Pragathi Nivedana Sabha
-
ఈ నెల 7న టీఆర్ఎస్ మరో భారీ బహిరంగసభ!
-
‘చెట్ల మీద విస్తరాకుల్లాగా వాగ్దానాలు చేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : మోస పూరితమైన వాగ్దానాలతో ముఖ్యంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ప్రగతి నివేదన సభలో కటింగ్ సెలూన్లకు డొమెస్టిక్ విద్యుత్ టారిఫ్ ఇచ్చానని కేసీఆర్ అబద్దం చెప్పారంటూ నాయి బ్రాహ్మణులు నిరసన తెలిపారు. గాంధీభవన్ ముందున్న గాంధీ విగ్రహం ముందు షేవింగ్ చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. నాయి బ్రాహ్మణుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయి బ్రాహ్మణులను మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా చేశానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 250 కోట్లతో నాయి బ్రాహ్మణుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్.. నిధి ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి వాగ్దానం చేస్తే రాజముద్రగా ఉండాలి కానీ.. కేసీఆర్ వాగ్దానాలు చెట్ల మీద విస్తరాకుల్లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోడ్రస్ సెలూన్లు ఎక్కడ నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ మరో భారీ బహిరంగసభ!
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి నివేదన సభ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న టీఆర్ఎస్ మరో బహిరంగ సభ ఏర్పాటుకు సిద్దం అవుతోంది. సెప్టెంబర్ 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, అక్కడి నుంచి ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్లో భారీ ఎత్తున ప్రగతి నివేదన సభను నిర్వహించి విజయవంతం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై మరింత దూకుడు పెంచారు. జెట్ స్పీడ్తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తూ.. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. హుస్నాబాద్లో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై ఈ రోజు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు సిద్దిపేటలో సమావేశం కానున్నారు. మరోవైపు ప్రభుత్వ సీఎస్ జోషితో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు భేటి అయ్యారు. దీంతో ఈ నెల 6న జరిగే కేబినేట్ మీట్ అనంతరం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
నిర్మానుష్యంగా కొంగరకలాన్
ఇబ్రహీంపట్నంరూరల్ : లక్షలుగా తరలివచ్చిన ప్రజలను ఆ గ్రామం అక్కున చేర్చుకుంది. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వేదికగా నిలిచిన కొంగరకలాన్ ప్రస్తుతం బోసిపోయింది. సభ ఏర్పాట్లు ప్రారంభమైన పది రోజుల నుంచి అక్కడ సందడి నెలకొంది. ప్రతి రోజూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకుల రాకపోకలతో రద్దీగా మారింది. సభకు తరలివచ్చిన జనంతో రహదారులు కిక్కిరిపోయాయి. జనం నినాదాలు, మైకుల శబ్ధాలతో హోరెత్తిన ఆ ప్రాంతం సోమవారం తెల్లారే సరికి మూగబోయింది. ఆదివారం ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు పడ్డారు. మరుసటి రోజు ఒక్క వాహనం కూడా కనిపించలేదు. కలెక్టరేట్ వద్దకు వెళ్లే వారు కూడా లేకుండా పోయారు. ప్రగతి సభ కోసం ఏర్పాటు చేసిన కార్పెట్ను తీసేశారు. గ్యాలరీల్లో ఏర్పాటు చేసిన కుర్చీలను ప్రాంగణం నుంచి తరలించారు. సభ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లను తొలగించే పనిలో పడ్డారు. సూమారు 2వేల ఎకరాల్లో చెత్త ఎత్తివేయడానికి టీఆర్ఎస్ పార్టీ పనులు చేపడుతోంది. పర్యావరణానికి ముప్పు రాకుండా శుభ్రం చేస్తున్నారు. మోబైల్ మూత్రశాలను ప్రాంగనం నుంచి తరలించారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో శుభ్రం చేసేలా చర్యలు చేపడతామని స్థానిక టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. -
ప్రగతి నివేదన సభపై ఇంటలిజెన్స్ నివేదిక?
కొంగరకలాన్కు తరలివెళ్లిన వాహనాలెన్ని, జనమెంత.. తక్కువ వెళ్లడానికి కారణాలేమిటీ? క్షేత్రస్థాయిలో నాయకులు జన సమీకరణ చేయలేదా..మరేమైనా కారణాలున్నాయా..? ప్రగతి నివేదన సభ జనసమీకరణపై నిఘా పెట్టిన ఇంటటిజెన్స్ వర్గాలు నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ పార్టీ నేతల్లోనూ అంతర్మథనం మొదలైంది. అనుకున్న మేర జనం రాకపోవడంపై కారణాలు విశ్లేషించే పనిలో పడ్డారు. సాక్షి, యాదాద్రి : టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొంగరకలాన్లో నిర్వహించిన ప్రగతి నివేదన సభపై పోస్టుమార్టం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. జన సమీకరణ, తరలివెళ్లిన వాహనాల వివరాలపై నియోజకవర్గాల వారీగా ఇంటలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరించాయి. ప్రగతి నివేదన సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 20నుంచి 25వేల మందిని తరలించాలని టీఆర్ఎస్ అధినా యకత్వం నిర్ణయించింది. ఈ మేరకు సభకు పది రోజుల ముందు నుంచే పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎక్కడికక్కడ తిష్ట వేసి విస్త్రృత ప్రచారం చేశారు. ప్రతి గ్రామానికి వాహనాలు పంపించారు. కానీ, కొన్ని మం డలాల నుంచి జనం ఆశించిన స్థాయిలో రాకపోవడంపై నేతల్లో అంతర్మథనం మొదలైంది. జన సమీకరణలో క్షేత్రస్థాయి నాయకులు ఆసక్తి చూపలేకపోయారా..? మరే కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో అధ్యయనం చేస్తున్నారు. లెక్కల్లో తేడా.. ప్రగతి నివేదన సభకు జరిగిన జన సమీకరణకు సంబంధించి ఇంటలిజెన్స్ , టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు చెబుతున్న లెక్కలకు తేడా ఉన్నట్లు వెల్లడైంది. ఆదివారం జరిగిన సభకు వెళ్లిన జన సమీకరణపై ఇంటలిజెన్స్ వర్గాలు ప్రధాన రహదారులపై తిష్ట వేసి నిఘా పెట్టాయి. జిల్లాలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి వాహనాల్లో తరలిన జనాన్ని లెక్కించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15వేల వరకు వెళ్లి నట్లు గుర్తించారు. బీబీనగర్, చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ల వద్ద వెళ్తున్న వాహనాల్లో జనాల సంఖ్యను లెక్కించడంతోపాటు మండల కేంద్రాలనుంచి స మాచారాన్ని రాబట్టారు. కదిలిన జనం ఇలా.. భువనగిరి నియోజకవర్గంలో బీబీనగర్, భువనగిరి రూరల్ మండలాల నుంచి ఆశించిన స్థాయిలో జనం రాలేదని ఇంటలిజెన్స్ వర్గాలు తేల్చాయి. పోచంపల్లి మండలం నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడం, చివరి నిమిషంలో వాహనాలు లేక కొందరు వెనుదిరగినట్లు గుర్తించారు. ఆలేరు నియోజకవర్గంలో పరిస్థితి మరోల గుర్తించారు. రాజాపేట, ఆలేరు, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల నుంచి ఆశించిన స్థాయిలో జనం సభకు తరలిపోగా గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాల నుంచి తక్కువగా వచ్చినట్లు గుర్తించారు. అయితే ఈ మండలాల్లో జిల్లాల, మండలాల పునర్విభజన ప్రభావం అధికంగా కనిపించింది. క్షేత్రస్థాయిలో సమీక్షలు.. ప్రగతి నివేదన సభ జనసమీకరణపై ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంచనా వేసిన దానికంటే అధికంగా జన సమీకరణ చేసినట్లు ప్రకటించినప్పటికీ ఇంటలిజెన్స్ నివేదికలు అం దుకు విరుద్ధంగా ఉండటంతో కారణాలు ఏమిటన్న విషయంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా జన సమీకరణ హెచ్చుతగ్గులపై పోస్టుమార్టం చేస్తున్నారు. సభకోసం జన సమీకరణకు పెద్ద ఎత్తున వాహనాలు గ్రామాలకు పంపించినప్పటికీ జనం అన్నిచోట్ల ఎందుకు రాలేకపోయారని చర్చ జరుగుతోంది. అయితే బోనాల పండుగ ఎఫెక్ట్ కూడా కొంత మేరకు ఉందని ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో చెప్పారు. నేతల్లో గుబులు ప్రగతి నివేదిక సభకు అనుకున్న మేరకు జిల్లా నుంచి జనం వెళ్లకపోవడంతో పార్టీ నేతల్లో గుబులు నెలకొంది. పార్టీ అధిష్టానం కూడా ఈ విషయమై అన్ని జిల్లాల నుంచి ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటుండడం, ఇప్పటికే నిఘా వర్గాలు నివేదిక సిద్ధం చేయడంతో ఏం జరగనుందోనన్న ఆందోళనలో గులాబీ నేతలు ఉన్నారు. -
టీఆర్ఎస్కు గుడ్బై చెప్పిన వెంకటరెడ్డి
సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం): అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో గందరగోళం నెలకొంది. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులు ఎవరికి వారుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ల కేటాయింపు పూర్తయ్యేలోగా గ్రూపు రాజకీయాలు మరింత విస్తృతమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగగా, ఇప్పుడు రాజీనామాల పర్వం ప్రారంభమైంది. తాజాగా అశ్వారావుపేట నియోజకవర్గంలో కీలకమైన నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయంగా అత్యంత కీలకమైన చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలను ప్రభావితం చేసే సీనియర్ నాయకుడు కొడకండ్ల వెంకటరెడ్డి టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. ఆయనతో పాటుగా రెండు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అధికార పార్టీకి రాజీనామా చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న సమయంలో కొడకండ్ల రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అనుచరుడిగా వ్యవహరించారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కొత్తగూడెం నియోజకవర్గంలో చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలు ఉన్నాయి. దీంతో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో సైతం కొడకండ్ల కీలకపాత్ర పోషించారు. తరువాత కాలంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీకి చెందిన జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా గెలిచేందుకు సైతం కీలకంగా వ్యవహరించారు. తాటి వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీ నుంచి టీఆర్ఎస్లో చేరే సమయంలో నియోజకవర్గం నుంచి తన అనుచరులతో కొడకండ్ల కూడా వెళ్లారు. అయితే తాటి వెంకటేశ్వర్లు తనకు ప్రాధాన్యత తగ్గించారంటూ గత ఏడాది కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు రెండు రోజుల ముందు తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. దీంతో తాటి వెంకటేశ్వర్లుకు భారీ దెబ్బ తగిలినట్టయింది. వచ్చే ఎన్నికల్లో తాటికి గడ్డు పరిస్థితే అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొడకండ్లను కలిసిన జలగం ప్రసాదరావు.. ప్రగతి నివేదన సభకు వెళ్లినప్పటికీ.. తాటి వెంకటేశ్వర్లుకు ఆందోళన కలిగించే అంశం చోటుచేసుకుంది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టు కలిగి ఉన్న మాజీ మంత్రి జలగం ప్రసాదరావు చంద్రుగొండకు వచ్చి కొడకండ్ల వెంకటరెడ్డిని కలిశారు. అత్యంత సీనియర్ అయిన వెంకటరెడ్డికి పూర్తిస్థాయిలో అండగా ఉంటానని ప్రసాదరావు తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చించారు. ప్రస్తుతం దేశానికి కాంగ్రెస్, రాహుల్ అవసరం ఉందని చెప్పిన జలగం ప్రసాదరావు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఉమ్మడి జిల్లాలోని ఎక్కడినుంచైనా పోటీ చేస్తానని కొడకండ్ల ఇంటి నుంచే ప్రకటించారు. దీంతో ఈ ప్రకటన కొత్తగూడెంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో వెంకటరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలపై పడే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. -
‘ప్రగతి’ సభకు వెళ్లి పరలోకానికి
తెలకపల్లి (నాగర్కర్నూల్): టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన ఎండీ జాంగీర్(45) టీఆర్ఎస్ ప్రభుత్వం కొంగరకలాన్లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు శనివారం సాయంత్రం ట్రాక్టర్లలో బయల్దేరారు. రాత్రి మైసిగండిలో బస చేసి ఆదివారం ఉదయం మరో వాహనంలో కొంగరకలాన్కు వెళ్లారు. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణంలో మైసిగండిలో తాము ఉంచిన ట్రాక్టర్ల వద్ద చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో మైసిగండి వద్ద రోడ్డు దాటుతుండగా దేవరకొండ ప్రాంతంలోని మల్లెపల్లికి చెందిన క్రూయిజర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎండీ జాంగీర్, మండలి బాలపీరు గౌస్పాష తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మైసిగండిలో ఉన్న పోలీసులు క్షతగాత్రులను ఆమన్గల్ ఆస్పత్రికి తరలించారు. ఇందులో జాంగీర్, బాలపీరు పరిస్థితి విషమంగా మారడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే మార్గమధ్యలో జాంగీర్ మృతిచెందాడు. బాలపీరుకు కాలు విరిగి తీవ్ర గాయం కావడంతో అక్కడే చికిత్స పొందుతున్నాడు. జాంగీర్కు భార్య రజియాబేగం, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో జాంగీర్ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు గ్రామస్తులు ఆస్పత్రికి వెళ్లారు. కల్వకుర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో గౌరారంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్థికసాయం అందజేత.. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్రెడ్డిలు సోమవారం నిమ్స్ ఆస్పత్రిలో గాయపడిన బాలపీరును పరామర్శించారు. జాంగీర్ కుటుంబానికి ఎమ్మెల్యే రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే నాగం జనార్దన్రెడ్డి జాంగీర్ కుటుంబానికి రూ.20 వేలు, బాలపీరు కుటుంబ సభ్యులకు రూ.10 వేలు అందజేశారు. గౌస్పాష అనే వ్యక్తికి కూడా గాయాలు కావడంతో నాగర్కర్నూల్ ఆస్పత్రికి వెళ్లారు. జాంగీర్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. -
ప్రగతి సభకు పోస్టుమార్టం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రగతి నివేదనపై టీఆర్ఎస్ నాయకత్వం అంతర్గత మథనం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా భావించిన సభకు ఆశించిన స్థాయిలో జన సమీకరణ జరపకపోవడంపై పోస్టుమార్టం నిర్వహిస్తోంది. కొంగరకలాన్లో సభ నిర్వహిస్తున్నందున కనిష్టంగా ఐదారు లక్షల మందిని తరలించాలని జిల్లా నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదారు లక్షలు దేవుడెరుగు కనీసం మూడు లక్షల మందిని కూడా తరలించకపోవడంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రగతి నివేదన సభకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన గులాబీ బాస్.. ప్రజల తరలింపుపై లెక్కలు తీశారు. అలాగే నిఘావర్గాలిచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన అధిష్టానం.. ప్రగతి సభకు జన సమీకరణలో జిల్లా నాయకత్వం వైఫల్యం చెందినట్లు అంచనా వేసింది. నివేదన సభకు ఆతిథ్యమిచ్చిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలే కాకుండా షాద్నగర్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల సెగ్మె ంట్ల నుంచి నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జనాలను సమీకరించలేదని తేలింది. బహిరంగ సభకు ముహూర్తం ఖరారు కాగానే రవాణా మంత్రి పట్నం మహేందర్రెడ్డి నివాసంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రత్యేక భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సెగ్మెంట్ నుంచి సగటున 35 వేల నుంచి 40వేల మందిని సభకు తరలించాలని నిర్ణయించారు. కేవలం ప్రజా ప్రతినిధులేగాకుండా ఆశావహులు సైతం బలప్రదర్శన చేసుకునేందుకు భారీగా జనాలను తీసుకొస్తారని అంచనా వేశారు. ఈ లెక్కలు తప్పడంపై తాజాగా గులాబీ నేతలు చింతిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి జనాలు పోటెత్తుతారని ఎవరికివారు మిన్నకుండడం కూడా ఈ పరిస్థితికి దారితీసిందని అంటున్నారు. ఆర్థిక వనరులు సమకూర్చినా ఆశించిన స్థాయిలో జన సమీకరణ చేయలేకపోవడాన్ని హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి నేతలపై క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్న గులాబీ దళపతి.. త్వరలోనే వీరికి క్లాస్ పీకనున్నట్లు తెలుస్తోంది. బాగా పనిచేశారు.. బహిరంగ సభ నిర్వహణలో విశేష కృషి చేసిన వారిని అభినందించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్వల్ప వ్యవధిలో ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పూర్తి చేసిన వారికి ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించిన ఆయన క్యాంపు ఆఫీసుకు రావాలని ఆహ్వానించారు. నిఘా విభాగం మల్లగుల్లాలు! ప్రగతి నివేదన సభకు హాజరైన ప్రజల సంఖ్య తేల్చడంలో ఇంటలిజన్స్ విభాగం తలమునకలైంది. మంగళవారం భేటీ అయిన నిఘా బృందాలు ఏయే జిల్లా, నియోజకవర్గాల నుంచి ఎన్ని వాహనాలు, ఎంతమంది వచ్చారనే అంశంపై సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. అదే సమయంలో రాష్ట్రం నలు దిక్కుల నుంచి ఒకేసారి జనప్రవాహం రావడంతో ట్రాఫిక్ను నియంత్రించలేకపోయినట్లు వివరించినట్లు తెలిసింది. సగం మంది సభకు రాకుండా రోడ్లపైనే నిలబడ్డారని, మరికొందరు ముందుకు రాలేక వెనక్కిపోయినట్లు పార్టీ వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం.. పోలీసుల బందోబస్తు నిర్వహించిన తీరుపై పెదవి విరిచినట్లు తెలిసింది. నిర్దేశిత మార్గాల గుండా వాహనాలను సభాస్థలికి చేర్చడంలో ఆ శాఖ వైఫల్యం ఉందని అన్నట్లు సమాచారం. -
‘ప్రగతి నివేదన’ అట్టర్ ఫ్లాప్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొంగరకలాన్లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, కొండను తవ్వి ఎలుకను తీసిన చందంగా బహిరంగ సభ ఉందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఘాటుగా విమర్శించారు. సోమవారం ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తామని, ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నామని కారాలు బీరాలు పలికిన టీఆర్ఎస్ నేతలు బహిరంగ సభ పేలవంగా సాగడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభ ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా తప్ప ఒరిగిందేమి లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వారం రోజులుగా చేసిన హంగామా అంతా ఇంతా కాదని, అధికార దర్పంతో, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు లెక్కలేసి జనాన్ని తరలించాలని సూచించిన ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు తగిన శాస్తి జరిగిందని అన్నారు. కొత్త నిర్ణయాలు, జరిగిన అభివృద్ధిపై బహిరంగ సభ వేదిక నుంచి సీఎం ప్రసంగిస్తారని పదేపదే వల్లేవేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ప్రసంగం పేలవంగా సాగడంతో గందరగోళంలో పడ్డారని అన్నారు. తెలంగాణ సాధనకు అమరులైన వారికి, బంధుమిత్ర కుటుంబాలకు వేదిక పైనుంచి ఏమి హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అమరులవీరుల స్మారకార్థం నిర్మిస్తామన్న స్మృతి వనం నిర్మించలేదని మండిపడ్డారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని, హుస్సేన్ సాగర్ శుద్ధి, హైదరాబాద్ డల్లాస్, కరీంనగర్ లండన్ లాంటి హామీలపై మాట్లాడకుండా కమ్యూనిటీ భవనాలు, గొర్రెలు, బర్రెలు, ప్రాజెక్టులపై మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. విద్య, వైద్య రంగాలు నాలుగేళ్లలో మరింత వెనుకబాటుకు గురయ్యాయని, శాతవాహన యూనివర్సిటీకి వీసీని నియమించలేని దుస్థితి నెలకొందని అన్నారు. బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్నమల్లయ్య గురించి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని, ఆయన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాక, మరణించాక కుటుంబాన్ని కూడా పరామర్శించలేని కేసీఆర్ శవరాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్బాపూజీ, డాక్టర్ సినారెలు మరణించిన సమయంలో వారి స్మారకార్థం నిర్మిస్తామన్న విగ్రహాలు, ఘాట్లు ఏమయ్యాయని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు బోయిన్పల్లి వెంకటరామారావు మరణిస్తే ముఖ్యమంత్రి హోదాలో కరీంనగర్కు వచ్చి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన సమయంలో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందని కేసీఆర్ తీరు ఓడ దాటాక ‘ఓడ మల్లన్న రేవు దాటాక బోడ మల్లన్న’ అన్న చందంగా ఉందని మండిపడ్డారు. టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నేతలకు లాగులు తడుస్తున్నాయని పదే పదే విమర్శించిన టీఆర్ఎస్ నేతలకు బహిరంగ సభ అట్టర్ఫ్లాప్ కావడంతో టీఆర్ఎస్ నేతల లాగులే తడుస్తున్నాయని అన్నారు. ప్రజాసంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో స్టేట్ అడ్వయిజరీ కమిటీ వేస్తామన్న పెద్దమనిషి ఇప్పటికీ దాని ఊసెత్తడం లేదని, నిన్నటికి నిన్న పొరుగు రాష్ట్రం పోలీసులు వరవరరావును అరెస్టు చేసి తీసుకెళ్తే కేసీఆర్ కనీసంగా మాట్లాడలేదన్నారు. ఇసుక దందాలో రూ.1900 కోట్ల ఆదాయం వచ్చిందంటున్న ఆయన తెరవెనుక ఆయన సన్నిహితుల జేబుల్లోకి వెళ్లిన రూ.1900 కోట్ల గురించి ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. దళితుల ప్రాణాలు బలిగొన్న గోల్డ్మైన్ పేరుతో ఇసుకదందా చేసిన సంతోష్రావుకు రాజ్యసభ సభ్యునిగా ప్రమోషన్ ఇస్తే ఈ ప్రభుత్వాధినేతను ఏమనాలని ప్రశ్నించారు. గులాబీ వాడిపోయిందని టీఆర్ఎస్ పార్టీ మాటలు ప్రజలు ఇక నమ్మబోరని, గారడి మాటలు కట్టిపెట్టకపోతే ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యరావు, ఆకుల ప్రకాష్, చాడగోండ బుచ్చిరెడ్డి, బాశెట్టి కిషన్, కటుకం వెంకటరమణ, బోనాల శ్రీనివాస్, పొన్నం శ్రీనివాస్, పడిశెట్టి భూమయ్య, శ్రీరాముల కిషన్, తదితరులు పాల్గొన్నారు. -
సభపై నివేదన!
-
‘ప్రగతి నివేదన’లో అన్నీ అబద్ధాలే: పొన్నం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనపై ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ దగ్గర మోకరిల్లి ఆత్మగౌరవం లేకుండా వ్యవహరిస్తున్న కేసీఆర్.. ఫెడరల్ ప్రంట్ పేరిట కొత్త నాటకానికి తెర తీశారన్నారు. ప్రధాని మోదీని కలిసినప్పుడల్లా వంగి నమస్కారాలు చేసిన ఆయన.. జోనల్పై ‘ఇస్తావా చస్తావా’ అని నిలదీశానంటే ఎవరు నమ్ముతారని ప్రభాకర్ ప్రశ్నించారు. నిజంగా నువ్వు నిలదీసే వాడివైతే ముస్లిం మైనార్టీలు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఎందుకు అడగడం లేదన్నారు. మిషన్ భగీరథపై సీఎం పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని, ఒకసారి 11 వందల గ్రామాలు అన్నింటికి ఇచ్చామంటారు.. మరోసారి 40 శాతమే పనులు జరిగాయి అంటున్నారని విమర్శించారు. ప్రగతి నివేదన సభలో కనీసం అమరుల పేరెత్తకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. -
రికార్డు స్థాయిలో సభ: కర్నె, బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: కేవలం పది రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో బహిరంగసభను నిర్వహించామని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ నేత గట్టు రామచందర్రావు అన్నారు. సోమవారం విలేకరులతో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ సభకు 25 లక్షల మంది వస్తారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని, వారి అనుమానాలను తలకిందులు చేస్తూ అన్ని రికార్డులను అధిగమించిందన్నారు. దీనికి అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాయన్నారు. ఈ సభపై కాంగ్రెస్ నాయకులు దివాళాకోరు తనంతో దిగజారుడు విమర్శలు చేస్తున్నారని, ఈ సభ దేశంలోనే రికార్డు అని కర్నె ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 42 ఏళ్లు పాలించినా ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. ట్రాఫిక్ జామ్ వల్లే రాలేకపోయారు: దానం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ జామ్ వల్ల వేలాదిమంది ప్రగతి నివేదన సభ జరుగుతున్న ప్రాంతానికి రాలేకపోయారని మాజీమంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సభ విజయవంతమైనా కొందరు కాకి గోల చేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్కుమార్రెడ్డి ప్రగతి నివేదన సభ గురించి ఉత్తమాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ను గద్దెదించడం సాధ్యంకాదని, గాంధీభవన్ నుంచి ఉత్తమ్కుమార్రెడ్డిని తొలగిస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు కాకి గోల చేస్తున్నారని, ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్లో తలొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల అండ టీఆర్ఎస్కు ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని నేరుగా ప్రధానమంత్రి మోదీకే కేసీఆర్ చెప్పాడని దానం వెల్లడించారు. ప్రగతి నివేదన సభలో అభివృద్ధి గురించి చెప్పడం తప్ప రాజకీయ విమర్శలు చేయలేదని, ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ కడిగి పారేస్తారని హెచ్చరించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ సాధ్యంకాదని ఉత్తమ్కు కాంగ్రెస్ నేతలే చెప్పారని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్షాతో ఉత్తమ్ ఎందుకు రహస్యంగా సమావేశం అయ్యారో చెప్పాలని దానం డిమాండ్ చేశారు. -
ప్రగతి నివేదన కాదు... కేసీఆర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రగతి నివేదన సభ నిర్వహించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గత పది రోజులుగా రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి భారీ ప్రచారం చేసి నా ఫలితం లేకపోయిందని విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభ కాస్త కేసీఆర్ ఆవేదన సభగా మారిందని, సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పారు. ఎన్నికల శంఖారావంలా, తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలని సీఎం కేసీఆర్ రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహించారని.. అది కాస్త ప్రజల ఆదరణ పొందని సభగా మిగిలిపోయిందని విమర్శించారు. ధనబలం, అధికారమదంతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జనాలను తరలించేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టినా.. ప్రజలను సమీకరించలేకపోయారన్నారు. టీఆర్ఎస్ తొత్తులుగా అధికారులు.. ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చకపోగా రాష్ట్రా న్ని టీఆర్ఎస్ అప్పులోకి నెట్టిందని లక్ష్మణ్ ఆరోపించారు. తాము ఫ్లెక్సీలు కడితే రాత్రికి రాత్రే తొలగించే జీహెచ్ఎంసీ అధికారులు, ఇప్పుడెందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారా రని మండిపడ్డారు. తమ అధినేత అమిత్షా కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారని, ప్రచారం కూడా చేస్తానని చెప్పారని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ప్రజల అభిమానం లేకపోతే ఏమవుతుందో ప్రగతి నివేదన సభతో తేటతెల్లమైందని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఉద్యోగాలు, ఎస్టీలకు రిజర్వేషన్లపై సభలో కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఆయన ప్రసంగం మొత్తం అబద్ధాలు, అసత్యాలేనన్నారు. కేసీఆర్ ప్రసంగానికి ఒక దశా దిశా లేదని విమర్శించారు. ట్విట్టర్లో స్పందించినంత సులువు కాదు.. బహిరంగ సభలను నిర్వహించడమంటే ట్విట్టర్లో స్పందిం చినంత సులువు కాదని మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కుటుంబ పెత్తనం, అవినీతి సొమ్ముతో ప్రజల ను మభ్యపెట్టలేరని తేలిందని చెప్పారు. ఈ సభకు 3 లక్షల మంది కూడా రాలేదన్నారు. ముందస్తుతో టీఆర్ఎస్కు పరాభవం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టు కొని ప్రధాని నరేంద్ర మోదీ జోనల్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఆమోదిస్తే.. ప్రధానిని ఉద్దేశించి చులకనగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఎస్సీ వర్గీకరణ, హైకోర్టు విభజనను ఎందుకు సాధించలేక పోయారని లక్ష్మణ్ ప్రశ్నించారు. -
కాంగ్రెస్ నేతలకు కడుపుమంట
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ బహిరంగసభ పెడితే కాంగ్రెస్ నేతలకు భయంతో, బాధతో కడుపు మం డుతున్నట్టు ఉందని ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడిక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ, సభ విజయవం తం కావడంతో భవిష్యత్తు అంధకారమైన కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో కొత్త బిచ్చగాడు రేవంత్రెడ్డి, పాత బిచ్చగాడు మధుయాష్కీ, గడ్డం బాబా ఉత్తమ్, బొమ్మాళి డీకే అరుణ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సుమన్ విమర్శించారు. టీఆర్ఎస్ సభలలో పల్లీలు, వాటర్ పాకెట్లు అమ్ముకునే వారి సంఖ్యకన్నా ఇటీవల రాహుల్గాంధీతో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభలో తక్కువ జనం ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్పై తిట్లు, శాపనార్ధాలు ఆపకుంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అవుతుందని, చాలామందికి డిపాజిట్లు రావని హెచ్చరించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్కు అధికారంలో లేకుంటే నిరుద్యోగులు గుర్తుకువస్తారా అని సుమన్ ప్రశ్నిం చారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ, సభ విజయవంతం కావడంతో వారికి భయం పట్టుకుందన్నారు. రాహుల్గాంధీ, సోనియాగాంధీతో ఇంత పెద్ద సభ పెట్టగలరా అని సవాల్ చేశారు. టీఆర్ఎస్ వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఐటీఐఆర్ విషయంలో కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని, వారి అసమర్థత వల్లనే ఐటీఐఆర్ రాకుండా పోయిందన్నారు. -
పదవీ విరమణ సభలా ఉంది
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ.. పదవీవిరమణ సభలా సాగిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆర్భాటంగా ప్రకటించినా సభ వెలవెలబోయిందన్నారు. సభలో ప్రగతి నివేదన, భవిష్యత్ దర్శనం లేదని, కేసీఆర్ ప్రసంగం పేలవంగా సాగిందని వ్యాఖ్యానించారు. మైక్ టైసన్లా గెలుస్తారని అనుకుంటే మొదటి రౌండ్లో ఎలిమినేట్ అయినట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో కోదండరాం మాట్లాడుతూ.. ‘సభకు 25 లక్షల మంది వస్తారని, ముఖ్య ప్రకటనలు చేస్తారని, ఏదో జరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రకటించిన దాంట్లో 4వ వంతు జనం కూడా రాలేదు’అన్నారు. సభ పూర్తిగా విఫలమైందని, అన్ని శక్తులు ఉపయోగించినా జనాన్ని సభకు తీసుకురాలేకపోయారన్నారు. సీఎం ప్రసంగంలో మాటల తడబాటు ఉందని, మాటలు వెతుక్కోవాల్సి వచ్చిందని.. ప్రజలతో సంబంధాలు లేకపోవడం వల్లే మాటలు రాలేదని విమర్శించారు. సభతో పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోయారని చెప్పారు. అది బలప్రదర్శన, కేసీఆర్ గర్జన కాదని, ఆయన స్వీయ వేద నలా ఉందని ఎద్దేవా చేశారు. దీపం ఆరిపోయేముందు ఆఖరి తేజంలా కేసీఆర్ తీరు ఉందన్నారు. రాజకీయంగా, ప్రభుత్వపరంగా తన విధానం చెప్పుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. త్వరలో ఇంటింటికీ జన సమితి తెలంగాణ జనసమితిని బూత్ స్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని కోదండరాం వెల్లడించారు. త్వరలోనే ఇంటింటికీ జన సమితి ప్రచారం మొదలెడతామన్నారు. హైదరాబాద్, జిల్లాల్లో అమరుల స్మృతి చిహ్నం కోసం ఈ నెల 12న ఒకరోజు దీక్ష చేస్తామని చెప్పారు. చేరికలతో కాకుండా సొంతగా పార్టీ శక్తి సామర్థ్యాలు పెంచుకుంటామన్నారు. పార్టీ ప్రచారం కోసం రెండు విడతులుగా బస్సుయాత్రలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మహిళలు టీజేఎస్లో చేరారు. -
తిట్టలేదనే వారి బాధ: తలసాని
సాక్షి, హైదరాబాద్: ప్రగతి నివేదన సభలో తమని తిట్టలేదని కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నట్టున్నారని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ఎల్పీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిట్టలేదనే బాధతో కాంగ్రెస్ నేతలు నిరుత్సాహపడ్డారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేకపోతున్నారని విమర్శించారు. వాస్తవాలు చూడటానికి రాష్ట్రంలో కంటివెలుగు శిబిరాల్లో కంటి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఉత్తమ్కుమార్రెడ్డికి బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ సభలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవడానికి నిబంధనలున్నాయనే విషయం కాంగ్రెస్ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. పొన్నాల లక్ష్మ య్యకు సొంత ఊరిలోనే పరపతి లేదన్నారు. కాంగ్రెస్ దిక్కూదివానం లేని పార్టీ అని, ఆ పార్టీ నేతలకు బుద్ధి లేదని విమర్శించారు. లెక్కలు తేల్చుకుందామా? మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదా, సాగుకు 24 గంటలు కరెంటు అందడం లేదో చెప్పాలని తలసాని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కాంగ్రెస్ హయాంలో ఎంతమందికి ఇచ్చారో, టీఆర్ఎస్ హయాంలో ఎందరికి ఇస్తున్నామో లెక్క తేల్చుకుందామా అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒకేసారి చెప్పడం సాధ్యం కానన్ని ఉన్నాయన్నారు. దళితులకు మూడెకరాల భూమి గురించి జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి సమాచారం తెప్పించుకుని చూడాలన్నారు. కేసీఆర్ హఠావో అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందా అని ప్రశ్నించారు. వీహెచ్ను కాంగ్రెస్ నేతలే పట్టించుకోరని, ఆయన టీఆర్ఎస్పై విమర్శలు మానుకోవాలని సూచించారు. డబ్బు మూటలతో రెడ్హ్యాండెడ్గా దొరికిన రేవంత్రెడ్డి నీతులు వల్లించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సభలన్నా, ఎన్నికలన్నా మీకు వణుకు.. కాంగ్రెస్ నేతలకు సభలన్నా, ముందస్తు ఎన్నికలన్నా భయమని తలసాని విమర్శించారు. ఎన్నికలు ముం దొచ్చినా, వెనుకొచ్చినా టీఆర్ఎస్దే విజయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నేతలే బాగుపడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అనుకున్నట్టు టీఆర్ఎస్ పాలిస్తుందా అని ప్రశ్నిం చారు. తెలంగాణలో ప్రజల కోసమే అప్పు చేస్తున్నామని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అప్పులు చేయడం లేదని ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల గుండెల్లో ప్రగతి నివేదన సభ రైళ్లు పరిగెత్తించిందన్నారు. కమీషన్లకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సేనని తలసాని విమర్శించారు. -
ఇక కేసీఆర్ శకం ముగిసింది..!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ ఫైర్ అయింది. అదో గ్రేట్ ఫ్లాప్ షో అని, ఇక సీఎం కేసీఆర్ శకం ముగిసినట్టేనని టీపీసీసీ నేతలు వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీమంత్రి డీకే అరుణ, గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ మాట్లాడారు. టీఆర్ఎస్ సభ జనం లేక వెలవెల పోయిందని, 25 లక్షల మంది వస్తారని గొప్పలకు పోయి మూడు లక్షల జనాన్ని తరలించారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. జనం లేకపోవడంతోనే కేసీఆర్ ప్రసంగం చప్పగా సాగిందని, చెప్పిందే చెప్పి జనానికి ఏం సందేశం ఇచ్చారో కేసీఆర్కే అర్థం కాకుండా పోయిందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పని అయిపోయిందనేందుకు ఈ సభే నిదర్శనమని, ఇక రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసినట్టేనని ఆమె అన్నారు. తాను లేకుంటే ఇదంతా జరిగేదా అని కేసీఆర్ అంటున్నారని, అసలు ఆయన లేకపోతే ఇంతకంటే పదిరెట్లు ఎక్కువ అభివృద్ధి జరిగేదన్నారు. ముందస్తుకు పోతే ముందుగానే కేసీఆర్ కుర్చీ పోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. సభ పెట్టి పెద్ద షో చేయాలనుకున్న కేసీఆర్ ఆశలు నెరవేరలేదని, కేసీఆర్ సభ గ్రేట్ ఫ్లాప్ షోగా మిగిలిందని అన్నారు. జనం కూడా బలవంతంగా వచ్చారని పేర్కొన్నారు. గ్రామాల్లో బస్సులెక్కేందుకు జనం లేక స్థానిక నేతలు నానా తంటాలు పడ్డారని అన్నారు. ‘సభ ఎందుకు నిర్వహించారో వాళ్లకే అర్థం కాలేదు. కేసీఆర్ జనానికి ఏం సందేశం ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగం పేలవంగా సాగింది. చెప్పిన మాటలు పదే పదే చెప్పారు. జనం లేకపోవడంతో కేసీఆర్ స్పీచ్లో నిరాశ కనిపించింది. తన వెంట జనం లేరనేది కేసీఆర్కు అర్థమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏమైందో చెప్పలేదు. ఇంకా సెంటిమెంట్తోనే ఓట్లు వేయించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. నేను లేకుంటే ఈ అభివృద్ధి జరిగేదా.. అని కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్ లేకుంటే ఇంకా ఎన్నో రెట్లు అభివృద్ధి జరిగేది. ఏ వర్గాలకు న్యాయం జరగలేదు. ఉద్యోగ సంఘాలు నోరువిప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ముందస్తుపై కేసీఆర్ ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ శకం ఇక ముగిసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్దే అధికారం’అని ఆమె అన్నారు. పగటి దొంగల నివేదిక సభ: మధుయాష్కీ అహంకారంతో కేసీఆర్ దొరల పాలన చేస్తున్నారని, తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఆస్తి ఎంతో, ఇప్పుడు ఎంతో లెక్క చెప్పాలని, కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని మధుయాష్కీ చెప్పారు. అది ప్రగతి నివేదన సభ కాదని, పగటి దొంగల నివేదిక సభ అని వ్యాఖ్యానించారు. బీసీలకు గొర్లు, బర్లు, నల్లానీళ్లు కాదని, ప్రగతిభవన్లో అధికారం కావాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, దేశిని చినమల్లయ్య లాంటి తెలంగాణ యోధుల పేరు పలికే అర్హత కేసీఆర్కు లేదని, ఎన్నికలు తొందరగా వస్తే పాపాత్ముడి పాలన తొందరగా పోతుందని ప్రజలు ఆశిస్తు న్నారన్నారు. ప్రధాని మోదీని చూస్తేనే కేసీఆర్ లాగు తడుస్తుందని, జోనల్ ఆమోదం కోసం చస్తవా.. చేస్తవా అని మోదీని అన్న కేసీఆర్, విభజన హామీలపై ఎందుకు అడగలేదని ప్రశ్నిం చారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్కు నోబెల్ బహు మతి ఇవ్వొచ్చని యాష్కీ ఎద్దేవా చేశారు. తాగుబోతుల సభలాగా సాగింది: దాసోజు టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ మాట్లాడుతూ చెప్పిన దాంట్లో పావలా వంతు జనాలు కూడా ప్రగతి నివేదన సభకు రాకపోవడానికి ప్రజల్లో ఉన్న అసం తృప్తే కారణమన్నారు. రూ.500, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినా కనీసం 5 లక్షల మందిని సమీకరించలేకపోయారని ఎద్దేవా చేశారు. అది రాజకీయ సభలా లేదని, తాగుబోతుల సభ లాగా సాగిందని, ప్రజారవాణాకు ఉపయోగించే ఆర్టీసీ బస్సులను మొబైల్ బార్లుగా మార్చారని ఆరోపించారు. దసరా రోజు రావణాసురుడిని కూల్చినట్టు ప్రకృతి ప్రకోపంతో కేసీఆర్ కటౌట్ను కూల్చేసిందన్నారు. -
టీఆర్ఎస్కు నా ప్రగాఢ సానుభూతి..!
