Sankranti 2025
-
కైకలూరు కోడి పందేల్లో ఆర్జీవీ హీరోయిన్ అప్సర రాణి సందడి (ఫొటోలు)
-
‘సంక్రాంతికి వెరైటీ దోపిడీ.. కూటమి సూపర్ ఫైవ్ ఇవేనా?’
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Jakkampudi Raja). ఏపీలో నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు. పేకాట, గుండాట, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్స్, మద్యం అమ్మకాలు.. ఇదే కూటమి మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు.రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఏం జరుగుతుందో చంద్రబాబు(Chandrababu), పవన్(Pawan Kalyan) ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. సంక్రాంతి(sankranthi) సంబరాలు అంటే గంగిరెద్దులు ముగ్గులు, అక్కడక్కడ కోడిపందాలు మాత్రమే గతంలో ఉండేవి. సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చారు కూటమి నేతలు.. నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు.. గుండాటలు జరిగాయి.ఒక్కో మహిళకు నెలకు 15వేలు చొప్పున ఆర్థిక సాయం అన్నారు.. సూపర్ సిక్స్ మేనిఫెస్టో దేవుడి పేరిట అటకెక్కింది. పేకాట, గుండాట.. కోడిపందాలు.. రికార్డింగ్ డ్యాన్స్.. మద్యం అమ్మకాలు.. ఇవే కూటమి మేనిఫెస్టో. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చూసినట్టు కోడి పందాలను, ప్రీమియర్ లీగ్లా నిర్వహించి పార్కింగ్ పేరిట సామాన్యుడి దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారు. రాజానగరం నియోజకవర్గంలో భూపాలపట్నంలో డ్రగ్స్.. రేవ్ పార్టీలు.. రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి తీసుకొచ్చారు. అనకాపల్లిలో గంజాయి దొరికితే.. అందులో రాజానగరం నియోజకవర్గం కాపవరం గ్రామానికి చెందిన జనసేన నేతలు మూలాలు ఉన్నాయి.గంగాధర్ అనే వ్యక్తి గుండాటలో డబ్బులు పోయాయని ఆత్మహత్య చేసుకున్నాడు. బహిరంగంగా పోలీసులను కూడా వేదికలపై నుండి బయటకి గెంటేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గాల్సి వచ్చింది. కొన్నిచోట్ల సంక్రాంతికి అసలు పోలీసులు ఉన్నారా లేరా అనే ప్రశ్న తలెత్తింది. రాజమండ్రి పేపర్ మిల్పై వేలమంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి చేస్తున్నాడు. ప్రవీణ్ చౌదరికి తెలుగుదేశంలో మూలాలు ఉన్నాయి.. బుచ్చయ్య చౌదరి అడుగుజాడల్లో నడుస్తాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
పల్లె నుంచి నగరానికి తిరుగు పయనం
చౌటుప్పల్/ చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరుగుపయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు బారులుతీరాయి. దీంతో గురువారం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ మార్గంలో ఉదయం నుంచి వాహనాల రాక పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. జంక్షన్లు, క్రాసింగ్ల వద్ద వాహనాలు సాఫీగా ముందుకుసాగేందుకు, ప్రమాదాల నివారణకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల కూడలి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించారు. పంతంగి టోల్ప్లాజా వద్ద సాఫీగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు సాఫీగా సాగాయి. టోల్ప్లాజాలో 16 గేట్లు ఉండగా, హైదరాబాద్ వైపు 12 గేట్ల నుంచి వాహనాలను పంపించారు. విజయవాడ వైపు నుంచి వస్తున్న వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా జాతీయ రహదారిపై హైవే అథారిటీ అధికారులు గుర్తించిన 17 సమస్యాత్మక ప్రాంతాలతోపాటు ప్రతి గ్రామ స్టేజీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. -
వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు
పండగ అయిపోయింది.. భీమవరం నుంచి భార్య రేవతి.. పిల్లలు భరత్.. భావనతో కలిసి పార్వతీపురం పండక్కి వెళ్లిన శ్రీకాంత్ మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యాడు.. బస్సులు ఎక్కలేని పరిస్ధితి.. ఏదోలా సంచులు అందుకుని తల్లి, నలుగురు ఎక్కేశారు. లక్కీగా బొబ్బిలిలో సీట్ దొరికింది.. కిటికీ పక్కన శ్రీకాంత్ కూర్చోగా ఆ పక్కనే తల్లి ముగ్గురు సర్దుకున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉన్న శ్రీకాంత్ చిన్ననాటి మిత్రుల్లాంటి వాళ్ళు.. బంధువుల గెటప్పుల్లో ఉన్న అంతర్గత విలన్లు.. సొంతవాళ్ల ముసుగులో ఉన్న పరాయివాళ్లతోనూ గడిపిన సంఘటనలు.. కళ్ళ ముందు గిర్రున తిరిగాయి.భోగినాడు రాత్రి తాను తెచ్చిన ఫుల్ బాటిల్ ఇంకా మంచింగ్ కోసం వెయ్యి పట్టుకెళ్లిన బావ శ్రీను తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో కల్లంలో సిట్టింగ్ వేశాడు. పిల్లలను ఊళ్ళో అటు ఇటు తిప్పి మొత్తానికి మనోళ్ల సిట్టింగ్ స్పాట్ దగ్గరకు వెతుక్కుని వెళ్లిన శ్రీకాంత్ కు వాళ్ళ మాటలు వినబడ్డాయి. ఒరేయ్.. ఆ శ్రీకాంత్ గాడు మహా ముదుర్రా.. అక్కడ ఎన్నెన్ని చేస్తున్నాడో ఏందో.. బాగా సంపాదించాడు. మొత్తానికి ఏదో ఉందిరా అంటున్నాడు బావ శ్రీను పెగ్గు కలుపుతూ.. అదేం లేదులేరా.. పదిహేనేళ్లుగా భార్యా భర్త అక్కడ పంజేస్తున్నారు. పైగా వాడు జాగ్రత్తపరుడు.. వ్యసనాల్లేవు.. అందుకే పదో పరకో దాచుకున్నాడు అన్నాడు ఇంకో బ్రదర్ నాగరాజు.అదేం లేదురా వాడు ఏదో చేస్తున్నాడు.. నాకు అనుమానమే.. లేకుంటే ఇంత ఎక్కువ ధర ఉన్న మందు మనకు ఎందుకు ఇస్తాడు.. వాడికి ఉబ్బర్న వచ్చింది కాబట్టే ఇచ్చాడు.. బావ శ్రీను ముక్తాయింపు ఇచ్చాడు. శ్రీకాంత్ కు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ ముందు బాటిల్ ను బట్టల మాటున బ్యాగులో తాను రేవతిని ఎంతలా ఒప్పించాల్సి వచ్చిందో.. దేవుడికి చూపే బట్టల్లో అది వద్దని తానూ ఎంతలా వాదించిందో గుర్తొచ్చి శ్రీకాంత్ ఇంకక్కడ ఉండలేక భారమైన మనసుతో చల్లగా అక్కణ్ణుంచి జారుకున్నాడు.చీరలు పెట్టే సమయంలో పెద్దక్క భవాని చేసిన కామెంట్లు మళ్లోసారి జ్ఞాపకం వచ్చాయి. చూసావా అమ్మా.. వాడి పెళ్ళానికి మంచిది కొన్నాడు.. మనకు ఏదో ఆఫర్లో వచ్చిన గుడ్డ ముక్కలు కొని పడేసాడు అంటూ పొయ్యిదగ్గర మాట్లాడుకున్న మాటలు తన చెవిన పడ్డాయి. అదేం లేదులేవే అని సర్ది చెప్పాల్సిన తల్లి వరాహలమ్మ కూడా.. వాడు పెళ్ళైన రోజునుంచే మారిపోయాడు కధేటి.. అనడం శ్రీకాంత్ ను మరింత బాధించింది. కానీ భవానికి చీర సెలక్షన్ కోసం రేవతి ఎన్ని షాపులు తిరిగిందీ.. దానికి మ్యాచింగ్ గాజులు.. జాకెట్ ముక్కలను ఎలా విశ్లేషించి సెలెక్ట్ చేసిందీ శ్రీకాంత్ కు గుర్తొచ్చింది. ఎవరికీ అవతలి వారి కష్టం పట్టదు.. తమ సౌఖ్యం మాత్రమే ముఖ్యం.. అందులో తల్లీ చెల్లీ కూడా మినహాయింపు కాదని తెలిసొచ్చింది. అయినా వాళ్ళను ఏమీ అనలేక తమాయించుకున్నడుఓహ్.. ఎవరికీ ఎంత చేసినా అందులో లోపాలు వెతకడమే కాకుండా అవహేళన చేయడమే నైజంగా ఉన్న బంధువులను సంతోషపరచడం ఇసుక నుంచి నూనెను పిండటం లాంటిదే అని శ్రీకాంత్ కు వందోసారి తెలిసొచ్చింది. కానీ సంప్రదాయలపేరిట.. నకిలీ అనుబంధాల మాటున వాటిని భరిస్తూ వస్తున్నాడు. ఇంతలో రేవతి యాండీ ఇదేటి.. ఈ షర్ట్ మనం కొనలేదు కదా.. ఇదేక్కడిది అంది కవర్లోంచి తీస్తూ.. అర్రే చూసేసిందా అని నాలుక్కరుచుకున్న శ్రీకాంత్.. ఓహ్.. అదా.. అదా.. మా క్లాస్మేట్ టైలర్ రమణగాడు కుట్టి ఇచ్చాడులే అని డైవర్ట్ చేశాడు.కానీ సంక్రాంతి నాడు సాయంత్రం టెంట్ కింద పిల్లలంతా డాన్సులు చేస్తుంటే అక్క కూతురు సుమిత్ర వచ్చి మామయ్యా సుజాత బాప్ప రమ్మంది .. ఆ రామ్మందిరం పక్కనే ఉంది అని చెప్పేసి తుర్రుమంది. సుజాత.. ఒకనాటి నెచ్చెలి.. డిగ్రీ వరకు క్లాస్మేట్. ఎన్నెన్ని ఊసులు.. ఎన్నెన్ని బాసలు.. ఎక్కడా ఇద్దరం గీత దాటింది లేదు.. పెళ్లి చేసుకున్నాకే అన్నీ అనుకున్నాం.. కానీ విధి ఆమెను తన మేన బావకిచ్చి పెళ్ళిచేసింది.నేను ఏం చేయలేక.. అసలు ఎందుకు బతకాలో తెలియక.. అలా ఊరొదిలి వెళ్ళిపోయా.. తరువాత సుజాత పంచాయతీరాజ్లో ఉద్యోగం తెచ్చుకుని ఊళ్ళోనే ఉంది. ఊరొచ్చిన ప్రతీసారీ దూరం నుంచి చూడటం.. కన్నీళ్లతో ప్రేమను చూపడం.. అంతే ఉండేది.. కానీ ఈసారి ఎందుకో సుజాతను చూడాలనిపించింది.. తనే పిలిచింది.. గోడ పక్కకు వెళ్ళగానే... ఇలారా అంటూ పిలిచింది. ఏదేదో మాట్లాడాలనుకున్నాను కానీ నోరు పెగల్లేదు.. మాట రాలేదు.. తనకూ నాకూ మధ్య నిశ్శబ్దమే మాట్లాడింది. ఆ నిశ్శబ్దంలో ఎన్నో భావాలూ.. బాసలూ.. నీకోసం చొక్కా తీసుకున్నాను.. అంటూ ఇచ్చింది.. వణుకుతున్న చేత్తో తీసుకున్నాను.. అదే ఈ చొక్కా.. చూస్తుంటే దానిలో క్రీనీడ మధ్య నీడలా కనిపించిన సుజాత మొహం గుర్తొచ్చింది... దాన్ని ప్రేమగా ఒళ్ళోకి తీసుకున్నాను.. మొత్తం సంక్రాంతి ఎపిసోడ్లో నాకు నచ్చింది.. ఇష్టమైన ఘట్టం ఏదైనా ఉందంటే.. ఆ రెండు నిముషాల నిశ్శబ్ద సంభాషణ మాత్రమే. -సిమ్మాదిరప్పన్న. -
