trade war
-
వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!
స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాన్ని ప్రపంచంపై బలవంతంగా రుద్దిన అమెరికా, దాన్ని తమకు లాభం కలిగినంత కాలం ఉపయోగించుకుని ఇపుడు లాభం లేదనిపించటంతో ఎదురు తిరుగుతున్నది. ఆ విషయం బయ టకు ఒప్పుకోకుండా అధ్యక్షుడు ట్రంప్ సాకులు వెతుకుతున్నారు. కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు పెంచిన ఆయన తన చర్యకు పేర్కొన్న కారణాలను గమనించండి: అక్రమ వలసలు, ఫెంటానిల్ అనే మాదక ద్రవ్యం రవాణా. అక్రమ వలసలు మెక్సికో నుంచే గాక, ఆ దేశం మీదుగా ఇతర లాటిన్ అమెరికన్ దేశాల నుంచి, చివరకు ఇండియా వంటి సుదూర దేశాల నుంచి కూడా సాగుతున్న మాట నిజం. వాటి నిరోధానికి మెక్సికో సరిహద్దులలో గోడల నిర్మాణం, వేలాది సైన్యాల మోహరింపు ఇప్పటికే మొదలు పెట్టారు. కెనడా, చైనా నుంచి అక్రమ వలసలు అత్యల్పం. మాదక ద్రవ్యాల తయారీ, రవాణాను ఈ మూడు దేశా లలో ఏదీ అధికారికంగా ప్రోత్సహించటం లేదు. స్వేచ్ఛా వాణిజ్యానికి భంగంఅమెరికా, కెనడా, మెక్సికోల మధ్య వాణిజ్యానికి ఒక ప్రత్యేక ఒప్పందం ఉంది. అది ట్రంప్ మొదటి హయాం (2017–21)లో జరి గిందే. దానిని ట్రంప్ స్వయంగా ఉల్లంఘిస్తున్నారు. అమెరికా పట్టు బట్టి చేయించిన గాట్స్ ఒప్పందానికీ, అందుకు రూపాంతరమైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకూ, ఇంకా చెప్పా లంటే అమెరికా పెట్టుబడిదారీ, స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాలకూ ఈ చర్యలు విరుద్ధమైనవి. వాస్తవానికి తదనంతర కాలంలో ఇందుకు అనుగుణంగానే పాశ్చాత్య ప్రపంచంతో సహా అనేక దేశాలు పర స్పరమో, లేక ప్రాంతీయ బృందాలు గానో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ వస్తున్నాయి. ఆ విధంగా ప్రపంచం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. పెట్టుబడులు, వాణిజ్యంలో పరస్పర చర్చల ద్వారా జరిగే ఈ ఒప్పందాలు సాధారణంగా అన్ని పక్షాలకూ ప్రయో జనకరమవుతున్నాయనే భావన ఏర్పడింది కూడా. అటువంటిది, ఈ పరిణామాలన్నింటికీ మాతృదేశమనదగ్గ అమెరికాయే అందుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతుండటం ఆశ్చర్యకరం. అనేక దేశాల వలెనే అమెరికాలోనూ మాదక ద్రవ్యాల విని యోగం పెద్ద ఎత్తున ఉంది. ఈ వినియోగం ఎప్పటినుంచి ఎందువల్ల మొదలై కొనసాగుతున్నదనే విషయం ప్రచారంలోకి రావటం లేదు. వియత్నాం యుద్ధంలో అమెరికా 1960ల నుంచి 1970ల వరకు ఉధృతంగా పాల్గొని భయంకరమైన హత్యాకాండ సాగించి ఆఖరుకు ఓటమిపాలైంది. ఆ కాలమంతా వారి యుద్ధ విమానాల రవాణా నైజీరియా మీదుగా జరిగినపుడు, యుద్ధం వల్ల వ్యథకు గురైన సైనికులు దానిని మరిచిపోయేందుకు స్థానికంగా లభించే మాదక ద్రవ్యా లకు అలవాటుపడ్డారు. అది యుద్ధం తర్వాత మాజీలు అయిన సైనికులకు కొనసాగి వారి ద్వారా, ఇతరత్రా వ్యాపించి స్థిరపడింది. ఆ కాలంలో లాటిన్ అమెరికా నుంచి డ్రగ్ కార్టెల్స్ ఎట్లా పని చేశాయన్న చర్చ అప్రస్తుతం. అయితే ఇందుకు సుంకాల హెచ్చింపు ఎట్లా పరిష్కారమవుతుందన్నది ట్రంప్ సైతం వివరించని ప్రశ్న. ఆ పని చేయటానికి బదులు, అంతర్జాతీయ ఆర్థిక అత్యవసరాల చట్టం ఒక దానిని అడ్డు పెట్టుకుని మెక్సికో, కెనడా వంటి అతి సన్నిహిత మిత్ర దేశాలపై 25 శాతం సుంకాలు పెంచారు.కృత్రిమ ఆధిపత్యంఅమెరికా వంటి అగ్రస్థాయి సంపన్న దేశానికి ఇటువంటి చర్యల అగత్యం ఎందుకు ఏర్పడింది? తమ వద్ద ఉత్పత్తుల ఖర్చు పెరుగు తున్నందున, వెనుకబడిన దేశాలలో వేతనాలు, ముడిసరుకులు, మౌలిక సదుపాయాల ఖర్చు తక్కువ గనుక, అక్కడ ఉత్పత్తులు చేయించి, అక్కడి నుంచి చవకగా దిగుమతి చేసుకోవచ్చుననే వ్యూహంలో దీనికంతా మూలాలు ఉన్నాయి. ఇది కొంతకాలం సజా వుగా సాగినా, ఆయా దేశాలు సాంకేతికంగా, పారిశ్రామికంగా బల పడటం, తొలి దశలో అమెరికా నుంచి యూరప్ నుంచి తరలి వెళ్లిన ప్రైవేట్ కంపెనీలు అక్కడి లాభాలకు అలవాటుపడటంతో ఈ పాశ్చాత్య దేశాలకు పలు సమస్యలు మొదలయ్యాయి. అక్కడి పారి శ్రామికత, ఆదాయాలు, ఉపాధి అవకాశాలు తగ్గసాగాయి. మిగులు బడ్జెట్లు లోటు బడ్జెట్లుగా మారాయి. అమెరికా అయితే సుమారు 30 ట్రిలియన్ డాలర్ల లోటు, అప్పుల భారానికి చేరి, బంగారం నిల్వల మద్దతు లేకపోయినా డాలర్లను యథేచ్ఛగా ముద్రించి ప్రపంచం పైకి వదలటం, డాలర్ ఆధిపత్యాన్ని కృత్రిమంగా నిలబెట్టడం వంటి దశకు చేరుకుంది. మామూలుగానైతే ఆర్థికంగా ఇది దివాళా స్థితి అవుతుంది. కానీ ఆ కృత్రిమతను నిలబెట్టేందుకు, ఒకవేళ బ్రిక్స్ కూటమి డాలర్ను బలహీనపరిచే చర్యలు తీసుకునే పక్షంలో ఆ కూటమి దేశాలపై 100 శాతం సుంకాలు పెంచగలమంటూ పదేపదే బెదిరించవలసిన బలహీన స్థితిని అమెరికా ఎదుర్కొంటున్నది. ఇంతకూ ట్రంప్ సుంకాల హెచ్చింపు అమెరికాకు ఎంతవరకు ఉపయోగపడవచ్చునన్నది ప్రశ్న. ఈ తరహా చర్యలు ఆయన తన మొదటి పాలనా కాలంలోనూ తీసుకున్నారు. అపుడు ఆయన వాణిజ్య యుద్ధం కేవలం చైనాపై. అది చైనాకు కొంత నష్టం కలిగించినా అమెరికాకు అంతకన్న ఎక్కువ నష్టం కలిగిందన్నది అమెరికన్ ఆర్థిక వేత్తల దాదాపు ఏకాభిప్రాయం. అందుకు కారణాలను విశ్లేషించుకోవడానికి బదులు, తన వాణిజ్య యుద్ధాన్ని మిత్ర దేశాల పైకి కూడా విస్తరించటం నమ్మశక్యం కాకుండా ఉంది. రానున్న రోజులలో యూరోపియన్ దేశాలపై కూడా సుంకాల పెరుగుదల ఉండగలదని సూచించారు. అమెరికా దిగుమతులలో ఈ మూడు దేశాల ఉత్ప త్తులు కలిపి 40 శాతం ఉంటాయని అంచనా. అమెరికాకు ఎగుమతులు చేసే మొదటి 10 దేశాలలో చైనా తప్ప మిగిలినవన్నీ వారి మిత్ర దేశాలే. ఇండియా పదవ స్థానంలో ఉంది. ఇండియా పైనా సుంకాలు పెంచగలమని ట్రంప్ ఇప్పటికే అన్నారు. తమ ఆధునిక మోటార్ వాహనాలపై ఇండియా సుంకాలు తగ్గించాలని మొదటి పాలనా కాలంలో కోరగా అందుకు అంగీకరించని మోదీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త బడ్జెట్లో అటువంటి ప్రతిపాదనలు చేయటం గమనించదగ్గది. ఆ చర్య ట్రంప్ను మెత్తబరచగలదేమో చూడాలి.ట్రంప్ చర్యకు ప్రతిగా, కెనడా ప్రధాని ట్రూడో కొద్ది గంటల లోనే, అదే 25 శాతం స్థాయిలో ఎదురు సుంకాలు ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షెన్బామ్ కూడా తాము సుంకాలను పెంచి తీరగలమన్నారు. ఈ రెండు దేశాల నుంచి వివిధ వినియోగ వస్తువులపైనే గాక యంత్ర పరికరాలు, చమురు, విద్యుత్ దిగుమతు లపై అమెరికా చాలా ఆధారపడి ఉంది. మరొక వైపు చైనా ఈ సుంకాలు వివక్షాపూరితం అంటూ డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేసింది. వాణిజ్య యుద్ధాలను అమెరికా గతంలోనూ చేసింది. కాకపోతే దౌత్యపరమైన లక్ష్యం కోసం ఇతరులను లొంగదీయటానికి. ట్రంప్ అట్లాగాక ఈ యుద్ధంతో తమ ఆర్థిక వ్యవస్థకు లాభం చేస్తామంటున్నారు. ఇతరులు లొంగి రావటంవల్ల అమెరికా లాభపడగలదనీ, దానితో ప్రజలపై ఆదాయ పన్ను మొత్తంగా రద్దు చేయవచ్చుననీ ఆశపెడుతున్నారు. అమెరికా మార్కెట్లు ఎంత పెద్దవి అయినా ఈ సుంకాల ఒత్తిడితో ఇతరులు కూడా సుంకాలు పెంచటం, వారి ముడి వస్తువులు అమెరికా పరిశ్రమలకు లభించకపోవటం, ఆయా దేశాలు ఇతర మార్కెట్లను వెదుక్కోవటం వంటివి జరిగితే పరిస్థితి ఏమిటి? ఇవిగాక రెండు ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. ఇటువంటి యుద్ధాలతో స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతపు భవిష్యత్తు ఏమిటన్నది ఒకటైతే, ఈ ప్రభావాలు రాజకీయంగా, భౌగోళికంగా ఏ విధంగా ఉండవచ్చు ననేది రెండవది. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఐరోపా సమాఖ్యపైనా టారిఫ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై అదనపు టారిఫ్లు విధించిన ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (ఈయూ)పై సుంకాలు విధిస్తానని సంకేతాలు ఇస్తున్నారు. ట్రంప్ సుంకాలు విధిస్తే తాము దీటుగా బదులిస్తామని ఐరోపా సమాఖ్య సైతం కుండబద్దలు కొట్టింది. చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను నివారించవచ్చని వ్యాఖ్యానించింది. 27 దేశాల కూటమిపై సుంకాల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నారా? అని వైట్హౌజ్లో ట్రంప్ను మీడియా ప్రశ్నించింది.‘‘ దీనికి నిజమైన సమాధానం కావాలా లేక రాజకీయ సమాధానం కావాలా?. ఖచ్చితంగా విధిస్తా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ అమెరికా పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈయూకు వ్యతిరేకంగా ట్రంప్ గళమెత్తడం ఇది మొదటిసారి కాదు. వాణిజ్యం విషయంలో అమెరికా పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని గతంలోనూ ఆయన ఆరోపించారు. ట్రంప్ తొలిసారిగా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నప్పుడూ స్టీల్, అల్యూమినియం ఎగుమతులకు సంబంధించి ఈయూపై సుంకాలు విధించారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఈయూ కూటమి వెంటనే తగిన రీతిలో స్పందించింది. విస్కీ, మోటార్ సైకిళ్లతో సహా పలు అమెరికా వస్తువులపై టారిఫ్లు విధించి ప్రతీకారం తీర్చుకుంది.ప్రతీకారం తప్పదన్న ఈయూకెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా టారిఫ్లు విధించడాన్ని ఈయూ వ్యతిరేకించింది. ‘‘సుంకాలు అనవసరమైన ఆర్థిక అంతరాయాలను సృష్టిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. అవి రెండు వైపులా ఇబ్బందులను కలగచేస్తాయి. అలాంటిది ఈయూ వస్తువులపైనే అన్యాయంగా లేదా ఏకపక్షంగా సుంకాలు విధించే ఏ వాణిజ్య భాగస్వామికైనా మేం గట్టిగా బదులిస్తాం’’ అని ఈయూ వ్యాఖ్యానించింది.మెక్సికోపై టారిఫ్ అమలుకు బ్రేక్మెక్సికో నుంచి దిగుమతి అయ్యే వస్తూత్ప త్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఆఖరి నిమిషంలో తన ఆదేశాల అమలును నిలుపుదల చేశారు. నేటి నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రావాల్సి ఉండగా తన ఉత్తర్వుల అమలును నెల రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు సోమ వారం ట్రంప్ ప్రక టించారు. టారిఫ్ల అమలు నిలుపుదలపై అమె రికా సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ వెల్ల డించారు. సోమవారం ఆమె ట్రంప్తో దాదాపు 45 నిమిషాలు ఫోన్లో మంతనాలు జరిపారు. -
అగ్రరాజ్యపు వాణిజ్య యుద్ధం
అగ్రరాజ్యం కొత్త యుద్ధానికి తెర తీసింది. అయితే, ఇది ఆయుధాలతో కూడిన యుద్ధం కాదు... ఆర్థికపరమైన యుద్ధం. అధ్యక్షుడు ట్రంప్ తన అత్యవసర అధికారాలను ఉపయోగిస్తూ... కెనడా, మెక్సికోల నుంచి దిగుమతులపై 25 శాతం మేర, అలాగే చైనా నుంచి దిగుమతులపై ఇప్పటికే ఉన్న భారానికి అదనంగా మరో 10 శాతం మేర సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కెనడా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, సహజ వాయువుపై మాత్రం 10 శాతం వడ్డింపుతో సరి పెట్టారు. ఇది అమెరికాకూ, దాని అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు మూడింటికీ మధ్య వాణిజ్య యుద్ధాల శకానికి శ్రీకారం చుట్టింది. చైనాను పక్కనబెట్టినా, సాక్షాత్తూ పొరుగుదేశాలపైనే ట్రంప్ ఇలా ఆర్థికంగా కత్తి దూయడం విడ్డూరమే. అదేమంటే... పెరుగుతున్న నేరాలనూ, డ్రగ్స్ సరఫరానూ అడ్డుకోవడానికే ఈ చర్య అంటూ సమర్థించుకోవడం మరీ విచిత్రం. ఈ సంచలనాత్మక చర్యకు ప్రతిచర్యగా మెక్సికో సైతం ఎదురు సుంకాలు వేయగా, త్వరలో జాతీయ ఎన్నికలున్న కెనడా కూడా అమెరికాకు దీటుగా 25 శాతం సుంకాల వడ్డింపుతో ఎదురుదాడికి దిగింది. అమెరికా తప్పుడు విధానాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు వేయనున్నట్టు చైనా ప్రకటించింది. కడపటి వార్తలు అందుతున్న సమయానికి అమెరికా – మెక్సికోల మధ్య మాత్రం సయోధ్య కుదురుతోందనీ, ఆ దేశంపై సుంకాలను అమెరికా నెల రోజులు వాయిదా వేసిందనీ సమాచారం. ఆ మాట ఏమైనా, విశ్వవేదికపై ట్రంప్ ఆరంభించిన వాణిజ్య పోరు రసకందాయంలో పడింది. ఇప్పటికే పరాయి దేశాలకు 36 లక్షల కోట్ల డాలర్ల మేర అప్పులున్న అగ్రరాజ్యం వాటి నుంచి బయటపడేందుకు సుంకాలు పెంచినట్టనిపిస్తున్నా, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు స్వయంకృత గాయమే. పెరిగిన సుంకాలతో అమెరికాకు సరఫరా తగ్గి, సరుకుల ధరలు పెరిగి, సామాన్యులపై భారం పడుతుంది. ఈ సుంకాల వల్ల ఈ ఏడాది అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పు డున్న 2.9 శాతం నుంచి మరో అర శాతం దాకా పెరుగుతుందట. ఇక, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 1.5 శాతం మేర పడిపోతుందని విశ్లేషణ. సగటు అమెరికన్ కుటుంబంపై ఏటా వెయ్యి నుంచి 1200 డాలర్ల మేర భారం పడుతుందని లెక్క. మొత్తం మీద అక్రమ వలసలు, ఫెంటానిల్ తరహా మందుల లాంటి ప్రధాన సమస్యలపై ట్రంప్ దృష్టి పెట్టడం బానే ఉన్నా, దిగుమతి సుంకాలు పెంచడమనే తప్పుడు విధానం వల్ల అమెరికన్లకే నష్టమనే భావన ఉంది. సరుకుల ధరలు తగ్గిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తీరా అందుకు వ్యతిరిక్తంగా వ్యవహరిస్తున్నా రని ప్రతిపక్ష డెమోక్రాట్లు ధ్వజమెత్తుతున్నారు. గత ట్రంప్ హయాంలోని చైనాతో వాణిజ్య యుద్ధాన్నే తమ పాలనలో కొనసాగించిన డెమోక్రాట్లు ఇప్పుడు భిన్న వైఖరి తీసుకుంటారేమో చూడాలి. ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై ఇంతగా సుంకాల విధింపు ఆలోచనను దశాబ్దం క్రితం చేస్తే దాన్ని వెర్రిమొర్రి ఆలోచనగా చూసేవారు. కానీ, ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆ పనే చేసింది. మెక్సికో, కెనడా, చైనాలతో ఇది ఆగుతుందా, లేక రానున్న రోజుల్లో యూరోపియన్ యూనియన్, భారత్ సహా ఇతర దేశాలపైనా ట్రంప్ ఈ అస్త్రం ప్రయోగిస్తారేమో చూడాలి. నిజానికి, వలసలను ఆపి, అధిక దిగుమతులకు ముకుతాడు వేయాలంటే, తగినంత సమయం వెచ్చించి, విధానపరమైన అంశాలపై లోతుగా దృష్టి పెట్టాలి. వలసజీవుల్ని పెద్దయెత్తున వెనక్కి పంపడంతో అమెరికాలో చౌకగా దొరికే శ్రామికులు తగ్గి, వేతనాలు పెరిగి, ద్రవ్యోల్బణం హెచ్చుతుంది. కానీ, ఎవరు చెప్పినా ఒక పట్టాన వినే ఘటం కాని ట్రంప్ సమస్త వాణిజ్య, ఆర్థికేతర సమస్యలకూ ఈ సుంకాల విధింపే సర్వరోగ నివారిణి అని భావిస్తున్నారు. చమురు మొదలు సరుకుల దాకా ఏవీ పొరుగుదేశాల నుంచి అమెరికాకు అక్కర్లేదని హూంకరిస్తున్నారు కానీ, దిగుమతులేవీ చేసుకోకుండా, సమస్తం స్వదేశంలోనే సిద్ధం చేసుకొని, ఎవరితోనూ ఏ వాణిజ్య సంబంధాలూ అవసరం లేని బంధిత ఆర్థిక వ్యవస్థగా అమెరికాను తీర్చిదిద్దడం సాధ్యమేనా? దేశాల ద్వారాలన్నీ తెరుచుకొని, ప్రపంచమొక కుగ్రామంగా మారిన వర్తమాన కాలంలో ఈ రకమైన విధానంతో మనగలగడం అగ్రరాజ్యానికైనా సరే కుదురుతుందా?ట్రంప్ తాజా చర్యతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి, గందరగోళం నెలకొన్నాయి. ప్రపంచమంతటా దీని ప్రకంపనలూ తప్పవు. భారత్ అనేక విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారపడినందున మన వస్తూత్పత్తి రంగం పైన, అలాగే డాలర్ బలపడి, విదేశీ మదుపరులు విక్రయాల్ని కొనసాగించడంతో మార్కెట్ పైన ప్రభావం కనిపించనుంది. అలాగే, అమెరికా భారీ సుంకాల బారిన పడ్డ ఆర్థిక వ్యవస్థలు ఇక తమ వస్తువుల్ని ఇతర దేశాల్లో కుమ్మరించాలి గనక భారత పరిశ్రమలకు బెత్తం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి, ఇప్పటికైతే సుంకాల విధింపు జాబితాలో మన పేరు లేకున్నా భారత్ తగిన జాగరూకతతో వ్యవహరించాలి. ఈ నెలలోనే అమెరికాలో పర్యటించ నున్న భారత ప్రధాని ఇరుదేశాల బలమైన బంధాన్ని మనకు సానుకూలంగా మలుచుకోవాలి. అయితే, ఒకటి మాత్రం నిజం. కోర్టులు బరిలోకి దిగి, ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమని తీర్మానిస్తే తప్ప... ప్రజాభిమతంతో గద్దెనెక్కిన ట్రంప్ ఆలోచనలకూ, అనుసరించే విధానాలకూ అడ్డులేదు. కనుక ట్రంప్ మార్కు వ్యవహారశైలికి ఇవాళ్టికి ఇవాళ బ్రేకులు పడవు. అదేసమయంలో దిగుమతి సుంకాల వల్ల అమెరికా సంపద్వంతమై, బలోపేతమవుతుందన్న ఆయన ఆలోచన మాత్రం ఆచరణలో వాస్తవరూపు దాల్చడమూ కష్టమే! -
ఇండియాకు వెయిటేజీ పెంచిన సీఎల్ఎస్ఏ
న్యూఢిల్లీ: గరిష్టాల నుంచి 10% దిద్దుబాటుకు గురైన భారత ఈక్విటీల పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ సానుకూల వైఖరి తీసుకుంది. లోగడ ఖరీదుగా మారిన భారత ఈక్విటీల నుంచి చౌకగా మారిన చైనా స్టాక్స్ వైపు మళ్లిన ఈ సంస్థ.. భారత ఈక్విటీ వ్యాల్యూ షన్లు దిగిరావడంతో ఇక్కడ ఎక్స్పోజర్ పెంచుకోవాలని నిర్ణయించింది. చైనా పెట్టుబడులు తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయంతో చైనా మార్కెట్లు పెద్ద సవాళ్లు ఎదుర్కోనున్నాయంటూ, తన తాజా నిర్ణయానికి ఇదే కారణంగా పేర్కొంది.చైనా వృద్ధిలో ఎగుమతుల వాటాయే సింహభాగం ఉండడం, చైనా దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడాన్ని గుర్తు చేసింది. భారత్లో అధికంగా ఉన్న ఎక్స్పోజర్ నుంచి కొంత మేర అక్టోబర్ మొదటి వారంలో చైనాకు మళ్లించినట్టు పేర్కొంది. భారత వెయిటేజీని 20% నుంచి 10%కి తగ్గించి, చైనా అలోకేషన్ను 5%కి సీఎల్ఎస్ఏ లోగడ పెంచుకోగా, ఇప్పుడు పూర్వపు స్థితికి మారుతున్నట్టు ప్రకటించింది. భారత్లో 20% ఇన్వెస్ట్ చేయాలని తాజాగా నిర్ణయించింది.నెలన్నర రోజుల్లో భారత ఈక్విటీల నుంచి ఎఫ్పీఐలు సుమారు రూ.లక్షన్నర కోట్లను తరలించుకుపోయిన నేపథ్యంలో సీఎల్ఎస్ఏ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. పలువురు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తమ భారత ఈక్విటీ ఎక్స్పోజర్ను పెంచుకునేందుకు ఈ తరహా కరెక్షన్ కోసం చూస్తున్నట్టు తెలిపింది. చైనాకు ప్రతికూలతలు.. చైనా ఆరి్థక భవిష్యత్ అనిశి్చతిగా ఉన్నట్టు సీఎల్ఎస్ఏ తెలిపింది. చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఉద్దీపనలు ఆరి్థక వృద్ధికి కావాల్సినంత ప్రేరణనివ్వలేవని అభిప్రాయపడింది. యూఎస్ ఈల్డ్స్ పెరుగుతుండడం, ద్రవ్యోల్బణంపై అంచనాలు యూఎస్ ఫెడ్, చైనా సెంట్రల్ బ్యాంక్లు తమ పాలసీని మరింత సరళించే అవకాశాలను పరిమితం చేయనున్నట్టు పేర్కొంది. ఈ అంశాలతో చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఉద్దీపనల తర్వాత చైనా మార్కెట్ వైపు వెళ్లిన ఆఫ్షోర్ ఇన్వెస్టర్లు వెనక్కి రావొచ్చని అంచనా వేసింది. -
అమెరికా, చైనా చలో చలో..
బీజింగ్ : కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటనుంచి అమెరికా, చైనాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినప్పటికీ తాజాగా మొదటిదశ వాణిజ్య ఒప్పందంలో ఇరుదేశాలు ముందడుగు వేశాయి. దీనికి సంబంధించి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో ముచ్చటించారు. దిగుమతులు, ఎగుమతుల అంశంపై ఒప్పందాన్ని కొనసాగించేందుకు మొగ్గుచూపారు. ఇక్కడ చైనానే ఒక మెట్టుదిగినట్లు కనబడుతోంది. చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా కాస్త వెనక్కి తగ్గింది. ఇరుదేశాల మధ్య ఆర్థికపురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజింగ్ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే చర్చలకు ముందుకొచ్చి అమెరికాతో సంప్రదింపులు జరిపింది. జనవరిలోనే యూఎస్, చైనా దేశాలు మొదటిదశ ఆర్థిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో అమెరికా బాహాటంగానే చైనాపై అగ్గిమీద గుగ్గిలమయ్యింది. కావాలనే వైరస్ను ప్రపంచానికి అంటగట్టారంటూ పలు విమర్శలు చేసింది. కరోనా వైరస్పై అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, ఆ దేశం చర్యలపట్ల అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ రెండో దశ వాణిజ్య చర్చలకు ట్రంప్ విముఖత చూపారు. (అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్) అంతేకాకుండా చైనా మాతృసంస్థ అయిన టిక్టాక్ను త్వరలోనే బ్యాన్ చేస్తాం అని అమెరికా ప్రకటించింది. టిక్టాక్ యాప్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని వాషింగ్టన్ మీడియా తమ ప్రకటనల్ని సమర్థించుకుంది.అయితే ఈ చర్యలను చైనా ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. కావాలనే అమెరికా అణచివేత ధోరణి అవలంభిస్తుందని ఆరోపించింది. తదనంతరం ఆరోపణలు, ప్రత్యారోపణలు కాస్తా ట్రేడ్ వార్కు దారితీసిన సంగతి తెలిసిందే. చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు వేసిన అమెరికాపై చైనా కూడా అదే ధోరణి అవలంభించింది. అవసరమనుకుంటే చైనాతో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు మొదటిదశ ఆర్థిక ఒప్పందాలపై నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. (మరో నాలుగేళ్లు ట్రంప్కు అవకాశమివ్వండి) -
అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై కత్తులు నూరారు. అవసరమనుకుంటే చైనాతో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరించారు. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా జాగ్రత్త పడతామని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో శనివారం పేర్కొన్నారు. కాగా, అమెరికా ఉత్పత్తులకు చైనా అతిపెద్ద దిగుమతిదారు అన్న సంగతి తెలిసిందే. ‘చైనాతో వ్యాపారం చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే మేము సరైన భాగస్వామి అని చైనా అనుకోవండం లేదు. అందుకే మేము కూలా అలానే ఆలోచిస్తున్నాం’అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, జనవవరిలో మొదటి దశ వాణిజ్య ఒప్పందాల సమయంలో ట్రంప్ చైనాతో ట్రేడ్ వార్కు తెర తీశారు. (చదవండి: చీకటి నుంచి వెలుగులోకి) చైనా నుంచి దిగుమతులపై టారిఫ్లు పెంచడంతో షీ జిన్పింగ్ ప్రభుత్వం కూడా దీటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండగానే కరోనా మహమ్మారి ప్రపంచదేశాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా అమెరికా తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో కరోనా వైరస్పై అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, ఆ దేశం చర్యలపట్ల అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ రెండో దశ వాణిజ్య చర్చలకు విముఖత చూపారు. ఇదిలాఉండగా.. చైనాలో అమెరికా తయారీ సంస్థలకు న్యాయమైన, స్థాయి ప్రాతిపదికన పోటీకి అవకాశాలు లభించకపోతే.. యూఎస్, చైనా ఆర్థిక వ్యవస్థలు వేరుపడక తప్పదని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్ జూన్లో పేర్కొనడం గమనార్హం. (చదవండి: వ్యాక్సిన్ తయారీలో చైనా దూకుడు) -
చైనా శకం ముగిసింది!