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభ విషయమై బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ సభ విఫలమైందని, కాబట్టి ఆ పార్టీకి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన అన్నారు. టీఆర్ఎస్ సభకు వచ్చింది కేవలం రెండున్నర లక్షల మందేనని, రేపు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు 20 సీట్ల కంటే ఎక్కువ రావని ఆయన జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో కారు అడ్డంగా బోర్లా పడుతుందన్నారు. ప్రధాని మోదీని జోనల్ వ్యవస్థపై చేస్తావా, లేక చస్తావా అనేంత సీన్ కేసీఆర్కు లేదని వ్యాఖ్యానించారు. -
‘ఈ సభతో ప్రజలకేం సందేశం ఇచ్చావ్’
సాక్షి, హైదరాబాద్ : ‘కేసిఆర్ నీ షో... ప్లాఫ్ షో. అసలింతకు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏమైనా సందేశం చేరిందా.. లేదా’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ కే అరుణ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావ్ని ప్రశ్నించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభతో కేసీఆర్ ఆట ముగిసిందన్నారు. సభకు 25 లక్షల మంది జనాలు హాజరవుతారన్నారని ప్రచారం చేశారు.. కానీ కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే సభలో పాల్గొన్నారని తెలిపారు. సభ ప్రాంగణం కూడా నిండలేదు.. ఏదో విహార యాత్రకు వచ్చినట్లు వచ్చి వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించలేదు.. నిరుద్యోగ యువతను పట్టించుకోలేదు. అసలు ఈ సభతో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇచ్చారో తెలపాలంటూ ఆమె డిమాండ్ చేశారు. సెంటిమెంట్లతో ఎంతో కాలం మోసం చేయలేరనే విషయం నిన్న జరిగిన సభ చూస్తే అర్థమవుతోందని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ని తిరస్కరిస్తున్నారనే విషయం నిన్నటి సభతో స్పష్టంగా తెలిసిందన్నారు. కేసీఆర్ లేకుంటే రాష్ట్రం మరింత ముందుకు పోయేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ముందస్తు పెట్టి, నవంబర్లో చెక్కులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నారు.. కానీ ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆమె ఆరోపించారు. -
‘కాంగ్రెస్ నేతలు నిరుత్సాహపడ్డారు’
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి నివేదన సభ విజయవంతం కావడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా సభ జరిగిందన్నారు. ఈ సభ విజయవంతంతో కాంగ్రెస్ నేతలు నిరుత్సాహపడ్డారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు సంక్షేమ కార్యక్రమాలు కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు. కడుపు కట్టుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అభివృద్ధి కోసం కష్ట పడుతున్నారని పేర్కొన్నారు. పల్లెల్లో ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని ఆలోచన ఏనాడైనా చేశారా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. పద్దతి ప్రకారమే ఆర్టీసీ బస్సులను వాడుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసమే అప్పులు చేస్తున్నామని, ఎక్కడా పన్నులు పెంచలేదన్నారు. -
‘ట్విటర్ అంత ఈజీ కాదు సభ నిర్వహించడం’
సాక్షి, హైదరాబాద్ : బహిరంగ సభలను నిర్వహించడం ట్విటర్లో స్పందించినంత సులువు కాదని మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభపై స్పందించారు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. గత వారం పది రోజులుగా వందల కోట్లు ఖర్చుపెట్టి ఒక హైప్ క్రియేట్ చేశారని, కానీ కలెక్షన్ నిల్గా నిలిచిందన్నారు. అది కేసీఆర్ ఆవేదన సభగా జరిగిందని విమర్శించారు. ఎన్నికల శంఖారావంలాగా, తన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని వందల కోట్లు ఖర్చుపెట్టారన్నారు. కానీ ప్రజల ఆదరణ పొందని సభగా నిలిచిపోయిందన్నారు. ధనబలం, అధికారమదంతో ప్రజాధనం దుర్వినయోగం చేశారని మండిపడ్డారు. ప్రజలను తరలించే విషయంలో వందలు కోట్లు ఖర్చు పెట్టారు తప్పా ప్రజలను సమీకరించలేకపోయారన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగంలో బలం లోపించిందని, ఒక దశ దిశ లేదన్నారు. సభలో ఏం చెప్తారో అని ప్రజలు ఆశగా ఎదురుచూశారని, కానీ కేసీఆర్ ప్రసంగం వారిని నిరుత్సాహపరిచిందన్నారు. నాలుగున్నరేళ్లలో ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారని ఆరోపించారు. తాము ప్లెక్సీలు కడితే రాత్రికి రాత్రే జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారని, ఇప్పుడెందుకు అలా చేయలేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ అధికారులు అధికార పార్టీలకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. తమ అధినేత అమిత్షా కూడా ముందస్తు ఎన్నికలు సిద్దమని, ప్రచారం కూడా చేస్తానని చెప్పారని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. చదవండి: నూటొక్క తీరు.. శ్రేణుల హోరు -
‘ప్రగతి నివేదన సభ కాదు పుత్రుడి నివేదిక సభ’
సాక్షి, హైదరాబాద్ : ‘కేసీఆర్ రక్తం చిందకుండా తెలంగాణ తెచ్చిన అంటున్నావ్.. నువ్వు పార్టీ పెట్టిన ఆరు ఏండ్లకు కేటీఆర్ అమెరికా నుంచి వచ్చాడు.. ఆ తరువాత కవిత బతుకమ్మ అంటూ దిగింది.. కానీ తెలంగాణ కోసం 1200 మంది ఆత్మార్పణం చేసుకున్నారు.. మరి మీ ఇంటి నుంచి ఒక్కరైనా స్మశానానికి పోయారా’ అంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు మీద నిప్పులు చెరిగారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. నిన్న జరిగింది ప్రగతి నివేదన సభ కాదని, పుత్రుడి నివేదిక సభ అని, తెలంగాణ ప్రజలపై జరిగిన దండయాత్రని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘నన్ను ముఖ్యమంత్రిని చేస్తావా లేదంటే మెత్త పెట్టి ఒత్తి చంపాలా’ అంటూ కేటీఆర్ తండ్రిని బెదిరిస్తున్నాడని, అందుకే కొడుకును మభ్యపెట్టడానికి కేసీఆర్ ముందస్తని హడావుడి చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సమైక్య పాలనలో తీసుకువచ్చిన పథకాలను కేసీఆర్ తనవిగా చెప్పుకుంటూ బీరాలు పోతున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో, కేసీఆర్ చేసింది ఏం లేదని ఆయన విమర్శించారు. పేదలు బతికున్నంత కాలం బర్లు, గొర్లు మేపుకుంటూ ఉంటే.. మీ కుటుంబం మాత్రం రాజ్యమేలుతూ ఉండలా అని మండిపడ్డారు. సామాజిక న్యాయం అంటే కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే న్యాయం చేయడం అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి కోసం 1200 మంది ఆత్మార్పణం చేస్తే వారి వివరాలు సేకరించడానికి మీకు 51 నెలల సమయ కూడా సరిపోలేదా అని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారుల్ని కూడా చిన్న చూపు చూస్తున్నారని, దాంతో వారు ప్రభుత్వం మీద తిరుగుబావుటా ఎగురవేశారన్నారు. పౌర హక్కుల కోసం పోరాడే వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారంటే తెలంగాణలో ఎలాంటి పాలన సాగుతుందో అర్థమవుతోందంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘గతంలో వార్తలు రాసి తరువాత పత్రిక అమ్మేవారు, కానీ ఇప్పుడు అమ్మిన తరువాత వార్తలు రాస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ తనకు వ్యతిరేకంగా రాసే పత్రికలను లాక్కొని.. జర్నలిస్టులను రోడ్డు మీద పడేస్తున్నారని’ ఆరోపించారు. వెయ్యికోట్లతో ప్రగతి భవన్, బుల్లెట్ ఫ్రూఫ్ బాత్రూమ్ నిర్మించుకున్న ముఖ్యమంత్రి.. అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం నిర్మించడంలో ఎందుకు ముందడుగు వేయడం లేదంటూ ప్రశ్నించారు. విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉంటేనే తట్టుకోలేని కేసీఆర్ హరికృష్ణకు స్మారక చిహ్నం కడతాను అన్నాడంటే ఓట్ల కోసం ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నాడో అర్దం చేసుకోవచ్చన్నారు. నిన్న జరిగిన సభలో కేటీఆర్, హరీష్ రావ్, కేసీఆర్, కవిత మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని అందుకే ఆయనలో ఇంతకు ముందున్న ఆత్మ విశ్వాసం, వాడి, వేడీ తగ్గాయని తెలిపారు.10వేల కోట్ల అంచనా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును 80వేల కోట్లకు పెంచిన కేసీఆర్.. ఇంటింటికి నల్లా కనేక్షన్ చూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి సవాలు చేశారు. -
కదిలింది గులాబీ దండు
నిజామాబాద్అర్బన్: దారులన్నీ అటు వైపే.. వాహనాలన్నీ ‘ప్రగతి’ సభ వైపే.. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ బిజీబిజీగా కనిపించాయి. గులాబీ జెండాల రెపరెపలతో సందడిగా మారాయి. టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కంగరకొలాన్లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు. వందలాది వాహనాల్లో వారంతా తరలి వెళ్లడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. 1.10 లక్షల మంది తరలింపు.. ప్రగతి నివేదన సభకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 1.10 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 53 వేల మంది సభకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర వాహనాల్లో ఉదయం నుంచే బయల్దేరి వెళ్లారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యలు, రాష్ట్ర నాయకులు జన సమీకరణ చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి 88 ఆర్టీసీ బస్సులు, 90 ప్రైవేట్ బస్సులు, 240 వరకు కార్లలో 8,700 మంది వరకు తరలివెళ్లారు. బాల్కొండ నుంచి 687 వాహనాల్లో 12,465 మంది, బోధన్ నుంచి 450 వాహనాల్లో 9,700 మంది, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో 425 వాహనాల్లో 11,400 మంది, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో 750 వాహనాల్లో 12,500 మందిని తరలించారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి 16 వేలు, బాన్సువాడ నుంచి 12 వేలు, ఎల్లారెడ్డి నుంచి 12 వేలు, జుక్కల్ నుంచి 11 వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు అద్దె వాహనాల్లో తరలి వెళ్లారు. మొత్తం కామారెడ్డి జిల్లా నుంచి 51 వేల మంది వరకు ప్రగతి నివేదన సభకు బయల్దేరి వెళ్లారు. రహదారులన్నీ గులాబీమయం.. జన సమీకరణ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో ఎమ్మెల్యేలు రెండు, మూడ్రోజులుగా తమ నియోజకవర్గాల్లోనే తిష్టవేసి జన సమీకరణకు సర్వశక్తులు ఒడ్డారు. జనాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 508 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. అలాగే, ప్రైవేట్ వాహనాలు, ట్రాక్టర్లు, సుమోలు అద్దెకు తీసుకుని జనాలను తరలించారు. 44వ జాతీయ రహదారి గులాబీమయంగా మారింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వాహనాలతో హైవే కిక్కిరిసింది. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాన ప్రాంతాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద సీపీ కార్తికేయ ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షించారు. హైవేతో పాటు జిల్లాకు అనుసంధామున్న రాష్ట్ర రహదారులు, వివిధ మండలాల నుంచి జిల్లాకు.. అక్కడి నుంచి జాతీయ రహదారికి వెళ్లేందుకు రూట్మ్యాప్ను రూపొందించారు. ఒక్కో ప్రధాన ప్రాంతం వద్ద సీఐ స్థాయి అధికారి, ట్రాఫిక్ పోలీసులను నియమించారు. -
ప్రగతి నివేదన సభకు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు
భూపాలపల్లి (వరంగల్): జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రగతి నివేదన సభకు భారీగా తరలి వెళ్లారు. శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి పరోక్షంగా, మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే పుట్ట మధు వాహనాలను పంపించి జనాల తరలింపులో సఫలీకృతమయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి సుమారు 100 ఆర్టీసీ బస్సుల్లో 6 వేల మంది, 90 డీసీఎంలలో 5 వేలు, 75 స్కూల్ బస్సుల్లో 3 వేలు, 60 ట్రాక్టర్లలో 1,500, వంద కార్లలో 700 మందిని ప్రగతి నివేదన సభకు తరలించారు. అలాగే మంత్రి చందూలాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను భారీ మొత్తంలోనే తరలించారు. నియోజకవర్గం నుంచి 100 ఆర్టీసీ బస్సులు, 64 ప్రైవేట్ బస్సులు, 25 మినీ బస్సులు, 50 స్కూల్ బస్సులు, 49 డీసీఎంలు, 50 టెంపో టాక్సీలు, 151 టవేరా వాహనాల్లో సుమారు 18 వేల మందిని తరలించారు. అలాగే మంథని నియోజకవర్గంలోని కాటారం, మహముత్తారం, మల్హర్, మహదేవ్పూర్, పలిమెల మండలాల నుంచి 190 ప్రైవేట్ వాహనాలు, 20 స్కూల్, ప్రైవేట్ బస్సులతోపాటు ఇతర వాహనాల్లో సుమారు 3,500 మందిని ఎమ్మెల్యే పుట్ట మధు తరలించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 37,500 మంది ప్రగతి నివేదన సభకు తరలివెళ్లినట్లు సమాచారం. పోటాపోటీగా.. పనితీరు ఆధారంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం టీఆర్ఎస్లో ఊపందుకోవడంతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రగతి నివేదన సభను సవాల్గా తీసుకున్నారు. ఒకరి కంటే ఒకరు పోటీగా వాహనాలను సమకూర్చి జనాలను తరలించారు. ప్రజాప్రతినిధులతో పాటు టికెట్లు ఆశిస్తున్న వారు సైతం తమ బలాన్ని చూపించుకోవడం కోసం తాపత్రయపడ్డారు. అనుకూలంగా ఉన్న మండలాలు, గ్రామాలకు వాహనాలను పంపించి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలను తరలించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో శాసన సభాపతి మధుసూదనాచారితోపాటు గండ్ర సత్యనారాయణరావు కూడా సభకు ప్రజలను తరలించినట్లు తెలిసింది. ఇబ్బందుల్లో ప్రయాణికులు.. సభ కారణంగా సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జిల్లాలో ఏకైక భూపాలపల్లి బస్డిపోలో 81 బస్సులు ఉండగా అందులో 71 బస్సులు సభకు వెళ్లాయి. -
సభకు వెళ్తూ.. మృత్యు ఒడికి..
వరంగల్/చిల్పూరు: ప్రగతి నివేదన సభకు వెళ్తూ మార్గమధ్యలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్టేషన్ఘన్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ పోచమ్మమైదాన్కు చెందిన గానుపు భిక్షపతి(40) ఆదివారం 29వ డివిజన్ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభకు బయలుదేరి వెళ్లారు. ఈక్రమంలో స్టేషన్ఘనపూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మూత్ర విసర్జన కోసం బస్సును నిలిపివేశారు. మూత్ర విసర్జన చేసిన భిక్షపతి తిరిగి బస్సు ఎక్కే సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో బస్సు ఢీకొట్టింది. దీంతో త్రీవగాయాల పాలైన ఆయనను స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మైరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్టానిక టీఆర్ఎస్ నాయకులు యెలుగం సత్యనారాయణ తెలిపారు. ఈవిషయాన్ని వెంటనే నగర మేయర్ నరేందర్కు తెలపడంతో ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకుపోగా భిక్షపతి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. మార్చురీ వద్ద మృతుడి బంధువుల రోధనలు కూలి చేసుకుని బతికేవాళ్లం. సభకు పోతే ఇండ్లు ఇస్తామంటే పోయాం. మీటింగ్కు పోతున్న క్రమంలో కాలకృత్యాల కోసం దిగి రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు ఢీ కొట్టింది. నాకెవరు దిక్కు అంటూ మృతుడి భిక్షపతి భార్య అనిత రోదించిన తీరు అందరిని కలిచివేసింది. రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు ఢీకొనడంతో భిక్షపతి అక్కడిక్కడే మృతిచెందాడని మృతుడి బంధువు సరోజన తెలిపింది. రూ.10లక్షలు చెల్లించాలి.. ప్రగతి నినేదన సభకు వెళ్లిన నిరుపేద భిక్షపతి కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ అర్బన్ పార్టీ అధికార ప్రతినిధి చిప్ప వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సభ విజయవంతం కోసం ప్రజలను తీసుకెళ్లిన నాయకులు సరైన జాగ్రత్తలు తీసుకోనందునే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈకుటుంబాన్ని ఆదుకునేందుకు స్థానిక టీఆర్ఎస్ నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. -
‘ప్రగతి’సభకు జనహోరు
సాక్షి యాదాద్రి : తెలంగాణ ప్రభుత్వం ఆదివారం కొంగరకలాన్లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు జిల్లా నుంచి జనం భారీగా తరలివెళ్లారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు వారం రోజులుగా శ్రమించి నిర్దేశించిన లక్ష్యానికి మించి జనసమీకరణ చేశారు. జిల్లా నుంచి మొత్తం 1,392 వాహనాల్లో 79,750 మంది సభకు వెళ్లారు. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు వాహనాల ర్యాలీలను జెండా ఊపి ప్రారంభించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ప్రభుత్వవిప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి బైక్ర్యాలీని ప్రారంభించారు. అనంతరం భువనగిరి రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద కొద్ది సేపు బైక్పై ప్రయాణించింది.అలాగే భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి వాహన శ్రేణిని ప్రారంభించారు. సభకు వెళ్లినవారు ఇలా.. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు ఇ తర మండలాల నుంచి 1,392 వాహనాల్లో 79, 750 మంది ప్రగతి నివేదన సభకు తరలివెళ్లా రు. ఆలేరు నియోజకవర్గం నుంచి 377 వాహనా ల్లో 30వేలు, భువనగిరి నియోజకవర్గం నుంచి 454 వాహనాల్లో 30,450వేల మంది, సంస్థాన్ నారా యణపురం, చౌటుప్పల్, రామన్నపేట, మో త్కూ రు, అడ్డగూడురు మండలాల నుంచి 561 వాహనాల్లో 19,300 మంది సభకు తరలివెళ్లారు. ప్రయాణికులకు తప్పని తిప్పలు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను సైతం సభకు జనాన్ని తరలించేందుకు ఉపయోగించడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. ఆదివా రం బోనాలు, శుభాకార్యలు, సొంత పనుల కో సం వెళ్లేవారికి బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి బస్సుల కో సం బస్టాండ్లలో నిరీక్షించారు. భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, రామన్నపేట, మోత్కూరు, యాదగిరిగుట్ట బస్టాండ్లలో బస్సులు లేక వెలవెలబో యాయి. చాలా మంది ప్రయాణికులు బస్సులు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిం చారు. హైవేలపై వాహనాల రద్దీ జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు జాతీయ రహదారులన్నీ గులాబీ శోభను సంతరించుకున్నాయి. సభకు వెళ్లే వాహనాలతో ర ద్దీగా మారాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీం నగర్ జిల్లాల వాహనాలు ఆలేరు, భువనగిరి, బీ బీనగర్ల మీదుగా వెళ్లడంతో గూడూరు టోల్ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. అలాగే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల వాహనాలు చౌటుప్పల్ మీదుగా వెళ్లడంతో పంతంగి వద్ద ఉన్న టోల్ప్లాజా రద్దీ ఏర్పడింది. రహదారుల వెంట ఉన్న వైన్స్లలో కోనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో ఖాళీ అయిపోయాయి. పార్టీ శ్రేణులు తమ వెంట తె చ్చుకున్న భోజనాన్ని రోడ్ల వెంట వాహనాలను ఆపి తిన్నారు. పోలీస్యంత్రాంగం పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. -
కేసీఆర్ మాటలు వింటే నవ్వొస్తోంది
సాక్షి, కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభలో హంగామా తప్ప ఏమీ లేదని, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభను చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. సభ అట్టర్ ఫ్లాఫ్ అయిందనడానికి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో నుంచి తీసిని ఏరియల్ వ్యూ విజువల్సే సాక్ష్యమన్నారు. పత్రికలు మాత్రం గోరింతలను కొండంతలు చేశాయన్నారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పత్రికలకు ముందస్తు ఎన్నికలంటూ లీకులిచ్చి ఇప్పుడేమో మ్యానిఫెస్టో కమిటీ త్వరలో వేస్తానంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజాసంఘాలు టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. విరసం నేత వరవరరావు అరెస్ట్పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదన్నారు. ఢిల్లీ దగ్గర మోకరిల్లుతామని మమ్మల్ని విమర్శిస్తున్న కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర మోకరిల్లడం లేదా అని ప్రశ్నించారు. ఫెడరల్ విధానంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎంతో కీలకమని తెలిపారు. ప్రధాన మంత్రిని ‘ఇస్తావా చస్తావా’ అని బెదిరించి జోనల్ విధానాన్ని సాధించానని చెబితే నవ్వొచ్చిందన్నారు. ఇదే మాట నాలుగేళ్ల కింద ఎందకడగలేదని నిలదీశారు. ముస్లిం, గిరిజిన రిజర్వేషన్లపై ఇదే తరహాలో మోదీని ఎందుకు అడగడం లేదన్నారు. విభజన హామీలు ఎందుకు సాధించలేక పోయావని ప్రశ్నించారు. రాష్ట్రంలో 15 రోజుల్లోనే 500 పైగా రైతులు చనిపోయారని, రాష్ట్రంలో హెల్త్ ఎమ్మెర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విద్యుత్ ఉద్యోగులకు జీతాలు పెంచిన కేసీఆర్.. హరీశ్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నందుకే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచడం లేదా అని ప్రశ్నించారు. -
ప్రగతి నివేదన సభకు వెళ్తూ మృత్యుఒడిలోకి..
