Hockey India League
-
బెంగాల్ టైగర్స్ విజయ గర్జన
రూర్కెలా: పది నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్... ఆ తర్వాత మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా మరో గోల్... వెరసి పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు చాంపియన్గా అవతరించింది. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రూపిందర్ సింగ్ పాల్ కెప్టెన్సీలోని బెంగాల్ టైగర్స్ జట్టు 4–3 గోల్స్ తేడాతో హైదరాబాద్ తూఫాన్స్ జట్టును ఓడించింది. బెంగాల్ టైగర్స్ జట్టు తరఫున జుగ్రాజ్ సింగ్ (25వ, 32వ, 35వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేసి ‘హ్యాట్రిక్’ నమోదు చేయగా... స్యామ్ లేన్ (54వ నిమిషంలో) గెలుపు గోల్ కొట్టాడు. హైదరాబాద్ తూఫాన్స్ తరఫున గొంజాలో పీలాట్ (9వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... అమన్దీప్ లాక్రా (26వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. ఏడేళ్ల విరామం తర్వాత హాకీ ఇండియా లీగ్ను పునరుద్ధరించారు. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన హాకీ ఇండియా లీగ్ మొదలైంది. విజేతగా నిలిచిన బెంగాల్ టైగర్స్ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ హైదరాబాద్ తూఫాన్స్ జట్టుకు రూ. 2 కోట్లు... మూడో స్థానంలో నిలిచిన సూర్మా హాకీ క్లబ్ జట్టుకు రూ. 1 కోటి నగదు పురస్కారం లభించింది. మొత్తం ఎనిమిది జట్లు పోటీపడ్డ హెచ్ఐఎల్లో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక బెంగాల్ టైగర్స్ జట్టు 19 పాయింట్లతో టాపర్గా నిలిచింది. తుదకు బెంగాల్ టైగర్స్ జట్టుకే టైటిల్ లభించడం విశేషం. హెచ్ఐఎల్ ‘బెస్ట్ గోల్ కీపర్’గా బ్రికమ్జీత్ సింగ్ (రూ. 10 లక్షలు; హైదరాబాద్ తూఫాన్స్)... ‘అప్కమింగ్ ప్లేయర్’గా అర్ష్ దీప్ (రూ. 10 లక్షలు; హైదరాబాద్ తూఫాన్స్)... ‘టాప్ స్కోరర్’గా జుగ్రాజ్ సింగ్ (బెంగాల్ టైగర్స్; రూ. 10 లక్షలు)... ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ సుఖ్జీత్ సింగ్ (రూ. 20 లక్షలు; బెంగాల్ టైగర్స్) ఎంపికయ్యారు. యూపీ రుద్రాస్ జట్టుకు ‘ఫెయిర్ ప్లే’ అవార్డు లభించింది. 8 పాల్గొన్న జట్లు 44 మొత్తం జరిగిన మ్యాచ్లు 199 నమోదైన మొత్తం గోల్స్ 103 ఫీల్డ్ గోల్స్ 89 పెనాల్టీ కార్నర్ గోల్స్ 7 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ 95 క్రీడాకారులకు లభించిన గ్రీన్ కార్డులు 16 క్రీడాకారులకు లభించిన ఎల్లో కార్డులు -
హైదరాబాద్ X బెంగాల్
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో హైదరాబాద్ తూఫాన్స్, ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ జట్లు ఫైనల్కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో హైదరాబాద్ తూఫాన్స్ 3–1 గోల్స్ తేడాతో సూర్మా హాకీ క్లబ్పై విజయం సాధించగా... హోరాహోరీగా సాగిన పోరులో ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ షూటౌట్లో తమిళనాడు డ్రాగన్స్పై గెలుపొందింది. హైదరాబాద్ జట్టు తరఫున అమన్దీప్ లక్రా (25వ నిమిషంలో), జాకబ్ అండర్సన్ (35వ నిమిషంలో), నీలకంఠ శర్మ (43వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. సూర్మ హాకీ క్లబ్ తరఫున మ్యాచ్ చివరి నిమిషంలో జెరెమీ హెవార్డ్ (60వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్ తూఫాన్స్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఇక బెంగాల్ టైగర్స్, తమిళనాడు డ్రాగన్స్ మధ్య తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన మరో సెమీస్లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2 గోల్స్తో సమంగా నిలిచాయి. బెంగాల్ టైగర్స్ తరఫున ప్రదీప్ సింగ్ సంధు (30వ నిమిషంలో), స్యామ్ లేన్ (53వ ని.లో) చెరో గోల్ చేయగా... డ్రాగన్స్ తరఫున నాథన్ ఎప్రామ్స్ (18వ ని.లో), సెల్వం కార్తి (32వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. దీంతో ఫలితం తేల్చేందుకు షూటౌట్ నిర్వహించగా... బెంగాల్ టైగర్స్ జట్టు ‘సడెన్ డెత్’లో 6–5 గోల్స్ తేడాతో తమిళనాడు డ్రాగన్స్ పై గెలిచింది. ఆదివారం జరగనున్న తుది పోరులో బెంగాల్ టైగర్స్తో హైదరాబాద్ తూఫాన్స్ టైటిల్ కోసం పోటీ పడనుంది. -
Hockey India League 2024-25: సెమీస్లో బెంగాల్ టైగర్స్
రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో బెంగాల్ టైగర్స్ 2–1 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో బెంగాల్ టైగర్స్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మిగిలిన మూడు మ్యాచ్ల ఫలితాలు ఎలా ఉన్నా బెంగాల్ జట్టు టాప్-4లోనే ఉండనుంది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో జేఎస్డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్.. వేదాంత కలింగ లాన్సర్స్పై 5-2 గోల్స్ తేడాతో గెలుపొందింది. సూర్మా హాకీ క్లబ్ తరఫున టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 32, 54 నిమిషాల్లో గోల్స్ చేయగా.. ప్రభ్జోత్ సింగ్ 26వ నిమిషంలో.. నికోలస్ కీనన్ 33వ నిమిషంలో.. మణిందర్ సింగ్ 51వ నిమిషంలో గోల్స్ చేశారు. లాన్సర్స్ తరఫున దిల్ప్రీత్ సింగ్ 5వ నిమిషంలో, థియరీ బ్రింక్మన్ 44వ నిమిషంలో.. గుర్సబ్జిత్ సింగ్ 56వ నిమిషంలో గోల్స్ చేశారు. ఈ గెలుపుతో సూర్మా హాకీ క్లబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇదిలా ఉంటే, మహిళా క్రీడాకారిణుల కోసం తొలిసారి నిర్వహించిన మహిళల హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెచ్ఐఎల్) టోర్నమెంట్లో ఒడిశా వారియర్స్ జట్టు చాంపియన్గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నేహా గోయల్ సారథ్యంలోని ఒడిశా వారియర్స్ 2-1 గోల్స్ తేడాతో జేఎస్డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టును ఓడించింది. రుతుజా దాదాసో పిసాల్ (20వ, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి ఒడిశా వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సలీమా టెటె కెప్టెన్సీలో ఆడిన సూర్మా క్లబ్ జట్టుకు పెన్నీ స్క్విబ్ (28వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. విజేతగా నిలిచిన ఒడిశా వారియర్స్ జట్టుకు రూ. 1 కోటి 50 లక్షల ప్రైజ్మనీ లభించింది. రన్నరప్ సూర్మా క్లబ్ జట్టుకు రూ. 1 కోటి ప్రైజ్మనీ దక్కింది. మూడో స్థానంలో నిలిచిన ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు రూ. 50 లక్షల ప్రైజ్మనీ సొంతం చేసుకుంది. -
చాంపియన్ ఒడిశా వారియర్స్
రాంచీ: మహిళా క్రీడాకారిణుల కోసం తొలిసారి నిర్వహించిన మహిళల హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెచ్ఐఎల్) టోర్నమెంట్లో ఒడిశా వారియర్స్ జట్టు చాంపియన్గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నేహా గోయల్ సారథ్యంలోని ఒడిశా వారియర్స్ 2-1 గోల్స్ తేడాతో జేఎస్డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టును ఓడించింది. రుతుజా దాదాసో పిసాల్ (20వ, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి ఒడిశా వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సలీమా టెటె కెప్టెన్సీలో ఆడిన సూర్మా క్లబ్ జట్టుకు పెన్నీ స్క్విబ్ (28వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. విజేతగా నిలిచిన ఒడిశా వారియర్స్ జట్టుకు రూ. 1 కోటి 50 లక్షల ప్రైజ్మనీ లభించింది. రన్నరప్ సూర్మా క్లబ్ జట్టుకు రూ. 1 కోటి ప్రైజ్మనీ దక్కింది. మూడో స్థానంలో నిలిచిన ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు రూ. 50 లక్షల ప్రైజ్మనీ సొంతం చేసుకుంది. ‘బెస్ట్ గోల్కీపర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు సవితా పూనియా (సూర్మా హాకీ క్లబ్)... ‘అప్కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ పురస్కారం సోనమ్ (సూర్మా హాకీ క్లబ్)... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు జ్యోతి (సూర్మా హాకీ క్లబ్) గెల్చుకున్నారు. ఐదు గోల్స్ చొప్పున సాధించిన యిబ్బీ జాన్సెన్ (ఒడిశా వారియర్స్), చార్లోటి ఎంగ్లెబెర్ట్ (సూర్మా హాకీ క్లబ్) ‘టోర్నీ టాప్ స్కోరర్స్’గా నిలిచారు. ‘టాప్’లో హైదరాబాద్ తూఫాన్స్ పురుషుల హాకీ ఇండియా లీగ్లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 17 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. యూపీ రుద్రాస్ జట్టుతో రూర్కెలాలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ తూఫాన్స్ 3-1తో నెగ్గింది. తూఫాన్స్ జట్టు తరఫున అర్‡్షదీప్ సింగ్ రెండు గోల్స్... పిలాట్ ఒక గోల్ చేశారు.4 పాల్గొన్న జట్లు 13 మొత్తం జరిగిన మ్యాచ్లు 41 నమోదైన మొత్తం గోల్స్ 27 ఫీల్డ్ గోల్స్ 11 పెనాల్టీ కార్నర్ గోల్స్ 3 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ 22 క్రీడాకారిణులకు లభించిన గ్రీన్ కార్డులు 6 క్రీడాకారిణులకు లభించిన ఎల్లో కార్డులు -
హైదరాబాద్ తూఫాన్స్ గెలుపు
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన పోరులో హైదరాబాద్ తూఫాన్స్ షూటౌట్లో సూర్మా హాకీ క్లబ్పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా... విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్లో 4–3 గోల్స్ తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు తరఫున అమన్దీప్ లక్రా (40వ నిమిషంలో) గోల్ సాధించగా... సూర్మా హాకీ క్లబ్ తరఫున నికోలస్ డెల్లా (8వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. ఆట ఆరంభంలోనే సూర్మా హాకీ క్లబ్ గోల్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లగా... మూడో క్వార్టర్లో హైదరాబాద్ జట్టు స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో షూటౌట్ అనివార్యమైంది. సడన్ డెత్లో గోల్కీపర్ డొమినిక్ డిక్సన్ చక్కటి ప్రతిభ కనబర్చడంతో తూఫాన్స్కు బోనస్ పాయింట్ లభించింది. తాజా సీజన్లో 5 మ్యాచ్లాడి 3 విజయాలు, 2 పరాజయాలు మూటగట్టుకున్న హైదరాబాద్ తూఫాన్స్ 7 పాయింట్లతో పట్టిక ఐదో స్థానంలో కొనసాగుతోంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో యూపీ రుద్రాస్ జట్టు 3–1 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్పై విజయం సాధించింది. యూపీ రుద్రాస్ తరఫున ఫ్లోరిస్ (30వ నిమిషంలో), కాన్ రసెల్ (43వ ని.లో), టంగ్యూ కసిన్స్ (54వ ని.లో) తలా ఒక గోల్ కొట్టగా... ఢిల్లీ జట్టు తరఫున జాక్ వెటన్ (29వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. లీగ్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్లో వేదాంత కళింగ లాన్సర్స్తో హైదరాబాద్ తూఫాన్స్ తలపడుతుంది. నేటి నుంచి మహిళల లీగ్ మహిళల హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెచ్ఐఎల్)కు నేడు తెరలేవనుంది. గతంలో కేవలం పురుషుల కోసమే ఈ లీగ్ నిర్వహించగా... ఈ ఏడాది నుంచి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా పోటీలు జరుపుతున్నారు. పురుషుల లీగ్ రూర్కేలాలో జరుగుతుండగా... మహిళల లీగ్ మ్యాచ్లు రాంచీలో నిర్వహించనున్నారు. మహిళల విభాగంలో ఢిల్లీ ఎస్జీ పైపర్స్, ఒడిశా వారియర్స్, బెంగాల్ టైగర్స్, సూర్మా హాకీ క్లబ్ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఈ నెల 26న జరగనున్న ఫైనల్తో మహిళల లీగ్ ముగియనుంది. ఆదివారం జరగనున్న తొలి పోరులో ఢిల్లీ ఎస్జీ పైపర్స్తో ఒడిశా వారియర్స్ జట్టు తలపడనుంది. -
