Visakha agency
-
చలిగాలుల జాడలేదు
సాక్షి, విశాఖపట్నం: డిసెంబర్, జనవరి నెలల్లో ఎముకలు కొరికేస్తున్నట్టుగా చలి తీవ్రత ఉంటుంది. కానీ.. ఈ ఏడాది అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఈ శీతాకాలం సాదాసీదాగానే ప్రభావం చూపించిది తప్ప జనాన్ని గజగజలాడించ లేదు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు (సివియర్ హీట్æవేవ్స్) వీస్తుంటాయి. అదే శీతాకాలంలో కొన్ని రోజులు అతి శీతల గాలులు (సివియర్ కోల్డ్ వేవ్స్) వీచి గడ్డ కట్టించే చలికి కారణమవుతాయి. అలాంటి రోజుల్లో కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతాయి. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. విశాఖ ఏజెన్సీ (అల్లూరి సీతారామరాజు జిల్లా)లోని లంబసింగి, చింతపల్లి, అరకు, పాడేరు వంటిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా క్షీణిస్తాయి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 5–6 డిగ్రీలకు దిగజారిపోతాయి. లంబసింగిలో అయితే ఏటా జనవరిలో ఏకంగా ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోతుంది. కానీ.. ఈ శీతాకాలం సీజన్ అందుకు భిన్నంగా సాగింది. ఈ సీజన్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ రోజులు 8–15 డిగ్రీల మధ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకంటే (చింతపల్లి, లంబసింగిల్లో) తక్కువగా రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాలేదు. మన్యం సహా రాష్ట్రంలో ఒక్క రోజూ అతి శీతల గాలులు (కోల్డ్ వేవ్స్) వీయలేదు. శీతల తీవ్రత అధికంగా ఉండే జనవరిలోనూ చలి ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. ఫలితంగా చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందే అవసరం ఏర్పడ లేదు. గడచిన కొన్నేళ్లలో ఇలాంటి పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తూర్పు, ఈశాన్య గాలులే ఇందుకు కారణం సాధారణంగా శీతాకాలంలో దక్షిణాదికంటే ఉత్తర, వాయవ్య భారతదేశంలో శీతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటునుంచి మన రాష్ట్రం వైపు ఉత్తర, వాయవ్య గాలులు బలంగా వీస్తుంటాయి. దీంతో చలి తీవ్రత ఆంధ్రప్రదేశ్పై కూడా కనిపిస్తుంది. అయితే.. ఈ ఏడాది రాష్ట్రంపైకి తూర్పు, ఈశాన్య గాలులు బలంగా వీస్తున్నాయి. ఫలితంగా ఈ గాలులు ఉత్తర, వాయవ్య గాలులకు ఒకింత అడ్డుకట్ట వేశాయి. ఈ ఏడాది చలి తీవ్రత అంతగా లేకపోవడానికి, అతిశీతల గాలులు వీయకపోవడానికి తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావం అధికంగా ఉండటమే కారణమని భారత వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు 17–23 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. దీంతో చలి ప్రభావం ఏమంత ఉండటం లేదు. గతంలో ఫిబ్రవరి ఆరంభంలో ఇలాంటి పరిస్థితి లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఇవి 30–35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరో 10 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆపై చలి నిష్క్రమిస్తుందని పేర్కొంటున్నారు. -
పోలీసు స్టిక్కర్ తగిలించి.. గంజాయి తరలించి
రామచంద్రాపురం (పటాన్చెరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్వోటీ, రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ నరేందర్రెడ్డి అందించిన వివరాలివి. మహారాష్ట్ర బడ్లాపూర్కు చెందిన ధీరజ్ మున్నాలా డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. అందులో సరైన ఆదాయం రాకపోవడంతో స్నేహితుడు ప్రశాంత్ సంజయ్ షిండేతో కలిసి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించాలని నిర్ణయించాడు. ఇన్నోవా కారు అద్దెకు తీసుకొని ఇద్దరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వినయ్ మండల్ ద్వారా కిలో రూ.3 వేల చొప్పున 58.5 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని 39 ప్యాకెట్లుగా విభజించి కారులో పెట్టుకుని మహారాష్ట్రకు బయల్దేరారు. వీరు గంజాయి తరలిస్తున్నట్లు గురువారం సాయంత్రం బాలానగర్ ఎస్వోటీ పోలీసులు, రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న ధీరజ్ మున్నాలా జైస్వాల్, ప్రశాంత్ సంజయ్ షిండేలను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. కాగా ఇన్నోవా వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి, ముందు భాగంలో పోలీస్ స్టిక్కర్ను పెట్టుకొని గంజాయిని తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. దాంతో వారి వద్ద నుంచి రూ.11 లక్షల 70 వేల విలువైన 58.8 కిలోల గంజాయిని, ఇన్నోవా కారు, డూప్లికేట్ నంబర్ ప్లేట్, కొడవలి, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
కొనసాగుతున్న చలి తీవ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. మంచుతోపాటు పొగమంచు కురుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో మంగళవారం తెల్లవారుజామున 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జి.మాడుగుల మండలం కుంతలంలో 4.1, చింతపల్లి మండలం చింతపల్లిలో 4.2, జీకే వీధిలో 4.3, డుంబ్రిగూడలో 4.4, జి.మాడుగుల, హకీంపేటలో 4.7, పాడేరులో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలోని చాలాప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ విశాఖ ఏజెన్సీ తరహాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. శ్రీసత్యసాయి జిల్లా ఆగలిలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా మడకశిర మండలం ఆర్.అనంతపురం, అనంతపురం జిల్లా బెళుగుప్పలో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మైమరపించే మారేడుమిల్లి అందాలు...
అల్లూరి సీతారామరాజు (మారేడుమిల్లి): నిన్న మొన్నటి వరకు వాడిపోయిన చెట్లకు ఇటీవల కురిసిన వర్షాలు కొత్త ఊపిరులూదాయి. ఏజెన్సీలో ఎటుచూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు ప్రకృతి కనువిందు చేస్తోంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ఒంపులు తిరిగే రహదారులు, జలజలపారే సెలయేర్లు, ఉరికే జలపాతాలు, వాగులు, వంకలతో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు మారేడుమిల్లికి తరలివస్తున్నారు. ఇక్కడి నుంచి చింతూరు వెళ్లే ఘాట్రోడ్డు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.రోడ్డుకు ఇరువైపులా పచ్చదనంతో కూడిన దట్టమైన ఆడవులు, పక్షుల రాగాలు, ఒంపుసొంపుల మార్గంలో సాగే ప్రయాణం, చల్లని వాతావారణంలో తొలకరి చినుకుల మధ్య ఘాట్లో ప్రయాణం వాహనచోదకులకు మధురానుభూతిని కలిగిస్తోంది. ఘాట్లోని మన్యం వ్యూపాయింట్ నుంచి అందమైన ప్రకృతిని చూసే వారికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. మండలంలో పేరొందిన పర్యాటక ప్రాంతం గుడిస హిల్ టాప్. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉంటుంది. పై భాగం చదునుగా ఉండి.. చుట్టూ గడ్డి మాత్రమే ఉంటుంది. ఇక్కడ చేతికి అందే ఎత్తులో మేఘాలు వెళుతుంటాయి. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డులో ప్రయాణించాలి. ఈ ప్రదేశం పచ్చదనంతో ఎంతో సుందరంగా ఉంది. అయితే ప్రస్తుతం గుడిస సందర్శనకు అనుమతి లేదు. -
వణికిస్తున్న చలి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ నెల 21న వాయుగుండంగా మారనుంది. ఇది థాయ్లాండ్ వైపుగా ప్రయాణించనుంది. దీని ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరో 10 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణం కంటే.. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గడం, దీనికి తోడు గాలులు వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు పడిపోతే అతి శీతల గాలులు(కోల్డ్వేవ్స్)గా ప్రకటిస్తారు. ఏజెన్సీలో పలు చోట్ల ఈ తరహా కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టులో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల కనిష్టానికి పడిపోయాయి. డుంబ్రిగుడలో 8, అరకు, జి.మాడుగుల, లంబసింగిలో 9, పెదబయలులో 9.5, పాడేరులో 11, చింతపల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఆదివాసీ బాలలకు ‘ఆధార్’ దొరికింది
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలు నిట్టమామిడి, బందులపనుకులోని బాలలకు ఎట్టకేలకు ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం జరిగింది. ఆ గ్రామాలకు చెందిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేకపోవటంతో చదువుకు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల ఈ సమస్యపై కథనం వెలువడడంతో అధికార యంత్రాంగం స్పందించింది. ఆదివాసీ పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టింది. పాడేరు ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ అప్పలస్వామి, ఎంఆర్ఐ చిన్నారావు, సిబ్బంది 8 కి.మీ కాలినడకన ఆయా గ్రామాలను సందర్శించి పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసి ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిట్టమామిడి, బందులపనుకు గ్రామాల్లో గల 53 మంది పిల్లలకు ఆధార్ నమోదు చేశారు. దీంతో తమ పిల్లలు చదువుకోవడానికి ఒక ఆధారం దొరికిందని ఆదివాసీ గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. -
విశాఖ ఏజెన్సీలో చలి పులి
పాడేరు: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో పాటు అర్ధరాత్రి నుంచే పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. నాలుగు రోజుల నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 11 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 14.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం వేళల్లో కూడా 24 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదవుతోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు అధికమవుతున్నాయి. ఏజెన్సీలోని అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, పాడేరు, చింతపల్లి, సీలేరు ప్రాంతాలను సందర్శిస్తున్న పర్యాటకులంతా ఏజెన్సీలోని శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. -
గంజాయి పంట ధ్వంసం
కొయ్యూరు/డుంబ్రిగుడ: విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ నిమ్మలగొంది, బోయవుట, డుంబ్రిగుడ మండలంలోని కురిడి పంచాయతీ గోరాపూర్ గ్రామాల్లో గిరిజనులు బుధవారం 40 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప, కొయ్యూరు, డుంబ్రిగూడ ఎస్ఐలు లోకేష్కుమార్, దాసరినాగేంద్ర, సంతోష్కుమార్ బుధవారం ఆయా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు ఏకమై 40 ఎకరాల్లో గంజాయి మొక్కలను పీకి పారేశారు. ఇక మీదట గంజాయి తోటలు పెంచబోమని వారు పోలీసులకు తెలిపారు. సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ గిరిజనుల్లో చైతన్యం వచ్చిందని, స్వచ్ఛందంగా వారే గంజాయిని ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. -
మరో 287 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా పోలీసు శాఖ, ఎస్ఈబీ బృందాలు గంజాయి దాడులను కొనసాగిస్తున్నాయి. జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎస్ఈబీ జేడీ ఎస్.సతీష్కుమార్ల ఆదేశాల మేరకు మంగళవారం జరిపిన దాడుల్లో ఏజెన్సీలోని జి.మాడుగుల, జి.కె.వీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలో మొత్తం 287 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ గచ్చుపల్లి పరిసర ప్రాంతాల్లో 77 ఎకరాలు, జి.కె.వీధి మండలంలోని గొందిపల్లి, పి.కొత్తూరు, సిల్లిగూడ గ్రామ సమీపంలోని 18 ఎకరాలు, జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ పరిధిలోని కె.పెదబయలు గ్రామ పరిసరాల్లో 40 ఎకరాల్లో గంజాయి పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే పెదబయలు మండలంలోని గుల్లెలు, గోమంగి పంచాయతీల్లోని చావిడిమామిడి, గుల్లెలు, దల్లెలు గ్రామాల్లో 152 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలన్నింటినీ నరికి నిప్పటించారు. కళాజాత ద్వారా ప్రచారం హుకుంపేట మండలంలోని కొట్నాపల్లి, చీడిపుట్టు, దాలిగుమ్మడి గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా గంజాయి వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టారు. గంజాయి సాగు, రవాణా ద్వారా గిరిజన ప్రాంతాలకు జరుగుతున్న అనర్ధాలు, జైలు జీవితంతో దుర్భర బతుకులు, తదితర అంశాలపై పాటలు, నృత్య రూపకాల ద్వారా అవగాహన కల్పించారు. -
402 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
పాడేరు/ కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా పోలీసుశాఖతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బృందాలు గంజాయి దాడులను కొనసాగిస్తున్నాయి. అలాగే చింతపల్లి మండలం తురబాలగెడ్డ వద్ద లిక్విడ్ గంజాయి తరలిస్తున్న తల్లీకొడుకులను సోమవారం అరెస్టు చేశారు. కాగా విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, జి.కె.వీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలోని 402 ఎకరాల్లో గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ శంకరరెడ్డి, ఎస్ఈబీ అధికారులు సుధాకర్, శ్రీను, ప్రశాంత్, సంతోస్, తదితరులు పాల్గొన్నారు. లిక్విడ్ గంజాయి పట్టివేత.. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి నుంచి రూ.లక్ష విలువ చేసే కిలో ద్రవ గంజాయిని ద్విచక్ర వాహనంపై తీసుకొస్తున్నారన్న సమాచారం గొలుగొండ ఎస్ఈబీ అధికారులకు అందింది. దీంతో డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన తల్లీ, కొడుకులు జరీనా, ఎస్కె.జహరుద్దీన్ లిక్విడ్ గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. వీరు కాకినాడలోని వైద్య విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారినుంచి మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. -
ఏజెన్సీలో 3 చోట్ల ఏకలవ్య మోడల్ పాఠశాలలు
పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అరకులోయ మండలం గన్నెల రోడ్డులోని మజ్జివలస, పెదబయలు, జి.మాడుగుల మండల కేంద్రాల్లో మూడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ మూడు చోట్లా నిర్మించనున్న పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం అనువైన స్థలాలను కేటాయించింది. ఒక్కో పాఠశాలను 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఈ సందర్భంగా గిరిజన గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ ఆదివారం మజ్జివలసలో పాఠశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. -
ఏజెన్సీలో 102 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
పాడేరు/గూడెంకొత్తవీధి: విశాఖ ఏజెన్సీలో శనివారం 102 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్కుమార్, సూపరింటెండెంట్ గోపాల్ పర్యవేక్షణలో జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ వి.కోడాపల్లి ప్రాంతంలో 54 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. రెండు లక్షల 70 వేల మొక్కలను నరికివేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ నరేంద్రనాథ్రెడ్డి, ఎస్ఈబీ బృందం, సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు జి.కె.వీధి మండలంలో సీఐ అశోక్కుమార్, ఎస్ఐ షమీర్ ఆధ్వర్యంలో రింతాడ పంచాయతీ కోరాపల్లి గ్రామంలో గంజాయి నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం గంజాయి సాగు జోలికి పోమని వారితో తీర్మానం చేయించారు. 8 ఎకరాల్లో తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. చింతపల్లి మండలంలోని కుడుమసారి పంచాయతీ కోటగున్నెల, లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామాల్లో 40 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం చేశారు. 760 కిలోల గంజాయి స్వాధీనం కశింకోట: విశాఖ జిల్లా మండలంలోని బయ్యవరం వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దర్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ జి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నైకు బొలెరో వాహనంలో తరలిస్తుండగా బయ్యవరం వద్ద పట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా చీడికాడకు చెందిన గ్రామానికి చెందిన డ్రైవర్ కొల్లివలస శ్రీను, బుచ్చియ్యపేట మండలం అప్పన్నపాలెం గ్రామానికి చెందిన జి.బత్తుల సంతోష్లను అరెస్టు చేశామన్నారు. 760 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని ఖరీదు రూ.15 లక్షలు ఉంటుందన్నారు. -
AP: 239 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) జాయింట్ డైరెక్టర్ సతీష్కుమార్ ఆధ్వర్యంలో గంజాయి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం 239 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల జగ్గంపేట, సీమకొండ, రంజెలమంది గ్రామాల సమీపంలో సుమారు 216 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను ఎస్ఈబీకి చెందిన ఏడు బృందాలు ధ్వంసం చేశాయి. 10.8 లక్షల గంజాయి మొక్కలను నరికేసి వాటికి నిప్పంటించారు. చింతపల్లి మండలం మేడూరు గ్రామ సమీపంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తుల సహకారంతో 15 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలకు నిప్పంటించారు. పాడేరు మండలంలోని ఇరడాపల్లి సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న కనక ఆధ్వర్యంలో గిరిజనులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, వలంటీర్ల సహకారంతో 8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. -
37 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
గూడెంకొత్తవీధి/డుంబ్రిగుడ/కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో మంగళవారం 37 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల, జి.కె.వీధి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జర్రెల పంచాయతీలోని పలు గ్రామాల్లో సర్పంచ్ వీరోజి నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 5 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జి.కె.వీధి పంచాయతీలోని బి.కొత్తూరు, డి.కొత్తూరు గ్రామాల పరిధిలో జి.కె.వీధి సీఐ అశోక్కుమార్, ఎస్ఐ షమీర్ ఆధ్వర్యంలో 20 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేసి మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలంలోని అన్నవరం స్టేషన్ పరిధిలో గచ్చిపల్లి సమీపంలోని సుమారు 6 ఎకరాల్లోని గంజాయి తోటలను ఎస్ఐ ప్రశాంత్కుమార్ సమక్షంలో ధ్వంసం చేశారు. డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ కొంతుగుడ గ్రామంలో ఎస్ఐ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో 6 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. 46 కిలోల గంజాయి పట్టివేత గొలుగొండ ఎస్ఈబీ సీఐ రాజారావు ఆధ్వర్యంలో మంగళవారం డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద 46 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి ప్రాంతం నుంచి టాటా నానో కారులో గంజాయి ప్యాకెట్లను తీసుకెళ్తుండగా ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.లక్ష వరకు ఉంటుంది. కారు, ద్విచక్ర వాహనం, నాలుగు ఫోన్లు, రూ.1,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. డుంబ్రిగుడకు చెందిన బి.రాజారావును, పాములవాకకు చెందిన సీహెచ్ నానిబాబు, హుకుంపేటకు చెందిన జి.రంగారావు, వి.రాజులను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. -
గంజాయిపై ఉక్కుపాదం
పాడేరు/డుంబ్రిగుడ/జీకే వీధి/చింతపల్లి/కాకినాడ సిటీ/అనంతగిరి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగు, రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో యథేచ్ఛగా సాగుతున్న గంజాయి దందాను నామరూపాల్లేకుండా తుదముట్టించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు త్రిముఖ వ్యూహంతో ముందుకు కదులుతూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ఓ వైపు గంజాయి సాగు వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గిరిజనులకు అవగాహన కల్పిస్తూ గంజాయి తోటలను ధ్వంసం చేసే పనిలో కొన్ని బృందాలు నిమగ్నం కాగా.. మరికొన్ని బృందాలు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ఈబీ, పోలీస్ అధికారులు కార్యాచరణ కొనసాగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. విజయవంతంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేయగా.. పలుచోట్ల తనిఖీలు దాడులు నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న గంజాయిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం విశాఖ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో 217 ఎకరాల్లో సాగు చేస్తున్న 9.80 లక్షలకు పైగా గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. మరోవైపు ఒడిశా నుంచి స్మగ్లింగ్ అవుతున్న రూ.కోటిన్నరకు పైగా విలువైన 1,720 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకే పంచాయతీ పరిధిలో 217 ఎకరాల్లో పంట ధ్వంసం విశాఖ ఏజెన్సీ పరిధిలోని ఐదు మండలాల్లో సోమవారం 217 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది ఏడు బృందాలుగా ఏర్పడి జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి, డిప్పలగొంది, వడ్రంగుల గ్రామాల్లో 164 ఎకరాల్లో సాగవుతున్న సుమారు 7.40 లక్షల మొక్కలను నరికి నిప్పంటించారు. డుంబ్రిగుడ మండలంలోని కండ్రుం పంచాయతీ దండగుడ, బెడ్డగుడ, కండ్రుం గ్రామాల్లో 12 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను సోమవారం ఆ పంచాయతీ గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు. ఇకపై గంజాయి సాగుచేయబోమని తీర్మానం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలో మావోయిస్టు ప్రాంతమైన కుంకుంపూడికి సమీపంలోని 5 ఎకరాల్లో గంజాయి తోటలను గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేసి, మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ గాదిగొయ్యి గ్రామంలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. పాడేరు మండలం గొండెలి, కించూరు పంచాయతీల్లో 16 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, గిరిజన పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. పశువుల దాణా ముసుగులో తరలిస్తున్న టన్ను గంజాయి పట్టివేత తూర్పు గోదావరి జిల్లా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో రూ.కోటి విలువైన వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్పీ రవీంద్రనాథ్బాబు కాకినాడలో సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన వ్యక్తులు పశువుల దాణా ముసుగులో ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్కు లారీలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ లారీని చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని గోడ్లగూడెం జంక్షన్ వద్ద అటకాయించారు. పోలీసుల్ని చూసి ఒక వ్యక్తి పారిపోగా మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా తికూరి గ్రామానికి చెందిన మన్మోహన్ పటేల్, అదే జిల్లా మౌరహా గ్రామానికి చెందిన మహమ్మద్ హారన్, ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లా ఎంపీవీ–79 గ్రామానికి చెందిన రాబిన్ మండల్, ఎంపీవీ–75 గ్రామానికి చెందిన అమృతా బిశ్వాస్, నలగుంటి గ్రామంలోని ఎంపీవీ–36కు చెందిన బసుదేవ్ మండల్ను అరెస్ట్ చేశారు. ఒడిశాలో పండించిన గంజాయిని వారంతా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి రాజును ఒడిశా పోలీసుల సహకారంతో అరెస్ట్ చేస్తామన్నారు. చిలకలగెడ్డ వద్ద 720 కేజీల స్వాధీనం విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్పోస్టు వద్ద ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వ్యాన్లో తరలిస్తున్న 720 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, స్టేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం సంయుక్తంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ గణపతిబాబు, టాస్క్ఫోర్స్ హెచ్సీ శ్రీధర్ నేతృత్వంలోని పోలీసులు చిలకలగెడ్డ వద్ద కాపుగాసి పట్టుకున్నారు. గంజాయితో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబట్ట గంజాయి విలువ రూ.50 లక్షలకు పైగా విలువ చేస్తుందని అంచనా. ఈ దాడిలో ఎస్ఈబీ ఎస్ఐ దాస్, టాస్క్ఫోర్స్ పోలీసులు కృష్ణప్రసాద్, నర్సింగరావు పాల్గొన్నారు. -
