forest lands
-
ఆదివాసీ చట్టం రద్దుకు కుట్రలు!
కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం 1/70 చట్టాన్ని రద్దు చేసి, గిరిజనుల హక్కు లను హరించేందుకు సన్నద్ధ మైంది. ‘ఈ చట్టం ఉంటే మన్యం ప్రాంత అభివృద్ధి చెందద’ని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే! అడవి, అటవీ భూములు, అందులోని వనరు లపై తరతరాలుగా వస్తున్న ఆదివాసీ గిరిజనుల హక్కులను హరించటానికి వలస పాలకుల నుంచి దేశీయ పాలకుల వరకు అనేక గిరిజన వ్యతిరేక చట్టాలు చేశారు. 1855లో భారత గవర్నర్ జనరల్ డల్హౌసీ తొలి గిరిజన వ్యతిరేక అటవీ విధానాన్ని ప్రకటించి, అటవీ సంపదలన్నీ ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించాడు. 1864లో అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ నియామ కంతో అడవిపై బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం ప్రారంభమైంది. 1865లో ఓ చట్టం ద్వారా పూర్తిగా అడవులను తన అధీనంలోకి తెచ్చుకుంది. అధికార మార్పిడి తర్వాత దేశీయ పాలకులు, వలస పాలకుల విధానాలనే కొనసాగించారు. 1952లో ప్రకటించిన అటవీ విధానం దాని కొనసాగింపే! 1973లో ‘టైగర్ ప్రాజెక్టు’ పేరుతో గిరిజనులను అడవి నుండి వెళ్ళ గొట్టేందుకు పూనుకుంది. 1980లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గిరిజన వ్యతిరేక చట్టం అడవి నుండి గిరిజనులను ఖాళీ చేయించే చర్యలు తీసుకుంది. 2023లో మోదీ ప్రభుత్వం ‘అటవీ హక్కుల సవరణ చట్టం’ ద్వారా అటవీ భూములను బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టే విధానాలు చేపట్టింది. షెడ్యూల్డ్ ఏరియా భూ బదలాయింపు నిబంధనల చట్టం–1959 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ఏడాది మార్చి 4న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం గిరిజనుల భూము లను, 1963 కంటే ముందు నుంచి స్థానికంగా ఉండి, భూమి హక్కులు కలిగిన గిరిజనేతరుల భూములను కూడా కాపాడుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 (1) ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించిన వాటిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఈ చట్టం 1963లో అమల్లోకి వచ్చింది. దీనికి కీలక సవరణలు 1970లో జరిగాయి కనుక ఈ చట్టం ‘1/70’గా ప్రాచుర్యంలో ఉంది. శ్రీకాకుళం గిరిజన ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల భూమి సమస్యను ముందుకు తెచ్చింది. గిరిజన పోరాటాలు ఇతర ప్రాంతాలకు విస్తరించ కుండా చూసేందుకు ప్రభుత్వమే గిరిజనులకు భూములు ఇచ్చి వారి హక్కులకు రక్షణ కల్పిస్తుందనే భ్రమలు కల్పించటానికి ఆనాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 1970లో 1/70 చట్టాన్ని చేసింది. ఈ చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాల్లో భూమిపై పూర్తి హక్కు గ్రామ సభలకు, పంచాయితీలకు, గిరిజన సలహా మండలికి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో సెంటు భూమి సేకరించాలన్నా గ్రామ సభ, పంచాయితీ తీర్మానం అవసరం. ఈ తీర్మానం గిరిజన సలహా మండలికి పంపుతారు.1/70 సెక్షన్ –3 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతా ల్లోని అన్ని అటవీ సంపదలు, భూములు కేవలం గిరిజనులకు గాని లేక గిరిజనులు సభ్యులుగా ఉన్న సొసైటీకి మాత్రమే చెందుతాయి. అందుకు విరుద్ధంగా గిరిజనేతరులు భూములు పొందితే చట్ట రీత్యా చర్యలు తీసుకోబడతాయి. 5వ షెడ్యూల్లో ఉన్న అటవీ భూములను ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు లీజుకు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై 1997 జూలైలో సుప్రీమ్ కోర్టు త్రిసభ్య ధర్మాసనం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వ లేదా దాని సంస్థలు లీజుకి ఇచ్చిన భూములు చెల్లవని తీర్పు ఇచ్చింది. ‘పీసా’ చట్టం కూడా ప్రతి ఆదివాసీ సమూహానికి, తమ గ్రామ పరిధిలోని సహజ వనరులపై హక్కు గ్రామ సభలకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. చట్ట సవరణ ప్రయత్నాలుగిరిజనులకు చెందాల్సిన అటవీ భూములను, బహుళజాతి సంస్థలకు, గిరిజనేతరులకు కట్ట పెట్టేందుకు 1996–2001 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 1/70 చట్ట సవరణకు నాటి సీఎం చంద్రబాబు దగ్గర నుండి శాసనసభ కమిటీల నివేదికల దాకా అనేక ప్రయత్నాలు జరిగాయి. 2000లో చింత పల్లి బాక్సైట్ తవ్వకాల కోసం ‘రస్ ఆల్ ఖైమా’ బహుళజాతి సంస్థకు బాబు ప్రభుత్వం అనుమతించింది. వేలాది ఎకరాలు అప్పగించేందుకు సిద్ధ మయింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య మాలు రావడంతో బాబు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. గత చంద్రబాబు ఆలోచనలకు అను గుణంగానే 1/70 చట్టం గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. గిరిజన ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమించడంతో ప్రభుత్వం ‘1/70 చట్టాన్ని రద్దు చేయబోమ’ని చంద్రబాబే స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇది మోసపూరిత ప్రకటనే. రద్దు అనే కత్తి చట్టంపై వేలాడుతూనే ఉంది. కూటమి ప్రభుత్వ మోసాలను గమనించి 1/70 చట్టాన్ని సవరించే చర్యలను వ్యతిరేకిస్తూ, చట్టంలో ఉన్న లొసుగులను తొలగించాలనీ, అటవీ హక్కుల సవరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయాలనీ అన్ని వర్గాల గిరిజనులు ఉద్యమించాలి.బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526 -
ఏదైనా చట్ట ప్రకారమే చేయాలి
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామ పరిధిలోని అటవీ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించడంతోపాటు వాటిపై వివరణ ఇవ్వాలంటూ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ విథున్రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, పి.ఇందిరమ్మ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నోటీసులను రద్దు చేసి, తమ భూముల విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని వారు తమ వ్యాజ్యాల్లో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలన్నా కూడా చట్ట నిబంధనలకు అనుగుణంగానే చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.మంగళంపేట గ్రామంలోని సర్వే నంబర్ 296/2లోని 18.94 ఎకరాల భూమిపై పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, సర్వే నంబర్ 295/1లోని 15 ఎకరాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 295/1సీ లోని 21 ఎకరాలపై మిథున్రెడ్డి, సర్వే నంబర్లు 295/1బీలో 10.8 ఎకరాలు, 295/1డీలో 89 సెంట్లు, 296/1లో 9.11 ఎకరాల భూముల విషయంలో ఇందిరమ్మ పిటిషన్లు దాఖలు చేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు అటవీ భూములను ఆక్రమించలేదని తెలిపారు. ఆ భూములను 20 ఏళ్ల కిందటే వాటి యజమానుల నుంచి కొనుగోలు చేశారని వివరించారు. అప్పట్లోనే అక్కడ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఇప్పుడు వాటిని అటవీ భూములుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేశారని చెప్పారు. తమ మనుషుల సమక్షంలో సర్వే చేసినట్లు పేర్కొంటూ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారన్నారు. నిరాధార ఆరోపణలతో ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆధారంగా చేసుకుని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం... పిటీషనర్ల విషయంలో కఠిన చర్యలేవైనా తీసుకోవాల్సి వస్తే, చట్ట ప్రకారమే నడుచుకోవాలని అధికారులను ఆదేశించింది. -
అదీనమా?.. పరాధీనమా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: భూములను గుర్తించడంలో అధికారుల కాలయాపన వల్ల అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. పర్యావరణం, జీవవైవిధ్యానికి దోహదపడాల్సిన సామాజిక అడవుల పెంపకం ఆగిపోగా.. ఆ భూములు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. రెవెన్యూ, అటవీశాఖల్లోని కొందరు అధికారుల ఉదాసీనత వల్ల అడవులు (Forest) పెరిగిన భూములు సైతం ఆక్రమణదారుల పేరిట రిజిస్ట్రేషన్ కాగా.. వారు ‘రైతుబంధు’ను సైతం పొందుతున్నారు. ఉమ్మడి వరంగల్లో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోగా, తెలంగాణ (Telangana) వ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల వివాదాలున్నాయి. చాలాచోట్ల కోర్టుల ద్వారా పరిష్కారమయ్యాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు సుమారు ఆరు నెలల కిందట తీర్పు ఇచ్చింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఇనుపరాతి గుట్టల చుట్టూ ఆక్రమణలకు గురైన అటవీ భూములపై రెవెన్యూ, అటవీశాఖలు ఎటూ తేల్చడం లేదు. సర్వేల పేరిట సాగదీత నేపథ్యంలో రూ.కోట్ల విలువైన అటవీ భూములు స్వాదీనం చేసుకుంటారా? పరాదీనమవుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సాయంతోనే యథేచ్ఛగా ఆక్రమణలు.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు మండలాల శివార్లలోని ఇనుపరాతి గుట్టల చుట్టూ అటవీశాఖ లెక్కల ప్రకారం 3,952 ఎకరాలు ఉంది. నిజాంకాలంలో మొత్తం 4 వేల ఎకరాలకుపైగా భూమిని అటవీశాఖకు అప్పగించినట్టు రికార్డుల్లో ఉంది. కొత్తపల్లి బ్లాక్లో 594 ఎకరాలు, దామెరలో 560, ఎర్రబెల్లిలో 820, దేవనూరులో 1,095, ముప్పారం బ్లాక్లో 906 ఎకరాలుగా ఉంది. కాలక్రమంలో రెవెన్యూ అధికారుల తీరు వల్ల అటవీ భూమికి చుట్టుపక్కల పట్టాలు పుట్టుకొచ్చాయి. ఈ వ్యవహారంపై కొన్నేళ్లుగా రెవెన్యూ, అటవీశాఖలు కలిసి సర్వే పేరుతో కాలయాపన చేస్తుండటంతో ఇంకా ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమిస్తూ పట్టాలు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కొందరు సర్వేనంబర్లకు బై నంబర్లు వేసి పట్టాదారు పాసుపుస్తకాలు కూడా అందజేస్తున్నారు. గతంలో పనిచేసిన ఓ రెవెన్యూ అధికారి ఏకంగా 40 ఎకరాలకు పట్టాలు ఇచ్చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 30 ఎకరాల వరకు ధర్మారం మండలంలోని అటవీ శివారుల్లోని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. పల్లగుట్ట, చాకలిగుట్ట, ఎదురుగుట్ట, పందిఅడుగుగుట్ట పరిధిలోని భూములు కొందరి కబ్జాలో ఉన్నాయి. ఏడాది క్రితం 102 ఎకరాలు కొందరికి పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరగ్గా.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఉన్నతాధికారులు చెక్ పెట్టారు. అయినా 40 ఎకరాల వరకు పట్టా అయ్యిందని చెబుతున్నారు. కాగా కొన్నేళ్లుగా ఈ భూములను పట్టాలు చేసుకుంటున్నవారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువగా ఉండగా.. కొందరు ఫారెస్టు, రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే వారి రంగప్రవేశం జరిగిందన్న చర్చ సాగుతోంది. ఇదిలా వుండగా ఈ స్థలాల్లోని కొన్ని సర్వే నంబర్లలో దశాబ్దాల కిందట కొందరు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం భూములను అసైన్డ్ చేయగా, వారికి సైతం రెవెన్యూ అధికారులు సాగు చేసుకునేందుకు హద్దులు నిర్ణయించి ఇవ్వడం లేదు. కబ్జాదారులకు మాత్రం ముడుపులు తీసుకుని చకచకా పట్టాలు చేసేయడం వల్ల పట్టాదారులు ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు.తెలంగాణలో తగ్గిన అటవీ విస్తీర్ణం.. ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు– 2023’ప్రకారం తెలంగాణలో 2021–23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 21,179.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్ (138.66 చ.కి.మీ.లు) తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తగ్గిన 13 జిల్లాలలో మహబూబాబాద్లో 26.98 చ.కి.మీ.లు, ములుగులో 25.91 చ.కి.మీ.లు, జయశంకర్ భూపాలపల్లిలో 15.43 చ.కి.మీ.లు, వరంగల్లో 2.51 చ.కి.మీ.లు, జనగామలో 2.13 చ.కి.మీ.లు తగ్గింది.‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు– 2023’ప్రకారం తెలంగాణలో 2021–23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 21,179.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్ (138.66 చ.కి.మీ.లు) తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తగ్గిన 13 జిల్లాలలో మహబూబాబాద్లో 26.98 చ.కి.మీ.లు, ములుగులో 25.91 చ.కి.మీ.లు, జయశంకర్ భూపాలపల్లిలో 15.43 చ.కి.మీ.లు, వరంగల్లో 2.51 చ.కి.మీ.లు, జనగామలో 2.13 చ.కి.మీ.లు తగ్గింది.ధర్మసాగర్ మండలం దేవునూర్ శివారులోని ప్రభుత్వ నోటిఫికేషన్లో ఉన్న భూములు, నోటిఫికేషన్లో లేని భూములు గుర్తించాం. ఆ భూముల్లో సాగు చేస్తున్న రైతుల వివరాలు సేకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశానుసారం నిర్ణయం తీసుకుంటాం. దేవునూర్, ముప్పారం గ్రామాల శివారులోని ఇనుపరాతి గుట్టల్లో ఫారెస్ట్ అధికారులకు– రైతులకు మధ్య జరుగుతున్న వివాదం పరిష్కారమయ్యేలా ఫారెస్ట్ భూములు, రైతుల పట్టా భూములు సర్వే చేశాం. – బి.సదానందం, తహసీల్దార్, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా సర్వే వివరాలు అందాల్సి ఉంది.. ఇనుపరాతి గుట్టలు, నాలుగు మండలాల పరిధిలో ఉన్న సర్వే ఇంకా కొంతమేర మిగిలి ఉంది. ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవనూరు, వేలేరు మండలంలోని ఎర్రబెల్లి, భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి, ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామాల శివారులో ఇనుపరాతి గుట్టలు ఉన్నాయి. మొత్తం ఫారెస్ట్ భూమి 3,750 ఎకరాలకుపైన ఉండాలి. ఈ భూమికి రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేసి ఇస్తే ఫారెస్ట్ అధికారులు ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ చేస్తారు. జిల్లా ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – భిక్షపతి, ఫారెస్ట్ రేంజ్ అధికారి, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా -
ఆరని అగ్నికీలలు
లాస్ ఏంజెలెస్: ప్రకృతి రమణీయతకు పట్టుగొమ్మలైన లాస్ ఏంజెలెస్ అటవీప్రాంతాలు ఇప్పుడు అగ్నికీలల్లో మాడి మసైపోతున్నాయి. వర్షాలు పడక ఎండిపోయిన అటవీప్రాంతంలో అంటుకున్న అగ్గిరవ్వ దావానంలా వ్యాపించి ఇప్పుడు వేల ఎకరాల్లో అడవిని కాల్చిబూడిద చేస్తోంది. పసిఫిక్ తీరప్రాంతం మొదలు పాసడేనా వరకు మొత్తం ఐదు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని రాజుకుని వేల ఎకరాలకు వేగంగా వ్యాపించి వందల ఇళ్లు, ఆఫీస్ కార్యాలయాలు, దుకాణాలు, పాఠశాలలను భస్మీపటం చేసింది. ఈ ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పసిఫిక్ పాలిసాడ్స్, అల్టాడేనా ప్రాంతాల్లో దావాగ్ని భీకరంగా ఎగసిపడుతూ 17,234 ఎకరాల అటవీప్రాంతాన్ని ఇప్పటికే కాల్చేసింది. ఈటన్ ప్రాంతంలో 10,600 ఎకరాలకుపైగా అటవీభూములు దగ్ధమయ్యాయి. హర్స్ట్ ప్రాంతంలో 855 ఎకరాలు, లిడియా ప్రాంతంలో 348 ఎకరాల మేర అడవి ఇప్పటికే అగ్నికి ఆహుతైంది. పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలోని మలీబూ తీరం వెంటే హాలీవుడ్ సినీ దిగ్గజాల విలాసవంత నివాసాలున్నాయి. ఇందులో ఇప్పటికే చాలామటుకు కాలిబూడిదయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్కు చెందిన ఇంటినీ కార్చిచ్చు దహించివేసింది. దావాగ్నిలో దహనమైన నివాసాల్లో చాలా మంది హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు ఉన్నాయి. లాస్ ఏంజెలెస్ చరిత్రలో ఎన్నడూలేనంతటి భీకర అగ్నిజ్వాలల ధాటికి 1,79,700 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికార యంత్రాంగం సూచించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి రాత్రిళ్లు లక్షలాది కుటుంబాలు అంధకారంలో గడిపాయి. దాదాపు 3,10,000 మంది కరెంట్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. పెనుగాలులతో వినాశకర స్థాయిలో విజృంభిస్తున్న మంటలను అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టంగా మారింది. మంటలను అదుపుచేయడం మా వల్ల కాదని కొందరు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే చేతులెత్తేశారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఉన్న మంటలకు తోడు కొత్తగా బుధవారం సాయంత్రం హాలీవుడ్ హిల్స్లో కొత్తగా అగ్గిరాజుకుని స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సన్సెట్ ఫైర్గా పిలుస్తున్న ఈ దావాగ్ని మాత్రమే అత్యల్పంగా 43 ఎకరాలను దహించింది. టీసీఎల్ చైనీస్ థియేటర్ మొదలు ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఉన్న వీధులనూ అగ్నికీలలు ఆక్రమించాయి. ఎన్నో సినిమాల్లో కనిపించిన ఫేమస్ పాలిసాడ్స్ చార్టర్ హైస్కూల్ భవనం కాలిపోయింది. సన్సెట్ బోల్వార్డ్సహా ఎన్నో కొండ అంచు కాలనీల్లో ఖరీదైన ఇళ్లను మంటలు నేలమట్టంచేశాయి. ప్రముఖుల ఇళ్లు నేలమట్టం హాలీవుడ్ సినీరంగ ప్రముఖుల ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి. మ్యాండీ మూర్, క్యారీ ఎల్విస్, ప్యారిస్ హిల్టన్, స్టీవెన్ స్పీల్బర్గ్, టామ్ హ్యాంక్స్, బెన్ ఎఫ్లేక్, ఆడమ్ శాండ్లర్, యూజిన్ లేవీ, బిల్లి క్రిస్టల్, జాన్ గుడ్మాన్, విల్ రోజరెస్, జేమ్స్ లీ కర్టిస్, జేమ్స్ ఉడ్స్ సహా చాలా మంది ప్రముఖుల ఇళ్లు తగలబడ్డాయి. ‘‘వీధుల్లో ఎక్కడ చూసినా కాలిన చెక్క ఇళ్ల చెత్తతో నిండిన స్విమ్మింగ్ ఫూల్స్ కనిపిస్తున్నాయి. యుద్ధంలో బాంబు దాడుల్లో దగ్దమైన జనావాసాల్లా ఉన్నాయి’’అని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశాయి. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో మే నెల నుంచి చూస్తే కేవలం 0.1 అంగుళాల వర్షపాతమే నమోదైంది. ఎండిపోయిన పర్వత సానువుల అడవీ ప్రాంతం గుండా గంటకు 80 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు ఈ మంటలను మరింత ఎగదోస్తున్నాయి. ఇప్పట్లో వర్షాలు పడకపోతే శీతాకాలమంతా దావానలం దారుణ పరిస్థితులను ఎదుర్కోక తప్పదని వెస్టర్న్ ఫైర్ చీఫ్ అసోసియేషన్ హెచ్చరించింది. పాసడీనా, పసిఫిక్ పాలిసాడ్స్లో భీకర మంటల భయంతో పలు హాలీవుడ్ స్టూడియోలు మూతపడ్డాయి. యూనివర్సల్ స్టూడియోస్ తమ థీమ్ పార్క్ను మూసేసింది. ‘‘ వింతవింత కుందేలు బొమ్మలతో బన్నీ హౌజ్గా ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న మా మ్యూజియం బుగ్గిపాలైంది. గిన్నిస్ ప్రపంచరికార్డు సృష్టిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద బన్నీ భవనం నెలకొల్పడానికి మాకు 40 ఏళ్లు పట్టింది. అది ఇప్పుడు నిమిషాల్లో కాలిపోయింది’’ అని ఆల్టాడేనాలోని సీŠట్వ్ లుబాన్స్కీ, కాండేస్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కార్లు, వస్తువులకు ఏమాత్రం ఇన్సూరెన్స్ వస్తుందోనని చాలా మంది దిగాలుగా కనిపించారు.ఆస్కార్కూ సెగ కార్చిచ్చు సెగ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులనూ తాకింది. దీంతో అకాడమీలో నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. వాస్తవానికి బుధవారం నుంచి 14వ తేదీదాకా నామినేషన్ ప్రక్రియ కొనసాగాలి. అగ్నికీలలు వ్యాపించడంతో ఓటింగ్ ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 17వ తేదీన ప్రకటించాల్సిన ఆస్కార్ నామినేషన్లను జనవరి 19కు వాయిదా వేశారు.చేతివాటం చూపిన దొంగలు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు ఇళ్లు వదిలిపోతుండటంతో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దగ్ధ్దమవుతున్న ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. ఇలా లూటీ చేస్తున్న 20 మందిని అరెస్ట్చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్చిచ్చు ఘటనల్లో ఇప్పటిదాకా 4 లక్షల కోట్ల రూపాయల సంపద అగ్నికి ఆహుతైందని బైడెన్ సర్కార్ ప్రాథమిక అంచనావేసింది. తన చిట్టచివరి అధికారిక పర్యటనలో భాగంగా ఇటలీకి వెళ్దామనుకున్న బైడెన్ ఈ అనూహ్య ఘటనతో పర్యటనను అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు. పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. మరోవైపు కార్చిచ్చు ఉదంతంలో సరిగా స్పందించని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తున్న అగ్నికీలలు ప్రైవేట్ శాటిలైట్ ఛాయాచిత్రాల సేవలందించే మ్యాక్సర్ టెక్నాలజీస్ తదితర ఉపగ్రహ సేవా సంస్థలు తీసిన ఫొటోలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఫొటోల్లో.. కాలిఫోర్నియాలోని మాలిబు తీరపట్టణ ప్రాంత శాటిలైట్ ఫొటోల్లో ఇప్పుడంతా కాలిబూడిదైన ఇళ్లే కనిపిస్తున్నాయి. ఆకాశమంతా దట్టంగా కమ్ముకున్న పొగలతో నిండిపోయింది. ఈస్ట్ ఆల్టాడీనా డ్రైవ్ ప్రాంతమంతా బూడిదతో నిండిపోయింది. శక్తివంతమైన శాంటా ఆనా వేడి పవనాలు తూర్పులోని ఎడారి గాలిని తీరప్రాంత పర్వతాలపైకి ఎగదోస్తూ మంటలను మరింత ప్రజ్వరిల్లేలా చేస్తున్నాయి. ఉచితాలు.. సాయాలు సర్వం కోల్పోయిన స్థానికులను ఆదుకునేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్కువ ధరకే వాహనాల్లో రైడ్ అందిస్తామని ఉబర్, లిఫ్ట్ సంస్థలు తెలిపాయి. ఉచితంగా స్నానాల గదులు, లాకర్ రూమ్, వై–ఫై సౌకర్యాలు అందిస్తామని ప్లానెట్ ఫిట్నెస్ తెలిపింది. తమ గదుల్లో ఉచితంగా ఉండొచ్చని ఎయిర్బీఎన్బీ పేర్కొంది. హోటళ్లలో డిస్కౌంట్కే గదులిస్తామని విసిట్ అనహీమ్ వెల్లడించింది. అపరిమిత డేటా, కాల్, టెక్సŠస్ట్ ఆఫర్ ఉచితంగా ఇస్తామని ఏటీ అండ్ టీ, వెరిజాన్ సంస్థలు ప్రకటించాయి. -
అటవీ భూములు అన్యాక్రాంతం కాలేదు
మాచవరం: పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో ఫారెస్ట్ లాండ్స్ లేవని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో అటవీ భూములున్నాయోమో పరిశీలించాలని డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు అటవీ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ఇక్కడి భూమలను శనివారం పరిశీలించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు మాచవరం మండలం చెన్నయపాలెం, దాచేపల్లి మండలం తంగెడ శివారు అటవీ భూములను, సరిహద్దు రాళ్లను పరిశీలించారు. అటవీ భూములు ఏవీ అన్యాక్రాంతం కాలేదని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు చెప్పారు. అటవీ భూములకు ఎనిమిది మీటర్ల దూరంలోనే సరస్వతీ భూములు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయినా మరో రెండు రోజులు మాచవరం మండలం భీమవరం, పిన్నెల్లి గ్రామాల సరిహద్దు భూములను కూడా పరిశీలిస్తామన్నారు. ఆయన వెంట డీఆర్వో విజయలక్ష్మి, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ భూముల పరిశీలన మండలంలోని చెన్నయపాలెం, వేమవరం గ్రామాల పరిధిలో ఉన్న రెవెన్యూ భూములను తహసీల్దార్ క్షమారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరస్వతీ సంస్థకు చెందిన కొంత భూమి వెబ్ల్యాండ్ చేయడం జరిగిందని, మరికొంత భూమి వెబ్ల్యాండ్ చేయాల్సి ఉందని చెప్పారు. రికార్డులను తనిఖీ చేసి ప్రభుత్వ భూములు ఏమైనా అన్యాక్రాంతం అయ్యాయా లేదా అనే విషయాన్ని తేలుస్తామని చెప్పారు. వార్తా కథనాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులు ఆ గ్రామాల్లోని భూములలో సర్వే చేస్తామని తెలిపారు. -
కాలిఫోర్నియాలో మంటల బీభత్సం.. 1200 మంది తరలింపు
కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భీకర వాతావరణం నెలకొంది. కాలిఫోర్నియాలోని అడవిలో ఎగిసిపడుతున్న మంటల కారణంగా సుమారు 1200 మంది వారి నివాస ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతలకు తరలివెళ్లారు. మంటల కారణంగా రెండు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. దక్షిణ కాలిఫోర్నియాలోని అడవిలో మంటలు అంటుకున్నాయి. అడవిలో విస్తరిస్తున్న మంటల కారణంగా కనీసం 1,200 మంది ప్రజలు ఖాళీ చేయవలసి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు. ఇక, మంటల వ్యాప్తితో 16 చదరపు మైళ్ల కంటే ఎక్కువ ప్రాంతం కాలిపోయింది. ఈ మంటలు క్రమంగా ఆ ప్రాంతమంతా చుట్టుముట్టాయి. మరోవైపు.. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ బ్రిగేడ్ ప్రకారం.. ఈ అగ్నికి పోస్ట్ ఫైర్ అని పేరు పెట్టారు. #PostFire update: acreage is now up to 12,265, with containment at 2%. The cause is still under investigation.#CAwx #firewx pic.twitter.com/Y0XxzczIyh— WeatherNation (@WeatherNation) June 17, 2024 మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు. కాలిఫోర్నియా నుండి న్యూ మెక్సికో వరకు కార్మికులు అడవి మంటలను నియంత్రించడానికి కష్టపడుతున్నారు. లాస్ ఏంజిల్స్కు వాయువ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోర్మాన్లోని ఇంటర్స్టేట్-5ఫ్రీవే సమీపంలో ఈ మంటలు శనివారం ప్రారంభమైనట్టు అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదని అధికారులు తెలిపారు. WILD FIRES, CALIFORNIAPost Fire grows to 10,504 acres; Castaic on evacuation warningJUNE 16,2024The Post Fire, which originated in Gorman on Saturday afternoon, has grown to 10,504 acres and is 2% contained as of Sunday morning as Castaic residents have been urged to… pic.twitter.com/rK56bsOu3G— Abhay (@AstuteGaba) June 16, 2024 మరోవైపు.. మంటల కారణంగా హంగ్రీ వ్యాలీ ప్రాంతం నుంచి 1200 మందిని తరలించినట్టు లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ బ్రిగేడ్ తెలిపింది. అలాగే, అగ్ని ప్రమాదం దృష్ట్యా హంగ్రీ వ్యాలీ, పిరమిడ్ సరస్సు రెండూ మూసివేయబడ్డాయి. అలాగే, మంటల వల్ల ఇళ్లకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, అయితే రెండు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. A wind-fueled #California #wildfire that started on Saturday (June 15) spread over 12,000 acres overnight. The fire is 2% contained and has burned through 12,265 acres of land and brush. No injuries reported so far. pic.twitter.com/QOYwqHJRDo— DD News (@DDNewslive) June 17, 2024 -
పా‘పాల’ ధూళిపాళ్ల..‘అవినీతి అనకొండ’
ఆధ్యాత్మిక తరంగాలతో పులకించే పొన్నూరును అవినీతి ‘ధూళి’ కమ్మేసింది. వరుసగా ఐదుసార్లు ప్రజా ప్రతినిధిగా గెలిపించిన అక్కడి ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. ఇసుక, గ్రావెల్, మెటల్ దేన్నీ వదల్లేదు. ‘సంగం డెయిరీ’ని సొంత ఆస్తిలా మార్చుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనా దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై శ్వేతపత్రం అంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఇదీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి చిట్టా. సాక్షి ప్రతినిధి, గుంటూరు: నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్వారీలు, రీచ్ల్లో అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్ సరఫరాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి కాసులు కాజేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో ఈయన సోదరులే కీలకం. ఇసుక రీచ్లపైనే ఆయన సుమారు రూ.500 కోట్లు సంపాదించారంటే ఆయన అవినీతి ఏ స్థాయిదో అర్థమవుతుంది. కొలనుకొండలో అటవీశాఖ భూమిలో ఒక వ్యక్తి మైనింగ్ కోసం అనుమతులు తీసుకుంటే ఆయన్ను బెదిరించి లాభాల్లో 40 శాతం వాటా దక్కించుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు క్వారీ మొత్తాన్నీ కొట్టేశారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న లీజుదారుడిని బెదిరించి దాన్నీ కబళించారు. గుంటూరు నుంచి తెనాలి మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ వర్క్ పనులకు గ్రావెల్ తరలించే కాంట్రాక్టు దక్కించుకుని చేబ్రోలు మండలంలోని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. వడ్లమూడి, చేబ్రోలు, శేకూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సోదరుడు, అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్ చేశారు. చేబ్రోలు మండల పరిధిలోని సుద్దపల్లిలో 25 ఎకరాల పెద్ద చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. సంగం ఆస్తులు స్వాహా.. ► పాడి రైతుల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు. ► చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (సంగం డెయిరీ) మొదట్లో 1964 సహకార చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ ఆ«దీనంలో కొనసాగింది. తరువాత 1995లో చంద్రబాబు హయాంలో మ్యాక్స్ చట్టంలోకి వచ్చిన తరువాత కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. ఈ చట్ట ప్రకారం గుత్తాధిపత్యం పాలకవర్గం అజమాయిïÙలో ఉండేది. ► 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కంపెనీ యాక్ట్లోకి మార్చారు. అప్పటి నుంచి నరేంద్ర తన చేతుల్లోకి తీసుకుని ఆయనే చైర్మన్గా కొనసాగుతున్నారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ను ఏర్పాటు చేసి పది ఎకరాల డెయిరీ స్థలాన్ని ట్రస్టుకు బదలాయించారు. విలువైన భూములూ హాంఫట్... అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో రూ. కోట్లు విలువైన పోరంబోకు భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. పెదకాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు చేతులు మార్చినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజి్రస్టేషన్ చేయించారు. పొన్నూరు దేవదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారు. కేవలం తమ సామాజికవర్గం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదు. 2019 లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోశయ్య నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతుంటే ఏం చేయాలో పాలుపోక ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. కల్యాణ మండపం నిర్వహణతో కాసుల వేట పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పాడి రైతులు తమ సంఘం నిధులతో రోడ్డుపక్కన 30 సెంట్ల స్థలం కొన్నారు. ఈ స్థలంలో ధూళిపాళ్ల తన తండ్రి పేరుతో కల్యాణ మండపాన్ని 2003లో నిర్మించారు. ఆ సమయంలో నలుగురు ఎంపీలు ఈ కల్యాణ మండప నిర్మాణానికి వారి ఎంపీ నిధులు కింద రూ. 23 కోట్లు మంజూరు చేశారు. సాధారణంగా ఎంపీ, ఎమ్మెల్యే నిధుల ద్వారా నిర్మించిన ఏ నిర్మాణాలైనా పంచాయతీ, మున్సిపాలిటీ ఆధీనంలోనే ఉండాలి. కల్యాణ మండపానికి నరేంద్ర తల్లి చైర్మన్గా వ్యవహరిస్తూ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ఏసీబీ కేసులో అరెస్ట్ ► సంగం డెయిరీలో జరిగిన అవకతవకలపై క్రైం నెంబర్– 02/ ఖఇౖ– ఎNఖీ– అఇఆ/2021తో 408, 409, 418, 420, 465, 471, 120–బి రెడ్విత్ 34 ఐపీసీ, సెక్షన్ 13 (1) ( ఛి)( ఛీ) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఏసీబీ కేసు నమోదు చేసింది. పొన్నూరు నియోజకవర్గ చింతలపూడి గ్రామంలో ఆయన స్వగృహంలో ఉండగా ఏసీబీ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసింది. ► సంగం డెయిరీలో పాలవిక్రయాలపై 14% బోనస్ చెల్లించాలని కోరిన పాడి రైతులపై దాడి చేసినందుకు చేబ్రోలు పోలీస్ స్టేషన్లో 15–11–2023న ఎఫ్ఐఆర్ నెంబర్ 286/2023తో ధూళిపాళ్లపై 143,147,148, 427,324,384,506,109,307 ట/ఠీ149 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. దీనిలో ఆయన 14వ ముద్దాయిగా ఉన్నారు. ► పెదకాకాని శివాలయంలో మాంసాహారం వంటకాలపై టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈఓ కార్యాలయం వద్ద ధూళిపాళ్ల నరేంద్ర బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనపై దేవదాయ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు.అనుమతి లేకుండా వచ్చి ఆందోళనలకు దిగారని ఈవో ధూళిపాళ్ల నరేంద్రపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ► కర్ఫ్యూ, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సంగం డెయిరీకి చెందిన 20 మందితో కలిసి హోటల్లో మీటింగ్ నిర్వహించినందుకు గుంటూరు ఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
అరణ్యానికి ఆసరా
అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్ పర్యావరణవేత్త చికో మెండిస్ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ నిఘంటు అర్థానికీ, 1996లో తాము వెలువరించిన తీర్పునకూ తు.చ. తప్పకుండా కట్టుబడివుండాలని మొన్న సోమవారంనాడు సర్వోన్నత న్యాయ స్థానం చెప్పవలసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా మన దేశంలో ‘అడవి’కి నిర్దిష్టమైన నిర్వచనం లేదు. దేశంలో అటవీభూముల విస్తీర్ణం ఎంతో స్పష్టమైన, సమగ్రమైన రికార్డు కూడా లేదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో మొత్తం ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయి. ఇది మరో 1,540 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని మూడేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. అయితే 1980 నాటి అటవీ సంరక్షణ చట్టానికి నిరుడు ఆగస్టులో తీసుకొచ్చిన సవరణల వల్ల ఆ చట్టం పరిధి కుంచించుకుపోయిందనీ, ఫలితంగా 1,97,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడిందనీ పిటిషనర్లు ఆరోపించారు. వివాదాస్పదమైన 1ఏ నిబంధన అటవీప్రాంతంగా రికార్డుల్లో వుండి 1980–96 మధ్య చట్టబద్ధంగా అటవీయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూములు, అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలోవుండి వ్యూహా త్మక అవసరాలకు వినియోగపడే ప్రాంతం ఈ చట్టం పరిధిలోనికి రాదని చెబుతోంది. అలాగే మావోయిస్టు ప్రాంతాల్లో ఆంతరంగిక భద్రతకై చేపట్టే నిర్మాణాల కోసం అయిదు హెక్టార్ల వరకూ అటవీయేతర భూమిగా రికార్డుల్లోవున్న ప్రాంతాన్ని సేకరించవచ్చని చెబుతోంది. ఇక జూ, సఫారీ వంటి అవసరాల కోసం కూడా ఈ తరహా భూమిని తీసుకోవచ్చని వివరిస్తోంది. అడవులే అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంవల్లనో, మరే ఇతర కారణంవల్లనో రికార్డుల్లోకి ఎక్కని భూముల న్నిటికీ ఈ చట్టసవరణవల్ల ముప్పు ఏర్పడుతుందని పిటిషనర్ల వాదన. ఈ కేసులో సుప్రీంకోర్టు వెలు వరించిన తాత్కాలిక ఆదేశాల పర్యవసానంగా 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం నిబంధనలూ, 1996లో సర్వోన్నత న్యాయస్థానం టీఎన్ గోదావర్మన్ కేసులో ఇచ్చిన ఆదేశాలూ వర్తిస్తాయి. అడవులను సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరినప్పుడల్లా అభివృద్ధి మాటేమిటన్న ప్రశ్న వినబడుతూ వుంటుంది. ఆ రెండూ పరస్పర విరుద్ధాలన్నట్టు... ఒకటి కోల్పోతేనే రెండోది సాధ్యమ న్నట్టు మాట్లాడతారు. ఇది సరికాదు. ఏ కారణంతో అడవుల్ని హరించినా అది ఆత్మవినాశనానికే దారితీస్తుంది. అడవులంటే కేవలం వృక్షాలు మాత్రమే కాదు... అక్కడుండే ఆదివాసులూ, ఆ అడవిని ఆలంబనగా చేసుకుని జీవించే వన్యమృగాలతో సహా సమస్త జీవరాశులూ కూడా! అడవులను ధ్వంసం చేసినప్పుడు ఆవాసం కరువై వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడతాయి. ఆదివాసులు జీవిక కరువై ఇబ్బందుల్లో పడతారు. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడేవి. కానీ పర్యావరణానికి కలిగే చేటు అపారమైనది. అటవీప్రాంతం తగ్గితే కరువు, అకాలవర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందువల్ల అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ సమతూకం వుండేలా ప్రభుత్వ విధానాలుండాలి. 2006 నాటి పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద రూపొందించిన పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనలు కొంతమేరకు ఈ సమతూకాన్ని సాధించాయి. అయితే దాన్ని నీరు గార్చిన పర్యవసానంగా మైనింగ్ కోసం, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం, మౌలిక సదుపాయ ప్రాజెక్టుల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తున్న అనుమతులు ఆ సమతూకాన్ని దెబ్బతీసి కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చాయని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక వెలువరించిన కథనాలు వెల్లడించాయి. వివిధ కారణాలవల్ల పర్యావరణ అనుమతులు పొందని కంపెనీలకు ఆర్నెల్లపాటు మినహాయింపునిచ్చిన 2017 నాటి కేంద్ర నిబంధనలే ఇందుకు కారణం. 2017–24 మధ్య వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన బాక్సైట్, బొగ్గు, ఇనుము మైనింగ్లతోపాటు, సిమెంట్ ఫ్యాక్టరీలు, సున్నపురాయి వంటి వంద ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని ఆ కథనం చెబుతోంది. 1996లో జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ బీఎన్ కృపాల్ ఇచ్చిన తీర్పు అడవికి విస్తృత నిర్వచనాన్నిచ్చింది. దాని ప్రకారం చట్టం నిర్వచనానికి సరిపోయే అటవీప్రాంతాలతోపాటు యాజమాన్యం ఎవరిదన్న అంశం జోలికి పోకుండా అడవిగా చట్టం గుర్తించిన అన్ని ప్రాంతాలూ అడవులు గానే భావించాలి. నిరుడు అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన సందర్భంగా పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర పర్యావరణమంత్రి భూపేందర్ యాదవ్ ఆ చట్టం వల్ల ఆదివాసీ ప్రాంతా ల్లోని పాఠశాలల్లో కనీసం ఆడపిల్లల కోసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోతున్నామని వాపోయారు. ఇందులో నిజం లేదు. 2006 నాటి అటవీ హక్కుల చట్టం అలాంటి అవసరాల కోసం మినహాయింపునిస్తోంది. పర్యావరణ సమతూకాన్ని సాధించగలిగినప్పుడే దేశంలో హరితావరణాన్ని కాపాడు కోగలుగుతాం. చాలా దేశాలు అడవుల్ని కోల్పోయిన పర్యవసానంగా జరిగిన నష్టాన్ని గమనించుకుని వాటి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు అడవులను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. ధర్మాసనం చెప్పినవిధంగా ఏప్రిల్ 15కల్లా దేశంలోని అన్ని రకాల అటవీ భూములపై సమగ్ర వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలి. అడవుల రక్షణపై పౌరుల అవగాహనను పెంపొందించే చర్యలకు ఉపక్రమించాలి. -
అతిపెద్ద టైగర్ రిజర్వ్!
