one injured
-
హనుమాన్ ఆలయాన్ని ఢీకొట్టిన బైక్
పర్లాకిమిడి: గుసాని సమితి కత్తలకవిటి గ్రామం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగాలపాడు గ్రామం నుంచి మోటార్ సైకిల్పై బయలుదేరిన ముగ్గురు యువకులు వేగంగా వెళ్తూ కత్తలకవిటి గ్రామం మలుపు వద్ద ఉన్న హనుమాన్ మందిరాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న చిన్మయపాత్రో(20) సంఘటనా స్థలంలో మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలవడంతో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిలో ఆర్.చందు, మిన్నా నాయక్ను మెరుగైన వైద్యం కోసం పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. బరంపురం మెడికల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అతి వేగమే చిన్మయ పాత్రో ప్రాణం తీసిందని సంఘటనా స్థలంలోని గ్రామస్తులు తెలిపారు. గురండి పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారిస్తున్నారు. -
ఐదు గంటలు నరకప్రాయం
చింతూరు (రంపచోడవరం) : ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీడ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుని ఐదు గంటలపాటు నరకం అనుభవించాడు. మండలంలోని కాటుకపల్లి వద్ద ఆదివారం ఛత్తీస్గఢ్ నుండి విజయవాడ వెళ్తున్న లారీ విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్ వెళుతున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. దీంతో అతడికి ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన అనంతరం భద్రాచలం తరలించారు. కాగా మరో లారీలోని డ్రైవర్ తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన లతీఫ్ క్యాబిన్లో ఇరుక్కుని పోయాడు. స్టీరింగ్ వీల్ వద్ద కాలు ఇరుక్కుని ఎంతకూ రాకపోవడంతో వైద్యులు అతడికి లారీలోనే సిలైన్లు పెట్టి చికిత్స అందించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రమాదం జరుగగా పోలీసులు తీవ్రంగా శ్రమించి ఐదు గంటల అనంతరం గ్యాస్కట్టర్ సాయంతో రాత్రి ఎనిమిది గంటలకు అతనిని బయటకు తీశారు. అనంతరం 108 ద్వారా అతడిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
పాయకరావుపేట: మండలంలో జాతీయరహదారిపై తాండవబ్రిడ్జి సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఎస్ఐ బాబూరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామానికి చెందిన కర్రి గణేష్(45), కర్రి నానాజీలు బైక్పై తుని బయలుదేరారు. వీరు కోటనందూరు వద్ద ఉన్న జీడి పిక్కల పరిశ్రమలో పనిచేస్తున్నారు. తాండవ బ్రిడ్జిసమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అవతలవైపు( తుని నుంచి విశాఖ వెళ్లే) రోడ్డుపై పడ్డారు. ఇంతలో తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొంది.ఈ ప్రమాదంలో గణేష్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన నానాజీని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బాకూరు ఘాట్లో జీపు బోల్తా
హుకుంపేట(అరకులోయ): మండలంలోని బాకూరు ఘాట్లోని డోగులజోరు సమీపంలోని మలుపు వద్ద ఓ జీపు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడిన ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు.మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. సూకూరు పంచాయతీలోని బిరిసింగి గ్రామం నుంచి సుమారు 15 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం వెళ్తున్న సర్వీసు జీపునకు ఘాట్లోని డోగులజోరు సమీపంలో బ్రేక్ ఫెయిలైంది. దీంతో అదుపు తప్పి,లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాకూరు గ్రామానికి చెందిన గెమ్మెలి సంజయ్భార్గవ్(4),బాకూరు వెంకటలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంత మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న సంజయ్భార్గవ్ను పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మృతదేహాన్ని శవపరీక్షల గదిలో భద్రపరిచారు.తీవ్ర గాయాలపాలైన వెంకటలక్ష్మికి వైద్యసేవలు అందించారు. కుమారుడు తమ కళ్లముందే మృతిచెందడంతో తల్లిదండ్రులు కుమారి,సత్తిబాబు కన్నీరుమున్నీరుగా విలపించారు.బరిసింగి గ్రామంలోని ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి, తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బిరిసింగి,బాకూరు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. హుకుంపేట పోలీసుస్టేషన్కు ఫిర్యాదు అందడంతో ఎస్ఐ నాగకార్తీక్ కేసు నమోదు చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఇంటికి చేరుకునేలోపే...
పరిగి : పండగపూట విషాదం చోటు చేసుకుంది. అందరూ ఉపవాస దీక్షల్లో మునిగిపోతే..ఆ ఇంట్లో మాత్రం విషాద ఛాయలు అలముకున్నాయి. ఎదురురెదుగా వస్తున్న డీసీఎం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్పై వెళుతున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని ఖుదావంద్గేట్ సమీపంలో పరిగి–షాద్నగర్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం గాలిగూడెం అనుబంధ గ్రామం ఇస్రాన్గడ్డతండాకు చెందిన విక్రమ్(19), అదే తండాకు చెందిన హన్ము(13) స్నేహితులు. విక్రమ్ అన్న బతుకుదెరువు కోసం బొంబాయి వెళుతుండటంతో సాగనంపేందుకు వికారాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లారు. వారిని రైలెక్కించి తిరిగి ఇంటికి బయలుదేరారు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా మండల పరిధిలోని ఖుదావంద్పూర్ గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వీరి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న విక్రం (19) అక్కడికక్కడే మృతి చెందాడు. హన్ము(13)కు తీవ్ర గాయాలవడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ షాద్నగర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా.. హన్ము గాలిగూడెం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్ మృతదేహాన్ని పరిగి మార్చురీలో ఉంచారు. -
పండక్కి వెళ్తూ..
