minimum support price
-
ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ దిశగా అడుగులు!
కనీస మద్దతు ధరల చట్టం... దశాబ్దాలుగా రైతులు కంటున్న కల! ప్రపంచంలో గుండు సూది నుంచి విమానం వరకు ఏ వస్తువు కైనా ధరను నిర్ణయించే అధికారం వాటిని ఉత్పత్తి చేసే వారికే ఉంటుంది. కానీ ఇంటిల్లి పాది రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసే పంటలకు ధరలు నిర్ణయించుకునే అధికారం రైతులకు లేదు. రిటైల్ ధరలలో మూడో వంతు కూడా సాగు దారులకు దక్కని దుస్థితి కొనసాగు తోంది. రైతులు పండించే పంట ఉత్పత్తులపై ఆధారపడి జీవించే దళారులు, టోకు, రిటైల్ వ్యాపారులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వర్గాలు మాత్రం కోట్లు గడిస్తు న్నారు. వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసే కెచప్, మసాలా వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్టులకు ఎమ్మార్పీలు ఉంటాయి. వాటికి ప్రాథమిక ముడి సరుకైన రైతు పండించే పంటలకు ఉండవు. అదే విషాదం!ఏటా పెరుగుతున్న పెట్టుబడులు రైతులకు తలకు మించిన భారంగా మారాయి. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే తెగుళ్లు, పురు గులు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్ మాయాజాలం కారణంగా పంట కోతకొచ్చే నాటికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. పంట సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ డాక్టర్ స్వామినాథన్ కమిటీ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. వాస్తవానికి 23 పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)తో చట్టబద్ధత కల్పించాలనీ, ఈ విషయాన్ని ప్రభుత్వం రైతుల ఆర్థిక కోణంలో చూడాలనీ రైతులు కోరుతున్నారు. అయితే ఇందుకు ఏమాత్రం తలొగ్గని కేంద్రం ఏటా 10–15 పంటలకు మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోంది. ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే కేంద్రంపై ఏటా రూ. 12 లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని నీతి అయోగ్ చెబుతున్న విషయాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి ముఖం చాటేస్తోంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయనం ప్రకారం... డెయిరీ రంగంలో పాడి రైతులు తమ ఉత్పత్తులకు రిటైల్ ధరలలో 60–70 శాతం పొందగలు గుతున్నారు. మాంసం రిటైల్ ధరలో 60 శాతం పొందుతున్నారు. టమోటా రైతులు 33 శాతం, ఉల్లి రైతులు 36 శాతం పొందుతున్నారు. ఇక పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లకు 31 శాతం, మామిడి పండ్లకు 43 శాతం, బత్తాయి, కమల వంటి పండ్లకు 40 శాతం పొందుతున్నారు. మార్కెట్లో కిలో రూ. 50–75 మధ్య పలికే బియ్యం (ధాన్యం) పండించే రైతులకు మాత్రం ఆ ధరలో కనీసం 10–20 శాతం కూడా దక్కని దుఃస్థితి నెలకొంది.రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 77 జాతీయ నమూనా సర్వే వెల్లడిస్తోంది. ఈ సర్వే ప్రకారం దేశంలో సన్నకారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4 వేలకు మించిలేదు. ఆదాయాలు పెరగకపోవడంతో వారి రుణభారంలో తగ్గుదల కనిపించడంలేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక, రుణ భారం తట్టుకోలేక రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు ఏటా పెరుగు తున్నాయి.చదవండి: నీటిలో తేలియాడే రాజధానా?స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గడచిన 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా... కేంద్రం ప్రకటించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడమే కాదు... మార్కెట్లో ధర లేని సమయంలో ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’ కింద మద్దతు ధర దక్కని ఉత్పత్తులను కొను గోలు చేసి మద్దతు ధర దక్కేలా కొంత మేర కృషి చేయగలిగింది ఏపీలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గ్రామస్థాయిలో ఏర్పాటైన ఆర్బీకే వ్యవస్థ, రైతులకు వెన్నుదన్నుగా నిలవగా, వాటికి అనుబంధంగా దాదాపు రూ. 16 వేల కోట్ల అంచనా వ్యయంతో కోల్డ్ స్టోరేజ్లు, కలెక్షన్ రూములు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు బీజం పడింది. మద్దతు ధరల నిర్ణయం, కల్పన, అమలు కోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఏపీ ఫామ్ ప్రొడ్యూస్ సపోర్టు ప్రైస్ ఫిక్సేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టు–2023’కు రూపకల్పన చేసింది. కానీ అధికారుల తీరు వల్ల అసెంబ్లీలో చట్టరూపం దాల్చలేక పోయింది.చదవండి: విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంఏపీ తయారు చేసిన చట్టాన్ని మరింత పకడ్బందీగా జాతీయ స్థాయిలో తీసుకొస్తే రైతులకు ఎంతోమేలు జరుగుతుంది. ఈ విషయంలో జాప్యం చేసే కొద్దీ మద్దతు ధర దక్కని రైతులు వ్యవసాయానికి మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుత వ్యవసాయ దారుల్లో 60 శాతం మంది లోటు ఉత్పాదకత కారణంగా సాగును వదలి వేయాలని నిర్ణయించుకున్నట్లు దేశంలోని 21 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఓ జాతీయ సర్వే సంస్థ ఇటీవల తేల్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ దిశగా అడుగులు వేసి ఈ రంగాన్ని బలోపేతం చెయ్యాలి.- తలకోల రాహుల్ రెడ్డి మార్కెట్ ఎనలిస్ట్, కన్సల్టెంట్ -
కనీస ధరే రైతుకు భరోసా
భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా, దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు ప్రభుత్వాలు రైతులను వదిలేశాయి. శాశ్వత పేదరికం నుండి రైతులను బయటపడేయడానికి ఉన్న ఏకైక ఆమోదయోగ్యమైన మార్గం – కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టాన్ని తేవడమే! చట్టపరమైన కనీస మద్దతు ధర వినియోగదారులపై ధరల భారాన్ని పెంచుతుందనీ, తద్వారా అది మార్కెట్లను దెబ్బతీస్తుందనీ ఆర్థికవేత్తలు భావిస్తుంటారు. అదే కార్పొరేట్లు వినియోగదారులపై ధరల భారాన్ని మోపినప్పుడు మాత్రం వీళ్లు నిశ్శబ్దంగా ఉంటారు. చట్టబద్ధంగా హామీ ఇచ్చే కనీస మద్దతు ధరను అందించడం వ్యవసాయ రంగం ఎదురుచూస్తున్న పెద్ద సంస్కరణ.ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవాన్ని, ఆర్థిక భద్రతను కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దాన్ని పెన్షన్ సంస్కరణ అన్నారు. దేశ ప్రగతికి గణనీయంగా దోహదపడే ప్రభుత్వ ఉద్యోగులందరి కృషిని చూసి గర్విస్తున్నామని కూడా అన్నారు.చివరిగా ఉద్యోగి పొందిన వేతనంలో 50 శాతానికి సమానమైన పెన్షన్కు హామీ ఇచ్చే యూపీఎస్, వాస్తవానికి మునుపటి మార్కెట్ అనుసంధానిత నూతన పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) ప్రభుత్వ ఉద్యోగు లకు మేలు చేయలేదని అంగీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ‘నిర్ధారిత ప్రయోజనపు’ హామీ ఇవ్వడం కోసం, వాళ్లు మార్కెట్ల దౌర్జ న్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా కేంద్ర మంత్రిమండలి పెన్షన్ పథకాన్ని సవరించింది.ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో దేశంలోని రైతులను ప్రశంసించినప్పటికీ తమ పంటలకు హామీ ధరలు ఉండాలని దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ను మాత్రం పట్టించుకున్న నాథుడు లేడు. ఉద్యోగు లకు భరోసా పెన్షన్ అవసరమైనప్పుడు, రైతులకు కూడా భరోసా ధర అవసరమే.ప్రపంచంలో ఎక్కడా మార్కెట్లు రైతులకు అధిక ఆదాయాన్ని అందించడం లేదు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో సబ్సిడీ ఆదాయ అంత రాన్ని భర్తీ చేస్తుంది. వ్యవసాయ రాయితీలను అందించడంలో చైనా అగ్రస్థానంలో ఉంది. భారతదేశం మాత్రం వ్యవసాయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలేసింది. కొన్ని అధ్యయనాలు చెబుతున్నట్టుగా, భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా, దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవి చూస్తున్నారు.శాశ్వత పేదరికం నుండి రైతులను బయటపడేయడానికి ఏకైక ఆమోదయోగ్యమైన మార్గం, వ్యవసాయ ధరలకు హామీ ఇవ్వడం కోసం ఒక చట్టబద్ధమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించడం. కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి హామీ ఇచ్చే చట్టం మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తుందని ఎన్డీయే ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విచిత్రమేమిటంటే, రైతుల విషయానికి వచ్చేసరికి, విధాన నిర్ణేతలు మార్కెట్లు అస్తవ్యస్తం అవుతాయన్న పల్లవిని ఎత్తు కుంటారు. అదే ఉద్యోగుల విషయంలో అంతా బానేవుంటుంది. మార్కెట్ల అస్తవ్యస్త భయం అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది.చట్టపరమైన కనీస మద్దతు ధర వినియోగదారులపై ధరల భారాన్ని పెంచుతుందనీ, తద్వారా అది మార్కెట్లను దెబ్బతీస్తుందనీ ప్రధాన ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు; వాస్తవంలో, ఇది కార్పొ రేట్ల లాభాలను పిండేస్తుంది కాబట్టే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అదే స్వేచ్ఛా మార్కెట్ ప్రబోధక ఆర్థికవేత్తలు అమెరికాలోని కార్పొరేట్లు వినియోగదారులపై ధరల భారాన్ని మోపినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉంటారు. ఇదీ నిజానికి ధరలను వక్రీకరించడం. అందుకే ఇప్పటికే కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్తో సహా 38 రాష్ట్రాలు ఈ ధరల పెరుగుదలను నిషేధించే చట్టాలను తెచ్చాయి. ఉదాహరణకు, కోవిడ్ మహమ్మారి సమయంలో హ్యాండ్ శానిటైజర్ల ధరలను 400 శాతం మేరకు పెంచిన కంపెనీలకు వ్యతిరేకంగా న్యూయార్క్ రాష్ట్రం చర్యలు తీసుకుంది. అయినప్పటికీ చాలామంది మార్కెట్ సమర్థక ఆర్థిక వేత్తలు స్పష్టంగా కనిపిస్తున్న ఈ మార్కెట్ వక్రీకరణలపై జరిగే ఇటువంటి తనిఖీలను సోవియట్ శైలి ధరల నియంత్రణగా పేర్కొంటున్నారు.రైతులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన సమయంలో మార్కెట్కు అనుకూలమైన పక్షపాత దృష్టి పెరుగుతుంది. కానీ కార్పొరేట్లు విని యోగదారుల రక్తమాంసాలను పీల్చివేయడం కోసం ధరలను పెంచి నప్పుడు మాత్రం ఎవరూ మాట్లాడరు. మార్కెట్ వక్రీకరణ అనే ఈ ద్వంద్వ ప్రమాణం రైతులకు జీవన ఆదాయాన్ని అందించే మార్గంలో అడ్డుగా నిలుస్తోంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, మార్కెట్లు రైతుల హామీ ధరలకు అనుగుణంగా వాటికవే సర్దుబాటు చేసుకుంటాయి. కేవలం భావజాలమే దీనికి అడ్డు నిలుస్తోంది.మహమ్మారి తర్వాత ఆహారం, కిరాణా వస్తువుల ధరలు 53 శాతం పెరగడానికి కారణమైన కార్పొరేట్ ధరల పెరుగుదలపై నిషేధం విధించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పిలుపునిచ్చారు. రిపబ్లికన్లు ఆమె వైఖరిని ‘కమ్యూనిస్ట్’ అన్నారు. మితవాద పక్షం ఏదైనా చెప్పనీ... కొందరు ఆర్థికవేత్తలు అంగీకరించినట్లుగా, ధరల పెరుగుదలపై నిషేధం అనేది మంచి ఆర్థిక శాస్త్రం, మంచి రాజకీయం అనే అభిప్రాయాన్ని ఎవరూ తిరస్కరించడం లేదు. ఈ సందర్భంగానే, ఆహార పదార్థాల ధరలను కృత్రిమంగా ఎక్కువగా ఉంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కమలా హారిస్ హామీ ఇచ్చారు.ఉద్యోగుల పెన్షన్ విషయానికి తిరిగి వస్తే, కేంద్ర వ్యయ శాఖ ఈ నిర్ణయాన్ని సమర్థించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయడం ఆసక్తికరం. ఇది ‘ఆర్థికంగా వివేకవంతమైన’ నిర్ణయమనీ, ‘ఇది భవిష్యత్ తరాల పౌరులకు ఆర్థిక కష్టాలను నివారిస్తుం’దనీ పేర్కొంది. ఉద్యోగు లకు ఇస్తున్న హామీ పెన్ష¯Œ పథకానికి ఎవరూ వ్యతిరేకం కాదు. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించగలుగుతున్నప్పుడు, రైతులకు ఆర్థిక భద్రత కల్పించలేకపోవడానికి కారణం ఏదీ లేదు. ఎందుకంటే రైతులు కూడా దేశ ప్రగతికి గణనీయంగా దోహదపడుతున్నారు. వారి నిర్విరామ కృషి వల్లే దేశానికి ఆహార భద్రత ఏర్పడింది.మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాకు చెందిన కమలేశ్ పాటీదార్ అనే రైతు తన పదెకరాల్లోని సోయాబీన్ పంటను దున్నివేసినప్పుడు, అది ఒక గొలుసుకట్ట చర్యను ప్రేరేపిస్తుందని అతను అనుకోలేదు. ఈ సంఘటన తాలూకు వీడియో వైరల్ అయిన కొద్ది రోజులకే, చాలా మంది రైతులు తమ పంటను దున్నేశారని వార్తలొచ్చాయి.సోయాబీన్ ధరల పతనం... అది కూడా, కోత కాలానికి నెలన్నర ముందు ధరలు పడిపోవడం అనేది, రైతులు మంచి ధరను పొందే వరకు పంటను నిల్వ ఉంచుకోవాలని సూచించే మరొక ఆర్థిక నమ్మ కాన్ని పోగొట్టింది. తర్వాతైనా ఎక్కువ ధర వస్తుందనే ఆశతో కమలేష్ పాటీదార్ గత ఏడాది పండించిన పంటను అలాగే నిల్వ ఉంచు కున్నాడు. అది కూడా ఫలించలేదు.సోయాబీన్ ధరలు పన్నెండేళ్ల క్రితపు స్థాయికి పడిపోవడంతో వ్యవసాయ జీవనోపాధి ధ్వంసమైన లక్షలాది మంది రైతులకు ఇది ఆగ్రహం కలిగించింది. కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువగా ఉన్న ధరలు ఉత్పత్తి ఖర్చులకు కూడా సరిపోవు. భవిష్యత్ తరాల రైతులకు మాత్రమే కాకుండా ప్రస్తుత రైతులకు కూడా ఆర్థిక కష్టాలను నివారించే భరోసా ధరల విధానం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురుచూస్తున్నాను.ఆ తర్వాత, టమోటా ధరలు 60 శాతం క్షీణించి, 25 కిలోల పెట్టెకు 300 రూపాయల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయని వార్తలొచ్చాయి. అనంతరం, బాస్మతి బియ్యం ధర క్వింటాల్కు 28 శాతం తగ్గి రూ. 2,500కు చేరుకుందని వార్తలొచ్చాయి. ఇది ఈ సంవత్సరం మాత్రమే జరిగిన ప్రత్యేకమైన ఘటనలు కావు. ఇది దేశం ఏమాత్రం ఆందోళన చెందని బాధాకరమైన వార్షిక ధోరణిగా తయారైంది.అమ్ముకోదగినంత మిగులు ఉన్న రైతులకు చట్టబద్ధంగా హామీ ఇచ్చే కనీస మద్దతు ధరను అందించడం, సన్నకారు రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతులను అందించడం అనేవి వ్యవసాయ రంగం ఎదురు చూస్తున్న పెద్ద సంస్కరణలుగా చెప్పాలి.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
చట్టబద్ధత కోసం తీవ్ర ఒత్తిడి తెస్తాం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సాధన కోసం మోదీ సర్కార్పై తీవ్రమైన ఒత్తిడి తెస్తామని లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ పునరుద్ఘాటించారు. బుధవారం పార్లమెంట్ భవన కాంప్లెక్స్లో రాహుల్ను రైతు సంఘాల నేతలు కలిశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచి్చన 12 మంది రైతునేతల బృందం రాహుల్తో సమావేశమై రైతాంగ సమస్యలపై చర్చించారు. ‘‘ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. పూర్తిస్థాయి సమీక్ష తర్వాతే ఇది ఆచరణ సాధ్యమని చెప్పాం. ఈ విషయమై రైతునేతలతో కాంగ్రెస్ చర్చించింది. ఇక ‘ఇండియా’ కూటమి నేతలతో సమాలోచనల జరిపి ఎంఎస్పీ చట్టబద్ధత కోసం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తాం’ అని భేటీ తర్వాత రాహుల్ చెప్పారు. -
రైతుకు ‘వినియోగ’ ఆసరా!
‘రైతు లేనిదే తిండి లేదు’ అనేది పసలేని నినాదం కాదు. అందుకే వ్యవసాయాన్ని సజీవంగా ఉంచడానికి, ముందుకు తీసుకెళ్లడానికి వినియోగదారుల నిబద్ధత చాలా అవసరం. ఎల్లప్పుడూ ఆహారం చౌకగా ఉండాలని కోరుకునే బదులు, వినియోగదారులు తాము చెల్లించే న్యాయమైన, లాభదాయకమైన ధర రైతులకు మంచి జీవనాన్ని పొందడంలో మద్దతునిస్తుందని గ్రహించినట్లయితే, ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకు ప్రతిఫలంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో అది వారికి సహాయపడుతుంది. వినియోగదారులు ఆహార గొలుసుపై నియంత్రణను క్రమేణా పెంచుకోవడంతో రైతుకూ, వినియోగదారుకూ మధ్య సంబంధం ఇద్దరికీ లాభదాయకం అవుతుంది. తద్వారా అది ఉత్పత్తుల అమ్మకాలలో ప్రతిబింబిస్తుంది. 2016లో ఫ్రాన్స్లో పాల ధరలు పడిపోయినప్పుడు ‘ఎవరు బాస్?’ అనే ఆలోచన వచ్చింది. ఫ్రెంచ్ డెయిరీ రైతులు కష్టాలను అధిగమించడంలో సహాయపడటానికి ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నమే ‘ఎవరు బాస్?’. తర్వాత ఇది తనకుతానుగా ఒక ప్రత్యేకమైన వినియోగదారుల ఉద్యమంగా మారింది, ప్రపంచవ్యాప్తంగా దాని రెక్కలను విస్తరించింది. స్థిరమైన, పునరుత్పత్తి వ్యవసాయ వ్యవస్థలకు దారితీసే ఆరో గ్యకరమైన పరివర్తన దిశగా వ్యవసాయ ఆహార పరిశ్రమ పని చేస్తుందని నిర్ధారిస్తూ, ఫ్రెంచ్ ఆహార సహకార బ్రాండ్గా ‘ఎవరు బాస్’ అనే అవగాహనోద్యమం రైతులకు జీవనాధారంగా ఉద్భవించింది. రైతులకు అధిక ధర ఇవ్వడం మార్కెట్లను కుప్పకూలుస్తుంది అని నమ్మే వారందరికీ, ఇక్కడ నేర్చుకోవడానికి గొప్ప అభ్యాసం ఉంది. ఎల్లప్పుడూ ఆహారం చౌకగా ఉండాలని కోరుకునే బదులు, విని యోగదారులు తాము చెల్లించే న్యాయమైన, లాభదాయకమైన ధర రైతులకు మంచి జీవనాన్ని పొందడంలో మద్దతునిస్తుందని గ్రహించినట్లయితే, ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. మరింతగా క్రమాంకనం చేస్తే, ప్రతిఫలంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహా రాన్ని అందించడంలో అది వారికి సహాయపడుతుంది. వినియోగ దారులు ఆహార గొలుసుపై నియంత్రణను క్రమేణా పెంచుకోవడంతో, ఈ క్విడ్ ప్రోకో (నీకిది, నాకది) సంబంధం మరింత పెరిగింది. ఇది ఆ ఉత్పత్తుల అమ్మకాలలో ప్రతిబింబిస్తుంది. సగటున 31 శాతం పైగా పెరిగింది. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ భారతీయ రైతులు నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఆహార ద్రవ్యోల్బణం పెరుగు తుందని భయపడే ప్రధాన ఆర్థికవేత్తలు, మీడియా, మధ్యతరగతి వారు ఆగ్రహించిన తరుణంలో ఈ క్విడ్ ప్రో కో భావన ప్రాముఖ్య తను సంతరించుకుంది. ఫ్రాన్స్, ఇతర ప్రాంతాలలో వినియోగ దారులు స్వచ్ఛందంగా ఎక్కువ చెల్లిస్తున్నప్పుడు భయాందోళనలను సృష్టించే బదులు, భారత ఆర్థికవేత్తలు పంటలకు సరసమైన ధరను నిరాకరించడం వ్యవసాయ జీవనోపాధిని ఎలా చంపుతుందో గ్రహించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ఈ ప్రయత్నం ఎంత కీలకమో వినియోగదారులకు అవగాహన కల్పించాలి. మొత్తానికి, వినియోగదారులు రైతుల కష్టాల పట్ల సున్నితంగా ఉంటారు. సరైన అవగాహనతో, వారు వినియోగ ప్రవర్తనను సులభంగా మార్చ గలరు. అది మార్కెట్ శక్తులను సైతం మార్చేలా చేస్తుంది. మిగులు ఉత్పత్తి కారణంగా ఫ్రాన్స్లో పాల ధరలు పడిపోయినప్పుడు ఆ పరిణామం ఫ్రెంచ్ పాడి పరిశ్రమ పతనానికి దాదాపుగా దారి తీసింది. పాడి రైతులు షట్టర్లు మూసివేయడం ప్రారంభించడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు పెరి గాయి. ఆ కష్ట సమయాల్లో నికోలస్ చబన్నే. ఒక పాడి రైతు అయిన మార్షల్ డార్బన్ ను కలుసుకున్నాడు. చబన్నే స్థానిక పాడి పరిశ్రమ సహకార సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. వారు రైతు సంఘం దుఃస్థితిని, చుట్టుపక్కల ఉన్న రైతుల బాధలను చర్చించినప్పుడు, రైతులను ఆదుకోవడానికి వినియోగదారులను ఒకచోట చేర్చే ఆలో చన రూపుదిద్దుకుంది. ‘‘ఇది కష్టమని నాకు తెలుసు, కానీ ప్రయత్నించడం విలువైనదే’’ అని నికోలస్ నాతో అన్నారు. ఇలా ‘ఎవరు బాస్?’ అనేది రూపొందింది. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి ఆదుకోవడమే దీని లక్ష్యం. ‘‘మనకు ఆహారం అందించే ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి ఇది అవసరం’’ అని చబన్నే అన్నారు. 2016 అక్టోబర్లో, ఆపదలో ఉన్న 80 కుటుంబాలకు సహాయం చేస్తూ 7 మిలియన్ లీటర్ల పాలను విక్రయించే లక్ష్యంతో పాల కోసం బ్లూ కార్టన్ డిజైన్ ప్యాక్ ప్రారంభమైంది. సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సహాయపడటానికి సోషల్ మీడియాను ఉపయో గించారు. రైతు చేయాల్సిందల్లా ఒక యూరో నమోదు రుసుము చెల్లించి, మంచి పద్ధతుల పట్ల తన నిబద్ధతను ప్రదర్శించడమే! ఇది ప్రారంభమైన ఏడేళ్లలో, ’హూ ఈజ్ ది బాస్’ సంఘీభావ బ్రాండ్ 424 మిలియన్ లీటర్ల పాలను లీటరుకు 0.54 యూరోల హామీతో కూడిన సరసమైన ధరకు విక్రయించింది. అయితే అది మార్కెట్ ధర కంటే 25 శాతం ఎక్కువ. అయినప్పటికీ ఇది నేడు ఫ్రాన్స్లో అత్యధికంగా అమ్ముడవుతున్న పాల బ్రాండ్గా ఉద్భవించింది. పైగా దాదాపు 300 వ్యవసాయ కుటుంబాలకు (వివిధ ఉత్ప త్తుల కోసం సుమారు 3,000 మందికి) ఇది అండనిస్తోంది. మార్కె ట్లో పనిచేసే ధరల వ్యత్యాసాల లాగా కాకుండా, మార్కెట్ ధోరణు లతో హెచ్చుతగ్గులు లేని స్థిరమైన ధరను రైతులు పొందుతారు. ఫ్రాన్స్లో 38 శాతం రైతులు కనీస వేతనం కంటే తక్కువ సంపా దిస్తారనీ, పైగా 26 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవించి ఉన్నారని లెక్క. ఈ పరిస్థితుల్లో ఒక సర్వే ప్రకారం 75 శాతం మంది ప్రజలు తమ కొనుగోలుకు మరికొన్ని సెంట్లు జోడించడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తించడం హర్షించదగినది. ఇది ఉత్పత్తిదారులకు సరస మైన ధరకు హామీ ఇస్తుంది. ఇది పాలతో ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ సంఘీభావ బ్రాండ్ సేంద్రియ వెన్న, సేంద్రియ కాటేజ్ చీజ్, ఫ్రీ–రేంజ్ గుడ్లు, పెరుగు, ఆపిల్ రసం, ఆపిల్ పురీ, బంగాళాదుంపలు, పిండిచేసిన టమోటాలు, గోధుమ పిండి, చాక్లెట్, తేనె, ఘనీభవించిన గొడ్డు మాంసం(గ్రౌండ్ స్టీక్)తో సహా దాదాపు 18 ఉత్పత్తులకు విస్తరించింది. సహకార సంఘం సాగుదారులకు సరసమైన ధరను అందజేస్తున్నప్పటికీ, వారు ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. అవేమిటంటే వంటకాల్లో లేదా పశువుల దాణాలో పామా యిల్ ఉపయోగించకపోవడం, జన్యుపరంగా మార్పు చెందిన పదార్థాలను వాడకపోవటం. సంవత్సరంలో కనీసం 4 నెలల పాటు జంతు వులను మేపడం వంటివి. ఈ భావన ఇప్పుడు జర్మనీ, బెల్జియం, గ్రీస్, ఇటలీ, మొరాకో, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రిటన్, అమెరికాలోని 9 దేశాల వినియోగ దారులకు చేరువవుతోంది. ఇక్కడ ఫ్రెంచ్ మాతృ సంస్థతో లైసెన్సింగ్ ఒప్పందంతో వినియోగదారుల వ్యవస్థలు ఏర్పాటు చేయటం జరిగింది. ఫ్రాన్ ్స తన పండ్లు, కూరగాయల అవసరాలలో 71 శాతం దిగుమతి చేసుకుంటుందని, ఇది స్థానిక ఉత్పత్తిదారుల జీవనోపాధిని దెబ్బతీస్తోందని గ్రహించిన నికోలస్ దేశీయ రైతులకు సహాయం చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ‘‘మేము సుదూర ప్రపంచం నుండి రవాణా చేయకూడదనుకుంటున్నాము. మన స్థానిక ఉత్పత్తిదారులను, వారు ప్రతిరోజూ మన ఇంటి ముంగిట ఉత్పత్తి చేసే ఆహారాన్ని మనం రక్షించుకోవాలి’’ అని ఆయన అన్నారు. స్థానిక ఉత్పత్తిదారులకు సహాయం చేయడానికి, సహకార బ్రాండ్ ఇటీవల తన ఆహార బాస్కెట్లో స్ట్రాబెర్రీ, తోటకూర, కివీ పళ్లను పరిచయం చేసింది. మార్కెట్లు పోటీని తట్టుకునేందుకు అట్టడుగు స్థాయికి దూసు కెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ‘ఎవరు బాస్’ అనే ఆలోచన వారికి కలిసి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ, వ్యవసాయ ఆదాయాలను పెంపొందించే విషయంలో ప్రపంచవ్యాప్తంగా విఫలమైన సాగుదారు లను మార్కెట్లు కలిగి ఉన్నందున, రైతులకు వినియోగదారుల మద్దతుపై చాలావరకు ఈ ‘ఎవరు బాస్’ ఆధారపడి ఉంటుంది. ఫ్రాన్స్లోని 16 మిలియన్ల మంది ప్రజలు సాపేక్షంగా ఎక్కువ ధరలకు కొనుగోళ్లు చేయడం ద్వారా రైతులను ఆదుకోవడానికి ముందుకు వస్తే, నికోలస్ ప్రారంభించిన సంస్థ కచ్చితంగా చాలా ముందుకు వచ్చినట్లే అవుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
Nyay Patra-2024: ఐదు న్యాయాలు.. 25 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో కూడిన ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. యువతకు ఉద్యోగాల కల్పన, నిమ్నవర్గాల సంక్షేమం, సంపద సృష్టి వంటి కీలక హామీలను ప్రకటించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తామని వాగ్దానం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అగ్నిపథ్ పథకం రద్దు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, దేశవ్యాప్తంగా కుల గణన వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీ, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ‘న్యాయ్ పత్ర–2024’ పేరిట 45 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు న్యాయాలను ప్రకటించారు. ఒక్కో న్యాయం కింద ఐదు గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలు ఇచ్చారు. ఐదు న్యాయాలు ఏమిటంటే.. నారీ న్యాయ్ ► మహాలక్ష్మీ పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళకు ఏడాదికి రూ.లక్ష నగదు బదిలీ ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనం ► మహిళ హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘మైత్రి’ అధికారి నియామకం ► మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు కిసాన్ న్యాయ్ ► స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత ► రుణమాఫీ కమిషన్ ఏర్పాటు ► పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు ► రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి, దిగుమతి విధానం ► వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు యువ న్యాయ్ ► కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ ► యువత కోసం ‘అప్రెంటీస్íÙప్ హక్కు చట్టం’. డిప్లొమా చదివినవారికి లేదా 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్కు ఏడాదిపాటు అప్రెంటీస్íÙప్ చేసే అవకాశం. వారికి సంవత్సరానికి రూ.లక్ష సాయం. ► ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం ► గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు ► స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే యువత కోసం రూ.5,000 కోట్ల నిధి శ్రామిక్ న్యాయ్ ► కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టం ► కనీస వేతనం రోజుకు రూ.400. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు ► పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు ► అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు ► ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు రద్దు హిస్సేదారీ న్యాయ్ ► అధికారంలోకి రాగానే సామాజిక, ఆర్థిక కుల గణన ► ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలో 50 శాతం సీలింగ్(పరిమితి) తొలగింపు ► ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు ► జల్, జంగల్, జమీన్పై చట్టబద్ధమైన హక్కులు ► గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తింపు న్యాయ్ పత్రలోని కీలక హామీలు ► సీనియర్ సిటిజన్లు, వితంతువులకు నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ ► రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ ► ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ఆలోచనకు చెల్లుచీటి.. ► పదో షెడ్యూల్ సవరణ. పార్టీ ఫిరాయించిన నేతల లోక్సభ, అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు ► సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకం రద్దు ► అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటా అమలు. ► జమ్మూకశ్మీర్కు, పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ► ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి: రాహుల్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు పరాభవం తప్పదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. 2004లో ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే బోల్తా పడిందని, ఈసారి కూడా అదే పునరావృతం కాబోతోందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలే రూపొందించారని, ఇందులో అక్షరాలను మాత్రమే తాము ముద్రించామని వివరించారు. 99 శాతం మంది ప్రజలు కోరుకున్న అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. అదానీ లాంటి కేవలం ఒకటి, రెండు శాతం మంది బడాబాబులు కోరుకున్న అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని ఎద్దేవా చేశారు. -
పంటలన్నిటికీ ఒకే విధానం సాధ్యమా?
కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని చేస్తున్న రైతుల ఉద్యమం ఇప్పటికీ ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో వారి చర్చలు సఫలం కాలేదు.వారి డిమాండ్లు నెరవేరుతాయా? అన్ని పంటలకూ ఒకే విధానం అమలుచేయడం సాధ్యమేనా అన్నవి తలెత్తే ప్రశ్నలు. ప్రకటించిన 23 పంటలకు కనీస మద్దతు ధరను అమలు చేసినట్టయితే దాని ప్రభావం ఇతర అంశాలపైన, ముఖ్యంగా ఆర్థిక రంగంపైన ఉంటుందన్నది ఒక వాదన. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం కంటే మెరుగ్గా ఉండే విధంగా ‘ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్’ (ధరల స్థిరీకరణ నిధి) ఏర్పాటు చేయాలని కొందరు సూచిస్తున్నారు. దీనివల్ల రైతాంగానికి మంచి మద్దతు అందుతుంది. 2024 రైతు ఉద్యమంలో ఉధృతి తక్కువే. కానీ ప్రశ్నలు ఎక్కువ. మూడు రైతు సంస్క రణ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమం ఆగడం లేదు. కేవలం రెండు రాష్ట్రాల (పంజాబ్, హరియాణా) రైతులే ఇందులో ఎందుకు పాల్గొంటు న్నారు? కేంద్రం చర్చలకు పిలిచిన ప్రతిసారీ డిమాండ్లు ఎందుకు మారుతున్నాయి? అసలు చర్చలు సఫలమయ్యే దిశగా డిమాండ్లు ఉన్నాయా? ఎన్నికల ముందు మొదలైన చలో ఢిల్లీ రైతు ఉద్యమం బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీసేందుకేనన్న విమర్శ మాటేమిటి? ఈ మేరకు ఒక రైతు నేత మాటలతో బయటపడిన వీడియో (మోదీ ప్రతిష్ఠను దించడమే ధ్యేయం అంటూ) మాటేమిటి? నిజానికి రెండేళ్ల నాటి రైతు ఉద్యమమమే చాలా అనుమానాలనే మిగిల్చింది. ఆఖరికి ‘టూల్–కిట్’ సాలెగూడులో కూడా రైతు ఉద్యమం చిక్కుకుంది. రైతు ఉద్యమ మంటే రైతుకు సాయపడాలి. రాజకీయాలకు కాదు. జాతి వ్యతిరేక శక్తులకు అసలే కాదు. ఐదు పంటలకు మద్దతు ధరను ఐదేళ్ల పాటు అమలు చేస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది. మొదట ఒప్పుకున్నట్టే ఒప్పుకున్న రైతు సంఘాలు, పంటల సంఖ్యను పెంచాయి. కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్– ఎంఎస్పీ)కి చట్ట బద్ధత కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోపాటు ఇతర అంశాలపైన ప్రభుత్వం తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ (కొన్ని ప్రాంతాలు)కు చెందిన రైతులు దాదాపు 200 యూనియన్లతో ఢిల్లీపైన దండయాత్రకు సిద్ధ మయిన నేపథ్యంలో, కేంద్రం చర్చలకు సిద్ధమైంది. చండీఘడ్లో నాలుగు దఫాలుగా సాగిన చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. ఎంఎస్పీ ప్రభుత్వాల వ్యవసాయ ధరల నిర్ణయం విధానంలో భాగం. ఇది పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయటానికి నిర్దేశించే ధర. స్వామినాథన్ కమిషన్ కనీస మద్దతు ధరకు సిఫార్సు చేసింది. మొత్తం పంతొమ్మిది వందల పేజీలతో ఐదు నివేదికలు సమ ర్పించింది. కానీ రైతు నేతలు చెబుతున్నట్టు ఎంఎస్పీకి చట్టబద్ధత, లేదా దాని లెక్కింపు సూత్రాల గురించి ప్రతిపాదించలేదు. ఎంఎస్పీ పంట వ్యయానికి 50 శాతం అధికంగా ఉండాలని సూచించింది. రైతు సంఘాలు కోరే 23 పంటలకు ఎంఎస్పీ అమలు కష్టమని నిపుణులు, విశ్లేషకులు మొదటినుంచీ చెబుతున్నారు. ఆ నిర్ణయం ఆర్థిక రంగంపైన చూపించే ప్రభావం నేపథ్యంలో అన్ని పంటలకు ఒకే విధానం సరికాదన్నది బలంగా వినిపిస్తున్న వాదన. ఎంఎస్పీ భద్రత చట్టాన్ని అమలు చేయాలంటే, ప్రభుత్వం ఏటా రూ. 12 లక్షల కోట్లు అదనపు వ్యయాన్ని భరించాలి. అది సాధ్యం కాదని కేంద్రం కూడా చెబుతోంది. ప్రభుత్వం గనక ఎంఎస్పీ ప్రకటించిన 23 పంటలను కొనుగోలు చేసినట్టయితే అనేక అంశాలపైన దాని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఎదుటికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వచ్చాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత కంటే మెరుగ్గా ఉండే విధంగా ‘ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్’(ధరల స్థిరీక రణ నిధి) ఏర్పాటు చేయాలని కొందరు సూచిస్తున్నారు. ఎంఎస్పీ కంటే ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉత్పత్తిలో కొంత భాగాన్ని ప్రొక్యూర్ చేసి రైతులకు న్యాయబద్ధమైన ధరను అందిస్తుంది. దీనివల్ల రైతాంగానికి మంచి మద్దతు అందుతుంది. 2024 రైతు ఉద్యమం 2020 నాటి ఆందోళనకు కొనసాగింపుగా కాకుండా, ఒక వివాదం పొడిగింపుగానే కనిపిస్తోంది. 2020 నాటి ఆందోళన కేంద్రం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకం. వాటిని కేంద్రం 2021లో రద్దు చేసింది. అప్పట్లో ప్రభుత్వం రైతుల డిమాండ్ల మేరకు ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయటానికి అంగీకరించింది. కానీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధతకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ నేటి ఢిల్లీ చలో ఉద్దేశం వేరు. ఆందోళనకు ముందే ఈ అంశం మీద చర్చించటానికి కేంద్రం సిద్ధమైంది. అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలనీ, రైతులకు రుణహామీ, పెన్షన్ సదుపాయాలు కల్పించా లనీ, స్వామినాథన్ కమిషన్ ఫార్ములాను అమలు చేయాలనీ రైతు సంఘాలు కోరుతున్నాయి. లఖింపుర్ హింసలో బాధితులకు న్యాయం చేయాలనీ, 2013 భూస్వాధీన చట్టాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలనీ, 2020–21 ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం అందించాలనీ కూడా కోరుతున్నారు. 2020లో ఈ నిరసనకు భారతీయ కిసాన్ యూనియన్, సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం వహించాయి. ఇప్పుడు వివిధ యూని యన్లు నడిపిస్తున్నాయి. 2020 మాదిరిగా కేంద్రం రైతు సంఘాలను ఢిల్లీలోకి అడుగు పెట్టనీయలేదు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలోనే ఆపేసింది. ఆందోళన నాలుగో రోజున, 63 ఏళ్ల జియాన్ సింగ్ మర ణించారు. రైతుల ఆందోళన సాగుతున్నతీరు, దానికి ఖర్చవుతున్న తీరు, ట్రాక్టర్ల స్థానంలో కోట్లాది రూపాయల విలువైన వాహనాలు అక్కడకు రావటం వంటివి చూస్తుంటే, ఈ ఆందోళనకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చునన్న విమర్శలు ఉన్నాయి. రైతుల ఆందోళన ముసుగులో కొందరు యువకులు ముసు గులు ధరించి భద్రతా సిబ్బంది పైన రాళ్లు విసురుతున్నట్టు తేలింది. హరియాణా పోలీసులు ఆందోళనకారులపైన టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి ‘బలవంతపు చర్యలకు’ పాల్పడటంతో అనేక మంది గాయపడ్డారని రైతు నేతలు ఆరోపించారు. రైతుల, యూట్యూబర్ల సోషల్ మీడియా ఎకౌంట్లను రద్దు చేయటం ద్వారా ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని రైతు నేత సరవన్ సింగ్ పాంథర్ ఆరోపించారు. కేంద్రం మీద నిందంతా మోపుతున్నవారు గమనించవలసిన అంశాలు కూడా ఉన్నాయి. పంజాబ్– హరియాణా సరిహద్దుల్లో రైతు లకు, భద్రతా సిబ్బందికి మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు దఫాలుగా చర్చలు నిర్వహించింది. రైతు నేతలు కేంద్రమంత్రుల మధ్య (ఫిబ్రవరి 8, 12, 15, 18) చర్చలు జరిగాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, వ్యవ సాయశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు జాతీయ రహదారుల మీద కనిపించకూడదు. దానిని రైతులు ఉల్లంఘించారు. ఇంకా చాలా విషయాలలో చట్టాన్ని చేతుల్లోకి తీసు కుంటున్నారు. కాగా 23 పంటలకు ఒకే విధమైన విధానం సాధ్యం కాదని ఎవరైనా అంగీకరించాలి. కొత్తగా మళ్లీ, పాడి రైతుల సమస్యలను ఈ ఆందోళన ఎందుకు పట్టించుకోదన్న ప్రశ్న మొదలయింది. ఇంకా చేపల చెరువుల రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శ కూడా ఉంది. ఇప్పుడు కనీస మద్దతు ధర శాశ్వతంగా ఇవ్వాలని రైతులు చెబుతున్న 23 పంటలు మొత్తం వ్యవసాయంలో 30 శాతం లోపే. మరి మిగిలిన వ్యవసాయోత్పత్తుల మాటేమిటి? ఈ ప్రశ్నకు రైతు నేతల నుంచి సమాధానం రావాలి. ఏమైనా రైతుల సమస్యల పేరుతో రాజకీయ లబ్ధిని పొందాలని కొన్ని బీజేపీయేతర పక్షాలు కోరుకుంటున్నాయి. అందుకు అవి ఎంచుకున్న మార్గం రోడ్ల మీద తేల్చుకోవడం. రైతు సమస్యల పరిష్కారం అంటే రైతులకు చెడ్డపేరు తేవడం కాదు. వారి మీద దారుణ ముద్ర పడేలా చేయడం కాదు. పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net -
ధాన్యం దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లుల్లో ఏడాది కాలంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు పొందడం ద్వారా సర్కారు ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం కలిగించేలా వ్యాపారులు, మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ కనుసన్నల్లో సిండికేట్ అయి తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి బిడ్లు ఆహ్వానించగా క్వింటాల్ ధాన్యం సగటున రూ. 1,950కన్నా తక్కువ మొత్తానికి దక్కించుకునేలా 27 బిడ్లు మాత్రమే దాఖలు కావడం వ్యాపారుల కుమ్మక్కును స్పష్టం చేస్తోంది. కాగా, ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం బిడ్డర్లకు ధాన్యాన్ని అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న పౌరసరఫరాల సంస్థకు దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ప్రక్రియకు పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులు సహకారాన్ని అందించారనే ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. యాసంగిలో 66.84 ఎల్ఎంటీల సేకరణ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్సీఐకి అప్పగించడం... ఎఫ్సీఐ నుంచి ధాన్యం సొమ్మును రీయింబర్స్ చేసుకోవడం అనే ప్రక్రియ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అప్పులు చేయడం... ఎఫ్సీఐ నుంచి డబ్బు తీసుకొని ఆ అప్పులు తిరిగి చెల్లించడం ఈ ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలోనే 2022–23 రబీ (యాసంగి) సీజన్కు సంబంధించి సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 66.84 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కింద రూ. 13,760 కోట్లకుపైగా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేసింది. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించింది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా..లెక్క చూపకుండా.. యాసంగి సీజన్లో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 67 కిలోల ముడి బియ్యం (రా రైస్) ఎఫ్సీఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నిర్ణీత లెక్క ప్రకారం 67 కిలోల బియ్యం రావని, అందువల్ల బాయిల్డ్ రైస్గా అయితేనే మిల్లింగ్ చేస్తామని మిల్లర్లు తేల్చిచెప్పారు. యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు మేరకు సుమారు 12 ఎల్ఎంటీల వరకు బాయిల్డ్ రైస్గా ఎఫ్సీఐకి ఇచ్చారు. మిగతా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు లెక్కలు చూపారు. అయితే నిల్వ ఉన్న ధాన్యంలో మేలు రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వకుండా ఎక్కడికక్కడ బియ్యాన్ని మిల్లర్లు విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సర్కార్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లుల్లో కనీసం 50 ఎల్ఎంటీల ధాన్యమైనా నిల్వ ఉండాలి. కానీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో టాస్్కఫోర్స్, విజిలెన్స్ జరిపిన తనిఖీల్లో ఈ మొత్తంలో ధాన్యం కాగితాల మీదే తప్ప భౌతికంగా లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తప్పిన వేలం మిల్లర్లు నిల్వ ఉంచిన ధాన్యాన్ని వేలం వేయాలని గత ఆగస్టులోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచగా 54 బిడ్లు దాఖలయ్యాయి. అప్పట్లో క్వింటాల్కు కనిష్టంగా రూ. 1,618, గరిష్టంగా రూ. 1,732, సగటున రూ. 1,670 ధర పలికింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ క్వింటాల్కు రూ. 2,060 కాగా రవాణా ఖర్చులు, నిల్వ వల్ల రుణాలపై పెరిగిన వడ్డీ కలిపి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 వరకు అవుతుందని అప్పటి పౌరసరఫరాల కమిషనర్ అంచనా వేశారు. వేలంలో వచ్చే ధరతో పోల్చుకుంటే నష్టం వస్తుందనే కారణంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలు మార్చి మరోసారి అక్టోబర్లో టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ టెండర్లను నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించి మరోసారి ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 25న ఐదుగురు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచి ఇటీవల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. బిడ్ల కనిష్ట ధర రూ. 1,920గా ఉన్నట్లు తెలిసింది. చక్రం తిప్పిన మాజీ సహకార సంస్థ చైర్మన్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినప్పటికీ వేలంలో రాష్ట్రంలో పలుకుబడిగల మిల్లర్లు, కొందరు వ్యాపారులే పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్లోని ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ వేలం ప్రక్రియలో చక్రం తిప్పినట్టుగా పౌరసరఫరాల శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడి గల ఆయన కొత్త ప్రభుత్వంలోనూ తనదైన రీతిలో సిండికేట్ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. క్వింటాల్ ధాన్యం రూ. 2 వేలలోపే ఉండేలా బిడ్డర్లతో రింగ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం ఉందో కూడా సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం వేలం వేసేందుకు ప్రయత్నించింది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 35 ఎల్ఎంటీలు విక్రయించేందుకు సిద్ధమైంది. విజిలెన్స్, టాస్్కఫోర్స్ తనిఖీల నేపథ్యంలో వీలైనంత తక్కువ ధరకు ధాన్యాన్ని దక్కించుకొని ప్రభుత్వానికి ఆ మేరకు డబ్బు చెల్లించడం ద్వారా గండం గట్కెక్కాలనే ధోరణిలో మిల్లర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యం రూ. 2,300 వరకు పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే..వేలం ప్రక్రియలో ముందుకెళ్లడం వల్ల సర్కారు ఖజానాకు రూ. 1,500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా టెండర్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. -
ఇచ్చిన హామీ కోసమే ఇంత పట్టు!
వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే వారు అడుగుతున్నారని అర్థం. ఇంకోలా చెప్పాలంటే... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాత్రమే వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వానికయ్యే ఖర్చు పది లక్షల కోట్ల వరకు ఉంటుందన్నది తప్పు. ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయలనేది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఆర్థికశాస్త్రాన్ని ఆకళింపు చేసుకోవటం దుర్ల భమనీ, అందులోని వ్యవసాయ ఉపాంగం గందరగోళ పరుస్తుందనీ భావించే వ్యక్తి మీరైతే గనుక... కనీస మద్దతు ధరకు ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇవ్వాలన్న రైతుల డిమాండ్ గురించీ, అసలు కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలన్న విషయం గురించీ రెండు వైపుల నుంచి వినవస్తున్న పూర్తి భిన్నాభి ప్రాయాలను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఐసీఆర్ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్) వ్యవసాయ సమాచార విభాగం ప్రొఫెసర్ అశోక్ గులాటీ తనకున్న వృత్తిపరమైన సౌలభ్యం ఆధారంగా కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావనలోకి తెచ్చారు. మొదటిది, భారతదేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో 27.8 శాతం మాత్రమే కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ –ఎంఎస్పీ) వర్తింపు కిందికి వస్తాయి. తత్ఫలితంగా 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే ఎంఎస్పీ వల్ల లబ్ధి పొందుతున్నాయి. అత్యంత వేగంగా 8–9 శాతంతో పుంజుకుంటున్న కోళ్ల పరిశ్రమ, 7–8 శాతంతో దూకుడు మీదున్న మత్స్య పరిశ్రమ, 5–6 శాతంతో పొంగిపొర్లుతున్న పాల ఉత్పత్తి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు ఎంఎస్పీ పరిధిలోకి రావు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా 23 రకాల దిగుబడులకు కనీస మద్దతు ధరను చట్ట పరమైన హామీగా ఇవ్వటం అన్నది ‘రైతు వ్యతిరేక చర్య’ కావచ్చునని గులాటీ అభిప్రాయం. ఎంఎస్పీ అన్నది మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్న సందర్భాలలో ప్రైవేటు వ్యాపారులు పంట దిగు బడులను కొనుగోలు చేయటానికి నిరాకరిస్తారు. ఆ కారణంగా అమ్ముడు కాని వ్యవసాయ ఉత్పత్తులు రైతుల దగ్గర భారీగా మిగిలి పోతాయి. చివరికి ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆ మిగులును కొనుగోలు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. మొదటిది రైతుకు విపత్కరమైనది. రెండోది ప్రభుత్వానికి ఆర్థికపరమైన చిక్కులను తెచ్చిపెట్టి, బడ్జెట్నే తలకిందులు చేసేది. అయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ హిమాన్షు ఈ వాదనను అంగీకరించడం లేదు. వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ... వాస్తవానికి గోధుమ, వరికి తప్ప మిగతా వాటికి మొదటసలు ఎంఎస్పీ అమలే కావటం లేదు. అయినప్పటికీ రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల ఎంఎస్పీకి చట్టపరమైన హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడుగుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇంకోలా చెప్పాలంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం అది! ఎంఎస్పీ అమలు వల్ల కేవలం 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందటానికి కారణం... ఆచరణలోకి వచ్చే టప్పటికి గోధుమ, వరికి తప్ప మిగతా రకాల దిగుబడులకు అది అమలు కాకపోవటమేనని హిమాన్షు అంటారు. వాటికీ అమలయ్యే పనైతే అప్పుడు లబ్ధిదారుల శాతం 30 వరకు, ఇంకా చెప్పాలంటే 40 వరకు పెరగొచ్చు. రెండోది... కోళ్లు, చేపలు, పాడి వంటి కొన్ని పరిశ్రమలు కనీస మద్దతు ధర లేకున్నా అభివృద్ధి చెందుతున్నాయంటే అర్థం పంటలకు అవసరం లేదని కాదనీ, అదొక తూగని వాదన అనీ హిమాన్షు అంటారు. మరీ ముఖ్యంగా, హిమాన్షు అనడం – ఎంఎస్పీ అనేది «ధరల స్థిరీకరణకు ఒక సాధనం అని! నిజానికి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో కనీస మద్దతు ధర సదుపాయం లేని రైతులు చాలా తక్కువ. రెండోది – ఎంఎస్పీ కనుక మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వమే ప్రతిదీ కొనేస్తుందని కాదు. మొదట ఆ రెండు ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించటం వరకు మాత్రమే ప్రభుత్వం ఆ పని చేయవలసి ఉంటుంది. ఒకసారి అలా చేస్తే మార్కెట్ ధరలు వాటంతట అవే పెరుగుతాయి. ఆ దశలో ప్రభుత్వ జోక్యం నిలిచి పోతుందని అంటారు హిమాన్షు. ఎంఎస్పీ అనేది ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీగా ప్రజలలో ఒక భావన ఉందన్న దానిపైన మాత్రం గులాటీ, హిమాన్షు ఇద్దరూ అంగీకరిస్తున్నారు. కనీస మద్దతు ధరను వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీగా వారు భావిస్తున్నారు. ఉదాహరణకు, ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నప్పుడు అది ఆ ప్రజలు పొందుతున్న సబ్సిడీ అవుతుందని హిమాన్షు అంటారు. అలాగే ఇద్దరూ కూడా కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇచ్చేందుకు అయ్యే ఖర్చును అంచనా వేయటం అంత తేలికైన విషయమైతే కాదని అంగీకరిస్తున్నారు. ప్రాంతానికీ ప్రాంతానికీ అంచనాలు మారుతుండటం మాత్రమే కాదు; అప్పటికి ఉన్న మార్కెట్ ధర, ఆ మార్కెట్ ధరకూ – ఎంఎస్పీకీ మధ్య ప్రభుత్వం ఎంత భారీగా వ్యత్యాసాన్ని తగ్గించాలి, ఎంతకాలం ఆ తగ్గింపు కొనసాగాలి అనే వాటి మీద అంచనాలు ఆధారపడి ఉంటాయి. హిమాన్షు మరో అంశాన్ని కూడా లేవనెత్తారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ధరకూ, ప్రభుత్వం అమ్మే ధరకూ మధ్య వ్యత్యాసమే ప్రభుత్వానికి అయ్యే అసలు ఖర్చు అని ఆయన అంటారు. అంటే కనీసం పాక్షికంగానే అయినా ఖర్చు ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇచ్చేందుకు కాగల ఖర్చు పది లక్షల కోట్లు అన్న లెక్క స్పష్టంగా తప్పు. నిజానికి ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయల లెక్క వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలి? ఉత్పత్తి ఖర్చును, అందులో 50 శాతాన్ని లాభంగా కలిపి లెక్కించాలా? అలా చేస్తే ఆహార ద్రవ్యోల్బణం 25 నుంచి 35 శాతం పెరుగుతుందని గులాటీ అంటారు. అంతేకాక బడ్జెట్లో భారీ కేటాయింపులు అవసరమై, ప్రభుత్వ ఆహార పథకం అమలులో ఆర్థికపరమైన సంకట స్థితులు తలెత్తవచ్చు. ప్రముఖ ఆర్థికవేత్త స్వామి నాథన్ అయ్యర్ కూడా 50 శాతాన్ని లాభంగా కలిపి మద్దతు ధర ఇవ్వటం సహేతుకం కాదని అంటున్నారు. ఈ వాదనలతో హిమాన్షు విభేదిస్తున్నారు. ప్రభుత్వం చెబు తున్నట్లు ఇప్పటికే సీ2 (ఉత్పత్తి వ్యయం), అందులో 50 శాతం మొత్తాన్ని కలిపి వరికి, గోధుమలకు కనీస మద్దతు ధరలు వర్తింపజేస్తున్నారు. అయినప్పటికీ గులాటీ భయాలకు దగ్గరలో కూడా ద్రవ్యోల్బణం లాంటిదేమీ లేదని అంటున్నారు. ఇక అయ్యర్ సహేతుకం కాదన్న 50 శాతం లాభం గురించి మాత్రం, కావాలంటే అందులో మార్పులు చేసుకోవచ్చన్నారు. అయితే రైతులకు తగిన ప్రతిఫలం అవసరం. అలా పొందిన ప్రతిఫలాన్ని వారు తిరిగి ఖర్చు చేయటం అన్నది దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ అభివృద్ధి అక్కడితో ఆగదు అంటారు హిమాన్షు. చివరి ముఖ్య విషయం. రైతుల ఆదాయాలను పెంచడానికి ఉత్తమమైన మార్గం... అధిక విలువ గలిగిన పంటల వైవిధ్యానికి వ్యవసాయ ప్రోత్సాహకాలను అందివ్వటం అని గులాటీ అంటారు. దీనికి స్పందనగా హిమాన్షు ఎంఎస్పీని మొత్తం 23 రకాల పంటలకు వర్తింపచేస్తే చాలు వైవిధ్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని అంటున్నారు. ఆయన అనటం... రైతులు వ్యాపారులు కూడాననీ, అందువల్ల ప్రోత్సాహాలను పొందటానికి మొగ్గు చూపుతారనీ!ఇదేమైనా మీకు ఉపకరించిందా? ఉపకరించిందనే భావిస్తాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
fact check: అండగా ఉన్నా ఆర్తనాదాలే..
సాక్షి, అమరావతి: వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని పెద్దలంటారు. దీనినే స్ఫూర్తిగా తీసుకున్న రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇదే సిద్ధాంతంతో లక్షలాది అబద్ధాలు ఆడైనా సరే సీఎం వైఎస్ జగన్ను గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి. అందుకే నిత్యం ఉన్నవీ లేనివీ పోగేసి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం మీద నిరంతరం దుమ్మెత్తి పోస్తున్న ఈనాడు దినపత్రిక కథనాల్లోని అంశాలనే తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు పాచిపోయిన ఆరోపణలనే చేస్తున్నాయి. తాజాగా.. రైతుల మద్దతు ధర విషయంలోనూ వాటి రంకెలు తారాస్థాయికి చేరాయి. రైతులకు అడుగడుగునా అండగా ఉన్నా విపక్షాల ఆర్తనాదాలు మామూలుగా లేవు. ఎందుకంటే.. రైతుకు తాను పండించిన ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 99.5 శాతం తుచ తప్పకుండా అమలుచేస్తున్న ప్రభుత్వంపై నిరంతరం బురద జల్లుతూ ఈనాడు అబద్ధాలను అచ్చేస్తోంది. ఈ క్షుద్ర పత్రిక రాసిన అంశాలనే పట్టుకుని కొందరు అవగాహన, అర్థంపర్థంలేకుండా అదే పనిగా ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. మార్కెట్లో జోక్యంతో రైతులకు మేలు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేయడమే కాదు సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మద్దతు ధర దక్కేలా సీఎం జగన్ సర్కారు చేస్తోంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తితో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కని ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ వంటి పంటలకు దేశంలో మద్దతు ధర ప్రకటించడమే కాదు..ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూసింది. ఉదా.. మిరపకు రూ.7వేలు, పసుపుకు రూ.6,850, ఉల్లికి రూ.770, చిరుధాన్యాలకు రూ.2,500, అరటికి రూ.800, బత్తాయికి రూ.1,400 వచ్చేలా చూస్తోంది. మద్దతు ధర కల్పనకు పంచసూత్రాలు.. మద్దతు ధర కల్పించే విషయంలో ధాన్యంతో సహా పంట ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారానే రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం, కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వడం, నాణ్యతకు పెద్దపీట వేయడం, నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలను నిక్కచ్చిగా అమలుచేస్తూ విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇలా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈ ఏడాది కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా కన్పించడంలేదు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పడిపోయినపుడు ఈ రకమైన భరోసా ఇవ్వడంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. చంద్రబాబు హయాంలో రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఐదేళ్లలో ఏ ఒక్క బడ్జెట్లోనూ పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించిన పాపాన పోలేదు. గతంలో అరకొరగా ధాన్యం సేకరణ.. నిజానికి.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ గతంలో సేకరణ కేంద్రాలకే పరిమితం అయ్యేది. అవికూడా అరకొరగానే ఉండేవి. దీన్ని పూర్తిగా మారుస్తూ నేరుగా ఫాంగేట్ వద్దే ఆర్బీకేల పర్యవేక్షణలో రైతుల భాగస్వామ్యంతో ధాన్యం కొనుగోలు ఈ ప్రభుత్వంలో హయాంలోనే జరుగుతోంది. రైస్మిల్లు ఎంపికలో మిల్లర్లను సంప్రదించాల్సిన అవసరంలేకుండా చేసింది. కొనుగోలు కేంద్రం వారే బ్యాంకు గ్యారంటీ లభ్యత, ధాన్యం రకం, మిల్లు లక్ష్యము, మిల్లు దూరం వంటి అంశాల ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో ఎంపిక చేసి రవాణా చేస్తోంది. బాబు కంటే రెట్టింపు కొనుగోలు.. ఇక పంట ఉత్పత్తుల కొనుగోలు విషయానికి వస్తే టీడీపీ తన ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. సీఎం వైఎస్ జగన్ హయాంలోని ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేసింది. అంటే.. రెట్టింపు కన్నా అధికం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పోనీ ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే అదీలేదు. టీడీపీ ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు క్షేత్రాల నుంచి ఆర్బీకేల ద్వారా 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.65 వేల కోట్లు చెల్లించింది. టీడీపీ హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు వెచ్చిస్తే, ఈ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది. అంటే.. సగటున ఏడాదికి చంద్రబాబు హయాంలో రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. అంటే.. బాబు ఐదేళ్లతో పోలిస్తే ఈ 57 నెలల్లో రెట్టింపు విలువైన పంట ఉత్పత్తులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ‘జీఎల్టీ’ భరిస్తున్న ఏకైక ప్రభుత్వం.. మరోవైపు.. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలుకు అయ్యే జీఎల్టీ (గన్నీ బ్యాగ్లు, లేబర్, ట్రాన్స్పోర్టు) ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా ఛార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. ఇక గోనె సంచుల, హమాలీ, రవాణా చార్జీలకు సంబందించి 2022–23 పంట కాలానికి 15,74,285 మంది రైతుల ఖాతాలకు రూ.237.11 కోట్లు జమచేయగా, ఖరీఫ్ 2023–24 పంట కాలానికి సంబంధించి ఇప్పటివరకు 6,83,825 మంది రైతుల ఖాతాలకు రూ.91.47 కోట్లు జమచేశారు. గతంలో ఈ పరిస్థితిలేదు. ఇలా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల (జీఎల్టీ) రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, గతంలో రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. అవి సరిపడా దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనికి చెక్ పెట్టింది. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, పీఎస్ఏలు రైతులకు గోనె సంచులను సమకూరుస్తున్నాయి. పైగా.. సేకరించిన ధాన్యాన్ని గతంలో రవాణా అనేది గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేవు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని ఏజెన్సీలను, రవాణాదారులను నియమించింది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సజావుగా కొనుగోలు చేసిన ధాన్యం రవాణా కొనసాగుతోంది. ఇంత చేస్తున్నా దీన్ని మొక్కుబడిగా కొనుగోలు, నామమాత్రపు కొనుగోలు అంటారా? ధరల స్థిరీకరణ ద్వారా మద్దతు ధర కల్పన విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. -
మద్దతు ఇవ్వడమే శాశ్వత పరిష్కారం
యూరప్లో కనివిని ఎరుగని వ్యవసాయ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించి, రొమేనియా, నెదర్లాండ్స్, పోలండ్, బెల్జియం దేశాలను కూడా తాకాయి. మరోవైపు దేశంలో పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు తమ నిరసన ప్రదర్శన కోసం ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవసాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలు కావని ఐరోపా అనుభవాలు చాటుతున్నాయి. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫలమయింది. అందుకే భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను కోరుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయదారుల నిరసనలు ఫ్రాన్స్లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించాయి. అక్కడ కోపోద్రిక్తులు అయిన రైతులు బెర్లిన్ ను దాదాపుగా స్తంభింపజేశారు. ఇప్పుడు మళ్లీ ఈ నిరసన ఫ్రాన్స్కు తిరిగి వచ్చింది. ఆగ్రహించిన రైతులు ప్యారిస్ను ట్రాక్టర్లతో ముట్టడిస్తామని హెచ్చరించారు. వ్యవసాయదారుల ప్రకంపనలు రొమేనియా, నెదర్లాండ్స్, పోలాండ్, బెల్జియంలకు కూడా విస్తరించాయి. స్పానిష్ రైతులు కూడా నిరసనల్లో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతులు ట్రాఫిక్ని అడ్డుకుని ప్రభుత్వ భవనాలపై పేడ చల్లుతున్నారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, సభ్య దేశాలలో వ్యవసాయ సమాజంలో పెరుగుతున్న నిరుత్సాహాన్ని, నిరాశను గుర్తించడం ద్వారా బ్రస్సెల్స్లోని యూరోపియన్ పార్లమెంట్లో చర్చను ప్రారంభించారు. ‘ఎటువంటి ప్రశ్న లేకుండా, సవాళ్లు పెరుగుతున్నాయని మేము అందరం అంగీకరిస్తాము. విదే శాల నుండి పోటీ కావచ్చు, స్వదేశంలో అధిక నియంత్రణ కావచ్చు, వాతావరణ మార్పు కావచ్చు లేదా జీవవైవిధ్యం కోల్పోవడం... పేర్కొనడానికి ఇవి కొన్ని అంశాలు’ అని ఆమె అన్నారు. కానీ సమస్యలను ప్రస్తావించడంలో ఆమె విఫలమైన విషయం ఏమిటంటే... రైతులకు భరోసా ఇవ్వకపోవటం, సరైన ధరను నిరాకరించడం పైనే ప్రధానంగా రైతుల ఆగ్రహం ఉంటోందని. ఉక్రెయిన్ (లేదా ఇతర ప్రాంతాల) నుండి వస్తున్న దిగుమతులు ధరలు తగ్గడా నికి కారణమయ్యాయి. అలాగే అనేక దశాబ్దాలుగా వ్యవసాయ వాహ నాలకు ఇస్తున్న డీజిల్ సబ్సిడీని ఉపసంహరించుకున్నారు. వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ ఆదాయం క్రమంగా క్షీణించడం. ‘మాకు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. మా ఉత్పత్తులు విలువైనవి, అవి మంచి ధరలకు విక్రయం అవాలని మేము కోరుకుంటున్నాము’ అని ఆగ్రహించిన ఒక బెల్జియన్ రైతు చెప్పాడు. వీటన్నింటికీ నిరసనగా వేలాది ట్రాక్టర్లతో ముట్టడించడానికి యూరోపియన్ రైతులను నడిపిస్తున్న నిరాశను ఆయన క్రోఢీకరించాడు. ‘మేము చనిపోవడానికి మాత్రమే ఇక మిగిలి ఉన్నాము’ అని మరొక బెల్జియన్ రైతు వ్యాఖ్యానించాడు. ఫ్రాన్ ్స రైతులలో మూడింట ఒకవంతు మంది కేవలం నెలకు 300 యూరోల (సుమారు రూ. 27,000)తో జీవిస్తున్నారనీ, ఎంపీల భత్యాలను మరో 300 యూరోలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నారనీ ఒక ఫ్రెంచ్ ఎంపీ ఇటీవల అన్నారు. రైతులు నిరసనల తరుణంలో ఎంపీ లకు భత్యాల పెంపుపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి వాటిని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. జర్మనీలో 2016–23 సంవ త్సరాల మధ్య, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని వ్యవసాయ ఆర్థిక బారోమీటర్ సూచిక చూపిస్తోంది. రొమేనియాలో నికర వ్యవసాయ ఆదాయం 2023లో 17.4 శాతం క్షీణించింది. ఈ పరిస్థితి యూరప్కే పరిమితం కాదు. ‘వారు మమ్మల్ని ప్రపంచ పటం నుండి తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అమెరికాలోని చిన్న రైతులను ఉటంకిస్తూ వచ్చిన మీడియా నివేదిక లను ఇది నాకు గుర్తు చేస్తోంది. అమెరికాలో గ్రామీణ ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే 3.5 రెట్లు అధికంగా ఉండటంతో, వ్యవసాయ మాంద్యంలో పెరుగుతున్న ఆటుపోట్లను పరిష్కరించడం జాతీయ సమస్యగా మారుతోంది. భారతదేశంలో 2022లో 11,290 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు పట్ల మార్కెట్లు అవగాహనతో ఉన్నట్లయితే రైతులు ప్రపంచ వ్యాప్తంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనేవారు కాదు. ఇంకా, వ్యవ సాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే బదులు, వ్యవసాయం నుండి రైతులను తప్పించడానికి యూరోపియన్ దేశాల ప్రభుత్వాలకు వాతావరణ మార్పు ఉపయోగపడుతోంది. ‘రైతుల నిరసనలు సమర్థనీయమైనవే’ అని రొమేనియా ప్రధాన మంత్రి మార్చెల్ చొలాకూ అంగీకరించారు. కొత్తగా నియమితులైన ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియేల్ అటల్ తమ ప్రభుత్వం ‘వ్యవసాయాన్ని అన్నింటికంటే ఉన్నత స్థాయిలో ఉంచాలని’ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి డీజిల్ సబ్సిడీని ఒకేసారి రద్దు చేయడానికి బదులుగా దశలవారీగా తొలగించాలని జర్మనీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ హామీలు ఉన్నప్పటికీ, రైతులకు భరోసాగా ఆదాయాన్ని అందించడంలో మార్కెట్ల వైఫల్యం, వ్యవసాయ రంగంలో పెరుగు తున్న నిరుత్సాహం వెనుక ఉన్న అసలు విలన్ను యూరోపియన్ నాయకులెవరూ ఎత్తి చూపలేకపోయారనేది వాస్తవం. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవ సాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయం అయివుంటే, ఐరోపా ఇప్పుడు దశాబ్దంగా ఎక్కడో ఒకచోట పునరావృతమౌతున్న రైతుల అశాంతిని ఎదుర్కొనేందుకు ఎటువంటి కారణమూ లేకపోయేది. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫల మయిందని ఇప్పుడు స్పష్టంగా చెప్పాలి. వ్యవసాయ ధరలను తక్కువగా ఉంచడం ద్వారా ఆర్థిక సంస్కరణలను ఆచరణీయంగా ఉంచడానికి రూపొందించిన స్థూల ఆర్థిక విధానాలు ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉన్నా యని ఇది చూపిస్తుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడంపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, ద్రవ్యోల్బణం యొక్క నిజమైన చోదక శక్తులైన గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచబడ్డాయి. అది స్థూల ఆర్థిక వంచన. రైతులు తరచుగా ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం శాశ్వత పరిష్కారం కాదని స్పష్టంగా అర్థమైంది. 2020–22లో సంవత్సరానికి 107 బిలియన్ డాలర్ల భారీ మద్దతును గుమ్మరించినప్పటికీ (ఏదేమైనప్పటికీ, సబ్సిడీలు, ప్రత్యక్ష ఆదాయ మద్దతును అత్యధికంగా స్వీకరించే వారిలో యూరోపియన్ రైతులే ఎక్కువగా ఉన్నారు) వ్యవసాయ జనాభాను చెక్కుచెదరకుండా ఉంచడంలో విఫలమయ్యారు. 2023లో యూరోపియన్ వ్యవసాయ నిరసనల కోపాన్ని కూడా అది తగ్గించలేదు. 2024 ప్రారంభం ఆందోళన విస్తరిస్తున్నట్లు, ఇంకా తీవ్రతరం అవబోతున్నట్లు కనిపిస్తోంది. భారతదేశంలోని రైతు సంఘాల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుండటం ఇక్కడే నేను చూస్తున్నాను. ప్రోత్సాహకాల కోసం అడగడానికి బదులుగా, భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను కోరుతున్నారు. కనీస మద్దతు ధరని రూపొందించే ఫార్ములాకు పునర్విమర్శ అవసరం అయినప్పటికీ, మార్కెట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే, వ్యవసాయ జనాభా త్వర లోనే అంతరించిపోతుందని యూరోపియన్ రైతులు అర్థం చేసు కోవాలి. వ్యవసాయాన్ని ఆచరణీయమైనదిగా మార్చడానికి, వ్యవ సాయ ధరలకు కచ్చితమైన హామీ ఇస్తూ, నిర్దేశిత ధర కంటే తక్కువ కొనుగోళ్లకు అనుమతి లభించకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం. హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధరలు మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తాయని ప్రధాన ఆర్థికవేత్తలు వాదిస్తారు. మార్కెట్లు సర్దుబాటు అవుతాయి, ఆ పేరుతో రైతులకు జీవన ఆదాయాన్ని తిరస్కరించ లేము. ధర విధానాలలో చరిత్రాత్మక దిద్దుబాటుకు ఇది సమయం. ఏ రైతూ బాధను అనుభవించకుండా లేదా అతని జీవితాన్ని బలవంతంగా ముగించకుండా ఇది నిలుపుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఇక రైతులకు మంచిరోజులేనా?
రైతులను శాశ్వత పేదరికంలో ఉంచిన ప్రధాన స్రవంతి ఆర్థిక ఆలోచనల నుండి బయటపడటానికి ప్రస్తుత రాజకీయాలు పోరాడుతున్నాయి. అనేక దశాబ్దాలుగా, ప్రధానమైన ఆర్థిక ఆలోచన ఏమిటంటే, పంటల ధరలను తక్కువగా ఉంచడమే! దీనివల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని దీని భావం. ఆర్థికవేత్తలతో సంబంధం లేకుండా, ఇప్పుడు రాజకీయ పార్టీలు రైతు సమాజం కోసం అదనపు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తీవ్ర సంక్షోభం నుండి వ్యవసాయాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందనీ, అధిక భరోసాతో కూడిన ఆదాయాన్ని అందించడమే కీలకమనీ పార్టీలు గ్రహించాయి. రైతుల చేతిలో ఎక్కువ డబ్బు ఉండడం అంటే, గ్రామీణ భారతం వ్యయం చేసే సామర్థ్యం పెరుగుతుందని అర్థం. కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కావాలంటూ పంజాబ్, హరియాణా రైతులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో అయిదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, వ్యవసాయ పంటలకు అధిక ధరను అందజేస్తామనే హామీతో రైతులను ఆకర్షించడానికి బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఏర్పడింది. ఇది 2024 సార్వత్రిక ఎన్నికలకు కొత్త నమూనాను సృష్టిస్తోంది. దేశంలో 14 శాతం మంది రైతులు మాత్రమే ధాన్య సేకరణ ధరల ప్రయోజనాన్ని పొందుతున్నారు కాబట్టి, కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఒక చట్రాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే, వ్యవసాయాన్ని శాశ్వత పేదరికంలో ఉంచిన ప్రధాన స్రవంతి ఆర్థిక ఆలోచనల నుండి బయటపడటానికి ప్రస్తుతం రాజకీయాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. అనేక దశా బ్దాలుగా, ప్రధానమైన ఆర్థిక ఆలోచన ఏమిటంటే, వ్యవసాయ ధరలను తక్కువగా ఉంచడమే! ఇలా చేయడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని దీని భావం. రైతులు పేదలుగా ఉండ టానికి ఇదే ప్రధాన కారణం. ప్రపంచంలోని అత్యంత సంపన్న వాణిజ్య కూటమి అయిన ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) చేసిన ఇటీవలి అధ్యయనం, భారతీయ రైతులపై 2000వ సంవత్సరం నుండి నిరంతరం పన్ను విధించబడుతోందని నిశ్చయాత్మకంగా చూపింది. ప్రబలంగా ఉన్న వ్యవసాయ సంక్షోభానికి మూలకారణం స్పష్టంగా మన ముందుంది. 54 దేశాలలో సాగిన ఈ అధ్యయనం ప్రకారం, రైతులు ‘ప్రతికూల జోన్’లో ఉన్న దేశాలు కొన్ని ఉన్నప్పటికీ, బడ్జెట్ మద్దతు ద్వారా నష్టాన్ని పూడ్చడానికి భారతదేశంలో మాత్రమే ఎటువంటి ప్రయత్నం జరగలేదని తేలింది. సరళంగా చెప్పాలంటే – ఇరవై సంవత్సరాలుగా, భారతీయ రైతులు ఏ సహాయమూ అందని కఠిన పరిస్థితుల్లో మిగిలి పోయారు. ఆర్థిక సంస్కరణలను ఆచరణీయంగా ఉంచడానికి వ్యవ సాయాన్ని త్యాగం చేయాలని విశ్వసించే ప్రధాన ఆర్థిక ఆలోచనకు ఇది సరిగ్గా సరిపోతుంది. 50 శాతం లాభ మార్జిన్తో ‘వెయిటెడ్ ధర’ను లెక్కించడం ద్వారా, రైతులకు కనీస మద్దతు ధరను (సాంకే తికంగా దీనిని ‘సీ2+50 శాతం’ అంటారు) చెల్లించాలనే ‘ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్’ సిఫార్సును తూట్లు పొడవడంలో అదే ఆధిపత్య ఆలోచనా ప్రక్రియ పనిచేసింది. ‘సీ2+50 శాతం’ ఫార్ములా ఆధారంగా రైతులకు ధరను అందించడం సాధ్యం కాదనీ, అది ‘మార్కెట్లను వైకల్యపరుస్తుంద’నీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్, కాలం చెల్లిన అదే ఆర్థిక ఆలోచనల ఫలితమే. అయితే, ప్రధాన ఆర్థికవేత్తలు ఏం చెబుతున్నారనే దానితో సంబంధం లేకుండా, ఇప్పుడు రాజకీయ పార్టీలు కష్టాల్లో ఉన్న రైతు సమాజం కోసం అదనపు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తీవ్ర సంక్షోభం నుండి వ్యవసాయాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందనీ, అధిక భరోసాతో కూడిన ఆదాయాన్ని అందించ డమే కీలకమనీ పార్టీలు గ్రహించాయి. 2020–21లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల విశిష్టమైన నిరసన వారి కళ్ళు తెరిపించింది. అంతే కాకుండా ఆహారాన్ని పండించే రైతులకు ఇకపై జరిమానా విధించడం కుదరదని వారికి అర్థమైంది. ఛత్తీస్గఢ్లో వరి సేకరణ ధర ఇప్పటికే క్వింటాల్కు రూ. 2,640 (2023 మార్కెటింగ్ సీజన్లో కొనుగోలు ధర రూ. 2,183 కాకుండా) ఉన్న చోట, కాంగ్రెస్ మొదటగా దానిని రూ.3,200కి పెంచడం ఆసక్తికరం. ఎకరాకు కనీసం 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఎకరాకు 21 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తూ, క్వింటాల్కు రూ.3,100 చొప్పున చెల్లిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అదే విధంగా మధ్యప్రదేశ్లో గోధుమలకు కాంగ్రెస్ అందించే ధర క్వింటాల్కు రూ. 2,600 కాగా, బీజేపీ రూ. 2,700లను ప్రతిపాదించింది. రాజస్థాన్లో, ‘సీ2+50 శాతం’ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధర చెల్లిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. అలాగే, తెలంగాణలో రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతుగా రూ. 15,000 అందజేస్తామని హామీ ఇచ్చింది. ఆశ్చర్యకరంగా, 2006లో సమర్పించిన స్వామినాథన్ ప్యానెల్ సిఫార్సులను అమలు చేయడంలో ఇరుపక్షాలూ నిరాసక్తులైనప్పటికీ, ఎన్నికల రాష్ట్రాల్లో వాగ్దానం చేసిన వరి, గోధుమ ధరలు ‘సీ2+50 శాతం’ ఫార్ములా ధరకు సమానంగా లేదా మించి ఉన్నాయి. ఈ ఎన్నికల వాగ్దానాలు నెరవేరుతాయా లేదా అని చాలామంది ఆలోచిస్తుండగా, కనీసం వ్యవసాయ ధరలనైనా ప్రకటించాలనే పోటీ కారణంగా, రాజకీయ నాయకులు రైతు సమాజం బాధలను, వేదనను గ్రహించడం ప్రారంభించినట్లు అర్థమవుతోంది. కాగా, అధిక ధరలను ప్రకటించడం వెనుక ఉన్న ఆర్థిక హేతు బద్ధతను ఇప్పటికే అనేక ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు ప్రశ్నించడం ప్రారంభించారు. అదనపు వనరులు ఎక్కడి నుంచి వస్తాయని కూడా అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నల హోరు మరింత పెరుగుతుంది. విచిత్రమేమిటంటే – అదే ఆర్థిక ఆలోచన గత 10 సంవత్సరాలలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల కార్పొరేట్ మొండి బకాయిలను మాఫీ చేయడంలోని హేతుబద్ధతను ఎన్నడూ ప్రశ్నించలేదు. అలాగే 16,000 మందికి పైగా ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు రుణాలు అందించడంలో బ్యాంకులను రాజీపడేలా చేసే ఆర్థిక శాస్త్రంలోని తప్పును ఈ ఆర్థిక ఆలోచన కనుగొనలేదు. రూ. 3.45 లక్షల కోట్ల బకాయిలను ఎగవేతదారులు దాటేసి పోవడంలోని తప్పును ఇది గుర్తించలేదు. మార్కెట్లు సమర్థతను, మంచి పనితీరును మెచ్చు కుంటున్నట్లయితే, పనితీరులో విఫలమైన కంపెనీలను బెయిల్ అవుట్ చేయడానికి ఎటువంటి ఆర్థిక కారణం లేదు. అందువల్ల, పంటలకు అధిక ధరలు అందించే నిబద్ధత దేశ వ్యాప్తంగా ఎందుకు విస్తరించడం లేదని రైతులు అడగడం సరైనదే! 14 శాతం మంది రైతులు మాత్రమే సేకరణ ధరల ప్రయోజనాన్ని పొందుతున్నారు కాబట్టి, కనీస మద్దతు ధరల కోసం ‘సీ2+50 శాతం’ వద్ద చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందించాల్సిన అవసరం ఉంది. తద్వారా మిగిలిన 86 శాతం వ్యవసాయ జనాభాకు హామీ ధరలు చేరేలా చూసుకోవాలి. దీనితో పాటుగా భూమిలేని రైతుల కోసం ‘పీఎం–కిసాన్’ ఆదాయ మద్దతును పెంచాలి. రైతుల చేతిలో ఎక్కువ డబ్బు ఉండడం అంటే గ్రామీణ భారతం వ్యయం చేసే సామర్థ్యం ఎక్కువ అవుతుందని అర్థం. పైగా అది జీడీపీని ఉన్నత పథంలో నడిపిస్తుంది. రాజకీయ పార్టీలు దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారి వాగ్దానాల నుండి వెనక్కి వెళ్ళడానికి ప్రధాన శ్రేణి శక్తులు చేసే అరిగిపోయిన వాదనలను అనుమతించకూడదు. ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విశిష్ట ఆర్థికవేత్త ప్రొఫెసర్ జేమ్స్ కె గాల్బ్రైత్ మాట్లాడుతూ, ‘విద్యా, రాజకీయ, మీడియా గుత్తాధిపత్యాన్ని’ అట్టి పెట్టుకోవడానికి ప్రధాన స్రవంతి తరగతి తీవ్రంగా పోరాడుతోందనీ, తాజా ఆర్థిక ఆలోచనలు పెరగడాన్ని అది ఏమాత్రం అనుమతించదనీ చెప్పారు. భారతదేశంలోనూ అలా జరగడం మనం చూస్తున్నాం. 1970లు, 1980ల ప్రారంభంలో శిక్షణ పొందిన నేటి ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు చాలా మంది, ముందే నిర్ధారించుకున్న ఆలోచనలు, సిద్ధాంతాలతో వస్తారు అని కూడా గాల్బ్రైత్ అన్నారు. ఆయన ప్రకారం, ‘‘ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు బహుశా వారి ప్రధాన నమ్మ కాలను పునఃపరిశీలించుకోవాలి. లేదా బహుశా మనకు కొత్త ‘ప్రధాన స్రవంతి’ అవసరం కావచ్చు.’’ దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
మద్దతు పెరగాల్సిన రంగం
రబీ పంటల పెంపు ధరలు 2 నుంచి 7 శాతం పరిధిలో ఉన్నాయి. 2022–23 సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం పెరుగుదల దాదాపు 7.6 శాతం. అంటే కనీస మద్దతు ధరలో పెంపుదల, ద్రవ్యోల్బణం రేటును కూడా సమీపించడం లేదు. పైగా ధాన్య సేకరణ ఎక్కువగా గోధుమలు, వరికే పరిమితం అయినందున, కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని పొందే రైతుల శాతం సంవత్సరాలుగా 6 శాతం నుండి 14 శాతానికి మాత్రమే పెరిగింది. 86 శాతం మంది రైతులు ఇప్పటికీ తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమ్ముకోవలసి వస్తోంది. పైగా, కనీస మద్దతు ధరలో పెంపుదల ఇంకా ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగానే ఉంటోంది. అందుకే ధరలకు సంబంధించి వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. 2018లో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ ఒక ఎపిసోడ్లో, నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఒక చిన్న రైతు తన దుఃస్థితి గురించి చెప్పినప్పుడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చెవులను తానే నమ్మలేక పోయారు. వ్యవసాయం ద్వారా ఎంత సంపాదిస్తున్నారని అమితాబ్ అడిగిన ప్రశ్నకు ఆ రైతు, ‘‘సంవత్సరానికి రూ. 60,000 కంటే ఎక్కువ సంపాదించడం లేదు. దానిలో సగం డబ్బు విత్తనాలు కొనడానికే పోతోంది. నేను నా కుటుంబానికి రాత్రి భోజనం మాత్రమే అందించగలుగుతున్నాను’’ అని బదులిచ్చారు. ఆ రైతు సమాధానం విని అమితాబ్ నివ్వెరపోయారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, దేశ రైతులను ఆదుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అప్పటి నుండి గ్రామీణ మహారాష్ట్రలో నిరాశ మరింతగా పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య కాలంలో 1,809 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తా కథనాలు చెబుతున్నాయి. గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువే అయినప్పటికీ సగటున రోజుకు ఏడుగురు రైతులు తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల్లో యాభై శాతం పత్తి పండించే ప్రాంతంలోనే నమోదయ్యాయి. రైతులకు జాక్పాటేనా? శీతాకాలపు పంటల కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)ల్లో ఇటీవలి పెంపుపై మీడియాలో వస్తున్న వార్తల్లోని ఉత్సాహం నన్ను ఆ దిశగా ఆలోచించేలా చేసింది. ఇది రైతులకు ‘జాక్పాట్’ లేదా ‘అదనపు వరం’ అని ప్రశంసిస్తున్నారు. కానీ ఇది కష్టాల్లో ఉన్న రైతులకు ఏదైనా సహాయం అందజేస్తుందా అనేది ప్రశ్న. ధరల పెంపుదల పెరుగు తున్న నిరాశను ఆశాజనకంగా మార్చే అవకాశమైతే కనిపించడం లేదు. ముందుగా, ప్రకటించిన కనీస మద్దతు ధర పెరుగుదల పరిమాణాన్ని చూద్దాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పైగా 2024 లోక్సభ ఎన్నికల సమయా నికి రబీ పంటల కోతలు జరగనున్నాయి. రబీ పంటల ధరల పెంపు 2 నుంచి 7 శాతం పరిధిలో ఉన్నాయి. 2022–23 సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం పెరుగుదల దాదాపు 7.6 శాతం. అంటే, కనీస మద్దతు ధరలో పెంపుదల అనేది, ద్రవ్యోల్బణం రేటును కూడా సమీపించడం లేదు. పైగా, రైతులకు ‘జాక్పాట్’ లేదా ‘అదనపు వరం’ అంటూ చేస్తున్న వర్ణన వాస్తవానికి క్షేత్ర వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయడం పైనే ఆధారపడి ఉంది. ప్రతి పంట సీజన్లోనూ, ప్రభుత్వానికి ధరలను సిఫార్సు చేసే ‘కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్’ (సీఏసీపీ– వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్)... ఉత్పత్తి ధరల సూచిలో వచ్చే మార్పుల శాతాన్ని, గణనలను కూడా అందజేస్తుంది. 2022–23తో పోలిస్తే, ఈ ఏడాది మిశ్రమ ఉత్పత్తి ధరల సూచీ 8.9 శాతం పెరిగింది. అంటే ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండగా, కనీస మద్దతు ధరల పెరుగుదల దానికి అనుగుణంగా లేదు. ఇది రైతులు హర్షించడానికి కారణం కాదు. ఒక సంవత్సరం క్రితం, ఇది మరింత దారుణంగా ఉండేది. మిశ్రమ ఉత్పత్తి ధరల సూచీ 8.5 శాతం పెరుగుదలకు ప్రతిగా, గోధుమ కనీస మద్దతు ధర కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. యాదృచ్ఛికంగా, ఈ ఏడాది క్వింటాల్కు రూ. 150 పెరగడంతో గోధుమల కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ. 2,275కి చేరుకుంది. 2006–07, 2007–08 తర్వాత, దేశీయ ఉత్పత్తిదారులకు ధరలను పెంచడం మినహా యూపీఏ ప్రభుత్వానికి పెద్దగా అవకాశం లేకుండా పోయిన తర్వాత, ఇది గోధుమ ధరలో అత్యధిక పెరుగుదలగానే చెప్పాలి. ఎన్నికల సంవత్సరాల్లోనే! రైతుల నుండి నేరుగా గోధుమలను కొనుగోలు చేయడానికి ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలనే లోపభూయిష్ట నిర్ణయం జరిగిన తర్వాత, ఇది ప్రభుత్వ నిల్వల్లో భారీ అంతరానికి కారణ మైంది. ఆ కొరతను తీర్చడానికి ప్రభుత్వం దాదాపు రెట్టింపు ధరలకు (స్వదేశీ రైతులకు ఇచ్చే) గోధుమలను దిగుమతి చేసుకోవలసి వచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాల నుండి వచ్చిన విమర్శల తరువాత, ముఖ్యంగా ధర సమానత్వం తీసుకురావడానికి, గోధుమ లకు కనీస మద్దతు ధరను పెంచారు. ఈ ఏడాది ధరలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణల్లోని ప్రధాన రబీ పంటలపై ప్రభావం చూపుతాయని పరిగణనలోకి తీసు కుంటే, ధరల పెరుగుదల ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఊహాగానాలు ఉన్నాయి. గోధుమలు అత్యంత ముఖ్యమైన రబీ పంట. బార్లీ(యవలు), పెసర, రేప్సీడ్–ఆవాలు, పప్పు (మసూర్)... ఇతర శీతాకాలపు పంటలు కావడంతో, ధరల పెరుగుదల కచ్చితంగా రాజకీయ కోణాన్ని కలిగి ఉంది. ఆర్థికవేత్తలు సుఖ్పాల్ సింగ్, శ్రుతి భోగల్ 2004, 2009, 2014, 2019కి ముందు సంవత్సరాల్లో గోధుమలు, వరి కనీస మద్దతు ధర ఎంత ఎక్కువగా ఉందనే అంశాన్ని 2021 జనవరిలో స్పష్టంగా చూపించారు. ఇవన్నీ ఎన్నికలు జరిగిన సంవత్సరాలు. 2023–24 రబీ ధరల పెంపు కూడా ఇదే తరహాలో ఉంది. ఎన్నికలకు ముందు మాత్రమే రైతులకు సాపేక్షంగా అధిక కనీస మద్దతు ధరలను ప్రకటించాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించారు. దీనివల్ల కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాలను పొందివుండొచ్చు. కానీ భవిష్యత్తులో పంటల ధరలను రాజకీయాలు నిర్ణయించకుండా దూరంగా ఉండేలా చూసుకోవాల్సిన సమయం ఇది. స్వామినాథన్ ఫార్ములా అమలు కావాలి వ్యవసాయం దానధర్మం కాదు. పంటల ధరలను రాజకీయ నాయకత్వం ఇష్టారాజ్యానికి వదిలేయలేం. వ్యవసాయానికి నిర్మా ణాత్మక సంస్కరణలు అవసరం. ఎన్నికలు జరిగిన సంవత్సరంతో నిమిత్తం లేకుండా, స్వామినాథన్ ఫార్ములా ప్రకారం, ‘వెయిటెడ్ యావరేజ్’కు 50 శాతం లాభం కలిపి రూపొందించిన కనీస మద్దతు ధరలు రైతులకు అందేలా ఈ సంస్కరణలు ఉండాలి. ఏది ఏమైనప్పటికీ, ధాన్య సేకరణ ఎక్కువగా గోధుమలు, వరికే పరిమితం అయినందున, కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని పొందే రైతుల శాతం సంవత్సరాలుగా 6 శాతం నుండి దాదాపు 14 శాతానికి మాత్రమే పెరిగింది. దీనివల్ల అర్థం చేసుకోవలసిన విషయమేమిటంటే, కనీస మద్దతు ధర పెంపు ఇంకా చాలావరకూ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ఉంది. మార్కెట్లు మిగిలిన 86 శాతం మంది రైతులకు నష్టాలతో కూడిన ధరలు చెల్లించడం వల్ల వ్యవసాయ కష్టాలు తీవ్ర మవుతున్నాయి. రుణభారం, ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. అంతేకాకుండా, రైతులకు సరైన ఆదాయాన్ని శాశ్వతంగా నిరాక రించిన స్థూల ఆర్థిక విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం ఇది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (ప్లస్ లేదా మైనస్ 2 శాతం) బ్రాకెట్లో ఉంచడం వ్యవసాయాన్ని దెబ్బతీసింది. వినియోగదారుల ధరల సూచిక బుట్టలో ఆహారం, పానీయాల వాటా 45.9 శాతం ఉన్న ప్పటికీ, విధాన రూపకర్తలు అతిపెద్ద ద్రవ్యోల్బణ చోదకశక్తిగా ఉన్న గృహనిర్మాణంపై మాత్రం కళ్ళు మూసుకున్నారు. గృహనిర్మాణాన్ని పెట్టుబడిగా పరిగణిస్తుండగా, కనీస మద్దతు ధరలో ఏదైనా పెంపు దలను మాత్రం ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని నిందిస్తుంటారు. ఇది మారాల్సి ఉంది. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
పత్తి రైతుకు ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పత్తి రైతులకు మంచి ధర దక్కాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఏటా నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచే కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పత్తి పండించిన ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా ముందుగానే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. 12.85 లక్షల టన్నుల దిగుబడులు రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 14.13 లక్షల ఎకరాలు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 13.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. 12.85 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. ఇటీవలే కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. ఏటా క్వింటాల్కు రూ.200 నుంచి రూ.300 వరకు పెంచుతుండగా, తొలిసారి ఏకంగా రూ.640 మేర పెంచింది. పొడుగు పింజ రకానికి క్వింటాల్కు రూ.7,020, మీడియం రకానికి రూ.6,620 చొప్పున కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రస్తుతం ఆదోని మార్కెట్కు రోజుకు 3 నుంచి 5 వేల క్వింటాళ్ల పత్తి వస్తుండగా.. క్వింటాల్కు రూ.7 వేల నుంచి రూ.7,400 వరకు పలుకుతోంది. అప్రమత్తమైన ఫ్రభుత్వం కనీస మద్దతు ధరకు కాస్త అటూ ఇటుగా మార్కెట్ ధరలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసింది. 34 ఏఎంసీలతో పాటు 50 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాల్కు రూ.13 వేల వరకు ధర లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలు ఇవీ తేమ 8 లేదా అంతకంటే తక్కువ శాతం ఉండాలి. 8 శాతం కంటే పెరిగిన ప్రతి ఒక్క శాతం తేమకు ఒక శాతం చొప్పున మద్దతు ధరలో రూ.70.20 చొప్పున తగ్గిస్తారు. 12 శాతానికి మించి తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయరు. పత్తి పింజ పొడవు 29.50 ఎంఎం నుంచి 30.50 ఎంఎం వరకు ఉండవచ్చు. మైక్రో నైర్ విలువ నిర్ణీత పరిధి కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే ప్రతి 0.2 విలువకు క్వింటాల్కు రూ.25 తగ్గిస్తారు. పత్తిలో దుమ్ము, ధూళి, చెత్తా, చెదారం లేకుండా చూసుకోవాలి. గుడ్డు పత్తికాయలు, రంగుమారిన, పురుగు పట్టిన కాయలను వేరు చేసి శుభ్రమైన పత్తిని మాత్రమే తీసుకురావాలి. నీళ్లు జల్లిన పత్తిని కొనుగోలు చేయరు. కౌడు పత్తి, ముడుచుకుపోయిన పత్తిని మంచి పత్తిలో కలపరాదు. గోనె సంచుల్లో కానీ లేదా లూజు రూపంలో మాత్రమే తీసుకు రావాలి. ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొస్తే కొనుగోలుకు అనుమతించరు. ఆర్బీకేల్లో నమోదుకు శ్రీకారం ఈ–పంట నమోదు ఆధారంగా సీఎం యాప్ ద్వారా వాస్తవ సాగుదారుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేయనున్నారు. రైతులు తమ సమీపంలోని ఆర్బీకే కేంద్రంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాల నకలుతో పేరు నమోదు చేసుకొని టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్లో పేర్కొన్న తేదీన పత్తిని నిర్ధేశించిన యార్డు లేదా జిన్నింగ్ మిల్లుకు తీసుకెళితే.. నిర్ధేశిత గడువులోగా రైతు ఖాతాలకు నగదు జమ చేస్తారు. తొందరపడి అమ్ముకోవద్దు మార్కెట్లో ధరలు ఎమ్మెస్పీకి కాస్త అటూఇటుగా ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నెల 25వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంట నమోదు ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు కొనుగోలు చేస్తాం. మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున తొందరపడి రైతులెవరూ అమ్ముకోవద్దని చెబుతున్నాం. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా మంచి ధరలు వచ్చే అవకాశాలున్నాయి. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
Fact Check: దగాకోరు.. దబాయింపు!