ఏవోబీలో ‘ఆపరేషన్ పరివర్తన్’
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కేరళ, మహరాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో ఏవోబీలో యథేచ్ఛగా నడుస్తున్న గంజాయి సాగును నామరూపాల్లేకుండా తుదముట్టించేందుకు ప్రత్యేక బృందాలను యాక్షన్లోకి దించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గంజాయి దందాను కట్టడి చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ను చేపట్టింది. ఈ తరహా ఆపరేషన్ను దేశంలో తొలిసారిగా ఏపీలో అమలు చేస్తున్నారు. గంజాయి దుష్పరిణామాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తూ..టెక్నాలజీ సాయం, భారీ స్థాయిలో బలగాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ద్విముఖ వ్యూహంతో విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. రంగంలోకి దిగిన బృందాలు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను ఆనుకుని ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ›5 రోజులుగా భారీగా గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ఈబీ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతోంది. మ్యాపింగ్తో నిర్దిష్ట ప్రాంతాల గుర్తింపు ‘ఆపరేషన్ పరివర్తన్’ను విజయవంతం చేసేందుకు ఎస్ఈబీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. మన్యంలో గంజాయి సాగుచేసే ప్రాంతాలను ముందుగా మ్యాపింగ్ చేశారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాలతోపాటు రాష్ట్ర సరిహద్దుకు అవతల ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తృతంగా గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను నిర్దిష్టంగా గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ డ్రోన్ కెమెరాలతో వీడియో తీయించారు. ఐదు రోజుల్లో 550 ఎకరాల్లో.. ఏపీ పరిధిలోని గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు భారీ సంఖ్యలో బలగాలు, సిబ్బందిని ఎస్ఈబీ వినియోగిస్తోంది. పోలీస్, ఎస్ఈబీ సిబ్బందితో ఏర్పాటు చేసిన 66 ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఆ బృందాలకు వివిధ మండలాల బాధ్యతలను అప్పగించారు. గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు అవసరమైన యంత్రాలను సమకూర్చారు. అనంతరం ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గంజాయి తోటల్ని ధ్వంసం చేసి, పంటకు నిప్పు పెట్టే పని ఓ యజ్ఞంగా సాగుతోంది. గడచిన 5 రోజుల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి ఏకంగా 550 ఎకరాల్లో గంజాయి సాగును అధికారులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు 21 లక్షల గంజాయి మొక్కలు ధ్వంసం చేసి నిప్పు పెట్టినట్టు ఎస్ఈబీ వర్గాలు వెల్లడించాయి. వీటి విలువ రూ.104.25 కోట్లు ఉంటుందని ఎస్ఈబీ ఉన్నతాధికారులు అంచనా. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ.. రాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసేలా ఆ రాష్ట్ర పోలీసు అధికారులతో ఏపీ పోలీసులు ఇప్పటికే చర్చలు జరిపారు. ఏపీ వైపు చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ను ఆ రాష్ట్రాల్లోనూ చేపట్టనున్నారు. అందుకు అవసరమైన సాంకేతిక, ఇతరత్రా సహకారాన్ని ఏపీ ఎస్ఈబీ అధికారులు అందిస్తారు. విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి తోటల ధ్వంసం గూడెంకొత్తవీధి/కొయ్యూరు/చింతపల్లి/జి.మాడుగుల/అనకాపల్లిటౌన్: విశాఖ ఏజెన్సీలోని 3 మండలాల్లో శనివారం పెద్దఎత్తున గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని దామనపల్లి, రింతాడ పంచాయతీల్లోని డేగలపాలెం, ఇంద్రానగర్, కొత్తూరులో 56 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. జీకేవీధి పోలీసులు ఈ గ్రామాలకు చేరుకుని, గంజాయి తోటలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టి కాల్చివేశారు. కొయ్యూరు మండలంలోని మారుమూల అంతాడ పంచాయతీ పారికలలో రీముల చంద్రరావు ఆధ్వర్యంలో శనివారం గ్రామస్తులు 5 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి మండలంలోని గంజిగెడ్డ, బౌర్తి, కొత్తూరు గ్రామాల సమీపంలో 16 ఎకరాల గంజాయి తోటలను చింతపల్లి పోలీసులు ధ్వంసం చేశారు. జి.మాడుగుల మండలంలో ఎగమండిభ, పరిసర ప్రాంతాల్లో 158 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. డాగ్స్క్వాడ్తో తనిఖీ మాదకద్రవ్యాల పని పట్టేందుకు విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్లో డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో శనివారం డాగ్స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. 1, 2, 3 ప్లాట్ఫారాలపై, తిరుమల ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా డాగ్స్క్వాడ్ తనిఖీలు జరిగాయి. 18 కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని కొత్తూరు బయలులో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల ద్రవరూప (లిక్విడ్) గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ ఎస్ఐ గణేష్ తెలిపారు. శనివారం రాత్రి కొత్తూరు బయలులో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి లిక్విడ్ గంజాయితో వెళ్తున్నాడని, దానిని పరిశీలిస్తుండగా అతడు పరారయ్యాడని ఎస్ఐ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కొనసాగుతున్న గంజాయి తోటల ధ్వంసం
సీలేరు/డుంబ్రిగుడ: ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలతో గిరిజనులు స్వచ్ఛందంగా విశాఖ ఏజెన్సీలోని గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో విశాఖపట్నం జిల్లా ధారకొండ పంచాయతీ చిన్నగంగవరం గ్రామ పరిధిలోని గంజాయి తోటలను స్థానికులు సోమవారం నరికేశారు. అలాగే డుంబ్రిగుడ మండలంలోని సాగర పంచాయతీ కొసోంగుడ, బల్లిగెడ్డ గ్రామాల్లో కూడా సర్పంచ్ తౌడమ్మ, ఎంపీటీసీ దేవదాసుల ఆధ్వర్యంలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అరకు సీఐ జి.డి.బాబు మాట్లాడుతూ.. గంజాయి పండించి జైలు పాలు కావద్దని.. కుటుంబాలను రోడ్డున పడవేయద్దని హితవు పలికారు. -
ఆనంద్బాబు వ్యాఖ్యలకు ఆధారాల్లేవు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో కొందరు రాజకీయ, ఇతర నాయకుల ప్రమేయంతోనే స్మగ్లింగ్ మాఫియా కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పిన మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు వ్యాఖ్యలకు తగిన ఆధారాలు లేవని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు స్పష్టం చేశారు. విశాఖ నుంచి వెళ్లిన ఒక ప్రత్యేక పోలీసు బృందం ఆయన్ను విచారించిందన్నారు. అందులో భాగంగానే ఐపీసీ సెక్షన్ 160 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశామని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర –ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో గంజాయి సాగు శాశ్వత నిర్మూలన ఒక్క పోలీసు వ్యవస్థతోనే సాధ్యం కాదని, ఆయా ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతతో సంకల్పించాలని సూచించారు. నల్గొండ పోలీసులు రెండు వారాల ముందు నుంచే విశాఖ ప్రాంతంలో పలు కేసుల విషయమై స్థానిక పోలీసులను సంప్రదించారని, కానీ చింతపల్లి వద్ద కాల్పుల ఘటన విషయమై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సమస్య దశాబ్దాల కాలంగా ఉందన్నారు. పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి కొంత కాలంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలో 2016లో 724 ఎన్డీపీఎస్ కేసులలో 2,290 మందిని అరెస్ట్ చేశామన్నారు. 2017లో 712 కేసుల్లో 2,100 మందిని, 2018లో 579 కేసుల్లో 2,174 మందిని, 2019లో 812 కేసుల్లో 2,565 మందిని, 2020లో 812 కేసుల్లో 2,565 మందిని, ఈ ఏడాది అక్టోబర్ 15 వరకు 1,359 కేసుల్లో 4,059 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. రెండేళ్లలో విశాఖ పోలీసులు ఏవోబీలో దాదాపు 50 గ్రామాల్లో 800 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారని చెప్పారు. గంజాయి స్మగ్లర్ల సమాచారం ఉందని ఎవరు చెప్పినా విచారిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసుల కాల్పులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. లంబసింగి ఘాట్రోడ్డులో పోలీసులపైకి స్మగ్లర్లు రాళ్లు రువ్వారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భారీ ఎత్తున గంజాయిని నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నల్లగొండ నుంచి విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. ఘటనా స్థలానికి నర్సీపట్నం నుంచి పోలీసు బలగాలను తరలించారు. -
అక్రమ ఆపరేషన్లపై ప్రభుత్వం కొరడా
పాడేరు: ఇటీవల విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెంలోని మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా గిరిజన మహిళలకు సంక్షేమ ఆపరేషన్లు చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ చేసిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.తిరుపతిరావును సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్.సూర్యనారాయణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఈ నెల 10న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. సబ్ కలెక్టర్ వి.అభిషేక్ చేపట్టిన విచారణలో.. ఈ ఆపరేషన్లు చేసింది అనకాపల్లి ఆస్పత్రి గైనకాలజిస్టు తిరుపతిరావుగా తేలింది. అలాగే వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు జరిపిన విచారణ నివేదికను అందుకున్న జిల్లా వైద్యాధికారి సూర్యనారాయణ.. డాక్టర్ తిరుపతిరావుపై చర్యలు తీసుకున్నారు. తిరుపతిరావును సస్పెండ్ చేసి ఆయన స్థానంలో తగరంపూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్నాయుడును అర్బన్ ఫ్యామిలి వెల్ఫేర్ సెంటర్కు ఇన్చార్జిగా నియమించారు. -
అక్రమ ఆపరేషన్లపై సబ్కలెక్టర్ విచారణ
పాడేరు: విశాఖ ఏజెన్సీ పాడేరు మండలంలోని మారుమూల గ్రామం ఈదులపాలెంలో మెడికల్ షాపులో అక్రమంగా కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు నిర్వహించిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు కలెక్టర్ను ఆదేశించింది. విచారణాధికారిగా నియమితులైన పాడేరు సబ్ కలెక్టర్ వి.అభిషేక్ మంగళవారం ఉదయమే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. ఏడీఎంహెచ్వో డాక్టర్ కె.లీలాప్రసాద్, తహసీల్దార్ ప్రకాష్రావు, ఇతర అధికారులు, ఈదులపాలెం వైద్యుల సమక్షంలో విచారణ నిర్వహించారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు నిర్వహించిన మెడికల్ షాపును తనిఖీ చేశారు. మెడికల్ షాపు నిర్వహకుడితోపాటు సమీప గిరిజనులను కూడా ఆయన విచారించారు. ఆపరేషన్లు చేయించుకున్న కొంతమంది మహిళలను సబ్ కలెక్టర్ పరామర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇక్కడే ఆపరేషన్లు చేయించుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఆరాతీశారు. ఆపరేషన్లు చేసిన అనకాపల్లికి చెందిన వైద్యుడు, ఫిమేల్ నర్సు వివరాలను సేకరించారు. స్థానికంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది ఒకరిద్దరు సహకరించారనే ఆరోపణలపైన కూడా విచారణ జరిపారు. మెడికల్ షాపులో అక్రమంగా ఆపరేషన్లు జరిపారని నిర్ధారణకు వచ్చిన ఆయన పాడేరు పోలీసులకు కూడా తగిన సమాచారం అందించారు. ఆయన సమగ్ర విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. మరోవైపు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్లు మెడికల్ షాపును పరిశీలించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. షాపునకు తాళాలు వేశారు. -
అందరి చూపు.. రంగురాళ్ల వైపు!.. వారం రోజుల్లో కోట్ల వ్యాపారం
రంగురాళ్లంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖ ఏజెన్సీ.. అందులో నర్సీపట్నం ప్రాంతాలే. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విలువైన వైఢూర్యాలు ఇక్కడికి సమీపంలో లభ్యం కావడమే ఇందుకు కారణం. నెల రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తూ.. అప్పట్లో మూసివేసిన క్వారీలన్నీ తవ్వకాలకు అనువుగా మారడంతో అందరూ దృష్టీ దీనిపై పడింది. నెలరోజుల క్రితం సాక్షాత్తూ డీఎఫ్వో డ్రైవర్ ఆధ్వర్యంలో కొంతమంది రంగురాళ్ల తవ్వకాలకు యత్నించి దొరికిపోయిన సంఘటన మరువక ముందే వారం నుంచి గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం, జీకే వీధి, చింతపల్లి మండలాల్లో సిగనాపల్లి, మేడూరు, గుర్రాలగొందిల్లో క్వారీలలో సైతం తవ్వకాలు కొనసాగిస్తున్నారు. రంగురాళ్ల వ్యాపారానికి నర్సీపట్నం కేంద్రంగా మారింది. వారం రోజుల్లో సుమారు రూ.5 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిసింది. ఫారెస్టు, పోలీసు సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరించడంతో వ్యాపారులు రంగురాళ్ల తవ్వకాలు నిరాటంకంగా సాగిస్తున్నారు. కృష్ణాబజార్ ప్రాంతంలో ఒక రంగురాళ్ల వ్యాపారి ఇల్లే ఇందుకు కేంద్రంగా మారింది. – నర్సీపట్నం కోట్లు కురిపించే క్వారీలు.. చెంతనే ప్రమాదాలు విశాఖ ఏజెన్సీ తూర్పు కనుమల్లోని గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీలో లభించే ఆకుపచ్చ వైఢూర్యాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి, గుర్రాలగొంది, మేడూరు క్వారీల్లో లభించే క్యాట్స్ ఐ రకాలకు కూడా డిమాండ్ ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రంగురాళ్ల తవ్వకాలకు అనువుగా మారాయి. నర్సీపట్నానికి చెందిన వ్యాపారులు సమీప గ్రామాల్లోని కొంతమందికి డబ్బులు ఇచ్చి పప్పుశెట్టిపాలెం లీజు క్వారీకి సమీపంలో అనధికారికంగా రంగురాళ్ల తవ్వకాలు సాగిస్తున్నారు. జీకే వీధి మండలం సిగనాపల్లిలో కూడా రంగురాళ్ల తవ్వకాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. సిగనాపల్లి క్వారీలో సెల్సిగ్నల్స్ అందుబాటులో ఉండటం రంగురాళ్ల వ్యాపారులకు కలిసొచ్చింది. తవ్వకాలు జరుపుతున్న కూలీలు (ఫైల్) పోలీసు, అటవీ సిబ్బంది ఎవరు వచ్చినా ఇట్టే సమాచారం తెలుస్తుండడంతో సమయానుకూలంగా తవ్వకాలు సాగిస్తున్నారు. 1992–93లో పప్పుశెట్టిపాలెం క్వారీలో ముమ్మరంగా తవ్వకాలు జరపడంతో క్వారీ కూలి అప్పట్లో 15 మంది మృతి చెందారు. ఆ తర్వాత కరకలో రంగురాళ్ల క్వారీ కూలి ముగ్గురు మృతి చెందారు. కరక ప్రమాదం తర్వాత అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ప్రకాష్ , జిల్లా పోలీసు, అటవీ అధికారులు రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అప్పటి నుండి కరక, పప్పుశెట్టిపాలెం ప్రాంతాల్లో తవ్వకాలకు అడ్డుకట్ట పడింది. ఇటీవల పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి క్వారీలో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ లభ్యమవుతున్న రంగురాళ్లను నర్సీపట్నం తరలిస్తున్నారు. చదవండి: (ఇక సొంత ఊరే.. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్) నర్సీపట్నానికి చెందిన వ్యాపారి క్రయవిక్రయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఈ వ్యాపారి వద్దకు వచ్చి రంగురాళ్లు కొనుగోలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సిగనాపల్లి క్వారీలో లభ్యమైన రంగురాళ్లు సుమారు రెండు కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలిసింది. రంగురాళ్ల వ్యాపారుల ధన దాహనికి మరింత మంది అమాయకులు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసు, అటవీ, రెవెన్యూ అధికారులు రంగురాళ్ల తవ్వకాలు నిరోధించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదు రంగురాళ్ల తవ్వకాలు, స్మగ్లింగ్ జరిపితే వదిలే ప్రసక్తి లేదు. లీజు క్వారీల వద్ద తప్ప మిగిలిన చోట్ల తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి రంగురాళ్ల తవ్వకాలకు వెళ్ళ వద్దు. ఎవరైనా వ్యాపారులు డబ్బులిచ్చి తవ్వకాలు జరపమని ప్రోత్సహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. –మణికంఠ చందోలు, నర్సీపట్నం ఏఎస్పీ -
విస్తారంగా వర్షాలు
సాక్షి, నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంగళవారం కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. హుకుంపేట–అడ్డుమాండ ప్రధాన రహదారిలో వంతెనపైకి వరదనీరు రావడంతో రాకపోకలు స్తంభించాయి. తూర్పుగోదావరి జిల్లాలో గత 24 గంటల్లో సగటున 67.9 మిల్లీమీటర్ల వర్షపాతం చోటు చేసుకుంది. జిల్లావ్యాప్తంగా సింహభాగం మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాకినాడ అర్బన్లో 174 మిల్లీమీటర్లు.. అత్యల్పంగా రాజోలులో 26.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఏజెన్సీలో కొండ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం వాల్మీకిపేటకు చెందిన గొర్లె మహేష్ (చిట్టి) చేపలు పట్టేందుకు స్థానిక పంపుహౌస్ సమీపంలోని కాలువలో దిగగా ఉధృతికి కొట్టుకుపోయాడు. అతడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. విశాఖపట్నం రుషికొండ బీచ్లో కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం 15 అడుగులు ముందుకు రావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంట ఉన్న కపుల్ బెడ్స్, వాచ్ టవర్స్, గొడుగులు వంటి వాటిని కెరటాలు తాకడంతో పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. భీమిలి బీచ్ రోడ్డు, మంగమారిపేట, ఉప్పాడ, తిమ్మాపురం ప్రాంతాల్లోనూ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా కవిటిలో 125 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లా ఎద్దెలవాగు వంతెనపై ప్రవహిస్తున్న గోదావరి వరద పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే దారిలో ఎద్దెల వాగు వంతెన సోమవారం రాత్రి నీటమునిగింది. దీంతో దిగువన ఉన్న కొయిదా, కట్కూరు, కాచారం, తాళ్లగొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, యడవల్లి, బుర్రెడ్డిగూడెం, టేకూరు, సిద్దారం, కుంకుడుకొయ్యల పాకలుతోపాటు మరో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 2 రోజుల నుంచి పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, రామవరం, ఊటగుంపు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అశ్వారావుపేట వెళ్లే రహదారిలో రామవరం వద్ద లోతు వాగు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోటకు వెళ్లే దారిలో పెదవాగు వంతెన ప్రాంతంలో రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. మద్దిగట్ల ప్రాంతంలో వాగు ఉధృతిలో కొట్టుకుపోతున్న 2,000 గొర్రెలను ఎస్ఐ సాదిక్, సిబ్బంది కాపాడారు. తహసీల్దార్ చల్లన్నదొర ఎద్దెల వాగు వద్ద నాటు పడవను ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 0.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వాగులో గల్లంతైన యువతి మృతి పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లి తిరిగొస్తూ సోమవారం వాగులో గల్లంతైన మనీషా వర్మ (23) మృతదేహం మంగళవారం లభ్యమైంది. సుమారు ఐదు బృందాలు ఉదయం నుంచి వాగు వెంట ఐదు కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కంట్లం సమీపంలో వాగులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వారంలో మరో అల్పపీడనం.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ కేంద్రం తెలిపాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రానున్న వారం రోజుల్లో మరో అల్పపీడనం ఏపీ తీరానికి సమీపంలో ఏర్పడి.. ఒడిశా వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో 10 రోజుల తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకుంటాయి. కాగా, గత 24 గంటల్లో తాడేపల్లిగూడెంలో 46.5, విశాఖపట్నంలో 30, పెందుర్తి, చింతపల్లిల్లో 22, అనకాపల్లిలో 18, వాయల్పాడులో 16.3, మాకవరపాలెంలో 12, కమలాపురంలో 11, సంజామలలో 10, నర్సీపట్నంలో 9, అమరపురంలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు అవాస్తవం: ప్రతాప్రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు అవాస్తవమని విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్తగా ఎవరికీ మైనింగ్ లైసెన్స్ ఇవ్వలేదని తెలిపారు. కోర్టు అనుమతితో ఇచ్చిన లైసెన్స్ మేరకు లెట్రైట్ తవ్వకాలు మాత్రమే జరుగుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్కు పాల్పడినవారి లైసెన్స్లు రద్దు చేశామన్నారు. అక్రమ మైనింగ్పై రేపటి నుంచి అనకాపల్లి ఏరియాలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని వెల్లడించారు. 3 జిల్లాల్లో కలిపి అక్రమ మైనింగ్పై రూ.250 కోట్ల వరకు ఫైన్ విధించామని తెలిపారు. అక్రమ మైనింగ్కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. -
విశాఖ మన్యంలో వలిసెల సోయగం విలసిల్లేలా..