గతమెంతో ఘనకీర్తి..?! భవిష్యత్తులో చైనా ఇదేవిధంగా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో. పిన్ను నుంచి పెద్ద యంత్రం వరకు ఏ ఉత్పత్తిని అయినా తయారు చేయగలదు చైనా. అందుకే అంత వేగంగా ఎదిగి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలిగింది. కానీ, కరోనాతో, అమెరికాతో వాణిజ్య కయ్యం కారణంగా చైనా పరిస్థితి మారిపోనుందని నిపుణులు, పారిశ్రామికవేత్తల మాటలను పరిశీలిస్తే అర్థమైపోతోంది. ‘ప్రపంచానికి పరిశ్రమగా చైనా రోజులు ముగిసినట్టే’.. ఈ విధంగా వ్యాఖ్యానించింది ఫాక్స్ కాన్ బాస్ యంగ్ లీ. (3 కోట్లు దాటిన పరీక్షలు) దీనికి కారణంగా ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం)ను ఆయన పేర్కొన్నారు. యాపిల్ ఐఫోన్ల నుంచి, డెల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్ కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్ కాన్తోపాటు చైనా కేంద్రంగా విస్తరించిన డజను వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్ కు, యూఎస్ మార్కెట్కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకున్నాయి. చైనా బయట క్రమంగా మరింత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ (ఫాక్స్ కాన్ గా ట్రేడయ్యే సంస్థ) చైర్మన్ యుంగ్ లీ తెలిపారు. ప్రస్తుతానికి మొత్తం తయారీ సామర్థ్యంలో 30 శాతం చైనా బయట ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. గతేడాది జూన్ నాటికి ఇది 25 శాతమే. ఏడాదిలో చైనా వెలుపల 5 శాతం తయారీని పెంచుకున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికలతో ఉంది. చైనాలో తయారై అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై పెరిగే టారిఫ్ల భారం పడకుండా ఉండేందుకు గాను ఫాక్స్ కాన్ సంస్థ భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ఫలితాల ప్రకటన సందర్భంగా యంగ్ లీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘భారత్ లేదా ఆగ్నేయాసియా లేదా అమెరికా.. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో తయారీ ఎకోసిస్టమ్ ఉంది’’ అని లీ పేర్కొన్నారు. అయితే, ఫాక్స్ కాన్ తయారీలో చైనా ఇక ముందూ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాకపోతే ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా దశకం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్లో ఫాక్స్ కాన్ విస్తరణ అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యంగ్ లీ గతేడాదే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని లీ మాటలతో స్పష్టమవుతోంది. ఫాక్స్కాన్కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి భారత్ ను ప్రధానంగా ఫాక్స్ కాన్ పరిశీలిస్తుండడం గమనార్హం. యాపిల్ ఐపాడ్, మ్యాక్ ఉత్పత్తులకు డిమాండ్ కారణంగా ఫాక్స్ కాన్ జూన్ క్వార్టర్ లో 5,835 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ తైవాన్కు చెందినది. టెన్సెంట్ హోల్డింగ్స్కు చెందిన వీచాట్ వినియోగాన్ని అమెరికా పౌరులు వినియోగించకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి వీచాట్ యాప్ ను తొలగించినట్టయితే వార్షికంగా ఐఫోన్ల ఎగుమతులు 25–30% పడిపోవచ్చనేది టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అంచనా. పోటీతత్వంతో స్వావలంబన భారత్ భారత్ తన అవసరాలను దేశీయంగా తీర్చుకునేందుకు (ఆత్మ నిర్భర్) దేశీయ పరిశ్రమ కచ్చితంగా మరింత పోటీనిచ్చే విధంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంబిస్తున్న తరుణంలో.. భారత్ కూడా తన అవసరాలకు తనపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత మార్కెట్ కలిగిన అమెరికా సైతం రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కనుక రానున్న రోజుల్లో ఆత్మ నిర్భర్కు మరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ‘‘మన పరిశ్రమలను మరింత పోటీయుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోటీతత్వం మన పరిశ్రమల సమర్థతను పెంచుతుంది. ఆ పోటీయే మనకు మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు, ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధానాలను అమలు చేసినట్టు ప్రభు చెప్పారు. దేశాన్ని మరింత సౌభాగ్యంగా మార్చేందుకే ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చినట్టు చెప్పారు. -
డ్రాగన్ దూకుడు : భారత్ దిగుమతులపై సుంకాల పొడిగింపు
బీజింగ్ : భారత్లో తయారయ్యే ఆప్టికల్ ఫైబర్పై యాంటీ డంపింగ్ టారిఫ్ను చైనా పొడిగించినట్టు విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సుంకాలు మరో ఐదేళ్ల పాటు అమల్లో ఉంటాయి. భారత్లో ఉత్పత్తయ్యే ఆప్టికల్ ఫైబర్పై ఆగస్ట్ 14 నుంచి ఐదేళ్ల పాటు యాంటీ డంపింగ్ డ్యూటీలు వర్తిస్తాయని బీజింగ్ పేర్కొంది. ఈ ప్రకటనలో పలు భారతీయ కంపెనీల పేర్లను డ్రాగన్ ప్రస్తావించింది. భారత తయారీదారులకు అనుగుణంగా ఈ సుంకాలు 7.4 శాతం నుంచి 30.6 శాతం దాకా ఉంటాయని చైనా పేర్కొంది. ఇండో-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో యాంటీ డంపింగ్ డ్యూటీల పొడిగింపుపై డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. యాంటీ డంపింగ్ సుంకాలను తొలగిస్తే చైనా పరిశ్రమలకు కలిగే నష్టాన్ని అంచనా వేసి విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. చైనా, మలేషియా, తైవాన్ల నుంచి బ్లాక్టోనర్ దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని భారత్ ప్రతిపాదించిన నేపథ్యంలో చైనా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23న చైనా, దక్షిణ కొరియా, వియత్నాం నుంచి దిగుమతయ్యే కొన్ని ఉక్కు ఉత్పత్తుల దిగమతులపైనా భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. చదవండి : చైనా కంపెనీల మనీలాండరింగ్ రాకెట్ -
బేర్ ఎటాక్!
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, దక్షిణ చైనా సముద్రం విషయమై అమెరికా–చైనాల మధ్య తాజాగా ఉద్రిక్తతలు చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా మంగళవారం భారీగా నష్టపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 23 పైసలు నష్టపోయి 75.42కు చేరడం, దేశంలో కొన్ని నగరాల్లో లాక్డౌన్ విధించడం వల్ల ఆర్థిక రికవరీకి విఘాతం వాటిల్లగలదన్న ఆందోళనలు, ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 661 పాయింట్లు పతనమై 36,033 పాయింట్లకు, నిఫ్టీ 195 పాయింట్లు క్షీణించి 10,607 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు సూచీలు చెరో 1.8% చొప్పున నష్టపోయాయి. ఫార్మా సూచీకే లాభాలు..... ►ప్రపంచ మార్కెట్ల పతనంతో మన మార్కెట్ నష్టాల్లోనే మొదలైంది. నష్టాలు పెరుగుతూ పోయాయే కానీ ఏ దశలోనూ ఊరట లభించలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 817 పాయింట్లు, నిఫ్టీ 240 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఒక్క ఎన్ఎస్ఈ ఫార్మా సూచీ మాత్రమే లాభపడింది. మిగిలిన అన్ని సూచీలు నష్టపోయాయి. బ్యాంక్, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ►సెన్సెక్స్లోని 30 షేర్లలో టైటాన్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ►వాహన రుణాలకు సంబంధించి అవకతవకలపై విచారణ జరుపుతున్నామని యాజమాన్యం నిర్ధారించడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2 శాతం నష్టంతో రూ.1,059 వద్ద ముగిసింది. ►స్టాక్మార్కెట్ భారీగా నష్టపోయినా, దాదాపు వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, డాక్టర్ లాల్ ప్యాథ్ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ►దాదాపు 400కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అర్వింద్ ఫ్యాషన్స్, ఐడీబీఐ బ్యాంక్, రెప్కో హోమ్ ఫైనాన్స్, సుజ్లాన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ►డాబర్ ప్రమోటర్లు బర్మన్లు తమ వాటాను 8.5 శాతం నుంచి 20 శాతానికి పెంచుకోవడంతో ఎవరెడీ ఇండస్ట్రీస్ షేర్ 10% అప్పర్ సర్క్యూట్తో రూ.89 వద్ద ముగిసింది. ►కరోనా చికిత్సలో ఉపయోగపడే ఔషధాన్ని అందించనున్నామని ప్రకటించడంతో బయో కాన్ షేర్ 5 శాతం లాభంతో రూ.437 వద్దకు చేరింది. ►ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీఓ) మొదలైన నేపథ్యంలో యస్ బ్యాంక్ షేర్ 5% నష్టంతో రూ.21 వద్ద ముగిసింది. గత 3 రోజుల్లో ఈ షేర్ 22% నష్టపోయింది. ఎఫ్పీఓ ఫ్లోర్ప్రైస్ రూ.12గా యస్బ్యాంక్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అన్ని సానుకూలాంశాలను మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుంది. సెన్సెక్స్ 37.022 పాయింట్ల స్థాయికి చేరే క్రమంలో ప్రతి నిరోధ స్థాయి వద్ద లాభాల స్వీకరణ జరుగుతూనే ఉంటుంది. –శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ నిఫ్టీ 10,750 పాయింట్లపైన ముగియగలిగితేనే అప్ట్రెండ్ కొనసాగుతుంది. లేని పక్షంలో 10,480–10,500 పాయింట్లకు, ఆ తర్వాత 10,350 పాయింట్లకు పతనమయ్యే అవకాశాలున్నాయి. –మనీశ్ హతిరమణి, టెక్నికల్ అనలిస్ట్ -
డ్రాగన్తో కటీఫ్ సాధ్యమేనా
చేతిలో రెడ్మి స్మార్ట్ఫోన్... ఓపెన్ చేస్తే టిక్టాక్ వీడియో... చెవిలో షియోమి ఇయర్ ఫోన్... అలీ ఎక్స్ప్రెస్లో నచ్చిన వస్తువుకు ఆర్డర్... పేటీఎంలో ఫ్రెండ్కి క్షణాల్లో నగదు బదిలీ... ఇలా ఒకటేమిటి చేతికి తొడుక్కునే వాచీ నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకూ అన్నింటికీ ఒకటే లింకు.. అరే ఠక్కున భలే చెప్పేశారే! అదేమరి చైనా ‘చౌక’ మహిమ!! భారతీయులను తన చౌక ఉత్పత్తులతో బానిసలుగా మార్చేసిన డ్రాగన్... అదును చూసి మనపైనే బుసలు కొడుతోంది. సరిహద్దుల్లో భారతీయ సైనికులను దొంగదెబ్బతీస్తూ... తన ఉత్పత్తులను మాత్రం రాజమార్గంలో ఎడాపెడా అమ్ముకుంటోంది. దేశంలో ఇప్పుడు ఇదే హాట్టాపిక్. చైనా వస్తువులను బహిష్కరించి డ్రాగన్తో వాణిజ్య యుద్ధం చేయాలంటూ సోషల్ మీడియాలో ఒకటే హల్చల్. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు చైనాతో మనకున్న ఆర్థిక, వాణిజ్య బంధం ఏ స్థాయిలో ఉంది. దీన్ని తెంచుకుంటే మనకొచ్చే ఇబ్బందులేంటి? దిగుమతులు, ఎగుమతులు ఆగిపోతే మన కంపెనీలు పడే అవస్థలు ఎలా ఉంటాయి? వీటన్నింటినీ వివరించే ‘సాక్షి బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనమిది... చైనా–భారత్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండుమూడేళ్లుగా ముదురుతూ వస్తున్న సరిహద్దు ఉద్రిక్తతలు... తాజాగా గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల ఊచకోతతో మరింత తీవ్రరూపం దాల్చాయి. గడిచిన 40 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ఇంత ఘోరమైన ఘర్షణ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికితోడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్కు మూలం కూడా చైనాయే కావడంతో భారతీయులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. చైనా ఉత్పత్తులు, కంపెనీలను బహిష్కరించాలంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయి. మరీ ముఖ్యంగా చైనా లాంటి బాహుబలి ఎకానమీతో అంటీముట్టనట్టుగా ఉండటం మనకేకాదు అమెరికాలాంటి అగ్రదేశానికీ సాధ్యంకాని పరిస్థితి. 14.14 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్ జీడీపీ 2.94 లక్షల కోట్లు మాత్రమే (ఆసియాలో నంబర్–3, ప్రపంచంలో నంబర్–5). పారిశ్రామిక యంత్రాలు, విడిభాగాలు, ముడి పదార్థాల సరఫరా నుంచి స్టార్టప్లు, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడుల వరకూ అమెరికా తర్వాత భారత్కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. చైనా ముడి పదార్థాలు, విడిభాగాలపై అత్యధికంగా ఆధారపడిన మన పరిశ్రమలకు అంత చౌకగా ప్రపంచంలో మరేదేశం కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కేవలం సరిహద్దు ఘర్షణ, కరోనా కారణంగా చైనాతో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని తెంచుకోవడం అంత సులువేమీ కాదనేది నిపుణుల అభిప్రాయం. ద్వైపాక్షిక వాణిజ్యం @ రూ.7.3 లక్షల కోట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల్లో 5.33 శాతం అంటే దాదాపు రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు చైనాకు వెళ్లాయి. అయితే, చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువ ఎంతో తెలుసా? రూ.5.5 లక్షల కోట్లు. అంటే మూడు రెట్లు ఎక్కువ. మన మొత్తం దిగుమతుల్లో ఇది ఏకంగా 14 శాతం. భారత్కు చైనాయే అతిపెద్ద దిగుమతిదారు కూడా. 2000 సంవత్సరం నుంచి 2018–19 నాటికి చూస్తే చైనా నుంచి బారత్కు దిగుమతులు 45 రెట్లు ఎగబాకి 70 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. డ్రాగన్ మన దేశంలోకి చౌక వస్తువులను ఎలా కుమ్మరిస్తోందో... అదేవిధంగా చైనా దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడిపోయామో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు అంతకంతకూ తీవ్రమవుతోంది. మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, విద్యుత్ ఉపకరణాలు, పవర్ ప్లాంట్ పరికరాలు, ఎరువులు, వాహన విడిభాగాలు, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, టెలికం పరికరాలు, మెట్రో రైలు కోచ్లు ఇతరత్రా యంత్ర పరికరాలు, ఔషధ ముడిపదార్థాలు, రసాయనాలు మరియు ప్లాస్టిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్... ఇలా చెప్పుకుంటూ పోతే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తుల లిస్టు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలా వెళ్తూనే ఉంటుంది. చైనా ముడి వస్తువులపై ఆధారపడిన మన కంపెనీలు, పరిశ్రమలకు వాటి సరఫరా నిలిచిపోతే లక్షలాది మందికి ఉపాది కరువయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మరోపక్క, చైనాకు ఎగుమతులు నిలిచిపోతే వాటిపై ఆధారపడిన మన కంపెనీలకూ తీవ్ర నష్టమే. ప్రధానంగా భారత్నుంచి చైనాకు ఆర్గానిక్ రసాయనాలు, ముడి ఖనిజం, మినరల్ ఆయిల్స్, మినరల్ ఫ్యూయెల్స్ ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు... భారత్లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్డీఐ) చైనా జోరు గడిచిన రెండుమూడేళ్లుగా పుంజుకుంది. ముఖ్యంగా లోహ సంబంధ పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం (సోలార్ ప్యానెల్స్), విద్యుత్ పరికరాలు, వాహన రంగం మరియు రసాయన పరిశ్రమల్లోకి చైనా నుంచి ఎఫ్డీఐలు భారీగా వస్తున్నాయి. ఇప్పటిదాకా భారత్లోకి వచ్చిన, ప్రణాళికల్లో ఉన్న చైనా ఎఫ్డీఐల విలువ 2600 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.1.98 లక్షల కోట్లు) అంచనా. భారత్లో చైనాకు చెందిన 75 తయారీ ప్లాంట్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒప్పో, షావోమి, వివో, ఫోసున్, హేయర్, ఎస్ఏఐసీ, వంటివి భారత్లో ప్లాంట్లున్న అతిపెద్ద బ్రాండ్స్లో కొన్ని. ఇక చైనాలో కార్యకలాపాలున్న తయారీ సంస్థల్లో అదానీ గ్లోబల్, డాక్టర్ రెడ్డీస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, బీఈఎంఎల్, బీహెచ్ఈఎల్, గోద్రేజ్ అండ్ బాయ్స్, అరబిందో వంటివి ఉన్నాయి. స్టార్టప్స్లోకి నిధుల వరద... భారతీయ స్టార్టప్ సంస్థలకు నిధుల తోడ్పాటును అందించడంలో చైనా కంపెనీలు ముందువరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా చైనా ఫండ్స్, కంపెనీలు తమ సింగపూర్, హాంకాంగ్, మారిషస్లోని సంస్థల ద్వారా భారత్లోని స్టార్టప్లకు నిధులను మళ్లిస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పేటీఎంలో పెట్టుబడిని అలీబాబా సింగపూర్ హోల్డింగ్స్ ద్వారా వెచ్చించింది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడి నేరుగా చైనా నుంచి వచ్చినట్లు కాదు, సింగపూర్ ఖాతాలోకి వెళ్తుంది. ఇలా మారువేషంలో చైనా నుంచి భారత్లోకి వస్తున్న పెట్టుబడులు చాలానే ఉన్నాయని ‘గేట్వే హౌస్’ నివేదిక చెబుతోంది. మొత్తంమీద భారత్లోని 30 స్టార్టప్ యూనికార్స్న్(బిలియన్ డాలర్లకు మించి విలువ కలిగినవి)కు ఈ ఏడాది మార్చివరకూ చైనా టెక్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన మొత్తం పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 30,000 కోట్లు) పైనే ఉంటుందని అంచనా. బల్క్ డ్రగ్స్... చైనాయే ఆధారం! పరిమాణం పరంగా భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. విలువ పరంగా చూస్తే 14 ర్యాంకు మాత్రమే. 2018–19లో భారత్ 1400 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. అదేసమయంలో ఔషధాల తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్స్(ముడి పదార్థాలు–ఏపీఐ) దిగుమతుల్లో మూడింట రెండు వంతులు చైనా నుంచే నమోదవడం గమనార్హం. ఇప్పుడు ఉన్నపళంగా చైనా దిగుమతులను తగ్గించుకుంటే... ఆమేరకు మనకు సరఫరా చేసేందుకు ఇతరదేశాలేవీ సిద్ధంగా లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా గనుక సరఫరా తగ్గిస్తే మన ఔషధ రంగానికి చాలా నష్టం వాటిల్లుతుందనేది ఫార్మా సంస్థల ఆందోళన. స్మార్ట్ ఫోన్స్లో ఆధిపత్యం.. భారత్లో అమ్ముడవుతున్న ప్రతి 100 స్మార్ట్ఫోన్స్లో 72 చైనావే అంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికీ నిజం! అంతగా మనం చైనా చౌక మొబైల్స్కు అలవాటుపడిపోయాం. షావోమీ, వివో, ఒప్పో, వన్ప్లస్ వంటి బ్రాండ్స్ మొత్తం కలిపి భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 72% వాటాను కొల్లగొట్టాయని గేట్వే హౌస్ నివేదిక పేర్కొంది. చైనా మొబైల్స్ దెబ్బకి శాంసంగ్, యాపిల్ అట్టడుగుకు పడిపోయాయి. టిక్ ‘టాప్’...: భారత్లో చైనా మొబైల్ యాప్ టిక్టాక్కు ఉన్న ప్రాచుర్యం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. 2016 సెప్టెంబర్లో అందుబాటులోకి వచ్చిన టిక్టాక్కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు(నెలవారీ) ఉన్నారు. దాదాపు 200 కోట్ల మేర డౌన్లోడ్స్ అయ్యాయి. ఇందులో సుమారు 50 కోట్ల డౌన్లోడ్స్ భారత్ నుంచే ఉండటం గమనార్హం. టిక్టాక్ వాడకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం(తర్వాత స్థానాల్లో చైనా–18 కోట్ల డౌన్లోడ్స్, అమెరికా–13 కోట్ల డౌన్లోడ్స్) ఉంది. చైనా ప్రతీకారం.. న్యూఢిల్లీ: భారత్లో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో చైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. తమ కన్సైన్మెంట్లను హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు నిలిపివేస్తున్నారంటూ ఎగుమతిదారులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై పోర్టులో చైనా నుంచి వచ్చిన దిగుమతులకు సంబంధించి భారత అధికారులు తీసుకున్న చర్యలకు ప్రతిగా ఆ దేశం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో పేర్కొంది. ‘చైనా దిగుమతులన్నింటినీ కస్టమ్స్ శాఖ భౌతికంగా ఒక్కో దాన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా దిగుమతుల వ్యయం పెరిగిపోతోంది. దీంతో హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు కూడా భారత్ నుంచి వచ్చే కన్సైన్మెంట్ల పై ఇలాంటి వైఖరే చూపిస్తున్నారు‘ అని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్కు రాసిన లేఖలో ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్కె సరాఫ్ పేర్కొన్నారు. కింకర్తవ్యం..? చైనాతో సరిహద్దు వివాదం ముదిరింది కాబట్టి ఆ దేశంతో పూర్తిగా తెగదెంపులు చేసుకునే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా చేస్తే చైనా కంటే భారత్కే అధిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్(స్వయం సమృద్ధి)తో దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభించినప్పటికీ.. చైనా కంపెనీలు, చైనా దిగుమతులను పూర్తిగా లేకుండా చేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మేకిన్ ఇండియానే చూసుకుంటే... భారత్లో తయారీ ప్లాంట్లను పెట్టాలని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు షావోమీ, వివో, ఒప్పో, హేయర్ తదితర అనేక చైనా కంపెనీలు సైతం భారత్లో ప్లాంట్లు నెలకొల్పాయి. భారీగా పెట్టుబడులు, ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరిహద్దు వివాదాలను సాకుగా చూపి వాటిని వెళ్లగొట్టగలమా? అలాచేస్తే అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన కింద మనం భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి రావడంతోపాటు ఇన్వెస్టర్లలో అభద్రతా భావం నెలకొనేందుకు దారితీస్తుంది. దిగుమతుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే, చైనా నుంచి క్రమంగా దిగుమతులను తగ్గించుకోవచ్చని.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్కు తైవాన్, మలేషియా, జపాన్, కొన్ని యూరప్ దేశాలను ప్రత్యామ్నాయంగా మార్చుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మేకిన్ ఇండియాలో చైనాకు క్రమంగా ప్రాధాన్యం తగ్గించి ఇతర దేశాలను ప్రోత్సహించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం మంచిదనేది వారి సూచన!! సాక్షి బిజినెస్ విభాగం -
ఆర్థికాంశాలు, అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచి
ముంబై: గతవారాంతాన వెల్లడైన పదకొండేళ్ల కనిష్టస్థాయి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, ద్రవ్య లోటు తీవ్రత వంటి ఆర్థికాంశాలతో పాటు లాక్డౌన్ను క్రమేపి సడలించడం వంటి ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వీటితోపాటు సోమవారం వెల్లడికానున్న భారత పీఎంఐ తయారీ రంగ డేటా కూడా మార్కెట్ దిశపై ప్రభావం చూపనుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దీపక్ జసాని అభిప్రాయపడ్డారు. నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచే కేరళను తాకనున్నాయనేది మార్కెట్కు సానుకూల అంశంగా పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య ముదురుతోన్న ప్రచ్ఛన్నయుద్ధ అంశంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయని నిపుణుల విశ్లేషణ. కాగా, ఈ వారంలో ఎస్బీఐ, ఇండిగో, బీపీసీఎల్ సహా 75 కంపెనీల ఫలితాలు వెల్లడికానుండడం కీలకాంశం. కాగా, లాక్డౌన్ ప్రకటించిన మార్చి చివరి వారంలో ఈక్విటీల్లో మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.1,230 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ఏప్రిల్ నెలలో రూ.7,965 కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాయి. తిరిగి మే నెలలో ఫండ్స్ రూ.2,832 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు సెబీ డేటా తెలియజేస్తోంది. -
జపాన్ అప్ - హాంగ్కాంగ్ డౌన్..!
ఆసియా మార్కెట్లు సోమవారం ప్రారంభలాభాల్ని కోల్పోయి పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్, థాయిలాండ్, కొరియా దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలుతున్నాయి. హాంగ్కాంగ్, చైనా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నేడు అమెరికా, బ్రిటన్ దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయవు. హాంకాంగ్ రాజకీయ అంశంలో అమెరికా జోక్యంతో మరోసారి చైనా-అమెరిక దేశాల వాణిజ్య సంబంధాలు ప్రశ్నార్థకమయ్యాయి. దీంతో చైనా ప్రధాన సూచీ షాంఘై కాంపోసైట్ అరశాతం క్షీణించింది. హాంగ్కాంగ్ నగరంలో అల్లర్లు తారాస్థాయికి చేరుకోవడంతో హాంగ్కాంగ్ మార్కెట్ 1శాతం వరకు క్షీణించింది. ఉద్దీపన ప్యాకేజీఆశలతో జపాన్ మార్కెట్ 1.50శాతం పెరిగింది. లాక్డౌన్తో తీవ్ర కష్టాలను ఎదుర్కోంటున్న జపాన్ తాజాగా 929 బిలియన్ డాలర్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీని దేశం పరిశీలిస్తోందని ఆ దేశపు మీడియా వర్గాలు వెల్లడించాయి. హాంగ్కాంగ్ విషయంలో అమెరికా చైనా మధ్య ముదురుతున్న రాజకీయ విబేధాలు ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. కరోనా వైరస్తో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు ఆయా దేశాలు పాలసీ ఉద్దీపనలు ప్రకటించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మార్చి కనిష్ట స్థాయిల నుంచి ఏకంగా 30శాతం వరకు ర్యాలీ చేశాయి. -
మార్కెట్కు ఒడిదుడుకుల వారం!
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, దేశీ కంపెనీల క్యూ4 ఫలితాలు, కోవిడ్–19 పాజిటివ్ కేసుల ప్రకటనల వంటి కీలక అంశాలు ఈ వారంలో స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. వైరస్ వ్యాప్తి విషయంలో అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరితే మాత్రం భారీ పతనం తప్పదని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్, ఈక్విటీ రీసెర్చ్ హెడ్ షిబాని సిర్కార్ కురియన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రతికూల వార్తలు వెలువడినా మార్కెట్కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఇప్పటికే ఓవర్సోల్డ్ అధికంగా ఉన్న కారణంగా రిబౌండ్కు అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వీపీ అజిత్ మిశ్రా విశ్లేషించారు. అయితే, ఇది అధికస్థాయిలో నిలవలేకపోవచ్చని, ఒడిదుడుకులకు ఈవారంలో ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే జరగనుంది. కాగా గురువారం (28న) మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సిరీస్ ముగియనుంది. మరోవైపు.. హెచ్డీఎఫ్సీ, సన్ఫార్మా, లుపిన్, డాబర్, టీవీఎస్ మోటార్, యునైటెడ్ స్పిరిట్స్, వోల్టాస్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్, మాక్స్ ఫైనాన్షియల్, టోరెంట్ ఫార్మా, వీఐపీ ఇండస్ట్రీస్, కేపీఐటీ టెక్నాలజీస్, ఈక్విటాస్ హోల్డింగ్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఉషా మార్టిన్ కంపెనీలు తమ ఫలితాలను ఈవారంలోనే ప్రకటించనున్నాయి. రూ. 9,089 కోట్ల పెట్టుబడి భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) మే 1–22 మధ్య కాలంలో రూ. 9,089 కోట్లను పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడైంది. ఏప్రిల్లో రూ. 6,883 కోట్లు, మార్చిలో రూ. 61,973 కోట్లను వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. నేడు మార్కెట్ సెలవు రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం (మే25న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సెలవు. మంగళవారం (26న) మార్కెట్ యథావిధిగా పని చేస్తుంది. -
అమెరికా ఎక్స్ఛేంజీల నుంచి డ్రాగన్ అవుట్ !
వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వైరం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. వాణిజ్య యుద్ధంగా మొదలైనది కాస్తా ఆ తర్వాత టెక్నాలజీ పోరుకు దారితీసింది. 5జీ టెలికం పరికరాల చైనా దిగ్గజం హువావేపై అమెరికా అనేక ఆంక్షలు విధించి దానితో తమ దేశ సంస్థలేవీ వ్యాపార లావాదేవీలు జరపకుండా దాదాపు అడ్డుకట్ట వేసేసింది. ఇక, కరోనా వైరస్ వివరాలను తొక్కిపెట్టి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని వ్యాప్తి చేసిందంటూ చైనాపై మండిపడుతున్న అమెరికా ప్రస్తుతం మరో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. తమ దేశ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలను, పరోక్షంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ‘నేను కొత్తగా మరో ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు. నేను..నాతో పాటు మిగతా అందరూ కూడా నిబంధనల ప్రకారం చైనా నడుచుకోవాలనే కోరుకుంటున్నారు‘ అని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టిన సెనేటర్లలో ఒకరైన జాన్ కెనెడీ వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఆలీబాబా, బైదు తదితర దిగ్గజ చైనా కంపెనీలకు డీలిస్టింగ్ గండం ఏర్పడింది. బిల్లు ఏం చెబుతోంది .. హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం అమెరికా సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు గాను నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్ చేయొచ్చు. గతేడాది మార్చిలోనే సెనేటర్లు జాన్ కెనెడీ, క్రిస్ వాన్ హోలెన్ దీన్ని సెనేట్లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం లిస్టెడ్ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ ప్రభుత్వ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో పబ్లిక్ కంపెనీల ఖాతాలను సమీక్షించే బోర్డు పీసీఏవోబీ తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాలి. వరుసగా మూడేళ్ల పాటు నిరాకరించిన పక్షంలో నిషేధం, డీలిస్టింగ్ తప్పదు. ఇది ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తించేదే. అయితే, చైనా కంపెనీల ఆడిటింగ్ విషయంలోనే సహకారం దొరకడం లేదంటూ పీసీవోఏబీ చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలపైనే అమెరికా ఎక్కువ కఠినంగా చర్యలు అమలు చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సేల్స్ అకౌంటింగ్ మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటు న్న చైనా సంస్థ ‘లకిన్ కాఫీ’ ను డీలిస్ట్ చేస్తున్నట్లు నాస్డాక్ ప్రకటించడం దీనికి మరింత ఊతమిస్తోంది. చైనా ముందస్తు వ్యూహాలు.. అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందుగానే ఊహించినా చైనా కూడా తదుపరి వ్యూహాలతో సిద్ధంగా ఉంది. హాంకాంగ్లో నిరసనలను అణగదొక్కే విషయంలో తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్ వైపు చూస్తోంది. ఒకవేళ అమెరికన్ ఎక్సే్చంజీల నుంచి డీలిస్ట్ అయిపోతే ప్రత్యామ్నాయంగా లండన్ ఎక్సే్చంజీలో కంపెనీలను లిస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. లండన్లో లిస్ట్ కాదల్చుకున్న కంపెనీల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను పునఃప్రారంభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వదేశీ కంపెనీలకూ ట్రంప్ వార్నింగ్.. చైనాతో వాణిజ్య యుద్ధం మొదలైనప్పట్నుంచీ అమెరికన్ కంపెనీలను అక్కణ్నుంచి వచ్చేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ సహా పలు కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తదితర దేశాలకు తయారీ కార్యకలాపాలు మళ్లించడంపై కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఆయా కంపెనీలను అమెరికాకే రప్పించే ప్రయత్నాల్లో ట్రంప్ ఉన్నారు. చైనా నుంచి తయారీ కేంద్రాలను స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలకు వెడితే వాటిపై పన్నుల మోత మోగిస్తామని ఈమధ్యే మరోమారు హెచ్చరించారు. అంతే కాకుండా.. చైనా కంపెనీల్లో తమ సంస్థలు ఇన్వెస్ట్ చేయకుండా కూడా అమెరికా చర్యలు తీసుకుంటోంది. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం శ్రేయస్కరం అంటూ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్రాక్కు నేషనల్ లీగల్ అండ్ పాలసీ సెంటర్ సూచించింది. పర్యావరణ కార్యకర్తల ఆందోళనల కారణంగా బ్లాక్రాక్ ఇప్పటికే కొన్ని బొగ్గు కంపెనీల నుంచి తప్పుకుంది. ప్రభుత్వ పెన్షన్ ఫండ్ను నిర్వహించే థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్ సంస్థ .. ఇన్వెస్ట్ చేసే విదేశీ స్టాక్స్ జాబితా నుంచి చైనా కంపెనీలను తప్పించడంలోనూ ట్రంప్ ప్రస్తుతానికి సఫలమయ్యారు. ఇది దాదాపు 500 బిలియన్ డాలర్ల నిధిని నిర్వహిస్తోంది. తమ ఇన్వెస్టర్లకు కొత్తగా అంతర్జాతీయ స్టాక్స్లో కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో 50 బిలియన్ డాలర్ల ఇంటర్నేషనల్ ఫండ్ పథకం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన విదేశీ స్టాక్స్ జాబితాలో చైనా కంపెనీలు లేకుండా చూసేలా ట్రంప్ ఒత్తిడి తెచ్చారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దాదాపు 170 చైనా కంపెనీలు.. అమెరికాలోని నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో దాదాపు 170 చైనా కంపెనీలు లిస్టయి ఉన్నాయి. చైనా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ అమెరికాలో లిస్టయిన భారీ కంపెనీలు పదికి పైగా ఉన్నాయి. పెట్రోచైనా, చైనా లైఫ్, చైనా టెలికం, చైనా ఈస్టర్న్, చైనా సదరన్, హువానెంగ్ పవర్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, చైనా పెట్రోలియం ఈ జాబితాలో ఉన్నాయి. ఇక టెక్ దిగ్గజాల్లో బైదు, ఆలీబాబా, పిన్డువోడువో, జేడీడాట్కామ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్, బైదు, జేడీడాట్కామ్ సంస్థల సంయుక్త మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. -
అవసరమైతే చైనాతో తెగదెంపులు: ట్రంప్
వాషింగ్టన్/లండన్/ఢాకా: కోవిడ్–19 సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య సంబంధాలు బీటలు వారుతున్నట్టుగానే కనిపిస్తోంది. అవసరమైతే చైనాతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందని ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన ట్రంప్ కోవిడ్–19 కట్టడి చర్యల్లో చైనా వైఫ్యలంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్ బ్రాడ్కాస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై పునః చర్చలకు ఇక ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడాలన్న ఆసక్తి కూడా తనకి లేదన్నారు. చైనాతో సంబంధాల అంశంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని, అసలు పూర్తిగా సంబంధాలు తెంపుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే జరిగితే అమెరికాకు 50 వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయన్నారు. కోవిడ్పై సహకరించుకోవాలి: చైనా చైనాతో తెగదెంపులౖకైనా సిద్ధపడతానని ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఆ దేశం ఆచితూచి స్పందించింది. కోవిడ్–19ను ఎదుర్కోవడంలో ఇరుదేశాల ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేసి, కలిసి పనిచేయాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్లో 5.80 లక్షల సర్జరీలు రద్దు? కోవిడ్ విజృంభణ నేపథ్యంలో భారత్లో 5 లక్షల 80 వేలకు పైగా సర్జరీలు రద్దు కావచ్చని, లేదంటే వాయిదా పడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సర్జరీ భారత్లో శస్త్రచికిత్సలపై ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. బంగ్లాదేశ్ రోహింగ్యా శిబిరాల్లో కరోనా బంగ్లాదేశ్ దక్షిణ ప్రాంతంలో ఉన్న రోహింగ్యా శరణార్థి శిబిరంలో తొలి కరోనా కేసు నమోదైంది. బంగ్లాలో రోహింగ్యాల శిబిరాలు అత్యంత రద్దీతో ఉంటాయి. కాక్స్ బజార్ జిల్లాలోని ఒక శిబిరంలో తలదాచుకుంటున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన రేపుతోంది. బంగ్లాలో వివిధ శరణార్థి శిబిరాల్లో 10 లక్షల మంది తలదాచుకుంటున్నారు. -
గణాంకాలు, ఫలితాలు కీలకం
ఈ వారం వెలువడే వివిధ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. కరోనా వైరస్ కేసుల తీవ్రత, ఈ వైరస్ వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందం పరిణామాలు కూడా కీలకమేనని వారంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్తో రూపాయి మారకం కదలికలు, ముడి చమురు ధరల గమనం, వివిధ దేశాల్లో లాక్డౌన్ సంబంధిత వార్తలు... ఇవన్నీ కూడా తగిన ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులంటున్నారు. ఈ నెల 12న(మంగళవారం) మార్చి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వస్తాయి. అదే రోజు ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. ఇక ఏప్రిల్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ నెల 14న (గురువారం) వస్తాయి. మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బంధన్ బ్యాంక్ తదితర మొత్తం 50కు పైగా కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు– ఈ రెండు అంశాలు పెట్టుబడులపై ప్రభావం చూపుతాయి. రిలయన్స్ రైట్స్ ఇష్యూకి రికార్డు తేది మే14 ప్రతిపాదిత రైట్స్ ఇష్యూకి మే 14ను రికార్డు తేదీగా నిర్ణయించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇష్యూ ప్రారంభ, ముగింపు తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. -
దిగివచ్చిన బంగారం ధరలు
ముంబై : ఈక్విటీ మార్కెట్లు కోలుకోవడం, లాక్డౌన్ సడలింపులతో పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా ప్రారంభమవుతుండటం బంగారం ధరలపై ప్రభావం చూపాయి. ముంబై ఎంసీఎక్స్లో బుధవారం పదిగ్రాముల బంగారం రూ 100 దిగివచ్చి రూ 45,650 పలికింది. బంగారం ధరలు మరికొద్ది రోజులు అనిశ్చితితో సాగినా నిలకడగా పెరుగుతాయని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా అమెరికా-చైనా ట్రేడ్వార్, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో రాబోయే రోజుల్లో పసిడికి పెట్టుబడి డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. బంగారం ధరలు తగ్గిన సందర్భాల్లో కొనుగోలు చేస్తూ పోవాలని మదుపుదారులకు నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో పసిడిపై పెట్టుబడులు మెరుగైన రాబడి ఇస్తాయని చెబుతున్నారు. చదవండి : పసిడి వెలవెల -
సెన్సెక్స్ 32,170 మద్దతుకు ఇటూ...అటూ
అమెరికాతో పాటు పలుదేశాల్లో ఆర్థిక వ్యవస్థల్ని పాక్షికంగా తెరిచినందున ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ గతవారం ప్రథమార్ధంలో జోరుగా ర్యాలీ జరిపినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...తిరిగి చైనాతో ట్రేడ్వార్ను తెరపైకి తేవడంతో ఆ మార్కెట్లన్నీ వారాంతంలో హఠాత్ పతనాన్ని చవిచూసాయి. భారత్ మార్కెట్కు శుక్రవారం సెలవుకావడంతో ప్రపంచ మార్కెట్ల ప్రభావం ఇక్కడ పడలేదు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇచ్చినప్పటికీ, దేశంలో పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక రంగ కార్యకలాపాలకు ప్రధానమైన పెద్ద నగరాలన్నీ రెడ్జోన్లు అయినందున, మరో రెండు వారాలు ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా వుండిపోతుంది. అటు అంతర్జాతీయ అంశాలు, ఇటు దేశీయ వార్తల ప్రతికూలతను భారత్ మార్కెట్ తట్టుకోవాలంటే..కేంద్రం కొద్దిరోజులుగా తాత్సారం చేస్తున్న ఆర్థిక ప్యాకేజీని తక్షణమే ప్రకటించాల్సివుంటుంది. అది ఇన్వెస్టర్లను మెప్పించాల్సివుంటుంది. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి..... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఏప్రిల్ 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ అనూహ్యంగా 33,887 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత, అంతక్రితంవారంతో పోలిస్తే 2391 పాయింట్ల భారీలాభంతో 33,718 పాయింట్ల వద్ద ముగిసింది. గత గురు, శుక్రవారాల్లో యూరప్, అమెరికా మార్కెట్లు పతనమైన నేపథ్యంలో ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్డౌన్తో మొదలైతే 32,170 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 31,660–31,275 పాయింట్ల శ్రేణి మధ్య గట్టి మద్దతు లభ్యమవుతున్నది. ఈ శ్రేణిని కోల్పోతే ఏప్రిల్ నెలలో జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్మెంట్ స్థాయి అయిన 30,750 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ సోమవారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే క్రమేపీ 33,880 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. అటుపైన ముగిస్తే 34,100 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 34,900 పాయింట్ల వరకూ పెరిగే చాన్స్ వుంటుంది. నిఫ్టీ 9,390 మద్దతు కోల్పోతే... క్రితం వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ...గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రైజింగ్ వెడ్జ్ ప్యాట్రన్ అప్పర్బ్యాండ్ అయిన 9,500 పాయింట్ల స్థాయిని ఛేదించినంతనే 9,889 పాయింట్ల గరిష్టస్థాయికి శరవేగంగా ర్యాలీ జరిపింది. ఈ స్థాయి 12,430 పాయింట్ల గరిష్టం నుంచి 7,511 పాయింట్ల కనిష్టంవరకూ జరిగిన పతనానికి 50 శాతం రిట్రేస్మెంట్ స్థాయి. వచ్చేవారం సైతం ఈ స్థాయిని పరిరక్షించుకుంటేనే తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ సోమవారం మార్కెట్ గ్యాప్డౌన్తో మొదలైతే 9,390 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 9,260–9,140 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 8,980 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. 7,511 పాయింట్ల నుంచి 9,889 పాయింట్ల వరకూ జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్మెంట్ స్థాయి అయిన 8,980 పాయింట్ల స్థాయిని కోల్పోతే నిఫ్టీ ప్రస్తుత రిలీఫ్ర్యాలీకి తెరపడినట్లే. అయితే ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే మరోదఫా 9,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 9,960 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 10,200 వరకూ కూడా పెరిగే చాన్స్ వుంటుంది. – పి. సత్యప్రసాద్ -
మార్కెట్ ర్యాలీయా.. దిద్దుబాటా?
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలోనూ ర్యాలీని కొనసాగిస్తుందా..లేక మరో భారీ పతనాన్ని నమోదుచేస్తుందా..? అనే సందిగ్ధంలో పడే స్తోంది. దశల వారీగా లాక్డౌన్ను ఎత్తివేయడం అనేది మార్కెట్కు సానుకూలాంశమేమి కాదని, మార్కెట్ గ్యాప్డౌన్తోప్రారంభం కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. కంపెనీల ఫలితాలు, కోవిడ్–19 వ్యాక్సిన్, ముడి చమురు ధరలే కీలకంగా ఉండనున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ విశ్లేషించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా–చైనాల మధ్య ట్రేడ్వార్ ముదిరితే భారీ పతనం ఉంటుందని అన్నారు. స్వల్పకాలంలోనే దిగువస్థాయి నుంచి ర్యాలీ చేసిన మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణ అవకాశం ఉండనుండగా.. ఈవారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు. గణాంకాల ప్రభావం: ఏప్రిల్ నెల మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం విడుదలకానుండగా.. సేవారంగ పీఎంఐ బుధవారం వెల్లడికానుంది. అమెరికా మార్కిట్ కాంపోజిట్ పీఎంఐ, సేవారంగ పీఎంఐ మంగళవారం విడుదలకానుంది. నిరుద్యోగ జాబితా శుక్రవారం రానుంది. 24 కంపెనీల ఫలితాలు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారికో, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, యస్ బ్యాంక్, నెరోలాక్ పెయింట్స్ ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఇక గతవారం మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఫలితాలు వెల్లడికాగా, సంస్థ క్యూ4 నికర లాభం 39 శాతం తగ్గింది. ఈ ప్రభావం సోమవారం మార్కెట్ ప్రారంభంపై స్పష్టంగా ఉండనుందని రెలిగేర్ బ్రోకింగ్ పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. ఇక చరిత్రలోనే తొలిసారిగా ఆటోమొబైల్ పరిశ్రమ ఏప్రిల్ అమ్మకాలను సున్నాగా ప్రకటించింది. -
ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు
వాష్టింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన దాడిని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ట్రంప్ తాజా సంచలన వ్యాఖ్యలతో ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ మళ్లీ రాజుకోనుంది. కోవిడ్-19 కారణంగా చైనాపై వాణిజ్య సుంకాలను పెంచనున్నట్లు ట్రంప్ బెదిరించారని గురువారం స్థానిక మీడియా నివేదించింది. చైనా నుంచే కరోనా మహమ్మారి వ్యాపించిందని పదే పదే దాడి చేస్తున్న ట్రంప్ చైనాతో వాణిజ్య ఒప్పందం తమకు ద్వితీయ ప్రాముఖ్యత అంటూ వాణిజ్య యుద్దానికి తెరలేపారు. వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసాం. నిజానికి చాలా వాణిజ్యం జరుగుతోంది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ తో తమకు జరిగి నష్టం కారణంగా ఈ నిర్ణయం తీసుకోన్నామని ట్రంప్ విలేకరులతో అన్నారు. వైరస్, లాక్డౌన్, ఆర్థిక నష్టాలు ఈ పరిస్థితి ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పారదర్శకత పాటించని చైనాకు అమెరికా రుణాన్ని రద్దు చేయాలనే ఆలోచనపై అధికారులు చర్చించినట్లు వాషింగ్టన్ పోస్ట్ గురువారం నివేదించింది. అయితే దీన్ని ట్రంప్ అత్యున్నత ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో ఖండించారు. మరోవైపు రుణాల రద్దు, చైనాపై అమెరికా ప్రతీకారంపై ప్రశ్నించినపుడు ట్రంప్ రాయిటర్స్తో మాట్లాడుతూ దీన్ని భిన్నంగా చేయనున్నామని వ్యాఖ్యానించారు. చైనా అమెరికా మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై జనవరిలో ట్రంప్ సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏటా 370 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువుల దిగుమతులపై 25 శాతం వరకు సుంకం అమలవుతోంది. చైనా ఎగుమతి చేసే కొన్ని రకాల వస్తువులపై సుంకాలను తగ్గింపు ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టి టారీఫ్లను ట్రంప్ పెంచనున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. (అమెరికాపై చైనా విమర్శలు: నెటిజన్ల ఫైర్!) కరోనా వైరస్ చైనాలోని వుహాన్లోని వైరాలజీ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని, దీనికి తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై లోతైన విచారణ జరుగుతోందని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. కరోనావైరస్ మూలం, వ్యాప్తిలో చైనా పాత్ర గురించి తన ఆందోళనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు, కోవిడ్-19 మనుషులు సృష్టించింది కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేయడం గమనార్హం. కాగా కరోనా విజృంభణతో అమెరికాలో 60 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. మిలియన్ కేసులను దాటిన మొదటి దేశంగా అమెరికా నిలిచింది. దీనికి తోడు రెండోసారి అధ్యక్ష ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో దేశంలోని తీవ్ర ఆర్థిక సంక్షోభం అమెరికా అధ్యక్షుడిని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో తన గెలుపును అడ్డుకునేందుకు చైనా కుట్రచేసిందని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవిడ్-19 చైనానే తయారు చేసిందని ఆరోపిస్తున్నారని అధికార, ప్రతిపక్షాల నుంచి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. -
అమెరికా–చైనా మధ్య మళ్లీ చిచ్చు!
వాషింగ్టన్: కరోనా వైరస్ అమెరికాను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న సమయంలో చైనాపై అగ్రరాజ్యం మరోసారి కన్నెర్ర చేసింది. అమెరికా మార్కెట్లో మొబైల్ సేవలు అందిస్తున్న ‘చైనా టెలికం (అమెరికా)’ను నిషేధిస్తామంటూ హెచ్చరించింది. భద్రత, న్యాయపరమైన ముప్పు ఉందంటూ అమెరికా న్యాయ శాఖ పేర్కొంది. చైనాలో రెండో అతిపెద్ద టెలికం కంపెనీ అయిన ‘చైనా టెలికం’ సబ్సిడరీయే చైనా టెలికం (అమెరికా). అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి అమెరికాకు టెలికమ్యూనికేషన్ సర్వీసులకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలంటూ అమెరికా న్యాయ, రక్షణ, అంతర్గత భద్రత (హోం), వాణిజ్య శాఖలు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్సీసీ)ను కోరాయి. కీలక శాఖల డిమాండ్ను ఎఫ్సీసీ ఆమోదిస్తే కోట్లాది అమెరికన్ల ఫోన్ సేవలకు విఘాతం ఏర్పడనుందన్నది విశ్లేషకుల అంచనా. వ్యతిరేకించిన చైనా అమెరికా చర్యలను చైనా వ్యతిరేకించింది. ‘‘అమెరికా మార్కెట్ విధానాలకు కట్టుబడి ఉండాలని కోరుతున్నాం. వాణిజ్య విషయాలను రాజకీయం చేయడం, జాతీయ భద్రతను ఊతపదంగా వాడడాన్ని ఆపేయాలి. అలాగే, అనుచితంగా చైనా కంపెనీలను అణచివేసే విధానాలను కూడా నిలిపివేయాలి’’ అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావోలిజియాన్ ప్రకటన విడుదల చేశారు. -
చమురు ‘బేజార్’
సింగపూర్: ముడి చమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్ కూటమి, రష్యా మధ్య డీల్ కుదరకపోవడంతో సౌదీ అరేబియా ధరల పోరుకు తెర తీసింది. భారీగా రేట్లు తగ్గించేసింది. 20 ఏళ్ల కనిష్ట స్థాయికి కోత పెట్టింది. దీంతో సోమవారం చమురు ధరలు ఏకంగా 30 శాతం దాకా పతనమయ్యాయి. ఒక దశలో ప్రామాణిక బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్ఫ్ యుద్ధ సమయం తర్వాత చమురు రేట్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. అటు సహజ వాయువు రేట్లు కూడా క్షీణించాయి. ఎందుకిలా.. కరోనా వైరస్ కారణంగా ముడిచమురుకు డిమాండ్ తగ్గి.. మార్కెట్లో క్రూడ్ నిల్వలు పెరిగిపోయాయి. ఫలితంగా రేట్లు పడిపోవచ్చన్న భయాలతో సౌదీ అరేబియా సారథ్యంలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్).. చమురు ఉత్పత్తిని మరింతగా తగ్గించాలని గత వారం జరిగిన సమావేశాల్లో ప్రతిపాదించింది. అయితే, తాము ఉత్పత్తి తగ్గించిన పక్షంలో అమెరికా చమురు ఉత్పత్తి సంస్థలు మార్కెట్లో దూసుకుపోయే రిస్కులు ఉన్నాయనే ఉద్దేశంతో.. ఈ ప్రతిపాదనను రష్యా విభేదించింది. చమురు ఉత్పత్తిలో సౌదీ, రష్యా.. ఒకటి, రెండో స్థానాల్లో ఉన్నాయి. తాజా పరిణామంతో తన మార్కెట్ వాటాను కాపాడుకునే దిశగా.. అదే సమయంలో రష్యాపై ఒత్తిడిని పెంచే దిశగా సౌదీ అరేబియా పావులు కదిపింది. చమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా .. క్రూడాయిల్ రేట్లను తగ్గించడంతో పాటు ఉత్పత్తినీ పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్లో కాంట్రాక్టుకు సంబంధించిన రేట్లను బ్యారెల్కు 6 నుంచి 8 డాలర్ల దాకా తగ్గించేసింది. ఇది మార్కెట్లో కలకలం రేపడంతో క్రూడాయిల్ రేట్లు భారీగా పతనమయ్యాయి. చమురు ధరలు దాదాపు దశాబ్దపు కనిష్ట స్థాయి 26 డాలర్లకు దగ్గర్లో ఉండటం మార్కెట్ వర్గాలను కలవరపెడుతోంది. త్వరలోనే ఈ స్థాయిని కూడా తాకవచ్చని ఆంచనాలు ఉన్నాయి. 20 డాలర్లకూ పతనావకాశం.. ఒకవేళ ఇరు పక్షాలు ఒక అంగీకారానికి రాకపోతే చమురు రేట్లు బ్యారెల్కు ఏకంగా 20 డాలర్ల స్థాయికి కూడా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. రష్యాను చర్చలకు రప్పించే ప్రయత్నాల్లో భాగంగానే సౌదీ అరేబియా ఈ వ్యూహాలు అమలు చేస్తుండవచ్చని వారు పేర్కొన్నారు. ఒకవేళ రేట్లు గానీ భారీగా పతనమైతే .. చమురు ఆదాయాలపై ఆధారపడిన దేశాలు దెబ్బతినడంతో పాటు క్రూడాయిల్ అన్వేషణ ప్రాజెక్టులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. -
ప్రపంచవ్యాప్తంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం
ట్రంప్ ట్రేడ్వార్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేస్తోంది. ఇక కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న కరోనా.. ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తోంది. ఈ రెండింటికీ సౌదీ అరేబియా–రష్యా మధ్య మొదలైన చమురు ధరల యుద్ధం ఆజ్యం పోసింది. ఇక చెప్పేదేముంది! మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మహా పతనాన్ని చవిచూశాయి. చమురు ఊచకోతకు గురైంది. ఒక్క జపాన్ యెన్ మినహా... ప్రపంచ కరెన్సీలన్నీ ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా, ఏ దశలోనూ ఇన్వెస్టర్లకు ఉపశమనం కనిపించలేదు. ♦ ముడిచమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్ కూటమి – రష్యా మధ్య రేగిన విభేదాలతో.. సౌదీ భారీగా రేట్లు తగ్గించేసింది. ఫలితం.. ఒకేరోజు ముడి చమురు ధరలు ఏకంగా 30 శాతానికిపైగా పతనమయ్యాయి. ఒక దశలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్ఫ్ యుద్ధ సమయం తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. ♦ తాజా పరిణామాలతో రూపాయి ఏకంగా 17 నెలల కనిష్టానికి క్షీణించి డాలర్తో పోలిస్తే 74.17 వద్ద క్లోజయ్యింది. జపాన్ యెన్ మినహా అమెరికా డాలర్, ఇతర కరెన్సీలూ రూపాయి దార్లోనే వెళ్లాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి అమెరికా మార్కెట్ల ప్రామాణిక సూచీ డోజోన్స్ 1,600 పాయింట్లకు పైగా నష్టంతో (6 శాతం) ట్రేడవుతోంది. జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్ మార్కెట్లు సైతం 5 నుంచి 7 శాతం మధ్యలో భారీగా నష్ట పోయాయి. మంగళవారం హోలీ సందర్భంగా మన మార్కెట్లకు సెలవు కావటంతో.. పతనానికి కూడా తాత్కాలికంగానైనా విరామం దొరికినట్లయింది. ఆయిల్ వార్, కరోనా ఫియర్ స్టాక్ మార్కెట్లను కుదిపేయడంతో ఆసియా నుంచి అమెరికా దాకా సోమవారం బెంచ్ మార్క్ ఇండెక్స్లు భారీ నష్టాలతో ముగిశాయి. అదుపులోకి రాని కరోనా వైరస్ పెట్టుబడిదారులను బెంబేలెత్తించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతం కుప్పకూలింది. మరో ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటామేమోననే భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దశాబ్దకాలంలో అతిపెద్ద సింగిల్–డే పతనంతో మార్చి 9వతేదీ ,2020 భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండేగా నిలిచిపోయింది.7లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. క్రూడ్(ముడి చమురు) ధరల పతనానికి బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 1,942 పాయింట్లు కుప్పకూలింది. చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలానికి ముడి చమురు ధరల పోరు జత కావడంతో స్టాక్ మార్కెట్ కనీవినీ ఎరుగని రీతిలో క్షీణించింది. సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ప్రస్తుతం మందగమనంలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ... కోవిడ్–19 వైరస్, ముడి చమురు ధరల పోరు కారణంగా మాంద్యంలోకి జారిపోతుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇక దేశీయంగా యస్బ్యాంక్ సంక్షోభం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్తో రూపాయి మారకం విలువ 30 పైసలు తగ్గడం వంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో 2,467 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ చివరకు 1942 పాయింట్లు క్షీణించి 35,635 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 695 పాయింట్లు పతనమైన నిఫ్టీ చివరకు 538 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్దకు చేరింది. శాతాలపరంగా చూస్తే, సెన్సెక్స్ 5.1 శాతం, నిఫ్టీ 4.9 శాతం చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, ఈ రెండు సూచీలు గత ఐదేళ్లలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఒక్క రోజులోనే ఇన్నేసి పాయింట్లు నష్టపోవడం (ఇంట్రాడే, ముగింపులో కూడా)ఇదే మొదటిసారి. ఆరంభంలోనే భారీ నష్టాలు.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ భారీ నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 627 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. సమయం Výæడిచే కొద్దీ నష్టాలు పెరిగాయే కానీ తరగలేదు. అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్ 5,088 పాయింట్లు (12.4 శాతం), నిఫ్టీ 1,511 పాయింట్లు(12.6 శాతం) చొప్పున క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు ముప్పిరిగొన్నందున సెంటిమెంట్ బలహీనంగా ఉందని, మన మార్కెట్పై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ మద్దతు స్థాయిలు 10,295–10,138 పాయింట్లని, ఒక వేళ పుల్ బ్యాక్ ర్యాలీ చోటు చేసుకుంటే నిరోధ స్థాయిలు 10,637–10,744 పాయింట్లని విశ్లేషకులు పేర్కొన్నారు. పతనానికి పంచ కారణాలు... ♦ చమురు ధరల పతనం... చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఉత్పత్తి కోతకు సంబంధించి చర్చలు విఫలమయ్యాయి. ఒపెక్ దేశాలు ప్రతిపాదించిన ఉత్పత్తి కోతను రష్యా వ్యతిరేకించడం.. నచ్చని సౌదీ అరేబియా ప్రతి చర్యలు ప్రకటించింది. తాము ఉత్పత్తి చేసే క్రూడ్ ధరలను తగ్గించడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది అంతర్జాతీయంగా వృద్ధి మరింతగా దెబ్బతీస్తుందన్న భయాలు మన మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులంటున్నారు. కోవిడ్–19 విలయం భారత్లో కోవిడ్–19 (వైరస్) బాధితుల సంఖ్య 43కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య 3,600కు పెరిగాయి. ఇటలీలో ఒక్క రోజులోనే 130కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కోటిన్నరకు పైగా ప్రజలను ఈ దేశం క్వారంటైన్లో ఉంచింది. మరిన్ని దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తుండటంతో మరిన్ని కష్టాలు ముందు ముందు ఉంటాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ మరింత విస్తరిస్తే, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా తదితర అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యంలోకి జారిపోతాయని మూడీస్ సంస్థ హెచ్చరించడం ఆందోళన రేకెత్తించింది. ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్ విస్తరిస్తుండటం, ముడి చమురు ధరల హఠాత్ పతనం కారణంగా ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి సురక్షిత సాధనాలైన పుత్తడి, అమెరికా డాలర్, బాండ్లలోకి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఫలితంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. షాంఘై, హాంగ్కాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు 5 శాతం మేర క్షీణించాయి. ఆరంభంలోనే 6% మేర నష్టపోయిన యూరప్ మార్కెట్లు అదే స్థాయిలో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు... కరోనా కల్లోలానికి సెంటిమెంట్ దెబ్బతినడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ నికర కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. సోమవారాన్ని కూడా కలుపుకుంటే వరుసగా 11వ రోజూ విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగానే నిలిచారు. ఈ 11 ట్రేడింగ్ సెషన్లలో రూ.25,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. యస్ బ్యాంక్ సంక్షోభం .. భారత బ్యాంకింగ్ రంగం స్థిరత్వంపై ఆందోళనను, సంశయాలను పెంచింది. పలు ఆర్థిక సంస్థలు యస్ బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్ చేశాయి. ఈ బాండ్ల రేటింగ్ను పలు రేటింగ్ సంస్థలు డౌన్గ్రేడ్ చేశాయి. మరోవైపు బాసెల్ టూ, టైర్–1 బాండ్ల వడ్డీ చెల్లింపుల్లో యస్ బ్యాంక్ విఫలమైంది. మొత్తం మీద యస్ బ్యాంక్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న భయాలు నెలకొన్నాయి. నేడు మార్కెట్లకు సెలవు నేడు హోలీ పండుగ సందర్భంగా సెలవు. సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడయ్యింది. ఆరంభంలోనే ఏడు శాతం మేర çపతనమై లోయర్ సర్క్యూట్ను తాకింది. దీంతో ట్రేడింగ్ను నిలిపేశారు. 15 నిమిషాల అనంతరం ఆరంభమైనప్పటికీ నష్టాలు తగ్గలేదు. కరోనా ప్రభావం పెరుగుతుండటం, ముడి చమురు ధరలు తగ్గడం ప్రభావం చూపాయి. రాత్రి గం.11.30 ని. లకు డోజోన్స్ 1,794 పాయింట్లు, నాస్డాక్ 500 పాయింట్ల నష్టాల్లో ట్రేడయ్యాయి. మంగళవారం సెలవు కావడంతో మేలైందని, లేకుంటే అమెరికా, యూరప్ మార్కెట్ల నష్టాల ప్రభావంతో మన మార్కెట్కు భారీ నష్టాలు ఉండేవని విశ్లేషకులంటున్నారు. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ మహా పతనం కారణంగా రూ. 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6, 84, 278 కోట్లు హరించుకుపోయి రూ.1,37,46,947 కోట్లకు పడిపోయింది. షేర్లు కకావికలం... ♦ ఓఎన్జీసీ.. 15 ఏళ్ల కనిష్టానికి ముడి చమురు ధరలు 30 శాతం మేర పతనం కావడంతో చమురు అన్వేషణ, తయారీ ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్జీసీ భారీగా నష్టపోయింది. 16 శాతం నష్టంతో రూ.74.65 వద్ద ముగిసింది. ఇది దాదాపు 15 ఏళ్ల కనిష్ట స్థాయి. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ♦ రెండో స్థానానికి రిలయన్స్ చమురు ఉత్పత్తి రంగంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ కూడా బాగా పతనమైంది. 12 శాతం నష్టంతో రూ.1,113 వద్దకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్లు ఆవిరైంది. ఈ నష్టం కారణంగా అత్యధిక మార్కెట్ క్యాప్గల భారత కంపెనీ అనే ఘనతను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. మొదటి స్థానం టీసీఎస్ షేర్కు దక్కింది. ♦ యస్ బ్యాంక్ జోరు... ఎస్బీఐ బేజారు.... సంక్షోభంలో చిక్కుకున్న యస్బ్యాంక్లో 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్న ఎస్బీఐ షేర్ 6 శాతం పతనమై రూ.254కు చేరింది. మరోవైపు యస్ బ్యాంక్ షేర్ 31 శాతం లాభపడి రూ.21 వద్ద ముగిసింది. ♦ చమురు షేర్లు రయ్... ముడి చమురు ధరలు 30 శాతం మేర తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు–హెచ్పీసీఎల్, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. హెచ్పీసీఎల్ షేర్ 6 శాతం లాభంతో రూ.213కు, బీపీసీఎల్ షేర్ 5.2 శాతం పెరిగి రూ.424కు పెరిగాయి. ♦ ఏడాది కనిష్టానికి 800 షేర్లు... దాదాపు 800కు పైగా షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. బీఎస్ఈ 500 సూచీలో ప్రతి నాలుగు షేర్లలో ఒక షేర్ ఏడాది కనిష్టానికి పడిపోయింది.∙ప్రపంచ పరిణామాలకు యస్ బ్యాంకు సంక్షోభం తోడవటంతో బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఒక్కరోజే 1,942 (5.1%) పాయింట్లు కుదేలైంది. చరిత్రలో ఇదే అత్యంత దారుణ పతనం. నిఫ్టీ సైతం 538 పాయింట్లు (4.9%) నష్టపోయింది. శాతాల పరంగా గత ఐదేళ్లలో ఇదే భారీ నష్టం కాగా.. పాయింట్ల పరంగా ఇది రికార్డు. ఓఎన్జీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు సైతం 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా ఒక్కరోజే ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. -
పసిడి ధరలు పైపైకి
సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో కాస్త నెమ్మదించిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బులియన్ మార్కెట్లో పసిడి ధర మళ్లీ 39 వేల రూపాయల స్థాయికి చేరింది. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్యంతరం ఒప్పందంపై ఆందోళనలు పసిడి ఫ్యూచర్ మార్కెట్లో కూడా ధరలు మళ్లీ పైపైకి పోతున్నాయి. ప్రపంచమార్కెట్లో పసిడి ధరలు మంగళవారం 7వారాల గరిష్టాన్ని నమోదు చేసాయి. దేశీయంగానే ఇదే ధోరణి నెలకొంది. దేశ రాజధానిలో మంగళవారం రూ. 191 పెరిగి 10 గ్రాముల ధర రూ. 39,239 పలికింది. అటు వెండి ధర ఇదే బాటలో పయనించింది. ఇవాళ ఒక్కరోజే రూ. 943 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,146కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర కిత్రం ముగింపు(1,488.70 డాలర్లు)తో పోలిస్తే 6డాలర్ల పెరిగి 1,495 స్థాయికి చేరింది. నవంబర్ 07 తరువాత పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి విశేషం. ఈ నవంబర్లో అమెరికా ఎగుమతులు క్షీణించడంతో నాలుగో త్రైమాసికంలో వృద్ధిపై అనుమానాలు రెకెత్తాయి. అంతర్జాతీయ ట్రెండ్కు అనుగుణంగానే దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడికి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.101లు పెరిగి రూ.38358.00 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నరాత్రి అమెరికాలో పసిడి ర్యాలీ కారణంగా నిన్న మార్కెట్ ముగిసే సరికి రూ.266 లాభంతో రూ.38,257ల వద్ద స్థిరపడింది. క్రిస్మస్, కొత్త సంవత్సరం తదితర పండుగల నేపథ్యంలో డిమాండ్ స్వల్పంగా పుంజుకునే అవకాశం ఉందని బులియన్ వర్తకులు భావిస్తున్నారు. -
పసిడిలో పెట్టుబడులు పటిష్టమే!
ప్రస్తుతం పెట్టుబడులకు పసిడి సురక్షిత సాధనమేనని నిపుణుల అంచనా. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో పసిడి ధర 20వ తేదీతో ముగిసిన వారంలో ఔన్స్కు (31.1గ్రా) 1,482 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు, అమెరికా స్థూల దేశీయోత్పత్తి, ప్రత్యేకించి వినియోగ గణాంకాలు సానుకూలత, డాలర్ పటిష్టత వంటి అంశాలు స్వల్పకాలంలో పసిడి ధర దిగువకు రావడానికి కొంత దారితీసినా.. 1,450 డాలర్ల వద్ద పసిడికి పటిష్ట మద్దతు ఉందన్నది వాదన. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన ధోరణుల వల్ల పసిడి దీర్ఘకాలంలో పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అనిశ్చితిని ధీటుగా ఎదుర్కొనడానికి పసిడి కొనుగోళ్లవైపు మొగ్గుచూపాలని ఇరాన్, మలేషియా, టర్కీ, కతార్లు భావిస్తున్నట్లు స్వయంగా మలేషియా ప్రధానమంత్రి మహతీర్ మహ్మద్ ప్రకటించడం ఇక్కడ గమనార్హం. -
గ్లోబల్ జోష్తో స్టాక్ మార్కెట్ జోరు..
