human rights
-
చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా శాంతి బహుమతి
న్యూఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ప్రముఖ మానవ హక్కుల నేత, చిలీ మాజీ దేశాధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్ అందుకోనున్నారు. ఇందిరా గాంధీ శాంతి బహుమతి అంతర్జాతీయ జ్యూరీ చైర్మన్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం పాటుపడే వారిని ఈ అవార్డుతో గౌరవిస్తారు. ఐరాస మహిళా విభాగం వ్యవస్థాపక డైరెక్టర్గా, ఐరాస మానవ హక్కుల హై కమిషనర్గా, చిలీ అధ్యక్షురాలిగా లింగ సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం స్వదేశంలో, అంతర్జాతీయంగా మిచెల్ ఎంతగానో కృషి చేశారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ పేర్కొంది. -
మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. మా జీవనాధారమైన భూముల్ని ఇవ్వలేమని తెగేసి చెబుతున్నవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారు. కలెక్టర్పై దాడి జరిగిందనే సాకుతో పోలీసులు అర్ధరాత్రి మా ఇళ్లపై దాడులు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. మా గొంతులు పిసికి, కళ్లకు బట్టలు కట్టి కొట్టారు. మాతో అనుచితంగా ప్రవర్తించారు. పిల్లలు ఏడుస్తున్నా విన్పించుకోకుండా మా భర్తల్ని కొడుతూ తీసుకెళ్లారు. కొందర్ని జైళ్లలో వేశారు. మరికొందరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పట్లేదు. గత మూడ్రోజులుగా అన్నం తినలేదు. నిద్ర కూడా పోవడం లేదు. ఊళ్లో ఉండాలంటేనే భయమేస్తోంది. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చాం..’ అంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. సోమవారం ఆయా కమిషన్లను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ల ఏర్పాటు పేరుతో కేవలం గిరిజనుల భూముల లాక్కుంటున్నారని వారు ఫిర్యాదు చేశారు. మూడు పంటలు పండే భూములివ్వలేమని తొమ్మిది నెలలుగా అనేక అర్జీలు ఇస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. సీఎం బంధువులకు కంపెనీలు కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. మంచి చేస్తడని రేవంత్కు ఓటేసినం: కిష్టిబాయి‘మాకు మంచి చేస్తడని రేవంత్రెడ్డికి ఓటేసినం. కానీ మమ్మల్ని రోడ్డుమీద కూర్చునేలా చేసిండు. మేము చావనికైనా సిద్ధం కానీ గుంటెడు భూమి కూడా ఇవ్వం. మా దగ్గరికొస్తే బాగుండదు. తొమ్మిది నెలల నుంచి దీనిపై కొట్లాడుతున్నాం. ఎన్నోమార్లు కలెక్టర్కు లేఖలిచ్చి కాళ్ల మీద పడ్డాం. ఎంతోమందిని వేడుకున్నాం. అప్పుడు ముఖ్యమంత్రైనా, ఆయన అన్న తిరుపతిరెడ్డి అయినా రాలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి 500 మంది పోలీసోళ్లను పంపి మా గొంతుక పిసుకుతాడా?, మా ఆడోళ్ల దాడిమీద చేపిస్తవా? ఇదేనా మీ తీరు? మా కొడంగల్ ముఖ్యమంత్రివి అనుకుంటే పూర్తిగా కొడంగల్ పేరునే కరాబ్ చేశావ్. అరెస్టు అయిన మా పిల్లలను బయటకు తేవాలే. మా భూముల జోలికి రావొద్దు..’ అని గిరిజన మహిళ కిష్టిబాయి డిమాండ్ చేసింది.గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమంటున్నారు?: జ్యోతి‘ఆ భూములు మా ముత్తాతల నుంచి మాకు వచ్చాయి. అవన్నీ పట్టా భూములే. వాటిని గుంజుకుందామని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మంచిగా పండే పంట పొలాలను లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోంది. అక్కడ ఫార్మా కంపెనీ వద్దని చెబుతున్నా వినడం లేదు. చావనైనా చస్తాం కానీ భూములివ్వం. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెబుతున్నా రైతులపై ఎందుకు కేసులు పెడుతున్నారు? గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమని అంటున్నారు. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఊళ్లోకి వస్తే ఇద్దరు పోలీసులు కూడా రాలేదు కానీ ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డి వస్తే రెండు బస్సుల పోలీసులు ఎందుకు వచ్చారు? తిరుపతిరెడ్డి వచ్చి భూములివ్వకుంటే బాగుండదని ఆడవాళ్లని బెదిరిస్తున్నాడు. కలెక్టర్పై దాడి జరిగిందని చెబుతూ తాగొచ్చి ఆడపిల్లలు అని కూడా చూడకుండా తప్పుగా ప్రవర్తించారు. మహిళలను కొట్టిన, తప్పుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జైల్లో ఉన్న నా భర్తను విపరీతంగా కొట్టారు. ఆయన్ను కొట్టిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’ అని తొమ్మిది నెలల గర్భిణి జ్యోతి విజ్ఞప్తి చేసింది.మూడ్రోజుల నుంచీ ఏడుస్తూనే ఉన్నాం: దేవీబాయి‘తొమ్మిది నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములు పోతున్నాయని మేము బాధపడుతుంటే రాత్రిళ్లు వచ్చి మా ఇంటోళ్లని, పిల్లలను పట్టుకెళ్లారు. వారెక్కడున్నారో కూడా తెలియదు. మూడ్రోజుల నుంచి తిండీతిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉన్నాం. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం..’ అని దేవీబాయి ఆశాభావం వ్యక్తం చేసింది.దాడి జరగలేదని కలెక్టర్ చెప్పినా అరెస్టులు చేశారు: సుశీల‘భూములు పోతున్నాయని తిండికూడా పోతలేదు. నిద్రపోవడం లేదు. చిన్నచిన్న భూములున్న మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కలెక్టర్ స్వయంగా దాడి జరగలేదని చెప్పినా రాత్రి 12 గంటలప్పుడు కరెంట్ ఆపేసి ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. జైల్లో ఉన్న మా వాళ్లను కలవకుండా చేస్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే భూములు మాత్రం ఇవ్వం..’ అని సుశీల తెగేసి చెప్పింది. -
మానవ హక్కుల్ని కాలరాశారు: అమిత్షా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మానవహక్కుల్ని నక్సల్స్ దారుణంగా ఉల్లంఘిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆరోపించారు. 2026 మార్చికల్లా నక్సల్స్ను అంతంచేస్తామని ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితిపై సమీక్ష, నక్సల్స్ ఏరివేతకు ఉమ్మడి వ్యూహం, నక్సల్స్ ప్రభావిత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, అందుకు కేంద్రం సాయం తదితర అంశాలపై సోమవారం అమిత్ షా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ‘‘దేశంలో గిరిజనులుసహా 8 కోట్ల మంది ప్రజలకు అభివృద్ధి, కనీస సంక్షేమ అవకాశాలు దక్కకుండా నక్సల్స్ దారుణంగా మానవహక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. అటవీ, మారుమూల ప్రాంతాలకు విద్య, ఆరోగ్యం, అనుసంధానత, బ్యాంకింగ్, పోస్టల్ సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు. అభివృద్ధికి అవరోధంగా తయారయ్యారు’’ అని అమిత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘భద్రతాబలగాలు గతంలో రక్షణాత్మక ధోరణిని అవలంభించేవి. ఇప్పుడు దీటుగా సమాధానమిస్తున్నాయి. ఇటీవలికాలంలో బలగాలు ఘన విజయాలను సాధించాయి’’ అని ఇటీవల ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ను అమిత్ షా పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ నక్సల్స్తో పోరాటం తుది అంకానికి చేరుకుంది. అందరి సహకారంతో 2026 మార్చికల్లా నక్సల్స్ను రూపుమాపుతాం. దీంతో దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతాం. మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందిస్తూనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి్దపై దృష్టి పెట్టినప్పుడు నక్సలిజాన్ని అడ్డుకోగలం. పోలీస్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పనితీరు అద్భుతం. ఛత్తీస్గఢ్లో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో గ్రేహౌండ్స్ పైచేయి సాధించింది. 2022 ఏడాదిలో గత 30 ఏళ్లలో ఎన్నడూలేనంతగా వామపక్ష ప్రభావిత హింసకారణంగా మరణాలు వందలోపునకు దిగొచ్చాయి. ఇప్పటిదాకా ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్, వామపక్ష ప్రభావిత ప్రాంతాల నుంచి 13,000 మంది హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇకనైనా నక్సల్స్ ఆయుధాలు వీడాలి’’ అని అమిత్ షా పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ విజయం స్ఫూర్తిదాయకం‘‘ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కొత్త అభివృద్ధి ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను గిరిజ నులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్లో ఈఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 237 మంది నక్సలైట్లు చనిపో యారు. 812 మంది అరెస్టయ్యారు. 723 మంది నక్సలైట్లు లొంగిపోయారు’’ అని వివరించారు. తగ్గిన హింసాత్మక ఘటనలు‘‘ఇటీవలికాలంలో నక్సల్స్ హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయి. నక్సల్స్ హింస ఘటనలు 16,463 నుంచి 7,700కి దిగొచ్చాయి. పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు 70శాతం తగ్గాయి. హింస బారినపడిన జిల్లాల సంఖ్య 96 నుంచి 16కు తగ్గింది. తమ పరిధిలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న పోలీసు స్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి తగ్గింది. ఇది కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాల ఫలితం. నక్సలిజం రూపుమాపేందుకు తీసుకునే చర్యల పురోగతిని సీఎంలు నెలకోసారి సమీక్షించాలి. డీజీపీలు ప్రతి 15 రోజులకే సమీక్ష జరపాలి’’ అని అమిత్ సూచించారు. -
బతుకు చితికి.. గూడు చెదిరి... వలస బాట
పుట్టిన నేల.. పెరిగిన ఊరు.. ఇవే మనిషి అస్తిత్వం. కానీ యుద్ధం, హింస ప్రజలను నిరాశ్రయులను చేస్తోంది. అధికార దాహం, అహంకార ధోరణి కోట్ల మందిని సొంత నేలకే పరాయివాళ్లుగా మారుస్తోంది. గత పదేళ్లలో ప్రపంచ జనాభాలో ప్రతి 69 మందిలో ఒకరు చొప్పున ఏకంగా 12 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది తలదాచుకునేందుకు కూడా దిక్కులేక శరణార్థులుగా మారాల్సి వస్తోంది. ప్రాణాలను చేతబట్టుకుని విదేశాల బాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తోంది...! – సాక్షి, నేషనల్ డెస్క్సంఘర్షణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మందికి పైగా నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్ (యూఎన్హెచ్సీఆర్) వెల్లడించింది. వీరిలో 6.83 కోట్ల మంది సంఘర్షణలు, ఇతర సంక్షోభాల కారణంగా సొంత దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు చెదిరిపోయారు. దాదాపు 4.5 కోట్ల మంది పొట్ట చేత పట్టుకుని శరణార్థులుగా విదేశాలకు వలస వెళ్లారు. 2024 తొలి నాలుగు నెలల్లో ఇది మరింత పెరిగింది.పదేళ్లకోసారి రెట్టింపు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1951లో ఐరోపాలోని శరణార్థుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 1967లో శరణార్థుల కన్వెన్షన్ ఆవిర్భవించినప్పుడు 20 లక్షల మంది శరణార్థులున్నారు. ⇒ 1980 నాటికి కోటికి చేరిన శరణార్థులు ⇒ 1990 నాటికి రెండు కోట్లకు చేరిన సంఖ్య⇒ 2021 చివరి నాటికి 3 కోట్లను మించిన శరణార్థులు⇒ తాజాగా 11 కోట్లు దాటేసిన వైనం2020 నుంచి వేగంగా...⇒ 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక 2023 చివరి నాటికి 60 లక్షల మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది దేశం విడిచి వెళ్లారు. ⇒ 2023లో సుడాన్లో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు శరణార్థుల సంఖ్యను 10.5 లక్షలు పెంచాయి. ⇒ ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజాలో గతేడాది చివరి మూడు నెలల్లో 10.7 లక్షల మంది నిరాశ్రయులై వలస వెళ్లారు.ఎక్కడి నుంచి వస్తున్నారు?⇒ ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 4.5 కోట్ల మంది శరణార్థులలో దాదాపు మూడొంతులు (72 శాతం) ఐదు దేశాల నుంచే వచ్చారు.అఫ్గానిస్తాన్ 64 లక్షలు సిరియా 64 లక్షలు వెనెజులా 61 లక్షలు ఉక్రెయిన్ 60 లక్షలు పాలస్తీనా 60 లక్షలుఆశ్రయమిస్తున్న దేశాలు?⇒ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది శరణార్థులు తమ స మీప పొరుగు దేశాల్లోనే బతుకీడుస్తున్నారు. ⇒ ఇరాన్, పాకిస్తాన్లోని శరణార్థులందరూ అఫ్గాన్లే. ⇒ టర్కీలో ఎక్కువ మంది శరణార్థులు సిరియన్లు.దేశం శరణార్థులు ఇరాన్ 38 లక్షలు తుర్కియే 33 లక్షలు కొలంబియా 29 లక్షలు జర్మనీ 26 లక్షలు పాకిస్తాన్ 20 లక్షలు -
రష్యా హక్కుల నేతకు 30 నెలల జైలు
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగిన తీరును తీవ్రంగా తప్పుబడుతూ వ్యాసాలు రాసిన రష్యా మానవ హక్కుల కార్యకర్తపై అక్కడి కోర్టు కన్నెర్రజేసింది. ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ ఆర్టికల్స్ రాయడం నేరమంటూ 70 ఏళ్ల ఒలెగ్ ఓర్లోవ్కు 30 నెలల కారాగార శిక్ష విధిస్తూ మాస్కో కోర్టు తీర్పు చెప్పింది. రాజకీయ దురుద్దేశ్యంతో పెట్టిన కేసు ఇది అని ఆయన చేసిన వాదనలను కోర్టు పట్టించుకోలేదు. ఆయనకు రెండు సంవత్సరాల 11 నెలల జైలు శిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా రెండు సంవత్సరాల ఆరునెలల శిక్షను కోర్టు ఖరారుచేసింది. ఈ కేసులో గతంలోనే విచారణ ముగిసింది. అప్పుడు ఆయనకు కొంతమేర జరిమానా కట్టాలని మాత్రమే కోర్టు సూచించింది. అయితే పుతిన్ ప్రభుత్వంపై విమర్శలను సహించేది లేదని, కఠిన శిక్ష వేయాల్సిందేనని ప్రాసిక్యూషన్ ఈ కేసు పునర్విచారణను కోరి చివరకు ఇలా శిక్ష పడేలా చేసింది. గతంలో నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని అందుకున్న మానవహక్కుల సంస్థ ‘మెమోరియల్’కు ఓర్లోవ్ సహ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఓర్లోవ్ను శిక్షించడాన్ని మెమోరియల్ సంస్థ తీవ్రంగా తప్పుబట్టింది. తమ ఉద్యమం ఆగదని పేర్కొంది. -
మహ్సా అమినికి
స్ట్రాస్బర్గ్(ఫ్రాన్సు): గత ఏడాది ఇరాన్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన కుర్దిష్–ఇరాన్ మహిళ మహ్సా అమిని(22)కి యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం ప్రకటించింది. మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సఖరోవ్ పురస్కారాన్ని యూరోపియన్ యూనియన్ ఏటా ప్రకటిస్తోంది. డిసెంబర్ 13న జరిగే కార్యక్రమంలో మహ్సా అమిని కుటుంబీకులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. హిజాబ్ ధరించలేదనే కారణంతో మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె గత ఏడాది సెప్టెంబర్ 16న మృతి చెందారు. ఇది ప్రభుత్వ హత్యేనంటూ దేశవ్యాప్తంగా కొన్ని నెలలపాటు తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం వాటిని బలప్రయోగంతో అణచివేసింది. గత ఏడాది సఖరోవ్ పురస్కారాన్ని రష్యా దురాక్రమ ణను ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు ప్రకటించారు. ఈ అవార్డును ఒకప్పటి సోవియెట్ యూనియన్ అసమ్మతి వాది ఆండ్రీ సఖరోవ్ పేరిట 1988లో నెలకొల్పారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సఖరోవ్ 1989లో మరణించారు -
Deepika Deshwal: ముచ్చటగా మూడోసారి...
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది. కాలేజీ రోజుల నుంచి సేవాపథంలో నడుస్తున్న దిల్లీకి చెందిన దీపిక ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, ఎన్నోరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. నలుగురిని ఒకటి చేసి తన దారిలో నడిచేలా చేసింది... పీహెచ్డీ స్కాలర్ అయిన దీపికా దేశ్వాల్కు చదువు మాత్రమే ప్రపంచం కాదు. కాలేజీ రోజుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. కోవిడ్ కల్లోల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంది. పంజాబ్లోని మోగా జిల్లాలో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వందలాదిమందికి సహాయం అందించింది. స్నేహితులు, బంధువులను కూడా తన సేవాకార్యక్రమాలలో భాగం చేసింది. అన్నదానం నుంచి అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వరకు ఎన్నో చేసింది. తన జీతం మొత్తం కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేది. ఆమె తండ్రి కూడా తన జీతంలోని కొంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చేవాడు. ఏ అవసరం ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయమంటూ ఎంతోమందికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా పరుగులు తీసేది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న 80 మంది అమ్మాయిలకు అండగా నిలిచి, నేరస్థులు అరెస్ట్ అయేలా ఉద్యమించింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మహిళా సాధికారత నుంచి మానవ హక్కుల వరకు ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించిన దీపికకు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. గత రెండు సమావేశాల్లో ‘మానవ హక్కులు–మహిళా హక్కులు’ అంశంపై మాట్లాడి 150 దేశాలకు చెందిన ప్రతినిధుల ద్వారా ప్రశంసలు అందుకుంది. మనసున్న దీపిక ఆటల్లోనూ బంగారం అనిపించుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ లో రెజ్లింగ్, జూడోలలో ఆరుసార్లు బంగారు పతకం గెలుచుకుంది. ఆత్మరక్షణకు సంబంధించి అమ్మాయిల కోసం రకరకాల వర్క్షాప్లు నిర్వహించింది. -
ఉత్తర కొరియా అరాచకాలు..వెలుగులోకి విస్తుపోయే దారుణాలు!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదీగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యహరిస్తాడంటూ.. పలు వార్తలు గుప్పుమన్నాయి కూడా. వాటిలో నిజానిజాలు ఎంత అనేది అందరి మదిలో తలెత్తిన ప్రశ్న. అయితే ఇప్పుడూ అవన్నీ నిజమేనంటూ బల్లగుద్ది మరీ చెబుతోంది దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ. అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా ఒక నివేదికను కూడా ఇచ్చింది. అందులో ఉత్తర కొరియా ఎంత ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందో వివరించింది. అందుకోసం దక్షిణ కొరియా 2017 నుంచి 2022 మధ్యలో తమ మాతృభూమిని వదిలో వచ్చేసిన దాదాపు 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదికలో.. అక్కడ పౌరుల జీవించే హక్కే ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల దగ్గర నుంచి వికలాంగులు, గర్భిణీల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా ఉరిశిక్షలు అమలు చేసినట్లు తెలిపింది. ప్రజలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మానవ ప్రయోగాల్లోకి దించినట్లు పేర్కొంది. నర్సు చేత బలవంతంగా మరుగుజ్జుల జాబితాను తయారు చేయించి .. వారిపై మానవ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపింది. ఒక ఆరు నెలల గర్భిణి స్త్రీ తన ఇంటిలో దివగంత కిమ్ ఇల్ సంగ్ చిత్రపటం ఎదుట డ్యాన్స్లు చేసిందన్న కారణంతో ఉరితీశారు. అలాగే దక్షిణ కొరియా మీడియాకు సంబంధించి ఏదైనా ఆన్లైన్లో షేర్చేసినా, అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినా.. వారందర్నీ ఉరితీసినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో ఫుటేజ్ని చూస్తూ.. నల్లమందు సేవించిన ఆరుగురు యువకులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చెప్పినట్లు పేర్కొంది. మనుషులను మానవ ప్రయోగాల కోసం నిద్రమాత్రలు ఇచ్చి మరీ ఆస్పత్రికి తరలించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా వికలాంగులు, మరగుజ్జుగా ఉన్నవారిపై ఇష్టారాజ్యంగా మానవ ప్రయోగాలు నిర్వహించారంటూ..అక్కడ జరిగిన భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 450 పేజీల నివేదికను దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ సమర్పించింది. (చదవండి: మిస్టరీగా కొత్త వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో ముగ్గురు మృతి!) -
దేశభక్తి అంటే తిరంగా సెల్ఫీ కాదు!
శాసన వేదికల్లో బిల్లుల్ని కృత్రిమంగా ఆపే సంస్కృతిని కేంద్ర పాలకులు ప్రవేశపెట్టారు. అందుకే ‘ధిక్కార స్వరంతో వ్యవహరించే పాలకులున్న చోట రాజ్యాంగ చట్ట నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు జరిపించడంలో సుప్రీంకోర్టు నిజమైన రాజ్యాంగ రక్షకురాలిగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని భారత్ లా కమిషన్ అధ్యక్షుడు ఎ.పి. షా స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణా శక్తిగా ఉండవలసినవాళ్లు ఆ బాధ్యత నుంచి తప్పుకోబట్టే దేశంలో పౌర హక్కులకు రక్షణ లేకుండా పోయింది. అందుకే ‘దేశభక్తి అంటే– తిరంగా సెల్ఫీ కాదు, తరాలుగా కూలబడిన పిట్టలకు రెక్క విదిల్చే తెగువనివ్వడం!’ ఇటీవలనే గుజరాత్లో ముగిసిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి రకరకాల కార ణాలను ఊహించుకుంటున్న దశలో అను కోని చిత్రమైన ‘విశేషాలు’ వెల్లడయ్యాయి. గుజరాత్ ఎన్నికల్లో అర వింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ రంగంలోకి దిగింది. బీజేపీని గెలిపించడానికే పరోక్షంగా పనిచేసిందని కొందరు ఊహిస్తే... కాదు గుజరాత్లో కూడా ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ ఉనికిని చాటుకోవడం ద్వారా అఖిల భారత స్థాయిలో తన ఓటు బ్యాంకుని పెంచుకొని జాతీయ స్థాయి రాజకీయ పక్షంగా నిలబడుతుందనీ, ఇది గొప్ప పరిణామమనీ మరికొందరు భావించారు. దీనికి తోడు అటు కాంగ్రెస్ పాలనలో మాదిరే ఇటు బీజేపీ–ఆరెస్సెస్ ఉమ్మడి పాలనలో కూడా తమకు అనుకూలమైన కేంద్ర ఎన్నికల కమిషన్లను, కమిషనర్లను నియమించుకోవడం దేశ ప్రజలకు అనుభవమే! ఎందుకంటే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ఘడియ ఆఖరిదశ డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ముగిసినప్పుడు 93 నియోజక వర్గాలలో 58.8 శాతం ఓటింగ్ నమోదు అయింది. కానీ ఆ ఓటింగ్ శాతాన్ని మరుసటి రోజు ఎలక్షన్ కమిషన్ 65.3 శాతంగా సవరించింది. మొదటి దశలో నమోదైన ఓటింగ్ను ముందు 60.11 శాతంగా చూపించి, తర్వాత దాన్ని 63.14 శాతంగా సవరించారు. అంటే, 2017 ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ కన్నా, 2022 ఎన్నికల్లో నాలుగు శాతంపైగా ఓట్లు తగ్గిపోయాయి. కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ కొత్తగా గుజరాత్లో రంగంలోకి దిగినందువల్ల ప్రత్యేకించి అది బీజేపీకి పరోక్షంగా సాయపడిందీ లేదు. పైగా తన సత్తాను ఉన్నంత లోనే ‘ఆమ్ ఆద్మీ’ ఆచరణలో రుజువు చేసుకొంది కూడా! కాగా, క్రమానుగతంగా బీజేపీ–ఆరెస్సెస్ పాలకుల కనుసన్నల్లో గత ఎనిమిది తొమ్మిదేళ్లుగా దేశంలో జరిగిందని చెప్పుకొంటున్న ‘ప్రగతి’ ఫలితాలన్నీ – ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాన్ని పూర్తిగా తారుమారు చేయడం. సంపూర్ణ ప్రైవేటీ కరణ దిశగా మరలడం. బహుశా ఈ పరిణామాల దృష్ట్యానే భారత్ లా కమిషన్ అధ్యక్షుడు, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎ.పి. షా ఇలా వ్యాఖ్యానించారు: ‘‘దేశంలో, రాష్ట్రాలలో అధికార బలం చూసు కుని వ్యవహరించే పాలక వర్గాలున్న చోట దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ మౌలిక ప్రయోజనాల సంరక్షక శక్తిగా వ్యవహరించాల్సి ఉంటుంది.’’ ఈ హెచ్చరిక ఎప్పటికీ శిరోధార్యం కావాలి. మూడు రాజధానుల నిర్మాణం ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవకాశం ఉంటుందని భావించి ఆ ప్రయత్నాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి కొట్టేందుకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ‘హైకోర్టే ప్రభుత్వమైతే, ఇంక ప్రజ లెన్నుకున్న మంత్రివర్గం దేనికి? ప్రజా ప్రతినిధులెందుకు?’ అని ప్రశ్నించింది. ‘ఫలానా ప్రాంతంలోనే రాజధాని ఉండాలని ఆదేశించే అధికారం’ కోర్టులకు లేదనీ స్పష్టం చేయవలసి వచ్చింది. అంతేగాదు, కొంతమంది జడ్జీలను హైకోర్టు, సుప్రీంకోర్టులకు ప్రమోట్ చేస్తూ నూతన సుప్రీం ధర్మాసనం చేసిన (నవంబర్ 28) ప్రతిపాదనను పాలకవర్గం అమలు చేయకుండా తొక్కి పట్టినందుకు సుప్రీంకోర్టు ఆగ్రహం ప్రకటించవలసి వచ్చింది. ఇటీవల హైకోర్టు లలో నియామకానికి సుప్రీం ధర్మాసనం ప్రతిపాదించిన 20 మంది జడ్జీల పేర్లను పునఃపరిశీలించాలని బీజేపీ పాలకులు ఒత్తిడి చేయ డాన్ని సుప్రీంకోర్టు నిరసించిందని మరచిపోరాదు. అంతేగాదు, శాసన వేదికల్లో బిల్లుల్ని కృత్రిమంగా ఆపే సంస్కృతిని కూడా బీజేపీ పాలకులు ప్రవేశపెట్టారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత తొలి రాష్ట్రపతిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత, ఇవాళ్టి లాగా ఎన్నడూ తమకు అనుకూలంగా లేని బిల్లుల్ని కృత్రి మంగా తొక్కిపట్టడానికి గానీ, తాను నియమించిన గవర్నర్లు అలాంటి పనులకు పాల్పడటానికి గానీ అనుమతించలేదు. భారత లౌకిక రాజ్యాంగ నిబంధనలను తు.చ. తప్పక పాటించి తీరాలనీ, కారణాలు చూపకుండా బిల్లుల్ని తమ వద్దే పాలక వర్గాలు ఉంచుకొని సభాధికారాన్ని ధిక్కరించరాదనీ సుప్రీం మాజీ న్యాయమూర్తి, నేష నల్ లా కమిషన్ మాజీ అధ్యక్షులు జస్టిస్ జీవన్ రెడ్డి పదే పదే మొత్తుకొంటూ వచ్చారు. అంతేగాదు, చివరికి స్వతంత్ర నిర్ణయాలు చేసుకొని రాజకీయ జోక్యానికి దూరంగా నిర్ణయాలను అమలు జరపాల్సిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లోకి కూడా పాలకులు తలదూర్చే స్థితి వచ్చింది. అందుకనే లా కమిషన్ మాజీ అధ్యక్షుడు జస్టిస్ ఎ.పి. షా అనుభవం మీద ‘ధిక్కార స్వరంతో వ్యవహరించే పాలకులున్న చోట రాజ్యాంగ చట్ట నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు జరిపించడంలో సుప్రీంకోర్టు నిజమైన రాజ్యాంగ రక్షకురాలిగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేయాల్సి వచ్చింది. రాజ్యాంగ పరిరక్షణా శక్తిగా ఉండవలసిన పాలకులు ఆ బాధ్యత నుంచి తప్పుకొని సొంత అజెండాలతో పాలన వెలగ బెడుతూండబట్టే దేశంలో పౌర హక్కు లకు రక్షణ లేకుండా పోయింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని పౌర హక్కులకు రాబోతున్న ప్రమాదం గురించి హెచ్చరిక చేసినా, పాలకు లకు ‘చీమ కుట్టలేదు’! జస్టిస్ వెంకటాచలయ్య, జస్టిస్ జె.ఎస్. వర్మ లాగా నేటి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నిర్ణయాలలో తన స్వతంత్ర వ్యక్తి త్వాన్ని కాపాడుకుంటూ దేశ ప్రజలకు ఆశావహమైన నిర్ణయాలతో అకుంఠితంగా ముందుకు సాగడం పాలకులకు ‘గొంతులో వెల క్కాయ పడిన’ట్టుగా ఉంది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు ఇచ్చిన హామీని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ‘మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వీటిలో మరే వివక్షతోనూ దేశ పౌరులను వేరుచేసి చూడటం నేరం’ అని స్పష్టంగా ప్రకటించారు. అయినా కుల, మత జాడ్యాలకు కళ్లెం పడకపోవడానికి కారణం భారత పార్లమెంటులో ‘సవర్ణ హిందు వుల’ సంఖ్య పెరగడమేనని అంబేడ్కర్ వివరించారు. సుప్రసిద్ధ పార్ల మెంటేరియన్ మహావీర్ త్యాగి ఒక సందర్భంలో రాజ్యాంగ ముసా యిదా కమిటీకి ఒక సవాలు విసిరారు: ‘‘రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చిన పౌర ప్రాథమిక హక్కులలో భాగంగా, ఆ హక్కులకు విరుద్ధంగా ప్రవర్తించే ప్రభుత్వాలను పడగొట్టే హక్కును కూడా అనుమతిస్తారా, లేదా? అలాంటి హక్కును మీరు కల్పించినట్టు లేదు. ప్రభుత్వ హక్కుల్ని మాత్రమే గుర్తించడంతో సరిపోదు, అదే మోతాదులో ప్రజల హక్కుల్ని గుర్తించాలి’’ అన్నారు మహావీర్ త్యాగి! ఈ ప్రతి పాదనతో అంగీకరిస్తూ అంబేడ్కర్ ఇలా స్పష్టం చేశారు: ‘‘రాజకీయ పదవులు లేదా మరొక పద్ధతుల్లో ప్రలోభాలు సభ్యులకు కట్టబెట్టడం ద్వారా ప్రయోజనం లేదు. ఈ రకమైన ప్రలోభాలకు మొత్తం పార్ల మెంట్ సభ్యుల్ని అలవాటు చేశామంటే పార్లమెంట్ స్వతంత్ర ప్రతి పత్తే నాశనమౌతుంది. వందిమాగధులకు వత్తాసు పెరిగి సంస్థ నాశన మవుతుంది. పార్లమెంట్ను మరొక స్టాక్ ఎక్స్ఛేంజ్గా, బ్రోకర్ల సంస్థగా మార్చకూడదు’’ అన్నారు. బహుశా ఇలాంటి అనుభవాలను చవిచూసిన తర్వాతనే కాబోలు కవి కంచరాన భుజంగరావు ఇలా ఆక్రోశించి ఉంటారు. ‘‘అర్ధరాత్రి సంకెళ్లు తెగిన జాతికి/ సూర్యోదయం ఒక సహజ మైన ఆశ/ తెల్లవారడం ఒక అనంతమైన భరోసా/... దొరల బూట్లలో కాలు పెట్టినప్పుడే/ అభివృద్ధి నడక ఎక్కడో తప్పటడుగులు వేసింది/ కొండల్ని మేరువులుగా బలిపించి/ కూసుల్ని కురచబార్చింది/ ఇప్పుడు చూడండి/ కేవలం రెండొందల మర్రి చెట్ల (మహాకోటీశ్వర్లు) నీడ దేశాన్ని కమ్మేసింది/ ఎదుగూ బొదుగూ లేని బీదల నేల/ వాడ ల్లోకి మురికివాడల్లోకి మునగ దీసుకుంది/ నేడు పెట్టుబడి ఒక్కటే వీసా లేకుండా దేశాలు తిరిగేస్తోంది/ ఈ గడ్డమీద పెట్టుబడికి ఉన్నంత స్వేచ్ఛ/ వేరెవరికైనా ఉందంటారా?/ ఇప్పుడిక దేశభక్తి అంటే – తిరంగా సెల్ఫీ కాదు సామీ/ రెక్కల మీది వివక్ష బరువుతో/ తరాలుగా కూలబడిన పిట్టలకు/ రెక్క విదిల్చే తెగువనివ్వడం/ రెండు గుండెల వాళ్ల కపటత్వాన్ని ఎదురొడ్డి/ ఉన్న ఒక్క గుండెను స్వేచ్ఛా కాశం కోసం/ ప్రజా పతాకను చేసి ఎగరేయడం! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు. abkprasad2006@yahoo.co.in -
వివక్ష ఉందంటే ఉలుకెందుకు?
వివక్ష సృష్టికర్తలు, వివక్ష లేదని చెప్పడమో లేక దాన్ని తక్కువ చేసి చూపడమో చేస్తూ వుంటారు. అందులో భాగంగానే బాధితుల ఆక్రందనల్ని ప్రమాదకరమైన అలవాట్లుగా చూపిస్తుంటారు. ఈ మధ్య ఒక వైపు దళితుల మీద వివక్ష వుందని చెబుతూనే మరోవైపు వివక్ష తీవ్రతనూ, పరిమాణాన్నీ పలుచన చేసి చూపించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. నవంబర్ 17న ‘సాక్షి’లో పి. కృష్ణమోహన్ రెడ్డి రాసిన ‘ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?’ వ్యాసంలో ఈ ధోరణి కనిపిస్తుంది. ఆధారాల కంటే సొంత అవసరాలనే నిజాలుగా ప్రచారంచేసే పోస్ట్– ట్రూత్ మేధావులు పెరిగిపోయారు. ఇక్కడి వివక్షని తెలుసు కోవడానికి విదేశాల రిపోర్టులు అవసరం లేదనీ... నిజాన్ని గుర్తించే జ్ఞానం వుంటే సరిపోతుందనీ తెలుసుకోలేకపోతున్నారు. కులం కొనసాగింపు కోసం కొత్తకొత్త వాదనలు కనిపెడుతున్నారు. దళితులు ప్రతి విషయాన్నీ కుల కోణం నుంచి చూస్తున్నారని ఆందోళన చెందటం అందులో మొదటిది. తమ తప్పును కప్పిపుచ్చు కోవడానికి అన్ని కులాలు వివక్ష ఎదుర్కొంటున్నాయి అంటారు. దళితులు ఎదుర్కొనే అంటరానితనం భిన్నమైందని ఒప్పుకోరు. ‘కొన్ని సంఘటన లను చూపించి’ దేశమంతా వివక్ష ఉందనడం సరి కాదంటారు. 2021లోనే దేశంలో 50,900 దాడులు నమోదు అయినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెప్పింది. ఇన్ని దాడులు చెదురు మదురు ఘటనలుగా కనిపించడం ఆశ్చర్యమే. దళితులు ఇక్కడి వివక్షనే ఎదిరించడం ‘అధర్మ’మట. ఆఫ్రికాలో అపార్తీడ్కూ, అమెరికాలో జాతి వివక్షకూ వ్యతిరేకంగా దళితులు సంఘీభావం ప్రకటించడం వీళ్ళకి కనబడదు. ఎక్కడో వివక్ష ఉంది కాబట్టి ఇక్కడ దళితులు దాన్ని అనుభవించాలంటారు! ఆస్ట్రేలియాలో ఆదివాసీలకు జరిగిన అన్యాయానికి ఆ దేశ అధినేత క్షమాపణ చెప్పాడు. అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ క్షమాపణలు చెప్పారు. అలాంటి ఊరట కలిగించే మాట ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? రిజర్వేషన్లు సమానత్వానికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. కానీ వీళ్ళకు కులం, అంటరానితనం అసమానత్వంగా కనబడవు. అమెరికాలో ‘పౌర హక్కుల చట్టం 1964’ ప్రకారం జాతి, మతం, లింగం వంటి అంశాల వల్ల ఒక వ్యక్తిని వివక్షకు గురి చేయకూడదు. ఈ చట్టం లోని ‘టైటిల్ సెవెన్’ ప్రకారం ప్రభుత్వంతో కలిసి పనిచేసే వ్యక్తులు, సంస్థలు... కాంట్రాక్టులు, వ్యాపారాల్లో అఫర్మే టివ్ యాక్షన్ ప్లాన్ అమలు చేసి తీరాలి. అంటే నల్ల జాతీయులు, లాటిన్ అమెరికన్స్, మహిళలు, మైనారిటీలు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి తప్పకుండా ఉద్యోగావకాశాలు కల్పించాలి. నియామకాలలో డైవర్సిటీ ఇండెక్స్ పాటించి తీరాలి. ఇది రిజర్వేషన్ లాంటిదే. అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీల్లో డైవర్సిటీ ఇండెక్స్, హాలీవుడ్ సినిమాల్లో నల్ల జాతీయులు కనిపించడం వంటివి అఫర్మేటివ్ యాక్షన్లో భాగమే. దౌర్భాగ్యం ఏంటంటే... బతుకుదెరువు కోసం వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న మన వాళ్ళు అక్కడ కూడా కుల వివక్షను పెంచి పోషిస్తున్నారు. అందుకే అక్కడి దళితులు నల్లజాతీయుల లాగే తమకూ రక్షణ చట్టాలు కావాలని ఉద్యమాలు చేస్తున్నారు. అకడమిక్స్లోనూ వివక్ష రాజ్యమేలుతోంది. దానికి వ్యతిరేకంగా పోరాడే విద్యార్థులనూ, ఉద్యోగులనూ కులవాదులుగా చిత్రించడం ‘అలవాటైన దుర్మార్గం’ కాదా? దళితులు ఇప్పుడిప్పుడే చదువుకు దగ్గర అవుతున్నారు. వాళ్లకి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు విష వలయాలుగా మారటం అన్యాయం కాదా? అంబేడ్కర్ మీద అక్కసు వెళ్లగక్కడం మరో పోకడ. గతంలో అమెరికాకి చెందిన నల్లజాతి నాయకులు ఇండియా వచ్చి గాంధీని కలిసి ఆహ్వానించారు గాని అంబేడ్కర్ని కలవలేదని పెద్ద రహా స్యాన్ని కనిపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. గాంధీని పిలిచారు కాబట్టి అంబేడ్కర్ వివక్ష మీద పోరాటం చెయ్యలేదని చెప్పగలరా? గాంధీ ఒక దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న నేతగా ప్రపంచాన్ని ఆకర్షించాడనే సంగతిని మరువరాదు. అంబేడ్కర్ను తక్కువ చేసి చూపాలనే దుగ్ధతో అనవసరమైన పోలికలు తీసుకొస్తే ఎలా? ‘అంబే డ్కర్ ఎంతో సహనంతో ఇప్పటిదాక నామీద దాడి చెయ్యకపోవడం అతని గొప్పతనమే’ అని గాంధీ స్వయంగా ‘హరిజన’ పత్రికలో ఎందుకు రాసుకున్నాడో తెలిస్తే లోతు అర్థమౌతుంది. దేశంలో చాక్లెట్ కొన్నా పన్ను కట్టాల్సిందే. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ... మిగిలిన పౌరుల్లాగానే పన్ను కడుతున్నారు. అందులోంచే సంక్షేమ కార్యక్రమాలకూ, పారిశ్రామిక వసతుల కోసం, కార్పొరేట్ లకూ, భూమి ఉన్న రైతులకూ రాయితీలు ఇవ్వడం కోసం ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. రాయితీల్లో తొంబై శాతం పైగా లబ్ధి దారులు పైకులాలవారే. ఈ రాయితీలతో పోల్చుకుంటే రిజర్వేషన్ల విలువ అతి స్వల్పం. దేశాన్నే ప్రైవేట్ చేతుల్లో పెడుతుంటే పట్టించు కోకుండా తరతరాలుగా అణచివేతకు గురైనవారికి ఇస్తున్న రిజర్వేషన్ల మీద దాడిచేయడం ఏమిటి? కులం పేరుతో ఎవరి పట్లయినా వివక్ష చూపడం జరిగినా, దాడి జరిగినా నైతికంగా అందరూ బాధ్యత వహించాలి. దాన్ని అందరూ గర్హించాలి. (క్లిక్ చేయండి: మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?) - ప్రొఫెసర్ శ్రీపతి రాముడు ఆచార్యులు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇన్క్లూజివ్ పాలసీ, హెచ్సీయూ -
మానవ హక్కులకు ప్రాణధార
‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది’ అన్నాడు గోల్డ్స్మిత్. ఆదర్శంలో ప్రతి ఒక్కరూ వారి స్థాయితో నిమిత్తం లేకుండా తమ ఫిర్యాదును న్యాయస్థానానికి నివేదించుకోగలగాలి. అందుకే జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణు లకు అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించవలసి వచ్చింది. కానీ ‘చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి దూరితే దాని కథ ముగిసినట్టే’ అన్నాడు సోలన్. అందుకే రాజ్యాంగంలోని 32వ అధికరణానికి ఉన్న పరిమితులను సైతం దృష్టిలో ఉంచుకుని మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న న్యాయమూర్తులు ఉన్నారు. అలాంటివారిలో... జస్టిస్ యతిరాజులు ఒకరు. ‘‘ఎంతటి సాధారణ పౌరుడైనా, జీవి తంలో అతడు ఏ స్థానంలో ఉన్నా, దానితో నిమిత్తం లేకుండా న్యాయస్థానంలో తన కేసును హుందాగా వినిపించే హక్కు అతనికి ఉంది. అంతే హుందా తనంతో కోర్టు అతని వాదనను సానుభూతితో వినే మర్యాదనూ పాటించాలి. ప్రజా సమస్యలను వినడానికే న్యాయస్థానాలు ఉన్నాయి. కోర్టులో న్యాయం కోసం వచ్చే పౌరుల్ని యాచకులుగానూ, పీడకులు గానూ చూడరాదు.’’ – 1988 షీలా బర్సీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ‘‘తీర్పు గుడ్డిది కావచ్చుగానీ, తీర్పరి (జడ్జి) గుడ్డివాడు కాకూడదు. – సుధాంశు రంజన్, సుప్రసిద్ధ జర్నలిస్టు, ‘జస్టిస్ వర్సెస్ జ్యుడీషియరీ’ గ్రంథం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2019 భారత రాజ్యాంగ సూత్రాలను, ‘భారత ప్రజలమైన మేము మాకుగా రూపొందించుకున్న సెక్యులర్ రాజ్యాంగాన్ని’ కంటికి రెప్పలా కాపాడుకునే హక్కు మాకు ఉందని రాజ్యాంగం పీఠికలోనే నిర్ద్వంద్వంగా ప్రకటించి ఉన్నందున అది ఎప్పటికీ అనుల్లంఘనీయ మని ప్రముఖ తెలుగు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ జి. యతి రాజులు చాటి చెప్పారు. రాజ్యాంగ అతిక్రమణ జరిగినప్పుడు ‘రాజ్యాంగ పరిహార’ హక్కును 32వ అధికరణం ప్రసాదిస్తోంది. భాగమైన 32వ అధికరణకు ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ– ఆ ఇబ్బందుల ఫలితంగా పాలక వర్గాలు, అధికారులు, పోలీసుల వల్ల సామాన్య ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తోందో వివరించారు. ‘‘జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణులకు’’ అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీం కోర్టు ఎందుకు గుర్తించవలసి వచ్చిందో జస్టిస్ యతిరాజులు పదే పదే ప్రస్తావించవలసి వచ్చింది (‘ఆర్టికల్ 32 అండ్ ద రెమెడీ ఆఫ్ కాంపె న్సేషన్’ పేరుతో రాసిన పుస్తకంలో). అయితే, దురదృష్టవశాత్తూ, కాదుకాదు, రాజ్యాంగ ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడి పౌరహక్కుల అధ్యాయానికి తూట్లు పొడవడానికి అలవాటుపడిన పాలకవర్గాలు పౌరులకు ఉపయోగపడాల్సిన అధికరణలను ఆచరణలో అమలు కాకుండా చేసే యంత్రాంగాన్ని చొప్పించాయి. ఆదేశిక సూత్రాల లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన. అవి అమలు జరగాలంటే వాటికి చట్టబద్ధత అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని విస్మరించరాదు. కొంతమంది వ్యక్తులకు సౌకర్యాల పేరిట కల్పించిన ప్రత్యేక హక్కులను అవసరమైతే సవరించయినా సరే ఆదేశిక సూత్రాలను అమలు జరపాలని కనీసం తొమ్మిది, పది కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది (1970–1987 మధ్యకాలంలో). రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రాధా న్యతను నొక్కి చెప్పడానికి జస్టిస్ యతి రాజులు ‘‘మానవ హక్కుల, ప్రాథమిక స్వేచ్ఛా స్వాతంత్య్రాల’’ రక్షణ ప్రాధాన్య తను ఉగ్గడించిన యూరోపియన్ కన్వెన్షన్ అధికరణలో పెక్కింటిని కూడా ఉదాహ రించారు. ఈ 32వ అధికరణ ఆసరాగానే పాలకులు ప్రత్యర్థులపై విధించే అక్రమ కేసుల నుంచి విడిపించే ‘హెబియస్ కార్పస్’ పిటీషన్ కూడా అమలులోకి రాగ ల్గింది! అలాంటి అధికారం ఉన్న 32వ అధిక రణను విధిగా అమలు జరిపే బాధ్యత నుంచి తప్పించి అమలు లోకి రాకుండా చేశారు. అలాంటి 32వ అధికరణ అమలు జరపడా నికున్న అడ్డంకులను ఛేదించిన జస్టిస్ యతిరాజులును న్యాయ శాస్త్రంలో ఉద్దండులైన పలువురు పాత తరం న్యాయ మూర్తులకు దీటైనవారిగా భావించవచ్చు. సుప్రసిద్ధ గోల్డ్స్మిత్ అన్నట్టు ‘‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది.’’ అయితే గతించిన శతాబ్దంలో ఏథెన్స్లో ధనికులకూ, పేదలకూ మధ్య దుర్భరమైన అంతరం ఏర్పడినప్పుడు రాచరిక కుటుంబీకుడైన సోలన్ రంగంలోకి దిగాడు. స్వయంగా ప్రజలకు ఆర్థిక బానిసత్వం నుంచి, అప్పుల నుంచి విముక్తి కల్పించాడు. జైళ్లపాలైన వారిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశాడు. పేదల్ని పిండి వసూలు చేసే పన్నులకు పన్నెండు రెట్లు ఎక్కువ పన్నును ధనిక వర్గాల నుంచి రాబట్టాడు. కోర్టులను ప్రజాబాహుళ్యం అవసరాలకు అనుగుణంగా సంస్కరిం చాడు. ఏథెన్స్ నగర రక్షణలో ప్రాణాలొడ్డిన వారి పిల్లలను పైకి తెచ్చి, ప్రభుత్వ ఖర్చుపైన విద్య చెప్పించాడు. ఈ సమూల సంస్కరణలకు ధనిక వర్గాలు భీషణమైన నిరసనలకు దిగాయి. అయితే ఇలా – ఒక తరం గడిచే లోగానే సోలన్ పెను సంస్కరణలు ఏథెన్స్ను విరుచుకు పడటానికి సిద్ధంగా ఉన్న విప్లవం నుంచి రక్షించాయి. అందుకే సెయింట్ అగస్తీన్ అన్నాడు: రాజ్యాలు, రాజ్యపాలకు లంటే ఎవరనుకున్నారు? పరమ ఘరానా దోపిడీదారులు, దోపిడీవర్గ సంస్థలు అన్నాడు (ది సిటీ ఆఫ్ గాడ్)! కనుకనే, సోలన్ ‘‘పాలకు డెవరో చెప్పండి – అతను చేసే చట్టం ఎలా ఉంటుందో నేను చెప్తా’’ అన్నాడు. ‘‘ఎందుకంటే చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి (పురుగు) దూరితే దాని కథ ఇక ముగిసి నట్టే. కానీ, ఎదిరించగల శక్తి ఉన్నది దూరితే అది నిభాయిం చుకుని బయటపడగల్గుతుంది’’ అని వివరించాడు. రాజ్యాంగంలోని 32వ అధికరణకున్న పరిమితులను సహితం దృష్టిలో ఉంచుకుని జస్టిస్ యతిరాజులు అదే అధికరణ కింద కక్షి దారుల సహజహక్కుల్ని రక్షించడం, నష్టపరిహారం రాబట్టగల్గడం... మానవహక్కుల సహజ పరిరక్షణకు తనవంతు చారిత్రక బాధ్యతను నెరవేర్చడంగా భావించాలి. ఈ విషయంలో జాతీయస్థాయిలోనూ, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ పలువురు న్యాయమూర్తులు సాధించిన విజయాలకు జస్టిస్ యతిరాజులు కృషి ఏమాత్రం తీసి పోదు. నిజాయితీకి, నిర్మొహమాటానికి పేరొంది, జాతీయ స్థాయిలో అభ్యుదయకర సంస్కరణలకు చేదోడు వాదోడుగా నిలిచిన జస్టిస్ పి.ఎ.చౌదరి, హిదా యతుల్లా, కేహార్, వెంకటాచలయ్య, హెచ్.ఆర్. ఖన్నా, జె.ఎస్.వర్మ, లోకూర్, జె.ఎస్.టాగోర్, భరూచా, కురియన్, జోసఫ్, జాస్తి చలమేశ్వర్ ప్రభృతులు ప్రవేశపెట్టిన నూతన ఒరవడు లకు జస్టిస్ యతిరాజుల కృషి కొనసాగింపుగానే భావించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, జాతీయ స్థాయిలోనూ నూతన ఒర వడిలో తీర్పులు వెలువరించిన పి.ఎ.చౌదరి, జస్టిస్ జీవన్ రెడ్డి ప్రభృ తుల కృషికి ప్రాణధారపోసి చట్టబద్ధతకు దూరంగా ఉండి పోయిన దానిని పలువురి దృష్టిని ఆకర్షించేలా చేసి ప్రజలముందు ప్రయోజ నకర అధికరణగా నిలబెట్టగలిగారు! సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉండ వలసిన సుప్రసిద్ధ పౌరహక్కుల వాణి అయిన ప్రశాంత్ భూషణ్ గొంతు నొక్కేసే సంప్రదాయానికి తలుపులు తెరి చిన మాజీ ప్రధాన న్యాయమూర్తుల వైఖరిని తూర్పారబట్టారు. ఇలాంటి వాతావర ణంలో – చట్టరీత్యా ఆచరణలో అమలు కాకుండా దూరంగా ఉంచేసిన 32వ అధికరణకు ఆచరణలో శాశ్వత విలువను సంతరింపజేయడంలో జస్టిస్ యతిరాజుల కృషి సదా అభినంద నీయం. అయితే, రాజ్యాం గంలో కేవలం పేరుకు మాత్రమే చేర్చి, ఆచరణలో లేకుండా దూరం చేసిన వాటికి పూర్తి చట్టబద్ధత కల్పించే వరకు ప్రజాశ్రేయస్సును కోరే న్యాయమూర్తులు విశ్రమించకుండా ఉంటే ప్రజలు సంతోషిస్తారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