బెంగాల్ టైగర్స్ ‘హ్యాట్రిక్’
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) శ్రాచి బెంగాల్ టైగర్స్ ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగాల్ టైగర్స్ 4–1 తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ను మట్టికరిపించింది. బెంగాల్ టైగర్స్ తరఫున జుగ్రాజ్ సింగ్ (17వ, 38వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో సత్తాచాటగా... సుఖ్జీత్ సింగ్ (1వ నిమిషంలో), అభిషేక్ (47వ ని.లో) చెరో గోల్ సాధించారు. ఢిల్లీ పైపర్స్ తరఫున ఫర్లాంగ్ గారెత్ (53వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. లీగ్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన బెంగాల్ టైగర్స్ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో గోనాసిక జట్టు 3–1 గోల్స్ తేడాతో హైదరాబాద్ తూఫాన్స్పై గెలుపొందింది. గోనాసిక జట్టు తరఫున సునీల్ విఠలాచార్య (2వ ని.లో), చార్లెట్ విక్టర్ (33వ ని.లో), నీలమ్ సంజీప్ (60వ ని.లో) తలా ఒక గోల్ సాధించగా... హైదరాబాద్ తూఫాన్స్ తరఫున డానియల్ టిమోతీ (12వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మూడు మ్యాచ్ల్లో ఒక విజయం 2 పరాజయాలు మూటగట్టుకున్న గోనాసిక జట్టు 4 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉండగా... హైదరాబాద్ తూఫాన్స్ 3 మ్యాచ్ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్ల్లో వేదాంత కళింగ లాన్సర్స్తో సూర్మా హాకీ క్లబ్, తమిళనాడు డ్రాగన్స్తో యూపీ రుద్రాస్ తలపడుతుంది. -
ప్రేక్షకులకు ప్రవేశం ఉచితం
న్యూఢిల్లీ: ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) మ్యాచ్లను తిలకించేందుకు ప్రేక్షకులను ఉచితంగా అనుమతించాలని లీగ్ నిర్వాహకులు నిర్ణయించారు. ఆటను అభిమానులకు చేరువ చేసేందుకు ఇది సరైన మార్గం అని హెచ్ఐఎల్ గవర్నింగ్ కమిటీ చైర్మన్ దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. డిసెంబర్ 28 నుంచి రూర్కేలాలోని బిర్సా ముండా స్టేడియంలో పురుషుల హెచ్ఐఎల్ ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పాల్గొననున్న ఈ లీగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న జరగనున్న ఫైనల్తో ముగియనుంది. మరోవైపు రాంచీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 26 మధ్య నిర్వహించనున్న మహిళల హెచ్ఐఎల్ లీగ్లో 4 జట్లు పాల్గొంటున్నాయి. ‘టికెట్ల విక్రయంతో డబ్బు సంపాదించడంకన్నా... ఆటను అభిమానులకు చేరువ చేయడం ముఖ్యం. ప్రత్యక్షంగా మ్యాచ్లు చూసే అనుభూతి ప్రతి ఒక్కరూ పొందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హాకీ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.‘మైదానాల్లోకి ఉచిత ప్రవేశం కల్పించడంతో ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా... ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయి పోరాటాలను నేరుగా వీక్షించే అవకాశం ఉంది’ అని హెచ్ఐఎల్ గవరి్నంగ్ కమిటీ చైర్మన్ దిలీప్ టిర్కీ అన్నాడు. -
HIL: విక్టర్కు రూ. 40 లక్షలు
ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలవుతున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)కు సంబంధించి పురుషుల విభాగం వేలం కార్యక్రమం సోమవారం ముగిసింది. రెండో రోజు బెల్జియం స్టార్ మిడ్ఫీల్డర్ విక్టర్ వెగ్నెజ్కు అత్యధికంగా రూ. 40 లక్షలు లభించాయి. బెల్జియం జట్టులో కీలక సభ్యుడువిక్టర్ను పంజాబ్కు చెందిన సూర్మా హాకీ క్లబ్ కొనుగోలు చేసింది. 28 ఏళ్ల విక్టర్ బెల్జియం తరఫున ఇప్పటి వరకు 175 మ్యాచ్లు ఆడాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన బెల్జియం జట్టులో, 2018 ప్రపంచకప్ సాధించిన బెల్జియం జట్టులో విక్టర్ కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. మన వాళ్లకు ఎంతంటే?నెదర్లాండ్స్కు చెందిన థియరీ బ్రింక్మన్, ఆర్థుర్ వాన్ డోరెన్లను కళింగ లాన్సర్స్ జట్టు వరుసగా రూ. 38 లక్షలకు, రూ. 32 లక్షలకు సొంతం చేసుకుంది. భారత యువ ఆటగాడు మొరాంగ్థిమ్ రబిచంద్రను కళింగ లాన్సర్స్ జట్టు రూ. 32 లక్షలకు కొనుగోలు చేసింది.భారత్కే చెందిన అంగద్బీర్ సింగ్ను కళింగ లాన్సర్స్ జట్టు రూ. 26 లక్షలకు... హైదరాబాద్ తూఫాన్స్ జట్టు రాజిందర్ను రూ. 23 లక్షలకు కైవసం చేసుకుంది. -
కొత్త హంగులతో పునరాగమనం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్ఫూర్తితో ప్రారంభమైన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. 2017లో నిలిచిపోయిన హెచ్ఐఎల్ను తిరిగి ఆరంభించాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. ఈసారి లీగ్కు సరికొత్త హంగులు అద్దగా... పురుషులతో పాటు మహిళల విభాగంలో పోటీలుజరగనున్నాయి. డిసెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్ కోసం ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు ప్లేయర్ల వేలం జరగనుంది. ఒక్కో జట్టులో 24 మంది ప్లేయర్లు ఉండనున్నారు. ఇందులో నలుగురు జూనియర్ ఆటగాళ్లు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టును రెసల్యూట్ స్పోర్ట్స్ కంపెనీ సొంతం చేసుకుంది. మహిళల లీగ్ తుదిపోరు వచ్చే ఏడాది జనగరి 26న, పురుషుల ఫైనల్ ఫిబ్రవరి 1న నిర్వహించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రకటించాడు. ఏడేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న లీగ్ విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, క్రీడావిభాగం దేశంలో హాకీ క్రీడకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఏడేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభం కానుంది. 2013లో ప్రారంభమైన లీగ్ ఐదు సీజన్లు పాటు విజయవంతంగా కొనసాగిన తర్వాత 2017లో అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ శుక్రవారం వెల్లడించాడు. గతంలో పురుషుల విభాగంలో మాత్రమే పోటీలు జరగగా... ఈ సారి మహిళల విభాగంలోనూ మ్యాచ్లు జరగనున్నాయి. హెచ్ఐఎల్ తిరిగి ప్రారంభమవడం ద్వారా ఆటకు మరింత ఆదరణ దక్కడంతో పాటు... మహిళల హాకీలో కోత్త జోష్ రానుంది. భారత మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీ హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి... ఈ లీగ్ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేయగా... ఇప్పటికి కార్యరూపం దాలి్చంది. హెచ్ఐఎల్కు టిర్కీనే చైర్మన్గా వ్యవహరించనున్నాడు. ‘జాతీయ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లను అందించడంలో హాకి ఇండియా లీగ్ కీలక పాత్ర పోషించనుంది. హాకీ క్రీడలో కొత్త అధ్యాయానికి నేడు తెర లేచినట్లు అనిపిస్తోంది. అడగ్గానే హెచ్ఐఎల్ కోసం 35 రోజుల సమయాన్ని కేటాయించిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)కు ధన్యవాదాలు. హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దీని కోసం కృషి చేశా. ఇప్పటికి కల సాకారమైంది’ అని టీర్కీ పేర్కొన్నాడు. హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్ మాట్లాడుతూ... భారత్లో హాకీ కేవలం క్రీడ మాత్రమే కాదని దీనికి భారతీయుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. 2036 వరకు భారత హాకీకి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్గా వ్యవహరించనుందని పునరుద్ఘాటించారు. జట్ల వివరాలు పురుషుల విభాగంలో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. వాటిలో చెన్నై జట్టుకు చార్లెస్ గ్రూప్, లక్నో జట్టుకు యదు స్పోర్ట్స్, పంజాబ్ జట్టుకు జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్ జట్టుకు ష్రాచీ స్పోర్ట్స్, హైదరాబాద్ జట్టుకు రెసల్యూట్ స్పోర్ట్స్, రాంచీ జట్టుకు నవోయమ్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులుగా కొనసాగనున్నారు. టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతికి చెందిన ఎస్జీ స్పోర్ట్స్ కంపెనీ ఢిల్లీ జట్టును సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో హరియాణా జట్టును జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్ టీమ్ను ష్రాచీ స్పోర్ట్స్, ఢిల్లీ జట్టును ఎస్జీ స్పోర్ట్స్, ఒడిశా జట్టును నవోయమ్ స్పోర్ట్స్ సొంతం చేసుకున్నాయి. మరో రెండు ఫ్రాంచైజీల యజమానులను త్వరలోనే వెల్లడించనున్నారు. » పురుషుల విభాగంలో 8 జట్లు, మహిళల విభాగంలో 6 జట్లు లీగ్లో పాల్గొననున్నాయి. గతంలో కేవలం పురుషుల విభాగంలోనే పోటీలు జరగగా.. తొలిసారి మహిళా లీగ్ను ప్రవేశ పెడుతున్నారు. » పురుషుల విభాగంలో పోటీలను రౌర్కెలాలో, మహిళల మ్యాచ్లను రాంచీలో నిర్వహించనున్నారు. » ఒక్కో జట్టులో 24 మంది ఆటగాళ్లు ఉండనున్నారు. వారిలో 16 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీయులకు అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో నలుగురు జూనియర్ ప్లేయర్లు తప్పనిసరి. » డిసెంబర్ 28న ఈ లీగ్ ప్రారంభం కానుండగా... మహిళల విభాగంలో వచ్చే ఏడాది జనవరి 26న రాంచీలో ఫైనల్ జరగనుంది. పురుషుల విభాగంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రౌర్కెలాలో తుదిపోరు జరగనుంది. » ఈనెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ప్లేయర్ల వేలంలో అన్ని ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. ప్లేయర్ల కనీస ధరను మూడు కేటగిరీలుగా (రూ. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు) విభజించారు. » ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు పురుషుల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 4 కోట్లు... మహిళల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 2 కోట్లు ఖర్చు చేయవచ్చు. » 2013లో తొలిసారి నిర్వహించిన హెచ్ఐఎల్లో రాంచీ రైనోస్ టైటిల్ సాధించగా.. ఆ తర్వాత 2014లో ఢిల్లీ వేవ్రైడర్స్, 2015లో రాంచీ రాయ్స్, 2016లో పంజాబ్ వారియర్స్, 2017లో కళింగ లాన్సర్స్ చాంపియన్గా నిలిచాయి. » పారిస్ ఒలింపిక్స్ తర్వాత హాకీ ఆటకు గుడ్బై చెప్పిన భారత దిగ్గజ గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఢిల్లీ జట్టుకు డైరెక్టర్గా వ్యవహరించనున్నాడు. -
ఏడేళ్ల విరామం తర్వాత...
