Karnataka Assembly Elections results
-
నన్ను ఓడించాలని బీజేపీనే ఓడింది: షెట్టర్
కర్ణాటక: కాంగ్రెస్కు నేను ఎటువంటి షరతులు విధించకుండా చేరాను. నేను మంత్రి కావాలన్నది ప్రజల అభిలాష. అయితే కొన్ని కారణాల వల్ల అవకాశం దొరకలేదని మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ తెలిపారు. నగరంలోని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవే కాకుండా మరిన్ని పదవులు ఉన్నాయని ఏ పదవి ఇచ్చినా నిర్వహిస్తానన్నారు. మంత్రి వర్గ విస్తరణ అయ్యాక చర్చించుకుందామని, వ్యక్తిగతంగా తాను ఎటువంటి ఆశలకు పోలేదన్నారు. నన్ను ఒక్కడిని ఓడించబోయి బీజేపీనే ఓడిపోయిందని అన్నారు. లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది ఉందని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానన్నారు. -
నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా
గంగావతి: గంగావతి నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి పరచి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తామని కేఆర్పీపీ సంస్థాపకులు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన నగరంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఓటర్ల అభినందన కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను రెండేళ్లలో పూర్తి చేస్తానని చెప్పారు. ఆరు నెలలలోపు మహిళలకు గార్మెంట్ ఫ్యాక్టరీని నిర్మించి వారికి ఉపాధి కల్పిస్తానని అన్నారు. నియోజక వర్గంలోని ఇరకల్గడ ఏరియా మెట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తానని, ఇందుకోసం నాలుగు సమాంతర జలాశయాలను నిర్మిస్తానని తెలిపారు. యువకులకు ప్రధానంగా స్థానికంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రమాణికంగా కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రదేశాలైన వెంకటగిరి, ఆనెగుంది, ఇతర ప్రాంతాల్లో తమ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి, అందులో వలంటీర్లను నియమించి ప్రజలకు ఇంటి వద్దకే సౌకర్యాలను తీసుకెళ్లే ఏర్పాటు చేస్తానన్నారు. నగరంలో రహదారులు, స్లం ఏరియా మౌలిక సదుపాయాలు, కల్పించి మాడ్రన్ సిటీగా మారుస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లాధ్యక్షుడు మనోహర్ గౌడ హెరూరు, పార్టీ యువజన విభాగపు రాష్ట్ర అధ్యక్షులు భీమశంకర్ పాటిల్, పార్టీ మహిళ విభాగపు జిల్లాధ్యక్షురాలు రాజేశ్వరి సురేష్, చెన్నవీరణ్ణగౌడ, టీజీ బాబు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జనార్ధన్రెడ్డిని ఈ సందర్భంగా నియోజక వర్గం నుంచి వచ్చిన అభిమానులు భారీ ఎత్తున పూలమాలలతో సన్మానించారు. -
బిల్లులు కట్టొద్దండి..బస్సుల్లో ఉచితంగా ప్రయాణించండి
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆర్.అశోక్ ఆరోపించారు. ఎవరూ కరెంటు బిల్లులు చెల్లించరాదని, మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలని సూచించారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరెంటు బిల్లులు చెల్లించవద్దని ఎన్నికల సమయంలో సిద్దరామయ్య, డీ.కే.శివకుమార్ ప్రచారం చేశారన్నారు. ఎవరైనా కరెంటు బిల్లులు చెల్లిస్తే సిద్దూ, డీకే శివకుమార్ను అవమానించినట్లు అవుతుందని ఎద్దేవా చేశారు. కరెంటు కనెక్షన్లు కట్ చేస్తే ప్రజల తరఫున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. గ్యారంటీ పథకాల అమలుపై షరతులు విధిస్తే ప్రజలను మోసిగించిట్లేనన్నారు. కాంగ్రెస్కు సత్తా ఉంటే ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని ఆయన సవాల్ విసిరారు. -
పేలిన కుక్కర్.. బాలికకు తీవ్ర గాయాలు
దొడ్డబళ్లాపురం: ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచిన ఉచిత కుక్కర్ పేలి బాలిక తీవ్రంగా గాయపడ్డ సంఘటన రామనగర తాలూకా కూనముద్దనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. మహాలక్ష్మి (17) కుక్కర్ పేలి గాయపడ్డ బాలిక. శుక్రవారం ఉదయం మహాలక్ష్మి అన్నం వండాలని బియ్యం కడిగి కుక్కర్ను స్టౌమీద పెట్టింది. అయితే కాసేపటికే పెద్ద శబ్దంతో కుక్కర్ పేలింది. దీంతో సమీపంలోనే ఉన్న మహాలక్ష్మి ముఖం, శరీరంపై కాలిన గాయాలయ్యాయి. తక్షణం బాధితురాలిని రామనగర జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎలెక్షన్ సమయంలో అభ్యర్థి ఒకరు ఈ కుక్కర్లను ఇంటింటికీ వచ్చి ఉచితంగా పంపిణీ చేశారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
బోసురాజుకు మంత్రి పదవి?
రాయచూరు రూరల్: రాష్ట్ర మంత్రివర్గంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.బోసురాజుకు పార్టీ అధిష్టానం మంత్రి పదవి కల్పించనున్నట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.బోసురాజు అసెంబ్లీ, విధాన పరిషత్ సభ్యుడు కాకపోయినా మంత్రివర్గంలో చోటు కల్పించడంపై అసంతృప్తి నెలకొంది. జిల్లాలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ, సింధనూరు ఎమ్మెల్యే హంపన గౌడ బాదర్లి అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఎన్నికై న ప్రజాప్రతినిధులను కాదని, ఎమ్మెల్యే(ల్సీ) కాని వారిని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బోసురాజుకు అమాత్య పదవిని కేటాయించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతోంది. నాగేంద్రకు అమాత్యగిరి? బళ్లారిఅర్బన్: వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలతో మమేకమై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన యువనేత, గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర శనివారం బెంగళూరులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు సమాచారం. సిద్దరామయ్య కేబినెట్లో సభ్యునిగా నాగేంద్ర పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ముఖ్యంగా ఆయన అభిమానుల్లో సంబరాలు నిండాయి. తాజా ఎన్నికల్లో ఆయన ఏకంగా బీజేపీ కీలక నేత బీ.శ్రీరాములుపై అఖండ మెజార్టీతో జయభేరి మోగించడం సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో ఆయనకు మంత్రి పదవి వరించిందని తెలుస్తోంది. -
అప్పుడు ఉచితమని.. ఇప్పుడు షరతులా?