సాక్షి, విశాఖపట్నం: మంచు తెరల మధ్య పసుపు వర్ణంతో మెరిసిపోయే వలిసె పూలు ప్రకృతి కాంతకు స్వర్ణ కాంతులద్దుతాయి. విశాఖ మన్యానికొచ్చే పర్యాటకుల మనసులను ఇట్టే దోచుకుంటాయి. ఏటవాలు కొండ ప్రాంతాల నడుమ చల్లని వాతావరణంలో పెరిగే వలిసె తోటలు కొన్నేళ్లుగా కనుమరుగవుతున్నాయి. గిరిజన రైతుల సంప్రదాయ పంట అయిన వలిసెల సాగు రెండు దశాబ్దాల్లో నాలుగో వంతుకు పడిపోయింది. అత్యధికంగా తేనె ఉండే వలిసె పూల సాగు తగ్గడంతో తేనెటీగలకు కష్టకాలం వచ్చింది. తేనె సేకరణపైనా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వలిసె తోటలకు పూర్వ వైభవం తెచ్చేందుకు చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధనలు చేపట్టింది. వలిసె తోటల మాతృ ప్రదేశం ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా. వందల ఏళ్ల క్రితమే మన్యంలోకి వచ్చి గిరిజనుల సంప్రదాయ పంటగా మారింది. విశాఖ మన్యంలోని అరుకు లోయ, పాడేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అనంతగిరి, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాలతోపాటు విజయనగరం జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో వలిసెల సాగు ఉండేది. తర్వాత కాలంలో విశాఖ మన్యానికే పరిమితమైంది. ఇక్కడ కూడా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2003–04లో 16 వేల హెక్టార్లకు పరిమితమైన వలిసెల సాగు క్రమేపీ తగ్గుతూ 2020–21 నాటికి 3,695 హెక్టార్లకు పడిపోయింది. వలిసె ఉపయోగాలివీ.. వలిసె పూలలో తేనె అధికంగా ఉంటుంది. తోటల్లో ఎకరానికి వంద చొప్పున తేనె పెట్టెల చొప్పున ఉంచి తేనెటీగల సాయంతో గిరిజనులు తేనెను సేకరిస్తారు. ఒక్కో పెట్టె నుంచి 35–40 కిలోల చొప్పున తేనె దిగుబడి వస్తుంది. వలిసె గింజల నుంచి వంటనూనె తీస్తారు. దీనిని గిరిజనులు ఇళ్లల్లో వినియోగిస్తుంటారు. ఈ నూనెను కాస్మొటిక్స్, పెయింటింగ్స్ తయారీలోనూ వినియోగిస్తున్నారు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వలిసె గింజలను కోళ్లు, పక్షుల దాణా తయారీలోనూ మిశ్రమంగా వాడతారు. తగ్గిపోవడానికి కారణాలు విశాఖ మన్యంలో నీరు నిలవని ఏటవాలు కొండ ప్రాంతాలు, చల్లని వాతావరణం వలిసెల సాగుకు అత్యంత అనుకూలం. పరిమాణం, రంగు, సాగు కాలంలో తేడాను బట్టి 30 రకాల వరకూ ఉన్నాయి. వలిసె గింజల దిగుబడులు తగ్గిపోవడం, రైతులకు పెద్దగా గిట్టుబాటు కాకపోవడం, భూసారం తగ్గడం వంటి పరిస్థితులు వలిసె తోటల సాగు తగ్గడానికి కారణమయ్యాయి. ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్లకు మించి వలిసె గింజల దిగుబడి రావడం లేదు. ఆకాశ పందిరి, బంగారు తీగ అనే కలుపు మొక్కలను నిరోధించడం కష్టమవుతోంది. గిరిజన రైతులు వలిసె విత్తనాలను తామే తయారుచేసుకోవడం వల్ల నాణ్యత లోపించి పంట దెబ్బతిని దిగుబడులు పెద్దగా ఉండటం లేదు. దీంతో వారంతా ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపడంతో సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోయింది. పూర్వ వైభవానికి కృషి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్దన్రెడ్డి గతంలో భారతీయ నూనెగింజల పరిశోధన కేంద్రం (ఐఐవోఆర్) డైరెక్టర్గా ఉన్నప్పుడు వలిసెలకు పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన చొరవతో వలిసెలపై చింతపల్లిలో నాలుగేళ్ల పరిశోధన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.69 లక్షలు మంజూరు చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో సాగవుతున్న 1,800 రకాల వలిసెల మూల విత్తనాలను న్యూఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ రిసోర్సెస్ నుంచి చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రానికి తీసుకొచ్చారు. మన్యంలో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనువైన, వివిధ తెగుళ్లను తట్టుకొని స్వల్ప కాలంలో అధిక దిగుబడిని ఇచ్చే మేలు రకం విత్తనాలను ఇక్కడి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు పాడేరు ఐటీడీఏతో పాటు సంజీవని స్వచ్ఛంద సంస్థ గిరిజన రైతులను ప్రోత్సహిస్తోంది. సాగు, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించడమే గాక టార్పాలిన్లు, కోత పరికరాలు అందజేస్తుంది. రెండు లాభదాయక రకాల అభివృద్ధి మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పరిసర ప్రాంతాల్లో మంచి దిగుబడి ఇస్తున్న జేఎన్ఎస్–26, జేఎన్ఎస్–28 రకాల మూల విత్తనాలను తెచ్చాం. మన్యం పరిస్థితులకు అనుగుణంగా ఉండే వీటిని ఇక్కడ అభివృద్ధి చేశాం. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు వేస్తే ఆరేడు క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. ఈ విత్తనాలను ఉచితంగా గిరిజన రైతులకు త్వరలోనే ఇస్తాం. ఇలా కనీసం వంద రకాల మేలు రకం విత్తనాలను అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. గిరిజన రైతులను వలిసెల సాగు వైపు అన్నివిధాలా ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాం. – డాక్టర్ గుత్తా రామారావు, సహాయ పరిశోధన సంచాలకులు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం -
ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు
సాక్షి, విశాఖ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు తెగబడ్డారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. పెదబయలు సమీపంలోని ఇంజరీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే భద్రతా బలగాలు తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రెండు నెలల వ్యవధిలో వరుసగా మావోయిస్టులు మందుపాతరలు పేల్చుతున్నారు. మరోవైపు ఏవోబీలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మన్యం.. మసాలా
సాక్షి, విశాఖపట్నం: నాణ్యమైన కాఫీ గింజలకు, సహజసిద్ధమైన తేనెకు దేశ ప్రసిద్ధిగాంచిన విశాఖ మన్యం ఇప్పుడు సుగంధ ద్రవ్యాల సాగులోనూ పేరుగడిస్తోంది. సుగంధ ద్రవ్యాలు.. అల్లం, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వంటల్లోనే కాకుండా కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి కషాయాలుగానూ ఉపయోగపడుతున్నాయి. దీంతో వీటికి మరింత డిమాండ్ పెరిగింది. సుగంధ ద్రవ్యాలకు పేరొందిన కేరళలో కంటే మన్యంలో సేంద్రీయ పద్ధతిలో పండించిన నాణ్యమైన సరుకు లభ్యమవుతోంది. ఇక్కడ 11 మండలాల్లో ఉన్న ఎర్రగరప నేలలు సాగుకు ఎంతో అనుకూలం. అల్లం ► మన్యంలో 300 ఎకరాల్లో అల్లం సాగవుతోంది. ► దేశవాళీ నర్సీపట్నం రకం అల్లం దిగుబడి ఎకరాకు రెండు టన్నులే ఉంటోంది. దీంతో మహిమ, నడియా రకాలను ఉద్యాన శాఖ ప్రవేశపెట్టింది. ఎకరాకు ఆరు టన్నుల దిగుబడి, రూ.5 లక్షల వరకు ఆదాయం లభిస్తున్నాయి. పసుపు ► మన్యం పసుపు ధర ఈ ఏడాది టన్ను రూ.9 వేలు పలికింది. ► కస్తూరి రకం పసుపును కుంకుమ తయారీకి ఉపయోగిస్తున్నారు. ► పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ‘పసుపు ప్రాజెక్టు’ను ఇటీవలే ప్రారంభించింది. ► 20,552 ఎకరాల్లో ఉన్న పసుపు సాగును ఐదేళ్లలో మరో పది వేల ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.100 కోట్లు కేటాయించాయి. దాల్చిన చెక్క వంద ఎకరాల్లో మొక్కలు సాగవుతున్నాయి. లవంగాలు ఈ ఏడాదే 80 ఎకరాల్లో లవంగాల మొక్కలను నాటారు. మిరియాలు ► 27,182 ఎకరాల్లో సాగు ఉంది. కాఫీ తోటల నీడ కోసం పెంచే సిల్వర్ ఓక్ చెట్లపైకి మిరియాల పాదులను పెంచుతారు. ఇలా అంతర పంటగా పన్నియూరు–1 రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ► ఎకరాకు వంద కిలోల వరకు దిగుబడి, రూ.15 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తున్నాయి. జాజికాయ ► మన్యంలో ఈ ఏడాదే 80 ఎకరాల్లో రైతులు జాజికాయ మొక్కలు నాటారు. పదేళ్ల చెట్లు అయితే ఎకరాకు రూ.50 వేలకుపైగా ఆదాయం వస్తుంది. రైతులకు లాభం సుగంధ ద్రవ్యాల సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితే ఎకరానికి ఏటా రూ.5 లక్షల వరకు పొందొచ్చు. మండల వ్యవసాయాధికారులు, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు రైతులకు సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం పసుపు, అల్లం రైతులకు హెక్టారుకు రూ.12 వేలు చొప్పున, మిరియాలకు రూ.8 వేలు, దాల్చిన చెక్క, జాజికాయ, లవంగాల రైతులకు రూ.20 వేల చొప్పున రాయితీ ఇస్తోంది. – కె.గోపీకుమార్, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు, విశాఖ జిల్లా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది సుగంధ ద్రవ్యాల మొక్కలను వివిధ రాష్ట్రాల నుంచి వ్యయప్రయాసలకోర్చి తెచ్చేవాడిని. ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. – కుశలవుడు, గిరిజన రైతు, లంబసింగి -
విశాఖ మన్యంలో టీడీపీ అడ్రస్ గల్లంతు
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరిది... ఇప్పుడు విశాఖ మన్యంలో తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్న మాట. ఎన్టీ రామారావు కాలంలో టీడీపీకి కంచుకోట లాంటి విశాఖ మన్యంలో ఇప్పుడు వెతికినా టీడీపీ అడ్రస్ కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఇప్పుడే అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకు శిక్ష గా తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో పాడేరు అరకు రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కాలంలో మంచి కంచుకోటగా కొనసాగేది. సినీ నటుడిగా ఎన్టీరామారావు అభిమానించిన గిరిజనులు ఆయనకు పట్టం కట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నిత్యం గిరిజన ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నించారు. దీంతో మంచి నాయకురాలిగా కొనసాగిన మత్సరాశ మణికుమారీ లాంటి నాయకులు కూడా తిరిగి గెలవలేకపోయారు. ముఖ్య విశాఖ మన్యంలోని బాక్సైట్ తవ్వకాలకు...గిరిజనుల సానుభూతి ఓట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆశించింది. అవన్నీ గమనించిన జనం వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ను గెలిపించగా ఆమెను కూడా తమ వైపు లాగి అక్రమాల కొనసాగించడానికి ప్రయత్నించారు. చివరికి ఆమె కూడా రాజకీయ పతనమైంది. (కేసుల నుంచి రక్షణ కోసమే రాష్ట్రపతి వద్దకు..) ఆ తర్వాత అరకు ఎమ్మెల్యే గా కిడారి సర్వేశ్వరరావు పాడేరు ఎమ్మెల్యే గా గిడ్డి ఈశ్వరి గెలుపొందగా, వారిద్దరినీ కూడా టీడీపీ వైపు లాగి బాక్సైట్ తవ్వకాలు జరిపాలని అనుకున్నారు. కానీ జనం ఎదురు తిరగడంతో తోక ముడిచారు. ఆ తర్వాత టీడీపీ వారసులుగా ఎన్నికల బరిలో దిగిన నాయకుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకు తమకు శాపంగా మారిందని తెలుగుదేశం నాయకులు మన్యంలో అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీలో ఉంటే ఇంకా మనుగడ లేదని నిర్ణయించుకున్న గిరిజనులు ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా అనంతగిరి మండలంలో చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన కొన్ని కుటుంబాలు.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సమక్షంలో కొయ్యూరు ప్రాంతానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఇదంతా చంద్రబాబు నాయుడు తప్పిదాలు ఒక ఎత్తయితే ఏడాదికాలంగా సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు టీడీపీ అడ్రస్ను గల్లంతు చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
జల్సాలకు అలవాటుపడి..
సాక్షి, గుంటూరు: మత్తు పదార్థాలతో బంగారు భవిష్యత్తు నాశనమవుతోంది. విద్యార్థులు, యువకులు గంజాయికి బానిసలై చేజేతులా జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. ఇందులో మైనర్లు అధికంగా ఉండటం కలవరపెడుతోంది. జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు కేంద్రాలుగా గంజాయి మాఫియా రెచ్చిపోతుంది. ఆయా ప్రాంతాల్లో గంజాయి విక్రయమే జీవనాధారంగా చేసుకుని పలువురు కార్యకలపాలు సాగిస్తున్నారు. ఇందులో అమాయక విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారు. తొలుత వారికి గంజాయి రుచి రూపించి, దానికి బానిసలుగా మార్చి ఆ తర్వాత గంజాయి రవాణా, విక్రయాలకు వినియోగిస్తున్నారు. జల్సాలకు అలవాటుపడి.. కావాల్సినంత డబ్బు అందుబాటులో ఉండి జల్సాలకు అలవాటుపడిన కొందరు వైద్యులు, లెక్చరర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల పిల్లలు సైతం గంజాయికి బానిసలైన ఉదంతాలు జిల్లాలో అనేకం వెలుగు చూశాయి. గుంటూరు నగరం, శివారు ప్రాంతాలు, మంగళగిరి, తాడేపల్లి సహా పలు ప్రాంతాల్లో కాలేజీలు, హాస్టళ్ల సమీపంలో ఉన్న పాడుపడిన కట్టడాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో డెన్లను ఏర్పాటు చేసుకుని కొందరు యువత గంజాయి పీలుస్తున్నారు. గతంలో నిఘావర్గాలు వీటిని గుర్తించి పలువురిని అరెస్టు చేసిన ఘటనలున్నాయి. గుంటూరు నగరంలో అయితే మైనర్ల తల్లిదండ్రులు పోలీస్ అధికారులను ఆశ్రయించి తమ పిల్లలు గంజాయికి బానిసలు అయ్యారని ఫిర్యాదు చేయడం గత ఏడాది కలకలం రేపింది. ఏజెన్సీ వయా విజయవాడ, ఇబ్రహీంపట్నం.. ►విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా విజయవాడ, ఇబ్రహీంపట్నాలకు గంజాయి సరఫరా అవుతున్నట్లు సమాచారం. ►అక్కడి నుంచి జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు నగరం సహా పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ►చిన్న చిన్న పొట్లాలుగా గంజాయిని ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. వీటికి పావులుగా కాలేజీ విద్యార్థులనే ఉపయోగిస్తున్నారు. ►గతంలో రూ.300కు విక్రయించే గంజాయి ప్యాకెట్ ప్రస్తుతం రూ.500 విక్రయిస్తున్నట్టు సమాచారం. ►ఫోన్ చేసి అడ్రెస్ చెబితే బైక్లపై గంజాయిని డెలివరీ చేసే విధానం ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో నడుస్తోంది. ►ఈ తరహాలో గంజాయి రవాణా చేస్తూ తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో విద్యార్థులు అనేక సార్లు పట్టుబడ్డారు. ►మరోవైపు అమాయక మహిళల అవసరాలను ఆసరాగా తీసుకుని గంజాయి రవాణా, విక్రయాల్లోకి దించుతున్నారు. ►అయితే గంజాయి రవాణా, సరఫరా, విక్రయాల్లో కీలక పాత్ర పోషించే వ్యక్తుల మూలలను ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శలొస్తున్నారు. మూలాలను ఛేదిస్తాం.. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. మూలలను ఛేదించేందుకు కృషి చేస్తున్నాం. కాల్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాల ద్వారా కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి, జైలు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. ప్రజల వద్ద సమాచారం ఉంటే ధైర్యంగా పోలీసులకు చెప్పాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, అర్బన్ ఎస్పీ -
కొనసాగుతున్న ఆదివాసీల బంద్
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల బంద్ కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రాంతంలోని ఉపాధ్యాయ ఉద్యోగాలు శాతం స్థానిక గిరిజనులకే చెందేలా గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-3ని సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని నిరసిస్తూ అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో- 3 సాధన సమితి, గిరిజన సంఘాలు మంగళవారం బంద్కు పిలుపునివ్వడంతో విశాఖ మన్యంలో 11 మండలాల్లో దుకాణాలు మూసివేశారు. వాహనాలను నిలిపివేయడంతో బాటు సంతలను కూడా బంద్ చేశారు. మన్యం బంద్ కు మావోయిస్టులు మద్దతు తెలిపారు. సీతంపేట ఏజెన్సీలో బంద్ కారణంగా షాపులు మూసివేశారు. జీవో-3 రద్దును నిరసిస్తూ గిరిజనులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా : జీవో నంబర్ 3పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్ర ఆదివాసీ తుడుం దెబ్బ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఉట్నూర్, ఇంద్రవేల్లి, నార్నూర్, గాదిగూడ, జైనూర్. సిర్పూర్ ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ కొనసాగుతుంది. ఉట్నూర్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
విశాఖ ఏజెన్సీలో గజగజ వణికిస్తున్న చలి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో స్థానికులు చలికి గజగజ వణుకుతున్నారు. ఏజెన్సీలోని మినుములూరులో 11 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్నోగ్రత నమోదవ్వగా, పాడేరు, లంబసింగిలో 12 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, అరకు, చింతపల్లిలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
మరదలిని తుపాకితో కాల్చిన బావ
హుకుంపేట (అరకులోయ): అన్నదమ్ముల మధ్య ఆర్థిక వివాదం నేపథ్యంలో బావ తన మరదలిని తుపాకితో కాల్చి తీవ్ర గాయాలుపాలు చేసిన ఘటన విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ కేంద్రంలో జరిగింది. హుకుంపేట ఎస్ఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామంలో కిల్లో కృష్ణ, కిల్లో జయరామ్ తమ తండ్రి పేరున ఉన్న భూమిని అన్నదమ్ములు పంచుకోలేదు. అయితే ఇటీవల రైతు భరోసా పథకం కింద జయరామ్ ఖాతాలో సొమ్ము జమైంది. ఈ సొమ్ము కోసం అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొనడంతో ఆదివారం ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో కిల్లో కృష్ణ తన వద్ద ఉన్న నాటు తుపాకితో కాల్పులు జరపడంతో అతని తమ్ముడి భార్య కొండమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశార -
ఈ విజయం గిరిజనులదే..
సాక్షి, విశాఖపట్నం: గిరిజన ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. ఈ నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకూ మావోయిస్టులు నిర్వహించిన ప్రజా విముక్తి గెరిల్లా దళాల (పీఎల్జీఏ) వారోత్సవాల్లో గిరిజనులెవరూ పాల్గొనకుండా యువత అడ్డుకుందని.. ఈ విజయం గిరిజనులుదేనన్నారు. ఎస్పీ మీడియాతో ఆదివారం మాట్లాడారు. వారోత్సవాల సందర్భంలో గిరిజనులను మావోయిస్టులు బెదిరించి, భయపెట్టి సభలు, సమావేశాలు, స్థూపాల ఆవిష్కరణ అంటూ జనసమీకరణ చేస్తుంటారన్నారు. అలాగే ప్రశ్నించే గిరిజన యువకులను పట్టుకుని ఇన్ఫార్మర్ల ముద్రవేసి చంపుతారని.. కానీ ఈసారి మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనుల నుంచి పెద్దఎత్తున నిరసనలు ఎదురయ్యావన్నారు. సభలు, సమావేశాలు అంటూ తమను ఇబ్బంది పెట్టవద్దని, ప్రశాంతంగా తాము బతుకుతామని గిరిజనులు ఎదురించినట్టు పేర్కొన్నారు. వారోత్సవాలతో తమకు ఒరి గేదేమీలేదని చాలా గ్రామాల్లో మావోయిస్టు అగ్రనాయకులను గిరిజనులు ప్రశ్నించినట్లు సమాచారం ఉందని ఎస్పీ చెప్పారు. తమకు అభివృద్ధి కావాలని, అడ్డుకోవద్దంటూ గిరిజన యువత మావోయిస్టులను అడిగినట్లు తెలిసిందన్నారు. ఈ పరిణామాలకు మావోయిస్టులు ఏమి చెప్పాలో పాలుపోక వెనుదిరిగి వెళ్లిపోయినట్టు తెలిసిందని చెప్పారు. వారోత్సవాల పేరుతో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతుండేవారని, ఈమధ్య ఇన్ఫార్మర్లంటూ గిరిజనులను చంపడంతో కోపొద్రిక్తులైన గిరిజన యువత పెద్దఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేశారన్నారు. వారోత్సవాల రోజుల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా మద్దిగురవు, బొయితిలి, బొంగరం, పాడేరు, చింతపల్లి, గూడెం, డుంబ్రిగుడ, కొయ్యూరు ప్రాంతాల్లో గిరిజన యువత పెద్దఎత్తున నిరసనలకు దిగడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు. ఇంత పెద్దఎత్తున గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం చూస్తుంటే మావోయిస్టులు చెప్పే బూటకపు మాటలు గిరిజనులు నమ్మడం లేదని అర్థమవుతుందన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు, ఆచరణకు సాధ్యంకాని మాటలు, పాటలతో జీవితాలు నాశనమవుతున్నాయని గ్రహించడం వల్లే ఈ వారోత్సవాల్లో గిరిజనలెవ్వరూ పాల్గొనడంలేదని యువత ద్వారా తెలియవచ్చిందన్నారు. వారోత్సవాల్లో మావోయిస్టులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా గిరిజన యువత ముందుకొచ్చి సహకరించినందుకు ధన్యవాదాలని, ఈ విజయం గిరిజనులదేనని ఎస్పీ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మావోయిస్టులు గిరిజనుల మనసు తెలుసుకొని జనజీవన స్రవంతిలో కలిసి గిరిజనాభివృది్ధకి సహకరించాలన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. -
గిరి వాకిట సిరులు!
సాక్షి, విశాఖపట్నం: మన్యంలో దాదాపు గిరిజన రైతులంతా ఖర్చులేని ప్రకృతి సేద్య విధానం (జడ్బీఎన్ఎఫ్)లో రాగులు సాగుచేసి సిరులు కురిపిస్తున్నారు. ఎలాంటి ఎరువులు, రసాయనిక మందులను కూడా వాడకుండా పూర్తిగా గుల్లిరాగి పద్ధతిని అనుసరిస్తున్నారు. ఫలితంగా తక్కువ విత్తనాలతో అదీ దేశవాళీ రకాలతో రికార్డు స్థాయిలో దిగుబడి సాధిస్తున్నారు. ఈ తరహాలో మంచి దిగుబడులు సాధించిన సుమారు 250 మంది గిరిజన రైతులను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ అభినందించారు. సోమవారం ముంచంగిపుట్టు మండలంలోని వణుగుపుట్టులో రైతుసాధికార సంస్థ, ఐటీడీఏ, వ్యవసాయ శాఖ, జడ్బీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మన్యంలోని 21 క్లస్టర్లలోనూ వంద శాతం జడ్బీఎన్ఎఫ్ అమలు చేయడానికి ఐటీడీఏ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైబ్రిడ్ విత్తనాలతో కాకుండా పూర్తిగా దేశవాళీ విత్తనాలతోనే రాగుల సాగులో రికార్డు స్థాయి దిగుబడి సాధించడం విశేషమని జడ్బీఎన్ఎఫ్ జిల్లా మేనేజరు డి.దాసు హర్షం వ్యక్తం చేశారు. రాగులదే ప్రథమ స్థానం.. చిరుధాన్యాల్లో రాగులది ప్రథమ స్థానం. జిల్లాలో వరి, చెరుకు పంటల తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట ఇదే. మొత్తం 17,626 హెక్టార్లలో ఈ ఖరీఫ్లో సాగు చేశారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. 2017 ఖరీఫ్లో 16,731 హెక్టార్లు, 2018 ఖరీఫ్లో 16,731 హెక్టార్లకే పరిమితమైంది. ఈసారి సాగు పెరిగింది. దీనిలో ఎక్కువగా మన్యంలోని 21 వ్యవసాయ క్లస్టర్లలోనే సాగు అయ్యింది. ఇప్పటికే దసరా బూడులు, మింతచోడి, మిలట్రీ చోడి రకాల పంట కోతలు పూర్తయ్యాయి. ఇప్పుడు పెద్దరకం చోడి పంట కోతలు మొదలయ్యాయి. ఇది దాదాపు గుల్లిరాగి సాగు విధానంలోనే సాగింది. గిరిజన రైతులు అద్భుతమైన దిగుబడులు సాధించారు. వ్యవసాయ శాఖ, రైతుసాధికారిక సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు (జడ్బీఎన్ఎఫ్) అధికారులు, సంజీవని, వాసన్, సీసీఎన్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన పంటకోత ప్రయోగాల్లో గిరిజన రైతుల ప్రతిభ వెల్లడైంది. తనకు రెండెకరాల్లో రాగులు పంట సాగుచేసిన గిరిజన రైతు పాంగి గోవిందు ఎకరాకు 18.20 క్వింటాళ్ల చొప్పున రికార్డు స్థాయిలో దిగుబడి సాధించి అభినందనలు పొందారు. మన్యంలోని 11 మండలాల్లోనున్న 21 క్లస్టర్లలో 1,260 మంది గిరిజన రైతులు గుల్లిరాగు విధానాన్నే అనుసరించడం విశేషం. సుమారు 824 ఎకరాల్లో ఈ విధానంలో సత్ఫలితాలు సాధించారు. ప్రభుత్వ ప్రోత్సాహం... చిరుధాన్యాల సాగులో ముందంజలోనున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా నిలబడుతున్నాయి. ముఖ్యంగా రాగులకు కనీస మద్దతు ధర బాగా పెరిగింది. 2018–19 సంవత్సరంలో క్వింటాలుకు రూ.2,897లు ఉంది. ఈ ఖరీఫ్ సీజన్లో రూ.3,150కి పెరిగింది. ఈ ప్రకారం రాగులకు మద్దతు ధర గత ఏడాది కన్నా ఈసారి రూ.253 పెరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే చిరుధాన్యాల సాగును పెంచడానికి మరింత ప్రోత్సాహం, ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా త్వరలోనే మిల్లెట్ బోర్డునూ ఏర్పాటు చేయనున్నారు. ఈ బోర్డు ద్వారా చిరుధాన్యాలు పండించే రైతులకు అవసరమైన సాయం, ప్రోత్సాహం అందనున్నాయి. మద్దతు ధరకన్నా తక్కువకు అమ్మవద్దు జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ విధానం విశాఖ మన్యంతో పాటు నాలుగు జిల్లాల్లో అమలు చేస్తున్నాం. రాగుల సాగులో విశాఖ మన్యం రైతులు అద్భుత ప్రగతి చూపిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఎకరాకు 18 క్వింటాళ్లు దిగుబడి సాధించడం గొప్ప విషయం. రాగులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువ ధర ఎవ్వరు ఇచ్చినా విక్రయించవద్దని గిరిజన రైతులకు చెబుతున్నాం. గిరిజన సహకార సమాఖ్య (జీసీసీ), పాడేరు ఐటీడీఏ యంత్రాంగం రాగుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. – పి.దేవుళ్లు, రాష్ట్ర రిసోర్స్పర్సన్, జడ్బీఎన్ఎఫ్ -