న్యూఢిల్లీ: ఏడేళ్ల విరామం తర్వాత హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) తిరిగి అభిమానుల మందుకు రానుంది. 2013లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన హెచ్ఐఎల్ ఐదు సీజన్ల తర్వాత 2017లో నిలిచిపోయింది. హకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడిగా దిలీప్ టిర్కీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ లీగ్ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేయగా... ఎట్టకేలకు శుక్రవారం దీనికి ఆమోద ముద్ర లభించింది. ఈ ఏడాది డిసెంబర్ 28న ప్రారంభం కానున్న ఈ లీగ్ సరికొత్త రూపంలో ప్రేక్షకులను అలరించనుంది. గతంలో పురుషుల విభాగంలో మాత్రమే పోటీలు జరగగా... ఇప్పుడు మహిళల విభాగంలోనూ నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో 8 జట్లు (చెన్నై, లక్నో, పంజాబ్, కోల్కతా, ఢిల్లీ, ఒడిశా, రాంచీ, హైదరాబాద్)... మహిళల విభాగంలో 6 జట్లు (పంజాబ్, కోల్కతా, ఢిల్లీ, ఒడిశా, మరో 2 జట్లను ప్రకటించాలి) పోటీపడతాయి. పురుషుల మ్యాచ్లను రౌర్కెలాలో, మహిళల పోటీలను రాంచీలో నిర్వహించనున్నారు. మహిళల లీగ్ ఫైనల్ వచ్చే ఏడాది జనవరి 26న, పురుషుల తుదిపోరు ఫిబ్రవరి 1న జరగనుంది. లీగ్ కోసం ఈ నెల 13 నుంచి 15 వరకు ప్లేయర్ల వేలం జరగనుంది. మూడు కేటగిరీల్లో (రూ. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు) ప్లేయర్లను విభజించారు. ఒక్కో జట్టులో 24 మంది ప్లేయర్లు ఉండనున్నారు. అందులో కనీసం 16 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీయులకు అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో నలుగురు జూనియర్లు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. ఈ లీగ్తో దేశంలో మహిళల హాకీకి మరింత ఆదరణ దక్కుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2017లో చివరిసారి జరిగిన హాకీ ఇండియా లీగ్లో కళింగ లాన్సర్స్ జట్టు విజేతగా నిలిచింది. -
హెచ్ఐఎల్ కింగ్ కళింగ
చండీగఢ్: పొగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఇదేనేమో... గత సీజన్ తుదిమెట్టుపై చేజారిన టైటిల్ను ఈసారి కళింగ లాన్సర్స్ ఒడిసి పట్టుకుంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్లో విజేతగా నిలిచింది. ఫైనల్లో కళింగ జట్టు 4–1తో దబంగ్ ముంబైపై జయభేరి మోగించింది. లాన్సర్స్ ఆటగాళ్ల దూకుడుతో మొదలైన ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. మోరిట్జ్ ఫ్యుయరిస్ట్ రెండు గోల్స్తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పో షించాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో కళింగ లాన్సర్స్ రెండు అర్ధభాగాలు ముగిసే సమయానికి మ్యాచ్ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. మొదట ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చడంతో తొలి క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో అర్ధభాగంలో కళింగ లాన్సర్ ఆటగాళ్లు ఒక్కసారిగా చెలరేగారు. దీంతో ఆట మొదలైన మూడో నిమిషంలోనే గ్లెన్ టర్నర్ (18వ నిమిషం) ఫీల్డు గోల్ చేయడంతో కళింగ జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం ఫీల్డు గోల్కు రెండు గోల్స్గా పరిగణిస్తారు. తర్వాత రెండో క్వార్టర్ కాసేపట్లో ముగుస్తుందనగా మోరిట్జ్ ఫ్యుయరిస్ట్ (30వ ని.) పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. దీంతో కళింగ 3–0తో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే మూడో క్వార్టర్లో దబంగ్ ముంబై ఖాతా తెరిచింది. ఆట 33వ నిమిషంలో అఫాన్ యూసుఫ్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచడంతో కళింగ ఆధిక్యం 3–1కు తగ్గింది. చివరి క్వార్టర్లో మళ్లీ మోరిట్జ్ (59వ ని.) గోల్ చేయడంతో లాన్సర్ 4–1తో టైటిల్ను ఎగరేసుకుపోయింది. విజేతగా నిలిచిన కళింగ లాన్సర్స్కు రూ. 2 కోట్ల 50 లక్షలు... రన్నరప్ ముంబై జట్టుకు రూ. కోటీ 25 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో యూపీ విజార్డ్స్ 5–4తో ఢిల్లీ వేవ్రైడర్స్ను ఓడించింది. -
ఫైనల్లో దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్ జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో దబంగ్ ముంబై జట్టు 2–0తో ఢిల్లీ వేవ్రైడర్స్పై గెలుపొందగా... కళింగ లాన్సర్స్ ‘షూటౌట్’లో 4–3తో యూపీ విజార్డ్స్ జట్టును ఓడించింది. నేడు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
రాంచీ రేస్ నిష్క్రమణ
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో మాజీ చాంపియన్ రాంచీ రేస్ జట్టు సెమీఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఢిల్లీ వేవ్రైడర్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో రాంచీ రేస్ 6–2 గోల్స్ తేడాతో గెలిచింది. రాంచీ రేస్ తరఫున మన్ప్రీత్ సింగ్ రెండు ఫీల్డ్ గోల్స్ చేయగా, ఇమ్రాన్ ఖాన్ ఒక ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్తో సమానం) సాధించాడు. ఢిల్లీ జట్టుకు జస్టిన్ రీడ్ ఏకైక ఫీల్డ్ గోల్ అందించాడు. నిర్ణీత 10 లీగ్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న రాంచీ జట్టు 23 పాయింట్లతో ఢిల్లీ వేవ్రైడర్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఉత్తరప్రదేశ్ విజార్డ్స్, ఢిల్లీ వైవ్రైడర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకున్నాయి. ఇప్పటికే దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్ జట్లు కూడా సెమీఫైనల్కు చేరాయి. -
యూపీ విజార్డ్స్, ఢిల్లీ వేవ్రైడర్స్ మ్యాచ్ డ్రా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా యూపీ విజార్డ్స్, ఢిల్లీ వేవ్రైడర్స్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ డ్రా అయింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు 1–1 స్కోరుతో సమంగా నిలిచాయి. యూపీ జట్టు తరఫున పేయ్లెట్ (22వ ని.), ఢిల్లీ జట్టులో రూపిందర్ (22వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచారు. సోమవారం జరిగే మ్యాచ్లో యూపీ విజార్డ్స్ జట్టుతో పంజాబ్ వారియర్స్ జట్టు తలపడుతుంది. -
సెమీస్లో దబంగ్ ముంబై
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో దబంగ్ ముంబై జట్టు 3–2తో ఢిల్లీ వేవ్రైడర్స్పై విజయం సాధించింది. ఈ సీజన్లో 9 మ్యాచ్లాడిన ముంబై ప్రస్తుతం 33 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. -
యూపీ విజార్డ్స్ గెలుపు
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ఉత్తరప్రదేశ్ (యూపీ) విజార్డ్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం పంజాబ్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో యూపీ విజార్డ్స్ 6–2తో గెలిచింది. యూపీ తరఫున షంషేర్ సింగ్ (5వ ని.లో), అజయ్ యాదవ్ (40వ ని.లో), ఆకాశ్దీప్ సింగ్ (58వ ని.లో) ఒక్కో ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్తో సమానం) చేశారు. పంజాబ్ జట్టుకు మిర్కో ప్రుసెర్ (31వ ని.లో) ఏకైక ఫీల్డ్ గోల్ అందించాడు. -
కళింగ లాన్సర్స్పై ఢిల్లీ వేవ్రైడర్స్ గెలుపు
ఢిల్లీ: హాకీ ఇండియా లీగ్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ వేవ్రైడర్స్ జట్టు 6–4తో కళింగ లాన్సర్స్పై నెగ్గింది. ఢిల్లీ జట్టులో తల్విందర్ (9వ ని.), సిమోన్ (59వ ని.) ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్తో సమానం) చేయగా... జస్టిన్ (29వ ని.), రూపిందర్ (57వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచారు. -
కళింగ, యూపీ మ్యాచ్ డ్రా
లక్నో: హాకీ ఇండియా లీగ్లో భాగంగా కళింగ లాన్సర్స్, యూపీ విజార్డ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది. ధ్యాన్చంద్ హాకీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్ 2–2 గోల్స్తో డ్రాగా ముగిసింది. యూపీ విజార్డ్స్ తరఫున వీఆర్ రఘునాథ్ (15వ ని.), గొంజాలో పేయ్లట్ లు గోల్స్ సాధించగా... కళింగ లాన్సర్స్ తరఫున కెప్టెన్ మోరిట్జ్ ప్యూర్స్టే (15వ ని., 51వ ని.) రెండు గోల్స్ను చేశాడు. శనివారం జరిగే మ్యాచ్లో పంజాబ్ వారియర్స్తో దబంగ్ ముంబై తలపడుతుంది. -
పంజాబ్ వారియర్స్ను గెలిపించిన వీర్డెన్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్లో పంజాబ్ వారియర్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. రాంచీ రేస్తో గురువారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 25వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను వీర్డెన్ గోల్గా మలిచి పంజాబ్ను గెలిపించాడు. -
ఢిల్లీకి తొలి విజయం
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్లో ఢిల్లీ వేవ్రైడర్స్ జట్టు బోణీ చేసింది. యూపీ విజార్డ్స్ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 8–1తో గెలిచి ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ తరఫున మన్దీప్ సింగ్ రెండు, పర్వీందర్ సింగ్ ఆస్టిన్ స్మిత్ ఒక్కో ఫీల్డ్ గోల్ చేశారు. -
కళింగపై ముంబై జయభేరి
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 5–2 స్కోరుతో కళింగ లాన్సర్స్ను కంగుతినిపించింది. దీంతో ఏడు మ్యాచ్లాడిన ముంబై నాలుగు విజయాలతో 23 పాయింట్లతో పట్టికలో టాప్లో నిలిచింది. దబంగ్ దెబ్బకు కళింగ (20) రెండో స్థానానికి పడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఆటగాళ్లు రెచ్చిపోయారు. మ్యాచ్ జరిగే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో కదంతొక్కారు. ఈ జట్టు తరఫున హర్మన్ప్రీత్ (23వ ని.) పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచగా... ఫ్లోరియన్ ఫుచెస్ (31వ ని.), గుర్జంత్ సింగ్ (53వ ని.) ఫీల్డు గోల్స్ చేశారు. దీంతో నిబంధనల ప్రకారం రెండేసి పాయింట్లు లభించాయి. చివర్లో గ్లెన్ టర్నర్ (57వ ని.) ఫీల్డ్ గోల్ చేయడంతో కళింగ జట్టుకు 2 పాయింట్లు దక్కాయి. -
ముంబైకి కళింగ లాన్సర్స్ షాక్
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో వరుస విజయాలతో జోరు మీదున్న దబంగ్ ముంబై జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో కళింగ లాన్సర్స్ జట్టు 4–3 గోల్స్ తేడాతో ముంబై జట్టును బోల్తా కొట్టించింది. కళింగ లాన్సర్స్ తరఫున ఫ్యుర్స్టె మోరిట్జ్ రెండు పెనాల్టీ కార్నర్ల ద్వారా రెండు గోల్స్ (32వ 33వ ని.లో) చేయగా... బాకెర్ బిల్లీ (40వ ని.లో) ఫీల్డ్ గోల్ సాధించాడు. హెచ్ఐఎల్లో ఒక ఫీల్డ్ గోల్, పెనాల్టీ స్ట్రోక్ రెండు గోల్స్తో సమానం. అంతకుముందు ముంబై తరఫున హర్మన్ప్రీత్ సింగ్ 27వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ను గోల్గా మలిచాడు. దాంతో ముంబై 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 43వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ను లక్ష్యానికి చేర్చడంతో ముంబై ఖాతాలో మరో గోల్ చేరింది. ఆ తర్వాత ముంబై మరో గోల్ చేసేందుకు ప్రయత్నించినా లాన్సర్స్ అడ్డుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే మ్యాచ్లో పంజాబ్ వారియర్స్తో రాంచీ రేస్ తలపడుతుంది. -
ముంబై ‘హ్యాట్రిక్’
ముంబై: హాకీ ఇండియా లీగ్లో దబంగ్ ముంబై ‘హ్యాట్రిక్’ విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై 3–2 గోల్స్ తేడాతో ఢిల్లీ వేవ్రైడర్స్పై నెగ్గింది. ముంబై ఆటగాడు యూసుఫ్ (29వ ని. 30వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేశాడు. 29వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేయడంతో 2 పాయింట్లు లభించాయి. ఢిల్లీ తరఫున రీడ్ (43వ ని.), రూపిందర్ (55వ ని.) చెరో గోల్ చేశారు. -
ముంబై చేతిలో పంజాబ్కు షాక్
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ జేపీ పంజాబ్ వారియర్స్కు దబంగ్ ముంబై చేతిలో దారుణ పరాజయం ఎదురైంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్ లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ముంబై 10–4 తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్లో అన్నీ ఫీల్డ్ గోల్సే నమోదు కావడంతో ఒక్కో గోల్కు రెండు పాయింట్లు లభించాయి. ముంబై నుంచి ఆరో నిమిషంలోనే నికిన్ తిమ్మయ్య గోల్తో జట్టు 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సునీల్ యాదవ్ (25), ఫ్లోరియన్ (30, 43), యూసుఫ్ (49, 50) గోల్స్ చేశారు. పంజాబ్ నుంచి గోడెస్ (13), అర్మాన్ ఖురేషి (44) చెరో గోల్ చేశారు. శనివారం జరిగే మ్యాచ్లో రాంచీ రేస్తో ఢిల్లీ వేవ్రైడర్స్ ఆడుతుంది. -
యూపీ విజార్డ్స్పై ముంబై విజయం
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై జట్టు తొలి విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ (యూపీ) విజార్డ్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో దబంగ్ ముంబై 4–3 గోల్స్ తేడాతో నెగ్గింది. గురువారం జరిగే మ్యాచ్లో రాంచీ రేస్తో కళింగ లాన్సర్స్ ఆడుతుంది. -
కళింగ లాన్సర్స్కు రెండో విజయం
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో కళింగ లాన్సర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రాంచీ రేస్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో కళింగ లాన్సర్స్ 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. లాన్సర్స్ జట్టు తరఫున గ్లెన్ టర్నర్ నాలుగు గోల్స్ చేయడం విశేషం. రాంచీ రేస్ జట్టుకు సర్వన్జిత్ సింగ్ రెండు గోల్స్ అందించాడు. మంగళవారం జరిగే మ్యాచ్లో దబంగ్ ముంబై జట్టుతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ తలపడుతుంది. -
ముంబై, రాంచీ మ్యాచ్ డ్రా
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్ ‘డ్రా’తో మొదలైంది. దబాంగ్ ముంబై, రాంచీ రేస్ జట్ల మధ్య శనివారం జరిగిన తొలి మ్యాచ్ 3–3తో ‘డ్రా’గా ముగిసింది. ఆదివారం జరిగే మ్యాచ్లో కళింగ లాన్సర్స్తో ఢిల్లీ వేవ్రైడర్స్ తలపడుతుంది. -
నేటి నుంచి హాకీ ఇండియా లీగ్
► ప్రారంభ మ్యాచ్లో ముంబై, రాంచీ పోరు ► స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్ కు నేడు (శనివారం) తెర లేవనుంది. నాలుగు సీజన్లపాటు అభిమానులను ఆకట్టుకున్న ఈ లీగ్ తాజా సీజన్ ప్రారంభ మ్యాచ్లో దబాంగ్ ముంబై, రాంచీ రేస్ జట్లు తలపడతాయి. పంజాబ్ వారియర్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది. వచ్చే నెల 26 వరకు జరిగే హెచ్ఐఎల్లో మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పటిదాకా కనీసం సెమీఫైనల్స్కు కూడా చేరుకోలేకపోయిన ముంబై ఈనెల చివరి వరకు ఐదు మ్యాచ్లను సొంత వేదికపైనే ఆడనుంది. దీంతో ఈసారి టైటిల్ సాధించాలనే కసితో ఉంది. అష్లే జాక్సన్ , బారీ మిడిల్టన్ , ఫెర్గుస్, గుర్బజ్ సింగ్, కొతజిత్ సింగ్ మన్ ప్రీత్ సింగ్, బీరేంద్ర లక్రాలతో ఈ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ వేవ్రైడర్స్, పంజాబ్ వారియర్స్, కళింగ లాన్సర్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ ఇతర జట్లు. -
హెచ్ఐఎల్ డబ్బుతో వర్సిటీ ఫీజు కట్టుకుంటా: క్రెయిగ్
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్(హెచ్ఐఎల్) కొందరి హాకీ ఆట గాళ్ల పాలిట వరమైంది. దేశవాళీ ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లకూ కల్పతరువైంది. ఈ లీగ్ పుణ్యమాని ఆస్ట్రేలియా ఆట గాడు టామ్ క్రెయిగ్ తన ఉన్నత చదువులకు కావాల్సిన డబ్బు ను సంపాదించుకోగలిగాడు. ఆసీస్ యువ ఫార్వర్డ్ టామ్ తనకు యూనివర్సిటీ ఫీజును చెల్లించుకునే స్థోమత హెచ్ఐఎల్ వల్లే కలుగుతోందని తెగ సంబరపడుతున్నాడు. కళింగ లాన్స ర్స్ ఫ్రాంచైజీ అతన్ని రూ. 45.65 లక్షలకు (67 వేల డాలర్లు) కొనుగోలు చేసింది. హాకీ ప్లేయర్లకు ఇది భారీ మొత్తమని, దీని వల్ల తన ఆర్థిక అవసరాలు, వర్సిటీ ఫీజు కష్టాలు తొలగిపోతాయని 21 ఏళ్ల టామ్ చెప్పాడు. ఈ నెల 21న హెచ్ఐఎల్ మొదలవనుంది. -
జనవరి 21 నుంచి హెచ్ఐఎల్-5
ముంబై: వచ్చే ఏడాది జనవరి 21న హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్కు తెర లేవనుంది. ముంబైలో దబంగ్ ముంబై, రాంచీ రేస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 25న సెమీఫైనల్స్, ఫిబ్రవరి 26న ఫైనల్ జరుగుతారుు. ‘హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ జట్టు మైదానంలో సెమీఫైనల్స్, ఫైనల్ను నిర్వహిస్తారు. ప్రస్తుత విజేత పంజాబ్ వారియర్స్ కావడంతో సెమీస్, ఫైనల్ చండీగఢ్లో జరుగుతారుు’ అని హెచ్ఐఎల్ చైర్మన్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. -
డాబు మనది..... డబ్బువాళ్లది......