కర్ణాటక: అధికారంలోకి వచ్చిన తక్షణమే 5 గ్యారంటీ పథకాలు జారీ చేయనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటికీ వాటిని అమలు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరూ కూడా విద్యుత్ బిల్లు చెల్లించవద్దని, మహిళలు టికెట్ లేకుండా బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. శుక్రవారం ఆయన జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐదు గ్యారంటీ పథకాలు ఉచితమని ఎన్నికల సమయంలో చెప్పిన సిద్దూ..ఇప్పుడు ఆ పథకాలకు షరతులు పెట్టాలనడం ప్రజలను మోసగించడమేనన్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఏ భవనం ప్రారంభోత్సవం సందర్భంలో కూడా రాష్ట్రపతి గాని, గవర్నర్ను గాని ఆహ్వానించిన దాఖలాలు లేవన్నారు. చత్తీస్ఘడ్ విధానసభ శంకుస్థాపనకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించారు గాని, గవర్నర్ను ఆహ్వానించ లేదన్నారు. పార్లమెంట్ నూతన భవనం ఉద్ఘాటన కార్యక్రమానికి జేడీఎస్ మద్దతు ఇస్తోందని, కార్యక్రమానికి దేవెగౌడ హాజరవుతారన్నారు. కాగా రాష్ట్ర జేడీఎస్ అధ్యక్షుడిగా సీఎం ఇబ్రహీం, రాష్ట్ర జేడీఎస్ యూత్ ప్రెసిడెంట్లుగా ఇద్దరూ కొనసాగుతారని, వారి రాజీనామాలు అంగీకరించేదిలేదన్నారు. -
మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్సిగ్నల్
సాక్షి బెంగళూరు: పూర్తి స్థాయి కేబినెట్కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఇప్పటికే 8 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, తాజాగా మరో 24 మంది శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ జాబితాతో ఢిల్లీకి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ అక్కడ అధిష్టానంతో చర్చించి తుది జాబితాకు ఆమోదం పొందారు. ప్రస్తుతం మంత్రివర్గంపై ఓ కొలిక్కి రావడంతో ఇక శాఖల కేటాయింపు అంశంతో సిద్ధరామయ్య ముందు మరో కొత్త తలనొప్పి రానుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తమ సన్నిహితులకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేశారు. ఇక ఈ నూతన మంత్రులకు శాఖల కేటాయింపులోనూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం వరించకపోవడంతో కీలక శాఖలు తనకు అప్పగించాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో వరుస సమావేశమవుతూ మంత్రివర్గం కూర్పును ఒక కొలిక్కి తీసుకువచ్చారు. కాగా, పూర్తి స్థాయి మంత్రివర్గానికి అధిష్టానం ఆమోదం చెప్పినట్లు తెలిసింది. దీంతో కొత్తగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు రాజ్భవన్లో ఉదయం 11.45 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా తొలుత 20 మందిని మంత్రులుగా ప్రకటించి మరో నాలుగు స్థానాలను పెండింగ్లో పెట్టాలని భావించారు. అయితే మంత్రి పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకేసారి 24 స్థానాలు భర్తీ చేయాలని చివరికి నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో కొందరు సీనియర్లకు మొండిచేయి తప్పేలా లేదు. సీనియర్లు ఆర్వీ దేశ్పాండే, దినేశ్ గుండూరావు, అప్పాజీ నాడగౌడ, టీబీ జయచంద్ర, బీకే హరిప్రసాద్ వంటి నేతలకు మంత్రి పదవులు దక్కకపోవచ్చు. అయితే వీరంతా ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామనే హామీతో హైకమాండ్ పంపిస్తున్నట్లు తెలిసింది. -
ఢిల్లీకి వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం 20 మందికి బెర్తులు ?
కర్ణాటక: మంత్రివర్గ విస్తరణకు కసరత్తు ప్రారంభమైంది. కాంగ్రెస్ హైకమాండ్తో కొత్త మంత్రుల ఎంపికపై చర్చించి విస్తరణకు ముహుర్తం నిర్ణయించడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈసారి సుమారు 20 మంది మంత్రులను చేర్చుకోవాలని సీఎం తీర్మానించారు. ఇటీవల సీఎం, డీసీఎం, మరో 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరికి ఏ శాఖ కేటాయించాలి అనేదానిపై హైకమాండ్తో చర్చిస్తారు. మంత్రి పదవుల కోసం తీవ్ర పైపోటీ నెలకొనడం ఒకెత్తయితే, ఇప్పుడు ఉన్న మంత్రులు ప్రధాన శాఖల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. హైకమాండ్పై ఒత్తిడి పోటీ ఎక్కువగా ఉన్నందున ఎవరికి ఇవ్వాలి, ఎవరిని తప్పించాలి అనేది హైకమాండ్కు తలనొప్పిగా మారింది. కుల, ప్రాంతాలవారీగా అనేక అంశాల దృష్టిలో పెట్టుకుని మంత్రుల ఎంపిక జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులతో ఉభయులూ సమావేశమవుతారు. మంత్రుల జాబితా గురువారం సాయంత్రంలోగా ఫైనల్ కానుండగా, 27 లేదా 28వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని అంచనా. ఢిల్లీలో ఔత్సాహికుల మకాం పదవుల రేసులో ఉన్న సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. దినేశ్ గుండూరావ్, కృష్ణబైరేగౌడ, విజయానంద కాశప్పనవర్ తో పాటు పలువురు బుధవారమే ఢిల్లీకి బయలుదేరారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టినా మరో నాలుగైదు స్థానాలు ఖాళీగానే ఉంచాలని హైకమాండ్ నిర్ణయించినట్లు వచ్చినట్లు సమాచారం. పదవుల కోసం మరీ గట్టిగా ఒత్తిడి చేస్తే వాటిలో నుంచి కేటాయించడానికి వీలుంటుంది. అవకాశం అధికంగా ఉన్నవారు వీరే శివానందపాటిల్, లక్ష్మణ సవది, గణేశ్ హుక్కేరి, ప్రకాష్ హుక్కేరి, ఎస్ఎస్ మల్లికార్జున్, ఈశ్వరఖండ్రే, కృష్ణభైరేగౌడ, ఎం.కృష్ణప్ప, దినేశ్ గుండూరావ్, తన్వీన్సేఠ్, బైరతి సురేశ్, రాఘవేంద్ర హిట్నాళ్, టీబీ.జయచంద్ర, కేఎన్.రాజణ్ణ, హంపనగౌడ బాదర్లి, సంతోష్లాడ్, వినయ్ కులకర్ణి, బసవరాజ శివణ్ణనవర్, ఆర్బీ.తిమ్మాపుర, బీకే.సంగమేశ్, మధు బంగారప్ప, చెలువరాయస్వామి, నరేంద్రస్వామి, ఎన్ఏ హ్యారిస్, లక్ష్మీ హెబ్బాళ్కర్, శరణప్రకాష్ పాటిల్. -
బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి
కర్ణాటక: జేడీఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం తాత్కాలిక స్పీకర్ ఆర్.వీ.దేశపాండే ఆఫీసులో జేడీఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హెచ్.డీ.రేవణ్ణ, పార్టీలోని 19 మంది కొత్త ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీఎస్ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమార మాట్లాడుతూ ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. -
బీజేపీ ఎల్పీ సారథ్యం ఎవరికి?