శాలిగౌరారం(నకిరేకల్) : రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో ఆదివారం జరిగిన టీఆ ర్ఎస్ ప్రగతి నివేదన బహిరంగ సభకు జనంతో కలిసి వెళ్తున్న శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామానికి చెందిన సయ్యద్ అబ్దుల్రహీం(31) డీసీ ఎం వాహనం పైనుంచి పడి మృతి చెం దాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ వద్ద జరిగింది. వివరాలు.. మాధారంకలాన్కు చెందిన డీసీ ఎం వాహనం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలను బహిరంగ సభకు తరలించే క్రమంలో వేగంగా వెళ్తూ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ప్రమాదం జరిగి నట్లు అదే వాహనంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. అతి నిరుపేద కుటుంబం గ్రామానికి చెందిన అబ్దుల్ రహీంది గ్రామంలోకెల్లా అతినిరుపేద కుటుం బం. దినసరి కూలీ. గ్రామంలో ఎలాంటి స్థిరాస్తులు, సొంత ఇల్లు కూడా లేదు. అబ్దుల్రహీం తండ్రి గూడుసాబ్ ఏడేళ్ల క్రితం మృతిచెందగా.. తల్లి సైదాబీ సంవత్సరం క్రితం మరణించింది. తల్లి ప్రథమ వర్థంతిని కూడా ఇటీవలే నిర్వహించాడు. అబ్దుల్రహీంకు ఒక తమ్ముడు ఉన్నాడు. తల్లిదండ్రుల మరణాంతరం అతను కూడా ఇల్లు వదిలి హైదరాబాద్లో కారు డ్రైవింగ్ చేస్తూ బతుకుతున్నాడు. ఈ క్రమంలో మాధారంకలాన్లో ఒంటరిగా తన పూరిగుడిసెలో ఉంటున్న అబ్దుల్రహీం దినసరి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. గ్రామంలో సొంత ఇల్లుకూడా లేని అబ్దుల్రహీంకు డబుల్బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ప్రగతి నివేదన బహిరంగ సభకు తీసుకుపోయారని గ్రామస్తులు తెలిపారు. అబ్దుల్ రహీం అవివాహితుడు. -
టీఆర్ఎస్లో కదనోత్సాహం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎటూ చూసినా గులాబీ జెండాల రెపరెపలే... ఏ రోడ్డు చూసినా టీఆర్ఎస్ జెండాలతో కదిలే వాహనాలే.. ఆర్టీసీ బస్సులు మొదలుకొని కార్లు, ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లతోపాటు చివరికి రైళ్లు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులతోనే కిక్కిరిసి పోయాయి. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ నాయకులు తమ వాహనాలతో గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ సమీపంలోని కొంగరకలాన్కు వెళితే... బోథ్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల వాహనాలు బాసర, నిజామాబాద్ మీదుగా 44వ నెంబర్ జాతీయ రహదారి గుండా హైదరాబాద్కు చేరుకున్నాయి. ఖానాపూర్ నుంచి మాత్రం లక్సెట్టెపేట మీదుగా కరీంనగర్ నుంచి రాజీవ్ రహదారి ద్వారా హైదరాబాద్ వైపు వాహనాలు బయలుదేరి వెళ్లాయి. రోడ్లపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గులాబీ జెండాలతో నిర్విరామంగా సాగుతున్న వాహనాల శ్రేణిని చూసి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యే పరిస్థితి ఆదివారం నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్వంలో హైదరాబాద్ కొంగరకలాన్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరంగసభ ఘన విజయం సాధించింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా లక్షలాదిగా తరలివచ్చిన ప్రజానీకాన్ని ఉద్ధేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఉర్రూతలూగించిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, జరిగిన అభివృద్ధిని సీఎం వివరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. వచ్చే ఎన్నికల్లో జరిగిన అభివృద్ఢిని చూసి టీఆర్ఎస్కు ఓటేయమని చెప్పిన కేసీఆర్... కాంగ్రెస్, ఇతర పక్షాలకు ఓటేయడానికి ఉన్న కారణాలను కూడా ప్రశ్నించి ప్ర జలను ఆలోచనలో పడేశారు. ఈ నేపథ్యంలో స భకు వెళ్లిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు టీవీలకు అతుక్కుపోయిన జనం సైతం స భ జరిగిన తీరుపై విస్తృతంగా చర్చించుకున్నారు. ఆదిలాబాద్ నుంచి 70వేల పైనే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రగతి నివేదన సభకు లక్ష జనాన్ని తరలించాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మందిని లక్ష్యంగా చేసుకొని జన సమీకరణ జరపాలని మండల, గ్రామ యంత్రాంగానికి ఆదేశాలు పంపారు. కాగా ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాల నుంచి 60వేల మందిని తరలించాలని భావించారు. ఈ మేరకు జన సమీకరణ జరిపినప్పటికీ వాహనాల కొరత వల్ల టార్గెట్ నిండలేదని నాయకులు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి 106 ఆర్టీసీ బస్సులతోపాటు టవేరా, తుపాన్, జీప్ వంటì 180 వాహనాల ద్వారా 10వేలకు పైగా జనం తరలినట్లు చెబుతున్నారు. నిర్మల్లో 88 ఆర్టీసీ బస్సులతోపాటు 80 స్కూలు బస్సులు, 180 జీపులు, కార్ల ద్వారా 10 వేల మంది వరకు తరలినట్లు నియోజకవర్గం నాయకులు చెబుతున్నారు. సిర్పూరు నియోజకవర్గంలో 50 ఆర్టీసీ బస్సులతోపాటు 100 కార్లు, ఇతర వాహనాల ద్వారా వెళ్లిన జనంతోపాటు దక్షిణ్, నాగపూర్ ఎక్స్ప్రెస్, భాగ్యనగర్, ఇంటర్సిటీ రైళ్ల ద్వారా 12వేల మంది వరకు జనం తరలివెళ్లినట్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుయాయులు స్పష్టం చేస్తున్నారు. బోథ్ నుంచి 8 ఆర్టీసీ బస్సులు, 25 స్కూలు బస్సులు, ఇతర వాహనాలు 511 కలిపి 544 వాహనాలు వెళ్లినట్లు అధికారికంగా లెక్కలున్నాయి. బెల్లంపల్లి, ఆసిఫాబాద్, చెన్నూరుల నుంచి కూడా ఒక్కో నియోకజవర్గానికి 7వేలకు తగ్గకుండా జనాన్ని సమీకరించి పంపించినట్లు వారి వర్గీయులు లెక్కలు చెబుతున్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్రావుతోపాటు టిక్కెట్లు ఆశిస్తున్న ఒకరిద్దరు ముఖ్య నాయకులు సొంత ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేశారు. అన్ని స్థాయిల నాయకులదీ ఒకటే లక్ష్యం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఇతర నాయకులు సైతం జన సమీకరణలో పోటీ పడ్డారు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తున్న ఎంపీలతోపాటు ఇతర నాయకులు కూడా వాహనాలు ఏర్పాటు చేసి జనాన్ని తరలించారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్రావుతోపాటు టిక్కెట్టు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు తనయుడు గోనె విజయ్కుమార్, చలనచిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ పుస్కూరి రామ్మోహన్రావు, బీసీ నాయకుడు బేర సత్యనారాయణ, మునిసిపల్ చైర్పర్సన్ ఎం.వసుంధర తదితరులు జన సమీకరణలో పాలు పంచుకున్నారు. చెన్నూరులో ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ నల్లాల ఓదెలుతోపాటు ఈ నియోజకవర్గం టికెట్టు ఆశిస్తున్న ఎంపీ బాల్క సుమన్ కూడా భారీగానే జన సమీకరణ జరిపారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు పోటీగా టిక్కెట్టు ఆశిస్తున్న ప్రవీణ్కుమార్ తన వర్గీయుల కోసం వాహనాలు ఏర్పాటు చేశారు. బోథ్లో ఎమ్మెల్యే బాపూరావుకు పోటీగా ఎంపీ గోడెం నగేష్, ఖానాపూర్లో ఎమ్మెల్యే రేఖానాయక్కు పోటీగా రాథోడ్ రమేష్ జన సమీకరణ జరిపారు. వీరికి తోడు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, రైతు సమన్వయ సమితి నాయకులు, జిల్లా, మండల పరిషత్ సభ్యులు సొంత కార్లలో హైదరాబాద్కు తరలి వెళ్లారు. -
కదిలింద దండు!
టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి గులాబీదండు కదిలింది. కొంగరకలాన్ సభ సక్సెస్ కోసం వారం రోజులుగా కసరత్తు చేస్తున్న నాయకులు.. ఎట్టకేలకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 13 నియోజకవర్గాల నుంచి 2.50 లక్షలమంది తరలింపు లక్ష్యం కాగా.. 1.60 లక్షల వరకు తరలినట్లు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ, తరలింపునకు బాధ్యులు సర్వశక్తులొడ్డారు. ప్రగతి నివేదన సభకు ముహూర్తం ఖరారైన మరుసటిరోజు నుంచే ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ జన సమీకరణ, తరలింపుపై ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో హైదరాబాద్, కరీంనగర్లో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. 13 నియోజకవర్గాలకు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులను ఇన్చార్జిలుగా నియమించి కరీంనగర్ సత్తా చూపేలా అందరూ కలిసి జనం తరలింపులో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భారీగా జనాన్ని తరలించడంలో సఫలీకృతులయ్యారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాజీవ్ రహదారి గులాబీమయమైంది. ఎటూ చూసినా గులాబీ జెండాల రెపరెపలే. ఏ రోడ్డు చూసినా టీఆర్ఎస్ జెండాలతో కదిలే వాహనాలే. ఆర్టీసీ బస్సులు మొదలు కార్లు, ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులతోనే కిక్కిరిసిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం, చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి, హుస్నాబాద్, కరీంనగర్ తదితర నియోజకవర్గాలకు చెందిన వాహనాలన్నీ కూడా కరీంనగర్–హైదరాబాద్ రాజీవ్రహదారి మీదుగానే వెళ్లడంతో రోడ్డంతా రద్దీగా మారింది. రేణికుంట టోల్ప్లాజా వద్ద ప్రతి 10 నిముషాలకోసారి ట్రాఫిక్ జామ్ అయ్యింది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన చాలా వాహనాల ఎన్హెచ్–44 నెంబర్ జాతీయ రహదారి మీదుగా వెళ్లాయి. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కామారెడ్డి, సిద్దిపేట మీదుగా సభాస్థలికి చేరుకున్నారు. హుజూరా బాద్ నియోజకవర్గం వాహనాలు వయా వరంగల్, హుస్నాబాద్ నుంచి వెళ్లాయి. దీంతో హైదరాబాద్ను కలిపే రోడ్లపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గులాబీ జెండాలతో నిర్విరామంగా సాగిన వాహనాల శ్రేణితో రహదారులన్నీ గులాబీమయం అయ్యాయి. కొంగరకలాన్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరంగసభ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ‘ముందస్తు’ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నిర్వహించిన సభకు జిల్లానుంచి పోటీపోటీగా జనాన్ని తరలించగా.. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఉర్రూతలూగించింది. హుషారెత్తించిన కేసీఆర్ ప్రసంగం.. కరీంనగర్ ప్రస్తావనతోనే మొదలు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం టీఆర్ఎస్ శ్రేణులను హుషారెత్తించింది. కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి, తనకు సెంటిమెంటని పదేపదే చెప్పే ఆయన.. కొంగరకలాన్ సభలో కరీంనగర్ ప్రస్తావనతోనే ప్రసంగం మొదలెట్టారు. సమైక్యాంధ్రుల పాలనలో కరువు, విద్యుత్ సమస్యలతోపాటు ఆనాడు జరిగిన అన్యాయాలను ఎంపీ వినోద్కుమార్, దేశిని చిన్నమల్లయ్యతో కలిసి తిరిగి పంచుకున్నానని ప్రస్తావించారు. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, జరిగిన అభివృద్ధిని సీఎం వివరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. వచ్చే ఎన్నికల్లో జరిగిన అభివృద్ఢిని చూసి టీఆర్ఎస్కు ఓటేయమని చెప్పిన కేసీఆర్.. కాంగ్రెస్, ఇతర పక్షాలకు ఓటేయడానికి ఉన్న కారణాలను కూడా ప్రశ్నించి ప్రజలను ఆలోచనలో పడేశారు. ఈ నేపథ్యంలో సభకు వెళ్లిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలతోపాటు టీ వీలకు అతుక్కుపోయిన జనం సైతం సభ జరిగిన తీరుపై విస్తృతంగా చర్చించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి 1.60 లక్షల పైనే.. ఇంటిలిజెన్స్, స్పెషల్బ్రాంచీల ఆరా కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని 13 నియోజకవర్గాల నుంచి 2.50 లక్షల మంది జనాన్ని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతి నియోజకవర్గం నుంచి 20 వేల మందిని లక్ష్యంగా చేసుకుని జన సమీకరణ జరపాలని మండల, గ్రామ యంత్రాంగానికి ఆదేశాలు పంపారు. కాగా 13 నియోజకవర్గాలనుంచి భారీగా తరలించేందుకు కసరత్తు చేసినా.. వాహనాలు సరిపోక.. సమయానికి గ్రామాలకు చేర్చలేకపోవడం వల్ల చాలామంది ఆగిపోయారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ నుంచి 5,743 ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సులు, కార్లు, వ్యాన్లు, జీపులు, ట్రాక్టర్లు తదితర వాహనాల్లో 1.60 లక్షల మందిని తరలినట్లు అంచనా. ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిన వాహనాల ఆధారంగా అధికారులు, నిఘావర్గాల అంచనా మేరకు కరీంనగర్ జిల్లా 60 వేల వరకు వెళ్లినట్లు చెప్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 23 వేలు, కరీంనగర్ నుంచి 15 వేలు, మానకొండూరు 13, చొప్పదండి నుంచి తొమ్మిది వేల వరకు వెళ్లినట్లు అంచనా. జగిత్యాల జిల్లా నుంచి 1343 వాహనాల్లో 41 వేలు, రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి 650 వాహనాల్లో 25 వేలు, పెద్దపల్లి జిల్లా నుంచి 950 వాహనాల్లో 30 వేలవరకు వెళ్లినట్లు అంచనా వేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జన సమీకరణ చేసేందుకు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు, సభ కోసం నియమించిన ఇన్చార్జిలు, ఇతర ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గం హుజూరాబాద్ నుంచి భారీగా జన సమీకరణ చేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం జనాన్ని తరలించింది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సొంత డబ్బులు కూడా వెచ్చించారు. ధర్మపురి, కోరుట్ల, పెద్దపల్లి, మానకొండూరు, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, కె.విద్యాసాగర్, దాసరి మనోహర్రెడ్డి, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్కుమార్ జనసమీకరణకు పాటుపడ్డారు. జగిత్యాల ఇన్చార్జి డాక్టర్ సంజయ్కుమార్, చొప్పదండి, రామగుండం ఎమ్మెల్యేలు బొడిగ శోభ, సోమారపు సత్యనారాయణతోపాటు ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలు కూడా జన సమీకరణలో పాలు పంచుకున్నారు. ఎంపీ వినోద్కుమార్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఐడీసీ, సుడా చైర్మన్ ఈద శంకర్రెడ్డి, జీవీ.రామకృష్ణారావు, పార్టీ సీనియర్ నాయకులు, ఇన్చార్జిలు భాగస్వామ్యం అయ్యారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, రైతు సమన్వయ సమితి నాయకులు, జిల్లా, మండల పరిషత్ అధ్యక్షులు, సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సొంత కార్లలో హైదరాబాద్కు తరలివెళ్లారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి కొంగరకలాన్ సభ కోసం ఎంత మంది తరలారు? ఏయే నియోజకవర్గాల నుంచి ఎన్ని వాహనాలు, ఎంతమంది? జన సమీకరణలో ఏయే నాయకుల ప్రమేయం ఎంత? తదితర అంశాలపై నిఘా వర్గాలు ఆరా తీశాయి. -
మహానగరం గులాబీ వనం
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ నగరం ప్రగతి నివేదన మహాసభకు దారితీసింది. అభివృద్ధి, సంక్షేమ నినాదాల హోరు.. బతుకమ్మ పాటలు, బోనాల జాతరలు, పోతరాజుల విన్యాసాలు, దున్నపోతుల రంకెలు, చేతి వృత్తుల ప్రదర్శనల మధ్య టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ నగర పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపింది. రెండు రోజుల నుంచే గులాబీ వనాన్ని తలపించిన మహానగరం.. ఆదివారం ఉదయం చిరు జల్లులు కురుస్తున్నా భారీ పార్టీ జెండాలను చేతబూని కొంగరకలాన్కు తరలి వెళ్లారు. దీంతో దారుల వెంట బైక్ ర్యాలీలు, ప్రయాణాల్లో జై తెలంగాణ నినాదాలతో సందడి నెలకొంది. ఆర్టీసీ సర్వీసులను ప్రగతి నివేదన సభకే నడిపారు. దీంతో ప్రత్యేక పనులున్న జనాలు మాత్రమే బయటకు వచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల లబ్దిదారులంతా ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయడంతో బస్తీలు, కాలనీ సంఘాల నుంచి జనం భారీ సంఖ్యలోనే పాల్గొన్నారు. జన సమీకరణలో పోటాపోటీ నగరం నుంచి మొత్తం మూడు లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అందుకు తగ్గట్టుగానే భారీ సమీకరణే చేయగలిగారు. ముఖ్యంగా శివారు నియోజకవర్గాలైన కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, సనత్నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి జనం భారీగా ర్యాలీలు తీశారు. ఉప్పల్లో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గంగిరెద్దులు, వెదురు బుట్టలను ప్రదర్శిస్తూ ప్రదర్శన సాగితే, అంబర్పేటలో గీత, కుమ్మరి, రజక వృత్తులను ప్రతిబింబించే కళా ప్రదర్శనలతో తరలివెళ్లారు. కంటోన్మెంట్లో ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, కాచిగూడలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దున్నపోతుల ర్యాలీని ప్రారంభించారు. సభ విజయవంతంపై నేతల సంతృప్తి మహానగరం నుంచి ఆశించిన స్థాయిలో జరిగిన జన సమీకరణపై టీఆర్ఎస్ ముఖ్య నేతలు సంతృప్తి వక్తం చేశారు. మంత్రులు పద్మారావు, తలసాని, పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, నాయకులు దానం నాగేందర్తో పాటు ఎమ్మెల్యేలను మున్సిపల్ మంత్రి కేటీఆర్ అభినందించారు. -
వైన్షాపులో సరుకు ఖాళీ
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పరిధిలోని వైన్షాపులన్ని ఆదివారం మధ్యాహ్ననికి ఖాళీ అయ్యాయి. రెగ్యులర్ బీర్లు, విస్కీ, రమ్, బాటిళ్లన్ని అమ్ముడు పోయాయి. ఒక పక్క పోలీసులు షాపులను మూసి వేయాలని, మరోపక్క నాయకులు మందు బాటిళ్లు కావాలని యజమానులపై ఒత్తిడి తెచ్చారు. చివరకు మధ్యాహ్నానికి బార్లు, వైన్షాపులన్ని మూతపడ్డాయి. కొన్ని షాపులు ఉదయమే మూయించివేశారు. ప్రగతి నివేదన సభ నేపథ్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ముందే మందు బాటిళ్లను కొనుగోలు చేశారు. పెద్ద ఎత్తున మందు బాటిళ్లను కొనుగోలు చేయడంతో షాపులో మధ్యం బాటీలన్నీ ఖాళీ అయ్యాయి. ఆదివారం ఉదయం బార్, వైన్షాపులను పోలీసులు తెరవ వద్దంటూ సూచించారు. కానీ నాయకుల ఒత్తిడితో షాపులను తెరిచి వారికి కావాల్సిన బాటిళ్లను అందించారు. ఎక్సైజ్ పోలీసులు తాము ఎవరికి షాపులు మూసివేయాలని తెలుపలేదన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రం సభకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న షాపులను మూసివేయాలని తెలిపామని వెల్లడించారు. -
‘ప్రగతి నివేదన’ అట్టర్ ఫ్లాప్ షో
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ‘అట్టర్ ఫ్లాప్ షో’అని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. అది ప్రగతి నివేదన కాదని, జనావేదన సభగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. నిండుసభలో సీఎం కేసీఆర్ దొంగ మాటలు మాట్లాడారని విమర్శించారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభతో కేసీఆర్ తన ధనబల ప్రదర్శన చేశారని, కేసీఆర్ అవినీతిని ప్రపంచం నివ్వెరపోయేలా గమనించిందన్నారు. ప్రగతి నివేదన పేరుతో రూ.300 కోట్ల అవినీతి సొమ్ము ఖర్చు పెట్టారని ఆరోపించారు. సభలో కేసీఆర్ ప్రసంగం తుస్సుమనిపించిందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా బెదిరించి ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల బస్సులను చట్టవిరుద్ధంగా తీసుకున్నారని, ఎవడబ్బ సొమ్మని ఆర్టీసీ బస్సులు వాడుకున్నారని ఆ యన ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఒక్క విద్యు త్ ప్రాజెక్టయినా మొదలుపెట్టారా..? అని నిలదీశారు. మిషన్ భగీరథ ద్వారా 10 శాతం ఇండ్లకు కూడా నీళ్లివ్వ లేదని, చెప్పిన సమయానికి నీళ్లివ్వడంలో కేసీఆర్ విఫ లమయ్యారన్నారు. అది మిషన్ భగీరథ కాదని, కమీషన్ భగీరథ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రసంగం లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు, దళితులకు మూడెకరాల భూమి ప్రస్తావనే లేదన్నారు. కేసీఆర్కు నిబద్ధత లేదని విమర్శించారు. ఆత్మహత్యల్లో రాష్ట్రం నంబర్ వన్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం నంబర్ 1 అయిందని, రాష్ట్ర ప్రజలను మందులో ముంచడం, అవినీతిలో నంబర్ వన్ అయిందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నాలుగు వేల చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయని పేర్కొ న్నారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా కేసీఆర్ ప్రసంగం సాగిందని విమర్శించారు. ఢిల్లీకి తాము చెంచాలం కాదని, కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి చెంచా అని, ఆయనకు ఏజెంట్గా పనిచేస్తున్నారని అన్నారు. ‘కేసీఆర్ హఠావో... తెలంగాణ బచావో’నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని ఉత్తమ్ చెప్పారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ అది ప్రగతి నివేదన సభ కాదని, ముక్క, చుక్క, లెక్క సభలా సాగిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీల మీద, మాట నిలబెట్టుకోవడం మీద, తెలంగాణ ప్రగతి మీద కేసీఆర్ చర్చకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అది ప్రగతి నివేదన కాదని, జనావేదన అని, చెప్పుకోవడానికి ఏమీలేక పేలవంగా మారిందన్నారు. సమావేశంలో మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పాల్గొన్నారు. నివేదనపై కాంగ్రెస్ నేతల నజర్ శనివారం రాత్రే సమావేశమైనటీపీసీసీ ముఖ్యులు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనించింది. భారీ జనసమీకరణ లక్ష్యంగా నిర్వహించిన సభలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటనలు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే దానిపై ఆ పార్టీ ముఖ్యులు ఆరా తీశారు. ఆదివారం ఉదయం నుంచే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి మొదలు.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు, క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ప్రగతి నివేదన సభ పరిణామాలను గమనిస్తూ వచ్చారు. సభకు కార్యకర్తలను ఎలా తరలిస్తున్నారు? ఏ నాయకుడి ఆధ్వర్యంలో, ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది వెళ్లారనే లెక్కలు కట్టుకున్నారు. మరోవైపు హైదరాబాద్లో మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు శనివారం రాత్రే సమావేశమయ్యారు. సమావేశానికి ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే రేవంత్రెడ్డి హాజరయ్యారు. కేసీఆర్ అనుసరించే వ్యూహంతోపాటు చేయనున్న ప్రకటనల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా వెనుకాడవద్దని, అవసరమైతే ఎన్నికలకు యుద్ధప్రాతిపదికన సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో చేరాల్సిన ముఖ్య నేతలను వెంటనే చేర్చుకోవాలని నిర్ణయించారు. -
‘ప్రగతి’ ప్రచారమే.. నివేదన ఎక్కడ: చాడ
హుస్నాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ ప్రచారమే తప్ప.. ఎలాంటి నివేదన లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి నివేదన సభకోసం అధికార దుర్వి నియోగానికి పాల్పడి అడ్డగోలుగా ఖర్చు చేసిందని ఆరోపించారు. కేబినెట్లో అనేక వరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్, త్వరలోనే అసెంబ్లీ రద్దుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజలకు ఇచ్చిన వరాలను ఎలా అమలు చేస్తా రని ప్రశ్నించారు. కేసీఆర్ ఇదివరకు ఇచ్చిన హమీలనే నేరవేర్చలేదని, ఉత్తి మాటలే తప్ప చేతలు లేవని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులు, మైండ్గేమ్, అప్పులు, మద్యం ఏరులుగా పారించడం, అవినీతి తప్ప.. అభివృద్ధి సాధించలేదని విమర్శించారు. రాష్ట్రం లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ నత్తనడకన సాగుతోందన్నారు. -
నూటొక్క తీరు.. శ్రేణుల హోరు
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చీమలదండు కదలింది. లక్షలాదిగా తరలివచ్చిన గులాబీ దళంతో కొంగర కలాన్ జనసంద్రమైంది. గులాబీ జెండాల రెపరెపలు.. కళాకారుల ఆట పాటలు.. యువత కేరింతలు.. జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదాలతో ప్రగతి నివేదన సభ మైదానం హోరెత్తింది. ఉప్పొంగిన ఉత్సాహంతో తరలివచ్చిన వేలాది వాహనాలు, టీఆర్ఎస్ అభిమానులతో పరిసరాలు నిండిపోయాయి. ప్రత్యేక వేషధారణలతో కళాకారులు, బతుకమ్మలను ఎత్తుకున్న మహిళలు, కోలాటాల బృందాల ఆట పాటలు అలరించాయి. సభా స్థలికి రెండు కిలోమీటర్ల ముందే వాహనాలను నిలిపివేసినా.. రెట్టించిన ఉత్సాహంతో ఉదయమే రైతులు, యువకులు, మహిళలు, ఆశా వర్కర్లు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. రాత్రి నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు సభాస్థలికి తరలివస్తున్న జనంలో ఉత్సాహాన్ని నింపేందుకు శనివారం రాత్రి నుంచే సాంస్కృతిక కార్య క్రమాలు మొదలయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వేదిక ముందున్న ప్రాంత మంతా కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలు మూలల నుంచి కార్యకర్తలు, నాయకులు, అభి మానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనసం దోహాన్ని ఉత్సాహంతో ఉంచేందుకు కళాకారులు ఆటపాట లతో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని పాటల రూపంలో ప్రదర్శించారు. కళా కారుల ప్రదర్శనకు జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈలలు, కేరింతలతో ప్రతిస్పందించడంతో అక్కడి వాతావరణం ఉల్లాస భరితంగా మారిపోయింది. కొందరు కార్యకర్తలు ఏకంగా స్టెప్పులు వేయడంతో వారికి జతగా మరికొందరు అదేస్థాయిలో నృత్యాలు చేశారు. రైతుబంధు, రైతు బీమా పథకాలతో లబ్ధిపొందిన రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 10 వేలకు పైగా ట్రాక్టర్లలో ఒకరోజు ముందే సభా స్థలికి వచ్చి వంటావార్పు చేసుకొని సభకు హజరయ్యారు. వారికి పార్టీ వలంటీర్లు వంట చెరుకు అందించడంతో పాటు పొయ్యిలు ఏర్పాటు చేసిచ్చారు. జనమే జనం రాజధాని శివారు ప్రాంతాల్లోని శామీర్పేట్, పటాన్ చెరు, శంషాబాద్, హయత్నగర్, ఘట్కేసర్ నుంచి టీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాలు, మోటారు సైకిళ్లలో భారీ ఎత్తున జనం కొంగరకలాన్కు చేరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి యువత మోటారు సైకిళ్లతో ర్యాలీలుగా తరలివచ్చారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు పాదయాత్రగా సభాస్థలికి చేరుకున్నాయి. టీఆర్ఎస్ అధినేత రాకకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ జనప్రవాహం పెరుగుతూ వచ్చింది. దీంతో వాహనాల తాకిడి ఒక్కసారిగా పెరిగి ట్రాఫిక్ జామ్కు కారణమైంది. కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులు రద్దీని నియంత్రించ లేక చేతులెత్తేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వలంటీర్లు ముందుకు వచ్చారు. బస్సు టాపులపై నిల్చొని..సభా స్థలికి వెళ్లే మార్గాలన్నీ జన సమ్మర్థంతో కిక్కి రిసిపోగా.. వేలాదిగా తరలివచ్చిన వాహనాలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన కార్యకర్తలు సభా ప్రాంగణానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ఏకంగా ఔటర్ రింగ్రోడ్డు నుంచే వెనుదిరగగా.. మరికొందరు బస్సు టాపులపై నిల్చొని సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. చిటపట చినుకులు సభకు వర్షం అంతరాయాన్ని కలిగించింది. మధ్యాహ్నం తర్వాత రెండు మూడుసార్లు చినుకులు కురిశాయి. ఓ సమయంలో మోస్తరు వర్షం కురవడంతో సభకు వచ్చిన జనం అటు, ఇటు పరుగులు తీశారు. భారీ వర్షం వచ్చే సూచనలు ఉందన్న ప్రచారంతో కొందరు వచ్చిన వెంటనే వెనుదిరిగారు. మహిళల సందడే సందడి సభలో ఏర్పాటు చేసిన 16 గ్యాలరీల్లో మహిళల సందడి అంతాఇంతా కాదు. సభావేదిక ముం దున్న గ్యాలరీలో కళాకారుల ఆటపాటలకు అను గుణంగా 2 వేల మంది స్టెప్పులేశారు. యువత కేరిం తలతో, డ్యాన్సులతో హోరెత్తించారు. పలువురు మహిళలు బతుకమ్మలు, బోనా లతో తరలివచ్చారు. అక్కడే బృందాలుగా ఏర్పడి బతుకమ్మ పాటలతో ఆటలాడారు. వారికనుగుణంగా యువతులు గొంతు కలిపారు. దోబూచులాడిన వరుణుడు.. ప్రగతి నివేదన సభకు వరుణుడు కొంత అంతరాయాన్ని కలిగించాడు. శనివారం మధ్యాహ్నం వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం రాత్రి సభ పరిసరాల్లో భారీ వర్షమే కురిసింది. పెద్ద ఎత్తున గాలితో కూడిన వర్షం రావడంతో అక్కడ ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు కుప్పకూలాయి. సభా ప్రాంగణంలోని ప్లెక్సీలు పడిపోగా... నేలంతా తడిసి చిత్తడిచిత్తడిగా మారింది. దీంతో తేరుకున్న నిర్వాహకులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఆదివారం ఉదయం పొడి వాతావరణం ఉన్నప్పటికీ... మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిరుజల్లుతో మొదలై ఓ మోస్తరు వాన కురిసింది. దీంతో సభకు వచ్చే జనాలకు ఇబ్బందులు తప్పలేదు. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులకు కాస్త అంతరాయం కలిగింది. సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. వాతావరణం పొడిగా మారడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వచ్చే సమయానికి పరిస్థితి పూర్తిగా సర్దుకుంది. అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించేందుకు 8 వైద్య శిబిరాలు, 30 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.కార్యకర్తల్లో సెల్ఫీ జోష్ కనిపించింది. సభకు వచ్చిన వారంతా సెల్ఫీలు తీసుకుని వాట్సాప్, ఫేస్బుక్లలో పోస్ట్ చేయడం కనిపించింది. సాయంత్రం ఐదున్నరకు బతుకమ్మలు, బోనాలతో మహిళలు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకు సభాస్థలి దృశ్యాలను ఎంపీ కవిత ఫొటో తీసుకున్నారు.