Reorganization
-
మళ్లీ పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను మళ్లీ పునర్వ్యవస్థీకరణ చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ యోచి స్తోంది. 2020 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదలశాఖను పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన విభాగాలు, ప్రాజెక్టులను గుర్తించి బలోపేతం చేయాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. తెలంగాణ వచ్చాక చేపట్టిన ప్రాజె క్టులు, తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర నీటిపారుదలశాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ నైపుణ్యం, పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాఖ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన లాభనష్టాలపై నివేదిక అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే మళ్లీ శాఖను పునర్వ్యవస్థీకరించి గాడిలో పెట్టాలని భావిస్తోంది. ప్రభ కోల్పోయిన ‘సీడీఓ’ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అక్రిడిటేషన్ ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో మన రాష్ట్ర నీటిపారుదల శాఖలోని ‘సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్’(సీడీఓ) ఒకటి. దేశంలోని కొన్ని రాష్ట్రాల సీడీఓలకు మాత్రమే ఈ గుర్తింపు ఉంది. సాగునీటి ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్లకు సీడీఓ ఆమోదిస్తూ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తేనే, ఆయా ప్రాజెక్టుల అంచనాలను కేంద్ర జల సంఘం ఆమోదిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్(సీఈ) నేతృత్వంలో ‘సీడీఓ’స్వయంప్రతిపత్తి గల సంస్థగా పనిచేసేది. అప్పట్లో నిష్ణాతులైన ఇంజనీరింగ్ నిపుణులను మాత్రమే నియమించేవారు. ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్ల రూపకల్పన, ఆమోదానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో సీడీఓ స్వతంత్రంగా వ్యవహరించేది. దానిపై నీటిపారుదలశాఖ ఈఎన్సీల అజమాయిషీగానీ, ఒత్తిడి గానీ ఉండేది కాదు. 2020 చేపట్టిన నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణలో సీడీఓ స్వతంత్రతను కోల్పోయింది. ఈ విభాగాన్ని ఈఎన్సీ(జనరల్) పర్యవేక్షణ కిందకు తెచ్చి అందులో పనిచేసే ఇంజనీర్ల సంఖ్యనూ సగానికి పైగా కుదించేశారు. తర్వాత సరైన అధ్యయనాలు లేకపోయినా అత్యవసరంగా ఆమోదించాలని ఒత్తిడి పెంచి తమ వద్ద ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్కు ఆమోదం పొందారని ఆరోపిస్తూ సీడీఓ చీఫ్ ఇంజనీర్ ఇటీవల ఈఎన్సీ(జనరల్)కి లేఖ రాయడం విశేషం. ఈఎన్సీ(జనరల్)కు సర్వాధికారాలు కట్టబెట్టే రీతిలో పునర్వ్యవస్థీకరణ జరగడంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విభాగాలు ప్రాధా న్యం కోల్పోయాయి. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర జలవనరులు, ఆయకట్టు అభివృద్ధి సంస్థ(కాడా)లు సైతం గతంలో స్వతంత్రంగా పనిచేసేవి. మళ్లీ ఈ విభాగాలకు స్వతంత్రత ఇస్తే ప్రాజెక్టుల డిజైన్లు, నీటిలభ్యత అధ్యయనాలను స్వేచ్ఛగా నిర్వహించే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐడీసీ లిఫ్టులకు తాళాలు కాల్వల ఆధునీకరణ, ఆయకట్టు అభివృద్ధి, సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ), ప్రపంచ బ్యాంకు పథకాలు, నీటి సంఘాల నిర్వహణ చూసే కాడాకు గతంలో ఐఏఎస్లు బాస్లుగా ఉండేవారు. ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి పరిమితం చేశారు. సాగునీటి అభివృద్ధి సంస్థ పరిధిలో 4.56లక్షల ఎకరాలకు నీరందించే 637 చిన్న ఎత్తిపోతల పథకాలున్నాయి. అందులో 216 పూర్తిగా, 137 పాక్షికంగా పనిచేస్తున్నాయి. 193 పూర్తిగా దెబ్బతిన్నాయి. 91 లిఫ్టులు అవసరం లేదని తాళాలు వేశారు. ప్రస్తుతం 2.18 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. పునర్వ్యవస్థీకరణలో ఐడీసీ ప్రాజెక్టులు 19 మంది చీఫ్ ఇంజనీర్ల పరిధిలోకి వెళ్లగా, చిన్న లిఫ్టులను నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ గందరగోళం పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొందని ఆ శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ► గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఒక చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షించేవారు. ఎడమకాల్వ ద్వా రా విడుదల చేసే నీరు ఏపీలోని పశి్చమగోదావరి జిల్లాకు చేరేవరకు ఆయనే పర్యవేక్షించేవారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వ నిర్వహణను సూర్యాపేట చివరి వరకు నల్లగొండ సీఈ, ఆ తర్వాత నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఖమ్మం సీఈ పర్యవేక్షిస్తున్నారు. ► అడ్మిన్ కమ్ చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉండేది. ఇప్పుడు నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, ములుగు, సూర్యాపేట, రామగుండం(పెద్దపల్లి) చీఫ్ ఇంజనీర్ల నిర్వహణలోకి ఈ ప్రాజెక్టు వెళ్లింది. ► కాళేశ్వరం ఈఎన్సీ(గజ్వేల్) పరిధి సిద్దిపేట వరకు మాత్రమే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈఎన్సీ(రామగుండం) పరిధిలోకి వస్తాయి. ► పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు హెడ్వర్క్స్ నాగర్కర్నూలు సీఈ పరిధిలో ఉండగా, వన పర్తి, మహబూబాబాద్, హైదరాబాద్ సీఈలు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ► ఒకే ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్ష చేయాలన్నా, ఏదైనా నిర్ణయం అమలు చేయాలన్నా అందరూ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడాల్సిందే. గతంలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్యేక విభాగాల వారీగా పర్యవేక్షించేవారు. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. ► మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్వహణలోపం కూడా ఒక కారణంగా తేల్చగా, నిర్వహణను ఓఅండ్ఎం విభాగానికి అప్పగించారా? లేదా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయ్యిందని, నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని, నిర్మాణ సంస్థదే బాధ్యత అని నీటిపారుదలశాఖ నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలున్నాయి. -
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి.. నయా స్వరూపం ఇలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచి్చంది. నగరంలో కొత్తగా రెండు జోన్లు, 10 డివిజన్లు, 13 ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జోన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు, డివిజన్లు 17 నుంచి 27కు, ఠాణాలు 60 నుంచి 73కు చేరనున్నాయి. ఈ మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లు మాయమవుతుండగా.. ఠాణాల పరిధులు మారుతున్నాయి. పక్షం రోజుల్లో వీటికి సంబంధించిన కార్యాలయాల ఎంపిక పూర్తి చేయాలని, కొత్త ఏడాది నుంచి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పోలీసు విభాగానికి 3,966 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నుంచి సిటీకి మూడు డీసీపీ, 12 ఏసీపీ, 26 ఇన్స్పెక్టర్ సహా 1,252 పోస్టులు వచ్చాయి. గతేడాది డిసెంబర్లో నగర కొత్వాల్గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగానే పునర్ వ్యవస్థీకరణపైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి పని ప్రారంభించేందుకు సీపీ ఆనంద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈస్ట్ జోన్: ప్రస్తుతం సుల్తాన్బజార్, కాచిగూడ, మలక్పేట డివిజన్లు.. సుల్తాన్బజార్, చాదర్ఘాట్, అఫ్జల్గంజ్, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్పేట, సైదాబాద్, అంబర్పేట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో నార్త్జోన్, సెంట్రల్ జోన్లలోని కొన్ని ఠాణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాచిగూడ, మలక్పేట డివిజన్లు మాయమై అంబర్పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు తో కొత్తవి వస్తున్నాయి. వారాసిగూడ పేరుతో కొత్త ఠాణా, చిలకలగూడ, లాలాగూడ, నారాయణగూడ ఠాణాలు ఈ జోన్లోకి వస్తున్నాయి. నార్త్జోన్: ఇందులో గోపాలపురం, మహంకాళి, బేగంపేట సబ్–డివిజన్లు, గోపాలపురం, తుకారాంగేట్, లాలాగూడ, చిలకలగూడ, మహంకాళి, మార్కెట్, మారేడ్పల్లి, కార్ఖానా, బేగంపేట, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో తిరుమలగిరి కేంద్రంగా డివిజన్ ఏర్పడుతోంది. తాడ్బన్లో కొత్త ఠాణాతో పాటు మధ్య మండల నుంచి రామ్గోపాల్పేట ఈ జోన్లోకే వస్తోంది. సౌత్ జోన్: ప్రస్తుతం చార్మినార్, మీర్చౌక్, ఫలక్నుమా, సంతోష్నగర్ డివిజన్లు, చార్మినార్, బహదూర్పుర, కామాటిపుర, హుస్సేనిఆలం, కాలాపత్తర్, మీర్చౌక్, డబీర్పుర, మొఘల్పుర, రెయిన్బజార్, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, కంచన్బాగ్, భవానీనగర్, మాదన్నపేట, సంతోష్నగర్ ఠాణాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జోన్లో ఉండే ఫలక్నుమా డివిజన్ మాయమవుతోంది. దాని స్థానంలో బహదూర్పుర వస్తుండగా.. పోలీసుస్టేషన్ల 11కు తగ్గుతున్నాయి. వెస్ట్ జోన్: ప్రస్తుతం పంజగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్నగర్ డివిజన్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్నగర్, ఆసిఫ్నగర్, హుమాయున్నగర్, లంగర్హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, షాహినాయత్గంజ్, హబీబ్నగర్, కుల్సుంపుర, మంగళ్హాట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో ఆసిఫ్నగర్ డివిజన్ ఈ జోన్ నుంచి మాయమవుతోంది. దీని స్థానంలో జూబ్లీహిల్స్ పేరుతో కొత్తది వస్తోంది. మాసబ్ట్యాంక్, రెహ్మత్నగర్, ఫిలింనగర్, బోరబండల్లో కొత్త ఠాణాలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ జోన్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్నగర్ ఠాణాలు మాత్రమే ఉంటాయి సౌత్ ఈస్ట్ జోన్: కమిషనరేట్లో ఆరో జోన్గా సౌత్ ఈస్ట్ ఏర్పడుతోంది. ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే చాంద్రాయణగుట్ట, సైదాబాద్ సబ్–డివిజన్లతో పాటు ఈస్ట్ నుంచి వచ్చే మలక్పేట, సౌత్ నుంచి వచ్చే సంతోష్నగర్ డివిజన్లు ఉండనున్నాయి. ఆ రెండు జోన్ల నుంచి వేరయ్యే చంద్రాయణగుట్ట, కంచన్బాగ్, చాదర్ఘాట్, మలక్పేట, మాదన్నపేట, సైదాబాద్, రెయిన్బజార్, భవానీనగర్, సంతోష్నగర్లతో పాటు కొత్తగా బండ్లగూడ, ఐఎస్ సదన్ ఠాణాలు ఈ కొత్త జోన్లో ఉంటాయి. సౌత్ వెస్ట్ జోన్: ఏడో జోన్గా పరిగణించే సౌత్ వెస్ట్ మరో కొత్త జోన్గా అవతరిస్తోంది. ఇందులో వెస్ట్, సెంట్రల్ జోన్ల నుంచి వేరైన ఆసిఫ్నగర్, బేగంబజార్తో పాటు కొత్తగా గోల్కొండ, కుల్సుంపుర డివిజన్లు వచ్చి చేరుతున్నాయి. ఆ రెండు జోన్ల నుంచే విభజించిన ఆసిఫ్నగర్, హుమాయున్నగర్, హబీబ్నగర్, బేగంబజార్, షాహినాయత్గంజ్, మంగళ్హాట్, గోల్కొండ, లంగర్హౌస్, కుల్సుంపుర, టప్పాచబుత్ర ఠాణాలతో పాటు కొత్తగా టోలిచౌకి, గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్లు రానున్నాయి. సెంట్రల్ జోన్: ప్రస్తుతం ఈ జోన్లో అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ డివిజన్లు.. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్, గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నాంపల్లి, రామ్గోపాల్పేట, సైఫాబాద్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. తాజా మార్పు చేర్పులతో గాం«దీనగర్ డివిజన్గా ఏర్పడుతోంది. దోమలగూడ, లేక్ పోలీసు, ఖైరతాబాద్ల్లో కొత్త ఠాణాలు ఏర్పాడుతున్నాయి. నారాయణగూడ, బేగంబజార్, నాంపల్లి, రామ్గోపాల్పేట్ ఠాణాలు ఈ జోన్లో ఉండవు. -
అటవీ శాఖ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలవారీగా అటవీ శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రతి జిల్లాలో ఒక అటవీ డివిజన్ (టెరిటోరియల్ లేదా సోషల్ ఫారెస్ట్) ఏర్పాటు చేసింది. అవసరం లేని, కాలం చెల్లిన 6 డివిజన్లను మూసివేసి వాటి స్థానంలో కొత్తగా 9 డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో 26 జిల్లాలకు ఇప్పుడు 32 డివిజన్లు ఉన్నాయి. గతంలో 13 జిల్లాలకు 23 డివిజన్లు ఉండేవి. పునర్వ్యస్థీకరణ తర్వాత కొత్తగా పార్వతీపురం మన్యం, చింతపల్లి, రంపచోడవరం, రాజమండ్రి, కోనసీమ, భీమవరం, మచిలీపట్నం, బాపట్ల, పల్నాడు డివిజన్లు ఏర్పాటయ్యాయి. వెదురు, కలప వెలికితీత కోసం ప్రత్యేకంగా ఉన్న చింతూరు, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, గిద్దలూరు, నంద్యాల లాగింగ్ డివిజన్లను రద్దు చేశారు. డివిజన్ల పరిధి, కలప తగ్గడంతో వీటిని మూసివేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు కట్టినప్పుడు దానికి పరిహారంగా అడవిని పెంచడానికి ఏర్పాటైన టీజీపీ డివిజన్ను కూడా రద్దు చేశారు. ► గతంలో సోషల్ ఫారెస్ట్, టెరిటోరియల్ డివిజన్లు విడిగా ఉండేవి. కొత్త డివిజన్లు చిన్నవి కావడంతో ఈ రెండింటినీ కలిపి ఒకటిగా చేశారు. గతంలో ఉన్న 13 సోషల్ ఫారెస్ట్ డివిజన్లను పదికి తగ్గించారు. ► పునర్వ్యవస్థీకరణ తర్వాత 3 జిల్లాల్లో మాత్రమే ఒకటికంటే ఎక్కువ డివిజన్లు ఏర్పాటయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు డివిజన్లు (పాడేరు, చింతపల్లి, చింతూరు, రంపచోడవరం) ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో 3 డివిజన్లు (కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల), ప్రకాశం జిల్లాలో 3 డివిజన్లు (మార్కాపురం, గిద్దలూరు, ప్రకాశం) పెట్టారు. మిగిలిన 23 జిల్లాల్లో ఒక్కో డివిజన్ (టెరిటోరియల్) ఏర్పాటయ్యాయి. ► వన్యప్రాణి విభాగం (వైల్డ్ లైఫ్) డివిజన్లను గతంలో మాదిరిగా ప్రత్యేకంగానే ఉంచారు. ఏలూరు (కొల్లేరు, కృష్ణా అభయారణ్యాలు), సూళ్లూరుపేట (పులికాట్, నేలపట్టు అభయారణ్యాలు) వైల్డ్లైఫ్ డివిజన్లను అలాగే ఉంచారు. నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు పరిధిలోని కర్నూలు, ఆత్మకూరు, గిద్దలూరు, మార్కాపురం డివిజన్లను అలాగే ఉంచారు. ఈ నాలుగింటికీ టెరిటోరియల్, వైల్డ్ లైఫ్ పరిధి రెండూ ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం పునర్వ్యవస్థీకరణ కొత్త పోస్టులు సృష్టించకుండా ఉన్న వాటినే సర్దుబాటు చేసి పునర్వ్యవస్థీకరణ చేశాం. దీనివల్ల పరిపాలన సౌలభ్యంతోపాటు జిల్లాకు ఒక డివిజన్ ఉంటుంది. రద్దు చేసిన డివిజన్లలోని ఉద్యోగులను కొత్త వాటిలో సర్దుబాటు చేస్తున్నాం. – వై మధుసూదన్రెడ్డి, అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అటవీప్రాంతం లేని జిల్లా పశ్చిమగోదావరి పశ్చిమగోదావరి జిల్లా అటవీ ప్రాంతం లేని జిల్లాగా ఉంది. నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన ఈ జిల్లాలో ఒక్క ఎకరం కూడా అటవీ భూమి లేదు. అయినా అక్కడ అటవీ డివిజన్ ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాలో అత్యధికంగా 8,03,039.45 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. బాపట్ల, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 10 వేల హెక్టార్లకంటె తక్కువ అటవీ విస్తీర్ణం ఉంది. విశాఖపట్నం 14,512 హెక్టార్లతో పూర్తి అర్బన్ అటవీ ప్రాంతంగా మారింది. -
ప్రత్యేక ఆర్థిక జోన్ల పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: కొత్త చట్టం ద్వారా ప్రత్యేక ఆర్థిక మండలాలను (ఎస్ఈజెడ్) పునర్ వ్యవస్థీకరించడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎస్ఈజెడ్లకు సంబంధించి దిగుమతి సుంకాల వాయిదా, ఎగుమతి పన్నుల నుండి మినహాయింపు వంటి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ప్రోత్సాహకాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండలాలను నియంత్రించే ప్రస్తుత చట్టాన్ని కొత్త చట్టంతో భర్తీ చేయాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వార్షిక బడ్జెట్ ప్రతిపాదించింది. ఈ మేరకు రూపొందే ‘‘డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్’’ (డీఈఎస్హెచ్)లో రాష్ట్రాలు భాగస్వాములు కావడానికి వీలుగా కేంద్రం పలు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. కొత్త బిల్లుకు సంబంధించి ఆర్థికమంత్రిత్వశాఖసహా పలు మంత్రిత్వశాఖల అభిప్రాయాలను వాణిజ్య మంత్రిత్వశాఖ స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఆయా శాఖల నుంచి అభిప్రాయాలు అందిన తర్వాత వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక కొత్త బిల్లును రూపొందించి, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దీనిని పార్లమెంటులో ప్రవేశపెడుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రోత్సాహకాలు ఇవీ... ఎస్ఈజెడ్లో ఒక యూనిట్ ద్వారా దేశీయ సేకరణపై ఐజీఎస్టీ (ఇంటిగ్రేడెట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) మినహాయింపు, ఈ జోన్ల డెవలపర్లకు పరోక్ష పన్ను ప్రయోజనాల కొనసాగింపు, దేశీయ టారిఫ్లకు సంబంధించి ఉపయోగించిన మూలధన వస్తువుల అమ్మకాలపై తరుగుదల అనుమతించడం వంటివి ప్రత్యేక ఆర్థిక జోన్లకు ఇస్తున్న ప్రోత్సాహకాల ప్రతిపాదనల్లో ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదిత డెవలప్మెంట్ హబ్లలో అధీకృత కార్యకలాపాలను చేపట్టే యూనిట్లకు ఎలాంటి మినహాయింపులు లేకుండా 15 శాతం కార్పొరేట్ పన్ను రేటును వర్తింపజేయాలన్నది బిల్లు ప్రతిపాదనల్లో మరోటి. తయారీ, ఉద్యోగ కల్పనను పెంచడానికి రాష్ట్రాలు కూడా ఈ జోన్లకు సహాయక చర్యలను కూడా అందించే వీలు కల్పించాలన్నది బిల్లులో ప్రధాన లక్ష్యంగా ఉంది. 2022–23 బడ్జెట్ సమర్పణ సందర్భంగా లోక్సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎకానమీలో కీలకపాత్ర... దేశంలో ఎగుమతి కేంద్రాలు, తయారీ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 2006లో ప్రస్తుత సెజ్ చట్టం రూపొందింది. 2022 జూన్ 30 నాటికి కేంద్రం 425 ఎస్ఈజెడ్ డెవలపర్లకు అధికారిక అనుమతులు ఇచ్చింది. అయితే అందులో ప్రస్తుతం 268 పని చేస్తున్నాయి. ఈ జోన్లు దాదాపు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. దాదాపు 27 లక్షల మందికి ఉపాధి కల్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఈ జోన్ల నుంచి ఎగుమతులు 32 శాతం పెరిగి దాదాపు రూ.2.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక 2020–21లో ఈ జోన్ల నుంచి రూ.7.6 లక్షల కోట్ల ఎగుమతులు జరగ్గా, 2021–22లో ఈ విలువ రూ.10 లక్షలకు చేరింది. -
లైఫ్స్టైల్ రిటైలింగ్కు ఐటీసీ టాటా
న్యూఢిల్లీ: లైఫ్స్టైల్ రిటైలింగ్ బిజినెస్ నుంచి వైదొలగినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. బిజినెస్ పోర్ట్ఫోలియోపై వ్యూహాత్మక సమీక్ష తదుపరి ఇందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. రెండు దశాబ్దాల క్రితం విల్స్ లైఫ్స్టైల్ బ్రాండుతో ఐటీసీ ఈ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఫార్మల్, క్యాజువల్, డిజైనర్ వేర్సహా పలు దుస్తులను విక్రయించడంతోపాటు.. జాన్ ప్లేయర్స్ బ్రాండుతో పురుషుల క్యాజువల్స్, డెనిమ్స్, ఫార్మల్స్ తదితరాలను సైతం మార్కెటింగ్ చేసింది. అయితే 2019లో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా లైఫ్స్టైల్ రిటైలింగ్ బిజినెస్ను తగ్గించుకుంది. జాన్ ప్లేయర్స్ బ్రాండును రిలయన్స్ రిటైల్కు విక్రయించింది. కొన్ని పాత స్టోర్స్లోగల విల్స్ బ్రాండు నిల్వలను విక్రయిస్తున్నట్లు గత నెలలో కంపెనీ చైర్మన్ సంజీవ్ పురి వెల్లడించిన విషయం విదితమే. -
స్వతంత్ర భారతి: భిన్నత్వంలో ఏకత్వంలా... భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు
భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే దాని వల్ల కుల మత పరమైన వైషమ్యాలు అణగిపోతాయని ఆశించారు. 1956 లో చేపట్టిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఈ సూత్రమే ఆధారం. దీనిని మూడు విడతలుగా.. 1956లో దక్షిణాది రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం), 1960 నాటికి పశ్చిమ రాష్ట్రాలలో (గుజరాత్), 1966 నాటికి వాయవ్య ప్రాంతంలో (పంజాబ్, హర్యానా, హిమాచల్) అమలు పరిచారు. తర్వాత ఈశాన్య ప్రాంత విభజన (1964, 71) గిరిజన జనాభా ప్రాతిపదికన జరిగింది. జార్ఖండ్, ఉత్తరాంచల్, చత్తీస్గఢ్ రాష్ట్రాలనూ ఏర్పాటు చేస్తూ 2000 లో ఉత్తరాది కేంద్రభాగంలో మినీ–పునర్వ్యవస్థీకరణ జరిపారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ఇది ఒక అరుదైన ప్రయోగం. భాషాపరమైన వ్యవస్థీకరణ భారతదేశ సమాఖ్య వ్యవస్థకు పుష్టిని ఇచ్చింది. 1956లో మొదలైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ నిరంతరం కొనసాగేలానే ఉంది. ఈ క్రమంలోనే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. విదర్భ కోసం డిమాండ్లు నేటికీ వినిపిస్తూ ఉన్నాయి. కర్నూలు రైల్వే స్టేషన్లో 1953 అక్టోబర్ 2న జవహర్లాల్ నెహ్రూ ఆ ముందు రోజే ఆంధ్ర రాష్ట్ర అవతరణ. మూడేళ్లకు 1956 నవంబర్ 1న ఆంధ్రా, తెలంగాణాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. -
హైదరాబాద్లో కొత్తగా రెండు జోన్లు, 13 పోలీస్ స్టేషన్లు.. ఏయే ప్రాంతాల్లో అంటే...
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్కు 175 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఏర్పాటైన నాటి నుంచి పలుమార్లు చిన్నచిన్న మార్పులతో పునర్వ్యవస్థీకరణ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గతానికి భిన్నంగా భారీ రీ– ఆర్గనైజేషన్కు కసరత్తు పూర్తయింది. కొత్తగా రెండు జోన్లు, 13 పోలీసుస్టేషన్లతో పాటు వాటికి తగ్గట్టు సబ్–డివిజన్లను ప్రతిపాదిస్తూ ప్రత్యేక కమిటీ తయారుచేసిన ప్రతిపాదనలు సోమవారం ప్రభుత్వానికి చేరాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం సర్కారు ఆమోదముద్ర వేయనుంది. ఈమేరకు ఉత్తర్వులు వెలువడితే నగరంలో జోన్ల సంఖ్య 7కు, పోలీసు స్టేషన్లు 73కు చేరనున్నాయి. ఇదీ చరిత్ర.. ► హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ 1847లో ఏర్పడింది. అప్పట్లో నిజాం స్టేట్కు హైదరాబాద్ రాజధాని కావడంతో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, జరిగిన నేరాలను కొలిక్కి తీసుకురావడం తదితర విధులతో దీన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం, హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం తొలిసారిగా 1955లో నగర పోలీసు పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి మద్రాస్ సిటీ పోలీసు విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ అమలుపరిచారు. దీంతో క్రైమ్, లా అండ్ ఆర్డర్ వేరు పడటం, హైదరాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు రైల్వే పోలీసులోకి బదిలీ కావడం తదితర కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ► ఆ ఏడాది జూలై 15 నుంచి ఈ విధివిధానాలు అమలులోకి వచ్చాయి. తొలిసారిగా ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్లకు కొందరు సిబ్బందిని అప్పగించి పెట్రోలింగ్ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు. 1956లో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దీంతో జంట నగరాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పోలీసు విభాగంలో లా అండ్ ఆర్డర్, క్రైమ్తో పాటు ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్ తదితర విభాగాలనూ ఏర్పాటు చేస్తూ 1957 అక్టోబర్ 11న నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పుతో పాటు నగర కమిషనరేట్నూ పాలనా సౌలభ్యం కోసం విభజించారు. నాలుగు సబ్– డివిజన్లు, 12 సర్కిళ్లతో 34 పోలీసుస్టేషన్లు ఏర్పడ్డాయి. నగర విస్తరణతో 1981 పునర్వ్యవస్థీకరణ.. ► విస్తరిస్తున్న నగరంలో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు 1981లో కమిషనరేట్ను మరోసారి పునర్వ్యవస్థీకరించారు. దీనిప్రకారం నగరంలో నాలుగు జోన్లు (ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్), 12 సబ్–డివిజన్లు ఏర్పడ్డాయి. జోన్కు డీసీపీలు, సబ్–డివిజన్కు ఏసీపీలు నేతృత్వం వహించే ఏర్పాట్లు చేశారు. ► 1985, 2001ల్లో జరిగిన మార్పుచేర్పులతో సెంట్రల్ జోన్, రెయిన్బజార్, కంచన్బాగ్ పోలీసుస్టేషన్ల ఏర్పాటుతో నగరంలోని జోన్ల సంఖ్య 5కు, పోలీసు స్టేషన్ల సంఖ్య 60కి పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ విశ్వనగరంగా మారుతూ వచ్చినా పోలీసుస్టేషన్లు, సబ్–డివిజన్లు, జోన్ల సంఖ్య పెరగలేదు. ► ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, నేరాల నమోదుతో పాటు జనాభా, పోలీసింగ్ తీరుతెన్నులు ప్రాతిపదికన పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తన నేతృత్వంలో సంయుక్త పోలీసు కమిషనర్, ముగ్గురు అదనపు డీసీపీలు, ముగ్గురు ఏసీపీలతో గత నెలలో కమిటీకి రూపమిచ్చారు. ► నగరంలో సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం, పట్టు ఉన్న ఈ అధికారులు పునర్వ్యవస్థీకరణ అంశాన్ని అనేక కోణాల్లో పరిశీలించారు. ఎట్టకేలకు సౌత్, వెస్ట్, సెంట్రల్, నార్త్జోన్లలో ఉన్న ప్రాంతాలను విడగొడుతూ రెండు జోన్లకు, 15 ఠాణాల్లోని ఏరియాలను కలుపుతూ 13 పోలీసుస్టేషన్లకు రూపమిస్తూ దస్త్రం రూపొందించి ప్రభుత్వానికి పంపారు. (క్లిక్: పోలీస్ పరీక్షల ఉచిత శికణకై ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్) ► ప్రస్తుత నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేపథ్యంలోనే కమిషనరేట్లో కీలక మార్పులు జరిగాయి. సెంట్రల్ జోన్ ఏర్పడినప్పుడు తొలి డీసీపీగా ఆయనే పని చేశారు. హుస్సేన్సాగర్లో ఆత్మహత్యల నిరోధానికి లేక్ పోలీసుస్టేషన్కు ఆనందే రూపమిచ్చారు. తాజాగా భారీ మార్పులు ఆయన నేతృత్వంలోని కమిటీ ద్వారానే జరగనుండటం విశేషం. (క్లిక్: మది దోచే మల్కంచెరువు..) -
Andhra Pradesh: పోలీస్శాఖలో పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీస్శాఖలో పునర్వ్యవస్థీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాలకు 48 అడిషనల్ ఎస్పీలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త జిల్లాలతో రాష్ట్రంలో సరికొత్త శకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. చదవండి: AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే? కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలు నియామకం కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 47 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మొత్తం 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
ఎచ్చెర్ల యథాతథంతో.. టీడీపీ ఎత్తులు చిత్తు
చక్కటి ప్రణాళిక, సమగ్రమైన అధ్యయనం, సలక్షణమైన నిర్ణయంతో జిల్లాలో వైఎస్సార్ సీపీ టీడీపీ నోరు మూయించింది. ఒక్క విమర్శకు కూడా తావు లేని విధంగా సిక్కోలు పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ‘ఎచ్చెర్ల’ వెళ్లిపోతే రోడ్డెక్కుదామని వేచి చూసిన ప్రతిపక్షానికి నోట మాట రాకుండా సమాధానం చెప్పింది. కీలకమైన ఆ ప్రాంతాన్ని సిక్కోలులోనే ఉంచేస్తూ టీడీపీకి ఊహించని షాకిచ్చింది. రాజాం, పాలకొండ వాసులకు కూడా మంచి జరిగేలా నిర్ణయం తీసుకుని ఆయా ప్రాంతాల అభిమానాన్ని చూరగొంది. సాక్షి, శ్రీకాకుళం: విమర్శ చేద్దామనుకున్న వారి నోళ్లు మూతబడ్డాయి. ఆందోళనలతో హడావుడి చేద్దామని భావించిన వారి నినాదాలు మూగబోయాయి. సిక్కోలు పునర్ వ్యవస్థీకరణలో ప్రభుత్వం సమగ్రమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చి, శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచడంతో ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వైఎస్ జగన్ సర్కారు ఈ నిర్ణయంతో వైరి పక్షం నోరు మూయించి, జనాల మనసులను మరోసారి గెలుచుకుంది. ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం ఎంపీ స్థానం పరిధిలో ఉండడంతో ఆ జిల్లాలోకి వెళ్లిపోతుందని చాలాకాలంగా వాదనలు జరుగుతున్నాయి. అలా జరిగితే జిల్లా కేంద్రంలోని కొంత భాగం వెళ్లిపోతుందని, పైడిభీమవరం, నవభారత్ పారిశ్రామిక వాడలతో పాటు ట్రిపుల్ ఐటీ, అంబేడ్కర్ యూనివర్సిటీ, ఐటీఐ, పాలిటెక్నికల్ కళాశాల, జిల్లా శిక్షణా నైపుణ్యాభివృద్ధి సంస్థ, వ్యవసాయ కళాశాల, పలు ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు, పో లీసు శాఖకు చెందిన ఏఆర్ విభాగం, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, ఫార్మా రంగం, జాతీయ రహదారి వంటివి జిల్లా కోల్పోతుందని అంతా అపోహలు సృష్టించారు. దీన్నే ఆయుధంగా చేసుకుని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ వేచి చూసింది. అయితే ప్రజలు, స్థానిక నాయకుల అభిప్రాయాల ను ప్రభుత్వం గౌరవించి ఎచ్చెర్లను శ్రీకాకుళంలోనే ఉంచడంతో టీడీపీ వ్యూహాలన్నీ చతికిలపడ్డాయి. చదవండి: (Andhra Pradesh New Districts: పెద్ద జిల్లా ప్రకాశం.. చిన్న జిల్లా విశాఖ) రెండు రెవెన్యూ డివిజన్లు.. 1466 రెవెన్యూ గ్రామాలు సరికొత్త సిక్కోలులో రెండు రెవెన్యూ డివిజన్లు, 921 పంచాయతీలు, 1466 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నా యి. వీటి పరిధిలో 5,53,830 కుటుంబాలు ఉంటాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో 16 మండలాలు, టెక్క లి రెవెన్యూ డివిజన్లో 14 మండలాలు ఉంటాయి. శ్రీకాకుళం డివిజన్లో ఇప్పటికే ఉన్న ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గా ల మండలాలు, ఎల్ఎన్పేట, నరసన్నపేట, పోలాకితో పాటు ఇంతవరకు పాలకొండ రెవెన్యూ డివిజన్లో ఉన్న కొత్తూరు, హిరమండలం, సారవకోట మండలాలు కలుస్తాయి. టెక్కలి డివిజన్లో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గా ల మండలాలు, జలుమూరుతో పాటు ఇప్పటివరకు పాలకొండ డివిజన్లో ఉన్న పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు కలుస్తాయి. ‘మన్యం’లోకి పాలకొండ.. బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో రాజాం కొత్తగా పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటయ్యే మ న్యం జిల్లాలో పాలకొండ కలవనుంది. ఇప్పటివరకు ఉన్న రెవెన్యూ డివిజన్ హోదా యథావిధిగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న రాజాం నియోజకవర్గ మండలాలు విజయనగరం జిల్లా పరిధిలోని బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో కలుస్తాయి. అలాగే, పాలకొండ డివిజన్లో ఉన్న పాతపట్నం నియోజకవర్గ మండలాలు టెక్కలి, శ్రీకాకుళం డివిజన్లలో విలీనమవుతాయి. పాతపట్నం, రాజాం నియోజకవర్గాల మండలాలు పోతుండగా, కొత్తగా కురుపాం ని యోజకవర్గంలోని జియ్యమ్మవలస, గరుగుబిల్లి కలవనున్నాయి. మొత్తం ఆరు మండలాలతో పాలకొండ రెవెన్యూ డివిజన్ కొనసాగనుంది. చదవండి: (కనుల ముందు కలల జిల్లాలు) మరింత సౌలభ్యం పునర్వ్యవస్థీకరణలో భాగంగా సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న విజయనగరం జిల్లాలో రాజాం నియోజకవర్గం కలవడంతో ఆ ప్రాంత వాసులకు మరింత సౌలభ్యం కలగనుంది. 18.84 లక్షల జనాభాతో 3,846 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విజయనగరం ఏర్పాటవు తుంది. రాజాం వాసులకు శ్రీకాకుళం కంటే విజయనగరంతోనే లావాదేవీలు ఎక్కు వ. వ్యాపార, ఇతర వ్యవహారాలు, సంబంధాలు కూడా అక్కడితోనే ఎక్కువ. ఇప్పుడు అధికారికంగా కూడా ఒక జిల్లాలోనే ఉండనున్నారు. ఇక, వారికి రెవెన్యూ డివిజన్గా ఉన్న బొబ్బిలి మరింత దగ్గరగా ఉండనుంది. రాజాం నియోజకవర్గం విలీనంతో విజయనగరం జిల్లాలోకి కొత్తగా 123 పంచాయతీలు, 171 రెవెన్యూ గ్రామాలు, 68,003 హౌస్ హోల్డ్స్ వెళ్లనున్నాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్: 16 మండలాలు (కొత్తగా కలిసేవి: కొత్తూరు, హిరమండలం, సారవకోట) టెక్కలి రెవెన్యూ డివిజన్: 14 (కొత్తగా కలిసేవి: పాతపట్నం, మెళియాపుట్టి) బొబ్బిలి రెవెన్యూ డివిజన్ : 11 (వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం, బొబ్బిలి, తెర్లాం, రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు,గజపతినగరం, మెరకముడిదాం) పాలకొండ రెవెన్యూ డివిజన్: 6 (వీరఘట్టం, సీతంపేట, పాలకొండ, భామిని, జియ్యమ్మవలస, గరుగుబిల్లి) పార్వతీపురం రెవెన్యూ డివిజన్ : 10 (కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం,పార్వతీపురం,సీతానగరం, బలిజిపేట, మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడ) పాలకొండకు అనుకూలం.. పాలకొండ నియోజకవర్గం విషయానికి వస్తే సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతో కలిసి 9.72లక్షల జనాభాతో 3,935 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో విలీనం అవుతుంది. దీని వల్ల జిల్లా కేంద్రం పార్వతీపురం వారికి మరింత దగ్గరవుతుంది. పాలకొండ వాసులకు కూడా శ్రీకాకుళం కంటే పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతోనే సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. ఈ నియోజకవర్గంలోని వీరఘట్టం ప్రజలు శ్రీకాకుళం రావాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. భామిని వాసులైతే 98 కిలోమీటర్లు ప్రయాణించాలి. కొత్త జిల్లా ఏర్పాటైతే వీరఘట్టం ప్రజలు 30 కిలోమీటర్లు, భామిని మండల ప్రజలు 70 కిలోమీటర్ల లోపే జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. పాలకొండ నియోజకవర్గం విలీనం కావడం వల్ల మన్యం జిల్లాలోకి 146 గ్రామ పంచాయతీలు, 226 రెవెన్యూ గ్రామాలు, 59,488 హౌస్ హోల్డ్స్ కలవనున్నాయి. సముచిత ప్రాధాన్యం.. పరిపాలనా సౌలభ్యం, సత్వర సే వలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టాం. వచ్చే నెల 26వ తేదీ వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తాం. మన జిల్లాకు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. – ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం శుభపరిణామం నూతన జిల్లాల ఏర్పాటు శుభ ప రిణామం. జిల్లాల వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. కొత్త జిల్లాలతో ప్రజలకు సేవలు మరింత వేగంగా అందుతాయి. సీఎం వినూత్న ఆలోచనలతో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. – తమ్మినేని సీతారాం, అసెంబ్లీ స్పీకర్ గొప్ప నిర్ణయం జిల్లాల పునర్విభజన గొప్ప పరిణామం. ఎచ్చెర్ల విషయంలో జిల్లా వాసులకు భయం ఉండేది. కానీ ఇక్కడి మనోభావాలను సీఎం గౌ రవించారు. ఇందులో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కృషి అధికంగా ఉంది. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మంత్రి సీఎంకు కృతజ్ఞతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అనిర్వచనీయం. పరిపాలనా సౌలభ్యం కోసం సులభతరంగా పర్యవేక్షణ చేసేందుకు వీలుగా శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నూతన అధ్యాయం అన్ని ప్రాంతాలకు సమన్యా యం జరిగేలా సీఎం వైఎస్ జగ న్మోహన్రెడ్డి కొత్త జిల్లాలకు రూపకల్పన చేశారు. ఇది నూతన అధ్యాయం. – డాక్టర్ కిల్లి కృపారాణి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు -
వేదాంత.. నాలుగు ముక్కలు!
