Gold theft
-
7.5 కిలోల బంగారంతో పరారీ
జగ్గయ్యపేట అర్బన్: హైదరాబాద్ నుంచి విజయవాడలోని షాపునకు బంగారు నగలు డెలివరీ కోసం కారులో నగల వ్యాపారి గుమాస్తాలతో బయలుదేరిన కారు డ్రైవర్ తనకు నిద్ర వస్తుంది టీ తాగుదామని చెప్పి కారు ఆపి టీ తాగుతుండగా, మంచినీటి బాటిల్ కారులో నుంచి తీసుకొస్తానని చెప్పి కారు వద్దకు వెళ్లి బంగారు నగలతో కారులో ఉడాయించిన సంఘటన శనివారం రాత్రి జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని షేర్మహ్మద్పేట క్రాస్ రోడ్డు ఫుడ్ప్లాజా వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్లో సూత్రావ్ బాలకిషన్ ఏడేళ్లుగా బంగారం వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడలోని డీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ ప్రైవేటు లిమిటెడ్ షాపు వారికి 7.5 కిలోల బంగారు నగలు ఆర్డర్ ప్రకారం ఇవ్వడానికి ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటలకు కారులో హిమయత్నగర్ నుంచి బాలకిషన్, గుమస్తా అంబాదాస్ షిండే, డ్రైవర్ జితేష్ అద్వాల్ బయలుదేరారు. కాగా డ్రైవర్ జితేష్ అద్వాల్ తనకు నిద్ర వస్తుందని చెప్పడంతో జగ్గయ్యపేట సమీపంలోని షేర్మహ్మద్పేట క్రాస్ రోడ్ ఫుడ్ ఫ్లాజా వద్ద మధ్యాహ్నం 12.30 సమయంలో కారు ఆపారు. ముగ్గురు టీ తాగుతుండగా మంచినీటి బాటిల్ కారులో ఉంది తీసుకొస్తానని చెప్పి కారు డ్రైవర్ జితేష్ అద్వాల్ కారు దగ్గరకు వెళ్లి కారు స్టార్ట్ చేసి విజయవాడ వైపు ఉడాయించాడు. కారుకు జీపీఎస్ ట్రాక్ ఉండటంతో నందిగామ సమీపంలోని మునగచర్ల వద్ద కారును వదిలేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసి నగల బ్యాగ్తో పరారయ్యాడు. నందిగామ ఏసీపీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేయగా, సంఘటన జగ్గయ్యపేట పట్టణ పరిధిలో జరగడంతో కేసును జగ్గయ్యపేట పట్టణ పోలీస్స్టేషన్కు బదిలీ చేయగా, పట్టణ ఎస్ఐ జి.రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా జగ్గయ్యపేట సీఐ లేకపోవడంతో నందిగామ సీఐ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టి కేసు విచారణ ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
బస్సులో 600 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ
మడకశిర/ హిందూపురం అర్బన్: ిహందూపురం నుంచి మడకశిరకు వస్తున్న ఆర్టీసీ బస్సులో బుధవారం మధ్యాహ్నం 600 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు... మడకశిరకు చెందిన ఆదినారాయణ సతీమణి విజయలక్ష్మి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గత శనివారం హిందూపురంలోని తన కుమార్తె సంధ్య ఇంటికి వెళ్లింది. బుధవారం కుమార్తె ఇంటి నుంచి మడకశిరకు బయలుదేరింది. దాదాపు 600 గ్రాముల బంగారు ఆభరణాలను ఒక బ్యాగులో ఉంచుకుని మధ్యాహ్నం హిందూపురంలోని పరిగి బస్టాండ్లో వచ్చి అక్కడ మడకశిర వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఇంటికి చేరుకున్న బాధితురాలు బంగారు ఆభరణాలున్న బ్యాగు చూసుకోగా ...కనిపించలేదు. మార్గంమధ్యలోనే బంగారు ఆభరణాల బ్యాగు చోరీ గురైనట్లు ఆమె తెలుసుకుంది. కుటుంబీకులతో కలిసి బుధవారం రాత్రి హిందూపురం వన్టౌన్ పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కంజాక్షన్ బాధితురాలికితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పరిగి బస్టాండు వద్ద తన పక్కనే ఇద్దరు మహిళలు కూర్చుని వెంటనే వెళ్లిపోయారని ఫిర్యాదులో బాధితురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు. -
అత్తారింటికే కన్నమేశాడు!
పామిడి: అంగన్వాడీ కార్యకర్త ఇంటిలో చోరీ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. అత్తింటికే మేనల్లుడు కన్నమేశాడు. రూ.లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు, ఏటీఎం కార్డు అపహరించుకెళ్లాడు. వివరాలను మంగళవారం సాయంత్రం పామిడి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య వెల్లడించారు. మంగళవారం ఉదయం పామిడి 44వ జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ యువకుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి యువకుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో గత నెల 17న పామిడిలో నివాసముంటున్న గజరాంపల్లి అంగన్వాడీ కార్యకర్త శైలజ కుమారి ఇంటిలో రూ. లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు, నగదు అపహరించుకెళ్లిన విషయం వెలుగు చూసింది. యువకుడిని గజరాంపల్లికి చెందిన నరిగమ్మగారి రఘునాథరెడ్డిగా గుర్తించారు. శైలజ కుమారికి మేనల్లుడవుతాడు. ఈ నెల 17న శైలజ కుమారి విధుల నిమిత్తం గజరాంపల్లికి చేరుకున్నప్పుడు ద్విచక్ర వాహనంపై పామిడిలోని అత్తింటికి చేరుకుని తలుపు తాళం బద్ధలుగొట్టి బీరువా తెరిచి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేలతో పాటు ఏటీఎం కార్డు అపహరించుకెళ్లాడు. బంగారు ఆభరణాలను పామిడిలో విక్రయించేందుకు వస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్లో చొరవ చూపిన పామిడి సీఐ ఈరన్న, ఎస్ఐ చాంద్బాషా, సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. -
టీనేజర్ భారీ స్కెచ్.. ప్రియుడితో కలిసి సొంత ఇల్లు లూటీ
రాజస్థాన్: దొంగతనాలకు సంబంధించిన నేరాల్లో ముందుగా ఇంటి దొంగల హస్తం ఉంటుందన్నది పోలీసుల నమ్మకం. అయితే రాజస్థాన్లో ఓ చోరీ కేసులోనూ పోలీసులు ఇదే రకంగా అనుమానం వ్యక్తం చేశారు. చివరకు వారి అనుమానమే నిజమైంది. అయితే ఇక్కడ చోరీకి పాల్పడింది ఎవరో తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజస్థాన్లోని పాలి జిల్లాలోని సెంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ. 33 వేల రూపాయల నగదుతో పాటు రూ. 4 లక్షల రూపాయల విలువైన నగలు మాయమయ్యాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని విచారన చేపట్టారు. ఇంట్లో తవ్వి దాచిపెట్టిన బంగారాన్ని తీసుకెళ్లడం ఇతరులకు సాధ్యం కాదు కాబట్టి ఇంట్లో వాళ్లే ఎవరో దీని వెనుక ఉన్నారని అనుమానించిన పోలీసులు ఆ ఇంటి యజమాని చిన్న కూతురు(17) ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. తనకు ఈ దొంగతనానికి కచ్చితంగా సంబంధం ఉందని భావించారు. చివరికి ఆమెను తమదైన శైలిలో విచారించగా జరిగిన విషయం నిందితురాలు బయటపెట్టింది. అదే ఊరిలో తనతో కలిసి చదువుతున్న తన ప్రియుడే ఈ చోరీ చేశాడని తెలిపింది. అయితే దీనికి కూడా ఓ కారణం ఉందని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 17 ఏళ్ల వయసు ఉన్న ఆ అమ్మాయి మరో ఏడాదికి తన మైనారిటీ తీరుతుందని అప్పుడు ప్రియుడిని పెళ్లి చేసుకుంటే ఇబ్బంది ఉండదని ప్లాన్ చేసింది. అందుకే ముందుగానే ఇంట్లో ఉన్న నగలు దోచుకోవాలని ప్రియుడికి సలహా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. -
Medak: ఒకేరోజు ఏడు చోట్ల చోరీలు మరువక ముందే..
సాక్షి, జోగిపేట(మెదక్): జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో అందోలులో ఇంటికి తాళాలు వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే స్థానికులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం ఒకేరోజు ఏడు చోట్ల దొంగతనాలు జరిగిన సంఘటన మరువకముందే శనివారం మరోసారి దొంగలు రెచ్చిపోయారు. రొయ్యలగూడెం కాలనీలో వరుసగా తాళాలు వేసిన ఏడు ఇళ్లు, రెండు కిరాణ దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. ఇళ్లకు వేసిన తాళాలు పగులగొట్టి నగదు, బియ్యం బస్తాలను అపహరించారు. ► రొయ్యల యాదమ్మ ఇంటి తాళం పగులగొట్టి క్వింటాల్ బియ్యం, ఎల్లమ్మ ఇంట్లో నుంచి 50 కిలోల బియ్యం, బంగారం, లచ్చమ్మతో పాటు మరో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ నాలుగు ఇళ్లవారు హైదరాబాద్లో ఉన్న కారణంగా ఇంట్లో ఏఏ వస్తువులు పోయాయో పూర్తి వివరాలు తెలియరాలేదు. ► రాజుకు చెందిన కిరాణా షాప్లో రూ.5వేల నగదు, సిగరెట్ ప్యాకెట్లు, డీవీడీ రాజుకు చెందిన కిరాణా డబ్బా షట్టర్ కట్ చేసి వెళ్లిపోయారు. ► ఈ విషయమై ఎస్ఐ వెంకటేష్ను వివరణ కోరగా రొయ్యల యాదమ్మ, రాజులు మాత్రమే ఫిర్యాదు చేశారన్నారు. సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు. చదవండి: దారుణం: 8 మందిని బలిగొన్న నిర్లక్ష్యం -
పెళ్లికి వస్తారు.. గిఫ్టులు ఎక్కడున్నాయో తెలుసుకుని..
