Chandrasekhar rao
-
ఉద్యోగ పరుగులో ఆగిన ఊపిరి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఉద్యోగ పరుగులో ఓ యువకుడి ఊపిరి ఆగిపోయింది. కానిస్టేబుల్ సెలక్షన్స్లో భాగంగా 1,600 పరుగులో పాల్గొన్న ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం జీలగొండి గ్రామానికి చెందిన దరావతు చంద్రశేఖరరావు (21) డిగ్రీ, డీఈడీ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రశేఖరరావు తండ్రి చనిపోవటంతో తల్లి కష్టపడి చదివించింది. అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో డీఎస్సీ(పీఈటీ) కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలోనే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యాడు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)కు హాజరయ్యాడు. ఇందులో భాగంగా 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గ్రౌండ్లో మూడు రౌండ్లు పూర్తి చేసిన చంద్రశేఖరరావు... నాలుగో రౌండ్ పూర్తి చేయడానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై పక్కకు పడిపోయాడు. పోలీసు అధికారులు వెంటనే అతన్ని పక్కకు తప్పించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే చంద్రశేఖరరావు మృతిచెందాడు. ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి ‘నాకింక దిక్కెవరయ్యా...’ అంటూ చంద్రశేఖరరావు తల్లి రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న అందరినీ కలచివేసింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
బరాజ్ల నిర్ణయం కేసీఆర్దే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావే నిర్ణయం తీసుకున్నారని నీటిపారుదల శాఖ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు చెప్పారు. 2016 జనవరిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం జరిగిందని పేర్కొన్నారు. వ్యాప్కోస్ రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, కేసీఆర్ స్వయంగా సంతకం చేశారని అన్నారు. ఈ డీపీఆర్ ఆధారంగా వివిధ కాంపోనెంట్ల అంచనాలను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారని వివరించారు. బరాజ్లను ఎక్కడ కట్టాలో ప్రభుత్వమే చెప్పగా, ఆ మేరకు డీపీఆర్ను వ్యాప్కోస్ సిద్ధం చేసిందన్నారు. నిర్మాణ దశలో అన్నారం, సుందిళ్ల బరాజ్ల స్థలాలను మార్చినట్టు చెప్పారు. గ్రావిటీ కాల్వ పొడవు తగ్గించడం, నిల్వ సామర్థ్యం పెంచడం, అటవీ భూముల సేకరణను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం ఆరు గంటల పాటు నిర్వహించిన రెండో విడత ఎగ్జామినేషన్లో వెంకటేశ్వర్లు ఈ మేరకు వివరణ ఇచ్చారు. తొలి విడతలో ఆయనకు 71 ప్రశ్నలు వేసిన కమిషన్.. తాజాగా రెండో విడతలో ఏకంగా 128 ప్రశ్నలు సంధించింది. శుక్రవారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరుకావాలని ఆదేశించింది. నిర్మాణ దశలో మార్పులు ‘డీపీఆర్ను 2016 మార్చిలో కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) సమర్పించిన తర్వాత నిర్మాణంలో పలు మార్పులు, చేర్పులపై నిర్ణయాలు జరిగాయి. డీపీఆర్లో అన్ని కాంపోనెంట్లు లేవు. గైడ్బండ్, ఫ్లడ్ బ్యాంకులు, డైవర్షన్ చానల్స్ను తర్వాత చేర్చాం. నిర్మాణ దశలో సైట్ పరిస్థితుల ఆధారంగా మరికొన్ని మార్పులు చేశాం. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్సీ)లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ మార్పులు జరిగాయి. డీపీఆర్లో అన్నారం బరాజ్ను 120 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించగా, అటవీ భూముల ముంపు, సైట్ పరిస్థితుల ఆధారంగా 119 మీటర్లకు కుదించాం. ప్రాథమికంగా మూడు బరాజ్లకు వేర్వేరు డీపీఆర్లను తయారు చేయగా, తర్వాత ఉమ్మడి డీపీఆర్ను తయారు చేశాం..’అని కమిషన్కు వెంకటేశ్వర్లు తెలిపారు. సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్ ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 2007లో రూ.17,875 కోట్లతో అనుమతిచ్చి 2008లో రూ.38,500 కోట్లకు అంచనాలను పెంచి రూ.6,156 కోట్ల పనులు సైతం పూర్తి చేశాక 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు కోసం రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఏమిటి?’అని కమిషన్ నిలదీసింది. ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్కు మహారాష్ట్ర అభ్యంతరం తెలపడంతో 148 మీటర్లకు ఎత్తు తగ్గించి ఒప్పందం చేసుకున్నాం. ఆ ఎత్తులో బరాజ్ కడితే 44 టీఎంసీల లభ్యతే ఉంటుంది. తుమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్ చేశారు’ అని వెంకటేశ్వర్లు వివరించారు.మ్యాథమెటికల్లీ తప్పుడు నిర్ణయమే ! ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా రెండుదశల్లో కలిపి 304 మెగావాట్ల పంపుల సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి వీలుండగా రీఇంజనీరింగ్ చేసి పంపుల సామర్థ్యాన్ని 11 వేల మెగావాట్లకు పెంచడం సరైందేనా అని కమిషన్ ప్రశ్నించగా, గణితపరంగా తప్పుడు నిర్ణయమేనని మాజీ ఈఎన్సీ పేర్కొన్నారు. కోల్బెల్ట్ ఏరియాలో మేడిగడ్డ బరాజ్ నిర్మించారా? అని ప్రశ్నించగా వాస్తవం కాదని ఆయన బదులిచ్చారు. బరాజ్ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నట్టు జాదవ్పూర్ వర్సిటీ ఇచి్చన నివేదికను ప్రస్తావించగా దానితో తాను ఏకీభవించనని చెప్పారు. ప్రభుత్వ అధినేత ఆదేశాలతో బరాజ్లలో నీళ్లను నిల్వ చేశామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. బెంగాల్ సహా 4 రాష్ట్రాల్లో నిర్మించిన బరాజ్లలో సికెంట్ పైల్స్ వాడినట్టు చెప్పగా.. తన స్వరాష్ట్రం బెంగాల్ పేరును ఉటంకించడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ‘మనం పయనించే ప్రగతిపథంలో అడుగడుగునా అడ్డుపడే నరకాసురులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూసంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యముందన్నారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. రేవంత్ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగను రాష్ట్ర ప్రజలు సుఖశాంతు లతో ఘనంగా జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేర కు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావ ళి పండుగను జరుపుకుంటామని, రాబోయే ఎన్నికలలో తెలంగాణకు పట్టిన చీకటి పోయి వెలుగులు రావడం ఖాయమని పేర్కొన్నారు. -
సారుకు కారు లేదు!
సాక్షి, సిద్దిపేట/ సాక్షి, కామారెడ్డి: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తన పేరిట విడిగా సొంత కారు, ద్విచక్ర వాహనం, వ్యవసాయ భూమి వంటివేవీ లేవని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. గురువారం గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా తనతోపాటు సతీమణి ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. కేసీఆర్, సతీమణి శోభమ్మకు కలిపి మొత్తం ఆస్తులు రూ.58,93,31,800 కాగా.. ఇందులో చరాస్తులు రూ.35,43,31,800, స్థిరాస్తులు రూ.23.50 కోట్లు ఉన్నాయి. మొత్తం అప్పులు రూ.24,51,13,631 ఉన్నాయి. ఇందులో ఇద్దరి పేరిట విడివిడిగా ఉన్న ఆస్తులు కొన్ని, ఉమ్మడిగా మరికొన్ని ఉన్నాయి. విడిగా పరిశీలిస్తే.. కేసీఆర్ చరాస్తులు రూ.17,83,87,492. ఇందులో 95 గ్రాముల బంగారం (రూ. 17.40 లక్షలు విలువ), చేతిలో నగదు రూ 2,96,605 ఉన్నాయి. ఆయన పేరిట ఉన్న స్థిరాస్తుల విలువ రూ.8.5 కోట్లు. రూ.17,27,61,818 అప్పులు ఉన్నాయి. కేసీఆర్ సతీమణి శోభమ్మ పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ.7,78,24,488 ఉండగా అందులో 2.841 కిలోల బంగారు అభరణాలు, 45 కేజీల వెండి వస్తువులు (రూ.1,49,16,084 విలువ), అప్పులు ఏమీ లేవు. కేసీఆర్, శోభమ్మ ఉమ్మడి ఆస్తులు రూ.24,81,19,820 ఉన్నాయి. ఇందులో ఉమ్మడి చరాస్తుల విలువ రూ.9,81,19,820. (దీనిలో రూ.1,16,72,256 విలువైన 14 వాహనాలు ఉన్నాయి), ఉమ్మడి స్థిరాస్తుల విలువ రూ.15 కోట్లు. ఉమ్మడి అప్పులు రూ.7,23,51,813. కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో 2010 సంవత్సరం నుంచీ ఉమ్మడి ఆస్తులుగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.1,35,00,116 విలువైన 53.30 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. అలాగే 9.365 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉందని, దానికి నాలా పన్నును సైతం చెల్లించామని వివరించారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా వచ్చే వేతనం/అలవెన్సులతోపాటు వ్యవసాయ ఆదాయం.. సతీమణి శోభమ్మకు బ్యాంకులోని డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీని ఆదాయంగా చూపించారు. కేసీఆర్పై తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 9 కేసులు ఉన్నట్టు తెలిపారు. -
ఓర్వలేకే ప్రతిపక్షాలు నీచ రాజకీయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ద్వారానే ప్రతీపశక్తులకు గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణభవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి నాగం జనార్దన్రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్రెడ్డి, కొల్లాపూర్ నేత రాంపుల్లారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం జరగ్గా, దేవుడి దయతో బతికి బయటపడ్డారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎప్పుడూ ఇలాంటి హేయమైన రాజకీయాలు లేవని, హింసకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ అనేక రంగాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. నాగం చేరికతో పెరిగిన బీఆర్ఎస్ బలం నాటి తెలంగాణ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లిన మాజీమంత్రి నాగం జనార్దన్రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీ బలం మరింత పెరిగిందని కేసీఆర్ అన్నారు. పాలమూరులో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలో నాగం ఇంటికి వెళ్లి మరోమారు ఆయన అనుచరులతో భేటీ అవుతానని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి తన కుటుంబసభ్యుడి లాంటి వాడన్నారు. విష్ణు తండ్రి పి.జనార్దన్రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన రాజకీయ భవిష్యత్తు తన బాధ్యత అని కేసీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. -
నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడుచోట్ల సీఎం సభలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సీఎం కె.చంద్రశేఖర్రావు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు కోదాడ చేరుకుంటారు. 1.50 గంటలకు అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. 2.30 గంటలకు కోదాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3.50 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు ఆలేరుకు చేరుకుంటారు. అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. కాగా, ఈ నెల 31వ తేదీన సీఎం మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
బీఆర్ఎస్కు కూచుకుళ్ల, కేఎస్ రత్నం రాజీనామా
సాక్షి, హైదరాబాద్/కొల్లాపూర్/చేవెళ్ల: ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇద్దరూ తమ రాజీనామా లేఖలను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు పంపించారు. ఈనెల 31న కొల్లాపూర్లో నిర్వహించనున్న ప్రియాంకాగాంధీ సభలో ఆమె సమక్షంలో దామోదర్రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు. సభాస్థలిని పరిశీలించేందుకు కొల్లాపూర్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవితో తగిన గుర్తింపు ఇచ్చినప్పటికీ, స్థానికంగా తనకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోలేదన్నారు. సమస్యలను చెప్పేందుకు సీఎం కేసీఆర్ను ఎన్నిసార్లు అపాయిట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు. మంత్రి కేటీఆర్కు చెప్పినా ఆయన కూడా పట్టించుకోలేదన్నారు. తాను గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని 15 రోజులకోసారి కలిసి స్థానిక అంశాలు మాట్లాడేవాడినని వివరించారు. కేసీఆర్ పాలనలో అలాంటి అవకాశం లేదన్నారు. కాగా.. కూచుకుళ్ల దామోదర్రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఇది వరకే కాంగ్రెస్లో చేరగా.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాగర్కర్నూల్ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం శుక్రవారం బీజేపీలో చేరనున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పదేళ్లుగా పారీ్టలో తగిన ప్రాధాన్యత లేకపోయినా కేసీఆర్పై ఉన్న గౌరవంతో కార్యకర్తగా కొనసాగానని చెప్పారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను బీఆర్ఎస్లో చేర్చుకుని తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. ఆ తరువాత రెండుసార్లు తనకు టికెట్ నిరాకరించారని ఆవేదన వ్యక్తంచేశారు. చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని.. చేవెళ్ల ప్రజల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నానని పేర్కొన్నారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
కేసీఆర్ పాలన అంతమైతేనే తెలంగాణ అభివృద్ధి
హిమాయత్నగర్ (హైదరాబాద్): ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పాలన అంతమైతేనే తప్ప తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ‘తెలంగాణ సమాఖ్య – ప్రజా సంఘాల ఉమ్మడి మేనిఫెస్టో’ను జస్టిస్ చంద్రకుమార్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో అప్పులు చేశారని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ప్రజా సంఘాల పోరాటాలకు అడ్డంకి కాదని, రాష్ట్రంలోని ప్రజా సంఘాలు ఏకమై కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ...బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని మోదీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు రవళిరెడ్డి, శ్యామల శ్రీను, హర్షవర్షన్ రెడ్డి, తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. -
29న రాష్ట్ర కేబినెట్ భేటీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ నెల 29న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్టు తెలిసింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 171(3), 171(5)లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రావీణ్యత కానీ ఆచరణాత్మక అనుభవం కానీ లేకపోవ డంతో వీరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తు న్నట్టు గవర్నర్ ప్రకటించిన విషయం తెలిసిందే. గవర్నర్ లేవనెత్తిన అంశాలకు సమాధా నమిస్తూ మళ్లీ వారి పేర్లనే సిఫారసు చేస్తూ... గవర్నర్ కోరిన వివరాలను పూర్తిగా తిరిగి పంపించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికలకు సన్నద్ధతపై సైతం విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకర్షించడానికి కొత్త పథకాలు, కార్యక్రమాల అమలుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు తెలిసింది. అయితే మంత్రివర్గ సమావేశం నిర్వహణపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. -
పనులు.. నిధులు.. పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ పదో తేదీలోపు వెలువడుతుందనే సంకేతాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్, సచివాలయానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని, వివిధ పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నిధుల అడ్డంకి ఉంటే తాము ప్రతిపాదించిన పనులకు కనీసం పాలనా పరమైన అనుమతులు అయినా ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సుమారు పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నందున తమ వినతులను సత్వరం పరిష్కరించాలంటూ లేఖలు సమర్పిస్తున్నారు. కేటీఆర్ సంతకాలతో కూడిన సిఫారసు లేఖలను తీసుకుని సచివాలయంలోని సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు, జిల్లా అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పనులు.. పోస్టింగులు ఎమ్మెల్యేల వినతుల్లో పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు తమ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారు లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే వీరిలో తమకు అనుకూలురైన పోలీసు, రెవెన్యూ అధికారుల పోస్టింగుల కోసం కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే పోస్టింగులు పూర్తయిన కొన్నిచోట్ల మార్పులకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణం నిధుల విడుదలకు సంబంధం లేని పనులకు ఓకే చెప్తూ, ఇతర అంశాలను పరిశీలిస్తామని మాత్రమే కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఎన్నికలు సమీపిస్తుండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. వీటితో పాటు తుది దశలో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా సంబంధిత శాఖల మంత్రులను ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తు న్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ నెల రోజుల క్రితం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది రెండేసి పర్యాయాలకు పైగా వరుస విజయాలు సాధించిన వారే ఉండటంతో వివిధ పథకాల ద్వారా లబ్ధి ఆశిస్తున్న వారి నుంచి వీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తమపై ఉన్న ప్రతికూలతను తొలగించుకునేందుకు, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీసీబంధు, గృహలక్ష్మి ఒత్తిడి.. ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఎదురవు తున్నట్లు సమాచారం. బీసీబంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు చెక్కుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించగా, ప్రస్తుతం లబ్ధిదారులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిగతా రెండు విడ తలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరో వైపు గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు లబ్ధిదారుల జాబితా పై స్పష్టత వచ్చేలా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తు న్నారు. మరోవైపు సామాజిక పింఛన్ల కోసం కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో దరఖా స్తులు అందుతున్నాయి. -
నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం ఉదయం 11 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సెప్టెంబర్ 17న రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు తెలంగాణ పరిణామం చెందిన సందర్భంగా ప్రతిఏటా ఆ రోజున తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండావిష్కరణలు చేయనున్నారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వవిధానానికి అనుగుణంగా ఆదివారం రాజ్భవన్లో విమోచన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్భవన్ ప్రాంగణంలో గవర్నర్ ఉదయం 9.30 గంటలకు జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. విమోచన దినోత్సవం జరుపుకోవాలి: గవర్నర్ పిలుపు హైదరాబాద్ విముక్తి పోరాటం దేశ స్వాతంత్య్ర సంగ్రామచరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుందని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని విడుదల చేశారు. విమోచన ఉద్యమంలో పోరాటయోధుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, మనం సంఘటితంగా పోరాడి సాధించిన విజయాలకు ఇది గుర్తుగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. -
నేటి నుంచి మైనార్టీలకు రూ. లక్ష సాయం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభం కానుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష ఆర్థిక సాయం నూరుశాతం రాయితీతో అందించనున్నట్లు వెల్లడించింది. సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ వెల్లడించింది. -
అసెంబ్లీ సమావేశాలకు తెర
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల పాటు కొనసాగిన తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది. ఆదివారం ఉదయం ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా జీరో అవర్తో ప్రారంభమైన సభ ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం – స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’అనే అంశంపై జరిగిన లఘు చర్చకు సీఎం కె.చంద్రశేఖర్రావు 2.30 గంటల పాటు సవివరంగా సమాధానం ఇచ్చారు. అనంతరం మూడు ప్రభుత్వ బిల్లుల ఆమోదం, గద్దర్కు సంతాపం ప్రకటించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఉభయ సభలు హుందాగా సాగాయి: వేముల అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రజాస్వామ్య బద్ధంగా, సభ్యుల సస్పెన్షన్లు లేకుండా సాఫీగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేశంలోనే నంబర్వన్ అనే రీతిలో నడిపాం: పోచారం 2019 జనవరి 18న శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన తాను అందరి సహకారంతో దేశంలోనే నంబర్ వన్ అనే రీతిలో సభను నడిపానని పోచారం శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు 2023 శానసభ ఆమోదించడం పట్ల స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్కు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అసెంబ్లీలోని వారి చాంబర్లలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డిపై వెలువరించిన ‘ససురవరం–తెలంగాణం’ మూడు సంకలనాలను శాసనసభలో సీఎం కేసీఆర్కు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు. 4 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో శాసనసభ 26.45 గంటలు, శాసన మండలి 23.10 గంటల పాటు సమావేశమైంది. -