గంజాయి తోటల్లో ఉద్యాన వన సిరులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/పాడేరు: పదేళ్లుగా విశాఖ మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో సంప్రదాయ పంటల కంటే గంజాయి సాగు వైపే అమాయక గిరిజనులు మొగ్గుచూపుతున్న పరిస్థితి నెలకొందనేది ఎవరూ ఔనన్నా కాదన్నా వాస్తవమే. విచ్చలవిడి గంజాయి సాగు, రవాణాతో అన్నెం పున్నెం ఎరుగని గిరిపుత్రులు పోలీసు, ఎక్సైజ్ కేసులకు బలికాగా... దళారులు, స్మగ్లర్లు, వ్యాపారులు మాత్రం రూ.కోట్లకు రూ.కోట్లు వెనకేసుకున్నారు. అందుకే నిషేధిత గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడంతో పాటు ఆ స్థానంలో గిరిజనులకు ఉద్యానవనపంట సాగుపై అవగాహన కల్పించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తొలినాళ్ల నుంచే కృతనిశ్చయంతో అడుగులు వేసింది. గంజాయి సాగు, రవాణాపై పక్కాగా నిషేధం అమలు చేస్తూ వచ్చింది. ఎక్కడికక్కడ పంటలను ధ్వంసం చేస్తూ రవాణాదారులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించింది. మరోవైపు స్వచ్ఛందంగా సాగు విరమించిన గిరిజనులకు లెక్కకు మించిన ప్రోత్సాహకాలు అందిస్తోంది. పదివేల నుంచి ఏడు వేలకు తగ్గిన సాగు.. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, జీ.కే.వీధి. హుకుంపేట డుంబ్రిగుడ మండలాల్లోని మారుమూల గ్రామాలు గంజాయి సాగుకు కేంద్రాలు మారిపోయాయనే సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా సగటున ఏడాదికి 10వేల ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగయ్యేది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గంజాయి సాగు, రవాణాపై పక్కాగా నిషేధం ప్రకటించి కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది సాగు 3వేల ఎకరాలకు తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడెక్కడ గంజాయి సాగును వదిలేశారంటే.. పాడేరు మండలంలోని ఇరడాపల్లి, గొండెలి, బడిమెల, కించూరు, హుకుంపేట మండలంలోని జర్రకొండ, జి.మాడుగుల మండలంలోని బీరం, గెమ్మెలి, వంజరి, వంతాల, గడుతూరు పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాలలోను గిరిజనులు గంజాయి సాగును పూర్తిగా వదిలిపెట్టారు. గంజాయి సాగు బదులు గంజాయి సాగుకు పేరొందిన పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ బొడ్డాపుట్టు, సరియాపల్లి. వీసమామిడి గ్రామాల్లోని కొన్ని గిరిజన కుటుంబాలు ఈ ఏడాది నుంచి గంజాయి సాగు వదిలివేశాయి. గతంలో నిషేధిత పంట సాగు చేసిన భూముల్లో ఇప్పుఉ వరి, రాజ్మా, చోడి. పసుపు పంటలను సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వరిపంట దిగుబడులు అధికంగా ఉండడంతో ప్రస్తుతం ధాన్యం నూర్పుల పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక రాజ్మా పంట సేకరణ దశలో ఉంది. మరికొందదరు పసుపు పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఏజెన్సీలో 90 శాతం రాయితీపై విత్తనాల పంపిణీ ఏజెన్సీలో గిరిజనులకు 90శాతం రాయితీపై రాజ్ మా చిక్కుళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నాం. ఖరీ ఫ్ సీజన్లో 2200 క్వింటాళ్ళ విత్తనాలు సరఫరా చేశాం. ఏజెన్సీలో పంటల సాగుకు గిరిజనులకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తాం. – ఎ.మల్లికార్జునరావు, వ్యవసాయశాఖ జేడీ రూ.82 కోట్లతో ప్రత్యేక పంటల ప్రణాళిక గంజాయి సాగును వదిలి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు రూ.82 కోట్లతో ప్రత్యేక పంటల ప్రణాళిక రూపొందించాం. విశాఖ మన్యంలో వంద శాతం గంజాయి సాగు నిర్మూలనకు ఎక్సైజ్, పోలీసు శాఖలతో కలిసి సమన్వయంగా చర్యలు చేపట్టాం. – డి.కె బాలాజీ, ఐటీడీఏ పీవో ఇక గంజాయి జోలికి పోం.. మెట్ట భూములలో గంజాయి సాగును వదిలిపెట్టి, ఈఏడాది ప్రభుత్వం పంపిణీ చేసిన 90శాతం సబ్సీడి విత్తనాలను సద్వినియోగం చేసుకుని రాజ్మా పంటను సాగు చేసాం. రాజ్మా పంటకు వాతావరణ పరిస్థితులు కలిసి రావడం ఎంతో మేలు చేసింది. పంట సేకరణ చేపట్టి, మరో వారం రోజులలో రాజ్మా గింజల అమ్మకాలు చేస్తాం. వచ్చే ఏడాది కూడా రాజ్మా,ఇతర వాణిజ్య పంటలను సాగు చేస్తాం. ఇక భవిష్యత్తులో గంజాయి జోలికి పోం – గల్లెలి నాగరాజు, ఈ.బొడ్డాపుట్టు గ్రామం, ఇరడాపల్లి పంచాయతీ, పాడేరు మండలం ప్రభుత్వ అండతో మాకు భయంపోయింది గంజాయి సాగును వదిలిపెట్టి మా భూములలో ఈ ఏడాది చోడిపంటను విస్తారంగా సాగు చేశాం. పంట సాగు ఆశాజనకంగా ఉండడంతో పంట సేకరణ చేపడుతున్నాం, విరగ్గాసిన వరికంకులతో దిగుబడి బాగుంది. భవిష్యతులో కూడా తమ వ్యవసాయ భూములలో వాణిజ్య పంటలను సాగు చేస్తాం. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో భయం పోయింది. – మర్రి రాజు, వీసమామిడి గ్రామం అందరమూ ఒకే మాటగా గంజాయి వదిలేశాం.. గంజాయి తోటల సాగును ఈఏడాది పూర్తిగా వదిలిపెట్టాం. గంజాయి సాగు చేపట్టే సమయంలో ప్రతిక్షణం భయంతో బ్రతికేవాళ్ళం. ఇప్పుడు అధికారుల అండతో గ్రామస్తులంతా ఐక్యమై ఒకే మాట అనుకుని గంజాయి సాగుకు దూరమయ్యాం. వచ్చే ఏడాది నుంచి కాఫీ తోటలు సాగు చేయాలని నిర్ణయించాం. ఈ ఏడాదికి ప్రభుత్వ సాయంతో నీడనిచ్చే సిల్వర్ఓక్ మొక్కలను 50ఎకరాలలో నాటుకున్నాం. – కిల్లో సాలో, గిరిజన మహిళా రైతు, వీసమామిడి ఉద్యానవన పంటల సాగుపై దృష్టి పెట్టాం.. గిరిజనులు ఉద్యానవన పంటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కాఫీ, రాజ్మా, కూరగాయలు, స్వీట్ ఆరెండ్, పైన్ యాపిల్వంటి పండ్ల మొక్కల సాగు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రీన్ కాలిఫ్లవర్ –బ్రకోలీ, పర్పల్ కలర్ క్యాబేజీ, చైనీస్ క్యాబేజీ, జుకుని–దోసకాయలు వంటి విదేశీ కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నాం. జనవరి, ఫిబ్రవరిలో 50 వేల యాపిల్ మొక్కల ప్లాంటేషన్ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏడాది పసు పు, అల్లం పంటలను ఏజెన్సీలో పెద్దమొత్తంలో సాగు చేయించాలని భావిస్తున్నాం. గంజాయి సాగు వదిలేసిన రైతులు ఇతర పంటల సాగుకు పవర్ టిల్ల ర్లు, పవర్ వీడర్లు, స్ప్రేయర్లు అడిగారు. ఆ మేరకు అందిస్తాం. – ప్రభాకర్రావు, ఉద్యానవనశాఖ ప్రత్యేక అధికారి, ఐటీడీఏ -
వణికిపోతున్న విశాఖ మన్యం
సాక్షి, పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి తాకిడితో ప్రజలు వణికిపోతున్నారు. ఆర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తుంది. సోమవారం ఉదయం 9 గంటల వరకు మన్యంలో మంచు తెరలు వీడలేదు. పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు కార్యాలయం, అరకులోయ కాఫీబోర్డు వద్ద 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతల ప్రాంతాలైన జి.కె.వీధి, చింతపల్లి, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో చలి తీవ్రత నెలకొంది. పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రధాన రోడ్లలో వాహన చోదకులు ఉదయం 8 గంటల వరకు వాహనాలకు లైట్లు వేసుకునే ప్రయాణిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు మంచు, చలితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
చల్చల్ గుర్రం.. తండాకో అశ్వం
కొన్ని సినిమాల్లో హీరోల పాత్ర గొప్పగా పండాలంటే.. కచ్చితంగా గుర్రాల సీన్ ఉండాల్సిందే. పాత కాలంలో ఏమో గానీ.. ఆ మధ్యన మగధీరతో మొదలైన గుర్రపు స్వారీల హవా బాహుబలితో శిఖరాగ్రానికి చేరింది. అసలు విషయానికి వస్తే.. సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ కావడానికి ఉపయోగపడే గుర్రాలు విశాఖ మన్యంలోని మారుమూల తండాల్లో దౌడు తీస్తున్నాయి. ఇక్కడి గిరిజనులకు రవాణా సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. నిజం చెప్పాలంటే ఇక్కడి గిరిజనుల జీవనంలో అశ్వాలు ఓ భాగమయ్యాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొండకోనల్లో విసిరేసినట్టుండే తండాల్లోని గిరి పుత్రులకు గుర్రాలే అసలైన నేస్తాలు. రోడ్లు లేని గ్రామాలు, అరణ్యాల నడుమ సుదూరంగా ఉండే గూడేల్ని చేరుకునేందుకు.. వర్షాకాలంలో గెడ్డలు, వాగులు దాటేందుకు గుర్రాలే సిసలైన వాహనాలు. కనీసం ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని చోటనుంచి అటవీ ఉత్పత్తుల్ని బాహ్య ప్రపంచానికి తరలించాలన్నా.. నిత్యావసర సరుకుల్ని తండాలకు తెచ్చుకోవాలన్నా ఈ ప్రాంత గిరిజనులు అశ్వాల్నే ఆశ్రయిస్తున్నారు. గూడేల్లోని గిరిపుత్రులు మండల కేంద్రాలకు.. అరకు, పాడేరు నియోజకవర్గ కేంద్రాలకు కాలి నడకన వెళ్లాలంటే కనీసం 12 నుంచి 25 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి, దిగాల్సి ఉంటుంది. తండాకు ఓ గుర్రం ఉంటే చాలు.. గిరిజనులు ఏడాది పొడవునా పండించే రాజ్మా చిక్కుళ్లు, రాగులు, జొన్నలు, కాఫీ, మిరియాలు, కొండ చీపుర్లు తదితర ఉత్పత్తులను వారపు సంతల్లో అమ్ముకునేందుకు.. సంతలో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులు, ఇతర సామగ్రిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు విశాఖ మన్యంలోని గూడేల ప్రజలు గుర్రాలపైనే వస్తారు. అత్యవసర సమయాల్లో వైద్యసేవల కోసం మండల కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు గుర్రాలనే వినియోగిస్తుంటారు. మారుమూల తండాలు, ఆవాస ప్రాంతాల్లో 10 నుంచి 15 కుటుంబాల వరకు నివసిస్తుంటాయి. వారిలో ఏ ఒక్క కుటుంబానికి గుర్రమున్నా అందరూ వినియోగించుకుంటారు. అంతా కలిసి దాన్ని పోషిస్తారు. వీటికి గడ్డి, ధాన్యం, దాణా, ఉలవలు ఆహారంగా పెడతారు. వాటిని ప్రాణ సమానంగా చూసుకుంటారు. మాడుగుల సంతలో.. మాడుగుల మండల కేంద్రంలోని వడ్డాది ప్రాంతంలో ప్రతి దసరా రోజున గుర్రాల సంత జరుగుతుంటుంది. ఒక్కో అశ్వం ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. నర్సీపట్నం సమీపంలోని కేడీ పేటలోనూ గుర్రాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అధికారిక విధులూ నిర్వర్తిస్తాయ్ - ఇక్కడి గుర్రాలను అడపాదడపా అధికారిక విధులకు సైతం వినియోగిస్తుంటారు - ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారులను తరలించేందుకు గుర్రాలే కీలకం - అటవీ ప్రాంతంలో మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన సందర్భాల్లో మృతదేహాలను తరలించేందుకు సైతం గుర్రాలనే వాడుతుంటారు. వినియోగం ఎక్కడెక్కడంటే.. - జి.మాడుగుల మండలం కిల్లంకోట, లువ్వాసింగి - గెమ్మెలి పంచాయతీల పరిధిలోని తండాలు - చింతపల్లి మండలం బలపం పంచాయతీ - కోరుకొండ పంచాయతీ పరిధిలోని సుమారు 70 పల్లెలు - జీకే వీధి మండలం గాలికొండ, అమ్మవారి దారకొండ, జర్రెల, దుప్పిలవాడ, సప్పర్ల, ఎర్రచెరువుల - మొండిగెడ్డ, దారకొండ పంచాయతీల పరిధిలోని 150 తండాలు - పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని 45 నివాస ప్రాంతాలు - గిన్నెలకోట పంచాయతీలోని 18 నివాస ప్రాంతాలు - జామిగుడ పంచాయతీలోని 19 తండాలు - ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీలోని 18 పల్లెలు - బుంగాపుట్టు పంచాయతీలోని 24 నివాస ప్రాంతాలు - రంగబయలు పంచాయతీలోని 22 తండాలు టీచర్కూ కొనిచ్చారు జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ పరిధిలోని సుర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో చుట్టుపక్కల తండాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 60 వరకు ఉంది. రోడ్డు మార్గం సరిగ్గా లేక.. ఉపాధ్యాయులు సక్రమంగా రాక విద్యార్థుల డ్రాప్ అవుట్స్ శాతం పెరిగింది. మూడు నెలల క్రితం ఇక్కడకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు గంపరాయి వెంకటరమణ ఇబ్బందులు పడుతూనే క్రమం తప్పకుండా స్కూలుకు వచ్చేవారు. దీంతో గిరిజనులంతా కలిసి ఆయనకు ఓ గుర్రాన్ని కొనిచ్చారు. ఆయన దానిపైనే వస్తూ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. గుర్రం లేకుంటే మాకు జీవనం లేదు మేం పండించిన పంటలను అమ్ముకునేందుకు చింతపల్లి దరి లంబసింగిలో ప్రతి గురువారం సంతకు వస్తుంటాం. గుర్రంపై బరువు వేసి.. మేం నడుచుకుంటూ వస్తాం. గుర్రం లేకుంటే మాకు జీవనమే లేదు. – గూడా బాబూరావు, చీడిమెట్ట గ్రామం, కిల్లంకోట పంచాయతీ, జి.మాడుగుల మండలం మా పిల్లలకు అవే నేస్తాలు మా గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే గుర్రాలే దిక్కు. అందుకే వాటిని మేం ప్రాణంగా చూసుకుంటాం. మా పిల్లలకు అవే నేస్తాలు.. మా గుర్రాన్ని మా పిల్లలు రాజు అని పిలవగానే పరుగెత్తుకు వస్తుంది. – ఎండ్రపల్లి సూరిబాబు, సుర్తిపల్లి, కిల్లంకోట పంచాయతీ, జి.మాడుగుల మండలం -
విస్తరిస్తున్న విశాఖ యాపిల్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని అరకు లోయ, లంబసింగి ప్రాంతాల్లో యాపిల్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఏజెన్సీ పరిధిలో ఇప్పటికే 10 వేల ఎకరాల్లో యాపిల్ సాగు చేస్తున్నారు. మరో 10 వేల ఎకరాల్లో గిరిజన రైతులతో యాపిల్ సాగు చేయించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రైతులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయనుంది. - వచ్చే జనవరి నుంచి గిరిజన రైతులకు మొక్కల పంపిణీకి శ్రీకారం చుడతారు - ఏడాది వయసున్న ఒక్కొక్క మొక్కకు రూ.250 చొప్పున వెచ్చించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది - లంబసింగి ప్రాంతంలో వాతావరణం యాపిల్ సాగుకు బాగా అనుకూలం - ఇక్కడ ఒక్కో సమయంలో ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీలకు పడిపోతుంది. ఎక్కువ రోజులు సున్నా డిగ్రీలు నమోదవుతుంది - హిమాచల్ ప్రదేశ్లో పండుతున్న అన్నా, డార్సెట్ గోల్డెన్ రకాలను ఇక్కడ సాగు చేయిస్తారు - రైతులు మూడేళ్లపాటు మొక్కలను సంరక్షిస్తే.. అప్పటినుంచి 20 ఏళ్ల వరకు ఫలసాయం వస్తుంది. యాపిల్ సాగుకు అనువైన ప్రాంతం పాడేరు ఐటీడీఏ పరిధిలోని అరకు లోయ, లంబసింగి, చింతపల్లి, జీకే వీధి గిరిజన గ్రామాలు యాపిల్ సాగుకు అనువైనవిగా గుర్తించాం. తక్కువ ఉష్టోగ్రతల్లో పండే యాపిల్ రకాలను ఇక్కడ సాగు చేయించాలని నిర్ణయించాం. భూసార పరీక్షలు చేయించి.. వచ్చే ఏడాది జనవరిలో గిరిజన రైతులకు మొక్కలు పంపిణీ చేస్తాం. – ఆర్పీ సిసోడియా, ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ -
80 కిలోల గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: విశాఖ నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.15.2 లక్షల విలువచేసే 80 కిలోల గంజాయి, కారు, రూ.4,200ల నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ వివరాలను నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్లో పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గుడెపు కుంట తండాకు చెందిన గుగులోతు సైదా నాయక్ అలియాస్ సైదా వృత్తి రీత్యా డ్రైవర్. అదే జిల్లా నూతంకల్ మండలం తీక్యా తండాకు చెందిన లవుడ్య అనిల్ కూడా డ్రైవర్. వీరిరువురు స్నేహితులు. ఈ ఇద్దరి ఆదాయం అంతంత మాత్రమే కావడంతో రవాణా రంగంలో ఉన్న సమయంలో విశాఖకు చెందిన గంజాయి విక్రయదారులతో ఏర్పడిన సత్సంబంధాలను ఉపయోగించి ఎక్కువగా డబ్బులు సంపాదించాలని ప్రణాళిక వేశారు. ఇందుకు వీరి స్నేహితులు సూర్యాపేట జిల్లాకే చెందిన లకావత్ వినోద్, లకావత్ హుస్సేన్ల సహకారం తీసుకున్నారు. ఇలా వీరు విశాఖ జిల్లా దారకొండ మండలం కొత్తూరు ఏజెన్సీ ప్రాంతం నుంచి అతి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్, నిజామాబాద్లోని కొందరికి అతి ఎక్కువ ధరకు విక్రయిస్తూ డబ్బులు సంపాదించడం మొదలెట్టారు. ఐదువేల లాభానికి విక్రయిస్తూ... విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి కిలో రూ.2 వేలకు కొనుగోలు చేసి తమ కొనుగోలుదారులకు దాన్ని రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. ఇలా కొత్తూరుకు చెందిన శివ నుంచి 80 కిలోల గంజాయిని కొనుగోలు చేసి కారు డిక్కీలో, సైడ్ డోర్లో, సీట్ల కింద పెట్టి హైదరాబాద్కు వస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ, మీర్పేట పోలీసులు సంయుక్తంగా గాయత్రి నగర్లో తనిఖీలు చేపట్టి గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. ఆ వెంటనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టు ఎదుట హాజరుపరిచి జ్యుడీíÙయల్ రిమాండ్కు తరలించారు. -
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు స్వస్తి
సాక్షి, అమరావతి : విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు పూర్తిగా స్వస్తి పలకాలని వైఎస్ జగన్ సర్కారు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గిరిజనుల విశ్వాసాలు, మనోభావాలను గౌరవించే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో 1521.078 హెక్టార్లకు సంబంధించిన ఆరు బాక్సైట్ మైనింగ్ లీజులను రద్దు చేస్తూ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి రాంగోపాల్ గురువారం జీఓ నంబరు 80 నుంచి 85 వరకు వేర్వేరుగా ఆరు జీఓలు జారీ చేశారు. మన ప్రభుత్వం రాగానే గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని, వారి అభిప్రాయాల ప్రకారం బాక్సైట్ తవ్వకాలకు స్వస్తి చెబుతూ మైనింగ్ లీజులను రద్దు చేస్తామని వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కాగానే అందుకు సంబంధించిన ఫైళ్లు తెప్పించుకుని పరిశీలించారు. బాక్సైట్ తవ్వకాలకు స్వస్తి చెబితే సర్కారు ఆదాయం కోల్పోతుందని కొందరు ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు సూచించినా అంగీకరించలేదు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదని, గిరిజనుల విశ్వాసాలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇందులో మరో మాటకు తావు లేదని, బాక్సైట్ మైనింగ్ లీజులు రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. తమ దశాబ్దాల కల, కోరికను నెరవేర్చిన వైఎస్ జగన్ చిరకాలం గిరిజనుల గుండెల్లో నిలిచిపోతారని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, గిరిజన ప్రజా ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. రద్దయిన మైనింగ్ లీజులు ►విశాఖ జిల్లా జెర్రెల అభయారణ్యం రెండు, ఎనిమిది బ్లాకుల్లో 617 హెక్టార్లు. ►జెర్రెల అభయారణ్యం మూడో బ్లాకులో 460 హెక్టార్లు. ►జెర్రెల అభయారణ్యం ఒకటో బ్లాకులో 85 హెక్టార్లు. ►విశాఖటపట్నం జిల్లా అరకు మండలం చిట్టంగోలి అభయారణ్యంలో 152 హెక్టార్లు. ►విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం (ఫారెస్టు బ్లాకు) రక్త కొండ గ్రామంలో 113.192 హెక్టార్లు. ►విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం గాలికొండ రిజర్వు ఫారెస్టులో 93.886 హెక్టార్లు. మాట తప్పిన బాబు.. విశాఖపట్నం జిల్లాలో 1521.078 హెక్టార్ల బాక్సైట్ నిక్షేపాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు కేటాయించింది. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే గిరిజనుల కోరిక మేరకు బాక్సైట్ మైనింగ్ లీజులు రద్దు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి రాగానే అందుకు విరుద్దంగా కేంద్రం నుంచి అనుమతులు తెప్పించి 2015 నవంబర్ 5న తవ్వకాలకు అనుమతిస్తూ జీవో జారీ చేయించారు. -
బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు: ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: విశాఖ ఏజెన్సీలో చంద్రబాబు ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన బాక్సైట్ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుకు సంబంధించిన ఫైల్పై గత గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకం చేయగా, తాజాగా అనుమతులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలు జరపబోమని.. గతంలో టీడీపీ సర్కార్ ఇచ్చిన మైనింగ్ లీజును రద్దు చేస్తామని విపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు బాక్సైట్ లీజును రద్దు చేశారు. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్ 1,2,3, గాలికొండ, చిత్తమగొండి, రక్తికొండ, చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లో బాక్సైట్ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనుల పోరాటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు ఇచ్చారు. రెండేళ్ల కిందటే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు 2,226 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు. (చదవండి: విశాఖ జిల్లాలో.. బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు) ఐదు జీవోలు జారీ.. బాక్సైట్ తవ్వకాల అనుమతులు రద్దుకు సంబంధించి మొత్తం 5 జీవోలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ►జీవో నెంబర్ 80- విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని రక్తకొండ గ్రామ పరిధిలో 113.192 హెక్టార్ల బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు ►జీవో నెంబర్ 81- చింతపల్లి, అరకులో 152 ఎకరాల బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు ►జీవో నెంబర్ 82- అనంతగరి మండలం గాలికొండలో 93.886 హెక్టార్ల మైనింగ్లీజు రద్దు. ►జీవో నెంబర్ 83 - జెర్రెల బ్లాక్–1 లో 85 హెక్టార్ల బాక్సైట్ మైనింగ్లీజు రద్దు ►జీవో నెంబర్ 84- జెర్రెల బ్లాక్–2,3లో 617 హెక్టార్లకు సంబంధించి చింతపల్లిలో మైనింగ్లీజు రద్దు ►జీవో నెంబర్ 85- చింతపల్లి రిజర్వు ఫారెస్ట్లో జెర్రెల బ్లాక్–3 లో మరో 460 హెక్టార్లలో మైనింగ్లీజు రద్దు -
విశాఖ ఏజెన్సీలో భారీ ఎన్కౌంటర్
సీలేరు (పాడేరు)/సాక్షి, అమరావతి : విశాఖ ఏజెన్సీలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఆదివారం పెద్దఎత్తున జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. పార్టీ అగ్రనాయకురాలు అరుణ ఇందులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గూడెంకొత్తవీధి మండలం సీలేరు పోలీసుస్టేషన్ పరిధిలోని మాదిగమల్లు, అన్నవరం సమీప బొడ్డమామిడికొండ ప్రాంతంలో ఆదివారం ఉ.11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..విశాఖ ఏజెన్సీలో కొంతకాలంగా మావో అగ్రనేతలు సంచరిస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున విశాఖ గ్రేహౌండ్స్ బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్కు వెళ్లాయి. ఈ క్రమంలో బొడ్డమామిడి అటవీ ప్రాంతం నుంచి ఉ.10గంటల సమయంలో 15 నుంచి 20 మంది మావోయిస్టులు కొండ దిగుతుండగా అదే సమయంలో గ్రేహౌండ్స్ బలగాలు వారికి తారసపడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది. ఘటనా స్థలిలో ఎస్ఎల్ఆర్ తుపాకి ఒకటి, రెండు 303 పిస్టళ్లు, ఆరు కిట్ బ్యాగులు, ఒక మందుపాతర లభ్యమయ్యాయి. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి ధారకొండ వారపు సంతకు వచ్చిన గిరిజనులు ఈ సంఘటన గురించి «తెలిపారు. ఎదురుకాల్పుల అనంతరం భారీవర్షం పడడంతో పోలీసు బలగాలు అడవిలోనే చిక్కుకుపోయాయి. మావోయిస్టుల మృతదేహాలను సోమవారం నాటికి బయటకు తెచ్చే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, ఎదురుకాల్పుల్లో మావోలు మృతిచెందిన అనంతరం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, సీఆర్ïపిఎఫ్ దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. పరారైన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. వారోత్సవాలతో పోలీసుల హైఅలర్ట్ కాగా, ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు పసిగట్టడంతో పోలీసులు ఏఓబీలో హైఅలర్ట్ ప్రకటించారు. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన వారోత్సవాల సమయంలోనే 2018 సెప్టెంబర్ 23న అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. వీరిరువురినీ దగ్గర్నుంచి కాల్చింది అరుణ అని అప్పట్లో పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ఇటీవల ఈస్ట్ జోన్కు వచ్చిన అరుణ అలియాస్ వెంకట రవిచైతన్య.. ప్రస్తుతం విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఆమె 2015లో నాటి కరీంనగర్జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు అగ్రనేత ఆజాద్కు సోదరి. అయితే, తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో అరుణ మృతిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. షెల్టర్ కోసం రాష్ట్ర సరిహద్దు జిల్లాలకు.. గత కొన్నేళ్లుగా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ఏఓబీతోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనమైన తెలంగాణ మండలాల్లో మావోల కదలికలు మళ్లీ కనిపిస్తున్నాయి. షెల్టర్జోన్గా వీరు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో మావోలు వారోత్సవాలు నిర్వహిస్తుండడం.. ఆ పార్టీ అగ్రనేతలు అందులో పాల్గొనే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలో ఆదివారం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కాగా, ఎన్కౌంటర్ సమాచారం తెలుసుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏఓబీ సరిహద్దు జిల్లాల ఎస్పీలు, గ్రేహౌండ్స్, ఎస్పీఫ్ దళాల పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
గిరి పల్లెల్లో విద్యుత్ కాంతులు
ఒకటి.. రెండు కాదు ఏకంగా 125 గిరిజన గ్రామాలకు విద్యుత్ సమస్య తొలగిపోయింది. తూర్పువిద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఎస్ఈ టి.వి.సూర్యప్రకాశ్ బుధవారం కృష్ణాదేవిపేట నుంచి కాకరపాడు వరకు వేసిన 26 కిలోమీటర్ల 11 కేవీ విద్యుత్ లైన్ను ప్రారంభించారు. దీంతో ఇంత వరకు పూర్తిస్థాయి విద్యుత్ సరఫరాను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం 132)33 కేవీ నుంచి పొందిన కాకరపాడు సబ్స్టేషన్ ఇప్పుడు దానిని ప్రత్యామ్నాయంగా వాడనుంది. కృష్ణాదేవిపేట 33/11కేవీ లైన్ నుంచి సరఫరా అవుతుంది. రూ.2.5 కోట్లతో 26 కిలోమీటర్ల దూరంలో 443 స్తంభాలను, 35 టవర్లను నిర్మించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా కానుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కొయ్యూరు/గొలుగొండ: విద్యుత్ సమస్యలు గిరిజనులకు తీరనున్నాయి. ఇప్పటి వరకూ వేరే జిల్లా నుంచి విద్యుత్ సరఫరా అయ్యే సందర్భంలో సాంకేతిక కారణాలతో పడిన ఇబ్బందులను గిరిజనులు ఇక మరచిపోవచ్చని ఈపీడీసీఎల్ ఎస్ఈ సూర్యప్రకాశ్ అన్నారు. కృష్ణాదేవిపేటలో కాకరపాడుకు సబ్స్టేషన్కు వేసిన ప్రత్యేక విద్యుత్లైన్ను ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఇక నుంచి కాకరపాడుకు కృష్ణాదేవిపేట నుంచి విద్యుత్ సరఫరా అవుతోందదన్నారు. ఏ కారణంతోనైనా విద్యుత్ నిలిచినా వెంటనే తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి నుంచి సరఫరా పొందవచ్చన్నారు. ప్రతీ గ్రామానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టామన్నారు. మన్యంలో విద్యుత్ లేని గ్రామాలు 126 ఉన్నాయన్నారు. వాటికి విద్యుత్ సౌకర్యం కోసం రూ.28 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. జి.మాడుగుల–చింతపల్లి మధ్య ప్రత్యేక లైన్ జి.మాడుగుల–చింతపల్లి మధ్య ప్రత్యేక లైన్ వేసేందుకు 36 కిలోమీట్లకు రూ.నాలుగు కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రతిపాదించినట్టు ఎస్ఈ చెప్పారు. దీనికి అనుమతి వస్తే పనులు ప్రారంభిస్తారన్నారు. ఈ లైన్ వేస్తే చింతపల్లికి కూడా విద్యుత్ సమస్య చాలా వరకు తొలగిపోతుందన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో కొన్నింటిని ప్రతిపాదించామన్నారు. రూ.వంద కోట్లతో 30 సబ్స్టేషన్లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. వీటిలో ఎక్కువగా విశాఖ నగరంలో నిర్మాణం అవుతుండగా... నర్సీపట్నంలో కూడా ఒకటి నిర్మాణ దశలో ఉందన్నారు. లైన్మెన్ల నియామకానికి చర్యలు జిల్లాలో 550 మంది జూనియర్ లైన్మెన్లను నియమించేందుకు చర్యలు తీసుకున్నట్టు ఎస్ఈ సూర్యప్రకాశ్ చెప్పారు. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చన్నారు. వారు వస్తే సిబ్బంది కొరత తీరుతుందన్నారు. ప్రస్తుతానికి ఏఈల కొరత లేదన్నారు. వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒకే ఫీడర్ ఉండాలని ప్రతిపాదించినట్టు వెల్లడించారు. దీనికిఅనుమతి వస్తే వారికి ప్రత్యేక ఫీడర్ ఇచ్చేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. అనంతరం ఆయన కాకరపాడు వరకు లైన్ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈ పి. ఆహ్మద్ఖాన్, ఏడీఈ లక్ష్మణరావు, నిర్మాణాల డీఈ టీఎస్ఎన్ మూర్తి, ఏడీఈ అప్పన్నబాబు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ వేదన!