భారత్ మానవ హక్కుల రికార్డుపై.. యూఎన్ చీఫ్ సీరియస్
ముంబై: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తన మూడు రోజుల పర్యటనలో భారత్ మానవ హక్కుల రికార్డుపై విమర్శలు కురిపించారు. ఈ మేరకు ఆయన ముంబైలో ప్రసంగిస్తూ...ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులు, మహిళా రిపోర్ట్ర్లపై దాడులు అధికమైపోయాయి. మానవ హక్కుల మండలిలో ఎన్నుకోబడిన సభ్య దేశంగా భారత్కి ప్రపంచ మానవ హక్కులను రూపొందించడం, మైనారిటీ వర్గాల సభ్యులతో సహా అందరి హక్కులను రక్షించడం, ప్రోత్సహించడం వంటివి చేయాల్సిన బాధ్యత ఉంది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్ల భారత్లో సాధించిన విజయాలను గురించి కూడా ప్రశంసించారు. అలాగే భారత్లో వైవిధ్యం గొప్పగా ఉంటే సరిపోదని, హక్కులు రక్షింపబడాలి. అలాగే ద్వేషపూరిత ప్రసంగాలను నిర్ద్వద్వంగా ఖండించి విలువలను కాపాడుకోవాలి. మానవహక్కులను భారత న్యాయవ్యవస్థ నిరంతరం రక్షిస్తూ ఉండాలి. ఈ ప్రసంగంలో భారత్ కర్భన ఉద్గారాలు తగ్గించే విషయం గురించి కూడా ప్రస్తావించారు. పునరుత్పాదక శక్తి కోసం లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ భారత్ మాత్రం 70 శాతం బొగ్గును వినయోగిస్తోంది. భారత్ వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ చర్యలు మరిన్ని తీసుకోవాలి. ఆరవ వంతు మానవాళి అధికంగా ఉన్న భారత్ 2030 కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తుంద? లేక విచ్ఛన్న చేస్తుందా? అని ప్రశ్నించారు. (చదవండి: మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..) -
యూఎన్లో చైనాకు వ్యతిరేకంగా ఓటుకు దూరం...వివరణ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఉయ్ఘర్ ముస్లింలపై చైనా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఓటింగ్ నిర్వహించగా భారత్ గైర్హాజరైంది. ఐతే భారత్ తానెందుకు దూరంగా ఉందో వివరణ ఇచ్చింది. ఈ ఓటింగ్ అనేది దేశ నిర్దిష్ట తీర్మానాలకు ఎప్పటికి సహాయకారి కాదని స్పష్టం చేసింది. అలాగే జిన్జియాంగ్లోని ప్రజల మానవ హక్కులను గౌరవించాలని నొక్కి చెప్పింది. ఈ మేరకు విదేశాంగ మత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ....అన్ని మానవహక్కులను సమర్థించేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఓటు అనేది దేశ నిర్దిష్ట తీర్మానాలకు సహాయకారి కాదని , భారత్ కేవలం దీర్ఘకాలికి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహిరిస్తుంది. భారత్ ఎప్పుడు ఇలాంటి విషయాల్లో సంభాషిచేందుకు ఇష్టపడుతుంది. అంతేకాదు జిన్జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో మానవ హక్కుల ఆందోళనలను అంచనా వేయగలం. ప్రజల మానవ హక్కులు గౌరవింపబడటమే కాకుండా హామీ ఇవ్వాలి. సంబంధిత పక్షం దీన్ని పరిష్కరిస్తారని భావిస్తున్నాం. అని అన్నారు. అలాగే భారత్లా చైనాకు వ్యతిరేకంగా ఓటింగ్కు దూరంగా 11 దేశాలు ఉన్నాయి. ఈ మేరకు యూఎన్హెచ్ఆర్సీలో తీర్మానానికి అనుకూలంగా 17 మంది సభ్యులు ఓటు వేయగా చైనా, పాకిస్తాన్, నేపాల్తో సహ 19 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఐతే భారత్, బ్రెజిల్, మెక్సికో, ఉక్రెయిన్తో 11 దేశాలు గైర్హాజరయ్యారు. (చదవండి: యూకే మంత్రి వీసా వ్యాఖ్యలపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్) -
వీగర్లపై చైనా పంజా
చైనా వాయవ్యప్రాంతం షింజియాంగ్లో సర్కారీ దౌష్ట్యానికి లోనవుతున్న మైనారిటీ వీగర్ ముస్లింల విషయంలో ఐక్యరాజ్యసమితి పట్టనట్టు వ్యవహరిస్తున్నదని కొంతకాలంగా హక్కుల సంస్థలు చేస్తున్న ఆరోపణలకు బ్రేక్ పడింది. అక్కడ చైనా ప్రభుత్వం తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సంగతి నిజమేనని గురువారం విడుదలైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(యూఎన్హెచ్ఆర్సీ) నివేదిక నిర్ధారించింది. ఈ నివేదిక బయటకు రాకుండా ఆపడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. దీన్ని పూర్తిగా బుట్టదాఖలయ్యేలా చూడాలనీ, కనీసం నివేదిక విడుదలను దీర్ఘకాలం వాయిదాపడేలా చూడాలనీ చైనా అనేక ఎత్తులు వేసింది. ఇప్పుడిక నివేదికను ఖండించే పనిలోపడింది. 48 పేజీల యూఎన్హెచ్ఆర్సీ నివేదికకు 122 పేజీల్లో బదులిచ్చింది. ఆ ప్రాంత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచేస్తున్నాం తప్ప సాధారణ పౌరుల జోలికి పోవటం లేదన్నది దాని సారాంశం. నియంతృత్వం, అణచివేత గాల్లోంచి ఊడిపడవు. వాటికి రాజకీయ కారణాలతోపాటు ఆర్థిక, భౌగోళిక, జాతి, మత, భాషాపరమైన కారణాలు కూడా ఉంటాయి. వరమో, శాపమో వీగర్ ముస్లింలు అత్యధికంగా ఉండే షింజియాంగ్ ప్రాంతం పర్వతాలు, అడవులు, ఎడారులతో నిండి ఉంటుంది. వాటిమధ్య బతకడానికి అనువైన చోటు ఎంచుకోవడం వారికి కష్టమే. అందుకే జనా వాసప్రాంతాలు విసిరేసినట్టు ఎక్కడెక్కడో ఉంటాయి. ఇరుగుపొరుగున రష్యాతోపాటు పలు మధ్య ఆసియా దేశాలుంటాయి. అందుకే దీన్ని నియంత్రించేందుకు ప్రస్తుత చైనా పాలకులు మాత్రమే కాదు... గతంలో పాలించినవారూ ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ అపారమైన ప్రకృతి సంపద ఉంది. పైగా వ్యూహాత్మకంగా చూస్తే పశ్చిమ దేశాలకు సమీపంగా, వాటిపై తన ప్రభా వాన్ని పెంచుకునేందుకు వీలుగా ఈ ప్రాంతం ఉంటుంది. భౌగోళికంగా చిన్నదే అయినా షింజి యాంగ్ ఎప్పుడూ బేలగా లేదు. చరిత్రలోకి తొంగిచూస్తే అనేక రాజరిక వ్యవస్థలకు అది కొరకరాని కొయ్యగా నిలిచింది. నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలకు చుక్కలు చూపింది. స్వయంప్రతిపత్తి నిలుపుకోవడమే లక్ష్యంగా పోరాడింది. 1949లో చైనా విప్లవ విజయానికి కాస్త ముందు ఆ ప్రాంతం స్వయంపాలనను రుచిచూసింది కూడా. కానీ జాతుల సమస్య విషయంలో కమ్యూనిస్టులకున్న అవగాహనను గౌరవించి కావొచ్చు... తొలిసారి వారికి తలవంచింది. ఆధిపత్య హాన్ జాతి పెత్తనమే ఇక్కడా కనబడటం, 1966–76 మధ్య సాగిన సాంస్కృతిక విప్లవకాలంలో అది మరింత బాహాటం కావడంతో మళ్లీ ఆ ప్రాంతం పోరుబాట పట్టింది. పథకం ప్రకారం వేరే ప్రాంతాలనుంచి హాన్ జనాభాను ఇక్కడికి తరలించడం, క్రమేపీ వారి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం పెంచడంతో వీగర్లు రగిలిపోయారు. 90వ దశకం మొదట్లో చెదురుమదురు నిరసనలుగా మొదలైన ఉద్యమం 2009 నాటికి తిరుగుబాటుగా మారింది. హింస చెలరేగి వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో 2014 నాటికి అధ్యక్షుడు షీ జిన్పింగ్ పూర్తిస్థాయి అణచివేత చర్యలకు ఆదేశాలిచ్చారు. అప్పటినుంచీ నరకానికి ప్రతీకలుగా ఉండే నిర్బంధ శిబిరాలకు లక్షలాదిమంది వీగర్లను తరలించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఆ శిబిరాలు కిక్కిరిసి ఉంటున్నా యని వార్తలొస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈమధ్యవరకూ చైనా ఎవరినీ అనుమతించక పోవడంతో అనుమానాలు బలపడ్డాయి. సమితిలో కదలికలు రావడం మొదలయ్యాక శిబిరాల్లో పరిస్థితులు కొంత మారాయంటున్నారు. నిర్బంధితుల విడుదల కూడా చోటుచేసుకున్నదని కథనాలు వచ్చాయి. కానీ జరగాల్సినదాంతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ఒక దేశ ఆంతరంగిక సమస్యగానో, సంబంధం లేని వ్యవహారమనో భావించి ప్రపంచ ప్రజానీకం ఈ నియంతృత్వ ధోరణులను చూస్తూ ఊరుకుంటే అంతటా ఇలాంటి పాలకులే తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈమధ్యే యూఎన్హెచ్ఆర్సీ హైకమిషనర్గా రిటైరైన మిషెల్ బాష్లెట్ చిలీలో పినోచెట్ పాలనాకాలంలో స్వయంగా నిర్బంధాన్ని అనుభవించినవారు. అందుకే ఆమె హైకమిషనర్గా వచ్చినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టు చైనా ఎంత మొండికేసినా దాన్ని ఒప్పించడానికి ఆమె ఓపిగ్గా ప్రయత్నించారు. పరిమిత సంఖ్యలోనైనా పాత్రికేయులను అక్కడి ప్రభుత్వం అనుమతించక తప్పని స్థితి ఏర్పడటం బాష్లెట్ విజయమే. కానీ ఏళ్లతరబడి నివేదిక వెలుగు చూడకపోవడం, అత్యంత అమానుషమైన ఉదంతాలు నిజమంటూనే వాటిని నరమేథంగా మాత్రం పరిగణించకపోవడం ఆమె పనితీరును ప్రశ్నార్థకం చేసింది. బక్క దేశాలపై ఆరోపణలు వచ్చినప్పుడు విరుచుకుపడే అగ్రరాజ్యాలు బలమైన దేశాలు కళ్లెదుటే దురాగ తాలకు పాల్పడుతున్నా పట్టించుకోవు. అరబ్ దేశాలు వీగర్ ముస్లింలకు ఏదో ఒరగబెడ తాయనుకోవడం దండగ. మతాన్ని కించపరిచారన్న ఆరోపణలపై తప్ప సాధారణ ముస్లింలపై జరిగే దాడుల విషయంలో అవి ఎప్పుడూ మౌనమే పాటిస్తాయి. చైనా రాక్షసత్వాన్ని నిగ్గుతేల్చడానికి మరింత లోతైన దర్యాప్తు అవసరమని నివేదిక తెలిపింది. యూఎన్హెచ్ఆర్సీ సభ్య దేశాలు అంగీకరిస్తేనే అది సాధ్యం. చైనా దీన్నెలాగైనా అడ్డుకుంటుంది. మొత్తానికి ఈ నివేదిక చైనా నేర వైఖరిని బయటపెట్టింది. ఉనికి కోసం, కనీస మానవ హక్కుల కోసం పోరాడుతున్న వీగర్ ముస్లింలకు నైతిక మద్దతునీయడం దేశదేశాల్లోని ప్రజాస్వామికవాదుల తక్షణ కర్తవ్యం. -
మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష.. ఇంతకీ ఆమె చేసిన నేరం..?
సల్మా అల్-షెహబ్ అనే 34 ఏళ్ల మహిళకు సౌదీ అరేబియా కోర్టు 34 ఏళ్ల సుదీర్ఘ కారాగార శిక్ష విధించింది. అసమ్మతివాదులను ట్విటర్లో అనుసరించడంతో పాటు వారి పోస్టులను రీట్వీట్ చేశారన్న నేరారోపణలతో కఠిన శిక్ష వేసిందని ‘గార్డియన్’ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేకాదు 34 ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా ప్రయాణ నిషేధం విధించింది. సౌదీ అరేబియా మహిళ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సల్మాకు సుదీర్ఘ జైలు శిక్ష విధించడం పట్ల అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆమెను విడుదల చేయాలని మానవ హక్కుల పరిరరక్షణ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అసలేం జరిగింది? బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న సల్మా అల్-షెహబ్ను 2021, జనవరి 15న సౌదీ అరేబియాలో అరెస్ట్ చేశారు. సెలవులకు స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆమెను నిర్బంధించారు. శాంతిభద్రతలకు విఘాతం, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇంటర్నెట్ను వినియోగించారన్న ఆరోపణలతో మొదట ప్రత్యేక ఉగ్రవాద కోర్టు ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా సోమవారం అప్పీల్ కోర్టు 34 సంవత్సరాల జైలు శిక్ష, 34 సంవత్సరాల ప్రయాణ నిషేధం విధిస్తూ తీర్పు చెప్పింది. ఓరల్, డెంటల్ మెడిసిన్లో నిపుణురాలైన సల్మా.. ప్రిన్సెస్ నౌరా విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆమెకు పైళ్లై, చిన్న వయసులో ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. Report I #SaudiArabia: 34 years sentence against the women's right activist #SalmaAlShehab 🔴 Read here: https://t.co/1S7sMV0gxY pic.twitter.com/ATjTREgxJM — ESOHR (@ESOHumanRightsE) August 16, 2022 సల్మా విడుదలకు డిమాండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్, ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్, యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఏఎల్క్యుఎస్టీ ఫర్ హ్యూమన్ రైట్స్ వంటి అనేక మానవ హక్కుల సంస్థలు ఈ తీర్పును ఖండించాయి. సల్మా అల్-షెహబ్ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ‘సల్మాను విడిపించాలని సౌదీ అధికారులను కోరుతున్నాం. ఆమె పిల్లల సంరక్షణకు, ఆమె చదువును పూర్తి చేయడానికి వీలు కల్పించేలా విముక్తి ప్రసాదించాల’ని ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మహిళా హక్కుల కార్యకర్తలకు సంఘీభావంగా ట్వీట్ చేయడం నేరం కాద’ని స్పష్టం చేసింది. In the #Saudi authorities’ longest prison sentence ever for a peaceful activist, the Specialised Criminal Court of Appeal on 9 August handed down terms totalling 34 years without suspension to women’s rights campaigner Salma al-Shehab. #SaudiArabiahttps://t.co/3bRLwqioec pic.twitter.com/fYgVrATNFX — ALQST for Human Rights (@ALQST_En) August 15, 2022 సుదీర్ఘ జైలు శిక్షపై అభ్యంతరాలు సోషల్ మీడియాలో పెద్దగా ఆదరణ లేనప్పటికీ సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ట్విటర్లో 2,597 మంది అనుసరిస్తుండగా, ఇన్స్టాగ్రామ్లో 159 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ‘అసమ్మతివాదులు ట్విటర్ ఖాతాలను అనుసరించడం, వారి ట్వీట్లను రీట్వీట్ చేయడం ద్వారా సమాజంలో చిచ్చు రేపడానికి, జాతీయ భద్రతను అస్థిరపరిచేందుకు కారణమయ్యారని’ ఆమెపై ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. షియా ముస్లిం కాబట్టే ఆమెను అన్యాయంగా అరెస్ట్ చేసి, కఠిన శిక్ష విధించారని నమ్ముతున్నట్టు యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ పేర్కొంది. సౌదీ అరేబియాలో మహిళల హక్కుల కోసం సల్మా గళమెత్తారు. స్త్రీలపై పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ను జెడ్డాలో జూలై 15న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలిసిన కొద్ది రోజుల తర్వాత సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు రావడం గమనార్హం. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి దారుణ హత్య కేసులో ప్రమేయంతో పాటు, అనేక మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌదీ యువరాజుతో బైడన్ భేటీ కావడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2018లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని సౌదీ కౌన్సులేట్లో ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. (క్లిక్: ఖషోగ్గి హత్య వెనుక సౌదీ యువరాజు హస్తం) -
శ్రీలంకలో మానవ హక్కులపై ‘సంక్షోభం’ పిడుగు.. ఐక్యరాజ్య సమితి ఆందోళన
కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ప్రజలకు తక్షణం మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణుల బృందం కోరింది. అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి సాయం అందించాలని సూచించింది. శ్రీలంకలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు మానవ హక్కుల నిపుణులు.' శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలి. అది కేవలం మానవతా సంస్థల నుంచే కాదు.. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రైవేటు లెండర్స్, ఇతర దేశాలు ముందుకు రావాలి.' అని పేర్కొన్నారు. శ్రీలంకలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్తు, ఇంధన సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ పతనంపై తొమ్మిది మంది నిపుణుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మానవ హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. సరైన ఆహారం, వైద్యం అందకపోవటం వల్ల తీవ్ర అనారోగ్యాలు ఎదురవుతాయని, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సహాయం అవసరమని తెలిపింది. అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ మిచెల్ బచెలెట్. హింసాత్మక ఘటనలు జరగటాన్ని ఖండించారు. ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు తీసుకునే నిర్ణయాల్లో మానవ హక్కులను ప్రధానంగా చూడాలన్నారు. ప్రభుత్వం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్లే సంక్షోభం తలెత్తిందని తెలిపారు. ఇదీ చదవండి: Sri Lanka Crisis: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే! -
ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్
UK Owes Apology For Forced Adoptions: అధికారికంగా తల్లి బిడ్డలను వేరుచేసే దారుణానికి పాల్పడిన బ్రిటన్ ప్రభుత్వం సదరు బాధిత మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని మానవ హక్కుల ప్యానెల్ పేర్కొంది. ఈ మేరకు బ్రిటన్ అధికారికంగా పెళ్లికానీ తల్లుల నుంచి తమ పిల్లలను బలవంతంగా దత్తత ఇచ్చేలా చేసినందుకు గానూ వారికి క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. 1949, 1976 మధ్యకాలంలో ఇంగ్లండ్, వేల్స్ నుంచి దాదాపు లక్ష మందికి పైగా పిల్లలు బలవంతంగా దత్తతకు వెళ్లారని మానవ హక్కులకు సంబంధించిన పార్లమెంట్ సంయుక్త కమిటీ నివేదికలో పేర్కొంది. అత్యంత దారుణంగా తల్లి బిడ్డలను వేరు చేసే పాశవిక చర్యకు బ్రిటన్ ప్రభుత్వం పాల్పడిందని కమిటీ అధ్యక్షురాలు లేబర్ ఎంపీ హ్యారియోట్ హర్మాన్ అన్నారు. అంతేకాదు ఆ తల్లుల చేసిన ఏకైక నేరం పెళ్లి కాకుండా గర్భవతి కావడమేనని చెప్పారు. ఇది బ్రిటన్ చేసిన ఘోరమైన తప్పుగా కమిటీ పరిగణించింది. స్వయంగా ప్రభుత్వమే ఆ తల్లుల పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్నారు. ఇప్పుడైనా వారికి న్యాయం జరగాలని, వారు గౌరవింపబడేలా చేసేందుకైన బ్రిటన్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. గతంలో ఆస్ట్రేలియ ప్రభుత్వం, ఐర్లాండ్ ఇలానే చేశాయని, అందుకు క్షమాపణలు కూడా చెప్పాయని తెలిపారు. 1963లో ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్లలో అబార్షన్ని చట్టబద్దం చేసినప్పటికీ మహిళలు ఈ సమస్యలను ఎదుర్కోవల్సి వచ్చిందన్నారు. పెళ్లికాకుండా తల్లికావడాన్ని ఘోరంగా చూడటం వల్లే ఈ పరిస్థితి వాటిల్లందని అన్నారు. ఐతే పార్లమెంట్ సంయుక్త కమిటీ నివేదిక బాధిత వ్యక్తుల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ను అందించడమే కాకుండా మరియు తల్లి లేదా బిడ్డను కనుగొనడానికి ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వం సాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో ఒక బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ...ఈ చారిత్రత్మక తప్పిదం వల్ల ప్రభావితమైన వారందరికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. గతాన్ని మార్చలేకపోయినప్పటికీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా బలోపేతమైన చట్టాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. సదరు బాధిత మహిళలకు మెరుగైన సంరక్షణను అందస్తామని చెప్పారు. (చదవండి: ఈయూ ఆంక్షాల మోత...టెన్షన్లో రష్యా!) -
నరరూప రాక్షసులు: కిడ్నాప్ చేసి మానభంగం, ఆపై..
న్యూయార్క్: మానవ హక్కుల ఉల్లంఘనలో హేయనీయమైన ఘటనలు వెలుగులోకి రావడం కొత్తేం కాదు. కానీ, ప్రపంచమంతా ఉలిక్కిపడేలా దారుణాతిదారుణాలు ఆఫ్రికన్ దేశం కాంగోలో చోటుచేసుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బుధవారం ఓ మహిళ కథ.. అక్కడి రెబల్ గ్రూప్ల అరాచకాలను బయటపెట్టడంతో పాటు సభ్య దేశ్యాలను నివ్వెరపోయేలా చేసింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పరిస్థితులపై భద్రతా మండలిలో సాధారణ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా.. సోఫెపడి హక్కుల సంఘం అధ్యక్షురాలు, న్యాయవాది జూలియెన్నె లుసెంగె.. తూర్పు కాంగోలో తనకు తారసపడ్డ ఓ మహిళ కథను మండలికి వినిపించగా.. ఆమె ప్రసంగిస్తున్నంత సేపు అక్కడ నిశబ్ద వాతావరణం నెలకొంది. కాంగోలో ప్రభుత్వం, రెబెల్ గ్రూప్స్ మధ్య అంతర్యుద్ధం.. ఈ మే నెలలో తారాస్థాయికి చేరింది. ఆ పరిస్థితులు కాస్త తీవ్ర హింసకు దారి తీశాయి. ఈ తరుణంలో.. కోడ్కో అనే మిలిటెంట్ గ్రూప్ ఓ కుటుంబం నుంచి ఓ మహిళను ఎత్తుకెళ్లింది. పలుమార్లు ఆమెపై మానభంగానికి పాల్పడ్డారు ఆ గ్రూప్ సభ్యులు. ఆపై ఓ వ్యక్తిని ఆమె కళ్లెదుటే గొంతు కోసి హత్య చేశారు. ఆ శవం నుంచి పేగులు బయటకు లాగేసి.. వాటిని వండాలంటూ ఆమెకు ఆదేశించారు. రెండు కంటెయినర్ల నీళ్లు తెచ్చి.. భోజనం సిద్ధం చేయమన్నారు. ఆపై ఆమెతో మనిషి పచ్చి మాంసం బలవంతంగా తినిపించారు’ అంటూ భావోద్వేగంగా జూలియెన్నె ఆ ఘటనలను వినిపించారు. కొన్నిరోజుల తర్వాత ఆమెను విడిచిపెట్టింది ఆ గ్రూప్. కానీ, ఇంటికి వెళ్తున్న దారిలో ఆమెను మరొక మిలిటెంట్ ఎత్తుకెళ్లింది. పలుమార్లు మానభంగం చేశారు ఆ గ్రూప్సభ్యులు. అక్కడ ఆమెకు అలాంటి రాక్షస అనుభవమే ఎదురైంది. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఆమె తన ప్రాణాలనే పణంగా పెట్టుకుంది.. అని జూలియెన్నెకు భద్రతా మండలికి వినిపించారు. ఈ ఘటనను మండలి సంయుక్తంగా ఖండించింది. ఇలాంటి ఘటనలను నిలువరించాల్సిన అవసరం ఉందని, మానవ హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణలపై కోడ్కో మిలిటెంట్ గ్రూప్గానీ, ఇతర సంస్థలుగానీ స్పందించలేదు. అంతర్యుద్ధంతో కాంగో నెత్తుటి నేలను తలపిస్తున్న వేళ.. గత 20 ఏళ్లుగా ఐరాస ప్రతినిధులు కాంగోలో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తున్నా అది వీలుపడడం లేదు. Disclaimer: ఇందులోని కంటెంట్ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు.. కేవలం పరిణామాలను తెలియజేయడానికే!. -
మలేషియా సంచలన నిర్ణయం... మరణ శిక్ష రద్దు!
Death Penalty Remains Mandatory For Several Offences: మలేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. హత్య, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర తీవ్రమైన నేరాలకు మలేషియా దేశంలో మరణశిక్ష తప్పనిసరి. ఐతే మలేషియా ప్రభుత్వం కొన్ని నేరాల్లో విధించే తప్పనిసరి మరణశిక్షను రద్దు చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. 2018లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న సంస్కరణవాద కూటమి మరణశిక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐతే రాజకీయ ప్రత్యర్థులు, బాధితుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఈ మరణశిక్ష రద్దు నిలిచిపోయింది. ప్రస్తుతం కేబినేట్ మరణ శిక్షను రద్దు చేసేందుకు సమ్మతించినట్లు న్యాయశాఖ మంత్రి వాన్ జునైది తువాంకు జాఫర్ తెలిపారు. కానీ ఈ మరణశిక్షకు ప్రత్యామ్యాయంగా ఎలాంటి శిక్షలు విధించవచ్చనే దానిపై తదుపరి అధ్యయనం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు ఈ విషయంపై నిర్ణయం అన్ని పార్టీల హక్కులను రక్షించే విధంగా ఇవ్వడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మార్పులు చేయడానికి పార్లమెంట్లో చట్టం చేయవలసి ఉంటుందన్నారు. పైగా ఇది పూర్తి స్థాయిలో అమలు కావడానికి కూడా కాస్త సమయం పడుతుందని అన్నారు. మానవ హక్కుల ఆసియా డిప్యూటీ డైరక్టర్ ఫిల్ రాబర్ట్సన్ తప్పనిసరి మరణశిక్షను తొలగిస్తామని మలేషియా బహిరంగంగా ప్రకటించడం ఒక ముఖ్యమైన ముందడుగుగా అభినందించారు. ఐతే మలేషియాలో ఇంతవరకు వరుసగా అధికాలోకి వచ్చిన ఇతర ప్రభుత్వాలు ఈ మరణశిక్షను రద్దు చేస్తాం అంటూ... మాటలకే పరిమితం చేశాయే తప్ప ఆచరణలోకి తీసుకు రావడంలో విఫమయ్యాయి. (చదవండి: తనని తాను కాల్చుకునేలోపే ఊహించని దారుణం... ఆ తర్వాత) -
‘మా అమ్మను కిడ్నాప్ చేశారు’
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని మానవహక్కుల మంత్రిగా పనిచేసిన తన తల్గి షిరీన్ మజారీని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆమె కుమార్తె ఆరోపించింది. వాస్తవానికి ఆమె అవినీతి నిరోధక సంస్థ కస్టడీలో ఉన్నారు. కానీ ఆమె కుమార్తె ఇమాన్ జైనాబ్ మజారీ మాత్రం పోలీసులు తన తల్లిని కొట్టి తీసుకెళ్లారని ఆరోపణలు చేశారు. అయినా ఏ వ్యక్తినైన అరెస్ట్ చేసేముందు ఏ అభియోగంతో తీసుకెళ్తున్నారో చెప్పాలి కానీ తనకు అవేమీ చెప్పలేదని కేవలం తన తల్లి లామోర్ అవినీతి నిరోధక విభాగంలో ఉందని మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు. సున్నితంగా ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఈ ప్రభుత్వం తన తల్లిని కిడ్నాప్ చేసిందంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. తన తల్లికి ఏదైన జరిగితే ఎవరిని వదలిపెట్టనంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన సహోద్యోగిని ఈ ఫాసిస్ట్ పాలన హింసాత్మక ధోరణితో కిడ్నాప్ చేసిందంటూ ఆరోపణలు చేశారు. తమ ఉద్యమం శాంతియుతమైనదని ఫాసిజాన్ని దిగుమతి చేసుకున్న ప్రభుత్వం దేశాన్ని గందరగోళంలోకి నెట్టాలని చూస్తోందన్నారు. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఉన్నది సరిపోదన్నట్లు ఈ ఎన్నికలను నివారించేందుకే ఈ అరాచకాలు సృష్టిస్తున్నారంటూ విమర్శించారు. (చదవండి: ఉత్తర కొరియాకు వ్యాక్సిన్ ఆఫర్ ప్రకటించిన అమెరికా...కిమ్ని కలుస్తానంటున్న బైడెన్) -
భారత్పై అమెరికా వ్యాఖ్యలు.. జై శంకర్ గట్టి కౌంటర్
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సాగిన చర్చల్లో మానవ హక్కుల అంశం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా భారత్పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ తీవ్రంగా స్పందించారు. అమెరికా, భారత్ మధ్య జరిగిన 2+2 స్థాయి సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చించాల్సిన విషయం కాదని అన్నారు. అయితే చర్చ జరిగినప్పుడల్లా వాటి గురించి మాట్లాడేందుకు తాము వెనకాడబోమని, తప్పకుండా మాట్లాడతామని స్పష్టం చేశారు. ‘ప్రతి ఒక్కరికి భారత్పై ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండేందుకు అర్హులు. అలాగే మాకు కూడా వారిపై అభిప్రాయాలు ఉంటాయి. అమెరికాతో సహా ఇతర దేశాల మానవ హక్కుల పరిస్థితిపై కూడా మాకు అభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మా అభిప్రాయాలు చెబుతాం’ అని గట్టి కౌంటర్ ఇచ్చారు. చదవండి: ఆహారం ‘వృథా’లో టాప్ టెన్ దేశాలివే.. కాగా భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. ఇటీవలపరిస్థితులు గమనిస్తుంటే కొంతమంది పోలీసులు, అధికారులు, ప్రభుత్వాల వల్ల మానవ హక్కుల ఉల్లంఘణ పెరిగిందని వ్యాఖ్యనించారు. వీటికి ముగింపు పలికే వరకు ఈ అంశంపై నిరంతరం భారత్తో సంప్రదింపులు జరుపుతుంటామన్నారు. పర్యటన ముగింపు సందర్భంగా అమెరికాలో భారతీయ పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుత సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చకు రాలేదని జై శంకర్ తెలిపారు. గతంలో ప్రస్తావనకు వచ్చిందని, దానిపై చర్చించి, సమాధానం కూడా చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయ సైనిక వ్యవహారాలపై చర్చించినట్లు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఆహర భద్రత, శ్రీలంక సంక్షోభం, పాకిస్తాన్ వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు వెల్లడించారు. చదవండి: రష్యాది నరమేధమే: బైడెన్ -
మహిళా హక్కులకు పాతర
అట్లాంటా: అఫ్గాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత దేశంలో మహిళల పరిస్థితి ఘోరంగా మారిందని అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఆరోపించాయి. ముఖ్యంగా మహిళలు, స్వలింగ సంపర్కులు, హిజ్రాల పరిస్థితి దేశంలో దుర్భరంగా మారుతోందని హ్యూమన్రైట్స్ వాచ్ సంస్థ తెలిపింది. తాలిబన్లు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన హక్కుల హననమే పునరావృతం అవుతోంది. వీరి పాలనలో మహిళలు రెండు రకాలుగా బాధితులవుతున్నారు. లైంగిక పరమైన దాడులు ఒక సమస్య కాగా, అలాంటి బాధితులపై సొంతవారి అకృత్యాలు రెండో సమస్యగా మారాయని హక్కుల కార్యకర్తలు వివరిస్తున్నారు. -
మానవహక్కులు–భాష్యాలు
మానవహక్కులను కొందరు రాజకీయ దృక్కోణంలోనుంచి చూస్తున్నారని...అందువల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చేసిన వ్యాఖ్యపై విస్తృతంగానే చర్చ నడుస్తోంది. ఒకచోట ఏ చిన్న ఘటన జరిగినా మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించే కొందరు ఆ మాదిరి ఘటనలే మరోచోట చోటుచేసుకుంటే మౌనంవహిస్తారన్నది ఆయన ఆరోపణల సారాంశం. ప్రధాని ప్రస్తావించిన అంశాలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మరికొంత విశదీకరించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమను తాము దళిత హక్కుల చాంపియన్లుగా చెప్పుకుంటూ రాజస్థాన్లోనూ, కొన్ని ఇతర రాష్ట్రాలలోనూ దళితులపై సాగుతున్న అత్యా చార ఘటనల విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్కు కొత్త కావొచ్చు గానీ... మన దేశంలోనూ, వేరే దేశాల్లోనూ హక్కుల సంఘాలు ఏదో ఒక దశలో పక్షపాత ఆరోప ణలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పౌరహక్కుల సంఘంలో చీలిక కూడా వచ్చింది. అధికార, విపక్షాల నడుమ సాగే వ్యాగుద్ధాల్లో ఇది వినబడటం తాజా పరిణామం. ఈమధ్య ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేడిలో రైతు ఉద్యమనేతలను పట్టపగలు వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన ఉదంతంపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఈ నెల 1, 7 తేదీల్లో రాజస్థాన్లో దళితులపై అత్యంత అమానుషంగా జరిగిన దాడి ఘటనలను మరుగుపరుస్తున్నదని బీజేపీ చేసిన వ్యాఖ్య కొట్టిపారేయదగ్గది కాదు. ఈ ఉదంతాల్లో కేసులు నమోదుచేశామని, నిందితు లను అరెస్టు చేశామని రాజస్థాన్ పోలీసులు చెబుతున్నా అక్కడ తరచుగా దళితులపై, మైనారిటీలపై సాగుతున్న దాడులను నిలువరించలేకపోవటం ఆ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే. ఏటా డిసెంబర్ 10న మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1948లో ఐక్య రాజ్యసమితి పిలుపునిచ్చింది. దారిద్య్రం అత్యంత అమానుషమైన మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించింది. తర్వాత ఆ సంస్థ ఆధ్వర్యంలో అనేక మార్గదర్శకాలు రూపొందుతూ వచ్చాయి. ఈలోగా హక్కులు కాలరాసే ప్రభుత్వాల తీరుపై పలు దేశాల్లో ఉద్యమాలు బయల్దేరాయి. పాలకు లపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. మన దేశంలో 60వ దశకం చివరిలో హక్కుల ఉద్యమాలు మొగ్గతొడి గాయి. దక్షిణాఫ్రికాలో జాత్యహంకార ప్రభుత్వ ఆగడాలు, బోస్నియా, రువాండా, బురుండీ, అంగోలా వంటిచోట్ల సాగిన నరమేథాలు, తూర్పు యూరప్ దేశాల్లో హక్కుల ఉల్లంఘనలు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేశాయి. ఆ తర్వాతే ప్రపంచ దేశాలన్నీ వ్యవస్థాగతమైన, తటస్థమైన మానవ హక్కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని 1991లో పారిస్లో జరిగిన మానవహక్కుల సదస్సు పిలుపునిచ్చింది. దీన్ని 1993లో ఐక్యరాజ్య సమితి కూడా ధ్రువీకరించాక అనేక దేశాల్లో మానవ హక్కుల సంఘాలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవి ఆచరణలో సామాన్య ప్రజానీకానికి పెద్దగా ఉపయోగపడిన దాఖలా లేదు. వీటికి నామమాత్ర అధికారాలులిచ్చి, లాంఛనప్రాయం చేసిన ప్రభుత్వాలే ఇందుకు కారణం. ఆ సంఘాలకు చేసే నియామకాలు కూడా అసంతృప్తినే మిగులుస్తున్నాయి. మన దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పరంగా జరిగే లోటుపాట్లను వేలెత్తి చూపేందుకు, సామాన్యులకు ఊరటనిచ్చేందుకు ఏర్పాటైనా యేటా ఈ సంఘాలు ఇచ్చే నివే దికలనూ, వివిధ సందర్భాల్లో ఇవి చేసే సిఫార్సులనూ ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడంలేదు. వాటి అమలుకు తిరిగి న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సివస్తోంది. మానవ హక్కుల సంఘాలు చేసే సిఫార్సులు అమలుపరిచి తీరవలసినవా కాదా అనే అంశంపై చాన్నాళ్లుగా అయోమయం ఉంది. మానవ హక్కుల సంఘాల అధికారాలు, విచారణలు న్యాయపరమైన కార్యకలాపాలుగానే పరిగణిం చాలని, వాటికి సివిల్ కోర్టులకుండే అధికారాలుంటాయని సుప్రీంకోర్టు వేరే సందర్భంలో చెప్పినా పరిస్థితి పెద్దగా మారలేదు. మానవహక్కుల సంఘాలు చేసే సిఫార్సులకు మానవహక్కుల చట్టం సెక్షన్ 18 ఇస్తున్న భాష్యంపై ఇన్నేళ్లయినా సుప్రీంకోర్టుతోసహా దేశంలోని ఏ న్యాయస్థానమూ సంది గ్ధతకు తావులేని విధంగా తీర్పులు వెలువరించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు ఫుల్ బెంచ్ ఆ పని చేసింది. సెక్షన్ 18 మానవ హక్కుల సంఘాలకు తిరుగులేని అధికారాలిస్తోందని తేల్చిచెప్పింది. ఈ చట్టం మరింత ప్రభావవంతంగా ఉండేందుకు తగిన సవరణలు అవసరమని సూచించింది. దానిపై కేంద్రం ఇంతవరకూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మానవ హక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు ఆ సంఘాల పటిష్టతపై చర్చ జరిగితే, వాటికి విస్తృతమైన అధికారాలు కల్పించే దిశగా చర్యలుంటే బాగుండేది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప లఖింపూర్ ఖేడి ఘటనలో ప్రధాన బాధ్యుడని ఆరోపణలొచ్చిన కేంద్ర మంత్రి కుమారుణ్ణి యూపీ పోలీసులు అరెస్టు చేయలేని దుస్థితి నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో ఆ సంఘాల బలోపేతాన్ని కోరుకోవడం దురాశే కావొచ్చు. మీ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా... మా ఏలుబడి ఉన్నచోట్ల ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా అని రాజకీయ పక్షాలు వాదులాడుకుంటే, సవాళ్లు విసురుకుంటే, మానవ హక్కులకు ఎవరికి వారు సొంత భాష్యాలు చెప్పుకుంటే నిజంగానే అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ మసకబారుతుంది. ముఖ్యంగా మానవహక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు అలాంటి వాదనలు అప్రస్తుతం. అందుకు బదులు మానవహక్కుల పటిష్టతకు సమష్టిగా ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడితే సాధారణ పౌరులకు మేలు కలుగుతుంది. -
ఆ కల తీరుతుందా?
ప్రపంచ దేశాలపై అమెరికా పట్టు నిలుపుకోవాలంటే భారత్తో స్నేహసంబంధాలు కొనసాగించడం అగ్రరాజ్యానికి అత్యంత అవసరం. రక్షణ రంగంలో ఒబామా అనుసరించే విధానాలే బైడెన్ కొనసాగించనున్నారు. ఉగ్రవాదం పాక్ భూభాగంపై ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి ఆయన ఏ మాత్రం అంగీకరిం చరు. ఉగ్రవాదం అంశంలో పాక్పై ఒత్తిడి గట్టిగానే కొనసాగిస్తారన్న ఆశాభావంతో భారత్ ఉంది. చైనాతో వైఖరి వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య సంబంధాలు భారత్కి కీలకం. ట్రంప్ భారత్కే మద్దత పలుకుతూ చైనాపై కస్సుబుస్సులాడుతూనే ఉన్నారు. కానీ బైడెన్ నుంచి ఆ స్థాయి మద్దతు లభించదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి ముప్పు ఉండకూడదన్న వైఖరినే ఆయన పాటించే అవకాశాలున్నాయి. మానవ హక్కులు మానవ హక్కుల ఉల్లంఘన అంశంలో భారత్ పట్ల కొత్త అధ్యక్షుడి వైఖరి ఎలా ఉంటుందో ఇప్పట్నుంచి అంచనా వెయ్యలేని పరిస్థితైతే ఉంది. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోందంటూ పాకిస్తాన్పై బైడెన్ గుర్రుగానే ఉన్నారు. మరోవైపు కశ్మీర్లో 360 ఆర్టికల్ రద్దుని ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమల మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నారు. వీసా విధానం హెచ్–1బీ వీసా విధానం, ఉద్యోగాల కల్పన అంశంలో బైడెన్ విధానాలు భారత్కు సానుకూలంగా మారే అవకాశాలున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ హెచ్–1బీ వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. అయితే బైడెన్ వాటిని సరళతరం చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఉండే వలసదారులకి అమెరికా పౌరసత్వం కల్పిస్తానని ఎన్నికల హామీ కూడా ఉంది. అదే జరిగితే 5 లక్షల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది కమలా హ్యారిస్ పాత్ర వివిధ అంశాలపై కమలకు స్పష్టమైన అభిప్రా యాలున్నాయి. అవన్నీ భారత్తో సంబంధాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. మరోసారి పోటీ చేయబోనని బైడెన్ చెప్పడంతో అధ్యక్షురాలయ్యే వ్యూహంతో కమలా అడుగులు వేస్తారు. ఆమె మూలాలు భారత్తో ముడిపడి ఉండడంతో మన దేశానికి కలిసొచ్చే అంశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘2020 నాటికి అమెరికా, భారత్ ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా అవతరించాలి. అప్పుడే ప్రపంచం హాయిగా ఉంటుంది. ఇదే నా కల — 2006లో ఓ ఇంటర్వ్యూలో బైడెన్ -
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత దేశంనుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. 2020 సెప్టెంబర్ 10న తన బ్యాంకు ఖాతాలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్తంభింపజేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో తీవ్ర వేదన, దుఃఖం, భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రతీకార చర్యల కారణంగానే తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని తెలిపింది. అవాస్తవాలు, ఉద్దేశపూరక ఆరోపణలపై మానవ హక్కుల సంస్థలను భారత ప్రభుత్వం మంత్ర గత్తెలా వేటాడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. తాము దేశంలో పరిస్థితిని ఎదుర్కొంటున్నామని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తాజాగా ఆరోపించింది. దేశంలో మానవ హక్కులు ఉల్లంఘనలపై తాము సమర్పించిన నివేదికల నేపథ్యంలో తమ సభ్యులు, బెదిరింపులు, వేధింపుల దాడిని ఎదుర్కొంటున్నారని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, జమ్ముకశ్మీర్ అంశాలపై మౌనం వహించిదని ఆరోపించారు. ఇలాంటి ధోరణుల మధ్య దేశంలో ఇక సేవలు అందించలేమని తెలిపింది. 70కి పైగా దేశాలలో పనిచేస్తున్నాం ఇంతకుముందు 2016 లో రష్యా మాత్రమే కార్యకలాపాలను మూసివేశాని ఖోస్లా చెప్పారు. అయితే దేశంలో తన చట్టపరమైన కేసులపై తమపోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010 (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై 2019 నవంబర్ 5న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సంస్థ ప్రధాన కార్యాలయంపై దాడులు నిర్వహించింది. అలాగే గత ఏడాది ఈడీ ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలతో తాజాగా ఇండియాలో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది కాగా భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛపై, అసమ్మతి గళాలపై ఒత్తిడి, దాడులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఆమ్నెస్టీ తాజా నిర్ణయం కలకలం రేపింది. దీంతో దేశ ప్రతిష్టకు తీవ్ర భంగం ఏర్పడిందని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీరని అవమానమని వ్యాఖ్యానిస్తున్నారు. #NEWS: Amnesty International India Halts Its Work On Upholding Human Rights In India Due To Reprisal From Government Of Indiahttps://t.co/W7IbP4CKDq — Amnesty India (@AIIndia) September 29, 2020 -
నీ హక్కుకు రక్షణగా నేనున్నా!
-
నీ హక్కుకు రక్షణగా నేనున్నా!
