Tourism Department
-
పర్యాటకంలో దోచుకో.. పంచుకో!
సాక్షి, అమరావతి : దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలపుతానన్న సీఎం చంద్రబాబు మాటలు ఒట్టి కోతలని తేలిపోయింది. 2025–26 బడ్జెట్లో ఏపీ పర్యాటక అభివృద్ధి కంటే తాత్కాలిక ఈవెంట్ల నిర్వహణకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టమైంది. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖకు మొత్తంగా రూ.460 కోట్లు కేటాయించారు. ఇందులో పర్యాటక శాఖలో తమ అనుయాయుల కంపెనీలకు ఈవెంట్, ఫంక్షన్ కాంట్రాక్టులు దక్కేలా చేసి, వారికి లబ్ధి చేకూర్చేలా ఏపీ టూరిజం అథారిటీకి రూ.171 కోట్లు కేటాయించగా.. అందులో రూ.150 కోట్లు ఒక్క ఈవెంట్ల నిర్వహణకే ఇవ్వడం గమనార్హం. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)ను నిర్లక్ష్యం చేసింది. సంస్థ స్వయం సమృద్ధి సాధించడం ద్వారా సింహ భాగం ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులను ఏపీటీడీసీ ఆదాయం నుంచే భరించేది. ప్రభుత్వం నుంచి ఏటా సుమారు రూ.2.50 కోట్ల వరకు కేటాయింపులుండేవి. కానీ, ఈ బడ్జెట్లో వాటిని రూ.64 లక్షలకు కుదించేసింది. తద్వారా ఏపీటీడీసీపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. ఏపీటీడీసీలో అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు జీతాల కింద నెలకు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుంది. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.50–60 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించే మొత్తం సుమారు ఐదారు నెలల వరకు రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు వీలుగా ఉండేది. ఇప్పుడు నిధులు తగ్గడంతో ఏపీటీడీసీపై ఆర్థిక భారం పెరగనుంది. ఇక 40 కొత్త పర్యాటక ప్రాజెక్టుల కోసమని రూ.50 కోట్లు కేటాయించారు. అంటే ఒక్కో ప్రాజెక్ట్ ఆధునికీకరణకు రూ.కోటికి మించి కేటాయించలేని దుస్థితి. ఇలా పర్యాటక శాఖ, భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్, శిల్పారామం సొసైటీకి కలిపి రూ.230 కోట్లు కేటాయింపులు చేసింది. క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ, కల్చరల్ కమిషన్కు కలిపి మరో రూ.230 కోట్ల వరకు కేటాయింపులు ప్రతిపాదించింది. -
10లోగా పర్యాటక పాలసీ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించి సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి పదో తేదీలోగా సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాలను ప్రాతిపదికగా చేసుకొని పాలసీని రూపొందించాలని సూచించారు. బుధవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అనుసరిస్తున్న పర్యాటక పాలసీలపై అధ్యయనం చేసి, అనుసరించదగ్గ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి దేశీ, విదేశీ పర్యాటకులు వచ్చేలా చూడాలన్నారు. పర్యాటక రంగంలో బహుళ జాతి కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీ ఉండాలని, దీనితో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు ఏర్పడి, పర్యాటకులను ఆకట్టుకోవటానికి వీలవుతుందని స్పష్టం చేశారు. పర్యాటక ఆదాయం పెరగాలి కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాలను సఫారీ టూరిజానికి అనువుగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘‘మేడారం, రామప్ప దేవాలయం, లక్నవరాలను సర్క్యూట్గా తీర్చిదిద్దాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్లో కేరళ తరహాలో బోట్హౌస్లతో పర్యాటకుల సంఖ్య పెరిగేలా చూడాలి. రాష్ట్రంలోని బౌద్ధ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేయాలి. సమ్మక్క–సారలమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు సమీపంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించాలి..’’అని సూచించారు. హైదరాబాద్ నగరంలోని ఎనీ్టఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్లను కలుపుతూ స్కైవాక్, సర్క్యూట్ను అభివృద్ధి చేయాలన్నారు. అనంతగిరితోపాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లో వసతులు మెరుగుపర్చాలని చెప్పారు. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వచ్చే ఆదాయమే కాకుండా పర్యాటక రంగం నుంచీ ఆదాయం పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరో దశకు చేరుకుంటుందని స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డును సత్వరం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దీనితోపాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. -
ప్రైవేటు చేతికి హార్సిలీహిల్స్?
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ జిల్లాలో ఏకైక పర్యాటక కేంద్రం. రాష్ట్రంలో ఏకైక పర్వత నివాస ప్రాంతం కూడా ఇదే. తిరుపతి డివిజన్ పరిధిలోని హార్సిలీహిల్స్ టూరిజం యూనిట్ను ప్రైవేటుకు అప్పగించే యత్నాలు మొదలయ్యాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ప్రైవేట్ ప్రతినిధులు హార్సిలీహిల్స్పైనున్న టూరిజం ఆస్తులపై పరిశీలన పూర్తి చేసినట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ విషయమై ఇటీవల సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా యూనియన్ నేతలు వినతిపత్రం అందించారు. రూ.9.13 కోట్లతో పనులు హార్సిలీహిల్స్ అభివృద్ధి, అతిథి గృహాల ఆధునికీకరణపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి రూ.9.13 కోట్ల నిధులు కేటాయించింది. అతిథిగృహాల ఆధునికీకరణ, కొత్త నిర్మాణాల కోసం పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్కు అప్పగించారు. 54 అతిథి గృహాలుండగా గవర్నర్ బంగ్లాను మినహాయించి మిగిలిన గదులకు రంగులు, కొత్తగా రెస్టారెంట్ భవనం నిర్మాణ పనులను హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. పర్యాటకశాఖ 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్లోపు 9 నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకుంది. వైల్డ్ విండ్స్ భవనంలోని 8, విండ్ విస్టిల్ భవనంలోని 6, విండ్ఫాల్ భవనంలోని 4 అతిథి గృహాలను కాంట్రాక్టర్కు అప్పగించింది. 18 అతిథిగృహలను ఏప్రిల్ నుంచి పర్యాటకులకు కేటాయించడం లేదు. 9నెలల్లో రూ.55 లక్షల నష్టం ఏప్రిల్ నుంచి 18 అతిథి గృహాలను పనుల కోసం కాంట్రాక్టర్కు అప్పగించడం, వాటిని పర్యాటకులకు అద్దెకు ఇవ్వకపోవడంతో పర్యాటకశాఖకు గడచిన 9 నెలల్లో రూ.55 లక్షల నష్టం వాటిల్లినట్టు ఉన్నతాధికారులకు సమాచారం. పనులు పూర్తి కాకపోవడంతో నెలకు రూ.6లక్షల నష్టం వస్తుంది. డిసెంబర్లో పనులు పూర్తి చేసి పర్యాటకశాఖకు భవనాలను అప్పగించాలి. ఇంతవరకు ఒక్క గది పనీ పూర్తి చేయలేదు. పనుల కోసం గదుల్లోని వాష్రూమ్ల గోడలను పడగొట్టి అలా ఉంచేశారు. ఆదాయం లేదని చూపే యత్నంహార్సిలీహిల్స్ యూనిట్ను ప్రైవేటుకు అప్పగించాలన్న యత్నాల్లో భాగంగానే ప్రభుత్వంలోని ఓ అధికారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఏటా రూ.3.50 నుంచి రూ.4.50 కోట్ల వరకు హార్సిలీహిల్స్ ఆదాయం ఉంటుంది. అలాంటిది గదుల పనులు పూర్తి చేయకుండా ఆదాయం తగ్గిపోయేలా చేస్తే దాన్ని ప్రైవేటుకు అప్పగించవచ్చన్న ఆలోచనతో ఇలా చేస్తున్నారని టూరిజం ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు -
కట్టలు తెగిన దుష్ప్రచారం.. రుషికొండ భవనాలపై దిగజారుడు మాటలు
ప్రభుత్వ అవసరాల కోసం రుషికొండలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం రూ.430 కోట్లతో భవనాలు నిర్మించింది. ఇవి శాశ్వత భవనాలు. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖలో ప్రభుత్వ పరంగా ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. వీటిని గుడ్లప్పగించి చూస్తూ.. నోరెళ్లబెట్టిన చంద్రబాబు.. గట్టిగా వానొస్తే నీళ్లు కారేలా ఏకంగా రూ.2,500 కోట్లతో అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఏ లెక్కన నిర్మించారు? ఇప్పుడు ఈ తాత్కాలిక కట్టడాలను కూల్చేసి.. శాశ్వత భవనాల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు? తన విలాసాల కోసం చేసిన ఖర్చు ఎవరికి తెలియదు? కుట్రలు, దుష్ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్న ఈ పెద్దమనిషికి డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. వాటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంతకైనా దిగజారుతానని మరోమారు నిరూపించుకున్నారు. సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా, చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సీఎం చంద్రబాబు విష ప్రచారాలనే నమ్ముకున్నారు. జరగని వాటిని జరిగినట్లు, లేని విషయాలను ఉన్నట్లు ఎడతెగని దుష్ప్రచారం చేస్తూ రోజుకో కుట్రకు తెరతీస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడ తన పని మరచిపోయి, రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ భవనాల వద్దకు వెళ్లి అవాకులు చెవాకులు పేలారు. గంట సేపు అక్కడ గడిపి వీడియో, ఫొటో షూట్లు చేయించడమే కాకుండా నోటికి వచ్చిన అబద్ధాలను కళ్లార్పకుండా చెప్పేశారు. ప్రభుత్వ అవసరాల కోసం టూరిజం శాఖ కట్టిన భవనాలను అప్పటి సీఎం విలాసాల కోసం కట్టారని.. రాజులు, చక్రవర్తులు ఇలాంటివి కట్టించుకుంటారంటూ అడ్డగోలుగా మాట్లాడారు. కమోడ్కు రూ.10 లక్షలు ఖర్చు పెట్టారంటూ అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. 2014లో హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో నెలల తరబడి కుటుంబంతో ఉండి రూ.30 కోట్ల బిల్లును ప్రభుత్వంతో కట్టించిన విషయాన్ని మరచిపోయారు. ఉండవల్లి, హైదరాబాద్, ఢిల్లీలోని తన క్యాంపు ఆఫీసులకు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ అవసరాల కోసం భవనాలు కట్టడాన్ని తప్పుగా చిత్రీకరించడం విడ్డూరంగా ఉంది. హైదరాబాద్ మదీనాగూడలోని తన సొంత ఫామ్హౌస్లో మరమ్మతులకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మించిన భవనాలపై అడ్డగోలు నిందలు మోపుతూ శుద్ధపూస కబుర్లు చెప్పడాన్ని ఏమనాలి? రుషికొండపై టూరిజం శాఖ రూ.430 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రభుత్వ కార్యకలాపాల కోసమేననే విషయాన్ని పక్కదారి పట్టించి వైఎస్ జగన్ కోసం నిర్మించినట్లుగా దాన్ని చిత్రీకరించడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి ఒక ఉదాహరణ. ఇందులో భూమి చదును చేయడానికే ఎక్కువ మొత్తం ఖర్చయింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాల కోసం ఇదే చంద్రబాబు ప్రభుత్వం గతంలో రూ.2,500 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు వీటిని కూలగొట్టి శాశ్వత భవనాలు నిర్మించడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తారో ఆయనే సెలవివ్వాలి. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్⇒ హనీ ట్రాప్ల మాయలేడి, ముంబయికి చెందిన నటి కాదంబరి జత్వాని కేసును తెరపైకి తెచ్చి నలుగురు ఐపీఎస్ అధికారులపై కేసులు బనాయించారు. పారిశ్రామికవేత్తలు, ధనికులను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్తో బ్లాక్ మెయిల్ చేసే కేసును ఏపీ పోలీసులు చాకచక్యంగా ఛేదిస్తే, దాన్ని కూడా రాజకీయం చేసి ఆమెకు వత్తాసు పలికి రాచమర్యాదలు చేయించారు చంద్రబాబు. ⇒ మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే.. దాన్ని వైఎస్సార్సీపీ కావాలని చేసిందంటూ ఆ ఘటనను రాజకీయానికి వాడుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని ఫైళ్లు తగుల బెట్టించడానికి ఇది చేయించారంటూ అడ్డగోలు వాదనకు దిగి కేసులు పెట్టి నానా రభస సృష్టించారు. డీజీపీని హెలికాప్టర్లో అక్కడికి పంపించారు. ఆ కేసులో ఇంతవరకు ఏమీ నిరూపించలేకపోయారు. ⇒ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్నప్పుడల్లా ఇలా ఏదో అంశాన్ని తెరపైకి తెచ్చి, వైఎస్ జగన్కు వ్యతిరేకంగా చిత్రీకరించి ఆయనపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు, ఆయన కూటమి పనిగా పెట్టుకుంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోననే భయంతో ఇలాంటి దారుణమైన కుట్ర రాజకీయాలు చేస్తూ చంద్రబాబు తన దిగజారుడుతనాన్ని ప్రతిరోజూ బయట పెట్టుకుంటున్నారు. మోసం, నయవంచనతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటినే ఆలంబనగా చేసుకుని తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించి వాటిని పక్కదారి పట్టించేందుకు దారుణంగా దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ప్రమాదంపై అడ్డగోలుతనం రెండేళ్ల క్రితం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదాన్ని ఇటీవలి ఎన్నికలకు ముందు జరిగినట్లు ప్రచారం చేస్తూ కుట్ర రాజకీయం మొదలుపెట్టారు. ఎప్పుడో 2022లో విజయమ్మ వాహనం టైర్లు ప్రమాదవశాత్తు పంక్చర్ అయితే, దాన్ని ఇటీవలే జరిగినట్లు.. దాని వెనుక కుట్ర ఉన్నట్లు, జగన్ కావాలని చేయించినట్లు అనుమానాలు కలిగేలా టీడీపీ సోషల్ మీడియా మూడు రోజులుగా వైరల్ చేస్తూ శునకానందం పొందుతోంది. అబద్ధానికి రెక్కలు తొడిగి పబ్బం గడుపుకునే చంద్రబాబుకు, ఆయన పరివారానికి కనీస విచక్షణా జ్ఞానం లేదని, కుట్రతో బురద జల్లడమే తెలుసని ఈ విషయం ద్వారా తేటతెల్లమైంది. అనుకోకుండా జరిగిన ప్రమాదాన్ని రెండేళ్ల తర్వాత తెరపైకి తెచ్చి, దానిపై ఆరోపణలు చేయడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. శ్రీవారి సాక్షిగా అబద్ధాలుకలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలనే వేదికగా చేసుకుని వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు అభాసుపాలయ్యారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, ఇందుకు గత ప్రభుత్వమే కారణమని దారుణమైన అబద్ధాన్ని పదే పదే చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. వేంకటేశ్వరస్వామి తన కుల దైవం అని చెప్పుకుంటూనే ఆయన్ను రాజకీయంలోకి లాగి చివరికి సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నారు. నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదని తేలడంతో దానిపై అడ్డగోలుగా మాట్లాడిన చంద్రబాబు, ఆయన అనుయాయుల నోళ్లు మూత పడ్డాయి.బెజవాడ వరదల్లోనూ రాజకీయంవిజయవాడ వరదలను ఎదుర్కోవడంలో దారుణంగా వైఫల్యం చెంది లక్షలాది మందిని నీటిలో ముంచిన చంద్రబాబు... ఆ విషయం నుంచి రాష్ట్ర ప్రజలను ఏమార్చేందుకు ప్రకాశం బ్యారేజీని బోట్లతో గుద్దించి ధ్వంసం చేయడానికి జగన్ పథకం పన్నారంటూ విష ప్రచారం చేశారు. వరదలో కొట్టుకువచ్చిన 4 బోట్లు బ్యారేజీ గేట్లకు అడ్డం పడితే, దాన్ని రాజకీయం చేసి వైఎస్సార్సీపీయే కావాలని బోట్లతో గుద్దించిందని, దీని వెనుక జగన్ ఉన్నారని చెబుతూ కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. చరిత్రలో ఇంతటి దగుల్బాజీ రాజకీయం చంద్రబాబు తప్ప వేరెవరూ చేయలేరని ఆ కేసు ద్వారా నిరూపించుకున్నారు. వాస్తవానికి వరద నీటిని నగరంలోకి మళ్లించిందే చంద్రబాబు. ఆ పడవలన్నీ టీడీపీ వాళ్లవే. -
వారంలోగా నిర్ణయం తీసుకోండి: టూరిజం ఎండీ సస్పెన్షన్ ఎత్తివేతపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహ ర్రావు సస్పెన్షన్ ఎత్తివేతపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ఆశాఖ ముఖ్యకార్యదర్శికి కోర్టుధిక్కారం కింద నోటీసులు జారీచేసి విచారణ జరపాల్సి ఉంటుందని హెచ్చ రించింది. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మనోహర్రావును సస్పెండ్ చేస్తూ గతనెల 17న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఎండీతోపాటు ఓఎస్డీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మనోహర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారిక సమావేశంలో భాగంగా తిరుమ ల వెళ్లానని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఎన్నికల సస్పెన్షన్లు దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరంలేదని, సస్పెన్షన్ ఎత్తి వేతపై నిర్ణయం తీసుకోవాలని గత విచారణ సందర్భంగా ఆదేశించింది. శుక్రవారం ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం మరోసారి విచా రణ చేపట్టింది. తమ ఆదేశాలపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
‘జనశక్తి’ ఎగ్జిబిషన్లో మోదీ
న్యూఢిల్లీ: మన్కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్(ఎన్జీఎంఏ)లో ఏర్పాటైన ఎగ్జిబిషన్ను ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. ‘జన శక్తి: ఒక సమ్మిళిత శక్తి’ఇతి వృత్తంతో ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖులైన 13 మంది కళాకారుల కళా ఖండాలున్నాయి. ఎగ్జిబిషన్లో ఆయన కలియదిరిగారని సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మన్కీ బాత్లో తమకు ప్రేరణనిచ్చిన అంశాల గురించి కళాకారులు ప్రధానికి వివరించారని పేర్కొంది. -
తీరానికి అందాల హారం! బీచ్లలో ఆధునిక సదుపాయాలు.. పోటీలు షురూ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీచ్ల సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ(ఆప్టా) చర్యలు చేపడుతోంది. బీచ్లను ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్కు అనుగుణంగా పర్యావరణ హితంగా, అందంగా తీర్చిదిద్దనుంది. ఇందులో భాగంగా తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్లలో ఆధునిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉత్తమ ప్రాజెక్టు డిజైన్ల కోసం ఆర్కిటెక్ట్ పోటీలను నిర్వహిస్తోంది. ఆర్కిటెక్ట్ సంస్థలతోపాటు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ (సీవోఏ)లో రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ)లో రిజిస్టర్డ్ ప్లానర్లు, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల (వ్యక్తిగత/బృందాలుగా)నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ)ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలించి ఉత్తమ ఆర్ఎఫ్పీలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించి ప్రోత్సహించనుంది. టెక్నికల్ బిడ్ల దాఖలుకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఇచ్చింది. పూర్తి వివరాలను https://tourism.ap.gov.in/tenders వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభివృద్ధి ప్రణాళిక ఇలా... తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్లలో సుమారు 1,500 మీటర్లు చొప్పున అభివృద్ధి చేయనున్నారు. ఈ బీచ్లను పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతోపాటు స్థానికులకు వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, వ్యూ పాయింట్లు, పిల్లల కోసం ఆట స్థలాలు, టూరిస్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ రిసెప్షన్ సెంటర్, రెస్క్యూ, వైద్య సౌకర్యాలు, ల్యాండ్ స్కేపింగ్, సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తారు. మరోవైపు పశ్చిమగోదారి జిల్లా పేరుపాలెంలో 104 ఎకరాల్లో, పల్నాడు జిల్లా నాగులవరంలో 250 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. వీటిల్లో బీచ్ కాటేజీలు, హోటళ్లు, రిసార్ట్స్, సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, ఎగ్జిబిషన్లు, థీమ్ పార్క్, వ్యూ పాయింట్లు, టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ వంటివి ఆధునిక సౌకర్యాలో ఏర్పాటు చేయనున్నారు. నగదు బహుమతులు ఇలా.. ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి వచ్చిన మొదటి మూడు ఉత్తమ ఎంపికలకు రూ.1,50,000, రూ.1,00,000, రూ.75,000 చొప్పున నగదు బహుమతులు అందిస్తారు. సీవోఏ రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్, ఐటీపీఐ రిజిస్టర్డ్ ప్లానర్ నుంచి వచ్చిన ఉత్తమ డిజైన్లకు రూ.1,00,000, రూ.75,000, రూ.55,000 చొప్పున, విద్యార్థి విభాగంలో విజేతలకు రూ.50,000, రూ.40,000, రూ.30,000 చొప్పున నగదు బహుమతులను ప్రదానం చేస్తారు. ప్రతిభగల ఆర్కిటెక్ట్లకు ఆప్టాతో కలిసి పని చేసే అవకాశం కూడా కల్పిస్తారు. చదవండి: సైన్యం సన్నద్ధం -
‘పాపికొండల’ ప్రత్యేక ప్యాకేజీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది. ఆ ప్యాకేజీ వివరాలను ఏపీటీడీసీ కాకినాడ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. రాజమండ్రి, గండి పోచమ్మ నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 98486 29341, 98488 83091 నంబర్లలో, పోచవరం నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 63037 69675 నంబర్లో సంప్రదించాలని కోరారు. రాజమండ్రి నుంచి ఒక రోజు పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. రాజమండ్రి నుంచి 2 రోజుల పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి ఒక రోజు పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి 2 రోజుల పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తిరిగి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. గండి పోచమ్మ నుంచి ఒక రోజు పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. గండి పోచమ్మ నుంచి 2 రోజుల పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి రెండు నాన్వెజ్ కూరలతో భోజనం. 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. -
కళ్లకు కట్టేలా ‘ఇంజనీరింగ్ పర్యాటకం’
సాక్షి, అమరావతి: పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వినోద, విహార యాత్రలకే పరిమితం కాకుండా ఇంజనీరింగ్ అద్భుత నిర్మాణ పాటవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తాజాగా విదేశాల్లో ‘ఇంజనీరింగ్ పర్యాటకం’ కొత్త ధోరణిగా అవతరిస్తోంది. వంతెనలు, డ్యామ్లు, పోర్టులు, భారీ కట్టడాలు చూసిన వెంటనే సందర్శకులను ఆకర్షిస్తాయి. అటువంటి వాటిల్లో చారిత్రక, వారసత్వ నిర్మాణాల విలువలను భావితరాలకు, యువ ఇంజనీర్లకు స్ఫూర్తినిచ్చేలా పర్యాటకం తోడ్పాటునందిస్తోంది. విదేశాల్లో ఎక్కువగా.. వంతెనలు, నీటి ప్రాజెక్టులు ఆయా ప్రాంతాలకు చిహ్నాలు. వాటి నిర్మాణం వెనుక కథ ఆసక్తిగా ఉంటుంది. ఎంతో మంది రేయింబవళ్లు ఏళ్లపాటు కష్టపడి చేపట్టిన నిర్మాణాల సంక్లిష్టతను, సామర్థ్యాన్ని అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, జర్మనీ, ఇంగ్లండ్లు భావితరాలకు అందిస్తున్నాయి. చారిత్రక ఇంజినీరింగ్ ప్రదేశాలను పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దడంలో విజయం సాధించాయి. భారీ యంత్రాలు లేని సమయంలో వంతెనలు, డ్యామ్ల రూపకల్పనకు సంబంధించిన ఆనాటి సాంకేతికత విలువలను మ్యూజియంల రూపంలో భద్రపరుస్తున్నాయి. వీటిని ప్రజలు సందర్శించేలా మౌలిక వసతులు కల్పిస్తూ పర్యాటక రంగం విస్తరణకు దోహదపడుతున్నాయి. చైనాలో ప్రతి వంతెనకు ఒక మ్యూజియం ఉంటుంది. ఆ వంతెన ముఖ్య విషయాలను అందులో ప్రదర్శిస్తారు. భారత్లో అయితే ఏపీలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ విశేషాలను, నమూనాలను ప్రదర్శించేందుకు, యూపీలో పాత నైనీ బ్రిడ్జికు ప్రత్యేక మ్యూజియంలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు.. సమాజ సంస్కృతి, అభివృద్ధి శ్రేయస్సుకు మూల స్తంభాలుగా డ్యామ్లు, వంతెనలు నిలుస్తున్నాయి. రోడ్డు వంతెన అయినా..రైలు వంతెన అయినా, సైన్యం నిర్మించినది అయినా, సస్పెన్షన్ బ్రిడ్జిలు, సపోర్డెట్ బ్రిడ్జ్లు, కంటిన్యూస్ స్పాన్ బ్రిడ్జిలు దేశంలో, రాష్ట్రంలో అనేకం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఏపీ పర్యాటకంలో ఇంజనీరింగ్ టూరిజం కేవలం 2.28 శాతం మాత్రమే. అయినప్పటికీ వాటికున్న ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రముఖ ఇంజనీరింగ్ నిర్మాణ ప్రాంతాలైన డ్యామ్లు, రిజర్వాయర్లు, సైన్స్ సెంటర్లు, హార్బర్లు, పోర్టులు, వంతెనలను విదేశీ తరహా పర్యాటకంగా అభివృద్ధికి కసరత్తు చేస్తోంది. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ, పోలవరం, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాధాన నిర్మాణాలతోపాటు వివిధ రిజర్వాయర్లు, వంతెనల టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఆయా ప్రాంతాలను గుర్తించనుంది. రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి గోదావరి అందాల్లో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖలో సబ్మెరైన్, జెట్ మ్యూజియంలు ఆకట్టుకుంటున్నాయి. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి రాష్ట్రంలో అపార పర్యాటక వనరులు ఉన్నాయి. వాటిని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రముఖ ఇంజనీరింగ్ నిర్మాణ ప్రాంతాలను కూడా పర్యాటక స్థలాలుగా గుర్తించేందుకు కసరత్తు జరుగుతోంది. దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి -
రాష్ట్రంలో కోటి జాతీయ జెండాల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్భార్గవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కోటి జాతీయ జెండాలను పింఛన్దారులకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. శనివారం ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు మూడు కిలో మీటర్ల జాతీయ పతాక ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 278 మంది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించడంతో పాటు 399 చెరువులను ఆధునికీకరించి అమృత్ సరోవర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. త్యాగధనుల స్ఫూర్తిని చాటేలా చారిత్రక సంపద, వారసత్వ కట్టడాలను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని వర్గాలను జెండా పండుగలో మమేకం చేయడానికి మూడు లఘు చిత్రాలను రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించినట్టు వివరించారు. -
మంగమారిపేటలో ఎంటర్టైన్మెంట్ సిటీకి ప్రణాళికలు
