andhra pradesh legislative council
-
ప్రజలకు షాక్లు.. సర్కారు సోకులు 'వాతలపై వాకౌట్'
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు విద్యుత్తు షాకులపై శాసన మండలి దద్ధరిల్లింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని... అవసరమైతే చార్జీలను ఇంకా తగ్గిస్తామన్న హామీని కూటమి నేతలు గాలికొదిలేయడంతోపాటు ఐదు నెలల్లోనే ప్రజలపై ఏకంగా రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండలి సాక్షిగా నిగ్గదీసింది. గత సర్కారుపై బురద చల్లే యత్నాలను ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా డిస్కమ్లకు (విద్యుత్తు పంపిణీ సంస్థలు) సకాలంలో రాయితీలను అందించి ఆదుకుందని, ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లకు పైగా అందచేసిందని గుర్తు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు నిరాకరిస్తూ వినియోగదారులపై నిర్దాక్షిణ్యంగా రూ.17 వేల కోట్లకుపైగా చార్జీల భారాన్ని మోపుతోందని మండిపడింది. విద్యుత్తు చార్జీల వాతలు, సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు లేకపోవడం, రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సోమవారం మండలి నుంచి వాకౌట్ చేసింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని ఎందుకు మోపుతున్నారని నిలదీశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన తరువాత ఆ కార్యక్రమాల వ్యయాన్ని ఆయా ప్రభుత్వాలే భరించాలని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో మీరే వాగ్దానం చేశారు కదా? హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? సబ్సిడీ కింద ప్రభుత్వం నిధులు కేటాయించి వినియోగదారులకు ఊరట కల్పించవచ్చు కదా? ఇప్పటికే రూ.ఆరు వేల కోట్లకుపై భారాన్ని ప్రజలపై మోపారు. ఇంకో రూ.11 వేల కోట్లకుపైగా భారాన్ని కూడా వేసి ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు జరపకపోవడం మోసపూరితమని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ బకాయిలు, అప్పులు రూ.ఏడు వేల కోట్ల దాకా ఉంటాయి. 2014–19 మధ్య టీడీపీ సర్కారు వాటిని రూ.29 వేల కోట్ల వరకు తీసుకెళ్లింది. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.395 కోట్లకు మించి ఐదేళ్లలో డిస్కంలపై భారం పడలేదు. అదే నాడు టీడీపీ హయాంలో రూ.22 వేల కోట్ల మేర భారం వేశారు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో డిస్కంలకు రూ.15 వేల కోట్లు మాత్రమే సబ్సిడీ కింద ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లకుపైగా విద్యుత్ రంగానికి అందచేసి ఆదుకుంది’ అని గణాంకాలతో కూటమి సర్కారు షాకులను ఎండగట్టారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి నిరసనగా పార్టీ సభ్యులందరితో కలసి వాకౌట్ చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ. ఇంత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై కూడా స్పష్టత లేదంటే ఇది మోసపూరిత బడ్జెట్ కాక ఇంకేమంటారు? మాజీ ఆర్ధికమంత్రి రూ.14 లక్షల కోట్ల అప్పలు అంటారు! ముఖ్యమంత్రి రూ.పది లక్షల కోట్లు అంటారు! ఆర్థిక మంత్రి రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్లో అంటారు! మరి ఇందులో ఏది నిజం? ఎవరు తప్పుడు లెక్కలు చెబుతున్నారో సభకు స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిర్దేశించిన పరిమితికి లోబడి అందులో 86 శాతం మాత్రమే అప్పులు తీసుకుంది. సూపర్ సిక్స్ ఎక్కడ? సూపర్సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడ? స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లికి వందనం ఎక్కడ? నీకు 15 వేలు.. నీకు 15 వేలు అనేది ఇప్పుడు తెగ ప్రచారమవుతోంది. పాఠశాల విద్యార్థులు 80 లక్షల మందికిపైగా ఉంటే బడ్జెట్లో కేటాయించిన రూ.5,000 కోట్లు ఎలా సరిపోతాయి? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్లు దాటిన వారికి ఫించను హామీని ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆలస్యం ఎందుకు? 20 లక్షల ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా? దిగజారిన శాంతి భద్రతలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఉప ముఖ్యమంత్రే చెప్పారని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, హత్యాచారాలపై మండలిలో చర్చ సందర్భంగా అధికార – ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత జవాబిచ్చిన తీరును బొత్స ఖండించారు. సభ్యుల ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా మంత్రి రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ఐదు నెలల కాలంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కల్పలత ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటవుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన నేరాల్లో 24–48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని హోంమంత్రి అనిత చెప్పారు. కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. కాగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం అనలేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఔను.. ఒక్క సిలిండరే ఉచిత గ్యాస్ సిలెండర్ హామీపై బొత్స గట్టిగా నిలదీయండంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇస్తామని, ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో స్పష్టం చేశారు. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం పెంపు ప్రతిపాదన లేదు.. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనాల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మహ్మమద్ రుహల్లాలు ఈ అంశాలను ప్రస్తావించారు. మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి రవి రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ఉపప్రశ్నకు మంత్రి గొట్టిపాటి ఈ మేరకు బదులిచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తున్నాం: లక్ష్మణ్రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిలును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.6 వేల కోట్ల భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపింది. ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల బాదుడుకు సిద్ధమైంది. మొత్తం సుమారు రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తోంది. వినియోగదారులకు ఇది మోయరాని భారం. ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా? దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. మూజువాణితో ఆమోదం... మండలిలో విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానిచ్చారు. గత ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్లు బొత్స సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని విమర్శించారు. ఇది సవరణ మాత్రమేనని, గత ప్రభుత్వమే ప్రజలపై భారం వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో లోపాలను సరిదిద్దడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. అనంతరం బిల్లుపై సభలో తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. -
Andhra Pradesh: ‘మండలి’లో మంటలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై శాసన మండలి అట్టుడికింది. కూటమి సర్కారు నిరంకుశ వైఖరి, అరాచక విధానాలపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను అరికట్టాలి.. నిరంకుశ రాజ్యం నశించాలి.. ఉయ్ వాంట్ జస్టిస్.. సేవ్ డెమొక్రసీ అంటూ నినదించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కూటమి పార్టీలకు చెందిన కొందరు పెట్టిన అభ్యంతరకర పోస్టుల ప్లకార్డులను ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు ప్రదర్శించారు. యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ అరెస్టులపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు మొండితోక అరుణ్కుమార్, తుమాటి మాధవరావు, పి.రామసుబ్బారెడ్డి వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా మరో ఫార్మాట్లో తేవాలంటూ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తిరస్కరించారు. దీనిపై చర్చకు అనుమతించాలంటూ పట్టుబట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, తలశిల రఘురాం, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, మహ్మద్ రుహుల్లా తదితరులు పోడియం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, మండలి చీఫ్విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు దీనిపై జోక్యం చేసుకుంటూ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత చర్చకు పట్టుబట్టడం సరికాదన్నారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అనేక మంది యువకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, దీనిపై సభలో ఖచ్చితంగా చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టారు. చర్చ కోసం వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన తెలపడంతో సభ 34 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో చైర్మన్ మోషేన్రాజు సభను కొద్దిసేపు వాయిదా వేసి మళ్లీ కొనసాగించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కాలయాపనపై చర్చించేందుకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా మండలి చైర్మన్ మోషేన్రాజు తిరస్కరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చకు డిమాండ్ చేస్తున్న సభ్యులు మా రాజీనామాలు ఆమోదించండి.. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ సభ్యులు కలసి వారిని ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. ఆ ముగ్గురూ పోడియం పైకి వెళ్లి చైర్మన్ను కలసి తమ రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞాపన పత్రాలు అందించారు. మీ రాజీనామాల అంశం పరిశీలనలో ఉందని, వాటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ స్పష్టం చేశారు. బడ్జెట్పై చర్చను అడ్డుకున్న మంత్రులు శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బడ్జెట్పై మాట్లాడుతున్న సమయంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు పదేపదే అడ్డుపడి రభస సృష్టించారు. వైఎస్సార్సీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి బడ్జెట్పై చర్చను ప్రారంభించగానే మంత్రులు, కూటమి సభ్యులు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చర్చ పక్కదారి పడుతోందని, బడ్జెట్పైనే మాట్లాడాలంటూ చైర్మన్ సహనంతో పలుమార్లు కోరినా మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయస్వామి, అనిత, సవిత పదేపదే అడ్డు తగులుతూ చర్చ కొనసాగనివ్వకుండా చేశారు. విధిలేని పరిస్థితుల్లో చైర్మన్ పది నిమిషాలు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు అదే ధోరణి కొనసాగించారు. చర్చ పూర్తిగా తప్పుదోవ పట్టి గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.సర్వనాశనం చేసింది బాబే: బొత్సరాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనని, మళ్లీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నాశనం చేశారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో అందుకు అనుగుణంగా కేటాయింపులు జరపలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్సీపీ సభ్యులు కోరటాన్ని తప్పుబడితే ఎలా? అని ప్రశ్నించారు. హామీలు ఎలా అమలు చేస్తారు? ఎప్పుడు నెరవేరుస్తారు? అని అడిగితే అందులో తప్పు ఏముందన్నారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక చర్చను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.ఏం జరిగిందంటే..?బడ్జెట్పై చర్చ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి పారీ్టలు హామీ ఇచ్చినట్లుగా.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు.. రైతులకు రూ.20,000, మహిళలకు నెలకు రూ.1,500 లాంటి పథకాల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే బడ్జెట్లో ఈ పథకాలకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని చెబుతుండగా.. మంత్రి సవిత, అనిత, పయ్యావుల కేశవ్ ఆమెను పదేపదే అడ్డుకున్నారు. సభ్యులు ప్రసంగించకుండా మంత్రులు ఈ విధంగా పదేపదే అడ్డుపడటం సరికాదని ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. సభ్యుల ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే వాటిని నోట్ చేసుకొని సమాధానం ఇచ్చే సమయంలో వివరణ ఇస్తే సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా సభలో ఏ విధంగా నడుచుకోవాలి? ఎలా మాట్లాడాలి? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరగడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం వరుదు కళ్యాణి తిరిగి చర్చను ప్రారంభిస్తూ దీపం–2 పథకం కింద మూడు ఉచిత సిలెండర్లకు రూ.3,000 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో కేవలం రూ.800 కోట్లే కేటాయించారని ప్రస్తావిస్తుండగా.. మంత్రి అనిత నిలబడి ఆమెను అడ్డుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమైందని కళ్యాణి మాట్లాడుతున్న సమయంలో మంత్రి డోలా వీరాంజనేయస్వామి లేచి నిలబడి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మీ నాయకుడు పారిపోయి ఇంట్లో పడుకున్నారు..! త్వరలో మీరూ పారిపోతారంటూ వైఎస్సార్సీపీ సభ్యులను రెచ్చగొట్టడంతో సభలో అలజడి చెలరేగింది. ఇంతలో హఠాత్తుగా నారా లోకేశ్ లేచి నిలబడి అసందర్భ చర్చను తెరపైకి తెచ్చారు. గౌరవ సభలో మా తల్లిని అవమానించారని, అందుకే ఆగ్రహంతో మాట్లాడుతున్నాం అంటూ ఊగిపోయారు. అయితే రికార్డుల్లో లేని విషయాలు, సభలో లేని వ్యక్తులను ప్రస్తావించి చర్చ చేయడం సరికాదంటూ బొత్స వారించారు. ఇరుపారీ్టల సభ్యులు వాగ్యుద్ధానికి దిగడంతో చైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. -
వీ వాంట్ జస్టిస్.. సేవ్ డెమోక్రసీ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసన
అమరావతి, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే.. శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టగా.. చైర్మన్ అందుకు నిరాకరించారు. దీంతో.. ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. సోషల్ మీడియా అరెస్టులతో పాటు డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. తమ వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని చైర్మన్ను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కోరారు. అయినా అందుకు చైర్మన్ అంగీకరించలేదు. దీంతో.. పోడియం వద్దకు వచ్చి చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ‘‘వీ వాంట్ జస్టిస్..’’, ‘‘సేవ్ డెమోక్రసీ’.. అంటూ నినాదాలు చేస్తుండగా.. మరోవైపు కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు యత్నించారు. కానీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాత్రం సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. చేసేది లేక ఆ నినాదాల నడుమే ఏపీ మంత్రులు మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా.. మండలిని కాసేపు వాయిదా వేశారు చైర్మన్. ఇదీ చదవండి: చావు లెక్కలు నవ్వుతూ.. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీ కొత్త డ్రామా?