సాక్షి, మైలార్దేవ్పల్లి: బంధువుల వలే వివాహాలకు హాజరై అదును చూసి విలువైన వస్తువులు, నగుదును కాజేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మైలార్దేవ్పల్లి పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. వీరిలో ఆరు సంవత్సరాల బాలిక కూడా ఉంది. మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్ జిల్లాకు చెందిన ప్రశాంత్ (22), శ్రావణ్ (21)తోపాటు ఓ మహిళ, ఆరు సంవత్సరాల బాలికతో నెలరోజుల క్రితం నగరానికి వచ్చారు. కారును అద్దెకు తీసుకోని మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ఫంక్షన్హాల్స్లో జరిగే శుభకార్యాల్లో బంధువుల వలే హాజరయ్యేవారు. ఆయా శుభకార్యాల్లో బంధువులు ఇచ్చిన ఖరీదైన గిప్టులను ఎక్కడ పెట్టారో తెలిపి బాలికను పంపించే వారు. ఆడుకుంటూ వెళ్లి ఆ చిన్నారి వాటిని తీసుకువచ్చి ఆ మహిళకు అందించేది. దొంగలించిన సొత్తుతో నిమిషాల వ్యవధిలో శుభకార్యం నుంచి వెళ్లిపోయే వారు. మైలార్దేవ్పల్లితో పాటు రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇలా మూడు దొంగతనాలకు పాల్పడ్డారు. గతనెల మూడో వారంలో జరిగిన శుభకార్యంలో విందు నిర్వహించిన కుటుంబ సభ్యులు విలువైన వస్తువులతో పాటు నగదును ఓ బ్యాగ్లో వేసి స్టేజిపైనే ఉంచారు. ఈ శుభకార్యంలో పాల్గొన్న చిన్నారి చాకచక్యంగా దానిని తీసుకోని ఉడాయించింది. విందులో ఏర్పాటు చేసిన వీడియో కెమెరాలో చిన్నారి బ్యాగ్ తీసుకువెళ్లిన సంఘటన రికార్డయ్యింది. కుటుంబ సభ్యులు మైలార్దేవ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శంషాబాద్ ఎస్ఓటీ సహాయాన్ని కోరారు. ఆ రోజు ఫంక్షన్హాల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు బయటకు వెళ్లిన వాహనాల పూర్తి వివరాలను సేకరించి బుధవారం నిందితులైన ఇద్దరు యువకులు, మహిళ, చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐ20 కారు, నాలుగు సెల్ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను గురువారం రిమాండ్కు తరలించారు. -
దొంగను పట్టించిన బైక్ పెనాల్టీ
మందమర్రిరూరల్(చెన్నూర్): తోటి ఉద్యోగుల కుటుంబాలతో కలివిడిగా ఉంటూ వారు లేని సమయంలో వారి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగను బైక్ పెనాల్టీ పట్టించింది. పట్టుకుని ముప్పై రెండున్నర తులాల బంగారాన్ని, బైక్ను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో దేవపూర్ ఎస్సై దేవయ్య, కాసిపేట ఎస్సై భాస్కర్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మందమర్రిలోని సర్కిల్ ఇన్సపెక్టర్ కార్యాలమంలో ఏసీపీ బాలుజాదవ్ సమక్షంలో శనివారం మంచిర్యాల డీసీపీ రక్షిత కే మూర్తి వివరించారు. వివరాల ప్రకారం... తూముల శ్రీకాంత్ (29) 2013 నుంచి దేవపూర్లోని సిమెంట్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్గా పనిచేసేవాడు. (ప్రస్తుతం వైజాక్లోని గాజువాకలో పని చేస్తున్నాడు). చదువుకున్న వాడు కావడంతో తోటి పనివారితో, వారి కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండేవాడు. ఈ క్రమంలో ఒక మిత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లిన సమయంలో వారి ఇంట్లోకి చొరబడి 17తులాల, మరోసారీ మరో మిత్రుడు కుటుంబ సభ్యులతో ఊరికి వెళ్లి నప్పుడు వారి ఇంట్లోని పదిహేనున్నర తులాల బంగారాన్ని దొంగిలించాడు. బాధితుల దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసినా శ్రీకాంత్ మీద మాత్రం ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త బడ్డారు. ఈ విషయం ఇలా ఉంటే అదే కంపేనీలో పని చేసే మరో మిత్రుని ద్విచక్ర వాహనం కూడా దొంగిలించి కరీంనగర్ ప్రాంత వాసికి అప్పగించగా ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న వ్వక్తి చేసిన తప్పిదం వలన రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీ ఉద్యోగి ఇంటికి (దేవాపూర్) ఫెనాల్టి రసీదు వచ్చింది. అప్పటికే వరుస దొంగతనాలు జరుగుతున్నందున్న బాధితులతో టచ్లోని ఎస్సై దేవయ్యకు బాధితుడు ఫెనాల్టీ రసీదు చూపించగా దాని లొకేషన్ వివరాలు ఆరా తీసారు. శనివారం సోమగూడం ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా శ్రీకాంత్ అనుమానంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో దొంగతనం గురించి వివరించాడు. ఈ కేసును చేధించిన సీఐ, దేవాపూర్ ఎస్సైలను డీజీపీ అభినందించారు. -
నకిలీ బంగారం ఉచ్చువేసి.. ఆపై చిత్తు
సాక్షి, నెల్లూరు: మాటలునేర్చిన మాయగాళ్లు వారు. అమాయకంగా కన్పించేలా నటిస్తారు. మాటల గారడితో దగ్గరవుతారు. అడవిలో పట్టే కముజు పిట్టలను విక్రయిస్తుంటారు. రోజుకోసారి వచ్చి మంచి అడవి కముజు పిట్ట ఉచ్చులో పడింది ఆ మాంసం తినండి సారూ అంటూ చెబుతారు. ఎదుటి మనిషి మాటలను బట్టి వారిలో అత్యాశ ఉందని గ్రహిస్తారు. వారి దగ్గరవుతున్నట్లు ప్రేమ ఒలకబోస్తూ వారి ఫోన్ నంబర్లు తీసుకుంటారు. వారం తర్వాత సారూ.. రాజుల కాలం నాటి బంగారు నగలు తవ్వకాల్లో దొరికాయని, మాకు ఎలా విక్రయించాలో తెలియదని? అవి సగం ధరకే అమ్మిపెట్టమని మొదట కొంత బంగారం నగలు ఇచ్చి నమ్మిస్తారు. వారి మాటలు నమ్మారో అంతే ఫేక్బంగారం అంటగట్టి రూ.లక్షల్లో దోచుకుంటారు. ఇలాంటి అంతర్జిల్లా కేటుగాళ్లు ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తిరుగుతున్నారు. వారి మాయమాటలు నమ్మి లక్షలు పోగొట్టుకున్న సంఘటనలు ఒక నెలలోనే రెండు వెలుగులోకి వచ్చాయి. మోసం చేసేది ఇలా.. అడవిలో తిరిగే కముజు పిట్టలను పట్టి విక్రయించే ముఠా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తిరుగుతోంది. కొందరు యువకులు కముజు పిట్టలను పట్టి విక్రయిస్తామంటూ ఊరూర తిరుగుతూ వ్యవసాయం చేసుకునే కొందరిని టార్గెట్ చేస్తున్నారు. రోజు వారీగా పిట్టలను పట్టి రైతులకివ్వడం వారిని మంచి చేసుకుంటారు. అలా కొందరు అమాయక వ్యక్తులతో మాటలు కలిపి వారితో స్నేహంగా ఉంటారు. స్నేహం ముసుగులో వారి ఫోన్ నంబర్లు సేకరిస్తారు. రోజువారీగా కముజుపిట్టలను పట్టి పిట్ట మాంసం మంచిదన్న తినండి అంటూ వారిపై ప్రేమ ఒలకపోస్తారు. అలా నమ్మించే ఆ ముఠా సభ్యులు వారం కన్పించకుండాపోయి ఫోన్లోనే టచ్లో ఉంటారు. ఆపై మెల్లిగా పక్కా ప్లాన్తో ఫోన్చేసి కర్ణాటక ప్రాంతంలోని మైసూర్ ఏరియాలో మా స్నేహితుడు జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడని చెబుతారు. పురాతన భవనం తవ్వుతుంటే రాజుల కాలం నాటి బంగారు ఆభరణాలు దొరికాయని నమ్మబలుకుతారు. కానీ ఆ బంగారం విక్రయించాలంటే మాకు ఎవరూ తెలియదని? వాటిని విక్రయించిపెడితే అందులో కొంత కమిషన్ ఇస్తామంటూ చెబుతారు. ముందుగా బంగారు ఆభరణాలు ఉన్నాయని, వచ్చి పరిశీలించుకోమని నమ్మిస్తారు. వారి మాటలను నమ్మిన వెళ్లిన వారికి ఫేక్ బంగారం నగలు చూపించి అందులో నాలుగుచోట్ల స్వచ్ఛ బంగారం పూసలు పెట్టి వారి ముందే ఆ పూసలు కట్చేసి పరిశీలించుకోమని నమ్మబలుకుతారు. ఆ బంగారు పూసలు తీసుకెళ్లి షాపులో చూపిస్తే మేలిమి బంగారమేనని తేలుతుంది. అంతే సగం ధరకే మేలిమి బంగారు ఆభరణాలు వస్తాయని నమ్మి కేటుగాళ్లకు డబ్బు కట్టి తీసుకుంటారు. ఆపై ఆ ముఠా సభ్యుల ఫోన్ నంబర్ మూగబోతుంది. నగలు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ పరిశీలించుకుంటే అది ఫేక్ బంగారం తెలిసిపోయి బాధితులు లబోదిబోమంటున్నారు. నెలలో రెండు సంఘటనలు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను టార్గెట్ చేసిన ఆ ముఠా సభ్యులు ఒక నెల వ్యవధిలోనే రెండు జిల్లాలో బురిడీ కొట్టించి రూ.లక్షలు దోచుకున్నారు. గత నెలలో సంగం మండల కేంద్రంలో ఇదే తరహాలో నకిలీ బంగారం అంటగట్టి రూ.లక్షలు కొట్టేసిన ఇద్దరు సభ్యులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సంగంలో కేబుల్ యజమానిని ఇదే తరహాలో బురిడీ కొట్టించి మోసం చేసి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన సింగరాయకొండ వాసులకు కూడా మరో ముగ్గురు సభ్యులు బురిడీకొట్టి నకిలీ బంగారం అంటగట్టి దాదాపు రూ.18 లక్షల నగదుతో ఉడాయించారు. అయితే నకిలీ బంగారం లావాదేవీలు కావలి కేంద్రంగా జరగడంతో బాధితులు కావలి పోలీసులను ఆశ్రయించారు. రాయచోటి వాసులుగా గుర్తింపు నకిలీ బంగారం ఉచ్చువేసి సొమ్ము చేసుకునే ముఠా సభ్యులు రాయచోటి ప్రాంత వాసులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ ముఠా విడిపోయి జిల్లాలవారీగా తిరుగుతూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. వారి నకిలీ బంగారం ఉచ్చులో చిక్కుకున్న చాలామంది బయటకు పొక్కితే పరువుపోతుందని చెప్పుకోలేక పోతున్నారు. తాజాగా ఈ రెండు సంఘటనలతో పోలీసులు ఇలాంటి వారి పట్ల జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు. -
నకిలీ పోలీసుల హల్చల్
సాక్షి, టెక్కలి రూరల్: నియోజకవర్గ కేంద్రం టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి కొడ్రవీధి జంక్షన్ వద్ద ఆదివారం పట్టపగలే నడిరోడ్డుపై వృద్ధురాలి వద్ద పోలీసుల పేరుతో(నకిలీ పోలీసులు) ఇద్దరు వ్యక్తులు బంగారాన్ని తరస్కరించారు. సీనీ ఫక్కీలో జరిగిన ఈ చోరీపై వృద్ధురాలు దండా హేమలత తెలిపిన వివరాల ప్రకారం.. హేమలత టెక్కలి మెయిన్ రోడ్డులో నివాసముంటుంది. బంధువుల ఇంటికి కొడ్రవీధి నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ముందు ఆగారు. తాము పోలీసులమంటూ వారి దగ్గరున్న డమ్మీ ఐడీ కార్డు చూపించారు. మెడలో అంత బంగారం వేసుకోని తిరగవద్దని, ఈ ప్రాంతంలో దొంగలు ఉన్నారని చెప్పారు. బంగారమంతా తీసి ఆమెతో తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టుకోమని చెప్పారు. ఆమె అనుమానంగా చూడటంతో వీధిలోంచి మరో వ్యక్తి వచ్చాడు. అతనికి కూడా అలాగే చెప్పారు. అతను తన చైన్, బంగార వస్తులు, డబ్బులు బ్యాగ్లో పెట్టుకోని వెళ్లిపోయాడు. అతనిని అనుసరిస్తూ ఆమె కూడా అదేవిధంగా తాళిబొట్టు, చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసి బ్యాగ్లో పెట్టింది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బంగారం అంతా భద్రంగా ఉందో, లేదో చూస్తానని బ్యాగ్ అడిగాడు. వస్తువులన్నీ సరిగానే ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి ఆమెను పంపించేశారు. ఇంటికి వెళ్లి తాళి, గాజు లు వేసుకోడానికి బ్యాగ్ చూసేసరికి అందులో ఆ వస్తువులు కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై టెక్కలి సీఐ నీలయ్య బాధితురాలు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతి గాజులు, తాళిబొట్టు కలిపి సుమారు 5 తులాలు ఉంటాయని బాధితురాలు రోదిస్తోంది. సీఐ నీలయ్య, ఎస్ఐ గణేష్లు ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల వద్ద వివరాలు సేకరించారు. బాధితురాలు హేమలత, భర్త శ్రీరామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోచోట విఫలయత్నం.. పై ఘటన జరగక ముందు గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు స్థానిక సంతోషిమాత గుడి సమీపంలో భవానీనగర్కు చెందిన విజయలక్ష్మి అనే మహిళను కూడా ఇలాగే నమ్మబలికారని పోలీసులు తెలిపారు. ఇక్కడ దొంగలు ఉన్నారని చెప్పారు. బంగారం తీసి దాచుకోవాలని సూచించడంతో ఆమె బంగారం అంతా తీసి తన చీరలో కట్టివేసింది. దీంతో చేసేది ఏమి లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొంత సమయానికే వృద్ధురాలి వద్ద బంగారం అపహరించారు. -
బంగారు షాపులో భారీ చోరీ
పిట్లం (జుక్కల్): పిట్లం మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. బస్టాండ్ ప్రాంతంలో గల లక్ష్మీ ప్రసన్న బంగారు దుకాణంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి, సుమారు రూ.30 లక్షలకు పైగా విలువైన సొత్తును దోచుకెళ్లారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే రహదారి సమీపంలో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. పిట్లం గ్రామానికి చెందిన అవుసుల సుదర్శన్ చారి తన ఇద్దరు కుమారులతో కలిసి రెండేళ్లుగా బస్టాండ్ ఎదుట లక్ష్మీప్రసన్న జువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి వెళ్లారు. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో దుకాణం పక్కనే చాయ్ హోటల్ నిర్వహిస్తున్న రసూల్ తన హోటల్ వెనుక భాగం కిటికి తెరిచి ఉండటంతో పాటు బంగారు దుకాణానికి కన్నం వేసినట్లు గమనించి సుదర్శన్ కుమారుడు సంతోష్కు సమాచారమిచ్చాడు. హుటాహుటిన సంతోష్ షాప్కు వచ్చి షెట్టర్ తెరిచి చూడగా, లోపల సామగ్రి చిందరవందరగా కనిపించాయి. షాప్లోని బంగారు, వెండి ఆభరణాలు మాయమవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దొంగతనం జరిగిన ప్రాంతాన్ని అడిషనల్ ఎస్పీ అన్యోన్య, బాన్సువాడ డీఎస్పీ యాదగిరి, బాన్సువాడ రూరల్ సీఐ టాటాబాబు, బిచ్కుంద సీఐ నవీన్, ఎస్సైలు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్టీం, డాగ్స్క్వాడ్ను పిలిపించి ఆధారాలు సేకరించారు. దొంగతనం చేయడంలో నైపుణ్యం ఉన్న వారే ఈ పని చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో దొంగతనం జరగడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షాప్లో ఉంచిన 433 గ్రాముల బంగారం, సుమారు 45 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ అన్యోన్య వెల్లడించారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ కేసును సవాల్గా తీసుకుంటున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే నైపుణ్యం ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చన్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ మస్తాన్ అలీ, పిట్లం, నిజాంసాగర్, పెద్దకొడప్గల్, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ ఎస్సైలు సుధాకర్, సాయన్న, నవీన్కుమార్, అభిలాష్, కృష్ణ, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. -
భారత సంతతి ఇళ్లే టార్గెట్