సంక్రాంతి ప్రత్యేకం
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగతో చిత్ర పరిశ్రమకు ప్రత్యేక అనుబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తమ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్, లుక్స్ని విడుదల చేశారు పలువురు మేకర్స్. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... రాజా సాబ్ ఆగయాప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతోన్న ‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. షూటింగ్ తుదిదశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.అందమైన లైలాహీరో విశ్వక్ సేన్ లైలాగా మారారు. ఆయన అబ్బాయిగా, అమ్మాయిగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీలో తొలిసారి లైలా అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా నుంచి లైలాగా విశ్వక్ సేన్ లుక్ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జాస్మిన్ వచ్చేశారు‘బబుల్ గమ్’ మూవీ ఫేమ్ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. సంతానప్రాప్తిరస్తువిక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నుంచి విక్రాంత్, చాందినిల స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
అర్థమైందా.. రాజా!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించిన బ్లాక్బస్టర్ మూవీ ‘జైలర్’ (2023). ఈ మూవీకి సీక్వెల్గా ‘జైలర్ 2’ రానుంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లోనే తెరకెక్కనున్న ‘జైలర్ 2’ సినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే చిత్రీకరణనుప్రారంభించనున్నట్లు ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్లో వెల్లడించారు. ‘టైగర్ కా హుకుమ్’ సాంగ్ బ్యాగ్రౌండ్ స్కోర్తో పాటు వీడియో చివర్లో ‘అర్థమైందా.. రాజా’ అనే ఓ డైలాగ్ ఉంది. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. సన్పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. -
Kanuma Importance: కనుమ పండుగ ఈ విశేషాలు తెలుసా?
సంక్రాంతి పండగ సంబరాలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముచ్చటగా మూడు రోజుల వేడుకలో తొలి రోజు భోగి. భోగి మంటల వెచ్చటి వెలుగులతో పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలని ప్రార్థిస్తారు. రెండో రోజు మకర సంక్రాంతి కాంతులతో , సౌభాగ్యాలతో ప్రతీ ఇల్లూ శోభాయమానంగా వెలుగొందాలని కోరుకుంటారు. కొత్తబియ్యంతో పొంగలి తయారు చేసుకుంటారు. మూడో రోజు కనుమ. పల్లెసీమలు పశుసంపద, వ్యవసాయ, పంటలతో సుభిక్షంగా కలకళలాడాలని ఆకాంక్షిస్తారు. పశువులను ప్రత్యేకంగా అలంకరించి, మొక్కుకుంటారు. అసలు ఈ రోజున పశువులను ఎందుకు పూజిస్తారు? ప్రయాణాలు చెయ్యరు ఎందుకు? తెలుసుకుందామా.!పశువులకు పూజలు, అందంగా ముస్తాబుసంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండగ. వ్యవసాయంలో ప్రధాన భూమిక పశువులదే. రైతులు ఎల్లవేళలా అండగా ఉంటాయి.అందుకే వాటిని దైవంతో సమానంగా భావిస్తున్నారు. పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నలు కనుమ రోజున పశువులను ఈ రోజున అందంగా అలంకరించి పూజిస్తారు. కనుమ రోజున పశువులను శుభ్రంగా కడిగి, వాటికి పసుపు కుంకుమ పెట్టి, మెడలో గజ్జెల పట్టీ, కాళ్లకు మువ్వలుతొడిగి అలంకరించి కన్నబిడ్డల్ని చూసినట్టు మురిసిపోతారు. ఇలాఅలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లాపాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా గ్రామ దేవత గుడిలో నైవేద్యం సమర్పిస్తారు. ఏడాదంతా సమృద్ధిగా పంటలు పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. మాంసాహారంతో విందు చేసుకుంటారు.అంతేకాదు గతంలో ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగ చెట్ల పూలు, ఆకులు, కాండం, వేర్లు సేకరించి, ఉప్పువేసి దంచి పొడి చేసి తినిపించేవారట. తద్వారా వాటిలో సంవత్సరానికి సరిపడా రోగనిరోధక శక్తి వస్తుందని నమ్మేవారు.ప్రయాణాలు ఎందుకు వద్దనేవారురవాణా సౌకర్యాలు బాగా లేని రోజుల్లో ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించే ఆరాధించేవారు. అందుకే ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంలో ఈ రోజు ప్రయాణాలను మానుకునేవారట మన పెద్దలు. కనుమ రోజు ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే ఒక నానుడి ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఈ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తికాదని, ఆటంకాలు తప్పవనే విశ్వాసం బాగా ఉంది. మరోవైపు సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతీ ఇల్లూ బంధువులతో కళకళాలాడుతూ కన్నుల పండువగా ఉంటుంది. కొత్త అల్లుళ్లు, పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లి తిరిగి పుట్టింటికి ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంతో వస్తారు. మరి వారితో సమయం గడిపేలా, కొత్త అల్లుడికి సకల మర్యాదలు చేసేలా బహుశా కనుమ రోజు ప్రయాణం చేయొద్దనే నియమం పెట్టారేమో! ఏది ఏమైనా ఈ నియమాలు కట్టుబాట్లు, ఎవరి ఇష్టాఇష్టాలు, నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి. -
HYD: ఈ గాలి పీలిస్తే డేంజరే..!
సాక్షి, హైదరాబాద్: నగరంలో అంబరాన్నంటిన కొత్త సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు ప్రయాణమైన లక్షలాది వాహనాలు వెరసి వాయు కాలుష్యంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తున్నాయి. పండగకు వరుస సెలవులు తోడవడంతో హైదరాబాద్ నుంచి సుమారు 30 శాతం మంది ప్రజలు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. దీంతో నగరంలో నడిచే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంతా భావించారు. స్వచ్ఛమైన గాలి దొరుకుతుందని ఊహించారు. అయితే అవన్నీ ఊహలేనని చెబుతూ వాయు నాణ్యత ఇండెక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 151గా నమోదు కాగా, 11న మరోమారు 150ని తాకింది. వార్షిక సరాసరి 136గా నమోదైంది. 2021లో వార్షిక ఏక్యూఐ 149గా నమోదు అయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఏక్యూఐ 50 లోపు ఉంటే స్వచ్ఛమైన గాలి ఉన్నట్లు లెక్క. 100 వరకు మోస్తరుగా ఉన్నట్లు. 100– 150 కి చేరితే మాత్రం నాణ్యత లోపించిందని లెక్క. ప్రస్తుతం నగరంలో గాలి నాణ్యత 122 నుంచి 151 మధ్య నమోదవుతోంది. ఏటా డిసెంబరు, జనవరి నెలల్లోనే గాలి నాణ్యత ఇలా తగ్గుముఖం పడుతోంది. గత ఏడాది జులైలో 53గా గాలి నాణ్యత ఉండగా, ఆరు నెలల్లోనే సుమారుగా రెండున్నర రెట్లు క్షీణించింది. ఈ వాయువులు పీలిస్తే ఆరోగ్యం చెడిపోతుందని, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మోత మోగిపోతోంది.. నగరంలో వాయు కాలుష్యానికి తోడు శబ్ద కాలుష్యం కూడా మోత మోగిస్తోంది. ఉదయం నుంచే సాధారణానికి మించి శబ్దాలు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో శబ్ద కాలుష్యం 55 డెసిబెల్స్ కంటే తక్కువ ఉండాలి. హైదరాబాద్ నగరంలో సుమారుగా 80 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదవుతోంది. రాత్రి పూట ప్రధాన రహదారులపై ప్రైవేటు వాహనాలు పెద్ద శబ్దాలతో హారన్లు మోగిస్తున్నాయి. -
కహానీలు చెబితే కడుపు నిండుతుందా?
