాస్తులను మాత్రం అంగీకరించబోమని అమెరికా స్పష్టం చేసింది. ఇక ఈ ప్రకటనను అమెరికా హోంలాండ్ కార్యదర్శి క్రిస్ట్జెన్ నీల్సన్ ధృవీకరించారు. ఒక్క సిరియానే కాదు.. మిగతా దేశాల(నిషేధం ఎదుర్కుంటున్న 10 దేశాలు) శరణార్థుల విషయంలోనూ పునరాలోచన చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తాజా ఉత్తర్వులతో అమెరికాలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న సిరియన్లు.. మరో 18 నెలలపాటు నిరభ్యరంతంగా జీవించొచ్చు. అయితే ఎల్ సాల్వెడొర్, హైతి, నికారగువా తదితర ప్రాంతాల నుంచి శరణార్థుల తాకిడి ఎక్కువగా ఉంటుండటంతో.. ఆ మధ్య టీపీఎస్ విధానాన్ని ఆయా ప్రాంతాలకు రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2007లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా శరణార్థుల ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో శరణార్థుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అయితే నిషేధం ఎదుర్కొంటున్న 11 దేశాలపై మాత్రం 90 రోజుల పాటు సమీక్షించాలని గతేడాది అక్టోబర్లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. -
క్రిస్టియన్ నగరంపై విరుచుకుపడ్డ జిహాదీలు
డమాస్కస్ : సిరియాలోని హమా, మహార్దా నగరాలపై ఆదివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) జిహాదీ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. అల్ఖైదా నేతృత్వంలో తీవ్రవాదాన్ని కొనసాగిస్తున్న ఉగ్ర సంస్థలు హాయత్ తహరీర్ అల్ షామ్, ఎఫ్ఎస్ఏలు సిరియా సైన్యానికి చెందిన మూడు చెక్ పాయింట్లపై బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఒక చెక్ పోస్టు పూర్తిగా ధ్వంసం కాగా, రెండు చెక్ పోస్టులు పాక్షికంగా నాశనమయ్యాయి. సైన్యం చెక్పోస్టులతో పాటు క్రిస్టియన్ నగరమైన మహార్దాపై ఒకే సమయంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మహార్దాపై క్షిపణుల వర్షం కురింపించారు. క్రిస్టమస్ వేడుకకు నగరం సిద్ధమవుతున్న సందర్భంలో దాడి జరగడంతో మహార్దా ప్రజలు షాక్కు గురయ్యారు. కాగా, ఉగ్రవాదుల దాడికి ప్రతిగా సిరియా, రష్యా ఫైటర్ జెట్లు ఉగ్ర ప్రభావం కలిగిన ప్రాంతాలపై బాంబు దాడులు చేశాయి. కాగా, జిహాదీలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉగ్రవాదులు చేసిన దాడిగా దీన్ని పరిగణిస్తున్నారు. -
ఐసిస్ అధీనంలోని చివరి పట్టణం స్వాధీనం
బగ్దాద్: సంకీర్ణ సేనలతో పాటు కుర్దిష్ దళాల దాడులతో దెబ్బతిన్న ఉగ్రసంస్థ ఐసిస్కు మరో షాక్ తగిలింది. దేశంలో ఐసిస్ అధీనంలో ఉన్న చివరి పట్టణమైన ‘రవా’ను శుక్రవారం ఇరాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ‘భద్రతా బలగాలు రవాకు విముక్తి కల్పించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపై ఇరాక్ జాతీయ జెండాను ఎగరవేశాయి’ అని సంయుక్త ఆపరేషన్స్ కమాండ్(జేఓసీ) జనరల్ అబ్దెలామీర్ యరల్లాహ్ ప్రకటించారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, కుర్దిష్ దళాలు, రష్యా మద్దతు ఉన్న సిరియన్ సైన్యం అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో ఇప్పటివరకు ఐసిస్ 95 శాతం భూభాగాన్ని కోల్పోయింది. -
జస్టిన్ ట్రూడో చేతిలో జస్టిన్ ట్రూడో.. వైరల్
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉద్వేగానికి లోనయ్యారు. శనివారం ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ చిన్ని జస్టిన్ ట్రూడోను అప్యాయంగా ఎత్తుకుని ముద్దాడిన సందర్బంలో ఆయన ఆనందం రెట్టింపయింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుజ్జి జస్టిన్ ట్రూడోకు ఆయనకు ఏమాత్రం సంబంధం లేదు. అయితే జస్టిన్ ట్రూడో పేరేంటి అంటారా. ఆ వివరాలు.. సిరియాలోని డెమాస్కస్కు చెందిన మహ్మద్, ఆఫ్రా బిలాల్ అనే దంపతులు గతేడాది ఫిబ్రవరిలో శరణార్థులుగా కెనడాకు వలసొచ్చారు. ఇక్కడి ఆల్బర్టా అనే ప్రాంతంలో ఈ జంట నివాసం ఉంటోంది. కెనడాకు వచ్చిన కొన్ని రోజులకు వీరికి ఓ పండండి బాబు పుట్టగా.. శరణార్థులుగా తమకు ఎంతో దయగా దేశంలోకి అనుమతులిచ్చిన ప్రధాని జస్టిన్ ట్రూడో పేరునే బాబుకు పెట్టారు. జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రధానిని కలిసి తమ కుమారుడు జస్టిన్ ట్రూడోను చూపించాలని సిరియా దంపతులు భావించారు. అంత త్వరగా తమ కోరిక నెరవేరుతుందని మహ్మద్, ఆఫ్రా బిలాల్లు ఊహించలేదు. కాల్గరీలోని ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ప్రధాని జస్టిన్ ట్రూడో వచ్చారని చూసేందుకు ఈ భార్యాభర్తలు వెళ్లారు. వీలు దొరకడంతో ప్రధానిని సిరియా జంట కలిసింది. 'మా బాబుకి మీ పేరే పెట్టుకున్నాం. జస్టిస్ ట్రూడోను అందుకోండి' అంటూ తల్లి ఆఫ్రా బాబును ప్రధాని చేతిలో పెట్టారు. తమకు ఇక్కడ ఉండేందుకు ఛాన్స్ ఇచ్చినందుకు మీ పేరే బాబుకె పెట్టామని దంపతులు చెప్పారు. జస్టిన్ ట్రూడోను ప్రధాని జస్టిన్ ట్రూడో ఎత్తుకోగా ఫొటోగ్రాఫర్ అడమ్ స్కాటి ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇక అంతే.. జస్టిన్ ట్రూడోను ఎత్తుకున్న జస్టిన్ ట్రూడో అంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్గా మారి విపరీతంగా లైక్స్, కామెంట్లతో దూసుకుపోతోంది. .@JustinTrudeau met Justin-Trudeau Adam Bilal in #Calgary today. Background: https://t.co/u91OQexycZ #cdnpoli pic.twitter.com/qA2kvBXeXn — Adam Scotti -
సిరియాలో ఉగ్రదాడి: నలుగురి మృతి
డమస్కస్: సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. మరో12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సిరియాలోని అలెప్పో అల్ ఫుర్ఖాన్ వీధిలో శుక్రవారం ఈ దాడి జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పవిత్ర మాసమైన రంజాన్ నెలలో చివరి శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు మార్కెట్లో కొనుగోళ్లు చేస్తున్న సమయంలో రాకెట్ లాంచర్ ప్రయోగించడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
అధినేతలే శరణార్థులైతే!!
దేశాధినేతలు అందునా అగ్రరాజ్యాల అధినేతలు అధికార దర్పం ప్రదర్శించడంలో ఏమాత్రం వెనక్కుతగ్గరు. అడుగు తీసి అడుగు వేస్తే అంగరక్షకులు, వందిమాగధులు, అనుచరగణాల మధ్య రాచఠీవి ఒలకబోస్తుంటారు. కానీ.. అభాగ్యులు, అన్నార్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లాపాపలతో శరణార్థులై వస్తుంటే వారికి ఆశ్రయం ఇవ్వడంపై సిద్ధాంత చర్చలతో రాద్ధాంతం చేస్తుంటారు. ఈలోగా ఆ అభాగ్యులు ఎందరో మధ్యధరా సముద్రంలోనో, మధ్యవర్తుల అకృత్యాలకో బలైపోతున్నారు. ముఖ్యంగా సిరియా శరణార్థుల దైన్యం మాటలలో చెప్పలేనిది. ఆ సిరియాకు చెందిన అబ్దల్లా అల్ఒమారి అనే చిత్రకారుడు ప్రపంచ దేశాల అధినేతల మీద తన నిరసనను తన చిత్రాల ద్వారా చూపించారు. 'మీరు కూడా మనుషులే... మీరు కూడా అభాగ్యులు కాగలరు.. మీరు శరణార్థులైతే ఎలా ఉంటారో చూడండి...' అంటూ వారి చిత్రపటాలు గీశారు. అధికారం అందించే రాజలాంఛనాలలో అనునిత్యం తేలియాడే ఆ నాయకుల చిత్రాలను.. జన్మభూమిని విడనాడి సర్వస్వం కోల్పోయి చెల్లాచెదురైన కుటుంబ సభ్యుల కోసం వెదుకులాడుతూ, తలదాచుకునేందుకు కాస్త చోటు కోసం అల్లాడుతూ, ఆకలి తీర్చుకోవడానికి పిడికెడు మెతుకుల కోసం బారులు తీరే దీనుల రూపంలో గీసి చూపించాడు. ఈ చిత్రాలు సామాజిక మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్జాంగ్ ఉన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని, హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లా, టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్సిసి, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు నికొలస్ సర్కోజీ, ఫ్రాంకోయ్ హోలాండ్ తదితరులను శరణార్థులుగా చిత్రించారు. ప్రస్తుతం బెల్జియంలోని బ్రసెల్స్ లో నివసిస్తున్న అబ్దల్లా 'వల్నరబిలిటీ సిరీస్' పేరుతో గీసిన ఈ చిత్రాల్లో.. ముఖ్యంగా ఒక చంటిపాపను భుజాన ఎత్తుకుని, ఆచూకీ లేని తన కుటుంబ సభ్యుల ఫొటోను చేతిలో చూపిస్తూ దీనంగా కనిపిస్తున్న ట్రంప్ చిత్రం, 'నాకు సాయం చేయండి' అని రాసిన కాగితాన్ని ప్రదర్శిస్తూ అత్యంత దీనంగా కనిపిస్తున్న పుతిన్ చిత్రం, కాగితం పడవను నెత్తిన పెట్టుకుని నీటిలో నానిపోయిన అసద్ చిత్రంతో పాటు.. అధినేతలందరూ ప్లేట్లు, గిన్నెలె చేతుల్లో పట్టుకుని తిండి కోసం వరుసలో నిల్చున్న చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్సిసి జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు నికొలస్ సర్కోజీ ఉత్తర కొరియా పాలకుడు కిమ్జాంగ్ ఉన్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితరులు -
ఈ ఫొటో జర్నలిస్టు హృదయాలు కదిలించాడు
డెమాస్కస్: హృదయాన్ని కదిలించే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. చాలా తక్కువమంది మాత్రమే అలాంటివాటికి స్పందిస్తుంటారు. ఈరోజుల్లో అయితే జరుగుతున్న విషయాన్ని పట్టించుకోకుండా కూసింత సాయం చేయకుండా దానిని వీడియో తీయడమో, ఫొటోలో తీయడమో చేసి సోషల్ మీడియాలో పెట్టి క్రేజ్ సంపాధించుకోవాలనుకుంటారు. కానీ, సిరియాలో ఓ ఫొటో జర్నలిస్టు మాత్రం తన వృత్తిధర్మాన్ని పక్కకు పెట్టి మానవత్వాన్ని ముందుకు తెచ్చాడు. తనముందు జరిగిన సంఘటనను చూసి చలించిపోయి కాసేపు నిశ్చేష్టుడిగా మారి అనంతరం మేలుకొని నిజమైన వ్యక్తిలా కదిలాడు. రక్తం కారుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ తన చుట్టూ అక్కడక్కడ పడి ఉన్న చిన్నారులపై వైపు చూసి గుండెలు పగిలేలా రోధించాడు. కెమెరా ఉండగానే రెండు చేతుల్లోకి ఓ చిన్నారిని తీసుకొని అంబులెన్స్ వైపు పరుగులు తీశాడు. ఇదంతా సిరియాలో అనూహ్యంగా వారం కిందట చోటు చేసుకున్న బాంబుదాడి జరిగినప్పుడు చోటు చేసుకున్న దృశ్యమాలిక. పశ్చిమ అలెప్పోలోని రషిదిన్ల స్వాధీనంలో ఉన్న పలు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే సమయంలో ఓ చిప్స్ ప్యాకెట్స్ పట్టుకొని కారు దగ్గర నిల్చున్న వ్యక్తి చిన్నారులను దగ్గరకు పిలుస్తున్నాడు. అక్కడే ఫొటో గ్రాఫర్ల బృందం కూడా ఉంది. ఆలోగా అనూహ్యంగా ఓ భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. క్షణాల్లో 126మంది బలయ్యారు. వారిలో 80మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ఫొటో గ్రాఫర్లలో ఒకరైన అబ్ద అల్కదేర్ హబాక్ అనే వ్యక్తి ఆ సంఘటనను చూసి కాసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ వెంటనే తేరుకొని తన మిగితా ఫొటో గ్రాఫర్లకు ఆదేశాలు ఇచ్చి ఫొటోలు తీయడం ఆపేసి సహాయక చర్యలకు దిగాడు. ఎటు చూసిన విగత జీవులై పడి ఉన్న చిన్నారులను రోదించాడు. హబాక్ తొలిసారి ఓ చిన్నారి వద్దకు వెళ్లగా అతడు చనిపోయి ఉన్నాడు. మరో రెండడుగులు వేయగా కొన ఊపిరితో ప్రాణంకోసం ఓ బాలుడు అల్లాడుతున్నాడు. దాంతో కన్నీటి పర్యంతమైన హబాక్ అతడిని చేతుల్లోకి తీసుకొని అంబులెన్స్లోకి చేర్చాడు. ఆ వెంటనే మరో చిన్నారి వద్దకు వెళ్లి చూడగా ప్రాణాలుకోల్పోయి కనిపించాడు. ఇలా అంతా చనిపోయి ఉండటం చూసి మొకాళ్లపై కూలబడి కుమిలికుమిలి ఏడ్చాడు. ఈ చిత్రాలను అతడి సహచర ఫొటో గ్రాఫర్లు తీసి ఆన్లైన్లో పెట్టగా లక్షల మంది వీక్షించారు. అతడు చూపించిన జాలి ప్రేమపట్ల నెటిజన్లు శబాష్ ఫొటో జర్నలిస్టు అంటున్నారు. -
కూతురి బాధ తట్టుకోలేకే...ట్రంప్ నిర్ణయం
లండన్: సిరియా వైమానిక స్థావరంపై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడానికి ఆయన కుమార్తె ఇవాంకా వేదన కూడా కారణమని ట్రంప్ కుమారుడు ఎరిక్ తెలిపారు. సిరియా గ్యాస్ దాడిలో గాయపడిన చిన్నారులపై మందును స్ప్రే చేస్తున్న చిత్రాలను చూసి తన తండ్రి చలించిపోయారని ఆయన చెప్పారు. గ్యాస్ దాడిలో తన గుండె పగిలిపోయిందని ఇవాంకా చెప్పినట్లు ‘టెలిగ్రాఫ్ పత్రిక’ పేర్కొంది. దాడి భయంకరంగా ఉందని, తన తండ్రి సకాలంలో చర్య తీసుకుంటాడని ఆమె చెప్పంది. కాగా యుద్దవిమానాలు విష రసాయనాలతో వాయువ్య సిరియాపై జరిపిన దాడిలో 72మందికి పైగా అమాయకుల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. రెబెల్స్ ఆధీనంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ పరిధిలోగల ఖాన్ షేఖున్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతున్న కుర్దిష్–అరబ్ కూటమి లక్ష్యంగా చేసుకుని గత కొద్ది రోజులుగా దాడులు ముమ్మరం చేసింది. -
సిరియాలో ఏం జరుగుతోంది?