విజయనగరం, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు కొత్త డ్రామాకు తెర లేపారా?. సరిగ్గా శాసన మండలిలో అనర్హత పిటిషన్పై విచారణ నాడే ఆయన ఆస్పత్రిలో చేరడం ఆ అనుమానాలను బలపరుస్తోంది. ఎమ్మెల్సీ రఘురాజు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారు. దీంతో వైఎస్సార్సీపీ శాసనమండలిలో ఫిర్యాదు చేసింది. మే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు పంపారు. అయితే ఆరోజు కారణం ఏంటో చెప్పకుండానే రఘురాజు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో విచారణను మే 31(ఇవాళ్టికి) వాయిదా వేశారు చైర్మన్. అయితే విచారణకు రాకుండా విశాఖ నారాయణ ఆస్పత్రిలో చేరారు రఘురాజు. కిడ్నీ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో చైర్మన్ మోషేన్ రాజు విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. తదుపరి విచారణ ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు శాసనమండలిలో.. అటు శాసనసభలోనూ చైర్మన్, స్పీకర్లు ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక మండలిలోనూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపైనా అనర్హత వేటు పడింది. -
మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ / సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 9 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, 3 పట్టభద్రులు, 2 టీచర్ల నియోజకవర్గాలకు మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న కౌంటింగ్ చేపడతారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 23 కాగా, ఉపసంహరణకు ఈ నెల 27 చివరి తేదీగా నిర్ణయించారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. తెలంగాణలో 1 టీచర్ (హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్నగర్) ఎమ్మెల్సీ, 1 స్థానిక సంస్థల (హైదరాబాద్) స్థానాల్లో కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో ఎన్నికలు జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు: అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలు, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే స్థానాలు : ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు కడప – అనంతపురం – కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు : 1. ప్రకాశం– నెల్లూరు –చిత్తూరు 2. కడప– అనంతపురం– కర్నూలు 3. శ్రీకాకుళం– విజయనగరం– విశాఖపట్నం షెడ్యూల్: నోటిఫికేషన్ : ఫిబ్రవరి 16 నామినేషన్లకు చివరి తేది : ఫిబ్రవరి 23 నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 24 నామినేషన్ ఉపసంహరణ : ఫిబ్రవరి 27 ఎన్నిక : మార్చి 13 ఫలితాలు: మార్చి 16 -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వికేంద్రీకరణపై స్పల్ప కాలిక చర్చ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్ ►అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిధ్వజమెత్తారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు అని సీఎం జగన్ ప్రశ్నించారు. ► ‘టీడీపీ సొంత అభివృద్ధి కోసమే ఈ ఉద్యమాలు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటే కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పది. అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం కాదు.. కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమే. ►నవరత్నాల ద్వారా రూ.లక్షా 65వేల కోట్లు డీబీటీ ద్వారా లబ్దిదారులకు అందించాం. అవినీతికి తావులేకుండా నేరుగా అకౌంట్లలో వేశాం. చంద్రబాబు హయాంలో రైతుభరోసా ఎందుకు లేదు?. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వలేదు?. 21 లక్షల ఇళ్లు ఎందుకు నిర్మించలేదు?. ►బాబు హయాంలోనూ, ఇప్పుడు ఒకే బడ్జెట్ ఉంది.. మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయి?. చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలు ఎందుకివ్వలేదు?. ఆనాడు దోచుకో పంచుకో తినుకో అన్నట్లు సాగింది. ►బినామీ భూములు ప్రాంతమే రాజధానిగా ఉండాలనేదే పెత్తందారీల మనస్తత్వం. పచ్చళ్లు అమ్మినా మా వారి పచ్చళ్లే అమ్మాలనేది పెత్తందారీ మనస్తత్వం. చిట్ఫండ్ వ్యాపారమైనా మా వాళ్లే వ్యాపారం చేయాలనేది పెత్తందారీల మనస్తత్వం’ అని సీఎం జగన్ విమర్శించారు. ►మా వాడైతే ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించి చిట్ఫండ్ వ్యాపారం చేయొచ్చనేది వారి మనస్తత్వం. మా నారాయణ, మా చైతన్య ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. ప్రతిపక్ష పార్టీలో కూడా నా మనుషులే ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. వీళ్లంతా ఈ మధ్య ఒకటే రాజధాని అమరావతి అని డిజైన్ చేశారు’ అని సీఎం జగన్ ►ఏపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ స్వప్రయోజనాల కోసమే రాజధానిగా అమరావతి ఉందన్నారు. విజన్ అని చెప్పుకునే చంద్రబాబు ప్లానింగ్ ఏంటో అర్థం కాలేదన్నారు. పాదయాత్ర పేరుతో హడావుడీ చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వమే కాకుండా నిర్మాత కూడా చంద్రబాబేనని విమర్శించారు. ►వికేంద్రీకరణపై అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. ‘అభివృద్ధి వికేంద్రీకరణ అవమసరమని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. రాజధాని కోసం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే.. చంద్రబాబు నారాయణ కమిటీని నియమించారు. నారాయణ కమిటీ తుళ్లూరులో రాజధాని ఎంపిక చేసింది. దానికి అమరావతి అని పేరు పెట్టారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ చుట్టూ భూములు కొనిపించినట్టే.. తమ వాళ్లతో అమరావతిలోనూ చంద్రబాబు భూములు కొనిపించారు. రూ. లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి కష్టమనే.. సీఎం జగన్ వికేంద్రీకరణకు మొగ్గు చూపారు.’ అని కన్నాబాబు తెలిపారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఆదేశించినా ఆందోళన కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ను టీడీపీ సభ్యులు ఏకవచనంతో సంబోధించగా.. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ►పయ్యావుల కేశవ్ కుమారుడు భూమలు కొన్నది వాస్తవం కాదా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎప్పుడెప్పుడు భూములు కొన్నారో తమ దగ్గర వివరాలు ఉన్నాయన్నారు. రాజధానిపై ఇష్టానుసారం మాట మార్చింది టీడీపీనే అని విమర్శించారు. ► కొందరి చేతుల్లోనే అమరావతి భూములు ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలోనివి తాత్కాలిక నిర్మాణాలు అని తెలిపారు. 30 వేల ఎకరాల భూమిలో కొంతమంది చేతుల్లోనే 10 వేల ఎకరాలు ఉన్నాయని అన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అని, అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ►16 వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన వ్యక్తి సీఎం జగన్. గ్రామ సచివాలయాలతో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా.. 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన.మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ. సీఎం జగన్పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వాళ్లకు రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశం లేదు. 40 ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దు: కొడాలి నాని ► సచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసిన ఘనత సీఎం జగన్దే. గ్రామ సచివాలయాలతో ప్రజలకు పాలన చేరువైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మరింత దగ్గరైంది. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకే సచివాలయ వ్యవస్థ. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేశాము. అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన: భూమన కరుణాకర్ రెడ్డి ► వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ ►చంద్రబాబు డైరెక్షన్లో వీరాంజనేయులు పనిచేస్తున్నారు. అసెంబ్లీలో సభా హక్కులను ఉల్లంఘిస్తున్నారు. దళితులను కించపరచడం టీడీపీకి అలవాటే: సుధాకర్బాబు ►అసెంబ్లీలో నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు. బాల వీరాంజనేయులు బాధ్యతారహితంగా మాట్లాడారు: మేరుగ నాగార్జున ►మా సభ్యులను కావాలనే రెచ్చగొడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.మేరుగ నాగార్జునను రెచ్చగొట్టాలని ప్రయత్నించి నీతులు చెబుతున్నారు. అలాంటి వ్యవహారాన్ని అంగీకరించొద్దు- అంబటి ►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం ►సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టీకరణ ► ఉద్యోగాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. ఇంటికో ఉద్యోగమని చంద్రబాబు మోసం చేశారు. 1.30 లక్షల మందికి సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. 2.80 లక్షల మందికి వాలంటీర్లుగా అవకాశం ఇచ్చాం. లోకం పూర్తిగా తెలియన వ్యక్తి లోకేష్.. దొడ్డిదారిన మంత్రి అయ్యారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ విఫలం: వేణుగోపాలకృష్ణ ►తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ► ముగిసిన బీఏసీ సమావేశం.. ఐదురోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ► స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్రెడ్డితో పాటు సభ్యులు బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేస్, ప్రసాద్రాజు, శ్రీకాంత్రెడ్డిలు పాల్గొన్నారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. దివంగత నేతలకు ఏపీ అసెంబ్లీ సంతాపం ► ఈ మధ్యకాలంలో కన్నుమూసిన నేతలకు.. ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, జేఆర్ పుష్పరాజ్, నల్లమిల్లి మూలారెడ్డి మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు. సభను అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ఏదో విధంగా గొడవ చేయాలని టీడీపీ సభ్యుల యత్నం. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ సభ్యుల ఆందోళన: అంబటి రాంబాబు ►నిరుద్యోగ భృతితో మోసం చేసింది చంద్రబాబు. ఎస్సీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. స్టడీ సర్కిళ్లను వైఎస్సార్ అభివృద్ధి చేశారు: మేరుగ నాగార్జున ►దళిత వ్యతిరేకి చంద్రబాబు. గత ప్రభుత్వం ఎస్సీలకు చేసేందేమీ లేదు. పేదలకు చంద్రబాబు ఏనాడు మేలు చేయలేదు: జోగారావు ► టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు. టీడీపీ సభ్యులకు చర్చించే దమ్ము లేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారు. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే : జోగి రమేష్ ► టీడీపీకి నైతిక హక్కు లేదు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు ఎలా ఉన్నారో.. వాళ్ల నాయకులు కూడా అలానే ఉన్నారు: సుధాకర్బాబు ► 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. సభా సమయం వృథా చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాల్ చేశారు. అసెంబ్లీ పెడితే చంద్రబాబు మళ్లీ డుమ్మాకొట్టారు. సభ్యులేమో ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తున్నారు: గడికోట శ్రీకాంత్రెడ్డి టీడీపీ సభ్యుల తీరు సరికాదు: బుగ్గన ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే.. ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి గోల చేశారు టీడీపీ సభ్యులు. సభను అడ్డుకునేందుకు ఆ పార్టీ సభ్యులు తీవ్రంగా యత్నించారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్ తమ్మినేని హామీ ఇచ్చినా.. వాళ్లు ఊరుకోలేదు. ఈ క్రమంలో.. మంత్రి బుగ్గన స్పందించారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదన్నారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. ► ప్రశ్నోత్తరాలతో మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ► ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. ► గురువారం నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను కోరారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో యావత్ ప్రజల దృష్టి ఈ సమావేశాలపై ఉంటుందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలని చెప్పారు. ఇందుకోసం బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ హాల్లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వారు వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ► సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందిస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అటువంటి సత్సంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గత సమావేశాల్లో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో కొన్నింటికి ఇంకా సమాధానాలు అందజేయాల్సి ఉందని, వాటిని ఈ సమావేశాల్లో అందజేయాలని చెప్పారు. ► సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు అందజేసేందుకు ప్రతి శాఖ ఒక లైజనింగ్ అధికారిని నియమించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆరి్థక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మాజీ ప్రజా ప్రతినిధులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఔషధాలను అందజేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ► ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్లు.. డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఆధునికీకరించిన ఏ పాఠశాల మూతపడదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు ద్వారా ఆధునికీకరించిన ఏ పాఠశాల మూతపడదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలలు మూసివేస్తామంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరో 27 వేల అదనపు తరగతి గదులు నిర్మిస్తామని చెప్పారు. ఎంఈవో పోస్టుల భర్తీ, పాఠశాలల విలీనం, ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు అనే అంశాలపై శాసనమండలిలో శుక్రవారం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సురేష్ బదులిచ్చారు. విద్యాశాఖ అంశాలపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ప్రతి మండలానికి ఎంఈవో–2ను నియమించాల్సిన అవసరాన్ని సూచించిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖాళీగా ఉన్న 264 ఎంఈవోలతోపాటు మరో 666 ఎంఈవో–2 పోస్టులను సృష్టించి వాటి భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. దీనివల్ల ఏడాదికి రూ.28 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. వీటితోపాటు 36 డివిజనల్ విద్యాశాఖ అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. ఎంఈవో, డివిజినల్ విద్యాశాఖ అధికారుల ఖాళీల భర్తీకి సీనియారిటీ ప్యానల్ రూపొందిస్తామన్నారు. స్వీపర్లను ఆయాలుగా చేసి వేతనాలు పెంచాం.. పాఠశాలల్లో పనిచేసేవారిని గత ప్రభుత్వం స్వీపర్లు అని కించపరిచేలా వ్యవహరిస్తే.. వారికి ఆయాలుగా పేరు మార్చి తమ ప్రభుత్వం గౌరవిస్తోందని మంత్రి సురేష్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 45,488 మంది ఆయాలకు గత ప్రభుత్వం రూ.2 వేలు వేతనంగా ఇస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి వేతనాన్ని రూ.6 వేలకు పెంచిందని మంత్రి గుర్తుచేశారు. -
మంగళసూత్రాలతో రాజకీయాలా!
సాక్షి, అమరావతి: హిందూ మహిళలు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా.. సిగ్గులేదా అంటూ శుక్రవారం శాసన మండలిలో పలువురు మహిళా ఎమ్మెల్సీలు టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. ఉదయం సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంలోకి వచ్చి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో అందులో కొందరు మంగళసూత్రాలను చూపుతూ కేకలు వేశారు. దీంతో ఎమ్మెల్సీ టి.కల్పలతతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన పోతుల సునీత, వరుదు కళ్యాణిలు పోడియంలోకి వచ్చి ‘తాళిబొట్లను సభలోకి తీసుకొచ్చి మహిళలను కించపరుస్తారా’ అంటూ టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. చైర్మన్ వెంటనే ఆ మంగళసూత్రాలను స్వాధీనం చేసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ మోషేన్రాజు స్పందిస్తూ.. తాళి బొట్టు అనేది హిందూ మహిళలు పవిత్రంగా భావిస్తారని, వాటిని సభలోకి తీసుకొచ్చి మహిళలందరినీ అవహేళన చేస్తున్నారని.. వెంటనే సభ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. అయినా టీడీపీ సభ్యులు అలాగే వ్యవహరిస్తుండడంతో మహిళా ఎమ్మెల్సీలతో వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ సభ్యుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సమయంలో చైర్మన్ సభను ఐదు నిమిషాలపాటు వాయిదా వేశారు. శాసనసభలోనూ.. టీడీపీ సభ్యులు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలోనూ తాళిబొట్లు ప్రదర్శించి నిరసన తెలిపారు. సారా మరణాలపై న్యాయవిచారణ నిర్వహించాలని నినాదాలు చేశారు. కొద్దిసేపు స్పీకర్ పోడియంపై చేతులతో చరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాళి బొట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఆ తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు. 8 మంది సస్పెన్షన్ వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమయ్యాక కూడా టీడీపీ సభ్యులు పోడియంలోకి మళ్లీ వచ్చి మంగళసూత్రాలను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో 8 మందిని సభ నుంచి సస్పెండ్ చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి ప్రతిపాదించగా.. ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్బాబు, దీపక్రెడ్డి, కేఈ ప్రభాకర్, రాజసింహులు, దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు, మంతెన వెంకట సత్యనారాయణరాజులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తరలించారు. మిగిలిన ఎమ్మెల్సీలతో కలిసి లోకేశ్ కూడా బయటకు వెళ్లిపోయారు. -
కౌన్సిల్లోనూ టీడీపీ అదే తంతు
సాక్షి, అమరావతి: శాసన మండలిలో గురువారం కూడా టీడీపీ ఎమ్మెల్సీలు చిడతలతో భజనలు చేస్తూ, ఈలలు వేస్తూ గలాటా సృష్టించారు. చైర్మన్ మోషేన్రాజు ఎంత వారిస్తున్నా.. భజనలు చేసే వారు సభ నుంచి వెంటనే బయటకు వెళ్లాలని ఆదేశిస్తున్నా వారు అదే తీరున వ్యవహరించారు. దీంతో ఎనిమిది మందిని సస్పెండ్ చేసేందుకు మంత్రి కన్నబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మన్ వారిని ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో.. దీపక్రెడ్డి, అశోక్బాబు, బచ్చుల అర్జునుడు, అంగర రామ్మోహన్, కేఈ ప్రభాకర్, రాజనర్శింహులు, దువ్వారపు రామారావు, మర్రెడ్డి రవీంద్రనాథ్రెడ్డి ఉన్నారు. వీరంతా బయటకు వెళ్లిపోవాలని చైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా వారు సభలోనే రాద్ధాంతాన్ని కొనసాగించారు. దీంతో.. చిడతలు, ఈలలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని మోషేన్రాజు మార్షల్స్ను ఆదేశించారు. చైర్మన్తో వాదులాట.. తమ సస్పెన్షన్ వ్యవహారంలో చైర్మన్ వైఖరిని తప్పుపడుతూ లోకేశ్ సహా మరికొందరు టీడీపీ సభ్యులు ఆయనతో వాదులాటకు దిగారు. ఇదే సమయంలో దీపక్రెడ్డి తమ చుట్టూ ఉన్న మార్షల్స్ను తోసుకుంటూ చైర్మన్ పోడియం మెట్లు ఎక్కేందుకు యత్నించగా మోషేన్రాజు మండిపడ్డారు. లోకేశ్ ప్రవర్తన బాగోలేదంటూ వ్యాఖ్యానించారు. అనంతరం.. మార్షల్స్ సస్పెండ్ అయిన వారిని బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లారు. అయినా కూడా అంగర రామ్మోహన్, బచ్చుల అర్జునుడు మరో గేట్ నుంచి తిరిగి సభలోకి వచ్చి ఆందోళన కొనసాగించేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. మరోవైపు.. అప్పటిదాకా తన సీటులోనే కూర్చుని ఉన్న టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు సభలో ఈ గందరగోళం జరుగుతున్న సమయంలో నెమ్మదిగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత లోకేశ్ మిగిలిన టీడీపీ ఎమ్మెల్సీలూ వెళ్లిపోయారు. సస్పెండ్ అయిన వారిని బయటకు తీసుకెళ్లకుండా మార్షల్స్ తాత్సారం చేయడంపై మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యల కోసం కాదు, సస్పెన్షన్ కోసమే.. సస్పెండ్ ప్రక్రియ అనంతరం చైర్మన్ మోషేన్రాజు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు సస్పెండ్ కావడానికే సభకు వచ్చారుగానీ, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదన్నారు. విచిత్రంగా తమను సస్పెండ్ చేయమని వారు అడుగుతున్నారని, కానీ.. సస్పెండ్ చేయకూడదని బుధవారం వరకూ ఓపిక పట్టామన్నారు. అనంతరం మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. మండలి స్థాయిని టీడీపీ దిగజార్చిందంటూ తప్పుపట్టారు. పెద్దల సభలో ఇంత చిల్లరగా గలాటా చేయడం దురదృష్టకరమని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ సభకు లోకేశ్ లాంటి వారు వచ్చాక ఇది దొడ్డిదారి సభలా ముద్రపడిపోయిందని చెప్పారు. మండలి అంటే చాలా గౌరవంగాను, హుందాగాను ఉండాలని.. కానీ అటువంటి సభా మర్యాదను టీడీపీ సభ్యులు మంటగలిపి సభ ఔన్నత్యాన్ని దిగజార్చారన్నారు. వారి ప్రవర్తనతో సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చివరికి.. గోవింద నామాలను కించపరిచారన్నారు. బయటకు వెళ్లి ఏం చెప్పినా ప్రజలు నమ్మడంలేదు కాబట్టి ఈ సభను ప్రచారం కోసం వినియోగించుకోవాలని చూశారని మంత్రి అవంతి అన్నారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ స్థానంలో ఉండడం ఇష్టంలేనట్లుగా వారి ప్రవర్తన ఉందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని సీ రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవ్రావు, అరుణ్కుమార్, రవీంద్రబాబు, భరత్, గోపాలరెడ్డి తదితరులు కూడా మాట్లాడారు. ఇదిలా ఉంటే.. సస్పెన్షన్కు ముందు టీడీపీ ఎమ్మెల్సీలు ‘మా భజన బాగుందా.. మీది బాగుందా’ అంటూ నినాదాలు చేస్తుండగా, మిగిలిన సభ్యుల వైపు నుంచి వీరిపై రూ.500 నోటు విసిరారు. -