కొడవలూరు: ఉపాధి కోసం జిల్లాకు వలస వచ్చి పండక్కి ఇంటికి వెళ్తూ ఓ వ్యక్తి దుర్మరణ పాలయ్యాడు. మరొకరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన మండలంలోని రాచర్లపాడు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా ఊపూరు మండలం కాకర్లపూడికి చెందిన దాసరి కోటేశ్వరరావు (32), రవీంద్ర బేల్దారీ పనుల నిమిత్తం తడకు వలస వెళ్లారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లేందుకు బైక్లో బయల్దేరారు. కొడవలూరు మండలం రాచర్లపాడు చెరువు వద్దకు వచ్చే సరికి ముందు వెళుతున్న లారీని క్రాస్ చేయబోయి బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. ఇంతలోనే వెనుకనే వేగంగా వస్తున్న కారు వీరి పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, రవీంద్ర తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని 108లో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కోటేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ రక్షణకుమార్ తెలిపారు. చెరకు ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి సంగం: రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని చెరకు ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన సంగం సబ్స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సంగం రాళ్లచెలికకు చెందిన కలికిరి వెంకటరత్నం (40) చేనేత కార్మికుడు. పనిలో కుటుంబపోషణ జరగకపోవడంతో ప్రైవేట్గా ఎలక్ట్రిషియన్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో నుంచి రోడ్డు మీదకు వచ్చి సబ్స్టేషన్ నుంచి బస్టాండ్ వైపు నడిచి వెళ్తుండగా వెనుకనే వచ్చిన చెరకు ట్రాక్టర్ అతన్ని ఢీకొంది. దీంతో అతను ట్రాక్టర్ చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే పరారయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతన్ని 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబానికి జీవనా«ధారమైన వెంకటరత్నం మృతితో భార్య పద్మ, కుమారుడు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. సంగం రాళ్లచెలికలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై వేణు తెలిపారు. ఘటనా స్థలంలో కోటేశ్వరరావు మృతదేహం -
రాయచోటి శివారులో ఘోర రోడ్డుప్రమాదం
-
రథోత్సవంలో అపశ్రుతి
పందికుంట(వజ్రకరూరు) : మండల పరిధిలోని పందికుంట గ్రామంలో బుధవారం సాయంత్రం శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తుండగా ఒక్కసారిగా రథం కిందపడిపోయింది. భక్తులకు ఎలాంటి హానీ జరగకపోయినా అందులో ఉన్న అర్చకుడికి స్వల్ప గాయాలయ్యాయి. -
పట్టణాల నుంచి పల్లెలకు తాకిన గన్కల్చర్
-
గుంటూరులో భోగి మంటల్లో అపశ్రుతి
గుంటూరు : భోగి మంటల్లో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే...భోగి సందర్భంగా శుక్రవారం ఉదయం గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భోగి మంటల్లో కిరోసిన్ పోస్తుండగా అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు ఓ వ్యక్తి శరీరానికి అంటుకున్నాయి. అతడిని కాపాడేందుకు ఎమ్మెల్యే మోదుగుల ప్రయత్నించారు. ఆయన పాదాలకు కూడా మంటలు అంటుకున్నాయి. గాయపడిన వ్యక్తిని స్టేడియం నిర్వాహకులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మోటార్సైక్లిస్ట్ దుర్మరణం
రాచూరు (ఉంగుటూరు): ఉంగుటూరు మండలం రాచూరు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద నిండ్రకొలనుకు చెందిన చిన్నం కిషోర్ (26), అతని స్నేహితుడు దాసరి రవి కలిసి మోటార్ సైకిల్పై తాడేపల్లిగూడెం వెళ్తుండగా నారాయణపురం నుంచి గణపవరం వైపు వెళుతున్న చేప పిల్లల లోడు లారీ ఎదురుగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో మోటార్ సైకిల్ నడుపుతున్న చిన్నం కిషోర్ తలకు బలమై గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక ఉన్న రవికి తీవ్రగాయాలు కావడంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. చేబ్రోలు ఏఎస్ఐ రమణకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
ఎస్ఐ వాహనమే ఢీకొట్టిందని బంధువుల ఆరోపణ గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లి శివార్లలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన షేక్ బాషా అనే స్లైక్లిస్టు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివార్లలోని సిమెంట్ స్తంభాల తయారీ పరిశ్రమలో కూలీ పనికి వెళ్లే బాషా మధ్యాహ్నం భోజనానికి సైకిల్పై ఇంటికి బయలు దేరాడు. అదే సమయంలో గుత్తి వైపునకు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం బాషా సైకిల్ను వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొనడంతో సైకిల్ నుజ్జునుజ్జైంది. బాసా ఎగిలి అల్లంత దూరంలో పడ్డాడు. రక్తస్రావమై తీవ్రంగా గాయపడ్డ బాషాను అటుగా వెళ్తున్న కర్నూలు జిల్లా ఎస్ఐ శంకర్ తన జీపులోనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. కాగా ఎస్ఐ శంకర్ వాహనం ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడి తండ్రి తెలిపారు. పంచాయితీ అనంతరం బాషా చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని ఎస్ఐ భరించేలా మాట్లాడుకొన్నట్లు తెలిసింది. ఆ తరువాత అతన్ని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఆ తరువాత బాధితులు మాటమార్చి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శంకర్ గుత్తిలో నివాసముంటూ ప్రభుత్వ వాహనాన్ని తన సొంతానికి వాడుకుంటూ రోజూ జొన్నగిరి నుంచి గుత్తికి వచ్చి వెళ్తుంటాడని తెలిసింది. ఈ విషయంపై ఎస్ఐ శంకర్ను ఫో¯ŒSలో ‘సాక్షి’ వివరణ కోరగా... బాషాను తన ముందు వెళ్తున్న లారీ ఢీ కొట్టి వెళ్తే వెనుకనే వచ్చిన తాను మానవత్వంతో అతడిని ఆస్పత్రికి చేర్చానన్నారు. తన వాహనమే ఢీకొట్టినట్లు బాషా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు భావించారని వివరించారు. బాధితుడు కూడా కోలుకున్నాక లారీ ఢీకొట్టినట్టు చెప్పాడని ఎస్ఐ తెలిపారు. గుత్తి ఎస్ఐ చాంద్బాషా వివరణ అడగ్గా.. బాషాను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ఎగిరి ముందు వస్తున్న ఎస్ఐ జీపుపై పడ్డాడని చెప్పారు. ఎస్ఐ జీపు ఢీ కొట్టలేదన్నారు. -
వ్యక్తిపై హోంగార్డు కత్తితో దాడి
వేటపాలెం: వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై వీర వసంతరావు అనే హోంగార్డు కత్తితో దాడి చేశాడు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయ్పేటలోని సాల్వేషన్ ఆర్మీ చర్చి ముందు వేటపాలెం-చీరాల రోడ్డులో నేటి ఉదయం ఈ ఘటన జరిగింది. వెంకటేశ్వర్లు, వసంతరావుల స్వగ్రామం యాదవపాలెం. వెంకటేశ్వర్లు తన భార్యతో కలిసి బైక్పై స్వగ్రామం నుంచి చీరాలకు పూలు అమ్మడానికి వెళ్తున్నాడు. దారి మధ్యలో వెంకటేశ్వర్లును కలిసిన వసంతరావు చిట్టీ డబ్బుల విషయం అడిగాడు. వీరిద్దరి మధ్య చిట్టీ డబ్బుల విషయంలో భిన్న అభిప్రాయాలు రావడంతో హోంగార్డు వసంతరావు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ను ఢీకొన్న స్కార్పియో