ఓ పక్క అంతర్యుద్ధం, మరో పక్క ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాదుల ఆగడాలు, అన్నిటికీ మించి దాదాపు 17 ఏళ్లుగా బాత్పార్టీ నేత బషారల్ అసద్ నియంతృత్వ పాలనలో మగ్గుతున్న సిరియాలో సంక్షోభం గురువారం అమెరికా విమాన దాడులతో మరింత తీవ్రమయింది. ఇద్లీబ్ పట్టణంపై మంగళవారం జరిగిన సారిన్ విషవాయువు దాడికి తీవ్రంగా స్పందిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలపై అమెరికా సేనలు తొలిసారి సిరియాపై ప్రత్యక్ష దాడిచేశాయి. అసద్ దళాలు రసాయన దాడి చేయడానికి ఉపయోగించాయని భావిస్తున్న వైమానిక స్థావరంపై 59 అమెరికా క్షిపణుల వర్షం కురిపించాయి. విషవాయువు దాడి ఎవరు చేశారో దర్యాప్తు జరిపించాలని రష్యా ఐరాసలో ప్రయత్నం చేస్తుండగానే, అమెరికా ఎప్పటిలా అసద్నే దోషిగా చేసి దాడులు జరిపించింది. తిరుగుబాటుదారులే సారిన్ వాయువును జనంపై ప్రయోగించి, అసద్ సర్కారుకు ఆ పాపం అంటేలా చేశారని రష్యా భావిస్తోంది. ఎందుకీ అంతర్గత పోరు? 2010 చివర్లో ఈజిప్ట్ సహా అరబ్ దేశాల్లో నియంతల పాలనపై ఆరబ్ స్ప్రింగ్ పేరిట ఆరంభమైన తిరుగుబాట్లు సిరియాలోనూ ప్రజలను అసద్ సర్కారుపై పోరాటానికి పురికొల్పాయి. 2011 మార్చిలో దేరా పట్టణంలో మొదలైన ఘర్షణలు 2012 నాటికి ప్రాచీన నగరం అలెప్పో, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించి, అప్పటి నుంచి ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. యుద్ధం ఎవరు ప్రారంభించారు? అప్పటికి(2011) 40 ఏళ్లుగా సోషలిస్ట్ బాత్ పార్టీ పేరిట సాగుతున్న అసద్ కుటుంబపాలనలో అవినీతి, అణచివేత అదుపు తప్పాయి. ఫలితంగా దేరాలో జరిగిన ప్రజాప్రదర్శనను సర్కారు ఉక్కుపాదంతో అణచివేసింది. దీంతో తిరుగుబాటుదారులకు ప్రవాసంలో ఉన్న అసద్ వ్యతిరేకులందరూ మద్దతు అందించారు. ఎవరెవరిపై పోరాడుతున్నారు? అధ్యక్షుడు అసద్ సేనలు తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులు, ఇస్లాం పేరిట దారుణాలకు పాల్పడుతున్న ఐసిస్ దళాలతో పోరుసాగిస్తున్నాయి. తిరుగుబాటుదారులపై యుద్ధంలో అసద్ సైన్యం ఎందుకు విజయం సాధించలేకపోతోంది? దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలు, గ్రూపుల జోక్యమే. అసద్ షియా కావడంతో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి షియా మెజారిటీ ఇరాన్తోపాటు, ప్రచ్ఛన్నయుద్ధకాలం నాటి సంబంధాల కారణంగా రష్యా సాయం చేస్తున్నాయి. అమెరికా, సౌదీఅరేబియాలు సున్నీ తిరుగుబాటుదారులకు అన్ని విధాలా తోడ్పడుతున్నాయి. అంతర్యుద్ధంలో జరిగిన నష్టమెంత? ఒక్క అలెప్పో నగరంలోనే మూడు నుంచి దాదాపు ఐదు లక్షల మంది ఈ అంతర్గత పోరులో ప్రాణాలు కోల్పోయారు. హింస ఎంతగా పెరిగిందంటే 2015 ఆగస్టులో ఇక్కడ మృతులను ఐక్యరాజ్య సమితి లెక్కించడం మానేసింది. దేశం నుంచి దాదాపు అర కోటి మంది పొరుగున ఉన్న టర్కీ, జోర్డాన్, లెబనాన్తో పాటు పశ్చిమ ఐరోపా దేశాలకు పారిపోయారు. దాదాపు 65 లక్షల మంది ప్రజలు ఈ అంతర్యుద్ధం కారణంగా తమ ఊళ్లను వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు చెల్లాచెదురయ్యారు. ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి అసద్ తన దళాలతో రసాయన ఆయుధాలు ప్రయోగించడమేగాక, వీధుల్లో మూకుమ్మడి హత్యాంకాడలకు తెగబడ్డాడని అమెరికా ఆరోపించింది. సిరియాలో హింస ఎంత క్రూరంగా కనిపిస్తోంది? తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రధాన నగరం అలెప్పోను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి డిసెంబర్లో అసద్ ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో దాడులు జరిపాయి. ఈ మెరుపు దాడుల్లో 82 మంది పౌరులు మరణించారు. తిరుగుబాటుదారుల చివరి స్థావరంగా మిగిలిన తూర్పు అలెప్పోలో కేవలం అయిదు శాతం ప్రాంతం మాత్రమే వారి అధీనంలో ఉన్నాగాని ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ప్రభుత్వ అనుకూల దళాలు ప్రజలపై దారుణాలకు పాల్పడ్డాయని ఐరాస ప్రధానకార్యదర్శి బాన్కీ మూన్ చెప్పారు. ప్రచ్ఛన్నయుద్ధం అవశేషాలే సిరియా మంటలకు కారణమా? ప్రచ్ఛన్నయుద్దకాలంలో అసద్ కుటుంబం అప్పటి సోవియెట్ యూనియన్కు మద్దతుదారుగా మారింది. అసద్ కుటుంబం షియా ఆలవైత్ తెగకు చెందినది కావడం, అమెరికాతో వైరం ఇరాన్ను సిరియాకు దగ్గరయ్యేలా చేసింది. సోవియెట్ యూనియన్ విచ్ఛన్నమయ్యాక కూడా అమెరికా అసద్ సర్కారుకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులకు సాయమందిస్తూనే ఉంది. ఫలితంగా రష్యాకు అసద్ సర్కారు మరింది చేరువయింది. ఏకైక అగ్రరాజ్యం అమెరికా, మాజీ అగ్రరాజ్యం వారసురాలు రష్యాల మధ్య ఇంకా కొనసాగుతున్న పోటీ కూడా సిరియా మంటలకు ఆజ్యం పోస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘యూఎస్, రష్యా మధ్య అణుయుద్ధం జరగొచ్చు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యను హవాయిన్ ప్రాంతం నుంచి అమెరికా కాంగ్రెస్కు ఎంపికైన తొలి హిందూ మహిళ, డెమొక్రాట్ తులసీ గబార్డ్ తప్పుబట్టారు. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా నిర్లక్ష్యపూరితంగా ట్రంప్ సిరియాపై దాడి చేయించారని మండిపడ్డారు. వారికి అసలు దూరదృష్టే లేదని విమర్శించారు. ‘ఈ పాలన వర్గం(ట్రంప్ ప్రభుత్వం) నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సిరియాపై దాడులు చేస్తే తదుపరి జరగబోయే పరిణామాలు ఏమిటనే విషయంలో ఎవరినీ సంప్రదించలేదు. అదీ కాకుండా అసలు సిరియాలో జరిగింది కెమికల్ దాడులా కాదా అని నిర్ధారించుకోలేదు. ఇవేం చేయకుండానే ఏకపక్షంగా దాడి చేయడం సరికాదు. ట్రంప్ చేసిన ఈ పని నాకు చాలా బాధను, కోపాన్ని కలిగించింది. ఇది అల్ కయిదాను మరింత బలోపేతం చేస్తోంది. వారు ఇంకెంతోమంది సిరియాలోని అమాయకులను పొట్టనపెట్టుకోవచ్చు. ఎంతోమందిని శరణార్థులుగా మార్చవచ్చు. అంతేకాదు, అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం కూడా జరిగే అవకాశం ఉంది’ అంటూ ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
హిల్లరీ చెప్పిన కాసేపటికే దాడి!
సిరియాలోని వైమానిక స్థావరం మీద అమెరికా తన యుద్ధ విమానాల నుంచి తోమహాక్ క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందు హిల్లరీ క్లింటన్ ఎన్బీసీ న్యూస్ చానల్తో మాట్లాడుతూ అసద్ అల్ బషర్ వైమానిక స్థావరాల మీద అమెరికా దాడి చేయాలని చెప్పారు. ఆ దేశంలో చాలావరకు పౌరుల మరణాలకు సిరియా వైమానిక దళమే కారణమని, అందువల్ల సిరియా అధ్యక్షుడి నియంత్రణలో ఉన్న మొత్తం అన్ని వైమానిక స్థావరాలను మనం స్వాధీనం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆ తర్వాత కాసేపటికే సిరియా వైమానిక స్థావరంపై తోమహాక్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ అనుమతి లేకుండానే... వాస్తవానికి అమెరికా తరఫున ఎలాంటి సైనిక చర్య తీసుకోవాలన్నా అందుకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, సిరియా మీద దాడి విషయంలో డోనాల్డ్ ట్రంప్ మాత్రం కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండానే దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతకుముందు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా దాడులు చేసినా, అప్పట్లో మాత్రం కాంగ్రెస్లో విస్తృతంగా చర్చించిన తర్వాత మాత్రమే రంగంలోకి దిగారు. ఆరుగురు సైనికుల మృతి అమెరికా క్షిపణి దాడుల్లో ఒక అధికారి సహా ఆరుగురు సైనికులు మరణించారని సిరియా చెబుతోంది. షైరత్ వైమానిక స్థావరంపై దాదాపు 60 తోమహాక్ క్షిపణులను అమెరికా మధ్యధరా సముద్రంలోని తన యుద్ధ నౌకల నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తమ దేశానికి చెందిన నలుగురు సైనికులు మరణించినట్లు సిరియా అంటోంది. వాస్తవానికి తాము ఈ వైమానిక స్థావరాన్ని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులపై దాడి కోసం ఉపయోగిస్తున్నామని, ఇలాంటి స్థావరాన్ని అమెరికా ధ్వంసం చేసిందని సిరియా వాదిస్తోంది. ఈ విషయాన్ని స్థానిక పాత్రికేయులు కూడా సమర్థిస్తున్నారు. సిరియాలో చాలా వైమానిక స్థావరాలు ఉండగా, అమెరికా మాత్రం కేవలం సిరియా వైమానిక దళం ఐసిస్ మీద దాడులకు ఉపయోగించే ఏకైక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందని సిరియాకు చెందిన అల్ మస్దర్ న్యూస్ సీఈవో లీత్ అబూ ఫదెల్ ట్విట్టర్లో తెలిపారు. ఇప్పుడు సిరియాను అల్ కాయిదాకు వెండి పళ్లెంలో పెట్టి మరీ అప్పగిస్తున్నారని రక్షణ రంగ నిపుణుడు హైదర్ సుమేరి వ్యాఖ్యానించారు. -
తోమహాక్ క్షిపణులే ఎందుకు?
అమెరికా నౌకాదళం సిరియా మీద దాడులకు ఉపయోగించుకున్న ప్రధానాస్త్రం.. తోమహాక్ క్షిపణులు. చాలా దూరం నుంచి ప్రయోగించినా కూడా కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం వీటికి ఉంటుంది. 1991 ప్రాంతంలో జరిగిన గల్ఫ్ యుద్ధంలో కూడా అమెరికా వీటిని విస్తృతంగా ఉపయపోగించింది. వీటికి సాధారణంగా 455 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. చిట్టచివరిసారిగా వీటిని ఎర్ర సముద్రం నుంచి యెమెన్లోని కోస్టల్ రాడార్ సైట్ల మీద పెంటగాన్ ప్రయోగించింది. అమెరికా నౌకల మీద హౌతీ రెబెల్స్ క్షిపణిదాడులు చేయడంతో వారిని అడ్డుకునేందుకు వీటిని వేసింది. ఇక తాజాగా సిరియా వైమానిక స్థావరం మీద చేసిన దాడుల కోసం.. మధ్యధరా సముద్రంలో ఉన్న యుద్ధనౌకల మీద నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారు. తోమహాక్ క్షిపణులను ప్రయోగించాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దాదాపు 1600 కిలోమీటర్ల దూరం నుంచి వీటిని నౌకాదళం ప్రయోగించగలదు. అంత దూరంలో ఉన్న నౌకల మీదకు శత్రువులు తమ వాయుసేనతో వచ్చేందుకు కూడా వెంటనే అవకాశం ఉండదు. తోమహాక్ క్షిపణుల కంటే కూడా అమెరికా సైనిక విమానాలు ఎక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలవు. కానీ, వాటిని తప్పనిసరిగా మనుషులే నడపాల్సి ఉంటుంది. శత్రుసేనలు వాటిమీద సులభంగా దాడి చేయగలవు. తోమహాక్ క్షిపణుల్లో కొన్ని క్లస్టర్ బాంబులను కూడా తీసుకెళ్లి, వాటిని టార్గెట్ మీద విరజిమ్మగలవు. దానివల్ల చుట్టుపక్కల ఉన్న వాహనాలు కూడా ధ్వంసం అవుతాయి. అయితే యుద్ధ విమానాల నుంచి వదిలే బాంబులు మరింత ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. ఒకవేళ యుద్ధవిమానాలు వాడాలని ట్రంప్ సర్కారు నిర్ణయించుకుంటే, అప్పుడు తప్పనిసరిగా నౌకాదళ విమానాలే వాడాల్సి ఉంటుంది. అంటే హారియర్ జెట్లు అన్నమాట. సిరియా సైన్యం ఎక్కువగా ఎస్-200 తరహా భూమ్మీద నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులను వాడుతుంది. అయితే, వాళ్లకు అండగా ఉన్న రష్యన్ సైన్యం మాత్రం ఎస్-300, ఎస్-400 తరహా క్షిపణులు వాడగలదు. ఇవి మామూలు వాటి కంటే చాలా వేగంగా వెళ్తాయి. వాటికి రాడార్ వ్యవస్థ కూడా ఉంటుంది. అమెరికా సైన్యం మాత్రం కొంతవరకు ఈఏ-18జి గ్రౌలర్ జెట్, ఇతర సాధనాలతో రష్యాన్ రాడార్లను జామ్ చేయగలదు. ఆ జామర్లను కూడా అధిగమించే సామర్థ్యం రష్యా దగ్గరున్న ఎస్-400 తరహా క్షిపణులకు ఉంటుంది. -
ఇది మాపై దురాక్రమణే: సిరియా
తమ సైనిక స్థావరంపై అమెరికా తోమహాక్ క్షిపణులతో దాడి చేయడాన్ని సిరియా తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా దురాక్రమణే అని సిరియా అధికారిక టీవీ చానల్ ప్రకటించింది. సిరియా రసాయన దాడులలో 70 మంది వరకు మరణించిన విషయాన్ని తీవ్రంగా ఖండించిన ఒక్క రోజు తర్వాతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడులకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులపై సిరియా అధ్యక్షుడు అసద్ అల్ బషర్ నేరుగా ఇంతవరకు స్పందించలేదు. అంతర్జాతీయ సమాజం నుంచి కూడా దీనిపై ఇంకా ఎలాంటి స్పందనలు రాలేదు. కానీ, తాము ముందుగానే సిరియాలో ఉన్న రష్యా దళాలకు తమ దాడుల గురించి సమాచారం అందించామని పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అక్కడ వైమానిక స్థావరంలో ఉన్న రష్యన్, సిరియన్ బలగాలకు ముప్పు వీలైనంత తక్కువగా ఉండేందుకు గాను అమెరికా సైనిక వ్యూహకర్తలు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నారని కూడా ఆ ప్రకటనలో వివరించింది. -
సిరియా జైలుపై వైమానిక దాడి: 16 మంది మృతి
బీరట్: సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ఇడ్లిబ్ నగరంలోని ఓ జైలుపై శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో 16 మంది మరణించారు. మృతుల్లో జైలు ఖైదీలు, సిబ్బంది కూడా ఉన్నారని సిరియాలోని ఓ మానవ హక్కుల సంస్థ తెలిపింది. రష్యా దళాలు ఈ వైమానిక దాడి చేసినట్లు భావిస్తున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు రష్యా.. తిరుగుబాటు చేస్తున్న ప్రతిపక్షానికి టర్కీ మద్దతుగా ఉండటం తెలిసిందే. దాడి అనంతరం జైలు నుంచి కొంతమంది ఖైదీలు పారిపోతుండగా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లోనూ కొంతమంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. ఇడ్లిబ్ నగరంపై సిరియా, రష్యా, అమెరికా సంకీర్ణ దళాలు తరచుగా దాడులు చేస్తుంటాయి. సిరియాలో ఆరేళ్ల క్రితం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఘర్షణల్లో 3.2 లక్షల మంది మరణించారు. -
‘రిపీటయిందో.. ఇక మీ డిఫెన్స్ ధ్వంసమే’
జెరూసలెం: సిరియాకు ఇజ్రాయెల్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఒకసారి చేసిన తప్పును మరోసారి చేసేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి అవిగ్దార్ లైబర్మాన్ నేరుగా హెచ్చరించారు. ఇటీవల సిరియా తమ యుద్ధ విమానాలను కూల్చివేసే ప్రయత్నం చేసిందని, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను తమ యుద్ధ విమానాలపైకి ప్రయోగించిందని ఆయన గుర్రుమన్నారు. ‘మరోసారి సిరియా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టంను మా విమానాలపైకి ప్రయోగిస్తే మేం ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఆ వ్యవస్థను ధ్వంసం చేసి పారేస్తాం’ అని లైబర్మాన్ ఘాటుగా హెచ్చరించారు. -
ఆ జైలులో 13 వేల మందికి దారుణ ఉరి
టెర్రరిస్టులకన్నా దారుణ హత్యలు లండన్ : సిరియాలో టెర్రరిస్టులు సాగిస్తున్న దారుణ మారణకాండ గురించే ఇంతవరకు మనం విన్నాం. వీడియోల్లో చూశాం. అంతకంటే దారుణాతి దారుణంగా బయటి ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వ ప్రోద్బలంతో సాగించిన మూకుమ్మడి మానవ హననానికి సంబంధించిన ఘోర కత్యాల గురించి ఇప్పుడు ‘ఆమ్నెస్టి ఇంటర్నేషనల్’ వెలుగులోకి తెచ్చింది. ఆ జైలులో రోజూ అర్ధరాత్రి పూట యాభై నుంచి అరవై మంది ఖైదీలను విచారణ పేరిట బయటకు ఎక్కడికో తీసుకెళతారు. వారు ఎప్పటికి తిరిగిరారనే విషయం తోటి ఖైదీలతోపాటు అక్కడి వారందరికి తెల్సిందే. ఎవరికి వారు మనసులో వారి ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటారే తప్ప, ఏమీ అనలేని నిస్సహాయ పరిస్థితి వారిది. అసలా అర్ధరాత్రి బయటకు వెళ్లినవారు ఏమవుతున్నారో తెలుసుకునేందుకు ఆమ్మెస్టీ జరిపిన దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగుచూశాయి. ఖైదీలను చీకటి బ్యార క్స్లోకి తీసుకెళతారు. మెడలకు తాడేసి ఉరి తీస్తారు. అప్పటికే సరైన తిండీ, నిద్ర లేక బక్కచిక్కిన ఖైదీల శరీరాలు వేలాడదీసిన ఎక్కువ సందర్భాల్లో వారి ప్రాణంపోదు. అలాంటి సమయంలో గార్డులు ఆ జీవచ్ఛవాలను బలంగా పట్టుకొని కిందకు లాగుతారు. అప్పుడు వారి తలల నుంచి మొండాలు ఊడిపోయి వస్తాయి. వాటికి తీసుకెళ్లి సామూహికంగా చీకట్లో ఖననం చేస్తారు. తమను ఇంత దారుణంగా ఉరితీస్తారన్న విషయం ఖైదీలకుగానీ, వారు ఏమయ్యారోనన్న విషయం వారి కుటుంబాలకు కూడా ఎప్పటికీ తెలియదు. రాత్రి పూట తీసే ఉరివల్ల ఒక్కసారే ప్రాణం పోతుంది. కానీ జైలు ఊచల గదుల్లో వారు క్షణం క్షణం మరణ వేదనను అనుభవించాల్సిందే. ఖైదీలను సైనికులే రేప్ చేస్తారు. తోటి ఖైదీలతోనీ రేప్ చేయిస్తారు. కర్రలు, రాడ్లతో చితకబాది రక్తం కక్కిస్తారు. రక్తం గడ్డకట్టిన, మురికితో కంపుకొడుతున్న నేలపైనే ఇన్ని మెతుకులేసి తినమని హుకుం జారీ చేశారు. తినకపోతే కొడతారు, తంతారు. పొద్దున లేవగానే విజిల్స్ వేసుకుంటూ సైనికులొస్తారు. ‘ఆ ఈ రోజు ఎంత మంది చచ్చార్రా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా!’ అంటూ ఖైదీలను ప్రశ్నిస్తారు. చనిపోయిన వారి శవాలను ట్రక్కులో చెత్తను మోసుకెళ్లినట్లు మోసుకెళతారు. ఇలా 2011 నుంచి 2015 సంవత్సరాల మధ్య 13వేల మందిని దారుణంగా హింసించి, ఉరితీసి చంపినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. డమస్కస్ నగారానికి 30 కిలోమీటర్ల దూరంలోని సయద్నాయ జైలులో జరిగిన ఈ దారుణాల గురించి మాజీ జడ్జీలు, మాజీ జైలు గార్డులు, తోటి ఖైదీలు సహా 84 మంది ప్రత్యక్షసాక్షుల ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ సమాచారాన్ని సేకరించింది. ఇంతకుముందు దేశవ్యాప్తంగా 17,500 మందిని అన్యాయంగా ఉరితీశారన్ని ఆమ్నెస్టీ లెక్కవేసింది. ఇప్పుడు ఒక్క జైలులోనే 13వేల మందిని ఉరితీయడం గురించి తెలియడంతో తమ అంచనాలు సరిచేసుకోవాల్సి ఉందని ఆమ్నెస్టీ అభిప్రాయపడింది. జైలు శిక్ష అనుభవిస్తున్నవారు, ఇలా దారుణంగా ఉరిశిక్షకు గురైన వారు టెర్రరిస్టులుకాదు, కరుడుకట్టిన నేరస్థులుకాదు. వారిలో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనను వ్యతిరేకిస్తున్న దేశ పౌరులు ఎక్కువ ‘ఖైదీలను ఉరి తీసినప్పుడు వారి బరువు సరిపోక ప్రాణం పోకపోతే గార్డులు వారి మోకాళ్లు పట్టుకొని కిందకు లాగేవారు. అలా లాగినప్పుడు కొన్నిసార్లు వారి మెడల నుంచి మొండాలి ఊడి వచ్చేవి. ఇలాంటివి నేను కళ్లారా చూశాను’ పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ మాజీ జడ్జీ ఆమ్నెస్టీ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ జైలుకు మాత్రమే కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేసే వారని, ఖైదీలెవరూ ఎవరితో మాట్లాడకూడదని, గార్డులు వచ్చినప్పుడు ఎలాంటి పొజిషన్స్లో ఉండాలో కూడా నిబంధనలు ఉండేవని పదవి విరమణ చేసిన ఓ జైలు అధికారి తెలిపారు. రోజూ తిండీ తిప్పలు లేక, చిత్ర హింసలకు గురై ఇద్దరు, ముగ్గురు చనిపోయేవారని, ఒకటో నెంబర్ సెల్లో ఎంత మంది చనిపోయారు, రెండో నెంబర్ సెల్లో ఎంత మంది చనిపోయారంటూ గార్డులు తోటి వారిని ప్రశ్నించడం తాను వినేవాడినని జైలు నుంచి విడుదలైన నాదల్ తెలిపారు. ‘జైలు కింది గదుల్లో ఖైదీల మెడ నరాలు తెగిన శబ్దాలు, ప్రాణం పోతున్న మూలుగు వినిపించేది’ అని హమీద్ అనే మాజీ సైనికాధికారి తెలిపారు. తాము నివేదికలో పేర్కొన్న పేర్లు అసలు పేర్లుకాదని, వారి నిక్నేమ్లని, అసలు పేర్లు బయట పెట్టొద్దనే షరతుపైనే వారు ఈ విషయాలు వెల్లడించారని ఆమ్నెస్టీ తెలిపింది. ఆమ్నెస్టీ ఇంటర్వ్యూ చేసిన 84 మందిలో న్యాయవాదులు కూడా ఉన్నారు. ఈ దారుణాలు ఇప్పటికీ కొనసాగుతుండవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 2011లోనే దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమై అది అంతర్యుద్ధానికి దారితీసిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో నాలుగు లక్షల మంది ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి లెక్కలు తెలియజేస్తున్నాయి. -
మూడు లక్షల మంది మరణించారు
సిరియా యుద్ధం ప్రారంభమై దాదాపు ఆరేళ్లు కావొస్తోంది. ఈ కాలంలో ఆ దేశంలోని కీలక భాగాలు నాశనమయ్యాయి. యుద్ధంలో ఇప్పటివరకూ మూడు లక్షల పన్నెండు వేల మంది మరణించగా.. దేశ జనాభాలో సగానికిపైగా జనాభా శరణార్ధులుగా పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. భారీగా మరణాలు 2011 మార్చిలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నినాదాల నుంచి ఇప్పటివరకూ మూడు లక్షల పన్నెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ గత వారం పేర్కొంది. వీరిలో 90 వేల మందికి పైగా పౌరులు ఉన్నట్లు తెలిపింది. యుద్ధానికి ముందు 23 మిలియన్లు జనాభా కలిగిన సిరియాలో యుద్ధం కారణంగా 6.6 మిలియన్ల జనాభా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పింది. శరణార్ధులు యుద్ధం కారణంగా 48 లక్షల మంది ప్రజలు సిరియాను వదిలి వెళ్లిపోయారని యూనైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్(యూహెచ్ సీఆర్) పేర్కొంది. వీరిలో 27 లక్షల మంది పైగా టర్కీకి వలస వెళ్లారని చెప్పింది. టర్కీ తర్వాత లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టులు శరణార్ధులకు ఆశ్రయం కల్పించాయి. అయితే, పెద్ద సంఖ్యలో శరణార్ధులు యూరప్ చేరుకోవడానికి సముద్రమార్గాన్ని ఎంచుకుని ప్రాణాలు కోల్పోయారు. యూరప్ చేరుకున్న కొంతమంది శరణార్ధులను అక్కడ అధికారులు జైళ్లలో బంధించి చిత్రవధ చేశారు. దాదాపు 17,700 మంది యూరప్ జైళ్లలో మరణించగా, వేల మంది జీహాదిస్టుల చెరలో ప్రాణాలు వదిలారని యూహెచ్ సీఆర్ చెప్పింది. నాశమైన ఆర్ధిక వ్యవస్ధ సిరియా యుద్ధం కారణంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ మూడు దశాబ్దాల వెనక్కు వెళ్లిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలకు గండి పడగా.. వసతులు, ఆరోగ్య, విద్యావ్యవస్ధలు సమూలంగా నాశనమయ్యాయి. సిరియా మొత్తం(కొన్ని ప్రాంతాల మినహా) విద్యుత్తు సౌకర్యం లేకుండా జీవనం సాగిస్తోందని ఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ 2015లో చెప్పింది. 80శాతం జనాభా పేదరికంలో బతుకీడుస్తున్నారు. 2010 నుంచి 2015 మధ్యలో 55శాతం మేర సిరియా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలింది. -
అలెప్పోకు దాదాపుగా విముక్తి!