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ సర్కారును విధానసభలో ఎదుర్కొనేందుకు గట్టి నేత కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటికీ ఎంపిక చేయకపోవడం గమనార్హం. సోమవారం నుంచి కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేలతో విధానసభ ప్రారంభమైంది. కాంగ్రెస్ పక్ష నేతగా, సీఎంగా సిద్ధరామయ్య ఉండగా, బీజేపీ ఎల్పీ నేతగా ఎవరు లేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అయితే ఈ మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల తరువాత ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమి గురించి ఆదివారం బీజేపీ ఆత్మావలోకనం జరిపినప్పటికీ ఇందులో ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై చర్చ జరగలేదు. ఆ రెండు వర్గాల నుంచి.. మాజీ సీఎం బసవరాజ బొమ్మైని ప్రతిపక్ష నేత చేయాలని కొందరు, దూకుడుగా ఉండే బసవనగౌడ పాటిల్ యత్నాల్ని చేయాలని మరికొందరు పట్టుబట్టినట్లు సమాచారం. లింగాయత, ఒక్కలిగ ముఖం కలిగిన హిందూత్వ ఎజెండాను ఎత్తుకుని నడిపించే నాయకుడి కోసం బీజేపీ నాయకత్వం అన్వేషిస్తోంది. నిరాణి, సుధాకర్, సీటీ రవి వంటివారు జాబితాలో ఉన్నప్పటికీ వారు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో బీఎస్ యడియూరప్ప ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొగలిగే సీనియర్ల కొరత బీజేపీ వేధిస్తోంది. సీనియర్లు చాలా మంది ఓటమి పాలవ్వడం, గెలిచిన వారిలో చాలా మంది కొత్తవారు కావడం ఇలాంటి తరుణంలో ఎవరిని ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలనే అంశంపై హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలపై.. లింగాయత్ వర్గానికి చెందిన మాజీ సీఎం బసవరాజు బొమ్మై, ఒక్కలిగ వర్గానికి చెందిన శోభ కరంద్లాజే, సీఎన్ అశ్వత్థ నారాయణ, సీటీ రవిలో ఒకరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించే విషయంపై కూడా బీజేపీ చర్చ జరుగుతోందని తెలిసింది. జేడీఎస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఒక్కలిగలను ఇప్పటినుంచే తమ వైపునకు తిప్పుకునేందుకు ఆ సామాజికవర్గ నేతనే అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని భావిస్తున్నారు. -
భవిష్యత్లో మెజార్టీతో వస్తా
శివాజీనగర: ప్రజల ఆశీర్వాదంతో 12 సంవత్సరాల తరువాత విధానసౌధలోకి కాలుపెడుతున్నాను. ఇప్పుడు ప్రజలు తనను ఒక్కడిని మాత్రమే గెలిపించి పంపారు. భవిష్యత్లో అధిక మెజార్టీతో విధాన సౌధకు వస్తానని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి అన్నారు. సోమవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడిన ఆయన, కొన్నేళ్ల తరువాత మళ్లీ విధానసౌధలోకి ప్రవేశిస్తున్నాను. తమ పార్టీకి అనేక మంది ప్రజలు ఓటు వేశారు. వారి ఆశీర్వాదంతో విధానసౌధలోకి ప్రవేశించాను. ప్రజోపయోగ పనులకు తన మద్దతు ఉంటుంది. అసెంబ్లీలో ప్రజలకు అనుకూలమైన బిల్లు ప్రవేశపెట్టడంలో తన మద్దతు తప్పకుండా ఉంటుంది. ఎవరికి తన అవసరం ఉంటుందో వారికి తన మద్దతు ఇస్తానన్నారు. -
కర్ణాటక ఫలితాలు..మాజీ సీఎం కుమారస్వామి వైరాగ్యం
దొడ్డబళ్లాపురం: నా నిరీక్షణ ఫలించలేదు..మీడియా వారి నిరీక్షణ ఫలించింది అంటూ మాజీ సీఎం కుమారస్వామి వైరాగ్య వ్యాఖ్యలు చేసారు. గురువారం చెన్నపట్టణలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసారు. అయితే ఇలాంటి ఫలితాలు తమ పార్టీకి కొత్తేమీ కాదన్నారు. దేవె గౌడ రెండుసార్లు ఓటమిపాలయ్యాక కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసారు. రాబో వు రోజుల్లో ప్రజలు జేడీఎస్ను కోరుకుంటారన్నారు. -
ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడమంటే..
బనశంకరి: కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఎన్నికకాగా 20వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలోనూ ఆయన ఐదేళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు ఐదేళ్లు అవధి ఆ పదవిలో ఉన్నది ముగ్గురు మాత్రమే. పలువురు ముఖ్యమంత్రులు అవధి పూర్తికాకముందే అధికారం కోల్పోయారు. మరికొందరు గడువు తీరకముందే ఎన్నికలు రావడంతో అవకాశం కోల్పోయారు. 2013 నుంచి 2018 వరకు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాటు పనిచేశారు. ఎస్.నిజలింగప్ప, దేవరాజ అరస్లు గతంలోనే పూర్తికాలం పదవిలో ఉండి సత్తా చాటుకున్నారు. తరువాత ఎంతోమంది సీఎంలు అయ్యారు కానీ సంక్షోభాలలో చిక్కుకుని, లేదా హైకమాండ్ చేత మధ్యలోనే పదవీచ్యుతులయ్యారు. మైసూరు సీఎం.. ఎస్.నిజలింగప్ప కర్ణాటక.. మైసూరు రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎస్.నిజలింగప్ప ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించారు. 1956 నుంచి 1958 వరకు కాంగ్రేస్ ప్రభుత్వంలో రెండేళ్లు పాటు సీఎంగా పరిపాలన చేశారు. 1958లో బీడీ జత్తి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 14, 1962 నుంచి 20 జూన్ 1962 వరకు సీఎంగా ఎస్ఆర్ కంఠి ఎన్నికయ్యారు. జూన్ 21, 1962 నుంచి సీఎంగా ఎన్నికై న నిజలింగప్ప మే 29, 1968 వరకు ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో ఉన్నారు. పథకాల్లో దేవరాజ్ అరస్ ముద్ర మైసూరు రాష్ట్రం కర్ణాటకగా మారిన తరువాత 1972 మార్చి 20 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవరాజ అరస్ ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. ఐదేళ్లపాటు ఆయన జనరంజక పాలన అందించారు. వెనుకబడిన వర్గాల బాగు కోసం అనేక పథకాలను అమలు చేశారు. 1978 ఫిబ్రవరి 28న మరోసారి ముఖ్యమంత్రి అయి 1980 జనవరి 7 వరకు పదవిలో కొనసాగారు. -
నాగేంద్రకు మంత్రి పదవి?
బళ్లారి అర్బన్: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారీటీని సాధించిన నేపధ్యంలో బళ్లారి గ్రామీణ నియోజక వర్గం నుంచి గెలుపొందిన బీ.నాగేంద్రకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముందు నుంచి సిద్దరామయ్యతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఐదు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఐదు మందిలో తుకారాం కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొదారు. అయితే గతంలో తుకారాం మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తొలిసారిగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని నాగేంద్ర కోరినట్లు సమాచారం. -
ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం పదవి ఎవరికి దక్కుతుందా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపైనే అధిష్టానంతో చర్చలు జరిపేందుకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు హస్తిన వెళ్లారు. సిద్ధరామయ్య, డీకేలు సీఎం పదవి చెరో రెండేళ్లు చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదించిందని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ డీకే కీలకవ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పంచుకోవడానికి సీఎం పదవి ఏమీ వారసత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు. అసలు ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనేమీ తమ ముందుకు రాలేదని చెప్పారు. అలాగే సిద్ధరామయ్యకు 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, దీంతో ఆయనకే అవకాశం లభిస్తుందని జరుగుతున్న ప్రచారంపైనా డీకే స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 135 అని, దీన్ని ఎవరు విడగొట్టలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మద్దతు గురించి అసలు అంత కచ్చితంగా సంఖ్య ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో డీకే పక్కనే ఉన్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఎమ్మెల్యేల మద్దతుపై ఇంకా కౌంటింగ్ జరాగాల్సి ఉందని జోకులు పేల్చారు. మరోవైపు కర్ణాటక సీఎం ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉదయం బేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకున్న డీకేతోనూ కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరపనుంది. ఇద్దరిని బుజ్జగించి సాయంత్రం వరకు సీఎం ఎవరనే విషయాన్ని తేల్చే అవకాశం ఉంది. కాగా.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని డీకే అంతకుముందే స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేలను విడగొట్టనని, వెన్నుపొటు పొడవనని స్పష్టం చేశారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడబోనని తేల్చిచెప్పారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్కు 20 సీట్లు తేవడమే తమ ముందున్న తదుపరి సవాల్ అని డీకే తెలిపారు. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. -