మండలిలో ప్లేటు ఫిరాయించి టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: శాసనమండలిలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలంటూ తెలుగుదేశం సభ్యులు వెల్లోకి వచ్చి ఆందోళన చేశారు. అయితే మరణాలపై చర్చకు రెడీగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సిద్ధమయ్యారు. దీంతో ఖంగుతున్న టీడీపీ నేతలు వెంటనే ప్లేటు ఫిరాయించారు. ముఖ్యమంత్రి సభకు వచ్చి జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వాలని యనమల రామకృష్ణుడు మాటమార్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యమంత్రే వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలన్న అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ పరిగణలోకి రాదని అన్నారు. అయితే యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రూల్ 306లో ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని రూల్ పొజిషన్లో చదివి వినిపించారు. యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు శాసనమండలి చైర్మన్ను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం సభ నడపాలని సూచించారు. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదు: మండలి ఛైర్మన్ టీడీపీ సభ్యులు.. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చెప్పింది ముందు వినాలని.. ఆ తర్వాత అభ్యంతరాలుంటే తెలపాలని మండలి ఛైర్మన్ మోషేన్రాజు పదే పదే చెప్పిన టీడీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు. -
సమావేశాలు ముగిసేలోగానే సమాధానాలివ్వండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో గతంలో సభ్యులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలను సమావేశాలు పూర్తయ్యేలోపు అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆదేశించారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ హాల్లో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్షించారు. ఆ ప్రశ్నలే ఎక్కువ పెండింగ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు మాట్లాడుతూ.. గత సమావేశాల్లో మండలి సభ్యులు అడిగిన ప్రశ్నల్లో పాఠశాల విద్య, ఆర్థిక శాఖకు సంబంధించినవే ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు పలు వినూత్న సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని, వాటిని సుస్పష్టంగా వివరిస్తూ సరైన సమాధానాలను సభ్యులకు అందజేయాలని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శికి సూచించారు. మాజీ ఎమ్మెల్సీల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీలకు వారు నివశించే ప్రాంతాల్లోనే మందులు అందజేసే అంశాన్ని పరిశీలించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ కె.రాజేంద్రనాథ్రెడ్డికి పలు సూచనలు చేశారు. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమివ్వాలి శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. ప్రజల దృష్టంతా ఈ నెల 7 నుంచి జరిగే శాసన సభ సమావేశాలపై ఉంటుందని, వాటికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలని అన్నారు. ఈ నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం అందజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గత సమావేశాల్లో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలను అందజేయాల్సి ఉందని, వాటన్నింటినీ ఈ సమావేశాలు ముగిసేలోపు తప్పక ఇవ్వాలని అన్నిశాఖల కార్యదర్శులను కోరారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న దృష్ట్యా అన్నివైపులా పటిష్టమైన బందోబస్తు, అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమై నిఘా ఏర్పాట్లు చేయాలని డీజీపీ కె.రాజేంద్రనాథ్రెడ్డికి సూచించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యలు, డిప్యూటీ సెక్రటరీ ఎం.విజయరాజు, శాసన మండలి ఓఎస్డీ కె.సత్యనారాయణరావు, పలు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కడప గడపలో తొలిసారి.. బీసీ ఎమ్మెల్సీ
సాక్షి, అమరావతి: కడప జిల్లా నుంచి చట్టసభల్లో బీసీలకు అవకాశం దక్కటమంటే ఒక చరిత్రే!! ఎందుకంటే ఇక్కడ చివరిసారిగా 1962లో కాంగ్రెస్ తరఫున కుండ రామయ్య జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. ఆ తరవాత ఏ పార్టీ తరఫున కూడా ఎవ్వరూ ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర లేదు. పోనీ ఎమ్మెల్సీగా అయినా బీసీలకు అవకాశమిచ్చారా అంటే... ఏ పార్టీ కూడా అందుకు ముందుకు రాలేదు. బలహీనవర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్... చేతల్లో కూడా అది చూపించారు. తాజాగా గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తూ కడప జిల్లా చరిత్రను తిరగరాశారు. అక్కడి నుంచి రమేష్ యాదవ్కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. వీటికి గవర్నరు ఈ నెల 10న ఆమోదముద్ర వేయగా సోమవారం అధికారికంగా ప్రకటించటం తెలిసిందే. నిజానికి ఆంధ్రప్రదేశ్ శానస మండలి ఏర్పాటయిన తరవాత కడప జిల్లా నుంచి మొత్తం 30 మంది ఎమ్మెల్సీలను ఇప్పటిదాకా వివిధ పార్టీలు నామినేట్ చేశాయి. వారిలో యాదవ సామాజిక వర్గానికి మాత్రం ఇప్పటిదాకా అవకాశం దక్కలేదు. ఇదే తొలిసారి. దీనిపై రమేష్ స్పందిస్తూ ‘‘నన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఈ జిల్లా నుంచి యాదవ వర్గానికి చెందినవారెవరూ ఇప్పటిదాకా ఎమ్మెల్సీ కాలేదు’’ అని సంతోషం వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్ తండ్రి వెంకటసుబ్బయ్య 1987లో ప్రొద్దుటూరు మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్గా పనిచేశారు. వైసీపీ ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ కావడం పట్ల జిల్లా బీసీలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. జగన్ హయాంలోనే బడుగులకు అధికారం తాజాగా నామినేట్ చేసిన మోషేన్రాజు (పశ్చిమగోదావరి), రమేష్యాదవ్ (కడప), తోట త్రిమూర్తులు (తూర్పుగోదావరి), లేళ్ళ అప్పిరెడ్డి (గుంటూరు)లో సగం... అంటే ఇద్దరు ఎస్సీ, బీసీలకు చెందిన వారు కావటం గమనార్హం. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారకంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ తరఫున ఇప్పటిదాకా 15 ఎమ్మెల్సీ స్థానాలను నామినేటెడ్, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికల ద్వారా భర్తీ చేయగా... ఇందులో 4 ఎస్సీలకు, 4 బీసీలకు, 3 మైనార్టీలకు దక్కాయి. ప్రతిపక్షంలో ఉండగా 2018 తర్వాత భర్తీ చేసిన ఎమ్మెల్సీల్లోనూ బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 12 సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దే. ఈ క్రమంలోనే బీసీ నేత జంగా కృష్ణమూర్తికి వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అవకాశం లభించింది. సామాజిక న్యాయమనేది మాటల్లో కాకుండా చేతల్లో జగన్ ఏ మేరకు చూపిస్తున్నారనేది తెలియటానికి ఈ ఉదంతాలు చాలు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సునీత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించారు. ఆయన చేతుల మీదుగా సునీత బీ ఫారం అందుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సోమవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె వెంట మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పోతుల సురేష్ ఉన్నారు. ఆ తర్వాత వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డికి సునీత తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు బీసీలను వాడుకుని వదిలేసేవారని, సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలను ఆదరిస్తున్నారని చెప్పారు. జగన్ పాలన స్వర్ణయుగమన్నారు. అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే లక్ష్యంతో పనిచేస్తున్న జగన్ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కుళ్లు, కుతంత్రాలు, కుట్రలతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుని తన బుద్ధిని చూపిస్తున్నారని విమర్శించారు. దేవుడినీ వదలకుండా రాజకీయానికి వాడుకుంటున్నారన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన సునీత.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీరును నిరసిస్తూ రాజీనామా చేయడం తెలిసిందే. -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశమవుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం మొదలవుతుంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సమావేశాలు డిసెంబర్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని భావిస్తుండటంతో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఉభయ సభల్లో ప్రారంభంలోనే తొలి అంశంగా సంతాప తీర్మానాలు ఉంటాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. శాసన మండలిలో కూడా ఈ ప్రముఖులతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం తెలిపే తీర్మానాలను ఆమోదిస్తారు. ఉభయ సభల్లోనూ ప్రభుత్వానికి చెందిన పలు అధికార పత్రాలను సమర్పించే కార్యక్రమం (పేపర్స్ లెయిడ్ ఆన్ ద టేబుల్) ఉంటుంది. బీఏసీ సమావేశంలో అజెండా ఖరారు ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఉభయ సభలు కొద్ది సేపు విరామంతో వాయిదా పడతాయి. ఈ విరామ సమయంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన ఆయన చాంబర్లో శాసనసభ కార్యకలాపాల సలహా మండలి (బీఏసీ) సమావేశం జరుగుతుంది. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరిగేది, చర్చించాల్సిన అజెండా అంశాలను ఖరారు చేస్తారు. మండలిలో చైర్మన్ షరీఫ్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో యధావిధిగా ఎజెండాను ఖరారు చేస్తారు. ఎక్కువ రోజులు జరగాల్సిన సాధారణ బడ్జెట్ సమావేశాలు కరోనా మహమ్మారి వల్ల గత జూన్ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇపుడు ఐదు రోజులు జరుగుతాయని భావిస్తున్న శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ► రాజ్యాంగ నియమం ప్రకారం డిసెంబర్ 14వ తేదీ లోపుగా ఉభయ సభల సమావేశాలు జరిగి తీరాలి కనుక.. కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో అనేకులు 60 ఏళ్లు దాటిన వారున్నప్పటికీ, తప్పనిసరిగా ఈ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రజా సమస్యలపై చర్చకు అధికార పక్షం సిద్ధం ► ప్రజా ప్రాధాన్యత గల అంశాలను చర్చించాలని అధికార పక్షం భావిస్తోంది. నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ, అత్యవసర ప్రాధాన్యత గల అంశాలను కానీ ప్రతిపక్షం చర్చకు తెస్తే ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా చర్చకు తావిచ్చేందుకు, సమగ్రంగా అన్ని విషయాలు చర్చించేందుకు అధికారపక్షం మొగ్గు చూపుతోంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశాల్లో ప్రాధాన్యత గల అంశాలన్నింటిపైనా చర్చకు సిద్ధపడదామని, ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ, మండలిని నడిపిద్దామని సూచించారు. ► ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతో సహా ఇతరత్రా సమస్యలు సుమారు 20 వరకు ఎంపిక చేసి, చర్చ కోసం అధికారపక్షం సిద్ధపడుతోంది. శుక్ర, ఆదివారాల్లో జరిగిన ప్రభుత్వ చీఫ్ విప్, విప్, మంత్రుల సమావేశాల్లో అధికార పక్షం ఆయా అంశాల వారీగా చర్చలో పాల్గొనే వారికి బాధ్యతలు అప్పగించింది. ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని వ్యూహం రూపొందించింది. అడ్డుకోవడమే ప్రతిపక్షం ఎజెండా ► ప్రజా సమస్యలపై ఒక దశ, దిశ లేకుండా సతమతం అవుతున్న ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వ కా>ర్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా వార్తల్లోకి ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాము ఉభయ సభల్లోనూ అడ్డుకుంటామని ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బాహాటంగానే ప్రకటించారు. ► ముఖ్యంగా ప్రభుత్వం తెచ్చే అధికారిక బిల్లులను శాసనమండలిలో తమకున్న ఆధిక్యతతో అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ప్రజా ప్రాధాన్యం గల అంశాలపై చర్చ కన్నా రాజకీయ లబ్ధి చేకూరే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ► రాష్ట్ర ప్రజలకు అవసరమా? లేదా? అనే అంశాలను పక్కన పెట్టి, ప్రభుత్వం తెచ్చిన బిల్లును మండలిలో అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే దిశా నిర్దేశనం చేశారు. టీడీపీ అనుకూల మీడియాపై అసెంబ్లీ, మండలిలో ఉన్న ఆంక్షలు తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో ప్రతిష్టంభనకు దిగాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపు జరుగుతోందని, రాష్ట్రంలో హింస, అవినీతి పెరిగి పోయిందని, రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదని ఆరోపిస్తూ ఉభయ సభల్లో చర్చకు దిగాలని ప్రతిపక్షం భావిస్తున్నట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని కూడా ఆ పార్టీ ఆరోపిస్తోంది. 15 బిల్లులు.. 20 అంశాలు ► శీతాకాల శాసనసభ, మండలి సమావేశాల్లో సుమారు 15 బిల్లులను ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాలు 5 రోజులు జరుగుతాయని భావిస్తున్నందున ఇప్పటి వరకు బిల్లుల స్థానంలో ఉన్న ఆర్డినెన్సులన్నింటికీ చట్ట రూపం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని బిల్లుల వివరాలిలా ఉన్నాయి. ► ఏపీ పశుదాణా బిల్లు, చేపల దాణా బిల్లు, అక్వా కల్చర్ విత్తన బిల్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్పు బిల్లు, అసైన్మెంట్ భూమి బదలాయింపు నిషేధ సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను (3వ సవరణ) బిల్లుతో పాటుగా సుమారు 15 బిల్లులు సభ ముందుకు వస్తాయని తెలుస్తోంది. ► మరి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. సమావేశాలు ముగిసే లోపు అవి కూడా సంబంధిత అనుమతులు పొందితే ఇదే సమావేశాల్లో చర్చకు వస్తాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం ప్రజా ప్రాధాన్యం గల 20 అంశాలను సమావేశాల్లో చర్చకు తీసుకు రావాలని జాబితాను సిద్ధం చేసింది. చర్చకు రానున్న అంశాలు ► పోలవరం పురోగతి–గత ప్రభుత్వం తప్పిదాలు, ఇళ్ల పట్టాల పంపిణీ – ప్రతిపక్షాల కుట్ర, టిడ్కో గృహాలు –వాస్తవాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ – ప్రతిపక్షాల కుట్ర, బీసీల సంక్షేమం – ప్రభుత్వ చర్యలు.. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, కరోనా నియంత్రణ – ప్రభుత్వ చర్యలు, వైద్య ఆరోగ్య రంగం – ఆరోగ్యశ్రీ. ► ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం, వ్యవసాయ రంగం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, మద్దతు ధర, వైఎస్సార్ జలకళ, గ్రామ సచివాలయాలు – మెరుగైన పని తీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు –అమలు తీరు, మహిళా సాధికారత.. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, మద్య నియంత్రణ – ప్రభుత్వ సంస్థలు, ► నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు – రివర్స్ టెండరింగ్, అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన, పారిశ్రామికాభివృద్ధి – ప్రభుత్వ చర్యలు, 9 గంటల ఉచిత విద్యుత్ – విద్యుత్ రంగంలో సంస్కరణలు, ప్రభుత్వ హామీలు – అమలు తీరు, నూతన ఇసుక విధానం అంశాలపై చర్చించాలని అధికారపక్షం భావిస్తోంది. ► వివిధ అంశాలపై ఉభయ సభల్లో చేపట్టే చర్చకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. శాసనమండలిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆయా అంశాలపై చర్చలో పాల్గొనే ఎమ్మెల్యేల పేర్లను కూడా ఖరారు చేశారు. -
ఏపీ మండలి చైర్మన్ షరీఫ్కు కరోనా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎంఏ. షరీఫ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు. షరీఫ్ కోవిడ్ బారిన పడటం బాధాకరమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
గవర్నర్ కోటాలో ఎస్సీ, ముస్లిం వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటాలో భర్తీ చేసే సభ్యుల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ మేరకు సిఫార్సు చేయనుందని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. ► ప్రస్తుతం మండలిలో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామా చేసిన కారణంగా శాసనసభ నుంచి ఎన్నికయ్యే రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ► గవర్నర్ నామినేట్ చేసే కోటాలో కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయి పదవీ కాలం ముగిసిన కారణంగా ఖాళీ అయిన రెండు స్థానాలు కొంత కాలంగా అలాగే ఉన్నాయి. ► వైఎస్ జగన్ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించినప్పటికీ పైస్థాయిలో జాప్యం కారణంగా అది ఇప్పటికీ మనుగడలో ఉంది. మండలి రద్దు విషయంలో ఎలాంటి రెండో ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే శాసనసభలో మండలి రద్దుకు తీర్మానం చేసి పంపారు కూడా. అయితే మండలి మనుగడలో ఉన్నంత వరకైనా ఖాళీ స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ► అందువల్ల గవర్నర్ నామినేటెడ్ స్థానాల్లో ఒకటి ఎస్సీ వర్గానికి, మరో స్థానం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి తాజాగా యోచిస్తున్నట్టు సమాచారం. ► బోస్, మోపిదేవి రాజీనామా వల్ల ఖాళీ అయిన వాటిలో ఒక స్థానం పదవీ కాలం కేవలం 9 నెలలే ఉంది. మరో ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. 9 నెలలే గడువున్న ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు కనుక రెండేళ్ల పదవీ కాలం ఉన్న స్థానానికి కూడా అభ్యర్థిని త్వరలో సీఎం ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మండలిలో మాటల యుద్ధం
సాక్షి, అమరావతి: శాసన మండలిలో బుధవారం రాష్ట్ర వార్షిక బడ్జెట్పై చర్చ కొనసాగుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటా మాట పెరిగి కొద్ది సేపు సభా కార్యక్రమాలు వాడీవేడిగా కొనసాగాయి. బడ్జెట్పై చర్చలో టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్రెడ్డి, నాగజగదీశ్వరరావులు మంత్రులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు.. టీడీపీ సభ్యులకు దీటుగా జవాబిచ్చారు. మంత్రులు గెడ్డాలు పెంచి గత సమావేశాల సమయంలో సభలో రౌడీల మాదిరి వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స జోక్యం చేసుకొని సభ్యులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. దీంతో చైర్మన్ షరీఫ్.. సభ్యులు బడ్జెట్పై చర్చకే పరిమితం కావాలని సూచించారు. ఆధారాలుండటం వల్లే అచ్చెన్నాయుడి అరెస్ట్ ► టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. ► అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉండడం వల్లే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేశారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. దొంగతనం చేస్తే, అవినీతి చేస్తే బీసీలు కదా అని వదిలి వేయాలా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఒక్క బీసీ నేతకు కూడా రాజ్యసభ సీటు కేటాయించ లేదని, సీఎం జగన్ ఇప్పుడు ఒకేసారి ఇద్దరు బీసీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చారని చెప్పారు. ► పేద కార్మికులకు సంబంధించిన రూ.150 కోట్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని తేలడంతో అచ్చెన్నాయుడు అరెస్టు జరిగిందని, తప్పు చేయకుంటే చట్టం ముందు ఆయన తన నిజాయితీని నిరూపించుకోవాలని మంత్రి అనిల్కుమార్ సవాల్ విసిరారు. తప్పుచేసే బీసీల పట్ల ఒక తీరుగా, అగ్రవర్ణాల పట్ల మరో తీరుగా వ్యవహరించడం చట్టంలో లేదన్నారు. గత ప్రభుత్వంలో కాపు నాయకుడు ముద్రగడ దీక్ష చేస్తుంటే అక్కడ 3 వేల మంది పోలీసులను దించి దిగ్బంధనం చేశారన్నారు. చంద్రబాబుకు, చైర్మన్కూ గెడ్డం ఉంది.. ► ‘మంత్రులు గెడ్డాలు పెంచుకుంటే రౌడీలన్నట్టు టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు గెడ్డం ఉంది.. చైర్మన్కు కూడా గెడ్డం ఉంది.. వాళ్లు రౌడీలవుతారా’ అని అనిల్కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ► మంత్రి అనిల్ మాట్లాడే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు జోక్యం చేసుకుని, మంత్రిపై క్రికెట్ బెట్టింగ్ కేసు ఉందనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ► గత ప్రభుత్వంలో పోలీసులు కేవలం నోటీసులిచ్చారని, తాను తప్పు చేయలేదు కాబట్టి విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకున్నానని అనిల్ అన్నారు. పోలీసు రికార్డులు పరిశీలించుకోవచ్చని చెప్పారు. గత ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెట్టి తనను ఓడించడానికి ప్రయత్నించిందని, అయినా తనను ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ► సభలో గొడవ ముదిరే పరిస్థితికి దారితీస్తుండటంతో చైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కూడా కొద్దిసేపు టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్ మధ్య వాగ్వాదం సాగింది. -
మండలిలో మరోసారి దుష్ట సంప్రదాయం!