డెమాస్కస్: సిరియాలోని ఉగ్రవాదులకు, తిరుగుబాటుదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అలెప్పో నగరంలో సిరియా బలగాలు వారిని తుదముట్టించాయి. దాదాపు 93శాతం ప్రాంతాన్ని బలగాలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. ఇంకొన్ని ప్రాంతాలపై మాత్రమే పట్టుసంపాదించాల్సి ఉంది. ఇది పూర్తయితే, పూర్తిగా అలెప్పోకు తిరుగుబాటుదారుల నుంచి విముక్తి లభించినట్లవుతుంది. ఇప్పటికే దాదాపు 30వేల మంది అలెప్పో నగర పరిధిలోని పౌరులంతా ప్రభుత్వ రక్షణ దళాల సహాయంతో సురిక్షిత ప్రాంతాలకు తమ ఇంటిని, కట్టుకున్న బట్టలను వదిలేసి వెళ్లారు. తాజాగా మరికొన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తెచ్చుకునేందుకు నిర్వహించిన ఆపరేషన్లో మరో మూడువేల మంది సౌకరి అనే ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు. అలెప్పో పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వచ్చాక దాని రూపురేఖలు పూర్తిగా మార్చి వేస్తామని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ అన్నారు. -
అందం పాదాల్లో ఉంటుందా?
సిరియా శత్రుసైన్యం షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసింది. ద్వారం మూసుకొని పట్టణం లోపల ఉన్న ఇశ్రాయేలీయులకు ఆహారం, నీరు తదితర అత్యవసర సరుకులు అందకుండా చేశారు. సిరియా సైనికులు పట్టణం లోపల కొంత కాలానికి ఆహారం నిండుకుంది. తర్వాత పక్షులు, గాడిదలూ చంపుకొని తిన్నారు. పిదప తల్లితండ్రులు తమ పిల్లల్నే చంపుకొని తినేంత దౌర్భాగ్యకరమైన దుర్భర క్షామం పట్టణంలో నెలకొంది. ఈ క్రీడంతా దేవుడే చేశాడు. ఇక ఆయన్ను నేనెందుకు ప్రార్ధించాలంటూ ఎదురు తిరిగారు షోమ్రోను రాజు (2 రాజులు 6:33). దేవుడు ఇంత భయంకరమైన క్షామాన్ని 24 గంటల్లో తొలగించి రేపు ఈ వేళకు సమృద్ధి ఆహారాన్నిస్తాడని ఎలీషా ప్రవక్త చెప్పాడు. పట్టణం లోపల కరవు రూపంలో, వెలుపల శత్రువుల రూపంలో మృత్యువు సంచారం చేస్తూంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచి ఆహారమిస్తాడా? అని ఎకసెక్కాలాడాడు ఒక అధికారి. ప్రవక్త మాటల్ని ఎవరూ నమ్మలేనంత నిరాకారమైన క్షామం అది. అయితే ఎవరు నమ్మినా నమ్మకున్నా దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన తన కార్యాన్ని నెరవేర్చి తీరుతాడు. షోమ్రోనును చుట్టుముట్టిన సిరియా సైన్యంలో దేవుడు గందరగోళం సృష్టించాడు. ఇశ్రాయేలీయులు పెద్ద ఎత్తున దాడికి రానున్నారన్న భ్రమ కల్పిస్తూ గుర్రాలు, రథాల ఉరుకులు, పరుగుల ధ్వని వారికి వినిపించడంతో శత్రువులు తమ గుడారాల్లో రెండేళ్ల కోసం దాచుకున్న ఆహార సరుకుల్ని పడవేసి ప్రాణాలు దక్కించుకోవడానికి రాత్రికి రాత్రి పారిపోయారు. పట్టణం చుట్టూ శత్రువులు లేరు కాని వారు వదిలివెళ్లిన ఆహారం విస్తారంగా పడి ఉంది. దేవుణ్ణి నమ్మక, అది తెలియక పట్టణం లోపల ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. తన మాటల్ని రాజులు, అధికారులు, ప్రముఖులు నమ్మకపోతే దేవుడు కుష్ఠురోగులనైనా వాడుకుంటాడు. పట్టణం లోపలికి ప్రవేశార్హత లేని కుష్ఠు రోగులు నలుగురు ఆకలికి తాళలేక శత్రువుల వద్దనైనా ఆహారం దొరుకుతుందేమోనన్న ఆశతో సిరియన్ల శిబిరానికి వెళ్ళారు. అక్కడ శత్రువులెవరూ లేకపోగా వాళ్లు వదిలి వెళ్లిన ఆహారం కనిపించింది. కరువుతీరా తిన్నారు. అయితే అంత ఆహారాన్ని తామే తినాలనుకోవడం అన్యాయమనుకున్నారు. ఆహారం సమృద్ధిగా పడి ఉందన్న ‘సువార్త’ను ఆ నలుగురు కుష్ఠురోగులూ పరుగెత్తుకెళ్లి పట్టణంలో ప్రకటించగా వాళ్లంతా వచ్చి తినగలిగినంతా తిని ఇళ్లకు సమృద్ధిగా ఆహారాన్ని తీసుకెళ్లారు. దేవుడు చెప్పినట్టే 24 గంటల్లో దుర్భరమైన కరవు సమృద్ధిగా మారింది. అయితే రాజులు అధిపతులు అవిశ్వాసులు కాగా, దేవుడు అంటరానివారు, పరమ వికారమైన వ్యక్తులైన కుష్ఠురోగులను వాడుకున్నాడు. అందాన్ని వ్యక్తుల ముఖారవిందాల్లో వెదుకుతుంది లోకం. కాని పదిమందికీ సాయం చేయడానికి ఉరుకులు పరుగులెత్తే పాదాలల్లోనే నిజమైన అందం ఉందంటాడు దేవుడు. ‘నాకు నా కుటుంబానికే అంతా కావాలనుకునేవాడు చూసేందుకు పైకి ఎంత అందగాడైనా పరమ వికారి అంటాడు దేవుడు. పక్కవాడికి, పదిమందికి లాభం కలగాలని పాకులాడేవాడు పరమ వికారంగా ఉన్నా, అతడు కుష్ఠురోగిౖయెనా అతనే నా దృష్టిలో అందగాడంటాడు దేవుడు. సమాధాన సువార్తను ప్రకటించేవారి పాదాలు ఎంతో సుందరమైనవని బైబిలు అందుకే చెబుతోంది (రోమా 10:14–15). – రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
నిన్ను చూసి గర్విస్తున్నా: ఒబామా
వాషింగ్టన్: ‘నువ్వు చాలా మంచివాడివి. నీలాగే అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నా’ అని ఆరేళ్ల బాలుడిని ఉద్దేశించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. సిరియా అంతర్యుద్ధం బాధిత బాలుడు ఒమ్రాన్ గురించి తనకు లేఖ రాసిన అలెక్స్ అనే అమెరికా బాలుడిని ఒబామా ప్రత్యేకంగా ప్రశంసించారు. తన అధికారిక నివాసానికి ఆహ్వానించి అలెక్స్ తో మాట్లాడారు. అలెక్స్ తన కుటుంబ సభ్యులతో పాటు వైట్ హౌస్ కు వెళ్లి ఒబామాను కలిశాడు. ఒమ్రాన్ పట్ల అలెక్స్ చూపిన మానత్వానికి ఒబామా ముగ్దుడయ్యారు. చిన్నవయసులోనే అరుదైన వ్యక్తిత్వం కనబరిచిన అలెక్స్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సిరియా వైమానిక దాడిలో గాయపడి అంబులెన్సులో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు ఒమ్రాన్ ఫొటోను చూసి కదిలిపోయిన అలెక్స్ ఒబామాకు లేఖ రాశాడు. ఒమ్రాన్ను తన ఇంటికి తీసుకురావాలని, తమ్ముడిలా చూసుకుంటానని లేఖలో పేర్కొన్నాడు. ఈ ఉత్తరాన్ని ఐక్యరాజ్యసమితిలో ఒబామా చదివి వినిపించారు. -
మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?
త్వరలో మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా రాబోతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమెరికా.. రష్యాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఈ విషయం నేరుగా ప్రకటించకపోయినా.. దేశాధ్యక్షుల ప్రకటనలు, వాళ్ల సూచలను బట్టి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న రష్యా అధికారులు, రాజకీయ నాయకులు అందరూ తిరిగి స్వదేశానికి వచ్చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయని, ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నందున వెంటనే తిరిగి వచ్చేయాలని అన్నారు. సిరియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు మరోసారి చెడిపోతున్నాయి. సిరియా విషయంలో అమెరికా మెప్పుకోసం ఫ్రాన్స్ ప్రయత్నిస్తోందని, అందుకే ఐక్యరాజ్య సమితి తీర్మానంపై వీటో చేసేందుకు తమను లాగుతోందని పుతిన్ ఆరో్పించారు. ఆ తర్వాతి నుంచి రష్యా, ఫ్రాన్స్ల మధ్య సంబంధాలు కూడా చెడిపోయాయి. అలెప్పోలో యుద్ధ నేరాలకు పాల్పడిన సిరియన్ బలయగాలకు సాయం చేసేందుకు రష్యా వైమానిక దాడులు జరుపుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఆరోపించడంతో.. ఆయనతో జరగాల్సిన భేటీని పుతిన్ రద్దుచేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. త్వరలోనే పెద్ద యుద్ధం సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రష్యాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు స్టానిస్లావ్ బెల్కోవ్స్కీ అన్నారు. ఉద్రిక్తతలు మరింత పెరిగితే అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని రష్యా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎవ్గెనీ బుజిన్స్కీ చెప్పారు. సిరియా గురించి జరుగుతున్న చర్చల నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించుకున్నప్పటి నుంచి అమెరికా - రష్యా సంబంధాలు చెడిపోవడం మొదలైంది. దానికి తోడు డెమొక్రాటిక్ నేషనల్ కమిటీలో కంప్యూటర్లు హ్యాకింగ్కు గురి కావడం, దాని వెనుక రష్యా ప్రభుత్వం ఉందని చెప్పడంతో.. పరస్పర ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. -
సరిహద్దుల్లో బాంబు పేలుడు : 20 మంది మృతి
డెమాస్కస్: సిరియా - టర్కీ సరిహద్దుల్లోని బద్ అల్ సలమ చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు సిరియా తిరుగుబాటుదారులని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. -
అలెప్పోపై వైమానిక దాడుల్లో 52 మంది మృతి
అలెప్పో: తిరుగుబాటు దారుల అధీనంలో ఉన్న సిరియా నగరం అలెప్పోలో శనివారం ప్రభుత్వం జరిపిన వైమానిక దాడుల్లో 52 మంది పౌరులు మరణించారు. కాల్పుల విరమణ కోసం రాయబారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం ఫిరంగులు, వైమానిక దాడులు చేసి, చేయిజారిపోయిన నగరాన్ని తిరిగి తన అధీనంలోకి తీసుకోడానికి ప్రయత్నించింది. ఈ దాడులపై అంతర్జాతీయ సమాజం మౌనం వహించిందంటూ సిరియా ప్రధాన ప్రతిపక్షం నిరసన తెలిపింది. సిరియా, రష్యాలు కలిసి అలెప్పోలో నేరానికి పాల్పడుతున్నాయంది. ప్రజలు శిథిలాల్లో చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ కేంద్రం పేర్కొంది. ఆహారం కొనడానికి ఒక అంగడి ముందు వరుసలో నిల్చున్న ఏడుగురు సామాన్యులు ఈ దాడుల్లో మరణించారు. కొన్ని వీధులు నామరూపాల్లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అలెప్పోలో శుక్రవారం నాటి దాడుల్లో 47 మంది మరణించారు. పేలని రాకెట్లు ఇంకా వీధుల్లో అలాగే పడి ఉన్నాయి. ‘వైట్ హెల్మెట్స్’ అనే ప్రజా రక్షణ సంస్థ భవనం తీవ్రంగా ధ్వంసమైంది. మిగతా భవంతులన్నీ పూర్తిగా నేలమట్టమైపోయాయి. అలెప్పో నగరంలో రెండే అగ్ని మాపక వాహనాలున్నాయని, అవి నగరం మొత్తానికి తిరగడం కష్టంగా ఉందని ఈ కేంద్రం పేర్కొంది. విద్యుత్, ఇంధనం లేకపోవడంతో అలెప్పో అంధకారంలో చిక్కుకుపోయింది. శుక్రవారం ఉదయం వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. స్థానికులు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. -
19 నుంచి ఐరాస సర్వసభ్య సమావేశాలు
ఐక్యరాజ్యసమితి: సెప్టెంబరు 19 నుంచి 26 వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు 195 దేశాల నేతల హాజరు కానున్నారు. 86 దేశాల నుంచి నేరుగా దేశాధినేతలే సమావేశాలకు వస్తారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, సహాయ మంత్రి ఎంజే అక్బర్ వెళ్తారు. సుష్మ సెప్టెంబరు 26న ప్రసంగిస్తారు. సిరియాలో అంతర్యుద్ధం, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, శరణార్థుల కష్టాలు, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు తదితరాలను ముఖ్యంగా చర్చించనున్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాల పదవీ కాలం త్వరలో ముగియనున్నందున వారికి ఇవే చివరి సమావేశాలు. 71వ సర్వసభ్య సమావేశాల అధ్యక్షుడు పీటర్ థామ్సన్ తన తొలి ప్రసంగంలో మాట్లాడుతూ భద్రతా మండలిలో సంస్కరణలపై తాను ప్రధానంగా దృష్టి పెడతానని చెప్పారు. -
సిరియాలో వైమానిక దాడులు: 45 మంది మృతి
బీరట్: సిరియాపై ఒప్పందానికి రష్యా, అమెరికా అంగీకరించిన ఒక రోజు తరువాత అక్కడి ఓ మార్కెట్, రెబెల్ల అధీనంలోని ఇద్లిబ్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో శనివారం జరిగిన వైమానిక దాడుల్లో 45 మంది చనిపోయారు. మరో 90 మంది గాయపడటానికి కారణమైన ఈ దాడికి పాల్పడింది ఎవరో తెలియరాలేదు. కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోవడంతో మృతుల్లో సాధారణ పౌరులు ఎందరన్నది స్పష్టం కాలేదు. దాడుల్లో పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. సిరియాలో సోమవారం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభమవుతుందని జెనీవాలో చర్చల తరువాత అమెరికా విదేశాంగ మంత్రి జాన్కెర్రీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం అమలైతే ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారుల అధీనంలోని ప్రాంతాలపై దాడులను ఆపాలి. ఫలితంగా యుద్ధ ప్రభావిత పౌరులకు అవసరమైన సాయం అందుతుందని భావిస్తున్నారు. -
జర్మనీలో మరో ఉగ్రదాడి
బెర్లిన్: జర్మనీలో మరోసారి ఉగ్రదాడి కలకలం సృష్టించింది. బెర్లిన్లో సిరియా శరణార్థి ఒకరు బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి(27) మృతి చెందాడు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ బార్ ప్రాంగణంలో జరుగుతున్న పాప్ మ్యూజిక్ ఫెస్టివల్ను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్న 2,500 మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దక్షిణ జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో జరిగిన మూడో దాడి ఇది. ఈ దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని జర్మనీ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిథి మైఖెల్ సిఫెనర్ వెల్లడించారు. మ్యూనిక్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా.. రైలులో ప్రయాణికులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేసిన ఘటనలో పలువురు గాయపడిన ఘటనలు ఇటీవల జర్మనీలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. -
'ఆ పైలట్ ను బంధించాం'
డమాస్కస్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు సిరియా యుద్ధ విమానాన్ని కూల్చి, పైలట్ ను బంధించారు. పైలట్ తమ వద్ద బందీగా ఉన్నట్టు ఐఎస్ ప్రకటించింది. శుక్రవారం డమాస్కస్ లో యుద్ధ విమానం ఎగురుతున్న సమయంలో ఉగ్రవాదులు దానిని కూల్చి వేశారు. పైలట్ ఆజామ్ ఇద్ ను ఉగ్రవాదులు బంధించారని సిరియా మానవ హక్కుల సంస్థ ధ్రువీకరించింది. గత కొద్ది రోజులుగా సిరియాలో ఉగ్రవాదులు యుద్ధ విమానాలను కూల్చివేస్తున్నారు. -
ఆ రెండు దేశాలకు ఒబామా హెచ్చరిక
బీరూట్: కాల్పుల విరమణపై మీ వైఖరిని ప్రపంచం గమనిస్తోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సిరియా, రష్యాలను హెచ్చరించారు. శుక్రవారం నుంచి పాక్షిక సంధి సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సిరియాలో శాంతిని నెలకొల్పే దిశగా అడుగులు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సిరియాలో శాంతి ప్రక్రియకు 17 దేశాలు మద్దతు ఇస్తున్నాయి. సిరియాలో శాంతి చర్చలకు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ప్రతిపక్ష పార్టీ ఆమోదం తెలిపారు. కాగా ఈ చర్చలకు ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలు దూరంగా ఉన్నాయి. శాంతి చర్చలకు మద్దతు ఇస్తున్న 17 దేశాల ప్రతినిధులు ఈ రోజు జెనీవాలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. ‘రేపు చాలా కీలకమైన రోజు’ అని ఐక్యరాజ్య సమితిలో సిరియా రాయబారి స్టఫాన్ డి మిస్టురా వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా కాల్పుల విరమణ కోసం కృషి చేస్తానన్నారు. కాగా సిరియా విషయంలో రష్యా, అమెరికాల మధ్య విభేదాలున్నాయి. రష్యా సిరియా అధ్యక్షుడిగా మద్దతుగా నిలవగా, అమెరికా సిరియాలోని ప్రతిపక్ష పార్టీకి మద్దతు తెలుపుతోంది. -
ప్రపంచ ఉత్తమ ఫొటోలు
-
బెస్ట్ ఫొటోస్ ఆఫ్ ది ఇయర్
ఆమ్స్టర్డామ్: ఏటా నిర్వహించే వరల్డ్ ప్రెస్ ఫొటో కాంటెస్ట్ ఫలితాలు నెదర్లాండ్ రాజధాని ఆమ్స్టర్డామ్ లో గురువారం అర్థరాత్రి విడుదలచేశారు నిర్వాహకులు. ప్రపంచ నలుమూలలా చోటుచేసుకున్న వివిధ సందర్భాల్లో 5,775 మంది ఫొటోగ్రాఫర్లు చిత్రీకరించిన 82,951 ఫొటోలు పోటీకి అర్హత సాధించాయి. వాటన్నింటిలోకి సిరియన్ల వలస కష్టాలపై చిత్రించిన ఛాయాచిత్రానికి 2015 ఏడాదికిగానూ మొదటి బహుమతి దక్కింది. హంగరీ- సెర్బియా సరిహద్దు వద్ద చంటిపిల్లాడితో కంచె దాటుతున్న కుటుంబం ఫొటోను ఆస్ట్రేలియాకు చెందిన వారెన్ రిచర్డ్ సన్ తీశారు. మొత్తం128 విభాగాల్లో ఉత్తమ ఫొటోలను ఎంపికచేశారు. వాటిలో కొన్ని ఇవి.. మరిన్ని చిత్రాల కోసం.. -
పిల్లులు.. కుక్కలను తింటున్నారు!