భోపాల్: మధ్యప్రదేశ్లోని రెండు అభయారణ్యాలను కలిపేసి దేశంలోనే అతిపెద్దదైన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. మధ్యప్రదేశ్లోని నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపేయనున్నట్లు ఒక నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. సాగర్, దామోహ్, నర్సింగ్పూర్, రేసిన్ జిల్లాల్లో విస్తరించిన ఈ రెండు అభయారణ్యాలను కలిపేస్తే దేశంలోనే పెద్దదైన 2,300 కిలోమీటర్ల విస్తీర్ణంలో నూతన అభయారణ్యం ఆవిష్కృతం కానుంది. ఇది వచ్చే రెండు, మూడు నెలల్లో ఏర్పాటుకానుంది. -
గిరిజనులనుంచి 18,665 ఎకరాలను గుంజుకున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ఆ భూములపై హక్కులు కల్పించాల్సింది పోయి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 18,665 ఎకరాల భూములను వారి నుంచి లాక్కున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. 1,950 మంది గిరిజనుల నుంచి ఈ భూములను లాక్కున్నారని ఆయన చెప్పారు. శనివారం టీపీసీసీ ఎస్టీ సెల్, కిసాన్సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో జరిగిన అటవీభూముల హక్కులపై రౌండ్టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ భూములపై హక్కుల కల్పన కోసం గిరిజనుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చా రు. అటవీభూములకు పోడు భూములనే పేరు పెట్టి వాటిపై గిరిజనులకు హక్కులు కల్పించకుండా టీఆర్ఎస్ చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాల భూమిని గిరిజనులకు పంపిణీ చేశామని, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వీహెచ్, రాములు నాయక్, కోదండరెడ్డి, మంగీలాల్ నాయక్, చారులతా రాథోడ్ పాల్గొన్నారు. -
భూ ఆక్రమణలపై కన్నెర్ర!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ భూముల ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. మునిసిపాలిటీ, అటవీ భూములను ఆక్రమించుకున్న వారిని రెండు నెలల్లోగా గుర్తించి ఆ తరువాత ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించిన తరువాత తిరిగి కబ్జాల బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే విషయంలో నిబంధనలు అనుసరించాలని అధికారులకు సూచించింది. పంచాయతీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల పేరు మీద క్రమబద్ధీకరించరాదని, వాటిని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించాల్సిందేనంటూ జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు 2011లోనే విస్పష్టమైన తీర్పు ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. సుప్రీం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జీవో 188 జారీ చేసి ఆక్రమణల తొలగింపునకు నిబంధనలు రూపొందించిందని తెలిపింది. అయినప్పటికీ అధికారులు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆక్రమణలపై పలు వ్యాజ్యాలు దాఖలు.. జీవో 188 జారీ అయినప్పటికీ ప్రభుత్వ భూములు, నీటి వనరులు, అటవీ, క్రీడా స్థలాలు, శ్మశానాల స్థలాలను ఆక్రమణల నుంచి అధికారులు కాపాడటం లేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది బుస్సా రాజేంద్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై పలు పిల్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై సీజే ధర్మాసనం ఉమ్మడిగా విచారణ జరిపింది. ఆక్రమణల చెర నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితి మారాలి... ‘జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం 2011లో జీవో 188 జారీ చేసింది. ఆ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ (ఆస్తుల పరిరక్షణ) రూల్స్ను తెచ్చింది. వీటి ప్రకారం పంచాయతీ భూములను మూడు రకాలుగా వర్గీకరించింది. 1.సొంతవి, సేకరించిన భూములు 2. దానంగా, విరాళంగా, పంచాయతీలకు బదిలీ చేసిన భూములు 3. పంచాయతీకి చెందిన భూములు. ఏటా పంచాయతీ పరిధిలోని భూముల వివరాలను సేకరించి గెజిట్లో ప్రచురించాలి. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఖాళీ చేయించాలి. ఆక్రమణల గుర్తింపు, తొలగింపు కోసం కలెక్టర్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ మూడు నెలలకొకసారి సమావేశమై ఆక్రమణల తొలగింపు పురోగతిని సమీక్షించాలి. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా దురదృష్టవశాత్తూ అధికారులు వీటిని అమలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఏటా పెరిగిపోతున్నాయి. హైకోర్టులో పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు నిబంధనలను అమలు చేయడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ఆక్రమణదారుల చెర నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. çపంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలి’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే ముందు నోటీసు ఇచ్చి వారి వాదన వినాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట సమయం నిర్ణయించుకుని ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని మునిసిపల్ అధికారులకు తేల్చి చెప్పింది. పంచాయతీ కార్యదర్శులంతా జీవో 188 ప్రకారం ఆక్రమణదారులను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పంచాయతీ భూముల నుంచి ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని నిర్దేశించింది. వక్ఫ్ భూములను ఈ జాబితాలో చేర్చలేం.. ధర్మాసనం మొదట తన ఉత్తర్వులను పంచాయతీ, మునిసిపల్, అటవీ భూములకే పరిమితం చేయగా రెవెన్యూ, దేవదాయశాఖ భూములను కూడా జత చేయాలని రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ రెవెన్యూ భూములను ఆక్రమణల తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చింది. దేవదాయ శాఖ భూములపై వేరుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వ మరో న్యాయవాది ఖాదర్ బాషా జోక్యం చేసుకుంటూ వక్ఫ్ భూములు కూడా పెద్ద సంఖ్యలో ఆక్రమణల్లో ఉన్నాయని, వాటిని కూడా ఆ ఉత్తర్వుల్లో చేర్చాలని కోరారు. అయితే ధర్మాసనం అందుకు నిరాకరిస్తూ వక్ఫ్ భూముల విషయంలో బహుళ వివాదాలుంటాయని, అందువల్ల వాటిని ఈ ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురాలేమని పేర్కొంది. -
గుడిసెల తొలగింపుతో తిరగబడిన ఆదివాసీలు
సాక్షి, మంచిర్యాల/దండేపల్లి: అటవీ భూముల్లో గిరిజనుల గుడిసెల తొలగింపుతో జోరు వర్షంలోనూ అటవీ, పోలీసు అధికారులు, గిరిజనులకు మధ్య రెండో రోజూ ఘర్షణ కొనసాగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ శివారు అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న ఆరు తాత్కాలిక గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్త తకు దారి తీసింది. గుడిసెలు తొలగించేందుకు శుక్రవారం ఉదయమే లక్సెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్ దాదాపు వంద మంది సిబ్బందితో వెళ్లారు. దీంతో గిరిజనులు కర్రలు, కారం పొడితో అధికారు లపై తిరగబడ్డారు. ఈ సందర్భంగా ఆరుగురు మహిళలను అధికారులు జీపుల్లో తరలి స్తుండగా గిరిజనులు దారిపొడవునా అడ్డుకుని, తమ వారిని విడిచిపెట్టాలని ఆందోళన చేశారు. అధికారులు వారిని పక్కకు నెట్టి మహిళలను తాళ్లపేట రేంజి ఆఫీసుకు తరలించారు. అక్కడ కూడా గిరిజనులు బైఠాయించి, సీపీఎం, వ్యవ సాయ కార్మిక సంఘం, బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేప ట్టారు. ఆది వాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమా ండ్ చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ హన్మంతరావు.. ఆ మహిళ లను బైండోవర్ చేస్తూ, 6 నెలలపాటు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని, లేకపోతే రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చ రించి విడిచిపెట్టారు. ఇందులో దోసండ్ల సునీత అనే మహిళ తనను ఒంటరిగా గదిలో నిర్బంధించి అధికారులు చిత్రహింసలకు గురి చేశారని రోదిస్తూ చెప్పింది. రిజర్వు ఫారెస్టులో ఆక్రమణలు చేపడుతున్నారని, గత నెల 1న అటవీ అధికారులు కేసులు నమోదు చేయగా, అప్పటి నుంచి ఇరు పక్షాలమధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. -
పులుల కోసం ఓ వంతెన
సాక్షి, హైదరాబాద్: తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడినుంచే తెలంగాణలోని అడవుల్లోకీ పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్. ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్పూర్–విజయవాడ ఎక్స్ప్రెస్వే నిర్మితం కాబోతోంది. 4 వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ వాటి ప్రాణానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 150 మీటర్ల పొడవుతో ఎకో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. అంటే వన్యప్రాణులు రాకపోకలు సాగించే సమయంలో జాతీయ రహదారిని దాటేందుకు సహజ సిద్ధ వాతావరణం కల్పిస్తూ నిర్మించే వంతెన అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల పరిరక్షణలో మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ తరహా నిర్మాణం తెలంగాణలోనే మొదటిది కానుండటం విశేషం. దీనికి మరో 2 కి.మీ. దూరంలో 200 మీటర్ల పొడవుతో అండర్పాస్నూ నిర్మిస్తున్నారు. మొదటి వంతెన వద్ద వాహనాలు దిగువ నుంచి సాగితే, జంతువు లు పైనుంచి రోడ్డును దాటుతాయి. రెండో నిర్మాణం వద్ద.. వాహనాలు ఫ్లైఓవర్ మీదుగా.. జంతువులు దిగువ నుంచి దాటుతాయి. మూడు రాష్ట్రాలను కలిపే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు సాగే ఈ కారిడార్లో తెలంగాణలోని మంచిర్యాల నుంచి విజయవాడ వరకు పూర్తి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెవేగా రోడ్డును నిర్మించబోతున్నారు. దీనికి కేంద్రం నుంచి ఆమోదం వచ్చినందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనివల్ల నాగ్పూర్–విజయవాడ మధ్య దూరం 180 కి.మీ. మేర తగ్గనుంది. తెలంగాణ నుంచి విజయవాడకు ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఈ రోడ్డు బిజీగా మారి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తోంది. ప్రతిపాదిత కొత్త రోడ్డు మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేని వాహనాలు అటుగా మళ్లి.. ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారిపై భారాన్ని తగ్గిస్తాయి. వైల్డ్లైఫ్ బోర్డు సిఫారసుతో.. ఇందులో మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్–మంచిర్యాల వరకు 2 వరుసల పాత రోడ్డు ఉంది. దాన్నే 4 వరుసలకు విస్తరిస్తారు. మంచిర్యాల నుంచి పూర్తి కొత్త రోడ్డును నిర్మిస్తారు. ఆసిఫాబాద్ మీదుగా విస్తరించే 4 వరుసల రహదారితో వన్యప్రాణులకు ఇబ్బందిగా మారడంతో అటవీశాఖతోపాటు ప్రత్యేకంగా వైల్డ్లైఫ్ బోర్డు నుంచి క్లియరెన్సు తీసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ దరఖాస్తు చేసుకోగా, గతేడాది వైల్డ్లైఫ్ కమిటీ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని సర్వే చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప అనుమతులు సాధ్యం కాదని తేల్చారు. అనంతరం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త బిలాల్ హబీబ్ నేతృత్వంలోని బృందం పర్యటించి మహారాష్ట్ర–ఆసిఫాబాద్ సరిహద్దు వద్ద 150 మీటర్ల మేర ఎకో బ్రిడ్జిని, ఆ తర్వాత 200 మీటర్ల మేర అండర్పాస్ కట్టాలని సిఫారసు చేసినట్టు అధికారులు చెప్పారు. నాయిస్ బారియర్స్ ఏర్పాటు ఎక్స్ప్రెస్ వే కావడంతో వాహనాలు 150 కి.మీ. వేగంతో దూసుకుపోతాయి. అప్పుడు విపరీతమైన శబ్దం వస్తుంది. అది వన్యప్రాణులను బెదరగొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకోసం ప్రతిపాదిత బ్రిడ్జి, అండర్పాస్ వద్ద వాహనాల శబ్దాన్ని వెలుపలికి బాగా తగ్గించి వినిపించేలా నాయిస్ బారియర్స్ ఏర్పాటు చేయాలని కూడా వైల్డ్ లైఫ్ బోర్డు ఆదేశించింది. దాంతోపాటు ఎకో బ్రిడ్జి మీదుగా జంతువులు దాటే ప్రాంతంలో ఎక్కడా అది ఓ కట్టడం అన్న భావన రాకుండా చూస్తారు. సాధారణ నేల, దానిపై చెట్లు ఉండేలా డిజైన్ చేస్తారు. అది మామూలు భూమే అనుకుని జంతువులు రోడ్డును సురక్షితంగా దాటుతాయి. -
అటవీ భూముల ఆక్రమణలను గుర్తించాలి
సాక్షి, అమరావతి: భూ వివాదాలకు తెర దించుతూ శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టిన సమగ్ర భూ సర్వేను వేగవంతం చేయాలని జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అధికారులకు సూచించింది. ప్రభుత్వ భూములు, అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించేందుకు అవసరమైతే రెవెన్యూ, అటవీశాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వే చేయాలని స్పష్టం చేశారు. తొలుత అటవీ భూముల సరిహద్దులను నిర్దిష్టంగా గుర్తించాలన్నారు. సబ్ కమిటీ గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో సమావేశమై పలు సూచనలు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్) శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిదార్ధ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ ఎం.ఎం.నాయక్, డీఎంజీ వెంకటరెడ్డి, డీటీసీపీ డైరెక్టర్ రాముడు తదితరులు పాల్గొన్నారు. కాపాడకుంటే పర్యావరణ సమస్యలు.. దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తూ తొలిదశలో 51 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి కాగా ఈ ఏడాది చివరి నాటికి 11,501 గ్రామాల్లో పూర్తి చేసే లక్ష్యంతో కృషి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించిది. అటవీశాఖ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం, నకిలీ ధ్రువపత్రాలతో ఆక్రమించుకున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భాల్లో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేస్తున్నారని చెప్పారు. అటవీ భూములను కాపాడుకోకుంటే పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వీటిని నివారించేందుకు శాస్త్రీయంగా ఆక్రమణలను గుర్తించాలన్నారు. సర్వే పనులు ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల వ్యయంతో 4,500 సర్వే బృందాలతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు సబ్ కమిటీ పేర్కొంది. ఇప్పటికే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమైనట్లు తెలిపింది. 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2 వేల రోవర్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర భూసర్వే జరుగుతోందన్నారు. 2023 జూన్ నాటికి దశలవారీగా రీసర్వే పూర్తి కావాలన్న లక్ష్యం మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు 1,287 గ్రౌండ్ ట్రూతింగ్ లో భాగంగా 1,287 ఆవాస ప్రాంతాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 606 గ్రామాల్లో తొలివిడత మ్యాపింగ్, 515 హ్యాబిటేషన్లలో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 161 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ వాలిడేషన్ ముగిసింది. అన్ని శాఖల సమన్వయంతో రీసర్వేను లక్ష్యం మేరకు పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. -
అడవులకు అగ్గి ముప్పు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి అగ్నిప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం హెచ్చరించింది. అక్కడక్కడా మరికొన్నిచోట్ల కూడా అడవులకు నిప్పంటుకునే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా విడుదల చేసిన ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్)’లో ఈ వివరాలను వెల్లడించింది. కొన్నిచోట్ల అడవులకు అతిఎక్కువ ప్రమాదం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతమున్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోనే ఈ ప్రాంతాలు ఉన్నట్టు తెలిపింది. 2018 నవంబర్ నుంచి 2019 జూన్ మధ్యకాలంలో.. తెలంగాణకు సంబంధించి మోడీస్ ద్వారా 1,246, ఎస్ఎన్నపీపీ–వీఐఆర్ఎస్ ద్వారా 15,262 అగ్ని ప్రమాద హెచ్చరికలు వచ్చాయని వెల్లడించింది. ఉపగ్రహాల ద్వారా పరిశీలించి.. మనదేశంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విభాగం ఉపగ్రహాల ద్వారా అడవుల్లో అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తోంది. ‘ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ సిస్టమ్’ ద్వారా నిప్పు అంటుకున్న, అగ్ని ప్రమాదం జరిగే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపడుతోంది. ఎక్కడ ప్రమాదం జరిగినా.. ఆ ప్రాంతంలోని సంబంధిత అధికారులు, గ్రామ కార్యదర్శులకు సమాచారం వెళ్లేలా ఏర్పాటు ఉంది. మోడీస్, ఎస్ఎన్నపీపీ–వీఐఆర్ఎస్ శాటిలైట్ డేటా ద్వారా ఈ హెచ్చరికలను పంపుతుంటారు. ఇప్పటికే జాగ్రత్తగా.. తెలంగాణలోని 43 అటవీ రేంజ్లలో మొత్తం 9,771 కంపార్ట్మెంట్లకు గాను 1,106 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలకు ఆస్కారమున్నట్టు గతంలోనే గుర్తించారు. ఆయా చోట్ల కనీసం ఐదుగురు సిబ్బంది, ప్రత్యేక వాహనం, నిప్పును ఆర్పే బ్లోయర్ పరికరాలతో క్విక్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని కంపార్ట్మెంట్లలో ఫైర్ లైన్లను ఏర్పాటు చేసి, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఫిబ్రవరి నుంచి మేదాకా అడవుల్లో అగ్ని ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ. అటవీ మార్గాల్లో మంటలు పెట్టకుండా, వంట చేయకుండా.. కాలుతున్న సిగరెట్, బీడీల లాంటివి పడేయకుండా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపడితే మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో అక్కడక్కడా చిన్నస్థాయిలో నిప్పు అంటుకోవడం సాధారణమేనని.. కానీ నియంత్రించలేని స్థాయికి చేరి కార్చిచ్చులుగా మారితే.. తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. -
600 ఎకరాల అటవీ భూమి అమ్మకానికి సిద్ధం..?!
సాక్షి, వరంగల్: ఏండ్లుగా అటవీ శాఖ అధీనంలో ఉన్న భూమి తన భూమి అంటూ ఓ వ్యక్తి కోటి రూపాయాలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వైనం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్కు చెందిన భూమి తమ దానం(హిబా) ద్వారా తనకు సంక్రమించిందని పేర్కొంటూ సదరు వ్యక్తి భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కొంత మంది వ్యక్తులకు విక్రయించినట్లు జోరుగా ప్రచారం నడుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నంబర్ 41లో 1298.03 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 41 సర్వే నంబర్లోను పూర్తి విస్తీర్ణం అటవీ(మహాసూర) భూమిని రెవెన్యూ అధికారులో రికార్డులో నమోదు చేశారు. సంవత్సారాలుగా పహణీ రికార్డులో, ధరణిలో సైతం మొత్తం ఎకరాలు అటవీ భూమిని అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. సదరు భూమి మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ అని రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. సర్వే నంబర్ 41 పరిధిలోని 600ఎకరాల భూమి తనదంటూ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగిరిగ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. సేత్వార్ రికార్డులో అప్పటి అధికారులు 41 సర్వేనంబర్ ఎవరికీ కేటాయించకపోవడంతోనే ఈ తతంగం అంత నడించిందని పలువురు చర్చించుకుంటున్నారు. ధరణిలో అడవి పేరుతో ఉన్న రికార్డు -
8,208 మంది.. 17,449 ఎకరాల భూమి ఆక్రమణ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని అటవీ భూమిలో పోడు ఆక్రమణ ఎంతో తేలింది. 10 మండలాల్లోని 95 గ్రామ పంచాయతీలకు చెందిన 125 గ్రామాలు, ఆవాసాల్లో ఈ ఆక్రమణ భూమి ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. మొత్తంగా 8,208 మంది ఆధీనంలో 17,449 ఎకరాలు ఉందని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. ఈనెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామసభల ద్వారా ఈ దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఈలోగా ప్రభుత్వం నుంచి వచ్చే గైడ్లైన్స్తో అధికార యంత్రాంగం దరఖాస్తుల స్వీకరణపై ముందుకెళ్లనుంది. అటవీ భూమి 1.57 లక్షల ఎకరాలు.. జిల్లావ్యాప్తంగా 10.77 లక్షల ఎకరాల్లో భూమి ఉంది. ఇందులో అటవీ విస్తీర్ణం 1,57,888 ఎకరాలు (14.66 శాతం). మొత్తం అటవీ భూమిలో ప్రస్తుతం ఇందులో 17,449 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అత్యధికంగా కారేపల్లి (సింగరేణి) మండలంలో 1,510 మంది ఆధీనంలో 4,673.315 ఎకరాలు, ఆ తర్వాత సత్తుపల్లి మండలంలో 2,355మంది చేతిలో 3,208.27 ఎకరాల భూమి ఉంది. 2005 నుంచి ఇప్పటి వరకు 17,861 ఎకరాలకు సంబంధించి అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. ఎఫ్ఆర్సీ కమిటీ పర్యవేక్షణలో.. ఫారెస్ట్ రైట్స్ కమిటీ (ఎఫ్ఆర్సీ) ఆధ్వర్యంలో మొదటిగా గ్రామసభ నిర్వహిస్తారు. ఈ కమిటీకి పోడుదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సంబంధిత అధికార బృందం విచారణ, సర్వే పూర్తి చేస్తుంది. అనంతరం అర్హులు ఎవరన్నది గ్రామసభ తీర్మానం చేసి దరఖాస్తులను సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపుతుంది. అక్కడి నుంచి ఈ నివేదిక జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీకి చేరుతుంది. ఈ కమిటీ పరిశీలించిన తర్వాత హక్కుపత్రాలను పోడుదారులకు జారీ చేస్తుంది. ఈనెల 8 నుంచి అటవీ భూమి ఆక్రమణకు గురైన 95 గ్రామ పంచాయతీల వారీగా 95 బృందాలు దరఖాస్తులు స్వీకరించనున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో ఆర్వోఎఫ్ఆర్ 2005 చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న అర్హులైన పోడుదారులను గుర్తించి హక్కపత్రాలు ఇస్తారు. గిరిజన సంక్షేమ శాఖ ఈ ప్రక్రియను అంతా పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అటవీ భూమి సంరక్షణకు హద్దులు నిర్ణయిస్తారు. ఈ భూమి సంరక్షణ కోనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజిలెన్స్ వింగ్ను ఏర్పాటు చేస్తారు. ఎస్టీల ఆధీనంలో 56 శాతం.. జిల్లాలోని 10 మండలాల్లో పోడు భూమి ఉంటే..ఎస్సీ,ఎస్టీ, గొత్తికోయ, ఇతర కేటగిరిలకు చెందిన మొత్తం 8,208 మంది 17,449 ఎకరాలను ఆక్రమించారు. ఇందులో ఎస్టీల చేతిలో అత్యధికంగా 9764 ఎకరాలు ఉండగా.. ఎస్సీలకు 1,602 ఎకరాలు, గొత్తికోయలు ఆధీనంలో 116 ఎకరాలు ఉంది. ఇతర కేటగిరిలకు చెందిన వారు మిగితా అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. సుమారు 56 శాతం ఎస్టీల ఆధీనంలోనే ఈ ఆక్రమణకు గురైన భూమి ఉంది. మిగితా 44 శాతం ఎస్సీలు, గొత్తికోయలు, ఇతర కేటగిరిల చేతిలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. గైడ్లైన్స్ ప్రకారం చర్యలు.. ప్రభుత్వం పోడు భూములపై దరఖాస్తుల స్వీకరణ, అఖిలపక్ష పార్టీలతో సమావేశంపై జిల్లా యంత్రాంగాలకు గతంలో సూచనలు చేసింది. ఈ ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో అఖిలపక్ష పార్టీలతో సమీక్ష సమావేశం కూడా పూర్తయింది. అయితే ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ, అర్హుల గర్తింపు ప్రక్రియ ఎలా ఉండాలన్న దానిపై ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారమే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. పోడుదారులను ఎలా గుర్తించాలన్న దానిపై అఖిలపక్ష పార్టీల నేతలు, ఆదివాసీ సంఘాలు కూడా జిల్లా యంత్రాంగానికి, నేరుగా ప్రభుత్వ పెద్దలకు పలు దఫాలుగా వినతులు అందించారు. ప్రభుత్వ గైడ్లైన్స్కు అనుగుణంగానే ఎఫ్ఆర్సీ కమిటీలు గ్రామసభ అర్హుల జాబితాను ఫైనల్ చేసి సబ్ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి కమిటీకి పంపనుంది. మండలాల వారీగా ఆక్రమణకు గురైన భూమి (ఎకరాల్లో..), పోడు దారుల సంఖ్య ఇలా ఉంది మండలం పోడుదారులు భూమి సత్తుపల్లి 2,355 3,208.27 కొణిజర్ల 1,575 3,682 సింగరేణి 1,510 4,673.315 పెనుబల్లి 1,182 1,580.8 రఘునాథపాలెం 735 1,795.525 కామేపల్లి 314 988.2275 ఏన్కూరు 282 1,087.975 తల్లాడ 104 270.8 చింతకాని 88 130 వేంసూరు 63 31.75 మొత్తం 8,208 17,448.66 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పోడుదారులు భూమి –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– సత్తుపల్లి 3,208.27 కొణిజర్ల సింగరేణి 4,673.315 పెనుబల్లి 1,580.8 రఘునాథపాలెం 1,795.525 కామేపల్లి 988.2275 ఏన్కూరు 1,087.975 తల్లాడ 270.8 చింతకాని 130 వేంసూరు 31.75 ––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పొటోరైటప్ 02సీకేఎం01: కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో అటవీ భూమి గూగుల్మ్యాప్ -
Telangana: పోడుపై బహుముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: పోడు భూములు, అడవుల పరిరక్షణ, హరితహారం అమలు తీరుతెన్నులపై సీఎం కేసీఆర్కు ఉన్నతాధికారుల బృందం శుక్రవారం నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అంశాలపై సీఎం ఓఎస్డీ భూపాల్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తూలతో కూడిన బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతోంది. ఇందుకు సంబంధించి 13 జిల్లాల కలెక్టర్లు, అటవీ, రెవెన్యూ, ఎస్టీ సంక్షేమం, పీఆర్, పోలీస్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ అంతా శుక్రవారంతోనే ముగియనుంది. తమ క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన అంశాలు, సమీక్షల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు అందజేసిన వివరాలు, సమాచారం ఆధారంగా శుక్రవారం రాత్రికల్లా ముఖ్యమంత్రికి నివేదిక సమరి్పంచనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఎలా ముందుకెళ్లాలి? పోడు సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన బహుముఖ వ్యూహం, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్వోఎఫ్ఆర్), పోడు చేస్తున్న వారిని మరో చోటికి తరలింపు, పునరావాస చర్యలు, అటవీ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఇంకా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలు నివేదికలో పొందుపరచనున్నారు. అలాగే ఇకముందు ఆక్రమణలు జరగకుండా ఏమి చేయాలి? హరితహారంలో భాగంగా అడవుల పునరుజ్జీవం, పట్టణ అటవీ పార్కుల తీరుతెన్నులు, రిజర్వ్ ఫారెస్ట్ వెలుపల మొక్కలు, చెట్ల పెంపకానికి చేపట్టాల్సిన కార్యాచరణను వివరించనున్నారు. పోడు, ఇతర సమస్యలు ఎక్కువగా ఉన్న కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ఉన్నతస్థాయి బృందం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం ఉదయం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పోడు భూములపై సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే పోడు పట్టాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో పాటు ధరణి పోర్టల్కు సంబంధించిన సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. అటవీ అంచున కేటాయింపు! అడవుల మధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవీ అంచున వారికి భూమి కేటాయింపు, తరలించిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి, వసతులు కల్పించడం, రైతుబంధు, రైతుబీమా వర్తింప చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అటవీ భూముల రక్షణ నిమిత్తం అటవీ పరిరక్షణ కమిటీల నియామకానికి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా అటవీశాఖే బాధ్యత తీసుకునేలా చర్యలు చేపడతారు. సమావేశం ముగిశాక పోడు భూములకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టి, వాటిల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వారి వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 3,31,070 ఎకరాలు ..లక్ష మందికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో 3,31,070 ఎకరాల పోడు భూములను దాదాపు లక్ష మంది వరకు గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు పంపిణీ చేయాల్సి ఉన్నట్టుగా అటవీశాఖ ప్రాథమికంగా తేల్చినట్టు సమాచారం. 2006లో కేంద్ర ప్రభుత్వం అటవీహక్కుల గుర్తింపు చట్టం తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఈ భూములకు సంబంధించి గ్రామసభ ఆమోదించిన వారికే పట్టాలు ఇవ్వాలి. 2017 ఆఖరుకు మొత్తం 11 లక్షల ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులందాయి. 6,30,714 ఎకరాలకు సంబంధించి హక్కులు కల్పించాలంటూ 1,83,107 మంది దరఖాస్తు చేసుకున్నారు. 4,70,605 ఎకరాలకు సంబంధించి 3,427 సా మూహికంగా క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులు అందాయి. ఇందులో భాగంగా వ్యక్తిగత క్లెయిమ్స్ కింద 3 లక్షల ఎకరాలకు సంబంధించి 93,494 మందికి హక్కుపత్రాలు ఇచ్చారు. సామూహికంగా 721 క్లెయిమ్స్లో భాగంగా 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలిచ్చారు. -
ఉచ్చులు అమర్చిన వారిపై కఠిన చర్యలు
ములుగు: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ఉచ్చులు అమర్చే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ హెచ్చరించారు. జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి అటవీ ప్రాంతంలో అమర్చిన ఉచ్చుకు పులి బలి అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్తో కలసి మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఆగస్టు 1న పులి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చినట్లు పాదముద్రల ద్వారా గుర్తించామన్నారు. ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాల ద్వారా పులి కదలికలను పరిశీలించామని తెలిపారు. ఎస్ఎస్ తాడ్వాయి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిక్కుకొని పులి మృతి చెందిందనే సమాచారం మేరకు అప్రమత్తం అయ్యామన్నారు. వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి మృతిచెందిన పులి గోర్లను, చర్మాన్ని అమ్మడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్లు తెలియడంతో ఆదివారం కాటాపురం సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టామని చెప్పారు. ఒక వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి వద్ద పులి గోర్లు, చర్మం లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొడిశాలగుంపునకు చెందిన మడవి నరేశ్, మడవి ఇరుమయ్య, మడకం ముఖేశ్, మడవి దేవ, మడవి గంగయ్య ఉన్నారని వివరించారు. కూలీ డబ్బులు చాలకపోవడంతో అటవీ జంతువులను వేటాడే దురాలోచనకు పూనుకొని ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. పులి తిరుగుతుందనే సమాచారంతో ఉచ్చులు ఏర్పాటు చేయగా.. గత నెల 21న ఉచ్చులో పడి పులి మృతి చెందిందని శోభ చెప్పారు. పులి శరీర భాగాలను స్థానికులు మడకం రామ, మడకం ఉందయ్య, కోవాసి ఇడుము అడవిలో దాచిపెట్టారని.. విచారణలో ప్రశ్నించగా వాటిని చూపించారని తెలిపారు. స్థానిక వెటర్నరీ వైద్యుడు, ఎఫ్డీఓ వీటిని నిర్ధారించారని పేర్కొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న పీసీసీఎఫ్ శోభ పులుల సంరక్షణ అందరి బాధ్యత... అంతరించిపోయే స్థితిలో ఉన్న పులుల సంరక్షణ బాధ్యత సమాజంలోని అందరిపై ఉందని సీసీఎఫ్ శోభ చెప్పారు. ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య, వరంగల్ సర్కిల్ సీసీఎఫ్ ఆశ, డీఎఫ్ఓ శివఆశీష్, ఎస్ఎస్ తాడ్వాయి ఎఫ్డీఓ ప్రశాంత్ పాటిల్, ములుగు ఎఫ్డీఓ జోగేంద్ర, పస్రా ఇన్స్పెక్టర్ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్రావు, వెటర్నరీ డాక్టర్ కరుణాకర్, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
తెరపైకి ‘పోడు’ గోడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ పరిరక్షణ, పోడు భూములు, ఆక్రమణల అంశానికి మరోసారి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే నెపంతో అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో వేసిన పంటలు నాశనం చేయడంతో పాటు మొక్కలు నాటి తమను వాటిల్లో వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పోడు రైతులు వాపోతున్నారు. 2005 తర్వాత రాష్ట్రంలో కొత్తగా పోడు అనేదే లేదని, తెలంగాణ ఏర్పడ్డాక గత ఏడేళ్లలో అటవీ భూముల్లో ఆక్రమణలు భారీగా పెరగడంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోందని అటవీ, రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించి, జిల్లాల వారీగా పోడు భూములు, వాటిలో ఇంకా ఎవరెవరికి, ఎన్ని ఎకరాల్లో పట్టాలు ఇవ్వాలో లెక్క తేల్చే పనిలో పడింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుతం అటవీ శాఖ ఏయే జిల్లాల్లో పోడు కింద ఎంత భూమి ఉంది, ఎన్ని ఎకరాల్లో అటవీ ఆక్రమణలు జరిగాయి, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్వోఎఫ్ఆర్) కింద ఎంతమేర హక్కు పత్రాలు ఇచ్చారో లెక్కలు తీసేపనిలో పడింది. దేశ వ్యాప్తంగా అటవీ భూములు పంపిణీ చేస్తే అడవులతో పాటు పర్యావరణం దెబ్బతింటుందని కొన్ని ఎన్జీవో సంస్థలు కేసు వేయడంతో ఆర్వోఎఫ్ఆర్ కింద భూముల పంపిణీపై 2019 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో తెలంగాణ సహా ఏపీ, త్రిపుర ఇతర రాష్ట్రాల్లో అప్పట్నుంచీ పోడు భూముల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ, సర్వే విభాగాలు ఉమ్మడిగా మొత్తం రాష్ట్రంలోని అటవీ భూముల సర్వే నిర్వహిస్తే అటవీ విస్తీర్ణం, ఆక్రమణలు, పోడు, ఇతర అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే ప్రభుత్వపరంగా ఇతర చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం తగ్గుదల: అడవుల విస్తీర్ణాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యంత వేగంగా, అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 24 శాతం అడవులున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో ఈ విస్తీర్ణం పది శాతం వరకే ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ భూముల ఆక్రమణలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన అడవే కనిపించకుండా పోయే స్థితి దాపురిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద హక్కు పత్రాల పంపిణీ రాష్ట్రంలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్–ఆర్ఓఎఫ్ఆర్) కింద 2017 చివరినాటికి 11 లక్షల ఎకరాల్లో హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ అందాయి. వాటిలో 1,83,107 మంది వ్యక్తిగతంగా (6,30,714 ఎకరాలకు) దరఖాస్తు చేయగా సామూహిక (కమ్యూనిటీ) క్లెయిమ్స్ కింద 3,427 దరఖాస్తులు (4,70,605 ఎకరాలకు) అందాయి. వాటిలో వ్యక్తిగత క్లెయిమ్స్లో భాగంగా 93,494 మందికి 3 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు పంపిణీ చేశారు. 721 సామూహిక క్లెయిమ్స్ కింద 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలు అందజేశారు. మిగతా వాటి లో కొన్ని క్లెయిమ్స్ తిరస్కరించగా కొన్ని పెండింగ్లో ఉన్నట్టుగా అటవీ, ఎస్టీ సంక్షే మ శాఖలకు చెందిన రికార్డులను బట్టి స్పష్టమవుతోంది. గిరిజనేతరుల ఆక్రమణతో... పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీలు, గిరిజనులను తమ బినామీలుగా చేసుకుని ఆదివాసీలు కాని వారు, గిరిజనేతరులు పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి తమ స్వాధీనంలో పెట్టుకోవడం పెద్ద సమస్యగా మారిందని అటవీ అధికారులు చెబుతున్నారు. వీరికి రాజకీయ పార్టీల అండకూడా ఉందని అంటున్నారు. పోడు పట్టాలున్న ఆదివాసీలు, పేద ఎస్సీ, బీసీ వర్గాల వారిని ముందుంచి, వారి భూముల పక్కల నుంచి ఆక్రమణలు మొదలుపెట్టి చెట్లు కొట్టడం, అటవీ భూఆక్రమణ విస్తీర్ణం క్రమంగా పెంచుకోవడంతో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. అమ్ముకోకూడదు.. కుదవ పెట్టకూడదు కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మారుమూల అడవుల్లోని ఆదివాసీలకు పోడు సాగు జీవనాధారంగా ఉండేది. జీవనోపాధి కోసం అడవుల్లో చెట్లు లేని చోట సాగుచేసి ఆ భూమిలో సారం తగ్గగానే ఒకటి, రెండేళ్లలోనే చెట్లు కొట్టకుండానే మరోచోటుకు తరలిపోవడం జరిగేది. పారలు, ఎడ్లు వంటి వాటిని ఉపయోగించకుండా వ్యవసాయం చేసేవారు. కాలక్రమేణా పోడు నిర్వచనమే మారిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో పోడు వ్యవసాయానికి 1907లో నిజాం నవాబు అనుమతించాడు. కొన్నేళ్ల తరబడి పోడు సాగు చేసుకునే వారికి ఆ భూమిపై హక్కును కల్పించినా, దున్నుకోవాలి తప్ప అమ్ముకోకూడదు, కుదవపెట్టకూడదు, ఈ భూములకు బ్యాంకులు రుణాలు సైతం ఇస్తాయి. 2006లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అటవీహక్కుల చట్టం ప్రకారం గ్రామసభ ఆమోదించిన వారికే ఈ పట్టాలు ఇవ్వాలి. రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా.. రాష్ట్రంలో మొత్తం 7,37,595 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూమి ఆక్రమణలకు గురైనట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు తలొగ్గి జిల్లాల్లో రెవెన్యూ శాఖ 1,09,584 ఎకరాల్లో పట్టాలిచ్చినట్టు అటవీ అధికారులు తమ నివేదికల్లో తేల్చారు. అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 2.15 లక్షల ఎకరాలు, అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 9 వేల ఎకరాల అటవీశాఖ భూములకు రెవెన్యూశాఖ పట్టాలు అందజేసినట్టు పేర్కొన్నారు. -
దారి ఇస్తావా.. చస్తావా: ఫారెస్టు అధికారికి టీడీపీ నేతల బెదిరింపులు
నిమ్మనపల్లె (చిత్తూరు జిల్లా): అటవీ భూమిలో తమ పొలానికి దారి ఇవ్వకపోతే చంపుతామని ఫారెస్టు అధికారిని బెదిరించిన వ్యవహారంలో టీడీపీ చిత్తూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్జీ వెంకటేష్, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిమ్మనపల్లె మండలం ఆచార్లపల్లెకు చెందిన ఆర్జే వెంకటేష్, గొల్లపల్లెకు చెందిన సిరసాని క్రిష్ణమూర్తి, సిరసాని చెన్నకేశవులకు నూరుకుప్పల కొండ, రిజర్వుఫారెస్టుకు మధ్య సర్వే నం.239లో పట్టాభూమి ఉంది. అటవీ రికార్డుల ప్రకారం పట్టాభూమికి సర్వే నం.222 నుంచి 3 అడుగుల వెడల్పుతో కాలిబాట ఉంది. రైతులు క్రిష్ణమూర్తి, చెన్నకేశవులు ఈ దారి గుండా తమ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆర్జే వెంకటేష్ టీడీపీ హయాంలో తన రాజకీయ పలుకుబడితో సర్వే నం.234 నుంచి అక్రమంగా రిజర్వుఫారెస్టులో 2కి.మీ రోడ్డు ఏర్పాటు చేసి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అటవీ భూమి, సంపద, పరిరక్షణలో భాగంగా ఫారెస్టు అధికారులు 2018లో రెడ్డివారిపల్లె, రాచవేటివారిపల్లె సమీపంలో కందకాలు తవ్వించారు. వెంకటేష్ ఏర్పాటు చేసుకున్న దారి మూసుకుపోయింది. అప్పటి నుంచి ఫారెస్టు బీట్ ఆఫీసర్ ప్రకాష్కు వేధింపులు మొదలయ్యాయి. విధులను అడ్డగిస్తూ, దారి ఇవ్వపోతే చంపేస్తామంటూ బెదిరిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులు, అనుకూల మీడియాలో వార్తలతో వేధిస్తున్నారు. శుక్రవారం విధుల్లో భాగంగా ఫారెస్టు అధికారి ప్రకాష్ వెళ్లగా వెంకటేష్, రెడ్డెప్ప చంపేస్తామంటూ బెదిరించడంతో అటవీ అధికారుల ఆదేశాలతో ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాగోతం బట్టబయలు.. అమరరాజా ఆటకట్టు..