సింగపూర్ వెళ్లే ప్రతి పర్యాటకుడూ సందర్శించే ఏకైక ప్రాంతం సెంటోసా దీవులు. భిన్నమైన పర్యాటక ప్రాంతాలన్ని ఒకే చోట కనువిందు చేసే ఈ ప్రాంతానికి వెళ్తే.. సరికొత్త ప్రపంచాన్ని చుట్టొచ్చినట్లే. సరిగ్గా ఇదే ఆలోచనతో సుందర నగరం విశాఖ తీరంలోనూ మెగా టూరిజం కాంప్లెక్స్కు పర్యాటక శాఖ శ్రీకారం చుడుతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 24 విభిన్న టూరిజం ప్రాజెక్టులు ఒకే చోట రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టులో ఇప్పటికే కొన్నింటికి కేబినెట్ ఆమోదముద్ర లభించింది. త్వరలోనే స్టేక్ హోల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు టూరిజం శాఖ సన్నద్ధమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: భారత్కు వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో ఐదుగురు విశాఖ నగరాన్ని సందర్శిస్తుంటారు. అందుకే పర్యాటకంగా నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టూరిజం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సెంటోసా దీవుల తరహాలో ఎంటర్టైన్మెంట్ సిటీని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం విశాఖపట్నం నుంచి 16 కి.మీ, భీమిలి నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న మంగమారిపేట బీచ్ను ఎంపిక చేశారు. 25 ఎకరాలు.. 24 ప్రాజెక్టులు.. రూ.700 కోట్లు మంగమారిపేట బీచ్లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎంటర్టైన్మెంట్ సిటీకి రూపకల్పన చేశారు. ఈ మెగా టూరిజం కాంప్లెక్స్లో మొత్తం 24 విభిన్న తరహా టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. ఇందుకోసం రూ.700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న భీమిలి–భోగాపురం ఆరులైన్ల గ్రీన్ఫీల్డ్ కారిడార్కు అనుసంధానంగా ఈ ఎంటర్టైన్మెంట్ సిటీ రానుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యాధునిక టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంతో పాటు.. ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలైన అంశాలతో టూరిజం అధికారులు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఒకే కాంప్లెక్స్లో పార్కింగ్, ఫుడ్ కోర్టులు, ఇతర మౌలిక వసతులు కల్పించడం వల్ల ప్రాజెక్టు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఎఎంఎల్) సహకారంతో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. పలు ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇప్పటికే ఈ ఎంటర్టైన్మెంట్ సిటీలో రానున్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం వేసింది. జెయింట్ వీల్, స్నో పార్క్, స్కై టవర్, టన్నెల్ అక్వేరియం వంటి ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం లభించింది. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను రూపొందించిన తర్వాత.. కేబినెట్ ముందుకు ఈ ఫైల్ రానుంది. కేబినెట్ ఆమోదం అన్నింటికీ లభించిన తర్వాత.. మెగా టూరిజం కాంప్లెక్స్కు వడివడిగా అడుగులు పడనున్నాయి. (క్లిక్: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం) ఎంటర్టైన్మెంట్ సిటీ విశేషాలు ఎంటర్టైన్మెంట్ సిటీలో టన్నెల్ అక్వేరియం, జెయింట్ వీల్, స్కైటవర్, స్నోవరల్డ్తో పాటు పలు అడ్వెంచర్ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఐస్ స్కల్ప్ చర్ పార్క్, అవుట్ డోర్ స్కై డైవింగ్, టెథర్డ్ గ్యాస్ బెలూన్, వేవ్ సర్ఫింగ్, ఎలివేటెడ్ ట్రాక్డ్ ట్రైన్, డైనోసర్ పార్క్, డైనోసార్ 5డీ ఇండోర్ షో, గ్లో గార్డెన్, మినియేచర్ వరల్డ్, గ్లాస్ వ్యూయింగ్ డెక్, ఈవెంట్ డోమ్, అవుట్డోర్ మువీ సిస్టమ్, పెర్ఫార్మెన్స్ థియేటర్, గ్లాస్ డెక్ రెస్ట్ అకామిడేషన్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, బీచ్ రాంట్, వాటర్ బస్తో పాటు భిన్నమైన ఆటలు, చిల్డ్రన్ పార్క్, పిల్లల అడ్వెంచర్ గేమ్స్, ఇండోర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, ఫుడ్కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) త్వరలోనే ఎంవోయూలు ఎంటర్టైన్మెంట్ సిటీ కోసం మంగమారిపేటని గుర్తించాం. బీచ్రోడ్డులో కొంత భూమి కోతకు గురైన కారణంగా ఆరు ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించాం. భూ సేకరణకు సంబంధించి చిన్న చిన్న సమస్యలున్నాయి. అవి త్వరలోనే పరిష్కృతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటికి సంబంధించి మార్పులు చేర్పులు కూడా చేపట్టాం. పెట్టుబడిదారుల కోసం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించి ప్రాజెక్టు గురించి వివరించనున్నాం. ఇప్పటికే చాలా మంది ఎంటర్టైన్మెంట్ సిటీలో పెట్టుబడుల కోసం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరలో ఎంవోయూలు నిర్వహించి, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. – శ్రీనివాస్పాణి, టూరిజం రీజనల్ డైరెక్టర్ -
క్రేజీ.. క్యారవాన్ టూర్!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా క్యారవాన్ పర్యాటకం పరుగెడుతోంది. వినోద, విహార యాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబం, స్నేహితులతో కలిసి బడ్జెట్లో విలాస టూర్లు చేయిస్తోంది. నచ్చిన చోటుకు.. కావాల్సిన సమయంలో తీసుకెళ్తూ.. బస గురించి బెంగ లేకుండా.. సకల వసతులతో హోం స్టే అనుభూతులన్నీ అందిస్తోంది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. విస్తరిస్తున్న క్యారవాన్ సంస్కృతి.. విదేశాల్లో ఉండే ఓవర్ ల్యాండర్ (క్యారవాన్) సంస్కృతి భారత్లోనూ క్రమంగా విస్తరిస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, ఈశాన్య భారతం, హిమాచల్ ప్రదేశ్, నాగ్పూర్, మహారాష్ట్ర, గోవాలో ప్రత్యేక ప్యాకేజీల్లో మొబైల్ హౌస్ పర్యాటకం లభిస్తోంది. ఇటీవల కేరళలో ఈ తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా క్యారవాన్ టూరిజం పాలసీని సైతం తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే టూరిజం శాఖ క్యారవాన్ పర్యాటకాన్ని ప్రవేశపెట్టగా.. రాష్ట్ర విభజన అనంతరం టీఎస్టీడీసీ దానిని నిర్వహిస్తోంది. తాజాగా ఏపీటీడీసీ తీర్థయాత్రల ప్యాకేజీలు అందిస్తున్న విధానంలోనే క్యారవాన్ టూరిజాన్ని కూడా తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. చక్రాలపై పర్యాటకం! సినిమా స్టార్స్ షూటింగ్ సమయాల్లో, రాజకీయ నాయకులు తమ పర్యటనల్లో సకల సౌకర్యాలు ఉండే క్యారవాన్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో విశ్రాంతి తీసుకోవడానికి విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. ఏసీ, ఆధునిక టాయిలెట్లు, షవర్ (వేడి, చల్ల నీళ్లతో), ఎల్ఈడీ స్క్రీన్లు ఉండడమే కాకుండా ఒక రిఫ్రిజిరేటర్తో కూడిన కిచెన్, బార్బిక్యూ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక్కడ నచ్చిన ఆహారాన్ని వండుకుని తినేందుకు పాత్రలుంటాయి. ఇందులో ఉండే సోఫాలను బెడ్లుగా కూడా మార్చుకోవచ్చు. గుడారాలు వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. అయితే ఇలాంటి వాహనాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. అయితే అద్దెకు తీసుకొని కోరిన చోటుకి విహార యాత్రకు వెళ్లడానికి వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు, టూర్ ఆపరేటర్ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. వినోదానికి బోర్డ్ గేమ్లు, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. వాహనం సైజును బట్టి.. ఒక్కో వాహనం సైజును బట్టి నలుగురు నుంచి 9 మంది వరకు ప్రయాణించవచ్చు. డ్రైవర్తో పాటు లేకుంటే సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా క్యారవాన్ టూర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణ దూరం, సమయాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు. -
ఆర్టీసీలో టూరిజం విభాగం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కొత్తగా టూరిజం విభాగం ఏర్పాటు అవుతోంది. పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు తిప్పాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ బాధ్యతను పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. కానీ కొంత కాలంగా ఆ సంస్థ బాగా బలహీనపడింది. చాలినన్ని బస్సులను నిర్వహించే స్థితిలో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆ లోటును తన బస్సులతో భర్తీ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేలా ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడిచే హోటళ్లు, విశ్రాంతి గదులున్నాయి. ఇప్పడు వాటిని ఆర్టీసీ వినియోగించుకుంటుంది. ఇందుకోసం ఆర్టీసీ–పర్యాటక శాఖలు సంయుక్తంగా ఓ విధానాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో బస్భవన్లో రెండు విభాగాల సంయుక్త సమావేశం జరిగింది. ఇప్పటికే టూరిజం విభాగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఆర్టీసీ, తన ప్రణాళికను పర్యాటక శాఖ ముందుంచింది. అటువైపు నుంచి వచ్చే స్పందన ఆధారంగా సంయుక్త విధానాన్ని రూపొందించుకుందామని ప్రతిపాదించింది. ఆర్టీసీ ఇటీవలే ప్రయోగాత్మకంగా కేపీహెచ్బీ–వికారాబాద్, అనంతగిరి మధ్య ప్రతి ఆదివారం పర్యాటకుల కోసం సర్వీసులు ప్రారంభించింది. ఈ సర్వీసులకు మంచి డిమాండ్ ఏర్పడింది. త్వరలో ఇలాంటి మరికొన్ని ప్రాంతాలకు కూడా సాధారణ ప్రయాణికుల సర్వీసులుగా కాకుండా, పర్యాటకుల సర్వీసులు ప్రారంభించాలని భావిస్తోంది. దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పర్యాటకరంగంలో తెలంగాణనే వెనకబడి ఉంది. కోవిడ్ భయం తగ్గిపోవటంతో గత నెలరోజులుగా పర్యాటక ప్రాంతాలకు జనం తాకిడి పెరిగింది. దీన్ని అందిపుచ్చుకుని ఇటు పర్యాటక శాఖ, అటు ఇతర అనుబంధ సంస్థలతో కలసి ముందుకు సాగాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భావిస్తున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస గుప్తా, ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, ఇతర అధికారులు మునిశేఖర్, జీవన్ప్రసాద్, యుగేందర్, రఘునాథ్ పాల్గొన్నారు. -
Visakhapatnam: టూరిజంలో వైజాగ్కు ట్రెండ్ సెట్ చేసే సత్తా
టీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే విశాఖ నగరానికి పర్యాటక రంగంలో ట్రెండ్ సెట్ చేసే సత్తా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గౌర్ కంజీలాల్ అన్నారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తూ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే గోవా కంటే మిన్నగా విశాఖ బీచ్లను అభివృద్ధి చేయవచ్చన్నారు. అలాగే 10 విభిన్న రకాల టూరిజం డెస్టినేషన్గా వైజాగ్ను తీర్చిదిద్దవచ్చని వివరించారు. ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన గౌర్ కంజీలాల్.. టూరిజం రంగంలో విశాఖకు ఉన్న అవకాశాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, విశాఖపట్నం ప్రపంచంలో ప్రతి మనిషి ఆలోచనలు ఎప్పటికప్పుడు విభిన్నంగా మారిపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్ టూరిజం ట్రెండ్కు తగినట్లుగా ఆలోచనలు చేస్తూ ప్రాజెక్టులను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఒక ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ వరుసలో అవకాశాలు పుష్కలంగా ఉన్న నగరాల జాబితాలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ పర్యాటక పరంగా వనరులు అపారంగా ఉన్నాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేస్తే దేశంలో నంబర్ వన్గా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్లీన్ అండ్ పీస్ఫుల్ బీచ్లుగా.. 1952 నుంచి 1980 మధ్యలో భారత్లో పర్యటించింది కేవలం ఒక మిలియన్ పర్యాటకులు మాత్రమే. దీనిపై మేము లండన్ వెళ్లి అధ్యయనం చేశాం. అప్పుడే ఛార్టర్ విమానాలు నడపాలన్న ప్రతిపాదనలను తీసుకొచ్చాం. క్రమంగా ఒక్కో ప్రాంతానికి ఎయిర్ కనెక్టివిటీ పెంచుతూ పర్యాటకంగా అభివృద్ధికి దోహదపడింది. ఇదే కాన్సెప్ట్లో వైజాగ్కు పెద్ద సంఖ్యలో టూరిస్టులను ఆకర్షితుల్ని చెయ్యాలి. ఇందుకు కాన్సెప్ట్ డెవలప్మెంట్ చాలా అవసరం. దేశంలో ఉన్న 365 బీచ్లతో పోలిస్తే.. విశాఖలో మంచి బీచ్లున్నాయి. వీటన్నింటినీ క్లీన్ అండ్ పీస్ఫుల్ బీచ్లుగా తీర్చిదిద్దాలి. తీరప్రాంత వినియోగంతో అద్భుతాలు విశాఖకు 135 కిలోమీటర్ల సువిశాల సాగర తీరం ఉన్నా.. టూరిజం పరంగా సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. పోర్ట్ ఆఫ్ కాల్ పేరుతో క్రూయిజ్ టూరిజం అభివృద్ధి చేయవచ్చు. పెద్ద క్రూయిజ్ని సముద్ర మధ్య భాగంలో నిలిపి.. డైనింగ్, ఫంక్షన్లు నిర్వహించేలా, క్యాసినోలు మొదలైన కమర్షియల్ టూరిజంని ప్రవేశపెడితే అద్భుతంగా ఉంటుంది. గోవా ఈ తరహాలోనే అభివృద్ధి చెందింది. అక్కడ జనాభా 2 మిలియన్లుంటే.. వచ్చే పర్యాటకులు మాత్రం 5 మిలియన్లుంటారు. కారణం.. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా స్థానికుల్లోనూ మార్పు వచ్చింది. ఫలితంగా గోవా మొత్తం టూరిస్ట్ డెస్టినీగా మారిపోయింది. దానికంటే మిన్నగా విశాఖను అభివృద్ధి చేయవచ్చు. ప్రజలు ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేస్తే... వైజాగ్ కచ్చితంగా.. దేశంలోనే నెంబర్ వన్ పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఛార్టర్లను అందుబాటులోకి తీసుకురావాలి.. ఛార్టర్లను విశాఖకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పొరుగు దేశాల నుంచి ఛార్టర్లు వస్తే.. ఒకేసారి 400 మంది పర్యాటకులు వస్తారు. వారికి తగిన ఏర్పాట్లను కల్పించాల్సి ఉంది. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. గల్ఫ్, ఖతార్, కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్, కొలంబో మొదలైన దేశాల నుంచి ఇక్కడి పర్యాటకులకు ఆహ్వానం పలికేలా ప్యాకేజీలు రూపొందించాలి. విదేశీ పర్యాటకులకు అనుగుణంగా ఎయిర్పోర్టులో మౌలిక వసతులు, నగరంలో సదుపాయాలు, హాస్పిటాలిటీ పెంచాలి. వైజాగ్ ప్రపంచాన్ని టూరిస్టులకు పరిచయం చేసేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఉన్న స్టాఫ్ని నియమించుకోవాలి. 10 విభిన్నతల టూరిజం.. బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, క్రూయిజ్ టూరిజం, సస్టైనబుల్ టూరిజం, ఎకోటూరిజం, విలేజ్ టూరిజం, కల్చరల్ టూరిజం, అగ్రి టూరిజం, క్రియేటివ్ టూరిజం, డార్క్ టూరిజం.. ఇలా పది విభిన్న రకాల పర్యాటక అభివృద్ధికి కావల్సిన వనరులు విశాఖలో ఉన్నాయి. ఉదాహరణకు అరకులో కూల్ టూరిజం అభివృద్ధి చేయవచ్చు. గ్రామీణ విశాఖ, అరకు ప్రాంతంలో అగ్రి టూరిజం, విలేజ్ టూరిజం ప్రమోట్ చేస్తే అంతర్జాతీయ నగరాల నుంచి పర్యాటకులు క్యూ కడతారు. అదేవిధంగా.. హోమ్ స్టే సంస్కృతి తీసుకురావాలి. టూరిజం మార్కెట్లో హోమ్స్టేలకు మంచి డిమాండ్ ఉంది. -
మొసళ్లు ఉన్నాయంటూ కథలు చెప్పారు.. అసలు విషయం వేరు.. బోటింగ్ లేనట్టేనా?
ఖానాపురం (వరంగల్): పర్యాటక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదరణకు నోచుకోకుండా మిగిలిపోగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధిపై ఆశలు పెంచుకుంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. దీంతో పాటు పోస్టల్ స్టాంపుపై ముద్రణకు ఎంపికైంది. అన్ని అర్హతలున్నా అభివృద్ధిలో మాత్రం అంతంతమాత్రంగానే ముందుకు సాగుతుంది పాకాల సరస్సు. పర్యాటకానికి వచ్చే వారిని తన అందాలతో మంత్రముగ్ధులను చేసి మరోసారి తన ఒడిలోకి వచ్చే విధంగా చేస్తుంది. కానీ అధికారుల సమన్వయ లోపం, పాలకుల పట్టింపులేని తనంతో పర్యాటకులు పెదవి విరుస్తున్న దుస్థితి నెలకొంది. ఖానాపురం మండలం అశోక్నగర్ శివారులో పాకాల సరస్సు సుమారు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సరస్సు చుట్టూ 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభయారణ్యం. (చదవండి: Hyderabad: డీజిల్ కొట్టించగానే ఆగిపోతున్న కార్లు.. ప్రశ్నిస్తే..) బోటింగ్ దృశ్యాలు (ఫైల్ ఫొటో) 30 ఫీట్ల నీటిసామర్థ్యం కలిగిన సరస్సుకు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. మత్తడిపోసే సమయంలో అయితే ఎక్కువ సంఖ్యలో వచ్చి చిలుకలగుట్ట అందాలు, ఔషధవనం, బటర్ఫ్లై గార్డెన్తో పాటు అభయారణ్యంలోని వివిధ రకాల పక్షులను తలకిస్తూ ఆనందంగా గడుపుతారు. అభయారణ్యంలో ఉత్సాహంగా గడిపిన తర్వాత నీటిమధ్య ఆనందంగా గడపడానికి బోటింగ్కు వెళ్తుంటారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడిచే బోటింగ్కు వెళ్లి సరస్సు అందాలను తనివితీరా వీక్షిస్తుంటారు. బోటింగ్ దృశ్యాలు (ఫైల్ ఫొటో) ఫారెస్ట్ అధికారుల మోకాలడ్డు.. పాకాల పర్యాటక ప్రాంతం అటవీ ప్రాంతం మధ్యలో ఉంటుంది. అభయారణ్యం మధ్యలో ఉండే సరస్సులో బోటింగ్ను అనేక సంవత్సరాలుగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇదే క్రమంలో సరస్సులో బోటింగ్ను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పర్యాటకులతో పాటు స్థానిక ప్రజల నుంచి బోటింగ్పై మండల ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు అందాయి. మండల స్థాయి అధికారులు ఫారెస్ట్ అధికారులతో గతంలో వాగ్వాదాలకు దిగడంతో కొంత కాలం యథావిధిగా నడిచింది. ఆ తర్వాత మళ్లీ ఫారెస్ట్ అధికారులు మోకాలడ్డు పెట్టడంతో 2020 అక్టోబర్ 7 నుంచి బోటింగ్ సేవలు నిలిచిపోయాయి. (చదవండి: గుడ్న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్ ) బోటింగ్ దృశ్యాలు (ఫైల్ ఫొటో) ఇదేంటని పలువురు పర్యాటకులు ప్రశ్నించడంతో సరస్సులో మొసళ్లు ఉన్నాయంటూ కాలం వెళ్లదీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత బోటింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఫారెస్ట్ శాఖకు పంచాలనే నిబంధన తీసుకువచ్చినట్లు అధికారుల ద్వారా తెలిసింది. బోటింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఫారెస్ట్ శాఖకు పంచితే టూరిజం శాఖకు నష్టం కలుగుతుండటంతో బోటింగ్ను ప్రారంభించడానికి ముందుకు రావడంలేదని పలువురు అనుకుంటున్నారు. ఇరు శాఖల సమన్వయలోపంతో పర్యాటకులు బోటింగ్ చేయకుండా వెనుదిరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు, పర్యాటకులు కోరుతున్నారు. ఫారెస్ట్ అధికారులతో చర్చిస్తాం.. పాకాలలో బోటింగ్ విషయాన్ని ఫారెస్ట్ అధికారులతో త్వరలో చర్చిస్తాం. బోటింగ్ను తప్పకుండా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. – మనోహర్, ఎండీ, టూరిజం -
వన్ ఇండియా.. వన్ టూరిజం
పర్యాటకానికి సంబంధించి దేశం మొత్తం మీద ఒకే విధానం అమలయ్యేలా వన్ ఇండియా వన్ టూరిజం పద్ధతిని పరిశీలించాలని ట్రావెల్ ఏజెంట్ల అసోసియేషన్ (టీఏఏఐ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఒకే పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చే అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని కోరింది. తద్వారా మహమ్మారి ధాటికి సంక్షోభంలో చిక్కుకున్న దేశీ ట్రావెల్, టూరిజం, ఆతిథ్య రంగానికి తోడ్పాటు అందించాలని టీఏఏఐ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, సంబంధిత వర్గాలందరికీ విమాన ప్రయాణం మరింత చౌకగా అందుబాటులో ఉండేలా విమాన ఇంధనాన్ని (ఏటీఎం) కూడా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చాలని కోరింది. అలాగే, అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిధిని మరింత విస్తృతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రం, రాష్ట్రాలు తోడ్పాటునివ్వాలి.. టూరిజం రంగం కోలుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునివ్వాలని టీఏఏఐ పేర్కొంది. విచక్షణాయుత ఖర్చులు పెట్టేందుకు వీలుగా మధ్యతరగతి ప్రజల చేతిలో తగు స్థాయిలో డబ్బులు ఆడేందుకు సముచిత చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. స్టార్టప్లు, చిన్న .. మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) వర్కింగ్ క్యాపిటల్ భారాన్ని తగ్గించేందుకు, నగదు లభ్యత మెరుగుపడేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. అలాగే ఆదాయపు పన్ను రేటు, జీఎస్టీ రేటును తగ్గించాలని, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. 2022–2023లో అన్ని టూరిస్ట్ వీసాలపై ఈ–వీసా ఫీజు మినహాయింపునివ్వాలని పేర్కొంది. ఎంఎస్ఎంఈలను పటిష్టం చేయడం, పరిశ్రమలో టెక్నాలజీ వినియోగానికి ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమును ఏర్పాటు చేయడం, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం క్రెడిట్ ఆధారిత క్యాపిటల్ సబ్సిడీ స్కీము (సీఎల్సీఎస్ఎస్)ను పునరుద్ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని టీఏఏఐ కోరింది. అలాగే, ట్రావెల్ ఏజెంట్లు, ఆపరేటర్ల మనుగడ కోసం వారికి రావల్సిన చెల్లింపులకు భద్రత కల్పించే విధంగా తగు వ్యవస్థను నెలకొల్పాలని విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ ఎంఐసీఈ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) కార్యక్రమాలను భారత్కు రప్పించే దిశగా, దేశీ ఎంఐసీఈ కంపెనీలు అంతర్జాతీయ బిడ్డింగ్లలో పాల్గొనేందుకు ఉపయోగపడే గ్లోబల్ బిడ్డింగ్ ఫండ్ ఏర్పాటు అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని టీఏఏఐ కోరింది. -
టూరిజం డే, అల్లూరి జయంతి.. ఛాన్స్ దొరికితే చాలు దోచేస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పర్యాటక శాఖ ఖజానాను ఖాళీ చేసే పనిలో టూరిజం రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నిమగ్నమైపోయింది. దొరికిందే తడవుగా.. ఏ చిన్న అవకాశం దొరికినా తమదైన శైలిలో దోపిడీకి తెరతీస్తున్నారు. టూరిజం సీఈవో నోటమాట పేరుతో నిధుల్ని తమ ఖాతాల్లోకి పంపించేసుకుంటున్నారు. టూరిజం డే.. అల్లూరి జయంతి.. కాదేదీ కాసుల వర్షానికి అనర్హం అన్న రీతిలో కలెక్టర్కు పంపించకుండానే బిల్లులతో ఖజానాకు చిల్లులు పెడుతున్నారు. 2021 ఆగస్ట్ 27న వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో పర్యాటక దినోత్సవం నిర్వహించారు. వరల్డ్ టూరిజం డేకు గతంలో రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చు చేసేవారు. ప్రభుత్వం కూడా రూ.5 లక్షలు ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. గతంలో ఘనంగా నిర్వహించేవారు. ఈసారి కోవిడ్ కారణంగా ఇన్డోర్లోనే చేపట్టారు. కానీ.. ఏకంగా రూ.8 లక్షల వరకూ బిల్లులు పెట్టారు. కొందరు కళాకారులకు రూ.19 వేలు ఇచ్చి.. రూ.40 వేలు డ్రా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నృత్య కళాకారులకు రూ.30 వేలు ఇచ్చి.. రూ.40 వేలు బిల్లు వేశారనీ.. మిగిలిన వారికీ అదేరీతిలో గోరంత ఇచ్చి.. కొండంత బిల్లు లాగేసుకున్నారనే విమర్శలొస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవానికి గతేడాది రూ.1.20 లక్షలు ఖర్చు చేయగా.. ఈసారి మాత్రం రూ.2.75 లక్షలు చేశారు. గతేడాది చేసిన మాదిరిగానే ఈసారీ నిర్వహించారు. కానీ.. ఒకే ఒక్క తేడా.. వర్షం పడుతుందని వాటర్ ప్రూఫ్ టెంట్ వేశారు. దానికే అదనంగా లాగేశారని కొందరు టూరిజం సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఇలా అవకాశం దొరికిన ప్రతిసారీ.. టూరిజం ఖజానా ఖాళీ చేసేందుకు టూరిజం ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది రెడీగా ఉంటున్నారని పర్యాటక శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నోటిమాట చాలంట! ప్రతి జిల్లా పర్యాటక శాఖకు సంబంధించి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ అకౌంట్ ఉంటుంది. దీనిని ప్రతి జిల్లాలోనూ జిల్లా పర్యాటక అధికారి పర్యవేక్షణలో ఉంటుంది. కానీ విశాఖ జిల్లాలో మాత్రం రెండేళ్ల క్రితం నుంచి వేరే అధికారి పర్యవేక్షణలో ఉంది. రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది ఇటీవల కొన్ని పనులకు సంబంధించి టూరిజం సీఈవో (నోటిమాట) ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో ఇటీవలే రూ. 1.50 లక్షలు వివిధ పనులకు డ్రా చేసుకున్నట్లు సమాచారం. పర్యాటక శాఖకు సంబంధించిన ప్రతి ప్రధాన బిల్లుని జిల్లా కలెక్టర్కు పంపించాల్సి ఉంటుంది. కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో ఫైల్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించకుండానే నడిపించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టూరిజం సీఈవో సత్యనారాయణని ప్రశ్నించగా.. ఈ బిల్లు విషయం తన దృష్టికి వచ్చిందనీ.. దీనిపై వివరణ కోరినట్లు తెలిపారు. -
రెండేళ్ల క్రితం సాదాసీదాగా వచ్చి.. ఇప్పుడు ఆ శాఖలో పెత్తనమంతా అతనిదే..!
ఎవ్రిథింగ్ ఈజ్ పాజిబుల్.. ఏపీ పర్యాటక శాఖ ట్యాగ్లైన్. ఇక్కడ జరిగే వింతలు చూస్తే.. నిజంగా ఈ శాఖకు ఈ ట్యాగ్లైన్ కరెక్ట్ అనిపిస్తుంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి సీనియర్ మేనేజర్ హోదాని కట్టబెట్టేశారు. గైడ్గా మొదలైన సదరు ఉద్యోగి ప్రస్థానం.. జిల్లా టూరిజం మేనేజర్గానూ.. ఇప్పుడు ఐటీడీఏ టూరిజం ఎస్ఎం వరకూ చేరింది. ఆరోపణలు, వివాదాలతో నిత్యం సావాసం చేసే ఉద్యోగికి ఇలా ఏకంగా పెద్ద బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: సుందరి నగరి విశాఖ రాష్ట్రంలో ప్రధాన టూరిస్ట్ కేంద్రంగా భాసిల్లుతూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఇక్కడ రూ.కోట్ల విలువైన టూరిజం ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి కీలకమైన జిల్లా పర్యాటక శాఖలో ఎంతో ప్రాధాన్యం ఉన్న బాధ్యతలన్నింటినీ ఓ గైడ్ చేతుల్లోనే కొనసాగుతున్నాయి. పైగా.. సదరు గైడ్ ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. టూరిజం డిగ్రీ లేకపోయినా.. కేవలం గైడ్గా పనిచేయడం మొదలు పెట్టారు. గైడ్కి పోస్ట్ ఇవ్వకూడదన్న నిబంధన ఉన్నా.. అప్పటి అధికారుల అండదండలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరిపోయాడు. ఇటీవలే అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగిగా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తిరస్కరించడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగానే కొనసాగుతున్నారు. తాజాగా ఐటీడీఏ సీనియర్ మేనేజర్ కమ్ కోఆర్డినేటర్గా రెగ్యులర్ అధికారిగా కొనసాగేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసేశారు. డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్, మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్కు కూడా వెహికల్ ప్రోవిజన్ లేదు. కానీ.. సదరు అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మాత్రం వాహన సౌకర్యం కల్పించేశారు. అడ్మిన్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ఏపీటీఏ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. సీఈవో మాత్రం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించడం విశేషం. దీనికి తోడు మూడు రోజులు జిల్లా టూరిజం కార్యాలయంలోనూ, మూడు రోజులు ఐటీడీఏ సీనియర్ మేనేజర్గా వ్యవహరించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా పర్యాటకశాఖ కార్యాలయంలోనూ అన్నీ తానై కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ సదరు ఉద్యోగికి జిల్లా టూరిజం ఆఫీసర్గా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంపైనా పెద్ద వివాదమే చెలరేగింది. ఆది నుంచీ ఆరోపణలే.. రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న అతన్ని ఇక్కడి అవసరాల నిమిత్తం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే పాతుకుపోయిన ఈ గైడ్.. క్రమంగా అసిస్టెంట్ టూరిజం ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గానూ, తర్వాత టూరిజం మేనేజర్గానూ కొనసాగుతున్నాడు. మొదటి నుంచి వివాదాస్పదుడిగా ఉన్న అతనిపై గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ రాయలసీమ జోన్కు బదిలీ చేశారు. అయితే ఆ బదిలీని సైతం ఆపేసుకొని.. ఇక్కడే కొనసాగుతూ చక్రం తిప్పేశాడు. గతంలో తొట్లకొండ పర్యాటక క్షేత్రం వద్ద నిబంధనలకు విరుద్ధంగా తన భార్య పేరిట ఓ నిర్మాణం చేపట్టాడు. దీనిపై అప్పటి కలెక్టర్ యువరాజ్కు ఫిర్యాదులు రావడంతో వెంటనే జేసీబీతో కూల్చివేయించారు. అలాంటి వ్యక్తికి ఏకంగా ఐటీడీఏ సెల్ సీనియర్ మేనేజర్ కమ్ కోర్డినేటర్గా బాధ్యతలు కట్టబెట్టడం పర్యాటశాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఈ బాధ్యత ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని స్వయంగా పర్యాటక శాఖ అధికారులే చెబుతున్నారు. నిబంధనలను అనుసరించాల్సిన ఉన్నతాధికారులు సదరు గైడ్కు ‘దాసో’హం అవడం టూరిజం ఉద్యోగులే జీర్ణించుకోలేకపోతుండటం కొసమెరుపు. చదవండి: వేల కిలోమిటర్ల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్! -
తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు..