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ, ఆర్మీ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వస్తుండటం మంచి పరిణామమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. కంటోన్మెంట్ను హైదరాబాద్లో కలపాలన్నది ఆ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న కల అని, ఇప్పుడు అది నెరవేరే సమయం వచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ సూచన మేరకు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘సాయన్న నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, వివిధ హోదాల్లో పనిచేశారు. ఎలాంటి సమయంలో అయినా చిరునవ్వుతో, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ఏదైనా ప్రయత్నం చేసి కంటోన్మెంట్ను హైదరాబాద్లో కలిపితే బాగుంటుందని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఆర్మీ నిబంధనలు కఠినంగా ఉండటంతో బలహీన వర్గాలకు కాలనీ కట్టాలన్నా ఇబ్బందిగా ఉందనేవారు. ఆయన విజ్ఞప్తి మేరకు పలుమార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్లను నగర పాలకవర్గాల్లో కలపాలని నిర్ణయానికి వస్తున్నట్టు శుభవార్త అందింది.ఈ రకంగా సాయన్న కోరిక నెరవేరుతోంది. ఆయన లేని లోటు తీర్చలేనిది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సంతాపం తీర్మానంపై మంత్రులు ప్రశాంత్రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి తదితరులు మాట్లాడారు. తర్వాత ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విజయరామారావు మృతి పట్ల కూడా సభ సంతాపం ప్రకటించింది. తర్వాత సమావేశాలను శుక్రవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మొత్తంగా తొలిరోజున 27 నిమిషాల పాటు అసెంబ్లీ కొనసాగింది. -
జలమండలి ఉద్యోగులకు 30% పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (జలమండలి)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ అమలు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్ బోర్డు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. మెట్రో వాటర్వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, ఇతర నేతలు సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన
-
జూబ్లిహిల్స్లోని ఇంటికి చేరుకున్న కృష్ణంరాజు భౌతికకాయం
రెబల్స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వస విడిచారు. ఆసుపత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్లోని నివాసానికి తరలించారు. అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణంరాజు భౌతికకాయాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలాదేవీ కన్నీరుమున్నీరుగా విలపించారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కేంద్రమంత్రలు కిషన్రెడ్డి, సినీ నటులు మోహన్ బాబు, ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు నివాళులర్పించారు. రేపు మధ్యాహ్నం అభిమానుల కడసారి చూపుకోసం కోట్ల విజయ భాస్కర్రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అటునుంచి మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలఓనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు తనకు అత్యంత అప్తమిత్రుడని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను కేసీఆర్ ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు. చదవండి: మా ఊరి హీరో కృష్ణంరాజు.. నన్ను పెద్దన్నలా ప్రోత్సహించారు: చిరంజీవి -
50 వేల ఉద్యోగాల భర్తీపై.. నేడే కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి దశలో భర్తీ చేయాలని భావిస్తున్న 50 వేల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలపై ఆర్థిక శాఖ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తోంది. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై.. గతంలో ఇచ్చిన ఖాళీలపై మరోసారి తుది నిర్ధారణకు రానున్నారు. ఆదివారం శాఖల వారీగా భర్తీ చేయాల్సిన 50 వేల పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి.. ఈనెల 13న సీఎం కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశానికి సమర్పించనున్నారు. మొత్తం 22 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఆయా విభాగాల అధిపతులు ఈ సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, పౌరసరఫరాలు, వినియోగదారుల శా ఖ, అటవీ పర్యావరణ, సాంకేతిక శాఖలతో, 10.30 గంటలకు నీటిపారుదల శాఖ, కార్మిక, ఉపాధి కల్పన, హోం, న్యాయ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. 11 గంటలకు చట్టసభలు, పురపాలక, పట్టణాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసులు శాఖల అధికారులు, 11.30 గంటలకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం రెవెన్యూ విభాగాల అధికారులతో, 12 గంటలకు రవాణా, రహదారులు, భవనాల శాఖ, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశమవుతారు. 12.30 గంటలకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఖాళీల భర్తీపై నివేదికలు ఇవ్వనున్నారు. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలు కూడా.. పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలకు సంబంధించిన సమాచారం కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు ఈ సమావేశంలో సమర్పించనున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి జోనల్ వ్యవస్థ చిక్కుముడులు విడిపోవడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎలాంటి ఇబ్బందులు లేనందున తక్షణమే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ లెక్కలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి జనవరి నుంచే ఈ కసరత్తు జరిగినా.. కోవిడ్ కారణంగా భర్తీ ప్రక్రియ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొత్త జోన్లకు ఇటీవలే రాష్ట్రపతి నుంచి ఆమోదం రావడంతో మళ్లీ ఈ ప్రక్రియ జోరందుకుంటోంది. -
నెహ్రూను మించిన ప్రధాని పీవీ
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూను మించిన ప్రధాని పీవీ నరసింహారావు అని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ఆర్వీఆర్ చంద్రశేఖర్రావు కొనియాడారు. సోమవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమం సందర్భంగా పీవీకి సన్నిహితుడిగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు బహుబాషా కోవిదుడే కాదని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. లండన్లో జరిగిన లీడర్షిప్ ఇన్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్లో పీవీ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుందని, ఆయన ప్రసంగాన్ని కొనసాగించేందుకు కాన్ఫరెన్స్ను మరో రోజు పొడిగించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. పీవీకి అనుకోకుండా పదవులు వచ్చినా.. అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. పీవీని ప్రధానిగా కాంగ్రెస్ ప్రకటించే సమయంలో తాను ఢిలీల్లో ఉన్నానని, ఈ విషయాన్ని ఎన్టీఆర్కు చెప్పగా, తెలుగు వ్యక్తి ప్రధాని కావడంపై ఆయన ఎంతో సంతోషించారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆయన మనవడు ఎన్వీ సుభాష్ ప్రభుత్వాన్ని కోరారు. సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. -
కమీషన్ల కోసమే ప్రాజెక్టుల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్ : మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అప్పుల ఊబిలో నెట్టారని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రాజెక్టుల పేరుతో నిధులు దోచుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధిలో రెండు సంవత్సారాలు వెనుక పడిపోయిందని విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే గత ప్రభుత్వాల కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు తరలింపు వల్ల ఒక లిప్ట్కు బదులు మూడు లిప్టులు అవసరం పడుతున్నాయని ఆరోపించారు. తుమ్మిడి హెట్టి దగ్గరే బ్యారేజ్ నిర్మిస్తే ఒకటే లిప్ట్ అవసరం వచ్చేదని అన్నారు. గ్రావిటీ ద్వారా పొందే నీటిని తొలుత పొంది, ఆతరువాత మిగిలిన వాటిని లిప్ట్ చేయాలని, కానీ కేసీఆర్ మాత్రం లిప్ట్ ఇరిగేషన్ పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిడ్డారు. ముఖ్యమంత్రి అనుకున్నదాన్ని సాధించడం కోసం ఖజానా మీద 20 వేల కోట్ల రూపాయల భారం పెంచుతున్నారని విమర్శించారు. తుమ్మిడిహెట్టి దగ్గరే కడితే గత ఏడాది నుండే నీటి వినియోగం కూడా జరిగేదని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తించే అవకాశం కోల్పోయామని ఆరోపించారు. కేసీఆర్ గొప్పల కోసం ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. -
పది తరాలకు సరిపోయేలా దోచుకున్నావ్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ నేతలను సన్నాసులంటూ సీఎం కేసీఆర్ విమర్శించిన నేపథ్యంలో నాగం ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. సీఎం విచ్చలవిడి అవినీతిని అడ్డుకోవడానికి మాత్రమే కోర్టుకు వెళ్లామన్నారు. రాష్ట్రం కోసమంటూ లక్షల కోట్లు అప్పు చేసి, వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కుటుంబం మొత్తం బంగారు తెలంగాణను పది తరాలకు సరిపోయేలా దోచుకున్నరని విమర్శించారు. కేసీఆర్ అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని, అవినీతికి సహకరించిన మంత్రులు, అధికారులు జైలుకు వెళ్లక తప్పదని నాగం జనార్ధన్ హెచ్చరించారు. మేడిగడ్డ దగ్గర మూడు లిప్టులు ఎందుకని ప్రశ్నించారు. ఒక బడా కాంట్రాక్టు సంస్థకు పనులను కట్టబెట్టడానికే కాళేశ్వరం నిబంధనలు మార్చారంటూ మండిపడ్డారు. ముప్పై నెలల్లో పాలమూరు పూర్తి చేస్తామన్న కేసీఆర్ కనీసం పది శాతం పనులను పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం పేరును అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్లగా మారుస్తామని చెప్పారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను అర్హత లేని కంపెనీకి కట్టబెట్టారని, 14 వేల కోట్ల అవినీతి పాల్పడ్డారని నాగం ఆరోపించారు. రివ్యూలు, రివిజన్ పేరు మీద కేసీఆర్ కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు నాగం విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై యుద్ధం చేస్తామని, ఈడీ, సీబీఐ దగ్గర కూర్చుంటామని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మిస్తే.. ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం అవినీతిని సాక్ష్యాధారలతో నిరూపిస్తానని, అలా చేయకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని సవాల్ చేశారు. -
చంద్రబాబు సహకారం అందిస్తున్నారు : బాలకృష్ణ
సాక్షి, విజయవాడ : రాష్ట్ర రాజధాని అమరావతిలో బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి 15 ఎకరాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధికి సీఎం తన వంతు సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పురిటి గడ్డమీద బసవతారకం హాస్పిటల్ కార్యకలాపాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ఆశయం పురడు పోసుకొని రెండు దశాబ్ధాలుగా కొనసాగడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో అమరావతిలో బసవతారకం హాస్పిటల్కు భూమి చేయనున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. మూడు ఫేజ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో బసవతారకం ఆస్పత్రికి పన్ను రద్దు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన తల్లి బసవతారకం పడిన బాధ ఏతల్లి పడొద్దని అందుకే హాస్పిటల్ ప్రారంభించినట్లు తెలిపారు. జీవితం మన హక్కుని దానిని పోరాడి సాధించుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కూడా అంతేన్నారు. -
కేసీఆర్ నిరంకుశత్వానికి పరాకాష్ట
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిరంకుశత్వానికి పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కుమార్ గృహ నిర్బంధం దారుణమని ఆయన మండిపడ్డారు. ఒక దళిత శాసనసభ సభ్యుడిని గృహ నిర్బంధం చేయడం దారుణమని, ఇది ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే సంపత్ పోరాడి సాధించారని పేర్కొన్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. దళిత శాసన సభ్యుడైనందువల్లే సంపత్ను టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వేధిస్తోందని, ఇందులో భాగంగానే శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. హైకోర్టు రెండు సార్లు ఆదేశించినా కూడా కేసీఆర్ పట్టించుకోకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేను పాల్గొననివ్వాలని, తన నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ క్యాంప్ కార్యాలయంలో అధికారులు భారీగా పోలీసులను మొహరించారు. ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేశారు. దీనిపై కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఒక ఎమ్మెల్యేకు తన నియోజక వర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. -
రెండు లక్షల రుణమాఫీ చేస్తాం
సాక్షి, నల్గొండ : కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బతుకమ్మ పండుగ ఇప్పుడు కవితమ్మ పండగగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం అసువులు బాసిన బీజేపీ కార్యకర్త మైసయ్య ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి అని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి అమరుడైతే, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఏలుతోందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కమీషన్ కోసమే మిషన్ కాకతీయ, భగీరథ చేపట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్, ఆయన మంత్రులు ఉస్మానియాలో అడుగుపెట్టాలంటే వణుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ శవాలతో రాజకీయాలు రకం అంటూ లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. భారత దేశాన్ని తమ కుటుంబమే ఏలాలని నెహ్రూ కుటుంబం చూస్తోందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన మోడీని చూసి ఓర్వలేక పోతోందని, కావాలనే ప్రధాని కులం, తినే ఆహారం పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మోడీ విజయాల జైత్రయాత్ర సాగితే తమ ఉనికి పోతోందని కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు బయపడుతున్నాయని విమర్శించారు. ఫ్లోరైడ్ బాధితులు ఇబ్బందిపడున్నా కేసీఆర్ పట్టించుకోకుండా ఉన్నారని, ఫ్లోరైడ్ నిర్మూలణకు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. గతంలో వాజ్పేయ్ ప్రభుత్వం 350 కోట్లు ఇస్టే వాటిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ, ఒక్క టీచర్ నియామకాలను చేపట్టలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క మహిళకు చోటు ఇవ్వలేదంటే మహిళలపై ఉన్న గౌరవం ఎంటో అర్థం అవుతోందన్నారు. సుకన్య సంవృద్ధి యోజన కింద కోట్ల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. తల్లి పడ్డ కష్టాలు చూసిన మోదీ ఏ మహిళా కష్టాలు పడకూడదని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని వెల్లడించారు. జనచైతన్య యాత్ర టీఆర్ఎస్ పతనానికి నాంది పలుకుతోందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చిన 350 కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేశారో టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో మొక్కల పెంపకానికి ఇచ్చిన 47 కోట్ల రూపాయలు ఏమయ్యాయని లక్ష్మణ్ నిలదీశారు. ఎన్నికల కోసమే రైతు బంధు పథకం కేసీఆర్ తెచ్చారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదని, ఊరు ఉరా బార్లు తెరిచి ఆదాయం పొందుతున్నారని దయ్యబట్టారు. జిల్లాకు ఇచ్చిన 543 కోట్ల రూపాయలు లెక్కలేకుండా పోయాయని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వమన్న లక్ష్మణ్, అధికారంలోకి వస్తే రైతులకు రూ 2లక్షల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిరైతుకు చితంగా బోర్లు వేయిస్తామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీని కూడా బీజేపీ కడుతుందని అన్నారు. -
మైనారిటీ విద్యకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాబోయే పది పన్నెండేళ్లలో మైనారిటీ వర్గాల్లో విద్యాపరంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావత్–ఏ–ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసి గురుకులాల్లో ఉచిత విద్య, వసతి అందిస్తున్నామన్నారు. తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యార్థులు నాసా వరకు వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. అన్ని అంశాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉందని, ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. ‘‘దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేశాం. దేశం మొత్తమ్మీద మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయిస్తే.. తెలంగాణలో రూ.2 వేల కోట్లు కేటాయించాం. ఈ బడ్జెట్ను పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తాం’’అని అన్నారు. రాజస్తాన్లో హైదరాబాద్ రుబాత్ అల్లా కృపతో తెలంగాణ సాధించగలిగామని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అల్లాను వేడుకున్నామని, అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరిపామన్నారు. దేవుడు న్యాయమైన కోరికను కరుణించడంతో రాష్ట్రం సిద్ధించిందన్నారు. మక్కా మదీనాలో మాదిరిగా రాజస్తాన్లోని అజ్మీర్ షరీఫ్లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్ రుబాత్ భవన సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. ఇందుకు రాజస్తాన్ ప్రభుత్వం 8 ఎకరాల భూమి కేటాయించిందని, త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రత్యేక రైలు వేసి 31 జిల్లాల నుంచి ముస్లింలను శంకుస్థాపన కార్యక్రమానికి తీసుకెళ్తామన్నారు. హైదరాబాద్లో సుమారు 10 ఎకరాల్లో ఇస్లామిక్ సెంటర్ను నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనారిటీ వర్గాలకు కూడా అన్ని పథకాలు వర్తింపచేసినట్లు వివరించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. దేశంలో మైనారిటీ వర్గాలు సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఇఫ్తార్ విందులో మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
డేంజర్లో ఉన్నారు జాగ్రత్త : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారా? పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో వారంతా గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదా? ఈ జాబితాలో పలువురు చైర్మన్లు, ప్రభుత్వ విప్లతోపాటు ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారా? ఇందుకు అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు! నియోజకవర్గాల్లో విపత్కర పరిస్థితులున్నాయంటూ ఆ 39 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హెచ్చరించినట్టుగా తెలిసింది. వీరిలో కొందరితో కేసీఆరే నేరుగా మాట్లాడారు. మరికొందరు ఎమ్మెల్యేలకు వారికి దగ్గరగా ఉన్న మంత్రులతో చెప్పించారు. మంత్రులు కేటీఆర్, టి.హరీశ్రావు సన్నిహితులకు వారితోనే ఈ విషయాన్ని చెప్పించినట్టుగా సమాచారం. పార్టీకి, ఎమ్మెల్యేలకు ఆదరణ ఎక్కువగా ఉందని అంచనా వేసుకుంటున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ పలువురు సీనియర్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని కేసీఆర్కు నివేదికలు అందాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అయితే ఎక్కువ మంది పనితీరుపై వ్యతిరేకత ఉండగా.. కొందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందని వివిధ సర్వేల నివేదికల ద్వారా తేలింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తేలిన 39 మందికి హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే ఎవరూ కాపాడలేరని సీఎం స్పష్టంగా చెప్పారు. 100 సీట్లపై ధీమా : గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 మంది ఎమ్మెల్యేలను గెల్చుకుని అధికారం చేపట్టింది. తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేల అకాల మరణం (నారాయణఖేడ్, పాలేరు) కారణంగా వచ్చిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలనూ టీఆర్ఎస్ గెల్చుకుంది. టీడీపీ(12), కాంగ్రెస్(7), వైఎస్సార్ కాంగ్రెస్(3), బీఎస్పీ(2), సీపీఐ(1) నుంచి మొత్తం 25 మంది టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 90 మందికి చేరింది. రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న 90 మంది ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గకుండా గెల్చుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇందుకు రాష్ట్రంలో అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా వంటి భారీ బడ్జెట్తో కూడిన పథకాలను అమలు చేస్తున్నారు. వీటితోపాటు పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వీటితో టీఆర్ఎస్కు తిరుగులేని ఆధిక్యత వస్తుందన్న విశ్వాసంతో కేసీఆర్ ఉన్నారు. వీటి భరోసాతోనే కనీసం 100 స్థానాలు గెలుస్తామని బహిరంగ సమావేశాల్లో ముఖ్యమంత్రి చెబుతున్నారు. కనీసం ఇప్పుడున్న 90 సంఖ్యను తగ్గకుండా గెలుస్తామని అంతర్గత సమావేశాల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం తేలింది? రైతుబంధు పథకం అమలు తర్వాత జరిగిన సర్వేలు, వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికల్లో వచ్చిన సమాచారంతో సీఎం కేసీఆర్ షాక్కు గురయినట్టు టీఆర్ఎస్ ముఖ్యులు వెల్లడించారు. టీఆర్ఎస్కు ఉన్న 90 మందిలో 39 మంది డేంజర్ జోన్లో ఉన్నారంటూ నివేదికలు అందాయి. నియోజకవర్గంలో అంతా తమదే రాజ్యం అని, ప్రత్యర్థి పార్టీలకు కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా లేరని కేసీఆర్ చుట్టున్న నాయకులు చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లోనూ క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశ్చర్యానికి గురి చేసినట్టుగా తెలిసింది. వీరిలో ఇద్దరు మంత్రులు కూడా ఉండటంతో కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన పలు కార్పొరేషన్ చైర్మన్లు, విప్ల పరిస్థితి అయితే పార్టీకి ఉన్న ఆదరణలో సగం కూడా లేదని తేలింది. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై వివిధ కారణాలతో పార్టీ శ్రేణులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, తటస్థులు వ్యక్తిగతంగా ఆగ్రహంతో ఉన్నారని తేలింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని చెబుతూ 39 మంది ఎమ్మెల్యేలకు రాతపూర్వకంగా నివేదికల వివరాలను పంపించినట్టుగా తెలిసింది. నియోజకవర్గాల్లో ఏయే కారణాల వల్ల వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మండలాల వారీగా అందించారు. ఇలా ఉంటే కష్టమే.. ఎమ్మెల్యేల పనితీరుపై హెచ్చరికతో కూడిన నివేదికను పంపించడంతోపాటు పార్టీ ముఖ్యులను ఆయా ఎమ్మెల్యేలతో మాట్లాడాలని కేసీఆర్ ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడి హెచ్చరించారు. ‘‘పార్టీ పనితీరుపై మీ నియోజకవర్గం సానుకూలంగా ఉంది. ఎమ్మెల్యేగా మాత్రం మీపై వ్యతిరేకత ఉంది. పార్టీ పనితీరుకు ఉన్న ఆదరణలో సగం కూడా మీకు లేదు. ఇది వ్యక్తిగతంగా మీకు మాత్రమే కాకుండా పార్టీకి చాలా నష్టం. ఎమ్మెల్యేలు గెలిస్తేనే టీఆర్ఎస్కు అధికారం వస్తుందని గుర్తుంచుకోవాలి. మీ పనితీరు ఎలా ఉన్నా అభ్యర్థిగా మీకే అధికారం ఇచ్చి, టీఆర్ఎస్కు అధికారం వచ్చే అవకాశాలను వదులుకోలేం. మీకు ఏయే కారణాలతో వ్యతిరేకత పెరిగిందో, ఏయే వర్గాలు మీకు దూరమయ్యాయో స్పష్టంగా, నిర్దిష్టంగా అందిస్తున్నాం. మీరేం చేస్తారో మీ ఇష్టం. మీ పనితీరు మారకుంటే, ఆదరణ పెంచుకోకుంటే కష్టం’’ అని స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా సమాచారం. వ్యక్తిగతంగా పనితీరును ఎలా మార్చుకుంటారో, బలమెలా పెంచుకుంటారో నివేదిక ఇవ్వాలంటూ ఆ 39 మంది ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ అయినట్టుగా తెలిసింది. -