ఐసిస్ అధీనంలోని నగరాల్లో చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా అందంగా కనిపించినవారు కూడా ఎముకల గూడుల్లా తయారయ్యారు. కడుపు నిండని తల్లులు.. తమ బిడ్డలకు పాలు ఇవ్వలేని దీనావస్థకు చేరుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని కొనలేక, కడుపు మాడ్చుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు. అన్నం స్థానంలో గడ్డి, మూలికలు, వేళ్ల వంటి వాటితో కడుపునింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆకలికి తట్టుకోలేక చివరికి పిల్లులను, కుక్కలను చంపి తినేందుకూ వెనుకాడటం లేదు. సిరియా ముట్టడి ప్రాంతంలో శిశువులు వేలాది మంది పస్తులతో మరణిస్తున్నారు. నెలల వయసులోనే పోషకాహారం అందక తనువు చాలిస్తున్నారు. ఒకప్పుడు చమురు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన డైర్ అజోర్ ప్రాంతం ఇప్పుడు మహిళలు, పిల్లల మరణాలకు సాక్షీభూతంగా నిలుస్తోంది. మధ్య ప్రాంతం నుంచి తప్పించుకొని డీర్ ఎజోర్ లో చిక్కుకున్న వేలాదిమంది శరణార్థులు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారు. బషర్ అల్ అస్సాద్ అందించే చాలీచాలని సరుకుల పంపిణీ.. శరణార్థులను చిక్కిశల్యమయ్యేలా చేస్తోంది. ఆహారధాన్యాలు అందించాలంటే సైన్యాధీనంలో ఉన్న ఆ ప్రాంతానికి కేవలం కార్గో విమానాలు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీంతో చాలా మంది పిల్లలు.. తిండిలేక ఆకలితో మరణిస్తున్నారు. ఎముకల గూడుకు చర్మం అతికించినట్లుగా మారిపోతున్నారు. వేలాదిమంది చిన్నారులతో ఆస్పత్రులు నిండిపోయాయి. అతిసారం వంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని శిశువుల చిత్రాలను చూస్తే అక్కడి వాస్తవిక పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. 11 నెలల నుంచి ఐసిస్ ముట్టడిలో ఉన్న డైర్ అజోర్లో చిక్కుకున్న సుమారు లక్ష మందికి పైగా శరణార్థులు ఆకలి, అనారోగ్యాలతో బాధపడుతూ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. బషర్ అల్ అస్సద్ అధీనంలోకి డైర్ అజోర్ జిల్లాలు చేరిన 8 నెలలకు ఆ బిడ్డలు పుట్టినట్లు తెలుస్తోంది. పరిస్థితి దీనావస్థలో ఉన్న సమయంలో శుక్ర్ అల్ అఫ్రే. పుట్టాడు. అతని తల్లి మన్నార్ కస్సర్ అల్ డఘిమ్ ఆహారం లేక కనీసం బిడ్డకు పాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. దీంతో పోషకాహారం లేని ఆ చిన్నారి తీవ్ర రక్తహీనతకు లోనయ్యాడు. బిడ్డల ప్రాణాలు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు దుఖసాగరంలో జీవిస్తున్నారు. చావైనా తమను కరుణించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తీవ్ర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. తిండిలేక, బతికేందుకు ఆసరా లేక శరణార్థులు చావే శరణ్యంగా జీవిస్తున్నారు. ముట్టడి ప్రాంతంలో సాధారణ జీవన పరిస్థితులు చిన్నాభిన్నమైపోయాయని, శరణార్థులు తిండిలేక.. ఆకలి తట్టుకోలేక ఏం కనిపించినా తినే స్థితికి చేరారని చెప్తున్నారు. స్థానిక జనజీవనం స్తంభించిపోయి, ఆస్పత్రుల్లో రోగులు, బయట సైనికులను మాత్రమే చూడగలిగే పరిస్థితి దాపురించిందని స్థానిక దుకాణదారుడు అబుల్ ఖాసిం చెప్తున్నాడు. రాత్రి పగలు తేడా లేకుండా తిండి కోసం జనం ఎదురు చూస్తున్నారని, పిల్లలను బతికించుకునేందుకు వేడినీటిలో ఉప్పు కలిపి, బ్రెడ్ తో పెడుతున్నారని అంటున్నాడు. రాను రాను పరిస్థితి మరీ దారుణంగా, భయంకరంగా మారుతోందని చెప్తున్నాడు. కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు పిల్లల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. కొందరు ఆహారం కోసం ఇంట్లోని వస్తువులు, ఇళ్ళూ అమ్మేసిన దాఖలాలున్నాయి. కొందరు గడ్డి, మూలికలు, ఆకులు తింటుంటే.. మరి కొందరు కుక్కలు, పిల్లులను చంపి తినడం శోచనీయంగా మారింది. యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు వంద రెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడక్కడ ముగ్గురికి మాత్రమే తిండి దొరుకుతోంది. ఒకటి సైన్యం, మరొకరు విదేశాల్లో బంధువులు ఉన్నవారు, ఇంకొకరు సంపన్నులు. మిగిలినవారంతా కష్టాల కడలిలో జీవనం సాగిస్తున్నారు. ఆహారం అందే మార్గం లేక, ధరాఘాతాన్ని తట్టుకోలేక పొట్ట చేత పట్టుకొని, కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని నిర్జీవంగా బతుకుతున్నారు. -
గోవాలో సిరియా పౌరుడి అరెస్ట్
పణజి: గోవాలో అక్రమంగా నివసిస్తున్న సిరియా దేశస్తుడిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. వీసా గడువు తీరినా అతడు స్వదేశానికి వెళ్లకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సిరియా పౌరుడి అరెస్ట్ ను ఐజీ సునీల్ గార్గ్ ధ్రువీకరించారు. అతడిని ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. 'కాసినో ప్రాంతంలో గతరాత్రి అతడిని అరెస్ట్ చేశాం. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇండియాలోనే ఉండడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమంగా ఉన్నందుకు అతడిపై కేసు నమోదు చేశాం' అని గార్గ్ తెలిపారు. అయితే అతడిని తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయో, లేవో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. సిరియా పౌరుడు అరెస్ట్ ను ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా ధ్రువీకరించారు. దర్యాప్తు సాగుతోందని చెప్పారు. -
భారత్లో సిరియన్ల కోసం వేట
న్యూఢిల్లీ: సిరియా నుంచి భారత్కు వచ్చిన సిరియా దేశస్థుల్లో వందమంది వీసా గడువు ముగిసి పోయినప్పటికీ వారి దేశం తిరిగి వెళ్లకుండా దేశంలోనే తప్పించుకు తిరుగుతున్నారు. వారిలో ఎక్కువ మంది యువకులే ఉండడం, వారికి ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉండే అవకాశం ఉండడంతో భారత భద్రతా దళాలు వారిని వెతికి పట్టుకునేందుకు వేట సాగిస్తున్నాయి. వారిలో కొంతమంది యువకులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో వారి ఆచూకి కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశామని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఉన్నత ప్రభుత్వాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. వారిలో ఎక్కువ మంది వైద్య చికిత్స నిమిత్తం, పర్యాటక కోసం రాగా, కొంత మంది 15 రోజుల ట్రాన్సిట్ వీసాలపై వచ్చారని ఆయన తెలిపారు. వైద్యం, పర్యాటక కోసం వచ్చేవారికి రెండు వారాల నుంచి ఆరు నెలలపాటు భారత్లో ఉండేందుకు వీసాలు జారీ అయ్యాయని, గతేడాది భారత్కు వచ్చి తిరిగి వెళ్లని వారు వందమంది ఉన్నారని, అలాంటి వారి జాబితాను రూపొందించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించామని ఆ అధికారి వివరించారు. వారిలో కొంత మంది పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. కొంతమంది సిరియన్లు భారత్కు వచ్చారని, వారు ఐక్యరాజ్య సమతి మార్గదర్శకాల ప్రకారం భారత ప్రభుత్వాన్ని శరణుకోరుతున్నారని, వారిలో కొంతమందికి టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలు కూడా ఉన్నాయని భారత్లోని సిరియా అంబాసిడర్ రియాద్ కామెల్ అబ్బాస్ స్వయంగా ఇటీవల ప్రకటించడం ఇక్కడ గమనార్హం. -
కుక్కలు, పిల్లులే ఆహారమౌతున్నాయ్...!
సిరియా ప్రభుత్వ సైన్యాధికారంలో ఉన్న నగరాల్లోని ప్రజలు ఇప్పుడు ఆకలితో అల్లాడుతున్నారు. వేలాదిమంది పస్తులతో మరణిస్తున్నారు. కడుపు నింపుకొనేందుకు పిల్లులు, కుక్కలను తినాల్సిన స్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు సిరియన్ల ప్రముఖ హాలీడే రిసార్ట్ గా ఉన్న మధ్య నగరం.. ఇప్పుడు బస్తర్ అల్ అసద్ ప్రభుత్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ముట్టడిలో ఉన్న ఆ ప్రాంతంలోని జనం తిండి, నీళ్ళు, నిద్రా లేక అవస్థలు పడుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా మీడియా దృష్టి పెట్టడంతో సిరియన్ ప్రభుత్వం ఇప్పుడు వారికి సాయం అందించేందుకు ఆయా పట్టణాలకు అనుమతిస్తోంది. సిరియా ప్రభుత్వ ఆమోదాన్ని తాము స్వాగతిస్తున్నామని, రాబోయే రోజుల్లో మానవతా దృక్పధంతో అక్కడి వారికి సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి చెప్పారు. అయితే చలికాలం కావడంతో 'మధ్య'లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆకలి తట్టుకోలేక అక్కడివారు పిల్లులు, కుక్కలను తినేందుకు వెనుకాడటం లేదు. అందుకు ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఓ చిత్రం సాక్ష్యంగా నిలుస్తోంది. కొందరు ఆకులు తిని కడుపు నింపుకుంటున్నారు. ఆకలి తీరేందుకు చాలా కుటుంబాలు గడ్డి తిని నీరు తాగడం, లేదా సుగంధ ద్రవ్యాలు, జామ్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. నీరు నింపిన ప్లేట్ లో ఏదో పచ్చని పదార్థం కలిపి సేవిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మరో ఫోటో కూడ అక్కడి పరిస్థితిని కళ్ళకు కడుతోంది. బియ్యం కిలో 170 యూరోలు అమ్ముతుండటంతో అక్కడివారికి కొనలేని పరిస్థితి నెలకొంది. మధ్య ప్రాంతవాసుల దారుణ పరిస్తితి వారి కళ్ళలో చూశానని రెడ్ క్రాస్ ప్రతినిధి డైబర్ ఫాకర్ అంటున్నారు. ''మహిళలు తమకు తిండిలేక.. పిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆకలిని తట్టుకోలేక రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు'' అని మధ్య ప్రాంతంలోని మెడికల్ కౌన్సిల్ మేనేజర్ చెప్తున్నారు. చనిపోయేవారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉంటున్నారని ఆయన తెలిపారు. నీరసించి, చావుబతుకుల్లో ఉన్నవారిని ఆరోగ్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకొని ఉంటున్నారని, అయితే తమ సంస్థ మరి కొద్ది రోజుల్లో వీరికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తోందని చెప్తున్నారు. మధ్య నగరానికి అక్టోబర్ ప్రాంతంలో సుమారు ఇరవై లారీల వైద్య, ఆహార పదార్థాలను అనుమతించారు. అప్పటినుంచి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. అయితే ఇటీవలి కొన్ని వారాల్లోనే ఆహారం లేక పదిమంది, ఆహారంకోసం ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ బలగాల కాల్పుల్లో 13 మంది వరకూ చనిపోయారని బ్రిటన్ కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ హ్యూమన్ రైట్స్ చెప్తోంది. సిరియాలో యుద్ధం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యునైటెడ్ నేషన్స్ పేర్కొంది. -
టెర్రరిస్టుల బందిఖానాలు
రక్కా: ఐఎస్ఐఎస్ టెర్రిస్టులు తమ రాకాసి మూకలో చేరని మహిళలను కిడ్నాప్లు చేయడం, రోజుల తరబడి వారిని సామూహికంగా రేప్లు చేయడం లాంటి దారుణ సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. అదే కోవకు చెందిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. యాజిది తెగకు చెందిన మహిళలను భూగర్భంలో నిర్బంధించిన అగ్గిపెట్టెలాంటి బందిఖానాలు ఓ మీడియా దర్యాప్తులో బయటపడ్డాయి. సిరియాకు ఉత్తరానున్న ఎడారిలో ఈ బందిఖానాలు వెలుగు చూశాయి. సొరంగ మార్గంలో వరుసగా నిర్మించినట్లున్న ఈ బందిఖానాలపై డ్రైనేజీ మూతల్లాగా తలుపులున్నాయి. వాటికున్నా సన్నటి కన్నాల గుండా లోపలికి సోకే వెలుతురు తప్పా లోపలంతా చీకటిగానే ఉంది. నెలల తరబడి అక్కడే యాజిది మహిళలను నిర్బంధించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారేమయ్యారో కూడా తెలియదు. ఇదివరకు పట్టుబడ్డ యాజిదీ తెగకు చెందిన మహిళలను ఇనుప బోనుల్లో నిలబెట్టి నీట ముంచి టెర్రరిస్టులు హత్య చేసిన విషయం తెల్సిందే. -
ట్రక్కు బాంబు పేలుళ్లు : 60 మంది దుర్మరణం
బీరూట్ : సిరియా ఈశాన్య ప్రాంతంలో హస్కా ప్రావిన్స్లో తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మారణహోమం సృష్టించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుని ట్రక్కు బాంబులు పేల్చింది. ఈ ఘటనలో 60 మందికిపైగా మరణించారు. మరో 80 మందికిపైగా గాయపడ్డారు. ఈ మేరకు కుర్దిష్ మిలటరీకి చెందిన ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. హస్కా పట్టణంలోని ఆసుపత్రి, మార్కెట్ వద్ద శుక్రవారం ఈ దాడులు జరగగా... మరోకటి గురువారం ఆర్థరాత్రి టెల్ టమర్ పట్టణంలోని నివాస ప్రాంతాల సమీపంలో ఈ ట్రక్కు పేలుడు సంభవించిందని చెప్పారు. సిరియాలోని యూఎస్ సంకీర్ణ దళాలకు స్థానిక కుర్ధిష్ మిలటరీ సహకారం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ ఈ దాడికి తెగబడిందని ఉన్నతాధికారి వివరించారు. -
సరిహద్దులు మూసేస్తాం..
- సోదర దేశాలుగా మీకు బాధ్యత లేదా? - సిరియా శరణార్థుల అంశంలో గల్ఫ్ దేశాలపై ఫ్రాన్స్ మండిపాటు - శీతాకాలంలో ఈయూ ద్వారాలు మూసేస్తామని వెల్లడి పారిస్: సిరియా శరణార్థుల విషయంలో గల్ఫ్ దేశాలపై ఫ్రాన్స్ మండిపడింది. ఇప్పటికే లెక్కకు మించి శరణార్థులకు ఐరోపా దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నాయని, ఇకపై ఆ బాధ్యతను గల్ఫ్ దేశాలు పంచుకోవాలని సూచించింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుల్ వాల్స్ శుక్రవారం రాత్రి పారిస్లో మీడియాతో మాట్లాడుతూ సిరియాకు సమీపంగా ఉండే సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాలు శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో అలసత్వం వహించాయని, ఇప్పటికైనా ఆ దేశాలు వాటి బాధ్యత నిర్వర్తించాలన్నారు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పలు యూరప్ దేశాల్లో దాదాపు 8 లక్షల మంది సిరియన్లు ఆశ్రయం పొందుతున్నారని, వారందరికీ వసతులు కల్పించడం ఎలాంటి దేశానికైనా సవాలేనని, శీతాకాలంలో ఆ పని మరింత కష్టసాధ్యమని వాల్స్ అన్నారు. నిరోధించలేని విధంగా శరణార్థులు వస్తుండటంతో సరిహద్దులు మూసివేయాలని ఈయూ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వాల్స్ తెలిపారు. ' నేను మళ్లీ మళ్లీ ఇదే చెప్తున్నా. ఇకపై యూరప్ లోకి శరణార్థులను అనుమతించబోం. అన్ని దేశాలు.. ప్రధానంగా గల్ఫ్ దేశాలు శరణార్థుల బాధ్యత పంచుకోవాలి. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే సరిహద్దులు మూసేస్తాం' అని వాల్స్ స్పష్టం చేశారు. సిరియాలో శాంతి స్థాపన ఒక్కటే ఈ సంక్షోభానికి పరిష్కారమని, ఆ దేశంలో రాజకీయ సుస్థిరతకు ప్రపంచం సహకరించాలని వాల్స్ పిలుపునిచ్చారు. -
నిజమైన కృతజ్ఞుడు..!