న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత లిమిటెడ్ తన నిర్వహణలోని వివిధ వ్యాపారాలను వేరు చేసి, వాటిని లిస్ట్ చేసే యోచనతో ఉంది. వేదాంత లిమిటెడ్తోపాటు.. మరో మూడు వ్యాపారాలు సమాంతరంగా పనిచేసే విధంగా పునర్వ్యవస్థీకరణను పరిశీలిస్తున్నట్టు సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ‘‘మూడు వ్యాపారాలు వృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉంది. ఈ నమూనాలో వ్యాపారాలు విడిగా మరింత వృద్ధి చెందడమే కాకుండా, వాటాదారుల విలువ కూడా ఇతోధికం అవుతుంది’’ అని అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ప్రణాళికను అమలు చేసినట్టయితే వేదాంత వాటాదారుల వద్ద ప్రస్తుతం ఉన్న ఒక షేరు స్థానంలో నాలుగు షేర్లు ఉంటాయని చెప్పారు. ‘‘ఇది అంతర్జాతీయంగా ఉన్న నమూనానే. దేశీయంగా చూసినా హిందాల్కో, టాటా స్టీల్ కనిపిస్తాయి. ఇవి వేర్వేరు వ్యాపారాల్లో ఉన్నాయి. మేము కూడా ఇదే చేయాలనుకుంటున్నాం. దీనిపై తగిన సూచనల కోసం బోర్డు డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశాం. సమయం చెప్పలేను కానీ, వీలైనంత తొందర్లోనే దీన్ని అమలు చేస్తాం’’అని అగర్వాల్ వివరించారు. ఈ విషయమై సాయం కోసం అడ్వైజర్లను కూడా నియమించినట్టు చెప్పారు. వేదాంత సైతం ఈ విషయమై స్టాక్ ఎక్సేంజ్లకు సమాచారం ఇచ్చింది. కార్పొరేట్ నిర్మాణం ఎలా ఉండాలి? డీమెర్జర్, స్పిన్ ఆఫ్, వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఇలా అన్ని రకాల ఆప్షన్లను డైరెక్టర్ల కమిటీ అధ్యయనం చేయ నున్నట్టు తెలిపింది. అల్యూమినియం, ఐరన్ అండ్ స్టీల్, ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాలు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా ఉండాలన్నది తమ ఆలోచనగా పేర్కొంది. అదానీ గ్రూపు కూడా 2015లో పోర్ట్లు, విద్యుత్, మైనింగ్, ట్రాన్స్మిషన్ వ్యాపారాలను విడదీసి ప్రత్యేకంగా లిస్ట్ చేయడం తెలిసిందే. -
ఆజాద్పై వేటు.. ప్రియాంకకు చోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)ని పునర్వ్యవస్థీకరించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జీలను మారుస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ యువ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. అదేవిధంగా ఇటీవల పార్టీపై లేఖాస్త్రం సంధించిన బృందం నాయకుడు గులాం నబీ ఆజాద్ ను సీడబ్ల్యూసీలో కొనసాగిస్తూనే ప్రధాన కార్యదర్శి హోదా నుంచి తప్పించారు. ఆజాద్తో పాటు సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా, మల్లిఖార్జున ఖర్గే, అంబికా సోనీలను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించారు. 22 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయగా, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు సహాయపడేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయులైన ఆంటోనీ, అహ్మద్ పటేల్ తోపాటు అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలాలకు చోటు కల్పించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లోకి రెగ్యులర్ సభ్యులుగా చిదంబరం, రణ్దీప్ సూర్జేవాలా, తారిఖ్ అన్వర్, జితేంద్ర సింగ్లను తీసుకున్నారు. లుజిన్హొ ఫెలిరియో, మోతీలాల్ వోరా, ఆధిర్ రంజన్ చౌధురి, తామ్రధ్వజ్ సాహులను సీడబ్ల్యూసీ సభ్యత్వం నుంచి తొలగించారు. లిరియోను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. ఆజాద్ను హరియాణా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించి, వివేక్ బన్సాల్ను ఆ పదవిలో నియమించారు. సూర్జేవాలాను కర్నాటకకు, జితిన్ ప్రసాదను పశ్చిమబెంగాల్కు పార్టీ వ్యవహారాల ఇన్చార్జి్జలుగా నియమించారు. కాంగ్రెస్పార్టీలో సంస్కరణలు అవసరమని, క్రియాశీల అధ్యక్షుడి అవసరం పార్టీకి ఉందంటూ సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో.. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. సీడబ్యూసీ కొత్త సభ్యుల్లో దిగ్విజయ్, రాజీవ్ శుక్లా, మానికం టాగోర్, ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, హెచ్కే పాటిల్, సల్మాన్ ఖుర్షీద్, దినేశ్ గుండూరావు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉమెన్ చాందీని కొనసాగించగా, తెలంగాణ ఇన్చార్జిని మార్చారు. తెలంగాణ ఇన్చార్జిగా కుంతియా స్థానంలో తమిళనాడుకు చెందిన విరుధానగర్ ఎంపీ మాణిక్కం టాగూర్ నియమితులయ్యారు. ఇక, సీడబ్ల్యూసీలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్, తెలంగాణ నుంచి ఐఎన్టీయూసీ నేత బి.సంజీవరెడ్డిలకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం లభించింది. పార్టీ సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో మరో ఐదుగురు సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)ని నియమించారు. -
జీఎంఆర్ పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీఐఎల్) పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. లిస్టెడ్ కంపెనీ అయిన జీఐఎల్ నుంచి ఎనర్జీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలను వేరు చేయనుంది. ఎయిర్పోర్ట్స్ వ్యాపారం మాత్రమే జీఐఎల్లో భాగం కానుంది. ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రా, ఈపీసీ విభాగాలు కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీ జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్కు (జీపీయూఐఎల్) బదిలీ అవుతాయి. గురువారం సమావేశమైన బోర్డు ఈ మేరకు ఆమోదం తెలిపింది. పునర్వ్యవస్థీకరణ తర్వాత జీఐఎల్ వాటాదారులు జీపీయూఐఎల్లో అదే నిష్పత్తిలో వాటాదారులు అవుతారు. జీఐఎల్లో రూ. 1 ముఖ విలువ కలిగిన ప్రతి 10 షేర్లకుగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక జీపీయూఐఎల్ షేరును అదనంగా జారీ చేస్తారు. జీపీయూఐఎల్ లిస్టింగ్ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. ఎయిర్పోర్టులపై మరింత దృష్టి... పునర్వ్యవస్థీకరణ ద్వారా ఎయిర్పోర్టుల వ్యాపారంపై మరింత ఫోకస్ చేసే అవకాశం లభిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎయిర్పోర్టుల వ్యాపారం ఎన్నో రెట్లు వృద్ధి చెందింది. ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుందని వివరించింది. ‘కొన్నేళ్లుగా జీఐఎల్ ఎన్నో రెట్లు వృద్ధి సాధించింది. ఈ కంపెనీ కింద విభిన్న వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మౌలిక రంగ వ్యాపారంలో వృద్ధిని నడిపించడానికి ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలు ఉండాలని వాటాదారులు సూచిస్తున్నారు. పలు విధానాలను మేం పరిశీలిస్తున్నాం. ఇందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నాం. జీపీయూఐఎల్లో ఎయిర్పోర్టేతర వ్యాపారాలు వాటాదారులకు విలువ చేకూర్చేందుకు మెరుగైన స్థానంలో ఉన్నాయి’ అని జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో గ్రంధి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ఎయిర్పోర్టుల రంగంలో భారత్లో అతిపెద్ద ప్రైవేటు కంపెనీ అయిన జీఎంఆర్.. ఫిలిప్పైన్స్, ఢిల్లీ, హైదరాబాద్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. గోవా, గ్రీస్లో విమానాశ్రయాలను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణకు ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జీఎంఆర్ ఇన్ఫ్రాకు రూ.834 కోట్ల నష్టం జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.834 కోట్ల నష్టం మూటగట్టుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.336 కోట్ల నష్టం నమోదైంది. టర్నోవరు రూ.2,206 కోట్ల నుంచి రూ.1,224 కోట్లకు వచ్చి చేరింది. ఎయిర్పోర్ట్స్ విభాగం టర్నోవరు రూ.494 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇది రూ.1,460 కోట్లు నమోదైంది. మెరుగైన పనితీరుతో విద్యుత్ విభాగం టర్నోవరు రూ.116 కోట్ల నుంచి రూ.300 కోట్లకు ఎగసింది. -
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అధ్యయన కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసేందుకు తన అధ్యక్షతన ఐదుగురు అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్, సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎం కార్యాలయ అధికారి సభ్యులుగా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా ఉంటారు. ఈ కమిటీ నివేదికను మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలి. కమిటీకి అవసరమైన సమాచారాన్ని అన్ని శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అధ్యయన కమిటీకి ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాలు.. ► ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం. ► పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో నిర్దిష్ట బాధ్యతలున్నాయి. పునర్వ్యవస్థీకరణలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. ► ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలుండాలి. ► వీలైనంత తక్కువ వ్యయంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి. ►ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని భౌగోళిక సరిహద్దులు, పరిపాలన కేంద్రాలను సూచిస్తూ 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ సిఫార్సులు చేయాలి. దీనికోసమే కొత్త జిల్లాల ఏర్పాటు.. ► ప్రభుత్వ సేవలను, పాలనను ప్రజల గడప ముందుకే తీసుకువెళ్లడం ద్వారా వారిలో సంతృప్త స్థాయిని పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ► ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. ► ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించింది. -
ఒకే గొడుగు కిందకు ఇరిగేషన్
సాక్షి, హైదరాబాద్ : నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ, సచివాలయ భవన సముదాయం నిర్మాణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండు కీలక ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో సోమ, మంగళవారాల్లో విస్తృతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటిపారుదల శాఖ, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రులు, ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. సాగునీటి రంగం బలోపేతానికి.. ‘రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత పెరిగింది. దీన్ని గుర్తించిన కేసీఆర్, ఆ శాఖను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయాలని సంకల్పించారు. ప్రస్త తం నీటిపారుదల శాఖ శాఖోపశాఖలుగా ఉంది. భారీ, మధ్య, చిన్న తరహా, ఐడీసీ, ప్రాజెక్టులు, ప్యాకేజీలుగా విభజించి ఉంది. ఇదంతా ఒకే గొడుకు కిందికి రావాలని, తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని సీఎం భావించారు. అందుకే నీటి పారుదల శాఖను 15–20 ప్రాదేశిక విభాగాలుగా మార్చి, ఒక్కో దానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్ (సీఈ)ని ఇన్చార్జిగా నియమించాలని నిర్ణయించారు. ఆ సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్డ్యామ్లు సమస్తం ఉంటాయి. దీనికి సంబంధించి ముసా యిదా తయారు చేయాలని గతవారం జరిగిన సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ 2రోజుల పాటు నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్షాపు నిర్వహించి, ముసాయిదా రూపొందించారు. దీనిని సోమ వారం సీఎం కేసీఆర్కు సమర్పిస్తారు. దీనిపై సమీక్ష సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణ యం తీసుకుంటారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం కార్యదర్శి, ఈఎన్సీలు, సీఈలు పాల్గొంటారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సచివాలయం ఎలా ఉండాలి? తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం నాటి సమీక్షలో డిజైన్లపై, సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చిస్తారు. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. ఈ సమీక్షలో ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్గొంటారు. -
సాగునీటి శాఖకు కొత్త రూపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి శాఖ పూర్తిగా కొత్త రూపును సంతరించుకోనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సీఎం సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ మార్పుచేర్పులతో కూడిన ప్రక్రియ ముగింపు దశకు రాగా దీనికి ఒకట్రెండు రోజుల్లో ఆమోదం దక్కనుంది. రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి కావస్తుండటం.. కాల్వలు, పంపులు, పంప్హౌస్లు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ కత్తిమీద సాములా మారనున్న తరుణంలో విప్లవాత్మక చర్యలు అత్యంత కీలకం కానున్నాయి. భారీ, మధ్యతరహా, చిన్నతరహా అన్నింటినీ ఒకే గూటి కిందకు తేనున్నారు. ఈఎన్సీలు, సీఈల వారీగా ఏయే ప్రాజెక్టులు ఉంచాలి, ఎంత ఆయకట్టు వారి పరిధిలో ఉంటుందన్న దానిపై కసరత్తు పూర్తయింది. ఎత్తిపోతల పథకాల్లో ఎలక్ట్రో మెకానికల్, ప్రెషర్ మెయిన్స్, పంప్హౌస్ల నిర్వహణను చూసేందుకు గోదావరి, కృష్ణా బేసిన్ల వారీగా ఇద్దరు సీఈలను నియమించనున్నారు. చెరువులు, చెక్డ్యామ్ల పనులు చూసేందుకు బేసిన్ల వారీ ఇద్దరు సీఈలు ఉండే అవకాశం ఉంది. ప్రక్షాళన ఇలా... - కరీంగనర్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో 3 బ్యారేజీలు, పంప్హౌస్లతో పాటు ఎల్లంపల్లి బ్యారేజీతో పాటు దానికింద మిడ్మానేరు వరకు నీటిని ఎత్తిపోసే ప్యాకేజీలన్నీ రానున్నాయి. ఈ బ్యారేజీల పరిధిలో కొత్తగా చేపట్టే ఎత్తిపోతలు దీని పరిధిలోనే ఉండనున్నాయి. ఈఎన్సీ కింద మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టు ఉండనుంది. - శ్రీరాంసాగర్ సీఈ పరిధిలో లోయర్మానేరు వరకు మాత్రమే ఆయకట్టును పరిమితం చేయనున్నారు. దీంతోపాటుగా కడెం, సదర్మఠ్, ఆదిలాబాద్లోని కాళేశ్వరం ఆయకట్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ఉండనున్నాయి. మొత్తంగా 7.42లక్షల ఆయకట్టు ఉంటుంది. - కరీంనగర్లోని మరో ఈఎన్సీ పరిధిలో లోయర్మానేరు నుంచి దిగువన సూర్యాపేట వరకు ఉన్న ఆయకట్టును కొత్తగా చేర్చారు. దీంతో పాటే ఎల్లంపల్లి దిగువ ఆయకట్టు, మిడ్మానేరు నుంచి గౌరవెల్లి రిజర్వాయర్, దానికింద ఆయకట్టును తెచ్చారు. మధ్యతరహా ప్రాజెక్టులు ఈఎన్సీ కిందే ఉండనున్నాయి. మొత్తంగా 13లక్షల ఎకరాల ఆయకట్టు ఈఎన్సీ పరిధిలో ఉండనుంది. - నిజామాబాద్ సీఈ పరిధిలోకి కాళేశ్వరంపై ఆధారపడ్డ నిజాంసాగర్ ఆయకట్టు, మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటాయి. సీఈ కింద 6.82 లక్షల ఆయకట్టు ఉంటుంది. - వరంగల్ సీఈ పరిధిలో దేవాదుల, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండగా కొత్తగా సమ్మక్క బ్యారేజీని చేర్చారు. ఆయకట్టు 6.07 లక్షల ఎకరాలు. - ఆదిలాబాద్ సీఈ పరిధిలో ప్రాణహిత, చనాకా–కోరటా, పెనుగంగ, కుప్టి, కొమరంభీంతో పాటు మధ్యతరహా ప్రాజెక్టులు. మహబూబ్నగర్ సీఈ పరిధిలో జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు, గట్టు, భీమా, కోయిల్సాగర్, కల్వకుర్తి ఉండ నుండగా, ఆయకట్టు 11.95 లక్షల ఎకరాలు. - పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ఒక్క సీఈ పరిధిలో ఉండనుంది. ఆయకట్టు 12.30 లక్షల ఎకరాలు. - నల్లగొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు పాలేరు వరకు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు, డిండి, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఆయకట్టు 10.97 లక్షల ఎకరాలు. - ఖమ్మం సీఈ పరిధిలో సీతారామ, సీతమ్మసాగర్, పాలేరు దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు, భక్తరామదాస, మధ్యతరహా పథకాలు ఉంటాయి. ఆయకట్టు 7.16 లక్షల ఎకరాలు. - హైదరాబాద్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో మిడ్మానేరు నుంచి గంధమల వరకు ఉన్న ప్యాకేజీలతో పాటు, కొత్తగా సింగూరు, ఘణపూర్, మధ్యతరహా ప్రాజెక్టులను చేర్చారు. ఆయకట్టు 11.54 లక్షలు. -
వ్యాపార పునర్వ్యవస్థీకరణలో వాల్మార్ట్
న్యూఢిల్లీ: రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ తాజాగా భారత్లో వ్యాపార కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 56 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో 8 మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉండగా, మిగతా వారిలో.. మధ్య స్థాయి, కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఉద్వాసనకు గురైన వారిలో అత్యధిక శాతం మంది .. స్టోర్స్ విస్తరణలో కీలకమైన రియల్ ఎస్టేట్ విభాగంలోని వారే కావడం గమనార్హం. ‘మరింత మెరుగ్గా కార్యకలాపాలు నిర్వహించుకునే మార్గాలపై దృష్టి పెడుతున్నాం. దానికి అనుగుణంగానే కార్పొరేట్ స్వరూపంలో మార్పులు చేస్తున్నాం‘ అని వాల్మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ తెలిపారు. భారత్కు కట్టుబడి ఉన్నాం.. హోల్సేల్ రిటైల్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నామని, వీటి నుంచి నిష్క్రమించే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. గతేడాది కొత్తగా ఆరు బెస్ట్ ప్రైస్ హోల్సేల్ స్టోర్స్, ఒక ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ప్రారంభించినట్లు.. అమ్మకాలు 22 శాతం పెరిగినట్లు అయ్యర్ చెప్పారు. కస్టమర్లకు మరింతగా సేవలు అందించేందుకు అవసరమైన పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. అమెజాన్, జియోమార్ట్లతో పోటీ.. 2014 జులైలో పుణె, హైదరాబాద్లో బెస్ట్ ప్రైస్ స్టోర్స్తో వాల్మార్ట్.. భారత్లో హోల్సేల్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆన్లైన్, ఆఫ్లైన్ ఫార్మాట్ల ద్వారా విక్రయాలు జరుపుతోంది. 28 హోల్సేల్ స్టోర్స్ ఉన్నాయి. 2018లో ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. అయితే గత కొన్నాళ్లుగా పోటీ సంస్థ అమెజాన్.. దూకుడుగా ముందుకెడుతోంది. ఫ్యూచర్ రిటైల్తో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు ఇతరత్రా ఆఫ్లైన్ రిటైల్ సంస్థల్లోనూ వాటాలు దక్కించుకుంటోంది. మరోవైపు దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా జియో మార్ట్ పేరిట నిత్యావసరాల ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించింది. -
ఓయోలో 1,000 మందికి ఉద్వాసన..!
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ‘ఓయో’ 1,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కంపెనీని వీడి ఇతర సంస్థల్లో ఉద్యోగాలను చూసుకోవాలంటూ పలువురికి ఈ–మెయిల్స్ అందినట్లు వెల్లడైంది. అయితే, దీనిపై ఇప్పటివరకు కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు.‘రైట్–సైజింగ్’ పేరిట ఈ ఉత్తరాలు అందినట్లు సమాచారం. ప్రస్తుత ఏడాది కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై సంస్థ సీఈఓ రితేష్ అగర్వాల్ స్పందిస్తూ.. ఉద్యోగులను బయటకు వెళ్లి మరో సంస్థలో చేరమని కోరడం అంత సులువైన విషయం కాదని వ్యాఖ్యానించారు. -
కార్వీ వ్యాపార పునర్వ్యవస్థీకరణ
హైదదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలపై కఠిన చర్యలు ఎదుర్కొంటున్న కార్వీ గ్రూప్ .. తాజాగా వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టింది. ఆర్థిక సర్వీసులు, ఆర్థికేతర సర్వీసులుకింద రెండు విభాగాలుగా వ్యాపారాన్ని విభజించే ప్రక్రియ ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. తద్వారా గవర్నెన్స్ను, వ్యాపార నిర్వహణను మెరుగుపర్చుకోనున్నట్లు తెలిపింది. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, కమోడిటీల ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ తదితర వ్యాపారాలను ఆరి్థక సేవల విభాగం కింద చేర్చనున్నట్లు కార్వీ వివరించింది. అలాగే, డేటా మేనేజ్మెంట్ సేవలు, డేటా అన లిటిక్స్, మార్కెట్ రీసెర్చ్, అనుబంధ వ్యాపారాలు.. ఆర్థికేతర విభాగం పరిధిలో ఉంటాయని పేర్కొంది. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కూడా మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు తెలిపింది. ఆరి్థక సేవల వ్యాపార విభాగం గ్రూప్ సీఈవోగా అమితాబ్ చతుర్వేది నియమితులైనట్లు కార్వీ గ్రూప్ చైర్మన్ సి. పార్థసారథి తెలిపారు. ఫైనాన్షియల్ సరీ్వసెస్లో సుమారు మూడు దశాబ్దాలపైగా అనుభవం ఉన్న చతుర్వేది సారథ్యంలో సంస్థ కొత్త శిఖరాలు అధిరోహించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చతుర్వేది గతంలో ధనలక్ష్మి బ్యాంక్, రిలయన్స్ ఏఎంసీ, ఐసీఐసీఐ, ఎస్సెల్ గ్రూప్ తదితర సంస్థల్లో పనిచేశారు. కార్వీ బ్రాండ్ను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు, కొత్తగా నిధుల సమీకరణతో సంస్థను ఉన్నత స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తామని చతుర్వేది తెలిపారు. -
పెరగనున్న పురపరిధి..!
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పలు మునిసిపాలిటీల పరిధి పెరగనుండడంతో పాటు మరికొన్ని మునిసిపాలిటీల్లో ఉన్న వార్డుల పునర్విభజన జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆయా మునిసిపల్ కమిషన్లకు అందాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి మునిసిపాలిటీలోని జనాభాను వార్డుకు సరాసరి విభజించాలని ఆదేశాల్లో పేర్కొన్నా రు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన షెడ్యూల్లో అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్తర్వుల్లో ఇలా.. 2011 జనాభా ప్రకారం మదనపల్లె, పలమనేరు, నగరి, పుత్తూరు మునిసిపాలిటీలతో పాటు చిత్తూ రు మునిసిపల్ కార్పొరేషన్లో వార్డుల పునర్విభజన చేయాలని రాష్ట్ర పురపాలన పరిపాలనశాఖ సంచాలకులు విజయకుమార్ ఆదేశించారు. ఉదాహరణకు చిత్తూరు నగరంలో 1.89 లక్షల జనాభా ఉండగా.. ప్రతి డివిజన్లో సగటున 3,787 మంది చొప్పున (మొత్తం 50 డివిజన్లు) ఉండాలి. ఇందులో 10 శాతం తక్కువ, ఎక్కువ ఉండొచ్చు. అంతకన్నా తేడా ఉంటే దాన్ని సమీపంలోని వార్డుల్లో కలపాలి. ఇలా 2011 జనాభా లెక్కల ప్రకారం మదనపల్లెలో 35 వార్డులు, పలమనేరు 24 , నగరిలో 27, పుత్తూరులో 24 వార్డులు ఏర్పడ్డాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం సగటు జనాభా 10 శాతం ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా వార్డుల పునర్విభజన జరగనుంది. చిత్తూరు కార్పొరేషన్లో 46, 47, 49, 50వ డివిజన్లలో స్వల్ప వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన అధికారులు దీన్ని ఇతర డివిజన్లలో సర్దుబాటు చేయనున్నారు. అయితే కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య పెరగకపోగా.. మునిసిపాలిటీల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలీనం తప్పదా ? మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో శ్రీకాళహస్తి, పుంగనూరు మునిసిపాలిటీలతో పాటు తిరుపతి కార్పొరేషన్ పేరు ప్రస్తావించలేదు. అంటే శ్రీకాళహస్తి, పుంగనూరు మునిసిపాలిటీ పరిధిలోకి సమీపంలో ఉన్న పంచాయతీలను విలీనం చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీల విలీనం అనంతరం వీటిలో వార్డుల పునర్విభజన వర్తింపచేసే అవకాశాలున్నాయి. తిరుపతి కార్పొరేషన్కు సంబంధించి విలీన ప్రక్రియలో ఇప్పటికే న్యాయపరమైన సమస్యలుండా దీనిపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచురణ షెడ్యూల్ వార్డుల పునర్విభజన ముసాయిదాను సెప్టెంబరు 3వ తేదీ లోపు, అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబరు 11లోపు, 13వ తేదీ జాబితాను రాష్ట్ర మునిసిపల్ అధికారులకు పంపడం, అక్టోబర్ 10వ తేదీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీచేస్తుందని షెడ్యూల్లో పేర్కొన్నారు. చిత్తూరు కార్పొరేషన్లో మాత్రం వచ్చేనెల 24వ తేదీ డివిజన్ల వారీ జనాభాను ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తుంది. -
జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జెడ్పీపీలు, ఎంపీపీలకు పోస్టులు, సిబ్బంది కేటాయింపునకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల మొదటివారంలో కొత్త జెడ్పీపీలు, మండల పరిషత్ల నూతన పాలకమండళ్లు ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా మొత్తం 32 జెడ్పీపీలు, 539 మండలాల్లో సిబ్బంది కేటాయింపు, సర్దుబాటు, ఇతర అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. గతంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లా పరిషత్లలోని పోస్టులను కొత్తగా ఏర్పడిన 32 జిల్లా పరిషత్లలో సర్దుబా టు చేస్తారు. ప్రస్తుతం 9 జిల్లా పరిషత్లలో 9 మంది జెడ్పీ సీఈవోలు, 9 మంది డిప్యూటీ సీఈవోలు పనిచేస్తున్నారు. తొమ్మిది మంది డిప్యూటీ సీఈవోలను మరో 9 జిల్లాలకు సీఈవోలుగా, మిగిలిన 14 జిల్లాల్లో ఇదివరకే డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి పొందిన వారిని సీఈవోలుగా నియమించాలని ప్రభుత్వం సూచించింది. తొమ్మిది జెడ్పీలలో 9 మంది అకౌంట్స్ ఆఫీసర్లు (ఏవో) పనిచేస్తున్నందున, మిగిలిన 23 జిల్లాల్లో డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు పొందిన వారిని ఏవోలుగా నియమిస్తారు. పాత జెడ్పీపీలకు మంజూరైన పోస్టులన్నీ (రీ అలొకేట్ చేయాల్సిన మినహాయించి) కొత్త జెడ్పీపీలకు కేటాయిస్తారు. పని ఒత్తిడి ప్రాతిపదికన... కొత్త జిల్లాల్లో పని ఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి పోస్టులను జెడ్పీపీలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త జెడ్పీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా జెడ్పీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త జెడ్పీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త పరిషత్లకు కేటాయించాల్సిన మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త జెడ్పీపీలకు కేటాయించిన వారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీ జోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. సిబ్బంది విభజన... మునుపటి జెడ్పీపీ హెడ్క్వార్టర్గా ఉన్న జిల్లాల కలెక్టర్లు, వాటి పరిధిలో కొత్తగా ఏర్పడిన జిల్లాల కలెక్టర్లను సంప్రదించి సొంత ప్రాంతం, మండలం, సీనియారిటీ ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. జెడ్పీపీల్లోని మండలాల సంఖ్య నిష్పత్తికి అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు ఉంటుంది. జిల్లా పరిషత్లలో అందుబాటులో ఉన్న వాహనాలు, ఫర్నిచర్, మౌలిక వసతులు తదితరాలను కొత్త జెడ్పీపీలకు పాత జిల్లా కేంద్రాల కలెక్టర్లు పంపిణీ చేస్తారు. కొత్త జెడ్పీపీల కోసం భవనాలను (వీలైనంత మేరకు ప్రభుత్వ భవనాల్లోనే) జిల్లా కలెక్టర్లు గుర్తిస్తారు. పాత జెడ్పీపీల్లోని వాహనాలను కూడా కొత్తగా ఏర్పడిన జెడ్పీపీలకు మండలాల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. మండల పరిషత్లలో... కొత్తగా ఏర్పడిన 112 మండలాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 539 మండలాలుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో గత మండల ›ప్రజాపరిషత్(ఎంపీపీ) కార్యాలయాల్లోని పోస్టులను కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సర్దుబాటు చేస్తారు. కొత్త మండలాల్లో పనిఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి కొత్త పోస్టులను కొత్త ఎంపీపీలకు కేటాయిస్తారు. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త ఎంపీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా ఎంపీపీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త ఎంపీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త మండల పరిషత్ల అవసరాల మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త పరిషత్లకు కేటాయించినవారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీజోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. రద్దయిన మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిని సమీప మండలాలు లేదా కొత్తగా ఏర్పడిన మండలాల్లో సర్దుబాటు చేస్తారు. కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సీనియారిటీ అధారంగా ఈవోపీఆర్డీ, సూపరింటెండెంట్లను ఇన్చార్జి ఎంపీడీవోలుగా జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. 32 జెడ్పీపీ చైర్పర్సన్లు, సీఈవోలు, ఇతర సిబ్బంది, 112 ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీడీవోలు, ఇతర సిబ్బంది అవసరాలకు తగ్గట్టుగా ఫర్నిచర్ను కేటాయిస్తారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పెంచుతారా?