యువకుడి పరిస్థితి విషమం సంగం : మోటార్బైక్ను స్కార్పియో ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని దువ్వూరు వద్ద శుక్రవారం జరిగింది. మండలంలోని గాంధీజనసంఘంకు చెందిన ఇంటా కిరణాకుమార్రెడ్డి తన మోటార్బైక్లో నెల్లూరుకు వెళ్లి ఇంటికి వస్తుండగా దువ్వూరు వద్ద లారీని తప్పించబోయే క్రమంలో వేగంగా వచ్చిన స్కార్పియో ఢీకొంది. దీంతో కిరణ్కుమార్రెడ్డి బైక్ పైనుంచి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది కిరణ్కుమార్రెడ్డికి ప్రథమ చికిత్స చేసి నెల్లూరుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వారు తెలిపారు. సమాచారం అందుకున్న సంగం ఎస్ఐ వేణు సంఘటన స్థలానికి వచ్చి ప్రమాదానికి కారణమైన స్కార్పియోను పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేరళ కోర్టు ఆవరణలో పేలుడు కలకలం
-
కేరళ కోర్టు ఆవరణలో పేలుడు కలకలం
తిరువనంతపురం: కేరళ మలప్పురం కోర్టు ఆవరణలో మంగళవారం పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారులో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, ఒకరు గాయపడ్డారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని స్థానికులు, పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో సోదాలు చేపట్టారు. దుండగులు ప్రెషర్ కుక్కర్ బాంబును అమర్చి పేల్చినట్టు పోలీసులు గుర్తించారు. కారు యజమాని హోమియో డీఎంవోదిగా గుర్తించారు. అలాగే ఘటనా స్థలంలో కరుడుకట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫోటోను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ర్యాష్ డ్రైవింగ్ తో ‘మైనర్’ బీభత్సం
హైదరాబాద్: చిన్నారి ‘రమ్య’ విషాదాంతం మరవక ముందే అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అంబర్పేట డీడీ కాలనీలో ఓ ఇంటర్ విద్యార్థి శనివారం అతి వేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అంబర్పేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్ పటేల్ కుమారుడు డీడీ కాలనీలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుకుంటున్నాడు. ఈ రోజు ఉదయం ఓ బాలికతోపాటు ముగ్గురు స్నేహితులతో కలసి కారులో కళాశాలకు బయలుదేరాడు. అతడు వేగంగా కారు నడుపుతూ ఓ వ్యక్తిని ఢీ కొట్టబోయాడు. అతడిని తప్పించేందుకు కారును రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న కార్లను ఢీ కొట్టాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కారులో పరిశీలించగా మద్యం బాటిళ్లు కనిపించాయి. అందులో ఉన్న బాలికను ఇంటికి పంపించి అభిషేక్తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై అంబర్ పేట సీఐ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ... ఈరోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మైనర్ ర్యాష్ డ్రైవింగ్తో ప్రమాదం చేసినట్లు సమాచారం అందిందన్నారు. డీడీ కాలనీలోని సోమసుందర్ నగర్ లో ఆగి ఉన్న కార్లతో పాటు ఓ వ్యక్తిని ఢీకొట్టినట్లుగా గుర్తించామని, గాయపడిన వ్యక్తి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్, విత్ అవుట్ లైసెన్స్ సెక్షన్ల కింద మైనర్తో పాటు కారు యజమానిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
శోక శుక్రవారం
శుక్రవారం నాలుగు కుటుంబాలకు శోకం మిగిల్చింది. వేర్వేరు దుర్ఘటనల్లో నలుగురు మరణించారు. విద్యుదాఘాతానికి ఇద్దరు బలికాగా, కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. వరికోత యంత్రం తరలిస్తూ.. ఉంగుటూరు : లారీలో వరి కోత యంత్రాన్ని పొలానికి తరలిస్తుండగా, విద్యుదాఘాతానికి గురై ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఉంగుటూరు మం డలం వెల్లమిల్లి వద్ద శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం.. వెల్లమిల్లి పంట పొలాల్లో వరి కోత నిమిత్తం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి గురువారం రెండు యంత్రాలు వచ్చాయి. స్థానికంగా ఉన్న మధ్యవర్తి కడవకొల్లు పెద్ద ముత్యాలు ద్వారా రైతు యాదగాని సత్యనారాయణ పొలంలో శుక్రవారం వరి కోత పని చేయాలని నిర్ణయించారు. దీంతో ఉదయం వరి కోత యంత్రాన్ని లారీలో తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు అడ్డువచ్చాయి. దీంతో లారీపై ఉన్న వారు కర్రలతో తీగలను ఎత్తేందుకు యత్నించి విఫలమయ్యారు. తీగలు యంత్రానికి తగలడంతో లారీలోకీ విద్యుత్ ప్రసరించింది. దీంతో లారీ నడుపుతున్న కడిమి భాస్కర్ ( 32), క్యాబిన్లో ఉన్న మరో వ్యక్తి దామవరపు నరసింహారావు అలియాస్ జగపతి (22) అక్కడిక్కడే మృతిచెందారు. వీరిని రక్షించబోయి తాటిపర్తి పవన్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిలో భాస్కర్ది పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మోతుకూరు మండలం రెడ్డిపాలెం కాగా, జగపతి, పవన్లది మోతుకూరు మండలం కొత్త ఒంగులూరు. దీంతో పవన్ని, మృతదేహాలను స్థానికులు తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చేబ్రోలు ఎస్సై చావా సురేష్, విద్యుత్ ఏఈలు రాళ్లపల్లి భీమేశ్వరరావు(నారాయణపురం), రెడ్డి సుబ్రహ్మణ్యం(గొల్లగూడెం) ఉంగుటూరు ఏవో డాక్టర్ ఎస్.ప్రసాద్, గ్రామ సర్పంచి నరమామిడి నాగేశ్వరరావు, బాదంపూడి సొసైటీ అధ్యక్షులు మల్లారెడ్డి శేషగిరి పరిశీలించారు. పొట్టకూటి కోసం వచ్చి.. పొట్టకూటికోసం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన వారిద్దరూ విద్యుదాఘాతానికి బలైపోయారు. నెల్లూరు జిల్లా నుంచి రెండు యంత్రాలు రాగా, వాటితోపాటు మొత్తం 20 మంది సిబ్బంది వచ్చారు. వీరిలో ఇద్దరు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తోటి సిబ్బందిని విషాదఛాయలు ఆవరించాయి. పొట్టకూటి కోసం వచ్చామని, ఏటా వస్తున్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇంద్రకీలాద్రికి వెళ్తూ.. అనంతలోకాలకు.. భీమడోలు : విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్తున్న ఇద్దరు భవానీ భక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శుక్రవారం గుండుగొలను–పాతూరు మధ్య షుగర్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గణపవరం మండలం జల్లికొమ్మెరకు చెందిన అడ్డగర్ల గిరి(20), మద్దాల సూరిబాబు(21), మద్దాల ఏడుకొండలు, మద్దాల సాయి వ్యవసాయ కూలీలు. వీరంతా బంధువులు. నలుగురూ కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కాలినడకన బయలుదేరారు. వారు గుండుగొలను దాటి పాతూరు పంచాయతీ పరిధిలోకి వచ్చే సరికి తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ముందుగా రోడ్డు పక్కనే జంటగా నడుస్తున్న అడ్డగర్ల గిరి, మద్దాల సూరిబాబుపై నుంచి దూసుకువెళ్లింది. దీంతో అక్కడికక్కడే గిరి దుర్మరణం పాలయ్యాడు. కొద్దిసేపు కొనప్రాణాలతో కొట్టుకున్న సూరిబాబు సహచరుల కళ్లెదుటే తుదిశ్వాస విడిచాడు. దీంతో ఏడుకొండలు, సాయి తీవ్రంగా రోదించారు. మృతులిద్దరికీ వివాహాలు కాలేదు. దీంతో ఇద్దరి కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును అందులో ఉన్నవారు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కారు అద్దాలు దెబ్బతిన్నాయి. మృతదేహాలను పంచనామా నిమిత్తం పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కారు హల్చల్: ఒకరికి గాయాలు