సాక్షి, అమరావతి: అర్థవంతమైన చర్చలు, సలహాలు, సూచనలతో ఆదర్శంగా నిలవాల్సిన శాసనమండలి టీడీపీ రాజకీయ కుయుక్తులకు వేదికైంది. విపక్ష సభ్యులు మరోసారి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను అడ్డుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధం అనే రీతిలో దౌర్జన్యంగా వ్యవహరించారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులతో పాటు ద్రవ్య వినిమయ బిల్లును బుధవారం మండలిలో ప్రవేశపెట్టనివ్వకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుని దుష్ట సంప్రదాయాన్ని కొనసాగించారు. నిబంధనల మేరకు సభ నడపాలని అధికార పార్టీకి చెందిన సభ్యులు అభ్యర్థించినా ఆలకించలేదు. రూల్ 90 ప్రకారం చర్చ చేపట్టాలంటే ఒక రోజు ముందుగా నోటీసు ఇవ్వాలనే సంప్రదాయాన్ని పాటించకుండా అప్పటికప్పుడు చైర్మన్కు నోటీసు ఇచ్చి పరిగణలోకి తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు రభస చేశారు. సంఖ్యా బలంతో జాప్యం చేయడం మినహా బిల్లులను అడ్డుకోలేమని తెలిసినా డ్రామాలకు తెరతీయడంపై ప్రజాస్వామికవాదులు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు సహా ఇతర బిల్లులను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. మండలిలో బుధవారం జరిగిన పరిణామాలు ఆందోళనకరం.ద్రవ్య వినిమయ బిల్లును మండలి ఆమోదించడం రాజ్యాంగ విధి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను, బిల్లును రాజ్యసభ ఆమోదిస్తున్నప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి ఏమిటి? ఆర్థిక బిల్లును అడ్డుకున్నా లావాదేవీలు ఆగవు. కాకుంటే కాస్త ఆలస్యమవుతాయి. – పీజే చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పెద్దల సభ పరిధి సలహాల వరకే.. ‘ద్రవ్యవినిమయ బిల్లు మనీ బిల్లు కనుక శాసనసభకే సర్వాధికారాలుంటాయి. శాసనమండలి అనేది పెద్దల సభ. కేవలం సలహాలు ఇవ్వడం వరకు మాత్రమే దాని పరిధి. బడ్జెట్పై చర్చించి వారికేమైనా సలహాలుంటే ఇచ్చి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సిందే. పరిస్థితులు ఎలా ఉన్నా సద్దుమణిగేలా చేస్తూ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే వరకు సభను కొనసాగించకుండా ఎందుకు వాయిదా వేశారో అర్థం కాకుండా ఉంది. ద్రవ్యవినిమయ బిల్లు పూర్తిగా అసెంబ్లీ అధికార పరిధికి లోబడి ఉంటుంది. మూడు రాజధానులకు సంబంధించి మొదట పంపించిన బిల్లుపై శాసనమండలి గడువులోగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు కనుక రెండోసారి అదే బిల్లును మళ్లీ శాసనసభ ఆమోదించి మండలికి పంపించింది. మండలి కేవలం సలహాలు ఇవ్వడం వరకే పరిమితం తప్ప బిల్లులను అడ్డుకొనే అధికారం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దల సభ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో దానికి విరుద్ధంగా అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాంటి ప్రజలు ఎనుకున్న శాసనసభకే సర్వాధికారాలు ఉంటాయి తప్ప శాసనమండలికి ఏమీ అధికారం ఉండదు. సలహాలు ఇచ్చి అభిప్రాయం చెప్పడం వరకే పరిమితం కాకుండా అంతకు మించి అక్కడ వ్యవహారాలు కొనసాగుతుండడం విపరీతంగా కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్కడి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల బిల్లును రెండుసార్లు అసెంబ్లీలో ఆమోదించి పంపించారు. రెండోసారి పంపించిన తరువాత శాసనమండలిలో ప్రవేశపెట్టినా, ప్రవేశపెట్టకున్నా, చర్చించినా చర్చించకున్నా, ఆమోదించినా ఆమోదించకున్నా శాసనసభ దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. శాసనసభకు పూర్తి అధికారాలున్నందున రెండోసారి బిల్లు పంపినందున అది ఆమోదమైనట్లే భావించి నిర్ణయం తీసుకోవచ్చు. శాసనమండలి ఆమోదంతో శాసనసభకు కానీ, ప్రభుత్వానికి కానీ అవసరం లేదు. శాసనసభ ఆమోదించినందున ప్రభుత్వం దాని ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రారంభించవచ్చు. శాసనమండలికి నచ్చినా నచ్చకున్నా ప్రజలు నేరుగా ఎన్నుకున్న శాసనసభదే తుది నిర్ణయం అవుతుంది’ – కేఆర్ సురేష్రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ -
మండలి చైర్మన్ వైఖరిపై సీఎస్కు ఫిర్యాదు
-
‘బొండా ఉమాను జైల్లో వేయమంటారా’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి చైర్మన్ తీరుపై సీఎస్కు ఫిర్యాదు చేసినట్టు ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి తెలిపారు. (చదవండి : సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి) ‘మేమంతా అసెంబ్లీ సెక్రటరీకి మద్దతుగా ఉంటాం. అవసరమైతే గవర్నర్ను కూడా కలుస్తాం. సెలెక్ట్ కమిటీని రూల్స్కి విరుద్ధంగా వేస్తున్నానని చైర్మన్ గారే చెప్పారు .మోషన్ ఇవ్వకుండా, ఓటింగ్ జరగలేదు. మరి ఎలా సెలెక్ట్ కమిటీ వేస్తారు. అందుకే అసెంబ్లీ సెక్రటరీ ఆమోదించలేదు. ఏ అధికారయినా రూల్ ప్రకారమే పని చేయాలి. మేమందరం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాం. అధికారుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. రూల్స్ లేవు ఏమీ లేవని యనమల, బొండా ఉమా మాట్లాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిమ్మల్ని జైల్లో వేయమంటారా. అలా చేస్తే ఎవరైనా సమర్థిస్తారా’అని వెంకట్రామిరెడి పేర్కొన్నారు. (చదవండి : లేని సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపడమేంటి?) -
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని అసెంబ్లీ కార్యదర్శి మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ పంపిన ఫైలును ఆయన వెనక్కి పంపించారు. క్లాజ్ 189 ఏ.. ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని లెజిస్లేచర్ కార్యదర్శి (ఇన్చార్జి) పి.బాలకృష్ణమాచార్య పేర్కొన్నారు. (చదవండి : ఏపీ: సెలెక్ట్ కమిటీకి నో) మండలి చైర్మన్ నిర్ణయంతోనే.. పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే. -
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
-
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ, శాసన మండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రోరోగ్ ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయడంతో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లు అయింది. కాగా బిల్లులు మండలి ముందున్న సమయంలో..సభలను ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక) ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదు.. తాడేపల్లి: శాసన మండలి రద్దును ఎవరూ అడ్డుకోలేరని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదన్నారు. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని కేంద్ర బీజేపీ నేతలు చెప్పారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు స్టేజ్ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని విశ్వరూప్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు స్టేజ్ షోలు బాగా అలవాటు అని, సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. (ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు) చదవండి: ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు -
అన్ని చట్టప్రకారమే జరుగుతాయి: స్పీకర్
సాక్షి, విశాఖ : శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రానికి ఉన్న నిబంధనల ప్రకారమే అన్ని జరుగుతాయి. చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలిని రద్దు చేశారు. రాజధాని రైతులతో ప్రభుత్వం వేసిన కమిటీ మాట్లాడుతుంది. రైతులతో పాటు రైతు కూలీలకు కూడా పెన్షన్ అందచేస్తామని శాసన సభ వేదికగా ప్రకటించారు. కృత్రిమ ఉద్యమాల గురించి నేను మాట్లాడను. నిజంగా ఉద్యం జరిగితే దానికి అందరు మద్దతిద్దాం’ అని పేర్కొన్నారు. -
రాజ్యాంగం మేరకే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడబోదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం వ్యవహరిస్తుందని స్పష్టంచేశారు. ‘ఇది రాజకీయ వ్యవహారం కాదు. బీజేపీ తీసుకునే నిర్ణయమూ కాదు. శాసనమండలి రద్దుపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. వ్యవస్థ ఆధారంగా కేంద్రం ముందుకెళ్తుంది.. రాజకీయ కోణముండే ఆస్కారం లేదు’ అని వెల్లడించారు. ఎక్కడా రాజకీయాలకు తావుండదు బిల్లుపై బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘కేబినెట్ ఆమోదం పొంది ప్రభుత్వం ద్వారా వచ్చే బిల్లును ప్రభుత్వంలో ఉన్న పార్టీగా వ్యతిరేకించడం సాధ్యం కాదు కదా.. ఏవో కారణాల వల్ల ఆపేస్తారని, రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా ఆపేస్తారని కొందరు అంటున్నారు. నా అవగాహన మేరకు ఆర్టికల్ 169(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే దానిని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. దీనిలో ఎక్కడా రాజకీయాలకు తావులేదు’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఏపీ చట్టసభల్లో.. అది కూడా శాసన మండలిలో మాత్రమే ఇద్దరు సభ్యులు ఉన్నారని, మండలి రద్దుతో ఆ ప్రాతినిధ్యం కూడా పోతుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇద్దరున్నా పది మంది సభ్యులున్నా సంబంధం లేదని, వ్యవస్థకు లోబడి నడుచుకోవాలన్నారు. బిల్లు వెనుక బీజేపీ ఉందన్న విమర్శలను తోసిపుచ్చుతూ.. ‘అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మాత్రమే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. అక్కడ ఏపార్టీ అధికారంలో ఉందన్న అంశాన్ని పరిగణించదు. కాబట్టి రాజకీయ కోణం నుంచి చూస్తే అది తప్పు. దీని వెనక బీజేపీ ఉందన్న విమర్శలు అక్కసుతో కూడినవే. ఏపీ ప్రజలు అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్కు మద్దతు పలికారు. మేం వారితో కలిసి పోటీచేయలేదు. ఈరోజు కూడా వారు ఎన్డీయేలో భాగస్వామి కాదు. అక్కడ సీపీఎం ఉన్నా రాజ్యాంగ వ్యవస్థకు లోబడి కేంద్రం నడుచుకుంటుంది’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్కు అనుగుణంగా బిల్లుపై ముందుకెళ్తారు ఈ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. దీనికి సమాధానం కేంద్ర కేబినెట్ కార్యదర్శి లేదా హోం శాఖ లేదా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి లభించవచ్చని.. వాటి షెడ్యూలు ప్రకారం సమయానుసారంగా పనిచేస్తాయని చెప్పారు. రాజకీయ కోణంలో జాప్యం చేయడం.. వెంటనే చేయడం వంటి కోణాలకు ఆస్కారం ఉండదని వివరించారు. రాజధానిపై పార్లమెంటులో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందని ప్రశ్నించగా ‘ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని గతంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెప్పారు. చర్చకు వస్తే మా పార్టీ వాణిని వినిపిస్తాం. దీనిని రాజకీయంగా రాష్ట్రంలో ఎదుర్కోవాలని గతంలోనే నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలనడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం’ అని పేర్కొన్నారు. -
రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాం
-
మండలి రద్దు: కేంద్రం అడ్డు చెప్పే ఛాన్సే లేదు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదని ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని తెలిపారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన తేల్చి చెప్పారు. (మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం) -
చంద్రబాబుకు సవాల్.. ఆ విషయం చెప్పగలరా?
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రలో రాజధాని అవసరంలేదని చెప్పే ధైర్యం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి ఉందా అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. వెనుకబడిన కర్నూలులో హైకోర్టు అవసరంలేదని బహిరంగంగా చెప్పగలరా అని సవాల్ విసిరారు. మంగళవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలి రద్దుకు టీడీపీ వ్యతిరేకమైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. వికేంద్రీకరణ, 13 జిల్లాల అభివృద్ధిపై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దిశ చట్టంను దేశ వ్యాప్తంగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. (కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం) ‘అసత్యాలు ప్రచారాలు చేస్తూ.. ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ఆయనలా దిగజారి మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డొస్తోంది. ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం దుర్గగుడి ఫ్లై ఓవర్ కూడా పూర్తి చేయలేని చంద్రబాబు రాజధానిని ఎలా నిర్మించగలరు?. ప్రభుత్వ నిర్ణయంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు దావోస్కు ఎందుకు వెళ్లారో చెప్పాలి. స్విస్ బ్యాంక్లో దాచుకున్న అక్రమ సొమ్ము కోసమే వెళ్లారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు చరిత్ర ఎలాంటిదో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు రాసిన పుస్తకం చూస్తే తెలుస్తుంద’ని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం..