ఆంధ్రప్రదేశ్లో ఎల్లోమీడియా తీరు భలే విచిత్రంగా ఉంటుంది. వారికి లాభం జరిగితే ప్రజలందరికీ జరిగినట్లే. వారి ఇబ్బందులు ప్రజలందరి సమస్యలు! ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటే.. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ సంక్రాంతి వరాలు వచ్చేశాయట!. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందట!. పచ్చి అబద్ధాలను వండి వార్చేఈ ఎల్లో మీడియా ఉరఫ్ ఈనాడులో వచ్చిన కథనాల్లో కొన్ని ఇవి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమలు చేసి ఉంటే ప్రజలు సంతోషంగా ఉండేవాళ్లు కానీ.. తిమ్మిని బమ్మి చేసినట్లు ప్రతి వాగ్ధానాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు కూటమి నానా తంటాలూ పడుతూంటే ఎల్లోమీడియా ఆ అబద్ధాలకు వంతపాడుతూ మురిసిపోతోంది. ఎన్నికలకు ముందు ఒక రకమైన అసత్యాలు.. ఇప్పుడు ఇంకో రకంగా బిల్డప్ ఇస్తూ జనాన్ని మభ్యపెడుతోంది. 😱కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు.. రాష్ట్రంలో అరాచకమే ఎక్కువ. జగన్ టైమ్లో జరిగిన అభివృద్దిని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వృద్దుల ఫించన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే ఇతర హామీని పూర్తిగా అమలు చేయని కూటమి, ఎన్నికల ప్రణాళికలో ఉన్న సుమారు 175 వాగ్దానాల జోలికే వెళ్లలేదు. దీన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రోజుకో కొత్త రకం భజన కీర్తలను పాడుతోంది. అయితే.. 👉జనం వాస్తవాలు తెలుసుకుంటున్నారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి నేతలు చేసిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ఈ మధ్య ఒక సీనియర్ పాత్రికేయుడు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించినప్పుడు ప్రజల్లోని ఈ అసంతృప్తిని గమనించారు. జగన్ ఉండి ఉంటే ఫలానా స్కీమ్ కింద తమకు ఇంత డబ్బు వచ్చి ఉండేది.. చేతులలో డబ్బు ఆడేది.. అని చెప్పుకుంటున్నారట. కానీ అంతకు మూడు రెట్లు సాయం చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తమను వంచించారని ఎక్కువ మంది భావిస్తున్నారట!.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఏ స్కీమ్ కూడా ఇప్పుడు ప్రజలకు అందడం లేదు. ‘అమ్మ ఒడి’ని మార్చి ప్రతి బిడ్డకు రూ.15 చొప్పున ఇస్తామన్న కూటమి నేతలు, కావాలంటే ఇంకా పిల్లలను కనండని బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తూచ్ అనేశారు. జాకీ మీడియా కూడా ‘అమ్మ ఒడి’ అంటే బటన నొక్కడమని ధనం వృధా చేయడమేనని ఊదరగొట్టింది. కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో చూడండి. 👇ఈ ఏడాదికి తల్లికి వందనం లేదు పొమ్మన్నారురైతు భరోసా జాడ కనిపించడం లేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఏమయ్యాయో తెలియదు. ఆరోగ్య శ్రీని నీరుకార్చే పనిలో ఉన్నారు. జగన్ ఇంటింటికి డాక్టర్ ను పంపిచే స్కీమ్ తెస్తే, ఇప్పుడు అది గాలికి పోయినట్లు ఉంది. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సేవలందించేందుకు జగన్ తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని జీతాలూ పెంచుతామని చంద్రబాబు ఉగాది పండగనాడు దైవ సాక్షిగా ప్రకటించినా.. ఇప్పుడు దానికి మంగళం పలికారు. మరోవైపు.. ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వంట నూనెల ధరలే లీటర్కు రూ.30 నుంచి రూ.40 వరకూ పెరిగాయి. పప్పులు, కూరగాయల ధరలన్ని అందుబాటులో లేకుండా పోయాయి. వీటన్నిటి ఫలితంగా సంక్రాంతి వచ్చినా ప్రజలు చేతిలో డబ్బులు ఆడక ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు కూడా తగ్గాయి. ఇందుకు ఉదాహరణ ఏమిటంటే.. లెక్కలు ఇలా.. 👇ఒక్క కృష్ణా జిల్లాలోనే వైఎస్ జగన్ పాలనలో 2023 లో పండగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లలో వస్త్ర వ్యాపారం రూ.3000 కోట్ల మేర జరిగితే కూటమి పాలన వచ్చిన 2024లో అదే కాలానికి కేవలం రూ.1200 కోట్లుగానే ఉంది. కిరాణా వ్యాపారం పరిస్థితి అలాగే ఉంది. గతంతో పోల్చితే ఈసారి లావాదేవీలు రూ. వెయ్యి కోట్ల తగ్గాయి. బంగారం వ్యాపారం రెండు నెలల టైమ్కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3000 కోట్ల టర్నోవర్ జరిగితే, కూటమి పాలనలో అది రూ.1500 కోట్లుగా ఉంది. ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా సగానికి సగం పడిపోయాయి. అప్పట్లో రూ.800 కోట్లు ఉంటే, ఈ సారి రూ.400 కోట్లే ఉంది. వీటి ఫలితంగా జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయమూ తగ్గింది. ఏపీలో జీఎస్టీ వసూళ్లు బీహారు కన్నా తక్కువ కావడం పరిస్థితిని తెలియచేస్తుంది. జగన్ టైమ్ లో 12 శాతం జీఎస్టీ వసూళ్లతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర భాగాన ఉంటే, ఈ సారి ‘- 6’ శాతం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 👉ఈ లెక్కలు ఇలా ఉన్నా, ఎల్లో మీడియా మాత్రం సంక్రాంతికి ప్రజలంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తోంది. అవును.. నిజమే.. మార్గదర్శికి సంబంధించిన కేసులలో గత ప్రభుత్వం జప్తు చేసిన రూ.వెయ్యి కోట్లను ఈ ప్రభుత్వం రాగానే తీసి వేసింది కదా!.. అందువల్ల ఈనాడు వారికే పండగే కావచ్చు. సామాన్యుడికి వస్తే ఎంత? రాకపోతే ఎంత? సంక్రాంతి వరాలు రూ.6700 కోట్లు అంటూ పెద్ద బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. గతంలో జగన్ ఒక్క స్కీమ్ కింద ఈ స్థాయిలో ప్రజలకు డబ్బు ఇచ్చేవారు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా అప్పులు చేసినా, ఆ డబ్బు అంతా ఏమైందో కాని స్కీమ్ లు అమలు చేయలేదు. 🤔నిజంగానే చెప్పిన హామీలు చెప్పినట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమలు చేసి ఉంటే సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఇచ్చి ఉండాలి. కానీ అందులో ఆరోవంతు నిధులు కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన మొత్తాలలో కొద్ది, కొద్దిగా ఇచ్చి పండగ చేసుకోమంటోంది. ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు ఉంటే రూ.1300 కోట్లు ఇచ్చారు. ఇది ఏ మూలకు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కీమ్, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అర కొరగానే ఇచ్చారని చెబుతున్నారు. ఉద్యోగులకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటెరిమ్ రిలీఫ్ ప్రకటిస్తామని అన్నా, దాని గురించి మాట్లాడడం లేదు. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని వాస్తవ పరిస్థితి చెప్పడం వేరు. మొత్తం హామీలు అమలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రచారం చేసుకోవడం వేరు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. 😥గతంలో ధరలు కొద్దిగా పెరిగినా, విద్యుత్ చార్జీల సర్దుబాటు జరిగినా ఇదే చంద్రబాబు ,పవన్ ఏ స్థాయిలో విమర్శలు చేసేవారు! ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటివి ఎంత దారుణమైన కథనాలు రాసేవి. మరి ఇప్పుడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారం మోపినా, రెండున్నర లక్షల మంది వలంటీర్ల నోటికాడి కూడు తీసేసినా, తల్లులకు ప్రతి ఏటా వచ్చే రూ.15 వేలు ఎగ్గొట్టినా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేసినా, నిరుద్యోగులకు రూ.3,000 ఖాయమని చెప్పి ఊరించి తూచ్ అంటున్నా, వారంతా సంతోషంగా ఉన్నారని భ్రమ పడాలన్నది ఎల్లో మీడియా లక్ష్యంగా ఉందనుకోవాలి. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందని ఈనాడు బోగస్ వార్తలు ఇస్తోంది. ప్రజల చేతిలో డబ్బు ఉంటే సంక్రాంతి పండగ బాగా చేసుకుంటారు కాని, కహానీలు చెబితే కడుపు నిండుతుందా?. కాకపోతే క్యాసినోలు, జూదాలు, కోడి పందేలు ఆడించి, ఎక్కడబడితే అక్కడ మద్యం అమ్మించి ఇదే సంక్రాంతి అనుకోండని అంటున్నారు. పేదలు వీటితో సరిపెట్టుకోవలసిందేనా!..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Mahakumbh: ఉదయం 8:30కే కోటిమందికిపైగా పుణ్యస్నానాలు