హెలికాప్టర్ నుంచి సభా ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ వీక్షించారు. కేడర్కు అభివాదం చేశారు. కార్యకర్తలు కూడా ‘జై కేసీఆర్’ అని నినాదాలు చేయడంతో సభా ప్రాంగణమంతా మార్మోగింది. ఆ దృశ్యాలను కవిత సహా కార్యకర్తలు కెమెరాల్లో బంధించుకున్నారు.6 గంటలకు సభాస్థలికి చేరుకున్న కేసీఆర్.. అమరులకు నివాళులర్పించారు. మంత్రి మహేందర్రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవరావు, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ మాట్లాడారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రసంగం మొదలైంది. ప్రగతి భవన్కు బస్సులో సీఎం శంషాబాద్: ప్రగతి నివేదన సభకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడ నుంచి ప్రత్యేక బస్సులో హైదరాబాద్కు బయలుదేరారు. సభ ముగిసే సమయానికి పూర్తిగా చీకటిపడింది. దీంతో హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతి లేకపోవడంతో ఆయన బస్సులో కొంగరకలాన్ నుంచి వయా శంషాబాద్ మీదుగా ప్రగతి భవన్కు బయలుదేరారు. దీంతో పోలీసులు రహదారి గుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎంతోపాటు పలువురు ప్రముఖులు, మంత్రులు కూడా అందులోనే బయలుదేరారు. ‘ప్రగతి నివేదన’లో అన్నీ తామై.. సాక్షి, హైదరాబాద్: కొంగర కలాన్లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ సజావుగా జరగడం, వేదిక నిర్వహణలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బాల్క సుమన్లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సభా వేదిక ఏర్పాట్లు, సాంస్కృ తిక కార్య క్రమాలు, సభికులకు అవసరమైన మంచినీళ్లు, టాయి లెట్ల ఏర్పాటు, పోలీసు బందోబస్తు ఇలా అన్నీ తామై పర్యవేక్షించారు. వీరిద్దరూ ఆదివారం ఉదయంనుంచీ సభా ప్రాంగణంలో అందరినీ సమన్వయం చేస్తూ ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూశారు. వలంటీర్లను అందుబాటులో ఉంచడం, ట్రాఫిక్ పోలీసులు, కళాకారు లను సమన్వయ పరుస్తూ కనిపించారు. ఇక సభ మొదలైన సమయం నుంచీ సభకు వస్తున్న మహిళలు, యువకులకు సూచనలు చేయడం, బారికేడ్లు దాటకుండా, కరెంట్ స్తంభాలు, కటౌట్లు ఎక్క కుండా బొంతు సూచనలు చేశారు. ఎవరైనా తప్పిపోతే వారికి సంబంధించి సమాచారం ఇచ్చారు. మరోవైపు ఎంపీ సుమన్ సభా ప్రాంగణం దగ్గరికి వస్తున్న నేతలు, ప్రజలను ఆహ్వానించారు. డోలు వాయిస్తూ ఉత్సాహపరిచారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ నుంచీ సభ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేటీఆర్, మహేందర్రెడ్డిలను మినహాయించారు. దీంతో వారిద్దరూ ఉదయం నుంచీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వలంటీర్ల స్వచ్ఛంద సేవ.. సాక్షి, హైదరాబాద్: ప్రగతి నివేదన సభకు భారీగా జనం వస్తారని ముందే ఊహించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా వలంటీర్లను ఏర్పాటు చేసింది. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసే బాధ్యత వలంటీర్లకు అప్పగించింది. మంచినీటి సరఫరా, భోజన సదుపాయాల కల్పన, టాయిలెట్ల నిర్వహణలో వీరి పాత్ర కీలకంగా మారింది. దాదాపు నాలుగు వందల మంది వలంటీర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన జనం ముందు రోజే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి ట్రాక్టర్లలో వచ్చిన రైతులు, అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. శనివారం రాత్రి భోజన ఏర్పాట్లు మొదలు ఆదివారం మధ్యాహ్న భోజనం, నీళ్ల ప్యాకెట్లు, బాటిళ్ల పంపిణీ తదితర కార్యక్రమాలన్నీ వలంటీర్లే చూసుకున్నారు. సభ ముగిసి కార్యకర్తలు, అభిమానులు తిరిగి వెళ్లిపోయేవరకు వలంటీర్లు అక్కడ ఉండి పనులు పూర్తిచేశారు. ఎమ్మెల్సీ రాములునాయక్ రొట్టెల పంపిణీ ఇబ్రహీంపట్నం: ప్రగతి నివేదన సభకు వచ్చే కార్యకర్తలకు ఎమ్మెల్సీ రాములునాయక్ రొట్టెలు పంపిణీ చేశారు. సభా ప్రాంగణానికి సమీపంలో ప్రత్యేకంగా గిరిజనులను తీసుకొచ్చి అక్కడికక్కడే జొన్నరొట్టెలు తయారు చేయించి వారికి అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆకలితో వచ్చిన కార్యకర్తలు జొన్నరొట్టెలు తిని ఎమ్మెల్సీని అభినందించారు. అనంతరం ఎమ్మెల్సీ గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. జనంతో కలసి మంత్రి భోజనం ఇబ్రహీంపట్నం జోన్ బృందం: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఒక రోజు ముందుగానే వేలాది మంది రైతులు ట్రాక్టర్లపై చేరుకున్నారు. వీరికి సభావేదికకు సమీపంలో పార్కింగ్, బస వసతి కల్పించారు. శనివారం రాత్రి అక్కడే బస చేసిన వారు ఆదివారం తెల్లవారుజామున పార్కింగ్ స్థలం వద్దే స్నానాలు చేశారు. ఈ క్రమంలో ఫ్యాబ్సిటీ వద్ద ఏర్పాటు చేసిన వసతి వద్ద రోడ్డు, రవాణా మంత్రి మహేందర్రెడ్డి స్వయంగా వడ్డించి తను కూడా వారితో కలసి అక్కడే భోజనం చేశారు. భోజనం కోసం పోలీసుల తంటాలు ప్రగతి నివేదన సభ బందోబస్తులో రెండు రోజులుగా ఉన్న పోలీసులు భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సభా ప్రాంగణం వద్దకు వారి కోసం భోజనం ప్యాకెట్లు తీసుకొచ్చిన వాహనం వచ్చింది. పోలీసులు ప్యాకెట్ల కోసం ఎగబడుతూ తీవ్ర తంటాలు పడ్డారు. - వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల నుంచి వచ్చిన కొందరు కార్యకర్తలు దారితప్పిపోయారు. వాహనాలు ఓచోట, వీరోచోట ఉండటంతో 3 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. - సభకు వచ్చిన కార్యకర్తలు చాలా మంది ఆకలికి అలమటించారు. కార్యకర్తలు ఓ చోట ఉండటం.. వంటలు మరోచోట చేయడంతో అందించడంలో తీవ్ర జాప్యం జరిగింది. చిరుతిళ్లు, మంచినీటితో సరిపెట్టుకున్నారు. - మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమ యంలో రెండు దఫాలుగా వర్షం కురవ డంతో జనం ఉరుకులు పరుగులు తీశారు. - ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ల వెంట ఉన్న హోటళ్లు, టీ స్టాళ్లను పోలీసులు మూసివేయించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, ఆ రోడ్ల వెంట వీఐపీలు వస్తున్నారని చెప్పి మూసేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. - సభకు వచ్చే జనాల కోసం భారీగా వాటర్ బాటిళ్లు స్టాక్ చేసుకున్నామని.. పోలీసుల నిర్వాకంతో అమ్మలేకపోయామని దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. - ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో చాలా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చాలా మంది సభకు నడుచుకుంటూ వెళ్లగా.. మరికొందరు వెళ్లలేక వాహనాల్లోనే ఉండిపోయారు. - ఒక్కసారిగా పార్కింగ్ స్థలాలకు వాహనాలు బారులుదీరడంతో అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. - పలువురు నేతలు బల ప్రదర్శన చేశారు. డీజే సౌండ్స్తో డ్యాన్సులు చేస్తూ ప్రాంగణానికి చేరుకున్నారు. - హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలు బైక్ ర్యాలీతో ప్రాంగణానికి బయలుదేరడంతో వెనుకొచ్చిన వాహనాలు నెమ్మదిగా ముందుగా కదిలాయి. - ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి రామ్మోహన్గౌడ్ కాన్వాయ్లో వచ్చిన కార్యకర్తలు బైక్లతో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. దీంతో నడుచుకుంటూ వెళ్తున్న కార్యకర్తలు, ఎదురుగా వస్తున్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. - బొంగుళూరు జంక్షన్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతాల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణానికి నడుచు కుంటూ వెళ్లడానికి కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. - మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు 1,000 మంది సైకిళ్లపై సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వెళ్లేటప్పుడు సైకిళ్లను డీసీఎంలలో పంపారు. - నాగార్జునసాగర్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు, శ్రీశైలం హైవే ఇతర దారుల వెంట తాత్కాలిక చిరుతిళ్ల కేంద్రాలు వెలిశాయి. మిర్చి, పునుగులు, వడలు, మొక్కజొన్న కంకుల అమ్మకాలు జోరుగా సాగాయి. ఆయా చోట్ల భోజనశాలలూ వెలిశాయి. - దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు చెట్ల కింద వంటలు చేసుకుని ఆరగించారు. కొంతమంది ఇళ్ల నుంచే పార్శిళ్లు తెచ్చుకుని తిన్నారు. - సభ సందర్భంగా భాగ్యనగరాన్ని గులాబీ జెండాలతో ముస్తాబు చేశారు. సిటీ అలంకరణ కమిటీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలిపేలా భారీ కటౌట్లు, బెలూన్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. - నకిరేకల్ నుంచి 4 రోజుల క్రితం సభకు పాదయాత్రగా బయలుదేరి వచ్చిన టీఆర్ఎస్వీ నేత కొమ్మనబోయిన సైదులు నేతృత్వంలోని విద్యార్థుల బృందానికి కేటీఆర్ ఘన స్వాగతం పలికారు. - సభకు హాజరైన మహిళల్లో అనేకమంది కేసీఆర్ చిత్రంతో ఉన్న స్టిక్కర్లను బొట్టుబిళ్ల, చెవిదిద్దులుగా పెట్టుకుని కనిపించడం ఆకట్టుకుంది. - ప్రగతిభవన్లో జరిగిన మంత్రివర్గ సమావేశానికి కేటీఆర్, మహేందర్రెడ్డి హాజరవలేదు. రోజంతా సభాస్థలి వద్దే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. - టీవీ యాంకర్ మంగ్లీ సందడి చేశారు. లంబాడీలతో కలసి నృత్యాలు చేశారు. -
‘ఆపరేషన్ సభ’ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగం పటిష్ట వ్యూహం.. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సమన్వయంతో పని... పగలు రాత్రి లేకుండా అహర్నిశలు శ్రమ... ఫలితంగా ‘ఆపరేషన్ సభ’పూర్తిగా సక్సెస్ అయింది. ఆదివారం నాటి ప్రగతి నివేదన సభను అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పూర్తి చేశారు. అక్కడక్కడా ట్రాఫిక్ జామ్, కొంగరకలాన్లోని పార్కింగ్ ప్రాంతంలో చిన్న, చిన్న ఇబ్బందుల మినహా ఆద్యంతం సజావుగా పూర్తయింది. కార్యక్రమం ముగిసిన తర్వాత వాహనాలను క్రమపద్ధతిలో పంపించారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా సభా వేదిక, చుట్టపక్కల ప్రాంతాల్లో మొత్తం 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్యాన్ టిల్ట్ జూమ్ (పీటీజెడ్) టెక్నాలజీతో పని చేసే కెమెరాలు అదనంగా అమర్చారు. వీటన్నింటినీ అనుసంధానిస్తూ కొంగరకలాన్లో ఓ కంట్రోల్రూమ్ ఏర్పాటు చేశారు. మరోపక్క డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఇక్కడే ఉన్న డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఆద్యంతం పర్యవేక్షించారు. రాత్రి సభ ముగిసిన తర్వాత సైతం గంటలపాటు డీజీపీ తన కార్యాలయంలోనే ఉండి తిరిగి వెళ్తున్న వాహనాల విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నారు. ఫలితాలు ఇచ్చిన హోల్డింగ్ ఏరియాలు... సభకు వచ్చే లక్షలాది వాహనాల కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఓఆర్ఆర్, సర్వీసు రోడ్లు, ఇతర కీలక రహదారుల్లో హోల్డింగ్ ఏరియాలు కేటాయించారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఇవి ఉన్నాయి. వెనుక వచ్చే వారికై వేచి చూడటం, ముందున్న వాహనాలు వెళ్లే వరకు ఆగడం కోసం వాహనాలను రహదారిపై నిలిపేస్తుంటారు. ఇలా చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈ ఏరియాలు కేటాయించారు. వాహనాలు వీటిలో నిలవడంతో పెద్దగా ఇబ్బందులు కలగలేదు. సర్వీసు రోడ్లతో పాటు ఎక్కడైనా వాహనాలు ఆగితే తరలించేందుకు 50 క్రేన్లు సిద్ధంగా ఉంచారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా భారీగా వచ్చిన వాహనాలతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ తప్పలేదు. ప్రధానంగా ఓఆర్ఆర్కు సమీపంలో ఉన్న సాగర్ రింగ్ రోడ్, ఎల్బీనగర్, నాగోల్, తెలంగాణ పోలీసు అకాడెమీ, గచ్చిబౌలి జంక్షన్లతో పాటు పెద్ద అంబర్పేట్, తూప్రాన్పేట్, కొంగర విలేజ్, రాచలూరు గేట్, పల్మాకుల, కండ్లకోయల్లోని ఎంట్రీ, ఎగ్జిట్పాయింట్స్ వద్ద వాహనాలు ఆగక తప్పలేదు. ఓ దశలో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ పోలీసు అకాడెమీ జంక్షన్ వద్ద ఆయనే నిల్చుని పరిస్థితిని సమీక్షించారు. మరోపక్క శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో ర్యాంప్, పార్కింగ్ ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవి మట్టితో నిర్మించినవి కావడంతో కొన్ని వాహనాలు దిగబడ్డాయి. సోమవారమే ట్రాక్టర్ల పయనం ప్రగతి నివేదన సభ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నగరం, సైబరాబాద్, రాచకొండ పరిధిలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పైనా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఆదివారం ఓఆర్ఆర్పై ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల ప్రవేశం నిషే«ధించారు. ఈ నేపథ్యంలోనే సభకు ట్రాక్టర్లపై వచ్చేవారు శనివారం సాయంత్రానికే ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. వీటిని సోమవారం ఉదయమే తిరిగి వెళ్ళేందుకు అనుమతించనున్నారు. -
అభివృద్ధి యజ్ఞం ఆగొద్దు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సమాజ సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి యజ్ఞం ఆగకూడదని, కొనసాగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణను త్వరలోనే సాకారం చేస్తామన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో జరిగిన ప్రగతి నివేదన సభలో టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు కేసీఆర్ వివరించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. చిమ్మచీకట్లను చీల్చుకుని.. ‘‘ఉద్యమ సమయంలో ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు జయశంకర్గారు, విద్యాసాగర్రావుగారు, నేను.. తెలంగాణ వచ్చాక ఏం చేయాలనే విషయంపై చర్చ మొదలుపెట్టాం. రాత్రి ఒంటి గంట అయింది. అప్పుడు విద్యాసాగర్రావు.. ‘తెలంగాణ వచ్చాక మిగిలింది ఆలోచిద్దాం. మీరు పడుకోండి’ అన్నారు. జయశంకర్సారు నేను అలాగే చర్చించుకుంటు న్నాం. మూడున్నరకు విద్యాసాగర్రావుగారు వచ్చి.. ‘మీరింకా పడుకోలేదా’ అన్నరు. అప్పుడూ చర్చ కొనసాగించాం. తెలంగాణ పరిస్థితులను, ఆత్మను జయశంకర్ సార్ అణువణువు అన్వేషించారు. చెరువుల విధ్వంసంతో భూగర్భ జలాలు అడుగంటిపోయిన వైనాన్ని.. కరెంటు పరిస్థితులను చర్చించాం. జయశంకర్సార్తో చర్చించిన సమయంలో భూగర్భ జలాల సమస్యను గుర్తించి మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టాం. కరెంటు విషయంలోనూ అంతే. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు బాధలు ఉంటాయని సమైక్య పాలకులు అన్నరు. అప్పటి సమైక్య సీఎం ఒకరు తెలంగాణలో కరెంటు ఉండదని కట్టె పెట్టి చూపించారు. శాశ్వతంగా అలాగే ఉంటుందనే అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిమ్మచీకట్ల నుంచి 24 గంటలు కరెంటుతో వెలుగు జిలుగులతో వరాజిల్లుతోంది. దేశంలో అన్ని రంగాలకు నిరంతరంగా, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. త్వరలోనే తెలంగాణను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చుతామని హామీ ఇస్తున్నా. ఏమైతోందని ఏడ్చిన.. సమైక్య పాలనలో తెలంగాణ జీవన విధ్వంసం అంతాఇంతా కాదు. అనేకసార్లు ఆలోచించా. ఏమైతోందని ఏడ్చిన. సిరిసిల్లకు పోయినప్పుడు అక్కడ గోడలపై ‘చేనేత కార్మికుల ఆత్మహత్యలు వద్దు’ అని కలెక్టర్ రాయించిన దృశ్యాలు కంటబడ్డాయి. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో చావులు గోడలపై చూడాల్సిన పరిస్థితికి బాధపడ్డా. పోచంపల్లిలో ఒకేరోజు ఏడుగురు చేనేత కార్మికులు విషంతాగి చనిపోయారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రిని కోరినా పట్టించుకోలేదు. భిక్షాటన చేసి రూ.మూడు నాలుగు లక్షలు ఇచ్చి అండగా ఉన్నం. సిరిసిల్లలో ఒకేరోజు 11 మంది చేనేత కార్మికులు చనిపోతే టీఆర్ఎస్ తరఫున మేమే ట్రస్టు పెట్టి ఆదుకున్నం. ప్రాణాలు తీసుకోవద్దు.. తెలంగాణ వచ్చేదాకా ఆగాలని కోరిన. ఇప్పుడు ఇయ్యాల తెలంగాణలో నేతన్నల ముఖాలు వెలిగిపోతున్నాయి. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ గురుకులాలు, పాఠశాల విద్యార్థుల యూనిఫారా లతో జీవన భద్రత వచ్చింది. నెలకు రూ.17 వేల నుంచి రూ.20 వేలకు ఆదాయం వస్తోంది. గొర్రెలు, బర్రెలు పెంచడం గొప్ప వృత్తే.. ఉమ్మడి రాష్ట్రంలో చీప్ లిక్కర్ కంపెనీలతో ప్రభు త్వాలు కుమ్మక్కై హైదరాబాద్లో కల్లు డిపోలను మూసేయించాయి. కోర్టులు తీర్పు ఇచ్చినా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తాటి చెట్లపై వసూలు చేసే పన్నును రద్దు చేశాం. కల్లు గీత కార్మికులకు అండగా నిలుస్తున్నాం. నయా ఆర్థిక వేత్తలు ఐటీ, పారిశ్రామిక అభివృద్ధినే అభివృద్ధి అంటున్నారు. గొర్రెలు, బర్రెలు పెంచడం కూడా గొప్ప వృత్తే. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో 70 లక్షల గొర్రెల ను పంపిణీ చేశాం. వాటికి 30 లక్షల పిల్లలు పుట్టాయి. మొత్తంగా రాష్ట్రంలోని గొల్లకుర్మలు రూ.1,500 కోట్లు సంపాదించారు. 2.11 లక్షల మంది రైతులకు పాడి గేదెలు పంపిణీ చేశాం. ఆడపిల్లల పాదాలు కడిగి చూపిస్తం ‘వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ మంచినీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడగం’ అని దేశంలో ఏ ము ఖ్యమంత్రీ చెప్పలేదు. మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్తో ఇప్పుడే మాట్లాడా. 22 వేల గ్రామా లకు నీరు ఇస్తున్నట్లు చెప్పారు. మరో 1,300 గ్రామాల పనులు పూర్తవుతున్నాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందే నీళ్లు సరఫరా చేస్తాం. ఆడపి ల్లల పాదాలు కడిగి చూపిస్తం. పాలమూరు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో వలసపోయిన పేద కుటుంబాలు తిరిగి ఊళ్లోకి వస్తున్నాయి. మంత్రి హరీశ్రావు పట్టుదలతో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు వచ్చింది. పాలమూరు జిల్లాలో రేషన్ కార్డులను బదిలీ చేయాలని దరఖాస్తులు పెట్టుకుం టున్నారు. భవిష్యత్ ఇంకా ఉంది. కీమానాయక్ కన్నీళ్లు.. కల్యాణలక్ష్మికి నాంది.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 465 కార్యక్రమాలు ప్రారంభించాం. అనేక విషయాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. ఉద్యమ సమయంలో నేను, మంత్రి చందులాల్ కలిసి ములుగులో ఒక తండాకు వెళ్లాం. అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బానోత్ కీమానాయక్ ఒక్కతీరుగా దుఃఖటిల్లాడు. ఏమైందని అడిగిన. ‘శ్రీరామనవమి తర్వాత బిడ్డ పెళ్లి చేసేందుకు ఇంట్లో రూ.50 వేలు పెట్టిన. అంతా బూడిదైంది’ అన్నడు. నేను పెళ్లి చేస్త అని భరోసా ఇచ్చిన. అన్నట్లుగానే రూ.లక్ష పంపించిన. పెళ్లికి వెళ్లిన. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చందాలు వసూలు చేసి ఎస్సీ, ఎస్టీ బిడ్డల పెళ్లిళ్లు చేయించిన. ఆడపిల్ల గుండెలమీద కుంపటి కాదని చెప్పేందుకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రారంభించాం. శాశ్వత ధనిక రాష్ట్రం కావాలె.. ఎప్పుడైనా రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు కొత్త నిర్ణయాలు తీసుకుంటాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 42 నిర్ణయాలు తీసుకున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా మరో 72 అంశాలను అమలు చేస్తున్నాం. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, వృత్తి కులాల పథకాలు వంటివి మేనిఫెస్టోలో పెట్టలేదు. నాయీ బ్రాహ్మణులకు సెలూన్లకు సరఫరా చేసే కరెంటును కమర్షియల్ నుంచి మార్చి తక్కువ చార్జీలు అయ్యేలా రాయితీ ఇస్తున్నాం. కేజీ నుంచి పీజీ విధానంలో భాగంగా అన్ని వర్గాలకు గురుకులాలను నిర్మిస్తున్నాం. గిరిజన తండాల, గోండు గూడాల సుదీర్ఘ ఆకాంక్ష అయిన ప్రత్యేక గ్రామ పంచాయతీలను సాకారం చేశాం. ‘మావ నాటే.. మావ రాజ్’ అనే నినాదాన్ని ఆచరణలోకి తెచ్చేలా వారే పరిపాలించేలా నిర్ణయం తీసుకున్నాం. సంక్షేమ, తక్షణ ఉపశమన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇవి సరిపోవు. తెలంగాణ రాష్ట్రం శాశ్వత ధనిక రాష్ట్రంగా ఉండాలి. కోటి ఎకరాలకు నీరు అందిస్తాం. ఈ దిశగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టాం. పాలమూరు, కాళేశ్వరం, దేవాదుల, సీతారామసాగర్ పూర్తవుతున్నాయి. గంధర్వులు రాలే.. హిమాలయాలకు పోయి రాలే.. కొత్త కుండలో ఈగ సొచ్చినట్లు రాష్ట్రం వచ్చిన కొత్తలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దృక్పథం మారితే ఫలితాలు ఉంటాయి. వరుసగా నాలుగేళ్లు ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2018–19లో ఇప్పటి వరకు వృద్ధిరేటు 17.83 శాతం ఉంది. బ్రహ్మాండంగా ఆదాయం పెరుగుతోంది. అప్పటికీ ఇప్పటికీ అదే తేడా. గంధర్వులు రాలేదు. హిమాలయాల్లో చెట్ల రసం తాగి రాలేదు. మారిందల్లా దృక్పథమే. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో నేతల అవినీతి చూశాం. ఎన్నో ఉన్నాయి.. ఒక్క ఇసుక విషయం చెప్పుకుందాం. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుకపై ప్రభుత్వానికి రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో రూ.1,980 కోట్ల ఆదాయం వచ్చింది. రాజకీయ అవినీతిని నిర్మూలించి, కడుపు మాడ్చుకుని, నోరు కట్టుకుని పని చేస్తే ఇలా అయ్యింది. పెంచిన సంపద ప్రజలకు పంచుతాం. సొల్లు పురాణం చెప్పను.. అన్నీ మీ కళ్ల ముందే ఉన్నయి.. మైనారిటీల సంక్షేమంలో మన రాష్ట్రం ఎంతో చేస్తోంది. మైనారిటీ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.4 వేల కోట్లు కేటాయించింది. మన రాష్ట్ర ప్రభుత్వం రూ.రెండు వేల కోట్లను కేటాయించింది. నేను మాటలు చెప్పడం కాదు. అభివృద్ధి, చెరువులు, కరెంటు, నీళ్లు, నిర్మించే ప్రాజెక్టులు మీ దగ్గరే ఉంటున్నాయి. కృష్ణా, గోదావరి నీళ్లు మీ ఇంటికే వస్తున్నయి. ప్రాజెక్టులు కట్టడం మీ కళ్ల ముందే ఉంది. సొల్లు పురాణం నేను చెప్పను. అన్నీ మీ కళ్ల ముందే ఉన్నాయి. ప్రగతి నివేదిన మీ ముందే ఉంది. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ సాకారం కావాలె. ఐటీ, పరిశ్రమలు అభివృద్ధి చెందాలె. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలె. బంగారు తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, సంక్షేమ తెలంగాణ కావాలె. గొప్పగా బాగుపడదాం అనుకున్నాం. ఇప్పటికే బాగుపడ్డాం. అయినా అభివృద్ధి యజ్ఞం ఆగకూడదు. కొనసాగాలి’’ అని సీఎం వివరించారు. తెలంగాణ వచ్చినంత సంతోషపడ్డా.. తెలంగాణలో కొత్త జోనల్ విధానానికి ఆమోదం దక్కిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు నా గుండెల నిండా ఎంత సంతోషపడ్డానో జోనల్ విధానం ఆమోదం పొందినప్పడు అదే అనుభూతి పొందా. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చే విషయంలో కేంద్రం ఊగిసలాటలో ఉంటే చేస్తవా చస్తవా అని ప్రధాని నరేంద్ర మోదీని బల్లగుద్ది అడిగినం. ఇది మా రాజ్యంగ హక్కు అని తెచ్చు కున్నం. స్వరాష్ట్రం మనకు సాధించిన విజయమిది. కేసీఆర్, టీఆర్ఎస్ లేకపోతే 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా నిర్ణయం వచ్చేదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై టీఆర్ఎస్కు ఉన్న నిబద్ధత ఇది’’ అని ఆయన అన్నారు. రైతులు ధనికులయ్యే వరకు.. కోటి ఎకరాలకు నీరు అందిస్తా. రైతులు మీదికి భుజాన కండువా ఏసుకుని పైకి పటేలా అన్నట్లు కనిపిస్తరు. కానీ అప్పులు ఉంటయి. అందుకే ఉచితంగా కరెంటు, పెట్టుబడి ఇయ్యాలె. కొన్నేళ్లు ఇలా చేస్తేనే రైతులకు అప్పులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత కొంత ఆదాయం పొందుతరు. 80 ఏళ్లలో ఏ ప్రభుత్వం సాహసం చేయని రీతిలో భూ రికార్డుల ప్రక్షాళన చేశాం. ఈ నివేదికల ఆధారంగా రూ.5,500 కోట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి రైతులకు ఇచ్చారు. రైతు ధనికులు అయ్యేంత వరకు ఇలా చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతు బంధు పథకం ఉంటుంది. నవంబర్లో రెండో విడత రైతు బంధు సాయం అందిస్తం. రైతులు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు. ఆ ఆలోచనతోనే రైతు బీమా అమలు చేస్తున్నాం. ఇప్పటికి 365 మంది రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున అందించాం. రైతు చనిపోయిన పది రోజుల్లో ఇవ్వాలని చెప్పినా.. నాలుగైదు రోజుల్లోనే ఇస్తున్నారు. రుణమాఫీ, ప్రాజెక్టులు, కరెంటు, ఇంకా కొన్ని మంచి పనులు చేయాలె. దీని కోసం ఖలేజా, సాహసం ఉండాలె. కనులన్నీ కలాన్పైనే..! సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభపై రోజంతా ఉత్కంఠ కొనసాగింది. ప్రభుత్వ వర్గాల్లో గత నాలుగు రోజుల నుంచే ముందస్తు హడావుడి కనిపించడం, సభకు ముందే మంత్రి మండలి సమావేశం కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు సభకు 25 లక్షల మంది వస్తారా? వారినెలా తీసుకొస్తున్నారు? అంతా ఊహించినట్టుగానే కేసీఆర్ ముందస్తుకు వెళ్లనున్నారా? ప్రగతి నివేదన సభ సాక్షిగా ఏ వర్గానికి ఎలాంటి వరాలు కురిపించనున్నారు? తొలి జాబితాలో ఎవరెవరికీ టికెట్లు ప్రకటించనున్నారు? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం ఉండబోతోంది? వంటి అంశాలపై సహజంగానే ఆయా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ నిజంగానే ముందస్తుగాకు వెళ్తే.. ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు..? వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ సహా దేశం మొత్తం దృష్టి సారించింది. లక్షలాది మంది సభకు వెళ్లారు. మరెందరో రోజంతా టీవీలకు అతుక్కుపోయారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులు.. తాము తీసుకున్న నిర్ణయాలు వెల్లడించారు. సభలో ఆశించిన స్థాయిలో ఉద్వేగపూరితమైన ప్రసంగాలేవీ లేకపోవడం.. ముందస్తుకు సంబంధించిన ప్రకటన ఏదీ చేయకపోవడం కొసమెరుపు. -
పదేళ్లలో స్వర్గ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: ఇంకో ఐదేళ్లు ఈ ప్రభుత్వాన్ని నడుపుకొంటే బంగారు తెలంగాణ పూర్తి చేసుకుంటామని, మరో పదేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటే నిజమైన స్వర్గ తెలంగాణ చేసి ఇస్తారనే నమ్మకం తనకు ఉందని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ప్రజల మద్దతు, ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు. మరో ఐదేళ్ల కోసం కేసీఆర్ను దీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో మాట్లాడుతూ.. నాలుగేళ్ల మూడు నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని నిజాయతీ, పారదర్శకతతో ప్రజలకు నివేదించడానికే ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలేనని, ప్రజలతో మాట్లాడుకున్న తర్వాతే ఏదైనా పని చేయాలనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. పుట్టినప్పటి నుంచి చివరి రోజు వరకు ప్రజలందరి అవసరాలు తీర్చేందుకు 500 పథకాలను అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. దేశంలో నంబర్వన్ రాష్ట్రంగా తెలంగాణ ప్రశంసలు అందుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉందని, జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే ఆ నిధులను ఖర్చు పెట్టాలని సీఎం పదేపదే అంటుంటారని గుర్తు చేశారు. ఎస్సీ, బీసీ కులాలను గుర్తించి వారి కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం పేరుకు మాత్రమేనని, ఈ సభ ద్వారా వారి అభివృద్ధి, సంక్షేమానికి పునరంకితం కావడం అసలు లక్ష్యమన్నారు. అల్లా కేసీఆర్ను ఇవ్వడం అదృష్టం: మహమూద్ అలీ ‘‘అల్లా మనకు కేసీఆర్ లాంటి గొప్ప సీఎంను ఇవ్వడం మన అదృష్టం. రాష్ట్రంలో అన్ని సామాజికవర్గాల ప్రజలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా గంగా జమున తెహజీబ్ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి బడ్జెట్లో సీఎం రూ.2 వేల కోట్లు కేటాయించారు. దేశంలో మైనారిటీలకు ఇదే అత్య ధిక బడ్జెట్. 24.22 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో ముస్లింలకు రూ.4,700 కోట్లే ఇచ్చారు.’’ – ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇవ్వని హామీలు కూడా అమలు: కడియం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 100 శాతం అమలు చేశామని, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, హెల్త్ అండ్ హైజీన్ కిట్, కంటి వెలుగు పథకాలు, వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు వంటి వాటిని అమలు చేశామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. నిండు మనసుతో సీఎం కేసీఆర్ను మరోసారి దీవించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాల గురించి ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయాన్ని పండుగ చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ రుణాల మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, సమస్యల్లేకుండా ఎరువులు, విత్తనాల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా కార్యక్రమాలను అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కడియం కొనియాడారు. రైతులకు అండగా ఉన్న కేసీఆర్కు అండగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు. యావత్ దేశాన్ని ఆకర్షించిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేసిన ఘనత పరిపాలనా దక్షత కలిగిన కేసీఆర్కే దక్కుతుందన్నారు. నీతి నిజాయతీతో పరిపాలన చేశామని, ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్న పథకాలు: మహేందర్రెడ్డి రాష్ట్రంలో ఊహించని రీతిలో అభివృద్ధి, పేదలకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభలో మహేందర్రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల పట్ల ఆకర్షితులైన ఇతర రాష్ట్రాల అధికారులు, ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చి వాటి గురించి తెలుసుకుంటున్నారని గుర్తుచేశారు. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభను తన సొంత జిల్లా రంగారెడ్డిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని జిల్లాల నుంచి యువకులు పాదయాత్రగా, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల మీద సభకు తరలివచ్చారని పేర్కొన్నారు. సీఎం మీద ప్రేమతో ట్రాక్టర్లపై ఒక రోజు ముందే భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు సభాస్థలి వద్దే శనివారం రాత్రి బస చేశారన్నారు. గన్మన్లు లేకుండా కేటీఆర్ సభకు వచ్చే వారు ఎలా వస్తున్నారు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయా, సక్రమంగా సభాస్థలికి చేరుకుంటున్నారా.. అంటూ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సభా పరిసర ప్రాంతాలు, ఓఆర్ఆర్ను పరిశీలించారు. ట్రాఫిక్ స్తంభించకుండా అధికారులకు ఎప్పటికప్పుడు అదేశాలు జారీ చేశారు. గన్మన్లు లేకుండా రహదారుల వెంట తిరుగుతూ కార్యకర్తల యోగక్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. చంకన బిడ్డతో విధులకు.. ప్రగతి నివేదన సభలో ఓ మహిళా కానిస్టేబుల్ చంకలో బిడ్డను ఎత్తుకొని బందోబస్తు నిర్వహించారు. ఓవైపు పెద్దఎత్తున వస్తున్న జనాలను నియంత్రిస్తూనే మరోవైపు తన బిడ్డను చూసుకున్నారు. ఇటు విధి నిర్వహణ.. అటు బిడ్డను చూసుకోవడాన్ని జనాలు ఆసక్తిగా గమనించారు. మాట్లాడింది నలుగురే! సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో నలుగురి ప్రసంగాలతోనే సరిపెట్టే సంప్రదాయం ఈసారీ కొనసాగింది. ప్రగతి నివేదన సభలో ఆనవాయితీ ప్రకారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్తోపాటు పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి మాత్రమే ప్రసంగించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015, 2017లో హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కూడా ఈ నలుగురే ప్రసంగించారు. ప్రగతి నివేదన సభ పేరుతోనే 2017లో వరంగల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కూడా సీఎం కేసీఆర్తోపాటు కె.కేశవరావు, కడియం, మహమూద్ అలీ మాత్రమే ప్రసంగించారు. -