న్యూఢిల్లీ: తెలంగాణలోని పోచంపల్లి (యాదాద్రి భువనగిరి జిల్లా) గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 2న స్పెయిన్లోని మాడ్రిడ్లో అవార్డుల ప్రధానం జరగనుంది. కాగా, పోచంపల్లి గ్రామానికి గుర్తింపుపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు రావడానికి కృషి చేసిన మంత్రిత్వశాఖ అధికారులను కిషన్ రెడ్డి ప్రశంసించారు. చదవండి: (బీజేపీ నేతలకు సిగ్గుండాలి: మంత్రి నిరంజన్రెడ్డి) -
పర్యాటకానికి 'జల'సత్వం
సాక్షి, అమరావతి: మరికొద్ది రోజుల్లో పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల్లో జలవిహారాన్ని పునఃప్రారంభించేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆగస్టులో ఈ రెండు నదుల్లో వరద ఉధృతి పెరగడంతో ముందస్తు చర్యల్లో భాగంగా బోటింగ్ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతోపాటు కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో నవంబర్ 7 నుంచి గోదావరిలో పాపికొండలుకు బోట్లను తిప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పోశమ్మగండి నుంచే బోట్లు బయల్దేరుతాయి. కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని సింగనపల్లి బోటు పాయింట్ నీటిలో మునిగిపోయింది. దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ బోటింగ్ పాయింట్ను అన్వేషిస్తున్నారు. మరోవైపు.. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిన వెంటనే ఇక్కడా బోట్లు తిప్పనున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతులు రాష్ట్రంలో 300లకు పైగా బోట్లు ఉండగా.. ఇందులో పర్యాటక శాఖకు చెందినవి 48 ఉన్నాయి. వీటిలో మూడు మినహా మిగిలినవి అన్ని అనుమతులతో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు.. ప్రభుత్వ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం.. ప్రైవేటు బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అధికారులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీచేస్తున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ బెరం పార్కులలో జల విహారానికి 50 సీట్ల సామర్థ్యం ఉన్న బోట్లను తిప్పుతున్నారు. అలాగే, రిషికొండ, రాజమండ్రి, దిండి ప్రాంతాల్లో చిన్నబోట్లు, జెట్ స్కీలను అందుబాటులో ఉంచారు. వాస్తవానికి పాపికొండలు మార్గంలో ఏపీ టూరిజం బోట్లతో పాటు దాదాపు 80 వరకు ప్రైవేటు బోట్లు రాకపోకలు సాగించేవి. ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడంతో కేవలం 23 బోట్లకు మాత్రమే అనుమతులు లభించాయి. నిరంతరం బోటింగ్ పర్యవేక్షణ రెండేళ్ల కిందట పాపికొండలు మార్గంలో కచ్చులూరు వద్ద సంభవించిన బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వ సూచనలతో బోట్ల రక్షణ, మార్పుల విషయంలో కాకినాడ పోర్టు అధికారులు ప్రత్యేక నివేదికను సమర్పించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఓపీని రూపొందించింది. దీని ప్రకారం.. ► బోట్ల రూట్ పర్మిట్, పర్యాటక, జలవనరుల శాఖ నుంచి లైసెన్సులు పొందితేనే బోటును నడుపుకునేందుకు ఎన్ఓసీ జారీచేస్తున్నారు. ► గండిపోచమ్మ, పేరంటాలపల్లి, పోచవరం, రాజమండ్రి, రుషికొండ, నాగార్జునసాగర్, శ్రీశైలం, విజయవాడ బెరం పార్కులలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటుచేశారు. ► పోలీసు, రెవెన్యూ, జలవనరులు, పర్యాటక శాఖాధికారులు సమన్వయంతో వీటి ద్వారా బోటింగ్ను నిరంతరం పర్యవేక్షిస్తారు. ► లైఫ్ జాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు బోట్లను తనిఖీ చేస్తున్నారు. ► బోటు బయలుదేరే ప్రదేశంతోపాటు గమ్యస్థానం వద్ద కూడా సీసీ కెమెరాలు, అలారంలను ఏర్పాటుచేశారు. ► ప్రైవేటు బోట్లలో సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించకుండా చర్యలు చేపడుతున్నారు. భద్రతా ప్రమాణాలతో సేవలు ఇక పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని బోట్లను సముద్ర యానానికి కూడా అనువైనవిగా తీర్చిదిద్దారు. 8 ఎంఎం స్టీల్ బాడీతో, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) నిర్దేశిత భద్రతా ప్రమాణాలతో ఇవి సేవలందిస్తున్నాయి. ఈ బోట్లలో సమాచారాన్ని వేగంగా అందించేలా శాటిలైట్ ఫోన్లను ప్రవేశపెట్టారు. పాపికొండల మార్గంలో వీటిని వినియోగిస్తారు. ప్రయాణించే బోటుతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్, పేరంటాలపల్లిలోని రిమోట్ కంట్రోల్ రూమ్లో వీటిని అందుబాటులో ఉంచారు. పాపికొండలుకు వెళ్లే బోట్లకు రక్షణగా ప్రత్యేక పైలట్ బోటుతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. నావిగేషన్ వ్యవస్థతోపాటు కమ్యూనికేషన్ కోసం వెరీ హై ఫ్రీక్వెన్సీ (వీహెచ్ఎఫ్) రేడియోలతో బోట్లను నడపనున్నారు. పాపికొండలుకు విహారయాత్ర గోదావరి, కృష్ణాలో బోటు షికారుకు ఏర్పాట్లుచేస్తున్నాం. పర్యాటక శాఖకు చెందిన 45 బోట్లకు పోర్టు అనుమతులున్నాయి. కార్తీక మాసంలో పర్యాటకుల సందడిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 7 నుంచి పాపికొండల విహార యాత్రను అన్ని జాగ్రత్తలతో ప్రారంభిస్తున్నాం. అదే రోజున కృష్ణాలో కూడా బోట్లు తిప్పేందుకు జలవనరుల శాఖ అధికారులతో చర్చిస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ -
బెజవాడలో హెలీ రైడ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దసరాను పురస్కరించుకుని భక్తులు హెలీకాఫ్టర్లో విహరిస్తూ బెజవాడ అందాలను ఆస్వాదించే అవకాశాన్ని కృష్ణా జిల్లా యంత్రాంగం కల్పించింది. పర్యాటకశాఖ, నగర మునిసిపల్ కార్పొరేషన్, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవకాశం కల్పించారు. శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ విహంగ సేవలు ప్రారంభించారు. తొలుత ఆలయ ఈవో భ్రమరాంబ ప్రయాణికులతో నగర అందాలను తిలకించారు. కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జేసీ (అభివృద్ధి) శివశంకర్ కూడా హెలీకాఫ్టర్లో విహరించారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, మేయర్ భాగ్యలక్ష్మి, ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి హెలీరైడ్.. : ఈ నెల 17 వరకు జరిగే హెలీ రైడ్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 6 నిమిషాల విహంగ యాత్రకు రూ.3,500, 13 నిమిషాలకు రూ.6 వేలుగా ధరను నిర్ణయించారు. సన్ రైజ్ ఎయిర్ చార్టర్ సంస్థ, తుంబై ఏవియేషన్ ప్రైవేట్ సంస్థ సంయుక్తంగా హెలికాప్టర్ నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. -
ఏపీకి పర్యాటక రంగంలో 2 అవార్డులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో రెండు అవార్డులను సొంతం చేసుకుందని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ తెలిపారు. టూరిజం ట్రావెల్ అసోసియేషన్ ఈ అవార్డులను ప్రకటించినట్లు పేర్కొన్నారు. బెస్ట్ టూరిజం పాలసీగా ఏపీ పాలసీకి అవార్డు దక్కిందని తెలిపారు. అదేవిధంగా బెస్ట్ టూరిజం ప్లేస్గా విశాఖపట్నం అవార్డు పొంతం చేసుకుందని పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని, ఇక్కడ ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజంలో విశేష సేవలను అందించిన స్టేక్ హోల్డర్లకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డులను మంత్రి అందించారు. చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రపంచస్థాయి గుర్తింపు లభించే పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, సీఎం కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను ఒక టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ టూరిజం పార్క్ను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కార్పొరేషన్ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రాంతాలకు మందులు -
పర్యాటక రంగానికి చేయూత
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చి.. రాష్ట్ర పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 జిల్లాల్లో ఫైవ్స్టార్ హోటళ్లు నిర్మించే క్రమంలో విశాఖ, తిరుపతి నగరాల్లో హోటళ్లను నిర్మించేందుకు ఓబరాయ్ హోటల్ ముందుకొచ్చినట్టు తెలిపారు. కరోనా వల్ల పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అరిమండ వరప్రసాద్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఎంపీలు బి.సత్యవతి, మాధవి, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, జి.బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ పి.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా టూరిజం పాలసీ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి.. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు టూరిజంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తున్నారని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని హరిత బరంపార్క్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన టూరిజం పాలసీ దేశంలోనే బెస్ట్ పాలసీ కానుందని తెలిపారు. వైజాగ్ బీచ్ కారిడార్తో పాటు ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. లంబసింగి, అరకు ప్రాంతాలను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. రుషికొండలో ఫైవ్స్టార్ హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించామని, రికార్డ్ స్థాయిలో ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వైజాగ్, గండికోటల్లో అడ్వంచర్ బోట్స్ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. విజయవాడ హరిత బరంపార్క్కు బెస్ట్ రెవెన్యూ, బెస్ట్ ఫుడ్ ఫాల్, బెస్ట్ ఆపరేషన్స్కు గానూ ఏపీటీడీసీ అవార్డ్ను ప్రకటించింది. దీనిని బరంపార్క్ యూనిట్ మేనేజర్ శ్రీనివాస్కు రజత్ భార్గవ అందించారు. -
‘బెస్ట్ విలేజ్’ పోటీలో భూదాన్పోచంపల్లి
భూదాన్పోచంపల్లి: తెలంగాణలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించింది. తాజాగా ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్డబ్ల్యూటీఓ) నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో భారత్ తరఫున తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి గ్రామం పోటీపడుతోంది. మన దేశంలోని భూదాన్పోచంపల్లితో పాటు మేఘాలయలోని ప్రఖ్యాతిగాంచిన కాంగ్థాన్, మధ్యప్రదేశ్లోని చారిత్రక గ్రామం లద్పురాఖాస్ కూడా పోటీలో నిలిచాయి. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలు పంపించింది. పోచంపల్లికి ఘనమైన చరిత్ర భూదాన్పోచంపల్లికి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1951లో మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లికి రావడం, ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. దాంతో భూదాన ఖ్యాతితో భూదాన్పోచంపల్లిగా మారి ప్రపంచపుటల్లోకెక్కింది. అలాగే ఇక్కడి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టే్ట చీరలు నేసి ఔరా అన్పించారు. ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభతో సిల్క్సిటీగా పేరు తెచ్చుకుంది. నాటి నిజాం రాజులతో పాటు అరబ్దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భూదాన్పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. భూదానోద్యమ చారిత్రక గాథ, గ్రామీణ పర్యాటక కేంద్రం, చేనేత, చేతివృత్తులతో పాటు కుటీర పరిశ్రమలు, వ్యవసాయానికి నిలయం. అంతేగాక నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇస్తున్న జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ రాష్ట్రంలోనే పేరు గాంచింది. దాంతో పోచంపల్లిని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా తదితర 100 దేశాలకు పైగా వేలాది పర్యాటకులు, విదేశీ ప్రతినిధులు సందర్శించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడి ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్ టూరిజం విలేజ్’పోటీని నిర్వహిస్తో్తంది. -
సంక్షేమ సేవల చోదకశక్తి పర్యాటకమే!
ఈశాన్య రాష్ట్రాల పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రుల సదస్సును కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నిర్వహించడానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈశాన్య భారత రాష్ట్రాలు భారత దేశానికి మిరుమిట్లు గొలిపే వజ్రాభరణాల వంటివి. దేశీయ పర్యాటకుల పర్యటన ప్రణాళికలో ఇవి తప్పక ఉండాల్సిందే. మంచుకప్పిన పర్వత శిఖరాలు, పరుగులెత్తే నదులు, లోతైన లోయలు, అచ్చెరువు గొలిపే సుందర ప్రకృతి దృశ్యాలు తదితరాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ నేల, సంస్కృతి, ప్రజానీకంపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపగల శక్తి పర్యాటక రంగానికి ఉంది. ఈ ప్రాంతంలోని స్థానిక ఉత్పత్తుల తయారీని చక్కగా ప్రోత్సహించడం మన బాధ్యత. మూడంచెల వ్యూహంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాని మోదీ అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రగతి, ఉపాధి అవకాశాలతో ఈశాన్య ప్రాంత సమాజాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పర్యాటక రంగాన్ని సంక్షేమ ప్రదానంలో ఒక ముఖ్యమైన ఉపకరణంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారు. భారతదేశం ఇవాళ్టికి 75 కోట్ల జనాభాకు టీకాలు వేసే కార్యక్రమానికి చేరువైంది. పర్యాటక రంగానికి ఇంతకన్నా ఉత్తేజమిచ్చే అంశం మరొకటి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే– అంతర్జాతీయ విమానయానంపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఫలితంగా ప్రపంచ పర్యాటక రంగం పూర్వస్థాయిలో ఊపందుకోవడానికి మరింత సమయం పట్టవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికల్లా మన జనాభాలో అత్యధిక శాతానికి టీకాలు వేయడం పూర్తవుతుంది. కాబట్టి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మనకిదే అద్భుతమైన అవకాశం. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఈశాన్య భారత రాష్ట్రాల పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రుల సదస్సు ప్రారంభ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈశాన్య భారతంలోని ‘అష్టలక్ష్మి’ రాష్ట్రాలకు ప్రధానమంత్రి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మూడంచెల వ్యూహంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన అవి శ్రాంతంగా కృషిచేశారు. ఇందులో మొదటిది– నరేంద్రమోదీ నాయకత్వంలో పలు ఒప్పందాలపై సంతకాల ఫలితంగా వివిధ తిరుగుబాటు బృందాలు హింసకు వీడ్కోలు పలికి దేశ ప్రగతి కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దారితీయడం జరిగింది. దీనితో ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగం పుంజుకోగా, ప్రధాని నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ, సకాలంలో తగిన చర్యలు తీసుకుంటూ వాటి అమలులో అడ్డంకులను తొలగిస్తూ వచ్చారు. చివరగా నేటి శాంతియుత వాతావరణం, మౌలిక సదుపాయాల ఆధునీకరణ అనేవి పర్యాటకులను ఆకర్షించడమేగాక వ్యాపార నిర్వహణలో ఆసక్తిగలవారు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు దోహదపడింది. ఈ నేపథ్యంలో రెండురోజులపాటు సాగే సదస్సు పర్యాటక అభివృద్ధి, ఈశాన్య ప్రాంతంలో అనుసంధాన సమస్యలపై ప్రధానంగా చర్చించనుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని భాగస్వాములందరి మధ్య సమన్వయంపై కూడా దృష్టి సారిస్తుంది. అలాగే ఈశాన్య భారతంలో సామర్థ్య వికాస కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధి పథకాలు సహా సాహస క్రీడల సంబంధిత యాజమాన్యం, నిర్వహణ, భద్రత ప్రమాణాలు వంటివాటితోపాటు డిజిటల్ ప్రోత్సాహం–విపణి సంబంధిత అంశాలను కూడా ఈ సెమినార్ పరిగణనలోకి తీసుకోనుంది. ప్రధానమంత్రి 2019లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట బురుజులనుంచి ప్రసంగిస్తూ– మన దేశం 2022లో 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలు నిర్వహించుకునే నాటికి పౌరులలో ప్రతి ఒక్కరూ కనీసం 15 దేశీయ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని పిలుపునిచ్చారు. తూర్పున మయన్మార్, పడమట బంగ్లాదేశ్, ఉత్తరాన భూటాన్–చైనా సరిహద్దులుగా ఉన్న ఈశాన్య భారత రాష్ట్రాలు భారత దేశానికి మిరుమిట్లు గొలిపే వజ్రాభరణాల వంటివి. అంతేగాక దేశీయ పర్యాటకుల పర్యటన ప్రణాళికలో ఇవి తప్పక ఉండాల్సిందే. మంచుకప్పిన పర్వత శిఖరాలు, పరుగులెత్తే నదులు, లోతైన లోయలు, అచ్చెరువు గొలిపే సుందర ప్రకృతి దృశ్యాలు తదితరాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా వివిధ జాతులు, సంస్కృతులు, భాషా వైవిధ్యానికి ఈ రాష్ట్రాలు పట్టుగొమ్మలు. ఈ నేల, సంస్కృతి, ప్రజానీకంపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపగల శక్తి పర్యాటక రంగానికి ఉంది. వివిధ అధ్యయనాల ప్రకారం... రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే పర్యాటక రంగం 78 ఉద్యోగాలను సృష్టించగలదు. ఆ మేరకు మన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి రంగాల్లో అత్యధిక ఉపాధి అవకాశాలు సృష్టించగల సామర్థ్యం పర్యాటకానికి మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 2019–20లో ఉపాధి అవకాశాల సృష్టికి సంబంధించి పర్యాటక రంగంవాటా 15.34 శాతంగా నమోదైంది. ఆ మేరకు మన ఆర్థిక వ్యవస్థలో మొత్తం 7 కోట్ల 90 లక్షల మేరకు ప్రత్యక్ష–పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పిం చింది. ఈ రంగానికిగల ఉపాధి కల్పన సామర్థ్యాన్ని ఈశాన్య ప్రాంతంలో చోదకశక్తిగా మార్చుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈశాన్య ప్రాంత వాస్తవికతను పరిరక్షించుకుంటూనే ఈ కృషిని మనం సుస్థిరంగా కొనసాగించవచ్చు. ముఖ్యంగా అపారమైన ప్రకృతి సహజ వారసత్వానికి నెలవు కాబట్టి పర్యావరణ, గ్రామీణ, సాహస క్రీడా పర్యాటకానికి ఈ ప్రాంతంలో ఎన్నో అవకాశాలున్నాయి. ఈశాన్య ప్రాంతంలో తేయాకు, ఆరోగ్య, చలనచిత్ర పర్యాటకాల వంటి చెప్పుకోదగిన అనేక పర్యాటక అనుభవాలను పొందే వీలుంది. ఇక ఈ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన 100 రకాల వెదురు జాతులు ప్రకృతి సహజంగా లభించడం ఆసక్తికర అంశం. సాంబ్రాణి కడ్డీలు, వెదురు చాపలతోపాటు పుల్లలు, బద్దలు వంటివి లభ్యమవుతాయి. ఈ ప్రాంతంలోని స్థానిక సమాజాల సౌభాగ్యం దిశగా వీటి తయారీని చక్కగా ప్రోత్సహించడం మన బాధ్యత. అసోంలో ‘మూగా పట్టు’... నాగాలాండ్ ‘నాగా మిరప’... ఏదైనా కావచ్చు.. వాటిని దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు ప్రపంచం మొత్తానికీ అందించాల్సి ఉంది. ఈ సమావేశం నిర్వహణకు ఇంతకన్నా అనువైన సమయం మరొకటి లేదు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఇతివృత్తం కింద వివిధ కార్యక్రమాలు సాగుతుండగా, భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలు నిర్వహించుకోనుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ మన దేశ సుసంపన్న సంస్కృతి, చరిత్ర, స్పష్టాస్పష్ట వారసత్వాన్ని చాటేవిగా ఉంటున్నాయి. మన దేశ ప్రాచీన మూలాలు, విస్తృత నాగరికతా వారసత్వాలను ప్రముఖంగా ప్రదర్శించడానికి కూడా ఇదొక అవకాశం. అలాగే అత్యాధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న నవభారత స్ఫూర్తిని అందిపుచ్చుకోవడానికీ ఇదే అదను. అంతేకాకుండా మౌలిక సదుపాయాల వృద్ధిపైనా గట్టిగా దృష్టి సారించడం అవశ్యం. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద దేశంలోని వివిధ ప్రాంతాలకు... ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకమైన భారతదేశ పండుగలను దృశ్యరూపం కల్పించడంపై కూడా మేం దృష్టి సారిస్తున్నాం. ఈ పండుగలు వాస్తవంగా మనను ఓ నాగరిక దేశంగా నిర్వచిస్తూ– ‘ఒకే భారతం–శ్రేష్ఠ భారతం’ భావనను ప్రోదిచేస్తాయి. ఈ ప్రాంతానికిగల మృదువైన శక్తిని ప్రోత్సహించడానికి పర్యాటకం ఒక కీలక ఉపకరణం. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల, ప్రపంచ ప్రజానీకంతో అనుసంధానించే సాధనం కూడా. పర్యాటకాన్ని అత్యున్నత దృష్టితో మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రగతి, ఉపాధి అవకాశాలతో ఈశాన్యప్రాంత సమాజాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పర్యాటక రంగాన్ని సంక్షేమ ప్రదానంలో ఒక ముఖ్యమైన ఉపకరణంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారు. భారత్ వంటి దేశంలో ప్రతి గ్రామానికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అది సుసంపన్న వారసత్వం... సహజ లేదా పర్యావరణ వైవిధ్యం లేదా సందర్శకులు పాలుపంచుకోగల కార్యకలాపాలు వంటివాటిలో ఏదో ఒకటిగా ఉండవచ్చు. ఈ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడమే మా లక్ష్యం. జి. కిషన్రెడ్డి వ్యాసకర్త కేంద్ర పర్యాటక–సాంస్కృతిక, ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి ఈ–మెయిల్: gkishanreddy@yahoo.com -
ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి అవంతి
-
ఏపీ పర్యాటకానికి ప్రత్యేక యాప్: మంత్రి అవంతి
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తితో పర్యాటక శాఖకు నష్టం వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 13 చోట్ల 5 స్టార్ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని చెప్పారు. ప్రసాదం పథకం కింద శ్రీశైలంలో అభివృద్ధి చేశాం.. సింహాచలంలో ఆ పథకం కింద రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని వివరించారు. పర్యాటన ప్రాంతాల వివరాలను ఆన్లైన్లో ఉంచుతామని పేర్కొన్నారు. స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్యాకేజిలు రూపొందిస్తామని వెల్లడించారు. సీ ప్లేన్స్ కూడా తీసుకొచ్చి విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నట్లు గుర్తుచేశారు. 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. పర్యాటక ప్రాంతాల్లో మద్యం ప్రోత్సహించాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన ఇద్దరు పర్యాటక కాంటాక్ట్ ఉద్యోగుల కుటుంబంలో వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీస్కున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. 36 పర్యాటక హోటళ్లలో నిర్వహణ పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అందమైన సముద్రం... అడవులు ఉన్నాయని, ఎకో టూరిజం అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో ఒక యాప్ తీసుకురాబోతున్నామని.. దసరాకు టూరిజం యాప్ సిద్ధమవుతుందని మంత్రి తెలిపారు. లోకల్ టూరిస్ట్లకు నాలుగు జోన్లుగా చేస్తున్నామని, జోన్కొక మేనేజర్ ఉంటాడని చెప్పారు. -
దేశ ఆర్థిక వ్యవస్థలో.. పోర్టులదే కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ పరిస్థితుల్ని అధిగమించి.. దేశ ఆర్థిక వ్యవస్థలో పోర్టులు కీలకపాత్ర పోషించనున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహన్రావు, జిల్లా కలెక్టర్ వినయ్చంద్, పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి విశాఖ పోర్టు గెస్ట్హౌస్కు చేరుకున్నారు. అక్కడ వెంకయ్య పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోర్టు చైర్మన్ రామ్మోహన్రావు, ఇతర అధికారులు పోర్టు పురోగతికి సంబంధించిన వివిధ అంశాల్ని వివరించారు. 103 ఎకరాల్లో రూ.406 కోట్లతో ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్హౌసింగ్ జోన్ ఏర్పాటుచేస్తున్నట్లు ఉపరాష్ట్రపతికి తెలిపారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యూహాత్మక నౌకాయాన మార్గంలో భారత్ ఉండటంతో పాటు 7,517 కి.మీటర్ల మేర ఉన్న తీరప్రాంతంలో 200కి పైగా మేజర్, మైనర్ పోర్టులు ఉండటం విశేషమన్నారు. దేశంలో పోర్టు ఆధారిత అభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేంద్రం సాగరమాల కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు అత్యవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయడంలో పోర్టులు చేసిన కృషిని ఆయన అభినందించారు. విశాఖ పోర్టులో సుస్థిరాభివృద్ధి కోసం ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన, పోర్టు ఆధారిత అభివృద్ధి, డిజిటలైజేషన్ వ్యవస్థతో పాటు పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలు ఏర్పాటుచేయడం ప్రశంసనీయమని కొనియాడారు. -
పర్యాటకం ప్రకాశించేలా!