-
శాసన మండలి రద్దుపై మరో ముందడుగు
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. తొలుత శాసనసభ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ తీర్మానాన్ని పంపారు. అనంతరం తీర్మానాన్ని పరిశీలించిన సీఎస్.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం హోంశాఖ అధికారులకు పంపారు. దీంతో మండలి రద్దు విషయంలో ప్రభుత్వం మరో ముందడుగేసినట్లయింది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభ్యులు రోజంతా సుదీర్ఘంగా చర్చించి.. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. -
‘రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నాం’
సాక్షి, అమరావతి: శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సభలో నేను సభ్యుడినైనా మండలి రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ గతంలో మండలిని చాలా స్వల్పకాలిక ప్రయోజనం కోసం రద్దు చేశారు. ఈనాడు రామోజీరావు కోసం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం రద్దు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన చోట రాజధాని పెట్టాలని శివరామకృష్ణ కమిటీ చెబితే.. చంద్రబాబు పట్టించుకోకుండా నారాయణ కమిటీ వేసి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరిచేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరం. శాసనసభలో చేసిన చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రాజకీయ కుట్రలకు దాన్ని వేదికగా చేసుకున్నారు. అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలే గానీ.. స్వార్థం కోసం కాదు. ఆటలో రిఫరీ నిష్పక్షపాతంగా ఉండాలి. బాల్ కొట్టకుండానే పాయింట్ ఇవ్వడం ఎంతవరకూ సమంజసం. మండలిలో చైర్మన్ చేసిన తప్పు అలాంటిదే. మండలి చైర్మన్ ఒక పార్టీ పట్ల పక్షపాతంగా వ్యవహరించడం క్షమించరాని నేరం. సభాపతులుకున్న నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఒక కమిటీ వేయాలని కోరుతున్నా. మండలిలో జరిగిన దాని గురించి అసెంబ్లీలో చర్చించకూడదని కొందరు అంటున్నారు. జరిగిన తప్పును చర్చించకపోతేనే తప్పు అవుతుంది. చర్చించకపోతే ఇంకా తప్పులు చేస్తారు. మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందే’అని పిల్లి సుభాష్చంద్రబోస్ పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తా ‘మండలిలో సభ్యులుగా ఉన్న నేను, నా సహచర మంత్రి సుభాష్ చంద్రబోస్ పదవులను తృణప్రాయంగా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. పెద్దల సభగా పిలిచే శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నాం. పాలకులు ప్రజల కోసం ఈ సభలో చర్చించి తీసుకున్న నిర్ణయాలపై పెద్దల సభలో మంచి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. గడచిన నాలుగు రోజుల్లో చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే బిల్లులను అపహాస్యం చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఆ చట్ట సభల్లోని సభ్యులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియా టుడే సర్వేలో దేశంలోనే అత్యుత్తమ పరిపాలనా దక్షత ఉన్న ముఖ్యమంత్రుల్లో నాలుగో స్థానంలో ఉన్న ఘనత జగన్ది. మా పార్టీ నుంచి మండలికి నామినేట్ అయిన సభ్యులు ప్రజా జీవితంలో గుర్తింపు పొందిన వ్యక్తులు. చంద్రబాబు దోపిడీదారులను మండలికి నామినేట్ చేశారు’ అని మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వ్యాఖ్యానించారు. చదవండి: ప్రజా ప్రయోజనాల కోసమే.. శాసనమండలి రద్దు -
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని అధికార పక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఓడిపోయిన నేతలకు శాసనమండలి పునరావాస కేంద్రంగా మారిందన్నారు. రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దాడిశెట్టి రాజా, మంత్రి పేర్ని నాని, అధికార పక్ష ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేరుగ నాగార్జున, విడదల రజని, గుడివాడ అమర్నాథ్, కొలుసు పార్థసారథి తదితరులు మాట్లాడారు.ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. ప్రజలు ఆమోదించిన,ప్రభుత్వ నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అధికార పక్ష సభ్యులు ఏమన్నారంటే... సాక్షి, అమరావతి: శాసనసభ తీసుకున్న ప్రజోపయోగ నిర్ణయాలను మండలి అడ్డుకుంటోందని.. అసలు అలాంటి సభ మనకు అవసరమా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ అప్రజాస్వామికంగా, అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్న టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు శాసనమండలిని రద్దు చేయొద్దని చెప్పే అధికారం లేదని అన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ధర్మాన ప్రసంగించారు. గతంలో శాసనమండలిని రద్దు చేసినప్పుడు ధర్మవాక్యాలు వల్లించిన చంద్రబాబు ఈవేళ సభకు జవాబు చెప్పలేక పారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో పలువురు ప్రముఖులు ఎగువ సభ రద్దు అవసరాన్ని నొక్కిచెప్పిన విషయాల్ని ఆయన తన ప్రసంగంలో వివరించారు. ధర్మాన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రజోపయోగ నిర్ణయాల్ని అడ్డుకుంటారా? ప్రపంచంలో 178 దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలులో ఉంటే కేవలం 68 దేశాల్లో మాత్రమే మండలి వంటి ఎగువ సభలు ఉన్నాయి. చాలా దేశాలు రద్దు చేస్తున్నాయే తప్ప కొత్తగా తీసుకొస్తున్నవి లేవు. బ్రిటీష్ వాళ్లు.. వారి అవసరాల కోసం ప్రజల ఆకాంక్షలను పక్కనబెట్టి వీటిని ఏర్పాటు చేశారు. అందుకే మహాత్మాగాంధీ మొదలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, గోపాలస్వామి అయ్యర్, ఎన్జీ రంగా లాంటి మహనీయులు వ్యతిరేకించారు. కొందర్ని మేనేజ్ చేయడానికి ఈ పెద్దల సభలు ఉపయోగపడతాయని ఆనాడే గాంధీ పసిగట్టారు. ప్రస్తుతం ఆ విషయం మనకు కరెక్ట్గా సరిపోయే సందర్భం. ఎన్నికల్లో గెలవలేక పరాజయం పొందినవారికి మండలి పునరావాస కేంద్రంగా మారింది. ఖజానాపై భారం పడుతుంది. ప్రజలచే తిరస్కరణకు గురైన వ్యక్తులు గ్యాలరీలలో కూర్చొని ప్రభావితం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శాసనసభ ఔన్నత్యాన్ని పడగొట్టాలని ఎత్తుగడలు వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? సెలెక్ట్ కమిటీని పద్ధతి ప్రకారం వేయలేదు. ఆ సభలో ఉండే చైర్మన్ రూల్స్ వక్రీకరించి నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ బిల్లును ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో టీడీపీ వాళ్లకు తెలియదా? మండలి అవసరం లేదని చంద్రబాబే చెప్పాడు అమరావతి ప్రాంత ప్రజలే చంద్రబాబు కుమారుడు లోకేష్ను ఓడిస్తే తిరిగి దొడ్డిదారిన తెచ్చి శాసనమండలిలో కూర్చోబెట్టి మంత్రిని చేశారు. ఆయన మండలిలో కూర్చొని ఇది తప్పు..అది తప్పని చెబుతున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేసినట్టవుతుందా? కాదా? శాసనమండళ్లనే కాదు రాజ్యాంగపరమైన రాజ్యసభ రద్దుకు కూడా 1971, 72, 1975లలో ప్రయత్నాలు జరిగాయి. దేశ, ప్రజాక్షేమానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు ఎవరో ఒక దేశ భక్తుడు ఈ ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ అవసరం వచ్చింది. మండలి అవసరం లేదని చంద్రబాబే అన్నాడు. అంతకుముందే మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి..గాంధీజీ చెప్పిన మార్గంలోనే నడుద్దాం. సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నా’ అని ధర్మాన పేర్కొన్నారు. మండలి రద్దు 5 కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రజా శ్రేయస్సు కోసం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే శాసనమండలి అడుగడుగునా అడ్డు తగులుతోంది. మండలిలో టీడీపీ సభ్యులు స్వార్థ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించి ఉమ్మడి రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోవడానికి చంద్రబాబు కారణమయ్యారు. సోనియాతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా వద్దంటూ ప్రత్యేక ప్యాకేజీ కోసం తాపత్రయపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి తన స్వార్థం కోసం అమరావతిని రాజధాని చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలను, పోలవరం ప్రాజెక్ట్ను మర్చిపోయారు. భవనాలు కట్టడమే అభివృద్ధి కాదు. దీనికి భిన్నంగా మా నాయకుడు వైఎస్ జగన్ 6 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి పాలనను ప్రజల చెంతకు చేరుస్తుంటే సహించలేకపోతున్నారు. అమరావతిలో 4,500 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే పరమావధిగా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లునూ తిప్పిపంపడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్నది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. మండలి రద్దు చాలా సమంజసం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే మండలి రద్దే మంచిది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నా. – ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని),ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిటికల్ క్రిమినల్ పొలిటికల్ క్రిమినల్ ఎవరని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు చంద్రబాబే అని. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయన దొంగ రాజకీయాలు చేస్తున్నారు. గాయం చేసిన బాధ తెలిసిన వాడే సాయం చేయగలడన్నట్లు సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల గాయాలను తెలుసుకుని వారు కోరుకున్న విధంగా చట్టాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డు తగులుతున్నారు. ప్రజలు ఛీకొట్టిన నాయకుడు గ్యాలరీలో కూర్చుని ఆదేశిస్తే శాసనసభ ఆమోదించిన బిల్లును అవమానిస్తారా. తన దగుల్బాజీ రాజకీయాన్ని నిలదీస్తామనే చంద్రబాబు సభకు రాకుండా పారిపోయారు. పెద్దల సభకు వైఎస్ జగన్ అనుభవజ్ఞులైన నాయకులను పంపితే చంద్రబాబు తన ఇంట్లోని దద్దమ్మను పంపారు. అఖిల భారత మేధావుల సంఘానికి అధ్యక్షుడినని తనకు తానే స్వయంగా ప్రకటించుకున్న యనమలకు సింగపూర్ వెళ్లి జ్ఞానదంతం పీకించుకున్నా జ్ఞానం రాలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ముందు నోటీసు ఇవ్వాలని ఈ మేధావికి తెలియదా. ప్రజాభిప్రాయానికి, ప్రజాతీర్పుకు విలువ ఇవ్వని మండలి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. రాజ్యాంగాన్ని గౌరవించని పెద్దల సభకు శుభం కార్డు వేయాలి. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ప్రజాస్వామ్య ‘స్పిరిట్’తో మండలి తెస్తే టీడీపీ ఆల్కహాల్గా మార్చేసింది ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం శాసనమండలిని చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేవారు. రాజకీయాలు ఫెయిర్గా ఉండాలనేది ముఖ్యమంత్రి అభిమతం. సీఎం వైఎస్ జగన్ అనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా అయినా చట్టం తెచ్చేవారు కాదా? ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలి. ఇలాంటి మండలిని ఇంకా ఉండాలా? అని ఆలోచించాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనే స్పిరిట్తో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మండలిని తీసుకొస్తే.. చంద్రబాబు ఆ మండలిని ఆల్కహాల్గా మార్చేశారు. దేవాలయం లాంటి పెద్దల సభను దెయ్యాల కొంపగా మార్చారు. – చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రభుత్వ విప్ ప్రజాస్వామ్యవాదుల్ని ఆశ్చర్యపరిచింది శాసనమండలిలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగిన రాజకీయ క్రీడ ప్రజాస్వామ్య వాదుల్ని ఆశ్యర్యానికి గురి చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్నీ ఆయన ప్రయోజనాల కోసమే. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఎండగట్టాల్సిందే. ఆయన పాలనలో దాడులు, అసమానతలు, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు చూశాం. రాష్ట్ర విభజనకు ఆయన లేఖ ఇచ్చారు. హోదా విషయంలో అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే.. మండలిలో టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు. మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే ప్రజాభిమతాన్ని అడ్డుకోవడమేనా? చంద్రబాబు లాంటి వ్యక్తులకు రాజకీయ క్రీడగా మారిన శాసనమండలి, ప్రజా ప్రభుత్వం చేసిన చట్టాలను అడ్డుకోవడానికే పరిమితమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను మండలి అడ్డుకోవడం వెనుక చంద్రబాబు కుతంత్రాలున్నాయి. వ్యవస్థలన్నీ ఆధిపత్య వర్గం చేతిలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాలనను వికేంద్రీకరించి, గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకు తెచ్చారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు పేదలను బానిసలను చేశాయి. విద్యుత్ సంస్కరణల పేరుతో చంద్రబాబు ఆ రంగాన్ని దోచుకుతిన్నారు. గ్రీన్ జోన్ పేరుతో అమరావతి రైతులను దగా చేసి, సింగపూర్ కంపెనీలకు మేలు చేకూర్చే ఒప్పందాలు చేసుకోవడమా చంద్రబాబు చేసిన రాజధాని అభివృద్ధి?. రైతులకు చేసిన పాపమే చంద్రబాబుకు శాపమైంది. అందుకే ఆయనకు 23 సీట్లు వచ్చాయి. కౌన్సిల్లో ఏదో జరిగిపోయిందని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలోనే వైఎస్ జగన్ మాదిరిగా 51 శాతం ఓట్లతో గెలిచిన నాయకుడు లేడు. ఎన్టీఆర్కు 1983లో 43 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 51 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించిన ఏకైక మగాడు వైఎస్ జగన్. – కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది మండలిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి తెగబడ్డారు. మండలిలో టీడీపీ సభ్యులు సైంధవుల్లా వ్యవహరిస్తున్నారు. యనమల రామకృష్ణుడు వేసుకునే సూటు, బూటు కూడా ప్రభుత్వ సొమ్మే. ప్రభుత్వ సొమ్మును ఇంటి అద్దెలకు వాడుకున్న చరిత్ర యనమలది. ఇందుకు సంబంధించి జీవోలు ఉన్నాయి. రూ.లక్షల ప్రజాధనంతో దంత చికిత్సకు సింగపూర్ వెళ్లిన ఘనుడు యనమల. తన 39 ఏళ్ల రాజకీయ చరిత్రలో దుర్మార్గం తప్ప సొంత జిల్లాకు, తన నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఎన్టీఆర్కు పొడిచినట్లే ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. శాసనసభ్యులను ఆబోతులతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. – దాడిశెట్టి రాజా, ప్రభుత్వ విప్ చంద్రబాబు అంటే వెన్నుపోటే గుర్తొస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన అమ్మ ఒడి లాంటి సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబును చూస్తే వెన్నుపోటు కళ్లముందు కదలాడుతుంది. చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మేనిఫెస్టోను వందకు వంద శాతం నెరవేర్చేలా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారు. ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. ఒక్క ముస్లిం, మైనారిటీకి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. మండలిపై కూడా చంద్రబాబు రెండు నాలుకల సిద్ధాంతాన్ని చూపించారు. ఈ ప్రభుత్వం ప్రజలకు అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరిస్తోంది. – విడదల రజని, ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్ని గాయపరిచింది శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల మనసును గాయపరిచింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు ఒక గుర్తింపు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దానిని చెడగొట్టే ప్రయత్నం చేశారు. మండలి రద్దుపై శాసన సభలో ఎలా చర్చిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తునారు. సభలో చర్చించకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చర్చించాలా?. పెద్దల సభలో పెద్దలు లేరు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, అవినీతి పరులు, ఆర్థిక నేరస్తులు, కొబ్బరి చిప్పలు అమ్ముకునేవారే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వికేంద్రీకరణ బిల్లుతో ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుంది. దానిని అడ్డుకుని చంద్రబాబు మూడు గ్రామాలకు హీరో కావొచ్చు. కానీ.. 13 జిల్లాలకు విలన్ అయ్యారు. – గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే చంద్రబాబుది నక్షత్రకుడి పాత్ర రాయలసీమది ఘనమైన చరిత్ర. రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని చిత్రీకరించి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచే దుష్ప్రచారం మొదలు పెట్టింది. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా వెలసిన తిరుపతి రాయలసీమలోనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యులు, వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారు రాయలసీమ వారు కాదా? ఎన్టీఆర్తో అద్భుతమైన హిట్ చిత్రాలు నిర్మించిన కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి వారు రాయలసీమ వారు కాదా?. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షిస్తున్నారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్ నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఆయన తాత రాజారెడ్డి గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావిస్తున్నారు. ‘రాజారెడ్డి లాంటి ఉత్తమోత్తమమైన వ్యక్తి చాలా అరుదుగా రాజకీయాల్లో ఉంటారు. ఆయనతో 23 ఏళ్లు సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా చెబుతున్నాను. కమ్యూనిస్టు నాయకుడు, ప్రముఖ పాత్రికేయుడు, గొప్ప దార్శనికుడు గజ్జెల మల్లారెడ్డికి అత్యంత ప్రాణసఖుడు రాజారెడ్డి. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే జగన్ వల్ల నాకు శాప విముక్తి పొలిటికల్ ట్రాప్లో పడి ఎన్టీఆర్ అంతటి గొప్ప వ్యక్తికి వెన్నుపోటు పొడిచానని, అందుకు 15 సంవత్సరాలు రాజకీయంగా తెరమరుగయ్యానని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల తనకు శాపవిముక్తి జరిగిందన్నారు. గొప్ప వ్యక్తుల వల్లే శాప విముక్తి జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్కు వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావించగా స్పీకర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విస్తృత చర్చ జరగాలి..: ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ సభాపతులు అనుసరించాల్సిన నిబంధనలు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జరిగిన స్పీకర్ల సమావేశాల్లో ఫిరాయింపుల నిరోధక చట్టాలపై మంచి చర్చలు జరిగాయన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనని తమ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కచ్చితంగా చెబుతున్నారని తాను చాలా స్పీకర్ల సమావేశాల్లో చెప్పానని తెలిపారు. దీనిపై రాజ్యాంగ సమీక్ష జరగాలనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. బోస్ ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, దానిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరముందని స్పీకర్ అన్నారు. అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్ అడ్డుకోవడం ఏమిటి? భావితరాల భవిష్యత్ కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసే చట్టాలను అడ్డుకోవడానికే శాసనమండలిని చంద్రబాబు లాంటి వాళ్లు వాడుకుంటున్నారు. మహా యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లుగా జగన్ ప్రజా శ్రేయస్సు కోసం చేసే ప్రతి పనినీ చంద్రబాబు అడ్డుకుంటున్నారు. శాసనసభలో ఆమోదించిన చట్టానికి సూచనలు చేయాల్సిన బాధ్యత గల మండలి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అందుకే మండలిని రద్దు చేయాల్సిందే. ఇంగ్లిష్ మీడియం విద్య బిల్లు, ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా కమిషన్ ఏర్పాటు చేసే చట్టాలను అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్ అడ్డుకోవడం ఏమిటి. శాసనసభలో తాటకి మాదిరిగా చంద్రబాబు, కౌన్సిల్లో సుబాహు మాదిరిగా ఆయన కుమారుడు అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారు. కుట్రలు, కుతంత్రాలుతో నిండిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ దుర్మార్గాలకు తెర తీస్తోంది. శాసన మండలి రద్దు గురించి చంద్రబాబు చెప్పే సుద్దులు విడ్డూరంగా ఉన్నాయి. 40 ఏళ్ల ఇండస్ట్రీ 2004లో మండలి పునరుద్ధరణపై వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను అందరూ గమనించాలి (అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు). రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన మండలి రాష్ట్రానికి ఆర్థిక భారమన్న చంద్రబాబు ఇప్పుడు కావాలనడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాత మీరెవరు విడగొట్టేందుకు అని బస్సులో బయల్దేరారు. వాజ్పేయి ప్రభుత్వాన్ని మతతత్వ పార్టీ అని, తాను మద్దతు ఇవ్వనని చెప్పిన చంద్రబాబు తరువాత ఆ పార్టీతోనే జత కట్టారు. ప్రధాని మోదీ కాళ్లకు దండం పెట్టి బీజేపీతో అంటకాగారు. పత్రికారంగంలో దుర్మార్గ పోకడలు హేయం. – పేర్ని నాని, రవాణా, సమాచార శాఖ మంత్రి -
నాడు ఎన్టీఆర్.. నేడు జగన్
సాక్షి, అమరావతి: శాసన మండలి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొంటూ 1985లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీ రామారావు కౌన్సిల్ను రద్దు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రపద్రేశ్లో నేడు మరోసారి మండలి రద్దుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక భారంతోపాటు రాష్ట్ర ప్రజలకు మేలు చేయకపోగా అన్యాయం చేసేలా ప్రతిపక్ష తెలుగుదేశం ఎమ్మెల్సీలు వ్యవహరించడంతో మండలి రద్దుకు వైఎస్ జగన్ తాజాగా నిర్ణయం తీసుకుని ఆ మేరకు అసెంబ్లీలో సోమవారం తీర్మానం ఆమోదింపజేశారు. ఎన్టీఆర్ హయాంలో మూడు నెలల్లో రద్దు.. 1958 జూలై 1న ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు చేశారు. అప్పట్లో మండలి రద్దు ప్రక్రియ కేవలం మూడు నెలల వ్యవధిలో పూర్తయింది. 1985 మార్చిలో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన ఎన్టీఆర్ వెంటనే మండలిని రద్దు చేయాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపగా.. అదే ఏడాది మే 31న మండలిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 1–06–1985న మండలి రద్దయిపోయింది. నేడు జగన్ నేతృత్వంలో మండలి రద్దు తీర్మానం.. రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే బిల్లులను అడ్డుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం ప్రస్తుతం శాసనమండలిని వేదికగా చేసుకుంది. ఇదే క్రమంలో తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లుకు సైతం మోకాలడ్డింది. ప్రజాశ్రేయస్సుకు ఏమాత్రం ఉపయోగపడకపోగా, ప్రజలకు మేలు చేసే బిల్లులను సైతం అప్రజాస్వామిక రీతిలో అడ్డుకుంటుండడంతో తాజాగా వైఎస్ జగన్ శాసన మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయకోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మండలి పనిచేస్తోందని, కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించట్లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి మండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. మండలి రద్దు ప్రక్రియ ఇలా.. - రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద శాసన మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. - మండలిని రద్దు చేయాలంటే.. రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద రద్దు ప్రతిపాదనను తొలుత రాష్ట్ర కేబినెట్ ఆమోదించాలి. అనంతరం మండలిని రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత సభలో చర్చ అనంతరం 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలి. - రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలించి స్వల్ప రాజ్యాంగ సవరణకు లోక్సభ, రాజ్యసభ ముందుకు తీసుకువెళ్లాలి. ప్రస్తుతం రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి ఉన్నాయి. ఇప్పుడు శాసనసభ మాత్రమే ఉంటుందని అతిసాధారణమైన రాజ్యాంగ సవరణలకు లోక్సభ, రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. - లోక్సభ, రాజ్యసభ ఆమోదించాక రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగానే మండలిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వమే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా సాధారణమైన అంశమని, రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా కేంద్రం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
మండలిని లోకేష్ భ్రష్టు పట్టించారు..
-
నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తారా..?
సాక్షి, అమరావతి: లోకేష్ అహంకారం, అహంభావంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. తాను డబ్బులు తీసుకున్నట్టు నిరూపించాలని.. లేకపోతే లోకేష్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీ స్వార్థ రాజకీయాలు కారణంగానే శాసనమండలి రద్దు కాబోతుందని ఆమె పేర్కొన్నారు. (చదవండి: బాబు తప్పులకు రిపేర్లు చేస్తున్నాం : సీఎం జగన్) -
చంద్రబాబు ఎందుకు పారిపోయారు..?
సాక్షి, అమరావతి: మండలి రద్దుపై ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయమే వైఎస్సార్సీపీ తీసుకుందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు మండలి రద్దు చేయాలనే ఆలోచన లేదని.. ఎన్నికల తర్వాత అనివార్యమైన పరిస్థితులను టీడీపీ కల్పించిందని చెప్పారు. పెద్ద మెజార్టీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలిచారని.. రాష్ట్రాభివృద్ధి కోసం త్వరితగతిన సీఎం నిర్ణయాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన అధికార వికేంద్రీకరణ బిల్లును మండలిలో కావాలనే రాజకీయంతో తిరస్కరించారని మండిపడ్డారు. సభలో తీర్మానం చేసిన బిల్లులను అడ్డుకోవాలనే దుర్బుద్ధితో టీడీపీ సభ్యులు వ్యవహరించారని.. దీంతో మండలిని రద్దు చేయాలనే భావనను కల్పించారని వెల్లడించారు. చట్టాలను త్వరితగతిన అమలు చేసి ప్రజలకు అందించాలంటే మండలి అడ్డుగా ఉంటుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లు పాలన చేసిన చంద్రబాబు అవమానకరంగా ఓడిపోయారని.. ఆయన బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. మెజార్టీ ప్రజల అభ్రిపాయాలను అణగదొక్కాలనే యత్నం చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. (చదవండి:బాబు తప్పులకు రిపేర్లు చేస్తున్నాం : సీఎం జగన్) ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు సభకు రాలేదని.. ఆ బాధ్యత నుంచి ఎందుకు పారిపోయారని అంబటి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొని కాపాడుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. వేగవంతమైన పరిపాలన అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని.. అందుకే మండలి రద్దు చేయాలనే నిర్ణయానికి సీఎం జగన్ వచ్చారన్నారు.. రాజకీయంగా అ ఆ లు రాని లోకేష్ లాంటి వ్యక్తులు శాసన మండలిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. మండలిని దుర్వినియోగం చేసినందుకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. శాసనసభలో తీర్మానం తర్వాత మండలి కచ్చితంగా రద్దు అవుతుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
-
మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ తెలిపారు. మండలిని రద్దు చేయాలని సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పెద్దల సభను రద్దు చేయాలని తీర్మానించి.. దానిని సీఎం జగన్ శాసనసభ ముందు ఉంచారు. దీనిపై రోజంతా సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. (మండలి రద్దుకు గర్వపడుతున్నాం: సీఎం జగన్) చర్చలో భాగంగా మండలి రద్దు తీర్మానంపై ప్రసంగించిన సీఎం జగన్.. దీనికి ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు. అనంతరం సభలో ఓటింగ్కు పెడుతున్నట్లు అసెంబ్లీ స్పీకర్ సీతారాం ప్రకటించారు. ముందుగా సభలో సభ్యులు కాని మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోష్లను పక్కన కూర్చోవాలని సూచించారు. అనంతరం సభలో ఓటింగ్ చేపట్టి.. ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. కాగా ఏపీలో శాసనమండలి రద్దు కావడం ఇది రెండోసారి. తొలిసారి మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. -
మండలిలో టీడీపీ తీరు దురదృష్టకరం
-
రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం..
సాక్షి, అమరావతి: రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణ కమిటీ ముఖ్యమైన సూచనలు చేసింది. ఆ కమిటీ సూచనలను చంద్రబాబు పట్టించుకోలేదు. నారాయణ కమిటీ వేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేశారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరి చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని’ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరమన్నారు. సభలో చేసిన చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రాజకీయంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మండలిలో తీర్మానం మూవ్ కాలేదని చైర్మన్ స్వయంగా చెబుతున్నారని.. విస్తృత అధికారులు ఉన్నాయని సెలెక్ట్ కమిటీకి పంపడం సబబా అని ప్రశ్నించారు. ప్రజాసంపద అన్ని ప్రాంతాలకు సమానంగా ఖర్చు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం చేసిన చట్టాలను కూడా మండలిలో అడ్డుకున్నారన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని.. వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని.. లేకుంటే ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందన్నారు. మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందే.. సీఎం జగన్ తీర్మానాన్ని సమర్థిస్తున్నానని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. -
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలకు నిలయంగా మండలి మారిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన విధానాలు వలనే మండలి అప్రతిష్ట పాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం బిల్లును తెస్తే మండలిలో టీడీపీ అడ్డుకుందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పాదయాత్రలో ప్రాంతాల మధ్య అసమానతలను సీఎం వైఎస్ జగన్ గుర్తించారని చెప్పారు. హైదరాబాద్ లాంటి ఉదాహరణతో వికేంద్రీకరణ జరగాలని ఆయన నిర్ణయించారన్నారు. పాక్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ సంకల్పమని తెలిపారు. మండలి రద్దు తీర్మానాన్ని బలపరుస్తున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని మోపిదేవి తెలిపారు. -
సమగ్రాభివృద్ధే సీఎం జగన్ సంకల్పం..
-
‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’
-
‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్ పదవి పోతుందనే సరికి భయపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 2004లో మండలి అవసరం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్ పదవి కోసం కావాలంటున్నారని మండిపడ్డారు. ఇక్కడే ఆయన రెండు నాలుకల ధోరణి ప్రతి ఒక్కరికి అర్థమవుతోందన్నారు. శాసనసభ ద్వారా చట్టాలు చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి మద్దతు తెలిపారు. సోమవారం అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానంపై రోజా మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటీకి పంపారని మండిపడ్డారు. శాసనసభలో ఆమోదించిన బిల్లును.. మండలిలో అవమానిస్తారా అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయినా చంద్రబాబు అహంకారంతో వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు విధానాలకు ప్రశ్నిస్తారనే.. ఈ రోజు శాసనసభకు రాకుండా పారిపోయారని విమర్శించారు. మండలి రద్దు చేయాలంటే రెండేళ్లు పడుతుందని చెబుతున్న చంద్రబాబు శాసనసభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పెద్దల సభకు చంద్రబాబు తన ఇంట్లో ఉన్న దద్దోజనాన్ని పంపించారని ఎద్దేవా చేశారు. యనమల రామకృష్ణుడు స్వయం ప్రకటిత మేధావిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థం కోసం స్పీకర్ వ్యవస్థలను వాడుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని గుర్తుచేశారు. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని చెప్పారు. గాయం విలువ తెలిసినవారే.. సాయం చేయగలరు పెద్దల సభ ప్రజాతీర్పును గౌరవించాలే.. కానీ అపహాస్యం చేయకూడదని అన్నారు. గాయం విలువ తెలిసినవారే.. సాయం చేయగలరని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం వైఎస్ జగన్ ప్రజల గాయాలు తెలుసుకుని.. వారికి సాయం చేస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. అందుకే అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా ఎదిగారని అన్నారు. 13 జిల్లాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని చెప్పారు. మండలిని చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. -
దొడ్డీదారిన మండలికి వచ్చి ప్రజానిర్ణయాలను అడ్డుకుంటున్నారు
-
మండలిని బంగారు బాతులా చూశారు : రజనీ
-
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: మండలిలో రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిలో ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని మండిపడ్డారు. ప్రజలు ఆమోదించిన, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మండలిని ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేవారని.. రాజకీయాలు ఫేర్గా ఉండాలని ఆయన అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. సీఎం అనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా అయినా చట్టం తెచ్చేవారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలని చెవిరెడ్డి కోరారు. ఆయన ప్రయోజనాల కోసమే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్ని ఆయన ప్రయోజనాల కోసమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ఎండగట్టారు. చంద్రబాబు పాలనలో దాడులు,అసమానతలు, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు చూశామని.. రాష్ట్ర విభజనకు ఆయన లేఖ ఇచ్చారని దుయ్యబట్టారు. హోదా విషయంలో అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే..మండలిలో టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో అందరికి తెలుసునన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ల బిల్లులను కూడా చంద్రబాబు అడ్డుకున్నారని మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. మండలిని అడ్డం పెట్టుకుని.. మండలిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి ప్రయత్నించారని మండిపడ్డారు. మండలిలో సైంధవుల్లా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. యనమల వేసుకునే సూటు,బూటు కూడా ప్రభుత్వ సొమ్మేనని విమర్శించారు. ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది అని దుయ్యబట్టారు. శాసనసభ్యులను ఆంబోతులతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. -
సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్లో చర్చించాలా?