నేడు మకర సంక్రాంతి సందర్భంగా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనం పోటెత్తారు. ఈరోజు చేసే స్నానాన్ని అమృత స్నాన్ అని అంటారు. దీనిని ఆచరించేందుకు సంగమం ఒడ్డున భక్తులు బారులు తీరారు. ఉదయం 8.30 గంటల కల్లా కోటి మందికి పైగా జనం త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు.మకర సంక్రాంతి(Makar Sankranti) సందర్భంగా అఖాడా వర్గానికి చెందిన సాధువులు అమృత స్నానాన్ని ఆచరిస్తున్నారు. పంచాయితీ అఖాడా మహానిర్వాణి, శంభు పంచాయితీ అటల్ అఖాడా మొదట అమృత స్నానం ఆచరించారు. అమృత స్నాన సమయంలో 13 అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఇది ముగిసిన అనంతరం సామాన్యులు స్నానం ఆచరిస్తున్నారు. అమృత స్నాన్ మహా కుంభమేళాలో ప్రధానమైనదిగా పరిగణిస్తారు. ఇందులో స్నానం చేసేందుకు మొదటి అవకాశం నాగ సాధువులకు ఇస్తారు.పురాణాల్లోని వివరాల ప్రకారం సముద్ర మథనం నుండి వెలువడిన అమృత భాండాగారాన్ని దక్కించుకునేందుకు దేవతలు, రాక్షసులు ఒకరితో ఒకరు పోరాడుతున్నప్పుడు నాలుగు అమృత బిందువులు నాలుగు ప్రదేశాలలో (ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్,నాసిక్) పడ్డాయి. నాటి నుంచి ఈ ప్రాంతాల్లో మహా కుంభమేళా(Great Kumbh Mela) ప్రారంభమైంది. నాగ సాధువులను మహాశివుని అనుచరులుగా పరిగణిస్తారు. అందుకే వారిని ముందుగా ఈ స్నానం ఆచరించడానికి అర్హులుగా భావిస్తారు. ఈ నేపధ్యంలోనే వారికి తొలుత స్నానం ఆచరించేందుకు అవకాశం కల్పిస్తారు.ఇది కూడా చదవండి: రూ. 25 లక్షల చైనీస్ మాంజా స్వాధీనం.. బుల్డోజర్తో ధ్వంసం -
రూ. 25 లక్షల చైనీస్ మాంజా స్వాధీనం.. బుల్డోజర్తో ధ్వంసం
నేడు దేశవ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రీతుల్లో సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో గంగా స్నానం, గాలిపటాలు ఎగురవేడం లాంటివి ఉన్నాయి. మరోవైపు యూపీలోని ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది.మకర సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలాచోట్ల గాలిపటాలను ఎగురవేస్తారు. అయితే ఈ గాలిపటాలను ఎగురవేసేందుకు వినియోగించే చైనా మాంజా కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు పోయిన సందర్బాలు కూడా ఉన్నాయి.మకర సంక్రాంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో భారీఎత్తున గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం ఉంది. గాలిపటాలు ఎగురవేసే వారు నైలాన్ దారం లేదా చైనా మాంజాను ఉపయోగిస్తుంటారు. వీటి కారణంగా ప్రాణహాని జరుగుతున్న నేపధ్యంలో నాగ్పూర్ పోలీసులు చైనీస్ థ్రెడ్ వినియోగం, విక్రయాలపై ఓ కన్నేసి ఉంచారు. లక్షల రూపాయల విలువైన చైనీస్ మంజాను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల సాయంతో.. గాలిపటాలు ఎగురవేసేవారిపై నాగపూర్ పోలీసులు నిఘా సారించారు. అదేవిధంగా నగరంలోని ప్రతీవీధివీధినా తిరుగుతూ చైనీస్ దారాన్ని ఉపయోగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.తాజాగా నాగ్పూర్ పోలీసులు రూ.25 లక్షల విలువైన చైనీస్ దారాన్ని స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేశారు. ఇండోర్ మైదానంలో 2,599 బండిళ్లు కలిగిన దాదాపు రూ.25 లక్షల విలువైన నిషేధిత నైలాన్ మాంజాను రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఆ ప్రాంత పౌరుల సమక్షంలో పోలీసులు ఈ విధమైన చర్యలు చేపట్టారు. చైనామాంజా వినియోగిస్తూ ఎవరైనా పట్టుబడితే వారిని నేరుగా కస్టడీకి పంపుతామని పోలీసులు హెచ్చరించారు. చైనీస్ థ్రెడ్ కారణంగా బైక్ రైడర్లు ప్రమాదాల బారిన పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: పతంగులకు ఎంత గాలి అవసరం? ఎందుకు తెగిపోతాయి? -
ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడమే పండుగ!
సంక్రాంతి తల్లి సకల సౌభాగ్యాలు ఇచ్చే కల్పవల్లి. తెలుగు లోగిళ్ళలో భోగి, సంక్రాంతి, కనుమ పేరిట 3 రోజులపాటు వైభవోపేతంగా జరుగుతుంది. సంక్రాంతి ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలిపే పండుగ. గత సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించే పండుగ. రైతు ఇంటికి పౌష్యలక్ష్మి సమృద్ధిగా వచ్చి చేరే కాలం కాబట్టి రైతు తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటాడు. భోగి తెల్లవారు జామున భోగిమంటలు వేసి చలి కాచుకుంటారు. వచ్చిన వారంతా మంటల్లో భోగి పిడకలు వేస్తారు. ఈ మంటలపై మరిగించిన నీళ్ళతో తలంటు స్నానాలు చేస్తారు. యువతులు ఇళ్ళ ముంగిట గొబ్బెమ్మలు పెట్టి, వాటి చుట్టూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఈరోజునే ఐదేళ్ల లోపు పిల్లలపై భోగిపళ్ళు పోయడమనే సంప్రదాయముంది. రేగుపళ్ళునే భోగిపళ్ళుగా వినియోగించడం పరిపాటి.మరుసటి రోజు సంక్రాంతి. ఇది చాలా ముఖ్యమైన రోజు. పెద్దలంతా కోడికూత జామునే నిద్ర లేస్తారు. స్నానాదులు ముగించి, ఉపవాసముంటారు. పితృదేవతలకు భక్తిశ్రద్ధలతో పొత్తర్లు పెడతారు. పిండివంటలను నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తారు. కొత్త బట్టలు, మడపళ్ళు మూలన పెట్టి సమర్పిస్తారు. మూడోరోజు కనుమ. ఇది పశువుల పండగ. ప్రత్యేకించి గోవులకు పూజ చేస్తారు. అందుకే పశువులను అందంగా అలంకరిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు పూస్తారు. పూల మాలలు కడతారు. వండిన పిండివంటలను పశువులకు తినిపిస్తారు. ఇలాగే ముక్కనుమ రోజున కూడా పశుపూజ ఉంటుంది.ఇంకా... పల్లెల్లో అడుగడుగునా ధనుర్మాసపు శోభ తాండవిస్తుంది. వీధులన్నీ పచ్చని మామిడి తోరణాలతో, అరటిబోదులతో, చెరకు గడలతో అలంకరించబడతాయి. బొమ్మల కొలువులు, సాము గరిడీలు, సంగిడీలు ఎత్తడాలు, గంగిరెద్దుల వారి నాదస్వర గీతాలు, డూడూ బసవన్న నాట్యాలు, హరిదాసుల కీర్తనలు, రంగస్థల పద్య నాటకాలు, మేలుకొలుపు గీతాలు, బుడబుక్కల వారి పాటలు, కొమ్మదాసరుల విన్యాసాలు, పిట్టల దొరల హాస్య సంభాషణలు, జంగమ దేవరల పొగడ్తలతో పల్లె వాతావరణం పరిమళ భరితమౌతుంది. అందుకే సంక్రాంతి పండుగను సకల కళల సమాహారంగా కవులు అభివర్ణిస్తారు. కోస్తాంధ్ర అంతటా సంక్రాంతి వేడుకలు కన్నులపండువగా జరుగుతాయి. తమిళనాడులో జల్లికట్టు వలె, దక్షిణ కోస్తాలో కోడిపందాలు (ప్రభుత్వ అనుమతి లేనప్పటికీ) జోరుగా నిర్వహిస్తారు. వీటిని ప్రజలు తండోపతండాలుగా వెళ్లి చూస్తారు.పిల్లలైతే కొత్త బట్టలు ధరించి, గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేస్తారు. పండుగ రోజుల్లో ఇంటి ముంగిళ్ళన్నీ రంగురంగుల రంగవల్లికలతో కళకళలాడుతాయి. అన్నావదినలతో, అక్కాబావలతో యువతీ యువకులంతా సరదాగా పండగ సమయాలను గడుపుతారు. సంప్రదాయంగా వస్తున్న ముగ్గుల పోటీలు, ఎడ్లబళ్ళ పందాలు, కబడ్డీ, వాలీబాల్ వంటి గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహిస్తారు. మైసూర్–కలకత్తాలలో దసరా ఉత్సవాల వలె, పూణే–హైదరాబాదులో గణపతి నవరాత్రి ఉత్సవాలు మాదిరి కోస్తాంధ్ర అంతటా సంక్రాంతిని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. తమ వారితో కలసి పండుగలో పాల్గొనేందుకు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్నవారు స్వగ్రామాలకు చేరుకుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరమైతే జనం లేక బోసిపోతోంది. ఇలా వచ్చిన వారంతా తమ ఊరిలో పండుగ మూడు రోజులూ ఉత్సాహంగా గడుపుతారు. ఎన్నో మధుర జ్ఞాపకాలను మదినిండా పదిలపరుచుకుంటారు. పండుగయ్యాక వలస జీవులంతా పట్టణాలకు తిరుగు ప్రయాణ మవుతారు.పండుగలు మన సంస్కృతీ సాంప్రదాయాలలో భాగంగానే పుట్టాయి. పండుగలు జాతీయ సమైక్యతా భావనకు చిహ్నాలు. వివిధ పండుగలను కులాల, మతాలకతీతంగా సామరస్యంగా జరుపుకోవడం మన కర్తవ్యం. మన వైవిధ్య జీవనానికి పండుగలు గొప్ప ప్రతీకగా నిలుస్తాయి. పండుగల నిర్వహణలో ఆచార వ్యవహారాలు అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండవు. ఐనప్పటికీ పండుగ యొక్క సామాజిక, సాంస్కృతిక ధ్యేయం ఒకటే కాబట్టి, అంతటా ఒకేలా ఐక్యత పరిఢవిల్లుతుంది. భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే విశిష్ట లక్షణాన్ని కలిగియున్నది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడూతాను ఇష్టపడుతున్న జీవనాన్ని స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. దీనిలో భాగంగానే తాను కోరుకున్న సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తన జీవితంలో ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా మేళవించుకోవచ్చు.పిల్లా తిరుపతిరావు వ్యాసకర్త తెలుగు ఉపాధ్యాయులుమొబైల్: 7095184846 -
అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి
సాక్షి, అమరావతి: తెలుగింట సంక్రాంతి పెద్ద పండుగ.. మరీ ముఖ్యంగా ఇది రైతన్న పండుగ. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు సంబరాలు చేసుకోవలసిన తరుణం. కానీ అన్నదాత లోగిలి కళతప్పింది. పల్లెల్లో సంక్రాంతి సందడి కానరావడం లేదు. అన్ని విధాలుగా మోసపోయిన రైతన్న దిగాలుగా కనిపిస్తున్నాడు. కొత్త సర్కారు వచ్చి ఏడు నెలలు గడిచాయి. ఖరీఫ్, రబీ రెండు సీజన్లు పూర్తయ్యాయి. పెంచి ఇస్తామన్న పెట్టుబడిసాయం ఒక్క విడత కూడా అందలేదు. పంటలబీమా పరిహారం లేదు.. పైగా ప్రీమియం కట్టాల్సిరావడం.. కరువు సాయానికి ఎగనామం.. ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరకలేదు. తుపానులు, వరదలు దారుణంగా దెబ్బతీశాయి. దిగుబడులు ఆశించినట్లులేవు.. వాటికీ కనీస మద్దతు ధర రాలేదు. అన్ని విధాలుగా దగా పడిన రైతన్న ఏడు నెలలుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తానన్న పెట్టుబడి సాయం లేదు. ఈ సాయం కోసం రాష్ట్రంలోని 54 లక్షల మందికి రూ.10వేల కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇంతమోసం చేస్తారా.. అని అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వలన రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఇలా రైతులకు ఈ ఏడు నెలల్లో అందించాల్సిన రూ.12,563 కోట్లు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. వీటి కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని రైతులు ఎదురు చూస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక ఈసారి పండుగకు దూరమవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దీంతో విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడ్డారు. రోడ్డునపడిన అన్నదాత..ఇంటికొచ్చే కొత్త పంటతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికే రైతన్నల ఇంట ఈసారి ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాల ప్రభావంతో ఓ వైపు పంటలు దెబ్బతినగా, చేతికొచ్చిన అరకొర పంటకు మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గడిచిన ఐదేళ్లుగా విత్తనాలు, ఎరువులకు ఏరోజు ఇబ్బందిపడని రైతులు గడిచిన ఖరీఫ్ సీజన్లో వాటి కోసం నానా అవస్థలు పడ్డారు. మళ్లీ, మళ్లీ పెట్టుబడులు పెట్టి పండించిన వరి, పత్తి, ఉల్లి, టమోటా, మిర్చి వంటి పంటలకు మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో తుపానులు, వరదలతో అధికారికంగా 6 లక్షల ఎకరాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో 80కి పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. పంటల బీమా రక్షణేది?గతేడాది ఇదే రబీ సీజన్లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య అక్షరాల 43.82 లక్షల మంది. మరిప్పుడూ.. కేవలం 7.64 లక్షల మంది. అంటే ఆరో వంతు మందికి కూడా పంటల బీమా రక్షణ దక్కలేదు. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు నూరు శాతం యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా రక్షణ లభించేది. ఈ బీమాతో ఎలాంటి విపత్తు ఎదురైనా రైతన్నలు నిశ్చింతగా ఉండే వారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ విపత్తుల కారణంగా పంటలు దెబ్బతిన్న 54.55 లక్షల మంది రైతులకు రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందించింది. వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తుంది. మిగతా పంటలకు గత నెల 31వ తేదీనే ముగిసింది. అయినా 50.67 లక్షల ఎకరాలకు రైతులు బీమా చేయించలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీమా ప్రీమియం భారాన్ని రైతులపైనే వేయడమే ఇందుకు కారణం. ఈ భారం భరించలేక లక్షలాది రైతులు పంటల బీమా చేయించుకోలేకపోయారు. పైగా, బీమాకు అవసరమైన సర్టిఫికెట్లు, నమోదు వంటి వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి. దీంతో పంటల బీమా అంటేనే రైతులు భయపడిపోయారు.17న విజయవాడలో ధర్నాకు పిలుపుప్రతీ రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలన్నీ అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా? స్పష్టం చేయాలి. రైతులకు ఇచ్చిన హామీల అమలు, పెండింగ్ బకాయిలు చెల్లింపుతోపాటు రైతులపై భారం వేయకుండా ఉచిత పంటల బీమా పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేయబోతున్నాం. – కె.ప్రభాకరరెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!
మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్పుట్స్ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్ పవర్ అనే థీమ్తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్గా పరిచయం అయిన చౌదరి ‘హిట్: ది సెకండ్ కేస్’తో హిట్ కొట్టింది. సూపర్హిట్ సినిమా ‘లక్కీభాస్కర్’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్ఫుల్గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్ అమ్మాయి దివి మోడలింగ్లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్బాస్4’తో లైమ్లైట్లోకి వచ్చింది. హీరోయిన్గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలలో మెరిసినా, నాన్–గ్లామరస్ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్స్టాప్గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్మెంట్ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి -
విజయవాడలో సంక్రాంతి వేడుకలు
-
సందళ్లే సందళ్లే.. సంక్రాంతి సందళ్లే..!
ఉద్యోగాల పేరుతో ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఉన్నా..ఈ పండగకి మాత్రం తమ సొంతూళ్లకి చేరి చేసుకునే గొప్ప పండుగా సంక్రాంతి. అందర్నీ ఒక చోటకు చేర్చే పండుగ. ఎంత వ్యయప్రయాసలు కోర్చి అయినా.. ఈ పండగకి సోంతూరికి వెళ్తేనే ఆనందం. అలాంటి ఈ పండుగ విశిష్టత ఏంటి, దేశమంతా ఏఏ పేర్లతో ఈ పండగను జరుపుకుంటుంది తదితరాల గురించి చూద్దామా..!.సంక్రాంతి పండగా ప్రకృతికి కృతజ్ఞత చెబుతూ జరుపుకునే సంబరం. ఈ పండుగ నాటికి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. అందుకే సంతోషంతో ఈ పండుగ చేసుకుంటారు. పురాణ కథనం ప్రకారం తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భువిపైకి ఆహ్వానిస్తాడు. అది సరిగ్గా మకర సంక్రాంతి పండుగ రోజునే. అందుకే ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 14న(మంగళవారం) మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ పర్వదినంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలతో హాయిగా ఉంటామని విశ్వసిస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేస్తారు. అంత మహిమాన్వితమైన మకర సంక్రాంతిని దేశమంతా ఏఏ పేర్లతో ఎలా జరుపుకుంటుందో చూద్దామా..!.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతిని "మకర సంక్రాంతి" అని పిలుస్తారు. అక్కడ పెద్దల పేరు చెప్పి భోజనం పెట్టడం లేదా ఏవైన దానధర్మాలు చేయడం వంటివి చేస్తారు. వరి దుబ్బులు తీసుకొచ్చి పక్షులకు ఆహారం పెట్టడం వంటివి చేస్తారు.