సాక్షి, హైదరాబాద్: జిల్లాలు, మండలాల పునర్విభజనలో భాగంగా కొన్నింటి పరిధి మరీ చిన్నగా మారడం ఇప్పుడు సమస్యగా పరిణమిస్తోంది. గతంలోని ఉమ్మడి 9 జిల్లా పరిషత్ల స్థానంలో కొత్తగా 32 జిల్లా పరిషత్లు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్వి భజనలో పరిమితంగా కొన్ని మండలాలతో ఏర్పడిన కొన్ని జెడ్పీలు, పరిమితంగా కొన్ని గ్రామాలతో ఏర్పడిన కొన్ని మండల ప్రజాపరిషత్లలో పాలకవర్గాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న మీమాంసకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు గురవుతున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో 4 గ్రామీణ మండలాలు, వరంగల్–అర్బన్ జిల్లాలో 7 గ్రామీణ మండలాలు, నారాయణపేటతోపాటు కొన్ని జిల్లాల్లోనూ తక్కువ సంఖ్యలో మండలాలు ఉండడంతో అలాంటి చోట్ల పాలకవర్గాలను ఎలా ఏర్పాటు చేస్తే బావుంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. కొన్ని స్థానాలే ఉన్నచోట జెడ్పీపీ చైర్పర్సన్, వైస్చైర్మన్ పదవులు పోగా మిగిలినసభ్యుల సంఖ్య తక్కువగా ఉంటే ఆ జెడ్పీ లేదా ఎంపీపీ మనుగడ ఎలా అని అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 15–20 వేల జనాభాకు ఒక జెడ్పీటీసీ... గతంలో ఒక మండలాన్ని జెడ్పీటీసీ స్థానంగా, గ్రామాన్ని లేదా మూడున్నర నాలుగు వేల జనాభా గత ప్రాంతాన్ని ఎంపీటీసీగా పరిగణిస్తూ వచ్చారు. కొత్తగా 32 జిల్లాలు ఏర్పడిన దృష్ట్యా, మండలాల సంఖ్య మరీ తక్కువగా ఉన్న జిల్లాల్లో, గ్రామాల సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సంఖ్య పెంచితే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. జెడ్పీటీసీ స్థానాలను 15–20 వేల మధ్య జనాభాకు ఒక జెడ్పీటీసీ స్థానం ఏర్పాటు చేయాలని, రెండున్నర, మూడువేల జనాభాలోపు ఎంపీటీసీ స్థానంగా పరిగణించాలని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు తెలుస్తోంది. ఆయా పదవులకు రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చునని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
గ్రూప్ఎమ్లో భారీ పునర్వ్యస్థీకరణ
హైదరాబాద్: డేటా సెంట్రిక్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసుల దిగ్గజ సంస్థ, గ్రూప్ఎమ్లో ఉన్నత స్థాయిలో భారీ పునర్వ్యస్థీకరణ చోటు చేసుకుంది. గ్రూప్ ఎమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సౌత్ ఏషియా) ప్రశాంత్ కుమార్ నియమితులయ్యారు. ప్రెసిడెంట్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్గా (సౌత్ ఏషియా) తుషార్ వ్యాస్ నియమితులయ్యారు. అలాగే గ్రూప్ఎమ్ కంపెనీలో ఒక విభాగమైన మైండ్షేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా (సౌత్ ఏషియా) పార్థసారధి మాండ్యం, మైండ్ షేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా (సౌత్ ఏషియా) అమిన్ లఖానీ నియమితులయ్యారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త పునర్వ్యస్థీకరణ తమ క్లయింట్ల విజయానికి మరింతగా దోహదపడగలదన్న ధీమాను గ్రూప్ఎమ్ వ్యక్తం చేసింది. సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రశాంత్ కుమార్, తుషార్ వ్యాస్లు విజయవంతమైన ఫలితాలు అందించారని గ్రూప్ఎమ్ సౌత్ ఏషియా సీఈఓ శామ్ సింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
కేసు ఒక స్టేషన్లో.. పంచనామా మరో చోట
పీఎం లంక, ఎల్బీ చర్ల నరసాపురం మండలంలోని గ్రామాలు. ఈ గ్రామాల్లో ఏదైనా సమస్య ఎదురై పోలీస్స్టేషన్కి వెళ్లాలంటేనరసాపురం రూరల్ పోలీస్స్టేషన్కి కాకుండా 18 కిలోమీటర్ల దూరంలోని మొగల్తూరు పోలీస్స్టేషన్కి వెళ్లాల్సి ఉంది. పశ్చిమగోదావరి,నరసాపురం: ఏదైనా సమస్య ఎదురైతే సొంత మండలంలోని పోలీస్స్టేషన్ కాకుండా దూరంగా ఉన్న వేరే మండలంలోని పోలీస్స్టేషన్కి ఆయా గ్రామాల ప్రజలు వెళ్లాల్సి వస్తోంది. ఇదీ నరసాపురం పోలీస్ సబ్డివిజన్లో పరిస్థితి. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్ల పరిధిల్లో మార్పులు చేపట్టకపోవడంతో ప్రజలే కాకుండా, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య ఉన్నా కూడా పోలీస్శాఖ పట్టించుకోకపోవడం విశేషం. సబ్ డివిజన్లో 19 పోలీస్స్టేషన్లు నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో ఆరు సర్కిల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో మొత్తం 19 పోలీస్ స్టేషన్లున్నాయి. నరసాపురం పట్టణం, రూరల్, మొగల్తూరు, పాలకొల్లు, పాలకొల్లు రూరల్, ఆచంట, పోడూరు, యలమంచిలి, వీరవాసరం, పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర, భీమవరం 1 టౌన్, భీమవరం 2 టౌన్, భీమవరం రూరల్, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. ప్రధాన సమస్య ఏమిటంటే నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు రూరల్, భీమవరం రూరల్ ప్రాంతాల పోలీస్ స్టేషన్ల పరిధి స్టేషన్లు ఏర్పాటు చేసిన నాటి నుంచి పాలనా పరమైన ఇబ్బందులతో పోలీస్ సిబ్బంది సతమతమవుతున్నారు. దీంతో పాటు ఫిర్యాదుదారులు అనేక అవస్థలు పడుతున్నారు. నరసాపురం రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మత్స్యపురి, తుందుర్రు గ్రామాలు నరసాపురం మండల పరిధిలోకి రావు. తుందుర్రు భీమవరం మండల పరిధిలో ఉండగా, మత్స్యపురి గ్రామం వీరవాసరం మండలంలోనిది. అలాగే నరసాపురం రూరల్ మండలంలోని ఎల్బీ చర్ల, పసలదీవి, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక గ్రామాలు ప్రస్తుతం మొగల్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్నాయి. దీనివల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే భీమవరం మండలానికి చెందిన వెంప గ్రామం ప్రస్తుతం మొగల్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఉంది. దీనివల్ల అటు పోలీస్ సిబ్బంది, ఇటు కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే తణుకు మండలానికి చెందిన రెండు గ్రామాలు ఇరగవరం పోలీస్స్టేషన్ పరిధిలోకి వచ్చాయి. పాలకొల్లు మండలానికి చెందిన అడవిపాలెం పోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఉంది. అమలుకు నోచుకోని ప్రభుత్వ నిర్ణయం ఏ మండలంలోని గ్రామాలు ఆయా మండలాల పోలీస్స్టేషన్ల పరిధిలోనే ఉండేలా చర్యలు చేపట్టాలని 2008లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం ఆలోచన ఇంతవరకూ అమలు కాలేదు. ఈలోపు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది. అలాగే గతంలో డీఎస్పీలుగా పని చేసిన అనేకమంది అధికారులు ఇక్కడ పడుతున్న ఇబ్బందులను, స్టేషన్ల పరిధిల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఉన్నతాధి కారులకు లేఖలు రాశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ పోలీస్స్టేషన్ల పరిధిలో నేరాలు జరిగితే కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణకు, శవ పంచనామాకు మరో మండలానికి చెందిన రెవెన్యూ అధికారులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో పాటు ఫిర్యాదుదారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాక సంబంధిత కీలక రెవెన్యూ పత్రాలను ఆయా మండల కేంద్రాలకు వెళ్లి తిరిగి తమ ప్రాంత పోలీస్స్టేషన్ అధికారులకు అందించాల్సి వస్తోంది. ప్రతి నియోజక వర్గానికి ఓ సర్కిల్ కార్యాలయం ఉండేలా స్టేషన్లను పునర్ వ్యవస్థీకరించాలని నాలుగేళ్ల క్రితం పోలీస్శాఖ నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం రాకపోవడంతో ఫైల్ పెండింగ్లోనే ఉంది. ఇప్పటికైనా స్టేషన్ పరిధిల్లో మార్పులు అంశాన్ని పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. -
పన్నుల శాఖలో బదిలీలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: పన్నుల శాఖలో ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడింది. శాఖ పునర్ వ్యవస్థీకరణ సాకుతో బదిలీలను అధికారులు నిలిపేశారు. ఏడాదిగా పెండింగ్లో ఉన్న పునర్ వ్యవస్థీకరణ చేపడుతున్నందున అది పూర్తయ్యేవరకు బదిలీలుండవని తేల్చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పనిభారం పెరగడంతో సర్కిళ్లను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించిన అధికారులు.. ఒక్కో సర్కిల్లో 1,500–2,200 మంది డీలర్లు ఉండేలా ప్రస్తుత 91 సర్కిళ్లకు అదనంగా మరో 5 కలిపి 96 సర్కిళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ డివిజన్ల పెంపుపై మాత్రం ప్రతిపాదన చేయలేదు. 8 నుంచి 10 సర్కిళ్లు కలిపి ఓ డివిజన్గా ఏర్పాటు చేస్తామని, అవసరమైతే డివిజన్ల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు. బదిలీల నిలిపివేతపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు.. పునర్ వ్యవస్థీకరణ చేయడంలో తమకు ఇబ్బంది లేదని, కానీ ఆ కారణంతో బదిలీలు నిలిపేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. జీఎస్టీ నాటి ప్రతిపాదన గతేడాది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. దీని వల్ల పన్నుల శాఖ పరిధిలోని ఉద్యోగులపై అదనపు భారం పడుతుందని.. వెంటనే సర్కిళ్లు, డివిజన్లను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. 120 సర్కిళ్లు, 15 డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. అయితే అప్పటి నుంచి ఆ ఫైలు పెండింగ్లో ఉంది. అదే సాకుతో పదోన్నతులనూ అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ పునర్ వ్యవస్థీకరణ అంటూ బదిలీలు ఆపుతుండటంతో ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐదేళ్లుగా బదిలీల్లేవని, ఈ సాకుతో మళ్లీ నిలిపితే ఇప్పట్లో బదిలీలు జరగవేమోనని ఆందోళన చెందుతున్నారు. -
పోలీస్ రేంజ్లపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జోన్లు, మల్టీజోన్ల పునర్వ్యవస్థీకరణతో పోలీస్ శాఖలోనూ నూతన రేంజ్లు, జోన్ల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో రెండు జోన్లు, నాలుగు రేంజ్లు ఉన్నాయి. వెస్ట్జోన్ (హైదరాబాద్) కింద ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలున్నాయి. అదేవిధంగా నార్త్జోన్ (వరంగల్) కింద ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉన్నాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు వెస్ట్జోన్ కింద, మరికొన్ని ప్రాంతాలు నార్త్జోన్ కిందకు వచ్చాయి. దీనితో సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ల పోస్టింగులు, వారి పై తీసుకునే క్రమశిక్షణ చర్యలు, మానిటరింగ్ తదితరాల పర్యవేక్షణకు సరిహద్దు సమస్యలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న జోన్లు, మల్టీజోన్లతో పోలీస్ శాఖలో రేంజ్లు, జోన్ల పునర్వ్యవస్థీకరణ క్లారిటీ వచ్చినట్టుగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఒక్కో జోన్ కింద రెండు రేంజ్లున్నాయి. జోన్లకు ఐజీ హోదా కలిగిన అధికారులుండగా, రేంజ్లను డీఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నూతనంగా మరో రెండు... ప్రస్తుతం కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ రేంజ్లుండగా, వీటికి తోడుగా మరో రెండు రేంజ్లు ఏర్పాటు చేసే అవకాశముందని పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. అదేవిధంగా ఇప్పుడున్న రేంజ్ల పేర్లు కూడా మార్పు జరిగే అవకాశం ఉందని, మొత్తంగా 6 రేంజ్లకు కొత్తపేర్లతో పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో రేంజ్ కింద 5 జిల్లాల పోలీస్ యూనిట్లు పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ జోన్తో పాటు మరో జోన్ కూడా ఏర్పాటు జరిగితే ఒక్కో జోన్ కింద రెండు రేంజ్ల పర్యవేక్షణ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. నూతనంగా ఏర్పడిన కమిషనరేట్లలో బదిలీలు, క్రమశిక్షణ చర్యలు ఎవరి అధీనంలో ఉండాలన్న దానిపై త్వరలో క్లారిటీ వస్తుందని, ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తామని సీనియర్ ఐపీఎస్లు స్పష్టం చేశారు. -
స్కూటర్స్ ఇండియా పునర్వ్యవస్థీకరణకు ఆమోదం
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ స్కూటర్స్ ఇండియా సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు తోడ్పడే దిశగా ఖాతాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నష్టాలకు ప్రతిగా ప్రభుత్వ ఈక్విటీని రూ.85.21 కోట్ల మేర తగ్గించడం ద్వారా ఖాతాలను పునర్ వ్యవస్థీకరించనున్నట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. దీనికి అనుగుణంగా 2012–13 తర్వాత నుంచి స్కూటర్స్ ఇండియా బ్యాలెన్స్ షీట్లను క్రమబద్ధీకరించడం జరుగుతుందని పేర్కొంది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహంలో భాగంగా.. స్కూటర్స్ ఇండియాలో 100 శాతం వాటాలను విక్రయించేందుకు భారీ పరిశ్రమల శాఖ బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
మార్పులు..చేర్పులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎట్టకేలకు మూడు దశాబ్దాల తర్వాత నగరంలో పోలీస్స్టేషన్ల పునర్విభజన జరిగింది. మొదట్లో 1898లో నెల్లూరు నగరంలో వన్టౌన్ పోలీస్స్టేషన్ను అప్పటి బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేశారు. తర్వాత 1970లో మరో మూడు పోలీస్స్టేషన్లు ఏర్పడ్డాయి. అప్పటికి నెల్లూరు జనాభా 65 వేలు మాత్రమే. ఆ తర్వాత 1990 నుంచి 1992 మధ్య ఐదు, ఆరు టౌన్ల పోలీస్స్టేషన్లు ఏర్పడ్డాయి. మళ్లీ కొన్ని దశాబ్దాల తర్వాత నగరంలోని పోలీస్స్టేషన్ల పునర్విభజనతో పాటు స్టేషన్ల పేర్లు, సరిహద్దులు, పరిధిని పెరిగిన జనాభా, పెరిగిన సరిహద్దుల విస్తీర్ణానికి అనుగుణంగా మార్చారు. దీంతో నెల్లూరు నగరంలో వన్ టౌన్, టూ టౌన్ స్టేషన్లుగా కాకుండా ప్రాంతాల పేర్లతో పనిచేయనున్నాయి. స్టేషన్ల భౌగోళిక హద్దులతో పాటు ఎఫ్ఐఆర్ నమోదుల్లో కూడా స్టేషన్ల పేర్లు మారనున్నాయి. రేపట్నుంచి అమలు నగరంలో 8 లక్షల జనాభా, 26 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగరం విస్తరించింది. ఆరు పోలీస్స్టేషన్లను పునర్విభజన చేస్తూ జీఓ ఎమ్మెస్ నంబర్ 48ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీఓ గురువారం నుంచి నగరంలో అమల్లోకి రానుంది. నగరంలో కొన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జనాభా సంఖ్య, నేరాల సంఖ్య తక్కువగా ఉండగా, మరికొన్ని పోలీస్స్టేషన్లలో అత్యధికంగా ఉండటంతో శాంతిభద్రతలను పరిరక్షించడం కత్తిమీద సాములా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది కొరత ఉన్నా, కొత్తగా పెంచే అవకాశాల్లేవు. దీంతో స్టేషన్ల హద్దులకు మార్పులు, చేర్పులు చేసి ఎక్కువ పరిధి ఉన్న స్టేషన్లను కొంత తగ్గించి ఇతర పోలీస్స్టేషన్లలో ఆ ప్రాంతాలను విలీనం చేస్తూ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. పేర్లు, పరిధుల మార్పు ఇలా.. ♦ నెల్లూరు ఒకటో నగర పోలీస్స్టేషన్ పేరును చిన్నబజార్ పీఎస్గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని పుత్తా ఎస్టేట్స్, పరమేశ్వరినగర్, రాజీవ్గృహకల్ప, నాలుగో నగర పీఎస్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్, ఫతేఖాన్పేట, అరవిందనగర్, జూబ్లీ హాస్పిటల్, మద్రాస్ బస్టాండ్, ముత్తుకూరు బస్టాండ్ ఈ పీఎస్ పరిధిలో కలిశాయి. ♦ నెల్లూరు రెండో నగర పీఎస్ పేరును నవాబుపేట పీఎస్గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని వెంకటేశ్వరపురం, జనార్దన్రెడ్డికాలనీ, పరమేశ్వరినగర్ నవాబుపేట పీఎస్ పరిధిలోకి వచ్చాయి. ♦ నెల్లూరు మూడో నగర పీఎస్ పేరును సంతపేట పోలీస్స్టేషన్గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని గాంధీగిరిజన కాలనీ ఈ స్టేషన్ పరిధిలోకి చేరింది. ♦ నాలుగో నగర పీఎస్ పేరును దర్గామిట్ట పీఎస్గా మార్చారు. ఒకటో నగర పీఎస్ పరిధిలోని బారాషహీద్దర్గా, కలెక్టర్ బంగ్లా, డీకేడబ్ల్యూ కళాశాల, పోలీస్ కార్యాలయం, ఐదో నగర పీఎస్ పరిధిలోని ప్రగతినగర్, జీజీహెచ్, రాజరాజేశ్వరి దేవాలయం, ఏసీ స్టేడియం, పోలీస్ కాలనీ, రెవెన్యూ కాలనీ, జ్యూడీషియల్ క్వార్టర్స్, జెడ్పీకాలనీ, పోస్టల్కాలనీ, నగర డీఎస్పీ కార్యాలయం దర్గామిట్ట పీఎస్ పరిధిలోకి వచ్చాయి. ♦ ఐదో నగర పీఎస్ పేరును వేదాయపాళెం పీఎస్గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని కొత్తూరు, అంబాపురం దీని పరిధిలోకి వచ్చాయి. ♦ ఆరో నగర పీఎస్ బాలాజీనగర్ పీఎస్గానే కొనసాగనుంది. నాలుగో నగర పీఎస్ పరిధిలోని రామలింగాపురం, హరనాథపురం, మినీబైపాస్లోని టీడీపీ కార్యాలయం, ముత్యాలపాళెం, నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఈ స్టేషన్ పరిధిలోకి వచ్చాయి. సిబ్బంది నామమాత్రం పెరిగిన దానికి అనుగుణంగా సిబ్బంది కేటాయింపులు జరగకపోవడంతో ఉన్న అరకొర సిబ్బందితోనే స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతలను పరిరక్షించాలి. ఒక్కో స్టేషన్లో సుమారు 20కుపైగా ఖాళీలు ఉన్నాయి. ఉన్న వారిలో పది మందికి పైగా ఇతర విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కేవలం 20 నుంచి 25 మంది మాత్రమే డ్యూటీలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ఉన్న వారిపైనే పనిఒత్తిడి పెరగనుంది. కేసుల పరిష్కారంలోనూ తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. -
సహకార పునర్విభజన ఎప్పుడో?
రైతన్నకు వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) సేవలు విస్తృతం కావడంలేదు. ఆయా సంఘాల పరిధి ఎక్కువగా ఉండటం.. గ్రామాలకు దూరంగా సంఘాలు ఉండడంతో అన్నదాత ఇబ్బందులు పడాల్సివస్తోంది. జిల్లాలో 18 మండలాలుండగా.. 51 సహకార సంఘాలున్నాయి. కొత్తగా ఏర్పడిన బుగ్గారం మండలంలో ఒక్క సహకార సంఘం లేదు. కొన్ని మండలాల్లో రెండు, మూడు గ్రామాలకు ఒక సహకార సంఘం ఉండగా.. మరికొన్ని మండలాల్లో 8 నుంచి 10 గ్రామాలకు ఒకటి ఉండటంతో దూరం భారంగా మారింది. కథలాపూర్(వేములవాడ) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పల్లెల్లోని రైతులకు పట్టుగొమ్మలాంటివి. పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. పంటలను కొనుగోలు చేస్తూ సేవలందిస్తున్నాయి. వీటి విస్తర్ణ గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిస్థాయి సేవలందడంలేదని అపవాదు ఉంది. 51 సొసైటీలు.. 95 వేల మంది సభ్యులు జిల్లాలో 18 మండలాలకు ప్రస్తుతం 51 సొసైటీలున్నాయి. ఇందులో 95,386 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రైతులు ప్రతి పంట సీజన్లో రుణాలు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు కొత్తగా రుణాలు తీసుకుంటారు. వీటికోసం దూరంలో ఉన్న సొసైటీలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన బుగ్గారం మండలంలో ఒక్క సహకార సంఘం లేదు. దీంతో ఆ మండల రైతులు ఇతర మండలంలోని సొసైటీకి వెళ్లాల్సిందే. జిల్లాలో కొన్ని సొసైటీల పరిధిలో తక్కువ గ్రామాలుండగా.. మరికొన్ని సొసైటీలకు ఎక్కువ గ్రామాలున్నాయి. గ్రామాలకు దూరంగా ఉన్న సొసైటీలకు వివిధ పనులకు రైతులు వెళ్లిరావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రుణాలకోసం, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో రాజకీయ చైతన్యం, పలుకుబడి గల మండలాలు చిన్నవైనప్పటికీ రెండు నుంచి మూడు సొసైటీలు ఉన్నాయి. మిగతా మండలాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. విభజిస్తేనే ప్రయోజనం... వ్యవసాయంలో రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడే సహకార సంఘాల సేవలు అందుబాటులోకి రావాలంటే వాటిని విభజించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కొత్తగా 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించింది. అదే తరహాలో రైతులకు అందుబాటులో ఉండేలా సొసైటీలను విభజించాలని రైతులు కోరుతున్నారు. ఒక్కో సొసైటీలో వేలాది మంది రైతులు సభ్యత్వం ఉండగా.. ఏ అవసరం వచ్చిన క్యూ కట్టాల్సి వస్తోంది. ప్రతి సీజన్ ఆరంభంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు బారులు తీరిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం సొసైటీల విభజనపై దృష్టి సారించాలని జిల్లాలోని రైతులు కోరుతున్నారు. సొసైటీ లేక ఇబ్బంది.. మా ఊరిలో సహకార సంఘం లేదు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూషణరావుపేట సొసైటీ పరిధిలో మా గ్రామం ఉంది. వివిధ అవసరాల కోసం అక్కడకు రైతులు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. సీజన్లో పంట రుణాల కోసం పోతే ఒక్కరోజంతా వృథా అవుతుంది. మా ఊరికి సమీపంలో సొసైటీ ఏర్పాటు చేయాలి. –కారంగుల చంద్రయ్య, కలిగోట, కథలాపూర్ ఆదేశాలు వస్తే పునర్విభజన.. సొసైటీల పునర్విభజన అనేది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉంటుంది. జిల్లాలో బుగ్గారం మండలంలో ఒక్క సహకార సంఘం లేదు. ఆ మండలంలో కొత్తగా సహకార సంఘం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారుచేశాం. మిగతా సొసైటీల పునర్విభజన అనేది ప్రభుత్వం నిర్ణయం బట్టి ఉంటుంది. –రామానుజచార్యులు, జిల్లా సహకార అధికారి -
మావో పార్టీలో పునర్వ్యవస్థీకరణ
కోల్కతా: నిషేధిత సీపీఐ–మావోయిస్టు పార్టీలో పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా వృద్ధ నేతలకు విరామం ఇచ్చి, వారి సేవలను ఇతర రంగాల్లో వినియోగించుకుంటోంది. ఈ ఏడాది ఆరంభంలో పార్టీ కేంద్ర నాయకత్వం సమావేశమై ఈ దిశగా చర్యలను ప్రారంభించింది. ఈ వివరాలున్న మూడు పేజీల సర్క్యులర్ను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ వివిధ అనుబంధ విభాగాలకు అందజేసింది. ఉద్యమ అవసరాల రీత్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అందులో పేర్కొంది. భద్రతా బలగాలు, పోలీసులు జల్లెడ పడుతున్న ప్రాంతాల్లో చురుగ్గా వ్యవహరించలేని అజ్ఞాతంలో ఉన్న సీనియర్ నేతలను రక్షించుకోవటం కూడా కీలకమని అందులో పేర్కొంది. పార్టీ నిర్దేశించిన విధులను సరిగ్గా నిర్వహించలేని వృద్ధ నేతలను, శారీరకంగా చురుగ్గా లేని వారిని గుర్తించాలని ఆ సర్క్యులర్లో కోరింది. వారిని బాధ్యతల నుంచి తప్పించి పార్టీ అనుబంధ సంఘాల ఏర్పాటు, ఇతర ప్రాంతాల్లో ఉద్యమ నిర్మాణం బాధ్యతలను అప్పగించాలని సూచించింది. అయితే, ఇందుకు వయో పరిమితిని మాత్రం నిర్దేశించలేదు. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకు 67 ఏళ్లు, తూర్పు ప్రాంత బ్యూరో ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా వయస్సు 72 ఏళ్లు, కేంద్ర మిలటరీ కమిషన్ చీఫ్ వాసవరాజ్కు 62 ఏళ్లు కావటం గమనార్హం. అయితే, ఇలాంటి ప్రక్షాళన మావోయిస్టు పార్టీకి కొత్తేమీ కాదని పశ్చిమబెంగాల్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో 1960–70లలో కూడా ఇలాంటివి జరగాయని తెలిపారు. అప్పట్లో సీనియర్ నేతల సేవలను ఉద్యమ సమావేశాలు వంటివి నిర్వహించటానికి వినియోగించుకున్నారన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్లో భారీ మార్పులు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయా? తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశలో పీసీసీకి అనుబంధంగా లేదా సమాంతరంగా మరిన్ని కమిటీలు ఏర్పాటు కానున్నాయా? పార్టీ సీనియర్లు, సామాజిక సమతుల్యత వంటివాటికి ప్రాధాన్యత ఇవ్వనుందా? ఇలాంటి ప్రశ్నలకు సీనియర్ నేతలు అవుననే సమాధానం ఇస్తున్నారు. పార్టీలో నాయకత్వ సమస్యను పరిష్కరించడానికి పలు మార్పులూ చేర్పులను చేపట్టనున్నట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ బాధ్యతలను తీసుకున్న తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లోని సమస్యలను పరిష్కరించడానికి, పార్టీ సీనియర్లను ఏకతాటిపైకి తీసుకురావడానికి కీలకమైన చర్యలను తీసుకుంటారని చెబుతున్నారు. ఇందుకోసం పార్టీలో కొంత పేరు, పని చేయగలిగే సత్తా ఉన్న వారికి తగిన బాధ్యతలను అప్పగించాలనే ఏఐసీసీ స్థాయి లో స్థూలంగా నిర్ణయాలు జరిగాయని పార్టీ జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషిస్తున్న నేత ఒకరు వెల్లడించారు. సీడబ్ల్యూసీలోకి కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డిని తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. పొన్నాల, సర్వేలకూ అవకాశం.. కేంద్ర మంత్రిగా పలు కీలకమైన శాఖలకు పని చేసిన జైపాల్రెడ్డి సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే సీనియర్లు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ వంటివారికి కూడా జాతీయ స్థాయిలోనే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇప్పటికే వి.హన్మంతరావు, మధు యాష్కీ, చిన్నారెడ్డి వంటివారికి ఏఐసీసీలో బాధ్యతలున్నాయి. వీరితోపాటు మరో ఇద్దరు, ముగ్గురికి ఏఐసీసీలో అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. అలాగే రాష్ట్రస్థాయిలో మరికొందరు ముఖ్యనేతలకు అవకాశాలు కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరికి కీలక అవకాశం కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న సినీ నటి, మాజీ ఎంపీ ఎం.విజయశాంతికి పార్టీలో తగిన వేదికను కల్పించాలనే ప్రతిపాదన ఏఐసీసీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికి కీలకమైన అవకాశాలను కల్పించాలనే యోచన ఏఐసీసీకి ఉన్నట్టు సమాచారం. వీరికి తగిన అవకాశాలను కల్పించే ప్రతిపాదనపై విజయశాంతి, కోమటిరెడ్డి సోదరులతోనూ ఏఐసీసీ ముఖ్యులు ప్రాథమికంగా చర్చలను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్లో చేరిన రేవంత్రెడ్డికి పీసీసీలో కీలక అవకాశాన్ని కల్పిస్తారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ పూర్తిచేసి, ఎన్నికలకు పీసీసీని సన్నద్ధం చేసే ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. కొత్తగా మరో కమిటీ..! ఇప్పటికే టీపీసీసీ సమన్వయ కమిటీ ఉంది. దీన్ని పునర్వ్యవస్థీకరించే యోచనలో ఏఐసీసీ ఉంది. సమన్వయ కమిటీలో సత్తా లేని వారిని తొలగించి, పని చేయగలిగే శక్తి ఉన్న నేతలకు అవకాశం కల్పించనున్నారు. పీసీసీకి కీలకమైన రాజకీయ అంశాల్లో తోడ్పాటు అందించేలా, పార్టీ సీనియర్ల ప్రతిపాదనలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా ఒక కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో పీసీసీ ఎన్నికల కమిటీ ఉంటుందని, అంతకుముందు పార్టీ నేతల అభిప్రాయాలకు తగిన వేదిక ఉండాలనే యోచనలో ఏఐసీసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. -
ఆరు వారాల గడువివ్వండి
అఫిడవిట్ సమర్పణకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ను కోరిన రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ.. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89పై అభిప్రాయాలను నాలుగు వారాల్లో తెలపాలన్న బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ను తెలంగాణ ప్రభుత్వం అదనపు గడువు కోరింది. ట్రిబ్యునల్ విధించిన గడువు శనివారంతో ముగియడంతో అఫిడవిట్ సమర్పణకు మరో ఆరు వారాల గడువు కావాలని విన్నవించింది. ఈమేరకు ఢిల్లీలో ఉన్న అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు.. ట్రిబ్యునల్ కార్యాలయ అధికారులకు తమ వినతిని అందించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 పరిధి, విసృ్తతిపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా గల ట్రిబ్యునల్ గత నెలలో తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కృష్ణా జలాల కేటారుుంపుల నుంచే రెండు కొత్త రాష్ట్రాలు పంచుకోవాలని ఇందులో స్పష్టం చేసింది. నీటి కేటారుుంపులు, ప్రాజెక్టుల వారీ కేటారుుంపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్ ప్రొటోకాల్(ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లు ఇవ్వాలి) తెలంగాణ, ఏపీకే పరిమితమని తేల్చిచెప్పింది. సెక్షన్ 89 పరిధి వివాదం పరిష్కారమైందని, కొత్త రాష్ట్రాల మధ్య నీటి కేటారుుంపులు, ప్రాజెక్టు వారీ కేటారుుంపులు, ఆపరేషన్ ప్రోటోకాల్ తేల్చేందుకు తదుపరి విచారణను డిసెంబర్ 14న చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై ఏపీ, తెలంగాణ నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలను సమర్పించాలని సూచించింది. వాటికి జవాబులను తదుపరి రెండు వారాల్లో సమర్పించాలని, తిరిగి వాటిపై ఏవైనా ప్రతిస్పందనలు ఉంటే వారంలోగా సమర్పించాలంటూ ఉత్తర్వుల్లో తెలిపింది. దీనిపై ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై స్పష్టత రాకపోవడంతో రాష్ట్రం మరో ఆరు వారాల గడువు కోరింది. ఈ నేపథ్యంలో డిసెంబర్14న జరగాల్సిన ట్రిబ్యునల్ భేటీ సైతం వారుుదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
పాలమూరుకు మిగిలింది 103 గనులే!