సాక్షి, అమరావతి : శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల మనసును గాయపరిచిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన శాసన మండలి రద్దు తీర్మానంలో అసెంబ్లీలో మాట్లాడుతూ.. స్వాతంత్ర లభించిన 70 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు ఒక గుర్తింపు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దానిని చెడగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. (చదవండి : ‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’) శాసనమండలిలో టీడీపీ సభ్యుల నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందన్నారు. ‘ మండలి రద్దు అంశంపై శాసన సభలో ఎలా చర్చిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తునారు... సభలో చర్చింకుండా ఈనాడు, ఆంద్రజ్యోతిలో చర్చించాలా’ అని ప్రశ్నించారు. పెద్దల సభలో పెద్దలు లేరని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, అవినీతి పరులు, ఆర్థిక నేరస్తులు, కొబ్బరి చిప్పలు అమ్ముకునేవారే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజల అభివృద్ధి కోసం సభలో చట్టాలు చేస్తుంటే.. రాజకీయం కోసం మండలిలో టీడీపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. వికేంద్రీకరణ బిల్లును మాత్రమే కాకుండా.. గతంలో తీసుకువచ్చిన ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి విశాఖపై టీడీపీ సభ్యులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లుతో ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబుకు రాష్ట్రం బాగోలు అవసరం లేదని, తన రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకొని చంద్రబాబు మూడు గ్రామాలకు హీరో కావొచ్చు కానీ 13 జిల్లాకు విలన్ అయ్యారన్నారు. శాసన మండలి రద్దు బిల్లుతో ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం జగన్ ధైర్యాన్ని ఇచ్చారని అమర్నాథ్ పేర్కొన్నారు. -
సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్లో చర్చించాలా?
-
రాజకీయ అవసరాల కోసమే అలా చిత్రీకరించారు..
-
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు
-
బాబు హయాంలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది
-
బాబు తన బినామీలను కాపాడూకునే ఉద్దేశం
-
‘బాబు నైతికంగా మండలి రద్దు ఒప్పుకున్నాడు’
సాక్షి, విజయవాడ: అసెంబ్లీలో శాసన మండలి రద్దు బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని.. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నైతికంగా మండలి రద్దు ఒప్పుకున్నారని తెలిపారు.1985లో ఎన్టీఆర్ మండలిని రద్దు చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదని నాగేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మండలి అవసరం లేదని.. అనవసరపు ఖర్చని ఆనాడు చంద్రబాబు అన్నాడని మండిపడ్డారు. సలహాలు, సూచలనలు ఇవ్వాల్సిన పెద్దలసభను చంద్రబాబు అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. రౌడీ ప్రవర్తన ఉన్న తన ఎమ్మెల్సీలతో చంద్రబాబు మండలిని నింపారని నాగేశ్వరరావు ఆరోపించారు. బిల్లును మండలికి పంపితే వెనక్కి పంపుతూ ప్రజాస్వామ్యం విలువలను దిగజారుస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ చరిత్రలో మాజీ సీఎం శాసనమండలి గ్యాలరీలో కూర్చుని మండలి చైర్మన్ను ప్రభావితం చేసిన సంఘనలు ఎక్కడా చూడలేదన్నారు. చదవండి: బినామీలను కాపాడుకునేందుకే బాబు తాపత్రయం ప్రజలకు మంచి చట్టాలను తీసుకురావడంలో జాప్యాన్ని గ్రహించిన సీఎం జగన్ మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. మండలి నిర్వహణ రాష్ట్రనికి అనవసర ఖర్చుతో పాటు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. ప్రజలకు ఉపయోపడే బిల్లులను మండలిలో అడ్డుకోవడం హేయమైన చర్య అని నాగేశ్వరరావు విమర్శించారు. టీడీపీ రాజకీయ ఉగ్రవాదంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో రాజాకీయ నిరుద్యోగిగా మారి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. చంద్రబాబు 23 సీట్లుకే కాకుండా 23 పంచాయతీలకు నాయకుడిగా పరిమితమయ్యాడని ఆయన ఎద్దేవా చేశారు. చదవండి: అందుకే చంద్రబాబు సభకు రాలేదు 151 సీట్లు ఉన్న ప్రభుత్వం చేస్తున్న చట్టాలను మండలిలో వ్యతిరేకించడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడవడమే అని నాగేశ్వర రావు మండిపడ్డారు. శాసన మండలి నిర్వహించటం అంటే రాజకీయ నిరుద్యోగులను ప్రోత్సహించడమే అని ఆయన పేర్కొన్నారు. 5 కోట్ల ప్రజలు శాసనసభ మండలి రద్దుపై హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు శాసనసభ మండలి రద్దును గ్రహించి.. సభ్యులకు అవినీతితో సంపాదించిన సొమ్ము జీతం రూపంలో ఇస్తానని హామీ ఇచ్చారని నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ హామీతో చంద్రబాబు అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో మండలి రద్దును బలపపిర్చిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. -
కాంట్రాక్టర్లకు ఎమ్మెల్సీ సీట్లు అమ్ముకున్నారు..
సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు ఐదేళ్లు చంద్రబాబు నాయుడుకి సమయం ఇచ్చినా ఉపయోగించుకోలేపోయారని వైస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ విమర్శించారు. శాసనమండలి రద్దుపై సోమవారం అసెంబ్లీలో చర్చలో భాగంగా ఆమె ప్రసంగించారు. మండలిపై చంద్రబాబు తొలినుంచి రెండు నాల్కల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే చంద్రబాబుకు శాసనమండలి బంగారుబాతులా కనిపించిందని, కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు, వ్యాపారవేత్తలకు ఎమ్మెల్సీ సీట్లు అమ్ముకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని రజనీ విమర్శించారు. మండలిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వాన్ని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. (మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్) నారా లోకేష్కు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన పెద్దల సభను.. తక్కువ చేసి మట్లాడం సరికాదని హితవుపలికారు. ప్రజల అవసరాలకు ఏమాత్రం ఉపయోగంలేని మండలిని రద్దు చేస్తామంటే పెద్దల సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ స్వాగతించారని సభలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామని రజనీ స్పష్టం చేశారు. -
ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు యూటర్న్
-
సైంధవుడి పాత్రకు ఆయన నిదర్శనం..
-
సైంధవుడి పాత్రకు ఆయన నిదర్శనం..
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ హయాంలోనే పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని.. సమితి వ్యవస్థల నుంచి మండల వ్యవస్థలు తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన బిల్లులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల ఆమోదంతో ఎప్పుడు గెలవలేదన్నారు. మండలిని కించపరిచిన చరిత్ర ఆయనదని విమర్శించారు. మండలి రద్దు వల్ల రాష్ట్రానికి నష్టం లేదని పార్థసారధి పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసమే అలా చిత్రీకరించారు.. రాష్ట్రాభివృద్ధి సాధించాలంటే అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని.. ప్రాంతాల మధ్య సమతుల్యత చేయాలనుకున్నారని చెప్పారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమది ఘనమైన చరిత్ర అని, రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని టీడీపీ చిత్రీకరించిందని మండిపడ్డారు. మండలి రద్దు తీర్మానానికి మద్దతు.. ‘మహావిష్ణువు స్వయంభూ గా వెలసిన ప్రాంతం రాయలసీమ.. ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య జన్మించిన ప్రాంతం..చిత్రరాజాలు తీసిన కేవిరెడ్డి జన్మించిన ప్రాంతమని’ భూమన తెలిపారు. రాయలసీమకు అన్యాయం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మండలిలో బిల్లులను అడ్డుకోవడం చంద్రబాబు సైంధవుడి పాత్రకు నిదర్శమన్నారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్లోని నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్ చేస్తున్న మండలి రద్దు తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని భూమన పేర్కొన్నారు. (చదవండి: శాసనమండలి రద్దును స్వాగతిస్తున్నాం!) (చదవండి: టీడీపీది శునకానందం: పేర్ని నాని) -
టీడీపీది శునకానందం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: రామాయణంలో యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలను చంద్రబాబు, లోకేష్లు అడ్డుకుంటున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక బిల్లులను అడ్డుకుని టీడీపీ శునకానందం పొందుతుందని మండిపడ్డారు. ‘40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడటం ఆయనకు అలవాటు లేదని’ పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాన్ని విడగొట్టాలని లేఖ ఇస్తారు.. రాష్ట్రాన్ని ఎలా విడగొడతారని ప్రశ్నిస్తారు.. బీజేపీ మతతత్వ పార్టీ అంటారు.. అదే బీజేపీతో పొత్తు అంటారు’ అంటూ టీడీపీ తీరును దుయ్యబట్టారు. రాష్ట్రానికి హోదా అవసరమని చెప్పి ప్యాకేజీని స్వాగతించారని.. ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు యూటర్న్ తీసుకుంటారని విమర్శించారు. ‘ఎన్నికల ముందు మోదీ, అమిత్షాను చంద్రబాబు తిట్టారని..ఇప్పుడు వాళ్లిద్దరు మా వెనుక ఉన్నారని ఆయన చెబుతున్నారని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిచ్చామంటున్న చంద్రబాబుకు గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయని’ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో నిర్లక్ష్యానికి గురైన కొల్లేరు పరిరక్షణ కోసం రూ.350 కోట్లతో రెగ్యులేటర్ల ఏర్పాటుకు సీఎం జగన్ హామీ ఇచ్చారని పేర్ని నాని పేర్కొన్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు కేబినెట్ నిర్ణయం) -
ప్రజల భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేశారు
-
అరుదైన తీర్పు ఇచ్చారు..
-
అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన
సాక్షి, అమరావతి: బ్రిటిషర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పెద్దల సభను ఏర్పాటు చేశారని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయాన్ని గమనించి స్వాతంత్ర్యానికి ముందే జాతిపిత మహాత్మా గాంధీ ఈ సభను వ్యతిరేకించారని పేర్కొన్నారు. పార్లమెంటు ప్రజాస్వామ్యం ఉన్న అనేక దేశాల్లో పెద్దల సభ లేదని తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయపరమైన కారణాలతో చట్టాలు ఆలస్యమవుతున్నాయి కాబట్టి మండలి రద్దు సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవలేని వారి రాజకీయ పునరావాస కేంద్రంగా మండలి మారిందని.. అటువంటి సభ అవసరం లేదని గతంలో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలోని కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని పేర్కొన్నారు.(ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం) అరుదైన తీర్పు ఇచ్చారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 51 శాతానికి పైగా ప్రజలు మద్దతిచ్చారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు, అభిప్రాయాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. రాష్ట్రమంతా పూర్తిగా అధ్యయనం చేసిన ఆయనకు ప్రజలు అరుదైన తీర్పు ఇచ్చారు. ఇంతకు ముందెన్నడూ లేని భారీ మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి ప్రభుత్వం చేస్తున్న చట్టాలను ప్రజల చేత తిరస్కరించబడిన టీడీపీ అడ్డుకుంటోంది. మండలి వల్ల కోట్ల రూపాయలు దుర్వినియోగమని చంద్రబాబు గతంలో చెప్పారు. ఐదు కోట్ల మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న చట్టాలను.. ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని మరీ అడ్డుకుంటున్నారు. టీడీపీ రాజకీయాల వల్ల కీలక బిల్లులు ఆలస్యమవుతున్నాయి’అని ధర్మాన.. చంద్రబాబు తీరును ఎండగట్టారు.(మీరు కోరుకున్నదే కదా చంద్రబాబు: చెవిరెడ్డి ) తాత్కాలికమని అంబేద్కర్ చెప్పారు.. ‘పెద్దల సభలు తాత్కాలికమే అని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పారు. ఆర్టికల్ 169 కింద పెద్దల సభను ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చని సూచించారు. అంతేకాదు గోపాలస్వామి అయ్యర్, ఆచార్య రంగా వంటి వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చట్ట సవరణలు చేసే అధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన శాసన సభకు లేకుంటే ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరతాయి. మంత్రిగా ఉన్న నారా లోకేశ్ను మంగళగిరి ప్రజలు తిరస్కరిస్తే.. ఆయన మండలిలో ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే. 1971, 72, 75లో రాజ్యసభను రద్దు చేసే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు ముఖం చూపించలేకనే శాసన సభకు రాలేదు. మండలి అవసరం లేదన్న బాబు వ్యాఖ్యలను ప్రశ్నిస్తారనే భయంతోనే చర్చకు రాలేదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గతంలో చంద్రబాబు తీర్మానం కూడా పెట్టారు. ఆ తీర్మానంలో ఉన్నవన్నీ కూడా తప్పులే. సీఆర్డీఏ చట్టం 171 పేజీలు ఉంది. దానిని శాసన మండలిలో ఎన్నిరోజులు చర్చించారు. దాన్ని సెలెక్ట్ కమిటీకి ఎందుకు పంపలేదు. 12 పేజీలు ఉన్న వికేంద్రీకరణ బిల్లును మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపడంలో ఉద్దేశం ఏమిటి’అని ధర్మాన ప్రశ్నించారు. -
సీఎం జగన్కు అందరూ సహకరించాలి: ఆళ్ల నాని
సాక్షి, అమరాతి : చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి, రెండు కళ్ల వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కారణమని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ధ్వజమెత్తారు. శాసన మండలి రద్దు తీర్మానంపై మంత్రి సభలో చర్చ సందర్భంగా రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ప్రాంతీయ అసమానతలు రాకుడదన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల ఏర్పాటు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.(మండలి రద్దుకు తీర్మానం ప్రతిపాదించిన సీఎం జగన్) చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు కొనుగోలు చేసిన వారికోసం బాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోనియాతో కుమ్మకై.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు సహకరించారని మండిపడ్డారు. విభజనతో హైదరాబాద్లాంటి మహా నగరాన్ని కోల్పోయామని, రాష్ట్రం రెండుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తును కోల్పోయామని అన్నారు. గత అయిదేళ్లలో చంద్రబాబు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ అలుపెరగని పోరాటం చేశారని, హోదా కోసం పోరాటం చేసిన వారిపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరావతి పేరుతో అభివృద్ధిని కేంద్రీకరిస్తుందని ప్రజలు భయపడ్డారని, శివరామకృష్ణ కమిటీ కూడా అమరావతిలో రాజధాని వద్దని చెప్పిందని తెలిపారు. చంద్రబాబు నారాయణ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. (అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన) చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆళ్ల నాని విమర్శలు గుప్పించారు. గత ఏడు నెలల్లో పశ్చిమగోదావరి జిల్లా ఎలా అభివృద్ధి చెందిందో స్వయంగా చూపిస్తానని, అభివృద్ధిని చూసేందుకు టీడీపీ నేతలు రావాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చేసిన ఘనత సీఎం జగన్ది అని, ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని బాబు ఎప్పుడైనా ప్రయత్నించారా అని ప్రశ్నించారు. మూడు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్ రూ. 700 వందల కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారని, డయాలసిస్ సెంటర్, తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారని తెలిపారు. (‘చంద్రబాబు వాదనలో పస ఉంటే చర్చకు రావాలి’) అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆళ్లనాని పేర్కొన్నారు. రియల్ ఎస్టేల్ వ్యాపారుల ప్రయోజనాలే బాబుకు ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టవని విమర్శించారు. మండలి గ్యాలరీలో కూర్చొని సభను ప్రభావితం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సలహాలు, సూచనలు ఇవ్వడానికే మండలి ఏర్పాటు జరిగిందని అన్నారు. మండలిలో టీడీపీ సభ్యులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేలా ప్రయత్నించారని, ప్రజలే చంద్రబాబుకు గుణపాఠం చెప్తారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్కు అందరూ సహకరించాలని సూచించారు. -
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రం
-