తమిళనాడులో మకర సంక్రాంతిని పొంగల్గా జరుపుకుంటారు. అక్కడ ఈ రోజున రైతులు తమ ఎద్దులను అలంకరించి పూజిస్తారు. వాళ్లు ఈ పండగను వ్యవసాయ ఉత్పాదకత, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు.కేరళలో మకర సంక్రాంతి పేరు మకరవిళక్కు. ఈ రోజున శబరిమల ఆలయం దగ్గర ఆకాశంలో మకర జ్యోతి కనిపిస్తుంది. ప్రజలు దానిని సందర్శిస్తారుకర్ణాటకలో ఈ పండుగను ఎల్లు బిరోధు అని పిలుస్తారు. ఈ రోజున మహిళలు కనీసం 10 కుటుంబాలతో చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరితో చేసిన వస్తువులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.పంజాబ్లో మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. మాఘి నాడు శ్రీ ముక్తసర్ సాహిబ్లో ఒక ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు ఈ రోజున నృత్యం చేసి ఆడి, పాడతారు. ఈ రోజున కిచిడి, బెల్లం, ఖీర్ తినే సంప్రదాయం ఉంది. గుజరాత్లో మకర సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్య కాలంగా జరుపుకుంటారు. ఆ రోజున గాలిపటాల పండుగ జరుగుతుంది. అలాగే ఉండియు, చిక్కీ వంటకాలు తింటారు.హిమాచల్ ఫ్రదేశ్లో ఈ పండుగను మాఘాసాజీ అని పిలుస్తారు. సాజి అనేది సంక్రాంతికి పర్యాయపదం. కొత్త నెల ప్రారంభం… మాఘమాసం కూడా నేటినుంచే ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం ప్రారంభ సూచికగా ఈ పండుగ చేసుకుంటారు.ఉత్తరాఖండ్లోని కుమావున్ ప్రాంతంలో మకర సంక్రాంతి గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. అక్కడ ఈ రోజున నేతిలో వేయించి తీసిన పిండి పదార్ధాలను కాకులకు ఆహారంగా పెడతారు. ఒడిషాలో ప్రజలు మకర చౌలా పేరుతో సంక్రాంతిని జరుపుకుంటారు. కొత్తబియ్యం, బెల్లం, నువ్వులు. కొబ్బరి వంటి వాటితో చేసిన ఆహార పదార్ధాలను తయారు చేస్తారు ముఖ్యంగా కోణార్కో లోని సూర్యదేవాలయానికి ఈరోజు భక్తులు పోటెత్తుతారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యభగవానుడిదర్శనం చేసుకుంటారు.పశ్చిమ బెంగాల్లో పౌష్ సంక్రాంతి పేరుతో ఈ పండుగ జరుపుకుంటారు. ప్రజలు గంగానది బంగాళా ఖాతంలో కలిసే ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీన్ని పౌష్ పర్బన్ అనే పేరుతో కూడాజరుపుకుంటారు. ఇక్కడి ప్రజలు ఖర్జూర పండును ఎక్కువగ ఉపయోగిస్తారు. కొత్త బియ్యం, కొబ్బరి, బెల్లం ఖర్జూరాలతో తయరు చేసిన ఖీర్ వంటివి ఆరగిస్తారు.,డార్జిలింగ్ లోని హిమాలయ ప్రాంతాల్లో ఈరోజున ప్రజలు శివుడిని ఆరాధిస్తారు.బీహార్,జార్ఖండ్లలో ఈ రోజున ఉత్సాహంగా గాలిపటాలు ఎగరేసి ఆనంద డోలికల్లో మునిగిపోతారు. సాయంత్రం వేళ ప్రత్యేక ఖిచిడీని తయారు చేసి పాపడ్, నెయ్యి, కూరగాయలతో చేసిన వంటకాన్ని బంధువులు స్నేహితులతో కలిసి సామూహికంగా ఆరగిస్తారు.ఇతర దేశాల్లో..నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, కాంబోడియా వంటి దేశాల్లోనూ ఈ పండగ కనిపిస్తుంది. అక్కడ ప్రజలు నది -సముద్రం కలిసే సంగమ ప్రదేశంలోనూ పుణ్యస్నానాలు ఆచరిస్తారట. అలాగే పతంగులు, తీపి వంటలు ప్రధానంగా ఉంటాయట.(చదవండి: Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?) -
Sankranti 2025 : జపాన్లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు. తొలి పండగ, పెద్ద పండగ అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సంబరాలు అంబరాన్నంటుతాయి. స్థానికంగా ఉన్న తెలుగువారంతా ఒక్క చోట సంబరంగా వేడుకచేసుకుంటారు. సంక్రాంతి-2025 సందర్భంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పోటీలను నిర్వహించారు. పిల్లలకు డ్రాయింగ్ ఈవెంట్, పెద్దలకు కబడ్డీ పోటీలు, ఆడవారికి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఇంకా కైట్ ఫెస్టివల్తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండువలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జపాన్లో నివసించే తెలుగువారు, జపనీయులు కూడ పెద్ద ఎత్తున పాల్గొని సంతోషంగా గడిపారు.ఉద్యోగగ రీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా తరువాతి తరం వారికి అందించే విధంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) నిరంతరం కృషిచేస్తూ ప్రశంసలు అందుకుంటుంది.గత పదేళ్లుగా సంక్రాంతి డుకులను జరుపుకుంటూ వస్తున్నామని తాజ్ నిర్వాహకులు ప్రకటించారు. ఒక్క సంక్రాంతి పండుగ మాత్రమే కాకుండా, ప్రతీ తెలుగు పండుగను అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకుంటా మన్నారు. -
విభేదాలూ, విద్వేషాలను దహించేసి.. భోగాల రాగాలు
మన్మథుడికి వసంతుడి లాగా, భోగి పండగ సంక్రాంతికి సామంతుడు. పెద్ద పండగకు హంగుదారు. ‘సంక్రాంతి లక్ష్మి వేంచేస్తు న్నదహో, బహుపరాక్!’ అని ముందస్తు హెచ్చరికలు చేస్తూ, ఊరంతటినీ ఉత్తేజపరిచి, పండగ కళకు పటిష్ఠమైన పునాది వేస్తుంది.ధనుర్మాసపు ముచ్చటలకు యథోచితంగా భరతవాక్యం పలికి, పౌష్యయోష ఆగమనానికి అంగరంగ వైభవంగా రంగం సిద్ధం చేస్తుంది. మకర సంక్రమణం జరగ బోతున్న మహత్తర ముహూర్తం వేళకు, చప్పటి సాధారణ జీవితపు స్తబ్ధతను వది లించే ప్రయత్నం చేస్తుంది. చలిమంటల నెపంతో, ఆబాల గోపాలంలోనూ సంబరాల వేడి పుట్టిస్తుంది. పల్లె సీమలలో ప్రతి ఇంటి ముంగిటా సమృద్ధికి సంకేతాలుగా, సంతుష్టికి గుర్తులుగా, పూర్ణ కలశాల ‘కుండ ముగ్గులు’ పూయిస్తుంది.వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి! /అరటి స్తంభాలతో అందగింతాము, / బంతి పూదండలన్ భావించుదాము, / తామరాకులతోడ దళ్ళల్లు దాము, / కలవ కాడల తోడ మెలికలేతాము! అంటూ (రాయప్రోలు వారి) పాటలు పాడుతూ వచ్చి, అందరినీ హుషారు చేస్తుంది.మరో రకంగా చూస్తే, సుదీర్ఘమైన సంక్రాంతి ఉత్సవంలో భోగి పండగ భోగానుభవాల రోజు. పులకింతలు కలిగించే చలిమంటలూ, ఉత్సాహం పెంచే ఉష్ణోదక అభ్యంగన స్నానాలతో ఆరంభించి, కొత్త బట్టల కోలాహలాలతో, వంటలు, పిండి వంటల ఆటోపాలతో, ఆత్మారాముడిని ఆనందపరిచే రోజు భోగి. సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభ సమయం. మార్తాండుడి మకర సంక్రమణ వేళ. కనుక దానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎక్కువ. ఆ రోజు ఆస్తికులు దానాలూ, తపాలూ, పితృతర్పణాల లాంటి ఆధ్యాత్మిక వ్యాసంగాలలో ఎక్కువ కాలం గడుపుతారు. కాబట్టి, సరదాలకూ, భోగాలకూ సమయం సరిపోక పోవచ్చు. కాబట్టి భోగినాడే చలిమంటలలో విభేదాలూ, విద్వేషాలూ, ఈర్ష్యా సూయల లాంటి నకారాత్మక భావనలు యథాశక్తి దహించేసుకొని, ఆ రోజంతా బంధుమిత్రుల సాంగత్యంలో ఉల్లాసంగా గడిపి, జీవితంలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ నింపుకొని, ఆపైన జరపవలసిన సంక్రాంతి విధులకు సన్నద్ధం కావాలి.అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు!– ఎం. మారుతి శాస్త్రి -
Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?
దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు అడుగుపెట్టే సమయంలో వచ్చే అందమైన పండుగ సంక్రాంతి. ఊరూ వాడా అంతా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా మొదలైపోయాయి. తెల్లవారుఝామున భోగి మంటలతో ఆరంభమై మకర సంక్రాంతి, పొంగళ్లు, కనుమ, ముక్కనుమ మూడు రోజుల పాటు ముచ్చటైన వేడుకలతో పల్లెలన్నీ కళకళ లాడతాయి. ఈ వేడుకల్లో ప్రధానమైంది భోగిపళ్లు. పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? ఎలా పోయాలి? ఈ విషయాలు తెలుసుకుందాం రండి.సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే రేగుపళ్లు పోయడం ద్వారా చాలా రోగాల నుంచి రక్షణ లభిస్తుందంటారు పెద్దలు. అంతేకాదు వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందని ప్రతీతి. సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, అలాగే ఆరోజన పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే ఆ లోక నాయరాణుని కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ల పోసే వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తారు. భోగి రోజు వచ్చిందంటే... ఇంట్లో చిన్నపిల్లలందరికీ భోగి పళ్లు పోసే వేడుక నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతారు అమ్మమ్మలు, అమ్మలు. ఎలాగా పిల్లలందరికీ భోగి రోజు పొద్దున్నే భోగి మంటల సందడి ఉంటుంది. పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని, తలారా స్నానాలు చేసి, కొత్త బట్టలు వేసుకొని భోగిమంటల విభూదిని దిద్దుకుంటారు.