లండన్: బ్రిటన్లో బంగారం దొంగలు అత్యధికంగా భారత సంతతి ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు శనివారం ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. గత ఐదేళ్లలో రూ. 1,280 కోట్ల విలువైన బంగారం బ్రిటన్లో చోరికి గురైందనీ, అందులో అత్యధికం భారత సంతతి ప్రజలదేనని బీబీసీ పరిశోధనలో తేలింది. 2013 నుంచి చూస్తే 28 వేల బంగారం దొంగతనాలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రేటర్ లండన్లో రూ. 1,050 కోట్ల విలువైన బంగారం దొంగతనానికి గురయ్యింది. ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా బంగారం ఎంతున్నా దొంగలు కొట్టేస్తున్నారనీ, బంగారాన్ని చాలా తక్కువ సమయంలో, చాలా సులువుగా నగదుగా మార్చుకునే అవకాశం ఉండటం ఇందుకు ఓ కారణమని పోలీసులు భావిస్తున్నారు. చెషైర్ పోలీస్ దళంలో నేరాల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆరోన్ దుగ్గన్ అనే అధికారి మాట్లాడుతూ ‘సెకండ్ హ్యాండ్ నగలు కొనే వ్యాపారులు అమ్ముతున్న వ్యక్తి ఎవరు? ఆ నగలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? అని తెలుసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. ఈ దేశంలో బంగారం తునక ముక్కలు అమ్మడం కన్నా సెకండ్ హ్యాండ్ నగలు అమ్మడమే సులభం’ అని తెలిపారు. దసరా, దీపావళి సమయాల్లోనే ఎక్కువ దీపావళి, దసరా తదితర భారత ప్రధాన పండుగల సమయంలో ప్రజలు బంగారం ఎక్కువగా ధరించి ఆలయాలు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తారనీ, ఆ పండుగల సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని లండన్ పోలీసులు అంటున్నారు. ప్రతీ ఏడాది ఈ పండుగల సమయంలో తాము హెచ్చరికలు కూడా చేస్తామన్నారు. 2017–18లో లండన్లోనే 3,300 దొంగతనాలు జరిగాయి. రూ. 193 కోట్ల విలువైన బంగారం చోరీకి గురయ్యింది. పశ్చిమ లండన్లోని సౌథాల్లో ఆసియా స్టైల్ బంగారం నగలు అమ్మే సంజయ్ కుమార్ మాట్లాడుతూ బంగా>రం ఆభరణాలకు సంప్రదాయాల పరంగా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవాలనీ, బీమా కూడా చేయించుకోవాలని తానెప్పుడూ తన దగ్గర బంగారం కొనేవారికి చెబుతుంటానని ఆయన తెలిపారు. ‘బంగారం కొనడమంటే పెట్టుబడి పెట్టడమనీ, అది అదృష్టాన్ని కూడా తెస్తుందని పిల్లలకు వారి తల్లిదండ్రులు చెబుతారు. ఆసియా ప్రజలు ఇదే చేస్తారు. వాళ్లు ఇక్కడకొచ్చినా ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు’ అని సంజయ్ కుమార్ వివరించారు. బంగారు ఆభరణాలు కేవలం విలువైనవేగాక, వాటి యజమానులకు వాటితో ప్రత్యేక అనుబంధం ఉంటుందనీ, అవి పోయినప్పుడు యజమానుల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని లండన్ పోలీసు విభాగంలో డిటెక్టివ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న లీసా కీలే చెప్పారు. తమ చర్యల కారణంగా ఈ దొంగతనాలు కొంచెం తగ్గాయనీ, అయినా చేయాల్సింది ఇంకెంతో ఉందని ఆమె తెలిపారు. బంగారం దొంగలను పట్టుకోడానికి, దొంగతనాల సంఖ్యను తగ్గించడానికి లండన్ పోలీసులు ప్రత్యేకంగా ‘ఆపరేషన్ నగ్గెట్’ పేరిట ఓ∙కార్యక్రమాన్ని సైతం ఆచరణలోకి తెచ్చారు. -
చెన్నైలో చోరీచేసి రైలులో పరార్
సాక్షి,విజయవాడ: చెన్నైలోని ఒక బంగారం వ్యాపారి ఇంట్లో రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను చోరీ చేసి పరారవుతున్న ఇద్దరు దొంగలను విజయవాడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారం, వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన హంసరాజ్ సింగ్ (27), హరీంద్రసింగ్ (26) చెన్నైలో చోరీ చేసి రైలులో విజయవాడ వైపు పారిపోతున్నారని చెన్నై జాయింట్ కమిషనర్ నుంచి రైల్వే సీనియర్ డీఎస్పీ ఎస్ఆర్గాంధీకి మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. దొంగల ఫోన్ను ట్రాకింగ్ చేయడం ద్వారా చెన్నై నుంచి వచ్చే మూడు రైళ్లలో దొంగలు వచ్చే అవకాశం ఉందని భావించారు. గూడూరులోని రైల్వే పోలీసులు తనిఖీలు చేసి 2 రైళ్లలో దొంగలు లేరని నిర్ధరించుకున్నారు. సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ (12651)లో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్నారు. రంగంలోకి విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు చెన్నై బయలుదేరితే విజయవాడ వరకు ఆగదు. విజయవాడలో దొంగలు తప్పించుకునే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి రైలు తెనాలిలో కొన్ని క్షణాలు ఆపించి రైల్వే ఆర్పీఎఫ్ స్పెషల్ టీమ్ను రైలులోకి ఎక్కించారు. వీరు మూడు బృందాలుగా విడిపోయి ప్రతిబోగీని తనిఖీ చేశారు. చివరికి దొంగలను గుర్తించి రైలు విజయవాడకు చేరగానే అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5 కోట్ల విలువైన 13.5 కేజీల బంగారం, 67 కేజీల వెండి, 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి చెన్నై పోలీసులకు అప్పగించారు. దేశ రైల్వే చరిత్రలోనే అతి పెద్ద రికవరీల్లో ఇది ఒకటని అధికారులు చెబుతున్నారు. -
సర్ఫ్ ప్యాకెట్లు అమ్మేవాళ్లమంటూ..
పార్వతీపురం : మత్తుమందు చల్లి మహిళ మెడలోని బంగారు ఆభరణాలు దోచుకున్న సంఘటన పార్వతీపురం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని ముత్తావారివీధికి చెందిన ఓ మహిళ ఇంటికి కొంతమంది వ్యక్తులు సర్ఫ్ అమ్మే వ్యక్తులుగా వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలు భోగి విజయలక్ష్మి తెలియజేసిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు బంగారం, వెండి, ఇత్తడి, తదితర వస్తువులకు మెరుగు పెట్టే సర్ఫ్ ఉందని చెప్పారు. దీంతో బాధితురాలు వారిని ఇంటిలోకి రమ్మంది. ఇంతలో తమకు దాహం వేస్తుందని మంచినీరు కావాలని అపరిచిత వ్యక్తులు మహిళను కోరారు. ఇంటిలో నుంచి మంచినీరు తెచ్చేలోపు ఆమె వెనుకాల వెళ్లి ముక్కు వద్ద మత్తు మందు పెట్టి 3 తులాల బంగారం పుస్తులతాడు, 3 తులాల బంగారం చైన్, 2 తులాల బంగారం గాజులను తీసుకొని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత మత్తు నుంచి బయటపడిన బాధితురాలు లబోదిబోమంటూ విషయాన్ని తన భర్త చక్రధర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. ఆయన సూచన మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
చిదంబరం ఇంట్లో భారీ చోరీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ కేసులో ఇద్దరు పనిమనుషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దొంగతనం జరిగిందని తొలుత చేసిన ఫిర్యాదును చిదంబరం భార్య నళిని చిదంబరం ఆదివారం రాత్రి వెనక్కి తీసుకోవడం గమనార్హం. తమ నివాసంలో ఎలాంటి దొంగతనం జరగలేదన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం...చెన్నై నుంగంబాక్కం ఫైవ్క్రాఫ్ట్స్ రోడ్డులోని ఇంట్లో చిదంబరం, భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధి నివసిస్తున్నారు. ఓ కార్యక్రమానికి వెళ్లడానికి ముందు నగలు అలంకరించుకునేందుకు నళిని శనివారం తన గదిలోని బీరువా తెరచిచూడగా అందులో పెట్టిన పురాతన మరకతాలు, బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా, వారు ఇంటి ప్రాంగణంలో అమర్చిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుమారు నెల క్రితం ఇద్దరు మహిళలు ముఖాలకు ముసుగేసుకుని నళిని గదిలోకి వెళ్లడం, కొద్దిసేపటి తరువాత ఒక సంచితో బయటకు వచ్చిన దృశ్యాలు అందులో నమోదయ్యాయి. వాటిలోని వ్యక్తుల రూపురేఖల ఆధారంగా, చిదంబరం ఇంట్లో పనిచేస్తున్న వెన్నెల, విజిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఉద్యోగం దొరకలేదని చోరీ
సాక్షి,అన్నానగర్ : ఉద్యోగం దొరకలేదని విరక్తితో ఎంబీఏ పట్టభద్రుడు 12 సవర్ల నగలను చోరీ చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై తిరువికనగర్ ప్రభు వీధికి చెందిన అరివళగన్. ఇతను కుటుంబంతో మంగళవారం బయటికి వెళ్లి ఇంటికి వచ్చాడు. అప్పుడు తలుపులు తెరచి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 12 సవర్ల నగలు చోరీ అయినట్టు తెలిసింది. అరివళగన్ తిరువికనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సహాయ కమిషనర్ హరికుమార్ ఆధ్వర్యంలో సీఐ రమణి, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశారు. అప్పుడు బీరువాలో ఉన్న రూ. 70వేలు నగదు చోరీకి గురికాలేదు. దీంతో అరివళగన్కి తెలిసిన వారు ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. బాడుగకు ఉన్నవారి వద్ద పోలీసులు విచారణ చేశారు. అప్పుడు తూత్తుకుడి జిల్లా ఉడన్కుడికి చెందిన ఇళమదిని పోలీసులు విచారణ చేశారు. విచారణలో అతను నగలు చోరీ చేసినట్లు నేరం అంగీకరించాడు. పోలీసుల విచారణలో ఇళమది ఎంబీఏ చదివి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఇతను అరిశలగన్ ఇంట్లో మూడు నెలల ముందు బాడుగకు చేరాడు. అరివళగన్ లగ్జరీ జీవితం చూసిన ఇళమది అతని ఇంట్లో చోరీ చేయాలని పథకం వేశాడు. దీని ప్రకారం మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగలను చోరీ చేసిన ఇళమది వాటిని తన భార్యకు ఇచ్చాడు. భార్య మందలిచ్చి తీసిన స్థలంలో నగలను పెట్టాలని బుద్ధి చెప్పింది. నగలను బీరువాలో పెట్టడానికి ఇళమది వెళ్లేలోపు అరివళగన్ వచ్చాడు. దీంతో నగలను ఓ బంధువు వద్ద ఇచ్చి ఇళమది ఇంటికి వచ్చాడు. ఫిర్యాదు ఇచ్చిన ఆరుగంటల సమయంలోనే ఇళమదిని అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
అక్రమార్జనలో రారాజు
సాక్షి, విశాఖ క్రైం : మున్సిపాలిటీలో వెలుగులు నింపాల్సిన ఆ అధికారి అవినీతి మురుగులో పీకల్లోతున కూరుకుపోయాడు. ఉద్యోగంలో చేరింది మొదలు... అందినకాడికి వెనకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగడంతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టేశాడు. ఎట్టకేలకు పాపం పండడంతో అక్రమార్జనలో రారాజుగా వెలుగొందిన శ్రీకాకుళం మున్సిపాలిటీ డీఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజుతోపాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకకాలంలో సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు వెనకేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర వెల్లడించారు. బంగారమే బంగారం శ్రీనివాసరాజు ఇంటిలో సోదాల సమయంలో 423.3గ్రాముల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు అక్కయ్యపాలెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని లాకర్లో భార్య పేరు మీద 151.78గ్రాములు బంగారు వస్తువులు, డాబాగార్డెన్స్లో గల బ్యాంకు ఆఫ్ ఇండియాలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద లాకర్లో 221.970 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 795 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు గుర్తించారు. 1548 గ్రాముల వెంటి వస్తువులు లభ్యమయ్యాయి. అదేవిధంగా నగదు రూ.12 లక్షల 27వేలు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.5లక్షల 45 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం ధర ప్రకారం రూ.1.64కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ మాత్రం రూ.30 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. గుర్తించిన అక్రమాస్తులివీ... విశాఖ నగర పరిధిలోని సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్స్న్ దరి పాపాహోం సమీపంలో గల ఆర్.ఆర్.రెసిడెన్సీలోని ప్లాట్ నెంబర్ 302లో శ్రీనివాసరాజు నివాసముంటున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోవలి గ్రామంలో ఎక్కువగా శ్రీనివాసరాజు భూమి కొనుగోలు చేశారు. తొలిసారిగా ఈ గ్రామంలో 6.82 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అదే గ్రామంలో 7.2 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తల్లి జి.స్వరాజ్యం పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 417/1, 418/1లో 3.19 ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో తండ్రి జి.కృష్ణంరాజు పేరు మీద సర్వే నెంబర్ 417/2, 449/2లలో వ్యవసాయ భూమి 2.69 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాస రాజు మామయ్య వి.నారాయణరాజు పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 416/1లో 2.49ఎకరాల వ్యవసాయ భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో సర్వే నెంబర్ 416/52, 416/3, 417 – 1,418 లో 4.71 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాసరాజు అత్తమ్మ వి.వరలక్ష్మి పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 887/1, 887/2లో 3.6ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నర్శింహపురం గ్రామంలో భార్య పేరిట సర్వే నెంబర్ 75/2లో 697.44 గజాల స్థలం. అదే గ్రామంలోని సర్వే నెంబర్ 75/2లో ఖాళీ స్ధలం 7.20 ఎకరాలను కుమార్తె జి.మౌనిక పేరు మీద కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరాం గ్రామంలో భార్య రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 487/1, 487/2, 487/2బిలలో 697.44 గజాల స్థలం. విశాఖ జిల్లా అడవివరం గ్రామంలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 275 / 30 – ఎలో 183 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. అలాగే శ్రీనివాస రాజు రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సర్వీసులో 25 ఏళ్లకుపైగా జీవీఎంసీలోనే అవినీతి ఊబిలో కూరుకుపోయిన శ్రీనివాసరాజు తన సర్వీసులో ఎక్కువ కాలంలో జీవీఎంసీలోనే తిష్ట వేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ మళ్లీ వెంటనే వెనక్కు వచ్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని వెంప గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు జీవీఎంసీలో 1988లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. అనంతరం 2000వ సంవత్సరంలో ఏఈగా ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి 2012 వరకు జీవీఎంసీలో ఏఈగా పనిచేశారు. 2012లో బొబ్బిలి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. అక్కడ 18 నెలలు పని చేసి మళ్లీ ఏఈగా జీవీఎంసీకి బదిలీపై వచ్చారు. అనంతరం 2017లో ఉద్యోగోన్నతి రావడంతో శ్రీకాకుళం మున్సిపాలిటీకి డీఈఈగా వెళ్లారు. అయితే జీవీఎంసీలో పనిచేసిన కాలంలో కొందరు అధికారులతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఓ ప్రజాప్రతినిధితో కలిసి బినామీల పేరున భారీగా పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బినామీల గుట్టు విప్పేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : అంతర్ జిల్లా దొంగ రాపాక గిరిబాబు అలియాస్ గిరి ప్రసాద్ అలియాస్ యాదగిరిని సీసీఎస్, టౌన్, తొర్రూరు పోలీసులు అరెస్ట్ చేసి, దొంగిలించిన 30 తులాల బంగా రం, కేజీ 30 గ్రాముల వెండి ఆభరణాలు, ఆటో, రూ.80వేల నగదు (మొత్తం సొత్తు విలువ రూ. 