ముంబై : అంతర్జాతీయ అనిశ్చితి తొలగుతుందనే సంకేతాలతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో కీలక సూచీలు ఎగిశాయి. ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా నిరాశాజనకంగా ఉన్నా ట్రేడ్ డీల్ పై ఆశలు, బ్రెగ్జిట్పై స్పష్టత వంటి అంశాల ఊతంతో మదుపుదారుల్లో సానుకూల సెంటిమెంట్ నెలకొంది. బీఎస్ఈ సెన్సెక్స్ 428 పాయింట్లు లాభపడి 41,009 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 12,086 పాయింట్ల వద్ద క్లోజయింది. -
స్టాక్ మార్కెట్లకు ట్రేడ్ వార్ షాక్..
ముంబై : అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంలో జాప్యం నెలకొంటుందనే సంకేతాలతో బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల ట్రెండ్ సైతం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. మెటల్, పీఎస్యూ సహా పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండగా, ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 101 పాయింట్ల నష్టంతో 40,573 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 12,000 పాయింట్ల దిగువన 11,957 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
ట్రేడ్వార్లో చైనానే విలన్!
హైదరాబాద్, సాక్షి బిజినెస్: చైనాతో అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే ఛాన్సు లేదని బెల్జియం రాజకీయ ప్రతినిధి, యూరోపియన్ యూనియన్ మాజీ ట్రేడ్ కమిషనర్ కారల్ డీ గష్ అభిప్రాయపడ్డారు. అదిగో డీల్ కుదరుతోంది, ఇదిగో కుదురుతోందంటూ వచ్చే వార్తలతో స్టాక్ మార్కెట్లు పరుగులు తీయడమే కానీ, నిజానికి ఎలాంటి డీల్ కుదరకపోవచ్చన్నారు. ట్రేడ్వార్ అనేది ఒక వ్యవస్థీకృత సమస్యని, ఇందుకు చైనానే ప్రధాన కారణమని, కానీ చైనాను దారికి తెచ్చేందుకు అమెరికా అనుసరిస్తున్న బలవంతపు విధానం సత్ఫలితాలు ఇవ్వదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో పదేళ్లు ట్రేడ్వార్ కొనసాగినా ఆశ్చర్యం లేదన్నారు. బెల్జియం, ఇండియా మధ్య ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల్లో వాణిజ్య సహకారం కోసం బెల్జియం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఇక్కడ ట్రేడ్వార్తో పాటు పలు అంశాలపై మాట్లాడారు. ‘బ్రెగ్జిట్ కారణంగా ఈయూలో బెల్జియం, నెదర్లాండ్స్పై అత్యధిక ప్రతికూల ప్రభావం ఉంటుంది. ట్రేడ్వార్, బ్రెగ్జిట్ నేపథ్యంలో ఇండియా, యూరోపియన్ యూని యన్ మధ్య సరికొత్త వాణిజ్య అవకాశాలకు అపార అవకాశముంది. అయితే భారత్ నుంచి ఈ దిశగా సరైన చర్యల్లేవు’ అని కారల్ డీ గష్ తెలిపారు. -
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
ముంబై : అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో సానుకూల పరిణామాలతో స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడుతున్నాయి. బ్యాంక్, ఆటోమొబైల్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. కొనుగోళ్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ 41,000 మార్క్ ఎగువన కొనసాగుతోంది. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 176 పాయింట్ల లాభంతో 40,092 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 61 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 12,099 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
విదేశీ పెట్టుబడులకు గాలం
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత్ దృష్టి సారిస్తోంది. బహుళజాతి సంస్థ(ఎంఎన్సీ)లను రప్పించేందుకు తీసుకోతగిన చర్యలపై కసరత్తు చేస్తోంది. టెస్లా, గ్లాక్సోస్మిత్క్లెయిన్ వంటి 324 కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే సంస్థలకు స్థలం ఇవ్వడంతో పాటు విద్యుత్, నీరు, రోడ్డు మార్గం వంటి సదుపాయాలు కూడా కల్పించడం తదితర అంశాలు వీటిలో ఉన్నాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ఈ మేరకు ఒక ముసాయిదా రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికన్ దిగ్గజం ఎలీ లిలీ అండ్ కో, దక్షిణ కొరియాకు చెందిన హన్వా కెమికల్ కార్పొరేషన్, తైవాన్ సంస్థ హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ తదితర దిగ్గజ కంపెనీలతో కేంద్రంలోని ఉన్నతాధికారులు సంప్రదింపులు జరపనున్నట్లు వివరించాయి. భూ, కార్మిక చట్టాలతోనే సవాలు... వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. వియత్నాం, మలేషియా వంటి దేశాలను ఎంచుకుంటున్నాయి. కఠినమైన భూసేకరణ నిబంధనలు, కార్మిక చట్టాలున్న కారణంగా భారత్ను పక్కన పెడుతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు.. తామే స్థలాన్ని సేకరించుకోవాల్సి ఉంటోంది. అయితే, వివిధ కారణాల రీత్యా దీనికి చాలా సమయం పట్టేస్తుండటంతో అసలు ప్రాజెక్టును ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ఇలాంటి ప్రతికూలాంశాలను గుర్తించిన కేంద్రం.. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు తీసుకోతగిన చర్యలపై దృష్టి పెడుతోంది. ప్రతిపాదనలు ఇవీ... ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనువైన పారిశ్రామిక క్లస్టర్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది. అలాగే పెట్టుబడులు, ఎంచుకున్న ప్రాంతం ప్రాతిపదికగా ప్రోత్సాహకాలు ఇస్తుంది. యాంటీ–డంపింగ్ సుంకాలను క్రమబద్ధీకరిస్తుంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, ఇంధనాన్ని ఆదా చేసే వాహనాల తయారీకి ప్రోత్సాహకాలు ఉంటాయి. అటు ఎలక్ట్రానిక్స్, టెలికం రంగాలకు సంబంధించి ఉద్యోగాలపరమైన వెసులుబాట్లు, పెట్టుబడుల ప్రాతిపదికన తయారీ సంబంధ ప్రోత్సాహకాలు మొదలైనవి పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ ప్రధాని కార్యాలయం పరిశీలిస్తోందని, త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా... 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వృద్ధికి దోహదపడే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. ఎగుమతులను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గించడం, విదేశీ పెట్టుబడుల నిబంధనలు సడలించడం తదితర సంస్కరణలు ప్రవేశపెట్టింది. వీటి ఊతంతో వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకింగ్స్ను గణనీయంగా మెరుగుపర్చుకుంటోంది. ప్రపంచ బ్యాంక్ రూపొందించే ఈ లిస్టులో 2017 నుంచి ఏకంగా 37 ర్యాంకులు పైకి ఎగబాకింది. అయినప్పటికీ రువాండా, కొసొవో వంటి దేశాల కన్నా ఇంకా దిగువనే 63వ ర్యాంకులో ఉంది. దీంతో మరిన్ని సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
లాభాల స్వీకరణతో మార్కెట్ వెనక్కి..
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపినా, బలహీన అంతర్జాతీయ సంకేతాలు గురువారం స్టాక్ మార్కెట్ను పడగొట్టాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై ప్రతిష్టంభన కొనసాగుతుండటం, రెండు రోజుల లాభాల నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 93 పాయింట్ల లాభపడినప్పటికీ సెన్సెక్స్ చివరకు 76 పాయింట్ల నష్టంతో 40,575 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 31 పాయింట్లు పతనమై 11,968 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్తో రూపాయి మారకం విలువ స్పల్పంగా పుంజుకున్నా, మార్కెట్కు నష్టాలు తప్పలేదు. అమెరికా–చైనా ఒప్పందం హుళక్కి ! ఐదు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతే కాకుండా రెండేళ్ల వరకూ స్పెక్ట్రమ్ చార్జీలు వసూలు చేయబోమంటూ టెలికం కంపెనీలకు ఊరటనిచ్చింది. ఈ అంశాలు ఆరంభంలో ఒకింత సానుకూల ప్రభావం చూపించాయి. అయితే హాంగ్కాంగ్ నిరసనకారులకు మద్దతుగా రెండు బిల్లులను అమెరికా ఆమోదించింది. అంతేకాకుండా మానవ హక్కుల విషయమై చైనాకు హెచ్చరిక జారీ చేసింది. దీంతో అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో మరింత అనిశ్చితి నెలకొన్నది. ఈ ఏడాది ఒప్పందం కుదిరే అవకాశాల్లేవంటూ వార్తలు వచ్చాయి. ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా నష్టపోయింది. 211 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... లాభాల్లోనే మొదలైన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఎన్ఎస్ఈ వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో స్టాక్ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. ఒక దశలో 93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 118 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 211 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక మార్కెట్ దృష్టి వచ్చే వారం వెలువడే క్యూ2 జీడీపీ గణాంకాలపై ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ► టాటా స్టీల్ షేర్ 3.5 శాతం నష్టంతో రూ.385 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► రుణ భారం తగ్గించుకునే నిమిత్తం జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో 16.5 శాతం వాటాను విక్రయించనున్నామని ఎస్సెల్ గ్రూప్ బుధవారం వెల్లడించింది. దీంతో గురువారం జీ ఎంటర్టైన్మెంట్ షేర్ 12 శాతం లాభంతో రూ.345 వద్ద ముగిసింది. ► స్పెక్ట్రమ్ చార్జీల చెల్లింపులను రెండేళ్లపాటు వాయిదా వేయడంతో టెలికం షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఇటీవల వరకూ లాభపడిన ఎయిర్టెల్, ఐడియా షేర్లు నష్టపోయాయి. వొడాఫోన్ ఐడియా షేర్ 6 శాతం నష్టంతో రూ.6.64 వద్ద, భారతీ ఎయిర్టెల్ 2.5 శాతం నష్టంతో రూ.426 వద్ద ముగిశాయి. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినప్పటికీ, పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్టైమ్ హైలను తాకాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ, ఇంద్రప్రస్థ గ్యాస్, ఆవాస్ ఫైనాన్షియర్స్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, పాలీక్యాబ్ ఇండియా, ఆఫిల్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
'వాణిజ్య యుద్దం ఇంకా ముగియలేదు'
వాషింగ్టన్ : అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా తమ దేశంతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని శుక్రవారం రాత్రి ట్రంప్ కుండబద్దలు కొట్టారు. వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ.. ' సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా కోరినట్లు తెలిసింది. దీనికి సంబంధించి వారు నాతో ఎలాంటి చర్చలు జరపలేదు, ఎందుకంటే నేను దానికి ఒపుకోనని వారికి తెలుసు. అందుకే సుంకాల ఎత్తివేతను తాను ఖండిస్తున్నా' అంటూ మీడియాకు తెలిపారు. అయినా ఇది ఎప్పటికి జరగని పని అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చైనా ఆర్ధికంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటుందని.. అందుకే ఇటువంటి ఒప్పందాల కొరకు పాకులాడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వారం ఇరు దేశాల మధ్య సుంకాలను దశలవారిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి గావో ఫెంగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్దానికి తెరపడినట్లేనని అంతా భావించారు. కానీ, తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో మళ్లీ ఆందోళన మొదలైంది. గతవారం చైనా చేసిన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్న విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలని పలువురు ఆర్థిక నిపుణులు అనుకుంటున్నారు. (చదవండి : అమెరికా-చైనా ట్రేడ్వార్ ముగియనుందా !) -
భారీగా తగ్గిన బంగారం!
న్యూయార్క్, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారత్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఒక్కసారిగా క్షీణించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్–నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా)కు 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా–చైనా మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నా యనే ఊహగానాలు పసిడి నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కారణమన్నది విశ్లేషణ. సహజంగా భౌగోళిక ఆర్థిక, రాజకీయ ఉద్రిక్తతల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడి సురక్షితమైనదిగా భావిస్తారు. అలాంటి పరిస్థితులు లేనప్పుడు వాస్తవ వృద్ధికి దోహదపడే అసెట్స్వైపు తమ ఇన్వెస్ట్మెంట్లను మళ్లిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర గురువారం రాత్రి ఇదే విధంగా బలహీనంగా ముగిస్తే, భారత్ దేశీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర భారీగా పతనమయ్యే అవకాశం ఉంది. -
అమెరికా-చైనా ట్రేడ్వార్ ముగియనుందా !
బీజింగ్ : అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్దానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 'గత రెండు వారాలుగా ఇరు దేశాలకు చెందిన అధికారులు మద్యవర్తిత్వ చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విధించిన సుంకాలను దశల వారిగా ఎత్తివేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు తుది ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నట్లు' చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి గావో ఫెంగ్ తెలిపారు. ఫేజ్-1లో భాగంగా ఇరు దేశాలు సమాన నిష్పత్తుల్లో విధించిన సుంకాలను ఒకేసారి ఎత్తేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. 'సుంకాలు విధించుకోవడం వల్ల మా దేశాల మధ్య వాణిజ్య యుద్దం మొదలైంది. ఇప్పుడు వాటిని రద్దు చేయడంతోనే ఈ యుద్దం ముగుస్తుందని' మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రెండు దేశాల అధికారులు త్వరలోనే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఏడాదికి పైగా వాణిజ్య యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండేళ్లలో వందల బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై రెండు దేశాలు భారీ స్థాయిలో సుంకాలు విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఒప్పందం వాణిజ్య యుద్దానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పసిడి పరుగు పటిష్టమే
తీవ్ర ఒడిదుడుకులు ఎదురయినా, సమీపకాలంలో పసిడి పటిష్టమేనన్నది నిపుణుల వాదన. అమెరికా–చైనా మధ్య చర్చ మధ్య మధ్యలో చర్చలు జరిగినా, వాణిజ్య యుద్ధంపై కొనసాగుతున్న తీవ్ర అనిశ్చితి, సౌదీ చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడుల నేపథ్యంలో భౌగోళికంగా ఉద్రిక్తతలు వంటి అంశాలు పెట్టుబడులకు తక్షణ ఆకర్షణీయ మెటల్గా పసిడిని కొనసాగిస్తున్నాయి. శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్లో 1,524 డాలర్ల వద్ద ముగిసింది. వారంవారీగా చూస్తే, ఇది దాదాపు 20 డాలర్ల పెరుగుదల. శుక్రవారంతో ముగిసిన గడచిన 15 రోజుల్లో రెండుసార్లు పసిడి 1,500 డాలర్ల లోపునకు పడింది. ఇది బంగారానికి పటిష్టస్థాయి. ఈ స్థాయి దిగువనకు పడిపోయినా, వెంటనే పసిడి 1,500 డాలర్లపైకి లేచింది. అమెరికా ఆర్థిక అనిశ్చితి పరిస్థితి, దీనితో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం తగ్గింపు (ప్రస్తుతం 2 నుంచి 1.75 శ్రేణిలో) వంటి అంశాలు పసిడికి మద్దతునిచ్చేవే కావడం గమనార్హం. దేశీయంగానూ పటిష్టమే.. దేశీయంగానూ పసిడి ధర సమీప భవిష్యత్తులో పటిష్టంగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి దీనికి కారణమన్నది వారి విశ్లేషణ. పలు పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం 72–70 శ్రేణిలో కొనసాగుతోంది. చమురు ధర పెరుగుదల భయాల నేపథ్యంలో దీర్ఘకాలంలో రూపాయిది బలహీన ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి ధర శుక్రవారం రూ.37,697 వద్ద ముగిసింది. 1,600 డాలర్ల వరకూ... ఔన్స్కు 1,600 డాలర్ల వరకూ పసిడి ర్యాలీ చేసే అవకాశం ఉంది. అయితే వాణిజ్య చర్చలు, మార్కెట్ అంశాలు వంటివి పసిడిని 1,400 డాలర్ల నుంచి 1,600 డాలర్ల శ్రేణిలో నిలిపే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ధర ఎక్కడ ఉన్నది ముఖ్యం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి పట్ల ఇన్వెస్టర్ ధోరణి ఎలా ఉంది అన్నది ఇక్కడ కీలకం. ఈ దిశలో పసిడికి సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. – క్రిస్టినా హూపర్, ఇన్వెస్కో చీఫ్ గ్లోబల్ మార్కెట్ వ్యూహకర్త -
దశాబ్దంలోనే కనిష్టానికి ప్రపంచ వృద్ధి: ఓఈసీడీ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక సంక్షోభం (2008–09) తర్వాత అత్యంత కనిష్టస్థాయిలో ఆర్థిక వృద్ధి ఈ ఏడాదిలోనే నమోదు కానుందని ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ’ (ఓఈసీడీ) తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి గతేడాది 3.6 శాతం నుంచి ఈ ఏడాది 2.9 శాతానికి పడిపోతుందని, 2020లో 3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. భారత్లో 2019లో వృద్ధి రేటు 5.9 శాతంగా, 2020లో 6.3 శాతంగా ఉంటుందన్న అంచనాలకు వచ్చింది. 2018లో 6.8 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు అంతర్జాతీయ వృద్ధిని దశాబ్దంలోనే కనిష్ట స్థాయికి నెట్టిందని అభివర్ణించింది. -
ఇంతగా సాష్టాంగపడాలా?
ప్రస్తుతం ప్రపంచంలో నడుస్తోన్న వాణిజ్య యుద్ధాలు అందరికీ తెలిసినవే. వీటిని ఆరంభించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన ప్రధాన టార్గెట్ చైనాతో అమెరికాకున్న భారీ వాణిజ్య లోటును తగ్గించుకోవడం. కానీ, చైనాతోపాటు మెక్సికో, యూరోపియన్ యూనియన్ దేశాలూ, భారత్తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలూ, దేశాలూ ఇవాళ ట్రంప్ వాణిజ్య యుద్ధ పరిధిలో ఉన్నాయి. అమెరికా ఇన్నేళ్లుగా ప్రపంచంలో ప్రధాన వినియోగదారు, దిగుమతిదారుగా ఉంది. అమెరికా నుంచి ప్రపంచ దేశాలకు జరిగే ఎగుమతులు ఆయుధాల అమ్మకం వంటి వాటికే పరిమితం. అంటే అమెరికా చేసే ఎగుమతులకన్నా, ఇతర దేశాల నుంచి అది చేసుకునే దిగుమతులు అనేక రెట్లు అధికం. తన కరెన్సీ డాలర్కు ఉన్న పలుకుబడితో, బలంతో అమెరికా ఈ వ్యవస్థను ఇన్నాళ్లూ కొనసాగించగలిగింది. కానీ, 2008 ప్రపంచ ఆర్ధిక, ఫైనాన్స్ సంక్షోభం అమెరికా అంతర్జాతీయ ఆధిపత్యానికీ, అస్తిత్వానికే ముప్పు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే 2016లో అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ కొద్ది కాలానికే ఇతర దేశాల సరుకులపై భారీ సుంకాలు అనే ఆయుధంతో విరుచుకుపడ్డాడు. వాషింగ్మెషీన్లు మొదలుకొని ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాల పెంపుతో తన వాణిజ్య యుద్ధం మొదలుపెట్టాడు. తద్వారా, ఈ సరుకులు అమెరికాలో ఖరీదైనవిగా మారి, ప్రత్యామ్నాయంగా వాటి ఉత్పత్తి అమెరికాలోనే జరుగుతుందనీ, దాని వలన అమెరికాలో ఉపాధి కల్పన కూడా పెరుగుతుందనేది ట్రంప్ వాదన. అలాగే విదేశాలకు తరలిపోయిన అమెరికా పరిశ్రమలు తిరిగి అమెరికాకు వచ్చేస్తాయన్నది కూడా ఆయన ఆశ. ఈ ఆలోచనలతోనే గత కొంతకాలంగా ఆయన చైనాతో భారీ స్థాయి వాణిజ్య యుద్ధానికి దిగాడు. ఈ క్రమంలో చైనా కూడా అమెరికా సరుకులపై దిగుమతి సుంకాలను పెంచేసింది. అలాగే మెక్సికో, యూరోపియన్ యూనియన్తో కూడా ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దిగాడు. భారత్, టర్కీ వంటి దేశాలకు 1970లలో కల్పించిన ‘‘జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్’’ అనే ఎగుమతుల వెసులుబాటును (అమెరికాకు ‘సున్నా’ శాతం సుంకాలతో ఎగుమతులు చేసుకొనే అవకాశం) రద్దు చేశాడు. ఈ రకంగా నయానా, భయానా అమెరికా దేశాన్ని తిరిగి ప్రపంచ నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనేది ట్రంప్ ప్రయత్నం. కాగా, ప్రపంచంలోని అతి పెద్ద వినియోగ మార్కెట్గా ఉన్న అమెరికాలోకి వచ్చే విదేశీ సరుకులపై టారిఫ్ల (సుంకాలు) పెంపు యుద్ధం ప్రకటించినా ఇప్పటికీ అమెరికా వాణిజ్యలోటు అనేక దేశాలతో పెరిగిపోతూనే ఉంది. ట్రంప్ ప్రధాన టార్గెట్ అయిన చైనా దేశం ఎగుమతులు, వాణిజ్య యుద్ధం మొదలైన అనంతరం 2018లో అమెరికాకు ఒక శాతం మేర పెరిగాయి. కాగా, ట్రంప్ ఆశలకు భిన్నంగా చైనాకు అమెరికా ఎగుమతులు మాత్రం 21% అంటే 33 బిలియన్ల డాలర్ల మేరన పడిపోయాయి. ఫలితంగా, ట్రంప్ వ్యూహం బెడిసికొట్టి చైనాతో అమెరికా వాణిజ్య లోటు మరింత పెరిగింది. అలాగే అమెరికాకు అధికంగా ఎగుమతులు చేసే దేశాలలో మరొకటైన మెక్సికోతో సహా ప్రపంచంలోని మిగతా అనేక దేశాలతో కూడా అమెరికాకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. కాగా, ట్రంప్ బెదిరింపులు, హూంకరింపులు ప్రపంచంలోని వేళ్ళ మీద లెక్కించగల కొద్ది దేశాలను మాత్రం అదరగొట్టాయి. వాటిలో దక్షిణ కొరియాతో పాటుగా, భారత్ కూడా ఉండటం గమనార్హం. వాణిజ్య యుద్ధాల ముందరి నుంచే (2017 నుంచి) అమెరికాతో భారత్కు ఉన్న వాణిజ్య మిగులును తగ్గించుకునే ‘‘కృషి’’ లో మన ప్రభుత్వం నిమగ్నం అయింది. ఆయుధాలు, ఇంధన దిగుమతుల ద్వారా అమెరికాను మెప్పించే పనిలో మన పాలకులు బిజీ అయ్యారు. సరుకుల దిగుమతులలో భారత్తో అమెరికా వాణిజ్యలోటు, 2017లోని 22.9 బిలియన్ల డాలర్ల నుంచి, 2018లో 21.3 బిలియన్ల డాలర్లకు తగ్గింది. అంటే, మన దేశంతో అమెరికా వాణిజ్య లోటు 2017–18 కాలంలో 7% మేరన (1.6 బిలియన్లు) తగ్గింది. ఈ మధ్యన ఫ్రాన్స్లో ట్రంప్ను కలిసిన సందర్భంలో మోదీ అమెరికాకు భారత్తో ఉన్న వాణిజ్యలోటు తగ్గింపునకు సాయపడతానంటూ సెలవిచ్చారు. అమెరికా నుంచి భారత్కు 4 బిలియన్ల మేరన చమురుతోపాటు అదనపు దిగుమతులు జరిపేందుకు అంతా సిద్ధమైందంటూ మోదీ, ట్రంప్కు చెప్పారు. మరోవైపున అమెరికా ఆంక్షలకు తలవొగ్గి, మనం, మన చిరకాల మిత్రదేశం ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించేసుకున్నాం. మనకు అవసరం ఉన్నా లేకపోయినా, అమెరికా నుంచి మనం చేసుకునే దిగుమతులు పెంచుకుంటూ పోతున్నాం. అమెరికా మాత్రం టారిఫ్ల పెంపుతో, మనకు గతం నుంచి ఇచ్చిన వాణిజ్య రాయితీల రద్దుతో తమదేశంలోకి ఎగుమతి అయ్యే మన సరుకులకు అడ్డుకట్ట వేస్తోంది. మన సాఫ్ట్వేర్ నిపుణుల వంటివారికి ఇచ్చే హెచ్1 వీసాల సంఖ్యను కుదించివేస్తోంది. ఇతర దేశాల చేతులు మెలిపెట్టి, మెడపై కత్తి పెట్టి అమెరికా సాగిస్తోన్న ఈ దాష్టీకానికి లొంగిపోవటం.. 24 /7 రోజులూ దేశభక్తి మంత్రం పఠించే మోదీ ప్రభుత్వ నిజస్వరూపానికి నిదర్శనమేమో ఆలోచించాలి...!! వ్యాసకర్త: డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
సెన్సెక్స్ 337 పాయింట్లు అప్
వాహన రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనున్నదనే అంచనాలతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం ఒప్పందం కుదరగలదన్న అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చైనా, ఇతర దేశాల కేంద్ర బ్యాంక్లు ప్యాకేజీలను ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. డాలర్తో రూపాయి మారకం విలువ 16 పైసలు పుంజుకొని 71.68 వద్ద ముగియడం... రూపాయి వరుసగా మూడో రోజూ బలపడటం కలసివచ్చింది. ...బీఎస్ఈ సెన్సెక్స్ 337 పాయింట్లు పెరిగి 36,982 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 10,946 పాయింట్ల వద్ద ముగిశాయి. గణేశ్ చవితి సందర్భంగా సోమవారం సెలవు కావడంతో నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 351 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు చొప్పున తగ్గాయి. అమ్మకాల్లేక కుదేలైన వాహన రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ గురువారం అభయం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాహన షేర్ల లాభాలు శుక్రవారం కూడా కొనసాగాయి. మారుతీ సుజుకీ 3.6 శాతం, బజాజ్ ఆటో 2.9 శాతం, టాటా మోటార్స్ 2.5 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.3 శాతం, హీరో మోటొకార్ప్ 2.1 శాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.09 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.09 లక్షల కోట్లు పెరిగి రూ.1,40,28,104కు పెరిగింది. ► ప్రభాత్ డైరీ షేర్ 20 శాతం అప్పర్ సర్క్యూట్తో రూ.78 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ నుంచి ఈ షేర్ను డీలిస్ట్ చేయడం కోసం ప్రమోటర్లు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు దీనికి కారణం. 70కి పైగా ఏడాది కనిష్టం... స్టాక్ మార్కెట్ భారీగా లాభపడినా, దాదాపు 70కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కాక్స్ అండ్ కింగ్స్, అలోక్ ఇండస్ట్రీస్, ఎడ్యుకాంప్ సొల్యూషన్స్, ఆర్కామ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు అబాట్ ఇండియా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ వంటి పదికి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. -
స్టాక్ మార్కెట్లకు గ్లోబల్ జోష్..
ముంబై : గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అమెరికా-చైనాల మధ్య ట్రేడ్ వార్ సమసిపోయేందుకు ఇరు దేశాల మధ్య వాణజ్య చర్చలు అక్టోబర్లో జరుగుతాయనే వార్తలు మదుపుదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు నెలకొంది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 36,814 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 10,885 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
ఆగస్ట్లో 10వేల ఉద్యోగాలకు నష్టం
వాషింగ్టన్: చైనాతో అమెరికా వాణిజ్య పోరు అగ్ర దేశంలో ఉద్యోగాలకు గండి కొడుతోంది. ఆగస్ట్ నెలలో ఏకంగా 10,000కు పైగా ఉగ్యోగులను కేవలం వాణిజ్య యుద్ధంతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగానే అమెరికన్ కంపెనీలు తొలగించుకోవాల్సి వచ్చినట్టు గ్రే అండ్ క్రిస్మస్ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు 2009 ఆగస్ట్ తర్వాత... ఇంతగా ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది ఆగస్ట్లోనే జరిగినట్టు గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ అంటోంది. జూలైతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్ట్లో ఉగ్యోగాల కోత 38 శాతం పెరిగింది. మొత్తం మీద 53,480 మందిని పేరోల్స్ నుంచి తొలగించాయి. వాణిజ్య యుద్ధం, టారిఫ్ల ప్రభావం కంపెనీలపై చూపించడం ఆరంభమైందని గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ యాండ్ర్యూ చాలెంజర్ పేర్కొన్నారు. తమ ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ తగ్గడంతో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయని చెప్పారు. అయితే, అమెరికాలో నిరుద్యోగ రేటు అన్నది చారిత్రకంగా కనిష్ట స్థాయిల్లోనే ప్రస్తుతానికి ఉండడం గమనార్హం. కాకపోతే నూతన ఉద్యోగాల కల్పన తగ్గింది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా చైనాతో అమెరికా వాణిజ్య పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. -
మార్కెట్లో ఆరంభ లాభాలు ఆవిరి
ముంబై : ఐటీ, ఫార్మా షేర్లలో అమ్మకాల వెల్లువతో శుక్రవారం స్టాక్ మార్కెట్ల ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నెగెటివ్ జోన్లోకి మారాయి. తొలి త్రైమాసిక జీడీపీ సహా పలు కీలక గణాంకాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల పైగా నష్టపోతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్ల నష్టంతో 10,895 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
పసిడి.. కొత్త రికార్డు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మాంద్యం భయాలు, ఇన్వెస్టర్ల నుంచి పటిష్టమైన డిమాండ్ ఊతంతో పసిడి రేట్ల పరుగు కొనసాగుతోంది. తాజాగా గురువారం మరో కొత్త గరిష్ట స్థాయిని తాకింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 40,220కి చేరినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇది పసిడికి జీవిత కాల గరిష్ట స్థాయి. రెండు రోజుల క్రితమే ముంబై మార్కెట్లో పసిడి రూ. 40 వేల మార్కును దాటి రూ. 40,100కి చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు, వెండి ధర కూడా క్రమంగా రూ. 50,000 మార్కుకు చేరువవుతోంది. కేజీకి రూ. 200 పెరిగి రూ. 49,050కి చేరింది. అంతర్జాతీయంగా మాంద్యం భయాలు, వాణిజ్య యుద్ధంపై అమెరికా–చైనా మధ్య చర్చల విషయంలో అనిశ్చితి తదితర అంశాలు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయని బులియన్ ట్రేడర్స్ తెలిపారు. -
స్టాక్ మార్కెట్ లాభాలు క్షణాల్లో ఆవిరి..
ముంబై : ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పలు చర్యలతో సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు వెనువెంటనే నష్టాల బాట పట్టాయి. అమెరికా-చైనా ట్రేడ్ వార్ భయాలతో మెటల్ సహా పలు రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆరంభంలో 500 పాయింట్లు పైగా లాభపడిన సెన్సెక్స్ నెగెటివ్ జోన్లోకి ఎంటరైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 108 పాయింట్ల నష్టంతో 36,592 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా,ఎన్ఎస్ఈ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 10,786 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
పసిడి ధరలు పటిష్టమే..!