సాక్షి, అమరావతి: ►కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకన్నా రైతులకు మార్కెట్లోనే అధిక ధరలు లభిస్తున్నప్పుడు ఎవరైనా ఎమ్మెస్పీకి అమ్ముకుంటారా? లేక అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తారా? మరి మన రాష్ట్ర రైతులు బహిరంగ మార్కెట్లో మంచి ధరలకు అమ్ముకుంటే ఇందులో తప్పు ఏమైనా ఉందా? ►కనీస మద్దతు ధర కన్నా అధిక రేట్లకు రైతులు పంట అమ్ముకుంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నట్లా లేక బాగోలేనట్లా? ►మన దగ్గర పండే ధాన్యానికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ధాన్యం దిగుబడుల్లో 60 శాతానికి పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుండగా మిగతాది సొంత అవసరాలు పోనూ బయట మంచి ధరకు రైతులు విక్రయిస్తున్నారు. ఎక్కడ విక్రయిస్తేనేం? అన్నదాతకు మంది ధర దక్కితే సంతోషించాలి కదా? గతంలో ఏ గ్రేడ్, సాధారణ రకాలుగా విభజించి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగేది. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం రంగుమారినా, తడిచినా వెరైటీల ప్రకారం గ్రేడెడ్ ఎంఎస్పీ చెల్లిస్తూ రైతులను ఆదుకుంటోంది. రైతుల సంఖ్య చూసినా, కొనుగోలు చేసిన ధాన్యం లెక్కలు గమనించినా ఇప్పుడెంతో మెరుగ్గా ఉంది. చంద్రబాబు హయాంతో పోలిస్తే ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించిన రైతుల సంఖ్య రెట్టింపైందని చిన్న పిల్లాడైనా చెబుతాడు. ఇదంతా దగాకోరులకు రుచించడం లేదు. రైతులంటే గిట్టని చంద్రబాబు పాలనతో బేరీజు వేస్తే తమకు పుట్టగతులుండవనే భయంతో పక్క రాష్ట్రంతో పోలుస్తూ పొంతన లేని రాతలతో విషం చిమ్ముతున్నారు. ఇందులో భాగంగా ‘ధాన్యం రైతుకు దగా’ అంటూ వక్రీకరణలతో ఈనాడులో అవాస్తవాలను వడ్డించారు. ఒక్కో రైతు 34.42 టన్నులు విక్రయించారా? టీడీపీ హయాంలో ధాన్యం సేకరణ దళారుల దందాగా సాగింది. 2014–15లో గత ప్రభుత్వం రెండు సీజన్లలో (ఖరీఫ్, రబీ) 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. రూ.5,583 కోట్లు చెల్లింపులు చేసింది. అంటే సగటున ఒక్కో రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం సాధ్యమేనా? అంటే రైతుల పేరిట దళారులు గత ప్రభుత్వానికి ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లోనూ ఇదే సీన్ రిపీట్.ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పటిష్టంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. 2022–23లో ఒక్క ఖరీఫ్ సీజన్లోనే మొత్తం 6.39 లక్షల మంది రైతుల వద్ద నుంచి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించారు. దిగుబడిలో 60 శాతం కొనుగోలు తెలంగాణలో అత్యధికంగా ఎంటీయూ 1010, 1001 రకం ధాన్యాన్ని సాగు చేస్తారు. వాటికి బహిరంగ మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో 60 శాతానికి పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. గత రబీలో తొలిసారిగా ఐదు లక్షల టన్నుల జయ రకం (బొండాలు) ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఫలితంగా దొడ్డు బియ్యానికి మార్కెట్లో రేటు పెరిగింది. వ్యాపారులు పొలాల్లోనే ఎగబడి కొనడంతో రైతులకు మేలు జరిగింది. రైతుల సంఖ్య రెట్టింపు టీడీపీ హయాంలో ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్లు విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే 32.78 లక్షల మంది రైతుల నుంచి రూ.58,766 కోట్లు విలువైన 3.10 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరి ఎవరి హయాంలో రైతులకు అన్యాయం చేశారో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇక గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు అంటే రైతులకు నరక యాతనే. కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదో గుర్తించేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సిందే. సరైన యంత్రాలు లేక నాణ్యత నిర్ధారణలోనూ రైతులు మోసపోయేవారు. ఇప్పుడు ఆర్బీకేల రాకతో రైతు దగ్గరకే టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి ధాన్యం శాంపిళ్లు తీసుకుంటున్నారు. రైతు ఎదురుగానే వివరాలు నమోదు చేసి రశీదు ఇస్తున్నారు. గతంలో ఎక్కడో మండల కేంద్రాల్లో అరకొర వసతుల్లో ధాన్యం కొనుగోళ్లు జరిగేవి. ఇప్పుడు రైతు ఊరిలోనే.. ఆర్బీకే పరిధిలో.. పొలం గట్టు వద్దే ధాన్యాన్ని కొని మిల్లుకు తరలిస్తున్నారు. రూ.960 కోట్లు బకాయి పెట్టిన బాబు చంద్రబాబు హయాంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. టీడీపీ సర్కారు దిగిపోతూ అన్నదాతలకు రూ.960 కోట్లు ధాన్యం బకాయిలు పెట్టింది. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత రబీ సీజన్లో రూ.2,884 కోట్లకుగాను రూ.2,595 కోట్లను నిర్ణీత గడువులోగా 90 శాతం చెల్లించేశారు. మిగిలిన చిన్న మొత్తాల చెల్లింపుల్లో జాప్యానికి కారణం రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం ఆలస్యంగా జరగడమే. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు ప్రతి జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తూ ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తోంది. జీఎల్టీ కింద రైతన్నకు టన్నుకు రూ.2,523 గతంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం లోడు తరలించాలంటే రైతులపై ఆర్ధిక భారం పడేది. ధాన్యం సొమ్ములు నెలల తరబడి అందకపోవడంతో బయట అప్పులు చేయాల్సి వచ్చేది. గోనె సంచుల సేకరణను గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. ఇప్పుడు పౌరసరఫరాల సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే గోనె సంచులను సమకూరుస్తున్నాయి. ధాన్యం లోడును ప్రభుత్వమే ఎగుమతి చేస్తూ మిల్లులకు తరలిస్తోంది. ఒకవేళ రైతుకు సొంత వాహనం ఉండి సంచులు, హమాలీలను సమకూర్చుకుంటే ఆ ఖర్చులను కూడా మద్దతు ధరతో కలిపి నిర్ణీత 21 రోజుల కంటే ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా క్వింటాల్కు అదనంగా రూ.252 రైతులకు లభిస్తోంది. టన్ను గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలీ రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ కింద టన్నుకు రూ.2,523 ప్రభుత్వం అందిస్తోంది. ఇది ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే బోనస్తో పోలిస్తే అధికంగా ఉండటం విశేషం. -
రైతుకు మరింత దన్ను
సాక్షి, న్యూఢిల్లీః దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న వేళ 2023–24 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి 14 రకాల పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం చేసింది. వ్యవసాయదారుల ఉత్పత్తులకు లాభదాయక ధరలు నిర్ధారించేలా, పంటల వైవిధ్యతను ప్రోత్సహించేలా మద్దతు ధరల పెంపున కు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై ప్రస్తుతం ఉన్న మద్దతు ధరను రూ.143 పెంచింది. దీంతో ప్రస్తుతం సాధారణ రకం వరి క్వింటాల్ ధర రూ.2,040 ఉండగా, అది ప్రస్తుత కేంద్రం నిర్ణయంతో రూ.2,183కి పెరగగా, గ్రేడ్–ఏ రకం వరి ధర రూ.2,060 నుంచి రూ.2,203కి చేరింది. పప్పుధాన్యాలకు పెరిగిన మద్దతు.. ఇటీవలి కాలంలో కేంద్రం పప్పుధాన్యాలు, నూనెగింజలు, తృణధాన్యాల పంటల సాగును ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ వంటి పధకాల ద్వారా పంటల వైవి«ధ్యం ఉండేలా రైతులను ప్రోత్సహిస్తోంది. 2022–23 మూడవ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 330.5 మిలియన్ టన్నులుగా అంచనా వేయగా, ఇది మునుపటి ఏడాది 2021–22తో పోలిస్తే 14.9 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పప్పుధాన్యాలు, నూనెగింజల ధరలను కేంద్రం గరిష్టంగా పెంచింది. పెసర ధరను ఏకంగా రూ.803కి పెంచింది. దీంతో పెసర ధర రూ.7,755 నుంచి రూ.8,558కి పెరిగింది. కంది మద్దతు ధరను రూ.400, మినప ధరను రూ.350 మేర పెంచింది. నూనెగింజల విషయంలో వేరుశనగకు రూ.527, సన్ఫ్లవర్ రూ.360, సోయాబీన్ రూ.300, నువ్వులు రూ.805 చొప్పున ధరలు పెంచింది. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎప్పటికప్పుడు మద్దతు ధరని నిర్ణయిస్తున్నామని, గత ఏడాదులతో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ధరలను పెంచామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూశ్గోయల్ పేర్కొన్నారు. రైతు సంక్షేమ సంస్కరణల్లో భాగమిది: మోదీ దాదాపు 14 ఖరీఫ్ పంట రకాలకు కనీస మద్దతు ధర పెంచడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల క్రమంలో భాగమే ఈ ఎంఎస్పీ పెంపు నిర్ణయం. ఈ పెంపుతో రైతులు తమ పంటకు లాభసాటి ఆదాయం పొందటంతోపాటు వైవిధ్య పంటల సాగు విధానం మరింత పటిష్టమవనుంది’ అని మోదీ ట్వీట్చేశారు. వరికి క్వింటాల్కు రూ.143 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై మోదీ సంతోషం వ్యక్తంచేశారు. గత దశాబ్దకాలంలో ఇంతగా ధర పెంచడం ఇది రెండోసారి. గత పదేళ్లలో చూస్తే గరిష్టంగా 2018–19లో క్వింటాల్కు రూ.200 పెంచారు. 2023–24 ఖరీఫ్ పంటలకు 5.3 శాతం నుంచి 10.35 శాతం శ్రేణిలో కనీస మద్దతు ధర పెంచారు. -
రైతులకు గుడ్న్యూస్.. పంటల గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఖరీఫ్లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచింది. పెసర్లకు కనీస మద్దతు ధర 10 శాతం పెంపు, అలాగే, క్వింటా కందులు రూ.7వేలు, రాగులు రూ.3,846, పత్తి రూ.6,620, సోయాబీన్ రూ.4,600, నువ్వులు రూ.8,635, మొక్కజొన్న రూ.2,050, సజ్జలు రూ.2,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇది కూడా చదవండి: అమిత్ షా ఇంటి వద్ద మణిపూర్ మహిళలు నిరసన -
టమాటా రైతుకు దిగుల్లేదిక..
సాక్షి, అమరావతి: టమాటా రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు కనీస మద్దతు ధర కంటే అదనపు లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 20 టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. వీటిలో నాలుగు యూనిట్లు ఈ నెలాఖరులో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతుండగా, ఇందులో అత్యధికంగా రాయలసీమ జిల్లాల పరిధిలోనే 56,633 హెక్టార్లు ఉన్నాయి. ఏటా 22.16 లక్షల టన్నుల దిగుబడుల్లో 20.36 లక్షల టన్నులు ఆ జిల్లాల నుంచే వస్తోంది. మూడున్నరేళ్లుగా టమాటా రైతుకు మద్దతు ధర లభించేలా కృషి చేస్తున్న ప్రభుత్వం.. ధరలు తగ్గిన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకొని, వ్యాపారులతో పోటీపడి ధర పెరిగేలా చేస్తోంది. దీంతో పాటు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘ఆపరేషన్ గ్రీన్స్’ ప్రాజెక్టు కింద రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో 20 ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో 4 యూనిట్ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన యూనిట్లను మార్చి కల్లా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఒక్కో యూనిట్ను ఎకరం విస్తీర్ణంలో రూ.3 కోట్ల అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో గంటకు 1.5 టన్నుల చొప్పున నెలకు 300 టన్నులు, ఏడాదికి 3,600 టన్నుల చొప్పున ప్రాసెస్ చేయనున్నారు. సార్టింగ్, గ్రేడింగ్, వాషింగ్.. ఒక్కో యూనిట్ పరిధిలో కనీసం 250 టన్నులు నిల్వ చేసేందుకు వీలుగా శీతల గిడ్డంగులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పండ్లు, కూరగాయలను సార్టింగ్, గ్రేడింగ్, వాషింగ్ చేసి.. అధిక ధరలకు విక్రయించే అవకాశం కలుగనుంది. ఈ రంగంలోని బడా కంపెనీలతో రైతు ఉత్పత్తి దారుల సంఘాలను (ఎఫ్పీవో – ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) అనుసంధానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే లీఫ్ అనే కంపెనీతో ఒప్పందం జరిగింది. సాధారణంగా రైతులు తాము పండించిన టమాటాలను మార్కెట్కు తీసుకెళ్లి అమ్మగా వచ్చే ఆదాయంలో రవాణా, కమీషన్ చార్జీల రూపంలో 10–20 శాతం కోల్పోతుంటారు. ఈ యూనిట్ల ఏర్పాటు వల్ల రైతులు ఈ నష్టాన్ని పూడ్చుకోగలుగుతారు. వీటన్నింటి వల్ల మార్కెట్ ధర కంటే 30 శాతం అదనంగా వస్తుంది. దళారుల చేతిలో నష్టపోకుండా అధిక లాభాలను ఆర్జించగలుగుతారు. వీటి నిర్వహణా బాధ్యతలను రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు అప్పగిస్తున్నారు. వచ్చే లాభాలను ఆయా సంఘాల పరిధిలోని రైతులే పంచుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టమాటా వాల్యూ చైన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర పనులను ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ.. మార్కెటింగ్ బాధ్యతలను లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ నిర్వహించనున్నాయి. ట్రయల్ రన్ విజయవంతం ఒక్కో యూనిట్ను ఒక్కో ఎఫ్పీవోకు అప్పగించనుండగా, మొత్తంగా 20 వేల మంది టమాటా రైతులు లబ్ధి పొందనున్నారు. తొలి దశలో చిత్తూరు జిల్లా అటుకురాళ్లపల్లి, చప్పిడిపల్లె, కమిరెడ్డివారిపల్లితో పాటు అన్నమయ్య జిల్లా తుమ్మనంగుంటలలో 4 యూనిట్లు ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా 3,300 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇటీవలే ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. రెండో దశలో అన్నమయ్య జిల్లా చెంబకూర్, పోతపొల్లు, చిన్నమండెం, తలవం, ములకల చెరువు, కంభంవారిపల్లె, బి.కొత్తకోట, కలికిరి, చింతపర్తి, వాల్మీకిపురం, నిమ్మనపల్లె, చిత్తూరు జిల్లా వీ.కోట, పలమనేరు, పుంగనూరు, రాజ్పేట, చెల్దిగనిపల్లి యూనిట్లు మార్చిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దళారుల నుంచి ఉపశమనం ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా దళారుల చేతిలో నష్టపోకుండా టమాటా రైతులు అధిక లాభాలు ఆర్జించే వీలు కలుగుతుంది. రవాణా, కమిషన్ నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా, తమకు గిట్టుబాటైన ధరకు నచ్చిన వారికి అమ్ముకోగలుగుతారు. పైగా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వీటి నిర్వహణా బాధ్యతను కూడా రైతు సంఘాలకే ఇస్తున్నాం. వచ్చే లాభాలు సంఘాలే పొందనున్నాయి. – ఎల్.శ్రీధర్రెడ్డి, సీఈఒ, ఏపీ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ -
టమాటా రైతుకు రానున్నది మంచికాలం
సాక్షి, అమరావతి: దళారుల ప్రమేయం లేకుండా టమాటా రైతులకు కనీస మద్దతు ధర కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఇంటిగ్రేటెడ్ టమాటా వాల్యూచైన్ డెవలప్మెంట్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సమక్షంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. సొసైటీ ద్వారా రూ.110 కోట్ల అంచనాతో 20 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మంత్రి కాకాణి సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళాభివృద్ధి సొసైటీ, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా ప్రతినిధులు వచ్చేనెలలో 4 ప్రాసెసింగ్ కేంద్రాలు ప్రారంభం నాలుగు ప్రాసెసింగ్ కేంద్రాలను వచ్చే నెలలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కాకాణి చెప్పారు. వీటి నిర్వహణ బాధ్యతలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్పీవోలకు) అప్పగిస్తామని తెలిపారు. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర పనులకు ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, మార్కెటింగ్ చైన్ అభివృద్ధికి లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ సహకరిస్తాయని తెలిపారు. సాధారణంగా డిమాండు, సప్లయ్కి అనుగుణంగా ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల కొన్నిసార్లు టమాటా రైతులు, మరికొన్నిసార్లు బహిరంగ మార్కెట్లో రేట్లు పెరగడం వలన వినియోగదారులు నష్టపోతున్నారని చెప్పారు. ధర పతనమైనప్పుడు మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం... మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు రైతుల నుంచి కొనుగోలుచేసి రైతుబజార్ల ద్వారా సరసమైన ధరలకు విక్రయిస్తూ వినియోగదారులకు అండగా నిలుస్తుందన్నారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో డిమాండుకు మించి దిగుబడుల ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర రాలేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20 ఎఫ్పీవోల పరిధిలోని 20 వేలమంది టమాటా రైతులకు మేలు కలుగుతుందన్నారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్రెడ్డి, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ సీఈవో సీఎస్ రెడ్డి, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ సీఈవో పి.విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నకు ‘మద్దతు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఏటా ఇన్పుట్ సబ్సిడీ అందించడంతోపాటు, ఉచిత పంటల బీమా వంటి పలు సదుపాయాలు కల్పించింది. ఆర్బీకేల ద్వారా నిరంతరం వారికి అవసరమైన సేవలు అందిస్తోంది. మార్కెట్లో రైతు పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించేలా చూస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కనీస మద్దతు ధర దక్కని ఖరీఫ్ ఉత్పత్తుల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ధాన్యంతో పాటు అన్ని రకాల ఉత్పత్తులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపడుతోంది. ధాన్యం కాకుండా ఈ మూడేళ్లలో ప్రభుత్వం 4.27 లక్షల మంది రైతుల నుంచి రూ. 7,157 కోట్ల విలువైన 20.18 లక్షల టన్నుల వివిధ రకాల పంట ఉత్పత్తులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో మార్కెఫెడ్ ద్వారా 3.76 లక్షల మంది రైతుల నుంచి రూ.5,023 కోట్ల విలువైన 16.34 లక్షల టన్నుల ఉత్పత్తులను సేకరించింది. ప్రధానంగా 2019–20 సీజన్లో 2.24 లక్షల మంది రైతుల నుంచి రూ. 2,231 కోట్ల విలువైన 8.56 లక్షల టన్నులు, 2020–21 సీజన్లో 1.20 లక్షల మంది రైతుల నుంచి రూ.2,255 కోట్ల విలువైన 6.46 లక్షల టన్నులు సేకరించింది. 2022–23లో ఇప్పటివరకు 32 వేల మంది నుంచి రూ. 537 కోట్ల విలువైన 1.32 లక్షల టన్నుల విలువైన ఉత్పత్తులను సేకరించింది. గత సీజన్లో మాదిరిగానే ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొక్కజొన్న, సజ్జలు, వేరుశనగ కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖరీఫ్లో వేరుశనగ 13.34 లక్షల ఎకరాల్లో సాగవగా, 4.87 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. మొక్కజొన్న 3.21లక్షల ఎకరాల్లో సాగవగా, 6.60 లక్షల టన్నులు, సజ్జలు 52 వేల ఎకరాల్లో సాగవగా, 50 వేల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. మొక్కజొన్నకు టన్నుకు రూ.1,962, సజ్జలకు రూ.2,350, వేరుశనగకు రూ.5,850 చొప్పున కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్లో వీటి ధరలు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. సజ్జలు మినహా మిగిలిన రెండింటి ధరలు ఎమ్మెస్పీకి దీటుగానే ఉన్నాయి. నాణ్యమైన (ఫైన్న్క్వాలిటీ) సజ్జలు, మొక్కజొన్నకు మార్కెట్లో టన్నుకు రూ.2 వేలకు పైగా ధర పలుకుతోంది. వేరుశనగ రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు పలుకుతోంది. పంట చేతికొచ్చే సమయానికి ధరలు ఏమాత్రం తగ్గినా వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద జోక్యం చేసుకొని ధరలు పడిపోకుండా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం మార్క్ఫెడ్ ద్వారా ఈ మూడు ఉత్పత్తుల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. 12వేల టన్నులు సజ్జలు, 66 వేల టన్నుల మొక్కజొన్న, 1.21 లక్షల టన్నుల వేరుశనగ కొనాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రైతుల వివరాల నమోదు ప్రక్రియ చేపట్టింది. -
Andhra Pradesh: రైతన్నకు ‘మద్దతు’
రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంటలు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఒక్క ధాన్యమే కాదు.. ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటలకూ కనీస మద్దతు ధర లభించేలా అధికారులు సవాల్గా తీసుకుని పనిచేయాలి. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఏమాత్రం ఉండకూడదు. ఈ – క్రాప్ వంద శాతం పూర్తి కావాల్సిందే. రైతుల ఈ–కేవైసీ 93 శాతం పూర్తి కాగా మిగిలిన 7 శాతం రైతులకు ఎస్ఎంఎస్ల ద్వారా ఈ–క్రాప్ వివరాలు పంపించాలి. ఈ – క్రాప్ డేటా ఆధారంగా గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలి. వ్యవసాయ, పౌరసరఫరా శాఖలు సమన్వయంతో పని చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతన్నలకు ఏ లోటూ రానివ్వకుండా అన్ని విధాలా తోడుగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇన్పుట్స్ సహా అన్నీ సకాలంలో అందించాలని స్పష్టం చేశారు. విత్తనాల నుంచి ఎరువుల వరకు సాగు ఉత్పాదకాలన్నీ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచి సాగు మెళకువలు, సూచనలు అందించాలన్నారు. ఈ దఫా రబీలో 22.92 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేస్తున్నామని, బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు సాగును ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. పొలంబడుల్లో విద్యార్థులకు అప్రెంటిస్షిప్ అత్యుత్తమ వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించి అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో చేపట్టిన పొలంబడి కార్యక్రమాలను మరింత సమర్ధంగా నిర్వహించాలి. పొలంబడి నిర్వహణలో మనం ఆదర్శంగా నిలిచాం. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులను భాగస్వాములను చేసేలా అప్రెంటిస్షిప్ కోసం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే శ్రీకారం చుట్టాలి. వీటి ద్వారా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి. వారి నుంచి సలహాలు తీసుకోవాలి. రెండేళ్లలో ప్రతి ఆర్బీకేలో డ్రోన్ ప్రతి ఆర్బీకేలోనూ డ్రోన్ సేవలు అందుబాటులోకి రావాలి. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్లు ఉండేలా కార్యాచరణ రూపొందించాలి. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో నానో ఫెర్టిలైజర్స్ వాడకంపై అవగాహన పెరుగుతుంది. ఎరువుల వృథాను నివారించడంతోపాటు మొక్కలకు మరింత మెరుగ్గా పోషకాలు అందుతాయి. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా సమకూర్చిన వ్యవసాయ యంత్రసామగ్రి రైతులకు అందుబాటులో ఉంచాలి. వీటి సేవలు రైతులందరికీ అందుబాటులోకి తేవాలి. మార్చికి ఆర్బీకేల్లో ప్లాంట్ డాక్టర్లు వచ్చే మార్చి కల్లా ఆర్బీకేల స్థాయిలో ప్లాంట్ డాక్టర్ సేవలను అందుబాటులోకి తేవాలి. ఇందుకు సంబంధించిన ప్లాంట్ డాక్టర్ కిట్స్ ప్రతీ ఆర్బీకేలో అందుబాటులో ఉంచాలి. భూసార పరీక్షలు నిర్వహించే పరికరాలను ఆర్బీకేల్లో సిద్ధం చేయాలి. వచ్చే మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. భూసార పరీక్షలు నిర్వహించి ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేయడం ద్వారా ఏ పంటలకు ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో స్పష్టత వస్తుంది. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. నాణ్యమైన దిగుబడులు పెరుగుతాయి. భూసారాన్ని పరిరక్షించుకునే అవకాశం ఏర్పడుతుంది. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీని ఈ నెల 29న జమ చేసేలా ఏర్పాట్లు చేయాలి. దిగుబడి అంచనా 186 లక్షల టన్నులు రాష్ట్రంలో జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణ వర్షపాతం 775 మి.మీ. కాగా ఇప్పటి వరకు 781.7 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 186 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి రానుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ‘ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ – క్రాప్ వంద శాతం నమోదైంది. వీఏఏ, వీఆర్వో బయోమెట్రిక్ ఆథరైజేషన్ కూడా వంద శాతం పూర్తైంది. రైతుల ఈ కేవైసీ 93 శాతం పూర్తైంది. సోషల్ ఆడిట్లో భాగంగా జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాం. రైతుల సమక్షంలోనే గ్రామసభల ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించాం’ అని అధికారులు వివరించారు. సమీక్షలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల కమిషనర్లు ప్రద్యుమ్న, హెచ్.అరుణ్కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, ఏపీ సీడ్స్ ఎండీ జి.శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు గుడ్న్యూస్.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరికీ శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) రబీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రబీ సీజన్ 2022-23(జూలై-జూన్), మార్కెటింగ్ సీజన్ 2023-24 కాలానికి గానూ ఎంఎస్పీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది సీసీఈఏ. గోదుమలకు క్వింటాలుకు రూ.110, ఆవాలు క్విటాలుకు రూ.400 పెంచింది. తాజా పెంపుతో గోదుమలు 2021-22లో క్వింటాలుకు రూ.2015 ఉండగా.. ప్రస్తుతం రూ.2,125కు చేరింది. ఆవాలు క్వింటాలుకు రూ.5,450కి చేరింది. రబీ పంటకాలానికి గోదుమల పెట్టుబడి వ్యయం రూ.1,065గా అంచనా వేసింది కేంద్రం. పంటలకు క్వింటాలుకు పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.. ► మసూర్ పప్పుకు రూ.500 ► గోధుమలకు రూ.100 ► బార్లీ రూ.100, ► శనగలు రూ.150 ► సన్ ఫ్లవర్ రూ.209 ►ఆవాలు రూ.400 రూపాయలు -
పసుపు రైతుకు ఏపీ సర్కార్ బాసట
సాక్షి, అమరావతి: పసుపు రైతుకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారం, పది రోజులుగా మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.6,850 చొప్పున రైతులకు చెల్లించేలా సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 60,812 ఎకరాల్లో పసుపు సాగు చేయగా 1,89,628 టన్నులు దిగుబడి వచ్చినట్టు అంచనా. గతేడాది మార్కెట్లో గరిష్టంగా క్వింటాల్కు రూ.7,900కు పైగా ధర పలకగా, ఈ ఏడాది మార్చి–ఏప్రిల్ వరకు క్వింటాల్కు రూ.7,500 వరకు పైగా పలికింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పంట రావడం, పొరుగు రాష్ట్రాల నుంచి మన పంటకు డిమాండ్ లేకపోవడం, ఎగుమతులు క్షీణించడం వంటి కారణాల వల్ల పసుపు ధర పతనమవుతూ వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఎగుమతులు ఈ ఏడాది 20% తగ్గడంతో ప్రస్తుతం క్వాలిటీని బట్టి క్వింటాల్ రూ.5,500 నుంచి రూ.6 వేలకు మించి ధర పలకడం లేదు. దీంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.6,850కు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కనీసం 30 వేల టన్నుల కొనుగోలు లక్ష్యం ఈ–పంటలో నమోదు ప్రామాణికంగా కనీసం 30వేల టన్నుల పసుపు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రైతుల వద్ద ఏ మేరకు నిల్వలు ఉన్నాయో అంచనా వేసేందుకు ఆర్బీకే సిబ్బంది ద్వారా సర్వే చేపట్టింది. పంట కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్ల వరకు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సీఎం యాప్ ద్వారా ఆధార్ ఆధారిత రైతు ఖాతాల్లో పంట సొమ్ము జమ చేస్తారు. సర్వే పూర్తి కాగానే సీఎం యాప్ ద్వారా జూన్ రెండో వారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. ఆర్బీకేల ద్వారా జూలై 31వ తేదీ వరకు కొనుగోలు చేస్తారు. పంట సేకరణకు నోడల్ ఏజెన్సీగా మార్క్ఫెడ్ వ్యవహరించనుండగా, జిల్లా జాయింట్ కలెక్టర్లు (రైతు భరోసా) నేతృత్వంలో జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగే కొనుగోలు ప్రక్రియలో డీసీఎంఎస్, పీఏసీఎస్, ఏఎంసీలు, ఎఫ్పీవోలు, స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. వీరికి 2.5 శాతం కమిషన్ చెల్లించనున్నారు. తొందరపడి అమ్ముకోవద్దు 2019–20లో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల నుంచి పసుపు కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుసగా రెండేళ్లూ మంచి ధర పలికింది. ప్రస్తుతం మార్కెట్ ధరలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రైతుల వద్ద ఉన్న నిల్వలను గుర్తించేందుకు ఆర్బీకేల ద్వారా చేపట్టిన సర్వే పూర్తి కాగానే కొనుగోళ్లు చేపడతాం. మార్కెట్లో తిరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది. రైతులు తొందరపడి అమ్ముకోవద్దు. – పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్ఫెడ్ -
పత్తి సాగు.. తగ్గేదే లే...!
కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామానికి చెందిన రైతు హుస్సేన్ ఎకరం పొలంలో పత్తి సాగు చేయగా 6 క్వింటాళ్ల దిగుబడివచ్చింది. విక్రయించేందుకు శుక్రవారం ఆదోని మార్కెట్ యార్డుకు పత్తి తీసుకొచ్చారు. ఫైన్ క్వాలిటీ కావడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడి క్వింటాల్ రూ.10,026 చొప్పున కొనుగోలు చేశారు. ఆరు క్వింటాళ్ల పత్తికి రూ.60,156 ఆదాయం వచ్చింది. పెట్టుబడి పోనూ నికరంగా రూ.35 వేలు మిగలడంతో హుస్సేన్ ఆనందానికి అవధుల్లేవు. గతంలో ఎప్పుడూ ఇంత ధర పలకలేదని సంతోషంగా చెబుతున్నారు. సాక్షి, అమరావతి: ఎక్కడా ‘తగ్గేదే లే’ అన్నట్టుగా పసిడితో తెల్ల బంగారం పోటీపడుతోంది. గత రెండేళ్లుగా కనీస మద్దతు ధరకు నోచుకోని పత్తి ఈసారి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న ఆదోని మార్కెట్యార్డుకు 688 మంది రైతులు 2,911 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా కనిష్టంగా రూ.7,290, గరిష్టంగా రూ.10,026 పలికి మోడల్ ధర రూ.8,650గా నమోదైంది. ఈ సీజన్లో దక్షిణాదిలో పత్తి మార్కెట్ యార్డుల్లో ఇదే అత్యధిక ధర. ఇదే ఊపు కొనసాగితే సంక్రాంతిలోగా రూ.11 వేల మార్కును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే తగ్గిన విస్తీర్ణం.. గత ఖరీఫ్లో 13.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 16.55 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటాల్ పొడుగు పింజ పత్తి రూ.6,025, మధ్యస్థ పత్తి రూ.5,726 చొప్పున నిర్ణయించారు. కనీస మద్దతు ధర లభించకపోవడంతో 2019–20లో 13 లక్షల క్వింటాళ్లు, 2020–21లో 18 లక్షల క్వింటాళ్ల పత్తిని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా పత్తి కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయగా సీజన్ ప్రారంభం నుంచి పత్తి ధర తారాజువ్వలా దూసుకెళ్తోంది. ప్రారంభంలోనే క్వింటాల్ రూ.6,100 పలికిన పత్తి ఆ తర్వాత ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. పత్తి రైతుకు సత్కారం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన మార్కెట్గా పేరొందిన కర్నూలు జిల్లా ఆదోని పత్తి యార్డుకు వస్తున్న పత్తిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు.సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదోని మార్కెట్ ద్వారా 4.20 లక్షల క్వింటాళ్ల పత్తి క్రయవిక్రయాలు జరిగాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే నాణ్యమైన పత్తికి మంచి ధర పలుకుతోంది. తాజాగా ఇక్కడ అత్యధిక ధర పొందిన రైతు హుస్సేన్ను మార్కెట్ యార్డు కార్యదర్శి బి.శ్రీకాంత్రెడ్డి సత్కరించారు. లాట్కు 30 మంది పోటీ నాణ్యమైన పత్తి కొనుగోలు కోసం వ్యాపారుల మధ్య పోటీ అనూహ్యంగా పెరిగింది. లాట్కు 30 మంది వరకు పోటీపడుతున్నారు. సంక్రాంతి లోగా ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. – బి.శ్రీకాంత్రెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్యార్డు, కర్నూలు జిల్లా -
రైతులకు డీజిల్పై రాయితీ పెంచండి
సాక్షి, అమరావతి: సాగు వాస్తవిక ఉత్పత్తి వ్యయం, డీజిల్పై అధిక రాయితీలు, జన్యుమార్పిడి విత్తనాలు (జీఎంఓ) వంటి వాటితో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేసేలా రాబోయే బడ్జెట్ (వ్యవసాయ) ఉండాలని, నిధుల కేటాయింపును కనీసం 25 శాతమైనా పెంచాలని పలువురు వ్యవసాయ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ తయారీకి ప్రారంభమైన ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా.. గడచిన 48 గంటల్లో రాష్ట్రానికి చెందిన వ్యవసాయ రంగ ప్రముఖులు వర్చువల్ విధానంలో జరిగిన సమావేశాల్లో తమ సలహాలను, సూచనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే రైతులకు ఇచ్చే రుణాలను కనీసం 25 శాతం పెంచాలని కన్సార్షియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్స్ (సిఫా) ముఖ్య సలహాదారు పి. చెంగల్ రెడ్డి సూచించారు.ఇక్రిశాట్, ఐసీఏఆర్ అభివృద్ధి చేసిన జన్యు సాంకేతికతకు తక్షణ ఆమోదం తెలపాలని ఆయన కోరారు. పంట ధరల విధానంపై ప్రభుత్వ సలహా సంఘంగా ఉన్న వ్యవసాయ ఖర్చులు, ధరల సంఘానికి వాస్తవిక ఖర్చుల ఆధారంగా ఎంఎస్పీ నిర్ధారించేందుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చేనేత రంగ నిపుణుడు డాక్టర్ డి.నరసింహారెడ్డి, రైతు నాయకుడు వై.శివాజీ సలహాలిచ్చారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరతను తగ్గించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎంఎస్పీ నిర్ణాయక విధానాన్ని సమూలంగా మార్చాలని కోరారు. దేశ ఆహారభద్రతకు భరోసా ఇచ్చిన హరిత విప్లవ రాష్ట్రాలు భారతీయ పౌష్టికాహార భద్రతా రాష్ట్రాలుగా మారేందుకు కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చాలన్నారు. రాష్ట్రాలు ఈ ఖర్చును భరించే దశలో లేవని పేర్కొన్నారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సీజన్కు ఒక్కో రైతుకు 5 వేల లీటర్ల వరకు డీజిల్ను అనుమతించడంతో పాటు భారీ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. క్రిమిసంహారక మందులపై పన్నులు తగ్గించాలని సలహా ఇచ్చారు. ఎంఎస్పీపై కమిటీలో ఏపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నియమించే కమిటీలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం కల్పించాలని ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉండడంతో పాటు సుమారు 28 రకాల పంటలకు కనీస మద్దతు ధరలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదేనని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం, చేపట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేని విధంగా ఉన్నందున ఆ కమిటీలో సభ్యత్వానికి తమకు అర్హత ఉందని విజ్ఞప్తి చేశారు. -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: రైతు విజయమిది. ఏడాదిగా ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికినా... మొక్కవోని సంకల్పంతో, దీక్షతో నిలిచి గెలిచాడు అన్నదాత. రైతుల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే భయమో... తరముకొస్తున్న ఎన్నికల్లో ఓట్ల లెక్కల బేరీజు, ఎదురయ్యే పర్యవసానాలో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు తలవంచింది. మూడు వివాదాస్పద సాగు చట్టాల బిల్లుల ఉపసంహరణకు సోమవారం పార్లమెంటులో ఆమోదముద్ర పడింది. ఈనెల 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి... దేశానికి క్షమాపణ చెప్పిన తర్వాత పరిణామాలు ఒకదానివెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. 24న కేంద్ర మంత్రి మండలి ఈ బిల్లును ఆమోదించడంతో... ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొని శీతాకాల సమావేశాల తొలిరోజు... సోమవారమే పార్లమెంటు ఉభయసభల్లో ఉపసంహరణ బిల్లును గట్టెక్కించింది. చర్చ కావాలనే విపక్షాల ఆందోళన మధ్యనే నిమిషాల వ్యవధిలో లోక్సభ, రాజ్యసభలో ‘వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు– 2021‘ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే... నల్ల చట్టాలుగా ఖ్యాతికెక్కిన మూడు సాగు బిల్లులు చరిత్ర గర్భంలో కలిసిపోనున్నాయి. మద్దతు ధరకు చట్టబద్ధత, ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం... తదితర అంశాలపై చర్చకు విపక్షాలు ఎంత పట్టుపట్టినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. రైతుల (సాధికారత, రక్షణ)కు ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల బిల్లు–2020, రైతు ఉత్పత్తుల వ్యాపారం– వాణిజ్యం (ప్రొత్సాహం... సులభతరం) చట్టం–2020, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం–2020... పేరిట 13 నెలల కిందట కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద ఆర్డినెన్స్లను తెచ్చి... తర్వాత పార్లమెంటులో ఆమోదం పొందడటంతో... రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 12న సుప్రీంకోర్టు ఈ మూడు చట్టాల అమలుపై స్టే విధించినా రైతులు ఆందోళనలు విరమించలేదు. ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రైతులు నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. 11 సార్లు కేంద్రంతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. చట్టాల ఉపసంహరణ తర్వాతే ఆందోళన విరమిస్తామని రైతులు తెగేసి చెప్పడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కేంద్ర ప్రభుత్వమూ అంతే పట్టుదలకు పోవడంతో ఏడాదికాలంగా ఇది కొనసాగిన విషయం తెలిసిందే. చర్చకు విపక్షాల పట్టు సోమవారం మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ లోక్సభలో ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టగానే విపక్ష పార్టీల ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చారు. చర్చకు పట్టుబట్టారు. రైతులను న్యాయం చేయాలని బ్యానర్లను ప్రదర్శిస్తూ... నినాదాలు చేశారు. విపక్షసభ్యులు ఆందోళనను విరమించి తమ స్థానాల్లోకి వెళితే... సభలో సాధారణ పరిస్థితులు నెలకొంటే బిల్లుపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నారు. సభామోదం కోసం బిల్లును ప్రవేశపెట్టినపుడు చర్చకు ఎందుకు అనుమతించడం లేదని లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధిరరంజన్ చౌదరి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం సభను తీవ్ర అలక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. విపక్ష ఎంపీల నినాదాల నడుమే స్పీకర్ బిల్లును మూజువాణి ఓటింగ్కు పెట్టి... ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఎంపీలందరూ సోమవారం సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీచేసిన విషయం తెలిసిందే. ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందాక సభ వాయిదా పడింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సభ ప్రారంభమైనా... విపక్షాల నిరసనలతో 2 గంటల ప్రాంతంలో లోక్సభ మంగళవారానికి వాయిదాపడింది. చర్చ ఎందుకు?: తోమర్ మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్తో సహా పలు విపక్షాలు రూల్ –267 కింద సభా కార్యాకలాపాలను పక్కనబెట్టి... రైతు సమస్యలపై చర్చను చేపట్టాలని నోటీసులు ఇచ్చాయి. చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ నోటీసులను తిరస్కరించడంతో నిరసనల మధ్య సభ వాయిదాపడింది. అనంతరం లోక్సభలో ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందిందని రాజ్యసభకు తెలుపుతూ... నరేంద్ర తోమర్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. అపై రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్) మాట్లాడుతూ... ఇటీవలి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, ఐదు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడటంతో మోదీ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకుంటోందని పేర్కొన్నారు. ఆందోళనల్లో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇంతలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మీకిచ్చిన రెండు నిమిషాల సమయం ముగిసిపోయిందని ఖర్గేకు మైక్ను కట్ చేశారు. తోమర్ను మాట్లాడాల్సిందిగా కోరారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని తమ మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని తోమర్ విమర్శించారు. అందరూ వ్యవసాయ బిల్లుల ఉపసంహరణనే కోరుకుంటున్నపుడు ఇక చర్చ ఎందుకన్నారు. ఆందోళనల నడుమే బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని హరివంశ్ ప్రకటించారు. టీఎంసీ, ఆప్ డుమ్మా సోమవారం ఉదయం రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో జరిగిన విపక్షాల సమావేశానికి 11 పార్టీలు హాజరుకాగా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డుమ్మా కొట్టాయి. రచ్చ కాదు.. చర్చలే కొలమానం కావాలి ఎంత అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరిపిందనేదే పార్లమెంటు పనితీరుకు కొలమానం కావాలి. ఎంత దుందుడుకుగా వ్యవహరించి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలామనేది ఒకరి పనితీరుకు కొల బద్ధ కారాదు. అన్ని అంశాలనూ చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిస్తాం. ప్రస్తుత సెషన్తో పాటు పార్లమెంటు ప్రతి సమావేశమూ జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించాలని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయులు స్ఫూర్తితో దేశాభివృద్ధికి పరిష్కారమార్గాలను అన్వేషించాలని ప్రజలు కోరుకుంటారు. దీర్ఘకాలిక ప్రభావం చూపే, సానుకూల నిర్ణయాలను ప్రస్తుత సమావేశాల్లో తీసుకోవడం జరుగుతుందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో సభ పనితీరుయే కొలమానం కావాలి. దానికి ఎవరెంత మేరకు దోహదం చేశారనేది లెక్కలోకి రావాలి తప్పితే.. ఎవరెంత హంగామా చేసి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనేది ముఖ్యం కారాదు. పార్లమెంటు ఉత్పాదకతే ప్రామాణికం కావాలి. ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా ఎంత బలంగానైనా గళాలు వినిపించొచ్చు. అయితే సభా మర్యాదను, సభాపతుల స్థానాలకున్న గౌరవాన్ని కాపాడాలి. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా పార్లమెంటు వ్యవహారశైలి ఉండాలి. – సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు విలేకరులతో ప్రధాని మోదీ జడిసే... చర్చ పెట్టలేదు పార్లమెంటులో ఎలాంటి చర్చా లేకుండా మూడు వ్యవసాయ చట్టాలకు ఉపసంహరించుకునే బిల్లును ఆమోదింపజేసుకోవడం మోదీ సర్కారు తీవ్ర భయభ్రాంతులకు లోనైందనే దానికి నిదర్శనం. తాము తప్పు చేశామని వారికి తెలుసు కాబట్టే చర్చ రాకుండా తప్పించుకున్నారు. ప్రధాని క్షమాపణ ఎందుకు చెప్పారు. రైతులకు అన్యాయం చేయకపోతే ఎందుకు మన్నించమని కోరారు? కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకనాడు ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని కాంగ్రెస్ ముందునుంచే చెబుతోంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన ముగ్గురు నలుగురు బడా పెట్టుబడిదారులు... కర్షకుల, శ్రామికుల శక్తి ముందు నిలువలేరు. బిల్లుల ఉపసంహరణ రైతుల విజయం... దేశ విజయం. చర్చ జరగకపోవడం దురదృష్టకరం. ఈ బిల్లులు ప్రధాని వెనుకున్న శక్తుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి మేము దానిపై చర్చ జరగాలని కోరుకున్నాం. కనీస మద్ధతు ధరపై, లఖీమ్పూర్ ఖేరీ దమనకాండపై, ఆందోళనల సందర్భంగా 700 మంది పైచిలుకు రైతులు ప్రాణాలు కోల్పోవడంపై చర్చించాలని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్చకు అనుమతించలేదు. చర్చకు జడుసుకుంది. వాస్తవాలను దాచేయాలని చూసింది. చర్చలకు వీల్లేకపోతే ఇక పార్లమెంటుకు అర్థమేముంది. చర్చలకు అనుమతించకపోతే పార్లమెంటును మూసేయడమే మంచిది. దేశ భవిష్యత్తుకు హానికరమైన శక్తులు ప్రధాని వెనకుండి నడిపిస్తున్నాయి. వారెవరో గుర్తించాలి. – కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ -
ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదు
లక్నో: దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, రైతులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ కోరారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు ఒక్కటే కాదు, ఇంకెన్నో అంశాలు ఉన్నాయని, వాటిపై కేంద్రం చర్చలకు వచ్చేదాకా అన్నదాతల పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందని, తమతో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని విమర్శించారు. రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత, విత్తనాలు, పాడి పరిశ్రమ, కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్కు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మద్దతు పలికారని తికాయత్ గుర్తుచేశారు. ఇదే డిమాండ్ను తాము లేవనెత్తుతున్నామని, ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాకేశ్ తికాయత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఉగ్రవాదితో సరిపోల్చారు. లఖీమ్పూర్ ఖేరిలో రైతుల ఆందోళన, హింసాత్మక ఘటనలో ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ‘కిసాన్ మహా పంచాయత్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తికాయత్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు హాని చేస్తాయన్న నిజాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని ప్రకటించిందని, సరైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే, ఈ చట్టాల గురించి కొందరికి అర్థమయ్యేలా వివరించడంలో విఫలమయ్యామంటూ రైతుల నడుమ చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ కొందరు తామేనని అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ దేశాన్ని అమ్మేస్తుంటారు సంఘర్‡్ష విశ్రామ్(కాల్పుల విరమణ)ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే ప్రకటించిందని, రైతులు కాదని రాకేశ్ తికాయత్ ఉద్ఘాటించారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, అప్పటిదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. దేశమంతటా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ వ్యవహార ధోరణిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. రైతుల పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘వారు (ప్రభుత్వం) ఒకవైపు మిమ్మల్ని హిందూ–ముస్లిం, హిందూ–సిక్కు, జిన్నా అంటూ మభ్య పెడుతుంటారు. మరోవైపు దేశాన్ని అమ్మేస్తుంటారు’’ అని తికాయత్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పినంత మాత్రాన పంటలకు కనీస మద్దతు ధర దక్కదని అన్నారు. చట్టబద్ధత కల్పిస్తేనే దక్కుతుందని చెప్పారు. ఈ అంశంపై ఒప్పటికే కమిటీని ఏర్పాటు చేశారని, నివేదిక ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) చేరిందని, నిర్ణయం తీసుకోవడానికి కొత్త కమిటీ అవసరం లేదని సూచించారు. నివేదిక ఇచ్చిన కమిటీలో నరేంద్ర మోదీ కూడా సభ్యుడేనని గుర్తుచేశారు. కమిటీ సిఫార్సులను ఆయన ఆమోదిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించరేం? ప్రసార మాధ్యమాల తీరుపై రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా మీడియా కేవలం రైతులను మాత్ర మే ప్రశ్నిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారని తెలిపారు. కిసాన్ మహా పంచాయత్లో పలువరు రైతు సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేర్చండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ రైతులు కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్పై ఇంకా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ శనివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతుల కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేర్చాలని, లఖీమ్పూర్ ఖేరి హింసలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని ఆయన కోరారు. రైతుల డిమాండ్లు నెరవేర్చేవరకు వారి పోరాటం ఆగదని పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని ముందే తీసుకుని ఉండి ఉంటే 700 మంది రైతుల ప్రాణాలను కాపాడగలిగేవారని వ్యాఖ్యానించారు. మోదీకి రాసిన లేఖను వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘రైతులు చేస్తున్న డిమాండ్లన్నీ నెరవేర్చేవరకు వారి ఉద్యమం ఆగదు. ఇప్పటికీ వారిలో ఆగ్రహావేశాలు ఉన్నాయి. అవి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో బయటకి వస్తాయి. అందుకే కనీస మద్దతు ధరకి చట్ట బద్ధత కల్పించాలి’ అన్నారు. గత ఏడాదిగా జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తలా రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని వరుణ్ డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలన్నారు. రైతులు చేస్తున్న డిమాండ్లు ఇవే.. ► కనీస మద్దతు ధరకి చట్ట బద్ధత కల్పించాలి. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయాలి. ► సంప్రదాయ ఆహార పంటల్ని కొనుగోలు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి ► మండీ వ్యవస్థను పరిరక్షించాలి ► విద్యుత్(సవరణ) బిల్లు–2020ను వెనక్కి తీసుకోవాలి. ► పంట వ్యర్థాల్ని తగలబెడుతున్నందుకు రైతులకు విధిస్తున్న జరిమానాలు, జైలు శిక్షలకు ఇకపై స్వస్తి పలకాలి. -
తదుపరి కార్యాచరణ ఏంటి?
న్యూఢిల్లీ: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే సరిపోదు, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆదివారం సింఘు బోర్డర్ పాయింట్ వద్ద సమావేశం కానుంది. ఎంఎస్పీతోపాటు ప్రతిపాదిత ట్రాక్టర్ ర్యాలీపై చర్చించనున్నట్లు ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ శనివారం చెప్పారు. సాగు చట్టాల రద్దు ప్రక్రియ పార్లమెంట్లో పూర్తయ్యేదాకా రైతుల పోరాటం ఆగదని అన్నారు. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ వరకూ ప్రతిరోజూ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని విరమించుకోలేదని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతన్నలు ప్రారంభించిన పోరాటానికి నవంబర్ 26న ఏడాది పూర్తి కానుంది. ఈ చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తమ పోరాట కార్యక్రమంలో ఎలాంటి మార్పు ఉండబోదని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ఈ నెల 26న ఢిల్లీ శివార్లలోని నిరసన కేంద్రాలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. కేసులను ఉపసంహరించాలి: మాయావతి కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టాన్ని తీసుకురావాలని బహుజన సమాజ్పార్టీ అధినేత మాయావతి శనివారం డిమాండ్ చేశారు. రైతులపై నమోదు చేసిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. -
ధాన్యం మద్దతు ధర పొందాలంటే..
పంటను కంటికి రెప్పలా కాపాడుకుని వరి పండించడం ఒక ఎత్తు. దానికి మద్దతు ధర పొందటం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తేనే మద్దతు ధర లభిస్తుందని మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల వ్యవసాయ అధికారి రమేష్ పేర్కొంటున్నారు. మరి అవేంటో చూద్దాం. సాక్షి, శామీర్పేట్: రైతులు తాము పండించిన వరి గింజలపై తీసుకునే జాగ్రత్తల మేరకు మద్దతు ధర లభిస్తుంది. రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. సాధారణ ధాన్యం రకం కనీసం మద్దతు ధర క్వింటాకు రూ.1940, ఎ–గ్రేడ్ రకం రూ.1960 రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించింది. రైతులు తమ పంట తాలుకు వరి ధాన్యాన్ని దిగువ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించి వాటిని ఆచరిస్తే మద్దతు ధర పొందవచ్చని వ్యవసాయ అధికారి సూచిస్తున్నారు. (చదవండి: ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలం) నాణ్యతాప్రమాణాలు... ► మట్టి, రాళ్లు, ఇసుక వంటి వ్యర్థాలు ఉండకూడదు. ► గడ్డి, చెత్త, తప్ప, కలుపు, విత్తనాలు ఒక్క శాతం మించకూడదు. ► చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యపు గింజలు 5శాతం మించకూడదు. ► వరిపక్వం గాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యపు గింజలు 3శాతంలోపే ఉండాలి. ► తక్కువ శ్రేణి ధాన్యపు గింజలు లేక కేళీలు ఎ–గ్రేడ్ రకంలో 6శాతం మించకూడదు. ► తేమ లేక నిమ్ము 17 శాతం మించితే కొనుగోలు చేయరు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ► ఒక రకం ధాన్యాన్ని మరోక రకం ధాన్యంతో కలపరాదు. ► పంట కోసిన తర్వాత ఆరబెట్టక పోతే గింజలు రంగుమారి నాణ్యత కోల్పోతాయి. పూర్తిగా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. ► నూర్చేటప్పుడు ధాన్యంలో రాళ్లు, మట్టి గడ్డలు కలపకుండా నేల మీద పరదాలు లేదా టార్పాలిన్లు వేసి, వాటిపై నూర్పిడి చేయాలి. ► పంటలో తాలు, తప్ప, పొల్లు, చెత్తాచెదారం పోయేటట్టు తూర్పారబట్టాలి. ► ధాన్యం ముక్కిపోయి రంగుమారి నాణ్యత పడిపోకుండా తేమ బాగా తగ్గాకే బస్తాల్లో నింపి లాటు కట్టాలి. ► నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎలుకలు నాశనం చేయకుండా బస్తాల మధ్యన జింకు సల్ఫేట్ మాత్రలు, పురుగు నివారణకు లీటరు నీటికి 5 మిల్లీ లీటర్లు మలాథియాన్ మందును బస్తాలపై పిచికారి చేయాలి. ► రైతులు ధాన్యపు పంట నుంచి సుమారు కిలో ధాన్యం మచ్చు (శాంపిల్) కింద ప్రాథమిక పరిశీలన కోసం కొనుగోలు కేంద్రానికి ముందుగా తీసుకొచ్చి నాణ్యత పరీక్ష అధికారికి చూపించి తగు సలహ పొందాలి. ► ధాన్యం కొనుగోలు కేంద్రంలో శాంపిల్ తీసుకున్న అధికారి ధాన్యం నాణ్యతకు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సరుకు కొనుగోలు కేంద్రానికి తెచ్చుకోవాలి. ► మొదట తెచ్చిన ధాన్యం శాంపిల్ మాదిరిగానే మొత్తం సరుకు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ► సదరు ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఉచిత నాణ్యత, తేమ పరీక్ష కేంద్రంగా కూడా రైతులకు ఉపయోగపడుతుంది. ► రైతు తనే పంట పండించిన భూమి సర్వే నంబర్ విస్తీర్ణ వివరాలు తెలియజేస్తూ అధికారి నుంచి గుర్తింపు పత్రం తీసుకుని ధాన్యం కోనుగోలు కేంద్రానికి దాఖలు చేయాలి. ► దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్లు చొరబాటు లేకుండా నివారించేందుకు నేరుగా పంట పండించిన రైతులకే ప్రభుత్వం గిట్టుబాటు ధర వర్తింపజేసేందుకే ఈ నిబంధనలు పాటించాలి. ► రైతులకు నాణ్యత ప్రమాణాలపై ఏమైనా సందేహాలుంటే సంబంధిత ఏఓ లేక ఏఈఓలను సంప్రదించాలి. దళారులను నమ్మొద్దు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రైతులు ఏమైనా సందేహాలుంటే ఏఈఓలను సంప్రదించండి. అధికారుల సూచనలను పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్ల ప్రమేయం నివారించేందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలి. – రమేష్, శామీర్పేట వ్యవసాయ అధికారి -
ఆర్బీకేలే ధాన్యం సేకరణ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఈసారి ఆర్బీకేలు కేంద్రంగా నూరుశాతం కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం సేకరించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ ప్రక్రియలో పౌర సరఫరాల సంస్థతో పాటు మార్క్ఫెడ్ను కూడా భాగస్వామిని చేసింది. గ్రేడ్ ‘ఏ‘ రకం ధాన్యాన్ని క్వింటాల్ రూ.1,960, సాధారణ రకం క్వింటాల్ రూ.1,940లకు కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ పౌరసరఫరాల శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సేకరణ లక్ష్యం 50 లక్షల టన్నులు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 39.35 లక్షల ఎకరాల్లో వరి సాగవగా కనీసం 80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. గత ఖరీఫ్లో రికార్డు స్థాయిలో రూ.8,868 కోట్లతో 47.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం ఈసారి పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఇలా అయితేనే .. ► తొలిసారి ఆర్బీకేలు వేదికగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ–క్రాప్తో పాటు రైతుల ఈకేవైసీ (వేలిముద్రలు) ప్రామాణికం ► వరి సాగవుతున్న ప్రాంతాల్లో 6,884 ఆర్బీకేల్లో సేకరణ కేంద్రాలు ► మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తొలిసారి వికేంద్రీకృత విధానం అమలు ► ధాన్యం సేకరణ, మిల్లింగ్, పంపిణీకి సంబంధించి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఏపీ మార్క్ఫెడ్, మిగిలిన పది జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థకు బాధ్యతలు ► గతంలో మాదిరిగా ప్రత్యేక పోర్టల్లో రైతులు వివరాలను నమోదు చేసుకోనవసరం లేదు. ► ఆర్బీకేల్లో ఉండే టెక్నికల్ సిబ్బంది కూపన్ ద్వారా ఎప్పుడు తీసుకురావాలో తెలియజేస్తారు. ► కేంద్రం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం ఉండేలా సిద్ధం చేసుకోవాలి. తేమ శాతం 17 శాతానికి మించి ఉండకూడదు. ► రైతులు విక్రయించిన ధాన్యం, వాటి విలువ తదితర వివరాలతో రసీదు తీసుకోవాలి. ► రైతులకు 21 రోజుల్లో వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారు. ► ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లలో అమ్మదలచిన రైతులు సైతం తమ పంట వివరాలను ఆర్బీకేలో తప్పనిసరిగా నమోదు చేయాలి. ► రోజువారీ పర్యవేక్షణకు జిల్లా జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా–రెవెన్యూ) చైర్మన్గా జిల్లా స్థాయిలో సేకరణ కమిటీ ఏర్పాటు. కమిటీలో మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాలు, రవాణా, డీఆర్డీఏ, ఐటీడీఎలతో పాటు వేర్హౌసింగ్ ఏజెన్సీలు (సీడబ్ల్యూసీ, ఎస్డబ్ల్యూసీ), ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు (ఎఫ్సీఐ, ఏపీఎస్సీఎస్సీఎల్), సబ్– కలెక్టర్లు / ఆర్డీవోలు సభ్యులు. కస్టమ్ మిల్లింగ్పై నిరంతర నిఘా ఆర్బీకేల వద్ద సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ సామర్థ్యం ప్రకారం కస్టమ్ మిల్లింగ్, సీఎంఆర్ డెలివరీ కోసం రైస్ మిల్లులకు కేటాయిస్తారు. ఇందుకోసం 1:1 నిష్పత్తిలో బ్యాంకు గ్యారెంటీ సమర్పించి రైసుమిల్లులు సంబంధిత ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీతో ఎంవోయూ పొందుతారు. కస్టమ్ మిల్లింగ్ కార్యకలాపాల ప్రక్రియను జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. కస్టమ్ మిల్లింగ్ చేయడంలో కానీ, నిర్ణీత గడువులోగా బట్వాడా చేయడంలో కానీ విఫలమైన రైస్ మిల్లర్లను బ్లాక్లిస్ట్ పెట్టడంతో పాటు తీవ్రతను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. -
పత్తి బంగారమైంది
సాక్షి, అమరావతి: పత్తి రైతుకు ఈ ఏడాది పండగే అయింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో తెల్ల బంగారమే అయింది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కంటే ఎక్కువే రైతుకు లభిస్తోంది. ప్రస్తుతం పత్తి ఎమ్మెస్పీ క్వింటాల్కు రూ.6,025 ఉండగా, మార్కెట్లో రూ.8,800 పలుకుతోంది. ఇది రూ.10వేల వరకు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. తగ్గిన విస్తీర్ణం.. పెరిగిన డిమాండ్ రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.73 లక్షల ఎకరాలు. గతేడాది 14.91లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 12.86 లక్షల ఎకరాల్లోనే సాగైంది. గతేడాది 10.46 లక్షల మిలియన్ టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది 9.33 లక్షల మిలియన్ టన్నులు వస్తుందని అంచనా. ఈ ఏడాది క్వింటాల్ పొడుగు పింజ పత్తి రూ.6025, మధ్యస్థ పత్తి రూ.5,726గా కనీస మద్దతు ధర నిర్ణయించారు. గత రెండేళ్లలో ఎమ్మెస్పీ లభించకపోవడంతో ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా 2019–20లో 13 లక్షల క్వింటాళ్లు, 2020–21 లో 18 లక్షల క్వింటాళ్ల పత్తిని 44,440 మంది రైతుల నుంచి ఎమ్మెస్పీకి కొనుగోలు చేసింది. ఈ ఏడాది 50 మార్కెట్ యార్డులతో పాటు 73 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో వ్యాపారులు రేటు తగ్గించే అవకాశం లేకుండా పోయింది. సీజన్ ఆరంభం నుంచి మంచి ధర పలుకుతోంది. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో దిగుబడి పెరిగినప్పటికీ, అకాల వర్షాలతో కొన్ని చోట్ల దిగుబడి తగ్గింది. మొత్తం మీద చూస్తే దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగింది. దీనికి నాణ్యత కూడా తోడవడంతో పత్తి రైతుకు ఎక్కువ ధర లభిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయంగా దూది వినియోగం పెరడం, కాటన్ యార్న్ ధరలు పెరగడం కూడా పత్తి ధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాటన్ సీడ్కు కూడా మంచి రేటొస్తోంది. క్వింటాల్కు కనిష్టంగా రూ.3,180 గరిష్టంగా రూ.3,620 పలుకుతోంది. ఆదోని ‘పత్తి’ యార్డుకు మహర్దశ పత్తికి మంచి ధర వస్తుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన పత్తి మార్కెట్గా పేరొందిన కర్నూలు జిల్లా ఆదోని యార్డుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఇక్కడకు ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పత్తి రైతులొస్తుంటారు. సీజన్ ప్రారంభం నుంచి సోమవారం వరకు 2 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకాలు జరిగాయి. రోజుకు వెయ్యి మంది రైతులు 25 వేల క్వింటాళ్ల పత్తిని తీసుకొస్తున్నారు. క్వింటాల్ రూ.8,670కు అమ్ముకున్నా నేను మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్న. ఈ ఏడాది ఎకరాకు 9 క్వింటాళ్ల వరకు వస్తోంది. సోమవారం ఆదోని యార్డులో క్వింటాలు రూ.8,670 చొప్పున 8 క్వింటాళ్లు అమ్మాను. గతంలో ఎప్పుడూ ఇంత ధర రాలేదు. చాలా ఆనందంగా ఉంది. – కే.వీరన్న, పరవతపురం, కర్నూలు జిల్లా గత ఏడాదికంటే ధర పెరిగింది నేను 2 ఎకరాల్లో పత్తి వేశా. మొదటి కోతలో 3 క్వింటాళ్లు రాగా క్వింటాల్ రూ.6,800కు అమ్మాను. రెండో కోతలో 5 క్వింటాళ్ల దిగుబడి రాగా రూ.7,500కు అమ్ముకున్నా. గతేడాదికంటే ఈసారి మంచి ధర వస్తోంది. – షేక్,ఖాసీం, పెద్దవరం, కృష్ణా జిల్లా లాట్కు 10 మంది పోటీపడుతున్నారు అనూహ్యంగా పెరిగిన ధరతో పత్తి కొనుగోలుకు వ్యాపారులు క్యూకడుతున్నారు. ఈసారి నాణ్యమైన పత్తి అధికంగా వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన యార్డులో లాట్కు పది మంది తక్కువ కాకుండా పోటీపడుతున్నారు. మంచి ధర పలుకుతోంది. – బి. శ్రీకాంతరెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్యార్డు, కర్నూలు జిల్లా ఈసారి మంచి రేటొస్తుంది అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోలుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. సోమవారం అత్యధికంగా క్వింటాల్కు రూ.8,800 ధర పలికింది. రోజురోజుకు పెరుగుతున్న ధరను బట్టి చూస్తుంటే ఈసారి క్వింటాల్ రూ.9500కు పైగా పలుకుతుందని అంచనా వేస్తున్నాం. రూ.10 వేల మార్కును అందుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. జి.సాయిఆదిత్య, ఏజీఎం, సీసీఐ కర్నూలు జిల్లా కౌతలం మండలం తోవి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు టి.నాగరాజు. 15 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. గత ఏడాది కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) క్వింటాల్కు రూ.5,825. అయినా మార్కెట్లో క్వింటాల్ రూ. 4,800 మించి ధర లేదు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర (క్వింటాల్ రూ.6,025)కు విక్రయించాడు. ప్రభుత్వ కేంద్రం లేకపోతే తక్కువ ధరకు వ్యాపారులకే అమ్ముకోవాల్సి వచ్చేది. అతను ఖరీఫ్లో కూడా పత్తి సాగు చేయగా ఎకరాకు 9–10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి వ్యాపారులే మంచి రేటు ఇస్తుండటంతో సోమవారం ఆదోని మార్కెట్ యార్డులో క్వింటాల్ రూ.8,800కు అమ్ముకోగలిగాడు. అంటే ఎమ్మెస్పీ (రూ.6,025) కంటే రూ.2,775 అధికంగా వచ్చింది. పెట్టుబడిపోను ఎకరాకు రూ.49 వేలు లాభంతో ఆనందంగా ఇంటికెళ్లాడు. -
భూ రికార్డులు చూశాకే ధాన్యం కొనుగోలు
న్యూఢిల్లీ: ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యాపారులకు కాకుండా అసలైన రైతులకే దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే చెప్పారు. వచ్చే నెల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు రైతుల భూమి రికార్డులను పరిశీలించనున్నట్లు (క్రాస్చెక్) సుదాన్షు తెలిపారు. రాష్ట్రాల్లోని డిజిటల్ ల్యాండ్ రికార్డులను ఎఫ్సీఐతో అనుసంధానించినట్లు వెల్లడించారు. రైతన్నల ప్రయోజనాల కోసమే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతులు వారి సొంత భూమిలో లేదా కౌలుకు తీసుకున్న భూమిలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుందని అన్నారు. ఏ ప్రాంతంలో ఎంత పంట పండించారు అనేది తెలుసుకోవడంతోపాటు అసలైన రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చేయడమే భూమి రికార్డుల క్రాస్చెక్ ఉద్దేశమని వివరించారు. -
రైతుల నిరసన: కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తక్షణమే ఈ కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం పలు పంటల మద్దతు ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ ఏడాదిలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయనున్న గోధుమ మద్దతు ధరను 2 శాతం అనగా 40 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ఈ ఏడాది క్వింటాల్ గోధుమ కనీస మద్దతు ధరను 2,015 రూపాయలుగా నిర్ణయించింది కేంద్రం. ప్రపంచంలో గోధుమ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. అలానే బార్లీపై 35 రూపాయల ధర పెంచుతూ.. క్వింటాల్ బార్లీ మద్దతు ధర 1,635 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. అలానే చెరుకు రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. క్వింటాల్ చెరకుకు మద్దతు ధరను 290 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జౌళి రంగంలో ప్రోత్సాహకాలకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జౌళి రంగంలో ఐదేళ్లలో 10,683 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం ప్రతి ఏటా మద్దతు ధరను నిర్ణయిస్తూ.. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటుంది. దానిలో భాగంగానే ఈ ఏడాదికి గాను పలు పంటల మద్దతు ధరలను కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. (చదవండి: బియ్యం, గోధుమల్లో ‘డి’ విటమిన్! ) అలానే ఈ ఏడాదికి గాను ఆవాల మద్దతు ధరను కేంద్రం 400 రూపాయలు పెంచి.. క్వింటాల్ ధర 5,050 రూపాయలుగా ప్రకటించింది. కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేసేందుకు నిర్ణయించే ధర. ప్రస్తుతానికి ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం 23 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ ఏడాదికి సంబంధించి కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: రైతుకు మద్దతు ధర అసాధ్యమా? -
Andhra Pradesh : ధాన్యం రైతుకు దన్ను
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ బుధవారం ఒక్కరోజే రైతులకు రూ.922.19 కోట్లను చెల్లించింది. దీంతో రబీలో సేకరించిన రూ.6,634.63 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,344.93 కోట్లను చెల్లించినట్లయింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను పౌరసరఫరాల సంస్థ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వెంటనే మిగతా రూ.289.7 కోట్లను చెల్లించేందుకు వీలుగా ఇప్పటికే నిధులు విడుదల చేసింది. ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు సకాలంలో చెల్లింపులు జరిపి దళారీలు, మిల్లర్ల మాయాజాలానికి తెరదించిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ కళ్లాల వద్దే కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం వల్ల అటు గిట్టుబాటు ధర దక్కడంతో పాటు ఇటు రవాణా ఖర్చుల రూపంలో రైతన్నలకు క్వింటాలుకు రూ.వంద వరకూ ఆదా అవుతోంది. ఏ ఒక్క రైతన్న కూడా ఇబ్బంది పడకూదనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే చెల్లింపులు జరపాలన్న నిర్ణయాన్ని ధృఢ సంకల్పంతో మనసా వాచా కర్మణా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 35.43 లక్షల టన్నుల కొనుగోలు.. రబీలో 21.75 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా సుమారు 65 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ధాన్యాన్ని సాధారణ రకం టన్ను రూ.1,868, ఏ–గ్రేడ్ రకం రూ.1,888 చొప్పున కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయడం, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం ద్వారా మిల్లర్లు, వ్యాపారులు అదే ధరకు కొనాల్సిన పరిస్థితి కల్పించింది. బుధవారం వరకూ 35,43,909 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా దీని విలువ రూ.6,634.63 కోట్లు ఉంటుంది. ఇందులో మంగళవారం వరకూ రూ.5,422.74 కోట్లను చెల్లించగా బుధవారం ఒక్క రోజే రూ.922.19 కోట్లను చెల్లించింది. మిగతా రూ.289.7 కోట్లను కూడా వివరాలు అందిన వెంటనే రైతులకు చెల్లించేలా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర చరిత్రలో రికార్డు.. గత ఖరీఫ్లో రూ.8,868.05 కోట్ల విలువైన 47,32,852 టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రబీలో రూ.6,634.63 కోట్ల విలువైన 35,43,909 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అంటే ఏడాదిలో రూ.15,502.68 కోట్ల విలువైన 82,76,761 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇక 2019–20లో రూ.15,036.67 కోట్ల విలువైన 82,56,761 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గత రెండేళ్లలో ఏడాదికి సగటున రూ.15,269.67 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. నాడు దళారీలు చెప్పిందే ధర.. టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో ఏనాడూ సక్రమంగా ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అరకొర కొనుగోళ్లకూ చెల్లింపులు చేయకుండా మూడు నుంచి ఆర్నెళ్ల పాటు జాప్యం చేయడం ద్వారా దోపిడీకి బాటలు పరిచింది. దళారులు, మిల్లర్లు తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల శ్రమను దోపిడీ చేశారు. ఐదేళ్లలో రూ.42,536.8 కోట్ల విలువైన ధాన్యాన్ని మాత్రమే టీడీపీ సర్కార్ కొనుగోలు చేసింది. అంటే ఏడాదికి సగటున రూ.8,507.36 కోట్ల ధాన్యాన్ని మాత్రమే కొన్నట్లు స్పష్టమవుతోంది. అది కూడా సకాలంలో చెల్లించకుండా మిల్లర్లు, దళారీలు రైతులను దోచుకున్నారు. 2018–19 రబీలో కొనుగోలు చేసిన 27.52 లక్షల టన్నుల ధాన్యానికి చెల్లించాల్సిన రూ.4,838.03 కోట్లను నాడు చంద్రబాబు ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించి రైతులను ముంచేశారు. ఆ బకాయిలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రైతులకు చెల్లించారు. ధాన్యం రైతులందరికీ సకాలంలో చెల్లించాం... – కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ. రబీలో కళ్లాల వద్దే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ రైతులకు రూ.6,344.93 కోట్లను చెల్లించాం. మిగతా రైతుల వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వెంటనే చెల్లించేందుకు వీలుగా రూ.289.7 కోట్లను విడుదల చేశాం. కొన్న ధాన్యానికి సకాలంలో చెల్లింపులు చేశాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నేతృత్వంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నాం. దీంతో దళారీలు, మిల్లర్లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా రైతులకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. -
ధాన్యం రైతుకు డబ్బులు!
సాక్షి, అమరావతి: ధాన్యం రైతన్నలకు శుభవార్త! కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ అన్నదాతలకు చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.1,600 కోట్లను విడుదల చేసింది. ధాన్యం కొనుగోలు చేసి 21 రోజులు దాటిన రైతుల ఖాతాలకు రూ.1,207 కోట్లను బుధవారం నుంచి జమ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. మిగిలిన రైతులకు కూడా సకాలంలో చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్రం బకాయిపడిన రూ.5,056.76 కోట్లను ఇంకా విడుదల చేయనప్పటికీ, కరోనా ప్రతికూల పరిస్థితులతో ఆర్థిక సమస్యలున్నా రైతన్నలు ఏమాత్రం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుని చెల్లింపులు చేస్తుండటాన్ని రైతు సంఘాల నేతలు ప్రశంసిస్తున్నారు. కళ్లాల వద్దే కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం వల్ల గిట్టుబాటు ధర దక్కడంతోపాటూ రవాణా ఖర్చుల రూపంలో క్వింటాలుకు రూ.వంద వరకూ ఆదా అవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో రైతులకు బకాయిపడిన రూ.4,838.03 కోట్లను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేసుకుంటున్నారు. 35.40 లక్షల టన్నులు కొనుగోలు... రబీలో 21.75 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా సుమారు 65 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా భారీ ఎత్తున కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. ధాన్యాన్ని సాధారణ రకం టన్ను రూ.1,868, ఏ–గ్రేడ్ రకం రూ.1,888 చొప్పున కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయడం వల్ల మిల్లర్లు, వ్యాపారులు అదే ధరకు కొనాల్సిన పరిస్థితిని కల్పించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకూ రైతు భరోసా కేంద్రాల ద్వారా కళ్లాల వద్దే 2,90,203 మంది రైతుల నుంచి 35,40,573.96 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కేంద్రం బకాయిలు విడుదల కాకున్నా.. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యానికి బియ్యం రాయితీ రూపంలో పౌరసరఫరాల శాఖకు కేంద్రం రూ.5,056.76 కోట్లు బకాయిపడింది. రబీలో భారీ ఎత్తున రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, బకాయిలు విడుదల చేస్తే సకాలంలో చెల్లింపులు చేస్తామని జూన్ 11న ఢిల్లీలో కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. అయితే కేంద్రం నుంచి బకాయిల విడుదలలో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ఖజానా నుంచి, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని చెల్లింపులు చేశారు. రబీలో ఇప్పటిదాకా కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.6,628.34 కోట్లు కాగా ఇప్పటికే రూ.3,266.70 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించింది. ఇందులో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల లోపు జరిపిన చెల్లింపులు రూ.1,637 కోట్లు ఉండడం గమనార్హం. రైతన్నలు ఇబ్బంది పడకుండా.. ధాన్యం రైతులకు ఇంకా రూ.3,361.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ధాన్యం విక్రయించి 21 రోజులు పూర్తయిన రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.1,207 కోట్లు ఉంది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నాబార్డు నుంచి రుణం తీసుకుని రైతులకు చెల్లింపులు చేయాలని పౌరసరఫరాలశాఖను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రూ.1,600 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన నాబార్డు నిధులను విడుదల చేయడంతో బుధవారం నుంచి రైతులకు చెల్లింపులు జరిపేలా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. నాడు దళారులు, మిల్లర్లు చెప్పిందే ధర.. టీడీపీ అధికారంలో ఉండగా జూన్ 2014 నుంచి మే 2019 వరకూ ఏనాడూ సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అరకొర కొనుగోళ్లకూ చెల్లింపులు చేయకుండా మూడు నుంచి ఆర్నెళ్ల పాటు జాప్యం చేసింది. దీంతో దళారులు, మిల్లర్లు తక్కువ ధరకే ధాన్యాన్ని సేకరించి రైతుల శ్రమను దోపిడీ చేశారు. 2018–19 రబీలో కొనుగోలు చేసిన 27.52 లక్షల టన్నుల ధాన్యానికి చెల్లించాల్సిన రూ.4,838.03 కోట్లను నాటి సీఎం చంద్రబాబు ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించి రైతులను ముంచేశారు. ఆ బకాయిలను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక చెల్లించారు. రెండేళ్లలోనే రూ.35,371.09 కోట్ల ధాన్యం కొనుగోలు.. టీడీపీ ఐదేళ్ల పాలనలో రబీ, ఖరీఫ్తో కలిపి రూ.37,698.77 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.35,371.09 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనడం గమనార్హం. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు రైతులకు సకాలంలో రూ.32,009.45 కోట్లను చెల్లించింది. మిగతా రూ.3,361.64 కోట్లను కూడా చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. -
రైతులతో మళ్లీ చర్చలకు సిద్ధం
న్యూఢిల్లీ/చండీగఢ్: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ శనివారం ప్రకటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలలుగా కొనసాగిస్తున్న ఆందోళనలను విరమించాలని రైతు సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాల డిమాండ్ మేరకు ప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని పెంచడంతోపాటు ఎంఎస్పీ ప్రకారం పెద్ద మొత్తంలో ధాన్యం సేకరణ జరిపిందని చెప్పారు. కాగా, మంత్రి తోమర్ పిలుపుపై 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పందించింది. ఆ ప్రకటనలు అస్పష్టంగాను, పరస్పర విరుద్ధంగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది. వివాదాస్పద చట్టాలకు అర్థంలేని సవరణలు చేపట్టాలని తాము కోరుకోవడం లేదని తెలిపింది. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత ఏడాది నవంబర్ నుంచి వివిధ రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయా చట్టాల్లోని వివాదాస్పద అంశాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య జనవరి 22వ తేదీ నాటికి 11 విడతలుగా జరిగిన చర్చలుæ పురోగతి సాధించలేకపోయాయి. ఆందోళనలు 8వ నెలకు చేరుకున్న సందర్భంగా ఎస్కేఎం ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాష్ట్రాలతోపాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలిపారు. చాలా రాష్ట్రాల్లో రైతులు గవర్నర్లకు వినతి పత్రాలు ఇచ్చేందుకు ర్యాలీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ నేతృత్వంలో ఈశాన్య ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)ను కలిసేందుకు బయలుదేరగా పోలీసులు వారిని వజీరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకునేదాకా ఆందోళనలను విరమించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యుధ్వీర్ సింగ్ తేల్చిచెప్పారు. చండీగఢ్–మొహాలీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. చండీగఢ్–మొహాలీ సరిహద్దుల్లో ఉన్న బారికేడ్లను తొలగించుకుని రైతులు ముందుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించి, అడ్డుకున్నారు. -
మార్కెట్లో మంచి ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను మించి బహిరంగ మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. వ్యాపారులు గతంలో సిండికేట్గా ఏర్పడి తమ ఇష్టమొచ్చిన ధరలకే రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేసేవారు. దీనివల్ల కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా రైతులకు లభించేవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కనీస మద్దతు ధర లభించని పంటలను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, ఇతర పద్ధతుల్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. గత ఏడాది ఈ విధంగా పెద్దఎత్తున పంట ఉత్పత్తుల్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులకు వ్యవసాయ ఉత్పత్తులు దొరకని పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ ఏడాది పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. దీంతో పప్పు ధాన్యాలు, రాగులు, సజ్జలు, ఇతర చిరు ధాన్యాల ధరలు పెరిగాయి. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి వాటిని కొనుగోలు చేస్తుండటంతో రైతుల పంట పండింది. ఈ కారణంగా రైతులు ఈసారి మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. గతేడాది రూ.2,856.53 కోట్ల విలువైన పంటల కొనుగోలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం గతేడాది మాదిరిగానే కందులు, శనగలు, జొన్న, మొక్కజొన్న ఇతర పంటల కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా సుమారు 10 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ అధ్వర్యంలో మార్చి 1న తెరిచింది. అయితే, ఇప్పటివరకు రూ.796.81 కోట్ల విలువైన 4.05 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే రైతులు వాటిలో విక్రయించారు. గతేడాది రబీలో రూ.2,856.53 కోట్ల విలువైన 8,19,572 టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. అంటే గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్లో అమ్ముడుపోయాయి. మొక్కజొన్న, జొన్న రైతుల్ని ఆదుకుంటున్న కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న, జొన్న రైతులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ఆదుకుంటున్నాయి. ఈ ఏడాది మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.1,850 కాగా, బహిరంగ మార్కెట్లో రూ.1,450 నుంచి రూ.1,550 మధ్య పలుకుతోంది. ఈ కారణంగా మొక్కజొన్న రైతులు పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు క్యూ కట్టారు. ఈ ఏడాది 3.96 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా.. ఇప్పటివరకు రూ.553.01 కోట్ల విలువైన 2,98,924.50 టన్నులను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి ఆదుకుంది. జొన్నలు 1.10 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.195.33 కోట్ల విలువైన 96,332.85 టన్నులను కొనుగోలు చేశారు. ఈ విధంగా ఈ ఏడాది 60,953 మంది రైతుల నుంచి రూ.796.81 కోట్ల విలువైన 4,04,763.10 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే మార్క్ఫెడ్ కొనుగోలు చేయగలిగింది. ఇది శుభపరిణామం ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చింది. మినుములు, కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే మిన్నగా ధరలు పలకడం వలన ఈ ఏడాది మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు పెద్దగా రాలేదు. ఇది నిజంగా శుభపరిణామం. – పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్ఫెడ్ -
చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిల్లెట్స్ మిషన్ను వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. మన రాష్ట్రంతోపాటు 19 రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయశాఖ సహకారంతో రెండేళ్ల కిందట ఈ మిషన్ ప్రారంభమైంది. సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న వంటి ముతక ధాన్యాలతో పాటు కొర్ర, వరిగ, అండుకొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం ఈ మిషన్ లక్ష్యం. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి చిరుధాన్యాల సాగును రెట్టింపు చేసి తక్కువ వ్యయంతో రైతులకు ఎక్కువ ఆదాయం దక్కేలా చేయాలన్నది ఉద్దేశం. దీన్లో భాగంగా సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న వంటి పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించగా కొన్ని చిరుధాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తోంది. ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు ధరల స్థిరీకరణ నిధితో జోక్యం చేసుకుంటోంది. అయినా మొక్కజొన్న తప్ప మిగతా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం సంతృప్తికరంగా లేదు. దీంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కృషి విజ్ఞాన కేంద్రాలు నిర్ణయించాయి. వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడంతో పాటు పర్యావరణ హితం, పౌష్టికాహార విలువలున్న జొన్న, సజ్జ, రాగి వంటి పంటలను రైతులు సాగుచేస్తే భూసారాన్నీ పరిరక్షించుకోవచ్చు. ప్రస్తుత తక్షణావసరం ఇదేనని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. మన రాష్ట్రంలో 2.87 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం సజ్జ, జొన్న, రాగి వంటి ముతక ధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీచేస్తే ఉత్పత్తి పెరుగుతుందని, వ్యయప్రయాసలతో కూడిన పంటల నుంచి రైతులు చిరుధాన్యాల వైపు మరల్చవచ్చని సాగురంగ నిపుణుల అభిప్రాయం. చౌకడిపోల ద్వారా చిరుధాన్యాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదించినా కరోనా నేపథ్యంలో అమల్లోకి రాలేదు. ముతక ధాన్యాలతో పాటు చిరుధాన్యాలను సాగుచేయడం వల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుంది. చిరుధాన్యాలను పండించడం వల్ల భూమి గుల్లబారకుండా ఉంటుందని హైదరాబాద్లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనసంస్థ డైరెక్టర్ విలాస్ తోనాపి పేర్కొన్నారు. రెండేళ్లలో దేశవ్యాప్తంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 24 శాతం పెరిగింది. ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతుంటే మన రాష్ట్రంలో మొత్తం 2.87 లక్షల హెక్టార్లలో సాగు చేయించాలన్నది లక్ష్యం. గత ఏడాది ఖరీఫ్లో 1.85 లక్షల హెక్టార్లలో ఈ పంటలు సాగయ్యాయి. ఈ ఖరీఫ్లోనైనా లక్ష్యానికి అనుగుణంగా జొన్న 41 వేల హెక్టార్లు, సజ్జ 34 వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.18 లక్షల హెక్టార్లు, రాగి 35 వేల హెక్టార్లు, ఇతర చిరుధాన్యాలను 59 వేల హెక్టార్లలో సాగు చేయించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో మిల్లెట్స్ మిషన్ అమల్లో ఉంది. ఒక్క చిరుధాన్యాలతోనే ఆదాయం రాదనే అపోహను పోగొట్టేలా.. పంట వైవిధ్యాన్ని, అంతరపంటల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఉత్తరాంధ్రలో రాగి పంట సాగు పెరిగింది. మొక్కజొన్న సాగు ఎందుకు పెరుగుతోందంటే.. సజ్జ, జొన్న, రాగి వంటి ముతక ధాన్యాల సాగు పెరగకపోయినా మొక్కజొన్న సాగు ఏటికేడాది పెరుగుతూనే ఉంది. మొత్తం దిగుబడిలో పది శాతానికి పైగా మొక్కజొన్నల్ని కోళ్ల మేత కోసం పౌల్ట్రీరంగం కొనుగోలు చేస్తోంది. ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అనుబంధ ఆహార ఉత్పత్తులకు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మిగతా చిరుధాన్యాలతో పోలిస్తే వీటిని శుద్ధి చేయడం సులభమేగాక మద్దతు ధర కూడా సాగు పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
ధాన్యం రైతు 'ధర'హాసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యాన్ని ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) భారీగా కొనుగోలు చేస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఉన్న ఊళ్లోనే ధాన్యాన్ని అమ్ముకోగలుగుతున్నారు. తద్వారా రవాణా ఖర్చు ఆదా అవుతోంది. ప్రస్తుత రబీలో ధాన్యాన్ని విక్రయించేందుకు ఆర్బీకేల ద్వారా 3.55 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. శనివారం నాటికి 2,11,320 మంది రైతుల నుంచి రూ.4,521.08 కోట్ల విలువైన 24,14,969.28 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రబీ పంట కోతలు పూర్తయ్యాయి. దాంతో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధిక భాగం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నెల్లూరు, ప్రకాశం.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పంట కోతలు ప్రారంభమవుతుండటంతో ఆ ప్రాంతాల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే కొనుగోలు చేయడమే కాకుండా 21 రోజుల్లోగా అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. ప్రభుత్వమే భారీ ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లోనూ అదే ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 24,14,969.28 టన్నులు కొనుగోలు ► రబీలో రైతులు 21.75 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. దిగుబడి అయిన ధాన్నాన్ని వీలైనంతంగా కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే 24,14,969.28 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ► ప్రభుత్వం ధాన్యం క్వింటాలుకు సాధారణ రకానికి రూ.1868, ఏ–గ్రేడ్ రకానికి రూ.1888 ఎమ్మెస్పీగా ప్రకటించి, అదే ధరకు కొనుగోలు చేస్తోంది. రైతుల కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో గ్రామాల్లోని 7,706 ఆర్బీకేలతో పౌర సరఫరాల శాఖ నేతృత్వంలోని 3,936 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానం చేశారు. ► ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తమ పేర్లను ఆయా గ్రామాల్లోని ఆర్బీకేల్లో నమోదు చేయించుకోవాలి. ఈ–పంటలో ఆ రైతులు వరి సాగు చేశారా లేదా అన్నది సరి చూసుకుని, కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలుకు కూపన్లు జారీ చేస్తారు. ఏ రోజున ఏ సమయంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారన్నది ఆ కూపన్లలో స్పష్టంగా ఉంటుంది. ► ఆ మేరకు ఆర్బీకేలోని వీఏఏ (గ్రామ వ్యవసాయ సహాయకుడు) కళ్లం వద్దకు వెళ్లి ధాన్యం నాణ్యతను పరిశీలించి, కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎఫ్సీఐ (భారత ఆహార సంస్థ) ప్రమాణాల మేరకు నాణ్యత లేకపోతే.. ధాన్యంలో తేమ శాతం తగ్గే వరకు అరబెట్టాలని వీఏఏ సూచిస్తారు. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. గిట్టుబాటుధర దక్కకపోతే అమ్ముకోవద్దు బహిరంగ మార్కెట్లో కనీస మద్ధతు ధర దక్కకుంటే ధాన్యాన్ని అమ్ముకోవద్దు. ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేయించుకోండి. కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేయడానికి కూపన్లు జారీ చేస్తాం. కూపన్లలో పేర్కొన్న రోజున ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు రాకపోతే.. మరో కూపన్ జారీ చేసి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. మిల్లర్లు, దళారీలకు ధాన్యాన్ని అమ్ముకోవద్దు. – కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ రైతులకు అన్ని విధాలా భరోసా ► దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు పంటల సాగులో సూచనలు, సలహాలు ఇస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ► అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల పంటకు నష్టం వాటిల్లితే బీమా పథకం ద్వారా పరిహారం అందజేస్తూ రైతులకు బాసటగా నిలుస్తోంది. తుదకు పండించిన పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తోంది. -
మొక్కజొన్న రైతులకు సర్కారు బాసట
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో మొక్కజొన్న రైతులకు బాసటగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్లో మొక్కజొన్న ధర క్వింటాల్కు రూ.1,450 నుంచి రూ.1,500 వరకు మాత్రమే పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు దళారుల బారినపడి నష్టపోకుండా చూసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 19 (సోమవారం) నుంచి వాటిద్వారా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనుంది. ఇక్కడ విక్రయించే మొక్కజొన్నకు క్వింటాల్కు రూ.1,850 చొప్పున కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఈ ఏడాది రబీలో 1.76 లక్షల హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. పంట బాగా పండటంతో హెక్టారుకు 8,144 కేజీల చొప్పున 14.33 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో కనీసం 3.96 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించి మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఈ క్రాప్ ఆధారంగా ఇప్పటికే ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకున్న రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతాయి. రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం మొక్కజొన్నను సాధారణంగా కోళ్ల ఫారాల్లో మేతగా వినియోగిస్తారు. పిండి పదార్థాల తయారీతో పాటు ఇథనాల్, ఆల్కహాల్ తయారీలోనూ మొక్కజొన్నను వినియోగిస్తారు. గతేడాది పంట చేతికొచ్చే సమయంలో కరోనా విరుచుకుపడింది. ఆ సమయంలో పౌల్ట్రీ రంగం కుదేలైంది. మొక్కజొన్నను ముడి సరుకుగా వినియోగించే ఇతర పరిశ్రమలు సైతం దెబ్బతిన్నాయి. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు లేకపోవడంతో వ్యాపారుల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మార్కెట్ లో మొక్కజొన్న రేటు ఒక్కసారిగా పడిపోయింది. క్వింటాల్కు రూ.1,300 నుంచి రూ.1,400కు మించి ధర లభించని దుస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,500కు పైగా కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధర రూ.1,760 చొప్పున చెల్లించి 61,445 మంది రైతుల నుంచి 4,16,140 మెట్రిక్ టన్నులను సేకరించింది. రైతులకు రూ.732 కోట్లు చెల్లించింది. నేటినుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తాం ఆర్బీకేలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. సోమవారం నుంచి కొనుగోళ్లకు శ్రీకారం చుడుతున్నాం. కనీస మద్దతు ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. – ప్రద్యుమ్న, ఎండీ, మార్క్ఫెడ్ -
పసుపు బోర్డు ఏర్పాటుకు బ్రేక్ పడినట్లేనా?!