నార్తురాజుపాలెం(కొడవలూరు): నార్తురాజుపాలెంలో కారు హల్చల్ చేసిన సంఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నెల్లూరు ఎన్టీఆర్ నగర్కు చెందిన వారు కొత్తకారు కొనుగోలు చేసి ఆ కారులో రామతీర్థానికి పూజకు వెళ్లారు. అక్కడ పూజ పూర్తి చేసుకొని తిరిగి అతివేగంగా వస్తూ బసవాయపాలెం వద్ద నెల్లూరు నుంచి విధులు ముగించుకొని స్వగ్రామమైన అల్లూరుకు మోటార్ సైకిల్పై వెళుతున్న కుండా గౌతమ్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గౌతమ్కు గాయాలయ్యాయి. ఆ వెంటనే అప్రమత్తమైన గౌతమ్lకారును వెనుకనే వెంబడించగా, మరింత వేగంతో నార్తురాజుపాలెం వైపు వచ్చిన ఆ కారు స్థానిక బస్టాండు కూడలిలో అతివేగంగా అటుఇటు తిప్పుతూ స్థానికులను భయభ్రాంతులను చేసి నెల్లూరు వైపు దూసుకెళ్లింది. కారును అతివేగంగా మలుపులు తిప్పడంతో కూడలిలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నార్తురాజుపాలెంలో హల్చల్ చేసి పరారైన కారు నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద వదిలేసి ఉండగా, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హల్చల్ చేసిన కారును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. -
చెట్టును ఢీకొన్న కారు..ఒకరి మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల క్రాసింగ్ వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మోటారు సైకిళ్లు ఢీకొని వ్యక్తి దుర్మరణం
కొవ్వూరు : మండలంలోని ఔరంగబాద్ సమీపంలో ఆదివారం వేకువజామున రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో సాగిరాజు శ్రీనివాసకుమారరాజు (43) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. దేవరపల్లికి చెందిన కుమారరాజు మోటారు సైకిల్పై వెళుతుండగా ఔరంగబాద్ సమీపంలో 5.30–6.00 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. దీంతో కుమారరాజుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు విజ్జేశ్వరంలో శెనగన వీర్రాజుకు చెందిన డీసీఎం వ్యాన్పై డ్రైవర్ పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీర్రాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఎర్రగడ్డలో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
హైదరాబాద్ : ఎర్రగడ్డ సమీపంలోని రహదారిపై బుధవారం రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న స్కూటర్ను వెనుక నుంచి వేగంగా వచ్చి... లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. వెనక కూర్చున వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బైక్లు ఢీ.. వ్యక్తి మృతి
రాచర్ల: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగుంటపల్లి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొనడంతో బైక్ పై ఉన్న యామ వెంకటేశ్వర్లు(46) అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
లారీని ఢీకొన్న టయోటా: ఇద్దరు మృతి
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద ఆదివారం లారీని టయోటా కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి
గుడ్లవల్లేరు (కృష్ణా జిల్లా) : వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజెండ్ర గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందిచారు. విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉంది. -
తాతమనవళ్లపైకి దూసుకెళ్లిన లారీ
ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద శుక్రవారం లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న తాతా,మనవడి మీదుకు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా... తాత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: వ్యక్తి మృతి
ఇల్లందు: ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలో శనివారం రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇల్లందు ప్రాంతానికి చెందిన అనిల్కుమార్(30) ద్విచక్ర వాహనంపై ఇల్లందు మెయిన్రోడ్డు బాబ్లీ హోటల్ సమీపంలో వెళుతుండగా వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న రవి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రుణ్ణి ఆస్పత్రికి తరలించారు. -
పేలిన నాటుబాంబు: ఒకరికి గాయాలు
ఖమ్మం: తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని వెంకటాపురం గ్రామంలో బుధవారం నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే వెంకటాపురం మండలం విజయపురి కాలనీ సమీపంలో రహదారి పక్కన బాంబుపేలింది. ఈ పేలుడులో ఓ బాటసారి గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రుడిని 108 వాహనంలో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నాటు బాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇది నాటుబాంబా లేక కూంబింగ్కు వెళ్లే పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన బాంబా అనే విషయం తేలాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆటో బోల్తా : బాలుడు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా కూడేరు వద్ద శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు - ఆటో ఢీ: ఒకరి మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం ప్రైవేట్ బస్సు - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని... బస్సు, ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్, కారు ఢీకొని యువకుడి మృతి
నేరేడుచర్ల(నల్లగొండ): బైక్ పై వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో కారును ఢీకొట్టారు. దీంతో బైక్ నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నేరేడుచర్లలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎన్టీఆర్ నగర్కు చెందిన షేక్ గౌస్(17), నాగరాజు(24) బైక్పై వెళ్తుండగా.. హుజూర్నగర్ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో దాని వెనుక వస్తున్న కారును ఢీకొట్టారు. ఆ సమయంలో బైక్ చాలా వేగంలో ఉంది. దీంతో బైక్ నడుపుతున్న గౌస్ అక్కడికక్కడే మృతిచెందగా, నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
కారు - బైక్ ఢీ: ఒకరు మృతి