సాక్షి, అనంతగిరి(అరకులోయ): ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రహదారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో వైద్యసేవలు పొందడానికి గిరిజనులు కాలినడకన, లేదా డోలీల్లో ఆస్పత్రులకు చేరుకోవలసి వస్తోంది. ఆస్పత్రులకు చేరే వరకు వారి ప్రాణాలు నిలు స్తాయన్న నమ్మకం ఉండడం లేదు. ఇలా తరలించే సమయంలో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పాడేరు, అరకులోయ మండలాల్లో ఈ పరిస్థితి నిత్యం ఎదురవుతోంది. ఒకే కుటుంబా నికి చెందిన, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు యువకులను కుటుంబ సభ్యులు ఏడు కిలోమీటర్లు డోలీలో తరలించవలసి వచ్చింది. అనంతగిరి మండలం అనంతగిరి పంచాయతీ డెక్కపురం, హుకుంపేట మండలం పట్కదవడ గ్రామాలు సమీపంలో పక్కపక్కన ఉన్నాయి. వీటికి రహదారి సౌకర్యం లేదు. డెక్కపురానికి చెందిన గెమ్మలి విజయ్ అనే యువకుడు కొద్దిరోజులుగా మతిస్థిమితం లేక బాధపడుతున్నాడు. పట్కదవడ గ్రామానికి చెందిన గెమ్మెలి చంటి అనే యువకుడికి గుండెనొప్పి వచ్చింది. వీరి ఆరోగ్య పరిస్థితి సోమవారం క్షీణించింది. దీంతో ఆ గ్రామాల నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపురం వరకు వారిని రెండు డోలీల్లో దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా మోసుకొచ్చారు. అక్కడి నుంచి ఆటోలో అనంతగిరి పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవల కోసం చంటిని అరకులోయ ఏరియా ఆస్పత్రికి, విజయ్ను కేజీహెచ్కు తరలించారు. తాము ఈ బాధలు భరించలేకపోతున్నామని, అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని ఆ రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
అయ్యో.. పాపం!
పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆ తల్లి కన్న కలలు ఆవిరయ్యాయి. భూమి మీద పడకుండానే.. లోకాన్ని చూడకుండానే బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తొమ్మిది నెలలు మోసిన మాతృమూర్తి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘోరం పాడేరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. రహదారి లేని కారణంగా కాలినడకన ఆస్పత్రికి వెళ్లే ప్రయత్నంలో బిడ్డ చనిపోయి జన్మించాడు. ఇలాంటి సంఘటనలు మన్యంలో తరచూ జరుగుతున్న పాపానికి గత పాలకుల నిర్వాకమే కారణమని ప్రజలు మండిపడుతున్నారు. సాక్షి, పాడేరు రూరల్ : మన్యంలో గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు నేటికీ కష్టాలను అనుభవిస్తున్నారు. కనీస రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడం వీరికి శాపంగా మారింది. దీంతో కొన్నాళ్లుగా మన్యంలో మాతాశిశు మరణాలు ఆగటం లేదు. తాజాగా పాడేరు మండలం వై.సంపలలో గర్భిణి వంతాల జ్యోతి ప్రసవ వేదనకి గురై ప్రసవ సమయంలో తన బిడ్డను కోల్పోవలసి వచ్చింది. వంతాల జ్యోతి నాలుగోసారి గర్భం దాల్చింది. నెలలు నిండడం శనివారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మినుములూరు పీహెచ్సీ, ఏఎన్ఎం పద్మకు సమాచారం ఇచ్చారు. అయితే వై.సంపల గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేదు. దీంతో జ్యోతిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడ్డారు. డోలిలో తరలించేందుకు కూడా రహదారి సరిగ్గా లేదు. అలాగే చేతిలో డబ్బులు కూడా లేని పరిస్థితి. దీంతో చేసేది లేక కుటుంబ సభ్యులు నిండు గర్భిణి జ్యోతిని అడవి మార్గం మీదుగా కాలినడకన పాడేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆమె మగబిడ్డను ప్రసవించింది. కానీ కాలినడకన సుమారు 5 కిలోమీటర్ల మేర నడవడంతో బిడ్డ చనిపోయి పుట్టాడు. రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ కూడా సగం వరకూ వెళ్లి ఆగిపోయింది. ఏఎన్ఎం పద్మ అక్కడకు వెళ్లి వైద్య సేవలందించారు. గత పాలకులు తమ గ్రామానికి రోడ్డు నిర్మంచలేదని వై.సంపల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్యంలో మాతాశిశు మరణాల్లో కొన్ని... - అనంతగిరి మండలంలో గత ఐదు రోజుల వ్యవధిలో ఐదుగురు శిశులు, ఒక గర్భిణి ప్రాణాలు కోల్పోయారు. -రెండు రోజుల క్రితం పాడేరు మండలం లగిసపల్లి గ్రామానికి చెందిన మూడు నెలల శిశువు మృతి చెందింది. -గత 10 రోజుల వ్యవధిలో పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, డుంబ్రిగూడ, అనంతగిరి, మండలాల్లో తొమ్మిది మంది శిశువులు, ఐదుగురు గర్భిణులు మృత్యువాత పడ్డారు. -
క్షణమొక యుగంలా..!
సాక్షి,దేవరాపల్లి (దేవరాపల్లి): పురిటినొప్పులు భరించి, ప్రసవించడం ఆడవాళ్లకు పునర్జన్మతో సమానం. అయితే బిడ్డను చూడగానే కష్టాన్నంతా మరిచిపోయి మమకారపు మధురిమలు ఆస్వాదిస్తారు. కానీ మన్యంలో మహిళలకు ప్రసవ వేదన కాస్తా నరకయాతనగా మారుతోంది. వారి జీవితాల్లో భయానక ఘటనగా మిగులుతోంది. ఇందుకు అనంతగిరి మండలం పినకోట పంచాయతీ చిందులపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన ఘటనే నిదర్శనం.. గ్రామానికి చెందిన నిండు గర్భిణి జన్ని లక్ష్మి నరకయాతన అనుభవించింది. శుక్రవారం ఉదయం 4 గంటలకు పురిటినొప్పులు రావడంతో దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా కుటుంబ సభ్యులు తట్టలో కూర్చోపెట్టి ఐదు కిలోమీటర్లు డోలీ మోశారు. ఈ గ్రామానికి ఫోన్ సదుపాయంతో పాటు రహదారి సౌకర్యం కూడా లేక పోవడంతో ఎంత ప్రమాదకర పరిస్థితి అయినా కాలి నడకే దిక్కు. దీంతో పురిటి నొప్పులతో విలవిల్లాడిపోతున్న గర్భిణీని కొండలు, గుట్టలు దాటించి మోసుకొచ్చారు. తల్లీబిడ్డ క్షేమం.. దేవరాపల్లి పీహెచ్సీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్లిపురం గ్రామానికి ఆశా కార్యకర్త బుచ్చమ్మ కుటుంబ సభ్యుల సహకారంతో అతి కష్టం తీసుకొచ్చారు. లక్ష్మీ భర్త దేముడు ముందుగా బల్లిపురానికి చేరుకొని ఏఎన్ఎం పుష్పకు సమాచారం అందించడంతో ఆమె అక్కడి నుంచి ఆటోలో దేవరాపల్లి పీహెచ్సీకి తీసుకెళ్లారు. పీహెచ్సీ సిబ్బంది సుఖప్రసవం చేయించడంతో లక్ష్మి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
నిత్యం భయం.. జీవనం దుర్భరం
సాక్షి, గూడెంకొత్తవీధి(పాడేరు): అదో గిరిజన కుగ్రామం. ఆ గ్రామం పేరు మండపల్లి. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దులో ఉంది. జిల్లా సరిహద్దుతో పాటు గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలకు కూడా ఇదే సరి హద్దు గ్రామం. సరిహద్దు ప్రాంతంలో అత్యంత మారుమూల ప్రాంతంలో ఉండడంతో మండపల్లి రెండింటికీ చెడ్డ రేవడిలా ఉంది. దశాబ్దాలుగా కనీస అభివృద్ధి నోచుకోకుండా తల్లడిల్లుతోంది ఈ గ్రామం. ఈ గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈనెల 19న ఈగ్రామం వద్దే పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి, గతంలో ఈ గ్రామానికి సమీపంలో మావోయి స్టులు శిక్షణ ఇవ్వడంతో అప్పుడో సారి గ్రామం పేరు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. తరచూ మావోయిస్టులు, పోలీసులు గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండడంతో గ్రామస్తులు బితుకు బితుకు మంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామాన్ని మావోయిస్టులు, పోలీసులు తప్ప అధికారులు సందర్శించిన దాఖలాలు లేవు. దీంతో కనీస సౌకర్యాలకు నోచుకోక దుర్భర పరిస్థితుల్లో మండపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు బతుకులు వెళ్లదీస్తున్నారు. దారుణంగా రోడ్డు.. మండపల్లి గ్రామం దట్టమైన కొండల మధ్య సుదూర ప్రాంతంలో ఉంది. భౌగోళికంగా ఈ గ్రామాన్ని కొయ్యూరు మండలంలో విలీనం చేశారు. మండపల్లి గ్రామస్తులు కొయ్యూరు మండల కేంద్రానికి వెళ్లాలంటే కాలిబాటే శరణ్యం. కొండలు ఎక్కి, వాగులు దాటి సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే జీకే వీధి మండలానికి రావాలంటే దారుణంగా ఉన్న మార్గంలో 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. గతంలో ఈ గ్రామానికి చెందిన గిరిజనులు శ్రమదానంతో రహదారి బాగు చేసుకున్నారు. అయితే గతంలో కురిసిన భారీ వర్షాలకు రహదారి అంతా కొట్టుకుపోయింది. కొండల పైనుంచి వర్షపు నీరు ప్రవాహానికి రహదారి కోతకు గురై రాళ్లమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్, తాగునీరు గగనమే.. మారుమూల గ్రామం కావడంతో పాటు రహదారి సౌకర్యం లేక ఈ గ్రామానికి విద్యుత్, తాగునీరు వంటి సదుపాయాలేవీ దరిచేయడం లేదు. విద్యుత్ సదుపాయం లేనికారణంగా ప్రత్యామ్నాయంగా గతంలో ప్రభుత్వం సోలార్ ప్లాంటు ఏర్పాటు చేశారు. కానీ ఇది సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేక చీకటిలోనే మగ్గుతున్నారు. తాగునీటికి కూడా దయనీయ పరిస్థితి. పొలం గట్ల వద్ద వచ్చే నీరు, వాగుల నుంచి వచ్చే నీటిని తాగునీటికి వినియోగించడంతో రోగాల బారినపడి ప్రతి ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. పింఛన్లు రద్దు.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామానికి చెందిన 15 మంది వరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రావాల్సిన ఫించన్ పూర్తిగా రద్దయింది. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. గత ఐదేళ్లలో గ్రామంలో ఏఒక్క ఉపాధి పనికూడా నిర్వహిం చకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, రహదారి లేకపోవడం వల్లే ఏ ఒక్క అధికారి కూడా తమ గ్రామానికి రావడం లేదని, కొయ్యూరు మండలానికి వెళ్లి అధికారులకు తమసమస్య చెప్పుకున్నా కనీసం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామ సచివాలయాల ఏర్పాటుతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించడంతో ఈ సారైనా తమ గ్రామాలు బాగుపడతాయన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపాలెం, కొమ్ము సంపంగి, కోతిగొంది, వెదురులంక, పుత్తకోట తదితర గ్రామాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. -
గిరిజన యువతి దారుణ హత్య
అరకులోయ: భార్య ఉండగానే, నెల రోజుల క్రితం రెండో వివాహం చేసుకొని ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన అరకులోయలో కలకలం సృష్టించింది. విశాఖ ఏజెన్సీ అరకులోయ మండలం చినలబుడు గ్రామానికి చెందిన కిల్లో పుష్ప (20) అనే గిరిజన యువతిని, అరకులోయకు చెందిన గిరిజనుడు కె.రమేష్ (25) ప్రేమించాడు. అతనికి అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పుష్పను రెండో వివాహం చేసుకుని, స్థానిక సి.కాలనీలో కాపురం పెట్టాడు. రమేష్ రెండో వివాహం చేసుకున్న తరువాత కుటుంబ కలహాలు అధికమైనట్టు తెలిసింది. గిరిజనేతర యువతి రాజేశ్వరిని కూడా ఐదేళ్ల క్రితం రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి ఒత్తిడి అధికం కావడంతో పుష్పను అడ్డు తొలగించుకునేందుకు భర్త రమేష్ ఈ హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు కూడా పుష్ప హత్యకు సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్ప మీసేవ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేస్తోంది. పుష్పను శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో భర్త రమేష్ బయటకు తీసుకువెళ్లినట్టు చుట్టు పక్కల వారు చెబుతున్నారు. శనివారం ఉదయాన్నే శరభగుడ సమీపంలోని నీలగిరి తోటలలో సగం వరకు బట్టలు లేకుండా ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, సీఐ పైడయ్య, ఎస్ఐ అరుణ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రమేష్పై అనుమానం వచ్చి పోలీసులు రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. అతని మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు ధర్మారావు, అనసూయలను కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పుష్ప ధరించిన చున్నీనే ఆమె మెడకు బిగించి హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. కాగా, హత్యకు గురైన పుష్ప తల్లిదండ్రులు కిల్లో పరశురామ్, పుణ్యవతితో పాటు, కుటుంబ సభ్యులు, బంధువులు అరకులోయలో ఆందోళన చేపట్టారు. నిందితులను అరెస్టు చేశామని, కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హమీ ఇవ్వడంతో వారు శాంతించారు. మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
గంగ.. మన్యంలో మెరవంగ
ఆ అమ్మాయికి ‘జీవనది’ గంగమ్మ పేరు పెట్టారా తల్లిదండ్రులు. పేరుకు తగ్గట్లే.. కష్టాలు కూడా.. ఆ చిన్నారిని వెంటాడాయి. మన్యంలో పుట్టినా.. చదువంటే ప్రాణంగా భావించింది. కష్టాలు రోజురోజుకీ పెరిగాయి. తండ్రి మరణంతో చదువును వదిలేయాలనుకుంది. కూతురి ఆశయాన్ని బతికించేందుకు తల్లి ముందుకొచ్చింది. కూలీ పని చేసుకుంటూ గంగను బడికి పంపింది. గంగ ప్రస్థానాన్ని తెలుసుకున్న ‘నన్హీకలీ’ అనే స్వచ్ఛంద సంస్థ వెన్నుతట్టింది. అంతే చదువులో గంగా ప్రవాహం పరుగులెత్తింది. పీఈటీగా ఉద్యోగం సాధించింది. మన్యంలోనే సేవలందిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ మారుమూల మండలమైన హుకుంపేట మండలం తాడిపుట్టులో బొజ్జయ్య, భీమలమ్మ దంపతులకు పుట్టింది గంగమ్మ. పేదరికం ఆ కుటుంబంపై పగబట్టింది. అభివృద్ధికి దూరంగా విసిరేసినట్లుండే ఆ గ్రామంలో పుట్టి పెరిగిన గంగమ్మకు చదువుకోవాలనే ఆకాంక్ష కలిగింది. తల్లిదండ్రులు ప్రభుత్వ బడికి పంపించారు. గ్రామంలోని పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన గంగకు.. పాఠాల్లో నేర్చుకున్న జీవిత గాధలు విని.. భవిష్యత్తు గురించి ఆలోచించే భావనలు మొదలయ్యాయి. పెద్ద చదువులు చదువుతానని.. ప్రభుత్వ కొలువు సాధిస్తానంటూ తల్లిదండ్రులతో చెప్పేది. కానీ.. ఆరో తరగతి చదవాలంటే.. ఆమడ దూరం వెళ్లాల్సిందే. ఇంట్లో వద్దని చెప్పినా.. గంగ పట్టుబట్టడంతో హుకుంపేటలోని హైస్కూల్లో చేర్పించారు. రెండు గంటల పాటు నడిచి వెళ్తేనే హైస్కూల్కి చేరుకోగలరు. అయినా పట్టు విడవక రోజూ నడిచి వెళ్లి క్లాస్ ఫస్ట్ వచ్చేది. తండ్రి మరణంతో.... గంగమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి బొజ్జయ్య మరణించాడు. దీంతో కుటుంబ పోషణ భారమైపోయింది. ఆశలు, లక్ష్యాలు పక్కనపెట్టి.. కుటుంబ పెద్ద భారం మోయాలని నిర్ణయించుకుంది. తల్లి మాత్రం ..తాను కష్టపడతాను.. చదువుకో అని చెప్పడంతో.. నెల రోజుల విరామం తర్వాత.. పాఠశాల మెట్లు ఎక్కింది గంగ. రోజు కూలీగా చేరిన తల్లి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. నన్హీకలీ ఫౌండేషన్ చేయూతతో... అదే సమయంలో మన్యంలో పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఆ ప్రాంతానికి వచ్చిన నన్హీకలీ ఫౌండేషన్ ప్రతినిధులు.. చదువులోనూ, ఆటపాటల్లోనూ గంగమ్మ చురుకుదనం చూసి ముగ్ధులయ్యారు. ఆమె కుటుంబ పరిస్థితులు చూసి చలించిపోయారు. వెంటనే గంగమ్మ విద్యా బాధ్యతను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రి అందించి ప్రోత్సహించారు. పదోతరగతి ఏ గ్రేడ్లో పాసయిన గంగమ్మకు.. ఆత్మ విశ్వాసం రెట్టింపైంది. నన్హీకలీ కమ్యూనిటీ అసోసియేట్ ట్యూటర్ల సహాయంతో ఇంటర్మీడియట్ను ఏపీ గిరిజన సంక్షేమ ప్రాంతీయ జూనియర్ కాలేజీలో చేరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైంది. తాడిపుట్టు గ్రామంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తిగా గంగమ్మ చరిత్రకెక్కింది. డిగ్రీ వద్దనుకొని.... ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత తొలుత డిగ్రీ పూర్తి చెయ్యాలని నిర్ణయించుకుంది గంగమ్మ. అయితే.. డిగ్రీ పూర్తి చేసేందుకు మూడేళ్ల సమయం పడుతుందనీ.. ఆ తర్వాత ఉద్యోగం కోసం మరికొన్ని సంవత్సరాలు శ్రమించాల్సి వస్తుందని భావించింది. డిగ్రీ విద్యని మొదటి సంవత్సరంలోనే స్వస్తి చెప్పింది. హైదరాబాద్లోని దోమల్గూడలోని గవర్న్మెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేరి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ పొందింది. తన జీవితంలో ఎదురైన ప్రతికూలతలను అనుకూలతలుగా మలచుకుని..పీఈటీగా ఉద్యోగం సాధించింది గంగమ్మ. అరకులోని పెదగరువు పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తోంది. జీవితంలో ఎదురైన ప్రతి పాఠాన్నీ నేర్చుకొని.. లక్ష్యం వైపు దూసుకుపోయిన గంగను గ్రామస్తులు అభినందనల్లో ముంచెత్తారు. అమ్మ మాటలే స్ఫూర్తి... పదమూడేళ్ల వయసులో నాన్న చనిపోయినప్పుడు.. చదువు మానేసి అమ్మతో పాటు పనిలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అయితే అమ్మ దీనికి ఇష్టపడలేదు. చదువుతోనే ఏదైనా సాధ్యమవుతుందనీ, ఊరికి మంచి పేరు తీసుకురావాలని అమ్మ చెప్పింది. అప్పుడే మన కష్టాలన్నీ తీరిపోతాయని అమ్మ చెప్పింది. అప్పటి నుంచి వెనుదిరగలేదు. కష్టపడి చదువుతున్న సమయంలో నన్హీకలీ ఫౌండేషన్ నన్ను అక్కున చేర్చుకుంది. వారి ప్రోత్సాహంతోనే ఇంత వరకు రాగలిగాను. ఏ కష్టం వచ్చినా నన్ను ఆదుకున్నారు. – గంగమ్మ, పీఈటీ, పెదగరువు పాఠశాల -
ఏజెన్సీలో మళ్లీ అలజడి
విశాఖ ఏజెన్సీలో మళ్లీ అలజడి మొదలైంది. కొయ్యూరు గూడెంకొత్తవీధి మండలాల సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య సోమవారం రెండుసార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని ప్రచారం జరుగుతున్నా వాటిని పోలీసులు నిర్ధారించడం లేదు. తాజా ఎదురు కాల్పులతో మన్యం మరోసారి భయం గుప్పెట్లోకి వెళ్లింది. గూడెంకొత్తవీధి/కొయ్యూరు: పోలీసులు–మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుసుకున్న గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గాలికొండ ఏరియా కమిటీకి చెందిన జగన్ ఆధ్వర్యంలో 30 మంది మావోయిస్టులు పుట్టకోట నుంచి మండపల్లి వైపునకు వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అదే సమయంలో మందపల్లి మీదుగా కూంబింగ్ చేసుకువస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో తొలుత మావోయిస్టులే పోలీసులపై కాల్పులను జరిపినట్టు తెలిసింది.దీనికి ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించారు. సుమారు 15 నిమిషాల పాటు కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. దీని తరువాత భారీగా వచ్చిన పోలీసులు సమీప ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరోసారి పోలీసులు–మావోయిస్టుల మధ్య సుమారు 20 నిమిషాల పాటు కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. తరువాత పోలీసు బలగాలు నలుదిక్కులా వెళ్లి కూంబింగ్ను ముమ్మరం చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం దీన్ని నిర్ధారించలేదు. ఒకే రోజు రెండుసార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో మండపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. భారీగా మావోయిస్టులు.. సుమారు 30 మంది మావోయిస్టులు కాల్పుల్లో పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వారిలో ఒకరు లేదా ఇద్దరైనా మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాలు ఉంటాయ ని ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి సమీపంలో ఉన్న ప్రాంతాల్లోను గాలిస్తున్నారు. వంటపాత్రలు స్వాధీనం.. ఇదిలా ఉంటే సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులు వంట చేసేందుకు ఉపయోగించే వంటపాత్రలను, పచ్చని షీట్లను, విప్లవసాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏం జరుగుతుందోనని మందపల్లి గ్రామస్తులు ఆందోళనతో ఉన్నారు. గతంలో.. ఈ ఏడాది జూన్లో ప్రస్తుతం ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతానికి దగ్గరలో తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి మండలం గుల్లవల్లి ప్రాం తంలో ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు ప్లీనరి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం తెలియడంతో పోలీసులు కూంబింగ్ ఉధృతం చేశారు.అప్పట్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నారు. దానిలో అక్కిరాజు హరిగోపాల్ అలియస్ ఆర్కే ఉన్నారని వార్తలు వచ్చాయి. సరిగ్గా మూడు సంవత్సరాల కిందట ఇదే మందపల్లి ప్రాంతంలో ప్రస్తుతం కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న గంగన్న అలియస్ బస్వరాజు పున్నయ్య 15 రోజుల పాటు మావోయిస్టులకు శిక్షణ ఇచ్చినట్టుగా వార్తలు రావడంతో అప్పట్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు అదే ప్రాంతానికి సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి. -
ఆంత్రాక్స్ ముప్పు పట్టించుకోని గిరిజనం