6న తెలంగాణ అసెంబ్లీ రద్దు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో షెడ్యూల్కంటే ముందే శాసనసభ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహం విజయవంతమైనట్లే. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్లో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతం కావడం పార్టీ నాయకత్వానికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు సభకు తరలిరావడంతో ముందస్తు ఎన్నికలకు చర్యలు వేగవంతం చేయాలన్న నిర్ణయానికి అధికార పార్టీ వచ్చింది. ప్రగతి నివేదన సభలో 49 నిమిషాలపాటు ప్రసంగించిన సీఎం కేసీఆర్ పరోక్షంగా ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. శాసనసభను రద్దు చేసి ముందుగా ఎన్నికలకు వెళ్లే విషయంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా మంత్రిమండలితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కమిటీలు తనకు అధికారమిచ్చాయని, ఈ మేరకు వచ్చే కొద్ది రోజుల్లో రాజకీయపరమైన నిర్ణయాలు ఉంటాయని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో 6వ తేదీన మంత్రివర్గం మరోసారి సమావేశమై శాసనసభ రద్దుకు సిఫారసు చేస్తుందని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. ‘ఎన్నికలకు వెళ్లడం దాదాపుగా ఖాయమైంది. మీరే చూస్తారు... నాలుగైదు రోజుల్లో అనూహ్య మార్పులు ఉంటాయి’అని కేబినెట్ సమావేశానంతరం ఆ మంత్రి సాక్షి ప్రతినిధికి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు కావడం వల్ల అదే రోజు శాసనసభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు కూడా వెల్లడించాయి. ఆ వెంటనే మంత్రివర్గం గవర్నర్ను కలసి శాసనసభ రద్దు తీర్మానాన్ని అందిస్తుందని పేర్కొన్నాయి. శాసనసభను రద్దు చేసినా కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా కేసీఆర్ నాయకత్వంలోని మంత్రిమండలి ఆపద్ధర్మ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని చెబుతున్నాయి. పథకాల వివరణకే ప్రాధాన్యత... కొంగరకలాన్ సభలో ముఖ్యమంత్రి ప్రసంగమంతా నాలుగేళ్ల మూడు నెలల కాలంలో చేపట్టిన తన ప్రభుత్వ పథకాలను వివరించడానికే పరిమితమైంది. భారీ సంఖ్యలో జన సమీకరణ చేసినా ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై విరుచుకుపడలేదు. మామూలుగా ప్రత్యర్థి పార్టీలపై ఒంటికాలిమీద లేచే అలవాటు ఉన్న కేసీఆర్ ఈ సభలో మాత్రం ఆ ఊసే లేకుండా మాట్లాడారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపు, నేత కార్మికుల అవస్థలపై అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా బహిరంగ లేఖ రాసి తెలంగాణ కోసం నలుగురైదుగురితో కలసి ఉద్యమం మొదలుపెట్టి లక్ష్యాన్ని ఏ విధంగా సాధించిందీ మొదటి ఏడు నిమిషాలపాటు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా ఎన్నికలకు ముందే మంచినీరు ఇవ్వడంతోపాటు రైతుబంధు రెండో విడత ఆర్థిక సాయం నవంబర్లో ఇవ్వడానికి ఏర్పాటు చేశామని చెప్పడం ద్వారా డిసెంబర్లో ఎన్నికలు వచ్చే వీలుందని పరోక్షంగా తేల్చిచెప్పారు. నేడే నిర్ణయం తీసుకోవాలనుకున్నా... శాసనసభను రద్దు చేస్తూ ఆదివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయంతీసుకోవాలని ముందుగానే భావించినా చివరి క్షణంలో దాన్ని వాయిదా వేసుకున్నారని సమాచారం. అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకుని ప్రగతి నివేదన సభలో అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా 6వ తేదీకి దాన్ని వాయిదా వేశారని అత్యున్నత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అందుకే కేబినెట్ సమావేశం కేవలం 15 నిమిషాలే జరిగిందని తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసిన విధానపరమైన నిర్ణయాలనే ఈ సమావేశంలో లాంఛనంగా ఆమోదించినట్లు ఆ తరువాత మంత్రులు ఈటల, హరీశ్, కడియం వెల్లడించిన విషయాల ద్వారా స్పష్టమైంది. దీనికితోడు ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పవరణకు సంబంధించి మధ్యంతర భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు లాంటి ముఖ్యమైన నిర్ణయాలను కూడా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉండటం కూడా ఆదివారం నాటి సమావేశంలో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోకపోవడానికి కారణమని అంటున్నారు. ఈ రెండింటితోపాటు ముఖ్యమైన విధానపరమైన అంశాలను వచ్చే 2 లేదా మూడు రోజుల్లో ప్రకటించి 6న శాసనసభ రద్దుకు నిర్ణయం తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రేపటిలోగా ప్రతిపాదనలు పంపండి అన్ని శాఖలకు సీఎస్ సర్క్యులర్ మరోసారి కేబినెట్ భేటీ నేపథ్యంలోనే... ‘త్వరలోనే మంత్రివర్గ సమావేశం జరగనుంది. మీ శాఖల పరిధిలోని ప్రతిపాదనలను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోగా పంపించాలి’అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సర్క్యులర్ జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారంలోపే మళ్లీ మంత్రివర్గ సమావేశం జరగనుండటం ఆసక్తికరంగా మారింది. -
దుమ్ము రేపిన ధూంధాం
ప్రగతి నివేదన సభలో కళాకారులతో కలసి మంత్రి కేటీఆర్ డోలు వాయించారు.రసమయి బాలకిషన్తో డోలు కొడుతూ స్టెప్పులేశారు. దీంతో ప్రాంగణమంతా సందడిగా మారింది. అక్కడి టీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ను ఎత్తుకొని అభినందించారు. అనంతరం కేటీఆర్ సభా ప్రాంగణంలో తిరుగుతూ కార్యకర్తలను పలకరించారు. సాక్షి, హైదరాబాద్: హోరెత్తించే పాటలు.. డప్పుల దరువులు.. గజ్జెల మోత.. గుస్సాడీ వేషాలు.. లంబాడీ నృత్యాలతో కొంగరకలాన్ సభ హోరెత్తింది. తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ బృందం ఆలపించిన పాటలతో సభ ధూంధాంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు, యువకులు, నేతలు.. 2,000 మందికి పైగా కళాకారులతో పాదం కలపడంతో 5 గంటల పాటు సభంతా సందడి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సభా వేదికపైకి వచ్చేవరకూ గులాబీ దండు ధూంధాం పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జనాలను హుషారెత్తించాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పాటలు పాడి సభికులను ఉత్సాహపరిచారు. గాయని మంగ్లీ ఆడుతూ పాడిన బతుకమ్మపాటలకు సభా వేదిక ముందున్న 1,000 మందికి పైగా మహిళలు బతుకమ్మ ఆడుతూ, కోలాటాలు వేస్తూ నృత్యాలు చేయడం సభకు కొత్త వన్నె తెచ్చింది. ఉరకలెత్తిన ఉత్సాహం: శివనాగులు పాడిన రంగస్థలంలోని ‘ఆ గట్టునుంటావా నాగన్న.. ఈ గట్టునుంటావా’పాటకు సభా ప్రాంగణం ఊగిపోయింది. యువకులు డ్యాన్సులతో అదరగొట్టారు. పాటను మళ్లీ పాడించాలని వేదికపై ఉన్న మంత్రులు కోరడంతో శివనాగులు మరోమారు పాట పాడి హుషారు తెచ్చారు. ‘సారా సారమ్మ సారా’, ‘రామా రామా ఎల్లమ్మరో’, ‘వీర తెలంగాణమా.. నాలుగు కోట్ల ప్రాణమా’, ‘లాయిల లల్లాయి.. లల్లాయిలే.. లల్లాయిలే’పాటలూ సభికుల్లో ఉత్సాహం నింపాయి. ఇక తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభవాన్ని చాటుతూ సుమారు 20 నిమిషాల పాటు ప్రదర్శించిన కళారూపాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, ఆసరా పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను పాటల్లో వినిపించారు. కళాకారుల ఆట–పాటలకు ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు మరికొంత మంది కూడా పాదం కలుపుతూ నృత్యాలు చేశారు. ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఇతర మంత్రులు కళాకారుల పాటలకు చప్పట్లు కొడుతూ కనిపించారు. చంకన బిడ్డ.. చేతిలో జెండా చంకన చంటి బిడ్డ.. చేతిలో గులాబీ జెండాలతో వేలాదిగా మహిళలు కొంగరకలాన్కు కదం తొక్కారు. పెద్ద సంఖ్యలో ఆడ బిడ్డలు తరలిరావడంతో సభ కళకళలాడింది. టీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ రంగు చీరలు ధరించి రావడంతో సభా ప్రాంగణం గులాబీమయమైంది. కొంత మంది మహిళలు కేసీఆర్ ఫొటోలున్న చెవి కమ్మలు, బొట్టు బిళ్లలు పెట్టుకొచ్చి అభిమానం చాటుకున్నారు. అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ లాంటి పథకాల కింద లబ్ధిపొందిన తల్లులు తమ చంటి బిడ్డలతో తరలిరాగా.. ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్లు అందుకుంటున్న మహిళలు ఎంతో శ్రమపడి సుదూర ప్రాంతాల నుంచి సభకు వచ్చి కేసీఆర్ పట్ల అభిమానం చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో లంబాడీలు, ఆదివాసీ మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి నృత్యాలు చేయడం ఆకట్టుకుంది. మహిళలకు ఇబ్బందులు రాకుండా సభా వేదిక ముందు వరుసలో రెండు ప్రత్యేక గ్యాలరీలు కేటాయించారు. మహిళా పోలీసులు భద్రత కల్పించారు. వీరికి వలంటీర్లతో నీరందించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, కార్యకర్తలు ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు. సభా మైదానంలో ఎక్కడికక్కడే మహిళలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన బోనాలు, బతుకమ్మ, కోలాటం ఆడారు. పారాచూట్తో పూల వర్షం ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో కార్యకర్తలు, నాయకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు నాలుగు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో కార్యకర్తలు, నాయకులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారాచూట్తో పూలవర్షం కురిపించారు. పైనుంచి పూలవాన కురవడంతో అందరూ ఆకాశం వైపు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తనయకు తండ్రి సెల్యూట్ ఒకే వేదిక వద్ద తండ్రి నాన్కేడర్ ఎస్పీగా.. కూతురు ఐపీఎస్గా బందోబస్తు నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఉమామహేశ్వర శర్మ మల్కాజ్గిరి డీసీపీగా పనిచేస్తున్నారు. ఈయన కూతురు సింధూ శర్మ జగిత్యాల ఎస్పీ(ఐపీఎస్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరిద్దరూ కొంగరకలాన్లో జరుగుతున్న ప్రగతి నివేదన సభలో విధులు నిర్వహిస్తూ ఒకరికొకరు తారసపడ్డారు. తండ్రికి 33 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ కూతురు ఐపీఎస్ అధికారిణి కావడంతో సెల్యూట్ కొట్టక తప్పలేదు. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసు అధికారులు, ప్రజలు ఒకింత ఆశ్చర్యం, ఆనందానికి గురయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ లాంటివాటితో పాటు పింఛన్లు, ఆసరా వంటి అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చింది. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. - అంజమ్మ, హైదర్నగర్,కూకట్పల్లి తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించింది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది. అనేక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందాయి. – రాధిక,రాజీవ్ గృహకల్ప,నిజాంపేట కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.అన్ని కుల సంఘాలకు భవనాలతో పాటు ప్రత్యేక నిధులను కూడా విడుదల చేశారు. ఇలా ప్రతి ఒక్కరిని సమపాళ్లలో చూస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు కేసీఆర్. - వెంకటలక్ష్మీ,మూసాపేట గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి నంబర్వన్ సీఎంగా ఉండేవారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలకంటే రెట్టింపు పథకాలు అమలు చేస్తున్నారు. -కీర్తి రెడి,్డటీఆర్ఎస్ నేత ప్రగతి నివేదిన సభను స్వయంగా వీక్షించాలని భావించా. కేవలం దీని కోసమే కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చా. చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్పై ఉన్న అభిమానమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. -అభిలాష, కువైట్ సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపడుతుంది. -శ్రీకాంత్గౌడ్, కాప్రా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ప్రజలకు షాదీ ముబారక్ లాంటి పథకాలు ఎంతో మేలు చేశాయి. -ఇలియాజ్ ఖురేషి, టీఆర్ఎస్, చార్మినార్ నియోజకవర్గం కన్వీనర్ సౌకర్యాలు సూపర్ ప్రగతి నివేదన సభకు హాజరయ్యే పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేశారు. తాగునీటిని సభా ప్రాంగణంలో అందుబాటులో ఉంచారు. స్వయంగా కార్యకర్తలే వాటర్ బాటిళ్లను మోసుకొచ్చారు. సభ ప్రాంగణంలో జొన్న రొట్టెల పంపిణీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో బంజారా మహిళలు జొన్నరొట్టెలు, కూరలు తయారు చేసి వచ్చే వాళ్లకు అందిస్తున్నారు. నాయకుల ప్రసంగాలు కార్యకర్తలకు స్పష్టంగా వినిపించేందుకు వేదిక వద్ద ఎనిమిది వైర్లెస్ మైక్రో కెమెరాలు, ఫోన్లు ఏర్పాటు చేశారు. 3,000 వాట్ల శక్తి గల 88 స్పీకర్లు ఏర్పాటు చేశారు. వేదికపై ఉన్న నేతలను చూసేందుకు 50కిపైగా ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం విద్యుత్ కాంతులతో మెరిసిపోయింది. 800 కేవీఏ విద్యుత్ అవసరం ఉంటుందని భావించిన డిస్కం ఆ మేరకు 60పైగా అదనపు ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అనారోగ్యానికి గురైన కార్యకర్తలకు యశోద, స్టార్, మల్లారెడ్డి, నారాయణ హృదయాలయ ఆస్పత్రులకు చెందిన సుమారు 300 మంది వైద్య సిబ్బంది సభాస్థలి వద్ద సేవలు అందించారు. హరిత టాయ్లెట్లను భారీగానే ఏర్పాటు చేసినా.. అవి కార్యకర్తల అవసరాలు తీర్చలేకపోయాయి. కార్యకర్తలు టాయ్లెట్ల ముందు క్యూ కట్టాల్సి వచ్చింది. పార్కింగ్ వద్ద ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు. అయితే ఓఆర్ఆర్ నుంచి సభాస్థలికి వెళ్లే మార్గాలన్నీ ద్విచక్రవాహనాలు, జనంతో జామ్ అయ్యాయి. దీంతో బస్సులు, కార్లు, ఇతర భారీ వాహనాల్లో సభకు వచ్చిన వారు ఇబ్బంది పడాల్సి వచ్చింది. – సాక్షి, హైదరాబాద్ పోటెత్తిన వాహనాలు..జంక్షన్లు జామ్ రోడ్లపైనే నిలిచిపోయిన వాహనాలు సభకు చేరకుండానే సగం వెనక్కి డ్రైవర్లకు అవగాహన లేకపోవడమే కారణం సభకు వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్ కావడంతో తిరిగి వెళ్లిపోతున్న బస్సులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదన’సభకు వాహనాలు పోటెత్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్ బాట పట్టిన ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో సగం సభాస్థలికి చేరకుండానే వెనుదిరిగాయి. కొన్ని మార్గమధ్యంలోనే నిలిచిపోయాయి. కార్యకర్తల అత్యుత్సాహం కూడా ట్రాఫిక్కు అంతరాయం కలిగించింది. ఏ రోడ్డు గుండా సభా ప్రాంతానికి వెళ్లాలనే అంశంపై డ్రైవర్లకు అవగాహన లేకపోవడం, రింగ్ రోడ్డు జంక్షన్లలో పోలీసులను నియమించకపోవడంతో గందరగోళం తలెత్తింది. ఉత్తర తెలంగాణ, వికారాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలను ఎక్కడ మళ్లించాలన్న అంశంపై పోలీసులు తికమకపడ్డారు. ఈ ప్రాంతాల గుండా వచ్చిన వాహనాలు ఔటర్ జంక్షన్లలో దిగి సర్వీసు రోడ్డు గుండా నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వికారాబాద్, బెంగళూరు జాతీయ రహదారి, ముంబై మార్గాల నుంచి వచ్చిన వాహనాలు తుక్కుగూడ దగ్గర దిగాల్సి ఉండగా బొంగ్లూరు జంక్షన్లో దిగాయి. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత వాహనాల తాకిడి మరింత పెరగడం.. ఊరేగింపులు, రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సూచించేవారు లేక... పోలీసులు, వాహనాల డ్రైవర్లు స్థానికేతరులు కావడంతో ఏ మార్గాన్ని అనుసరించాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాల రద్దీ ఊపందుకుంది. దీనికితోడు ఇబ్రహీంపట్నం నుంచి సాధారణ వాహనాల రాకపోకలు తోడయ్యాయి. వాహనాలు పోటెత్తడంతో రాత్రి ఏడు గంటల వరకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. దీంతో కార్యకర్తలు అలసటకు గురయ్యారు. కార్యకర్తలు మాత్రం సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సభాప్రాంగణానికి కాలినడకన చేరుకున్నారు. ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. వంద మీటర్ల దూరం పోవడానికి కనీసం అరగంట సమయం పట్టింది. రావిర్యాల, వండర్ లా, ఆదిబట్లకు వెళ్లే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ తిప్పలు అధికంగా కనిపించాయి. వాహనాలు తిరిగి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువైంది. -
గులాములం కాదు.. గులాబీలం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు.నా గుండెల నిండా ఎంత సంతోష పడ్డానో జోనల్ విధానం ఆమోదం పొందినప్పడు అదే అనుభూతి పొందా. ఈ విషయంలో కేంద్రం ఊగిసలాటలో ఉంటే చేస్తవా చస్తవా అని ప్రధాని మోదీని బల్లగుద్ది అడిగినం. ఇది మా రాజ్యాంగ హక్కు అని తెచ్చుకున్నం. స్వరాష్ట్రం మనకు సాధించిన విజయమిది. వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ మంచినీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడగం అని దేశంలో ఏ ముఖ్యమంత్రీ చెప్పలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందే నీళ్లు సరఫరా చేస్తాం. ఆడపిల్లల పాదాలు కడిగి చూపిస్తం. సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీకి గులాములుగా ఉండాలో లేక తెలంగాణ గులాబీలుగా స్వతంత్ర జీవనం గడపాలో ప్రజలే తేల్చుకోవాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. ఢిల్లీ చక్రవర్తుల కింద సామంతులుగా ఉన్న వాళ్లు, అసెంబ్లీ టికెట్ల కోసం ఢిల్లీ గుమ్మం దగ్గర కాపలా కాసే వాళ్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అధికారం మన చేతిలో ఉంటేనే ఆత్మగౌరవంతో నిర్ణయాలు తీసుకోగలమని, ఇందుకు 50–60 ఏళ్ల క్రితమే తమిళ సోదరులు తీసుకున్న నిర్ణయం మాదిరిగా ముందుకెళ్దామన్నారు. శాసనసభకు ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోందని, తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర భవిష్యత్తుకు, టీఆర్ఎస్ పార్టీకి ఏది మంచిదైతే రాజకీయంగా ఆ నిర్ణయం తీసుకుంటామని, తీసుకున్నప్పుడు ప్రజలకు చెప్తామని వివరించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో జరిగిన ‘ప్రగతి నివేదన సభ’కు హాజరైన లక్షలాది మంది ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభానికి ముందు కేసీఆర్ తెలంగాణ తల్లికి నమస్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. కేసీఆర్ రాజకీయ ప్రసంగం ఆయన మాటల్లోనే ప్రపంచమే నివ్వెరపోయే విధంగా.. జనమా, ప్రభంజనమా అనుకునే విధంగా తెలంగాణలోని గిరిజన గూడాలు, లంబాడీ తండాలు, మారుమూల పల్లె ప్రాంతాల నుంచి, రాష్ట్రం నలుచెరగుల నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు వందనం.. శుభాభివందనం. ఈ సభను చూస్తుంటే 18–19 సంవత్సరాల నాటి జ్ఞాపకాల దొంతరలు కళ్ల ముందు తిరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో ఆనాటి సీఎం ఎడాపెడా ఇష్టం వచ్చిన రీతిలో కరెంటు చార్జీలు పెంచితే తెలంగాణ రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. ఆ రోజున ఉన్న సీఎంను తెలంగాణ బిడ్డగా ఒక బహిరంగ లేఖ ద్వారా కరెంటు చార్జీలు తగ్గించమని కోరా. అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ రైతులకు పెంచిన కరెంటు చార్జీలు ఉరితాళ్లలాంటివని, ఆ ప్రతి పాదనలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశా. మీరు వాపస్ తీసుకోకపోతే సమైక్య రాష్ట్రంలో మా కష్టాలు తీరవని, స్వరాష్ట్రం కోసం, తెలంగాణ కోసం పోరాడాల్సి వస్తుందని చెప్పా. అప్పటికే తెలంగాణ అంటే అలుసైపోయింది. ఏం చేయగలుగుతారులే తెలంగాణ అమాయక ప్రజలనే స్థాయికి అప్పటి పాలకులు వెళ్లిపోయారు. ఏదైనా చేస్తే కేసులు పెట్టి, లాఠీచార్జీలు చేసి అవసరమైతే కాల్చి పారేస్తాం అనే అహంకారంలో ఉన్నారు. ఎందుకంటే అప్పడు ఎన్డీయే ప్రభుత్వంలో వాళ్ల హవానే నడుస్తోంది. కేంద్రం, రాష్ట్రం వాళ్ల చేతుల్లో ఉన్నాయి. 20 ఏళ్లు మేమే ఉంటామనే అధికార మదంతో విర్రవీగిన వాళ్ల కళ్లు మూసుకుపోయి ఉన్నాయి. అందరూ అనుకున్నట్టు తెలంగాణ ఉద్యమం 2001 ఏప్రిల్ 27న ప్రారంభం కాలేదు. అసలు ఉద్యమానికి బీజం పడింది ఆనాడు నేను రాసిన లేఖతోనే. 9–10 నెలలపాటు విపరీత మేధోమథనం చేశాం. ఏం చేయాలి... ఏం చేయగలం... ప్రత్యామ్నాయమే లేదా .. కళ్లలో నీళ్లు దిగమింగుకోవడమేనా? అని ఆలోచించాం. ఇందుకోసం ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు. చుట్టూ పిడికెడు మందితో చిమ్మచీకటిలో ప్రయాణం ప్రారంభించాం. ఆరేడు నెలలపాటు మేధోమథనం తర్వాత తెలంగాణ రావాల్సిందే... పోరాడాల్సిందే.. గత్యంతరం లేదనే స్థిర నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం కోసం మార్గం ఏమిటి? కారుచీకట్లో గుండె దిటవు చేసుకుని భగవంతుని స్మరించుకుని ధర్మం, న్యాయం ఉంటే తెలంగాణ సమాజం విజయం సాధిస్తుందనే నమ్మకంతో హింస లేకుండా కొనసాగే ప్రశాంత ఉద్యమం చేపట్టాం. రాజకీయ పద్ధతిలోనే తెలంగాణ సాధించాలని సంకల్పించి ఆ బాట పట్టాం. ఎన్నో కుట్రలు, అవమానాలు చేసినా ధైర్యం చెదరలేదు... తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు, రాజీనామాలు, ఉప ఎన్నికలు, ఢిల్లీ యాత్రలు చేశాం. పక్షి తిరిగినట్టు తెలంగాణ అంతా తిరిగా. ఎక్కడికి పోయినా ప్రజలు జేజేలు పలికారు. యావత్ మహిళలు, విద్యార్థులు, యువకులు.. ఇలా అన్ని వర్గాల వారు భాగస్వాములై ఉప్పెన సృష్టించారు. తెలంగాణ ఇస్తామని మొదట వాగ్దానం చేసిన ఢిల్లీ పెద్దలు అహంకారంతో వ్యవహరించారు. ఈ సమయంలో ఎన్నో కుట్రలు జరిగాయి. గులాబీ జెండా అయిపోయింది.. దీని పని ఖతం అని ప్రచారం చేశారు. ఆనాటి అధికార పార్టీ పెద్దలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు ఎన్నోసార్లు అవమానపర్చారు. అవహేళన చేశారు. అయినా ఏనాడూ ధైర్యం చెదరలేదు. ఓ రోజున కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్, నేను... దివంగత దేశిని చినమల్లయ్య గారి ఇంట్లో కూర్చున్నం. రాత్రి 3 అవుతోంది. వినోద్ అమాయకంగా అడిగాడు. సార్.. ఏమైతది.... ఎక్కడి దాకా పోతం అని అడిగాడు. చిత్తశుద్ది, నిబద్ధత, మొండి పట్టుదల, ధైర్యం మీద ఆధారపడి ఉద్యమం కొనసాగిస్తే... తెలంగాణ సమాజం ఒక్క దిక్కే నిలబడి బరి గీసి ఇవ్వరా మా తెలంగాణ అని నినదించి అడుగుతుందని చెప్పిన. అదే ధైర్యంతో 2001 ఏప్రిల్ 27 మీ అందరి దీవెనలతో పిడికెడు మందితో జలదృశ్యంలో ప్రతిజ్ఞ చేసిన. మడమ తిప్పను.. మాట తప్పను.. ఉద్యమ బాట వీడను, ఎత్తిన జెండా దింపను.. దించితే రాళ్లతో కొట్టండని చెప్పా. విశ్వసించిన ప్రజలు కలసి వచ్చి, కదిలి వచ్చి అద్భుతం చేసి చూపించారు. నేను కేంద్ర మంత్రిగా ఉన్న కొద్ది సమయంలో దేశంలోని 36 రాజకీయ పార్టీలను ఒకటి కాదు పది కాదు.. ఒక్కో పార్టీని 20 సార్లు కలిసినం. కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బర్దన్ గారయితే నన్ను పిచ్చోడివా అని అడిగారు. ఒక్క సీపీఐ ఆఫీసుకే 38 సార్లు వెళ్లిన. అవును.. నేను తెలంగాణ పిచ్చోడినని చెప్పిన. ఓకే నేను మద్దతిస్తా అని చెప్పారు. జయశంకర్ సార్, విద్యాసాగర్రావుగారు... అందరం కలసి అనేక శ్రమ, ప్రయాసలు పడి ఒక్కో పార్టీని ఒప్పించి, అనేక పోరాటాలు చేశాం. 14 ఏళ్ల కఠోర పరిశ్రమ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొత్త రాష్ట్రంలో భయంకర సమస్యలు... తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఎన్నికలకు పోవాలె. విచిత్ర పరిస్థితి. ప్రజలు ఏం చేస్తారు.. ఎలా చేస్తారు? ఈనెకాచి నక్కల పాలు చేయకుండా.. రాష్ట్రాన్ని ఇతర పార్టీలకు అప్పగించకుండా ప్రజలను నమ్ముకొని ఒంటరి పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాం. ప్రజలు మద్దతిచ్చారు.. దీవించారు... టీఆర్ఎస్ బిడ్డలే శ్రీరామరక్షగా సంపూర్ణ మెజారిటీని సింగిల్ పార్టీకి ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో భయంకర సమస్యలున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి ఏమిటో.. అసలు బడ్జెట్ ఎంతో అర్థం కాదు. మిగులు బడ్జెట్ ఉందా... రెవెన్యూ లోటు ఉందా తెలియని పరిస్థితి. అదో విపత్కర పరిస్థితి. ఒక్క మహబూబ్నగర్ జిల్లా నుంచే 15 లక్షల మంది ప్రజలు గూడు చెదిరిన పక్షుల్లా వలస వెళ్లారు. కులవృత్తులు ధ్వంసమై ఉన్నాయి. చెరువులు తాంబాళాలుగా మారాయి. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు.. కరిగిపోయే వైర్లు.. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రస్థానం ప్రారంభించాం. ఎక్కడ ప్రారంభించాలో గుండె లోతుల్లోంచి నిజాయితీగా ఆలోచించాం. ఏది తెలంగాణ ప్రజలకు మొదట అవసరమో.. ఏది మొదట చేయాల్నో ఆలోచించాం. ప్రజలకు ఏది మంచిదైతే అదే... కేసీఆర్ ఈ సభలో ఏం చెప్తడు.. శాసనసభను రద్దు చేస్తడా... అని ఆలోచన చేస్తున్నరు. నేను ఒకమాట చెబుతున్నా. తెలంగాణ రాష్ట్రానికి, టీఆర్ఎస్కు, ప్రజల భవిష్యత్తుకు రాజకీయంగా ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకోవాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు నాకు అధికారం అప్పజెప్పారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఏం చేయాలో భవిష్యత్తులో తీసుకుంటాం. తీసుకున్నప్పుడు నేను మీకు చెప్తా. పత్రికలు, మీడియాలో కేసీఆర్ ఏదో వరాలు ప్రకటిస్తడని రాశారు. అధి ధర్మం కాదు. ప్రభుత్వంలో ఉన్నం కాబట్టి మేం ఒకమాట చెప్పామంటే అమలు జరగాలె. అందుకోసం పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తం. ఎన్నికలలొచ్చిన తర్వాత చిత్తశుద్ధితో ఏం చేయాలో నిర్ణయిస్తం. ప్రభుత్వంలో ఉండి సీఎం హోదాలో అది చేస్తం.. ఇది చేస్తం అని చెప్పడం అనైతికం. మేనిఫెస్టోలో అన్ని అంశాలను వివరంగా తీసుకొస్తాం. ప్రజలంతా మమ్మల్నే కోరుకుంటున్నరు... ప్రజలంతా మళ్లీ టీఆర్ఎస్సే (అధికారంలోకి) రావాలని, కేసీఆరే (సీఎం) కావాలని కోరుకుంటున్నరు. నేను టీవీల్లో చూస్తున్నప్పుడు మీలో చాలా మంది మాట్లాడిండ్రు... ఫేస్బుక్లో, మీడియాలో మీరు చెప్తున్నరు మాకు టీఆర్ఎస్, కేసీఆరే కావాల్నని. మాకు చేపలు వచ్చినయ్, గొర్రెలొచ్చినయ్.. కరెంటు ఇచ్చిండ్రు. రోడ్లు వేసిండ్రు... చెరువులు తవ్విండ్రు..అని చెప్తున్నరు. ఇది ప్రజావాణి. ప్రజలు ఆ విధంగా చెప్తున్నరు. ఢిల్లీకి బానిసలు కావొద్దు... కొన్ని మూకలు, కొన్ని ప్రతీప శక్తులు ప్రాజెక్టులు ముందుకు పోకుండా కేసులు వేశాయి. ఇంకొకాయన కేసీఆర్ను గద్దె దింపుడే తన రాజకీయ లక్ష్యమని చెప్తడు. ఇదేం దిక్కుమాలిన లక్ష్యం. కేసీఆర్ను గద్దెదింపుడు ఒక లక్ష్యమా? ప్రగతి నిరోధక శక్తులు, ప్రతీపశక్తులు అవాకులు, చెవాకులు పేలుతున్నయ్. అలవిగాని మాటలు మాట్లాడుతుయ్. మోసపోతే గోసపడతం.. ఇబ్బంది పడతం. జరిగిన ప్రగతి మీ కళ్ల ముందే ఉంది. ఆత్మగౌరవంతో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాములుగా ఉన్నాయి. ఢిల్లీ చక్రవర్తులకు సామంతులు వాళ్లంతా... తెలంగాణ మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు ఆలోచించాలె. అధికారం తెలంగాణలో ఉండాల్నా? ఢిల్లీ దొరల కింద ఉండాల్నా? అధికారం మన దగ్గర ఉంటే ఆత్మగౌరవంతో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ పార్టీ వాళ్లు అసెంబ్లీ టికెట్ల కోసం కూడా ఢిల్లీ గుమ్మం ముందు కాపలా కాయాలె. చెంచాగిరీ చేయాలె. ఢిల్లీకి గులాములవుదామా.. తెలంగాణ గులాబులవుదామా అనేది ప్రజలే ఆలోచించాలి. 50–60 ఏళ్ల క్రితం నుంచే తమిళ రాష్ట్రాన్ని అక్కడి ప్రజలు ఆత్మగౌరవంతో ఎలా పాలించుకుంటున్నారో అదే మాదిరిగా మనం కావాలె. తమిళ సోదరుల్లా ఆత్మగౌరవంతో అభివృద్ధి సాధించాలె. ఢిల్లీకి బానిసలు కావద్దు. ఇది భవిష్యత్ తరాలకు మంచిది కాదు. నిర్ణయాధికారం మన చేతుల్లోనే ఉండాలె. మళ్లీ ప్రజలు దీవిస్తే ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటవుతుంది. సమూల పేదరిక నిర్మూలన జరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలె. నా మాట విశ్వసించాలి. మరోమారు మీ ఆశీర్వచనం ఉండాలి. రాజకీయ నిర్ణయాలు త్వరలోనే మీ ముందుంటాయి. అందరికీ ధన్యవాదాలు... జై తెలంగాణ... (ఏమయింది సవ్వబడ్డరు.. గట్టిగ చెప్పాలె..) జై తెలంగాణ.. జై తెలంగాణ... జై తెలంగాణ... జై భారత్’ అని నినదిస్తూ కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు. -
జనమా.. ప్రభంజనమా..