10.50 లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మంగళవారం సాయంత్రం అరెస్ట్ వివరాలు వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఎలా చేధించగలిగారో ప్రొజెక్టర్ ద్వారా చూపించి వివరించారు. మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో పగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి పూట వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను సీసీ కెమెరాల్లో రికార్డయిన ఛాయా చిత్రాల ద్వారా గుర్తిం చామన్నారు. దీంతో మహబూబాబాద్ టౌన్ సీఐ షేక్ అబ్దుల్ జబ్బార్, సీసీఎస్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు అంతర్ జిల్లా దొంగ అయిన రాపాక గిరిబాబును తొర్రూరు నుంచి మహబూబాబాద్కు వస్తుండగా మూడుకోట్ల సెంటర్ వద్ద పట్టుకున్నారని తెలిపారు. మానుకోటలోని తొర్రూరు రోడ్లో గల వాటర్ట్యాంక్ వద్ద ఉంటూ పండ్ల వ్యాపారం చేసే రాపాక గిరిబాబును పోలీసులు విచారించగా మహబూబాబాద్, తొర్రూరు, ఖమ్మం, పాల్వంచ ప్రాం తాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడన్నా రు. చోరీ ద్వారా సంపాదించిన బంగారు వస్తువులను దాచిపెట్టి వాటిని మహబూబాబాద్ పట్టణంలో రహస్యంగా అమ్మాలని వచ్చినట్లు, తాను చేసి న నేరాలన్నింటినీ అంగీకరించాడని తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై.. రాపాక గిరిబాబు 5వ తరగతి వరకు చదువుకుని ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. వచ్చిన డబ్బులు సరిపోక చెడు అలావాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని దొంగతనాన్ని వృత్తిగా చేసుకున్నాడు. మొదటగా నాలుగేళ్ల క్రితం ఖమ్మంలో ఆటో దొంగతనం కేసులో అరెస్టై జైలు జీవితం గడిపాడు. ఆ తరువాత కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మళ్లీ కొద్దిరోజులకు రెండోసారి పాల్వంచలో ఆటో దొంగతనానికి పాల్పడి అరెస్ట్ అయ్యాడు. అనంతరం జైలు నుంచి విడుదలై మహబూబాబాద్ గిరిబాబు అత్తగారి ఊరు కావడంతో ఇక్కడే ఉంటూ మధ్యాహ్నం పళ్ల వ్యాపారం చేస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. మానుకోటలో 7,తొర్రూరులో 3 దొంగతనాలు.. సుమారు 6 నెలల క్రితం మహబూబాబాద్లోని వెంకటేశ్వర బజార్లో ఓ ఇంటి ముందు తాళం వేసి ఉన్న ఆటోను దొంగిలించాడు. తరువాత సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గిరిబాబు దొంగతనం చేయడానికి అనుకూలమైన పనిముట్లను జనగామ నుంచి తయారు చేయించుకున్నాడు. దీంతో మహబూబాబాద్లోని కృష్ణకాలనీ, సిద్ధార్థనగర్, వెంకటేశ్వరబజార్, కంకరబోడ్ ప్రాంతాల్లో మొత్తం 7 దొంగతనాలు చేశాడు. అనంతరం తొర్రూరు పట్టణంలో మూడు దొంగతనాలు చేశాడు.అధికారులు, సిబ్బందికి ఎస్పీ అభినందనలు..అంతర్ జిల్లా నేరస్తుడు రాపాక గిరిబాబును చాకచక్యంగా పట్టుకుని అతని వద్ద నుంచి సొత్తు ను రికవరీ చేసిన మహబూబాబాద్ టౌన్ ఎస్హెచ్ఓ ఎస్.ఏ జబ్బార్, తొర్రూరు సీఐ వి.చేరాలు, సీసీఎస్ ఎస్సై జి.స్వామిదాస్, సీసీఎస్ ఏఎస్సై పి.వెంకటరమణ, పీసీ సీహెచ్ వేణుగోపాల్, అలాగే నేరస్తుడిని సీసీ కెమెరాల ద్వా రా గుర్తించిన ఐటీకోర్ సీఐ శ్యాంసుందర్, పీసీ లు నాగరాజు, సంతోష్కుమార్ను ఎస్పీ నంద్యా ల కోటిరెడ్డి అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, మహబూబాబాద్, తొర్రూరు డీఎస్పీలు నరేష్కుమార్, రాజారత్నం, సీఐలు జబ్బార్, చేరాలు, సీసీఎస్ ఎస్సై జి.స్వామిదాస్, ఏఎస్సై పి.వెంకటరమణ, ఐటీకోర్ సీఐ శ్యాంసుందర్, టౌన్, ట్రాఫిక్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, అరుణ్కుమార్, రమేష్బాబు, అశోక్, పీసీలు వేణుగోపా ల్, నాగరాజు, సంతోష్కుమార్ పాల్గొన్నారు. -
ఐదుగురు బైక్ దొంగల అరెస్టు
సాక్షి, గుటూరు : విలాసాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి బైకుల మీద తిరుగుతూ దోపిడీలకు పాల్పడే ఐదుగురి యువకులను తెనాలి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బులు జల్సాలకు సరిపడవని చోరీలకు పాల్పతుండేవారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని వారిని బెదిరిస్తూ వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్ఫోన్లు లాక్కెళ్తుంటారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి మూడు బైకులు, ఒక బంగారు గొలుసు, నాలుగు సెల్పోన్లు స్వాధినం చేసుకునట్లు పోలీసులు తెలిపారు. -
ఏసీబీ గాలానికి చిక్కిన ఇంజనీర్..
సాక్షి, గుంటూరు : పట్టణంలో మరో అవినీతి అధికారి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు ఏసీబీ అధికారులు. ఏఓగా పనిచేస్తున్న మధవరావు అక్రమాస్తుల చిట్టా ఒక్కక్కటిగా విప్పారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ఇతనికి ఇరవై విలువైన ఇళ్ల స్థలాలు, నాలుగు నివాస గృహాలకు సంబంధించిన రికార్డులను గుర్తించారు. అంతేకాక ఏడు లక్షల రుపాయల నగదు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపు ఆరు కోట్ల రుపాయలు. ఏకకాలంలో ఇతని బంధువుల ఇంటిపై కూడా అధికారులు దాడి చేశారు. పొన్నూరు మండలం మాచవరంలో ఇతని బినామీ చిట్టిబాబు ఇంట్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. -
మానుకోటలో దొంగల బీభత్సం
మహబూబాబాద్ రూరల్ : చోరీ జరిగి 45.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.47వేల నగదు అపహరణకు గురైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు వేర్వేరు చోట్ల చోట్ల జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన జడల లక్ష్మిరేణుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కళాసీబస్తీ ఎంపీపీఎస్లో క్లర్క్గా పని చేస్తుంది. ఆమె సోదరుడు రిటైర్డ్ ఎస్సై బొగ్గుల సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించడంతో పరామర్శించడానికి గురువారం సాయంత్రం వరంగల్కు వెళ్లింది. ఆ రోజు రాత్రి ఆమె అక్కడే బస చేసింది. శుక్రవారం ఉదయం తిరిగి మానుకోటకు చేరుకుని గేట్ తీసే సరికి ఇంటికి వేసిన తాళం లేకుండా తలుపులు తెరిసి ఉండడం చూసింది. ఇంటి లోపలికి వెళ్లి చూసేసరికి రెండు బీరువాల్లోని దుస్తులు, ఇతర సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దొంగలు బీరువాల తలుపులు పగులకొట్టి 45.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.7 వేల నగదును దోసుకెళ్లినట్లు గ్రహించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్, టౌన్ సీఐ జబ్బార్, ఎస్సైలు అరుణ్కుమార్, రమేష్బాబు, సీసీఎస్ సీఐ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ తిరుపతి, ఐటీ కోర్ సీఐ శ్యాంసుందర్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్టీం బృందాలు డాగ్ స్క్వాడ్తో ఇంటి పరిసరాలను తనిఖీ చేశారు. అనంతరం బాధితులరాలు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ క్యాంప్ కార్యాలయం, టౌన్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. కిరాణ షాపులో రూ.40 వేల అపహరణ.. జిల్లా కేంద్రంలోని ఇల్లందు రోడ్డులోని కర్లపాటి నారాయణమూర్తికి చెందిన కిరాణ షాపులో చోరీ జరగగా రూ.40 వేలు అపహరణకు గురయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము 3 నుంచి 4 గంటల మధ్యలో ఓ యువకుడు బండరాయితో దుకాణం తలుపు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు సీసీ పుటేజ్లో రికార్డు అయింది. బాధితుడు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
4 కిలోల బంగారం దొంగ అరెస్టు
సాక్షి, నిజామాబాద్ క్రైం(నిజామాబాద్అర్బన్): వారం రోజుల క్రితం నాలుగు కిలోల బంగారంతో ఉడాయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 3.05 కిలోల బంగారం, 6 డైమండ్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్బెంగాల్ హుగ్లీ జిల్లా కుల్లత్ గ్రామానికి చెందిన భూపాల్ మన్నా ఆర్మూర్లో స్థిరపడ్డాడు. బంగారు అభరణాలు తయారు చేస్తూ, నమ్మకంగా ఉండడంతో బంగారు వ్యాపారులు కిలోల కొద్ది బంగారం ఇచ్చి అభరణాలు చేయించుకునే వారు. ఇలా ఆర్మూర్, నందిపేట్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన బంగారు వ్యాపారులు కలిసి నాలుగు కిలోల బంగారాన్ని ఇచ్చారు. పెద్ద మొత్తంలో బంగారం అతని వద్ద ఉండటంతో భూపాల్కు దురాలోచన కలిగింది. దీంతో నాలుగు రోజుల క్రితం బంగారంతో ఉడాయించాడు. అయితే, ఆభరణాలు చేయాలని బంగారం ఇచ్చిన జక్రాన్పల్లి మండలం మునిపల్లికి చెందిన వ్యాపారి ఆరే శివకుమార్ ఈ నెల 23న వెళ్లగా షాప్ మూసి ఉంది. మిగతా వ్యాపారులు కూడా అక్కడకు చేరుకోవడంతో భూపాల్ ఉడాయించినట్లు తేలింది. శివకుమార్ ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ పర్యవేక్షణలో టౌన్ సీఐ సీతారాం, ఎస్సై గోపీ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ మల్లేశ్ నాగ్పూర్ వెళ్లారు. నిందితుడు కటక్ వెళ్లినట్లు గుర్తించి అతడ్ని పట్టుకున్నారు. పోలీసుల ఎదుట తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇతడ్ని అరెస్టు చేసే ముందు ఆర్మూర్ పోలీసులు కటక్ మేజిస్ట్రేట్ ఎదుట శుక్రవారం హాజరు పరిచారు. అనంతరం అరెస్టు చేసి శనివారం ఆర్మూర్కు తీసుకువచ్చారు. నిందితుడి నుంచి 3.05 కిలో బంగారు అభరణాలు, 6 డైమండ్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
మహిళ దారుణ హత్య
బషీరాబాద్(తాండూరు) : కట్టుకున్నవాడు కాలం చేయడంతో పదిహేనేళ్లుగా ఒంటరిగా నివసిస్తున్న ఓ ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. హత్యకు ఒక రోజు ముందు బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైన ఆమె.. అక్కా, చెళ్లెళ్లు బంధుమిత్రులతో సరదాగా గడిపారు. మర్నాడు సొంతూరికి రాగా.. అదే రోజు రాత్రి హత్యకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటన బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని జీవన్గీ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలంలో సంచలనం సృస్టించిన ఈ హత్యకు సంబంధించి తాండూరు గ్రామీణ సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీవన్గీ గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మీ(35)కి 2000 సంవత్సరంలో యాలాల మండలం కిష్టపూర్ గ్రామానికి చెందిన బీరప్పతో వివాహం జరిగింది. అయితే అన్నదమ్ముల గొడవలో 2004లో బీరప్ప హత్యకు గురయ్యాడు. దీంతో లక్ష్మీ కొడుకు మహేష్తో కలిసి పుట్టింటికి వచ్చింది. జీవన్గీ గ్రామంలోని బర్కాల్ కాలనీలో ఓ చిన్న ఇంట్లో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. కొడుకు మహేష్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే రెండు రోజుల కిందట కొడంగల్ మండలం రేగడి మైలారం గ్రామంలో జరిగిన బంధువుల శుభకార్యానికి కొడుకుతో కలిసి వెళ్లింది. బంధువులు, అక్కాచెల్లెళ్లతో సరదాగా గడిపింది. తిరిగి ఈ నెల 25న(బుధవారం)కొడుకును బంధువుల దగ్గర పెట్టి జీవన్గీకి ఒంటరిగా వచ్చింది. అయితే తెల్లవారి చూసేసరికి లక్ష్మీ శవమై కనిపించింది. తల వెనుక భాగంలో గాయమై పడిఉంది. ఒంటిపైనున్న ఆభరణాలు, ఇంట్లో ఉన్న ఇనుప పెట్టె తీసి వస్తువులు, బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి. రంగంలోకి దిగిన క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ హత్య విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఎస్సై లక్ష్మయ్య తన సిబ్బందితో కలిసి హుటాహుటిన జీవన్గీ చేరుకున్నాడు. సమాచారం అందుకున్న తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, గ్రామీణ సీఐ సైదిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య మిస్టరీగా మారడంతో పోలీసులు వికారాబాద్ నుంచి క్లూస్టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించారు. ఇంట్లో వస్తువులపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ గ్రామంలోని హతురాలి ఇంటి ముందు, ఓ హోటల్లోకి వెళ్లింది. కానీ ఎలాంటి క్లూ ఇవ్వలేకపోయింది. హత్యపై అనుమానాలు.. భర్త మరణానంతరం ఒంటరిగా జీవిస్తున్న లక్ష్మీ హత్య అనేక అనుమానాలకు తావిస్తోంది. జీవన్గీ బర్కాల్లో నివసించే ఆమె.. అదే కాలనీలో నివసించే సేవ్యానాయక్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. అయితే ప్రియురాలు లక్ష్మీ ప్రవర్తన పట్ల అనుమానం పెంచుకున్న సేవ్యానాయక్ ఆమెను తరచూ కొట్టేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదిలా ఉంటే లక్ష్మీ హత్య జరిగిన విషయాన్ని మొదట సేవ్యానాయక్ చూసి గ్రామస్తులకు తెలిపాడు. ప్రియుడు హత్య చేస్తే గ్రామస్తులకు ఎందుకు సమాచారం ఇస్తాడన్న ప్రశ్నలు తలెత్తాయి. దీంతోపాటు మృతురాలి శరీరంపై ఉన్న ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఇది దోపిడీ దొంగల పనా లేక తెలిసిన వారెవరైనా చేసిన హత్యా.. అనే కోణంలోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడే హంతకుడు? మృతురాలి తండ్రి బాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీ ప్రియుడు సేవ్యానాయక్కు సీఐ సైదిరెడ్డి అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ప్రియుడే హత్యచేసి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ప్రియురాలిపై అనుమానంతో తరచూ ఆమెను హింసిస్తూ కొట్టేవాడని ఈ క్రమంలోనే బుధవారం రాత్రి గొడవ పడ్డారని, తోపులాటలో తలకు గాయమై చనిపోయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఫిర్యాదులో సేవ్యానాయక్ భార్య తిప్పి భాయి పేరును కూడా చేర్చారు. ఒకట్రెండు రోజుల్లో కేసును ఛేదించి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని సీఐ పైదిరెడ్డి తెలిపారు. -
మదనపల్లెలో పట్టపగలు భారీ చోరీ
మదపసల్లె క్రైం : మదనపల్లె పట్టణంలో గురువారం పట్టపగలే దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. బీరువా లాకర్లను ధ్వంసంచేసి అందులో ఉన్న 300 గ్రాముల బంగారు నగలు, రూ.లక్ష నగదు అపహరించారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కదిరి రోడ్డు న్యాయమూర్తుల బంగ్లా సమీపంలో నివాసం ఉంటున్న పరుపుల వ్యాపారి దర్బార్బాషా, అతని భార్య దిల్షాద్ గురువారం ఉదయం ఇంటికి తాళం వేసుకుని ఎస్టేట్లో పరుపులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోనికి వెళ్లి పరిశీలించారు. బీరువాలు, కప్బోర్డులను పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఈ విషయమై వన్టౌన్ ఎస్ఐ సుమన్ను వివరణ కోరగా చోరీపై తమకు ఫిర్యాదు అందిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
అంతా పథకం ప్రకారమే..