హుకుంపేట (అరకులోయ): మన్యంలో ప్రతి ఏడాది ఆంత్రాక్స్ వ్యాధి తీవ్రత నెలకొంటున్నప్పటికీ గిరిజనులు మాత్రం ఆ వ్యాధి గురించి ఏ మాత్రం భయపడడం లేదు. కొన్ని వర్గాల గిరిజనులు మాత్రం పశుమాంసం వినియోగాన్ని మానడం లేదు. అయితే పశు వైద్యుల పరీక్షలు అనంతరం పశువులను వధించి, తరువాత మాంసంపై పశుసంవర్థ్ధకశాఖ సీల్ వేయాలనే నిబంధనలను పశువైద్యులు, సంబంధిచ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. పశువైద్యుల సూచనలు మేరకు తాజా పశు మాంసాన్ని బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ ఏజెన్సీలో మాత్రం వ్యాపారులు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పలు వ్యాధులతో బక్కచిక్కిన పశువులు, చనిపోవడానికి కొన ఊపిరితో ఉన్న పశువులు, ఒక్కో సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మృతి చెందిన పశువులను వధించి, సంతల్లో విచ్చలవిడిగా పశుమాంసం అమ్మకాలు జరుపుతున్నారు. అయితే పశు మాంసం అమ్మకాలు వ్యాపారులకు సిరులు కురిపిస్తుండగా వినియోగిస్తున్న గిరిజనులు మాత్రం పలు రోగాల బారిన పడుతున్నారు. వ్యాధులతో చనిపోయిన పశువులను ఖననం చేయకుండా, వాటిని కోసిన వారికి, అలాగే ఈ మాంసం వండుకు తిన్నవారికి ఆంత్రాక్స్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని చర్మవ్యా«ధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతి శనివారం హుకుంపేట సంతలో ఆవులను వ«ధించిన వ్యాపారులు, ఎలాంటి పశువైద్యులు పరీక్షలు లేకుండానే యథేచ్ఛగా∙ఈ మాంసాన్ని భారీగా విక్రయిస్తున్నారు. అయితే బక్కచిక్కి,బాగా నీరసించిన పశువులనే కోస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమాయక గిరిజనులు ఈ పశు మాంసాన్నే కొనుగోలు చేసి తమ ఇళ్లకు తీసుకు వెళుతున్నారు. సంతలోనే వంటలు.. పశుమాంసాన్ని కొంతమంది సంతలోనే వండి ఫాస్ట్ఫుడ్ మాదిరిగా వ్యాపారం చేస్తున్నారు. సంతల్లో కల్లు, ఇతర మద్యం సేవిస్తున్న గిరిజనులు ఈ పశుమాంసం తింటున్నారు. పశుమాంసంను బాగా ఉడకబెట్టి నాణ్యంగా తయారు చేసిన తరువాత తింటే అనారోగ్య సమస్యలు ఉండవని వైద్యులు చెబుతుండగా, ఈ సంతలో మాత్రం నామమాత్రంగా అక్కడికక్కడే ఉప్పు కారం వేసి, ఉడకబెట్టి విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ పశుమాంసంను తింటున్నారు. తనిఖీలు జరుపుతాం.. సంతలో పశువుల వధ. మాంసం నాణ్యతను నిర్థారించేందుకు తనిఖీలు చేపడుతున్నాం. అనారోగ్యంతో బాధపడే పశువులు, మృతి చెందిన పశువుల మాంసం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – సునీల్, పశువైద్యాధికారి -
విశాఖ ఏజెన్సీని ముంచెత్తిన వర్షాలు
సాక్షి, అమరావతి/ సాక్షి, నెట్వర్క్: విశాఖ జిల్లా మన్యంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మండల కేంద్రాలతో గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ముంచంగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ కర్లపొదోర్ గ్రామ సమీపంలోని కల్వర్టు వరద ఉధృతికి శనివారం పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో లక్ష్మీపురం, బుంగాపుట్టు పంచాయతీలకు చెందిన 27 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే ఒడిశా రాష్ట్రంలోని మూడు పంచాయతీలకు చెందిన 53 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కల్వర్టు కొట్టుకుపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ముంచంగిపుట్టు సంతకు వచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. అత్యవసరంగా సరుకులు కావాల్సిన వారు ధైర్యం చేసి గెడ్డలు దాటి సంతకు వచ్చారు. కల్వర్టు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కల్వర్టు కోతకు గురైందని, మరమ్మతులు చేపట్టాలని గతంలో అనేకమార్లు అధికారులను కోరినా స్పందించలేదని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టును పునరుద్ధరించాలని కోరుతున్నారు. మరోవైపు డొంకరాయి జలాశయం నిండుకుండలా మారి ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు ఒక గేటుని ఎత్తి వరద నీటిని శబరి నదిలోకి విడిచిపెట్టారు. జలకళతో తొణికిసలాడుతున్న సీలేరు జలాశయం. (ఇన్సెట్లో) డ్యాం నుంచి విడుదలవుతున్న నీరు 31న మరో అల్పపీడనం ఆదివారం, సోమవారం కోస్తాంధ్రలో జల్లుల నుంచి ఒక మోస్తరు వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం పేర్కొంది. రాబోయే మూడు రోజులు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు రెండో వారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయనీ.. దీనివల్ల లోటు ప్రభావం పూర్తిగా పోతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో గత 24 గంటల్లో 25.7 మి.మీ వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కృష్ణా జిల్లాలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవగా, శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా వత్సవాయి మండలంలో 67.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కంకిపాడులో 6.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. విజయవాడ అర్బన్తోపాటు కొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవగా లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. కాగా, తూర్పు గోదావరి జిల్లాలో గత 24 గంటల్లో 26.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అరకు–పాడేరు ప్రధాన రోడ్డులో చేరిన వరద నీరు రాష్ట్రంలో నమోదైన వర్షపాత వివరాలివీ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం చింతూరులో 11 సెంమీ, పాలకోడేరులో 7, నర్సీపట్నంలో 6, అమలాపురం, పాడేరు, వరరామచంద్రాపురం, కూనవరం, అరకు లోయ, ఎమ్మిగనూరులో 5 సెం.మీ, విజయవాడ, కంభం, గుడివాడ, యలమంచిలి, యర్రగొండపాలెం, చింతపల్లిలో 4 సెం.మీ, నూజివీడు, అవనిగడ్డ, తుని, వేలేరుపాడు, అర్ధవీడు, మచిలీపట్నం, తిరువూరు, గుంటూరు, కొయిడా, భీమవరం, ఏలూరు, తెనాలి, కైకలూరు, శృంగవరపుకోట, వేపాడ, వెలిగండ్ల, బెస్తవారిపేట, బెలగల, గొనెగండ్ల, నంద్యాల, శ్రీశైలం, నందవరంలో 3 సెం.మీ, కుక్కునూరు, కావలి, నర్సాపురం, పొదిలి, రేపల్లె, నందిగామ, భీమడోలు, రాచెర్ల, చింతలపూడి, నెల్లిమర్ల, బొబ్బిలి, యానాం, మార్కాపురం, కొనకొనమిట్ల, నందికొట్కూరు, గూడూరు, రుద్రవరం, ఓర్వకల్లు, కర్నూలులో 2 సెం.మీ వర్షం కురిసింది. అదేవిధంగా విజయనగరం, కొమరాడ, పార్వతీపురం, అనకాపల్లి, పత్తిపాడు, నెల్లూరు, ధవళేశ్వరం, పోలవరం, బొందపల్లి, మర్రిపూడి, గజపతినగరం, ఉయ్యూరు, తాడేపల్లిగూడెం, ముండ్లమూరు, పూసపాటిరేగ, చోడవరం, అచ్చంపేట, దర్శి, మెంటాడ, డెంకాడ, అనకాపల్లి, రణస్థలం, కొయ్యలగూడెం, తెర్లాం, సీతానగరం, చీమకుర్తి, సంతమాగులూరు, పెద్దాపురం, జియ్యమ్మవలస, అద్దంకి, కురుపాం, మాచర్ల, ఒంగోలు, తణుకు, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, పత్తికొండ, జూపాడు బంగ్లా, పగిడ్యాల, బనగానపల్లిలో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు
హైదరాబాద్: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు అంతరాష్ట్ర ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ, మీర్పేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 82 కిలోల గంజాయి, ఒక బైక్, రూ.35 వేల నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూలు జిల్లాకు చెందిన కమోజీ కొండల్ (31) నగరంలో మీర్పేటలో నివాసం ఉంటూ గంజాయి సరఫరా చేస్తున్నాడు. కొండల్ 2017లో గంజాయి సరఫరా చేస్తూ తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మోతిగూడం పోలీసు స్టేషన్లో పట్టుబడాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. జైల్లో తూర్పు గోదావరి జిల్లా రామవరం మండలానికి చెందిన ఫంగితెలి తేజ (28) పరిచయమయ్యాడు. జైలు నుంచి వచ్చిన తరువాత వీరిద్దరూ కలిసి గంజాయి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. తేజ విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి, పాడేరు, ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన రాజు పరిచయమయ్యాడు. ఇతడు కూడా గంజాయి సరఫరా చేస్తుంటాడు. వీరితోపాటు విశాఖ జిల్లాకు చెందిన నాగార్జున, చిన్నబాబులతో కలసి ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని ట్రావెల్ బ్యాగుల ద్యారా నగరానికి తెచ్చేవారు. దీనిని కొండల్ నివాసం వద్ద నిల్వ ఉంచారు. పోలీసులకు పట్టుబడిందిలా.. మంగళవారం ఆసిఫ్ నగర్కు చెందిన సుబేడర్ వినోద్ సింగ్ కొండల్ దగ్గర 10 కేజీల గంజాయిని రూ.30 వేలకు కొనుగోలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కొండల్ ఇంటిపై దాడి చేసి 82 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినోద్ సింగ్ కొనుగోలు చేసిన గంజాయిని 100 గ్రాములుగా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మార్చి నగరంలోని విద్యాసంస్థల వద్ద అమ్మతున్నట్లు గుర్తించారు. అనంతరం కొండల్, ఫంగితెలి తేజ, నాగార్జున, చిన్నబాబు, వినోద్ సింగ్లను అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన రాజు పరారీలో ఉన్నాడని.. త్వరలో అతడిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. -
ఆర్నెల్ల క్రితమే హెచ్చరిక.. అయినా!
సాక్షి, విశాఖపట్నం: ‘రామ్గుడా ఎన్కౌంటర్ తర్వాత ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ధీమాగా ఉండడానికి వీల్లేదు. దండకారణ్యంలో కొంత సడలిన పట్టును మళ్లీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఊపందుకుంటున్నాయి. ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఏ క్షణమైనా మెరుపు దాడులకు తెగబడే అవకాశం లేకపోలేదు’ – ఆర్నెళ్ల కిత్రం రాష్ట్రానికి కేంద్ర నిఘా సంస్థల హెచ్చరిక.. దాడులపై ముందే అప్రమత్తం చేసినా.. తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మళ్లీ బలపడుతున్నారని కేంద్ర నిఘా వర్గాలు కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దాదాపు 200 మందికి పైగా మావోయిస్టులు ఏవోబీలో క్రియాశీలంగా ఉన్నారని రాష్ట్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కూడలిలో కార్యకలాపాలను విస్తరించుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఆయుధాలు, సామగ్రిని సమకూర్చుకుంటున్నారని, ఏ క్షణాన్నైనా మెరుపు దాడులకు తెగబడే అవకాశం ఉందని అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ‘పొరుగు’ సేవల వ్యూహం! స్థానికంగా బలం తగ్గడంతో చత్తీస్గడ్, ఒడిశా నుంచి మావోయిస్టులను రప్పించి క్యాడర్ పెంచుకునేందుకు అగ్ర నాయకత్వం వ్యూహ రచన చేస్తోందని నిఘావర్గాలు పేర్కొన్నాయి. గతంలో మాదిరిగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కలిసి జాయింట్ ఆపరేషన్లకు వ్యూహ రచన చేయాలని నిఘా సూచించింది. ఏవోబీని షెల్టర్ జోన్గా ఎంచుకుంటున్నారని హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని నిఘావర్గాలు అంటున్నాయి. బీఎస్ఎఫ్ బెటాలియన్ తెచ్చుకోలేని దుస్థితి మావోయిస్టుల అణచివేతకు అదనంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ బెటాలియన్ కావాలని విశాఖలో జరిగిన సమీక్షలో హోం మంత్రి చినరాజప్ప కోరగానే మంజూరు చేస్తున్నట్టు రాజ్నాధ్సింగ్ ప్రకటించారు. దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్రంలో భాగస్వామిగా కొనసాగిన టీడీపీ సర్కారు ఈ బెటాలియన్ ఏపీకి తెచ్చుకోలేకపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పట్టని సర్కార్ రెండున్నరేళ్ల క్రితం విశాఖలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, డీఐజీలు ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి రాజ్నా«థ్సింగ్ నిర్వహించిన సమీక్షలో ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాలపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ఉమ్మడి ఆపరేషన్తో సత్ఫలితాలు సాధించవచ్చని, నిరంతర కూంబింగ్తో కదలికలను కనిపెట్టాలని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సూచించింది. మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు కమ్యూనికేషన్ల వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించినా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. -
బాక్సైట్ తవ్వకాల కోసం కేంద్రం ఒత్తిడి
సాక్షి విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ గనుల తవ్వకాల కోసం కేంద్రం ఒత్తిడి తెస్తోందని, గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గురువారం పాడేరులో జరిగిన గిరిజన ఉత్సవాలలో సీఎం పాల్గొన్నారు. అంతకుముందు గ్రామదర్శినిలో భాగంగా చింతలవీధి పంచాయతీ ఆడారిమెట్టలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం పాడేరు జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ఆదివాసీ ఉత్సవాల్లో మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని చెప్పారు. బాక్సైట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్న రసల్ ఆల్ఖైమా సంస్థ అంతర్జాతీయ కోర్టుకు వెళ్లడానికి ఎవరు కారణమో తెలుసుకోవాలన్నారు. బాక్సైట్పై కేంద్రం కూడా తమను తప్పుపట్టి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గడిచిన ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని, అయినప్పటికీ తాను చేస్తున్న అభివృద్ధిని చూసి అరుకు, పాడేరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని చెప్పుకొచ్చారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం గత నాలుగేళ్లలో 14 వేలు కోట్లు ఖర్చు చేశామని, రానున్న ఏడాది రూ.2,564 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్లు ఇప్పిస్తానని పునరుద్ఘాటించారు. గిరిజన విశ్వ విద్యాలయం విజయనగరం జిల్లాలో వస్తోందన్నారు. మౌలిక వసతుల మెరుగుదలకు పాడేరు పంచాయితీకి 20 కోట్లు కేటాయిస్తామన్నారు. పాడేరు, అరుకులను కలుపుతూ హెల్త్ టూరిజం ఏర్పాటు చేస్తామన్నారు. కాఫీ, పెప్పర్లకు బ్రాండింగ్ ఇచ్చి వాటి విలువ పెంచుతామన్నారు. గత ఎన్నికల్లో తనకు ఓట్లయలేదు, ఈ సారైన వేయాలని అభ్యర్ధించారు. కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సభలో గిరిజనుల నుండి తీవ్ర నిరసనల సెగ ఎదురయింది. బాక్సైట్ జీవో రద్దు చేయడంతో పాటు గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ, గిరిజన విశ్వ విద్యాలయం కావాలంటూ పెద్ద పెట్టున యువత నినాదాలు చేశారు. దీంతో అసహనానికి గురైన సీఎం వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాక్సైట్ జీవో రద్దు చేస్తూ ప్రకటన చేయాలని లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటామన్న ఏపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్సతో పాటు మరో పది మందిని పోలీస్లు గృహ నిర్బంధం చేశారు. విద్యుదాఘాతంతో సీఎం సభకు వస్తున్న వ్యక్తి సజీవ దహనం జి.మాడుగుల (పాడేరు): పాడేరులో ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబునాయుడి సభకు బైక్పై వెళ్తుండగా విద్యుత్ తీగ తెగిపడి ఒక గిరిజనుడు సజీవ దహనమయ్యాడు. జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ మాదేమామిడి గ్రామానికి చెందిన సాగేని శివానందచారి (తౌడాచారి) బైక్పై సీఎం సభకు వెళ్తుండగా లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామ సమీపాన విద్యుత్ వైరు తెగి మీద పడటంతో మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాలతో శివానందచారి అక్కడక్కడే మృతి చెందగా, బైక్ పూర్తిగా దగ్ధమైంది. -
మహిళా స్మగ్లర్ అరెస్ట్..
సాక్షి, సిటీబ్యూరో: విశాఖ ఏజెన్సీలో గంజాయి ఖరీదు చేసి, సిటీకి అక్రమ రవాణా చేసి విక్రయించడానికి ప్రయత్నించిన ఓ మహిళా స్మగ్లర్ను ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈమెపై గతంలోనూ ఈ తరహా కేసులు ఉన్నాయని, తాజాగా 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ మంగళవారం తెలిపారు. విశాఖపట్నం జిల్లా జీకే వీధి గూడానికి చెందిన కె.పార్వతమ్మ చింతపల్లికి చెందిన అప్పారావు నుంచి గంజాయి ఖరీదు చేసి, వివిధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేసి విక్రయించడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితం 14 కేజీల గంజాయిని అక్కడి ఏజెన్సీ ఏరియాలో ఖరీదు చేసి సోమవారం హైదరాబాద్కు బయలుదేరింది. మంగళవారం అఫ్జల్గంజ్లోని సీబీఎస్లో బస్సు దిగిన ఈమె ట్రాలీ బ్యాగ్స్లో ఉన్న గంజాయిని ధూల్పేట ప్రాంతానికి తరలించి అక్కడ తనకు పరిచయస్తులైన హోల్సేల్ గంజాయి వ్యాపారులకు కేజీ రూ.5 వేల చొప్పున అమ్మాలని భావించింది. అయితే పార్వతమ్మ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.మోహన్కుమార్ నేతృత్వంలోని బృందం సీబీఎస్ వద్ద వలపన్ని నిందితురాలిని అరెస్టు చేసింది. కేసును తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించింది. గోవాలో చిక్కిన హైదరబాదీలు... విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీల నుంచి గంజాయిని తరలిస్తూ, సిటీలో విక్రయిస్తున్న నిందితుల్ని ఇక్కడి పోలీసులు పట్టుకుంటున్నారు. ఇలానే హైదరాబాద్ నుంచి గంజాయిని గోవాకు తీసుకువెళ్ళి అక్కడ అమ్మడానికి ప్రయత్నించిన ఇద్దరు సిటీ వాసుల్ని గోవా యాంటీ నార్కోటిక్ సెల్ (ఏఎన్సీ) అధికారులు పట్టుకున్నారు. నగరానికి చెందిన అరుణ్, మహేష్ రెండు కేజీల గంజాయి తీసుకుని గోవాకు చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి గోవా ఏఎన్సీ అధికారులు వలపన్ని అరుణ్, మహేష్లను పట్టుకున్నారు. వీరి నుంచి రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. -
పారా‘చెక్’
► మలేరియా నిర్ధారణకు మీనమేషాలు ► పాత పద్ధతిలో స్లైడ్లతో రక్తపరీక్షలు ► జ్వర పీడితులకు సకాలంలో అందని వైద్యం ► ఎపిడమిక్కు ముందస్తు చర్యలు చేపట్టని ప్రభుత్వం మలేరియా అనగానే విశాఖ ఏజెన్సీ గుర్తుకొస్తుంది. ఈ మహమ్మారి విజృంభణతో ఆదివాసీలు పిట్టల్లా రాలిపోయిన సందర్భాలను గుర్తు చేసుకుంటే భయం గొలుపుతుంది. ఈ ఏడాది మాత్రం దీని నియంత్రణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేకపోయింది. గిరిజనుల సంక్షేమమే ధ్యేయమని ఊకదంపుడు ప్రసంగాలిచ్చే పాలకులు మలేరియాను క్షణాల్లో నిర్ధారించే పారాచెక్ కిట్లను కూడా ఆస్పత్రులలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచలేకపోయారు. హుకుంపేట (అరకులోయ): పారాచెక్ కిట్లు ఏజెన్సీలోని పీహెచ్సీల్లో లేకపోవడంతో మలేరియా నిర్ధారణ సకాలం జరగడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మే 28వ తేదీ వరకు మన్యంలో 11,073 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జ్వర పీడితులకు రక్తపరీక్షలను స్లైడ్స్ పద్ధతిలో ఇప్పుడు చేపడుతున్నారు. ఈ నివేదిక వచ్చేందుకు 24 గంటల సమయం పడుతోంది. మలేరియా బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించకుంటే ప్రాణాంతక సెరిబ్రల్గా మారి ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. అదే పారాచెక్లతో రక్తపరీక్షలు చేపడితే క్షణాల్లో అది మలేరియా..కాదా అన్నది నిర్ధారణ అవుతుంది. కానీ గ్రామాలలో తిరిగే వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తల వద్ద పారాచెక్లు లేవు. ఒకటి,రెండు కిట్లతో గ్రామాలను వైద్యసిబ్బంది సందర్శించాలిసిన దుస్థితి. ఏటా ఏప్రిల్ నెల నుంచి మన్యంలో వ్యాధుల కాలం మొదలవుతుంది. మలేరియా, ఇతరత్రా వ్యాధుల నివారణకు జనవరి నెల నుంచే ముందస్తుగా ,ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం, వైద్యఆరోగ్య, మలేరియా శాఖలు ప్రణాళికలు రుపోందించాలి. ఈ ఏడాది జనవరి నెల నుంచే మలేరియా తీవ్రత నెలకొంది. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 36 ఆరోగ్య కేంద్రాలతో పాటు, అరకులోయ, పాడేరు, నర్సీపట్నం, కె.కోటపాడు ఏరియా ఆస్పత్రులలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రులన్నింటిలోనూ పారాచెక్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో జ్వరపీడితులకు ,క్షణాల్లో రక్తపరీక్షలు జరగడం లేదు. ప్రతి ఆస్పత్రి పరిధిలో కనీసం 2వేల పారాచెక్ కిట్లు అందుబాటులో ఉండాలి. ఒక్కోదానిలో ప్రస్తుతం 100 కూడా లేవు. జ్వరంతో పరిస్థితి విషమించిన వారికి మాత్రమే ఉన్నవాటితో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు. మిగతా జ్వరపీడితులకు రక్తపరీక్షలు ఆలస్యమవుతున్నాయి. పారాచెక్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని, ఈమేరకు జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చామని మలేరియా శాఖాధికారులు గత నెలలో ప్రకటించారు.కానీ కొత్త కిట్లు మన్యానికి రాలేదు. పాత పద్ధతిలో స్లైడ్లపై రక్తపూతలు సేకరించి తెచ్చి ల్యాబ్లలో పరీక్షలు చేస్తున్నారు. ఎపిడమిక్ దృష్ట్యా ఆస్పత్రులకు జ్వరపీడితుల తాకిడి అధికంగా ఉంటోంది. ఈ కారణంగా పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. మరుసటి రోజున వ్యాధి నిర్ధారణ చేసి, సంబంధిత రోగి ఉండే గ్రామాలకు వైద్యసిబ్బంది పరుగులు తీస్తున్నారు.ఆసమయంలో మలేరియా సోకిన గిరిజనుడు ఉంటే వైద్యసేవలు కల్పిస్తున్నారు. రోగి లేకపోతే వైద్యసేవలు ఆలస్యమవుతున్నాయి. రెండు రోజుల్లో 20వేల కిట్లు... మలేరియాను సకాలంలో నిర్ధారించే పారాచెక్ ఆర్డీ కిట్లు 20వేలు రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తాం. జిల్లా కలెక్టర్ అనుమతి లభించడంతో పారాచెక్లను ఏజెన్సీలోని అన్ని ఆస్పత్రులకు పంపిణీకి చర్యలు చేపట్టాం. ప్రతి జ్వరపీడితుని క్షణాల్లో మలేరియా నిర్ధారణ పరీక్షలు జరుపుతాం. - ప్రసాదరావు, జిల్లా మలేరియా అధికారి -
మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత
-
మన్యంలో పెరిగిన చలి తీవ్రత
విశాఖ: మన్యంలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో గురువారం రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. లంబసింగిలో 5 డిగ్రీలు, పోతురాజుగుడి సమీపంలో 6 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో మంచు దుప్పటి కప్పుకున్న విధంగా దట్టమైన పొగమంచు ఆవరించింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి పర్యాటకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కుటుంబమంతా ఉద్యమంలోనే..