సాగు సంబురం
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఇంతకాలం రైతులు మొగులుకు ముఖం పెట్టి చూసేవారు. తెలంగాణ రైతుకు ఇక ఆ కష్టం దూరమైతది. వచ్చే సంవత్సరం జూన్ తర్వాత కాళేశ్వరంతో అనుసంధానం ఏర్పడగానే చెరువులు 365 రోజులు నీటితో కళకళలాడుతై. అవి ఎండకుండా నింపుతనే ఉంటం. అప్పుడు రోహిణి కార్తెలనే నాట్లేస్తం. రోహిణికి ముందొచ్చే కృత్తిక కార్తెలనే మొక్కజొన్న విత్తనాలేస్తం. ఈ అద్భుత దృశ్యాన్ని చల్లగా బతికి కళ్లారా చూడాలనుకుంటున్న..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. అటెండరైనా సరే ఉద్యోగితో పెళ్లి సంబంధానికి ఒప్పుకుంటున్నోళ్లు రైతు అనగానే ముఖం తిప్పుకుంటున్నారని, ఈ దుస్థితిని మారుస్తామని ఉద్ఘాటించారు. రైతులు మంచి ఆదాయంతో కాలు మీద కాలు వేసుకుని కూర్చునే పరిస్థితి కల్పిస్తామని చెప్పారు. ‘‘నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. నీటి వసతి కల్పిస్తున్నం. అప్పు చేయకుండా పెట్టుబడి సాయం చేస్తున్నం. మెరుగైన సాగుకు రాయితీతో యంత్రాలు సమకూరుస్తున్నం. పంట చేతికొచ్చాక మద్దతు ధర అందేలా చూస్తం. ఇప్పటిదాకా వైకుంఠపాళిలో పెద్దపాము మింగిన తరహాలో నష్టపోతున్న రైతుల బాధలు దూరం చేసేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకొస్తే కొందరు ఈకలు తోకలు పీకే ప్రయత్నం చేస్తున్నరు’’అని విమర్శించారు. టీఆర్ఎస్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో రైతుబంధు, జీవిత బీమా పథకాలపై అవగాహన సదస్సు జరిగింది. ఇందులో రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్తలు, మండల సమన్వయ కర్తలు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల జీవిత బీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. సదస్సును ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. రైతు కష్టాలు దూరం చేసేందుకు తమ ప్రభుత్వం నడుం బిగించి, మంచిరోజులు తెచ్చిందన్నారు. ‘‘రెప్పపాటు సేపు కూడా కరెంటు పోవటం లేదు. ఇక మోటార్లు కాలిపోయే పరిస్థితి ఎక్కడిది? అందుకే తెలంగాణలో మోటార్ల మరమ్మతు కేంద్రాలు, జనరేటర్ కేంద్రాలు దివాలా తీసినై. వాటి నిర్వాహకులను వేరే ఉపాధి వెతుక్కోమని చెప్పినం’’అని అన్నారు. సరైన సాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం క్రాప్ కాలనీలను ఏర్పాటు చేస్తోందని, ఆ ప్రాంత నేల స్వభావం, వాతావరణ పరిస్థితి, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పంటలు వేయాలో శాస్త్రవేత్తలు సూచిస్తారని, వాటినే సాగు చేయాలని పేర్కొన్నారు. ఒకే రకమైన పంట వేసి రైతుకు రైతే పోటీ అయ్యే పరిస్థితిని నివారించాలన్నారు. డిమాండ్ ఉన్నవాటిని గుర్తించి ఆ పంటలే వేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతులు అనుసరిస్తున్న సొంత మార్కెట్ కమిటీ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఆ తరహాలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని, అవసరమైతే దాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖలో ఓ పోస్టును, సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డిని ఆదేశించారు. పంటలకు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్పై సర్వే చేసి రైతులకు సూచనలిచ్చే బాధ్యత ఆ అధికారి ఆధ్వర్యంలోని బృందానిదేనని చెప్పారు. ఉపాయంతో వ్యవసాయం చేయాలి పాత పద్ధతులు వదిలేసి సాగును యాంత్రీకరించేందుకు నడుం బిగించామని సీఎం చెప్పారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ సమీపంలోని వీఎన్ఆర్ షీట్స్ ఆధ్వర్యంలో క్లస్టర్ల నిర్వహణ బాగా ఉందని, దాన్ని తాను స్వయంగా పరిశీలించానని చెప్పారు. ఆ తరహాలో యాంత్రీకరణకు అవకాశం కల్పిస్తామని, పంట అమ్మడం కూడా నియంత్రిత విధానంలో ఉండాలని పేర్కొన్నారు. ‘‘నిత్యం ఆ క్లస్టర్ పరిధిలోని మూడు నాలుగు ఊళ్ల నుంచి మాత్రమే ధాన్యం మార్కెట్కు వస్తది. కొద్దిసేపట్లో విక్రయం పూర్తయి రైతు డబ్బు జేబులో పెట్టుకుని ఇంటికి పోయే పరిస్థితి ఉంటుంది. ఇలా క్రమ పద్ధతిలో రావాలంటే ఏ గ్రామంలో ఏ పంట వేశారో, ఎప్పుడు మార్కెట్కు తెచ్చే అవకాశం ఉందో సమాచారం అంతా సిద్ధంగా ఉండాలి. పట్టణాలకు చేరువగా కూరగాయల సాగు చేస్తే రైతులు ధనవంతులు అవుతారు. ధాన్యం ఎక్కువగా వచ్చి మార్కెట్లో వ్యాపారులు ధర తగ్గిస్తే రైతులు అమ్మొద్దు. ఇలా జరిగితే ఆ విషయాన్ని రైతు సమన్వయ సమితి చైర్మన్ దృష్టికి తేవాలి. ఈ సంఘటితత్వంతో వ్యాపారులే దిగొచ్చి ధర పెట్టేందుకు సిద్ధపడతారు. ఇలా ఉపాయంతో వ్యవసాయం చేసి దేశంలో తెలంగాణ రైతు తెలివైనోడనే పేరు సంపాదించాలి’’అని సూచించారు. కౌలు రైతులకు ‘రైతు బంధు’ఇవ్వం రైతుబంధు పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకు ఇవ్వబోమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఆ సాయం పొందుతున్నవారిలో 92 శాతం ఐదాకరాలున్న సాధారణ రైతులేనని, 54 లక్షల మంది రైతుల్లో 18 లక్షల మంది ఒక ఎకరం పొలం ఉన్నవారేనని పేర్కొన్నారు. ఇప్పటికి రూ.5 వేల కోట్లు డ్రా చేసుకున్నారని, ఇందులో రూ.4,956 కోట్లు సాధారణ రైతులే పొందారని, ధనవంతులైన పెద్ద రైతుల సంఖ్య అత్యల్పమని, వారిలో కొందరు ఆ సాయాన్ని వెనక్కు ఇచ్చేస్తున్నారని వివరించారు. ఇలా వెనక్కు వచ్చిన మొత్తం కూడా తిరిగి రైతుకే ఉపయోపడేలా రైతు సమన్వయ సమితి వద్దే ఉంచుతామని స్పష్టం చేశారు. ‘‘కొందరు అనారోగ్యం లాంటి కారణాలతో ఓ సంవత్సరం కౌలుకు ఇస్తారు. ఆ తర్వాత మరొకరికి ఇస్తారు. తర్వాత సొంతంగా చేసుకుంటరు. ఇలాంటప్పుడు ఏ కౌలు రైతును గుర్తిస్తం. ఈ వివరాలు తెలుసుకునుడే సర్కారు పనా?’’అని సీఎం అన్నారు. కొందరు పేరుకు పెద్ద రైతులైనా సరైన సాగు లేక వారూ అప్పుల్లోనే ఉన్నారంటూ, ఉద్యమ సమయంలో మహబూబ్నగర్కు చెందిన 60 ఎకరాల రైతు తనను కలిసి తీరును వివరించారు. అతను హైదరాబాద్లో కూలీ పని చేసుకున్నట్టు పేర్కొన్నారు. కొందరు నేతలు కౌలు రైతులకు సాయం చేయడం లేదని విమర్శిస్తున్నారని, వారికి సాయం సాధ్యం కాదని స్పష్టంచేశారు. అద్దె భవనాల్లో ఉండే కిరాయిదారులకు వాటిని రాసివ్వగలుతారా అని ప్రశ్నించారు. రామ, రావణ యుద్ధంలో అర్ధాయుష్షుతో చనిపోయిన రాక్షసులు ఈ జన్మలో ప్రజలను పీక్కుతినే నేతలుగా పుట్టారని, వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ నవ్వులు పూయించారు. కమతాల ఏకీకరణ జరగాలి రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలో ఒకే వ్యక్తికి ఉన్న కమతాలు ఒకేచోటకి చేరేలా చూడాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రైతులు పరస్పరం మాట్లాడుకుని ఆ భూముల »బదలాయింపుతో కమతాలను ఒకేచోటకు మార్చుకోవాలని సూచించారు. పంట దిగుబడి అధికంగా వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరమని, ఇందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాలని సూచించారు. రెండేళ్ల కాలంలో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత వరకు సేంద్రియ పద్ధతులు, పచ్చిరొట్టె వాడకాన్ని ప్రోత్సహించాలని, ఫాస్పేట్ వాడకం తగ్గించాలని సూచించారు. ఎల్ఐసీతో అతిపెద్ద డీల్ అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీతో రైతు బీమా ఒప్పందం చేసుకోవటం ద్వారా దాని పరిధిలో ఇప్పుడు అతిపెద్ద బీమా గ్రూపుగా నిలిచినట్టు ముఖ్యమంత్రి అన్నారు. క్లెయిమ్ చేసిన 10 రోజుల్లో బీమా మొత్తాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎల్ఐసీ చైర్మన్ శర్మ సమక్షంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి–ఎల్ఐసీ ఆర్ఎం శాస్త్రిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రైతు శ్రేయస్సు కోసం రైతుబంధు వంటి గొప్ప పథకం ప్రారంభించిన నేత దేశంలో కేసీఆర్ ఒక్కరేనని ఎల్ఐసీ చైర్మన్ శర్మ కితాబిచ్చారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని పేర్కొన్నారు. రైతుబంధు పథకం చెక్కులు బ్యాంకులో వేశాక నగదు కొరత సాకు చూపితే ఆర్బీఐ ముందు మంత్రులతో కలిసి నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించానని, ఆ భయంతో బ్యాంకర్లు రైతులకు వెంటనే డబ్బులిస్తున్నారని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఆగస్టు 15 నుంచి బీమా అమల్లోకి వస్తున్నందున ఆ లోపే తప్పుల్లేకుండా రైతుల వివరాలు, నామినీ పేరు, సెల్ నంబర్తో సహా అందించే బాధ్యత మండల వ్యవసాయ విస్తరణాధికారులదేనని చెప్పారు. సహజ మరణం అయినా 10 రోజుల్లో రూ.5 లక్షల బీమా సొమ్ము రైతు కుటుంబానికి అందుతుందని, డెత్ సర్టిఫికెట్ ఇస్తే చాలని పేర్కొన్నారు. ఇక నుంచి గ్రామపంచాయితీ కార్యాలయాల్లో కూడా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
నం.1 చేశాం : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ‘‘సమైక్య పాలనలో దారుణమైన అణచివేత.. దోపిడీ.. బతుకు మీద ఆశలు లేని నిస్సహాయత.. అలాంటి దైన్య స్థితి నుంచి కేవలం నాలుగేళ్లలోనే 21 శాతం ఆదాయ వృద్ధి రేటు కలిగిన ధనిక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అభివృద్ధిలో, ప్రజా సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇది దశాబ్దాలుగా మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా భావిస్తున్నా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్ర ఏర్పాటు పరిస్థితులను గుర్తు చేసుకుంటూ.. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కష్టాలను దూరం చేసుకుంటూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి, ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ క్రమంలో తెలంగాణ ప్రజల కష్టాలు, కడగండ్లు, వాటికి కారణాలు గుర్తించామని.. వాటిని పరిష్కరించే దిశగా మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణం నుంచే హామీలను అమలు చేస్తున్నామని.. విస్తృత ప్రజాప్రయోజనం కలిగించే కొత్త పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ‘సంపద సృష్టించాలి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి..’అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తోందన్నారు. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని అద్భుత కార్యక్రమాలను తెలంగాణలో చేపట్టామని.. పలు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు వీటిని పరిశీలించి, తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు పూనుకుంటున్నారని తెలిపారు. ఇది తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. సంక్షేమమే పరమావధిగా.. సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అనేక పథకాలను చేపట్టామని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం 42 లక్షల మంది అసహాయులకు నెలకు రూ.వెయ్యి చొప్పున పింఛన్ అందిస్తూ ఆసరాగా నిలుస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్లకు కూడా ప్రభుత్వం జీవన భృతి కల్పిస్తోందన్నారు. కల్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్నామని, బడిపిల్లలకు సన్నబియ్యంతో భోజనం అందజేస్తున్నామని చెప్పారు. ఏకంగా రూ.40 వేల కోట్లతో 40 పథకాల ద్వారా ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు వ్యవసాయంతో పాటు కులవృత్తులకు ఊతమిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. ఆ దిశగా యాదవ, గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ, ముదిరాజ్, బెస్తలకు ప్రయోజనం కల్పించేలా చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు. ఈత, తాటి చెట్లపై విధించే పన్ను రద్దు చేశామని.. పాడి రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకంగా అందజేస్తున్నామని తెలిపారు. నిరుపేదల ఆత్మగౌరవాన్ని నిలిపేలా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రాబోయే కొద్ది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతుందన్నారు. కోటి ఎకరాలకు నీరిచ్చి తీరుతాం.. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టులు చేపట్టామని కేసీఆర్ తెలిపారు. సమైక్య పాలకులు కావాలనే అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారమిచ్చేలా ప్రాజెక్టులను డిజైన్ చేసి, తర్వాత ఆ వివాదాలను సాకుగా చూపి ప్రాజెక్టులు నిర్మించలేదని ఆరోపించారు. దాంతో తమ ప్రభుత్వం ప్రాజెక్టులను రీడిజైన్ చేసి.. పనులు కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. గత 70 ఏళ్లలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలేవీ మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోలేకపోయాయని.. తాము తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసం ఎంతో పరిణతితో వ్యవహరించి.. అంతర్రాష్ట్ర ఒప్పందాలను సాధించుకోగలిగామని పేర్కొన్నారు. దీంతో గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలిగాయన్నారు. గోదావరి, కృష్ణా నదుల మీద 23 భారీ ప్రాజెక్టులు, 13 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు చేపట్టామని.. ఏటా బడ్జెట్లో రూ. 25 వేల కోట్లు కేటాయించుకుంటున్నామని చెప్పారు. భారీగా కొత్త ఆయకట్టుకు నీరు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, మిడ్ మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెం వాగు, కొమురంభీమ్, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్పూర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఇప్పటికే 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ ఏడాది మరో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కొత్తగా తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్ మాట్ బ్యారేజీ, మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని.. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకాన్ని చేపట్టామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు, 365 రోజుల పాటు ఆ ప్రాజెక్టుకు నీరు అందుబాటులో ఉండేలా గోదావరిపై తుపాకుల గూడెం బ్యారేజీని నిర్మిస్తున్నామన్నారు. వలస కూలీలకు నిలయమైన పాలమూరు, తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని భూములకు పాలమూరు–రంగారెడ్డి పథకం ద్వారా సాగునీరు అందుతుందన్నారు. శరవేగంగా పనులు.. భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశామని.. అదే స్ఫూర్తితో తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయని కేసీఆర్ చెప్పారు. గోదావరి జలాలను సమగ్రంగా వినియోగించుకునేలా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయానికి వరప్రదాయిని అన్నారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు సమృద్ధిగా నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేసే విధంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ ఎత్తున సాగుతున్న నిర్మాణ పనులను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రముఖులు వచ్చారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు జీవధారగా మారబోతున్నదని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారని గుర్తుచేశారు. కేంద్ర జల సంఘం ప్రతినిధి బృందం కూడా రెండు రోజుల పాటు కాళేశ్వరం పనులను పరిశీలించి.. ఈ ప్రాజెక్టు దేశ చరిత్రలోనే విభిన్నమైనదని కొనియాడిందని చెప్పారు. మిషన్ కాకతీయ తోడ్పాటుతో రాష్ట్రంలో సాగయ్యే భూమి విస్తీర్ణం పెరిగిందని.. భూగర్భ జల మట్టాలు కూడా పెరిగాయని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలిచేలా పథకాలు.. రాష్ట్రంలో రైతులను మరింతగా ఆదుకోవడానికి ఎంతో చేయాలన్న తపన మదిలో మెదులుతూనే ఉందని.. ఆ దిశగానే ‘రైతుబంధు’పథకాన్ని ప్రారంభించామని కేసీఆర్ తెలిపారు. ఒకవేళ రైతులెవరైనా చనిపోతే.. వారి కుటుంబానికి ఆధారంగా ఉండేలా రైతులకు జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇకపై తెలంగాణలో ఏ రైతు మరణించినా.. వారి కుటుంబానికి పది రోజుల్లోగానే రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతుందని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రైతులకు బీమా పత్రాలు అందించే కార్యక్రమం ప్రారంభవుతుందని వెల్లడించారు. ఇక రైతు రుణాల మాఫీ, సకాలంలో ఎరువులు–విత్తనాల సరఫరా, ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియామకం, డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌజ్లకు, యంత్ర పరికరాలకు భారీ సబ్సిడీలు, పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం, నీటితీరువా బకాయిల రద్దు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు వంటి వాటితో వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజాన్ని కలిగించామని చెప్పారు. నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ సరఫరాతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. విజయవంతంగా ‘ప్రక్షాళన’ రాష్ట్రంలో భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు.. ఎవరూ చేయని విధంగా కేవలం వంద రోజుల్లో ‘భూరికార్డుల ప్రక్షాళన’కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని 2.38 కోట్ల ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను ప్రక్షాళన చేయడంతోపాటు.. కోటి 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో స్పష్టత సాధించగలిగామని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీలోగా రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తిచేసేలా అధికార యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళన ద్వారా తేలిన సమాచారాన్ని పొందుపరుస్తూ ప్రభుత్వం ‘ధరణి’పేరుతో వెబ్సైట్ రూపొందిస్తోందన్నారు. ఈ నెల 20 నాటికి భూములకు సంబంధించిన పూర్తి స్పష్టత సాధించి, ఆ వివరాలను పారదర్శకంగా ‘ధరణి’లో నమోదు చేస్తామని చెప్పారు. దీనివల్ల భూముల వివరాలన్నీ ఒకేచోట అందరికీ అందుబాటులో ఉంటాయని.. క్రయ, విక్రయాలు ఎప్పుడు జరిగినా వెంటనే మార్పులు నమోదవుతాయని తెలిపారు. సరికొత్తగా రిజిస్ట్రేషన్ విధానం అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని విధంగా రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతమున్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు అన్ని మండలాల తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. నామమాత్రంగా ఉన్న పంచాయతీ పాలక వర్గాలను క్రియాశీలంగా మార్చేలా పంచాయతీ చట్టంలో మార్పులు చేశామని చెప్పారు. గ్రామాలకు దూరంగా ఉన్న తండాలు, గూడేలు, శివారు పల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపన కోసం అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చే విధానం తీసుకొచ్చామని.. దీంతో అనేక పరిశ్రమలు తరలి వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,155 పరిశ్రమలు అనుమతి పొందాయని.. రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ కోసం.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రభుత్వాస్పత్రుల పనితీరు మెరుగుపడి.. ప్రజల్లో విశ్వాసం పెరిగిందని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు నాలుగు విడతలుగా రూ.12 వేలు చెల్లిస్తున్నామని, ఆడపిల్ల పుడితే మరో రూ.వెయ్యి అదనంగా అందిస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా తల్లికి, నవజాత శిశువులకు కావల్సిన 16 రకాల వస్తువులతో కూడిన ‘కేసీఆర్ కిట్’ను కూడా అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 39 ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. అందులో ఇప్పటికే 17 కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయని తెలిపారు. హైదరాబాద్లో వైద్యసేవలను మరింత విస్తరించి, పేదలందరికీ ప్రయోజనం కలిగించేలా వెయ్యికి పైగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి, తగిన వైద్యం అందించేందుకు ‘తెలంగాణ కంటి వెలుగు’పేరిట పథకాన్ని రూపొందించామని.. ఆగస్టు 15 నుంచి ఉచిత కంటి పరీక్షల శిబిరాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ‘సివిల్స్’లోనూ సత్తా చాటుతున్నాం.. ఇటీవల జరిగిన సివిల్స్ పరీక్షల్లో తెలంగాణ బిడ్డలు దేశం మొత్తమ్మీద ప్రథమ స్థానంతోపాటు అత్యుత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చారని కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో ఏర్పాటు చేసిన గురుకులాలు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని.. ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అనుసరిస్తున్నాయని చెప్పారు. చివరిగా ‘జై తెలంగాణ.. జై భారత్’అంటూ కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు. వేడుకల్లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