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు లాక్డౌన్ కాలాన్ని చక్కగా వినియోగించుకోబోతోంది. లాక్డౌన్ వల్ల పర్యాటక కేంద్రాలు మూతపడిన దృష్ట్యా ఈ సమయంలో వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర పర్యాటక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.61.74 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని అన్ని శిల్పారామాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించడంతోపాటు వాటిని ఆధునికీకరించడానికి పీపీపీ విధానంలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కనీసం 6 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేలా ఏడాది పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విజయవాడ భవానీ ద్వీపంలో రూ.6 కోట్లతో 3డీ ఎంటర్టైన్మెంట్ జోన్, 5డీ థియేటర్స్ను అభివృద్ధి చేస్తోంది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా సముద్ర ప్రాంతంలో జెట్టీల అభివృద్ధితోపాటు, రుషికొండ బీచ్ను అభివృద్ధి చేస్తున్నారు. అటవీ శాఖతో కలిసి కనీసం 12 ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తోంది. అటవీ ప్రాంతంలో సుందరమైన కాటేజీల నిర్మాణంతో పాటు సఫారీ, ట్రెక్కింగ్ వంటి వసతులు కల్పించనున్నారు. ఎంఐసీఈ టూరిజం కేంద్రాలుగా విశాఖ, తిరుపతి రాష్ట్రంలో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించే విశాఖ, తిరుపతిల్లో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎంఐసీఈ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్స్) టూరిజం ఆకర్షణలో భాగంగా విశాఖ, తిరుపతి నగరాలను అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, సదస్సులకు వేదికగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఆ రెండుచోట్ల అంతర్జాతీయ వసతులతో భారీ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించడం ద్వారా భారీ ఆదాయాన్ని పొందవచ్చన్నది పర్యాటక శాఖ భావన. సుమారు రూ.6 వేల కోట్లతో ఎంఐసీఈ టూరిజంలో భారత్ ప్రస్తుతం 27వ స్థానంలో ఉంది. ఏటా కనీసం 20 శాతం వృద్ధితో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఆదాని సంస్థ సొంతంగా ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మించనుండగా, పర్యాటక శాఖ భీమిలి ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో భారీ కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ ఏటా రాష్ట్రానికి సుమారు 1.70 కోట్ల మంది దేశీయ, విదేశీ పర్యాటకులు వస్తున్నారు. ఇందులో 15 శాతం మంది అంటే 25 లక్షల మందిని విశాఖ ఆకర్షిస్తోంది. విశాఖ బీచ్లు, బొర్రా గుహలు, అరకు, సింహాచల దేవస్థానం వంటివి ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. దీంతో విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. భీమిలి–భోగాపురం బీచ్ కారిడార్లో భాగంగా రూ.1,200 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా భీమిలి మండలం అన్నవరం వద్ద 200 ఎకరాల్లో భారీ హోటల్స్, రిసార్టుల నిర్మాణం చేపడుతున్నారు. 30 ఎకరాల్లో ఒకటి, 35 ఎకరాల్లో ఒకటి చొప్పున రెండు లగ్జరీ రిసార్టులు, 15 ఎకరాల్లో లగ్జరీ హోటల్, 5 ఎకరాల్లో మినీ గోల్ఫ్ కోర్స్, 60 ఎకరాల్లో బీచ్ అభివృద్ధి చేయనున్నారు. తొట్లకొండ బీచ్ వద్ద పీపీపీ విధానంలో భారీ టన్నెల్ అక్వేరియాన్ని అభివృద్ధి చేయనున్నారు. కైలాసగిరి వద్ద 120 మీటర్ల ఎత్తులో స్కై టవర్, ఆర్కే బీచ్ అభివృద్ధి వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టనున్నారు. -
19 నెలల తర్వాత తెరచుకోనున్న ‘పాపికొండలు’
పోలవరం: ఘోర ప్రమాదం జరిగిన 19 నెలల తర్వాత పాపికొండలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. ఆ ప్రమాదం అనంతరం పాపికొండల పర్యటన ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా తిరిగి పాపికొండల సందర్శనకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో త్వరలోనే పాపికొండలు సందర్శించేందుకు ప్రయాణికులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. పాపికొండలను వీక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగన్నపల్లి నుంచి పేరంటాలపల్లి వరకూ ఏపీ పర్యాటక శాఖ బోటులో ట్రయల్ రన్ నిర్వహించారు. పర్యాటక, పోలీస్, సాగునీటి, రెవెన్యూ అధికారులు ట్రయల్ రన్ను పర్యవేక్షించారు. కచ్చులూరు బోటు ప్రమాదంతో పాపికొండల విహారయాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. దాదాపు 19 నెలల తర్వాత పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ప్రయాణికుల భద్రతే పరమావధిగా విహార యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ట్రయల్ రన్పై నివేదికను ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని, త్వరలో టూరిజం మంత్రి అనుమతితో పాపికొండలు విహార యాత్ర ప్రారంభమవుతుంది అని ఏపీ టూరిజం జనరల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో ఇప్పట్లో సందర్శకులను అనుమతించే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. -
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి
సాక్షి, అమరావతి: పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేయనున్నామని, ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం సీఎస్ అధ్యక్షతన ఎకో టూరిజం డెవలప్ మెంట్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. ఎకో టూరిజం అభివృద్ధి చేసూ్తనే.. తద్వారా స్థానికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ అధికారులు, అటవీ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వచ్చే నెల 15వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తి ప్రణాళికలతో రావాలని ఆదేశించారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ కుమార్ ఎకో టూరిజం అభివృద్ధికి తీసుకోబోయే చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని, ఇందులో భాగంగా సీఎస్ చైర్ పర్సన్గా టూరిజం డిపార్టుమెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి వైస్ చైర్ పర్సన్లుగా, ఏపీ టూరిజం అథారిటీ సీఈవో సభ్య కన్వీనర్గా, మరో ఎనిమిది శాఖల ఉన్నతాధికారులతో ఎకో టూరిజం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ రాష్ట్రంలో సుందరమైన అటవీ ప్రాంతాలను గుర్తించి, ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని వివరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్, ఒడిశా, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఎకో టూరిజం అమలు తీరు తెన్నులను పరిశీలిస్తున్నా మన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ఎకో రిస్టార్టులు, జంగిల్ లాడ్జిల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్టు అధికారులు పాల్గొన్నారు. -
పర్యాటకానికి పెళ్లి కళ
న్యూఢిల్లీ: దేశంలో ఖరీదైన వివాహ వేడుకల సందడి మళ్లీ మొదలైంది. కరోనా కారణంగా గతేడాది చాలా వివాహాలకు బ్రేక్ పడింది. అయితే, తమ వివాహాలను ‘అద్భుతం.. అనిర్వచనీయం’ అనే తీరున నిర్వహించుకోవాలన్న ఆకాంక్షలతో ఉన్న వారు ఈ ఏడాది అందుకు సరైన ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇటలీలో చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన టుస్కానీలో విరాట్ కోహ్లీ–అనుష్క శర్మల వివాహం.. ఇటలీలోనే మరో చిన్న పట్టణం ‘కోమో’లో జరిగిన దీపికా పదుకొణె–రణవీర్సింగ్ల వివాహ వేడుకలు గుర్తుండే ఉంటాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలతో.. ఈ తరహా ఘనమైన వివాహాలకు దేశీయంగా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు ఇప్పుడు రద్దీగా మారుతున్నాయి. దేశంలో వివాహ గమ్యస్థానాలుగా (డెస్టినేషన్ వెడ్డింగ్) పేరొందిన జైపూర్, జోధ్పూర్, ముస్సోరీ ప్రాంతా ల్లోని అల్ట్రా లగ్జరీ హోటళ్లకు ఇప్పుడు భారీ డిమాండ్ నెలకొంది. గతేడాది కరోనా కారణంగా చాలా మంది తమ వివాహాలను వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాది అయినా పెళ్లి పీటలు ఎక్కుదామనుకుంటే.. కరోనా మళ్లీ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం పరిమిత కాలపు నిషేధం విధించడం వారిని ప్రత్యామ్నాయాల వైపు ఆలోచించేలా చేసింది. దీంతో ‘ఆగడం ఇక మా వల్ల కాదు’ అని భావించే వారు.. దేశీయంగానే మనసులను కట్టిపడేసే ప్రదేశాల వైపు చూస్తున్నారు. దీంతో ఖరీదైన వివాహ వేడుకులకు పేరొందిన.. తాజ్, ఒబెరాయ్, ఐటీసీ, లీలా, మారియట్, యాకోర్ ఇవన్నీ కూడా ఇప్పుడు బుకింగ్లకు మంచి డిమాండ్ను చూస్తున్నాయి. రణబీర్ కపూర్ వివాహం ఎక్కడ? ‘‘ఖరీదైన భారతీయ వివాహ వేడుకలు ఇప్పుడు కొంచెం పలుచన అయ్యాయేమో (తగ్గడం) కానీ.. గతంతో పోలిస్తే మరింత భారతీయతను సంతరించుకుంటున్నాయి’’ అని తాజ్ హోటల్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు పేరొందిన ప్రముఖ హోటళ్ల జనరల్ మేనేజర్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ‘‘ఉదయ్పూర్లో కలల వివాహాలకు పేర్కొందిన ఉదయ్ విలాస్లో జరిగిన స్నేహితుని వివాహ వేడుకకు రణబీర్కపూర్ గతంలో విచ్చేశారు. కానీ, ఇప్పుడు హోటళ్ల ప్రతినిధుల మధ్య ఆసక్తికరమైన చర్చ ఏమిటంటే.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నందున.. రణబీర్ కపూర్ వివాహానికి ఏ హోటల్ వేదిక కానుందనే’’ అని పేర్కొన్నారు. డిమాండ్ పెరిగినప్పటికీ హోటళ్ల యాజమాన్యాలు పూర్తి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా నివారణకు సంబంధించి అన్ని నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాయి. గరిష్టంగా అతిథుల ఆహ్వానంలో పరిమితులు, అతిధుల మధ్య భౌతిక దూరం తదితర చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘యే జవానీ హాయ్దివానీ తరహా వివాహాలను ఖరీదైన ప్రదేశాల్లో చేసుకోవాలంటే.. అది కనీసం రెండు మూడు రోజుల కార్యక్రమమే అవుతుంది. సంగీత్, మెహెంది, హాల్ది, చివరగా వివాహ వేడుక ఇలా కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం ఖర్చు.. బస, భోజనాలు, పానీయాలు, వినోదం, ఇతర కార్యక్రమాలకు ఎంతలేదన్నా కనీసం కోటి నుంచి కోటిన్నర రూపాయల ఖర్చు ఉంటుంది’’ అని ప్రముఖ హోటల్ ప్రతినిధి పేర్కొన్నారు. డిమాండ్తో పెరుగుతున్న చార్జీలు.. ‘‘మా హోటళ్లలో పరిమిత అతిధులతో కూడిన వివాహాలకూ డిమాండ్ నెలకొంది. పట్టణ ప్రాంతాల్లోనూ చక్కని బుకింగ్లు నమోదవుతున్నాయి. ఈ విభాగంలో తిరిగి డిమాండ్ బలపడుతోంది’’ అని తాజ్ హోటల్స్ అధికార ప్రతినిధి తెలిపారు. చాలా హోటళ్లు 2019 సంవత్సరం టారిఫ్లను 2021 మొదటి మూడు నెలల్లో జరిగిన వివాహ వేడుకలకు వసూలు చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలోని వివాహాల బుకింగ్లపై 2019లో వసూలు చేసిన చార్జీల కంటే 10–15 శాతం అధికంగానే చార్జ్ చేయడం జరుగుతోంది. ఇక 2021 అక్టోబర్–డిసెంబర్ కాలంలోని పెళ్లిళ్ల బుకింగ్లపై చార్జీలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోని చార్జీల కంటే 20 శాతం అధికంగా ఉండనున్నాయి’’ అని జైపూర్లోని ఫెయిర్మాంట్ జనరల్మేనేజర్ రాజీవ్ కపూర్ చెప్పారు. -
కుంటాల సందర్శకులకు గుడ్ న్యూస్
సాక్షి, ఆదిలాబాద్: కుంటాల.. రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. కుంటాల అందాలను వీక్షించేందుకు వచ్చేవారి అవస్థలను తొలగించడానికి మార్గం సుగమమైంది. పర్యాటకుల వసతి కోసం రిసార్ట్స్, కుటీరాలు నిర్మిస్తున్నారు. ఇందుకుగాను రూ.3.81 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేస్తున్నారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు. గిరిజన సర్క్యూట్ అమలులో భాగంగా కేంద్ర స్వదేశీ దర్శన్ పథకం కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే పనులు నడుస్తున్నాయి. కేంద్ర టూరిజం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్వదేశీ దర్శన్ పథకం కింద పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తోంది. ఈ పనులను ఐటీడీఏ అమలు చేస్తుండగా రాష్ట్ర పర్యాటక శాఖ అనుసంధానంగా పనిచేయనుంది. జూలై నుంచి అక్టోబర్ వరకు జలపాతం వద్ద పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది పర్యాటకులు ఈ జలపాతం అందాలను వీక్షించేందుకు వస్తుంటారు. అయితే, ఇక్కడ పర్యాటకులకు సరైన వసతి, ఇతర సౌకర్యాలు లేవు. తాజాగా కుంటాలకు దగ్గరలో గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఎకో ఎథెనిక్ రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఈ జలపాతం వద్ద అటవీ ప్రాంతం ఉంటుంది. దానికి తగ్గట్టు పర్యాటకులు ఉండేలా పర్యావరణానికి అనువుగా కుటీరాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పర్యాటకులు భోజనం చేసేందుకు డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా కుంటాల జలపాతానికి వచ్చే పర్యాటకులు ఇక్కడ విడిది చేయాలన్న ఉద్దేశంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైల్ ఫోటో -
పర్యాటకం పట్టాలెక్కేనా?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం విధించిన లాక్డౌన్ చర్యలతో ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటకం (టూరిజం), ఏవియేషన్ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కరోనా భయంతో ప్రజలు ముఖ్య అవసరాలు మినహాయించి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు తొలి నాళ్లలో సుముఖత చూపలేదు. దీంతో గడిచిన ఏడాది కాలంలో పర్యాటక రంగం భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 1న ప్రకటించే బడ్జెట్లో కచ్చితంగా తమను ఒడ్డెక్కించే చర్యలు ఉంటాయని ఈ రంగానికి చెందిన కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. రూ.1.25 లక్షల కోట్ల నష్టం.. కరోనా కారణంగా పర్యాటక రంగం ఒక్కటే 2020లో రూ.1.25 లక్షల కోట్ల మేర నష్టపోయినట్టు కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పర్యాటక రంగంపై 50 శాతం ప్రభావం పడగా.. మార్చిలో 70 శాతానికి పెరిగింది. ఇదే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో పర్యాటక రంగం రూ.69,400 కోట్ల మేర నష్టపోయిందని కేర్ రేటింగ్స్ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 30 శాతం నష్టాలుగా పేర్కొంది. ఈ రంగం తిరిగి సాధారణ స్థితికి రావాలంటే రెండేళ్లు పడుతుందని అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో పరిశ్రమను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు చర్యలను ప్రకటించొచ్చని ఈ రంగానికి చెందిన కంపెనీలు ఆశిస్తున్నాయి. పరిశ్రమ డిమాండ్లు.. ► దేశీయంగా చేసే పర్యటనలపై ఆదాయపన్ను మినహాయింపును ఇవ్వాలన్న డిమాండ్ను పర్యాటక రంగం ఈ విడత కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. జీఎస్టీ నమోదిత టూర్ ఆపరేటర్లు, ఏజెంట్లు, హోటళ్ల సేవల కోసం రూ.1.5 లక్షల వరకు ఖర్చుపై పన్ను మినహాయింపు ఇవ్వాలి. టూరిజమ్ పరిశ్రమ జీడీపీలో 6.23 శాతం వాటాతో ప్రముఖ పాత్ర పోషిస్తూ.. 8.78 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ సంస్థలు, ఏవియేషన్, ఆతిథ్యం ఇవన్నీ టూరిజమ్ పరిశ్రమ కిందకే వస్తాయి. ► ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వాలని, జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలి. ► గడిచిన 10–12 నెలల కాలంలో దెబ్బతిన్న డిమాండ్ను పునరుద్దరించేందుకు తగినన్ని నిధులు కేటాయించి.. కష్టాల నుంచి బలంగా బయటపడేందుకు, డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం సహకరించాలి. ► ఆర్థిక వ్యవస్థ చురుగ్గా మారాలంటే వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. అందుకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ఎత్తివేయాలి. ► ఎంఎస్ఎంఈ మూలధన నిధుల రుణాలను పర్యాటక రంగానికీ విస్తరించడం ద్వారా ఉద్యోగాల కల్పనకు సహకరించాలి. ► రుణాల వడ్డీపై వెసులుబాట్లు, రుణ చెల్లింపులపై మారటోరియం కల్పించాలి. ► ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఎయిర్పోర్ట్ చార్జీలపై లెవీలను, ల్యాండింగ్, నేవిగేషన్ చార్జీలను కూడా తగ్గించాలి. ► లాక్డౌన్లను ఎత్తేసి, ప్రయాణాలపై ఆంక్షలు తొలగించిన అనంతరం పర్యాటక రంగంలో క్రమంగా పురోగతి కనిపిస్తోంది. వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తుండడం, మరోవైపు టీకాల కార్యక్రమం కూడా మొదలైనందున రానున్న నెలల్లో మంచి వృద్ధి ఉంటుందని ఈ రంగం అంచనా వేస్తోంది. ప్రభుత్వపరమైన సహకారం తోడైతే తాము మరింత వేగంగా పురోగమించొచ్చని భావిస్తోంది. ఆతిథ్య రంగాన్ని ముందుగా ఒక పరిశ్రమగా గుర్తించాలి. అద్దె ఇళ్ల విధానాన్ని తీసుకురావాలి. ఈ రెండు ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాము. పరిశ్రమ ఎంత వేగంగా పుంజుకుంటుందన్నది ప్రభుత్వ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. – కృష్ణ కుమార్, సీఈవో, ఇస్తారా పార్క్స్ 2022 నాటికి దేశీయంగా 22 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఎంతో ఉత్సాహాన్నిచ్చేది. ఇందులో భాగంగా పర్యాటక రంగానికి వెన్నెముకగా నిలిచే హోటళ్లకు ప్రభుత్వం పూర్తి మద్దతునివ్వాలి. ఎంఎస్ఎంఈ వర్కింగ్ క్యాపిటల్ రుణాలను టూరిజమ్ పరిశ్రమకూ ఇవ్వాలి. ఎల్టీసీజీని వెనక్కి తీసుకోవాలి. – రోహిత్ వారియర్, వారియర్ సేఫ్ సీఈవో వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు దేశీయ పర్యాటక రంగానికి మేలు చేస్తుంది. –దీప్కల్రా,మేక్మైట్రిప్ వ్యవస్థాపకుడు -
వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీ: మంత్రి అవంతి
సాక్షి, విజయవాడ: భవాని ఐల్యాండ్ను ఈ నెల 10వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీని తీసుకువస్తున్నట్లు చెప్పారు. బోటింగ్కు ఇప్పటికే అనుమతినిచ్చామని, ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేసిన తరువాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి వస్తుందన్నారు. పాపికొండలకు తప్ప అన్ని చోట్లకు బోటింగ్కు అనుమతినిచ్చామని చెప్పారు. బోటింగ్ జరిగే చోట కమాండ్ కంట్రోల్ రూం పని చేస్తుందని, గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అవంతి చెప్పారు. చదవండి: నాడు భయమేసింది.. నేడు సంతోషంగా ఉంది: పెద్దిరెడ్డి -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పర్యాటకం అంటే హైదరాబాద్ మాత్రమే కాదని, జిల్లాల్లో ఎన్నో అద్భుత ప్రాంతాలు న్నాయన్నారు. వీటన్నింటిలో వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్స వం సందర్భంగా పలు హోటళ్లు, ట్రావెల్స్ నిర్వాహకులు, టూర్ ఆపరేటర్లు తదితరులతో మంత్రి ఆన్లైన్ ద్వారా సమావేశమయ్యారు. అవార్డుల కు ఎంపికైన సంస్థల పేర్లు ప్రకటించి, అందజేసే సర్టిఫికెట్లు ప్రదర్శించారు. స్టార్ హోటళ్లలోని వివిధ కేటగిరీలు, హై దరాబాద్లో, రాజధాని వెలుపల తదితర విభాగాలకు సంబంధించి.. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్, గోల్కొండ, అలంక్రిత రిసార్ట్స్–స్పా, సితార, మిన ర్వా గ్రాండ్, అడోబ్, ఓపీడీఎస్ఎస్ హోటల్స్, రిసార్ట్స్, వివేరా హోటల్స్, ఫుడ్కోర్ట్లకు, టూర్ ఆపరేటర్లు; ట్రావె ల్ ఏజెంట్స్కు సంబంధించి.. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్, సదరన్ ట్రావెల్స్లకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. -
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏపీ పర్యాటకం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు తగిన స్థానం దక్కేలా అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు నూతన పర్యాటక పాలసీని ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వసతులు, భద్రత తదితరాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యాటక రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసే సంస్థలకు పన్ను రాయితీ ఇస్తుంది. ట్రావెల్ ఏజెంట్లు, సంస్థలు, హోటళ్లు, తదితరాలన్నీ పర్యాటక శాఖ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్దేశించింది. కాగా.. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పర్యాటకం–గ్రామీణాభివృద్ధి’ నినాదంతో ఆదివారం విశాఖపట్నంలో ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ► దేశంలో గుజరాత్ తర్వాత 974 కి.మీ. పొడవైన సముద్ర తీరం ఏపీకి మాత్రమే సొంతం. ► ప్రముఖ బీచ్ల వద్ద ప్రైవేట్ భాగస్వామ్యంతో కుటీరాలు, తదితరాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ పర్యాటకంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కళలను తెలిపేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ పర్యాటకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో అతిథ్యం కల్పిస్తారు. ► ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాచీన కట్టడాల పునరుద్ధరణ. రాష్ట్రంలో 12 నుంచి 14 ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు. ► అరకులో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో కాలేజ్ను ఏర్పాటు చేస్తారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు 7 స్టార్ సదుపాయాలతో రిసార్టులు, హోటళ్లను అందుబాటులోకి తెస్తారు. ► పర్యాటకుల భద్రత కోసం దేశంలోనే తొలిసారి పశ్చిమగోదావరి జిల్లా సింగనపల్లి, పేరంటాలపల్లి, పోచవరం, తూర్పుగోదావరి జిల్లా గండి పోచమ్మ, రాజమండ్రి, విశాఖజిల్లా రుషికొండ, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్, కర్నూలు జిల్లా శ్రీశైలం, కృష్ణా జిల్లా విజయవాడలోని బెరం పార్క్ల వద్ద కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ‘బ్లూఫ్లాగ్’’ సర్టిఫికేషన్ కోసం ఎంపికైన రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం విశాఖలోని రుషికొండ బీచ్ ఎంపికైందని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► గతేడాది విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో ఆదాయం 21% పెరిగింది. ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. ► కాగా, రాజకీయంగా ఎదగడానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మంత్రి మండిపడ్డారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న టీడీపీ, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే.. సదుపాయాలు ఉండి.. అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన బీచ్లకు డెన్మార్క్లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ను ఇస్తుంది. ఈ సర్టిఫికేషన్ ఉన్న బీచ్లనే అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు. సర్టిఫికేషన్కు కేంద్రం 8 బీచ్లను ఎంపిక చేయగా రుషికొండ కూడా ఉంది. -
పర్యాటకానికి చిరునామాగా మారాలి
-
దళారీ వ్యవస్థ నుంచి ఉద్యోగులను సీఎం జగన్ కాపాడారు
-
టూరిజం.. అవినీతి విహారం
జిల్లా అధికారుల పర్యవేక్షణకు దూరంగా ఉండే పర్యాటక శాఖలో అవినీతి, అక్రమాలు నిరాటకంగా సాగుతున్నాయి. ఈ శాఖ ఆధ్వర్యంలో హోటల్స్, రిసార్ట్స్, గదుల బుకింగ్స్ వంటి కార్యకలాపాల నిర్వహణ ఉంటుంది. ప్రతిదాంట్లో కింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ శాఖలో జరిగే అవినీతి, అక్రమాలపై విచారణ నివేదికలు వెలుగుచూడడం లేదు. టూరిజంలో అక్రమార్కుల వీర విహారం తారస్థాయికి చేరింది. కాంట్రాక్ట్ ఉద్యోగినిపై దాడి ఘటనతో వివాదాస్పదమైన ఏపీ టూరిజం శాఖలో లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నెల్లూరు(టౌన్): నెల్లూరు డివిజన్ పర్యాటక శాఖ అక్రమాలకు అడ్డాగా మారింది. ఈ శాఖలో జరిగే అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమేనని, రానివి చాలా ఉన్నాయని ఆ శాఖ ఉద్యోగులు కొందరు బహిరంగంగా చెబుతున్నారు. పర్మినెంట్ ఉద్యోగులను తీసుకోకపోవడంతో ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లపై ఈ శాఖలోకి తీసుకురావడంతో అక్రమాలు, వివాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. పర్యాటక శాఖలోని లొసుగులు, అవకాశాలను అదనుగా తీసుకుని పలువురు అధికారులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అవినీతి, అక్రమాలెన్నో.. ►కూరగాయలు, ప్రొవిజన్స్, పాలు, మాంసాహార కొనుగోళ్లతో పాటు గదుల బుకింగ్, రిసార్ట్స్, హోటళ్ల నిర్వహణలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ►వీటికి సంబంధించి ఇప్పటికే ఆ శాఖాపరంగా పలు విచారణలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ►గతేడాది తడ టూరిజం హోటల్లో రేవ్ పార్టీ జరిగిందని ప్రచారం ఉంది. రెండు రోజుల పాటు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో టూరిజం అధికారులు హడావుడి చేశారు. ►విచారణ అధికారిగా వెళ్లిన అప్పటి డివిజనల్ మేనేజర్ ఏమి నివేదిక ఇచ్చారో తెలియదు కానీ, ఆ యూనిట్ మేనేజర్ను సస్పెండ్తో సరిపెట్టారు. ►అతను కొద్ది రోజులకే ఏపీ టూరిజం కార్యాలయంలో ఉన్న లొసుగులు, పలుకుబడిని ఉపయోగించుకుని తిరిగి చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ సంపాదించాడు. ►ఏపీ టూరిజంలో చిరుద్యోగులుగా ప్రస్థానం ప్రారంభించిన పలువురు అనతికాలంలోనే లక్షాధికారులుగా అవతారమెత్తారు. ఆ శాఖలోని లోపాలు వారికి వరంలా మారాయి. ►సాధారణంగా ఏ శాఖకైనా భారీ మొత్తంలో ఏవైనా వస్తువులు అవసరమైతే టెండర్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేస్తారు. ఇక్కడ మాత్రం అంతా వీరిదే పెత్తనం. వారు కొన్నదే వస్తువు. చెప్పిందే ధర. మాయాజాలం ►ఏపీ టూరిజం శాఖకు ప్రధాన ఆదాయ వనరు హోటల్ గదులు. అయితే ఆ శాఖలోనే కొందరు ఉద్యోగులు తమ తెలివితేటలు ప్రదర్శించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ►సాధారణంగా గది బుకింగ్ చేసుకుంటే 24 గంటలు సమయం ఉంటుంది. అయితే ఈ హోటల్స్కు వచ్చే ఎక్కువ మంది కొద్ది గంటలు మాత్రమే ఉండి వెళ్లిపోతుంటారు. ఇది వారికి అవకాశంగా మారింది. ►ఒక వ్యక్తి రెండు, మూడు గంటలకు ఖాళీ చేసి వెళ్లిపోతే ఆ తర్వాత వచ్చిన వారికి కూడా అదే పేరు మీద గదిని ఇచ్చేస్తారు. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగి డ్యూటీ రోజు భారీగా సంపాదిస్తారని ఆరోపణలు ఉన్నాయి. ►దీంతో పాటు బుకింగ్ కాకుండా ఖాళీగా ఉన్న రూములను అనధికారికంగా రెండు నుంచి మూడు గంటలు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ►డివిజనల్ మేనేజర్ లేదా విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వచ్చినా కొద్ది గంటల ముందే సమాచారం తెలిసి పోయేలా సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ►మరో వైపు హోటల్స్, రిసార్ట్స్ ఆవరణల్లో నిర్వహించే పలు విందులు, ఫొటో షూట్లకు సంబంధించి కస్టమర్ల నుంచి భారీగా వసూలు చేసినా లెక్కల్లో చూపేది మాత్రం కొంతే. బహిరంగ రహస్యమే ఏపీ టూరిజం శాఖలో జరుగుతున్న అక్రమాలు బహిరంగ రహస్యమే. ఆయా విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఉన్నతాధికారులకు తెలిసినా తమ వాటాలు తీసుకుని పట్టించుకోరని చెబుతున్నారు. తనపై జరిగిన దాడి విషయంలోనూ ఉన్నతాధికారులు సకాలంలో స్పందించలేదని బాధితురాలు సీనియర్ అసిస్టెంట్ ఉషారాణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కార్పొరేట్ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు అవినీతి పరులుగా తయారై ప్రతి నెలా వాటాల పేరుతోనే వేధించడంతోనే కింది స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కొందరు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ శాఖలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఆఫీస్లో అమానుషం
-
మాస్క్ ధరించాలని చెప్పినందుకు..
-
మాస్క్ ధరించాలని చెప్పినందుకు..