ఆ ఐదు శాతమే! రాత మార్చింది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం విలక్షణమైనదనే చెప్పాలి. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలవారీ ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసి ట్రెండునే మార్చేసిన గెలుపది. చారిత్రకంగా బీజేపీ, జేడీ(ఎస్)ల కంచుకోటలైన కీలక ప్రాంతాల్లో ఈసారి కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. అది కూడా రెండు పార్టీలనూ ఒకే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో దెబ్బ తీయడం విశేషం. బీజేపీ ఓడినా మొత్తమ్మీద ఆ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉండటం మరో విశేషం. బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 36.2 శాతం ఓట్లు రాగా ఈసారీ 36 శాతం దక్కాయి. కాకపోతే ఈసారి జేడీ(ఎస్) రాష్ట్రవ్యాప్తంగా కోల్పోయిన 7 శాతం ఓట్లలో 5 శాతం ఓట్లను బీజేపీ దక్కించుకుంది. అదే సమయంలో అంతిమ ఫలితాన్ని తేల్చడంలో కీలకంగా మారిన పలు అసెంబ్లీ స్థానాల్లో కలిపి మొత్తమ్మీద 5 శాతం ఓట్లను కాంగ్రెస్కు కోల్పోయింది. దాంతో మెజారిటీకి బీజేపీ సుదూరంలో ఆగిపోగా ఆ ఓట్ల ఊపుతో కాంగ్రెస్ గెలుపు బావుటా ఎగరేసింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ, ఈసారి 43 శాతం ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 66 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి గట్టి పట్టున్న ముంబై కర్ణాటక, జేడీ(ఎస్) దుర్గమైన పాత మైసూరు ప్రాంతాలు ఈసారి కాంగ్రెస్కు జై కొట్టాయి. కర్ణాటక ఫలితాల ప్రాంతాలవారీ విశ్లేషణలో ఇలాంటి పలు ఆసక్తికరమైన విశేషాలు తెరపైకి వస్తున్నాయి... కోస్తా కర్ణాటక బీజేపీ కంచుకోటల్లో ఈ ప్రాంతమూ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ బీజేపీదే పై చేయి. ఈసారి కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ రెట్టింపు సీట్లు నెగ్గిన, ఆ పార్టీకి ఊరటగా నిలిచిన ఏకైక ప్రాంతం కోస్తానే. ఇక్కడి 19 స్థానాల్లో బీజేపీ 13, కాంగ్రెస్ 6 నెగ్గాయి. అయినా 2018తో పోలిస్తే బీజేపీకి 3 సీట్లు తగ్గగా ఆ మేరకు కాంగ్రెస్కు పెరిగాయి. బీజేపీకి దాదాపుగా 3 శాతం ఓట్లు తగ్గి ఆ మేరకు కాంగ్రెస్కు పెరగడమే ఇందుకు కారణం. బెంగళూరు సిటీ రాజధాని కావడంతో పూర్తిగా నగర ఓటర్లతో కూడిన వైవిధ్యమైన ప్రాంతమిది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రతి ఎన్నికల్లోనూ నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతుంది. గత నాలుగు ఎన్నికల్లోనూ రెండు పార్టీలకూ దాదాపుగా చెరో 40 శాతం ఓట్లొచ్చాయి. ఈసారి కూడా బీజేపీ 46 శాతం, కాంగ్రెస్కు 41 శాతం ఓట్లు సాధించాయి. అయితే బీజేపీ 2018 కంటే 4 సీట్లు ఎక్కువగా గెలుచుకోగా కాంగ్రెస్ 2 స్థానాలు కోల్పోయింది. ఇక జేడీ(ఎస్) ఇక్కడ 2018లో గెలిచిన 2 సీట్లనూ కోల్పోయింది. ముంబై కర్ణాటక లింగాయత్ల ప్రాబల్యమున్న ఈ ప్రాంతం బీజేపీ కంచుకోట. 1990లో రాజీవ్గాంధీ చేతిలో తమ సామాజిక వర్గానికి చెందిన నాటి సీఎం వీరేంద్ర పాటిల్కు జరిగిన ఘోర అవమానం నేపథ్యంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ను దూరం పెట్టిన లింగాయత్లు ఈసారి ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు. దాంతో దాదాపు 45 శాతం ఓట్లతో మొత్తం 50 స్థానాల్లో ఏకంగా 33 సీట్లు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. గత 3 దశాబ్దాల్లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్ల శాతం 40 శాతం దాటడం ఇదే తొలిసారి! ఇక బీజేపీ ఈసారి దాదాపు 3 శాతం ఓట్లను కాంగ్రెస్కు కోల్పోయింది. దాంతో 2018తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోయి 16 సీట్లకు పరిమితమైంది. లింగాయత్ల జనాభా 20 శాతానికి పైగా ఉండి వారి ఓట్లు నిర్ణాయకంగా మారే మొత్తం 69 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఈసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. వీటిలో కాంగ్రెస్ ఏకంగా 45 సీట్లు కొల్లగట్టగా బీజేపీకి కేవలం 20 స్థానాలు దక్కాయి. పాత మైసూరు 64 అసెంబ్లీ స్థానాలతో రాష్ట్రంలో అతి పెద్ద ప్రాంతమిది. జేడీ(ఎస్)కు ఆవిర్భావం నుంచీ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఈసారి కాంగ్రెస్ ఇక్కడ ఏకంగా 42 శాతం ఓట్లు సాధించింది. 2018 కంటే ఇది ఏకంగా 7 శాతం ఎక్కువ! దాంతో కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యధికంగా ఇక్కడ 43 సీట్లు కొల్లగొట్టింది. మరోవైపు జేడీ(ఎస్) 2018తో పోలిస్తే ఏకంగా 9 శాతం ఓట్లు కోల్పోయింది. అప్పుడు 26 సీట్లు నెగ్గగా ఈసారి 14కు పరిమితమైంది. ఇక బీజేపీకి ఓట్లు 2.8 శాతం పెరిగినా ఏకంగా 11 సీట్లు తగ్గాయి! సెంట్రల్ కర్ణాటక ఇది స్వింగ్ ప్రాంతంగా పేరుబడింది. ఒక్కోసారి ఒక్కో పార్టీని ఆదరిస్తూ వస్తోంది. 2008లో బీజేపీని, 2013లో కాంగ్రెస్ను అక్కున చేర్చుకుంది. మళ్లీ 2018లో ఇక్కడి 23 సీట్లలో బీజేపీ 16 గెలవగా ఈసారి కాంగ్రెస్ 15 నెగ్గింది! హైదరాబాద్ కర్ణాటక తన కంచుకోటైన ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఈసారి స్వీప్ చేసేసింది. ఎస్సీల ఆదరణకు తోడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతం కావడం ఈసారి ఆ పార్టీకి మరింత కలిసొచ్చింది. దాంతో 46 శాతం ఓట్లతో మొత్తం 40 సీట్లకు గాను ఏకంగా 26 స్థానాలను ఒడిసిపట్టింది. బీజేపీ 10 సీట్లకు పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి సీఎం ఎంపికపైనే ఉంది. సీనియర్ లీడర్ సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్లలో అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎవరిని ఖరారు చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఇద్దరి నేతల అభిమానులు మాత్రం పోస్టర్ల వార్కు దిగారు. తమ నేతనే సీఎంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ డీకే ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అటు సిద్ధరామయ్య మద్దతుదారులు కూడా తమ నేతనే సీఎంగా ప్రకటించాలని ఆయన నివాసం బయట పోస్టర్లు కట్టారు. దీంతో అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. #WATCH | Karnataka Congress President DK Shivakumar's supporters put up a poster outside his residence in Bengaluru, demanding DK Shivakumar to be declared as "CM" of the state. pic.twitter.com/N6hFXSntJy — ANI (@ANI) May 14, 2023 #WATCH | Supporters of senior Congress leader Siddaramaiah put up a poster outside Siddaramaiah's residence in Bengaluru, referring to him as "the next CM of Karnataka." pic.twitter.com/GDLIAQFbjs — ANI (@ANI) May 14, 2023 మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. పోస్టర్లు, బ్యానర్లు కట్టినంత మాత్రాన వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయరని పేర్కొన్నారు. అధిష్టానమే అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని సీఎం ఎవరనేదని ఖరారు చేస్తుందని వ్యాఖ్యానించారు. కాగా.. సీఎం ఎంపిక కోసం కర్ణాటక శాసనసభ పక్షం బెంగళూరులో సమావేశమైంది. ఈ భేటీకి ఏఐసీసీ పరీశీలకులుగా సుషీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వార్ జీతేంద్ర సింగ్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదికలో సమర్పించనున్నారు. నివేదిక అందిన అనంతరం కర్ణాటక సీఎం ఎవరని అధిష్టానం ప్రకటించనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నో త్యాగాలు చేశా.. సిద్ధ రామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని డీకే శివకుమర్ మరోమారు స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసి ఆయనకు మద్దతుగా నిలిచానని తెలిపారు. సిద్ధరామయ్యకు పూర్తి సహకారం అందించినట్లు సీఎల్పీ సమావేశానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ -
నన్ను ఒంటరిని చేసిందెవరు?!.. జగదీశ్ శెట్టర్ రాయని డైరీ..