జాతీయ జట్టులో చోటు లేదా...? ఫర్వాలేదు ఐపీఎల్ ఉందిగా... ఒక విదేశీ క్రికెటర్ ఆలోచన. ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించేశాను, ఇక చేసేదేముంది... ఇబ్బందేమీ లేదు ఇండియన్ సూపర్ లీగ్లో ఆడుకోవచ్చు... ఒక ఫుట్బాలర్ మనోగతం. హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్... భారత్లో జరిగే ఏ లీగ్లోనైనా బరిలోకి దిగేందుకు విదేశీ ఆటగాళ్లు సిద్ధం. ఇక్కడి లీగ్లు వారికి బంగారు బాతుగుడ్లుగా మారాయి. పేరు చూస్తే ఇండియన్... నిర్వహణ, ఏర్పాట్లు, హడావిడి, హంగామా అంతా భారతీయులదే. కానీ మన ఆటగాళ్లకు మాత్రం ఆర్థిక పరంగా దక్కుతోంది అంతంత మాత్రమే. తక్కువ సంఖ్యలో ఉన్నా... విదేశీ క్రీడాకారులు కొల్లగొడుతోంది చాలా ఎక్కువ మొత్తమే. సాక్షి క్రీడా విభాగం ప్రస్తుతం భారత్లో ఏడు క్రీడాంశాల్లో ఎనిమిది రకాల లీగ్లు నడుస్తున్నాయి. ఐపీఎల్, ఐఎస్ఎల్, హాకీ ఇండియా లీగ్, ప్రొ కబడ్డీ లీగ్, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, ప్రొ రెజ్లింగ్, ఐపీటీఎల్, సీటీఎల్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ లీగ్లలో ఆటగాళ్లకు చెల్లిస్తున్న డబ్బుకు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ‘ఇండియన్ స్పోర్ట్స్ సాలరీస్ రిపోర్ట్ 2016’ దీనికి సంబంధించి ఒక సర్వే నిర్వహించింది. ఆయా టోర్నీల నిర్వహణకు సంబంధించి ఇతర అంశాల జోలికి వెళ్లకుండా కేవలం ప్లేయర్లు ఎంత సంపాదిస్తున్నారనేదానిపైనే ఈ నివేదిక రూపొందింది. సాధారణంగా అందరూ అనుకునే విధంగా ఐపీఎల్లో ఆడుతున్న ఆటగాళ్లు ఎక్కువ మొత్తం సంపాదించడం లేదు. ఈ స్థానం టెన్నిస్ ఆటగాళ్లది. మొత్తంగా భారత లీగ్ల సొమ్ముతో విదేశీయులు ‘పండగ’ చేసుకుంటున్నారు. ►ఎనిమిది లీగ్లలో కలిపి ఆటగాళ్లకు చెల్లిం చేందుకు ప్రతీ ఏటా రూ. 1100 కోట్లు అందుబాటులో ఉంటున్నాయి. 2015 భారత క్రీడా బడ్జెట్లో ఇది 75 శాతం. ► గత ఏడాది ఆటగాళ్లకు రూ. 823 కోట్లు ఇచ్చారు. ►మొత్తం 857 మంది ప్లేయర్లలో 521 మంది భారతీయులు, 336 మంది విదేశీయులు ఉన్నారు. ►రూ. 527 కోట్లు విదేశీ ఆటగాళ్లు (64 శాతం) తీసుకుంటుండగా, భారత ఆటగాళ్లకు లభించిన మొత్తం 296 కోట్లు మాత్రమే (36 శాతం) ►రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ ఒక్కొక్కరు ఐపీటీఎల్లో రూ. 26 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. ఐపీఎల్లో ధోని, కోహ్లి కలిసి పొందే మొత్తం కంటే ఎక్కువ. ప్రొ కబడ్డీ లీగ్, రెజ్లింగ్ లీగ్, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లు మూడింటిలో కలిపి ఆటగాళ్లకు ఇస్తున్న మొత్తం...ఫెడరర్, నాదల్కు కలిపి ఇచ్చేదానికంటే తక్కువే. హాకీ లీగ్లో ఆటగాళ్లందరికీ ఇచ్చే డబ్బు కలిపితే ఒక్క ఫెడరర్కు ఇచ్చేదానికి సరిపోతుంది. ►ఐపీటీఎల్లోని ఆరుగురు ఆటగాళ్లు నిమిషానికి రూ. 6 లక్షల చొప్పున సంపాదిస్తున్నారు. వీరిలో అత్యధికంగా ఆండీ ముర్రే నిమిషానికి రూ. 14.34 లక్షలు ఆర్జించడం విశేషం. ►భారత ఆటగాళ్లలో రెజ్లర్ యోగేశ్వర్దత్ నిమిషానికి రూ. 1.65 లక్షలు అందుకున్నాడు. ►క్రికెటర్లలో గత ఏడాది ఐపీఎల్లో రూ. 16 కోట్ల విలువ పలికిన యువరాజ్ సింగ్కు నిమిషానికి రూ 1.01 లక్ష చొప్పున అందాయి. అయితే ఆర్జనలో దీనికి 17వ స్థానం మాత్రమే దక్కింది. కోహ్లి, ధోని, రైనాలైతే నిమిషానికి రూ. 75 వేలు మాత్రమే సంపాదించారు. ►భారత్లోని లీగ్లలో అత్యధికంగా ఐపీఎల్లో ఆటగాళ్లకు రూ. 420 కోట్లు లభిస్తున్నాయి. సగటున ఒక్కో క్రికెటర్కు ఏడాదికి రూ. 2.48 కోట్లు దక్కుతోంది. ►జట్టుపరంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 63.5 కోట్లు, ఐపీటీఎల్లో ఇండియన్ ఏసెస్ రూ. 63.36 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నాయి. ►తక్కువ మొత్తం చెల్లిస్తున్నా, సోషల్ మీడియాలో ప్రచారపరంగా ఎక్కువ విలువను తెచ్చి పెట్టగల ఆటగాళ్ల జాబితాలో గుత్తా జ్వాలకు అగ్రస్థానం దక్కగా, క్రికెటర్లలో సెహ్వాగ్ ముందున్నాడు. -
వారెవ్వా... వారియర్స్
హాకీ ఇండియా లీగ్ విజేత పంజాబ్ ఫైనల్లో కళింగ లాన్సర్స్పై గెలుపు రూ.2.50 కోట్ల ప్రైజ్మనీ సొంతం ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ రూపిందర్ రాంచీ: వరుసగా మూడుసార్లు ఫైనల్కు చేరిన జేపీ పంజాబ్ వారియర్స్ జట్టు చివరకు అనుకున్నది సాధించింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) నాలుగో సీజన్లో నూతన చాంపియన్గా అవతరించింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సర్దార్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు 6-1 తేడాతో కళింగ లాన్సర్స్పై ఘనవిజయం సాధించింది. విజేతగా నిలిచిన పంజాబ్కు రూ. 2 కోట్ల 50 లక్షల ప్రైజ్మనీ దక్కగా... రన్నరప్ కళింగకు రూ. కోటీ 75 లక్షలు లభించాయి. పంజాబ్ తరఫున అర్మాన్ ఖురేషి (4వ నిమిషంలో), మాట్ గోడెస్ (39), సత్బీర్ సింగ్ (42) ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్తో సమానం)తో అదరగొట్టగా... కళింగకు లభించిన ఏకైక గోల్ కెప్టెన్ మోరిట్జ్ అందించాడు. రెండేళ్లుగా తుది మెట్టుపై బోల్తా పడుతూ వచ్చిన పంజాబ్ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి రానీయకూడదనే కసితో తమ ఆటను ప్రారంభించింది. ఫలితంగా నాలుగో నిమిషంలోనే కళింగకు షాక్ తగిలింది. సర్కిల్లో బ్రౌన్ నుంచి అందుకున్న పాస్ను అర్మాన్ ఖురేషి చక్కటి ఫీల్డ్ గోల్తో జట్టుకు 2-0తో ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత రెండు పెనాల్టీ కార్నర్లు వచ్చినా గోల్స్గా మలచలేకపోయారు. అయితే రెండో క్వార్టర్ 24వ నిమిషంలో కళింగ బోణీ చేసింది. లీగ్లో అత్యంత విలువైన ఆటగాడిగా ఉన్న మోరిట్జ్ తమకు లభించిన తొలి పెనాల్టీని గోల్గా మలవడంతో స్కోరు 2-1కి తగ్గింది. మూడో క్వార్టర్లో పంజాబ్ ఆటగాళ్లు చక్క టి సమన్వయంతో ముందుకు వెళ్లారు. దీంతో నాలు గు నిమిషాల వ్యవధిలో రెండు ఫీల్డ్ గోల్స్ నమోదయ్యాయి. 39వ నిమిషంలో మాట్ గోడెస్, 42వ నిమిషంలో సత్బీర్ గోల్స్ సాధించడంతో స్కోరు 6-1కి పెరిగింది. చివర్లో ఇరు జట్లకు పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించినా సఫలం కాలేదు. రాంచీ రేస్తో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ వేవ్రైడర్స్ 2-0తో విజయం సాధించింది. అవార్డులు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్: రూపిందర్ పాల్ సింగ్ (ఢిల్లీ, రూ.50 లక్షలు) అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు: గ్లెన్ టర్నర్(కళింగ లాన్సర్స్, రూ.20 లక్షలు) ఫెయిర్ ప్లే అవార్డు: యూపీ విజార్డ్స్ అప్కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: సుమిత్ -
పంజాబ్తో కళింగ అమీతుమీ
సెమీస్లో ఓడిన రాంచీ రేస్, ఢిల్లీ హాకీ ఇండియా లీగ్ రాంచీ: డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టు హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) సెమీఫైనల్లోనే నిష్ర్కమించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ షూటౌట్ దాకా వెళ్లగా కళింగ లాన్సర్స్ 6-4తో రాంచీకి షాక్ ఇచ్చింది. దీంతో ఈ లీగ్లో తొలిసారిగా కళింగ ఫైనల్కు వెళ్లింది. ఆదివారం జరిగే తుది పోరులో కళింగ జట్టు పంజాబ్ వారియర్స్ను ఢీకొంటుంది. అంతకుముందు నిర్ణీత సమయంలో కళింగ, రాంచీ జట్లు 2-2తో సమంగా నిలిచాయి. విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. దీంట్లో మొదట రాంచీ రేస్ నుంచి కెప్టెన్ ఆష్లే జాక్సన్ తొలి ప్రయత్నాన్ని విఫలం చేయగా ఆ తర్వాత సర్వన్జిత్, మన్ప్రీత్ సింగ్ గోల్స్ చేశారు. అయితే నాలుగో షాట్ను మిడిల్టన్ గోల్గా మలచలేకపోయాడు. అటు కళింగ జట్టుకు కెప్టెన్ మోరిట్జ్ ఫ్యుయర్స్టే, క్యాస్పర్స్, లలిత్, జలెక్సి వరుసగా చేసిన గోల్స్తో జట్టు ఫైనల్కు చేరింది. మూడోసారి పంజాబ్ ఫైనల్లోకి.. అంతకుముందు జరిగిన తొలి సెమీస్లో ఢిల్లీ వేవ్రైడర్స్పై 3-1తో నెగ్గిన పంజాబ్ వారియర్స్ వరుసగా మూడోసారి ఫైనల్లోకి వెళ్లింది. ఢిల్లీ నుంచి రూపిందర్ పాల్ సింగ్ 6వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టుకు అర్మాన్ ఖురేషి (13) ఫీల్డ్ గోల్ చేయగా సైమన్ ఆర్కర్డ్ (51) పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి విజయాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్ సా. 5.20 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
సెమీస్లో ఢిల్లీ
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ఢిల్లీ వేవ్రైడర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 6-0తో కళింగ లాన్సర్స్పై విజయం సాధించింది. ఢిల్లీ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (18, 33వ ని.) పెనాల్టీలను గోల్స్గా మల్చగా, సైమన్ చిల్డ్ (34వ ని.), పర్వీందర్ సింగ్ (56వ ని.)లు ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్తో సమానం) చేశారు. శనివారం జరిగే తొలి సెమీస్లో ఢిల్లీ... జేపీ వారియర్స్తో తలపడుతుంది. -
ముంబై ఆశలు సజీవం
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబాంగ్ ముంబై తమ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. మంగళవారం ఉత్తరప్రదేశ్ విజార్డ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 6-3తో నెగ్గింది. ఈ ఓటమితో విజార్డ్స్ సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది. ముంబై తరఫున గుర్జంత్ సింగ్ (14వ నిమిషంలో), ఫ్లోరియన్ ఫచ్స్ (42), యూసుఫ్ అఫాన్ (59) ఫీల్డ్ గోల్స్తో అదరగొట్టారు. యూపీ విజార్డ్స్ నుంచి వీఆర్ రఘునాథ్ (19) పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచగా.. చింగ్లెన్సన సింగ్ (30) ఫీల్డ్ గోల్ చేశాడు. 10 మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో ప్రస్తుతం ముంబై జట్టు కళింగ లాన్సర్తో సమానంగా 25 పాయింట్లతో ఉంది. -
సెమీస్లో వారియర్స్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం కళింగ లాన్సర్స్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ను వారియర్స్ 4-4తో ‘డ్రా’ చేసుకుంది. ఈ టోర్నీలో ఇదే తొలి డ్రా కాగా రాంచీ రేస్ తర్వాత సెమీస్కు చేరిన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. తొలి అర్ధభాగంలో పూర్తి దూకుడును ప్రదర్శించిన కళింగ జట్టుకు 14వ నిమిషంలో మలక్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో 2-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత 29వ నిమిషంలో క్విర్జిన్ కాస్పర్స్ ఫీల్డ్ గోల్తో 4-0తో పైచేయి సాధించింది. అయితే ద్వితీయార్ధంలో వ్యూహం మార్చి ఆడిన పంజాబ్కు ఫలితం లభించింది. 35వ నిమిషంలో గోడెస్ ఫీల్డ్ గోల్ చేయడంతో పంజాబ్ 2-4తో మ్యాచ్లో నిలిచింది. మూడో క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీ ప్రదర్శనతో ఆకట్టుకున్నా మరో గోల్ నమోదు కాలేదు. అయితే ఆట మరో నిమిషం (59)లో ముగుస్తుందనగా వెట్టన్ అద్భుత ఫీల్డ్ గోల్తో పంజాబ్ను ఓటమి నుంచి తప్పించి మ్యాచ్ను ‘డ్రా’గా మలిచాడు. -