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టు రహదారిలోని కిషన్గూడ సమీపంలో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి
గుంటూరు: గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున చిలకలూరిపేటలో ముగ్గురు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా మరో యువకుడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. గుంటూరు వైఎస్సార్సీపీ నేత చోటానాయక్ కుమారుడు ఈ ప్రమాదంలో మృతిచెందారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్రెడ్డి చోటానాయక్ను పరామర్శించి..ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
గుడిలోకి దూసుకెళ్లిన బైక్: ఒకరు మృతి
ధరూరు (రంగారెడ్డి జిల్లా) : ధరూరు శివారులోని మైసమ్మ గుడిలోకి ఆదివారం సాయంత్రం ఒక ద్విచక్రవాహనం దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అల్లీపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంత్యక్రియలకు వెళ్లివస్తుండగా మోటార్బైక్ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న మైసమ్మ గుడిలోకి దూసుకుపోయింది. మృతుడు పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన అంజయ్య(25)గా పోలీసులు గుర్తించారు. అల్లీపూర్కు చెందిన శాంతయ్య అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
కారు ఢీకొని తోడికోడళ్లు మృతి
ఏలేశ్వరం (తూర్పుగోదావరి జిల్లా) : ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామం శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో తోడికోడళ్లు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్తిపాడు మండలం బమ్మంగి గ్రామానికి చెందిన అర్జున, ఆయన భార్య లక్ష్మి, ఆమె తోడికోడలు భవాని, ఆమె కుమారుడు జగన్కుమార్ ద్విచక్రవాహనంపై జగ్గంపేటకు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మి, భవాని, జగన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాకినాడ ఆస్పత్రికి తరలించగా లక్ష్మి, భవానిలు మృతిచెందారు. జగన్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
పరీక్ష రాయడానికి వెళ్తూ అనంతలోకాలకు..
వికారాబాద్ (రంగారెడ్డి) : భార్య డిగ్రీ పరీక్షలు రాస్తుండటంతో.. ఆమెను పరీక్ష కేంద్రం వద్ద దించడానికి బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఫ్లై ఓవర్పై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానిక సాకేత్నగర్లో నివాసముంటున్న చందు పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. ఆయన భార్య మేరి(25) వికారాబాద్లోని ఎస్ఐపీ కళాశాలలో డిగ్రీ పరీక్షలు రాస్తోంది. దీంతో ఆమెను పరీక్షా కేంద్రం వద్దకు తీసుకెళ్లేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు.. బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేరి అక్కడికక్కడే మృతిచెందగా.. చందుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
తేనెటీగల దాడిలో భర్త మృతి: భార్యకు గాయాలు
సీలేరు (విశాఖ జిల్లా) : తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన విశాఖ జిల్లా సీలేరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. దుప్పలవాడ గ్రామం గొందివీధికి చెందిన భార్యాభర్తలు కొర్ర ధను(50), కొర్ర కుంద్రి(46)లపై తేనెటీగలు దాడిచేశాయి. దీంతో తీవ్రగాయాలపాలైన భర్త ధను కాసేపటికే మృతిచెందాడు. భార్య కుంద్రిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానికులు దారకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బైక్, బొలెరో ఢీ: ఒకరికి తీవ్రగాయాలు
జూలూరుపాడు (ఖమ్మం జిల్లా) : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ సమీపంలో బైక్ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న దండుమిట్టతండాకు చెందిన మాలోత్ నాగు(50) అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలు
చిట్టినగర్: విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. వన్ టౌన్లోని సొరంగం ప్రాంతంలో ఓ ఇంట్లో సోమవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలడంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పారావు, సూర్యనారాయణమ్మ(65) దంపతులు స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఉదయాన్నే సూర్యనారాయణమ్మ ఇంట్లో టీ పెట్టేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించింది. అప్పటికే గ్యాస్ లీకేజీ ఉండడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. స్థానికులు మంటలను ఆర్పివేసి తీవ్రంగా గాయపడిన సూర్యనారాయణమ్మను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్ పేలుడు దాటికి వారి ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతింది. -
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
పర్చూరు (ప్రకాశం జిల్లా) : పర్చూరు మండలకేంద్రంలోని చిలకలూరిపేట వెళ్లే రోడ్డులో వై జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం ఓ కారు రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ - కారు ఢీ: ఇద్దరు మృతి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం గోరింతోట గ్రామంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి
కూడేరు (అనంతపురం) : బైక్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘట మంగళవారం అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని కమ్మకు గ్రామంలో జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా మార్గమధ్యంలో ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న బాబారావు నాయక్(45) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి తీవ్రగాయాలయ్యాయి. -
రైలు కింద పడి తల్లీకూతుళ్ల మృతి
చుండూరు(గుంటూరు): కుటుంబకలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి సుస్మిత(35), కూతురు(5) మృతి చెందగా.. కుమారుడు(3) తీవ్రగాయాల పాలయ్యాడు. అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుంటూరు జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లిలో బుధవారం అర్దరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు సుస్మిత(35)ది హైదరాబాద్ కాగా, ఆమె భర్త గుజరాత్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పరీక్ష కోసం వెళ్తూ నవవధువు మృతి
అనంతగిరి: విశాఖపట్టణం జిల్లా అనంతగిరి శివారులో శనివారం ఉదయం లారీ బోల్తాపడి నవ వధువు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతగికిరికి చెందిన నిత్య(21)కు వారం రోజుల కిందటే వివాహం అయింది. వైజాగ్లో శనివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ఉండగా రాసేందుకు మామతో పాటు బయలుదేరింది. బస్సులు లేకపోవడంతో వైజాగ్ వెళ్లే లారీ ఎక్కారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత లారీ ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో నిత్య అక్కడికక్కడే మృతిచెందగా ఆమె మామకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి తప్పించుకున్న లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడినుంచి పరారయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