వడ్డించే వాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఒక్కటే అన్నట్లుగా సాగింది గతంలో అమరరాజా వ్యవహారం. టీడీపీ అధికారంలో ఉండగా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆడిందే ఆట, పాడిందే పాటగా అటవీ శాఖ భూముల్లో పాగావేసింది. అనుమతి తీసుకున్న భూమిని కాదని.. పక్కనున్న స్థలాన్నీ కలిపేసుకుంది. ఎంచక్కా గోడ కట్టేసినా.. పెద్దలతో వ్యవహారంతో కావడంతో అధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఈ బాగోతం కాస్తా బట్టబయలు కావడంతో అధికారుల్లోనూ చలనం వచ్చింది. చర్యలకు సిద్ధమైన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు అనధికార ప్రహరీని కూల్చేసి.. ఆక్రమిత స్థలాన్ని స్వాదీనం చేసుకోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలోని కరకంబాడి పంచాయతీ పరిధిలో ‘అమరరాజా’ యాజమాన్యం 2000 సంవత్సరంలో తమ ఫ్యాక్టరీ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సమీప అటవీ శాఖ(ఫారెస్ట్ పోరంబోకు) భూమిని భూ మార్పిడి చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. ఆ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో 4.4 హెక్టార్ల అటవీభూమిని కేంద్ర ప్రభుత్వ అనుమతితో అమరరాజాకు కట్టబెట్టారు. అయితే ప్రభుత్వం 4.4 హెక్టార్లకు అనుమతిస్తే.. ఫ్యాక్టరీ యాజమాన్యం మరో 3.04 హెక్టార్లను ఆక్రమించేసింది. ఏకంగా ఆ అటవీ భూముల్లోనే ప్రహరీ కట్టేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 766 సర్వే నంబర్ పరిధిలోకి వచ్చే దాదాపు ఏడున్నర ఎకరాలకు పైగా భూమిని అడ్డగోలుగా ఆక్రమించేసింది. ఇలా సుమారు రెండు దశాబ్దాలుగా అటవీభూమిని ఆక్రమించుకున్నా ఎవ్వరూ సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం జోలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. అమరరాజా ఫ్యాక్టరీలు వెదజల్లుతున్న విష కాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం, కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చిన పరిణామాలతో అమరరాజా వివాదాల తుట్టె ఈ మధ్యకాలంలో కదలడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత జూలై 20న ‘సాక్షి’లో ‘అటవీభూముల్లో అమరరాజా’ శీర్షికన వచ్చిన కథనంపై అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. తొలుత ఆయా భూముల్లో ఆక్రమిత గోడను తొలగించాలని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాకపోవడంతో ఇటీవల అటవీశాఖ అధికారులు పెద్ద ఎత్తున సిబ్బందితో వెళ్లి అక్రమిత భూమిలోని ప్రహరీని కూల్చేశారు. అమరరాజా కలిపేసుకున్న ఆ మూడు హెక్టార్ల భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్నామని తిరుపతి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్వో) పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఆ 18 ఎకరాలూ అటవీభూములే.. అమరరాజా భూ ఆక్రమణలకు సంబంధించి తాజాగా అటవీశాఖ అధికారులు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అమరరాజా ఫ్యాక్టరీస్కు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్ పరిధిలో 18 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని చెబుతున్నారు. నోటిఫైడ్ గెజిట్ ప్రకారం అవి కచ్చితంగా అటవీ శాఖ భూములేనని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో 2015–16 మధ్య కాలంలో కరకంబాడి పంచాయతీ పరిధిలోనే 21 ఎకరాల భూములను అమరరాజా యాజమాన్యం కొనుగోలు చేసింది. 1982లో పేదల కోసం అసైన్ చేసిన ఆ భూములను అడిగిందే తడవుగా ఆరేళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం అలినేషన్ పేరిట అమరరాజాకు విక్రయించింది. అయితే ఈ 21 ఎకరాల భూముల్లో 18 ఎకరాలు అటవీ భూములేనని, 1979లో నోటిఫై చేసిన అటవీ భూములను రెవెన్యూ అధికారులు ఎలా విక్రయిస్తారని అటవీశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ మేరకు భూముల పూర్తి వివరాలతో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఇటీవల లేఖ రాశారు. వాస్తవానికి గతంలో అవి అటవీ భూములేనని, అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ నేపథ్యంలో డీనోటిఫైగా చూపిస్తున్నాయనేది రెవెన్యూ అధికారుల వాదన. అయితే ఆ భూమి ఎప్పుడు, ఎందుకు డీనోటిఫై చేశారో వివరాలు అందుబాటులో లేవని చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఆ సర్వేతోనైనా 18 ఎకరాల అటవీ భూముల అసలు ‘కథ’ బయటికొస్తుందో లేదో చూడాలి. -
అటవీ భూములు ధ్వంసం చేస్తుంటే మీరేం చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో ఉన్న రక్షిత అటవీ భూముల్లో మైనింగ్ చేస్తూ, అడవులను ధ్వంసం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కృష్ణా జిల్లా, పరిటాల గ్రామ పరిధిలోని ఇబ్రహీంపట్నం ప్రధాన పంట కాలువను అక్రమ మైనింగ్దారులు కనుమరుగు చేశారని, ఈ కాలువను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు కొండపల్లి అటవీ భూముల్లో మైనింగ్ చేస్తున్న ఘటనలపై స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. -
గిరిజన పక్షపాతి సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అటవీ భూములపై హక్కు పత్రాలు పొందిన గిరిజనులకు 2 విడతల రైతు భరోసాను ఒకేసారి చెల్లించడం ద్వారా సీఎం జగన్ గిరిజన పక్షపాతి అనే విషయాన్ని మరోసారి నిరూపించారని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కొనియాడారు. ఒక్కో గిరిజన రైతుకు రూ.11,500 చొప్పున ఒకేసారి ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 2న సీఎం జగన్ రాష్ట్రంలోని 1.53 లక్షల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమిని పట్టాలుగా పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వారందరికీ కూడా రైతు భరోసా అందిస్తామని సీఎం అప్పట్లో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ మాట ప్రకారం.. నేడు రెండు విడతల రైతు భరోసా మొత్తాలను ఒకేసారి గిరిజనుల ఖాతాల్లో జమ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా గిరిజనులు ఆ భూముల ద్వారా ఉపాధి పొందడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారని పుష్ప శ్రీవాణి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కోసం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే అమలు చేసిన రైతు భరోసా, పెన్షన్ కానుక, వాహన మిత్ర, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా, కంటి వెలుగు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాల ద్వారా గిరిజనులకు ఎంతో మేలు జరిగిందని కొనియాడారు. -
అటవీ భూముల కేటాయింపులపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలం మైలవరం గ్రామం సమీపంలోని అటవీ భూములను ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ భూములకు సంబంధించి న్యాయవాది వి.గంగా ప్రసాద్ దాఖలు చేసిన పిల్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. ‘మైలవరం గ్రామంలో సర్వే నంబర్లు 54, 55, 204/1, 205/1లో కొండలతో కూడిన దాదాపు 250 ఎకరాల అటవీ భూమి ఉంది. జిల్లా కోర్టుల భవన సముదాయంతో పాటు ఇతర నిర్మాణాలకు ఈ భూమిని కేటాయించారు. 25 ఎకరాలను జిల్లా కోర్టుల భవన సముదాయాల నిర్మాణానికి, 20 ఎకరాలను పీజీ కళాశాల భవనాలకు, ఐదెకరాలు టూరిజం కార్పొరేషన్కు, 2.30 ఎకరాలు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కేటాయించింది. నిరుపయోగమైన, నీటి సౌకర్యం లేని భూములను మాత్రమే నిర్మాణాలకు కేటాయించాలని 2012లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోకు విరుద్ధంగా వృక్షాలున్న ఈ భూమిని నిర్మాణాలకు కేటాయించారు. ఈ భూ కేటాయింపులను చట్టవిరుద్ధంగా ప్రకటించి నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలివ్వండి’అని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. -
వ్యవసాయం ద్వారా జీవనోపాధి
సాక్షి, అమరావతి: ఆర్వోఎఫ్ఆర్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) మంజూరు ద్వారా గిరిజనులు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గిరిజనులకు దారి చూపించేలా వ్యవహరించాలని, మానవత్వంతో పని చేసి.. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం చేసే మంచిని గిరిజనులు కలకాలం గుర్తు పెట్టుకుంటారని, ప్రతి ఆర్వోఎఫ్ఆర్ పట్టాను ఆధార్తో లింక్ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. గిరిజనులకు మేలు జరిగేలా చూడాలి ► ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఉన్న వారికి మనం రైతు భరోసా అమలు చేస్తున్నాం. అటవీ భూములపై వారికి హక్కులు కల్పించడం ద్వారా పెట్టుబడి సహాయం పొందడానికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. ► గిరిజనులు ఆదాయం పొందడానికి మనం అవకాశాలు కల్పించాలి. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదు. అధికారులు గిరిజనులకు దారి చూపించేలా వ్యవహరించాలి. ► వచ్చిన దరఖాస్తులను మరోసారి పరిశీలించండి. ఆదివాసీ దినోత్సవం నాటికి వారికి అటవీ భూములపై హక్కులు కల్పించేలా చూడాలి. ► సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పి.పుష్ప శ్రీవాణి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణకు కృషి జీవో నంబరు 3పై (షెడ్యూల్ ఏరియాల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో నూరు శాతం ఎస్టీలనే నియమించాలి) గిరిజనుల ప్రయోజనాలను రక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సమీక్షలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు సీఎం పై విధంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను నిశితంగా అధ్యయనం చేయాలని ఇదివరకే ఆదేశాలిచ్చామని, పరిశీలన పూర్తయ్యాక తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని చెప్పారు. -
నల్లమలలో వంట, మంట నిషేధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అడవుల్లో నిప్పు రాజేయడం, వంటలు చేయడంపై అటవీ శాఖ నిషేధం ప్రకటించింది. రక్షిత అటవీ ప్రాంతాల్లో బయటి వ్యక్తులు, ఇతరుల ప్రవేశంపైనా ఆంక్షలు విధించింది. వేసవిలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశాలుండటంతో.. ఈ చర్యలు చేపట్టింది. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో మూడు అగ్నిప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. శివరాత్రిని పురస్కరించుకుని భక్తులు నల్లమల అడవి మీదుగా శ్రీశైలానికి వెళ్లనున్న క్రమంలో.. వారు అటవీ శాఖ సూచనలు తప్పక పాటించాలని, నిర్దేశించిన ప్రాంతాలు, రోడ్ల ద్వారానే ప్రయాణించాలని, కాలిబాట ప్రయాణాలు చేయరాదని ప్రకటించింది. అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విరామ ప్రాంతాల్లోనే సేదతీరేందుకు అనుమతి ఉందని అటవీ శాఖ స్పష్టం చేసింది. కూర్చునే సదుపాయం, తాగునీటి సౌకర్యం, చెత్త వేసేందుకు కుండీలు ఏర్పాటు చేస్తోంది. అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాల్లో ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. పశువుల కాపరులు, అడవిలోకి వచ్చేవారు సిగరెట్, బీడీ తాగకుండా చర్యలు చేపడుతోంది. అవగాహనా కార్యక్రమాలు అటవీ మార్గాలు, అడవుల వెంట ఉండే గ్రామాల్లో ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొత్తం 9,771 కంపార్ట్మెంట్లకు గాను 43 అటవీ రేంజ్ల్లో 1,106 ప్రాంతాలు అగ్ని ప్రమాదాలకు అత్యంత ఆస్కారం ఉన్న వాటిగా గుర్తించారు. కనీసం ఐదుగురు సిబ్బంది, వాహనం, నిప్పును ఆర్పే బ్లోయర్లతో క్విక్ రెస్పాన్స్ టీమ్లుంటాయి. శాటిలైట్లో పర్యవేక్షించే విధానం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తున్నందున, ఎక్కడ ప్రమాదం జరిగినా సంబంధిత అధికారులతో పాటు, గ్రామ కార్యదర్శికి కూడా ఫోన్ సందేశం వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు. -
రూ.8 కోట్ల విలువైన ఖనిజం అక్రమరవాణా
పచ్చని చెట్లపై పక్షుల కిలకిల రావాలు.. పొదల మాటున జీవనం సాగించే వన్యప్రాణులు. విలువైన వృక్ష సంపద. అద్భుతమైన జీవ వైవిధ్యం.. అటవీ ప్రాంతం సొంతం. గత టీడీపీ హయాంలో నేతలు అడవినీ వదిలి పెట్టలేదు. అడవిలో విధ్వంసం సృష్టించి సహజ వనరులను కొల్లగొట్టారు. కొందరు అక్రమార్కులు తమ స్వార్థం కోసం అటవీ ప్రాంతంలో జెలిటిన్స్టిక్స్తో పేల్చుతూ వృక్ష, పక్షి జాతులతో పాటు వన్యప్రాణులను విలవిలల్లాడేలా చేశారు. ఇదంతా రిజర్వు ఫారెస్ట్లోనే విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టడానికే అని విజిలెన్స్ విచారణలో నిగ్గు తేలింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అక్రమార్కులు రూ.8 కోట్ల విలువైన సంపదను యథేచ్ఛగా అక్రమ రవాణా సాగించినా, అధికారులు నిలువరించలేకపోయారు. అప్పటి మంత్రి అండదండలు ఉండడంతో అక్రమార్కులకు అధికారులు అండగా నిలిచారని సమాచారం సాక్షి, నెల్లూరు: అధికారం మాటున అప్పటి మంత్రి అండదండలతో అక్రమార్కులు అడవిని ధ్వంసం చేశారు. రక్షకులమంటూ.. అడవిని భక్షించారు. నీతికి, నిజాయతీకి తామే బ్రాండ్ అంబాసిడర్లమంటూ నిత్యం నీతులు వల్లించే ఆ పార్టీ నేతలు మైనింగ్ నిర్వాహకులతో కలిసి అటవీ సహజ వనరులను దోచేశారు. పొదలకూరు మండలం నందివాయ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 28లో 36.58 ఎకరాల భూమిని 1990లో ఉమామహేశ్వరీ మైన్ నిర్వాహకులకు మైనింగ్ అనుమతి ఇచ్చారు. ఆ సర్వే నంబరులో దాదాపు 214 ఎకరాల భూమి ఉంది. అందులో 70 ఎకరాల భూమి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. రెవెన్యూ భూములను మైనింగ్కు అనుమతులు తీసుకున్న నిర్వాహకులు మాత్రం రెవెన్యూ భూముల పరిధి దాటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి చొరబడ్డారు. కొండలు, గుంటల భూములను ఇష్టానుసారంగా తవ్వేసి తెల్లరాయి, గ్రావెల్, మెటల్ను అక్రమంగా రవాణా చేశారు. 19 ఏళ్ల పాటు మైనింగ్ అనుమతులు పొందిన లీజుదారులు ఆయా భూములను పీల్చి పిప్పి చేసి కోట్లాది రూపాయల విలువైన సంపదను దోచేశారు. 2009 నాటికి మైనింగ్ అనుమతులు ముగిసినా కూడా నిర్వాహకులు రెన్యువల్ చేయించుకోలేదు. అయినా యథేచ్ఛగా మైనింగ్ను కొనసాగించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటి అధికార పార్టీ నేత, మాజీమంత్రి అండతో దోపిడీని కొనసాగించారు. టీడీపీ హయాంలో.. టీడీపీ హయాంలో మైనింగ్ నిర్వాహకుడు జిల్లా మంత్రితో లోపాయి కారి ఒప్పందం చేసుకుని అనుమతులు లేకుండానే రెవెన్యూ భూములే కాకుండా నందివాయ రిజర్వ్ ఫారెస్ట్ను ఆక్రమించారు. ఫారెస్ట్ పరిధిలో ఉండే కొండలను జిలెటిన్స్టిక్ వంటి పేలుడు పదార్థాలతో పేల్చి తెల్లరాయి నుంచి గ్రావెల్, మెటల్ను అక్రమ రవాణా సాగించారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో ఫారెస్ట్ పరిధిలో సుమారు 20 ఎకరాల్లోకి చొచ్చుకుపోయి సహజ వనరులను కొల్లగొట్టుతున్నా అటవీశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. అప్పటి మంత్రి అండదండలు ఉండడంతో చర్యలు తీసుకొనేందుకు వెనకాడిన అధికారులు మైనింగ్ నిర్వాహకుడితో లాలూచీ పడి అక్రమ రవాణాకు సహకరించారు. అప్పట్లో అక్రమ మైనింగ్పై స్థానికులు ఫిర్యాదు చేయడంతో 2017లో అటవీశాఖ, రెవెన్యూ శాఖ సర్వే నిర్వహించి ఫారెస్ట్ భూముల్లో మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో మైనింగ్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కానీ అప్పటి అధికార పార్టీ మంత్రి అండదండలు ఉండడంతో సర్వే నివేదికను తొక్కి పెట్టారు. దీంతో మైనింగ్ నిర్వాహకుడు మాత్రం అక్రమ రవాణా దందా కొనసాగించాడు. జిల్లా అధికారుల దృష్టికి వెళ్లినా.. నందివాయ రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ వ్యవహారం విషయం జిల్లా స్థాయిలో అధికారులందరికీ తెలిందే. ఈ వ్యవహారంపై గత జిల్లా ఉన్నతాధికారి దృష్టికి అటవీశాఖ అధికారులు తీసుకెళ్లినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో కనీసం స్పందించలేదని తెలిసింది. జిల్లా అటవీశాఖ అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. అప్పటి మంత్రి ఈ అక్రమ మైనింగ్కు అండగా ఉండడంతో జిల్లా స్థాయి అధికారులు కూడా వారికి సహకరించి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇటు రెవెన్యూ, అటు మైనింగ్ అధికారులు కూడా అక్రమ మైనింగ్కు పూర్తి స్థాయిలో అండదండలు అందించారు. వన్యప్రాణులు విలవిల మైనింగ్ నిర్వాహకులు తమ స్వార్థం కోసం అడవినే ఆక్రమించి సంపదను కొల్లగొట్టే క్రమంలో విధ్వంసం సృష్టించి వన్యప్రాణులను, పక్షి జాతులను విలవిలాలాడేలా చేశారు. నందివాయ రిజర్వ్ ఫారెస్ట్లో దాదాపు 40 రకాల పక్షి జాతులు, వన్యప్రాణులు ఉన్నాయి. పచ్చని అడవిలో ప్రశాంతంగా ఉండే పక్షులు, వన్యప్రాణులకు పేలుళ్లతో నిద్ర లేకుండా చేశారు. కొండను తొలిచేందుకు నేపథ్యంలో జెలిటిన్స్టిక్, అమ్మెనియా వంటి పేలుడు పదార్థాలను ఉపయోగించి రాత్రి వేళల్లో పేల్చేవారు. ఆ ప్రభావంతో వన్యప్రాణులు, పక్షులు విలవిలలాడాయి. ఆ పేలుళ్ల ప్రభావం వల్ల నందివాయ గ్రామ పరిధిలో పంటలపై పడేది. పచ్చని పంటలపై దుమ్ము, ధూళి కణాలు పడి ఎదుగుదల లోపించేదని స్థానికులు ఆరోపించారు. విచారణలో నిగ్గుతేలిన వాస్తవాలు నందివాయ రిజర్వు ఫారెస్ట్లో కొండలను తొలిచి ఏళ్ల కాలంగా అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న వైనంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అక్రమ మైనింగ్ వ్యవహారంపై కదలిక వచ్చింది. అధికారులు విచారణలో దాదాపు అడవిని కొల్లగొట్టి రూ.8 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా రవాణా సాగించినట్లు నిగ్గు తేలింది. 2010 నుంచి మైనింగ్కు అనుమతి లేకుండా నిర్వాహకులు మాత్రం మైకా, తెల్ల రాయిలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించి అటవీశాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. గత టీడీపీ హయాంలో ఇంత భారీగా అక్రమ మైనింగ్ జరిగినా అధికారులు స్పందించలేదని తేలడంతో అందుకు బాధ్యులైన ఇద్దరు బీట్ అధికారులపై వేటు వేశారు. ఇంకా ఈ అక్రమ మైనింగ్కు సహకరించిన అధికారులపై కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఒక్కరూ సహకరించలేదు నేను రాపూరు రేంజర్గా జాయిన్ అయినప్పటి నుంచి అక్రమ మైనింగ్ను నిలువరించేందుకు పోరాటం చేస్తున్నా. ఏ ఒక్క అధికారి కూడా నాకు సపోర్ట్ చేయలేదు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు అయితే అసలు చెవికెక్కించుకోలేదు. గతంలో అక్రమ మైనింగ్పై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మైనింగ్ నిర్వాహకుడిపై కేసు కూడా నమోదు చేశాను. కానీ ఎవరూ సహకరించకపోవడంతో ఏమి చేయలేకపోయాం. నిర్వాహకుడు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడు. జాయింట్ సర్వే చేయమని కోర్టు ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోలేదు. – శ్రీదేవి, ఫారెస్ట్ రేంజ్ అధికారిణి జాయింట్ సర్వే నిర్వహిస్తాం రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో సహకరించిన అధికారులు, ఉద్యోగులందరిపై శాఖా పరమైన చర్యలు ఉంటాయి. త్వరలోనే మైనింగ్పై జాయింట్ సర్వే నిర్వహిస్తాం. పూర్తి స్థాయి విచారణ కూడా జరుపుతాం. అక్రమ మైనింగ్కు సహకరించిన ఎవరిని వదలం. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులపై తాత్కాలిక చర్యలు చేపట్టాం. పూర్తిస్థాయి విచారణలో తప్పు చేశారని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. – శ్రీనివాసులు రెడ్డి, డీఎఫ్ఓ , నెల్లూరు -
అడవి.. ఆగమాగం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యంత వేగంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. రాష్ట్రంలో 24 శాతం అడవులున్నాయని అధికారిక లెక్కలు ఉటంకిస్తున్నా క్షేత్రస్థాయిలో ఈ విస్తీర్ణం సగం కంటే తక్కువగానే ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కొన్నేళ్లుగా వివిధ రూపాల్లో సాగుతున్న అటవీ భూముల ఆక్రమణలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన అడవే కనిపించకుండా పోయే పరిస్థితి నెలకొంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అడవుల విస్తీర్ణాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం హరితహారం కార్యక్రమం చేపడుతున్నా అడవుల ఆక్రమణల వల్ల ఆ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీలు, గిరిజనులను అడ్డం పెట్టుకొని వారి బినామీలుగా ఆదివాసీ, గిరిజనేతరులు పెద్ద మొత్తంలో అటవీ భూములను స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారింది. ఎస్టీలు, ఇతర బలహీనవర్గాల పేరుతో స్థానికంగా బలమైన సామాజికవర్గాలు, రాజకీయ అండదండలున్న వారి పెత్తనం పెరిగిపోయింది. కింది స్థాయిలో అటవీ, రెవెన్యూశాఖలలో అవినీతి కూడా ఆక్రమణదారులకు కలసి వస్తోంది. ‘పోడు’ మారిపోయింది... కొన్ని దశాబ్దాలుగా ఆదివాసీలకు పోడు సాగు జీవనాధారంగా కొనసాగుతోంది. చెట్లు లేని చోట వారు సాగు చేసుకొని ఆ భూమిలో సారం తగ్గగానే ఒకటి, రెండేళ్లలోనే చెట్లు కొట్టకుండానే మరోచోటకు తరలిపోవడం వంటిది జరిగేది. పారలు, ఎడ్లు లేకుండా వారు వ్యవసాయం చేసేవారు. కాలక్రమేణా పోడు నిర్వచనమే మారిపోయింది. 1907లో ఆదివాసీలు అడవుల్లో ఈ విధమైన పోడు వ్యవసాయం చేసుకునేందుకు నిజాం నవాబు అనుమతించాడు. 1947 తర్వాత గిరిజనేతరులు అడవులపై పడటంతో పోడు అటవీ భూముల ఆక్రమణ మొదలైంది. ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకునే వారికి ఆ భూమిపై హక్కు కల్పించినా దున్నుకోవాలి తప్ప అమ్ముకోకూడదు, కుదవపెట్టకూడదు, ఈ భూములకు బ్యాంకులు రుణాలు సైతం ఇస్తాయి. 2006లో కేంద్రప్రభుత్వం అటవీహక్కుల చట్టం తీసుకురావడంతో ఈ భూములను సంబంధించి గ్రామసభ ఆమోదించిన వారికే పట్టాలు అందజేయాల్సి ఉంది. అడవి మిగిలింది 13 శాతమే.... రాష్ట్రంలో 26.9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి ఉంది. అందులో 2.94 లక్షల (11%) హెక్టార్లు అన్యాక్రాంతమైనట్టు అటవీశాఖ రికార్డుల్లో స్పష్టమైంది. వాస్తవానికి ఈ ఆక్రమణలు మరో 3% వరకు ఉంటాయని, ఇప్పుడు మనకు మిగిలింది 10–13% అడవులేన ని అటవీ అధికారులు చెబుతున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద... అటవీ హక్కుల గుర్తింపు చట్టం (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్–ఆర్ఓఎఫ్ఆర్) కింద 2017 చివరి నాటికి మొత్తం 11 లక్షల ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ అందాయి. వాటిలో 1,83,107 మంది వ్యక్తిగతంగా (6,30,714 ఎకరాలకు), సామూహికంగా 3,427 క్లెయిమ్స్ (4,70,605 ఎకరాలకు) క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులు అందాయి. ‘వ్యక్తిగత’లో భాగంగా 93,494 మందికి 3 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. సామూహికంగా 721 క్లెయిమ్స్కు 4,54,055 ఎకరాల మేర హక్కు పత్రాలు అందజేశారు. మొత్తం 80,890 ‘వ్యక్తిగత’కు సంబంధించిన కేసులను 2,90,589 ఎకరాలకు, ‘సామూహిక’లో 11,988 ఎకరాలకు సంబంధించి 1,682 కేసులను తిరస్కరించారు. -
పెద్ద బీట్లు..పర్యవేక్షణకు ఫీట్లు!
సాక్షి, అమరావతి: మామిడి కాయలు ఉన్నప్పుడు తోట రక్షణ కోసం పదెకరాలకు ఒక కాపరిని నియమిస్తారు.30–40 ఎకరాలకు ఒకే కాపరిని పెడితే నిఘా లోపించి, కాయలు దొంగల పాలవుతాయి. బహిరంగ కోశాగారంగా(ఓపెన్ ట్రెజరీ) పేర్కొనే అడవుల పరిరక్షణ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. చిన్న చిన్న బీట్లు ఉంటేనే కట్టుదిట్టమైన పర్యవేక్షణతో అటవీ సంపదను చక్కగా కాపాడుకోవచ్చు.పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లోనే సుదీర్ఘమైన అటవీ బీట్లు ఉన్నాయి. సాధారణంగా ఒక్కో బీట్ పర్యవేక్షణకు ఒక్కో అధికారి ఉంటారు.ఎర్రచందనం, టేక్, రోజ్వుడ్ లాంటి అత్యంత విలువైన కలప ఉన్నందున రాష్ట్రంలో బీట్ల పరిమాణాన్ని పునర్వ్యవస్థీకరించాలని అటవీ శాఖ దశాబ్దాలుగా కోరుతోంది.గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సిబ్బంది కొరత, నిఘా లోపాలతో విలువైన కలపను స్మగ్లర్లు యథేచ్ఛగా కొల్లగొడుతున్నారని అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సగటున 24.03 చదరపు కిలోమీటర్లకు ఒక బీట్ రాష్ట్రంలో 37,258 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి విస్తరించి ఉంది. ఈ అడవిలో అత్యంత విలువైన వృక్ష సంపద నెలకొని ఉంది. ఇక అరుదైన జీవజాతులకు కొదవే లేదు. ఏపీలో మొత్తం 1,232 అటవీ బీట్లు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే పెద్ద బీట్లు ఉన్నాయి. తెలంగాణ పోల్చితే ఏపీలో బీట్ పరిధి మూడు రెట్లు అధికంగా ఉంది. తెలంగాణలో సగటున 8 చదరపు కిలోమీటర్లకు (800 హెక్టార్లకు) ఒక బీట్ ఉండగా, ఏపీలో సగటున 24.03 చదరపు కిలోమీటర్లకు (2,400కు పైగా హెక్టార్లకు) ఒక బీట్ ఉంది. తమిళనాడులో 5.85 చదరపు కిలోమీటర్లకు ఒక బీట్ ఉంది. బీట్ పరిధిని 15 చదరపు కిలోమీటర్లకు కుదిస్తాం.. ‘‘అటవీ సంపద పరిరక్షణకు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా రాష్ట్రంలో అటవీ బీట్ల పరిధిని 15 చదరపు కి.మీలకు కుదించడంతోపాటు పోలీస్ స్టేషన్ల తరహాలో ఫారెస్టు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అటవీ పరిరక్షణలో ఈ స్టేషన్లు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రయోగాత్మకంగా వీటిని మొదట ఎర్రచందనం ప్రాంతాల్లో నెలకొల్పేందుకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశాం’’ – ప్రతీప్ కుమార్,రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
ఆకుపచ్చ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్/సిద్ధిపేట/గజ్వేల్ : అడవులు విరివిగా ఎక్కడ పెరిగితే ఆ ప్రాంతంలోని ప్రజలు ఆనందంగా ఉంటారు.. ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా, హరిత జిల్లాల ఏర్పాటుకు కలిసి కట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. కలెక్టర్లు, మంత్రులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని సింగాయిపల్లి, నెంటూరు, కోమటిబండ ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను బుధవారం మం త్రులు, కలెక్టర్లకు ఆయన చూపించారు. సింగాయిపల్లి అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలను, గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని గజ్వేల్ షరీఫ్లో 160 హెక్టార్లలో నాటిన మొక్కలను పరిశీలించారు. అక్కడి నుంచి 2016లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీ నాటిన మొక్కలను కలెక్టర్లు, మంత్రులకు చూపించారు. మంకీస్ ఫుడ్ కోర్టులు... కొత్త రెవెన్యూ, పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన గురించి కలెక్టర్లతో కేసీఆర్ చర్చించారు. ‘పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలి. ఇందుకోసం 60 రోజుల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎక్కడా అవినీతికి తావులేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే కొత్త రెవెన్యూ చట్టం రూపొందిస్తున్నాం. ఈ చట్టంతో రైతులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు. అడవులు నశించడంతో పండ్లూఫలాలు లేక కోతులు ఊళ్లలోకి వస్తున్నాయి. కోతులు వాపస్ పోవాలంటే వాటికి అక్కడే ఆహారం లభించేలా చెట్లను పెంచాలి. ఫల, మేడి, మర్రీ లాంటి 27 రకాల పండ్ల మొక్కలు నాటితే కోతులకు కావాల్సిన ఆహారం దొరుకుతుంది. అడవులు అంటే కోతులు, ఇతర జంతువులతో కళకళలాడుతూ ఉండాలి’అని చెప్పారు. గచ్చకాయ చెట్టు పరిచయం చేసింది నేనే.. ‘అడవులు, చెలకలకు గచ్చకాయ చెట్టు కంచెగా ఉంటుంది. జంతువులు, మనుషులు కూడా లోపలికి వెళ్లలేరు. అటవీ అధికారులకు దాన్ని పరిచయం చేసింది నేనే’అని చెప్పిన కేసీఆర్ ఇలా నాటిన గచ్చకాయ చెట్లను కలెక్టర్లకు చూపించారు. ఎడారిగా ఉన్న సిద్దిపేట అటవీ భూముల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పంచిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అటవీశాఖ అధికారుల పనితీరు భేష్ అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. గజ్వేల్ అటవీ ప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్.శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్ స్టాక్ను ఉపయోగించుకొని సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీశామని, దీంతో బయటి జంతువులు లోపలకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎ.ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఈటల రాజేందర్, గుంతకండ్ల జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోశ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజీవ్శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరి శుభాష్రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, భూపతిరెడ్డి, ఎలక్షన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ జహంగీర్, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రాజయ్య సైతం పాల్గొన్నారు. పచ్చటి గజ్వేల్... ‘తెలంగాణ ఏర్పడిన కొత్తలో గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీ భూములు చెట్లు లేకుండా ఏడారిగా ఉండేవి. అడవుల పునరుద్ధరణే లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాం. ఆ ఫలితమే ఇప్పటి ఈ పచ్చటి గజ్వేల్. ఇక్కడ 27 రకాల పండ్ల మొక్కలను పెంచడంతో కోతులకు ఆహారం అందుతోంది. దీన్ని ఆదర్శంగా తీసుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీభూమి ఉంది. ఇది మన భూభాగంలో 23.4 శాతం. అడవుల పెంపకంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములు కావాలి. అడవుల్లో చెట్ల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలి’అని కలెక్టర్లకు సీఎం సూచించారు. ఈ సందర్భంగా కోమటిబండలో ప్రారంభించిన మిషన్ భగీరథ ప్లాంట్ను కలెక్టర్లకు చూపించారు. అక్కడే వారితో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. -
కాంక్రీట్ జంగిల్లో అటవీ వనం!
రణగొణ ధ్వనులు, రోజువారీ ఉద్యోగం, ఇతర టెన్షన్లతో బిజీ జీవితం గడుపుతున్న నగర, పట్టణ వాసులకు మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) సిద్ధ మవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 76 పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యించగా, 25 పార్కులు ఇప్పటికే నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాల పరిధిలో ఈ పార్కుల అభివృద్ధి జరుగుతున్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారి, సంబంధిత శాఖల సమన్వయంతో వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటు న్నారు. రాష్ట్ర జనాభాలో మూడోవంతుపైగా హైదరాబాద్లో నివసిస్తుండడంతో ప్రధానంగా నగర శివార్ల లోనే అత్యధికంగా అంటే, దాదాపు 50కు పైగా ఇక్కడే అర్బన్ పార్కులు ఏర్పాటవుతున్నాయి. అంతర్జాతీ యంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే అందుబాటులోకి రాగా, మరో అయిదింటిని సోమవారం మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మల్లారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. ఈ పార్కులు ఎక్కడెక్కడ... ఈసీఐఎల్కు సమీపంలోని నాగారం ఆరోగ్యవనంలో ఒకటి, ఉప్పల్కు దగ్గరలోని నారాపల్లి జఠాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ రెండోది, యాదాద్రి సమీపంలోని రాయగిరి వద్ద నర్సింహ అరణ్యం మూడోది, చౌటుప్పల్ సమీపంలోని లక్కారం అర్బన్ ఫారెస్ట్ వద్ద నాలుగోది, శంషాబాద్ సమీపంలోని మసీదుగడ్డ వద్ద ఐదో అర్బన్ పార్కు ప్రారంభం కానున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న 59 పార్కులను వీలైనంత త్వరగా దశల వారీగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని, నవంబర్ నెలాఖరు డైడ్లైన్గా పెట్టుకున్నారు. 59 పార్కులకు సంబంధించిన ప్రత్యేకతలు, సమాచారంతో విడివిడిగా బుక్ లెట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి పార్కులో సహజమైన అటవీ సంపద దెబ్బతినకుండా, సందర్శకులకు తగిన సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. అందుబాటులోకి అటవీ భూములు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇతర నగరాలు, పట్టణాలు క్రమక్రమంగా కాంక్రీట్ జంగళ్లుగా మారుతూ వనాలు, తోటలు, పార్కులు కనుమరుగవుతున్నాయి. హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణ శివార్లలో వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ భూములను ప్రజలకు అందు బాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్, చుట్టుపక్కల హెచ్ఎండీఏ, అటవీ శాఖ సంయుక్తంగా అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను అభివృద్ధి చేస్తున్నాయి. అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఆహ్లాదకరంగా, అందంగా తీర్చిదిద్దుతుండడంతో ఇప్పటికే ప్రారంభించిన పలు అర్బన్ పార్కుల్లో వారాంతాలు, సెలవు రోజుల్లో ప్రజలు ప్రశాంతంగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని పార్కుల్లో వాకింగ్ ట్రాక్, కానోఫి వాక్, పాత్ వే, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. – సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు సూక్ష్మ పోషక విలువలపై అవగాహనతోపాటు మధ్యాహ్న భోజనంలోకి తాజా కూరగాయలు అందించవచ్చని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శనివారం విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్కుమార్, ఉద్యానశాఖ సంచాలకులు వెంకట్రామిరెడ్డి తదితరులు సచివాలయంలో సమావేశమయ్యారు. పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్ల ఆవశ్యకతపై చర్చించి నిర్ణయించిన అనంతరం పలు సూచనలు చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీలో తప్పకుండా కిచెన్ గార్డెన్లు నిర్వహించాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో కనీసం 10 శాతంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు. స్థలాభావం ఉన్న చోట చిన్నపాటి తొట్లు, కుండీలు కొనుగోలు చేసి ఆ మేరకు నిర్వహణ చేపట్టాలన్నారు. కిచెన్ గార్డెన్ల నిర్వహణలో విద్యార్థులను సైతం భాగస్వామ్యం చేయాలని, దీంతో వారికి ప్రకృతితోపాటు తోటల పెంపకంపై అవగాహన వస్తుందన్నారు. సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాల ప్రతులను జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా అన్ని పాఠశాలలకు పంపించాలని సూచించారు. చెట్టుకు పుట్టిన రోజు.. మహబూబాబాద్: ప్రాణ వాయువునిచ్చే చెట్లను పెంచడమే గగనమైన ఈ రోజుల్లో ఓ మొక్కను పెంచడమే గాక దాని జన్మదిన వేడుకలూ జరుపుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడో వ్యక్తి. వివరాలు.. మానుకోట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టీస్టాల్ నిర్వహిస్తున్న గుగులోతు శంకర్ మూడు సంవత్సరాల కింద వేపమొక్కను నాటి, దాన్ని సంరక్షిస్తున్నాడు. ప్రతి ఏడాది ఆ మొక్క జన్మదిన కార్యక్రమంలో దానిని బెలూన్లతో అలంకరించి కేక్ కట్ చేయడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నాడు. శనివారం ఆ మొక్క పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ కమిషనర్ బి.ఇంద్రసేనారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొని కేక్ కట్ చేశారు. -
అంగుళం భూమినీ ఆక్రమించనివ్వం
సాక్షి, హైదరాబాద్ : కొత్తగా ఒక్క అంగుళం అటవీభూమిని కూడా ఆక్రమణలకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, ఈ విషయంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) ప్రశాంత్కుమార్ ఝా స్పష్టంచేశారు. ప్రభుత్వపరంగా తమకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు, మద్దతు అందుతున్న నేపథ్యంలో తమకు అప్పగించిన విధులను అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. విధుల నిర్వహణ, అటవీ ఆక్రమణలను అడ్డుకునే క్రమంలో ఇటీవల కొన్నిచోట్ల చోటుచేసుకున్న ఘటనలతో అధికారులు, సిబ్బంది ఆత్మస్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కేసులు పెట్టడంతోపాటు దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుందని, అలాగే తమ విధుల నిర్వహణకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందున వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వపరంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయడంతో పాటు అడవుల సంరక్షణ, తదితర చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. సాగుకాలం మొదలు కావడంతో ఆక్రమణలు సాగుకాలం జూలైలో మొదలుకానుండటంతో అడవుల్లో కొత్త ఆక్రమణలకు ప్రయత్నాలు మొదలయ్యాయని ఝా వెల్లడించారు. గతంలోనే గుర్తించిన అటవీభూమిలో మొక్కలు నాటేందుకు అధికారులు, సిబ్బంది వెళుతుండడంతో కొన్నిచోట్ల ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడుతోందన్నారు. గిరిజనులు, ఇతర రైతులు ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు బలవంతంగా చెట్లు నాటుతున్నారనే ఆరోపణలున్నాయి కదా అని అడగ్గా.. అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది ఎన్నో కష్టనష్టాలకోర్చి పనిచేస్తున్నా అటవీశాఖను అడవులు సంరక్షించే విభాగంగా, చట్టాలను కాపాడే శాఖగా చూడకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. సార్సాలో జరిగిన ఘటన చూస్తే పోలీసులు, అటవీ సిబ్బందిపై దాడి జరిగిన తీరు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. చట్ట పరిరక్షణకు వెళ్లినవారిపై ఇలాంటి దాడులు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సిబ్బందికి ఆయుధాలిస్తే ఇలాంటి దాడులు జరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని భావిస్తారా అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదన్నారు. అటవీ అధికారులకు కూడా ఆయుధాలు సమకూర్చాలని వస్తున్న డిమాండ్పై ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా.. అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే సూచనలు కనిపించడం లేదని పేర్కొన్నారు. స్మగ్లర్లు, అటవీ నేరస్తులపై తప్ప ప్రజలపై అటవీ అధికారులు ఆయుధాలను ప్రయోగించే పరిస్థితి రాదని స్పష్టంచేశారు. 1980లలో అటవీశాఖ వద్ద కూడా ఆయుధాలుండేవని.. అయితే, మారుమూల ప్రాంతాల్లో అటవీ సిబ్బంది నుంచి నక్సలైట్లు ఆయుధాలు ఎత్తుకెళ్తుండటంతో వాటన్నింటినీ పోలీస్శాఖ వద్ద డిపాజిట్ చేశారని తెలిపారు. అప్పటి నుంచి ఆయుధాలు లేకుండానే అన్నిస్థాయిల్లోని అధికారులు అడవుల్లో విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. గిరిజనుల భూములను అటవీశాఖ బలవంతంగా లాక్కుంటోందని, కొన్నేళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న చోట కూడా హరితహారం కింద మొక్కలు నాటుతోందని, దాడులకు కూడా పాల్పడుతోందని వస్తున్న ఆరోపణలను ఝా తోసిపుచ్చారు. అడవుల్లోని భూమిని అప్పగిస్తామని, చెట్లను కొట్టి వ్యవసాయం చేసుకుంటే పట్టాలు ఇప్పిస్తామని అమాయక ప్రజలను కొంతమంది రెచ్చగొట్టడం వల్లే అడవుల్లో ఘర్షణాత్మక పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. -
‘పోడు’ సమస్య ఇంకెన్నాళ్లు?