మీరు కోరుకున్నదే కదా చంద్రబాబు: చెవిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయంగా స్వాగతిస్తున్నామని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. 2004లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆనాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. శాసనమండలిలో ప్రజాస్వామ్యానికి కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. శాసన మండలి పునరుద్ధరణ సమయంలో.. మండలి పెట్టడాన్ని చంద్రబాబు దుర్మార్గం అన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 2004లో చంద్రబాబు శాసన సభలో మాట్లాడిన మాటల(‘‘అధ్యక్షా, ఏదైతే ఈరోజు శాసనమండలి తేవడం పట్ల దీనిని వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ద్వారా ప్రజల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. మంచిపనులు చేస్తే తప్పకుండా సహకరించేవారము. అదే విధంగా ప్రజల పైన భారం పడే చర్యలు ప్రభుత్వం ప్రధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం అనేకసార్లు చెప్పాము. మళ్లీ ఒకసారి రీయిటరేట్ చేస్తున్నాము. విధాన మండలికి చాలామంది చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నిర్ణయం వలన వారి మనుషులకు మళ్లీ పదవులు వస్తాయి తప్ప రాష్ట్రప్రజలకు లాభం లేదు. మీరే చూడబోతున్నారు. ఈ రోజు శాసనమండలి ఒకసారి చూస్తే, కార్యకర్తలు కొంతమందికి, నాయకులు కొంతమందికి రాజకీయంగా పునరావాసం కల్పిస్తారు తప్ప దీనివలన బ్రహ్మాండంగా శాసనాలు వస్తాయి, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది అనేది వాస్తవం కాదని తెలియజేస్తున్నాను. అందుకే మనం ఒకసారి ఆలోచించుకుఉంటే ఏ విధంగా ఇవన్నీ జరిగాయో, దేశంలో గానీ, ప్రపంచంలోగానీ ఒకసారి ఎనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది’’)ను చెవిరెడ్డి వినిపించారు. (ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు కేబినెట్ నిర్ణయం) అదే విధంగా... శాసన మండలి వల్ల రూ. 20 కోట్లు ఆర్థిక భారం పడుతుందని.. రాజకీయ ప్రయోజనాల కోసమే మండలిని... రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారంటూ బాబు వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆరోజు చంద్రబాబు కోరుకున్న మాటను తాము ఈరోజు అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘మీరు కోరుకున్నది నిజమవుతుంటే స్వాగతించకుండా ఎందుకు దాక్కుంటున్నారు. మీకు అనుకూలంగా ఉంటే ఒకవిధంగా.. వ్యతిరేకమైతే మరో విధంగా మాట్లాడుతారా’ అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే.. మండలి ఉపయోగంపై శాసనసభలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. -
రాజకీయ దురుద్దేశంతో బిల్లులను అడ్డుకున్నారు
-
చంద్రబాబు 13 జిల్లాలకు విలన్
-
‘సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని మెజార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన క్యాబినేట్ సమావేశం శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకోవడ ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నకోబడిన ప్రభుత్వమన్నారు. మండలిలో పెట్టిన బిల్లులన్నింటినీ ప్రతిపక్షం తిరస్కరించిందని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రమని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మండలి రద్దవుతుందన్న బాధ కంటే ఆయన కుమారుడు లోకేష్కు ఉద్యోగం పోతుందనే బాధ ఎక్కువైందన్నారు. మండలి చైర్మన్కు విచక్షణ అధికారాలు ఉంటే... 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా విచక్షణ అధికారాలు ఉన్నాయన్నారు. ఇక మండలి రద్దును వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలుగా సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ: ఈ రోజు శాసన మండలి రద్దుకు క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చంద్రబాబుకు పట్టడం లేదని, వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అడ్డుకోవడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లు అడ్డుకున్నారని, గిరిజనులు, దళితుల అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అదేవిధంగా ఆంగ్లభాషా బిల్లును కూడా అడ్డుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ: శాసన మండలి రద్దు నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా శాసన మండలిలో టీడీపీ వ్యవహరిస్తోందని, ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకుందని మండిపడ్డారు. కాగా పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రతి ఒక్కరు సమర్థిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. -
ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచారు
-
ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
-
'వారి కదలికలపై కుల మీడియా నిఘా'
సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కష్టాలు ఎల్లో మీడియాకు జీవన్మరణ సమస్యలుగా పరిణమించాయని విమర్శించారు. శాసనమండలి రద్దుపై సీఎం జగన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా నిఘా పెట్టిందని తెలిపారు. వారి ఇళ్ల చుట్టూ తమ ప్రతినిధులను మోహరించి బాబుకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. (పూల ఖర్చు వృథా అయినట్టేనా బాబూ..!) కాగా మరో ట్వీట్లో.. 'రాజధాని పరిరక్షణ అంటూ పెయిడ్ ఆర్టిస్టులను దించాడు. ధర్నాలు, దీక్షల నాటకాలాడాడు. జోలె పట్టి చందాలకు తిరిగాడు. ఇప్పుడవన్నీ వదిలేసి కౌన్సిల్ను ఎలా రద్దు చేస్తారో చూస్తా అని రంకెలేస్తున్నాడు. చిట్టి నాయుడు, వెన్నుపోటు సహచరుడు నిరుద్యోగులవుతారని ఆయనకు భయం పట్టుకుంది' అని ట్వీట్ చేశారు. 'అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు ముట్ట చెబుతున్నాడు. ఎమ్మెల్సీలు ఎక్కడ ధిక్కరిస్తారో అని నిద్ర పోవడం లేదు. వారి పదవీకాలం ముగిసేంత వరకు జీత భత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట' అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. 'పప్పు నాయుడి రాజకీయ జీవితం ముగిసినట్టే' -
ఏపీ అసెంబ్లీ: ముగిసిన బీఏసీ సమావేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఏపీ కేబినెట్ ఆమోదించిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రభుత్వం అందించింది. అయితే ఈ రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగాలంటే బీఏసీ సమావేశం కావాలని స్పీకర్ సూచిస్తూ అసెంబ్లీని వాయిదా వేశారు. బీఏసీ సమావేశం అనంతరం తిరిగి సభ ప్రారంభం కానుంది. ముగిసిన బీఏసీ సమావేశం.. ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ ఒక్క రోజు(సోమవారం) మాత్రమే అసెంబ్లీ జరపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా నేటి అసెంబ్లీ సమావేశంలో మండలి రద్దుపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించింది. మండలి రద్దుతో పాటు మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టేందుకు బీఏసీ సుముఖత వ్యక్తం చేసింది. ఇక ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్కుమార్ యాదవ్, కన్నబాబు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి సంబంధించిన పలు కీలక బిల్లులను శాసనమండలి అడ్డుకుంటున్న నేపథ్యంలో మండలిని రద్దుపై చర్చించనుంది. ఇప్పటికే ఏపీ కేబినెట్ శాసనమండలి రద్దుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అభివృద్ది-పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ వంటి కీలకబిల్లులను మండలిలో టీడీపీ అడ్డుకుంటూ సైంధవ పాత్ర పోషిస్తోందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఈ రెండు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తామని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం లోకేష్ తీరు... బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి -
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు..!
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కీలక బిల్లులకు అడ్డు తగులుతున్న శాసన మండలి రద్దే సరైందని మంత్రివర్గం భావించింది. ఈ మేరకు మండలి రద్దుకు సంబంధించి శాసన సభలో సోమవారం ప్రవేశపెట్టే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు కేబినెట్ భేటీలో భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించినట్టు తెలిసింది. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రభుత్వం కేంద్రం ఆమోదానికి పంపనుంది. (చదవండి : ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?) ⇒ ఏపీలో మండలి రద్దు కావడం ఇది రెండోసారి ⇒ శాసన మండలిని మే 31, 1985న రద్దు చేసిన నాటి సీఎం ఎన్టీఆర్ ⇒ మార్చి 30, 2007న తిరిగి మండలి పునరుద్దరణ ⇒ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి విడిగా శాసన మండలి ⇒ మండలి రద్దుపై తీర్మానం చేయనున్న శాసన సభ ⇒ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం ⇒ ఆర్టికల్ 169 ద్వారా ఏ రాష్ట్ర మండలినైనా రద్దు చేసే అధికారం ⇒ పార్లమెంట్ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో రద్దు కానున్న మండలి ⇒ ఇప్పటికే చాలాచోట్ల మండలిని పక్కనపెట్టిన రాష్ట్రాలు ⇒ దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసన మండలి ⇒ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, యూపీలోనే పెద్దల సభ ⇒ మండలిని పునరుద్దరించాలంటూ 5 రాష్ట్రాల్లో వినతులు ⇒ అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, బెంగాల్లో మండలి కోసం వినతులు ⇒ మండలి పునరుద్దరించాలన్న ఐదు రాష్ట్రాల వినతుల పట్ల కేంద్రం విముఖత ⇒ మండలి వల్ల ఆర్థికంగా రాష్ట్రంపై భారీగా భారమన్న భావనలో కేంద్రం -
అలాంటి శాసన మండలి అవసరమే లేదు
-
బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి..
సాక్షి, అమరావతి: పెద్దల సభ అంటే సూచనలు ఇవ్వాలి గాని, సంఘర్షణలకు వేదికగా ఉండకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అభిప్రాయపడ్డారు. ఆమె సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే యనమల రామకృష్ణుడు స్టీరింగ్ అని ఎద్దేవా చేశారు. పెద్దల సభను దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పునరుద్దరిస్తే...శాసనమండలిలో ఇవాళ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానుల బిల్లుపై వారి తీరు చూస్తుంటే... చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతారని అన్నారు. పెద్దల సభ అంటే అందరూ గౌరవించేలా ఉండాలే కానీ, శాసనమండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని, మండలిలో ప్రజాతీర్పును అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న మండలి అవసరం లేదని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. శాసనమండలిని రద్దు చేయమని తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గట్టిగా కోరుతామని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. శాసనసభ ఆమోదించిన బిల్లును అగౌరపరిచారని, అమరావతిలో బినామీల భూముల కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని విమర్శించారు. ‘బాగా బలిసిన కోడి.. చికెన్ షాప్ కు వెళ్తే.. ఏమవుతుందో.. నారా లోకేష్ గ్రహించాలి. యనమల మహా మేధావిగా ఫీల్ అవుతున్నారు..రెండుసార్లు ఓడిపోయారు. పెద్దల కోసం ఏర్పాటు చేసిన సభకు తన ఇంట్లో ఉన్న దద్దమ్మను, దద్దోజనాన్ని పంపించారు. చంద్రబాబు ఓటమిపాలైనా ఇంకా అహంకారం మాత్రం తగ్గలేదు. ప్రజా క్షేత్రంలో ఓడిపోయిన యనమల మహా మేధావిలా ఫీలవుతున్నారు. ఇండియా టుడే సర్వేల బెస్ట్ సీఎం సర్వేలో 4వ స్థానంలో జగన్గారు ఉన్నారు. ఆయన పనితీరును ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. టీడీపీ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్సీలతో బేరసారాలు చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి అవసరమే లేదు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు’ అని చురకలు అంటించారు. -
ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. శాసనమండలి రద్దుపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మండలి భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ నిర్ణయం తర్వాత అసెంబ్లీ చర్చించి, ఆ తర్వాత తీర్మానం చేయనుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించనుంది. (శాసనమండలిపై నేడే నిర్ణయం) కాగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల శ్రేయస్సును కాంక్షిస్తూ, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ధ్యేయంతో శాసన సభలో ఆమోదించిన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. అలాగే అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తానని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వానికి సూచించారు.(టీడీపీ తప్పుడు ప్రచారం.. వెలుగులోకి అసలు నిజం..!) -
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఆరుగురు ఎమ్మెల్సీలు
-
అందరి సలహాల కోసం సమయం ఇచ్చాం
సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగిందని, ప్రజా సంబంధమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని వర్గాల సలహాలు తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ కొంత సమయం ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము ప్రలోభాలు పెడుతున్నట్లు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోందని, ఆ మీడియా ఆగడాలకు అంతేలేకుండా పోతోందన్నా్డరు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపినంత మాత్రాన టీడీపీ సాధించేది ఏమీ లేదన్నారు. తప్పు చేశానని మండలి చైర్మన్ అంగీకరించారని, నిబంధనలను తుంగలోతొక్కి ఆయన నిర్ణయం ప్రకటించారని, బిల్లులపై ఓటింగ్ కూడా నిర్వహించలేదన్నారు. ఆ బిల్లులు చట్టాలు కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. శాసనసభే ఎప్పుడూ సుప్రీం అని, తన పరిధికి మించి మండలి వ్యవహరించడం కరెక్టు కాదన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతుంటే.. మండలిలో ఆ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందన్నారు. మండలిని ఎవరూ తక్కువ చేయడంలేదన్నారు. మండలిలో మెజార్టీతో తామేదైనా చేయగలుగుతామని టీడీపీ ప్రజలకు భ్రమలు కల్పిస్తోందని మండిపడ్డారు. మండలిని రద్దు చేస్తారేమోనని చంద్రబాబుకు, లోకేశ్కు భయం పట్టుకుందన్నారు. చైర్మన్ను చంద్రబాబు తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, గ్యాలరీలో కూర్చుని చైర్మన్ను నియంత్రించడం దుర్మార్గమన్నారు. అంతరించిపోతున్న నేత బాబు .. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సజ్జల చెప్పారు. ఆ పార్టీ ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అలాగే ఉందని, అయితే వాళ్లందరిని తీసుకుని తామేం చేయాలని ప్రశ్నించారు. రూ. 5 కోట్లో, రూ. 10 కోట్లో ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరమేముందని అన్నారు. పొరపాటున కూడా డబ్బులతో సీఎం వైఎస్ జగన్ రాజకీయాలు చేయరని స్పష్టం చేశారు. సీఎం జగన్ నవతరం నాయకుడైతే, చంద్రబాబు అంతరించిపోతున్న నేత అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చీకటి అయితే.. సీఎం వైఎస్ జగన్ వెలుగు అన్నారు. అమిత్షాతో మాట్లాడి మండలి రద్దును అడ్డుకుంటామని చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలకు చెపుతున్నారని తెలిసిందన్నారు. ఎమ్మెల్సీలను భ్రమపెట్టేందుకు అమిత్ షాతో మాట్లాడినట్టు వేరే ఎవరితోనో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. 18 మంది ఎమ్మెల్సీలను బీజేపీలోకి పంపుతాను.. రెండేళ్లు మండలి రద్దు కాకుండా ఆపాలని చంద్రబాబు కోరారని, ఒక ఏడాది ఆపుతానని ఫోన్లోని అవతలి వ్యక్తి చెప్పినట్లు ఎమ్మెల్సీలను మభ్యపెట్టారని చెప్పారు. అమిత్ షా ఎందుకు లైన్లోకి వచ్చి మీతో మాట్లాడతారని ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తే బాబు వద్ద సమాధానం లేదన్నారు. అమరావతిలో కృత్రిమ ఉద్యమం ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని సజ్జల విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీని చంద్రబాబు పట్టించుకోక పోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బినామీ భూమల వ్యవహారం బయటపడుతుందనే, అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారని తెలిపారు. ఎన్టీఆర్ నిర్ణయాలను మండలిలో వ్యతిరేకించడం కరెక్టు కాదని అప్పట్లో ఈనాడు రాసిందని, ఇప్పుడేమో దానికి భిన్నంగా రాస్తోందని అన్నారు. లోకేశ్ను ఓడించి సీఎం జగన్ నాయకత్వాన్ని ఆహ్వానించిన ప్రాంతాన్ని, ఆ ప్రజలను తాము ఎట్లా విస్మరిస్తామని, భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందన్నారు. -
మండలి రద్దుపై లెఫ్ట్ యూ టర్న్!
సాక్షి, అమరావతి: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు, శాసన మండలి వంటివి దండగమారి వ్యవస్థలుగా అభివర్ణించిన కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నాయి. ఈ రెండు వ్యవస్థలు ఆరో వేలు లాంటివని, వీటివల్ల ప్రజాధనం వృథా కావడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని గతంలో వాదించిన లెఫ్ట్ పార్టీలు ప్రస్తుతం అందుకు భిన్నమైన గళం వినిపిస్తుండడం గమనార్హం. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసన మండలి రద్దు ప్రతిపాదన చేసినప్పుడు అందుకు మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు ఇప్పుడు స్వరం మార్చారు. విధానాలు మారిపోతాయా? రాష్ట్రంలో శాసన మండలి రద్దు ఆలోచనే అప్రజాస్వామికమని సీపీఎం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే వ్యవస్థలనే రద్దు చేస్తారా? అని సీపీఐ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆయా పార్టీల్లోని సీనియర్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వాలు మారినప్పుడల్లా కమ్యూనిస్టు విధానాలు మారిపోతాయా? అని నిలదీస్తున్నారు. ఎన్టీ రామారావు హయాంలో శాసన మండలి రద్దు తీర్మానాన్ని తాము సమర్థించామని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు నేత ఒకరు గుర్తుచేశారు. ప్రస్తుతం 6 రాష్ట్రాల్లోనే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయి. ఇటీవలి వరకు జమ్మూకశ్మీర్లోనూ మండలి ఉండేది. రాష్ట్ర హోదా రద్దయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన తర్వాత అక్కడ కూడా శాసన మండలి రద్దయ్యింది. అస్సాం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు ఉండేవి. తర్వాత అవి రద్దయ్యాయి. శాసన మండళ్లు వద్దని చెబుతున్న కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కౌన్సిల్ను రద్దు చేస్తామనే ప్రతిపాదన వచ్చీ రాకమునుపే అన్యాయం, అప్రజాస్వామికం అనడం దేనికి సంకేతమని సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.