• అందులోనూ 33 గనుల్లోనే పనులు • రూ.11.34 కోట్ల సీనరేజ్ చార్జీల లక్ష్యం • నెల రోజుల్లోనే రూ.3.67 కోట్లు వసూలు • పునర్విభజనతో ఏడీ కార్యాలయం కుదేలు • రెగ్యులర్ ఉద్యోగులు నలుగురే • కార్యాలయాల్లో నెలకొన్న స్తబ్ధత మహబూబ్నగర్ అర్బన్: జిల్లాల పునర్విభజన దెబ్బ గనులు, భూగర్భ వనరుల శాఖ పై భారీ ప్రభావం చూపింది. కొత్త జిల్లాల్లో ఆ శాఖ కార్యాలయాలు నెలకొల్పి, ఆ ప్రాంతాల్లో గల గనులను వాటి పరిధిలోకి మార్చారు. దీంతో ఒకప్పుడు ప్రాభవాన్ని సంతరించుకున్న మహబూబ్నగర్ ఏడీ ఆఫీస్ కుదేలైంది. గద్వాలలో అసిస్టెంట్ జియాలజిస్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సీనియర్ అధికారిని నియమించగా, హబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జి ల్లాల్లో అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫీసులను నెలకొల్పారు. వీటితో పాటు కొడంగల్ అసెం బ్లీ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉ న్న నాపరారుు, గ్రానైట్, స్టోన్ క్రషర్ల పర్యవేక్షణను వికారాబాద్ జిల్లాకు, షాద్నగర్, ఫరూక్నగర్, కొత్తూరు. నందిగామ, కేశంపేట, కొందుర్గు, తలకొండపల్లి, ఆమనగ ల్లు, కడ్తాల, మాడ్గుల మండలాల్లోని గను లు రంగారెడ్డి జిల్లాలో చేర్చడం తో మహబూబ్నగర్ ఏడీ కార్యాలయం పరిధిలో కార్యకలాపాల్లో స్థబ్దత ఏర్పడింది. లీజుకు అనుమతి: ఏడీ జిల్లాలో పలు రకాలైన 103 గనులను లీజు పద్ధతిపై కేటారుుంచారు. 54 స్టోన్ కటింగ్ అండ్ మెటల్ క్రషర్లు, 10 గ్రానైట్, 39 పలుగురాళ్ల గనులు లీజుకు ఇచ్చిన వాటి లో ఉన్నారుు. ప్రస్తుతం 38 మైన్స మా త్రమే పనిచేస్తున్నట్లు మైనింగ్ అండ్ జియాలజీ ఏడీ ప్రవీణ్రెడ్డి వివరించారు. 2016 అక్టోబర్ నుంచి 2017 మార్చి వరకు రూ.11.34 కోట్ల సీనరేజ్ చార్జీలను వసూలుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణరుుంచించగా ఒక నెల వ్యవధిలోనే రూ.3.67 కోట్లను వసూలు చేశామని వెల్లడించారు. వీటిని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్తులకు వాటి దామాషా ప్రకారం అందజేస్తామని తెలిపారు. కాగా జిల్లాలో ఇసుకను సరఫరా చేసే బాధ్యతలను టీఎస్ఎండీసీకి ప్రభుత్వ అప్పగించిందని, కోరుుల్సాగర్, సంగంబండ, రామన్పాడ్ రిజర్వాయర్లలో కొంత భాగంలో గల పూడికలో ఉన్న ఇసుకను డీసిల్టింగ్ చేయాలని ఆదేశాలు వచ్చాయని, కాని వాటిలో నీరు ఉన్నందున ఆ పనులను ప్రారంభించలేదని తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులు నలుగురే! అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్ డెరైక్టర్ జిల్లా స్థారుు అధికారి, కాగా ఒక్కొక్క రాయల్టీ ఇన్స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, సర్వేయర్ పోస్టుల్లో మాత్రం రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, కొంత మంది ఔట్సోర్సింగ్ సిబ్బందితో కార్యకలాపాలను నెట్టుకొస్తున్నారు. ఏడీని గ్రామ వికాస్తో పాటు పలు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి నారాయణపేట అసెంబ్లీ నియోజక వర్గానికి స్పెషల్ ఆఫీర్గా నియమించడంతో తగినంత సమయాన్ని గనుల శాఖకు వెచ్చించలేని స్థితి ఏర్పడింది. -
30 సర్కిళ్లు మారిన గ్రేటర్ ముఖచిత్రం
పూర్తయిన జీహెచ్ఎంసీ పునర్విభజన 24 నుంచి 30కి పెరిగిన సర్కిళ్లు 3 డివిజన్లున్న సర్కిళ్లు: గచ్చిబౌలి, ఆర్సీపురం,పటాన్చెరు, అల్వాల్ 8 డివిజన్లున్న సర్కిల్: చార్మినార్ కొత్త సర్కిళ్ల పేర్లు: హయత్నగర్, గడ్డిఅన్నారం, సైదాబాద్, చాంద్రాయణగుట్ట, బేగంబజార్, ఫలక్నుమా,మెహిదీపట్నం, కార్వాన్, ముషీరాబాద్, అంబర్పేట, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ, గచ్చిబౌలి, మూసాపేట, గాజులరామారం, మోండా మార్కెట్ సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ముఖచిత్రం మారింది. ప్రస్తుతం 24 సర్కిళ్లుగా ఉండగా, వీటిని 30 సర్కిళ్లకు మార్చారు. దీంతో ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు గ్రేటర్ పునర్విభజన పూర్తరుునట్లే. 2011 జనాభా లెక్కల మేరకు జీహెచ్ఎంసీని గతంలో ఉన్న 18 సర్కిళ్ల నుంచి 30 సర్కిళ్లకు మార్చాలని కమిటీ సిఫారసు చేయగా, గత సంవత్సరం సెప్టెంబర్ 9న 18 సర్కిళ్లను 24 సర్కిళ్లుగా మార్చారు. ప్రస్తుతం మరో ఆరు సర్కిళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తూ మొత్తం 30 సర్కిళ్లుగా మార్చారు. ప్రసాదరావు కమిటీ స్టాఫింగ్ ప్యాటర్న్ మేరకు మొత్తం 30 సర్కిళ్లు ఏర్పాటు చేయగా, ఒక్కో జోన్కు ఆరు సర్కిళ్లు ఉండనున్నారుు. జీహెచ్ఎంసీలో మొత్తం ఐదు జోన్లుండటం తెలిసిందే. 2011 జనాభా లెక్కల మేరకు, కోర్ఏరియా పరిధిలోని 15 సర్కిళ్లల్లో ఒక్కో సర్కిల్కు సగటున 2.65 లక్షల జనాభా, శివార్లలోని సర్కిళ్లలో ఒక్కో సర్కిల్కు సగటున 2.25 లక్షల జనాభా ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్ జనాభా 67,31,790 కాగా, ఒక్కో డివిజన్లో దాదాపు 45 వేల జనాభా ఉంది. గతంలో ఒక సర్కిల్లో 3 డివిజన్లు మాత్రమే ఉండగా, ఒక డివిజన్లో 16 డివిజన్ల వరకున్నారుు. ప్రస్తుతం భారీ వ్యత్యాసం లేకుండా సగటున ఒక్కో సర్కిల్లో ఐదారు డివిజన్లుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుత కొత్త సర్కిళ్లలో కొన్నింట్లో అత్యల్పంగా మూడు డివిజన్లు మాత్రమే ఉండగా, అత్యధికంగా చార్మినార్ సర్కిల్లో 8 డివిజన్లున్నారుు. -
నిజామాబాద్ ట్రెజరీలో కొట్లాట
ఇందూరు: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపు విషయం నిజామాబాద్ జిల్లా ట్రెజరీ శాఖలో డీడీ, ఉద్యోగుల మధ్య సోమవారం వాగ్వాదం.. తోపులాటకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ ఎస్టీవో చేతికి గాయమైంది. కొత్తగా ఏర్పాటవుతున్న కామారెడ్డి జిల్లా కోసం ట్రెజరీ ఉద్యోగుల విభజన ప్రక్రియ జరుగుతోంది. రాష్ట్ర ట్రెజరీ అధికారుల ఆదేశాల ప్రకారం డీడీ ఓ జాబితాను రాష్ట్ర అధికారులకు పంపినట్లు సమాచారం. జాబితాలో డీడీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగులనే జిల్లాలకు కేటాయిస్తూ ప్రతిపాదనలు పంపించారంటూ ట్రెజరీ గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.గంగాధర్, ఇతర నాయకులు డీడీ గదిలోకి వెళ్లి, ఆ వివరాలను నోటీసు బోర్డుపై పెట్టాలని కోరారు. జాబి తాను బయట పెట్టబోమని, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆ ప్రాంతాలకు వెళ్లి పని చేయాలని డీడీ స్పష్టం చేశారు. ఇదే విషయమై డీడీ, ఉద్యోగులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం, అనంతరం తోపులాట జరిగింది. ఉద్యోగులను పక్కకు తోసుకుంటూ డీడీ వెళ్తుండగా, ఎస్టీవో గంగాధర్ చేతికి గాయమైంది. దీంతో ఉద్యోగు లు ఆగ్రహంతో డీడీపై దాడికి పాల్పడి చొక్కాను పట్టుకున్నట్లు తెలిసింది. బయట ఉన్న ఉద్యోగులు వచ్చి సర్దిచెప్పారు. ఉద్యోగులు తనపై దాడి చేశారనే మనస్తాపంతో డీడీ రామకృష్ణ అప్పటికప్పుడు సెలవు పెట్టి వెళ్లిపోయారు. దాడి విషయాన్ని రాష్ట్ర ట్రెజరీ శాఖ డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.ఇన్చార్జి డీడీగా యాదగిరి: నిజామాబాద్ జిల్లా ట్రెజరీ శాఖ కార్యాలయానికి ఇన్చార్జి డిప్యూటీ డెరైక్టర్(డీడీ)గా హైదరాబాద్ ట్రెజరీ డీడీ యాదగిరికి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ట్రెజరీ శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో నోడల్ వ్యవస్థ
• జిల్లా పాలనలో సహకరించేందుకు ప్రత్యేక ఏర్పాటు • {పస్తుతమున్న 12 రిజిస్ట్రేషన్ జిల్లాలే కొనసాగింపు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో కొత్తగా నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. పునర్వ్యవస్థీకరణతో ఏర్పాటవుతున్న రెవెన్యూ జిల్లాల కంటే రిజిస్ట్రేషన్ జిల్లాల సంఖ్య తక్కువగా ఉన్నందున... జిల్లా పాలనా యంత్రాంగానికి శాఖాపరంగా సహకరించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రెవెన్యూ జిల్లాలతో పాటు రిజిస్ట్రేషన్ జిల్లాలను కూడా పెంచాలని ప్రభుత్వం తొలుత భావించినా.. దానివల్ల వ్యయం విపరీతంగా పెరుగుతుందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల సంఘం, గ్రూప్-1 అధికారుల సంఘం, టీఎన్జీవోల సంఘం ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రిజిస్ట్రేషన్ జిల్లాల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. అయితే జిల్లాల పాలనా యంత్రాంగానికి (జిల్లా కలెక్టర్కు) సహకరించేందుకు సదరు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ను నోడల్ అధికారిగా నియమించనున్నారు. రెండేళ్లకోసారి భూముల మార్కెట్ విలువ సవరణ, జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆ నోడల్ అధికారే జిల్లా రిజిస్ట్రార్ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మార్కెట్ విలువ సవరణ సమయంలో తహసీల్దార్లు, ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లతో సమన్వయంగా వ్యవహరించేందుకు నోడల్ వ్యవస్థ తప్పనిసరని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ జిల్లాలు 12గానే (హైదరాబాద్, హైదరాబాద్ సౌత్, రంగారెడ్డి, రంగారెడ్డి ఈస్ట్లతోపాటు ప్రస్తుతమున్న మిగతా 8 జిల్లాలు) ఉండనున్నాయి. రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలోకి వచ్చే రెవెన్యూ జిల్లాలు రిజిస్ట్రేషన్ జిల్లా ప్రతిపాదిత రెవెన్యూ జిల్లాలు రంగారెడ్డి శంషాబాద్ రంగారెడ్డి ఈస్ట్ వికారాబాద్, మేడ్చల్ నల్లగొండ సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ మెదక్ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట మహబూబ్నగర్ మహబూబ్నగర్, నాగర్ కర్నూల్,వనపర్తి, గద్వాల వరంగల్ వరంగల్, వరంగల్ రూరల్,భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్ ఖమ్మం కొత్తగూడెం (భద్రాద్రి), ఖమ్మం నిజామాబాద్ నిజామాబాద్, కామారెడ్డి ఆదిలాబాద్ ఆదిలాబాద్, మంచిర్యాల,ఆసిఫాబాద్ (కొమురం భీం), నిర్మల్ కరీంనగర్ కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి హైదరాబాద్ హైదరాబాద్ (పాక్షికం) హైదరాబాద్ సౌత్ హైదరాబాద్ (పాక్షికం) -
ఉనికి కోల్పోతున్న రేగోడ్ మండలం
మండలంపై ప్రభుత్వం కక్షసాధింపు నిబంధనలకు విరుద్ధంగా పునర్విభజన మండలానికి ఉండాల్సిన జనాభా 35 వేలు ప్రస్తుతం 22 వేలే.. న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న ప్రజానీకం రేగోడ్: ఏ ప్రభుత్వమైనా పాలనాపరంగా పారదర్శకంగా... నిస్పక్షపాతంగా వ్యవహరించాలి. ఆంధ్రోళ్లు, నీళ్లను... ఉద్యోగాలను దోచేసుకుంటున్నారని.. మన తెలంగాణ మనకు వస్తే సమస్యలేమీ ఉండవని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ 14 సంవత్సరాలుగా ఉద్యమాన్ని తన భుజాన వేసుకుని ఉద్యమాలు చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టారు. బంగారు తెలంగాణలో బంగారు భవిషత్ ఉంటుందని కలలుగన్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. జిల్లాలు.. మండలాల పునర్విభజనలో తెలంగాణ సర్కారు తీరుపై మండలానికి తీరని అన్యాయం జరిగిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పునర్విభజన చేశారని ఆరోపిస్తున్నారు. న్యాయ పోరాటనికి సిద్ధమవుతున్నారు రేగోడ్ మండల ప్రజలు. దివంగత సీఎం ఎన్టీఆర్ 1985 సంవత్సరంలో మండలాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేవునూరు రెవెన్యూ సర్కిల్గా ఉండేది. సర్కిల్గా ఉన్న దేవునూరు గ్రామాన్ని మండల కేంద్రం హోదా కల్పించాలని అప్పట్లో స్థానికులు ఒత్తిడి తెచ్చారు. రేగోడ్ గ్రామానికి చెందిన కల్లేటి రాజేశ్వర్ గుప్తా తనకున్న పలుకుబడితో దేవునూరు కాకుండా రేగోడ్ను మండల కేంద్రం చేయించారు. రేగోడ్ మండలంలో 19 గ్రామ పంచాతీలున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 25 గ్రామాలు, 36,167 జనాభా ఉంది. రేగోడ్ మండలం ఏర్పాటు కావడంతో ఖాదిరాబాద్, ఉసిరికపల్లి, నిర్జప్ల, సాయిపేట, దరఖాస్తుపల్లి, దేవునూరు, మేడికుంద పంచాయతీల ప్రజలు 30 కిలో మీటర్లు రేగోడ్ మండలానికి రావాలంటే గత 30 సంవ్సరాలకుపైగా ఇబ్బందులు పడ్డారు. వట్పల్లిలో ఏడు పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునర్విభజనలో నూతనంగా అల్లాదుర్గం మండలంలోని వట్పల్లిని మండల కేంద్రం చేశారు. రేగోడ్ మండలంలోని దేవునూరు గ్రామ పంచాయతీలో 3,592 జనాభా, ఉసిరికపల్లిలో 1,482 జనాభా, నిర్జప్లలో 1,017 జనాభా, మేడికుందలో 1,604 జనాభా, దుద్యాలలో 1,733 జనాభా, ఖాదిరాబాద్లో 3,313 జనాభా, సాయిపేటలో 893 జనాభా ఉంది. ఈ గ్రామాలు వట్పల్లి మండలంలో విలీనం కానున్నాయి. ఈ గ్రామ పంచాయతీల్లో మొత్తం 13,634 జనాభా మాత్రమే ఉంది. రేగోడ్కు మిగిలింది 22 వేల జనాభా ప్రస్తుతమున్న రేగోడ్ మండలంలోని రేగోడ్లో 3,732 జనాభా, చౌదర్పల్లిలో 1,473 జనాభా, మర్పల్లిలో 2,338 జనాభా, కొత్వాన్పల్లిలో 1,471 జనాభా, జగిర్యాలలో 1,020 జనాభా, ఆర్.ఇటిక్యాలలో 1,529 జనాభా, దోసపల్లిలో 2,251 జనాభా, కొండాపురంలో 1,727 జనాభా, ప్యారారంలో 1,077 జనాభా, టి.లింగంపల్లిలో 1,412 జనాభా, సిందోల్లో 2,200 జనాభా, గజ్వాడలో 2,303 జనాభా ఉంది. 22,533 జనాభా మాత్రమే మిగలనుంది. పూర్తిస్థాయి రేగోడ్ మండలం 156 చదరపు కిలో మీటర్లలో విస్తరించి ఉంది. ప్రస్తుతం 81 చదరపు కిలో మీటర్లు మాత్రమే ఉండబోతోంది. రేగోడ్ మండలాన్ని నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లో కలపాలని ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి రెండువేల మంది ప్రజానీకం విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. రేగోడ్ మండలానికి జరిగిన అన్యాయంపై ఇక్కడి ప్రజలు.. ప్రజాప్రనిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. బాబూమోహన్ ఉప ఎన్నికలో రేగోడ్కు కేసీఆర్ అందోల్ నియోజకవర్గానికి 1998లో ఉప ఎన్నిక జరిగింది. హాస్యనటుడు బాబూమోహన్ను అందోల్ ఎమ్యెల్యే అభ్యర్థిగా బరిలో దింపారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉప ఎన్నికలో ప్రచారం నిమిత్తం రేగోడ్ మండలానికి వచ్చారు. రేగోడ్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నాడు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఆయన సీఎంగా ఉండగానే రేగోడ్ మండలం తన అస్తిత్వాన్ని కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగోడ్ మండలం నుంచి వట్పల్లిలో పలు గ్రామాలను కలపడాన్ని ఇక్కడి ప్రజలు తప్పుబట్టడం లేదు. 35 వేల జనాభాకంటే తక్కువగా 22 వేలు ఉంచడం... నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లో రేగోడ్ మండలాన్ని ఉంచాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభిప్రాయాలను పరిగణణలోకి తీసుకుంటామని ఓ పక్కన సీఎం పదేపదే చెబుతున్నా ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా విభజన చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసమే ఇష్టానుసారంగా మండలానికి తీరని అన్యాయం చేస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు.. ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి పోకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఐదు గ్రామాలను అందోల్ కలిపిన దామోదర రేగోడ్ మండలంలో గతంలో ఆరు గ్రామాలు, మూడు తండాలు మెదక్ నియోజకవర్గంలో ఉండేవి. పరిపాలనా సౌలభ్యం కోసం 2009లో అప్పటి మంత్రి దామోదర రాజనర్సింహ ఆ గ్రామాలు, తండాలను అందోల్ నియోజకవర్గంలో కలిపారు. ప్రస్తుతం పరిపాలనా సౌలభ్యమంటూ పునర్విభజన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ను కాదని 65 కిలోమీటర్ల దూరంలోని మెదక్లో రేగోడ్ మండలాన్ని కలపడం ఎంత వరకు న్యాయమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీ కోన్యాయం.. మా కోన్యాయమా..? ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు, మేధావులు, యువకులు, అన్ని కుల సంఘాలు, ఉద్యోగులు ధర్నాలు, రాస్తారోకోలు, బందులు చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తమ ప్రాంతం తమకు కావాలని టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ఎలా ఆందోళనలు చేశారో? రేగోడ్ మండల ప్రజలు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లో తమను చేర్చాలని ఆందోళనలు చేశారు. అందోల్ ఎమ్యెల్యే బాబూమోహన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనలు చేసినందుకే పాలకులు మండలాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మెదక్లోనే ఉంచడం.. మండలంలో 35 వేలకంటే తక్కువ 22 వేల జనాభాకే పరిమితం చేయడంపై ప్రజలు.. ఆయా పార్టీల నాయకులు మండిపడుతున్నారు. మీరు ఉద్యమం చేస్తే న్యాయం.. మేం ఉద్యమం చేస్తే వ్యతిరేకమా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీర్, మంత్రి హరీశ్రావు స్పందించి రేగోడ్ మండలానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
పాలమూరులో ‘విభజన’ మంటలు
* యువకుడి ఆత్మహత్యాయత్నం * మరికల్లో అంతర్రాష్ట్ర రహదారి దిగ్బంధం నారాయణపేట/మక్తల్: జిల్లాల పునర్విభజన మంటలు పాలమూరులో ఎగిసిపడుతున్నాయి. నారాయణపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన 48 గంటల బంద్ విజయవంతమైంది. రెండోరోజు మరికల్లో అంతర్రాష్ర్ట రహదారిని అఖిలపక్షం నాయకులు దిగ్బంధిం చారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రాజీనామాకు మద్దతుగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎం.జ్యోతి, లక్ష్మి, అమీరుద్దీన్, కాకర్ల నారాయణమ్మ, తరుణబేగం, విజయలక్ష్మి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మక్తల్ను మహబూబ్నగర్లోనే కొనసాగించాలని రామకృష్ణ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలం కోసం టవరెక్కి.. వెల్దుర్తి: మెదక్ జిల్లా మాసాయిపేటను మండలంగా ప్రకటించకపోవడంతో గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు ఆరుగురు యువకులు సెల్టవరెక్కి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై బైఠారుుంచడంతో ఇరువైపులా 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. యువకులతో ఎమ్మెల్యే మదన్రెడ్డి ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చినా వారు ససేమిరా అన్నారు. మండల సాధన సమితి నేతలు దీక్షకు కూర్చున్నారు. గ్రామ పంచాయతీ వాటర్మన్ సతీష్ ఆగ్రహంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. -
కొత్తగా మూడు ఏసీపీ కార్యాలయాలు
పరకాల డీఎస్పీ పోస్టు రద్దు... డివిజన్ల వారీగా స్టేషన్లు ఖరారు ప్రభుత్వ ఆమోదమే తరువాయి సాక్షిప్రతినిధి, వరంగల్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పోలీసు శాఖ పరంగా చేపట్టిన పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మార్పులకు ఓ రూపం వచ్చింది. కొత్తగా ఏర్పడబోయే వరంగల్, హన్మకొండ జిల్లాలను వరంగల్ కమిషనరేట్ పరిధిలోకి తేవాలని ఇప్పటికే నిర్ణయించారు. పరిపాలన పరంగా ఏ పోలీస్ స్టేషన్ డివిజన్ పరిధిలో ఉండాలనే విషయంపైనా ప్రతిపాదనలు పూర్తయ్యాయి. పోలీసు శాఖ సూచన మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు కమిషరేట్ తుదిరూపునకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. దసరాలోపే ఈ ప్రతిపాదనలకు ఆమోదం రానుంది. కొత్త జిల్లాలు ఏర్పడే దసరా రోజు నుంచి కమిషనరేట్ పరిధిలోనూ మార్పులు అమల్లోకి రానున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం వరంగల్, హన్మకొండ, కాజీపేట, మామునూరు, క్రైం, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీ పోస్టులు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం నర్సంపేట, హుజూరాబాద్ల్లోని డీఎస్పీ కార్యాలయాలు ఏసీపీ ఆఫీస్లుగా మారనున్నాయి. కొత్తగా కేయూసీ, వర్ధన్నపేట, స్టేషన్ఘపూర్లో ఏసీపీ పోస్టులు మంజూరవుతున్నాయి. జిల్లాల పునర్విభజనతో కమిషనరేట్ పరిధిలోకి వస్తున్న పరకాల డీఎస్పీ పోస్టు రద్దు చేసి కేయూసీ ఏసీసీ పోస్టుగా మార్చనున్నారు. వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో ప్రస్తుతం 19 సాధారణ, మూడు ట్రాఫిక్, ఒక మహిళా పోలీస్ స్టేషన్, ఒక క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో ఉన్న రఘునాథపల్లి, నర్మెట, పాలకుర్తి, కొడకండ్ల, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్లు వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో కలపనున్నాయి. కొత్త మండలాలుగా ఏర్పడే చెల్పూరు, వేలేరు, ఐనవోలు, ఇల్లంతకుంటల్లో ఏర్పాటయ్యే పోలీస్ స్టేషన్లు కమిషరేట్ పరిధిలోనే ఉంటాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఐదు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇలా మొత్తం 50 పోలీస్ స్టేషన్లతో కమిషనరేట్ పరిధి బాగా పెరగనుంది. ఏసీపీ కార్యాలయాల వారీగా పోలీస్ స్టేషన్లు వరంగల్ : మట్టెవాడ, మిల్స్కాలనీ, ఇంతేజార్గంజ్, లేబర్కాలనీ, ఎనుమాముల. హన్మకొండ : హన్మకొండ, సుబేదారి, వడ్డేపల్లి, న్యూశాయంపేట. కాజీపేట : కాజీపేట, మడికొండ, ధర్మసాగర్. నర్సంపేట : నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ. మామునూరు : మామునూరు, పర్వతగిరి, సంగెం, గీసుగొండ. హుజూరాబాద్ : హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లంతకుంట, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి. కేయూసీ : కేయూసీ, హసన్పర్తి, ఆరెపల్లి, ఆత్మకూరు, పరకాల, శాయంపేట. వర్ధన్నపేట : వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్గఢ్, ఐనవోలు, పాలకుర్తి, కొడకండ్ల. స్టేషన్ఘన్పూర్ : స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి, నర్మెట, చిల్పూరు, వేలేరు. -
మాతృ జిల్లాల్లోనే రికార్డులు
కొత్త జిల్లాలకు స్కానింగ్ కాపీలు సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశం సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా మాతృ జిల్లాల్లో ఉన్న ఒరిజనల్ రికార్డులను ఆయా జిల్లాల్లోనే భద్రపరిచి, కొత్త జిల్లాలకు అవసరమైన రికార్డులను స్కానింగ్ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో నూతన జిల్లాల ఏర్పాటుపై వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన రోజు నుంచే ప్రతి శాఖ తమ కార్యాలయాలు ప్రారంభించి, కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లలో నూతన పోస్టుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. -
అశాస్త్రీయంగా విభజన ప్రక్రియ
మాజీ మంత్రి శ్రీధర్బాబు టేకుమట్లను మండలంగా ప్రకటించాలని ర్యాలీ, సభ టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం, తోపులాట చిట్యాల : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జిల్లాలు, మండలాల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయంగా లేదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. టేకుమట్లను మండలంగా ప్రకటించాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గొర్రె సాగర్ ఆధ్వర్యంలో బుధవారం రామకిష్టాపూర్(టి) నుంచి టేకుమట్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ విస్తీర్ణం, జనాభాపరంగా విస్తరించి ఉన్న టేకుమట్లను మండలంగా చేయకపోవడం విచారకరమన్నారు. జనగాం, గద్వాలలను జిల్లాలుగా ప్రకటించాలన్నారు. గ్యాంగ్స్టర్ నÄæూం ఎన్కౌంటర్ను ప్రజలు మర్చిపోయేలా చేసేందుకే సీఎం కేసీఆర్ తెరపైకి కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. కాగా, సభా స్థలి సమీపంలోకి టీఆర్ఎస్ నాయకులు చేరుకొని ఆ పార్టీ చేరికల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సౌండ్బాక్స్లతో పాటలు వేశారు. ఈక్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసు సిబ్బంది రంగప్రవేశం చేసి వారిని శాంతింపజేశారు. కాంగ్రెస్ సభలో ఎంపీపీ బందెల స్నేహలత, వైస్ ఎంపీపీ సట్ల కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రారంభానికి సీఎంను ఆహ్వానిస్తాం
కలెక్టరేట్, ఎస్పీ, డీఆర్డీఏ కార్యాలయాలకు భవనాలు ఎంపిక విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం జిల్లా ప్రారంభ కార్యక్రమానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ఆహ్వానిస్తామని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అన్నారు. మంగళవారం స్థానిక లక్ష్మీదేవిపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తొలి,మలి ఉద్యమ పోరాటాలు ఇక్కడ నుంచే మొదలైన ఘనత ఉందన్నారు. జిల్లా పేరు కొత్తగూడెంగానే ఉంటుందని, మార్పులు ఉండవన్నారు. కొత్తగూడెంను జిల్లాగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు స్థానిక ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఇక కొత్తగూడెం జిల్లాలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ఉన్న ఈఆర్పీ భవనము కలెక్టరేట్కు, సింగరేణి పాత డిస్పెన్సరీ భనవనాన్ని ఎస్పీ కార్యాలయానికి, పాత మున్సిపల్ కార్యాలయం భవనం డీఆర్డీఏ, డ్వామా కార్యాలయాల నిర్వహణకు ఎంపిక చేసినట్లు వివరించారు. దీంతో పాటు జిల్లాకు అదనంగా 44 ప్రభుత్వ శాఖలు రానున్నయన్నారు.జిల్లాలో మరిన్ని ప్లాంట్లతో పాటు వనరులు బొగ్గు, విద్యుత్, సీతారామ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి నీళ్లు రానున్నాయన్నారు. జిల్లాలో పని చేసే అధికారుల సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. -
జిల్లాల పునర్విభజన అశాస్త్రీయం
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి : పరిపాలన సౌలభ్యం పేరుతో అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేస్తున్నారన్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లా విభజన టీఆర్ఎస్ పార్టీ సొంత వ్యవహారంగా చూస్తోందని, రాజకీయ సమీకరణలు ,కారణాలతో జిల్లాలను విభజించడం సరికాదన్నారు. నిపుణుల కమిటీ, అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలు అందించిన సూచనలు, సలహాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఇష్టారీతిన పునర్విభజన చేస్తుందని విమర్శించారు. జిలాల్ల పునర్విభజన ముసాయిదా అసెంబ్లీ సమావేశాలలో చర్చించిన అనంతరమే చర్యలు చేపట్టాలన్నారు. మార్గదర్శకాలకు విరుద్ధంగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు.. సత్తుపల్లి లేదా కల్లూరు రెవెన్యూ డివిజన్లగా ఏర్పాటు చేయాల్సి ఉండగా మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వైరా రెవెన్యూ డివిజన్ను తెరపైకి తీసుకురావడం వెనక మతలబు ఏమిటో అర్ధంకావడం లేదని ఎమ్మెల్యే వాపోయారు. డివిజన్ల ఏర్పాటులో ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్న వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రభుత్వమార్గదర్శకాల ప్రకారం45 కిలోమీటర్లు దూరంలో ఉండాలని స్పష్టంగా పేర్కొన్నా, 20 కిలోమీటర్ల దూరంలోనే ఖమ్మం రెవెన్యూ డివిజన్కు దగ్గరలో వైరా డివిజన్ను ఎలా ఏర్పాటు చేస్తారని నిలదీశారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్ల సంజీవరెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు దొడ్డా శంకర్రావు, కూసంపూడి మహేష్, వల్లభనేని పవన్, దూదిపాల రాంబాబు, చాంద్పాషా, అద్దంకి అనిల్, చక్రవర్తి, తడికమళ్ల ప్రకాశరావు, మల్లికార్జున్ ఉన్నారు. -
ఏకపక్షంగా జిల్లాల పునర్విభజన
గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్లో కలపొద్దు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్వంచ: జిల్లాల పునర్విభజనలో సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోకుండానే జిల్లాల పేర్లను కూడా ప్రకటించారని, సరైన నైసర్గిక స్వరూపాలు లేకుండానే విభజించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన గురువారం ఇక్కడ సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం మండలాలను ప్రకటిత మహబూబాబాద్ జిల్లాలో కలపడం సరికాదన్నారు. కొన్ని నియోజకవర్గాలను మూడు ముక్కలు చేశారని అన్నారు. మోడీ ప్రభుత్వం ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ అని నినదిస్తూనే, మరోవైపు రక్షణ, రైల్వే, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోకి విదేశీ పెట్టుబడులను ప్రొత్సíß స్తోందని.. మున్ముందు వీటిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు సాగిస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు రూ.10లక్షల కోట్లు రాయితీగా ఇచ్చిందన్నారు. అధికారంలోకి వస్తే కార్మికులను ఆదుకుంటామని చెప్పిన బీజేపీ పెద్దలు.. గద్దెనెక్కాక అదే కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే, మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మెకు 10 జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న ప్రతిపక్షాలను జైళ్లల్లో పెడతామని కేసీఆర్ బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. డబ్బు దండుకునేందుకే దుమ్మగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.2,500 కోట్ల నుంచి రూ.8000 కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్పాషా, కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, బరిగెల సాయిలు, మండే వీరహన్మంతరావు, పూర్ణచందర్రావు, ఆదాం, దుర్గాఅశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయ అతిపెద్ద కుంభకోణం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆరోపణ ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల పునర్విభజన చేయాలని డిమాండ్ వినాయక్నగర్ : ప్రజల అభిప్రాయాల మేరకే జిల్లాల పునర్విభజన జరగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి, అధికారులకు కనబడడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. మిషన్ కాకతీయ కార్యక్రమం అతి పెద్ద కుంభకోణమని, ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మాజీ ఎంపీ మధుయాష్కికి తగదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజలకు దగ్గరవ్వాలనుకోవడం అవివేకానికి నిదర్శనమన్నారు. నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటులో ప్రజాభిప్రాయం సేకరించాలని, లేకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. జిల్లాలో డయేరియా, విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, వెంటనే పల్లెలు, తండాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని గతంలో డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించిన రోజే అమరుల ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. బీజేపీ నేతలు గంగోని గంగాధర్, సుధాకర్, నాగరాజు, కిషన్, రాజు, నరేశ్, విజయ్ కృష్ణ, రోషన్లాల్ బోరా, మనోజ్ పాల్గొన్నారు. -
అందరి ఎజెండా ఒక్కటే!
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలపై ఏకాభిప్రాయం రెండు జిల్లాల ఏర్పాటు... తుది దశకు పునర్విభజన.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘పునర్విభజన’పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో శుక్రవారం జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతిని«ధులు భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉపసంఘం భేటీ అవుతోంది. ఇందులో భాగంగా మొదటగా శుక్రవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆడిటోరియంలో సమావేశం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రుల తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్ తదితరుల కమిటీ జిల్లాల పునర్విభజనపై పలు అంశాలపై చర్చించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశంలో జిల్లా నుంచి మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, పాతూరు సుధాకర్రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్గుప్త పాల్గొన్నారు. ఇప్పటికే పలు కమిటీలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండు నెలలుగా కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ జిల్లాల ఏర్పాటు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో అధ్యయన కమిటీలు కూడా వేశారు. జిల్లాకు సంబంధించి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్లను అధ్యయన కమిటీ సభ్యులుగా సీఎం కేసీఆర్ నియమించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా వేర్వేరుగా జరిగే కొత్త జిల్లాల ఏర్పాటు అధ్యయనం జూన్ 2లోగా ముగించారు. జిల్లాలో జనాభా, భౌగోళిక పరిస్థితులు, నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్లను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. వీటిపైనా మరో రెండు మార్లు సీసీఎల్ఏ, చీఫ్ సెక్రటరీలు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కూడా నిర్వహించి ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని కోరారు. కొత్త జిల్లాలపై సీఎం నిర్ణయం, ప్రతిపాదనలకే సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, గ్రామ, మండల జిల్లా స్థాయిల్లో పునర్విభజనకు సంబంధించి స్వరూపాలు, మార్పులు, ప్రాంతాల వారీగా ప్రజల మనోభావాలు తెలుసుకున్నారు. ఆ తర్వాతే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోద ముద్ర కూడ వేశారు. అయితే ఈ నెల 22న కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటించనుండగా.. ఏవైనా మార్పులు చేర్పులుంటే మాట్లాడేందుకు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో సబ్కమిటీ సమావేశాలు నిర్వహిస్తుంది. తుదిదశకు చేరిన ‘పునర్విభజన’ జిల్లాల పునర్విభజనపై అందరి ఎజెండా ఒక్కటే. సుపరిపాలన, ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యంగా పునర్విభజన చేస్తున్నట్లు ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. వీటికి కట్టుబడే అందరి ఎజెండా ‘సుపరిపాలన’గా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సబ్కమిటీతో శుక్రవారం హైదరాబాద్లో భేటీ అయిన మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఇతర ప్రజాప్రతినిధులు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాలతో నిజామాబాద్ జిల్లాగా... కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలు కలిపి కామారెడ్డి జిల్లాగా ఏర్పడనున్న విషయం తెలిసిందే. ఈ రెండు జిల్లాల్లో కొత్తగా ఏర్పడే 10 మండలాలు ఏర్పడనుండగా... ఏయే మండలాలు ఏ జిల్లాలో ఉండాలన్న విషయమై ఉపసంఘంలో చర్చించినట్లు తెలిసింది. బాన్సువాడ నియోజకవర్గం కామారెడ్డి జిల్లాలో ఉన్న కోటగిరి, వర్ని మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని మంత్రి సూచించినట్లు సమాచారం. బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగానే జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటు చేస్తుందని, అయితే ఇవన్నీ ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడాలని ఎంపీ కవిత సూచన చేసినట్లు తెలిసింది. సుపరిపాలన దిశగా ప్రభుత్వం ముందుగా సాగుతుందని, ఇందులో భాగంగానే పునర్విభజన జరుగుతుందని, తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా జిల్లాల పునర్విభజనపై ఉపసంఘం పలు సూచనలు చేసినట్లు సమాచారం. -
‘గీతో’పదేశం!