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): పసుపు రైతుల చిరకాల స్వప్నమైన పసుపు బోర్డు ఏర్పాటుకు బ్రేక్ పడినట్లేననే వాదన వినిపిస్తోంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, సహాయ మంత్రి పురుషోత్తం రూపాలలు పసుపు బోర్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా పసుపు పంట సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోనే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పసుపు సుగంధ ద్రవ్యాల బోర్డులో ఒక భాగమని వెల్లడవుతుంది. కానీ పసుపు పంటకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే వివిధ రాజకీయ పక్షాలు పసుపు బోర్డు ఏర్పాటుపై హామీ ఇచ్చాయి. ఈక్రమంలో కేంద్రం ప్రకటనతో పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తే.. పొగాకు బోర్డు, మిర్చి బోర్డుల తరహాలోనే ³సుపు బోర్డు ఏర్పాటు చేస్తే పంట సాగు విస్తీర్ణంను నియంత్రించడంతో పాటు మినిమం సపోర్టు ప్రైస్(ఎంఎస్పీ)ని ప్రకటించడం లేదా మద్దతు ధరను అమలు చేయడం జరుగుతుంది. అలాగే పసుపు సాగు చేసే రైతులకు మెళుకువలను తెలియజెప్పి నాణ్యమైన పంటను సాగు చేయించడం జరుగుతుంది. పసుపు సాగు మొదలుకొని మార్కెటింగ్ వరకు పసుపు బోర్డు కనుసన్నలలోనే సాగుతుంది. పసుపు బోర్డు ఏర్పాటు జరిగితే తమకు ఎలాంటి నష్టం కలుగదని పైగా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని రైతులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా సాగు అయ్యే పసుపు పంటలో 80 శాతం పసుపు నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాల్లోనే సాగు అవుతుంది. అందువల్ల నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. పసుపు బోర్డు సాధనే లక్ష్యంగా 2019 పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి అత్యధిక సంఖ్యలో రైతులు పోటీ చేసిన విషయం విదితమే. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోను ఇక్కడి రైతులు కొందరు పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్తో పోటీ చేశారు. పసుపు బోర్డు విషయంలో కేంద్రం స్తబ్దంగా ఉండటం, రైతులు పట్టు వీడకపోవడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. బీజేపీ నేతలు వంచించారు పసుపు బోర్డు ఏర్పాటు విషయమై బీజేపీ నేతలు రైతులను వంచించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామ ని పార్లమెంట్ ఎన్నికల్లో హా మీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు. పసుపు బోర్డు సాధించేవరకు మేము నిద్రపోం. – పవన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మోర్తాడ్ రైతుల ఆకాంక్షను నెరవేర్చాలి రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలి. రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు. రైతుల ఆశయాలను సాకా రం చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉంది. బీజేపీ నాయకత్వం చొరవ తీసుకుని పసుపు బోర్డును ఏర్పాటు చేయించాలి. – తక్కూరి సతీష్, మోర్తాడ్ పసుపు బోర్డు ఏర్పాటు అవసరం లేదు: పురుషోత్తమ్ రూపాలా -
కందులు.. ఆల్టైమ్ రికార్డు ధర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కందులు పంటకు గిరాకీ ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో కందులు క్వింటాలుకు రూ.7,200 వరకు ధర లభిస్తోంది. ఇది ఆల్టైమ్ రికార్డు కావడం విశేషం. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కందులుకు ఇంతటి ధర లభించలేదు. గతేడాది కురిసిన అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో గత ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన కందులు పంట చెప్పుకోదగినంతగా దిగుబడులు రాకపోవడంతో దిగాలు పడిన రైతులకు మంచి ధర పలుకుతుండడం సంతోషాన్నిస్తోంది. కందులుకు క్వింటాలుకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) రూ.ఆరు వేలు కాగా గత నెల వరకు మార్కెట్లో రూ.5,000 నుంచి రూ.5,600 మధ్య ధర కొనసాగింది. ఇప్పుడీ ధర అమాంతం రూ.ఏడు వేలు దాటింది. రైతుల వద్ద నుంచి కందులు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. 5,44,220 ఎకరాల్లో సాగు.. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 5,44,220 ఎకరాల్లో కందుల పంటను రైతులు సాగు చేశారు. సాధారణంగా దీన్ని అంతర పంటగా సాగు చేస్తారు. అంతర పంటగా సాగు చేస్తే ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లు, ఒకే పంటగా సాగు చేస్తే 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గతేడాది కురిసిన అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో దిగుబడులు కాస్త తగ్గాయి. కొన్ని జిల్లాల్లో ఎకరానికి 4–5 క్వింటాళ్లు దిగుబడి రాగా, మరికొన్ని జిల్లాల్లో 3–4 క్వింటాళ్లకు మించి రాలేదు. అదే సమయంలో నాణ్యత కూడా తగ్గింది. గత డిసెంబర్ నుంచి పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ మార్చి రెండో వారం వరకు ఇవి కొనసాగుతాయి. గత డిసెంబర్ 2వ వారం నుంచే మార్కెట్కు కందులు వస్తున్నాయి. వచ్చే మే నెల రెండోవారం వరకు కూడా వచ్చే అవకాశముంది. పోటీ పడి కొంటున్నారు.. కందులు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.6 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ నెలాఖరు వరకు కందులుకు మార్కెట్లో పెద్దగా రేటు లేదు. క్వింటాల్ రూ.5,000–5,600 మధ్య ఉండింది. గడిచిన నెల రోజులుగా ఊహించని రీతిలో ధర పెరగడం మొదలైంది. నాణ్యతను బట్టి రూ.6,800 నుంచి రూ.7,200కుపైగా పలుకుతోంది. రాష్ట్రంలో కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు మార్కెట్లకు పెద్ద ఎత్తున కందులు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఇస్తామంటూ వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. ప్రభుత్వ చర్యల వల్లే.. నిజానికి మూడేళ్లుగా కందులుకు మార్కెట్లో సరైన ధర పలకలేదు. అయితే కనీస మద్దతు ధరలు లభించని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఆ మేరకు గతేడాది మార్క్ఫెడ్ ద్వారా కందులును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయించింది. గతేడాది మార్కెట్లో కందులుకు రూ.4,500కు మించి ధర పలకలేదు. దాంతో ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,800 చొప్పున కనీస మద్దతు ధరను నిర్ణయించడమేగాక.. 394 కోట్ల రూపాయలు వెచ్చించి 61,772 మెట్రిక్ టన్నుల కందులును మార్క్ఫెడ్ ద్వారా గతేడాది కొనుగోలు చేసింది. అంతేగాక ఈ సీజన్లో కందులుకు కనీస మద్దతు ధరను రూ.6 వేలుగా నిర్ణయించి.. అంతకన్నా తక్కువకు విక్రయించవద్దని, ఒకవేళ మార్కెట్లో ధర పెరగకుంటే ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి కొంటుందని రైతులకు అభయమిచ్చింది. ఇది రైతుల్లో భరోసాను నింపగా.. వ్యాపారుల్లో పోటీని పెంచింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు పోటీపడి కొంటుండడంతో కందులుకు రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. ధర ఇలా పెరగడం ఇదే తొలిసారి.. నా పొలంలో పూర్తి కంది పంట సాగు చేశా. మొన్నటిదాకా క్వింటాలు ధర రూ.5,600కు మించి పలకలేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.6000గా ప్రకటించింది.. కంగారు పడొద్దు.. మార్కెట్లో రేటు పెరుగుతుంది.. ఒకవేళ పెరగకపోతే కనీస మద్దతు ధరకు కొంటామని అధికారులు చెప్పారు. ఆ మేరకు ఓపిక పట్టాం. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ.7,200 ధర పలుకుతోంది. దిగుబడి తగ్గినా.. ధర పెరగడంతో ఊరట లభించింది. ఈ ధర ఇలాగే ఉంటే రైతుకు గిట్టుబాటవుతుంది. –సి.వలీసాహెబ్, చింతకుంటపల్లి, చాపాడు మండలం, వైఎస్సార్ జిల్లా ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే రైతుకు మంచి ధర... ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మార్కెట్లో కందులు, పెసలు ధరలు పెరుగుతున్నాయి. కనీస మద్దతు ధర దక్కని ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తోంది. ఈ కారణంగానే వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడుతోంది. ఈ కారణంగానే కందులు క్వింటాలు ధర రూ.7,200కు చేరింది. ఇది ఆల్టైమ్ రికార్డు. –పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్ఫెడ్ -
వ్యవసాయాన్ని వెనక్కినెట్టిన బడ్జెట్
నూతన చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ ఏడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత ఏడాదితో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు కనీస మద్దతు ధర ద్వారా కనీస రాబడి కోసం ప్రశ్నిస్తున్న తరుణంలో వారి మనోభావాలను గౌరవిస్తూ వ్యవసాయ రాబడులను పెంచడానికి కొన్ని ఏర్పాట్లను 2021–22 బడ్జెట్లో చేరుస్తారని అందరూ భావించారు. పైగా గ్రామీణ కొనుగోలు డిమాండ్ను పెంపొందించడానికి తగుచర్యలు తీసుకోవాలని పలువురు ఆర్థికవేత్తలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ప్రత్యక్ష నగదు మద్దతు ద్వారా, ఆందోళన చేస్తున్న రైతులు చేతిలో మరింత నగదును అందించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాస్త ఉదారంగా వ్యవహరిస్తారని భావించారు. దీనికి బదులుగా ఈ సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేటాయింపులను రూ. 75 వేల కోట్లనుంచి 65 వేల కోట్లకు తగ్గించేశారు. ఈ పథకం కింద భూ యజమానులకు సంవత్సరానికి మూడు వాయిదాల్లో రూ.6 వేల నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ఈ పథకంలో ఈ సారి భూమిలేని కౌలు రైతులను కూడా చేరుస్తారని నేను ఆశించాను. గత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వ్యవసాయం మాత్రమే దేశానికి వెలుగు చూపినందున ఒక్కొక్క రైతుకు నగదు బదిలీ కింద చెల్లించే మొత్తాన్ని ఈ యేడు రూ.18 వేలకు పెంచుతారని అందరూ భావించారు. దీనికోసం అదనంగా రూ. 1.5 లక్షల కోట్లను బడ్జెట్లో కేటాయించవలసి ఉంటుంది. అయితే వ్యవసాయ రంగానికి ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ దాదాపు గత యేడు బడ్జెట్కు సరిసమానంగానే ఉండటం గమనార్హం. గత సంవత్సరం వ్యవసాయరంగానికి సవరించిన అంచనా ప్రకారం రూ. 1.45 లక్షల కోట్లను కేటాయించగా ఈ ఏడు రూ. 1.48 లక్షల కోట్లను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరపతి పరిమితిని రూ. 15 లక్షల కోట్లనుంచి రూ. 16.5 లక్షల కోట్లకు పెంచి నప్పటికీ రైతులను రుణ ఊబి నుంచి బయటపడేసేందుకు మరికొన్ని చర్యలు చేపట్టాలని దేశంలో కొనసాగుతున్న వ్యవసాయ దుస్థితి సూచించింది. దీనికి గాను వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులను పెంచాల్సి ఉంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులు మొత్తం బడ్జెట్లో కేవలం 0.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాబట్టి పెట్రోల్, డీజిల్పై సెస్ విధింపు ద్వారా వ్యవసాయ మదుపు నిధిని సృష్టించాలనే ఆర్థిక మంత్రి ప్రతిపాదనను స్వాగతించాల్సిందే కానీ రైలు, రోడ్డు, మూలధన మదుపు వంటివాటిపై చేసే ప్రకటనలకు మల్లే వ్యవసాయ మదుపుపై కూడా నిర్దిష్టమైన ఏర్పాట్లు చేయడం ఉత్తమమార్గంగా ఉంటుంది. వ్యవసాయరంగానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన విషయం ఏమిటంటే తగిన మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పర్చడమే. భారత్లో వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఏపీఎంసీ) క్రమబద్ధీకరించే 7 వేల మండీలు ఉంటున్నాయి. దేశంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మండీ చొప్పున ఏర్పర్చాలంటే ఇప్పటికిప్పుడు 42 వేల మండీలు అవసరం అవుతాయి. అయితే 22 వేల గ్రామ సంతలను మెరుగుపర్చి వాటిని ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్)తో అనుసంధానం చేయాలనే ప్రభుత్వ వాగ్దానానికి ఇప్పటివరకు ప్రోత్సాహం లభించలేదని తెలుసుకున్నప్పుడు, గ్రామీణ మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పాటు ఇక ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడని అంశంగా మనముందుకొస్తోంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు నిరసన ప్రదర్శనలను నెలల తరబడి కొనసాగిస్తున్న సమయంలో 2021–22 బడ్జెట్ రంగంలోకి వచ్చింది కాబట్టి ఇటీవలి సంవత్సరాల్లో గోధుమ, వరి, కాయధాన్యాలు, పత్తి వంటి పంటలకు కనీస మద్దతు ధర ఎలా అందించాము అనే విషయాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రస్తావిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కూడా వెల్లడించారు. అయితే సంపూర్ణంగా సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న రైతులు ప్రభుత్వం చెబుతున్న కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం 23 పంట లకు గాను ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరకంటే తక్కువ ధరను పెట్టి వ్యాపారం చేయడానికి వీలు ఉండదని దీనర్థం. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులపై కనీసం 50 శాతం లాభాన్ని కనీస మద్దతు ధర అందిస్తోందని ప్రభుత్వం చెబుతున్న వివరాలను ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న రైతులు సవాలు చేశారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం రైతులు పెట్టే విస్తృత ఖర్చులపై 50 శాతం లాభాన్ని కనీసమద్దతు ధర ఇవ్వాల్సి ఉంటుంది. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర అంది ఉంటే 2020–21 బడ్జెట్లో అదనంగా రూ. 14,296 కోట్ల మేరకు పంజాబ్ రైతులు లబ్ధి పొందేవారు. మొత్తంమీద చూస్తే రైతుల చేతికి మరింత నగదు అందేలా చేస్తేనే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది సాధ్యపడుతుంది. ఇది దానికదేగా మరింత గ్రామీణ డిమాండును సృష్టిస్తుంది. ప్రాణాంతక కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్న సమయంలో, గ్రామీణ డిమాండును సృష్టించి ఉంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థకు వరంలాగా పనిచేయడమే కాకుండా, ఆర్థికాభివృద్ధిని రాకెట్లాగా ముందుకు తీసుకెళ్లేది. ఉజ్వలంగా ప్రకాశించే వ్యవసాయ రంగం భారీ స్థాయిలో వ్యవసాయ అవకాశాలను సృష్టించడమే కాకుండా అనేక మంది జీవితాలను నిలబెట్టి ఉండేది. కాబట్టి ఒక్క వ్యవసాయ రంగమే ఆర్థిక వృద్ధికి సజీవ కేంద్రంగా మారగలిగి ఉండేది. నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ రెండున్నర నెలలకుపైగా ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ యేడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత సంవత్సరంతో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. మరోవైపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో రైతులకు కనీస మద్దతు ధరను చెల్లించడంలో తమ ప్రభుత్వం ఘనమైన రికార్డును కలిగి ఉందని నొక్కి చెప్పారు. అలాగే లక్ష కోట్ల మేరకు వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ప్రభుత్వ నిర్వహణలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలకు అందిస్తామని మంత్రి తెలిపారు. అయితే ప్రభుత్వ నూతన సాగు చట్టాలు ఇంతవరకు కొనసాగుతున్న మండీల వ్యవస్థను, కనీస మద్దతు రేట్లను కుప్పగూల్చి సన్నకారు రైతులను కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తాయని రైతులు భయాందోళనలకు గురైనందువల్లనే సాగు చట్టాల రద్దుకోసం పోరాడుతున్నారనే విషయం మర్చిపోరాదు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో బడ్జెట్ ప్రసంగాల మాదిరి కాకుండా తాజా బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం గమనార్హం. సోమవారం బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన గంట తర్వాతే వ్యవసాయరంగానికి కేటాయింపుల గురించి ఆర్థిక మంత్రి తడిమారు. పైగా వ్యవసాయ రంగ విశ్లేషకులను తాజా బడ్జెట్ పెద్దగా ప్రభావితం చేయలేదు. పీఎమ్ ఆషా, ధరల మద్దతు పథకం వంటి పథకాలకు ఈ ఏడు బడ్జెట్లో 20 నుంచి 25 శాతం దాకా కోత విధించారు. రైతులకు ఏటా తలసరి 6 వేల రూపాయలను అందిస్తున్న పీఎమ్ కిసాన్ పథకాన్ని ఈసారి 9 కోట్లమంది రైతులకే పరిమితం చేస్తూ సవరించారు. ప్రభుత్వం వాస్తవానికి 14.5 కోట్ల రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించుకుంది ఇది కూడా కోత పడటం రైతులు జీర్ణింప చేసుకోలేకున్నారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని మేం డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. మౌలిక వసతుల నిధి పేరుతో ప్రకటించిన భారీ మొత్తాలు వాస్తవానికి బడ్జెట్ కేటాయింపుల్లో భాగం కాదని వీటిని రుణాల రూపంలో తీసుకోవలసిన ఫైనాన్స్ ప్రాజెక్టులని రైతులకు వీటితో ఒరిగేదేమీ లేదని రైతునేతలు చెబుతున్నారు. ఈ కోణంలో చూస్తే ఈ ఏటి బడ్జెట్ కూడా రైతాంగాన్ని సంతృప్తిపర్చే బడ్జెట్గా కనిపించడం లేదనే చెప్పాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
రైతుకు మద్దతు ధర అసాధ్యమా?
ఎమ్ఎస్ స్వామినాధన్ కమిషన్ సిఫార్సు చేసినట్లుగా కనీస మధ్దతు ధరను ప్రభుత్వం 50 శాతం మేర పెంచినట్లయితే ప్రభుత్వం మీద పడే అదనపు భారం రూ. 2,28,000 కోట్లు అవుతుంది. ఇది మొత్తం జీడీపీలో 1.3 శాతం మాత్రమే. అంటే కేంద్ర బడ్జెట్లో 8 శాతం అన్నమాట. ప్రభుత్వం తల్చుకుంటే ఇది అసాధ్యం కాదు. పైగా ఈ అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు పంచుకోగలవు. మరి మనదేశం రైతులకు ఈ మాత్రం చేయలేదా? మన దేశాన్ని, అన్నదాతలను మీరు ఏ దృష్టితో చూస్తున్నారు అనేదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇది మన దేశ రాజకీయ సంకల్పానికి సంబంధించిన ప్రశ్న. దేశంలోని కోట్లాది మంది రైతులు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఇదే. మన దేశ రైతులకు హామీ ఇచ్చిన మేరకు వారి పంటలకు ప్రోత్సాహక ధరను ఇస్తామని ఎవరైనా ప్రతిపాదించగలరా? ప్రభుత్వం, కొందరు ఆర్థికవేత్తలు, మీడియా కూడా గణాంకాల రీత్యాకానీ, ఆర్థికపరంగా కానీ ఇది అసాధ్యమని మనల్ని నమ్మిం చాలని చూస్తుంటారు. కానీ వారి అంచనాలు తప్పు. రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారో వారు అర్థం చేసుకోవడం లేదు. లేదా రైతులు పండిస్తున్న పంటలకు అవుతున్న ఖర్చులను వారు లెక్కించడం లేదు. లేదా వారు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తుండాలి. ఈ కల్పనను, భ్రమను చెదరగొట్టే సమయం ఉంది అంటే రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో లక్షలాది రైతులు జరుపనున్న ర్యాలీకి మించిన సందర్భం మరొకటి ఉండదు. అదృష్టవశాత్తూ మనం శిధిలాల నుంచి మొదలుపెట్టాల్సిన పనిలేదు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 23 పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పి) ప్రకటిస్తుంటుంది. కాబట్టి సూత్ర రీత్యానే రైతుల పంటలకు కనీస ధర అవసరమని దానికి వారు అర్హులని భారత ప్రభుత్వమే గుర్తిస్తోందన్నమాట. అది ఎంత లోపభూయిష్టంగా లేదా వివాదాస్పదంగా ఉండినా సరే రైతుల పంటకు ధరను లెక్కించే, ప్రకటించే ఒక యంత్రాంగం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నమాట. పైగా చట్టపరంగా కాకున్నా, పంటల ధరల రూపంలో తాను మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కేంద్రం గుర్తిస్తోందన్నమాటే. సమస్య ఏమిటంటే ఈ మద్దతుని ఇచ్చే విషయంలో కేంద్రప్రభుత్వం తనవంతుగా చేస్తున్నది పెద్దగా లేదనే చెప్పాలి. నిజానికి దేశంలో అయిదింట ఒక వంతుకంటే తక్కువమంది రైతులు మాత్రమే కేంద్రం నుంచి ఈ మద్దతు పొందుతున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు లేదా మూడు పంటలకు మాత్రమే ప్రభుత్వం మద్దతును ఇస్తోంది. మరోవైపున చాలామంది రైతులకు భద్రత కల్పించే కనీస మద్దతు ధర అనేది వారి కలలకు మాత్రమే పరిమితం అవుతోంది. ప్రస్తుత పంట సీజన్లో మొక్కజొన్నపంటను చూస్తే క్వింటాలుకు రూ. 1,850లు కనీస మద్దతు ధరను కేంద్రం ప్రతిపాదించింది. అయితే గత మూడు నెలలుగా రైతులు మొక్కజొన్న పంటను రూ. 1,100 నుంచి రూ. 1,300లకు మాత్రమే అమ్ముకోగలిగారు. ఇక దేశంలోనే రాగులు ఎక్కువగా పండించే రాజస్తాన్లో దాని కనీస ధర జనవరిలో రూ. 1340లు మాత్రమే పలికింది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 2,150లు. ఇక మినుములు, పెసలు వంటి తృణధాన్యాల ధరల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర అని స్వయంగా ప్రకటించిన మొత్తాన్నయినా తమకు కచ్చితంగా దక్కేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీస మద్దతుధరకు తప్పనిసరిగా హామీ ఇచ్చేలా ఇప్పుడు ఒక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది సాధ్యమేనా? ముందుగా మద్దతు ధర అంటే ఏమిటి అనే విషయంలో ప్రచారంలో ఉన్న తప్పుడు భావనను సరిచేద్దాం. హామీ ఇచ్చిన మేరకు కనీస మద్దతు ధర అంటే ప్రతి క్వింటాల్ పంటనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాదు. ఇది అసాధ్యం, ప్రభుత్వం భరించలేని డిమాండ్ ఇది. పైగా అది అనవసరం కూడా. కనీసమద్దతు ధర వద్ద ప్రభుత్వం సేకరిస్తున్న పంటల సంఖ్య ప్రస్తుత స్థాయినుంచి బాగా పెరగాల్సి ఉంది. రైతులకు మద్దతుగా నిలిచే అనేక యంత్రాం గాల్లో కనీస మద్దతు ధర ఒకటి మాత్రమే. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సేకరించే ఆహార ధాన్యాల జాబితాను చిరుధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలకు కూడా విస్తరించాలి. ఈ ఒక్క చర్య చేపట్టినా చాలు దేశంలోని కోట్లాది కుటుంబాల పోషకాహర అవసరం తీరుతుంది. దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగమైన 75 కోట్లమందికి ఒక్కొక్క కిలో మినుములు లేదా కాయధాన్యాలను ఇవ్వగలిగితే ఏటా పండిస్తున్న కోటీ 30 లక్షల టన్నుల కాయధాన్యాల పంటలకు ఎంతో డిమాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల కాయధాన్యాల ఉత్పత్తికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. ఇక రెండో యంత్రాంగం ఏమిటంటే, కనీస మద్దతు ధరకంటే తక్కువకు మార్కెట్ ధరలు పడిపోయిన ప్రతిసారీ సకాలంలో, వేగంగా ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడమే. మార్క్ఫెడ్, నాఫెడ్ వంటి ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఏజెన్సీలలో మెరుగైన ఫండింగ్, నిల్వ, మార్కెటింగ్ సామర్థ్యాలను మరింతగా విస్తరింపజేయాలని దీనర్థం. ఇవన్నీ కలిసి మొత్తం పంటలో 10 నుంచి 20 శాతం భాగాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మాత్రం సహాయం చేసినా, ఇతర మార్కెట్లో రైతుల పంటకు గిట్టుబాటు ధరలు కాస్త లభించే అవకాశం ఉంటుంది. అలాంటి పథకం ఉనికిలో ఉన్నట్లయితే ఆ పథకానికి వెచ్చించే నిధులను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. దీంట్లో విఫలమైనట్లయితే, ప్రభుత్వం లోటు చెల్లింపు ద్వారా ముడో యంత్రాంగాన్ని ఉపయోగించగలదు. కనీస మద్దతుధరకు, వాస్తవంగా రైతుల నుంచి సేకరిస్తున్న మొత్తానికి మధ్య వ్యత్యాసాన్ని రైతులకు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం భవాంతర్ పథకం పేరుతో మధ్యప్రదేశ్లో గతంలోనే ప్రయత్నిం చారు. అయితే పేలవమైన రూపకల్పన కారణంగా ఆ ప్రయోగం విఫలమైంది. ఈ పథకాన్ని మళ్లీ కొత్తగా రూపొందించి తగిన నిధులు కేటాయించి కేంద్రప్రభుత్వం అమలు చేయడానికి పూనుకోవాలి. ఇక నాలుగో యంత్రాంగం ఏమిటంటే కనీస మద్దతు ధరకన్నా తక్కువకు వ్యాపారులు కొనడాన్ని చట్టవిరుద్ధంగా ప్రభుత్వం ప్రకటించాలి. అయితే ఇది అనుకున్న వెంటనే కుదిరే పరిష్కారంలాంటిది కాదు. మొదటి మూడు యంత్రాంగాలు మద్దతు ఇవ్వకపోతే చివరిదైన నాలుగో యంత్రాంగం కుప్పకూలిపోతుంది. నాలుగో యంత్రాంగాన్ని ఉల్లంఘించేవారిపై చట్టపరమైన నిబంధనలు అమలు చేసినప్పుడే మార్కెట్ అధికారులు ఈ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలు కలుగుతుంది. చివరకు ఇది కేంద్ర ప్రభుత్వం భరించగలిగినదేనా? కనీస మద్దతు ధర విషయంలో ఈ ఒక్క మార్పు చేసినట్లయితే కేంద్రంపై 17 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందని ప్రభుత్వ ప్రతినిధులు సన్నాయి నొక్కులు మొదలెడుతున్నారు. ఇది కేంద్ర బడ్జెట్లో సగానికంటే ఎక్కువేనని వీరి భావం. అయితే ఇది వాస్తవాన్ని ఏమార్చే సంఖ్య. కనీస మద్దతు ధర వద్ద దేశంలోని అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలుచేస్తే దానికయ్యే మొత్తం ఖర్చు ఇది. ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వం పంట లను కొంటే దాన్ని హిందూ మహాసముద్రంలో విసిరిపారేయడం తప్ప మరేమీ చేయలేరు. వాస్తవానికి కొనుగోలు చేస్తున్న పంటలకు ఈ తరహా లెక్కలు అసలు విలువను ఇవ్వడం లేదు. మరోవైపున నిజమైన అంచనా కోసం, మనం కనీస మద్దతు ధరకు, సగటు వాస్తవ మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని లెక్కిం చాల్సి ఉంటుంది. సగటు మార్కెట్ ధరను, మార్కెట్లో రోజువారీ ధరలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా లెక్కించినప్పుడు రోజువారీ కొనుగోళ్లలో రైతు పంటలకు ఎంత ధర వస్తుందన్నది తేలిపోతుంది. ఉదాహరణకు 2017–18 సంవత్సరానికి మొక్క జొన్న పంటకు కనీస మద్దతు ధరను రూ. 1,425లుగా నిర్ణయించారు. కానీ మార్కెట్లో సగటున రూ. 1,159లు మాత్రమే పలికింది. ఆ సంవత్సరం అంచనా వేసిన మార్కెట్లోకి వచ్చిన అదనపు ఉత్పత్తితో పోలిస్తే, రైతులు అదనంగా పొందిన పంట నష్టం రూ.6,727 కోట్లుగా తేలింది. మొత్తం 13 పంటల్లో 10 పంటలకు సగటు మార్కెట్ ధర కనీస మద్దతు ధరకంటే తక్కువగా నమోదైంది. 2017–18 సంవత్సరానికి మొత్తం 13 పంటలకు గాను రైతులు నష్టపోయిన ధరల లోటుకు ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ. 47,764 కోట్లు మాత్రమే. మరో పది చిన్న పంటల బిల్లును కూడా దీనికి కలిపితే అయ్యే మొత్తం రూ. 50 వేల కోట్లు మాత్రమే. ఇది ఆ సంవత్సరం జాతీయ పనికి ఆహార పథకం కింద వెచ్చించిన ఖర్చు కంటే తక్కువే మరి. అయితే మార్కెట్లో జోక్యం చేసుకోవడం, తక్కువ ధరలకు కొంటే చట్ట పరంగా చర్యలు తీసుకోవడం అనేవి సమర్థంగా అమలైతే ప్రభుత్వంపై పడే అదనపు భారం తక్కువే. ఎమ్ఎస్ స్వామినాధన్ కమిషన్ సిఫార్సు చేసినట్లుగా కనీస మధ్దతు ధరను ప్రభుత్వం 50 శాతం మేర పెంచినట్లయితే ప్రభుత్వం మీద పడే అదనపు భారం రూ. 2,28,000 కోట్లు అవుతుంది. ఇది మొత్తం జీడీపీలో 1.3 శాతం మాత్రమే. అంటే కేంద్ర బడ్జెట్లో 8 శాతం అన్నమాట. ప్రభుత్వం తల్చుకుంటే ఇది అసాధ్యం కాదు. పైగా ఈ అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు పంచుకోగలవు. మరి మనదేశం రైతులకు ఈ మాత్రం చేయలేదా? మన దేశాన్ని, అన్నదాతలను మీరు ఏ దృష్టితో చూస్తున్నారు అనేదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇది మన దేశ రాజకీయ సంకల్పానికి సంబంధించిన ప్రశ్న. దేశంలోని కోట్లాది మంది రైతులు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఇదే. వ్యాసకర్తలు యోగేంద్ర యాదవ్ (కిసాన్ స్వరాజ్) కిరణ్ కుమార్ విస్సా (రైతు స్వరాజ్య వేదిక) -
రైతు సంఘాలతో చర్చల్లో పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి చోటు చేసుకుంది. రైతుల ప్రధానమైన 4 డిమాండ్లలో.. సాగు చట్టాల రద్దుకు విధివిధానాలు రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడమనే రెండు డిమాండ్ల అమలుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రైతులపై విద్యుత్ బిల్లుల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న డిమాండ్కు, అలాగే, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదనను విరమించుకోవాలన్న డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్, సోం ప్రకాశ్ సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులైన 40 రైతు సంఘాల నేతలతో బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం 2 నుంచి దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిపారు. ఇర వర్గాల మధ్య ఇవి ఆరో విడత చర్చలు. 50% అంశాలపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని చర్చల అనంతరం తోమర్ వ్యాఖ్యానించారు. ప్రతిష్టంభన నెలకొన్న మిగతా రెండు డిమాండ్లపై వచ్చే సంవత్సరం జనవరి 4న చర్చిస్తామన్నారు. ‘చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. రెండు అంశాలపై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. మూడు వ్యవసాయ చట్టాలు, ఎమ్మెస్పీపై చర్చలు జనవరి 4న కొనసాగుతాయి’ అన్నారు. రైతు నేతలు కొత్త సాగు చట్టాల రద్దుకు పట్టుపట్టారని, అయితే, చట్టాల వల్ల ప్రయోజనాలను వారికి వివరించామని తెలిపారు. చట్టాలకు సంబంధించి తమ అభ్యంతరాలను నిర్దిష్టంగా తెలపాలని కోరామన్నారు. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్పై స్పందిస్తూ.. దీనిపై లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న వేలాది రైతులపై తోమర్ ప్రశంసలు కురిపించారు. వారు శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన తెలుపుతున్నారన్నారు. చలి తీవ్రమవుతున్న దృష్ట్యా.. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలను ఇళ్లకు పంపించాలని కోరారు. విద్యుత్ చార్జీలు, పంట వ్యర్థాల దహనంపైనే బుధవారం నాటి చర్చలు ప్రధానంగా జరిగాయని రైతు నేత కల్వంత్ సింగ్ సంధు వెల్లడించారు. చర్చల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సానుకూలంగా ఉందని రైతు నేతలు వ్యాఖ్యానించారు. ఎమ్మెస్పీని సమర్ధవంతంగా అమలు చేసేందుకు నిపుణులతో కమిటీ వేస్తామన్న ప్రతిపాదనను తిరస్కరించామని పంజాబ్ కిసాన్ యూనియన్ నేత రుల్దు సింగ్ మాన్సా వెల్లడించారు. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కు తీసుకుంటామని, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు శిక్ష విధించే నిబంధనను తొలగిస్తూ సంబంధిత ఆర్డినెన్స్లో సవరణలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై 2న రైతుల చర్చ కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత వరి సహా పలు పంటలను కనీస మద్దతు ధర కన్నా తక్కువకే అమ్మాలని రైతులపై ఒత్తిడి చేస్తున్నారని రైతు నేతలు బుధవారం తెలిపారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్లో పంటల మార్కెట్ ధరలు 50శాతానికిపైగా పడిపోయాయి. ఎమ్మెస్పీ కన్నా తక్కువ ధరకే అమ్మాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారు. వరి క్వింటాల్కు రూ. 800లకు అమ్మాల్సి వస్తోంది. ఈ విషయాలను చర్చల్లో లేవనెత్తుతాం’ అని చర్చలు ప్రారంభమయ్యే ముందు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ వివరించారు. ‘మా డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేవరకు ఉద్యమం కొనసాగుతుంది. నూతన సంవత్సర వేడుకలను కూడా ఇక్కడే జరుపుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై జనవరి 2వ తేదీన రైతు సంఘాల ప్రతినిధులు సింఘు సరిహద్దు వద్ద అంతర్గత చర్చలు జరుపుతారని ఆల్ ఇండియా కిసాన్ సభ నేత హన్నన్ మొల్లా వెల్లడించారు. రైతులతో కలిసి భోజనం ఆరో విడత చర్చల సందర్భంగా రైతు నేతల కోసం దీక్షాస్థలి నుంచి వచ్చిన భోజనాన్నే కేంద్ర మంత్రులు సైతం భుజించారు. చర్చలు ప్రారంభమైన రెండు గంటల తరువాత రైతు నేతలకు నిరసన కేంద్రంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్ నుంచి ఒక వ్యాన్లో భోజనం వచ్చింది. అదే ఆహారాన్ని చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు తోమర్, గోయల్, సోమ్ ప్రకాశ్ కూడా స్వీకరించారు. సాయంత్రం ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, స్నాక్స్ను రైతు నేతలు తీసుకున్నారు. గత చర్చల సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనాన్ని రైతు నేతలు తిరస్కరించి, తమ కోసం దీక్షాస్థలి నుంచి వచ్చిన ఆహారాన్నే స్వీకరించిన విషయం తెలిసిందే. రెండు కమిటీలు రైతుల అభ్యంతరాలపై నిపుణులతో రెండు కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రతిపాదన. కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు మధ్య అసమానతలను తొలగించేందుకు ఒక కమిటీని, వ్యవసాయ చట్టాలపై రైతులు వెలిబుచ్చుతున్న అభ్యంతరాలను తొలగించేందుకు, చట్టాల్లో సవరణలను సూచించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించిన ప్రభుత్వం. ఈ ప్రతిపాదనలను రైతు నేతలు తోసిపుచ్చారు. వాయిదా చర్చల్లో పురోగతి నేపథ్యంలో నేడు తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్ను వాయిదా వేసుకున్న రైతు సంఘాలు. మోదీది ‘అసత్యాగ్రహ’ చరిత్ర ప్రధాని మోదీపై రైతులు విశ్వాసం కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ తన ‘అసత్యాగ్రహ’ చరిత్ర వల్ల దేశ ప్రజల నమ్మకం కోల్పోయారన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలను మోదీ ఎందుకు రద్దు చేయడం లేదనే అంశంపై జరిగిన ఆన్లైన్ సర్వేను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ప్రతీ పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ. 15 లక్షలు’, ‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు’, ‘50 రోజుల సమయమివ్వండి’, ‘కరోనాపై 21 రోజుల్లో విజయం సాధిస్తాం’, ‘మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదు. చైనా మన పోస్ట్లను ఆక్రమించలేదు’.. ఇలాంటి ‘అసత్యాగ్రహ’ చరిత్ర కారణంగా రైతులు ప్రధాని మోదీని నమ్మడం లేదని రాహుల్ పేర్కొన్నారు. చర్చల వేళ విజ్ఞాన్ భవన్లో భోజనం చేస్తున్న రైతు ప్రతినిధులు సింఘు సరిహద్దు వద్ద మువ్వన్నెల జెండాతో రైతు -
రైతు సంఘాల కీలక నిర్ణయం; కేంద్రానికి లేఖ!