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఆదివారం అటవీ అధికారులపై స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ తన మనుషులతో సాగించిన దాడిలో ఎఫ్ఆర్ఓ అనిత తీవ్రంగా గాయపడటం పోడు భూముల సమస్యను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. కాగజ్నగర్ మండలం కొత్త సార్సాల శివారులోని 20 హెక్టార్ల భూమి విషయంలో కొంతకాలంగా స్థానిక రైతులకు, అటవీ అధికారులకు మధ్య వివాదం సాగుతోంది. తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఆ భూములను ఖాళీచేయాలని అటవీశాఖ ఒత్తిడి చేస్తోంది. పోడుభూములంటే అటవీశాఖ స్వాధీనం చేసుకోదగిన భూములుగా, ప్రజలకు ఏ హక్కు లేని భూములుగా ప్రభుత్వం భావించాల్సిన అవసరం లేదు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని పోడు భూములపై ఆదివాసీలకు హక్కు లేకుండా అటవీహక్కుల చట్టం 2006 పేరుతో ఆదివాసీ గ్రామా లను ఖాళీ చేయిస్తున్నారు. భూములు హరితహారాలుగా మారుతాయేమో కాని పోడు చేసుకుంటున్న జీవితాలకు ఆధారం పోతుందని, వారికి తామే ప్రత్యామ్నాయం చూపెట్టవలసిన బాధ్యత ఉందని ప్రభుత్వం గుర్తించటం లేదు. అటవీభూమిపై ఆదివాసీలకు హక్కు ఉంటుందని 1997లో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. కానీ ఆదివాసీల భూములను పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలనే ప్రభుత్వ విధానం వల్ల ఆదివాసీలు నిర్వాసితులవుతున్నారు. నెలరోజుల క్రితం ఇదే జిల్లాలో కొలాంగోంది గ్రామ ఆదివాసీలపై పోలీసుల అండదండలతో అటవీశాఖ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. అప్పుడు ఎవరూ ఆదివాసీలను రక్షించడానికి రాలేదు. అదే సిబ్బందిపై సార్సాలలో దాడిచేస్తే దానికి నాయకత్వం వహించింది అధికారపక్ష ప్రజాప్రతినిధి కనుక పోలీసు సిబ్బంది, ఇతర అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. ప్రభుత్వాల ‘చట్టబద్ధ పాలన’లో అధికారుల పాత్ర ఎలా ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధులు తమను దుర్భాషలాడినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అధికారులు ఉండిపోవడం ఇది మొదటి సారి కాదు. గతంలో టీఆర్ఎస్ నేతలు హరీష్రావు, దానం నాగేందర్లు కూడా ఇలాగే వ్యవహరించారు. స్థానిక ఎస్ఐ మొదలుకొని జిల్లా ఎస్పీ వరకూ అందరి బదిలీలనూ ప్రజాప్రతినిధులే నిర్దేశిస్తున్నారు. కనుకనే వారిని ప్రశ్నించడం, ఎదిరిం చడం అధికారులకు సాధ్యం కావడం లేదు. ఏం జరిగినా వారు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. సార్సాల దాడిని ఈ నేపథ్యంలోనే చూడాలి. సార్సాల ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకొని అందరూ స్పందించారు. ఖండించారు. కానీ కొలాంగోంది ఆదివాసీ గ్రామాన్ని టైగర్ ప్రాజెక్టు పేరుతో అటవీ శాఖ సిబ్బంది దగ్గరుండి ఖాళీ చేయించినప్పుడు ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదు? ఒక ఆదివాసీ గ్రామాన్ని ధ్వంసం చేస్తుంటే వీరెవరికీ పట్టదా? ఆ గ్రామం 40 ఏళ్లనుంచి అక్కడ ఉంది. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ గ్రామాన్ని కుట్రపూరితంగా టైగర్ ప్రాజెక్టులో విలీనం చేయించారు. తమ రేషన్ కార్డులతోసహా అన్ని పత్రాలూ ఆయన దగ్గరే పెట్టుకున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. కానీ ఎలాంటి పత్రాలూ లేవనే సాకుతో అటవీ శాఖ ఆ ఆదివాసీలను నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్లగొ ట్టింది. అంతేగాక ఆ సమస్య గురించి న్యాయస్థానా నికి తప్పుడు నివేదిక ఇచ్చింది. ఇది నేరం కాదా? ఈ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో గిరిజనేతరుల ఆధిపత్యం అమలవుతోంది. అక్కడ 1/70 చట్టం ఉన్నా ఈ కబ్జాలు ఆగడం లేదు. గిరిజనులకు దక్కాల్సిన ఎన్నో సారవంతమైన భూములు గిరిజనేతరుల వద్ద ఉన్నాయి. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కోనేరు సోదరులు వీటిని ప్రోత్సహిస్తున్నారు. కొలాంగోంది గ్రామాన్ని ధ్వంసం చేయడంలోనైనా, మొన్న అటవీ సిబ్బందిపై దాడి వెనకైనా ఈ కబ్జాల బాగోతమే ఉంది. కొలాంగోంది గ్రామానికి తిరిగి వెళ్లాలని ఆదివాసీలు ప్రయత్నిస్తున్నా అటవీశాఖ అనేక ఆటంకాలు కల్పిస్తోంది. ఇప్పటికీ ఆ జిల్లాలోని పలు గ్రామాలపై అటవీ సిబ్బంది దాడులు చేస్తున్నారు. వీటన్నిటినీ ఆపాలని పౌరహక్కుల సంఘం కోరుతోంది. కొలాంగోంది గ్రామస్తులపై అటవీ సిబ్బంది జరిపిన దాడినైనా, అటవీ సిబ్బందిపై కోనేరు కృష్ణ నేతృత్వంలో సాగిన దాడినైనా పౌరహక్కుల సంఘం ఖండిస్తోంది. ఈ రెండు రకాల దాడుల వెనకా కబ్జాలే ఉన్నాయి. కబ్జారాయుళ్లను నిరోధించి ఆదివాసీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అదే సమయంలో అటు ఆదివాసీలపైన, ఇటు అటవీ సిబ్బందిపైన దాడులు జరగకుండా నియంత్రించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించి, వారిపై అటవీ సిబ్బంది జులుం చేయకుండా తగిన ఆదేశాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎన్. నారాయణరావు, ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ మొబైల్ : 98667 34867 -
కవ్వాల్ నుంచి రెండు గ్రామాలు రీలొకేట్
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రధాన అటవీ ప్రాంతం (కోర్ ఏరియా) నుంచి మైసంపేట, రాంపూర్ గ్రామాలను రీలొకేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం 112 హెక్టార్ల అటవీప్రాం తాన్ని డీనోటిఫై చేస్తూ ఆదేశాలిచ్చింది. గురువారం ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులిచ్చారు. గ్రామస్తులు ఖాళీ చేసిన ప్రాంతాన్ని అటవీశాఖ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని, తగిన విధంగా నిర్వహించాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ నివాసుల (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్), 2006 చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతంలోని వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో చెట్లను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు (ట్రాన్స్లొకేషన్) పీసీసీఎఫ్ చర్యలు తీసుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అటవీశాఖ పర్యవేక్షణలో చెట్లను కొట్టాలని పేర్కొన్నారు. ఏడాదిలోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరావాస ప్రక్రియ ఏ మేరకు జరిగిందన్న దానిపై చెన్నైలోని కేంద్ర అటవీశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిశీలిస్తుందని, ఒకవేళ గ్రామస్తులు వెనక్కు వెళితే ఈ అనుమతిని తిరగదోడవచ్చునని స్పష్టం చేశారు. తొలి ఐదేళ్ల వరకు ప్రాంతీయ కార్యాలయం పరిశీలనను కొనసాగిస్తుందని తెలిపారు. అటవీ భూమిలో లేబర్ క్యాంప్లు లేకుండా పీసీసీఎఫ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. దశలవారీగా తరలింపు దశల వారీగా కవ్వాల్ అడవి ప్రధాన ప్రాంతం నుంచి వివిధ గ్రామాలు, నివాసిత ప్రాంతాలను బయటి ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అడ్మిన్, వైల్డ్లైఫ్ ఇన్చార్జి అడిషనల్ పీసీసీఎఫ్ మునీంద్ర ‘సాక్షి’కి తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని గ్రామస్తుల నుంచి స్వచ్ఛంద అంగీకారం తీసుకున్నాకే వారిని ఇతర ప్రాంతాల్లోకి పంపించే ప్రక్రియను చేపడుతున్నట్టు చెప్పారు. గ్రామసభల్లో తీర్మానం చేశాకే తరలింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ గ్రామాల ప్రజలకు ప్రధాన అటవీ ప్రాంతం కాకుండా ఇతర అటవీ ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తున్నామన్నారు. టైగర్ రిజర్వ్లోని కోర్ ఏరియాలో మొత్తం 37 వరకు ఆవాసాలు (హ్యాబిటేషన్లు) ఉన్నాయని, వాటిలో మైసంపేట, రాంపూర్ గ్రామాలను రీలొకేట్ చేయడం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు. -
‘బస్తర్’ మే సవాల్
మహారాష్ట్రలోని గడ్చిరోలి.. ఛత్తీస్గఢ్లోని బస్తర్.. గిరిజన నియోజకవర్గాలు. అటవీ హక్కుల చట్టంపైనే అన్ని కళ్లూ పెట్టుకున్నారు ఇక్కడి ఆదివాసీలు. భూమి హక్కులు కాపాడే వారికే ఓటేస్తామంటున్నారు. మరోవైపు మావోయిస్టులు ఇక్కడ ఎన్నికల్ని అడ్డుకునేందుకు బెదిరింపులకు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మంగళవారం బస్తర్లోని దంతేవాడకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు భీమా మాండవి కాన్వాయ్పై దాడి జరిపి, ఆయనతో సహా నలుగురు భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం బస్తర్లో 80 వేల భద్రతా బలగాలను, డ్రోన్లను మోహరించింది. భారీ ఏర్పాట్ల మధ్య నేడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గడ్చిరోలిలో అటవీ హక్కుల చట్టం ప్రభావం మహారాష్ట్రలోని గడ్చిరోలి చిముర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఢీకొంటున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అశోక్ నేతే, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నామ్దేవ్ ఉసెంది మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే. మోదీకి వున్న జనాకర్షణ తమ అవకాశాలను మెరుగుపరుస్తుందని బీజేపీ భావిస్తుండగా, ఎన్సీపీ, సీపీఐ పొత్తుతో తాము గట్టెక్కగలమని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఎటపల్లి – భమ్రాగర్ మైనింగ్ బెల్ట్లో పెసా, అటవీ హక్కుల చట్టాలు అమలు చేయకపోవడంపై ఇక్కడ ఆదివాసీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ అంశం ఎన్నికల్లో కీలకం కానున్నదని గడ్చిరోలి మారుమూల ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. గిరిజనుల అటవీ హక్కులు పరిరక్షించకపోవడమనేది బీజేపీకి నష్టదాయకంగా పరిణమించగలదన్న అభిప్రాయం వినపడుతోంది. గడ్చిరోలిలో 90.85 శాతం మంది గ్రామీణులు. 30.50 శాతం మంది ఆదివాసీలు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడిన గడ్చిరోలి ప్రజలు రైల్వే కనెక్టివిటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వీటిపై నేతే 2014లో ఓటర్లకు ఇచ్చిన వాగ్దానం నెరవేరకపోవడం, దీనికి తోడు ఆయన ఓ ఆర్థిక కుంభకోణంలో చిక్కుకోవడం అనే అంశాలు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 42 శాతం ఓబీసీల ఓట్లు ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. తమ రిజర్వేషన్ కోటాను 19 నుంచి 6 శాతానికి తగ్గించడంపై వీరు ఆగ్రహంతో వున్నారు. కోటాను పునరుద్ధరింపచేస్తామని రెండు ప్రధాన పార్టీల నేతలూ హామీలిచ్చారు. భూమి హక్కులే ‘బస్తర్’ ఎజెండా ఛత్తీస్గఢ్లోని బస్తర్లో భూమి హక్కే ప్రధాన ఎజెండా. అటవీ హక్కుల చట్టం కింద అడవులపై ఆధారపడి జీవించే హక్కు తమకు ఉందంటున్న ఆదివాసీలు.. తమ భూముల జోలికి రాబోమని ప్రకటించే వారికే ఓటు వేస్తామంటున్నారు. ‘జాతీయవాదం ఇక్కడ ఓట్లు రాల్చదు. జీవనాధారమైన భూమే మాకు అతి ముఖ్యం’ అంటున్నారు స్థానికులు. అడవుల్లో నివసించేందుకు అనర్హులైన ఆదివాసీలను దురాక్రమణదారులుగా గుర్తించి జూలై లోపు ఖాళీ చేయించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇక్కడి ఆదివాసీలు మండిపడుతున్నారు. ఇటీవల నిరసన ప్రదర్శనలు జరిపి, కరపత్రాలు పంచారు. ఏ ఒక్కరినీ అడవుల నుంచి ఖాళీ చేయించబోమని ముఖ్యమంత్రి భాగెల్ హామీ ఇచ్చిన తర్వాతే వారు శాంతించారు. మోదీ ప్రభుత్వం కోర్టులో ఆదివాసీల తరఫున తన వాదన సరిగా వినిపించలేకపోయిందని, వారి హక్కులకు రక్షణ కల్పించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కొంటా, బస్తర్, చిత్రకూట్, కొండగావ్, జగదల్పూర్, దంతేవాడ, బీజీపూర్, నారాయణపూర్ అనే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న బస్తర్ లోక్సభ నియోజకవర్గంలో ఎస్టీ జనాభా 70 శాతం. బీజేపీ తరఫున ఆ పార్టీ బస్తర్ జిల్లా నేత బైదురామ్ కశ్యప్.. కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ లీడర్ దీపక్ బైజ్తో తలపడుతున్నారు. 1998 నుంచి బీజేపీ ఖాతాలో వున్న బస్తర్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో వున్న కాంగ్రెస్.. ఈసారి చిత్రకూట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దీపక్కు టికెట్ ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి కంటే ఈ యువకుడికే ప్రజాదరణ ఎక్కువ వున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో టాటా గ్రూప్ కోసం బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగిచ్చేయడమనేది ఆదివాసీల్లో కాంగ్రెస్ ఆదరణకు దోహదపడగలదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బస్తర్ సిట్టింగ్ ఎంపీ దినేశ్ కశ్యప్పై స్థానికుల్లో చోటుచేసుకున్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్కు అనుకూలంగా మారనుంది. పలు సమస్యలతో సతమతమవుతున్న నియోజకవర్గాన్ని ఎంపీ ఏనాడూ సందర్శించలేదని ఆదివాసీలు విమర్శిస్తున్నారు. కేంద్రంపై ఉన్న వ్యతిరేకతకు తోడు గత మూడు మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరచడం, ప్రత్యేకించి రుణమాఫీ అమలు చేయడం, బీజేపీ సర్కారు స్వాధీనం చేసుకున్న గిరిజనుల భూములను తిరిగివ్వడం వంటి చర్యలు తమకు లాభిస్తాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ నేత కవసి లక్మా. మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బస్తర్ లోక్సభ స్థానంలో దంతేవాడ మినహా మిగిలిన సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు దంతేవాడలో మావోయిస్టులు పేల్చిన మందు పాతరలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి మృతి చెందారు. బీఎస్పీకి చెందిన ఆయుతు రామ్ మండవి, సీపీఐకి చెందిన రాము రామ్ మౌర్య సహా మొత్తం ఏడుగురు అభ్యర్థులు ఇక్కడ బరిలో వున్నారు. మొబైల్ ఫోన్లు వాడుకోగల పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో అంతగా లేదు. రహదారులకు దగ్గరగా వుండే కొన్ని ఇళ్లలోనే ఇక్కడ టీవీలుంటాయి. బీజేపీ, కాంగ్రెస్లంటే ఇక్కడ పువ్వు, చేతి గుర్తులే. మావోయిస్టుల ఆదేశాల ప్రభావమే ఎక్కువ. మావోల బెదిరింపులు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు కొన్ని ప్రాంతాల్లో తొలగించి, దగ్ధం చేశారు. మరోవైపు మావోల భయంతో అభ్యర్థులు భమ్రాగర్, సిరోంచ, అహేరి, ధనోరా, ఎటపల్లి సహా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి దూరంగా వున్నారు. బెదిరింపుల నేపథ్యంలో జనం ఎన్నికల సభలకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు నేతే. ఉసెంది మారుమూల ప్రాంతాల్లో కొద్ది మేర ప్రచారం జరిపారు. మావోయిస్టుల హింసకు సంబంధించి ఇక్కడ 2014లో 15 కేసులు, 2009లో 18 కేసులు నమోదయ్యాయి. 2004లో ఎదురు కాల్పుల ఘటనలు సహా మొత్తం 23 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మందు పాతర పేలుళ్లలో ఇద్దరు పోలీసులు మరణించారు. గత ఏప్రిల్లో భద్రతా దళాలు కస్నాసుర్ గ్రామం వద్ద 40 మంది అనుమానిత మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఇందుకు ప్రతీకారంగా మావోలు ఇన్ఫార్మర్లుగా ముద్ర వేసి, అరడజను మంది గ్రామస్తులను చంపేశారు. -
మా భూములు లాక్కుంటున్నారు
సాక్షి,కాసిపేట: అన్యాయంగా 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను అటవీ శాఖ అధికారులు కేసులు పె డుతూ లాక్కుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ నాయకపుగూడ శివారులోని భూములు ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. కాని ఈ మ ధ్య కాలం నుంచి అటవీశాఖ అధికారులు తమ భూములు అంటూ సాగు చేసుకుంటున్న గిరిజనులను బెదిరించి కేసులు పెడుతున్నారు. వారం రోజుల క్రితం సాగు చేసుకునేందుకు వెళ్లిన రైతుపై, ట్రాక్టర్పై కేసు నమోదు చేయడంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అటవీశాఖ అధికారులతో వాదనకు దిగారు. 1978లో 116 మందికి 188 ఎకరాలు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. లావణి పట్టాలు కలిగి ఉన్న రైతులు కొంత మంది సాగు చేసుకోగా కొంత మంది పడావుగా వదిలేశారు. ఈ మధ్య కాలంలో సాగు చేసుకునేందుకు గిరిజనులు మా భూములు అంటూ వెళ్తుండగా బెల్లంపల్లి డివిజన్ అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారు. దీంతో గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం అక్రమ కేసులు పెట్టడంతో సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళనకు సిద్ధమవుతూ అధికారులను కలిసి విన్నవించారు. దీనిపై రెవెన్యూ అధికారులు తమ భూములని లావణి పట్టాలు ఉన్నాయని చెబుతుండగా, అటవీశాఖ అధికారులు తమ భూములని అంటున్నారు. దీంతో ఇరుశాఖల మధ్య సమన్వయం లోపించడం గిరిజనులకు శాపంగా మారింది. కనీసం రెండేళ్ల నుంచి ఏం తేల్చకుండా రైతులను వేధింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు పట్టాలు ఉన్న భూములను తమకు ఇప్పించాలని లేనట్లయితే మరోచోట భూమి చూపాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజనులను వేధించడం సరికాదు.. ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసు కుంటున్న గిరిజన రైతులను అటవీశా ఖ అధికారులు ఇబ్బందులకు గురి చే యడం సరికాదు. దీనిపై ఇరు శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సమ స్యను పరిష్కరించాలి. లేదంటే ఆందో ళనలు ఉధృతం చేస్తాం. వేముల కృష్ణ పెద్దనపల్లి యాబై ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం.. ప్రభుత్వం 1978లో తమకు భూములు అసైన్డ్ చేయడంతో అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు వచ్చి తమ భూములంటూ బెదిరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాకు న్యాయం చేయాలి. – మెసయ్య, రైతు -
అటవీ భూముల.. ఆక్రమణ!
సాక్షి, దామరచర్ల(నల్గొండ) : పక్కనే మూసీ, కృష్ణా నది.. నీటి వనరులు పుష్కలం.. చుట్టుపక్కల విస్తారమైన అటవీ ప్రాంతం.. ఇంకేముంది అక్రమార్కులు అడవిపై పడ్డారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కబ్జాపర్వం మొదలుపెట్టారు. కొందరు పంటలు సాగు చేసుకుంటుండగా, మరికొందరు క్రయ విక్రయాలు కూడా జరుపుతున్నారు. ఇదీ.. దామరచర్ల మండలంలోని అటవీభూముల్లో ఆక్రమణల తీరు. అధికారుల నిర్లక్ష్యం.. అక్రమార్కులకు వరంగా మారింది. దామరచర్ల మండలంలో వందలాది ఎకరాల అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. వందల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములను కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేసుకొని సాగు చేసుకుంటున్నారు. ఇవి క్రయ విక్రయాలు జరుగుతున్నా అటవీశాఖ అధికారులకు మాత్రం పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టంలోని లొసుగులను ఆ«ధారంగా చేసుకొని కొందరు అధికారులు తప్పుడు పట్టాలు ఇచ్చారు. వందలాది ఎకరాలు పరాధీనం అవుతున్నా, పచ్చని చెట్లు కనుమరుగవుతున్నా పట్టించుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక్కడి వందలాది ఎకరాల డీఫామ్ పట్టా భూములు సైతం వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వం ఓవైపు హరితహారం పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుండగా, మరో పక్క కొందరు అవినీతి అధికారుల కారణంగా ఉన్న అడవి నాశనం అవుతోంది. మిర్యాలగూడ రేంజర్ పరిధిలో4,99,259.91 హెక్టార్ల అటవీ భూమలున్నాయి. అందులోని దామరచర్ల మండలం పలుగ్రామాల్లో అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ తంతు దశాబ్దకాలంగా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దామరచర్ల రెవెన్యూ పరిధిలోని 430 సర్వే నంబర్లో 1,089 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిల్లో సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు కొంతమేర కేటాయించారు. డీఫామ్ పట్టాల భూముల్లో సైతం ఆక్రమణదారులు చేరారు. ఈ భూములన్నీ మూసీ నది పక్కన ఉండడం, లిప్టు సౌకర్యం ఉండటంతో దర్జాగా సాగు చేసుకుంటు న్నారు. కరెంట్, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకొని, బోర్లు వేసి çవరి, పత్తి లాంటి పంటలు పండించుకుంటున్నారు. వీటిని కొందరు వ్యక్తులు విక్రయాలు సైతం జరుపుతున్నారు. సర్వే నంబర్ 826లో 1097 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిల్లో సైతం పలువురు కబ్జా చేసుకొని సాగు చేసుకుంటున్నారు. కొందరైతే తాము ఆక్రమించుకున్న అటవీ భూములను అమ్ముకుంటున్నారు కూడా. వీటిపై ఉన్నతాధికారులకు ఇప్పటికే పలువురు ఫిర్యాదు కూడా చేశారు. దామరచర్ల కనుచూపు మేరలోనే అటవీ భూముల అక్రమాల పర్వం జరుగుతున్నా, ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనుమరుగవుతున్న వనసంపద దామరర్ల మండలంలోని కృష్ణా, మూసీనది, అన్నమేరు వాగుల నడుమ వందలాది ఎకరాల్లో ఉన్న అటవీ భూముల్లోని వనసంపద కనుమరుగవుతోంది. విలువైన, సారవంతమైన భూములు కావడం, నీటి సౌకర్యం ఉండడంతో చెట్లు ఏపుగా పెరిగాయి. ఈ చెట్లను నరికి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. దామరచర్ల, నర్సాపురం, వాచ్యాతండా, కల్లేపల్లి, తాళ్లవీరప్ప గూడెం, గణేష్పాడ్, వాడపల్లి తదితర గ్రామాల్లోని అటవీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అధికారుల్లో స్పష్టత కరువు సాగర్ నిర్వాసితుల కోసం దామరచర్లలోని సర్వేనంబర్ 430, నర్సాపురం సర్వేనంబర్ 826, గాంధీనగర్ సర్వేనంబర్ 441లోని అటవీ భూముల్లో కొంతభాగాన్ని డీ ఫారెస్టు చేసి పట్టాలు ఇచ్చారు. అయితే వీటిపై అధికారుల్లో స్పష్టత లేదు. నిజమైన లబ్ధిదారులు ఎవరు? వారికి ఏ సర్వేనంబర్లో ఎంతమేర భూములు.. ఎక్కడెక్కడ కేటాయించారు? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డీ ఫారెస్టు భూములు క్రయ విక్రయాలకు వీలుండడంతో, కొందరు అవినీతి అ«ధికారులు అక్రమ పట్టాలు ఇచ్చారు. వీటిని ఆసరాగా చేసుకొని కబ్జాల పర్వం సాగుతోంది. అటవీశాఖ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి, నిజమైన డీఫామ్ పట్టాదారులను గుర్తిస్తే కబ్జాకు గురైన వందలాది ఎకరాల అటవీభూములును రక్షించే వీలుంది. తాజాగా మండలంలోని 430లో సర్వే చేస్తున్నందున, మిగిలిన చోట్ల కూడా సర్వే జరిపి కబ్జాదారుల కబంధ హస్తాలనుంచి అటవీ భూములను రక్షించాల్సి ఉంది. దీనికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
అటవీ చట్ట ఉల్లంఘనలకు చీతా చెక్
కాగజ్నగర్: డివిజన్ పరిధిలో ఎవరైనా అటవీ చట్ట ఉల్లంఘనలకు చీతా చెక్ పెట్టనుంది. చీతా అనే పేరు గల జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన స్నిప్ ఫర్ డాగ్ను డివిజన్కు కేటాయించారనీ, దీంతో చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడే నిందితులను త్వరగా పట్టుకోవచ్చని కాగజ్నగర్ ఎఫ్డీవో రాజారమణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం కాగజ్నగర్ డివిజన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి జన్నారం నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ బృందం గురించి వివరించారు. ఈ డాగ్ పేరు చీతా అని ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను దీని సాయంతో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చీతా చాలా చురుకైన డాగ్ అనీ, నేరస్థులతోపాటు అక్రమ వేట సామగ్రిని కూడా గుర్తిస్తుందన్నారు. గత చట్టంలో నిందితులు బెయిల్పై వచ్చేవారని, కొత్త చట్టంలో అలాంటి వీల్లేదని ఎఫ్డీవో స్పష్టం చేశారు. అడవులను నరికినా, వన్యప్రాణులను వేటాడినా నాన్ బెయిలేబుల్ కేసు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎప్ఆర్వో అనిత, ఎఫ్ఎస్వో యోగేష్, బీట్ ఆఫీసర్ బానయ్య, డాగ్ స్క్వాడ్ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు కుట్ర
సిరిసిల్ల: మూడు తరాలుగా అడవుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు ఆరోపించారు. సిరిసిల్లలో ఆదివారం ఆ యన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలం గాణలో సుమారు 80 వేల మంది ఆదివాసీలు అడవుల్లో ఉన్నారని, 1971 నుంచి పరిశ్రమల పేరుతో వారిని అడవుల నుంచి బయటకు వె ళ్లగొట్టేందుకు సర్కారు కుట్ర చేస్తోందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ చ ట్టాలను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. అ టవీ సంపదను దోచుకునేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను అడ్డుకుం టామని నాయకులు బూర శ్రీనివాస్, మంత్రి చంద్రన్న పేర్కొన్నారు. -
అడవి బిడ్డలను పొమ్మంటున్నారు
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో దేశంలోని 16 రాష్ట్రాల్లోని ఆదివాసీలు, గిరిజనులు, అడవిపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది తక్షణమే అడవి వదలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు ఆదివాసీల అటవీ హక్కుల చట్టానికి భిన్నమైన తీర్పు రావడం బీజేపీకి నష్టం చేకూరుస్తుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రాధాన్యాన్ని కోర్టులో సరిగ్గా వివరించని కారణంగానే ఆదివాసీలు నష్టపోవాల్సి వస్తుందని అపవాదును ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటవీ హక్కుల చట్టం–2006 చెల్లుబాటుకు సంబంధించిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్పై పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన వాజ్యంపై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. పిటిషన్ దారుల్లో ఒకరైన నేచర్ కన్జర్వేషన్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ 2006 అటవీ హక్కుల చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. అడవి విధ్వంసానికి, వన్యప్రాణులకు నష్టం చేస్తుందని పేర్కొంది. అటవీ హక్కుల చట్టంలో వాడిన అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్యుయెల్లర్స్ అనే కోవలోనికి ఎవరొస్తారన్న విషయంలో రాజ్యాంగంలోనే అస్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ ఆధారంగా ఇచ్చిన కోర్టు ఆదేశాల ప్రకారం అటవీ హక్కుల చట్టం పరిధిలో భూ యాజ మాన్య హక్కు దరఖాస్తుల తిరస్కరణకు గురైన దాదాపు 11 లక్షల మంది ఆదివాసీలను అటవీ ప్రాంతాల నుంచి జూలై 27లోగా ఖాళీ చేయించాలని కోర్టు స్పష్టం చేసింది. నిర్దాక్షిణ్యంగా తరిమికొడతారా? ఆదివాసీలపై అటవీశాఖ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివాసీల హక్కులు హరణకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఆ శాఖ ఎదుర్కొంటోంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద భూయాజమాన్య హక్కుల దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలను అడవి నుంచి నిర్దాక్షిణ్యంగా తరిమికొట్టే ప్రయత్నం జరుగుతోంది. అటవీ ఉత్పత్తుల ద్వారా అటవీ శాఖకు వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడంతో ఆదివాసీలపై ఒత్తిడి పెరుగుతోందని ఆదివాసీల హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2శాతం మందికే అనుమతి ట్రైబల్ వెల్ఫేర్ శాఖ గణాంకాల ప్రకారం దేశం మొత్తం 42.19 లక్షల మంది భూ యాజమాన్య హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే 18.89 లక్షల మందినే అనుమతించారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారిని కూడా కలుపుకుంటే అడవి నుంచి నిర్వాసితులు కానున్న ఆదివాసీల సంఖ్య 23 లక్షలకు పైగానే ఉంటుంది. గోండూ, ముండా, డోంగ్రి యా తదితర ఆదివాసీలు తమ అటవీ భూములను బాగు చేసుకొని అందులో పండించుకునే అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి బతుకుతారు. ఇందులో 2 శాతం మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన వారంతా అక్రమంగా అటవీ ప్రాంతంలో సాగుచేసుకుంటున్న వారేనని అటవీ హక్కుల చట్టాన్ని బట్టి అర్థం అవుతోంది. అయితే కోర్టులో కేంద్రం ఆదివాసీల రక్షణ చట్టాన్ని సమర్థించుకోలేకపోయిందన్న విమర్శలొస్తున్నాయి. -
‘పాలమూరు, సీతారామ’కు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూముల బదలాయింపునకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూములను వాడుకునేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ భూముల బదలాయింపున కు అంగీకరించింది. దీనికి సంబంధించి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్మిశ్రా శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. సీతారామ ఎత్తిపోతలకు గత నెలలో చెన్నై ప్రాంతీయ కార్యాలయం అట వీ అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూ డెం అటవీ డివిజన్లలోని 1,201 హెక్టార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం డివిజన్లలోని 330 హెక్టార్లు.. మొత్తం 1,531 హెక్టార్ల అటవీ భూమిని నీటిపారుదల శాఖకు బద లాయిస్తూ రాష్ట్ర అటవీ శాఖ నిర్ణ యం తీసుకుంది. ఇక పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్ లోని 205.48 హెక్టార్ల అటవీ భూమిని సాగునీటి శాఖకు అప్పగించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, ఇటీవలే తుది దశ అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రాజెక్టులో భాగంగా నిర్మి స్తున్న మొదటి స్టేజి పంప్ హౌస్, నార్లపూర్ వద్ద అంజనగిరి రిజర్వాయర్, నార్లపూర్ –అంజనగిరి – ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్ల మధ్య టన్నెల్ తవ్వకపు పనులకు అటవీ భూములను బదిలీచేస్తూ రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత అనుమతితో 205.48 హెక్టార్ల అటవీ భూమి పాలమూరు ప్రాజెక్టు సీఈ ఆధీనంలోకి వస్తుంది. -
పండ్ల మొక్కలకు ప్రాముఖ్యత
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హరితహారంలో కోతులకు ఆహారాన్ని ఇచ్చే పండ్ల మొక్కలకు ప్రాముఖ్యత ఇస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) పీకే ఝా అన్నారు. గత ఏడాది హరితహారం కింద రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు 90 శాతం బతికాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడారు. ప్రకృతిలో పండ్ల మొక్కలు తగ్గిపోవడం, మరోవైపు మనుషులు జంక్ ఫుడ్ను ఫీడ్గా ఇవ్వటం వలన కోతులు వనాలు వదిలి ఊళ్ల మీదకు మళ్లాయని, తిరిగి వాటిని వనాల్లోకి పంపాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ పండ్ల మొక్కలు పెంచటం ఒక్కటే మార్గమని చెప్పారు. ‘‘కోతులు ఇష్టంగా తినే 25 రకాల పండ్ల మొక్కలను గుర్తించాం, వాటిని రాష్ట్రవ్యాప్తంగా వివిధ నర్సరీలతో పెంచుతున్నాం. ఈసారి రుతుపవనాలు ఆశాజనకంగానే ఉన్నాయి. మొక్కలతో మేం సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది 39.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి హరితహారం ప్రారంభ తేదీని నిర్ణయిస్తాం. అటవీ భూములు ఉన్నచోట వందకు వంద శాతం పండ్ల మొక్కలనే నాటుతామని, అటవీ భూములు లేనిచోట కనీసం 20 శాతం కోతులు తినే పండ్ల మొక్కలు కచ్చితంగా నాటాలనే నిబంధన పెట్టుకున్నాం. మనుషులు కోతులకు కృత్రిమ ఆహారం ఇవ్వొద్దని, దీనికి అలవాటు పడిన కోతులు సహజ ఆహార అన్వేషణ మరిచిపోయి ఊళ్ల మీదకు మళ్లుతున్నాయని’’ఝా అన్నారు. శాటిలైట్ ఫోటోల ద్వారా రాష్ట్రంలో 565 స్క్వేర్ కిలోమీటర్ల మేరకు పచ్చదనం పెరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ ఏడాది గూగుల్ శాటిలైట్ విడుదల చేసిన చిత్రాల్లో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే 100 స్క్వేర్ కిలోమీటర్లకు పైగా పచ్చదనం విస్తరించిన రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. మా పనితనానికి ఇది అద్భుతమైన గుర్తింపు. బంగారు తెలంగాణలో మా భాగస్వామ్యం బలంగా ఉండాలనే ఆశయంతో అటవీ శాఖ ఉద్యోగులు, అధికారులు సమష్టిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న జల ప్రాజెక్టులకోసం మా అధికారుల చొరవ, కృషిని అభినందిస్తున్నారు. కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు ఎత్తిపోతల పథకానికి అత్యంత వేగంగా అటవీ అనుమతులను సాధించటంలో అధికారులు రాత్రింబవళ్లు కృషి చేశారు. కేంద్ర అటవీ శాఖ నుంచి జల ప్రాజెక్టులకు ఇంత వేగంగా అటవీ అనుమతులు గతంలో నేనెప్పుడూ చూడలేదని ఝా చెప్పారు. అటవీ భూముల రక్షణే ధ్యేయంగా.. ఎకోపార్కులు, అర్బన్ ఫారెస్టు పార్కు ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ప్రజలకు అడవుల మీద, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యతల మీద అవగాహన కలిగించటమే ఎకో పార్కుల ఉద్దేశం. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని అటవీ భూములను రక్షించుకుంటూ.. ప్రజలకు స్వచ్ఛమెన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించే లక్ష్యంతో నే అర్బన్ ఫారెస్టు పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే కొండాపూర్లో పాలపిట్ట సైక్లింగ్ ఉద్యానవనం, బర్డ్ పార్కును అభి వృద్ధి చేశాం. 40 రకాలకు చెందిన దాదాపు 7,500 మొక్కలను ఈ పార్కులో కొత్తగా పెంచుతున్నాం. కండ్లకోయ పార్కు వినియోగంలోకి వచ్చింది. కవాల్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు సమీపంలో మంచిర్యాల జిల్లా చింతగూడ గ్రామంలో కొత్త పర్యావరణ, పర్యాటక ప్రాజెక్టు కోసం ఆరు ఎకరాల భూమిని గోదావరి నది దగ్గర సేకరించి, పర్యాటక స్థల అభివృద్ధి కోసం టెండర్లు పిలిచాం. నల్లగొండ జిల్లాలోని వైజాగ్ కాలనీలో నాగార్జునసాగర్ తీర ప్రాంతంలో మరొక పర్యావరణ ప్రాజెక్టు కోసం భూమి గుర్తించాం. ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ అడవులను దట్టమైన అటవీ ప్రాంతంగా మార్చాలనేది ముఖ్య మంత్రి ఆకాంక్ష. సుమారు 3,470 హెక్టార్లలో అటవీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో రక్షించటంతో పాటు పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఆక్రమణలకు గురికాకుండా దాదాపు 40 కి.మీ పొడవునా సీ త్రూ వాల్ను నిర్మిస్తాం. వెదురు పరిశ్రమ (బ్యాంబూ లంబర్ ఇండస్ట్రీ) ఏర్పాటుకోసం రూ.22.4 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఇదివరకు కాగితం తయారీ కోసం పేపర్ మిల్లులు వెదురును కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసేవి. ప్రస్తుతం టెక్నాలజీ మార్పు కారణంగా వీటికి డిమాండ్ లేదు. బ్యాంబూ లంబర్ ఇండస్ట్రీని స్థాపించి ఈ ప్లాంటేషన్లలో లభించే వెదురును పూర్తిగా ఉపయోగించుకుంటే ఇది రైతులకు ఆదాయాన్ని పెంచుతుంది అని ఝా చెప్పారు. -
నెల రోజుల్లో పెండింగ్ కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: అటవీ భూముల హక్కులకు సంబంధించిన కేసులను నెలరోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించాలని గిరిజన సలహా మండలి (టీఏసీ) నిర్ణయించింది. అటవీభూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలిచ్చే అంశంపై మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం ఇక్కడ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ అధ్యక్షతన టీఏసీ సమావేశం జరిగింది. ఇందులో ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటవీ భూముల హక్కులకు సంబంధించి పెండింగ్ కేసులపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉండటంతో అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగట్లేదని మండిపడ్డారు. రైతు బంధు పథకం వర్తింపజేయాలంటే కేసులు పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా స్పందిస్తూ రైతు బంధు పథకం అమల్లోపే కేసులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో తిరస్కరించిన దరఖాస్తులతో పాటు కొత్తవారి నుంచి కూడా అర్జీలు స్వీకరించే అంశాన్ని పరిశీలించాలని, ఈ మేరకు ప్రభుత్వానికి సూచించాలని టీఏసీ తీర్మా నించింది. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ.. ప్రభుత్వ శాఖల్లో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి తక్షణ చర్యలు తీసుకోవాలని గిరిజన సలహా మండలి తీర్మానించింది. దాదాపు 1,000 బ్యాక్లాగ్ పోస్టులున్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని సభ్యులు సూచించారు. నెలరోజుల్లోగా ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో 108 వాహ నాలను అందుబాటులో ఉంచాలని, పారామెడికల్, మెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవరకొండ ప్రాంతంలో నర్సింగ్ శిక్షణ కళాశాల ఏర్పాటు చేయాలని టీఏసీ తీర్మానించింది. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు ఐటీడీఏలకు మూడు స్వధార్ గృహాలను మంజూరు చేసి నిర్మించాలని సలహా మండలి తీర్మానం చేసింది. భద్రాచలం, సార పాక, ఉట్నూరు, ఆసిఫాబాద్లను మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేయాలని తీర్మానించింది. ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులనే నియమించాలని సభ్యులు సున్నం రాజయ్య టీఏసీకి సూచించగా.. ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. గిరిజన సలహా మండలి సమావేశానికి మీడియాను అనుమతించకపోవడంపై పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. -
‘2200 ఎకరాల భూమి కబ్జాకు ప్లాన్’
సాక్షి, పొట్టి శ్రీరాములు నెల్లూరు : 2,200 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసేందుకు తెలుగుదేశం పార్టీ మంత్రి సోమిరెడ్డి ప్లాన్ చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయని అన్నారు. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో మొక్క మొలవని భూములను ఇచ్చి మైనింగ్ భూములను కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మూడు గనుల్లో మైనింగ్ చేసి అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. ఈ భూ కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. -
జంగల్ కబ్జా!
సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. భూమి ధరలు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో అటవీ భూములపై అక్రమార్కులు కన్నేశారు. వనాన్ని గొడ్డళ్లతో తెగనరికేస్తున్నారు. రిజర్వ్ ఫారెస్టులోని చెట్లను నరికివేస్తూ భూమిని సాగు చేస్తున్నారు. అటవీ సంపదను రక్షించాల్సిన అధికారులు ఆఫీసులకే పరిమితవుతుండగా, దట్టమైన అడవులు నేలమట్టమవుతున్నాయి. జిల్లా సరిహద్దు అడవుల్లో సాగుతున్న వన సంహారంపై కథనం. అడవి తల్లి గుండెలపై గొడ్డలి వేటు.. జిల్లా పరిధిలో 379.14 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 18.78 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, గంభీరావుపేట మండలాలను కలుపుతూ దట్టమైన అడవి విస్తరించి ఉంది. ఒకప్పుడు నక్సలైట్లకు ఆశ్రయం కల్పించిన ఈ అడవులు ఇప్పుడు స్వార్థపరుల గొడ్డలి వేట్లకు నేలకూలుతున్నాయి. అడవులను నరకడాన్ని అప్పట్లో నక్సలైట్లు తీవ్రంగా పరిగణించేవారు. ఎవరైనా స్మగ్లర్లు చెట్లను నరికితే.. కఠిన శిక్షలు అమలు చేసేవారు. దీంతో నక్సలైట్ల భయంతో ఎవరూ జంగల్ని నరికే సాహసం చేయలేదు. దశాబ్ద కాలంగా నక్సలైట్ల కదలికలు తగ్గిపోయాయి. గ్రామీణులు విచ్చలవిడిగా పచ్చని చెట్లను నరికివేస్తూ భూమిని ఆక్రమిస్తున్నారు. ఏళ్ల తరబడి సహజ సిద్ధంగా పెరిగిన అడవులు గంటల్లోనే నేలకూలుతూ మోడులు దర్శనమిస్తున్నాయి. అడవుల్లో యథేచ్ఛగా అక్రమార్కులు చెట్లను నరికివేయడంతో అడవి తల్లి దీనంగా రోదిస్తోంది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరువుకు క్షీణిస్తున్న అడవులే కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తుండగా, అడవిని ఆక్రమిస్తూ అటవీ భూమి కోసం నరికివేత కొనసాగుతోంది. నరికిన వారికి నరికినంత.. వీర్నపల్లి మండలం గర్జనపల్లి, రంగంపేట, వన్పల్లి, శాంతినగర్, రుద్రంగి మండలం మానాల, కోనరావుపేట మండలం వట్టిమల్ల, ఎగ్లాస్పూర్, మరిమడ్ల, నిమ్మపల్లి, నిజామాబాద్, ప్రాంతాల్లోని అటవీ భూములను ఇటీవల కొందరు నరికివేసి సాగు చేసుకుంటున్నారు. వట్టిమల్ల నారాయణ చెరువు ప్రాంతంలో 20 ఎకరాలు ఆక్రమణకు గురైంది. వృక్షాలను నేలకూల్చి సేద్యానికి సిద్ధం చేశారు. మరిమడ్ల, మానాల సరిహద్దుల్లో గుట్టల మధ్యలో నీటి ఆధారం ఉండడంతో అడవి ని నరికివేసి భూములు ఆక్రమించుకుంటున్నారు. నరి కిన వారికి నరికినంత భూమి దక్కుతోంది. వేసవి సీజ న్కు ముందే అడవులన్నీ ఆకురాలి ఉండడంతో చెట్లను నరికివేస్తూ భూములను చదును చేస్తున్నారు. ఈ సీజన్లోనే 300 ఎకరాలను కొత్తగా నరికివేసిన అక్రమార్కులు ఖరీఫ్లో సాగు చేసేందుకు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 800 ఎకరాల ఫారెస్ట్ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. నరికివేసిన చెట్లను వంటచెరుకుగా, విలువైన టేకు కలపను గృహోపకరణాలకు వినియోగించుకుంటూ అటవీ సంపదను దోచుకుంటున్నారు. ఫా‘రెస్ట్’.. అడవుల నరికివేత కొనసాగుతుండగా క్షేత్రస్థాయిలో ఉండాల్సిన అటవీ శాఖ సిబ్బంది పట్టణాల్లో నివాసముంటూ మొక్కబడిగా నిఘా కొనసాగిస్తున్నారు. నిజానికి అడవిలో గొడ్డలి చప్పుడు వినిపిస్తే పట్టుకుని చట్టబద్ధంగా శిక్షించాల్సిన ఫారెస్టు అధికారులు క్షేత్రస్థాయిలో లోపాయికారి అంగీకారంతో అటవీ భూముల ఆక్రమణకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వన సంరక్షణ పేరిట లక్షల్లో మొక్కలు నాటుతూ వాటి ఆలనాపాలన పట్టించుకోని అధికారులు సహజ సిద్ధంగా పెరిగిన ప్రకృతి సంపద నేలకూలుతుంటే కనీసం అడ్డుకోకపోవడం విడ్డూరం. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్లో ఫారెస్ట్ భూములు ముంపునకు గురవుతున్నాయని నిజామాబాద్కు చెందిన యువకుడు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఫారెస్ట్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. జిల్లాలో అటవీ భూముల పరాధీనంపై అటవీశాఖ అధికారులు దృష్టిసారించి అక్రమార్కులను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరినీ వదలం జిల్లా పరిధిలో అటవీ భూములను ఎవరు అక్రమించినా వదిలిపెట్టం. చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ భూరికార్డుల ప్రక్షాళనతో మా భూములపై క్లారిటీ వస్తుంది. ఎక్కడైనా అటవీ భూములను సాగుచేస్తే వారికి నోటీసులు జారీ చేసి స్వాధీనం చేసుకుంటాం. కొత్తగా మొక్కలను నాటుతాం. మల్కపేట రిజర్వాయర్ విషయంలో చట్ట పరిధిలోనే పని చేశాం. లక్ష చెట్లు ముంపునకు గురవుతుంటే ఏడు లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం చేశాం. – వేముల శ్రీనివాస్రావు, డీఎఫ్వో. -
అనుమతులు అనవసరం!.. కట్టె కొట్టు.. శివారు దాటించు..!!
కలప అక్రమ రవాణా జిల్లాలో జోరుగా సాగుతోంది. కలప వ్యాపారులు అటవీ భూములు, పట్టాభూముల్లోని చెట్లను యథేఛ్చగా నరికేస్తున్నారు. అటవీశాఖ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకుని విలువైన కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఓ వైపు హరితహారంతో అటవీ విస్తీర్ణం పెంచాలని చూస్తుంటే మరోవైపు కలప వ్యాపారులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడిన కొంత మంది అధికారుల వల్లే కలప అక్రమ వ్యాపారం జిల్లాలో సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.చెట్లను నరికి అక్రమంగా సాగిస్తున్న కలప వ్యాపారంపై సాక్షి ప్రత్యేక కథనం... సాక్షి, మెదక్: జిల్లాలో అనుమతులు లేకుండా చెట్లు నరికి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మెదక్, హవేళిఘణాపూర్, రామాయంపేట, నర్సాపూర్, వెల్దుర్తి, కౌడిపల్లి, శివ్వంపేట, మనోహరాబాద్ మండలాల్లో ఈ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. అటవీ, పట్టా భూముల్లోని టేకు, మద్ది, తుమ్మ, వేప, యూకలిప్టస్, మేడి, సరువు, మామిడి, చింత చెట్లు ఇలా అన్ని రకాల చెట్లను అనుమతులు లేకుండానే నరికేస్తున్నారు. నరికిన అరుదైన వృక్షాలను లారీల ద్వారా హైదరాబాద్, తూప్రాన్, పటాన్చెరులోని పారిశ్రామిక వాడలకు , ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 10 మందికిపైగా కలప వ్యాపారులు ఉండగా వీరి వద్ద పనిచేస్తున్న ఏజెంట్లు కలప నరకడం, రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో రూ.10 నుంచి రూ.30 లక్షల కలప అక్రమ దందా సాగుతున్నట్లు అంచనా. సెలవు, పండుగ రోజుల్లో పోలీసులు, రెవెన్యూ, అటవీశాఖ అధికారుల తనిఖీలు తక్కువగా ఉంటాయి. దీన్ని ఆసరా చేసుకుని కలప వ్యాపారులు కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లాలోని అటవీ, పట్టాభూముల నుంచి అక్రమంగా నరికిన కలపను ఎక్కువగా టింబర్ డిపోలు, ఇటుక బట్టీలు, పరిశ్రమలకు తరలిస్తున్నారు. నిబంధనలు సడలింపుతో.. చెట్లను సంరక్షించేందుకు ప్రభుత్వం వాల్టా 2002 చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. దీంతో ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా వందలాది టన్నుల కలప అక్రమ రవాణా జరుగుతోంది. అటవీ చట్టాన్ని అనుసరించి అటవీభూముల్లోని చెట్లను నరకడం నిషేధం. అలాగే పట్టాభూముల్లోని చెట్లను నరకడం, రవాణాకు వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఈ చట్టం ప్రకారం చెట్లు నరికిన చోట మొక్కలను పెంచాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వం 26 రకాల చెట్లను నరకడాన్ని నిషేధించింది. అయితే ఇటీవల ప్రభుత్వం మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 42 చెట్ల రవాణా అనుమతిస్తూ నిబంధనలను సడలించింది. దీనిని ఆసరా చేసుకుని కలప అక్రమ రవాణా చేసే వ్యాపారులు ఇష్టారాజ్యంగా చెట్లను నరుకుతూ అక్రమంగా కలప వ్యాపారం సాగిస్తున్నారు. గ్రామాల నుంచి సామిల్కు.. అసైన్డ్ భూములు, పట్టా భూముల్లో మాత్రం చెట్లను అడ్డగోలుగా నరుకుతున్నారు. చింతచెట్టు నరకాలంటే అటవీశాఖ జిల్లా అధికారి అనుమతి తప్పనిసరికాగా తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండానే లారీలు, ట్రాక్టర్లలో కలప అక్రమ రవాణా జరుగుతుంది. పట్టా, అసైన్డ్ భూముల్లో చెట్లను నరకడానికిగాను సంబంధిత కంట్రాక్టర్ అటవీ సిబ్బందికి మమూళ్లు ఇవ్వాల్సిందే. ఒక్క రామాయంపేట రేంజీ పరిధిలోనే ప్రతిరోజూ పదిహేను లోడ్ల కలప రవాణా చేస్తున్నారు. మారుమూల గ్రామాలనుంచి కలప సా మిల్లులకు చేరుతుంది. దీనితో వారు చీకటి పడ్డాక హైదరాబాద్ తరలిస్తున్నారు. తూప్రాన్ సరిహాద్దులో జాతీయ ర«హదారిపై అటవీశాఖ చెక్పోస్టు ఉండగా, ఇక్కడ నుంచి జాతీయ రహదారిపై కలప తరలిస్తున్న ప్రతి వాహనానికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సిందే. పారిశ్రామిక వాడలకు తరలింపు.. నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి, అచ్చంపేట, నత్నాయిపల్లి, ఎల్లాపూర్, బ్రాహ్మాణపల్లి తదితర గ్రామాలను ఆనుకుని ఉన్న అడవులలో చెట్లను నరికి కలపను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్కుల, తిమ్మాపూర్, పాంబండ గ్రామాలు అడవులను ఆనుకుని ఉన్నందున అడవుల నుంచి కలప నరికి మేడ్చల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన కంపెనీలకు రవాణా చేస్తున్నారు. కొత్తపేట ప్రాంతంలో ఇటుక బట్టీలు ఎక్కువగా చేపడుతూ అడవిలోని చెట్లను నరికి బట్టీలకు వినియోగిస్తున్నారు. కౌడిపల్లి మండలంలోని మహ్మద్నగర్ గ్రామ పంచాయితీలోని గిరిజన తండాలతో పాటు కౌడిపల్లి కొల్చారం మధ్య ఉన్న అడవి నుంచి చెట్లను నరికి కలపను పారిశ్రామిక వాడలకు రవాణా చేస్తుంటారు. ఇటీవల శివ్వంపేట మండలంలోని కొత్తపేట నుంచి కలపను అక్రమంగా చేస్తున్న లారీ నర్సాపూర్త్లో బోల్తా పడింది. కలప లారీకి ఎలాంటి అనుమతులు లేకపోయినా లారీపై కేసు నమోదు చేయకుండానే వదిలివేయడం పోలీసు ల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. కఠిన చర్యలు తప్పవు అక్రమంగా అటవీభూములు, పట్టాభూముల్లో చెట్లు నరికి అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో కలప రవాణా కేసులు తక్కువగానే ఉన్నాయి. అటవీ అధికారులు మామూళ్లు తీసుకుని కలప రవాణాకు అనుమతిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాప్తవం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు కలప అక్రమ రవాణాకు సంబంధించి 40 కేసులు పెట్టాం. అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు తప్పవు. వాల్టా చట్టం ప్రకారం ముందుస్తు అనుమతి తీసుకుని చెట్లు నరకడం లేదా రవాణా చేయాలని తెలిపారు. – పద్మజారాణి, డీఎఫ్ఓ -
రెండో స్థానంలో తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో (2014–15 నుంచి 2016–17 వరకు) దేశవ్యాప్తంగా అత్యధికంగా అటవీ భూములు మళ్లించిన రాష్ట్రాల్లో హరియాణా మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. హరియాణా 7,944 హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోగా.. తెలంగాణ 7,149 హెక్టార్ల అటవీ భూములను మళ్లించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ 3,343 హెక్టార్ల అటవీ భూములను మళ్లించి 8వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలసి ఈ మూడేళ్లలో 93,400 హెక్టార్లలోనే అడవులను పెంచడం గమనార్హం. జాతీయ అటవీ విధానం ప్రకా రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి. ఆ మేరకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా–2015 నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం 21.60 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 18.80 శాతమే. ఏపీలో 24.42 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 15.25 శాతమే. ఇటీవల కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2013 నుంచి 2015 మధ్య 168 చదరపు కి.మీ. మేర (16,800 హెక్టార్ల మేర)అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. -
‘కాళేశ్వరం’ అడ్డంకులు తొలగిపోయాయి
నారాయణఖేడ్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 78 ఎకరాల అటవీభూముల సమస్య పరిష్కారమైందని, ఢిల్లీ నుంచి క్లియరెన్స్ వచ్చిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. ఇక ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లేనని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు రావడంతో మంజీరా నదిని గోదావరి నీటితో నింపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా నారాయణఖేడ్లో ఉల్లి రైతుల కోసం గోడౌన్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా 50 శాతం సబ్సిడీ అందజేసి చిన్న గోడౌన్లను నిర్మింపజేస్తామని, ఇక్కడ గోడౌన్లు విజయవంతమైతే రాష్ట్రం మొత్తం నిర్మిస్తామన్నారు. ఉల్లి పంట అమ్ముకొనే సమయంలో ధరలు తగ్గి 3 నెలల తర్వాత ధరలు పెరిగి రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఈ ఇబ్బందుల నుంచి రైతులను గట్టెక్కించేందుకు గోడౌన్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. మొదటగా 200 మంది రైతులకు ఈ గోడౌన్లను ఇస్తామన్నారు. అవసరమైతే 2 వేల మందికి ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. ‘మిషన్ భగీరథ’పనులు పూర్తవుతున్నాయని, కొత్త సంవత్సరంలో ఇంటింటికీ నల్లాలను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, గృహావసరాలు, కర్మాగారాలకు విద్యుత్ సమస్య తీరిందని, 24 గంటలపాటు కరెంట్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గజం భూమీ పోనివ్వం
సాక్షి, హైదరాబాద్: వాతావరణ సమతౌల్యం, భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలంటే అడవుల పరిరక్షణ అత్యంత ఆవశ్యకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఇకపై అటవీ భూముల ఆక్రమణలు జరగకుండా చూడాలని, దీనికోసం అవసరమైతే సభా సంఘాన్ని ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. దశాబ్దాల నిర్లక్ష్యాన్ని పూడ్చాలంటే అడవుల పునరుజ్జీవం జరగాలని, ఇందుకు సమాజంలోని అన్ని పక్షాలు కలసి ముందుకెళ్లాలని పేర్కొన్నారు. సోమవారం హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా విపక్ష సభ్యుల సందేహాలు, విమర్శలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ‘‘ఇప్పటివరకు అటవీ భూములను గిరిజనులు, గొత్తికోయలు, మరొకరు ఆక్రమించారు. కానీ ఇకముందు అలా జరగకుండా చూడాలి. ఆక్రమణలు జరిగితే చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు ఆక్రమణకు గురైంది పోనిద్దాం. ఇకపై మాత్రం గజం భూమి కూడా ఆక్రమణ కావద్దు. దీనిపై అవసరమైతే సభా సంఘం వేయండి. ప్రతి నెలా సమీక్షించండి. అందరినీ కలుపుకొని అటవీ భూముల పరిరక్షణ చేపడదాం. దీనికి సభ మద్దతు తెలపాలని కోరుతున్నా..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. విధ్వంస చరిత్ర విపక్షాలదే.. చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ విపక్షాలను టార్గెట్ చేశారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయలు అటవీ భూముల్లో చేరడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో విపక్షాలు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ‘‘అటవీ చట్టాల మేరకు అటవీ భూమి ఎవరికీ దాఖలు కాదు. కేవలం ఆ భూముల్లో పండ్ల తోటలు పెంచి, వాటిపై వచ్చే ఫలసాయాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. భూపాలపల్లిలో గొత్తికోయలకు అన్యాయం జరిగిందని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. నిజానికి వారంతా ఛత్తీస్గఢ్ నుంచి అక్రమంగా వచ్చినవాళ్లు. వారు రావడం, అడవిని నరకడం అలవాటుగా మారింది. విచక్షణా రహితంగా చెట్లు నరుకుతుంటే చూస్తూ కూర్చోలేం. ఇదేదో మహోద్యమం అన్నట్లు కమ్యూనిస్టులు జెండాలు పట్టి ఆందోళనలకు దిగారు. అడవులు దెబ్బతింటుంటే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం సబబేనా..?’’అని ప్రశ్నించారు. గతంలో నర్సాపూర్ అడవుల్లో సినిమా షూటింగులు జరిగేవని, ఆ అడవులను చూస్తేనే భయం వేసేదని చెప్పారు. ఇప్పుడా అటవీ సంపద ఏదని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాయం చేసిందా? అని ప్రశ్నించారు. 24 శాతం అటవీ భూమి అనేది కేవలం కాగితాలపైనే తప్ప వాస్తవంలో లేదని స్పష్టం చేశారు. ప్రతి మొక్కకు.. ప్రతి ఖర్చుకు లెక్క అటవీ భూముల బదలాయింపునకు సంబంధించి కేంద్రం వద్ద రూ.40 వేల కోట్ల నిధులు మురిగిపోతున్నాయని, అందులో రాష్ట్రానికి సంబంధించి రూ.1,500 కోట్లు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందులో ‘కంపా’నిధులు విడుదల చేయాలని రెండు డజన్లసార్లు కేంద్రానికి లేఖ రాస్తే తనను పిచ్చోడిలా చూశారని.. చివరికి రూ.304 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. 1980 నుంచి 2014 వరకు 34 ఏళ్లలో తెలంగాణలో కేవలం 3.17 కోట్ల చెట్లు మాత్రమే నాటారని.. 2004 నుంచి 2014 వరకు కేవలం రూ.130 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కేసీఆర్ తెలిపారు. అదే తాము గత మూడున్నరేళ్లలోనే రూ.2,008 కోట్లు ఖర్చు చేశామని.. 230 కోట్ల మొక్కలు నాటేందుకు సంకల్పించామని చెప్పారు. ఈ ఖర్చుపై నయాపైసా సహా లెక్కలను వారం రోజుల్లో సభ ముందు పెడతామని.. థర్డ్ పార్టీ నివేదిక, నరేగా, కంపా, రాష్ట్ర బడ్జెట్ నిధులన్నింటిపై వివరణ ఇస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటికే 4.29 కోట్ల మొక్కలు నాటామని, ఆ లెక్కలు సభ్యులకు అందిస్తామని పేర్కొన్నారు. ఇక ఎంత ధనం సంపాదించినా బతికి ఉండగలిగే పరిస్థితులు ఉండాలని.. మొక్కలు నాటకపోతే ఎనిమిదేళ్లలో హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటడం ఖాయమని, మనుషులు పిట్టల్లా రాలుతారని వ్యాఖ్యానించారు. ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే హరిత పందిరి వేయాల్సిందేనని.. హైదరాబాద్ చుట్టూ రాగి, వేప మొక్కలు నాటి హరిత వలయం ఏర్పాటు చేయాలని, జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసేలా మున్సిపల్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టేలా నిబంధనలు హరితహారాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఇంటికి ఆరు మొక్కలు నాటేలా చూడాలని కోరుతున్నా.. పంచాయతీలు ఆ బాధ్యతను మోయడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామంలో, పాఠశాలల్లో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు నాటడాన్ని సర్పంచులు, వీఆర్ఏలు, ఇతర అధికారులు సామాజిక బాధ్యతగా గుర్తించడం లేదన్నారు. స్థానిక సంస్థలు పనిచేయకుండా ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా ఫలితముండదని ప్రధాని మోదీకి చెప్పానని తెలిపారు. ఈ దృష్ట్యా కొత్తగా కోయ, గూడెం, గోండు పల్లెలు సహా పలు శివారు గ్రామాలకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తంగా పంచాయతీల పరిధిలో గ్రామానికో సొంత నర్సరీ పెట్టేలా, దాన్ని వారే నిర్వహించేలా ‘ఫర్మార్మ్ ఆర్ ఫెరిష్’చట్టాలను తెస్తామని తెలిపారు. పొలాలకొస్తయ్.. వంటింట్లకొస్తాయ్.. చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కోతులు, అడవి పందుల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘గతంలో వన్యప్రాణులకు అవసరమైన మొర్రి, తొంకి, జీడి, ఈత పండ్లు అడవుల్లోనే దొరికేవి. కానీ వాటి ‘కిచెన్’ను ధ్వంసం చేసినం. ఇప్పుడవి వెనుకకు ఎట్ల పోతాయి. మన కిచెన్లకు వస్తయ్.. మన పొలాల్లోకి వస్తయ్. అడవుల్లో నీళ్లు లేక ఊళ్లోకొచ్చిన ఒక కోతి నల్లా తిప్పి నీళ్లు తాగుతుంటే.. మరో మంచి కోతి రేపటి నుంచి నీళ్లు దొరవేమోనని మూత బంజేస్తుంది. ఇలాంటివి ఫేస్బుక్కుల్లో జోకులు బాగా వస్తున్నాయ్..’’అని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. కోతులు తిరిగి వెళ్లిపోవాలంటే అడవులు బాగా పెంచాల్సిన ఆవశ్యకత ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు కూడా కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపుతామని మేనిఫెస్టోల్లో ప్రకటించాయని గుర్తుచేశారు. అరుణమ్మా.. ఆ జోకులు మీ చరిత్రపైనే..! హరితహారం అంశంపై తొలుత సభలో కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ చేసిన విమర్శలపై సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘డీకే అరుణ తమాషాగా మాట్లాడారు. ఉదయం మంత్రి పోయి మొక్క పెడతాడు. సాయంత్రం దాన్ని మేక తింటది. రాత్రికి మేకను మంత్రి తింటుండంటూ సోషల్ మీడియాలో జోకులొస్తున్నాయన్నారు. ఆ జోకులు వేస్తోంది మాపైన కాదు. మీ (కాంగ్రెస్) చరిత్ర పైన. మీ హయాంలో జరిగిన విధ్వంసంపైన..’’అని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శమని 14 రాష్ట్రాల్లో తిరిగిన కేంద్ర మాజీ పర్యావరణ, అటవీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కీర్తించారని గుర్తు చేశారు. మరో మంత్రి హర్షవర్ధన్ సైతం దేశవ్యాప్తంగా నాటిన మొక్కల్లో 20 శాతం ఒక్క తెలంగాణలో నాటినట్లుగా పార్లమెంటులో చెప్పారని పేర్కొన్నారు. నవ్వులే.. నవ్వులు.. హరితహారంపై మాట్లాడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో సభలో పలుమార్లు నవ్వులు విరిశాయి. అటవీ శాఖలో ఖాళీల భర్తీపై మాట్లాడుతూ ‘‘దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు రిక్రూట్ చేయని కారణంగా ఖాళీలున్నాయి’అని కేసీఆర్ పేర్కొనగా... వెంటనే జానారెడ్డి స్పందిస్తూ ‘మన ప్రభుత్వాలు చేయని కారణంగా..’అన్నారు. దీంతో సీఎం సహా సభ్యులంతా గొల్లుమన్నారు. దీనిపై కేసీఆర్ సెటైర్ వేస్తూ.. ‘‘అవును.. మన ప్రభుత్వాలే. జానా గారూ అప్పుడు టీడీపీలో ఉన్నారు. నేనూ ఉన్నాను. జీవన్రెడ్డి అంతే. 1983లో నేను ఓడిపోయా.. కానీ జీవన్రెడ్డి గెలిచి మంత్రి అయ్యారు..’’అని వ్యాఖ్యానించారు. ఇక అధికారపక్ష ప్రతి విమర్శలపై జానా స్పందిస్తూ.. ‘నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన చట్టం) కార్యక్రమాన్ని కాంగ్రెస్ తెచ్చింది. చరిత్ర మరిచిపోవద్దు.’అని సూచించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ‘నరేగా తెచ్చింది కాంగ్రెస్సే.. అదో చరిత్ర. 1945 నుంచి అడవుల విధ్వంసం జరిగింది.. ఇదీ చరిత్రే..’’అని చురకలు వేయడంతో మళ్లీ నవ్వులు విరిశాయి. ఇక సీఎం సుదీర్ఘంగా మాట్లాడుతుండటంతో సమయం మూడు గంటలు దాటింది. ఆ సమయంలో జానారెడ్డి, అక్బరుద్దీన్తో మాట్లాడుతున్నారు. దీన్ని చూసిన సీఎం కేసీఆర్.. ‘భోజన సమయం అయిందని జానా చెబుతున్నట్లున్నారు. నేనూ కూడా ఉదయం మూడే ఇడ్లీలు తిన్నా..’’అనడంతో సభ్యులంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. -
అటవీ హద్దులు గుర్తించాల్సిందే
- కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ డైరెక్టర్ జనరల్ సిద్ధాంత దాస్ - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా అటవీ అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: అటవీ భూముల సర్వే, బ్లాకుల నిర్ధారణ ఎప్పుడో స్వాతంత్య్రానికి ముందు జరిగిందని, మారిన పరిస్థితుల నేపథ్యంలో కచ్చితమైన హద్దులు సాంకేతికంగా నిర్ణయించాల్సి ఉందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ డైరెక్టర్ జనరల్ సిద్ధాంత దాస్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అటవీ భూ ముల హద్దులను కచ్చితమైన లెక్కలతో తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సిద్ధాంత దాస్ మాట్లా డుతూ దేశ విస్తీర్ణంలో మూడో వంతుకు పైగా ఉండాల్సిన అటవీ ప్రాంతం, కేవలం 24 శాతంగా ఉన్నట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నా యని, ఉన్న అటవీ సంపదను కాపాడుకుంటూనే, పచ్చదనాన్ని మరో 9 శాతం పెంచుకునేందుకు అన్ని రాష్ట్రాలు కృషి చేయాలన్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం 4 రాష్ట్రాలకు చెందిన అధికారులు తమ రాష్ట్రాల్లో అటవీ భూముల రక్షణకు, హద్దుల గుర్తింపునకు చేస్తున్న ప్రయత్నాలు, టెక్నాలజీ వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన, రెవెన్యూ శాఖతో అటవీ శాఖ సమన్వయం ద్వారా పూర్తిస్థాయిలో అటవీ భూములను రికార్డు చేయించబోతున్నట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని, ఉమ్మడి సరిహద్దుల్లో అటవీ బౌండరీలను గుర్తించేందుకు సహకరించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. సీఎం కేసీఆర్తో సిద్ధాంత దాస్ భేటీ పచ్చదనం పెంచడానికి, నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్రం చేస్తోన్న కృషి ఆదర్శనీయ మని సిద్ధాంత దాస్ ప్రశంసించారు. రాష్ట్రప్రభుత్వం హరితహారంతోపాటు సమర్థ నీటి వినియోగ కార్య క్రమాలు అమలు చేస్తోందన్నారు. శనివారం ప్రగతి భవన్లో ఆయన సీఎం కేసీఆర్ను కలిశారు. తెలంగాణ ఏర్పడిన రెండో వారం నుంచే అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంపకానికి చర్యలు చేపట్టినట్లు సీఎం ఆయనకు వివరించారు. -
అనుమతులు అడవిపాలు.. కాల్వలు రోడ్డు పాలు..!
సాగునీటి ప్రాజెక్టుల కాల్వలకు అడవి, రోడ్లు, రైల్వే క్రాసింగ్ల చక్రబంధం ► ప్రధాన పనులపైనే అధికారుల దృష్టి ► అటవీ అనుమతుల్లేక రెండున్నర లక్షల ఎకరాలపై ప్రభావం ► రోడ్డు దాటలేక ఏడు లక్షల ఎకరాలకు చేరని నీరు ► రైల్వే క్రాసింగ్ల సమస్యతో 2.8 లక్షల ఎకరాలకు తిప్పలు ► ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేక ప్రాజెక్టుల జాప్యం ► పెరిగిపోతున్న ప్రాజెక్టుల వ్యయ అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్నా.. ఆయకట్టుకు నీరందేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టుల ప్రధాన పనులు పూర్తిచేసినా కాల్వల నిర్మాణానికి అటవీ అనుమతులు, రోడ్లు, రైల్వే క్రాసింగ్లు ఇబ్బందిగా మారాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం, అనుమతుల జారీలో కేంద్రం చేస్తున్న జాప్యం ఈ సమస్యను మరింతగా పెంచుతున్నాయి. దీంతో 10 లక్షలకుపైగా ఎకరాల ఆయకట్టు ప్రభావితం అవుతుండడం గమనార్హం. –సాక్షి, హైదరాబాద్ రైల్వే క్రాసింగ్లతో ఇబ్బందులు 11 ప్రాజెక్టులు 60 క్రాసింగ్లు 26 పూర్తయినవి 10 పురోగతిలో ఉన్నవి 24 చేపట్టాల్సినవి ప్రభావితమయ్యే ఆయకట్టు: 2,83,966 ఎకరాలు ఆయకట్టును పట్టాలు ఎక్కనివ్వని రైల్వే! నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులకు రైల్వే క్రాసింగ్లు అడ్డంకిగా మారాయి. కొన్ని ప్రాజెక్టుల రిజర్వాయర్లు, డ్యామ్లు, కాల్వల పనులు ముగిసినప్పటికీ.. రైల్వే శాఖ పరిధిలో చేయాల్సిన పనుల్లో జాప్యంతో సుమారు 2.8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిందించలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 11 ప్రాజెక్టుల పరిధిలో 60 చోట్ల రైల్వేకు సంబంధించిన అడ్డంకులున్నాయి. అవి పూర్తయితేనే కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తవుతుంది. ఈ 60 పనుల్లో తెలంగాణ ఏర్పాటయ్యాక 26 పనులను రైల్వే శాఖ పూర్తిచేయగా.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. 24 చోట్ల పనులను అసలు చేపట్టనే లేదు. ఇందులో దేవాదుల, ఎస్ఎల్బీసీ పరిధిలో 8 చొప్పున క్రాసింగ్లు, నెట్టెంపాడు పరిధిలో 16 చొప్పున క్రాసింగ్లు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు రైల్వే శాఖతో సంప్రదించింది. స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులు కూడా చర్చించారు. అయినా రైల్వే శాఖ స్పందించడం లేదు. అటవీ అనుమతుల జాడ్యం సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకిగా మారిన వాటిలో అటవీ భూముల అంశమే ప్రధానమైనది. రాష్ట్రంలో 8 ప్రాజెక్టులకు అటవీ అనుమతులు సమస్యగా మారాయి. మిగతా ప్రాజెక్టులు, ఆయకట్టు కాల్వలకు కలిపి మొత్తంగా 15,672 ఎకరాలకు సంబంధించి అనుమతులు అవసరం. దేవాదుల, కల్వకుర్తి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులు దాదాపు ఏడెనిమిదేళ్ల కిందే మొదలుపెట్టినా ఇంతవరకు అటవీ రాలేదు. చాలా ప్రాజెక్టుల పరిధిలో డీజీపీఎస్ సర్వే పూర్తికాకపోవడం, అటవీ భూమికి సమానమైన భూమిని చూపక పోవడం, పూర్తిస్థాయి ప్రతిపాదనలు తయారుకాకపోవడం, పలుచోట్ల ప్రత్యామ్నాయంగా చూపిన భూమిని అంతకు ముం దే ఇతరులకు కేటాయించి ఉండడం వంటివి అటవీ అనుమతులకు సమస్యగా మారాయి. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగి అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. కొమ్రుం భీం ప్రాజెక్టు పరిధిలో అటవీ అనుమతుల జాప్యంతో వ్యయం రూ. 274 కోట్ల నుంచి రూ.882 కోట్లకు పెరిగింది. రూ.9,427 కోట్లతో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు వ్యయం రూ.13,445 కోట్లకు పెరిగింది. మొత్తంగా అటవీ భూముల అనుమతుల ప్రభావం రెండున్నర లక్షల ఎకరాలపై పడుతుండడం గమనార్హం. రోడ్డు కూడా అడ్డే.. ఇక ఆర్ అండ్ బీ రోడ్లు, జాతీయ రహదారుల కారణంగా కాల్వల నిర్మాణానికి ఇబ్బందులూ తీవ్రంగానే ఉన్నాయి. ఆయకట్టు కాల్వలకు అడ్డంగా ఉన్న రహదారులను పునర్నిర్మించేందుకు అవసరమైన నిధులను నీటి పారుదల శాఖ చెల్లిస్తున్నా.. శాఖల మధ్య సమన్వయంలోపించి పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆర్అండ్బీ రోడ్ల కారణంగా ఏకంగా 5.24 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడుతోంది. ఇందులో ఎస్ఎల్బీసీ పరిధిలో 9, డిండిలో 29, దేవాదుల పరిధిలో 113 క్రాసింగ్ సమస్యలుండగా.. వాటిల్లో 63 పరిష్కారమయ్యాయి. ఇంకా 50 చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఇక జాతీయ రహదారులకు సంబంధించి 8 ప్రాజెక్టుల పరిధిలో 37 క్రాసింగ్లు ఉండగా.. ఇంకా 31 పనులు పూర్తి చేయాల్సి ఉంది. -
‘అరణ్య’రోదన..!
- ఆక్రమణలకు గురైంది (చదరపు కిలోమీటర్లలో) 15,000 - ప్రాజెక్టులకు ఇచ్చింది (చదరపు కిలోమీటర్లలో) 14,000 పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు మొక్కలు నాటాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వాలే.. అభివృద్ధి పేరిట అటవీ భూములను ఉదారంగా కట్టబెట్టేస్తున్నాయి. సాగునీటి, రక్షణ ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లు, గనులు, పరిశ్రమలు, రైల్వే, రహదారులు ఇలా వివిధ ప్రాజెక్టుల కోసం అడవులను అడ్డంగా నరికేసేందుకు అనుమతులి స్తున్నాయి. గడిచిన 30 ఏళ్లలో 15,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఆక్రమణలకు గురికాగా.. మరో 14,000 చదరపు కిలోమీటర్ల అరణ్యం 23,716 ప్రాజెక్టుల కోసం హరించుకుపోయిందట. ఈ గణాంకాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇది ప్రభుత్వ లెక్క మాత్రమే అని, వాస్తవానికి చాలా భాగం అటవీ ప్రాంతం ఆక్రమణలకు గురయ్యాయని పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. ఏటా 250 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను రక్షణ ప్రాజెక్టులు, డ్యామ్లు, మైనింగ్, పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, రహదారులు వంటి వాటికోసం ప్రభుత్వాలు అప్పగిస్తున్నాయి. ఈ మళ్లింపులో రాష్ట్రాలకు.. రాష్ట్రాలకూ మధ్య వ్యత్యాసం ఉంటోంది. 1980 నుంచి ఇప్పటి వరకూ పంజాబ్ తమ అటవీ ప్రాంతంలో సగ భాగాన్ని ఇలా మళ్లించిందట. అదే పశ్చిమబెంగాల్, తమిళనాడు తమ అటవీ ప్రాంతంలో కేవలం 1 శాతం మాత్రమే ఇలా మళ్లిం చాయి. 1980 నుంచి 14,000 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను ప్రాజెక్టులకు కేటాయించడంతో.. దీనికి పరిహారంగా 6,770 చదరపు కిలోమీటర్ల చెట్లను కొత్తగా నాటడం లేదా పరిహార అటవీకరణ చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి. – సాక్షి, తెలంగాణ డెస్క్ మైనింగ్, రక్షణ, డ్యామ్లకే ఎక్కువ పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ప్రాజెక్టులకు అప్పగించిన 14,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో మైనింగ్కు 4,947 చ.కి.మీ., రక్షణ ప్రాజెక్టులకు 1,549 చ.కి.మీ., హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు 1,351 చ.కి.మీ. అప్పగించారు. ఇక 15,000 చదరపు కిలోమీటర్ల అరణ్యం ఆక్రమణల బారిన పడగా.. ఇందులో ఎక్కువ శాతం మధ్యప్రదేశ్, అస్సాం, కర్ణాటక రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. గత 30 ఏళ్లలో అరుణాచల్ప్రదేశ్ అత్యధికంగా 3,338 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని ప్రాజెక్టులకు కట్టబెట్టింది. మధ్యప్రదేశ్ 2,477 చ.కి.మీ., ఆంధ్రప్రదేశ్ 1,079 చ.కి.మీ. అప్పగించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జమ్మూకశ్మీర్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ అతి తక్కువ కేటాయింపులు జరిపాయని తేలింది. అటవీ భూముల్లో అత్యధికంగా 4,330 ప్రాజెక్టులను ఉత్తరాఖండ్ చేపట్టగా.. పంజాబ్ 3,250, హరియాణాలో 2,561 ప్రాజెక్టులను చేపట్టారు. -
అటవీ భూముల్లో ఉపాధి
► నీటి సంరక్షణ, అడవుల పరిరక్షణకు పెద్దపీట ► పెద్ద ఎత్తున నీటి, ఊట కుంటల తవ్వకాలు ► భూముల సరిహద్దు చుట్టూ కందకాలు ► త్వరలో ముగియనున్న పనుల గుర్తింపు ► ఉపాధి కూలీలకు పని.. ► అటవీ ప్రాంతాలకు వైభవం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ఇప్పటి వరకు పల్లెలకే పరిమితమయ్యాయి. ఇకపై ఈ పనుల విస్తృతి పెరగనుంది. అటవీ భూముల్లోనూ ఉపాధి పనులు చేపట్టనున్నారు. అటవీ భూముల్లో వర్షపునీటి వరదకు మట్టి కోతకు గురికాకుండా, భూమిలో తేమ సాంద్రత ఎక్కువ కాలం నిలిపే ప్రక్రియలో భాగంగా ఉపాధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తద్వారా అటవీ ప్రాంతంలో సారవంతమైన మట్టి కొటుకుపోవడానికి అవకాశం ఉండదు. అలాగే వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా మట్టిలో తేమ ఉంటుంది. తద్వారా మొక్కలు చనిపోకుండా మనుగడ సాగిస్తాయి. ఫలితంగా హరిత శాతం పెరగడంతో పాటు వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అడవుల్లో నీటి లభ్యత లేని కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. దీంతో మూగజీవులు ప్రమాదాల బారిన పడడంతోపాటు వేటగాళ్లు, ఆకతాయిల చేతిలో బలవుతున్నాయి. తాజాగా నీటిని పెద్దఎత్తున సంరక్షించడం ద్వారా అటువంటి విఘాతాలకు అడ్డుకట్ట వేయవచ్చని సర్కారు భావిస్తోంది. అటవీ భూముల్లో వివిధ పనులను ఉపాధి పథకం ద్వారా చేపట్టడం ద్వారా కూలీలకు పని లభించడంతోపాటు.. అడవులకు వైభవం రానుంది. చేపట్టే పనులివే... అటవీ భూముల్లో నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. ఇందులో భాగంగా వాననీటిని ఒడిసి పట్టేందుకు నీటి కుంటలు, ఇంకుడు గుంతలు తవ్వనున్నారు. అలాగే ఏటావాలుగా ఉన్న ప్రాంతాల్లో భూమికి సమాంతరంగా కండిత కందకాలు తీయనున్నారు. పైనుంచి కిందకు వచ్చే వర్షపు నీరు ఈ కందకాల్లో చేరి భూమిలోకి సులువుగా ఇంకిపోతుంది. అలాగే భూముల రక్షణకూ ఉపక్రమించనున్నారు. అటవీ భూముల సరిహద్దు చుట్టూ వెడల్పాటి కందకాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా బయటి నుంచి పశువులు, మనుషులు అటవీ భూముల్లోకి ప్రవేశించడానికి వీలుండదు. ఫలితంగా అటవీ వృక్షాలకు ఎటువంటి ముప్పు వాటిల్లదు. వేసవి వచ్చిందంటే అడవులకు నిప్పంటుకోవడం సహజంగా మారింది. మానవ తప్పిదం, యాధృచ్ఛికంగా జరుగుతున్న ఈ ప్రమాదాల వల్ల వృక్షాలు కాలి బూడిదవుతుండడంతో హరితం కనుమరుగవుతోంది. ఈ నష్టాన్ని నివారించడానికి చాలా ఏళ్లు పట్టక తప్పదు. ఈ క్రమంలో యంత్రాంగం అగ్ని ప్రమాదాలను సాధ్యమైనంత మేరకు నివారించడంపై దృష్టి సారించింది. అటవీ విస్తీర్ణాన్ని బట్టి ఒకవైపు నుంచి మరోవైపునకు నిర్ణీత వెడల్పులో నేలపై పూర్తిగా మొక్కలు లేకుండా పనులు చేపడతారు. అంటే మట్టి రోడ్డు మాదిరిలా ఆ ప్రాంతాన్ని తయారు చేస్తారు. ఈ విధానాన్ని అవలంభించడం వల్ల మంటల వ్యాప్తి కొంత ప్రాంతానికే పరిమితమై నష్ట తీవ్రత తగ్గుతుంది. త్వరలో పనుల గుర్తింపు.. అటవీ భూముల్లో నీటి సంరక్షణ, మొక్కల పెంపకం వంటి పనులు చేపట్టడానికి ఆ శాఖకు పెద్దగా నిధుల కేటాయింపు లేదు. అలాగే మానవ వనరులూ తక్కువే. దీంతో భూముల పరిరక్షణ కష్టంగా మారింది. ఇప్పటికే గ్రామాల్లో ఉపాధి కింద ఆ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ శాఖకు చెందిన భూముల్లోనూ గుర్తించిన పనులను చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అటవీ భూముల్లో ఉపాధి కింద పనులు చేసేందుకు మార్గం సుగమం అయిందని అధికారులు వివరిస్తున్నారు. అటవీ భూముల్లో ఏయే ప్రాంతాల్లో ఏయే రకం పనులు చేపట్టాలన్న అంశంపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు అటవీ శాఖకు తాజాగా లేఖ రాశారు. వీలైనంత త్వరలో పనులు గుర్తించాలని కోరారు. ఈ పనులను పూర్తిగా ఉపాధి హామీ కూలీలే చేయనున్నారు. పనుల అంచనాలు రూపొందించడంతోపాటు కూలీలకు వేతనాలు అందజేయడం గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యత. పనుల పర్యవేక్షణ మాత్రం అటవీ శాఖ అధికారులదే. పచ్చదనం 9.75 శాతమే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విస్తీర్ణం 7,493 చదరపు కిలోమీటర్లు. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఇందులో 33శాతం హరితం పరుచుకోవాలి. కానీ జిల్లాలో అతి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో పచ్చదనం కేవలం 9.75 శాతానికే పరిమితమైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా సమతుల్యత లోపించడం కారణంగానే పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని నిపుణులు వివరిస్తున్నారు. భవిష్యత్ ఇవే పరిస్థితులు కొనసాగితే మానవ మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఉపద్రవం ముంచుకరాకముందే యంత్రాంగం మేల్కొంటోంది. ఉపాధి పథకంలో భాగంగా అటవీ భూముల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
అడవి బిడ్డల ఎదురు చూపులు!