బెర్లిన్: కీడు చేసినవారిని మరిచిపోయినా పర్వాలేదుగానీ.. మంచి చేసినవారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. అవకాశం వచ్చినప్పుడల్లా వారిపట్ల చేతనైనంత కృతజ్ఞత చూపించుకోవడం ప్రతి మనిషికి ఉండాల్సిన విజ్ఞత. అదే విషయాన్ని నిరూపించుకున్నాడు ఓ సిరియన్ శరణార్థి. కట్టుబట్ట సొంతగూడు వదిలేసి అకస్మాత్తుగా తమ దేశాన్ని విడిచి వచ్చిన తమను అక్కున చేర్చుకున్న జర్మనీ దేశంపట్ల సిరియా శరణార్థి అలెక్సా అస్సాలి రుణం తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించి అందరిచేత ప్రశంసలు అందిపుచ్చుకున్నాడు. కన్నీళ్లు నింపుకొని, కన్నవారిని చేతపట్టుకొని వచ్చిన తమకు జర్మనీ ఆశ్రయం ఇచ్చిన తీరు మరవలేమని అందుకే తన ఈ ఉడతా భక్తి సాయం అంటూ ఓ వీధిలో నిల్చుని స్వయంగా ఆహారం వండి ఉచితంగా జర్మన్ ప్రజలకు పంచిపెడుతూ వారి మనసులు కొల్లగొట్టేశాడు. అలెక్సా అస్సాలి అనే సిరియా శరణార్థి గత నెలలో జర్మనీకి వలస వచ్చాడు. ఆ సమయంలో జర్మనీ తనను అక్కున చేర్చుకున్న విధానానికి ముగ్గుడైపోయాడు. తాను ఆశ్రయం పొందిన వెంటనే సేద తీరకుండా తమకు సాయం చేసిన జర్మనీకి ఏదో చేయాలన్న తహతహతో బెర్లిన్ లోని అలెగ్జాండ్రాప్లాట్స్ స్టేషన్ వద్ద వేడివేడిగా వంట చేసి అక్కడ ఉన్న ఆశ్రయం లేనివారికి, పేదలకు ఉచిత ఆన్నదానం చేయడం ప్రారంభించాడు. దీన్నంతటిని వీడియో తీసిన కొందరు ఇంటర్నెట్ లో పెట్టగా కొద్ది సమయానికే 27లక్షల మంది వీక్షించారు. -
‘అసద్ తొలగితే అంతర్యుద్ధానికి ముగింపు’
మనీలా: సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ అధికారం నుంచి వైదొలగితేనే ఆ దేశంలో అంతర్యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యానించారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరుగుతున్న సదస్సు నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ‘‘అసద్ అధికారంలో ఉండగా సిరియాలో అంతర్యుద్ధం ముగుస్తుందని నేను భావించడం లేదు. ఆయన హయాంలో అంతర్యుద్ధం, సాధారణ పౌరులపై దాడులు జరిగిన నేపథ్యంలో ఆయన అధికారంలో ఉండేందుకు అక్కడి ప్రజలు అంగీకరించరు..’ అని పేర్కొన్నారు. అసద్కు గట్టి మద్దతుదారైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఒబామా భేటీ అయిన కొద్దిరోజులకే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసద్ను తొలగించాలని అమెరికా, దానికి అంగీకరించబోమని రష్యా గట్టి పట్టుదలతో ఉన్నాయి. కానీ ఈ భేటీ సందర్భంగా ఇద్దరూ సిరియాపై ఓ ఒప్పందానికి వచ్చారని, అందువల్లే అసద్ను తొలగించాలంటూ ఒబామా చెప్పారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
మూడో రోజూ ఐసిస్పై వైమానిక దాడులు
సిరియాలో 33 మంది ఉగ్రవాదులు మృతి బీరుట్: ఫ్రాన్స్, రష్యా యుద్ధవిమానాలు ఉత్తర సిరియాలోని ఐసిస్ స్థావరమైన అల్-రాఖా, పరిసర ప్రాంతాలపై వరుసగా మూడో రోజు కూడా బాంబు దాడులు కొనసాగించాయి. ఆదివారం మొదలు మూడు రోజుల్లో 33 మంది ఉగ్రవాదులు చనిపోయారని, పదుల సంఖ్యలో గామపడ్డారని బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్సర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ డెరైక్టర్ రామి అబ్దెల్ రహమాన్ బుధవారం తెలిపారు. అయితే.. దాడుల నుంచి చాలా మంది ఉగ్రవాదులు తప్పించుకున్నారని, విదేశీ ఉగ్రవాదుల కుటుంబాలు చాలా వరకూ అల్-రాఖా నుంచి ఇరాక్లోని మోసుల్ నగరానికి తరలిపోయాయని వివరించారు. పారిస్లో శుక్రవారం నాటి దాడి నేపథ్యంలో ఐసిస్ లక్ష్యంగా ఫ్రాన్స్ వైమానిక దాడులను ముమ్మరం చేసింది. ప్రాన్స్ యుద్ధ విమాన వాహక నౌకను తూర్పు మధ్యధరాసముద్రానికి పంపింది. మరోవైపు.. గత నెలలో ఈజిప్టులో రష్యా విమానాన్ని కూల్చివేసింది తామేనని ప్రకటించిన ఐసిస్ను వేటాడటానికి రష్యా కూడా దాడులను తీవ్రం చేసింది. విమానం కూలిపోయి 224 మంది మరణించటానికి కారణం బాంబు దాడేనని రష్యా తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా.. తమపై దాడులకు ప్రతీకారంగా తమ వద్ద బందీలుగా ఉన్న ఒక చైనా జాతీయుడిని, ఒక నార్వే జాతీయుడిని హతమార్చామని ఐసిస్ ప్రకటించింది. అమెరికా, రష్యాలతో కలిసి మహా సంకీర్ణం ఫ్రాన్స్ ఇప్పుడు యుద్ధం చేస్తోందని.. ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని ఆ దేశాధ్యక్షుడు హోలాండ్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికా, రష్యాలతో కలిసి మహా సంకీర్ణం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఫ్రాన్స్లో విధించిన అత్యవసర పరిస్థితిని మూడు నెలలకు పొడిగించాలని నిర్ణయించారు. టర్కీలో 8 మంది ఐసిస్ అనుమానితుల అరెస్ట్ ఇస్తాంబుల్: ఐసిస్ సభ్యులుగా భావిస్తున్న 8 మంది అనుమానితులను టర్కీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారు శరణార్థుల పేరుతో ఈయూలోకి ప్రవేశించే ప్రణాళికలు రచిస్తున్నారని అధికారులు తెలిపారు. మొరాకో లోని కాసాబ్లాంకా నుంచి మంగళవారం విమానంలో ఇస్లాంబుల్కు వచ్చిన ఈ ఎనిమిది మందిని.. ఇస్తాంబుల్లోని అటాటర్క్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాంబు బెదిరింపుతో ఫ్రాన్స్ విమానాల దారిమళ్లింపు అమెరికా నుంచి బుధవారం పారిస్కు బయల్దేరిన రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలను.. బాంబు బెదిరింపులతో దారి మళ్లించి క్షేమంగా దించారు. లాస్ ఏంజెలెస్ నుంచి 497 మందితో బయల్దేరిన ఫ్లైట్ 65 విమానం, వాషింగ్టన్ నుంచి 262 మందితో వెళ్లిన ఫ్లైట్ 55 విమానాలకు కాసేపటికే బాంబు బెదిరింపులు రావటంతో దారిమళ్లించినట్లు ఎయిర్ ఫ్రాన్స్ తెలిపింది. వాషింగ్టన్ నుంచి వచ్చిన విమానాన్ని హాలిఫాక్స్కు, లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చిన విమానాన్ని సాల్ట్ లేక్ సిటీకి మళ్లించారు. వాటిలో తనిఖీలు నిర్వహించి బాంబు ప్రమాదం లేదని నిర్ధారించుకున్నారు. -
ఐఎస్ టెర్రరిస్టుల వద్ద రూ.13 వేల కోట్లు
న్యూఢిల్లీ: మానవ సమూహం మధ్య బాంబులై పేలి మారణ హోమానికి పాల్పడుతూ ప్రపంచంలో భీతావహం సృష్టిస్తున్న ఐఎస్ టెర్రరిస్టు మూకలు నేడు అపార ధనరాశులు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం వారి వద్ద 13వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నట్టు ఓ తాజా అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ఇటు డబ్బులోనూ అటు మారణహోమం సృష్టించడంలోను ప్రపంచంలోనే నెంబర్ వన్ టెర్రరిస్టు సంస్థగా ఐఎస్ ముద్రపడింది. సిరియా, ఇరాక్లలో పది చమురు క్షేత్రాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ టెర్రరిస్టులు రోజూ 30 వేల నుంచి 40 వేల బ్యారెళ్ల వరకు అక్రమ మార్గంలో క్రూడాయిల్ విక్రయిస్తూ రోజుకు పది కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాయి. టర్కీ, ఇరాన్, జోర్డాన్ దేశాలు చీకటి మార్గంలో టెర్రరిస్టుల నుంచి ఆ ఆయిల్ను కొనుగోలు చేస్తున్నాయి. కిడ్నాప్ల ద్వారా ర్యాండమ్ కింద ఏడాదికి 300 కోట్ల రూపాయలను సమకూర్చుకుంటున్నాయి. ఇరాక్లో దాదాపు 40 శాతం గోధమ పంటను తమ ఆధీనంలోకి తెచ్చుకొని కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాయి. సిరియాలో తమ ఆధీనంలో నివసిస్తున్న కోటి మంది ప్రజల నుంచి 20 శాతం ఆదాయం పన్నును వసూలు చేస్తున్నాయి. వాహనాల రాకపోకలపై రోడ్డు పన్నును విధిస్తున్నాయి. అంతేకాకుండా ఇస్లాం మతం పుచ్చుకోని క్రైస్తవుల నుంచి ప్రాణ రక్షణ పన్నును గుంజుతున్నాయి. ప్రాణ భీతితో దేశంవీడి వలస వెళుతున్న వారి నుంచి ఒక్కొక్కరి వద్ద ఆరున్నర వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. దౌర్జన్యం, బెదిరింపుల ద్వారా వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున నిధులను రాబడుతున్నాయి. ఇలా వచ్చిన సొమ్మును అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయడానికి టెర్రరిస్టుల నియామకానికి వినియోగిస్తున్నాయి. మానవ బాంబులుగా మారేందుకు సిద్ధపడిన యువకులకు ముందుగానే కోట్ల రూపాయలను అందజేస్తున్నాయి. ముందుగా సిరియా, ఇరాక్ ప్రభుత్వ సైనికులను, వారికి మద్దతిస్తున్న యూరప్, మధ్యప్రాచ్య దేశాల సైనికులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపిన ఐఎస్ టెర్రరిస్టులు ఇప్పుడు పంథా మార్చారు. జన సమూహాన్ని ఎంచుకొని మారణ హోమాన్ని సృష్టించడం లక్ష్యంగా చేసుకొన్నారు. ఆ వ్యూహంలో భాగంగానే పారిస్లో ఏకకాలంలో ముంబై తరహా దాడులు జరిపి దాదాపు 140 మందిని అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. -
ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యం
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ♦ ఇరాక్, సిరియాల్లో పలు ప్రాంతాలు స్వాధీనం ♦ అమెరికా, పాశ్చాత్య దేశాలపై దెబ్బతీయడంపై దృష్టి ♦ ‘ఖలీఫా’ను పునరుద్ధరించడమే లక్ష్యంగా విస్తరణ ఐఎస్ఐఎస్.. గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఉగ్రవాద సంస్థ ఇది. ఇరాక్, సిరియాల్లోని కొన్ని ప్రాంతాలను అనూహ్యమైన బలప్రయోగంతో తమ అధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ఐఎస్... తాను ‘ఖలీఫా’ను స్థాపించానని, తమ ఖాలీఫ్ అబుబకర్ అల్-బగ్దాదీ అని ప్రకటించింది. ఖాలీఫా అంటే ‘ఇస్లాం రాజ్యం’. ఖాలీఫ్ అంటే ఆ రాజ్యానికి అధినేత, మహమ్మద్ ప్రవక్త వారసుడు. అరేబియా ప్రాంతంతో పాటు మధ్య ప్రాచ్యమంతా ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని.. యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియా వరకూ విస్తరిస్తామని, అమెరికా శ్వేతసౌధం పైనా తమ జెండా ఎగురవేస్తామని ఐఎస్ఐఎస్ తన ‘ప్రణాళిక’ను వెల్లడించింది. అందులో భాగంగా భారీ స్థాయిలో ఉగ్రదాడులకు తెగబడుతోంది. ఫ్రాన్స్లోనూ శుక్రవారం మారణహోమం సృష్టించి 128 మందిని బలి తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఐఎస్ఐఎస్ ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా విస్తరిస్తోందనే దానిపై ప్రత్యేక కథనం.. ఎలా పుట్టింది? ఇరాక్లో జమాత్ అల్-తాహిద్ వల్-జిహాద్ అనే పేరుతో 1999లో ఒక ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఆ తర్వాత 2004 సంవత్సరంలో అల్ఖైదాతో చేతులు కలిపి.. ‘అల్-ఖైదా ఇన్ ఇరాక్’ (ఏక్యూఐ) అని పేరు మార్చుకుంది. 2003లో ఇరాక్పై అమెరికా ఆక్రమణ నేపథ్యంలో.. ఆ దేశంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏక్యూఐ పాలుపంచుకుంది. 2006లో ఇతర సున్నీ తీవ్రవాద సంస్థలతో కలసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’గా మారింది. ఆ తర్వాత కొద్ది కాలానికే.. ఇస్లామిక్ రాజ్యంఏర్పాటును ప్రకటించింది. తన పేరును ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్’ (ఐఎస్ఐ)గా మార్చుకుంది.అబుబకర్ అల్-బాగ్ధాదీ నాయకత్వంలో ఈసంస్థ గణనీయంగా పెరిగింది. సిరియా అంతర్యుద్ధంలో ప్రవేశించి.. ఆ దేశంలోని సున్నీ మెజారిటీ ప్రాంతాల్లో గట్టి పట్టు సాధించింది.2013 ఏప్రిల్లో అక్కడి అల్ఖైదా అనుబంధఉగ్రవాద సంస్థ జభాట్ అల్-నుస్రా ఫ్రంట్నువిలీనం చేసుకుని.. పేరును ‘ఇస్లామిక్ స్టేట్ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ - ఐఎస్ఐఎస్గా (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరా అండ్ ద లెవాంట్ -ఐఎస్ఐఎల్ అనీ అంటారు) మార్చుకుంది.ఇది 2014 ఫిబ్రవరి వరకూ కూడా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదాతో సన్నిహతసంబంధాలు కలిగివుంది. కొంత కాలం ఆధిపత్య పోరు తర్వాత ఐఎస్ఐఎస్తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు అల్ఖైదా అధినేతఅల్-జవహరి ప్రకటించారు. ఐఎస్ఐఎస్ ‘ఖలీఫా’.. ఒకప్పుడు అరబ్ దేశాలన్నీ ‘ఖలీఫా’ పాలనలో ఉండేవి. దాదాపు వందల ఏళ్ల పాటు ఒకే ఛత్రం కింద కొనసాగాయి. కానీ పశ్చిమ దేశాల ప్రభావం, ప్రపంచ యుద్ధాల్లో దెబ్బతినడంతో... ఇప్పుడున్న రూపంలో స్వతంత్ర దేశాలుగా రూపొందాయి. అయితే.. ఇస్లాం రాజ్యాన్ని పునరుద్ధరించాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఖలీఫాను రాజకీయ చర్యలద్వారా పునరుద్ధరించాలని ముస్లిం బ్రదర్హుడ్, హిజ్బ్ ఉట్-తాహ్రిర్ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. శతాబ్దాల పాటు కొనసాగిన తమ ‘ఖలీఫా’ విచ్ఛిన్నం కావడానికి కారణం పశ్చిమ దేశాలేనన్న ఆలోచన ఇస్లాం ప్రపంచంలో బలంగా నాటుకుపోయింది. ఆ తర్వాత కూడా పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించి ఇజ్రాయెల్ ఏర్పాటు, అఫ్గానిస్థాన్ ఆక్రమణ, ఇరాక్ ఆక్రమణ వంటి అనేక పరిణామాలు.. ముస్లిం ప్రపంచంలో పాశ్చాత్య దేశాలపై వ్యతిరేకతను పెంచుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బలప్రయోగం ద్వారా ఖాలీఫాను పునరుద్ధరించాలని, పశ్చిమ దేశాలను దెబ్బ తీయాలనే లక్ష్యంతో అల్ఖైదా వంటివి పుట్టుకొచ్చాయి.అనూహ్యంగా తెరపైకి వచ్చిన ‘ఐఎస్ఐఎస్’ మాత్రం.. ఇరాక్, సిరియాల్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి ‘ఖాలీఫా’ను స్థాపించినట్లు ప్రకటించుకుంది. 2014 జూన్ 29న తాను ప్రపంచవ్యాప్త ఖలీఫాగా ఐఎస్ఐఎస్ సంస్థ ప్రకటించుకుంది. తన పేరును ‘ఇస్లామిక్ స్టేట్’గా మార్చుకుంది. అయితే ఏదేశం కానీ, ప్రధాన స్రవంతి ముస్లిం సంస్థలు కానీ దీనిని ఖాలీఫాగా గుర్తించటానికి నిరాకరించాయి. నాయకుడు ఎవరు? ప్రపంచంలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ టైస్ట్గా ఉన్న అబుబకర్ అల్-బాగ్దాదీ (43) అసలు పేరు ఇబ్రహీం ఇబిన్ అవ్వాద్ అల్-బాద్రి అల్-సమర్రాయి. 1971లో ఇరాక్లోని సమర్రా నగరంలో పుట్టాడు. స్వతహాగా బిడియస్తుడని పేర్కొంటారు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్ నుంచి ఇస్లామిక్ స్టడీస్లో పీహెచ్డీ పూర్తిచేశాడు. ఇతడు నేరుగా మహమ్మద్ ప్రవక్త వారసుడని ప్రచారం. ఇరాక్పై అమెరికా ఆక్రమణ నేపథ్యంలో తన నగరంలో ‘జైష్ హల్ అల్ సున్నా అల్-జమా’ అనే ఒక చిన్న సున్నీ తిరుగుబాటు సంస్థను నెలకొల్పాడు. కొన్ని నెలలకే 2004 ఫిబ్రవరిలో ఫలుజాలో ఇతడిని అమెరికా బలగాలు నిర్బంధంలోకి తీసుకుని.. బాగ్దాద్ శివార్లలో ‘క్యాంప్ బుక్కా’ జైలుకు తరలించాయి. అదే ఏడాది డిసెంబర్లో విడుదల చేశాయి. అనంతరం 2006లో బాగ్దాదీ సంస్థ, మరికొన్ని సున్నీ తిరుగుబాటు సంస్థలు కలిసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’గా ఏర్పడ్డాయి. అది ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్’గా పేరు మార్చుకున్నపుడు అందులో బాగ్దాదీ హోదా పెరిగింది. 