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం హోటల్లో దారుణం చోటు చేసుకుంది. మాస్క్ ధరించాలని సూచించిన కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడి చేశారు. గత శనివారం ఈ ఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులంతా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగులంతా మాస్కులు ధరించగా, డిప్యూటీ మేనేజర్ భాస్కర్ మాత్రం దీనిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించాలని మహిళా ఉద్యోగి ఉషారాణి సూచించగా, తనకే సలహాలు ఇస్తావా అంటూ ఆమెపై దాడి చేశారు. సహచర ఉద్యోగులు కలుగజేసుకొని ఆయనను బయటకు పంపించేశారు. అనంతరం బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన సీసీ పుటేజీని కూడా పోలీసులకు అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డిప్యూటీ మేనేజర్ భాస్కర్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. మహిళలుపై దాడులు చేస్తే సహించేది లేదు : వాసిరెడ్డి పద్మ మహిళా ఉద్యోగి ఉషారాణిపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె నెల్లూరుకి వెళ్లి ఉషారాణిని పరామర్శించారు. అనంతరం పద్మ మీడియాతో మాట్లాడుతూ.. దివ్యాంగురాలైన మహిళపై దాడి చేయడం అమానుషం అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా భాస్కర్ ప్రవర్తించారని మండిపడ్డారు. మాస్క్ ధరించమన్నందుకు ఇష్టానుసారంగా దాడి చేయడం దారుణమన్నారు. మహిళలపై దాడి చేస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి చేసిన ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్ చేసిందని ఆమె వెల్లడించారు. మహిళలపై దాడులు చేసిన, లైంగిక నేరాలకు పాల్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. -
లాక్డౌన్: ఆ వార్తలో నిజం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో అన్ని షాపులు, వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయాయి. మొదట లాక్డౌన్ను ఏప్రిల్ 14 వరకు విధించిన తరువాత దానిని మే3 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే లాక్డౌన్ ఎత్తి వేసిన తరువాత కూడా హోటళ్లు, రెస్టారెంట్లు అక్టోబర్ 15వ తేదీ వరకు తెరవడానికి వీలులేదు అని పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించిన లెటర్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే దీనిపై పర్యాటక శాఖ స్పందించింది. ఆ వార్తలో నిజం లేదని, అది తాము ప్రకటించలేదని పేర్కొంది. ఎవరో ఫేక్ న్యూస్ సృష్టించి దానిని ఆన్లైన్లో వైరల్ అయ్యేలా చేశారని తెలిపింది. దీని వల్ల దేశ పర్యాటక రంగం మీద ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇలాంటి అబద్దపు వార్తలు ఎవరు ప్రచారం చేశారో తెలుసుకొని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రజలు ఎవరూ ఇలాంటి వార్తలు నమ్మి ఆందోళన చెందవద్దని పర్యాటక శాఖ విజ్ఞప్తి చేసింది. (అది నకిలీ లింక్.. క్లిక్ చేస్తే అంతే!) Be cautious of #Fake order claiming that hotels/resturants will remain closed till 15th October 2020 due to #Coronavirusoutbreak.#PIBFactCheck: The order is Fake and has NOT been issued by Ministry of Tourism. Do not believe in rumours! pic.twitter.com/efRx3PWTj0 — PIB Fact Check (@PIBFactCheck) April 8, 2020 ఇదిలా ఉండగా ఇప్పటి వరకు భారతదేశంలో 19,000 మంది కరోనా బారిన పడగా, 640 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల్లో 5218 పాజిటివ్ కేసుల్తో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, తరువాత స్థానంలో ఢిల్లీ, గుజరాత్ ఉన్నాయి. (లాక్డౌన్ పొడగింపు: ఆ ప్రచారం అవాస్తవం) -
రోమాంచిత సంబరం.. తాకెను అంబరం
బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): కొండలపై సైక్లింగ్ పోటీలు దుమ్ము రేపాయి. సాహస విన్యాసాలు సందడి చేశాయి. పారా మోటార్ విహారం ఉత్సాహం నింపింది. తాళ్లతో చేసిన వలపై నిలువుగా పైకి ఎగబాకటం.. తాళ్ల ఆధారంగా ఒకచోట నుంచి మరో చోటకు ప్రయాణించటం.. ఆకాశ వీధిలో తాళ్లు ఆధారంగా ఉంచిన చెక్కలపై నడవటం వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్పై రెండు రోజుల పాటు నిర్వహించే అడ్వెంచర్ ఫెస్టివల్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ చేపట్టిన ఈ ఉత్సవాలు పండుగ వాతావరణంలో సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వంద మందికి పైగా క్రీడాకారులు సైక్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లె సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పృధ్వీతేజ్ అడ్వెంచర్ క్రీడలను ప్రారంభించారు. చేకూరి కీర్తి, పృధ్వీతేజ్ వేర్వేరుగా పారా మోటార్లో అరగంట పాటు ఆకాశంలో విహారం చేశారు. రోప్ సైక్లింగ్, బైక్ రైడింగ్, జిప్ సైకిల్, ట్రెక్కింగ్ ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు యాత్రికులు, క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. సాహస క్రీడల్లో పాల్గొనేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. విన్యాసాలు, క్రీడలను తిలకించి ఆహ్లాదం పొందారు. సాహస క్రీడలపై మక్కువ గల క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు ఈ అడ్వెంచర్ ఫెస్టివల్ వేదికగా నిలిచింది. టూరిజం డీవీఎం సురేష్కుమార్రెడ్డి, జిల్లా అధికారి చంద్రమౌళి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలరించిన వినోద కార్యక్రమాలు అడ్వెంచర్ ఫెస్టివల్లో భాగంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలు అలరించాయి. టీవీ యాంకర్లు గీతా భగత్, చైతూ సందడి చేశారు. హాస్యనటులు బుల్లెట్ భాస్కర్, రాజమౌళి హాస్యం పండించారు. పలు చిత్రాల్లోని సినీ నేపథ్య గేయాలు ఆలపించారు. డీజే నృత్యాలతో సభికులను ఉత్సాహపరిచారు. నివేదిక కూచిపూడి, యశ్వని జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలను సందర్శకులు ఉత్సాహంతో తిలకించారు. -
‘కచ్చలూరు’ ఎఫెక్ట్ : గిరాకీ లేక నిలిచిన బోటు ప్రయాణం
సాక్షి, నల్గొండ : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లాల్సిన బోటు ప్రయాణాన్ని అధికారులు శనివారం నిలిపివేశారు. గిరాకీ లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల గోదావరిలో కచ్చలూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బోటు సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాగర్ టు శ్రీశైలం బోటు ప్రయాణానికి కేంద్ర పర్యాటక శాఖ అనుమతులిచ్చినా ప్రయాణీకులు ఆసక్తి చూపడం లేదు. లాంచీ ప్రయాణం అంటేనే ప్రయాణీకులు హడలిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో టిక్కెట్లు అమ్ముడుపోక టూర్ను రద్దు చేస్తున్నట్లు పర్యాటక శాఖ ప్రకటించింది. -
బుద్ధవనం..గర్వకారణం
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం ప్రాజెక్టు నాగార్జునసాగర్లో ఏర్పాటు చేయడం గర్వకారణమని రాష్ట్ర పురావస్తు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న బౌద్ధసంగీతి –2019 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 274 ఎకరాల్లో బుద్ధవనం నిర్మించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని తెలిపారు. మన రాష్ట్రంలోని చారిత్రక సంపద పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బౌద్ధమతానికి సంబంధించి దేశంలోనే తొలి సదస్సును ౖహైదరాబాద్లో నిర్వహించడం ఎంతో అదృష్టమన్నారు. రాష్ట్రంలో కోటిలింగాల, ఫణిగిరి, పార్శిగాన్, ధూళికంట, గాజులబండ, తిరుమలగిరి, నేలకొండపల్లి, ఏలేశ్వరం లాంటి ప్రాంతాల్లో బౌద్ధుల చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్నారు.బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బౌద్ధచరిత్ర చాలా గొప్పదన్నారు. శివనాగిరెడ్డి రచించిన తెలంగాణ బుద్ధిజం అనే పుస్తకాన్ని మంత్రి శ్రీనివాసగౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) చైర్మన్ భూపతిరెడ్డి, టీఎస్టీడీసీ ఎండీ డి.మనోహర్, 17 దేశాలకు చెందిన పురావస్తు శాఖ పరిశోధకులు, పురావస్తు శాఖ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమివ్వాలి బుద్ధిజాన్ని కూడా ఇతర మతాలలాగే చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బౌద్ధాన్ని కేవలం టూరిజం కోణంలోనే చూస్తున్నాయి. అలాకాకుండా కాకుండా ఆధ్యాత్మికతకు కూడా ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపడితే బుద్దుడి ఆలోచనలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. – సద్దారకిత బంతేజ్, బౌద్ధ సన్యాసి -
అతిథులకు ఆహ్వానం
సాక్షి, విశాఖపట్నం: చల్లగా తాకి వణికించే చిరుగాలులు, మిట్టమధ్యాహ్నమైనా సూరీడిని సైతం కప్పేసే దట్టమైన పొగమంచు.. సున్నా డిగ్రీల వాతావరణం.. ఇవన్నీ ఆస్వాదించాలంటే కశ్మీర్, సిమ్లా, ఖండాలా వెళ్లాల్సిన పనిలేదు. వాటిని మరిపించే హిల్స్టేషన్ మన రాష్ట్రంలోని లంబసింగి! విశాఖకు 135 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి మండలంలోని ఓ చిన్న గిరిజన గ్రామం ఇది. దీని పంచాయతీ పరిధిలో 50 వరకు తండాలున్నాయి. కొండల మధ్య ఉండే వీటన్నింటిలో ఒకే రకమైన వాతావరణం కనిపిస్తుంది. పర్యాటకుల సీజన్ ప్రారంభమయ్యేలోగా ఇక్కడ వసతి సదుపాయాలను మెరుగు పరచాలని సీఎం జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఏపీటీడీసీ రిసార్ట్స్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. లంబసింగి సమీపంలోని కొండలపై ఇటీవల ట్రెక్కింగ్ కూడా నిర్వహిస్తున్నారు. తాజంగి జలాశయానికి ఇరువైపులా కొండల మధ్య రోప్ లైన్ నిర్మిస్తున్నారు. జలాశయంలో బోటింగ్కు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భారత్లో అడుగుపెట్టే ప్రతి విదేశీ పర్యాటకుడు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ఏపీని ప్రముఖంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలి. 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి అంతర్జా తీయంగా పేరున్న సంస్థల సహకారంతో అభివృద్ధి చేయాలి. ప్రముఖ సంస్థలు ఏపీలో హోటళ్లను ఏర్పాటు చేసేలా ఉత్తమ సదుపాయాలు కల్పించాలి. – ఇటీవల పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాల శాఖలపై సమీక్షలో సీఎం జగన్ ఆదేశం సుదీర్ఘమైన సుందర సముద్రతీరం.. అబ్బురపరచే చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే సప్తగిరులు, ఆతిథ్యానికి పెట్టింది పేరైన తెలుగు లోగిళ్లు.. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకూ ప్రకృతి కాన్వాసుపై చిత్రించిన సుందర రమణీయ చిత్రం ఆంధ్రప్రదేశ్.. పర్యాటకం ద్వారా రాష్ట్రానికి ఆదాయం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ పలు టూరిజం సర్క్యూట్లు, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. భద్రతే లక్ష్యం.. ఏపీలో పర్యాటక రంగం ఐదేళ్లుగా నిరాదరణకు గురైంది. టీడీపీ సర్కారు హయాంలో పర్యాటక రంగానికి సంబంధించి 2015 నుంచి 2017 వరకు రూ. 12 వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయని, 2018లో రూ. 2,008 కోట్ల పెట్టుబడులు రానున్నాయంటూ ప్రచారం చేసుకున్నా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోవడం గమనార్హం. గత ప్రభుత్వం పర్యాటక నిబంధనలను గాలికి వదిలేయడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలు సురక్షితంగా తిరిగి వెళ్లేలా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సూపర్ సర్క్యూట్లు... రాష్ట్రంలో అరకు టూరిజం సర్క్యూట్కి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉండగా మిగిలినవి కొత్త పాలసీ ప్రకటించాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ హెరిటేజ్ సర్క్యూట్, రాజమండ్రి హెరిటేజ్ నేచర్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి కోసం పర్యాటక శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్ జెట్టీ సర్క్యూట్లపై డీపీఆర్ సిద్ధమైంది. బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండలను రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ పేరిట అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇవీ ప్రణాళికలు... - రాష్ట్రంలో అరకు, మారేడుమిల్లి, కాకినాడ, సూర్యలంక, హార్స్లీ హిల్స్, గండికోట తదితర 15 ప్రదేశాల్ని పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. దేశ విదేశీ పర్యాటకుల కోసం ఇక్కడ మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు. - ప్రైవేట్ – ప్రభుత్వ భాగస్వామ్యంతో 22 ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తించారు. - పర్యాటక శాఖకు వివిధ ప్రాంతాల్లో ఉన్న 17 భవనాలు, ఆస్తులను ఆధునికీకరించి పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నారు. - కేంద్ర పర్యాటకశాఖ ప్రకటించిన తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి పథకం (ప్రసాద్)లో భాగంగా అమరావతి, శ్రీశైలంలను అభివృద్ధి చేస్తున్నారు. తిరుపతి, విజయవాడ, సింహాచలం, అన్నవరం, అరసవల్లి, ద్వారకా తిరుమల ప్రాంతాలను కూడా పథకం కింద అభివృద్ధి చేయనున్నారు. ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలకు ‘ప్రసాద్’ పథకం కింద రూ.50 కోట్లు మంజూరయ్యాయి. - కేంద్ర పర్యాటకశాఖ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) పథకంలో భాగంగా అమరావతిని అభివృద్ధి చేయనున్నారు. స్టార్ హోటళ్లు.. గ్లాస్ బ్రిడ్జిలు... తిరుపతిలో 5 నక్షత్రాల హోటల్ లేదా రిసార్ట్ అభివృద్ధికి అవసరమైన స్థలాన్ని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి తీసుకోవాలని భావిస్తున్నారు. మారేడుమిల్లి, అరకులో 5 స్టార్ రిసార్ట్స్ అభివృద్ధికి ఐటీడీఏ నుంచి భూమి సేకరించనున్నారు. గండికోట జార్జి మీదుగా గాజు వంతెన నిర్మించడంతో పాటు హోటళ్లు, రిసార్ట్లు, రోప్వే ఏర్పాటు చేయనున్నారు. లంబసింగి, కోటప్పకొండ రోప్వే అందాలతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఓర్వకల్లులో రాతి నిర్మాణాల్ని అభివృద్ధి చేయడంతోపాటు విజయవాడలో భవానీద్వీపంతో పాటు కృష్ణా నదిలో ఉన్న 6 ద్వీపాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నారు. సందర్శకుల స్వర్గధామంలా.. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో హయత్, ఫోర్ సీజన్స్, తాజ్, ఒబెరాయ్ తదితర స్టార్ హోటళ్ల నిర్వాహకుల సహకారంతో సదుపాయాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నాం. ఒక్కో ప్రాంతంలో హోటళ్లు, రిసార్ట్స్ అభివృద్ధి కోసం కనీసం 20 ఎకరాలు అవసరమని ప్రాథమిక అంచనా. ఆయా ప్రదేశాలను సందర్శకుల స్వర్గధామంలా తీర్చిదిద్దుతాం. – కె.ప్రవీణ్కుమార్, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ‘స్థానిక’ ఉపాధికి ఊతం.. హోటళ్లను పర్యాటకశాఖ సారథ్యంలో అభివృద్ధి చేయడంతోపాటు ఏపీటీడీసీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్లు నిర్వహించి యువతకు ఉపాధి కల్పిస్తాం. పర్యాటకానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాల నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడంతో పాటు పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాస్, పర్యాటకశాఖ మంత్రి -
ట్రావెల్.. మొబైల్
సాక్షి, సిటీబ్యూరో: పొద్దున్న లేవగానే చేతిలో ఫోన్ ఉందో లేదో చూడడం...రాత్రి పడుకునే ముందు కూడా పక్కనే దాన్ని కూడా బజ్జోపెట్టడం మామూలైందిప్పుడు. అంతగా మన జీవితంతో మమేకమైపోయిన మొబైల్ ఫోన్..ఇష్టమైన పర్యటనలు చేస్తున్న సమయంలో కూడా మనల్ని వీడడం లేదు. అయితే మన హాలిడే ట్రిప్స్లో ఫోన్ ప్రభావం ఎంత అంటే... ప్రయాణాల్లో కూడా మొబైల్ ఫోన్ తప్పనిసరిగా వినియోగిస్తాం అని చెబుతున్నారు జర్నీఇష్టులు. అంతేకాదు స్మార్ట్ ఫోన్ లేకపోతే తమ జర్నీ చాలా చప్పగా ఉంటుందంటున్నారు. హోటల్స్ డాట్ కామ్ నిర్వహించిన మొబైల్ ట్రావెల్ ట్రాకర్ సర్వే వెల్లడించిన విషయమిది. దాదాపుగా 30 దేశాలకు చెందిన 9 వేల మందిని సర్వే చేసి ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం తాము కనీసం 4 గంటలపైనే మొబైల్ఫోన్తో గడుపుతామని అంగీకరించారు. బీచ్లో సుందర దృశ్యాల కంటే మిన్నగా మొబైల్ స్క్రీన్లో విశేషాలు తిలకిస్తామన్నారు. మరి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేవాళ్లు ఏం చేస్తున్నారంటే..చుట్టు పక్కల కనిపించే సుందర దృశ్యాల సంగతేమో గానీ 64 శాతం మంది తాము తింటున్న ఫుడ్ ఫొటోలు తీస్తున్నామని చెప్పారు. 18 నుంచి 29 మధ్య వయస్కులలో 85 శాతం మంది తాము అడుగుపెట్టిన నగరపు విశేషాల చిత్రాల కంటే సెల్ఫీలనే అప్లోడ్ చేస్తున్నామన్నారు. అంతేకాదు తమకు ప్రయాణాల్లో తోడు లేకపోయినా పర్లేదు కానీ... మొబైల్ ఉండాల్సిందే అంటున్నవారు 31 శాతం మంది ఉండడం గమనార్హం. అయితే విచిత్రమేమిటంటే...స్మార్ట్ ఫోన్స్ బాగా అందుబాటులోకి రావడం వల్లనే విహారయాత్రలు, హోటల్స్లో బసలు బాగా పెరిగాయని 71 శాతం మంది భారతీయ ట్రావెలర్లు అభిప్రాయపడడం. వీరిలో కూడా 58 శాతం మంది స్మార్ట్ఫోన్ చేతిలో లేకపోతే తమ ప్రయాణం ఆనందం కలిగించడం లేదంటున్నారు. ప్రయాణాల్లో అన్నింటికన్నా తమకు అత్యంత చిరాకు కలిగించే విషయాల్లో మొబైల్ ఫోన్ చార్జింగ్ అయిపోవడం మొదటిది అని అత్యధికులు చెప్పడం కొసమెరుపు. -
టూరిజం ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష
అమరావతి : ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. టూరిజం, ఆర్కియాలజీ, యూత్ ఎఫైర్స్ శాఖలపై శుక్రవారం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాల్లో 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సెవెన్స్టార్ తరహా సదుపాయాలున్న హోటళ్లు తీసుకురావాలని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజంతో పాటు చారిత్రక ప్రాంతాల అభివృద్ధి, అన్ని జిల్లాల్లో క్రీడా సదుపాయాల ఏర్పాటుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలో అడుగుపెట్టే ప్రతి పర్యాటకుడు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారని, అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణమని అన్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అభివృద్ధిచేయాల్సిన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసిన తనకు వివరాలు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆతిథ్యరంగంలో, పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న సంస్థలు హోటళ్లను ఏర్పాటు చేసేలా ఇక్కడ ఉత్తమ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై సహజంగానే అంతర్జాతీయస్థాయిలో మంచి ప్రచారం లభిస్తుందన్నారు. అభివృద్ధి చేయాల్సిన పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేయడంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు. ఇదే సమయంలో కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పోలవరం, సూర్యలంక, హార్సిలీ హిల్స్, ఓర్వకల్లు, గండికోట తదితర ప్రాంతాలను అధికారులు ప్రతిపాదించారు. పూర్తిస్థాయి వివరాలతో తనకు మళ్లీ సమాచారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అక్కడ నదికి అడ్డంగా గ్లాస్తో ఒక వంతెన కూడా నిర్మించే ఆలోచన చేస్తున్నామని, పలు పర్యాటక ప్రాంతాల్లో రోప్వేలను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు వివరించారు. తనకు సమర్పించే నివేదికలో ఈ ప్రతిపాదనలు అన్నింటినీ చేర్చాలని సీఎం సూచించారు. పోలవరం, పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్లు, డ్యాంలతో పాటు, విశాఖ జిల్లాలో అరకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విశాఖలో మరో మ్యూజియం ఏర్పాటుకు రక్షణ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సమావేశంలో వెల్లడించారు. ఏపీటీడీసీ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో హోటళ్లను, రిసార్టులను నిర్వహిస్తోందని, అయితే చాలా రోజులగా నిర్వహణ కోసం కనీస నిధులు కూడా ఇవ్వకపోవడంతో సమస్యలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వీటి మరమ్మత్తులు చేపట్టి, నిర్వహణ మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. హస్తకళలు అంతరించిపోకుండా చర్యలు తీసుకోండి ష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్న హస్తకళలు అంతరించిపోకుండా వాటిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, లేసుల తయారీ, కళంకారీ తదితర అరుదైన హస్తకళలు చేస్తున్న కుటుంబాలవారికి సహాయం చేసేలా మార్గదర్శకాలు తయారుచేయాలన్నారు. లేకపోతే ఆ కళలు బతకవని, వాటిని నిలుపుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అలాగే రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి, వాటిని సరిగ్గా నిర్వహించడానికి ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొండపల్లికి రోడ్డు, లైట్ల సదుపాయం, బాపు మ్యూజియంలో అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరిలో మరలా బోట్లను తిప్పడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. నదీతీరాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుపై ఈ సందర్భంగా సీఎం ఆరాతీశారు. నిర్దిష్టమైన నిర్వహణా పద్ధతులు, కంట్రోల్ రూమ్స్ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. పర్యాటకులు, ప్రయాణికులకు సరైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని సంతృప్తి చెందిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఏర్పాటైన కమిటీ నివేదిక రాగానే సిఫార్సులపై చర్చిద్దామని సీఎం చెప్పారు. శిల్పారామాల్లో ప్రస్తుత పరిస్థితిపైనా సీఎం సమీక్ష చేశారు. ప్రస్తుతం ఉన్న శిల్పారామాల అభివృద్ధి, వాటిలో గ్రీనరీని పెంచడంపై సీఎం అధికారులకు సూచించారు. శిల్పారామాల నిర్వహణకు ఇబ్బందిలేకుండా నూతన విధానాన్ని తయారుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కల్చరల్ అకాడమీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. కనీసం ఐదెకరాల స్థలంలో ఈ అకాడమీలను నిర్మించాలని, రెండేళ్లలోగా వీటిని పూర్తిచేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సంగీతం, నాట్యం సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్ అకాడమీలు వేదిక కావాలన్నారు. మన కళలను, సంస్కృతిని నిలుపుకోవడానికి, వాటి ప్రాముఖ్యత పెంచడానికి ఈ అకాడమీలు ఉపయోగపతాయని సీఎం అన్నారు. సంగీత, నృత్యకళాశాలలో బోధిస్తున్న పార్ట్టైం, ఫుల్టైం వారికి జీతాలు పెంచాలని కూడా సీఎం ఆదేశించారు. జిల్లాకో క్రీడా సముదాయం రాష్ట్రంలో క్రీడలు, సదుపాయాలపైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్షించారు. ప్రతి స్కూళ్లో క్రీడల కోసం మైదానం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఎన్ని స్కూళ్లకు ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి..? ఎన్నింటికి సమాకూర్చాలన్న దానిపై నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. అలాగే ఉన్న ఆటస్థలాల అభివృద్దిపై కూడా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అలాగే ఫిజికల్ ట్రైనర్లు ఉన్నారా? లేదా? అనేదానిపై కూడా పరిశీలనచేసి, నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియంల నిర్మాణం విశాఖపట్నం, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియంల నిర్మాణంపై సమావేశంలో చర్చ జరిగింది. అంతర్జాతీయ సదుపాయాలతో స్టేడియంల నిర్మాణానికి సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతిజిల్లాలో కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలని వీటికి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని స్పష్టంచేశారు. ప్రతి జిల్లాలో కూడా క్రీడా సముదాయాల కారణంగా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ఏవిధంగా ప్రోత్సహించాలి, వారికి ఎలా అండగా నిలబడాలన్నదానిపై కూడా ప్రతిపానదలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. గడచిన ఐదేళ్లలో జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన గతంలో ఎప్పుడూ చేయలేదని, ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ కార్యక్రమాన్ని చేపట్టిందని సీఎం చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాలశాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్తో పాటు ఆ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇడుపులపాయలోనూ శిల్పారామం
సాక్షి, తాడేపల్లి : యువజన సర్వీసులు, పర్యాటకశాఖపై శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటళ్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. నదిలో బోటు రవాణాపై త్వరలోనే కమిటీ వేసి నివేదిక అందిస్తామని తెలిపారు. అలాగే నదిలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బోట్ల ఫిట్నెస్ చూశాకే అనుమతి ఇక్కడి నుంచే ఇస్తామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో స్టేడియల ప్రతిపాదనకు మంత్రి ఆమోదం తెలిపారు. జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, మండల, నియోజకవర్గ స్థాయి స్టేడియం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కొండపల్లి పోర్ట్, గాంధీ మ్యూజియం త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. త్వరలోనే ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నామని, భాషా, సంస్కృతి అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి తెలిపారు. సంస్కృతి వికాస కేంద్రాల ఏర్పాటు చేయాలని సూచించారు. కళాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్తో ఇంటిగ్రేడ్ చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. కోటి రూపాయలతో శిల్పారామాలకు మరమ్మత్తులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఇడుపులపాయలోనూ శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు అవంతి తెలిపారు. -
లంగరుకు చిక్కింది బోటా.. కొండ రాయా!
రంపచోడవరం/దేవీపట్నం: గోదావరిలో గల్లంతైన ప్రైవేట్ టూరిజం బోటు ‘రాయల్ వశిష్ట పున్నమి’ వెలికితీత పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. దేవుడు గొంది వద్ద గోదావరి వైపు గల ఇసుక మేటను వేదికగా చేసుకుని ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసే పనులు చేపట్టింది. బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతానికి ఐరన్ పంటు, ఏపీ టూరిజం బోటు సహాయంతో వెళ్లి ఐరన్ రోప్లను బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతంలో వలయం మాదిరిగా నదిలోకి జారవిడిచి ఉచ్చులా బిగించారు. దానికి బలమైన వస్తువు చిక్కుకున్నట్టు గుర్తించారు. ఆ వస్తువు బోటా లేక కొండ రాయా అనేది ఇంకా తేలలేదు. అది ఏమిటనేది మంగళవారం తేలుతుందని చెబుతున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు బోటును వెలికి తీసేందుకు అవసరమైన రోప్లు, కప్పీలతో దేవీపట్నం నుంచి సత్యం బృందం బయలుదేరింది. దేవుడు గొంది ఇసుక దిబ్బల నుంచి ఏపీ టూరిజం బోటు, ఐరన్ పంటు సహాయంతో రెండు వేల అడుగుల పొడవున్న ఐరన్ రోప్ను బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతం మీదుగా వలయంలా గోదావరిలోకి విడిచిపెట్టారు. రోప్కు ఒకవైపు గల చివరి భాగాన్ని (కొస) గోదావరి ఒడ్డున ఉన్న బలమైన చెట్టుకు కట్టారు. రెండో కొసను ఒడ్డున ఉన్న మెషిన్ సహాయంతో బిగించుకుంటూ వచ్చారు. అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు కావడంతో బోటును వెలికి తీసే పనులు నిలిపివేశారు. గోదావరి శాంతించడంతో భయంకరమైన సుడులు తగ్గాయి. నీటి ప్రవాహం సాధారణ స్థాయిలో ఉండటంతో బోటును వెలికి తీసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. -
చంద్రబాబు స్విమ్మరా? డ్రైవరా..?
సాక్షి, ఢిల్లీ: ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు అందుకోవడం సంతోషకరంగా ఉందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 28 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని తెలిపారు. ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని.. పర్యాటకం అభివృద్ధి, ప్రయాణికుల భద్రతపై మరింత దృష్టి పెడుతున్నామన్నారు. గుజరాత్ తర్వాత పెద్ద సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతమన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి వెల్లడించారు. మారుమూల ప్రాంతాలకు సైతం పర్యాటక రంగాన్ని తీసుకెళ్లి, స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. త్వరలోనే రాష్ట్రంలో టూరిజం సదస్సుని నిర్వహిస్తామని చెప్పారు. మౌలిక వసతులు, రవాణా, పర్యాటకుల భద్రత, స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించామన్నారు. విదేశీ పర్యాటకులు సంఖ్యను పెంచేందుకు వైజాగ్ విమానాశ్రయంలో వీసా ఆన్ అరైవల్కి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పర్యాటకుల భద్రత ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే సీఎం జగన్ ఐదుగురి సభ్యులతో కమిటీ వేశారన్నారు. కమిటీ ఇచ్చే సిఫార్సులను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఒడ్డున కూర్చొని ఎన్నైనా మాట్లాడొచ్చు.. పాపికొండల వద్ద గోదావరిలో మునిగిపోయిన బోట్ను వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గంటలు కష్టపడుతున్నారని మంత్రి అవంతి తెలిపారు. ‘చంద్రబాబు ఉంటే గంటలో తీస్తారు.. రెండు గంటల్లో తీసేవారని అంటున్నారని.. చంద్రబాబు ఏమన్నా స్విమ్మరా? డ్రైవరా రెండు గంటల్లో వెలికి తీయడానికి’ అని ఎద్దేవా చేశారు. ఒడ్డున కూర్చొని ఎన్నైనా మాట్లాడవచ్చని.. బోట్ని వెలికితీసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. ఎంత ఖర్చయినా బోటును వెలికితీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. బోటు మునక ఘటన దురదృష్టకరమని.. దీనిపై రాజకీయాలు చేయడం దారుణన్నారు. బోటు టీడీపీ మద్దతుదారుడిదని, బోటుకు అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
కేరళ చలో...రీచార్జ్ కరో..