గుత్తి : తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు, చే బదులుగా ఇచ్చిన నగదుతో ముత్తూట్ ఫిన్కార్ప్ మేనేజర్ రవికుమార్ ఉడాయించాడు. బాధితులు తమ సొమ్ము కోసం ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తిలోని ముత్తూట్ ఫిన్కార్ప్ మేనేజర్ రవికుమార్ తమవద్దకు వచ్చే ఖాతాదారులతో పరిచయం పెంచుకుని, వారిని తన బుట్టలో వేసుకున్నాడు. తనకు సంస్థ టార్గెట్ కేటాయిచిందని, మీ బం గారు ఆభరణాలు ఇస్తే.. తర్వాత తిరిగి ఇస్తానని తెలపడంతో దాదాపు 12 మంది అమాయకులు అతడి మాటలు నమ్మి 30 తులాలమేర ఆభరణాలతోపాటు, చేతి బదులు కింద రూ.5 లక్షల నగదు అప్పగించారు. అయితే వారికి ఎటువంటి రసీదూ మేనేజర్ ఇవ్వలేదు. అలా కొద్దిరోజులు గడిచాక తమ సొమ్ము తెచ్చుకునేందుకు కస్టమర్లు కార్యాలయం వద్దకు వస్తున్నారు. అయితే మేనేజర్ లేడని సిబ్బంది చెప్పి పంపుతూ ఉన్నారు. మేనేజర్ ఇంటికి తాళం పడి ఉండటం.. సెల్ఫోన్ స్విచాఫ్ కావడం, ఇరవై రోజులు దాటినా లేడని సిబ్బంది నుంచి సమాధానం వస్తుండటంతో ఓపిక నశించిన బాధిత కస్టమర్లు గౌరమ్మ, సరోజ, రంగయ్య(గుత్తి), నరసింహులు( గుత్తి ఆర్ఎస్), విరూపాక్షిరెడ్డి(ఇసురాళ్లపల్లి) మరికొంతమంది మంగళవారం కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ప్రస్తుత మేనేజర్ నౌషద్ స్పందించిత్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
కర్నూలులో కిలో బంగారం చోరీ
-
కర్నూలులో భారీ చోరీ.. కిలో బంగారం మాయం!
సాక్షి, కర్నూలు: పట్టణంలోని కృష్ణానగర్లో భారీ దొంగతనం జరిగింది. కృష్ణానగర్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి దొంగలు కిలో బంగారం, రూ. 4 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ కాలనీలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. అయినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల భయంతో తాము హడలిపోతున్నామని అంటున్నారు. కృష్ణా నగర్లోని రవీంద్ర స్కూల్ వెనుక వైపు రైల్వే ట్రాక్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బంగారంతోపాటు పిల్లల ఫీజుల కోసం దాచి ఉంచిన నగదును దొంగలు దోచుకెళ్లారని బాధితురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి నెల్లూరుకు వెళ్లడంతో ఈ ఘటన జరిగింది. ఇంటికి వేసిన తాళాలు తెరిచి ఉండటంతో ఉదయం పక్కింటివారు గుర్తించడంతో రాత్రి చోరీ జరిగిన వ్యవహారం వెలుగుచూసింది. ఘటనపై బాధితురాలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
వందలు ఎరవేసి.. 25 లక్షల ఆభరణాలు చోరీ
ఖమ్మం క్రైం: కొన్ని రూ. 50 నోట్లను ఎరగా వేసి కారు డ్రైవర్ దృష్టి మళ్లించి.. రూ. 25 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన ఖమ్మంలో సోమవారం జరిగింది. నగరానికి చెందిన గుర్రం రాధిక, ఆమె కోడలు వనజ ఓ బ్యాంక్ లాకర్లో ఉన్న తమ బంగారు ఆభరణాలను ఓ సూట్కేస్లో భద్రపరిచి కారు సీటు కింద పెట్టి.. గాంధీచౌక్లోని ఓ బంగారం షాపులోనికి వెళ్లారు. డ్రైవర్ను కారు పార్కింగ్ చేయాలని సూచించి, బంగారం భద్రపరిచిన సూట్కేçస్ను అతడికి అప్పగించారు. ఈలోపు గుర్తు తెలియని ఆగంతకుడు కారు వద్దకు వచ్చి ‘కింద రూ.50 నోట్లు పడి ఉన్నాయి.. అవి మీవేనా..?’అంటూ అడగడంతో అతను కిందకు దిగి వరుసగా పడి ఉన్న నోట్లను ఏరుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తి కారులోని సూట్కేసుతో పరారయ్యాడు. నోట్లు తీసుకున్నాక డ్రైవర్.. కారులో కూర్చొని సీట్ కింద ఉన్న సూట్ కేసును చూసుకోగా.. అది కనిపించలేదు. వెంట కారుదిగి చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. డ్రైవర్ వెంటనే వెళ్లి తన యజమానురాలికి విషయం చెప్పగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ పింగళి నరేశ్రెడ్డి సందర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చోరీ అయిన సూట్కేసులో బంగారం, వజ్రాల నగలు ఉన్నాయని బాధితులు తెలిపారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ దృశ్యాలు సరిగా లేకపోవటంతో దొంగలను గుర్తు పట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. -
అరకిలో బంగారం, రెండు కిలోల వెండి..
సాక్షి, యాదగిరిగుట్ట: జల్సాలకు అలవాటు పడి దొంగతనాల బాట పట్టిన ఓ దొంగను యదాద్రి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి అరకిలో బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులతో పాటు రూ. 4 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వలిగొండ మండలం సుంకిశాలకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. యాదగిరిగుట్ట బస్టాండ్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు డీసీపీ యాదగిరి ఈ రోజు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
నటుడి అల్లుడు ఇంట్లో 21 కేజీల బంగారం చోరీ
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో భారీ చోరీ చోటుచేసుకుంది. కోట్లాది రూపాయల విలువచేసే బంగారు బిస్కెట్లు, కడ్డీలను దొంగలు దోచుకెళ్లడం సంచలనం రేపుతోంది. కన్నడ నటుడు దొడ్డణ్ణ అల్లుడు కేసీ.వీరేంద్ర అలియాస్ పప్పి ఇంట్లో దొంగలు పడి 21 కేజీల బంగారు బిస్కెట్లు, కడ్డీలను దోచుకెళ్లారు. ఈ ఘటన చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. చెళ్లకెరె పట్టణంలోని పాత టౌన్లో కేసీ.వీరేంద్ర నివాసముంటున్నారు. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దుండగులు ఇంటి తాళం బద్దలు చొరబడి లాకర్ను పగలగొట్టి అందులో ఉన్న రూ.6.30 కోట్ల విలువ చేసే 21 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అంతేగాక ఇతడి ఇంటికి వందమీటర్లు దూరంలో ఉన్న కేసీ.వీరేంద్ర సోదరుడు తిప్పేస్వామి ఇంటినీ వదల్లేదు. ఆ ఇంట్లోనూ చొరబడి లాకర్లో ఉన్న రూ.10.70 లక్షల నగదు అపహరించుకెళ్లారు. ఈ రెండు ఘటనలపై భాదితులు చెళ్లకెరె పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్ధలానికి డాగ్స్క్వాడ్, వేలిముద్ర నిపుణులతో పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకుని తనిఖీ చేసి దుండగుల ఆచూకీకోసం గాలింపు చేపట్టారు. ఎస్పీ శ్రీనాథ్జోషి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానంతో ఇద్దరు పని మనుషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, గత కొద్దినెలల కిందట ఐటీ శాఖ దాడుల్లో కేసీ.వీరేంద్ర ఇంటి బాత్ రూమ్ గోడ సీక్రెట్ లాకర్లో దాచిపెట్టిన రూ.6 కోట్లు నగదు లబించిన విషయం తెలిసిందే. తాజా దోపిడీ ఆ కుటుంబానికి బాగా తెలిసినవారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. -
విమానంలో సీటు కింద భారీగా బంగారం
చెన్నై: దుబాయి నుంచి వచ్చిన ఓ విమానంలో సోదా జరిపిన అధికారులు భారీగా బంగారాన్ని కనుగొన్నారు. ప్రయాణికులంతా వెళ్లి పోయిన తర్వాత అధికారులు విమానాన్ని తనిఖీ చేయగా ఓ సీటు కింద ఉన్న మూడు కిలోల బంగారం బిస్కెట్లను కనుగొన్నారు. దీని విలువ రూ.1.15 కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ ఇంటలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. అక్రమంగా తీసుకువచ్చిన బంగారం పట్టుబడుతుందనే భయంతోనే అక్కడే పడేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిని ఎవరు వదిలి వెళ్లారనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. -
ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో కిలోపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇండిగో విమానంలో ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడు భారీగా బంగారం తెస్లున్నట్టు ముంబై ఐటీ అధికారులు ఇక్కడి అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి 1076.25 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదనపు సమచారం కోసం విచారణ చేపడుతున్నారు. -
మాయలేడి
– జాతకం చెబుతానంటూ ఇంట్లోకొచ్చి బంగారు ఆభరణాల అపహరణ బత్తలపల్లి : జాతకం చెబుతానంటూ ఓ మాయలేడి అమాయకురాలిని బురిడీ కొట్టించింది. ఐదు తులాల బంగారు, ఐదు తులాల వెండి ఆభరణాలను అపహరించి ఉడాయించింది. బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకెళితే.. బత్తలపల్లికి చెందిన గౌసియా మంగళవారం మధ్యాహ్నం ఇంటి ముందు దుస్తులు ఉతుకుతోంది. ఇదే సమయంలో ఒక గుర్తు తెలియని మహిళ వచ్చి ‘మీ ఇంటి వాస్తు బాగలేదు. మీకు ఏదీ కలిసి రావడం లేదం’టూ మాటలు కలిపింది. దీంతో గౌసియా తన సమస్యలు ఏకరువుపెట్టింది. బయటెందుకు ఇంటిలోకి వెళ్దామంటూ గుర్తు తెలియని మహిళ అనడంతో సరేనని లోనికి తీసుకెళ్లింది. బియ్యం పోసి.. పూజలు చేయాలంటూ సెలవిచ్చింది. దీంతో బియ్యం పోయడానికి చిన్న పాత్రలు లేవనడంతో తనవద్దనున్న పాత్రలను ఇచ్చింది. అందులో బియ్యం పోయగా బంగారు, వెండి నగలుంటే ఇవ్వండి వాటికి కూడా పూజలు చేస్తానని నమ్మబలికింది. దీంతో గౌసియా బీరువాలోనుంచి ఐదు తులాలు (నెక్లెస్, మాటీలు, జుంకీలు, కమ్మలు), ఐదు తులాల వెండి ఆభరణాలు ఇచ్చింది. అనంతరం దక్షణగా రూ.2,100 పెట్టమంది. అన్నిటినీ సమకూర్చిన అనంతరం గౌసియాపై బియ్యం చల్లి.. తాను వెళ్లిన అనంతరం వాటిని సర్దుకోవాలని సూచించింది. తనను కొంత దూరం సాగనంపాలనడంతో ఆమెతో కలిసి గౌసియా కూడా కొంత దూరం వరకు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చింది. ఇంట్లో బంగారు, వెండి వస్తువులు కనిపించకపోయేసరికి స్థానికులకు తెలిపింది. వారు వచ్చి చూడగా అప్పటికే గుర్తు తెలియని మహిళ ఎక్కడా కనిపంచలేదు. వెంటనే బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఆమెను గుర్తు పట్టారు. అయితే ఆమె ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు అన్న వివరాలను ఆరా తీస్తున్నారు. విద్యార్థి మెడలో బంగారు గొలుసు చోరీ మండల కేంద్రం బత్తలపల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి దామోదర్ బ్యాంకులో తాకట్టు పెట్టిన ఒకటిన్నర తులం బంగారు చైనును విడిపించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ కూడలికి చేరుకున్నాడు. పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ ఆర్డినరీ బస్సు రాగానే బస్సు ఎక్కాడు. ఇంతలో మెడలో చైను కనిపించలేదు. దీంతో పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. రెండు కేసులూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రైల్వే స్టేషన్లో భారీగా బంగారం స్వాధీనం
న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్లో పెద్ద మొత్తంలో బంగారం బయటపడింది. సరైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో బంగారం తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపడుతున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఓ వ్యక్తి వద్ద నుంచి 25.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.54 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని నిందితుడు నేపాల్ నుంచి దొంగచాటుగా తీసుకువస్తున్నట్లు తెలుసుకున్నారు. దీని వెనుక బంగారం స్మగ్లింగ్ ముఠా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి నుంచి మరిన్ని వివరాలు రాబట్టి మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. -
36 కాసుల బంగారం స్వాధీనం
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 36 కాసుల బంగారు ఆభరణాలు, 1400 గ్రాముల వెండి ఆభరణాలను ఏలూరు-2 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
సేలంలో భారీ చోరీ