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలతోపాటు తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు పునఃప్రారంభించాలని రైతు సంఘాలు శనివారం నిర్ణయించాయి. ఈ నెల 29న(మంగళవారం) తదుపరి దశ చర్చలు మొదలు పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు అనుసరించాల్సిన పద్ధతులు, కనీస మద్దతు ధరపై(ఎంఎస్పీ) చట్టబద్ధతకు హామీ, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంటల కొనుగోలు, రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్కు సవరణలు.. ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుంచి రైతులకు మినహాయింపు అంశాలను చర్చల ఎజెండాలో తప్పనిసరిగా చేర్చాలని ప్రభుత్వానికి సూచించారు. విద్యుత్ సవరణ బిల్లు–2020 ముసాయిదాలో మార్పులు చేయాలన్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ వివేక్ అగర్వాల్కు లేఖ రాశారు. డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్చలు ప్రారంభిద్దామని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం కోరినట్లుగానే తాము చర్చల తేదీని ఖరారు చేశామని, ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులోనే ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికైత్ చెప్పారు. 30న కేఎంపీ రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమ ఆందోళనలో భాగంగా ఈ నెల 30వ తేదీన కూండ్లీ–మానేసర్–పాల్వాల్(కేఎంపీ) రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నేత దర్శన్ పాల్ చెప్పారు. ఢిల్లీలో నిరసన కొనసాగిస్తున్న రైతులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలను ఆహ్వానించారు. ట్రాక్టర్ ర్యాలీలో రైతు పెద్ద ఎత్తున పాల్గొనాలని మరో నాయకుడు రాజీందర్ సింగ్ కోరారు. కేఎంపీ రహదారిని దిగ్బంధించవద్దని రైతులను కోరే బదులు కొత్త సాగు చట్టాలను రద్దు చేయడమే మంచిదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు గత నెల రోజులుగా ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల వద్ద ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీయేకు ఆర్ఎల్పీ గుడ్బై కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) నుంచి తాము విడిపోతున్నట్లు రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) కన్వీనర్, నాగౌర్ ఎంపీ హనుమాన్ బెణివాల్ ప్రకటించారు. రైతులకు మద్దతుగా ఆర్ఎల్పీ కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి వెళ్తామన్నారు. మరోవైపు రైతులకు మద్దతుగా మాజీ ఎంపీ హరీందర్ సింగ్ ఖల్సా బీజేపీకి రాజీనామా చేశారు. గాలిపటాలతో నిరసన సామాజిక మాధ్యమాలు, లౌడ్ స్పీకర్లు, కరపత్రాల ద్వారా సాగు చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తిన యువత సింఘు సరిహద్దుల్లో ఓ సరికొత్త నిరసన చేపట్టారు. ‘రైతు లేనిదే ఆహారం లేదు’‘మేం రైతులం, ఉగ్రవాదులం కాదు’అని నినాదాలు రాసిన గాలిపటాలను ఢిల్లీలో ఎగురవేశారు. ఈ గాలిపటాలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నివాసాలపై ఎగిరినప్పుడు బహుశా మేం ఏమి కోరుకుంటున్నామో వాళ్ళకు అర్థం అవుతుందని ఓ యువకుడు వ్యాఖ్యానించారు. గాలిపటాలకు కట్టిన దారాలను కత్తిరిస్తామని, తద్వారా తమ ఉద్యమ నినాదం మరింత మంది ప్రజలకు చేరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఢిల్లీ దిశగా.. వడివడిగా చండీగఢ్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు నెల రోజులుగా ఆందోళన సాగిస్తున్న రైతాంగానికి మద్దతు వెల్లువెత్తుతోంది. తోటి రైతుల పోరాటంలో పాలుపంచుకోవడానికి పంజాబ్ నుంచి భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, కార్లు, ఇతర వాహనాల్లో శనివారం ఢిల్లీకి బయలుదేరారు. వారంతా బృందాలుగా ముందుకు సాగుతున్నారు. నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు కూడా వెంట తెచ్చుకుంటున్నారు. దట్టమైన పొగమంచు, తీవ్ర చలిని లెక్కచేయకుండా గమ్యం దిశగా ప్రయాణం సాగిస్తున్నారు. వీరిలో వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. కొత్త చట్టాల వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతం చేయడమే లక్ష్యంగా పంజాబ్లోని సంగ్రూర్, అమృత్సర్, తార్న్తరణ్, గురుదాస్పూర్, భటిండా జిల్లాల నుంచి రైతులు ఢిల్లీవైపు బయలుదేరారని రైతు సంఘాల నేతలు తెలిపారు. అమృత్సర్–ఢిల్లీ జాతీయ రహదారిపై పంజాబ్ రైతుల వాహనాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఎక్కువ కాలం ఉండేలా వారు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాతే తమకు విశ్రాంతి అని రైతు ఒకరు చెప్పారు. శనివారం హరియాణాలో పలు రహదారులపై టోల్ప్లాజాల వద్ద టోల్ వసూలును రైతులు నిలిపివేయించారు. (చదవండి: బీజేపీకి మిత్రపక్షం షాక్.. ఎన్డీయే నుంచి ఔట్) -
నాకు పేరొస్తుందనే.. మోదీ ధ్వజం
భోపాల్: వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానం కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం దేశంలో సాగు సంస్కరణల అవసరం ఎంతో ఉందన్నారు. కొత్త సాగు చట్టాలు ఎన్నాళ్లుగానో రాజకీయ పార్టీలు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు కోరుతున్నవేనని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఈ సంస్కరణలు తీసుకువచ్చిన పేరు మోదీకి దక్కుతుందనే బాధతోనే విపక్ష పార్టీలు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలకు గతంలో ఆయా పార్టీలు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన రైతులను ఉద్దేశించి శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు గత 23 రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన తెలుపుతున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ‘ఈ చట్టాలపై ఎవరికైనా, ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నా.. తలవంచి, చేతులెత్తి దండం పెడ్తూ చర్చలు జరిపేందుకు, వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చట్టాలు రాత్రికి రాత్రి రూపొందించినవి కావు. ఎప్పటినుంచో రైతులు, నిపుణులు, రాజకీయ పార్టీలు కోరుతున్నవే ఈ సంస్కరణలు’ అని పేర్కొన్నారు. ‘సాగు రంగం, రైతులు ఇంకా వెనకే ఉండిపోవడానికి వీల్లేదు. వారు అన్ని సదుపాయాలతో ఆధునికతను సంతరించుకోవాలి. ఈ విషయంలో ఇంకా ఆలస్యం కూడదు. సమయం ఎవరికోసం ఆగదు’ అని ప్రధాని ఉద్ఘాటించారు. గతంలో సాగు సంస్కరణలు తీసుకువస్తామని మేనిఫెస్టోల్లో పెట్టి, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని మర్చిపోయిన వారిని రైతులు ప్రశ్నించాలన్నారు. నాడు అధికారంలో ఉన్నవారికి అది ప్రధాన విషయం కాదని విమర్శించారు. ‘ఇది మోదీ ఎలా చేయగలిగారు? ఈ మంచిపేరంతా మోదీకే వస్తే ఎలా? అనేదే వారి ప్రధాన సమస్య. ఈ విషయంలో మంచిపేరు నాకు అక్కర్లేదు. ఆ క్రెడిట్ మీ మేనిఫెస్టోలకే ఇవ్వండి. ఈ సంస్కరణలు మీ మేనిఫెస్టోల్లోనే ఉన్నాయి. నాకు కావల్సింది రైతుల అభివృద్ధి మాత్రమే. ఇకనైనా రైతులను తప్పుదోవ పట్టించడం ఆపేయండి’ అని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘కొత్త చట్టాలపై మీ అభ్యంతరాలేమిటో చెప్పమని పదేపదే అడుగుతున్నాం. వారి వద్ద సమాధానం లేదు. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతున్న వారే.. ఇప్పుడు కొత్త చట్టాలతో భూమిని కోల్పోతారని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏళ్లకేళ్లు అధికారంలో గడిపారు’ అని విపక్ష కాంగ్రెస్పై మండిపడ్డారు. 25, 30 ఏళ్ల క్రితమే తీసుకురావాల్సిన సంస్కరణలను తాము ఇప్పుడు తీసుకువచ్చామన్నారు. రైతన్నలను తాము అన్నదాతలుగా భావిస్తామని, ఇప్పటికే ఎమ్మెస్పీ ద్వారా దిగుబడి వ్యయం కన్నా ఒకటిన్నర రెట్లు ఆదాయం రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చి ఆరు నెలలు గడచిపోయాయి. కోవిడ్–19 సమయంలోనూ వ్యవసాయ ఉత్పత్తులను, గతంలో వారు తమ ఉత్పత్తులను అమ్ముకునే మండీల్లోనే, కనీస మద్దతు ధరకే కొనుగోలు చేశాం’ అని గుర్తు చేశారు. ‘ఎమ్మెస్పీ విధానాన్ని రద్దు చేస్తారంటే తెలివైన వ్యక్తి ఎవరూ నమ్మరు. ఇంతకంటే పెద్ద కుట్ర, అబద్ధం ఉండదు’ అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ మార్కెట్ల విషయంలోనూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. ‘కొత్త చట్టం ప్రకారం, వ్యవసాయ మార్కెట్ సహా ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే రైతు అక్కడ తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు’ అని వివరించారు. గత ఆరు నెలల్లో ఒక్క మండీ కూడా మూతపడలేదని, మండీల ఆధునీకరణకు రూ. 500 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. సాగు చట్టాలపై 25న రైతులతో మళ్లీ మాట్లాడుతానన్నారు. -
రైతన్నలూ.. చర్చలకు రండి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. రాతపూర్వకంగా ఇస్తామన్న హామీలను పరిశీలించాలని కోరారు. చర్చల తేదీని వారే నిర్ణయించవచ్చని అన్నారు. వ్యవసాయ చట్టాల్లోని కొన్ని నిబంధనలను సవరిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని తిరస్కరిస్తూ రైతు సంఘాలు తదుపరి ఆందోళనకు కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తోమర్ గురువారం ఢిల్లీలో రైల్వే, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘రైతులకు అభ్యంతరాలు ఉంటే కొత్త చట్టాల్లో ఏవైనా నిబంధనలను విశాల దృక్పథంతో పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల అనుమానాలను నివృత్తి చేస్తాం. వారి సమస్యలను పరిష్కరించడానికి రైతు సంఘాల నాయకుల సలహాల కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, కొత్త చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో వారు మళ్లీ మొదటికొస్తున్నారు’’ అని తోమర్ వ్యాఖ్యానించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్ను తోసిపుచ్చారు. ‘‘తీవ్రమైన చలి వాతావరణంలో, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తుండడం పట్ల ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని తోమర్ చెప్పారు. సమస్య పరిష్కారంపై తాను అశాభావంతో ఉన్నానన్నారు. చర్చలు పురోగతిలో ఉండగానే రైతు సంఘాలు తదుపరి దశ పోరాట కార్యాచరణను ప్రకటించడం సరైంది కాదని తోమర్ ఆక్షేపించారు. కొత్త చట్టాలతో ఎంఎస్పీకి ఢోకా లేదు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) అమలు కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై రాతపూర్వక హామీ ఇస్తామని బుధవారం ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. రైతుల భయాందోళనలు తొలగించడానికి కనీసం 7 సమస్యలపై అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటికి రైతు సంఘాలు ససేమిరా అనడంతో చర్చలకు విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు తదుపరి చర్చలకు పిలుపునిచ్చారు. కొత్త చట్టాలు ఎంఎస్పీని ప్రభావితం చేయవని, పైగా రక్షణగా ఉంటుందని పీయూష్ గోయెల్ అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేట్ మార్కెట్లలో విక్రయించడానికి అదనపు ఎంపికను మాత్రమే ఈ చట్టం ఇస్తుందని వివరించారు. సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేసుకోవచ్చు రైతుల అభ్యంతరాలపై ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదనను పంపుతుందని 13 యూనియన్ నాయకులతో మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో హోం మంత్రి అమిత్ షా చెప్పగా.. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. కొత్త చట్టాల తరువాత వ్యవసాయ మార్కెట్లు బలహీనపడతాయన్న రైతుల ఆందోళనకు పరిష్కారంగా.. సవరణలు చేయవచ్చని, రాష్ట్ర ప్రభుత్వాలు మండీల వెలుపల పనిచేసే వ్యాపారులను నమోదు చేయవచ్చని కేంద్రం ప్రతిపాదించిందని తాజాగా మంత్రులు గుర్తుచేశారు. రాష్ట్రాలు వాటిపై కూడా ఏపీఎంసీ మండీల తరహాలో పన్ను, సెస్ విధించవచ్చని వివరించారు. వివాదాల పరిష్కారం కోసం సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేసే హక్కు రైతులకు లభించకపోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. అందుకే సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేయడానికి వీలుగా నిబంధనల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు చెప్పారు. కార్పొరేట్ సంస్థలు సాగు భూములను స్వాధీనం చేసుకుంటాయన్న భయాన్ని తొలగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద సాగు భూములను అటాచ్ చేయడంపై ఇంకా స్పష్టత ఇస్తామన్నారు. ప్రస్తుత కనీస మద్దతు ధర అమలు ప్రక్రియ కొనసాగుతుందని లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమేనన్నారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. రైతుల విషయంలో ప్రస్తుత విద్యుత్ బిల్లు చెల్లింపు విధానంలో ఎటువంటి మార్పు ఉండదని మంత్రులు వెల్లడించారు. రైతుల వెనుక ఎవరున్నారో తేల్చండి ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల వెనుక ఏయే శక్తుల ఉన్నాయో నిగ్గు తేల్చాలని నరేంద్ర సింగ్ తోమర్, పీయూస్ గోయెల్ ప్రసార మాధ్యమాలను కోరారు. ‘‘మీడియా కళ్లు చురుగ్గా ఉంటాయి. మీ దర్యాప్తు నైపుణ్యాలను ఉపయోగించండి. రైతుల ఆందోళన వెనుక ఉన్న శక్తులు ఏమిటో బయటపెట్టండి. చర్చల కోసం రైతులు ముందుకు రాకుండా వెనక్కి లాగుతున్న అంశమేమిటో గుర్తించండి’’ అని పేర్కొన్నారు. కార్పొరేట్ల కోసమే.. కొత్త చట్టాలను రైతులు స్వాగతిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి తోమర్ చేసిన ప్రకటనను అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్సీసీ) తప్పుపట్టింది. ఈ చట్టాల విషయంలో కేంద్ర మంత్రులు తప్పుడు వాదనలు వినిపిస్తున్నారని, బహిరంగంగా అసత్యాలు వల్లెవేస్తున్నారని విమర్శించింది. బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే కొత్త చట్టాలు తెచ్చారని ఆరోపించింది. ఈ విషయాన్ని సామాన్య ప్రజలు సైతం అర్థం చేసుకుని రైతుల పోరాటానికి మద్దతు ఇస్తున్నారని గుర్తుచేసింది. 14 రోజుల్లో 15 మంది.. చండీగఢ్: సాగు చట్టాలపై ఢిల్లీలో, నగర శివార్లలో 14 రోజులుగా ఉద్యమిస్తున్న రైతుల్లో 15 మంది వేర్వేరు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను సహచర రైతులు పంజాబ్లోని స్వస్థలాలకు చేరుస్తున్నారు. ప్రతి రోజూ ఒక్క మృతదేహమైనా ఢిల్లీ నుంచి పంజాబ్కు చేరుకుంటోందని వారు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. గుండెపోటుతో 10 మంది రైతన్నలు తనువు చాలించారు. చలిని తట్టుకోలేక మరో రైతు మరణించాడు. మృతుల్లో మహిళలూ ఉన్నారు. రైలు పట్టాలపై పోరాటం! సా గుచట్టాలను తక్షణమే రద్దు చేయాలనే తమ డిమాండ్ను నెరవేర్చకపోతే ఇకపై దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమ కార్యాచరణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సింఘు వద్ద ఆందోళన కొనసాగిస్తున్న రైతులు గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దిగి రాకపోతే ఢిల్లీకి దారితీసే అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధిస్తామని పేర్కొన్నారు. సర్కారు మొండి వైఖరి అవలంబిస్తే రైల్వే ట్రాక్లపై పోరాటం తప్పదని, ఇది పంజాబ్, హరియాణాల్లోనే కాదు, దేశమంతటా జరుగుతుందని రైతు సంఘం నాయకుడు బూటా సింగ్ స్పష్టం చేశారు. -
రైతు ఆందోళనలు: కేంద్రం ప్రతిపాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొత్త చట్టాలను రద్దు చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం వద్దని అన్నదాతలు ప్రభుత్వానికి తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో రైతులు మంగళవారం చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనూహ్యంగా రంగంలోకి దిగి రైతు సంఘం నాయకులతో చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం- రైతుల మధ్య నేడు మరో దఫా చర్చలు జరుగనున్న వేళ ప్రభుత్వం రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపింది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ-ఏపీఎంసీ), మార్కెట్ ట్యాక్స్ యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది.(చదవండి: భారత్ బంద్ విజయవంతం) ‘‘రైతులు భూములను కోల్పోరు. ప్రైవేటు ట్రేడర్స్ కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. ట్రేడర్స్పై పన్ను విధింపు ఉంటుంది. కనీస మద్దతు ధరపై పునఃసమీక్షకు, లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు సిద్ధం. పంట ఉత్పత్తి, మార్కెట్ కమిటీ చట్ట సవరణకు కూడా సిద్ధం. వివాదాలు తలెత్తితే కోర్టులను ఆశ్రయించే హక్కు రైతులకు ఉంటుంది’’ వంటి ప్రతిపాదనలు రైతు సంఘాల ముందు ఉంచింది. ఇక ఈ విషయంపై స్పందించిన భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికేత్.. ‘‘కేంద్రం పంపిన ప్రతిపాదనల గురించి మేం చర్చించుకుంటాం. రైతులు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. ఇది వారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. కేంద్రం చట్టాలు రద్దు చేయకుంటే ఇక్కడే ఉంటాం. ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే.. రైతులు కూడా అలాగే ఉంటారు. ఏదేమైనా చట్టాలు రద్దు చేయాల్సిందే’’అని పేర్కొన్నారు. -
‘మద్దతు’ కోసం మట్టిమనుషుల పోరాటం!!
రైతే ఒక పారిశ్రామికవేత్తగా మారేలా వ్యవసాయ రంగంలో చరిత్రాత్మక చట్టాల్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెప్పుకున్నారు. కానీ ఆ చట్టాలను రద్దు చేయాలంటూ గత పది రోజులుగా ఢిల్లీ వీధుల్లో బైఠాయించిన రైతన్నలు చరిత్ర సృష్టిస్తున్నారు. ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువగా ఉండే పంజాబ్, హరియాణా రైతులు పోరాటానికి తొలి అడుగు వేస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల రైతులు వారి అడుగులో అడుగు వేసి కదం తొక్కారు. ఈ చట్టాల అమలుతో వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ జరుగుతుందన్న ఆందోళన అన్నదాతల్ని వెంటాడుతోంది. అందుకే నిత్యావసర సరుకుల సవరణ చట్టం.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక చట్టం... రైతుల సాధికారత, రక్షణ ధరల హామీ సేవల ఒప్పంద చట్టాలను వెనక్కి తీసుకోవాలని, మద్దతు ధరను చట్టంలో చేర్చాలని రేయింబగళ్లు నిరసన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాల లక్ష్యంలోనే తప్పులు ఉన్నాయని రైతు ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ‘ఏదైనా చట్టం లక్ష్యమే తప్పుగా ఉంటే దానిలో సవరణలు చేసినా అవి తప్పుదారి పడతాయి. దాని వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు’’ అని 40 మంది రైతులున్న ప్రతినిధి బృందంలోని ఏకైక మహిళా కవితా కురుగంటి తెలిపారు. పీట ముడి ఎక్కడ ? సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. ఎంఎస్పీపై రైతులను విపక్షాలు పక్కదారి పట్టిస్తున్నాయనీ, అందుకే రైతులు ఆందోళన తీవ్ర చేస్తున్నారన్నది కేంద్రం ఆరోపిస్తోంది. రైతుల అభ్యంతరాలు, డిమాండ్లు.. వ్యవసాయ రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఒకే దేశం ఒకే మార్కెట్ విధానం వల్ల భవిష్యత్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుందంటున్నారు. అందుకే ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. కేంద్రం ఏమంటోంది ? ► వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ససేమిరా కుదరదని తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్ట సవరణలకు అంగీకరించింది. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా బడా కంపెనీలు రైతులు భూములు తీసుకోవడానికి వీల్లేకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ► మండీల్లో ప్రైవేటు వ్యక్తులు వస్తే పోటీ ఉండి రైతులకే ప్రయోజనమని వాదిస్తున్న కేంద్రం రాష్ట్రాల పరిధిలో నడిచే మండీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒప్పుకుంది. ప్రైవేటు మార్కెట్లు, ప్రభుత్వ మార్కెట్ యార్డుల్లో పన్నులు సమానంగా వసూలు చేయడానికి అంగీకరించింది. ► ప్రైవేటు వ్యాపారులు పాన్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి బదులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ► కనీస మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందని, దానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని పదే పదే చెబుతూ వస్తోంది. -
చర్చలు అసంపూర్ణం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు, కేంద్ర మంత్రులకు మధ్య గురువారం జరిగిన నాలుగో విడత చర్చలు ఎలాంటి నిర్ణయాత్మక ఫలితం రాకుండానే, అసంపూర్తిగా ముగిశాయి. రేపు(శనివారం) మరో విడత చర్చలు జరగనున్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు, దాదాపు 40 మంది రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా ప్రభుత్వం నుంచి మంచినీరు కూడా రైతు ప్రతినిధులు స్వీకరించలేదు. ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, లంచ్ను వారు తిరస్కరించారు. హడావుడిగా తీసుకువచ్చిన సాగు చట్టాల్లోని లోటుపాట్లను ప్రస్తావించి, వాటిని రద్దు చేయాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ విషయంలో అపోహలు వద్దని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. ఆ విధానాన్ని టచ్ కూడా చేయబోమని హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ‘చర్చించాల్సిన అంశాలను నిర్ధారించాం. వాటిపై శనివారం చర్చ జరుగుతుంది. అదే రోజు రైతుల నిరసన కూడా ముగుస్తుందని ఆశిస్తున్నా’ అని చర్చల్లో పాల్గొన్న వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ‘చర్చల సందర్భంగా కొన్ని అంశాలను రైతు ప్రతినిధులు లేవనెత్తారు. కొత్త చట్టాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లు మూత పడ్తాయేమోనని వారు భయపడ్తున్నారు. ప్రభుత్వానికి పట్టింపులేవీ లేవు. సానుకూల దృక్పథంతో రైతులతో చర్చలు జరుపుతున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత బలోపేతం చేయడానికి, ఆ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ‘కొత్త చట్టాల ప్రకారం.. ఏపీఎంసీ పరిధికి వెలుపల ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి. రెండు విధానాల్లోనూ ఒకే విధమైన పన్ను వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. ‘రైతులు తమ ఫిర్యాదులపై ఎస్డీఎం(సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్) కోర్టులకు వెళ్లవచ్చని చట్టంలో ఉంది. అది కింది కోర్టు అని, పై కోర్టుల్లో దావా వేసే వెసులుబాటు ఉండాలని రైతు ప్రతినిధులు కోరారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని తోమర్ తెలిపారు. రైతులు కోరుతున్నట్లు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు తాను భవిష్యత్తును చెప్పేవాడిని కాదని తోమర్ బదులిచ్చారు. తోమర్, సోమ్ ప్రకాశ్లతో పాటు రైల్వే, వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పియూష్ గోయల్చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. ‘మా వైపు నుంచి చర్చలు ముగిశాయి. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపనట్లయితే.. తదుపరి చర్చలకు రాకూడదని మా నేతలు నిర్ణయించారు’ అని ఏఐకేఎస్సీసీ(ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ) సభ్యురాలు ప్రతిభ షిండే తెలిపారు. ‘ఎమ్మెస్పీ సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై శుక్రవారం రైతు సంఘాల ప్రతినిధులు చర్చిస్తారు’ అని మరో నేత కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. ‘చట్టాల్లో సవరణలు చేయడం కాదు.. ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మా ప్రధాన డిమాండ్’ అని ఏఐకేఎస్సీసీ ప్రధాన కార్యదర్శి హన్నన్ మోలా స్పష్టం చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు శుక్రవారం సమావేశమై, త్రదుపరి చర్చలపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మీ ఆతిథ్యం మాకొద్దు చర్చల సందర్బంగా ప్రభుత్వ ఆతిథ్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. తమకోసం సింఘు నుంచి వ్యాన్లో వచ్చిన భోజనాన్ని స్వీకరిం చారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన టీ, మంచినీరును కూడా వారు తీసుకోలేదు. ‘సహచర రైతులు రోడ్లపై ఉంటే, మేం ఇక్కడ ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఎలా తీసుకుంటాం’ అని చర్చల్లో పాల్గొన్న రైతు నేత షిండే వ్యాఖ్యానించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు -
రైతుల ఆందోళన: ‘మీ భోజనం మాకొద్దు’
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం రైతులతో చర్చలు జరుపుతున్నప్పటికి.. అన్నదాతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మంత్రుల బృందం రైతులతో భేటీ అయ్యింది. మధ్యాహ్నం వరకు కూడా చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించలేదని సమాచారం. ఇక భోజన విరామ సమయంలో రైతులు ప్రభుత్వం అందించే ఆహారాన్ని నిరాకరించారు. తామే వండుకుని తెచ్చుకున్న భోజనాన్ని స్వీకరించారు. సమావేశం జరుగుతున్న విజ్ఞాన్ భవన్ లోపలి విజవల్స్ ప్రకారం రైతులంతా పొడవైన డైనింగ్ టేబుల్ దగ్గర తమతో పాటు తెచ్చుకున్న భోజనాన్ని తింటుండగా.. మరి కొందరు కింద కూర్చుని తిన్నారు. ఈ సందర్భంగా ఓ రైతు సంఘం నాయకుడు మాట్లాడుతూ.. ‘వారు మాకు భోజనం, టీ, కాఫీలు ఇవ్వాలని చూశారు. కానీ మేం వాటిని తిరస్కరించాం’ అని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఎనిమిది రోజులుగా ఢిల్లీలో సరిహద్దులో ఉద్యమం చేస్తున్నారు. ఇక నేటి భేటీలో మొదట వారు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో వివరించారు. అందులో వారు చట్టం లోపాలపై దృష్టి సారించారు. దాని గురించి ఎందుకు భయపడుతున్నారో తెలిపారు. సమావేశం రెండవ భాగంలో ప్రభుత్వ సంస్కరణపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, అతని క్యాబినెట్ సహోద్యోగి పియూష్ గోయల్, జూనియర్ మంత్రి సోమ్ ప్రకాష్ రైతులతో సమావేశం కానున్నారు. (వైరలైన రైతు ఫొటో: అసలు నిజం ఇదే!) కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల గురించి చర్చిండానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరిస్తున్నారు. నూతన చట్టాల పట్ల ప్రభుత్వం కూడా స్థిరంగానే ఉంది. రైతుల నిరసనల నేపథ్యంలో వారిని శాంతింపచేయడానికి సహాయపడే ఇతర అవకాశాలను వారు పరిశీలిస్తున్నారు. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న కనీస మద్దతు ధరకు సంబంధించి ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. -
రైతులకు సన్నాల సంకటం!
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: సన్న రకాలు సాగు చేసిన రైతులు సంకట స్థితిలో పడ్డారు. ఈ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నామమాత్రంగా కొనుగోలు జరుగుతున్నాయి. దొడ్డు రకాల కొనుగోళ్లకే ఐకేపీ, పీఏసీఎస్ నిర్వాహకులు ప్రాధాన్యం ఇస్తుండటంతో రైతులు రైస్ మిల్లుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 3.22 లక్షలు, ఖమ్మం జిల్లాలో 2.32 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 3.80 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 2.43 లక్షలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3.98 లక్షల ఎకరాల్లో అత్యధికంగా వరి పంటను సాగు చేశారు. ఈ జిల్లాల్లో సాగైన పంటలో 70 శాతం పైగా సన్నరకాలే. నియంత్రిత సాగు విధానంలో భాగంగా రైతులు సన్న రకాల సాగుకే మొగ్గు చూపారు. కానీ పంట చేతికి వచ్చాక ఈ పంట సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ధాన్యం అమ్మడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సన్న రకాలైన ఆర్ఎన్ఆర్, 108 సంపూర్ణ, సిద్ది 44, బీపీటీ, పూజలు, హెచ్ఎంటీ, వరంగల్ 44 రకాలు ఎక్కువగా సాగయ్యాయి. ఈ రకాల వరి కోతలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం వీటిని అంతంత మాత్రంగానే కొనుగోళ్లు చేస్తుండటం గమనార్హం. మిల్లుల బాట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు ధాన్యం అమ్మకానికి మిల్లుల బాట పట్టారు. పంట కోసిన వెంటనే మిల్లుల్లో సన్న రకం కొనుగోలు చేస్తున్నారు. పది రోజులుగా ధాన్యం ట్రాక్టర్లతో మిల్లుల వద్ద రద్దీ పెరిగింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టోకెన్ సిస్టం పెట్టారు. తహసీల్దార్ల నుంచి టోకెన్ అందితేనే రైతులు పంట కోసుకొని మరుసటి రోజు మిల్లులకు ధాన్యం తీసుకెళ్లాలి. ఈ పరిస్థితితో టోకెన్ల కోసం కూడా రైతులు క్యూ కడుతున్నారు. మూడు రోజులకోసారి మం డల కార్యాలయాల్లో టోకెన్లు ఇస్తుండటంతో ఇవి దొరకని రైతులు పంట అంతా తూరి పోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొనుగోలు చేయక తిప్పలు సూర్యాపేట జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ 306 కేంద్రాలకు గాను 148 కేంద్రాలు తెరిచారు. కానీ వీటిలో చాలా కేంద్రాల్లో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మిల్లులకు లేదా వ్యవసాయ మార్కెట్లలో ఈ ధాన్యం అమ్మాలని వీటి నిర్వాహకులు రైతులకు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్లు కలిపి 441 కేంద్రాలకు 21 కేంద్రాలు తెరిచారు. పాలేరు డివిజన్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు అక్కడక్కడ ఏర్పాటు చేసినా వీటిల్లో సన్న ధాన్యం కొనుగోళ్లు లేకపోవడంతో ఈ జిల్లా రైతులు ఎక్కువగా మిర్యాలగూడలోని మిల్లులకు ధాన్యం అమ్మకానికి తీసుకెళ్తున్నారు. సన్నరకం కొనుగోలు చేయడం లేదు ఈ రైతు పేరు మట్టపల్లి గురులింగం. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ ఇతని గ్రామం. మూడెకరాల్లో సన్న రకం వరి సాగు చేశాడు. నాలుగు రోజుల క్రితం పంట కోసిన ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి తీసుకెళ్లాడు. ఈ ధాన్యం కొనుగోలు చేయడం లేదని మిల్లులకు, లేదా వ్యవసాయ మార్కెట్కు తీసుకెళ్తే కొనుగోలు చేస్తారని ఐకేపీ నిర్వాహకులు ఉచిత సలహా ఇచ్చారు. ఎక్కడికి ధాన్యం తీసుకెళ్లాలో తెలియక ఈ కేంద్రంలోనే ధాన్యాన్ని ఆరబెట్టాడు. ప్రభుత్వం చెబితేనే సన్న రకం వేశామని, మరి ప్రభుత్వ కేంద్రాల్లో ఈ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరన్నది గురులింగం ఆవేదన. -
మద్దతు ధరకే కొనుగోళ్లు
కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర ఉందని యాప్లో అలర్ట్ వస్తే వెంటనే చర్చించి, తగిన చర్యలు తీసుకోవాలి. పంటలకు కనీస ధరలు ఉన్నాయా? లేవా? అనే సమాచారం ప్రతిరోజూ 10,641 ఆర్బీకేల ద్వారా కచ్చితంగా రావాలి. దానిని ప్రతి రోజూ పరిశీలించాలి. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు జరుగుతున్నాయనే మాట రాకూడదు. ఆర్బీకేల్లో ప్రదర్శించిన పంటల కనీస మద్దతు ధరలు అమలయ్యేలా చూడాలి. ధరలు తక్కువగా ఉన్న చోట్ల జేసీలు, ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా తక్కువ ధరలకు పంటల కొనుగోళ్లు జరక్కూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటలు అమ్ముకోవడంలో రైతులు ఇబ్బంది పడరాదని స్పష్టం చేశారు. ఎంఎస్పీ కన్నా తక్కువ ధరలుంటే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయ మార్కెట్ చూపాలని, లేదంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ప్రాజెక్ట్, ఈ–మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్తో పాటు సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) పనితీరుపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, వేరుశనగ, పత్తిలాంటి పంటలను అమ్ముకోవడంలో రైతులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మద్దతు ధర, కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో ప్రతి రోజూ సమీక్ష చేయాలని ఆదేశించారు. కొనుగోళ్లకు సంబంధించి రైతులకు 10 రోజుల్లోగా పేమెంట్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఖరీఫ్లో 1,09,24,524 మెట్రిక్ టన్నుల పంటలు వస్తాయని అంచనాగా ఉందని, 5,812 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల పనులు – ప్రతి ఆర్బీకే పరిధిలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటులో భాగంగా గోడౌన్లు, కోల్డ్ రూమ్స్, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, ఆక్వా ఇన్ఫ్రాస్ట్రక్చర్.. ఆర్బీకే, మండల పరిధిలో వ్యవసాయ యంత్ర పరికరాలు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆక్వా బజార్, ప్రి ప్రాసెసింగ్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇ–మార్కెటింగ్ ప్లాట్ఫాం ఉంటుంది. ఇందుకు దాదాపు రూ.9,093 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. – మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అన్ని పనులు ఏకకాలంలో యుద్ధప్రాతిపదికన ముందుకు సాగాలి. క్షేత్ర స్థాయిలో పనుల పురోగతి కనిపించాలి. – పేమెంట్ గేట్వే, సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. బయ్యర్లు, రైతుల మధ్య పేమెంట్ల చెల్లింపు సక్రమంగా ఉండేలా పటిష్ట విధానం ఉండాలి. బయ్యర్ ఆర్డర్ చేయగానే 3–4 రోజుల్లో ఆ పంట డెలివరీ అయ్యేలా చూడాలి. పంటను అత్యంత నాణ్యమైన విధానాల్లో ప్రాసెసింగ్ చేసి, క్వాలిటీ ప్రాడక్టు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి. మహిళలకు మేలు జరగాలి – రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధి, మహిళా ఆర్థికాభివృద్ధి కోసం ఉద్దేశించిన అమూల్తో అవగాహన ఒప్పందం అమలు గురించి సమీక్షిస్తూ.. వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందిన మహిళలు పోషిస్తున్న పాడి పశువుల నుంచి తప్పకుండా పాల సేకరణ జరగాలని, తద్వారా వారికి మేలు కలగాలని సీఎం ఆదేశించారు. – రైతుల నుంచి పాల సేకరణ, బల్క్ మిల్క్ యూనిట్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. మహిళలకు పాడి పశువుల పంపిణీ కొనసాగుతోందన్నారు. – నవంబర్ 25 నుంచి కొన్ని బీఎంసీల్లో.. ఒంగోలు, మదనపల్లి డెయిరీల ద్వారా కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీలైంతన త్వరగా అన్ని చోట్లా కార్యకలాపాలు ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. – ఈ సమీక్షలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కురసాల కన్నబాబు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కనీస మద్దతు ధరలో రాజీ పడొద్దు
రైతుల ఉత్పత్తులకు మార్కెట్లో పోటీ ఏర్పడాలి. తద్వారా రైతులకు మెరుగైన ధర రావడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీ ఏర్పడేలా చేస్తుంది. ఈ ఏడాది కూడా రూ.3,300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదని రైతులు బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. పంటలకు ముందుగానే కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) ప్రకటిస్తామని చెప్పాం. ఆ మేరకు గురువారం (నేడు) ప్రకటించబోతున్నాం. సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఖరారు చేసే కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతుల పంటలు ఎక్కడా కొనుగోలు జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వీలుంటే ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు జరిగేలా చూడాలన్నారు. రైతులకు ఏ విధంగా కూడా నష్టం జరగకూడదని, ఈ విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్దతు ధరలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ► రైతులు పంటలు అమ్ముకోవడంలో ప్రభుత్వం సహాయకారిగా నిలుస్తుంది. గత ఏడాది రైతులకు కనీస గిట్టుబాటు ధర రావాలని ప్రభుత్వం దాదాపు రూ.3,200 కోట్లు కేటాయించి పలు పంటలు కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.11,500 కోట్లు ఖర్చు చేసింది. ► ప్రభుత్వం ప్రకటించిన ధరలు రైతులకు దక్కేలా చూస్తాం. కనీస ధర లేక ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. జనతా బజార్లు ► రైతుల ఉత్పత్తులకు గ్రామాల్లో కూడా మార్కెటింగ్ సదుపాయం కల్పించడం కోసం జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ బజార్లలో తప్పనిసరిగా ఫ్రీజర్లు ఉండాలి. ► రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, హిందుస్తాన్ యూనీలీవర్ వంటి సంస్థలను కూడా జనతా బజార్లలోకి తీసుకురావాలి. వీలైనంత త్వరగా జనతా బజార్లతో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం చేసే ప్రతి పని రైతులకు మేలు చేసేలా ఉండాలి. ► ఈ సమీక్షలో మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్డీయేకు గుడ్బై చెప్పిన మిత్రపక్షం
చండీగఢ్: వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏ) నుంచి వైదొలుగుతున్నట్లు శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) ప్రకటించింది. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ అత్యవసర సమావేశం అనంతరం పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి కేంద్రం నిరాకరించడంతోపాటుగా, జమ్మూకశ్మీర్లో పంజాబీని రెండో అధికారి భాష స్థాయి నుంచి తొలగించడం వంటి చర్యలకు నిరసనగా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రైతుల ఆకాంక్షలను గౌరవించడంలో కేంద్రం విఫలమైనందునే..బీజేపీతో తమ పార్టీ చిరకాల మైత్రికి ఫుల్స్టాప్ పెట్టాల్సివచ్చిందన్నారు. -
బిల్లులపై రైతుల ఆందోళన ఎందుకు ?!
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కార్పొరేట్ వ్యాపారుల సముచిత పాత్రకు వీలు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడం పట్ల రైతు లోకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కార్పొరేట్ వ్యాపారుల లాభాపేక్షకు వ్యవసాయ ఉత్పత్తులకు ప్రస్తుతం ఇస్తోన్న ‘కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)’ కనుమరగవుతుందన్నదే వారి ఆందోళనకు అసలు కారణం. కనీస మద్దతు ధరపై కేంద్రం తీసుకొచ్చిన ఈ మూడు బిల్లులపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు. పైగా కనీస మద్దతు ధరను కొనసాగిస్తామంటూ మోదీ ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసింది. అయినప్పటికీ దేశంలోని రైతులు మోదీ ప్రభుత్వాన్ని నమ్మక పోగా, ఎందుకు వ్యవసాయ బిల్లులను శంకిస్తున్నారు ? పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు? ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు నిర్వహించే మార్కెట్లలోనే కాకుండా దేశంలో ఎక్కడైన బయటి ప్రైవేటు మార్కెట్లలో లేదా మండీల్లో రైతులు తమ వ్యవసాయోత్పత్తులను విక్రయించుకునేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ది పార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్’ బిల్లు వీలు కల్పిస్తోంది. దీని వల్ల ప్రభుత్వ హయాంలోని మార్కెట్ కమిటీలు కనీస మద్దతు ధరకు గోధమలు, బియ్యం సేకరించడం తగ్గిపోతుందని, ఆమేరకు తాము నష్టపోతామన్నది రైతుల ఆందోళనని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సీరజ్ హుస్సేన్ తెలిపారు. కాలక్రమంలో ప్రభుత్వ వ్యయసాయ మార్కెట్ కమిటీలు కూడా రద్దు కావచ్చని వారు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. (చదవండి: రబీ పంటల ‘మద్దతు’ పెంపు) ప్రైవేటు మార్కెట్ శక్తుల వల్ల వ్యవసాయోత్పత్తుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందన్నది రైతుల భయం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులే ఎక్కువ ఆందోళన చెందడానికి ప్రధాన కారణం ఆ రెండు రాష్ట్రాల నుంచే 80–90 శాతం వరకు కనీస మద్దత ధరపై ప్రభుత్వం వరి, గోధుమలను కొనుగోలు చేస్తుండడం. కేంద్ర ప్రభుత్వం డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన గోధమలు, వరిలో 52 శాతం వాటా ఈ రెండు రాష్ట్రాలకు చెందినదే. కేంద్రం ఈ రెండు రాష్ట్రాలకే ప్రధానంగా ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణం 1960లో కేంద్రం ‘హరిత విప్లవం’ ఈ రెండు రాష్ట్రాల నుంచే ప్రారంభించడం. హరిత విప్లవం కారణంగా ఈ రెండు రాష్ట్రాలో అధిక దిగుబడి ఎక్కువగా వచ్చింది. ఫలితంగా గోధుమలు, వరి రేట్లు పడిపోవడంతో కేంద్రం ‘కనీస మద్దతు ధర’ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత రైతుల డిమాండ్పై ఈ విధానాన్ని కేంద్రం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. కనీస మద్దతు ధర వల్ల ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాలే లాభ పడుతున్నాయా? కనీస మద్దతు ధర ఎత్తివేయాలా? ఈ విధానాన్ని ఎత్తివేయాలా ? వద్దా ? అన్న అంశంపై గత కొన్నేళ్లుగా చర్చలు జరగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం 5.8 శాతం మంది రైతులే ఎంఎస్పీ కింద తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని, ఈ విషయంలో పంజాబ్, హర్యానా రైతుల తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల రైతులే ఎంఎస్పీ కింద లబ్ధి పొందుతున్నారని 2015లో శాంత కుమార్ కమిటీ ఓ నివేదికలో తెలియజేసింది. ప్రభుత్వ ఏజెన్సీలు ఎక్కువగా పెద్ద రైతుల నుంచే కొనుగోళ్లు ఎక్కువ చేస్తున్నాయి. కేంద్రం 23 రకాల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరలను ప్రకటించగా, వాటిలో వరి, గోధుమలనే ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎంఎస్పీ కింద పప్పు దినుసల కొనుగోళ్లు పెరిగాయి. ఒకప్పుడు దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నప్పుడు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందని, ఇప్పుడు ఆ అవసరం లేదని, ఎంఎస్పీ కన్నా మార్కెట్ ధరలు తక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ఎంఎస్పీ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని శాంత కుమార్ కమిటీ సిఫార్సు చేసింది. ఎంఎస్పీ స్కీమ్ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పిస్పూ కేంద్రం 1997లో చట్టంలో సవరణ తీసుకొచ్చింది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఎంఎస్పీ అమలు చేయడం వల్ల ప్రభుత్వాలపై అధిక ఆర్థిక భారం పడుతోందని, ఈ విధానాన్ని ఎత్తివేయాలంటూ అధికార వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చోప చర్చలు జరగుతున్నాయి. కొత్త వ్యవసాయ బిల్లులో ఎంఎస్పీ విధానానికి తగిన రక్షణలు కల్పించక పోవడంతో ఎప్పుడైనా ఆ విధానానికి కేంద్రం చెల్లు చీటి చెప్పవచ్చన్నది రైతులకు వీడని శంక. (చదవండి: సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే) -
రబీ పంటల ‘మద్దతు’ పెంపు
న్యూఢిల్లీ: గోధుమ సహా ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 6% వరకు పెంచుతూ కేంద్రం సోమవారం నిర్ణయం తీసుకుంది. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుల ద్వారా ఎంఎస్పీ వ్యవస్థను దశలవారీగా తొలగించాలనుకుంటోందన్న రైతుల ఆందోళనకు తాజా చర్య ద్వారా ప్రభుత్వం సమాధానమిచ్చింది. గోధుమ కనీస మద్దతు ధరను క్వింటాల్కు రూ. 50 పెంచారు. దాంతో క్వింటాల్ గోధుమ ఎంఎస్పీ రూ. 1,975కి చేరింది. 2020–21 పంట సంవత్సరానికి(జూన్–జూలై), 2021–22 మార్కెటింగ్ సీజన్కు ఆరు రబీ పంటల ఎంఎస్పీ పెంపును ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్సభకు తెలిపారు. బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్కు రూ.75 పెంచారు. దాంతో క్వింటాల్ బార్లీ ధర రూ.1,600కు చేరింది. ఎంఎస్పీ రూ.225 పెరగడంతో, కందుల ధర క్వింటాల్కు రూ. 5,100కి చేరింది. మసూర్దాల్ ధర క్వింటాల్కు రూ.300 పెరిగింది. దాంతో వాటి ధర క్వింటాల్కు రూ. 5,100కి చేరింది. ఆవాల ధర క్వింటాల్కు రూ.225 పెరిగి, రూ. 4,650కి చేరింది. కుసుమల ధర క్వింటాల్కు రూ.112 పెరిగి, రూ.5,327కి చేరింది. కనీస మద్దతు ధర కొనసాగుతుందనేందుకు తాజా పెంపే నిదర్శనమని తోమర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని విపక్ష పార్టీలకు సూచించారు. గత ఆరేళ్లలో రైతులకు రూ. 7 లక్షల కోట్లను ఎంఎస్పీగా అందించామన్నారు. -
21వ శతాబ్దపు ఆవశ్యకాలు!