పార్టీ ఆఫీసులో ఒంటరిగా కూర్చొని ఉన్నాను. నా వెనుక గోడపై మోదీజీ ఉన్నారు. అమిత్ షా ఉన్నారు. అయినప్పటికీ నేనివాళ ఒంటరినే! ముప్పై ఏళ్లుగా హుబ్లీ–ధార్వాడ్ సెంట్రల్లో గెలుస్తూ వస్తూ, ఇవాళ ఓడిపోవడం వల్ల నేను ఒంటరిని కాలేదు. ముప్పై ఏళ్లకు ముందు హుబ్లీ–ధార్వాడ్లో అడ్రెసే లేని బీజేపీకి... గెలుపునే అడ్రెస్గా ఇచ్చిన నన్ను కాదని పార్టీ వేరొకరికి టికెట్ ఇచ్చినందు వల్ల నేను ఒంటరిని కాలేదు. బీజేపీ నుంచి బయటికి వచ్చి, కాంగ్రెస్లో చేరి, నా కారుకు కాంగ్రెస్ జెండా తగిలించుకుని, నా కారు అద్దాలపై కాంగ్రెస్ స్టిక్కర్ అంటించుకుని ఎన్నికల ప్రచారంలో తిరిగినందుకు నేను ఒంటరిని కాలేదు. ఏడోసారీ నేనే గెలిస్తే యడ్యూరప్ప తర్వాత నేనే నంబర్ వన్ అవుతానన్న భయంతో పార్టీ జనరల్ సెక్రెటరీ నాకు కాకుండా, వేరొకరికి పార్టీ టికెట్ ఇప్పించుకున్నందుకు నేను ఒంటరిని కాలేదు. మరెందుకు ఒంటరినయ్యాను?! గెలుస్తూ గెలుస్తూ వచ్చి ఓడినందుకా? అయినా నేనెక్కడ ఓడిపోయాను! విజయమే తొలిసారి నా తోడు లేక ఒంటరిదయింది. బీజేపీ నాపై నిలబెట్టి గెలిపించుకున్న మహేశ్ 30 వేల ఓట్ల తేడాతో విజేత అయితే కావచ్చు. బీజేపీ ముప్పై ఏళ్ల నియమ ఉల్లంఘనకు కూడా అదే 30 వేల ఓట్ల దూరం. మరి నన్ను ఒంటరిని చేసిందెవరు?! ‘‘ఇకనైనా ఆ గోడకున్న మోదీ, అమిత్షాల ఫొటోలు తొలగిస్తారా?’’ అని రెండు పార్టీల వాళ్లూ అడుగుతున్నారు. నేను ఓడినందుకు బీజేపీ. నేను గెలవనందుకు కాంగ్రెస్. అంతటా ఓడిపోయి బీజేపీ ఇక్కడ గెలిచింది. అంతటా గెలిచి కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోయింది. అప్పుడిక ఫొటోలు ఉంచేయడానికి, తీసేయడానికి పెద్ద తేడా ఏముంది? టికెట్ ఇవ్వనప్పుడే నేను ఫొటోలు తొలగించలేదు. ఓడినప్పుడు తొలగిస్తానా? ఓటమి కన్నా టికెట్ దక్కకపోవడం ఎక్కువ ఓటమి కాదా? ‘‘ఓటమిలో ఎక్కువ తక్కువలు ఉంటాయా?’’... నా బీజేపీ అంత రాత్మ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో అడుగుపెట్టి నన్ను ప్రశ్నిస్తోంది. ఆ అంతరాత్మ నా రూపంలో లేదు. యడ్యూరప్ప ఆకృతిలో ఉంది. ‘‘శెట్టర్జీ.. పార్టీ మిమ్మల్ని వదులుకోలేదు! మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తాను అంది. కేంద్ర మంత్రిని కూడా చేస్తానంది. స్వయంగా అమిత్షానే మీతో మాట్లాడారు. కానీ మీ దృష్టిలో ఆయన ఫొటోకు ఉన్న విలువ ఆయన మాటకు లేకుండా పోయింది. తప్పు చేశారు శెట్టర్జీ. కాంగ్రెస్లోకి మారి తప్పు చేశారు. కాంగ్రెస్కు మారుపేరు ‘ఖర్గే’ అని అనుకుని మీరు వెళ్లారు కానీ, సమన్యాయానికి మారుపేరు బీజేపీ అన్న సంగతిని మీరు మీ ఇగో వల్ల మర్చిపోయారు’’ అంది యడ్యూరప్ప ఆకృతిలోని నా అంతరాత్మ. ‘‘ఇగో కాదు. అది సెల్ఫ్ రెస్పెక్ట్..’’ అన్నాను. ‘‘ఇగోకు పోయినవారంతా చెప్పే మాటే అది శెట్టర్జీ! చెప్పండి.. మీరు కోరుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లింది? విజయానికా, అపజయానికా? రాజ్యసభకా, మీ హుబ్లీ–ధార్వాడ్ను గెలుచుకోలేని కాంగ్రెస్ పార్టీకా?’’ అన్నారు యడ్యూరప్ప. నేనిక.. నాది కాని నా అంతరాత్మతో సంభా షణను కొనసాగించ దలచలేదు. కుర్చీలో గిర్రున్న వెనక్కు తిరిగి గోడపై మోదీజీ, అమిత్షాల ఫొటోల వైపు చూశాను. నాపై నాకెంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో, వాళ్లపైనా అంతే రెస్పెక్ట్ ఉంది. అంత పెద్ద నాయకు లను అక్కడి నుంచి కదల్చదలచలేదు నేను. పెద్ద నాయకులు!! అయినా ప్రజల్ని మించిన పెద్ద నాయకులు ఉంటారా? కర్ణాటక అంతటా బీజేపీ కూలిపోతున్న ప్పుడు హుబ్లీ–ధార్వాడ్ను మాత్రం వాళ్లెందుకు గట్టిగా పట్టు కుని ఉన్నట్లు?! నన్నెందుకు ఒంటరిని చేసినట్లు? సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం కానీ, అదెప్పుడూ మన చేతుల్లో ఉండదు. -మాధవ్ శింగరాజు రాయని డైరీ జగదీశ్ శెట్టర్ (కర్ణాటక మాజీ సీఎం) -
తెలంగాణలో 'కర్ణాటక వ్యూహం'.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..!