పట్టాలు పంపిణీ చేయాల్సిన మండలాలు: 8 ఎకరాలు: 8,871 కుటుంబాలు: 3,436 ►అటవీసాగు హక్కు పత్రాల పంపిణీకి గ్రహణం ► రెండో విడత పంపిణీ జరగని వైనం ►ఎదురు చూస్తున్న 3,500గిరిజన కుటుంబాలు అడవి బిడ్డలు అటవీసాగు హక్కు పత్రాల (పట్టాలు) కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. 2006వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కు చట్టాన్ని తెచ్చింది. 2005 డిసెంబర్ 13వ తేదీకి ముందు సాగులో ఉన్నవారికి పట్టాలివ్వాలని అధికారులు నిర్ణరుుంచారు. దీంతో జిల్లాలోని కొంతమంది గిరిజనులకు 2008లో హక్కు పత్రాలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. రెండో విడత పంపిణీ గురించి కనీసం పట్టించుకోకపోవడంతో వేలాది గిరిజన కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుు. సీతంపేట: గిరిజనులకు పోడు వ్యవసాయమే జీవనాధారం. అరుుతే అటవీ అధికారులు ఒక్కోసారి వారి పనులకు అడ్డుతగులుతుండేవారు. దీంతో సాగు హక్కు పట్టాలివ్వాలని ఉద్యమించడంతో దిగివచ్చిన పాలకులు అటవీ హక్కు చట్టాన్ని చేసింది. అరుుతే ఈ చట్టానికి జిల్లా అధికారులు తూట్లు పొడిచారనే విమర్శలు వస్తున్నారుు. కేవలం 2008లో కొద్దిమంది గిరిజనులకు హక్కు పత్రాలను ఇచ్చి..మిగిలిన వారిని పట్టించుకోవడం మానేశారు. రెండో విడతలోనైనా అందుతాయని ఎదురు చూస్తే నిరాశే మిగిలింది. దీంతో వేలాది గిరిజన కుటుంబాలు ఆందోళన చెందుతున్నారుు. పక్క జిల్లాల్లో పంపిణీ విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, పార్వతీపురం పరిధిలోని గిరిజనులకు సాగు హక్కు పత్రాలను అక్కడి అధికారులు రెండోవిడతలో పంపిణీ చేశారు. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. ఈ విషయం తెలిసి ఎప్పుడు పంపిణీ జరుగుతుందోనని గిరిపుత్రులు ఎదురు చూస్తున్నారు. ప్రతీ సోమవారం సీతంపేట ఐటీడీఏలో జరిగే గిరిజన దర్బార్కు వచ్చి సాగు హక్కు పట్టాలు ఇవ్వడం లేదంటూ అధికారులకు వినతులు అందిస్తూనే ఉన్నారు. అధికారుల సర్వే ప్రకారం 3,436 కుటుంబాలకు పంపిణీ చేయాల్సి ఉంది. వీరంతా భామిని, కొత్తూరు, పాలకొండ, పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి, మందస, పాతపట్నం మండలాల్లో ఉన్నారు. గత ఏడాది గిరిజనోత్సవాలకు వచ్చిన గిరిజనశాఖ మంత్రి చేతుల మీదుగా కొంతమంది పట్టాలు ఇవ్వడానికి ఐటీడీఏ యంత్రాం గం ఏర్పాట్లు చేసినప్పటికీ అటవీ శాఖ అధికారులతో సమన్వయం లేకపోవడంతో అప్పట్లో సాధ్యం కాలేదు. 8 వేల ఎకరాలపైనే... పాలకొండ, టెక్కలి రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 3,436 గిరిజన కుటుంబాలకు సంబంధించి 8,881.74 ఎకరాల్లో పట్టాలు ఇవ్వడానికి నిర్ణరుుంచారు. ఈ మేరకు గతంలోనే గ్రామస్థారుులో అటవీహక్కుల కమిటీ, డివిజన్, జిల్లా స్థారుు కమిటీలు తీర్మానం సైతం చేశారుు. కమిటీల తీర్మానం చేసినప్పటికీ అటవీశాఖ మాత్రం అంగీకరించలేదు. దీంతో ఈ ప్రక్రియ నిలిచిపోరుుంది. పరిస్థితి ఇలా.. పాలకొండ డివిజన్లోని సీతంపేట మండలంలో 1420 కుటుంబాలకు సంబంధించి 4164.39 ఎకరాలకు, భామినిలో 463 కుటుంబాలకు గాను 1501.98, కొత్తూరులో 145 కుటుంబాలకు 322.86, పాలకొండలో 19 కుటుంబాలకు 56.8, పాతపట్నంలో 332 కుటుంబాలకు 465.69, వీరఘట్టంలో 162 కుటుంబాలకు 596.3, హిరమండలంలో 202 కుటుంబాలకు గాను 659.64, మెళియాపుట్టిలో 580 కుటుంబాలకు 896.18, మందసలో 113 కుటుంబాలకు 218.72 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రయోజనం.. గిరిజనులకు సాగుహక్కు పత్రాలు ఇస్తే భూమిపై పూర్తి హక్కులు కలుగుతారుు. అలాగే పంట రుణాలను బ్యాంకర్లు ఇస్తారు. అటవీ ఫలసాయాలపై పూర్తి హక్కులు గిరిజనులకు ఉంటారుు. పట్టాల పంపిణీ చాలా ముఖ్యం గిరిజనులకు అటవీ సాగు హక్కు పట్టాల పంపిణీ చాలా ముఖ్యమైంది. పాడేరులో చాలా ఎక్కువ పట్టాలు పంపిణీ చేశాం. ఇక్కడ ఎంతమందికి పట్టాలు ఇవ్వాలి, ఎందుకు పంపిణీలో జాప్యం జరిగిందనే విషయమై పరిశీలించాల్సి ఉంది. జిల్లా కలెక్టర్తో చర్చించి పంపిణీకి చర్యలు తీసుకుంటాం.- ఎల్.శివశంకర్, ఐటీడీఏ పీవో ఆధారాలు చూపకపోవడం వల్లే.. గిరిజనులు తగిన ఆధారాలు చూపిస్తే పట్టాలు ఇస్తాం. అరుుతే ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నామనే ఆధారాలేవీ మాకు చూపించలేదు. పోడు పట్టాలకు సంబంధించిన గిరిజనులు సరైన ఆధారాలు చూపించకపోవడంతో సాగుహక్కు పట్టాల పంపిణీలో జాప్యం జరుగుతుంది. - జి.జగదీశ్వరరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రభుత్వ వైఫల్యమే గిరిజనులకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు గిరిజనులకు పట్టాలు పంపిణీ జరిగింది. ఇప్పుడు పంపిణీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు తప్పితే పంపిణీకి మాత్రం చర్యల్లేవు. - విశ్వాసరారుు కళావతి, పాలకొండ ఎమ్మెల్యే లిఖిత పూర్వకంగా ఇవ్వాలి గిరిజనులకు సాగు హక్కు పత్రాలు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదో లిఖితపూర్వకంగా చెప్పాలని అడుగుతున్నాం. దీనిలో అటవీశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా గిరిజనులు అన్యాయానికి గురౌతున్నారు. - బి.సంజీవరావు,ఎస్టీ సబ్ప్లాన్ నిధుల సాధన సమితి అధ్యక్షుడు -
'అరణ్య' రోదన
* అన్యాక్రాంతమవుతున్న అటవీ భూములు * పట్టించుకోని అధికారులు * పేదల సాగుకు మాత్రం ప్రతి బంధకాలు వనం–మనం, మొక్కలు నాటండి..పర్యావరణాన్ని కాపాడండి ఇలాంటివన్నీ ప్రభుత్వ పెద్దల చిలక పలుకులుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. పచ్చదనాన్ని పెంపొందించడానికి అవకాశం ఉన్నచోట కూడా అధికారుల అలసత్వం, పాలకులు నిర్లక్ష్యంతో హామీల అమలు ఆచరణ గడప దాటడం లేదు. వన సంరక్షణకు ప్రధాన వేదికలైన అటవీ భూములను అక్రమార్కులు అన్యాక్రాంతం చేస్తున్నా అధికారుల్లో చలనం కలగడం లేదు. తిరువూరు: పశ్చిమ కృష్ణాలోని తిరువూరు నియోజకవర్గంలో 10 వేల ఎకరాల రిజర్వు అటవీ భూమి ఉంది. దీర్ఘకాలంగా ఈ భూముల స్థితిగతులను పట్టించుకోని అధికారులు ఏటా వనసంరక్షణ పేరుతో మొక్కలు నాటి చేతులు దులుపుకుంటున్నారు. మొక్కల పెంపకానికి నియమించిన కూలీలకు సైతం సక్రమంగా సొమ్ములు చెల్లించని కారణంగా పట్టించుకునే నాథుడు లేక మొక్కలు ఎదుగుదల లోపించి కునారిల్లుతున్నాయి. తిరువూరు మండలంలోని చిట్టేల, ఆంజనేయపురం, చౌటపల్లి, మల్లేల, కాకర్ల, లక్ష్మీపురం, చిక్కుళ్లగూడెం, ఏ కొండూరు మండలంలోని కృష్ణారావుపాలెం, చీమలపాడు, కొండూరు, కోడూరు, రామచంద్రాపురం, గంపలగూడెం మండలం వినగడప, నారికింపాడు, కనుమూరు, విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల అటవీ భూములున్నాయి. పలుచోట్ల రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో 2 సంవత్సరాల క్రితం జాయింట్ సర్వే జరిపి హద్దులు నిర్ణయించి కందకాలు తవ్వారు. తదుపరి కొందరు పెద్దల ఒత్తిడితో అటవీశాఖ భూముల హద్దులు తారుమారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు ప్రతి బంధకాలు.. అటవీభూమిని జీవనోపాధి కోసం సాగు చేసుకునే పేదలపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేసే అధికారులు యథేచ్ఛగా కొండలు, గుట్టలు తవ్వి మట్టి విక్రయించి సొమ్ము చేసుకునే వారిని వదిలేస్తున్నారు. సమీప పొలాల్లో అటవీ భూమి కలుపుకునే వ్యక్తులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తిరువూరు మండలంలోని మల్లేలలో ఇటీవల అటవీ అధికారులు ఎస్సీ, ఎస్టీల భూములు ఖాళీ చేయాలని వేధింపులకు గురి చేసినప్పటికీ సాగుదారులు సంఘటితంగా నిలబడటంతో అధికారులు వెనక్కు తగ్గారు. కిందిస్థాయి సిబ్బంది మామూళ్ల మత్తులో అటవీ భూముల ఆక్రమణలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు కబ్జాదారులు కోట్లాది రూపాయల విలువైన భూములు కాజేసేందుకు పావులు కదుపుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు తీవ్ర హాని.. రిజర్వు అటవీ భూములను ఆక్రమించి పంటలు సాగు చేస్తుండటంతో మొక్కల పెంపకానికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిహామీ పథకం కింద అటవీ భూముల్లో మొక్కల పెంపకం, నీటి వనరుల అభివృద్ధికి చెక్డ్యామ్ల నిర్మాణం, వాగులు వంకల్లో నీటి పారుదలకు అవరోధాల తొలగింపు నిధులు మంజూరైనా పనులు తూతూమంత్రంగా జరుగుతున్నాయి. నారికింపాడు అడవులను వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంగా 50 ఏళ్ల క్రితమే ప్రకటించినప్పటికీ ఇంతవరకు తదనుగుణంగా చర్యలు చేపట్టలేదు. ఆక్రమణదారులపై కేసులు: రంజిత్, అటవీ రేంజి అధికారి, ఏ కొండూరు అటవీ భూములను ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. మల్లేల అటవీ భూముల్లో ఆక్రమణలు తొలగించి 25 ఎకరాల్లో మొక్కలు నాటాం. వీటి సంరక్షణ బాధ్యతలను త్వరలో వన సంరక్షణ సమితులకు అప్పగిస్తాం. గతంలో ఆక్రమణకు గురైన భూముల విషయం న్యాయస్థానాల పరిధిలో ఉంది. ఇకపై ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. అటవీ భూముల రక్షణకు చర్యలు: రక్షణనిధి, ఎమ్మెల్యే, తిరువూరు అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశిస్తాం. వన్యప్రాణుల సంరక్షణకు అవసరమైన చర్యలు కూడా తక్షణం తీసుకునే విధంగా కృషి చేస్తాం. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. -
అటవీభూముల్లో తవ్వకాలపై 'విజిలెన్స్'
సైదాపురం: అటవీ భూముల్లో మట్టి తవ్వకాలపై విజిలెన్స్ డీఎఫ్ఓ శ్రీనివాసులురెడ్డి విచారణ చేపట్టారు. షామైన్ రోడ్డు నుంచి మొలకలపూండ్ల వరకు తారురోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ అటవీ అధికారుల అనుమతి లేకుండానే అడవిలో 900 మీటర్ల మేర మట్టిని తరలించడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో అటవీశాఖ అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ శ్రీనివాసులునాయుడు అనే వ్యక్తి సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మొలకలపూండ్ల అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన ప్రాంతాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. సైదాపురం పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. అటవీశాఖ అధికారులు ఈ విషయంలో నిజాయితీగా వ్యవహరించారని సర్పంచ్ బండి వెంకటేశ్వర్లు రాతపూర్వకంగా తెలిపారు. రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, రహదారి నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని గ్రామస్తులు కోరారు. శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అనుమతులు వచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రావెల్ తవ్విన 900 మీటర్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉందన్నారు. ఈ విషయమై అధికారులు సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపితే అనుమతులు వస్తాయన్నారు. అప్పటి వరకు పనులు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట నెల్లూరు, వెంకటగిరి రేంజర్లు వెంకటేశ్వర్లు, శ్రీకాంత్రెడ్డి, విజిలెన్స్ రేంజర్ సుబ్బారెడ్డి తదితరులున్నారు. -
అటవీ భూముల అన్యాక్రాంతంపై జూపల్లి ఫైర్
హైదరాబాద్: అటవీ భూముల అన్యాక్రాంతంపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సొంత పార్టీ జెడ్పీటీసీని సస్పెండ్ చేయాలని ఆయన బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు కాసింపై వేటుకు వరంగల్ కలెక్టర్ సిఫారసు చేశారు. తక్షణమే జెడ్పీటీసీని సస్పెండ్ చేయాలని జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. -
'ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు'
న్యూఢిల్లీ: అటవీ భూములను పరిరక్షించేలా నవ్యాంధ్ర నూతన రాజధానిని డిజైన్ చేయాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సూచించారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యయనం లేకుండా అమరావతికి పర్యావరణ అనుమతులు ఇచ్చారన్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. అమరావతి కోసం కొత్త పాలసీ తీసుకొచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు. అటవీ భూముల్లో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు అనుమితించామని, రాజధాని నిర్మాణ ప్రతిపాదనలపై ఇంకా తనిఖీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాజధాని అంశంలో అనుమతుల విషయంలో జాప్యం జరగలేదని చెప్పారు. రాజధాని నిర్మాణానికి తక్కువ అటవీ భూములు ఉపయోగించాలన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు. -
అమరావతి ఫైలును తిప్పిపంపిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి పర్యావరణ అడ్డంకులు ఎదురయ్యాయి. నగర నిర్మాణానికి అనుమతి కోసం ఏపీ ప్రభుత్వం పంపిన ఫైలును కేంద్రం తిప్పి పంపింది. అటవీ భూమిని బదలాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మొత్తం 19 వేల హెక్టార్ల భూమిని కోరడంపై కేంద్ర పర్యావరణ సలహా సమితి సందేహాలు వ్యక్తం చేసింది. డీనోటిఫికేషన్కు సంబంధించిన సమాచారం అసంపూర్తిగా ఉందని పర్యావరణ సలహా సమితి చెప్పింది. ఇప్పటికే రాజధాని నిర్మాణం విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
అటవీ సంపదను కాపాడాలి: సీఎం
సాక్షి, హైదరాబాద్: అటవీ భూములు దురాక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను సీఏం కేసీఆర్ ఆదేశించారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ పి.కె. శర్మ శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతమున్న అడవులను కాపాడాల్సిన బాధ్యత అధికారుల పైనే ఉందని అన్నారు. అటవీ భూముల్లో మొక్కలు నాటాల ని, మిగిలిన అడవిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ శాఖను మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. -
కనిపిస్తే కబ్జా
- ప్రభుత్వ, ప్రైవేటు భూములనే తేడాలేదు - ఏది కనిపించినా.. కన్నుపడితే చాలు ఆక్రమణలే - వేములపాడు మహమ్మదాపురం పంచాయతీల్లో కబ్జాలపర్వం - యథేచ్ఛగా అటవీ భూముల ఆక్రమణ.. - జామాయిల్ తోటల సాగు హనుమంతునిపాడు : ప్రభుత్వ భూములు, కుంటలు, పురాతన బంగళాలు, పోలీసు ఠాణా స్థలాలు, అటవీ భూములు, కొండ వాలు భూములు, పశువుల బీడు.. ఒక్కటేమిటి ఆక్రమణకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వందల ఎకరాలు ఆక్రమించుని ఏకంగా తోటలు సాగు చేస్తున్నారు. హనుమంతునిపాడు మండలం వేములపాడు, కొండారెడ్డిపల్లి, మహమ్మదాపురం పంచాయతీలు కబ్జాదారుల అడ్డగా మారాయి. ప్రధానంగా వందల ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుని జామాయిల్, క్లోన్స్ మొక్కలు సాగు చేశారు. ముప్పళ్లపాడు పంచాయతీలోనూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి బడా బాబులు నిమ్మతోటలు నాటారు. కొంత మంది పక్క మండలాల రైతులకు కౌలుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. కొండారెడ్డిపల్లి పంచాయతీలో.. కొండారెడ్డిపల్లి పంచాయతీలో సర్వే నంబర్ 222లో గాడిరాళ్లకొండ వద్ద 274 ఎకరాలు, సర్వేనంబర్ 208లో ఆరెకరాల పోరంబోకు భూమి, సర్వేనంబర్ 207లోని 42 ఎకరాల పశువుల బీడును ఆక్రమించుకున్నారు. జామాయిలు తోటలు విస్తారంగా సాగు చేశారు. ఇటీవల జామాయిల్ కర్రను రాత్రులు తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో వదిలేశారు. హైవే పొడవునా.. వేములపాడు సమీప నంద్యాల-ఒంగోలు హైవే పక్కన 419, 422, 420,421,405 సర్వే నంబర్లలో భూమిని దర్జాగా కబ్జా చేశారు. కుంటలు, ఫారెస్టు భూమి, ప్రభుత్వ భూములు, రోడ్డు సైడు భూములు, పశువుల బీడు భూమి, చెక్ డ్యాం సైతం కబ్జాలకు గురయ్యాయి. పశువుల కుంటలు చదును చేసి సాగు చేయడంతో పశువులకు తాగునీరు కరువైంది. అడవికి మేతకెళ్లిన జీవాలు, పశువులు అల్లాడుతున్నాయి. మహమ్మదాపురం రెవెన్యూలో సర్వేనంబర్ 422లో అసైన్డు భూమిలో ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయలకు, హాస్టల్ వార్డెన్లకు 18 ఎకరాల్లో పట్టాలు ఇచ్చారు. వాటికి కూడా పాస్ పుస్తకాలు సృష్టించి అమ్ముకున్నట్లు సమాచారం. కఠిన చర్యలు తప్పవు డిప్యూటీ తహసీల్దార్ షేక్ రఫీని భూ కబ్జాలపై వివరణ కోరగా ప్రభుత్వ భూముల ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలతోపాటు కేసుల నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో దండోరా కూడా వేయించినట్లు తెలిపారు. హెచ్చరిక బోర్డులనుకూడా ఏర్పాటు చేశామన్నారు. కబ్జా భూములను పరిశీలించి హెచ్చరించినట్లు తెలిపారు. -
అక్రమంగా సాగు చేశారని..
సిరికొండ(నిజామాబాద్ జిల్లా): గిరిజనులు అక్రమంగా అటవీ భూముల్లో సాగు చేశారని అటవీ అధికారులు, పోలీసుల సహాయంతో పంటలను తొలగించారు. ఈ సంఘటన మంగళవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామంలోని 50-60 ఎకరాల భూమిని గతంలో రెవిన్యూ అధికారులు గిరిజనుల పేరున పట్టా చేసి పట్టాదారు పాస్పుస్తకాలను కూడా ఇచ్చారు. అయితే, ఈ భూమి అటవీ భూమి అని, మీరు ఏ అధికారంతో గిరిజనుల పేరున పట్టా చేస్తారని అటవీ అధికారులు.. రెవిన్యూ అధికారులను నిలదీశారు. దీంతో కళ్లు తెరిచిన రెవిన్యూ అధికారులు భూమిని వెనక్కి లాక్కున్నారు. అయితే, ఎన్నో ఏళ్లుగా ఆ భూమిని సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది కూడా సాగు చేశారు. దీంతో అటవీ అధికారులు పోలీసుల సహాయంతో పంటను నాశనం చేశారు. కళ్ల ముందే సాగు చేసిన పంటను నాశనం చేస్తుండటంతో గిరిజనులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రంగంపేటకు స్మార్ట్ కిరీటం?
తిరుపతి నగరం స్మార్ట్ సిటీ కిరీటం దక్కించుకోవడం దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు ఇందుకు కావాల్సిన భూమిని సైతం సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు చంద్రగిరి మండలం ఏ.రంగంపేట అటవీ ప్రాంతంలో స్మార్ట్ సిటీ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు ఎస్వీ జూ పార్క్ దాటిన తరువాత కల్యాణి డ్యాం వరకు ఉన్న అటవీ ప్రాంతంలో స్మార్ట్ సిటీ నిర్మాణం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తుడా, రెవెన్యూ విభాగాల్లోని కీలక అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నారు. - అన్ని అర్హతలతో నివేదికలు రెడీ 50 బ్లాకులు.. - 500 ఎకరాల భూముల గుర్తింపు తిరుపతి తుడా : తిరుపతి నగరం ఎస్వీ జూ పార్కు వరకు విస్తరించడం, అక్కడి నుంచి కల్యాణి డ్యాం వరకు ప్రభుత్వ, అటవీ భూములు పుష్కలంగా ఉండటం స్మార్ట్ సిటీకి అనుకూలం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్మార్ట్ సిటీకి రంగంపేట పరిసర ప్రాంతం అన్ని విధాల అనుకూలంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఈ క్రమంలో అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. స్మార్ట్ సిటీ అభివృద్ధికి కావాల్సిన 500 ఎకరాల భూమితో పాటు అదనంగా మరో 2 వేల ఎకరాల వరకు ఇక్కడ అటవీ భూమి ఉంది. నీటి వనరులకు కల్యాణి డ్యాం, మరో పక్క గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఎస్వీ జూ పార్కు వరకు వస్తుంది. దీంతో నీటి వనరు సమస్య ఉండదు. అటవీ ప్రాంతం కావడంతో భూములన్నీ ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు వాలుగా ఉంటాయి. డ్రైనేజీ వ్యవస్థకు ఇవి అనుకూలంగా ఉంటాయి. అనంతపురం- నాయుడుపేట రహదారికి ఇదే మార్గం మీదుగా వెళతాయి. మరో పక్క ఎస్వీ జూ పార్కు మీదుగా అలిపిరి బైపాస్ రోడ్డు ఇలా ఏ రంగ ంపేట పరిసర ప్రాంతం స్మార్ట్ సిటీకి అర్హతలు ఉన్నాయని రెవెన్యూ, తుడా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే ప్రభుత్వం ఎక్కడ నిర్మిస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. సొంత మండలానికి ఏమి చేయలేదని అపవాదు నుంచి బయటపడేందుకు ఇక్కడే స్మార్ట్ సిటీ నిర్మించాలనేది సీఎం చంద్రబాబు కోరికగా కనిపిస్తోంది. ఆ మేరకు అనధికారికంగా ఆయన ఇక్కడే స్మార్ట్ సిటీ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జిలా ఉన్నతాధికారికి చెప్పినట్టు మరో అధికారి చెప్పారు. భూముల గుర్తింపు స్మార్ట్ సిటీకి అవసరమయ్యే భూముల వివరాలను రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశారు. రంగంపేట, ఏర్పేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో బ్లాకులుగా భూములను గుర్తించి నివేదికను అందజేశారు. అయితే ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాలు కేంద్రం విధించిన నిబంధనలకు విరుద్ధంగా నగరానికి చాలా దూరంగా ఉన్నాయి. ఇప్పటికే ఐఐటీ ఇతర ప్రాజెక్టులన్నీ ఈ ప్రాంతాలకే రాబోతున్నాయి. దీంతో ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాలు స్మార్ట్కు అనుకూలంగా లేవని అధికారులు చెబుతున్నారు. ఇక రేణిగుంట మండలం విషయానికి వస్తే తాత్కాలికంగా అభివృద్ధికి భూములు ఉన్నా భవిష్యత్ అవసరాలకు ఇక్కడ భూములు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఇక మిగిలింది ఏ.రంగంపేట మాత్రమే కావడం ఇక్కడ కలిసివచ్చే అంశం. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఎస్వీ జూ పార్కుకు ఆనుకుని సుమారుగా కల్యాణి డ్యాం వరకు ప్రభుత్వ, ఫారెస్టు, డీకేటీ భూములను గుర్తించారు. 50 ఎకరాలను ఒక బ్లాకుగా విభజించారు. ఇలా మొత్తం 50 బ్లాకులను సిద్ధం చేశారు. ఒక్కో బ్లాకులో ఎలాంటి మౌలిక వసతులు లభ్యమవుతున్నాయో నివేదికలో పొందుపరిచారు. స్మార్ట్ సిటీకి అర్హత సాధించేం దుకు పక్కా ప్రణాళికతో కలెక్టర్ నివేదికను సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పరిశీలిస్తే... స్మార్ట్ సిటీకి నగరాన్ని ఎంపిక చేయాలంటే ఆ నగరానికి దరిదాపుల్లో 500 ఎకరాల భూములు ఉండాలి. ఆ భూముల్లో అవసరమయ్యే మౌలిక వసతు లు, బ్లాక్లుగా విభజించి అభివృద్ధి చేయడానికి అనువైన పరిస్థితులు ఉండాలి. స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేయడం కోసం ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఉండటంతోపాటు వాటిల్లో పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉండాలి. స్మార్ట సిటీగా ఎంపికైన ప్రాంతంలో విద్యుత్, డ్రైనే జీ, టెలిఫోన్, నీరు తదితర సౌకర్యాలు భూగర్భ విధానంతో కల్పిస్తారు. ఇందుకు అనుగుణంగా ఆప్రాంతం ఉండాలి. నీటి వసతి ఉండే ప్రాంతంగా ఉంటేనే స్మార్ట్ సిటీ ఎంపికకు అర్హత పొందుతుంది. -
భూ దాహం
రాష్ట్ర ప్రభుత్వ భూ దాహానికి అంతేలేకుండాపోతోంది. ఎక్కడ భూమి కనిపించినా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోంది. సీఆర్డీఏ ఏర్పాటయ్యాక ఈ ప్రక్రియ వేగవంతమైంది. తాజాగా మైలవరం అటవీ రేంజ్ పరిధిలోని పంజిడి చెరువు ప్రాంతంలో గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములపై కన్నేసింది. - అటవీ భూములపై ప్రభుత్వ కన్ను - మైలవరం రేంజ్లో పేదల నుంచి స్వాధీనానికి యత్నాలు - రోడ్డున పడనున్న రెండువేల గిరిజన రైతు కుటుంబాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో మైలవరం అటవీ రేంజ్ పరిధిలోని పంజిడి చెరువు ప్రాంత అడవుల్లో గిరిజనులు, ఎస్సీ, బీసీలు సుమారు రెండు వేలమంది భూములు బాగుచేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. సుమారు 17వేల ఎకరాల భూమి గిరిజనులు, పేదల ఆధీనంలో ఉంది. గతంలో కొందరికి అటవీ అధికారులే భూములను లీజుకు ఇచ్చారు. ఈ లీజు గడువు 2009లో ముగిసింది. ఆ తరువాత లీజును రెన్యువల్ చేయించుకునేందుకు రైతులు ముందుకు రాలేదు. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్నందున తమ భూముల్లోకి ఎవరూరారనే ధైర్యంతో ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత గిరిజన కుటుంబాల్లో అలజడి మొదలైంది. వారు సాగుచేసుకుంటున్న అటవీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుండటమే దీనికి కారణం. 15 రోజుల క్రితం సబ్కలెక్టర్ నాగలక్ష్మి పంజిడి చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తరువాత అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పేదలు సాగుచేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు. బతుకు భయం గతంలో అటవీ భూములు సీఆర్డీఏ పరిధిలో లేవు. ఇటీవల కొన్ని గ్రామాలను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకున్నారు. దీనిలోనే మైలవరం అటవీ భూములు కూడా కలిశాయి. ఆ వెంటనే సీఆర్డీఏ కొరడా ఝుళిపించింది. రైతులు అటవీ భూములను ఖాళీ చేయాలని ఇటీవల మైలవరం తహశీల్దార్ ఆదేశించారు. దీంతో వారిలో బతుకు భయం మొదలైంది. భూములను వదిలి ఎలా జీవించాలని మదనపడుతున్నారు. తమను వదిలి భూస్వాముల స్వాధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. ఏలూరుకు చెందిన నాగరాజు ఆధీనంలో 800 ఎకరాల భూమి ఉందని, గతంలో గిరిజనులకు కాస్తో కూస్తో సొమ్ము చెల్లించి అతను ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమకు అండగా నిలబడ్డారని, అటవీశాఖ అధికారులకు ఎప్పటికప్పుడు ెహ చ్చరికలు జారీ చేస్తూ తమకు భరోసా ఇచ్చారని రైతులు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుంటున్న విషయాన్ని వివరిస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారం రోజుల్లో భూములు వదిలి వెళ్లాలంటూ రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారని, పరిహారంపై గ్యారెంటీ ఇవ్వలేనని తహశీల్దార్ పేర్కొంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. పేదల భూములే కావాలా? రాజధాని నిర్మాణానికి పేదలు సాగు చేసుకునే భూములు కావాల్సి వచ్చాయా? మా భూములు లాక్కుంటే మేము ఏం తినాలి? ఎలా బతకాలి? అధికారులు, ప్రజాప్రతినిధులు మా సమస్యను పరిష్కరించాలి. - మూడుమంతల రాంబాబు, రైతు, వెదురుబీడెం, మైలవరం మండలం పారిశ్రామిక వేత్తల కోసం.. పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకు పేదల భూములే అవసరమయ్యాయా? ఏళ్ల తరబడి భూములు సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాము. ఇప్పుడు ఈ విధంగా మా భూములు లాక్కుంటే మేమెలా బతకాలి. ఇది భూస్వాముల రాజ్యంగా ఉంది. పెద్దల కోసం పేదల నోళ్లు కొట్టవద్దు. - మహమ్మద్ జానీ, సీపీఎం నాయకుడు పెద్దలకు కట్టబెట్టేందుకే.. రాజధాని నిర్మాణం పేరుతో పేదల సాగులోని భూములు తీసుకుని పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది భూస్వాముల ప్రభుత్వం. మా ఓట్లతో గెలిచి మమ్మల్నే రోడ్డుకు ఈడుస్తారా? ఇక పోరాటం చేయక తప్పదు. - జి.చుక్కయ్య, రైతు, వెల్లటూరు -
అడవుల రక్షణకు ‘వాచ్ టవర్’
దండేపల్లి: అడవుల రక్షణపై అటవీ శాఖ మరింత దృష్టి సారించింది. అడవుల్లో నిఘా పెంచేందుకు వాచ్టవర్ల నిర్మాణాలు చేపడుతోంది. జన్నారం అటవీ డివిజన్లో ఇప్పటికే దొంగపల్లి, గండిగోపాల్రావ్పేట, ఉడుంపూర్, అల్లంపల్లిలో వాచ్ టవర్లు నిర్మించింది. తాజాగా కవ్వాల్తోపాటు దండేపల్లి సమీపంలోని ఊట్ల మలుపుల వద్ద వాచ్ టవర్ నిర్మాణం చేపడుతోంది. దీంతో ఈ ప్రాంతంలో కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. అడవుల రక్షణలో వాచ్టవర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. టవర్లు ఎక్కి పరిశీలిస్తే అడవిలో ఎక్కడా ఏం జరుగుతున్నా తెలుసుకోవచ్చు. కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల పరిశీలన, వేసవిలో అడవుల్లో మంటలు చెలరేగిన ప్రాంతాలను గుర్తించి అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే వీలుంటుంది. తాళ్లపేట, తిర్యాణి అటవీ రేంజిల సరిహద్దు ప్రాంతమైన ఊట్ల రెండో మలుపు వద్ద చేపడుతున్న వాచ్ టవర్ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఊట్ల అటవీ ప్రాతంలో ఇప్పటికే చాలామంది పర్యాటకులు వస్తుంటారు. వాచ్ టవర్ నిర్మాణం పూర్తయితే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
పరిశ్రమించేనా!
ఏలూరు : జిల్లాలోని 16వేల ఎకరాల అటవీ భూములను పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ భూములను గుర్తించి రెవెన్యూ భూములుగా డీ-నోటిఫై చేయటం ద్వారా పరిశ్రమలకు కేటాయించాలని ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సర్కారు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని అటవీ భూముల స్థితిగతులపై రెవెన్యూ, అటవీ శాఖ రికార్డులతో సరిపోల్చే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక వసతుల సంస్థ సర్వే చేయిస్తోంది. ఈ బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. అడుగడుగునా ఆటంకాలే అటవీ భూములను రెవెన్యూ భూములుగా డీ-నోటిఫై చేసేందుకు సాగిస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. చాలాచోట్ల భూ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. వేలాది ఎకరాల భూములకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ సర్వేకు వెళుతున్న అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాల్లో ఈ పరిస్థితులు అధికంగా ఉన్నాయి. నల్లజర్ల మండలలో 540 ఎకరాల అటవీ భూమిలో వనసరంక్షణ సమితులు వివిధ రకాల తోటలను సాగు చేస్తు న్నాయి. ఇందులో 480 ఎకరాల అస్సైన్డ్, 60 ఎకరాల జిరాయితీ భూములు ఉన్నాయి. ఈ భూములను పారిశ్రామిక అవసరాల కోసం సేకరించాలనే నిర్ణయాన్ని సాగుదారులు వ్యతిరేకిస్తున్నారు. సర్వేకు వచ్చిన బృందాలను వారంతా అడ్డుకున్నారు. గతంలో కొండలు, వాగుల రూపంలో ఉన్న అస్సైన్డ్ భూములను తామంతా సాగుకు యోగ్యంగా మలుచుకున్నామని, ఇందిర జలప్రభ కార్యక్రమంలో బోర్లు వేసి మొక్కలు నాటామని సాగుదారులు చెబుతున్నారు. ఫలసాయం చేతికొచ్చే సమయంలో ఆ భూములను పరిశ్రమలకు ఇచ్చేయాలని అడిగితే తమ పరిస్థితి ఏమిటని రైతులు నిల దీస్తున్నారు. సేకరణ సాధ్యమేనా? జిల్లాలోని నాలుగు అటవీ రేంజ్ల పరిధిలో 81వేల 152 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఇటీవల కుకనూరు, వేలేరుపాడు మండలాల పరిధిలోని 47,676 హెక్టార్ల అటవీ భూమి కూడా జిల్లాలో కలిసింది. దీంతో కలిపి జిల్లాలో మొత్తంగా సుమారు 1.49 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఉంది. కాగా, చాలా మండలాల్లో అటవీ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. గిరిజనులకు చెందాల్సిన భూములు సైతం గిరిజనేతరుల చేతుల్లో చిక్కాయి. టి.నరసాపురం మండలం అల్లంచర్లరాజుపాలెంలో 250 ఎకరాలకు పైగా అటవీ భూమిని కొందరు దర్జాగా ఆక్రమించుకుని అరటి తోటలు సాగు చేస్తున్నారు. దీనిపై రాజుకున్న చిచ్చు నేటికీ ఆరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అటవీ భూములను రెవెన్యూ భూములుగా డీ-నోటిఫై చేసి పరిశ్రమలకు కేటాయించడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా, అటవీ భూములను డీ-నోటిఫై చేసే ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందనేది తమకు తెలియదని జిల్లా అటవీ శాఖ అధికారి పీఏ శ్రీనివాసశాస్త్రి చెప్పారు. -
అటవీ భూమిలో ‘ఏపీ పోలీస్ హబ్’కు కేంద్రం ఓకే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని సమీపంలో ఏర్పాటు కానున్న పోలీసు హబ్కు అటవీ భూములు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు కేంద్ర అటవీ-పర్యావరణ మంత్రిత్వ శాఖ వర్తమానం పంపింది. గుంటూరు జిల్లా తుళ్ళూరుకు కాస్త దూరంలో ఉన్న వెంకటాయపాలెంలో నిరుపయోగంగా ఉన్న (డీ గ్రేడెడ్) 2700 ఎకరాల అటవీ భూమిని గుర్తించిన డీజీపీ కార్యాలయం.. అక్కడ పోలీసు శాఖకు సంబంధించిన ప్రధాన విభాగాల ఏర్పాటుకు ప్రతిపాదించి ఆ భూములను డీ-నోటిఫై చేయాలని కోరుతూ మార్చిలో కేంద్రానికి లేఖ రాసింది. తుళ్ళూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటాయపాలెం ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ కార్యాలయంతో పాటు నిఘా విభాగం, సీఐడీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా), ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వెంకటాయపాలెంలోని భూముల్ని డీ నోటిఫై చేసేందుకు అంగీకరించిన కేంద్రం.. అంతే విస్తీర్ణం గల భూములను ప్రత్యామ్నాయ ప్రాంతంలో అప్పగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షించండి
- స్థాయి సంఘాల సమావేశాల్లో జెడ్పీటీసీల వినతి పాతగుంటూరు : జిల్లా పరిషత్ ఆస్తుల వివరాలు అడిగాం... ఇప్పటివరకు అధికారులు ఇవ్వలేకపోయారు... జిల్లా పరిషత్ భూముల్లో అక్రమ మైనింగ్, అటవీ భూముల ఆక్రమణలనూ పట్టించుకోవడంలేదు... అంటూ పలువురు జెడ్పీటీసీలు స్థాయి సంఘాల చైర్మన్లకు విన్నవించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని చైర్పర్సన్ చాంబర్, సీఈవో చాంబర్లో శనివారం ఏడు స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. 1వ స్థాయి సంఘం సమావేశం చైర్పర్సన్ షేక్ జానీమూన్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా పరిషత్ ఆస్తుల వివరాలు గతంలో అడిగామని, ఇప్పటివరకు తెలియజేయలేదంటూ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి అధికారులను ప్రశ్నించారు. దాచేపల్లి, నకరికల్లు మండలాల్లో జెడ్పీ నిధులు మంజూరైనప్పటికీ అక్కడి ఎమ్మెల్యేలు పనులు చేయకుండా అడ్డు తగులుతున్నారని , వాటిని పరిష్కరించాలని కోరారు. 2వ స్థాయి సంఘం సమావేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించాలని రాజుపాలెం, పిడుగురాళ్ళ జెడ్పీటీసీలు మర్రి వెంకటరామిరెడ్డి, వీరభద్రుని రామిరెడ్డిలు కోరారు. జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన 3వ సమావేశంలో దాచేపల్లి జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ అటవీ భూములను కొన్ని కంపెనీల యాజమాన్యం ఆక్రమించుకున్నాయని, వాటికి హద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో మత్స్యకారులకు మంజూరైన వలలు ఇవ్వాల్సిందిగా కోరారు. జానీమూన్ ఆధ్వర్యంలో జరిగిన 4వ స్థాయి సంఘం సమావేశంలో పీహెచ్సీలను మెరుగుపరచాలని, సిబ్బంది కొరత లేకుండా చూడాలని దుగ్గిరాల జెడ్పీటీసీ విజయలక్ష్మి సూచించారు. డాక్టర్లు లేక కొన్ని పీహెచ్సీల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ సమావేశానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హాజరయ్యారు. 5వ స్థాయి సంఘం సమావేశం చైర్మన్ ఉప్పుటూరి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. బొల్లాపల్లి జెడ్పీటీసీ కె. సంతోషమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు వేధింపులకు గురవుతున్నారని, అంగన్వాడీ కేంద్రాలకు సరుకులను సక్రమంగా రవాణా చేయాలని కోరారు. జెడ్పీ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ స్థాయి సంఘం సమావేశంలో గుంటూరు రూరల్ మండలం జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరైన లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించడంలేదన్నారు. బ్యాంకు అధికారులను ఒప్పించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని తెలిపారు. 7వ స్థాయి సంఘ సమావేశంలో పనులు కేటాయింపుపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
అటవీ భూములను రక్షించాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో అటవీ భూములను రక్షించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకోసం మొక్కల పెంపకాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితికి సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలతోపాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా జిల్లాలో అటవీ భూములను పరిరక్షించే విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని, ఇందు కోసం సాధ్యమైనంత కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్ కలెక్టర్లకు ఈ సూచనలు చేశారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టంచేశారు. బోగస్ రేషన్కార్డులను ఏరివేతలోనూ నిక్కచ్చిగా ఉండాలన్నారు. జిల్లాలో అత్యవసర సమయంలో కావాల్సిన నిధులను అందుబాటులో ఉంచుకునేందుకు అనువుగా కలెక్టర్ పరిధిలో రూ.10 కోట్లను ప్రత్యేక నిధిగా ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులను సైతం జారీ చేశారు. జిల్లాలో పాలనా పరంగా మరింత వేగం పెంచాలని, అభివృద్ధి కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్గ్రిడ్ పనులను కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఇంటికి పంపు కనెక్షన్ ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.మిషన్ కాకతీయ వల్ల రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయన్నారు. చెరువుల తవ్వకం, పునర్నిర్మాణం అనే యజ్ఞం కలెక్టర్ల పర్యవేక్షణలో సరైన నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి కావాలన్నారు. ఖమ్మంలో ప్రత్యేకంగా డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం అవసరమైన చర్యలను సత్వరం చేపట్టాలని కలెక్టర్ను సీఎం ఆదేశించారు. డంపింగ్యార్డ్ లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను స్థానికులు అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో సీఎం కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి సత్వరం చర్యలు తీసుకోమని ఆదేశించడం విశేషం. నగరాన్ని, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నం చేయాలన్నారు. అన్ని పట్టణాల్లో చెత్తను ఎత్తివేయడానికి అనుగుణంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో తడి,పొడి చెత్తలను ఎత్తివేసేందుకు రెండు డస్ట్బిన్లను పంపిణీ చేయాలని సూచించారు.. జిల్లాలో శ్మశాన వాటిక కొరత ఉన్న ప్రాంతాన్ని గుర్తించి శ్మాశాన వాటికలకు స్థలం మంజూరు చేయాలని తెలిపారు. రైతుబజారులను ఏర్పాటు చేయాలని, ప్రతినెలలో ఒకరోజు అర్బన్ డే, ఒకరోజు రూరల్డేను నిర్వహించి ఆయా ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని, మరుగుదొడ్లను నిర్మించుకునే వారికి రూ.12వేల సహాయాన్ని మంజూరు చేయాలన్నారు. సామూహిక మరుగుదొడ్లకు రూ.60 వేలు కేటాయించాలన్నారు. హైదరాబాద్లో సీఎం నిర్వహించే ఈ సమావేశానికి హాజరు కావడానికి దాదాపు వారం రోజుల ముందు నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీ వివిధ శాఖల వారీగా అభివృద్ధిని సమీక్షించి, ప్రగతి నివేదికలను తయూరు చేశారు. దాదాపు 18 అంశాలతో ఈ సమావేశం ఎజెండా రూపొందిం చారు. జిల్లాలో కొనసాగుతున్న విద్యుత్ ప్రాజెక్టుల అంశానికి ఎజెండాలో తొలి ప్రాధాన్యం లభించింది. నీటిపారుదల, వాటర్గ్రిడ్, గోదావరి పుష్కరాల పనులు, సీజనల్ వ్యాధులకు సంబంధించి పరిస్థితి, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, జిల్లాలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమతోపాటు జిల్లాలో ఫుడ్పార్క్, డ్రైపోర్ట్ వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సిద్ధం చేసుకున్నారు. గత నెలలో సీఎం ఖమ్మంలో పర్యటించి భద్రాద్రి పవర్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, అశ్వాపురం మండలం అమర్ద వద్ద మరో పవర్ ప్లాంట్ నిర్మించే అవకాశంపై వివరాలను కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. మిషన్కాకతీయలో జిల్లావ్యాప్తంగా 903 చెరువులను అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, టెండర్లు పూర్తయిన తీరు, ఇప్పటికి పనులు ప్రారంభించిన చెరువులు, వాటి పురోభివృద్ధి తదితర అంశాలను నివేదికలో వివరించారు. తొలిరోజు సీఎం నిర్వహించిన సమావేశంలో జిల్లాకు సంబంధించిన కొన్ని అంశాలు ప్రస్తావనకు రాగా.. మరికొన్ని అంశాలను రెండోరోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశంలో కలెక్టర్ ఇలంబరితితోపాటు ఎస్పీ షానవాజ్ఖాసిం, జాయిం ట్ కలెక్టర్ దివ్య, ఆర్డీవో వినయ్కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు పాల్గొన్నారు. -
గోదావరి ప్రాజెక్టులపై ప్రభుత్వ దృష్టి!