న్యూఢిల్లీ: తాజాగా పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైనవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. తాజా సంస్కరణలతో రైతులు తాము కోరుకున్న ధరకు, కోరుకున్న చోట తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలు లభిస్తుందన్నారు. వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేక బిల్లులని, అవి రైతులను నాశనం చేస్తాయని విపక్ష పార్టీలు నిరసిస్తున్న విషయం తెలిసిందే. హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ బిల్లులపై విమర్శలను ప్రధాని తిప్పికొడుతూ.. ‘చాన్నాళ్లు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన నిబంధనల సంకెళ్లలో రైతులను ఉంచి, వారికి అన్యాయం చేసి, వారిని దోపిడీ చేసిన కొందరు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నార’న్నారు. ‘వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల కొందరు ఆ రంగంపై పట్టు కోల్పోతున్నారు. వాళ్లే ఇప్పుడు కనీస మద్దతు ధరపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ఏళ్లకేళ్లు గడిపిన వారే ఇప్పుడు మా నిర్ణయాలను విమర్శిస్తున్నారు’ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు తాజా బిల్లులు వ్యతిరేకం కాదని, ఆ మండీల కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్లో 9 హైవే ప్రాజెక్టులకు సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్లోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్ను కూడా ప్రధాని ప్రారంభించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ రికార్డు స్థాయిలో గోధుమలను ప్రభుత్వం సేకరించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూనె ధాన్యాల సేకరణ 24 రెట్లు పెరిగిందని వివరించారు. -
రైతుల పాలిట రక్షణ కవచాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఆ మూడు బిల్లులు చరిత్రాత్మకం అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. అవి రైతు వ్యతిరేకమంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడం, కేంద్రంలో బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్కి చెందిన మంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రధాని ఆ బిల్లుల్ని గట్టిగా సమర్థించారు. రైతులు, వినియోగదారుల మధ్య దళారీ వ్యవస్థ నుంచి కాపాడే రక్షణ కవచాలని వ్యాఖ్యానించారు. బిహార్లో పలు రైల్వే ప్రాజెక్టుల్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ప్రధాని తన ప్రసంగంలో ఈ బిల్లుల గురించే ఎక్కువగా మాట్లాడారు. రైతులకు స్వేచ్ఛ కల్పించడం కోసం రక్షణగా ఆ బిల్లుల్ని తీసుకువస్తే విపక్షాలు దళారులకు కొమ్ము కాస్తూ రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లులు అత్యంత అవసరం 21వ శతాబ్దంలో ఈ బిల్లుల అవసరం చాలా ఉందన్నారు. రైతుల్ని సంకెళ్లలో బంధించకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా తమ ఉత్పత్తుల్ని అమ్ముకునే అవకాశం వస్తుందని ప్రధాని అన్నారు. ప్రభుత్వం ఇక వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయదని, కనీస మద్దతు ధర ఇవ్వదని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) చట్ట సవరణల్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇవే అంశాలను ఉంచిందని మోదీ ధ్వజమెత్తారు. దళారులకు ఎవరు కొమ్ము కాస్తున్నారో, తమకు అండగా ఎవరున్నారో అన్నదాతలు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తుందని, కనీస మద్దతు ధర ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఎంఎస్పీని తొలగించే కుట్ర: కాంగ్రెస్ తాజాగా తీసుకువచ్చిన మూడు బిల్లుల ద్వారా ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించే విధానాన్ని తొలగించే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రైతులను పాండవులతో, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కౌరవులతో పోలుస్తూ.. ఈ ధర్మ యుద్ధంలో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఇతర రాజకీయ పార్టీలను కోరింది. రైతుల కోసం పార్లమెంటు వెలుపల, లోపల పోరాడుతామని స్పష్టం చేసింది. మాటలకు, చేతలకు పొంతన లేకుండా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వంపై రైతులు నమ్మకం కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రైతుల పొట్టగొట్టి, తన స్నేహితులకు లాభం చేకూర్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శుక్రవారం ట్వీట్ చేశారు. పార్లమెంటు తాజాగా ఆమోదించిన వ్యవసాయ బిల్లులు కనీస మద్దతు ధర విధానాన్ని నాశనం చేస్తాయని మరో సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. -
పంటల అమ్మకం కష్టం కాకూడదు
పంటలకు తగిన మార్కెటింగ్ లేక, కనీస గిట్టుబాటు ధరలు రాక ఏటా అరటి, చీని,టమాటా, ఉల్లి, నిమ్మ, పసుపు, మిర్చి తదితర పంటలు పండించే రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు అమ్ముకునేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆయా పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలి. మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పంటలు అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడకూడదని, వారు ఎక్కడా రోడ్డెక్కే పరిస్థితి కనిపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని పంటలకు మార్కెటింగ్ లేక కనీస గిట్టుబాటు ధరలు రాని అంశాన్ని స్వయంగా ఆయనే ప్రస్తావించారు. ఈ సీజన్ నుంచి మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు తగిన జాగ్రత్త పడాలని, దీని కోసం ఎంత ఖర్చు అయినా పర్వా లేదన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. శాశ్వత పరిష్కారం కావాలి ► రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే.. ఏ పంట, ఎంత వరకు కొనుగోలు చేయాలి? ఎంత మేర ఫుడ్ ప్రాసెసింగ్కు తర లించాలన్న దానిపై అధికారులు దృష్టి పెట్టాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి. ► పంటలకు గిట్టుబాటు ధరలు రావడంతో పాటు, వాటి మార్కెటింగ్లో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. అవసరమైతే ధరల స్థిరీకరణ నిధి ఉపయోగిస్తుంది. ఈ ఏడాది దాదాపు రూ.3 వేల కోట్లు వ్యయం చేశాం. రైతుల కష్టాలను తీర్చడానికి వ్యవస్థీకృతంగా సిద్ధం కావాలి. ► వచ్చే సీజన్ కల్లా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా మార్కెటింగ్ లేక, గిట్టుబాటు ధరలు రాక రైతులకు ప్రధానంగా ఇబ్బందులు తెస్తున్న ఏడెనిమిది పంటలను గుర్తించాలి. వాటి ప్రాసెసింగ్తో పాటు, వాల్యూ ఎడిషన్ ఏం చేయగలమో ఆలోచించాలి. వీటి కోసం మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి. ► ప్రాథమికంగా ఆర్బీకే స్థాయిలో, ఆ తర్వాత మండల, నియోజకవర్గ స్థాయిల్లో అంచనాలు తయారు చేయాలి. ► వ్యవసాయ మంత్రి కె.కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇది గిట్టుబాటవుతుందా?!
ఈసారి బడ్జెట్ సమావేశాలు మొదలైనరోజు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పార్లమెంటులో చేసిన ప్రసంగం రైతుల్లో ఆశలను పెంచింది. ఆహార ధాన్యాలకు మెరుగైన ధరలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, ఇన్పుట్ వ్యయంపై 1.5 రెట్లు అధికంగా వారికి రాబడి వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నదని తెలియజేశారు. సోమవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఈ ఖరీఫ్ సీజన్లో పండించే 14 పంటల కనీస మద్దతు ధరలు పెంచింది. ఈ ధరలు గతంతో పోలిస్తే మెరుగ్గా వుండాలని... ఒకటిన్నర రెట్లు అధికంగా రావడం సంగతటుంచి పెట్టిన పెట్టుబడికి దీటుగా వుండాలని రైతులు ఆశించడం సహజం. కానీ ఎప్పటిలాగే వారికి అసంతృప్తే మిగిలింది. వరికి నిరుడు మద్దతు ధర క్వింటాల్ రూ. 1,815 వుండగా ఈసారి దాన్ని రూ. 1,868కి పెంచారు. అంటే గతంతో పోలిస్తే పెంచింది రూ. 53. ఏ గ్రేడ్ వరి ధరను కూడా రూ. 53 పెంచి, దాని మద్దతు ధరను రూ. 1,888గా నిర్ణయించారు. నూనెగింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాల ఎంఎస్పీలు గణనీయంగా పెరిగాయి. గడ్డి నువ్వులు(నైజర్ సీడ్స్, ఒడిసెలు)కి అయితే రూ. 755 మేర పెంచారు. ఈ కొత్త ధరల గురించి ప్రకటన చేస్తూ పంట ఉత్పత్తి వ్యయంపై అదనంగా 50 శాతం ప్రతిఫలం వుండేలా మద్దతు ధర వుండాలన్న సంకల్పంతోనే ఈ ధరలు ప్రకటించామని కేంద్రం తెలిపింది. కానీ ఇప్పుడు ప్రకటించిన మద్దతు ధరలను గమనిస్తే అసలు వివిధ పంటలకు ఇన్పుట్ వ్యయం స్థూలంగా ఎంతవుతున్నదోనన్న అవగాహన వుందా అన్న అనుమానం కలుగుతోంది. ఏ పంట దిగుబడికి ఎంత మద్దతు ధర వుండాలో జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్(సీఏసీపీ) సిఫార్సు చేస్తుంటుంది. వాటి ఆధారంగా కేంద్రం ఈ ధరల్ని నిర్ణయిస్తుంది. సీఏసీపీ వివిధ రాష్ట్రాలను సందర్శించి అక్కడి ప్రభుత్వాలు, రైతు సంఘాలు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని... సాగు చేయడానికి అవుతున్న వ్యయం, పంట ఉత్పత్తి, మార్కెట్లో పంట దిగుబడికి వుండే ధర వగైరాలను పరిశీలించి సిఫార్సులు చేస్తుంటుంది. ఉత్పత్తి వ్యయంపై 50 శాతంకన్నా అధికంగా ఎంఎస్పీ వుండేలా చూడాలని ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ కమిషన్ ఎప్పడో 2006లో సూచించింది. దాన్ని అమలు చేస్తామని గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటించినా, ఆ పని చేయకుండానే అది నిష్క్రమించింది. ఎన్డీఏ ప్రభుత్వం సైతం ఆ మాటే చెప్పింది. దాన్ని అమలు చేయడం ప్రారంభించామని ఇప్పుడంటోంది. కానీ ఆ ధరలు తమ ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అధికంగా వుండటం మాట అటుంచి గిట్టుబాటు కావడమే కష్టమవుతున్నదని రైతుల ఫిర్యాదు. అసలు కనీస మద్దతు ధరల్ని జాతీయ స్థాయిలో ప్రకటించడం అహేతుకమని రైతు సంఘాలు చెబుతాయి. ఉత్పత్తి వ్యయం అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా లేనప్పుడు, దిగుబడికి ఒకే రకం ధరను ప్రకటించడం ఏవిధంగా సమంజసమన్నది ఆ సంఘాల ప్రశ్న. సీజన్లో కేరళలో రోజు కూలీ రూ. 850 నుంచి రూ. 1,000 వరకూ వుండగా, తెలుగు రాష్ట్రాల్లో అది రూ. 600–రూ. 800 మధ్య వుంటుంది. ఒడిశా వంటిచోట్ల రూ. 150–రూ. 200 మించదు. పంజాబ్లో కూడా తక్కువే. అసలు విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగుమందులు, డీజిల్ వరకూ అన్నిటి ధరలూ ఆకాశా న్నంటుతున్నాయి. ఇవన్నీ తడిసిమోపెడయి ఉత్పత్తి వ్యయాన్ని విపరీతంగా పెంచుతున్నాయి. మద్దతు ధరలు జాతీయ స్థాయిలో నిర్ణయిస్తుండటంవల్ల ఒడిశా, పంజాబ్ వంటివి లాభ పడుతున్నాయి. దక్షి ణాది రైతులు నష్టపోతున్నారు. ఏ గ్రేడ్ వరికి ఈసారి నిర్ణయించిన గిట్టుబాటు ధర రూ. 1,888ని కనీసం రూ. 2,500గా ప్రకటిస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమాత్రం గిట్టు బాటు కాదని రైతు నేతలు చెబుతున్న మాట. ఉపాధి హామీ పథకాన్ని సాగు పనులకు అను సంధానించాలని చాన్నాళ్లుగా వారు కోరుతున్నారు. కనీసం ఆ నిర్ణయం తీసుకున్నా సాగు వ్యయం గణనీయంగా తగ్గుతుందని, రైతుకు ఎంతో కొంత మేలు కలుగుతుందని సూచిస్తున్నారు. కానీ వినిపించుకొనేవారేరి? ఎంఎస్పీ నిర్ణయంలో సీఏసీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటినుంచో విమర్శలున్నాయి. అది అచ్చం వ్యాపార ధోరణితో ఆలోచించి... డిమాండు, సరఫరాలను పరిగణనలోకి తీసుకుని సిఫా ర్సులు చేస్తున్నది తప్ప రైతులకు వాస్తవంగా అవుతున్న వ్యయం సంగతిని పట్టించుకోవడంలేదన్న ఫిర్యాదులు ఎప్పటినుంచో వున్నాయి. ఉదాహరణకు వరి ధాన్యం నిల్వలు మన దేశంలో సమృద్ధిగా వున్నాయి. కనుక వరి ఎంఎస్పీని నిర్ణయించేటపుడు ఆ సంగతిని సీఏసీపీ దృష్టిలో వుంచుకుం టుంది. కానీ నూనె గింజల సంగతి వచ్చేసరికి పరిస్థితి వేరు. రైతుల నుంచి కొనేదికాక దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. దిగుమతులు తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది కనుక నూనె గింజలకిచ్చే ఎంఎస్పీ ఎప్పుడూ గణనీయంగానే వుంటోంది. అలాగే ఉత్తరాదిన పండే గోధుమకు ప్రతిసారీ మెరుగైన ఎంఎస్పీ లభిస్తుంది. వాస్తవానికి దానికయ్యే ఉత్పత్తి వ్యయం తక్కువ. మరి ఏ ప్రాతి పదికన దానికి ఎంఎస్పీ ఎక్కువిస్తారన్న సందేహాలు ఎప్పటినుంచో వున్నాయి. పైగా ఏటా కేంద్రం ప్రకటించే ఎంఎస్పీని బట్టి వ్యాపారులు కొంటారన్న విశ్వాసం ఎవరికీ లేదు. మార్కెట్లో ఎప్పుడూ దళారులదే పైచేయి. ఎంఎస్పీని ప్రకటించడంతోపాటు ఆ ధరకు తామే కొనడానికి అనువైన వ్యవస్థల్ని ప్రభుత్వాలు ఏర్పరిస్తేనే ఈ సమస్య తీరుతుంది. దిగుబడినంతా ప్రభుత్వాలు కొనవలసిన అవసరం ఉండదు. ప్రభుత్వ వ్యవస్థలు రంగంలోకి దిగి కొనుగోలు చేస్తే అందరూ దారికొస్తారు. కరోనా మహమ్మారి మన ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిన వర్తమానంలో జీడీపీ ఈ మాత్ర మైనా వుండటానికి రైతాంగం కృషే కారణం. రైతులకు ఎంతో చేస్తున్నామని చెప్పుకునే బదులు, వారికి అక్కరకొచ్చే కనీస చర్యలు అమలు చేస్తే ఎంతో మేలుచేసిన వారవుతారు. -
వరికి మద్దతు రూ.53 పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆహార, వాణిజ్య పంటల కనీస మద్ధతు ధర(ఎమ్మెస్పీ)లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరి మద్ధతు ధరను స్వల్పంగా రూ. 53 పెంచింది. ఈ పెంపుతో వరి క్వింటాల్ ధర సాధారణ రకం రూ. 1,868కి, ఏ గ్రేడ్ రకం రూ. 1888కి చేరింది. నూనె గింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలకు గణనీయంగా పెంచింది. ప్రస్తుత 2020–21 పంట సంవత్సరానికి(2020 జూలై– 2021 జూన్) ఈ ఎమ్మెస్పీ వర్తిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ కనీస మద్దతు ధర పెంపు ప్రతిపాదనలను ఆమోదించారు. అత్యధికంగా గడ్డి నువ్వులు(నైజర్ సీడ్స్)కు క్వింటాలుకు రూ. 755 పెంచారు. నువ్వులకు రూ. 370, మినుములకు రూ. 300, పత్తికి రూ. 275 మేర పెంచారు. మద్దతు ధర పెంపులో ఉత్పత్తి వ్యయంపై మెరుగైన ప్రతిఫలంతోపాటు, వైవిధ్య పంటల ప్రోత్సాహం అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పంట ఉత్పత్తి వ్యయంపై అదనంగా కనీసం 50 శాతం ప్రతిఫలం లభించేలా కనీస మద్దతు ధర ఉండాలని 2018–19 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా మద్దతు ధరలను ప్రకటించారు. ఉత్పత్తి వ్యయానికి అదనంగా సజ్జల(బాజ్రా)కు 83%, మినుములకు 64%, కందులకు 58%, మొక్కజొన్నకు 53%, ఇతర పంటలకు కనీసం 50% మేర ప్రతిఫలం వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఖరీఫ్ సీజన్లో వరి ప్రధాన పంట. ఇప్పటికే 35 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు. ‘కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఫారసుల మేరకు 2020–21 సంవత్సరానికి గానూ 14 ఖరీఫ్ పంటలకు మద్ధతు ధరలను పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ పంటలపై, దిగుబడి ఖర్చుపై 50% నుంచి 83% వరకు రైతుకు లాభం వచ్చేలా ధరల పెంపు ఉంది’ అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. వరి దిగుబడి వ్యయాన్ని సాధారణ రకానికి రూ. 1245, ఏ గ్రేడ్ రకానికి రూ. 1246గా నిర్ధారించి, దానిపై 50% ప్రతిఫలం లభించేలా కనీస మద్దతు ధర నిర్ణయించామన్నారు. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు వాటి ఎమ్మెస్పీని గణనీయంగా పెంచారు. రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించే తేదీని ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
అన్నదాతకు మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. తెలంగాణలోని కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని.. ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని, ఈ నేపథ్యంలో రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవ హరించి, రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి అనుసరించాల్సిన వ్యూహం రూపొందించేందుకు సీఎం కేసీఆర్.. మంగళవారం ప్రగతి భవన్లో సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సీనియర్ అధికారులు పార్థసారథి, రాహుల్ బొజ్జా, స్మితా సభర్వాల్, పౌసమి బసు, ఉద్యాన కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతీ గింజకు మంచి ధర వచ్చే విధంగా ప్రభుత్వ విధానం ఉండాలని స్పష్టంచేశారు. ‘తెలంగాణ రాష్ట్రం చేసిన ఆలోచన ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అధికారులను ఆదేశించింది. రైతులకు కనీస మద్దతు ధర అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇది మనందరికీ గర్వకారణం. ఇదే విధంగా రైతులకు మంచి ధర లభించడం కోసం ప్రభుత్వపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలి. ఇందుకోసం సమగ్ర వ్యూహం రూపొందించాలి’ అని సూచించారు. మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేయాలి... రైతులు పండించిన పంట మార్కెట్కు వచ్చి, కాంటా అయితే.. ఐదు నిమిషాల్లోనే వారికి చెక్కు ఇచ్చే పద్ధతి రావాలని సీఎం అభిప్రాయపడ్డారు. రైతుల నుంచి ఉత్పత్తులను నేరుగా మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేయడం వల్ల పోటీతత్వం పెరిగి, రైతన్నలకు మంచి ధర వస్తుందని పేర్కొన్నారు. నిధుల సేకరణ కోసం మార్కెటింగ్ శాఖ డైరెక్టరేట్కు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందని హామీ ఇచ్చారు. మార్కెటింగ్ శాఖ రైతుల నుంచి కొనుగోళ్లు జరిపి, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలని.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎవరూ సరుకులు కొనకుండా చూడాలని ఆదేశించారు. దేశ విదేశాల్లో మార్కెట్ పోటీదారులను గుర్తించి, వారిని ఎదుర్కొనే వ్యూహం కూడా రూపొందించాలని సూచించారు. ఆ వివరాలన్నీ పక్కాగా ఉండాలి... మన రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలేమిటనే విషయంలో పక్కా వివరాలుంటే ఏ పంట పండించాలో నిర్ణయించవచ్చని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే ఏ పంటకు మంచి మార్కెట్ ఉందో తెలుసుకుని పంటల సాగు చేస్తే మంచి ధర వస్తుందన్నారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పది రోజుల్లో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాలని ఆదేశించారు. ‘వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఒక్కో రైతు నుంచి వివరాలు తెలుసుకోవాలి. ఏ గుంట భూమిలో ఏది సాగు చేస్తున్నారో సేకరించాలి. బియ్యం ఎంత తింటున్నారు? కూరగాయలు ఎన్ని తింటున్నారు? పప్పుదినుసులు ఎంత తింటున్నారు? మసాలా దినుసులు ఎంత మేర వినియోగిస్తున్నారు? నూనె గింజల వాడకం ఎంత? తదితర విషయాలు సేకరించాలి. ఈ అంశాల్లో కచ్చితమైన గణాంకాలు రూపొందించాలి. అప్పుడు వాటికి అనుగుణంగా పంటల సాగు చేయడానికి క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. అలాగే పండించిన పంటకు మంచి మార్కెట్ రావడానికి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. రైతులు కూడా పండించిన పంటనంతా ఒకేసారి మార్కెట్కు తీసుకురాకుండా, గ్రామాలవారీగా మార్కెట్కు తీసుకొచ్చే పద్ధతిని అలవాటు చేయాలి. ఇందుకు రైతు సమన్వయ సమితులను ఉపయోగించుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. కల్తీ విత్తనాలపై ఇంకా కఠినం... కల్తీ విత్తనాల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా ఉంటుందని సీఎం స్పష్టంచేశారు. ‘‘మన రాష్ట్రంలో వరి, మక్కలు, పత్తి ఎక్కువగా పండిస్తున్నారు. పండ్ల తోటలున్నాయి. అక్కడక్కడా ఇతర పంటలు కూడా వేస్తున్నారు. కానీ ఈ పంటల సాగు శాస్త్రీయంగా లేదు. మార్కెట్ పరిస్థితులను బట్టి పండించడంలేదు. ఉత్పాదకత పెరగాలి. నాణ్యత పెరగాలి. అప్పుడే రైతులకు మంచి ధర వస్తుంది. కల్తీ విత్తనాలు లేకుండా ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఈ విషయంలో ఇంకా కఠినంగా ఉంటుంది. పత్తి దిగుబడి ఎక్కువ రావడం కోసం అనువైన భూముల్లోనే పత్తి సాగు చేయించాలి. మేలు రకమైన పత్తి సాగు విధానాలు ప్రపంచంలో ఎక్కడున్నా వాటిని అధ్యయనం చేసి అనుసరించాలి. పంజాబ్ సహా వరిసాగు బాగా జరిగే ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలి. అక్కడి మెళకువలు తెలుసుకుని, రైతులకు నేర్పించాలి. తక్కువ కాలరీలు, తక్కువ షుగర్ ఉన్న వరి వంగడాలు సాగుచేయాలి. వరిలో ఎక్కువ దిగుబడి పొందేలా రైతులను తీర్చిదిద్దాలి. మొక్కజొన్నకు మంచి డిమాండ్ ఉన్నందున మంచి విత్తనాలు తయారుచేయాలి. ప్రతిరోజూ వంటలో వాడే చింతపండుకు కొరత ఉంది. అందువల్ల తెలంగాణలో విరివిగా చింతచెట్లు పెంచాలి. హరితహారం కింద కనీసం 5 కోట్ల మొక్కలను రైతులకు ఉచితంగా సరఫరా చేయాలి. పసుపు కొమ్ములను పసుపు పొడిగా, మిరపకాయలను కారం పొడిగా, కందులను పప్పుగా మార్చి అమ్మే పనిని మహిళా సంఘాల ద్వారా చేయించాలి. స్వచ్ఛమైన పల్లీనూనె, నువ్వుల నూనెలను తయారు చేయాలి. దీనివల్ల రైతులకు మంచిధర వస్తుంది. మహిళలకు ఉపాధి దొరుకుతుంది. కల్తీ సరుకులు కొనే బాధ వినియోగదారులకు తప్పుతుంది. మేలురకమైన సాగు పద్ధతులను రైతులకు నేర్పడానికి వ్యవసాయ విస్తరణాధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దాలి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆగ్రానమీ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీలో ఆగ్రానమీ కన్సల్టెన్సీని పెట్టాలి’ అని సీఎం సూచించారు. దిగుమతి కావొద్దు... ‘‘మనం ప్రతిరోజూ కూరల్లో కొత్తిమీర, మెంతికూర, పుదీనా, జీలకర్ర వినియోగిస్తుంటాం. కానీ వాటిని మనం పండించం. ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటాం. మామిడిపండ్లు, బత్తాయిలు, ఇతర పండ్లు తింటాం. వాటిని కూడా దిగుమతి చేసుకుంటాం. చివరికి కూరగాయలను కూడా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చింది. రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలున్నాయి. నగర జనాభా 50 శాతానికి చేరుకుంటోంది. అక్కడ నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలను ఆ పట్టణాల చుట్టుపక్కలున్న గ్రామాల్లో పండిచవచ్చు. కానీ పండించడం లేదు. గతంలో గ్రామాల్లో పండించే కూరగాయలను పట్టణాలకు తీసుకెళ్లి అమ్మేవారు. కానీ ప్రస్తుతం వేరే ప్రాంతాల నుంచి పట్టణాలకు దిగుమతి చేసుకుని, పట్టణాల నుంచి కూరగాయలను గ్రామాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఈ పరిస్థితి పోవాలి. మనం తినే కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను మనమే పండించుకోవాలి. ఒక్క బియ్యం బస్తా కూడా తెలంగాణకు దిగుమతి కావద్దు. మనమే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకోవాలి. అంకాపూర్ రైతుల మాదిరిగా దేశంలో ఏ పంటకు ఎక్కడ మంచి మార్కెట్ ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా పంటలకు మంచి ధర రాబట్టుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మనం తినే ఆహారంలో ఏది ఆరోగ్యకరం? ఏది కాదు? అనే విషయంలో కూడా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ‘మంచి ఆహార పదార్థాలను ప్రోత్సహించాలి. ఆకుకూరలు, పండ్ల వాడకాన్ని పెంచాలి. తెలంగాణ సోనా రకం బియ్యం మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి ఆహార పదార్ధాలను ప్రోత్సహించాలి. కొన్ని పండ్లను ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. మన రాష్ట్రంలోనే ఆయా పండ్ల సాగుకు ఏ ప్రాంతం అనువైనదో గుర్తించి సాగు చేయించాలి’ అని సీఎం ఆదేశించారు. వ్యవసాయశాఖకు ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలు అనుబంధంగా ఉండాలని, ఇందుకోసం అధికార వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని ఆయన సూచించారు. -
రుణమాఫీతో రుణం తీరేనా?
ఎన్నికల సమయంలో వాగ్దానాలను చూస్తుంటే ఎన్నికలకు రైతులకు అవినాభావ సంబంధం ఉందా అనిపిస్తుంది. నేడు ఏ రాష్టంలో ఎన్నికలు జరిగినా అక్కడి రాజకీయ పార్టీలు చేసే ముఖ్యమైన వాగ్దానం ‘ రైతుల రుణమాఫీ‘. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా, ఇంకా వ్యవసాయ రంగం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రంగం మీద ఆధార పడిన 61.5 శాతం రైతుల బతుకులు మారలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగానికి మేలుచేసి, వారి అభివృద్ధికి దోహదం చేసే ఎన్నికల వాగ్దానాలు అవసరమే! అయితే అవి దీర్ఘకాలంలో రైతులకు ప్రయోజనం చేకూరేవిగా, వారి సంపదను పెంచేవిగా ఉండాలి. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలు రైతుల ‘వ్యవసాయ రుణమాఫీ’కే పెద్దపీట వేస్తున్నాయి. ఈ వాగ్దానం ఆశ చూపి రైతుల ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిసారి ఎన్నికల వేళ ‘రుణ మాఫీ’ ప్రకటనతో రైతులకు చేకూరే ప్రయోజనం కంటే దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు చేకూరే ముప్పే ఎక్కువ అన్న విషయం మననేతలకు తెలియదా? నిజానికి, రైతుల అభివృద్ధి ‘రుణ మాఫీ’తో సాధ్యం కాదు అనే విషయం తేటతెల్లం. రాజకీయ నాయకులు ‘రుణమాఫీ’ కాకుండా రైతులకు ‘పెట్టుబడి సాయం’ రూపంలో నగదు బది లీపై ఆలోచించాలి. నిజానికి 2008 లోనే నాటి సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి రైతులకు పెట్టుబడి సాయం రూపంలో నగదు బదిలీ గురించి ఆలోచించారు కానీ ఆయన అకాల మరణంతో అది కార్యరూపం దాల్చ లేక పోయింది. రైతుకు నేరుగా పెట్టుబడి కింద నగదును బదిలీ చేయడం ద్వారా రైతుకు బ్యాంకుల మీద లేదా వడ్డీవ్యాపారస్తులమీద ఆధార పడాల్సిన అవసరం ఉండదు. వడ్డీల భారం ఉండదు, రైతు తన సాగు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసుకునే అవకాశముంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ‘రైతుబంధు’ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరాకు 8 వేల రూపాయలు ఇవ్వడం ఒక విధంగా ‘రైతుల రుణమాఫీ’కి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కేసీఆర్ పథకాలను ఇప్పుడు తెలంగాణ మోడల్ గా చెప్పుకుంటున్నారు. రైతుల ఈ దుస్థితికి కారణం వారు పండించే పంటకు సరైన ‘మార్కెటింగ్ విధానం’ లేకపోవడమే అని చెప్పక తప్పదు. మనదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికి, లోపభూయిష్టమైన వ్యవసాయ ఉత్పతుల మార్కెటింగ్ విధానం స్థూల సమస్యగా చెప్పవచ్చు. ఇప్పటికీ, రైతు పండించిన పంట అమ్మడానికి స్థానిక వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల మీద ఆధార పడుతున్నాడు. దీనితో విస్తృతమైన మార్కెటింగ్ అవకాశాలను కోల్పోతున్నాడు. ఇక ప్రభుత్వాలు ప్రకటించే ‘కనీస మద్దతు ధర’ కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప క్షేత్ర స్థాయికి చేరుకోవడంలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం‘ (ఈ– నామ్) కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది. వీటికి తోడూ సాగునీరు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత మొదలగు సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. ఇలాంటి సమస్యల పరి ష్కారాన్నే పార్టీలు తమ ప్రధాన వాగ్దానాలుగా ప్రకటించగలిగిననాడు కేవలం రైతుల జీవితాల్లో నిజ మైన మార్పు రాగలదు. -డాక్టర్ రామకృష్ణ బండారు, మార్కెటింగ్ పరిశోధకుడు, ఓయూ మొబైల్ : 80191 69658 -
ఉల్లి ధర ఢిల్లీకి చుక్కలు చూపెట్టనుందా...!!
హివర్గావ్/ముజాహిద్పూర్ : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అంతటి పోషక విలువలుంటాయి ఉల్లిలో. అంతేకాదు ఉల్లి ధరలు ఢిల్లీ పీఠాన్ని సైతం కదిలించగలవు. ఈ విషయం గతంలో రుజువైంది. ఇప్పుడు అదే ధోరణి పునరావృతం అవుతుందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఉల్లి, ఆలు ధరలు దారుణంగా పడిపోవడంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో నరేంద్రమోదీ వ్యతిరేక పవనాలు బలపడే అవకాశాలున్నాయి. ఉల్లి ధర కిలో రూపాయికి చేరడంతో రైతులు ఆందోళనబాట పట్టారు. కిలో ఉల్లిని పండించడానికి రూ.8 ఖర్చవుతుండగా..రూపాయి గిట్టుబాటు కావడంతో అప్పుల్లో మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను రోడ్లపై పోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటేయమని తేల్చిచెప్తున్నారు. అచ్చేదిన్ అంటూ అధికారంలోకొచ్చిన బీజేపీ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. 1998లో ఉల్లి ధర క్షీణించడంతో తర్వాత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి తిరిగి అధికారంలోకి రాలేకపోయింది. ధర పెరిగినా దెబ్బే.. ధరలు క్షీణించడంతో వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందనుకోవడం పొరబాటే. రైతుల నుంచి కొనుగోలు చేసే ధరలు ఎలా ఉన్నా బహిరంగ మార్కెట్లో మాత్ర వాటిలో తేడా ఉండదు. నాలుగు దశల్లో ఉండే దళారులు తలా ఇంత ధర పెంచడంతో సరుకు వినియోగదారుడికి చేరేసరికి దాని ధర తడిసి మోపెడవుతుంది. ఇక ధరలు నిజంగానే పెరిగితే.. వినియోగదారుల జేబులకు చిల్లులు పడాల్సిందే. అప్పుడు కూడా ఢిల్లీకి సెగ తాకక తప్పదు. 1980 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉల్లి ధర ఆకాశాన్ని తాకడంతో జనతా ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీచాయి. దాంతో కేంద్రంలో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ 353 ఎంపీ సీట్లలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉల్లి ధర తోడ్పడిందని భావించవచ్చు. బీజేపీకి మాత్రం ఓటేయం.. ‘లోక్సభ ఎన్నిలకు మరికొన్ని నెలలే ఉంది. ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మేం దానిని స్వీకరించలేం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీకి మాత్రం ఓటు వేయం. 2014 ఎన్నికలప్పుడు చేసిన తప్పును మళ్లీ చేయం. ఏదేమైనా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తాం’ అని ఓ ఇంగ్లిష్ వార్తా సంస్థ సర్వేలో కొందరు రైతులు కుండబద్దలు కొట్టారు. భవితవ్యాన్ని మార్చేస్తారు.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో కలిపి 128 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 545 స్థానాలున్న భారత పార్లమెంటులో ఈ రెండు రాష్ట్రాల పాత్రేమిటో తెలుస్తూనే ఉంది. ఇక ఉల్లి, ఆలు ధరల క్షీణత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లోని గ్రామీణ జనంలో బీజేపీపై వ్యతిరేకత రావడానికి కారణమవుతుందనడంలో సందేహం లేదు. వీరంతా 128 ఎంపీ అభ్యర్థుల భవితవ్యాన్ని తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే నరేంద్ర మోదీకి ప్రతికూల పవనాలు వీస్తుండగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో గనుక బీజేపీకి తక్కువ సీట్లు వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఇబ్బందులు తలెత్తవచ్చు. లేదా తిరిగి అధికారంలోకి రాలేకపోవచ్చు. మరోవైపు 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టగానే నెమ్మది నెమ్మదిగా రైతులకు సబ్సిడీలను తొలగించడం కూడా వ్యతిరేకత పెంచింది. ఇదే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పవనాలు వీయడానికి కారణమైంది. రూ. 400 పెరిగింది.. దేశంలో ఆలు పంట అధికంగా పండించే ఉత్తరప్రదేశ్లోనూ గిట్టుబాబు ధరలులేక రైతులు ఆందోళన చెందుతున్నారు. 86 శాతం మేర పడిపోయిన టన్ను ఆలు ధర రూ.2500లకు చేరిందని వాపోతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పంటల నిర్వహణ ఖర్చులు పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయా అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ) రూ. 400 పెరిగి 1450 రూపాయలకు చేరిందనీ, కానీ ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ కలిసి ధర పెంచేశాయి.. టన్ను ఉల్లి ధర 83 శాతం మేర పడిపోవడం ఒకవైపు.. అంతర్జాతీయంగా రూపాయి విలువ పడిపోవడం మరోవైపు దిగుబడి ఖర్చులు పెరిగేలా చేశాయి. గతంలో కంటే పంట దిగుబడి ఎక్కువ రావడం, తూర్పు మధ్య ఆసియా, ఆగ్నేయాసియా నుంచి ఆర్డర్లు లేకపోవడంతో ఎగుమతులు తగ్గి నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అప్పుల్లో ముంచేశారు.. పండించిన పంటలకు గిట్టుబాబు ధరలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు. ‘ధరల స్థిరీకరణ నిధి’ని ఏర్పాటు చేయకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న 26 కోట్ల మంది రైతులు దళారీల దయాదాక్షిణ్యాల మీద పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తింది. తమకు పంటలను నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి సదుపాయాలు కల్పిస్తే ఇంతటి తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యేవి కాదనీ, అప్పుల్లో మునిగిపోయేవారం కాదని రైతులు అంటున్నారు. అచ్చేదిన్ ఎక్కడ.. ‘మంచి రోజులొస్తాయంటే నమ్మాం. నరేంద్ర మోదీని గెలిపించాం. కానీ, రైతుల పట్ల ఇంత నిర్లక్ష్య పాలన సాగిస్తారని అనుకోలేదు’ అని మాధవ్ పవాసే అనే ఉల్లి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ధర పడిపోవడంతో రైతులు పంటపొలాల్లోనే ఉల్లిని వదిలేస్తున్నారనీ, పంటను కోసి మార్కెట్కు తరలిస్తే మరింత నష్టం మూటగట్టుకోవాల్సి వస్తుందని వాపోయారు. బీజేపీకి సవాల్.. ఇక సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో రైతుల్లో ఉన్న వ్యతిరేకతను ఎలా తగ్గించడమని బీజేపీలో అంతర్మథనం మొదలైంది. వారిని ఆకట్టుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ రైతులకు మేలు చేసే పథకాలు అమలు చేస్తామని చెప్పుకొస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్లలోనూ రైతు రుణ మాఫీ ప్రకటించిన కాంగ్రెస్.. దేశ వ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేయాలని బీజేపీకి సవాల్ విసురుతోంది. అయితే, రుణాల మాఫీ అన్నది రైతు సమస్యల పరిష్కారానికి మార్గం కాదని నీతి ఆయోగ్ వైఎస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు రైతుల సంక్షేమం కోసం బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ చెప్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని అన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోల్చి గిట్టుబాబు ధరలు అందించడానికి ఎలక్ట్రానిక్ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ కొనసాగుతోందనీ, ఇంత పెద్ద దేశంలో నాలుగేళ్లలోనే దానిఫలాలు రావాలనడం భావ్యం కాదని అన్నారు. -
ఎంఎస్పీపై భిన్నస్వరాలా?
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను ఖరారు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇటువంటి విషయాల్లో ఏకస్వరం, ఏకాభిప్రాయం అవసరమని, ఇందుకోసం అన్ని శాఖలు కలసి ఒకే నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఓ ఉమ్మడి వేదిక ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంచేసింది. ఈ విషయంలో తాము ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఇవ్వొద్దని కేంద్రానికి ధర్మాసనం తేల్చి చెప్పింది. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరను ఖరారు చేసే విషయంలో అనుసరిస్తున్న విధానానికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస మద్దతు ధర నిర్ణయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ న్యాయవాది సీహెచ్.వెంకటరామన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం శాఖల భిన్నాభిప్రాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో ఏకస్వరం, ఏకాభిప్రాయం అవసరమని పేర్కొంది. ఎంఎస్పీ కోసం అనుసరిస్తున్న విధానంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. -
ఉల్లి పతనంతో రైతుకు కన్నీళ్లు
గత మూడేళ్లుగా తాము పండిస్తున్న పంటలకు ధరలు పడిపోవడంతో ఆగ్రహావేశాలకు గురైన రైతులు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమేటోలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బఠానీ వంటి కూరగాయలును వీధుల్లో పారేయడం నిత్యం వార్తలకు ఎక్కుతూనే ఉంది. కానీ అమెరికాలో అధిక ఉత్పత్తితో వ్యవసాయ ధరలు పతనమైనప్పడు అమెరికా వ్యవసాయ విభాగం రైతులనుంచి నేరుగా ఉత్పత్తులను కొంటూ సమస్యను పరిష్కరిస్తున్న పద్ధతిని భారత్లో ఎందుకు అమలు చేయరు? వినియోగదారుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే వ్యవస్థ నుంచి రైతుకు ప్రాధాన్యమిచ్చే తరహా వ్యవస్థకు భారత్ చోటు కల్పించాలి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మద్నగర్లో ఉన్న సంగమ్నెర్కి చెందిన యువరైతు శ్రేయస్ అభాలే. ఇతడి వయస్సు 21 సంవత్సరాలు. 53.14 క్వింటాళ్ల ఉల్లిపాయలు అమ్మిన తర్వాత తాను సంపాదించిన మొత్తం కేవలం రూ. 6 (ఆరు రూపాయలు) మాత్రమే అని తెలుసుకుని ఒక్కసారిగా నివ్వెరపోయాడు. తీవ్రమైన నిరాశా నిస్పృహలతో అతడు తను సంపాదించిన ఆ ఆరు రూపాయలను చెక్కురూపంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవీందర్ ఫడణవీస్కు పంపాడు. కొద్ది రోజుల తర్వాత మహారాష్ట్రలోని యోలా తాలూకాలో ఉన్న అండర్సుల్ ప్రాంతానికి చెందిన చంద్రకాంత్ బైకన్ దేశ్ముఖ్ అనే మరొక రైతు తాను పండించిన ఉల్లి పంటకు కిలోకి 51 పైసలు మాత్రమే ధర పలకడంతో హతాశుడయ్యాడు. దారుణంగా పడిపోయిన ఉల్లిపాయల ధరకు నిరసనగా అతడు 216 రూపాయలను మహారాష్ట్ర ముఖ్యమంత్రికి మనీఆర్డర్ రూపంలో పంపాడు. మండీ చార్జీలు, రవాణా ఖర్చులు మినహాయిస్తే ఈ సీజన్లో తాను పండించిన ఉల్లిపాయలకు వచ్చిన రాబడి అంతే మరి. ఎంవో వద్దట.. ఆన్లైన్లో పంపాలట..! మహారాష్ట్రలోని నాసిక్ రైతు సంజయ్ సాఠేను వీరిద్దరూ ఆదర్శంగా తీసుకున్నట్లుంది. సాఠే కూడా ప్రధాని విపత్తు సహాయ నిధికి రూ. 1,066ల మనీఆర్డర్ను పంపి వార్తలకెక్కాడు. 750 కిలోల ఉల్లిపంటను అమ్మగా, ఖర్చులన్నీ మినహాయించుకున్న తర్వాత సాఠేకి దక్కిన రాబడి ఇదే. ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు ఆ మనీఆర్డర్ను స్వీకరించకుండా, మళ్లీ తనకే వెనక్కు పంపడంతోపాటు ఆ సొమ్మును ఆన్లైన్లో పంపమని ఉచిత సలహా ఇవ్వడం చూసి సాఠే విస్తుపోయాడు. ఉల్లి ధర దారుణంగా పడిపోవడంతో, పంటపొలాల్లో నిజంగా రక్తస్నానం చోటు చేసుకుంది. దేశంలోనే ఉల్లిపాయలకు అతిపెద్ద వ్యాపార కేంద్రమైన లసల్గావ్ మండీలో ఉల్లి ధర క్వింటాలు (వంద కేజీలు)కు రూ. 100 నుంచి రూ. 300 వరకు పడిపోయింది. సగటున ఉల్లిరైతులు ఉల్లిసాగుకు అయిన ఖర్చుల్లో 15 శాతానికి మించి రాబడి పొందలేకపోయారు. ఈ ఉత్పాతం కలిగించిన ప్రకంపనలను తట్టుకోలేక నాసిక్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు. మధ్యప్రదేశ్లోని నీముచ్ మండీలో, ఉల్లి ధరలు కిలో 50 పైసలకు పడిపోయాయి. ఇలాంటి అనేక ఘటనల్లో, విసిగిపోయిన రైతులు తమ పంటను వీధుల్లో పారవేశారు. కొంతమంది రైతులు ఉల్లి పంటను రహదారుల పైన కుమ్మరించి ఆ దారెంట వెళుతున్న జనాలకు ఉచితంగా పంచిపెట్టారు. చివరకు వెల్లుల్లి పంటకు కూడా ఇదే గతి పట్టింది. గత సంవత్సరం రాజస్థాన్లోని హడోటి (కోటా, బుండి, బరన్, ఝళవర్ అనే నాలుగు జిల్లాలు) రీజియన్లోని రైతులు ధర బాగా పలుకుతోందని వెల్లుల్లి పంట సాగుకు మళ్లారు. ఈ సంవత్సరం మార్చి నెలలో పంట చేతికొచ్చింది. కానీ మార్కెట్లో ధర కిలోకు 1 రూపాయి మేరకు పడిపోయింది. మండీకి రవాణా చేయడం కూడా సాధ్యం కాని దుస్థితి ఏర్పడింది. వెల్లుల్లిధరలు అనూహ్యంగా పడిపోవడంతో ఈ ప్రాంతంలో అయిదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలొచ్చాయి. ఉల్లి, వెల్లుల్లి సాగుదారుల దుస్థితి అసాధారణమైన విషయం కాదు. కొన్ని నెలల క్రితం నాసిక్ మార్కెట్లో టొమేటో టోకు ధరలు 65 శాతం పతనమైనప్పుడు చాలామంది రైతులు తాము పండించిన టొమేటో పంటను రోడ్లమీదే కుప్పపోశారు. ఇలా ధరలు కుప్పకూలే ధోరణి మన దేశానికి కొత్తేమీ కాదు. గత మూడేళ్లుగా తాము పండిస్తున్న పంటలకు ధరలు పడిపోవడంతో ఆగ్రహావేశాలకు గురైన రైతులు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టొమేటోలు, క్యాబేజీ, కాలిఫ్లవర్, బఠానీ వంటి కూరగాయలను వీధుల్లో పారేయడం నిత్యం వార్తలకు ఎక్కుతూనే ఉంది. నిజానికి గతంలో ఒక రైతు తాను పండించిన దానిమ్మకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్డుమీద కూర్చుని దానిమ్మ పళ్లను ఒకదాని తర్వాత ఒకటిగా పగులగొడుతూ తన నిస్పృహను వ్యక్తపరుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పంట చేతికి వచ్చాక మార్కెట్లో ధరలు కుప్పగూలిపోవడం అనేది వేలాది వ్యవసాయదారుల జీవితాలను ఎలా దెబ్బ తీస్తోందో తెలుసుకోవడానికి ఇలాంటి ఉదాహరణలు నిత్యం సమాజం అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి. కనీస మద్దతు ధరను వెక్కిరిస్తున్న వ్యవసాయ ధరల పతనం నవంబర్ నెలలోనే కనీస మద్దతు ధరకంటే కనిష్ట స్థాయికి బహిరంగ మార్కెట్లో ధరలు పతనమైపోయినప్పుడు మన దేశ రైతులు ఇంతకు మించి ఏం చేయగలరని ఆశించాలి? రైతులు పండించే పంటల ధరలు మొత్తంగా 15 నుంచి 25 శాతం వరకు పడిపోవడం ప్రస్తుతం సాధారణ కృత్యమైపోయింది. చివరకు వరిధాన్యం విషయంలో కూడా కనీస మద్దతు ధర కింద అదనపు వరి ధాన్యాన్ని సేకరించడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్న దశలోనూ వరి ధర 20 శాతం మేరకు పడిపోయింది. ప్రతి సంవత్సరం 23 వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్న నేపథ్యంలో వీటిలో 21 పంటల ఉత్పత్తి అనూహ్య స్థాయిలో మిగులు రూపంలో పోగుపడటం ఫలితంగానే ధరలు కుప్పకూలుతున్నాయని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఒక సంవత్సరం ఏదైనా పంటకు అధిక ధర లభించడం, వాతావరణం అనుకూలించడం పట్ల ఆకర్షితులైన రైతులు ఆ మరుసటి సీజ నులో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. కానీ వారి ఆ ఉత్సాహం, చొరవ తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కుప్పకూలి పోతూ రైతులను సంక్షోభంలో ముంచెత్తుతున్నాయి. మన ఎగుమతులకు సుస్థిర మార్కెట్ను కల్పించడంలో వైఫల్యానికి కారణంగా దేశీయ ఎగుమతి, దిగుమతి పాలసీని తప్పుపట్టడం సహజమే. అదే సమయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ప్రవేశపెడతామని ప్రభుత్వం చేస్తున్న వాగ్దానం రైతులను నష్టాల బారినుంచి గట్టెక్కించడంలో విఫలమయింది. వాస్తవానికి ఆపరేషన్ ఫ్లడ్ విధానాలకు అనుగుణంగా ఆపరేషన్ గ్రీన్ని ప్రారంభించినప్పుడు టొమేటో, ఉల్లి, బంగాళాదుంప అనే మూడు కీలక పంటల విషయంలో మార్కెట్ జోక్యానికి వీలుకల్పించాలని నిర్ణయించారు. ధరలు పెరిగే అవకాశముందనేది వార్తల రూపంలో ఉన్నప్పుడే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. కానీ పాలు వంటి అతిత్వరగా పాడైపోయే ఉత్పత్తి కోసం సమర్థవంతంగా సహకార వ్యవస్థను దేశంలో ఏర్పర్చుకోగలిగినప్పుడు, ఇదే వ్యూహాన్ని ఇతర కీలక వ్యవసాయోత్పత్తుల విషయంలో ఎందుకు అమలు చేయలేరన్నది ప్రశ్న. అమెరికాలో, ధరల పతనం నుంచి రైతులను కాపాడటంలో ప్రైవేట్ మార్కెట్లు విఫలమైనప్పుడు అమెరికా వ్యవసాయ విభాగం (యుఎస్డిఎ) రైతుల వద్ద ఉన్న మిగులుపంటకు ధర కల్పించే విషయమై పదే పదే చర్యలు తీసుకుంటుంది. 2016లో మార్కెట్ధరలు పతనమైనప్పుడు అమెరికా రైతులనుంచి 20 మిలియన్ డాలర్ల విలువైన కోటి పది లక్షల టన్నుల చీజ్ని (జున్నుగడ్డలాంటిది) యుఎస్డిఎ సేకరించింది. ఆ సందర్భంగా అమెరికా వ్యవసాయ కార్యదర్శి టామ్ విల్శాక్ మాట్లాడుతూ ‘‘వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు అనేది సమగ్రమైన భద్రతా నెట్వర్క్లో భాగమని, 30 ఏళ్ల కాలంలో కనివీనీ ఎరుగని రీతిలో ఉత్పత్తయిన చీజ్ మిగులును తగ్గించడానికి, సమాజంలో అత్యవసరమైన వారికి ఈ అత్యధిక ప్రొటీన్ విలువలున్న ఆహారాన్ని అందించడానికి ఈ నెట్వర్క్ తోడ్పడుతుంద’’ని చెప్పారు. రైతు కేంద్రక భద్రతా వ్యవస్థ అవశ్యం అంతకుముందు కూడా, యుఎస్డిఎ కోటి పౌండ్ల స్టాబెర్రీలను కొనుగోలు చేసి వాటిని పాఠశాలలకు, సమాజంలో అవసరమైన వారికి పంపిణీ చేసింది. అధిక మిగులుతో సతమతమవుతున్న టొమేటో రైతులనుంచి 2011లో తాజా టొమేటాలను 6 మిలియన్ డాలర్ల విలువైన టొమేటాలను కొనుగోలు చేసింది. ఇదేవిధంగా భారత ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ అదనంగా ఉత్పత్తయిన టొమేటో, ఉల్లి, బంగాళాదుంపలను ఎందుకు కొనలేదు అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాగే త్వరగా పాడైపోయే అదనపు ఆహార పదార్థాలను ఆహార భద్రత వలయంలో లేని వారికి మనం ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నట్లు? ఈ దేశంలో ప్రతి రాత్రీ 2 కోట్లమంది ప్రజలు పస్తులతో నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే అదనపు టొమేటాలను వీధుల్లో పారవేస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగని, అమెరికా ప్రతి సందర్భంలోనూ ఈ వ్యవసాయ ధరల పతనాన్ని పరిష్కరిస్తూ వచ్చిందని చెప్పలేం. 2002లోనే అమెరికా ప్రైజ్–లాస్ కవరేజ్ సిస్టమ్ పేరిట రైతులకు మద్దతు ప్రకటించేందుకు యుఎస్ ఫార్మ్ బిల్ తోడ్పడింది. 2014లో కూడా వేరుశనగ ఉత్పత్తిదారులు ధరల పతనం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ఈవిధమైన ఇన్కమ్ సపోర్టు వ్యవస్థ సంబంధిత రైతులను ఎంతగానో ఆదుకుంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరిగిపోయినప్పుడు వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకునే భారతీయ మార్కెట్ ఇంటర్వెన్షన్ సిస్టమ్లా కాకుండా, అమెరికాలో రైతులకు భద్రతా నెట్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తుండటం గమనార్హం. దేవిందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
‘రైతుల శాపం’ ఫలిస్తుందా?!