► 700 సవర్ల బంగారు నగలు, రూ. 2లక్షలు అపహరణ ► నిఘా కెమెరాల కనెక్షన్లు కట్ ► రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు సేలం: సేలంలోని వ్యాపార వేత్త ఇంట్లో భారీ చోరీ సంఘటన చోటు చేసుకుంది. సేలం కిచ్చిపాళయం అంకమ్మాల్ ఆలయ వీధికి చెందిన ఆదియప్పన్ (74). ఈయన సెవ్వాపేట ప్రాంతంలో కొయ్య, ఇనుప వస్తువుల వ్యాపారం చేస్తున్నాడు. ఇతని మొదటి భార్య మృతి చెందింది. ఆ తర్వాత అదే ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి(40) అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు మనోజ్ కుమార్, కుమార్తె దేవిప్రియ ఉన్నారు. గత ఏడాదిన్నర కిందట అనారోగ్యం కారణంగా ఆదియప్పన్ మృతి చెందాడు. అప్పటి నుంచి ఆయన భార్య విజయలక్ష్మి వ్యాపారం నడుపుతూ వస్తోంది. ఆమెకు సహాయంగా సోదరుడు భాస్కర్ కూడా ఉన్నాడు. ఆయన తన కుటుంబం సహా సోదరి ఇంట్లోనే ఉంటున్నాడు. విజయలక్ష్మి తన కుటుంబంతో అంకమ్మాల్ ఆలయ వీధిలో ఉన్న మూడంతస్తుల భవనంలో ఉంటోంది. ఆదివారం సాయంత్రం విజయలక్ష్మి తన కుటుంబంతో తిరుమల వెళ్లారు. ఇంటికి భద్రతగా తన తండ్రి దక్షిణా మూర్తి(63), శివభాగ్యం(58) ఉన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం తిరుమల నుంచి తిరిగి వచ్చిన విజయలక్ష్మి కారు డ్రైవర్కు డబ్బు ఇవ్వడం కోసం బీరువాను తెరిచి చూసింది. అప్పుడు బీరువాలో ఉన్న 700 సవర్ల నగలు, రూ. 2 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిచ్చిపాళయం పోలీసుల విచారణ : విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కిచ్చిపాళయం పోలీసులు, జాగిలం, ఫోరెన్సిక్ నిపుణులతో అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇంటి వెనుక వైపు ఉన్న స్నానపు గది తలుపులు, కిటికీలు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఇంట్లో పలు గదుల్లో 8 నిఘా కెమెరాలు ఉన్నాయని, అయితే వీడియో దృశ్యాలను నమోదు చేసే బాక్స్ను దొంగలు దోచుకెళ్లినట్లు తెలిసింది. మంత్రించిన నిమ్మ పండు : బీరువాలో మంత్రించిన నిమ్మపండు, దానితోపాటు పసుపు కుంకుమలు పూసిన ఒక లేఖ ఉంది. ఆ లేఖలో ‘ఈ విషయం గురించి బయట చెబితే కుటుంబం నాశనమవుతుంది’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో తమ ఇంట్లో అప్పుడప్పుడు పూజలు చేస్తారని విజయలక్ష్మి తెలిపారు. ఆ పూజలు చేసే ఒక స్వామీజీ వద్ద పలుమార్లు డబ్బు, నగలు చూపినట్టు చెప్పింది. అంతేకాకుండా ఇటీవల పూజ చేసిన సమయంలో తమను తిరుపతికి వెళ్లి రావాల్సిందిగా సూచించింది కూడా ఆ స్వామీజీనే అని వెల్లడించింది. దీంతో పూజలు చేసిన ఆ స్వామీజీపై పోలీసులకు సందేహం ఏర్పడింది. ఇంటిలోపల ఒక్క కిటికీ అద్దాలుకానీ, తలుపులు, తాళాలు కానీ ఏవీ పగులగొట్టలేదు. నిఘా కెమెరాల కనెక్షన్లు కట్ చేసి ఉన్నాయి. దీంతో ఆ కుటుంబీకులకు బాగా తెలిసిన వ్యక్తే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని పోలీసులు సందేహిస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాల పోలీసులు : సేలం నగర పోలీస్ కమిషనర్ సంజయ్కుమార్, నేర విభాగ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణన్, పోలీసు అధికారులు చోరీ జరిగిన ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం సంజయ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సహాయక కమిషనర్ల అధ్యక్షతన ఆరుగురు ఇన్స్పెక్టర్లతో కూడిన రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నేరస్తులను పట్టుకుంటామన్నారు. సీసీటీవీ కెమెరాల కనెక్షన్ కట్ చేసి ఉందని, త్వరలో నేరస్తులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ చోరీ గురించి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు సమాచారం వెల్లడైంది. -
ఇంద్రపాలెంలో చోరీ
5 కాసుల బంగారం, కిలో వెండి అపహరణ ఇంద్రపాలెం (కాకినాడ రూరల్) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి 5 కాసుల బంగారం, కిలో వెండిని ఎత్తుకుపోయిన ఘటన ఆదివారం అర్ధరాత్రి ఇంద్రపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే కాకినాడ రూరల్ ఇంద్రపాలెం డ్రైవర్స్కాలనీకి చెందిన వులిశెట్టి భాను కుటుంబ సభ్యులు వేసవి సెలవులు కావడంతో బంధువుల ఇళ్లకు వెళ్లారు. శనివారం ఉదయం భాను ఉంటున్న జీప్లస్ టూ పై అంతస్తులోని పోర్ష¯ŒSకి తాళం వేసుకుని శనివారం రాత్రి వ్యక్తిగత పనిపై పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఇంటి తాళం బద్దలు కొట్టి బీరువాలో ఉన్న సుమారు ఐదు కాసుల బంగారు ఆభరణాలు, కిలో వెండి, సుమారు రూ. 5 వేల నగదును దోచుకుపోయారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కింద పోర్ష¯ŒSలో ఉంటున్న నివాసితులు భానుకి ఫో¯ŒS చేశారు. ఇంటి తాళం కప్ప బద్దలు కొట్టబడి ఉందని, ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా ఉన్నాయని సమాచారం ఇచ్చారు. తణుకులో ఉన్న భాను హుటాహుటిన ఇంటికి చేరుకుని దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి ఎస్సై డి.రామారావుకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఆయన క్లూస్ టీమ్ని రప్పించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెల్లిపాకలో చోరీ
దొంగ దాడిలో గాయపడిన మహిళ బంగారం,నగదు అపహరణ నెల్లిపాక: ఎటపాక మండల పరిధిలోని నెల్లిపాకలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పెట్రోల్ బంక్ సెంటర్లో జాతీయ రహదారి పక్కనే నివాసం ఉంటున్న దుద్దుకూరి నాగరత్నం ఇంటి ముందు నిద్రిస్తోంది. తెల్లవారు జామున ఇంటి వెనుక తలుపు పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువాను తెరిచి అందులోని రూ 1.05 లక్షల విలువైన 116గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15వేల నగదును ఎత్తుకెళ్లాడు. అయితే ఇంట్లో ఏదో అలికిడి వస్తున్నదని గమనించిన నాగరత్నం ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగ ఉన్నట్లు గుర్తించి అడ్డగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆ దొంగ ఇనుప రాడ్తో ఆమె తలపై కొట్టి గాయపర్చి అక్కడ నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎటపాక పోలీసులు ఘటన స్థలానికి వచ్చి విచారణ జరుపుతున్నారు. -
రాజధాని ఎక్స్ప్రెస్లో భారీగా బంగారం
గువాహటి: గువాహటి రైల్వే స్టేషన్లో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరిన రాజధాని ఎక్స్ప్రెస్లో శుక్రవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బోగీలోని సీటు కింద ఉన్న గోనె సంచిలో 15 కిలోల బరువైన బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి లుంబింగ్ ప్రాంతానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం రాజధానికి వెళ్లే అవథ్ ఎక్స్ప్రెస్లో కిలోన్నర బ్రౌన్షుగర్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. -
సినీఫక్కీలో
12 తులాల బంగారం అపహరణ పూసపాటిరేగ (నెల్లిమర్ల): మండలంలోని రెల్లివలసకు చెందిన వృద్ధ దంపతుల నుంచి అగంతకులు సినీఫక్కీలో నగలు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పతివాడ సత్యనారాయణ, సరస్వతి దంపతులు శుభకార్యంలో పాల్గొనేందుకు నెల్లిమర్ల మండలం గరికిపేటకు ఈ నెల 9న బయలుదేరారు. విజయనగరం వరకు తమ అల్లుడుకు చెందిన కారులో వెళ్లారు. అక్కడ నుంచి భోజనం చేసేందుకు ఎస్కేఎంఎల్ హోటల్ వైపు వెళ్తుండగా, మార్గమధ్యలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు తారసపడ్డారు. మెడలో బంగారు గొలుసులు ఉంటే దొంగలు అపహరించే ప్రమాదముందని, అందుకే వాటిని తీసి సంచిలో వేసుకోండని అగంతకులు వృద్ధ దంపతులకు సలహా ఇచ్చారు. అంతలో వారి వద్దకు మరో యువకుడు వచ్చాడు. ఆయన మెడలో కూడా బంగారు గొలుసు ఉండడంతో వృద్ధులను నమ్మించడానికి అతనిచేత కూడా గొలుసు తీయించి బ్యాగులో వేయించారు. దీంతో వృద్ధ దంపతులు కూడా తమ వద్ద నున్న నాలుగున్నర తులాల బంగారం గొలుసు, మూడు తులాల పుస్తెల తాడు, తులంన్నర మూడు ఉంగరాలు, అర తులం శతమానం తీశారు. వాటిని వృద్ధురాలి చీర కొంగులో ముడికడుతున్నట్లు సాయం చేసిన అగంతకులు బంగారం స్థానంలో ఇనపముక్కలు కట్టి అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. కొద్ది సేపటి తర్వాత చీరకొంగుముడి విప్పిన వృద్ధురాలు అందులో ఇనపముక్కలు ఉండడంతో మోసపోయామని గుర్తించి లబోదిబోమన్నారు. దీనిపై విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
విమానాశ్రయంలో బంగారం పట్టివేత
కోయంబత్తూరు(కేరళ): కోయంబత్తూరు విమానాశ్రయంలో సోమవారం రూ.25 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని పలక్కడ్ ప్రాంతానికి చెందిన ప్రభాకరన్ సోమవారం ఉదయం షార్జా నుంచి కోయంబత్తూర్ విమానాశ్రయంలో దిగాడు. అతని తీరును అనుమానించిన అధికారులు లగేజిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అతని స్పీకర్ బాక్స్లో దాదాపు 700 గ్రాముల బరువున్న బంగారు కడ్డీలు లభించాయి. ఈ మేరకు విచారణ నిమిత్తం ప్రభాకరన్ను పోలీసులకు అప్పగించారు. -
రైల్వేస్టేషన్లో నగలు అపహరణ
హిందూపురం అర్బన్ : హిందూపురం రైల్వేస్టేషన్ శనివారం రాత్రి బెంగళూరు నుంచి వస్తున్న దంపతుల వద్ద 10 తులాలు బంగారు నగలు అపహరించుకుపోయినట్లు బాధితులు రాధాకృష్ణ, మమతలు వాపోయారు. బెంగళూరు నుంచి కాచిగూడ ఎక్స్ప్రెస్లో రాత్రి 8 గంటల సమయంలో హిందూపురం రైల్వేస్టేషన్లో దిగారు. వీరిని అనుసరిస్తున్న దొంగ బంగారు నగలు కలిగిన బ్యాగ్ను లాక్కొని పరారు అయ్యాడు. దొంగను పట్టుకోవడానికి రాధాకృష్ణ ప్రయత్నించా ఫలితం లేకపోయింది. దీంతో రైల్వే పోలీస్స్టేషన్లో జరిగిన విషయాన్ని తెలియజేసి కేసు నమోదు చేయాలని కోరారు. అయితే పోలీసులు ఎస్ఐ అందుబాటులో లేరని ఫిర్యాదు తీసుకోలేమని చెబుతున్నట్లు బాధితులు వాపోయారు. -
ఎయిర్పోర్టులో భారీగా బంగారం: హైదరాబాదీ అరెస్టు
శంషాబాద్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 376 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 376 గ్రాముల బంగారం పట్టుబడింది. బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం రూ. 11 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తి హైదరాబాద్కు చెందిన వాడిగా గుర్తించారు. -
రైల్వే స్టేషన్లో భారీగా బంగారం
వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి 60 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల విలువ సుమారు రూ. 18 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
లక్కీ డ్రా గెల్చుకున్నారంటూ ఘరానా దోపిడీ
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఘరానా దోపిడీ జరిగింది. ముదాంగల్లిలో నివాసముంటున్న లక్ష్మి, లింగం భార్యాభర్తలు. మంగళవారం మధ్యాహ్నం పల్సర్ బైక్పై వచ్చిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ను రీచార్జి చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్కు లక్కీ డ్రాలో స్కూటీ గెల్చుకున్నారని వారిని బురిడీ కొట్టించాడు. స్కూటీ తీసుకోవాలంటే తమ ఆఫీసుకి వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పాడు. ఆఫీసుకు వచ్చేటప్పుడు బంగారు ఆభరణాలు తీసేసి రావాలన్నాడు. పేదవారిలా కనిపిస్తేనే బండి ఇస్తారని నమ్మబలికాడు. భార్యాభర్తలకు మొదట అనుమానం వచ్చినా డబ్బులేం అడగకపోవడంతో బంగారు ఆభరణాలను ఇంట్లో ఉన్న కూతురికి ఇచ్చి అతనితో పాటు బయలుదేరారు. బంగారు ఆభరణాలను లింగం కుమారై దాచడం పల్సర్పై వచ్చిన వ్యక్తి గమనించాడు. లింగం దంపతులను కొంతదూరం బైక్పై తీసుకెళ్లిన తర్వాత మీలాగే ఇంకొకరికి కూడా లక్కీ డ్రాలో బహుమతి వచ్చిందని వారిని కూడా తీసుకువస్తానని చెప్పాడు. అక్కడే వారిద్దరినీ ఉండమని చెప్పి లింగం వాళ్ల ఇంటికే వెళ్లాడు. మీ అమ్మ ఫోటోలు దిగాలి..ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలు తీసుకురమ్మని చెప్పింది అని లక్ష్మి కూతురికి మాయమాటలు చెప్పాడు. మా అమ్మ వస్తేనే ఆభరణాలు ఇస్తానని చిన్నారి చెప్పటంతో బలవంతంగా ఇంట్లో దూరి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. సదరు వ్యక్తి తిరిగి రాకపోవడంతో భార్యాభర్తలు ఇంటికి వచ్చేశారు. ఇంటి నుంచి ఆభరణాలను ఎత్తుకుపోయాడని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంటనే కామారెడ్డి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ మెడలో గొలుసు చోరీ
హైదరాబాద్: నగరంలోని చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. సికింద్రాబాద్ పార్శిగుట్టకు చెందిన తన కుమారుడికి తాయత్తు కట్టించేందుకు నడుచుకుంటూ ఓ మహిళ వెళ్తున్నది. ఆ సమయంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని పది తులాల బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
15 తులాల బంగారు నగల చోరీ
అనంతపురం సెంట్రల్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి పర్సులోని 15 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన రుక్ష్మిణమ్మ అనంతపురంలోని వేణుగోపాల్నగర్లో నివాసముంటున్న బంధువుల ఇంటికి వచ్చేందుకు జనవరి 31న ఆర్టీసీ బస్సులో వచ్చింది. అనంతపురం బస్టాండులో బస్సు దిగే సమయంలో పర్సులోని బంగారు నగలను ఎవరో అపహరించారు. బాధితురాలు శుక్రవారం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వెంకటేశులు తెలిపారు. -
అరికాళ్లలో కిలో బంగారం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం సౌదీ అరేబియా జెడ్డా నుంచి వచ్చిన ఇద్దరి ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అరికాళ్ల కింద బంగారాన్ని దాచి తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఓ వ్యక్తి నుంచి 467 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు మస్కట్ నుంచి ఒమర్ ఎయిర్లైన్స్ డబ్ల్యువై-235 విమానంలో హైదరాబాద్ వచ్చాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో చేపట్టగా బంగారం పట్టుబడింది. పట్టుకున్న బంగారం విలువ రూ.13.64 లక్షలు అని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. -
నమ్మించి మంగళసూత్రం కాజేసింది!