భూతల స్వర్గం, ప్రకృతి అందాల నిలయం అని కేరళను పర్యాటకులు కీర్తిస్తుంటారు. అక్కడి పచ్చని ప్రకృతిని.. జాలువారే జలపాతాలను.. హౌస్బోట్లను ఆస్వాదించని సిటీ టూరిస్ట్లు అరుదే. అయితే ఒకసారి కేరళను సందర్శిస్తే చాలని భావించే సిటీ టూరిస్ట్లు ఇప్పుడు తరచుగా కేరళ చలో అంటున్నారు. అవును మరి... ఇప్పుడు కేరళ సిటిజనుల రీచార్జ్ సెంటర్. ఐటీ ఉద్యోగులు, సంపన్నులు, గ్లామర్ రంగ ప్రముఖులకు రెగ్యులర్ విజిట్. కనీసం మూణ్నెళ్లకు ఒకసారైనా కేరళ వెళ్లడం పరిపాటిగా మారింది. దీనికి కారణం ఆ రాష్ట్రంలోని ఆయుర్వేద చికిత్సలే.– సాక్షి, సిటీబ్యూరో సర్జరీ సమస్య తప్పింది మోకాలి కీళ్ల సమస్యతో బాధపడేదాన్ని. నేల మీద కూర్చోలేనని తేల్చి చెప్పారు. మెట్లు ఎక్కలేనని చెప్పిన ఇక్కడి వైద్యులు నాకు కీహోల్ సర్జరీ సూచించారు. ఇద్దరు పిల్లల తల్లిగా ఇంట్లో నా పనులు చేసుకోకుండా ఉండలేను. చివరకు స్నేహితుల సూచన మేరకు కేరళలోని అస్టాముడిలో ఉన్న ఓ ఆయుర్వేదిక్ సెంటర్లో 21 రోజుల పాటు చికిత్స తీసుకున్నాను. సంపూర్ణంగా కోలుకున్నాను. నా పనులన్నీ చేసుకోగలుగుతున్నా జిమ్కు కూడా వెళుతున్నా. – కవిత, గృహిణి విభిన్న రకాల మారథాన్లలో పాల్గొన్న అనుభవం ఉంది కానీ మారథాన్ని అడ్వెంచరస్గా అనుభూతించింది మాత్రం ఒకే ఒక్కసారి. గత వింటర్ సీజన్లో పుణెలోని ఈస్ట్రన్ ఘాట్స్ దగ్గర దీనిని ఒక సంస్థ నిర్వహించింది. మారథాన్ రేస్ మొత్తం హిల్స్ మీదే కావడం దీనిలోని విశేషం. మై అడ్వెంచర్హిల్స్లోరేస్ పుణె రైల్వే స్టేషన్ నుంచి 50కి.మీ దూరం ఈస్ట్రన్ ఘాట్స్కు వెళ్లాం కొండ కింద అందరికీ అవసరమైనవి అన్నీ అందించాక రేస్ ప్రారంభమైంది. ఫోన్ సిగ్నల్స్ లేవు. కనుచూపు మేరలో మనుషుల్లేరు. నాది 25 కిలోమీటర్ల విభాగంలో రేస్. కొన్ని కిలోమీటర్లు నడిచాక పాలు పెరుగు అమ్ముకునే మరాఠా మహిళలు.. కొండల్లో వారిని చూస్తే వనకన్యల్లా ఎంత చక్కగా ఉన్నారో. చుట్టు పక్కల ఊర్ల నుంచి వచ్చి మా లాంటి ట్రెక్కర్స్ కోసం వీళ్లు అవి విక్రయిస్తుంటారు. కొండ ఎక్కేటప్పుడు పలు మార్లు జారిపడ్డా, దెబ్బలు తగిలాయి. హమ్మయ్య ఎక్కడం పూర్తయింది అనుకుంటే.. ఎక్కడం కన్నా దిగడం చాలా కష్టమని దిగేటప్పుడు అర్థమైంది. ట్రాక్ చిరిగిపోయి చేతులకి దెబ్బలు కాళ్లకి దెబ్బలతో ఎలాగో పూర్తి చేశా. నిర్ణీత వ్యవధి 7గంటల్లో పూర్తి చేసి మెడల్ అందుకున్నా. అప్పుడు బాగా కష్టంగా అనిపించింది. కానీ ఇప్పటికీ తలచుకుంటే ఆ అనుభవం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. జీవితంలో తొలి క్లిష్టమైన అడ్వెంచర్ అదే. మళ్లీ అలాంటివి చేయాలనిపించేంత మంచి జ్ఞాపకాన్ని అందించింది. – భార్గవి, రేడియో జాకీ, యాంకర్ ట్రీట్...క్లీన్ ‘‘ ఏ సమస్య ఉన్నా లేకున్నా నిర్ణీత వ్యవధిలో కారు సర్వీసింగ్కి పంపుతాం కదా. అలాగే శరీరాన్ని కూడా కేరళకు పంపాలి’’ అంటూ అభిప్రాయపడ్డారు నగరానికి చెందిన వ్యాపార వేత్త కిరణ్. ఆ ఏడాదిలో తలెత్తిన ఏవైనా ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి మాత్రమే కాక టాక్సిన్స్ను తొలగించుకోవడానికి, శరీరంలో పేరుకుపోయిన అన్ని రకాల చెత్తను శుభ్రపరచుకోవడానికి సిటిజనులు ఈ మళయాళీ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ‘‘మన వాళ్లింకా తక్కువని చెప్పాలి. ప్రతీ ఏడాదీ అక్కడకు వెళ్లినప్పుడల్లా భారతీయుల కన్నా పెద్ద సంఖ్యలో పాశ్చాత్యులు నాకు కనిపిస్తుంటారు. అంతేకాదు వారికి ఆయుర్వేద, నేచురోపతి చికిత్సలపై మంచి అవగాహన కూడా ఉంది’’ అని చెప్పారు ఐటి ఉద్యోగిని శ్రీకళ. ఓ వైపు వ్యయ భరితం కావడం మరోవైపు పూర్తి ప్రశాంతతను కోరుకోవడం వల్ల ఇలాంటి చికిత్సలకు ఒంటరిగా లేదంటే బాగా సన్నిహితులతో మాత్రమే వెళుతున్నారు. శరీరం మొత్తం తిరిగి పునరుత్తేజం పొందేలా తిరిగొస్తున్నారు. చర్మ సంబంధ సమస్యల తీవ్రమైన ఒళ్లు నొప్పుల వంటి శారీరక సమస్యల నుంచి డిప్రెషన్, నిద్రలేమి వంటి సైకలాజికల్ సమస్యల దాకా కేరళ పేరు జపిస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే వెళ్లడం దగ్గర మొదలై ఏ సమస్య లేకపోయినా ఇప్పుడు ఏడాదికి ఆర్నెళ్లకు ఒకసారి తప్పక వెళ్లివచ్చేదాకా వచ్చేసింది. ఈజీ ప్యాకేజీలూ... విభిన్న ఆయుర్వేద కేంద్రాలు విభిన్న రకాల ప్యాకేజ్లు అందిస్తున్నాయిు. సిటీ నుంచి కేరళకు పెరిగిన టూరిస్టుల రద్దీతో అన్నీ కలగలిపిన ప్యాకేజ్లు కూడా టూర్ ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్నారు. రానుపోను చార్జీలు కాకుండా 3 పూటలా భోజనం, రోజుకు 3గంటల చికిత్స, యోగా, మందుల వినియోగం ఖర్చులు, రిసార్ట్స్లో బస వెరసి ఖరీదు రోజుకు రూ.5వేల నుంచి రూ.10వేల మధ్యలో ఉంటుంది. చికిత్స సందర్భంగా అక్కడ అందించే ఆహారం తక్కువ నూనెలతో తక్కువ స్పైసీగా ఉన్నా, రుచిగా ఉంటుందని అక్కడికి వెళ్లొచ్చినవారు చెబుతున్నారు. విరివిగా వినియోగించే గ్రీన్ చిల్లీస్, కొబ్బరి రుచిని పెంచుతాయని చెప్పారు. రోజుకి 8వేలైనా ఎక్కువనిపించలేదు... ఏటేటా కేరళ వెళ్లి కొట్టాయంలోని ఓ ఆయుర్వేదిక్ సెంటర్లో పంచకర్మ చికిత్స చేయించుకుంటుంటా. దీనికి గాను రోజుకి 8వేలు చెల్లిస్తా. ఇదిæ వ్యయభరితంగా అనిపిస్తుంది. అయితే మన మానసిక ప్రశాంతత, ఆరోగ్యంతో పోలిస్తే ఇది అంత పెద్ద మొత్తం కాదు. పైగా ఇందులో బస, ఆహారం, వైద్య చికిత్స తదితర అన్ని ఖర్చులూ కలిపి ఉంటాయి.– ఎం.శ్రీరామ్నాథ్, ఐటి ఉద్యోగి సీనియర్స్కు విల్లాలో ఉచిత బస తరచుగా టూర్లు వెళ్లి రావడం, ఇష్టమైన చోటుకి పర్యటనలు చేయడం అనేది సిటిజనుల్లో అంతకంతకూ పెరుగుతున్న అభిరుచి. దీనిని దృష్టిలో ఉంచుకుని విభిన్న రకాల ప్యాకేజీలతో టూర్ ఆపరేటర్లు ఆకర్షిస్తున్నారు. వీరితో పోటీగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ల కోసం నిర్వాహకులు కూడా మరిన్ని హంగులతో, ఆకర్షణీయ పధకాలతో ముందుకు వస్తున్నారు. అదే తరహాలో ప్రముఖ సంస్థ విస్టా రూమ్స్ వినూత్న ఆఫర్తో ముందుకొచ్చింది. పెద్దలను హాలిడే వెకేషన్కి తీసుకెళితే వారికి ఉచితంగా తమ విల్లాలో బస అందిస్తామని అంటోంది విస్టా రూమ్స్. దక్షిణాసియా వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో బస ఏర్పాట్లలో పేరొందిన విస్టా రూమ్స్ 60ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల కోసం ఒక ఆకర్షణీయమైన ఆఫర్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా పలు పర్యాటక ప్రాంతాల్లో తమకున్న 300కు పైగా వసతి భవనాల్లో సీనియర్స్ కోసం ఉచిత బస కల్పిస్తోంది. ఈ నెల 15 న ప్రారంభమైన ఈ ఆఫర్ కేవలం నెల రోజులు అది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బిజీ లైఫ్లో పేరెంట్స్ సరదాలను తీర్చలేకపోతున్న పిల్లల్ని ప్రోత్సహించేందుకు దీన్ని అందిస్తున్నామని, వృద్ధులు ఎవరైనా సరే దీనిని ఉపయోగించుకోవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదనపు వివరాల కోసం www.vistarooms.com లాగిన్ కావచ్చు. గో.. గోవా... పార్టీ ప్రియులు ఇష్టపడే ప్లేస్ గోవా అక్కడి షిప్స్ మీద విహరించే సిటిజనుల కోసం గోవాలోని డెల్టిన్ కాసినోస్ తాజాగా సరికొత్త డెల్టిన్ మ్యూజికల్ స్టార్స్తో ఆహ్వానిస్తోందని సంస్థ సిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రతి వారాంతంలో డెల్టిన్ రాయల్, డెల్టిన్ జేఎక్యుకె...షిప్లలోఇండియన్ ఐడల్, సరిగమప, ది వాయిస్, రా తదితర రియాలిటీ షోస్లో పాల్గొన్న సింగర్స్తో షోస్ మ్యూజికల్ స్టార్ పేరుతో ఈవెంట్స్ ఉర్రూతలూగిస్తాయన్నారు. -
లుక్కుండాలె.. లెక్కుండాలె..!
సాక్షి, హైదరాబాద్: ఇక ఇష్టారాజ్యంగా సాహసక్రీడలు నిర్వహించడం కుదరదు. వీటిపై ఓ లుక్కుండాలి.. వీటికో లెక్కుండాలని కేంద్రం స్పష్టం చేసింది. విధివిధానాలు రూపొందించింది. భూపాలపల్లి జిల్లాలోని పాండవులగుట్టతోపాటు భువనగిరి గుట్ట వద్ద ట్రెక్కింగ్ చేస్తున్న యువ కులు కనిపిస్తారు.. ఈ ట్రెక్కింగ్కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఏంటి? వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టల్లో తరచూ మోటారు సైకిల్, సాధారణ బైసికిల్ రేసులు కనిపిస్తాయి. కానీ, వీటిని నిర్వహిస్తున్నదెవరు? వీటి గురించి తెలంగాణ పర్యాటకశాఖ వద్ద ఎలాంటి సమాచారం ఉండదు. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. సాహస క్రీడలు నిర్వహిస్తున్న సంస్థలేవో కూడా సమాచారం లేకుండా పర్యాటకశాఖ ఉండటమేంటని ప్రశ్నించింది. ఇక నుంచి సాహస క్రీడలకు సంబంధించి విధివిధానాలను అనుసరిం చాల్సిందేనని స్పష్టం చేసింది. ఎవరు పడితేవారు నిర్వహించొద్దు రాష్ట్రంలో రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, మోటారు బైక్స్ రేసింగ్, సైక్లింగ్, టెర్రయిన్ కార్ స్పోర్ట్స్... ఇలాంటివి చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేసుకుని గో కార్టింగ్లు నిర్వహిస్తున్నాయి. కొన్నిసంస్థలు క్లబ్గా ఏర్పడి సభ్యులను చేర్చుకుని తరచూ సైక్లింగ్, బైక్ రైడింగ్ లాంటివి నిర్వహిస్తున్నాయి. వీటిల్లో ధనార్జన లక్ష్యంగా లేకున్నా, సాహసక్రీడలను నిర్వహించే కుతూహలం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సైక్లింగ్, ట్రెక్కింగ్ లాంటి భూమి మీద నిర్వహించే 15 రకాల సాహస క్రీడలు, నీటిలో, గాలిలో నిర్వహించే ఏడు చొప్పున క్రీడలకు సంబంధించి ఈ విధివిధానాలను సిద్ధం చేసింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలంటే ఈ సాహస క్రీడలను విస్తృతం చేయాలని గతంలోనే కేంద్ర పర్యాటక శాఖ నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో స్థానిక వనరుల ఆధారంగా సాహస క్రీడలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆ రూపంలో 430 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని అంచనా వేసింది. ఇది వచ్చే కొద్ది సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. కానీ, మనదేశంలో చాలా ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వీటిని నిర్వహిస్తున్న తీరును గుర్తించింది. విదేశీ పర్యాటకులు సైతం వీటిపై ఫిర్యాదు చేస్తున్నట్టు పేర్కొంది. చాలాచోట్ల కనీస జాగ్రత్తలు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త విధివిధానాలను రూపొందించింది. మనోహర్, ఎండీ, టీఎస్టీడీసీ సాహస క్రీడల విధివిధానాలపట్ల కేంద్ర పర్యాటక శాఖ కచ్చితంగా వ్యవహరిస్తోంది. ఇది మంచి పరిణామమే. ఇటీవలే ఢిల్లీలో దీనిపై సదస్సు నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు కూడా లేకుండా ఎవరికి వారుగా వాటిని నిర్వహించే పద్ధతి ఇక ఉండదు. దీనిపై నిర్వాహకులకు కూడా త్వరలో స్పష్టతనిస్తాం ఇలా ఉండాలి.. ఇక నుంచి సాహసక్రీడలు నిర్వహించే సంస్థలన్నీ తెలంగాణ పర్యాటకశాఖలో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. ఎక్కడ ఎలాంటి క్రీడలు నిర్వహించబోతున్నారో ముందుగా స్థానిక పర్యాటక శాఖ కార్యాలయంలో సమాచారం ఇచ్చి అనుమతి పొందాలి ఆయా క్రీడలకు సంబంధించి కనీసం మూడేళ్ల నిర్వహణ అనుభవం ఉన్నట్టుగా పర్యాటక శాఖ నుంచి సర్టిఫికెట్ పొందినవారే వాటి నిర్వహణకు అర్హులు నిర్వాహకులు, కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు ఆయా క్రీడల్లో కనీస శిక్షణ తీసుకుని ఉండాలి. వారు కనీస విద్యార్హతలను కూడా కలిగి ఉండాలి పర్యాటక శాఖ నిర్దేశించిన పరికరాలనే వినియోగించాలి. వాటిల్లో పాల్గొనేవారు కచ్చితంగా హెల్మెట్లులాంటి రక్షణపరికరాలు వాడాలి. క్రీడలు నిర్వహించే ప్రాంతంలో ప్రమాద నియంత్రణ పరికరాలుండాలి. గాయపడ్డవారికి చికిత్స చేసేందుకు అవసరమైన మెడికల్ కిట్స్ అందుబాటులో ఉండాలి -
మళ్లీ పూటకూళ్ల ఇళ్లు !
సాక్షి, హైదరాబాద్ : పూటకూళ్ల ఇళ్లు.. మన తండ్రులు, తాతల కాలంలో ప్రతి ఊళ్లో ఉండేవని పెద్దలు చెబుతుంటే విన్నాం. దూరప్రాంతాలకు ప్రయాణం చేసేవారు చీకటి పడేసరికి దగ్గరున్న ఊళ్లోని పూటకూళ్ల ఇంట విశ్రాంతికి దిగేవారని చందమామ కథల్లో చదివాం కూడా. బాటసారులకు భోజనం, విశ్రాంతి తీసుకునేందుకు కల్పించే బసను పూటకూళ్ల ఇళ్లుగా వ్యవహరించే వారు. హోటళ్లు వచ్చిన తర్వాత ఇవి కనుమరుగయ్యాయి. కానీ కేంద్ర పర్యాటక శాఖ ఇప్పుడు వీటిని పునరుద్ధరించాలంటూ రాష్ట్రాలకు సూచిస్తోంది. ఆ మేరకు తెలంగాణలో కూడా అలనాటి పూటకూళ్ల ఇళ్ల తరహా వసతి గృహాలను అందుబాటులోకి తెచ్చేందుకు పర్యాటక శాఖ కసరత్తు మొదలుపెట్టబోతోంది. ఎందుకీ ఇళ్లు జలపాతాలు, పురాతన కట్టడాలు, వందల ఏళ్లనాటి దేవాలయాలు, హాయి గొలిపే అడవి అందాలు.. ఇలాంటి చూడదగ్గ ప్రాంతాలు తెలంగాణలో ఎన్నో. దట్టమైన అడవిలో ఉండే బొగత జలపాతం వద్దకు వెళ్తే తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకవు. ఆ ప్రాంతం అబ్బుర పరిచేదే అయినా, కనీస వసతి లేకపోవటంతో అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య తక్కువే. ఇక విదేశీ పర్యాటకుల జాడే ఉండదు. సూర్యో దయ వేళ ఆ ప్రాంతాన్ని చూడాలన్నా, సూర్యుడు అస్త మించే అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించాలన్నా రాత్రి వేళ ఆ ప్రాంతంలో ఉండాల్సిందే. కానీ పట్టణాలకు చేరువగా ఉన్న ప్రాంతాలు తప్ప రాష్ట్రంలో వేరే పర్యాటక ప్రాంతాల్లో అలాంటి వసతేలేదు. కచ్చితంగా చీకటి పడేసరికి సమీపంలోని పట్టణ ప్రాంతానికి చేరు కోవాల్సిందే. ఈ పద్ధతి మారాలంటే పూటకూళ్ల ఇళ్ల తరహా ఏర్పాటు ఉండాలనేది కేంద్ర పర్యాటక శాఖ అభిప్రాయం. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కోరుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో కూడా అలాంటి ‘ఇంటి ఆతిథ్యం’అవసరమని స్పష్టం చేసింది. రాజస్తాన్, తమిళనాడుల్లో భేష్ ! గతేడాది 1.5 కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారత్లో పర్యటించారు. ఇందులో 18 లక్షల మంది తమిళనాడును సందర్శించారు. తెలంగాణకు వచ్చినవారి సంఖ్య 3.8లక్షలు మాత్రమే. ఏటేటా తమిళనాడుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అలా పెరిగేందుకు దోహదం చేస్తున్న అంశాల్లో పూటకూళ్ల తరహా ఇళ్ల వసతులు ఉండటమూ ఓ కారణమని తేలింది. కేంద్రప్రభుత్వం గతంలో ‘హోమ్ స్టే’పథకాన్ని రూపొందించింది. దీనికి ‘బెడ్, బ్రేక్ఫాస్ట్’స్కీంగా నామకరణం చేసింది. దీన్ని రాజస్తాన్, తమిళనాడులాంటి రాష్ట్రాలు బాగా అమలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో అది మొదలే కాలేదు. ఏంటా విధానం? పట్టణాలకే ఓ మోస్తరు హోటళ్లు పరిమితమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే చిన్నాచితకా టిఫిన్, చాయ్ హోటళ్లు తప్ప బస చేసే వెసులుబాటుండటం లేదు. విదేశీ పర్యాటకులను బెదరగొడుతున్న విషయమిదే. దీంతో కొన్ని రాష్ట్రాలు ఈ ‘బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్’పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో ఉండేవారు తమ ఇళ్లలోని కొంత భాగాన్ని ఇలా పర్యాటకులు తాత్కాలికంగా ఉండేలా తీర్చిదిద్ది ఆదాయం పొందుతున్నారు. అలా ఏర్పాటు చేసేలా పర్యాటక శాఖ ప్రయత్నించి విజయం సాధించింది. కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తే ఎంతటి మారుమూల ప్రాంతానికైనా విదేశీ, స్వదేశీ పర్యాటకులు వస్తారని తేలింది. తమిళనాడు, రాజస్తాన్ల్లో దాదాపు అన్ని పర్యాటక ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు వచ్చేందుకు ఇదే కారణమవుతోంది. గ్రామాల్లో స్థానికులు తమ ఇంటిలోని కొంత భాగాన్ని పర్యాటకులు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వారికి తమ ఇంటి భోజనాన్నే వడ్డిస్తున్నారు. అది సురక్షిత ప్రాంతమనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. వాటి వివరాలు పర్యాటక శాఖ వెబ్సైట్లలో పొందు పరచడంతో పర్యాటకులు ఎలాంటి జంకు లేకుండా అక్కడే రాత్రి బసచేసి సమీపంలోని ప్రకృతి అందాలను తిలకిస్తున్నారు. ఇప్పుడు ఈ తరహా విధానం తెలంగాణలో కూడా ఏర్పాటయ్యేలా ప్రయత్నం చేస్తామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా ఉండాలి ! ఆ ఇంటిలో కనిష్టంగా ఒక గది, గరిష్టంగా ఆరు గదులు పర్యాటకులకు కేటాయించాలి. అందులోనే టాయిలెట్లు, స్నానాల గదులు కచ్చితంగా ఉండాలి. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలి. ఇంటి యజమానులు కూడా అదే ప్రాంగణంలో నివాసం ఉండాలి. అక్కడే భోజన వసతి కల్పించాలి. విద్యుత్తు వసతి, మంచాలు, శుభ్రమైన పరుపు, దుప్పట్లు, శుభ్రమైన నీటి వసతి, ఫ్యాన్, దోమల నియంత్రణకు కొన్ని ఏర్పాట్లు అవసరం. ఏసీ, కూలర్ లాంటి ఏర్పాట్లు ఉంటే మంచి వసతి గదులుగా పరిగణిస్తారు. పర్యాటక శాఖ వెబ్సైట్లో నమోదు తప్పనిసరి ఇలా వసతి గదులు ఏర్పాటు చేయాలనుకునేవారు ముందుగా సంబంధిత పర్యాటకశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతో అధికారులు ఆ గదులను పరిశీలించి యోగ్యంగా ఉంటే అనుమతిస్తారు. వాటి వివరాలు, సమీపంలోని పర్యాటక ప్రాంతాలు, ఫోన్ నెంబర్లు, ఇళ్ల ఫొటోలను వెబ్సైట్లో పొందుపరుస్తారు. వాటిని పర్యాటకులు ఆన్లైన్ ద్వారా చూసి ఎంచుకునే అవకాశం ఉంటుంది. భోజనం, అద్దె తదితర వివరాలు కూడా డిస్ప్లేలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఈ వివరాలు ఉండాలి. తమిళనాడు, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఉండటంతో పర్యాటకులు ఆయా ప్రాంతాలలో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలకు వస్తున్న స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది రెండ్రోజుల క్రితం ఢిల్లీలో కేంద్రపర్యాటక శాఖ ఏర్పాటు చేసిన సదస్సులో దీనిపై చర్చ జరిగింది. తెలంగాణకు వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా పెరగాల్సి ఉంది. ఇది జరగాలంటే ఈ తరహా ఏర్పాట్లు చాలా అవసరం. వీటిని గొప్పగా నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితులు పరిశీలించి తెలంగాణలో కూడా వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. త్వరలో దీనికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి కసరత్తు ప్రారంభిస్తాం. – పార్థసారథి, పర్యాటక శాఖ ఇన్ఛార్జి కార్యదర్శి -
సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మంత్రి అవంతి సమీక్ష
సాక్షి, అమరావతి : టూరిజం, యూత్అ ఫైర్స్ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏయే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే దానిపై సీఎస్తో సమీక్షించామని తెలిపారు. 2019 ఏడాదికి గాను మంగళంపల్లి బాల మురళీ కృష్ణ అవార్డును కర్నాటక సంగీత విధ్వాంసురాలు బాంబే జయశ్రీకి అందజేయనున్నట్టు వెల్లడించారు. బహుమతి ప్రదాన కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబర్ 10న నిర్వహిస్తామని అన్నారు. రూ.10 లక్షల నగదు పురస్కారాన్ని అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త శిల్పారామాలకు పీపీపీ పద్ధతిలో భూమిని కేటాయిస్తామని స్పష్టం చేశారు. కడప, కర్నూలు జిల్లాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. నెలరోజుల్లో విజయవాడలో బాపు మ్యూజియం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సాత్విక్ సాయిరాంను అభినందిస్తాం.. ‘బ్యాడ్మింటన్లో పతకం సాధించిన అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాంను ముఖ్యమంత్రి సమక్షంలో అభినందిస్తాం. ఇటీవల చనిపోయిన బ్యాడ్మింటన్ కోచ్ సుధాకర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. విశ్వ విద్యాలయాల్లో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలు, ట్రాక్స్ నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహకాలు అందిస్తాం. ప్రతి నెల ఒక జిల్లాలో క్రీడలు నిర్వహిస్తాం. ఆయా క్రీడల్లో గెలుపొందిన వారితో రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం. గాయాల పాలైన, అనారోగ్యానికి గురైన క్రీడాకారులకు చికిత్స చేయిస్తాం. దానికోసం ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో టూరిస్టుల కోసం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే యోచనలో ఉన్నాం. తద్వారా అన్ని ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల సంప్రదాయం వెల్లి విరేసేలా కృషి చేస్తాం. పురాతన దేవాలయాలను దేవాదాయ లేక టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి చేస్తాం’అని అవంతి చెప్పారు. -
గండికోటకు ‘వారసత్వ హోదా’ వచ్చేనా?
సాక్షి, కడప : భారతదేశపు గ్రాండ్ క్యానియన్గా పేరుగాంచి దేశానికి తలమానికంగా నిలిచిన గండికోటకు వారసత్వ హోదా వచ్చే అవకాశంపై పర్యాటకాభిమానుల్లో తిరిగి ఆశలు మొలకెత్తుతున్నాయి. 2012 నుంచి గండికోటకు వారసత్వ హోదా కోసం జిల్లాలోని పర్యాటకాభిమానులేగాక ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఎన్నో రకాలుగా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం, సంబంధిత మంత్రులు, అధికారులను గట్టిగా ఈ విషయంపై అడిగారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే గండికోట వారసత్వ ఉత్సవాల్లో భాగంగా రెండు సంవత్సరాలుగా సాక్షాత్తు జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి స్వయంగా నెలరోజుల్లో వారసత్వ హోదా వస్తుందని నమ్మబలికా రు. గత సంవత్సరం కూడా అదే హామీ ఇచ్చారు. కానీ హోదాకు సంబంధించి ఇంతవరకు జిల్లా నుంచి కనీస అభ్యర్థనలు వెళ్లలేదని తెలుసుకున్న పర్యాటకాభిమానులు ఆవేదనకు గురయ్యారు. వారసత్వహోదా వస్తే.... గండికోటకు వారసత్వ హోదా వస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. సంవత్సరానికి రూ. 100 కోట్లు కోట అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన, ఇతర పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన చరిత్ర పరిశోధకులు, అధ్యయనం కోసం ఈ కోటను ప్రతి సంవత్సరం రెండు, మూడు నెలలపాటు పరిశీలిస్తారు. వారితోపాటు ఆయా దేశాలకు చెందిన పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఉంది. 2012లో గండికోటలో చారిత్రక సంపద అభివృద్ధిలో భాగంగా గండికోటలో వారసత్వ ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా పర్యాటకాభిమానులు కోరారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి 2015 నుంచి ఉత్సవాలను నిర్వహించింది. అప్పటి నుంచి 2019 ఫిబ్రవరి వరకు జరిపారు. ప్రతి సంవత్సరం నిధుల కొరత ఉందని ఉత్సవాలను నిలిపివేసే ప్రయత్నం చేస్తుండడం జిల్లాకు చెందిన పర్యాటకాభిమానులు, పర్యాటక సంస్థల ప్రతినిధులు గట్టిగా పట్టుబట్టడంతో అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఇవ్వగా.. వేరే శాఖల నుంచి కొద్దిమొత్తాన్ని ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చయ్యాయని ప్రచారం చేశారు. కానీ ఆ స్థాయి కార్యక్రమాలు జరగకపోవడం గమనార్హం. దీనికి అంతర్జాతీయ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభిస్తే పుష్కలంగా నిధులు వచ్చి అనుకున్న విధంగా కోటను అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుంది. గత ప్రభుత్వాలు అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేశారేగానీ ఈ విషయంపై అభ్యర్థన పంపింది లేదు. ప్రస్తుతం పర్యాటకానికి ప్రత్యేకంగా మంత్రిని నియమించడం, ఆయన కూడా ఈ రంగం అభివృద్ధి పట్ల ఆసక్తి కనబరుస్తుండడంతో జిల్లా వాసుల్లో గండికోటకు యునెస్కో గుర్తింపు లభించగలదని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి గండికోటను సందర్శించాలని కోరుతున్నారు. -
స్విమ్మింగ్ పూల్లో మునిగి బాలుడి మృతి
సాక్షి, అరకులోయ (విశాఖపట్నం) : విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదం నింపింది. టూరిజంశాఖకు చెందిన స్థానిక హరితవేలి రిసార్ట్స్లోని స్విమ్మింగ్పూల్లో ఈతకు దిగిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో జరిగింది. శ్రీకాకుళానికి చెందిన శంకరరావు, అతని భార్య,నాలుగేళ్ల కుమారుడు విహారయాత్రకు వచ్చి,మంగళవారం హరితవేలి రిసార్ట్స్లో బస చేశారు. మధ్యాహ్నం భోజన విరామంలో ఈనాలుగేళ్ల బాలుడు గది నుంచి బయటకు వచ్చి ఒంటరిగానే స్విమ్మింగ్పూల్లోకి దిగాడు. ఆ తరువాత స్విమ్మింగ్ పూల్ వద్దకు తల్లిదండ్రులు వచ్చారు. ఈతకొడుతునే ఈ బాలుడు ఒక్కసారిగా నీట మునిగాడు.ఆ సమయంలో పర్యాటక సిబ్బంది,ఇతర అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ఈ బాలుడు క్షణాల్లోనే మునిగిపోయాడు.తల్లిదండ్రులు చూస్తుండగానే ఈబాలుడు నీటమునిగి చనిపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్విమ్మింగ్పూల్ నుంచి బాలుడిని బయటకు తీసి,స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.ఈ సంఘటనతో తల్లడిల్లిన తల్లిదండ్రులు బాలుడు మృతదేహాన్ని ఓ ఆటోలో తరలించారు. స్థానిక పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయలేదు.హరితవేలి రిసార్ట్స్ మేనేజర్ అప్పలనాయుడు కూడా మృతిచెందిన బాలుడి వివరాలను బయటకు చెప్పడం లేదు. శ్రీకాకుళానికి చెందిన శంకరరావు పేరున రిసార్ట్స్లో ఓ గది బుక్ అయ్యింది.మిగతా వివరాలను టూరిజం అధికారులు గోప్యంగానే ఉంచారు. -
పాపం పండింది
విజయవాడ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్వాతంత్య్ర సమరయెధుని స్థలం కబ్జాలో సూత్రధారి.. ఎమ్మెల్యే బొండా ఉమ కేసులో పాత్రధారి అర్బన్ తహసీల్దార్గా పనిచేసిన ఆర్.శివరావు ఏసీబీకి చిక్కారు. సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు బ్రిడ్జి వద్ద స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణకు చెందిన రూ.కోట్ల విలువ చేసే భూమిని ఎమ్మెల్యే, అతని అనుచరులు కబ్జాకు పాల్పడగా, అప్పట్లో తహసీల్దార్గా అందుకు సహకరించినట్లు తేలింది. బుధవారం నగరంలోని శ్వేతా టవర్స్లో ఏసీబీ అధికారులు శివరావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే శివరావు నోరు మెదపలేదని తెలుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధునికి సంబంధించిన భూమి అడంగళ్లు తారుమారు ఎందుకు చేశారని డీఎస్పీ రమాదేవి తహసీల్దార్ను ప్రశ్నించారు. ఇదిలాఉండగా స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణకు చెందిన 1.50 ఎకరాల భూమిని అబ్దుల్ మస్తాన్ పేరుతో 2007లో అడంగళ్లు మార్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అడంగళ్లు మార్చి పట్టాదారు పాస్పుస్తకాలు కూడా తహసీల్దార్ ఇచ్చినట్లు నిర్ధారణ అయింది. ఆ భూమిలో సగం 0.75 సెంట్లు తహసీల్దార్ శివరావు తన బావమరిది దార్ల విజయకుమార్ పేరుతో జీపీఏ చేయించుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై కూడా సమగ్ర విచారణ జరుపుతామని ఏసీబీ డీఎస్పీ రమాదేవిమీడియాకు చెప్పారు. టైపిస్టు నుంచి తహసీల్దార్ వరకు.. శివరావు రెవెన్యూ శాఖలో 1987లో టైపిస్టుగా ఉద్యోగ బాధ్యతల్లో ప్రవేశించారు. కొంత కాలం మచిలీపట్నంలో కలెక్టర్ వద్ద సీసీగా విధులు నిర్వహించారు. ఆ తరువాత 2003 నుంచి 2006 వరకు పెనమలూరు డెప్యూటీ తహసీల్దార్గా పనిచేశారు. అనంతరం పదోన్నతి పొంది 2009 నుంచి 2012 వరకు మోపిదేవి, కంకిపాడు, గన్నవరంలో తహసీల్దార్గా పనిచేశారు. 2012 నుంచి 2018 వరకు ఆరేళ్ల పాటు విజయవాడ అర్బన్ తహసీల్దార్గా ఉన్నారు. అర్బన్ తహసీల్దార్ పోస్టు దక్కడంతో శివరావు దశ తిరిగింది. నగరంలో ప్రధాన ప్రొటోకాల్ ఆఫీసర్ కావడంతో కలెక్టర్లకు అత్యంత సన్నిహితంగా ఆయన చక్రం తిప్పాడు. చాలా నిదానంగా, నమ్మకంగా ఉండే ఆయన ఆరేళ్లలో అడ్డగోలుగా పనిచేసి అక్రమాస్తులు కూడబెట్టారు. ఎమ్మెల్యే అనుచర గణంతో, రియల్టర్లతో సన్నిహితంగా మెలిగేవారని ఆరోపణలు వెల్లువెత్తాయి. శివరావు అరెస్టు.. ప్రస్తుత పర్యాటక శాఖ ఎస్టేట్ ఆఫీసర్ శివరావును ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆయనను కోర్టు ఎదుట హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. బొండాగిరినివెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ గత ఏడాది ‘సాక్షి’ స్వాతంత్య్ర సమరయోధుని స్థలం కబ్జాలో బొండా ఉమ పాత్ర ఉన్నట్లు వెలుగులోకి తెచ్చింది. బొండాగిరి బయటపడగానే తహసీల్దార్ శివరావు పర్యాటక శాఖకు డెప్యుటేషన్పై బదిలీ చేయించుకున్నారు. బంధువుల ఇళ్లల్లో సోదాలు కంకిపాడు : కంకిపాడులో బుధవారం రాత్రి పర్యాటక శాఖ ఎస్టేట్ అధికారి ఆర్.శివరావు బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. శివరావు స్వగ్రామం కంకిపాడు కావడం తో లాకుగూడెంలోని బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. కుటుంబ నేపథ్యం,ఆస్తుల వివరాలు సేకరించినట్లు సమాచారం. -
చిలక్కొట్టుడు!