రైతుల బాధ్యత ఏఈవోలదే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలను వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) చూసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ‘‘తమ క్లస్టర్ పరిధిలోని ఐదు వేల ఎకరాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఏఈవోల వద్ద ఉండాలి. ప్రతి రైతు వివరాలు ఉంచుకోవాలి. ఏ పంట ఎప్పుడు వేయాలో, ఏ భూమికి ఏ పంట అనుకూలమో రైతులకు సూచించాలి. పంటలకు రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో మార్కెటింగ్ అవకాశాలను పర్యవేక్షించాలి. రైతులెవరైనా మరణిస్తే.. వారికి సంబంధించి బీమా క్లెయిమ్ దగ్గరి నుంచి నామినీకి సొమ్ము అందేవరకు బాధ్యత తీసుకోవాలి. ఏఈవోలు అధికారుల్లా కాకుండా రైతులకు ఒక విధమైన ప్రోత్సాహకర్తల్లా వ్యవహరించాలి. టీమ్ లీడర్లలాగా పనిచేయాలి..’’అని సూచించారు. కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో వ్యవసాయ శాఖపై మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. వ్యవసాయం లాభసాటి చేయాలి.. రైతులు మూస పద్ధతిలో, సాంప్రదాయ విధానాల్లో పంటలు పండిస్తున్నారని.. ఏఈవోలు ఈ పరిస్థితిని మార్చాలని, లాభసాటిగా పంటలు పండించే నైపుణ్యాన్ని కల్పించాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలోకి పూలు, పళ్లు, కూరగాయలను దిగుమతి చేసుకునే పరిస్థితిని నివారించి.. మనమే ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. వ్యవసాయం లాభసాటి అయ్యేంతవరకు ఆ శాఖ మంత్రి, రైతు సమన్వయ సమితులు నిర్విరామంగా కృషి చేయాలన్నారు. పాలమూరు, సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తయి నీరు రావడం మొదలైతే... తెలంగాణ వ్యవసాయపరంగా దేశంలోనే ప్రథమ శ్రేణి రాష్ట్రం అవుతుందని పేర్కొన్నారు. పంట కాలనీల ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణ, ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) యూనిట్ల ఏర్పాటు దిశగా ఏఈవోలు కృషి చేయాలని సూచించారు. ‘రైతు బీమా’పథకానికి సంబంధించి సోమవారం హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఏఈవోలు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతు సమన్వయ సమితి కో–ఆర్డినేటర్లతో విస్తృత స్థాయి సమావేశం జరగనుందని.. అందులో ఈ అంశాలను సమగ్రంగా చర్చించాలని సూచించారు. ఆ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటున్నట్టు చెప్పారు. నర్సరీ నుంచి పంటకొత దాకా యాంత్రీకరణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ ముమ్మరంగా సాగాలని సీఎం పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏమేం అందుబాటులో ఉన్నాయి, ఇంకా ఏమేం కావాలో అధ్యయనం చేయాలని ఏఈవోలకు సూచించారు. అవసరమైన యంత్రాలను సరఫరా చేయాలని, అవి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నర్సరీ దగ్గరి నుంచి పంటకోతల దాకా అన్ని స్థాయిల్లో యాంత్రీకరణ జరగాలన్నారు. వచ్చే బడ్జెట్లో యాంత్రీకరణకు భారీగా నిధులిస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పండించే పంటలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని.. పళ్ల తోటలున్న చోట పల్ప్ తయారీ యూనిట్ల ఏర్పాటు జరగాలని సూచించారు. రైతులకు లేఖలు రాయండి.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల గురించిన సమగ్ర సమాచారంతో రైతులకు లేఖలు రాయాలని వ్యవసాయశాఖ మంత్రికి సీఎం సూచించారు. రైతులకు అవగాహన కలిగించడానికి, వారిలో మరింత స్థైర్యం నింపడానికి ప్రయత్నించాలన్నారు. రైతు బీమా పత్రాల పంపిణీ మొదలయ్యే ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో రైతుల సమావేశాలు–సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ఆ సదస్సుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని.. రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కలిగించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం అద్భుతమైన చర్యలు చేపడుతున్నామని.. మూడు నాలుగేళ్లు పంటలు బాగా పండితే రైతుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంపీలు జితేందర్రెడ్డి, బాల్క సుమన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ కోసం 500 ఏసీ బస్సులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న మినీ ఏసీ ఎలక్ట్రికల్ బస్సుల మోడల్ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చైనాకు చెందిన బీవైడీ బస్సు కంపెనీ జీఎం లియో జూలింగ్, ఈడీ జాంగ్ జీ, ఇతర ప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు. బస్సుల పనితీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు గంటలపాటు చార్జింగ్ చేస్తే 300 నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతరం బీవైడీ ప్రతినిధులతో కలిసి కేసీఆర్ ప్రగతి భవన్ ఆవరణలో కాసేపు బస్సులో చక్కెర్లు కొట్టారు. జీహెచ్ఎంసీలో ఎలక్ట్రికల్ బస్సులతో వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని, తక్కువ ఖర్చుతో పాటు, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. మొదటి విడతగా హైదరాబాద్లో 500 బస్సులు ప్రవేశ పెట్టేందుకు వీలుగా సీఎం కంపెనీ ప్రతినిధులను వివరాలు ఆరా తీశారు. దీనిపై స్పందించిన బీవైడీ ప్రతినిధులు అవసరం అయితే ప్లాంట్ పెట్టడానికి సిద్దమని వెల్లడించినట్లు సమాచారం. చైనా బయట తొలిసారి తెలంగాణలో తమ యూనిట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
కేసీఆర్కు అఖిలేష్ యాదవ్ మద్దతు
సాక్షి, హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మరో అడుగు ముందుకేశారు. కొత్త ఫ్రంట్ ఏర్పాటుకై కేసీఆర్ గత కొంతకాలం నుంచి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల చెన్నై వెళ్లి తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధిని కలిసిన కేసీఆర్ నేడు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ఇది 2019 ఎన్నికల కోసం చేస్తున్న ప్రయత్నం కాదన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని యత్నిస్తున్నాం అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో చాలాసార్లు అఖిలేష్ యాదవ్తో ఫోన్లో సంభాషించామని తెలిపారు. దీనిపై పలుసార్లు చర్చలు జరిపామని ఇందులో భాగంగానే అఖిలేష్ హైదరాబాద్ వచ్చారని చెప్పారు. అనంతరం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. తాను చాలాసార్లు కేసీఆర్తో ఫోన్లో మాట్లాడానన్నారు. ఈసారి నేరుగా మాట్లాడాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. చాలా అంశాలపై చర్చించామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తోందని కితాబిచ్చారు. రైతులు సహా అన్ని వర్గాల ప్రజల అభిమానం కేసీఆర్ సర్కార్కు ఉందన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సాగునీరుకు ప్రాముఖ్యత ఉందని, అందులో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎంతో చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచాయని... ఇప్పుడు ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రాంతీయ పార్టీలు, నేతలు మాత్రమే బీజేపీని అడ్డుకోగలరని అఖిలేష్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ప్రజలకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. సమాజ్వాదీ పార్టీకి హైదరాబాద్తో చాలా గట్టి, పాత అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము బలమైన అనుబంధం కోరుకుంటున్నామని చెప్పారు. దేశ ప్రజలు ఒక కొత్త రాజకీయ పంథాను కోరుకుంటున్నారని, అందుకే కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి తాము మద్దతు ఇస్తున్నామని అఖిలేష్ స్పష్టం చేశారు. మీడియా సమావేశానికి ముందు కేసీఆర్, అఖిలేష్ యాదవ్లు సుమారు నలభై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. -
‘చంద్రుల’ నోట చైనా పాట
డేట్లైన్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల పాలకులు ఇద్దరూ తమకు అడ్డంకిగా మారిన ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ కాలరాస్తున్నారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. నిరసనలకు తావే లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్పింగ్లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు సీఎంలకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్లుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ మధ్య వేర్వేరు సందర్భాలలో చైనాలో పరిపాలనను, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఉదహరించారు. ఇటు తెలం గాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తాను జాతీయ రాజకీయాలకు వెళ్లనున్నట్టు ప్రకటించిన సభలో చైనాను ప్రస్తావిస్తే, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అక్కడి శాసనసభలో మాట్లాడుతూ చైనాను కొనియాడారు. ఇద్దరి మాటల్లోనూ మనకు అర్థం అయింది ఏమిటంటే అభివృద్ధి సాధించాలంటే చైనాను ఆదర్శంగా తీసుకోవాలి అని. అభివృద్ధి అంటే ఏమిటి? అది ఎవరి అభివృద్ధి? దేన్నయినా పణంగా పెట్టి ఆ అభివృద్ధి సాధించుకోవలసిందేనా? చైనా సాధిస్తున్న అభివృద్ధిని గురించి ఇంకోసారి చర్చించుకుందాం. ఇటీవలే చైనా దేశ రాజ్యాంగాన్ని సవరించి ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ జీవితకాలం పదవిలో కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది ఆ దేశ పార్లమెంట్. రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష పదవిలో ఎవరూ కొనసాగకూడదన్న నియమాన్ని సవరించి జిన్పింగ్కు నిరాఘాటంగా అధికారంలో కొనసాగే అవకాశం కల్పించడం చైనా దేశాన్ని ఏకవ్యక్తి నియంతృత్వం వైపు నెట్టడమే అన్న విమర్శను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చి ఈ చర్యకు ప్రజల ఆమోదం ఉందని తేల్చేసింది. చైనా మోడల్ దేనికి నిదర్శనం? అభివృద్ధి పేరిట చైనా దేన్ని పణంగా పెడుతుందో ఈ తాజా చర్యల వల్ల మనకు అర్థమవుతుంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో, అభివృద్ధి కోసం దేశాన్ని నియంతృత్వ పాలకుల చేతుల్లో ఎలా పెట్టెయ్యవచ్చునో, దానికోసం స్వేచ్ఛాస్వాతంత్య్రాల అవసరం అసలే అక్కరలేదనో ఎవరయినా ఆర్థిక శాస్త్ర పండితులు చెప్తారేమో. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛను, జీవించే హక్కును కోరుకునే వారెవ్వరూ ఇప్పటి చైనా పోకడలను హర్షించరు, ఆమోదించరు. విచిత్రంగా చైనాలో ఈ రాజ్యాంగ సవరణ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరి నోటా చైనా అభివృద్ధి పాట వినిపించింది. నిజంగా ఈ ఇద్దరు నాయకులను చైనాలో జరుగుతున్న అభివృద్ధి ఆకర్షించిందా లేకపోతే జిన్పింగ్ లాగా తమకు శాశ్వత అధికారం కట్టబెడితేనే చైనా మోడల్ అభివృద్ధి సాధిస్తామని ప్రజలకు చెప్పదల్చుకున్నారా తెలియదు. ఈ సందేహం రావడానికి కారణం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి నిరసనలకు తావు లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపొయింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తానూ చెయ్యబోయే అభివృద్ధిని 2050 సంవత్సరం వరకూ విస్తరిస్తుంటారు. అంటే ఆయన, ఆయన కొడుకు లోకేష్, ఆ తరువాత మనుమడు దేవాన్‡్ష కూడా ముఖ్యమంత్రులు అయిపోవొచ్చు ఈ 52 ఏళ్ళ కాలంలో. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 20 ఏళ్ళ దాకా మాదే అధికారం అంటారు. ప్రతిపక్షాలు లేనే లేవు, ఎప్పుడు ఎన్నికలొచ్చినా రాష్ట్ర శాసనసభలోని 119 స్థానాల్లో 106 మావేననీ, వచ్చే 20 ఏళ్ళు అధికారం మాదే అని కూడా అంటుంటారు. ఇద్దరూ ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ, విలువలనూ కాలరాస్తుంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్పింగ్లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు ముఖ్యమంత్రులకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్టు ఉన్నది. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి కుప్పిగంతులే! రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలిచ్చి, విడిపోతున్న సమయంలో 15 ఏళ్ళు ప్రత్యేక తరగతి హోదా కావాలని డిమాండ్ చేసి ఆ తరువాత అధికారంలోకి వచ్చాక అదే హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాన్ని, ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కదలనివ్వదు, జైళ్ళలో పెడుతుంది. కేసులు పెడుతుంది. హోదా సంజీవని కాదు, ప్యాకేజీతోనే ప్రయోజనం అని చెప్పి చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసి, చివరికి ప్రజాగ్రహానికి తలొగ్గక తప్పని స్థితిలో మళ్ళీ ప్రత్యేక హోదా పాట అందుకున్నది. ఎన్నికల ఎత్తుగడగా బీజేపీని వదిలించుకోవాలని ఆలోచిస్తున్నప్పటికీ చంద్రబాబుకు పూర్తి ధైర్యం చాలడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో నుండి మాత్రం తన మంత్రులతో రాజీనామా చేయించి ఎన్డీఏ కూటమిలో మాత్రం కొనసాగుతున్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కేంద్రంతో తగాదా పడలేము, మంచిగా ఉండి సాధించుకోవాలి అనే పాట పాడుతూ వొచ్చిన చంద్రబాబుకు, ఆయన పార్టీ నాయకులకూ ఇప్పుడు బీజేపీతో సంబంధాలు చెడేసరికి సహకార ఫెడరలిజం గుర్తొచ్చింది. 2016 సెప్టెంబర్ 8న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న ప్యాకేజీ గురించి ప్రకటించినప్పుడు ఉబ్బితబ్బిబ్బయిపోయి ఆయనకు సన్మానాలు చేసిన చంద్రబాబు, అదే ప్రకటనను అక్షరం పొల్లుపోకుండా 2018 మార్చిలో చేస్తే మాత్రం అన్యాయం జరిగిందని ప్రకటనలు చేస్తున్నారు. అధికారాన్ని మళ్ళీ ఎట్లాగయినా దక్కించుకోవాలన్న ఆరాటం స్పష్టంగా కని పిస్తూనే ఉంది ఆయన నిర్ణయాల్లో. తాము ఇంకా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూనే, ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకయినా మద్దతు ఇస్తామన్న ప్రతిపక్షాన్ని మాత్రం బీజేపీలో చేరబోతున్నది అని నిందించేందుకు చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు శతవిధాలా చేస్తున్న ప్రయత్నాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటే పొరపాటు. ఇక దేశానికే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తాను ఇస్తాననీ మూడవ ఫ్రంట్కు తాను నాయకత్వం వహిస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రైతు సమస్యల మీద కేంద్రాన్ని నిలదీయడానికి ఉద్యమం చేస్తానని, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉండదు. హైదరాబాద్లో ధర్నా చౌక్ ఎత్తేసి నిరసనకారులను ఇళ్ళల్లో నిర్బంధించి అవసరం అయితే పోలీస్ స్టేషన్లకు తరలించి ముఖ్యమంత్రి మాత్రం జంతర్ మంతర్కు నిరసన కార్యక్రమం నిర్వహించడానికి వెళతారు. రిజర్వేషన్ల పెంపు డిమాండ్ మీద ఆయన పార్టీ ఎంపీలు లోక్సభను స్తంభింప చెయ్యొచ్చు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపవచ్చు కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం విపక్షాల నిరసనకు అనుమతి లేదు. ప్లకార్డులు ధరించి సభకు రావడం అరాచకం. దాడుల రాజకీయంలోనూ పక్షపాతమే! శాసనసభలో గవర్నర్ మీద దాడి హేయమయిన చర్య. ఎవరూ సమర్థించకూడని చర్య. అయితే గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలపడం ఇవాళ కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. నిలబడి నిరసన తెలపడం, నినాదాలు చెయ్యడం, ప్రసంగాల ప్రతులను చించివెయ్యడం చాలా కాలంగా శాసనసభల్లో మామూలు అయిపోయింది. అయితే భౌతికంగా గవర్నర్ మీద దాడికి దిగడం ఎవరితో ప్రారంభం అయింది? ఉమ్మడి రాష్ట్రంలో ఇదే గవర్నర్ గారి మీద ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు కాదా దాడి చేసింది. శాసన సభ ఆవరణలో ఒక ఎంఎల్ఏను కొట్టండిరా తన్నండిరా అని రెచ్చగొట్టిన పెద్ద మనిషి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్నాడు. రేపో మాపో ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సంఘటనను ఆదర్శంగా చేసుకుని గవర్నర్ మీద మళ్లీ దాడి చెయ్యడాన్ని ఎవరూ సమర్థించరు. చెప్పేదేమంటే మేం చేస్తే మంచిది, ఇతరులు చేస్తే చెడ్డది అన్న ప్రభుత్వాల, రాజ కీయ పక్షాల వైఖరి సరయినది కాదు అనే. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమం అనేక మార్గాల్లో, అనేక పద్ధతుల్లో సాగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉందో చెప్పడానికి మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటి పలు కార్యక్రమాలు జరి గాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ఆ ఉద్యమ కార్యక్రమాలు అన్నింట్లో భాగస్వామి. వాటిల్లో ఒకటయిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ జరుపుకోవడాన్ని ఎందుకు ప్రభుత్వం అడ్డుకున్నట్టు? ఉద్యమ కాలంలో తెలంగాణ సాధన కోసం ఆ నాటి ప్రభుత్వంతో తలపడిన దానికి, ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి తేడా లేదా? మిలియన్ మార్చ్ నిర్వహణను నిషేధించడానికి ఆ నాడు ప్రభుత్వం ఏ కారణాలు చెప్పిందో, స్ఫూర్తి సభను నిషేధించడానికి నేటి ప్రభుత్వమూ అవే కారణాలు చూపడం విడ్డూరం. ఆ నాటి దృశ్యమే ఈనాడూ ట్యాంక్ బండ్ చుట్టూ కనిపించింది. ఆనాడు వేల మంది పోలీసులు ఉద్యమకారుల మీద విరుచుకుపడి అరెస్టులు సాగిస్తే ఈనాడు పోలీసులు అంతకంటే ఎక్కువ దాష్టీకం చేశారు, దౌర్జన్యం చేశారు. పాలకులు ఎవరయినా ప్రజా ఉద్యమాల పట్ల, వారి ఆకాంక్షల పట్ల ప్రదర్శించే అసహనంలో మాత్రం మార్పు ఉండదేమో! మన పాలకులూ చైనా దారి పట్టినట్టు ఉన్నారు..!! దేవులపల్లి అమర్ ఈమెయిల్ : datelinehyderabad@gmail.com -
ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పండి: కోదండరాం
ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో లెక్కలు చెబుతున్నారు గానీ, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తున్నారో చెప్పలేదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. భర్తీకి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం భక్తరామదాసు కళా క్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన నిరుద్యోగ సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ఈ విషయంలో సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు దసరా తర్వాత హైదరాబాద్ లో భారీ ఎత్తున నిరుద్యోగ సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
చీకటి ఒప్పందాలు కాంగ్రెస్వే: శ్రీనివాస్గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావును విమర్శిం చడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ను బద్నాం చేయడానికి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. అన్ని పార్టీలను ఒప్పించి, ప్రజాపోరాటం ద్వారా తెలంగాణ సాధించిన కేసీఆర్కు కుమ్మక్కు రాజకీయాలు, చీకటి ఒప్పందాల గురించి తెలియదన్నారు. చీకటి ఒప్పం దాల చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆయన విమర్శిం చారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన శని వారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు తమ ఉనికికోసం టీఆర్ఎస్పై రాజకీయ విమర్శలు చేస్తున్నాయని అన్నారు. జీఎస్టీ ఆలోచనకు బీజం పడిందే కాంగ్రెస్ పాలనలోనని, 13 ఏళ్లుగా జీఎస్టీపై చర్చలు జరిగి ఇప్పుడు అమలైతే టీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. యూపీఏ రాష్ట్రాల్లో జీఎస్టీ అమలును కాంగ్రెస్ నాయకులు ఆపగలుగుతారా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ ముందే ఎందుకు కేసీఆర్ను కోరలేదని నిలదీశారు. స్వార్ధంతోనే ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతు.. దేవుడితో సమానం
► త్రిదండి చినజీయర్స్వామి సాక్షి, హైదరాబాద్: రైతు.. దేవుడితో సమానమని, రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతృప్తిగా ఉంటుందని త్రిదండి చినజీయర్స్వామి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ప్రశంసించారు. తక్కువ రసాయనాలతో పంటలు పండించే విధానాలపై రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, హైబ్రిడైజేషన్ వల్ల భూమి సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. -
కొలిక్కి వచ్చిన జిల్లా అధ్యక్షుల ఎంపిక!