టిప్పర్, బైక్ ఢీ: ఒకరు మృతి
శంషాబాద్ (రంగారెడ్డి) : టిప్పర్, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక విద్యార్థి చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. శంషాబాద్ మండలం అవుటర్ సర్వీస్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. హిమాయత్సాగర్ నుంచి వస్తున్న బుల్లెట్ బైక్ ఎదురుగా వస్తున్న టిప్పర్ను హుడా కాలనీ సమీపంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో బుల్లెట్పై ఉన్న శంషాబాద్కు చెందిన సౌమిత్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక కూర్చున్న సందీప్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సందీప్ స్థానిక కళాశాలలో ఎంబీఏ చదువుతుండగా.. సౌమిత్ రెడ్డి చెన్నైలో బీటెక్ చేస్తున్నాడు. అక్కడ వరదలు రావటంతో ఇటీవలే శంషాబాద్ వచ్చాడు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కొవ్వూరు రూరల్ (పశ్చిమ గోదావరి) : బైక్పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన పెద్దాడ శ్రీనివాస్ గౌరీపట్నంలో జరిగే మేరీమాత ఉత్సవాలకు వెళ్తున్నాడు. కుటుంబసభ్యులు ముందుగా బస్సులో వెళ్లిపోగా మేనల్లుడితో కలసి శ్రీనివాస్ బైక్పై బయలుదేరాడు. కాగా వారి వాహనాన్ని దొమ్మేరు గ్రామ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా అతని మేనల్లుడికి స్వల్ప గాయాలయ్యాయి. -
బస్సు, స్కూటీ ఢీ: ఒకరి మృతి
హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ నల్లచెరువు వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో పడిన బైక్: ఒకరు మృతి
బెస్తవారిపేట : ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కలగొట్ల గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. బైక్ అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో మార్కాపురం మండలం తిప్పయపాలెం గ్రామానికి చెందిన వీరా రెడ్డి (28) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ఉన్న రవి అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తెలుగు తమ్ముళ్ల తన్నులాట
విజయవాడ: కృష్ణా జిల్లాలో టీడీపీ రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటన ఆదివారం నూజివీడు మండలం జంగంగూడెంలో చోటుచేసుకుంది. జంగంగూడెంలో అధికార టీడీపీ చేపట్టిన జనచైతన్య యాత్ర వేదికగా టీడీపీ నేతలు వల్లభనేని భాస్కర్, పొట్లురి రవి వర్గీయులు పరస్మరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల నేతల కొట్లాటలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని నూజివీడులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పత్తి లారీ బోల్తా: డ్రైవర్ కు గాయాలు
చింతపల్లి (నల్లగొండ) : అధిక లోడుతో వెళ్తున్న పత్తి లారీ అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల శివారులో ఆదివారం చోటుచేసుకుంది. హోమంతాలపల్లి గ్రామం నుంచి చింతపల్లికి పత్తి లోడుతో వెళ్తున్న లారీ చింతపల్లి శివారులోని మూలమలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా కొట్టి బ్రిడ్జి నుంచి కింద పడింది. దీంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. -
కర్మాగారంలో ప్రమాదం: ఇద్దరు మృతి
-
రైలు ఢీకొని తండ్రీకొడుకులు మృతి
రాజుపాలెం (గుంటూరు) : రైలు ఢీకొని తండ్రీకొడుకులు మృతిచెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని అంచులవారిపాలెం గ్రామానికి చెందిన తోట నాగరాజు తన ఇద్దరు కుమారులతో కలిసి బావి వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో రైలు పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టింది. దీంతో నాగరాజు(30)తో పాటు ఆయన కుమారుడు అనిల్(4) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కర్మాగారంలో ప్రమాదం: ఇద్దరు మృతి
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగలపల్లిలోని ఓ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. గ్రామ సమీపంలోని తిరుమల ఆయిల్ కంపెనీలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో బాయిలర్లో పడి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు బిహార్ రాష్ట్రానికి చెందినవారని సమాచారం. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ఒక మృతదేహాన్ని వెలికితీశారు. క్షతగాత్రుడిని హైదరాబాద్కు తరలించారు. -
విద్యుత్ పనులు చేస్తుండగా ఒకరికి షాక్
వెల్దుర్తి (మెదక్) : విద్యుత్ లైన్లు సరిచేస్తున్న ఓ వ్యక్తి షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మెదక్ జిల్లా వెల్దుర్తికి చెందిన బెస్త మల్లేశం స్థానికంగా జరుగుతున్న కరెంటు పనుల్లో కూలీకి వెళ్తున్నాడు. శనివారం మధ్యాహ్నం స్తంభం పైకెక్కి తీగలు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ముందుగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
మహిళను ఢీకొట్టిన కారు: చిన్నారి మృతి
హైదరాబాద్ : భర్త కోసం టీ తీసుకెళ్తున్న మహిళ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె చేతిలో ఉన్న చిన్నారి మృతిచెందగా.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గచ్చిబౌలి క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. రాజస్థాన్లోని భూంది జిల్లాకు చెందిన మమతా బాయి(23) కుటుంబం బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. ఈ క్రమంలో శిల్పారామం సమీపంలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. కాగా శుక్రవారం భర్త కోసం టీ తీసుకెళ్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా.. వేగంగా వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టింది. అనంతరం ఆమె పై నుంచి దూసుకుపోయింది. ఆ సమయంలో ఆమె చెతిలో ఎనిమిది నెలల పాప ఉంది. ఈ ప్రమాదంలో పాప మృతిచెందగా.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కారు డ్రైవర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. తీవ్రంగా గాయాలైన మమత పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
నేరేడ్మెట్ : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టడంతో ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సు శుక్రవారం కాకతీయనగర్ నుంచి ఈసీఐఎల్ వెళ్తున్న క్రమంలో వాయుపురి చౌరస్తా సమీపంలో రోహిణి కాలనీ నుంచి వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టి పక్క నుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కోటేశ్వరరావుకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఆర్టీసి బస్సు రోడ్డుపై ఆగిపోవడంతో చాలా సేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. బస్సు అక్కడే ఆగిపోవడంతో ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మరో బస్సును ఆశ్రయించారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కత్తులతో దాడి