♦ జిల్లాల విభజనపై టీఆర్ఎస్ ప్రతినిధులతో నేడు సీఎం భేటీ ♦ సమావేశంలో కొత్త జిల్లాలపై సంకేతాలు ఇచ్చే అవకాశం ♦ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై వీడనున్న చిక్కుముడి జిల్లా విభజన రేఖ ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో స్పష్టం కానుంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మదిలో ఏముందో తేలనుంది. జిల్లాల పునర్విభజనే ప్రధాన ఎజెండాగా బుధవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రతిపాదిత జిల్లాల ముసాయిదాలపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాలు కొత్త జిల్లాలుగా ఏర్పడనున్నాయి? ఏవి జిల్లా కేంద్రాలు కానున్నాయి? ఏ నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన మవుతున్నాయనే అంశాలపై సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చే అవకాశం ఉంది. నయా జిల్లాలపై ఇప్పటికే సరిహద్దులు, మ్యాపులు తయారు చేసి.. ఇప్పుడు తమ అభిప్రాయం తెలుసుకోవడం లాంఛనప్రాయమేననే భావన అధికారపార్టీలో వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులను కూడా సంప్రదించిన తర్వాతే కొత్త జిల్లాలకు తుదిరూపు ఇచ్చామనే సందేశం ప్రజల్లోకి వెళ్లడమే ఈ సమావేశం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు అంటున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి మినహా ఇతర జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చింది. వీటిలో చాలావరకు కొత్త కలెక్టరేట్లపై కసరత్తు కూడా పూర్తి చేసింది. చివరి దశకు చేరిన విభజన ప్రక్రియలో ఉద్యోగుల సర్దుబాటుపై అక్కడి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జంట జిల్లాల్లో అనిశ్చితి మన జిల్లా విషయానికి వస్తే విభజనపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగించాలనే అంశం మాత్రమే కొలిక్కి వచ్చింది. ఈ జిల్లా పరిధిలో ప్రతిపాదించిన వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలు మినహా ఇతర నియోజకవర్గాలు (10) ఏ జిల్లాలోకి వెళతాయి? ఎన్ని భాగాలుగా విడిపోతాయి? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజన విషయానికొచ్చేసరికి సీఎం ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల పునర్విభజనపై జరిగిన రెండు అత్యున్నతస్థాయి సమావేశాల్లో ప్రభుత్వం ఈ జంట జిల్లాలను ఎలా విభజించాలనే అంశంపై ఎటూ తేల్చలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగే భేటీలో జిల్లా భవితవ్యాన్ని సీఎం నిర్దేశించనున్నారు. ఇదిలావుండగా, జిల్లాల డీలిమిటేషన్పై శాసనసభాపక్ష సమావేశంలో జిల్లా ఎమ్మెల్యే /ఎమ్మెల్సీ అభిప్రాయాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకునే అవకాశ ముంది. అంతేకాకుండా జిల్లాల పునర్విభజనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పకొట్టేలా జిల్లాల ఖరారులో పాటిస్తున్న శాస్త్రీయత, వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను కూడా విశదీక రించే వీలుంది. అయితే, నయా జిల్లాలపై ఇప్పటికే సరిహద్దులు, మ్యాపులు తయారు చేసి.. ఇప్పుడు తమ అభిప్రాయం తెలుసుకోవడం లాంఛనప్రాయమేననే భావన అధికారపార్టీలో వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులను కూడా సంప్రదించిన తర్వాతే కొత్త జిల్లాలకు తుదిరూపు ఇచ్చామనే సందేశం ప్రజల్లోకి వెళ్లడమే ఈ సమావేశం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏదీఏమైనా సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడించే సంకేతాల ఆధారంగా జిల్లాల విభజనపై మరికొంత స్పష్టత రానుంది. -
పదవులు పదిలం!
♦ స్థానిక సంస్థల భవితవ్యంపై ప్రభుత్వం స్పష్టత ♦ జిల్లాల విభజన నేపథ్యంలో అనుమానాలు నివృత్తి ♦ పదవీకాలం ముగిసేవరకు ప్రస్తుత పాలకవర్గాలకే పీఠం ♦ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతకు తప్పిన పదవీగండం ♦ మండలాల వ్యవస్థలో ఆచరించిన పద్ధతికే మొగ్గు ♦ ఊపిరి పీల్చుకున్న ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు 1985లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన సమయంలో అప్పటికే కొలువుదీరిన పంచాయతీ సమితులను రద్దు చేయలేదు. వాటి పదవీ కాలం వరకు కొనసాగించారు. ఇప్పుడూ అదే పద్ధతిని అవలంబించనున్నారు. ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి యాలాల మండలం నుంచి ఎన్నికయ్యారు. ఈ మండలం పునర్విభజనలో వికారాబాద్ కేంద్రంగా కొనసాగే రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లనుంది. స్థానిక సంస్థల ఉనికికి భంగం కలగకుండా జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పదవీకాలం ముగిసేంతవరకు స్థానిక సంస్థల జోలికి వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా మరో రెండున్నరే ళ్ల పదవీకాలం ఉన్న జిల్లా పరిషత్ పాలకవర్గాన్ని యథావిధిగా కొనసాగించేందుకు మొగ్గు చూపుతోంది. దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు తుదిరూపు ఇస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాల విభజనపై స్పష్టత కూడా వచ్చింది. మరోవారం పది రోజుల్లో మన జిల్లా ఎన్ని ముక్కలు కానుందో తేలనుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో స్థానిక సంస్థల భవిష్యత్తు ఏమిటనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయంగా ఈ అంశం ముడిపడి ఉండడంతో ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. న్యాయపర, రిజర్వేషన్ల సమస్య తలెత్తకుండా వీటి విభజనపై దృష్టి పెట్టకపోవడమే మంచిదనే భావనకొచ్చాయి. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లా పరిషత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీటీసీ సభ్యులు.. రేపు జిల్లాల విభజన తర్వాత మరో జిల్లా పరిధిలోకి చేరితే పరిస్థితేంటనే సందేహాన్ని పలువురు కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వీరందరి అనుమానాన్ని నివృత్తి చేసిన ప్రభుత్వ పెద్దలు.. 1985లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన సమయంలో అప్పటికే కొలువుదీరిన పంచాయతీ సమితులను రద్దు చేయలేదని, వాటి పదవీకాలం వరకు కొనసాగించారని, అదే పద్ధతిని ఇప్పుడు అవలంబిస్తామని స్పష్టం చేశారు. 1987 వరకు సమితులు కొనసాగించారని, ప్రస్తుత పాలకవర్గాలు కూడా ఐదే ళ్ల పదవీకాల ం ముగిసేవరకు ఉంటాయని స్పష్టతనిచ్చారు. ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి యాలాల మండలం నుంచి ఎన్నికయ్యారు. ఈ మండలం జిల్లాల పునర్విభజనలో వికారాబాద్ కేంద్రంగా కొనసాగే రంగారెడ్డి జిల్లాలో ఉండనుంది. చేవేళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయి. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు ఏ జిల్లాలో చేరుతాయి? కొత్త జిల్లాలుగా మారుతాయా? అనే అంశంపై ఇంకా అస్పష్టత నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ భవితవ్యంపై రాజకీయవర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి. అయితే, ఇటీవల జరిగిన సమావేశంలో ప్రభుత్వం.. జిల్లా పరిషత్లను యథాతథంగా కొనసాగించేందుకే మొగ్గు చూపాయి. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా పదవుల విభజన కూడా చేపడితే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందనే అభిప్రాయానికొచ్చాయి. అదేసమయంలో అర్ధంత రంగా ఈ పదవులను అర్డినెన్స్ ద్వారా రద్దు చేసి ప్రత్యేకాధికారుల పాలనను తెచ్చినా.. రాజకీయంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని భావించారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగిసేవరకు కొనసాగిస్తే మంచిదనే నిర్ణయానికొచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తే జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి పీఠానికి ఢోకాలేనట్లే! పునర్విభజనతో జిల్లా రెండు, మూడు జిల్లాలుగా ఏర్పడినా.. ఆ జిల్లాల పగ్గాలు కూడా ప్రస్తుత చైర్పర్సన్ చేతిలోనే ఉంటాయని అధికారవర్గాలు తెలిపాయి. -
పునర్విభజనలో రాజకీయం తగదు
♦ విభజనలో ప్రజల సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి ♦ భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూములను సేకరించాలి ♦ పార్టీని బతికించుకోవడం కోసం విభేదాలు వీడండి ♦ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పాలనా సౌలభ్యం మేరకు జిల్లాను విభజించాలి తప్ప.. రాజకీయ లబ్ధికోసం అడ్డగోలుగా విడగొడితే సహించేదిలేదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. జిల్లా యూనిట్గా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని.. జిల్లా పరిధిని మరో జిల్లా పరిధిలోకిగానీ, అక్కడి పరిధిని జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనలను ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి, మాజీ మంత్రి డీకే అరుణ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లో ముఖ్యనేతల సమావేశం జరిగింది. ప్రస్తుత జిల్లా పరిధిలోనే జిల్లాలను విభజించాలని.. జిల్లా కేంద్రాల విషయంలోనే శాస్త్రీయత పాటించాలని తీర్మానించింది. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూములను సమీకరించాలని, జీఓ 123 ప్రకారం భూములను తీసుకుంటే ఉద్యమిస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో భూముల వేలం ద్వారా వచ్చే రాబడిలో అధికశాతం జిల్లా అవసరాలకే వెచ్చించాలని డిమాండ్ చేశారు. ఐక్యంగా సాగండి... కష్టకాలంలో ఉన్న పార్టీని.. అధికారపీఠం వైపు నడిపించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అరుణ పిలుపునిచ్చారు. కొందరు నేతల మధ్య అభిప్రాయభేదాలున్నా.. వాటిని పక్కనపెట్టి ముందుకు సాగాలని హితవు పలి కారు. పూటకో మాటతో ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్ సర్కారుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటం ద్వారా పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన గోదావరి నీటిని సొంత నియోజకవర్గానికి మళ్లించుకుపోయారని దుయ్యబట్టారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు కింద హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పారిశ్రామిక, తాగు, సాగునీటి అవసరాలకు 30 టీఎంసీల నీటి కేటాయింపులు చేశారని, ప్రాజెక్టు కుదించడం ద్వారా ఈ జలాలను ఎలా సమకూరుస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పేదల గుడిసెలను క్రమబద్ధీకరించాలి... ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన గుడిసెలను క్రమబద్ధీకరించాల్సిందేనని మాజీ శాసనసభ్యుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. జవహర్నగర్లో ఏళ్ల తరబడి గుడిసెల్లో నివసిస్తున్నవారి స్థలాలను రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణమని, బేషరతుగా వాటిపై యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేశవాపూర్లో ప్రతిపాదించిన రిజర్వాయర్ వల్ల వేలాది ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, ప్రసాద్కుమార్, చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బండారి రాజిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఎం.కోదండరెడ్డి, నారాయణరావు,డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు కుసుమ కుమార్, రవీందర్రావు, నాగబండి శ్రీరామ్, పార్టీ నేతలు లక్ష్మారెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అయితే పార్టీ ఏకైక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. -
రంగారెడ్డి జిల్లా ‘మూడు’ ముక్కలే!
కొత్త జిల్లాల ఖరారు ఇంకా కొలిక్కిరాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పునర్విభజన చిక్కుముడిగా మారిన నేపథ్యంలో.. దీనిపై ప్రత్యేకంగా భేటీ కావాల ని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఈ క్రమంలోనే సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసింది. ఇతర జిల్లాల పునర్విభజనపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖచిత్రం ఆధారపడి ఉండడం.. ఈ జిల్లాల విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేక దృష్టి సారించినందున.. దీనిపై లోతుగా చర్చించకుండా దాటవేసింది. * జిల్లా యూనిట్గా జిల్లాల పునర్విభజన * అనంతగిరిలో తాత్కాలిక కలెక్టరేట్ * జిల్లా విభాగాలకు కార్యాలయాల అన్వేషణ రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత జిల్లా పరిధిలో మాత్రమే విభజన ప్రక్రియ జరగాలనే ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని కలెక్టర్ రఘునందన్రావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రంగారెడ్డి జిల్లాను ఎన్ని ముక్కలుగా చేసినా అభ్యంతరం లేదని, జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఇతర జిల్లాల్లో కలిపాలనే ప్రతిపాదన సరికాదని పేర్కొంటూ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో ప్రస్తావించిన అంశాన్ని ప్రభుత్వం ముందుంచారు. ఒకవేళ ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే జిల్లా మూడు ముక్కలు కానుంది. ఈ పరిణామాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విభజన సంక్లిష్టంగా మారడం.. ఈ జిల్లాల పునర్విభజన బ్లూప్రింట్ సీఎం కేసీఆర్ మదిలో ఉండడంతో లోతుగా చర్చించేందుకు అధికారవర్గాలు అంతగా ఆసక్తి చూపడంలేదు. నాలుగు అంశాలపై చర్చ! కొత్త కలెక్టరేట్లు, ఉద్యోగుల విభజన, రికార్డుల తరలింపు, మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే కలెక్టరేట్లకు రికార్డులను తరలించడంలో అవలంబించాల్సిన పద్ధతులపై సీఎస్ రాజీవ్శర్మ, సీసీఎల్ఏ రేమాండ్ పీటర్ ప్రత్యేక సూచనలు చేశారు. ప్రస్తుత జిల్లాను రెండుగా విభజిస్తే.. ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాల్సివుంటుందని, అంతకంటే ఎక్కువ జిల్లాలు ఏర్పడితే మాత్రం ప్రభుత్వమే ఉద్యోగులను సర్దుబాటు చేస్తుందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో జిల్లా స్థాయి కార్యాలయాలకు అవసరమైన భవనాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆయా శాఖలధిపతులు (హెచ్ఓడీ) ప్రతిపాదిత జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలను అన్వేషించాలని స్పష్టం చేసింది. కొత్త కలెక్టరేట్లకు రూ.80-100 కోట్లు నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ల నిర్మాణానికి రూ.80 -100 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం డివిజన్స్థాయి కార్యాలయాల్లోనే జిల్లా కార్యాలయాలు కొలువుదీరుతాయని, రంగారెడ్డి జిల్లా తాత్కాలిక కలెక్టరేట్ను అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ర ఘునందన్రావు సమావేశంలో చెప్పారు. మండలాల్లో మార్పులు, చేర్పులు మండలాల ప్రతిపాదనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గత సమావేశంలో 11 మండలాలకు ప్రభుత్వం లైన్క్లియర్ చేసింది. అయితే, తాజాగా మండలాల పునర్విభజనలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతో దానికి అనుగుణంగా నూతన మండలాల జాబితాను జిల్లా యంత్రాంగం తయారు చేసింది. ఈ మేరకు ఎల్బీనగర్, పెద్ద అంబర్పేట్/ అబ్దుల్లాపూర్మెట్, దుండిగల్, గండిపేట్/ నార్సింగి, జవహర్నగర్, కోట్పల్లి, బాలాపూర్/మీర్పేట్ ఉండనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ భూములు అంతంగా లేని పట్టణ మండలాల్లో కొత్త మండలాల ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగం వెనక్కి తీసుకుంది. -
ఖర్గే మంత్రాంగం !
పునర్ వ్యవ స్థీకరణపై అనుమానాలు ? తెరపైకి ‘సీనియర్ల అస్త్రం’ వలసొచ్చిన వారి మంత్రి పదవులు తొలగించు : సిద్ధుకు ఖర్గే హితవు సీనియర్లను తొలగిస్తే పార్టీకి నష్టం : మేడంకు విన్నపం బెంగళూరు : కర్ణాటక మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ విషయమై పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే చక్రం అడ్డు వేశారు. మంత్రి మండలి నుంచి తొలగించాల్సిన పేర్లతో కూడిన జాబితాలో తన వర్గానికి చెందిన వారిని రక్షించుకోవడానికి ‘పార్టీకి సీనియర్ల అవసరం ఎంతో ఉంది’ అన్న అస్త్రాన్ని మల్లికార్జున ఖర్గే తెరపైకి తీసుకువచ్చారు. దీంతో పునర్ వ్యవస్థీకరణపై సందిగ్దత నెలకొంది. మంత్రి మండలిలోకి యువ కులను చేర్చుకోవాలని సీఎం సిద్ధరామయ్య భావిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సిద్ధరామయ్య రూపొందించిన తొలగింపు జాబితాలో చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లే కాక, మల్లికార్జున ఖర్గే అనుచరులుగా గుర్తింపు పడిన మంత్రులు ఖమరుల్ ఇస్లాం, శ్యామనూరు శివశంకరప్ప, కిమ్మెనరత్నాకర్, బాబురావ్ చించన్సూర్, అభయ్చంద్రజైన్ వంటి వారి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం తనను కలిసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మల్లికార్జున ఖర్గే కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులను అనుభవిస్తున్న వారిని మొదట మంత్రి మండలి నుంచి తొలగించు. అటుపై మిగిలిన వారి సంగతి చూద్దాం. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో సీనియర్లను తొలగిస్తే పార్టీ చాలా నష్టపోతుంది. అందువల్ల పార్టీలో చాలా కాలంగా ఉన్న వారు మంత్రులుగానే కొనసాగడం ఉత్తమం.’ అని సూచించారు. అంతేకాకుండా మల్లికార్జున ఖర్గే సోనియాతో ప్రత్యేకంగా భేటీ అయ్యి సీనియర్లను తొలగించడం వల్ల రానున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీ నష్టపోయే అవకాశం ఉందని వివరించారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మండలి పున ర్ వ్యవస్థీకరణ విషయమై అనుమతి లభించలేదు. ఒకేసారి 12 మంది మంత్రులను తొలగించడం సరికాదని సోనియాగాంధీ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో మంత్రి మండలి పునర్ వ్యవస్థీకణకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో శుక్రవారం జరిపిన చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) మరోసారి సిద్ధరామయ్య, సోనియాగాంధీతో సమావేశం కానున్నారు. ఒకవేళ మండలి పునర్ వ్యవస్థీకరణకు నేడు అనుమతి లభించకపోతే సోనియా గాంధీ విదేశీ పర్యటన ముగిసేంతవరకూ విస్తరణ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఈ విషయమై సోనియాగాంధీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ...‘పునర్వ్యవ స్థీకరణ విషయంపై శుక్రవారం మేడం సోనియాగాంధీతో సూత్రప్రాయంగా చర్చించాను. ఈ విషయమై మేడంను శనివారం మరోసారి కలుస్తాను.’ అని పేర్కొన్నారు. -
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ?
22న కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం * యూపీ, ఉత్తరాఖండ్లకు మరింత ప్రాతినిధ్యం * పనితీరు సరిగాలేని మంత్రులపై వేటు * కోషియారి, రామేశ్వర్లకు అవకాశం న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే రూపుదాల్చనుంది. ఈనెల 22న ఇది జరిగే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లోకి కొత్తగా తీసుకునే వారిలో ఉత్తరాఖండ్కు చెందిన భగత్సింగ్ కోషియారి, అస్సాంకు చెందిన రామేశ్వర్ తెలి ఉంటారని సమాచారం. అలాగే కేంద్ర క్రీడా శాఖ మంత్రి (స్వతంత్ర హోదా)గా ఉన్న శర్బానంద సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఖాళీ అయిన ఆ పదవిని కొత్త వారితో భర్తీ చేసే అవకాశముంది. మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు ఈనెల 18-22 లోపే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే రాష్ట్రపతి విదేశీ పర్యటన ముగించుకొని ఈనెల 18న భారత్కు తిరిగి వచ్చే అవకాశముంది. ఆ తర్వాత ఈనెల 23న ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశముంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఈనెల 21న ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 18 నుంచి 22వ తేదీలోపే కేబినెట్లో మార్పుచేర్పులకు అవకాశముందని భావిస్తున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత వ్యవస్థీకృత మార్పులు జరిగే అవకాశముంది. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న కొందరిపై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. పనితీరు సరిగాలేని, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన మంత్రులను మోదీ పక్కనపెట్టవచ్చని భావిస్తున్నారు. సీనియర్ మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కారీలు తమ మంత్రిత్వ శాఖలను అట్టిపెట్టుకోనున్నారు. పెండింగ్ పనులను పూర్తిచేయడానికి వీలైనంత త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేయాలని మోదీ భావిస్తున్నారని ఆ వర్గాలు చెప్పాయి. -
ఖేడ్ లో ‘పునర్విభజన’ చిచ్చు..
♦ సంగారెడ్డి జిల్లాలో కలపాలని డిమాండ్ ♦ మెదక్ జిల్లాలో విలీనం చేస్తే ఆందోళన బాట నారాయణఖేడ్: జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతుండడం, నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలో కలుపుతారనే వార్తలు రావడంతో నియోజకవర్గంలో స్థానికుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.ప్రస్తుతం ఉన్న జిల్లాను మూడు జిల్లాలుగా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఖేడ్ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడే సంగారెడ్డి జిల్లాలో ఉంచాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీతోపాటు అన్ని రాజకీయపార్టీలు ఖేడ్ను మెదక్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఖేడ్ను సంగారెడ్డి జిల్లాలోనే కలపాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని ప్రతిపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఖేడ్ను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ సైతం ఉంది. మంత్రి హరీశ్రావు ఇటీవల ఖేడ్ను డివిజన్ కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఖేడ్ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అనంతర పరిణామాల్లో ఖేడ్ను మెదక్ జిల్లాలో విలీనం చేస్తారనే పిడుగులాంటి వార్తను మాత్రం ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంగారెడ్డితోనే సంబంధాలు.. ఏళ్లుగా నారాయణఖేడ్ వాసులకు సంగారెడ్డితోనే సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు చాలామంది సంగారెడ్డిలో నివాసమేర్పరుచుకోవడమే కాకుం డా అక్కడే స్థలాలను కూడా కొనుగోలు చేశారు. వ్యాపారం, ఆస్పత్రులు, తదితర పనులన్నింటీకీ ప్రధానంగా హైదరాబాద్పై ఆధారపడతారు. ఖేడ్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంమధ్యలోనే సంగారెడ్డి ఉంటుంది. దీంతో సంగారెడ్డికి, రాజధానికి వెళ్లేందుకు అన్ని విధాలుగా అనువుగా ఉంది. అన్ని కార్యాలయాలు సంగారెడ్డిలో ఉండడంతో సంగారెడ్డి పట్టణంతోనే మేకమయ్యారు. మెదక్ ప్రాంతం తో ఈ ప్రాంత ప్రజలకు అంతగా సంబంధాలు లేవు. కేవలం పోలీసు డివిజన్ మాత్రమే మెదక్లో ఉండడంతో ఆ పనులపై వెళ్లివచ్చేందుకే నానా తంటాలు పడతారు. మెదక్ వెళ్లేందుకు సరియైన రవాణా సదుపాయాలు కూడా లేవు. ఖేడ్ నుంచి సంగారెడ్డికి రోజులో రెండు మూడు మార్లు వెళ్లివచ్చే వీలుంది. అదే మెదక్ వెళ్లాలంటే ఒక రోజంతా పడుతుంది. సంగారెడ్డికి నారాయణఖేడ్ నుం చి 80 కిలోమీటర్లు. మెదక్కు 45 కిలోమీటర్ల దూరం ఉన్నా ఆ ప్రాంతంలో ఎలాం టి ప్రయోజనంలేదు. అవసరమైతే ఖేడ్ వాసులు బీదర్ ప్రాంతానికి వెళ్తారు కానీ మెదక్ వెళ్లరు. అలాంటి మెదక్లో ఖేడ్ను విలీనం చేస్తామనడంతో అన్ని వర్గాల వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకొందరు ఇప్పటికే జిల్లా కేంద్రంగా ఖేడ్ను చేయాలని కోరుతున్నారు. -
మూడుకే మొగ్గు!