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాదిన బీజేపీ కంచుకోటను భారీ మెజారిటీతో బద్దలుకొట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుపై గురి పెట్టింది. ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న హస్తం పార్టీ ఆ దిశగా అడుగులు ప్రారంభించనుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో సానుభూతి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంతోపాటు కన్నడ నాట ఫలించిన వ్యూహాలను కూడా ఉపయోగించాలని అధిష్టానం యోచిస్తోంది. కన్నడ కాంగ్రెస్లో కొదమ సింహాలైన డీకే శివకుమార్, సిద్దరామయ్యలను ఒకేతాటిపైకి తెచ్చి పార్టీలో ఐకమత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన విధంగానే తెలంగాణలో నేతలందరినీ ఒకేతాటిపైకి తెచ్చేలా శ్రేణులకు సంకేతాలు పంపుతోంది. సగానికిపైగా అభ్యర్థుల్ని ముందే ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, కుటంబపాలన, కుంభకోణాలపై బీఆర్ఎస్ను ఎండగడుతూనే పార్టీ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్టీ శ్రేణుల మధ్య అంతరం లేకుండా.. అంతర్గత కుమ్ములాటలు, పలువురు ముఖ్యమంత్రుల అభ్యర్థులు, నేతల మధ్య ఐకమత్యం లేకపోవడం... ఇదీ కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు కాంగ్రెస్ పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలంటే ముందుగా పార్టీ శ్రేణుల మధ్య అంతరం లేకుండా చూసుకోవాలని అధిష్టానం డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు సంకేతాలు పంపింది. వేర్వేరు పాదయాత్రలు, వేర్వేరు సభలు పెడుతూ కేవలం పార్టీ మేనిఫెస్టోనే ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేసింది. ఎన్నికల తేదీకి ముందుగా ఇద్దరు బడా నేతల్ని ఒకే వేదికపైకి తెచ్చి పార్టీలో ఎలాంటి పొరపొచ్ఛాలు లేవని సంకేతాలు పంపింది. తెలంగాణ కాంగ్రెస్లోనూ ఐకమత్యం లేకపోవడాన్ని గుర్తించి అధిష్టానం తొలిగా ఈ అంశంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించింది. సీనియర్లందరికీ వేర్వేరు టాస్్కలు అప్పగించి పార్టీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశం చేయనుంది. ముఖ్యమంత్రి అభ్యరి్థని కూడా ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటించేందుకు సిద్ధమైంది. కుమ్ములాటలను ప్రోత్సహించే నేతలకు ముందుగానే చెక్ పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అవినీతి.. ఉద్యోగ కల్పన తెలంగాణలో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని, అప్పుడే ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకెళ్లొచ్చని అధిష్టానం భావిస్తోంది. ప్రాజెక్టుల పేరిట చేస్తున్న అవినీతిపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్తుండగా.. దీన్ని మరింత పటిష్టంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలోనూ బీఆర్ఎస్ నేతల ప్రమేయంపై ఆరోపణలు వచి్చన నేపథ్యంలో ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. తెలంగాణలో కుటుంబ పాలనకు తెర దించి అధికారంలోకి వచ్చేలా శ్రేణులు కష్టపడాలని దిశానిర్దేశం చేయనుంది. తెలంగాణ ఉద్యమానికి కారణమైన అంశాల్లో ఒకటైన ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని, ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకొని మేనిఫెస్టోలో ఉద్యోగ కేలండర్ను పొందుపరచాలని భావిస్తోంది. ముందుగానే ప్రకటన అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ ఒక అడుగు ముందు వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటకలో 100 స్ధానాలు ప్రకటించినట్లే.. తెలంగాణలో నూ కనీసం 60 స్థానాల్లో ప్రకటించేందుకు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటోంది. ఏకాభిప్రా యం ఉన్న చోట్ల అభ్యర్థులను ముందుగా ప్రకటించి కదనరంగంలో ముందడుగు తమదేనని శ్రేణుల్లో నూతనోత్తేజం నింపాలని చూస్తోంది. అభ్యర్థుల విషయానికొస్తే ప్రజల్లో గుర్తింపు ఉన్న గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. మరింత ఉత్సాహంగా గర్జనలు తెలంగాణ కాంగ్రెస్ యువ గర్జన, దళిత–గిరిజన గర్జన, రైతు గర్జన అంటూ వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమని చెప్పింది. ఆయా వర్గాలకు అండగా ఉంటామని, అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెబుతూ వారికి దగ్గరయ్యే యత్నాలు ప్రారంభించింది. త్వరలోనే మహిళా గర్జన, యువ గర్జన, మైనారిటీ గర్జనలతో మరింతగా ప్రజల్లోకి వెళ్లడానికి సమాయత్తమవుతోంది. అన్ని వర్గాల ప్రజలకు చేదోడువాదోడుగా ప్రభుత్వం ఉంటుందన్న విశ్వాసం నెలకొనేలా మేనిఫెస్టో రూపొందించేలా అధిష్టానం కసరత్తు ప్రారంభించనుంది. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
మోదీ గుజరాత్ బిడ్డయితే.. కన్నడ బిడ్డను నేను
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఘనవిజయంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్లో ఉన్నాయి. సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత తనదేనని అన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. శనివారం సాయంత్రం కేపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కింది. కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. కర్ణాటక గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది. కన్నడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత నాది. తొలి కేబినెట్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కర్ణాటక మాదిరిగానే ఇతర స్టేట్స్లోనూ కాంగ్రెస్ను గెలిపిస్తాం అని అన్నారాయన. నేను గుజరాత్ బిడ్డనని మోదీ పదే పదే చెప్తుంటారు. మోదీ గుజరాత్ బిడ్డయితే నేను కన్నడ బిడ్డను.. రైతు బిడ్డను. మోదీ సహా కేంద్రమంత్రులంతా వచ్చి కర్ణాటకలో ప్రచారం చేసినా.. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారని, అందుకు కృతజ్ఞతలని ఖర్గే పేర్కొన్నారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారెంటీ స్కీంపై మా కేబినెట్ తొలి సంతకం చేస్తుంది. దేశాన్ని బీజేపీ అప్పుల పాలు జేసింది. మోదీ పదిసార్లు రోడ్షోలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. కర్ణాటక గెలుపు దేశానికి ఓ సందేశం. 2024 కూడా ఇదే విజయాన్ని సాధిస్తాం. రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కర్ణాటక ప్రజలందరిదీ. కాంగ్రెస్ను గెలిపించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు. ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. రాహుల్ భారత్ జోడో యాత్ర కలిసొచ్చింది. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కర్ణాటకకు పట్టిన గ్రహణం వీడింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యదే విజయం కాదు. ఇది కర్ణాటక ప్రజల విజయం. రేపు(ఆదివారం) సాయంత్రం సీఎల్పీ సమావేశం ఉంటుంది అని తెలిపారు. Live : ಜಂಟಿ ಮಾಧ್ಯಮಗೋಷ್ಠಿ, ಕೆಪಿಸಿಸಿ ಕಚೇರಿ. https://t.co/vwUf4mQ9RK — Karnataka Congress (@INCKarnataka) May 13, 2023 -
విమర్శకుల నోళ్లు మూయించిన అప్పాజీ
కర్ణాటక ఎన్నికల్లో మంత్రులు సహా కీలక నేతలెందరో ఓటమితో భంగపడ్డ వేళ.. ఆ రేసు గుర్రం విక్టరీని దావణగెరె దక్షిణ నియోజకవర్గం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. వయసైపోయింది.. ఇంకేం పోటీ చేస్తాడు? టికెట్ ఇచ్చినా గెలుస్తాడా? అంటూ విమర్శించిన వాళ్ల నోళ్లు మూయిస్తూ అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని మరీ గ్రాండ్ విక్టరీ సాధించారు 92 ఏళ్ల కాంగ్రెస్ నేత శామనూరు శివశంకరప్ప ఉరఫ్ అప్పాజీ. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం శివశంకరప్పకు కాంగ్రెస్ మరోసారి టికెట్ ఇచ్చినప్పుడు సొంత నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో దీటుగా బదులిచ్చిన శివశంకరప్ప.. ‘‘నేను రేసు గుర్రాన్ని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. భారీ మెజారిటీతో గెలుస్తా’’ అని శపథం చేశారు. మాటలతోనే కాదు.. ఇప్పుడు ఫలితాల్లో చేతల్లోనూ చూపించారు. దాదాపు 28 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. 👉 శామనూరు శివశంకరప్ప 1994లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అదే సంవత్సరంలో దావణగెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2004లో మరోసారి దావణగెరె నుంచి పోటీ చేసి గెలుపొందారు. 👉 2008 నుంచి దావణగెరె దక్షిణ నుంచి పోటీ చేస్తున్నారు. 2013, 2018, 2023లో వరుసగా గెలుపొందారు. మొత్తంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 👉 ఈ దఫా ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగి.. హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు. 👉 కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా బరిలోకి దిగి శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. 👉 దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 👉 శివశంకరప్పకు 84,298 ఓట్లు రాగా, ఆయన సమీప బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్ కు 56,410 ఓట్లు పడ్డాయి. 👉 ఈ ఎన్నికల్లో శివశంకరప్పకు పోటీగా బీజేపీ అజయ్కుమార్ను నిలబెట్టింది. ఆ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలతో అజయ్కుమార్కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో బీజేపీ విజయం సాధించడం ఖాయమనుకున్నారు. కానీ దావణగెరె నియోజకవర్గ ప్రజలు తమ అప్పాజీకే గెలుపు కట్టబెట్టారు. -