నోటి తీపి చేసుకుంటారు. ఇక భోగి పళ్లు పోస్తున్నామంటూ ముత్తుయిదువలను పేరంటానికి ఆహ్వానిస్తారు. సాయంత్రం ఇంట్లో 10 ఏళ్ల లోపు పిల్లలందరికీ కొత్త బట్టలు తొడిగి ముస్తాబు చేస్తారు. రేగి పళ్లు, పూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు, నానబెట్టిన సెనగలు, అక్షింతలు మొదలైనవి కలిపి ఉంచుతారు. అందరు రాగానే, తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా చిన్నారులను కూర్చోపెడతారు. ఎలా పోయాలి? ఇంట్లోని పెద్దవాళ్లు (అమ్మమ్మ, నానమ్మ) తల్లి కలిపి ఉంచుకున్న భోగిపళ్లను మూడు గుప్పిళ్లతో పిల్లల శిరస్సు చుట్టూ దిష్టి తీసినట్టు తలచుట్టూ తిప్పి పోయాలి. అంటే మూడు సార్లు సవ్య దిశలో, మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి తలమీద పోయాలి. ఆ తరువాత పేరంటాళ్లు కూడా ఇలాగే చేయాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని పిల్లల్ని నిండు మనస్సుతో దీవించాలి.ఈ సందర్భంగా "ఓం సారంగాయ నమః" అనే నామం చెప్పాలని పెద్దలు చెబుతారు.ముత్తయిదువలకు పండూ ఫలం కానుకగా ఇస్తారు. ఇలా కార్యక్రమం పూర్తైన తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెడతారు. పిల్లలకు దిష్ట పోవాలని తీసినవి కాబట్టి, ఈ రేగు పళ్లును ఎవరూ తినకూడదని కూడా చెబుతారు.విశిష్టతశ్రీమన్నారాయణుడు రేగుచెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూనే తపస్సు చేశాడని చెబుతారు. రేగుపళ్లను అర్కఫలం అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్య భగవానుడు. సూర్యుడితో సమానంగా రేగుపళ్లను భావించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ భోగిపళ్లు పోస్తారు. రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలు కూడా ఉండడంతో చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయట. -
భోగినాడు పెట్టే ముత్యాల ముగ్గులు..మనసుదోచే రంగవల్లులివే..! (ఫోటోలు)
-
అక్కడి ఆచారం.. సంక్రాంతికి దూరం
గుర్రంకొండ: సంక్రాంతి విశిష్టత.. ఆ పండుగ సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే అలాంటి పర్వదినానికి కొన్ని గ్రామాలు కొన్నేళ్ల నుంచి దూరంగా ఉంటున్నాయి. ఇది అక్కడి ఆచారంగా కొనసాగుతుండటం గమనార్హం. ఇలాంటి పల్లె సీమలు అన్నమయ్య జిల్లా గుర్రకొండ మండలంలో 18 ఉన్నాయి. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని.. ఆ గ్రామాల వాసులు ఆధునిక కాలంలో కూడా పాటిస్తుండటం విశేషం. ఎప్పుడో పెద్దలు ఏర్పాటు చేసుకొన్న కట్టుబాట్లను కలసికట్టుగా అమలు చేస్తుండటం వారి ప్రత్యేకత. మార్చిలో ఉత్సవాలే వారికి సంక్రాంతి మండలంలోని మారుమూల టి.పసలవాండ్లపల్లె పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల వాసులందరూ కలిసి టి.పసలవాండ్లపల్లెలో ఉన్న శ్రీ పల్లావలమ్మ అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తారు. ఏటా మార్చిలో నిర్వహించే గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ జాతర ఉత్సవాలే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి పండుగ. శ్రీ పల్లావలమ్మ ఆజ్ఞానుసారం ఈ పర్వదినం జరపకూడదంటూ పూర్వకాలంలో గ్రామపెద్దలు నిర్ణయించారు. వారి ఆదేశాలనే నేటికీ పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని పశువులను గ్రామదేవత పల్లావలమ్మ పేరుమీద వదిలేసి కొందరు వాటిని మేపుతుంటారు. వాటిలో ఆవులను అమ్మవారి ఉత్సవాల రోజున అందంగా అలంకరించి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. అక్కడ వాటికి భక్తిశ్రద్ధలతో అందరూ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదే వారికి సంక్రాంతి పండుగ. పాడి ఆవులతో వ్యవసాయం నిషేధంపాడి ఆవులపై ఎంతో ప్రేమ కలిగిన ఈ గ్రామాల్లో.. పాడి ఆవులతో వ్యవసాయం చేయడం నిషేధం. సాధారణంగా రైతులు ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఈ 18 గ్రామాల్లో మాత్రం పాడిఆవులతో వ్యవసాయ పనులు చేయరు. గోమాతను భక్తిశ్రద్ధలతో పూజించే సంస్కృతి ఇక్కడ ఎప్పటి నుంచో కొనసాగుతుండటం విశేషం. పూర్వపు తమ పెద్దల ఆచారం ప్రకారమే ఈ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఆచారాలను మరువబోం మా పూరీ్వకులు ఆచరించిన ఆచారాలను మరవబోము. గ్రామ దేవత శ్రీపల్లావలమ్మ ఉత్సవాల రోజున అమ్మవారి ఆవులను ఆలయం వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తాం. అదే మాకు సంక్రాంతి. –బ్రహ్మయ్య, ఆలయ పూజారి, బత్తినగారిపల్లె పూర్వీకుల అడుగుజాడల్లో.. పూర్వీకుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ నేటికీ వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాం. మా ప్రాంతంలోని 18 గ్రామా ల ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోబోము. మా పెద్దోళ్ల కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ సంస్కృతిని ముందు తరాల వారు కూడా పాటిస్తారని నమ్ముతున్నాం. – కరుణాకర్, టి.గొల్లపల్లె, టి.పసలవాండ్లపల్లె పంచాయతీ -
కోడి పందేల్లో కూటమి నేతల బరితెగింపు
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే పందెంలను ప్రారంభిస్తున్నారు. ఇక, పందెం రాయుళ్లు.. కోడి పుంజులతో బరులకు చేరుకుంటున్నారు.తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పందెం బరుల దగ్గర ఎల్ఈడీ తెరలు సైతం దర్శనమిస్తున్నాయి. పెందెంలా నిర్వహణ కోసం భారీ ఏర్పాటు. మరోవైపు.. స్థానికంగా జరుగున్న కోడి పందెంలను చూసేందుకు ప్రజలు భారీగా బరుల వద్దకు చేరుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. కోడి పందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5, రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించుకున్నారు.నిషేధం బేఖాతరు.. కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్–1974లోని సెక్షన్ 9(1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి.దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్ లీగ్’ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్ లీగ్ (కోడి పందేల లీగ్) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్రికెట్ టోర్నమెంట్స్ లీగ్ మాదిరిగా కోడి పందేల లీగ్ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు. -
అల్లుళ్లకు108 రుచులతో విందు
సంగారెడ్డి: సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుళ్లకు 108 రకాల వంటలతో విందును ఏర్పాటు చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా శాంతినగర్ మాజీ సర్పంచ్ మంగ రాములు నివాసంలో ఈ విందును ఘనంగా నిర్వహించారు. ఇటీవల మంగరాములు రెండవ కుమార్తె డాక్టర్ నిషాకు డాక్టర్ శ్రీకాంత్తో వివాహం జరిపించారు. అలాగే, సినీ నటుడు ఏడిద రాజా కుమార్తె మేఘన వివాహాన్ని లక్ష్మణ్ యాదవ్తో జరిపారు. ఈ రెండు కొత్త జంటలను విందుకుఅహ్వనించారు. ఈ సందర్భంగా 108 వంటకాలను తయారు చేసి వారికి వడ్డించారు. -
గీతాభాస్కర్ సమర్పించు సంక్రాంతికి సకినాలు