-
సినిమా స్టంట్ సీన్ను తలపించేలా..
-
‘ప్రగతి నివేదన సభ తుస్సు..’
సాక్షి, హైదరాబాద్: ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభలో కేసీఆర్ స్పీచ్ తుస్సుమనిపించిందని ఎద్దేవా చేశారు. సభకు ప్రపంచం నివ్వెరపోయేలా జనం రావటం కాదు.. ప్రపంచం నివ్వెర పోయేలా అవినీతి ప్రదర్శన జరిగిందన్నారు. ప్రజల సొమ్ము విచ్చల విడిగా ఖర్చు చేసి బలవంతగా బస్సులను సభకు తరలించారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభకు ప్లాస్టిక్ నిషేధం పేరుతో జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లెక్సీలను తొలగించారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అదే అధికారులు దగ్గరుండి కటౌట్లు కాపాడుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరు సరిగా లేదని హెచ్చరించారు. ప్రగతి నివేదన సభ కాదు.. ప్రజా ఆవేదన సభ అని ఉత్తమ్ విమర్శించారు. సభకు 300 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఈ సొమ్ము ఎక్కడిదని, దోచుకున్నది కాదా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, ఇంటికో ఉద్యోగం వంటి హామీల గురించి ఎందుకు ప్రస్తావన తీసుకురాలేదని ప్రశ్నించారు. కరెంట్ విషయంలో కేసీఆర్ మళ్లీ అబద్దాలు చెప్పారని అన్నారు. జైపూర్, భూపాలపల్లిలో పవర్ ప్లాంట్లు కాంగ్రెస్ హయంలోనివేనని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 10శాతం ఇళ్లకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఉత్తమ్ ఆరోపించారు. తాగుడులో, రైతుల ఆత్మహత్యలలో, అప్పులు చెయ్యడంలో తెలంగాణను నంబర్ 1గా చేశారని మండిపడ్డారు. జోన్ల విషయంలో ప్రధానితో కోట్లాడానని చెప్పిన కేసీఆర్, ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల అంశంపై ఎందుకు పోరాడలేదని నిలదీశారు. పెన్షన్లు పెంచుతామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ విజయేనని ఆయన తెలిపారు. కోర్టులకు వెళ్తునందుకు నిందిస్తున్నారని.. టీఆర్ఎస్ అన్యాయాలపై, అక్రమాలపై కేసులు వేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఢిల్లీకి చెంచాగిరి చేస్తుంది కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ గులాంగిరి చేస్తున్నారని ఆరోపించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో ముందుకెళ్తుందని వెల్లడించారు. -
సినిమా స్టంట్ సీన్ను తలపించేలా..
సాక్షి, హైదరాబాద్ : సినిమా స్టంట్ సీన్ను తలపించేలాంటి ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘‘ప్రగతి నివేదన సభ’’ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్లో మార్పులు చేశారు. కొన్ని చోట్ల వాహనాల రాకపోకలు ఓకే రహదారిపై జరిగాయి. దీంతో రహదారిపై వెళుతున్న ఓ బైక్ ఎదురుగా వస్తున్న మినీ ట్రక్కును ఢీ కొట్టగా.. బైక్ నడుపుతున్న వ్యక్తి కొన్ని అడుగులపైకి గాల్లోకి పల్టీలు కొట్టి నేలను తాకాడు. శరీరం రోడ్డును తాకినప్పటికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అతడు వెంటనే లేచి బైక్ దగ్గరకు చేరకున్నాడు. రోడ్డుపై వెళుతున్న కొద్దిమంది అతనికి సహాయం చేయటానికి చుట్టూ చేరారు. -
అసెంబ్లీ ముందస్తుపై కేసీఆర్ సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు వస్తాయని గత కొంతకాలంగా సాగుతున్న చర్చపై ఉత్కంఠ వీడలేదు. టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభ ద్వారా ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు స్పష్టతనిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరిగినప్పటికీ ఆదివారం అలాంటిదేమీ జరగలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారనే గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు సూచించాయి. అందుకు అనుగుణంగానే ప్రగతి నివేదన సభలో ప్రకటన వెలువడుతుందని అంతా భావించారు. అయితే ముందస్తు ఆలోచనపై కేసీఆర్ తన మనసులోని మాటను ఎక్కడా బయటపెట్టలేదు. కానీ కేసీఆర్ మాట్లాడిన తీరు ముందస్తుపై రకరకాలుగా అన్వయించుకునే ఆస్కారం కల్పించి మరింత ఉత్కంఠకు తెరలేపారు. ఆదివారం హైదరాబాద్ నగర శివారులోని కంగర కొలాన్ లో జరిగిన ప్రగతి నివేదిన సభ ప్రారంభానికి ముందు కేసీఆర్ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశంలోనే ముందస్తుపై ఒక నిర్ణయం తీసుకుంటారని, ఆ నిర్ణయాలను సభలో వివరిస్తారని ఒక ప్రచారం జరిగింది. అయితే, కొన్ని వర్గాలకు సంబంధించి వరాలు ప్రకటించడం వరకే కేబినేట్ సమావేశాన్ని పరిమితం చేశారు. కేబినేట్ సమావేశంలో ముందస్తుపై నిర్ణయం చేయకపోవడంతో ఆ అంశంపై ప్రగతి నివేదన సభలోనైనా కేసీఆర్ కొంత స్పష్టతనిస్తారని పార్టీ నేతలు భావించారు. అయితే, మరికొద్ది రోజుల్లోనే మరోసారి కేబినేట్ సమావేశం ఉంటుందని మంత్రులు చేసిన ప్రకటన, ఆ తర్వాత సభలో కేసీఆర్ చెప్పిన మాటలు బేరీజు వేసుకుని విశ్లేషించుకుంటే ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అన్న ఉత్కంఠ వీడకపోగా మరింత సస్పెన్స్ లోకి నెట్టినట్టయింది. ప్రగతి నివేదన సభలో 50 నిమిషాలపాటు ప్రసంగించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సూటిగా ఎలాంటి విషయాలను చెప్పలేదు. అయితే, ఈ విషయంలో ఏది మంచి నిర్ణయమైతే అది తీసుకోవాలని కోరుతూ మొత్తం కేబినేట్ మంత్రులు తనకు అధికారం అప్పగించారన్న విషయాలు కేసీఆర్ సభలో తెలియజేశారు. దాంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ మొదలైంది. ముందస్తుకు సంబంధించి... రాజకీయపరమైన అంశాల్లో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని కేసీఆర్కు కేబినేట్ కట్టబెట్టగా, మరికొద్ది రోజుల్లో నిర్వహించబోయే కేబినేట్ సమావేశం కీలకమవుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడుతూ, పార్టీ నాయకుడు కే కేశవరావు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయనున్నామని, టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. అలా అంటూనే, కేసీఆర్ తన ప్రసంగంలో మరో వారంలో రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటామని చేసిన వ్యాఖ్యలు ముందస్తుపై మళ్లీ ఉత్కంఠకు తెరలేపింది. కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. వారం రోజుల్లో రాజకీయపరమైన నిర్ణయాలు ఉంటాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికలకు సిద్ధం కావలసిందే అని కొందరు నేతలు భావిస్తుంటే అసెంబ్లీని రద్దు చేసే ఆలోచన కేసీఆర్కు లేదని, వచ్చే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేయడంలోనే ఆయన నిమగ్నమయ్యారన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే, ముందస్తుకు వెళ్లడంపై ప్రజలు, పార్టీ శ్రేణుల అభిమతాన్ని తెలుసుకోవడానికి ముందస్తుపై చర్చకు తెరలేపారని, పార్టీ పరంగా నిర్వహించిన కీలకమైన ప్రగతి నివేదక సభ పూర్తయిన నేపథ్యంలో సమావేశమయ్యే వచ్చే కేబినేట్ లో కీలకమైన నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. వచ్చే డిసెంబర్ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆ రాష్ట్రాలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు నిర్వహించాలంటే ఈ నెల మొదటి వారంలో సభను రద్దు చేయాల్సి ఉంటుందని, తాజా పరిస్థితుల్లో త్వరలో జరగబోయే కేబినేట్ సమావేశం అత్యంత కీలకంగా మారుతుంది. ఆ కేబినేట్ సమావేశంతో మాత్రమే ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? లేదా అన్న సస్పెన్స్ కు తెరపడుతుంది. -
కేసీఆర్ ఆత్మగౌరవ నినాదం
సాక్షి, కొంగకలాన్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మరోసారి ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్నారు. ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. కొంగకలాన్లో ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలన్నీ ఇక్కడే జరగాలని ఆకాంక్షించారు. ‘ఢిల్లీకి గులాములుగా ఉందామని కొన్ని పార్టీలు అంటున్నాయి. తెలంగాణ సంబంధించిన నిర్ణయాలు ఇక్కడ జరగాలా? ఢిల్లీలో జరగాలా? ఢిల్లీకి గులాం, చెంచాగిరి చేసుకుందామా? ఆలోచన చెయ్యండి.. తెలంగాణ జాతి ఒక్కటిగా ఉండాలి. ఢిల్లీకి గులాంగిరి వద్ద’ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీకి గులాంగిరి చేసే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి పార్టీలు ఢిల్లీ గుమ్మం దగ్గర పడిగాపులు కాసి ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకుంటాయని ఎద్దేవా చేశారు. ప్రతీప శక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ఉంటాయని ధ్వజమెత్తారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని, తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రాజకీయ నిర్ణయాల పట్ల ఆచితూచి స్పందించారు. త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. -
కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ త్వరలోనే సాకారం
-
‘ఈ సభ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుంది’
-
ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలే
-
జనమా ప్రభంజనమా: సీఎం కేసీఆర్
సాక్షి, కొంగరకలాన్ : ప్రపంచం నిబ్బర పోయే విధంగా జనమా ప్రభంజనమా అనుకునే విధంగా ప్రజలు ప్రగతి నివేదన సభకు తరలి వచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొంగరకలాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సభను చూస్తూ ఉంటే 2001 నాటి జ్ఞాపకాలు తన కళ్ల ముందు తిరుగుతున్నాయని తెలిపారు. ఈ సభలో కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. నాడు బహిరంగ లేఖ ద్వారా.. ‘ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడా పెడా కరెంట్ చార్జీలు పెంచితే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఓ తెలంగాణ బిడ్డగా బహిరంగ లేఖ ద్వారా మీరు పెంచిన కరెంట్ బిల్లులు ఉరితాళ్ల వంటివని చెప్పాను. మీరు అలా మొండిగా అదే పద్దతిలో వెళ్తే మా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తానని చెప్పాను. వలస పాలనలో ఎక్కువ మాట్లాడితే కాల్చిపారేద్దం అనే ధోరిణిలో నాడు సమైక్య పాలకులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ చేతిలో ఉందనే మదంతో కళ్లు మూసుకుపోయిన నాటి ప్రభుత్వానికి నా మాటలు వినపడలేదు. నేను రాసిన ఈ బహిరంగ లేఖతోనే నాడు ఉద్యమానికి బీజం పడింది. 9 నెలల పాటు ఏం చేయలేని పరిస్థితి. ఎక్కని కొండలేదు. మొక్కని బండ లేదు. కొన్ని వేల మందితో ఆరు ఏడు నెలల పాటు విపరీతంగా ప్రయత్నించాను. లాభం లేదు తెలంగాణ రావాల్సిందేనని, ధర్మం, న్యాయం ఉంటే తెలంగాణ సమాజం విజయం సాధిస్తుందని, అహింస మార్గంలో ఉద్యమం చేపట్టాలని భావించి నాడు ఆ బాట పట్టాం. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం.. ఆ ఉద్యమంలో మీరందరూ కూడా పాత్రదారులే. ఎన్నో రాజీనామాలు, ధర్నాలతో ప్రభంజనం సృష్టించినం. మొదట హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అహంకారంతో ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసింది. మనల్ని ఘోరంగా అవమానించారు. ఎక్కడిదయ్యా తెలంగాణ అని మాట్లాడారు. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న ఎంపీ వినోద్.. ఒకరోజు మిత్రుడు చిన్న మల్లయ్య ఇంట్లో కూర్చున్నప్పుడు ఏమైతుంది ఈ పోరాటం ఎక్కడి వరకు పోతుంది అని అడిగారు. మనకున్న సిన్సియారిటీపై ఆధారపడుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చిన కొనసాగించగలిగితే విజయం సాధించవచ్చని నాడు చెప్పా. 2001, ఎప్రిల్ 27 నాడు జలదృశ్యంలో పిడికెడు మందితో ప్రాణం పోయినా సరే ఎత్తిన పిడికిలి దించను. ఒకవేళ దింపితే రాళ్లతో కొట్టండి అని చెప్పాను. నేను తెలంగాణ పిచ్చోడిని.. ఢిల్లీలో నేను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం 36 పార్టీలను ఒకటికి 20 సార్లు కలిసాను. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ను ఒప్పించడానికి 38 సార్లు వెళ్లాను. ఆయన నీకేమైన పిచ్చా అని అడిగారు. అవును నాకు తెలంగాణ పిచ్చి అని సమాధానమిస్తే మద్దతు ఇస్తానని తెలిపారు. 36 పార్టీల మద్దతు కూడగట్టి అనేక పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నాం. వెంటనే ఎన్నికలకు పోయే పరిస్థితి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. పార్టీ మిత్రులంతా ఇతరులకు అప్పగించవద్దని ఒంటరిగా పోటీ చేద్దామని తెలిపారు. ప్రజలు మద్దతు ఇచ్చి దీవించి టీఆర్ఎస్ బిడ్డలే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని సంపూర్ణ మెజార్టీతో తెలంగాణను బాగుచేయమని చెప్పడం జరిగింది. నాడు పుట్టిన ఆలోచననే.. కొత్త రాష్ట్రం.. ఆర్థిక పరిస్థితి ఎంటో తెలియదు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల వరకు విపత్కరమైన పరిస్థితి. మహూబూబ్నగర్ నుంచి 15 లక్షల వలసలు, అన్ని కష్టాలను అర్థం చేసుకొని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటు ముందుకు వెళ్లాం. తెలంగాణ రాక ముందు ఢిల్లీలో ఒక రోజు విద్యాసాగర్ రావు, జయశంకర్ సార్ నేను తెలంగాణ వస్తది వస్తే ఏం చేయాలని చర్చ చేశాం. నేను చెబుతున్నా కొద్ది జయశంకర్ సర్ రాస్తున్నాడు. ఆ నాడు భూగర్భ జలాలు అడుగంటాయని, చెరువుల్లో సామర్థ్యం పోయిందని చెప్పాను. తెలంగాణ రాగానే చేపట్టిన మిషన్ కాకతీయ ఆ నాటి మా చర్చలో నుంచి పుట్టిందే. కరెంట్ బాధలు పోవాలి, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఓ ముఖ్యమంత్రి చెప్పిండు. చిమ్మన చీకటి అయితది అని చెప్పిన స్థితి నుంచి ఈ రోజు 24 గంటలు వెలిగేలా.. భారత్లో రైతులకు 24 గంటలిచ్చే రాష్ట్రం తెలంగాణే అని చెప్పేలా చేశాం. భవిష్యత్తులో ఒక రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను. ఆ రాతలు చూసి ఏడ్చా.. సమైక్యపాలనలో కుల వృత్తుల నిర్వీర్యమయ్యాయి. కరీంనగర్ పర్యటనలో ఒక రోజు సిరిసిల్లా ప్రజలు ఆత్మహత్య చేసుకోవద్దని రాతలు చూసి ఏడ్చాను. పోచంపల్లిలో చేనేత కార్మికులు ఒకే రోజు 7గురు ఆత్మహత్య చేసుకున్నారు. నాటి ముఖ్యమంత్రి రూ.50 వేల ఎక్స్గ్రేషియా ఇవ్వమంటే ఇవ్వలేదు. మేం జోల పట్టి ఇస్తానని చెప్పి ఇచ్చాం. సిరిసిల్లాలో 11 మంది చనిపోతే టీఆర్ఎస్ తరపున సాయం అందజేశాం. ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణ వస్తే మన బాధలు తీరుతాయని చెప్పా. ఇప్పుడు బతుకమ్మ చీరలు, రంజాన్కు పేదలకు ఇచ్చే దుస్తులతో వారికి పనిఇచ్చి ఆదుకుంటున్నాం. చీప్ లిక్కర్ వల్ల గీతకార్మికులు నష్టపోతే వాటిని రూపుమాపి ఆదుకున్నాం. వారికి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం. 70 లక్షల గొర్రెలు ఇచ్చాం. వాటికి 30 లక్షల పిల్లలు పుట్టాయి. దీంతో యాదవులకు మేలు జరిగింది. 2లక్షల 11 వేల పాడిరైతులకు సబ్సిడీ అందజేశాం. ఆయన గోస చూడలేక.. ఉద్యమ సమయంలో మంత్రి చందులాల్తో ములుగుకు వెళ్లి వస్తుంటే ఓ ఇళ్లు కాలిపోయిది. ఆ ఇంటి చెందిన ఇమానాయక్ ఏడుస్తున్నాడు. ఏమయిందయ్యా అంటే బిడ్డ పెళ్లి కోసం తెచ్చిన రూ. 50 వేలు కాలిపోయినాయని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయనకు లక్ష రూపాయలు ఇస్తానని, పెళ్లికి వస్తానని చెప్పి ఆ పెళ్లికి కూడా వెళ్లడం జరిగింది. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎంతో మంది పేదలకు పెళ్లి చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే కళ్యాణి లక్ష్మీ పథకం చేపట్టాం. దీంతో బాల్యవివాహాలు తగ్గాయి. ఎంతో మంది తల్లి తండ్రులకు సాయంగా ఉంది. ఎలక్షన్ మ్యానిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేస్తున్నాం. ఐదున్నర వేల కోట్లు కేటాయించాం.. తెలంగాణ ప్రభుత్వ ఏర్పడిన తరువాత నాయి బ్రాహ్మణులకు భరోసా కల్పించాం. పేద బిడ్డల భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాయి. రానున్న రోజుల్లో కేజీ టూ పీజీ ఉచిత విద్యా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన గిరిజనులు, లంబాడ ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. దీంతో మూడువేల గిరిజన బిడ్డలు సర్పంచులుగా ఎన్నికకానున్నారు. కోటి ఎకరాలకు నీరందించేందుకు కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. రాష్ట్రంలో అప్పులేని రైతు లేడు. వారందరిని ఆదుకునేందుకు రైతుబంధు పథకం ప్రవేశపెట్టాం. రైతులకు ప్రభుత్వమే అప్పు చెల్లించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నది. దాని కోసం ఏకంగా ఐదున్నర వేల కోట్ల రూపాయాలను కేటాయిచాం. రెండో విడత రైతుబంధు చెక్కులను నవంబర్లో విడుదల చేస్తాం. రైతులు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుభీమా పథకం అమలు చేస్తున్నాం. 11 రాష్ట్రాలు అభినందించాయి.. ఇంటింటికి త్రాగు నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగమని దేశంలో ఇంతవరకూ ఏ ఒక్క సీఎం కూడా ప్రకటించలేదు. అలా ప్రకటించింది కేసీఆర్ ఒక్కడే. దానికి అనుగుణంగానే మరో ఆరు నెలల్లో ఇంటింటికి నీరు అందిస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకం దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. పథకాన్ని 11 రాష్ట్రాల అధికారులు వచ్చి పరిశీలించారు. తెలంగాణలో మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు. పేదరికంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. మనం తీసుకున్న శ్రద్ద దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా తీసుకోలేదు. దేశంలోని ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్లు కేటాయిస్తే.. తెలంగాణ ప్రభుత్వం రెండు వేల కోట్లు కేటాయించింది. ముందస్తు ఎన్నికలపై గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే బాగుంటోందో అది చేయండని మంత్రివర్గ సహాచరులు నాకు అప్పగించారు. ముందస్తు ఎన్నికలపై తరువాత.. ముందస్తు ఎన్నికలపై తరువాత నిర్ణయం తీసుకుంటాం. దీనికొరకు త్వరలో కేకే అధ్యక్షతన పార్టీ మ్యానిఫేస్టో రూపొందిస్తాం. దానిలో మరిన్ని కొత్త పథకాలను పొందుపరుస్తాం. తెలంగాణ వచ్చిన రోజు నేనెంత సంతోష పడ్డానో.. కొత్త జోన్లకు కేంద్ర ఆమోదం తెలిపిన తరువాత అంత సంతోష పడ్డా. స్థానికులైన నిరుద్యోగులకు 95 శాతం ఉద్యోగాలు రావాలని ప్రధాని మోదీతో కొట్లాడి మరీ ఒప్పించాను. కేసీఆర్ లేకపోతే ఇది సాధ్యమేనా మీరే ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు కొన్ని మూకలు, ప్రగతి నిరోధక శక్తులు అడ్డుపడుతున్నాయి. ప్రాజెక్టులు కట్టుకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అది దిక్కుమాలిన చర్య. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మగౌరవంతో ముందుకు తీసుకెళ్దాం. కొన్ని పార్టీలు ఢిల్లీకి బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఢిల్లీకి చెంచాగిరి చేసే అవసరం మనకు లేదు. తమిళనాడు ప్రజలు ఏలానైతే ఇతర పార్టీలను రానివ్వకుండా ఆత్మగౌరవంతో ముందుకువెళ్తున్నాయో అలానే మనం కుడా కొనసాగుదాం’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
‘ఈ సభ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుంది’
సాక్షి, కొంగర కొలాన్: ప్రగతి నివేదన సభ భారత రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. వ్యవసాయాన్ని పనిగా చేయాలి, రైతును రాజుగా చేయాలనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తెచ్చి, రైతు బంధు, రైతు భీమా ద్వారా రైతుకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. నాలుగు సంవత్సరాల మూడు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశామంటే అది కేసీఆర్ పరిపాలన దక్షత వల్లనే అన్నారు. నూతన రాష్ట్రమైనప్పటికీ.. కేసీఆర్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం, కంటివెలుగు వంటి తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆలోచన చేయడమే కాకుండా అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను వందకు వంద శాతం నెరవేర్చి.. మేనిఫెస్టోలో లేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయడానికి వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు లేని పరిపాలన కొనసాగుతోందని , రాబోయే రోజుల్లో మరోక్కసారి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కడియం కోరారు. -
నేను తెలంగాణ పిచ్చోడిని: కేసీఆర్
సాక్షి, కొంగకలాన్: ప్రగతి నివేదన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తన ప్రసంగంతో సభికులను ఆకట్టుకున్నారు. ఇది జనమా? ప్రభంజనమా’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తన వాగ్ధాటితో అందరినీ కట్టిపడేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమం పుట్టుపూర్వోత్తరాల నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను సవివరంగా తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన చేపట్టిన పథకాల గురించి వివరించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చెప్పారు. కేసీఆర్ ప్రసంగంలో ఉటంకించిన మాటలు కొన్ని... ఇది జనమా? ప్రభంజనమా? తెలంగాణ అప్పట్లో వలస పాలకుల ప్రయోగశాలగా మారింది ప్రత్యేక రాష్ట్రం కోసం ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా పాత్రధారులే ప్రాణం పోయినా సరే మడమ తిప్పను, మాట తప్పను తెలంగాణ తేకపోతే రాళ్లతో కొట్టి చంపమని చెప్పా తెలంగాణ ప్రజలు కలిసి వచ్చి, కదిలివచ్చి అద్భుతం చేశారు సీపీఐ పార్టీని ఒప్పించడానికి 38 సార్లు తిరిగా నేను తెలంగాణ పిచ్చోడిని అని ఏబీ బర్దన్కు చెప్పా కూలిపోయిన కులవృత్తిదారుల బాధ వర్ణణాతీతం తెలంగాణ వచ్చిన తర్వాత నేతన్నల ముఖంలో వెలుగులు చూస్తున్నాం కంప్యూటరే కాదు గొర్రెలు పెంచడం కూడా వృత్తే తెలంగాణ సమాజంలోని దుఃఖాన్ని పంచుకోవాలన్న 24 గంటల విద్యుత్తో తెలంగాణ వెలుగులు జిమ్ముతోంది మీకు ఆకుపచ్చ తెలంగాణ చూపిస్తా ఓట్లు అడగను అనే మాట చెప్పాలంటే ఖలేజా కావాలి రాజకీయ అవినీతిని నిర్మూలించి పనిచేస్తే ఫలితాలు బాగుంటాయి రాష్ట్ర సంపదను పెంచుతాం, ప్రజలకు పంచుతాం మేము చేసిన పనులు డప్పు కొట్టే పనిలేదు మళ్లీ కేసీఆరే రావాలని ప్రజావాణి చెబుతోంది రాజకీయంగా కేసీఆర్ ఏం చెబుతాడో అందరూ చూస్తున్నారు తెలంగాణ వచ్చే ప్రతి ఉద్యోగం మన బిడ్డకే వస్తది కేసీఆర్ సీఎంగా లేకపోతే 95 శాతం ఉద్యోగాలు సాధ్యవ కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ సాకారం కావాలె మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ భాసిల్లాలె ప్రతీప శక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ఉంటాయి జరిగిన ప్రగతి ప్రజల కళ్ల ముందున్నది ఢిల్లీకి గులాములుగా ఉందామని కొన్ని పార్టీలు అన్నాయి తెలంగాణ సంబంధించిన నిర్ణయాలు ఢిల్లీలో జరగాలా? మళ్లీ ప్రజలు దీవిస్తే.. అన్ని సాధిస్తా -
మరో పది సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉంటే..