పుట్టిన ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ప్రతి పౌరుడికి కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. హక్కులను హరించే హక్కు ఎవరికి ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో ఆ ప్రభుత్వాలే హక్కులను కాలరాస్తుంటాయి. అటువంటి సందర్భాలలో కోర్టుకెక్కి మన హక్కులను దక్కించుకుంటున్నాం. అయితే రారాను మన హక్కులను మనకు దక్కకుండా చేస్తున్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో పౌరులందరికి తమ హక్కులు దక్కేలా కృషి చేస్తూ ప్రతి యేడాది డిసెంబర్ 10వ తేదీన మానవహక్కుల దినోత్సవంగా నిర్వహిస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషి, చేపడుతున్న చర్యలు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఉత్తరాదినే ఉల్లంఘనం ఎక్కువట!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)లో నమోదవుతున్న కేసుల్లో ఉత్తరాది రాష్ట్రాలవే ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే.. ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లోనే ఈ తరహా ఘటనలు అధికంగా చోటుచేసుకుంటునాయి. ఎన్హెచ్ఆర్సీ 2016–17కు సంబంధించి నివేదికను బట్టి ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. మానవహక్కుల ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగుతుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తారు. మరికొన్ని సార్లు దినపత్రికలు, చానళ్లలోచూసి ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఒక్క యూపీలోనే సగం కేసులు దేశంలో మానవహక్కుల ఉల్లంఘనపై ఏటా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎన్హెచ్ఆర్సీ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతుంటుంది. ఇందులో అత్య«ధి కంగా వచ్చే ఫిర్యాదులు ఉత్తరప్రదేశ్ నుంచే కావడం గమనార్హం. ఏటా దేశవ్యాప్తంగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. ఒక్క యూపీ నుంచే 30 నుంచి 40 వేల వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో ఎన్కౌంటర్లకు సంబంధించినవే వేల సంఖ్యలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎన్హెచ్ఆర్సీ విడుదల చేసిన నివేదిక 2016–17 పేర్కొన్న అంశాల ప్రకారం.. 42,590 కేసుల నమోదుతో యూపీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా 8,750, ఢిల్లీ 6,368, హరియాణా 4,596, బిహార్ 3,765 ఉన్నాయి. 928 కేసులతో తెలంగాణ 17వ స్థానం, 1,250 కేసులతో ఏపీ 10వ స్థానంలో నిలిచింది. కాగా 2017 నుంచి ఇప్పటివరకు 5,178 ఎన్కౌంటర్లు యూపీలోనే అయినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. వీటిలో 103 మంది నేరస్తులు మరణించారు. ఇక తెలంగాణలో గత ఆరేళ్లలో 10 ఎన్కౌంటర్లు జరగ్గా.. అందులో దాదాపు 25 వరకు వ్యక్తులు మరణించారు. ఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుంది? ఒకవేళ ఎన్హెచ్ఆర్సీ విచారణలో ఎన్కౌంటర్ బూటకమని తేలితే సదరు బాధిత కుటుంబాలకు రూ.ఒక లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందించాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. మిగతా కేసు ల్లో వ్యక్తులు, ఇతర సంస్థలు, పరిశ్రమల ‡తప్పిదాల వల్ల మనుషుల ప్రాణాలకు నష్టం వాటిల్లితే.. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు అందజేయాలని సిఫారసు చేస్తుంది. ఉమ్మడి ఏపీలో బూటకపు ఎన్కౌంటర్లు.. 2002కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలులో జరిగిన 19 ఎన్కౌంటర్లలో 16 బూటకపువేన ని ఎన్హెచ్ఆర్సీ తేల్చిచెప్పింది. ఆయా ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
ఆ బాధ్యత అందరిదీ కాదా?
మన రాజ్యాంగం, మూడో అధ్యాయంలో ప్రాథమిక హక్కులకు భద్రత కల్పించారు. అయినా సగటు మనిషి హక్కుల్ని కోల్పోతూనే ఉన్నాడు. రోజూ ఏదో రూపంలో వంచనకు గురవుతూనే ఉన్నాడు. సర్వ వ్యవస్థల్ని చెరబట్టి, అధికారాన్ని కేంద్రీకృతం చేస్తున్న వారు పౌరులకు ఒరగబెట్టిందేమిటి? నెల రోజుల పాటు విచారణ జరుపుతూ వివిధ వ్యాఖ్యలతో ఆశలు రేపిన న్యాయస్థానం చివర్న ‘సమ్మె తప్పో ఒప్పో తేల్చడం మా పరిధిలో లేదు’ అంటే ఆర్టీసీ కార్మికులు ఎటు వెళ్లాలి? ‘సమ్మెకట్టి విధులకు రానంత మాత్రాన ఉద్యోగాలు కోల్పోయినట్టు కాదు..’ అని హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సమ్మె విరమించిన ఉద్యోగులు చాలా వేదనకు గురికావలసి వచ్చింది. పౌరుల నుంచి ఆశిస్తున్నట్టే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ తమ నిర్దేశిత విధుల్ని బాధ్యతగా నిర్వర్తిస్తే అందరం బాగుపడతాం! భారతీయ సనాతన సంస్కృతి, వారసత్వ సంపదకు సంబంధించిన సమస్త సాహి త్యంలో ఎక్కడైనా ‘హక్కు’ అనే మాట ఉందా? చెప్పండి! అని సర దాగా సవాల్ చేశారు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పుష్కర కాలం కిందట. సమాచార హక్కు చట్టం కమిషనర్గా ఉన్నాను నేనపుడు. అధికార వ్యవస్థ పారదర్శకంగా ఉండి, ప్రజా సమాచారం ప్రజల కివ్వడం తమ విధిగా భావిస్తే పౌరులు దాన్ని హక్కుగా డిమాండ్ చేయాల్సిన అవసరమే రాదన్నది ఆయన కవి హృదయం. నిజమే! ఈ సూక్ష్మం గ్రహించినందునే కాబోలు మన వేదాలో, వేదాంగాలో, ఉపనిషత్తులో, బ్రహ్మసూత్రాలో, పురాణాలో, ఇతిహాసాలో... భారత సనాతన ఆధ్యాత్మిక వాఙ్మయంలో ఎక్కడా హక్కు అనే మాటే కని పించదు. ఎందుకంటే, హక్కులు–విధులు ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. ఒకరి హక్కులు ఎదుటి వారి విధులవుతాయి. అలాగే ఎదుటి వారి హక్కులు వీరికి విధులవుతాయి. వ్యక్తులు, జన సమూ హాల మధ్యే కాకుండా, పరస్పరం ఆధారపడ్డ రెండు సంస్థల మధ్య, చివరకు... పౌరులు–రాజ్యం మధ్య కూడా ఇదే బంధం ఉంటుంది. ఎవరికి వారు, ఎక్కడికక్కడ తమ విధులు–బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తే, ఇక ఎదుటి వారెవరూ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరమే రాదు. మన పురాణ గాథల్లో కుటుంబంలోని వ్యక్తుల మధ్యే కాదు, అందరికీ, కుటుంబాలకు, సమాజాలకు, రాజ్యానికి కూడా విధుల్ని నిర్దేశించారు. వాటిని పాటించేలా కట్టడి చేశారు. తద్వారా ఎదుటి వారి హక్కులు నెరవేరేలా, వాటికి భంగం కలుగకుండా భద్రత కల్పించారు. డిమాండ్ చేసి హక్కులు సాధించుకోవాల్సిన పరిస్థితి ఎవరికీ రానీయవద్దనేది లక్ష్యం. సదరు భావన ఇపుడు లోపిస్తోంది. రాజ్యం, దాని అవిభాజ్య అంగాలు, వివిధ వ్యవస్థలు, సంస్థలు... తమ నిర్దేశిత విధుల్ని, బాధ్యతల్ని, కర్తవ్యాల్ని విస్మరిస్తున్నాయి. ఫలితంగా పౌరులు కడగండ్లపాలవుతున్నారు. విధుల్ని నిర్వర్తించ డంలో అప్పుడప్పుడు పౌరులూ విఫలమౌతున్నారు. మన రాజ్యాం గంలో పౌరులకు కొన్ని విధుల్ని నిర్దేశించారు. సదరు విధుల్ని పాటిం చండని పెద్దలు నొక్కి చెబుతున్నారీ రోజు. మన రాజ్యాంగాన్ని ఆమో దించి 70 ఏళ్లయిన సందర్భంగా మాట్లాడిన భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సహా పెద్దలు పౌరుల విధులు–బాధ్యతల్ని నొక్కి చెప్పారు. విధులు నిర్వ ర్తించకుంటే హక్కులకు రక్షణ ఉండదనీ ధ్వనించారు. బాధ్యతలు లేనిదెవరికి? నిజమే! పౌరులకు నిర్దిష్ట విధులున్నాయని భారత రాజ్యాంగం చెబు తోంది. ఎవరికి లేవు? శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో సహా ముఖ్యమైన ప్రజాస్వామ్య విభాగాలన్నింటికీ నిర్దేశిత బాధ్యత లున్నాయి. ప్రసార మాధ్యమ (మీడియా) వ్యవస్థతో సహా! రాజ్యం నిర్వహించాల్సిన బాధ్యతల్ని రాజ్యాంగం నాలుగో అధ్యాయంలో ఆదేశిక సూత్రాలుగా పేర్కొన్నారు. శాసన–కార్యనిర్వాహక వ్యవస్థల పనితీరు సమీక్షించి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యతను న్యాయ వ్యవస్థకు అప్పగించారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికి మీడియా పోషించాల్సిన పాత్ర గురించి ప్రెస్ కమిషన్ నివేదికతో పాటు ప్రెస్ కౌన్సిల్ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలూ దేనికదిగా పనిచేసే క్రమంలో పౌరుల హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే న్యాయం పొందవచ్చు. మన రాజ్యాంగం, మూడో అధ్యాయం, ప్రాథమిక హక్కుల రూపంలో ఇందుకు భద్రత కల్పించారు. అయినా సగటు మనిషి హక్కుల్ని కోల్పోతూనే ఉన్నాడు. రోజూ ఏదో రూపంలో వంచనకు గురవుతూనే ఉన్నాడు. సర్వ వ్యవస్థల్ని చెరబట్టి, అధికారాన్ని కేంద్రీకృతం చేస్తున్న వారు పౌరులకు ఒరగబెట్టిందే మిటి? నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పదిహేడేళ్ల దేవేందర్ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ ఎందరికో కంటతడి పెట్టిం చింది. కారణమేదైనా ఆత్మహత్యలు గర్హనీయం, అందరం ఖండించా ల్సిందే! కానీ, ‘....ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, పేదలు ఇంకా నిరుపేదలవుతున్నారు... మా వైపు చూడండి, మా అమ్మానాన్నలు రోజూ కూలీ చేస్తున్నా మాకంటూ ఓ ఇల్లు లేదు, నే చచ్చాకయినా మాకో ఇల్లు ఇప్పించండి’ అంటూ ఆలేఖలో ప్రతి ధ్వనించిన యువకుడి ఆర్తి గురించి ఒక నిమిషమైనా ఆలోచించాలి కదా! ‘నిందితులెవరో వెంటనే తెలియదు తప్ప, ఆత్మహత్యలన్నీ హత్యలే!’ అని ఓ సామాజిక శాస్త్రవేత్త అన్నది ఇందుకేనేమో! నెల రోజుల పాటు విచారణ జరుపుతూ వివిధ వ్యాఖ్యలతో ఆశలు రేపిన న్యాయస్థానం చివర్న ‘సమ్మె తప్పో ఒప్పో తేల్చడం మా పరిధిలో లేదు’ అంటే ఆర్టీసీ కార్మికులు ఎటు వెళ్లాలి? ‘సమ్మెకట్టి విధులకు రానంత మాత్రాన ఉద్యోగాలు కోల్పోయినట్టు కాదు...’ అని హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సమ్మె విరమించిన ఉద్యోగులు చాలా వేదనకు గురికావలసి వచ్చింది. ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం, ‘పిల్’ (అమరావతి రాజధాని భూములు–ఏబీకే ప్రసాద్ కేసు) విచారిస్తూ, బాధ్యత కలిగిన ఓ సంపాదకుడిని, ‘... మీకేమి సంబంధం? మీ భూములు లాక్కొన్నప్పుడు వద్దురు పొండి!’ అని సాక్షాత్తు సుప్రీంకోర్టే అంటే ఇక సాధారణ పౌరులకు దిక్కేది? పౌర విధులు స్వీయ బాధ్యత పౌరుల ప్రాథమిక విధులు రాజ్యాంగంలో మొదట్నుంచి లేవు. 42వ రాజ్యాంగ సవరణతో, అధికరణం 51ఎ ద్వారా 1976 నుంచి అమ ల్లోకి వచ్చాయి. రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం, స్వాతంత్య్ర పోరా టాన్ని ప్రభావితం చేసిన విలువల పరిరక్షణ. దేశ సమైక్యత, సమ గ్రత, సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం వంటివన్నీ ఈ ప్రాథమిక విధుల్లో ఉన్నాయి. అవసరం ఏర్పడ్డపుడు దేశ రక్షణకు సేవలందిం చాలి. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, ప్రాంత, భాషా భేదాలకతీతంగా మనుషుల్లో సోదర భావం పెంచాలి, మహిళల్ని గౌరవించాలి. మన వైవిధ్య సంస్కృతి, వారసత్వ సంపదకు విలువిచ్చి పరిరక్షించాలి. అడవులు, నదులు, కుంటలు, జీవవైవిధ్యంతో పాటు సర్వ సహజ వనరుల్ని కాపాడుతూ, జీవకారుణ్యంతో ఉండాలి. హింసను నిలువ రించి, ప్రజా ఆస్తుల్ని పరిరక్షించాలి. శాస్త్రీయ దృక్ప«థం, మానవ విలు వల వృద్ధితో అన్వేషణ–సంస్కరణ పంథాలో సాగాలి. అన్ని రంగాల్లో వ్యక్తిగత, సామూహిక సామర్థ్యాల ద్వారా దేశం ప్రగతి పథంలో సాగేందుకు తోడ్పడాలి. ఆరు–పద్నాలుగేళ్ల మధ్య వయసు పిల్లల తలిదండ్రులుగానో, సంరక్షకులుగానో వారికి విద్యావకాశాలు కల్పిం చాలి. ఇవన్నీ నిర్వర్తించడం దేశ పౌరుల ప్రాథమిక విధి అని రాజ్యాంగం చెబుతోంది. వీటి ఉల్లంఘనలకు నేరుగా న్యాయస్థా నాల్లో న్యాయ పరిష్కారం లేదు. కానీ, ఎప్పటికప్పుడు ఇవన్నీ పౌరులు పాటించేలా సంబంధిత ప్రభుత్వాలు చట్టాలు చేయవచ్చు. వీటిని రాజ్యాంగంలో చేర్చడం పట్ల కొంత వివాదం, విమర్శ కూడా ఉంది. ఇవన్నీ పౌరులు సహజంగానే చేస్తారని, పైగా ఆచరణ పరమైన స్పష్టత కొరవడిందనేది విమర్శ. నిజానికి 42వ రాజ్యాంగ సవరణే ఒక పీడకల అనే స్థూల అభిప్రాయముంది. 1975లో అర్థరాత్రి విధిం చిన ఆంతరంగిక అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) నీడలో వచ్చిన సవరణలివి. విధులు పాటించడమే హక్కులకు రక్షణ ఎవరో చెప్పారని కాదు గానీ, ఎవరికి వారు తమ విధుల్ని నిర్వర్తిం చాలి. ఫలితంగా అందరి హక్కులకు రక్షణ లభిస్తుంది. ఏ చట్టం, రాజ్యాంగపు ఏ అధికరణం నిర్దేశించనవసరం లేకుండా మన వ్యక్తిత్వ రీత్యానే ఈ ప్రాథమిక విధుల్ని పాటించవచ్చు. సద్గురు జగ్గీవాసుదేవ్ ఒక పుస్తకంలో బాధ్యతను చక్కగా వివరించారు. ‘బాధ్యత... మూడొంతుల మంది తప్పుగా అర్థం చేసుకున్న పదమిది. అది ఎంత విస్తృతంగా, ఎంత విచక్షణారహితంగా వాడబడుతోందంటే, అది దాని ప్రబలమైన శక్తిని చాలా వరకు కోల్పోయింది. బాధ్యత అంటే ప్రపంచ బరువుని మనమీద వేసుకోవడం కాదు. మీరు చేసినదానికీ చెయ్యని దానికీ నిందని భరించడం కాదు. దానర్థం నిరంతరం అప రాధ భావనతో బ్రతకడం అంతకంటే కాదు. బాధ్యత అంటే కేవలం మీ స్పందనా సామర్థ్యమే. ‘నేను బాధ్యున్ని’ అని మీరు నిర్ణయిం చుకుంటే, స్పందించే సామర్థ్యం మీలో ఏర్పడుతుంది. ‘నేను బాధ్యున్ని కాదు’ అని నిర్ణయించుకుంటే, స్పందించే సామర్థ్యం ఉండదు. దాన్నంత తేలిగ్గా వివరించవచ్చు, అదంత సరళమైంది..... ఈ క్షణంలో, చెట్లు వదిలే గాలినే మీరు తీసుకుంటున్నారు. మీరు వదిలే శ్వాసనే అవి తీసుకుంటున్నాయి. ఈ ఉచ్ఛ్వాస–నిశ్వాసల లావాదేవీ నిరంతరం సాగుతోంది. మీకిది తెలిసినా తెలియక పోయినా మీ శ్వాసకోశంలో సగభాగం ఆ చెట్లకి వేలాడుతోంది. ఇలా పరస్పరం ఆధారపడి ఉన్నారన్న సంగతి మీరెన్నడూ అనుభూతి చెంది ఉండకపోవచ్చు. మహా అయితే మేధోపరంగా ఆలోచించి ఉంటారు. కానీ, ఈ అనుబంధాన్ని మీరు అనుభూతి చెంది ఉంటే, మీకెవరైనా ‘మొక్కలు నాటండి, అడవుల్ని రక్షించండి, ప్రపంచాన్ని కాపాడండి’ అని చెప్పాలా? అసలు అది అవసరమా?’అన్నారాయన. ఇది గ్రహిస్తే రాజ్యాంగం నిర్దేశించే విధుల్ని మనం విడువకుండా పాటిస్తాం. ఇప్పటికే పాటిస్తున్నాం కూడా! పౌరుల నుంచి ఆశిస్తు న్నట్టే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ తమ నిర్దేశిత విధుల్ని బాధ్యతగా నిర్వర్తిస్తే అందరం బాగుపడతాం! ఇది నిజం! వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఉచిత ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు
లండన్: ఇంటర్నెట్ సేవలను ఉచితంగా పొందడమన్నది మానవుల ప్రాథమిక హక్కు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు ఇంటర్నెట్ను పొందలేకపోతున్నారని, దీంతో ప్రపంచ స్థాయి వ్యక్తులతో సమానంగా తమ జీవితాలను బాగుపరుచుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయని పేర్కొంది. ఈ అధ్యయనాన్ని చేపట్టిన బ్రిటన్లోని బర్మింగ్హామ్ యూనివర్సిటీ పరిశోధకులు భారత్లోని కేరళ రాష్ట్రాన్ని ఓ ఉదాహరణగా చూపారు. ఇంటర్నెట్ పొందడమనేది ప్రాథమిక హక్కుగా కేరళ రాష్ట్రం ప్రకటించిందని, ఈ ఏడాది చివర కల్లా 3.5 కోట్ల మందికి ఇంటర్నెట్ను అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. కొందరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండి.. మరికొందరికి లేకపోవడం వల్ల ప్రాథమిక స్వేచ్ఛగా పేర్కొనే వ్యక్తీకరణ, సమాచార స్వేచ్ఛలను కోల్పోతారంది. -
మెజారిటీ నైతికతకు సర్వజనామోదమా?
రోడ్డున పోతూ రాలిపడిన మామిడిపండ్లను ఏరుకొంటాడతను, ఉగ్గబట్టిన ప్రేమను చాటుగా తీర్చుకుంటుంది ఆమె, తమకు ఇష్టమైన మాంసాహారాన్ని ప్రీతిగా ఆరగిస్తుంది ఆ కుటుంబం. మీ దైవనినాదం నేను పలకలేను అంటాడతను. పొట్టిదుస్తులు ధరించి పబ్కి వెళ్లి ఒక్కతే తిరిగి వస్తుంటుంది అమ్మాయి, మా మతాన్ని ప్రచారం చేసుకుంటామంటారు వాళ్ళు. ఇంతేసి ఘోరమైన నేరాలను సహించలేని సంస్కృతి పరిరక్షకులు, నైతిక వర్తనులు సమూహంగా చేరి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు. ఎప్పటికో ఆ విషయం సెన్సేషనల్ సోకు చేసుకుని మీడియాలో సామాజిక మాధ్యమాల్లో గిరికీలు కొడుతుంది. కాస్త అలజడి, మృత సముద్రపు చివరి అలలా బద్ధకంగా ఉబికి మళ్ళీ పడుకుంటుంది. నిర్జీవ శరీరాల మీదుగా రహస్యపు ఒప్పుదల గాలి వీస్తుంది. చిన్నదైనా పెద్దదైనా ఒక నేరం జరిగిందంటే, జరిగిందన్న అనుమానం ఉంటే–తమకి తోచిన ఎంతటి శిక్షయినా విధించవచ్చుననే ‘మెజారిటీ నైతికత’ ఇపుడు సినిమాలను దాటి వాస్తవ జీవితంలోకి బలంగా చొచ్చుకు వస్తోంది. సర్వజనామోదం దిశగా దూసుకుపోతోంది. నేరము, శిక్షల విషయంలో చట్టాలకి వెలుపల వ్యక్తుల, సమూహాల జోక్యం బాగా పెరగడం ఆలోచించాల్సిన విషయం. సామాజిక, ఆర్థిక పోరాటాలకి వెన్నుబలంగా నిలవాల్సిన ‘మెజారిటీ నైతికత’ సమూహ స్వభావాన్ని వదిలిపెట్టి వ్యక్తులను విడివిడిగా నిలవేసి ఎందుకు స్కాన్ చేస్తోందో చర్చించాలి. నైతిక విలువలు, సమాజ క్షేమం ముసుగులో భౌతికదాడులు, మానసిక హింస, అసూయ, ద్వేషం, నోటి దురుసుతనం, అహంభావం, తీర్పరితనం, కుట్రస్వభావం పెచ్చుమీరిపోవడాన్ని విశ్లేషించాలి. వ్యక్తుల హక్కులకి, గౌరవప్రదమైన ఆంతరంగిక, బాహిర జీవితానికి తావులేని ఇటువంటి చోట ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో నేరస్తులుగా ముద్రలు మోస్తున్నారని గ్రహించాలి. శత్రువుని గుర్తించడంలో తడబాటు, తమకి భిన్నంగా ఉన్నదాని పట్ల అసహనం, ఏ మాత్రమూ వివరం తెలీని నేరంపట్ల తక్షణ స్పందన కొత్త ధోరణులుగా స్థిరపడుతున్నాయి. సామాజిక మాధ్యమాలు ఈ ధోరణులకి ఒకానొక ఉదాహరణ. ఎవరో ఎవరినో అన్యాపదేశంగా తిడుతూ నేరం ఆరోపిస్తూ ఒక పోస్టు పెడతారు. వెంటనే వందలమంది లాయర్ల అవతారం ఎత్తుతారు. మరి కొంతమంది తీర్పరులు. వీరంతా కలిసి విచారణ చేసి రకరకాల తీర్పులు వెలువరిస్తారు. అనుమానితులు, నిందితులు, నేరస్తుల వంటి క్రమం లేకుండానే, ఆరోపణలకి గురైన వ్యక్తి ప్రమేయం లేకుం డానే శిక్ష ఖరారు అవుతుంది. ఈ మధ్యలోనే ఒక అభ్యుదయ స్వరం వచ్చి ‘బాగా అయింది, బట్టలూడదీసి మరీ తన్నావుగా!’ అని ఎంకరేజ్ చేస్తుంది. ఇంకోచోట మరి కొందరు, ‘మీరెవరన్నా తప్పు చేశారా డొక్క చించి డోలు కడతాం, తాట తీస్తాం, తొక్క వలుస్తా’మంటూ వీరంగం వేస్తారు. తరతరాలుగా బట్టలూడదీసి తన్నబడిన వాళ్ళలోనూ తాట వలవబడిన వాళ్లలోనూ ఆధిపత్యవర్గాలు దాదాపు ఉండవని, అటువంటి ఫ్యూడల్ హింసలకి గురయ్యేది అనువుగా ఉండే బలహీనులేనన్నది గ్రహించరు. కొత్త ఆలోచనల నడక ఇప్పటికీ అంత సజావు కాదు, మాటల చుట్టూ సీసీ కెమెరాలుంటాయి. అక్షరం ప్రతీ కదలిక రికార్డ్ అవుతూ ఉంటుంది. కులం, మతం, స్త్రీల లైంగికత, దేశభక్తి లాంటి విషయాల్లో మెజారిటీ నైతికతకి భిన్నంగా మాట్లాడినవారిని మానసికంగా కుంగదీసేలా ట్రోలింగ్ మొదలవుతుంది. మరి కొన్నిసందర్భాల్లో విలువలు అతిక్రమించిన, విస్మరించిన వ్యక్తుల ఆచరణ మీద అప్రజాస్వామికంగా నైతిక ఫాసిస్టుల దాడి మొదలవుతుంది. తమ ఆలోచన, ఆచరణ మాత్రమే తిరుగులేనిదన్న అహంభావమే వైరుధ్యపూరితమైన ఇతర మానవుల జీవిత ఘర్షణల పట్ల ఏమాత్రం శ్రద్ధ పెట్టనివ్వదు. అర్థం చేసుకోనివ్వదు. ఈరోజు ప్రతివ్యక్తి చేతిలో ఒక శిక్షాస్మృతి ఉంది. వారివారి రాగద్వేషాలను, తీర్పరితనాలను, ఓపలేనితనాలను బట్టి, చంపడం, కొట్టడం, అంటుముట్లు, వెలివేతలు, పబ్లిక్ షేమింగ్ లాంటి వాటికి పిలుపునిస్తారు. క్షణాల్లో గుమిగూడిన గుంపు ఏమీ తెలీకుండానే తలొక రాయీ విసురుతుంది. మానవులలోని పురా హింసాప్రవృత్తి రెక్కలు సాచుకుని లేస్తుంది. ‘బలవంతులదే రాజ్యం’ అన్న నినాదానికి వ్యతిరేకంగా నిర్మించుకున్న ప్రజాస్వామికత, తలను లోనికి ముడుచుకుంటుంది. ‘మెజారిటీ నైతికత’ ప్రతిష్టించబోయే విలువల కోసం జరిగే హింసాకాండకి నువ్వొక సమిధ వ్రేల్చావా లేదా అన్నదే ముఖ్యం తప్ప నీకేం తెలుసని గుంపులో దూరావని అడగరెవ్వరు. చట్టాలకి బైట చేతిలోకి తీసుకునే శిక్షారూపాలన్నీ మొదట అనువర్తిత మయ్యేది ‘వల్నరబుల్’ వర్గాల మీదనే. ఈరోజు సాంస్కృతిక రంగంలో మనం శిక్షాస్మృతిని సొంతంగా నిర్మించుకుని అమలు చేస్తే రేపు మరొకరు అంతే సొంతంగా ఏవి నేరాలో నిర్వచిస్తూ పోతారు. అసలు ఎంత తప్పుకి ఎంత శిక్ష విధించాలో నిర్ణయించాల్సింది ఎవరు? జరిగిన తప్పుకీ మన నైతికదాడి మూలంగా పడిన శిక్షకీ మధ్య వెనక్కి తీసుకోలేని ఎడం ఉంటే ఇక మనం నేరస్తులం కాక మరేమిటి? ప్రజల హక్కులకి రక్షణ కల్పించే రాజ్యవ్యవస్థలని మాత్రమే నమ్ముకుని ఉండటం ఎలానూ సాధ్యం కావడం లేదు. అలాగని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి నేర విచారణలోనూ శిక్ష నిర్ధారణలోనూ పాల్గొని ఘటనకొక సొంత చట్టాన్ని తయారు చేయడమూ సరి కాదు. ఎన్ని లొసుగులతో ఉన్నప్పటికీ రాజ్యాంగం బాధితులకీ నేరస్తులకీ వారివైన హక్కులను పొందుపరిచింది. మధ్యయుగాల నేరవిచారణ, శిక్షల నిర్ధారణ నుంచి మనుషులను చైతన్యపరచేవాటిలో ‘మానవ హక్కుల’ స్పృహ ముఖ్యమైనది. కలిసివచ్చే అంశాల మీద వ్యక్తులను సమూహంలో భాగం చేయాలి తప్ప, సమూహంలో భాగంగా ఉన్న వ్యక్తులను విడి ఘటనల రీత్యా బహిష్కరించడం వల్ల సంస్కరణ, మేలు జరగదు. నేరపూరితమైన ఆధిపత్య సంస్కృతికి ఎదురుగా నిలబడాల్సింది సర్వ సమానత్వ బలంతో నిండిన ప్రజాస్వామిక సంస్కృతి మాత్రమే. వ్యక్తిలోనైనా సంస్థలోనైనా ఎక్కడైనా ఈ ప్రజాస్వామికత బాహిరమే కాదు అంతర్గతం కూడానన్నది ఆచరణలో నిరూపణ కావాలి. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక malleswari.kn2008@gmail.com -
కథనాలే కాదు మాటా పదునే
‘దక్షిణాసియాలో మానవ హక్కులు’ అనే అంశం మీద మంగళవారం యు.ఎస్.లో సదస్సు జరుగుతోంది. ఆ సదస్సును ఏర్పాటు చేసింది యు.ఎస్. హౌస్ కమిటీ. హౌస్ అంటే ‘హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్’. ప్రతినిధుల సభ. ఆ సభ నేతృత్వంలో విదేశీ వ్యవహారాల మీద చర్చలకు, తీర్మానాలకు ‘హౌస్ కమిటీ ఆన్ ఫారిన్ అఫైర్స్’ పని చేస్తుంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే మంగళవారం నాటి సదస్సు జరిగింది. అందులో మాట్లాడ్డం కోసం ఆసియా దేశాల్లోని జర్నలిస్టులు కొందరికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి. ఇండియా నుంచి ప్రముఖ పాత్రికేయురాలు ఆర్తిసింగ్కు ఆహ్వానం అందింది. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. వారిలో ఎక్కుమంది కశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. వారి మాటల్ని బట్టి.. ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని బయటిదేశాల్లో ఇప్పటికే బాగా ప్రచారం అయిందని ఆర్తికి అర్థమైంది. ఏ ప్రచారంలోనైనా ప్రపంచ మీడియా పాత్ర బలంగా ఉంటుంది. అందుకని ఆర్తి తన ప్రసంగంలో.. ప్రచారం జరుపుతున్న వారి బాధ్యతారాహిత్యం మీద ప్రశ్నలు గుప్పించారు. ‘‘ముప్పై ఏళ్లుగా కశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయంపై ప్రపంచ మీడియా ఒక్కసారైనా నోరు మెదిపిందా? కశ్మీర్లో పాక్ ఉగ్రవాద బాధితుల గురించి గళమెత్తడం తమ కనీస ధర్మం అని ప్రపంచ మీడియాతో పాటు, ప్రపంచ మానవ హక్కుల కార్యకర్తలు ఏనాడైనా అనుకున్నారా?’’ అని ఆర్తి విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై పాక్ స్పందన, పాక్ను సమర్థించే దేశాల ప్రతిస్పందన ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల నుండి ఆర్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆర్తి ప్రస్తుతం ఒక జాతీయ దినపత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నారు. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాలలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆర్తి, గతంలో జమ్మూకశ్మీర్లో ఏడేళ్లపాటు న్యూస్ కరస్పాండెంట్గా పని చేశారు. -
ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జరిమానా
న్యూఢిల్లీ: మానవ హక్కుల కోసం ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేసే అంశం గురించి నివేదిక ఇవ్వడంలో విఫలమయ్యాయంటూ ఏడు రాష్ట్రాలకు వేర్వేరుగా రూ.లక్ష వరకూ సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిందిగా గత ఏడాదే సూచించినప్పటికీ ఏర్పాటు చేయకపోవడం వల్లే జరిమానా విధించినట్లు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ బీఆర్ దవైల ధర్మాసనం తెలిపింది. ఈ కేసు మంగళవారం వాదనలకు రాగా కనీసం తమ రాష్ట్రాల తరపున లాయ ర్లు కూడా హాజరుకాకపోవడంతో రాజస్తాన్. ఉత్తరాఖండ్లకు లక్ష జరిమానా విధించింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాంలకు రూ.50 వేల చొప్పున పెనాల్టీ విధించింది. మానవ హక్కుల చట్టం 1993 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక లాయర్ను నియమించాలని గతేడాదే సుప్రీం సూచించింది. తిరిగి నాలుగు వారాల్లోగా తమ నివేదికలను సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. ఈ జరిమానాను మైనర్ల కేసుల విచారణ కోసం వాడతామని తెలిపింది. -
ఒకేసారి 3 కీలక బిల్లులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డికి ఒకే రోజు మూడు కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం లభించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం –1967ను సవరిస్తూ తెచ్చిన బిల్లును, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ –2008ను సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లును, అలాగే మానవ హక్కుల చట్టం –1993ను సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లులను ఆయన సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఇలా బిల్లులను ప్రవేశపెట్టడాన్ని విపక్ష సభ్యులు అధీర్ రంజన్ చౌదరి, శశిథరూర్, ఎన్.కె.ప్రేమచంద్రన్ తదితరులు వ్యతిరేకించారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం –1967ను సవరిస్తూ తెచ్చిన బిల్లును వ్యతిరేకించారు. సంస్థలుగా కాకుండా వ్యక్తులు గానూ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని నిర్బంధించేందుకు వీలుగా ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని, తీవ్రవాది అనే పేరుతో ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకునే ప్రమాదం ఉందని విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. మిగిలిన బిల్లులపైనా విభిన్న అంశాలను ప్రస్తావిస్తూ ఆయా సభ్యులు వ్యతిరేకించారు. అయితే మంత్రి కిషన్రెడ్డి ఆయా విమర్శలను దీటుగా తిప్పికొట్టారు. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం సహించబోదని, సంస్థలను నిషేధించినా వాటి నుంచి విడిపోయి బయటకు వచ్చి వ్యక్తిగతంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఈ చట్టం తేవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆధార్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం: ఆధార్ను స్వచ్చందంగా ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పించే ఆధార్ సవరణ బిల్లు–2019ను రాజ్యసభ ఆమోదించింది. గత వారం ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఫోన్ కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ ధ్రువీకరణకు ఆధార్ వివరాలను వాడుకునేందుకు తాజా ప్రతిపాదనల్లో ప్రభుత్వం వీలు కల్పించింది. -
మానవహక్కులకు దిక్కేది?
దాదాపు అర్ధశతాబ్దం కిందట ఆరంభమైన నక్సలైట్ ఉద్యమంతో పాటే మానవ హక్కుల నేతల కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. నక్సౖ ట్లు పోలీసులతో జరిగిన నిజమైన ఎన్కౌంటర్లో చనిపోతే మానవ హక్కుల కార్యకర్తలు ప్రశ్నించేవారు కాదు. పట్టుకొని కాల్చి చంపడాన్ని నకిలీ ఎన్కౌంటర్గా అభివర్ణించి దాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తారు. పట్టుకున్న నక్సలైట్ను న్యాయస్థానంలో హాజరుపరిచి నిజమైన నక్సలైట్ అని నిర్ధారించి చట్టప్రకారం శిక్ష విధించమని వారు అడుగుతారు. నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమానికి మూలకారణం రాజకీయార్థికమనీ, దీనిని శాంతి,భద్రతల సమస్యగా పరిగణించకుండా మూలాలకు వెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత ఉన్నవారు కోరుతూ వచ్చారు. మావోయిస్టులకు ఈ రాజ్యాంగంపైన విశ్వాసం లేదు, ఈ వ్యవస్థను కూలదోసి నూతన వ్యవస్థను నిర్మించాలనేది వారి సిద్ధాంతం, అటువంటప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు వారికి ఎట్లా వర్తిస్తాయని ప్రశ్నించేవారు మొదటి నుంచీ ఉన్నారు. మావోయిస్టులకు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు సరే, రాజకీయ నాయకులకూ, పోలీసు అధికారులకూ, సాధారణ పౌరులకూ రాజ్యాంగంపట్ల విశ్వాసం ఉన్నది కనుక ప్రభుత్వం తీసుకునే ప్రతిచర్యా రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. మావోయిస్టులపైన పోరాటం పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు. హక్కులను కాలరాయకూడదు. రాజ్యాంగాన్ని ప్రభుత్వ నిర్వాహకులే ఉల్లంఘిస్తే వారికీ, మావోయిస్టులకూ తేడా ఏమున్నది? ఈ రకమైన ప్రశ్నలూ, సమాధానాలూ ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న 1960–90లలో రాష్ట్రం అంతటా వినిపించేవి. వివిధ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమం తగ్గుముఖం పట్టి ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలలోనూ, ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోనూ, మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోనూ కేంద్రీకృతమైంది. ఈ లోగా దేశంలో అసహన వాతావరణం ప్రబలింది. మావోయిస్టులను పట్టుకొని కాల్చిచంపడాన్ని (‘ఎన్కౌంటర్’ చేయడాన్ని) ప్రశ్నించేవారి నోరు మూయించే వాతావరణం వచ్చింది. మానవ హక్కుల కార్యకర్తలని మావోయిస్టుల సానుభూతిపరులుగానో లేదా మావోయిస్టులుగానో అభివర్ణించడం, ‘సో కాల్డ్ హ్యూమన్రైట్స్ యాక్టివిస్ట్స్’ అంటూ ఎద్దేవా చేయడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో ‘రొమాన్సింగ్ విత్ మావోయిజం’ అంటూ ఒక వ్యాసాన్ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో రాశారు. చత్తీస్గఢ్లోని సుక్మాలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు మందుపాతర పేల్చి చంపినప్పుడు మానవ హక్కుల నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు నందినీ సుందర్, సామాజిక కార్యకర్త స్వామీ అగ్నివేష్, మానవ హక్కుల నేతలు హిమాన్షు కుమార్, సోనీ సోరీ, బేలాభాటియా సుక్మా ఘటనను ఖండించారు. చనిపోయిన జవాన్ల గౌరవార్ధం బిలాస్పూర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సన్నగిల్లిన సామాజిక స్పృహ 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత, విదేశాలలో చదివే అవకాశాలు పెరిగిన అనంతరం యువత దృష్టి చదువుల మీదికీ, వ్యాపారంపైకీ మళ్ళింది. సామాజిక స్పృహ క్రమంగా సన్నగిల్లింది. విద్యాసంస్థల నుంచి నేరుగా నక్సలైట్ ఉద్యమంలోకి చేరే యువతీయువకుల సంఖ్య తగ్గిపోయింది. నాయకుల నేపథ్యం ఏమైనప్పటికీ దళసభ్యులు అధికంగా ఆదివాసీలూ, దళితులే. పోరాటం సైతం వారిదే. ఉద్యమం ఉనికి అడవి ప్రాంతాలకే పరిమితమైపోయింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వానికీ, మావోయిస్టు పార్టీకీ మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఈ వ్యవహారంలో రాజీకి ఆస్కారం లేదనీ, ఉత్తరదక్షిణ ధ్రువాలను కలపాలనే ప్రయత్నం వ్యర్థమనే అభిప్రాయం ఏర్పడింది. మావోయిస్టు నాయకులకు ఆశ్రయం ఇచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. పోలీసులు వ్యూహం మార్చారు. మావోయిస్టుల ఆచూకీ తెలియగానే గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామీణులను హింసించే ప్రక్రియకు స్వస్తి చెప్పారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్ఠం చేసుకొని మావోయిస్టుల గుట్టుమట్టులు తెలుసుకొని ‘ఎన్కౌంటర్’ చేయడం ద్వారా ఏరివేయడం ఆరంభించారు. ఆ దశ కూడా ముగిసింది. ఛత్తీస్గడ్లోనూ, మహారాష్ట్రలోనూ దాడులూ, ప్రతిదాడులూ సాగుతున్నాయి. చంపుడు పందెం సాగుతోంది. ఎవరి లెక్కలు వారు సరి చూసుకుంటున్నారు. సాధించే అవకాశం లేని లక్ష్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తున్న మావోయిస్టులను సమర్థించేవారు సమాజంలో కొందరు ఉంటారు. దానిని రాజకీయార్థిక సమస్యగా గుర్తించి పరిష్కరిస్తే సంతోషించేవారే ఎక్కువ మంది. మావోయిస్టులతో వ్యవహరించే విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కులనూ, 1993 మానవ హక్కుల చట్టాన్నీ ఉల్లంఘించరాదనే నియమాన్ని ప్రభుత్వాలు తు.చ. తప్పకుండా పాటించాలనే హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. హక్కుల నాయకులలో సైతం వ్యత్యాసం ఉంటుంది. ఎటువంటి హింసనైనా నిర్ద్వంద్వంగా ఖండించేవారు ఒక బాపతు. రాజ్యం బలమైనదీ, రాజ్యాంగానికి కట్టుబడి నడవవలసిందీ కనుక రాజ్యహింసకు ప్రతిగానే మావోయిస్టుల హింస ఉంటుందని భావించేవారూ ఉన్నారూ. వారు వ్యక్తిగతంగా హింసావాదులు కారు. మావోయిస్టుల హింసను సైతం ఖండిస్తారు. ప్రముఖ హక్కుల నాయకుడు కె బాలగోపాల్ నక్సలైట్ల హింసావాదాన్ని కూడా గట్టిగా వ్యతిరేకించారు. హక్కుల నేతల పట్ల యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు కఠిన వైఖరిని అవలంబించాయి. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో హక్కుల కార్యకర్తలపైన ఒత్తిడి పెరిగింది. మావోయిజాన్ని రూపుమాపడం బదులు మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ దేశీయాంగ మంత్రి రాజ్నాధ్సింగ్ ప్రకటిస్తున్నారు. అండాసెల్లో సాయిబాబా ఈ ధోరణికి నిదర్శనమే పన్సారే, కల్బుర్గీ, దభోల్కర్, గౌరీ లంకేశ్ వంటి హక్కుల నాయకుల అమానుష హత్యలు. ఢిల్లీ విశ్వవిద్యాయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకూ, మరి కొందరికీ యావజ్జీవ శిక్ష విధించి నాగపూర్ సెంట్రల్ జైలులోని అండాసెల్లో నిర్బంధించారు. తొంభై శాతం శారీక నిస్సత్తువ కలిగి, వీల్చైర్కే పరిమితమైన వ్యక్తిని ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర చేసినవాడిగా పరిగణించి కనీస సౌకర్యాలు లేని సెల్లో నిర్బంధించి నరకం చూపిస్తున్నారు. మహారాష్ట్ర హైకోర్టు బెయిల్ దరఖాస్తును తిరస్కరించినప్పుడు సాయిబాబా తరఫున సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సుప్రీంకోర్టు 2016 మార్చిలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్కు తలంటింది. ‘నిందితుల పట్ల మీరు చాలా అన్యాయంగా వ్యవహరించారు,’ అంటూ జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ నాగప్పన్లతో కూడిన సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. తర్వాత మరో కేసు బనాయించి జైలులో పెట్టారు. సాయిబాబా ఆరోగ్యం క్షిణించిందనీ, వైద్యం అందకపోతే ప్రాణాలు దక్కవనీ భార్య వసంత చేసిన విజ్ఞప్తులు పాలకుల చెవికి ఎక్కలేదు. ఆయనను తక్షణం విడుదల చేసి, వైద్య సదుపాయం సమకూర్చాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి ప్రవీణులు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రచురించే ‘డీయూ బీట్’ పత్రికలో ‘కలిసే నేరస్థులుగా ఉందాం సార్’ (డియర్ ప్రొఫెసర్, లెట్స్ బి క్రిమినల్స్ టుగెదర్) అనే శీర్షికతో సంపాదకీయం రాశారు. ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు (వీవీ) ఇంటిలో, ఆయన బంధువుల ఇళ్ళలో పోదాలు జరిపి, ఆయనను అరెస్టు చేసి పుణె జైలుకు తరలించిన సంగతి విదితమే. భీమా కోరేగాం హింసకు కారకులని చెబుతూ ఒక కేసు పెట్టారు. తర్వాత మోదీ హత్యకు కుట్ర చేశారని మరో కేసు పెట్టారు. ఈ కుట్రలో ఎం–4 రైఫల్ కొనుగోలు చేయడానికి అవసరమైన ఎనిమిది కోట్ల రూపాయలు సమకూర్చే బాధ్యత వీవీ స్వీకరించారని ఆరోపణ. ఆయనకు బెయిల్ ఇప్పించాలనే ప్రయత్నం ఫలించడం లేదు. 79 సంవత్సరాల వీవీ అనారోగ్యం కారణంగాæ జైలులో ఉండలేకపోతున్నారనీ, ఆరోపణలు నిరాధారమైనవనీ చెబుతూ వీవీ శ్రీమతి హేమలత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్కి బహి రంగ లేఖ రాశారు. కడచిన 45 సంవత్సరాలలో వీవీపైన 25 కేసులు బనాయించారనీ, వాటిలో 13 కేసులలో సుదీర్ఘమైన విచారణ తర్వాత వీవీని నిర్దోషిగా కోర్టులు ప్రకటించాయనీ, తక్కిన 12 కేసులనూ సాక్ష్యాధారాలు బొత్తిగా లేనికారణంగా ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయనీ హేమలత వివరించారు. జస్టిస్ గొగోయ్ నుంచి స్పందన లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు కూడా బహిరంగ లేఖ రాశారు. 1968 నుంచి యాభై సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ వాదనను వీవీ బలపరిచారని గుర్తు చేశారు. 2005 సెప్టెంబర్లో చంచల్గూడా జైలులో ఉన్న వీవీని చూసేందుకు కేంద్ర మంత్రిగా ఉండిన కేసీఆర్ నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను లెక్క చేయకుండా వెళ్ళిన సంగతి జ్ఞాపకం చేశారు. ఫలితం లేదు. ఈ హక్కుల నేతల గురించి ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ప్రస్తావించలేదు. సమాజం స్పందించడం లేదు. ఎవరి గొడవ వారిది ‘మీరు చెప్పేదానిని నేను ఆమోదించను కానీ మీకు చెప్పడానికి ఉన్న హక్కును చనిపోయేవరకూ కాపాడతా (I disapprove of what you say, but I will defend to death your right to say it) అంటూ ఫ్రెంచ్ తత్వవేత్త వోల్తేర్ చెప్పిందే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. ఛత్తీస్గఢ్లో రమణ్సింగ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం యధేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసు బలగాలనూ, నక్సలైట్ల వ్యతిరేక ప్రైవేటు సాయుధ బలాలనూ (సల్వాజుడుం) వినియోగించింది. మానవ హక్కులను హరించడాన్ని ప్రశ్నించిన చరిత్రకారుడు రామచంద్రగుహా, నందినీ సుందర్, స్వామీ అగ్నివేష్, మాజీ ఉన్నతాధికారి ఇఏఎస్ శర్మలను మావోయిస్టు సానుభూతిపరులుగా అభివర్ణించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ 2011లో చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. జస్టిస్ బి సుదర్శనరెడ్డి, ఎస్ఎస్ నిజ్జర్తో కూడిన ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలిస్తూ నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమం మూలాలలోకి వెళ్ళింది. మానవ హక్కులకోసం ప్రశ్నించే ప్రతి వ్యక్తినీ అనుమానించి మావోయిస్టుల సానుభూతిపరులుగా ముద్రవేయడం, వారిపైన ఉక్కుపాదం మోపడం తప్ప మరో మార్గం లేదని ఛత్తీస్గఢ్ సర్కార్ తరఫున వాదించడం తమకు విస్మయం కలిగిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు మూలం, అందువల్లనే పరిష్కారం, వేరే చోట ఉన్నది (The root cause of the problem, and hence its solution, lies elsewhere)అని స్పష్టం చేశారు. మానవ హక్కుల గురించి మాట్లాడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, దేశద్రోహంగా పరిగణిస్తున్న ఈ రోజులలో న్యాయం ఎక్కడ దొరుకుతుంది? హేమలత లేఖకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి వెంటనే స్పందించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికల జాతర జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు లక్ష్మణరేఖ దాటి ఒకరిపైన ఒకరు యధాశక్తి బురద చల్లుకుంటున్నారు. ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం చెప్పకపోయినా, చెప్పిన నిర్ణయం తమకు నచ్చకపోయినా సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు. దీనికి తోడు ప్రధాన న్యాయ మూర్తిపైనే లైంగికవేధింపుల ఆరోపణ (లేదా కుట్ర)పైన విచారణ. సర్వోన్నత న్యాయస్థానంలో ఊపిరి పీల్చుకునేందుకు కూడా తీరిక లేదు. ఎన్నికల సంఘం నియంత్రణ, సుప్రీంకోర్టు అభిశంసనలను ఖాతరు చేయకుండా ప్రచారాంకంలో అమీతుమీ తేల్చుకునే అంతిమ ఘట్టంలో ఒక వైపు ప్రధాని నరేంద్రమోదీ, మరో వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మోహరించి వాగ్బాణాలు సంధిస్తూ, పరస్పరం గాయపరుచుకుంటూ, రక్తం కళ్ళజూస్తూ పోరాటాన్ని రక్తికట్టిస్తు న్నారు. పాకిస్తాన్పైన సర్జికల్ స్ట్రయిక్స్ మేము చేశామంటే మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ రంధిలో మానవ హక్కులను ఎవరు పట్టించుకుంటారు? సాయిబాబానూ, వరవరరావునీ విడుదల చేయాలన్న లేదా కనీసం బెయిలు ఇప్పించాలన్న న్యాయమైన విన్నపాలను ఎవరు వినిపించుకుంటారు? కె. రామచంద్రమూర్తి -
హక్కులకు దిక్కేది?
‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని మహాకవి ఏనాడో చెప్పినట్లే చాలా దేశాల్లో మానవ హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే పరిస్థితులు నేటికీ లేవు. రాచరిక పాలనలు, నియంతృత్వ పాలనలు అంతరించి, ప్రజాస్వామ్యాన్ని స్వీకరించిన భారత్ వంటి దేశాల్లో సైతం మానవ హక్కుల హననం నిత్యకృత్యంగా సాగుతోంది. యుద్ధాలతో విలవిలలాడుతున్న దేశాల్లోను, రాచరిక పాలన కొనసాగుతున్న దేశాల్లోను మానవ హక్కులకు భద్రత ఉండకపోవడం విశేషం కాదు, ప్రజాస్వామిక దేశాల్లో సైతం మానవ హక్కుల హననం కొనసాగుతుండటమే దారుణం. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఘనత చెప్పుకొంటున్న భారత్లో కొనసాగుతున్న మానవ హక్కుల హననంపై ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు వేలెత్తి చూపినా మన పాలకుల్లో చలనం లేకపోవడం విడ్డూరం. బ్రిటిష్పాలన అంతమై దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశం ప్రజాస్వామిక విధానాన్ని ఎంచుకుంది. ప్రజల ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూ సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది. సామాజికంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించింది. రాజ్యాంగం వరకు బాగానే ఉన్నా, ఆచరణలో మాత్రం సామాన్యుల హక్కులకు రక్షణ కరువవుతోంది. పాలక వర్గాలు, అధికార యంత్రాంగం సైతం హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. మరోవైపు కులమతాల పిచ్చి తలకెక్కిన మూర్ఖపు మూకలు అమాయకులపై దాడులు సాగిస్తున్నాయి. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం వంటి వివక్షాపూరిత చట్టాలు కొన్ని ప్రాంతాల్లోని ప్రజల హక్కులను హరిస్తున్నాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన పాతికేళ్లకే 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడంతో దాదాపు రెండేళ్ల పాటు ప్రజల కనీస హక్కులకు దిక్కులేని దుస్థితి వాటిల్లింది. ఎమర్జెన్సీ పీడ విరగడైనా పెద్ద మార్పులేవీ వచ్చిపడలేదు. దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకుల బతుకులు అగమ్యగోచర స్థితిలో మగ్గిపోతూనే ఉన్నాయి. యమభటులను తలపించే పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇష్టానుసారం హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉంటున్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో నేర పరిశోధన సాగించే బదులు నిందితులపై బలప్రయోగం చేసి నేరాలను ఒప్పించడం మన దేశంలో సర్వసాధారణం. ‘థర్డ్ డిగ్రీ’ పేరిట నిందితులను చిత్రహింసలకు గురిచేయడం చట్ట విరుద్ధమైనా, ఇదంతా చాలా మామూలు వ్యవహారంగా కొనసాగుతోంది. నేషనల్ లా యూనివర్సిటీ తన అధ్యయనంలో భాగంగా మరణశిక్ష పడ్డ 373 మంది ఖైదీల నుంచి సమాచారాన్ని సేకరించింది. వారిలో 72 మంది ఖైదీలు, పోలీసుల చిత్రహింసలు తాళలేకనే ఏ తప్పూ చేయకున్నా, నేరం చేసినట్టు అంగీకరించామని తెలిపారు. ఇదిలా ఉంటే, పోలీసు కస్టడీలో సంభవించిన మరణాలకు సంబంధించి 50 శాతం కంటే తక్కువ సంఘటనలపై మాత్రమే కేసులు నమోదయ్యాయని నేషనల్ లా యూనివర్సిటీ వెల్లడించింది. పోలీసు కస్టడీలో నిందితులను హింసించడం దేశంలో విపరీతంగా కొనసాగుతోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్వయంగా అంగీకరించింది. ఎన్హెచ్ఆర్సీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2017 ఏప్రిల్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 1,674 మంది కస్టడీలో ఉండగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మృతుల్లో పోలీసు కస్టడీలో ఉన్నవారు 144 మంది కాగా, జుడీషియల్ కస్టడీలో ఉన్నవారు 1530 మంది అని కేంద్ర హోంశాఖ స్వయంగా రాజ్యసభలో వెల్లడించింది. పోలీసు వ్యవస్థలోను, జైళ్ల వ్యవస్థలోను సంస్కరణలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా, కస్టడీ మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గుతున్న దాఖలాల్లేవు. దేశవ్యాప్తంగా 2001–10 కాలంలో 14,231 మంది కస్టడీలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. గడచిన దశాబ్దిలో రోజుకు సగటున నాలుగు కస్టడీ మరణాలు సంభవిస్తే, 2017–18లో రోజుకు సగటున ఐదు కస్టడీ మరణాలు సంభవించినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇదేకాలంలో దేశవ్యాప్తంగా 19 బూటకపు ఎన్కౌంటర్లు జరిగినట్లు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లోనే ఆరు బూటకపు ఎన్కౌంటర్లు జరిగాయి. ఇక జైళ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లు సగటున 14 శాతం అధికంగా ఖైదీలతో కిక్కిరిసి ఉంటున్నాయి. మితిమీరిన రద్దీ కారణంగా పలు జైళ్లలో ఖైదీల అసహజ మరణాలు సంభవిస్తున్నాయి. చాలాచోట్ల రద్దీ కారణంగా ఖైదీలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్ని జైళ్లలోనైతే మరీ దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,401 జైళ్లు ఉంటే, వాటిలోని 149 జైళ్లలో సగటున 200 శాతం అధికంగా ఖైదీలు ఉంటున్నారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం సబ్జైలులో 16 మంది ఖైదీలు ఉండేందుకు మాత్రమే తగిన సౌకర్యాలు ఉన్నాయి. ఈ జైలులో 2015 డిసెంబర్ 31 నాటికి 200 మంది ఖైదీలు ఉన్నారు. అలాగే మహారాష్ట్రలోని రోహా సబ్జైలులో కేవలం ముగ్గురు ఖైదీలకు మాత్రమే తగిన సామర్థ్యం ఉంటే, అందులో ఏకంగా 35 మంది ఉంటున్నారని ఎన్సీఆర్బీ తన నివేదికలో వెల్లడించింది. జైళ్లలో నెలకొన్న ఈ దుర్భర పరిస్థితులపై దాఖలైన రిట్పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. జైళ్లలో ఖైదీలను పశువుల్లా బంధించి ఉంచలేరంటూ వ్యాఖ్యానించింది. ఖైదీలు కూడా మనుషులేనని, కస్టడీలో ఉన్న ఖైదీలకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయని తేల్చిచెప్పింది. జైళ్లలో ఖైదీల రద్దీ సమస్యను పరిష్కరించడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, దానిని 2017 మార్చి 31లోగా సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. జైళ్లలో రద్దీపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసినా, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జైళ్ల పరిస్థితుల్లో నేటికీ ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. చిన్నారుల పరిస్థితి మరీ దారుణం వయోజనుల హక్కులకు భంగం కలిగితే వారు కనీసం తమకు జరిగిన అన్యాయాలపై గొంతెత్తగలరు. ఎంతటి నిస్సహాయతలో ఉన్నా బాహ్యప్రపంచానికి తమ గోడు వినిపించుకోగలరు. న్యాయం కోసం తమకు చేతనైన ప్రయత్నాలు చేయగలరు. అభం శుభం తెలియని చిన్నారులు ఇవేవీ చేయలేరు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు అడుగడుగునా హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. ఇళ్లలో, బడుల్లో, హాస్టళ్లలో... ఎక్కడ చూసినా వారి హక్కులకు భరోసా లేని పరిస్థితి ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్నారుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటున్నా, వెనుకబడిన దేశాల్లోను, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, యుద్ధ వాతావరణంతో నలిగిపోతున్న దేశాల్లోను చిన్నారుల హక్కులకు రక్షణ కరువవుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను అమల్లోకి తెచ్చినా, భారత్ సహా చాలా దక్షిణాసియా దేశాల్లోను, ఆఫ్రికన్ దేశాల్లోను ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, 2015–16 నాటికి దేశవ్యాప్తంగా 20–24 ఏళ్ల వయసు గల మహిళల్లో 26.8 శాతం మందికి 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లయ్యాయి. ఇక 25–29 ఏళ్ల వయసు గల పురుషుల్లో 20.3 శాతం మందికి 21 ఏళ్ల నిండక ముందే పెళ్లిళ్లయ్యాయి. వీరందరికీ బాల్యం వీడక ముందే బాధ్యతల భారం నెత్తినపడింది. చిన్నారులపై లైంగిక హింస కూడా మన దేశంలో నానాటికీ పెరుగుతోంది. దేశంలోని ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరు ఏదో ఒక దశలో లైంగిక హింసను ఎదుర్కొన్నట్లు ‘వరల్డ్ విజన్ ఇండియా’ గత ఏడాది నిర్వహించిన సర్వేలో తేలింది. మన దేశంలో నిరుపేదల కుటుంబాలకు చెందిన పిల్లల్లో చాలామంది బాలకార్మికులుగా వెళ్లదీస్తున్నారు. బాలకార్మిక వ్యవస్థను నిషేధిస్తూ ప్రభుత్వం చట్టాన్ని తెచ్చినా చాలా చోట్ల చిన్నారులను పనిమనుషులుగా, చిన్నా చితకా కర్మాగారాల్లో కార్మికులుగా నియమించుకుంటూ వారితో వారి స్థాయికి మించిన పనులు చేయించుకుంటున్నారు. మన దేశంలో 5–14 ఏళ్ల మధ్య గల చిన్నారుల జనాభా 25.96 కోట్లు. వీరిలో దాదాపు 1.01 కోట్ల మంది బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. ఇవి 2011 జనాభా లెక్కల్లో వెల్లడైన వివరాలు. బాల కార్మికుల్లో చాలామంది యజమానుల చేతిలో దూషణలకు, భౌతిక హింసకు గురవుతున్నవారే ఎక్కువమంది. పిల్లలను ఏదోలా చదివించుకుందామని నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేరుస్తున్నా, హాస్టళ్లలో పిల్లల భద్రతకు భరోసా ఉండటం లేదు. హాస్టల్ నిర్వాహకుల నుంచి దూషణలు, హింస, దారుణమైన భోజనం వంటి బాధలు తప్పడంలేదు. కొన్ని హాస్టళ్లలోనైతే చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్న సంఘటనలు తరచు వార్తలకెక్కుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లలో చిన్నారులపై జరుగుతున్న ఘాతుకాలకు సంబంధించి సరైన గణాంకాలేవీ అందుబాటులో లేవు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమాలకు చేరిన చిన్నారులది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ప్రేమ, ఆప్యాయాతల మధ్య పూర్తి భద్రతతో పెరగాల్సిన చిన్నారులు మూర్ఖులైన పెద్దల కాఠిన్యానికి, దాష్టీకాలకు బలైపోతున్నారు. ►భారత్లో చిన్నారుల జనాభా 25.96 కోట్లు ►బాల కార్మికుల జనాభా 1.01 కోట్లు (2011 జనాభా లెక్కల ప్రకారం..) చాలాచోట్ల బాలకార్మికులను ప్రమాదకరమైన పనుల్లో నియమిస్తున్నారు. బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలోని అక్రమంగా నడుపుతున్న అభ్రకం గనుల్లో చిన్నారులతో పనులు చేయిస్తున్నారు. ఎన్సీఆర్బీ–2015 నివేదిక ప్రకారం కర్మాగారాల్లో జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు బాలకార్మికులు మృతి చెందారు. గనులు, క్వారీల్లో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది బాల కార్మికులు మరణించారు. వీరంతా పద్నాలుగేళ్ల లోపు వయసులోని వారే. దళితులు, గిరిజనులు, మైనారిటీలకూ భద్రత కరువు దళితులు, గిరిజనులు, మైనారిటీలకు దేశంలో భద్రత కరువవుతోంది. గోవధ ఆరోపణలతో మైనారిటీలపై దాడులు కొన్నేళ్లుగా బాగా పెరిగాయి. ఈ ఏడాది నవంబర్ వరకు చూసుకుంటే, దేశవ్యాప్తంగా 38 మూక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 10 మంది మరణించారు. ఈ సంఘటనల్లో పోలీసులు దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. కొన్ని సంస్థలు మత విద్వేషాన్ని రెచ్చగొడుతుండటంతో మూర్ఖపు మూకలు మైనారిటీలపై తరచు దాడులకు తెగబడుతున్నాయి. కుల దురహంకారం తలకెక్కించుకున్న అగ్రవర్ణాల వారు దళితులు, గిరిజనులపై దాడులకు తెగబడుతున్నారు. దేశంలో 1990 దశకం ద్వితీయార్ధం నుంచి దళితులు, మైనారిటీలపై విద్వేషపూరిత దాడులు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా 1964–96 మధ్యకాలంలో మైనారిటీల విద్వేషపూరిత దాడులకు సంబంధించి 38 కేసులు నమోదయ్యాయి. 1997లో కేవలం ఏడాది వ్యవధిలోనే 27 కేసులు, ఆ తర్వాత 1998లో 70 కేసులు నమోదయ్యాయి. ఇక 2017లో ఏకంగా 351 కేసులు నమోదయ్యాయి. ఇక గోసంరక్షకుల పేరిట కొందరు సాగిస్తున్న దాడులు 2014 నుంచి పెరుగుతూ వస్తున్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2014లో ఇలాంటి నాలుగు సంఘటనలు జరిగాయి. ఫలితంగా దాడులు జరిగిన ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. గోవధ ఆరోపణల పేరిట 2017లో ఏకంగా 11 దాడులు జరిగాయి. గడచిన దశాబ్దకాలంలో.. అంటే 2007–17 మధ్య కాలంలో దళితులపై దాడులు 66 శాతం మేరకు పెరిగినట్లు ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. హక్కుల ఉల్లంఘనలో ఇవి కొన్ని ప్రధాన పార్శా్వలు మాత్రమే. స్థూలంగా చెప్పాలంటే మానవ హక్కుల ఉల్లంఘన మన దేశంలో నిత్యకృత్యంగా సాగుతోంది. – పన్యాల జగన్నాథదాసు నేరాలకు బలవుతున్న చిన్నారులు మన దేశంలో చిన్నారులపై జరుగుతున్న నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు ఏటేటా పెరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఎన్సీఆర్బీ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ప్రతి గంటకు నలుగురు చిన్నారులు లైంగిక అఘాయిత్యాలకు బలవుతున్నారు. చిన్నారులపై నేరాలకు సంబంధించి ఎన్సీఆర్బీ వెల్లడించిన గణాంకాలు.. చిన్నారులపై నేరాలు ►2006 18,967 ►2016 1,06,958 (పదేళ్ల వ్యవధిలోనే చిన్నారులపై నేరాలు 500 శాతం మేరకు పెరిగాయి) ఈ నేరాల్లో దాదాపు 50 శాతం సంఘటనలు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే జరిగాయి. ఆ ఐదు రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్. కిడ్నాపర్ల బారిన పడి ఆచూకీ లేకుండా పోయిన చిన్నారుల సంఖ్య మరింత ఆందోళనకరంగా ఉంది. దేశవ్యాప్తంగా 2016లో 1,11,159 మంది చిన్నారులు ఆచూకీ లేకుండాపోయారు. వీరిలో 41,175 మంది బాలురు. 70,394 మంది బాలికలు ఉన్నారు. ఇదీ మన న్యాయం పోలీసు కస్టడీ మరణాలకు సంబంధించి ఎన్సీఆర్బీ లెక్కలు మరికొన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2000–16 మధ్య కాలంలో 1,022 మంది పోలీసు కస్టడీలో మరణించారు. వీటికి సంబంధించి కేవలం 428 ఎఫ్ఐఆర్లు మాత్రమే నమోదయ్యాయి. వీటికి సంబంధించి కేవలం 234 కేసుల్లో మాత్రమే పోలీసులు చార్జిషీట్లు దాఖలు చేశారు. దాదాపు 50 శాతం పోలీసు కస్టడీ మరణాలపై కనీసం మెజిస్టీరియల్ విచారణ సైతం జరగలేదు. ఇన్ని సంఘటనలు జరిగినా, వీటికి సంబంధించి కేవలం 24 మంది పోలీసులకు మాత్రమే కోర్టుల ద్వారా శిక్షలు పడ్డాయి. కస్టడీ మరణాలు కొన్ని వాస్తవాలు 2001–10 దేశవ్యాప్తంగా సంభవించిన కస్టడీ మరణాలు 14,231 2001–10 ప్రతిరోజూ సగటున కస్టడీ మరణాలు 4 2017–18 ప్రతిరోజూ సగటున కస్టడీ మరణాలు 5 కస్టడీ మరణాల్లో టాప్ – 5 రాష్ట్రాలు ఉత్తరప్రదశ్ 374 మహారాష్ట్ర 137 పంజాబ్ 128 మధ్యప్రదేశ్113 బిహార్ 109 -
గోప్యత మానవహక్కే: సత్య నాదెళ్ల
లండన్: గోప్యతను మానవ హక్కుగా భావించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల టెక్నాలజీ సంస్థలకు పిలుపునిచ్చారు. సైబర్ నేరాల నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు, సంస్థలు కలసి పనిచేయాలని కోరారు. లండన్లో గురువారం జరిగిన ఓ కాన్ఫరెన్స్లో గోప్యత, సైబర్ భద్రత, కృత్రిమ మేధ తదితరాలను ఆయన ప్రస్తావించారు. డిజిటల్ ప్రపంచంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా గోప్యతను మానవ హక్కుగా గుర్తించాలని ఆయన సూచించారు. సైబర్ దాడులకు గురయ్యే వర్గాలను కాపాడటం సాంకేతిక పరిశ్రమ ఒక్కదాని వల్లే కాదని, ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలని అభిప్రాయపడ్డారు. యూరప్లో కఠిన ఆన్లైన్ ప్రైవసీ ప్రమాణాలు నెలకొల్పేందుకు తీసుకొచ్చిన చట్టం జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ను ప్రశంసించారు. -
స్త్రీలోక సంచారం
ఉత్తర కొరియాలో మహిళలపై లైంగిక అకృత్యాలు జరగడమన్నది.. శిక్ష లేని అత్యంత సాధారణమైన సంగతని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడయింది! వివిధ కారణాల వల్ల దేశం వదిలి పారిపోయిన 62 మంది ఉత్తర కొరియన్లను ఇంటర్వ్యూ చేసిన అనంతరం, వారు చెప్పిన అత్యాచార, లైంగిక వేధింపుల రహస్య సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న ఈ సంస్థ.. ఆ దేశంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కొన్ని నిజ ఘటనలను ఉదహరిస్తూ వివరించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఈ నెలకు నూరేళ్లు అవుతోంది. 1914 జూలై 28న ప్రారంభమైన యుద్ధం 1918 నవంబర్ 11న పరిసమాప్తమైంది. ఆ యుద్ధం వల్ల జరిగిన భారీ నష్టం మాట అటుంచితే.. నాటి యుద్ధ పరిస్థితులు స్త్రీల జీవితాల్లో పెనుమార్పులు తెచ్చాయి. ఎంత పాశ్చాత్యులైనా, అప్పటి వరకు మగవాళ్ల చాటున ఇళ్లలోనే ఉన్న మహిళలు యుద్ధ కాలపు అత్యవసర విధుల నిర్వహణకు మగవాళ్లతో సమానంగా తమ దేశాల కోసం పని చేయవలసి వచ్చింది. అలా బయటికి వచ్చిన మహిళల పనితీరు సమర్థంగా, విశ్వసనీయంగా ఉండి, స్త్రీ సాధికారతవైపు తొలి అడుగులు పడడానికి దోహదపడింది. ‘స్విమ్వేర్లో మహిళా క్రీడాకారులు స్లిమ్గా కనిపించడం ఎలా?’ అని ఒక ఆర్టికల్ను అప్లోడ్ చేసిన ప్రసిద్ధ ‘స్విమ్ ఇంగ్లండ్’ వెబ్ సైట్.. పాఠకుల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ ఆర్టికల్ను తన సైట్ నుంచి తొలగించింది. బికినీ వేసుకోవడం వల్ల మీ ఉదరం నొక్కుకుపోయి, దేహమంతా ఒక ముక్కగా కనిపిస్తూ మీ పొట్ట మరింత పైకి వచ్చినట్లుగా కనిపిస్తుంది తప్ప మీరు స్లిమ్గా కనిపించరు. అందుకే బికినీకి బదులుగా వదులుగా ఉండే ‘టింకిణీ’ (స్విమ్ సూట్) వేసుకోవాలన్న సూచన ఆ వ్యాసంలో ఉంది. నిజానికి 2010లో వచ్చిన ఆ ఆర్టికల్నే ఆ వెబ్ సైట్ మళ్లీ రిపీట్ చేసింది. ‘క్రీడాకారిణులను సెక్స్ సింబల్గా చూస్తారా?’ అంటూ అప్పుడూ విమర్శలు వచ్చాయి కానీ, ఈసారి మాత్రం ఆ వెబ్సైట్ వాళ్లు స్పందించక తప్పలేదు. బికినీ విషయం ఒక్కటే కాదు, మగవాళ్లలా ఉండే ఆడవాళ్లు తమ ఎదను కనిపించేలా స్విమ్సూట్ను ఎలా ధరించాలో కూడా ఆ వివాదాస్పద ఆర్టికల్లో రాసి ఉంది. -
భారత్ మానవ హక్కులను కాలరాస్తోందా
సాక్షి, న్యూఢిల్లీ : ఏడుగురు రోహింగ్యా ముస్లింలను భారత ప్రభుత్వం గురువారం నాడు మయన్మార్కు పంపించిన విషయం తెల్సిందే. వారు 2012లో భారత్లో అక్రమంగా ప్రవేశించి అరెస్టయ్యారు. అప్పటి నుంచి వారు అస్సాం జైల్లోనే ఉన్నారు. వారిని వెనక్కి పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంత మంది మానవ హక్కుల కార్యకర్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో వారిని గురువారం మయన్మార్కు సాగనంపారు. మయన్మార్లో 2012 నుంచే కల్లోల పరిస్థితులు నెలకొని ఉండగా, 2016లో మైనారిటీలయిన రోహింగ్యా ముస్లింలకు వ్యతిరేకంగా అక్కడ మారణ హోమం ప్రారంభమైంది. ఆ జాతిని సమూలంగా నిర్మూలించేందుకు మయన్మార్ సైన్యం నడుంగట్టింది. పర్యవసానంగా వేలాది కుటుంబాలను హత్య చేశారు. వందలాది గ్రామాలను తగులబెట్టారు. మహిళలు, పిల్లలపై సామూహికంగా హత్యలు జరిపారు. ఇక ఆ దేశంలో తలదాచుకునేందుకు కూడా చోటు లేక దాదాపు 9 లక్షల మంది రోహింగ్యాలు ఇరుగు, పొరుగు దేశాల వైపు పరుగులు తీశారు. ఈ దారణ మారణ కాండను ఐక్యరాజ్య సమితితోపాటు పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. శాంతి భద్రతల పరిస్థితిని చక్కదిద్దాలని, రోహింగ్యాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని మయన్మార్ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. అప్పటి వరకు తాత్కాలికంగానైనా సరే రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని ఇరుగు పొరుగు దేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారీ సంఖ్యలో పరుగెత్తుకొచ్చిన రోహింగ్యాలను అటు బంగ్లా, ఇటు భారత దేశం సరిహద్దుల్లోనే నిలిపి వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏడుగురు రోహింగ్యాలను భారత ప్రభుత్వం వెనక్కి పంపించింది. మాతృ దేశంలో మారణ హోమం కొనసాగుతున్నప్పుడు వారిని అక్కడికి పంపించడం కచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టం ‘రిఫౌల్మెంట్’ను ఉల్లంఘించడమే. ఓ దేశంలో జాతుల మధ్య హింసాకాండ కొనసాగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాందిశీకులను లేదా శరణార్థులను ఆ దేశానికి పంపించకూడదన్నదే ‘రిఫౌల్మెంట్’ ఒప్పందం. ఈ అంతర్జాతీయ ఒప్పందంపై భారత్ కూడా సంతకం చేసింది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి హెచ్చరికలను పట్టించుకోకుండా రోహింగ్యా ముస్లింలను పంపించాలని భారత ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకుంది. అస్సాంలో అసలైన భారతీయ పౌరులను గుర్తించడంలో భాగంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను వేరు చేసేందుకు కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించేందుకు బిల్లును తీసుకొచ్చిన (ప్రస్తుతం ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది) భారత ప్రభుత్వం రోహింగ్యాలను వెనక్కి పంపించడానికి కారణం వారు ముస్లింలు కావడమేనా...! చదవండి: రెచ్చగొడితేనే ‘మారణ హోమాలు’ -
జన చేతనే రక్షణ కవచం
రాజ్యం అధికార బలంతో పౌరుల హక్కుల్ని కాలరాసినపుడు మానవహక్కుల సంఘం వంటి సంస్థలు పౌర రక్షణకు వచ్చిన సందర్భాలెన్నో! ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మేరకు కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓ సదుపాయంగా హక్కుల సంస్థలు రూపొందాలి. రాజ్యాంగ స్ఫూర్తికి ఏ మాత్రం భంగం కలగనీయకుండా వాటి నిర్వహణ చట్టబద్ధంగా సాగాలి. సర్కార్లు నిర్వీర్యపరుస్తున్నపుడు ‘మనదేం పోయింది..?’ అనే అలసత్వంతో కాకుండా పౌర సమాజం బాధ్యతగా వాటిని పరిరక్షించుకోవాలి. అప్పుడే, సామాన్యుడు మాన్యుడవుతాడు. రాజ్యాంగ స్ఫూర్తి రహిస్తుంది, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌర హక్కుల స్ఫూర్తికి ప్రభుత్వాలే పాతరేస్తు న్నాయి. ప్రజలకు రాజ్యాం గం కల్పించిన హక్కుల్ని, ప్రత్యామ్నాయ సదుపా యాల్ని నిలువునా తొక్కేస్తున్నాయి. ఫలితంగా... చట్టాలు అయినవాళ్లకు చుట్టాలయి, కాని వాళ్లకు కష్టాలయి కూర్చున్నాయి. ప్రజల హక్కులకు భంగం కలిగినపుడు ఆసరాగా నిలిచే పలు స్వతంత్ర, ప్రజా స్వామ్య, హక్కుల సంస్థల్ని పనిగట్టుకు నీరుగారు స్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పౌరసమాజం వీధుల్లో పోరాడో, న్యాయస్థానాల తలుపు తట్టో వాటిని నిలుపుకోవాల్సి వస్తోంది. ఆయా సంస్థల్ని ప్రభుత్వాలు అసలు ఏర్పాటే చేయవు. చేసినా... పాలకులు అక్కడ తగిన బాధ్యుల్ని నియ మించరు. నియమించినా... అందుకు అవసరమైన సదుపా యాలు కల్పించరు, అరకొర కల్పించిన చోట కూడా... నామ మాత్రపు వ్యవహారమే తప్ప స్ఫూర్తిని రక్షించే ఒక్క చర్యా ఉండదు. ఇలా నిర్లక్ష్యం లానో, ఉదాసీనత లాగానో బయటకు కనిపించే సర్కారు చర్యల వెనుక లోతైన వ్యూహమో, ఎత్తుగడో దాగి ఉండటం ఇటీవలి పరిణామాల్లో కొట్టొచ్చినట్టు కని పిస్తోంది. అది మరింత బాధాకరం! కొంచెం లోతుగా పరిశీలిస్తే... ప్రజాస్వామ్య సంస్థల్ని ఏలిన వారు నిర్వీర్యం చేయడం వెనుక ఉండే దురుద్దేశాలు ఒకటొకటిగా తేటతెల్లమౌతున్నాయి. కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. మానవహక్కుల సంఘాలు లేవు, లోక్పాల్–లోకాయుక్తల్లేవు, బాలల హక్కుల సంఘా లదీ అదే గతి! సమాచార హక్కు కమిషన్ ఒక చోట లేనే లేదు, మరోచోట నామమాత్రం! పరిపాలనా ట్రిబ్యునల్ ఒక చోట లేనే లేదు మరో చోట అంతంత మాత్రమే. అఖిల భారత స్థాయిలో హరిత న్యాయ స్థానాల వ్యవస్థను పలుచన చేస్తున్నారు. ఇంకా ఇతరేతర సంస్థల్లోనూ ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీ, ఖాళీ! ఇదీ వరుస! పరిపాలనలో పారదర్శకత కోసం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు నీడన పనిచేయా ల్సిన సమాచార హక్కు కమిషన్లను నిర్వీర్యం చేస్తున్న వైనాన్ని సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టే తప్పుబట్టింది. ‘కమిషన్లు ఎందుకు పనిచేయ ట్లేదు? కమిషనర్లను ఎందుకు నియమించలేదు? పెండింగ్ ఫిర్యాదులు, అప్పీళ్లనెలా పరిష్కరిస్తార’న్న సుప్రీంకోర్టు ప్రశ్నకు విస్పష్టంగా సమాధానమే లేని దుస్థితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది! మూడు వారా లకు వాయిదా పడిన తాజా కేసులో, సుప్రీంకోర్టుకి అవేం సమాధానం చెబుతాయో వేచి చూడాలి. కనీస హక్కుల రక్షణకు వ్యవస్థల్లేవు! మానవ హక్కుల ఉల్లంఘన జరిగినపుడు వాటిని ఎత్తి చూపి, తగు రక్షణ పొందే వ్యవస్థల్ని మన రాజ్యాంగమే కల్పించింది. అటువంటి ఉపద్రవాల నుంచి సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాలే పౌరులను కాపాడాలి. ప్రభుత్వాలు, వాటి వివిధ విభాగాలు, సంస్థలు నైతిక సూత్రాలను, చట్ట నిబంధనలను ఉల్లంఘించినపుడు, తద్వారా మానవ హక్కులకు భంగం కలిగినపుడు పౌరులకు రక్షణ అవసరం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల్ని అందుకే నెల కొల్పుతారు. చట్టాల అమలుకు బాధ్యత వహించా ల్సిన ప్రభుత్వాలే కట్టుదప్పి వ్యవహరిస్తే, ఆ తప్పుల్ని ఎత్తిచూపే తెగువ, స్వేచ్ఛ, చొరవ కోసమే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన తటస్థ సంస్థల ఏర్పా టును రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యం అధి కార బలంతో పౌరుల హక్కుల్ని కాలరాసినపుడు మానవహక్కుల సంఘం వంటి సంస్థలు పౌర రక్ష ణకు వచ్చిన సందర్భాలెన్నో! అందుకే, నేరుగా రాజ్యాంగం ద్వారా కొన్ని, అందులోని స్ఫూర్తితో రూపొందించుకున్న చట్టాల ద్వారా మరికొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. ఆ స్ఫూర్తి కోసమే ఆయా సంస్థలు సంపూర్ణ స్థాయిలో, స్వేచ్ఛగా, ఏ అవరో ధాలూ లేకుండా పనిచేయాలి. కానీ, ప్రభుత్వాలు అలా చేయనీయవు. సదరు సంస్థల్ని కొన్నిసార్లు అసలు ఏర్పాటే చేయవు! తమకు ఇతరేతర విష యాలు ప్రాధాన్యమైనట్టు, ఆయా విషయాల్ని పట్టిం చుకోవడానికి తమ వద్ద సమయమే లేనట్టు ప్రభు త్వాలు నటిస్తుంటాయి. ప్రస్తుతం జరుగుతున్నదదే! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు లోకా యుక్త, ఉప లోకాయుక్త సంస్థలకు అధిపతులు లేరు. రెండు చోట్లా మానవహక్కుల సంఘాలూ పనిచే యడం లేదు. మానవహక్కుల సంఘానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రిటైర్ట్ ప్రధాన న్యాయమూర్తి స్థాయి వారు నేతృత్వం వహించాలి. జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ పదవీ విరమణ తర్వాత మరెవరినీ ఆ పదవిలో నియమించలేదు. ఇప్పుడక్కడ సభ్యులు కూడా లేరు. నిబంధనలకు భిన్నంగా... కార్యదర్శి స్థాయి అధికారే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు, కమిష న్ను నడుపుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత, ఉద్యోగుల సర్వీసు వివాదాలు పరిష్కరించే పరిపా లనా ట్రిబ్యునల్ (ఏటీ) తెలంగాణకు లేకుండా పోయింది. అధికారికంగా దాని రద్దు ప్రకటించారు. ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డపుడు నమోదయ్యే ఏసీబీ కేసులు, ఉన్నతాధికారులపై వచ్చే అభియో గాల విచారణను నిర్ణయించాల్సిన విజిలెన్స్ కమిషన్ కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. పలు ఇతర హక్కుల సంస్థలదీ ఇదే గతి! హైకోర్టు మందలించినా తోలు మందమే! పాలనలో పారదర్శకత కోసం దేశంలో పుష్కర కాలంగా అమలవుతున్న సమాచార హక్కు చట్టానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కష్టకాలమొచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఈ చట్టం అమలుకు ప్రభుత్వాలు తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. చట్టం అమలును పర్యవేక్షించే, ఫిర్యాదులు–అప్పీళ్లు పరిష్క రించే కమిషన్ను క్రమంగా బలహీనపరిచాయి. ఈ పరిస్థితులు, పౌరులు కోరుకునే సమాచారం వెల్లడి విషయమై అన్ని స్థాయిల్లో అలసత్వాన్ని పెంచి పోషించాయి. సమాచారం సులువుగా లభించని పూర్వస్థితి మళ్లీ బలపడుతుండటంతో ప్రజలు భంగ పోతున్నారు. అంతకుముందు నియమించిన కమి షనర్ల పదవీ కాలం ముగిసి, కమిషన్లో అసలు కమి షనర్లే లేని పరిస్థితి తలెత్తినా... ప్రభుత్వాలు పట్టించు కోలేదు. ఆ దశలో జోక్యం చేసుకున్న ఉమ్మడి హైకోర్టు, నిర్దిష్టంగా ఒక తేదీ లోపల కమిషన్ ఏర్పాటు చేసి, కమిషనర్లను నియమించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలనూ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ‘ఆ మేరకు’ ప్రధాన సమాచార కమిష నర్తో పాటు ఒక కమిషనర్ను నియమిస్తూ కమిషన్ ఏర్పాటు చేసింది. తొమ్మిది వేలకు పైగా అప్పీళ్లు పెండింగ్లో ఉంటే, పది మంది వరకు కమిషనర్లను నియమించుకునే వెసలుబాటున్నా, ఎందుకు నియ మించటం లేదన్నది న్యాయస్థానాల ప్రశ్న. అదనపు సమయం కావాలని పలుమార్లు వాయిదాలు కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాదాపు పదినెలలు కావ స్తున్నా ఇప్పటివరకు కమిషనర్లను నియమించలేదు. కమిషన్ ఏర్పాటుకు ఒక ఉత్తర్వు, కమిషనర్ల పోస్టుల్ని ఏర్పాటు చేస్తున్నట్టు మరో ఉత్తర్వు ఇచ్చి చేతులు దులుపుకొంది. కమిషనర్ల నియామకాలు జరుపలేదు. ఇదే విషయమై హైకోర్టు గట్టిగా నిలదీసినపుడు, చేసేస్తున్నామని మాట ఇచ్చింది. కానీ, ఇప్పటికీ అదేమీ చేయకపోవడం న్యాయధిక్కా రమనే అభియోగంతో కొందరు తిరిగి కోర్టును ఆశ్ర యించిన కేసు శుక్రవారం విచారణకు రానుంది. ప్రజ లకు మేలు చేయడం కన్నా, తమ వారికి పదవులు కట్టబెట్టి, అధికారంలో తామున్నా, లేకున్నా రాబోయే అయిదేళ్లు వారిని కీలకస్థానాల్లో చూసుకోవాలనే రాజకీయ స్వార్థంతోనే ఈ వ్యూహాలన్న విమర్శలు న్నాయి. వారి ఎత్తుగడల్లో చిత్తవుతున్నది మాత్రం ప్రజా ప్రయోజనాలు! జరుగుతున్నది పౌర హక్కుల హననం! చట్టం చెప్పే ప్రమాణాలు తుంగలో సమాచార హక్కు కమిషన్లలో ఖాళీలు భర్తీ చేయండి అన్న సుప్రీంకోర్టు సూచనకే హక్కుల కార్యకర్తలు సంబరపడి పోతున్నారు. ఈ ఇల్లు అలకడాలతో పండు గైపోయినట్టు కాదు. నిజానికి, చట్ట స్ఫూర్తి గల్లంతవు తున్న మతలబంతా అక్కడే ఉంది. ఈ ప్రభుత్వాలు తమకు వీలయినంత కాలం కమిషన్లను ఏర్పాటు చేయవు. ఇక తప్పదన్నపుడు, చట్టం నిర్దేశిం చిన అర్హతా ప్రమాణాలతో నిమిత్తం లేకుండా ‘తమ’ వారితో కమిషన్లను నింపేస్తున్నాయి. స్వతంత్ర ప్రతి పత్తి స్ఫూర్తినే గంగలో కలిపి, ఆయా సర్కార్లు– సదరు కమిషనర్లు పరస్పర ప్రయోజనకరంగా వ్యవహ రించడం దేశవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా అఖిల భారత సర్వీసు రిటైర్డ్ అధికారుల్ని ముఖ్య కమిషనర్లుగా, కమిషనర్లుగా నియమిస్తు న్నారు. సర్వీసు కాలమంతా సమాచారాన్ని చెరబట్టి, జనాన్ని విలువైన సమాచారానికి దూరం పెట్టిన వారు అంత సులువుగా సమాచార వ్యాప్తికి ఎలా నడుం కడతారన్న పౌర సంఘాల ప్రశ్నకు సమాధానమే లేదు! ఆర్టీఐ చట్టం (2005), సెక్షన్లు 12 (5), 15 (5)లో కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియా మకానికి ఎలాంటి వారై ఉండాలో విస్పష్టంగా పేర్కొ న్నారు. ప్రజాజీవితంలో ప్రముఖులై ఉండి, న్యాయ, శాస్త్ర–సాంకేతిక, సామాజిక సేవ, యాజమాన్య నిర్వ హణ, జర్నలిజం, జనమాధ్య మాలు, పరిపాలనలో విశేషానుభవం కలిగిన వారై ఉండాలని పేర్కొన్నారు. అంటే, అవన్ని రంగాల్లో విస్తృత పరిజ్ఞానమో, ఆ ప్రాధాన్యతా క్రమంలో ఏదైనా అంశంలో విశేష ప్రజ్ఞనో కలిగి ఉండటం ప్రామాణికం. అంతే తప్ప, ప్రభుత్వ సర్వీసుల్లో పదవీ విరమణ చేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తప్పు. దాని వల్ల వివిధ స్థాయిల్లో చిక్కులు తలెత్తుతున్నాయి. కమిషన్ నిర్వ హణ, సమచారం ఇచ్చే ప్రక్రియ, ఫిర్యాదులు–అప్పీ ళ్లను పరిష్కరించే విధానం అన్నిట్లోనూ ఈ ‘అధికార ముద్ర’ ఆధిపత్యమే కనిపిస్తోంది. ఫలితంగా, సమా చార కమిషన్ వ్యవస్థ కూడా జనహితానికి భిన్నంగా పనిచేస్తోందన్న విమర్శ వినిపిస్తోంది. ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మేరకు కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓ సదుపాయంగా హక్కుల సంస్థలు రూపొందాలి. రాజ్యాంగ స్ఫూర్తికి ఏ మాత్రం భంగం కలగనీయకుండా వాటి నిర్వహణ చట్ట బద్ధంగా సాగాలి. సర్కార్లు నిర్వీర్యపరుస్తున్నపుడు ‘మనదేం పోయింది..?’ అనే అలసత్వంతో కాకుండా పౌర సమాజం బాధ్యతగా వాటిని పరిరక్షించుకోవాలి. అప్పుడే, సామాన్యుడు మాన్యుడవుతాడు. రాజ్యాంగ స్ఫూర్తి రహిస్తుంది, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. దిలీప్ రెడ్డి -
కశ్మీర్లో హక్కుల హననం
కశ్మీర్లో రాజకీయాలకు విశ్వసనీయత లేకుండా పోయింది. ప్రజలు ప్రభుత్వానికి దూరమయ్యారు. మానవ హక్కుల పరిస్థితిపై అంతర్జాతీయ ఒత్తిడులు పెరుగు తున్నాయి. పాక్ తెగింపు ఎక్కువైంది. జాతీయ రాజకీయాల్లో ఏకాభిప్రాయం లేదు. గతంలో పాశ్చాత్య మానవ హక్కుల సంఘాల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు ఇండియాలో అందరూ కశ్మీర్పై ఏకమయ్యారు. కశ్మీర్ను భారత్లో విలీనం చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందానికి ఉన్న విలువపై అప్పటి అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాబిన్ రాఫేల్ చేసిన ప్రకటన కూడా ఇందుకు దోహదం చేసింది. మళ్లీ ఇప్పుడు బాధ్యతారహితమైన ఐరాస నివేదిక అలాంటి పని చేసింది. కశ్మీర్పై ఐక్యరాజ్యస మితి మానవ హక్కుల మండలి నివేదిక అంతా తప్పుల తడకే. దీనిలో వాస్తవాలు, రూపకల్పనలో పద్ధతులు, లక్ష్యాలపై చర్చించడం శుద్ధ దండగ. కశ్మీర్ రాజకీయ పరిస్థితిపై రాసిన విషయాలు పూర్తిగా లోపభూయిష్టమైనవి. ఈ నివేదిక పాకి స్తాన్ను గాని, ఇండియాను గాని తప్పుబడుతోందా? అంటే ఏ మాత్రం లేదని చెప్పవచ్చు. రెండు దేశాలూ కశ్మీర్ను తోబుట్టువుల ఆస్తి తగాదాలా చూస్తు న్నాయి. ఇక్కడ సీమాంతర ఉగ్రవాదంపై పోరాడు తున్నానని ఇండియా భావిస్తూ మానవహక్కులకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. కశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలకు తాను నిధులు, ఆయుధాలు సరఫరాచేస్తున్నట్టు తెలిపే మరో ఐరాస నివేదిక వచ్చినా పాక్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. న్యాయం కోసం నైతిక పోరాటం చేస్తున్నానని పాక్ భావిస్తోంది. కశ్మీర్లో చిచ్చుకు ఆజ్యం పోస్తున్న కారణంగా ‘జిహాద్ యూనివర్సిటీ’ వంటి ముద్రలను తనకు గౌరవసూచకమైన బిరు దులుగా ఈ దేశం పరిగణిస్తోంది. ఏదేమైనా రెండు దేశాలూ కశ్మీర్ కోసం చివరిదాకా పోరాడతాయి. అర్ధంపర్ధం లేని ఈ ఐరాస నివేదిక నివేదికలోని విషయాల గురించి మాత్రం ఇవి పట్టించుకోవు. ఈ నివేదిక కశ్మీర్ ప్రజలకు మేలు చేస్తుందనే అంచనాల కారణంగా దీన్ని నేను బుర్ర తక్కువ మనుషులు రూపొందించిందని అంటున్నాను. ఈ నివేదిక వల్ల ఇండియా దూకుడు మరింత పెరుగు తుంది. అలాగే, పాకిస్థాన్ కూడా ఎక్కువ సంఖ్యలో కశ్మీరీలను, తాను పంపించే యువకులను జిహాదీ లుగా మార్చి కశ్మీర్ చిచ్చు పెరిగేలా చేస్తుంది. ఎప్ప టికైనా భారత్ను ఈ పద్ధతుల ద్వారానే కశ్మీర్ నుంచి వైదొలగేలా చేయగలనని పాక్ నమ్ముతోంది. 1990ల నాటి ప్రమాదకర పరిస్థితుల్లో కశ్మీర్ అనేక దురదృష్టకర పరిణామాల ఫలితంగా కశ్మీర్ 1990ల నాటి ప్రమాదకర పరిస్థితులకు చేరుకుంది. ఈ కల్లోల రాష్ట్రంలో మానవ హక్కుల పరిస్థితి నానా టికి దిగజారుతుందంటూ ఐరాస, పాశ్చాత్య దేశాల మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు ఇండియాపై విపరీతంగా ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ విష యంలో భారత్ మరింత బలహీనంగా కనిపిస్తోంది. మరి ఈ సంస్థల నివేదికలపై ఇండియా ఎలా స్పంది స్తోంది? పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రాంతాల న్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెబుతూ భారత పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదిం చింది. గతంలో ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్ పేయి, అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి సల్మాన్ ఖుర్షీద్తో కలిసి వెళ్లిన ద్వైపాక్షిక భారత ప్రతినిధి బృందం జెనీవా సమావేశంలో చారి త్రక విజయం సాధించింది. భారత తీర్మానం ఆమో దానికి మానవ హక్కులకు పెద్దగా విలువ ఇవ్వని చైనా, ఇరాన్తో ఇండియా చేతులు కలపాల్సి వచ్చింది. ఈ ఐరాస నివేదిక వల్ల కూడా ఇలాంటి అనేక దేశాలు ఏకమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఐరాస మానవహక్కుల మండలి నివేదికను భారత భారత విదేశాంగశాఖ అధికారికంగా ఖండిస్తూ ప్రకటన చేసే లోపే ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలు కుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి టీవీ చానళ్లలో మాట్లాడారు. రైజింగ్ కశ్మీర్ పత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారీ హత్యతో ఈ నివేదికలోని దుర్మార్గమైన అంశాలను పరిశీలించే అవకాశం లేకుండాపోయింది. దృష్టి అంతా బుఖారీ హత్యపైకి మళ్లింది. రెండు దేశాలూ ఉద్దేశపూర్వకంగానే ఒకేలా వ్యవహరిస్తు న్నాయి. కశ్మీర్పై యుద్ధం ప్రకటించడానికి బదులు కశ్మీరీల స్వయం నిర్ణయాధికారాన్ని పరిశీలించాలన్న ఐరాస చేసిన సూచనను భారత్ గట్టిగా పట్టించు కోలేదు. అలాగే, స్వయం నిర్ణయాధికారం ప్రజలకు ఇస్తే ఇది చివరికి కశ్మీర్ స్వాతంత్య్రానికి దారి తీస్తుందనే భయం పాకిస్థాన్కు ఉంది. అందుకు పాక్ ఎన్నటికీ అంగీకరించదు. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందం కశ్మీర్ను పూర్తిగా ద్వైపాక్షి సమస్యగా ప్రకటించినప్పటి నుంచి ఐరాస కశ్మీరీల స్వయం నిర్ణయాధికారం లేదా ప్లెబి సైట్(జనాభిప్రాయ సేకరణ) గురించి మాట్లాడ లేదు. పాకిస్థాన్ అప్పుడప్పుడూ ఈ విషయాలను లేవనెత్తినాగాని లాహోర్, ఇస్లామాబాద్ లేదా షర్మెల్ షేక్లో ఇండియాతో కలిసి చేసిన సంయుక్త ప్రకట నల్లోగాని, ద్వైపాక్షిక ఒప్పందాల్లోగాని ఈ అంశీలపై పట్టుబట్టలేదు. కశ్మీర్ వివాదాన్ని రెండు దేశాలే పరిష్కరించుకోవాలని మాత్రమే ప్రకటించాయి. 1989–94 మధ్య ఐదేళ్ల కాలంలో కశ్మీర్ తీవ్రవాదం అధ్వాన్న స్థితికి చేరుకుంది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కశ్మీర్లో కనిపి స్తోందా? అనే విషయం మనం చర్చించాల్సి ఉంది. కశ్మీర్లో రాజకీయాలకు విశ్వసనీయత లేకుండా పోయింది. ప్రజలు ప్రభుత్వానికి దూరమయ్యారు. మానవ హక్కుల పరిస్థితిపై అంతర్జాతీయ ఒత్తిడులు పెరుగుతున్నాయి. పాక్ తెగింపు ఎక్కువైంది. జాతీయ రాజకీయాల్లో ఏకాభిప్రాయం లేదు. గతంలో పాశ్చాత్య మానవ హక్కుల సంఘాల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు ఇండియాలో అందరూ కశ్మీర్పై ఏకమయ్యారు. కశ్మీర్ను భారత్లో విలీనం చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందానికి ఉన్న విలు వపై అప్పటి అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాబిన్ రాఫేల్ చేసిన ప్రకటన కూడా ఇందుకు దోహదం చేసింది. మళ్లీ ఇప్పుడు బాధ్యతా రహితమైన ఐరాస నివేదిక అలాంటి పని చేసింది. ఎందుకు ఈ స్థితికి చేరుకున్నాం? గతంలో ఐరాస, పాశ్చాత్య దేశాలు పదేపదే పనికి మాలిన, రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా ఇండియా తట్టుకుంది. మళ్లీ అదే స్థితికి ఎందుకు చేరుకున్నామో మనం ఆలోచించుకోవాలి. మనం కూడా అలాంటి తప్పులే చేయడం దీనికి కారణం. ఇండియాలో రాజకీయ, సైద్ధాంతిక వాతావరణం మారుతున్న క్రమంలో 1989లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక కశ్మీర్లో కల్లోలం మొదలైంది. ఈ మైనారిటీ సర్కారుకు బయటి నుంచి వామపక్షాలు, బీజేపీ మద్దతు ఇచ్చిన విష యం తెలిసిందే. కశ్మీర్లో బలప్రయోగంతో ‘గట్టి’ వైఖరి అవలంబించాలని బీజేపీ కోరింది. ఫలితంగా, బీజేపీ చెప్పినట్టే కశ్మీరీ తీవ్రవాదులను అణచివేయ డానికి జగ్మోహన్ను గవర్నర్గా పంపించారు. అయితే, వామపక్షాల మద్దతుపై ఆధారపడిన కార ణంగా కేంద్రం ముస్లింలకు అనుకూల ధోరణిని కూడా అనుసరించింది. అదీగాక కశ్మీర్కే చెందిన ముఫ్తీ మహ్మద్ సయీద్ కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. దీనికితోడు కశ్మీరీలంటే ప్రేమ ప్రదర్శించే జార్జి ఫెర్నాండెజ్కు కశ్మీరీ వ్యవహరాల శాఖను కూడా అప్పగించారు. ఈ పరిస్థితుల్లో కశ్మీర్లో ఓ అధికార కేంద్రం దూకుడుగా ప్రవర్తిస్తే, రెండోది ప్రజలకు ఊరట కలి గించే రీతిలో వ్యవహరించేది. హోంమంత్రి సయీద్ ఎటు ఉంటారో ఊహకుందని విషయం కాదు. తీవ్ర వాదులు కశ్మీర్ లోయ నుంచి దుర్మార్గమైన రీతిలో కశ్మీరీ పండితులను ఊచకోతకోశారు. తీవ్రవాదం పాక్ భూభాగం నుంచి విస్తరించింది. తర్వాత కశ్మీర్ సమస్యపై పూర్తి అవగాహన ఉన్న పీవీ నరసింహా రావు అధికారంలోకి వచ్చాక సాయుధ దళాలకు అపరిమిత వనరులు, స్వేచ్ఛ కల్పించి, తీవ్రవాదాన్ని అణచివేయడానికి పూర్తి అధికారం ఇచ్చారు. రాష్ట్ర మానవ హక్కుల చరిత్రలో ఇది అత్యంత భయనక దశగా చెప్పవచ్చు. ఇంటరాగేషన్ పేరుతో దారుణాలకు పాల్పడ్డారు. సాధారణ ప్రజలపై జరి పిన కాల్పుల్లో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. బిజ్బెహరాలో కాల్పుల ఘటన, కునాన్ పోష్పోరాలో సామూహిక బలాత్కారాల ఆరోపణలు– ఇవన్నీ ఈ కాలంలోనే కశ్మీర్ను అత లాకుతలం చేశాయి. అప్పుడే చరారే షరీఫ్ సంక్షోభం తలెత్తింది. కశ్మీర్ చరిత్రలో ‘హైదర్’ దశ! కశ్మీర్ చరిత్రలో ఈ కాలాన్నే నేటి తరం ప్రజలు హైదర్ దశగా గుర్తుంచుకుంటారు. కశ్మీర్ సమస్యపై ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ నిర్మించిన చిత్రమే హైదర్. 1996లో పీవీ సర్కారు పాలన ముగిసే నాటికి తీవ్రవాదాన్ని చాలా వరకు అణచివేశారు. అయితే, కశ్మీరీల మనోభావాలు బాగా దెబ్బదిన్నాయి. వీపీ సింగ్ ప్రభుత్వం మతిమాలిన పోకడలకు ఇండియా ఇంత భారీ మూల్యం చెల్లిం చాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే గందరగోళ పరిస్థితి మనకు కనిపిస్తోంది. తేడా ఏమంటే– అప్పట్లో వీపీ సింగ్ మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం ఏ రోజుకారోజు నెట్టుకుంటూ నడిచింది. నేటి బలమైన జాతీయవాద ప్రభుత్వానికి పార్లమెంటులో మంచి మెజారిటీ ఉంది. ఇంత తేడా ఉన్నా ప్రస్తుత బీజేపీ సర్కారు ఏం చేసింది? పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలను, కశ్మీర్ లోయను జమ్మూ ప్రాంతాన్ని కలపడానికి పీడీపీతో బీజేపీ చేతులు కలిపింది. కాని, ఆచరణలో తన ఉద్దేశాలు, లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించలేక పోయింది. ఏక కాలంలో బలప్రయోగం, ప్రజలను ఊరడించే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ఒకే ప్రభు త్వంలో జగ్మోహన్, జార్జి ఫెర్నాండెజ్ పనిచేస్తున్న ట్టుగా వ్యవహారం కనిపిస్తోంది. అయితే, కశ్మీర్ వ్యవహారంలో లేనిదల్లా›మానవ హక్కుల సంఘాల ఒత్తిడి, కశ్మీర్ భారత్లో విలీనంపై రాబిన్ రాఫేల్ వంటి మంత్రులు పశ్నించడమే. ఇప్పుడు అనాలో చితమైన ఐరాస మానవ హక్కుల మండలి నివేదిక కారణంగా ఈ లోటు కూడా తీరిపోయింది. కశ్మీర్ కల్లోలం మళ్లీ 1993 నాటి పరిస్థితికి చేరుకుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని యూఎన్ నివేదిక