సెమీస్ లో రాంచీ రేస్
రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లో రాంచీ 6-0తో ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్పై నెగ్గింది. దీంతో ఆరు విజయాలు, మూడు ఓటములతో మొత్తం 32 పాయింట్లతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. రాంచీ తరఫున ఒగ్లివి ఫ్లిన్ (40వ ని.), జాక్సన్ ఆష్లే (47వ ని.), సుమిత్ కుమార్ (59వ ని.) ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్తో సమానం) సాధించారు. తొలి రెండు క్వార్టర్స్లో ప్రత్యర్థి సర్కిల్లోకి దూసుకెళ్లిన రాంచీ గోల్స్ కోసం చాలా అవకాశాలను సృష్టించుకుంది. రెండో అర్ధభాగంలో రాంచీ కొట్టిన ఐదు పెనాల్టీ కార్నర్లను గోల్కీపర్ శ్రీజేష్ అద్భుతంగా అడ్డుకున్నాడు. మూడో క్వార్టర్స్లో యూపీ అటాకింగ్ మొదలుపెట్టినా.. రాంచీ డిఫెన్స్ను ఛేదించలేకపోయింది. నాలుగో క్వార్టర్లో పూర్తి ఆధిక్యం ప్రదర్శించిన రాంచీ మరో రెండు ఫీల్డ్ గోల్స్తో మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్లో రాంచీ రేస్.. దబాంగ్ ముంబైతో తలపడుతుంది.a -
‘టాప్’లోకి వారియర్
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. దబంగ్ ముంబై జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ వారియర్స్ 5-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. వారియర్స్ జట్టుకు పెనాల్టీ కార్నర్ల ద్వారా వరుణ్ కుమార్ (2వ నిమిషంలో), మార్క్ గ్లెగ్హార్న్ (13వ నిమిషంలో), క్రిస్టోఫర్ సిరియెలో (25వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించగా... 40వ నిమిషంలో నితిన్ తిమ్మయ్య ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్తో సమానం) సాధించాడు. ముంబై జట్టు తరఫున జెరెమి హేవార్డ్ ఏకైక గోల్ చేశాడు. ప్రసుత్తం వారియర్స్, రాంచీ రేస్ 27 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నా, మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా వారియర్స్ జట్టు ‘టాప్’లోకి వచ్చింది. పట్నా ఘనవిజయం కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 47-34 తేడాతో దబాంగ్ ఢిల్లీపై ఘనవి జయం సాధించింది. దీంతో ఈ జట్టు 33 పాయింట్లతో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీపక్ నర్వాల్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి 13 రైడ్, 2 టాకిల్ పాయింట్లు సాధిం చగా పర్దీప్ నర్వాల్ 11 రైడ్ పాయింట్లు సాధించాడు. ఢిల్లీ నుంచి సుర్జీత్ సింగ్ (10) మెరుగ్గా రాణించాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 25-22 తేడాతో పుణెరి పల్టన్ను ఓడించింది. పుణె నుంచి అజయ్ ఠాకూర్ (11) రాణించాడు. -
పంజాబ్పై యూపీ విజయం
పంజాబ్పైయూపీ విజయం లక్నో: హాకీ ఇండియా లీగ్లో సొంతగడ్డపై ఉత్తరప్రదేశ్ (యూపీ) విజార్డ్స్ తమ చివరి మ్యాచ్లో గెలిచింది. పంజాబ్ వారియర్స్తో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో యూపీ 4-1 గోల్స్ తేడాతో నెగ్గింది. 10వ నిమిషంలో మార్క్ గ్లెన్హార్న్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచడంతో పంజాబ్కు ఆధిక్యం లభించింది. 19వ నిమిషంలో యూపీ తరఫున పిలెట్ గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. 41వ నిమిషంలో పిలెట్ మరో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచి యూపీని ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 43వ నిమిషంలో ఆగస్టిన్ ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్తో సమానం) చేయడంతో యూపీ 4-1తో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత యూపీ ఖాతాలో 23 పాయింట్లు ఉన్నాయి. దీంతో సెమీస్ అవకాశాలు సజీవంగా నిలిచాయి. -
దబాంగ్ ముంబై సంచలన విజయం
హాకీ ఇండియా లీగ్ న్యూఢిల్లీ: చివరి పది నిమిషాల వరకు ఢిల్లీ వేవ్రైడర్స్ ఆధిక్యం 3-0. ఈ దశలో దబాంగ్ ముంబై అద్భుతమే చేసింది. ఏకంగా నాలుగు ఫీల్డ్ గోల్స్తో చెలరేగి చివరకు 8-3తో ఘనవిజయాన్ని అందుకుంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించింది. పటిష్టమైన వీరి డిఫెన్స్ను ప్రత్యర్థి ఛేదించలేకపోయింది. 22వ నిమిషంలో స్టీవెన్ ఎడ్వర్డ్స్ ఫీల్డ్ గోల్తో ఢిల్లీకి 2-0 ఆధిక్యం దొరికింది. 39వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను రూపిందర్ పాల్ సింగ్ గోల్గా మలిచి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఇక ఢిల్లీ గెలుపు ఖాయమే అనుకున్న దశలో ముంబై తరఫున 49వ నిమిషంలో డానిష్ ముజ్తబా ఫీల్డ్ గోల్తో పరిస్థితి మారింది. మరో మూడు నిమిషాలకే నీలకంఠ శర్మ ఫీల్డ్ గోల్తో స్కోరు 4-3తో ముంబైకి అనుకూలంగా మారింది. దీనికి తోడు 57, 58వ నిమిషాల్లో మన్ప్రీత్ వరుసగా రెండు ఫీల్డ్ గోల్స్ చేయడంతో ముంబై అద్భుత విజయాన్ని అందుకుంది. -
రాంచీ రేస్ విజయం
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ నాలుగో సీజన్లో భాగంగా సోమవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ 3-2తో కళింగ లాన్సర్ను ఓడించింది. ఆరంభంలో జోరు కనబరిచిన కళింగ తొమ్మిదో నిమిషంలోనే ధరమ్వీర్ ఫీల్డ్ గోల్ చేయడంతో 2-0 ఆధిక్యం పొందింది. అయితే 10వ నిమిషంలోనే రాంచీ కెప్టెన్ ఆష్లే జాక్సన్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. ఆ తర్వాత మూడు క్వార్టర్ల వరకు తమ ఆధిక్యాన్ని కాపాడుకున్న కళింగకు 49వ నిమిషంలో రాంచీ రేస్ షాకిచ్చింది. ఆమిర్ ఖాన్ ఫీల్డ్ గోల్తో స్కోరు 3-2గా మారింది. అయితే 53వ నిమిషంలో స్కోరును సమం చేసే అవకాశం వచ్చినప్పటికీ కళింగ విఫలం చేసుకోవడంతో రాంచీ విజయం ఖరారైంది. -
దబాంగ్ ముంబైకి మరో విజయం
లక్నో: వరుస పరాజయాల అనంతరం దబాంగ్ ముంబై విజయాల బాట పట్టింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) నాలుగో సీజన్లో భాగంగా శనివారం ఉత్తరప్రదేశ్ విజార్డ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 2-1 తేడాతో నెగ్గింది. ఆరంభం నుంచి దూకుడును కనబరచడంతో 8వ నిమిషంలోనే ముంబైకి జోర్క్మన్ ఫీల్డ్ గోల్ను అందించాడు. దీంతో తమ దాడులను ఉధృతం చేసిన విజార్డ్స్కు 14వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను పిలియట్ గోల్గా మలిచాడు. ద్వితీయార్ధంలో ఇరు జట్లు ఎంతగా ప్రయత్నించినా గోల్స్ నమోదు కాలేదు. దీంతో ముంబై విజయం ఖాయమైంది. -
పంజాబ్ పై యూపీ గెలుపు
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో 3-0తో పంజాబ్ వారియర్స్పై నెగ్గింది. యూపీ తరఫున ఆకాశ్దీప్ సింగ్ (44వ ని.) ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్ తో సమానం) చేయగా, పిల్లెట్ (60వ ని.) పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. శుక్రవారం జరిగే మ్యాచ్లో కళింగ లాన్సర్స్... ఢిల్లీ వేవ్రైడర్స్తో తలపడుతుంది. -
రాంచీ రేస్కు ముంబై షాక్
ముంబై: చివరి రెండు అర్ధభాగాలను పది మంది ఆటగాళ్లతోనే ఆడినప్పటికీ... పట్టుదలగా పోరాడిన ముంబై దబంగ్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టుకు షాక్ ఇచ్చింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై 7-5 గోల్స్ తేడాతో రాంచీ రేస్ జట్టును ఓడించింది. రెండో క్వార్టర్ చివరి సెకన్లలో ముంబై ఫార్వర్డ్ యూసుఫ్ అఫాన్కు రెడ్ కార్డు ప్రకటించడంతో ఆ జట్టు మిగిలిన మ్యాచ్ను పది మంది ఆటగాళ్లతోనే ఆడింది. ముంబై తరఫున స్వాన్, నీలకంఠ శర్మ, ఫ్లోరియన్ ఒక్కో ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్తో సమానం) చేయగా... దివాకర్ రామ్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. మరోవైపు రాంచీ జట్టులో పెనాల్టీ కార్నర్ల ద్వారా యాష్లే జాక్సన్ రెండు గోల్స్, సందీప్ ఒక గోల్ చేశాడు. సర్వంజిత్ సింగ్ ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్తో సమానం) సాధించాడు. -
టాప్లో రాంచీ రేస్
♦ పంజాబ్ వారియర్స్పై విజయం ♦ హాకీ ఇండియా లీగ్ రాంచీ: డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్కు హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) నాలుగో సీజన్లో మరో విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ వారియర్స్ను 5-4 తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆరంభంలో అర్మాన్ ఖురేషి (7వ నిమిషంలో) ఫీల్డ్ గోల్ చేయడంతో వారియర్స్ 2-0 ఆధిక్యం పొందింది. అయితే వెంటనే పుంజుకున్న రాంచీ... కొతజిత్ సింగ్ (18), డానియల్ బీల్ (28) ఫీల్డ్ గోల్ ్స చేయడంతో 4-2తో పైచేయి సాధించింది. కానీ 31వ నిమిషంలో సత్బీర్ సింగ్ ఫీల్డ్ గోల్తో వారియర్స్ 4-4తో స్కోరును సమం చేయగలిగింది. ఈ దశలో ఇరువురు ఆటగాళ్లు పోటాపోటీగా తలపడినా 48వ నిమిషంలో సర్దార్ సింగ్ రాంచీ తరఫున పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి విజయం అందించాడు. -
కళింగ లాన్సర్స్ విజయం
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో కళింగ లాన్సర్స్ తొలి విజయాన్ని అందుకుంది. ప్రారంభ మ్యాచ్లో యూపీ విజార్డ్స్ చేతిలో ఓడిన కళింగ ఈసారి మెరుగ్గా ఆడింది. గురువారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో దబాంగ్ ముంబైపై 4-2 తేడాతో నెగ్గింది. తొలి అర్ధభాగం వరకు ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే 35వ నిమిషంలో ఫ్లోరియన్ ఫచ్ ముంబైకి తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత పుంజుకున్న కళింగ 45వ నిమిషంలో ఆడమ్ డిక్సన్, 51వ నిమిషంలో గ్లెన్ టర్నర్ ఫీల్డ్ గోల్స్తో గెలిచింది. -
పంజాబ్ పై ఢిల్లీ గెలుపు
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్లో ఢిల్లీ వేవ్రైడర్స్ బోణీ చేసింది. పంజాబ్ వారియర్స్పై 5-4తో విజయం సాధించింది. ఢిల్లీ తరఫున రూపిందర్ రెండు గోల్స్ చేయగా... యువరాజ్ వాల్మికీ (ఫీల్డ్గోల్) రెండు గోల్స్ ఖాతాలో చేర్చాడు. మార్క్ పియర్సన్ ఒక గోల్ చేశాడు. పంజాబ్ తరఫున మాథ్యూ గోడ్స్ (ఫీల్డ్గోల్) రెండు గోల్స్ ఖాతాలో చేర్చగా... క్రిస్టోఫర్, మార్క్ ఒక్కో గోల్ సాధించారు. -