న్యూఢిల్లీ/న్యూయార్క్: పసిడి బులిష్ ట్రెండ్ కనబడుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి .. ప్రత్యేకించి అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రత, ఈక్విటీ మార్కెట్ల బలహీనత, అమెరికా ఆర్థికాభివృద్ధి మళ్లీ మాంద్యంలోకి జారిపోతుందన్న అంచనాలు, దీనితో వడ్డీరేట్ల తగ్గింపునకే ఫెడ్ మొగ్గు చూపిస్తుందన్న విశ్లేషణలు పసిడికి బలాన్ని ఇస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని ఒక తక్షణం ఒక సురక్షిత సాధనంగా ఎంచుకుంటున్నారు. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్ల నేపథ్యంలో– శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ఒకేరోజు 28 డాలర్లు ఎగిసి 1,537 డాలర్లకు పెరిగింది. ఇది వారం వారీగా 16 డాలర్ల పెరుగుదల. 1,546 డాలర్లు ఈ ఏడాది గరిష్టం కావడం గమనార్హం. 1,360 డాలర్ల కీలక నిరోధాన్ని దాటిన తర్వాత పసిడి వేగంగా 1,546 స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. రానున్న వారం రోజుల్లో పసిడి 1,600 డాలర్ల స్థాయిని చేరడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. ఇక దేశీయంగా చూసినా పసిడి రికార్డులు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా పసిడి బలపడ్డంతోపాటు, డాలర్ మారకంలో రూపాయి (శుక్రవారం 71.66 వద్ద ముగింపు)బలహీన ధోరణి కూడా దేశీయంగా పసిడికి కలిసివస్తోంది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ ఎంసీఎక్స్లో పసిడి ధర 10 గ్రాములకు రూ.38,765 వద్ద ఉంది. -
ఆర్థిక వ్యవస్థకు మోదీ టానిక్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రధాని నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మందగమన పరిస్థితులు ఒకదాని తర్వాత మరో రంగానికి వేగంగా విస్తరిస్తుండడం, ఉద్యోగాలు, సంపదకు విఘాతం కలుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈ సమీక్ష నిర్వహించడం గమనార్హం. ఆర్థిక మందగమనానికి సహజ కారణాలు, దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికే ఈ భేటీ జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రంగాలవారీగా ఉద్దీపన చర్యలను ప్రభుత్వం ప్రకటించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ జీడీపీ వృద్ధి 2018–19లో 6.8%కి తగ్గిపోగా, 2014–15 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. వినియోగ విశ్వాసం క్షీణిస్తుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కుంగుదల వంటి అంశాలు ప్రభుత్వాన్ని సైతం ఆందోళనకరం. అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య ముదిరిన వాణిజ్య, కరెన్సీ యుద్ధం పరిస్థితులను మరింత ప్రతికూలంగా మారుస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇతమిద్ధంగా ఈ చర్యలు ఉంటాయన్న స్పష్టత అయితే ఆర్థిక శాఖ ఇంత వరకు వ్యక్తపరచలేదు. గత 2 వారాల వ్యవధిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లు, వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఆర్థిక రంగ వృద్ధికి అవరోధంగా ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే చర్యలు ఉంటాయని ఆ సందర్భంగా పారిశ్రామిక వేత్తలకు హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ప్రకటించే చర్యల కోసం మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆర్బీఐ సైతం తనవంతుగా రెపో రేట్లను కూడా మరోమారు తగ్గించింది. ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు ► వాహన రంగం అయితే గత రెండు దశాబ్దాల కాలంగా అత్యంత దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. వాహనాల అమ్మకాలు ప్రతీ నెలా భారీగా తగ్గిపోతున్నాయి. ► కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇప్పటి వరకు 300 డీలర్షిప్లు మూతపడ్డాయని, 2.30 లక్షల వరకు ఉద్యోగాలు పోయాయని అంచనా. ఆటో పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడినట్టు వాహన కంపెనీల సంఘం ప్రకటించింది. ► రియల్టీ పరిస్థితీ ఆశాజనకంగా లేదు. అమ్ముడుపోని ఇళ్లు భారీగానే ఉన్నాయి. ► ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల వృద్ధి సైతం గతంలో పోలిస్తే జూన్ త్రైమాసికంలో తగ్గింది. హిందుస్తాన్ యూనిలీవర్ జూన్ క్వార్టర్లో అమ్మకాల పరంగా కేవలం 5.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 12 శాతంగా ఉంది. డాబర్ అమ్మకాల వృద్ధి సైతం 21 శాతం నుంచి 6 శాతానికి పరిమితం అయింది. బ్రిటానియా అమ్మకాల వృద్ధి 12% నుంచి 6 శాతానికి క్షీణించింది. ► ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బ్యాంకుల నుంచి పరిశ్రమలకు రుణాలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.9%నుంచి 6.6%కి పెరగడం కాస్త ఆశాజనకం. కానీ, అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రం రుణాల పంపిణీ 0.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కేవలం 1.4 శాతమే పెరగ్గా, జీఎస్టీ వసూళ్లు జూలై వరకు 9% పెరిగాయి. 18% వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. -
సుంకాలు వాయిదా, లాభపడుతున్న రూపాయి
సాక్షి, ముంబై : డాలరు మారకంలో దేశీయ కరెన్సీ బుధవారం రుపీ భారీగా ఎగిసింది. మంగళవారం నాటి ముగింపు 71.40 తో పోలిస్తే 40 పాయింట్లు ఎగిసింది. ఆరంభంలో 55 పాయింట్లు ఎగిసి 70.92 వద్ద ఉన్న రూపాయి ప్రస్తుతం డాలరు మారకంలో 71 వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా చైనా దిగుమతులపై సుంకాల అమలుపై అమెరికా వెనక్కి తగ్గడంతో దేశీయ కరెన్సీకి బలమొచ్చింది. డిసెంబర్ మధ్య కాలం వరకు హాలిడే-షాపింగ్ జాబితాలో ఎక్కువగా ఉండే కొన్ని చైనా ఉత్పత్తులు ఫోన్లు, ల్యాప్టాప్లు , బొమ్మలు లాంటివాటిపై 10శాతం సుంకం విధింపునువాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆసియాలో ప్రధాన కరెన్సీలు లాభపడుతున్నాయి. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా 150 పాయింట్లకు పైగా ఎగిసి పాజిటివ్గా ఉన్నాయి. అలాగే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర కూడా లాభపడింది. -
బేర్ ‘విశ్వ’రూపం!
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధభయాలు, కార్పొరేట్ల ఆదాయాలు బలహీనంగా ఉండటం, రూపాయి క్షీణత, జమ్మూకశ్మీర్ పరిణామాలు.. అన్నీ కలగలిసి సోమవారం మార్కెట్లను కూలదోశాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ఇవన్నీ ప్రతికూల ప్రభావాలు చూపడంతో సెన్సెక్స్ 418 పాయింట్లు క్షీణించి కీలకమైన 36,700 పాయింట్ల దిగువకు పతనమైంది. అయిదు నెలల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఇక నిఫ్టీ సైతం 135 పాయింట్లు పతనమై 10,863 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ, సెన్సెక్స్ రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్ల దాకా కూడా పతనమైంది. చివర్లో కొంత కోలుకుని 418 పాయింట్ల తగ్గుదలతో (1.13 శాతం) 36,699.84 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ 36,417 – 36,844 పాయింట్ల కనిష్ట, గరిష్టస్థాయిల మధ్య తిరుగాడింది. ‘మార్కెట్ హెచ్చుతగ్గులకు అనేక ప్రతికూలాంశాలు కారణమయ్యాయి. జమ్మూకశ్మీర్ పరిణామాలతో రాజకీయ సంక్షోభం తలెత్తవచ్చన్న ఆందోళనలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్పీఐ) సర్చార్జీ నుంచి మినహాయింపునకు సంబంధించి కొత్తగా మరే సంకేతాలు లేకపోవడం వంటివి కూడా మార్కెట్ హెచ్చుతగ్గులకు కారణమయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు ఆఖర్లో కొంత రికవర్ కాగా.. బలహీన రూపాయి వల్ల ఐటీ రంగ షేర్లు ఆసాంతం లాభాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు సంబంధించిన చర్చలకు ప్రతికూలతలు ఉండటం, ఎఫ్పీఐలు రిస్కులకు దూరంగా ఉండాలని భావిస్తుండటం వంటి అంశాల వల్ల.. మార్కెట్ల కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఉంది‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. విపక్షాల ఆందోళనల మధ్య.. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల సూచీలు క్షీణతలోనే.. ఐటీ మినహా.. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఎనర్జీ 2.7 శాతం తగ్గగా.. మెటల్, బ్యాంక్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఫార్మా తదితర సూచీలు తగ్గాయి. ఇక బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీ కూడా 1 శాతం పైగా తగ్గాయి. యస్ బ్యాంక్ 8 శాతం డౌన్.. ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న యస్ బ్యాంక్ షేర్లకు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రూపంలో మరో షాక్ తగిలింది. అసెట్ క్వాలిటీ దిగజారుతుండటం, ఎన్బీఎఫ్సీలకు భారీగా రుణాలిచ్చి ఉండటం వంటి ప్రతికూల అంశాల కారణంగా బ్యాంక్ రేటింగ్ను డౌన్గ్రేడ్ చేసే అంశం ఇంకా పరిశీలనలోనే ఉందంటూ మూడీస్ వెల్లడించింది. రెండు నెలల్లో మూడీస్ ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఇది రెండోసారి కావడంతో బ్యాంక్ షేరు భారీగా తగ్గింది. సెన్సెక్స్ షేర్లలో యస్ బ్యాంక్ అత్యధికంగా 8.15 శాతం క్షీణించింది. ఇక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు కూడా రేటింగ్ సెగ తప్పలేదు. రిలయన్స్ రేటింగ్ను న్యూట్రల్ నుంచి అండర్పెర్ఫార్ఫ్కి తగ్గించడంతో పాటు టార్గెట్ రేటును రూ. 1,350 నుంచి రూ. 995కి తగ్గిస్తున్నట్లు బ్రోకరేజి సంస్థ క్రెడిట్ సూసీ ప్రకటించింది. దీంతో రిలయన్స్ షేరు 3.48 శాతం క్షీణించి రూ. 1,141 వద్ద క్లోజయ్యింది. టాటా మోటార్స్ 5.25 శాతం, పవర్గ్రిడ్ 4.42 శాతం, కోటక్ బ్యాంక్ (3.13 శాతం) తగ్గాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో అత్యధికంగా లాభపడిన వాటిల్లో ఉన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ 10 శాతం పతనం.. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) షేరు మరింత పతనమైంది. ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ తప్పుకుందన్న వార్తలతో 10% క్షీణించింది. బీఎస్ఈలో 41.95 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 12.43% క్షీణించి 52 వారాల కనిష్టమైన రూ. 40.85 స్థాయికి కూడా తగ్గింది. ఎన్ఎస్ఈలో 10.07 శాతం క్షీణతతో రూ. 41.95 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 22.03 లక్షలు, ఎన్ఎస్ఈలో 1.97 కోట్ల షేర్లు చేతులు మారాయి. డెలాయిట్ ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదంటూ డీహెచ్ఎఫ్ఎల్ వివరణనిచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్కు రూ. 90,000 కోట్ల రుణభారం ఉంది. నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల సంపద ఆవిరి లార్జ్ క్యాప్, మిడ్.. స్మాల్ క్యాప్ అనే తేడా లేకుండా మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతుండటంతో గడిచిన నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. జూలై 5న రూ. 153.58 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 శాతం తగ్గి సోమవారం నాటికి రూ. 138 లక్షల కోట్లకు పడిపోయింది. ఇదే వ్యవధిలో సెన్సెక్స్ 8 శాతం క్షీణించింది. ఇక కరెన్సీ యుద్ధాలు..! అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఇక కరెన్సీ వార్కు దారితీయనుందన్న భయాలతో వివిధ దేశాల కరెన్సీ విలువలు కుప్పకూలాయి. ఈ ప్రభావం రూపాయి మారకంపై కూడా ప్రభావం చూపింది. ఒకే రోజు 113 పైసలకు పైగా కుప్పకూలింది. కొత్తగా మరో 300 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా ఎగుమతులపై 10 శాతం సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయం ప్రభావాలను ఎదుర్కొనే క్రమంలో ఎగుమతిదారులకు ఊతమిచ్చే ఉద్దేశంతో సొంత కరెన్సీ విలువను చైనా తగ్గించుకోనుందన్న(డీ వేల్యూ) వార్తలు వచ్చాయి. దీంతో డాలర్తో పోలిస్తే చైనా యువాన్ విలువ 7.03 స్థాయికి క్షీణించింది. ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలం.. అమెరికా సుంకాల దాడిని ఎదుర్కొనేందుకు చైనా కరెన్సీ అస్త్రాన్ని ప్రయోగించడం ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఆసియాలో కీలక సూచీలు భారీగా క్షీణించాయి. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.6 శాతం, జపాన్ నికాయ్ 1.7 శాతం మేర తగ్గాయి. హాంకాంగ్లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల ఆందోళనలు కూడా తోడవడంతో హాంగ్సెంగ్ మూడు శాతం దాకా పడింది. ఈ ప్రభావాలతో అటు యూరప్ స్టాక్స్ కూడా రెండు శాతం దాకా క్షీణించాయి. అమెరికాలో కీలక సూచీలు డోజోన్స్ ఏకంగా 2.6 శాతం, నాస్డాక్ 3.3 శాతం మేర పడ్డాయి. రూపాయి విలవిల... ఆరేళ్లలో అతిపెద్ద పతనం! డాలర్ మారకంలో ఒకేరోజు 113 పైసలు డౌన్ 70.73 వద్ద ముగింపు నాలుగు నెలల కనిష్టస్థాయి ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకేరోజు 113 పైసలు (1.62 శాతం) పతనం అయ్యింది. 70.73 వద్ద ముగిసింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. గడచిన ఆరు సంవత్సరాల్లో (2013 ఆగస్టు తరువాత) రూపాయి ఒకేసారి ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన మూడు రోజుల ట్రేడింగ్లో రూపాయి భారీగా 194 పైసలు నష్టపోయింది. మూడు ప్రధాన కారణాలు... ► అమెరికా–చైనా వాణిజ్య భయాలతో విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ మార్కెట్ అమ్మకాలు ► అమెరికా డాలర్ మారకంలో చైనా విదేశీ మారకద్రవ్యం– యువాన్ భారీ పతనం. 2008 తరువాత మొట్టమొదటిసారి డాలర్ మారకంలో చైనా యువాన్ 7% పతనమైంది. ఇది అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం కొత్త దశకు సంకేతమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ వ్యూహకర్త వీకే శర్మ పేర్కొన్నారు. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ కరెన్సీ రీసెర్చ్ హెడ్ రాహుల్ గుప్తా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► కశ్మీర్ అంశంపై అనిశ్చితి. ఈ మూడు ప్రతికూలతలతో నిజానికి రూపాయి మరింత పతనం కావాల్సి ఉంది. అయితే అంతర్జాతీయంగా తక్కువ ధర వద్ద ట్రేడవుతున్న క్రూడ్ ధరలు రూపాయి పతనాన్ని కొంత నిలువరించాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్ ట్రేడింగ్ మొదట్లో రూపాయి 70.20 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.74 కనిష్టాన్ని చూసింది. 70.18 గరిష్టస్థాయిని తాకినా.... అంతకుమించి బలపడలేకపోయింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాలతో రూపాయి కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. ఇక్కడ నుంచి రూపాయి మరింత బలపడలేకపోయింది. బంగారం భగభగ ► కరెన్సీల పతనం, వాణిజ్య యుద్ధం నేపథ్యం ► ఔన్స్కు 1,482 డాలర్లకు దూకుడు ► దేశీయంగానూ కొత్త రికార్డులు ► ఢిల్లీలో రూ. 37 వేలకు చేరువ న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీలు డాలర్ మారకంలో పతనం కావడం పసిడికి వరమైంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం భారీగా పెరిగింది. ఒకదశలో 1,481.75 డాలర్ల గరిష్టాన్ని తాకింది. గడచిన ఆరేళ్లలో పసిడి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటలకు పసిడి ధర గత శుక్రవారం ధరతో పోల్చితే, 20 డాలర్ల లాభంతో 1,477 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో పసిడిని పెట్టుబడులకు సురక్షితమైనదిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ట్రేడవుతుంటే, చైనా కరెన్సీ యువాన్ ఏకంగా 7 శాతం పతనమైంది. దేశీయంగా రూపాయి ఎఫెక్ట్ తోడు... అంతర్జాతీయంగా పరుగుకు తోడు, డాలర్ మారకంలో రూపాయి విలువ 1.6 శాతంపైగా పతనం చెందడంతో దేశంలో బంగారం ధర ఒక్కసారిగా మెరిసింది. ఢిల్లీలో సోమవారం ధర 10 గ్రాములుకు (99.9 ప్యూరిటీ) రూ.800 పెరిగి రూ.36,970కి చేరింది. 99.5 ప్యూరిఈ ధర కూడా రూ.800 ఎగసి రూ.36,800కి చేరింది. బంగారంతోపాటు వెండి ధర కూడా ఢిల్లీలో భారీగా కేజీకి రూ.1,000 పెరిగింది. రూ.43,100కి చేరింది. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటల సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో 10 గ్రాముల పసిడి ధర క్రితం శుక్రవారం ధరతో పోల్చి రూ.988 లాభంతో రూ.37,259 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.37,347ను కూడా తాకింది. కాగా వెండి ధర రూ.991 లాభంలో రూ.42,355 వద్ద ట్రేడవుతోంది. ఇదే రీతిన ట్రేడింగ్ ముగిస్తే, మంగళవారం దేశంలో పసిడి ధరలు మరింత పరుగు పెట్టే అవకాశం ఉంది. -
చైనా బలహీనతకు ట్రేడ్వార్ కారణమా?
బీజింగ్ : చైనా ఆర్థిక వృద్ధి గత మూడు దశాబ్దాలతో పోల్చితే కనిష్ట స్థాయికి చేరింది. ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి రెండవ త్రైమాసికంలో 6.2 శాతానికి పడిపోయింది. చైనా ప్రభుత్వం 1992లో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కనిష్ట స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ చైనా వస్తువులపై అమెరికా టారిఫ్లు పెంచడం వల్లే చైనా వృద్ధి మందగించిందని పేర్కొన్నారు. పెంచిన టారిఫ్లు చైనాపై ప్రభావం చూపడమే గాక విదేశీ కంపెనీలు(వీటిలో అధిక భాగం అమెరికా కంపెనీలే) వేల సంఖ్యలో చైనాను వదిలి ఇతర దేశాలవైపు చూస్తున్నాయని తెలిపారు. అందుకే చైనా అమెరికాతో ఒప్పందం కోసం తహతహలాడుతోందని ఎద్దేవా చేశారు. గత నెలలో ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ, 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై అమెరికా సుంకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో చైనా పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు ఈ సుంకాల సెగతో నెమ్మదించాయి. అయితే ఆర్థిక విశ్లేషకులు మాత్రం చైనా ఆర్థిక వృద్ధి తగ్గుదలకు అమెరికాతో ట్రేడ్వార్ ఒక్కటే కారణం కాదంటున్నారు. వారు ట్రంప్ వాదనతో ఏకీభవించట్లేదు. చైనా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగియుందని, కేవలం ఒక దేశంతో ట్రేడ్వార్ వల్ల దానికొచ్చే నష్టం తక్కువేనని వీరి అభిప్రాయం. మరి తగ్గిపోతున్న ఆర్థిక వృద్ధికి కారణం ఏంటి? అంటే.. కొండలా పేరుకుపోతున్న ప్రభుత్వ అప్పులు, చైనీయుల పొదుపులే కారణం అంటున్నారు. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో చైనా ప్రారంభించిన భారీ ఉద్దీపన ప్యాకేజీ కోసం అధిక స్థాయిలో అప్పులు చేసుకుంటూ పోయింది. ఉద్దీపన ప్యాకేజీ చైనా ఆర్థిక వృద్ధిని పెంచినా, దీని ఫలితంగా మార్చి 2019 నాటికి చైనా జీడీపీలో 300% కంటే ఎక్కువ ప్రభుత్వ, కార్పొరేట్ మరియు గృహ రుణాలు పేరుకుపోయాయి. ఎంతలా అంటే దేశం మొత్తం అప్పు ప్రపంచ మొత్తం అప్పులో 15% వాటా కలిగి ఉంది. దీంతో అప్పులను తగ్గించుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో నిబంధనలను కఠినతరం చేయడం, బ్యాంక్ రుణాలను తగ్గించడం తదితర చర్యలను ప్రారంభించింది. అప్పులు చేసి వృద్ధిపై ఆధారపడటాన్ని తగ్గించే ఈ ప్రయత్నాలు దేశంలో కంపెనీలకు ఫైనాన్సింగ్ పొందడం మరింత కష్టతరం చేశాయి. ప్రత్యేకించి ప్రైవేటు రంగ సంస్థలు బ్యాంకుల నుంచి నిధులను సేకరించడం కష్టమైంది. గత సంవత్సరం చైనా కంపెనీల రుణ ఎగవేతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే రుణఎగవేతల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందని చైనా ఆర్థిక డేటా చూస్తే తెలుస్తుంది. కొనేవారు కరువు అయ్యారు ఈ సంవత్సరం వృద్ధికి దెబ్బ తగిలింది ప్రధానంగా చైనా వినియోగదారుల నుంచే. వీరు చైనా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుతో పాటు వ్యక్తిగత రుణ స్థాయిల గురించి ఆందోళన చెందడంతో ఖర్చును తగ్గించారు. పెరిగిన ఆస్తి ధరలు కూడా వారి కొనుగోలు శక్తిని దెబ్బతీశాయి. రిటైల్ అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే విపరీతంగా తగ్గిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల అమ్మకాలు కూడా చైనాలో నెమ్మదించాయి. ఉదాహరణకు చైనాలో ఆపిల్ ఉత్పత్తుల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. ఆపిల్ మొత్తం ఆదాయంలో గ్రేటర్ చైనా (హాంకాంగ్, తైవాన్లతో కూడిన చైనా) వాటా 18%. రెండవ త్రైమాసికంలో వాటి అమ్మకాలు ఏకంగా 21.5శాతం తగ్గిపోయాయి. అలాగే కార్ల అమ్మకాలలో తగ్గుదల కూడా చైనా వృద్ధి తగ్గుదలకు ఒక సంకేతం. ఫోర్డ్, జనరల్ మోటార్స్ తదితర దిగ్గజ కంపెనీలకు వినియోగదారులు లేక అమ్మకాలు నిలిచాయి. దశాబ్ద కాలంగా క్షీణిస్తూనే.. చైనా ఆర్థిక మందగమనం వాణిజ్య యుద్ధానికి చాలా సంవత్సరాల ముందు నుంచే మొదలైంది. 2007లో వృద్ధి రికార్డు స్థాయిలో 14.2శాతానికి చేరుకున్నా.. తర్వాత తన ఆర్థిక వ్యవస్థపై సాధించిన పట్టును క్రమంగా కోల్పోయింది. ఆ ప్రభావం గత ఐదు సంవత్సరాల నుంచి కనిపిస్తోంది. ఈ సంవత్సరానికి తన వృద్ధి లక్ష్యాన్ని 6.5శాతం నుంచి కనిష్టంగా 6శాతానికి సైతం తగ్గించింది. దీనికి కారణాలు అనేకం ఉన్నా.. మొదటి నుంచి తయారీపై దృష్టి కేంద్రీకరించిన చైనా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, సేవల ద్వారా నడిచే ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేసిన ప్రయత్నాలే ఆర్థిక మందగమనానికి దోహదం చేశాయనేది విశ్లేషకుల వాదన. స్టీల్, సిమెంట్, షిప్ బిల్డింగ్ వంటి భారీ పరిశ్రమలలో అధిక సామర్థ్యాన్ని తగ్గిస్తూ, అదే సమయంలో దేశీయ సంస్థలను ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. దీంతో టెన్సెంట్, అలీబాబా, హువావే వంటి దిగ్గజ కంపెనీలు ఇతర రంగాలలో తమ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకున్నా, సాంప్రదాయ ఉత్పాదక కంపెనీలు ఈ మార్పు కోసం కష్టపడుతుండటంతో వృద్ధికి బలమైన విఘాతం ఏర్పడింది. తిరిగి వృద్ధిని పెంచడానికి గత కొంతకాలంగా చైనా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఇటీవలే పన్నులను తగ్గించింది. అలాగే ఆర్థిక వ్యవస్థకు నూతన శక్తిని ఇవ్వడానికి మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచింది. కానీ, విశ్లేషకులు 2008 ఉద్దీపన ప్యాకేజీలాగా మరోసారి ఈ నమూనా పనిచేయకపోవచ్చని అంటున్నారు. దాని పాత పద్ధతులు కొత్తగా ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించలేక పోవచ్చనేది వారి భావన. ఏదేమైనా అనేక రంగాలలో దూసుకుపోతున్న చైనాను అమెరికా ట్రేడ్వార్తో నిలవరించలేదని, ఆర్థిక రంగాన్ని తిరిగి వృద్ధివైపు నడిపించగల శక్తి చైనా రాజకీయరంగానికి ఉందని అభిప్రాయపడుతున్నారు. -
గూగుల్, అమెజాన్లకు ఫ్రాన్స్ షాక్
పారిస్ : తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీలు చిక్కినప్పుడల్లా చైనా, భారత్ తదితర దేశాలను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫ్రాన్స్ చట్టసభ డిజిటల్ ఇంటర్నెట్ కంపెనీలపై నూతన సర్వీస్ టాక్స్ విధించాలని తెచ్చిన బిల్లును ఆమోదించింది. ఇదే జరిగితే అమెరికా కంపెనీలు అయిన అమేజాన్, ఫేస్బుక్, గూగుల్ వంటి పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు ఇకపై తమ సంపాదనలో అధికభాగం పన్ను రూపంలో ఫ్రాన్స్కు చెల్లించుకోవల్సిందే. ఈ నిర్ణయంతో ట్రంప్ నుంచి వ్యతిరేకత ఎదురైనా ముందుకే వెళ్లాలని ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చర్య అమెరికా కంపెనీలపైనే ప్రధాన ప్రతికూలత చూపేలా ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధులు అంటున్నారు. దీంతో అమెరికా కూడా ఫ్రెంచ్ ఉత్పత్తులపై సుంకాలు పెంచి ప్రతీకారచర్యకు దిగవచ్చని చెప్పారు. ‘డిజిటల్ సేవల పన్ను .. అన్యాయంగా అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుందని’ యుఎస్ ట్రేడ్ ప్రతినిధి రాబర్ట్ లైట్జైజర్ వాపోయారు. ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ‘ఇక్కడ అమెరికా ప్రతీకార చర్యలకు పాల్పడేది ఏమీ లేదని, చర్చల ద్వారా సమస్యను మేం పరిష్కరించుకుంటామని’ తెలిపారు. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మెక్రాన్ సంతకం చేస్తేనే ఈ బిల్ అమలులోకి వస్తుంది. ఫ్రాన్స్తో పాటు ఇతర యూరప్ దేశాలు సైతం ఇదే బాటలో ఉన్నాయి. డిజిటల్ కంపెనీలపై నూతనంగా పన్నులు విధించడం ద్వారా మరింత ఆదాయాన్ని పొందడమే గాక, ఇంటర్నెట్ను నియంత్రించడానికి వీలు కలుగుతుందని ఆయా దేశాల ఆలోచన. ముఖ్యంగా బ్రిటన్ ఏప్రిల్ 2020 కంతా డిజిటల్ కంపెనీలపై 2 శాతం పన్ను విధించాలని చూస్తోంది. జూన్లో జరిగిన జీ-20 ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా డిజిటల్ కంపెనీలపై పన్ను విధింపులు, సవాళ్లు ఏమున్నాయో చర్చకు సైతం వచ్చింది. పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ఒక అంతర్జాతీయ పన్ను విధానం తీసుకురావడానికి మరిన్ని చర్చలు అవసరం అని యుఎస్ ప్రతినిధుల వాదన. కానీ ఫ్రాన్స్ మాత్రం డిజిటల్ కంపెనీలపై పన్ను విధింపులో కాస్త దూకుడుగానే ఉంది. మరి చైనా, భారత్ వస్తువులపై టారిఫ్లు పెంచేసి వాణిజ్యయుద్ధం ప్రారంభించిన ట్రంప్ ఇప్పుడు తమ మిత్రదేశం ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. -
బడ్జెట్పైనే మార్కెట్ దృష్టి
ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీ సర్కార్.. కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టాక 2019–20 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5న (శుక్రవారం) బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా.. ఈ ప్రధాన అంశమే మార్కెట్ వర్గాలకు ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి, కంపెనీల ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నందున బడ్జెట్లో ఈసారి ద్రవ్య లభ్యత పెంపు, భారీ సంస్కరణల సూచనలు ఉండేందుకు ఆస్కారం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లో నెమ్మదించిన డిమాండ్ మళ్లీ ఊపందుకునేలా చూడడం, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగేలా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ బడ్జెట్లో ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన.. బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ, ఇంధన, విద్యుత్, ఉక్కు, ఆటోమొబైల్ రంగాలకు ఊతమిచ్చే నిర్ణయాలు వెల్లడైతే మాత్రం మార్కెట్కు నూతన ఉత్సాహం వస్తుంది. గతంలో కూడా.. మూలధన వ్యయంపై ప్రకటనలు, విధాన సంస్కరణలే సూచీల దిశానిర్దేశం చేశాయి’ అని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మ¯Œ డీకే అగర్వాల్ అన్నారు. నిరాశపరిస్తే నేలచూపులే.. ఈవారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్.. భవిష్యత్తుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంచేయనుంది. భారీ అంచనాలు ఉన్న కారణంగా ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ విశ్లేషించారు. ఈ నేపథ్యంలో వేచిచూసే ధోరణిలోనే ఉండడం ఉత్తమం అని సూచించారు. మార్కెట్ ప్రస్తుత గమనం చూస్తుంటే తుపానుకు ముందు ప్రశాంతతలా ఉందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. బడ్జెట్ అంచనాలను అందుకోలేకపోతే అమ్మకాల ఒత్తిడి భారీస్థాయిలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆటోరంగంలో ఉంటే భారీ పతనం కానీ.. లేదంటే.. కోలుకోవడానికి ఆస్కారం ఉందన్నారు. ఆటో, మెటల్ రంగాలు ఈవారం ఫోకస్లో ఉండనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఈవారంలో బడ్జెట్, 2018–19 ఆర్థిక సంవత్సర ఎకనామిక్ సర్వే (జూలై 4న) ఉన్న కారణంగా.. ప్రస్తుతం కన్సాలిడేషన్ లో ఉన్న మార్కెట్ ఈ ప్రధాన అంశాలు పూర్తయిన తరువాత బలమైన ర్యాలీ నమోదుచేయవచ్చని భావిస్తున్నట్లు ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు. అంతర్జాతీయ పరిణామాలు ఆశాజనకం.. మార్కెట్ వర్గాలను ఇరకాటంలో పడేసిన వాణిజ్య యుద్ధం తాత్కాలికంగా ఆగింది. అమెరికా–చైనాల మధ్య ట్రేడ్వార్కు ప్రస్తుతానికి తెరపడింది. గతంలో ఆగిపోయిన వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్లు అంగీకరించారు. జపాన్ లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 సదస్సు సందర్భంగా శనివారం సమావేశమైన ఇరువురు నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం మార్కెట్కు సానుకూల అంశంగా ఉంది. వివాదం పరిష్కారం అయ్యేంత వరకూ చైనా ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించబోమని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ , ట్రంప్ల మధ్య ఆదివారం చరిత్రాత్మక భేటీ జరగడం కూడా మార్కెట్కు సానుకూల అంశంగా ఉంది. ఈ తాజా అంశాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించినట్లు సాహిల్ కపూర్ అభిప్రాయపడ్డారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. నికాయ్ ఇండియా తయారీ రంగ ఇండెక్స్ జూన్ నెల గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. సేవల డేటా బుధవారం వస్తుంది. మౌలికరంగ డేటా శుక్రవారం మార్కెట్ ముగిశాక వెల్లడికానుండగా.. జూలై ఒకటి నుంచి గతనెల ఆటో రంగ అమ్మకాల సమాచారం వెల్లడికానుంది. మరోవైపు అంతర్జాతీయ అంశాల్లో.. ఈవారంలోనే అమెరికా, చైనా దేశాల తయారీ రంగ సమాచారం వెల్లడికానుంది. రూ.10,384 కోట్ల విదేశీ నిధుల వెల్లువ భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయనే అంచనాల కారణంగా వీరు వరుసగా ఐదో నెల్లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. జూన్లో ఈక్విటీ మార్కెట్లో రూ.2,273 కోట్లు.. డెట్ మార్కెట్లో రూ.8,112 కోట్లను ఇన్వెస్ట్చేశారు. మొత్తంగా గత నెలలో రూ.10,384 కోట్లను పెట్టుబడిపెట్టారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.87,313 కోట్లను వీరు పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
వాణిజ్య యుద్ధానికి బ్రేక్
బీజింగ్/ఒసాకా: అమెరికా–చైనాల మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. గతంలో ఆగిపోయిన వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు అంగీకరించారు. జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా శనివారం సమావేశమైన ఇరువురు నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం పరిష్కారమయ్యేవరకూ చైనా ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించబోమని ట్రంప్ ప్రకటించారు. ‘చైనాతో శత్రుత్వం లేదు. అమెరికా–చైనాల మధ్య సత్సంబంధాలను కోరుకుంటున్నా’ అని ట్రంప్ చెప్పినట్లు చైనా అధికార పత్రిక ‘చైనా డైలీ’ తెలిపింది. వాణిజ్య లోటుపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల కమిటీలు త్వరలో సమావేశమవుతాయని వెల్లడించింది. ట్రంప్తో భేటీ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పందిస్తూ..‘పరస్పరం సహకరించుకుంటే అమెరికా–చైనాలు లబ్ధి పొందుతాయి. కానీ గొడవలకు దిగితే ఇరుపక్షాలూ నష్టపోతాయి’ అని చెప్పినట్లు చైనా డైలీ పేర్కొంది. అమెరికాతో ఉన్న 539 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించాలని ట్రంప్ గతంలో చైనాను డిమాండ్ చేశారు. అలాగే అమెరికా కంపెనీల మేధోపరమైన హక్కులను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు చెందిన వాణిజ్య బృందాలు పలుమార్లు సమావేశమైనప్పటికీ సత్ఫలితాలు రాలేదు. దీంతో 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఎగుమతులపై 25 శాతం మేర సుంకాలను పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై చైనా సుంకాలు విధించింది. అయితే ఈ వాణిజ్య యుద్ధం కారణంగా తమకు నష్టం జరుగుతోందని గుర్తించిన ఇరుదేశాలు తాజాగా సయోధ్యకు ముందుకొచ్చాయి. హలో చెప్పాలని ఉంది ‘మీ ఇంటికొస్తా. మీ భూభాగంలో అడుగు పెడతా. హలో అని పలకరిస్తా. కరచాలనం చేస్తా. రెండు నిమిషాలు మాట్లాడినా చాలు’ అని ట్రంప్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్కి ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. ట్రంప్ ట్విట్టర్లో చర్చలకు రమ్మంటూ కిమ్ని ఆహ్వానించడంతో రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. -