♦ కొత్త జిల్లాలుగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ♦ 15 లక్షలలోపు జనాభాకే ప్రాధాన్యం ♦ రోడ్ మ్యాప్ను సిద్ధం చేసిన కలెక్టర్ ♦ పునర్విభజనపై రాజుకుంటున్న అగ్గి ♦ మేం సంగారెడ్డిలోనే ఉంటాం: ఖేడ్ ఎమ్మెల్యే ♦ మమ్మల్ని సిద్దిపేటలో కలపొద్దు: బెజ్జంకి ప్రజలు కొత్త జిల్లాల స్వరూపం! సంగారెడ్డి జిల్లా .. (జనాభా: 11,86,280.. వైశాల్యం: 3,116 చ.కిలోమీటర్లు, మండలాలు: 18) పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట, మునిపల్లి, రాయికోడ్, హత్నూర, జహీరాబాద్, జహీరాబాద్ అర్బన్, కోహీర్, న్యాల్కల్, ఝరాసంఘం, కంది మండల కేంద్రంగా సంగారెడ్డి రూరల్ గ్రామాలు, అమీన్పుర్ మండల కేంద్రంగా పటాన్చెరు రూరల్ గ్రామాలు వచ్చే అవకాశం ఉంది. మరో రెండు కొత్త మండలాలు కలిపి మొత్తం 18 మండలాలతో జిల్లా ఏర్పడనుంది. మెదక్ జిల్లా .. (జనాభా: 14,44,955, వైశాల్యం: 4,215 చ . కిలోమీటర్లు, మండలాలు: 25 పుల్కల్, తూప్రాన్, చేగుంట, మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, కొల్చారం, నారాయణఖేడ్, నారాయణఖేడ్ అర్బన్, మనూరు, కంగ్టి, కల్హేర్, పెద్దశంకరంపేట, కొత్తగా గుమ్మడిదల మండల కేంద్రంగా జిన్నారం రూరల్ గ్రామాలు, మెదక్ అర్బన్ మండలం, సిర్గాపూర్ మండల కేంద్రంగా కంగ్టిలోని కొన్ని గ్రామాలు, కల్హేర్లోని మరి కొన్ని గ్రామాలు, నిజామాబాద్ జిల్లా తాడ్వాయి, నాగిరెడ్డిపల్లి, ఎల్లారెడ్డి మండలాలు కలిసే అవకాశం ఉంది. మొత్తం 25 మండలాలతో మెదక్ జిల్లా ఏర్పడనుంది. సిద్దిపేట జిల్లా.. (జనాభా: 11,90,209, వైశాల్యం: 4,398 చ.కిలోమీటర్లు, మండలాలు: 22) సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు, దుబ్బాక, దౌల్తాబాద్, మిరుదొడ్డి, తొగుట, కొండపాక, గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్తో పాటుగా కరీంనగర్జిల్లా నుంచి హుస్నాబాద్, కోహెడ్, చిగురు మామిడి, ఇల్లంతకుంట, బెజ్జంకి, వరంగల్ జిల్లా నుంచి చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట్ట మండలాలు, కొత్తగా సిద్దిపేట అర్బన్ మండలం ఏర్పడ వచ్చు. మొత్తం 22 మండలాలతో సిద్దిపేట జిల్లా రూపుదిద్దుకోవచ్చు. సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి : జిల్లా భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోనుంది. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జి ల్లాను మూడు జిల్లాలుగా మార్చేందుకు కలెక్టర్ రోనాల్డ్ రోస్ రోడ్ మ్యాప్ను రూపొందించారు. మరోవైపు జిల్లాల పునర్విభ జనపై అగ్గి రాజుకుంటోంది. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ చేయాలని అక్కడి ప్రజలు రోడ్డెక్కగా.. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తాము సిద్దిపేట జిల్లాలో కలవబోమని, తమ కోసం గుండ్లపల్లి మండలం కేంద్రాన్ని ఏర్పాటు చేసి కరీంనగర్లోనే ఉంచాలని కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారు. తూప్రాన్ను రెవిన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్తో బుధవారం తూప్రాన్ పట్టణంలో బంద్ నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న తూప్రాన్ను మెదక్ జిల్లాలో చేర్చాలనే డిమాండ్ ఉంది. జియోగ్రాఫికల్ స్వరూపం దృ ష్ట్యా తూప్రాన్ను మెదక్ జిల్లాలోనే కల పాల్సి ఉంటుంది. తూప్రాన్ ఇప్పటికే పోలీసు డివిజన్గా ఉంది. దీన్ని రెవెన్యూ డివిజన్గా ప్రమోట్ చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. చేగుంట, వె ల్తుర్తి, శివ్వంపేట తూప్రాన్ మండలాల తో తూప్రాన్ రెవెన్యూ డివిజన్ చేయాల ని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నారాయణఖేడ్ను రెవిన్యూ డివిజన్గా చేసి సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా భౌగోళిక స్వరూపం దృష్ట్యా నారాయణఖేడ్ మెదక్ జిల్లాలోనే కలపటానికి అదికారులు ప్రణాళిక రూపొందించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి నారాయణఖేడ్ 80 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. కంగ్టి మండలంలోని చివరి గ్రామాలైతే దాదాపు 115 కిలో మీటర్ల దూరం ఉంటుంది. అదే మెదక్ పట్టణానికి 45 కిలో మీటర్ల దూరంమే ఉంటుంది. ఈనేపధ్యం అధికారులు నారాయణఖేడ్ను మెదక్లో కలపాలని సూచించారు కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలాన్ని సిద్దిపేటలో కలిపేందుకు ప్రణాళిక రూపొం దించారు. అయితే బెజ్జంకి దక్షిణ వైపున్న గ్రామాలు సిద్దిపేటలో కలిసేందుకు ఇష్టపడటం లేదు. దాదాపు 7కిలో మీటర్ల పరధిలో 20 గ్రామాలు గుండ్లపల్లికి చుట్టూ ఉంటాయి. ఈ గ్రామాలను బెజ్జంకి నుంచి వేరు చేసి గుండ్లపల్లిని మండల కేంద్రంగా చేసి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గూడెల్లి ఆంజనేయులు అనే నాయకుని ఆధ్యర్యంలో గుండ్లపల్లి మండల కేంద్రం సాధన జేఏసీ ఏర్పడి అక్కడ ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. మరో వైపు కేసీఆర్ సొంత గ్రామం చింతమడకను మండల కేంద్రంగా చేయాలనే డిమాండ్ ఉంది. అయితే చింతమడకను మండలంగా చేయడానికి దానికి అనుసంధానంగా తగినన్ని సమీప గ్రామాలు లేకపోవడంతో మండల కేంద్రంగా మార్చడానికి సాధ్యపడక పోవచ్చని రెవిన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త జిల్లాల రోడ్ మ్యాప్ను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ రూపొందించారు. జిల్లా కేంద్రానికి చివరి మండల కేంద్రం కనీసం 70 కిలో మీటర్ల లోపు ఉండాలనే నిబంధనలకు లోబడి జిల్లా రోడ్ మ్యాప్ను విభజించారు. ఇందులో చిన్న చిన్న మార్పులతో కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. -
జిల్లా కేంద్రమే.. గీటురాయి
♦ పునర్విభజనలో తెరపైకి జీఐఎస్ మ్యాపింగ్ ♦ జిల్లా కేంద్రం నుంచి 70 కి.మీ. పరిధి నిర్ధారణ ♦ కొత్తగా జిల్లాలో 11 మండలాలకు గ్రీన్సిగ్నల్ ♦ రెవెన్యూ డివిజన్ల పెంపు ఇప్పట్లో లేనట్లే మండలాల పునర్విభజనకు లైన్ క్లియరైంది. జిల్లాలో కొత్తగా 11 మండలాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.ఎంసీహెచ్ఆర్డీలో భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కలెక్టర్ల వర్క్షాప్లో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్విభజనపై విస్తృతంగా చర్చించారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పరిపాల నా సౌలభ్యం దృష్ట్యా జిల్లాలో అదనంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలనే జిల్లా కలెక్టర్ రఘునందన్రావు ప్రతిపాదనలకు సర్కారు పచ్చజెండా ఊపింది. కాగా, ఇప్పటికే ఐదు రెవెన్యూ డివిజన్లు ఉన్నందున.. కొత్త డివిజన్ల అవసరంలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి మండలంలో దాదాపు ఒకే నిష్పత్తిలో జనాభా, మండల కేంద్రం నుంచి దూరాన్ని కూడా కొలమానంగా తీసుకొని మండలాలను పునర్విభజించారు. అంతేకాకుండా మండలాల పునర్విభజనలో భూ పరిపాలనాశాఖ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. జీఐఎస్ సాఫ్ట్వేర్ మ్యాపింగ్ ద్వారా ప్రతిపాదిత మండలాల రేఖాచిత్రాలను గీసింది. కలెక్టర్ల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని నిర్దేశిత మండలాల సరిహద్దులు, మండల పరిధిలోకి వచ్చే గ్రామాలు, కొత్తగా కలిపే గ్రామాలు, జనాభా, ఇతర వనరులు తదితర అంశాలతో కూడిన మ్యాపింగ్ ను అక్కడికక్కడే ప్రదర్శించింది. తద్వారా మండలాల విభజనలో శాస్త్రీయత పాటించలేదనే విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టింది. అయితే ఈ జీఐఎస్ సాఫ్ట్వేర్ మ్యాపింగ్ విధానాన్ని నగర శివారులో ప్రాంతాల్లో అమలు చేయకూడదని నిర్ణయించింది. కొత్త మండలాలు ఇవే..! జిల్లాలో ప్రస్తుత 37 మండలాలకు అదనంగా మరో 11 మండలాలు ఏర్పడనున్నాయి. వీటిలో అధికశాతం పట్టణ మండలాలే ఉన్నాయి. రెవెన్యూ వివాదాలు, సిబ్బందిపై పనిభారం కారణంగా అదనంగా అర్బన్ మండలాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటికి తాజాగా జరిగిన సమావేశంలో మోక్షం కలిగింది. ప్రస్తుత మండలాల పరిధిని వర్గీకరించడం ద్వారా అల్వాల్, దొమ్మరపోచంపల్లి, జవహర్నగర్, కాప్రా, పెద్దషాపూర్, అబ్దుల్లాపూర్, కూకట్పల్లి, మీర్పేట/ బడంగ్పేట, మాదాపూర్/ కొండాపూర్, నార్సింగి, మేడిపల్లి మండలాలుగా ఆవిర్భవించనున్నాయి. జిల్లాలపై సస్పెన్స్ జిల్లాల పునర్వ్యస్థీకరణపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతునే ఉంది. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగే సమావేశంలో జిల్లాల ముఖచిత్రం ఖ రారు కానుంది. వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే అంశంపై ఎలాంటి వివాదం లేకున్నా, శివారు ప్రాంతాలను ఎక్కడ కలపాలనే విషయంపై మాత్రం ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 23 లేదా 24 జిల్లాలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. దానికి అనుగుణంగా ఆదిలాబాద్ నుంచి జిల్లాల విభజన ప్రక్రియను మొదలు పెడతారని, ఆ మేరకు రంగారెడ్డి, హైదరాబాద్లలో జిల్లాలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే ది ఆధారపడి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. కాగా, జిల్లా కేంద్రం 70 కిలోమీటర్ల దూరం వరకు జిల్లా పరిధిని ప్రభుత్వం నిర్ధేశించింది. దీనికి అనుగుణంగా జిల్లా కేంద్రం కొత్త జిల్లా ఏర్పాటులో కీలకం కానుంది. జిల్లా కేంద్రాన్ని గీటురాయిగా చేసుకొని జీఐఎస్ సాఫ్ట్వేర్(టూల్)తో నయా జిల్లా సరిహద్దులు రూపొందించనున్నారు. తద్వారా ఆ జిల్లా పరిధిలోకి వచ్చే జనాభా, జలవనరులు, రైల్వేలైన్లు, జాతీయ రహదారులు, ఇతరత్రా వనరులు క్షణాల్లో మ్యాపింగ్ అవుతాయి. దీంతో ఆ పరిధిలోకి వచ్చే పొరుగు జిల్లాల పరిధిలోని మండలాలు కూడా ఇందులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో ఇక్కడి ప్రాంతాలు పక్క జిల్లా పరిధిలోకి వెళ్లే వీలు లేకపోలేదు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో నేడు జరిగే వర్క్షాప్లో సీఎం కొత్త జిల్లాలను కొలిక్కి తేనున్నారు. అయితే, జిల్లా కేంద్రమే ఈ వ్యవహారంలో దిక్సూచి కానున్నందున.. రాజకీయ నిర్ణయం మేరకు కొత్త జిల్లాలు పురుడు పోసుకునే అవకాశముంది. -
కొత్త జిల్లాలకు ‘జోన్ల’ తంటా
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు జోనల్ వ్యవస్థతో ఇబ్బందులు ఎదురుకానున్నాయి! 14 లేదా 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే రెండుసార్లు ప్రకటించారు. సీఎం సూచనలకు అనుగుణంగా ఇప్పటికే అధికారులు కొత్త జిల్లాల తుది ముసాయిదా ఖరారు చేశారు. ఏ జిల్లాలో ఏయే ప్రాంతాలుండాలి, ఏయే నియోజకవర్గాలు, మండలాలు ఎందు లో కలపాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. అందుకే మరింత అధ్యయనం అవసరమని భావించిన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే జిల్లా కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు తీసుకోవటంతోపాటు జూన్ 2 తర్వాత వర్క్షాప్ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇదే సందర్భంలో జోనల్ వ్యవస్థతో తలెత్తే చిక్కుముళ్లు, ఇబ్బందులు, ఉద్యోగులు లేవనెత్తుతున్న సందేహాలపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలు మారినా రెండే జోన్లు విభజన తర్వాత 371 డీ ప్రకారం తెలంగాణలో రెండు జోన్లు మిగిలాయి. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం అయిదో జోన్లో ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ జిల్లాలు ఆరో జోన్లో ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు ఈ జోన్ల పరిధిని పరిగణనలోకి తీసుకోవటం తప్పనిసరి కానుంది. జోన్ల పరిధిలో ఏ మాత్రం మార్పు లేకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి. లేకుంటే రాజ్యాంగ, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా అయిదు, ఆరో జోన్ సరిహద్దుల్లో ఉన్న రంగారెడ్డి-నల్లగొండ, మెదక్-వరంగల్, మెదక్-కరీంనగర్, నిజామాబాద్-కరీంనగర్, నల్లగొండ-వరంగల్ జిల్లాల మధ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈ సరిహద్దు జిల్లాల్లో ఉన్న మండలాలు, ప్రాంతాలను పునర్వ్యస్థీకరణలో జోన్ దాటించటం సాధ్యమయ్యేలా లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చిక్కుకు మచ్చుతునకలివీ.. ఉదాహరణకు మెదక్ జిల్లాలో ఉన్న సిద్దిపేట కేంద్రంగా కొత్త జిల్లాగా ఏర్పాటు చేసి.. పక్కనే ఉన్న వరంగల్ జిల్లాలోని జనగాం పరిసర ప్రాంతాలను కలిపితే జోనల్ చిక్కు తప్పదు. కొత్తగా ఏర్పడే యాదాద్రి జిల్లాలో జనగాంను కలిపినా.. అదే సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకే జోన్ల సరిహద్దులు దాటకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేదంటే జోనల్ పోస్టులు, జిల్లా పోస్టులు, కొత్త నియామాకాల విషయంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇప్పటికే టీఎస్పీస్సీ వివిధ పోస్టుల భర్తీకి పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్-2 నియామకాలకు జోన్ల వారీగానే పోస్టులను ప్రకటించింది. లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త జిల్లాలు జోన్ల సరిహద్దులు దాటితే.. ఆ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు, ఉద్యోగులను ఏ జోన్లో పరిగణించాలనే సమస్య ఉత్పన్నం కానుంది. ఇది న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తుంది. జోనల్ వ్యవస్థను మార్చటం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. జోన్ల వ్యవస్థలో మార్పుచేర్పులు చేయాలంటే కేంద్రం ఆమోదం పొందడంతోపాటు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుంది. ఇదంతా ఉన్నఫళంగా సాధ్యమయ్యే అంశం కానందున ఏ జోన్ పరిధిలోని జిల్లాలను అదే పరిధిలో పునర్వ్యవస్థీకరించటం తప్ప మరో గత్యం తరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ జోన్ జిల్లాలు అక్కడే.. తెలంగాణను మొత్తం 24 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఖరారైన తుది ముసాయిదా ప్రకారం అయిదో జోన్లో ఉన్న నాలుగు జిల్లాలను తొమ్మిది జిల్లాలుగా, ఆరో జోన్లో ఉన్న ఆరు జిల్లాలను 15 జిల్లాలుగా విభజిస్తారు. పునర్వ్యవస్థీకరణతో జోన్లకు విఘాతం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. -
వికారాబాద్ జిల్లా కేంద్రం కాకుంటే..ఆమరణ నిరాహార దీక్ష
♦ సీఎం కేసీఆర్ మాటపై పూర్తి నమ్మకం ఉంది ♦ వీడీడీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరావు ♦ జిల్లా కేంద్రంపై కాంగ్రెస్ పూర్తి సహకారం : మాజీ మంత్రి ప్రసాద్కుమార్ వికారాబాద్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా పశ్చిమ రంగారెడ్డిలోని వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయమని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బి.సంజీవరావు అన్నారు. అలా కానీ పక్షంలో ఉద్యమంలో ముందు నడిచి ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు - అభివృద్ధి అనే అంశంపై మంగళవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ సమావేశ మందిరం లో వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫోరం(వీడీడీఎఫ్) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటపై నిలబడే వ్యక్తి అని, ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా వికారాబాద్ను జిల్లా కేంద్రంగా చేస్తారన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని కోరారు. వికారాబాద్ జిల్లా నాలు గు నుంచి ఐదు నియోజకవర్గాలతో ఏర్పడడం ఖాయమన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరుపున జిల్లా కేంద్రం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి వికారాబాద్ జిల్లా కేంద్రం అయ్యేందుకు పూర్తిసహకారం అందిస్తామని చెప్పారు. వికారాబాద్ జిల్లా ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమన్నారు. జిల్లా విషయంలో తేడా వస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.. వికారాబాద్ ప్రజలకు ముందు నుంచి పాల కులు అన్యాయం చేస్తూనే ఉన్నారని, గతంలో పార్లమెంట్ స్థానాన్ని చేవెళ్లకు, ప్రభుత్వ ఆసుపత్రిని తాండూరుకు తరలించి తీరని అన్యాయం చేశారని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం అవుతుందంటే లేనిపోని ఆందోళనల తో ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత నాయకులు ఐక్యంగా ఉండి వికారాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. లేని పక్షంలో ప్రమాదం పొంచి ఉందన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటులో తేడా వస్తే ప్రత్యేక రాష్ర్ట తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, వీడీడీఎఫ్ నాయకులు శుభప్రద్పటేల్, కె.శ్రీనివాస్, నర్సింహు లు, మారుతి, టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు రత్నారెడ్డి, రాజు నాయక్, వేణుగోపాల్రెడ్డి, బీజేపీ నుంచి శివరాజ్, నాయకులు పెం డ్యాల అనంతయ్య, సురేష్, రవిశంకర్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.విఠల్, పీఆర్టీయూ నర్సింహులు, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
‘తీన్’మార్
మూడు జిల్లాలుగా విభజించాలని ప్రతిపాదనలు ♦ రెవెన్యూ, పోలీస్ విభాగాలు కలిసి సమర్పణ ♦ మండలం యూనిట్గా డీలిమిటేషన్ ♦ గుట్టుగా సర్కారుకు మరిన్ని ప్రతిపాదనలు ♦ మొదటి నుంచీ అనుకున్నట్టే ‘వికారాబాద్’ ♦ రాజధాని సహా షాద్నగర్, ♦ భువనగిరితో నాలుగు జిల్లాల ఏర్పాటు జిల్లా మూడు ముక్కలుగా విడిపోనుంది. పునర్విభజనలో జిల్లాను మూడు జిల్లాలుగా విభజించేలా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, తొలుత అనుకున్నట్లు నియోజకవర్గాలవారీగా కాకుండా మండలాలను యూనిట్గా చేసుకొని డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రతిపాదనలేకాకుండా మరికొన్నింటిని గుట్టుగా ప్రభుత్వానికి నివేదించింది. దీంట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనను ఆధారంగా చేసుకొని నయా జిల్లాలను ప్రతిపాదించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాంతాలేకాక.. షాద్నగర్, భువనగిరిని కూడా కలుపుకొని జిల్లా యంత్రాంగం పునర్విభజన కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ పెద్ద మనోగతానికి అనుగుణంగా ఈ జిల్లాల మ్యాప్లను సైబ రాబాద్ పోలీస్ కమిషనర్, కలెక్టర్ సంయుక్తంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు కొత్త జిల్లాల స్వరూపం, సరిహద్దులపై ఈ ఇరువురి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకే దాదాపుగా పచ్చజెండా ఊపే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ను రెండుగా విభజించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. ఈ క్రమంలోనే తెలంగాణ తిరుమలగా అభివర్ణిస్తున్న యాదాద్రిని కూడా కొత్త కమిషనరేట్ల పరిధిలోకి తీసుకురావాలని యోచించింది. అందులో భాగంగానే నగరానికి చేరువలో ఉన్న భువనగిరి, అదే తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న షాద్నగర్ను కూడా కలుపుకొని విభజన పర్వాన్ని చేపట్టే దిశగా ఆలోచన చేస్తోంది.భువనగిరి పరిధిలో ఇబ్రహీంపట్నం, మే డ్చల్ సెగ్మెంట్లను పొందపరచాలని,శంషాబాద్ కేం ద్రంగా షాద్నగర్.. చార్మినార్లోకి మహేశ్వరంను చేర్చే లా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా మినహా రంగారెడ్డి, హైదరాబా ద్ జిల్లాల పరిధిలో నూతన ంగా నాలుగు జిల్లాలను ఏ ర్పాటు చేయాలనే కోణంలో మల్లగుల్లాలు పడుతోంది. మూడు జిల్లాలివే.. ఇదిలావుండగా, ప్రస్తుత జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. వికారాబాద్, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం పేరిట ఈ జిల్లాలు ఉంటాయని స్పష్టం చేసింది. మండలాలను యూనిట్గా చేసుకొని వీటికి తుదిరూపు ఇచ్చారు. మొదట భావించినట్లు వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగుతుందనే ప్రచారానికి తెరదించుతూ వికారాబాద్ను ప్రత్యేక జిల్లాగా నిర్వచించింది. అయితే, జిల్లా కేంద్రాల ప్రకటనను మాత్రం ప్రభుత్వం విచక్షణకే వదిలేసింది. -
టీఆర్ఎస్ నేతల్లో గుబులు!
♦ నియోజకవర్గాల పెంపు లేదని తేలడంతో ఆందోళన ♦ ‘సాక్షి’ కథనంపై సీఈవో భన్వర్లాల్కు పలువురి ఫోన్లు? ♦ మంత్రులు, ముఖ్య నేతల వద్ద మరికొందరి ఆవేదన ♦ ‘కారెక్క’డంపై పునరాలోచనలో కొందరు మాజీలు సాక్షి, హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో కొత్తగా 34 సీట్లు పెరుగుతాయని ఆశించి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరిన ఎమ్మెల్యేలతోపాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఎదురుచూస్తున్న ఆ పార్టీ ఆశావహుల్లో గుబులు మొదలైంది. ఇప్పుడున్న 119 స్థానాలకుతోడు పునర్విభజనలో మరో 34 సీట్లు పెరిగి 153 స్థానాలు అవుతాయని జోరుగా సాగిన ప్రచారంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బంది ఉండదని భావించి టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి ఆరుగురు, వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఇద్దరు అధికార టీఆర్ఎస్లో చేరారు. వీరి చేరికలను ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జ్లు వ్యతిరేకించకుండా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని టీఆర్ఎస్ నాయకత్వం భరోసా ఇచ్చింది. అయితే సమీప భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశమే లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పిన విషయాన్ని సాక్షి శనివారం ప్రధాన సంచిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించిన దరిమిలా ఆయా నేతలు ఆందోళనలో పడ్డారు. కొందరైతే రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్లాల్కు ఫోన్ చేసి నిజమేనా అని ఆరా తీసినట్లు సమాచారం. మరికొందరు తమ జిల్లాల్లో మంత్రులు, ముఖ్య నేతల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. మా పరిస్థితి ఏమిటి..? ఖమ్మంలో గడచిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆర్జేసీ కృష్ణ, పినపాకలో శంకర్ నాయక్లు తాజాగా అక్కడ కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేరడంతో ఆందోళనలో పడ్డారు. ఖమ్మంలో టీఆర్ఎస్కు ఉనికి లేని సమయంలో తాము ధైర్యంగా ముందుకొచ్చి ప్రజల ముందుకెళ్తే ఇప్పుడు వేరే పార్టీల ఎమ్మెల్యేలను తెచ్చి ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టీఆర్ఎస్లో చేరినప్పుడు అదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కె.ఎస్.రత్నం వ్యతిరేకించారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని ఏ ఇబ్బంది లేదని ఆయనకు నచ్చజెప్పారు. కానీ ఇప్పుడు పునర్విభజన లేదని వార్తలు వెలువడుతుండటంతో తన పరిస్థితి ఏమిటోనని ఆయన ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఆయన టీఆర్ఎస్ ప్రముఖ నేతల్లో ఒకరిని కలసి నియోజకవర్గాలు పెరగకపోతే తనకే చేవెళ్ల టికెట్ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో తన దారి తాను చూసుకుంటానని పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. వరంగల్ జిల్లా డోర్నకల్, మహబూబ్నగర్ జిల్లా మక్తల్ సహా దాదాపు 23 నియోజకవర్గాల్లో చేరిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు అక్కడ్నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థుల్లోనూ ఆందోళన నెలకొంది. ‘సీట్లు పెరుగుతాయని మాకు ఆశ చూపారు. ఇప్పుడేమో పరిస్థితి అయోమయంగా ఉంది’ అని హైదరాబాద్కు చెందిన సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు. -
పునర్విభజన లేదు
ఎన్నికల సంఘం స్పష్టీకరణ కేంద్ర హోంశాఖ కూడా అదే చెప్పిందని వివరణ ఆర్టీఐ కింద ఈసీ సమాధానం ‘సాక్షి’ వద్ద ఈసీ, హోంశాఖ లేఖలు 2026 జనాభా లెక్కలు తేలే వరకు పునర్విభజన సాధ్యం కాదు రాజ్యాంగంలోని 170(3) అధికరణే సుప్రీం... ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి రాజ్యాంగం అడ్డుకట్ట సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన జరగనున్నదంటూ సాగుతున్న ఊహాగానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. సమీప భవిష్యత్లో రెండు తెలుగురాష్ట్రాలలో శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేదని అది తేల్చేసింది. సమాచార హక్కు చట్టం కింద ‘సాక్షి’కి ఇచ్చిన సమాధానంలో ఈ మేరకు అది స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయ సలహా కోరిందా? భారత అటార్నీ జనరల్ నుంచి ఏదైనా సలహా కోరిందా? ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపును చేపట్టే ప్రతిపాదన ఏదైనా ఉందా? అంటూ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమాధానం ఇచ్చింది. ఈనెల 4 తేదీతో ఉన్న ఎన్నికల సంఘం లేఖ ‘సాక్షి’కి శుక్రవారం అందింది. తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు వీలుకల్పించే చట్టం ఏదీ లేనందున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని అది వివరించింది. రాజ్యాంగంలోని 170 (3) అధికరణ లోని నిబంధనలే అమలులో ఉంటాయంటూ కేంద్ర హోంశాఖ నుంచి తమకు అందిన లేఖ ప్రతిని కూడా ఈ లేఖతో పాటు అందించింది. అంటే రాజ్యాంగ సవరణ చేస్తూ మరో చట్టం చేస్తే తప్ప పునర్విభజనకు అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. ఆ ప్రక్రియ ఎప్పుడో ఆగిపోయింది... నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ నిజానికి 2014 సెప్టెంబర్లోనే నిలిచిపోయింది. ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖ లేఖలను పరిశీలిస్తే ఈవిషయం అర్ధమౌతుంది. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్ర హోంశాఖ చేపట్టింది. పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కొన్ని వివరణలు కావాలని అది భావించింది. దీనిపై కేంద్ర హోంశాఖ, లా అండ్ జస్టిస్ మంత్రిత్వశాఖలోని లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. ఆ తర్వాత 2014 సెప్టెంబర్ 8న మాకు కేంద్ర హోంశాఖ ఒక లేఖ రాసింది.’’ అని ఎన్నికల సంఘం వివరించింది. ‘‘లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ సూచనలను కేంద్ర హోంశాఖ ఆ లేఖలో ప్రస్తావించింది. రాజ్యాంగంలోని 170 (3) అధికరణను బట్టి చూస్తే ఎస్సి ఎస్టీ నియోజకవర్గాల పునః పంపిణీకి అవసరమైన సర్దుబాటుకు తప్ప పునర్విభజనకు అవకాశమే లేదు. అందువల్ల సమీప భవిష్యత్లో రెండు రాష్ట్రాలలో నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు గాను పూర్తిస్తాయి పునర్విభజన ప్రక్రియ అవసరమే లేదని కేంద్ర హోంశాఖ తెలిపింది’’ అని ఎన్నికల సంఘం వివరించింది. ఈసీకి హోం శాఖ జవాబు ఇదీ.. కేంద్ర హోం శాఖ పంపిన ఆఫీస్ మెమోరాండంను కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమాచార హక్కు కింద ఇచ్చిన జవాబుతో జతపరిచింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేష్కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుమిత్ ముఖర్జీకి ఈ లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ.. మీరు జూన్ 26, 2014న రాసిన లేఖకు సంబంధించి ఈ లేఖ రాస్తున్నాం. మీరడిన వివరాలపై కేంద్ర న్యాయశాఖ సలహా తీసుకున్నాం. వారు చెప్పినదేంటంటే ‘‘కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ద్వారా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 2002 నుంచి 2008 మధ్య చేపట్టింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వును కేంద్రం 2008లో నోటిఫై చేసింది. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ స్థానాల పెంపు సబబని భావించి, ఆర్టికల్ 170కి లోబడి ఈ ప్రక్రియ ఉండాలని చట్టంలో పొందుపరిచింది. అయితే ఈ సెక్షన్కు సంబంధించి ఎలాంటి గడువు విధించలేదు. అందుకు కారణం ఆర్టికల్ 170 అనేది ఒక సమగ్రమైన నిబంధన. ఇది మొత్తం సీట్లను నిర్ధారించడానికి, ప్రతి రాష్ట్రాన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు గానూ విభజించడానికి గల ప్రమాణాన్ని నిర్ధేశిస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి గమనించాల్సిన ముఖ్య విషయం మరొకటి ఉంది. ఈ నిబంధన(సెక్షన్ 26) భవిష్యత్తులో అమలయ్యేదానిని సూచిస్తోంది. అంతేకాకుండా ఆర్టికల్ 170లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 15ను చూడాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణచట్టంలోని సెక్షన్ 26లో చెప్పిన తరహాలో సీట్ల పెంపు యోచన సెక్షన్ 15కు సంబంధం లేకుండా రాజ్యాంగ నిబంధనలకు లోబడి నూతనంగా పునర్విభజన ప్రక్రియ చేపట్టే వరకు ప్రస్తుత స్థితి కొనసాగుతుంది. ఆర్టికల్ 170 (3) ఏం చెబుతోందంటే.... ప్రతి జనాభా లెక్కల తరువాత అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్యను, అదే విధంగా నియోజక వర్గాల ప్రాదేశిక పరిధులను పార్లమెంట్లో చట్టం తెచ్చి, ఆ చట్టం పేర్కొన్న విధంగా పునఃసర్దుబాటు చేసుకోవచ్చు. అయితే ఆ మార్పులు అప్పటికే ఉన్న అసెంబ్లీలోని ప్రాతినిధ్యాన్ని ఆ అసెంబ్లీ రద్దు అయ్యేంత వరకూ ఏ విధంగానూ ప్రభావితం చెయ్యకూడదు. అంతేకాక ఆ పునఃసర్దుబాటు రాష్ట్రపతి జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్న తేదీ నుంచే అమలులోకి రావాలి. ఆ లోపు అసెంబ్లీకి జరిగే అన్ని ఎన్నికలూ పునఃసర్దుబాటుకు ముందు ఉన్న నియోజక వర్గాలకే జరగాలి. అంతేకాక 2026 సంవత్సరం తరువాతి మొదటి జనగణనకి చెందిన గణాంకాలన్నీ ప్రచురితమయ్యేంత వరకూ, 1) 1971 జనగణన ఆధారంగా ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో మార్పు చేసిన నియోజక వర్గాల సంఖ్యను, 2) 2001 జనగణన ఆధారంగా ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో మార్పు జరగబోయే నియోజక వర్గాల ప్రాదేశిక పరిధులను పునఃసర్దుబాటు చెయ్యాల్సిన అవసరం లేదు. -
గ్రేటరే..టాప్
గ్రేటర్ హైదరాబాద్లో నియోజకవర్గాల సంఖ్య పెరగనుంది. పునర్విభజన అనంతరం ఇప్పుడున్న స్థానాలకు అదనంగా మరికొన్ని వచ్చిచేరనున్నాయి. అయితే ఎన్ని నియోజకవర్గాలు పెరగనున్నాయి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.పునర్విభజనలో భారీగా పెరగనున్న నగర ప్రాతినిధ్యం 2001 ప్రామాణికమైతే హైదరాబాద్లో 19, రంగారెడ్డిలో 18 నియోజకవర్గాలు 2011 తీసుకుంటే.. రంగారెడ్డిలో 23, హైదరాబాద్లో 17 స్థానాల ఏర్పాటు నాలుగు లోక్సభ స్థానాల సరిహద్దుల్లోనూ మార్పులు చేర్పులు సిటీబ్యూరో: శాసనసభ స్థానాల పునర్విభజనలో గ్రేటర్ హైదరాబాదే అత్యధిక స్థానాలతో అగ్రభాగాన నిలువనుంది. ఇప్పటికే 24 నియోజకవర్గాలుండగా, పునర్విభజన జరిగితే శాసనసభ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. అయితే పునర్విభజన కమిషనర్ 2001 జనాభాను పరిగణలోకి తీసుకుంటే అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 19 స్థానాలు, 2011 జనాభాను తీసుకుంటే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 23 స్థానాలు ఏర్పాటవుతాయి. త్వరలో పునర్విభజన పని మొదలవుతుందన్న సంకేతాలు కేంద్రం నుండి వెలువడటంతో నగరంలోనూ రాజకీయ చర్చలు - లెక్కలు, తీసివేతలు జోరందుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభాను పరిగణలోకి తీసుకుని కొత్త నియోకజవర్గాల ఏర్పాటు చేయనున్నారు. భారీగా పెరగనున్న నియోకజవర్గాలు 2001 జనాభాను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతమున్న 14 నియోజకవర్గాల స్థానే 18 ఏర్పాటవుతాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్బీనగర్, కూకట్పల్లి, శేరిలింగపల్లి, ఉప్పల్ నియోజకవర్గాలను విడదీసి కొత్తగా మరో నాలుగు నియోకజవర్గాలు ఏర్పాటు కానున్నాయి. అదే హైదరాబాద్కు వచ్చే సరికి కొత్తగా మరో నాలుగు నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. హైదరాబాద్ లోక్సభ పరిధిలో రెండు, సికింద్రాబాల్ లోక్సభ పరిధిలో రెండేసి చొప్పున కొత్త నియోకజవర్గాలు ఏర్పాటవుతాయి. ఏ జనాభా..ప్రామాణికం ..! త్వరలో చేపట్టబోయే పునర్విభజనకు ఏ జనాభా లెక్కలు ప్రామాణికంగా తీసుకోబోతున్నారన్న అంశం ఆసక్తికరంగా మారిది. 2001 తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో కేవలం 4 స్థానాలే పెరుగుతాయి. 2011 తీసుకుంటే ఏకంగా తొమ్మిది స్థానాలు పెరుగుతాయి. అయితే దేశంలో 2000 సంవత్సరంలో కొత్తగా ఏర్పడ్డ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పునర్విభజన చేసే సమయంలో 1981,1991 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నా, అక్కడ 1971 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2026 వరకు 2001 జనాభా లెక్కల మేరకే జస్టిస్ కుల్దీప్సింగ్ ఆధ్వర్యంలో పునర్విభజన కమిషన్ నియోజకవర్గాల్లో చేర్పులు మార్పులు చేసిన దృష్ట్యా, ఏపీ, తెలంగాణాలోనే చేపట్టబోయే పునర్విభజనకు 2001 లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటారని పునర్విభజన విశ్లేషకులు ఆర్.జ్యోతిర్మయరెడ్డి అభిప్రాయపడ్డారు. 2001 జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో కేవలం నాలుగు స్థానాలు పెరుగుతాయి. అదే 2011 జనాభా తీసుకుంటే ఏకంగా తొమ్మిది స్థానాలు, అవీ జీహెచ్ఎంసీ పరిధిలోనే పెరుగుతుండటం విశేషం. పునర్విభజన సాగేదిలా పరిగణలోకి తీసుకునే జనాభా లెక్కల మేరకు శాసనసభ స్థానాల పునర్విభజన జరుగుతుంది. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674 (ఖమ్మం జిల్లా నుండి ఏపీకి వెళ్లిన ప్రాంతాలను మినహాయిస్తే) గా తేల్చారు. ఇదే 2001 లెక్కలు తీసుకుంటే 3,08,05,599 గా తేలింది. దీంతో మొత్తం జనాభాను 153 నియోకజవర్గాలకు విభజిస్తే వచ్చే సగటు మేరకు నియోకజవర్గాల ఏర్పాటు జరుగుతుంది. అంటే 153 నియోకజవర్గాలకు రాష్ట్ర జనాభా సగటు తీసకుని శాసనసభ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తారు..అయితే పునర్విభజన చట్టం మేరకు ప్రత్యేక పరిస్థితుల్లో నియోకజవర్గ జనాభా రాష్ట్ర సగటు కంటే 10 శాతం తక్కువ లేదా 10 శాతం ఎక్కువతోనైనా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. 2001 లెక్కలే ప్రామాణికం.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న నియోజకవర్గాలు 2001 జనాభా లెక్కల మేరకు విభజించినవే.2031వరకు 2001 జనాభానే ప్రామాణికంగా తీసుకుంటారు. ఉత్తరాఖండ్లో 2000లో చేసిన నియోజకవర్గాల పునర్విభజనకు 1981, 1991 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నా, 1971 లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నారు. - జ్యోతిర్మయరెడ్డి, విషయనిపుణులు -
రూ. 13,600 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ
ఆంధ్రాబ్యాంకు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 13,643.51 కోట్ల మేర రుణభారం ఉన్న 190 ఖాతాలను పునర్వ్యవస్థీకరించింది. వీటిలో చాలా మటుకు ఖాతాదారులు రూ.25 కోట్ల పైగా రుణాలు పొందినట్లు ఆర్థిక పనితీరు నివేదికలో బ్యాంకు గురువారం వెల్లడించింది. రూ. 1 కోటి మించి.. రూ. 25 కోట్ల కన్నా తక్కువ రుణాలు ఉన్న ఖాతాల సంఖ్య 48 ఉన్నాయని, వీటి మొత్తం విలువ రూ. 378 కోట్లుగా ఉంటుందని బ్యాంకు తెలిపింది. రూ. 1 కోటి కన్నా తక్కువ రుణ భారం ఉన్న ఖాతాలు 53 ఉన్నాయని, వీటి మొత్తం విలువ రూ. 19.51 కోట్లని పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రూ. 691 కోట్ల మేర రుణాలు నిరర్థకంగా (ఎన్పీఏ) మారాయని బ్యాంకు తెలిపింది. విలువ, పరిమాణంపరంగా పరిశ్రమలకిచ్చిన రుణాలు అత్యధికంగా (90 ఖాతాలు.. రూ. 12,368 కోట్లు) పునర్వ్యవస్థీకరించినట్లు ఆంధ్రా బ్యాంకు తెలిపింది. ఆ తర్వాత లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (61 ఖాతాలు, రూ. 1,097 కోట్లు), వ్యవసాయ రుణాలు (24 ఖాతాలు, రూ. 177 కోట్లు) ఉన్నాయి. భారీగా పెరిగిపోయిన మొండి బకాయిలకు కేటాయింపుల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఆంధ్రా బ్యాంకు నికర లాభం ఏకంగా 83 శాతం క్షీణించి రూ. 34 కోట్లకు పడిపోయింది. -