2010 మే నాటికి ఆ సంస్థ అధినేత అయ్యాడు. బగ్దాదీ ఉన్నట్లా.. లేనట్లా? బగ్దాదీ గాయపడ్డాడని, మరణించాడని పలుమార్లు వార్తలు వెలువడ్డాయి... అయితే అతని మృతి చెందాడని గట్టిగా ధృవీకరించి ఏ దేశమూ చెప్పడం లేదు. ఈ ఏడాది మార్చి 18న సిరియా సరిహద్దుల్లోని అల్ బాజ్ జిల్లాలో.. వైమానిక దాడుల్లో బగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. తదుపరి నేతను ఎన్నుకోవడానికి ఐఎస్ఎస్ అగ్రనేతలు సమావేశమయ్యారని కూడా వినవచ్చింది. బగ్దాదీ పూర్తిగా కోలుకోలేదని, బగ్దాదీకి డిప్యూటీగా పనిచేసిన ఫిజిక్స్ ఉపాధ్యాయుడు అబూ అలా అల్- ఆఫ్రీ (ఇరాక్ దేశస్తుడు)ని ఐఎస్ఐఎస్ తాత్కాలిక నాయకుడిగా ఎన్నుకున్నారని ఏప్రిల్ 22న ఇరాక్ ప్రభుత్వవర్గాలు తెలిపాయి. బగ్దాదీ వెన్నముక దెబ్బతిందని, కదల్లేని స్థితిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. మే 14న బగ్దాదీ ఆడియో టేపుగా ఐఎస్ఐఎస్ ఒక టేపును విడుదల చేసింది. ఇందులో అతను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇస్లామిక్ స్టేట్కు తరలిరావాలని, తమ తరఫున పోరాడాలని పిలుపిచ్చాడు. బగ్దాదీ గాయపడ్డాడు లేదా మరణించాడనే వార్తలు నిజం కాదని ఈ ఏడాది జులై 20న న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అక్టోబరు 11న బగ్దాదీ కాన్వాయ్పై తాము దాడి చేశామని ఇరాక్ వాయుసేన ప్రకటించుకుంది. కానీ ధృవీకరణ జరగలేదు. మొత్తం మీద అగ్రరాజ్యం అమెరికా సహా ఏ దేశమూ బగ్దాదీ చనిపోయాడని ధృవీకరించకపోవడం గమనార్హం. బలాన్ని చాటే యత్నం సిరియా అధ్యక్షుడు అసాద్ను తొలగించాలని, అతని అసమర్థత వల్లే ఐఎస్ఐఎస్ విస్తరిస్తోందని అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు వాదిస్తున్నాయి. అసాద్ తప్పితే మరొకరు ఐఎస్ఐఎస్ను నిలువరించలేరని రష్యా అధ్యక్షుడు పుతిన్ వాదన. అసాద్ బలగాలకు మద్దతు తమ వైమానిక దళాలతో రష్యా ఐఎస్ఐఎస్పై వైమానిక దాడులు మొదలుపెట్టింది. మరోవైపు అమెరికా ఐఎస్ఐఎస్ ఆధీనంలోని చమురు బావులు, ఇతర కీలక స్థావరాలపై దాడులను ముమ్మరం చేసింది. సింజార్ ఐఎస్ ఆధీనంలో నుంచి జారిపోయింది. కుర్దు బలగాలు సింజార్ను వశం చేసుకున్నాయి. వీటన్నింటిని నేపథ్యంలో ఇటీవల ఐఎస్ఐఎస్ కాస్తా వెనకంజ వేయాల్సి వచ్చింది. బలం కూడా తగ్గినట్లు కనపడింది. ఈ నేపథ్యంలోనే పాశ్చాత్యదేశాల్లో వణుకు పుట్టించడం... తద్వారా తామింకా బలంగానే ఉన్నామని చాటడమే లక్ష్యంగా ఐఎస్ఐఎస్ భారీదాడికి వ్యూహరచన చేసి... పారిస్పై విరుచుకుపడి ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. యువత ఎలా ఆకర్షితమవుతోంది..? ఐఎస్ఐఎస్లో చేరేందుకు.. అరబ్ దేశాల నుంచేకాదు.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వంటి పాశ్చాత్య దేశాల నుంచీ.. భారత్ నుంచీ గణనీయమైన సంఖ్యలో యువత ప్రయాణమవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ఇస్లాం రాజ్యాన్ని విస్తరించేందుకు జిహాద్ (పవిత్రయుద్ధం)లో బాధ్యతగా పాల్గొనాలని ఐఎస్ఐఎస్ ఇస్తున్న పిలుపు ఒకటైతే.. ఇరాక్, సిరియాల్లో తాను ఇస్లాం రాజ్యాన్ని స్థాపించానంటూ ‘సాధించిన విజయం’పై చేసుకుంటున్న ప్రచారం మరొకటి. యుక్తవయసులోఉండే ఉడుకు రక్తంతో పాటు.. పాశ్చాత్య దేశాలపై వ్యతిరేకతతో రగులుతున్న ముస్లిం యువతకు ఇదితమకు అందివచ్చిన ఒక అవకాశంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే.. ఒకసారి అందులోకి వెళ్లాక.. అక్కడి అంతులేని హింస, అరాచకత్వాలను సహించలేక.. అందులో నుంచి బయటకు రాలేక తల్లడిల్లుతున్న యువకుల ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. జాతుల హత్యాకాండ.. ఐఎస్ఐఎల్ తన ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ‘జాతి, మత పరమైన’ హత్యాకాండలకు, హింసకుపాల్పడుతోందని.. ఇతర జాతుల వారిని తుడిచిపెట్టే కార్యక్రమం కొనసాగిస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని వారందరూ ఇస్లాం మతాన్ని స్వీకరించి.. సున్నీ ఇస్లాం, షరియా చట్టాలకు తాను ఇచ్చే భాష్యం ప్రకారం జీవించాలని ఈసంస్థ స్పష్టం చేస్తోందని.. వినని వారిపై హింసకు పాల్పడుతోందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగాషియా ముస్లింలు, స్థానికులైన అస్సీరియన్, చాల్దియన్, సిరియాక్, ఆర్మీనియన్ క్రిస్టియన్లు, యాజిదీలు, డ్రూజ్, షబాక్లు, మాందియాన్లను లక్ష్యంగా చేసుకుని హింసిస్తోంది. ఖ్వినియేలో 90 మంది వరకూ, హర్దాన్లో 60 మంది, సింజార్లో 500 మందివరకూ, రమాదీ జబాల్లో 70 మంది, ధోలాలో50 మంది, ఖానాసోర్లో 100 మంది, హర్దాన్లో 300 మంది వరకూ, అల్-షిమాల్లో డజన్ల సంఖ్యలో, జదాలాలో 14 మంది, టాల్ అఫర్ జైలులో200 మంది యాజిదీలను ఐఎస్ఐఎస్ హత్యచేసింది. ఖోచోలో 400 మంది యాజిదీలను చంపేసివేయి మందిని అపహరించింది. బేషిర్లో 700మంది షియా తుర్కుమెన్లను చంపింది. మోసుల్లోని బాదుష్ జైలులో 670 మంది ఖైదీలను చంపింది. ఈ హత్యలన్నీ ఇరాక్లోని ఆయా ప్రాంతాలను ఐఎస్ఐల్ ఆక్రమించుకుంటున్న క్రమంలో 2014 ఆగస్టులో జరిగినవే. ఇక సిరియాలోనూ ఘ్రానీజ్, అబు హమాన్, కాష్కియే పట్టణాల్లో సున్నీ అల్షియాటట్ తెగకు చెందిన 700మందిని హతమార్చారు. -
అక్కడ సిరియా ఉగ్రవాది పాస్ పోర్ట్!
పారిస్/కైరో: ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఫుట్బాల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఓ ఉగ్రవాది మృతదేహం వద్ద సిరియా దేశస్థుడి పాస్పోర్టు లభ్యమైంది. ఉగ్రదాడులపై దర్యాప్తు చేస్తున్న అధికారులు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ యుద్దానికి వచ్చినట్లయితే తగిన విధంగా స్పందించే వాళ్లమంటూ ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల టార్గెట్ జాబితాలో ఫ్రాన్స్ మిత్ర దేశాలు మరికొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ప్రమాదకరమైన బెల్టు బాంబులు, ఏకే 47 తుపాకులు, ఇతర పేలుడు సామాగ్రితో పకడ్బందీగా రాజధాని ఫ్రాన్స్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా అధికారులు భావిస్తున్నారు. పారిస్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడులను యుద్ద చర్యలుగా పరిగణిస్తున్నట్లు దేశ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలాండే పేర్కొనడంతో తన కార్యకలాపాలు కొనసాగిస్తామని తీవ్రవాద సంస్థ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్లు, ఆత్మాహుతి బాంబు పేలుళ్ల ఘటనలో 127 మందిగా పైగా మృత్యువాతపడ్డ విషయం అందరికీ విదితమే. -
ఆ నిర్ణయాన్ని మార్చుకున్న అమెరికా!
వాషింగ్టన్: సిరియాలో తిరుగుబాటు దారులకు శిక్షణ ఇవ్వాలన్న నిర్ణయాన్ని అమెరికా ఉపసంహరించుకుంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అసద్ పై పోరు సల్పుతున్న తిరుగుబాటు దారులకు శిక్షణ ఇచ్చేందుకు అంతకుముందు పెంటగాన్ సంకల్పించింది. ఇందుకోసం 500 మిలియన్ డాలర్లు వ్యయంతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. అయితే ఈ నిర్ణయంపై బరాక్ ఒబామా సర్కారు వెనక్కు తగ్గిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సిరియాలో తిరుగుబాటు దారులకు శిక్షణ ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్టు పేర్కొంది. దీనిపై త్వరలోనే పెంటగాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని తెలిపింది. -
బాలికను దత్తత తీసుకోనున్న ఏంజెలినా జోలి
న్యూయార్క్ : ముగ్గురు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలతోపాటు మూడు జాతులకు చెందిన ముగ్గురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని కన్నబిడ్డల్లా పెంచుకుంటున్న హాలీవుడ్ అందాల తార ఏంజెలినా జోలి మరో అనాథ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించింది. ఈసారి అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియాకు చెందిన అనాథ బాలికను దత్తత తీసుకోవాలని నిర్ణయించినట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఐక్యరాజ్య సమితి శరణార్థుల అంబాసిడర్గా వ్యవహరిస్తున్న జోలీ ఇటీవల పలు దేశాల్లోని సిరియా శరణార్థుల శిబిరాలను సందర్శించారు. అక్కడ తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు అనాథ బాలల పరిస్థితిని చూసి కదిలిపోయారు. ఆ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయానికొచ్చి భర్త బ్రాడ్ పిట్కు తన నిర్ణయాన్ని తెలియజేశారట. అయితే ఇప్పటికే ఆరుగురు పిల్లలున్నారని, మరో ముగ్గురు చేరితే తొమ్మిదిమందవుతారని, అంతమందిని చూసుకోవడం కష్టమని, పైగా కొత్త పిల్లలతో సర్దుబాటవటం కూడా కష్టమేనని బ్రాడ్ వాదించారని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ రేడార్ డాట్ కామ్ వెల్లడించింది. చివరకు సిరియాకు చెందిన ఓ అనాథ ఆడపిల్లను దత్తత తీసుకోవాలని భార్యాభర్తలిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆ వెబ్సైట్ తెలిపింది. సిరియాలో అంతర్యుద్ధం కారణంగా 70 వేల మంది పిల్లలు తండ్రులను కోల్పోగా, 3,700ల మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. ఈ ఏడాదిలోనే ఓ అనాథ సిరియా బాలికను ఏంజెలినా జోలి దత్తత తీసుకునే అవకాశం ఉందని సన్నిహితవర్గాలు చెప్పాయి. భౌతికంగా పిల్లలను కనే అవకాశం జోలికి లేదనే విషయం తెలిసిందే. వంశపారంపర్యంగా తమ కుటుంబంలో వస్తున్న కేన్సర్ ను నివారించడంలో భాగంగా ఆమె అండాశయాన్ని, బ్రెస్ట్ను తొలగించుకున్నారు. -
శరణార్థులపై పెప్పర్ స్ప్రే ప్రయోగం
తమ దేశంలోకి వెల్లువలా తరలివస్తున్న శరణార్థులను నియంత్రించేందుకు పలు ప్రాంతాల్లో తాము పెప్పర్ స్ప్రే ఉపయోగించినట్లు క్రొయేషియా పోలీసులు వెల్లడించారు. ఒపటోవా, తూర్పు క్రొయేషియా ప్రాంతాల్లో ఇలా చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధఙ జెలెనా బికిక్ తెలిపారు. శరణార్థులు బస్సులో ఎక్కేందుకు ఒకరిని ఒకరు విపరీతంగా తోసుకుంటున్నారని, ఈ తోపులాటను ఆపేందుకు పోలీసులకు మరో ప్రత్యామ్నాయం లేక పెప్పర్ స్ప్రే ఉపయోగించారని చెప్పారు. ఈ తొక్కిసలాటలో పిల్లలు ఇరుక్కుపోకుండా ఉండాలనే అలా చేశామంటున్నారు. అయితే, ఇద్దరు పిల్లల మీద కూడా పొరపాటున ఈ స్ప్రే పడిందని ఆమె చెప్పారు. వెంటనే రెడ్ క్రాస్ వలంటీర్లు ఆ పిల్లలను ఆస్పత్రికి తరలించారు. గడిచిన వారంలో దాదాపు 44 వేల మంది శరణార్థులు క్రొయేషియాకు వచ్చారని క్రొయేషియా హోంశాఖ మంత్రి తెలిపారు. -
శిథిలాల మధ్య.. కన్నీటి పాట!
'శిథిల విలాపం'.. అంటే శిథిలాలు విలపించడం కాదు. నివాస స్థలాలు ధ్వంసమై శిథిలాలుగా మారిన చోట.. అప్పటికే కన్నీళ్లు ఇంకిన హృదయాలు మళ్లీ గుండెలవిసేలా ఏడవటం! అక్కడుంటే ఘోరమైన చావు తథ్యమని తెలిసీ.. ఆ శిథిలాల వీధుల్లోనే పియానో వాయిస్తూ.. ప్రతి మనిషికి ప్రాథమిక వాంఛ అయిన 'ఎలాగైనాసరే బతకాలనే' సందేశాన్ని ప్రకటిస్తాడు అయిహమ్- అల్- అహ్మది. అతనిది యర్మౌక్ పట్టణం. సిరియా ప్రధాన నగరం డమాస్కస్ను ఆనుకుని ఉన్న ఆ పట్టణం.. ఆసుపత్రులు, పాఠశాలలకు పెట్టింది పేరు. ఇప్పుడు మాత్రం.. సిరియా సైన్యం, తిరుగుబాటు దళాలు, ఐఎస్ ఉగ్రవాదులు విడివిడిగానో, కలిసికట్టుగానో సాగిస్తున్న దమనకాండకు ప్రత్యక్ష సాక్షి. ఆ విషాద వీధుల్లో పియానో సంగీతానికి లయబద్ధంగా అహ్మదీ పాడే పాటల్ని పిల్లలు, పెద్దలూ చుట్టూ చేరి వింటూ స్వాంతన పొందేవాళ్లు. పరిస్థితులు రోజురోజుకూ గడ్డువైపోయాయి. అప్పటికే సరుకులు నిండుకున్న దుకాణాలన్నీ బాంబు దాడుల్లో దెబ్బతిన్నాయి. యర్మౌక్ పట్టణానికి పాల సరఫరా కూడా నిలిచిపోయింది. విషాదగీతాలతో అందరినీ అలరించే అహ్మదీని.. ఇంట్లో కొడుకులు పెట్టే ఆకలి కేకలు తీవ్రంగా కలిచివేశాయి. తన కొడుకు లాంటి ఆయలాన్ కుర్దీ (టర్కీ తీరంలో శవమై తేలిన సిరియా బాలుడు) మరణంతో తెరుచుకున్న యూరప్ ద్వారాలకేసి నడవాలనుకున్నాడు.. సిరియా నుంచి టర్కీ గుండా యూరప్లోకి తన ప్రయాణాన్ని ఇలా వివరించాడు.. 'పిల్లలకు కనీసం పాలు పట్టలేని దుస్థితి. డబ్బులున్నా అమ్మేవాళ్లు లేరు. మేముండే పట్టణానికి ఆహార పదార్థాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో బతకడానికి వేరేచోటికి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే నేను గమ్యం చేరతానా, ఎక్కడో ఒక చోట కాల్పుల్లో చచ్చిపోతానా లేక పడవలో వెళ్తూ వెళ్తూ సముద్రంలో మునిగిపోతానా అనేది అస్పష్టం. చూస్తూ చూస్తూ నా పిల్లల్ని చంపుకోలేను. అందుకే మొదట నేను బయలుదేరాను.. ఓ గూడు దొరికాక వాళ్లను తిరిగి తెచ్చుకోవాలని నా ఆలోచన. నాతోపాటు శరణార్థుల బృందం ఓ బోటు మాట్లాడుకున్నాం.. మధ్యదరా గుండా గ్రీస్కు చేరడం మా గమ్యం. కిక్కిరిసిన చిన్న పడవలో రోజుల కొద్దీ ప్రయాణం. రొట్టె ముక్క కాదు కనీసం నీళ్లూ లేవు. చివరికి గ్రీస్ తీరానికి చేరాం. అదృష్టవశాత్తూ కోస్ట్ గార్డులకు మేం దొరకలేదు. ఎన్నాళ్ల నుంచో దూరమైన ప్రశాంతతను పడవ దిగగానే అనుభవించడం నాకింకా గుర్తుంది. నాతోపాటు ప్రయాణించిన వాళ్ల ముఖాల్లోనూ సన్నటి ఆనందాన్ని గుర్తించాను. గ్రీస్ నుంచి జర్మనీకి వెళ్లడం, చిన్నదైనా సరే, అక్కడో ఇంటిని సాధించడం నా తక్షణ లక్ష్యాలు. ఆ వెంటనే యర్మౌక్కు వెళ్లి నా భార్యాబిడ్డలను తీసుకొచ్చుకుంటా' అంటూ ముగించాడు అహ్మదీ. కల్లోల యర్మౌక్ పట్టణ వీధుల్లో అహ్మదీ పియానో వాయిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. యూరప్లో అతనికి కొత్త జీవితం దొరకాలని, అతి త్వరలోనే తన కుటుంబాన్ని అక్కడికి తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు నెటిజన్లు. మనమూ అదే కోరుకుందాం.. - మధు కోట -
శరణార్థులకు దారేదీ?
-
ఏసీ టెంట్లున్నా శరణివ్వరా ?