ట్రంప్ కీలక వ్యాఖ్యలు : దిగుమతి సుంకాలపై గుర్రు
న్యూఢిల్లీ /ఓసాకా : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ను టార్గెట్ చేశారు. ఇప్పటికే టారిఫ్ కింగ్ అని ఇండియానుద్దేశించి పేర్కొన్న ట్రంప్ తాజాగా అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తూ ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టారు. జపాన్లో జీ 20 సమ్మిట్ సందర్బంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్న నేపథ్యంలో ట్రంప్ ట్వీట్ చర్చకు దారి తీసింది. ప్రధానంగా అమెరికాపై విధించిన టారిఫ్లను ఇందులో టారిఫ్లు ఆమోద యోగ్యంకాదు.. తగ్గించాల్సిందే అంటూ డిమాండ్ చేయడం గమనార్హం. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు చూస్తున్నాను. భారత్ చాలా ఏళ్లుగా అమెరికా ఉత్పత్తులపై దిగుమతులపై భారీగా విధిస్తూ వస్తోంది. ఇటీవలే మళ్లీ సుంకాలను పెంచింది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఈ సుంకాలను ఉపసంహరించుకోవాల్సిందేనంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. కాగా దిగుమతి సుంకాల పెంపును వాయిదా వేస్తూ వచ్చిన భారత్ ఈ నెల ప్రారంభంలోనే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్మండ్స్, వాల్నట్స్, ఆపిల్స్ తదితర దాదాపు 29 ప్రొడక్టులపై సుంకాలు పెంచిన విషయం తెలిసిందే. అటు జపాన్లోని ఓసాకా నగరంలో జరుగుతున్న జీ20 సదస్సుకు ప్రధాని మోదీ ఇప్పటికే జపాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ సహా వివిధ దేశాలకు చెందిన కీలక నేతలతో మోదీ భేటీ కానున్నారు. I look forward to speaking with Prime Minister Modi about the fact that India, for years having put very high Tariffs against the United States, just recently increased the Tariffs even further. This is unacceptable and the Tariffs must be withdrawn! — Donald J. Trump (@realDonaldTrump) June 27, 2019 -
అమెరికా వర్సెస్ ఇండియా? కాదు కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, అమెరికాల ట్రేడ్వార్పై ఎకనమిక్ టైమ్స్ ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. అమెరికా భారత్ ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. దీనికి దీటుగా భారత్ కూడా స్పందించి 28 రకాల అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ఇది జాతీయవాదులకు ఉత్సాహం అనిపించినా ఇరుదేశాల సగటు పౌరునికి నష్టం కలిగిస్తుంది. దీన్ని ఇరు దేశాల ట్రేడ్వార్ అని భావించవచ్చు. కానీ విశ్లేషకులు మాత్రం దీనిని ట్రంప్, మోదీలు తమ సొంత ప్రజలపైనే చేస్తున్న వాణిజ్య యుద్ధంగా పిలుస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనిద్దాం. ట్రంప్ అధికారంలోకి రావడానికి కారణం అతను అమెరికా ప్రజల సమస్యలకు చాలా సరళమైన, తప్పుదోవ పట్టించే వాటిని కారణాలుగా చూపించాడు. 1.మీ ఉద్యోగాలను విదేశీయులు వచ్చి దోచుకుంటున్నారు. 2.మీ ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతున్నాయి. ఈ రెండు వివరణలు తప్పు కానీ అవి ట్రంప్కోసం పనిచేశాయి. వాటిని ట్రంప్ ఇంకా నమ్ముతున్నారు. మొదటి కారణంతో అమెరికన్లు వలసదారులను ద్వేషించడం మొదలుపెట్టారు. రెండవ కారణంగా టారిఫ్లు పెంచడంతో ఇతరదేశాలతో అమెరికా వాణిజ్యం ప్రభావితం అయింది. టారిఫ్ల పెంపుపై ఓ ఆర్థికవేత్త ఇందిరా జమానా నాటి ‘ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర’ నినాదం లాగా నేడు ‘ట్రంప్ అంటే టారిఫ్, టారిఫ్ అంటే ట్రంప్’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. అసలు ట్రేడ్వార్ ఎందుకంటే? ట్రేడ్వార్ దిశగా దేశాలను నడిపిస్తున్న శక్తులు నిస్సహందేహంగా దేశీయ పారిశ్రామికవేత్తలే. ఉదాహరణకు ఒక వస్తువు ధర రూ.100 ఉందనుకోండి. దాన్ని విదేశీ కంపెనీ రూ.90కే అందిస్తే సహజంగానే కొనుగోలుదారులు అటువైపు అడుగులు వేస్తారు. దీంతో దేశీయ వ్యాపారులు జట్టుకట్టి భయానో, నయానో రాజకీయ నాయకులతో విదేశీ వస్తువుపై సుంకం విధించేలా చేసి దాని ధరను రూ.110కి పెంచారనుకోండి అప్పుడు తిరిగి కొనుగోలుదారులు దేశీయ వస్తువుపై మొగ్గుచూపుతారు. ఇక్కడ నష్టపోయేది వినియోగదారులే. స్థానిక వ్యాపారులకు మిగిలిన ఆ రూ.10తో ఏదైనా ఉద్యోగాలు సృష్టిస్తున్నారా? లేక దేశ సంపదను పెంచుతున్నారా?. కచ్చితంగా అది వారి జోబుల్లోకి, అటునుంచి నల్లధనంగా మారుతుంది. అదే రూ.10 వినియోగదారునికి మిగిలితే మరొక వస్తువును కొనడానికి ఉపయోగిస్తాడు. అంటే సంపద ఎక్కువ మంది చేతిలో మిగులుతుంది. కాని అక్కడ కేవలం కొద్ది మంది వ్యాపారుల చేతిలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఒక వస్తువుపై టారిఫ్ విధించడం ద్వారా ఆదాయాన్ని కొద్దిమంది చేతుల్లోకి నెడుతున్నాం. మరి టారిఫ్ విధించడంలో ఉపయోగాలు ఎక్కడ ఉన్నట్లు?. అందుకే దీన్ని తమ సొంత ప్రజలపై ప్రభుత్వం విదించే పన్నుగానే భావించాలి. అలాగే అమెరికా దిగుమతుల్లో ఎక్కువగా ముడి పదార్థాలే ఉంటాయి. అది ఒక దేశం మీద టారిఫ్ విధించినపుడు వాటి ధరలు పెరుగుతాయి. ఆపిల్ కంపెనీనే తీసుకుంటే ఒక ఫోన్ ఉత్పత్తికి 43 దేశాలనుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటుంది. వాటి ధరలు పెరిగినపుడు ఆపిల్ ధర కూడా పెరుగుతుంది. దీంతో వాటి అమ్మకాలు తగ్గి వాటి ఉద్యోగాల్లో కోత పడుతుంది. సుంకాలు లేని వ్యాపారం వాణిజ్యంలో ఎలా గెలవాలి అని ట్రంప్ నిరంతర ఆలోచన. కానీ ఈ ఆటలో గెలుపు అంత సులువు కాదు. ఎందుకంటే ట్రంప్ను ఆ దిశగా ఆలోచింపచేసిన పదం వాణిజ్యలోటు. దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాము. ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ ఉంటే దానర్థం మనం నష్టపోతున్నామని కాదు, ఎందుకంటే మనం ఇచ్చేదానికన్నాతీసుకునేది ఎక్కువగా ఉంది, అలాగే ఇతర దేశాల వస్తువులు మన మార్కెట్ను తక్కువధరలకే నింపుతున్నాయి. ఇవి చిన్న వ్యాపారులకు నష్టం అని భావించేకన్నా మన సంపదలో అధిక వాటా కేవలం మనదేశంలోని కొంత మంది చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది అనేది ఆలోచించాలి. సుంకాలు లేని బడావ్యాపారం అనేది ఇరుదేశాల వాణిజ్య విజయం అవుతుంది. అందుకే టారిఫ్లను ప్రజలను దోచుకునే వాటిగానే భావించి, ఇరుదేశాల వాణిజ్యయుద్ధాన్ని ఇరుదేశ ప్రజానీకాలపై తమ నాయకులు చేస్తున్న యుద్ధంగానే చూడాలి. పోటీపడినా చివరికి మిగిలేది? చివరగా ఏంటంటే ట్రంప్ భారతీయ వస్తువులపై టారిఫ్లు పెంచుతారు. అంటే తన ప్రజలపై పన్ను విధిస్తారు. మోదీ దీనికి అనుగుణంగా అమెరికా వస్తువులపై టారిఫ్లు పెంచుతారు. ట్రంప్ ఇంకా పన్నులు పెంచుతారు. ఇది చూసిన మోదీ మరిన్ని పన్నులు పెంచుతారు. అంతిమంగా ఇరుదేశాల ప్రజలు నష్టపోతారు. ఇదంతా చూ(చే)స్తున్న ఇరుదేశాలలోని లాబీయింగ్ మాత్రం లోలోన నవ్వుతుంటుంది. -
ట్రేడ్వార్ : భారత్ టార్గెట్ గూగుల్
సాక్షి , న్యూఢిల్లీ : భారత మార్కెట్లో 99శాతం వాటాను కలిగి ఉన్న గూగుల్ ఆండ్రాయిడ్ ఇతరులను మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటుందనే ఫిర్యాదుల నేపథ్యంలో గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్పై కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు ప్రారంభించింది. మొబైల్ తయారీదారులు, గూగుల్ మధ్య ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) మార్కెట్ వాటా ఆరోపణలపై వీటి మధ్య ఒప్పంద వివరాలను ఇవ్వాలని సిసిఐ దర్యాప్తు విభాగం మొబైల్ తయారీదారులను కోరింది. గూగుల్తో చేసుకున్న నిబంధనలు, షరతులపై సమాచారం కోరుతూ శాంసంగ్, షావోమి, కార్బన్, లావాతో సహా పలు హ్యాండ్సెట్ తయారీదారులకు సిసిఐ డైరెక్టర్ జనరల్ లేఖలు జారీ చేశారు. ఏప్రిల్ 2011 నుంచి ఎనిమిది సంవత్సరాలలో మొబైల్ యాప్స్, సేవలను ఉపయోగించడానికి గూగుల్ ఏదైనా ఆంక్షలు విధించిందో లేదో కూడా సీసీఐ వివరాలు అడిగింది. ఏప్రిల్ 2011 నుంచి మార్చి 2019 వరకు వార్షిక ప్రాతిపదికన ఆండ్రాయిడ్ ఓఎస్ మరియు గూగుల్ సేవలను ఉపయోగించుకోవడం కోసం గూగుల్కు చెల్లించిన లైసెన్స్ ఫీజు లేదా రాయల్టీ వివరాలను కూడా కోరింది. నోటీసులు అందుకున్నట్లు కంపెనీలు ధృవీకరించినా ఈ విషయంపై వారు స్పందించడానికి నిరాకరించారు. దర్యాప్తుకు సహకరిస్తామని గూగుల్ తెలిపింది. విచారణలో భాగంగా సీసీఐ ముందు హాజరుకావడానికి గూగుల్ అత్యున్నత అధికారులను పిలుస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ట్విట్టర్ యాజమాన్యాన్ని విచారణకు పిలిచిన తర్వాత విచారణ ఎదుర్కొనే మరో మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ అవుతుంది. 2012లో కూడా గూగుల్ తన ఆధిపత్యస్థానాన్ని దుర్వినియోగం చేసిందనే ఫిర్యాదుపై 2018లో 136 కోట్ల రూపాయల భారీ జరిమానాను భారత్ విధించింది. అయితే ఇంతవరకూ గూగుల్ జరిమానాపై స్పందించలేదు. ఆండ్రాయిడ్ మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిన కేసులో దోషిగా తేలడంతో యూరోపియన్ యూనియన్ గత ఏడాది 5 బిలియన్ డాలర్లు (రూ .35,000 కోట్లు) చెల్లించాలని గూగుల్ను ఆదేశించడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాల్లో ఈ అంశం సంచలనం రేపినా గూగుల్ ఇంతవరకూ ఒక్క రూపాయి చెల్లించలేదు. పూర్తి వివరాలు కోరిన సీసీఐ సిసిఐ కోరిన ఇతర వివరాలలో 2011 మరియు 2019 మధ్య స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ద్వారా మొబైల్ ఫోన్ల వార్షిక అమ్మకం ఎంత ఉంది, అదే కాలంలో గూగుల్ లేదా దాని యూనిట్లలో ఏదైనా గూగుల్ యాప్లను కోరుకునే కంపెనీలు ఇతర యాప్లను ఎందుకు ఎంచుకోకూడదు, హ్యాండ్సెట్ తయారీదారులు తమ సొంత యాప్ స్టోర్స్, వారి యాప్ల సంఖ్య, పరిశోధన, అభివృద్ధిపై వార్షిక పెట్టుబడులు, యాప్ స్టోర్ల నిర్వహణ, అప్గ్రేడ్, వార్షిక ఆదాయం గురించి సమాచారాన్ని గూగుల్తో ఎందుకు పంచుకోవలసి ఉంటుంది?, స్మార్ట్ఫోన్లలో ప్రత్యర్థుల యాప్ స్టోర్స్ను ఇన్స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉందా? తదితర పూర్తి వివరాలను సిసిఐ కోరింది. అమెరికాకు చెక్ పెట్టే భాగంలోనే భారత్లో అమెరికా వస్తువులకు సుంకం రేట్లు భారీగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ విమర్శించడం తెలిసిందే. ఇందులో భాగంగా భారత వస్తువులపై సుంకాన్ని భారీగా పెంచుతామని హెచ్చరించారు. దీనికి ధీటుగా భారత్ కూడా ప్రతిస్పందించింది. ఈ చర్యల్లో భాగంగానే కాలిఫోర్నియా ప్రధానకేంద్రంగా గల గూగుల్ను నియంత్రించి ట్రేడ్వార్పై అమెరికా చర్యలను కట్టడి చేయాలని భారత్ భావిస్తుందని పరిశీలకులు అంటున్నారు. -
ట్రేడ్ వార్ భయాలు : స్టాక్మార్కెట్ల పతనం
సాక్షి, ముంబై : నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు ఏకోశానా కోలుకోలేదు. భారత్ అమెరికా వాణిజ్య యుద్ధ భయాలతో ఆరంభంనుంచీ ట్రేడర్ల అమ్మకాల ఊపందుకున్నాయి. అనంతరం మరింత పెరిగిన అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 340 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ 100పాయింట్లకు పైగా పతనమై 11800 స్థాయిని కోల్పోయింది. భారత్ అమెరికాపై ప్రతీకార సుంకాలు వాణిజ్య యుద్ధ భయాన్ని సృష్టిస్తోందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్కు చెందిన సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. మెటల్, రియల్టీ, బ్యాంకింగ్ ఇలా దాదాపు అన్ని రంగాలు నష్టపోతున్నాయి. ప్రధానంగా రిలయన్స్, యాక్సిస్ ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐటీసీ, మారుతి సుజుకి నష్టాలు మార్కెట్లను పడగొడుతున్నాయి. ఇంకా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.9 శాతం పడిపోయింది, జేఎస్డబ్ల్యు స్టీల్ టాటా స్టీల్ వరుసగా 3.3, 2.5 శాతం నష్టపోతున్నాయి. రియల్టీ కౌంటర్లలో సన్టెక్, డీఎల్ఎఫ్, బ్రిగేడ్, ఒబెరాయ్ 3.7-1.7 శాతం మధ్య నష్ట పోతున్నాయి. ఇంకా జెట్ ఎయిర్వేస్ తాజాగా 16 శాతానికి పైగా పడిపోయింది. సెయిల్, వేదాంతా, జైన్ ఇరిగేషన్, హిందాల్కో 4.4-1.7 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు ఎస్బ్యాంకు, యూపీఎల్, ఇన్ఫోసిస్, జీ, విప్రో స్వల్పం లాభపడుతున్నాయి. దీంతోపాటు ఎంఆర్ఎఫ్, సియట్, అపోలో లాంటి టైర్ల షేర్లు లాభపడుతున్నాయి. -
అమెరికాపై చైనా ‘సోయాబీన్స్’ యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంలో ‘సోయాబీన్స్’ చైనాకు ప్రధాన ఆయుధమైంది. 25, 000 డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై అమెరికా ఇటీవల దిగుమతి సుంకాలను పెంచినందుకు ప్రతీకారంగా అమెరికా నుంచి సోయాబీన్స్ దిగుమతిని పూర్తిగా నిలిపివేసింది. ప్రపంచంలోనే సోయాబీన్స్ను దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద దేశం చైనానే. దీని వల్ల అమెరికాకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. ప్రపంచ ఆహారం లింకుల్లో సోయాబీన్స్ చాలా ముఖ్యమైనది. పందులు, కోళ్ల పెంపకంలో ఇది చాలా ముఖ్యమైన ప్రొటీన్. ఒకప్పుడు రైస్ ఎక్కువగా తిన్న చైనా ప్రజలు ఆవులు, పందులు, కోళ్ల మాంసానికి అలవాటు పడడంతో పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా దేశంలో మాంసం ఉత్పత్తులను పెంచేందుకు ఈ సోయాబీన్స్ను చైనా దిగుమతి చేసుకుంటోంది. చైనాలో 1986లో మాంసానికున్న డిమాండ్ 2012 నాటికి 250 రెట్లు పెరిగింది. 2020 నాటికి మరో 30 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ఆవులు, గొర్రెలు, పందుల పెంపకానికి చాలినంత ఫీడ్ను చైనా ఉత్పత్తి చేయలేక పోతోంది. అందుకని అమెరికా, బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున సోయాబీన్స్ దిగుమతి చేసుకుంటూ వచ్చింది. బ్రెజిల్ ఏటా 25,700 డాలర్లు విలువైన సోయాబీన్స్ను ఎగుమతి చేస్తుండగా, ఆ తర్వాత స్థానంలో అమెరికా ఏటా 21,400 డాలర్లు విలువైన సోయాబీన్స్ను ఉత్పత్తి చేస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో అర్జెంటీనా, పరాగ్వే, కెనడా ఎగుమతి చేస్తున్నాయి. 2017లోనే అమెరికా, బ్రెజిల్ నుంచి చైనా 34,600 డాలర్ల విలువైన సోయాబీన్స్ను దిగుమతి చేసుకుంది. చైనా దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడంతో ముందుగా చైనా ప్రభుత్వం అమెరికా నుంచి సోయాబీన్స్ దిగుమతిపై 25 శాతం సుంకాన్ని పెంచింది. గతంలో అమెరికా రైతులు ఏటా చైనాకు 2.9 కోట్ల మెట్రిక్ టన్నుల సోయాబీన్స్ను సరాసరి సగటున ఎగుమతి చేయగా, సుంకం పెంచిన తర్వాత 59 లక్షల మెట్రిక్ టన్నులనే ఎగుమతి చేయగలిగారు. అప్పుడే ఎంతో నష్టపోయిన అమెరికా రైతులు, ఇప్పుడు చైనా నిర్ణయంతో ఎక్కువ నష్టపోతారు. తక్కువపడే సోయాబీన్స్ను బ్రెజిల్తోపాటు ఇతర దేశాల నుంచి చైనా దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది. -
చర్చలైనా, యుద్ధమైనా సై
సింగపూర్: వాణిజ్య అంశాలపై అమెరికా, చైనాల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ విషయంలో అమెరికాతో చర్చలకైనా, యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది. చర్చలకు ఇప్పటికీ తాము సిద్ధమేనని, కానీ ఒకవేళ అమెరికా గానీ యుద్ధమే కోరుకుంటే తుదిదాకా పోరాడతామని హెచ్చరించింది. సింగపూర్లో ఐఐఎస్ఎస్ షాంగ్రి–లా సదస్సుకు హాజరైన సందర్భంగా చైనా రక్షణ మంత్రి జనరల్ వై ఫెంగీ ఈ విషయాలు చెప్పారు. ‘అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య వివాదం విషయానికొస్తే.. అమెరికా కోరుకుంటే మేమూ చర్చలకు సిద్ధమే. కాదూ.. యుద్ధం చేయదల్చుకుంటే దానికి కూడా సిద్ధమే‘ అని ఆయన చెప్పారు. మరోవైపు, దేశభద్రత పేరిట చైనా టెలికం కంపెనీ హువావేపై అమెరికా ఆంక్షలు విధించడం అర్ధరహితమన్నారు. ఆ సంస్థ యజమాని మాజీ సైనికాధికారి అయినంత మాత్రాన అది మిలిటరీ కంపెనీ కాదని ఫెంగీ వ్యాఖ్యానించారు. 539 బిలియన్ డాలర్ల పైగా ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేయాలంటూ చైనా మీద అమెరికా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 250 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై అమెరికా ప్రభుత్వం ఇటీవలే సుంకాలు పెంచింది. ప్రతిగా చైనా కూడా 60 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికన్ దిగుమతులపై టారిఫ్లు పెంచింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాలు ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెంగీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల మధ్య బంధాలు మెరుగుపర్చుకునేందుకు తీసుకోతగిన చర్యల గురించి చర్చించడం ఈ సదస్సు ప్రధానోద్దేశం. అమెరికా ఎకానమీకే నష్టం.. అమెరికా తెరతీసిన వాణిజ్య యుద్ధంతో ఆ దేశానికి ఒనగూరిందేమీ లేకపోగా.. ఆ దేశ ఎకానమీకే ఎక్కు వగా నష్టం జరుగుతోందని చైనా ప్రభుత్వం వ్యాఖ్యానించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే సిద్ధాంతాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించిన దరిమిలా తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ అంశాలు పేర్కొంది. చైనా ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లు విధించడం వల్ల అగ్రరాజ్యంలో ఉత్పత్తి వ్యయాలు, ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయని.. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వృద్ధికి ప్రమాదకరంగా మారాయని చైనా వ్యాఖ్యానించింది. -
ఆ రెండు దేశాలతోనే ఆయనకు అసలైన సవాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కీలకమైన విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్ జైశంకర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాలతో దౌత్యపరమైన సమస్యలు శంకర్కు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా భారత్-చైనా, అమెరికా-భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సి ఉంది. భారత్కు పక్కలో బళ్లెంలా తయారైన చైనాతో దశాబ్దాలుగా సరిహద్దు సమస్య వెంటాడుతోంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, డోక్లాం సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతోంది. మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఈ సమస్య పరిష్కారానికి ఎంతో కృషిచేసినప్పటికీ.. సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య యుద్ధ వాతవారణం అప్పడప్పుడు కనిపిస్తూనే ఉంది. భారత భూభాగంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ను తమ దేశ పటంలో చూపిస్తూ.. డ్రాగాన్ అనేక సార్లు దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. వీటన్నింటని జై శంకర్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, జపాన్, కొరియాలతో వ్యూహాత్మక ఒప్పందాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశాలైన అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు పెంచడమే ఇందుకు కారణం. మరో 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలను ట్రంప్ రెట్టింపు చేశారు. దీని ప్రభావం భారత్పై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో అమెరికాకు ఇండియా దగ్గర కావడం చైనాకు మింగుడుపడడంలేదు. న్యూక్లియర్ ఒప్పందం (అమెరికా-చైనా) చైనాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. భారత్ ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వనికి మద్దతు ఇవ్వడానికి చైనా అభ్యంతరం చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జైశంకర్ ఎంతో వ్యూహత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ అనుసరిస్తున్న లుక్ ఈస్ట్ పాలసీ చైనాకు చేదుగుళికలా తయారైంది. తన పొరుగు దేశాలైన జపాన్, వియాత్నం దేశాలతో భారత్ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో చైనాను కొంతమెర అడ్డుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చైనా వ్యతిరేక శక్తులైన అమెరికా, జపాన్, కొరియా, లాంటి దేశాలతో భారత్ వ్యహాత్మక ఒప్పందాలను కుదుర్చుకోవాలి. భారత్కు ట్రంప్ షాక్ ఇదిలావుండగా.. భారత్కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ)ను త్వరలో తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామం భారత్ను షాక్కు గురిచేసింది. ట్రంప్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయం ఇప్పుడు భారత్లో చర్చనీయాంశమైంది. అమెరికాకు మన దేశం ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. జీఎస్పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భారత్ వస్తువులపై సుంకాలు విధిస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా వాణిజ్య ప్రాధాన్య హోదాను తొలగించడానికే సిద్ధమయ్యారు. ఇన్ని సవాళ్ల నడుమ జైశంకర్ విదేశాంగశాఖను నడిపించాల్సి ఉంది. -
ట్రేడ్ వార్ : హువావే స్పందన
చైనీస్ టెలికం దిగ్గజం హువే టెక్నాలజీస్పై విధించిన ఆంక్షలపై హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫీ ధీటుగా స్పందించారు. తమ బలాన్ని అమెరికా ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తోందనీ, ఇది తగదని గట్టిగానే హెచ్చరించారు. ఇలాంటి చర్యల ద్వారా తమ సామర్ధ్యాలను ఏమాత్రం దెబ్బతీయలేరంటూ చైనీస్ స్టేట్ మీడియా సీసీటీవీతో పేర్కొన్నారు. హువావేపై నిషేధం సడలింపు హువావే వ్యాపారం చేయడానికి వీల్లేకుండా విధించిన నిషేధాన్ని 90 రోజులు సడలిస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా హువావేపై అమెరికా గుర్రుగా ఉన్న నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హార్డ్వేర్, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, టెక్నాలజీ సేవలను హువావేకు బదిలీ చేయడం నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా గత వారం హువేను వాషింగ్టన్ ప్రభుత్వం వాణిజ్యపరమైన(ట్రేడ్) బ్లాక్లిస్ట్లో పెట్టడంతో గూగుల్ తదితర కంపెనీలు బిజినెస్ డీలింగ్స్ను రద్దుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా సడలిస్తూ వాషింగ్టన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. -
వాణిజ్యపోరులో మరీ దూరం వెళ్లొద్దు
బీజింగ్: ఇరుదేశాల వాణిజ్యానికి సంబంధించి చైనాకు వ్యతిరేకంగా నష్టం కలిగించే చర్యల విషయంలో మరీ దూరం వెళ్లిపోవద్దని, పరస్పర సహకారం ద్వారానే ఇరు దేశాలూ ప్రయోజనం పొందగలవని అమెరికా విదేశాంగ మంత్రి మైక్పాంపియోకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హితవు పలికారు. శనివారం పాంపియోతో టెలిఫో¯Œ లో మాట్లాడారు. అమెరిక¯Œ కంపెనీలు విదేశీ తయారీ టెలికం ఎక్విప్మెంట్ను వినియోగించొద్దని, వీటివల్ల దేశ భద్రతకు ముప్పు అంటూ నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ట్రంప్ గత వారమే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాంగ్ నుంచి ఈ సూచన వెలువడడం గమనార్హం. చైనాకు చెందిన హువావేను లక్ష్యంగా చేసుకునే ట్రంప్ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వాంగ్ మాట్లాడుతూ.. అమెరికా ఇటీవల తీసుకున్న చర్యలు, చేసిన వ్యాఖ్యలు ఎన్నో విభాగాల్లో చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేవని, చైనా కంపెనీల కార్యకలాపాలను కూల్చే విధంగా ఉన్నాయన్నారు. మరింత ముందుకు వెళ్లొద్దని అమెరికాను కోరుతున్నట్టు చెప్పారు. వివాదాల వల్ల నష్టపోయాయని, పరస్పర సహకారంతో అమెరికా, చైనాలు లబ్ధి పొందినట్టు చరిత్ర, వాస్తవాలు తెలియజేస్తున్నాయని వాంగ్ గుర్తు చేశారు. పరస్పర గౌరవం, ఇరు దేశాల ప్రయోజనాల కోణంలో సహకార విస్తృతి ఆధారంగా విభేదాలను పరిష్కరించుకోవాలని కోరారు. -
తక్షణ నిరోధం 38,600... మద్దతు 37415
అమెరికా–చైనాల మధ్య వాణిజ్యపోరు తీవ్రతరంకావడంతో ప్రపంచ మార్కెట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలోనే భారత్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్పోల్స్ ఆదివారంనాడు వెలువడ్డాయి. అత్యధిక శాతం ఎగ్జిట్పోల్స్...అధికార ఎ¯Œ డీఏనే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చన్న అంచనాలు వెలువరించడంతో ఈ సోమవారం మన మార్కెట్ గ్యాప్అప్తో ప్రారంభమయ్యే ఛాన్సుంది. కానీ 23న వెలువడే వాస్తవ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం మార్కెట్ అంచనాల్ని చేరలేకపోయినా, పెద్ద పతనం సంభవించే ప్రమాదం కూడా వుంటుంది. ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వున్నా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో ర్యాలీ భారీగా వుండకపోవొచ్చన్న అభిప్రాయాల్ని పలువురు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... మే 17తో ముగిసినవారం ప్రధమార్థంలో బీఎస్ఈ సెన్సెక్స్ 36.956 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైన తర్వాత ద్వితీయార్థంలో 38,000 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 468 పాయింట్ల లాభంతో 37,931 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆదివారం వెలువడిన ఎగ్జిట్పోల్స్కు స్పందనగా మార్కెట్ గ్యాప్అప్తో ప్రారంభమైతే సెన్సెక్స్కు 38,600 పాయింట్ల సమీపంలో తొలి అవరోధం కలగవచ్చు. అటుపై స్థిరపడితే క్రమేపీ ఏప్రిల్ 18నాటి గరిష్టస్థాయి 39,480 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ గురువారం వెలువడే ఎన్నికల ఫలితాల అనంతరం ర్యాలీ కొనసాగితే 40,300 పాయింట్ల వరకూ పెరిగే అవకాశాలుంటాయి. ఈ వారం రెండో నిరోధాన్ని దాటలేకపోయినా, సోమవారం గ్యాప్అప్ స్థాయిని నిలబెట్టుకోలేకపోయినా 37,415 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఎన్నికల ఫలితాలు నిరుత్సాహపరిస్తే 200 రోజుల చలన సగటు రేఖ కదులుతున్న 36,700 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం నిలబెట్టుకోలేకపోతే 35,830 పాయింట్ల స్థాయివరకూ సెన్సెక్స్ నిలువునా పతనమయ్యే ప్రమాదం వుంటుంది. తొలి అవరోధం 11,570...మద్దతు 11,260 గతవారం ప్రధమార్థంలో 11,108 పాయింట్ల వరకూ పతనమైన ఎ¯Œ ఎస్ఈ నిఫ్టీ...వారంలో చివరిరోజున 11,426 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 128 పాయింట్ల లాభంతో 11,407 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్అప్తో ప్రారంభమైన తొలుత 11,570 పాయింట్ల స్థాయి అవరోధం కల్పించవచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే క్రమేపీ 11,830 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపై 12,100 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం రెండో నిరోధాన్ని దాటలేకపోయినా, సోమవారంనాటి గ్యాప్అప్స్థాయిపైన స్థిరపడలేకపోయినా 11,260 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా రోజుల్లో 200 డీఎంఏ రేఖ కదులుతున్న 11,040 పాయింట్ల దిశగా నిఫ్టీ ప్రయాణించవచ్చు. ఈ కీలక స్థాయిని సైతం వదులుకుంటే 10,780 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. -
స్టాక్మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు
-
అమెరికా ఉత్పత్తులపై చైనా ప్రతీకార సుంకం
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. చైనా ఉత్పత్తులపై సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు శుక్రవారం అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనకు చైనా దీటుగా స్పందించింది. తాము కూడా అమెరికా ఉత్పత్తులపై 10 నుంచి 25 శాతం వరకు పన్ను విధిస్తామని పేర్కొంది. ట్రంప్ ఒత్తిడులకు తలొగ్గేది లేదంటూ స్పష్టం చేసింది. గత వారం రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఆ వెంటనే అమెరికా ప్రభుత్వం దాదాపు రూ.14 లక్షల కోట్ల విలువైన చైనా ఉత్పత్తులపై పన్ను శాతాన్ని ప్రస్తుతమున్న 10 నుంచి 25కు పెంచుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, మరో రూ.21 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులపైనా ఇలాగే పన్ను భారం మోపుతామని హెచ్చరించింది. అమెరికా చర్యకు బదులు తీర్చుకునేలా చైనా దాదాపు రూ.4.2 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై 10% మొదలు కొని 25% వరకు పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో స్పం దించారు. ‘మాపై ప్రతీకారం తీర్చుకుంటే చైనా భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఆ దేశంతో ఎవరూ వ్యాపారం చేయరు. చాలా కంపెనీలు ఆ దేశం వీడి మరో దేశానికి వెళ్తాయి. మాతో వెంటనే ఒప్పందానికి రావడం మంచిదని జిన్పింగ్తోపాటు చైనాలోని మిత్రులకు చెబుతున్నా’ అంటూ పేర్కొన్నారు. -
చైనాపై అమెరికా మళ్లీ సుంకభారం
వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశాలైన అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు పెంచడమే ఇందుకు కారణం. మరో 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలను ట్రంప్ రెట్టింపు చేశారు. ఓవైపు వాణిజ్య ఉద్రిక్తతలపై ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరుగుతుండగా.. ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు చైనా కూడా ఇందుకు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచేందుకు సిద్ధమైంది. శుక్రవారం లేదా ఆ తర్వాత నుంచి చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు అమలవుతాయని యూఎస్ ఫెడరల్ రిజిస్టర్ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతకుముందు చైనా నుంచి దిగుమతి చేసుకునే పలు, హ్యాండ్బ్యాగులు, దుస్తులు, పాదరక్షలు ఇలా తదితర 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై 10శాతం సుంకం ఉండేది. తాజాగా దాన్ని 25శాతానికి పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘తాజా పరిణామాలపై చైనా అసహనం వ్యక్తం చేసింది. ‘అమెరికాకు బదులిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు అమెరికా మాతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. -
‘ట్రంప్ నిర్ణయం ఎవరికి నష్టం?’