డిజిటల్ మ్యాగజైన్లను నిలిపివేస్తున్న యాహూ
శాన్ఫ్రాన్సిస్కో: ప్రత్యర్థి కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఇంటర్నెట్ సంస్థ యాహూ.. వ్యాపార పునర్వ్యవస్థీకరణపై మరిం తగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని డిజిటల్ మ్యాగజైన్స్ను నిలిపివేయడం మొదలుపెట్టింది. యాహూ ఫుడ్, హెల్త్, పేరెంటింగ్, మేకర్స్, ట్రావెల్, ఆటోస్, రియల్ ఎస్టేట్ మ్యాగజైన్లను దశలవారీగా మూసివేయనున్నట్లు సంస్థ గ్లోబల్ ఎడిటర్ ఇన్ చీఫ్ మార్తా నెల్సన్ తమ బ్లాగ్లో వెల్లడించారు. యాహూను వృద్ధి బాట పట్టించే దిశగా ఉత్పత్తులు, వనరులపరంగా మరింత సాహసోపేత ప్రణాళికను అమలు చేయాల్సి ఉంటుందని కంపెనీ సీఈవో మరిస్సా మెయర్ ఇటీవలే పేర్కొన్నారు. దీని ప్రకారం దాదాపు 1,500 ఉద్యోగాల్లో కంపెనీ కోత విధించనుంది. దుబాయ్, మెక్సికో సిటీ, బ్యూనస్ ఎయిర్స్, మ్యాడ్రిడ్, మిలాన్ తదితర ప్రాంతాల్లో కార్యాలయాలను మూసివేయనుంది. -
జీఎంఆర్ ఎయిర్పోర్ట్లో వాటాల పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్లో వాటాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రకటించింది. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో పెట్టుబడి పెట్టిన పీఈ ఇన్వెస్టర్ల వాటాను జీఎంఆర్ ఇన్ఫ్రా జూన్ 5, 2017లోగా కొనుగోలు చేయనుంది. కాల్ ఆప్షన్ రైట్స్లో భాగంగా పీఈ ఇన్వెస్టర్ల వాటాను కన్వర్టబుల్ ఈక్విటీలుగా మార్చుకోనున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. -
రెఢీ
డివిజన్ల ముసాయిదా జాబితా సిద్ధం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి అంకం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరలేచింది. డివిజన్ల పునర్విభజన ముసాయిదా బుధవారం విడుదలైంది. దీని ప్రకారం కొన్ని నియోజకవర్గాల పరిధిలో డివిజన్లు పెరుగుతుండగా... మరికొన్ని నియోజకవర్గాల్లో తగ్గుతున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టడంతో శివారు ప్రాంతాల్లోని డివిజన్ల సంఖ్య పెరుగుతుండగా... కోర్సిటీ, పాతబస్తీల్లో తగ్గుతున్నాయి. సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 49 డివిజన్లు ఉండగా... ఈ సంఖ్య 39కి తగ్గనుంది. అంటే ఏకంగా పది డివిజన్లు తగ్గుతున్నాయి. హైదరాబాద్ లోక్సభ స్థానం(పాతబస్తీ) పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 43కు త గ్గుతోంది. మల్కాజిగిరి లోక్సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది డివిజన్లు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 39 డివిజన్లు ఉండగా...ఈ సంఖ్య 49కి పెరగనుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 11 డివిజన్లు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 8 డివిజన్లు ఉన్నాయి. ఉప్పల్ నియోజకవర్గంలో డివిజన్లు 7 నుంచి 10కి పెరగనున్నాయి. దీంతో సహజంగానే వివిధ రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. కొత్తగా ఏర్పాటవుతున్న డివిజన్లలోనూ తమకు పట్టున్నవేవో... పట్టులేనివి ఏవో తేల్చుకునే పనిలో పార్టీలు తలమునకలవుతున్నాయి. గందరగోళం.. డివిజన్లు గందరగోళంగా ఏర్పాటు చేశారనే ఆరోపణలు అప్పుడే మొదలయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని కొత్త డివిజన్లలో రహదారులు, బస్తీలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయంటున్నారు. కొత్తపేట డివిజన్లో ఎంతో దూరంగా ఉన్న బస్తీలను కలిపారని.. దీని వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఖైరతాబాద్లోనూ ఒకదానికొకటి పొంతన లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్: రెండుగా శ్రీనగర్ కాలనీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉండే శ్రీనగర్ కాలనీని రెండుగా చీల్చారు. కొంతభాగాన్ని సోమాజిగూడ, మరికొంత ప్రాం తాన్ని యూసుఫ్గూడలో కలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోకి సోమాజిగూడ.. జాబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి యూసుఫ్గూడ వచ్చింది. ఒకే డివిజన్ రెండు నియోజకవర్గాల్లో విస్తరించడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శ్రీనగర్ కాలనీ డివిజన్ను తొలగించడంతో డివిజన్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. రాజేంద్రనగర్... రాజేంద్రనగర్ సర్కిల్ను ఐదు డివిజన్లుగా విభజించారు. గతంలో నాలుగు డివిజన్లు ఉండగా...కొత్తగా ఒకటి చేరింది. శివరాంపల్లి డివిజన్ కనుమరుగైంది. సూలేమాన్నగర్, శాస్త్రీపురం రెండు నూతన డివిజన్లుగా ఏర్పడ్డాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి డివిజన్ల పేర్లే కొనసాగనున్నాయి. ముషీరాబాద్: సంబంధం లేకుండా చేశారు సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గంలో గతంలో ఎనిమిది డివిజన్లు ఉండగా... ప్రస్తుతం ఆరుకు కుదించారు. దోమలగూడ, బాగ్లింగంపల్లి డివిజన్లను మాయం చేశారు. బాగ్లింగంపల్లి డివిజన్ను అడిక్మెట్, రాంనగర్, గాంధీనగర్ డివిజన్లలో కలిపారు. దోమలగూడను కవాడిగూడ, గాంధీనగర్లలో విలీనం చేశారు. ఈ మార్పులు, చేర్పుల వల్ల రహదారులు, బస్తీలు ఒకదానికొకటి సంబంధం లేకుండా పోయాయి. వార్డుల పునర్విభజనపై స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కొసమెరుపు. సనత్నగర్: రెండు డివిజన్లు గల్లంతు.. సనత్ నగర్ నియోజకవర్గంలో పద్మారావు నగర్, బల్కంపేట డివిజన్లు తొలగించారు. ఇందులో కొంతభాగాన్ని సనత్నగర్లో, మరికొంత ప్రాంతాన్ని అమీర్పేట డివిజన్లో కలిపారు. ఎల్లమ్మ దేవాలయం అమీర్పేట డివిజన్లోకి వస్తోంది. బల్కంపేటను డివిజన్గా కొనసాగించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ అవకాశం కల్పించకపోవడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న పద్మారావు నగర్లో కొంత భాగాన్ని బన్సీలాల్పేటలో, మరికొంత ఏరియాను రాంగోపాల్పేటలో విలీనంలో చేశారు. మొన్నటి వరకు ఏడు డివిజన్లు ఉండగా.. తాజాగా ఐదుకు పరిమితం చేశారు. అంబర్పేట: బీజేపీకి ఇబ్బందులే అంబర్పేట నియోజకవర్గ పరిధిలో ఏడు డివిజన్లు ఉండగా... వీటిలో కాచిగూడ, విద్యానగర్ డివిజన్లు మాయమయ్యాయి. బీజేపీ కి పట్టున్న బస్తీలను విచ్ఛిన్నం చేయడంతో ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. విద్యానగర్ డివిజన్లోని కొన్ని బస్తీలను నల్లకుంట, బాగ్అంబర్పేట్ డివిజన్లలో కలిపారు. కాచిగూడ డివిజన్లో కొంత భాగాన్ని బర్కత్పుర, గోల్నాకలో కలిపారు. ఖైరతాబాద్: లోపించిన శాస్త్రీయత ఖైరతాబాద్ నియోజకవర్గంలో పంజగుట్టకు స్థానం దక్కలేదు. బంజారాహిల్స్ డివిజన్ను రెండుగా చీల్చి... బంజారాహిల్స్, కొత్తగా వేంకటేశ్వర కాలనీ డివిజన్ను ఏర్పాటు చేశారు. వీటి స్వరూపాలు శాస్త్రీయంగా లేవు. బంజారాహిల్స్ డివిజన్లో ప్రేమ్నగర్ను చేర్చారు. వాస్తవంగా ప్రేమ్నగర్తో బంజారాహిల్స్కు సంబంధం లేదు. సోమాజిగూడ డివిజన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన శ్రీనగర్ కాలనీ డివిజన్లోని కొంత భాగాన్ని కలిపారు. అసలు సోమాజిగూడకు.. శ్రీనగర్ కాలనీకి పొంతనే లేదు. పైగా ఈ రెండు ప్రాంతాలు వేర్వేరు నియోజకవర్గాల పరిధిలోకి వెళ్తాయి. మల్కాజిగిరి: యాప్రాల్ గల్లంతు మల్కాజిగిరిలో ఇప్పటి వరకు అల్వాల్, మచ్చబొల్లారం, యాప్రాల్, డిఫెన్స్ కాలనీ, మౌలాలీ, సఫిల్గూడ, ఓల్డ్ మల్కాజిగిరి, గౌతమ్నగర్ (మొత్తం 8) డివిజన్లు ఉన్నాయి. పునర్విభజనతో డివిజన్ల సంఖ్య 9కి పెరిగింది. అవి.. వెంకటాపురం, అల్వాల్, మచ్చబొల్లారం, నేరేడ్మెట్, వినాయక్ నగర్, మౌలాలీ, మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్బాగ్, గౌతమ్నగర్తాజాగా యాప్రాల్ డివిజన్ ఉనికిని కోల్పోయింది. దీనిని మల్కాజిగిరిలో కలపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పల్ : చిలుకానగర్ పై అభ్యంతరాలు సాక్షి,సిటీబ్యూరో: ఉప్పల్ నియోజకవర్గంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఉప్పల్, కాప్రా, ఏఎస్రావు నగర్, చర్లపల్లి, మీర్పేట్ హెచ్బీ కాలనీ, మల్లాపూర్, నాచారం, చిలుకానగర్, హబ్సిగూడ, రామంతాపూర్ మొత్తం 10 డివిజన్లు యధాతథంగా ఉన్నాయి. ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి కాప్రా వరకు ఉన్న చిలుకానగర్ డివిజన్పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఉప్పల్ డివిజన్లో ఉన్న ప్రశాంత్ నగర్, కల్యాణిపురి, బ్యాంకు కాలనీ, బాలాజీ ఎన్క్లేవ్, ధర్మపురి కాలనీ, తదితర ప్రాంతాలను చిలుకానగర్లో కలపడంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. {పస్తుతం ఉప్పల్లో ఉన్న దేవేందర్ నగర్ బస్తీతో పాటు కొన్ని ప్రాంతాలు రామంతాపూర్ డివిజన్లో కలపడం కూడా అభ్యంతరకరంగానే ఉంది. శేరిలింగంపల్లి: నాలుగు పెరిగాయి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వార్డుల సంఖ్య ఆరు నుంచి పదికి పెరిగింది. గతంలో గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, హఫీజ్పేట్, కుందనగర్, హైదర్నగర్, వివేకానందనగర్ ఉండగా... ఇప్పుడు అదనంగా కొండాపూర్, మాదాపూర్, మియాపూర్, ఆల్విన్ కాలనీ డివిజన్లు ఏర్పడ్డాయి. ఐదారు కాలనీలు మినహా అంతా బాగానే ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఎల్బీనగర్: ఆ రెంటినీ కలపడమే సమస్య సాక్షి,సిటీబ్యూరో: నగర శివార్లలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో కొన్ని డివిజన్లలో పొరపాట్లు జరిగాయి. ప్రధానంగా కొత్తపేట్ డివిజన్కు దూరంగా ఉన్న భరత్నగర్, శివగంగా కాలనీలను కలపడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీఎన్రెడ్డి నగర్ డివిజన్లో హస్తినాపురం డివిజన్ కాలనీలు కలపడం, మన్సూరాబాద్ గ్రామాన్ని నాగోల్ డివిజన్లో కలపడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పునర్విభజనలో శాస్త్రీయత లోపించిందని ఆరోపిస్తున్నారు. మలక్పేటలో ఓకే.. మలక్పేట్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉన్నాయి. మూసారాంబాగ్, అక్బర్బాగ్, సైదాబాద్, ఆజంపురా, చావ్ని, ఓల్డ్ మలక్పేట్ డివిజన్లలో స్వల్ప తేడాలు మినహా పొరపాట్లు లేవని స్థానికులు అంటున్నారు. గోషామహల్: ధూల్పేట్ మాయం అబిడ్స్: గోషా మహల్ నియోజకవర్గంలో కొత్తగా రెండు డివిజన్లు తగ్గించి... ఆరు డివిజన్లను రూపొందించారు. 5వ సర్కిల్లోని ధూల్పేట్ డివిజన్లో సగభాగం బేగంబజార్లో, మిగతా భాగాన్ని గోషామహల్ డివిజన్లో కలిపారు. కొత్తగా అబిడ్స్, నాంపల్లి డివిజన్లను ఏర్పాటు చేశారు. సర్కిల్-8లోని చారిత్రాత్మక సుల్తాన్బజార్ పేరు మాయమైంది. కొత్తగా ఏర్పడిన అబిడ్స్ డివిజన్లో పాత సుల్తాన్బజార్ డివిజన్తో పాటు గన్ఫౌండ్రీ ఏరియా, బషీర్బాగ్, బిర్లామందిర్ ప్రాంతాలను కలిపారు. గోషామహల్ కొత్త డివిజన్లో జ్ఞాన్బాగ్కాలనీ, రజాక్పురా, చందన్వాడి, చాక్నావాడి, ఆర్యసమాజ్, షాహినాయత్గంజ్, కొత్తబస్తీ, మచ్చీపుర నుంచి జుమ్మెరాత్బజార్ వరకు కొంతభాగాన్ని కలిపారు. కూకట్పల్లి: అదనంగా రెండు కూకట్పల్లి నియోజకవర్గంలో వార్డుల సంఖ్య ఆరు నుంచి ఎనిమిదికి పెరిగింది. గతంలో కేపీహెచ్బీ కాలనీ, మూసాపేట, మోతీనగర్, ఫతేనగర్, పాత బోయిన్పల్లి, కూకట్పల్లి ఉండగా...తాజాగా అల్లాపూర్, బాలానగర్ డివిజన్లు ఏర్పడ్డాయి. కూకట్పల్లిలోని కొంత భాగం, పాత బోయిన్పల్లిలోని కొంత భాగం కలిసి బాలానగర్గా, మోతీనగర్ నుంచి కొంత భాగం, మూసాపేట నుంచి కొంత భాగం కలిసి అల్లాపూర్గా ఏర్పడ్డాయి. కేపీహెచ్బీలోని కొన్ని ప్రాంతాలు మూసాపేట డివిజన్లో కలిశాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపారాయుడు నగర్, దీనబంద్ కాలనీ, హనుమాన్నగర్, అస్బెస్టాస్ కాలనీ, పాపిరెడ్డికాలనీలను కూకట్పల్లి డివిజన్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది స్థానికులు ఉప కమిషనర్కు వినతిపత్రాలు సమర్పించారు. -
20 స్టేషన్లు.. 5 జోన్లు
కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణపై పోలీసు పెద్దల దృష్టి ప్రతిపాదనల రూపకల్పనలో ఉన్నతాధికారులు ప్రస్తుతం ఉన్న మూడు జోన్ల విస్తరణ ఒక్కో జోన్లో 4 నుంచి 5 స్టేషన్లు విజయవాడ సిటీ : పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. రాజధాని నగరంగా రూపొందడం, పాలనా వ్యవహారాలు ఇక్కడి నుంచే సాగుతుండటంతో పునర్వ్యవస్థీకరణపై పోలీసు పెద్దలు దృష్టి పెట్టారు. అమరావతి కమిషనరేట్ ఏర్పాటుకు ముందే కమిషనరేట్ను పునర్వ్యవస్థీకరించి సబ్ డివిజన్ల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పుడున్న పరిధిలోనే కొత్త సబ్ డివిజన్లను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైతే రూరల్లో మరో రెండు పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నగరంలో మంగళవారం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పోలీస్ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణపై ఉన్నతస్థాయి చర్చలు జరిగినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి వెంటనే ప్రభుత్వ ఆమోదం పొందాలని అధికారులు నిర్ణయించారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత కీలక సబ్ డివిజన్ల బాధ్యతలను ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణ కిందకు తేవాలనేది అధికారుల నిర్ణయం. పునర్వ్యవస్థీకరిస్తే ఇలా... ఇప్పుడున్న 20 పోలీస్స్టేషన్లతో పాటు అదనంగా ఒకటి లేదా రెండు పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసి ఐదు సబ్ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క డివిజన్లో నాలుగు నుంచి ఐదు పోలీస్స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. రూరల్లోని పెద్ద పోలీస్స్టేషన్లను విడదీసి కొత్త స్టేషన్ల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వన్టౌన్, టూ టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం స్టేషన్లు పశ్చిమ, కంకిపాడు, ఉయ్యూరు సర్కిల్స్లోని స్టేషన్లను ఈస్ట్జోన్కు కలిపే అవకాశం ఉంది. కృష్ణలంక, గవర్నరుపేట, సూర్యారావుపేట, మాచవరం స్టేషన్లు సౌత్జోన్, అజిత్సింగ్నగర్, సత్యనారాయణపురం, నున్న రూరల్తో పాటు కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రామవరప్పాడు పోలీస్స్టేషన్ నార్త్జోన్, పటమట, పెనమలూరు, గన్నవరం స్టేషన్లు సెంట్రల్ జోన్లోకి రానున్నట్టు తెలిసింది. అవసరమైన పక్షంలో పాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రతిపాదిత జాబితాలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని కమిషనరేట్ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సహా కీలక ప్రాంతాలు ఉండే సబ్ డివిజన్లకు ఐపీఎస్ అధికారిని ఏసీపీగా నియమించనున్నారు. ఐదింటిలో మూడింటికి ఐపీఎస్లు ఏసీపీలుగా వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాల సమాచారం. ప్రభుత్వం నుంచి ఇప్పటికే సానుకూల సంకేతాలు వచ్చినందున కమిషనరేట్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ఆమోదింప చేసుకునే యోచనలో ఉన్నారు. ఇప్పుడిలా... 1989లో ఏర్పడిన కమిషనరేట్ను 2006లో ఒకసారి పునర్ వ్యవస్థీకరించారు. అంతకు ముందు వరకు రెండు సబ్ డివిజన్లు మాత్రమే ఉండగా, మూడు సబ్ డివిజన్లకు పెంచారు. ఆ తర్వాత పోలీసు కమిషనరేట్లో 20 పోలీస్స్టేషన్లు ఉండగా ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ మూడు సబ్ డివిజన్లు ఉన్నాయి. వెస్ట్ జోన్ పరిధిలో గవర్నరుపేట, సూర్యారావుపేట, వన్టౌన్, టూ టౌన్, ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లు ఉండగా, గత ఏడాది ప్రారంభంలో ఏర్పాటుచేసిన భవానీపురం పోలీస్స్టేషన్ను చేర్చారు. సెంట్రల్ జోన్లో కృష్ణలంక, మాచవరం, పటమట, సత్యనారాయణపురం, నున్న రూరల్ పోలీస్స్టేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన అజిత్సింగ్నగర్ స్టేషన్ను కలిపారు. రూరల్లోని పెనమలూరు, గన్నవరం పోలీస్స్టేషన్లతో పాటు కంకిపాడు, ఉయ్యూరు సర్కిల్స్తో ఈస్ట్జోన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ జోన్కు ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి ఏసీపీగా వ్యవహరిస్తుండగా, వెస్ట్కు ర్యాంకర్, సెంట్రల్కు డెరైక్ట్ డీఎస్పీలు ఏసీపీలుగా వ్యవహరిస్తున్నారు. -
పాత‘వే’!?
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్ పడుతుందా? పాత మార్గంలోనే ఎన్నికలకు వెళ్లనున్నారా? ఇప్పటికే ఉన్న 150 డివిజన్లే కొనసాగుతాయా? ప్రస్తుత పరిణామాలు... రాజకీయ పార్టీల ‘లెక్కలు’ పరిశీలిస్తే... పెంచడం కంటే ఉన్న వాటితోనే సర్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు ఈ లెక్క తేల్చే పనిలో ఉన్నారు. - డివిజన్ల విభజనపై పునరాలోచన - ప్రస్తుతం ఉన్న 150కే పరిమితం? - పెంపు యోచనపై మల్లగుల్లాలు - బలాబలాలపై పార్టీల లెక్కలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ వార్డుల (డివిజన్ల) పునర్విభజన కథ మళ్లీ మొదటికొచ్చింది. 2011 జనాభా లెక్కల మేరకు డివిజన్లలోని జనాభా మధ్య వ్యత్యాసం దాదాపు సమానంగా (పది శాతం తే డాకు మించకుండా) ఉండాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 200కు పెంచేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ పునరాలోచనలో పడింది. 200 డివిజన్లపై వివిధ వర్గాల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు... టీఆర్ఎస్ ప్రభుత్వ రాజకీయ అవసరాలు.. ఇతర పరిణామాల నేపథ్యంలో డివిజన్లను ఎప్పటిలాగా 150కే పరిమితం చేయాలనే యోచనలో ఉన్నట్లు తె లిసింది. డివిజన్లను హేతుబద్ధీకరించినప్పటికీ సంఖ్య మాత్రం 150కే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తప్పనిసరి అనుకుంటే 172కు పెంచాలనే మరో ఆలోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. ఈమేరకుఅధికారులు మళ్లీ కసరత్తు మొదలు పెట్టారు. 150... 172... 200 డివిజన్లకు జనాభాను ‘విభజించే’ పనిలో పడ్డారు. ఉన్నత స్థాయి నిర్ణయం మేరకు ఎన్ని డివిజన్లు చేయాలనుకున్నా... సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టారు. 2011 లెక్కల మేరకు గ్రేటర్ జనాభా 67,31,790. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లనే హేతుబద్ధీకరిస్తే... ఒక్కోదానిలో సగటున 44,879 మంది, 172 డివిజన్లు చేస్తే 39,138 మంది, 200 డివిజన్లు చేస్తే 33,659 మంది వంతున ఉండాలని లెక్కలు వేశారు. నియోజకవర్గాల వారీగా ఎన్నేసి డివిజన్లు వస్తాయో లెక్కలు తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 200 చేస్తే శివార్లలో ఎక్కువ డివిజన్లు వచ్చే అవకాశం ఉంది. పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యాక... రిజర్వేషన్ల అమలుకు బీసీల గణన చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి ఇదీ సంగతి: ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లలో కొన్నింటిలో అత్యధికంగా, మరికొన్నింటిలో అత్యల్పంగా జనాభా ఉందని... అన్నిటిలో దాదాపు సమానంగా ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేయాలనేది హైకోర్టు తీర్పు సారాంశం. వ్యత్యాసాల వల్ల కొన్ని డివిజన్లకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని కొందరు కోర్టుకు వెళ్లడంతో...న్యాయ స్థానం దీనిపై స్పందించింది. పార్టీల లెక్కలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల డీలిమిటేషన్ అంశం మొదటికి వస్తుండటంతో రాజకీయ పార్టీల్లో కూడికలు, తీసివేతలు మొదలయ్యే అవకాశం ఉంది. 200 వార్డులకు విస్తరిస్తే... 2008 కంటే ముందు ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వంద డివిజన్లు... జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల్లో మరో వంద డివిజన్లు అవుతాయి. దీంతో రాజకీయంగా కొన్ని పార్టీలకు నష్టం... మరికొన్ని పార్టీలకు లాభం కలిగే అవకాశ ం ఉంది. తాజాగా చేస్తున్న కసరత్తులో 172 లేదా 150కి పరిమితం చేస్తే శివార్లలో కొత్త డివిజన్ల సంఖ్య అతి స్వల్పంగానే పెరగనుంది. ఈ నేపథ్యంలో డివిజన్లను 200 లేదా 172 లేదా 150కి కుదిస్తే లాభ నష్టాలు ఎలా ఉంటాయన్న అంశంపై అన్ని రాజకీయ పక్షాలు కూడికలు, తీసివేతల్లో నిమగ్నం కానున్నాయి. -
నేతల్లో దడ!
- మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై మల్లగుల్లాలు - జాబితాతో నేడు ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య - సీనియర్ మంత్రులపై వేటు - జార్జ్కు శాఖ మార్పు - తొలగింపు జాబితాలో రెబల్స్టార్? సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేటి (సోమవారం) ఢిల్లీ పర్యటన రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ అమాత్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ పర్యటన తర్వాత మంత్రి వర్గ విస్తరణతో పాటు పునఃవ్యవవస్థీకరణ కూడా ఉండబోతోందన్న సమాచారంతో వారి కి కునుకు పట్టడం లేదు. చాలా కాలంగా వాయిదా పడుతూ వసు ్తన్న మంత్రి వర్గ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లడంలో విఫలమైన వారిని మంత్రి వర్గం నుండి తొలగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య ఇటీవల బెంగళూరులో మాట్లాడుతూ త్వరలో ‘మంత్రి వర్గ పునర్వవస్థీకరణ భాగంలో కొంతమందిని తప్పించబోతున్నాం. ఈ ప్రక్రియ గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత ఉండబోతోంది.’ అని పేర్కొనడం తెలిసిందే. దీంతో మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయంపై సీనియర్ మంత్రుల్లో భయం నెలకొంది. సీనియర్ మంత్రుల పై వేటు...హోం శాఖ మంత్రికి ట్రాన్స్ఫర్! ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వమోభారంతో బాధపడుతుండటం వల్ల ఆయనను మంత్రి పదవి నుండి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్కు నివేదిక అందింది. గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా ఈయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెబల్స్టార్ కూడా ‘తొలగింపు' జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో ఇటీవల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరగడంతో జాతీయ స్థాయిలో కర్ణాటక పరువు వీధిన పడిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇందుకు హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ అసమర్థతే ప్రధాన కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని స్వపక్షంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే హై కమాండ్కు నివేదిక పంపించారు. అంతేకాక ఐఏఎస్ అధికారి డీ.కే రవి అనుమానాస్పద వృుతితోపాటు సింగిల్ నంబర్ లాటరీ కేసుకు సంబంధించి కూడా కే.జే జార్జ్ పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కే.జే జార్జ్ను కూడా ఆ స్థానం నుంచి తప్పించి మరో అప్రాధాన్యత పదవి ఇవ్వొచ్చునని తెలుస్తోంది. ఈయనతోపాటు మరికొందరు సీనియర్లను సైతం మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో భాగంగా వారి శాఖలను మార్చాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బెర్తులపై సీనియర్ ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో కన్నేశారు. దీంతో ఆ పదవులను దక్కించేందుకు వారు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని జోరుగా లాబీయింగ్ నడుపుతున్నట్లు ఆ పార్టీకు చెందిన కొంతమంది నాయకులు చెబుతున్నారు. ‘మేడం, యువరాజు’ ఆమోదం కూడా... మంత్రి వర్గం మరింత చురుగ్గా పనిచేసేందుకు గాను అసమర్థులైన మంత్రులను తప్పించి వారి స్థానంలో కార్యదక్షత ఉన్న యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను అప్పగించాలని సిద్ధరామయ్యను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ గతంలోనే ఆదేశించారు. ఆమేరకు సిద్ధరామయ్య నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నూతన నివేదికకు ఈ ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మేడం, యువరాజుతో తో ఆమోద ముద్ర వేయించుకుని రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. -
దొంగలు బాబోయ్
సిటీలో పెరిగిపోతున్న దొంగతనాలు కునుకు తీస్తే ఇల్లు గుల్లే.. ఎండలు ముదిరితే మరింత పెరిగే అవకాశం పట్టించుకోని పోలీస్ యంత్రాంగం ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలు నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కష్టించి కూడబెట్టిన సొమ్ము కనుమరుగు కావడం ఖాయంగా మారింది. సీసీఎస్ బలోపేతంతో దొంగలు నగరంవైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించరని పోలీసు పెద్దలు చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. విజయవాడ సిటీ : నగరంలో వేసవి ప్రారంభానికి ముందే దొంగలు పంజా విసురుతున్నారు. భానుడి ప్రతాపం నుంచి సేదతీరేందుకు తలుపు దగ్గరకు వేసుకుంటే చాలు దర్జాగా పని పూర్తి చేసుకుని వెళ్తున్నారు. కిటికీ తెరిచినా అందుబాటులో వస్తువులు, సెల్ఫోన్లు మాయం చేసేస్తున్నారు. రాకపోకలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, ఇరుకైన ఇళ్లు, ఆపై వీధులు, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించే పోలీసుల పనితీరు వెరసి దొంగల దండయాత్రకు మార్గం సుగమమవుతోంది. అంతర్రాష్ట్ర నేరస్తుడు ప్రకాష్ కుమార్ సాహూ లాంటి కరుడుగట్టిన నేరస్తుడి రాకను సైతం పోలీసులు పసిగట్టలేకపోవడం సీసీఎస్ నిఘా నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. చోరీల జోరు గతంతో పోలిస్తే ఇటీవల ఇళ్లు, షాపు దొంగతనాలు భారీగా పెరిగాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే నిండు వేసవిలో పరిస్థితి ఏమిటో అర్థంకాక నగరవాసులు భయపడిపోతున్నారు. సాధారణ రోజుల్లో నెలకు సగటున 20 వరకు చోరీలు జరిగితే, వేసవిలో 35 వరకు ఉంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చోరీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2013లో 69 దోపిడీలు జరిగితే, 323 దొంగతనాలు, 2116 ఇతర చోరీలు, 2014లో 44 దోపిడీలు, 324 దొంగతనాలు, 1901 ఇతర చోరీలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు దోపిడీలు, 56 దొంగతనాలు, 365 ఇతర చోరీలు జరిగాయి. వేసవి తీవ్రతకు తోడు చోరీలు కూడా భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్రైం పోలీసులు.. కాదుకాదు సీసీఎస్.. చోరీ జరిగితే ఎవరిని కలవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలోని క్రైం పోలీసు స్టేషన్లను ఎత్తేసి సీసీఎస్ను కేంద్రీకృతం చేశారు. ఇందులో భాగంగా వన్టౌన్లో ఇళ్లల్లోనూ, షాపుల్లోనూ జరిగేచోరీలు, గవర్నరుపేటలో చైన్ స్నా చింగ్స్, మోటారు సైకిళ్ల చోరీలు, మాచవరంలో నకిలీ బంగారం, సూర్యారావుపేటలో చిల్లర చోరీ లకు సంబంధించిన విభాగాలను ఏర్పాటు చేశారు. నేరం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి సీసీఎస్కు బదలాయించి చేతులు దులుపుకొంటున్నారు. అడిగిన వారికి సీసీఎస్కు వెళ్లమంటూ సలహా ఇస్తున్నారు. సూర్యారావుపేట వెళ్తే.. వన్టౌన్ అంటూ.. అక్కడికి వెళితే మరోచోటికి అంటూ తిప్పుకొంటున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. సీసీఎస్ డొల్లతనం పునర్వ్యవస్థీకరణ తర్వాత సీసీఎస్ డొల్లతనం బయటపడుతోంది. సమాచార సేకరణ, విశ్లేషణ, దర్యాప్తు, రికవరీ, దొంగతనాల నివారణా విభాగాలుగా విభజించారు. ఎప్పటికప్పుడు నేరస్తుల సమాచారం సేకరించడం, వారి రాకపోకలను విశ్లేషించుకుని దర్యాప్తు చేసి అరెస్టు చేయడంతో పాటు సొత్తు రికవరీ ప్రధాన బాధ్యత. ఇదే సమయంలో ప్రజలకు చోరీలపై అవగాహన కలిగించి నిలువరించడం ముఖ్యమైన విధి. సమాచార మార్పిడి కోసం కోస్తా జిల్లాల క్రైం అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. సమాచార సేకరణ ద్వారా నేరగాళ్లను కట్టడి చేయడమే ప్రధానంగా సమావేశం సాగింది. పొరుగు జిల్లాలతో సమావేశం సంగతి అలా ఉంచితే.. సీసీఎస్లోని విభాగాల పనితీరు ఏంటనేది పోలీసు అధికారులే చెప్పలేకపోతున్నారు. సమాచార సేకరణకు ఇన్ఫార్మర్ల వ్యవస్థ సక్రమంగా లేదని తెలుస్తోంది. అధికారుల స్థాయిలో తీసుకునే నిర్ణయాలు, అమలుకు సంబంధించిన కార్యాచరణ, ఆర్థిక వనరులు సమకూర్చడం వంటి లోపాల కారణంగా దొంగల పట్టివేత కష్టంగా పరిణమించిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దొంగతనాల నివారణ విభాగం ప్రారంభంలో కొంత హడావుడి చేసినా ప్రస్తుతానికి అలికిడి లేదు. గతనెల 22వ తేదీ అర్ధరాత్రి ఇంటి తలుపులు మూసి నిద్రపోయాం. ఉదయం మేల్కొని చూస్తే వెనుక వైపు తలుపులు తెరిచి ఉన్నాయి. పరిశీలిస్తే 11 కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఇన్ని రోజులు గడిచినా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. అదేమంటే విచారణ జరుపుతున్నామనే సమాధానం మినహా అడుగు ముందుకు పడటం లేదు. - కొమరవోలు భరత్కుమార్, వాటర్ ప్లాంట్ యజమాని, కృష్ణలంక మా ఇంట్లో చోరీ జరిగి రోజులు గడిచినా దొంగల ఆచూకీ లేదు. పోలీసులు కూడా మా కేసుపై పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. విశ్రాంత జీవితం గడిపే సమయంలో ఉన్నదంతా దొంగలు ఊడ్చుకుపోయారు. పోయిన సొత్తు ఎప్పుడు దొరుకుతుందో.. - డీవీకే రాజు, విశ్రాంత ఉద్యోగి, బాపనయ్యనగర్ -
కాంగ్రెస్లో ఉత్కంఠ
20 తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ! * అనంతరం మంత్రి మండలి విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ * లాబీయింగ్ జోరు పెంచిన ఆశావహులు * సమన్వయ బాటలో సీఎం సిద్ధు, కేపీసీసీ చీఫ్ ? సాక్షి, బెంగళూరు : అధికార కాంగ్రెస్ పార్టీలో అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా నెలాఖరుకు భారీ మార్పులు జరగబోతున్నాయి. గత ఏడాదిన్నరగా ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు మంత్రి మండలి విస్తరణ, పునఃవ్యవస్థీకరణ కూడా జరగనుంది. దీంతో ఆశావహులు ఇటు సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్తో పాటు ఢిల్లీ పెద్దల ఆశీస్సులను పొందడానికి భారీ లాబీయింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ కొలిక్కి రాలేదు. సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మధ్య నడుస్తున్న కోల్డ్వారే ఇందుకు ప్రధాన కారణమనేది బహిరంగ రహస్యం. అయితే గత నెల బెంగళూరు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ ఇద్దరు నాయకులపై సీరియస్ అయ్యారు. దీంతో వారు దారిలోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ నెల 20 తర్వాత జాబితాను విడుదల చేయాలని పార్టీ అధినాయకులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సీఎం ఆప్త మంత్రి ఒకరు మాట్లాడుతూ... ‘మొదట్లో ఈనెల 16న జాబితా విడుదల చేయాలని భావించినా, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి పోస్టులను కేటాయించడంపై కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అందువల్లే సిద్ధరామయ్య, పరమేశ్వర్ సోమవారం నాటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇరవై తర్వాత వారు ఈ విషయమై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏది ఏమైనా నెలాఖరుకు ఈ విషయంలో స్పష్టత వస్తుంది’ అని పేర్కొన్నారు. పదవులు కోల్పోవడం ఖాయం! ఏడాదిన్నర దాటినా రాష్ట్ర మంత్రి మండలిలో ఇంకా ఖాళీలు ఉన్నాయి. వీటిపై చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పరమేశ్వర్కు ఉప ముఖ్యమంత్రి పదవి కచ్చితమనే వాదన వినిపిస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి తదితరులు మంత్రి పదవులు ఆశలు పెట్టుకున్నారు. వీరికి ఇప్పటికైనా పదవులు కేటాయించకపోతే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. పరమేశ్వర్ డిప్యూటీ సీఎం పదవి కోరకున్నా ఆయన అనుచరులు హైకమాండ్పై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ‘అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. మంత్రి మండలి విస్తరణ కూడా ఉంటుంది’ అని ఇటీవల బెంగళూరు పర్యటనలో డిగ్గీ పేర్కొనడం ఇందుకు ఊతమిస్తోంది. చాలా మంది సీనియర్ మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎం సిద్ధరామయ్యకు లేఖలు రాశారు. మరోవైపు అవినీతి, అక్రమాలే ప్రచార సాధనాలుగా చేసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది మంత్రులపై భూకబ్జా, ఇసుక అక్రమ రవాణా తదితర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంతమందిని పదవుల నుంచి తప్పించడంతో పాటు శాఖల మార్పు కూడా జరగవచ్చునని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ రెండు విషయాలపై కూడా ‘ఢిల్లీ టూర్’లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా,‘పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంత మంది మంత్రులను తప్పించవచ్చు. శాఖల మార్పు కూడా ఉంటుంది’ అని సీఎం సిద్ధరామయ్య ఢిల్లీలో ఇటీవల పేర్కొనడం ఇందుకు మరింత బలమిస్తోంది. ఏది ఏమైన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు జరుగనున్నాయనేది స్పష్టమవుతోంది. అయితే ఈ పరిణామం ఏ మలుపు తిరుగుతుందో తెలియడానికి మరికొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. -
ఫండ్స్లో పెట్టుబడులు డీఎల్ఎఫ్ విక్రయించుకోవచ్చు
ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్) నుంచి ఉపశమనం లభించింది. వచ్చే నెలలోగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన రూ. 1,806 కోట్లను వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తూ శాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ నెలలో రూ. 767 కోట్లు, డిసెంబర్లో మరో రూ. 1,039 కోట్ల విలువైన ఫండ్ యూనిట్లను విక్రయించుకునేందుకు డీఎల్ఎఫ్కు వీలు చిక్కింది. గత నెలలో డీఎల్ఎఫ్తోపాటు, ఆరుగురు కంపెనీ ఉన్నతాధికారులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి మూడేళ్లపాటు నిషేధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఫండ్స్లో పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్ఎఫ్ శాట్ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ సూచనలమేరకు ఫండ్స్లో పెట్టుబడులను తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్ఎఫ్ శాట్కు సోమవారం అఫిడవిట్ను దాఖలు చేసింది. కాగా, సెబీ నిషేధ ఉత్తర్వులపై తుది విచారణను డిసెంబర్ 10న శాట్ చేపట్టనుంది. 2007 ఐపీవో దరఖాస్తుకు సంబంధించి ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని దాచిపెట్టిందన్న ఆరోపణలతో గత నెలలో డీఎల్ఎఫ్తోపాటు, చైర్మన్ కేపీ సింగ్ తదితర 6గురు ఎగ్జిక్యూటివ్లను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది. డీఎల్ఎఫ్పై సెబీ నిషేధం క్యాపిటల్ మార్కెట్లకే పరిమితమని కంపెనీ కార్యకలాపాలకు వర్తించదని ముగ్గురు సభ్యుల శాట్ బెంచ్ వ్యాఖ్యానించింది. సెబీ సైతం ఇందుకు అభ్యంతర ం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, రుణాలపై వడ్డీ చెల్లింపులు వంటి అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవచ్చునని శాట్ ప్రిసైడింగ్ అధికారి జేపీ దేవధర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు అవసరమైనప్పుడు తనఖాలో ఉంచిన డీఎల్ఎఫ్ అనుబంధ కంపెనీల షేర్లను విడిపించుకోవడం, వినియోగించుకోవడం వంటివి నిర్వహించుకోవచ్చునని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కొత్త నియోజకవర్గాలా... జిల్లాలా?