గీతాభాస్కర్ సినిమాలలో నటిస్తే నటన ఎక్కడా కనిపించదు. పూర్తిగా సహజత్వమే. ఆమె ఏ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లోనూ శిక్షణ తీసుకోలేదు. ‘డెస్టినీస్ చైల్డ్’ అనే పుస్తకం రాస్తే.... ‘పుస్తకం అంటే ఇలా ఉండాలి నాయనా’ అనిపిస్తుంది. ఆమె పెద్ద పుస్తకాలు రాసిన పెద్ద రచయిత్రి కాదు. నటన అయినా రచన అయినా వంట అయినా... ఏదైనా ఇట్టే నేర్చుకోగల సామర్థ్యం గీతమ్మ సొంతం. గీత పుట్టి పెరిగింది చెన్నైలో. అయినప్పటికీ... ఆమె సకినాలు చేస్తే తెలంగాణ పల్లెకి చెందిన తల్లి చేసినంత రుచిగా ఉంటాయి. పెళ్లయిన తరువాత గీత... దాస్యం గీతాభాస్కర్ అయింది. అత్తగారిది పక్కా తెలంగాణ. తెలంగాణ అంటే ది గ్రేట్ సకినాలు. ఇక నేర్చుకోకుండా ఉంటారా! సకినాలు ఎలా చెయ్యాలి... నుంచి ఫ్యామిలి ముచ్చట్ల వరకు ‘సాక్షి’తో పంచుకున్నారు గీతాభాస్కర్. ఆమె మాటల్లోనే.. అరిసెల పిండిలానే సకినాల పిండి కూడా తయారు చేసుకోవాలి. మామూలుగా వరి పిండి అయితే గట్టిగా అయిపోతుంది. పైగా అంతకుముందు వేరే గోధుమ పిండిలాంటివి పట్టి ఉంటే... అదే గిర్నీలో ఈ పిండి పడితే సరిగ్గా ఉండదు. అదే తడి పిండి అనుకోండి వేరే పిండి ఏదీ పట్టరు... బియ్యం పిండి మాత్రమే పడతారు. అయితే అరిసెల పిండికి రోజంతా బియ్యం నానబెట్టాలి. కానీ సకినాలకి నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది.మా ఆయన ఉన్నప్పుడు ముగ్గుల పోటీకి తీసుకుని వెళ్లేవారు. ఒకసారి గవర్నర్ చేతుల మీదగా బహుమతి కూడా అందు కున్నాను. పండగ రోజున మంచి మంచి ముగ్గులు వేస్తుంటాను. నా ముగ్గులన్నీ డిఫరెంట్గా ఉంటాయి. దసరా, సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలో నేను పాల్గొనాల్సిందే. ఆయన అలా తీసుకువెళ్లేవారు.– గీతాభాస్కర్ గీతా భాస్కర్ వేసిన ముగ్గునువ్వులు ఎక్కువ వేస్తాసకినాల పిండికి కొలతలు అంటూ ఉండవు. ఒక గ్లాసు పిండికి నేను పావుకిలో నువ్వులు వేస్తాను. నువ్వులు ఎక్కువ వేస్తే గ్యాప్ ఎక్కువ వస్తుంది... పైగా నువ్వుల నుంచి కూడా నూనె వస్తుంది కదా.. బాగా ఉడుకుతుంది. దాంతో సకినం కరకరలాడుతుంది. కొంతమందైతే పచ్చి నువ్వులు వేసేస్తారు. నేను చెన్నై నుంచి వచ్చినదాన్ని కదా... మాకు అక్కడ మురుకులు అలవాటు. అక్కడ వేయించిన నువ్వులు వేస్తారు. నేను సకినాల్లో అలానే వేస్తా. అసలు ఇక్కడికి వచ్చాకే నేను సకినాలు వండటం నేర్చుకున్నాను. సకినాలకి దొడ్డు బియ్యం బాగుంటుంది. నేను దాదాపు రేషన్ బియ్యమే వాడతాను. అవి ఎక్కువ పాలిష్ ఉండవు కాబట్టి సకినాలకి బాగుంటుంది. అలాగే వేరు శెనగ నూనె వాడతాను.అమ్మ వైపు... నాన్న సైడుమా తండ్రి, తల్లివైపు వాళ్లందరూ చెన్నైలో సెటిల్ అయ్యారు. నేను పుట్టింది, పెరిగిందీ అక్కడే. రెండు కుటుంబాల వాళ్లు బిగ్ బిజినెస్ పీపుల్. ఇక మా అమ్మగారివైపు అయితే పూర్తిగా కాస్మోపాలిటన్. ఆవిడ హార్స్ రైడ్ చేసేవారు. చెన్నైలో శివాజీ గణేశన్లాంటి స్టార్స్ ఉండే మలోని స్ట్రీట్లో మా తాత ఉండేవారు. పొలిటికల్గా ఆయనకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉండేవి. నెహ్రూగారితో పరిచయం ఉండేది. మా అమ్మ బట్టలన్నీ సినిమా కాస్ట్యూమర్స్ కుట్టేవారు. ఇక నాన్నవైపు పూర్తిగా భిన్నం. వాళ్లు కూడా వ్యాపారవేత్తలే. నాన్న వాళ్లది పప్పుల వ్యాపారం. నాన్నగారి కుటుంబంలో అమ్మాయిలు బయటకు వెళ్లకూడదు... మగవాళ్లతో మాట్లాకూడదు... అలా ఉండేది. నేను ఇటు అమ్మవైపు అటు నాన్నవైపుఇలాంటి కాంబినేషన్లో పెరిగా. మా అమ్మ ఒక్కతే కూతురు. ఆమెకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒక్కతే కూతురు కావడంతో రాణిలా పెంచారు. నాన్నవాళ్లు పదమూడుమంది. నాన్నమ్మ వాళ్లు బాగా ట్రెడిషనల్. ఇంటికి పెద్ద కోడలిగా అమ్మకి చాలా బాధ్యతలు ఉండేవి. అయితే అమ్మ ఎక్కడిది అక్కడే అన్నట్లుగా తనను మలచుకుంది. అత్తింటి విషయాలు పుట్టింటికి, అక్కడివి ఇక్కడ ఎప్పుడూ చెప్పలేదు. మా నాన్నమ్మ సైడ్లో పూర్తి ట్రెడిషనల్ పిండి వంటలు వండేవాళ్లు. అమ్మ సైడ్ కొంచెం డిఫరెంట్. అలా నాకు అమ్మ వల్ల, నాన్నమ్మ వల్ల వంటలు చేయడం అలవాటైంది. ఇక నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి (తెలంగాణ) వచ్చాక పూర్తి భిన్నమైన వంటలు వండాల్సి వచ్చింది.అత్తింట్లోనే సకినాలు నేర్చుకున్నాఅత్తింటికి వచ్చాకే సకినాలు చేయడం నేర్చుకున్నాను. మా అత్తగారైతే అన్ని వంటలు బాగా వండుతావు... ఈ సకినాలు ఎందుకు చేయలేకపోతున్నావు... ఇవి కూడా చేయడం వస్తది అనేవారు. మా పెద్ద ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ సకినాలు నేర్పించారు. మామూలుగా సకినాలకు ఉల్లికారం బాగుంటుంది. మా తరుణ్ (హీరో–దర్శకుడు– రచయిత తరుణ్భాస్కర్) కాస్త కారంగా తింటాడు. ఉల్లికారం తనకి తగ్గట్టుగా చేస్తాను. అయితే మా అత్తవాళ్లు ఉప్పు, కారం నూరి దానిమీద పచ్చి నూనె వేసేవారు. నేను కాస్త చింతపండు వేస్తాను. పండగకి అరిసెలు కూడా వండుతాను. యాక్చువల్లీ మా అమ్మ బాగా వండేది. నాకు కుదిరేది కాదు. అత్తింటికి వచ్చాక కూడా సరిగ్గా వండలేక΄ోయేదాన్ని. అయితే నా ఫ్రెండ్ వాళ్ల అమ్మ నేర్పించారు. అప్పట్నుంచి అరిసెలు చక్కగా మెత్తగా వండటం నేర్చుకున్నాను. ఇట్లు... బొబ్బట్లుఒకప్పుడు బుట్టలు బుట్టలు పిండివంటలు వండేవాళ్లు. మా ఇంట్లో మా అమ్మమ్మ, నాన్నమ్మ అలా వండటం చూశా. కానీ ఇప్పుడు ఒకట్రెండు కేజీలు వండటానికే కష్టపడిపోతున్నాం. అప్పట్లో పిండి దంచి వండేవాళ్లు. ఇప్పుడు అన్నింటికీ మిషన్ ఉంది. అయినా చేయలేకపోతున్నాం. కానీ బయట కొనుక్కుని తింటే అంత సంతృప్తి ఉండదు. ఇంట్లో వండితే పండగకి ఇంట్లో వండాం అనే తృప్తి ఉంటుంది. కానీ ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావని తరుణ్ అంటుంటాడు. ఇప్పుడు తను కూడా బిజీ కాబట్టి హెల్ప్ చేసే వీలుండదు. కానీ నాకు పండగకి ఇంట్లో వండితేనే మనసుకి బాగుంటుంది. పోయిన గురువారం నాకు స్కూల్లో ఓ వర్క్షాప్ ఉంది. అలాగే కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్లు గవర్నమెంట్ సపోర్ట్తో ఓ నాలుగైదు ప్రోగ్రామ్స్ చేయమన్నారు. ఇంకా ‘ఇట్లు బొబ్బట్లు’ అని పిల్లలు తయారు చేస్తుంటారు. వాళ్లు పిలిస్తే వెళ్లాను. మా నాన్నగారు మాతోనే ఉంటారు. ఆయనకు 90 ఏళ్లు. ఆయన్ని చూసుకుంటూ, బయట పనులు చూసుకుని, ఇంటికొచ్చాక పిండి వంటలు మొదలుపెట్టా. ఇలా ఇంట్లో వండుకుంటే ఫీల్గుడ్ హార్మోన్తో మనసు హాయిగా ఉంటుంది. అది మన హెల్త్కి మంచిది. సకినాలు ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ). స్ట్రెస్ ఉంటే తరుణ్ ‘చెఫ్’మా తరుణ్కి కూడా వంటలంటే ఇష్టం. నేను చేస్తుంటే వచ్చి చేస్తుంటాడు. నేనేదైనా బాగా వండితే, ఎలా వండావు అని అడిగి తెలుసుకుంటాడు. మా ఇంటి పక్కనే మాకు బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీ ఉంది. అలాగే మా ఆఫీసు ఒకటి క్లోజ్ చేశాం... ఆ ఆఫీసులో ఉన్న ఇద్దరు పిల్లలు మా ఇంట్లో ఉంటారు. ఇక ఆ ఫ్యామిలీ, ఈ పిల్లలు అందరూ కలిసి చేస్తుంటాం. మా నాన్న కూడా సలహాలు ఇస్తుంటారు. మా తరుణ్కి చాలా స్ట్రెస్ ఉండిందనుకోండి... అప్పుడు వంట చేస్తాడు. నా వంటిల్లు మొత్తం హైజాక్ అయి΄ోతుంది (నవ్వుతూ). వాడి బర్త్డేకి వాడికి తెలియకుండా వంటల బుక్ రాసి, గిఫ్ట్గా ఇచ్చాను. ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ). -
డబ్బాలు, బొట్టు పెట్టెలు, అట్టపెట్టెలు
సాక్షి, సిద్దిపేట: తరతరాల నుంచి సంక్రాంతి నోములు నోచుకునే కుటుంబాలూ ఉన్నాయి. సిద్దిపేట, హైదరాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పండుగ వేళ.. లలితాదేవి పుస్తకం, శ్రీచక్రం, మంగళగౌరి, పీటమీద పిల్లెన్లు, అరుగు మీద అద్దాలు, లాలి గౌరవమ్మ, డబ్బాలు, బొట్టు పెట్టెలు, అట్ట పెట్టెలు, పల్లకి, బతుకమ్మ, కుంకుమ భరణి, క్యారంబోర్డు, గాలిపటాలు, చరఖాలు ఇలా వందల రకాల వస్తువుల్లో ఏదో ఒకదానితో నోముకుంటారు. గౌరమ్మను పెట్టి పసుపు, కుంకుమ వేసి, ఏవైనా ఒకే రకమైన 13 వస్తువులను పెట్టి బంధువులు, స్నేహితుల ఇంటికెళ్లి వాయనం ఇచ్చి వస్తారు. బాలింతలు, చిన్న పిల్లలు ఉన్నవారు ఉగ్గు గిన్నె, నూనె పావు నోములు నోస్తారు. ఆరునెలల ముందే నోము సామగ్రి తెప్పిస్తాంపండుగకు ఆరు నెలల ముందే నోము సామగ్రి తెప్పిస్తాం. స్టీల్ అయితే మచిలీపట్నం, ఇత్తడి సామాను చెన్నై, ప్లాస్టిక్ వస్తువు లను ఢిల్లీ నుంచి తెప్పిస్తాం. మా షాప్నకు వివిధ జిల్లాలవారు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కొందరు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారు. – నార్ల నాగరాజు, నోముల సామగ్రి షాప్ యజమాని, సిద్దిపేట