రియాద్: అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియా, ఇరాక్ తదితర ముస్లిం దేశాల నుంచి లక్షలాదిగా తరలివస్తున్న శరణార్థులకు సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ యూరప్ దేశాలను సౌదీ అరేబియా ఆడిపోసుకుంటోంది. ఈ నేపథ్యంలో ధనిక దేశమైన సౌదీ అరేబియా- శరణార్థుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటోందన్న సందేహం ఎవరికైనా రావడం సమంజసం. అక్షరాల 40 లక్షల మంది శరణార్థులకు వసతి కల్పించేందుకు మీనా నగరంలో పది లక్షల అత్యాధునిక ఏసీ టెంట్లు ఉన్నప్పటికీ ఒక్కరంటే ఒక్క శరణార్థికి కూడా సౌదీ అరేబియా ఆశ్రయం కల్పించకపోవడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా జర్మనీ ఏటా ఐదు లక్షల మంది ముస్లిం సోదరులకు ఆశ్రయం కల్పిస్తే అక్కడ ఏటా 200 చొప్పున మసీదులు ఉచితంగా కట్టిస్తామని సౌదీ అరేబియా ఆఫర్ ఇస్తోంది. దీన్నెలా అర్థం చేసుకోవాలి? (అంతర్యుద్ధం కారణంగా సిరియా నుంచి దాదాపు 40 లక్షల మంది ప్రజలు యూరప్ దేశాలకు వలసపోయారన్నది ప్రస్తుత అంచనాలు) హజ్ యాత్రికుల కోసం మీనా నగరంలో 20 చదరపు కిలీమీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల పొడువుగల పది లక్షల టెంట్లను సౌదీ అరేబియా 1990లో నిర్మించింది. అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేందుకుగాను వీటిని 1997లో ఆధునీకరించింది. వీటిలో ప్రత్యేక బాత్రూమ్లతోపాటు వంట చేసుకునేందుకు ప్రత్యేక గదిలాంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఏడాదికోసారి హజ్ యాత్రికులు కేవలం ఐదు రోజులపాటు బస చేసేందుకు మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత ఏడాదిపాటు ఎడారి గుడారాల్లాగా ఖాళీగా ఉంటాయి. సిరియా తదితర ప్రాంతాల నుంచి శరణుకోరుతోంది ముస్లిం సోదరులేకదా! వారికి ఈ టెంట్లలో వసతి కల్పించినట్టయితే ఆ అల్లా కూడా సంతోషిస్తారుకదా! ఇలాంటి విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తడంతో తాము 2011 నుంచే శరణార్థులకు ఆశ్రయిస్తున్నామని, ఇప్పటి వరకు ఐదు లక్షల మందికి ఆశ్రయం ఇచ్చామని సౌదీ అరేబియా ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని, తమ దేశంలో పనిచేయడం కోసం చట్టపరంగా వీసాలిచ్చి తీసుకొచ్చుకున్న వారిని శరాణార్థుల లెక్కలో చూపేందుకు సౌదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. సౌదీ ధోరణి చూస్తే సిరియాలో మానవ హననానికి పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ టైస్టులకు అత్యాధునిక ఆయుధాలను సౌదీ అరేబియా అందిస్తోందన్న ఆరోపణలు ఇప్పుడు నిజమనుకోవాల్సి వస్తోందని పాశ్చాత్య పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక్క సౌదీ అరేబియా దేశమే కాకుండా ఖతార్, కువైట్ లాంటి సంపన్న గల్ఫ్ దేశాలేవీ కూడా సిరియా, ఇరాక్ శరణార్థులను సరిహద్దుల దరిదాపులకు కూడా రానీయడం లేదు. -
ప్రపంచం వారిని ఆదుకోవాలి
కెదార్ ర్యాపిడ్స్: ప్రపంచం మొత్తం సిరియా శరణార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుతం ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న హిల్లరీ క్లింటన్ అన్నారు. ప్రతి ఒక్కరం శరణార్థులకు సహాయం చేయాలని కోరుకోవాలని చెప్పారు. సివిల్ వార్ నుంచి బయటపడి తమ ప్రాణాలు కాపాడుకోవాలని యూరప్ దేశాలవైపు వస్తున్నవారికి రక్షణగా నిలవాలని సూచించారు. ఒక వేళ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితి ఏ దేశానికి ఉంటుందో ఆ దేశాలు వారికి ఆర్థికపరమైన సహాయం అందించాలని కోరారు. ముఖ్యంగా పెట్రోలియం సంపద ఎక్కువగా ఉండి సంపన్న దేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలు ఈ విషయంలో ముందుకు రావాలని సూచించారు. -
మానవత్వం ఓడిన వేళ...
మానవత్వం ఓడిన తీరును కళ్లకు కట్టి ప్రపంచాన్ని కంటతడి పెట్టించిన చిన్నారి అయలాన్ కుర్దీ అంత్యక్రియలు శుక్రవారం సిరియాలోని కోబాన్ పట్టణంలో పూర్తయ్యాయి. టర్కీ నుంచి సిరియా సరిహద్దుల వరకు ప్రత్యేక విమానంలో రేహన్, ఇద్దరు పిల్లల మృతదేహాలను తరలించారు. జర్నలిస్టులు, టర్కీ ఎంపీలు వెంటరాగా... తండ్రి అబ్దుల్లా సొంతపట్టణానికి చేరుకొని బంధు, మిత్రుల సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దామనే మధ్యదరా సముద్రాన్ని దాటే సాహసం చేశానని... ఇప్పుడు నాకంటూ ఏమీ మిగల్లేదు గనక ఇక ఎక్కడికీ పోనని అబ్దుల్లా రోదిస్తూ చెప్పారు. 'ప్రపంచ దేశాలన్నింటినీ తనకిచ్చినా (ఎక్కడైనా నివసించే అవకాశం కల్పించినా) నాకేమీ వద్దు. అత్యంత విలువైనదే కోల్పోయాను' అంటూ గద్గదస్వరంతో అన్నారు. టర్కీ తీరంలో అయలాన్ మృతదేహం యూరోప్ దేశాధినేతలను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజానీకంలో సానుభూతి వెల్లువెత్తింది. ఏళ్లుగా నలుగుతున్న సిరియా శరణార్థుల సమస్యను ప్రపంచం దృష్టికి తెచ్చింది. 2 లక్షల మందికి నీడ ఇవ్వండి బ్రస్సెల్స్: యూరప్కు వస్తున్న వలసదారులు ప్రమాదాల్లో చనిపోతున్న నేపథ్యంలో 2 లక్షల మంది శరణార్థులకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలన్నీ కలసి ఆశ్రయమివ్వాలని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ అంటోనియో గటై పిలుపునిచ్చారు. అయలాన్ మృతదేహం దొరికిన తీరు ప్రపంచ ప్రజల్ని కలచి వేసిన తరుణంలో స్పందించకుండా ఉండకూడదన్నారు. కాగా, శరణార్థులకు ఆశ్రయమివ్వడానికి జర్మనీ, ఫ్రాన్స్ అంగీకరించాయి. గ్రీస్, ఇటలీ, హంగరీ దేశాలపై శరణార్థుల భారం తగ్గించేందుకు 1.2 లక్షల మందికి పునరావాసం కోసం ఒక ప్రణాళికను వచ్చేవారంలో ఈయూ విడుదల చేయనుంది. అధిక సంఖ్యలో శరణార్థులకు ఆశ్రయమిస్తామని బ్రిటన్ తెలిపింది. -
పాపం... పసివాడు!
ఈ ఫోటో చూడగానే 'అయ్యో పాపం...' అంటూ చలించని హృదయం ఉండదు. సురక్షిత జీవితం, మంచి భవిష్యత్తు కోసం ప్రాణాలకు తెగించి సిరియాను వదిలి మధ్యదరా సముద్రం మీదుగా యూరోప్కు ప్రయాణమైంది వీరి కుటుంబం. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, కుర్దు సాయుధుల మధ్య సిరియా నలిగిపోతోంది. నిత్యం బాంబుల మోతలు, తుపాకుల గర్జనలే. ఇక ఇక్కడ ఉండలేమనే భావనతో పుట్టినగడ్డను, ఆస్తిపాస్తులను వదిలేసి వేలాది మంది ప్రాణాలకు తెగించి చిన్నచిన్న బోట్లలో మధ్యదరా సముద్రాన్ని దాటే సాహసం చేస్తున్నారు. జనాన్ని అక్రమంగా తరలించే ముఠాల అత్యాశతో బోట్లు కిక్కిరిసిపోతున్నాయి. కల్లోల సముద్రంలో ఈ బోట్లు మునిగిపోతున్నాయి. వేల మంది చనిపోతున్నారు. సిరియాలోని కొబాని పట్టణానికి చెందిన అబ్దుల్లా, తన భార్య రేహన్, కుమారులు అయలాన్ కుర్దీ (3), గాలిప్ (5)లతో ఇలాగే దేశం వదిలాడు. టర్కీకి వచ్చి గ్రీస్లోని కోస్కు వెళ్లేందుకు బోటు ఎక్కాడు. వీరి పడవ మునిగిపోయి 12 మంది చనిపోయారు. అబ్దుల్లా ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ... కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. భార్య, ఇద్దరు పిల్లలు నీట మునిగి చనిపోయారు. అయలాన్ కుర్దీ మృతదేహం టర్కీ తీరానికి కొట్టుకువచ్చింది. దీన్ని చూసిన ప్రపంచం నివ్వెరపోయింది. బాధతో విలవిల్లాడింది. పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. సోషల్ సైట్లలో ఎందరో అశ్రుతర్పణాలు అర్పించారు. యూరోప్ దేశాధినేతలంతా స్పందించారు.ప్రస్తుతానికి ఏడాదికి 32 వేల మందిని ఆశ్రయం కల్పిస్తున్న యూరోప్ దేశాలు ఈ సంఖ్యను మరింత పెంచడానికి సిద్ధమని ప్రకటించాయి. మొత్తం లక్షా అరవై వేల మంది యూరప్లోని శరణార్థుల శిబిరాల్లో తలదాచుకున్నారు. -
అధికారపార్టీలో భారీ చీలిక
ఎథెన్స్: ఆర్థిక సంక్షభం అనంతరం తలెత్తిన రాజకీయ సంక్షోభం గ్రీస్ను అతలాకుతలం చేస్తున్నది. ప్రధాని పదవికి రాజీనామాచేసి, మరోసారి ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రకటించిన సిరిజా పార్టీ అధ్యక్షుడు అలెక్సిస్ సైప్రస్కు శుక్రవారం మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీలో సైప్రస్ వ్యతిరేకులుగా ముద్రపడ్డ దాదాపు 25 మంది ఎంపీలు.. సిరిజా పార్టీని వీడి వేరు కుంపటిపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టా నియా డైలీ పత్రిక సైతం ఈ విషయాన్ని నిర్ధారించింది. చీలిక ఎంపీల బృందం.. లెయికీ అనోటితా (ప్రఖ్యాత కూటమి) పేరుతో కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయింది. దీనికి మాజీ విద్యుత్ శాఖ మంత్రి పానజియోటిస్ లఫాజనిస్ నేతృత్వం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో 300 స్థానాలున్న గ్రీక్ పార్లమెంట్లో సిరిజా పార్టీకి 149 స్థానాలు రాగా, 76 స్థానాలతో న్యూ డెమోక్రసీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. లెయికీ లనోటితా పార్టీ ఏర్పాటుతో గ్రీస్ రాజకీయ గమనం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. యూరోజోన్తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై సొంతపార్టీలోనే వ్యతిరేకత రావడంతో గ్రీసు ప్రధాని అలెక్సిస్ సైప్రస్ గురువారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మెత్తం ప్రక్రియలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని ప్రజలకు వివరించిన ఆయన.. తర్వాతి ఎన్నికలు సెప్టెంబర్ 20న నిర్వహించనున్నట్లు చెప్పారు. -
ఉగ్ర చెర నుంచి 22 మందికి విముక్తి
డమాస్కస్: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల చెర నుంచి 22 మంది క్రైస్తవులు విడుదలయ్యారు. సిరియాలో గత ఫిబ్రవరి 23న కిడ్నాప్నకు గురైన వీరిని విడుదల చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఉగ్రవాదుల చెరు నుంచి విడుదలైన వీరు సిరియా ఉత్తరాన ఉన్న హసాఖా పట్టణానికి చేరుకుని, అక్కడ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఈ పట్టణానికి చెందిన మానవ హక్కుల విభాగం నుంచి ఉగ్రవాదుల ఆగడాలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఉగ్రవాదుల చెరలో ఇంకా మహిళలు, చిన్నారులు సహా 187 మంది బంధీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాల్ హుర్మాజ్, తాల్ షామిరామ్, తాల్ నస్రా పట్టణాలపై ఈ ఏడాది మొదట్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. సుమారు 200 మందికి పైగా ప్రజలను ఐఎస్ ఉగ్రవాదులు బంధించినట్లు సమాచారం. ఈ దాడులు ముఖ్యంగా చర్చ్ వంటి వాటిపై జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. -
కూలిన సైనిక విమానం: 25 మంది మృతి
డమాస్కస్: సిరియాలో యుధ్ద విమానం జనావాసాల మీద కుప్పకూలి పోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. చాలామంది గాయపడినట్టు తెలుస్తోంది. నైరుతి సిరియా నగరం జెరికోలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. విమాన సిబ్బంది ఆచూకీ తెలియలేదని మిలిటరీ వర్గాలు తెలిపాయి. విమానం ఇళ్ల మీద కూలిపోవడంతో.. ఈ ప్రమాదంలో కొన్ని డజన్ల మంది గాయపడి ఉంటారని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇద్దరు మహిళల తలనరికిన ఐఎస్ఐఎస్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. సిరియాలో 'చేతబడి' ఆరోపణలతో ఇద్దరు మహిళల తలలు నరికారు. సిరియాలో ఈ తరహా దారుణం జరగడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని సిరియా మానవహక్కుల పరిశీలన సంఘం తెలిపింది. డైర్ ఎజోర్ రాష్ట్రంలో వారిద్దరినీ తలలు నరికారని సంఘం చీఫ్ రమీ అబ్దెల్ రహమాన్ తెలిపారు. నరికివేతకు గురైన మహిళలిద్దరూ వివాహితులే. వాళ్ల భర్తలతో కలిపి మరీ వాళ్లను చంపారు. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో కొంతమంది మహిళలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రాళ్లతో కొట్టి చంపారు. అయితే.. ఇలా తల నరికి చంపడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ ఏడాది సిరియాలో ఇప్పటివరకు దాదాపు 3 వేల మందికి పైగా వ్యక్తులను ఇస్లామిక్ స్టేట్ హతమార్చింది. వాళ్లలో 74 మంది పిల్లలు కూడా ఉన్నారు. -
ఉపవాసం విరమించారని ...
బీరూట్: ఆ ఇద్దరు ముస్లిం యువకులు ఆహారం తీసుకున్నారు. అది రంజాన్ వేళల్లో... ఆ విషయం ఐఎస్ సంస్థకు చెందిన ఉగ్రవాదులకు తెలిసింది. అంతే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సదురు యువకులిద్దరిని ఐఎస్ ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్తంభాలకు కట్టేసి రాత్రి వరకు అలాగే ఉంచాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా వారికి శిక్షను అమలు చేశారు. అంతేకాకుండా ముస్లిం పవిత్ర మాసమైన రంజాన్ని వీరిద్దరు అత్రికమించారని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటన బీరూట్ డైయిర్ ఈజోర్ ప్రావిన్స్లోని మాయాదీన్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ మేరకు సిరియాకు చెందిన మానవహక్కుల సంఘ పర్యవేక్షకులు మంగళవారం వెల్లడించారు. ఈ ఇద్దరు ముస్లిం యువకులు 18 ఏళ్ల కంటే చిన్నవారేనని స్పష్టం చేసింది. ముస్లిం పవిత్ర మాసం రంజాన్ గత గురువారం ప్రారంభమైంది. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఆ మాసంలో ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం తీసుకోకుండా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు యువకులు రంజాన్ నియమ నిబంధనలను అత్రికమించడంతో ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. రంజాన్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఐఎస్ ఈ విధంగా ముస్లింలను హెచ్చరించింది. -
పెనం నుంచి పొయ్యి లోకి.... శరణార్థుల బతుకులు
-
ఏంజెలినా జోలీకి కోపం వచ్చినవేళ!
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి కాందిశీకుల హైకమిషనర్ ప్రత్యేక రాయబారి, హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ భద్రతా మండలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో శుక్రవారం భద్రతా మండలిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సిరియా సంక్షోభాన్ని పరిష్కరించే శక్తిసామర్థ్యాలు భద్రతా మండలికి ఉన్నప్పటికీ, వాటిని వాడుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. మండలికి ఐక్యత, రాజకీయ సంకల్పం కొరవడిందని ఆమె మండిపడ్డారు. అయిదు సంవత్సరాలుగా సిరియాలో జరుగుతున్న సంఘర్షణలు, సంక్షోభం కారణంగా రెండు లక్షల 20వేల మంది చనిపోయారు. పది లక్షల మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. 76 లక్షల మంది వారు నివసించే ప్రదేశాల నుంచి వెళ్లిపోయారు. దాదాపు 40 లక్షల మంది పొరుగుదేశాలకు వెళితే అక్కడ తిరస్కరించబడ్డారు. ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించాలన్న సంకల్పం లేకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితులలో సిరియా సంక్షోభం సమసిపోయే దిశగా భద్రతా మండలి పనిచేయాలని శరణార్ధుల తరపున ఆమె మండలికి విజ్ఞప్తి చేశారు. మండలి తన అధికారాలను వినియోగించి సిరియాలో సంఘర్షణలకు చరమగీతం పాడి సిరియన్లకు న్యాయం చేయాలని ఆమె కోరారు. మండలిలోని దేశాల విదేశాంగ మంత్రులు అందరూ కలసి ఈ సమస్యకు ఒక రాజకీయ పరిష్కారం కనుగొనాలని ఏంజెలినా జోలీ విజ్ఞప్తి చేశారు. -
పోలీస్ ఆపరేషన్ లో 13మంది జిహాదీల అరెస్ట్
వియన్నా: తీవ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల కోసం యువకులకు జిహాదీలో చేరేలా ప్రేరేపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాద చర్యలను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం పెద్దఎత్తునా ఆపరేషన్ను మొదలుపెట్టింది. ఆస్ట్రియాలో జిహాదీలుగా అనుమానించిన 13మందిని ఆస్ట్రియన్ పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. సిరియా సరిహద్దు ప్రాంతంలో తీవ్రవాద సంస్థల వద్ద యువకులు జిహాదీ శిక్షణ తీసుకుంటున్నారనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. జిహాదీలుగా అనుమానించిన 16మందిని లక్ష్యంగా పోలీసులు ఈ అపరేషన్ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లోని ఇళ్లలో సోదాలు జరిపారు. ఈ ఆపరేషన్లో దాదాపు 900 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సూచించిన దానిప్రకారం.. అనేకమంది యువకులు జిహాదీలో చేరుతున్నట్టు సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు జరిపారు. సోదాలు చేసిన ఇళ్లలో ఉగ్రవాదుల సంబంధిత వస్తువులతోపాటు డేటా స్టోరేజ్ డివైజ్లు, నగదు, బ్రెస్ నక్లెస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఐఎస్ ముప్పును తక్కువ అంచనా వేశాం: ఒబామా
వాషింగ్టన్: సిరియాలో సంక్షోభం వల్ల జిహాదిస్టు మిలిటెంట్లు తిరిగి ఏకమై బలం పుంజుకుంటారన్న విషయాన్ని తాము తక్కువగా అంచనా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పారు. ఇరాక్ నుంచి స్థానిక ప్రభుత్వ, అమెరికా బల గాలు తరిమేసిన అల్ కాయిదా ఉగ్రవాదులు సిరి యాలో తిరిగి ఏకమై కొత్తగా ఇస్లామిక్ స్టేట్ గ్రూ పుగా ఏర్పడ్డారని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. -
వైమానిక దాడులు: 50 మంది తీవ్రవాదులు మృతి
డెమాస్కస్ : డీర్ అల్ జోర్ తూర్పు ప్రావెన్స్లోని తీవ్రవాదుల శిక్షణ శిబిరంపై శనివారం సిరియా వైమానిక దాడులు జరిపింది. ఆ దాడులలో సున్నీ తీవ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్కు చెందిన దాదాపు 50 మంది తీవ్రవాదులు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అల్ రఖా ప్రాంతంలో కూడా సిరియా దళాలు మరిన్ని వైమానికి దాడులు నిర్వహించాయని తెలిపింది. 2011 మార్చిలో మొదలైన సిరియాలో జరుగుతున్న పోరాటంలో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది మరణించారు. అలాగే ముప్పై లక్షల మంది పొరుగు దేశాలకు వలస పోయారని యూఎన్ తన గణాంకాలలో వెల్లడించింది. -
కళ్లు కూడా కనిపించడానికి వీలులేదు!