కీసర: కూరగాయల మార్కెట్ లో వివాహిత వద్ద నుంచి ఓ మాయలేడి మంగళసూత్రం కాజేసింది. ఈ ఘటన మేడ్చెల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం గ్రామంలో చోటుచేసుకుంది. నకిలీ బంగారం ముద్ద చూపించి ఇది మన ఇద్దరికీ దొరికింది అని నమ్మబలికి, ఒక మహిళ దగ్గర ఉన్న నాలుగున్నర తులాల మంగళసూత్రంతో గుర్తుతెలియని మహిళ ఉడాయించింది. బంగారం దుకాణానికి వెళ్లి పరీక్షించగా బంగారం ముద్ద నకిలీదని దుకాణం యజమాని తేల్చి చెప్పాడు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న బాధిత మహిళ కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
కర్నూలు: జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్లో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఓ వ్యాపారి ఇంట్లో దొంగలు పడి ఉన్న బంగారం, నగదు దోచుకెళ్లారు. ఆ వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా నివాసముంటున్న ఓ వ్యాపారి ఇంట్లో శనివారం రాత్రి దొంగలుపడి 100 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.10 లక్షల నగదును చోరీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. -
జవహర్నగర్లో భారీ చోరీ
హైదరాబాద్: జవహర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. నాగారం లక్ష్మీనగర్ కాలనీలోని రచ్చ సుభద్రారెడ్డి అనే మహిళ ఇంట్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగులగొట్టి సుమారు రూ.10 లక్షల నగదు, 8 తులాల బంగారం అపహరించారు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ క్రైమ్ డీసీపీ జానకి, కుషాయిగూడ ఏసీపీ రఫిక్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
స్వామీజీ ముసుగులో నగల అపహరణ
సూళ్లూరుపేట : స్వామిజీ ముసుగులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మహిళను మోసం చేసి ఐదు సవర్ల బంగారు నగలు అపహరించిన సంఘటన పట్టణంలోని పార్కువీధిలో సోమవారం జరిగింది. బాధితురాలు వెలుగూరి కుమారి కథనం మేరకు.. స్థానిక సత్యం జూనియర్ కళాశాలకు ఎదురుగా టిఫిన్ సెంటర్ నడుపుకుంటుంది. సోమవారం సాయంత్రం రుద్రాక్షలు, కాషాయ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి టిఫిన్ సెంటర్కు వచ్చి ఆమెతో మాటలు కలిపి నమ్మ బలికాడు. ఈ టిఫిన్ సెంటర్కు వాస్తు బాగలేదని, దీనికి తాను సూచించిన మేరకు చిన్నచిన్న మార్పులు చేస్తే బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. దీంతో ఆమె అతన్ని నమ్మి ఇంట్లోకి తీసుకెళ్లి పూజలు చేయమని కోరగా ఆయన ఆమె నుదుటిన బొట్టు పెట్టి పూజ చేస్తానని చెప్పి తాళిబొట్టు ఉన్న బంగారు సరుడు ఇవ్వమని అడిగాడు. కొద్దిసేపటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అతను ఐదు సవర్లు బంగారు నగలు తీసుకుని వెళ్లిపోయారు. పది నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చి చూసే సరికి అతను కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పట్టపగలే స్వామీజీ ముసుగులో చోరీకి పాల్పడిన వైనం స్థానికంగా సంచలనం రేపింది. ఏఎస్ఐ మల్లికార్జునరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూకట్పల్లిలో దొంగల స్వైరవిహారం
హైదరాబాద్: కూకట్పల్లి బాలాజీనగర్లో ఎంఐజీ క్వార్టర్లలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. మూడిళ్లలో దొంగలు చొరబడి రూ.3 లక్షల నగదుతోపాటు అరకిలో బంగారాన్ని ఎత్తుకుపోయారు. అడ్డు వచ్చిన ఒక మహిళను తీవ్రంగా గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మేడిపల్లిలో దొంగల హల్చల్
హైదరాబాద్: సైబరాబాద్ మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి దొంగలు తెగబడ్డారు. బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్కెట్ చేసిన దొంగలు.. రెండిళ్లలో ప్రవేశించి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకు పోయారు. అలాగే, పోలీస్స్టేషన్కు సమీపంలోని ఓ దుకాణం షట్టర్లు తొలగించి, రూ.5 లక్షల విలువైన సామగ్రిని దోచుకున్నారు. సోమవారం ఉదయం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలు చోరీ
బుట్టాయగూడెం : మండలంలోని ముప్పినవారిగూడెం ఎస్సీ కాలనీ సమీపంలోని ఓ ఇంటిలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. బాధితురాలు జె.వెంకాయమ్మ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం వెంకాయమ్మ, ఆమె భర్త బుల్లిదొర బయటకు వెళ్లారు. దీనిని గమనించిన దుండగులు గునపంతో ప్రధాన ద్వారాన్ని పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని తొమ్మిదిన్నర కాసుల బంగారాన్ని దొంగిలించుకుపోయారు. ఏఎన్ఎంగా పనిచేస్తున్న వెంకాయమ్మ బుట్టాయగూడెం వైద్యశిబిరానికి వెళ్లారు. అయితే ఆ శిబిరం రద్దు కావడంతో బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి అక్కడి నుంచి 11గంటల 30 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటì తలుపులు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా, బీరువాలో పెట్టిన మూడు కాసుల గాజులు, మూడు కాసుల నక్లెస్, మూడు కాసుల నల్లపూసల దండ, అరకాసు మేటీలు, రూ.ఐదువందలు, రెండు చెక్బుక్కులు కనిపించలేదు. దీంతో ఆమె వెంటనే తన తమ్ముడు నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ శ్యామ్, కానిస్టేబుళ్లు సి.హెచ్.రవి, కె.రాము ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సివిల్ ఇంజినీర్ ఇంట్లో చోరీ
కుటుంబ సభ్యులు ఊరెళ్లిన సమయంలో ఘటన 10.5 తులాల బంగారు నగల అపహరణ రంగంలోకి దిగిన పోలీసుల గుంతకల్లు టౌన్: గుంతకల్లు పట్టణంలోని హనుమేష్నగర్ ఎస్సీ బాలికల హాస్టల్ వెనుకభాగంలో సివిల్ ఇంజినీర్ నూర్ అహ్మద్ ఇంట్లో చోరీ జరిగింది. పదిన్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి ఈ సంఘటన వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నూర్ అహమ్మద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 15న వైజాగ్లోని డిఫెన్స్ అకాడమీలో చదువుతున్న తన కుమారుడి వద్దకు వెళ్లారు. ఇంటి తాళాన్ని పక్కనే ఉన్న సమీప బంధువుకి ఇచ్చివెళ్లారు. సోమవారం సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అల్మారా (గూటి)లో ఉంచిన తాళం చెవితో బీరువాను తెరిచి.. అందులోని సీక్రెట్ లాకర్లో భద్రపరిచిన బంగారు నగలను అపహరించారు. రాత్రి 7 గంటల సమయంలో ఈ ఇంటిలో బల్బు వెలుగుతుండటాన్ని గమనించిన నూర్ అహ్మద్ సమీప బంధువులు అక్కడికి వచ్చారు. అప్పటికే తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోనికెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు, దుస్తులు చెల్లాచెదురుగా కనిపించాయి. వెంటనే సమాచారాన్ని నూర్అహ్మద్కు చేరవేశారు. ఆయన వైజాగ్ నుంచి హుటాహుటిన బయల్దేరి మంగళవారం ఉదయం గుంతకల్లుకి చేరుకున్నారు. ఇంట్లో పరిశీలించిన తర్వాత 10.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ప్రసాదరావు, ఒన్టౌన్ ఎస్ఐ బీవీ.నగేష్బాబు, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతపురం నుంచి క్లూస్టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. -
ప్రగతినగర్లో వరుస చోరీలు
భాగ్యనగర్ కాలనీ: కేపీహెచ్బీ ఠాణా పరిధిలోని ప్రగతినగర్లో దొంగలు రెచ్చిపోయారు. శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు వరుసగా ఐదు అపార్టుమెంట్స్లో చొరబడి వీరవిహారం చేశారు. వీటిలో మూడు ఫ్లాట్లలో చోరీ చేసిన దొంగలు, మరో ఐదు ఫ్లాట్లలో చోరీకి విఫలయత్నం చేశారు. ప్రగతి నగర్లోని సాయిపద్మజా ప్యారడైజ్ అపార్టుమెంట్, ప్లాట్ నెం. 101లో నివసిస్తున్న ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ రవితేజ తన భార్యను తీసుకొచ్చేందుకు శనివారం తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లాడు. ఇది గమనించిన దుండగులు ఆయన ఫ్లాట్కు వేసిన తాళాలను ఆక్సా బ్లేడ్లతో కోసి బీరువాలో ఉన్న రూ.9.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. మరో అపార్ట్మెంట్లో ఉండే రామకృష్ణ ఈనెల 23న తిరుపతి వెళ్లాడు. ఆయన ఫ్లాట్లో చొరబడిన దొంగలు సుమారు తొమ్మిది తులాల బంగారు నగలు అపహరించారు. ఇదే అపార్ట్మెంట్లో ఉండే పార్థసారథి ఫ్లాట్ తాళాలు పగులగొట్టి ఏడు తులాల బంగారు నగలు అపహరించారు. ఆ తర్వాత వరుసగా మరో రెండు అపార్ట్మెంట్లలోని చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. తాళం కప్పలు గట్టిగా ఉండటంతో అవి పగలకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ప్రగతినగర్ కాలనీలో చోరీలు చేసిన తర్వాత కేపీహెచ్బీ కాలనీ ఏడో ఫేజ్లోని ఎల్ఐజీ 2లో ఇంటి తాళాలు పగులగొట్టి రెండు ల్యాప్టాప్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆయా ఇంటి యజమానులు ఫ్లాట్, ఇళ్లకు తాళాలు వేసి ఉండటం గమనించిన దొంగలు ఇంటితాళాలను పగులగొట్టి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దొంగలను పట్టుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ చోరీలు స్థానిక ముఠా పనేనని, ముందుగానే రెక్కీ నిర్వహించి ఆయా ఫ్లాట్, ఇళ్లలో ఎవరూ లేరని తెలుసుకున్నాకే వరుస చోరీలకు పాల్పడ్డారని పోలీసులంటున్నారు. -
నేలకొండపల్లిలో చైన్స్నాచింగ్...