ప్రాజెక్టుల వారీగా అధికారుల చర్యలు కంతనపల్లి, దేవాదులపై సమీక్షలు పూర్తి ఎల్లంపల్లి, మిడ్మానేరు, వరద కాల్వలో పునరావాసంపై సమీక్షించిన ముఖ్య కార్యదర్శి సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా నిర్మాణంలో ఉన్న పనులను పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా శరవేగంగా కసరత్తులు చేస్తోంది. ప్రాజెక్టు వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలు, సేకరించాల్సిన భూమి, అటవీ సమస్యలు, సహాయ పునరావాసం తదితరాలపై రోజూవారీ సమీక్షలు నిర్వహిస్తూ వేగం పెంచే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నీటిపారుదల శాఖా మంత్రి హరీష్రావు స్థాయిలో దేవాదుల, కంతనపల్లిపై అటవీ శాఖతో సమీక్షలు జరగ్గా, సోమవారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఎల్లంపల్లి, వరద కాల్వ, మిడ్మానేరు, కాళేశ్వరం, మంథని ఎత్తిపోతల పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే మిడ్మానేరు ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన 1,300 ఎకరాల భూసేకరణను పూర్తి చేయాలని, 11 గ్రామాల్లో సహాయ పునరావాసం పూర్తికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని 2,400 ఎకరాలు, వరద కాల్వ పరిధిలోని మరో 2 వేల ఎకరాలు, మంథని, ఎల్లంపల్లి పరిధిలోని మరో 3,500లకు పైగా ఎకరాల భూసేకరణను వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని జోషి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి, ఇటీవల ఏరియల్ సర్వే నిర్వహించడంతో పాటు ప్రాజెక్టుల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేకంగా కమిటీ నిర్వహించారు. దేవాదుల పరిధిలో నెలకొన్న అటవీ, భూసేకరణ సమస్యలను అధిగమించేందుకు 3 రోజుల కిందట అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు వచ్చే ఖరీఫ్ నాటికి 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరందించే చర్యలకు ఆదేశాలిచ్చారు. ఇక కంతనపల్లిలో ముంపు తగ్గింపు కోసం అవసరమైతే బ్యారేజీలో నీటి నిల్వను తగ్గించేందుకు ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగింది. అయితే ఎత్తు ఏ మేరకు తగ్గించాలన్న దానిపై ఇప్పుడు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. భూసేకరణకు కలెక్టర్ల నియామకం భూసేకరణ కోసం డిప్యూటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రాణహిత-చేవెళ్ల సిద్ధిపేట డివిజన్కు కుసుమకుమారి, నిజామాబాద్ జిల్లాకు పద్మశ్రీ, ఎస్సారెస్పీ-2కు బీఎస్ లత, దేవాదులకు బి.విద్యాసాగర్, కంతనపల్లికి ఆర్.గోపాల్ను నియమించింది. -
మైనింగ్ మాయ!
కందుకూరు: అక్రమార్కుల కన్ను ప్రభుత్వ, అటవీ భూములపై పడింది. అనుమతులు తీసుకున్న చోట కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం ఫిర్యాదులు అందినప్పుడు హడావుడి చేస్తూ ఆ తర్వాత తమకేమీ పట్టనట్లుగా మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారీతీన తవ్వకాలు.. మండల పరిధిలో వివిధ గ్రామాల్లో క్వారీలు, క్రషర్లు, చెరువు శిఖాల్లో ఎర్రమట్టి, నల్లమట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పులిమామిడి, లేమూరు, మీర్కాన్పేట, కందుకూరు తదితర గ్రామాల్లో మట్టి తవ్వకాలు ఇష్టారీతిన కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో చాలా చోట్ల అనుమతులు ఒక దగ్గర తీసుకుని తవ్వకాలు మరో చోట నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం లేమూరులో సర్వేనంబర్ 356లో 20 గుంటలకు అనుమతులు తీసుకుని కంకెల కుంట శిఖం భూమిలో తవ్వకాలు జరుపుతున్నారంటూ గ్రామస్తులు అక్కడికి చేరుకుని తవ్వకాలను నిలిపివేయించి ఆందోళన చేశారు. చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అటవీ భూముల్లో... మురళీనగర్ సమీపంలోని సర్వేనంబర్ 74, 75ల్లో 22.32 ఎకరాల భూమిపై క్వారీకి అనుమతులు తీసుకుని నాలుగేళ్లుగా తవ్వకాలు జరుపుతున్నారు. కాగా ఆ భూమికి ఆనుకుని చిప్పలపల్లి అటవీ భూమి సర్వే నంబర్185లో కూడా తవ్వకాలు జరుపుతున్నట్లు ఇటీవల మురళీనగర్, చిప్పలపల్లి గ్రామస్తులు పలువురు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం క్వారీకి వెళ్లే మార్గంమధ్యలో తవ్వి వాహనాల రాకపోకలను నిలువరించారు. నిత్యం అటవీ భూముల నుంచే టన్నులకొద్దీ విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారని, సర్వే చేయించి అటవీ భూములకు హద్దు రాళ్లను పాతాలని డిమాండ్ చేశారు. కటికపల్లి వద్ద నిర్వహిస్తున్న క్రషర్తో చుట్టు పక్కల పంటలు పండించలేకపోతున్నామని దుమ్మూధూళీ దట్టంగా కమ్ముకుని ఇబ్బందికరంగా మారుతోందంటూ గ్రామస్తులు ఇటీవల ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకున్న దాఖ లాలు లేకుండాపోయాయి. మరోవైపు బేగంపేట పరిధి లో కొనసాగుతున్న మరో క్రషర్ నిర్వాహకులు రెండు నెలల క్రితం అటవీ భూముల నుంచి రోడ్డు వేసుకుని రాకపోకలు సాగిస్తుండటంతో గ్రామస్తుల ఫిర్యాదుతో అటవీ అధికారులు లారీలకు చలానా విధించి రాకపోకలను నిలువరించారు. వివిధ గ్రామాల్లో ఇటుక బట్టీలు యథచ్ఛగా కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటల నుంచి మట్టిని అక్రమంగా తరలించి దందా నడుపుతున్నా మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడటంలేదు. ఫిర్యాదు చేస్తే గానీ స్పందించడంలేదని, కొన్ని సందర్భాల్లో తూతూమంత్రంగా తనిఖీలు చేపట్టి మమ అనిపిస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులపై కొరడా ఝళిపించి అటవీ, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం అక్రమంగా మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఎవరినీ ఉపేక్షించడంలేదు. లేమూరులో కూడా ఫిర్యాదు అందగా తవ్వకాలను నిలిపివేయించాం. పరిశీలించిన తర్వాత అనుమతిస్తాం. - సుశీల, తహసీల్దార్, కందుకూరు -
వచ్చారు.. వెళ్లారు..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం నగర శివారు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. శివార్లలోని కూడళ్లు, రహదారులు, అటవీ ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా వీక్షించారు. వాస్తవానికి శనివారమే ఈ పర్యటన ఉన్నప్పటికీ సమయాభావం కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఏరియల్ సర్వేతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో హెలికాప్టర్ నేలపైకి దిగలేదు. దీంతో ఏరియల్ సర్వే మాత్రం పూర్తి చేసుకుని తిరుగుపయనమైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. అటవీ భూములను పరిశీలించి.. ఏరియల్ సర్వేలో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ జిల్లాలోని అటవీ భూములను పరిశీలించారు. ముఖ్యంగా మూడు ప్రాంతాల్లో సర్వే చేసి క్షేత్ర పరిశీలన చేయాల్సి ఉంది. ఇందుకోసం హయత్నగర్లోని డీఆర్ పార్క్, ఘట్కేసర్ మండలం నారపల్లి రిజర్వ్ ఫారెస్ట్, మేడ్చల్ మండలం కండ్లకోయ ఫారెస్ట్లలో జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేసింది. అయితే సాంకేతిక సమస్యతో ఈ మూడుచోట్ల హెలికాప్టర్ ల్యాండ్ కాలేదు. కేవలం అటవీ భూములను పరిశీలించి సీఎం నగరానికి వెళ్లిపోయారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి స్పష్టమైన సమాచారం జిల్లా యంత్రాంగానికి సైతం తెలియదని జిల్లా రెవెన్యూ శాఖలోని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
కృష్ణమ్మ కాంతులు
* మెగా పవర్ ప్రాజెక్టుల కేంద్రంగా కృష్ణానది పరీవాహక ప్రాంతం * నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు * ఏరియల్ సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం * కృష్ణా తీరంలో 7,800 ఎకరాల అటవీ భూములు గుర్తింపు * 7,600 మె.వా. ప్లాంట్ల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు * రూ. 55 వేల కోట్ల పెట్టుబడులు.. 30 వేల మందికి ఉపాధి * కేంద్ర పర్యావరణ మంత్రి జవదేకర్కు ఫోన్లో సమాచారం * ప్రతిపాదనలిస్తే వారంలో అనుమతులిస్తామని మంత్రి హామీ సాక్షి, హైదరాబాద్, నల్లగొండ: భారీ స్థాయిలో విద్యుదుత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. రాష్ర్టం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను వీలైనంత త్వరగా అధిగమించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులోభాగంగా నల్లగొండ జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని మెగా పవర్ ప్రాజెక్టుల కేంద్రంగా మార్చాలని భావిస్తోంది. జిల్లాలోని దామరచర్ల మండలంలో ఎన్టీపీసీ, జెన్కో ఆధ్వర్యంలో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న విస్తారమైన అటవీ భూములను ఉపయోగించుకుని దాదాపు రూ. 55 వేల కోట్ల పెట్టుబడులతో 7,600 మెగావాట్ల సామర్థ్యం మేరకు విద్యుదు త్పత్తి కేంద్రాలను నిర్మించాలని ఆయన భావిస్తున్నారు. కృష్ణా తీరంలోని దాదాపు 7,800 ఎకరాలను ఇందుకనువైనవిగా గుర్తించారు. విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, విద్యాశాఖ మంత్రి జగదీ్శ్రెడ్డి, ఉన్నతాధికారులతో కలసి దామరచర్ల మండలంలోని రక్షిత అటవీ ప్రాంతంలో మంగళవారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. మెగాపవర్ ప్రాజెక్టులు స్థాపించేందుకు ఈ స్థలం అనుకూలమైనదిగా నిర్ణయించారు. అక్కడే జిల్లా అధికారులతో గంట పాటు సమావేశమై సీఎం సమీక్ష జరిపారు. సాయంత్రం హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే ఉన్నతాధికారులతో మరోసారి భేటీ అయ్యారు. యుద్ధప్రాతిపదికన భూ సర్వే చేసి 10 రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని జిల్లా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక(డీపీఆర్)ను తయారు చేయాలని జెన్కో అధికారులనూ ఆదేశించారు. వచ్చే నెల తొలివారంలోనే ఢిల్లీ వెళ్లి ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు తెస్తానని, ఇందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే రాష్ర్ట విద్యుత్ అవసరాలు తీరడంతోపాటు దక్షిణ తెలంగాణ విద్యుత్ హబ్గా నల్లగొండ జిల్లా రూపుదిద్దుకోనుంది. సానుకూలంగా స్పందించిన కేంద్రం సీఎం నిర్ణయం మేరకు దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్పూర్ ప్రాంతాల్లో జెన్కో అధ్వర్యంలో 5,200 మెగావాట్లు, ఎన్టీపీసీ అధ్వర్యంలో 2,400 మెగావాట్ల ప్రాజెక్టులు రానున్నాయి. అటు కృష్ణానదికి, ఇటు రైల్వే ట్రాక్కు సమీపంలో ఉన్న అటవీ భూములు ఇందుకనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రిజర్వ్ ఫారెస్టు భూమి కావడంతో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్తో సీఎం అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడారు. అటవీ భూమిని వినియోగించుకున్న మేర భూమిని మరోచోట అటవీ శాఖకు కేటాయిస్తామని చెప్పారు. దీనికి కేంద్రమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన వారంలోనే అనుమతులిప్పిస్తామన్నారు. దీంతో జనవరి మొదటి వారంలో తానే స్వయంగా ప్రతిపాదనలను ఢిల్లీకి తీసుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం అన్ని నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకే ప్రాంతంలో 7600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడం వల్ల నల్లగొండ జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందని కేసీఆర్ అన్నారు. ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, భారీ పెట్టుబడుల వల్ల 20 నుంచి 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. లక్ష్యం మేరకు ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ అధ్వర్యంలో తెలంగాణలో 4,000 మెగావాట్ల ప్లాంట్ ను కేంద్రం నిర్మించాలి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా రామగుండంలో 1,600 మెగావాట్ల ఉత్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్ కోసం దామరచర్ల మండలంలోనే ఎన్టీపీసీకి స్థలం కేటాయించాలని సీఎం నిర్ణయించారు. టీ జెన్కో ఆధ్వర్యంలో 6,000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రాష్ర్టం ఇప్పటికే నిర్ణయించింది. అందులో 1,080 మెగావాట్ల ప్లాంట్ ను (270 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూని ట్లు) ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో బీహెచ్ఈఎల్ నిర్మిస్తోంది. ఈ పనులు రెండేళ్లలో పూర్తవుతాయి. మరో 5,200 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను జెన్కో ద్వారా నల్లగొండలోనే నెలకొల్పాలని కేసీఆర్ ఆదేశించారు. సీఎం సమీక్షలో సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రాణహిత’ కోసం భూసేకరణ
- జిల్లాలో 448 ఎకరాల అటవీ భూమి సేకరణ - డీఎఫ్ఓ సోనీబాల వెల్దుర్తి: ప్రాణహిత చేవెళ్ల కాల్వల నిర్మాణం కోసం జిల్లాలో 448 ఎకరాల అటవీ భూములను సేకరిస్తున్నట్లు డిఎఫ్వో సోనీబాల తెలిపారు. బుధవారం మండలంలోని మంగళపర్తి, యశ్వంతరావుపేట తదితర అటవీ ప్రాంతంలో జీపీయస్ సిస్టమ్ ద్వారా మ్యాపుల ఆధారంగా ముమ్మరంగా పర్యటించి హద్దులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల కాల్వల నిర్మాణానికి పిల్లుట్ల, వెల్దుర్తి, మంగళపర్తి, హస్తాల్పూర్ల రిజర్వ్ ఫారెస్టులోని ప్యాకేజీ 18లో 182 హెక్టార్లు, ప్యాకేజీ 14లోని దౌల్తాబాద్ రిజర్వ్ ఫారెస్టులో 4 హెక్టార్లు, ప్యాకేజీ 15లోని జగదేవ్పూర్ రిజర్వ్ ఫారెస్టులో 7 హెక్టార్ల అటవీ భూముల్లో కాల్వల నిర్మాణం కోసం స్థలం సేకరిస్తున్నామన్నారు. అలాగే కాల్వల నిర్మాణం వల్ల ఎన్ని చెట్లు కోల్పోతున్నామో వాటి వివరాలను సేకరిస్తున్నామన్నారు. జిల్లాలోని తమ అటవీ భూములు ఎంత కోల్పోతున్నామో అంత భూమిని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. అటవీ భూములను ఎవరైనా కబ్జాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండలంలోని హస్తాల్పూర్ అటవీ ప్రాంతంలో దాదాపు 15 ఎకరాలలో విలువైన చెట్లను నరికివేసి కొందరు కబ్జా చేశారు. పంటలు సాగు చేస్తున్నారని విలేకర్లు ఆమె దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించారు. చర్యలు తీసుకొని అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని మెదక్ రేంజ్ అధికారి చంద్రశేఖర్రెడ్డిని ఆదేశించారు. డీఎఫ్వో వెంట ప్రాణహిత చేవేళ్ల ఇంజనీర్, సర్వేయర్లు, మెదక్రేంజ్ అధికారి చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల భూ దందా
మాచర్లరూరల్ : తెలుగుతమ్ముళ్ల భూదందాకు అంతులేకుండా పోతోంది. ప్రభుత్వ భూములే కాకుండా ఫారెస్టు భూములను సైతం కబ్జాచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తపల్లి గ్రామంలోని 534 ఎకరాల ఎద్దులబోడు భూ ఆక్రమణ మరువక ముందే అదే మండలంలో పశువేముల గ్రామంలో 340/1, 341/2, 340 సర్వేనంబర్ల సరిహద్దు ప్రాంతంలో సుమారు 50 ఎకరాల్లో జేసీబీ యంత్రాలతో భూములను చదును చేసి యథేచ్చగా భూదందా కొనసాగిస్తున్నారు. ఆ భూములకు పక్కనే ఉన్న ఫారెస్టు భూములను సైతం కబ్జా చేస్తున్నారు. వీటిపై అధికారులు ఇప్పటి వరకు కన్నెత్తి చూడకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. మండలంలో సాగు చేసేందుకు భూమి కావాలంటే అధికారులను సంప్రదించటం కంటే ముందుగా రెవెన్యూ పొలాన్ని గుర్తించి ఆ భూముల్లో చొరబడి అనేక ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామనే దరఖాస్తుతో సులభంగా పట్టా పొందే మార్గాలు అన్వేషిస్తున్నారు. వీరికి అధికార పార్టీకొమ్ముకాస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నారుు. తుళ్లూరు ప్రాంతంలో భూములు అమ్ముకునేవారు ఈ ప్రాంతానికి వచ్చి కొనుగోళ్లు చేపడుతున్నారని తెలియడంతో ఇలాంటి భూములతో కాసులు పోగేసుకోవచ్చని భావిస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ పరిధిలో 40 ఎకరాల రెవెన్యూ భూమి ఇక్కడ ఉంది. దీని పై ప్రాజెక్టు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. అందుకే అవికాస్తా ఆక్రమణల బారినపడుతున్నారుు. ఈ విషయమై తహశీల్దార్ గర్నెపూడి లెవీని సాక్షి సంప్రదించగా పశువేములలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములకు గతంలోనే డీకే పట్టాలు ఇచ్చారని తెలిసిందని, అయినప్పటికి ఇంకా ఏమైన ఆ ప్రాంతంలో కబ్జాకు గురైతే వాటిని పరిశీలించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ప్రసన్నజ్యోతి మాట్లాడుతూ పశువేముల బీట్ పరిధిలో ఫారెస్టు భూములను కబ్జా చేసిన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఈ ప్రాంతం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. గతంలో కొందరు ఆక్రమణలకు పాల్పడితే ఆ ప్రాంతంలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నామన్నారు. -
97 వేల ఎకరాల గుర్తింపు
25లోపు నివేదిక ఇవ్వాలని గ్రామ కమిటీలకు ఆదేశం నేటి నుంచి కమిటీల పర్యటన తిరుపతి తుడా: తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో 97,076 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. జిల్లాలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలి సిందే. ఈ మేరకు తిరుపతి డివిజన్ మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించాలని గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య తూర్పు మండలాల్లో భూములను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఆయా మండలాల తహశీల్దార్లు ప్రభుత్వ భూములను గుర్తించారు.ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు మండలాల్లో మొత్తం 97,076 ఎకరాలను గుర్తించి ఆర్డీవో కార్యాలయానికి నివేదికలు పంపించారు. అటవీ భూముల గుర్తింపు పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉండే అటవీ భూములను అధికారులు గుర్తించారు. అటవీ శాఖ భూములను డీనోటిఫై చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఉండే అటవీ భూములను గుర్తించారు. ఏర్పేడులో 958.28 ఎకరాలు, శ్రీకాళహస్తిలో 3999.66 ఎకరాలు, సత్యవేడులో 11,331.47 ఎకరాలను గుర్తించారు. అదేవిధంగా 55,714.94 ఎకరాల ప్రభుత్వ భూములు( చెరువులు, కుంటలు, వాగులు, వివిధ రకాల భూములు) గుర్తించారు. ఏర్పేడులో 784.56 ఎకరాలు, శ్రీకాళహస్తిలో 35,119.62 ఎకరాలు, సత్యవేడులో 19,810.76 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. అయితే నీరు నిల్వ ఉండే చెరువులు, వాగులు, కుంటలను కాకుండా మిగిలిన ప్రభుత్వ భూములను మాత్రమే గుర్తించాలని మళ్లీ ఆయా మండల అధికారులకు ఆదేశించారు. ఈ మూడు మండలాల్లో 25,072.03 ఎకరాల డీకేటీ భూములు ఉన్నాయని తేల్చారు. ఏర్పేడులో 7,043.34, శ్రీకాళహస్తిలో 15,019.66, సత్యవేడులో 3,009.03 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని నివేదిక అందజేశారు. 25వ తేదీ కల్లా భూముల వివరాల నివేదిక గ్రామ స్థాయిలో ప్రభుత్వ, డీకేటీ, అటవీ భూములను మరింత స్పష్టంగా గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలను వేశారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు మండలాలతో పాటు అదనంగా మరో మూడు మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఎన్ కండ్రిగ, కేవీబీ పురం, చంద్రగిరి మండలాల్లో ప్రభుత్వ, డీకేటీ, అటవీ భూములను గుర్తించాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామస్థాయి కమిటీలు శనివారం నుంచి భూములను గుర్తించనున్నాయి. ఈ నెల 28న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్న నేపథ్యంలో ఈలోపు భూములను గుర్తించి నివేదికను సమర్పించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 25 లోపు గ్రామ స్థాయిలో ప్రభుత్వ, అటవీ, డీకేటీ భూములను గర్తించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. -
అటవీశాఖలో బోగస్ నియామకాలు
ఆదిలాబాద్ క్రైం : సాక్షాత్తు అటవీ శాఖ మంత్రి సొంత జిల్లా.. సొంత శాఖ అయిన అటవీశాఖలో బోగస్ నియామకాలు కలకలం సృష్టించాయి. గిరిజన యువకుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. బోగస్ నియామక ఉత్తర్వులు సృష్టించి.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.6 లక్షలు వసూలు చేసిన వైనం బహిర్గతమైంది. ఆదిలాబాద్ డీఎఫ్వో సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ దీనంతటికి సూత్రధారి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం 2012లో నోటిఫికేషన్ వెలువడింది. 23 బీట్ ఆఫీసర్, 10 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేశారు. పోస్టులకు ఎంపికైన 33 మంది అభ్యర్థుల్లో కొందరికి బోగస్ పత్రాలు ఉన్నట్లు తేలింది. అయితే.. తమ ధ్రువీకరణ పత్రాలు సరైనవేనని, తాము ఉద్యోగాలకు అర్హులమేనని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చక్రం తిప్పిన సీనియర్ అసిస్టెంట్.. అటవీశాఖలో బోగస్ నియామకాలు సృష్టించి.. అభ్యర్థుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడంలో డీఎఫ్వో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో సొంత శాఖ అధికారుల చేతివాటం ఉన్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. గతంలో అటవీశాఖ కార్యాలయంలో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్ను తోడుగా చేసుకుని పక్క ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. అటవీశాఖ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను తెలుసుకుని లాబీయింగ్ చేశారు. రెండేళ్ల నుంచి అభ్యర్థులకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఓ రోజు హైకోర్టులో విచారణ పూర్తైదని.. ఉద్యోగాలకు మీరు ఎంపికయ్యారంటూ వారికి సమాచారం అందించారు. అటవీ కార్యాలయంలోని 08732-226984 ల్యాండ్ ఫోన్ నుంచి ఈ తతంగం నడిపించారు. అభ్యర్థులు నమ్మేలా బోగస్ ఉత్తర్వులును సృష్టించారు. ఏకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి నెల రోజుల క్రితం నియామక పత్రాలు ఇచ్చి పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతాల్లో వెళ్లి యూనిఫాం తీసుకోవాలని, ఉద్యోగంలో చేరాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో అభ్యర్థులు బోగస్ నియామక పత్రాలతో ఆయా అటవీశాఖ డివిజన్ కార్యాలయాలకు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. తాము బోగస్ ఉత్తర్వులతో నియామకమయ్యామని, డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు గుర్తించిన కొంత మంది బాధితులు సోమవారం అడిషనల్ ఎస్పీ పనసారెడ్డిని, మంగళవారం ఎస్పీ తరుణ్జోషిని కలిశారు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటర్వ్యూలు.. గత సెప్టెంబర్ 29న అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే ఇంటర్వ్యూలు కొనసాగించారు. అయితే.. ఇంటర్వ్యూలు నిర్వహించిన వారిలో తమ ప్రమేయం లేదని రేంజ్ అధికారి నాగేశ్వర్రావు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఉదయం అధికారుల రాక ముందు.. మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలిపారు. ఆ సమయంలో ఎవరెవరు కార్యాలయానికి వచ్చారో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అసిస్టెంట్ను రేంజ్ ఆఫీస్కు పిలిపించారు. బాధితుల ఎదుట ఆయన్ను ప్రవేశపెట్టగా గుర్తించిన బాధితులు తమ వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇతనేనంటూ రేంజ్ అధికారులకు, డీఎఫ్వో సర్కిల్ కార్యాలయ అధికారులకు చూపించారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సైతం చూపించారు. కాగా.. తనకు వారెవరో తెలియదంటూ సదరు సీనియర్ అసిస్టెంట్ విషయాన్ని దాటవేశారు. తాను డబ్బులు ఎవరి వద్దా తీసుకోలేదని వాపోయాడు. సీనియర్ అసిస్టెంతోపాటు టెక్నికల్ అసిస్టెంట్ ఇందులో ప్రమేయం ఉందని బాధితులు చెప్పారు. టెక్నికల్ అసిస్టెంట్ను విచారించిన తర్వాతే నిందితులను గుర్తించి పోలీసులకు అప్పగిస్తామని రేంజ్ అధికారులు పేర్కొన్నారు. బాధితుల రోదన.. తమను మోసం చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తి బాధితుల ముందరికి రాగానే వారు కన్నీళ్లు కార్చారు. ఎన్నో అప్పులు చేసి డబ్బులు తెచ్చిస్తే తమను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమిలో ఉద్యోగం కోసం వచ్చిన అవకాశాన్ని సైతం వదులోకోమని ప్రలోభపెట్టాడంటూ ఓ అభ్యర్థి రోదించిన తీరు అందరినీ కలిసివేసింది. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నారు. -
మెగాసిటీపై నిర్లక్ష్యం!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేసేందుకు అటవీ భూములను డీ-నోటిఫై చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. డీ-నోటిఫై ప్ర తిపాదనలు పంపడానికి మరో వారం మాత్రమే గడువు ఉన్నా.. ఇప్పటికీ కమిటీ సమావేశం నిర్వహించకపోవడం అందుకు తార్కాణం. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని సెప్టెంబర్ 4న సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించిన విషయం విదితమే. నగరాన్ని మెగాసిటీగా మార్చాలంటే అటవీ భూములను డీ-నోటిఫై చేయడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్. కృష్ణారావు నేతృత్వంలో అటవీ, రెవెన్యూ, పురపాలకశాఖ కార్యదర్శులతో సెప్టెంబర్ 29న హైదరాబాద్లో ఉన్నత స్థా యి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి చుట్టూ పది కిమీల పరిధిలోని అటవీ భూములను కనీసం పది వేల ఎకరాలను గుర్తించి.. డీ-నోటిఫై చేయాలని నిర్ణయించారు. అటవీ భూములను డీ-నోటిఫై చేసేందుకు జాయింట్ కలెక్టర్ భరత్నారాయణ గుప్తా అధ్యక్షులుగా, తూర్పు విభాగం డీఎఫ్వో శ్రీనివాసులురెడ్డి మెంబర్ కన్వీనర్గా, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డి.సాంబశివరావు, వైల్డ్ లైఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవికుమార్ సభ్యులుగా కమిటీని నియమిస్తూ అక్టోబర్ 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డీ-నోటిఫై ప్రతిపాదనలను 30 రోజుల్లోగా పంపాలని ఆదేశించింది. ప్రభుత్వం విధించిన గడువు మరో వారం రోజుల్లో ముగియనుంది. హుద్హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జాయింట్ కలెక్టర్ భరత్నారాయణ గుప్తా విశాఖపట్నంలో కొన్నాళ్లు మకాం వేశారు. చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గడువును మరో నెలపాటు పొడిగించాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు రెవెన్యూవర్గాలు వెల్లడించాయి. తిరుపతికి పది కిమీల పరిధిలో అటవీ భూములు భారీ ఎత్తున అందుబాటులో లేవని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. చంద్రగిరి మండలం రంగంపేట పరిసర ప్రాంతాల్లోని రిజర్వు అటవీ ప్రాంతంలో చామల రేంజ్లో నాగపట్ల సెక్షన్లో భూములు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి కళ్యాణి డ్యాం కూడా సమీపంలో ఉండటం గమనార్హం. ఆ భూములను డీ-నోటిఫై చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. -
మెగాసిటీ కోసం..మరో అడుగు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నగరం చుట్టూ పది కి.మీ.ల పరిధిలోని అటవీ భూములను డీ-నోటిఫై చేసి.. సేకరించాలని నిర్ణయిం చింది. అటవీ భూములను గుర్తించి.. డీ-నోటిఫై చేసేందుకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఓ కమిటీని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన మేరకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. ప్రైవేటు భూములను సేకరించడం ఆర్థికంగా సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చింది. ఈ నేపథ్యంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లోని అటవీ భూములను డీ-నోటిఫై చేసి.. వాటిని సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలో అటవీ, రెవెన్యూ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్లో సెప్టెంబర్ 29న సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తిరుపతి చుట్టూ పది కి.మీ.ల పరిధిలోని అటవీ భూములు గుర్తించి.. కనీసం పది వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. ఇందుకు జాయింట్ కలెక్టర్ భరత్నారాయణ గుప్తా అధ్యక్షులుగా తూర్పు విభాగం డీఎఫ్వో శ్రీనివాసులురెడ్డి మెంబర్ కన్వీనర్గా, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డి.సాంబశివరావు, వైల్డ్ లైఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవికుమార్ సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటుచేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ తిరుపతి చుట్టూ పది కమీల పరిధిలోని అటవీ భూములను పరిశీలిస్తుంది. శేషాచలం అడవులను బయోస్పియర్(జీవావరణం)గా కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. బయోస్పియర్ పరిధిలోని భూములను డీ-నోటిఫై చేయడానికి కేంద్ర పర్యావరణశాఖ అనుమతించదు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక్క ఎకరం భూమిని కూడా సేకరించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఇతర అటవీ భూములను డీ-నోటిఫై చేయడానికి మార్గం ఉంటుంది. కానీ.. డీ-నోటిఫై చేసిన భూమి మేరకు ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించాలి. డీ-నోటిఫై చేసిన భూమి పరిధిలో ఉన్న వృక్ష సంపదకు పరిహారాన్ని చెల్లించడంతోపాటు.. అటవీ శాఖకు అప్పగించిన భూమిలో అడవుల పెంపకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. -
అమ్మితే తంటా!
అన్యాక్రాంతమైన అటవీ భూములకు సంబంధించి ఇప్పటి వరకూ 1.10 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో 2.04 లక్షల ఎకరాలు కబ్జాకు గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో పది ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణంలో కబ్జాకు సంబంధించి 1.09 లక్షల కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,86,197 ఎకరాల అటవీభూమి అన్యాక్రాంతమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ భూములను కొంత అపరాధ రుసుంతో సక్రమం చేసి సంబంధితవ్యక్తులకు యాజమాన్య హక్కులను కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర అటవీశాఖ న్యాయశాఖకు లేఖ రాసినట్లు సమాచారం. అయితే కర్ణాటక అటవీ భూముల సంరక్షణ చట్టం-1963 సెక్షన్ 24 ప్రకారం అటవీ భూములను ఆక్రమించడం నేరం. దీంతో ఆక్రమణే నేరమయినప్పుడు సక్రమం ఎలా చేస్తారని న్యాయశాఖ వాదిస్తోంది. అంతే కాకుండా అన్యాక్రాంతమైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కర్ణాటక హై కోర్టు ప్రభుత్వానికి సూచించిందని న్యాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సక్రమం’ చేస్తే కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని వారు కుండబద్ధలు కొడుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర అటవీశాఖ మంత్రి రామనాథరై మాట్లాడుతూ... ‘పదెకరాల కంటే తక్కువ విస్తీర్ణంలోని భూములను సక్రమం చేసే ఆలోచన ఉంది. అయితే ఈ విషయంలో న్యాయపరమైన ఇబ్బందులున్నాయి. చట్టసభల ఆమోదం పొందిన తర్వాత సక్రమం చేస్తాం.’ అని పేర్కొన్నారు. తేకలవట్టి చెరువు లోతట్టు ప్రాంతాల వాసులకు మంత్రి పరామర్శ చిత్రదుర్గం : జిల్లాలోని హొసదుర్గ తాలూకాలో కురిసిన వర్షానికి తేకలవట్టి చెరువు నిండి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో సుమారు వందకు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో జిల్లా ఇన్చార్జి మంత్రి హెచ్.ఆంజనేయ ఆదివారం గ్రామానికి వచ్చి తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జలానయన (వాటర్షెడ్) శాఖ ఆధ్వర్యంలో చెరువు పైభాగంలో రెండు చెక్డ్యాంలు నిర్మించామని, అయితే అధిక వర్షం కురవడంతో చెక్డ్యాంలు నిండి చెరువులోకి నీరు రావడంతో చెరువు నిండి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇళ్లలో ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేవలం ఇళ్లలో ఉన్న ఆహార ధాన్యాలు మాత్రం తడిసి పోయాయి. నీటి ప్రవాహానికి పంట నష్టం జరిగింది. పంచాయతీ తరఫున తాత్కాలిక గంజి కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న ఇళ్లు, పంటలకు నష్టం పరిహారం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సంబంధిత అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత లోతట్టు ప్రాంత వాసులకు ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. మంత్రి వెంట ఎంపీ బీఎన్.చంద్రప్ప, జిల్లాధికారి తిప్పేస్వామి, అడిషనల్ జిల్లా ఎస్పీ శాంతరాజ్, తహశీల్దార్ లక్ష్మణప్ప, రెవిన్యూ శాఖ అధికారులు, గ్రామ నేతలు ఉన్నారు. -
భూసేకరణపై కసరత్తు
సాక్షి, గుంటూరు: నూతన రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. భూ సేకరణకోసం ఏర్పాటైన మంత్రుల కమిటీతో గురువారం గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు సమావేశమై జిల్లాలోని మొత్తం భూముల వివరాలు అందించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ శాతం ప్రభుత్వ, అటవీ భూములు లేకపోవడంతో రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను రైతుల నుంచి ఎలా సేకరించాలి, వారికి ఏ విధమైన ప్యాకేజీ ఇవ్వాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. జిల్లాకు సంబంధించి మొత్తం 28,13,510 ఎకరాల భూమి ఉండగా, . ఇందులో మొత్తం 4,00157.29 ఎకరాల అటవీ భూములని రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. మూడు నెలలుగా రెవెన్యూ అధికారులు, లాండ్ సర్వే అధికారులు భూముల స్థితిగతులు గుర్తించారు. వివరాలను సర్వే బృందాలు పరిశీలించి ఓ మ్యాపు తయారు చేసినట్టు తెలుస్తోంది. హైవే పక్కన అందుబాటులో ఉన్న భూములు, మండల వ్యాప్తంగా ఉన్న భూములు, కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని భూములు, ఉడా పరిధిలోని 27 మండలాలకు సంబంధించిన భూముల వివరాలు, మ్యాపులను వివిధ కోణాల్లో తయారు చేయించి నివేదికను హైదరాబాద్ తీసుకెళ్లిన కలెక్టర్ మంత్రుల కమిటీకి, సీఎంకి అందించినట్లు తెలుస్తోంది. ఇందులో మూడు మండలాలకు సంబంధించిన మ్యాపులను కమిటీ ప్రత్యేకంగా అడిగినట్లు సమాచారం. ఉడా పరిధిలోని ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్, మేడికొండూరు, పెదకూరపాడు, అమరావతి, పెదకాకాని, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో సైతం ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా సర్వే చేశారు. దీంతో పాటు తెనాలి డివిజన్లోని ఐదు మండలాల్లోనూ సర్వే జరగడం గమనార్హం. మొత్తం సమాచారం ఆధారంగా భూసేకరణపై మంత్రుల కమిటీ అధ్యక్షుడు నారాయణ, సభ్యుడు గల్లా జయదేవ్ గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లతో చర్చించారు. సీఎంతో సమావేశం : మంత్రులు కలెక్టర్లతో చర్చించాక అందరు కలిసి లేక్వ్యూ అతిథి గృహంలో సీఎంతో రాత్రి సమావేశం అయ్యారు. గుంటూరు కలెక్టర్ అందజేసిన నిపేదికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ల్యాండ్ పుల్లింగ్ ద్వారా భూసేకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
డూప్లికేటుగాళ్లు
సాక్షి, ఖమ్మం: అటవీ భూముల్లో పోడు నరికి వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రభుత్వం హక్కులు కల్పించింది. 2006 డిసెంబర్ నాటికి గిరిజనుల ఆధీనంలో ఉన్న అటవీ భూములకు సంబంధించిన అర్హులను గుర్తించారు. జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకునే సుమారు 30 వేల మంది గిరిజన రైతులకు దాదాపు 2.10 లక్షల ఎకరాల అటవీ భూములపై శాశ్వత హక్కులు కల్పించారు. ఇంకా వేలాది మంది తమకు హక్కు కల్పించాలంటూ ఆయా మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు 2010 నుంచి పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఆసరాగా చేసుకున్న ఓ ముఠా అక్రమ సంపాదనే ధ్యేయంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామంటూ గిరిజనులను నమ్మించింది. ఏజెన్సీ మండలాల్లో ఒక్కో రైతు నుంచి ఎకరానికి రూ.10 వేలు వసూలు చేసింది. ‘ఈ పాస్ పుస్తకాలుంటే బ్యాంకుల్లో రుణాలు వస్తాయి.. ప్రభుత్వం విద్యుత్, బోర్లకు రుణాలిస్తుంది..’ అని మాయమాటలు చెప్పింది. పట్టాలు వస్తాయని గిరిజన గూడేల్లో ఒకరిని చూసి మరొకరు ఇలా వందలాది మంది గిరిజన రైతులు ఈ ముఠాకు డబ్బులు ముట్ట జెప్పారు. చాలా మంది రైతులు రూ.2, నుంచి రూ.5కు వడ్డీకి తెచ్చి మరీ ఇచ్చారు. ఇదే అదనుగా భావించిన ముఠా రైతుల నుంచి అందినకాడికి దండుకుంది. రూ.లక్షల్లో కూడబెట్టుకుంది. జూలూరుపాడు, ఏన్కూరు, ఇల్లెందు, టేకులపల్లి, మండలాల్లో ఈ ముఠా సభ్యులు చాలా మంది రైతులను మోసం చేశారు. బయట పడిందిలా.. గత ఏడాది ఏన్కూరు మండలంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకం బయట పడింది. అయితే అక్కడ ఉన్న అధికారులు.. ఆ ముఠా సభ్యులు కుమ్మక్కై ఈ వ్యవహారం బయటపడకుండా సదరు రైతుకు డబ్బులు ఇప్పించినట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకొని ముఠా మరోసారి జూలువిదిల్చింది. జూలూరుపాడు మండలం వినోభానగర్, ఏన్కూరు మండలం అక్కినాపురంతండా, నాచారం, కేశుపల్లి, ఇమామ్నగర్ గ్రామాల్లోని గిరిజన రైతులకు నకిలీ పాస్ పుస్తకాలు అంటగట్టింది. వినోభానగర్కు చెందిన భూక్యా ఉమ పంట రుణం కోసం బ్యాంకుకు వెళ్లడంతో అసలు విషయం బయట పడింది. ‘ఇది నకిలీపాస్ పుస్తకం.. రుణం ఇవ్వటం కుదరదు’ అని బ్యాంకు అధికారులు చెప్పడంతో మోసపోయినట్లు వారు గ్రహించారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లినా అక్కడ కూడా తాము ఈ పట్టాదారు పుస్తకాలు ఇవ్వలేదని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె ఆశలు అడియాశలయ్యాయి. గిరిజనులకు సదరు ముఠా సభ్యులు ఇస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు ఒరిజనల్ వాటిని పోలి ఉండటం గమనార్హం. తహశీల్దార కార్యాలయాల్లోని ఉద్యోగుల సహకారం లేనిదే ఇంత పకడ్బందీగా పుస్తకాలు తయారు చేయటం కుదరదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ముఠా సభ్యులు వారు వసూలు చేసిన డబ్బులో కొంత తహశీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందికి అప్పజెప్పి ఖాళీ పాసు పుస్తకాలను తీసుకుంటున్నట్లు సమాచారం. వీటిపై తహశీల్దార్, ఐటీడీఏ అధికారుల పోర్జరీ సంతకాలు చేసి యథేచ్ఛగా గిరిజనులకు అసలువే అంటూ ఇస్తున్నారు. ఉమకు 2013లో జారీ అయినట్లుగా ఉన్న నకిలీ పట్టాదారు పాసు పుస్తకంలోనూ తహశీల్దార్, ఐటీడీఏ ఫారెస్టు అధికారుల నకిలీ సంతకాలు, ముద్రలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఈ ముఠాకు తహశీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందే సహకరిస్తున్నారని తెలుస్తోంది. -
అటవీ అనుమతుల గుట్టు..గోపాలుడికే ఎరుక!