రాష్ట్ర కమిటీ, పొలిట్బ్యూరో కూర్పుపై టీఆర్ఎస్ కసరత్తు సాక్షి, హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు, కమిటీల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు వరసగా బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ఇదే అంశంపై కసరత్తు చేశారని పార్టీ వర్గాల సమాచారం. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతోనూ అవసరమైన సందర్భాల్లో సీఎం మాట్లాడి జిల్లా అధ్యక్షుల పేర్లకు తుదిరూపు ఇచ్చారని తెలిసింది. కాగా, రాష్ట్ర కమిటీ, పార్టీ పొలిట్బ్యూరో కూర్పుపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. 31 జిల్లాల అధ్యక్షుల జాబితాను ఒకేసారి ప్రకటించాలని కూడా నిర్ణయించారని సమాచారం. గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో కనీసం ఏడెనిమిది మందికి తిరిగి అవకాశం దక్కనుంది. ఐడీసీ చైర్మన్గా నామినేటెడ్ పదవి దక్కించుకున్న కరీంనగర్ జిల్లా(పాత) అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి, ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితుడైన నల్లగొండ జిల్లా (పాత) అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో పాతవారినే కొనసాగిస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుని ఖరారు కొంత జటిలంగా మారినా, ప్రస్తుత అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు పేరు ఖరారైనట్లేనని చెబుతున్నారు. అనుబంధ సంఘాల కమిటీలపై స్పష్టత.. అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీలు, జిల్లా అనుంబంధ సంఘాల కమిటీలపైనా ఒక స్పష్టత వ చ్చిందని తెలుస్తోంది. అయితే, ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షుల వరకు ప్రకటి ంచి, మిగిలిన కమిటీలను తర్వాత ప్రకటించే వీలుందని సమాచారం. మరోవైపు పార్టీ రాష్ట్ర కమిటీ, పొలిట్బ్యూరో, రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాల కమిటీలను మరో విడతలో ప్రకటించే వీలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, పార్టీ సంస్థాగత కమిటీల వివరాలను శనివారం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటు నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన నేతల్లో అత్యధికులు హైదరాబాద్లోనే మకాం వేశారు. -
గుండెపోటుతో సీనియర్ శాస్త్రవేత్త కన్నుమూత
విశాఖ జిల్లా చింతపల్లిలోని ఉద్యానపరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త చంద్రశేఖర్రావు(50) గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబసభ్యులు స్వగ్రామం వెళ్లగా ఆయన ఒక్కరే చింతపల్లిలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురువారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు ఉద్యుక్తులవుతుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. చుట్టుపక్కల వారు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈయన నాలుగేళ్లుగా ఇక్కడ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆశల పల్లకిలో..
♦ పదవుల పంపకానికి మళ్లీ ముహూర్తం ♦ ఏప్రిల్లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ♦ సమాచారాన్ని సేకరిస్తున్న సర్కారు ♦ అధిష్టానం చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నామినేటెడ్ పోస్టులపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పదవుల పంపకానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు మరోసారి ముహూర్తం ఖరారు చేయడంతో ఆశావహుల్లో అలజడి మొదలైంది. పక్షం రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని శుక్రవారం జరిగిన శాసనసభపక్ష పార్టీ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయపై దృష్టి సారించాల్సి ఉన్నందున ఆ లోపు పదవులను పంచేయాలని నిర్దేశించారు. దీంతో అధికారపార్టీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పదవులపై గంపెడాశ పెట్టుకున్న సీని యర్లు, దిగువశ్రేణి నాయకులు వ్యూ హాలకు పదును పెడుతున్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో పోస్టుల కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. పోస్టులపై లెక్క! జిల్లాలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. శాఖలవారీగా ఎన్ని నామినేటెడ్ పదవులున్నాయో లెక్క తీస్తోంది. ఈ జాబితా ఆధారంగా పదవుల కూర్పు చేపట్టాలని భావిస్తోంది. తక్షణమే మార్కెట్ కమిటీలు, జిల్లా, నియోజకవర్గస్థాయి ఆస్పత్రులు, దేవాదాయ, వక్ఫ్ బోర్డు, ఆహార సలహా సంఘం, రవాణా, గ్రంథాలయ, హాకా తదితర సంస్థల చైర్మన్లు, డెరైక్టర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పదవుల పంపకంలో జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యమివ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో పోస్టుల రేసులో ఉన్న నేతాగణం వీరిని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కత్తిమీద సామే! పదవుల పంపకం గులాబీ నాయకత్వానికి కత్తిమీద సాముగా మారింది. 20 నెలలుగా పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలను ఎప్పటికప్పుడు బుజ్జగిస్తూ వచ్చిన అధిష్టానానికి తాజాగా కొత్త నాయకుల చేరిక తలనొప్పులు తెచ్చిపెట్టింది. సామాజిక సమీకరణలు, మారిన పరిణామాలకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. పార్టీ ఆవిర్భా వం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పలువురు నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. రిజర్వేషన్ల కారణంగా పోటీచేయలేని పరిస్థితి తలెత్తిన ద్వితీయశ్రేణి నాయకులు కూడా వీటిపై కన్నేశారు. వీరిలో అధికశాతం మందికి పార్టీ పదవుల్లోనో, నామినేటెడ్ పోస్టుల్లోనో ప్రాధాన్యమిస్తామని నమ్మబలుకుతూ వచ్చిన టీఆర్ఎస్ అ ధిష్టానానికి ఆపరేషన్ ఆకర్ష్తో ఇతర పార్టీల నుంచి వ లస వచ్చిన నేతల రూపంలో గట్టి సవాల్ ఎదురవుతోం ది. మొదటి నుంచి పనిచేసిన నాయకులకంటే.. ఇటీవల పార్టీలో చేరిన నేతలు అన్ని విధాలా సమర్థు లు కావడంతో పాతవారికి ఎలా న్యా యం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. దీనికితోడు సామాజికవర్గాల సమతుల్యత, స్థానిక నాయకత్వానికి ఆమోదయోగ్యమైనవారికే ప దవులు కట్టబెట్టాలనే అధిష్టానం సూ చనలు కూడా అధికారపార్టీకి ఒకింత చికాకు కలిగించే అంశాలు కానున్నాయి. -
యాదాద్రిగా మారిన యాదగిరి గుట్ట
యాదగిరి గుట్ట : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామితో కలిసి గురువారం యాదగిరి గుట్టలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ యాదగిరి గుట్టకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన మార్పులన్నీ ఆగమ శాస్త్రం ప్రకారమే ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి యాదగిరి గుట్టకు యాదాద్రిగా నామకరణం చేశారు. యాదగిరి గుట్ట అభివృద్ధికి 100 కోట్ల రూపాయల కేటాయించడం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన హర్షం వ్యక్తం చేశారు -
సీఎంవోలో కదలని ఫైళ్లు
భారీగా పేరుకుపోతున్న వైనం విధానపరమైన వాటితోపాటు, రొటీన్ ఫైళ్లకూ మోక్షం లేదు రోజువారీ సమీక్షలతో సీఎం బిజీబిజీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. వేయికిపైగా ఫైళ్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సంతకం కోసం ఎదురు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి వద్ద సాధారణ పరిపాలనతోపాటు పురపాలక శాఖ, పలు సంక్షేమ శాఖలు ఉన్నాయి. సీఎం ఆయా శాఖలకు సంబంధించిన ఫైళ్లను చూడకుండా సమీక్షా సమావేశాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు వందల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కోసం పలువురు టెండర్లు దాఖలు చేయగా.. సీఎస్ రాజీవ్శర్మ అధ్యక్షతన ఉన్నతస్థాయి కార్యదర్శుల కమిటీ ధర నిర్ణయించింది. ఈ ఫైలు పెండింగ్లో ఉందని సమాచారం. భారీ స్పంద న వచ్చిన నేపథ్యంలో 500 మెగావాట్లు కాకుం డా వెయ్యి మెగావాట్లు తీసుకోవడానికి ముఖ్యమంత్రి అనుమతి కోరుతూ డిస్కమ్లు మరో ఫైలు పంపించినా... దానికీ మోక్షం లభించలేదు. ఇక వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ వినియోగించుకునేందుకు ఉద్దేశించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాల్సిన పథకం టెండర్లలో అధిక ధర వచ్చిందంటూ ఆ టెండర్లను రద్దు చేశారు. ఆ తరువాత తిరిగి ఏమి చేయాలన్న దానిపై సీఎం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల తెలంగాణ ఇంక్రిమెంట్ ఫైలుపై ఆయన సంతకం చేయలేదని సమాచారం. బహుళ అంతస్తుల నిర్మాణానికి అవసరమైన చోట సడలింపులు ఇచ్చే ఫైళ్లపై నిర్ణయం తీసుకోవడం లేదని తెలిసింది. యాదగిరిగుట్ట పట్టణాభివృద్ధి సంస్థ ఫైలు, ఆంధ్రా నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అఖిల భారత సర్వీసు అధికారుల పోస్టింగ్ల ఫైలు కూడా పెండిం గ్లో ఉంది. ‘ఫాస్ట్’ మార్గదర్శకాల ఫైలు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బయటకు రాలేదు. సీఎం కార్యదర్శులు కూడా ఫైళ్లను క్లియర్ చేయించడంలో చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. -
ఇద్దరు ‘చంద్రులదీ’ ఒకే దారి
వినాయక్నగర్ : రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర్రావులది ఒకేదారని, మాదిగలకు పట్టిన గ్రహాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్య వస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. శనివారం ఆయన నిజామాబాద్లో ని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే దళి తుడి ముఖ్యమంత్రినే చేస్తానని పలుమార్లు చెప్పిన కేసీఆర్ దురహంకారంతో తానే ఆ కుర్చీలో కూర్చున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి పని చేసిన కొప్పుల ఈశ్వర్ను కొడుకు కోసం బలి చేశారన్నారు. కేసీఆర్ చేయించిన సర్వేలో నల్లాల ఓదెలు తెలంగాణలోనే ప్రథమస్థానంలో నిలిచినా మంత్రి పదవికి నోచుకోవడంలో చివరకు కూడా నిలవలేదన్నారు. పార్టీలు మారిన ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి నాలుగుసార్లు గెలిచిన నల్లాల ఓదెలును పక్కకు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ దళితులపై చూపుతున్న వివక్షకు ఇదే తార్కాణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన మహిళలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. అధికారంలోకి వచ్చిన రెండునెలలలో నిజాం చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుంటమన్న మాటలు మరుగున పడేసారన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఘం టా చక్రపాణి నియామకంతో మాదిగలకు అన్యా యం జరిగిందన్నారు. మాదిగల రుణం తీర్చుకుం టామన్న ఇద్దరు ముఖ్యమంత్రులు గట్టుకెక్కినాక తెప్పకాల బెట్టారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు మాదిగలె అండగా ఉన్నారన్నారు. చంద్రబాబు తెలంగాణలో పాద యాత్ర చేసేసమయంలో మాదిగలు ముందుండి జైలుకు వెళ్లడంతోపాటు, ఆదిలాబాద్ జిల్లా బైంసా నుంచి తిరుగు ప్రయాణంలో ముగ్గురు మాదిగలు మృతి చెందారని గుర్తు చేశారు. మహిళలను విస్మరించిన కేసీఆర్ కల్లు తెరిపించేవిధంగా మార్చి7వతేదీన మహిళలతో హైదరాబాద్లో మహాయాత్ర నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రెండుగా చీలి టీఎంఆర్పీఎస్గా కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కలిసి పోరాడితే ఏదైనా తొందరగా సాధిం చవచ్చుకదా అని విలేకరులు ప్రశ్నించగా వారు ప్రభుత్వం ఏజేంట్లు,పాలకులకు అమ్ముడుపోయి,పాలేరుల పనిచేస్తున్నరని మందకృష్ణ విమర్శిం చారు. సమావేశంలో జిల్లాఅధ్యక్షులు గందమాల నాగభూషణం,మైలారం బాలు,కిష్టయ్య,గంగాధర్ తార, తదితరులు పాల్గొన్నారు. -
జైపూర్లో మూడో యూనిట్!
విద్యుత్ కొరతను అధిగమించే దిశగా సీఎం నిర్ణయం నిర్మాణంలోని ఈ ప్లాంట్లో ప్రస్తుతం 600 మెగావాట్ల రెండు యూనిట్లు తాజాగా మరో 600 మెగావాట్ల యూనిట్ నెలకొల్పాలని నిర్ణయం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం ఈ యూనిట్ విద్యుత్ మొత్తం తెలంగాణకే! నేటి సింగరేణి బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు సాక్షి, ఆదిలాబాద్ / హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్యను ఎదుర్కోవడానికి చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు.. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రంలో అదనంగా మరో యూనిట్ (600 మెగావాట్లు)ను కూడా నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సింగరేణి ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జైపూర్లో ఒక్కోటి 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం మంత్రులు, సింగరేణి, బీహెచ్ఈఎల్, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ప్లాంటు నిర్మాణ పనులను పరిశీలించారు. తరువాత అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించి... పనుల ప్రగతిపై సంబంధిత సంస్థల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టులో మరో యూనిట్ను అదనంగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం జరగనున్న సింగరేణి బోర్డు సమావేశంలో మూడో యూనిట్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని, ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ప్లాంటు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మూడో యూనిట్ నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక వసతుల విషయమై సీఎం ఆరా తీశారు. చివరగా ఏరియల్ సర్వే కూడా చేసి విద్యుత్ కేంద్రం పనులను పరిశీలించారు. నిర్వాసితులను ఆదుకుంటాం.. జైపూర్ విద్యుత్ ప్లాంటు నిర్మాణంతో భూములు కోల్పోయిన నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో అర్హులైన వారికి ప్లాంటులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంపీలు కె.కేశవరావు, గోడం నగేష్, బాల్క సుమన్, పార్లమెంటరీ సెక్రటరీ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్రావు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, జి.విఠల్రెడ్డి, నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాబూరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిపైనే ఆశలు! రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సింగరేణి చేపట్టిన కొత్త ప్రాజెక్టులపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం జైపూర్ ప్లాంట్లో రెండు యూనిట్లు కూడా ఇప్పటికే పూర్తి కావాల్సినా... ఆలస్యమయ్యాయి. 2016 మార్చిలో మొదటి యూనిట్, 2016 అక్టోబర్లో రెండో యూనిట్ అందుబాటులోకి వస్తుందని సింగరేణి అధికారులు సీఎంకు వివరించారు. ఇక్కడి 1,200 మెగావాట్లలో సింగరేణి తమ సొంత అవసరాలకు 150 మెగావాట్లు వాడుకోనుంది. మిగతా 1,050 యూనిట్ల విద్యుత్ను విక్రయిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం కావటంతో ఇందులో 53.89 శాతం (సుమారు 3,855 మిలియన్ యూనిట్లు) వాటా తెలంగాణకు దక్కుతుంది. అయితే జైపూర్ ప్లాంటులో ప్రస్తుతం నిర్మించతలపెట్టిన మూడో యూనిట్ నుంచి ఉత్పత్తయ్యే 600 మెగావాట్ల విద్యుత్ను మొత్తంగా తెలంగాణ రాష్ట్రమే వాడుకునే అవకాశముంది. విద్యుత్పైనే సీఎం ఫోకస్..! రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నారు. మూడు రోజులుగా ఆయన విద్యుత్ అంశంపైనే దృష్టిపెట్టడం గమనార్హం. మంగళవారం కృష్ణా తీరంలోని దామరచెర్ల మండలంలో సీఎం ఏరియల్ సర్వే చేసి... థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించారు. ఏకంగా 7,600 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్టీపీసీ, టీజెన్కో ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రాలను నిర్మించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. గుర్తించిన భూములు రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉండటంతో.. అప్పటికప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్కు ఫోన్ చేసి ఆ విషయాన్ని చర్చించారు. 800 మెగావాట్ల సోలార్, పనవ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఒక సంస్థ ముందుకురాగా.. ఉత్పత్తికి అవకాశాలను అధ్యయనం చేయాలని బుధవారం అధికారులను ఆదేశించారు. అదనంగా 2 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక గురువారం జైపూర్ లో మరో 600 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. -
బంగారు తెలంగాణకు బాటలు వేస్తాం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా శ్రమిస్తే తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించడం ఖాయమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బంగారు తెలంగాణ.., విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ఆదివారం సమావేశమై కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సహాయ సహకారాలపై చర్చిస్తానని వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన రాష్ట్ర మంత్రులతో శనివారం సాయంత్రం దిల్కుశ అతిథి గృహంలో సమావేశమైన దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రులతో కలసి దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రిత్వశాఖలన్నింటి నుంచి రాష్ట్రానికి కావాల్సిన సహాయ, సహకారాలను అందిస్తామన్నారు. హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ, హైదరాబాద్ నగరాభివృద్ధికి దత్తాత్రేయ సేవలు అవసరమన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముందుకు రావడం అభినందనీయమన్నారు. నూతన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఈ సమావేశంలో దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. -
నేడు ‘రాచకొండ’కు కేసీఆర్
ఫిలింసిటీ కోసం భూములు పరిశీలించనున్న సీఎం ఏరియల్ సర్వేలో పాల్గొననున్న మంత్రులు మహేందర్రెడ్డి, జగదీష్రెడ్డి ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫిలింసిటీ ఏర్పాటుకు మరో అడుగు పడనుంది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లోని రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాచకొండ భూములను సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పరిశీలించనున్నారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు రెండు జిల్లాల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్తో పాటు రెండు జిల్లాలకు చెందిన మంత్రులు మహేందర్రెడ్డి, జగదీష్రెడ్డి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్శర్మ, కలెక్టర్లు శ్రీధర్, చిరంజీవులు హాజరుకానున్నారు. పటిష్ట భధ్రత వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ నెల 3న ఫిలింసిటీ, ఫార్మాసిటీ భూముల పరిశీలన నిర్వహించాల్సి ఉండగా.. సమయాభావం, ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం నేపథ్యంలో కేవలం ఫార్మాసిటీ భూములను మాత్రమే పరిశీలించారు. అనంతరం పదిరోజుల తర్వాత రాచకొండ భూములను పరిశీలించాలని నిర్ణయించిన ఆయన.. సోమవారం ఏరియల్ సర్వేకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హెలికాప్టర్లో రాచకొండ భూములు పరిశీలించనున్నారు. సీఎం పర్యటన ఉండడంతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. రాచకొండ ప్రాంతమంతా నక్సల్ ప్రభావితమైనది కావడంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. -
సోలార్ ప్లాంటు కోసం స్థల పరిశీలన
బెజ్జూర్ : సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు మండలంలోని ఎల్కపెల్లి (పి) సర్వే నంబర్ 61లో గల ప్రభు త్వ భూమిని కేంద్రం ప్రభుత్వం బృందం మంగళవారం పరిశీలించింది. ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, ఎన్ఈఈపీసీడీ సంస్థలకు చెందిన 13 మందితో కూడిన బృందం స్థలా న్ని చూశారు. గతనెల 24వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుతో కేంద్ర ప్రభుత్వ బృందం సమావేశమైంది. అందులో భాగంగానే ఏర్పాటు చేసిన కమిటీ జిల్లాలో పర్యటించి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు సర్వేలు చేస్తున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. పరిస్థితుల అంచనా.. స్థితిగతులపై విచారణ.. అనుకూల వాతావర ణం తదితర అంశాలను క్రోడీకరించి సమగ్రంగా సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 200 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్తత్పి ప్లాంటు ఏర్పాటు చేసేందుకు వీలుగా స్థలం ఉందని కేంద్ర ప్రభుత్వం బృందం ఈ మేరకు అంచనాకు కూడా వచ్చింది. ఇప్పటివరకు చేపట్టిన సర్వేలో ఎల్కపెల్లి(పి) గ్రామంలోని భూమి సోలార్ప్లాంటు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉన్నట్లు అభిప్రా యం వారిలో కనిపించింది. సహజ వనరులను విని యోగించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సో లార్హబ్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చా రు. నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని అనుమతులిస్తే పది నెలల్లో ప్లాంటు ఏర్పాటవుతుందని వారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటుకు సర్వేలు పూర్తిచేశామన్నారు. ఎల్కపెల్లిలోని ప్రభుత్వ స్థలం నుంచి ఎయిర్పోర్ట్, రైలు మార్గం, 400 వాట్ల విద్యుత్లైన్, జాతీయ రహదా రి, 220 మెగావాట్ల విద్యుత్ కేంద్రం తదితర అంశాలు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకున్నారు. కాగా.. సోలార్ప్లాంటును ఎల్కపెల్లిలో ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమై నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సిర్పూర్ ఎమ్మె ల్యే కోనేరు కోనప్ప వారికి వివరించారు. బృందం వెంట ఎన్టీపీసీ మేనేజర్ గాలి సందర్, ఎన్వీవీఎుం సంస్థ ఏజీఎంలు బీకే దాస్, అనురాగ్గుప్త, ఎన్హెచ్పీసీ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ, తెలంగాణ పరిశ్రమల శాఖ డిప్యూటి డెరైక్టర్ డి.వినయ్కుమార్, నెఫ్కో సినియర్ మేనేజర్ రఫీక్ హుస్సేన్,తహశీల్దార్ విశ్వంబర్, డిప్యూ టీ తహశీల్దార్ రఫత్, ఆర్ఐ సంతోష్, ట్రాన్స్కో ఏడీఈ శ్రీనివాస్రావు, ఏఈ శివప్రసాద్, సర్పంచ్ పరమేశ్, ఎంపీటీసీలు సముద్రాల సత్యనారాయణ, సాజిత్, తదితరులు ఉన్నారు. -
దళితులను చీల్చేందుకు సీఎం కుట్ర
జహీరాబాద్ టౌన్: దళితులను చీల్చేందుకు సీఎం చంద్రశేఖర్రావు కుట్ర పన్నుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. జహీరాబాద్ పట్టణంలోని ఉత్తం గార్డెన్లో నిర్వహించిన సంఘం నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నీరుగారుతున్న సమయంలో కేసీఆర్కు తాము అండగా నిలిచామని తెలిపారు. ఆయన ఆమరణ దీక్ష చేసిన సందర్భంలోనూ దళితులు వెన్నంటి ఉన్నారన్నారు. ప్రతిపక్షాలకు ఆయనను ఎదిరించే శక్తిలేదని, కేవలం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకే ఆ దమ్ముందని తెలిపారు. తెంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ అధికారం వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు. గతంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతునిచ్చిన కే సీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ప్రస్తుతం సీఎంలుగా ఉన్నారన్నారు. వారికి దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఇరువురు కలసి అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ నెల నుంచి ఉద్యమాన్ని చేపడుతామన్నారు. అందుకని గ్రామ మండల స్థాయి కమిటీలను వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ నరోత్తం, ఎమ్మార్పీఎస్ నాయకులు భూమన్ మధు మాదిగ, ఆనంద్, నర్సింలు, యువరాజ్, పవన్, పద్మారావు, బుడగ జంగం నాయకులు కె.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
26 వరకు అసెంబ్లీ సమావేశాలు?