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకులపై సుంకం మినహాయింపు దేశాల (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రివరెన్సెస్) జాబితా నుంచి టర్కీతోపాటు భారత్ పేరును కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నిర్ణయం వల్ల భారత దేశానికి ఎలాంటి నష్టం ఉంటుంది ? అలాంటి నిర్ణయం భారత్ కూడా తీసుకుంటే ఆ ప్రభావం అమెరికాపై ఎలా ఉంటుంది ? ఈ నిర్ణయాల వల్ల వాస్తవానికి ఎవరు నష్టపోతారు ? ఇరు దేశాల ప్రభుత్వాలా ? లేదా ఇరు దేశాల వినియోగదారుల ? అసలు అమెరికా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటీ? అమెరికా సుంకం మినహాయింపు జాబితా కింద భారత దేశం నుంచి 1500 రకాల సరకుల దిగుమతులపై సుంకం విధించడం లేదు. అంటే ఎలాంటి సుంకం చెల్లించకుండానే భారత వ్యాపారులు ఆ వస్తువులను అమెరికాలో విక్రయించుకోవచ్చు. భారత్ ఎగుమతి చేస్తున్న సరకుల్లో మధుబని ప్రింట్లు, టీ షర్టుల నుంచి ఉక్కు వరకు ఉంది. అయితే ఉక్కుపైన పరిమితి పన్ను ఉంది. ఇందుకు బదులుగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న సోయాబిన్, ఆల్మండ్స్ నుంచి ఖరీదైన బైకుల వరకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇస్తోంది. సుంకం మినహాయింపు కింద భారత్ 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 560 కోట్ల డాలర్ల సరకులను అమెరికాకు ఎగుమతి చేసింది. వీటిపై 19 కోట్ల డాలర్ల సుంకం మినహాయింపు లభించింది. వాస్తవానికి 2017–18, నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో (2018, డిసెంబర్ వరకు) భారత్ దాదాపు 8,700 కోట్ల డాలర్ల విలువైన సరకులను అమెరికాకు ఎగుమతి చేసింది. దాంతో పోల్చుకుంటే సుంకం మినహాయింపు కింద ఎగుమతి చేసిన సరకుల విలువ చాలా తక్కువ. అమెరికా ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారత్కు దిగుమతి చేసిన సరకుల విలువ దాదాపు 5,300 కోట్ల డాలర్ల మాత్రమే. గత జూన్ నుంచే భారత్ బెదిరింపులు భారత్ కొత్త సుంకం విధానం కింద అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 30 సరకులపై సుంకం మినహాయింపు ఇస్తోంది. వీటిపై కూడా సుంకాలను విధిస్తామని గత జూన్ నెల నుంచే అమెరికాను భారత్ హెచ్చరిస్తూ వస్తోంది. అంతకుముందే అమెరికా నుంచి పాల ఉత్పత్తుల దిగమతిని భారత్ నిషేధించింది. కారణం, అమెరికాలోని ఆవులు మాంసాహారాన్ని తింటాయి కనుక. ఇందుకు ప్రతీకారంగా గుండె రక్తనాళాల్లో అమర్చే స్టెంటుల దిగుమతిపై టారిఫ్లను పెంచుతామని అమెరికా హెచ్చరించింది. టారిఫ్లు తక్కువగా ఉండడం వల్లనే మోదీ ప్రభుత్వం స్టెంట్ల ధరలపై నియంత్రణ ధరలను తీసుకొచ్చింది. అయితే అమెరికా ఇప్పటి వరకు వీటిపై సుంకం టారిఫ్లను పెంచలేదు. 800 సీసీ పైనున్న టూ వీలర్స్, ముఖ్యంగా హార్లీ డేవిడ్సన్ వాహనాలపై భారత్ అధిక సుంకం విధించడం పట్ల ట్రంప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో భారత్ వాటిని తగ్గించింది. ఈ-వాణిజ్యంలో కూడా ఇరు దేశాల మధ్య మినహాయింపులు కేవలం సరకుల ఎగుమతులు, దిగుమతులకే పరిమితం కాలేదు. ఈ-వాణిజ్యంలో కూడా మినహాయింపులు ఉన్నాయి. అమెరికాలో ఈ-వాణిజ్య నిబంధనలను సవరించిన కారణంగానే అమెజాన్, వాల్మార్ట్ కంపెనీలు భారత్లో రిటేల్ వ్యాపారాన్ని నిర్వహించ కలుగుతున్నాయి. అయితే ఇలాంటి విదేశీ సంస్థలపై భారత్ ఆంక్షలు విధించింది. విదేశీ ఈ రిటేలర్లు ‘ఇన్వెంటరీ మోడల్’ లో సరకులను అమ్మరాదు. అంటే ముందుగా ఆర్డర్లు తీసుకొని వాటిని ఉత్పత్తి చేసి ఆ తర్వాత సరఫరా చేయడం చేయరాదు. రెడీగా ఉన్న సరకులను అమ్మాలి. రిలయెన్స్ లాంటి భారతీయ రిటేలర్స్ రెడీగా ఉన్న ఉత్పత్తులను అమ్మవచ్చు. ఇన్వెంటరీ పద్ధతిలో సరకులను సరఫరా చేయవచ్చు. భారత్ తాము ఎగుమతి చేస్తున్న ఉక్కుపై మరింత టారిఫ్ను తగ్గించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇలా దేశాల మధ్య మార్కెట్ యుద్ధం ఎంతో కాలం నుంచి నడుస్తోంది. మనకే నష్టం ఎక్కువ అమెరికా ఎలాగు నిర్ణయం తీసుకున్నది కనుక, అలాంటి నిర్ణయం భారత్కూడా తీసుకొని అమెరికా దిగుమతి ఉత్పత్తులపై సుంకం విధించాల్సి వస్తుంది. మనమే అమెరికాతో ఎక్కువ ఎగుమతి వ్యాపారం చేస్తున్నాం కనుక మనమే ఎక్కువ నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా స్టీల్ ఎగుమతి పడిపోయే ప్రమాదం ఉంది. పరస్పర సుంకాల వల్ల ప్రభుత్వ ఖజానాలకు పెద్ద నష్టం వాటిల్లక పోవచ్చు. కానీ వినియోగదారులు ఎక్కువ ధరలు పెట్టి సరకులను కొనాల్సి వస్తుంది కనుక వాళ్ల జేబులకు చిల్లులు పడుతాయి. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది, అక్కడి వినియోగదారులకు ఆదాయం ఎక్కువ. అలా చూసినా భారత వినియోగదారులే ఎక్కువ నష్ట పోవాల్సి వస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం పేరిట ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య ఇలా ఇచ్చి పుచ్చుకునే రాయతీలు కొనసాగడం వల్లనే గత 30 ఏళ్లల్లో ప్రపంచ స్థూల ఉత్పత్తి రేటు ఊహించనంతగా పెరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం..!
ముంబై: ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య పరమైన చర్చలు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఈవారంలో మార్కెట్లను ప్రభావితం చేసే దేశీ ఆర్థిక అంశాలు ఏమీ లేనందున.. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్తో రూపాయి మారకం విలువ కదలికలు సూచీలపై ప్రభావం చూపనున్నాయి.’ అని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ వెల్లడించారు. మార్కెట్ను ప్రభావితం చేసే సానుకూల అంశాలు లేకపోవడం, ముడిచమురు ధరలు పెరుగుతుండడం వంటి ప్రతికూలతలు ఉన్న కారణంగా ఈవారంలో అధిక శాతం ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం! మంగళవారం హౌసింగ్ మార్కెట్ ఇండెక్స్ డేటా వెల్లడితో ఈవారం అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు ప్రారంభంకానున్నాయి. 20న (బుధవారం) రెడ్బుక్ ఈ–కామర్స్ రిటైల్ సేల్స్, ఫిబ్రవరి 15తో ముగిసే వారానికి యూఎస్ ఎంబీఏ మార్టిగేజ్ అప్లికేషన్ డేటా వెల్లడికానుంది. గురువారం ఎఫ్ఓఎంసీ మినిట్స్, ఏపీఐ క్రూడ్ వివరాలు... ఫిబ్రవరి 16తో ముగిసే వారానికి జాబ్లెస్ క్లెయిమ్స్, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ వెల్లడికానున్నాయి. అదే రోజున ఇప్పటికే ఉన్న గృహ అమ్మకాల గణాంకాలు, ఫిబ్రవరి కాంపోజిట్ అండ్ సర్వీసెస్ పీఎంఐ డేటా కూడా గురువారమే వెల్లడికానుంది. ఇతర ప్రధాన దేశాల స్థూల ఆర్థిక అంశాల విషయానికి వస్తే.. సోమవారం జనవరి నెలకు సంబంధించిన చైనా వాహన విక్రయ గణాంకాలు, జపాన్ డిసెంబర్ మెషినరీ ఆర్డర్స్ వెలువడనుండగా.. మంగళవారం యూరో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్, డిసెంబర్ నిర్మాణ డేటా వెల్లడికానుంది. గురువారం యూరో జోన్ ఫిబ్రవరి తయారీ, కాంపోజిట్ అండ్ సర్వీసెస్ పీఎంఐ వెల్లడికానుంది. ఈ ప్రాంత జనవరి ద్రవ్యోల్బణం శుక్రవారం విడుదలకానుంది. ఇదే రోజున చైనా జనవరి నెల గృహ ధరల సూచీ, జపాన్ జనవరి ద్రవ్యోల్బణం వెల్లడికానున్నాయి. ఈ ప్రధాన అంతర్జాతీయ అంశాలకు తోడు ఇండో–పాక్ ఉద్రిక్తతలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట..! వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ ఈనెల 20న (బుధవారం) సమావేశంకానుంది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో మంత్రుల బృందం సిఫార్సుల మేరకు రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట లభించనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిమెంట్పై ప్రస్తుతం ఉన్నటువంటి 28% పన్నురేటును 18%కి తగ్గించాలని ప్రతిపాదన ఉండగా.. అందుబాటు గృహాల విభాగానికి చెందిన ప్రాజెక్టులపై అమల్లో ఉన్న 8% పన్నును 3%కి తగ్గించాలనే సిఫార్సులను కౌన్సిల్ పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉందని అంచనా. మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలా వద్దా..? ఈ ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలన్న కేంద్రం విజ్ఞప్తిపై కేంద్ర బ్యాంక్ సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఈ మేరకు ఢిల్లీలో సమావేశంకానున్న ఆర్బీఐ బోర్డు సమావేశం జరగనుంది. ముడిచమురు ధరల ప్రభావం.. గతేడాది డిసెంబర్లో 50 డాలర్ల కనిష్టాన్ని నమోదుచేసిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర.. గతవారం చివరినాటికి 31% పెరిగింది. గతవారంలో 6.7% పెరిగి 66.25 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో డాలరుతో రూపాయి మారకం విలువ గతవారం 9 పైసలు బలహీనపడింది. ఈవారంలో రూపాయి విలువ 71.60–70.90 స్థాయిలో ఉండొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ చెబుతోంది. ఎఫ్ఐఐల నికర కొనుగోళ్లు ఫిబ్రవరి 1–15 కాలంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) రూ.5,322 కోట్ల పెట్టుబడులను భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే ఇదే సమయంలో రూ.248 కోట్లను వీరు డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ.5,074 కోట్లను ఈ 15 రోజుల్లో ఎఫ్పీఐలు పెట్టుబడి పెట్టారు. ఇకపై వీరు ఎటువంటి ధోరణి అవలంభిస్తారనే అంశం లోక్ సభ ఎన్నికలు, క్రూడ్ ఆయిల్ ధరలపై ఆధారపడి ఉందని బజాజ్ క్యాపిటల్ హెడ్ అలోక్ అగర్వాల్ అన్నారు. -
ట్రేడ్ వార్ దెబ్బ : చైనా జీడీపీ భారీ పతనం
అమెరికా-చైనా మధ్య రగులుతున్న ట్రేడ్వార్ దెబ్బడ్రాగెన్ కంట్రీపై గట్టిగానే పడింది. 2018లో మందగిస్తూ వచ్చిన చైనా ఆర్థిక వృద్ధి రేటు మరింత పతనమైంది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి చైనా 6.6 శాతం వృద్ధి రేటు సాధించింది. పెట్టుబడులు బలహీనపడటం, అమెరికాతో వాణిజ్య యుద్ధం చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో చైనా జీడీపీ 28 ఏళ్ల కనిష్ఠాన్ని తాకింది. గతేడాది నాల్గవ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు కేవలం 6.4 శాతంగా ఉంది. గత త్రైమాసికంలో నమోదు చేసిన 6.5శాతం వృద్ధి రేటు కంటే ఇది తక్కువ. 2018లో చైనా వృద్ధిరేటు 6.6 శాతంగా ఉన్నట్లు చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. 1990 తరువాత ఇదే అతి తక్కువ. దీంతో అగ్రరాజ్యం అమెరికాతో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్న చైనా ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు మరింత పతనాన్ని నమోదు చేయనుందని అంచనా వేశారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం, అధిక రుణ భారం లాంటి సమస్యలే చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. గత ఏడాది చైనా వస్తువుల దిగుమతులపై దాదాపు 250 బిలియన్ డాలర్ల విలువైన సుంకం విధింపు చైనా ఎగుమతులపై ప్రభావం పడింది. ఆ పరిణామాల తర్వాత బీజింగ్ తన ఆర్థిక ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారి. -
తక్షణ అవరోధశ్రేణి 36,200–36,285
జనవరి తొలివారంలో భారత్తో సహా ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ...వాటి ఇటీవలి గరిష్టస్థాయిల వద్ద పరిమితశ్రేణిలో కదిలాయి. అమెరికా–చైనా ట్రేడ్వార్ చర్చలు సానుకూలంగా ముగిసాయన్న వార్తలు కూడా మార్కెట్లను పెద్దగా ఉత్తేజపర్చలేకపోయాయి. ఇక్కడ ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్లతో పాటు ఇండస్ఇండ్ బ్యాంక్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు సైతం మార్కెట్ అంచనాలకంటే దిగువస్థాయిలోనే వున్నాయి. ఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్ ప్రకటించినందున, ఫలితాలు నిరుత్సాహపర్చినా, షేరు గరిష్టస్థాయిలోనే ట్రేడ్కావొచ్చు. అయితే ఇన్ఫోసిస్, ఐటీసీ, కొన్ని కార్పొరేట్ బ్యాంకులు మినహా మిగిలిన హెవీవెయిట్ షేర్లన్నీ ముందడుగు వేయలేకపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనపర్చే అంశం. సంవత్సరాంతపు సెలవుల తర్వాత సాధారణంగా జనవరి రెండోవారం నుంచి మన మార్కెట్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ ఇన్వెస్టర్లు, ఫెడ్ తాజా ప్రకటనతో భారత్ మార్కెట్లో పెట్టుబడుల్ని పునఃప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్ ట్రెండ్ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు.. జనవరి 11తో ముగిసిన వారంలో 36,270–35,750 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 315 పాయింట్ల లాభంతో 36,010 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే సెన్సెక్స్కు 36,200–36,285 శ్రేణి గట్టిగా నిరోధించవచ్చు. గతవారంలో పలుదఫాలు అవరోధం కలిగించిన ఈ శ్రేణిపైన ముగిస్తే 36,285–36,560 పాయింట్ల నిరోధశ్రేణిని అధిగమించడం సెన్సెక్స్ భవిష్యత్ ట్రెండ్కు కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్ నిస్తేజంగా ప్రారంభమైనా 35750 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తేక్రమేపీ 35,380 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ లోపున ముగిస్తే తిరిగి 35000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధశ్రేణి 10830–10,870 గతవారం 10,870– 10,733 పాయింట్ల మధ్య పరిమితశ్రేణిలో ఊగిసలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 10,795 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 10830–10,870 శ్రేణి తొలుత తీవ్ర నిరోధాన్ని కల్పించవచ్చు. అటుపైన కీలక నిరోధ శ్రేణి 10925–10,985 పాయింట్లు. గత మూడువారాలుగా పలుదఫాలు ఈ శ్రేణి అవరోధాన్ని కల్గించినందున, ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ వారం పైన సూచించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,730 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. గత వారంరోజులుగా మద్దతునిచ్చిన ఈ స్థాయిలోపున ముగిస్తే 10,630 పాయింట్ల వద్ద క్రమేపీ తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే 10,535 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
స్థూల ఆర్థిక గణాంకాలతోనే దిశా నిర్దేశం..
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి ఈ వారంలో దేశీ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ముడిచమురు, రూపాయి కదలికల ఆధారంగా నూతన ఏడాది మొదటివారం ట్రెండ్ ఆధారపడి ఉందని చెబుతున్నారు. ‘భూగోళ రాజకీయ అంశాలు, అధిక స్థాయిల వద్ద కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి, వాణిజ్య యుద్ధాలు వంటి ప్రతికూలతల నేపథ్యంలో మార్కెట్లలో నెగటివ్ సెంటిమెంట్ అధికంగా ఉండేందుకు ఆస్కారం ఉంది.’ అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. మరోవైపు ముడిచమురు ధరల్లో కన్సాలిడేషన్ చోటుచేసుకోవడం, డాలరుతో రూపాయి బలపడడంతో పాటు స్థూల గణాంకాల ఆధారంగా ఇన్వెస్టర్లలో విశ్వాసం నెలకొనవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. వచ్చే ఏడాది రెండవ వారం నుంచి ప్రారంభంకానున్న క్యూ3 (అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు మార్కెట్ దిశకు మరింత స్పష్టత ఇవ్వనున్నాయని వివరించారు. నికాయ్ గణాంకాల వెల్లడి.. ఎనిమిది కీలక రంగాల వృద్ధిరేటుకు సంబంధించిన సమాచారం ఈ వారంలోనే వెల్లడికానుండగా.. నవంబర్ నెల దేశీ మౌళిక సదుపాయాల నిర్మాణ సమాచారాన్ని ప్రభుత్వం సోమవారం వెల్లడించనుంది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరంగ్ పర్చేరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) బుధవారం, నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈవారంలోనే ఆటోమొబైల్ కంపెనీలు తమ డిసెంబర్ నెలకు సంబంధించిన అమ్మకాల డేటాను ప్రకటించనున్నాయి. ఎన్బీఎఫ్సీల్లో నెలకొన్న ద్రవ్య లభ్యత కొరత ఈసారి ఆటో డేటాపై ఉత్కంఠ నింపిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఓలా, ఉబెర్ వంటి ఆటో అగ్రిగేటర్ సంస్థల మద్దతుతో వాల్యూమ్స్ నిలబడే అవకాశం ఉందనే ఆశాభావం ఉన్నట్లు వ్యక్తంచేశారు. ఇక అంతర్జాతీయ గణాంకాల పరంగా చూస్తే.. అమెరికా, చైనా దేశాల డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐలు బుధవారం వెల్లడికానున్నాయి. ఈ మొత్తం సమాచారాల ఆధారంగానే మార్కెట్ కదలికలు ఈవారంలో ఉండనున్నట్లు వినోద్ నాయర్ అన్నారు. ఎఫ్పీఐల నికర పెట్టుబడి రూ.5,477 కోట్లు ముడి ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలపడిన కారణంగా డిసెంబర్ 3–28 కాలంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ)లు రూ.5,477 కోట్లను దేశీ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల సమాచారం ద్వారా వెల్లడైంది. రూ.1,900 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్చేసిన వీరు రూ.3,577 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టినట్లు తేలింది. 71–72 శ్రేణిలో రూపాయి.. గడిచిన వారంలో ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 52.20 డాలర్లకు పతనం కాగా, యూఎస్ క్రూడ్ 45.12 డాలర్లకు పడిపోయి.. వరుసగా మూడవ వారంలోనూ పతనాన్ని నమోదుచేశాయి. అక్టోబర్ గరిష్టస్థాయిల నుంచి 39 శాతం, ఏడాది ప్రాతిపదికన 17 శాతం పడిపోయాయి. ఉత్పత్తిలో కోత కారణంగా బ్రెంట్ ధర 50 డాలర్ల సమీపంలో బోటమ్ కావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు డబ్ల్యూటీఐ ధర మరింత పతనమైతే యూఏఈ, రష్యాలు అత్యవసర సమావేశానికి పిలుపునివ్వగా.. ఇందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆనంద్ రాఠీ కమోడిటీస్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ హెచ్ రవీంద్ర వీ రావు విశ్లేషించారు. ఇక గతవారం డాలర్తో రూపాయి మారకం విలువ 69.93 వద్దకు చేరుకుంది. అమెరికా డాలర్ బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్ బలపడటం వంటి సానుకూల అంశాలతో రూపాయి విలువ బలపడింది. దిగుమతిదారులు అన్హెడ్జ్ పొజిషన్లను కవర్చేసుకోవడం కోసం వచ్చే కొద్ది సెషన్లలో క్యూ కట్టవచ్చని ఈకారణంగా రానున్న సెషన్లలో రూపాయి 71–72 స్థాయిలో ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం!
న్యూఢిల్లీ: అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు, ఫెడ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్కెట్ ముందుగానే డిస్కౌంట్ చేసింది. నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. 2.33 శాతంగా నమోదైంది. మరోవైపు పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్లో 8.1 శాతం పెరిగి ఏడాది గరిష్టస్థాయికి చేరుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ వైఖరి మారడం అనేది మార్కెట్ వర్గాల్లో ఆశావాదాన్ని నింపింది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ అన్నారు. దేశీ అంశాలు పాజిటివ్గానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ అంశాలు ఏమేరకు ప్రభావం చూపుతాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కదలికలు ఉండనున్నాయని పలువురు మార్కెట్ పండితులు విశ్లేషించారు. ఫెడ్ రేట్లు 25 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం.. ఈవారం మంగళ, బుధవారాల్లో (18–19) అమెరికన్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగనుండగా.. ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేట్లు 25 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఫెడ్ వైఖరి ఎలా ఉండనుందనే అంశం కూడా ఇదే సమావేశం ద్వారా వెల్లడయ్యే సూచనలు ఉండడంతో దలాల్ స్ట్రీట్ వర్గాలు ప్రధానంగా దృష్టిసారించాయి. మంగళవారం యూఎస్ వాణిజ్య విభాగం భవన అనుమతులు, నవంబర్ గృహ నిర్మాణాలకు సంబంధించి నివేదికను ఇవ్వనుంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాలసీ ప్రకటన, బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ సమావేశం కూడా ఇదే వారంలో ఉన్నాయి. క్రూడ్ ధరల ప్రభావం.. చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి డిమాండ్ తగ్గుతుందనే అంచనాల కారణంగా గతవారంలో ముడిచమురు ధరలు దిద్దుబాటుకు గురైయ్యాయి. ఇదే సమయంలో ఒపెక్ ఉత్పత్తిపై నెలకొన్న పలు అనుమానాలతో గతవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.25 శాతం తగ్గి 60.28 డాలర్లకు చేరుకుంది. ‘రష్యా ఉత్పత్తిని తగ్గించనుందనే ప్రకటన, అమెరికా ఎగుమతుల్లో సౌదీ అరేబియా కోత వంటి అంశాల ఆధారంగా చమురు ధరలు రేంజ్ బౌండ్లోనే ఉండేందుకు అవకాశం ఉంది.’ అని ఆనంద్ రాఠీ కమోడిటీస్ విభాగం రీసెర్చ్ హెడ్ రవీంద్ర వీ రావ్ విశ్లేషించారు. ధరలు ఏమాత్రం పడిపోయినా దేశీ మార్కెట్లకు సానుకూలంగా మారునుందన్నారు. 71.30–72.50 శ్రేణిలో రూపాయి.. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయడం, ఎన్నికల ఫలితాలు, డాలర్ బలపడడం వంటి కారణాలతో గతవారం డాలరుతో రూపాయి మారకం విలువ 109 పైసలు (1.54 శాతం) క్షీణించి 71.89 వద్దకు పడిపోయింది. ఫెడ్ సమావేశాన్ని పరిగణలోనికి తీసుకుని రూపాయి కదలికల శ్రేణి 71.30–72.50 మధ్య ఉండవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ డెరివేటివ్స్ హెడ్ అమిత్ గుప్తా అంచనావేశారు. 10,880–10,929 వద్ద నిరోధం.. నిఫ్టీ 10,700 స్థాయి వద్ద నిలవ గలిగితే అక్కడ నుంచి 10,880–10,929 స్థాయి వరకు వెళ్లేందుకు అవకాశం ఉందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ చందన్ తపరియా విశ్లేషించారు. ఈ సూచీ కీలక మద్దతు స్థాయి 10,650 వద్ద ఉండగా.. ఈస్థాయిని కోల్పోతే 10,600 తరువాత మద్దతుగా ఉంటుందన్నారు. అమెరికా–చైనా మధ్య సంధిపై ఆశావహంగా ఇన్వెస్టర్లు వాణిజ్య యుద్ధభయాలతో ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తించిన అమెరికా–చైనాల మధ్య చర్చలు ఫలించవచ్చని ఇన్వెస్టర్లలో ఆశాభావం పెరుగుతోంది. వివాదాల పరిష్కారానికి రెండు దేశాల మధ్య కుదిరిన 90 రోజుల సయోధ్య ఒప్పందంపై చర్చలు పురోగమిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. చైనా టెలికం దిగ్గజం హువావే సీఎఫ్వో మింగ్ కెనడాలో అరెస్టయినప్పటికీ .. రెండు పక్షాల నుంచి పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలేమీ లేకపోవడం ఇందుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్, చైనా ప్రభుత్వం.. ఈ రెండు అంశా లను (టారిఫ్లు, మింగ్ అరెస్టు) వేర్వేరుగానే చూస్తున్నట్లుగా స్పష్టమవుతోందని వాణిజ్యవేత్త ఎడ్వర్డ్ అల్డెన్ తెలిపారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు రెట్టింపు చేసే ప్రతిపాదనలను ట్రంప్ మార్చి 1 దాకా వాయిదా వేయడం, ప్రతిగా అమెరికాతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేలా చైనా మరిన్ని అమెరికన్ ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు అంగీకరించడం తెలిసిందే. -
వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేకులు
బ్యూనస్ ఎయిర్స్: దాదాపు ఆరు నెలలుగా వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన అమెరికా, చైనాల మధ్య ఎట్టకేలకు సంధి కుదిరింది. వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ప్రస్తుతానికి కొత్తగా మరిన్ని టారిఫ్లు విధించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇవ్వగా.. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీకి చర్యలు తీసుకుంటామని చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ భరోసానిచ్చారు. వార్షిక జీ–20 సదస్సు సందర్భంగా దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన విందు సమావేశంలో ఈ మేరకు ఇరువురు అంగీకారానికి వచ్చారు. 2019 జనవరి 1 నుంచి 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 25 శాతానికి పెంచకుండా.. ప్రస్తుతం 10 శాతానికే పరిమితం చేసేందుకు ట్రంప్ అంగీకరించారు. ప్రతిగా 375 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న వాణిజ్య లోటును తగ్గించేందుకు అమెరికా ఉత్పత్తులు భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు జి జిన్పింగ్ అంగీకారం తెలిపారు. ’అమెరికా, చైనాలకు అపరిమిత ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఫలవంతమైన చర్చలు జరిగాయి’ అని ట్రంప్ పేరిట విడుదల చేసిన ప్రకటనలో వైట్హౌస్ వెల్లడించింది. ట్రేడ్వార్కు తాత్కాలికంగా బ్రేకులు వేసే దిశగా ట్రంప్, జిన్పింగ్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ చైనా మీడియా కథనాలు ప్రచురించింది. 90 రోజుల వ్యవధి.. ముందుగా ప్రతిపాదించినట్లు జనవరి 1 నుంచి టారిఫ్లను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు, దీంతో ఈ అంశంపై మరిన్ని చర్చలకు ఆస్కారం లభించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరి సారా సాండర్స్ తెలిపారు. వాణిజ్య లోటు భర్తీ క్రమంలో అమెరికా నుంచి వ్యవసాయ, ఇంధన, పారిశ్రామికోత్పత్తులు మొదలైనవి గణనీయంగా కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. టెక్నాలజీ బదలాయింపు, మేథోహక్కుల పరిరక్షణ తదితర అంశాలపై తక్షణం చర్చించేందుకు ట్రంప్, జిన్పింగ్ నిర్ణయించినట్లు వివరించారు. ఇరు పక్షంలో 90 రోజుల్లోగా ఒక అంగీకారానికి రాలేకపోయిన పక్షంలో 10 శాతం సుంకాలను 25 శాతానికి పెంచడం జరుగుతుందన్నారు. గతంలో తిరస్కరించిన క్వాల్కామ్–ఎన్ఎక్స్పీ డీల్ తన ముందుకు వచ్చిన పక్షంలో ఈసారి ఆమోదముద్ర వేసేందుకు జిన్పింగ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు శాండర్స్ వివరించారు. -
స్టాక్మార్కెట్ల దూకుడు : భారీ లాభాలు
-
స్టాక్మార్కెట్ల దూకుడు : భారీ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి. ఆరంభంలోనే భారీ లాభాలను సాధించిన కీలక సూచీలు కొనుగోళ్ల జోష్తో మరింత లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 427 పాయింట్లు లాభపడి 34, 859 వద్ద,నిఫ్టీ 133 పాయింట్లు ఎగిసి 10, 13 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. దీంతో నిఫ్టీ 10500 స్థాయిని అధిగమించింది. దీంతో దేశీయంగా దాదాపు అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. ముఖ్యంగా ఆటో, రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా సెక్టార్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఏషియన్ పెయింట్స్, యస్బ్యాంక్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, హీరోమోటో, ఇండస్ఇండ్, ఐషర్, ఎంఅండ్ఎం, ఐవోసీ, టాటా మోటార్స్ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ స్వల్పంగా నష్టపోతున్నాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా పాజిటివ్గా ప్రారంభమైంది. డాలరుమారకంలో నిన్నటి ముగింపు 73.45 తో పోలిస్తే. 73.10 వద్ద బలంగా ఉంది. అంతర్జాతీయ చమురు ధరలు దిగి రావడం, ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలు అమెరికా, చైనా మధ్య ట్రేడ్వార్ ముగింపు సంకేతాలతో ఇన్వెస్టర్లలో జోష్ వచ్చింది. అటు వరుసగా మూడో రోజు అమెరికా మార్కెట్లు హైజంప్ చేశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అన్ని మార్కెట్లోనూ ఇదే ధోరణి నెలకొంది. -
భారీగా సంపద కోల్పోయిన ఆపిల్, టెస్లా సప్లయర్
బీజింగ్ : అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో చైనా బిలీయనీర్లు భారీగా సంపద కోల్పోతున్నారు. ఇప్పటికే అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా, టెన్సెంట్ హెల్డింగ్స్ సీఈఓ మా హుటేంగ్ బిలియన్ డాలర్లను కోల్పోగా.. లెన్స్ టెక్నాలజీ సహ వ్యవస్థాపకురాలు జో కున్ఫెయ్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరారు. చైనాలో అత్యంత ధనవంతురాలైన మహిళగా గుర్తింపు పొందిన జో కున్ఫెయ్ 6.6 బిలియన్ డాలర్ల(660 కోట్ల రూపాయలు) సంపద కోల్పోయారని బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ గణాంకాలు ఆమె మొత్తం సంపదలో 66 శాతం అని పేర్కొంది. సంపద కోల్పోతున్న చైనీయుల్లో ఆమె ప్రథమ స్థానంలో ఉన్నారని బ్లూమ్బర్గ్ పేర్కొంది. కాగా చైనాలోని హనన్ ప్రావిన్స్లో గల జియాంగ్ జియాంగ్ పట్టణంలో 1970లో జన్మించిన జో మొదట ఓ గ్లాస్ తయారీ కంపెనీలో పనిచేశారు. తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలి లెన్స్ టెక్నాలజీని స్థాపించారు. 2015లో వ్యాపార కలాపాలు మొదలుపెట్టిన ఈ సంస్థ ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లకు టచ్స్క్రీన్లను అందిస్తోంది. అదే విధంగా ఆటోమొబైల్ దిగ్గజం టెస్లాకు అవసరమైన డిస్ప్లే ప్యానెళ్లను తయారుచేసి ఇచ్చేది. అయితే గత కొంత కాలంగా అమెరికా- చైనాల మధ్య జరుగుతున్న ట్రేడ్వార్ ముదురుతున్నకారణంగా లెన్స్ టెక్నాలజీ ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ప్రధాన కస్టమర్లైన రెండు కంపెనీలు అమెరికాకే చెందినవి కావడంతో జో భారీగా సంపద కోల్పోయారు. (చదవండి : చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్) -
బంగారం కాదు..ఎలక్ట్రానిక్ వస్తువులపై
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా-చైనా ట్రేడ్వార్, రోజు రోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ వస్తువుల దిగుమతులను అడ్డుకునేందుకు కొన్నివస్తువులపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచాలనే ప్రతిపాదను పరిశీలిస్తోంది. ముఖ్యంగా విలువైన మెటల్ బంగారంపై ఈ పెంపు ఉండవచ్చని ఎనలిస్టులు అంచనావేశారు. అయితే ఇపుడు దీనికి భిన్నంగా బంగారాన్ని దిగుమతి సుంకం పెంపు నించి మినహాయింపునిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బంగారంపై కుండా విలువైన రాళ్లను, కొన్ని రకాల ఉక్కు, ఎలక్ర్టానిక్ వస్తువులపై దిగుమతి సుంకం వేయాలని కేంద్ర నిర్ణయించింది. అక్రమ రవాణాను నివారించడానికి బంగారంను ఈ పెంపు నుంచి మినహాయించనున్నాని ఆర్థిక శాఖ అధికారి సోమవారం విలేకరులకు చెప్పారు. వీటితో పాటు విలువైన రాళ్ళపై కూడా ఈ పన్ను విధించే అవకాశముందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి ఒకరు తెలిపారు. జాబితా తయారవుతోందని, త్వరలోనే తుది రూపం ఇచ్చి విడుదల చేస్తామని ఈ వర్గాలు తెలిపాయి. డాలర్తో రూపాయి విలువ పడిపోతున్న నేపథ్యంలో కొన్ని రకాల వస్తువులు అంటే నిత్యావసరం కాని విలువౌన వస్తువులపై దిగుమతి సుంకం వేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇదే సమయంలో బంగారంపై కూడా సుంకం వేయాలని ప్రతిపాదనను పరిశీలించింది. మరోవైపు చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఈరోజు(సెప్టెంబరు 24, 2018) నుంచి అమెరికా సుంకం అమలువుతున్న సంగతి తెలిసిందే. -
ట్రేడ్ వార్ ఎటు పోతోంది?