Karnataka: ఖట్టా-మీఠా
చాలా ఏండ్ల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ సాధించింది ఓ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు అక్కడి ఓటర్లు. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనబర్చిన ఓటర్లు.. చివరికి మంత్రులను, పలువురు కీలక నేతలను సైతం తమ ఓటు ఆయుధంతో తిరస్కరించారు. ► ఈ లిస్ట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ గురించి. బీజేపీ నుంచి సీటు నిరాకరించడంతో కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పోటీని ఆసక్తికరంగా గమనించాయి రాజకీయవర్గాలు కూడా. అయితే.. హుబ్బళ్లి-ధార్వాడ్- సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ► దేవగౌడ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. దేవేగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ.. రామ నగర స్థానం నుంచి ఓటమి పాలయ్యాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ నెగ్గారు. ► బొమ్మై సర్కారులో మంత్రులుగా చేసిన 13 మంది ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ► వరుణ నుంచి నుంచి సోమన్న ఓటమిపాలుకాగా.. బళ్లారి నుంచి పోటీ చేసిన శ్రీరాములు, చిక్కబళ్లాపూర్ నుంచి పోటీ చేసిన కె. సుధాకర్(హస్య నటుడు బ్రహ్మనందం ఈయన తరపున ప్రచారం చేశారు కూడా), కృష్ణ రాజపేట నుంచి కేసీ నారాయణ గౌడ, నవల్ గుండ్ స్థానం నుంచి పోటీ చేసిన సీసీ పాటిల్, హిరికేరూర్ నుంచి పోటీ చేసిన బీసీ పాటిల్ ఓటమి చెందారు. ► బీజేపీ కీలక నేత, పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి చిక్ మంగళూరు నుంచి ఓటమి పాలయ్యాడు. గెలిచిన ప్రముఖులు.. ► షిగ్గావ్ నుంచి పోటీ చేసిన భాజపా నేత, సీఎం బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారీ విజయం సాధించారు. ► వరుణ నుంచి పోటీ చేసి మాజీ సీఎం సిద్ధ రామయ్య విజయం సాధించారు. ► కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురా నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. డీకేకు లక్షకు పైగా ఓట్లు (70శాతం) రాగా.. భాజపా, జేడీఎస్ అభ్యర్థులకు 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ► జేడీఎస్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కుమారస్వామి చెన్నపట్న నుంచి మరోసారి గెలుపొందారు. ► కుమారస్వామి సోదరుడు హెచ్డీ రేవణ్ణ సైతం విజయం సాధించారు. ► ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ నుంచి పోటీ చేసి గెలు పొందారు. ఎన్నికల ముందు కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించిన గాలి జనార్దన రెడ్డి గంగావతి స్థానం నుంచి విజయం సాధించారు. ► షెట్టర్ మాదిరే బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన లక్ష్మణ్ సావడి అథని స్థానం విజయం సాధించారు. -
సంచలన విజయంతో కాంగ్రెస్ సరికొత్త రికార్డు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ విజయం సాధించింది. అలాగే అత్యధిక ఓటింగ్ శాతంతో మాత్రమే కాదు.. ఒక పార్టీకి విజయం దక్కడంలోనూ అక్కడ సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. 34 ఏళ్ల తర్వాత.. ఒక పార్టీ ఇంతేసి ఓటు షేర్, ఇన్నేసి స్థానాలతోనూ గెలుపొందడం ఈ ఎన్నికల్లోనే జరిగింది. ► 1994లో 115 స్థానాలు గెలుపొందిన జేడీఎస్ మొత్తం ఓటింగ్లో 33.54 శాతం ఓటు షేర్ దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా హెచ్డీ దేవగౌడ ప్రమాణం చేశారు. ► 1999 ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ 132 స్థానాలు కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో 40.84 శాతం ఓట్ షేర్ దక్కించుకుంది. ఎంఎం కృష్ణను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. ► 2004 ఎన్నికల్లో.. 79 స్థానాలు నెగ్గిన బీజేపీ.. కేవలం 28.33 శాతం ఓట్ షేర్ను దక్కించుకుంది. యాడియూరప్పను సీఎంను చేసింది. ► 2008లో 110 స్థానాలు గెలుపొందిన బీజేపీ.. 33.86 శాతం ఓట్ షేర్ను దక్కించుకుంది. మళ్లీ యడియూరప్పనే సీఎంను చేసింది. ► 2013 అసెంబ్లీ ఎన్నికల్లో.. 122 స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్.. 36.6 శాతం ఓటు షేర్ను దక్కించుకుంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసింది. ► 2018 ఎన్నికల్లో.. 104 స్థానాలు, 36.3 శాతం ఓటు షేర్ దక్కించుకుంది బీజేపీ. యాడియూరప్పను సీఎంను చేసింది. ► 2023 ఎన్నికల్లో.. 136 స్థానాలు, 43 శాతం ఓటింగ్తో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. గత ఎన్నికల్లో కంటే ఏకంగా ఐదు శాతం ఓటింగ్ను పెంచుకుంది కాంగ్రెస్. ఇక గతంలో.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ 178 స్థానాలు దక్కించుకుని.. 43.76 శాతం ఓటు షేర్ను కైవసం చేసుకుంది. వీరేంద్ర పాటిల్ను అప్పుడు సీఎంను చేసింది. -
ఇది సంతృప్తి చెందాల్సిన సమయం కాదు!: శశి థరూర్
కన్నడ నాట కాంగ్రెస్ అత్యథిక మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా కార్యాలయాల్లో సంబరాలు చేసుకుంటూ సందడిగా కనిపిస్తున్నారు. ఈ మేరకు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ దీనిపై స్పందిస్తూ..ఈ ఘన విజయానికి సంతృప్తి చెందాల్సిన సమయం కాదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు తగిన ఫలితం అందించాల్సిన తరుణం అని నాయకులుకు గుర్తు చేశారు. అలాగే కన్నడ నాట గెలిచిన తన కాంగ్రెస్ సహచరులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. ఇది వేడుకలకు సమయమే కానీ ఆత్మసంతృప్తికి మాత్రం కాదని అన్నారు. ఎందుకంటే మనం గెలిచేందుకు చేసిన కృషికి తగిన ఫలితం పొందాం. అంతకంటే ముందు మన గెలుపుకి కారణమైన కర్ణాట ప్రజలకు తగిన ఫలితాలను అందించాల్సిన సమయం కూడా ఇది అని ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా..కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చాలా వరకు నిజం చేస్తూ.. అనూహ్యంగా 224 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలిపోంది, విజయ డుండిభి మోగించడమే గాక సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో సీఎం రేసులో సిద్ధ రామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీ కే శివకుమార్ ఇద్దరూ ఉన్నందున అందరి దృష్టి ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన కీలక నిర్ణయంపైనే ఉంది. కాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తొలి కేబినేట్ సమావేశంలో హామీలను నెరవేర్చడంపైనే కర్ణాటక కాంగ్రెస్ దృష్టిసారిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. (చదవండి: ప్రజల తీర్పుని గౌరవిస్తాం: హెచ్డీ కుమారస్వామి) -
కర్ణాటక ఫలితంపై ప్రధాని మోదీ స్పందన