వారియర్స్ను గెలిపించిన జాకబ్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టుకు షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ వారియర్స్ 2-0 గోల్స్ తేడాతో రాంచీ రేస్ జట్టును ఓడించింది. ఆట రెండో నిమిషంలోనే జాకబ్ వెటన్ ఫీల్డ్ గోల్ చేశాడు. హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం ఫీల్డ్ గోల్ చేస్తే దానిని రెండు గోల్స్గా పరిగణిస్తారు. దాంతో ఆరంభంలోనే వారియర్స్ జట్టు 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ను చేయడంలో విఫలమయ్యాయి. బుధవారం జరిగే మ్యాచ్లో ఢిల్లీ వేవ్రైడర్స్తో పంజాబ్ వారియర్స్ తలపడుతుంది. -
యూపీ విజార్డ్స్ థ్రిల్లింగ్ విజయం
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) నాలుగో సీజన్కు అదిరే ఆరంభం లభించింది. చిట్ట చివరి నిమిషం వరకు ఆతిథ్య కళింగ లాన్సర్స్దే విజయమని భావించినా యూపీ విజార్డ్స్ ఆటగాళ్లు అద్భుతమే చేశారు. దీంతో సోమవారం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఆరంభ మ్యాచ్లో విజార్డ్స్ 8-6 గోల్స్తో కళింగ లాన్సర్స్ను ఓడించింది. నమోదైన గోల్స్ అన్నీ ఫీల్డ్ గోల్సే. ఈ లీగ్ కొత్త నిబంధన ప్రకారం ప్రతి ఫీల్డ్ గోల్ను రెండు గోల్స్గా పరిగణిస్తున్నారు. తొలి క్వార్టర్ వరకు విజార్డ్స్ 4-2తో ఆధిక్యంలో ఉంది. అయితే ఆ తర్వాత పుంజుకున్న లాన్సర్స్ ఆట చివరి వరకు 6-4తో పైచేయిలోనే ఉంది. అయితే 60వ నిమిషంలో విజార్డ్స్ తరఫున ఆకెన్డెన్, ఆకాశ్దీప్ రెండు గోల్స్ సాధించడంతో ఆతిథ్య జట్టు అవాక్కయ్యింది. జోలీ (9వ నిమిషంలో), కెన్నెత్ (14) మిగతా గోల్స్ చేశారు. లాన్సర్స్ నుంచి ప్రదీప్ (15), గ్లెన్ టర్నర్ (29, 37) గోల్స్ సాధించారు. -
నేటి నుంచి హాకీ ఇండియా లీగ్
భువనేశ్వర్: కొత్త జట్ల తరఫున బరిలోకి దిగే స్టార్ ఆటగాళ్ల హంగామాతో పాటు సరికొత్త స్కోరింగ్ నిబంధనలతో నేటి (సోమవారం) నుంచి హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) నాలుగో సీజన్కు తెర లేవనుంది. 37 రోజుల పాటు అలరించే హెచ్ఐఎల్ ఆరంభ మ్యాచ్ కళింగ లాన్సర్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఈసారి జరిగే టోర్నీలో ఆటగాళ్లతో పాటు జట్ల యజమానులు, నిర్వాహకులకు కూడా సవాల్గానే మారనుంది. మూడేళ్లుగా తమ జట్ల తరఫున బరిలోకి దిగిన ఆటగాళ్లు గతేడాది జరిగిన వేలంలో అటు ఇటు మారారు. దీంట్లో భాగంగా ఢిల్లీ నుంచి సర్దార్ సింగ్ పంజాబ్ వారియర్స్కు వెళ్లాడు. ఈ సీజన్లో జట్లకు, ఆటగాళ్లకు ఇచ్చే ప్రైజ్మనీని రూ.5.7 కోట్లకు పెంచారు. అభిమానుల్లో మ్యాచ్ల పట్ల ఆసక్తి మరింత పెంచేందుకు నిబంధనలు మార్చారు. దీంట్లో భాగంగా ఆటగాడు ఓ ఫీల్డ్ గోల్ చేసినా, పెనాల్టీ స్ట్రోక్ ద్వారా గోల్ చేసినా రెండు గోల్స్గా లెక్కిస్తారు. భారత క్రికెట్ వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని సహ యజమానిగా ఉన్న రాంచీ రేస్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. -
హెచ్ఐఎల్ డైరెక్టర్గా ఐస్బెర్గ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) డైరెక్టర్గా స్వీడన్కు చెందిన జార్న్ ఐస్బెర్గ్ కొనసాగనున్నారు. అంపైర్స్ మేనేజర్గా ఆండీ మేయిర్ పేరును ప్రతిపాదించారు. ఈ మేరకు ఈ ఇద్దరి నియామాకాన్ని లీగ్ నిర్వాహకులు బుధవారం ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఆరు నగరాల్లో జరగనుంది. 2008, 2012 ఒలింపిక్స్లో మేయిర్ అంపైర్గా బాధ్యతలు నిర్వహించారు. రియో ఒలింపిక్స్లోనూ ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. లీడ్ అంపైర్స్ మేనేజర్గా క్రెయిగ్ గ్రిబ్లి (న్యూజిలాండ్) బాధ్యతలు తీసుకుంటారు. -
ఆకాశ్దీప్కు రూ.55 లక్షలు
సర్దార్ సింగ్కు నిరాశ హాకీ ఇండియా లీగ్ ఆటగాళ్ల వేలం న్యూఢిల్లీ : హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఆటగాళ్ల వేలంలో యువ స్ట్రయికర్ ఆకాశ్దీప్ సింగ్కు భారీ ధర పలికింది. అయితే భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్పై ఫ్రాంచైజీలు అంతగా ఆసక్తి కనబరచకపోవడం ఆశ్చర్యపరిచింది. వచ్చే సీజన్ కోసం శుక్రవారం జరిగిన ఈ వేలంలో ఆకాశ్దీప్ను ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్ 84 వేల డాలర్ల (రూ.55,56,247)కు కొనుగోలు చేసింది. భారత ఆటగాళ్లలో అత్యధిక మొత్తం ఆకాశ్కే దక్కింది. ఆ తర్వాత స్థానంలో 81 వేల డాలర్ల(రూ.53,57,578) ధరతో సీనియర్ డ్రాగ్ఫ్లికర్ సందీప్ సింగ్ (రాంచీ రేస్), గుర్మైల్ సింగ్ (దబాంగ్ ముంబై) నిలిచారు. మరోవైపు ఢిల్లీ వేవ్రైడర్స్ ఈ ఏడాది వదులుకున్న సర్దార్ సింగ్ను 58 వేల డాలర్ల (రూ. 38,36,290) తక్కువ మొత్తంతో పంజాబ్ వారి యర్స్ తీసుకుంది. ఓవరాల్గా జర్మనీ స్టార్ ఆటగాడు మోరిట్జ్ ఫ్యుయర్స్టే టాప్లో నిలిచాడు. కళింగ లాన్సర్స్ ఈ ఆటగాడిని లక్షా 5 వేల డాలర్ల (రూ.69,46,289)కు తీసుకుంది. -
హాకీ లీగ్ చరిత్రలో రికార్డు వేలం
హాకీ ఇండియా లీగ్ సీజన్ 4లో.. జర్మన్ మిడ్ ఫీల్డర్, టూ టైం ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మోర్టిజ్ రికార్డు సృష్టించాడు. లీగ్ చరిత్రలో తొలిసారి లక్ష డాలర్ల మార్క్ దాటేశాడు. ఇవాళ జరిగిన ఆటగాళ్ల వేలం లో కలింగ లాన్సర్స్ 1,05,000 డాలర్ల (భారత కరెన్సీలో 69 లక్షల రూపాయల)కు మోర్టిజ్ ను కొనుగోలు చేసింది. జర్మనీకే చెందిన 2012 లండన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఫార్వర్డ్ ఆటగాడు ఫ్లోరియన్ ఫుచ్స్, టోబియాస్ హుకే 63 లక్షల 54 వేల రూపాయులు ధర పలికారు. ఈ సీజన్ లో భారీ అంచనాలతో వేలంలో దిగిన భారత హకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ కోసం అన్ని జట్లు భారీగా పోటీ పడ్డాయి. 20 వేల డాలర్ల బేస్ ప్రైజ్ వద్ద వేలం ప్రారంభం కాగా.. పంజాబ్ వారియర్స్ 38 లక్షల 39వేల రూపాయలకు సర్ధార్ ను దక్కించుకుంది. అయితే.. భారత ఆటగాళ్లు...రూపీందర్ పాల్ సింగ్, ధరమ్ వీర్ సింగ్ లు సర్ధార్ కంటే ఎక్కువ ధర పలికారు. ఢిఫెండర్ రూపీందర్ ను ఢిల్లీ వారియర్స్ 45 లక్షల రూపాయలకు కొనుగోలు చేయగా.. ధరమ్ వీర్ సింగ్ ను కలింగ లాన్సర్స్ 39లక్షల71 వేల రూపాయలకు దక్కించుకుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెల్లీ ఫెయిర్వెదర్ వేలాన్ని పర్యవేక్షించారు. -
నేడు హెచ్ఐఎల్ వేలం
సర్దార్ సింగ్, రూపిందర్పాల్పైనే దృష్టి న్యూఢిల్లీ: రాబోయే రెండు ఎడిషన్ల కోసం హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలం నేడు (గురువారం) జరగనుంది. భారత కెప్టెన్ సర్దార్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్పాల్ సింగ్ ఈ వేలానికి ప్రధాన ఆకర్షణకానున్నారు. 135 మంది భారత ఆటగాళ్లతో పాటు జేమీ డ్వేయర్, నికోలస్ జాకోబి, ఆండ్రూ హెవార్డ్, గోవెర్స్, లుకాస్ రేలాంటి 137 మంది విదేశీ ప్లేయర్లు ఈ వేలానికి అందుబాటులో ఉన్నారు. ఎఫ్ఐహెచ్ సీఈఓ కెల్లీ ఫెయిర్వెయిదర్ ఈ వేలానికి హాజరుకున్నారు. ఒక్కో ఫ్రాంచైజీ నుంచి యజమాని, కోచ్, ఇతర అధికారులు వేలంలో పాల్గొంటారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ 20 మంది ఆటగాళ్లను తీసుకోవాలి. ఇందులో 12 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీ ప్లేయర్లు కచ్చితంగా ఉండాలి. మెరికల్లాంటి ఆటగాళ్లను తీసుకోవడానికి ఫ్రాంచైజీలకు ఇదో మంచి అవకాశమని హెచ్ఐఎల్ చైర్మన్ నరీందర్ బాత్రా అన్నారు. -
ఒక్క గోల్కు రెండు పాయింట్లు
మారిన హెచ్ఐఎల్ నిబంధనలు న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఆటగాళ్లలో పోరాటపటిమ, క్రమశిక్షణ పెంచేందుకు నిర్వాహకులు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 2016 నాలుగో సీజన్ నుంచి గోల్ స్కోరింగ్లో కొత్త నిబంధనలు తేనున్నారు. నైపుణ్యత, వ్యూహాత్మక ఆటతీరును ప్రోత్సహించేందుకు ఫీల్డ్ గోల్స్కు రెండు పాయింట్లు, ఆటగాళ్లను మొరటుగా అడ్డుకోవడాన్ని తగ్గించేందుకు పెనాల్టీ స్ట్రోక్లకు కూడా రెండు పాయింట్లు ఇస్తున్నట్టు హెచ్ఐఎల్ చైర్మన్ నరీందర్ బాత్రా తెలిపారు. క్షమాపణలు చెబితేనే...: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు లేదని లీగ్ చైర్మన్ బాత్రా తేల్చి చెప్పారు. గతేడాది చాంపియన్స్ ట్రోఫీలో భారత్పై విజయం అనంతరం పాక్ ఆటగాళ్లు ప్రేక్షకులతో అసభ్యంగా ప్రవర్తించారు. పాక్ తమకు ఈ విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని ఆయన గుర్తుచేశారు. క్షమాపణలు చెబితే ఆలోచిస్తామని చెప్పారు. -
ధోని జట్టుదే హాకీ టైటిల్
హెచ్ఐఎల్ ఫైనల్లో నెగ్గిన రాంచీ న్యూఢిల్లీ: ప్రపంచకప్లో ధోని సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు దుమ్ము రేపుతుంటే... స్వదేశంలో హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లోనూ ధోని జట్టు అదరగొట్టింది. ధోని సహ యజమానిగా ఉన్న రాంచీ రేస్ జట్టు హెచ్ఐఎల్ మూడో సీజన్లో విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రాంచీ జట్టు షూటవుట్స్లో 3-2తో పంజాబ్ వారియర్స్పై నెగ్గింది. మ్యాచ్ 39వ నిమిషంలో కీరన్ గోవర్స్ (పంజాబ్) గోల్ చేయగా... రాంచీ తరఫున స్టాన్లీ మింజ్ 42వ నిమిషంలో గోల్ సాధించాడు. క్రిస్టఫర్ సిరియెట్లో (56 వ ని.) గోల్తో పంజాబ్ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాతి నిమిషంలో మిడిల్టన్ గోల్తో రాంచీ ఊపిరి పీల్చుకుంది. స్కోరు 2-2తో సమం కావడంతో... మ్యాచ్ ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ను ఆశ్రయించారు. ఇందులో రాంచీ 3-2తో గెలిచింది. అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ వేవ్రైడర్స్ 2-1తో యూపీ విజార్డ్స్ను ఓడించింది. -
ఫైనల్లో రాంచీ రేస్, పంజాబ్
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో రాంచీ రేస్, పంజాబ్ వారియర్స్ ఫైనల్స్కు చేరుకున్నాయి. తుది పోరు నేడు (ఆదివారం) జరుగనుంది. లీగ్లో తొలిసారిగా అడుగుపెట్టిన రాంచీ రేస్... శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్పై పెనాల్టీ షూటవుట్స్ (9-8)లో నెగ్గింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది. యూపీ తరఫున డ్రాగ్ఫ్లికర్ వీఆర్ రఘునాథ్ (34వ ని.), రాంచీ నుంచి ఆష్లే జాక్సన్ (41వ ని.) గోల్స్ చేశారు. ఆ తర్వాత పెనాల్టీ షూటవుట్స్లోనూ ఫలితం తేలక 3-3తో స్కోరు సమమైంది. చివరకు సడెన్ డెత్లో రాంచీ రేస్ గట్టెక్కింది. ఇక మరో సెమీస్లో పంజాబ్ వారియర్స్ 2-0తో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్రైడర్స్ను ఓడించింది. సందీప్ సింగ్ (3వ ని.), ఆగస్టిన్ మజిలీ (35వ ని.) గోల్ చేశారు. మరోవైపు మూడో స్థానం కోసం ఢిల్లీ, విజార్డ్స్ తలపడనున్నాయి. -