యుద్ధం మొదలైంది... తుపాకీ మోతల్లేవు.. క్షిపణులు అంతకంటే లేవు.. కానీ పోరు జరుగుతున్నది మాత్రం నిజం. ఎందుకంటే ఇది వాణిజ్య యుద్ధం! అగ్రరాజ్యాధిపతి కవ్విస్తున్నాడు.. ఇతర దేశాలు ఆ ఉచ్చులో పడిపోతున్నాయి! పన్నుకు పన్ను పడుతోంది. మార్కెట్లు వేడెక్కుతున్నాయి! ఈ పోటీ ఇంకొంచెం ముదిరిందా? ఏ దేశాన్నీ వదలదు.. ప్రపంచాన్ని కబళిస్తుంది... ‘పోరు నష్టం... పొందు లాభం..’ అని మనం చిన్నప్పుడెప్పుడో ఓ సామెత చదువుకున్నాం. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ సామెత అర్థం పెద్దగా తెలిసినట్టుగా లేదు. అమెరికా ఫస్ట్ అంటున్నాడు.. అందుకోసం ఎంతకైనా తెగిస్తానని బీరాలు పోతున్నాడు కూడా. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడటంపై ఎవరికీ అభ్యంతరాల్లేవు గానీ.. ఈ క్రమంలో ప్రపంచాన్ని ముంచేసే ఎత్తులకు సిద్ధమవుతూండటం మాత్రం ఆందోళన కలిగించేదే! నియంత పోకడలతో చాలా దేశాల దిగుమతులపై ఎడాపెడా సుంకాలు వేసేస్తూండటంతో ప్రపంచ వాణిజ్య రంగం అతలాకుతలమయ్యే స్థితికి చేరుకుంది. వ్యాపారం లేకపోతే ఉత్పత్తి మందగిస్తుంది.. దీనివల్ల ఉద్యోగాలు పోతాయి.. అది కాస్తా సమాజంలో అసంతృప్తికి దారితీస్తుంది. మొదటి శత్రువు చైనా.. ఎన్నికైన నాటి నుంచి చైనాకు ముకుతాడు వేస్తామనే ధోరణితోనే ట్రంప్ వ్యవహారాలు నడిచాయి. వాణి జ్య యుద్ధంలోనూ తొలి వేటు పడింది ఈ దేశంపైనే. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ట్రంప్ ముందుగా 3,400 కోట్ల డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలు వేసేశారు. ఇది చాలదన్నట్లు ఇంకో 20,000 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై 10% పన్ను అధికంగా విధించాలని నిర్ణయించారు. మూడో విడతగా ఇంకో 1,600 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై సుంకాలకు అమెరికా రంగం సిద్ధం చేస్తోంది. అమెరికా పన్నుల కారణంగా చైనాలో ఉత్పత్తి అవుతున్న ఫ్లాట్స్క్రీన్ టీవీలు, విమానాల విడిభాగాలు, వైద్య పరికరాల ధరలు పాతికశాతం పెరిగిపోయాయి. పండ్లు, కూరగాయలు, చేతిసంచులు, రిఫ్రిజిరేటర్లు, రెయిన్కోట్ల వంటి నిత్యావసర వస్తువులపై కూడా పన్నుపోటు పడింది. దీటుగా స్పందించిన చైనా ఈ పన్నుల దాడిపై చైనా కూడా దీటుగానే స్పందించింది. తొలిదఫా అమెరికా విధించిన స్థాయిలోనే 3,400 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై పన్నులు పెంచేసింది. ఫలితంగా అమెరికా నుంచి చైనాకు చేరే సోయాబీన్, ఆటోమొబైల్స్, సముద్ర ఉత్పత్తుల ధరలు కొండెక్కాయి. చైనా ఇంకో అడుగు ముందుకేసి అమెరికా తీరేం బాగా లేదంటూ ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు కూడా చేసేసింది. ఇరుగు పొరుగులపై కూడా... పన్నుల కొరడా ఝళిపించే విషయంలో ట్రంప్ ఇరుగు పొరుగును కూడా వదల్లేదు. ఉత్తరాన ఉండే కెనడా, దక్షిణాన ఉండే మెక్సికోతోనూ కాలు దువ్వాడు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పుత్తులపై సుంకాలు వి«ధించాడు. జపాన్పై కూడా ఇదే తీరుతో వ్యవహరించడంతో ఆ దేశం కూడా అమెరికాపై పన్నుల దాడికి సిద్ధమవుతోంది. అమెరికాలో తయారయ్యే కార్ల కంటే జపాన్ నుంచి దిగుమతి అయ్యే కార్ల సంఖ్య, వాటి విలువ చాలా ఎక్కువ అన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఫలితంగా అమెరికన్లు ఇకపై కొనే కార్ల ఖర్చు బోలెడంత ఎక్కువ కానుంది. దీంతో వారు జపాన్ కార్లపై ఆశలు వదిలేసుకోవాలి. లేదంటే.. రాజీపడి తమ దేశంలోనే తయారైన కార్లను కొనుక్కోవాల్సి వస్తుంది. ‘యూరోపియన్’ దేశాలపై.. స్టీలు, అల్యూమినియం విషయంలో కెనెడా, మెక్సికో, జపాన్లపై పన్నులు విధించిన అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలకూ దీన్ని వర్తింపజేసింది. ప్రతిగా యూరోపియన్ యూనియన్.. అమెరికన్లు అతిగా ఇష్టపడే బ్లూజీన్స్తోపాటు మోటార్ బైకులు, మద్యం ఉత్పత్తులపై పన్నులు పడ్డాయి. నాణ్యమైన ఇంజనీరింగ్ ఉత్పత్తులకు, కార్లకు పెట్టింది పేరైన జర్మనీ యూరోపియన్ యూనియన్లో భాగమన్నది తెలిసిందే! మన పరిస్థితి ఏమిటి? ట్రంప్ పన్నుల యుద్ధం భారత్నూ వదల్లేదు. దాదాపు 29 వస్తువులపై పన్నులు విధిస్తూ గత నెలలో ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రతిగా అంతేస్థాయిలో భారత్ కూడా పన్నుల కొరడా ఝళిపించింది. ఉక్కు, అల్యూమినియంలపై విధించిన సుంకాలకు ప్రతిగా భారత్ 23.5 కోట్ల డాలర్ల విలువైన 30 ఉత్పత్తులపై పన్నులు వేసింది. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. కాలిఫోర్నియా నుంచి దిగుమతయ్యే బాదంపప్పు మొదలుకొని వాషింగ్టన్ ఆపిల్స్, కొన్ని ఇతర వస్తువులపై సుంకం విధించిన కారణంగా ఇకపై వాటి ధరలు మరింత ఎక్కువ కానున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యమే కాకుండా బ్యాంకులు, వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణంపైనా ఆ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొన్ని ఇతర దేశాల పరిస్థితి ఎలా ఉందంటే.. ఈ ఏడాది మార్చిలో అమెరికా, దక్షిణ కొరియాల మధ్య వాణిజ్య సంబంధాలను సులభతరం చేసుకునేందుకు ఒక ఒప్పందం కుదిరింది. అమెరికన్ కార్లకు దక్షిణ కొరియాలో భారీ మార్కెట్ కల్పించేందుకే ఈ ఒప్పందం. అయితే ట్రంప్ తీరు కారణంగా ఇప్పుడు ఈ ఒప్పందం ప్రశ్నార్థకమవుతోంది. ఉత్తర కొరియాను మంచి చేసుకునే క్రమంలో చాలాకాలంగా వ్యాపారం చేస్తున్న దక్షిణ కొరియాతో ట్రంప్ పన్నుల తగువుకు సిద్ధమవుతున్నాడు. ఫలితాలేమిటి..? ట్రంప్ మొదలుపెట్టిన పన్నుల యుద్ధం ప్రపంచానికి మంచిది కాదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మార్క్ కార్నే ఈ యుద్ధం అమెరికాకే చేటు చేస్తుందని, ఆర్థిక వ్యవస్థ 5 శాతం వరకూ నష్టపోవచ్చని హెచ్చరించారు. మూడేళ్లలో జీడీపీ వృద్ధి కూడా 2.5 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. అమెరికా తాను వ్యాపారం చేసే అన్ని దేశాలపై కనీసం పది శాతం పన్నులు వేసినా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థూల ఉత్పత్తి ఒకశాతం వర కూ తగ్గుతుందని అంచనా. యూరోపియన్ యూని యన్, యూకేల నష్టం కూడా ఇదే స్థాయిలో ఉండవచ్చని అంచనా. ట్రంప్ పన్నులు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే.. యూరప్లో తయారైన ఒక కారు ధర అమెరికాలో సగటున రూ.8 లక్షల వరకూ ఎక్కువవుతుంది. పన్నుల కారణంగా వాహనాల అమ్మకాలు తగ్గిపోతే అమెరికాలోని కార్ల ఫ్యాక్టరీల్లో తగ్గి పోయే ఉద్యోగాలు 2 లక్షలుంటాయి. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై పన్నులు పెంచేస్తే ఈ సంఖ్య 6.25 లక్షలు అవుతుందని పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ చెబుతోంది. టెక్ కంపెనీలపై దుష్ప్రభావం చైనా నుంచి దిగుమతయ్యే నెట్వర్క్ పరికరాలపై భారీగా సుంకాలు విధించాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఇదే జరిగితే సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీలపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. వచ్చే నెలాఖరు నుంచి మోడెమ్స్, రౌటర్స్ వంటి 20 వేల కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10 శాతం సుంకం అమలు కానున్న నేపథ్యంలో ఈ తాజా నిర్ణయంపై ఐటీ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్, అమెజాన్లు విశ్లేషిస్తున్నాయి. ఇక కంప్యూటర్ చిప్స్ తయారు చేసే ఇంటెల్ వంటి సంస్థలపైనా సుంకాల ప్రభావం పడబోతోంది. 300 కోట్ల డాలర్ల విలువైన సెమీ కండక్టర్లపై 25 శాతం సుంకాలు విధించడం చిప్ల తయారీ కంపెనీలైన ఇంటెల్, క్వాల్కామ్ (క్యూసీవోఎం)ల గుండెల్లో గుబులు పెంచుతోంది. కొన్ని అమెరికా కంపెనీలు తాము తయారు చేసిన కంప్యూటర్ చిప్స్ను అసెంబుల్, టెస్టింగ్, ప్యాకేజింగ్ కోసం చైనాకి పంపిస్తూ ఉంటాయి. తిరిగి అవి చైనా నుంచి అమెరికాకి వచ్చినప్పుడు భారీగా సుంకాలు చెల్లించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడబోతోంది. ఇప్పటికే వలస విధానాలు, పర్యావరణ సమస్యలతో సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్న సిలికాన్ వ్యాలీ ఈ వాణిజ్య యుద్ధంతో మరింత కుదేలైపోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లకూ దెబ్బే..! ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రభావం అమెరికన్లకూ తప్పదు. చైనా నుంచి చేసుకునే 20 వేల కోట్ల డాలర్ల దిగుమతులపై వేయనున్న పదిశాతం సుంకం వంటింటి దినుసులు మొదలుకొని చిన్నాచితకా యంత్రాలు, సైకిళ్లు ఇతర గాడ్జెట్ల ధరలను పెంచేయనున్నాయి. కత్తులు, ఫోర్కులు, ‘తిలాపియా’ చేపలు, ఆపిల్ జ్యూస్, వైన్ ధరలు పదిశాతం పెరగనుండగా, రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్లు, ఇతర గాడ్జెట్లూ ఖరీదు కానున్నాయి! వెల్లుల్లి మొదలుకుని వెదురు ఉత్పత్తులు, పుట్టగొడుగుల ధరలకూ రెక్కలు వస్తాయి. వాహనాల విడిభాగాలు స్పార్క్ ప్లగ్లు, పిస్టన్ ఇంజన్లు, వాహనాల మిర్రర్లు, సైకిళ్లు, గోల్ఫ్ బ్యాటింగ్ గ్లవ్స్ తదితర వస్తువులపై పన్ను పెరుగుతుంది. బాత్రూంలో తలస్నానం చేశాక తుడుచుకునే ఫ్లఫీ టవల్స్, తదితరాల ధరలు, హెయిర్ క్లిప్పర్స్, ఎలక్ట్రిక్ షేవర్స్, షేవింగ్ బ్రష్షులు, చైనాలో తయారైన లిప్స్టిక్, మేకప్ సామగ్రి కూడా పెరిగే జాబితాలోనే ఉన్నాయి. క్రిస్మస్ సందర్భంగా ఇళ్లలో ఏర్పాటు చేసే క్రిస్మస్ చెట్లతో పాటు ఇళ్లలో అలంకారానికి ఉపయోగించే లైటింగ్ సెట్లపైనా పన్నులు పెరుగుతాయి. చివరకు రోజంతా ఒళ్లు హూనమయ్యేలా పనిచేశాక సుఖంగా పడుకునేందుకు ఉపయోగించే చైనా మేడ్ పరుపుల ధరలూ వేడెక్కనున్నాయి. చమురు ధరలు పెరుగుతాయా? ట్రేడ్ వార్తో చమురు ధరలు బ్యారెల్కు 250 డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదని వాణిజ్య నిపుణుడు ఆర్టెమ్ అవినోవ్ అంచనా వేస్తున్నారు. అయితే చాలా వరకు ఇది సత్యదూరమని ఇతర నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు సరఫరాదారుల్లో ముఖ్యమైన ఇరాన్పై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ దేశం ప్రతీకార చర్యలకు దిగితే చమురు ధరలు కొండెక్కడం ఖాయమన్నది ఇందుకు కారణం. తమను ఒంటరిని చేసి ఆంక్షలు పెట్టడమే కాకుండా ఇతర దేశాల నుంచి అందుతున్న మద్దతునూ అడ్డుకుంటున్న అమెరికాపై ఇరాన్కు పీకల్దాకా కోపం ఉందన్నది సుస్పష్టం. దీంతో దేశం గుండా ఇతర దేశాలకు తరలిపోతున్న చమురు పైపులపై దాడి చేయవచ్చు లేదా అనేక చమురు దేశాల సరఫరాకు మార్గమైన హర్ముజ్ జలసంధి గుండా రవాణా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పరచవచ్చు. అలాంటిది జరిగితే 80 –90 డాలర్ల మధ్య ఊగిసలాడుతున్న చమురు ధర ఎకాఎకి కొంతకాలం పాటు 160 డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. అయితే ఇప్పటికే ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని బాగా పెంచిన నేపథ్యంలో ఇరాన్ కలిగించే నష్టాన్ని భర్తీ చేసేందుకు అవి ముందుకు రావచ్చు. భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. అయితే ఈ దేశం నుంచి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా హుకుం విధించడం అందుకు తగ్గట్టుగానే భారత్ దిగుమతులను కొంతవరకూ తగ్గించుకోవడం మనకు తెలిసిన విషయమే. -
చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్ : ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ఉధృతమవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై ట్రేడ్ వార్ బాంబు వేశారు. చైనా నుంచి దిగుమతి అయ్యే మరో 200 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. దీంతో ఆ దిగుమతులు అదనంగా 10 శాతం సుంకాలను ఎదుర్కోబోతున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన పలు ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వాటికి ప్రతీకారంగా ఇటీవలే చైనా కూడా 34 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. దీనికి కౌంటర్గా అదనంగా 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై ఈ సుంకాలను అమెరికా విధించింది. ఇలా అమెరికా, చైనాలు సుంకాల మీద సుంకాలు విధించుకుంటూ.. వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. అమెరికా చర్యలకు దీటుగా చైనా స్పందిస్తోంది. అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై కూడా అధిక సుంకాలు విధిస్తోంది. అయితే ప్రస్తుతం తాము చేపట్టిన టారిఫ్ యుద్ధం, చైనా అమెరికా మేథోసంపత్తి హక్కులను దొంగలించకుండా నిరోధిస్తుందని అమెరికా కార్యాలయ అధికారులు చెబుతున్నారు. చైనీస్ మార్కెట్లో యాక్సస్ పొందడానికి ట్రేడ్ సీక్రెట్లు చెప్పాలని అమెరికా కంపెనీలపై డ్రాగన్ ఒత్తిడి తెస్తుందని ఆరోపిస్తున్నారు. చైనా వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోందని వందల బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇది తమ ఆర్థికవ్యవస్థకు భవిష్యత్తులో ముప్పు కలిగిస్తుందని అమెరికా అధ్యక్ష ప్రధాన వాణిజ్య సందానకర్త రాబర్ట్ అన్నారు. ట్రంప్ ప్రస్తుతం చైనాపై తీసుకున్న ఈ చర్య వల్ల టెలివిజన్లు, వస్త్రాలు, బెడ్షీట్లు, ఎయిర్కండీషనర్లు ప్రభావితం కానున్నాయి. అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలకు ఇతర మార్గాల్లో కూడా ప్రతీకారం తీసుకోవాలని చైనా అధికారులు భావిస్తున్నారు. చైనాలో కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికా కంపెనీల్లో చెప్పాపెట్టకుండా తనిఖీలు, ఆర్థిక లావాదేవీల ఆమోదంలో జాప్యం, ఇతర కార్యాలయ తలనొప్పులను అమెరికా కంపెనీలకు విధించాలని డ్రాగన్ చూస్తోంది. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం విధిస్తున్నాయని, అమెరికాలో మాత్రం ఆయా దేశాల ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తున్నామని, ఇలా కాకుండా పరస్పరం ఒకే విధమైన సుంకాలు విధించే విధానం ఉండాలని డొనాల్డ్ ట్రంప్ అంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇతర దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచుతూ వస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. తొలుత స్టీట్, ఉక్కులపై సుంకాలు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. -
ఆర్థిక చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్వార్
బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేల్చిన ట్రేడ్వార్ బుల్లెట్పై చైనా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇది ఆర్థిక చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్వార్గా అభివర్ణించింది. 34 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్లను ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో చైనా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తమ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు అంతే స్థాయిలో తాము చర్యలు తీసుకోనున్నామని బీజింగ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా ఎగుమతులపై అంతేమొత్తంలో టారిఫ్లను విధించనున్నామని అంతకముందే బీజింగ్ హెచ్చరించింది. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య టారిఫ్ వార్ ఉధృతమవడంతో, ప్రపంచవ్యాప్తంగా కన్జ్యూమర్లు, కంపెనీలు అత్యంత ప్రమాదకరమైన జోన్లలోకి ప్రవేశిస్తున్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 16 బిలియన్ చైనీస్ ఉత్పత్తులపై కూడా 25 శాతం టారిఫ్లు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికాకు కౌంటర్ కచ్చితంగా ఇస్తామంటూ చైనా ప్రతిజ్ఞల మీద ప్రతిజ్ఞలు చేస్తోంది. ఒకవేళ బీజింగ్ నుంచి ఏమైనా ప్రతీకార చర్యలు వస్తే, తమ అడ్మినిస్ట్రేషన్ ఏమీ చూస్తూ ఊరుకోదని మరోవైపు నుంచి ట్రంప్ చెబుతున్నారు. దీనికి ఓ ముగింపు వచ్చేంత వరకు ట్రేడ్ వార్ ఆగదని కూడా చైనా చెబుతోంది. ఈ హెచ్చరికలను చూస్తే దెబ్బకు దెబ్బ అనే రీతిలో పెద్ద ఎత్తునే ట్రేడ్ వార్ను విజృంభించేలా ఉందని సీఎన్ఎన్ రిపోర్టు చేసింది. కేవలం చైనాతో మాత్రమే కాకుండా... అమెరికా దేశం యూరోపియన్ యూనియన్, కెనడా దేశాలతో కూడా ట్రేడ్ వార్ కొనసాగిస్తోంది. ఆయా దేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్లను విధించింది. వీటికి ప్రతీకారంగా కెనడా, ఈయూలు కూడా సుంకాలు విధించాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల మధ్య ట్రేడ్ వార్ మరింత ఉధృతమవుతుంది. -
ట్రంప్ ‘ట్రేడ్వార్’ బుల్లెట్ పేలింది, ఇక రణరంగమే..
వాషింగ్టన్ : ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికాకు, చైనాకు మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై ‘ట్రేడ్ వార్’ బుల్లెట్ ప్రయోగించారు. 34 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై టారిఫ్లను ధృవీకరిస్తూ.. ఈ అర్థరాత్రి నుంచి వీటిని అమల్లోకి తేనున్నట్టు వెల్లడించారు. ట్రంప్ ఆదేశాల మేరకు సెమికండక్టర్ల నుంచి ఎయిర్ప్లేన్ పార్ట్ల వరకు పలు చైనీస్ దిగుమతులపై 25 శాతం టారిఫ్లను అమెరికా కస్టమ్స్ అధికారులు సేకరించబోతున్నారు. అమెరికా మేథోసంపత్తి హక్కులను బీజింగ్ దొంగలిస్తుందని, అమెరికా వాణిజ్య అకౌంట్కు తీవ్రంగా తూట్లు పొడుస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించిన అనంతరం డైరెక్ట్గా చైనా ఉత్పత్తులపై టారిఫ్లు విధించడం ఇదే మొదటిసారి. మరో 16 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై మరో రెండు వారాల్లో టారిఫ్ మోత మోగనుందని కూడా హెచ్చరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగుతున్న క్రమంలో, ప్రపంచవ్యాప్తంగా కన్జ్యూమర్లు, కంపెనీలు అత్యంత ప్రమాదకరమైన జోన్లలోకి ప్రవేశిస్తున్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా సైతం అమెరికాకు కౌంటర్గా అంతేమొత్తంలో పలు అమెరికన్ ఉత్పత్తులపై టారిఫ్లను విధించనున్నట్టు ప్రకటించింది. వీటిలో సోయాబీన్స్ నుంచి పందిమాంసం వరకూ ఉన్నాయి. ఇటీవల స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్, ప్రపంచదేశాలన్నీ ఆగ్రహంతో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, కెనడా దేశాలు అమెరికాపై ప్రతీకార పన్నులు విధించేశాయి. అమెరికా ఐకానిక్ కంపెనీ హార్లీ డేవిడ్సన్ సైతం ఈయూ విధించే టారిఫ్లను తప్పించుకోవడానికి అమెరికా నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఒకవేళ చైనీస్ వాణిజ్యాన్ని దెబ్బతీసేందుకు పెద్ద మొత్తంలో ట్రంప్ ఏమైనా సుంకాలను విధిస్తే, చైనా కూడా అమెరికా కంపెనీలపై కస్టమ్స్ ఆలస్యం, పన్ను ఆడిట్లు, రెగ్యులేటరీ తనిఖీలను భారీగా పెంచి, జరిమానాలు విధిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ హెచ్చరించారు. అమెరికా కంపెనీలు ఆపిల్ ఇంక్, వాల్మార్ట్ ఇంక్ నుంచి జనరల్ మోటార్స్ వరకు అమెరికా కంపెనీలు చైనాలో వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీలన్నింటికీ ఈ ట్రేడ్ వార్ అతిపెద్ద ముప్పుగా అవతరించిందని ఆర్థిక వేత్తలంటున్నారు. -
ట్రంప్పై ప్రతీకారం : బిలియన్ డాలర్ల టారిఫ్లు
అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లపై ప్రపంచ దేశాలన్నీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిరసన వ్యక్తం చేయడమే కాకుండా.. ట్రంప్పై ప్రతీకారం కూడా తీర్చుకుంటున్నాయి. చైనా, భారత్, యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు.. తాజాగా కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై భారీగా టారిఫ్లను విధించింది. కెనడియన్ స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ కార్యాలయం విధించిన డ్యూటీలకు దెబ్బకు దెబ్బగా బిలియన్ డాలర్ల ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్టు కెనడా ప్రకటించింది. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం శుక్రవారం సుంకాల విధించే ఉత్పత్తుల తుది జాబితాను విడుదదల చేసింది. జూలై 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొన్ని ఉత్పతుల పన్నులు 10 శాతం నుంచి 25 శాతమున్నాయి. ఇది తీవ్రతరం కాదు, అలా అని వెనక్కి తీసుకోలేం అని కెనడియన్ విదేశీ మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్ అన్నారు. పన్నులు విధించిన ఉత్పత్తుల్లో కెచప్, గట్టి కోసే యంత్రాలు, మోటర్ బోట్స్ ఉన్నాయి. మొత్తంగా 12.6 బిలియన్ డాలర్లు సుంకాలను కెనడా అమెరికాపై విధించింది. ఇది డాలర్కు డాలర్ స్పందన అని ఫ్రీల్యాండ్ చెప్పారు. తమకు మరో దారి లేదన్నారు. చాలా అమెరికా ఉత్పత్తుల్లో ఆర్థిక సంబంధనమైన వాటితో పోలిస్తే రాజకీయపరమైనవే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ తమతో వాణిజ్య యుద్ధానికి తెరలేపితే, దానికి కూడా సిద్దమయ్యే ఉన్నామని హెచ్చరించారు. అయితే అల్యూమినియం, స్టీల్పై విధించిన సుంకాలను సమర్థించుకున్న ట్రంప్, దిగుమతి చేసుకునే మెటల్స్ వల్ల అమెరికా దేశ రక్షణకు ప్రమాదం వాటిల్లుతుందని తెలిపారు. దిగుమతి చేసుకునే కార్లు, ట్రక్కులు, ఆటో పార్ట్లపై విధించిన టారిఫ్లు కూడా దేశ రక్షణకు చెందిన టారిఫ్లని పేర్కొన్నారు. ఆటో పార్ట్లపై టారిఫ్లు విధించడంపై కెనడా ఎక్కువగా ఆందోళన చెందుతోంది. కెనడా ఆర్థిక వ్యవస్థకు ఇవి ముఖ్యమైనవి. అమెరికాలో తయారయ్యే కార్ల విభాగాలను కెనడాలోనే తయారు చేస్తారు. వీటి ఫలితంగానే అమెరికా ఉత్పత్తులపై కెనడా బిలియన్ డాలర్ల టారిఫ్లను విధించింది.