ఎన్కౌంటర్లో మృతి చెందిన అరుణక్క - ఆమె తండ్రి, సోదరుడూ ఉద్యమబాటలోనే -16 ఏళ్ల కిందట లొంగిపోయిన మావోయిస్టు అరుణక్క తండ్రి - గత మే 4న ఎన్కౌంటర్లో కన్నుమూసిన సోదరుడు ఆజాద్ పెందుర్తి: ఎన్కౌంటర్లో మృతిచెందినట్లు భావిస్తున్న మావోయిస్ట్ అరుణక్క కుటుంబం మొత్తం ఉద్యమ బాటలో ఉంది. వెంకటరవివర్మ లక్ష్మణరావు, అర్జునమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. చాలాకాలం ఉద్యమంలో ఉన్న లక్షణరావు.. 16 ఏళ్ల కిందట ప్రభుత్వానికి లొంగిపోయారు. వీరి స్వస్థలం విజయవాడ సమీపంలోని మహంతిపురం. లక్ష్మణరావు లొంగుబాటు తరువాత కుటుంబంతో సహా విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెంలో స్థిరపడ్డారు. ఉన్నత విద్యను అభ్యసించిన లక్ష్మణరావు ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తాజా ఎన్కౌంటర్లో మరణించిన లక్ష్మణరావు పెద్దకుమార్తె చైతన్య అలియాస్ అరుణక్క ఒడిశా మావోయిస్ట్ దళంలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. 16 ఏళ్ల కిందట ఆమె ఉద్యమంలోకి వెళ్లింది. అప్పటి నుంచి ఇప్పటికి ఒకటి రెండుసార్లు మాత్రమే ఆమె తల్లిదండ్రులతో మాట్లాడింది. లక్ష్మణరావు రెండో కుమార్తె ఝాన్సీ ప్రజా ఉద్యమకారిణి. అడ్వకేట్. హిందుజా పవర్ప్లాంట్, గంగవరం పోర్టు పోరాటంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. లక్ష్మణరావు మూడో సంతానం గోపాల్ అలియాస్ ఆజాద్ ఇంజనీరింగ్ వరకు చదువుకున్నాడు. యుక్తవయసు నుంచీ ఉద్యమం వైపు నడిచాడు. 2002లో తొలిసారి మావోయిస్ట్ సభ్యునిగా చేరాడు. 2006లో మావోయిస్టులకు ఆయుధాలు, సాంకేతిక సామగ్రి సరఫరా చేస్తున్నాడన్న అభియోగంతో విజయనగరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత పూర్తిస్థాయి ఉద్యమంలోకి వెళ్లిన ఆజాద్ గాలికొండ దళానికి కమాండర్గా ఉన్న సమయంలో గత మే 4న విశాఖ ఏజెన్సీ కొయ్యూరులో జరిగిన ఎన్కౌంటర్లో కన్నుమూశాడు. -
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు కరపత్రాల కలకలం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం పెదవలస గ్రామంలో మావోయిస్టుల పేరిట శుక్రవారం బ్యానర్లు వెలిశాయి. అటవీ ప్రాంతంలోని సంపద కాజేయటానికి ఆపరేషన్ గ్రీన్హంట్ పేరిట పోలీసులు, ఏపీఎఫ్డీసీ అధికారులు ఏజెన్సీలో అరాచకం సృష్టిన్నారని మావోయిస్టులు కరపత్రాల్లో ఆరోపించారు. జీకే వీధి పరిధిలోని పలు గ్రామాల్లో ని కాఫీ తోటలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని మావోయిస్టులు హెచ్చరించారు. చాపరాతిపాలెం ఎర్రమట్టి క్వారీని మూసివేయకపోతే గడుతూరి బాలయ్య, జి.శంకర్, జి.మురళి తదితరులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు స్పష్టం చేశారు. దీంతో జీకే వీధి మండలంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ కరపత్రాలు సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా పేరిట బ్యానర్లు, కరపత్రాలు వెలిశాయి. -
బాక్సైట్ తవ్వకాలకే సర్కారు మొగ్గు
బడ్జెట్ సమావేశంలో తేటతెల్లం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజం పాడేరు: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్న వైఖరి బడ్జెట్ సమావేశంలో మొదటిసారి తేటతెల్లమైందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆమె గురువారం హైదరాబాద్ నుంచి ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రంలో గనుల తవ్వకాల ద్వారా రూ.17,880 కోట్లు ఆదాయం సమకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారని చెప్పారు. రాష్ట్రంలో ఇంత ఆదాయం సమకూరే గనులు మరెక్కడా లేవని, ఏజెన్సీలో నిక్షిప్తమైన బాక్సైట్ తవ్వకాల ద్వారానే ఇది సాధ్యమవుతుందని, దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి రూ.3,100 కోట్లు కేటాయించిన ప్రయోజనమేమీ ఉండదన్నారు. గతేడాది గిరిజన సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్లో సుమారు రూ.900 కోట్లు దారిమళ్లించిందని వెల్లడించారు. దీని వల్ల గిరిజన సంక్షేమం కుంటుపడుతోందని, నిధులు కేటాయించినా సక్రమంగా వినియోగించకపోవడం వల్ల మౌలిక సౌకర్యాలు కూడా మెరుగు పడటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. -
విశాఖ ఏజెన్సీలో పెరిగిన కనిష్ట ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా పెరిగాయి. ఏజెన్సీ ప్రాంతంలోని చింతపల్లిలో 15.5 డిగ్రీలు, లంబసింగిలో 13, అరకులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు చలీగాలులు బాగా వీచడంతో గిరిజనులు ఇళ్లు వదిలి బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. -
విశాఖ ఏజెన్సీలో స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు బుధవారం స్పల్పంగా పెరిగాయి. అరకు 10 డిగ్రీలు, లంబసింగిలో 12 డిగ్రీలు, చింతపల్లిలో 15 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అలాగే చలి తీవ్రత రోజురోజుకి పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. కానీ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. -
మన్యంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
విశాఖ ఏజెన్సీ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు ఆదివారం మరింతగా పడిపోయాయి. లంబసింగిలో ఆదివారం ఉదయం 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 6 డిగ్రీలుగా ఉంది. ఇక పాడేరు, మోదపల్లిలో 7 డిగ్రీలు నమోదైంది. లంబసింగిలో శనివారం ఉదయం 7 డిగ్రీల ఉష్ణోగ్రత, చింతపల్లిలో 10 డిగ్రీలు ఉండగా ఆదివారం ఉదయం నాటికి బాగా తగ్గినట్టు తెలుస్తోంది. చలి గాలులు, మంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 20 అడుగుల దూరంలో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. -
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టుల మృతి
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ తీవ్ర కలకలం సృష్టించింది. అరకు మండలం గిన్నిల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. గిన్నిల- గిరజాయి ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పలు కిట్ బ్యాగ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఒరిస్సాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలతో పాటు సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
వణుకుతున్న విశాఖ ఏజెన్సీ
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖపట్నం ఎజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. లంబసింగిలో 7 డిగ్రీలు... చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. జనవరి నెలాఖరు వరుకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పడతాయన్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే గానీ ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. -
బాక్సైట్ దారిలో బాబుగారి వేషాలెన్నో!
-
రూ.526 కోట్లతో కాఫీ ప్రాజెక్టు
2025 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్ విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో తలపెట్టిన కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మరో అడుగు పడింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పాడేరు ఐటీడీఎ పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో రూ. 526 కోట్ల 16 లక్షలతో ఈ ప్రాజెక్టు తలపెట్టారు. 2015-16 నుంచి 2024-25ల మధ్య ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆర్థిక సహాయం చేయనుండగా, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ నుంచి ట్రైబల్ సబ్ప్లాన్ కాంపొనెంట్ కింద రాష్ర్టం తన వాటాను సమకూర్చనుంది. ఏజెన్సీ పరిధిలోని కాఫీ ప్లాంటేషన్పై ఆధారపడే ప్రతీ గిరిజన కుటుంబానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి కనీసం రూ.లక్ష ఆదాయం సమకూర్చేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కాఫీని గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేయనుంది. అలా సేకరించిన కాఫీని వేలం పాటల ద్వారా విక్రయించనుంది. దీంట్లో కనీసం 50 శాతం మొత్తాన్ని కాఫీ గ్రోయిర్స్కు అందజేయనుంది. ఇందుకోసం డెరైక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రతిపాదనల మేరకు ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కార్ను ఆదేశించింది. ట్రైబల్ వెల్ఫేర్ డెరైక్టర్ చైర్మన్గా వ్యవహరించనున్న ఈ కమిటీకి పాడేరు ఐటీడీఎ పీవో మెంబర్ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. ట్రైకార్ మేనేజింగ్ డెరైక్టర్, కాఫీ బోర్డు నుంచి అగ్రిఎకనామిస్ట్, జీసీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్లు సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ సీజన్కు కనీసం రెండుసార్లు సమావేశమవుతూ కాఫీ పిక్కల సేకరణ, ధరలను నిర్ణయిస్తుంది. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఎపెక్స్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ విద్యాసాగర్ గురువారం రాత్రి ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు. -
బాక్సైట్ దారిలో బాబుగారి వేషాలెన్నో!
► అధికారంలో ఒక మాట.. ప్రతిపక్షంలో మరో బాట ► నిజాలన్నీ దాచి నిందలు వేయడం బాబు నైజం (సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) విశాఖ బాక్సైట్పై రాష్ర్టవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అన్ని పక్షాలూ తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి.తవ్వకాలకు అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా మన్యం అట్టుడుకుతోంది. గిరిజనులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు తెలీకుండానే ఆ జీవో వచ్చింది అని చెబుతున్నారు. ఏ ప్రభుత్వంలోనైనా సీఎంకు తెలియకుండా ముఖ్యమైన జీవోలు జారీ అవుతా యా? అది నిజమయితే అలాంటి సీఎం పరిపాలనకు పనికివస్తాడా? ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన బాబు ఇపుడు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు? ఎందు కు జీవోలు జారీ చేస్తున్నారు? ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత కనపడగానే డ్రామాలు ఎందుకు మొదలు పెట్టారు? జీవో తనకు తెలియకుండా వచ్చిందని చెబుతున్న చంద్రబాబు ఇపుడు రద్దు చేసే అవకాశం తన చేతుల్లోనే ఉన్నా ఎందుకు చేయడం లేదు? ఈ జీవో వల్ల ఉపయోగమెవరికి? నష్టపోయేదెవరు? నిలుపుదల చేస్తున్నానంటూనే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వెనక మర్మమేమిటి? తాను తప్పు చేస్తూ నెపం పక్కవారిపై నెట్టేసే బాబు నైజం అనేకమార్లు బైటపడింది. ఇపుడు కూడా ఆయన నిజాలన్నీ దాచేసి దివంగత సీఎం వైఎస్రాజశేఖరరెడ్డిపై బురదజల్లేందుకు మరోమారు ప్రయత్నించారు.. అందుకే విశాఖ బాక్సైట్ ఉదంతం పూర్వాపరాలను ఓ మారు పరిశీలిద్దాం.. ► ఎన్నికల ముందు ఏం చెప్పారు?... ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారు? ‘బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తాం. ఎట్టిపరిస్థితులలోనూ తవ్వకాలను అనుమతించేది లేదు’ అంటూ ప్రగల్భాలు పలికారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ లీజులు, అల్యూమినా కర్మాగారం ఏర్పాటు ఒప్పందం గిరిజనుల హక్కులకు తీవ్ర భంగకరమని, వాటిని రద్దు చేయాలని అసెంబ్లీ లోపలా, వెలుపలా డిమాండ్ చేశారు. అంతేకాదు గవర్నర్ వద్దకు ఓ ప్రతినిధి బృందాన్ని పంపించి విశాఖ బాక్సైట్ గనుల లీజుతో పాటు తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. విశాఖ బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలంటూ చంద్రబాబు స్వయంగా 24.12.2011న గవర్నర్కు ఓ లేఖ రాశారు. 24.04.12న అదే లేఖను మరోమారు విడుదల చేశారు. ► అధికారంలోకి రాగానే యూటర్న్... ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట.. పగ్గాలు చేపట్టగానే ఆయనది వేరే బాట.. ఇదీ చంద్రబాబు నైజం. అనేక సందర్భాలలో ఇది రుజువయ్యింది. ప్రతిపక్షంలో ఉండగా గిరిజనుల హక్కుల కోసం పోరాటమన్న చంద్రబాబు పగ్గాలు చేపట్టగానే యూటర్న్ తీసుకున్నారు. గిరిజనుల హక్కులను కాలరాసే ‘జీవో 97’ని జారీ చేశారు. జీవో 97తో ప్రభుత్వం మన్యంలోని రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న 1212 హెక్టార్ల( 3,030 ఎకరాల)భూమిలోనూ, చింతపల్లి, జై భూములలో బాక్సైట్ మైనింగ్ చేపట్టే బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ)కి అప్పగించింది. ఇక్కడ వెలికితీసిన బాక్సైట్ ముడి నిక్షేపాలను నర్సీపట్నం సమీపంలో ‘అన్రాక్’ కంపెనీ నెలకొల్పిన రిఫైనరీకి, జిందాల్ గ్రూప్ నెలకొల్పబోతున్న రిఫైనరీకి తరలిస్తారు. ► మన్యంలో దావానలం.. బాక్సైట్ తవ్వకాలతో చంద్రబాబు తలపెట్టిన దారుణమైన విధ్వంసానికి వ్యతిరేకంగా మన్యంలోని గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు, పర్యావరణ వేత్తలు, వామపక్షాలతో సహా వివిధ రాజకీయ పార్టీలు వారికి అండగా పోరాడుతున్నాయి. గిరిజన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులు ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఏకంగా శాసనసభ్యత్వానికే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా, వారి హక్కుల పరిరక్షణకై జీవో 97కు వ్యతిరేకంగా ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 2న మన్యంలో పర్యటిస్తానని ప్రకటించారు. అన్నివైపుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుండడం, ప్రతిపక్షనేత గిరిజనులకు బాసటగా నిలవడంతోనే సీఎం తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ► జీవో 97 రాజ్యాంగ ఉల్లంఘనే... ప్రస్తుతం విశాఖ బాక్సైట్ తవ్వకాల కోసం ఎంపిక చేసిన ప్రాంతం గిరిజనులు ఉండే రిజర్వ్డ్ ఏజెన్సీ ప్రాంతం. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రకారం గిరిజనులకు, వారు నివసించే ప్రాంతాలకు రాజ్యాంగపరంగా కొన్ని రక్షణలు ఉంటాయి. ప్రభుత్వాలైనా గిరిజనుల జీవనం, సంక్షేమాన్ని దెబ్బతీసే కార్యకలాపాలను చేపట్టడానికి వీల్లేదు. ఒకవేళ బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో సిఫార్సు చేయాలి. ఆ కమిటీని ప్రభుత్వమే నియమించాలి. కానీ ఏడాదిన్నరయినా ప్రభుత్వం ఇంత వరకు కౌన్సిల్ను ఏర్పాటు చేయలేదు. కౌన్సిల్ నియామకం కాకుండా మైనింగ్ సిఫార్సుకు తావు లేదని ప్రభుత్వానికి తెలిసినా ఏకపక్షంగా జీవో 97 జారీ చేసింది. అలాగే గిరిజన ప్రాంతంలో ఏం చేయతలపెట్టినా గ్రామ సభల ఆమోదం పొందాలి. గవర్నర్ సిఫార్సు చేయాలి. ఆ తర్వాత రాష్ర్టపతి ఆమోదం కూడా పొందా లి. వీటిలో ఏ ఒక్కటినీ చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదు. ► సుప్రీం మార్గదర్శకాలూ ఉన్నాయి... అటవీ ప్రాంతాలలోని అమూల్యమైన సంపదను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడానికి వీలులేకుండా సుప్రీం కోర్టు 1997లో చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ఆదివాసీల భూములను అప్పటి ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు మైనింగ్ లీజులకిచ్చింది. ఆ నిర్ణయాన్ని ‘సమత’ అనే స్వచ్ఛంద సంస్థ కోర్టులో సవాలు చేసింది. కింది కోర్టుల్లో వారి పిటిషన్ వీగిపోయినా సుప్రీం అత్యంత ముఖ్యమైన తీర్పును వెలువరించింది. దాని ప్రకారం... ఆదివాసీలు, గిరిజనులు నివసించే ప్రాంతాలలోని ప్రకృతి, ఖనిజ వనరులు ఏవైనా స్థానిక ప్రజల సంక్షేమానికే ఉపయోగించాలి. అలాగే మన్యంలో గనుల్ని తవ్వే హక్కులు గిరిజనులకు మాత్రమే చెందుతాయని అంతవరకు ఉన్న చట్టం. గిరిజనులకు ఉన్న ఈ హక్కుకు సుప్రీంకోర్టు మద్దతు పలికింది. ► 70వ దశకంలోనే బాక్సైట్పై అంచనాలు తూర్పు కనుమల్లో బాక్సైట్ సంపద నిక్షిప్తమై ఉందని 70వ దశకంలోనే గుర్తించారు. 21శాతం బాక్సైట్ నిక్షేపాలున్న ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఆ సంపదను వాణిజ్యపరంగా ఉపయోగించాలని 1970లోనే ఏపీఐడీసీ ప్రయత్నించింది. మెకాన్ సంస్థతో 1975 ఏప్రిల్లో సర్వే చేయించారు. 1987లో రష్యన్ సంస్థతో కలసి ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయించారు. ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపుల క్రమబద్ధ్దీకరణ చట్టం -1970 ప్రకారం గిరిజనుల భూములని ఏ రకంగానైనా గిరిజనేతరులకు బదలాయించడం నిషిద్ధం. ఆ తర్వాత ఈ చట్టానికి చేసిన సవరణ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు మైనింగ్ చేయడం కూడా నిషిద్ధ్దం. ► గతంలోనే బాబు యత్నాలు.. వెన్నుపోటుతో అధికారం చేజిక్కించుకోగానే బాక్సైట్ నిక్షేపాలపై బాబు కన్నుపడింది. సుప్రీం తీర్పు అందుకు ఆటంకంగా మారింది. గిరిజనుల చట్టాలూ ఆయన కాళ్లకు అడ్డంపడ్డాయి. అయినా బాబు దుబాయ్ నుంచి ఓ బృందాన్ని పిలిపించి, అక్కడి కొండల్ని చూపించి తవ్వుకోవడానికి మీరు రెడీనా అని అన్నారు. దుబాయ్ ప్రతినిధి బృందానికి సకల సదుపాయాలూ కల్పించాలని సూచిస్తూ 29-02-2000న సీఎం చంద్రబాబు కార్యదర్శి స్వయంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. దుబాయ్ బృందం 2000 మేలో హైదరాబాద్ వేంచేయగా సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. చట్టాలను, సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజని బాబు తన ‘చాణక్యం’ అంతా ఉపయోగించి 2000 మే, జూన్లలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్తో ప్రత్యేక తీర్మానం చేయించారు. 2000 మే 24న విశాఖ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్లో జరిపిన భేటీలో ఈ కౌన్సిల్తో ‘మన్యంలో గనుల్ని గిరిజనేతరులు కూడా తవ్వవచ్చు’ అని దుర్మార్గమైన తీర్మానం చేయిం చారు. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ రాజ్యాంగబద్ధ సంస్థ. అది గిరిజనుల హక్కుల పరిరక్షణకు పనిచేయాల్సిన సంస్థ. కానీ దానితోనూ నిబంధనలకు విరుద్ధమైన తీర్మానాలు చేయించిన ఘనుడు చంద్రబాబు.ఆయన ప్రభుత్వం చట్టాలకు తూట్లు పొడిచిన తర్వాతే విశాఖ బాక్సైట్ మైనింగ్ లీజుల్ని నేరుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రమాదం దాపురించింది. ఆ తర్వాత దుబాయ్ అల్యూమినియం కంపెనీ(దుబాల్)కు లీజులు కట్టబెట్టేందుకు బాబు చేయని ప్రయత్నమే లేదు. 2004 మేలో దుబాయి బాబులు రంగంలోకి దిగిపోయారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో బాబు ఆశలు ఆవిరయ్యాయి. బాక్సైట్ నిక్షేపాలను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి తానూ ముడుపులు మింగేయాలని తహతహలాడిన చంద్రబాబు ఇపుడు తానేమీ ఎరగనట్లు వైఎస్ హయాంలోనే బాక్సైట్ లీజుల వ్యవహారం ఆరంభమయినట్లు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ► గిరిజన సంక్షేమానికి అనుగుణంగానే వైఎస్ నిర్ణయాలు చంద్రబాబు చేసిన చట్ట సవరణలు, ప్రత్యేక తీర్మానాల కారణంగా విశాఖ బాక్సైట్ మైనింగ్ లీజులు నేరుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే అవకాశం ఉన్నా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సంయమనం పాటించింది. బాక్సైట్ గనుల లీజుల్ని నేరుగా కంపెనీలకు కేటాయించలేదు. నిజానికి లీజు తమ పేరిటే ఉండాలని బాబు తీసుకువచ్చిన దుబాల్ కంపెనీ గట్టిగా పట్టుబట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలోని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కే సర్వహక్కులు ఉంటాయని వైఎస్ సర్కార్ స్పష్టం చేసింది. జిందాల్, అన్రాక్, నాల్కో వంటి కంపెనీలు బాక్సైట్ను అల్యూమినా, అల్యూమినియంగా మార్చే కర్మాగారాలని వేలకోట్ల పెట్టుబడిపెట్టి అక్కడే నెలకొల్పాలని వైఎస్ సర్కార్ నిర్ణయించింది. బాక్సైట్ దొరికే చోటే కర్మాగారం ఏర్పాటయితే గిరిజనులకు ఉపాధి లభిస్తుంది. అంతేకాదు బాక్సైట్ శుద్ధి కర్మాగారాలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో లాభాలు - టర్నోవర్లలో ప్రభుత్వం, సంస్థలు, ఏపీఎండీసీలు తమ వంతుగా ఎంతెంత శాతాన్ని గిరిజనుల సంక్షేమానికి వెచ్చించాలన్న స్పష్టమైన నిబంధనలూ ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చే రాయల్టీలో 25%, ఏపీఎండీసీ ఖనిజ విక్రయాల ద్వారా పొందే ఆదాయంలో 20%, అల్యూమినా కర్మాగారం సాధించే లాభంలో 0.5% మొత్తాన్ని ఈ ప్రాంతంలోని గిరిజనుల ఆర్థిక, సామాజిక ప్రగతికి వెచ్చించాలని స్పష్టమైన నిబంధన ఉంది. చంద్రబాబులా నచ్చిన కంపెనీలకు నిబంధనలను అతిక్రమించి మరీ అడ్డగోలుగా అన్నీ కేటాయించే నైచ్యానికి వైఎస్ ఎన్నడూ దిగజారలేదు. షరతులతో కూడిన ఆరు గనుల తవ్వకం లీజులను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ పేరిట మంజూరు చేసింది. 