ఖమ్మం: చైన్ స్నాచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. రోడ్లపై ఒంటిరిగా మహిళలు కనిపిస్తే పాపం.. మెడలోంచి బంగారు గొలుసులు అపహరిస్తున్నారు. ప్రతిఘటిస్తే ప్రాణాలను కూడా తీయ్యడానికి వెనుకాడటలేదు. ఇలాంటి ఘటనలు ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఓ మహిళ నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. మహిళను కొంతదూరం అనుసరించిన గొలుసు దొంగలు బైక్పై వెనకనుంచి వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసును అపహరించారు. బాధితురాలు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యాపారి ఇంట్లో 25 తులాల బంగారం చోరీ
మధురానగర్(హైదరాబాద్సిటీ): ఓ వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం చోరీంది. ఈ ఘటన ఎస్ఆర్నగర్ పరిధిలోని మధురానగర్లో సోమవారం అర్థరాత్రి జరిగింది. మధురానగర్కు చెందిన సత్యనారాయణ ఇంటిలో సోమవారం గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. అతని ఇంటినుంచి 25 తులాల బంగారం, రెండు కిలోల వెండిని దొంగలు అపహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్ లో ఓ ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్: నగరంలో మంగళవారం భారీ చోరి జరిగింది. ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రశాంత్నగర్లో ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు బంగారం అపహరించారు. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే తమ ఇంటి పనిచేసే వ్యక్తిపై బాధిత యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. -
జల్సాలకు అలవాటుపడి...
కరీంనగర్: జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పట్టిన ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 6 తులాల బంగారు ఆభరణాలతో పాటు 250 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్లో గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వరపర్తి సతీష్(30) కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు. అయితే జల్సాలకు అలవాటు పడిన సతీష్ దొంగతనాల బాట పట్టాడు. ఈ నెల 5 న కరీంనగర్లో జరిగిన దొంగతనం కేసులో అతన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టి అతన్ని అరెస్ట్ చేశారు. -
శంషాబాద్ లో 700 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బుధవారం ఉదయం ఇద్దరు ప్రయాణికుల నుంచి 700 గ్రాముల బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు వస్త్రాల లోపల బంగారం బిస్కెట్లను దాచుకుని వస్తుండగా స్కానింగ్లో విషయం బయట పడింది. బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. -
చాగల్లులో భారీ దొంగతనం
చాగల్లు: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది. స్థానిక మెయిన్రోడ్డులో ఉంటున్న కటారు రామచంద్రరావు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని కుటుంబసభ్యులతో రాజమండ్రికి వెళ్లారు. ఇదే అదునుగా దుండగులు తాళాలు పగులగొట్టి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 25 కాసుల బంగారు ఆభరణాలు, మూడు కిలోల వెండి సామగ్రిని ఎత్తుకుపోయారు. ఉదయం తిరిగి వచ్చిన రామచంద్రరావు దొంగతనం విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్టీం రప్పించి దర్యాప్తు ప్రారంభించారు. నిడదవోలు సీఐ బాలకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
కాసేపట్లో పెళ్లి... వధువు నగలు మాయం
హిందూపురం: కాసేపట్లో పెళ్లి అనగా వధువు నగలు మాయం అయిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. 16 లక్షల రూపాయల విలువైన 60 తులాల బంగారం కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హిందూపురంలోని కంచి కామాక్షి కళ్యాణ మండపంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లికూతుర్ని చేసిన తర్వాత గురువారం రాత్రి కళ్యాణ మండపంలో నిద్రపోయారు. ఈ ఉదయం లేచి నగల కోసం అవి కనిపించలేదు. అయితే తెలిసినవారే ఈ దొంగతనానికి పాల్పడ్డారా, బయటి నుంచి వచ్చిన దుండగులెవరైనా చోరీ చేశారా అనే దాని గురించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నగలు లేకపోయినా పెళ్లి జరగడంతో వధువు తరపువారు ఊపిరి పీల్చుకున్నారు. -
కాసేపట్లో పెళ్లి... వధువు నగలు మాయం
-
విమానాశ్రయంలో బంగారం పట్టివేత
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 350 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన చెన్నై వాసి (32) లగేజీలో 350 గ్రాముల బంగారం బయటపడింది. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండు కిలోల బంగారం పట్టివేత
-
రెండు కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దోహా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రెండు కిలోల బంగారు లభ్యమైంది. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడినని ఆ ప్రయాణికుడు చెప్పినట్టు సమాచారం. -
‘ఆత్మ’ వంచన
- ఫేస్బుక్ ద్వారా డ్రామా ఆడిన యువకుడు - ఆత్మలు తిరుగుతున్నాయని 18 తులాల బంగారం కాజేసిన నవీన్ - 18 తులాల బంగారం కాజేసిన వైనం - నిందితుడి అరెస్ట్, రిమాండ్ గద్వాల: కష్టపడే తత్వం లేకపోవడం.. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశ.. జల్సాలకు అవసరమైన డబ్బు కోసం అమాయకులను మోసం చేయడం.. ఇలా నిత్యం ఏదో ఒక చోట ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఫేస్బుక్లో ఒక విద్యార్థినితో పరిచయం ఏర్పరచుకొని 18 తులాల బంగారాన్ని కాజేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణంలోని ఒంటెలపేటలో నివాసముంటున్న ఇంజినీరింగ్ విద్యార్థిని హైదరాబాద్లో చదువుకుంటుంది. చింతలపేటకు చెందిన నవీన్ ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆరునెలల క్రితం విద్యార్థినుల పేర్లపై ఫేస్బుక్ అకౌంట్ తెరిచాడు. ఫేస్బుక్లో స్పందన, శిరీష పేర్లతో పరిచయం పెంచుకున్నాడు. పాఠశాలలో సదరు విద్యార్థినికి సీనియర్ అయిన నవీన్ పలుసార్లు కలసి ఆమెకు సహాయం చేస్తున్నట్లుగా నటించాడు. కొన్నిరోజుల తర్వాత స్పందన, శిరీష ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారు ఆత్మలై తిరుగుతున్నారని, వాటిని నీ నుంచి తప్పించడానికి కొంత బంగారం అవసరం ఉంటుందని ఫేస్బుక్ ద్వారా నమ్మించాడు. భయపడిన సదరు విద్యార్థిని ఈ విషయాన్ని నవీన్కి వివరించింది. దీంతో అతను చాకచక్యంగా వ్యవహరించాడు. ఆత్మలకు నేరుగా బంగారు ఇస్తే అవి ఏమైనా చేస్తాయని భయపెట్టాడు. ఆ బంగారం త నకు ఇస్తే తాను వెళ్లి మీ స్నేహితుల ఆత్మలకు బంగారం అందజేస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని కొద్దికొద్దిగా నవీన్కు అందజేసింది. అయితే, బంగారం మాయమవుతున్న విషయాన్ని తల్లిదండ్రులు ఒకరోజు పసిగట్టి కూతురును నిలదీశారు. అప్పుడు ఆత్మలు, దెయ్యాలు అంటూ పిచ్చిపిచ్చిగా వ్యవహరించిందని తల్లిదండ్రులు ‘సాక్షి’కి వివరించారు. బంగారం తప్పకుండా తిరిగి వస్తుందని తల్లిదండ్రులను సైతం ఆమె నమ్మించింది. ఇలా నెలరోజుల్లో నవీన్ ఆమె నుంచి 18 తులాల బంగారాన్ని కాజేశాడు. ఈ విషయం ఎక్కడ బయట పడుతుందోనని నవీన్ తన తండ్రి, స్నేహితుల ద్వారా ఆమెను కిడ్నాప్ డ్రామాను నడిపాడు. విద్యార్థిని తల్లిదండ్రులకు సైతం నవీన్ గుర్తుతెలియని వ్యక్తిగా ఫోన్చేసి బెదిరించాడు. బాధిత కుటుంబసభ్యులు తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, మాయమైన బంగారం గురించి డీఎస్పీ బాలకోటికి ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ అకౌంట్లను పోలీసులకు అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్ఐ సైదాబాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.ఒక్కరోజులోనే నిందితుడిని గుర్తించి కేసును ఛేదించి 18 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నవీన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని ఎస్ఐ తెలిపారు. -
నలుగురు స్మగ్లర్ల అరెస్టు, ఆయుధాలు స్వాధీనం
కోల్ కతా: ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను, బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న మరో వ్యక్తిని బీఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని మల్దా జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగింది. మొత్తంగా రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు ఆయుధాలు తరలిస్తుండగా సైఫుల్ మండల్, బుడేబ్ రాయ్, నిర్మల్ సర్కార్ లను 31 వ బెటాలియన్ వారిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి 2 పిస్తోళ్లు, 10 సిమ్ కార్డులు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులకు అప్పగించారు. రతన్ బిస్వాస్ అనే వ్యక్తి రూ.84 లక్షల విలువ చేసే 29 బంగారు బిస్కట్లును తరలిస్తుంటే, అతడిని అదుపులోకి తీసుకుని బిస్కట్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ కి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ ఏడాది దక్షిణ బెంగాల్ ప్రాంతంలో ఇప్పటి వరకూ రూ.5.5 కోట్ల విలువ చేసే బంగారాన్ని 13 మంది నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. -
65 తులాల బంగారం చోరీ
గాజువాక: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని కైలాస్ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. కైలాస్ నగర్లోని ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు 65 తులాల బంగారం, రూ. 20 వేల నగదు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
శంషాబాద్లో దొంగల హల్ చల్
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో దొంగలు గురువారం అర్ధరాత్రి సమయంలో హల్చల్ చేశారు. రెండిళ్లలో భారీ చోరీలకు పాల్పడ్డారు. ఓ ఇంటి ఊచలు తొలగించుకుని లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు 22 తులాల బంగారు నగలు, రూ.లక్షకు పైగా నగదును అపహరించి పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం గ్రామంలోని చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
ఒకే కాలనీలో నాలుగు ఇళ్లలో చోరీ
గద్వాల టౌన్ (మహబూబ్నగర్): తాళం వేసి ఉన్న ఇళ్లులను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. మహబూబ్నగర్ జిల్లా గద్వాల పట్టణం పాత హౌసింగ్బోర్డు కాలనీలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటపై పోలీసులు తెలిపిన వివరాలివీ.. మార్కెట్ యార్డు రిటైర్డు అధికారి ఇస్మాయిల్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి కర్నూలులోని బంధువుల ఇంటికి వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు, రూ.5 వేల నగదును అపహరించారు. సమీపంలో ఉండే మార్కెట్ యార్డు కమీషన్ వ్యాపారి మహేశ్వర్రెడ్డి ఇంట్లో చొరబడి రూ.20 వేల నగదు, 5 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఆ ఇంటిని ఆనుకొని ఉన్న శంకర్ ఇంటి తాళాలను పగులగొట్టి రూ.3 వేల నగదును మాయం చేశారు. సమీపంలో ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు తిరుమలరావు ఇంట్లో సైతం చొరబడ్డారు. అక్కడ ఎలాంటి నగదు, బంగారం లభించలేదు. ఇస్మాయిల్, తిరుమలరావు ఇళ్లలో గతంలోనే నాలుగైదు సార్లు చోరీలు జరగడం విశేషం. చుట్టుపక్కల వారు బుధవారం విషయాన్ని గ్రహించి బాధితులకు సమాచారం అందించారు. చోరీ జరిగిన ఇళ్లను పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. -
20తులాల బంగారం చోరీ
హైదరాబాద్: ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు పడి బీరువాలో ఉన్న 20 తులాల బంగారం రూ. 5 వేల నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ లక్ష్మీనగర్ విల్లాస్ అపార్ట్మెంట్లో మంగళవారం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లో నివాసముంటున్న కృష్ణమూర్తి అనే ఉద్యోగి ఉదయం ఇంటికి తాళం వేసి సాయంత్రం తిరిగి వచ్చారు. వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉండటంతో అనుమానం వచ్చి బీరువా తెరిచి చూడటంతో ఇంట్లో ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5 వేల నగదు కనబడలేదు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వీఆర్వో ఇంట్లో చోరీ
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగౌనూరు వీఆర్వో ఇంట్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. 30 గ్రాముల బంగారం, రూ.40వేల నగదు అపహరణకు గురైందని వీఆర్వో, పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బనగానపల్లెలో బంగారం చోరీ
బనగానపల్లె: కర్నూలు జిల్లా బనగానపల్లె కొండపేట కాలనీలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో రంగాచారి అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి విలువైన సొత్తును అపహరించారు. రంగాచారి కుటుంబ సభ్యులు తలుపు తాళం వేయకుండా ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా... దొంగలు తమ పనిని సులువుగా చక్కబెట్టుకుపోయారు. 8 తులాల బంగారం, రూ.80 వేల నగదు చోరీకి గురైనట్టు బాధితుడు రంగాచారి పేర్కొంటున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
400 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్ (రంగారెడ్డి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. సోమవారం వేకువ జామున నిర్వహించిన తనిఖీల్లో సింగపూర్ నుంచి వచ్చిన ఫణే సెల్వ అనే ప్రయాణికుడి నుంచి 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడ్ని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. -
నగరంలో దొంగల హల్చల్
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ఏరియాలో గురువారం రాత్రి దొంగలు కలకలం సృష్టించారు. ఇక్కడి జనప్రియ కాలనీలోని ఓ ఇంటిలోకి చొరబడ్డ దుండగులు 6 తులాల బంగారం, రూ.4 వేల నగదుతో ఉడాయించారు. వెళుతూ వెళుతూ ఇళ్ల ముందు ఉన్న నాలుగు కార్ల అద్దాలను ధ్వంసం చేసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం జనప్రియ కాలనీకి చేరుకుని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
చంద్రగిరిలో దోపిడీ దొంగల బీభత్సం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని చంద్రగిరి పట్టణంలోని విజయనగర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున దొంగలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. వారి నుంచి ఐదు సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో సునీల్, మునిరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చంద్రగిరి) -
10 తులాల బంగారం అపహరణ
కరీంనగర్(వీనవంక): కరీంనగర్ జిల్లాలోని వీనవంక మండలంలోని గణుముక్కల గ్రామం నాగిడి శివారెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, 40 తులాల వెండి నగలను ఎత్తుకెళ్లారు. ఈ నగలను పడక గదిలోని గోడకు రంధ్రం చేసి అందులో భద్రపరిచారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఎత్తుకెళ్లారు. తెలిసిన వాళ్లే చేసుంటారని అనుమానిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానం వచ్చిన ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.