నేటి బీఏసీ సమావేశంలో నిర్ణయం కొత్త పారిశ్రామిక, ఇసుక, మార్కెట్ కమిటీలపై బిల్లులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 22వరకే శాసనసభ సభ నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో మొదట్లో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం సభలో బిల్లుల ఆమోదంతోపాటు, పలు అంశాలపై చర్చించాల్సి ఉందని, ఇప్పటి వరకు పద్దులపై కూడా పూర్తిస్థాయిలో చర్చ జరగలేదని భావిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సమావేశాలను పొడిగించడానికి సుముఖంగా ఉన్నారు. ఆయనే స్వయంగా అసెంబ్లీలోనే ఈ అంశాన్ని ప్రకటించారు. అవసరమైతే 20 రోజులపాటు శాసన సభా సమావేశాలు పొడిగించుకుని పూర్తిస్థాయిలో చర్చలు నిర్వహించుకుందామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం విది తమే. శుక్రవారం ఉదయం స్పీకర్ మధుసూదనాచారి వద్ద శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతల అభిప్రాయాలను తీసుకున్న తరువాత సమావేశాల పొడిగింపును అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎజెండా ప్రకారం కాకుండా, అప్పటికప్పుడు వస్తున్న అంశాలపై సభ సుదీర్ఘంగా కొనసాగుతోంది. కాలపరిమితి లేకుండా సమావేశం ఒక అంశంపైనే కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల సమయంలోనూ అన్ని ప్రశ్నలు పూర్తికావడం లేదు. ముఖ్యమైన బిల్లుల కోసమే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పారిశ్రామిక విధానం బిల్లును ఈ సమావేశా ల్లోనే ఆమోదించుకోవాలన్న ఆలోచనలో అధికారపక్షం ఉంది. తద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు వస్తారని భావిస్తోంది. అలాగే కీలకమైన ఇసుక విధానం బిల్లును కూడా ఈ సమావేశాల్లో పెట్టాలని, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేసే బిల్లుకు సభ ఆమోదం తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు వివిధశాఖల పద్దులపై చర్చ సాగలేదు. పద్దులను సభలో ప్రవేశపెట్టారు. అలాగే ప్రభుత్వంపై సభ బయట ప్రతిపక్షాలు చేస్తున్న పలు ఆరోపణలను ప్రభుత్వమే ఏదో ఒక రూపంలో చర్చకు తీసుకువచ్చి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. -
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు మంగళవారం రాత్రి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. సుమారు గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో... ఇంటర్ పరీక్షలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం, దానికి కారణాలు, పరిష్కారాలపై ప్రధానంగా చర్చించినట్టుగా సమాచారం. విద్యాశా ఖ పరిధిలో భవిష్యత్లో తలెత్తబోయే సమస్యలు, అంశాలు, పరిష్కారాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు విడిగా సమ యం ప్రకటించడానికి కారణాలను కేసీఆర్ గవర్నర్కు వివరించారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో వస్తున్న సమస్యలు, పరిష్కారాలపైనా మాట్లాడారు. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాలు, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్లు, దానికి దారితీసిన కారణాలు తదితర అంశాలపైనా గవర్నర్, సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడినట్టుగా తెలిసింది. -
ఇందిరా పార్కులో ‘నిమజ్జన’ సరస్సు
తెలంగాణ సీఎం కేసీఆర్ యోచన అందులోనే గణేశ్, దుర్గామాత విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం హుస్సేన్సాగర్ పరిరక్షణ, శుద్ధికి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం హైదరాబాద్: నిండా కలుషితమై దుర్గంధం వెదజల్లుతున్న హుస్సేన్సాగర్ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ హుందాతనాన్ని పెంచేలా ఈ సరస్సును తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా... గణేశ్, దుర్గామాత విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం కోసం సాగర్కు సమీపంలోని ఇందిరాపార్కులో ఒక సరస్సును నిర్మిద్దామని కేసీఆర్ ప్రతిపాదించారు. సాగర్నీటితోనే దానిని నింపడంతో పాటు.. కొత్త సరస్సును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని పేర్కొన్నారు. ఇక సాగర్లోకి చేరే మురుగునీటిని పూర్తిగా మళ్లించాలని, అందుకోసం డ్రైనేజీలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కేసీఆర్ హుస్సేన్సాగర్ను, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. నెక్లెస్ రోడ్డులోని పలు చోట్ల హుస్సేన్ సాగర్ నీరు కలుషితమవుతున్న విషయాన్ని స్వయంగా పరిశీలించారు. బాల్కాపూర్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, కూకట్పల్లి, పికెట్ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు హుస్సేన్సాగర్లో కలుస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై సచివాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్, హెచ్ఎండీఏ ప్రత్యేకాధికారి ప్రతీప్ చంద్ర, హెచ్డబ్ల్యూడబ్ల్యూస్బి ఎండీ ఎం.జగదీష్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు తదితరులతో సమీక్షించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా వేలాది విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల హుస్సేన్సాగర్ కలుషితమవుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి సమీపంలోనే ఉన్న ఇందిరాపార్కులో 15-20 ఎకరాల స్థలంలో చిన్నపాటి సరస్సును నిర్మించి.. అందులోనే గణేశ్, దుర్గామాత విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం జరపాలనే ప్రతిపాదన చేశారు. బోటింగ్ తదితర సౌకర్యాలతో ఈ సరస్సును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజల సెంటిమెంట్కు భంగం కలగకుండా హుస్సేన్సాగర్ నీటితోనే ఆ సరస్సును నింపుదామన్నారు. ఈ అంశంలో సలహాలు, సూచనలు, అభిప్రాయాల సేకరణ కోసం హైదరాబాద్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు గణేశ్ ఉత్సవ కమిటీతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రక్షాళన చేయండి.. ప్రపంచంలోని చాలా నగరాల మధ్యలో హుస్సేన్సాగర్లాంటి సరస్సులున్నా.. అవి దుర్గంధం వెదజల్లడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్కు హుస్సేన్సాగర్ గొప్ప ఆకర్షణ అని, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. అలాంటిది సాగర్ కలుషితమై దుర్గంధం వెదజల్లడం చూస్తే అవమానకరంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నిపుణులను రప్పించి సాగర్ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హుస్సేన్సాగర్ పరిధిలోని పూర్తి భూభాగాన్ని పరిరక్షించాలని.. ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మురుగు చేరకుండా చూడండి.. హుస్సేన్సాగర్లోకి చేరిన మురుగునీటిని శుభ్రం చేయడం కన్నా.. అసలు మురుగు నీరు అందులో చేరకుండా అడ్డుకోవడంపై ప్రధానంగా దృష్టిసారించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. సాగర్లోకి నాలాల ద్వారా రోజుకు 527 మిలియన్ లీటర్ల మురికి నీరు వస్తోందని.. కేవలం 368 మిలియన్ లీటర్ల నీటిని తరలించడానికి మాత్రమే పైపులైన్ ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ... నాలాల నుంచి వచ్చే నీరంతా నేరుగా సాగర్ తూము నీరు పోయే చోటికి చేరేలా కాలువలు నిర్మించాలని కేసీఆర్ సూచించారు. వర్షాకాలంలో మంచి నీటిని హుస్సేన్సాగర్లో నింపి తర్వాత షట్టర్లు మూసివేయాలన్నారు. -
ఔను.. మేం కాపలా కుక్కలమే!
కేసీఆర్ విమర్శలపై సీఎల్పీ ధ్వజం హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కుక్కలకంటే హీనంగా మొరుగుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శాసనసభాపక్షం మండిపడింది. ‘‘ఔను...ప్రతిపక్షంగా మేం ప్రజల పక్షాన కాపలా కుక్కలా ఉంటాం. ఎన్నికల్లో మీరిచ్చిన హామీలన్నీ అమలయ్యేదాకా నీ మెడలొంచుతాం. నీలాంటి వాళ్లను ఎంతోమందిని చూసిన చరిత్ర కాంగ్రెస్కు ఉంది. నువ్వు ముఠా నాయకుడివి కాదు... ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకుని మసలుకుంటే మంచిది’’ అని హెచ్చరించింది. సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్తో కలిసి సోమవారం సీఎల్పీ కార్యదర్శి మల్లు భట్టివిక్రమార్క మీడియూతో మాట్లాడుతూ కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ వ్యవహారశైలిని చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని అర్థమవుతోందని, అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడానికి అనర్హుడని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలపై సమాధానమిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే సీఎం దిష్టి బొమ్మలు, టీఆర్ఎస్ గద్దెలు కూల్చింది రైతులు, టీఆర్ఎస్ శ్రేణులే తప్ప కాంగ్రెస్ నాయకులు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రుణ మాఫీపేరుతో రైతులపైనే భారం మోపాలని సీఎం చూస్తున్నారన్నారు. ప్రపంచమంతా వ్యతిరేకించే నియంత హిట్లర్తో కేసీఆర్ పోల్చుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మూడేళ్లదాకా కరెంట్ సమస్య తప్పదంటున్నావ్...అప్పటిదాకా రైతులు ఏం చేయాలని వారు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. -
సీఎం పర్యటన బందోబస్తు సంఖ్య
ఆదిలాబాద్ క్రైం : కొమురం భీమ్ వర్ధంతిలో పాల్గొనేందుకు ఈనెల 8న జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రశేర్రావు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భీమ్ స్వస్థలమైన కెరమెరి మండలం జోడేఘాట్లో వర్ధంతి నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సోమవారం జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ గజరావు భూపాల్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి బందోబస్తు వివరాలు తెలుసుకున్నారు. జిల్లాకు మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న కేసీఆర్కు రాష్ట్ర పోలీసు అధికారుల పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎక్కడా భద్రతా లోపం లేకుండా జోడేఘాట్లో అణువణువు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ జోన్ ఐజీ రవిగుప్తా, కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. -
జోడేఘాట్లోనే జోహార్లు
ఆసిఫాబాద్ : గిరిజనుల ఆరాధ్య దైవం.. జల్, జంగల్, జమీన్ కోసం నిజాం పాలకులకు ఎదురొడ్డి పోరాడిన వీరుడు.. కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఈసారి ఆయన సొంత గడ్డ అయిన జోడేఘాట్లోనే జరగనున్నాయి. దీంతో భీమ్ వర్ధంతి వేడుకలు పూర్వవైభవం సంతరించుకోనున్నాయి. దీనికితోడు ఈ నెల 8న నిర్వహించే ఈ వర్ధంతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హాజరవుతుండడం విశేషం. మొన్నటి వరకు హట్టికే పరిమితం.. ఆదివాసీల్లోని అసంతృప్తిని తొలగించి.. వారికి ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో 1984లో ఐటీడీఏ ఆధ్వర్యంలో కెరమెరి మండలం జోడేఘాట్లో అధికారికంగా వర్ధంతి వేడుకలు ప్రారంభించారు. మూడేళ్ల పాటు ఆర్భాటంగా జోడేఘాట్లోనే భీమ్ వర్ధంతి, దర్బార్ విజయవంతంగా కొనసాగించారు. తదనంతరం మావోయిస్టుల ప్రభావంతో జోడేఘాట్లో నిర్వహించే వేడుకలకు ఆటంకం కలిగింది. కాగా.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జన్మభూమి కార్యక్రమాలు ని ర్వహిస్తూ.. ఇక ప్రత్యేకంగా దర్బార్ అవసరం లేదం టూ అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి పోర ట వీరుడి వర్ధంతిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. కేవలం భీమ్ వారసులే జోడేఘాట్కు వెళ్లి ఆదివాసీల సంప్రదాయ పద్ధతిలో సంస్మరణ సభ కొనసాగించారు. భద్రతా బూచీతో జోడేఘాట్కు ప్రముఖులు, ఉన్నతాధికారులు ఎవరూ రావడం లేదు. ఏటా పలువురు వస్తున్నా పోలీ సులు వారిని హట్టి వద్దే అడ్డుకుంటున్నారు. దీంతో ఎంతో ఆర్భాటంగా జరగాల్సిన వేడుకలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం భీమ్ వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినా.. భద్రతా కారణాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు హట్టికే పరిమితమయ్యారు. ముస్తాబవుతున్న జోడేఘాట్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటిసారి నిర్వహించే భీమ్ 74వ వర్ధంతి వేడుకలకు జోడేఘాట్ ముస్తాబవుతోంది. ఈ నెల 8న జరగనున్న వర్ధంతి వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హాజరు కానున్నారు. జోడేఘాట్కు జాతీయ స్థాయి గుర్తింపు రావాలని అధికారులను ఆదేశించడంతో జిల్లా అధికార యంత్రాంగం వారం రోజులుగా ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖుల తాకిడితో ఈ ప్రాంతం కొత్తరూపు సంతరించుకుంది. ఇటీవల భీమ్ మనువడు సోనేరావు హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను కలిసి వర్ధంతికి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన జోడేఘాట్కు వస్తున్నారు. కాగా.. 2007లో వర్ధంతికి హాజరైన కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జోడేఘాట్ పరిసర ప్రాంతాల్లోని 200 ఎకరాల్లో రూ.వంద కోట్లతో బొటానికల్ పార్కు, మూడెకరాల స్థలంలో మ్యూజియం, భీమ్ నిలువెత్తు కాంస్య విగ్రహంతో పాటు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆదివాసీల్లో ఆనందం.. జోడేఘాట్ పోరుగడ్డపైనే వర్ధంతి వేడుకలను జరపాలనే అధికారుల నిర్ణయంతో ఆదివాసీల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను జోడేఘాట్లోనే పరిష్కరించుకుందామనే ధీమాలో కనిపిస్తున్నారు. ఇందుకోసం ఆయా సంఘాల నేతలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలను జోడేఘాట్కు పెద్దఎత్తున తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి ఆదివాసీలను తీసుకొచ్చేం దుకు గిరిజన సంఘాలు కార్యాచరణ పూర్తిచేశాయి. ప్రభుత్వ పరంగా తమ ఆరాధ్య దైవమైన కొమురం భీమ్కు ఈ సారి నివాళులర్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తరలి వస్తుండడంతో ఇక జోడేఘాట్ పూర్వవైభవం సంతరించుకోనుంది. -
అక్కర్లేని విగ్రహాలు తొలగిస్తాం
ట్యాంక్బండ్పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం ఇతరుల విగ్రహాలను కూల్చబోం..గౌరవంగా పంపిస్తాం కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ హైదరాబాద్: హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం చంద్రశేఖర్రావు చెప్పారు. అక్కడ అక్కర్లేని విగ్రహాలను తొలగించాల్సి ఉందని.. ఆ స్థానంలో తెలంగాణ కోసం పోరాడిన వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అయితే తమకు అవసరంలేని విగ్రహాలను కూల్చబోమని, వాటిని తీసి గౌరవంగా పంపిస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో బీజేపీకి స్నేహం ఉంటే ఉండవచ్చని.. విగ్రహాల విషయంలో మాత్రం బీజేపీ తమతో సహకరించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నారాయణగూడ పద్మశాలిభవన్ వద్ద ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్బంధం, వ్యతిరేక పరిస్థితులు, ఒడిదుడుకుల్లోనూ తెలంగాణ ఉద్యమాన్ని బతికించింది కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్లేనని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు సభలు పెట్టినా వారు వెళ్లేవారు. వాటికి వచ్చే కొద్దిమందితో ఏం చేస్తారని నేను ప్రశ్నించినపుడు.. ‘ఎవరైనా నీలాంటి వారు ముందుకొచ్చి ఉద్యమం చే యాలనుకున్నపుడు వీరంతా ఉపయోగపడతార’ని నాకు చెప్పారు. అందుకే తెలంగాణ సమాజానికి వారిద్దరిని మించిన గొప్పవారు లేరు..’’ అని ఆయన పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. అందులో భాగంగా నెలకో కార్యక్రమం చొప్పున ఏడాది పాటు నిర్వహించేందుకు చర్యలు చేపడుతామన్నారు. తెలుగు యూనివర్సిటీకి లేదా మరేదైన మంచి సంస్థకు బాపూజీ పేరు పెడతామన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక మిషన్ను అమలుచేస్తామన్నారు. ఆ మిషన్కు కొండా లక్ష్మణ్ పేరు పెడతామన్నారు. టీఆర్ఎస్ బాపూజీ ఇంట్లో (జల దృశ్యంలో)నే ఏర్పాటైందని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీకి పుట్టినిల్లు అయిన బాపూజీ ఇంటిని కక్ష గట్టి కూలగొట్టారని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ఆశ్రయం ఇచ్చినందునే ఈ పని చేశారని చెప్పారు. ఆ తరువాత పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వలేదని, ఈ విషయాలపై తాను సమీక్షిస్తానని కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, దత్తాత్రేయ, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, బాపూజీ కుమార్తె పవిత్రారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్: న్యాయవ్యవస్థలో దశలవారీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల సహకారంతో పటిష్టమైన చట్టాలను రూపొందించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ వివక్షకు గురైనట్లే న్యాయవ్యవస్థకూ అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిటీ కోర్టులు ఏర్పాటు చేసి 150 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల పాత్రపై రూపొందించిన ఫొటోల ఆల్బంను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని నిజాం నవాబు ఆనాడే గుర్తించారని.. కోర్టులు ఇచ్చే తీర్పులకు తాను బద్ధుడినై ఉంటానని ప్రకటించారని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్ కోర్టుల్లో జిల్లాల వారీగా ఉత్తమ న్యాయవాది అవార్డును ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘ఉత్తమ న్యాయవాదికి రూ.లక్ష బహుమతి ఇస్తాం. న్యాయవాదుల సంక్షేమం కోసం ఇప్పటికే ప్రకటించిన రూ. 100 కోట్లను వెంటనే విడుదల చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వారికి ఆరోగ్య కార్డులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. అలాగే ఫ్లాట్లు నిర్మించుకునేందుకు వీలుగా న్యాయవాదుల సొసైటీలకు సిటీకి దగ్గరలో భూమిని కేటాయిస్తాం’ అని చెప్పారు. -
మెడికల్ టూరిజం హబ్గా హైదరాబాద్