కొంగరకలాన్: మరో 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణకు సీఎంగా ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాజ్యసభ టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు వ్యాఖ్యానించారు. కొంగరకలాన్ ప్రగతి నివేదన సభలో కేశవరావు ప్రసంగిస్తూ..మనం ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేశామో చెప్పాలనుకున్నామని, అందుకే ప్రజలను ఇక్కడికి పెద్ద ఎత్తులో రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలేనని వ్యాక్యానించారు. నిజానికి టీఆర్ఎస్ పాలించింది రెండున్నర సంవత్సరాలు మాత్రమేనని, మొదటి రెండు సంవత్సరాలు రాష్ట్ర విభజస సమస్యలతో గడిచిపోయాయని తెలిపారు. తెలంగాణలో 80 శాతం బడుగుబలహీన వర్గాలే ఉన్నాయని, ప్రతీ బీసీ కులాల్ని గుర్తించి వారి అభివృద్ధికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు సీఎం కేసీఆర్ పూనుకున్నారని కొనియాడారు. -
ప్రగతి నివేదన: వేదికపై సీఎం కేసీఆర్
-
ప్రగతి నివేదన సభ: నకిలీ కరెన్సీ కలకలం
సాక్షి, హైదరాబాద్: ప్రగతి నివేదన సభ కోసం చేపట్టిన ర్యాలీలో నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది. ఆదివారం ఉప్పల్, రామంతాపూర్ స్థానిక కార్పోరేటర్ గంధం జ్యోత్స్ననాగేశ్వరరావు ఆధ్యర్యంలో జరిగిన ర్యాలీలో టీఆర్ఎస్ నాయకులు నకిలీ కరెన్సీని వెదజల్లారు. దీంతో అక్కడున్న కార్యకర్తలు, జనాలు అసలు నోట్లనుకుని ఏరుకునేందుకు పోటీపడ్డారు. తీరా అవి నకిలీ నోట్లని తెలియడంతో నిరాశకు లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాయకులు వెదజల్లిన నకిలీ నోట్లు -
ప్రగతి నివేదన సభ.. వ్యక్తి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్లో తలపెట్టిన ప్రగతి నివేదన సభ ప్రాంగణానికి సమీపంలోనే హృదయవిధారక సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి రోడ్డు పక్కన పడి ఉన్నా అటుగా వెళుతున్న ఏ ఒక్కరూ స్పందించలేదు. వివరాలు.. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తు వెళుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ బైక్(టీఎస్ 07 ఎఫ్ఆర్ 6346)పై నుంచి పడిపోయారు. ప్రగతి నివేదన సభకు సమీపంలోనే రావిరాల దారిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 108కి దాదాపు 100కు పైగా ఫోన్లు చేసినా స్పందించలేదని స్థానికులు మండిపడుతున్నారు. గంటన్నరకు పైగా ప్రగతి నివేదన సభకు వెళ్లే వాహనాలను సహాయం చేయమని అడిగినా ఎవరినుంచి సరైన స్పందనరాలేదని పేర్కొన్నారు. చివరకు చేసేదేమీలేక సంతోష్ నగర్ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ అబేద్ హుస్సేన్, కానిస్టేబుల్లు నవీన్, మధుసూదన్లు, స్థానికుల సహకారంతో ట్రాఫిక్ వాహనంలోనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలతో రక్తం బాగా పోవడంతో ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి గురైన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు ఢీకొని ఒకరు మృతి వరంగల్ : ప్రగతి నివేదన సభకు బస్సులో బయల్దేరిన బిక్షపతి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ పోచమ్మ మైదాన్కు చెందిన బిక్షపతి పెండ్యాల వద్ద బస్సు దిగి మూత్రవిసర్జనకు వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. -
ఓయూలో నిరుద్యోగ ఆవేదన సభ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ ఆవేదన సభను చేపట్టారు. ప్రగతి నివేదన సభను నిరసిస్తూ.. ఓయూ లైబ్రరరీ నుంచి భారీ ర్యాలీ చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన నిరుద్యోగ ఆవేదన సభ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తన ఉనికిని కాపాడుకోవాడానికే కేసీఆర్ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారని విద్యార్థి నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో బీసీలకు రూ. 70 కోట్లతో 70 ఎకరాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆదివారం సీఎం కేసీఆర్తో జరిగిన కేబినేట్ భేటి అనంతరం తెలంగాణ మంత్రులు ఈటెల రాజేంధర్, హరీష్ రావు, జోగురామన్న, కడియం శ్రీహరిలు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలను మాత్రమే తీసుకున్నామని కడియం శ్రీహరి తెలిపారు. త్వరలోనే మరోసారి కేబినెట్ భేటీ జరగనుందని, ఆ కేబినెట్ భేటీలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాజా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను తెలిపారు. హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు, గోపాల మిత్రులకు వేతనం రూ. 3,500 నుంచి రూ. 8500 పెంపు, అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65 ఏళ్లకు పెంపు, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి 7500లకు పెంచుతూ నిర్ణయం, వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలుకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు, ఎన్యూహెచ్ఎంలో పని చేస్తున్న 9 వేల మందికి కనీస వేతనాలు పెంపు, కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనం రూ. 40 వేలకు పెంచినట్లు ప్రకటించారు. ఇక ముందస్తు ఎన్నికలు, పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరగగా మంత్రులు వాటి గురించి ఏం ప్రస్తావించలేదు. వీటిపై కొంగర్కలాన్ సభలో సీఎం కేసీఆర్ స్పష్టతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇది చివరి కేబినెట్ సమావేశం కాదు
-
అప్డేట్స్: ముగిసిన ప్రగతి నివేదన సభ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభ ముగిసింది. ఈ సభలో కేసీఆర్ ప్రసంగం ఆకట్టుకుంది. హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్లో తలపెట్టిన ఈ సభకు లక్షలాదిగా టీఆర్ఆర్ కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు సభ ప్రాంగణానికి చేరుకున్నాయి. జిల్లాల నుంచి వేలాది ట్రాక్టర్లలో సభకు కార్యకర్తలు తరలివచ్చారు. సుమారు లక్ష వాహనాల్లో 25 లక్షలమంది ప్రజలు సభకు హాజరైనట్టు అంచనా. ప్రగతి నివేదన సభ, కేబినెట్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఇవి.. రాత్రి 7:30: ముగిసిన సీఎం కేసీఆర్ ప్రసంగం సాయంత్రం 6:40: ఉపన్యాసం ప్రారంభించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు లైవ్ కోసం క్లిక్ చేయండి సాయంత్రం 6.35: ఎన్నికల హామీలను 100శాతం అమలు చేశాం. కేసీఆర్ పరిపాలన వల్లే ఇది సాధ్యమైంది- కడియం శ్రీహరి సాయంత్రం 6.30: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అంకితం, మరో 10 ఏళ్ల కేసీఆర్ సీఎంగా ఉండాలి - కేశవరావు సాయంత్రం 6.27: సీఎం కేసీఆర్ రాకతో ప్రగతి నివేదన సభ ప్రారంభమైంది. రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కేసీఆర్ స్వాగతం పలుకుతూ సభనుద్దేశించి ప్రసంగించారు. సాయంత్రం 6.23: ప్రగతి నివేదన సభా వేదికపైకి కేసీఆర్ చేరుకున్నారు. సభపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. సాయంత్రం 6.15: సభాప్రాంగణాన్ని హెలికాప్టర్ నుంచి పరిశీలిస్తున్న కేసీఆర్ సాయంత్రం 6.10: సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో కొంగరకలాన్కు చేరుకున్నారు. సాయంత్రం 5.45: బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో ప్రగతి నివేదన సభకు బయల్దేరారు. సాయంత్రం 4.57: కొంగర్కలాన్ ప్రగతి నివేదన సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పార్కింగ్ ప్లేస్ లేక సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. సాయంత్రం 4.15: ప్రగతి నివేదన సభ వేదికపై మంత్రులు, ఎంపీలు ఆసీనులయ్యారు. కళాకారులు వారి ఆటపాటలతో అలరిస్తున్నారు. సాయంత్రం 4.05: సీఎం కేసీఆర్ కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రగతినివేదన సభకు బయల్దేరనున్నారు. మరోవైపు మానిటరింగ్ రూమ్ నుంచి డీజీపీ మహేందర్రెడ్డి ట్రాఫిక్ను పరిశీలిస్తున్నారు. అన్ని రహదారుల్లో సాఫీగా వాహన రాకపోకలు సాగతున్నాయని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రోజు ట్రాక్టర్లను అనమతించమన్నారు. ట్రాఫిక్ దృష్ట్యా రేపు ఉదయం తర్వాతే అనుమతిస్తామన్నారు. ప్రగతి భవన్ నుంచి ప్రగతి నివేదన సభకు.. మధ్యాహ్నం 3.35: ప్రగతి భవన్ నుంచి రెండు హెలికాప్టర్లలో బయలు దేరిన మంత్రులు కొంగరకలాన్ సభకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3.15: కేబినేట్ భేటి ముగియడంతో తెలంగాణ మంత్రులు ప్రగతి భవన్ నుంచి కొంగరకలాన్ సభకు బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి రెండు హెలికాప్టర్లలో సభకు వెళ్లారు. ముగిసిన తెలంగాణ కేబినేట్ సమావేశం ముందుస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూములు, నిధులు కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అర్చకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచింది. రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయించింది. మధ్యాహ్నం 2.20 : తెలంగాణ కేబినేట్ సమావేశం ముగిసింది. మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు.. లైవ్ కోసం క్లిక్ చేయండి మధ్యాహ్నం 1: తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం. కేబినెట్ సమావేశం తర్వాత మీడియా సమావేశం. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకుంటారని ఊహాగానాలు. కేబినెట్ భేటీ అనంతరం గవర్నర్ నరసింహాన్ను సీఎం కేసీఆర్ కలుస్తారని ప్రచారం. అనంతరం ప్రగతి నివేదన సభకు బయలుదేరనున్న సీఎం కేసీఆర్, మంత్రులు ఈ రోజు జరగబోయేది చివరి కేబినెట్ సమావేశం అని తాను అనుకోవడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందనేది చెప్పడమే సభ ఉద్దేశమని చెప్పారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశానికి తాను, మంత్రి మహేందర్రెడ్డి హాజరుకావడం లేదని, సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తుండటంతో తాము హాజరు కావడంలేదని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలు: ప్రగతి నివేదన సభలో శ్రీరాముడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ను చిత్రిస్తూ.. రూపొందించిన కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది. రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నాయకులు శ్రీరాముడి రూపంలో సీఎం కేసీఆర్ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొంగరకలాన్ సభకు జనజాతర కొనసాగుతున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి వందలాది వాహనాల్లో బయలుదేరారని, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 4.50 లక్షల మంది సభకు వస్తున్నారని మంత్రి తెలిపారు. ఉదయం అప్డేట్స్.. సభా వేదిక, మైదానంతోపాటు సభకు దారితీసే ఔటర్ రింగ్రోడ్డు గులాబీ జెండాలతో రెపరెపలాడుతోంది. సభ కోసం భారీ వేదికను నిర్మించారు. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో పటిష్టంగా నిర్మించిన వేదికపై 300 మంది ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు వేదికపై కూర్చునే అవకాశముంది. భారీ వర్షం వచ్చినా వేదికపై ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రూఫ్ను నిర్మించారు. వేదిక పరిసరాల్లో కంకర, సిమెంటుతో రోడ్డు వేశారు. దూరప్రాంతాల నుంచి వస్తున్న టీఆర్ఎస్ శ్రేణుల ట్రాక్టర్లలో చాలా మటుకు శనివారం సాయంత్రానికే సభా మైదానానికి చేరుకున్నాయి. అయితే ట్రాఫిక్ జామ్ను నివారించేందుకు శనివారం అర్ధరాత్రి వరకే ట్రాక్టర్లను అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు. హెలికాప్టర్లో సభాస్థలికి చేరుకోనున్న కేసీఆర్... ప్రగతి నివేదన సభకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే సభకు వచ్చే జనం, వాతావరణం వంటి వాటితో ఈ షెడ్యూల్లో మార్పులు ఉండే అవకాశం ఉందంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం ముగియనుంది. ఆ తరువాత సభాస్థలికి కేసీఆర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు అన్ని ప్రాంతాల నుంచి సభా మైదానానికి ప్రజలు చేరుకుంటారు. 3 గంటల ప్రాంతంలో సాంస్కతిక కార్యక్రమాలు, ప్రగతిని వివరించే పాటలు, కళారూపాల ప్రదర్శన ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పార్టీకి చెందిన ముఖ్య నేతల ప్రసంగాలు ప్రారంభమవుతాయి. కొందరు ముఖ్యుల ప్రసంగాల మధ్యలోనే పాటలు, సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన జరగనుంది. కేసీఆర్ సభకు చేరుకున్నాక ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ ప్రసంగాలు ఉండే అవకాశముందని పార్టీ ముఖ్యులు వెల్లడించారు. సిద్ధమైన కేసీఆర్ ప్రసంగం... ప్రగతి నివేదన సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన సందేశంపై కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఫాంహౌస్లో దీనికి తుది మెరుగులు చేశారు. కొందరు ముఖ్య నేతలు, అధికారులు, సలహాదారులతో కలసి ఈ సభ ద్వారా ప్రజలకు నివేదించాల్సిన ముఖ్య అంశాలపై కసరత్తు చేపట్టారు. 13 ఏళ్ల ఉద్యమకాలం, రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం, చేసిన త్యాగాల నుంచి ప్రారంభించి వర్తమాన పరిస్థితుల దాకా అన్ని విషయాలపై సంక్షిప్తంగా మాట్లాడనున్నారు. రుణమాఫీ నుంచి రైతుబంధు దాకా... పంట రుణాల మాఫీ నుంచి ప్రస్తుతం అమలు చేస్తున్న రైతుబంధు దాకా రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను కేసీఆర్ వివరించనున్నారు. రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్, సబ్సిడీపై యంత్రాల పంపిణీ, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకం దాకా అన్ని అంశాలనూ వివరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు విద్యను అందించడానికి రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉద్యోగాల భర్తీ, యువతకు ఉపాధి కల్పన కోసం తీసుకున్న చర్యలను చెప్పనున్నారు. గ్రామాల్లోని వృత్తుల పరిరక్షణ కోసం ఉచితంగా చేప పిల్లలు, గొర్రెల పంపిణీ పథకాలను గుర్తుచేయనున్నారు. బాలింతలు, శిశువుల కోసం అందిస్తున్న కేసీఆర్ కిట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ఆర్థిక సాయం, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్, కంటి వెలుగు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటాన్ని వివరించనున్నారు. ప్రధానంగా సాగునీటిని అందించడానికి పూర్తి చేస్తున్న కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను, ఇంటింటికీ తాగునీటిని అందించడానికి చేపట్టిన మిషన్ భగీరథను, చిన్ననీటి వనరులను పరిరక్షించడానికి అమలు చేసిన మిషన్ కాకతీయ వంటి పథకాలు, వాటి ద్వారా పొందిన ఫలితాలను చెప్పనున్నారు. ఆసరా పింఛన్లు, ఉచిత బియ్యం, విద్యార్థులకు సన్న బియ్యం, అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం, పేదలకు పట్టాలు, కిందిస్థాయి ఉద్యోగులకు బీమా, ఆత్మగౌరవ భవనాలు, జీతాల పెంపు, వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు, పారిశ్రామిక విధానం వంటి వాటిపై కేసీఆర్ సంక్షిప్తంగా వివరించనున్నారు. -
దారులన్నీ ‘కొంగర’కే..!
ఆదిలాబాద్టౌన్: జిల్లా నుంచి దారులన్నీ కొంగరకలాన్ బాటపట్టాయి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో హైదరాబాద్ శివారు ప్రాంతంలోని కొంగరకలాన్లో ఆదివారం నిర్వహించే ప్రగతి నివేదన సభకు జనాన్ని భారీగా తరలించేందుకు ఆ పార్టీ నాయకులు కసరత్తు చేశారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే సభకు భారీ సంఖ్యలో ప్రజల ను తరలిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగా నాల నేపథ్యంలో పార్టీ నాయకులు పెద్ద మొత్తం లో తరలించేందుకు సిద్ధమయ్యారు. జనసమీకరణ బాధ్యతలను ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మాజీ సర్పంచులు, పార్టీ ముఖ్యనాయకులకు అప్పగిం చారు. కాగా శనివారం కొంతమంది పార్టీ శ్రేణులు ప్రత్యేక వాహనాల్లో బయల్దేరారు. పెద్ద మొత్తంలో మాత్రం ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనాలు, ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ వాహనాల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలను భారీగా తరలించనున్నా రు. బస్సులను గ్రామాలకు పంపించి అక్కడి నుంచే జనాన్ని సభకు తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వాహనాలను అద్దెకు తీసుకున్నారు. సభకు తరలిస్తున్న జనానికి టీ, టిఫిన్తోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మోటార్సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10వేలకు పైగా.. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి 10వేలకు పైగా జనాన్ని ప్రగతి నివేదన సభకు తరలించేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి మరో 10వేల చొప్పున జనం తరలించేందుకు కసరత్తు చేశారు. ఆదిలాబాద్ రూరల్ ప్రాంతం నుంచి 30 ఆర్టీసీ బస్సులు, ఒక ప్రైవేట్ బస్సు, 18 తుఫాన్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణం నుంచి 39 ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేశారు. బేల మండలం నుంచి 36 ఆర్టీసీ బస్సులు, 55 తుఫాన్ వాహనాలు, జైనథ్ మండలం నంచి 39 ఆర్టీసీ బస్సులు, 5 ప్రైవేట్ బస్సులు, 41 తుఫాన్ వాహనాల్లో జనాన్ని తరలించనున్నారు. మావల మండలం నుంచి 16 ప్రైవేటు బస్సుల్లో జనాలను సభకు తీసుకెళ్లనున్నారు. జనాన్ని బట్టి మరిన్ని వాహనాలను సమకూర్చేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి జోగు రామన్న దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాపూరావు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇక్కడి నుంచి 9వేల మంది జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 10 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేట్ బస్సులు, 516 జీపులు సిద్ధం చేశారు. ఉదయం 7గంటలకు తన నివాసం వద్ద నుంచి భీంపూర్, తలమడుగు, తాంసి మండలాల ప్రజలను వాహనాల్లో జెండా ఊపి తరలించనున్నట్లు ఎమ్మెల్యే బాపురావు పేర్కొన్నారు. ఆ తర్వాత గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, బజార్హత్నూర్ మండలాలకు వెళ్లి వాహనాలను పంపి ప్రజలు, కార్యకర్తలను తరలించనున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలో 126 ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులను సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. 186 జీపులు, కార్ల ద్వారా జనాన్ని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉట్నూర్ 35 మ్యాక్స్లు, 18 బస్సులు, ఇంద్రవెల్లి 28 వాహనాల వరకు సిద్ధం చేశారు. దాదాపు 3వేల వరకు జనాన్ని తరలించనున్నారు. -
సర్వాంగ సుందరంగా ముస్తాబైన కొంగర కలాన్
-
కేబినెట్ సమావేశం.. నేను, మహేందర్రెడ్డి పోవడం లేదు!
సాక్షి, హైదరాబాద్: కొంగరకలాన్లో ప్రగతి నివేదన సభ.. ఆ సభకు ముందే తెలంగాణ కేబినెట్ సమావేశం. కేబినెట్ భేటీలో అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు.. ఈ నేపథ్యంలో మంత్రి కే.తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జరగబోయేది చివరి కేబినెట్ సమావేశం అని అనుకోవడం లేదని అన్నారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందనేది చెప్పడమే ప్రగతి నివేదన సభ ఉద్దేశమని చెప్పారు. సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తుండటంతో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశానికి తాను, మంత్రి మహేందర్రెడ్డి హాజరుకావడం లేదని వెల్లడించారు. సభ విషయంలో ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నాయనీ.. ప్రతిపక్షాలు ముందుకు పోవడం లేదని, వెనక్కిపోతున్నాయని ఎద్దేవా చేశారు. -
అన్ని తొవ్వలు అటే..
సాక్షి, మెదక్: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ప్రగతి నివేదన’ సభకు భారీగా జనం శనివారం నుంచే తరలివెళ్తున్నారు. ఆదివారం హైదరాబాద్ సమీపంలోని ‘కొంగర కలాన్’లో ఈ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు, జనాలు తరలివెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇరువై మండలాల నుంచి లక్షకుపైగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్లనున్నారని అంచనా. మెదక్, నర్సాపూర్ ఈ రెండు నియోజకవర్గాల నుంచి దాదాపుగా 60వేల పైచిలుకు జనాన్ని తరలించేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డిలు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. మెదక్ నియోజకవర్గం నుంచి శనివారమే దాదాపుగా వంద ట్రాక్టర్లలో కార్యకర్తలు, ప్రజలు కొంగర కలాన్కు బయలుదేరారు. మెదక్ పట్టణంలో డిప్యూటీస్పీకర్ జెండా ఊపి ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ట్రాక్టర్ నడిపి టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాం నింపారు. అలాగే నర్సాపూర్ నుంచి శనివారం సాయంత్రం 20 ట్రాక్టర్లు బయలుదేరాయి. జిల్లాలో ఉన్న గజ్వేల్, దుబ్బాక, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు సంబంధించిన మండలాల నుంచి కూడా భారీగా తరలివెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మండల కేంద్రాలు, గ్రామాల నుంచి వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి రికార్డు స్థాయిలో జనసమీకరణ జరగుతుందని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చెబుతున్నా రు. ఈ సభను విజయవంతం చేయాలని డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డిలు పార్టీ కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి మండలం నుంచి ఐదు వేల మంది.. మెదక్ పట్టణంలో జనసమీకరణపై పద్మాదేవేందర్రెడ్డి శనివారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ సూచించిన లక్ష్యానికి అనుగుణంగా సభకు జనాలను తరలించాలన్నారు. గ్రామాల వారీగా వాహనాలను సమకూర్చడం, భోజన వ్యవస్థ గురించి ఆరా తీసి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను తరలించేందుకు 400 వాహనాలను సిద్ధం చేశారు. ఆర్టీసీతోపాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన మొత్తం 150 బస్సులను అద్దెకు తీసుకున్నారు. అలాగే 180 డీసీఎం వాహనాలు, 120 ట్రాక్టర్లు, 100 టాటాఏస్ వాహనాల్లో జనాలను తరలించనున్నారు. ప్రతి మండలం నుంచి 5వేల మంది కార్యకర్తలు, ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేశారు. అలాగే 120 ట్రాక్టర్లు వెళ్తున్నాయి. ఇందులో వంద ట్రాక్టర్లు శనివారమే బయల్దేరాయి. మిగితా వాహనాలు ఆదివారం బయలుదేరనున్నాయి. మెదక్ పట్టణం టీఆర్ఎస్ జెండాలు, బ్యానర్లతో గులాబీమయంగా మారింది. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 30వేల మందిని తరలిస్తున్నారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడి నుంచి 300 బస్సులు, 100 డీసీఎంలు, 200 ఆటోలు, 100 ట్రాక్టర్లతో పాటు బైక్లు ప్రైవేటు వాహనాల్లో తరలించెందుక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పర్యటించి నాయకులను కార్యకర్తలను కలిసి సభకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చారిత్రాత్మక సభ ఈ సభ చారిత్రాత్మకమైనదని పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం ఆమె మెదక్లో మాట్లాడారు. నియోజకవర్గం నుంచి 30వేల మందిని తరలిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు హాజరయ్యేందుకు ముందసుకు వస్తున్నట్లు తెలిపారు. సభలో పాల్గొనేందుకు కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నట్లు తెలిపారు. ఈ సభ విజయవంతం కావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నారన్నారు. టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. విజయవంతం చేయండి కొంగర కలాన్లో జరిగే ప్రగతి నివేదన సభకు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రగతి నివేదన సభకు నర్సాపూర్ నుంచి 25వేల నుంచి 30 వేల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రగతి నివేదన సభ నిర్వహణ చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్పై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. -
సందడే సందడి..
ఇబ్రహీంపట్నం రూరల్ (రంగారెడ్డి): అన్ని అడుగులు కొంగరకలాన్లోని ప్రగతి నివేదన సభా ప్రాంగణం వైపే పడుతున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సభలో కుర్చోవడానికి నిర్వాహకులు దాదాపు 70 వేల కుర్చీలు, 50 వేల చదరపు అడుగుల గ్రీన్ కార్పెట్ను ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. శనివారం మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. సందడే సందడి.. శనివారం ప్రగతి నివేదన సభ స్థలం వద్ద కోలాహోలం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గడ్డపై సభ జరుగుతుండటంతో వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని గిరిజన మహిళలు 300 మంది తమ సాంప్రదాయ వేషధారణలో అక్కడికి చేరుకొని సుమారు అరగంటపాటు నృత్యాలు చేశారు. వారు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చుట్టూ చేరుకొని సందడి చేశారు. గిరిజనుల ఆటలను చూసి మంత్రి మంత్రముగ్దులయ్యారు. చాలా చక్కగా ఆటపాడారని అభినందించారు. రోడ్లపై సూచికలు ఏర్పాటు ప్రగతి నివేదన సభకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళ్పల్లి–కొంగరకలాన్, ఔటర్ రింగ్రోడ్డు నుంచి సభా స్థలం, రావిర్యాల్ నుంచి సభా స్థలం వద్దకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. సభా స్థలం, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించడానికి, సభకు రాకపోకలు వారి కదలికలను గుర్తించడానికి పోలీసులు కమోండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. దీనిని మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, రసమయి బాలకిషన్ పరిశీలించారు. నిరంతరం నిఘాపెట్టాలని పోలీసులను అదేశించారు. కళాకారుల కోసం ప్రత్యేక వేదిక సభ సాయంత్రం ప్రారంభం కానుండడంతో ఉదయం నుంచి వచ్చే జనాలను ఆకర్షించేందుకు కళాకారులు ఆడిపాడేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ యాస, భాషతో కూడిన సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందు కోసం వేదికకు ఎడమ వైపు దాదాపు వంద మంది కళాకారుల కోసం ఏర్పాట్లు చేశారు. సభకు పెద్దఎత్తున ప్రజలు హాజరు కానుండటంతో రోడ్లపై దుకాణాలు వెలిశాయి. వాటర్ బాటిళ్లు, కూల్డ్రింక్స్తో పాటు ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచారు. -
చారిత్రక ఘట్టం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజకీయాల్లో ఓ చారిత్రక ఘట్టానికి తెరలేవబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే ‘కీలక’ నిర్ణయానికి కొంగర కలాన్ వేదిక కానుంది. 25 లక్షల మంది ఆశేష జనవాహిని సాక్షిగా సీఎం చేసే ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెల కొంది. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్లో జరిగే ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. నభూతో నభవిష్యత్గా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభ రాజకీయ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలువనుందని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. వచ్చే ఎన్నికలకు నాంది పలికే ఈ సభపై భారీ ఆశలు పెట్టుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రారంభమయ్యే ఈ సభ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంతో ముగియనుంది. ఎటు చూసినా గులాబీమయం అన్ని దారులు కొంగర కలాన్ వైపే సాగుతున్నాయి. ప్రగతి నివేదన సభ ప్రాంగణమంతా గులాబీ వర్ణ శోభితం కాగా.. సభాస్థలికి వెళ్లే మార్గాలు పార్టీ జెండాల రెపరెపలాడుతున్నాయి. 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తరలివచ్చే లక్షలాది మంది కార్యకర్తలకు పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి జనం రాక ప్రారంభమైంది. మంత్రుల తాకిడి.. ముఖ్యనేతల సందడితో సభా ప్రాంతంలో కోలాహలం నెలకొంది. 20 వేల మంది పోలీసుల పహారా బహిరంగ సభకు పోలీసుశాఖ కట్టుదిట్టమైన భ ద్రతా ఏర్పాట్లను చేసింది. 20వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్న ఆ శాఖ.. స భా ప్రాంగణంపై సీసీ కెమెరాలతో డేగ కన్ను పె ట్టింది. లక్షలాదిగా వచ్చే వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పార్కింగ్ ఏరియాల్లో పోలీసులను మోహరించింది. ఒక్కో బాధ్యతను ఐపీఎస్ స్థాయి అధికారికి కట్టబెట్టడమేకాకుండా తొలిసారి పీటీజెడ్ కెమెరాల సహాయంతో డీజీపీ మహేందర్రెడ్డి నేరుగా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. రూట్లు క్లియర్! వివిధ జిల్లాల నుంచి ప్రగతి సభకు వచ్చే ప్రజల కోసం ఏడు రూట్లను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశం నుంచి ఔటర్ రింగ్రోడ్డు పైకి నేరుగా ఎక్కేందుకు.. దిగేందుకు వీలుగా రేలింగ్ను కట్ చేసి.. మట్టితో చదును చేశారు. ఇలా తుక్కుగూడ, బొంగ్లూరు జంక్షన్ల మధ్య ఇరువైపులా 20 చోట్ల ఔటర్ మీదకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై సభకు వచ్చిన వారి కోసం బస ఏర్పాట్లు చేశారు. గుఢారాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. -