కడప: వైఎస్సార్ జిల్లాలో దారుణం జరిగింది. కడప పట్టణంలోని చిన్న చౌక్ వద్ద గురువారం ఉదయం ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. స్థానికంగా నివాసముంటున్న బండి మునిరెడ్డి(35) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా ఒక ల్యాండ్కు సంబంధించిన వివాదంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం రోడ్డుపై టీ తాగుతున్న మునిరెడ్డిని కారులో వచ్చిన పదిమంది గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ దూసుకెళ్లి వ్యక్తి మృతి
బలిజపేట: విజయనగరం జిల్లా బలిజపేట మండలం గలావల్లి సమీపంలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఇద్దరిపైకి ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎస్.రాము(42) అక్కడికక్కడే మృతి చెందాడు. రాము తండ్రి ఎర్రప్పన్నకు కాలు విరిగిపోవడంతో రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రోడ్డు పక్కన వరి కల్లాలు పెట్టుకుని నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
వనస్థలిపురంలో లారీ బీభత్సం
వనస్థలిపురం (హైదరాబాద్) : నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం చౌరస్తాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. బైక్ పై వెళ్తున్న దంపతులపైకి వెనుక నుంచి వచ్చిన లారీ దూసుకెళ్లింది. దీంతో ద్విచక్రవాహనం పై వెనుక కూర్చుని ఉన్న భార్య మృతిచెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం
సత్తెనపల్లి (గుంటూరు) : సత్తెనపల్లి మండలం వెన్నదేవి వద్ద శనివారం ఓ ద్విచక్రవాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చైన్స్నాచింగ్కు విఫలయత్నం: వృద్ధురాలికి గాయాలు
రామాయంపేట (మెదక్) : మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మంగళవారం పట్టపగలు ఓ యువకుడు చైన్ స్నాచింగ్కు విఫలయత్నం చేశాడు. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వృద్ధురాలు కింద పడి గాయాలపాలైంది. బాధితురాలి కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం రామేశన్పల్లి గ్రామానికి చెందిన ముచ్చెర్ల మోహన్రెడ్డి తన తల్లి పద్మవ్వతో కలిసి మంగళవారం బైక్పై రామాయంపేట మీదుగా నిజాంపేటలోని తమ బంధువుల వద్దకు వెళ్తున్నారు. అయితే రామాయంపేట ఎల్లమ్మగుడి కమాన్ వద్ద ముఖానికి గుడ్డకట్టుకున్న ఓ యువకుడు వెనుక నుంచి బైక్పై వచ్చి పద్మవ్వ మెడలోని పుస్తెలతాడు లాగాడు. ఆమె తాడును గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో కిందపడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆగంతకుడు క్షణాల్లో బైక్పై పారిపోయాడు. పద్మవ్వను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. -
దంపతులను ఢీకొట్టిన కారు: భార్య మృతి
దత్తిరాజేరు (విజయనగరం) : దత్తిరాజేరు మండలం చౌడంతివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం బైక్పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య గొల్లు రమణమ్మ(45) అక్కడికక్కడే మృతిచెందగా..భర్తకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: యువకుడు మృతి
సుల్తానాబాద్ (కరీంనగర్) : ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన సంపత్(27) తన స్నేహితుడు సతీష్తో పాటు ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు డీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపత్ అక్కడికక్కడే మృతి చెందగా.. సతీష్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో ఢీకొని ఒకరి పరిస్థితి విషమం
పాతపట్నం(శ్రీకాకుళం): ఆర్టీసీ బస్సులోంచి దిగుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని నవతల జంక్షన్ వద్ద శనివారం జరిగింది. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న తోట కృష్ణమూర్తి(45) శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులోంచి దిగుతున్న సమయంలో.. శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఆటో అతడిని ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
వ్యక్తి పై యాసిడ్ దాడి
టి. నర్సపురం(పశ్చిమగోదావరి): ఇంటి ముందు అరుగుపై నిద్రపోత్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్తో దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సపురం మండలంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని వెంగపాడులో నరదల పెంటయ్య పై గుర్తు తెలియని వ్యక్తి పై గుర్తు తెలియకి వ్యక్తులు దాడి చేశారు. దీంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
వివేక్ ఎక్స్ ప్రెస్లో హిజ్రాల బీభత్సం
శ్రీకాకుళం (టెక్కలి) : మంగళూరు నుంచి సత్రగచ్చి వెళ్తున్న వివేక్ ఎక్స్ప్రెస్ లో సోమవారం హిజ్రాలు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...కొంతమంది హిజ్రాలు సోమవారం వివేకానంద్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయసాగారు. అయితే అడిగినంత డబ్బులివ్వలేదని కదులుతున్న రైల్లో నుంచి ఓ ప్రయాణికుడిని బయటకు తోసేసి, మరో ప్రయాణికుడిని చితకబాదారు హిజ్రాలు. రైల్లో నుంచి కిందపడ్డ ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించగా.. దాడిలో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన టెక్కలి మండలంలోని నౌపడ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడు ఒడిస్సాలోని నయాగఢ్ జిల్లాకు చెందిన పూర్ణచంద్రసాహు(45)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి ఫకీర్ బెహ్రాగా గుర్తించారు. ప్రయాణికులను తోసేసిన అనంతరం హిజ్రాలు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
పెద్దవూర (నల్లగొండ) : రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాత్రి మండలంలోని సంగారం స్టేజీ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం మొల్కచర్ల గ్రామానికి చెందిన కుర్ర విష్ణు(35) త్రిపురారం మండలం హర్జ్యాతండాకు చెందిన మహిళ విజయతో కలిసి దేవరకొండకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మండలంలోని సంగారం స్టేజీ దాటగానే ఇతని బైక్ను హైదరాబాద్ నుంచి మాచర్లకు వెళ్తున్న కారు ఎదురుగా ఢీ కొట్టింది. దీంతో బైక్ను నడుపుతున్న విష్ణు, వెనుక కూర్చున్న విజయ కారు పైనుంచి ఎగిరి 50 అడుగుల దూరంలో పడ్డారు. ఈ ప్రమాదంలో విష్ణు అక్కడికక్కడే మృతి చెందగా విజయకు తీవ్ర గాయాలయ్యాయి. విష్ణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. విజయ చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాడాన ప్రసాదరావు తెలిపారు. -