సాక్షి, విజయవాడ : పర్యాటక సంస్థలో నిబంధనలకు నీళ్లొదిలిన పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పర్యాటకుల్ని ఆకట్టుకోవడానికి ఖర్చు చేయాల్సిన నిధులు తమ వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారుల అవినీతిని ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో వారు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా కొనసాగుతోంది. సొంత కార్యక్రమాలకు పర్యాటక సంస్థ భోజనాలు.. పర్యాటకులకు కావాల్సిన భోజనాలను పున్నమి రెస్టారెంట్లో తయారు చేస్తారు. పర్యాటకులు ముందుగా సొమ్ము చెల్లిస్తే అక్కడ వంటలు వండించుకుని బయటకు తీసుకెళ్లవచ్చు. దీన్ని అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుని పర్యాటక సంస్థ ఆదాయానికి చిల్లు పెడుతున్నారు. గతంలో పర్యాటక సంస్థలో ఓ ఉన్నతాధికారి భార్యకు సీమంతం జరిగింది. దీనికి పున్నమి రెస్టారెంట్ నుంచి భోజనాలు వెళ్లాయి. ఈ భోజనాలు భవానీద్వీపం, బరంపార్కుకు వచ్చిన పర్యాటకులకు ఖర్చు చేసినట్లుగా చూపించారు. అయితే ఈ విషయం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో చివరకు ఆ అధికారి భోజనాలకు అయిన ఖర్చును పర్యాటక సంస్థకు చెల్లించి రసీదు తీసుకున్నారు. అప్పట్లో ఆ అధికారి ఇంట్లో శుభకార్యానికి భోజనాలు పంపి స్వామి భక్తి ప్రదర్శించిన ఒక మేనేజర్ ఇంట్లో ఇటీవల ఒక శుభకార్యం జరిగింది. ఆ మేనేజర్ కుమార్తె జన్మదిన వేడుకలను గత నెలలో భవానీపురంలోని ఒక కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆ ఫంక్షన్కు కావాల్సిన భోజనాలన్నీ పున్నమి రెస్టారెంట్ నుంచే వెళ్లాయి. రెండు నాన్వెజ్ రకాలతో సుమారు 200 మందికి భోజనాలు వెళ్లాయని పర్యాటక సంస్థ సిబ్బంది చెబుతున్నారు. కనీసం లక్షన్నర విలువ చేసే ఈ భోజనాలకు అయిన ఖర్చు పర్యాటక సంస్థ ఖాతాలో వేశారు. ఇటీవల పున్నమి ఘాట్లో ఎఫ్1హెచ్2ఓ పవర్ బోటింగ్ ఫార్ములా రేస్ జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందల మందికి భోజన, వసతి ఏర్పాట్లను పర్యాటక సంస్థ కల్పించింది. దీంతో అంతకు ముందు జరిగిన జన్మదిన ఖర్చులను ఆ మేనేజర్ ఇందులో కలిపేశారని సిబ్బంది నుంచి తెలుస్తోంది. తన జేబులో రూపాయి ఖర్చు కాకుండా కుమార్తె జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించడం ఇప్పుడు బరంపార్కులో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పర్యాటక సంస్థ ఉన్నతాధికారికి తెలిసినా మిన్నకుండటం గమనార్హం. ఖర్చుకు.. లెక్కకు పొంతన కరువు పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో పెద్దపెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు పెట్టే ఖర్చులకు, చూపే లెక్కలకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు వచ్చినప్పుడు వారి వెంట వచ్చిన వారికి కావాల్సిన భోజనాలు కూడా పర్యాటక సంస్థ కల్పిస్తుంది. ఆ సమయంలో భోజనాలు చేసిన వారికి మరో 50 శాతం ఎక్కువ మంది తిన్నట్లుగా చూపించి ఆ సొమ్ము పంచుకుంటున్నారని సమాచారం. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న హడావుడి అధికారులకు వరంగా మారిందని కింది స్థాయి సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. -
పర్యాటక శాఖకు బెస్ట్ ఏషియన్ టూరిజం ఫిల్మ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక శాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. యూరప్లోని పోర్చుగల్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన ‘విజట్ తెలంగాణ’చిత్రానికి ఏషియన్ టూరిజం ఫిల్మ్ అవార్డు వరించింది. శనివారం అక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఫిల్మ్ మేకర్ సత్యనారాయణ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా బుర్రా మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకశాఖకు అవార్డు దక్కటం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ టూరిజం ఫెస్టివల్ నిర్వహణకు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా త్వరలో నిర్వాహకుల బృందం హైదరాబాద్లో పర్యటించనుందని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. -
ఆ వీడియోలను బయటపెట్టాలని డిమాండ్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14న జరిగిన తొక్కిసలాటపై జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ దాదాపు మూడేళ్లపాటు విచారణ జరిపి, ఇచ్చిన నివేదికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనకు మీడియా ప్రచారం, భక్తుల రద్దీయే కారణమని తేల్చడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ఈ తొక్కిసలాటతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదని, పైగా చంద్రబాబు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారని కితాబు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల్లో ముఖ్యమంత్రి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు ఎక్కడున్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్ష్యాధారాలను మాయం చేశారని, సీఎం ప్రచారం యావ వల్లే ఈ తొక్కిసలాట జరిగి, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి మీడియాను, భక్తులను కారకులను చేయడం సరికాదని పేర్కొంటున్నారు. సాధారణ భక్తుల ఘాట్కు సీఎం ఎందుకెళ్లారు? గోదావరి పష్కరాలకు తరలి రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ముందుగానే టీవీ చానళ్లు, పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో సాగించిన ప్రచారాన్ని సోమయాజులు కమిషన్ తన నివేదికలో కనీసం ప్రస్తావించలేదు. వీఐపీలకు ప్రత్యేకంగా రాజమహేంద్రవరంలోనే సరస్వతి ఘాట్ ఉండగా, సీఎం చంద్రబాబు కుటుంబం, మంత్రులు సాధారణ భక్తులకు కేటాయించిన పుష్కర ఘాట్లోకి ఎందుకు వెళ్లారో చెప్పలేదు. పుష్కరఘాట్లో భక్తులను నిలిపివేసి ఒక్కసారిగా వదిలారన్న అంశాన్ని కమిషన్ విస్మరించింది. రద్దీ అధికంగా ఉంటే భక్తులను పక్కనే 200 మీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాల ఘాట్, పద్మావతి ఘాట్లకు ఎందుకు మళ్లించలేదు? అని నివేదికలో ఎక్కడా ప్రశ్నించలేదు. ఆ వీడియోలు ఎక్కడున్నాయి? తొక్కిసలాట ఘటనకు మీడియా, భక్తులను బాధ్యులను చేయడం దారుణం. రూ.64 లక్షలకు ఏపీ టూరిజం శాఖ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. పుష్కరాల్లో ముఖ్యమంత్రి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు ఎక్కడున్నాయి? – ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు. రాజమహేంద్రవరం సీఎం ప్రచార యావ వల్లే తొక్కిసలాట 2003 నాటి గోదావరి పుష్కరాల ఫొటోలు ఉన్నాయి, మరి 2015 పుష్కరాల సీసీ కెమెరాల ఫుటేజీలు ఎందుకు లేవు? సాక్ష్యాధారాలను మాయం చేశారు. సీఎం ప్రచారం యావ వల్లే తొక్కిసలాట జరిగింది. మీడియా, భక్తులను కారకులను చేయడం సరికాదు. – కూనపురెడ్డి శ్రీనివాసరావు, న్యాయవాది, అఫిడవిట్దారుడు, రాజమహేంద్రవరం అబద్ధం ఎవరిది? తాను అక్కడ ఉండగానే తొక్కిసలాట గురించి తెలిసిందని, వెంటనే కంట్రోల్ రూమ్లోకి వెళ్లి కంట్రోల్ చేయాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఏకసభ్య కమిషన్ మరోలా చెప్పింది. ఇక్కడ చంద్రబాబు అబద్ధం అడారా? లేక కమిషన్ అబద్ధం చెప్పిందా? – ఉండవల్లి అరుణ్కుమార్, మాజీ ఎంపీ మీడియాను నిందించడం సరికాదు పుష్కరాలపై సమాచారం తెలియజేయడం మీడియా ప్రధాన విధి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. దానికి మీడియాను కారణంగా చూపడం సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – మండేలా శ్రీరామమూర్తి, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రాజమహేంద్రవరం -
విశాఖలో సబ్ మెరైన్ హెరిటేజ్ మ్యూజియం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో సబ్ మెరైన్ హెరిటేజ్ మ్యూజియం ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం టూరిజం ప్రమోషన్ బోర్డు సమావేశంలో పలు ప్రాజెక్టులపై పర్యాటక శాఖ అధికారులతో ఆయన చర్చించారు. పారిస్కు ఈఫిల్ టవర్, ఆగ్రాకు తాజ్ మహల్ లాగా, విశాఖకు సబ్ మెరైన్ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ కావాలన్నారు. విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద స్కూబా డైవింగ్, విశాఖ, విజయనగరం జిల్లాలలో స్కై స్కూల్ కార్యకలాపాలను ప్రోత్సహించాలన్నారు. ప్రకాశం బ్యారేజి ఎగువన వైకుంఠపురం, దిగువన చోడవరం ప్రాజెక్టులు పూర్తయితే రాజధాని ప్రాంతంలో కృష్ణానది వాటర్ ఫ్రంట్గా ఉంటుందన్నారు. అదే తరహాలో ఉత్తరాంధ్రలో పురుషోత్తపట్నం ప్రాజెక్టు నుంచి 50 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలని చెప్పారు. గ్రామ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, స్థానిక జానపదాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ దర్శని, నగర దర్శనిలో రాబోయే 5 నెలల్లో 774 కళాకారుల బృందాలకు వర్క్షాపులు నిర్వహించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో మంత్రి అఖిలప్రియ పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగానికి త్వరలో ఒక విధానాన్ని తీసుకు వస్తామని సీఎం చెప్పారు. సచివాయంలో శుక్రవారం విద్యుత్ వాహనాల వినియోయాగంపై సమీక్ష నిర్వహించారు. కాగా, రూ. కోటిన్నర విలువైన నిత్యావసర సరుకులతో కేరళకు బయలుదేరిన వాహనాలకు సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో ఈ సరుకులు సేకరించి సచివాలయానికి తెచ్చారు. -
జనవరిలోపు సమస్యలన్నీ పరిష్కరించాలి
సాక్షి, అమరావతి: జనవరి వచ్చేలోపు గ్రామాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల్లో సంతృప్తి పెరిగేలా పనిచేయాలని నిర్దేశించారు. గ్రామదర్శిని కార్యక్రమం అమలుకోసం నియమితులైన నోడల్ అధికారుల సదస్సును బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సాధికార మిత్రలకు శిక్షణ ఇవ్వాలని, వారి పనితీరును పర్యవేక్షించాలని నోడల్ అధికారులకు సూచించారు. నోడల్ అధికారులు ప్రభుత్వ ప్రతినిధులని, ప్రతిభ చూపి ప్రజల్లో సంతృప్తి పెంచాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఉద్యోగుల వైఖరితో ఇబ్బంది.. సంక్షేమ పథకాలు పెద్దఎత్తున అమలు చేస్తున్నా ఉద్యోగుల వైఖరి వల్ల ఇబ్బంది ఏర్పడుతోందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేకూర్చినా రేషన్, పింఛన్ పంపిణీ సందర్భంగా ఉద్యోగులు అసహనం వ్యక్తం చేయడం, కరుగ్గా మాట్లాడడం వల్ల సంతృప్తి రావట్లేదన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత పెంచాలని కోరారు. సంతోష స్థాయిలో దేశం వెనుకబడినా మనం ముందున్నాం.. అన్ని రాష్ట్రాలకు అవతరణ దినోత్సవాలు ఉన్నా మన రాష్ట్రానికే అవతరణ దినోత్సవం లేదని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆరు దశాబ్దాల ఆటుపోట్లే అందుకు కారణమన్నారు. అయినప్పటికీ దేశంలోనే వృద్ధిరేటులో ముందున్నామన్నారు. హ్యాపీనెస్(సంతోష సూచిక) ఇండెక్స్లో రాష్ట్రం 74వ స్థానం నుంచి 44వ స్థానానికి పెరిగితే.. దేశం 122 నుంచి 133వ స్థానానికి పడిపోయిందన్నారు. తొలుత తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతి పట్ల సంతాపం తెలుపుతూ తీర్మానం చేశారు. సీఎం మాట్లాడుతూ.. ఎన్టీఆర్తోనూ, తనతోనూ కరుణానిధికి సాన్నిహిత్యముందని చెప్పారు. సమావేశంలో మంత్రులు పుల్లారావు, పితాని, లోకేష్, సీఎస్ దినేశ్కుమార్ పాల్గొన్నారు. కాగా, గ్రామదర్శిని పేరుతో నిర్వహించిన ఈ ఒకరోజు వర్క్షాపునకు ఏకంగా రూ.36 లక్షలు ఖర్చుచేయడం గమనార్హం. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ ప్రణాళికాశాఖ ఉత్తర్వులిచ్చింది. త్వరలో వర్సిటీల్లో జపాన్ భాష రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో త్వరలో జపాన్ భాషను ప్రవేశపెడతామని సీఎం చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం జపాన్ రాయబారి కెంజి హిరమట్సు బృందంతో ఆయన సమావేశమయ్యారు. పర్యాటక శాఖకు చెందిన ఆధునిక ఓల్వో బస్సులను సీఎం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ సమీపంలో బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులను విశాఖపట్నం నుంచి తిరుపతికి తిప్పుతామని అధికారులు తెలిపారు. -
పర్యాటక కేంద్రంగా శామీర్పేట
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న శామీర్పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. షామీర్పేట చెరువు ఏడాది పొడవునా నీటితో నిండి ఉండేలా చర్యలు తీసుకోవాలని.. పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నెలరోజుల్లోగా దీనిపై ప్రణాళికను రూపొందించి, పూర్తి నివేదిక అందజేయాలన్నారు.సీఎం కేసీఆర్ షామీర్పేట చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే అంశంపై ప్రగతిభవన్లో టూరిజం డెవలప్మెంట్ ఎండీ మనోహర్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి తదితరులతో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండ పోచమ్మ రిజర్వాయర్ ద్వారా షామీర్పేట చెరువుకు.. అక్కడి నుంచి కాలువ ద్వారా బస్వాపూర్ రిజర్వాయర్కు నీళ్లు అందుతాయని చెప్పారు. అటు షామీర్పేట చెరువు, ఇటు కాలువలు నిత్యం నీటితో నిండి ఉంటాయని, దీన్ని పర్యాటకశాఖ మంచి అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. హైదరాబాద్కు అతి సమీపంలో ఈ ప్రాంతం ఉన్నందున పర్యాటకులు ఎక్కువగా వస్తారన్నారు. పర్యాటకుల కోసం కాటేజీలు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, చెరువు, కాలువల వెంట పూల చెట్లు పెంచాలని తెలిపారు. ప్రధాన రహదారి, చెరువు కట్ట మధ్యనున్న ప్రాంతాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. -
చరిత్రకు చిత్రిక పట్టారు!
సాక్షి, హైదరాబాద్: చెరువులు.. పట్టణాలు.. ఆలయాలు (త్రిబుల్ టీ) స్ఫూర్తితో పాలన సాగించిన కాకతీయుల చరిత్రను ప్రస్తుత తరాలకు కళ్లకు కట్టినట్లు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. వ్యవసాయం, అనుంబంధ వర్గాలకు చేయూత నిచ్చేలా పాలించిన కాకతీయుల వైభవాన్ని చిత్రాల రూపంలో అందరికీ తెలియజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాకతీయుల పరిపాలన కేంద్రం ఖిలా వరంగల్లోని ప్రస్తుత గృహాలపై వారి పరిపాలన ప్రస్థానాన్ని, వైభవాన్ని చిత్రీకరించనున్నారు. పర్యాటక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ హస్తకళల విశ్వవిద్యాలయం (జేఎన్ఏఎఫ్ఏయూ) విద్యార్థులు భాగస్వాములవనున్నారు. 120 ఇతివృత్తాలు ఖిలా వరంగల్లో కాకతీయుల నాటి సంఘటనలు గుర్తుకు తెచ్చేలా 120 ఇతివృత్తాలను పర్యాటక శాఖ ఎంపిక చేసింది. వీటి ఆధారంగా ఇళ్లపై బొమ్మలను తీర్చిదిద్దనున్నారు. రాజస్థాన్ జోధ్పూర్లోని ఇళ్లన్నీ ఒకేలా కనిపిస్తూ పర్యాటకులను ఆలరిస్తాయి. అదే తరహాలో ఖిలా వరంగల్లోని నిర్మాణాలపై నీలిరంగుతో కాకతీయ ఘట్టాలను బొమ్మలుగా వేయనున్నారు. పరుసవేది లభించడం నుంచి ప్రతాపరుద్రుడి పరాజయం వరకు సంఘటలను చిత్రించనున్నారు. ఖిలా వరంగల్, కాకతీయ కీర్తితోరణాలు, ఖుష్ మహల్ చూసేందుకు వచ్చే పర్యాటకులకు కాకతీయ యుగంపై అవగాహన వచ్చేలా ఈ చిత్రాలు కనువిందు చేయనున్నాయి. తొలిదశలో పడమర కోట ముఖద్వారం నుంచి ఖుష్మహల్ వరకు ఉన్న ఇళ్లను ఎంపిక చేశారు. రోడ్డు వైపు ఉన్న గోడలపై కా>కతీయుల చరిత్రను తెలిపేలా చిత్రాలు వేయనున్నారు. పడమర కోట ముఖ ద్వారంలో ప్రయోగాత్మకంగా 3 చిత్రాలు వేశారు. త్వరలోనే ఈ పనులు పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి. ఏకశిల గుట్ట.. ఐనవోలు తోరణం.. కాకతీయుల రాజ్య స్థాపకుడు గుణ్యన నుంచి మొదలు రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వరకు కీలక ఘట్టాలను పర్యాటక శాఖ ఎంపిక చేసింది. కాకతీయులు జైనం నుంచి శైవంలోకి మారారు. వేలాది శివాలయాలు నిర్మించారు. శైవారాధన చేసే చిత్రాలు, కాకతీయ కళా తోరణం, హన్మకొండ ప్రవేశద్వారం, హన్మకొండ కోట, ఎండ్ల బండ్ల వరుస, భూమిలో బండి కూరుకుపోవడం, ఇనుప కమ్మి బంగారంలా మారడం, రాజుగారికి తెలియజేయడం, ప్రోలరాజు గురువులతో కలసి రావడం, పరుసవేది శివలింగం, కోట నిర్మాణం ప్రారంభం, పరుసవేది ప్రతిష్టాపన, స్వయంభూ ఆలయ నిర్మాణం, 7 కోట గోడలు, మట్టి ఆకారం కోసం అగడ్తల తవ్వకం, తోరణ స్తంభాల ఏర్పాటు, మట్టికోట–రాతికోట–ఇటుక కోట–పుట్టకోట నిర్మాణాలు, గొలుసుకట్టు చెరువులు, మెట్ల బావుల నిర్మాణం, సైనికుల శిక్షణ, వ్యవసాయం, చేనేత, కళలు, తోటలు, రెండు అంతస్తుల బంగ్లాలు, ఏకశిల గుట్ట, ఐనవోలు తోరణం, జైన–శైవ–వైష్ణవ, భైరవ పూజ, పేరిణి నాట్యం, సింహద్వారం, మోటుపల్లి రేవు, వెయ్యి స్తంభాల ఆలయం, రామప్పలోని నంది, కుష్ మహల్, రుద్రమదేవి అబ్బాయిగా వేషధారణ వంటి ఎంపిక చేసిన ఘట్టాలను బొమ్మలుగా వేయనున్నారు. -
వెయ్యేళ్ల కోట... వెయ్యాలి బాట!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదీతీరం.. దట్టమైన అడవి.. ఎత్తైన గుట్ట.. అద్భుతమైన నిర్మాణం.. శత్రుదుర్భేద్యమైన స్థావరం.. జల, వన, గిరుల మధ్య దర్శనమిస్తోంది ప్రతాపరుద్రుడి వనదుర్గం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి గ్రామ సమీపంలో ఉన్న ఈ కోట ఇటీవల వెలుగుచూసింది. వెయ్యేళ్ల నాటి అరుదైన ఈ చారిత్రక సంపద ఆదరణలేక మరుగున పడిపోయింది. ఇటీవల ఔత్సాహిక చారిత్రక పరిశోధకులు అరవింద్ ఆర్యా, అనుదీప్ పరిశోధనల ఫలితంగా ఈ కోట గురించిన విశేషాలు బయ టి ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఏకో/అడ్వెంచర్ టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు ఈ కోటకు అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్నాయి. పర్యాటక శాఖ దృష్టి సారించి అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా మార్చవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఒకేచోట మూడు విధాలుగా... పూర్వం శత్రుసైన్యాల నుంచి రక్షణ కోసం రాజ్య సరిహద్దుల్లో కోట లేదా దుర్గాలను నిర్మించి సైనిక స్థావరంగా రాజులు ఉపయోగించుకునేవారు. ఈ కోటలు లేదా దుర్గాలు నీటి వనరుల పక్కన ఉంటే జలదుర్గం, అడవిలో ఉంటే వన దుర్గం, కొండలు/గుట్టలపై ఉంటే గిరి దుర్గం అంటారు. కాకతీయుల కాలంలో గోదావరి తీరం సమీపంలో ప్రతాపగిరి గ్రామ సమీపంలోని దట్టమైన అడవిలో ఎత్తైన కొండపై జల, వన, గిరి దుర్గంగా ప్రతాపగిరి కోటను నిర్మించారు. ఈ కోటను కాకతీయులు తమ సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నారు. కాకతీయుల సామ్రాజ్యం చివరి రోజుల్లో ప్రతాపరుద్రుడు ఇక్కడ కొంత కాలం ఉన్నందున దీన్ని ప్రతాపగిరి కోట, ఈ కొండలను ప్రతాపగిరి గుట్టలు అని అంటారు. ఈ కొండ పై నుంచి గోదావరి నదీ ప్రవాహాన్ని చూడవచ్చు. ప్రతాపగిరి గిరి వద్ద మొదలైన గుట్టల వరస గోదావరితీరం వరకు విస్తరించి ఉంది. మధ్యలో గోదావరి నది మినహా ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంతో ఈ గుట్టలు అనుసంధానం చేయబడి ఉంటాయి. కాగా దీని వైపు ఇప్పుడు కన్నెత్తి చూసేవారు కరువవడంతో ఈ చారిత్రక సంపదకు తగిన గుర్తింపు రాలేదు. ఢిల్లీ సుల్తాను దండయాత్ర సమయంలో చివరి కాకతీయ వంశస్తులు ప్రతాపగిరిపై కొంతకాలం ఆశ్రయం తీసుకున్నాక దంతెవాడలో రాజ్యస్థాపన చేసినట్లు చరిత్ర చెబుతోంది. పన్నెండు అడుగుల ఎత్తయిన ప్రహరీ ఈ దుర్గం చుట్టూ ప్రహరీ, రాజప్రాసాదం, ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. కోట చుట్టూ ప్రహరీ 12 అడుగుల ఎత్తులో భారీ బండరాళ్లతో నిర్మించారు. కోట ప్రవేశద్వారానికి, దేవాలయానికి ఉన్నట్లు గజలక్ష్మి, సర్వతోభద్ర యంత్రం చెక్కబడి ఉన్నాయి. నాటి కాలానికి చెందిన శిల్పాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కోటలో రాజప్రాసాదం, సైనికుల నివాసాలు, గుర్రపుశాలలు, పహారా కాసే స్థలాలకు సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. కోటకు సమీపంలో గొంతెమ్మగుట్ట, రాపెళ్లి గుట్టల వద్ద కూడా కాకతీయుల కాలం నాటి సైనిక స్థావరాలున్నాయి. కోటలో రహస్యసొరంగ మార్గాలు ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. ముచ్చనాయుని నిర్మాణం కోటగోడపై తొమ్మిది వరసల్లో తెలుగులో చెక్కిన శాసనం ఉంది. ఇది పూర్తిగా చదివి అర్థం చేసుకునేందుకు అనువుగా లేదు. అర్థమైనంత వరకు కీలక సంవత్సర వైశాఖ శుద్ధ తదియ వడ్డేవారమున శాసనం వేయించారు. ఈ దుర్గాన్ని ముచ్చనాయినంగారు నిర్మించినట్లుగా ఇతనికి ఇరువత్తుగండడు, గండగోపాలుడు, కంచిరక్ష్యాపాలకా, దాయగజకేసరి, అరిరాయ గజకేసరి, తెలుగు రాయుడు వంటి బిరుదులున్నట్లు ఈ శాసనంలో పేర్కొన్నారు. ఇందులో పేర్కొన్న దాయగజకేసరి, అరిరాయ గజకేసరి వంటి బిరుదులను బట్టి కాకతీయుల కాలంనాటికి చెందిన శాసనంగా అంచనా వేయవచ్చు. -
పర్యాటకమా.. ఏదీ నీ చిరునామా!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే కార్యక్రమాలు పర్యాటక, సాంస్కృతిక శాఖల నుంచే ఉంటాయి. పర్యాటక ప్రాంతాలు సైతం రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల పర్యాటకులు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు ఆకర్షితులవుతున్నారు. దీంతో వీరి సంఖ్య కూడా పెరుగుతోంది. హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు నగరంతో పాటు తెలంగాణలోని ఇతర దర్శనీయ స్థలాలను తిలకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరు ఇక్కడి పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు టీఎస్టీడీసీ ఆధ్వర్యంలో నగరంలో నడుస్తున్న టీఎస్టీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్లకు వెళితే ఎలాంటి సమాచారం లభించటంలేదు. దీనికి తోడు ఈ కేంద్రాల్లో ఉంటున్న కియోస్కో కేంద్రాలు మొరాయిస్తున్నాయి. దీంతో చేసేదేమీలేక పర్యాటక ప్రాంతాలను సందర్శించకుండానే వెనుదిరుగుతున్నారు. పది కేంద్రాల్లోనూ కన్పించని మెటీరియల్ టీఎస్టీడీసీ ఆధ్వర్యంలో బషీర్బాగ్, ట్యాంక్బండ్, పర్యాటక భవన్, కూకట్పల్లి, శిల్పారామం, దిల్సుఖ్నగర్, యాత్రీ నివాస్, ఎయిర్పోర్టు, కోల్కతా, చెన్నైలతో పాటు ఇటీవల నగరంలో హిమాయత్నగర్లోని టీఎస్టీడీసీ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో, సాలార్జంగ్ మ్యూజియం, మెహిదీపట్నంలలో నూతనంగా సీఆర్ఓ కేంద్రాలను ప్రారంభించారు. వీటికి టీఎస్టీడీసీలోని పబ్లిక్ రిలేషన్ అధికారులు ప్రచారం సామగ్రిని సరఫరా చేస్తారు. కానీ వారి దగ్గరే మెటీరియల్ లేకపోవటంతో చేతులెత్తేశారు. మూడేళ్లుగా కరువైన సామగ్రి.. 2014లో టీఎస్టీడీసీ ఆధ్వర్యంలో బ్రోచర్స్, జిల్లా వైడ్ బ్రోచర్స్ను ముద్రించారు. వాటినే ఇంత వరకూ నడిపిస్తూ వస్తున్నారు. మూడేళ్లుగా ప్రచార బ్రోచర్స్ లేకపోవటంతో టీఎస్టీడీసీ పీఆర్వో కార్యాలయ అధికారులు పూర్వ (మొన్నటి వరకు) ఎండీగా ఉన్న క్రిస్టీనా ఛొంగ్తూకి పదిసార్లు నూతన బ్రోచర్స్ ప్రింటింగ్ కోసం ఫైల్ పెట్టారు. ఆమె పట్టించుకోకపోవటంతో ఆ సమస్య అలాగే ఉండిపోయింది. సీఆర్వో కేంద్రాల అధికారులు కూడా ఉన్నతాధికారులను అడిగి అడిగీ వదిలేశారు. ఇటీవల బషీర్బాగ్ సీఆర్వో కేంద్రానికి ఆకస్మిక తనిఖీకి వచ్చిన టీఎస్టీడీసీ చైర్మన్ భూపతిరెడ్డి దృష్టికి కూడా అక్కడి అధికారులు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేదు. ఇటీవల ఎండీగా వచ్చి మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను పర్యటిస్తూ మార్పులకు శ్రీకారం చుడుతున్నా.. ఆయన కూడా ప్రచార బోచర్స్పై దృష్టి సారించకపోవటం గమనార్హం. హిమాయత్ నగర్లోని టీఎస్టీడీసీ భవన్లో ఉన్న సీఆర్వో కేంద్ర స్టాండ్లోనే ప్రచార బ్రోచర్ కనిపంచడం లేదు. ఆ స్టాండ్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. మొరాయిస్తున్న కియోస్క్ యంత్రాలు.. నగరంలోని అన్ని టీఎస్టీడీసీ సీఆర్వో కేంద్రాల్లో కియోస్క్ యంత్రాలు ఉన్నాయి. వీటిలో టూరిస్టుల కోసం తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలపై సమగ్ర సమాచారం పొందుపరిచారు. కానీ ఆరునెలలుగా అవి పనిచేయటం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలూ లేవు. బుధవారం బషీర్బాగ్ సీఆర్వో కేంద్రంలోని కియోస్క్ యంత్రాలను ఆన్ చేసేందుకు అక్కడి సిబ్బంది ప్రత్నించినా ఫలితం శూన్యంగానే మారింది. అధికారులు ఏమంటున్నారంటే.. ఈ విషయమై ట్యాంక్బండ్, యాత్రీ నివాస్ సీఆర్వో కేంద్రాల్లో పని చేసే అధికారులను ప్రశ్నించగా.. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ట్రోచర్స్ అడుగుతున్నారని తెలిపారు. జిల్లా వైడ్ బ్రోచర్స్ లేవని చెప్పటంతో వెనుదిరిగిపోతున్నారని చెప్పారు. బ్రోచర్స్ విషయమై తమ ఎలాంటి సమాచారం లేదని టీఎస్టీడీసీ పీఆర్వో కార్యాలయ అధికారులు దాటేస్తున్నారు. -
ఇంకెందరు బలి కావాలో..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో పడవ ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మొన్న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద, నిన్న తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని మంటూరు సమీపంలో, నేడు ఐ.పోలవరం మండలంలో... ప్రాంతం ఏదైనా కన్నీటి గాథ మాత్రం ఒక్కటే. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎన్ని ప్రాణాలు పోతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో చాలాగ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. బయటి ప్రపంచానికి రావాలంటే జనం నాటు పడవలను ఆశ్రయించడం తప్ప మరోదారి లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అన్ని గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వానికి అనుమతి లేని బోట్లపై రాకపోకలు సాగిస్తున్న ప్రజలు కనిపించకపోవడం గమనార్హం. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు నాలుగు రోజులు హడావుడి చేయడం, తూతూమంత్రంగా విచారణ సాగించడం, ఆ తర్వాత దాని గురించి మర్చిపోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. నిర్వాహకుల అజాగ్రత్త తూర్పు గోదావరి జిల్లాలో అనుమతి లేని బోట్లే అధికం. వీటిలో నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పడవల్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకైక ఆధారం లైఫ్ జాకెట్లే. నాటు పడవల్లో లైఫ్ జాకెట్లు కనిపించడం లేదు. కొన్ని బోట్లలో ఉన్నా వాటిని బయటకు తీయడం లేదు. ఓ మూలన పడేస్తున్నారు. పైగా ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కిస్తున్నారు. జిల్లాలో మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయన్న దానిపై అధికారుల వద్ద సరైన సమాచారం లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ప్రతిఏటా ఏప్రిల్లో రెన్యూవల్ చేయడం, పడవలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేయడం షరా మామూలుగా మారిపోయింది. నిర్వాహకుల నుంచి లంచాలు దండుకుని నిబంధనల విషయంలో చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే బోట్లు కేవలం రెండే ఉన్నాయి. అధికారికంగా నడిచే మిగతా 64 బోట్లు ప్రైవేట్ వ్యక్తులవే. ఇవి కాకుండా అనధికారికంగా మరో 100 నాటు పడవలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమంగా తిరుగున్న పడవలపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాకపోకలకు పడవలే ఆధారం తూర్పు గోదావరి జిల్లాలో జనం నిత్యం ప్రమాదాల మధ్యే ప్రయాణం సాగిస్తున్నారు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివానిపాలెం, కమిని, గురజాపులంక, సేరులంక, కొత్తలంక గ్రామాలకు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం, కాట్రేనికోన మండలం పలంకురు మధ్య ప్రయాణానికి పడవలే దిక్కు. కాట్రేనికోన మండలం మగసానితిప్ప, ఐ.పోలవరం మండలం గోగుల్లంక గ్రామానికి పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఏజెన్సీ పరిధిలోని దేవీపట్నం మండలంలో 14 గ్రామాలకు రాకపోకలు సాగించాలంటే పడవలు తప్ప మరో గత్యంతరం లేదు. మామిడికుదురు, పి.గన్నవరం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం, ఆలమూరు, కడియం, సీతానగరం, రాజోలు, సఖినేటిపల్లి మండలాలకు చెందిన రైతులు లంక భూములకు వెళ్లేందుకు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. ఇవీ నిబంధనలు.. - లైసెన్స్డ్ డ్రైవర్ మాత్రమే పడవ నడపాలి. - డ్రెస్కోడ్ తప్పనిసరిగా పాటించాలి. - పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే తొలుత 15 రోజులపాటు లైసెన్స్ రద్దు చేయొచ్చు. - బోటులో లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ఉండాలి. లైఫ్ జాకెట్లు ధరిస్తేనే ప్రయాణికులను ఎక్కించాలి. - ప్రతి పది మంది ప్రయాణికులకొక లైఫ్ రింగ్ అందుబాటులో ఉంచాలి. - పడవలో ప్రథమ చికిత్స కిట్ తప్పనిసరిగా ఉంచాలి. - ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలి. -
మూడేళ్ల క్రితం ఇదే రోజున..