-
మహానుభావుడు... మరి లేరు
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ రాజిందర్ సచార్. నిన్న (శుక్రవారం) ఢిల్లీలో కన్నుమూశారు. ఆయనకు 95 ఏళ్లు. ఆయన్ని ఎన్నో రకాలుగా గుర్తించుకోవచ్చు. అయినప్పటికీ మెయిన్ మీడియా ఆయనను ఎందుకు విస్మరించిందో తెలియదు. రాజిందర్ సచార్ ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. పౌరుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తే కాకుండా సోషలిస్ట్ పార్టీలో పనిచేసిన వారు. రాజకీయ కుటుంబానికి చెందిన వారు. ఆయన తండ్రి భీమ్ సేన్ సచార్ పంజాబ్కు రెండుదసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పాలక ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే వారు. భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1953 ప్రాంతంలో అప్పడు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న భీమ్ సేన్ సచార్ నివాసానికి విందు భోజనానికి హాజరయ్యారు. ఆ విషయాన్ని ఆయన ముందుగానే తన కుమారుడైన రాజిందర్ సచార్కు గొప్పగా చెప్పి, తమతోపాటు అల్పాహార విందుకు ఉండాలని కోరారట. మామూలుగా అయితే ఉండేవాణ్నేమోగానీ, నెహ్రూ వస్తున్నానంటే అసలే ఉండనంటూ రాజిందర్ సచార్ బయటకు వెళ్లిపోయారట. అప్పటికే రాజిందర్ సచార్ సోషలిస్ట్ పార్టీలో చేరి కాంగ్రెస్ విధానాలను విమర్శిస్తున్నారు. ప్రేమ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజిందర్ సచార్ 1948లో సోషలిస్ట్ పార్టీలో చేరారు. నెహ్రూతోని అల్పాహార విందుకు హాజరుకానందుకు కాంగ్రెస్ పార్టీ తనకు ఎలాంటి హాని చేయలేదంటూ అప్పుడప్పుడు ఆయన ఆ పార్టీపై చురకలేసేవారు. దేశంలో ముస్లింల స్థితిగతులు, అభ్యున్నతి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాన మంత్రి వేసిన ఉన్నతస్థాయి కమిటీకి రాజిందర్ సచార్ చైర్పర్సన్గా వ్యవరించి ఓ సుదీర్ఘ నివేదికను సమర్పించారు. 2006లో వెలుగుచూసిన ఆ నివేదిక పట్ల పలు సామాజిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. దేశంలో ఎస్టీ, ఎస్సీలకన్నా ముస్లింలు బాగా వెనకబడి ఉన్నారని, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో కేవలం 3.2 శాతం మంది మాత్రమే ముస్లింలు ఉన్నారని ఆయన నివేదిక వెల్లడించింది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే ముస్లింలు మెరుగైన పరిస్థితుల్లో బతుకుతున్నారని, అందుకు కారణం ముస్లింలకు కొంత మేరకు రిజర్వేషన్లు కల్పించడమేనని కూడా ఆయన నివేదిక పేర్కొంది. వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి మెరుగ్గా ఉందనే భ్రమ అప్పట్లో ఉండేది. అదంతా ఒట్టిదని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ముస్లింలు దేశంలోకెల్లా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, 2011లో ఆ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం పడిపోవడానికి ముస్లింల వ్యతిరేకతే కారణమని కూడా సచార్ నివేదిక వెల్లడించింది. దేశంలో ముస్లింల అభ్యున్నతి కోసం జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని పలు పార్టీల నుంచి నేటికి డిమాండ్ వినిపిస్తూనే ఉంటోంది. -
అరుదైన వ్యక్తిత్వం
సమాజ గమనాన్ని చూసి అసహనం ప్రదర్శించేవారుంటారు. ఆగ్రహావేశాలు వ్యక్తం చేసేవారుంటారు. కానీ ఆ సమాజాన్ని ప్రభావితం చేయడానికి, చక్కదిద్దడానికి తమ వంతు బాధ్యతగా క్రియాశీలంగా పనిచేసేవారు చాలా అరుదు. అలాంటి అరుదైన కోవకు చెందినవారిలో తన 95వ ఏట శుక్రవారం కన్నుమూసిన ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజిందర్ సచార్ అగ్రగణ్యులు. రిటైరైన తర్వాత వచ్చే పదవుల కోసం, వాటి ద్వారా లభించే అధికారాల కోసం వెంపర్లాడేవారు ఇంచుమించు అన్ని వ్యవస్థల్లోనూ కనబడతారు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. కానీ సచార్ది విలక్షణమైన వ్యక్తిత్వం. సోషలిస్టు నాయకుడు రాంమనోహర్ లోహియా అనుచరుడిగా తనకంటూ ఒక సామాజిక దృక్పథాన్ని ఏర్పరుచుకుని చివరంటా దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించిన వ్యక్తి ఆయన. ఏడేళ్లక్రితం పౌరహక్కుల ఉద్యమకారుడు కణ్ణబీరన్ మరణించినప్పుడు నివాళులర్పిస్తూ మానవ హక్కుల కోసం ఆయన అవిశ్రాంతం శ్రమించారని జస్టిస్ సచార్ చెప్పారు. ఈమాటే ఆయనకు కూడా వర్తిస్తుంది. హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా ప్రశ్నించడం, బాధితులకు న్యాయం చేసేందుకు అందరినీ కూడగట్టడం ఆయన విధానం. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై, అక్కడి శాంతిభద్రతల స్థితిగతులపై 1990లో ఆయన ఆధ్వర్యంలోని కమిటీ నిజనిర్ధారణ చేసి నివేదిక రూపొందించింది. జాతీయ మానవ హక్కుల సంఘం మరింత చురుగ్గా పనిచే యడం కోసం చేయవలసిన మార్పులపై 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో ఆయన సభ్యుడు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గొంతెత్తి పోరాడినవారిలో ఆయన ప్రముఖుడు. జస్టిస్ సచార్ పేరు చెప్పగానే ఆయన ఆధ్వర్యంలోని కమిటీ దేశంలో ముస్లింల స్థితిగతులపై సమర్పించిన నివేదిక గుర్తొస్తుంది. ముస్లింల సంక్షేమానికి పథకాలు రూపొందించాలనుకునే ఏ ప్రభుత్వమైనా సచార్ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయాల్సిందే. దేశ జనాభాలో 15 శాతంగా ఉన్న ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎంత వెనకబడి ఉన్నారో 400 పేజీల ఆ నివేదిక వెల్లడించింది. ఉన్నతాధికార వ్యవస్థలోనూ, శాంతిభద్రతల పరిరక్షణ విభాగంలోనూ ఆ వర్గానికి సరైన ప్రాతినిధ్యంలేని సంగతిని గణాంకాలతోసహా వివరించింది. వారి అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునో సూచించింది. సైన్యంతోసహా ప్రభుత్వానికి చెందిన సకల విభాగాల్లోనూ ముస్లింల సంఖ్య ఏవిదంగా ఉన్నదో తేల్చడానికి ఆ కమిటీ చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆ ప్రాతి పదికన గణాంకాలిస్తే దురభిప్రాయాలు ఏర్పడతాయని అభ్యంతరాలు వ్యక్తం చేసినా వాస్తవ స్థితిగతులను తెలుసుకోవడానికి వేరే మార్గం ఉండదని జస్టిస్ సచార్ నిష్కర్షగా చెప్పారు. ఇతర విభాగాలు దారికొచ్చినా సైన్యం మాత్రం అయి ష్టంగా వివరాలందజేసి, వాటిని బయటకు వెల్లడించడం మంచిది కాదని సూచిం చింది. ఎంతో శ్రమకోర్చి 2006లో ప్రభుత్వానికి సమర్పించిన ఆ నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం సక్రమంగా అమలు చేసి ఉంటే ముస్లింల స్థితి మరింత మెరుగ్గా ఉండేది. అణగారిన వర్గాలకోసం, అసహాయుల కోసం జరిగే ఏ ఉద్యమానికైనా మద్ద తునీయడం, వారి సమావేశాల్లో పాల్గొనడం సచార్కు అలవాటు. పిలిస్తే వక్తగా వెళ్లడం, లేనట్టయితే సభికుల్లో ఒకరిగా ఉండి నైతిక మద్దతునందించడం పాటిం చేవారు. దేశంలో ఏమూల ఏ అన్యాయం జరిగిందని తెలిసినా, చదివినా దాన్ని ఖండిస్తూ ప్రకటనలిచ్చేవారు. 1985లో రిటైరైన తర్వాత పౌరహక్కుల ప్రజా సంఘం(పీయూసీఎల్) కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2008లో ముంబైపై ఉగ్రదాడి జరిగాక యూపీఏ సర్కారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) తెచ్చినప్పుడు దాన్ని నిశితంగా విమర్శించారు. అంతక్రితం పాలించిన ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించిన ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(పోటా) దుర్వినియోగమైందని ఆరోపించి, దాన్ని రద్దు చేసిన పాలకులు అంతకన్నా కఠినమైన చట్టాన్ని అమలు చేయాలని చూడటంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని నిరోధించడానికి అనుసరించే విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలే తప్ప, వాటిని ఉల్లంఘించేవిగా మారకూడదని ఎలుగెత్తారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పేరిట మానవ హక్కులను హరిస్తే అది ఉగ్రవాదం మరింత పెరగడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. ఇక్కడే కాదు... ప్రపంచంలో ఏమూల హక్కుల ఉల్లంఘన జరిగినా జస్టిస్ సచార్ గళం వినబడేది. శ్రీలంకలో లిబరేషన్ టైగర్ల సాకుతో తమిళులపై సాగిన అకృత్యాలనూ, అత్యాచారాలు... ఇరాక్లో అగ్ర రాజ్యాల దురాక్రమణ, లిబియాలో అమెరికా దురంతం, అక్కడి అంతర్యుద్ధం వగైరాలన్నీ ఆయనను కలవరపెట్టేవి. వాటిపై పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశారు. ప్రపంచంలో పౌరహక్కుల కోసం, మానవ హక్కుల కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఐక్యరాజ్యసమితి మైనా రిటీల పరిరక్షణ, గృహ నిర్మాణం వంటి అంశాల్లో ఆయన నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసింది. ఎన్నో వైరుధ్యాలు, అసమానతలు నిండి ఉండే సమాజంలో ఆధిపత్య వర్గాల తీరుతెన్నులను ప్రశ్నించడం, అసహాయులకు అన్యాయం జరిగినప్పుడు దృఢంగా పోరాడటం, నిరంకుశ ప్రభుత్వాలను ఎదిరించి నిలవడం అందరికీ సాధ్యం కాదు. అందుకు ఎన్నో త్యాగాలు చేయాలి. ఎంతో సమయాన్ని వెచ్చించాలి. జస్టిస్ సచార్ దేనికీ వెరవలేదు. మన రాజ్యాంగాన్ని త్రికరణశుద్ధిగా పాటిస్తే దేశంలో అసమాన తలు, అన్యాయాలు రూపుమాసిపోతాయని ఆయన విశ్వసించారు. ఆ విలువలను పాలకులతో పాటింపజేయడానికి శక్తి మేరకు కృషి చేశారు. వినని సందర్భాల్లో విమ ర్శించారు. ఉద్యమించేవారితో సైతం ఈ విషయంలో ఆయన తగువుపడిన సంద ర్భాలున్నాయి. ఎందరికో స్ఫూర్తినిచ్చే ఇలాంటి అరుదైన వ్యక్తుల అవసరం పెరుగు తున్న దశలో సచార్ కనుమరుగు కావడం దురదృష్టకరం. -
హక్కుల పరిరక్షణ చట్టాలను నీరుగార్చొద్దు!
అవలోకనం శిక్షల రేటు తక్కువగా ఉన్నదన్న కారణంతో ఒక చట్టం దుర్వినియోగమవుతున్నదని నిర్ధారించడం సబబు కాదు. అపహరణలు, ఫోర్జరీ, మోసం, బలవంతపు వసూళ్ల కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంటున్నది. కనుక ఆ చట్టాలు దుర్వినియోగమవుతున్నట్లేనా? దుర్బల వర్గాల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలు మాత్రమే దురుపయోగమవుతున్నాయని నిర్ణయించడం సబబేనా? చట్టాల ‘దుర్వినియోగానికి’ వ్యతిరేకంగా మన సుప్రీంకోర్టు తీసుకుంటున్న చర్యలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈమధ్యే జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యు యు లలిత్ల నేతృత్వంలోని ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం ‘అడ్డూ ఆపూ లేకుండా దుర్వినియోగం’ అవుతున్నదని చెప్పి దాన్ని నిరోధించడం కోసం మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ఫలితంగా...దళితులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న చట్టం కాస్తా బలహీనపడుతుంది. తీర్పులో చాలాభాగం నిష్పాక్షిక విచారణ జరగాలని కోరడానికి నిందితులకుగల హక్కును కాపాడటానికి ఉద్దేశించిందే. కానీ ఈ తీర్పు విచిత్రమైన తర్కం చేసింది. కొన్ని హైకోర్టుల తీర్పుల్ని, జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం ‘దోపిడీ, అణచివేత’ శాసనంగా మారిందన్న నిర్ణయానికొచ్చింది. ఇది ‘బ్లాక్మెయిల్ చేయడానికి, వ్యక్తిగత ప్రతీకారాన్ని తీర్చు కోవడానికి’ ఉపయోగపడటంతో పాటు కులతత్వాన్ని శాశ్వతీకరిస్తున్నదని భావిం చింది. వాటికి విరుగుడుగా అనేక మార్గదర్శకాలిచ్చింది. అందులో అన్నిటికన్నా విధ్వంసకరమైనది కుల వివక్షకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు విషయంలో ఎఫ్ఐ ఆర్ దాఖలు చేసే ముందు ‘ప్రాథమిక విచారణ’ను తప్పనిసరి చేయడం. ఈ న్యాయమూర్తులిద్దరూ పరిరక్షణ చట్టాల దుర్వినియోగంపై ఆదేశాలివ్వడం ఇది తొలిసారి కాదు. గత జూలైలో భారత శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్ (వరకట్న వేధింపుల నిరోధక చట్టం) ‘దుర్వినియోగం’ కాకుండా ఆదేశాలిచ్చారు. వరకట్న వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులొచ్చినప్పుడు వాటిని పరిశీలించడానికి ‘కుటుంబ సంక్షేమ సంఘాలు’ ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఎలాంటి చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని ఫిర్యాదులొస్తాయో ఆలో చించండి. వాటిలో–లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పని స్థలాల్లో మహిళల పరి రక్షణకు ఉద్దేశించిన చట్టం), వరకట్న నిరోధక చట్టం (వివాహితల పరిరక్షణకోసం వచ్చిన చట్టం), కుల వివక్షనూ, అఘాయిత్యాలనూ నిరోధించే చట్టం ( దళితులు, ఆదివాసీలకు ఉద్దేశించింది) ఉన్నాయి. చిత్రమేమంటే దుర్బల వర్గాల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాల విషయంలోనే దుర్వినియోగం ఆరోపణలు వస్తాయి. ఇంత క్రితం ప్రస్తావించిన రెండు తీర్పుల విషయంలో నాకు రెండు ప్రశ్నలున్నాయి. ఒకటి–ఇతర చట్టాలకంటే ఇవే దుర్వినియోగానికి అనువుగా ఉన్నాయా? రెండు– ధర్మాసనం సూచించిన చర్యలు నిష్పాక్షిక విచారణకు దోహదపడేవేనా? మొదటి ప్రశ్నలోకి వద్దాం. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టానికి సంబంధించిన తీర్పులో ధర్మాసనం ఉటంకించిన గణాంకాలు చూద్దాం. 2015 జాతీయ క్రైం రికా ర్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) ప్రకారం ఎస్సీ కేసుల్లో 5,347, ఎస్టీ కేసుల్లో 912 తప్పుడు కేసులని నిర్ధారణ అయింది. దళిత సంఘాలు చెబుతున్న ప్రకారం ఆధి పత్య కులాలకు చెందిన పోలీసు సిబ్బంది దళితుల ఫిర్యాదులను స్వీకరించడానికి విముఖంగా ఉంటారు. అది తప్పుడు ఫిర్యాదని అప్పటికప్పుడే తేల్చేస్తారు. 2016 నాటి ఎన్సీఆర్బీ నివేదికలోని గణాంకాలను పరిశీలిద్దాం. ఆ ఏడాది మొత్తంగా ఎస్సీలకు సంబంధించి 56,299, ఎస్టీలకు సంబంధించి 9,096 ఫిర్యాదులు రావ డమో, దర్యాప్తు పెండింగ్లో ఉండటమో జరిగిందని ఆ నివేదిక తెలిపింది. అంటే మొత్తం కేసుల్లో 10 శాతం లేదా ప్రతి పది కేసుల్లో ఒకటి తప్పుడు కేసు అని అను కోవచ్చు. దానర్థం పదిలో తొమ్మిది నిజమైన కేసులేనన్నమాట! దీన్ని ‘అడ్డూ ఆపూ లేకుండా దుర్వినియోగం’ అవుతున్నట్టు భావించడం సబబేనా? ఈ గణాంకాలను ఇతర నేరాలతో పోల్చి చూద్దాం. కిడ్నాపింగ్ కేసుల్లో 9 శాతం, ఫోర్జరీ కేసుల్లో 12 శాతం తప్పుడువని పోలీసులు చెబుతున్నారు. అంత మాత్రాన కిడ్నాపింగ్, ఫోర్జరీల నిరోధానికి ఉద్దేశించిన చట్టాలను రద్దు చేయాలని ఎవరైనా అంటారా? 2015లో న్యాయస్థానాలు మొత్తం 15,638 కేసుల్లో తీర్పునిస్తే అందులో 11,024 కేసుల్లో నిందితులు నిర్దోషులని తీర్పులొచ్చాయని, 495 కేసుల్ని ఉపసంహరించుకున్నారని, 4,119 కేసుల్లో శిక్షలు పడ్డాయని సుప్రీంకోర్టు ధర్మా సనం ఉటంకించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కేసుల్లో ‘కేవలం’ 26 శాతం కేసుల్లో మాత్రమే శిక్షపడిన సంగతిని గుర్తు చేసింది. వాటి ఆధారంగా ఆ చట్టం దుర్వినియోగమవుతున్నదని అభిప్రాయపడింది. దర్యాప్తు, విచారణల్లో చోటు చేసుకుంటున్న జాప్యం.. బాధితులు, సాక్షుల వేధింపు.. దళితులకు, ఆదివాసీలకు న్యాయం లభించడానికి ఎదురవుతున్న వ్యవ స్థాపరమైన అడ్డంకులు... ఫలితంగా తగ్గుతున్న శిక్షల రేటు గురించి కాసేపు మరిచి పోదాం. వీటిని ‘దుర్వినియోగానికి’ ప్రమాణంగా తీసుకోదల్చుకుంటే ఎన్సీఆర్బీ తాజా గణాంకాల ప్రకారం మోసం కేసుల్లో 20 శాతం, బలవంతపు వసూళ్లలో 19 శాతం, దహనకాండల్లో 16 శాతం మేరకు మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఈ చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని ఎవరూ చెప్పినట్టు లేదు. కానీ కేవలం కొన్ని చట్టాల పనితీరుపైనే దృష్టిపెట్టి అవి మాత్రమే దుర్వినియోగమవుతున్నాయ నడం సబబేనా. ఇక న్యాయబద్ధమైన విచారణ కోసం ధర్మాసనం జారీచేసిన మార్గ దర్శకాలను పరిశీలిద్దాం. మన దేశంలో బాధితులు లేదా సాక్షుల పరిరక్షణకు సంబంధించిన విధానమేదీ లేదు. కనుక ఇలాంటివారు నిందితుల నుంచి వేధిం పులు, బెదిరింపులు ఎదుర్కొంటారు. దీనికితోడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధపడరు. ఇలాంటి స్థితిలో కుటుంబ సంక్షేమ సంఘాల ఏర్పాటు, ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ‘ప్రాథమిక విచారణ’ ఇప్పుడున్న పలురకాల అడ్డంకులకు అదనంగా వచ్చి చేరతాయి. నిరుడు ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ ఆదివాసీలు వంద మంది ఎదుర్కొన్న సమస్యను ఉదహరిస్తాను. కొన్ని ప్రైవేటు సంస్థలు ఏజెంట్ల ద్వారా బెదిరించి తమ భూములు కబ్జా చేయడంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వారు ఫిర్యాదు చేశారు. రాయ్గఢ్ పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకుని ‘ప్రాథమిక దర్యాప్తు’ పేరిట జాప్యం చేసి కొన్ని వారాల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించారు. తప్పుడు కేసుల నుంచి రక్షణకు మన చట్టాల్లో ఇప్పటికే పలు ఏర్పాట్లున్నాయి. ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తికి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. తప్పుడు సాక్ష్యాలు, వాటిని తారుమారు చేయడం నేర పూరిత చర్యలు. వీటిని పోలీసులు, న్యాయవ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటే తప్పుడు ఫిర్యాదులు ఆగిపోతాయి. దుర్బల వర్గాల కోసం పార్లమెంటు చేసిన చట్టా లను మొద్దు బార్చే మరిన్ని తీర్పులు మనకు అవసరం లేదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
పాక్ ఉద్యమకారిణి కన్నుమూత
లాహోర్: పాకిస్తాన్కు చెందిన ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్(66) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పాకిస్తాన్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్కు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన అస్మా.. శక్తిమంతమైన ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్ఐల వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించేవారు. 1952లో లాహో ర్ జన్మించిన అస్మా, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఎల్ఎల్బీ పట్టా పొందారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని 1983లో అప్పటి పాక్ నియంత జియా ఉల్ హక్కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంతో సైనిక ప్రభుత్వం ఆమెను జైల్లో నిర్బంధించింది. జైలు నుంచి విడుదలైన అనంతరం 1986లో స్విట్జర్లాండ్లోని జెనీవాకు వెళ్లిన ఆమె..డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ సంస్థకు రెండేళ్లు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1987లో పాకిస్తాన్లో స్థాపించిన జాతీయ మానవహక్కుల సంఘానికి 1993 వరకూ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఆ తర్వాత చైర్మన్గానూ వ్యవహరించారు. 2007లో అప్పటి పాక్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌధురిని సైనిక నియంత పర్వేజ్ ముషార్రఫ్ పదవి నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు పెద్దఎత్తున చేపట్టిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మానవహక్కుల రంగంలో చేసిన కృషికి గానూ 2014లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు, 2010లో ఫ్రీడమ్ అవార్డు, హిలాల్ ఏ ఇంతియాజ్ అవార్డులను ఆమె అందుకున్నారు. అస్మా మృతి పట్ల బాలీవుడ్ దర్శకులు మహేశ్ భట్, నందితా దాస్, రచయిత జావేద్ అక్తర్, నటి షబానా అజ్మీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జీవించే హక్కుకు దిక్కెవరు?
దేశ సేవంటే పేదరికాన్నీ, నిరక్షరాస్యతనూ, ఆరోగ్య నిర్భాగ్యాన్నీ, ఆర్థిక అసమానతలనూ రూపుమాపటమేనని నెహ్రూ అభిప్రాయపడ్డారు. ముందుతరాలు రాజ్యాంగ వైఫల్యాన్ని ఎత్తిచూపితే అందుకు కారణం రాజ్యాంగం కాదనీ, దాని అమలుకై గద్దెనెక్కిన శక్తులేననీ అంబేడ్కర్ హెచ్చరించారు. ఒక గొప్ప వ్యవస్థను రూపొందించుకుని, మనకు మనం సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగం దశాబ్దాలు గడచినా సజావైన అమలుకు నోచుకోక పోవటం బాధాకరం. మరో గణతంత్ర దినోత్సవానికి దేశం సిద్ధమవుతోంది. ఎర్రకోట సాక్షిగా మాటలు కోటలు దాటి జనాన్ని ముంచెత్తుతాయి. అద్భుతాలు జరుగుతాయని అరవయ్యేళ్లుగా ఎదురుచూస్తున్న జనం తమవి పగటి కలలేనని మరోమారు పెదవి విరుస్తారు. ప్రజలు నిర్లిప్తంగా, నిస్తేజంగా జీవించేందుకేనా ఒక మహత్తర రాజ్యాంగం నిర్మితమైంది? రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులతో తమ తలరాతలు మారిపోతాయని ఆశించే ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీ కాదా? మానవ హక్కుల, ప్రాథమిక హక్కుల పరిరక్షణలే ప్రాతిపదికగా మన గణతంత్ర వ్యవస్థలో రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు తమ పాత్రను ఏ మేరకు అర్థవంతంగా పోషిస్తున్నాయి? ఓట్లు వేసి ఏలికలనెన్నుకునే ఓటున్న మారాజులు ప్రభుత్వాల పనితీరుని సమీక్షించుకోవలసిన అవసరముంది కదా! 1948 నాటి విశ్వజనీన సమాన హక్కుల పత్రం మనిషి జన్మతః స్వేచ్ఛాప్రియుడనీ, సమభావన, సమానావకాశాలతో ఎదగడానికి వ్యక్తి స్వేచ్ఛను సభ్యదేశాలు కాపు కాయాలనీ పేర్కొనగా, ఇదే పత్రం అనేకానేక పౌర, రాజ కీయ హక్కులను మానవ హక్కులుగా నిర్ధారించింది. భారత రాజ్యాంగం సైతం దాదాపు మానవ హక్కులన్నింటినీ ప్రాథమిక హక్కులనే పేరిట పౌరులకు హామీ ఇచ్చి, వీటి అమలుకు ప్రభుత్వాన్నే జవాబుదారీ చేసింది. జనమంతటికీ కూడూ, గూడూ కల్పించడం జీవించే హక్కుకు పునాది కాగా ఈ హక్కు కల్పనతో సర్కారీ వైఫల్యాలు మనలని నివ్వెరపరుస్తున్నాయి. మానవ హక్కులను కాలరాసి జనం తలరాతలని తారుమారు చేసే ఏలికల గుణగణాలను ఈ సందర్భంగా తర్కించుకోవాలి. శాంతి స్టార్ బిల్డర్స్ కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం కూడూ గూడూ ప్రజలకు ఇవ్వలేని ప్రభుత్వ పాలనలో రాజ్యాంగం విఫలమైనట్టేనని వ్యాఖ్యానించింది. ఈ తీర్పు తరువాత పదిహేడేళ్ల కాలంలో పరిస్థితి ఎలా ఉంది? దారిద్య్ర రేఖ దిగువ దృశ్యం ప్రపంచంలోని 119 ఆకలి పీడిత దేశాల జాబితాలో భారత్ నూరవ స్థానంలో ఉంది. అన్నపూర్ణ వంటి మన దేశంలో 194 మిలియన్ల ప్రజలు పస్తుల పాలవుతున్నారు. అంతర్జాతీయ పేదరిక సూచీ (2013)లో భారత్ స్థానం ప్రముఖంగానే ఉంది. జనాభాలో 30 శాతం దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. సవరించిన ప్రమాణాల ప్రాతిపదికగానే 2012 నాటికి జనాభాలో 20.6 శాతం దారిద్య్ర రేఖకు కింద ఉన్న వారితో చేరారు. 2011–2012 నాటికి జనాభా పద్దులో 12.4 శాతం దరిద్ర నారాయణులే. 2013 అంతానికి గూడు కరువైన భారతీయులు 78 మిలియన్లు. 11 మిలియన్లు జనం రోడ్లు, ప్లాట్ఫారాల మీద బతుకులు వెళ్లదీస్తున్నారు. 10.78 మిలియన్ల నివాస గృహాల కొరత ఉందని కేంద్రమే తేల్చింది. ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని నిరుద్యోగం 8.3 శాతం (1983) నుంచి 3.46 శాతానికి (2016) తగ్గినట్టు కాకి లెక్కలు వేసినా ఇదంతా వాపేననీ, బలుపు కాదనీ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలతో మూతపడుతున్న పరిశ్రమలు ఉపాధికి గండికొట్టాయనీ, 2016లో 17.7 మిలియన్లుగా ఉన్న ఉద్యోగ భద్రత లేని చిరుద్యోగులు, వచ్చే రెండేళ్లలో 18 మిలియన్లు దాటిపోతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ జోస్యం చెప్పింది. ఏతావాతా ప్రైవేటు, పారిశ్రామిక రంగాలలో ఉపాధి పొందుతున్న 475 మిలియన్ల బడుగుజీవులకు గాను 400 మిలియన్లకు ఉద్యోగ భద్రత నాస్తి. ఇదిలా ఉండగా ప్రపంచ ఆహార భద్రతా నివేదిక ప్రకారం (2017) దేశంలో 190.7 మిలియన్ల ప్రజలకు పోషకాహార సరఫరా లేదు. 51.4 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతుండగా, 30 శాతం నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఎదిగే బాలలు పౌష్టికాహార లేమి కారణంగా రోజూ 3,000 మంది అసువులు బాస్తున్నారు. 65 మిలియన్ల జనం మురికివాడలలో మగ్గుతుంటే వీరిలో 17 శాతం దాకా పట్టణాలలో జీవిస్తున్నారు. కేటాయించిన సబ్సిడీ ఆహారంలో సగం పైగా అర్హులకు చేరడం లేదు. 410 మిలియన్ల బతుకులు ఒక్కపూట, అరకొర తిండితో గడుస్తున్నాయి. ఆకలిచావులు సాధారణమైపోయాయి. ఇదీ వర్తమాన భారతం. ‘వెలిగిపోతోంద’ని నమ్మబలికిన మన దేశంలో కోట్లాది ఓటర్ల జీవించే హక్కు పట్టపగలు దోపిడీకి గురవుతుండగా మానవ హక్కులను రక్షిస్తున్నామని మనకి మనం కితాబిచ్చుకుంటామా? వేల కోట్లు గుమ్మరించి ఎన్నికల ప్రక్రియ ద్వారా మనం ఏలికలనెన్నుకోవడం ఎవరి ప్రయోజనం కోసం? కనీస అవసరాలు తీర్చమని ప్రభుత్వాన్ని అడుక్కోవలసిన దుస్థితి ఎందుకు దాపురిస్తోంది? ఆ చురకలు అవమానం కాదా? ప్రభుత్వ పరంగా మానవహక్కుల చట్టం, ఆ చట్టం అమలు కోసం దేశ వ్యాప్తంగా హక్కుల కమిషన్, ఉపా«ధి హామీ కోసం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం, విద్యా హక్కు చట్టం వంటివి అమలులోకి తెచ్చినా, ఈ చట్టాలూ, ఈ పథకాల అమలు తీరుతెన్నుల మీద నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా దేశ న్యాయవ్యవస్థ అనేక సందర్భాలలో ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం మీద చురకలు వేయడం, సజావైన ప్రజా పాలన కోసం కోర్టులు సూచనలు ఇవ్వడం ప్రభుత్వానికి తలవంపులు కాదా? బతికే హక్కు అర్థవంతంగా ఉండాలనీ, ‘మృగజీవనం’ కారాదనీ జస్టిస్ భగవతి ఫ్రాన్సిస్ కొరాలీ కేసులో స్పష్టం చేశారు. రాజ్యాంగపు 21వ అధికరణాన్ని విశ్వజనీన మానవహక్కు పత్రంలోని 5వ ఆర్టికల్ తోనూ, అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల అవగాహనలోని 7వ ఆర్టికల్తోనూ అనుసంధానించి జీవించే ప్రాథమిక హక్కును నిర్వచించిన 80వ దశకపు ఫ్రాన్సిస్ కొరాలీ తీర్పు తర్వాతి కాలంలో రాజ్యాంగ ధర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మహిళలూ, బాలల రక్షణ, సంక్షేమం ప్రభుత్వ విధిగా పేర్కొన్న హుస్సేనీరా ఖాటూన్ తీర్పు తర్వాత కూడా విచారణ ఖైదీల అంశంలో సరైన సంస్కరణలు చేపట్టలేదు. దేశంలోని 1,387 జైళ్లలో 68 శాతం అండర్ట్రయల్ ఖైదీలే. వీరిలో 40 శాతం ఆర్నెల్లకు పైబడి బందీలుగా కాలం గడిపేశారు. వీరిలో సగంపైగా జామీనుదార్లను సమర్పించుకోలేని నిస్సహా యులే. వీరందరి జీవించే హక్కును చట్టం సాక్షిగా చట్టుబండలు చేయడం ప్రాథమిక హక్కులకు పాతర వేయడమే కదా! చదువుకోవటం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం అందరికీ విద్యావకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు 1992లో మోహినీజైన్ కేసులో ప్రకటించింది. ఏళ్లూ పూళ్లూ గడిపి చట్టం తెచ్చినప్పటికీ అమలులో మాత్రం ప్రభుత్వం నీరసిం చింది. 2011 జనాభా లెక్కల రీత్యా 78 లక్షలమంది బాలలు బతుకుతెరువుకోసం బరువులెత్తుతుంటే, 8.4 కోట్లమంది చిన్నారులు స్కూళ్లకు వెళ్లలేని దురదృష్టవంతులు. ఉపాధి కోసం శ్రమించే చిట్టితల్లులు 43 శాతమైతే, బాలురు 57 శాతం. 2016 వార్షిక విద్యా సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ భారతంలో 11–14 ఏళ్ల లోపు 3.5 శాతం, 15–16 ఏళ్లలోపు 13.5 శాతం బాలలున్నారు. వీరిలో 25 శాతం పాఠశాల చదువుకు అర్ధాంతరంగా మంగళం పాడేస్తున్నారు. 14 ఏళ్లలోపు చిన్నారులను శ్రమకు గురిచేయడం వారి బాల్యాన్ని దోపిడీ చేయడమవుతుందని ఇటు భారత రాజ్యాంగమూ, అటు పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తున్నప్పటికీ, బాలల హక్కులను దోపిడీకి గురిచేయడం, రాజ్యాంగ వ్యవస్థ మన్నుతిన్న పాములా మిన్నకుండిపోవటం తన వైఫల్యం కాదని ప్రభుత్వం దబాయించగలదా? ‘బాండెడ్ లేబర్’అరాచకత్వాన్ని రూపుమాపాలని బంధు ముక్తి మోర్చా కేసు (1983)లో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి తాఖీదునిచ్చింది. అయితే 1978–2015 మధ్యకాలంలో కట్టు బానిసల పునరావాసానికై విడుదల చేసిన రూ. 81.826 కోట్లలో సగంపైగా నిధుల్ని రాష్ట్రాలు వాపసు చేసినట్లు మే 2016లో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ నివేదిక వెల్లడించింది. ఇదీ మన అధికార యంత్రాంగపు నిర్వాకం. మరణశయ్య మీద ఆరోగ్యం ఇక ఆరోగ్య హక్కు అనారోగ్యం పాలై మరణశయ్య ఎక్కింది. ఆరోగ్య హామీకి ప్రభుత్వం పూచీకత్తు నివ్వకపోవటం మానవ హక్కులకు గండి కొట్టటమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయం. సుప్రీంకోర్టు సైతం ఈ దిశలో కొన్ని తీర్పులిచ్చింది. విన్సెంట్–పనికుర్లంగార కేసు (1987)లో జస్టిస్ రంగనాథ మిశ్రా ఆరోగ్యం మహా భాగ్యాన్ని ప్రాథమిక హక్కుగా ప్రస్తావిం చగా, మహీందర్ సింగ్ చావ్లా కేసులో (1996) జస్టిస్ రామస్వామి, పట్నాయక్ల ధర్మాసనం, ఈ హక్కును పటిష్టంగా ప్రభుత్వం అమలు చేయాలని వక్కాణించింది. అయితే 2000–01లో జీడీపీలో ఒక్క శాతం కూడా ఆరోగ్య హక్కు కోసం కేటాయింపు చేయలేని కేంద్రం 2009–10కి ఈ పద్దుకింద ఖర్చు అంచనాను 1.45 శాతంగా నిర్ధారించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం 1999–2002 కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ, ప్రాదేశిక పాలనా సంస్థలూ జీడీపీలో కేవలం 1.3 శాతమే ఆరోగ్యం కోసం వెచ్చించాయని వెల్ల డించింది. పేద దేశాలుగా పేరొందిన ఆఫ్రికా దేశాల్లోనే జీడీపీలో 3 శాతంపైన ఆరోగ్యం ఖాతాలో ఖర్చు రాయడం విశేషం. కేంద్రం ఇటీవల వెలువరించిన 2017 నాటి జాతీయ ఆరోగ్య పాలసీలో జీడీపీలో 2.5 శాతం మొత్తాన్ని ప్రజారోగ్యం పద్దుకు కేటాయించాలని సంకల్పించింది. దీంతో దేశం ఆరోగ్యకరమైన జనాభాతో కిక్కిరిసిపోతుందని మురిసిపోతోంది. దేశంలోని 12,760 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిపడా మంచాలే లేవు. పెరిగే రోగులకు ఆసుపత్రులూ, వైద్యులూ, వైద్య నిపుణులూ, సహాయ సిబ్బంది, పరికరాల లేమీ కొట్టొచ్చినట్లున్న దుస్థితిలో నిధుల లేమి మాయదారి రోగంగా సంతరించుకోవటం ఆరోగ్య దౌర్భాగ్యానికి నిలువెత్తు నిదర్శనం. దేశ సేవంటే పేదరికాన్నీ, నిరక్షరాస్యతనూ, ఆరోగ్య నిర్భాగ్యాన్నీ, ఆర్థిక అసమానతలనూ రూపుమాపటమేనని నెహ్రూ అభిప్రాయపడ్డారు. ముందుతరాలు రాజ్యాంగ వైఫల్యాన్ని ఎత్తిచూపితే అందుకు కారణం రాజ్యాంగం కాదనీ, దాని అమలుకై గద్దెనెక్కిన శక్తులేననీ అంబేడ్కర్ హెచ్చరించారు. ఒక గొప్ప వ్యవస్థను రూపొందించుకుని, మనకు మనం సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగం దశాబ్దాలు గడచినా సజావైన అమలుకు నోచుకోకపోవటం బాధాకరం. వెలుగులు విరజిమ్మే భారత్ను ఆవిష్కరించడం కోసం రాజ్యాంగ సందేశాల్ని తు.చ. తప్పకుండా అమలు చేయాలనీ మరోసారి నేతలూ, ప్రజలూ గుర్తు చేసుకోవాలి. (రేపు గణతంత్ర దినోత్సవం) - వేదాంతం సీతారామావధాని వ్యాసకర్త భారత సుప్రీంకోర్టు మాజీ సెక్రటరీ జనరల్ ఈ–మెయిల్ : sitharam.avadhani@gmail.com -
పోరాటమే లక్ఘ్యం
ఒక లక్ష్యం కోసం పోరాడినా... ఆ లక్ష్యాన్ని సాధించలేనప్పుడు పోరాటం ఆగాలా..! పోరాటం సాగాలా..!! మహాత్మాగాంధీ అన్నట్టు ‘‘వాళ్లు నా శరీరాన్ని హింసించవచ్చు, నా ఎముకలు విరిచేయవచ్చు, నన్ను చంపేయొచ్చు కూడా... అప్పుడైనా వాళ్లకు దొరికేది నా దేహమే... నా విధేయత కాదు’’ నేడు మానవ హక్కుల దినోత్సవం మానవ హక్కులు దేవతావస్త్రాల్లా తయారయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఘనత చాటుకునే మన భారత్లోను, అతిపాత ప్రజాస్వామ్య దేశంగా జబ్బలు చరుచుకునే అగ్రరాజ్యం అమెరికాలోనూ మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఇక నియంతృత్వ పాలన సాగుతున్న దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. చాలాచోట్ల ప్రభుత్వాలే నిస్సిగ్గుగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ఇంకొన్ని చోట్ల ప్రభుత్వాలు మానవ హక్కుల పరిరక్షణకు కంటితుడుపుగా అధికారిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నా, అలాంటి చోట్ల ప్రభుత్వాల అధీనంలో పనిచేసే శాంతిభద్రతల బలగాలు, రక్షణ బలగాలు ప్రజల కనీస మానవ హక్కులను కాలరాస్తున్నాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాల సంగతి సరే, ముందు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఘనత పొందిన మన భారత దేశంలో మానవ హక్కుల పరిస్థితిని ఒకసారి చూద్దాం. మన రాజ్యాంగం జీవించే హక్కును, సమానత్వ హక్కును, దోపిడీకి గురికాకుండా ఉండే హక్కును, భావ ప్రకటనా స్వేచ్ఛను, విద్యాహక్కును, సాంస్కృతిక స్వేచ్ఛను, మత స్వేచ్ఛను, గోప్యత హక్కును ప్రాథమిక హక్కులుగా గుర్తించింది. ఈ హక్కులకు భంగం వాటిల్లితే రాజ్యాంగ పరిధిలో చట్టపరంగా రక్షణ పొందే హక్కును కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మన రాజ్యాంగంలో హక్కులు, మన చట్టాల్లో హక్కుల పరిరక్షణ మార్గాలు చాలా పకడ్బందీగానే ఉన్నా, మన దేశంలో యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో మానవ హక్కులకు రక్షణ కల్పించడానికి 1993లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది. తర్వాతి కాలంలో వివిధ రాష్ట్రాల్లోనూ మానవ హక్కుల కమిషన్లు ఏర్పడ్డాయి. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నా, మానవ హక్కులకు భరోసా కల్పించడంలో మన దేశంలో పెద్దగా సాధించినదేమీ లేకపోగా, ఎక్కడో ఒకచోట సామాన్యుల హక్కులకు తరచుగా విఘాతం కలుగుతూనే ఉంది. హక్కుల ఉల్లంఘనలో మన రికార్డు స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఏళ్లు నిండినా, ఆధునిక బానిసత్వంలో, వెట్టిచాకిరిలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. కట్టుబానిసలుగా వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న అమాయకుల సంఖ్య మన దేశంలో 1.83 కోట్లు అని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెట్టి చాకిరిలో మగ్గుతున్న వారి సంఖ్య 4.58 కోట్లు అయితే, వారిలో దాదాపు మూడోవంతుకు పైగా వెట్టి కార్మికులు మన దేశంలోనే ఉన్నారు. దోపిడీకి గురికాకుండా ఉండే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిన మన దేశమే శ్రమ దోపిడిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుండటం విషాదకర వాస్తవం. దేశంలో విద్యా హక్కు అమలులో ఉన్నా, దాదాపు 1.26 కోట్ల మంది చిన్నారులు పొట్ట పోసుకోవడానికి ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. వీరిలో చాలామంది నామమాత్రపు ప్రతిఫలానికి వెట్టిచాకిరి చేస్తున్నవారే. పేదరికం వల్ల అప్పులపాలైన తల్లిదండ్రులు తమ పిల్లలను రుణదాతల వద్ద వెట్టిచాకిరికి పెడుతున్నారు. వెట్టిచాకిరి కోరల్లో చిక్కుకుంటున్న బాలికల్లో చాలామంది లైంగిక దోపిడీకి గురవుతున్నారు. రక్షకులే భక్షకులు మానవ హక్కుల పరిరక్షణలో, శాంతిభద్రతల అమలులో కీలక పాత్ర పోషించాల్సిన పోలీసు బలగాలు యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. పోలీసుల కస్టడీలోను, జుడీషియల్ కస్టడీలోను చిత్రహింసలకు తాళలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన దేశంలోని పరిస్థితినే గమనిస్తే, 2001–13 మధ్య కాలంలో 1,275 మంది పోలీసు కస్టడీలో మరణించారు. అదే కాలంలో ఏకంగా 12,727 మంది జుడీషియల్ కస్టడీలో ప్రాణాలు వదిలారు. పోలీసు కస్టడీ మరణాలకు సంబంధించి మహారాష్ట్ర (306), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (210), గుజరాత్ (152) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కస్టడీ మరణాలకు సంబంధించి 2013 సంవత్సరం తర్వాతి లెక్కలను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఆ లెక్కలను కూడా కలుపుకుంటే, ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది. ఇక ఎన్కౌంటర్ల పేరిట భద్రతా బలగాలు పొట్టన పెట్టుకుంటున్న వారి సంఖ్య దీనికి అదనం. జమ్ము కశ్మీర్లోను, ఈశాన్య రాష్ట్రాల్లోను భద్రతా బలగాలు సామాన్యులపై సాగించే దమనకాండకు సంబంధించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎవరిపై అయినా ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనే అనుమానం వస్తే చాలు, కాల్చి పారేయడమే పనిగా పెట్టుకున్న పోలీసులు ఈశాన్య రాష్ట్రాల్లో చాలామందే ఉన్నారు. ఉగ్రవాదులుగా అనుమానించిన దాదాపు వందమందిని తాను స్వయంగా కాల్చి చంపానని మణిపూర్కు చెందిన హెరోజిత్ అనే మాజీ పోలీసు అధికారి పాత్రికేయుల వద్ద సగర్వంగా చెప్పుకున్నాడంటే ఆ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసు కస్టడీ, జుడీషియల్ కస్టడీల్లో సంభవిస్తున్న మరణాలకు సంబంధించి బాధ్యులకు శిక్షలు పడుతున్న సందర్భాలు దాదాపు రెండు శాతం మాత్రమే ఉంటున్నాయి. కస్టడీ మరణాలు, బూటకపు ఎన్కౌంటర్లు ఒక ఎత్తయితే, మరోవైపు... బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడటం, కూంబింగ్ ఆపరేషన్ల పేరిట అత్యాచారాలకు తెగబడటం, చట్ట విరుద్ధంగా సెటిల్మెంట్లు చేయడం, పౌరుల పట్ల నిష్కారణంగా దురుసుగా ప్రవర్తించడం, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడం వంటి ‘ఘన’కార్యాలు కూడా మన పోలీసులకు చాలా మామూలు విషయాలు. కేవలం 2015 సంవత్సరంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 46 మంది మహిళలు పోలీసుల చేతిలో అత్యాచారాలకు గురయ్యారని జాతీయ మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. మన పోలీసుల మానవ హక్కుల ఉల్లం‘ఘన’ చరిత్ర విదేశాలకూ పాకింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నందున సీఆర్పీఎఫ్ మాజీ ఐజీ తేజీందర్ సింగ్ ధిల్లాన్కు వీసా ఇచ్చేందుకు కెనడా నిరాకరించింది. మానవ హక్కుల ఉల్లంఘనలో మన పోలీసుల ‘ఘనత’కు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులపై గత ఏడాది 36 వేలకు పైగా కేసులు నమోదైనట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రకటించింది. భావప్రకటనకూ దిక్కులేదు స్వతంత్ర భారత దేశంలో భావ ప్రకటనకూ దిక్కులేకుండా పోతోంది. ఎమర్జెన్సీకాలంలో భావప్రకటనకు పూర్తిగా సంకెళ్లు పడ్డాయి. ఆ తర్వాత ఇటీవలి కాలంలో భావప్రకటనా స్వేచ్ఛకు తరచుగా అవరోధాలు ఏర్పడుతున్నాయి. కార్టూన్లు వేసినందుకు, వ్యాసాలు, పుస్తకాలు రాసినందుకు, చివరకు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేసినందుకు కటకటాల వెనక్కు వెళ్లే పరిస్థితులు, కేసుల్లో చిక్కుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వంపైన, ప్రభుత్వాధినేతలపైన విమర్శలు చేసే వారికి బెదిరింపులు, భౌతిక దాడులు ఎదురవుతున్నాయి. అవినీతి బాగోతాలను బట్టబయలు చేసేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయిస్తున్న వారిలో కొందరికి ఏకంగా ప్రాణాలకే ముప్పు ఎదురవుతోంది. సమాజంలో భిన్నాభిప్రాయాలను గౌరవించే లక్షణం తగ్గిపోతోంది. ఒక వర్గం అభిప్రాయాలకు భిన్నంగా మరోవర్గానికి చెందిన వారెవరైనా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే, వారిపై భౌతిక దాడులకు తెగబడే మూకలు పేట్రేగిపోతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను హరించడానికి కూడా అలాంటి మూకలు వెనుకాడటం లేదు. వీళ్ల తాకిడికి ఎక్కువగా రచయితలు, కళాకారులు, అవినీతి పాలనపై విమర్శలు సంధించే వాళ్లు, నిబంధనలకు కట్టుబడి నిజాయతీగా విధులు నిర్వర్తించే ప్రభుత్వాధికారులు బాధితులవుతున్నారు. కర్ణాటకలో పత్రికా సంపాదకురాలు గౌరీ లంకేష్ హత్య, ‘పద్మావతి’ సినిమా దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ, ఆ సినిమా కథానాయకురాలు దీపికా పదుకొనెలపై బెదిరింపులు, ఫత్వాలు ఇలాంటి పోకడలకు తాజా ఉదాహరణలు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిలో మత ఛాందసులతో పాటు రాజకీయ పదవుల్లో కొనసాగుతున్న నాయకులు కూడా ఉంటున్నారు. దేశ రాజ్యాంగంపైన కనీస గౌరవం లేని ఇలాంటి నాయకులు చట్టసభల్లో కొనసాగుతున్నారు. బలహీనులే బాధితులు మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి బలహీనులే బాధితులుగా మిగులుతున్నారు. సమాజంలోని బలహీనులు తరచుగా హక్కుల అణచివేతకు గురవుతున్నా, వారికి న్యాయం దక్కుతున్న సందర్భాలు మాత్రం అరుదుగానే ఉంటున్నాయి. మహిళలు, దళితులు, మైనారిటీలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం మన దేశంలో గత ఏడాది దళితులపై 45 వేలకు పైగా నేరాలు జరిగాయి. గిరిజనులపై 11వేలకు పైగా నేరాలు జరిగాయి. గడచిన రెండేళ్లలో మైనారిటీలపైన, దళితులపైన గోపరిరక్షక దళాల దాడులు గణనీయంగా పెరిగాయి. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 2015లో మత ఘర్షణలకు సంబంధించి దాదాపు 750 సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనల్లో 97 మంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు. 2016 సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లోనే ఇలాంటి 275 మత ఘర్షణలు జరిగి 38 మంది మరణాలకు దారితీశాయి. కుల మతాలకు అతీతంగా ప్రేమించుకున్న ప్రేమజంటలు పరువు హత్యలకు గురవుతున్నారు. సభ్య సమాజంలో ఇలాంటి పరువు హత్యలు అత్యంత హేయమైనవి అంటూ సుప్రీంకోర్టు ఒక తీర్పులో తీవ్రంగా అభిశంసించినా, ఈ సంఘటనలు తగ్గకపోగా మరింతగా పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2014లో 28 పరువు హత్యలు జరిగితే, 2015లో ఏకంగా 251 హత్యలు జరిగాయి. ఎక్కువగా దళితులు, మైనారిటీలు, మహిళలే పరువు హత్యల బారిన పడుతున్నారు. ప్రపంచంలో కొన్ని దారుణమైన ఉల్లంఘనలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రకరకాలుగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పలు దేశాల్లో ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలోని ‘రక్షణ’బలగాలు ఇష్టానుసారం సామాన్యుల హక్కులను కాలరాస్తున్నాయి. ప్రపంచమంతటికీ మానవ హక్కులపై సుద్దులు చెప్పే పెద్దన్న అమెరికాలో నల్లజాతి వారికి సమాన హక్కులు ఇప్పటికీ దక్కడం లేదు. అక్కడి చట్టాల ప్రకారం పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నా, అమెరికన్ పోలీసులు మాత్రం నల్లజాతి ప్రజల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. కేవలం ‘అనుమానం’తో నల్లజాతి వారిపై ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతున్న ఉదంతాలు తరచుగా వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఉత్తర ఇరాక్, సిరియా ప్రాంతాలను గుప్పిట్లో పెట్టుకున్న ‘ఐసిస్’ పాల్పడుతున్న ఘాతుకాల గురించి చెప్పుకుంటే పెద్ద గ్రంథమే తయారవుతుంది. ఇండోనేసియా జాతీయ పోలీసు దళంలోకి మహిళలు ఎవరైనా చేరాలనుకుంటే వారు తప్పనిసరిగా కన్యత్వ పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. ఎడాపెడా మరణశిక్షలను అమలు చేయడంలో చైనా రూటే సెపరేటు. మరణశిక్ష విధించిన ఖైదీల నుంచి అవయవాలు సేకరించి, వాటిని అవయవ మార్పిడి చికిత్సలకు ఉపయోగించడం అక్కడ సర్వసాధారణం. కాంగో, గాంబియా వంటి ఆఫ్రికా దేశాలైతే పౌరుల పాలిట ప్రత్యక్ష నరకాలే! ఉత్తర కొరియాలో పరిస్థితి మరీ దారుణం. అక్కడ అధ్యక్షుడి ఆగ్రహానికి గురైతే ఎంతటి వారైనా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే! అక్కడి మహిళా సైనికులపై జరుగుతున్న ఘాతుకాలపై వెలుగులోకి వచ్చిన కథనాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మయన్మార్లో అక్కడి బలగాలు రోహింగ్యాలకు కనీస హక్కులను నిరాకరించడమే కాకుండా, బలప్రయోగంతో దేశం నుంచి వెళ్లగొడుతుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో అణచివేతలు... ఆంధ్రప్రదేశ్లోనూ హక్కుల ఉల్లంఘనలు కొత్త ముచ్చటేమీ కాదు. ప్రజల హక్కులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఉదంతాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని తుందుర్రు గ్రామ ప్రజలు తమ ఉనికికే ముప్పుగా మారిన గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్కు పేరిట రొయ్యల ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగితే, ప్రభుత్వం వారిపై దమనకాండకు పాల్పడింది. రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయనాల వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవడమే కాకుండా, సమీప గ్రామాల మత్స్యకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండటంతో ఆందోళనలు చెలరేగాయి. రొయ్యల ఫ్యాక్టరీని గ్రామాలకు చేరువలో కాకుండా, సముద్ర తీరానికి తరలించాలంటూ తుందుర్రు చుట్టుపక్కల దాదాపు నలభై గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు పలికినా, ప్రభుత్వం మాత్రం గ్రామస్తుల గోడు పట్టించుకోకుండా ఆందోళనకారులపై కేసులు బనాయించి, జైళ్లలోకి నెట్టింది. ►కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారుగా ఉన్న సమయంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోద్బలంతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చాలానే జరుగుతున్నాయి. ►భీమవరానికి చేరువలోని గరగపర్రు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు మూడువందల దళిత కుటుంబాలను అగ్రవర్ణాల వారు సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. ►శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కొవ్వాడలో తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా సమీప గ్రామాల ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలను ఎలాగైనా అణచివేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆ ప్రాంతంలో సంక్షేమ పథకాలతో పాటు, స్థిరాస్తుల క్రయవిక్రయాలను కూడా నిలిపివేసింది. ►నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం పంట భూములను బలవంతంగా సేకరిస్తుండటానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా ఉండవల్లి మండలంలోని పెనుమాక గ్రామస్తులు మూడేళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. ►కర్నూలు జిల్లా పాములపాడు మండలంలోని వెంపెంట గ్రామస్తులు తమ ఉనికికే ముప్పుగా మారిన పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాటం కొనసాగిస్తున్నా, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ►తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ పరిశ్రమకు ప్రభుత్వం 505 ఎకరాల అసైన్డ్ భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందంటూ పంపాదిపేట పరిసర గ్రామాల ప్రజలు న్యాయపోరాటం సాగిస్తున్నారు. ►ఇవన్నీ ఒక ఎత్తయితే, రెండేళ్ల కిందట చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లనే నెపంతో ఇరవై మంది కూలీలను పోలీసులు కాల్చి చంపారు. ఈ సంఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా అభిశంసించింది. -
అన్నం ముద్ద మనిషి హక్కు
ఆహార హక్కు మనిషి కనీస హక్కు. భూమిపై పడిన ప్రతి ఒక్కరికీ భూమిపై మొలకెత్తిన ప్రతి గింజను పొందే నైతిక హక్కు ఉంది. నార్మన్ బొర్లాగ్ ఇలా అంటాడు : ‘‘నీ పక్కవాడు తినకుండా పడుకుంటే నీకా రోజు నిద్ర పట్టకూడదు. ‘బాగున్నావా’ అని అడిగే బదులు, ‘తిన్నావా?’ అని అడుగు. అప్పుడు వాడు నిజంగా ఎలా ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చెయ్యాలో తెలుస్తుంది. ఆకలి భయంతో సగం ప్రపంచం సూర్యోదయానికి భయపడుతూ లేస్తున్నప్పుడు నీ నాగరికతకు అర్థం లేదు. దేవుడిపై నీ విశ్వాసానికి అర్థం లేదు. ఆకలి భయంతో సగం ప్రపంచం.. కన్నీటిని కూడా పొదుపుగా ఖర్చు చేస్తున్నప్పుడు నువ్వు ప్రబోధించే శాంతి సామరస్యాలకు అర్థమేలేదు’’ అని. మనిషి ఆహారపు హక్కును కాపాడే ప్రయత్నం చేసిన అమెరికన్ వ్యవసాయ నిపుణుడు నార్మన్ బోర్గాగ్. ఆకలిగా ఉన్నవారికి ఇంత ముద్దను పెట్టడం కూడా మానవ హకుల్ని పరిరక్షించడం కిందికే వస్తుంది. (రేపు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం) -
మారణహోమం ఖరీదు.. 3 లక్షల ప్రాణాలు
బీరుట్ : సిరియా అంతర్గత యుద్ధంలో మొత్తంగా 3 లక్షల 40 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ సంస్థ ఒకటి ప్రకటించింది. సిరియా మారణహోమానికి ముగింపు పలికే ఉద్దేశంతో జెనీవాలో ప్రపంచ దేశాలు చర్చిస్తున్న సమయంలో ఇటువంటి ప్రకటన రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ చర్చలు ముగిసేలోపు మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని సదరు సంస్థ పేర్కొంది. సిరియాలో 2011 నుంచి మొదలైన అంతర్గత సంక్షోభం, ఐసిస్ తీవ్రవాద ప్రభావాలను గమనిస్తున్న బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవహక్కుల సంఘం ఈ ప్రకటన చేసింది. సిరియాలో 2011 నుంచి ఇప్పటివరకూ 3 లక్షల 43 వేల 511 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మృతుల్లో లక్షకు పైగా సాధారణ పౌరులు ఉన్నారని.. అందులోనూ 19 వేల మంది చిన్నారులు, 12 వేల మంది మహిళలు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అంతర్గత సంక్షోభం మొదలైన తరువాత ఇప్పటివరకూ ప్రభుత్వ అనుకూల దళాలు.. లక్ష 19 వేల మందిని ఊచకోతకోశాయి. ఇందులో 62 వేల మంది సిరియన్ సైనికులు ఉండగా, 10 వేల మంది మిలటరీ అనుకూలరు ఉన్నట్లు అంచనా. -
రోహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
-
రోహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
మానవహక్కులు.. జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాలి రోహింగ్యాల దుస్థితిపై కేంద్రం సున్నితంగా వ్యవహరించాలి మేం నిర్ణయించే వరకు వారిని పంపించకూడదు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని రోహింగ్యా ముస్లింలను పంపించే విషయమై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రోహింగ్యాల దుస్థితిపై కేంద్ర ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని సూచించింది. దేశంలోని శరణార్థుల సమస్యను ఎదుర్కొనే విషయంలో మానవ హక్కులు, జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాల్సిన అవసరముందని పేర్కొంది. అమాయక రోహింగ్యా మహిళలు, చిన్నారుల దుస్థితిని కోర్టు చూసీచూడకుండా వదిలేయలేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రోహింగ్యాల విషయంలో మానవ హక్కుల, జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాలని, ఈ విషయంలో అనేక అంశాలను పరిగణించాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ విషయంలో తాము నిర్ణయం తీసుకునే వరకు దేశంలోని రోహింగ్యాలను డిపోర్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోహింగ్యాలను పంపించే విషయంలో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే పిటిషనర్ తమను ఆశ్రయించవచ్చునని తెలిపింది. దేశంలోని రోహింగ్యా శరణార్థుల తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. దేశంలోని రోహింగ్యాలు శరణార్థులు కాదని, వారు అక్రమ వలసదారులని, వారు దేశభద్రతకు ముప్పుగా పరిణమించారని, చట్టప్రకారం వారు దేశంలో నివసించడం కుదరదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
మానవహక్కులు అణచివేస్తే సహించం
గౌరీ లంకేశ్ హత్యపై నినదించిన ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యపై ప్రజా, హక్కుల సంఘాలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో హత్య చేస్తుంటే సహించేది లేదని హెచ్చరించారు. మతం, కులం పేరుతో మానవ హక్కులను అణచివేస్తే సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. శుక్రవారం ట్యాంక్బండ్పై నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటకలో హత్యకు గురైన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్కు వందలాది మంది నివాళులర్పించారు. నేను సైతం గౌరి... గౌరీ లంకేశ్ హంతకులను కఠినంగా శిక్షించాలి... మతోన్మాదం నశించాలి.. అంటూ నినదించారు. ‘మతోన్మాదంపై ఒంటరిగా పోరాడి మరణించినా.. అక్షరాలను ఆయుధాలుగా మలిచి గెలిచింది గౌరీ లంకేశ్. ఆమె ఇప్పుడు గతం కాదు. వర్తమానం, భవిష్యత్తు కూడా’అంటూ ప్రముఖులు శ్లాఘించారు. ఆమె మరణాన్ని జయించిన కలం యోధురాలని కొనియాడారు. దాడులు, బెదిరింపులు, హత్యలతో భావ ప్రకటనా స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని హరించలేవన్నారు. అసహనాన్ని అంతం చేద్దాం.. హత్యారాజకీయాలను తిప్పికొడదాం అంటూ గౌరీ లంకేశ్ తన చివరి శ్వాసతో ప్రజల్లో కొత్తశ్వాస నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త చుక్కారామయ్య, విరసం నేత వరవరరావు, సీపీఐ నేత కె.నారాయణ, జర్నలిస్టు నాయకుడు అమర్, ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎన్.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 12న చలో బెంగళూరు.. గౌరీ లంకేశ్ హత్యకు నిరసనగా ఈ నెల 12న చలో బెంగళూరు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు. బెంగళూరులో జరిగే నిరసన ప్రదర్శనలో పాత్రికేయులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గౌరీ లంకేశ్ హంతకులను కఠినంగా శిక్షించాలి న్యాయవాదుల డిమాండ్ ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యను ఉమ్మడి హైకోర్టు న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. గౌరి హత్యపై న్యాయవాదులు శుక్రవారం భోజన విరామ సమయంలో హైకోర్టు బయట నిరసన తెలియచేశారు. హంతకులను కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఐలు, ఐఏఎల్, ఏపీసీఎల్సీ, ఏపీసీఎల్ఏ తదితర సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాటిబండ్ల ప్రభాకరరావు, కె.పార్థసారథి, వి.రఘునాథ్, ఎన్.మాధవరావు, పి.సురేశ్కుమార్, బొమ్మగాని ప్రభాకర్, తిరుమలశెట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులే కొట్టి చంపారు..!
– మృతుని బంధువుల ఆరోపణ – పారిపోతూ ప్రాణాలు కోల్పాయాడంటున్న పోలీసులు కర్నూలు సీక్యాంప్: తన తండ్రి వెంకోబనాయుడిని కర్నూలు పోలీసులే కొట్టి చంపారని తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్ల గ్రామానికి చెందిన మురళీధర్నాయుడు ఆరోపించారు. పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా పారిపోతూ ఆదివారం సాయంత్రం కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు వద్ద తుంగభద్ర నదిలో మునిగి వెంకోబనాయుడు మృతి చెందిన విషయం విదితమే. మృతదేహానికి కర్నూలు పెద్దాస్పత్రిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుని కుమారుడు మురళీధర్ నాయుడు, అతని బంధువులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి పోలీసులను నిలదీశారు. తుమ్మిళ్ల గ్రామానికి చెందిన వెంకోబ నాయుడు పేకాట ఆడడానికి ఆర్.కొంతలపాడుకు వస్తే పోలీసులు ఉద్దేశపూర్వకంగా కొట్టి చంపారని ఆరోపించారు. అతని దగ్గర ఉన్న రూ.50 వేలు పోలీసులు కాజేశారన్నారు. మృతుని శరీరంపై ఉన్న దెబ్బలు ఉంటడంతో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని చెప్పారు. ఈ ఘటనపై కర్నూలు తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. పేకాట ఆడుతున్న వారిలో 8 మంది పోలీసులకు లొంగిపోయారని, వెంకోబనాయుడు మాత్రం తప్పించుకునే ప్రయత్నంలో తుంగభద్రనదిలో పడి స్పృహ కోల్పోయాడన్నారు. నీళ్లు ఆయన పొట్టలోకి చేరడంతో చనిపోయాడన్నారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత బంధువులకు అప్పగిస్తామన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన తిమ్మిళ్ల గ్రామానికి చెందిన వెంకోబనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబీకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. పేకాట ఆడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా దాడి చేయడంతోనే మరణించాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో మృతుడి భార్య పుష్పావతి, కుటుంబీకులు వేణుగోపాల్నాయుడు, చిన్న కొండయ్య, జి.కొండయ్య, జి.మాధన్న తదితరులు పాల్గొన్నారు. -
నాట్ ఇన్ మై నేమ్
సమానత్వం కోరుతూ శాంతికాముకుల వినూత్న నిరసన సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ సందడిగా ఉండే ట్యాంక్బండ్ బుధవారం సాయంత్రం నాలుగ్గంటల సమయంలో నిశ్శబ్దం ఆవహించింది. అది న్యాయాన్ని డిమాండ్ చేస్తోన్న నిశ్శబ్దం. నిరసనతో కూడిన నిశ్శబ్దం. అన్యాయాన్ని మౌనంగా ధిక్కరిస్తోన్న నిశ్శబ్దం. ఆహారం పేరుతోనో, ఆవు పేరుతోనో, ఇంకో పేరుతోనో, మరేదైనా పేరుతోనో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై నోరు విప్పాలంటూ నిశ్శబ్దంతో నిరసనని పాటించారు దేశంలో శాంతిని కాంక్షిస్తున్న వారు. మానవ హక్కులు కాలరాయొద్దంటున్న వారు. మానవతావాదులు. అంతా ఒక్కరొక్కరుగా ట్యాంక్బండ్పైకి చేరారు నిశ్శబ్దంగా. ప్రజలంటే ఒక మతమో, ఒక అంకెనో, ఒక ఓటో మాత్రమే కాదు అని అభిప్రాయపడుతున్న వారు. జనం అంటే ధనవంతులు మాత్రమే కాదంటున్నవారు. జనం అంటే ఒక్క పురుషులు మాత్రమే కాదంటున్నవారు. జనం అంటే మనం అంటున్నవారు. సమానత్వానికీ దేశంలో స్థానం కల్పించాలంటున్న వారు. స్త్రీలూ, పురుషులూ, థర్డ్ జెండర్స్, ట్రాన్స్ జెండర్స్, పిల్లలూ, పెద్దలూ అంతా అక్కడ చేరారు. అయితే అక్కడంతా నిశ్శబ్దమే. సంస్థల పేర్లు లేవు, రాజకీయ పార్టీల జాడల్లేవు, విద్యాసంస్థల, సంఘాల బ్యానర్లు లేవు. ఊకదంపుడు ఉపన్యాసాలసలేలేవు. ఉన్నదంతా వ్యక్తులే. వారి చేతుల్లో మాత్రం ‘‘నాట్ ఇన్ మై నేమ్’’ ప్లకార్డులు. దేశవ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతోన్న అత్యాచారాలకు, హింసకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ముంబై, బెంగళూరు, ఢిల్లీలోని జంతర్మంతర్, హైదరాబాద్లాంటి ప్రధాన నగరాల్లో సమానత్వాన్ని కాంక్షిస్తోన్న పౌరులంతా సాయంత్రం నాలుగ్గంటల నుంచి ఆరుగంటల వరకు మౌనంగా నిరసనని తెలియజేశారు. ‘‘నాట్ ఇన్ మై నేమ్’’ అనే స్లోగన్కి అర్థం ఈ రోజు నేను దాడికి గురికాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నేను కూడా ఒకానొక కారణంతో దాడికి గురికావచ్చు. ఇప్పుడు నేను వ్యతిరేకించకపోతే రేపు నా వంతూ రావచ్చు. అందుకే ఈ దాడులు ఆపాలంటూ మా నిశ్శబ్ద నిరసన ఇది అన్నారు కార్యక్రమంలో ప్రొఫెసర్ రమామేల్కొటే, వసంతా కన్నాభిరాన్, కల్పనా కన్నాభిరాన్, సుధ, సునీతా రెడ్డి, ఆశాలత, పద్మజాషా, వసుధ, సుమతి, అనితా రెడ్డి, అజీజ్పాషా, తేజస్వీని, కృశాంక్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
మానవ హక్కులకు ‘వృద్ధి’ చెర?
కొత్త కోణం మానవ హక్కుల ఉల్లంఘనను పట్టించుకోకుండా ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధినే ప్రధాన అంశంగా చూడటం ఎంత మాత్రం వాంఛనీయం కాదని ఐరాస నొక్కిచెబుతున్నది. ప్రైవేటు కంపెనీల, ప్రభుత్వాల మానవ హక్కుల ఉల్లంఘనను ప్రజలు ఇక ఎంత మాత్రం సహించే స్థితిలో లేరు. భూసేకరణలో రాజ్యాంగ హక్కులు, అటవీహక్కులు, కార్మిక చట్టాలు, వాటికి సంబంధించిన విధానా లను గౌరవించకపోతే భవిష్యత్లో పరిశ్రమల స్థాపన, నిర్వహణ కష్టమే. కొరియాకు చెందిన ‘పోస్కో’ కంపెనీ వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఒడిశాలో ఒక ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. పోస్కో అటవీ హక్కులు, భూ సేకరణ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతోందని, పునరావాసంలో కనీస నిబంధనలు పాటించడం లేదని, నష్టపరిహారం విష యంలో లోపాలున్నాయని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. గత్యంతరం లేక ‘పోస్కో’ కంపెనీ తమ ప్రాజెక్టును ఉపసంహరించుకున్నది. అట్లాగే శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని కూడా ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. ఆ ప్రతిపాదనను కూడా వెనక్కి తీసుకోకతప్పలేదు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ బస్తర్ అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను తవ్వితీసే కాంట్రాక్టును కొన్ని కంపెనీలకు కట్టబెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని అక్కడి ఆదివాసీలు చాలాకాలంగా తిరస్కరిస్తున్నారు, తిప్పికొడుతున్నారు. ఎలాగైనా బడా బాబులకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు ప్రభుత్వం తన సొంత గడ్డపైనే, తన ప్రజలపైనే ఆయుధాలు ఎక్కుపెట్టింది. ఒక రకంగా యుద్ధం ప్రకటించింది. నల్లగొండ జిల్లాలో యురేనియం నిక్షేపాలను వెలికి తీసి, అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని చేస్తున్న ప్రభుత్వ యత్నాన్ని గత కొన్నేళ్లుగా పలు ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఓపెన్కాస్ట్ బొగ్గుగనుల తవ్వకాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. యాంత్రీకర ణతో అతి తక్కువ ఖర్చుతో అత్యధిక ఉత్పత్తిని ఆశించి ఓపెన్కాస్ట్ తవ్వకా లను అనుసరిస్తున్నారు. ఓపెన్కాస్ట్లను తక్షణమే రద్దుచేయాలని, ఆదివాసీ భూహక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన 1 ఆఫ్ 70 చట్టం అమలయ్యే భూముల్లో తవ్వకాలు చేపట్టకూడదనీ, ఆస్ట్రేలియాలోలాగా ప్రజలు లేని ప్రాంతాల్లోనే తవ్వకాలు జరపాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ‘ఉల్లంఘనలు’... కంపెనీల బాధ్యత ఇటువంటి సమయాల్లో ప్రభుత్వాలు, కంపెనీలు, వాటి ప్రయోజనాలను పరిరక్షించే ఆర్థికవేత్తలు కొన్ని అసంబద్ధమైన వాదనలను చేస్తున్నారు. కొత్తగా జరిగే పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపారాభివృద్ధిని అడ్డుకోవడం దేశ ఆర్థిక పురోగతిని అడ్డుకోవడమేనని, దానివల్ల దేశం రోజురోజుకూ వెనుక బడిపో గలదని వాదిస్తున్నారు. రెండోవైపు ఎటువంటి పరిస్థితుల్లోనూ మానవ హక్కులను ఉల్లంఘించే సంస్థలను అంగీకరించేది లేదని మానవ హక్కుల సంఘాలు తెగేసి చెబుతున్నాయి. సరిగ్గా ఈ విషయంలోనే ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల పరిరక్షణకు మార్గదర్శకాలను రూపొందించి, ‘çసుస్థిరాభివృద్ధి’ సూచికలను తయారుచేసింది. ముఖ్యంగా వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అనుసరిస్తున్న విధానాలు మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్నాయని ఐరాస భావించింది. ఐరాస గతంలో ఈ ఉల్లంఘనలకు ప్రభుత్వాలనే బాధ్యులుగా చేసేది. నేడు అది ప్రభుత్వాలతో పాటు కంపెనీలు కూడా అందుకు బాధ్యులేనని నొక్కి చెప్పింది. మంగళ వారం ఢిల్లీలో ఐరాస మార్గదర్శకాల వెలుగులో ‘‘ఛేంజ్ అలయెన్స్’’ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. మానవ హక్కులను గౌరవించడం, అమలు చేయడం, పరిరక్షించడం ద్వారా పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధిని సాధించ వచ్చునని ఆ నివేదిక సారాంశం. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఇప్పటివరకు మూడు దశలుగా నిబంధనలను రూపొందించింది. మొదటిదశలో వెలువరించిన 1948 డిసెం బర్ 10 ప్రకటనలో ప్రధానంగా పౌర, రాజకీయ హక్కులను ఎక్కువగా ప్రస్తావించారు. ఓటు హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, వివక్ష నుంచి స్వేచ్ఛ లను, చిత్రహింసల నిర్మూలన వంటి వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన పలు విషయాలను అందులో పొందుపరిచారు. మానవ హక్కుల రెండవ దశలో ఎక్కువగా సామాజికాభివృద్ధికి సంబంధించిన విషయాలు పొందుపరిచారు. విద్య, వైద్యం, గృహం, ఉద్యోగం, సామాజిక భద్రత, చాలినంత వేతనం లాంటి విషయాలు ఇందులో ఉన్నాయి. మూడో దశలో, శాంతిగా జీవించే హక్కుతోపాటు, పరిశుభ్రమైన పర్యావరణం, ఆర్థికాభివృద్ధిలో హక్కు, ఆర్థిక పురోగతిలో వాటా, సామాజిక సామరస్యం, ఆరోగ్యకరమైన వాతావరణం లాంటి అంశాలవైపు హక్కుల ఉద్యమ ప్రయాణం మొదలైంది. వర్తక వాణిజ్యాలు–మానవ హక్కులు ముఖ్యంగా వర్తక వాణిజ్యాలు–మానవ హక్కులు అనే అంశం గురించిన చర్చ మొదటిసారిగా ఐరాస ఆధ్వర్యంలో ప్రారంభమైంది. తొలిసారి 1964లో 77 దేశాలు భాగస్వాములుగా జెనీవాలో ‘‘వ్యాపారం–అభివృద్ధి సదస్సు’’ జరిగింది. ఆ తదుపరి నేడు సభ్య దేశాల సంఖ్య 131కి చేరింది. 1990లో ఐరాస ఆర్థిక, సామాజిక సమితి ‘‘ఆర్థికాభివృద్ధి–అంతర్జాతీయ సంబంధాలు–బహుళజాతి కంపెనీలు’’ అనే విషయంపై అధ్యయనం జరప డానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శిని కోరింది. తదనుగుణంగానే 1998 ఆగస్టులో మానవ హక్కుల పరిరక్షణ – అమలుపై ఒక సబ్కమిటీ ఏర్పాటైంది. ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ నియమించిన ప్రొఫెసర్ జాన్ రగ్గి ఏకసభ్య కమిషన్ 2008లో వ్యాపార, వాణిజ్యం–మానవ హక్కులపై స్పష్ట విధానాన్ని రూపొందించింది. అప్పటివరకు మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉండేది. రగ్గి నివేదిక అనంతరం కంపెనీలను ఈ పరిధిలోకి తీసుకురావాలని భావించారు. దానితో ఐరాస ప్రత్యేకించి కొన్ని నిబంధనలను రూపొందిం చింది. ‘‘వ్యాపార, వాణిజ్యాలు – మానవహక్కులు – ఐరాస మార్గదర్శక సూత్రాలు’’ పేరుతో 2011లో వీటిని విడుదల చేశారు. ఇందులో, ‘‘పరి శ్రమలు, వ్యాపార, వాణిజ్యసంస్థలతో సహా ఎవరైనా మానవ హక్కుల ఉల్లం ఘనకు పాల్పడితే, స్థానిక ప్రభుత్వాలు తక్షణమే స్పందించి తగు రక్షణ చేపట్టాలి. సమర్థవంతమైన చట్టాలు, నిబంధనలు, విధానాల ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేవారిని శిక్షించాలి. ఇటువంటి సమయాల్లో తగు నివారణ చర్యలు చేపట్టాలి’’ అంటూ మౌలిక నిబంధనలతో మార్గదర్శకాలు రూపొందించారు. ఇందులో మొదటి నిబంధన ఒక జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం. దీనిపైన మొట్టమొదట బ్రిటన్ స్పందించింది. ఆ తర్వాత స్వీడన్ కూడా జాతీయ మార్గదర్శకాలను తయారు చేసుకున్నది. అదేవిధంగా, కంపెనీలు తగు విధంగా వ్యవహరించడానికి ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించాలి. మానవ హక్కులపై కంపెనీలే స్వయంగా నివేదికలు తయారుచేయాలి. ప్రజల నిత్యావసరాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి. యుద్ధాలు, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో కంపెనీలు, ప్రభుత్వాలు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. భారత రాజ్యాంగంలో మానవ హక్కులకు సంబంధించి ఎన్నో విష యాలను పొందుపరిచారు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల పేరుతో వ్యక్తి స్వేచ్ఛ, సామాజిక రక్షణ, భద్రతలకు సంబంధించిన ఎన్నో అంశాలను ఇందులో చేర్చారు. అంతేకాకుండా ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) బాల కార్మిక వ్యవస్థ నిషేధంపై ఒక నిబంధనను విడుదల చేసింది. దానిని భారత ప్రభుత్వం ఈనెలలోనే ఆమోదించింది. పిల్లల చాకిరి, పిల్ల లను వేశ్యావృత్తిలోనికి దింపడం లాంటి చర్యలను అరికట్టాలని అది సూచిం చింది. అంతేకాకుండా 2011 జూలైలో ఐరాస విడుదల చేసిన మార్గదర్శకా లలో తొమ్మిది అంశాలను పొందుపరిచారు. ఒకటి, వ్యాపారం బాధ్యతగా, పారదర్శకంగా, నైతిక సూత్రాల ఆధారంగా సాగించాలి. రెండు, సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు సురక్షితమైనవిగా, నాణ్యమైనవిగా ఉండాలి. మూడు, ఉద్యోగాలకు రక్షణ, భద్రత కలిగించి, మంచి జీవితాన్ని అందించాలి. నాలుగు, నిరాదరణకు, వివక్షకు గురవుతున్న వర్గాల పట్ల బాధ్యతగా వ్యవ హరిస్తూ, వారి ప్రయోజనాలను కాపాడాలి. ఐదు, మానవ హక్కులను గౌరవించి, పరిరక్షించాలి. ఆరు, పర్యావరణ పరిరక్షణకు పూనుకుంటూనే, వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. ఏడు, ప్రజలతో చర్చలు జరిపేటప్పుడు ఎంతో సంయమనంతో వ్యవహరించి, వారి అంగీకారం పొందాలి. ఎనిమిది, అభివృద్ధిలో సమానవాటాకు, సమ్మిళిత అభివృద్ధికి అవకాశం కల్పించాలి. తొమ్మిది, ప్రజలకు వినియోగదారులకు తగు గౌరవం ఇస్తూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలి. ప్రజలు ఇక సహించరు ఇటువంటి నిబంధనలైతే రూపొందించారు కానీ, ప్రభుత్వాల పని తీరుని పరిశీలిస్తే ఐరాస ఒత్తిడివల్లనో, అంతర్జాతీయ ప్రతిష్టకోసమో కొన్ని నిబంధనలను రూపొందిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆచరణ మాత్రం అందు కనుగుణంగా సాగుతున్నట్టు కనిపించడంలేదు. మానవ హక్కుల ఉల్లంఘ నను పట్టించుకోకుండా, కేవలం వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధినే ప్రాధాన అంశంగా చూడటం ఇక ఎంత మాత్రం వాంఛనీయం కాదని ఐరాస నొక్కిచెబుతున్నది. రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం ప్రైవేటు కంపెనీల, ప్రభుత్వాల మానవ హక్కుల ఉల్లంఘనను ఇక ఎంతమాత్రం సహించే స్థితిలో ప్రజలు లేరన్నది నిర్వివాదాంశం. దీనివల్ల ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు చేపడుతున్న ప్రాజెక్ట్లకు ఎదురు దెబ్బ తగులుతున్నది. అందువల్ల ప్రైవేట్ సంస్థలు తాము చేపట్టబోయే ప్రాజెక్ట్లు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండా చూసుకోగలగాలి. ఈ విషయంలో రాజకీయ అవినీతి ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ప్రజల అవసరాలను, హక్కులను ఖాతరు చేయకుండా లాభాలే లక్ష్యంగా రాజకీయ నాయకులు, ప్రైవేట్ సంస్థల అక్రమ కలయిక ఉనికిలోనికి వస్తున్నది. ప్రపంచవ్యాప్త అనుభవాల దృష్ట్యా వ్యాపార, వాణిజ్య, కంపెనీలు భూసేకరణలో రాజ్యాంగ హక్కులు, అటవీహక్కులు, కార్మిక చట్టాలకు సంబంధించిన పలు రక్షణ విధానాలను గౌరవించాలి. లేదంటే పరిశ్రమల స్థాపన, నిర్వహణ భవిష్యత్లో కష్టసా ధ్యమే. అందుకే ఐరాస రూపొందించిన మార్గదర్శకాలపట్ల, వాటి అమలు పట్ల ప్రభుత్వాలు నిబద్ధతను ప్రదర్శించాలి. దాంతోపాటు ప్రైవేట్ కంపెనీలు కూడా ఐరాస సూచనలను తు.చ. తప్పక పాటించాలి. లేదంటే పారిశ్రామిక, వాణిజ్య వ్యాపారాభివృద్ధిలో ఆటంకాలు తప్పవు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 -
నిరసన తెలిపే హక్కును హరిస్తున్నారు
► ప్రభుత్వంపై హైకోర్టు న్యాయవాది సురేష్కుమార్ ధ్వజం ఒంగోలు టౌన్ : భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగా ప్రజలు తమకు జరిగిన అన్యాయంపై నిరసన తెలుపుకునే హక్కును కూడా రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని హైకోర్టు న్యాయవాది, పౌరహక్కుల సంఘ రాష్ట్ర కార్యదర్శి పీ సురేష్కుమార్ ధ్వజమెత్తారు. శనివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఏపీ పౌరహక్కుల సంఘ జిల్లా కమిటీ ఆవిర్భావ సదస్సు సందర్భంగా పోలీసు చట్టాలు – పౌరహక్కులు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పాలనలో పౌరహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగా ఎవరికైనా నిరసన తెలియజేసే హక్కు ఉందని, దీనిని కూడా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో నిరసన తెలుపుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోతోందన్నారు. 144 సెక్షన్ అత్యవసర సమయాల్లో అమలు చేయాల్సి ఉంటుందని, కానీ, రాష్ట్రంలో ప్రతి చిన్నపాటి సంఘటనకు కూడా దాన్ని అమలుచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సెక్షన్ పరిధిలో లేని అనేక నిబంధనలను పోలీసులు అమలు చేస్తున్నారన్నారు. సెక్షన్ 30, సెక్షన్ 144 ద్వారా పోలీసులు ఉపయోగించే నిబంధనలు పౌరహక్కులను దెబ్బతీస్తున్నాయన్నారు. సెక్షన్ 43 ప్రకారం రాత్రి సమయాల్లో మహిళలను అరెస్టు చేయకూడదని, ఇక్కడ మాత్రం రాత్రివేళల్లో మహిళలను పోలీసు స్టేషన్లలోనే ఉంచుతున్నారని పేర్కొన్నారు. అధికారపార్టీ నేతలు ఎప్పుడు ఏది చేయమంటే అదే పోలీసులు చేస్తున్నారు తప్పితే చట్టాలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఆడపిల్లల కేసుల విషయంలో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని, ఇలా నమోదు చేయకపోతే సంబంధిత పోలీసు అధికారిపై ఆ మహిళ కేసు పెట్టవచ్చని తెలిపారు. రూల్ ఆఫ్ లా ప్రకారం పోలీసులు తమ విధులు నిర్వహించడం లేదన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ ఉంది కాబట్టి ఈ మాత్రమైనా ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. ఓపీడీఆర్ రాష్ట్ర నాయకుడు సీహెచ్ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో పౌర హక్కుల ఉల్లంఘనలు అనేకం జరుగుతున్నాయన్నారు. ప్రజలు తమ సమస్యలపై అధికారులకు విన్నవించుకునే స్వేచ్ఛను కూడా పోలీసులు హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరహక్కుల ఉల్లంఘనపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐలు జిల్లా కార్యదర్శి వై.రమేష్ మాట్లాడారు. జిల్లా నూతన కమిటీ ఎన్నిక...: ఏపీ పౌరహక్కుల సంఘ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్గా బీ దశరథరామయ్య, సభ్యులుగా వై.రమేష్, కాశీ, యూ మల్లికార్జున్, శాస్త్రి, ఎం.కొండలరావు, ఎం.మల్లికార్జున, బీ రూపేష్, బీ రఘురామ్, అజీజ్లను ఎన్నుకున్నారు. -
బేలా సోమారి కోసం!
సందర్భం బస్తర్లో బేలా సోమారి (హక్కుల కార్య కర్త) ఇంటి మీద దాడి జరగడం ఇది రెండోసారి. ఇది ఐజీ కల్లూరి భాషలో స్వచ్ఛందంగా ఆదివాసీలు చేసిన దాడి. కాని ఇది కల్లూరి ఆదేశాలతో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం, రాజ్యం చేసిన దాడి. హిమాంశు కుమార్తో ప్రారంభించి ఇప్పటి వరకు బస్తర్లో బయట సమాజం నుంచి వచ్చిన ప్రజాస్వామ్య వాదులు ఎవరూ ఉండకుండా తరిమేయగలిగారు. ఒక్క బేలా భాటియా విషయంలోనే అది సాధ్యం కావడం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ మేధావి తాను ఆదివాసీగా మారి బేలా సోమారి అయింది. ఆమె విదేశాల్లో చదవవచ్చు, అక్కడే పీహెచ్డీ చేయ వచ్చు. ఢిల్లీ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో ప్రొఫెసర్ కావచ్చు. ఒకసారి ఢిల్లీ బస్తీలలో, మురికివాడల్లో పనిచేయాలని ఎంచుకున్నదంటే వాటిని తన ఆవాసాలుగా మార్చుకుంటుంది. దండకారణ్యంలో ఆదివాసీ సమాజం గురించి చదవడానికీ, చదువు చెప్పడానికీ చేరిందంటే ఆమె దండకారణ్యంలో భాగమైన గడ్చిరోలీ, బస్తర్ ప్రజల మధ్య ఉండడానికి ఎంచుకుంటుంది. ఆమె మొదటిసారి దండకారణ్యంలోకి వెళ్లే ప్రయత్నంలో నన్ను కలిసింది. ఇటువంటి వాళ్లతో మనకు ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు, కానీ తమ విశ్వాసాలతో పాటు మన విశ్వాసాలను కాపాడడానికి వాళ్లు ప్రాణాలు ఒడ్డడానికైనా వెను కాడరు. ఇవాళ ‘బస్తర్ను కాపాడుకుందాం’ అని నినదించే వాళ్లందరికీ ఆమె ప్రతీక. బాసగూడ మారణకాండ తరువాత బొజ్జా తారకం నాయ కత్వంలో సీడీఆర్ఓ నిజ నిర్ధారణ కమిటీ వెళ్లి వచ్చిన తరువాత ఆర్డిఎఫ్, హైదరా బాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నది. బస్తర్ పరిస్థితులను వివరిస్తూ ‘బస్తర్ అడవుల్లో ఒక ఆదివాసీ మహిళ మీదనో, పిల్లల మీదనో ఒక దాడి, ఒక అత్యాచారం, ఒక అన్యాయం జరిగిందంటే పోలీసుస్టేషన్లో ఎఫ్ఐ ఆర్ నమోదు చేయడమే ఒక విప్లవం’ అన్నారామె. అప్పటి నుంచి ఇప్పటి వరకు బేలా సోమారి లాంటి వాళ్లు ఆ కృషిని ముందుకు తీసుకువెళ్లారు. ఆదివాసీ యువకుల చేతులకు మారణాయుధాలు ఇచ్చి తమ తోటి ఆదివాసుల పైనే దాడులు చేయించి, చంపిం చడం; ఆదివాసీ సమాజంలో ఒక అంతర్యుద్ధం వంటి కల్లోలాన్ని సృష్టించడమేనని సుప్రీంకోర్టు అభిశంసించింది. ఒక్క 2016లోనే ఛత్తీస్గఢ్లో 134 బూటకపు ఎన్కౌంటర్ హత్యలు జరిగాయి. ఆదివాస మహిళల మీద భద్రతా బలగాలు సామూహిక లైంగిక అత్యాచారాలు చేశాయి. వీటిని జాతీయ మానవ హక్కుల కమిషన్ దాకా తీసుకురాగలిగారు. బేలా సోమారి ఇంటిపై దాడికి కొంచెం ముందే మరో హక్కుల కార్యకర్త శాలినీ గేరాపై రద్దయిన నోట్ల మార్పిడి కేసు పెట్టారు. అంతకు కాస్త ముందు డిసెంబర్ 25న తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం బృందం సభ్యులు ఏడుగురు నిజ నిర్ధారణకు వెళ్తూ ఉంటే తెలంగాణ పోలీ సులే దుమ్ముగూడెం దగ్గర అరెస్టు చే¯ì సుక్మా పోలీసులకు అప్పగించారు. రెండుసార్లు బెయి ల్ను నిరాకరించగా ఛత్తీస్గఢ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద వీళ్లు సుక్మా జైలులో మగ్గుతున్నారు. వీరిలో బల్లా రవీంద్రనాథ్ స్వయంగా రాజకీయ ఖైదీల విడుదల కమిటీకి రెండు తెలుగు రాష్ట్రాల చాప్టర్కు కార్యదర్శి. ఆయనా, చిక్కుడు ప్రభా కర్ హైకోర్టు న్యాయవాదులు. రమడాల లక్ష్మయ్య తుడుందెబ్బ ఆదివాసీ సంఘం నాయ కుడు. దుడ్డు ప్రభాకర్ రెండు దశాబ్దాలుగా కుల నిర్మూలన పోరాట సమితి రెండు తెలుగు రాష్ట్రాల నాయకుడు. దుర్గాప్రసాద్ సీనియర్ జర్నలిస్టు. రాజేంద్రప్రసాద్, నజీర్ ఉస్మానియా యూనివర్సిటీలో రిసెర్చ్ స్కాలర్లు. రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ విద్యార్థి వేదిక ఉపాధ్యక్షుడు. నజీర్ తెలంగాణ విద్యార్థి వేదిక ఉస్మానియా క్యాంపస్ బాధ్యుడు, రచయిత, వక్త. వీళ్ల అరెస్టు సందర్భంలోనే ఐజి కల్లూరి తాను ఉండి ఉంటే వాళ్లను కోర్టుకు అప్పగించేవాడిని కాదని, ఇక నుంచి అంటే 2017లో ‘తెల్ల కాలర్ మావోయిస్టు’లను వేధించే అజిత్ దోవల్ డాక్ట్రిన్ (సిద్ధాంతాన్ని) అమలు చేస్తామని నిస్సిగ్గుగా ప్రకటించాడు. ఎన్ఆర్పి కల్లూరి మారణకాండను అమలుచేస్తూనే ఉన్నాడు. 2009లో గ్రీన్హంట్ ఆపరేషన్గా ప్రారంభమైన ఈ ప్రజల మీది యుద్ధం మూడు దశలు దాటి ఆపరేషన్ విజయ్, హాకా, మిషన్ 2016లలో కూడా విఫలమై, ఇప్పుడు మిషన్ 2017గా ఆదివాసీ ప్రజలతో పాటు ప్రజాస్వామ్యవాదులపై అమలవుతున్నది. దాని పేరే ‘సఫేద్ కాలర్ మావోయిస్టు’ల అణచివేత. బేలాపై దాడి అనంతరం తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఐజీ కల్లూరిని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపారు. ఆయన మాట్లాడుతూ బేలా బాటియా గెలిచింది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ సంద ర్భంగా బేలా ఒక మాటన్నారు. ‘పోరాటం కల్లూరిమీద కాదు. కల్లూరివంటి వారిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ విధానాల మీద’. బుద్ధిజీవులకు, ప్రజాస్వామ్యవాదులకు న్యాయం పట్ల, ప్రజా స్వామ్యం పట్ల అంత నిజాయితీతో కూడిన ప్రేమ, పక్షపాతం ఉంటే అది ఒక్కటే ఇవాళ రాజ్యహింసను, రాజ్యం దాడిని ఎదు ర్కోవడానికి మిగిలిన ప్రత్యామ్నాయమైన ప్రజాస్వామిక మార్గం. బేలా సోమారి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెను అక్కడి నుంచి పంపించాలని రాజ్యం చేస్తున్న కుట్రను ప్రతిఘటిస్తూ, ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్న ప్రపంచీకరణ విధ్వంసక అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం కూడా ఆశ యంగా, లక్ష్యంగా నిర్దేశించుకోవడమే ఇవాళ మన కర్తవ్యం. వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు -
ఆదివాసీలే త్యాగాలు చేయాలా ?
మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏటూరునాగారం: ఎవరి భవిష్యత్ అవసరాలకైనా ఆదివాసీలే త్యాగాలు చేయాలా? అని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి(హెచ్ఆర్ఎఫ్) వీఎస్.కృష్ణ ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరునాగారంలో ఆదివారం ఆదివాసీ ఉద్యమ నేత దివంగత చంద పాపారావు సంస్మరణ సభ, ఆదివాసీలపై కె.బాలగోపాల్ రాసిన పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. కార్యక్రమంలో కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదివాసీల మనుగడ దినదిన గండంగా మారిందని, సీఎంలుగా ఉన్న చంద్రబాబు, కేసీఆర్లు ఆదివాసీలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ముంపు ఆదివాసీ ప్రాంతాలను మేకపోతుల్లా ఆంధ్రాకు బలిచ్చిన కేసీఆర్ నేడు జిల్లాల పేరిట 5వ షెడ్యూల్డ్ భూభాగాన్ని ముక్కలు చేశారన్నారు. ఆదివాసీ ప్రాంతా లను ఐక్యం కాకుండా కుట్రపన్ని నేడు భారీ ప్రాజెక్టులు, ఓపెన్ కాస్టులు, టైగర్ జోన్ ల పేరిట మరో బలిదానానికి సిద్ధం చేస్తున్నాడని చెప్పారు. ఆదివాసీలకు అన్యాయం చేయాలని చూస్తే ప్రభుత్వాలకు ఎదురు దెబ్బతగలడం తప్పదని కృష్ణ పేర్కొన్నారు. దండకారణ్యం లాంటి ప్రాంతాలలో బాలగోపాల్ మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేశాడని, ఆయన తుదిశ్వాస విడిచే వరకు ఆదివాసీ సమాజంలోనే ఉన్నారని వివరించారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక నేతలు పాల్గొన్నారు. -
హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్గా అంకం విజయ
కర్నూలు(అర్బన్): రెండు తెలుగు రాష్ట్రాల ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఉమెన్స్ వింగ్ కో ఆర్డినేటర్గా కర్నూలుకు చెందిన అంకం విజయను నియమించారు. ఈ మేరకు ఏఐహెచ్ఆర్ఏ దక్షిణాది రాష్ట్రాల చీఫ్ లయన్ జే అశోక్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. యునైటెడ్ నేషన్స్ అనుబంధంగా పనిచేస్తున్న తమ సంస్థ కార్యాకలాపాలను రెండు తెలుగు రాష్ట్రాల్లోను విస్తరించనున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచి మహిళా హక్కులు, సమస్యలపై అవగాహన ఉండటంతో పాటు వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ఆమె కృషి చేస్తారనే నమ్మకంతో అంకం విజయను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 1991లో జిల్లా సంపూర్ణ అక్షరాస్యత కోఆర్డినేటర్గా పని చేయడంతో పాటు మహిళా సమస్యల పరిష్కారంలో ముందున్న కారణంగా తనకు ఈ పదవిని అప్పగించారని ఆమె శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా మహిళా హక్కులను కాపాడేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
కస్టడీ కాదు మరణ మృదంగం
విచారణ పేరుతో వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. సహకరించడం లేదని చిత్ర వధలు చేయడంపై మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. 2010 నుంచి 2016 వరకూ దేశవ్యాప్తంగా 591 మంది పోలీసు కస్టడీలో మరణించారని పేర్కొంది. గత ఏడాది కాలంలో ఈ సంఖ్య 97గా ఉందని చెప్పింది. విచారణలో ఉన్న వ్యక్తి మరణం వల్ల కేసులు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల సంఖ్య మరణించిన వారికి మూడింతలు తక్కువగా ఉందని వెల్లడించింది. కస్టడీలోకి తీసుకున్నవారిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాల్సివుండగా కొంత మంది పోలీసు అధికారులు అలా చేయడం లేదని అంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మానవహక్కులను కాలరాస్తున్నారని ఘాటుగా విమర్శించింది. కస్టడీలో మరణిస్తున్నవారిలో ఎక్కువ మంది మేజిస్ట్రేటు ముందు హాజరుపరచని వారేనని తెలిపింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధలు బాధిత కుటుంబాలతో చేసిన ఇంటర్వూల్లో విషాదకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పింది. కస్టడీలోకి తీసుకున్న వారిని చట్ట ప్రకారం కాకుండా అమానవీయంగా ప్రవర్తిస్తూ దారుణంగా హింసించేవారని చెప్పినట్లు తెలిపింది. -
పౌర హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
* తుళ్ళూరులో కేవీపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం * అంబేడ్కర్ కల్పించిన పౌరహక్కులపై ప్రసంగించిన ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాల నేతలు తుళ్లూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తుళ్లూరులోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజదాని ప్రాంత సీఐటీయూ నాయకుడు జె.నవీన్ ప్రకాష్ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కెవీపీఎస్ అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపినా, ,ప్రశ్నించినా వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం, రాజకీయ కక్షలకు దిగడం వంటి చర్యలకు ప్రభుత్వాలు పాల్పడడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే అన్నారు. మేధావులు, ,ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఏకమై హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు రాజు, ఈశ్వరరావు, సీపీఎం నాయకులు ఎం.రవి, జె.వీర్లంకయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల కిషోర్, నందిగం సురేష్, ప్రజాసంఘాల నేతలు స్వచ్ఛంద సంస్థల నేతలు రామారావు, బిళ్ళా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆ పత్రాలు మా వద్ద లేవు
ఎమర్జెన్సీలో మానవ హక్కుల తొలగింపుపై హోం శాఖ న్యూఢిల్లీ: ఆత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) విధించిన నాటి రోజుల్లో మానవ హక్కులను తాత్కాలికంగా తొలగించిన దానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద లేవని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర సమాచార కమిషన్కు (సీఐసీ) తెలిపింది. 1975లో ఆత్యయిక స్థితి అమలులో ఉన్న సమయంలో మానవ హక్కుల తొలగింపునకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. హోం మంత్రిత్వ శాఖలోని మానవ వనరుల విభాగం దీనికి సమాధానమిస్తూ..తమ విభాగం 1993లో ఏర్పాటైందనీ, 1975 నాటి సమాచారం తమ వద్ద లేదని తెలిపింది. ఈ మేరకు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని సీఐసీ హోం శాఖను ఆదేశించింది. -
చంపుడు పందెం!
త్రికాలమ్ నోట్ల గందరగోళంలో దేశం యావత్తూ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే కొన్ని రాష్ట్రాలలో మాత్రం ‘చట్టం’ తన పని తాను చేసుకుపోతోంది. ఉదాహరణకు, ఛత్తీస్గఢ్లో రమణ్సింగ్ చెప్పిందే చట్టం. బస్తర్ రేంజి పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఆర్పీ కల్లూరి చేసిందే న్యాయం. రాజ్యాంగాన్ని కానీ, న్యాయవ్యవస్థను కానీ, మానవ హక్కులను కానీ అక్కడి ప్రభువులు గుర్తించరు. తమకు రాజ్యాంగంపైన నమ్మకం లేదంటూ మావోయిస్టులు ముందే ప్రకటించారు. జనతన సర్కార్ నడుస్తోంది ఆ సిద్ధాంతం ప్రాతిపదికపైనే. ఆ సర్కార్ను నడవనివ్వడం రాజ్యానికి అవమానకరమంటూ పాలకులు భావిస్తున్నారు. రాజ్యాంగంపైన విశ్వాస రాహిత్యాన్ని బాహాటంగా ప్రకటించిన మావోయిస్టులు ఒకవైపు. రాజ్యాంగం ధర్మమా అని అందలాలు ఎక్కి ఆ రాజ్యాంగాన్నే తుంగలో తొక్కి తమ వ్యక్తిగత రాగద్వేషాలనే చట్టాలుగా చెలామణి చేయిస్తున్న రాజకీయ నాయకులూ, అధికారగణం మరోవైపు. రెండు పక్షాల మధ్యా నలిగిపోతున్న అమాయక ఆదివాసీ ప్రజలది దయనీయ స్థితి. ఈ రక్తచరిత్రకు శాంతియుతంగా స్వస్తి చెప్పడానికి ప్రయత్నించినవారిని శత్రువులుగా పాలకులు భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో సైతం మానవహక్కులకు రక్షణ ఉండాలని వాదిస్తున్నవారిని మావోయిస్టుల మద్దతుదారులుగా ముద్రవేసి రాజద్రోహులుగా చిత్రిస్తున్నారు. ఈ నీతిలో భాగమే ఢిల్లీ విశ్వవిద్యాయానికి చెందిన ప్రొఫెసర్ నందినీ సుందర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలు ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్, వినీత్ తివారీ, సంజయ్ పరాటే, తదితరులపైన ఐజీ కల్లూరి వ్యూహం ప్రకారం పెట్టిన కేసు. నందిని దాఖలు చేసిన పిటిషన్ను విచారించి నాలుగువారాల వ్యవధి తర్వాతనే వారిపైన చర్య తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఈ నెల 15న ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల సంస్థ (ఎన్హెచ్ఆర్సీ) ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివేక్ధండ్నీ, ఐజీ కల్లూరినీ ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు తన ఎదుట హాజరు కావలసిందిగా ఆదేశించింది. మానవ హక్కుల కోసం వీరోచితంగా పోరాడుతున్న అధ్యాపకులపైన పోలీసులు పెట్టిన అన్యాయపు కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది జరుగుతుండగానే గత మూడు రోజులలో 11 మంది మావోయిస్టులను ఛత్తీస్గఢ్లోని భద్రతాదళాలు హతమార్చాయి. మన మేధావులకు పట్టని హక్కులు ఛత్తీస్గఢ్కు సమీపంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో 30 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేసి ‘ఎన్కౌంటర్’ చేసినా, శేషాచలం అడవులలో తమిళనాడు కూలీలను దారుణంగా కాల్చి కాల్చివేసినా ఆంధ్రప్రదేశ్లోని పౌరసమాజం తగినంతగా స్పందించలేదు. పౌరహక్కుల సంఘాల బాధ్యతగానే పరిగణించారు కానీ పోలీసులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అతిపోకడలు పోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు గుర్తించి ప్రతిఘటించలేదు. వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ అధ్యాపకులుగా పని చేస్తున్న మేధావులు ఎవ్వరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. కొన్ని దశాబ్దాల కిందట వియత్నాంపైన అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు హైదరాబాద్లోనూ, విజయవాడలోనూ, విశాఖపట్టణంలోనూ, ఇతర పట్టణాలలోనూ జరిగాయి. ఇప్పుడు పక్కవాడి మీద పిడుగుపడినా చలించని జడత్వం పెరిగింది. ఛత్తీస్గఢ్కు చాలా దూరంలో ఉన్న ఢిల్లీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు మానవ హక్కుల పరిరక్షణ బాధ్యతను తమ భుజస్కంధాలపైన వేసుకున్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ వారిని అభినందించాలి. సల్వాజుడుం అరాచకాలను అరికట్టాలనీ, ఆ సంస్థను రద్దు చేయాలనీ సుప్రీంకోర్టు 2011లో ఆదేశించడానికి కారణం నందినీ సుందర్ చేపట్టిన ప్రజాప్రయోజన వ్యాజ్యమే (పిల్). బస్తర్లో కోయ కమాండోలు సృష్టిస్తున్న మారణహోమాన్ని సాక్ష్యాధారాలతో సహా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట నిరూపించిన కారణంగా సల్వాజుడుంకు స్వస్తి చెప్పాలన్న ఆదేశం వెలువడింది. అరుంధతీరాయ్ వంటి అగ్రశ్రేణి రచయిత నక్సలైట్ల వెంట కీకారణ్యంలో నడిచినా, నందినీ సుందర్, అర్చనా ప్రసాద్, తదితరులు నిజనిర్ధారణ బృందం సభ్యులుగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న అటవీ ప్రాంతాలలో పర్యటించినా చట్టపాలన సవ్యంగా జరగాలనీ, రాజ్యాంగం ప్రాతిపదికగా అధికారంలోకి వచ్చినవారు అదే రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటించాలనీ, మానవ హక్కులను పరిరక్షించాలనీ ఉద్ఘోషించడానికే. ఈ మేధావులు మావోయిస్టులు ఈ దేశంలో సాయుధ పోరాటం ద్వారా అత్యంత బలమైన రాజ్యాన్ని ఓడించి అధికారం హస్తగతం చేసుకుంటారనే విశ్వాసం ఉన్నవారు కాదు. ఆ మార్గంలో అధికారం హస్తగతం చేసుకోవాలని అభిలషిస్తున్నవారు సైతం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందరూ ఆదరించాలని తపిస్తున్నవారు. సంవిధానానికి లోబడి పనిచేయవలసిన రాజకీయ నాయకులూ, ప్రభుత్వాధికారులూ, పోలీసు అధికారులూ చట్టపాలనను గౌరవించాలని కోరుతున్నవారు. అంతులేని రక్తచరిత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి 1980లలో నక్సలైట్లు bè త్తీస్గఢ్ ప్రాంతానికి వలస వెళ్ళారు. 2000 నవంబర్ ఒకటిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రంలోని మొత్తం 18 జిల్లాలలో ఏడు జిల్లాలు ఐదవ షెడ్యూల్ కిందికి వచ్చే ఆదివాసీ జిల్లాలు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకోసం 1996లోనే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియా (పెసా) చట్టాన్ని తీసుకువచ్చారు. స్వయంపాలన హక్కులను ఆదివాసీలకు ఇవ్వాలన్నది ఈ చట్టం లక్ష్యం. భారత భూభాగంలో నాలుగు శాతం విస్తీర్ణం ఛత్తీస్గఢ్ది. ఈ రాష్ట్రంలో 44 శాతం విస్తీర్ణంలో అడవులు. దేశంలోని ఖనిజ ఉత్పత్తులలో 13 శాతం ఈ రాష్ట్రం నుంచే. ఇనుము, బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్ వంటి ఖనిజాలు అపారం. వజ్రాలు, బంగారు, రాగి, సీసం, జింక్, తదితర నిక్షేపాలు దండిగా ఉన్నాయి. దేశంలో ఉన్న బొగ్గులో 16 శాతం ఛత్తీస్గఢ్లోనే ఉంది. ఇంత ఖనిజ సంపద ఉన్న ప్రాంతంలో ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా పెత్తనం కాంట్రాక్టర్లదీ, వ్యాపారులదీ, అధికారులదీ, ఆదివాసీలు కానివారందరిదీ. రమణ్సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2005లో కాంగ్రెస్ నాయకుడు మహేంద్రకర్మ నాయకత్వంలో నక్సలైట్లపైన పోరాటం చేయడానికి కోయతెగకు చెందిన యువకులకు ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇచ్చి ప్రైవేటు సైన్యం తయారుచేశారు. దానికి వికాస్ సంఘర్ష్ సమితి అని పేరు పెట్టారు. అదే సల్వాజుడుం. అదే సంవత్సరం ఖనిజ సంపద వినియోగానికి టాటాలతో, ఎస్సార్ కంపెనీతో రమణసింగ్ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకోవడం కాకతాళీయం కాదు. దశాబ్దాలుగా ఆదివాసీలను దోచుకోవడం నిరాఘాటంగా సాగిపోతోంది. వారు న్యాయవ్యవస్థను ఆశ్రయించి హక్కులను సాధించే అవకాశం లేదు. చట్టాలున్నవి వారికి న్యాయం చేయడానికి కాదు. శాంతిసుస్థిరతలు నెలకొల్పేందుకు అసలే కాదు. హింసించే సాధనాలుగానే ఉపయోగపడుతున్నాయి. వాటివల్ల జైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఐదు కిలోమీటర్లకూ భద్రతాదళాల విడిది ఉంది. కొన్ని గ్రామాలలో అయితే రెండు కిలోమీటర్లకు ఒక మిలటరీ క్యాంపు ఉంటుంది. ప్రతి 45 మంది ప్రజలకు ఒక సాయుధ జవాను ఉంటాడు. మొత్తం 58,772 పారామిలటరీ జవాన్లు ఉన్నారు. ఒక్కొక్క ఇంటి ఆదాయం నెలకు వేయి నుంచి రెండున్నర వేల వరకూ ఉంటుంది. నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన పథకం) ఇప్పుడు అమలు జరగడం లేదు. ఏడు సంవత్సరాల కిందట ఈ పథకం కింద చేసిన పనికి ఇంతవరకూ ప్రతిఫలం ముట్టలేదు. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుచేసి రోడ్లు వేయడానికి సిద్ధం. నక్సలైట్లు రోడ్లు వేయడానికి వ్యతిరేకం. అభివృద్ధి శూన్యం. సల్వాజుడుం కార్యకలాపాలకు తోడు 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలయింది. నక్సలైట్లను ఏరివేయాలని సంకల్పం. అది నెరవేరలేదు కానీ సాయుధ దళాలకూ, నక్సలైట్లకూ మధ్య జరుగుతున్న పోరాటంలో నక్సలైట్లూ, భద్రతాదళ సిబ్బందీ, అమాయక గిరిజనులూ చనిపోతున్నారు. 2013లో నక్సలైట్లు సృష్టించిన హింసాకాండలో మహేంద్రకర్మ, వీసీ శుక్లా సహా అనేకమంది కాంగ్రెస్ నాయకులు మరణించారు. మహేంద్రకర్మ కుమారుడు ఇటీవల సల్వాజుడుం–2ను ప్రారంభించాడు. వారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించింది. జర్నలిస్టులు దిక్కుతోచని పక్షులైనారు. ఇద్దరు గ్రామీణ జర్నలిస్టులు సాయిరెడ్డి, నెమీచంద్ జైన్ను నక్సలైట్లు చంపివేశారు. ఇటీవల 2016 ఫిబ్రవరి 8న స్క్రోల్ డాన్ ఇన్కు పనిచేస్తున్న జర్నలిస్టు మాలినీ సుబ్రమణియన్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. నక్సలైట్లను సమర్థిస్తున్న కారణంగా జగదల్పూర్ వదిలి వెళ్ళాలంటూ ఆదేశించారు. బీబీసీ హిందీ విభాగంలో రిపోర్టర్గా పనిచేస్తున్న అశోక్ పుతుల్ను ‘సామాజిక్ ఏక్తా మంచ్’ సభ్యులు బస్తర్ వీడి వెళ్ళిపోవాలంటూ ఆజ్ఞాపించారు. ఐజీ, ఎస్పీలను కలుసుకునేందుకు అశోక్ ప్రయత్నిస్తే, ‘మేము జాతీయవాదులతోనూ, దేశభక్తులతోనూ మాత్రమే మాట్లాడతాం’ అంటూ అవమానించారు. ఇది కాదు పరిష్కారం సాయుధ పోరాటం పరిష్కారం కాదని రెండు పక్షాలూ గ్రహించినప్పుడే శాంతి నెలకొంటుంది. అంతవరకూ యుద్ధం కొనసాగుతుంది. యుద్ధంలో ధర్మాధర్మ విచక్షణ ఉండదనీ, అన్నీ ఆమోదయోగ్యమే కావాలనీ పోలీసు యంత్రాంగం వాదన. పోలీసు అధికారగణం మాట కాదనే సాహసం రాజకీయ నాయకత్వానికి లేదు. అందుకే చంపుడు పందెం ఆగడం లేదు. సల్వాజుడుం అత్యాచారాలకు ప్రతిగా నక్సలైట్ల హింసాకాండ కొనసాగింది. మాజీ నక్సలైట్లకూ, లొంగిపోయిన సంఘసభ్యులకూ, నిరుద్యోగ ఆదివాసీ యువకులకూ ఆయుధాలు ఇచ్చి వారిని స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్లు (ఎస్పీఓలు)గా పిలిచి నక్సలైట్లమీదికి పురిగొలిపే పేరుతో గ్రామాలపైకి పంపించారు. నక్సలైట్ల దళాలలోని సాయుధులలోనూ ఆదివాసీ యువతీయువకులే అధికం. ఆదివాసీలపైన ఆదివాసీలతోనే యుద్ధం చేయించడం తెలుగు పోలీసులు పాటించిన యుద్ధనీతి. నయీం వంటి నరహంతకుడు రెండు దశాబ్దాలపాటు పోలీసుల మద్దతుతో నేరసామ్రాజ్యాన్ని ఏలడానికి ఇదే నీతి కారణం. అటువంటి నీతి పాటించినందుకు రాజకీయ నాయకులు కానీ, పోలీసు ఉన్నతాధికారులు కానీ పశ్చాత్తాపం చెందిన దాఖలా లేదు. ఛత్తీస్గఢ్లో అంతులేని హింసాకాండతో విసిగిపోయి సుమారు లక్షమంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో తలదాచుకున్నారు. ఆదివాసీ మహిళలపైన భద్రతాదళాలు చేసిన అత్యాచారాలనూ, ఇన్ఫార్మర్లంటూ ఆదివాసీలను నక్సలైట్లు హత్య చేసిన ఉదంతాలనూ నమోదు చేసి మానవాధికారాలు ఛత్తీస్గఢ్లో అడుగంటాయంటూ నందినీ సుందర్ 2007లో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. సోషియాలజీ ప్రొఫెసర్గా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పనిచేస్తున్న నందిని ‘సబాల్టర్న్ అండ్ సావరీన్స్ :ఆంత్రొపొలాజికల్ హిస్టరీ ఆఫ్ బస్తర్ (1856–1996)’ పేరుతో ప్రామాణికమైన గ్రంథం రచించారు. ‘ది బర్నింగ్ ఫారెస్ట్: ఇండియాస్ వార్ ఇన్ బస్తర్’ పేరుతో తాజా పుస్తకం వెలువరించారు. ఛత్తీస్గఢ్పైన ఆమెకు పూర్తి అవగాహన ఉంది. తోటి ప్రొఫెసర్లూ, హక్కుల నాయకులూ, న్యాయవాదులతో కలిసి ఆమె మే 12 నుంచి 16 వరకూ బస్తర్ డివిజన్లోని బీజాపూర్, సుక్మ, బస్తర్, కంకెర్ జిల్లాలలో పర్యటించారు. సామ్నాథ్ బఘెల్ అనే ఆదివాసీ యువకుడిని నక్సలైట్లు నవంబర్ నాలుగో తేదీన హత్య చేశారు. హతుడి భార్య విమల పేరు మీద ఐజీ కల్లూరి ఎఫ్ఐఆర్ దాఖలు చేయించారు. నందినీ, తదితర హక్కుల కార్యకర్తలు సామ్నాథ్ను ఫోన్లో బెదిరిస్తూ ఉండేవారనీ, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉద్యమానికి స్వస్తి చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చేవారనీ ఫిర్యాదు చేసినట్లు కల్లూరి అంటున్నారు. నందినిపైన కానీ, మరొకరిపైన కానీ తాను ఎటువంటి ఆరోపణా చేయలేదంటూ విమల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ఎన్హెచ్ఆర్సీ అధ్యక్షుడు జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఛత్తీస్గఢ్ పోలీసులనూ, ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నందిని, తదితరులపైన చేసిన ఆరోపణలను నిరూపించడం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వల్ల కాని పని. కానీ హక్కుల కార్యకర్తలను కోర్టుల చుట్టూ తిప్పడం, వారికి విసుగు కలిగి పోరాటం విరమించుకునే విధంగా వ్యవహరించడం పోలీసు వ్యూహంలో భాగం. మానవ హక్కుల పరిరక్షణకోసం పోరాడుతున్నవారిని నైతికంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించకపోతే సమాజంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి నశించి నియంతృత్వం వైపూ, అమానవీయమైన అరాచక వ్యవస్థవైపూ ప్రయాణం అనివార్యం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
పాఠ్య పుస్తకాల్లో మార్పులు
కొత్త జిల్లాల నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) కసరత్తు చేస్తోంది. ప్రాథమిక మార్పులపై చర్చించిన ఉన్నతాధికారులు.. లోతైన అధ్యయనానికి త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సాంఘిక శాస్త్రం, పర్యావరణ అధ్యయన పుస్తకాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. సాంఘిక శాస్త్రా ల్లో వివిధ జిల్లాల భౌగోళిక నైసర్గిక స్వరూపాలకు సంబంధించిన చిత్రపటాలను మార్పునకు చర్య లు చేపడుతోంది. తెలుగు పాఠ్యపుస్తకాల్లో మార్పులపై పరిశీలన జరపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది పాఠ్య పుస్తకాల ముద్రణకు ముందే మార్పులను ఖరారు చేయాలని నిర్ణయించింది. లింగ భేదం, వివక్ష వంటి అంశాలపైనా పాఠ్యాంశాలు పెట్టాలని ఎస్సీఈఆర్టీ నిర్ణయిం చింది. 6 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల్లో ఈ పాఠాలు అందుబాటులోకి తేనుంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్: ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, మానవహక్కులు వంటి అంశాలను పాఠ్యాం శాలుగా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పాఠాలు పాఠశాల నుంచి ఉన్నత విద్య కోర్సుల వరకు ఉండాల్సిందేనని రిజర్వు బ్యాంకు ఇటీవల ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, అకౌంట్స్ తదితర అంశాలపై పాఠ్యాంశాలు రూపొందించేందుకు ప్రభుత్వ ఆమోదం తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధం అవుతోంది. -
రాజధానిలో పౌర హక్కుల ఉల్లంఘన
హైకోర్టు న్యాయవాది సురేష్కుమార్ తాడేపల్లి రూరల్: రాజధానిలో పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది పొత్తూరు సురేష్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాజధాని గ్రామాలైన ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయనిపాలెం, మందడం, లింగాయపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రైతులు, వివిధ వృత్తిదారులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. 2013 భూసేకరణ చట్టం కింద ప్రజలకు అందాల్సిన సాయం అందడం లేదన్నారు. రాజధానిలో వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు, పేదల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. చేతివృత్తిదారులకు ప్రభుత్వం ఇంతవరకు ప్రత్యామ్నాయం ఎందుకు చూపలేదో సమాధానం చెప్పాలన్నారు. సచివాలయం పక్కనే ఉన్న లింగాయపాలెంలో పెత్తందార్లు పేదలను ఇసుక పనులను కూడా చేసుకోనివ్వడం లేదని చెప్పారు. ఒక విధంగా ఫాసిజం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. -
మానవహక్కుల పరిరక్షణపై చైనా శ్వేతపత్రం
బీజింగ్: తమ దేశంలో మానవ హక్కుల రక్షణపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో చైనా చర్యలు ప్రారంభించింది. మానవ హక్కుల రక్షణకు చట్టాల్లో సంస్కరణలు తీసుకువస్తున్నామని, అలాగే జైళ్లలో పరిస్థితుల మెరుగునకు చర్యలు తీసుకుంటున్నామని సోమవారం విడుదల చేసిన శ్వేతపత్రంలో కేంద్ర కేబినెట్ పేర్కొంది. కేస్ ఫైలింగ్ రివ్యూ పద్ధతిని కేస్ ఫైలింగ్ రిజిస్టర్ పద్ధతికి మార్చడం ద్వారా సంస్కరణలకు తెరతీశామని, క్రిమినల్ ప్రొసీజర్ చట్టాన్ని సవరించామని ఆ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అలాగే వ్యక్తుల హక్కుల పరిరక్షణలో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ చట్టాన్ని బలోపేతం చేశామని, వీటితో పాటు మరిన్ని చట్టాల్లో మార్పులు తీసుకువచ్చామని చైనా తెలిపింది. -
వైద్యుల నిర్లక్ష్యంతోనే మరణాలు
బాలింత మరణాలపై మావన హక్కుల వేదిక విచారణ నార్నూర్ : ఏజెన్సీ ప్రాంతంలో పౌష్టికాహార లోపం, వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడుతున్నారని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఆత్రం భుజంగ్రావు అన్నారు. మండలంలోని బేతాల్గూడ గ్రామంలో మతి చెందిన బాలింత సరస్వతి కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు గిరిజనులకు వైద్యం అందించడంలో చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. రిమ్స్లో సకాలంలో వైద్యం అందకనే మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో వైద్య వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీలో మృతి చెందిన బాలింతల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకూ మానవ హక్కుల వేదిక న్యాయ పోరాటం చేస్తుందన్నారు. ఆయనతో పాటు టీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనక వెంకటేశ్, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు మల్లేశం, గిరిజన సంఘం మహిళా నాయకురాలు పద్మ, లీగల్ సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకుడు మాదాసు మధు తదితరులు ఉన్నారు. పోలీసులపై పనిభారం తగ్గించాలి కెరమెరి : పోలీసులపై పని భారం తగ్గించి వారు ఆత్మసై్థర్యం కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఆత్రం భజంగ్రావు అన్నారు. ఇటీవల కెరమెరి ఎసై ్స శ్రీధర్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను ఏఎసై ్స శివరాజ్ నుంచి అడిగి తెలుసుకున్నారు. పోలీసులపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతన్నాయని ఆరోపించారు. అత్యవసర సమయాల్లో కూడా ఉన్న సెలవులను వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. పోలీసు రంగంలో పని చేసిన వారికి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎసై ్సల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక ^è ర్యలు తీసుకోవాలని కోరారు. ఎసై ్స మృతిపై చేపట్టిన విచారణను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పోలీసులపై ఉన్నతాధికారుల ఒత్తిడులు లేకుండా చూడాలని అన్నారు. పోలీసుల పనిభారంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. అతని వెంట బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందోరన్ ప్రభాకర్, హెచ్ఆర్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మల్లేశం ఉన్నారు. -
పౌరహక్కుల అణచివేతకు దిగిన సర్కార్
మానవ హక్కుల వేదిక ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పౌర,ప్రజాస్వామిక హక్కులను అణచివేతకు దిగిందని మానవహక్కుల వేదిక ధ్వజమెత్తింది. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో వరంగల్లో మంగళవారం తలపెట్టిన సభను పోలీసులు భగ్నం చేయడాన్ని ఈ మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండించింది. ఈమేరకు ఈ వేదిక మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాస్వామిక హక్కులను గౌరవించాలని, ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం పూర్తి భరోసాను ఇస్తూ ప్రకటనను జారీచేయాలని వేదిక ఉభయరాష్ట్రాల అధ్యక్షుడు ఎస్.జీవన్కుమార్, ప్రధానకార్యదర్శి వీఎస్ కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం నుంచే వివిధ జిల్లాల్లో మానవహక్కుల కార్యకర్తలను పోలీస్స్టేషన్లకు పిలిపించి, వరంగల్కు వెళ్లడం లేదని హామీపత్రాలు రాయించుకోవడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారని, రాష్ర్టవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టించారని విమర్శించారు. ఈ విషయంపై హోంమంత్రి కాని, ప్రభుత్వంలోని బాధ్యులు కాని పెదవి విప్పడం లేదని పేర్కొన్నారు. ఇదంతా పూర్తిగా ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగిందని తాము భావిస్తున్నామన్నారు. -
ఏపీలో హక్కుల ఉల్లంఘన
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఏపీసీసీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ప్రభుత్వం మానవ హక్కులను కాలరాసేవిధంగా పరిపాలన సాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర పీసీసీ బృందం మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను కలసి ఏపీలో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా విజయవాడలో తమ పార్టీ ఆధ్వర్యంలో 23న చేపట్టిన మహా నిరసన కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని అందులో పేర్కొంటూ.. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, కె.తులసిరెడ్డి, సూర్యానాయక్, అధికార ప్రతినిధి కె.గంగాభవాని తదితరులు హెచ్ఆర్సీని కలసి వినతిపత్రం అందజేశారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్సీ జూన్ 30లోగా ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది. -
జీవన సమస్యలపై ప్రజలు గొంతెత్తాలి
సాక్షి, హైదరాబాద్: జాతి, మతం, కులం పేరిట జన జీవనం, జీవనోపాధిపైన జరుగుతున్న ప్రభుత్వ దాడిపై జనం గొంతెత్తాలని ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్, ఢిల్లీ జేఎన్యూ ప్రొఫెసర్ గోపాల్గురు పిలుపిచ్చారు. అందుకు ప్రచార, ప్రసార సాధనాలు అండగా నిలవాలని కోరారు. దేశ సరిహద్దులు భద్రంగా ఉంటే సరిపోదని, దేశ సామాజిక వ్యవస్థలోని అంతర్గత అడ్డుగోడల్ని కూల్చాలన్నారు. దీని కోసం భావసారుప్యత ఉన్న వ్యక్తులు, శక్తులు, సంస్థలు నడుంకట్టాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ సామరస్యం, సమగ్రతకు ముంచుకొచ్చిన ముప్పు- పరిరక్షణపై ‘హైదరాబాద్ కలెక్టివ్’ ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సు గురువారమిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ చందనా చక్రవర్తి అధ్యక్షతన ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలిరోజు పి.సాయినాథ్ ‘మీడియా-మతతత్వం’పైన, ప్రొఫెసర్ గోపాల్గురు ‘దేశం- జాతీయత’పై ప్రసంగించారు. ఆ తర్వాత పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సదస్సు శుక్రవారం కూడా జరుగుతుంది. మానవ హక్కుల్ని గుర్తించడం మీడియా తొలి బాధ్యత: సాయినాథ్ ప్రజా సమస్యలపై మీడియా గొంతెత్తాలని, మానవ హక్కుల్ని గుర్తించడం తొలి బాధ్యతగా వ్యవహరించాలని సాయినాథ్ పేర్కొన్నారు. మూడు లక్షల మంది సెప్టిక్ట్యాంక్ స్కావింజర్లు, మాన్హోల్స్, మురుగు కాల్వలు శుభ్రం చేసే వారికి పునరావాసం కల్పించేందుకు ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున రూ. 9 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనుకాడితే ఒక్క విజయ్ మాల్యా రూ. 9 వేల కోట్లతో ఉడాయించారని చెప్పారు. ప్రస్తుతం దేశాన్ని ఓ రాజకీయ ఐక్య సంఘటన పాలిస్తున్నట్టు కనిపిస్తున్నా, వాస్తవానికది సామాజిక మతతత్వ వాదులు, మార్కెట్ ఆర్థిక శక్తుల సంఘటన ఏలుతోందని వివరించారు. ప్రస్తుతం మీడియా కూడా వీరి చేతుల్లోనే ఉందని చెప్పారు. అందుకే ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచినా, సైన్స్ కాంగ్రెస్లో ప్రధాని సహా పలువురు అవాకులు చెవాకులు పేలినా,రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీడియాకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలపై రెవెన్యూ లెక్కలకు, జాతీయ నేర దర్యాప్తు సంస్థల లెక్కలకు పొంతన ఉండదన్నారు. రైతు కుటుంబాలకు అన్యాయం చేసేందుకే ఈ లెక్కల్లో తేడాలని చెప్పారు. కులాల అడ్డు గోడల్ని కూల్చాలి: గోపాల్గురు ‘జాతికి, జాతీయతకు ఒకే అర్థం లేదు. అనేకులు అనేక అర్థాల్లో మాట్లాడుతుంటారు. కొందరి దృష్టిలో అది ప్రాంతమైతే మరికొం దరి దృష్టిలో బహిష్కృత ప్రాంతంగా ఉంద’ని గోపాల్ గురు చెప్పారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల మధ్య హద్దులు చెరిగిపోయి అవధులు లేని ప్రపంచం అవతరిస్తున్నా మన సమాజంలోని అంతర్గత కుడ్యాలుగా ఉన్న కులం, మతం, వివక్ష అంతరించడం లేదన్నారు. -
'రోహిత్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే'
భద్రాచలం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ ఆరోపించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో శనివారం గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక్కరోజు రోహిత్ జాగృతి దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీసీ అప్పారావుకు పదేళ్ల క్రితమే దళిత విద్యార్థులను వేధించిన చరిత్ర ఉందన్నారు. మరోసారి దళిత విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరించి, రోహిత్ మరణానికి కారణమయ్యారన్నారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరాని పదేపదే యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి తెచ్చి దళిత విద్యార్థులను బహిష్కరించి రోహిత్ చనిపోయే దాకా వేధించారని కృష్ణ అన్నారు. కేంద్ర మంత్రులిద్దరినీ బర్తరఫ్ చేయాలన్నారు. వీసీ అప్పారావును ఉద్యోగం నుంచి తొలగించి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సోందె వీరయ్య, ముర్రం వీరభద్రం, సోడె చలపతి తదితరులు పాల్గొన్నారు. -
మానవహక్కుల వేదిక ఆరవ మహాసభలు
మానవ హక్కుల వేదిక 6వ మహాసభలు అక్టోబర్ 10, 11 తేదీల్లో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కె.జి.ఎన్ ఫంక్షన్ హాలులో జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఆ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హెచ్ఆర్ఎఫ్ కార్యకర్తలు హాజరు కానున్నారు. తొలిరోజు కాన్ఫరెన్సులో సమకాలీన ప్రాధాన్య అంశాలపై బహిరంగ సెషన్లో చర్చలు జరుగుతాయి. ఉదయం ప్రారంభ కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన రచయిత, హక్కుల కార్యకర్త సుభాష్ ఘటాడే ‘నయా ఉదారవాదం - హిం దూత్వ నమూనా’ అనే అంశంపై ప్రసంగిస్తారు. అనంతరం ఆంధ్రా విశ్వ విద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.డి.సత్యపాల్ ‘అంబేడ్క రిజాన్ని బ్రాహ్మణీకరించే కుట్ర’ అనే అంశంపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సెషన్లో ఢిల్లీకి చెందిన పరిశోధకురాలు డాక్టర్ ఉషా రామనాథన్ ‘ప్రభు త్వం- కొత్త భూస్వాహా పద్ధతులు’ అనే అంశంపైనా, హెచ్ఆర్ఎఫ్ ఉపాధ్యక్షులు ఎ. చంద్రశేఖర్ ‘అసమాన అభివృద్ధి-రాయలసీమ దుస్థితి’ అనే అంశంపై ప్రసం గించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఊరేగింపు అనంతరం ఆదోని మునిసి పల్ హైస్కూల్ గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుంది. అక్టోబర్ 11న సంస్థాగత కార్యక్రమం ఉంటుంది. సదస్సు ప్రతినిధులు సంస్థ కార్యక్రమాలను సమీక్షించి, చర్చించి రానున్న రెండేళ్ల పనికి సంబంధించి విధివిధానాలు నిర్ణయించుకుం టారు. నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రశ్నించే గొంతుల అవసరం మరింతగా ఉందని ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయి. అనేక వాగ్దానాలతో, ప్రజల్లో పలు ఆశలు రేకెత్తించి రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ప్రతి పక్షంలో ఉండగా తాము తీవ్రంగా విమర్శించిన విధానాలనే చంద్రబాబు, కేసీఆర్లు అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లోని సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు నైవేద్యంగా సమర్పించి కమీషన్లు దండుకోవడా నికి ఇద్దరు సీఎంలూ పోటీపడుతున్నారు. ఉమ్మడి వనరులను ప్రజల మేలు కోసం వినియోగించాలనే రాజ్యాంగ ఆదేశిక సూత్రాన్ని అపహాస్యం చేస్తున్నారు. అభివృద్ధి అనేది లాభదాయకమైన పరిశ్రమగా మారిన నేపథ్యంలో అభివృద్ధి ఫలాల్లో సింహభాగం కార్పొరేట్ సంస్థలకు పోగా మిగిలిన భాగాన్ని పాలక పార్టీల నేతలూ, అనుచరగణం తమతమ స్థాయిలను బట్టి పంచుకుంటు న్నారు. మరోవైపున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేయడంతో వందలాదిగా రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. గత జూన్ 2 తర్వాత తెలంగాణలో 1,290 మంది రైతులు ఆత్మహత్యలు జరిగితే, ఆంధ్రప్రదేశ్లో అవి 400 దాటాయి. మనం నిలదీసి అడగకపోతే ఈ పరిస్థితిలో ఎప్పటికీ మార్పు రాదు. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రేక్షకులు కారాదని కోరుతూ.. మా గొంతుకు మీ గొంతుల్ని కలపమని కోరుతూ ఆదోనిలో 10,11 తేదీల్లో జరిగే మానవ హక్కుల వేదిక ఆరవ సదస్సుకూ, మహాసభలకు రావలసిం దిగా అందరినీ అహ్వానిస్తున్నాం. ఎస్. జీవన్ కుమార్, మానవ హక్కుల వేదిక. మొబైల్: 98489 86286 -
పోలీసు ఎన్కౌంటర్లను విడనాడాలి
- పౌర, ప్రజాస్వామిక, మానవ హక్కులకు భరోసా కల్పించాలి - ‘చలో అసెంబ్లీ’కి అనుమతినివ్వాలి - మానవ హక్కుల వేదిక డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పౌర, ప్రజాస్వామిక, మానవ హక్కుల అమలుకు ప్రభుత్వం భరోసానివ్వాలని, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును గౌరవించాలని మానవ హక్కుల వేదిక ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం మద్దతునివ్వాలని కోరింది. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసే చర్యల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడడాన్ని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జీవన్కుమార్, ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ తీవ్రంగా ఖండించారు. అరెస్టులను వెంటనే నిలిపివేయాలని కోరారు. అరెస్టుల పర్వం నిరంకుశమైన పాలనను తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధానపరమైన నిర్ణయంగా కొనసాగిన ఎన్కౌంటర్ హత్యలను విడనాడాలని, రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణానికి, చట్టబద్ధమైన పాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. ఈ మేరకు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న పోలీస్ ఎన్కౌంటర్లు, నిర్బంధం వల్ల ప్రజలు అనేక కష్టాలను, బాధలను అనుభవించారని కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల మేరకు ఆవిర్భవించిన తెలంగాణ రాష్ర్టంలో శాంతియుతమైన, ప్రజాస్వామిక వాతావరణం ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు మానవ హక్కుల వేదిక రాసిన లేఖలో పలు అంశాలివీ.. - ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమం సందర్భంగా వెలువడిన ప్రజల ఆకాంక్షల్లో ఉమ్మడి రాష్ర్టంలో కొనసాగిన అణచివేత, నిర్బంధం, ఎన్కౌంటర్లు లేని స్వేచ్ఛాయుతమైన వాతావరణం నెలకొనాలని వ్యక్తమైంది. రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన కొనసాగాలని ప్రజలు ఆకాంక్షించారు. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. - ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్కౌంటర్లను ఒక విధానంగా కొనసాగించాయి. చంద్రబాబునాయుడు హయాంలోనే 1,448 మంది ఎన్కౌంటర్ల పేరిట హతమయ్యారు. ఎన్కౌంటర్ హత్యలకు పాల్పడిన పోలీసు అధికారులకు సీనియారిటీతో నిమిత్తం లేకుండా పదోన్నతులు, డబ్బు రూపేణా పారితోషికం అందజేయడం వంటి విధానాలు అమలు చేశారు. - తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మూడు ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 8 మంది మరణించారు. పోలీసు లాకప్పుల్లో ఒక దళిత మహిళసహా 6 అనుమానాస్పద లాకప్పు మరణాలు సంభవించాయి. - ఎన్కౌంటర్ హత్యలు తెలంగాణలో ఉండవనే పాలనాపరమైన విధానాన్ని నిర్ధిష్టంగా ప్రకటించాలి. -
అలుపెరుగని మానవ హక్కుల బాటసారి!!