పశువులకాపరిపై ఎలుగు దాడి
కుప్పం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుడ్లనాయినిపల్లె గ్రామంలో శనివారం ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పశువులను కాస్తున్న వ్యక్తిపై దాడి చేసింది. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన తోటి పశువుల కాపరులు తమ ప్రాణాలు రక్షించుకొని అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
పాముకాటుకు చిన్నారి బలి
కోడేరు (మహబూబ్నగర్) : ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను పాము కాటు వేసిన ఘటనలో ఒక చిన్నారి మృతిచెందగా.. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన మహబూబ్నగర్ జిల్లా కోడేరు మండలం గన్యానాయక్ తండాలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నిహారిక(4), చరణ్(7)లు ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వారిని పాము కాటు వేసింది. దీంతో నిహారిక అక్కడికక్కడే మృతిచెందగా.. చరణ్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
పిడుగు పడి ఇద్దరు మృతి
నాగర్కర్నూలు : మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు మండలం పెద్దాపూర్ శివారులో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పొలంలో వ్యవసాయ పనుల్లో ఉండగా సమీపంలోనే పిడుగు పడడంతో బక్కమ్మ (55), ఈశ్వరమ్మ (40) అక్కడికక్కడే మృతి చెందారు. బాలయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి
ఉరవకొండ : ఇసుక లోడ్తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లింబగల్లు వద్ద చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్సు ఢీకొని వృద్ధునికి గాయాలు
అర్వపల్లి (నల్గొండ జిల్లా) : సూర్యాపేట - జనగాం ప్రధాన రహదారిపై మండల పరిధిలోని తిమ్మాపురం బస్ స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధునికి గాయాలైన ఘటన సోమవారం జరిగింది. అర్వపల్లి ఎస్హెచ్ఓ డి.వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం... తిమ్మాపురం గ్రామానికి చెందిన కోడెబోయిన వెంకటయ్య అనే వృద్ధుడు సోమవారం పశువులు తోలుకొని వ్యవసాయ పొలం వద్దకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాటిపాములకు వెళ్లి వస్తూ ఢీకొట్టింది. దీంతో బాధితుడిని నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
మంత్రి సతీమణి కారు ఢీకొని వ్యక్తికి గాయాలు
కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి) : దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి సతీమణి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒకరు గాయపడ్డారు. పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీఐ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గురువారం రంగారెడ్డి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన దొడ్ల రమేష్, ఇ.రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తుండగా కొంపల్లి చంద్రగార్డెన్స్ సమీపంలో మంత్రి సతీమణి ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెనుక కూర్చున్న దొడ్ల రమేష్ కాలు విరిగిపోయింది. అతడిని వెంటనే పేట్బషీరాబాద్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంత్రి కారు డ్రైవర్ రవికుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆయిల్ ట్యాంకర్, ఆటో ఢీ
కొణిజర్ల (ఖమ్మం) : ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని తనికెళ్ల గ్రామ సమీపంలో ఆటోను వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాధితుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కాగజ్ నగర్ లో పిడుగుపాటు
కాగజ్ నగర్ (ఆదిలాబాద్) : పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిలా కాగజ్నగర్ మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని వల్లకొండ పంచాయతీ పరిధిలోని సీతానగర్లో పిడుగుపడటంతో డి.మహేందర్కు చెందిన ఎద్దు మృతి చెందింది. సంఘటనా స్థలంలోనే వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న మహేందర్ భార్య కూడా పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం బాధితురాలు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
అదుపు తప్పిన బైక్ : ఒకరు మృతి
హైదరాబాద్ (గచ్చిబౌలి) : ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గచ్చిబౌలికి చెందిన మురళి అనే వ్యక్తి బైకుపై వెళుతుండగా అదుపు తప్పి రెయిలింగ్ను ఢీకొట్టాడు. దీంతో సదరు అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. -
టాటా ఏస్, బైక్ ఢీ : ఇంటర్ విద్యార్థి మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా శివారులోని గోరంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న టాటా ఏస్, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో అమృతం రాజశేఖర్(17) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. ఎనిమిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి గురైన ఇద్దరూ నారాయణ కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన పూర్ణచంద్రారెడ్డిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్, బైక్ ఢీ : ఒకరి పరిస్థితి విషమం
కొలిమిగుండ్ల (కర్నూలు) : ట్రాక్టర్ బైకును ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని జమ్మలమడుగు రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. దీంతో బైక్పై ఉన్నవారిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు, బైక్ ఢీ : ఒకరు మృతి
పుంగనూరు (చిత్తూరు జిల్లా) : వేగంగా వెళ్తున్న కారు బైక్ను ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండల కేంద్రంలో జాతీయరహదారిపై ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న కారు.. మలుపు వద్ద బైక్ను ఢీ కొనడంతో కర్ణాటకకు చెందిన ఫోటోగ్రాఫర్గా అనుమానిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. కాగా బైక్పై ఉన్న అతని కుమార్తె గాయపడటంతో మదనపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె షాక్కు గురికావడంతో వారి వివరాలు తెలియడంలేదని పోలీసులు తెలిపారు. ఆమె షాక్ నుంచి తేరుకున్నాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్నోవా, బోలెరో ఢీ.. ఒకరి మృతి
కర్నూలు(ఆధోని): కర్నూలు జిల్లా ఆధోని మండలం ఆరేకల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇన్నోవా, బోలెరో వాహనాలు ఢీకొన్నాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బోలెరోలో ప్రయాణిస్తున్న శ్యామల(32) అనే మహిళ మృతిచెందగా.. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆధోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.