రాంచీపై ఢిల్లీ గెలుపు
న్యూఢిల్లీ: కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్రైడర్స్ సత్తా చూపింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా శనివారం రాంచీ రేస్తో జరిగిన ఈ మ్యాచ్లో 2-0తో నెగ్గింది. 26వ నిమిషంలో లాయిడ్ నోరిస్ జోన్స్, 53వ నిమిషంలో ఆకాశ్దీప్ సింగ్ గోల్స్ చేశారు. అయితే డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన అవకాశాలను కల్పించడంతో పాటు ప్రత్యర్థి గోల్స్ అవకాశాలను వమ్ము చేశాడు. ఈ విజయంతో జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. -
రాంచీ రేస్ గెలుపు
రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగం గా ఆదివారం జరిగిన మ్యాచ్లో రాంచీ రేస్ 1-0 తేడాతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్పై నెగ్గింది. ఆట ప్రారంభమైన 18వ నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ను జాక్సన్ గోల్గా మలిచాడు. మ్యాచ్ ఆద్యంతం ఈ ఆధిక్యాన్ని నిలుపుకోవడంతో రాంచీ విజయం సాధించింది. కళింగపై ముంబై విజయం ముంబై: హెచ్ఐఎల్లో దబాంగ్ ముంబై తమ తొలి విజయాన్ని అందుకుంది. కళింగ లాన్సర్స్తో స్థానిక మహీంద్ర స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 2-1 తేడాతో గెలిచింది. 18వ నిమిషంలో జెరెమీ హేవర్డ్, 42వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ ముంబైకి గోల్స్ అందించారు. కళింగ తరఫున 42వ నిమిషంలో ఆమిర్ ఖాన్ గోల్ చేశాడు. -
జాక్సన్ ‘హ్యాట్రిక్’
రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో రాంచీ రేస్ కెప్టెన్ ఆష్లే జాక్సన్ ‘హ్యాట్రిక్’ గోల్స్తో చెలరేగాడు. మూడు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మల్చడంతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాంచీ 4-0తో కళింగ లాన్సర్పై విజయం సాధించింది. 11వ నిమిషంలోనే తొలి గోల్ చేసిన జాక్సన్... 32వ నిమిషంలో దాన్ని డబుల్ చేశాడు. మరో రెండు నిమిషాల తర్వాత విల్సన్ (34వ ని.) ఫీల్డ్ గోల్ చేయగా... 41వ నిమిషంలో జాక్సన్ హ్యాట్రిక్ గోల్ చేశాడు. -
రాంచీ రేస్ విజయం
లక్నో: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్కు రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం ఈ జట్టుపై 2-0తో రాంచీ రేస్ విజయం సాధించింది. ప్రారంభం నుంచే రెండు జట్లు దూకుడును కనబరిచాయి. రెండో నిమిషంలోనే రాంచీ పెనాల్టీ కార్నర్ అవకాశం పొందినా గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. 11వ నిమిషంలో విజార్డ్స్కు వచ్చిన పెనాల్టీ కార్నర్ విఫల మైంది. అయితే 13వ నిమిషంలో ప్రత్యర్థి లోపాలను ఆసరాగా చేసుకుని స్ట్రయికర్ ట్రెంట్ మిట్టన్ తొలి గోల్ చేసి రాంచీకి ఆధిక్యాన్ని అందించాడు. విజార్డ్స్ డిఫెన్స్ను ఏమార్చుతూ 42వ నిమిషంలో మన్దీప్ సింగ్ చేసిన గోల్తో రాంచీకి రెండో గోల్ దక్కింది. -
యూపీ విజార్డ్స్ విజయం
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ఉత్తరప్రదేశ్ (యూపీ) విజార్డ్స్ జట్టు రెండో విజ యాన్ని సాధించింది. కళింగ లాన్సర్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో యూపీ విజార్డ్స్ 2-0 గోల్స్ తేడాతో గెలిచింది. -
వారియర్స్ ‘హ్యాట్రిక్’
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్రైడర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో వారియర్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో నెగ్గింది. పంజాబ్ తరఫున సిరియెల్లో, సునీల్, యూసుఫ్ ఒక్కో గోల్ చేయగా... ఢిల్లీకి సిమోన్ చైల్డ్ ఏకైక గోల్ అందించాడు. పంజాబ్ 17 పాయింట్లతో లీగ్లో అగ్రస్థానంలో ఉంది. -
రాంచీ, ముంబై మ్యాచ్ ‘డ్రా’
రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా రాంచీ రేస్, దబాంగ్ ముంబై జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో ‘డ్రా’గా ముగిసింది. రాంచీ తరఫున డానియల్ బీల్, కెప్టెన్ యాష్లే జాక్సన్ ఒక్కో గోల్ చేయగా... ముంబై జట్టు నుంచి గ్లెన్ టర్నర్, సంతా సింగ్ ఒక్కో గోల్ సాధించారు. రెండు జట్లకు రెండేసి పాయింట్లు లభించాయి. ప్రస్తుతం తొమ్మిది పాయింట్లతో రాంచీ జట్టు రెండో స్థానంలో, ఐదు పాయింట్లతో ముంబై జట్టు నాలుగో స్థానంలో ఉన్నాయి. -
పంజాబ్ వారియర్స్కు మరో గెలుపు
మొహాలీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో తమ జోరును కొనసాగిస్తూ పంజాబ్ వారియర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్లో వారియర్స్ 3-2 గోల్స్ తేడాతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ను ఓడించింది. వారియర్స్ తరఫున వరుణ్ కుమార్ (12వ ని.లో), ఎస్వీ సునీల్ (29వ ని.లో), సందీప్ సింగ్ (42వ ని.లో) ఒక్కో గోల్ సాధించగా... విజార్డ్స్ జట్టుకు వీఆర్ రఘునాథ్ (7వ, 53 ని.లో) రెండు గోల్స్ అందించాడు. ఈ గెలుపుతో పంజాబ్ జట్టు మొత్తం 12 పాయింట్లతో లీగ్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాంచీ రేస్, ఢిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్రైడర్స్ జట్ల మధ్య రాంచీలో జరిగిన మ్యాచ్ 2-2 వద్ద ‘డ్రా’గా ముగిసింది. ఢిల్లీ తరఫున ఆకాశ్దీప్ సింగ్, డానిష్ ముజ్తబా చెరో గోల్ చేయగా... రాంచీ జట్టుకు నిక్ బడ్జెన్, మన్దీప్ సింగ్ ఒక్కో గోల్ అందించారు. -
‘కళింగ’ శుభారంభం
హాకీ ఇండియా లీగ్ భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) - 2015లో కళింగ లాన్సర్స్ జట్టు శుభారంభం చేసింది. సొంతగడ్డపై గురువారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్లో లాన్సర్స్ 6-3 గోల్స్ తేడాతో రాంచీ రేస్ను చిత్తు చేసింది. తొలి క్వార్టర్లో కళింగ తరఫున ల్యూకాస్ విలా (9వ నిమిషం), రేస్ తరఫున బారీ మిడిల్టన్ (15వ నిమిషం)లో గోల్స్ చేశారు. అయితే రెండు, మూడు క్వార్టర్స్లో దూకుడుగా ఆడిన కళింగ వరుసగా గోల్స్ చేసింది. ర్యాన్ ఆర్కిబాల్డ్ (17), విక్రమ్ కాంత్ (18), గుర్జీందర్ సింగ్ (37), మన్దీప్ అంటిల్ (58), మొహమ్మద్ ఖాన్ (60) ఈ గోల్స్ చేశారు. మరో వైపు రాంచీ ఆటగాళ్లలో కెప్టెన్ యాష్లే జాక్సన్ (36, 50) ఒక్కడే రెండు గోల్స్ చేశాడు. శుక్రవారం జరిగే మ్యాచ్లలో యూపీ, ఢిల్లీతో... ముంబై, పంజాబ్తో తలపడతాయి. -
టామ్ బూన్కు అత్యధిక ధర
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ ఆటగాళ్ల క్లోజ్డ్ బిడ్లో బెల్జియం స్టార్ ఫార్వర్డ్ టామ్ బూన్కు అత్యధిక ధర పలికింది. వ చ్చే ఏడాది జరిగే మూడో సీజన్ కోసం శనివారం ఈ బిడ్డింగ్ జరిగింది. లీగ్ లో కొత్తగా ప్రవేశిస్తున్న దబాంగ్ ముంబై ఫ్రాంచైజీ బూన్ను లక్షా మూడు వేల డాలర్ల (రూ. 63 లక్షలు)కు కొనుగోలు చేసింది. లీగ్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. గత రెండు సీజన్లలో ముంబై మెజీషియన్స్గా బరిలోకి దిగిన ఈ జట్టు యాజమాన్యం లీగ్ నుంచి వైదొలగగా... డుఇట్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కొనుగోలు చేసింది. దీంతో వచ్చే సీజన్కు సరికొత్తగా తయారయ్యేందుకు మొత్తం 7లక్షల 50 వేల డాలర్ల (రూ.4 కోట్ల 62 లక్షలు)ను ఖర్చు చేసింది. బూన్తో పాటు రెండో అత్యధిక ధరతో మాథ్యూ స్వాన్ (ఆసీస్, రూ.48 లక్షలు)ను తీసుకుంది. అలాగే గ్లెన్ టర్నర్, డేవిడ్ హార్ట్, ఫ్లోరిస్ ఎవెర్స్, అర్జున్ హలప్ప, భరత్ చికారా తదితరులను జట్టులో చేర్చుకుంది.దేశీయ ఆటగాళ్లలో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ 69 వేల డాలర్ల (దా దాపు రూ.43 లక్షలు)తో టాప్లో నిలిచాడు. తనను ఉత్తర ప్రదేశ్ విజార్డ్ కొనుగోలు చేసుకుంది. ఇక భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనికి చెందిన రాంచీ రైనోస్... ఆసీస్ స్ట్రయికర్ ట్రెంట్ మిట్టన్ను 67 వేల డాలర్ల (రూ.41 లక్షలు)కు దక్కించుకుంది. ఓవరాల్గా ఈ బిడ్లో 149 మంది ఆటగాళ్లు (95 మంది స్వదేశీ, 54 విదేశీ) పాల్గొన్నారు. -
ధోని చేతికి హాకీ స్టిక్
రాంచీ జట్టును కొనుగోలు చేసిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రాంచీ: భారత కెప్టెన్గా క్రికెట్లో అత్యున్నత స్థాయి విజయాలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోని వరుసగా ఇతర క్రీడల్లో కూడా కీలక పాత్ర పోషించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. మహీమోటార్ రేసింగ్ టీమ్తో పాటు ఇటీవలే ఐఎస్ఎల్లో చెన్నైయిన్ ఫుట్బాల్ జట్టును కొనుగోలు చేసిన ధోని... ఇప్పుడు హాకీలో కూడా అడుగు పెట్టాడు. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) జట్టు ‘రాంచీ రేస్’ను ధోని సొంతం చేసుకున్నాడు. సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ లిమిటెడ్ ఇందులో సహ భాగస్వామిగా ఉంటుంది. 2013లో జరిగిన తొలి హెచ్ఐఎల్లో టైటిల్ గెలుచుకున్న రాంచీ రైనోస్ టీమ్ ఈ ఏడాది మూడో స్థానంలో నిలిచింది. అయితే ఆ జట్టు యజమానుల మధ్య వచ్చిన విభేదాల కారణంగా హాకీ ఇండియా ఈ జట్టును రద్దు చేసింది. దాంతో ధోని, సహారా ఈ టీమ్ను కొని జట్టు పేరును ‘రాంచీ రేస్’గా మార్చారు. ఈ కార్యక్రమంలో టీమ్ లోగో, జెర్సీని ఆవిష్కరించారు. నగరంతో అనుబంధం వల్లే: భవిష్యత్తులో హాకీ క్రీడకు మరింత ప్రచారం కల్పించేందుకు తాను అన్ని విధాలా సహకరిస్తానని ధోని అన్నాడు. ‘హాకీతో అనుబంధం ఏర్పరచుకున్న ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. నేను ఇక్కడే పుట్టి పెరిగినవాడిని. గత రెండేళ్లుగా రాంచీ టీమ్ చాలా బాగా ఆడుతోంది. కాబట్టి ఈ అవకాశం వచ్చినపుడు మరో ఆలోచన లేకుండా ఇందులో అడుగు పెట్టాను. ఈ ప్రాంతంలో ప్రతిభను ప్రోత్సహించి హాకీని అభివృద్ధి చేయాలనేదే నా ప్రధాన ఉద్దేశం. అందుకోసం రేస్ జట్టు తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని ఈ సందర్భంగా ధోని వ్యాఖ్యానించాడు. -