మండపేట: మూడేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు గోదావరి పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చి సర్కారు ప్రచార దాహంకారణంగా తొక్కిసలాటలో చిక్కుకుని 29 మంది బలయ్యారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14న పుణ్యస్నానాల కోసం రాజమహేంద్రవరం వచ్చిన 29 మంది సీఎం చంద్రబాబు ప్రచార యావ కారణంగా మృత్యువాత పడ్డారు. 52 మంది గాయాలపాలయ్యారు. పుష్కర ఘాట్లో తాను నిర్వహించే పూజలను చిత్రీకరించి ప్రచారం చేసుకోవాలన్న సీఎం తాపత్రయమే అమాయకుల ప్రాణాలను బలిగొంది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రెండు గంటలకు పైగా ఘాట్లోనే ఉండిపోవడంతో రద్దీ పెరిగింది. షూటింగ్ పూర్తయిన అనంతరం చంద్రబాబు వెళ్లాక ఒక్కసారిగా భక్తులను వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకుని మృత్యువాత పడ్డారు. దీనిపై నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమిచిన జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. 19 మంది గిరిజనులు జలసమాధి ఈ ఏడాది మే 15న దేవీపట్నం మండలం మంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి మధ్య గోదావరిలో లాంచీ తిరగబడిన సంఘటనలో 19 మంది గిరిజనులు జలసమాధి అయ్యారు. పడవ ప్రయాణాలకు సంబంధించి నిబంధనల అమలులో వైఫల్యం, లాంచీ యజమాని నిర్లక్ష్యం ప్రమాదానికి కారణంగా గుర్తించారు. లాంచీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి నాలుగు రోజులు హడావుడి చేసినా తర్వాత పరిస్థితి షరా మామూలే అయింది. కాలిపోయిన పర్యాటక బోటు పాపికొండల అందాలను తిలకించేందుకు గత మే 11వ తేదీన పర్యాటకులు పడవలో వెళ్తుండగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సరంగు సమయస్ఫూర్తితో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్ సర్కూట్ వల్ల ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. పర్యాటక బోటులో గ్యాస్ సిలిండర్, కిరోసిన్ తదితర నిషేధిత వస్తువులు ఉండకూడదని నిబంధనలు పేర్కొంటున్నా పాటించడం లేదు. నాడు కృష్ణాలో... సాక్షి, విజయవాడ: ప్రకాశం జిల్లా ఒంగోలు వాకర్స్ క్లబ్కు చెందిన దాదాపు 60 మంది సభ్యులు గత ఏడాది నవంబర్ 12న అమరావతి వెళ్లి అక్కడ దైవ దర్శనం తరువాత విజయవాడకు వచ్చారు. భవానీ ద్వీపం చూసిన తరువాత పున్నమీ ఘాట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి కృష్ణా, గోదావరి నదులు కలిసే పవిత్ర సంగమం వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చీకటి పడడంతో ఏపీ పర్యాటక శాఖకు చెందిన బోటు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో రివర్ బోటింగ్ అండ్ అడ్వెంచర్ సంస్థకు చెందిన ప్రైవేట్ బోటు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.300 తీసుకుని 38 మందితో బయల్దేరింది. కృష్ణా–గోదావరి నదులు కలిసే ప్రదేశం వద్దకు వచ్చే సరికి బోటు పెద్ద కుదుపునకు గురైంది. ఏం జరుగుతోందో తెలిసేలోపే ఒక వైపునకు ఒరిగిపోయింది. బోటులోని వారంతా నదిలో పడిపోయారు. ఈత వచ్చిన వారు ఈదుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడే ఉన్న జాలర్లు కొంతమందిని రక్షించారు. చివరికి 22 మంది జలసమాధి అయ్యారు. -
కాళేశ్వరానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. దీనికి సంబంధించిన బ్రోచర్ను గురువారం సచివాలయంలో పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ ఆవిష్కరించారు. కాళేశ్వరం టూర్లో భాగంగా రంగనాయకుల సాగర్ ప్రాజెక్టు, సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్ హౌస్ ప్రాంతాలను చూపిస్తారు. సాధారణ సమయంలో ఇక్కడికి అనుమతించరు. ప్రత్యేక ప్యాకేజీ నేపథ్యంలో పర్యాటక శాఖ ఈ యాత్రను అందుబాటులోకి తెచ్చింది. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున టిక్కెట్ ధర నిర్ణయించింది. ఉదయం 7.30 గంటలకు బషీర్బాగ్లోని సీఆర్ఓ కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్లోని యాత్రి నివాస్కు చేరుకుంటుంది. తర్వాత అక్కడ్నుంచి కాళేశ్వరం చేరుకుంటుంది. ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు గైడ్ కూడా ఉంటాడు. -
సిటీకి హెరిటేజ్ ఆటోలు!
హైదరాబాద్ వారసత్వ సంపదను కళ్లకుకట్టేలా తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్టీడీసీ) హోప్ ఆన్.. హోప్ ఆఫ్ సర్వీస్ బస్సులను తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే తరహాలో ‘హెరిటేజ్ ఆన్ ఆటోస్’ పేరుతో బ్యాటరీతో నడిచే ఆటోలను ప్రవేశ పెట్టనుంది. ఈ నెల 15వ తేదీ తర్వాత ఇవి సిటీలో చక్కర్లు కొట్టనున్నాయి. ఇందుకు సంబంధించిన ఆటోలను ఢిల్లీకి చెందిన స్మార్ట్ సంస్థ అందిస్తోంది. మ్యూజియంనుంచి ప్రారంభం.. నగర చరిత్రను చాటే సాలార్జంగ్ మ్యూజియం అందరూ సందర్శించే ప్రదేశం. ఈ ఆటో టూర్ ఇక్కడి నుంచే ప్రారభమవుతుంది. నిజాం అధికారక నివాసం పురానీ హవేలీ. అసఫ్ జాహీ వంశస్తుడైన సికందర్ జా నివాసం కోసం దీన్ని నిర్మించారు. ‘యు’ ఆకారంలో ఉన్న ఈ రాజసౌధంలో ప్రస్తుతం పలు విద్యాలయాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఒక భాగాన్ని మ్యూజియంగా మార్చారు. ఏడో నిజాం సిల్వర్జూబ్లీ వేడుకల సందర్భంగా అతిథులు అందించిన బహుమతులు, ఆ వేడుకల్లో నిజాం ఆశీనుడైన సింహాసనంతో సహా అనేక వెండి, బంగారు వస్తువులతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిజాం ‘వార్డ్రోబ్’, మ్యాన్యువల్ లిఫ్ట్ను ఈ ప్రదర్శనశాలలో ఉంచారు. వీటిని చూసేందుకు ఆటోలు ఇక్కడ ఆగుతాయి. చార్మినార్..మక్కా మసీదు.. పురానీహవేలీ నుంచి నిజాం మంత్రుల నివాసం ‘దివాన్ దేవిడీ’కి ఆటోలో ప్రయాణం చేయోచ్చు. చార్మినార్, మక్కా మసీద్, యునానీ ఆస్పత్రుల మీదుగా చౌమహల్లా ప్యాలెస్కు బయలుదేరతాయి. చార్మినార్ వద్దకు పెద్ద వాహనాలు ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఈ స్మార్ట్ ఆటోలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. రాయల్ ట్రీట్..హైదరాబాదీ టేస్ట్ చౌమహల్లా ప్యాలెస్లో నిజాం ధరించిన దుస్తులు.. వింటేజ్ కార్లు ప్రత్యేక ఆకర్షణ. ఏస్ బైక్ హార్లీ డేవిడ్సన్ సిరీస్లో తొలితరం బైక్ని ఇక్కడ చూడవచ్చు. అడుగడుగునా రాజసం ఉంట్టిపడే ప్యాలెస్ నాలుగు మహళ్ల సముదాయం. అఫ్జల్ మహల్, మహతబ్, తహ్నియత్, అఫ్తబ్ మహల్. నిజాం అతిథులకు విందు ఈ మహల్లోనే ఇచ్చేవారు. ప్రస్తుతం సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు వేదికగా ఉంది. స్మార్ట్ ఆటోలు.. టీఎస్టీడీసీ ఢిల్లీకి చెందిన ‘స్మార్ట్’ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తొలుత 20 స్మార్ట్ ఆటోలను నగరంలో ప్రవేశపెట్టనున్నారు. అన్ని హేరిటేజ్ ప్రాంతాల ఎంట్రీ టికెట్ కలిపి ఒక్కొక్కరు రూ.200 చెల్లించాలి. సాలార్జంగ్ మ్యూజియం నుంచి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆరు, ఏడు వారసత్వ ప్రాంతాలను ఈ టూర్లో చుట్టిరావచ్చు. సాలార్జంగ్ మ్యూజియం వద్ద ప్రతి పది నిమిషాలకు ఓ ఆటో బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఆటోల్లోనే ఆయా ప్రాంతాల విశిష్టతను తెలియజేసే బోర్డులు సైతం ఏర్పాటు చేస్తారు. డ్రైవర్లకు గైడ్ల తరహా శిక్షణ ఇస్తారు. అసౌకర్యాలపై ఫిర్యాదు చేయండి టీఎస్టీడీసీ ఆధ్వర్యంలో నడిచే టూర్స్, హరిత హోటల్స్, బుకింగ్ రిజర్వేషన్ సెంటర్లు, సెంట్రల్ రిజర్వేషన్స్ సెంటర్లలో టూరిస్టులకు ఏ విషయంలోనైనా అసౌకర్యం కలిగితే 180042546464(టోల్ ఫ్రీ), 92460 10011 నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు. -
హరిత హైదరాబాద్!
సాక్షి హైదరాబాద్: మహానగరంలో పెరిగిపోతున్న కాలుష్యానికి అర్బన్ పార్కుల నిర్మాణంతో చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్క హైదరాబాద్ చుట్టూ మాత్రమే కాకుండా పక్కన ఆనుకొని ఉన్న 6 జిల్లాల్లోనూ పార్కుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు వీలైనంత త్వరగా అన్ని సౌకర్యాలతో కూడిన అర్బన్ ఫారెస్ట్ పార్కులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న 188 ఫారెస్ట్ బ్లాకుల్లో 129 ప్రాంతాలు పార్కుల నిర్మాణం, అభివృద్ధికి అనుకూలంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు సమావేశంలో నివేదించారు. వీటిల్లో 70 ప్రాంతాలను ఫారెస్ట్ కన్జర్వేషన్ జోన్లుగా, మిగతా వాటిల్లో 52 ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా, మరో ఏడు ప్రాంతాలను ఎకో టూరిజం జోన్లుగా రూపొందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. సీఎం ఆదేశం మేరకు: సీఎస్ రానున్న రెండేళ్లలో దశలవారీగా పార్కులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని సీఎస్ ఎస్కే జోషి చెప్పారు. ఆ దిశగా అన్ని శాఖలు పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య, ఆహ్లాద, విహార సౌకర్యాలకు అనువుగా అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను, ఎకో టూరిజం స్పాట్లను తీర్చిదిద్దాలన్నారు. అటవీశాఖ ఇప్పటికే చేపట్టిన అర్బన్ పార్క్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. భాగ్యనగర్ నందనవనం, మేడిపల్లి ఫారెస్ట్ పార్క్, కండ్లకోయ ఆక్సిజన్ పార్కులు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, మున్సిపల్శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, రోడ్లు భవనాలు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, పంచాయతీరాజ్ కార్యదర్శి వికాస్రాజ్, పీసీసీఎఫ్ పీకే ఝా, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల పరిధిలో.. రంగారెడ్డి జిల్లా పరిధిలో 26 పార్కులు, మేడ్చల్లో 11, యాదాద్రిలో 6, మెదక్లో 4, సంగారెడ్డిలో 3, సిద్దిపేటలో 1, చొప్పన కొత్త పార్కుల నిర్మాణానికి అధికారులు రూపకల్పన చేశారు. తొలిదశలో అటవీశాఖ 15, హెచ్ఎండీఏ 17, జీహెచ్ఎంసీ 3, టీఎస్ఐఐసీ 11, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 4, మెట్రోరైల్ 2 పార్కుల చొప్పున దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులు, మానవ వనరులను ఆయాశాఖలు సొంతంగా సమీకరణ చేసుకోవాలని లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను వాడుకోవచ్చని సీఎస్ సూచించారు. వివిధ శాఖలు అర్బన్ పార్కులను అభివృద్ధి చేసి అటవీశాఖకు అప్పగిస్తే ఆ శాఖే నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుందన్నారు. టూరిజం శాఖ పరిధిలో మరో ఏడు చోట్ల ఎకో టూరిజంను పార్కులను అభివృద్ధి చేయనున్నారు. మేడ్చల్ జిల్లాలో మూడు, యాదాద్రి జిల్లాలో 4 చొప్పున ఎకో టూరిజం పార్కులు రానున్నాయి. -
పర్యాటకం.. నిధుల పందేరం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పర్యాటక శాఖలో నిధుల పందేరం కొనసాగుతోంది. ఫెస్టివల్స్ పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక కొత్త పేరుతో ఫెస్టివల్స్ నిర్వహించడం.. సగటున రూ.2 కోట్ల మేర ఖర్చు చేయడం ఆనవాయితీగా మారింది. ఒకటిన్నర ఏడాది కాలంలోనే నాలుగు ఫెస్టివల్స్ను పర్యాటకశాఖ నిర్వహించింది. వీటి నిర్వహణలో ఆ శాఖ సిబ్బందికి ఏ మాత్రమూ పాత్ర లేదు. పూర్తిగా ఈవెంట్ మేనేజర్లకే అప్పగిస్తున్నారు. ఒక్కో ఫెస్టివల్స్ను ఒక్కో ఈవెంట్ మేనేజింగ్ సంస్థకు పర్యాటక శాఖ అప్పగిస్తోంది. మరోవైపు టెంపుల్ టూరిజం సర్క్యూట్, శిల్పారామం పేరిట వివిధ పథకాలను ప్రకటించిన పర్యాటక శాఖ ఒక్క ప్రాజెక్టును కూడా ఇప్పటివరకు పూర్తి చేసిన పాపాన పోలేదు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ జిల్లాకు చెందినవారు. అయితే..జిల్లాలో దీర్ఘకాలం పనికొచ్చే కార్యక్రమాలు కాకుండా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో అఖిలప్రియ వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవెంట్ మేనేజర్లదే హవా ఇప్పటివరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్లులో మూన్లైట్, కర్నూలులో ధూల్ ఫెస్టివల్స్తో పాటు అహోబిలం ఫెస్టివల్ను, తాజాగా కర్నూలులో ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్షోను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పర్యాటక శాఖ అధికారుల పాత్ర నామమాత్రమేనని చెప్పవచ్చు. ఒక్కో ఫెస్టివల్కు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.8 కోట్ల మేర ఖర్చు చేశారు. ఒక్కో ఫెస్టివల్ నిర్వహణను ఒక్కో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ..కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు మొత్తం పెత్తనమంతా ఈవెంట్ మేనేజర్లకే అప్పగించడం.. పర్యాటకశాఖ అధికారులకు ఏ పాత్ర లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులతో కనీసం జిల్లాలో వివిధ దేవాలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ కానీ, మినీ శిల్పారామాన్ని కానీ ఏర్పాటు చేసివుంటే అటు భక్తులతో పాటు శిల్పకారులకైనా మంచి జరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అహోబిలం ఫెస్టివల్కు కోటి 70 లక్షల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. కనీసం రోడ్డును బాగు చేసి ఉంటే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేది. మొత్తం మీద ఫెస్టివల్స్ పేరుతో రూ.కోట్లు ఖర్చు చేయడంతో మంత్రి అఖిలప్రియ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పర్యావరణాన్ని పరిరక్షించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అద్భుతమైన అటవీ ప్రాంతాలు, సహజ ఆవాసాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటిని పరిరక్షించుకోవాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్రాన్ని పర్యాటకంగానే కాకుండా దేశంలోనే గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇందుకోసం అటవీ, పర్యాటక శాఖలకు తోడు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ అధ్యక్షతన జరిగింది. అటవీ సంపద, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఎకో టూరిజం అభివృద్ధిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని, దానిని అసెంబ్లీ కమిటీ తరఫున ప్రభుత్వానికి పంపుదామని స్పీకర్ సూచించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, కిషన్రెడ్డి, దివాకర్రావు, బాపూరావు రాథోడ్, గువ్వల బాలరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పర్యావరణహిత టూరిజం అభివృద్ధికి ప్రణాళిక వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణకు అటవీశాఖ తరఫున చేపట్టిన కార్యక్రమాలు, పథకాలపై సమావేశంలో పీసీసీఎఫ్ పీకే ఝా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వేట నియంత్రణకు పోలీసులు, అటవీ సిబ్బం దితో ఉమ్మడి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, పర్యావరణహిత టూరిజం అభివృద్ధికి త్వరలోనే ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అటవీశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆహ్వానం మేరకు హరితహారం, అటవీ పునరుజ్జీవన చర్యలు, అర్బన్ పార్కుల సందర్శనకు కమిటీ త్వరలోనే వెళ్తుందని స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. -
రాతికోటకు బీటలు
సాక్షి, జనగామ: మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపనకు నడుం కట్టిన సర్దార్ సర్వాయి పాపన్న రాతి కోటకు బీటలు పడుతున్నాయి. నాటి గోల్కొండ రాజ్యాన్ని జయించి విజయ కేతనం ఎగురేసిన కోటను ఇప్పుడు పట్టించుకునే నాథుడు లేక కూలిపోయే దశకు చేరుకుంది. టూరిజం స్పాట్గా గుర్తించి నిధులు కేటాయించినా కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో సర్దార్ సర్వాయి పాపన్న క్రీ.శ 17వ శతాబ్దంలో రాతి కోటను నిర్మించారు. రాజ్య విస్తరణలో భాగంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండపై కన్నేసి దండయాత్రకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే క్రీ.శ.1687 లో గోల్కొండను ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. ఈ కాలంలో మొఘల్ పాలకులు నియమించిన సుబేదార్ల ఆగడాలతో రాజ్యంలో ఆరాచకం నెలకొంది. ప్రజలు అణచివేతకు గురవుతున్న సమయంలో క్రీ.శ. 1650లో పాపన్న జన్మించారు. గౌడ కులంలో జన్మించిన పాపన్న పశువుల కాపరిగా, తర్వాత కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించారు. పాలకులు విధానాల కారణంగా పాపన్నలో రాజ్యకాంక్ష పెరిగింది. బలహీన వర్గాలు ఏకమైతేనే రాజ్యా ధికారానికి రావచ్చని సొంతం సైన్యం ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టారు. మొగల్ పాలకులపై తిరుగుబాటును ప్రకటించిన పాపన్న తొలి కోటను ఖిలాషాపూర్లోనే నిర్మించి నట్లుగా చరిత్రకారుల అభిప్రాయం. ఔరంగజేబు మర ణించాక మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి పలు కోటలను పాపన్న స్వాధీనం చేసుకున్నారు. ఖిలాషాపూర్ కోట కేంద్రంగా వరంగల్, భువనగిరి, గోల్కొండను వశపర్చుకున్నారు. రాతి కోట నిర్మాణం ఇలా.. ఖిలాషాపూర్లో పాపన్న క్రీ.శ 1675లో రాతి కోటను నిర్మించారు. 20 అడుగుల ఎత్తులో రాతి కోటను నిర్మించారు. ఆ కోటపై నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తుతో బురుజులు, మధ్యలో మరో బురుజును నిర్మించారు. దూర ప్రాంతాల నుంచి శత్రువులు దండెత్తి వస్తే సులువుగా గుర్తించే విధంగా కోటను నిర్మాణం చేశారు. అంతేకాకుండా కోట సొరంగ మార్గాలను సైతం తవ్వించినట్లుగా చరిత్రకారులు, స్థానికులు చెబుతున్నారు. శత్రు దుర్భేధ్యంగా పూర్తిగా రాతితో కోట నిర్మాణం చేశారు. చెదిరిపోతున్న కోట ఆనవాళ్లు.. బహుజన రాజ్య స్థాపకుడిగా గుర్తింపు పొందిన పాపన్న నిర్మించిన రాతి కోట ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. కోట లోపలి భాగం ధ్వంసం అవుతోంది. గోడలు కూలిపోతున్నాయి. 2017 జనవరిలో కోట మరమ్మతు కోసం టూరిజం శాఖ రూ. 3 కోట్లు కేటాయించింది. అయినా పనులు చేపట్టకపోవడంతో కోట అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అంతేకాదు టూరిజం శాఖ చైర్మన్ పేర్వారం రాములు సొంత గ్రామంలోనే ఈ కోట ఉండటం గమనార్హం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కోట అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
నింగీ నేలను కలుపుతూ..
సాక్షి, హైదరాబాద్: రంగు రంగుల పతంగులు రకరకాల ఆకృతులతో నింగీ నేలను కలుపుతూ రివ్వున ఎగిరాయి.. ఆకాశానికి నిచ్చెన వేశారా అనిపించేలా గాలిపటాలు దూసుకుపోయాయి.. వంద లాది పతంగులు ఒకేసారి గాలి లోకి ఎగిరి అద్భుతాన్ని ఆవిష్కరించాయి. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభమైన అంత ర్జాతీయ పతంగుల పండుగ సందర్భంగా కనిపించిన దృశ్యాలివీ. ఉదయం ప్రారంభమైన ఈ కైట్ ఫెస్టివల్ రాత్రి వరకు కొనసాగగా.. తొలిరోజు దాదాపు 50 వేల మంది నగరవాసులు తిలకించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన పతంగుల పోటీదారులతో పరేడ్ మైదానం కోలాహలంగా మారింది. 3 రోజులపాటు పతంగుల పండుగ నగరవాసులకు కనువిందు చేయనుంది. అందరినీ ఏకతాటిపైకి తేవడానికే.. భాగ్యనగరంలో ఉన్న సకలజనులను ఏకతాటిపైకి తేవటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వివిధ రకాల ఫెస్టివల్స్ను తమ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో భాషా సాంస్కృతిక శాఖ–పర్యాటక శాఖల ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను మహమూద్ అలీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రారంభించారు. మహమూద్ మాట్లాడుతూ 15 దేశాలు, 25 రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన భిన్న జాతులు, సంస్కృతులు కలిగిన వారిని ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో పతంగుల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ.. పతంగుల పండుగలో నగర ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ బాల్యదశలో దోస్తులతో కలసి సంక్రాంతి ఆనందంగా జరుపుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది సింగపూర్, థాయిలాండ్, కొరియా, జపాన్, చైనా సహా పది దేశాలు, మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 40 కైట్ ఫ్లేయర్ బృందాలు పాల్గొంటున్నాయని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. -
టూరిజం హబ్గా సూళ్లూరుపేట
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రాంతాన్ని టూరిజం హబ్గా తయారుచేసేందుకు కృషి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాలు కేంద్రంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ను ఆదివారం మంత్రి నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంత్రులు ఫ్లెమింగో బెలూన్లను ఎగురవేశారు. –సూళ్లూరుపేట