పునర్విభజనపై తర్జనభర్జన నియోజకవర్గాల తర్వాతే: సీఎం కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను ఒక్కొక్క జిల్లాకు 5 నియోజకవర్గాల చొప్పునలో మొత్తం 24 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. దాని ప్రకారం జిల్లాలను ఏర్పాటు చేస్తే పలు సమస్యలు వస్తాయని ‘సాక్షి’ ముందుగానే విశ్లేషిం చింది. సీఎం కేసీఆర్ కూడా జిల్లాల పునర్విభజ న అంశం ఇప్పుడే లేదని శుక్రవారం తేల్చేశారు. ఏది ముందు? కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తే భౌగోళికంగా, రాజ్యాంగపరంగానే కాకుండా రాజకీయంగా కూడా పలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఒక్కొక్క లోక్సభా నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున 17 లోక్సభా స్థానాల్లో తెలంగాణ అసెంబ్లీకి మరో 34 నియోజకవర్గాలు పెరుగనున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం దీనిని 2019 ఎన్నికల్లోగా పూర్తిచేయాల్సి ఉంది. ఒక మండలం ఒకే నియోజకవర్గంలో ఉండాలి. ఒక నియోజకవర్గం ఒకే జి ల్లాలో ఉండాలి. జనాభా సగటులో 5-10 శాతం దాకా హెచ్చుతగ్గులున్నా మిగిలిన విషయాల్లో మార్గదర్శకాలను అనుసరించాలి. జిల్లాల పునర్విభజన తరువాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే పలు ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఒక జిల్లా పరిధిలోని కొన్ని నియోజకవర్గాలు, మండలాలు వేరేదానిలో కలపాల్సి రావొచ్చు. కొత్త సమస్యలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్విభజన ఇప్పుడప్పుడే సాధ్యం కాదని ‘సాక్షి’ విశ్లేషించింది. దీనికి తోడు స్థానిక నైసర్గిక, భౌగోళిక పరిస్థితుల మేరకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల నుండి కొన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. విభజన అనేది అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయంగా ఇబ్బందులే తెస్తుందని గతంలో కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి. అందుకని జిల్లాల పునర్విభజనను వీలైనంత కాలం వాయిదా వేయాలనే ఆలోచనలోనే సీఎం కేసీఆర్ ఉన్నారు. ‘తెలంగాణను విభజించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా?,సమైక్య ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. గతంలో ఎన్డీయే ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయంగా ఎంత లాభం జరిగింది? దానికి అనుగుణంగానే జిల్లాల విభజన విషయంలోనూ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అదే వ్యూహాన్ని అనుసరించొచ్చు’ అని అదే పార్టీకి చెందిన ముఖ్య నాయకుడొకరు విశ్లేషించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాతే జిల్లాల ఏర్పాటు ఇప్పుడే కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు.‘నియోజకవర్గాల పునర్వవస్థీకరణ పూర్తి అయిన తర్వాతనే నూతన జిల్లాల ఏర్పాటు విషయం తెరమీదకు వస్తుంది. జిల్లాల ఏర్పాటుపై ఇప్పుడు వస్తున్న వార్తలను నమ్మవద్దు’ అని ఆయన కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. -
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుల నియామకం
హైదరాబాద్: పార్టీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన కమిటీలోని పీఏసీ సభ్యుల పేర్లను వైఎస్సార్ సీపీ ఖరారు చేసింది. రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ)ని మరింత విస్తరించే క్రమంలో వైఎస్సార్ సీపీ మరో కొంతమందిని నూతన కమిటీలో సభ్యులుగా నియమించింది. పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అనేక మార్పులు చేశారు. ఇప్పటికే పీఏసీలో పలువురు సభ్యులను నియమించిన పార్టీ.. వీరికి అదనంగా మరో కొంతమందిని ఎంపిక చేసింది. రాష్ట్ర వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి సరికొత్త బాధ్యతలు అప్పజెప్పగా, సెక్రటరీలుగా నిర్మలాకుమారి, అవ్వారు ముసలయ్య, గాంధీ, మేరుగ మురళీలను నియమించారు. ఈ రోజు ప్రకటించిన వైఎస్సార్ సీపీ నూతన కమిటీలోని సభ్యుల వివరాలు.. పీఏసీ సభ్యులు..సాగి దుర్గా ప్రసాదరాజు, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారధి జనరల్ సెక్రటరీలు.. కారుమూరి నాగేశ్వరరావు, తలశిల రఘురాం నియామకం డాక్టర్స్వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా దుట్టారామచంద్రరావు వాలంటీర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సెక్రటరీలుగా నిర్మలాకుమారి, అవ్వారు ముసలయ్య, గాంధీ, మేరుగ మురళీ సీజీ సీ సభ్యులు.. గురునాథరెడ్డి, రెహమాన్, జక్కంపూడి విజయలక్ష్మి పార్లమెంట్ అబ్జర్వర్స్..కొత్త కోట ప్రకాశ్ రెడ్డి, సురేశ్ బాబు -
వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల పునర్వ్యవస్థీకరణ
-
వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల పునర్వ్యవస్థీకరణ
పార్టీ పటిష్టతకు జగన్ కసరత్తు అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శులుగా సజ్జల, వైవీ నియామకం హైదరాబాద్: పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఈ మేరకు ఆయా కమిటీల్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. ఆయా ప్రాంతాలను, సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించారు. సాధారణ ఎన్నికలు ముగిసిన తరువాత వరుసగా జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన అనంతరం కొంత కాలంగా కసరత్తు చేసి ఈ కమిటీలను రూపుదిద్దినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఏర్పడిన తరువాత తొలిసారి తనకు అనుబంధంగా ఇద్దరు రాజకీయ కార్యదర్శులను జగన్ నియమించుకున్నారు. రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ)ని విస్తరించడంతో పాటు కేంద్ర పాలక మండలి (సీజీసీ)లో అనేక మార్పులు చేశారు. సమర్థవంతంగా పార్టీ విధానాలను, వ్యవహారాలను వివరించడానికి వీలుగా అధికారప్రతినిధులు గానూ, టీవీ చర్చల్లో పాల్గొనే ప్రతినిధులుగానూ ఎంపిక చేశారు. ఇప్పటికే పార్టీ పలువురు ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియమించింది. వీరికి అదనంగా శుక్రవారం మరికొందరిని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులుగా నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన అధికార ప్రకటనలో పేర్కొన్న నియామకాల వివరాలు కింది విధంగా ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడికి అనుబంధంగా రాజకీయ కార్యదర్శులు: వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ కలిపి) ప్రధాన కార్యదర్శులు: వై.ఎస్.అనిల్రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, జలీల్ఖాన్ (ఆంధ్రప్రదేశ్కు మాత్రమే) కార్యదర్శులు: పిరియా సాయిరాజ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, తానేటి వనిత, కంపా హనోకు, పాలవలస విక్రాంత్ (ఆంధ్రప్రదేశ్కు మాత్రమే) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు: డి.ఎ.సోమయాజులు, కొణతాల రామకృష్ణ, మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్చంద్రబోస్, పినిపె విశ్వరూప్, కొడాలి నాని, అంబటి రాంబాబు, జలీల్ఖాన్, పేర్ని నాని, ఆదిమూలం సురేష్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ కలిపి) కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యులు: పెనుమత్స సాంబశివరాజు, వై.ఎస్.వివేకానందరెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాదరావు, ధర్మాన ప్రసాదరావు, జి.ఎస్.రావు, పి.వి.కృష్ణబాబు, వాసిరెడ్డి పద్మ, ఎన్.లక్ష్మీపార్వతి, ఎడ్మ కృష్ణారెడ్డి, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాశరావు, ఎన్.అమరనాథరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, తోట చంద్రశేఖర్, బాలశౌరి, వంకా రవి, బొడ్డు భాస్కరరామారావు, గిడ్డి ఈశ్వరి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ కలిపి) అధికార ప్రతినిధులు: ధర్మాన ప్రసాదరావు, జ్యోతుల నెహ్రూ, మోపిదేవి వెంకటరమణారావు, ఆర్.కె.రోజా, భూమన కరుణాకర్రెడ్డి, అంబటి రాంబాబు, తమ్మినేని సీతారాం, కిడారి సర్వేశ్వరరావు, జలీల్ఖాన్, పేర్ని నాని, వాసిరెడ్డి పద్మ, కె.పార్థసారథి, ఆదిమూలం సురేష్, ఉప్పులేటి కల్పన, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కొడాలి నాని (ఆంధ్రప్రదేశ్కు మాత్రమే) టీవీ చర్చల్లో పాల్గొనే పార్టీ ప్రతినిధులు: గడికోట శ్రీకాంత్రెడ్డి, కోన రఘుపతి, రాజీవ్ కృష్ణ, జోగి రమేష్, ఎ.ప్రవీణ్కుమార్రెడ్డి, మద్దాల రాజేశ్, గొట్టిపాటి రవికుమార్, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి (ఆంధ్రప్రదేశ్కు మాత్రమే) -
ఢీలిమిటేషన్ తరువాతే....
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలు సకాలంలో జరుగుతాయా.. లేదా..? అన్నది మరోసారి చర్చనీయాంశంగా మారింది. వార్డుల పునర్విభజన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని మంగళవారం హైకోర్టు తీర్పునివ్వడమే దీనికి కారణం. ప్రస్తుత పాలక మండలి గడువు డిసెంబర్ 3తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. వార్డుల జనాభా మధ్య వ్యత్యాసం పది శాతానికి మించకూడదని, ప్రస్తుతం గ్రేట ర్లోని కొన్ని వార్డుల్లో 90 వేలకు పైగా జనాభా ఉండగా, మరికొ న్ని వార్డుల్లో 20 వేలే ఉందని... దీనివల్ల అభివృద్ధిలో భారీ తేడా కనిపిస్తోందని ఇటీవల కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జీవో 570 ప్రకారం 2011 జనాభా లెక్కల మేరకు వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఇబ్బంది లేదు... వాస్తవానికి జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికల వాతావరణం లేదు. ఒక వేళ నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు నిర్వహించా లన్నా ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది లేదని... హైకోర్టు తీర్పు మేరకు వార్డుల పునర్విభజనకు దాదాపు రెండు నెలల సమయం సరిపోతుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అంటే గరిష్టంగా అక్టోబర్లోగా వార్డుల విభజన పూర్తి చేయవచ్చు. దాంతోపాటే బీసీల గణన కూడా పూర్తి కావాల్సి ఉంది. దానికి అదనంగా మరో నెల సమయం తీసుకున్నా నిర్ణీత వ్యవధిలోగా ఎన్నికలు జరిగేందుకు ఆటంకాలు ఉండకపోవచ్చు. కాకపోతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటందన్నదే ఆసక్తికరంగా మారింది. ఉనికి కోసం టీఆర్ఎస్ ఆరాటం టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీలో ఉనికే లేదు. గ్రేటర్లో జెండా ఎగురవేయాల నేది ఆ పార్టీ యోచన. ఇందులో భాగంగా వివిధ పార్టీల నుంచి వచ్చే కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వంటి వారికి స్వాగతం పలుకుతోంది. నగర రాజకీయాల్లో ప్రభావం చూపగల కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కార్పొరేటర్ల స్థాయి వారు భారీ సంఖ్యలో టీఆర్ఎస్లో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. త్వరలో జరిగే టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో ఈ చేరికలు ఉంటాయని భావిస్తున్నారు. వీటన్నిటినీ బే రీజు వేసుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల విషయమై టీఆర్ఎస్ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు కార్పొరేషన్లు... మరో వైపు జీహెచ్ఎంసీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లుగా విభజిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒక వేళ విభజించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకనుగుణంగా వార్డుల పునర్విభజన ఉండాలి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 వార్డులు ఉన్నాయి. కోర్టు తీర్పు మేరకు వార్డుల మధ్య పదిశాతం జనాభా కంటే ఎక్కువ తేడా ఉండకూడదంటే అందుకనుగుణంగా విభజించాలి. గ్రేటర్ మొత్తం ఒకే కార్పొరేషన్గా ఉన్నా.. లేక మూడుగా విభజించినా దీన్ని అమలు చేయాల్సిందే. పాతబస్తీలోని వార్డులతో హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది ఎంఐఎం డిమాండ్. ఈ విషయంలో టీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశమైంది. ఏది మేలు? గ్రేటర్ మొత్తం ఒకే కార్పొరేషన్గా ఉంటే మేలా? లేక మూడు నాలుగు కార్పొరేషన్లుగా ఉంటే ప్రయోజనమా? అన్న దానిపైనా చర్చలు సాగుతున్నాయి. గ్రేటర్ మొత్తం ఒకే కార్పొరేషన్గా ఉంటే.. ఫ్లై ఓవర్లు, అధునాతన రహదారులు వంటి భారీ ప్రాజెక్టులకు వీలుంటుందని.. ఆదాయంలో ప్రాంతాల మధ్య అసమానతలున్నప్పటికీ, భారీ ప్రాజెక్టులకు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఎక్కువ కార్పొరేషన్లు ఉంటే.. అధికార వికేంద్రీకరణతో ప్రజలకు సౌలభ్యంగా ఉంటుం దని భావిస్తున్నారు. ఇలా ప్రయోజనాలు, నష్టాలపైనా చర్చ సాగుతోంది. వార్డుల విభజన జరిగితే దానితో పాటు ప్రసాదరావు కమిటీ సిఫారసులు అమలు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న 18 సర్కిళ్లను 30గా మార్చాలనేది ప్రసాదరావు కమిటీ ప్రధాన సిఫారసు. అందరి చూపూ గ్రేటర్పైనే.. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలూ జీహెచ్ఎంసీ పైనే కన్నేశాయి. ఓ రాష్ట్రంతో సరిసమానమైన హైదరాబాద్లో పార్టీ పగ్గాలు పట్టాలనేది టీఆర్ఎస్ లక్ష్యం. ఇప్పటికే చావు తప్పి కన్నులొట్టబోయిన తమకు గ్రేటర్లో తగినన్ని సీట్లు రాకుంటే పార్టీ ఉనికికే ప్రమాదమనే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఎలాగైనా నగరంలో తమ పట్టు నిలుపుకోవాలనేది ఎంఐఎం వ్యూహం. టీడీపీ, బీజేపీలు నగరంలో సత్తా చాటుతామని చెబుతున్నాయి. ప్రస్తుతం టీడీపీకి శివారుల్లో ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి బలాన్ని ఆసరా చేసుకొని గ్రేటర్లో సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల తరహాలోనే టీడీపీ-బీజేపీ జతకడితే జీహెచ్ఎంసీలో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోగలమన్నది ఆ రెండు పార్టీల యోచన . గ్రేటర్ ఎన్నికలపై రెండు పార్టీల మధ్య ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఎంఐఎం-కాంగ్రెస్ ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కూటమిగా ఉన్నాయి. ఇవి అదే బంధాన్ని కొనసాగిస్తాయా.. లేక ఎంఐఎం అధికార టీఆర్ఎస్తో జత కడుతుందా అన్నది వేచి చూడాలి. -
ఆర్థిక లోటు పూడ్చండి
కేంద్రానికి చంద్రబాబు వినతి {పధాని, కేంద్ర మంత్రులతో భేటీ సీమాంధ్రకు ఇచ్చిన విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని విజ్ఞప్తి {పమాణ స్వీకారానికి రావాలని ప్రధానికి, మంత్రులకు ఆహ్వానం తెలంగాణ సీఎంకు ఆహ్వానంపై ‘చూద్దాం’ అన్న బాబు న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రకు దాదాపు రూ.13,579 కోట్ల లోటు ఏర్పడుతుందని, దీనిని పూడ్చాలని నూతన ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ భవన్లో రెండు విడతలుగా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రితోపాటు హోం మంత్రి రాజ్నాథ్సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, విద్యుత్తు శాఖ మంత్రి పియూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను, ప్రణాళిక శాఖ మంత్రి జితేందర్సింగ్ను, 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్రెడ్డిని కలిసినట్లు తెలిపారు. తన ప్రమాణస్వీకారానికి రావడంపై ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. ‘‘రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులను కేంద్ర మంత్రులందరికీ వివరించా. విభజన ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. అప్పులను, విద్యుత్తును జనాభా ప్రాతిపదికగా విభజించారు. ఆస్తులను భౌగోళికంగా ఇచ్చేశారు. ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ వల్ల తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చింది. సీమాంధ్రకు మాత్రం వచ్చే 9 నెలల్లోనే భారీ లోటు ఏర్పడనుంది. ఒక పక్క అప్పు క డుతూ మరోపక్క ఆదాయం సంపాదించాలి. దీన్ని ఎలా చేయాలని ఒక్క మాట కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. అందుకే ప్రజలు కాంగ్రెస్ను భూస్థాపితం చేశారు. ఈ లోటును పూడ్చాలని ఆర్థిక మంత్రిని కోరాం. తగిన ఆర్థిక రక్షణ కల్పించాలని ఆర్థిక సంఘం చైర్మన్ను కోరాం. విభజన సమయంలో పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు. ఈ మూడింటినీ తక్షణం అమలు చేయాలని కోరాం. ఇప్పటివరకు ఉన్న హామీల అమలుకు ఒక సెల్ వేసి మానిటరింగ్ చేయాలని ప్రధానిని కోరాం. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదు. టీఆర్ఎస్ కావాలని రాద్ధాంతం చేసింది’ అని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదులకు అపెక్స్ కౌన్సిల్ కృష్ణా, గోదావరి నదులకు అపెక్స్ కౌన్సిల్, బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. నిర్దిష్ట కాలపరిమితితో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, చత్తీస్గఢ్లకు ఇచ్చినట్లుగానే ముందుగా సీమాంధ్రకు 30 టీఎంసీల నీళ్లివ్వాలని కోరామన్నారు. విభజన సవ్యంగా సాగేలా చూడాలని రాజ్నాథ్సింగ్ను కోరినట్లు చెప్పారు. ఐఐటీ, తదితర సంస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని మానవ వనరుల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విభజన తరువాత కరెంటు నష్టాలను సర్దుబాటు చేయాలని విద్యుత్తు మంత్రి పియూష్ గోయల్ను కోరామన్నారు. గంగవరంలో ఎల్ఎన్జీ టెర్మినల్ నిర్మాణం, పెట్రోలియం కారిడార్ పునరుద్ధరణ చేపట్టాలని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను కోరినట్లు చెప్పారు. త్వరగా పెటోల్రియం యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో త్వరగా హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కోరినట్లు చెప్పారు. రైతు రుణమాఫీపై ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రితో మాట్లాడినట్టు తెలిపారు. ‘వీటిపై రివ్యూ చేశాం. మళ్లీ చేస్తాం. అమలుకు కట్టుబడి ఉన్నా. తొలి సంతకం దానిపైనే చేస్తా’ అని చెప్పారు. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా పిలుస్తున్నారా అన్న ప్రశ్నకు.. ‘చూద్దాం.. ’ అని బదులిచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు దేశీయ టెర్మినల్కు మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టిస్తామని చెప్పారు. -
అనకాపల్లికి జిల్లా చాన్స?
- బెల్లంపల్లి కేంద్రంగా రూరల్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన - విశాఖను రెండుగా విభజించే అవకాశం - ఉత్తరాంధ్రలో ఇక్కడే అవకాశం అనకాపల్లి, న్యూస్లైన్: అనకాపల్లి మరో మైలురాయికి చేరువయ్యింది. భౌగోళిక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటికే పలు ప్రాధాన్యతలను సొంతం చేసుకున్న అనకాపల్లి అన్నీ అనుకున్నట్టు జరిగితే సరికొత్త హోదా దక్కించుకోనుంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెరపైకి వచ్చిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు అనకాపల్లికి అనుకూలంగా మారనుంది. సూటిగా చెప్పాలంటే అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశాలు అధిక శాతం ఉన్నట్టు సమాచారం. సీమాంధ్రలో 13 జిల్లాలు ఉండగా, వీటిని 21 వరకు పెంచాలన్నది ప్రభుత్వ యోచన. నియోజకవర్గాలు సైతం 175 నుంచి 225 వరకు పెంచే ప్రతిపాదన ఉండడంతో జిల్లాల పెంపు అనివార్యం. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రచారం జోరందుకుంది. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం మూడు జిల్లాలుండగా అదనంగా మరో జిల్లా ఏర్పాటుకానుంది. ప్రస్తుతం ఉన్న భౌగోళిక స్థితిగతుల నేపధ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను విభజించే అవకాశం లేదు. దీంతో విశాఖ నగరాన్ని ఒక జిల్లాగాను, గ్రామీణ ప్రాంతాన్ని మరో జిల్లాగాను విభజించే ప్రయత్నాలు జోరందుకున్నాయి. అనకాపల్లి కేంద్రంగా ఈ కొత్త జిల్లా ఏర్పాటుకానుందన్నది ఉన్నతాధికారుల అభిప్రాయం. అనకాపల్లిలోఉన్న వంద పడకల ఆస్పత్రి ఇటీవలే జిల్లా స్థాయి ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయింది. మరోవైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్మాసిటీ, ఎస్ఈజెడ్లకు రవాణా పరంగా అనకాపల్లి అత్యంత కీలకం. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బెల్లం మార్కెట్, కూరగాయల వ్యాపార కలాపాల కేంద్రంగా అనకాపల్లికి ప్రత్యేకత ఉండనే ఉంది. అనకాపల్లి నుంచి వందలాది మంది ఫైనాన్స్ వ్యాపారస్తులు విశాఖపట్నానికి తరలివెళ్లడం, అక్కడ వ్యాపారస్తులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంలో ఈ ప్రాంతానికి చెందిన ఫైనాన్స్ర్ల పాత్ర ఎనలేనిది. ఇక జాతీయ రహదారి ఆనుకుని ఉండడం, రైల్వేస్టేషన్ సదుపాయం ఉండనే ఉన్నాయి. తాజాగా అనకాపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు, అన్నిరకాల వ్యాపార కలాపాలు ఇక్కడ నిర్వహించడం కలిసొచ్చే అంశం. వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ అధికార కార్యాలయం, కార్మిక శాఖ, తూనిక లు, కొలతల శాఖ, అటవీ శాఖ కార్యాలయాలు, సీసీఎస్ మహిళా పోలీస్స్టేషన్తోపాటు జిల్లా కేంద్రానికి అవసరమైన కార్యాలయాల ఏర్పాటుకు వనరులన్ని ఉన్నాయి. అనకాపల్లి మీదుగా శారద నది ఉండడంతో నీటి వనరులకు లోటుండదు. ఆధ్యాత్మికంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబికా అమ్మవారి ఆలయం, పర్యాటక కేంద్రంగా బొజ్జన్నకొండ, తాగు, సాగునీటి వనరులను పెంపొందించుకునేందుకు సమీపంలోనే అనకాపల్లి, వాడ్రాపల్లి, కొండకర్ల ఆవ ఉండనే ఉన్నాయి. ఇన్ని అర్హతలున్న అనకాపల్లికి కొత్త జిల్లా కేంద్రంగా గుర్తింపు తెచ్చుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కావలసింది రాజకీయ పరపతి, వనరులున్న కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపనే. మరికొద్ది నెలల్లో కొత్త జిల్లా ఏర్పాటుపై పూర్తి స్పష్టత రానుంది. -
మంచిర్యాల జిల్లాపై ఆశలు
మంచిర్యాల టౌన్, న్యూస్లైన్ : మంచిర్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. 10 జిల్లాల తెలంగాణను 24 జిల్లాలుగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జిల్లాల పునర్విభజన ఖాయమనే నేపథ్యంలో మంచిర్యాల జిల్లా తప్పనిసరి అనే వాదన తెరపైకి వచ్చింది. అదనంగా 14 జిల్లాల ఏర్పాటులో మంచిర్యాలకు చోటు లభించినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లా అంశాన్ని ఇటీవల ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి తెరపైకి తీసుకురావడం.. కొత్త జిల్లాల జాబితాలో మంచిర్యాలకు స్థానం లభించడం ఈ ప్రాంత వాసుల్లో ఆనందం నింపింది. దశాబ్దాల క్రితమే ప్రతిపాదన.. మంచిర్యాల జిల్లా డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి మంచి ర్యాల జిల్లాగా నామకరణం చేస్తూ కొన్ని సంఘాలు తమ కార్యకలాపాలు మంచిర్యాల జిల్లా పేరిట నిర్వహిస్తుండడం తెలిసిందే. ఎన్నికల సమయంలోనే తెరపైకి వచ్చే మంచిర్యాల జిల్లా ఏర్పాటు అంశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జిల్లాల పునర్విభజన జాబితాలో చోటు దక్కించుకోవడంతో స్థానికుల్లో ఆశలు రేకెత్తాయి. తూర్పు జిల్లాకు మంచిర్యాలే కేంద్రం... 1905లో ఆదిలాబాద్ జిల్లా ఏర్పడింది. 1940 వరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా కొనసాగుతూ వచ్చింది. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా మారింది. జిల్లా విస్తీర్ణం 16,128 కిలోమీటర్లు. జనాభా 29,35,967. భౌగోళికంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం తూర్పు జిల్లాకు ఎంతో దూరంలో ఉంటుం ది. జిల్లాలోని 52 మండలాల్లో 26 మండలాలు తూర్పు జిల్లాలోనే ఉన్నాయి. జన్నారం నుంచి సిర్పూర్ వరకు ఉన్న ఈ మండలాల కు మంచిర్యాల నడిబొడ్డున ఉంటుంది. వేమనపల్లి మండల వాసులు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 280 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిందే. సామాన్యులకు ఇది భారంగా మారింది. జిల్లా కేంద్రంలోని వివిధ కార్యాలయాలకు పనుల నిమిత్తం ఇక్కడి నుంచి వె ళ్లే అధికారులు, ఉద్యోగులు, ప్రజలతోపాటు వివిధ పరీక్షలు, ఉద్యోగాల ఎంపిక కోసం వెళ్లే అభ్యర్థులకు దూరభారం సమస్యగా మారిం ది. ఈ నేపథ్యంలో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన మంచిర్యాలను జిల్లాగా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఐదు నియోజకవర్గాలతో... జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో మంచిర్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మంచిర్యాల, సిర్పూర్-కాగజ్నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలు కొత్త జిల్లా పరిధిలోకి రానున్నాయి. ఈ నియోజకవర్గాల ప్రజలకు మంచిర్యాల జిల్లా కేంద్రంగా అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది. -
అటవీశాఖ విభాగాల పునర్విభజన
ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలోని అటవీశాఖ విభాగాల పునర్విభజనకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న విభాగాలను పునర్విభజన చేయాలని 2011లో ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆమోదం లభించింది. జిల్లాలో అటవీశాఖ (టెరిటోరి యల్) పర్యవేక్షణలో సామాజిక వన విభా గం, వన్యప్రాణి విభాగాలు పనిచేస్తున్నా యి. వీటి పరిధికి తగ్గట్టుగా అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు తలెత్తుతున్నా యి. సెక్షన్ల పునర్విభజన అనంతరం ఆ విభాగాలను పర్యవేక్షించేందుకు జిల్లాకు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీఎఫ్వో)కుబాధ్యతలు అప్పగించనున్నారు. ఈయన పరిధిలో మూడు విభాగాల డీఎఫ్వోలు పనిచేయనున్నారు. పెరగనున్న రేంజర్లు, బీట్ ఆఫీసర్లు జిల్లాలో 811.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. నాలుగు రేంజిల పరిధిలో 213 వనసంరక్షణ సమితి పర్యవేక్షణలో 42,281.50 హెక్టార్ల అటవీప్రాంతం ఉంది. అయితే జిల్లాలో ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. అటవీ విస్తీర్ణానికి తగిన విధంగా రక్షణ సిబ్బంది లేకపోవడంతో అడవులతో పాటు వన్యప్రాణులు కూడా అంతరించిపోతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీనిని అరికట్టడానికి ఇప్పుడున్న ఏలూరు, పోలవరం, జంగారెడ్డిగూడెం, కన్నాపురం రేంజిలతో పాటు కొత్తగా జీలుగుమిల్లిలో మరో రేంజిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ రేంజర్ పోస్టును ప్రభుత్వం భర్తీ చేయనుంది. కాగా ఇప్పటి వరకు ఉన్న 43 బీట్లను 60కు పెంచారు. దీంతో 17 మంది బీట్ ఆఫీసర్లు అదనంగా జిల్లాకు రానున్నారు. 16 అటవీ సెక్షన్లను ఇప్పుడు 22కు పెంచారు. మరో ఆరు పోస్టులు పెరగనున్నాయి. ఒక్కో అటవీబీట్ పరిధిలో మూడువేల హెక్టార్ల వరకు అటవీ ప్రాంతాన్ని పర్యవేక్షించాల్సి వస్తోంది.. దీంతో రేంజ్ పరిధిని తగ్గించడంతో పాటు బీట్ విస్తీర్ణాన్ని కనిష్టంగా వెయ్యి హెక్టార్లకు కుదించనున్నారు. వన్యప్రాణి విభాగానికి మరో 10 బీట్ల పెంపు పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండడంతో వేటగాళ్ల ఉచ్చులో పడి అరుదైన వన్యప్రాణుల జాతులు కనుమరుగవుతున్నాయి. దీనికి తోడు పశ్చిమ, కృష్ణా జిల్లాలో విస్తరించి ఉన్న కొల్లేరు పరిధిలోని 9 మండలాల్లో 75,126 ఎకరాల అభయారణ్య భూములున్నాయి. ఇవి చాలా వరకు చేపల చెరువులుగా మారాయి. ఉన్న భూములను కాపాడటానికి, పక్షుల రక్షణకు కొత్తగా 10 బీట్లను పెంచారు. ఇప్పటి వరకు కైకలూరు, ఏలూరు, నాగాయలంక పరిధిల్లో 17 బీట్లుండగా అవి 27కు పెరగనున్నాయి. 10 మంది బీట్ ఆఫీసర్లను కొత్తగా నియమించనున్నారు. ఇదిలా ఉండగా సామాజిక వన విభాగం(సోషల్ ఫారెస్టు) ఏలూరు, జంగారెడ్డిగూడెం, నర్సాపురంలో మూడు రేంజ్ కార్యాలయాలున్నాయి. వీటికి అదనంగా ఒక సెక్షన్ ఆఫీసర్ను పెంచాలని ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు. దీనికి అనుమతి రావాల్సి ఉంది. పోస్టుల భర్తీపై మల్లగుల్లాలు అటవీశాఖల్లో 3,800కు పైగా వివిధ పోస్టులను మూడేళ్లలో భర్తీ చేయడానికి ఆర్థికశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంట్లో జిల్లాకు కొన్ని పోస్టులను కేటాయించే అవకాశం ఉందని టెరిటోరియల్ డీఎఫ్వో జి.రామ్మోహన్ ‘న్యూస్లైన్’కు తెలిపారు. పునర్విభజన కార్యక్రమం దాదాపుగా పూర్తయ్యిందని త్వరలోనే ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తుందని ఆయన ధ్రువీకరించారు.