ఏపీ సారథి శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ హాకీ జట్టు సారథిగా శ్రీనివాసరావు వ్యవహరిస్తాడు. ఇతను హాకీ ఇండియా లీగ్లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్కు గోల్కీపర్గా వ్యవహరించాడు. శ్రీనివాసరావు నేతృత్వంలోని ఏపీ జట్టు జాతీయ పురుషుల హాకీ చాంపియన్షిప్లో పాల్గొంటుంది. లక్నోలో మంగళవారం మొదలైన ఈ టోర్నీ మ్యాచ్లు 20వ తేదీ వరకు జరగుతాయి. గ్రూప్-బిలో ఉన్న ఏపీ జట్టు ఈ నెల 14న తమ తొలి మ్యాచ్లో చండీగఢ్ను ఎదుర్కొంటుంది. 15న రెండో మ్యాచ్లో సర్వీసెస్తో, 18న మూడో మ్యాచ్లో కంబైన్డ్ యూనివర్సిటీస్ జట్టుతో, 20న జరిగే చివరి లీగ్ మ్యాచ్లో ఎయిరిండియాతో ఏపీ తలపడుతుంది. జట్టు: శ్రీనివాసరావు (కెప్టెన్, గుంటూరు), రమేశ్, నాగేంద్ర (యలమంచిలి), మణికంఠ (గూడూరు), సందీప్ రాజు, కిషోర్ (కడప), శివకుమార్ (నిజామాబాద్), సంపత్ కుమార్ (హైదరాబాద్), కృష్ణకిషోర్ (వైజాగ్), జావేద్ (ఆర్మూర్), మైలారి (హిందుపురం), నాగశ్రీను (కాకినాడ), రమేశ్కృష్ణ, తేజకిరణ్, చౌదరి బాబు, రాజేశ్ (తిరుపతి), సుదర్శనం (కర్నూల్), అక్రమ్ బాషా (అనంతపురం). -
హాకీ ఇండియా లీగ్ విజేత ఢిల్లీ
రాంచీ: గతేడాది రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న ఢిల్లీ వేవ్రైడర్స్ ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయలేదు. కీలకసమయంలో సంయమనంతో రాణించి రెండో ప్రయత్నంలో హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత కెప్టెన్ సర్దార్ సింగ్ నాయకత్వంలోని ఢిల్లీ వేవ్రైడర్స్ ‘షూట్అవుట్’లో 3-1 గోల్స్ తేడాతో పంజాబ్ వారియర్స్ను ఓడిం చింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 3-3తో సమఉజ్జీగా నిలిచాయి. ‘వన్ ఆన్ వన్’ షూట్అవుట్లో ఢిల్లీ తరఫున మాట్ గోడ్స్, సిమోన్ చైల్డ్, ఎడ్వర్డ్స్ సఫలంకాగా... రాజ్పాల్ సింగ్ విఫలమయ్యాడు. పంజాబ్ తరఫున కెప్టెన్ జేమీ డ్వెయర్, సిమోన్ ఆర్చర్డ్, సత్బీర్ సింగ్ గురి తప్పగా... రాబ్ హామండ్ మాత్రమే బంతిని లక్ష్యానికి చేర్చాడు. నాలుగో షాట్ తర్వాత ఫలితం తేలిపోవడంతో ఐదో షాట్ను తీసుకోలేదు. నిర్ణీత సమయంలో ఢిల్లీ తరఫున ఆకాశ్దీప్ సింగ్ (33వ నిమిషంలో), సర్దార్ సింగ్ (35వ నిమిషంలో), యువరాజ్ వాల్మీకి (51వ నిమిషంలో)... పంజాబ్ తరఫున మార్క్ నోల్స్ (తొలి నిమిషంలో), శివేంద్ర సింగ్ (44వ నిమిషంలో), అఫాన్ యూసుఫ్ (47వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. విజేతగా నిలిచిన ఢిల్లీ వేవ్రైడర్స్కు రూ. 2 కోట్ల 50 లక్షలు... రన్నరప్ పంజాబ్ జట్టుకు రూ. కోటీ 25 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. అంతకుముందు జరిగిన వర్గీకరణ మ్యాచ్లో గత ఏడాది విజేత రాంచీ రైనోస్ ‘షూట్అవుట్’లో 3-2తో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ను ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 1-1వద్ద సమంగా నిలిచాయి. రాంచీ జట్టుకు రూ. 75 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. -
ఫైనల్లో ఢిల్లీ, పంజాబ్
హాకీ ఇండి యా లీగ్ రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) రెండో సీజన్లో కొత్త చాంపియన్ అవతరించనుంది. గతేడాది రన్నరప్గా నిలిచిన ఢిల్లీ వేవ్రైడర్స్ వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి అడుగుపెట్టగా... లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ వారియర్స్ అదే జోరును కొనసాగించి డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రైనోస్ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ, పంజాబ్ టైటిల్ పోరులో తలపడతాయి. ఉత్తరప్రదేశ్ విజార్డ్స్తో జరిగిన తొలి సెమీఫైనల్లో ఢిల్లీ 1-0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 15వ నిమిషంలో యువరాజ్ వాల్మీకి ఏకైక గోల్ చేసి ఢిల్లీ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. జస్టిన్ రీడ్ అందించిన పాస్ను గోల్ పోస్ట్ ముందున్న వాల్మీకి లక్ష్యానికి చేర్చాడు. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తగిన ఫలితం పొందింది. మరోవైపు ఉత్తరప్రదేశ్కు గోల్ చేసేందుకు పలుమార్లు అవకాశాలు వచ్చినా వృథా చేసుకొని మూల్యం చెల్లించుకుంది. రెండో సెమీఫైనల్లో పంజాబ్ వారియర్స్ 3-2 గోల్స్ తేడాతో రాంచీ రైనోస్పై విజయం సాధించింది. పంజాబ్ తరఫున స్టార్ డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్ (22వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్... అఫాన్ యూసుఫ్ (53వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. రాంచీ జట్టుకు యాష్లే జాక్సన్ (13వ నిమిషంలో), ఫ్లోరిస్ ఎవర్స్ (57వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నిరుటి విజేత రాంచీ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లినా సందీప్ సింగ్ గోల్తో పంజాబ్ స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే చివరి అర్ధభాగంలో పంజాబ్ విజృంభించి నిమిషం తేడాలో రెండు గోల్స్ చేసి మ్యాచ్ను తమవైపునకు తిప్పుకుంది. చివర్లో రాంచీ ఖాతాలో మరో గోల్ చేరినా చివరి పది నిమిషాలు పంజాబ్ జాగ్రత్తగా ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది. హాకీ కూడా ‘స్టార్’లోనే న్యూఢిల్లీ: ఇప్పటికే భారత్లో ఐపీఎల్ మినహా అన్ని టోర్నీలతో క్రికెట్ ప్రసారహక్కుల విషయంలో ఆధిపత్యం చలాయిస్తున్న స్టార్ గ్రూప్... ఇక హాకీలోనూ ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించనుంది. ఇప్పటికే హెచ్ఐఎల్ను ప్రసారం చేస్తూ... భారత్లో జరిగే అన్ని టోర్నీల ప్రసార హక్కులు దక్కించకున్న స్టార్ గ్రూప్.... తాజాగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జరిగే హాకీ టోర్నమెంట్ల ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. -
ఎట్టకేలకు ముంబై గెలుపు
హాకీ ఇండియా లీగ్ మొహాలీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ముంబై మెజీషియన్స్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఈ సీజన్లో గెలుపు కోసం ఎనిమిది మ్యాచ్లుగా మొహం వాచిపోయిన ముంబై ఆదివారం కళింగ లాన్సర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 3-2 తేడాతో నెగ్గింది. కెప్టెన్ టర్నర్ (17వ నిమిషం)లో సాధించిన గోల్తో ఖాతా తెరవగా ఆ తరువాత గ్లెగోమ్ (33వ), రవిపాల్సింగ్ (57వ)లు చెరో గోల్ చేశారు. అయితే కళింగ లాన్సర్స్ జట్టులో నిజాముద్దీన్ (43వ), లూకాస్ విలా (58వ)లు సాధించిన రెండు గోల్స్తోనే సరిపెట్టుకుంది. దీంతో చివరి మ్యాచ్ ఆడిన లాన్సర్స్ 17 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. ఇక మరో మ్యాచ్లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న పంజాబ్ వారియర్స్ 4-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ రాంచి రైనోస్ను ఓడించి తమ పాయింట్ల సంఖ్యను 35కు పెంచుకుంది. కాగా, రాంచి నాలుగో ఓటమితో 24 పాయింట్లకే పరిమితమై ఇంకా నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. -
రఘునాథ్ హ్యాట్రిక్
ముంబై: స్టార్ డ్రాగ్ ఫ్లికర్ వీఆర్ రఘునాథ్ ‘హ్యాట్రిక్’ నమోదు చేయడంతో... ముంబై మెజీషియన్స్తో బుధవారం జరిగిన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ 5-3 గోల్స్ తేడాతో గెలిచింది. కెప్టెన్ రఘునాథ్ ఆట 28వ, 41వ, 56వ నిమిషాల్లో లభించిన పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచి హ్యాట్రిక్ సాధించాడు. ఆట 12వ నిమిషంలో గుర్జిందర్ సింగ్... 18వ నిమిషంలో గ్లెన్ టర్నర్ ఒక్కో గోల్ చేయడంతో ఒకదశలో ముంబై 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రఘునాథ్ విజృంభణతో విజార్డ్స్ తేరుకొని స్కోరును సమం చేసింది. ఆ తర్వాత సిద్ధార్థ్ శంకర్, ఉతప్ప ఒక్కో గోల్ చేయడంతో విజార్డ్స్ 5-2తో ముందంజ వేసింది. 57వ నిమిషంలో సర్వన్జిత్ సింగ్ గోల్తో ముంబై ఖాతాలో మూడో గోల్ చేరింది. ఆ తర్వాత విజార్డ్స్ జట్టు ప్రత్యర్థిని మరో గోల్ చేయనివ్వలేదు. వరుసగా రెండో విజయంతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
వారియర్స్కు రెండో గెలుపు
భువనేశ్వర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన పంజాబ్ వారియర్స్ జట్టు హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 7-3 గోల్స్ తేడాతో కళింగ లాన్సర్స్ను ఓడించింది. వారియర్స్ తరఫున స్టార్ డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్, అఫాన్ యూసుఫ్ రెండేసి గోల్స్ చేయగా... ధరమ్వీర్ సింగ్, లూకాస్ మార్టిన్ రే, సిమోన్ ఆర్చర్డ్, కెప్టెన్ జేమీ డ్వెయర్ ఒక్కో గోల్ సాధించారు. కళింగ జట్టులో గొంజాలో పెలియట్ రెండు గోల్స్, మన్దీప్ అంటిల్ ఒక గోల్ చేశారు. రెండు మ్యాచ్ల్లో నెగ్గి, మరో మ్యాచ్లో ఓడిన వారియర్స్ 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. -
రాంచీ రైనోస్కు షాక్
రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్-2)లో డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రైనోస్కు ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ షాకిచ్చింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో విజార్డ్స్ 3-2 గోల్స్ తేడాతో రైనోస్పై నెగ్గింది. ఆరంభంలో రాంచీ ఆధిక్యం కనబరిచినప్పటికీ మ్యాచ్లో మాత్రం పట్టుబిగించలేకపోయింది. ఆట ఆరంభమైన నాలుగో నిమిషానికే స్టార్ స్ట్రయికర్ మన్దీప్ సింగ్ గోల్ చేసి రైనోస్కు శుభారంభాన్నిచ్చాడు. అయితే సరిగ్గా ఐదు నిమిషాల వ్యవధిలో విజార్డ్స్ ఆటగాడు తిమ్మయ్య (10వ ని.) గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. ఇదే స్కోరుతో తొలి అర్ధభాగం ముగిసింది. ద్వితీయార్ధంలోనూ తొలి గోల్ రాంచీ జట్టే నమోదు చేసినప్పటికీ... మళ్లీ నిమిషాల వ్యవధిలోనే ఆధిక్యాన్ని కోల్పోయింది. రాంచీ తరఫున 46వ నిమిషంలో జస్టిన్ రీడ్ రాస్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచగా, యూపీ తరఫున 51వ నిమిషంలో రఘునాథ్ గోల్ చేశారు. తర్వాత 63వ నిమిషంలో ప్రదీప్ కీలకమైన గోల్ చేసి విజార్డ్స్ను విజయంపథంలో నిలిపాడు. మొహాలీలో జరిగిన మరో మ్యాచ్లో పంజాబ్ వారియర్స్ 5-3 గోల్స్ తేడాతో ముంబై మెజీషియన్స్పై గెలిచింది. -
నేటి నుంచి హెచ్ఐఎల్
మొహాలీ: ఐపీఎల్ తరహాలో ప్రారంభమైన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) తొలి సీజన్ విజయవంతం కావడంతో ఇప్పుడు అదే ఉత్సాహంతో రెండో సీజన్కు సిద్ధమవుతోంది. నేటి (శనివారం) నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ విజేతకు రూ.2.5 కోట్ల భారీ ప్రైజ్మనీని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో పంజాబ్ వారియర్స్, ఢిల్లీ వేవ్రైడర్స్ తలపడనున్నాయి. రాంచీ రైనోస్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. ముంబై మెజీషియన్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్, కళింగ లాన్సర్ మిగతా జట్లు.