అది ఆదిలాబాద్ గిరిజన ప్రాంతం అయినా, జమ్మూ కశ్మీర్ అయినా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న బుర్ర రాములు, సమాజానికీ మానవ హక్కుల ఉద్యమానికి ఒక దిక్సూచి. ఆయన ఒక పేద మధ్యతరగతి కుటుంబం లో బుర్ర అయిలయ్య - చంద్రమ్మ దంపతులకు 1954 జూన్ 10న ఖిల్లా వరంగల్లో జన్మించారు. తన ప్రాథమిక విద్యను ఖిల్లా వరంగల్లోను, ఇంటర్మీడి యెట్ విద్య హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లోనూ, డిగ్రీ విద్యను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోను, ఎం.ఎ. ఎకనామిక్స్ను కాకతీయ యూనివర్సిటీలోను, మిగతా ఉన్నత విద్యను యూనివర్సిటీలోనే పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఎం.ఎ. ఎకనా మిక్స్ చదివిన రోజుల్లో పీడీఎస్యూ విద్యార్థి సంఘం లో చేరి అనతి కాలంలో విద్యార్థి నాయకుడుగా ఎదిగాడు. ఆ కాలంలోనే బాలగోపాల్ గారి హక్కుల పోరా టం రాములు సార్ని ఎంతో ప్రభావితం చేసింది. యూనివర్సిటీ యూజీఎస్ పోరాటంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నాడు. విద్యార్థి సమస్యలపైన పోరాటంలో ముందుండేవాడు. 1984-85 కాలంలో ఎంఎల్ పార్టీ చీలికలు, పీడీఎస్ యూలో చీలికలు ఆయన్ని చాలా మనస్తా పానికి గురిచేశాయి. అనంతరం మానవ హక్కుల పోరాటంలో భాగస్వామ్యం అయ్యాడు. ఈ పోరాటంలో క్రియాశీలంగా పాల్గొనసాగారు. 1985లో డాక్టర్ రామనాథాన్ని ఆయన క్లినిక్లోనే రాజ్యహింసలో భాగంగా మఫ్టీ పోలీ సులు చంపేశారు. ఇదే కాలంలో పలువురు పౌర హక్కుల నేతలను పౌరహక్కుల సంఘం కోల్పోవలసి వచ్చింది. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ ఆయన హక్కుల రక్షణలో బాధ్యత వహించారు. రెండు తెలు గు రాష్ట్రాలలోనే కాదు మహా రాష్ర్ట, గుజరాత్ ఇలా అనేక రాష్ట్రాల్లో పౌర హక్కుల పరిరక్షణ కోసం పోరా డారు. తను చదువుకున్న యూనివర్సిటీలోనే అధ్యా పకుడిగా చేరారు. గతంలో విద్యార్థిగా లాఠీ దెబ్బలు తిన్న చోటే ప్రగతిశీల భావాలను వ్యాప్తి చేయడం అరుదు. మరోవైపు తన కుటుంబ కర్తవ్యాలను ఏనాడూ విడనాడలేదు. తన జీవిత భాగ స్వామి స్వరూపమ్మ ఆయనకు ఎనలేని సహ కారాన్ని అందించింది. తన ఇద్దరు కూతుళ్లు జన, రనలపై తన స్వంత అభిప్రాయాలను ఆయన రుద్దలేదు. వారి ఇష్టానుసారంగానే వారి చదువులు కొనసాగాయి. చివరికి వారి జీవిత భాగస్వాములను కూడా వారే ఎంపిక చేసుకున్నారు. తన మార్గదర్శకుడు బాలగోపాల్ మర ణం, సహచరి మరణం ఆయనను మానసికంగా చాలా కృంగదీశాయి. ఈ సమయంలోనే తనకు సోకిన కేన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించలేకపోయారు. పౌరుల హక్కులే తన శ్వాసగా బతికిన ఆయన 2011 మే 14న చనిపోయారు. కుల అడ్డుగోడలను ఛేదించ డంలో మత అంతరాలను ప్రాలద్రోలడంలో, విప్లవ శక్తులను రాజ్యం, బూటక ఎన్కౌంటర్ల పేరుతో చంపి నప్పుడు తను ప్రశ్నించే తత్వం ఎన్నదగినది. ఆయన అస్తమయం హక్కుల ఉద్యమానికి తీరని లోటు. (నేడు బుర్ర రాములు వర్ధంతి) తోట రాజేశ్ పీవైఎల్ నేత, 9440195160 -
పాకిస్తాన్లో హక్కుల కార్యకర్త హత్య
కరాచీ: పాకిస్తాన్కు చెందిన ప్రముఖ హక్కుల ఉద్యమవేత్త సబీన్ మహ్మద్ను శుక్రవారం గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్లో మానవ హక్కులకు భంగం కలుగుతున్న అంశంపై కరాచీలో జరిగిన సెమినార్కు హాజరైన ఆమె.. అక్కడి నుంచి కారులో బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది. బైక్పై వచ్చిన దుండగులు తుపాకీలతో కాల్పులు జరపడంతో సబీన్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ సమయంలో కారులోనే ఉన్న ఆమె తల్లి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ‘ది సెకండ్ ఫ్లోర్ (టీ2ఎఫ్)’ సంస్థ డెరైక్టర్ అయిన సబీన్ ప్రజల హక్కులు కోసం పోరాడారు. -
ఏ ఎండకా గొడుగు
అమలాపురం టౌన్/ పెద్దాపురం : మానవ హక్కుల పరిరక్షణ ముసుగులో అవినాష్ పాల్పడిన మోసాలు, అక్రమ వసూళ్లపై జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఆ టక్కరికి సంబంధించిన ఏ చిన్ని ఆధారం దొరికినా వదలకుండా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జిల్లాలో అవినాష్ ఎక్కడెక్కడకు వెళ్లాడు, ఎవరెవర్ని కలిశాడు... అని కూపీ లాగుతున్నారు. అతడి బంధువులు, స్నేహితులనే కాదు.. పరిచయస్తులను కూడా వదలకుండా విచారణ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆరు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. అవినాష్ అన్వేషణలో ఓ బృందం హైదరాబాద్ వెళ్లగా నిడదవోలు, కొవ్వూరు, భద్రాచలం, పెద్దాపురం, కోనసీమలకు తలో బృందం వెళ్లింది. అవినాష్ది ఏ ఎండకా గొడుగు పట్టే స్వభావం. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు తన దందాలు, అక్రమ వసూళ్ల కోసం ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు. ఎంతటి వారితోనైనా సంబంధాలు పెట్టుకుంటాడు. లేని బంధుత్వాలు సృష్టించుకుంటాడు. నాలుగేళ్ల కిందట స్మగ్లర్ అవతారం ఎత్తి కొందరు అటవీ అధికారలతో అనుబంధం పెంచుకుని అక్రమాలకు పాల్పడ్డాడు. తర్వాత ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ అవతారం ఎత్తి ఉద్యోగాలు వేయిస్తానని మోసాలకు దిగాడు. రాజప్ప బంధువునని చెప్పుకుంటూ గత అక్టోబరు నుంచి బెదిరింపులకు, దందాలకు దిగాడు. ఇదే సమయంలో 2015 సంవత్సరానికి హ్యూమన్ రైట్స్ చైర్మన్ హోదాతో ఖరీదైన రంగురంగుల పేజీలతో క్యాలెండర్ ముద్రించాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోని ముఖ్యనేతలతో, రాష్ట్రానికి చెందిన ప్రముఖులతో దిగిన ఫొటోలను ఆ క్యాలెండర్లో ముద్రించాడు. తానో దాతనని చెప్పుకునేందుకు పేదలకు ఏవో పంపిణీ చేస్తున్న పలు ఫోటోలు కూడా ముద్రించేశాడు. క్యాలెండర్లో మన జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలను కూడా ప్రచురించుకున్నాడు. ఏదో ఒక సందర్భంలో ప్రముఖులను కలిసినప్పుడు వారితో తీరుుంచుకున్న ఫొటోలను క్యాలెండర్లో ముద్రించి వారితో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ, రాజప్ప బంధువునంటూ, హ్యూమన్ రైట్స్ చైర్మన్నంటూ ఆ క్యాలెండర్లతో కాకినాడలోని జిల్లాస్థాయి కార్యాలయాలకూ వెళ్లాడు. డీఎస్పీలు, ఆర్డీఓలకు కూడా విజిటింగ్ కార్డుల్ని, క్యాలెండర్లిచ్చి రాజప్పతో తన బంధుత్వం, తన పదవి గురించి గొప్పగా చెప్పుకుని పరిచయాలు చేసుకున్నాడు. అలా జిల్లా అధికార యంత్రాంగంతో పరిచయం పెంచుకున్నాడు. తాను ఏదైనా పని చేయించుకోవాలన్నా, అక్రమ వసూళ్లకు వల విసరాలన్నా తెచ్చిపెట్టుకున్న అధికార దర్పంతో, మాటల గారడీతో బురిడీ కొట్టించేవాడు. రాజమండ్రిలో హక్కుల సదస్సు.. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ హోదాలో అవినాష్ గత ఏడాది ఆగస్టు 22న రాజమండ్రిలోని ఓ స్టార్ హోటల్లో మానవహక్కుల పేరిట జాతీయ సదస్సు నిర్వహించాడు. దానికి సంస్థ హెచ్ఆర్ఓ ఎన్.బి.నజీర్ అతిథిగా వచ్చాడు. ఇదే వేదికపై మానవహక్కుల రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా రాజమండ్రి ప్రాంతానికి చెందిన రాజేశ్వరి అనే మహిళకు నియామక పత్రం కూడా అవినాష్ అందజేశాడు. ఆ సదస్సులో తమ సంస్థ బాలకార్మికుల నిర్మూలన, మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహాలు, గృహహింస వంటి సమస్యలపై పోరాడుతుందని ఆర్భాటంగా చెప్పాడు. పోలీసుల అదుపులో నలుగురు.. అవినాష్ మోసాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు బుధవారం జిల్లాలో నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పెద్దాపురం పోలీసులు అవినాష్పై అనుమానం వచ్చి విచారిస్తున్నప్పుడు అతడికి మద్దతుగా వెళ్లిన మీడియా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని, అవినాష్తో వారికున్న సంబంధాలను ఆరా తీస్తున్నారు. అంబాజీపేట మండలానికి చెందిన అవినాష్ స్నేహితుడు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కూల్లో ఓవర్యూక్షన్పై ప్రత్యేకాధికారి విచారణ అవినాష్ గతనెల 25న హ్యూమన్ రైట్స్ చైర్మన్ హోదాతో భద్రతా సిబ్బంది, ఎర్రబుగ్గ కారుతో పెద్దాపురంలోని లూథరన్ హైస్కూలును సందర్శించినట్లు పోలీసు దర్యాప్తులో మంగళవారమే గుర్తించారు. అవినాష్ బచ్చు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కోటేశ్వరరావుతో కలిసి ఆ హైస్కూల్ను సందర్శించి పారిశుధ్యం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రధానోపాధ్యాయుడు ఇజ్రాయిల్ నుంచి ఈ మేరకు పెద్దాపురం పోలీసులు మంగళవారమే స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ క్రమంలో ప్రత్యేకాధికారి, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆ హైస్కూల్లో బుధవారం విచారణ చేపట్టారు. అక్కడ అవినాష్ ఓవర్ యాక్షన్పై ఆరా తీసి, సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేశారు. కాగా భద్రాచలం వెళ్లిన బృందం అక్కడికి సమీపంలోని మామిడిగూడెంలో అవినాష్ తల్లి, బంధువులను విచారించారు. -
భద్రాచలం టు కోనసీమ..వయా పెద్దాపురం
‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు’ అన్నట్టు.. తెల్లగా మెరిసిపోతున్న దుస్తులు.. నల్లటి కళ్లద్దాలు.. నీట్గా పాలిష్ చేసిన బూట్లు.. ఖరీదైన కార్లు.. ఒలకబోస్తున్న దర్జా, దర్పం చూసి.. చాలా గొప్పవాడని చాలామంది నమ్మారు. తీరాచూస్తే వాడే ఆరితేరిన నేరగాడని.. చాలా తేలిగ్గా నమ్మించి.. తడిగుడ్డతో గొంతు కోసేయగల కిలాడీ అని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. ‘హ్యూమన్ రైట్స్’ పేరు చెబుతూనే.. చేత కర్రపట్టి.. సాటి మనిషిపై అమానుషంగా వ్యవహరించిన తీరు చూసి నిర్ఘాంతపోతున్నారు. హోం మంత్రి బంధువునంటూ చేసిన దందాలు, దాడులకు పాల్పడిన అవినాష్ నేరచరిత్రను తెలుసుకుని జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ/అమలాపురం టౌన్ :ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సౌత్ ఇండియా చైర్మన్గా చెప్పుకుంటూ.. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునని ప్రచారం చేసుకుంటూ.. జిల్లాలో పలు దందాలకు, అక్రమ వసూళ్లకు పాల్పడిన పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర నేర ప్రస్థానం భద్రాచలంలో మొదలై జిల్లాకు విస్తరించింది. చాలా దశాబ్దాల కిందట తాత చంద్రరావు హయాంలో అవినాష్ కుటుంబం కోనసీమలోని పి.గన్నవరం మండలం పోతవరం నుంచి భద్రాచలానికి వలస వెళ్లింది. చంద్రరావుకు ముగ్గురు కుమారులు సత్యసాయిబాబా, రాజబాబు, డాక్టర్ బాబు ఉన్నారు. వీరిలో రాజబాబుకు అవినాష్ భద్రాచలంలో పుట్టాడు. ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలకు అవినాష్ ఒక్కడే మగబిడ్డ కావడంతో గారాబంగా పెరిగాడు. కమశిక్షణ లోపించడంతో స్మగ్లింగ్కు, అక్రమార్జనకు అలవాటు పడ్డాడు. దీంతో తృప్తి చెందకుండా అధికార హోదా కోసం అప్పుడే హ్యూమన్ రైట్స్ చైర్మన్గా అవతారమెత్తి, తిరిగి జిల్లాలో అడుగు పెట్టాడు. పెద్దాపురం, రాజమండ్రితోపాటు కోనసీమలో దందాలు ప్రారంభించాడు. జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉన్నతాధికారులను కలిసి తన హోదాను చెప్పుకోవడంతోపాటు ఉప ముఖ్యమంత్రి రాజప్పతో బంధుత్వం ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకునేవాడు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురికి ఎరవేసి రూ.లక్షలు కాజేశాడు. మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర శాఖకు చైర్పర్సన్ను చేస్తానని కాకినాడకు చెందిన ఓ మహిళ నుంచి రూ.14 లక్షలు వసూలు చేశాడు. ఆ పని జరగకపోవడంతో బాధితురాలు పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేసింది. దీంతోపాటు రాజమండ్రిలోని ఓ దళిత కుటుంబంపై అవినాష్ కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటనలు బయటకు వచ్చాయి. బాధితుల కోసం అన్వేషణ అవినాష్ బాధితులు జిల్లాలో అనేకమంది ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అవినాష్ బాధితులు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీస్తున్నారు. వారికోసం అన్వేషిస్తున్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే కోనసీమలోని అవినాష్ పూర్వ బంధువులు, స్నేహితులపై దృష్టి పెట్టారు. వారిద్వారా అతడి సమాచారాన్ని మరింతగా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాకలగరువు, పోతవరాల్లో ఉన్న అవినాష్ బంధువులు, స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే భద్రాచలం సమీపంలోని మామిడిగూడెంలో అవినాష్ ఇంటికి కూడా జిల్లా నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లాయి. రాజప్పతో సంబంధాలపై దర్యాప్తు ఉప ముఖ్యమంత్రి రాజప్పతో అవినాష్కున్న బంధుత్వంపై మరో పోలీసు బృందం మంగళవారం విచారణ చేపట్టింది. జిల్లాలోని అంబాజీపేట మండలం వాకలగరువు, పి.గన్నవరం మండలం పోతవరంలో పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. రాజప్పకు అవినాష్తో బంధుత్వం ఉందో లేదో పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అవినాష్ పెదనాన్న సత్యసాయిబాబాకు రాజప్పకు గతంలో స్నేహం ఉండేది. గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీన రాజప్ప పుట్టిన రోజును పురస్కరించుకుని.. అవినాష్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్నని చెప్పుకుంటూ, ఖరీదైన కారులో అధికార దర్పంతో అమలాపురం వచ్చాడు. అప్పుడే రాజప్పకు తన పెదనాన్న సత్యసాయిబాబా స్నేహితుడని.. తాను ఆయన తమ్ముడి కుమారుడినని పరిచయం చేసుకున్నాడు. అప్పటినుంచీ రాజప్ప తన బంధువని చెబుతూ.. తాను చేసే అక్రమాలకు ఆయన పేరును ఉపయోగించుకుంటూ వచ్చాడు. పెద్దాపురంలోనే ప్రాథమిక చదువు అవినాష్ ప్రాథమిక విద్య పెద్దాపురంలో సాగింది. అక్కడి ఇంటర్నేషనల్ మేథ్మెటిక్స్, సైన్స్ అకాడమీల్లో చదివాడు. హైదరాబాద్లో ఉన్నత విద్య చదివాడు. ఆ అకాడమీ వ్యవస్థాపకుడు, బచ్చు ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన బచ్చు కోటేశ్వరరావు (ఎన్నారై) గత నెల 24న అమెరికా నుంచి పెద్దాపురం వచ్చినప్పుడు అవినాష్ ఖరీదైన కారులో ప్రత్యక్షమయ్యాడు. అప్పట్లో తనది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అని చెప్పుకున్నాడు. అవినాష్ చిన్నాన్న ప్రస్తుతం అదే జిల్లా నిడదవోలులో ఉంటున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. తప్పించేందుకు తెర వెనుక యత్నాలు! అవినాష్పై ఉచ్చు బిగుసుకోకుండా తెరవెనుక కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. కాకినాడ రామారావుపేటకు చెందిన ఒక మహిళకు మానవ హక్కుల కమిషన్ రాష్ర్ట మహిళా విభాగం చైర్పర్సన్ పదవి ఇప్పిస్తానంటూ అవినాష్ రూ.14 లక్షలు కాజేశాడన్న ఆరోపణలున్నాయి. దీనిపై బాధిత మహిళ మంగళవారం రాత్రి కాకినాడ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరు మాత్రం గోప్యంగా ఉంచాలని పోలీసులను కోరినట్టు తెలిసింది. దీంతో అవినాష్పై కేసు నమోదైంది. ఇలా మరికొంతమంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఏదో అదృశ్య శక్తి బాధితులను బెదిరించి కేసులు పెట్టకుండా అడ్డుకుంటోందన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అలాగే అవినాష్ చేతిలో దెబ్బలు తిని, చిత్రహింసలకు గురైన బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడం వెనుక కొందరు అధికార పక్ష నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరీ అవినాష్? తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరం గ్రామంలో అవినాష్ తాతయ్య పేరాబత్తుల చంద్రరావు కుటుంబం ఉండేది. చంద్రరావుకు ముగ్గురు కుమారులు సత్యసాయిబాబా, రాజబాబు, డాక్టర్ బాబు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు రాజబాబు కొడుకే అవినాష్. ఆ ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలకు కలిపి అవినాష్ ఒక్కడే మగ సంతానం. మిగిలినవారంతా ఆడపిల్లలే. దీంతో అతడు ఆ కుటుంబాలకు గారాల పుత్రుడయ్యాడు. దాదాపు 25 ఏళ్ల కిందట వ్యాపారాల నిమిత్తం చంద్రరావు భద్రాచలం వలస వెళ్లారు. అప్పటినుంచీ ఆ కుటుంబం అక్కడే స్థిరపడింది. కాలక్రమంలో తాత, తండ్రి మృతి చెందారు. ప్రస్తుతం పోతవరంలో అవినాష్ మేనత్త కొడుకు, అమ్మమ్మ ఊరైన అంబాజీపేట మండలం వాకలగరువులో మేనత్త ఉన్నారు. వాకలగరువులో అతడి స్నేహితులు కూడా కొందరు ఉన్నారు. వీరిలో నాగబాబు అనే స్నేహితుడు అవినాష్ ఇటీవల అమలాపురం వచ్చినప్పుడు అతడి కూడా తిరిగాడు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్లు వాకలగరువు, పోతవరంలో అవినాష్ బంధువులు, స్నేహితులను మంగళవారం విచారించారు. మారిన విచారణాధికారి ఇదిలా ఉండగా అవినాష్ దురాగతాలపై విచారణకు అదనపు ఎస్పీ దామోదర్ను తొలుత నియమించారు. కానీ మంగళవారం ఆయన స్థానంలో ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించారు. మొత్తం వ్యవహారంపై ఆయన విచారణ చేపట్టి ఎస్పీ రవిప్రకాష్కు నివేదిక అందజేయనున్నారు. అవినాష్తో ‘బచ్చు’పై చర్చ.. పెద్దాపురం : ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో అవినాష్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇక్కడి ఎన్నారై సంస్థ బచ్చు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బచ్చు కోటేశ్వరావుతో అవినాష్కు ఉన్న సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. గత అక్టోబర్లో పెద్దాపురంలో దేవాంగ సేవా సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా జరిగిన అభినందన సభ వేదికపై అవినాష్ తన శిష్యుడంటూ చినరాజప్ప, ఎంపీ తోట నరసింహాలకు బచ్చు కోటేశ్వరరావు బహిరంగంగా పరిచయం చేశారు. ఈ అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. గత నెల 24న శివాలయం వీధిలో కోటేశ్వరావు నివాసంలో అవినాష్ ప్రతక్షమయ్యాడు. అప్పట్లో కోటేశ్వరావుతో కలిసి అవినాష్ విలేకర్ల సమావేశం నిర్వహించాడు. తనది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అని, చిన్నప్పుడు కోటేశ్వరావు స్థాపించిన ఐఎంఎస్ఏ పాఠశాలలో చదువుకున్నానని చెప్పాడు. ఆయనతో కలిసి తాను పెద్దాపురంలో మానవ హక్కులపై అవగాహన, సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నానని, ఇందుకు కోటేశ్వరావు సుముఖుత వ్యక్తం చేశారని అవినాష్ చెప్పాడు. ఈ సందర్భంగా అతడు, కోటేశ్వరావు కలిసి పట్టణంతోపాటు నియోజకవర్గంలోని పలు పాఠశాలలను సందర్శించారు. అవినాష్ తన విద్యార్థి అని ఉపాధ్యాయులకు కోటేశ్వరరావు పరిచయం చేశారు. తెల్లటి సఫారీ వాహనం, ఇద్దరు వ్యక్తిగత అంగరక్షకులు, అనుచరులతో క్యాబినెట్ మంత్రి తరహాలో అవినాష్ హడావిడి చేసేవాడు. దీంతో అతడికి అధికారులు నానా సపర్యలూ చేసేవారు. అవినాష్పై అనుమానం వచ్చిన పెద్దాపురం పోలీసులు దీనిపై విచారణకు యత్నించారు. పెద్దాపురం సీఐ శ్రీధర్ కుమార్, ఎస్సై శివకృష్ణలు బచ్చు ఫౌండేషన్ భవనానికి వెళ్లి విచారణ జరిపారు. అనంతరం అవినాష్ను, అతడి అనుచరులను, మూడు వాహనాలను స్టేషన్కు తరలించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ విచారణ పేరుతో స్టేషన్లోనే ఉంచి అన్ని రికార్డులూ సక్రమంగా ఉన్నాయంటూ వారిని విడిచిపెట్టారు. రాజమండ్రిలో సోదాలు రాజమండ్రి క్రైం : అవినాష్ కోసం పోలీసులు రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సోదాలు చేశారు. గత ఏడాది మార్చి నుంచి జూలై వరకూ నగరంలోని ఎమ్కే సిగ్నేచర్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 201లో అవినాష్ ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు చేశారు. అక్కడి వారిని విచారించారు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో అతడిని ఖాళీ చేయించినట్టు అపార్ట్మెంట్లోని కొందరు చెబుతున్నారు. తరువాత అక్కడినుంచి పక్కనే ఉన్న ఏఎంటీ ప్లాజాలో అవినాష్ కొంతకాలం ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ రెండు అపార్ట్మెంట్ల నుంచే అతడు తన కార్యకలాపాలు సాగించేవాడని చెప్పారు. ఆ అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేసిన తరువాత కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని ఒక లాడ్జిలో అప్పుడప్పుడు ఉంటూ తన అనుచరులను రప్పించుకుని పనులు సాగించినట్టు సమాచారం. అవినాష్ వివరాలు తెలుసుకునేందుకు పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్ మంగళవారం రాత్రి రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. -
రెక్కలు తెగుతున్న హక్కులు
మహిళల హక్కులే మానవ హక్కులు- అని నినదించింది బీజింగ్ సదస్సు. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న హింసను ప్రతిఘటిద్దాం - అంటోంది ఐక్యరాజ్యసమితి. అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం మహిళల హక్కు - అని ఘోషిస్తున్నాయి అంతర్జాతీయ సదస్సులు. పితృస్వామ్య కుటుంబాలను కూల్చండి, ప్రజాస్వామ్య కుటుంబాలను నిర్మించండి- అని డిక్లరేషన్ ఇచ్చింది సెడా (కన్వెన్షన్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ ఉమెన్). ఈ అన్ని డిక్లరేషన్లలోనూ సంతకం చేసింది భారతదేశం. అయితే వాస్తవంలో ఏం జరుగుతోంది? వాటిని గుర్తు పెట్టుకుని నడుచుకుంటోందా? ‘మానవ హక్కుల దినోత్సవం’ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య మాటల్లో సింహావలోకనం చేసుకుందాం. మొన్న ఈ మధ్య వరంగల్లో పెళ్లి నిశ్చయమైన ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత వరుడి కుటుంబీకులు కట్నం ఇంకా ఎక్కువ కావాలని పట్టుబట్టడం, ఆ ఆర్థిక భారాన్ని తట్టుకునే పరిస్థితి ఆమె కుటుంబానికి లేకపోవడమే ఇందుకు కారణం. మానవ హక్కుల ఉల్లంఘన అంటే నేరుగా కొట్టి చంపడమే కాదు, మానసికంగా వేధించడం కూడా ఆమె జీవించే హక్కును కాలరాయడమే. పైగా 1961 వరకట్న నిషేధ చట్టం పేరుతో ఓ చట్టం ఉండగానే ఈ పరిస్థితి దాపురించింది. కూతురికి డబ్బిచ్చి పెళ్లి చేయడం నుంచి కోడలి నుంచి డబ్బు కోరుకోవడం వరకు చట్టం ఉల్లంఘనకు లోనవుతూనే ఉంది. అంతర్లీనంగా ఇది యువతి హక్కులను తమ చేతుల్లోకి తీసుకోవడమే. ఆ అమ్మాయి మరణానికి ప్రభుత్వం, పౌరసమాజం, కుటుంబ వ్యవస్థ కూడా బాధ్యత వహించాలి. ఉపాధ్యాయుడే హక్కులు కాలరాస్తే! కృష్ణా జిల్లాలో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు, ఇంగ్లిష్ టీచరు ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక మీద అత్యాచారం జరుపుతూ ఆమె గర్భం దాలిస్తే అబార్షన్ చేయిస్తూ... చివరికి మూడవసారి అబార్షన్ సమయంలో ప్రాణాలు వదిలిందా బాలిక. ఒక ఉపాధ్యాయుడు... పైగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం గుర్తించి గౌరవించిన ఆ మహోత్తముని చేతిలో ఓ అమాయక బాలిక జీవితం హరించుకుపోయింది. దళిత, గురుకుల, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో బాలికలు అవాంఛిత గర్భాలు మోస్తూ అయిష్టంగా బిడ్డకు జన్మనివ్వడం, గర్భాన్ని మోయడం ఇష్టం లేక దొరికిన మందేదో తీసుకుని ఆరోగ్యాన్ని కోల్పోవడం వంటివన్నీ చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. ‘మహిళ ఒంటిని ఆమె అనుమతి లేకుండా తాకకూడదు’ అనే చట్టం ఒకటుందని వీరికి తెలియదా? మైనర్ బాలిక అయితే ఆమె అనుమతించినా సరే ఆమెతో లైంగిక చర్య తప్పు అని తెలుసు కదా! అయినా అత్యాచారాలకు పాల్పడుతున్నారంటే... ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యమా? ఇంతటి భరోసాని వారికెవరిచ్చారు? అనేక రకాలుగా జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కోసం ఓ నిర్భయ చట్టం, ఓ 498ఎ, ఓ వరకట్న నిరోధక చట్టం... ఇన్నింటిని తెచ్చుకున్నప్పటికీ అవి మహిళకు తగినంత భరోసానివ్వక పోగా నేరస్థులకే భరోసానిస్తున్నాయి. ఏ సంస్కృతికి ఈ ప్రోత్సాహం! పాశ్చాత్య సంస్కృతిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ ఆ పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి మహిళ లోనవుతోందని తిరిగి ఆమెనే ఆరోపించే భరోసా పాలకులకు ఎవరిచ్చారు? హింస, తీవ్రమైన అభద్రత, పేదరికాల్లోకి నెట్టివేసే ఈ సంస్కృతిని భారతీయ మహిళ నిజంగా వీటిని కోరుకుంటోందా? ఎక్కడ ఉన్నా... ఎలా ఉన్నా! 1977-78లలో రమీజాబీ అత్యాచారాన్ని ఆమె వ్యక్తిగత అంశంగా కాక సామాజికాంశంగా పరిగణించాలని ఉద్యమించాయి ప్రజాసంఘాలు. ఉద్యమాన్ని అణచడానికి పేలిన తూటాలకు 27 మంది బలయ్యారు. నిర్భయ, అభయ... అందరి విషయాల్లోనూ ‘ఆమె ఎప్పడు, ఎక్కడ, ఎలా ఉన్నది’ అనే ప్రశ్నలు వేసే సమాజం... ‘ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఆమె ఒంటి మీద చేయి వేసే హక్కు నీకు లేదు’ అని చెప్పడంలో విఫలమైంది. అమెరికా పగటి వేళ ఇక్కడ షిఫ్టుల్లో పని చేసే ఐటి అమ్మాయి అర్ధరాత్రి ప్రయాణం చేయకపోతే కుదురుతుందా? ‘మహిళలు రాత్రి వేళల్లో కూడా పని చేయాలి, వెనుకడుగు వేయవద్దు’ అని ప్రబోధించే పాలకులు మహిళలు రాత్రి పూట ప్రయాణించగలిగిన భద్రమైన రవాణా వ్యవస్థను రూపొందించడంలో విఫలమవుతున్నారు. ప్రజాసంఘాలు 1985లో మహిళల హక్కుల కోసం మహార్యాలీ చేసినప్పుడు నేను ఓ ప్లకార్డులో ‘సిగ్గుతో తలదించుకోవాల్సింది బాధితులు కాదు, నేరస్థులే’ అనే నినాదాన్నిచ్చాను. దాదాపుగా 30 ఏళ్ల కిందట మహిళ సంఘాలన్నీ ఆ నినాదంతో ర్యాలీ చేశాం. అప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లిన నినాదం తరం మారినా ఏ మాత్రం ప్రభావం చూపించకుండా... స్త్రీ హక్కును కాలరాసే హక్కు మగవారి చేతిలో ఉందనే భావజాలాన్నే పెంచి పోషిస్తోంది పౌర సమాజం. 498ఎ దుర్వినియోగం అంటూ గొంతు చించుకునే ముందు మహిళలు మానసిక, ఆర్థిక, మౌఖిక హింసల నుంచి రక్షణ పొందే చట్టాలు లేకపోవడంతో, చట్టబద్ధత, భద్రత లేనప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కడో కొందరు మాత్రమే 498ఎని ఆశ్రయిస్తున్నారని కూడా గుర్తెరగాలి. వాటన్నింటికీ చట్టాలు ఉంటే ఈ దుర్వినియోగం ఉండదు. చట్టానికి తూట్లు పొడవడం కూడా హక్కుల ఉల్లంఘనే! ప్రేమను తిరస్కరించిందనే కారణంతో అమ్మాయి మీద దాడికి పాల్పడుతున్నారు. అదే అబ్బాయి నుంచి తిరస్కరణకు గురైన అమ్మాయిలు న్యాయం కోసం మౌనపోరాటాలు చేస్తున్నారు తప్ప భౌతిక దాడులకు దిగజారడం లేదు. స్త్రీ స్వేచ్ఛను, గౌరవాన్ని కోరుకుంటోంది. ‘హింస లేని జీవితం, హింసలేని శరీరం, హింస లేని కుటుంబం’ ఆమె హక్కు. వాటిని పాదుకొల్పే ప్రజాస్వామ్య కుటుంబాలను నిర్మిద్దాం. అన్ని రకాల ఆధిపత్యాలను, తిరస్కరణలను రద్దు చేద్దాం. శాంతియుత కుటుంబాల నిర్మాణమే నిజమైన మానవహక్కుల పరిరక్షణ. సంభాషణ : వాకా మంజులారెడ్డి -
ప్రజలను మోసం చేశాడు.. పోలీసులిలా..!
-
కంచే చేను మేస్తోంది..
న్యూఢిల్లీ:ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో ఢిల్లీ పోలీసుశాఖ చాలా వెనుకబడి ఉంది. సామాన్యులను రక్షించాల్సిన రక్షకభటులే వేధింపులు, లంచాలు, బలవంతపు వసూళ్ల వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్నట్టు స్వయానా కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. పోలీసుల నిర్వాకాలపై గత ఏడాది 12,427 ఫిర్యాదులు రాగా, 2012లో వీటి సంఖ్య 12,343గా తేలింది. వీటిని బట్టి చూస్తే నగర పోలీసు వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు జరగాల్సి ఉందని అర్థమవుతోంది. గత ఏడాదిలో నగర పోలీసులు 141 కేసుల్లో మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డట్టు ఫిర్యాదులు వచ్చాయి. 2012లోనూ 75 కేసుల్లో ఉల్లంఘనలు నమోదయినట్టు తేలింది. వీటిలో 12 కేసుల్లో పోలీసులపై చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవడంలోనూ ఉన్నతాధికారులు అలసత్వం చూపిస్తున్నారనే విమర్శలూ ఉన్నా యి. గత ఏడాది సిబ్బంది అక్రమాలపై 178 విచారణలకు ఆదేశాలు జారీ చేయ గా, వీటిలో 95 కేసులు తప్పుడువని నిర్ధారించారు. మిగతా కేసుల విచారణ కొనసాగుతూనే ఉంది. జాతీయ నేర గణాంకాల సంస్థ పైవివరాలను వెల్లడించింది.2013లో మొత్తం 149 మంది పోలీసులపై కోర్టుల్లో విచారణ కొనసాగింది. వీటిలో ఒక కేసును కొట్టివేయగా, నిందితుడు నిర్దోషిగా విడుదలయ్యారు. 2012లో 43 కేసులను న్యాయస్థానాలు పరిష్కరించాయి. వీటిలో 13 మంది పోలీసులకు శిక్షలు పడ్డాయి. 30 మంది నిర్దోషులుగా తేలారు. అంతేగాక 1,125 మందిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోగా, 1,222 కేసులను ఉపసంహరించుకోవడమో లేక కొట్టివేయడమో జరిగింది. తీవ్ర తప్పిదాలకు పాల్పడిన 103 మంది పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించగా, 592 మందిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇక 2012లో 112 మంది పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించగా, 1,049 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని జాతీయ నేరగణాంకాల శాఖ విశదీకరించింది. అక్రమ అరెస్టులపై గత ఏడాది రెండు కేసులు నమోదు కాగా, 2012లో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. గత ఏడాది పోలీసుల బలవంతపు వసూళ్లపై తొమ్మిది, వేధింపులపై మూడు కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఇప్పటికీ చార్జిషీట్లు దాఖలు చేయలేదు. మహిళలతో అనుచితంగా ప్రవర్తించినట్టు 23 కేసులు నమోదుకాగా, మూడు కేసుల్లో మాత్రమే చార్జిషీట్లు సమర్పించారు. గత ఏడాది ఒక నిందితుడి నుంచి డబ్బులు వసూలు కాలేదనే కోపంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపినట్టు కేసు నమోదయింది. మరో బలవంతపు వసూళ్ల కేసులో పోలీసులే ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు. అమిత్ తోమర్ అనే పోలీసు ఉద్యోగితోపాటు నెబ్ సరాయి పోలీసు వల్ల గత ఏడాది ఈశాఖ ప్రతిష్టకు మచ్చలు తప్పలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 446 మందిని నిరుడు సస్పెండ్ చేశారు. 491 మంది పేర్లను ‘అనైతిక ప్రవర్తన’ కలిగిన ఉద్యోగుల జాబితాలో చేర్చారు. ఇది వరకే 598 మంది పోలీసుల పేర్లు ఇందులో ఉన్నాయి. వివిధ కేసుల్లో వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన అధికారులు గత ఏడాది 158 విచారణలకు ఆదేశించగా, 19 కేసుల్లో నిందితులు దోషులని తేలింది. దీంతో ముగ్గురు ఇన్స్పెక్టర్లు సహా 19 మంది పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. పలువురు పోలీసులపై గతేడాది 794 శాఖాపరమైన విచారణలు నిర్వహించగా, 1,057 మందిపై చర్యలు తీసుకున్నారని జాతీయ నేరగణాంకాల సంస్థ వివరించింది.మహిళలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఫిర్యాదు పెరుగుతుండడంతో మహిళా పోలీసుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది కల్లా మూడు వేల మంది మహిళా పోలీసులను నియమించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మహిళలకు సంబంధించిన సున్నితమైన అంశాలను పరిష్కరించేందుకు కానిస్టేబుల్ మొదలుకొని వివిధస్థాయిల అధికారులను నియమిస్తారు. ‘భర్తీ ప్రక్రియ ఇది వరకే మొదలయింది. ఎంపికైన వారికి భారీ ఎత్తున శిక్షణ ఇస్తాం. వచ్చే ఏడాది ముగిసేనాటికి మూడు వేల మంది మహిళా పోలీసులు ఉద్యోగాల్లో చేరతారు’ అని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ అధీనంలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 2012, డిసెంబర్ 16న నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవిదేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం మహిళా పోలీసుల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ప్రకారం ఒక్కో స్టేషన్లో కనీసం ఇద్దరు ఎస్ఐలు, ఏడుగురు కానిస్టేబుళ్లు మహిళలు ఉండేలా చూస్తారు. ఈ మేరకు మహిళా పోలీసుల నియామకానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుశాఖలో 80 వేల మంది పనిచేస్తుండగా, వీరిలో ఏడు వేల మంది వరకు మహిళలు ఉన్నారు. -
తిరుమల కొండల్లో ఇది రెండో ఎన్కౌంటర్
తొలి ఎన్కౌంటర్ బ్రహ్మాజీ కొండ వద్ద వారం రోజుల్లో నాలుగుసార్లు పోలీసుకాల్పులు తొలిసారి వెలుగుచూసిన బాణం సాక్షి, చిత్తూరు: శేషాచల కొండల్లో గత ఆరు నెలల్లో జరిగిన ఎన్కౌంటర్లలో బుధవారం రాత్రి జరిగింది రెండోది. చామల రేంజ్ బ్రహ్మాజీ కొండ వద్ద(భాకరాపేట అడవుల్లో) తొలి ఎన్కౌంటర్ లో తమిళ కూలీ హతమయ్యాడు. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్లో ఒకేసారి ముగ్గురు ఎర్రదొంగలు మృతిచెందారు. ఎన్నికల కారణంగా సాయుధబలగాలు మూడు నెలలు కూంబింగ్ ఆపేశాయి. మళ్లీ నెల రోజులుగా చిత్తూరు, తిరుపతి అర్బన్జిల్లాల పోలీసులు కూంబింగ్ విస్తృతం చేశారు. అటు చామల రేంజ్(భాకరాపేట, తలకోన) నుంచి ఇటు తిరుమల మీదుగా మామండూరు రేంజ్(మామండూరు) వరకు తిరుమల అడవుల్లో పోలీసులు, అటవీశాఖ, టాస్క్ఫోర్స్ సాయుధ బలగాలు నాలుగు బృందాలుగా విడిపోయి జల్లెడపడుతున్నారుు. వారం రోజులుగా సాగుతున్న విస్తృత కూంబింగ్లో నాలుగుసార్లు స్మగ్లర్ల దాడులను ఎదుర్కొన్న పోలీసు, అటవీశాఖల దళాలు, టాస్క్ఫోర్స్ బృందాలు ఆత్మరక్షణార్థం కాల్పులకు దిగాల్సి వచ్చింది. 15 రోజుల కిత్రం భాకరాపేట అడవుల్లో తొలిసారి స్మగ్లర్లు రాళ్లదాడికి దిగటంతో టాస్క్ఫోర్స్ పోలీసు బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి. తరువాత వారం రోజులకు శ్రీవారి మెట్టు వద్ద, పులిబోనుకు పై ప్రాంతాల్లోను, చంద్రగిరి మండలం మామండూరు వద్ద హైవేకు సమీపంలోని అటవీప్రాంతంలో స్మగ్లర్లపై పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. వెలుగుచూసిన బాణం తిరుమల అడవుల్లో ఎర్రచందనం నరికేందుకు వచ్చిన కూలీల వద్ద తొలిసారి బాణం వెలుగుచూసింది. గతంలో కూడా పోలీసులపై బాణంతో దాడులు చేసినా, అప్పట్లో బాణం వెలుగుచూడలేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బాణం వెలుగు చూడటంతో ఎర్రదొంగలు తమిళనాడులోని తిరువణ్ణామలై జమునామత్తూరు అటవీ ప్రాంతానికి చెందిన గిరిజనులై ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. వీరు మాత్రమే ఇతరులపై దాడికి బాణాలు కూడా వాడతారని విశ్లేషిస్తున్నారు. భక్తుల ముసుగులోనే.. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీవారి పాదాలకు సమీపంలో ఉండటంతో ఎర్రకూలీలు భక్తుల ముసుగులోనే కొండకు చేరుకుని అక్కడి నుంచి ఎర్రచందనం చెట్లను నరికేందుకు వెళ్లి ఉంటారని అటవీ, పోలీసు శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. కొందరు కూలీలు అటవీ మార్గంలో ఆయుధాలతో పైకి చేరుకోగా, మిగిలినవారు బస్సుల్లో తిరుమలకు, అక్కడి నుంచి కాలినడకన శేషాచల కొండల్లోకి ప్రవేశించినట్లు సమాచారం. -
వాయిస్ ఆఫ్ యూత్!
వయసుకు తగ్గట్టుగా వచ్చే హార్మోన్లు మనిషికి సహజసిద్ధంగా చాలా విషయాలను నేర్పిస్తాయి. అలాగే సంఘంలో బతుకుతున్నందుకు చదువు, ఉద్యోగం, శ్రమలకు సులువుగా అలవాటు పడిపోతాడు.. మరి ఇదే సంఘంలో బతుకీడుస్తూ కొంచెం వైవిధ్యంగా చదివే వాళ్లు, కొంచెం వైవిధ్యమైన ఉపాధిని చూసుకొనే వాళ్లు, కొంచెం వైవిధ్యంగా శ్రమ పడే వాళ్లు... ప్రత్యేకమైన వ్యక్తులు అవుతారు. గొప్ప గుర్తింపును తెచ్చుకొంటారు. అవకాశం కలిసొస్తే అంతర్జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకొంటారు. ఈ తరహాలో కొంచెం సృజన, మరికొంచెం బాధ్యత, కొంచెం ఆసక్తి మరికొంచెం అవసరంతో కొంతమంది మంచి ప్రయత్నాలు చేశారు. సమకాలీన సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వారుగా, ప్రభావితం చేసే వ్యక్తులుగా పేరు తెచ్చుకొన్నారు. అలాంటి వారిలో కొందరు. వీళ్లంతా యువ డాక్యుమెంటరీ మేకర్లు. తమ చుట్టూ ఉన్న సమాజంలోని సమస్యలపై అధ్యయనం చేసి తమదైన శైలిలో దాన్ని సంస్కరించడానికి ప్రయత్నించిన వాళ్లు. పేరు: శ్రుతీ రాయ్, ఇండియా డాక్యుమెంటరీ పేరు: మైనా, ది లిటిల్ బ్రైడ్ బాల్య వివాహం. చాపకింద నీరులా ఇప్పటికీ మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. వ్యవస్థలో భాగమై అనేక మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ దుష్పరిణామాలకు కారణం అవుతున్న సమస్య ఇది. దేశంలోని ఒక మహానగరంలో చదువుతున్న యువతి శ్రుతీరాయ్. అక్కడే ఒక కార్పొరేట్ విద్యాలయంలో చదువుతున్న శ్రుతి ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా గ్రామానికి వెళితే అక్కడ చిన్న వయసు పిల్లలకే వివాహాలు అవుతున్నాయనే విషయం అర్థమైందట. ఈ విషయం గురించి పూర్తి వివరాల గురించి గూగుల్ను ఆశ్రయిస్తే ఎన్నో కఠోరమైన నిజాలు తెలిశాయి. వాటి గురించి తెలుసుకొన్న శ్రుతి ఆవేదనకు ప్రతిరూపమే ‘మైనా, ది లిటిల్ బ్రైడ్’. అప్పటికే మూవీ మేకింగ్ మీద అవగాహన కలిగిఉన్న ఈ టీనేజర్ యానిమేషన్ డాక్యుమెంటరీని రూపొందించింది. ‘సమాజంలో మార్పు తీసుకురావడానికి, ఏదో ఒక వైవిధ్యమైన ప్రయత్నం చేయాలనే ఆలోచనే ఈ డాక్యుమెంటరీకి మూలం. దీనికి మంచి గుర్తింపు రావడం ఆనందమే. అయితే నా డాక్యుమెంటరీ కొంతమందిపై ప్రభావం చూపి, కొంతమంది అమ్మాయిల జీవితాలు బాగు పడటానికి కారణం అయినా ఆనందమే..’’ అని అంటోంది శ్రుతి. పేరు: బిజిమనా ఫ్రాంకోయిస్, కెన్యా డాక్యుమెంటరీ పేరు: క్రై ఆఫ్ ది రెఫ్యుజీస్ ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది శరణార్థి శిబిరంలో ఉన్న మనిషే. ఇటు తమిళ ఈలం దగ్గర నుంచి అటు ఆఫ్రికన్ అంతర్యుద్ధాల బాధితుల వరకూ ఎవరి పరిస్థితిని చూసినా అర్థమవుతుంది ఈ విషయం. కష్టమో నష్టమో సొంత ఊరిలో ఉండి, సొంత వాళ్ల మధ్యనే ఉండి దాన్ని ఎదుర్కొంటునప్పుడు ఉండే స్థైర్యం వేరు, స్థానిక పరిస్థితుల ప్రభావంతోనో, యుద్ధ వాతావరణంలోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో.. కష్టాలను ఎదుర్కోవడం వేరు. అలాంటి కష్టాల ప్రతిరూపమే ‘క్రై ఆఫ్ ది రెఫ్యూజీస్’. బిజిమనా ఫ్రాంకోయిస్ అనే ఈ కెన్యన్ యువకుడు తీశాడు ఈ డాక్యుమెంటరీని. వాలంటీర్గా కెన్యాలోని ఒక శరణార్థ శిబిరాన్ని సందర్శించినప్పుడు ఫ్రాంకోయిస్ కళ్లలోని తడికి ఆవిష్కారం ఈ సినిమా. సృజనాత్మకత ఉన్న యువతీయువకులు సమాజాన్ని ఎంతగానైనా ప్రభావితం చేయగలరనేది తన నమ్మకం అని, అందుకే తను ఈ ప్రయత్నం చేశానని, మరిన్ని ఇలాంటి ప్రయత్నాలు చేస్తానని ఫ్రాంకోయిస్ అంటాడు. పేరు: ఎరిని-రెనీ గట్సీ, గ్రీస్ డాక్యుమెంటరీ పేరు: డ్రాప్ ఇట్ ఈమె పేరు పలకడానికి మనకు కొంచెం కష్టం కానీ, ఆమె భావాన్ని మాత్రం డాక్యుమెంటరీని చూస్తే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోతోంది, వలసలు ఎక్కువవుతున్నాయి. దీంతో కొన్ని దేశాలకే పరిమితం అయిన భిన్నత్వంలో ఏకత్వం అంతటా ఆవిష్కృతం అవుతుందనే భ్రమల్లో ఉన్నాం కానీ, తమదేశంలోనే జాతుల మధ్య అంతరాలున్నాయని, రేసిజం పుష్కలంగా ఉందని అంటుంది గ్రీస్కు చెందిన ఈ టీనేజర్. మనుషులు అలాంటి జాడ్యాలను వదులుకోవాలని, మనసుంటే అది చాలా సులభమైన విషయం అనే సందేశాన్ని ఇస్తూ ‘డ్రాప్ ఇట్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది రెనీ. భవిష్యత్తులో మానవహక్కులు, మహిళల హక్కులపై అవగాహనను పెంపొందించే పనిలో ఉంటానని, అందులో భాగంగా ఇండియాను ఒకసారి సందర్శించాలనేది తన ప్రణాళిక అని రెనీ వివరించింది. -
మానవ హక్కులపై అవగాహన అవసరం
బళ్లారి అర్బన్, న్యూస్లైన్ : రాజ్యాగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత హక్కులు, వాక్ స్వాతంత్య్ర మౌలిక సూత్రాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సీనియర్ న్యాయవాది, బళ్లారి న్యాయవాదుల సంఘం జిల్లాధ్యక్షుడు పాటిల్ సిద్దారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక బుడా కాంప్లెక్స్లోని మానవ హక్కుల జాగృతి కార్యాలయాన్ని ఆ సంఘం రాష్ట్రధ్యక్షులు సమేతనహళ్లి లక్ష్మణసింగ్ ప్రారంభించిన అనంతరం ఆయన మా ట్లాడారు. భారతదేశంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్, రష్యాలో స్టాలిన్, అమెరికాలో అబ్రహాం లింకన్ తదితరులు రాజ్యాంగంలో వివిధ హక్కులను పొం దుపరిచారన్నారు. ప్రజాస్వామ్యంలో హక్కులను అందరూ పొందే అవకాశం ఉందన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మరవరాదన్నారు. రాజ్యాంగం ప్రకారం ఖైదీలు, నేరస్తులకు ఇలా ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు మానవ హక్కుల జాగృతి సమితి రాష్ట్ర అధ్యక్షుడు సమేతనహళ్లి లక్ష్మణసింగ్ మాట్లాడుతూ 2011 నవంబర్ 1న రాష్ట్ర మానవ హక్కుల సమితిని వ్యవస్థాపకుడు డాక్టర్ ఆనంద్కుమార్, గౌరవాధ్యక్షుడు సుభాష్ భరణి నేతృత్వంలో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ప్రజల్లో మానవ హక్కులపై చైతన్యం కల్పించేం దుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాగృతి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అందుకు ప్రభుత్వంతో పాటు సంఘ సంస్థలు ఎప్పటికప్పుడు తమకు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మానవహక్కుల జాగృతి సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జీ.శ్రీనివాస్, పదాధికారులు చాంద్, నాగరాజు గౌళి, కళమళ్లి వెంకటేష్, శంకర్, జిల్లాధ్యక్షులు లోకేష్, కార్యదర్శి శశిధర్, సహకార్యదర్శి ఎస్.శ్యాంప్రసాద్, జంటి కార్యదర్శి కేధర్నాథ్, జిల్లా మహిళా అధ్యక్షులు గౌసియా, కొప్పళ సమితి రాజాసాబ్ తదితరులు పాల్గొన్నారు.