తెలంగాణ సీఎం చంద్రశేఖర్రావు ఐటీఐఆర్ ప్రాజెక్టుతో మరో కోటి జనాభా పెరుగుదల సినీ పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తామని వెల్లడి హైదరాబాద్: అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారా హైదరాబాద్ మహానగరం ‘మెడికల్ టూరిజం హబ్’గా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ‘కాంటినెంటల్ ఇంటర్నేషనల్ కేన్సర్ సెంటర్ ’ను ఆయన ప్రారంభించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యసేవలు, పరికరాలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. ఎంత మంచి ఆసుపత్రిని కట్టినా దానిని సరిగ్గా ప్రచారం చేసుకోకపోతే ఉపయోగం ఉండదని.. ఈ ఆసుపత్రికి తాను అంబాసిడర్గా, ఏజెంట్గా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచేందుకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందన్నారు. రాజధానిలో ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తున్నందున మరో కోటి మంది జనాభా పెరుగుతుందన్నారు. సినీ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తామని, నాలుగైదు వేల ఎకరాల్లో ఫిల్మ్సిటీని గొప్పగా నిర్మిస్తామని చెప్పారు. దాని బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఒకరిగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు కృష్ణను ఆయన కోరారు. హైదరాబాద్ వాతావరణం మరెక్కడా ఉండదని తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్.రెడ్డి, రేడియేషన్ అంకాలజిస్ట్ రమణమూర్తి, ప్రముఖ సినీ నటుడు కృష్ణ, విజయనిర్మల దంపతులు పాల్గొన్నారు. హైదరాబాద్ నా సొంతూరు: సినీ హీరో కృష్ణ ముప్పై ఏళ్లుగా తాను హైదరాబాద్లోనే ఉంటున్నానని, ఈ నగరమే తన సొంతూరన్న అభిప్రాయంతో ఉన్నానని ప్రముఖ సినీ నటుడు కృష్ణ చెప్పారు. ఇక్కడ సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే పెద్దదిగా నిర్మించదలచిన ఆ ఫిల్మ్సిటీకి కేసీఆర్ ఫిల్మ్సిటీగా పేరుపెట్టాలని సూచించారు. -
తుగ్లక్ పాలన... హిట్లర్ పోకడ
కేసీఆర్ వంద రోజుల పాలనపై కాంగ్రెస్ విమర్శలు హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వంద రోజుల పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో తుగ్లక్ను, నిరంకుశత్వంలో హిట్లర్ను తలపిస్తున్నాడని వ్యాఖ్యానించారు. గాంధీభవన్లో మంగళవారం శాసన మండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్అలీ, టీపీసీసీ అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్లతో కలసి మీడియాతో మాట్లాడారు. అబద్దాల్లో గోబెల్స్ను, తప్పుల్లో శిశుపాలుడిని, నిర్లక్ష్యంలో రోమ్ చక్రవర్తిని మొత్తంగా కుంభకర్ణుడి వారసుడిగా కేసీఆర్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ‘బంగా రు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ అందుకు భిన్నంగా రైతుల ఆత్మహత్యల, కరవు, వరదలు, కరెంటు లేని చీకటి తెలంగాణగా మార్చిండు. కొత్త పథకాల సంగతి దేవుడెరుగు ఉన్న వాటి కి కత్తెర్లు వే స్తూ ప్రజలకు నరకం చూపిస్తుండు’అని ఆయన విమర్శించారు. అమరుల త్యాగాలతో తెలంగాణ వచ్చినప్పటికీ వారి కుటుంబాలను ఆదుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ఎండుగడుతుందనే భయంతో కేసీఆర్ విపక్ష ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నాయకులకు ఆశచూపి వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనతో విసిగిపోయి న ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు. కేసీఆర్ వంద రోజుల పాలనలో వైఫల్యాలపై టీపీసీసీ రూపొందించిన కరపత్రాన్ని పొన్నాల ఆవిష్కరించారు. రుణమాఫీ, సీఎం పదవి, 24 గంటల కరెంట్ సరఫరా, ఉద్యోగులకు ఆప్షన్లు వంటి ప్రధాన హామీలపై కేసీఆర్ ఎలా మాటమార్చారనే అంశాలపై ఎన్నికలకు ముందు, తరువాత కేసీఆర్ చేసిన ప్రసంగాలతో రూపొందించిన వీడియో దృశ్యాలను సమావేశంలో ప్రదర్శించారు. దీంతోపాటు షబ్బీర్అలీ ‘టీఆర్ఎస్ వంద రోజుల తప్పుడు పాలన’ పేరుతో ఆంగ్లంలో రూపొందించిన కరపత్రాన్నీ పొన్నాల విడుదల చేశారు. ఏ ఒక్క అంశంపై స్పష్టత లేదు: చాడ సీఎం కేసీఆర్ వంద రోజుల పాలన మూడడుగులు ముందు కు.. రెండడుగులు వెనక్కు.. అన్న చందంగా ఉందని తెలంగా ణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు 43 అంశాలను గురించి ప్రకటించినా ఒక్క దానిపై కూడా స్పష్టత లేదనీ, అన్నింటినీ అమలుచేయాలని కోరారు. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజుల విషయంలో వెం టనే స్పష్టతనివ్వాలని, లేనిపక్షంలో వీరు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతాయన్నారు. మంగళవారం మఖ్దూం భవన్లో పార్టీ నాయకులు సిద్ధి వెంకటే శ్వర్లు, కందిమళ్ల ప్రతాపరెడ్డి, డాక్టర్ డి.సుధాకర్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాల సందర్భంగా.. ప్రజానాట్యమండలి రూపొందించిన ‘వీర తెలంగాణ పోరుపాటలు’ సీడీని చాడ ఆవిష్కరించారు. -
కొత్త జిల్లాలపై కసరత్తు షురూ!
ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ చర్చ జిల్లా పరిధి ఐదు అసెంబ్లీ లేదా ఒక పార్లమెంట్ నియోజకవర్గం దశలవారీగా ప్రక్రియ చేపట్టాలని యోచన హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను 24 జిల్లాలకు పెంచుతామని కేసీఆర్ ఎన్నికల ప్రచార సమయంలోనూ వెల్లడించిన విషయం విదితమే. శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహిం చిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు చర్చించారు. కొత్తగా ఏర్పాటుచేయాలనుకున్న జిల్లా కేంద్రాలపై సాధ్యాసాధ్యాల నివేదికను తెప్పించుకోవాలని ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు లేదా ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 2019లో పునర్వ్యవస్థీకరణ అనంతరం జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ జిల్లాల ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి కొత్తగూడెం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పూర్తి కసరత్తు అనంతరమే ఈ జిల్లాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. శుక్రవారం జరిగిన సమావేశం కేవలం ప్రాథమిక సమావేశమేనని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఒకేసారి కాకుండా దశలవారీగా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్లతో సమావేశం.. ప్రభుత్వం నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీల తొలిదశ బడ్జెట్ కసరత్తు పూర్తయింది. కొంతమంది టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవారం ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఆయా టాస్క్ఫోర్స్ కమిటీలు రూపొందించిన నివేదికలను కేసీఆర్కు వివరించారు. బడ్జెట్ రూపకల్పనలో టాస్క్ఫోర్స్ కమిటీల నివేదికలను పరిగణ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. వాటర్గ్రిడ్పై.... తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వాటర్గ్రిడ్పై గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఇంజనీర్లతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈనెల 10న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 650కి పైగా ఇంజనీర్లతో హైదరాబాద్లో ఒకరోజు సమావేశం నిర్వహించి.. వారికి వాటర్గ్రిడ్పై పూర్తిగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. -
సాగర్లో డీఆర్డీఓ యూనిట్
రూ. 1,600 కోట్లతో ఏర్పాటుకానున్నట్లు వెల్లడించిన కేసీఆర్ 100 ఎకరాలు కేటాయింపు.. విమానాలు దిగేందుకు ప్రత్యేక రన్వే ప్రపంచవ్యాప్తంగా ఐదు దేశాల్లోనే ఈ తరహా యూనిట్లు ప్రస్తుతం సాగర్లో ఏర్పాటుతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి అధికారులతో సమీక్ష సమావేశంలో సీఎం హైదరాబాద్: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో రూ. 1,600 కోట్ల వ్యయంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు చెందిన ముఖ్యమైన విభాగాన్ని రక్షణశాఖ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు దేశాల్లో మాత్రమే ఉన్న ఈ తరహా యూనిట్ను ఏర్పాటుచేసేందుకు అనువైన స్థలం నాగార్జున సాగర్ మాత్రమేనని రక్షణ శాఖ అధికారులు నిర్ణయించారని, దానికి ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించిందని ఆయన చెప్పారు. నాగార్జున సాగర్ పరిధిలో రక్షణ శాఖ మరిన్ని పరిశోధనలు చేయడానికి, మరిన్ని సంస్థలు నెలకొల్పడానికి వీలుగా అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ యూనిట్ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించి.. సాగర్ను ఎంపిక చేశారని తెలిపారు. డీఆర్డీఓ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం కేసీఆర్ బుధవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, రెవెన్యూ కార్యదర్శి మీనా, నీటి పారుదల శాఖ కార్యదర్శి జోషి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్రావు తదితరులతో సమీక్షించారు. భారత్లో ఈ తరహా యూనిట్ లేక రక్షణశాఖ తన అవసరాల కోసం రష్యాలోని మాస్కోలో ఉన్న యూనిట్పై ఆధారపడుతోందని సీఎం తెలిపారు. నాగార్జునసాగర్లో డీఆర్డీఓ యూనిట్ ఏర్పాటు ద్వారా భారత్కు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని.. భారతే ఇతర దేశాలకు పరిశోధన సహకారం అందిస్తుందని వివరించారు. రూ. 1,600 కోట్లతో ఏర్పాటు చేసే ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభిస్తుందని, సాగర్ ప్రతిష్ట పెరుగుతుందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో ఈ యూనిట్ నెలకొల్పడానికి 100 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని, దానికి అవసరమయ్యే నీరు, విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేసిందని సీఎం చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు కూడా ఈ యూనిట్ ఉపయోగపడుతుందన్నారు. ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నందున దేశ, విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు సాగర్కు రాకపోకలు సాగిస్తారని, వారి కోసం సాగర్ వద్ద విమానం దిగేందుకు వీలుగా రన్వే (ఎయిర్ స్ట్రిప్) నిర్మిస్తామని సీఎం తెలిపారు. దానిని రక్షణ శాఖ అవసరాలకే కాక పర్యాటకులకు కూడా వినియోగించుకుంటారని చెప్పారు. -
మోడీ ఫాసిస్టని పాకిస్థానే అనలేదు
కావాలనే కేంద్రంతో కేసీఆర్ కయ్యం తెలంగాణ ప్రభుత్వంపై పోరుకు సిద్ధం: కిషన్రెడ్డి హైదరాబాద్: ప్రధాన వుంత్రి నరేంద్రమోడీని ఫాసిస్టు అని పాకిస్థాన్ కూడా వ్యాఖ్యానించలేదని, అలాంటిది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆయునను ఫాసిస్టుగా పేర్కొనటాన్ని తావుు తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆదివారం ఇక్కడ విలేకరులతో వూట్లాడుతూ పేర్కొన్నారు. కేసీఆర్ వ్యవహారాన్ని ప్రతిఘటించేందుకు తాము సమాయత్తమవుతున్నామని ఆయున చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అయినందున బడ్జెట్ సమావేశాల వరకు రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దని తాము ముందుగా నిర్ణరుుంచుకున్నా కేసీఆర్ వ్యవహారశైలితో తాము పోరుబాట పట్టక తప్పట్లేదని వ్యాఖ్యానించారు. కావాలనే కేసీఆర్ కేంద్రప్రభుత్వంతో కయ్యం పెట్టుకుంటూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతి నేందుకు కారణమవుతున్నారని, ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విఘాతంగా మారే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొం టామని కేసీఆర్ ప్రక టనిస్తున్నారే తప్ప ఆ రాష్ట్రంతో చర్చించేందుకు ప్రతినిధి బృందాన్ని పంపలేదని వివుర్శించారు. తమతో ఎవరూ చర్చించలేదని ఆ రాష్ర్ట సీఎం రమణ్సింగ్ తనతో అన్నట్టు కిషన్రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారాన్ని హైదరాబాద్ సభతో ప్రారంభించి విజయవంతంగా నిర్వహించిన మోడీ మాదిరిగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షాకు కూడా హైదరాబాద్పై ప్రత్యేక అభివూనం ఏర్పడిందని, కిషన్రెడ్డి చెప్పారు. జాతీయాధ్యక్షుడిగా నియుమితులైన తరువాత తొలి సమీక్ష హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారని, ఈనెల 21, 22 తేదీల్లో తెలంగాణలో ఆయన పర్యటిస్తున్నారని తెలి పారు. తొలిరోజు ఇంపీరియల్ గార్డెన్లో నగర నేతలతో, అనంతరం సెస్ హాలులో పార్టీ ఆఫీస్బేరర్ల సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. రెండో రోజు సరూర్నగర్ ఇండోర్స్టేడియంలో పార్టీ గ్రామ, పట్టణ, మండల, జిల్లా కమిటీలతో భేటీ అవుతారని చెప్పారు. -
త్వరలో ఆర్టీసీ విభజన
తాండూరు: త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీ విభజన జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఏపీఎస్ఆర్టీసీని రెండుగా విభజించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. రెండు మూడు నెలల్లో ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తవుతుందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. తెలంగాణలో ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర సీఎం చంద్రశేఖర్రావు ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఇక్కడ ఆర్టీసీకి ఎందుకు నష్టాలు వస్తున్నాయి, వాటిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆర్టీసీ అధికారులతో సమీక్షిస్తున్నట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చితే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారని, ఆదాయం కూడా అధికమేనని మంత్రి అన్నారు. తెలంగాణలో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ముంబయి తరహాలో సిటీ బస్సులను ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నందన్నారు. ఈనెల 20వ తేదీ తరువాత ముంబయికి తాను వెళ్లనున్నట్టు చెప్పారు. ముంబయిలో ఆర్టీసీ ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, నగర ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా సిటీ బస్సులు నడుపుతున్న పద్ధతులు, ట్రాఫిక్ నియంత్రణకు పాటిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయడానికి ముంబయికి వెళ్లనున్నట్టు మంత్రి వివరించారు. ముంబయి తరహాలో తెలంగాణలోని జిల్లాల్లో సిటీ బస్సులు నడిపించేందుకు ఇటీవలనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కలిసి, 500 బస్సులు కావాలని కోరినట్టు మంత్రి తెలిపారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని, తెలంగాణకు సుమారు 200-300 కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలలో రూ.80కోట్లతో 80 సిటీ బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఈ బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ 50 శాతం, కేంద్ర ప్రభుత్వం 35 శాతం, రాష్ట్రం 15 శాతం నిధులను భరిస్తాయని మంత్రి వివరించారు. ఆయా జిల్లాల్లో ఐదు నిమిషాలకు ఒకసారి సిటీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. తెలంగాణలో తీవ్ర రూపం దాల్చిన విద్యుత్ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. రెండుమూడేళ్లు తెలంగాణలో కరెంట్కష్టాలు తప్పవన్నారు. సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కరెంట్ కొనుగోలు చేసేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. క్రెడిట్ కో-ఆపరేటివ్ సోసైటీ(సీసీఎస్) నిధుల వ్యయం విషయమై సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొ.జయశంకర్ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ జీవితాన్నే త్యాగం చేశారని కొనియాడారు. శంషాబాద్ విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, దాని పేరు మార్పుపై తాను మాట్లాడలేనని పేర్కొన్నారు. -
'మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వస్తే రాజీనామా'
గజ్వేల్, న్యూస్లైన్: మరో రెండేళ్లలో గజ్వేల్ నియోజకవర్గంలో మహిళలు మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లపైకి వస్తే తాను రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం గజ్వేల్లోని ప్రజ్ఞా గార్డెన్స్లో నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర, జిల్లాస్థాయి ఉన్నతాధికారులతోపాటు నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, సహకార సంఘాల చైర్మన్లు, నగరపంచాయతీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ విషయంలో ఎలాంటి వెనకడుగు లేదన్నారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సైతం నిర్లక్ష్యం చేస్తే పదవులకు రాజీనామా చేయాలన్నారు. ్ల జాతీయ ఆహార భద్రత పథకం జాబితానుంచి జిల్లాను తొలగించడం వల్ల వరి విత్తనాల సబ్సిడీని ఎత్తేసిన విషయం తెలుసుకున్న సీఎం వెంటనే సబ్సిడీని పునరుద్ధరించనున్నట్లు సభలో ప్రకటించారు. బీటీ పత్తి విత్తనాలు, ఇతర సబ్సిడీ విత్తనాలు, ఎరువులు బ్లాక్ మార్కెట్కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా నుంచి మరో ఇద్దరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే బంగారు తునకగా తీర్చిదిద్దుతానన్నారు. అభివృద్ధిలో ఆదర్శంగా మలచడం ద్వారా దేశం నలుమూలల నుండి ఈ ప్రాంతాన్ని ప్రజలు సందర్శించే విధంగా తయారు చేస్తానన్నారు. అభివద్ధే లక్ష్యంగా గజ్వేల్కు ప్రత్యేకంగా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్లు, దీనికి హన్మంతరావు ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఈ ఆథారిటీ అధ్వర్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి నోడల్ అధికారిని నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు ఆయా తమ గ్రామాల్లో మంచినీరు, విద్య, నీటిపారుదల, విద్యుత్, ఆరోగ్యం, రోడ్డు రవాణా అంశాలవారిగా ప్రణాళికలు రూపొందించి డెవలప్మెంట్ అథారిటీకి అందించాలని చెప్పారు. ఈ ప్రణాళికలకు త్వరితగతిన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా నియోజకవర్గంలో పారిశుద్ధ్య లోపంపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. నాలుగైదురోజుల్లో మండలాలవారీగా సమావేశాలు నిర్వహించి పిచ్చిచెట్ల తొలగింపు, మురికి తొలగింపు కార్యక్రమం కోసం కార్యాచరణ రూపొందించాలని, ఈ కార్యక్రమంలో తానుకూడా పాల్గొంటానన్నారు. అదేవిధంగా ‘పచ్చతోరణం’ పేరిట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మండలానికి లక్ష చొప్పున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొందరలోనే చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు నియోజకవర్గంలో శాఖల వారిగా చేపట్టాల్సిన పనులపై కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ శాఖ రోడ్లన్నీ డబుల్గా మార్చాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ శాఖ సమీక్షలో గజ్వేల్-తూప్రాన్ రహదారిపై కల్వర్టులను బాగుచేయడమే కాకుండా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డు ఫోర్లేన్ పనులు వెంటనే చేపట్టాలని, ములుగు మండలం వంటిమామిడి-మేడ్చల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చి కల్వర్టులను బాగుచేయడానికి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. విద్యుత్ శాఖకు సంబంధించి పెండింగ్లో వున్న అయిదు 33/11 కేవీ సబ్స్టేషన్ల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గ రైతాంగం అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖా ఎస్ఈ రాములు 350 త్రీఫేజ్, 150 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు కావాలని అడగగా మంజూరు చస్తానని సీఎం ప్రకటించారు. అదేవిధంగా తూప్రాన్ మండలం కాళ్లకల్లో యూపీహెచ్సీ, తూప్రాన్లో కమ్యూనిటీ హెల్త్సెంటర్, గజ్వేల్లో ఏరియా ఆసుపత్రి కోసం భవన నిర్మాణం వంటి పనులను చేపట్టడానికి అవసరమైన ప్రతిపాదనలిస్తే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో బస్సు సౌకర్యానికి నోచుకోని తూప్రాన్ మండలంలోని ఆరు గ్రామాలు, నియోజకవర్గంలోని మిగతా గ్రామాలకు వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ గజ్వేల్లో బుధవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాల్లో భాగంగా జిల్లాలోని 1326 స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.38.45బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. -
జూన్ 2 కేసీఆర్ ప్రమాణ స్వీకారం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖరరావు జూన్ 2 తేదిన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2 తేదిన రోజునే కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 2 తేదిన మధ్యాహ్నం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పీటీఐకి వెల్లఢించారు. 119 సీట్లున్న అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కేసీఆర్ ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. -
కేసీఆర్కు అభినందనల వెల్లువ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలియజేశారు. పీఆర్టీయూ, టీఆర్టీయూ, తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘాల నేతలు ఆదివారం కేసీఆర్ను కలిశారు. టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలియ జేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్రాన్ని విద్యా పరంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి తమ వంతు కృషి చేస్తామని పీఆర్టీయూ నేతలు పేర్కొన్నారు. అలాగే హరీష్రావుకు అభినందనలు తెలియజేశారు. కేసీఆర్ను కలిసిన వారిలో గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంత్ నాయక్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్రెడ్డి, సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
నాడు అంజయ్య.. నేడు కేసీఆర్
మెదక్ : నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మెదక్ జిల్లా నుంచి టంగుటూరి అంజయ్య ఎన్నిక కాగా, నేడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఇదే జిల్లాకు చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నిక కాబోతున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ యవనికపై మెతుకుసీమ ప్రతినిధులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1980లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికైన ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా కొనసాగారు. అలాగే 1981లో ఇదేజిల్లా రామాయంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన టంగుటూరి అంజయ్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1989లో నర్సాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన జగన్నాథరావు ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం 2009లో ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర రాజనర్సింహ కూడా ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్ త్వరలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. -
సస్యశ్యామలం చేస్తాం
పాకాలకు జూరాల నీటిని రప్పిస్తాం వ్యవసాయ అభివృద్ధి ప్రాతిపదికతో ముందుకు సాగుతాం వంద శాతం హామీలు నెరవేరుస్తా పొన్నాల భూకబ్జాపై కలెక్టర్ స్పందించాలి ఆ భూములను తిరిగి దళితులకు ఇవ్వాలి {పచార సభల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్టేషన్ ఘన్పూర్ టౌన్, న్యూస్లైన్ : జిల్లాకు సాగు, తాగు నీరు అందించి సస్యశ్యా మలంగా మారుస్తామని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. వ్యవసాయ అభివృద్ధి ప్రాతిపదికతో ముందుకు సాగుతామన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మూడో దఫా హెలికాప్టర్ ద్వారా జిల్లాను చుట్టేశారు. స్టేషన్ ఘన్పూర్, పరకాల, నర్సంపేట, జనగామ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. తొలుత స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న భోజ్యానాయక్ ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగా... వివిధ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, మహిళలు పోటెత్తారు. డప్పు చప్పుళ్లు, బతుకమ్మలు, బోనాలతో అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని రాంపూర్లో తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల ఆక్రమిం చుకున్న భూములపై కలెక్టర్ వెంటనే స్పందించాలని కోరారు. ఆ భూములను తిరిగి దళితులకు ఇప్పించాలని కోరారు. ఆంధ్ర పార్టీల నేతలు 60 ఏళ్లుగా తెలంగాణను దోచుకుంటూనే ఉన్నారని... ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు సోయిలోకి రావాలని, ఎవరిని గెలిపిస్తే తెలంగాణ రాష్ర్ట పునర్నిర్మాణం, అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలన్నారు. ఉద్యమ గడ్డ ఘన్పూర్ స్టేషన్ఘన్పూర్ నియోజక వర్గం ఉద్యమాల గడ్డ అని, ఉప ఎన్నికల్లో రాజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపిం చి ఉద్యమానికి ఊపు తీసుకువచ్చిన ప్రాంతమని కేసీఆర్ అన్నారు. ఘన్పూర్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి ఐదు వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. తానే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తానన్నారు. ఉప ఎన్నికలు ఫలితాలు పునరావృతం కావాలని, సాధారణ ఎన్నికల్లో అందరూ కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని, ఘన్పూర్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ రాజయ్యను గెలిపించాలని ఆయన కోరారు. సభలో కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపెల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి ఎడవెల్లి కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ గట్టు రమేష్గౌడ్, సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్తో పాటు జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూరాల నుంచి పాకాలకు.. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే జూరాల, పాకాల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యావులం చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో వూట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సవుగ్ర అభివృ ద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని, వ్యవసాయు అభివృద్ధి ప్రాతిపదికలతో వుుందుకు సాగుతావున్నారు. నల్లగొండ జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంతం జూరాల వద్ద ఎత్తిపోతల పథకం చేపట్టి నర్సంపేటలోని పాకాలకు నీటిని తీసుకురావడం వల్ల వరంగల్ జిల్లాలో సాగు, తాగు నీరు సవుస్య తీరుతుందన్నారు. వ్యవసాయూనికి ఎనిమిది గంటలపాటు ఉచిత విద్యుత్ అందించడంతోపాటు వుూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తి పెంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేసేలా పనిచేస్తామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు చేస్తే సహించబోవున్నారు. మన తలరాతలు మార్చే ఎన్నికలివి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక.. తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చేవని.. ఏమాత్రం ఏమరపాటుకు గురికాకుండా టీఆర్ఎస్కే ఓటు వేసి పట్టం కట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. జనగామ ప్రెస్టన్ మైదానంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అంటే నీళ్లు లిఫ్ట్ చేయడం.. ఆంధ్రకు తెఫ్ట్ చేయడం అనేది ఇన్నాళ్లుగా జరిగిందన్నారు. జూరాల ఉంచి సక్కగా పాకాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా.. లిఫ్ట్ల పేరుతో ఆన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఈ విషయం పొన్నాలకు తెలిసినా.. ఆంధ్ర ముఖ్యమంత్రులకు సేవలు చేస్తూ పట్టించుకోలేదని విమర్శించారు. 2003లో తాను బచ్చన్నపేట పర్యటనకు వచ్చినప్పుడు సభకు సుమారు 500 మంది వస్తే అందులో అందరు వృద్ధులే ఉన్నారని ఆ సంఘటనను కేసీఆర్ గుర్తు చేశారు. ఇదేమని అడిగితే.. ఏడేళ్ల కరువుతో యువకులందరూ వలస వెళ్లారని చెప్పడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఉద్యమ తీవ్రతకు బచ్చన్నపేట కారణమైందన్నారు. తెలంగాణలో ముఠా, స్వార్థ, గ్రూపు రాజకీయాలు ఎక్కువ అభివృద్ధి జరగలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనగామ నియోజకవర్గంలో 5వేల ఇళ్లను నిర్మించి.. వాటిని తానే స్వయంగా ప్రారంభిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యమానికి కేంద్ర బిందువైన వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కేసీఆర్ అన్నారు. అవసరమైతే తాను కుర్చీ వేసుకుని కూర్చొని పనులు పూర్తి చేస్తామన్నారు. ఎవరు అడ్డు వచ్చినా.. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. జనగామలో పొన్నాల చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు. దేవాదుల నీళ్లను ఎందుకు తెప్పించలేదని విమర్శించారు. పొన్నాల చేసిన అభివద్ధి... బొంద అభివద్ది, బోకే అభివద్ధి అంటూ ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే.. ప్రాజెక్టులను పూర్తి చేసి జనగామ నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ను గెలిపించాలని కోరారు. -
కేసీఆర్ తాట తీస్తాం!
నరేంద్రమోడీని, దళిత నాయకులను తిడితే ఊరుకోబోం తెలంగాణ నీవల్లే వచ్చిందని విర్రవీగొద్దు ఒక్కో ఎంపీ సీటు 30కోట్లకు అమ్ముకున్నావ్! హరీశ్రావుకు బొత్సతో కేబుల్ వ్యాపారాలు జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యాఖ్యలు హుస్నాబాద్: బీసీ వర్గానికి చెందిన నరేంద్రమోడీని, దళిత నాయకులను తిట్టినా, ఆరోపణలు చేసినా టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు తాట తీస్తామని జనసేన పార్టీ అధిపతి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తనకు పిరికితనం చిన్నప్పటి నుంచీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన వరంగల్ జిల్లా పాలకుర్తి, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లలో జరిగిన ప్రచారంలో మాట్లాడారు. ఎందరో విద్యార్థులు, యువకులు ప్రాణాలర్పించడంతోపాటు ఎర్రబెల్లి దయాకర్రావు వంటి అనేక మంది నేతల కృషి ద్వారానే తెలంగాణ వచ్చిందన్నారు. ‘‘కేసీఆర్ తన వల్లే తెలంగాణ వచ్చిందని విర్రవీగుతున్నారు. అది సరికాదు. ఎప్పుడూ ఆంధ్రావాళ్లను తిట్టే కేసీఆర్ కుటుంబం వారితోనే వ్యాపారాలు చేస్తోంది. కేసీఆర్ ఒక్కో ఎంపీ సీటుకు రూ.30 కోట్లు వసూలు చేశారు. ఆంధ్రావాళ్ల బంధువులకే టికెట్లిచ్చారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో హరీష్రావుకు కేబుల్ వ్యాపారాలున్నాయి. కేసీఆర్ కూతురు కవిత ఆంధ్ర వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేశారు. కేటీఆర్ ఆంధ్రలో చదువుకున్నారు’’ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా కాంగ్రెస్, టీఆర్ఎస్లకు లేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాలేదని, బీజేపీతోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. తుదిశ్వాస వరకు దేశం కోసమే పనిచేస్తానన్న పవన్... దమ్ము, సత్తా లేని కాంగ్రెస్ నేతలు తెలంగాణను పాలించలేరని, ఆ పార్టీని నుంచి దేశం నుంచి సాగనంపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో మద్దతు తెలిపినందుకే బీజేపీకి తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.తొర్రూరులో పవన్కల్యాణ్తోపాటు ఎంపీ అభ్యర్థి పరమేశ్వర్, ఎమ్మెల్యే అభ్యర్థి దయాకర్రావు, వర్ధన్నపేట ఎంఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి మంద కృష్ణమాదిగ పాల్గొనగా... హుస్నాబాద్లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్రావు పాల్గొన్నారు. -
ఇందూరును ప్రగతిపథంలో నడిపిస్తాం
జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తాం నిజాంసాగర్ ప్రాజెక్టును ఆధునీకరిస్తాం లెండి సహా పెండింగ్ పథకాలు పూర్తి చెరుకు, పసుపు రైతులకు అండగా ఉంటాం రూ.11 కోట్ల ఎర్రజొన్నల బకాయిలు ఇప్పిస్తాం గల్ఫ్ బాధితులు, బీడి కార్మికులకు న్యాయం నిజామాబాద్ పేరు ప్రఖ్యాతులు కాపాడుతాం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్కే.. సర్వేలు చెప్తున్నాయి... ప్రజలు ఆదరిస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ : ‘‘ఆంధ్ర పాలకుల పుణ్యమా అని వ్యవసాయరంగంలో అగ్రస్థానంలో ఉన్న ఇందూరు జిల్లా అభివృద్ధిలో వెనకబడింది. తెలంగాణ రాష్ర్టంలో నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం తెస్తా’’ అని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచానికి పంచిన అంకాపూర్ అన్నదాతలు, ప్రపంచ ఉత్పత్తిలో 16 శాతం పసుపును ఎగుమతి చేసే రైతులున్న ఈ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇందూరును ఆదర్శ జిల్లాగా తీర్చదిద్దుతానని హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి నిజామాబాద్లో జీజీ కాలే జ్ సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన ‘నిజామాబాద్ నగారా’ సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి పెట్టింది పేరుగా ఉన్న ఇందూరు జిల్లా రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తానన్నారు. గతమెంతో ఘనం నిజామాబాద్ జిల్లాలో ఉన్న రెండు అంశాలకు ప్రాముఖ్యత ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టని, మూడు లక్షల ఎకరాలకు సాగునీరిచ్చిన ఘన త ఆనాటిదన్నారు. ఆసియాలో అతి పెద్దదైన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిర్వీర్యమైందన్నారు. ‘షుగర్ ఫ్యాక్టరీ అగమై చెరుకు మాయమైందని, నిజాంసాగర్ ఆగమై ఆయకట్టుకు నీళ్లు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను హైదరాబాద్కు తరలించి సింగూరు ప్రాజెక్టును జిల్లాకు అంకితం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తానని పేర్కొన్నారు. కౌలాస్నాల సామర్థ్యం పెంచి, ప్రాణహిత, లెండి తదితర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి వ్యవసాయరంగానికి పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు. రైతుకు మద్దతు ధర తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప సుపు, చెరుకు రైతులకు అండగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. నిజాం షుగర్స్కు పూర్వవైభవం తెస్తామని, చెరుకు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని, తద్వారా మెరుగైన వంగడాలు, మద్దతు ధర వచ్చేలా చూస్తామన్నారు. మోతె కేంద్రంగా పసుపు పరిశోధన కేంద్రం ఏ ర్పాటు చేసి రైతులకు మేలు చేస్తామన్నారు. ఆ ర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ ప్రాంతాల కు చెందిన రైతులకు రూ.11 కోట్ల ఎర్రజొన్న ల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుం టామన్నారు. తెలంగాణ యూనివర్సిటీ నా మ్కేవాస్తేగా మారిందని, టీఆర్ఎస్కు అధికా రం రాగానే అన్ని హంగులు కల్పిస్తామని హా మీ ఇచ్చారు. గ్రామంలో విధులు నిర్వహించే ఆశ వర్కర్లు, ఐకేపీ ఉద్యోగులకు జాబ్ చార్ట్ రూపొందించి గ్రామాలకు సరైన సేవలందిం చేలా చూస్తామన్నారు. జిల్లాలోని గిరిజన, కో య గూడాలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే పూచీ తనదన్నారు. గల్ఫ్ బా ధితులు, బీడి కార్మికుల అభివృద్ధి కోసం ప్ర త్యేక చర్యలు తీసుకుంటామని, పోచంపల్లిలో ఏడు కుటుంబాలను ఆదుకునేందుకు భిక్షాట న చేసింది కూడ తానేనని కేసీఆర్ గుర్తు చేశా రు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఇందూరు పే రు ప్రఖ్యాతులను కాపాడుతానన్నారు. అన్ని స్థానాలు మావే తెలంగాణ జిల్లాలలోని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమని, ఇది తాను చెప్తున్నది కాదని, సర్వేలు సూచిస్తున్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎంపీకొకరికీ, ఎమ్మెల్యేకొక్కరికి ఓటేయడం సరికాదని, ఎమ్మెల్యే, ఎంపీలుగా టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన కోరారు. రాష్ర్టంలో తమ ప్రభుత్వ ం వచ్చినా, కేంద్రం మెడలు వంచి నిధులు తేవాలంటే మన ఎంపీలు ఢిల్లీలో ఉండాల్సిందేనన్నారు. జిల్లాలోని రెండు ఎంపీ, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రజల మధ్యన నిలిచి వారితో కలిసి ఉద్యమాలు చేసిన టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడతారని అన్నారు. కేసీఆర్ ఆద్యంతం తన ప్రసంగంలో కాంగ్రెస్, టీడీపీలపై విమర్శలు చేసి, జిల్లాపై వరాల జల్లు కురిపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ఎమ్మెల్యే అభ్యర్థులు బిగాల గణేష్ గుప్తా, ఆశన్నగారి జీవన్రెడ్డి, బాజిరెడ్డి గో వర్ధన్, పోచారం శ్రీనివాస్రెడ్డి, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్రెడ్డి, హన్మంత్ సింధే, షకీల్ అహ్మద్, వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పోశెట్టి, సుజిత్కుమార్ ఠాగూర్, డీసీఎమ్మెస్ చైర్మన్ ముజిబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడు మనకు బాధ.. ఇప్పుడు వాళ్లకు: కేసీఆర్
‘ఇప్పటిదాకా మనకు (తెలంగాణ) బాధ ఉండేది. ఇప్పుడు వాళ్లకు (సీమాంధ్రకు) బాధ ఉంటది. మనం అనుకున్నది సాధించినవాళ్లుగా హుందాగా వ్యవహరించాలి’ అని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు పార్టీ నేతలకు సూచించారు. బుధవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా నిర్దేశించారు. ఇప్పటిదాకా పార్టీ అనుసరించిన వ్యూహానికి, ఇప్పటినుంచి అనుసరించబోయే దానికి చాలా తేడా ఉండాలని సూచించారు. నిన్నటిదాకా మనం కొట్లాడినట్టే ఇప్పుడు వాళ్లు(సీమాంధ్ర ఎమ్మెల్యేలు) కొట్లాడుతారని కేసీఆర్ విశ్లేషించారు. -
11న ఢిల్లీకి కేసీఆర్, కేకే
తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో సమావేశం కావడానికి టీఆర్ఎస్ ప్రతినిధులుగా పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు, సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఈ నెల 11న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆరోజు ఉదయం పార్టీ శిక్షణ శిబిరాల సన్నాహక సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. శిక్షణ శిబిరాల ఉపన్యాసకులకు సూచనలిస్తారు. సాయంత్రం కేకేతో కలిసి కేసీఆర్ ఢిల్లీకి పయనమవుతారు. ఈనెల 16 నుంచి పార్టీ శిక్షణ శిబిరాలు ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.