సాక్షి, న్యూఢిల్లీ : మనకు అన్నం పెడుతున్న రైతును మరచిపోతున్నాం. పస్తులుంటున్నా పట్టించుకోవడం లేదు. మన సంగీతంలో మన సాహిత్యంలో, మన సంస్కృతిలో, మన సంప్రదాయాల్లో, మమేకమై మన జీవన విధానంలో కలిసిపోయిన రైతును ఒకప్పుడు భుజానికి ఎత్తుకున్నాం. అతని గురించి కథలు, కథలుగా చెప్పుకున్నాం. కవితలు, కవితలుగా రాసుకున్నాం. అతని కష్టాల గురించి తెలిసి కన్నీళ్లు కార్చాం. అతని వెంట కలిసి నడిచాం. జమిందారి వ్యవస్థలో నలిగిపోతున్న రైతు తరఫున తుపాకీ పట్టి పోరాడాం. ఆ రైతు కోసం ప్రాణాలు కూడా అర్పించాం. జై జవాన్, జై కిసాన్ అని పాడుకున్నాం. ఆయన లేకుండా పాట లేదు. ఆయన లేకుండా పాడి లేదు, పొలమూ లేదు. ఓ కాల్వ లేదు. ఓ చెరువు లేదు. మొత్తానికి పల్లే లేదు. 20వ శతాబ్దం ఆరంభంలోనే ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో, పలు దేశాల్లో రైతు కోసం భూ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. రష్యా విప్లవం రైతు ప్రపంచానికే కొత్త ఊపరి పోసింది. అది భారత దేశ హిందీ, ఉర్దూ రచయితలను కదిలించింది. ప్రముఖ హిందీ రచయిత మున్షీ ప్రేమ్చంద్ రాసిన ‘సద్గతి (మోక్షం), పూస్ కీ రాత్ (శీతల రాత్రి), దో బైలోన్ కీ కథ (రెండు ఎద్దుల కథ), సవ్వా సేర్ గెహూన్ (సవ్వసేరు గోధుమలు), కఫన్ (శవంపై కప్పే వస్త్రం)’ కథల్లో భూస్వాములు ఆగడాలు, పాలకుల నిర్లక్ష్యం, రైతుల అగచాట్లు కనిపిస్తాయి. బ్రిటీష్ ఇండియాలో ముహమ్మద్ ఇక్బాల్ కవి రాసిన ‘పంజాబ్ కే దెహఖాన్ కే నామ్ (పంజాబ్ రైతుల కోసం) కవిత్వంలో’, ప్రముఖ పాకిస్థాన్ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘ఇంతెసాబ్ (అంకితం)’ లో, ప్రముఖ హిందీ పాటల రచయిత సాహిర్ లుధియాన్వీ రాసిన ‘ముజే సోచ్నే దో (నన్ను ఆలోచించనివ్వండి)’పాటలో, మరో హిందీ రచయిత ఖైఫీ ఆజ్మీ రాసిన ‘కిసాన్ (రైతు)’కథలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఉర్దూ కవి మఖ్దూం మొయినుద్దీన్, జాహిర్ కశ్మీరీ రాసిన కవితల్లో రైతే కనిపిస్తాడు. ‘మజ్దూర్, ఉప్కార్, భరత్, మదర్ ఇండియా’ లాంటి హిందీ చిత్రాల్లో రైతుల జీవితాలనే ఆవిష్కరించారు. భారత్ ప్రధానంగా వ్యవసాయ దేశమవడం వల్ల పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూ సంస్కరణలు తీసుకొచ్చింది. అప్పుడే అభ్యుదయ రచయితల సంఘం ‘దెహఖాన్ (రైతు), మజ్దూర్ (కార్మికుడు)’ పుస్తకాల్లో రైతుల జీవన స్థితిగతులనే వర్ణించాయి. ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య నేపథ్యంలో రుణాల భారం ఎక్కువై గిట్టుబాటు ధరల్లేక అలమటిస్తున్న నేటి రైతును పాలకులు పూర్తిగా విస్మరించారు. గత మూడేళ్లుగా దేశం నలుమూలల నుంచి లక్షకు పైగా రైతులు ఇటు ఢిల్లీకి, అటు ముంబైకి పలుసార్లు పాదయాత్రలు చేసిన వారికి శుష్క వాగ్దానాలే మిగిలాయి. మొన్న ఢిల్లీని ముట్టడించి కూడా నిరాశ నిస్పృహలకు గురైన రైతులు, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షాలు ఓడిపోవాలని శాపనార్థాలు పెట్టారు. వారికి ఎక్కడా ఓట్లేసేది లేదంటూ ఒట్లు కూడా పెట్టుకున్నారు. ‘అన్నదాత సుఖీభవ!’ అనే పాలకుల కోసం వారు నిరీక్షిస్తున్నారు. -
తెల్ల బంగారమే!
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది పత్తికి ఆశాజనకమైన మద్దతు ధర లభిస్తుందని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.5,450గా ఉందని..మార్కెట్లో వ్యాపారులు వంద రూపాయలు ఎక్కువగా ఇచ్చి.. రూ.5,550కి మించి కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన అవసరం రైతులకు పెద్దగా ఉండకపోవచ్చన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దిగుబడులు తగ్గుతుండటంతోనే.. పత్తికి డిమాండ్ పెరిగిందని.. అందుకే మంచి ధర వస్తుందని వెల్లడించారు. ‘ఈసారి పత్తికి కనీస మద్దతు ధరకన్నా ఎక్కువగా.. మంచి ధర వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల దళారులు మాయమాటలు చెప్పినా.. రైతులు పత్తిని ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. తేమ శాతం సరిగా చూసుకుని అమ్ముకుంటే ఎక్కడా నష్టాలు రావు’అని మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. ‘ఒకవేళ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసే సీసీఐ కొనుగోలు కేంద్రాలకు రండి’అని రైతులకు హరీశ్ పేర్కొన్నారు. గతేడాది ఎమ్మెస్పీ రూ. 4,320 ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దీన్ని రూ.5,450 పెంచడంతో రైతులకు మేలు జరుగుతుందని మార్కెటింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే లక్ష క్వింటాళ్లు.. ఈ ఏడాది తెలంగాణలో 35.92 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి ఉంటుందని ప్రభుత్వం అంచనావేసింది. అయితే తాజా పరిస్థితుల ప్రకారం అంతకన్నా తక్కువ దిగుబడి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 30 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆశించకూడదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి జాతీయంగా, అంతర్జాతీయంగా నెలకొందని వారు వెల్లడించారు. దిగుబడి తగ్గనున్నందునే.. మంచి ధర వస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పత్తి తీతలు మొదలయ్యాయి. ముందస్తుగా పంటలు వేసినచోట్ల మొదటి తీత పూర్తయిన రైతులు పత్తిని మార్కెట్కు తరలిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష క్వింటాళ్ల వరకు పత్తి మార్కెట్కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా గతేడాది 241 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి 342 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో జిన్నింగ్ మిల్లుల ద్వారా 275, మార్కెటింగ్శాఖ ద్వారా 67 సీసీఐ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటి వరకు 7 కేంద్రాలను ప్రారంభించారు. -
అసలు సమస్య అసమర్థ మార్కెట్లే!
రెండు దశాబ్దాలుగా ఇండియాలో వ్యవసాయోత్పత్తుల ధరలు మారకుండా స్తంభించిపోయాయని ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘం సర్వే వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉండేలా చేయడానికి ఇన్నేళ్లుగా రైతులకు ఉద్దేశపూర్వకంగానే 15 శాతం తక్కువగా ధరలు చెల్లిస్తున్నారు. అయితే, అంతే స్థాయిలో వారికి మేలు చేయడానికి అవసరమైన సొమ్ము నేరుగా చెల్లించే పద్ధతి అమల్లో లేకపోవడంతో భారత రైతులు కష్టాల కొలిమిలో చిక్కుకుపోతున్నారు. ఓ పక్క ఉత్పత్తి ఖర్చులు పెరగడం, వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం, ధరల్లో విపరీత మార్పులు రావడంతో అసమర్థ వ్యవసాయ మార్కెట్లకు భారత రైతు బలి అవుతున్నాడు. దాదాపు 40 ఏళ్లుగా భారత రైతులు టమాటాలు పండిస్తూ పొందుతున్న సగటు ధర మారలేదు. 1978లో లభించిన ధరకూ 2018 ధరకూ పెద్దగా తేడా లేదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇంకా టమాటా ధర స్పల్పంగా తగ్గినట్టే. పంట ఖర్చులు కూడా రాకపోవడంతో గత రెండేళ్లలో ఆగ్రహించిన రైతులు పండించిన టమాటాలను వీధుల్లో పారబోయడం మనం చూస్తున్నదే. 1980ల ఆరంభంలో సైతం రైతులు టమాటాలను పశువులకు దాణాగా పెట్టడం లేదా రోడ్లపై వదిలి రావడం నాకింకా గుర్తుంది. సరుకు రవాణా, వ్యాపారులు బహిరంగంగా పాల్గొనడంపై ఆంక్షలు ఉండటంతో దేశంలో నిజమైన జాతీయ మార్కెట్ లేదు. దీంతో వ్యవసాయోత్పత్తులకు దేశంలో సమర్థంగా పనిచేసే మార్కెట్ ఇంకా అవతరించలేదనే చెప్ప వచ్చు. కేవలం ఆరు శాతం రైతులకు కనీస మద్దతు లభిస్తుండగా, మిగి లిన 94 శాతం కర్షకులు మార్కెట్లపైనే ఆధారపడుతున్నారు. తక్కువ ధరలకే వ్యవసాయోత్పత్తులు దొరకడం మార్కెట్ సామర్థ్యానికి ప్రతి బింబం కాదు. ఈ విషయంలో మరింత అవగాహన కోసం అమెరికాలో ఈ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అమెరికా మార్కెట్ ధరల విష యంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా వ్యవసాయోత్పత్తుల మార్కెట్లలో పోటీతత్వం ఎక్కువ. ఇక్కడ పెద్ద వ్యాపారులు, సంస్థలు సునాయాసంగా పనిచే యడం సర్వసాధారణం. భవిష్యత్తులో క్రయవిక్రయాలకు సంబంధించి ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ధరలు రైతులకు అనుకూలంగా ఉంటాయి. అమెరికా రైతు మైక్ కాలిక్రాట్ తన బ్లాగ్లో వ్యాసం రాస్తూ, ‘‘44 ఏళ్ల క్రితం నా తండ్రి 1974 డిసెంబర్ 2న ఒక బుషల్ (25.4 కిలోలు) మొక్కజొన్నను 3.58 డాలర్లకు అమ్మాడు. 2018 జనవరిలో నేను రెండు సెంట్లు తగ్గించి 3.56 డాలర్లకు విక్రయించాను’’ అని వివరించాడు. కెనడాలోని అంటారియో ప్రావిన్స్కు చెందిన రైతు ఫిలిప్ షా ఈ ఏడాది జనవరి ధరతో పోల్చితే మరో నాలుగు సెంట్లు తగ్గించి 2018 సెప్టెంబర్ 12న మొక్కజొన్నను 3.52 డాలర్లకు అమ్మానని ఓ ట్వీట్లో వెల్లడించారు. ‘‘1974లో మొక్కజొన్న పంట ప్రారంభించిన రైతు ఎవరైనా తాను రిటైరయ్యే సమయానికి కూడా పాత ధరకే అమ్ముకోక తప్పదు’’ అని మైక్ తన బ్లాగ్లో అభిప్రాయపడ్డాడు. ఈ మార్కెట్లు అంత సమర్థంగా పనిచేసేవైతే, వ్యవసాయోత్పత్తుల ధరలు ఇంత అడ్డగోలుగా చలనం లేకుండా ఉండకూడదు. మొక్కజొన్న పండించే రైతుకు దక్కాల్సిన ధర ఎంతో 44 ఏళ్లుగా ఈ మార్కెట్లు నిర్ణయించడంలో విఫలమయ్యాయని పైవివరాలు చెబుతున్నాయి. అంటే ఇవి సమర్థ మార్కెట్లు కాదనే చెప్పాలి. పై అమెరికా రైతు చెప్పి నట్టు, ఇదే సమయంలో విత్తనాలు, భూమి, పరికరాలు, ఎరువులు, ఇంధనం ధరలు బాగా పెరుగుతున్నాయిగానీ ఉత్పత్తుల ధరలు మాత్రం మారలేదు. ఇంతకన్నా బాధాకరమైన అంశం ఏముంటుంది. అమెరికాలోనూ 1960 నుంచీ వాస్తవ ధరలు తగ్గాయా? అమెరికా వ్యవసాయ శాఖ ప్రధాన ఆర్థికవేత్త రాబర్ట్ జొహాన్సన్ 2018 వ్యవసాయ ఆర్థిక, విదేశీ వాణిజ్య వేదిక సమావేశంలో ప్రసంగిస్తూ, ‘‘ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే వాస్తవ వ్యవసాయోత్పత్తుల ధరలు 1960 నుంచీ బాగా తగ్గిపోయాయి. అమెరికాలో ఇలాగే జరుగు తోంది. మీరు విన్నది నిజమే. రైతుకు న్యాయమైన ధర మార్కెట్లో చెల్లించలేకపోవడంతో ఏటా ప్రతి రైతుకూ అమెరికా ప్రభుత్వం సబ్సిడీ కింద 50 వేల డాలర్లు అందిస్తోంది,’’అని వివరించారు. రెండు దశాబ్దా లుగా ఇండియాలో వ్యవసాయోత్పత్తుల ధరలు మారకుండా స్తంభించి పోయాయని ఇటీవల ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘం(ఓఈసీడీ) సర్వే వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉండేలా చేయ డానికి ఇన్నేళ్లుగా రైతులకు ఉద్దేశపూర్వకంగానే 15 శాతం తక్కువగా ధరలు చెల్లిస్తున్నారు. అయితే, అంతే స్థాయిలో వారికి మేలు చేయడానికి అవసరమైన సొమ్ము నేరుగా చెల్లించే పద్ధతి అమల్లో లేకపోవడంతో భారత రైతులు కష్టాల కొలిమిలో చిక్కుకుపోతున్నారు. ఓ పక్క ఉత్పత్తి ఖర్చులు పెరగడం, వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గి పోవడం, ధరల్లో విపరీత మార్పులు రావడంతో సమర్థంగా పనిచేయని వ్యవసాయ మార్కెట్లకు భారత రైతు బలి అవుతున్నాడు. అయితే, అనవసర ఆంక్షలు తొలగించి వ్యవసాయ మార్కెట్లను మరింత సరళతరం చేయడం ద్వారానే రైతులకు సరైన ధరలు దక్కేలా చూడవచ్చనే భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. అప్పుడే వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు లభ్యమౌతాయనేది అందరికీ ఆమోదయోగ్యమైన అభిప్రాయం. అయితే, స్వేచ్ఛ విపణికి పేరుపొందిన అమెరికాలోని మార్కెట్లలో సైతం వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయే స్థాయిలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరగడం లేదు. ఈ విషయం ఎవరూ బహిరంగంగా అంగీకరిం చకపోవడం విశేషం. ఖరీఫ్ పంట కోతల కాలం మొదలైంది. ఫలితంగా మూంగ్ పెసలు, మినుములు, వేరుశనగలు, సజ్జలు, జొన్నల ధరలు ఇప్పటికే మార్కెట్లలో కనీస మద్దతు ధర కన్నా తక్కువ పలుకుతు న్నాయి. పెసల ధరల విషయమే తీసుకుందాం. క్వింటాలు పెసల కనీస మద్దతు ధర రూ. 6,975 కాగా, మధ్యప్రదేశ్లోని పప్పు ధాన్యాల మార్కె ట్లలో కిందటి వారం ధరలు కేవలం రూ.3,900–4,400 మధ్య ఊగిస లాడాయి. మహారాష్ట్రలో క్వింటాలు పెసలకు లభించే గరిష్ట ధర రూ. 4,900. ఇక మినుముల విషయానికి వస్తే, కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,600 ఉండగా, మహారాష్ట్ర వ్యవసాయోత్పత్తుల మండీల్లో రైతులకు లభించే ధర క్వింటాలుకు రూ. 3,900 నుంచి రూ. 4,200 మధ్యనే ఉంటోంది. పప్పు ధాన్యాల క్రయవిక్రయాల సీజన్ ఆరంభంలోనే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. మరి మార్కెట్కు ఈ పప్పుధాన్యాల రవాణా అత్యధిక స్థాయికి చేరుకున్నప్పుడు వీటి ధరలు ఎంతగా క్షీణించిపోతాయో ఊహించుకోవచ్చు. గడచిన రెండేళ్ల అనుభ వాలను బట్టి చూస్తే, దేశవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తుల మార్కెట్లలో పప్పు ధాన్యాల ధరలు 20 నుంచి 40 శాతం వరకూ పడిపోయాయి. ఈ లెక్కన ఈ సంవత్సరం పప్పుధాన్యాల ధరలు పెరుగుతాయని అంచనా వేయడం అత్యాశే అవుతుంది. అసలు సమస్య అసమర్థ మార్కెట్లే! రైతులను అప్పుల విష వలయం నుంచి కాపాడటంలో వ్యవసాయ మార్కెట్లు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (ప్రధానమంత్రి రైతుల ఆదాయ పరిరక్షణ పథకం–పీఎం ఆశా) ప్రారంభించడం అంటే రైతులకు అవస రాలు తీర్చేస్థాయిలో కనీస ఆదాయం సమకూర్చాలన్న వాస్తవాన్ని గుర్తించనట్టు లెక్క. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి, ఇతర రంగాలకు ఆదాయంలో ఉన్న వ్యత్యాసాలను తగ్గించడానికి కీలక చర్యగా ఈ పథకాన్ని పరిగణించవచ్చు. రైతులకు తగినంత ఆదాయం వచ్చేలా చూడటం నేటి తక్షణావసరంగా ప్రభుత్వం గుర్తించింది. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం–ఆశా) పథకంలో భాగంగా వాస్తవానికి ప్రభుత్వం మూడు పథకాలను అమలు చేస్తుంది. ప్రస్తుత వ్యవసాయ కనీస మద్దతు ధరల పథకాన్ని కొనసా గిస్తుంది. అలాగే, మధ్యప్రదేశ్ ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసిన వ్యవసాయోత్పత్తుల ధరల లోటు చెల్లింపుల పథకాన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు. మూడో పథకం కింద వ్యవసాయో త్పత్తుల సేకరణ రంగంలోకి ప్రైవేటు వ్యాపారులను, సంస్థలను ప్రయో గాత్మకంగా అనుమతిస్తారు. ఇది నూనె గింజల రంగంతో మొదలవు తుంది. ఈ పథకం అమలును అత్యంత క్షుణ్ణంగా పరిశీలించి, అంచనా వేయాల్సి ఉంటుంది. రైతుల సమస్యలను ప్రభుత్వాలు అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలే పరిష్కరించి, వారిని ఒడ్డున పడేయలేవని గత అనుభవాలే చెబుతున్నాయి. వ్యవసాయోత్పత్తులకు ప్రభుత్వం అధిక కనీస మద్దతు ధర ప్రకటించినా (ఇది రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నదాని కన్నా తక్కువగా ఉన్నాగాని) మార్కెట్లో అమ్ముకునే వీలున్న మొత్తం సరుకులో 25 శాతం కొనుగోలు చేస్తామన్న సర్కారీ వాగ్దానం అమలు చేయడం అంత తేలిక కాదు. తగినన్ని పంటల మార్కెట్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలిగినప్పుడే ఇది సాధ్యమౌతుంది. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక్కటి చొప్పున 42,000 వ్యవసాయోత్ప త్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) మండీల(మార్కెట్లు) అవసరం ఉండగా, భారతదేశంలో కేవలం 7,600 మండీలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏపీఎంసీల నిర్వహణలోని మార్కెట్లను విపరీతంగా విస్తరించాల్సిన అవసరం ఓ పక్క ఉండగా, పంట ఉత్పత్తుల ధరలకు మద్దతు ఇవ్వ డానికి తగినంత ఆర్థిక ఏర్పాట్లు అత్యంత కీలకం. కనీస మద్దతు ధరల కోసం వచ్చే రెండు సంవత్సరాల కోసం కేంద్ర బడ్జెట్లో కేటాయించిన రూ. 15,053 కోట్లు ఏమాత్రం చాలదు. 2008లో సంక్షోభంలో చిక్కు కున్న భారత కార్పొరేట్ రంగాన్ని కాపాడటానికి రూ.1,86,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కల్పించారు. దీన్నింకా ఉపసంహరించలేదు. అలాంటప్పుడు, వ్యవసాయోత్పత్తుల సేకరణకు తగినంత మద్దతు ధరలతో అలాంటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో అర్థంకావడం లేదు. దేవిందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
‘రైతు మద్దతు’ యూపీఏ కంటే తక్కువే
ముంబై: ఖరీఫ్ పంటలకు కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో తొలిసారిగా 2018లో అత్యధికంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను ప్రకటించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే ఈ మొత్తం యూపీఏ ప్రభుత్వ హయాంలో 2008–09, 2012–13 ఆర్థిక సంవత్సరాల్లో ప్రకటించిన దానికంటే తక్కువేనని వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన ద్రవ్య విధాన నివేదిక(ఎంపీఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు పేర్కొంది. రైతుల పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018–19 ఆర్థిక సంవత్సరానికి గానూ క్వింటాల్ వరిపై రూ.200, గోధుమపై రూ.105, మసూర్పై రూ.225 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, మద్దతుధర పెంపు కారణంగా ద్రవ్యోల్బణం 0.29 నుంచి 0.35 శాతం పెరిగే అవకాశముందని ఆర్బీఐ నివేదికలో తెలిపింది. బ్యారెల్ ముడిచమురు విలువ ఇప్పుడు ఒక్క డాలర్ పెరిగినా, భారత కరెంట్ అకౌంట్ లోటు(సీఏడీ) రూ.5,901 కోట్ల మేర పెరుగుతుందని వెల్లడించింది. -
రబీ పంటలకు మద్దతు ధర పెరిగింది
న్యూఢిల్లీ : కిసాన్ క్రాంతి మార్చ్ అనంతరం నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు ప్రకటించింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచే ప్రతిపాదనను నేడు కేబినెట్ ఆమోదించింది. దీంతో గోధుమల మద్దతు ధర క్వింటాకు 105 రూపాయలు పెరిగి, ప్రస్తుతం క్వింటా 1,840 రూపాయలుగా ఉంది. గోధుమతో పాటు మరో ఐదు రకాల పంటలకు కూడా కనీస మద్దతు ధర పెరిగింది. కాగా జూలై నెలలోనే 14 రకాల ఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ.. రైతులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా రబీ పంటలకు కూడా కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో 20 శాతం లోటు వర్షపాతం, నీటి నిల్వలు పడిపోవడంతో, ఈ సీజన్లో రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందేనని కేంద్రం నిర్ణయించి, ఈ ప్రకటన చేసినట్టు తెలిసింది. అంతేకాక మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండటంతో, రైతులను ఆకర్షించేందుకు మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాజస్తాన్, మధ్యప్రదేశ్లు అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో కిసాన్ క్రాంతి ర్యాలీ. వీటన్నింటికీ తలొగ్గి కేంద్రం రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచిందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. -
అమ్ముకోలేక అప్పులపాలు!
సాక్షి, హైదరాబాద్ : రైతుల నుంచి మద్దతు ధరకు మార్క్ఫెడ్ సేక రించిన లక్షలాది మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. కొనుగోలు చేసి వెంటనే విక్రయించకపోవడంతో రూ. 2 వేల కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు పాడైపోతున్నాయి. పైగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు చేసిన అప్పులు, దానిపై వడ్డీ, గోదాముల అద్దె, నిర్వహణ భారం.. అంతా కలసి సర్కారుకు భారీగా నష్టం వాటిల్లే పరిస్థితి తలెత్తింది. గత ఖరీఫ్, రబీ సీజన్లలో కొనుగోలు చేసిన మొక్కజొన్న, కంది, ఎర్రజొన్న, మినుములన్నీ గోదాముల్లో మూలుగుతున్నాయని.. అన్నీ కలిపి దాదాపు రూ. 2 వేల కోట్ల విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కల్వకుర్తి, జడ్చర్ల, పెద్దేరు, వనపర్తి.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా గోదాముల్లో ఉంచిన మొక్కజొన్నకు పురుగు పడుతోందంటున్నారు. దీంతో గోదాముల సమీపంలో నివసించే ప్రజలు పురుగులతో సతమతమవుతున్నారు. కల్వకుర్తి వంటి చోట్ల ప్రజలు ధర్నాలకు దిగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఎర్రజొన్నకు మార్కెట్లో గణనీయంగా ధర పడిపోయింది. మార్క్ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. కొనుగోలు చేసిన నెల రోజుల్లో విక్రయించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొక్కజొన్న 4.41 లక్షల టన్నులు గత ఖరీఫ్, రబీల్లో పండించిన మొక్కజొన్నను రైతుల నుంచి మద్దతు ధరకు మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 4.41 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించిన ప్రభుత్వం.. ఆ మేరకు రైతులకు రూ. 629 కోట్లు చెల్లించింది. ఆ మొత్తాన్ని గోదాముల్లో ఉంచింది. ఖరీఫ్ మొక్కజొన్న విక్రయాలు ప్రారంభించింది. అయితే ఖరీఫ్, రబీ మొక్కజొన్న రెండూ ఒకేచోట ఉండటం.. ఇప్పటికే నెలలు గడుస్తుండటంతో అనేక చోట్ల పురుగు పడుతోందని, ఆ పురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో వాటి తాకిడి చుట్టుపక్కల వారు తట్టుకోలేకపోతున్నారని మార్క్ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఖరీఫ్ మొక్కజొన్నే పూర్తిగా విక్రయించలేదని, రబీ జొన్నను ఇప్పటికిప్పుడు వదిలించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. ఇదే జరిగితే మార్క్ఫెడ్కు రూ. కోట్లలో నష్టం మిగలనుంది. అంతేకాదు గోదాముల్లో ఉంచడం వల్ల అద్దె భారం, నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడంతో ఆ భారం కలసి తడిసి మోపెడవనుంది. గత ఖరీఫ్, రబీ సీజన్ల మొక్కజొన్న ఉండగానే మరోవైపు ప్రస్తుత ఖరీఫ్ కొనుగోలుకు మార్క్ఫెడ్ సన్నద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఎర్రజొన్నలు కొనే దిక్కులేదు గత ఫిబ్రవరిలో మార్కెట్లో క్వింటా ఎర్రజొన్న ధర రూ. 1,800 వరకే పలికింది. దీంతో రైతులు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం వాటిని రూ. 2,300 చొప్పున 51,749 టన్నులు కొనుగోలు చేసింది. అందుకోసం రైతులకు మార్క్ఫెడ్ రూ. 119 కోట్లు చెల్లించింది. ఆ ఎర్రజొన్నలను ఆయా జిల్లాల్లోని గోదాముల్లో నిలువ చేశారు. కానీ తిరిగి విక్రయించడంలో అధికారులు ఆలస్యం చేశారు. దీంతో ఎర్రజొన్నలూ పురుగులు పట్టే స్థితికి చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కనీసం క్వింటా రూ. 1,000కి కూడా కొనే వారు లేకుండా పోయారు. అవి అమ్ముడవకపోతే మార్క్ఫెడ్కు రూ. 119 కోట్లు నష్టం వాటిల్లనుంది. మినుములు, శనగలు కూడా.. ఇవిగాక 1.86 లక్షల టన్నుల కందులు గోదాముల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కందిని క్వింటా రూ. 5,450 మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆ మేరకు రైతులకు రూ. 646 కోట్లు చెల్లించారు. విక్రయించడంలో అధికారులు ఆలస్యం చేసి చివరకు పాడయ్యే పరిస్థితికి వచ్చాక కొంత కమీషన్ తీసుకొని వదిలించుకుంటున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు 2 వేల మెట్రిక్ టన్నుల మినుములు, 17 వేల మెట్రిక్ టన్నుల శనగలు, 3,500 మెట్రిక్ టన్నుల జొన్నలూ గోదాముల్లో ఉన్నాయి. వీటన్నింటినీ ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల పట్టుకుంటున్నారు. రూ. 2 వేల కోట్లు రుణాలు తెచ్చి రైతులకు మద్దతు ధరకు కొనుగోలు చేసిన మార్క్ఫెడ్, వాటిని విక్రయించకుంటే తీవ్ర నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. -
కేవలం 14 పంటలపై ధర పెంచటం దారుణం
-
‘కనీస మద్దతు ధర’లో అసలు కిటుకు తెలుసా!
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీఫ్ సీజన్కుగాను 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం నాడు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఇది చరిత్రాత్మక నిర్ణయమని, ఇది ప్రస్తుత విధాన స్వరూపానే మార్చి వేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో గొప్పగా చెప్పింది. పైగా రైతులకు పంటకయ్యే ఖర్చుకు 50 శాతాన్ని మించే కనీస మద్దతు ధర ఇస్తామంటూ ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీని అక్షరాల అమలు చేస్తున్నామని డాబుసరిగా చెప్పుకుంది. 2020 సంవత్సరం నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదే పదే చేసిన ప్రతిజ్ఞను అమలు చేసే దిశగా ఈ అడుగు వేస్తున్నామని కూడా సగౌరవంగా ప్రకటించుకుంది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం రైతులకు కావాల్సినంత పెంచిందా, లేదా? రైతులు ఎంత డిమాండ్ చేస్తూ వచ్చారు? ప్రభుత్వం ఎంత పెంచింది? అసలు కనీస మద్దతు ధరను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రాథమిక ప్రమాణాలు ఏమిటీ? గత ప్రభుత్వాల కన్నా నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఎక్కువ పెంచిందా? ఈ పెంపుతో రైతుల కష్టాలు తీరుతాయా? అన్ని కోణాల నుంచి ప్రభుత్వ మద్దతు ధరలను పరిశీలించి చూస్తేగానీ సంగతంతా బోధ పడదు. ఓ పంటకయ్యే మొత్తం ఖర్చును పరిగణలోకి తీసుకొని దానికన్నా ఎక్కువ ధర వచ్చేలా ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. కనీసం ఆ మద్దతు ధరకన్నా మార్కెట్ ఆ పంటను కొనకపోతే ప్రభుత్వమే ఆ ధరకు పంటను రైతు నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పంట ఖర్చును ఎలా లెక్కిస్తారు? పంటకయ్యే ఖర్చును ప్రాతిపదికగా తీసుకొని కనీసమద్దతు ధర నిర్ణయిస్తారు. అయితే ఈ ఖర్చును ఏ ప్రమాణాలపై నిర్ణయిస్తారు. మూడు ప్రమాణాలు లేదా మూడు సూత్రాల ప్రకారం పంటకయ్యే ఖర్చును లెక్కిస్తారు. మొదటి సూత్రం: ఏ2.....విత్తనాలు, ఎరువులు, పురుగుమందలకు రైతులు పెట్టే ఖర్చుతోపాటు వ్యవసాయ కూలీలకు, వ్యవసాయ అద్దె యంత్రాలకు రైతులు చెల్లించే మొత్తంను పరిగణలోకి తీసుకుంటారు. రెండవ సూత్రం: ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ (ఫ్యామిలీ లేబర్): మొదటి సూత్రం కింద విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలకు, యంత్రాలకు పెట్టే మొత్తం ఖర్చు ప్లస్ రైతు కుటుంబం ఆ పంటపై పెట్టే మొత్తం శ్రమను పరిగణలోకి తీసుకోవడం. మూడవ సూత్రం: సీ2. అంటే కాంప్రెహెన్సివ్ కాస్ట్. విత్తనాల దగ్గరి నుంచి రైతు కుటుంబం శ్రమ వరకు అయ్యే ఖర్చు ప్లస్ రైతు ఓ పంటపై పెట్టిన పెట్టుబడికి వచ్చే కనీస వడ్డీ, ఆ పంట పండే భూమి లీజుకయ్యే మొత్తం. ఈ మూడు సూత్రాల ప్రాతిపదికన ఓ పంటకు కనీస మద్దతు ధరను కేంద్రంలోని ‘కమిషన్ ఫర్ అగ్రికల్టర్స్ కాస్ట్ అండ్ ప్రైసెస్’ నిర్ణయిస్తుంది. పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వాల అసలు కిటుకు అంతా ఇక్కడే ఉంది. 2017లో దేశవ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించిన రైతులు కూడా తమ పెట్టుబడులకన్నా యాభై శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు. మూడవ సూత్రమైన ‘సీ2’ కన్నా 1.5 రెట్లు ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండాలని కోరారు. వారికి ఈ అవగాహన ఎలా వచ్చిందంటే వ్యవసాయ సంస్కరణలపై అధ్యయనం చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వంలోని జాతీయ కమిషన్ 2006లో సమర్పించిన నివేదికలో ఇదే సిఫార్సు చేశారు కనుక. ఏ ప్రాతిపదికన మద్దతు ధర నిర్ణయించారు? స్వామినాథన్ నివేదిక సిఫార్సు మేరకు లేదా రైతుల డిమాండ్ మేరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడవ సూత్రం ప్రకారం కనీస మద్దతు ధరను నిర్ణయించక రెండో సూత్రం ప్రకారం నిర్ణయించింది. కనీస మద్దతు ధర పెంపును ‘సీ2’ సూత్రం ప్రకారం లెక్కిస్తే ఒక్క సజ్జల కనీస మద్దతు ధర పెంపు మాత్రమే పెట్టుబడికి 50 శాతంపైగా ఉంది. మిగతా వాటి ధరలన్నీ 14 శాతం, అంతకన్నా తక్కువే. అత్యంత ముఖ్యమైన వరికి 12.2 శాతం, నువ్వులకు కేవలం మూడు శాతం పెంచింది. గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం పెంచిందీ ఎక్కువా ? అదీ అంతా నిజం కాదు. 2012–2013లోనే ఎక్కువ పెరిగాయి దేశంలోని ఎక్కువ పంటలకు కనీస మద్దతు ధరలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న 2012–2013 ఆర్థిక సంవత్సరంలోనే ఎక్కువ పెరిగాయి. సీ2 సూత్రం ప్రకారం మోదీ ప్రభుత్వం వరి మద్దతు ధరను పెట్టుబడులపై 12.2 శాతం పెంచగా, నాడు మన్మోహన్ సర్కార్ 15 శాతం పెంచింది. జొన్నలపై నేటి ప్రభుత్వం 11.3 శాతం పెంచగా, నాటి ప్రభుత్వం 53 శాతం పెంచింది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం సజ్జలు, రాగులు, గడ్డి నువ్వులపైనే కాస్త ఎక్కువ పెంచింది. మోదీ ప్రభుత్వం బుధవారం నాడు 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించినా అందులో పెరిగిందీ 14 పంటలకే. మద్దతు ధరను అమలు చేస్తుందా ? అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేది ఎక్కువగా బియ్యం, గోధుమలు మాత్రమే. ఓ మోస్తారుగా పప్పు దినుసులను కొనుగోలు చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు చౌక ధరలపై రేషన్పై బియ్యం, గోధమలను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నందున బియ్యం, గోధుమలను ప్రభుత్వాలు కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. అది కూడా ఉత్తర భారత దేశం నుంచే ఎక్కువగా కొనగోలు చేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాయి. రైతుల నుంచి మద్దతు ధరకు బియ్యం, గోధుమలను కేంద్రం కొనుగోలు చేసి వాటిని రేషన్ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్నా ప్రభుత్వం వద్ద ధాన్యం వృధా అవుతోంది. ఈ వృధా అరికట్టేందుకు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు కొత్త స్కీమ్ను ప్రకటించాయి. కనీస మద్దతు రేటుకు, మార్కెట్ రేటుకున్న వ్యత్యాసాన్ని నేరుగా రైతులకు డబ్బు రూపంలో ప్రభుత్వం చెల్లించడమే ఆ స్కీమ్. అది కూడా ఆయా రాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే అమలవుతోంది. సీ2తో సవరించిన మద్దతు ధరలను పొలిస్తే పంట పాత(రూపాయల్లో) కొత్త(రూపాయల్లో) పెరిగిన శాతం 1. వరి 1,560 1,750 12.2 2. జొన్నలు 2,183 2,430 11.3 3. సజ్జలు 1,124 1,950 47.3 4. రాగి 2,370 2,897 22.2 5. మొక్కజొన్న 1,480 1,700 14.9 6. కందిపప్పు 4,981 5,675 13.9 7. పెసరపప్పు 6,161 6,975 13.2 8. మినపపప్పు 4,989 5,600 12.2 9. పల్లీలు 4,186 4,890 16.8 10. పొద్దు తిరుగుడు గింజలు 4,501 5,388 19.7 11. సోయాబిన్ 2,972 3,399 14.4 12. నువ్వులు 6,053 6,249 3.2 13. పత్తి(మీడియం రకం) 4,514 5,150 14.1 14. నైగర్ సీడ్(కలోంజి) 5,135 5,877 14.4 -
పంటల మద్దతు ధరలను పెంచిన కేంద్రం
-
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
-
వరికి కనీస మద్దతు ధర పెరిగింది
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతుల మన్ననలు పొందేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును కేంద్రం ప్రకటించింది. దీంతో ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంట అయిన వరి కనీస మద్దతు ధర 2018-19లో క్వింటాకు 200 రూపాయలు పెరిగి, రూ.1,750గా నిర్ణయమైంది. 2017-18లో ఈ ధర రూ.1,550గా ఉండేది. గ్రేడ్ ఏ రకం వరి కనీస మద్దతు ధర కూడా 160 రూపాయలు పెరిగి రూ.1,750 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వరికి కనీస మద్దతు ధర పెరగడంతో, 2016-17(అక్టోబర్-సెప్టెంబర్) మార్కెటింగ్ ఏడాది ప్రకారం ఆహార రాయితీ బిల్లు కూడా రూ.11 వేల కోట్ల కంటే ఎక్కువ పెరగనుందని తెలిసింది. వరితో పాటు పత్తి(మిడియం స్టాపుల్) కనీస మద్దతు ధర కూడా రూ.4,020 నుంచి రూ.5,150కు పెరిగింది. అదేవిధంగా పత్తి(లాంగ్ స్టాపుల్) కనీస మద్దతు ధర కూడా క్వింటాకు రూ.4,320 నుంచి రూ.5,450కు పెంచారు. పప్పు ధాన్యాల కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,450 నుంచి రూ.5,675కు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సన్ ప్లవర్ ధర క్వింటాకు 1,288 రూపాయలు, పెసర్ల ధర క్వింటాకు 1,400 రూపాయలు, రాగుల ధర క్వింటాకు 997 రూపాయలు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను ఉత్పత్తి ఖర్చు కంటే 1.5 రెట్లు ఎక్కువగా పెంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మంగళవారమే ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, నీతి ఆయోగ్ ప్లానింగ్ బాడీ అధికారులు సమావేశమయ్యారు. -
వరికి ‘మద్దతు’ రూ.200 పెంపు!
సాక్షి, న్యూఢిల్లీ: వరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో రైతుల ‘మద్దతు’ పొందేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంట అయిన వరికి 2018–19లో 13 శాతం పెంపుతో క్వింటాలుకు రూ.1,750 చెల్లించనుంది. మరో 13 రకాల ఖరీఫ్ పంటల మద్దతు ధరను కూడా స్వల్పంగా పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మద్దతు ధర పెంపుపై కేంద్రం ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత ఏడాదిలో వరికి క్వింటాలుకు రూ.1,550 (సాధారణ రకం) కనీస మద్దతు ధరను కేంద్రం చెల్లిస్తోంది. గ్రేడ్–ఏ పంటకు రూ.1,590 చెల్లిస్తోంది. ‘ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర వివరాలను ఇప్పటికే ప్రకటించాల్సి ఉన్నా.. కేంద్రం ఆలస్యం చేసింది.