1957 గనుల చట్టం, 1960 ఖనిజాల రాయితీ నియమావళి మేరకే ఒప్పందాలు జరిగాయి. అంతకు ముందు ప్రభుత్వాల హయాంలో ప్రయత్నాలు జరిగినట్లే వైఎస్ హయాంలోనూ బాక్సైట్ అనుబంధ పరిశ్రమల స్థాపనకు (గిరిజనుల సంక్షేమానికి విఘాతం కలగకుండా) నిబంధనల మేరకు ప్రయత్నాలు జరిగాయి. అయినా వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాలను వైఎస్ పూర్తిగా నిలిపేశారు. ► దొంగే దొంగా అన్నట్లు... విశాఖ బాక్సైట్ వ్యవహారంలో ఆది నుంచి నేటి వరకు జరిగిందిదే. తన నేరాలన్నిటినీ దాచిపెట్టి పక్కవారిపై నెపం మోపడానికి ప్రయత్నించడం బాబు నైజం. బాక్సైట్ లీజుల వ్యవహారాన్ని రాజశేఖరరెడ్డి మీద, కాంగ్రెస్ మీద నెట్టేయడానికి శ్వేత పత్రంలో ఆయన చేయని ప్రయత్నమే లేదు. చంద్రబాబు చెప్పినట్లు వైఎస్ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలు జరిగాయనేది శుద్ధ అబద్దం. ఇన్నేళ్లు అక్కడ బాక్సైట్ తవ్వకాలు జరగనేలేదు. ఒక్క తట్ట కూడా బాక్సైట్ను ఎత్తి పోయలేదు. వైఎస్కు ముందు, వైఎస్ తర్వాత బాక్సైట్ తవ్వకాల కోసం నిబంధనలను అతిక్రమించి అనేక ప్రయత్నాలు చేసింది చంద్రబాబే. ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ తవ్వకాలు నిషేధించాలని ఉద్యమాలు చేసిన, చేయించిన బాబు అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకోవడానికి కారణాలు వెతకనక్కరలేదు. గిరిజనుల ప్రయోజనాలను పణంగా పెట్టి బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తేనే ఆయన మెచ్చిన కంపెనీలు బాగుపడతాయి. అందుకే హడావుడిగా జీవో జారీ చేశారు. వ్యతిరేకత రావడంతో ఆ జీవో సంగతే తనకు తెలియదంటున్నారు. ప్రస్తుతానికి జీవోను నిలుపుదల చేశామని చెబుతున్నారు.. గిరిజనుల సంక్షేమంపై నిజంగా చిత్తశుద్ది ఉంటే జీవోనే రద్దు చేయవచ్చు కదా? అది వదిలేసి శ్వేతపత్రాలు విడుదల చేయడం దేనికి సంకేతం? చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే జీవోను రద్దు చేసేవారని, అలా కాకుండా నిలుపుదల చేయడంలోనే ఏదో కుట్ర పొంచి ఉందని గిరిజన సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ► ఆద్యుడు చంద్రబాబే.. అయినా ైవె ఎస్పై బురదజల్లే యత్నం విశాఖ బాక్సైట్ లీజులకు ఆద్యుడు చంద్రబాబే. 1995లో పదవి చేపట్టగానే ఆయన బాక్సైట్ నిక్షేపాలపై కన్నేశారు. నిబంధనలను మార్చి, గిరిజనులను ఏమార్చి 2000లోనే దుబాయ్ కంపెనీ ప్రతినిధులను తీసుకొచ్చి బాక్సైట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ నిజాలన్నీ దాచి ఇపుడు వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు 2004 ఎన్నికల్లో గెలిచినట్లయితే దుబాయ్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బాక్సైట్ తవ్వకాలతో యథేచ్ఛగా దోపిడీ సాగించేవారే. ఆయన ఓడిపోవడంతో వినాశకరమైన దుబాయ్ ఒప్పందాలకు బ్రేక్ పడింది. బాక్సైట్ తవ్వకాలపై వైఎస్ దృష్టిపెట్టినా గిరిజనుల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతమూ కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. -
2న విశాఖ ఏజెన్సీలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడి సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 2న విశాఖ ఏజెన్సీలో పర్యటించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆ రోజు ఉదయం విమానంలో జగన్ విశాఖ చేరుకుని నేరుగా రోడ్డు మార్గంలో చింతపల్లి వెళ్లి బాక్సైట్ వ్యతిరేక బహిరంగ సభలో పాల్గొంటారని, బహిరంగ సభ అనంతరం లంబసింగిలో గిరిజనులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి వారితో నేరుగా మాట్లాడతారని వివరించారు. ఉద్యమం ఉధృతానికి వైఎస్సార్సీపీ బాక్సైట్ వ్యతిరేక పోరాట కమిటీ తీర్మానం బాక్సైట్ జోలికి భవిష్యత్తులో ప్రభుత్వం రాకుండా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాక్సైట్ వ్యతిరేక పోరాట కమిటీ తీర్మానించింది. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర, పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజులతో పాటు పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్లు సభ్యులుగా ఏర్పడిన కమిటీ ఆదివారం విశాఖలో తొలిసారి సమావేశమైంది. బాక్సైట్ ఉద్యమ కార్యచరణపై చర్చించారు. -
రేపు మన్యం బంద్
పాడేరు: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేయడానికైనా వెనకాడమని వైఎస్సార్సీపీ, వామపక్షాల నాయకులు స్పష్టం చేశారు. వామపక్ష నాయకులు విశాఖ మన్యం ప్రాంతంలో శనివారం బంద్కు పిలుపునిచ్చారు. -
మావోల చేతిలో యువకుని హతం
గొడ్డలితో నరికిచంపిన మావోయిస్టులు పోలీసులకు సహకరిస్తున్నాడని చంపామంటూ ప్రకటన కన్నీరుమున్నీరయిన తల్లిదండ్రులు ముంచంగిపుట్టు: పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్ మండలంలోని బూసిపుట్టుకు చెందిన పాంగి రామయ్య (19)ను మావోయిస్టులు హతమార్చారు. ఆదివారం రాత్రి సాయుధులైన మావోయిస్టులు గ్రామం నుంచి రామయ్యను సమీపంలోని ప్రధాన రహదారి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ అతడ్ని గొడ్డలితో నరికి చంపారు. సంఘటన స్ధలంలో సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ పేరిట ఓ లేఖను విడిచిపెట్టారు. రెండు సంవత్సరాలుగా రామయ్య ముంచంగిపుట్టు ఎస్ఐ, పోలీసులతో సంబంధాలు పెట్టుకొని బూసిపుట్టు ఏరియాలో అరెస్టులకు దాడులకు కారకుడయ్యడని ఆ లేఖలో పేర్కొన్నారు. పలుమార్లు ప్రజలు, పార్టీ హెచ్చరించిచా మార్పు రానందునే చంపాల్సి వచ్చిందని వివరించారు. ‘రాత్రి మావోలు ఇంటికి వచ్చారు.. మా బిడ్డగురించి అడిగారు. లేడని చెప్పాం. అయినప్పటికీ వీడకుండా పక్క వీధిలో పడుకుని ఉన్న రామయ్యను బలవంతంగా తీసుకువెళ్లి చంపారని’ మృతుడి తల్లిదండ్రులు పాంగి.జోగి, ముత్తాయిలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈసంఘటన మండలంలో సంచలనమైంది. -
వాన జల్లు... వరద పొంగు
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు సాక్షి, విజయవాడ బ్యూరో/విశాఖపట్నం: /హైదరాబాద్: రాష్ట్రాన్ని మొన్నటి వరకు ఎండలు ముచ్చెమటలు పట్టిస్తే.. ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా కోస్తా తీరంలోని జిల్లాలో మూడు రోజులుగా పడుతున్న వానల కారణంగా నారుమళ్లు నీట మునిగాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. పుష్కర పనులకు, పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరిపై నిర్మిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పనులకు విఘాతం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో నారుమళ్లు నీట మునిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి ఈ నెల 16వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 50 మంది మత్స్యకారుల ఆచూకీ ఇంకా దొరకలేదు. రెండు ఆర్మీ హెలికాప్టర్, రిలయన్స్కు చెందిన హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శనగపాడు వద్ద పశువుల కాపరి ఏసునాథ్ మున్నేరువాగులో చిక్కుకోవడంతో గజ ఈతగాళ్లు అతన్ని రక్షించారు. * తూర్పుగోదావరి జిల్లా చింతూరు-మారేడుపల్లి ఘాట్ రోడ్డులో దుర్గగుడి, టైగర్ క్యాంపుల నడుమ కొండచరియలతోపాటు భారీ వృక్షాలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విశాఖ ఏజెన్సీలోని దాదాపు 96 గ్రామాల ప్రజల జలబంధనంలో చిక్కుకున్నారు. వర్షాలపై సీఎం సమీక్ష వర్షాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో సమస్య ఏర్పడే పరిస్థితి ఉత్పన్నమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కోస్తాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. -
వణికిస్తున్న మలేరియా
- గుమ్మడిగుంటలో ఒకే ఇంట్లో నలుగురికి జ్వరాలు - ఏజెన్సీలో 3 వేల మలేరియా పాజిటివ్ కేసులు నమోదు - ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయాలని గిరిజనుల వినతి పాడేరు: విశాఖ ఏజెన్సీలో మళ్లీ మలేరియా విజృంభిస్తోంది. హుకుంపేట మండలం మారుమూల ప్రాంతమైన చీకుమద్దెల పంచాయితీ గుమ్మడిగుంట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గిరిజనులు మలేరియా బారిన పడ్డారు. ఈ గ్రామంలో పలువురు కొద్ది రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఆశ వర్కర్ లేకపోవడం వల్ల గ్రామంలో జ్వరాలు ప్రబలిన సంగతి తెలియరాలేదు. శనివారం పొరుగూరి నుంచి బంధువులు ఇంటికి వెళ్లిన ఒక ఆశా వర్కర్ జ్వరబాధితులకు రక్తపరీక్షలు చేయగా జ్వరాలతో బాధపడుతున్న ఒక కుటుంబంలోని వలసనైని చిన్నమ్మి(35), వలసనైని మచ్చులు(40), వి.కుమారి(22), విష్ణు(6)లకు మలేరియా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఇంకా పలువురు జ్వరబాధితులు ఉన్నారని వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాలే కారణం.. విశాఖ మన్యంలో మలేరియా ముంచుకొస్తోంది. గ్రామాల్లో జ్వర బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మన్యంలో 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏజెన్సీలో ఈ ఏడాది మలేరియా జ్వరాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో మలేరియా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏజెన్సీలోని 36 పీహెచ్సీల పరిధిలో వైద్య శిబిరాలను నిర్వహిస్తు గ్రామాల్లో జ్వర బాధితులకు రక్తపూతల ద్వారా మలేరియా పాజిటివ్ కేసులను గుర్తించి వైద్యసేవలు అందిస్తున్నారు. పాడేరు, అరకు ఏరియా ఆస్పత్రులకు, చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రికి మలేరియా జ్వరబాధితుల తాకిడి ఎక్కువగా ఉంది. ఏజెన్సీలో ఇప్పటి వరకు 3 వేల వరకు మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వర్షాలు పడుతుండటంతో మన్యంలో గిరిజనులు వ్యవసాయ పనుల్లో ముమ్మరంగా పాల్గొంటుంటారు. వాతావరణ పరిస్థితులు మారడమే కాకుండా వర్షాల మూలంగా పంట పొలాల్లో దోమలు ప్రబలుతున్నాయి. సహజంగా పంట పొలాల్లోని వర్షపునీరు మీద మలేరియా కారకమైన అనాఫిలస్ దోమలు పెరుగుతాయని, దీని వల్ల ఎక్కువగా గిరిజనులు మలేరియా జ్వరాల బారిన పడే పరిస్థితి ఉందని జిల్లా మలేరియా అధికారి కె.ప్రసాదరావు తెలిపారు. ఈ పరిస్థితుల్లో గిరిజనులు మలేరియా జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరం వచ్చిన వెంటనే రక్తపరీక్షలు చేయించుకుని పాజిటివ్ వస్తే వెంటనే ఏసీటీ మందులు 3 రోజులు వాడాలని సూచించారు. -
హత్యచేసి తలతీసుకెళ్లారు
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ పినకిల్తారి గ్రామానికి చెందిన వంజరి పోతురాజు (45) ఆదివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. అతడిని హత్య చేసినవాళ్లు తలను నరికి తీసుకెళ్లారు. జి.మాడుగుల-నర్సీపట్నం రోడ్డులో పినకిల్తారి,పెదకిల్తారి జంక్షన్ కర్రిమామిడి వద్ద ఈ మొండేన్ని సోమవారం ఉదయం కనుగొన్నారు. పోతురాజుకు ఇంకా పెళ్లి కాలేదు. మద్యం తాగే అలవాటు ఉంది. అన్నయ్య కొడుకు వంజరి నాయుడుతో కలసి జీవిస్తున్నాడు. రోజూ గ్రామంలో ఎవరో ఒకరి ఇంటి వద్ద నిద్రపోతుంటాడని తెలుస్తోంది. -
సరిహద్దులో గంజాయి జోరు
- రాష్ట్ర విభజన తరువాత పెరిగిన గంజాయి రవాణా - పీడీ చట్టంతో సాగుదారుల గుండెల్లో రైళ్లు సీలేరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం విశాఖ ఏజెన్సీ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి రవాణా జోరందుకుంది. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో ఎక్కడా పండనంత గంజాయి జీకేవీధి మండలం దారకొండ, గుమ్మిరేవులు, గాలికొండ, ఎ.దారకొండ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు పాతుకోట, గుత్తేరు వంటి పంచాయతీలలో సుమారు 200 గ్రామాల్లో, వేలాది ఎకరాల్లో గంజాయి పంట సాగవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం గంజాయి రవాణా ఈ ప్రాంతం నుంచే పెద్దఎత్తున సాగుతోందని తెలిసింది. ప్రస్తుతం తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాలతోపాటు విశాఖ జిల్లాలో దొరుకుతున్న గంజాయి ఈ ప్రాంతం నుంచే కాలిబాటన మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయితో పాటు స్మగ్లర్ల వద్ద తుపాకులు కూడా దొరికిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లర్లపై మళ్లీ పీడీ యాక్టు తేవాలని నిర్ణయించుకున్న తరుణంలో ఈ ప్రాంత గంజాయి స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నాలుగేళ్ల క్రితం సీలేరులో భారీ ఎత్తున గంజాయి రవాణా చేసిన 14 మందిని గుర్తించి పోలీసులు విచారణ చేపట్టి వదిలేశారు. మళ్లీ ఇప్పుడు పీడీయాక్టు తెరపైకి పోలీసు శాఖ తీసుకురావడం, గంజాయి స్మగ్లర్ల ఆస్తులు, భూములు ఎక్కడెక్కడున్నాయని దానిపై ఆరా తీస్తున్నారు. వెంకటేశ్వరరావు గంజాయి ప్రస్తావన సీలేరు నుంచే 2 రోజుల క్రితం నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో 5 బస్తాల గంజాయి, 2 పిస్తోళ్లు, 28 బుల్లెట్లతో దొరికి జిల్లా పోలీసు వర్గాల్లో కలకలం రేపిన గంజాయి స్మగ్లర్లలో ఒకరైన వెంకటేశ్వరరావు గంజాయి ప్రస్తానం తొలుత సీలేరు నుంచే ప్రారంభమైంది. పదేళ్ల క్రితం సీలేరులో ఓ కాంట్రాక్టరు దగ్గర రాళ్ల కొట్టుకుంటూ జీవనం సాగించి తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేశాక సీలేరు ఫారెస్ట్ ఆఫీసులో పనిచేసేవాడు. అనంతరం సారా వ్యాపారం చేసి గంజాయిపై మోజుపడి అక్కడ నుంచి తన గంజాయి వ్యాపారాన్ని రూ.కోట్లలో టర్నోవర్ చేసేవాడు. కొంత మంది బడావ్యాపారులతో ఈ గంజాయి రవాణా చేస్తు రూ.లక్షలు ఇక్కడే సంపాదించి అనంతరం కొన్ని కేసుల్లో చిక్కుకోవడంతో సీలేరు వదిలి నర్సీపట్నంలో ఉండేవాడు. అతను గంజాయితో పట్టుబడినట్లు పత్రికల్లో తెలుసుకున్న స్థానికులు అవాక్కయ్యారు. -
విశాఖ ఏజెన్సీలో కాల్పుల కలకలం
గూడెంకొత్తవీధి : విశాఖ ఏజెన్సీ మండల కేంద్రం జీకే వీధికి సమీపంలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటన కలకలం రేకెత్తించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మండలంలోని చెరుకుంపాకలు గ్రామానికి చెందిన పాంగి సన్నిబాబు, ముల్లే దంపతులు, గెమ్మెలి కామేశ్వరరావు, సీమ, మరో ఇద్దరు దంపతులు, వంతల రామారావు, తాలేష్, దొరబాబు, మరో కుటుంబానికి చెందిన వారిపై ప్రత్యేక పోలీసు బలగాలు కాల్పులు జరిపాయి. చెరుకుంపాకలు డీఆర్డిపోలో శుక్రవారం ఉదయం కిరోసిన్ తీసుకుని వీరంతా జీకేవీధిగుండా నడుస్తూ వస్తుండగా తీముమబంద సమీపంలో ప్రత్యేక పోలీసు బలగాలు తారసపడ్డాయి. ముసుగులు ధరించి టాటాసుమోలో వచ్చిన వీరు ‘మీ ఊరేమిటి’ అంటూ గిరిజనులను ఆరా తీసి వెళ్లిపోయారు. ఆ తర్వాత గిరిజనులు జీకేవీధికి వచ్చేసరికి వారంతా తమ వాహనం తలుపులు తెరిచి పట్టుకునేందుకు యత్నించారు. ఏజెన్సీలో మనుషులను ఎత్తుకుపోతున్నారనే వదంతుల నేపథ్యంలో చెరకుంపాకలు వాసులు అడవిలోకి పరుగులు తీశారు. దీంతో వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని భావించిన పోలీసులు పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నేపథ ్యంలో ఎవరికీ ఏమీకాకపోయినప్పటికీ అంతా చెల్లా చెదురయ్యారు. కాగా ఇద్దరు మహిళల ఆచూకీ గల్లంతైందని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఉండొచ్చంటూ గిరిజనులు వాపోతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనూహ్యంగా జరిగింది: ఎస్పీ కాల్పుల ఘటనను ఎస్పీ కోయ ప్రవీణ్ వద్ద ప్రస్తావించగా ‘సీఆర్పీఎఫ్, స్పెషల్పార్టీ పోలీసులు గిరిజనులపై కాల్పులు జరిపారు. వ్యాపారుల వద్ద నుంచి నగదు తీసుకునేందుకు కుంకంపూడి నుంచి జీకేవీధికి మావోయిస్టులు వస్తున్నట్టు సమాచారం అందింది. అయితే కాల్పులు మాత్రం అనూహ ్యంగా జరిగాయి’ అని వివరించారు. -
మత్స్యగెడ్డ మృత్యు పంజా
♦ నాటు పడవ మునక ♦ దంపతుల దుర్మరణం.. ఒకరి గల్లంతు ♦ ఇటుకల పండగకు వెళ్లి మృత్యు ఒడిలోకి పెదబయలు: విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలంలోని అడుగులపుట్టు పంచాయతీ తమరడ గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డలో శనివారం మధ్యాహ్నం నాటు పడవ మునిగి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మృతులిద్దరూ దంపతులు. మరో మహిళ గల్లంతయింది. తమ కుమార్తె ఊరిలో జరుగుతున్న ఇటుకల పండుగకు వెళ్లి తిరిగివస్తూ పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దు మత్స్యగెడ్డ దాటడానికి నాటు పడవ ఎక్కి ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగి భార్యా భర్తలు మృ తిచెందారు. స్థానికులు అందించిన స మాచారం మేరకు వివరాలు ఇలా ఉ న్నాయి. పెదబయలు మండలం గలగండ పంచాయితీ సిరశపల్లి గ్రామానికి చెందిన కొర్రా ఊర్మిళ (65), కొర్రా కొండమ్మ (62) ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీ పెద్దపేట గ్రామంలో ఉన్న తన రెండో కుమార్తె రత్నాలమ్మ ఇంటికి ఇటుకల పండుగకు ఈ నెల 10న వెళ్లారు. వారితో పాటు వారి సమీప బంధువు పాంగి కొండ మ్మ(45)ను కూడా తీసుకెళ్లారు. శనివారం భోజనాలు చేసి ముగ్గురూ బయలు దేరారు. మధ్యలో ఉన్న మత్స్యగెడ్డను దాటడానికి ఒడ్డున ఉన్న నాటుపడవ ఎక్కారు. గెడ్డ మధ్యలోకి రాగానే నాటు పడవకు రంధ్రం ఏర్పడి పడవలోకి నీరు చేరి మునిగిపోయింది. ఆ సమయంలో సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో రక్షించలేకపోయారు. అయితే గెడ్డకు కొంత దూరంలో క్రికెట్ ఆడుతున్న చిన్న పిల్లలు నాటు పడవ మునక విషయం గ్రామస్తులకు చేరవేశారు. గ్రామస్తులు వచ్చే లోపలే వారు మృత్యువాతపడ్డారు. వీరు గెడ్డ దాటడానికి ఉపయోగించిన నాటుపడవ రంధ్రాలు పడి ఎంతో కాలంగా నిరుపయోగంగా ఉందని, గెడ్డదాటాలనే తొందరలో ఆ పడవను ఉపయోగించడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. వెంటనే దంపతుల మృతదేహాలు లభ్యంకాగా, పాంగి కొండ మ్మ ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతిచెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. తల్లి దండ్రులు మృతి చెందడంలో పిల్లలు బోరున విలపించారు. మరణంలోనూ వీరు తోడుగానే వెళ్లడం అందరినీ కలిచివేసింది. పోలీసుల సేవాభావం ప్రమాద స్థలానికి బంధువులు ఎవరూ సకాలంలో చేరుకోకపోవడంతో పాడేరు సీఐ సాయి, పెదబయలు ఎస్ఐ మల్లేశ్వరరావు మృతదేశాలను ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి రోడ్డు వరకు చేర్చి, అంబులెన్స్లో పాడేరు ఏరియ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నామని తెలిపారు. సంఘటన స్థలంలో స్థానిక ఎంపీపీ సల్లంగి ఉమామహేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు పాంగి పాండురంగస్వామి, డివిజన్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కూడ బొంజుబాబు, ఎంపీటీసీ సభ్యులు పోయిబ కృష్ణారావు, కాతారి సురేష్కుమార్, ఆర్ఐ వెంకటరమణ, వీఆర్వో కొండపడాల్, దడియా రాంబాబు, దారెల సర్పంచ్ టి. తిలోత్తమ తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కలకలం
విశాఖ:ఏజెన్సీ ప్రాంతంలో శనివారం సాయంత్రం మావోయిస్టుల కలకలం రేగింది. గుమ్మరేవుల వద్ద 30 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల కంటబడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. అయితే మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే తప్పించుకుని పారిపోయారు. పోలీసుల నుంచి తప్పించుకున్న వారిలో మావోయిస్టుల అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మావోయిస్టులపై ఫైరింగ్ జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు.