Tamil Politics
-
హీరో విజయ్కు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
జట్టుగా వచ్చినా.. సింగిల్గా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరో విజయ్కు పరోక్షంగా సవాల్ విసిరారు ఈ యువనేత. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని దీమా ప్రదర్శించారు. హీరో విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తొలి బహిరంగ సభలో తమపై పరోక్షంగా విమర్శలు చేసిన విజయ్పై డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్కు కౌంటర్ ఇచ్చారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు తిరుగులేదని, 2026లోనూ తిరిగి అధికారంలోకి వస్తామంటూ ‘దళపతి’కి పరోక్షంగా జవాబిచ్చారు. తంజావూరులో గురువారం జరిగిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. అక్టోబరు 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో మానాడు పేరుతో మొదటి బహిరంగ సభ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని ఇన్డైరెక్ట్గా స్టాలిన్ ఫ్యామిలీపై ఎటాక్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలను వదిలేసి తమను మాత్రమే విమర్శించడంతో విజయ్పై డీఎంకే నాయకులు మాటల దాడి పెంచారు.ఎంత మంది వచ్చినా మాదే గెలుపుఅయితే తమిళనాడు ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎంత మంది వచ్చినా డీఎంకే నీడను కూడా తాకలేరని తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తున్నామని, 2026 లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడోసారి డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని వ్యతిరేకించేవారంతా జట్టు కట్టినా.. ఢిల్లీ నుంచి వచ్చినా, స్థానికంగా ఏ దిక్కు నుంచి వచ్చినా డీఎంకేనే గెలుస్తుంది. మా పార్టీని నాశనం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతార’ని వార్నింగ్ ఇచ్చారు. కాగా, విజయ్ను ఉద్దేశించే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే విక్రవండిలో మానాడు సభ సందర్భంలో విజయ్కు ఉదయనిధి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.చదవండి: హీరో విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభంవిజయ్ ఓడిపోతాడు..మరోవైపు సూపర్స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ.. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం పార్టీకి గెలుపు అవకాశాలు లేవని, విజయ్ కూడా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. మదురైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదన్నారాయన.చదవండి: ‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?69 సినిమాపై విజయ్ ఫోకస్కాగా, విజయ్ ప్రస్తుతం తన 69 సినిమాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఇదే ఆయన అఖరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. దళపతి రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా ఉంటుందని టాక్. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?
‘సామాజిక స్పృహ టు రాజ్యాధికారం, వయా సినిమా.’ తమిళనాట ఏడున్నర దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న రాజకీయ ఫార్ములా! సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని యత్నించి వెనకడుగు వేసిన చోట, సినీ తుఫాన్ విజయ్కాంత్ రాజకీయంగా మెరుపు మెరిసి కనుమరుగైన చోట, మరో దిగ్గజ నటుడు కమల్హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్న చోట... ఇంకో నటుడు ‘దళపతి’ విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ‘‘మారా ల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటేనా? రాజకీయాలు కూడా మారాలి’’ అన్న ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తాయి. రజనీకాంత్ తర్వాతి తరంలో అత్యధిక అభిమాన గణం ఉన్న నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ ఆగమనం తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తుందా?తమిళ నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పేరిట కొత్త పార్టీని ప్రకటించి, అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి, ఓ జయ లలిత... సినీరంగ నేపథ్యంతో రాజకీయాలకు వచ్చి, తమదైన ముద్ర వేయడమే కాకుండా తమిళనాడు సామాజికార్థిక, రాజకీయ స్థితి గతుల్నే మార్చిన చరిత్ర కొనసాగింపే తాజా పరిణామం. తీవ్రమైన భావోద్వేగాలకు నెలవైన తమిళ నేలలో ‘దళపతి’ ప్రభావమెంత? ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి. అసెంబ్లీలో ప్రత్యర్థి సభ్యులు భౌతికదాడికి పాల్పడి అవమానించినపుడు, ‘ఒక్క డీఎంకే సభ్యుడు కూడా లేని సభకే మళ్లీ వస్తా’నని దివంగత ముఖ్యమంత్రి జయలలిత శపథం చేస్తే, అటువంటి సభనే ఏర్పరచిన తమిళ తీర్పు ఒక భావోద్వేగ చరిత్ర! ఆత్మ గౌరవ ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీని కలిపి 1944లో రామస్వామి పెరియార్ ‘ద్రావిడర్ కజగం’ (డీకే) ఏర్పాటు చేశారు. అర్ధ శతాబ్ధానికి పైగా తమిళనాడును పాలిస్తున్న ద్రవిడ కజగం పార్టీలన్నీ ఈ డీకే నుంచి పుట్టినవే! పెరియార్తో విబేధాలు రావడంతో డీకే నుంచి బయటకొచ్చిన అన్నాదురై... 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్థాపించారు. ద్రవిడ సిద్ధాంతాల ప్రకారం బ్రాహ్మణులు,కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది ఆర్యుల పార్టీల పెత్తనం చెల్లదు. అన్నాదురై తర్వాత డీఎంకేలో ఉంటూ ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రచయిత కరుణానిధి 1969లో ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి తన గురువు అన్నాదురై సిద్ధాంతాలకు విరు ద్ధంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ... నటుడు ఎంజీ రామచంద్రన్ డీఎంకే నుంచి బయటకు వచ్చి 1972లో అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో నటునిగా తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన ఎంజీఆర్, 1977లో అన్నాడీఎంకేని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత కొనసాగించారు. డీఎంకే, అన్నా డీఎంకేలు కేంద్ర ప్రభుత్వాలకు అవసరమైనపుడు ఆ మేరకు మద్దతునిచ్చినా... తమిళనాడులో ఆ యా జాతీయ పార్టీలు బలపడ కుండా అవి నివారించగలిగాయి. దీంతో 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలు డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా నడుస్తున్నాయి. ఎంజీఆర్ స్ఫూర్తితో చాలామంది నటులు రాజకీయ ప్రవేశం చేశారు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మినహా ఎవరూ అంతటి విజయం సాధించలేకపోయారు. ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి ముందు నటించిన సినిమాలను తన రాజకీయ ఆశయాలను ప్రచారం చేయడానికి వాడుకున్నారు. ఇటీవల విజయ్ సినిమాల్లో కూడా ఇదే తంతు కనిపించింది. 2018లో విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో... హీరో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి షాక్ తిని, రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఈ సినిమాలోనే, ఆ సమయంలో అధి కారంలో ఉన్న అన్నాడీఎంకేను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. కానీ, మొదటి బహిరంగ సభలో విజయ్ అన్నాడీఎంకేను ఒక్కమాటా అనలేదు! ఇటీవల విడుదలైన పలు చిత్రాల్లో పరోక్షంగా పంచ్ డైలాగ్స్తో డీఎంకేను విమర్శించారు. పెరియార్, అన్నా పేర్లను స్మరిస్తూ ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని విమర్శిస్తూ, ఆ పార్టీయే మన శత్రువని విజయ్ ప్రకటించారు. హేతువాది పెరియారే తన పార్టీకి విధాన మార్గదర్శి, కానీ పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే తాము అంగీకరించమని చెప్పారు. ఈ విషయంలో ‘ఒకటే వంశం – ఒకటే దేవుడు’ అన్న ‘అన్నా’ సూత్రాన్ని పాటిస్తామన్నారు. విధానపరంగా తమ సిద్ధాంతంలో ద్రవిడ, తమిళ జాతీయవాదం మధ్య విభజన లేదని వ్యాఖ్యానిస్తూ, ఆ రెండూ తనకు రెండు కళ్ళు అని చెప్పారు. పరస్పర విరుద్ధాంశాలపై అభిప్రాయానికి పొంతన లేకపోవడంతో విజయ్ సిద్ధాంతాల్లో స్పష్టత కొరవడినట్టు కనిపిస్తోంది. పార్టీల పేర్లను ప్రస్తావించకుండా, మతోన్మాద బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థిగా చెప్పినప్పటికీ, డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడి నంతగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం పలు ఊహాగానా లకు ఆస్కారం కల్పిస్తోంది. కుల గణన నిర్వహించాలనీ, విద్య ఉద్యో గాల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలనీ చెప్పిన విజయ్, మైనారిటీల గురించి, వారి భద్రత గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడమే ఆయనలోని ద్వైదీభావనకు నిదర్శనం! పలు తమిళ ఫ్యాన్ పేజీల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్తో విజయ్కు పోలికలు తేవడం చూడొచ్చు. వీరిరువురు ఒకరి సినిమాలు ఇంకొకరు రీమేకులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా ఇలాంటి రీమేక్ జరుగుతుందనే చర్చను అభిమానులు తెరపైకి తెస్తున్నారు. విజయ్, పవన్ మధ్య సామ్యాలు ఉన్నన్ని వైరుధ్యాలు కూడా ఉన్నాయి. పైగా, తెలుగు, తమిళ రాజకీయాలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని గమనించాలి. ఏపీలో జనసేన అధికార భాగస్వామ్య పక్షమైన ప్పటికీ, వాస్తవానికి ఆ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలపడలేదు. ఎన్నికల ఫలితాల్లో నూరు శాతం సక్సెస్ రేట్ సాధించినప్పటికీ, పకడ్బందీ పార్టీ వ్యవస్థ ఏర్పడలేదు. రాజకీయ సిద్ధాంత విధానా ల్లోనూ స్పష్టత లేదు. విజయ్ టీవీకేకూ ఇదే వర్తిస్తుంది. ఎంజీఆర్ పార్టీ పెట్టడానికీ, ఇతర నటులు పార్టీ పెట్టడానికీ తేడా ఉంది. ఎంజీఆర్ డీఎంకేను విడిచిపెట్టినప్పుడు, ఆయన అప్పటికే పార్టీలో నంబర్ త్రీగా ఉన్నారు. పదేళ్లు శాసనసభ అనుభవం గడించి ఉన్నారు. డీఎంకే కోశాధికారిగా పనిచేశారు. తమిళనాడులో కొత్త పార్టీలు పెట్టడానికి ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటుందనే వాదన ఉంది. ఎంజీఆర్ వెనుక ఇందిరాగాంధీ ఉన్నారు. కొంతమేరకు విజయం సాధించగలిగిన నటుడు విజయకాంత్ వెనక పన్రుటి ఎస్. రామచంద్రన్ వంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఉన్నారు. మరి, విజయ్ వెనుక కూడా ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానా లున్నాయి. ‘‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాకే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. భావసారూప్య పార్టీలతో పొత్తులకు, కూటమి ఏర్పాట్లకూ సిద్ధమే. మాతో పొత్తు పెట్టుకున్న వారినే అధికారంలో భాగస్వాము లను చేస్తాం’’ అని విజయ్ చెప్పారు. కానీ, సోషల్ మీడియాను దాటి క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే మెజారిటీ సులభంగా కనిపించదు. మరోవైపు, అన్నాడీఎంకే ముందు పరోక్షంగా పొత్తు సంకేతాలు ఉంచి నట్లయ్యింది. ఒకవేళ ఆయన అన్నాడీఎంకేతో కలిసి నడిస్తే కూటమిగా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2021లో అధికార డీఎంకే 37.7 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే 33.29 శాతం ఓట్లు సాధించింది. విజయ్ పార్టీ వచ్చే రెండేళ్లు క్షేత్రస్థాయిలో ఉంటే 7 శాతం వరకు ఓట్లు సాధించవచ్చు. అంటే, విజయ్ అన్నా డీఎంకేతో కలిస్తే, డీఎంకేకు నష్టం కలుగుతుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, డీఎంకేకు లబ్ధి చేకూరుతుంది. అందుకే ఉభయ ద్రవిడ పార్టీలు విజయ్ అడుగులనూ, ఆయనకు లభించే ప్రజాదరణనూ జాగ్రత్తగా గమనిస్తున్నాయి.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
తమిళ రాజకీయాల్లో కలకలం; పన్నీరు సెల్వంపైకి బాటిళ్లు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరుతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలో ఆధిపత్యం కోసం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), ఓ పన్నీర్సెల్వం(ఓపీఎస్) పోటీ పడటంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలని పళనిస్వామి పట్టుబడుతుండగా.. అలాంటిదేమి కుదరదంటూ పన్నీర్సెల్వం అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వెంకటాచలపతి ప్యాలెస్లో గురువారం జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ రసాభాసగా ముగిసింది. సమావేశం ముగియడానికి కొద్దిసేపు ముందు పళనిస్వామి వర్గీయులు పన్నీర్సెల్వంపైకి వాటర్ బాటిళ్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన కారు టైర్లలో గాలి తీసేయడంతో మరో వాహనంలో ఓపీఎస్ వెళ్లిపోయారు. ‘సింగిల్ లీడర్షిప్’కు అనుకూలంగా పలువురు సీనియర్ నాయకులు మాట్లాడారు. అయితే కోర్టు తీర్పు కారణంగా దీనిపై ఎటువంటి తీర్మానం చేయలేకపోయారు. 23 తీర్మానాలు తిరస్కరణ ఓపీఎస్ ఆమోదించిన 23 తీర్మానాలను తిరస్కరిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 23 తీర్మానాలను జనరల్ కౌన్సిల్ సభ్యులంతా వ్యతిరేకించారని, పార్టీ పగ్గాలు ఒక్కరి చేతిలోనే ఉండాలని వారంతా కోరుకుంటున్నారని అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ మునుస్వామి తెలిపారు. జనరల్ కౌన్సిల్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మాజీ మంత్రి జయకుమార్ చెప్పారు. ‘సింగిల్ లీడర్షిప్’ తీర్మానాన్ని తర్వాతి సమావేశంలో ఆమోదింపజేసుకుంటామన్నారు. నాటకీయ పరిణామాలు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరగకుండా చూడాలని పన్నీర్ సెల్వం.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం ముదిరింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఓపీఎస్ మరోసారి కోర్టు తలుపులు తట్టింది. దీనిపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టింది. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకునేందుకు అనుమతి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మిగతా అంశాలపై చర్చపై జరగాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ‘సింగిల్ లీడర్షిప్’పై తీర్మానాన్ని ఆమోదించడానికి వీలు లేకుండా పోయింది. దీనంతటికీ కారణమైన పన్నీర్ సెల్వంపై పళనిస్వామి మద్దతుదారులు కోపంతో రగిలిపోతున్నారు. (క్లిక్: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు ముఖ్యమా?) -
తమిళ రాజకీయాల్లో నవ శకం.. డీఎంకే నయా పంథా
తమిళనాట రాజకీయాల్లో నవ శకం ప్రారంభమైంది. తాజాగా జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ ‘యువ’ మంత్రం జపించింది. అంతేకాదు అతివలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఫస్ట్ టైమర్స్, యువత, చదువుకున్న వారిని ప్రోత్సహించడంతో డీఎంకేపార్టీ నూతనోత్సాహంతో తొనికిసలాడుతోంది. విద్యావంతులకు పెద్దపీట డీఎంకే తరపున మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారిలో 30 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ఒక డాక్టర్ కూడా ఉండటం విశేషం. కాంచీపురం మేయర్గా ఎన్నికైన మహలక్ష్మి యువరాజ్.. ఇన్ఫోసిస్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదులుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదివిన ఎన్. దినేశ్.. తిరుప్పూర్ మేయర్గా ఎన్నికయ్యారు. అలాగే చెన్నై మేయర్గా ఎన్నికై రికార్డు సృష్టించిన ప్రియా రాజన్ కూడా ఎంకామ్ చేశారు. తంజావూర్ డిప్యూటీ మేయర్ అంజుగమ్ భూపతి.. ఎంబీబీఎస్, ఎండీ చదివారు. ఆశ్చర్యకర ఎంపిక కోయంబత్తూర్ మేయర్గా కల్పనా ఆనందకుమార్, చెన్నై మేయర్గా ప్రియా రాజన్ను ఎంపిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణ కుటుంబానికి చెందిన 40 ఏళ్ల కల్పన.. కోయంబత్తూర్కు తొలి మహిళా మేయర్ అయ్యారు. ఆమె స్థానిక డైమండ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, కల్పన భర్త ఆనందకుమార్.. ఈ-సేవ కేంద్రం నిర్వహిస్తూ, మానియాకరంపాళయం ప్రాంత డీఎంకే కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కల్పన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే సమయానికి.. చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసేందుకు భర్తతో పాటు ఆమె ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్నారని పార్టీ వర్గాలు గుర్తు చేసుకున్నాయి. ప్రియా రాజన్ రికార్డు 51 ఏళ్ల తర్వాత మళ్లీ చెన్నై మేయర్ పీఠాన్ని మహిళ అధిష్టించారు. అంతేకాదు అతిచిన్న వయసులో చెన్నై మేయర్గా ఎన్నికైన ఘనత కూడా ప్రియా రాజన్(28)కు దక్కింది. చెన్నై నగర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ సామాజిక వర్గానికి మేయర్ కుర్చీ సొంతమైంది. తారా చెరియన్(1958), కామాక్షి జయరామన్(1971) తర్వాత చెన్నైకి మూడవ మహిళా మేయర్గా ప్రియా రాజన్ నిలిచారు. డీఎంకే నుంచి మేయర్లుగా ఎన్నికైన 20 మందిలో 11 మంది మహిళలు ఉండటం విశేషం. డీఎంకే మిత్ర ధర్మం నగర పాలక సంస్థల ఎన్నికల్లో డీఎంకే విజయఢంకా మోగించి 21 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే మిత్రధర్మాన్ని పాటించి కాంగ్రెస్కు ఒక స్థానాన్ని కట్టబెట్టింది. కుంభకోణం నగర మేయర్ సీటును కాంగ్రెస్ పార్టీకి వదిలిపెట్టింది. అంతేకాదు ఆరు డిప్యూటీ మేయర్ స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చింది. దీంతో కమ్యూనిస్ట్, ఎండీఎంకే, వీసీకే తదితర పార్టీలకు కూడా పదవులు దక్కాయి. 15 డిప్యూటీ మేయర్ స్థానాలకు డీఎంకే పరిమితమైంది. (క్లిక్: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా) స్థాలిన్ ముందుచూపు యువతకు పెద్దపీట వేయడం ద్వారా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ముందుచూపు ప్రదర్శించారు. 20 ఏళ్ల పాటు పార్టీకి సేవలు అందించేలా యువ నాయకులను తయారు చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీలో ఏళ్లకు తరబడి పాతుకుపోయిన నాయకులతో పోలిస్తే కొత్త తరంపై వ్యతిరేకత తక్కువ ఉంటుంది. యువతకు అవకాశం కల్పిస్తే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారన్న ఉద్దేశంతో స్టాలిన్.. నగర పాలక సంస్థల్లో వారికి పెద్దపీట వేసి అనుకున్న ఫలితాలు సాధించారు. (చదవండి: చెన్నై మేయర్గా ప్రియా రాజన్) - సాక్షి, వెబ్ స్పెషల్ -
తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..?
చెన్నె: తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు. పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నో అంచనాలతో దూకుడుతో వచ్చిన సినీ నటీనటులకు మాత్రం ఈ ఎన్నికలు చుక్కలు చూపించాయి. ఒక్క ఉదయనిధి స్టాలిన్ తప్ప అందరూ పరాజయం మూటగట్టుకున్నారు. వారి చరిష్మా వెండితెర వరకే అని ఈ ఎన్నికల తీర్పు చెబుతోంది. తమిళ రాజకీయాలకు సినీ పరిశ్రమకు విడదీయరాని బంధం. కొన్ని దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను సినీ ప్రముఖులు ఏలారు. దాదాపు నలభై ఏళ్లకు పైగా సినీ రంగానికి చెందినవారే రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అప్పుడు వేరు.. ఇప్పుడు వేరనట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సినీతారలంతా పరాజయం పాలయ్యారు. గతంలో రాష్ట్రాన్ని శాసించిన సినీనటులు ఇప్పుడు గెలవడమే కష్టంగా మారింది. ఎంజీఆర్ మొదలుకుని జయలలిత, కరుణానిధి వరకు సినీ పరిశ్రమకు చెందిన వారే. రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించారు. ప్రస్తుతం రాజకీయాలకు సినీ పరిశ్రమ దూరం కానుందేమో. ముఖ్యంగా మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ స్థాపించి బరిలోకి దిగిన కమల్హాసన్కు ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. పార్టీ అధినేత, స్టార్ నటుడిగా ఉన్న కమల్ హాసనే గెలవలేకపోయారు. దీంతోపాటు ఆయన పార్టీ అభ్యర్థులంతా కూడా ఓడిపోయారు. ఎంఎన్ఎం పార్టీ సత్తా చాటలేకపోయింది. ఇక ఖుష్బూను కూడా తమిళ ప్రజలు ఓడించారు. సినీనటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ తన సతీమణి ప్రేమలతను విరుదాచలం నుంచి పోటీ చేయించగా ఆమె పరాజయం పొందారు. సినీ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఈ ఎన్నికల్లో తిరువొత్తియూరు నుంచి ఓడిపోయారు. నటి కుష్బు చెన్నై థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. చెపాక్ నుంచి పోటీచేసిన ఉదయనిధి స్టాలిన్ గెలుపొందాడు. ఈ విధంగా తమిళ ఓటర్లు సినీ పరిశ్రమకు చెందినవారిని విశ్వసించలేదు. ఇక రాజకీయాల్లోకి వస్తానని.. తర్వాత అనారోగ్యంతో దూరమైపోయిన రజనీకాంత్కు ఇదే పరిస్థితి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
వెనక్కి తగ్గని శశికళ: ఆమె ఇంటికి సినీ ప్రముఖుల క్యూ
చెన్నె: జైలు శిక్ష అనుభవించి వచ్చిన శశికళ అన్నాడీఎంకే పార్టీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఆ పార్టీ తనదేనని.. పార్టీ గుర్తుపై ఇప్పటికే కేసు వేసిన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి అన్నాడీఎంకే గుర్తు రెండాకులు వినియోగిస్తోంది. తాజాగా బుధవారం జయలలిత జయంతి సందర్భంగా శశికళ తనను తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకుంది. ఈ మేరకు అదే హోదాతో ప్రకటన విడుదల కావడం విశేషం. కాగా తమిళనాడులో బుధవారం జయలలిత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలందరి అమ్మగా పేరుపొందిన జయలలితను అన్ని పార్టీల నాయకులు స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా జయలలితకు ఘన నివాళులర్పించారు. అయితే పోయెస్ గార్డెన్లో శశికళ తన స్నేహితురాలు జయలలితకు ఘన నివాళులర్పించింది. టీటీవీ దినకరన్తో పాటు తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ తనదేనని శశికళ మరోసారి పునరుద్ఘాటించారు. అమ్మ అభిమానులంతా ఏకం కావాలని శశికళ పిలుపునిచ్చారు. త్వరలోనే అందరినీ కలుసుకుంటానని ప్రకటించారు. తమకు ప్రధాన శత్రువు డీఎంకే అని తెలిపారు. ఈ క్రమంలోనే శశికళ నివాసానికి సినీ ప్రముఖులు వరుస కట్టారు. దర్శకుడు భారతీరాజా, నటులు రాధికా శరత్కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా శశికళను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. వారు శశికళను కలవడం తమిళనాడులో ఆసక్తికరంగా మారింది. అయితే సమావేశంలో రాజకీయంగా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నా.. దీనిపై వారు స్పష్టత ఇచ్చారు. శశికళ అనారోగ్యానికి గురవడం.. జైలు నుంచి రావడంతో ఆమెను పరామర్శించేందుకే వచ్చామని రాధికా శరత్కుమార్ తెలిపారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకే వచ్చినట్లు వివరణ ఇచ్చారు. అయితే రాధికా శరత్ కుమార్ సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. -
అగ్ర హీరోల భేటీ: తమిళనాడులో కాక
చెన్నై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు హాట్టాపిక్గా మారాయి. తాజాగా అగ్ర నటులు రజనీకాంత్, కమల్హాసన్ ఇద్దరూ సమావేశమయ్యారు. వీరిద్దరూ శనివారం భేటీ కావడంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న కమల్హాసన్కు రాజకీయంగా సహకరించేందుకు రజనీకాంత్ రాబోతున్నారని తెలుస్తోంది. చెన్నెలోని పోయెస్గార్డెన్లో రజనీకాంత్ నివాసానికి శనివారం మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, సినీ నటుడు కమలహాసన్ వెళ్లారు. రజనీకాంత్తో కొన్ని నిమిషాల పాటు సమావేశమయ్యారు. అయితే వీరి ఇరువురు ఏం మాట్లాడుకున్నారో తెలియడం లేదు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో రజనీకాంత్ను పరామర్శించేందుకు కమల్ వచ్చాడని అధికారికంగా తెలుస్తోంది. కాకపోతే దానితోపాటు రాజకీయంగా కూడా చర్చించేందుకు కమల్ వచ్చాడని సమాచారం. 2018లో కమల్హాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యం పార్టీకి రజనీకాంత్ మద్దతు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీతో కమల్కు ఒప్పందం జరిగిందని.. ఇక రజనీకాంత్ మద్దతు ఇస్తే రాష్ట్రంలో బలమైన శక్తిగా తయారు కావొచ్చని కమల్ హాసన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్తో సమావేశమైనట్లు తమిళ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకేతో పాటు ఇటీవల జైలు నుంచి వచ్చిన శశికళ రావడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తాజాగా రజనీ, కమల్ భేటితో మరింత ఉత్కంఠగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతోందననే ఆసక్తిగా మారింది. మూడోసారి అధికారంలోకి రావాలని అన్నాడీఎంకే భావిస్తుండగా.. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావాలని డీఎంకే తీవ్రంగా శ్రమిస్తుండగా.. బీజేపీ మాత్రం తొలిసారిగా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ప్రస్తుత అధికార పార్టీకి అండగా నిలుస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎన్నికల వరకు వేచి చూడాలి. #MakkalNeedhiMaiam President #Kamalhassan sir visited the residence of #Rajinikanth sir at Poes Garden and had met him. The meeting between them took place for nearly 20 minutes. pic.twitter.com/BSfGMeH73q — Yuvraaj (@proyuvraaj) February 20, 2021 -
శశికళ కొత్త ఎత్తుగడ.. ఫలించేనా?!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు నుంచి విడుదలైన ఎంకే శశికళ ఎన్నికల్లో పోటీకి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించే పనిలోపడ్డారు. సిక్కిం రాజకీయాలను ఉదాహరణగా చూపుతూ ఆరేళ్ల నిషేధం తొలగింపుపై చట్టపరంగా పోరాడనున్నారు. శశికళ అనుచరులు న్యాయకోవిదులతో చర్చలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న శశికళ గత నెల 27వ తేదీన జైలు నుంచి విడుదలైనా తమిళనాడు అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేదు. ఆర్థికనేరంపై జైలు శిక్ష అనుభవించిన శశికళ 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆరేళ్లపాటూ అంటే 2027 జనవరి వరకు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. పార్టీ సారధ్య బాధ్యతలకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకి లేదు. అయితే ఈ ఆరేళ్ల కాలం నిషేధంపై న్యాయస్థానంలో సవాలు చేయాలని ఆమె అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంలో సిక్కిం రాష్ట్ర రాజకీయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. సిక్కిం రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి ప్రేమ్సింగ్ దమాంగ్ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు. ఆరేళ్లు పోటీచేసేందుకు వీలులేదని చట్ట నిపుణులు ఆయనకు చెప్పినా 2019లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆరేళ్ల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన చేసుకున్న విన్నపాన్ని ఎన్నికల కమిషన్ అమోదించింది. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 11 ప్రకారం సడలింపుకు అవకాశం ఉందని అంటున్నారు. సిక్కిం సీఎంలా శశికళ కూడా సడలింపు పొందే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల కమిషన్ను కలుసుకోవాలని భావిస్తున్నారు. శశికళ న్యాయవాదులు చట్ట నిపుణులతో చర్చిస్తున్నారు. శశికళ చెన్నైకి చేరుకోగానే ఆమెతో నేరుగా మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శశికళకు మార్గం సుగమం అవుతుందని, ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారని అనుచరులు ఢంకా భజాయించి చెబుతున్నారు. చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత -
రజనీకాంత్ ‘ఆగమనం’
రాజకీయ రంగప్రవేశంపై అసంఖ్యాక అభిమానుల్ని ఊరిస్తూ వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్టు గురువారం ప్రకటించారు. 2017 డిసెంబర్లోనూ, మొన్న మార్చిలోనూ కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. ఆ రెండు సందర్భాల్లోనూ ‘రాజకీయాల్లోకొస్తానుగానీ, పోటీ చేయబోన’ని చెప్పారు. ఈసారి మాత్రం వచ్చే జనవరిలో తాను స్థాపించబోయే పార్టీ ఎన్నికల్లో తలపడుతుందన్న అభిప్రాయం కలిగించారు. ఆయన బరిలో వుంటారా లేదా అన్న అంశంలో స్పష్టతనీయలేదు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ జరగద’ంటూ ఆయన చేసిన ట్వీట్ను బట్టి చూస్తే రజనీకాంత్ పూర్తి స్థాయిలో రాదల్చుకున్నట్టు అర్థమవుతోంది. పార్టీ ఆవిర్భావం తేదీ, ఇతర వివరాలు ఈనెల 31న వెల్లడిస్తారు గనుక అప్పుడు మరింత స్పష్టత వస్తుంది. తమిళనాట రాజకీయ పార్టీలకు కొదవలేదు. ఇప్పటికే డీఎంకే, అన్నా డీఎంకేలతోపాటు వైకో నేతృత్వంలోని ఎండీఎంకే, డాక్టర్ రాందాస్ నాయకత్వంలోని పీఎంకే, నటుడు విజయ్కాంత్ సారథ్యంలోని డీఎండీకే, శశికళకు చెందిన ఎంఎంఎంకేవంటి పార్టీలెన్నో వున్నాయి. రెండేళ్లక్రితం ప్రముఖ నటుడు కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పేరిట పార్టీని స్థాపించారు. సీఎన్ అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వీరంతా ఆ రాష్ట్రంలో వెల్లువెత్తిన ద్రవిడ ఉద్యమ ప్రభావంతో అడుగుపెట్టారు. ఆ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామి హేతువాదం, ఆత్మగౌరవం, మహిళల హక్కులు, కులనిర్మూలన తదితర సిద్ధాంతాల ప్రాతిపదికగా దాన్ని నడిపించారు. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఆ ఉద్యమం సాధించుకున్న విజయాలను సుస్థిరం చేసుకోవడానికి ద్రవిడ కజగం పార్టీని స్థాపించారు. అయితే ఆయన ప్రధాన అనుచరుడిగా ఆ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన అన్నాదురై పెరియార్తో అనంతరకాలంలో విభేదించి డీఎంకే పార్టీకి అంకురార్పణ చేశారు. 1965లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం హిందీని ఏకైక అధికార భాష చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతి రేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉద్యమాలు పెల్లుబికినప్పుడు తమిళనాడులో అన్నాదురై దానికి నేతృత్వం వహించారు. ఆ ఉద్యమం కాంగ్రెస్ను శాశ్వత సమాధి చేసింది. కాంగ్రెస్ మాత్రమే కాదు... ఏ జాతీయ పార్టీకీ అక్కడ నిలువనీడ లేకుండాపోయింది. ఎన్నికల్లో గెలవాలనుకునే జాతీయ పార్టీ రాష్ట్రంలోని ద్రవిడ పార్టీలతో జతకట్టక తప్పని స్థితి ఏర్పడింది. తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వం కొన్ని ఒడిదుడుకులతోనే అయినా నిరా టంకంగా సాగుతోంది. ఆ పార్టీ చీలిపోతుందని 2016లో ఆ పార్టీ అధినేత జయలలిత మరణా నంతరం చెప్పినవారు చాలామందే వున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, మాజీ సీఎం ఒ. పన్నీరు సెల్వంల మధ్య కొంతకాలం పార్టీ రెండుగా చీలిన మాట వాస్తవమే. కానీ త్వరలోనే అదంతా సర్దుకుంది. ముఖ్యమంత్రి కావాలనుకున్న జయలలిత సన్నిహి తురాలు శశికళ చివరి నిమిషంలో అవినీతి కేసులో జైలుపాలయ్యారు. అధికారం వుందన్నమాటే గానీ, అన్నాడీఎంకే అత్యంత బలహీన స్థితిలోవుంది. కరుణానిధి తనయుడు స్టాలిన్ ఆధ్వర్యంలోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పటిష్టంగానే వున్నా ఆయనకు తన సోదరుడు అళగిరితో వైరం వుంది. పైగా కరుణానిధికున్నంత ప్రజాదరణ స్టాలిన్కు వుందో లేదో ఇంకా తేలాల్సివుంది. వచ్చే ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఆవరిం చిందన్న అభిప్రాయం చాలామందిలో వుంది. ఆ అభిప్రాయంతోనే గతంలో కమలహాసన్ రాజ కీయాల్లోకొచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ ఉద్దేశమైనా అదే కావొచ్చు. వర్తమాన రాజకీయ దుస్థితి చూసి ఆగ్రహం కలగడం వల్లే రాజకీయాల్లోకి రావాలనిపించిందని గతంలో రజనీకాంత్ చెప్పారు. నిజాయితీగా, అవినీతిరహితంగా, పారదర్శకంగా, సెక్యులర్ సిద్ధాంతాలతో తన పార్టీ వుంటుందని తాజాగా రజనీకాంత్ ప్రకటించారు. అలాగే ఎన్నికల్లో నెగ్గడానికి ‘ఆధ్యాత్మిక రాజకీయాల’ను పాటి స్తానని కూడా తెలియజేశారు. ఆధ్యాత్మిక రాజకీయాలు అనే మాట ఆయన గతంలోనూ ఉపయో గించారు. అయితే దాని స్వరూపస్వభావాలేమిటో ఇంతవరకూ చెప్పలేదు. డిసెంబర్ 31న జరగ బోయే సమావేశంలోనైనా దాని గురించి అందరికీ స్పష్టత లభించగలదని ఆశించాలి. ‘ఆధ్యాత్మికం’ అనేసరికి రజనీకాంత్ బీజేపీవైపు వెళ్తారన్న అభిప్రాయం మాత్రం అందరిలోనూ కలిగింది. ఇంతవరకూ ఆయన ఏ పార్టీనీ విమర్శించలేదు. ఎవరినీ సమర్థించలేదు. ఆయనెప్పుడూ వివాదాలకు దూరమే. కానీ రాజకీయాల్లోకొచ్చాక అది సాధ్యపడదు. దేశాన్ని, రాష్ట్రాన్ని కలవరపరిచే ప్రతి సమస్యపైనా స్పందించాల్సివస్తుంది. తాను సూచించే ప్రత్యామ్నాయమేమిటో వెల్లడించాలి. సినిమా రంగం ఒక కాల్పనిక జగత్తు. అందులో అగ్రశ్రేణి నటుడుగా రజనీకాంత్కు అత్యంత ప్రజా దరణ వుంది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఆయనకు లక్షలాదిమంది అభిమానులున్నారు. తమిళ నాడులో మూలమూలనా ఆయన అభిమాన సంఘాలున్నాయి. ఆ సంఘాలన్నీ రజనీ రాజకీయా ల్లోకి రావాలని దాదాపు పాతికేళ్లుగా కోరుతున్నాయి. ఈ అభిమానం పార్టీని సాధారణ ప్రజానీకానికి చేర్చడంలో మంచి దోహదకారి అవుతుంది. అయితే పార్టీ శాశ్వతంగా వేళ్లూనుకోవాలన్నా, మరిం తగా విస్తరించాలన్నా ప్రజలకు మెరుగైన ప్రత్యామ్నాయం చూపాల్సివుంటుంది. సమస్యలపైనా, విధానాలపైనా ఊగిసలాట లేని వైఖరిని ప్రదర్శించాల్సివుంటుంది. బలమైన క్యాడర్ను నిర్మించు కోవాల్సివుంటుంది. ఇప్పటికైతే బీజేపీ, అన్నాడీఎంకేలు రెండూ ఆయన తమతో చెలిమి చేస్తారన్న ఆశాభావం ప్రకటించాయి. ఇకపై ప్రజలు ఆయన్ను నిశితంగా గమనిస్తారు. కనుక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికే వస్తున్నారన్న అభిప్రాయం కలగకుండా రజనీకాంత్ జాగ్రత్తపడక తప్పదు. -
సినిమాను ఏలింది చాలు.. రాజకీయాల్లోకి రండి!
చెన్నై : ‘మీరు సినిమాను ఏలింది చాలు– ఇక తమిళనాడును పాలించేందుకు రండి’. నటుడిగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హీరో సూర్య తన అభిమానుల నుంచి ఈరకమైన రాజకీయ ఆహ్వానాన్ని అందుకున్నారు. తమిళనాడులో సినీ, రాజకీయరంగాలకు మధ్య ఉన్న అనుబంధం జగమెరిగిన సత్యమే. తాజాగా నటుడు సూర్య పైనా రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. సూర్య రాష్ట్ర వ్యాప్తంగా తమ అగరం ఫౌండేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలను చేస్తున్నారు. దీంతో సూర్య రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్ష ఆయన అభిమానుల్లో పెరుగుతోంది. సూర్య నటుడిగా పరిచయమై శనివారానికి 23 ఏళ్లు అవుతుంది. ( మరోసారి మంచి మనసు చాటుకున్న సూర్య ) ఈ సందర్భంగా ‘మీరు సినిమాను ఏలింది చాలు ఇక తమిళనాడును పాలించడానికి రండి’ అనే నినాదంతో సూర్య అభిమానుల పోస్టర్లు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వెలిశాయి. అందులో విప్లవ నాయకుడు చేగువేరా రూపంలో సూర్య ఫొటోలు పొందుపరిచి పక్కన తమిళనాడు సచివాలయం ఫొటోను ముద్రించారు. ఈ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
రాజకీయాల్లో టాప్ హీరో పోస్టర్ల కలకలం
చెన్నై : హీరో విజయ్కి సంబంధించిన పోస్టర్లతో తమిళనాడులో మరోసారి రాజకీయ కలకలం చెలరేగుతోంది. రజనీకాంత్ తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ అని చెప్పవచ్చు. ఈయనకి అభిమానగణం కూడా చాలా ఎక్కువే. అదేవిధంగా రజనీకాంత్ మాదిరిగానే విజయ్కు రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆసక్తి ఉందన్నది ఎవరూ కాదనలేని మాట. ఇకపోతే విజయ్ అభిమానులు ముద్రిస్తున్న పోస్టర్లు చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అదేవిధంగా ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా అన్నాదురై, పెరియార్లతో విజయ్ ఫొటోలను ముద్రించిన పోస్టర్లను అభిమానులు ఈ సందర్భంగా విడుదల చేశారు. అందులో మీరు రాజకీయాల్లోకి వస్తే అన్నాదురై లేకుంటే పెరియార్ అంటూ పేర్కొన్నారు. (పదేళ్లకు జోడీ కుదిరింది ) తాజాగా నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ నటించిన చిత్రాల్లోని ఆయన గెటప్లలో విజయ్ ముఖాలను పొందుపరిచిన పోస్టర్లు కాంచీపురంలో హల్చల్ చేస్తున్నాయి. అందులో నాడొడి మన్నన్ మాట్టుక్కార వేలన్, కుడియిరుంద, కోయిల్ చిత్రంలోని ఎంజీ రామచంద్రన్ గెటప్పుల్లో విజయ్ ముఖాన్ని పొందుపరిచారు. ఆ పోస్టర్లో మక్కల్ తిలకంకు మరో రూపమే అంటూ పేర్కొన్నారు. 2021 ప్రథమార్థంలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పోస్టర్లూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా వీటి గురించి ప్రముఖ చానల్లో చర్చావేదిక కూడా జరగడం విశేషం. (కూతురుతో సహా సినీ నటి అదృశ్యం) -
అవసరమైతే కలిసి పనిచేస్తాం
సాక్షి, చెన్నై: తమిళ ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి సిద్ధమేనని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల హాసన్, రజనీకాంత్ మంగళవారం వేర్వేరుగా వ్యాఖ్యానించారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేసి డిసెంబరుతో ఏడాది కానుంది. అయితే ఆయన ఇంత వరకు పార్టీ ›ప్రకటన చేయలేదు. తన లక్ష్యం 2021 అసెంబ్లీ ఎన్నికలే అని చెబుతూ వస్తున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరో వైపు సమయానుగుణంగా రాజకీయ వ్యాఖ్యలను పేల్చుతూ వస్తున్నారు. అదే సమయంలో రజనీ కన్నా ముందుగా కమల్ మక్కల్ నీది మయ్యం పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 8న కమల్ బర్త్డే సందర్భంగా రాజ్కమల్ కార్యాలయంలో జరిగిన దివంగత దర్శకుడు బాలచందర్ విగ్రహావిష్కరణకు రజనీ హాజరయ్యారు. తాను కాషాయం వలలో పడనని కమల్తో తన బంధం విడదీయరానిదిగా రజనీ వ్యాఖ్యానించారు. అలాగే రజనీకాంత్ను తనను ఎవరూ విడదీయలేరని, తమ మధ్య రహస్య ఒప్పందం ఉందని కమల్ వ్యాఖ్యానించి రాజకీయ చర్చకు తెరలేపారు. ఈ ఇద్దరు ఏకం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ మొదలైంది. ఇందుకు తగ్గట్టుగా మంగళవారం రజనీ వ్యాఖ్యలు చేయడం, అందుకు తగ్గట్టుగా కమల్ స్పందించడం ఆ చర్చలకు బలాన్ని చేకూర్చాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తమిళనాట చర్చ జోరందుకునేలా చేశాయి. కలిసి పనిచేయడానికి రెడీ రజనీ కాంత్ మంగళవారం మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తమిళ ప్రజల సంక్షేమం కోసం తప్పని సరి అయినా, అవశ్యమైనా కమల్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అదే సమయంలో ఒడిశాలో జరిగిన డాక్టరేట్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని చెన్నైకు వచ్చిన కమల్ మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రజల సంక్షేమం, తమిళనాడు అభివృద్ధి కాంక్షిస్తూ అవసరం అయితే రజనీకాంత్తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు. తమ ఇద్దరు 44 ఏళ్లుగా సినీ రంగంలో కలిసి పనిచేస్తున్నామని, ప్రజాహితం కోసం కలయిక అవశ్యం అయితే సిద్ధమేనని వ్యాఖ్యానించారు. కాగా, రజనీ, కమల్, విజయ్ వంటి నటులు అందరూ ఏకమై వచ్చినా అన్నాడీఎంకేకు ఢోకా లేదని.. 2021 ఎన్నికల్లో మళ్లీ అధికారం అన్నాడీఎంకేకు దక్కుతుందని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
నేను కరుణానిధిని కాను.. కానీ...
‘‘నేను కరుణానిధిని కాను. కానీ నా తండ్రిలా మారేందుకు ప్రయత్నించే దమ్ము, ధైర్యం నాకున్నాయి’’ ఇదీ.. డీఎంకే అధిపతి స్టాలిన్ ఉద్వేగ పూరితంగా చేసిన తొలి ప్రసంగం. ఇదే ప్రసంగం... ఎనిమిదేళ్లుగా విజయదాహంతో పరితపిస్తున్న డీఎంకేని ఆయన గెలుపు తీరాలకు చేర్చేలా చేసింది. కరుణానిధి స్థానంలో డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టినప్పడు ఎం.కె.స్టాలిన్ తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయగలడా? అన్న రాజకీయ వర్గాల గుసగుసలకు స్వస్తిపలుకుతూ... పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని చూరగొనడానికి స్టాలిన్కి 2019 సార్వత్రిక ఎన్నికలు మంచి అవకాశాన్నిచ్చాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు మినహా మిగిలిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకొని విజయదుంధుభి మోగించి, తమిళ ప్రజల్లో కలైంజర్ కరుణానిధికి తగ్గ వారసుడన్న ముద్ర వేయటంలో స్టాలిన్ కృతకృత్యులయ్యారు. నిజానికి ప్రారంభంలో స్టాలిన్ సోదరుడు ఎంకే అళగిరి సైతం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో సోదరులిద్దరినీ విభజించి పబ్బం గడుపుకోవాలని బీజేపీ తమిళనాట అడుగుపెట్టే ప్రయత్నాలు జోరుగానే చేసింది. ఇదంతా చూసి... అళగిరితో ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకొని ద్రవిడ భూమిలో పాదం మోపాలన్న బీజేపీ ప్రయత్నాన్ని స్టాలిన్ చిత్తుచేయగలిగారు. జయలలిత, కరుణానిధి లేని తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను అత్యంత సమర్థవంతంగా భర్తీ చేసిన స్టాలిన్ అతి కొద్దికాలంలోనే తమిళ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. మోదీ గాలికి వ్యతిరేకంగా.. 2019 ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అతికొద్ది రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఒక్క లోక్సభ సీటు మినహా తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్నిటికి అన్నింటినీ కైవసం చేసుకుని, డీఎంకే తన రాజకీయప్రస్థానాన్ని సుస్థిరపరుచుకుంది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం డీఎంకే విజయం సాధిస్తుందని ఆకాంక్షించినా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ గెలవడం డీఎంకే ఉత్సాహాన్ని కొంత నీరుగార్చింది. తండ్రి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న స్టాలిన్ దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి తమిళనాట చరిత్ర సృష్టించగలిగారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ పార్లమెంటులో డీఎంకే ఎంపీలు అనుసరించిన వామపక్ష అనుకూల వైఖరి, రాజకీయవర్గాల్లో స్టాలిన్పై విశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. అది రుజువైంది.. ఒకసారి డీఎంకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక స్టాలిన్ తనని తాను సమర్థవంతంగా రుజువు చేసుకున్నారని స్టాలిన్ చిరకాల సహచరుడు, రాజ్యసభలో డీఎంకే పార్లమెంటరీ పార్టీ నాయకుడు తిరుచ్చి శివ వ్యాఖ్యానించారు. అయితే స్టాలిన్కీ అతని తండ్రి కరుణానిధికీ మధ్య ఉన్న విభేదాల విషయాన్ని చాలా మంది ప్రస్తావనకు తెస్తున్నారు. అయితే ఏ ఇద్దరూ ఒకేరకంగా ఉండరనీ, కశ్మీర్ విషయంలో స్టాలిన్ తీసుకున్న బీజేపీ వ్యతిరేక విధానం, కశ్మీర్లో అరెస్టు చేసిన రాజకీయ నాయకులను విడుదల చేయాలంటూ డీఎంకే ఎంపీలు ఢిల్లీలో నిరసనకు దిగడం స్టాలిన్కీ, కరుణానిధికీ ఉన్న సారూప్యతకు అద్దం పడుతోందనీ, సరిగ్గా కరుణానిధి ఇలాగే ఉండేవారని ఆయన చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకోలేదా? ఏఐడీఎంకేలోని లోపాలను స్టాలిన్ వాడుకోలేకపోయారన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. అయితే శత్రువు బలహీనతలను వాడుకొని, వారిని దెబ్బతీసే మనస్తత్వం ఆయనది కాదని కొందరి భావన. 2016లో జయలలిత మరణానంతరం ఏఐడీఎంకే లో విభేదాలను ఆయన నేర్పుగా ఉపయోగించుకొని ఉండాల్సిందన్న అభిప్రాయం వారిలో ఉంది. అలాగే దాదాపు 34 ఏళ్ళ పాటు డీఎంకే యువజన నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించిన స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధికి డీఎంకే యువజన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పడం పట్ల సైతం కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే 2019 ఎన్నికల విజయోత్సాహాన్ని చేబూని, నాయకుడిగా తనని తాను నిలబెట్టుకుంటూనే, రాబోయే ఎన్నికల్లో పార్టీ స్థానాన్ని సుస్థిరపరుచుకునే వైపు స్టాలిన్ అడుగులు వేస్తున్నారు. దినకరన్, నటుడు కమల్హాసన్, డీఎంకేకి పెద్ద ప్రమాదకరం కాదని గత ఎన్నికలు రుజువు చేశాయి. రాబోయే ఎన్నికల్లో సైతం డీఎంకే, ఏఐడీఎంకేల మధ్యనే పోటీ ఉండనుంది. అయితే 2021 ఎన్నికల్లో రజనీకాంత్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది. (చదవండి: వారసుడి ప్రజాయాత్ర) -
కుల, జాతి సంఘాల వ్యక్తులపై నిషేధం : రజనీకాంత్
సాక్షి, చెన్నై : తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో సరికొత్త పంథాను ఎంచుకున్నారు. రాజకీయ పార్టీని ప్రకటించడానికి ముందుగానే సభ్యత్వాల నమోదు చేయించాలని రజనీకాంత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం మక్కల్ మండ్రంను ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే రజనీకి సంబంధించిన పార్టీ సభ్యత్వాల సంఖ్య కోటి దాటిపోవడం విశేషం. అయితే మక్కల్ మండ్రం విధివిధానాలతో కూడిన 32 పేజీల పుస్తకాన్ని రజనీకాంత్ మంగళవారం విడుదల చేశారు. దీనిలో కుల, మత, వారసత్వరాజకీయాలకు చోటులేదని స్పష్టం చేశారు. ఒకే కుటుంబానికి ఒకే పదవి అని మక్కల్ మండ్రం విధివిధానాల్లో పేర్కొన్నారు. ఏదైనా కుల, జాతి సంఘాల్లోని వ్యక్తులకు రజనీ మక్కల్ మండ్రంలో నిషేధం విధించారు. అంతేకాకుండా మక్కల్ మండ్రం జెండాను కూడా ఎక్కడ పడితే అక్కడ వాడకూడదని ఆంక్షలు విధించారు. కేవలం సమావేశాలున్న సమయాల్లో మాత్రమే వాడాలని సూచించారు. మక్కల్ మండ్రం గురించి పబ్లిక్లో ఎవరూ మాట్లాడరాదని ఆంక్షలు విధించారు. -
కరుణానిధితోనే ఇవి సాధ్యమయ్యాయి
దాదాపు యాభై ఏళ్ల క్రితం (1970 ఫిబ్రవరిలో) తిరుచ్చిలో జరిగిన డీఎంకే మహాసభలో ’రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు, కేంద్రంలో సమాఖ్య వ్యవస్థ’ (మానిలాతిలే సుయాచ్చి, మతిఇలేకూటచ్చి)అనే నినాదాన్ని కరుణానిధి మళ్లీ వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. దీనికి అక్కడి ప్రజల నుంచే కాకుండా, వివిధ రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలు,నాయకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కేంద్ర,రాష్ట్ర సంబంధాల్లో నూతన మార్పులు అవసరమన్న పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై తీసుకొచ్చిన ఈ డిమాండ్కు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా మళ్లీ ఈ నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, హక్కుల విషయంలో కేంద్రం జోక్యాన్ని డీఎంకే ఆధ్వర్యంలో ఆయన గట్టిగా అడ్డుకున్నారు. అన్నాదురై అడుగుజాడల్లోనే ఈ అంశానికి కరుణానిధి అత్యంత ప్రాధాన్యతినిచ్చారు. రాష్ట్రాలకు తగినన్నీ అధికారాలిస్తేనే కేంద్రం ఆదర్శవంతంగా ఉన్నట్టుగా భావిస్తామని, అదే దేశ సమైక్యత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తాయన్న అన్నాదురై వాదనను ఆయన మరింత ముందుకు తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్కారియా కమిషన్ కేంద్రరాష్ట్ర సంబంధాలు అధ్యయనం చేయడానికి 14 ఏళ్ల ముందే 1974లోనే రాజమన్నార్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధి ప్రభుత్వం తీర్మానం ఆమోదించింది. సమాఖ్య వ్యవస్థలో భాగంగా రాష్ట్రాలకు పూర్తి ప్రతిపత్తిని కల్పించేందుకు వీలుగా భారత రాజ్యాంగానికి వెంటనే అవసరమైన మార్పులు చేయాలంటూ ఇందులో కేంద్రాన్ని డిమాండ్చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన కాలం నుంచి చూస్తే 1974లో చేసిన ఈ తీర్మానానికి దేశ రాజకీయాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని తమిళరచయిత ఆలి సెంథిలినాథన్ పేర్కొన్నారు. కరుణానిధి సీఎంగా ఉన్న 1970-75 మధ్యకాలం తమిళనాడుకు స్వర్ణయుగంగా పిలవవచ్చునని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పన అనే ఆలోచనను మళ్లీ చర్చనీయాంశం చేయడం వల్ల అదే తమిళనాడు రాజకీయ సిద్ధాంతంగా మార్పు చెందిందన్నారు. 1970 నుంచే తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక పతాకం (జెండా) ఉండాలనే డిమాండ్కు కరుణానిధి ప్రాచుర్యం కల్పించారు. 1974 వరకు స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రాష్ట్రాల సీఎంలకు జాతీయపతాకాన్ని ఎగురవేసే అవకాశం ఉండేది కాదు. ఆ తర్వాత సీఎంలకు ఆ హక్కు కల్పించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినపుడు అధికారంలో ఉన్న కాంగ్రేసేతర డీఎంకే ప్రభుత్వం ఒక్కటే ఎమర్జెన్సీని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే కరుణానిధి ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దుచేసింది. డీఎంకే పార్టీ నాయకులు చాలా మంది ఎమర్జెన్సీ ఎత్తేసేవరకు జైళ్లలోనే ఉండాల్సి వచ్చింది. 1980 దశకం చివర్లో దేశంలో సంకీర్ణ రాజకీయాల వ్యూహాకర్తగా కరుణానిధి పేరుగాంచారు. 1983లో శ్రీలంక తమిళుల సమస్యపై కాంగ్రెస్తో బంధాన్ని తెంచుకున్నారు. వీపీసింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. జాతీయ రాజకీయ క్షేత్రంలో ఓ ప్రాంతీయపార్టీ నేత కీలకపాత్ర పోషించడం గొప్ప విషయమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. -
చిన్నమ్మ చిరాకు
సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’పై శశికళ చిరాకు పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్బావ సభలో దినకరన్ తనను తాను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా శశికళను ప్రస్తావించడం, అడయారులోని దినకరన్ ఇంటినే పార్టీ చిరునామాగా చూపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టే ఆలోచన లేదని ఈ ఏడాది జనవరి 17వ తేదీన నీలగిరిలో ప్రకటించిన దినకరన్ అకస్మాత్తుగా పార్టీని ప్రకటించడం వెనుక అంతరార్థం ఏమిటని చిన్నమ్మ సన్నిహితుల వద్ద ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీ పెట్టడంతో ఎంజీఆర్ సినిమాల్లో విలన్లా అన్నాడీఎంకేను, పార్టీ చిహ్నాన్ని ఎడపాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గానికి దినకరన్ అప్పగించినట్లయిందని శశికళ కోపగించుకున్నట్టు తెలుస్తోంది. దినకరన్ పార్టీ పెట్టడం శశికళ కుటుంబంలోని పలువురు సభ్యులకు కూడా ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు దినకరన్ పార్టీలో అప్పుడే అసంతృప్తి చెలరేగింది. ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ శనివారం పార్టీ నుంచి తప్పుకున్నారు. -
దినకరన్కు సీనియర్ నేత ఝలక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’లో ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ వైదొలిగారు. మరే పార్టీలో చేరనని, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటునానని తెలిపారు. నాంజిల్తోపాటు మరికొందరు దినకరన్ అనుచర నేతలు సైతం అదేరకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమిళ ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించే ద్రవిడ సిద్ధాంతాలు, అన్నాదురైకి చోటు లేకుండా కేవలం జయలలిత బొమ్మతో నెగ్గుకురావడం అసాధ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. అమ్మను అవమానిస్తున్నారు: దినకరన్ తన పార్టీ పతాకంలో జయలలిత బొమ్మవేయడాన్ని తప్పుపడుతూ పార్టీ నుంచి వైదొలగడం ద్వారా నాంజిల్ సంపత్ అమ్మను అవమానించాడని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆయన ఎంతో సీనియర్ డీఎంకే, ఎండీఎంకేల నుంచి అన్నాడీఎంకేలో చేరినవారన్నారు. ఇపుడే తానేదో పచ్చి అబద్ధాలు చెబుతున్నానని చెప్పడాన్ని అంగీకరించనని అన్నారు. పార్టీ ఏర్పాటు, పేరు నిర్ణయాన్ని అందరితోనూ చర్చించలేనని స్పష్టం చేశారు. ప్రజలు ఏం కొరుకుంటున్నారో అదిమాత్రమే తాను చేయగలనని అన్నారు. పార్టీ తొలి సమావేశాన్ని ఈనెల 24వ తేదీన తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నట్లు దికరన్ ప్రకటించారు. -
కమల్.. నాస్తికత్వంతో ఎలా?
సాక్షి, చెన్నై : రాజకీయ అరంగ్రేటంపై ఊరిస్తూ వచ్చిన లోకనాయకుడు ‘మక్కళ్ నీది మయ్యం’ పేరిట పార్టీని ప్రకటించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. పార్టీ విధివిధానాల్లో వైవిధ్యత ఉంటుందని చెబుతున్నప్పటికీ.. అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో ద్రవిడ భావజాలాన్ని తన పార్టీ అనుసరించే తీరుతుందన్న సంకేతాలను ఆయన అందించారు. గతాన్ని ఓసారి పరిశీలిస్తే... ద్రవిడ పార్టీలకు ప్రధాన పునాది నాస్తికత్వం. మతం, ఆధ్యాత్మికతను తీవ్రంగా వ్యతిరేకం. బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా, కుల వివక్షపై పోరాటం దిశగా అవి పుట్టుకొచ్చాయి. అయితే ఆ క్రమంలో పార్టీలు (డీఎంకే తప్ప) తమిళ రాజకీయాల్లో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. డీకే(ద్రవిడ కగళమ్)ను ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు చూపిస్తుంటారు. డీఎంకే నుంచి అన్నాడీఎంకే ఏర్పడ్డాక ఎంజీఆర్ కొంత ఉదారంగా వ్యవహరించటం మొదలుపెట్టారు. స్వతహాగా దేవుడ్ని నమ్మే ఆయన.. రహస్యంగా ఆయన దేవాలయాలను సందర్శించేవారన్న వార్త బయటకు పొక్కటం.. ఆయన వ్యవహార శైలిపై విమర్శలు వచ్చాయి. పదేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరుణానిధి శ్రీపురం స్వర్ణ దేవాలయం సందర్శించుకోవటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో శివాజీ గణేశన్కు ఇలాంటి సమస్యే ఎదురైంది. అస్థికుడు అయినప్పటికీ తొలినాళ్లలో ఆయన డీఎంకే మద్ధతుదారుడిగా ఉన్నారు. ఓసారి తిరుమలకు వెళ్లి దేవుడ్ని దర్శించుకోగా.. డీఎంకే ఆయనను తీవ్రంగా మందలించింది. తర్వాత కాంగ్రెస్పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావటం, 1987లో ‘తమిళ మున్నేట్ర మున్నాని’ పార్టీ స్థాపన, ప్రత్యర్థుల దెబ్బకు అది మనుగడ కొనసాగించలేకపోవటం.. ఇలా అస్తికత్వం మూలంగానే ఆయన విఫలం అయ్యారని చెబుతుంటారు. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక పాలన నినాదంతో రాజకీయాల్లోకి వస్తున్న రజనీకాంత్ ఎలా రాణిస్తాడో? జయ విషయంలో మాత్రం ... ఇక జయలలిత అయితే మొదటిసారి అధికారం చేపట్టగానే ద్రవిడ సిద్ధాంతాలకు, దాని భావజాలానికి కాస్త దూరంగా ఉన్నారు. దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు. దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. అలాగని ఆమె పూర్తిగా ఆ సిద్ధాంతాన్ని విస్మరించలేదు. దీంతో ఆమె ద్వంద్వ వైఖరిపైనా ద్రవిడ భావజాల పార్టీలు విమర్శలు గుప్పించేవి. కానీ, ప్రజలను ఆకర్షించడమే ధ్యేయంగా పెట్టుకున్న జయలలిత అనేక జనాకర్షక పథకాలు రూపొందించి విజయవంతం అయ్యారు. కాలక్రమేణా ఇప్పుడున్న పరిస్థితుల్లో సిద్ధాంతాల కన్నా.. జనాకర్షణ మీదే ప్రధాన దృష్టి ఆకర్షించాల్సి ఉంటుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపునకు ఎన్ని కారణాలు ఉన్నా.. ప్రజల్లో దినకరన్ పై సానుభూతి ఒకటి నెలకొందన్న విషయం అర్థమైంది. ఆ క్రమంలో నటుడిగా ఛరిష్మా ఉన్న కమల్ రాజకీయాల్లో సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. అలాకానీ పక్షంలో రాజకీయ చదరంగంలో మరో ఫెయిల్యూర్ స్టార్గా కమల్ మిగిలిపోవాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. -
రేపు కుండబద్దలు కొడతా: అగ్రహీరో
సాక్షి, చెన్నై: విలక్షణ నటుడు కమల్హాసన్ రేపటి నుంచి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. రేపు ఆయన సొంత పార్టీ ప్రకటించబోతున్నారు. ఈ నెల 21న రామేశ్వరంలో కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అదే రోజు మథురైలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తన రాజకీయ ప్రయాణంలో రేపు అన్ని కుండబద్దలు కొడతానని ఆయన తెలిపారు. ఎవరెవరు తనతో కలిసి వస్తారో పార్టీ ప్రకటించాక చెబుతానని అన్నారు. తమిళ రక్తానికి నా మద్దతు: సీమాన్ నామ్ తమిళర్ నేత సీమాన్ మంగళవారం కమల్హాసన్ను కలిశారు. ఈ సందర్భంగా సీమాన్ మాట్లాడుతూ.. తమిళ రక్తానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కమల్ నటన చూసి అభిమానిగా పెరిగానని, ఆయన కలుస్తానంటే వచ్చికలిసినట్టు చెప్పారు. రజనీకాంత్ కలుస్తానంటే తప్పకుండా కలుస్తానని చెప్పారు. కాగా, కమల్ హాసన్ సోమవారం డీఎండీకే విజయకాంత్ను కలిశారు. రజనీకాంత్, డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్లతో ఆదివారం భేటీ అయ్యారు. -
తమిళనాడులో ఆసక్తికర పరిణామం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ సినీనటులు రజనీకాంత్, కమల్హాసన్ ఆదివారం చర్చలు జరిపారు. రజనీ నివాసానికి వచ్చిన కమల్ చాలాసేపు ఆయనతో ఏకాంతంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పొత్తులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నెల 21న రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు కమల్హాసన్ ప్రకటించిన నేపథ్యంలో వీరద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశం ముగిసిన తర్వాత రజనీకాంత్ మాట్లాడుతూ... కమల్పై ప్రశంసలు కురిపించారు. డబ్బు, పేరు కోసం ఏనాడు కమల్ పాకులాడలేదని.. తమిళ ప్రజల శ్రయేస్సు కోసం ఆయన పనిచేస్తున్నారని అన్నారు. కొత్త పార్టీ పెట్టనున్న కమల్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు కమల్హాసన్ చెప్పారు. రాష్ట్రంలో తన పర్యటన గురించి రజనీకి వివరించినట్టు వెల్లడించారు. రజనీకాంత్ పెట్టబోయే పార్టీతో పొత్తు కాలమే నిర్ణయిస్తుందన్నారు. -
‘మా హీరోకి రాజకీయాలపై ఆసక్తి ఉంది’
తమిళసినిమా: తమిళనాడులో దాదాపు సినీ నటులే ప్రభుత్వాన్ని పాలించారు. తాజాగా నట దిగ్గజాలు కమలహాసన్, రజనీకాంత్ సొంతంగా రాజకీ య పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ 234 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తుందని రజనీ ఇప్పటికే వెల్లడించారు. కమలహాసన్ ఈ నెల 21న పార్టీ పేరు, జెండా, అజెండానూ వెల్లడించి భారీ బహిరంగ సమావేశంతో ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. మరో పక్క నేను సైతం అన్నట్లు విశాల్ తన చేతలతో రాజకీయ ప్రవేవం చేయనున్నట్టు చెప్పకనే చెబుతున్నారు. వీరందరి కంటే ముందే నటుడు విజయ్ రాజకీయాలపై ఆసక్తి కనబరచారన్నది నిజం. అందుకు తన అభిమాన సంఘాన్ని ప్రజాసంఘంగా మార్చా రు కూడా. తద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఆయన తండ్రి దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ తన కొడుకు రాజకీయాల్లో వస్తారని చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. విజయ్ నటించిన పలు చిత్రాలు విడుదల సమయంలో రాజకీయ సమస్యలను ఎదుర్కొన్నాయి. అందుకు కారణం విజయ్ను రాజకీయాల్లోకి రానీయకుండా అణగదొక్కలన్నదే అనే ప్రచారం సాగింది. అయితే ఇటీవల విజయ్ రాజకీయాల మాట ఎత్తడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ, కమల్ అభిమానులు ఎవరి పరిధిలో వారు ప్రజలను తమ పార్టీ సభ్యులుగా చేర్చుకునే పనిలో మునిగిపోయారు. ఈ సెగ విజయ్ అభిమానుల్లోనూ తగిలింది. విజయ్ ప్రజా సంఘం పేరుతో నూతన వెబ్సైట్ను ప్రారంభించి తద్వారా ప్రజలను సభ్యులుగా చేర్చే పనికి అభిమానులు శ్రీకారం చుట్టారట. దీని గురించి విజయ్ అభిమాన సంఘం నిర్వాహకుడు ఒకరు మాట్లాడుతూ తమ హీరోకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, ఎప్పుడైనా రాజకీయరంగ ప్రవేశం గురించి వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. అందుకే తాము సభ్యత్య నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టామని అన్నారు. -
తమిళనాడులో మరో కూటమి
సాక్షి, చెన్నై: తమిళనాడులో మరో రాజకీయ కూటమి ఏర్పాటైంది. సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్కుమార్, నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మదురై విమానాశ్రయంలో వారు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదని, రాష్ట్ర సంక్షేమం కోసం తాము కలిసి పోరాడతామని వారు తెలిపారు. అంశాలవారీగా పోరు కొనసాగిస్తామని ప్రకటించారు. జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలైందని, ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమలహాసన్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సినిమా పరిశ్రమకు చెందిన శరత్కుమార్, సీమాన్ చేతులు కలపడం చర్చనీయాంశంగా మారింది. రజనీ-కమల్కు వ్యతిరేకంగా వీరు గళం విన్పిస్తున్నారు. మరోవైపు ‘కెప్టెన్’ విజయ్కాంత్ కూడా రజనీ-కమల్తో చేతులు కలిపేందుకు విముఖత వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. -
అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి అవుట్
-
అన్నాడీఎంకేలో బహిష్కరణ పర్వం
-
అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి అవుట్
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో బహిష్కరణ పర్వల కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి పచ్చైమాల్ సహా కన్యాకుమారి జిల్లాకు చెందిన అన్నాడీఎంకే నిర్వాహకులపై 93 మందిపై వేటు పడింది. దీనిగురించి ఈపీఎస్, ఓపీఎస్ గురువారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే పార్టీ విధానాలకు, లక్ష్యాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న కారణంగా మాజీ మంత్రి పచ్చైమాల్ సహా 93 మందిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నిక వైఫల్యం తర్వాత అనేక జిల్లాలకు చెందిన పార్టీ నిర్వాహకులను ఎడపాడి పళనిస్వామి, ఓ.పన్నీర్సెల్వం మూకుమ్మడిగా పార్టీ నుంచి తొలగిస్తున్నారు. దినకరన్ వర్గానికి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలతో ఇప్పటికే పలు జిల్లాలకు చెందిన నాయకులను పార్టీ నుంచి బహిష్కరించారు.