అటవీ అనుమతులు లేక అనుప్పల్లి-పనబాకంరహదారి పనుల నిలిపివేత రూ.4.59 కోట్ల నాబార్డ్ నిధులు వెనక్కి పరదరామి, కీనాటంపల్లి రిజర్వు ఫారెస్టులో గ్రానైట్ తవ్వకానికి అటవీశాఖ అనుమతి! ఇద్దరు గ్రానైట్ వ్యాపారులు మంత్రికి సన్నిహితులు కావడం వల్లే అనుమతులు వచ్చాయంటున్న అధికారవర్గాలు..! సాక్షి ప్రతినిధి, తిరుపతి: అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు రహదారుల నిర్మాణానికి ఆ శాఖ అనుమతించడం లేదు. కానీ.. అటవీ భూముల్లో నిక్షిప్తమైన సహజసంపదను బడా వ్యక్తులకు దోచిపెట్టడానికి మాత్రం ఆశాఖ తలుపులు బార్లా తెరుస్తోంది. రామచంద్రాపురం మండలంలో అనుప్పల్లి-పనబాకం రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతించలేదు. ఎంత ప్రయత్నించినా అటవీశాఖ అనుమతించకపోవడంతో చేసేదిలేక ఆ రోడ్డును రహదారులు, భవనాలశాఖ అధికారులు రద్దు చేశారు. యాదమరి మండలంలో కీనాటంపల్లి, పరదరామి రిజర్వు అటవీ భూముల్లో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్ను తవ్వుకోవడానికి మాత్రం ఇద్దరు టీడీపీ నేతలకు ఆ శాఖ అనుమతి ఇచ్చేసింది. అటవీశాఖ మంత్రి బొజ్జలకు ఆ ఇద్దరు సన్నిహితు లు కావడం వల్లే అనుమతి ఇచ్చిందని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించి, చంద్రబాబు మంత్రివర్గంలో అటవీశాఖను దక్కించుకున్నారు. అటవీ శాఖమంత్రి జిల్లాకు చెందిన నేతే కావడంతో ఆశాఖ అనుమతులు రాక ఆగిపోయిన అభివృద్ధి పనులు శరవేగంగా సాగే అ వకాశం ఉందని అధికారవర్గాలు భావించాయి. ప్రజలూ అదే ఆశించారు. ఆ ఆశలను అటవీశాఖ అడియాశలు చేస్తోంది. జనం ఆశలపై నీళ్లు.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రామచంద్రాపురం మండలంలోని ఆర్కే పల్లి రోడ్డు 0/0 కిమీ నుంచి 9/4 కిమీ వరకూ అనుపల్లి నుంచి గోకులాపురం మీదుగా పనబాకం వరకూ రోడ్డు నిర్మాణానికి ఆగస్టు 1, 2011న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు రూ.4.59 కోట్ల నాబార్డు నిధులను మంజూరు చేసింది. 9.4 కిమీల పొడవు ఉన్న రోడ్డును.. 4.30 కిమీల మేర రిజర్వు అటవీ ప్రాంతంలో నిర్మించాల్సి ఉంది. ఇందుకు అటవీశాఖ అనుమతి తప్పనిసరి. అనుపల్లి-పనబా కం రోడ్డు నిర్మాణం కోసం రహదారులు భవనాలశాఖ అధికారులు అటవీశాఖ అనుమతి కోసం ప్రయత్నించారు. మూడేళ్లపాటు అటవీశాఖ ప్రధాన కార్యాలయం చుట్టూ రహదారు లు, భవనాలశాఖ అధికారులు కాళ్లరిగేలా తిరిగారు. చివరకు అటవీశాఖ మంత్రి బొజ్జల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారు. కానీ.. ఆ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతిం చలేదు. దాంతో చేసేదిలేక ఆ రోడ్డు నిర్మాణాలను ఆపేశారు. పనులు చేసిన మేరకు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించి.. తక్కిన నిధులను నాబార్డుకు వెనక్కి పంపాలని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి బి.శ్యాంబాబు ఆగస్టు 13న ఉత్తర్వులు(జీవో ఆర్టీ నెం: 618)ను జారీ చేశారు. ఇది అనుపల్లి, గోకులాపురం, పనబాకం గ్రామాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది. గ్రానైట్ వ్యాపారులపై ప్రేమ.. యాదమరి మండలం పరదరామి రిజర్వు అటవీ ప్రాంతంలోని 213 కంపార్ట్మెంట్లో 4.90 హెక్టార్లలో నిక్షిప్తమైన బ్లాక్ గ్రానైట్ను తవ్వుకోవడానికి అనుమతించాలని టీడీపీ నేతకు చెందిన సిద్ధార్థ్ గ్రానైట్స్ జూన్ 14, 2007న దరఖాస్తు చేసుకుంది. అదే మండలంలో కీనాటంపల్లి రిజర్వు అటవీ ప్రాం తంలోని 228 కంపార్ట్మెంట్లో ఏడు హెక్టార్లలో నిక్షిప్తమైన బ్లాక్ గ్రానైట్ను తవ్వుకోవడానికి మరో టీడీపీ నేతకు చెందిన గుల్షన్ గ్రానైట్స్ జూన్ 7, 2008న దరఖాస్తు చేసుకుంది. రిజర్వు అటవీ భూముల్లో గనుల తవ్వకానికి ఆశాఖ అనుమతించలేదు. ఏడేళ్లుగా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. కానీ.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ శాఖ మంత్రి పదవి దక్కించుకోగానే ఆ ఇద్దరి నేతల ఫైళ్లు చకచకా కదిలాయి. కీనాటంపల్లి రిజర్వు అటవీ ప్రాంతంలో ఏడు హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్ తవ్వుకోవడానికి టీడీపీ నేతకు చెందిన గుల్షన్ గ్రానైట్స్కు అనుమతి ఇస్తూ ఈనెల 4న అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 73) జారీచేశారు. ఇక మరో టీడీపీ నేతకు చెందిన సిద్ధార్థ్ గ్రానైట్స్కు పరదరామి రిజర్వు అటవీ ప్రాంతంలో 4.90 హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్ను తవ్వుకోవడానికి అనుమతి ఇస్తూ ఈనెల 4న అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 74) జారీచేశారు. ఏడేళ్లుగా అనుమతించని అటవీశాఖ ఇప్పుడు ఒక్కసారిగా తలుపులు బార్లా తెరవడం వెనుక మతలబేమిటన్నది గోపాలుడికే ఎరుక. -
అటవీ ఆక్రమణలు ఉపేక్షించం
30 శాతం ఆక్రమణ చెరలోనే ఆక్రమణదారులపై కఠిన చర్యలు ప్రభుత్వానికి నివేదిక జిల్లాలో 7శాతమే అడవులు జిల్లా అటవీశాఖాధికారి ఎస్.రాజశేఖర్ సాక్షి, విజయవాడ : జిల్లాలో అటవీభూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖాధికారి ఎస్.రాజశేఖర్ హెచ్చరించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో కేవలం ఏడు శాతం మాత్రమే అడవులున్నాయని తెలిపారు. జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో ఉన్న అటవీ భూములను పూర్తిస్థాయిలో పరిరక్షించటానికి శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల్ని ఆయన వివరించారు. ఇప్పటికే జిల్లాలోని నూజివీడు డివిజన్లో ఆక్రమణలు అధికంగా జరిగాయని పేర్కొన్నారు. అటవీ భూముల్లో సుమారు 30శాతం ఆక్రమణల్లోనే ఉన్నాయని రాజశేఖర్ చెప్పారు. జిల్లాలో 49,960 హెక్టార్లలో అటవీప్రాంతం ఉందని తెలిపారు. దీనిలో సుమారు 20శాతం అటవీ ప్రాంతం కొండల్లో ఉందని, విజయవాడ డివిజన్ పరిధిలోని జగ్గయ్యపేట, కొండపల్లి, కంచికచర్ల, శోభనాపురం, విజయవాడ తదితర ప్రాంతాల్లో 25,368.04 హెక్టార్లు అటవీప్రాంతం ఉందని చెప్పారు. అలాగే మైలవరం డివిజన్ పరిధిలోని జి.కొండూరు, ఎ.కొండూరు, మైలవరం తదితర ప్రాంతాల్లో 11,863.42 హెక్టార్లలో అడవులున్నాయని వివరించారు. నూజివీడు డివిజన్ పరిధిలోని నూజివీడు, సుంకొల్లు, విస్సన్నపేట, తదితర ప్రాంతాల్లో 12,708.83 హెక్టార్లలో అడవులున్నాయని, వీటిలో సుమారు 25 నుంచి 30శాతం అడవులు ఆక్రమణల చెరలోనే ఉన్నాయని తెలిపారు. 40 ఏళ్లుగా ఆక్రమణలు దాదాపు 40 ఏళ్ల నుంచి జిల్లాలో అడవుల ఆక్రమణలు యథేచ్ఛగా జరగుతున్నాయని రాజశేఖర్ తెలిపారు. ఈ క్రమంలోనే తమశాఖ అధికారులు కొనేళ్ల కిత్రమే అక్రమణలదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరె స్టు చేశారని చెప్పారు. ప్రస్తుతం 50కి పైగా కేసులు కోర్టుల్లో ఉన్నాయని వివరించారు. నూజివీడులో సుమారు 30 వేల ఎకరాల అడవులు అన్యాకాంత్రం అయ్యాయని, వీటిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని చెప్పారు. అడవుల్లో మామిడి, పామాయిల్, ఇతర పంటలు సాగులో ఉన్నాయని చెప్పారు. అటవీ భూములను ప్రభుత్వం తీసుకోవడానికి సంబంధించి తమ శాఖకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, గతంలో కలెక్టర్ ఆదేశాలతో భూముల వివరాల నివేదికను పంపామని చెప్పారు. అటవీ భూములను ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరని తెలిపారు. -
గాలేరు గతి ఇంతేనా?
కర్నూలు రూరల్: శ్రీశైలం బ్యాక్ వాటర్ను పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తరలించాలనే లక్ష్యంతో గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద సీమ జిల్లాల్లో 2.6 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చేందుకు, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు 38 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవచ్చు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాల్సి ఉంది. మొదటి దశ కింద ఎస్సార్బీసీ ప్రధాన కాలువ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ (12.44 టీఎంసీలు) కు నీటిని తీసుకెళ్లాలి. అక్కడి నుంచి 57.70 కి.మీ వరద కాలువ ద్వారా అవుకు రిజర్వాయర్ (4.31 టీఎంసీ) ను నింపాలి. మళ్లీ ఇక్కడి నుంచి 58.125 కి.మీ దూరంలో ఉన్న మరో వరద కాలువ ద్వారా పెన్నా నదిపై కడుతున్న గండికోట రిజర్వాయర్కు నీటిని తరలించాలి. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ గండికోట రిజర్వాయర్ నుంచి మొదలవుతుంది. ఇవీ సమస్యలు.. అటవీ భూముల క్లియరెన్స్ తీసుకోకపోవడంతో ప్రాజెక్టు పనులకు ఆదిలో అడ్డంకులు ఏర్పడ్డాయి. విడతల వారీగా ప్రతిపాదనలు పంపగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 254 ఎకరాలకు అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం భూ సేకరణపై నూతన సంస్కరణలు తీసుకొస్తామని చెబుతోంది. కేంద్రం ఇచ్చిన అనుమతులకు అనుగుణంగా ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. {పభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టును రద్దుచేయాలని, కొత్త ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని పెంచాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదీ ప్ర‘గతి’ ఎస్ఆర్బీసీ కాలువ పరిధిలో గోరకల్లు జలాశయం నిర్మాణానికి రూ.448.20 కోట్లు కేటాయించారు. దీని కోసం ఇప్పటివరకు రూ. 411 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనులు 2008లో పూర్తి కావాల్సి ఉంది. అయితే 314 ఎకరాల అటవీ భూములకు అనుమతులు రావలసి ఉంది. ఎస్ఆర్బీసీ కాలువ పరిధిలోని అవుకు జలాశయం సొరంగం పనులకు ప్యాకేజీ నంబర్ 30 కింద 401.12 కోట్లు కేటాయించారు. ఈ సొరంగం పనుల్లో నాణ్యతకు తిలోదకాలివ్వటంతో లోపలిభాగంలో సొరంగం పెచ్చులూడుతోంది. అవుకు సొరంగం పనులు పూర్తి కావటానికి ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉన్నా ఇప్పటివరకు అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పాటు అంచనా వ్యయం పెంచాలంటూ కాంట్రాక్టర్ పనులు సక్రమంగా చేయడం లేదు. 36వ ప్యాకేజీ పనుల కోసం రూ. 38.73 కోట్లు కేటాయించారు. ఈ ప్యాకేజీ కింద 13499 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక్కడ 70 ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. ఈ పనులకు ఈ నెల చివరితో గడువు ముగుస్తుంది. వివిధ రకాల కారణాలు చూపుతూ కాంట్రాక్టర్ కాంట్రాక్టు క్లోజ్ చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. 37వ ప్యాకేజీలో రూ.48.40 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.27.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక్కడ కూడా 63.67 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంపై ఎలాంటి స్పందన లేకపోవడంతో 2010లోనే కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. చివరికి కాంట్రాక్టును రద్దు చేయాలని సదరు కాంట్రాక్టర్ ప్రభుత్వానికి తెలియజేశారు. 38వ ప్యాకేజీలో 7600 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు రూ.48.36 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రూ.15.64 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 93.92 ఎకరాల భూసేకరణ చేయాల్సిన ఉన్నా రెవెన్యూ అధికారులు, అటు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పనులు రద్దు చేయాలంటూ 2010లోనే దరఖాస్తు చేసుకోవడంతో సదరు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటివరకు ఆ పనులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. -
హంద్రీ-నీవాకు తొలగిన అడ్డంకులు
అటవీ భూములకు కేంద్రం క్లియరెన్స్ రూ.39.32 కోట్ల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వ జీవో జారీ ఎల్వోసీ కోసం ఎదురుచూస్తున్న అధికారులు బి.కొత్తకోట: ఏవీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు రెండోదశ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. పనులకు అడ్డుగా నిలిచిన అటవీభూములను ప్రాజెక్టుకు ఇచ్చేందుకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. అయితే అటవీభూములు స్వాధీనం చేసుకోవాలంటే పరిహారం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ తర్వాతే అటవీశాఖ నుంచి భూములు ప్రాజెక్టుకు అప్పగిస్తారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు రెండో దశకు సంబంధించి చిత్తూరు జిల్లాలోని 23, 59, 62 ప్యాకేజీల్లో, అనంతపురం జిల్లాలోని 3, 9, 14, 17, 25, 26 ప్యాకేజీల్లో 522 హెక్టార్ల(1,245ఎకరాలు) అటవీ భూమినిసేకరించా ల్సి ఉంది. 2006 నుంచి ప్రాజెక్టు పనులు ప్రా రంభమయ్యాయి. ఈ కాలువలు అటవీ ప్రాంతాల మీదుగా వెళుతున్నాయి. అటవీ భూములకు సంబంధించి క్లియరెన్స్ లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. అటవీ ప్రాంతంలో పనులు చేపట్టాలంటే కేంద్రపర్యావరణ, అడవులశాఖ అనుమతులు తప్పనిస రి. పనులకోసం ఈ భూములు పొందాలంటే అటవీశాఖ కోల్పోయే భూములకు పరిహార భూములను అప్పగించాలి. ఈ మొత్తం అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూమిగా అనంతపురం జిల్లాలోని తలపుల మండలం పెద్దన్నగారిపల్లె గ్రామంలో ప్రభుత్వ భూములను ఇప్పటికే అప్పగించారు. 522 హెక్టార్ల అటవీ భూమికి అదనంగా మరో 10 హెక్టార్లభూమితో కలిపి 532 హెక్టార్ల భూమిని అప్పగించారు. అలాగే పరిహార సొమ్ము చెల్లించేం దుకు ప్రభుత్వం గత నెలాఖరులో జీవో నంబర్ 71 జారీ చేసీంది. అటవీశాఖ పొందిన పరిహారభూముల్లో అడవుల పెంపకం కోసం హెక్టారుకు రూ.8-9 లక్షలు చెల్లించాలి. ఈ సొమ్మును కేంద్రానికి చెల్లించి భూములు స్వాధీనం చేసుకునేందుకు అనుమతి లభించింది. మొత్తం రూ.39.32 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సివుంది. ఈ నిధులను చెల్లించి భూములను స్వాధీనం చేసుకొని పూర్తిగా నిలిచిపోయిన పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిధుల కొరత లేకపోవడంతో ప్రాజెక్టు అధికారులు చర్యలు పూర్తిచేశారు. అయితే ఈ నిధులను చెల్లించేందుకు ప్రభుత్వం ఎల్వోసీ జారీ చేయాల్సి ఉంది. దీని కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. -
నల్లమల అందాల అల
నల్లమల.. ఆ పేరు వింటేనే అభయారణ్యంతో పాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. ఆ ప్రాంతమే నేడు పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోబోతుంది. పోటీ ప్రపంచంతో కుస్తీపట్టి విసిగిపోయి.. అలసిపోయిన పట్టణజనం సెలవుదినాల్లో ఈ ప్రాంతంలో గడపడానికి అత్యంత మక్కువ చూపుతున్నారు. ఇక్కడ జలజల పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రాగాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలు.. నాటి శిల్పకళను తెలియజేసే ఎంతో సుందరమైన కట్టడాలు ఆధ్యాత్మికను నింపుతాయి. కనుచూపుమేర పచ్చదనం.. నింగిని తాకుతున్నట్లుగా కనిపించే అరుదైన వృక్షాలు ఆహ్లాదపరుస్తాయి. అడవిని చీల్చుతూ ముందుకుసాగే రోడ్డు వెంట ఎన్నో మరెన్నో అందాలు చూడొచ్చు. మన్ననూర్: నల్లమల ముఖద్వారమైన మన్ననూర్ నుంచి ప్రారంభమయ్యే అభయారణ్యంలో అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. అటవీశాఖ చెక్పోస్టు వద్దే వనమాలిక ఉంది. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి హంగులతో, పచ్చని చెట్ల నడుమ విడిది కేంద్రాలు ఉన్నాయి. ఎన్నో వన్యప్రాణులు తలదాచుకుంటూ తమ సంతతిని వృద్ధిచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అటవీశాఖ నల్లమలను పర్యాటక ప్రాంతంగా, ప్రశా ంత వాతావరణానికి కేంద్రంగా తీర్చిదిద్దాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. శ్రీశైల ఉత్తర ముఖద్వారంగాఉమామహేశ్వరం శ్రీశైల ఉత్తర ముఖద్వారంగా విరాజిల్లుతు న్న శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం ఆధ్యాత్మికంతోపాటు నల్లమల ఊటీగా పిలుస్తారు. మండుటెండలో కూడా ఈ ప్రాంతంలో చల్లగా ఉండటంతో ఈ ప్రాంతవాసులందరు ఉమామహేశ్వర క్షేత్రాన్ని తరచూ సందర్శిస్తుంటారు. అలాగే శ్రీశైలం వెళ్లే ప్రతీ యాత్రికుడు సైతం ఇక్కడికి వచ్చే శ్రీశైలానికి వెళ్లే సంప్రదాయం అలవాటు పడింది. వ్యూ పాయింట్ ప్రత్యేకం.. నల్లమల ద్వారం ఫర్హాబాద్ చౌరస్తానుంచి 8 కి.మీ దూరంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న వ్యూ పాయింట్ ఇక్కడ ప్రత్యేకం. సుదూరప్రాంతం, అనేక గ్రామాలు, ఎల్లవేళలా మంచుదుప్పటితో కప్పివేసిన దృశ్యాలను చూసేందుకు చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఆ అందాలు చూడాలంటే రెండు కళ్లూ చాలవు. సఫారీ ప్రయాణం నల్లమల అందాలను చూడటానికి అటవీశాఖ సఫారీ వాహనంలో ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసింది. అటవీజంతువులను దగ్గరనుంచి చూసేందుకు ఈ వాహనాలెందో ఉపకరిస్తాయి. లోతట్టే ప్రాంతం నుంచి అడవిబిడ్డల గూడేలు, వారి జీవన స్థితిగతులతోపాటు ఎత్తయిన కొండ అందాలను ఈ ప్రయాణంలో చూడొచ్చు. వాచ్టవర్, రకరకాల చెట్లు, ఔషధ మూలికలు, అడవిలో స్వేచ్ఛగా సంచరి ంచే వన్యప్రాణులను తిలకించే మంచి అవకాశం కల్పించారు. జాలువారే జలపాతం వటువర్లపల్లి గ్రామానికి 10 కి.మీ దూరంలోని మల్లెలతీర్థం ప్రాంతం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈకో డెవలప్మెంట్ భాగస్వామ్యంతో అటవీశాఖ ఇక్కడ పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా 200 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పక్కనే శివలింగం ఉండటంతో మునులు, అడవిబిడ్డలు ఆ ప్రాంతంలో తరచూ పూజలుచేస్తుంటారు. అలాగే రోడ్డు వెంట ఉండే ఎన్నో సుందర దృశ్యాలు శ్రీశైలం వెళ్లే యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. -
అడవినీ అమ్మేశారు..
పీసీపల్లి, న్యూస్లైన్ : అడవిని రక్షించాల్సిన అధికారులే కనిగిరి ప్రాంతంలో అటవీ సంపదను యథేచ్ఛగా అమ్ముకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అధికారులు గతంలో ఎర్రచందనం తరలించి రూ. లక్షలు పోగేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సిరిమేని కర్ర, పులిందల కర్ర నరికేస్తున్న దళారులు, కొందరు రైతులకు అధికారులు దన్నుగా నిలిచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని లక్ష్మక్కపల్లి, లింగన్నపాలెం గ్రామాల్లో అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో భూములు విస్తారంగా ఉండటంతో రైతులు పొగాకును ఎక్కువగా సాగు చేస్తారు. మూడు గ్రామాల్లో దాదాపుగా 30 బ్యారన్లకుపైగా ఉన్నాయి. పొగాకు కాల్చేందుకు కర్ర అవసరం కాగా రైతులు అటవీశాఖాధికారులతో బేరం కుదుర్చుకుని అడవిని నరికేస్తున్నారు. తొలుత అన్ని బ్యారన్లకు కలిపి రూ.25 వేలు డిమాండ్ చేసిన అధికారులు.. తీరా రైతులు డబ్బులివ్వబోగా ఒక్కో బ్యారన్కు రూ.25 వేలు డిమాండ్ చేసి మరీ తీసుకున్నారు. కర్ర నరికి వేస్తున్న దళారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏటా పొగాకు క్యూరింగ్ సీజన్లో అటవీ కర్ర బ్యారన్ల పాలు కావడం సర్వసాధారణమైంది. ఈ ఏడాది ఆకినీడు, మాలకొండ అడవులు, పీసీపల్లి మండలం కొప్పుకొండ, పాలకొండ అడవుల్లో కూలీలను పెట్టి మరీ చెట్లను నరికిస్తున్నారు. అటవీ శాఖాధికారులు ప్రధాన రోడ్లకే పరిమితమయ్యారు. గ్రామాలకు వెళ్లి అడవులను ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవు. అడవిలో చెట్లను యథేచ్ఛగా నరికివేస్తుంటే పట్టించుకోని అధికారులు.. పట్టా భూముల్లో చెట్లను నరికి అమ్ముకుంటున్న రైతులపై తమ ప్రతాపం చూపుతున్నారు. ఇటీవల పెదయిర్లపాడులో పట్టాభూమిలో టేకు మొక్కలు కొట్టుకుని చిన్న కుర్చీ తయారు చేసుకుంటున్న చిరు వ్యాపారిపై దాడి చేసి రూ.8 వేల జరిమానా కట్టించుకుని రశీదు కూడా ఇవ్వకుండా వెళ్లారు. కలప అక్రమ రవాణా పేరిట రైతులకు వేల రూపాయల అపరాధ రుసుం విధించి వేధిస్తున్నారు. వెయ్యి చలానా మాటున రూ.10 వేలకుపైగా వసూలు చేస్తున్నారని పీసీపల్లి, అలవలపాడు, కోదండరామపురం రైతులు ఆరోపిస్తున్నారు. అటవీ కార్యాలయంలోని ఎర్రచందనం దొంగల పాలైతే పట్టించుకోని అధికారులు.. అడవులనేమి రక్షిస్తారని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కనిగిరి రే ంజి పరిధిలో అటవీ సంపదను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై డీఎఫ్ చంద్రశేఖర్ను వివరణ కోరగా రైతులు నరికిన కలప అడవిదైతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఇందిర జలభ్రమ
సాక్షి, రాజమండ్రి : ‘రెక్కలు ముక్కలయ్యేలా అటవీ భూములను చదును చేసుకుని సాగులోకి తెచ్చుకున్నాము. కానీ ఏం లాభం వాన తడికి వేసిన ఆరుతడి పంటలు కోతకు వచ్చేసరికి ఎండి పోవడం రివాజుగా మారిపోతోంది. పోడు భూముల్లో వానలేని రోజుల్లో నేలకు కాస్త చెమ్మ తగిలితే చాలు బంగారం పండించుకుందుము బాబూ’ అంటూ ఆనాడు గిరిజనులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి మొర పెట్టుకున్నారు. ఫలితంగా ఇందిర ప్రభ పథకాన్ని ప్రారంభించి ఎస్సీ, ఎస్టీ మెట్ట భూములకు సాగునీరందించుకునే కలను మహానేత సాకారం చేశారు. కానీ ఈనాడు ఆ పథకం అమలు కల్లగా మారిపోయింది. ఇందిర జలప్రభగా పేరు మార్చిన కిరణ్ సర్కారు పథకాన్ని పూర్తి భ్రమగా మార్చేసింది. ఆర్భాటంతో సరి కాంప్రహెన్సివ్ ల్యాండ్ డవలప్మెంట్ ప్రోగ్రాం(సీఎల్డీపీ)లో భాగంగా నిధులు విడుదల చేసి సమీపంలోని కొండ కాలువలు, చెరువుల నుంచి పైపుల ద్వారా పొలాలకు నీరు అందించాలన్నది పథకం ఉద్దేశం. 2009లో ఆయన మరణానంతరం ఈ పథకం కుంటినడకన సాగుతోంది. తర్వాత ఇందిర జలప్రభగా పేరు మార్చి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఆర్భాటం చేసింది. రాష్ట్రంలో ఈ పథకంలో 10 లక్షల ఎస్సీ, ఎస్టీ భూములను సాగుయోగ్యంగా మారుస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో 28,000 ఎకరాలు సాగులోకి తెస్తామని ప్రకటించి 2011 సెప్టెంబర్లో రూ.33.94 కోట్లు మంజూరు చేస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జీఓ నెంబరు 315ను విడుదల చేసింది. కానీ ఆర్భాటం అంతా జీవోకే పరిమితం కాగా పథకం చతికిల బడింది. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి చూస్తే పథకం పూర్తిగా అటక ఎక్కినట్టేనని అనిపిస్తోంది. 22 మండలాల్లో.. జిల్లాలో ఏడు క్లస్టర్లలోని 22 మండలాల్లో పథకం అమలులో ఉంది. అడ్డతీగల క్టస్టర్ పరిధిలో అడ్డతీగల, రాజవొమ్మంగి, గంగవరం, వై.రామవరం మండలాలు. రంపచోడవరం క్టస్లర్ నుంచి మారేడుమిల్లి, దేవీపట్నం, రంపచోడవరం మండలాలు. కాకినాడ క్లస్టర్ నుంచి గొల్లప్రోలు, కత్తిపూడి క్లస్టర్ నుంచి తుని, తొండంగి, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాలు, పెద్దాపురం క్లస్టర్ నుంచి రంగంపేట, పెద్దాపురం. ప్రత్తిపాడు క్లస్టర్లో గోకవరం, జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రాజమండ్రి క్లస్టర్ నుంచి కోరుకొండ, రాజానగరం మండలాల నుంచి లబ్దిదారులను ఎంపిక చేశారు. అమలు ఇలా.. 2011లో 15,778 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఇందులో 636 ఎస్సీ లబ్దిదారులకు చెందినభూమి 860 ఎకరాలు ఉండగా, 4822 మంది గిరిజనులకు చెందిన 14,918 ఎకరాలు ఉంది. ఈ భూమిని సాగునీటి సౌకర్యం కల్పించడం కోసం 1072 బ్లాకులుగా విభజించి పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. 2011 సంవత్సరాంతానికి 356 బ్లాకుల్లో 1744 పనులు ప్రతిపాదించారు. కాగా వీటిలో ఇప్పటికి 342 బ్లాకుల్లోని 1500 లకు పైగా పనులకు పరిపాలనా పరమైన అనుమతులు లభించగా 107 బ్లాక్లలోని 326 పనులు పూర్తిచేయగలిగారు. ఇంకా 78 డివిజన్లలో 136 పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. రెండేళ్లుగా పనుల్లో ప్రగతి మందగించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తిగా స్తంభించినట్టు తెలుస్తోంది. -
అడవుల రక్షణఅందరి బాధ్యత
వికారాబాద్/అనంతగిరి, న్యూస్లైన్: మానవజాతి మనుగడ కోసం అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతి అన్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో అనంతగిరి లాంటి చక్కని అటవీ ప్రాంతం ఉండడం చాలా సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్ట అటవీ ప్రాంతంలో ఆదివారం అటవీశాఖ ఆధ్వర్యంలో 5 కృష్ణ జింకలు, 12 చారల జింకలను సీఎస్ మహంతి, డీజీ పీ ప్రసాదరావు, రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి బీఎస్ఎస్ రెడ్డిలు వదిలిపెట్టారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ.. ఆఫ్రికా ఖండంలో ఉన్న సవన్నా గడ్డి భూములు, అక్కడి వాతావరణం అనంతగిరి గుట్టలో గోచరిస్తోందని, జింకల ఎదుగుదలకు ఇక్కడి వాతావరణం తోడ్పడుతుందన్నారు. జంతువులు ఉండటానికి కేవలం దట్టమైన అడవులే అవసరం లేదని.. ఇక్కడ ఆ రెండూ కలిసి ఉన్నాయని సీఎస్ పేర్కొన్నారు. ప్రకృతిలో సమతుల్యత లోపిస్తే ఇటు మానవ మనుగడకు, అటు జంతు జాలానికీ ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. పర్యావరణాన్ని అభివృద్ధిపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతగిరి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. హైదరాబాద్కు చేరువలో అటవీ ప్రాంతం ఉండటం సంతోషకరమన్నారు. ప్రస్తుతం వదిలిపెడుతున్న జింకలు ఇంతకుముందున్న జంతు ప్రదర్శనశాలలో కన్నా ఇక్కడ స్వేచ్ఛగా విహరిస్తాయని.. వాటికి స్వేచ్ఛ మనకు పుణ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మానవ జాతి మనుగడకు అటవీశాఖ అభివృద్ధి చాలా అవసరమని స్పష్టంచేశారు. డీజీపీ ప్రసాదరావు మాట్లాడుతూ.. జింకలు విహరించడానికి అనంతగిరి అడవుల్లో మంచి వాతావరణం ఉందన్నారు. అనంతగిరి అటవీ ప్రాంతంలోప్రస్తుతం 80లోపు వన్యప్రాణులు ఉన్నాయని, మరిన్ని వన్య ప్రాణులను సంరక్షించేందుకు అవకాశముందన్నారు. అడవుల పరిరక్షణకై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉందని చెప్పారు. రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి బీఎస్ఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు అటవీ సిబ్బంది ఉన్నారని, స్థానిక గ్రామాలకు చెందిన మరో ఐదుగురిని నియమించి వన్యప్రాణులను పరిరక్షిస్తామన్నారు. మనుషులు పరిసరాల్లోని వన్యప్రాణులపై దాడి చేయడం వల్ల అవి గ్రామాల్లోకి వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు. అనంతగిరి అడవుల్లోని ప్రశాంత వాతావరణం అటవీ జంతువుల మనుగడకు చాలా అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. అనంతగిరి అడవిలో ప్రస్తుతం వివిధ రకాల వన్యప్రాణులు 100 వరకే ఉన్నాయని, ఇంకా వదిలిపెట్టడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ జోసెఫ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్, రాష్ట్ర ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ రాజేష్ మిట్టల్, హైదరాబాద్ రేంజ్ కన్జర్వేటివ్ అధికారి రమణారెడ్డి, సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, ఎస్పీ బి.రాజకుమారి, అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి, డీఎఫ్ఓ నాగభూషణం, సబ్ డీఎఫ్ఓ మాధవరావు, ఎఫ్ఆర్ఓ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. కాగా సీఎస్ మహంతి, డీజీపీ ప్రసాదరావు,లు అడవిలో జింకలు వదిలిపెట్టిన అనంతరం అడవిలో నడుచుకుంటూ అనంతపద్మనాభస్వామి ఆలయానికి వెళ్లారు. వీరిని ప్రధాన అర్చకుడు శేషగిరిశర్మ సాదరంగా ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. -
అటవీ భూంఫట్..!
సాక్షి, గుంటూరు : జిల్లాలో అటవీభూములకు సంబంధించి అటు రెవెన్యూ, ఇటు అటవీశాఖలో ఉన్న రికార్డుల్లో పొంతనలేని సమాచారాన్ని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నిర్భయంగా భూములను ఆక్రమించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 1.64 లక్షల హెక్టార్లలో అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. వీటిల్లో సుమారు 3,260 హెక్టార్లు(8,058 ఎకరాలు) అన్యాక్రాంతమైనట్లు అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలోని నల్లమల, కాకిరాల అటవీప్రాంత భూములతో పాటు మంగళగిరి, తాడేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాల్లో అటవీభూములు పెద్ద ఎత్తున ఆక్రమణల బారినపడ్డాయి. గుంటూరు రేంజ్లోనే మొత్తం 1630 హెక్టార్లు, మాచర్ల రేంజ్ పరిధిలో 1394 హెక్టార్లు, వినుకొండ రేంజ్లోని 20 హెక్టార్లు అన్యాక్రాంతం కాగా, రేపల్లె రేంజ్కు చెందిన 226.37 హెక్టార్ల అటవీభూములు ఆక్రమణలకు గురయ్యాయి. చదును భూములపై కన్నేస్తూ.. జిల్లాలో పట్టణాలు విస్తరిస్తున్నకొద్దీ సమీపంలోని అటవీభూములు ఆక్రమణలబారిన పడుతున్నాయి. కొం డలు, అడవుల్లో చదునుగా ఉన్న భూములపై కొం దరు కన్నేస్తున్నారు. సొసైటీలు, యువజన సంఘాల పేరుతో పాగా వేయడం, అనంతరం వాటిని గజాల చొప్పున పేదలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది. ఈ ప్రకారం పల్నాడు డివిజన్లో అనేక చోట్ల అటవీభూముల్లో గుడిసెలు వెలిశాయి. దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో 210 హెక్టా ర్లు, మాచవరం మండలంలోని కోనంకి, నకరికల్లు మండలంలోని కొంతభాగం, పిడుగురాళ్ల సమీపాన గుత్తికొండ, రాజుపాలెం మండలంలోని గుడ్లపల్లి, త్రిపురాపురం, దుర్గి సమీపాన కాకిరాల, ముటుకూరు, మంచాలపాడు తదితర అటవీభూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. మాచర్ల రేంజ్ పరిధిలోనే కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి మండలాల్లో సుమారు 1394 హెక్టా ర్లు కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకుంది.పొంతనలేని రికార్డులు.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత నెల రెండు మార్లు జిల్లాకొచ్చి ఆక్రమణలపై పరిశీలన జరిపారు. కొన్ని ప్రాంతాల్లోని కబ్జా భూములకు సంబంధించి గ్రామమ్యాప్లు, సర్వే రికార్డులకు వ్యత్యాసం ఉండటం ఆక్రమణదారులకు అనువుగా మారినట్లు వారు గుర్తించారు. సాధారణంగా సర్వే రికార్డులు తయారైన తర్వాత విలేజ్ మ్యాప్లు ఏర్పడ్డాయి. అయితే, అటవీభూములకు సంబంధించి సర్వే రికార్డుల్లో కొండపోరంబోకుగా చూపితే, విలేజ్మ్యాప్లో మాత్రం అసైన్డ్గా పేర్కొన్నారు. దీంతో పేదలకు అసైన్డ్ భూములు పంపిణీచేయవచ్చనే సాకుతో ఆక్రమణదార్లు ముందుగా గుడిసెలు వేయడం, ఆ తర్వాత రెవెన్యూ కార్యాలయాలపై ఒత్తిళ్లు తెచ్చి పట్టాలు సాధించుకోవడం పరిపాటిగా మారింది. మరి కొన్ని చోట్ల అన్సర్వే భూములుండటం విశేషం. ఉదాహరణకు బెల్లంకొండ మండలం, చండ్రాజుపాలెం గ్రామంలో సర్వేనంబర్ ఒకటి, క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో సర్వేనంబర్ 337/18లు గ్రామమ్యాప్లో అటవీశాఖకింద ఉండగా, సర్వే రికార్డుల్లో మాత్రం అసైన్డ్ భూమలుగా పేర్కొని ఉండటంతో అధికారులు ఎటూ తేల్చుకోలేక తికమకపడుతున్నారు. కొరవడుతున్న సమన్వయం.. అటవీభూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ సహకరించడం లేదంటూ అటవీశాఖాధికారులు వాపోతున్నారు. తమ భూములకు పట్టాలిచ్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిని రెవెన్యూ శాఖ కొట్టిపారేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో కొన్నిచోట్ల అటవీభూములు అన్యాక్రాంతం కాగా, అక్కడ నివసించే వారికి రెవెన్యూ అధికారులు అన్ని సదుపాయాలు కల్పించడంపై అటవీశాఖాధికారులు తప్పుపడుతున్నారు. అయితే, మానవహక్కుల చట్టం మేరకు వసతులు కల్పిస్తున్నామని వారు వాదిస్తున్నారు. కాగా రేపల్లె, మంగళగిరి ఏరియాల్లో విలువైన భూములు కూడా కబ్జా కాటుకు హరించుకుపోతున్నాయని పలువురు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మాచర్ల, బెల్లంకొండ ఏరియాల్లో కొన్నిచోట్ల గిరిజనుల పేరిట బినామీలు ఆక్రమించుకుని అటవీహక్కు చట్టం కింద పట్టాల కోసం తిరుగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ తనిఖీలు వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.