సిరియాలో మహిళలపై జీహాదీల ఆంక్షలు బీరుట్: సిరియాలో జీహాదీలు మహిళలపై కఠిన ఆంక్షలకు దిగారు. శరీరంలో ఏ అవయవం కనిపించడానికి వీలులేదని ఆంక్షలు విధించారు. శరీరంలో ఏ భాగం కనిపించని విధంగా వస్త్రధారణ ఉండాలని నిషేధాజ్ఞలు జారీ చేశారు. చివరకు కళ్లు కూడా కనిపించడానికి వీలులేదని ఆదేశించారు. రంగు రంగుల వస్త్రాలు ధరించకూడదు.వస్త్రాలపై పూసలు వంటి అలంకరణ వస్తువులు ఉండకూడదు. హైహీల్స్ చెప్పులు వాడకూడదు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు శిక్షలు కూడా విధిస్తారు. ఈ ఆదేశాలను జీహాదీల నియంత్రణలోని దీర్ ఎజ్జార్ ప్రాంతంలో జారీ చేసినట్లు సిరియా మానవ హక్కుల పరిశీలన సంస్థ తెలిపింది. -
సిరియాలో పేలుడు: 30 మంది సైనికుల మృతి
బీరుట్: సిరియా ఆగ్నేయ ప్రాంతం శివారులోని ఓ సొరంగంలో పేలిన శక్తి మంతమైన బాంబు పేలుడులో 30 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చెక్పోస్టుకు కిందగా తవ్విన ఈ సొరంగంలో ప్రత్యర్థి వర్గాలు ఈ బాంబును అమర్చి ఉంటాయని భావిస్తున్నారు. టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలను ఈ సొరంగంలో అమర్చారని, ఇలి అత్యంత శక్తిమంతవైనవని అధికార వర్గాలు తె లిపాయి. సోమవారం సంభవించిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిందని పేర్కొన్నాయి. -
సిరియాలో హింస: 71 మంది మృతి
సిరియాలో నరమేథం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో గురువారం ఓ వైపు కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లగా, మరోవైపు దేశ భద్రత సిబ్బంది, తిరుగుబాటుదారులకు మధ్య హోరాహోరిగా కాల్పులు జరిగాయి. ఆ హింసలో మొత్తం 71 మంది మరణించారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. సిరియా ఈశాన్య ప్రావెన్స్లో హస్కాలో రెండు కారు బాంబు పేలుళ్లకు తిరుగుదారులు పాల్పడ్డారు. ఆ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. హస్కాలోని ఓ పాఠశాల ప్రవేశ ద్వారం సమీపంలో కారు పేలుడు సంభవించి... ఇద్దరు చిన్నారుల మృతి చెందారని తెలిపింది. తల్ హలాఫ్ పట్టణంలో అల్ ఖమిస్ మార్కెట్ వద్ద మరో కారును తిరుగబాటుదారులు పేల్చేశారిని ఆ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని, అనేక మంది గాయపడ్డారని పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో తిరుగుబాటుదారులను అణిచేందుకు భద్రత సిబ్బంది చర్యలు చేపట్టింది. అందులోభాగంగా భద్రత సిబ్బందికి, తిరుగుబాటుదారులకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో మొత్తం 64 మంది మరణించారని మీడియా వివరించింది. -
ఒబామా, ఫ్రాంకోయిస్ ల సమావేశం
-
సిరియాలో హింసాత్మక ఘటనల్లో 17 మంది మృతి
సిరియాలోని అలెప్పో నగరంలో తిరుగుబాటుదారులు రక్తపాతాన్ని సృష్టించారు. దాంతో 17 మంది మరణించారు. మృతుల్లో జడ్జి, మిలటరీ ఉన్నతాధికారి ఉన్నారని స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. అలెప్పో నగరంలోని మెరిడియన్, అల్ఫర్కన్ ప్రాంతాల్లోని జనవాసాలపై తిరుగుబాటుదారులు రాకెట్ లాంచర్లతో దాడులు చేశారని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో ఫూటేజ్లను స్థానిక టీవీలలో ప్రసారం చేసింది. ఆ దాడుల్లో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. -
సిరియాకు మళ్లీ ఐరాస తనిఖీ బృందం
సిరియా : ఐక్యరాజ్యసమితి రసాయన ఆయుధ తనిఖీ బృందం మళ్ళీ సిరియా చేరుకుంది. ఈ బృందం మార్చినెల 19న ఖాన్ అల్ అసాల్ పట్టణంపై జరిగిన రసాయన ఆయుధ దాడిపై దర్యాప్తు జరుపుతుంది. స్వీడన్ నిపుణుడు ఆకే సెల్స్టామ్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు.. అధ్యక్షుడు అసాద్ సేనలు సాగిస్తున్న దాడులకు దేశంలో నిలువలేక వలసపోతున్న సిరియన్ల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. గురువారం నాడు దేశ సరిహద్దలు దాటి వేల మంది సిరియన్లు ఇరాక్ చేరుకున్నారు. పెరుగుతున్న శరణార్దుల కోసం ఇరాక్ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. -
‘సిరియా’పై రష్యా, అమెరికా చర్చలు
మాస్కో/జెనీవా: సిరియా రసాయన ఆయుధాలను అంతర్జాతీయ నియంత్రణకు అప్పగించే విషయంపై ప్రయత్నాలు మొదలయ్యాయి. రష్యా, అమెరికా విదేశాంగ మంత్రులు ఈ మేరకు దీనిపై చర్చించేందుకు గురువారం జెనీవాలో సమావేశమయ్యారు. మరోపక్క ఈ సంక్షోభాన్ని నివారించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా మరోసారి అమెరికాకు విజ్ఞప్తిచేశారు. సిరియా సంక్షోభం నివారణ కోసం నాలుగు అంశాల ప్రణాళికపై అమెరికా, రష్యాల విదేశాంగ మంత్రులు జాన్ కెర్రీ, సెర్గెయ్ లావ్రోవ్లు జెనీవాలో చర్చలు ప్రారంభించారు. కాగా, మిత్రదేశం రష్యా ప్రతిపాదించినందు వల్లనే తాము రసాయన ఆయుధాలను అప్పగిస్తున్నామని, అమెరికాకు భయపడి మాత్రం కాదని గురువారం ఓ టీవీచానెల్ ఇంటర్వ్యూలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ వ్యాఖ్యానించారు. -
అమెరికా మెరైన్ల సైట్ను హ్యాక్ చేసిన సిరియన్లు
అమెరికా మెరైన్లంటే తెలుసు కదూ.. మెరికల్లాంటి సైనిక బలం వారిది. అలాంటి మెరైన్ కోర్ వెబ్సైట్ హ్యాకింగ్కు గురైంది. సిరియా అనుకూల వాదులు ఈ సైట్ను హ్యాక్ చేసి అందులో ఓ సందేశం పెట్టారు. సిరియా మీద దాడి చేయాలని వాషింగ్టన్ నుంచి ఆదేశాలు వస్తే, వాటిని తిరస్కరించాలని అమెరికన్ సైనికులను కోరుతూ ఆ సందేశం ఉంది. దీంతో చాలా గంటల పాటు మెరైన్స్.కామ్ అనే ఆ సైట్ చాలా గంటల పాటు స్తంభించిపోయింది. సిరియన్ ఎలక్ట్రికల్ ఆర్మీ - సీ అనే పేరుతో ఉన్న సందేశమే చాలాసేపటి వరకు అందులో కనిపించింది. గతంలో న్యూయార్క్ టైమ్స్ సైట్ను, సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ను, ఇతర మీడియా సైట్లను కూడా ఇదే గ్రూపు హ్యాక్ చేసింది. 'సిరియాలో అల్ కాయిదా గురించి నేను పోరాడను' అంటూ చేత్తో రాసి ఉన్న సందేశాలను పట్టుకున్న కొందరు వ్యక్తుల ఫొటోలు ఆరింటిని కూడా ఈ సైట్లో పెట్టారు. సిరియన్ సైన్యం తమ మిత్ర పక్షమే గానీ శత్రుపక్షం కాదని అమెరికా దళాలకు 'సీ' తెలిపింది. తామిద్దరి ఉమ్మడి శత్రువు ఉగ్రవాదమేనని చెప్పింది. అయితే, ఈ హ్యాకింగ్ వల్ల తమ సమాచారానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అమెరికా మెరైన్ కోర్ ప్రతినిధి ఎరిక్ ఫ్లానగాన్ తెలిపారు. ఈ నియామక సైట్ వాణిజ్యపరమైన నెట్వర్కే గానీ పెంటగాన్ నెట్వర్క్ కాదని చెప్పారు. -
సిరియాపై యుద్ధమేఘాలు
డమాస్కస్: సిరియాపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక చర్యలకు సిద్ధమవుతున్నాయి. సిరియాలోని సైనిక స్థావరాలపై గురువారం దాడులు చేసే అవకాశముందని అమెరికా సీనియర్ అధికారులు ‘ఎన్బీసీ’ టీవీ చానల్కు చెప్పారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ల జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాల నుంచి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించే అవకాశముందని రాజకీయ నిపుణులు తెలిపారు. అమెరికా, దాని మిత్రదేశాలు యుద్ధ సామగ్రిని సిరియా సమీపానికి తరలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ బుధవారం అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ఫోన్లో చర్చలు జరిపారు. సిరియాపై దాడికి బ్రిటన్ పార్లమెంటు అనుమతి తీసుకునే అంశంపై మాట్లాడారు. దాడికి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి మద్దతు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మరోపక్క.. డమాస్కస్లో ఈ నెల 21న వందలాది మంది మృతికి కారణమైన రసాయన దాడికి పాల్పడింది సిరియా ప్రభుత్వ బలగాలేనని అమెరికా ఉపాధ్యక్షుడు జోసఫ్ బిడెన్ స్పష్టం చేశారు. దాడి సిరియా ఆర్మీ పనేనని ‘నాటో’ కూడా ప్రకటించింది. తమ దేశంపై దాడి చేస్తే దీటుగా ఎదుర్కొంటామని సిరియా, సిరియాపై దాడి చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదురువుతాయని రష్యా, ఇరాన్లు హెచ్చరించడం తెలిసిందే. కాగా, సిరియాపై ఏకపక్ష దాడి చేయబోమని, సైనిక చర్యపై మిత్రదేశాలతో చర్చిస్తున్నామని అమెరికా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తాము దాడి చేస్తే సిరియా మళ్లీ రసాయనిక దాడి జరిపే అవకాశముందన్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో సిరియాలోని లటాకియా నగరం నుంచి వంద మందికిపైగా తమ దేశీయులను రష్యా మంగళవారం విమానాల్లో స్వదేశానికి తరలించింది. సిరియా సమస్యకు దౌత్యమార్గాల్లో పరిష్కారం కనుగొనాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్కీ మూన్ సూచించారు. ట్విట్టర్, న్యూయార్క్ టైమ్స్ వెబ్సైట్ల హ్యాకింగ్.. వాషింగ్టన్: సిరియాపై అమెరికా దాడి చేయనుందన్న వార్తల నేపథ్యంలో అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్, హఫింగ్టన్ పోస్ట్, ట్విట్టర్ సంస్థల వెబ్సైట్లు మంగళవారం కొన్ని గంటలపాటు హ్యాక్ అయ్యాయి. సిరియా అధ్యక్షుడు అసద్కు మద్దతిస్తున్న ‘సిరియన్ ఎలక్ట్రానిక్ ఆర్మీ’ అనే బృందం వీటిని హ్యాక్ చేసింది. దేశం వెలుపల నుంచి హ్యాకింగ్ జరగడంతో తమ వెబ్సైట్ను కొన్ని గంటలపాటు మొరాయించిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. వెబ్సైట్ను పునరుద్ధరించిన తర్వాత మళ్లీ హ్యాకింగ్ చేశారని, వెబ్సైట్ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. -
ఇరాన్పై దాడికి ‘సిరియా’నాంది
‘శాంతి’ ఎంత బీభత్సంగా, వికృతంగా విలయ నర్తనం చేయగలదో సిరియాలో గత బుధవారం జరిగిన రసాయనిక ఆయుధ ప్రయోగం కళ్లకు కట్టింది. ఎప్పుడైనా మొద లు కావచ్చనిపించేలా ఉన్న సిరియా దురాక్రమణకు నాంది పాలస్తీనా ‘శాంతి చర్చలు’ కావడం విశేషం. పాలస్తీనా అథారిటీకి ఇస్తున్న 50 కోట్ల డాలర్ల వార్షిక సహాయాన్ని నిలిపేస్తామని బెదిరించి మొహ్మద్ అబ్బాస్ను శాంతి చర్చలకు ‘ఒప్పించింది’ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ. పాలస్తీనాలోకి అక్రమ వలసల విస్తరణను తాత్కాలి కంగా నిలిపివేసేందుకు కుదిరిన ఒప్పం దాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిన కారణంగా ‘శాంతి చర్చలు’ 2010లో నిలిచిపోయాయి. అవి గత నెల 29న తిరిగి మొదలయ్యాయి. ఈ నెల 8న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరో వెయ్యి అక్రమ కాలనీల నిర్మాణానికి పచ్చ జెండా చూపారు. అందుకే నేటి చర్చలను పాలస్తీనీయులలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. ‘ఒకే దేశం (ఇజ్రాయెల్)’ పరిష్కారంతో పాలస్తీనానే లేకుండా చేసి ‘శాశ్వత శాంతి’ని సాధించాలని తపిస్తున్న నెతన్యాహూ ‘శాంతి’ కోసం హఠాత్తుగా తెగ తాపత్రయపడుతున్నారంటే అం దులో నిగూఢార్థం ఏదో ఉండి ఉంటుందనే అర్థం. అది సిరియాపై దురాక్రమణకు రంగం సిద్ధం చేయడమేనని డమాస్కస్ ‘రసాయనిక చేతబడి’ సూచిస్తోంది. సిరియా సమస్యపై ‘నిర్ణయాత్మకం’గా వ్యవహరించడానికి నిర్ణయించిన అమెరికా అందుకు జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా మద్దతును కూడగట్టడం కోసమే పాలస్తీనా శాంతి చర్చల ప్రహసనానికి తెరదీసింది. సిరియాకు దక్షిణ, ఆగ్నేయ దిశల్లో విస్తరించిన జోర్డాన్ ఇప్పటికే సిరియా శరణార్థుల సమస్యను ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్కు ఈశాన్యంగా ఉన్న జోర్డాన్, సిరియాపై దాడులకు ఆధారం కాగలుగుతుంది. సిరియాకు వాయవ్యంగా ఉన్న టర్కీ, బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని సైనిక చర్యతో కూలదోయాలని చాలా కాలంగా పట్టుబడుతోంది. సిరియాపై ముప్పేట దాడు లకు సన్నాహల్లో భాగంగానే ఇజ్రాయెల్... అసద్కు అనుకూలంగా పోరాడుతున్న హిజ బుల్లా బలగాలపై బాంబుల వర్షం కురిపిం చింది. ‘హిజబుల్లా ఉగ్రవాద స్థావరాలపై దాడుల’ పేరిట లెబనాన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. హిజబుల్లా సంస్థ లెబనాన్ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భాగస్వామి! లెబ నాన్ సరిహద్దులను తటస్థం చేసి, టర్కీ, జోర్డాన్లను కేంద్రాలుగా చేసుకుని సిరి యాపై యుద్ధానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిట న్లు జోరుగా సన్నాహాలు చేస్తున్నాయి. సిరి యాపై దురాక్రమణ మొదలైతే వారికి అదో తాత్కాలిక మజిలీ మాత్రమే. ఇదంతా అమెరికా, ఇజ్రాయెల్లకు వ్యతిరేకమైన ఊహాగానమేనని భావించేవారికి ఆదివారం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కనువిప్పు. ‘ఐరాస నిపుణులకు అనుమతిపై సుదీర్ఘ వాదోపవాదాల్లో ఇరుక్కోదలుచుకోలేదు. ఎందుకంటే అది అక్కడ విశ్వసనీయమైన నిర్థారణలు చేయలేకపోవచ్చు’ అన్న వైట్హౌస్ అధికారుల అభిప్రాయాన్ని అది బట్టబయలు చేసింది. ఒబామా బహిరంగంగానే అసంభవమని చెప్పిన ‘డమాస్కస్ తనిఖీ అనుమతి’ని అసద్ ఎలాంటి వాదోపవాదాలు లేకుండా ఆమోదించారనేది వేరే సంగతి. మార్చిలో అసద్ రసాయనిక ప్రయోగానికి ‘ఇదమిత్థమైన ఆధారాలు’ దొరికాయని ఒబామా చెప్పారు. అప్పుడు కూడా అసద్ తనిఖీకి అంగీకరించారు. అసద్ బల గాలు తిరుగుబాటుదళాలపై నిర్ణయాత్మకం గా పైచేయి సాధించాయని అమెరికా మీడి యా సైతం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఘోషిస్తోంది. ఈ సానుకూల పరిస్థితుల్లో, ఐరాస నిపుణులు తనిఖీకి వచ్చిన సందర్భాన్ని ఏరి కోరి ఎంచుకొని, అదీ రాజధాని శివార్లలో రసాయనిక ఆయుధ ప్రయోగానికి పాల్పడడానికి అసద్ వెర్రివాడా? ‘అసద్ గెలిచినా లేదా నిలదొక్కుకున్నా ఇరాక్, సిరియా, లెబనాన్లపై ఇరాన్ వినూత్నమైన స్థాయిలో గొప్ప ప్రాబల్యాన్ని సంపాదిస్తుంది. ఇజ్రాయెల్ మునుపెన్నడూ ఎరుగనంతటి తీవ్ర ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంపై ఇరాన్ పట్టు మరింతగా బలపడి విస్తరిస్తుంది’ అని ఆదివారం ఆంటోనీ కార్డ్స్మాన్ అమెరికా అసలు సమస్య ఏమిటో విడమరిచారు. ఆం టోనీ సామాన్యుడు కాదు... అమెరికా దురాక్రమణ యుద్ధాలకు గొప్ప వత్తాసుదారైన ‘సెం టర్ ఫర్ స్ట్రేటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ నిపుణుడు. అమెరికా ముందున్న సమస్య చిన్నది కాదు... రూఢియైన ప్రపంచ చమురు నిక్షేపాలలో 20 శాతం ఇరాన్, ఇరాక్ల చేతుల్లోనూ, 48 శాతం గల్ఫ్లోనూ ఉన్నాయి! ‘దుష్టరాజ్యం’ ఇరాన్, దాని మిత్రుడు రష్యాల నుండి ‘ఆత్మరక్షణ’ కోసం యుద్ధానికి దిగక తప్పదు. అందుకే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు ఐరాస తీర్మానాల గొడవే లేకుండా సిరి యాపై యుద్ధానికి సకల సన్నాహాలు పూర్తి చేశాయి. కాకపోతే ఆశిస్తున్నట్టుగా దీర్ఘకాలిక యుద్ధంలో కూరుకుపోకుండా సిరియా యు ద్ధం నుంచి బయటపడగలమా? రష్యా, చైనా లు ఎలా ప్రతిస్పందిస్తాయి? అని తేల్చుకోలేకనే అమెరికా అధ్యక్షుడు వేచిచూస్తున్నారు. పిళ్లా వెంకటేశ్వరరావు