పల్లె పల్లె.. సద్దిగట్టింది..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన మహాసభకు వరంగల్ జిల్లాలోని పల్లె పల్లె కదిలి వెళ్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచార నేపథ్యంలో భారీ జన సమీకరణతో బల నిరూపణకు వరంగల్ టీఆర్ఎస్ నేతలు ఈ సందర్భాన్ని ఓ అవకాశంగా భావిస్తున్నారు. సభకు సాధ్యమైనంత ఎక్కువగా మందిని తరలించి అధినేతకు తమ బలం చూపించేందుకు సన్నద్ధమయ్యారు. ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ పనులు కూడా పెద్దగా లేకపోవడంతో జనం పల్లెల నుంచి అంచనాలకు మించి సభకు తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2.5 లక్షల మంది తరలింపును లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకంటే ఎక్కువ సంఖ్యలో జనం వస్తుండడంతో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రూ.80 లక్షల నుంచి రూ.1.50 కోట్లు సభకు వెళ్తున్న ప్రతి కార్యకర్తకు సగటున రూ.1,000 ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఇందులో రూ.500 ప్రయాణ చార్జీలు కాగా, మిగతా రూ.500 తిండి, ఇతర ఖర్చులుగా లెక్కేశారు. ప్రగతి నివేదన సభ జరిగే రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్కు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు 6 వేల నుంచి 8 వేల మంది చొప్పున తరలించేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సభకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాల నుంచి 10 వేల నుంచి 15 వేల మంది చొప్పున జనాలను తరలిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.80 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా. ఔత్సాహిక నేతలు కూడా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ నుంచి కొంత మేరకు ఆర్థిక సహకారం అందినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తున్న ఔత్సాహిక నేతలు కూడా ఎమ్మెల్యేలకు దీటుగా జన సమీకరణ చేస్తున్నారు. వాళ్లు కూడా 4 వేల నుంచి ఐదు వేల వరకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ అధినాయకత్వం నుంచి అందిన ఆర్టీసీ బస్సులకు తోడుగా ప్రైవేటు, సొంత వాహనాలను జనాలకు తరిలించేందుకు వినియోగించుకుంటున్నారు. 1,300 బస్సులు అద్దెకు.. స్టేషన్ ఘన్పూర్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ తూర్పు, పరకాల, ములుగు, నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఔత్సాహిక నేతలు పోటీ పడి జన సమీకరణ చేశారు. నేతల మధ్య పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో బస్సుల పంపిణీల్లో గొడవలు రాకుండా ఉండేందుకు వీలుగా మంత్రి కడియం శ్రీహరి ఒక్కరే బస్సులన్నీ అద్దెకు తీసుకున్నారు. మొత్తం 1,300 బస్సులను ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలకు పంపించారు. ఇవి కాకుండా నేతలు స్కూల్ బస్సులు, ప్రైవేటు, డీసీఎంలు ఇతర వాహనాల్లో జనాలను తరలిస్తున్నారు. జన సమీకరణ కోసం పోటీ... స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, రాజారపు ప్రతాప్ జన సమీకరణ కోసం పోటీపడ్డారు. ఈ నియోజకవర్గంలో 150 గ్రామాలకు గాను అత్యధికంగా 150 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయగా.. మిగిలిన వాహనాలు, భోజన ఏర్పాట్లు ఎవరి కార్యకర్తలకు ఆయా నేతలు సమకూర్చారు. రాజయ్య నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జనాలను సమీకరించగా.. రాజారపు ప్రతాప్ జఫర్గఢ్, ఘణపురం, చిల్పూరు మండలాలపై దృష్టిపెట్టి ప్రజలను సమీకరించారు. చిల్పూరు మండలం తీగల తండాలో ప్రతాప్ మాట్లాడుతూ టికెట్ మనకే వస్తుంది... అందరు సభకు రావాలని ప్రజలను కోరారు. తూర్పున వాళ్లిద్దరూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు, మేయర్ నరేందర్ ఎవరికి వారుగా జన సమీకరణ చేశారు. కొండా సురేఖ 253 బస్సులు, 203 కా>ర్లు తదితర వాహనాల్లో 20 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి అయ్యే భోజన ఖర్చుల కోసం ప్రతి బస్సుకు రూ.3 వేల చొప్పున ఇచ్చినట్లు సమాచారం. చేతి ఖర్చుల కింద ప్రతి వ్యక్తికి రూ.200 చొప్పున సమకూర్చినట్లు తెలుస్తోంది. మరో వైపు నరేందర్ వర్గం కూడా 10 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెబుతోంది. 175 బస్సులు, 20 కార్లు సమకూర్చగా నియోజకవర్గ పరిధిలోని డివిజన్కు వెయ్యి మందిని జన సమీకణ చేస్తున్నట్లు చెప్పారు. వీరందరికి భువనగిరి సమీపంలో భోజన వసతి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఎవరి లక్ష్యం వాళ్లది.... జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ మధుసుదనాచారి, గండ్ర సత్యనారాయణ రావు వర్గాలు వేర్వేరుగా జన సమీకరణ చేశాయి. పార్టీ పరంగా 100 ఆర్టీసీ బస్సులను సమకూర్చారు. ఇక్కడ నుంచి కనీసం 16 వేల మందిని తరలించేందుకు స్పీకర్ వర్గం ప్రయత్నాలు చేస్తున్నాయి. స్పీకర్కు పట్టున్న భూపాలపల్లి, శాయంపేట, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల నుంచి కనీసం 8 వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మరో వైపు గండ్ర సత్యనారాయణ కూడా భారీగా జనాన్ని పోగేస్తున్నారు. కనీసం 5 వేల నుంచి 6 వేల మందిని తరలించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ప్రధానంగా ఆయన ఘణపురం, చిట్యాల. రేగొండ మండలాల మీద దృష్టి పెట్టి ప్రజలను సమీకరించారు. సత్తా చాటిన శంకర్ నాయక్.... మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన సత్తా చూపించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. నియోజకవర్గం నుంచి 220 బస్సులను ఏర్పాటు చేశారు. మరో 100 ప్రైవేటు వాహనాలను సమకూర్చారు. 15 వేల మందితో ప్రాంగణంలో నిలబడాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఇక్కడి నుంచే టికెట్ ఆశిస్తున్న కవిత కూడా తన వంతుగా భారీగానే ప్రయత్నాలు చేశారు. అయితే ఆమె వైపు 70 మాత్రమే ప్రైవేటు వాహనాలు పెట్టినట్లు తెలుస్తోంది. కార్యకర్తలను పార్టీ పెట్టిన బస్సుల్లోనే ఎక్కిరావాలని కోరినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యే20 వేలకు తగ్గకుండా... ములుగు నియోజకవర్గంలో మంత్రి చందూలాల్ తనయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ దాదాపు 17 వేల మందిని జనాలను మహాసభకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్రావు 30 వేల మందిని, వరంగల్ పశ్చిమ నుంచి వినయ్ భాస్కర్ 25 వేల మందిని, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ 25 వేలు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 25 వేల మంది చొప్పున జన సమీకరణ చేస్తున్నారు. పలువురు శనివారం ఉదయం నుంచే వాహనాల్లో సభకు బయలుదేరి వెళ్లారు. రాత్రి పొద్దు పోయే సమయం వరకు హైదరాబాద్కు చేరుకుంటారు. దగ్గరలోని ఓ ఫంక్షన్హాల్లో మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి వేర్వేరుగా ఎవరికి వారు ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలా... 700 పెద్ద వాహనాలు, 1,000కి పైగా చిన్న వాహనాలు ద్వారా 30 వేల మందితో సభకు వెళ్తున్నాం. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తలపిస్తున్న స్పందన నేడు కనిపిస్తున్నది. వాహనాల కొరత వల్ల సభకు వచ్చే వారిని తీసుకెళ్లలేకపోతున్నాం. సభకు తరలివస్తున్న వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశాం. – ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి ఎమ్మెల్యే 28 వేల మంది.. జనగామ నియోజక వర్గం నుంచి 28 వేల మందిని తరలిస్తున్నాం. 750 బస్సులు, డీసీ ఎంలు, 70 ట్రాక్టర్లు, 300 చిన్నవాహనాలతో పాటు 90 వివిధ హోదాల్లో ఉన్న సొంత కార్లలో వెళ్తున్నాం. జిల్లా, మండలాలు, గ్రామాల వారిగా ప్రత్యేక కమిటీలను వేసి, లెక్కకు ఒక్క రు కూడా తగ్గకుండా వచ్చేందుకు పకడ్బందీ ప్రణాళిక వేశాం. ఉదయం 10 లోపు వాహనాలు బయలుదేరాలని సూచించాం. – ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే 25 వేల మందిని తరలిస్తున్నాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభకు స్టేషన్ ఘన్పూర్ నుంచి 25వేల మందిని తరలిస్తున్నాం. నియోజకవర్గంలోని 150 గ్రామాల నుంచి 25వేల మందిని తరలించేందుకు 136 ఆర్టీసీ బస్సులు, 63 స్కూల్ బస్సులు, 113 డీసీఎంలు, 85 డీజిల్ ఆటోలు, 35 ఆటోలు, 500 వరకు ద్విచక్రవాహనాల్లో తరలించేందుకు సిద్ధం చేశాం. ఇప్పటికే దాదాపు 100 ట్రాక్టర్లలో దాదాపు 2వేల మంది వరకు తరలివెళ్లారు. – తాటికొండ రాజయ్య, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే -
దండిగ కదిలె.. గులాబీబండ్లు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన బహిరంగసభకు భారీగా తరలివెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ వద్ద జరగనున్న ఈ సభకు పార్టీ శ్రేణులు, జనాలను తరలిస్తున్నారు. నియోజకవర్గం నుంచి 20 వేల చొప్పున జన సమీకరణ లక్ష్యంగా నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు ఒకటిన్నర లక్షల మందిని తరలించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆదివారం జరగనున్న ఈ సభకు శనివారమే ట్రాక్టర్లు బయలుదేరి వెళ్లాయి. వందలాదిగా ట్రాక్టర్లు జిల్లా నుంచి కొంగరకలాన్ వైపు దారితీశాయి. అందంగా అలంకరించుకుని 44వ జాతీయ రహదారిపై ఒకదాని వెంట, మరొకటి.. వరుసకట్టాయి. రైతులు, పార్టీ శ్రేణులు ఈ ట్రాక్టర్లలో తరలివెళ్లారు. కామారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ వంటి నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వందలాది ట్రాక్టర్లను భిక్కనూర్ వద్ద మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్లో ట్రాక్ట ర్ నడిపి తన నియోజకవర్గం బాల్కొండ నుంచి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. ఆర్మూర్లో జీవన్రెడ్డి, బోధన్ లో షకీల్ అమేర్లు ట్రాక్టర్ నడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బయలుదేరిన ట్రాక్టర్లను డిచ్పల్లి వద్ద ఎమ్మెల్యే బాజి రెడ్డిగోవర్ధన్, ఎల్లారెడ్డిలో స్థానిక ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, బిచ్కుంద నుంచి ట్రాక్టర్లను ఎమ్మెల్యే హన్మంత్షిండేలు ప్రారంభించారు. ట్రాక్టర్లలో వెళ్లే వారికి అవసరమైన భోజన, వసతి ఏర్పాట్లు చేసుకున్నారు. నేడు బస్సులు, ఇతర వాహనాల్లో వారం రోజులుగా ఈ జనసమీకరణ పైనే దృష్టి సారించారు. శనివారం ట్రాక్టర్లను తరలించిన ఎమ్మెల్యేలు బస్సులు, ఇతర వాహనాల్లో ఆదివారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బస్సులను సమీకరించారు. జిల్లాలో వాహనాలు అందుబాటులో లేకపోవడం తో జుక్కల్, బాన్సువాడ, బోధన్ నేతలు మహారాష్ట్ర, కర్నాటకల్లోని వాహనాలను అద్దెకు తీసుకున్నారు. 508 ఆర్టీసీ బస్సులు.. జిల్లాలోని దాదాపు అన్ని ఆర్టీసీ బస్సులను ఈ సభకు వినియోగిస్తున్నారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆరు (ఆర్మూర్, బోధన్, నిజామాబాద్–1, –2, బాన్సువాడ, కామారెడ్డి) డిపోల పరిధిలో మొత్తం 670 బస్సులుండగా, మొత్తం 508 ఆర్టీసీ బస్సులలో సభకు జనాలను తరలించేందుకు వినియోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. తొలిసారిగా అద్దె బస్సులను కూడా ఈ అవసరాలకు వినియోగిస్తున్నారు. సభకు బస్సులను పంపాలని జిల్లా ఆర్టీసీ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేకంగా సర్క్యూలర్ జారీ అయింది. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు 83 బస్సుల చొప్పున బుక్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 93 బస్సులు, కామారెడ్డికి 89 బస్సులు కేటాయించారు. ఇవన్నీ ఆదివారం ఉదయమే బయలుదేరి వెళ్తాయి. జుక్కల్, బాల్కొండ నియోజకవర్గాలకు డిపోలు లేకపోవడంతో బోధన్, బాన్సువాడ డిపోల నుంచి బస్సులను సర్దుబాటు చేస్తున్నారు. ఈ 508 ఆర్టీసీ బస్సులకు చార్జీలు సుమారు రూ.96 లక్షలను టీఆర్ఎస్ పార్టీ నాయకులు నగదు రూపంలో ఆర్టీసీకి చెల్లించారు. ఎప్పటికప్పుడు నిఘావర్గాల నివేదికలు.. కొంగరకలాన్ సభ జనసమీకరణపై రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. గత రెండు రోజులుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపుతోంది. ముఖ్యంగా ఈ సభకు ఎమ్మెల్యేలు ఏ మేరకు జన సమీకరణ చేస్తున్నారనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. శనివారం ఎమ్మెల్యేలు ఏయే మండలాల నుంచి ట్రాక్టర్లను తరలించారు. జనాలను ఏ మేరకు తరలించాలనే అంశంపై ఆరా తీశారు. పోలీసుశాఖ రూట్మ్యాప్లు.. సభకు తరలనున్న వాహనాలకు సంబంధించి పోలీసు శాఖ రూట్మ్యాప్ను విడుదల చేసింది. వాహనాలన్నీ ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఆయా రూట్లలో వచ్చే వాహ నాలు ఏ వైపు నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లాలనే రూట్లను సూచిస్తూ మ్యాప్లను ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి వెళ్లే వాహనాలతో పాటు, ము«థోల్, బాసర వైపు నుంచి వచ్చే వాహనాలు, కోరుట్ల, మెట్పల్లిల వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక రూట్లను ప్రకటించారు. -
దళం కదులుతోంది!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని దారులన్నీ గులాబీమయం అవుతున్నాయి. హైదరాబాద్ శివారు కొంగరకలాన్లో ఆదివారం జరగనున్న టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు తరలివెళ్లడానికి ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. హైదరాబాద్కు సమీపంగా ఉమ్మడి నల్లగొండలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కువగా ఉండడంతో జన సమీకరణపై ఎక్కువగా దృష్టి పెట్టారు. జిల్లాకు 3లక్షల మందిని తరలించాలని లక్ష్యం పెట్టడంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు సమీకరణ కోసం వారం రోజులుగా పల్లెపల్లె తిరుగుతున్నారు. ఒకరోజు ముందుగానే జిల్లానుంచి కార్యకర్తలు, రైతులు ట్రాక్టర్లలో కొంగరకలాన్కు పయనమయ్యారు. హైదరాబాద్కు దూరంగా ఉన్న కోదాడ, హుజూర్నగర్ వంటి నియోజకవర్గాలకు, నాగార్జునసాగర్కు మిగతా నియోజకవర్గాల కన్నా తక్కువ లక్ష్యం పెట్టారు. ఈ మూడు చోట్లా పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో ప్రగతి నివేదన సభ కోసం ప్రచారం చేశారు. ముందస్తు ఎన్నికల వార్తలు వెలువడుతున్న తరుణంలో జరుగుతున్న బహిరంగ సభ కావడంతో అధినాయకత్వం వద్ద తమ బలాన్ని నిరూపించుకునేందుకు నాయకులు శ్రమిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న ప్రతి నాయకుడు తమ అనుచరులను, పట్టున్న గ్రామాలనుంచి జనాన్ని తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఆశావహులున్న చోట సన్నాహక సమావేశాలు కూడా వేర్వేరుగా నిర్వహించారు. ప్రధానంగా ఈ సభను ఒక విధంగా ఎన్నికల శంఖారావం పూరించనున్నదిగా భావిస్తుండడంతో జిల్లా నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణపై దృష్టి పెట్టింది. మూడు రోజుల కిందటే నకిరేకల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అనుబంధ విద్యార్ధి విభాగం టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రగతి నివేదన సభకు పాదయాత్రగా బయలుదేరారు.శనివారం మిర్యాలగూడ, నకిరేకల్ , తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి ట్రాక్టర్ల ర్యాలీలు బయలు దేరాయి. ఆదివారం ఉదయం ఆయా నియోజకవర్గ కేంద్రాల నుంచి కార్యకర్తలు బయలుదేరే వాహనాల్లోనే ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు ప్రయాణించనున్నారు. ప్రైవేటు వాహనాల ఏర్పాటు చేసుకుంటున్న నియోజకవర్గాలకు అదనంగా ఆర్టీసీ బస్సులనూ కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో తుంగతుర్తి మినహా మిగిలిన పదకొండు నియోజకవర్గాలకు మొత్తంగా 817 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. నాగార్జున సాగర్ నియోజవర్గానికి ఏపీలో మాచర్ల నుంచి 30 బస్సులను అద్దెకు తీసుకున్నారు. జిల్లాలో ఉన్న బస్సులు సరిపోని కారణంగా హైదరాబాద్ నుంచి మరో 120 బస్సులను జిల్లాకు కేటాయిం చారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల్లోని బస్సులను ప్రగతి నివేదన కోసం కేటాయించడంతో రోజువారీ నడిచే అన్ని బస్సు సర్వీసులను రద్దు చేశామని, ప్రజలు తమ ప్రయాణాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ డీజీఎం మధుసూదన్ ‘సాక్షి’కి చెప్పారు. ప్రగతి నివేదన సభకోసం మొత్తం బస్సులు : 817 ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం బస్సులు : 667 హైదరాబాద్ నుంచి కేటాయించినవి : 20 ఏపీలోని మాచర్ల నుంచి అద్దెకు తీసుకున్న బస్సులు : 30 -
నేదు తెలంగాణ మంత్రి వర్గం వేటీ
-
కృతజ్ఞతలు తెలిపేందుకే ‘ప్రగతి నివేదన’
ఖమ్మం మయూరిసెంటర్: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతోపాటు అడగకుండానే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకునే సమయం వచ్చిందని, అందరూ ప్రగతి నివేదన సభను వేదికగా చేసుకొని సీఎంకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని రాష్ట్ర మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు అన్నారు. ప్రగతి నివేదన సభను జయప్రదం చేయాలని కోరుతూ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ ఆధ్వర్యంలో నగరంలో బైక్, ఆటోల భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థాని క ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఇల్లెంద్ క్రాస్ రోడ్డు, జెడ్పీసెంటర్, వైరారోడ్డు, బస్టాండ్, మయూరిసెంటర్, జూబ్లీక్లబ్, కాల్వొడ్డు మీదుగా పీఎస్ఆర్ రోడ్డు, గాంధీచౌక్, గాంధీగంజ్, కిన్నెరసాని థియేటర్, జహీర్పుర, చర్చ్కాంపౌండ్, చెరువుబజార్, జమ్మిబండ, గట్టయ్యసెంటర్ మీదుగా టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం వరకు చేరుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే అజయ్కుమార్లు కలిసి బైక్పై ప్రదర్శనలో పాల్గొని నాయకులను, కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర స్వరూపమే మారిందని, అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెడుతోందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభు త్వం చేసిన సేవలు, అమలు చేసిన సంక్షేమ పథ కాలను దృష్టిలో ఉంచుకొని సభకు తరలివెళ్లేం దు కు ఆసక్తి చూపిస్తున్నారని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రదర్శనలో 2వేల మోటార్ సైకిళ్లు, 1400 ఆటోలు పాల్గొన్నాయన్నారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కమర్తపు మురళి, నాగరాజు పాల్గొన్నారు. -
యుద్ధ భేరి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ పార్టీ యుద్ధ భేరి మోగించింది. ముందస్తు ఆలోచనలో భాగంగా అధికార పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ అత్యం త ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రగతి నివేదన సభ ఆదివారం జరగకుండగా విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ సభకు భారీ జనసమీకరణ ద్వారా బలప్రదర్శన చేసి విపక్షాలపై పైచేయి సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందుకు అనుగుణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి దా దాపు 3లక్షల మందిని తరలించేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ప్రతీ గ్రామం, ప్రతీ ఆవాసం నుంచి కూడా జనాలు తరలేలా చూస్తు న్నారు. జన రవాణాకు సంబంధించి ఆర్టీసీ బస్సు లు, ప్రైవేట్ వాహనాలు, స్కూల్బస్సులు, ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ట్రాక్టర్ల ద్వారా వెళ్లే కార్యకర్తలు బయలుదేరారు. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఆదివారం ఉదయం వెళ్లనున్నారు. భారీ జనసమీకరణే లక్ష్యం రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు జనసమీకరణను టీఆర్ఎస్ అధిష్టానం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ ద్వారా ముందస్తు ఎన్నికల సమరశంఖం పూరించే అవకాశం ఉన్న నేపథ్యంలో నేతలంద రూ సీరియస్గా తీసుకున్నారు. ప్రతీ నియోజకవర్గం నుంచి దాదాపు 20 నుంచి 25వేల మంది తరలించాలని ముఖ్యనేతలు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా వారం రోజులుగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు ఎక్కడిక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రణాళికలు రూపొందించారు. అంతేకాదు... ప్రగతి నివేదన సభను ఒక ఎన్నికల సభ మాదిరిగా భావించి వచ్చే ఎన్నికల్లో టికెట్పై ఆశలు పెట్టుకున్న వారు హడావిడి చేస్తున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని నేతలు ఏ మేరకు జనసమీకరణ చేస్తున్నారు... ఎవరెవరు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నార నే అంశాలపై అధిష్టానం నిఘా ఉండడంతో నే తలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎక్కడ వెనకబడినా టికెట్టు దక్కే అవకాశాలు సన్నగిల్లుతాయనే గుబులుతో నేతలందరూ ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ స్థానాలు మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, దేవరకద్ర, నాగర్కర్నూల్, అచ్చంపేట, కొ ల్లాపూర్, మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలు తమ స్థానాన్ని భద్రం చేసుకునేందుకు అంచనాల కు మించి పనిచేస్తున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేని కల్వకుర్తి, వనపర్తి, అలంపూర్, గద్వాల, కొడంగల్ నుంచి ఆశావహులు జనసమీకరణలో పూర్తిగా నిమగ్నమయ్యారు. సభకు 667 బస్సులు ఉమ్మడి పాలమూరు నుంచి దాదాపు 3లక్షల మం ది జనాన్ని తరలించేందుకు పక్కాగా రవాణా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు 20 నుంచి 25వేల మంది తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లు వాహనాలను ఏర్పాటు చేశారు. కార్లు, ఇన్నోవా వంటి ప్రైవేట్ వాహనాలకు అడ్వాన్స్ చెల్లించేశా రు. స్థానికంగా వాహనాలు సరిపోకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తీసుకున్నారు. పక్కనున్న కర్ణాటక, ఏపీల నుంచి జిల్లాలోని నియోజకవర్గాలకు భారీగా రప్పించారు. వీటితో పాటు స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఒక్క ఆర్టీసీ నుంచే 667 బస్సులను వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది బస్డిపోల పరిధిలో 890 బస్సులు ఉండగా... 677 బస్సులను అద్దెకు తీసుకున్నారు. అంటే ఆర్టీసీ పరిధిలోని 76శాతం బస్సులను సభకు తరలుతున్నాయి. తద్వారా జిల్లా ఆర్టీసీకి ప్రగతి నివేదన సభ ద్వారా రూ.1.11 కోట్ల ఆదాయం సమకూరినట్లయింది. అజెండాగా పాలమూరు అంశం టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రగతి నివేదన సభలో పాలమూరు ప్రాంతానికి సం బంధించిన అంశమే ప్రధాన అజెండాగా ఉంటుం దని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పాలమూరు ప్రాంత ప్రాజెక్టుల విషయమై ప్రముఖం గా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. పెండింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెం పాడు, కోయిల్సాగర్, బీమా ప్రాజెక్టులతో పాటు పాలమూరు–రంగారెడ్డి, తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోత ల పథకాలు ప్రస్తావనకు వచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. 2014లో ఉమ్మడి జిల్లా లో సాగునీటి ఆయకట్టు కేవలం 1.5లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా.. తాజాగా 7.5లక్షల ఎకరాలకు పెరిగినట్లు గణాంకాలు పేర్కొంటున్నా యి. అంతేకాదు పాలమూరు ప్రాంతంలో వల సలు తగ్గి... ప్రజల వార్షికాదాయం భారీగా పెరిగి నట్లు ప్రణాళిక విభాగం పేర్కొంటోంఛీట. ఈ నేప థ్యంలో నాలుగున్నరేళ్ల కాలంలో పాలమూరు పురోగతిలో చోటు చేసుకున్న అంశాలను ప్రధా నంగా ప్రస్తావించే అవకాశమున్నట్లు సమాచారం. ప్రయాణాలు ఎలా? ప్రగతి నివేదన సభకు భారీ జనసమీకరణ కోసం అందుబాటులో ఉన్న వాహనాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ మేరకు ఆదివారం తప్పనిసరైతే తప్ప ప్రయాణం పెట్టుకోవద్దని ప్రభుత్వ ముఖ్యులు సూచించారు. ఆర్టీసీ బస్సులతో పాటు ట్యాక్సీలు ఇతర వాహనాలన్నీ సభ కోసం తరలివెళ్లాయి. అయితే ఆదివారం భారీగా పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నందున కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రగతి నివేదన సభకు ట్రాక్టర్లు ర్యాలీని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి బాలానగర్ (జడ్చర్ల): రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్లో జరగనున్న ప్రగతి నివేదన సభకు బాలానగర్ నుంచి భారీగా పార్టీ శ్రేణులు భారీగా బయలుదేరారు. ఈ మేరకు కొంగరకలాన్ వెళ్తున్న ట్రాక్టర్ను నడిపిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ర్యాలీని ప్రారంభించారు. జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు కర్ణం శ్రీనివాస్, నర్సింలు, గోపాల్ రెడ్డి, మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. -
దారులన్నీ ‘ప్రగతి’ వైపే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/హైదరాబాద్: ప్రగతే నినాదంగా.. ఎన్నికల గెలుపే లక్ష్యంగా.. నగారా మోగించేందుకు గులాబీ దండు కదులుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఆదివారం జరిగే భారీ బహిరంగ సభ సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ రాజకీయ పార్టీ నిర్వహించని విధంగా 25 లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్న గులాబీ శ్రేణులు రాష్ట్ర నలుమూలల నుంచి కొంగరకలాన్ బాట పట్టాయి. జోడేఘాట్ మొదలు జోగులాంబ... యాదాద్రి నరసింహుడి మొదలు సిరిసిల్ల రాజన్న... ఇలా దారులన్నీప్రగతి నివేదన వైపు సాగుతున్నాయి. ఇప్పటికే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, పాదయాత్రల ద్వారా సభాస్థలికి జనం చేరుకుంటున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బస్సులన్నీ ఇటే.. రాజకీయ యవనికపై కొత్త రికార్డు సృష్టించాలని నిర్ణయించిన టీఆర్ఎస్ పార్టీ... జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నింటినీ ప్రగతి నివేదన సభ కోసమే అద్దెకు తీసుకుంది. సుమారు 7,600 బస్సులను జన సమీకరణకు వినియోగించుకుంటోంది. దీంతో ఆదివారం ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. కేవలం ఆర్టీసీయే కాకుండా 50వేల ప్రైవేటు వాహనా లను ఉపయోగించుకుంటోంది. శుక్రవారం సాయం త్రం నుంచే వివిధ జిల్లాల నుంచి వాహనాలు బయల్దేరిన సంగతి తెలిసిందే. అన్నీ కలిపి సుమారు లక్ష వాహనాలు ప్రగతి సభకు తరలివస్తుండటంతో అందుకు తగ్గట్టుగా 18 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా, శనివారం రాత్రి వరకు 2వేల వాహనాలు సభకు చేరుకున్నట్లు రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్ తెలిపారు. గులాబీ రెపరెపలు ఎటు చూసినా గులాబీ రెపరెపలు.. ఏ కూడలి చూసినా నేతల ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇటు నాగార్జునసాగర్ హైవే మొదలు అటు బెంగళూరు జాతీయ రహదారి వరకు పార్టీ పతాకాలతో నిండిపోయాయి. పోటాపోటీగా స్వాగత తోరణాలు, కటౌట్లు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా గులాబీతో ముస్తాబైంది. ఆఖరికి ఔటర్ రింగ్రోడ్డు కూడా గులాబీ వర్ణశోభితమైంది. పోటెత్తనున్న ప్రైవేటు వాహనాలు.. ఆర్టీసీ బస్సులు మెజారిటీ సభకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలు రోడ్లపైకి పోటెత్తనున్నాయి. ముఖ్యంగా ఆ రోజు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉండటంతో ఆటోలు, కార్లు, సొంత వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముంది. టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరే అవకాశం ఉండటంతో అదనపు సిబ్బందిని నియమించారు. సభ నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు.. కొంగరకలాన్లో సభ నేపథ్యంలో ఓఆర్ఆర్పై ప్రయాణాలను ప్రజలు ఆదివారం ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 వరకు తాత్కాలికంగా రద్దు చేసుకోవడం శ్రేయస్కరమని పోలీసు శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఓఆర్ఆర్ మీదుగా కూకట్పల్లి, గచ్చిబౌలి, పటాన్చెరు, ఎల్బీ నగర్, సాగర్ రోడ్లను మినహాయించి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరింది. ‘ట్రాక్టర్లు, స్కూటర్లు, ఇతర ద్విచక్ర వాహనాల రాకపోకలు ఓఆర్ఆర్పై నిషేధం. ఈ సభకు వచ్చే ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు 3న తిరిగి వెళ్లాలి. లారీలు, డీసీఎంలు, బస్సుల ద్వారా సభా ప్రాంగణానికి వచ్చేవారు ఆదివారం మధ్యాహ్నం 12లోపు చేరుకోవాలి. కేటాయించిన స్థలంలో వాహనాలను నిలిపి సభా ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్లాల’ని సూచించింది. ఏదైనా సాయంతో పాటు సందేహాల నివృత్తి కోసం ఆదిభట్ల ట్రాఫిక్ కంట్రోల్ రూం నంబర్లు 9493549410 సంప్రదించవచ్చని వివరించింది. తడిసి ముద్దయిన సభాస్థలి... మహేశ్వరం: ప్రగతి నివేదన సభాప్రాంగణంలో శనివారం రాత్రి వర్షం కురిసింది. చిరు జల్లులతో ప్రారంభమై ఓ మోస్తారు వర్షం కురిసింది. వర్షం కురవడంతో సభా ప్రాంగణం తడిసి ముద్దయింది. ప్రాంగణంలో పరిచిన కార్పెట్లు, సౌండ్ సిస్టమ్స్ వర్షం నీటితో తడిసిపోయాయి. సభలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ భారీ కటౌట్ గాలివానకు నేలకొరిగింది. వర్షానికి సభా మైదానం బురదమయంగా మారి వాహనాల రాకపోకలు, నడవడానికి ఇబ్బందిగా మారింది. ఆదివారం ఎండ ఉంటేనే ప్రాంగణం ఆరుతుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు. -
ట్రాక్టర్లపై ప్రజారవాణా నేరం: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యయుగాల చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మె ల్యే రేవంత్రెడ్డి ఆరో పించారు. ట్రాక్టర్లపై ప్రజారవాణా నేరమని, ట్రాక్టర్ల ద్వారా ప్రజలను తరలించాలని చెప్పడం ద్వారా కేసీఆర్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభ పేరుతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. హరితహారం పేరుతో చెట్లు నాటినట్లు పోజులిచ్చిన సినిమా నటులు ఇప్పుడు కొంగరకలాన్లో వేల చెట్లు నరికివేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులైన బలవంతంగా కళాకారులతో టీఆర్ఎస్ సభలో పాటలు పాడించుకుంటున్నారని వీటిని కోర్టు సుమోటోగా తీసుకుని కేసులు దాఖలు చేయాలన్నారు. ‘ప్రగతి నివేదన సభను అడ్డుకుంటాం’ హైదరాబాద్: గిరిజనులను మోసం చేసిన సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రగతి నివేదన సభను 5వేల మంది గిరిజనులతో అడ్డుకుంటామని సేవాలాల్ బంజార సంఘం హెచ్చరించింది. సభకు వ్యతిరేకంగా శనివారం ఎల్బీ నగర్లోని బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రాం విగ్రహాల వద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోతిలాల్నాయక్, ప్రధాన కార్యదర్శి గాంధీనాయక్, ఇతర నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడగానే గిరిజన రిజర్వేషన్ జీవోపై సంతకం పెడతామని హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లు దాటినా జీవో ఊసే లేదన్నారు. టీఆర్ఎస్ది ప్రగతి నివేదన సభ కాదు లంబాడీలను గోస పెట్టే సభని మండిపడ్డారు. సభకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. -
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాళీ: భట్టి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతులు, రైతు కూలీలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పేందుకు ప్రగతి నివేదన సభకు తరలివస్తున్న ఖాళీ ట్రాక్టర్లే నిదర్శనమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకున్న ఏహ్య భావానికి ఈ ఖాళీ ట్రాక్టర్లే సంకేతమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కచ్చితంగా ఖాళీ అవుతుందని ఈ ఖాళీ ట్రాక్టర్లే చెబుతున్నా యని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
‘నివేదన’ వద్ద నిఘానేత్రం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రగతి నివేదన సభపై పోలీస్శాఖ నిఘానేత్రం పెట్టింది. అత్యాధునిక కెమెరాలను వినియోగిస్తోంది. బందోబస్తుపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పోలీస్శాఖ సాంకేతిక పరిజ్ఞానంతో అపరిచితుల కదలికలపై ఓ కన్నేయనుంది. అసాంఘిక శక్తులను గుర్తించడానికి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన పీటీజెడ్ (పాన్ టిల్ట్ జూమ్) కెమెరాలను ఉపయోగిస్తోంది. సభాస్థలిలో మొత్తం 112 సీసీ కెమెరాలు అమరిస్తే వాటిల్లో 16 పీటీజెడ్ ఉన్నాయి. ఇవి 360 డిగ్రీల కోణంతో ప్రతిక్షణం సభ పరిసర ప్రాంతాన్ని హెచ్డీ క్వాలిటీతో రికార్డు చేస్తాయి. అనుమానాస్పద వ్యక్తులను దగ్గర నుంచి గుర్తించడానికి జూమ్ చేసుకోవడమే గాకుండా నాణ్యమైన చిత్రాలను వీక్షించే అవకాశముంది. వీటిని సభ ప్రధాన వేదిక వెనుక భాగంలోని కమాండ్ కంట్రోల్ రూ మ్ నుంచి నియంత్రిస్తారు. సభా ప్రాంగణంలోని బందోబస్తును ఈ కెమెరాలతో డీజీపీ కూడా పర్యవేక్షించే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్లో యాప్ ద్వారా ఈ కెమెరాలను నిరంతరం పరిశీలించవచ్చు. ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా అనుమానితులను సులువుగా గుర్తించవచ్చు. లగేజ్ చెక్ చేసేటప్పుడూ కూడా మాన్యువల్గా కాకుండా విమానాశ్రయాల్లో వినియోగించే భద్రతా పరికరాలను ఇంటలిజెన్స్ విభాగం వినియోగిస్తోంది. -
భద్రతకు తొలి ప్రాధాన్యం
సాక్షి,రంగారెడ్డి జిల్లా : ప్రగతి నివేదన సభకు ప్రజలు క్షేమంగా హాజరై, తిరిగి గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ శాఖ అదనపు డీజీ జితేందర్ పేర్కొన్నారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాలు తెలిసేలా అన్ని దారుల్లో ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో శనివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. 2వ తేదీన ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పైకి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లను అనుమతించబోమన్నారు. సభా ప్రాంగణాన్ని మొత్తం 24 సెక్టార్లుగా విభజించి బందోబస్తు చేపడుతున్నట్లు పేర్కొ న్నారు. సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్ ప్రాంతా ల్లో సీసీ కెమెరాలు అమర్చినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చకుండా సభలూ.. సంబరాలా?
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న ప్రగతి నివేదన సభపై ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం ఉస్మానియా వర్సిటీలో విలేకరులతో విద్యార్థి జేఏసీ చైర్మన్ దయాకర్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో సగం కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. దళిత సీఎం, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని మారుస్తారని కేసీఆర్కు అధికారం కట్టబెడితే ఐదేళ్లు పూర్తికాక ముందే ఎన్నికలకు వెళ్దా మనుకోవడం దారుణమన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారన్నారు. కార్యక్రమం లో వామపక్ష, దళిత, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మాట తప్పినట్లు ఒప్పుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి నివేదన సభ వేదిక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంలో, ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన ఒక్కమాట కూడా ఆయన నిలబెట్టుకోలేదని, తాను చెప్పిన మాట తప్పినట్లు ప్రజల ముందు ఒప్పుకోవాలని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ సభను ప్రజా ఆవేదన సభగానో.. కేసీఆర్ క్షమాపణల సభగానో నిర్వహిస్తే బాగుండేదన్నారు. శనివారం గాంధీభవన్ నుంచి పార్టీ పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు, మండల, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్లతో ఉత్తమ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా తెలంగాణ సమాజాన్ని లూటీ చేయడం లోనే కేసీఆర్ కుటుంబం నిమగ్నమైందని, అడ్డంగా సంపాదించిన సొమ్మును అడ్డగోలుగా ఖర్చుపెడుతూ విలాస జీవనానికి అలవాటు పడింద ని ఆరోపించారు. ప్రగతి సభ పేరుతో ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, ప్రజా రవాణా కోసం, స్కూళ్లు, కళాశాలల కోసం వినియోగించాల్సిన బస్సుల్లో పార్టీ కార్యకర్తలను తరలిస్తున్నారన్నారు. ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు.. దళితులకు ముఖ్యమంత్రి పదవి, దళితులు, గిరిజనులకు మూడెకరాల భూ పంపిణీ, గిరిజనులు, ముస్లిం లకు 12% రిజర్వేషన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్.. ఇలా ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఉత్తమ్ ఆరోపించారు. ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించకుండా నాటకాలాడుతున్నారన్నారు. వారిని ఓట్లు అడిగే హక్కు కేసీఆర్కు లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనావైఫల్యాలతోపాటు రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు ఉత్తమ్ సూచించారు. ఓటర్ల జాబితా సవరణలు ప్రారంభమైనందున ప్రతి నాయకుడు, కార్యకర్త ఓటర్ల జాబితా చూసుకుని అవసరమైతే సవరణలు చేసుకోవాలని కోరారు. రూ.2 లక్షల ఏకకాల రైతు రుణమాఫీ, రైతు బీమా పథకం, ప్రీమియం చెల్లింపు, పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, మహిళా సంఘాలకు రుణాలు వంటి కాంగ్రెస్ హామీలను ప్రజలకు వివరించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తామని, ఇందుకు సంబంధించిన ప్రీమియం భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తమ్ చెప్పారు. శనివారం గాంధీభవన్లో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్