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారాయన. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు. అలాగే.. కర్ణాటక ఎన్నికల్లో మాకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు. బీజేపీ కార్యకర్తల కృషిని నేను అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తాం అని ట్వీట్ చేశారాయన. I thank all those who have supported us in the Karnataka elections. I appreciate the hardwork of BJP Karyakartas. We shall serve Karnataka with even more vigour in the times to come. — Narendra Modi (@narendramodi) May 13, 2023 Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations. — Narendra Modi (@narendramodi) May 13, 2023 బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్గా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు వారం రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం చేశారు మోదీ. దాదాపు మూడు వేల మందితో ఇంటరాక్ట్ అయినట్టు తెలుస్తోంది. పైగా కిలోమీటర్ల కొద్దీ ర్యాలీ నిర్వహించడమూ తెలిసిందే. -
ఎల్లుండే కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయోత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పుడు పెద్ద టాస్క్ వచ్చి పడింది. అదే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలి అని. సీఎం రేసులో సీనియర్ నేత సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇద్దరి పేర్లే మొదటి నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి వాళ్లు అధిష్టానం చూపు తమపైనే ఉందంటూ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో.. కర్ణాటకలో కొత్త సర్కార్ కొలువు దీరడానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ సాయంత్రం ప్రస్తుత సీఎం బొమ్మై తన రాజీనామాను గవర్నర్ను కలిసి సమర్పిస్తారు. ఎల్లుండి(మే 15వ) బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే యోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. అదేరోజు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా గతంలో డీకే శివకుమార్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ను పరిశీలిస్తే.. తన పుట్టినరోజునాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తనకు గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చారని డీకే ప్రకటించారు. దీంతో.. తన పుట్టినరోజు నాడే కొలువుదీరనున్న కొత్త సర్కార్లో డీకే శివకుమార్ స్థానం ఏమై ఉండొచ్చని?.. అధిష్టానం ఆయనకు ఏం గిఫ్ట్ ఇస్తుందనే చర్చ మొదలైంది కన్నడనాట. రేపు(ఆదివారం) సీల్పీ భేటీలో సీఎల్పీ నేతలను ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉండగా.. సీఎం ఎంపికపైనా సాయంత్రకల్లా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘‘మద్దతుదారులంతా నన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారా?(మీడియాను ఉద్దేశించి). నాకంటూ ప్రత్యేకించి మద్దతుదారులంటూ ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ అంతా నాకు అండగా ఉంది. ఈ విజయం అందరి సమిష్టి విజయం. సోనియా, రాహుల్ గాంధీలకు ఈ విజయం అంకితం’’: సీఎం అభ్యర్థి రేసుపై డీకే తాజా స్పందన ఇదీ చదవండి: 'జై బజరంగబలి' మా వెంటే ఉన్నాడు!: కాంగ్రెస్ -
కేరళ స్టోరీలాగే.. కర్ణాటక ఫలితాలపై కేటీఆర్ స్పందన
హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపించబోవని ట్వీట్ చేశారాయన. కేరళ స్టోరీ సినిమా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో ఎలా విఫలమైందో.. అదే విధంగా కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విభజనవాద రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటకవాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్, బెంగళూరుల మధ్య ఆరోగ్యకర పోటీ నెలకొనాలని ఆకాంక్షించారు. కర్ణాటకలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు అని తెలియజేశారాయన. Just the way Kerala Story failed to amuse people of Karnataka, similarly Karnataka election results will have NO bearing on Telangana Thanks to the people of Karnataka for rejecting ugly & divisive politics 🙏 Let Hyderabad and Bengaluru compete healthily for investments &… — KTR (@KTRBRS) May 13, 2023 ఇదీ చదవండి: సీఎం అభ్యర్థిపై ఖర్గే క్లారిటీ -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ గెలుపు సంబరాలు (ఫొటోలు)
-
కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలి.. జీవీఎల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. మ్యాజిక్ ఫిగర్ను దాదాపు క్రాస్ చేసే అవకాశం ఉంది. దీంతో, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, జీవీఎల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఉండదు. కర్ణాటక ఫలితాలు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతాయి. గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో మేమే గెలిచాం. కర్ణాటకలో బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. తొలుత మాకు 50 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ, అంతకంటే ఎక్కు సీట్లు మాకు వస్తున్నాయి. కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్నికల సంఘం ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ 111 స్థానాల్లో లీడింగ్లో ఉంది. బీజేపీ 73 స్థానాల్లో, జేడీఎస్ 30 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇక, కాంగ్రెస్కు ఫలితాలు ఫేవర్గా వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. Karnataka elections | Congress inches towards the halfway mark of 112, leads in 110 constituencies while BJP leads in 71 seats and JD(S) in 23, as per trends for 209 of 224 Assembly constituencies.#KarnatakaElectionResults pic.twitter.com/9tApdBlMzd — ANI (@ANI) May 13, 2023 ఇది కూడా చదవండి: రిసార్ట్ పాలిటిక్స్.. తెలంగాణను తాకిన కర్ణాటక రాజకీయం! -
కాంగ్రెస్కు కర్ణాటక ఖాయం!.. హైదరాబాద్లో రిసార్ట్ రాజకీయం!
సాక్షి హైదరాబాద్/ బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక, ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ముందంజలో దూసుకెళ్తున్నారు. దీంతో.. కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. ప్రస్తుత ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ దాదాపు 110 స్థానాల్లో ముందంజలో ఉండగా అధికార బీజేపీ 71 స్థానాల్లో, జేడీఎస్ 23 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఉన్నారు. Karnataka elections | Congress inches towards the halfway mark of 112, leads in 110 constituencies while BJP leads in 71 seats and JD(S) in 23, as per trends for 209 of 224 Assembly constituencies.#KarnatakaElectionResults pic.twitter.com/9tApdBlMzd — ANI (@ANI) May 13, 2023 మరోవైపు.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ షిమ్లాలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. కర్నాటకలో కౌంటింగ్ సందర్భంగా ఆమె హనుమాన్ గుడిలో ప్రార్థనలు చేశారు. దేశం, కర్నాటక ప్రజల శాంతి, సామరస్యం కోసం ప్రియాంకా గాంధీ ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. షిమ్లాలోని జాకూ ఆలయంలో ఆమె పూజలు చేశారు. #WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra offers prayers at Shimla's Jakhu temple pic.twitter.com/PRH47u36Zm — ANI (@ANI) May 13, 2023 ఇదిలా ఉండగా.. కర్టాటక అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ హైదరాబాద్పై పడింది. హైదరాబాద్లోని ప్రముఖ హోటల్స్లో కాంగ్రెస్ నేతలు రూమ్స్ బుక్ చేసుకున్నారు. తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్లో 20 రూములు, నోవేటల్ హోటల్లో 20 రూములను కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేతలు బుక్ చేసినట్టు సమాచారం. ఇవే కాకుండా మరికొన్ని హోటల్స్లో కూడా రూమ్స్ బుక్ చేసినట్టు సమాచారం. అయితే, కర్ణాటక, హైదరాబాద్కు సంబంధించిన వివిధ వ్యక్తుల పేర్లతో రూమ్స్ నిన్న బుక్ అయ్యాయి. కాగా, ఎన్నికల ఫలితాలను బట్టి ఎమ్మెల్యేలను ఈ హోటళ్లకు తీసుకొస్తారని సమాచారం. మరోవైపు.. ఏ పార్టీ నుంచి రూమ్స్ బుక్ చేశారో తమకు సమాచారం లేదని హోటల్ యజమాన్యాలు చెబుతున్నాయి. #WATCH | Karnataka Congress workers hail party leadership as they celebrate the party's lead in 95 Assembly constituencies Visuals from Congress office in Bengaluru pic.twitter.com/wHETDrMVuz — ANI (@ANI) May 13, 2023 ఇది కూడా చదవండి: కర్నాటకలో బీజేపీకి ఊహించని షాక్! -
Karnataka Results: కాంగ్రెస్కు లీడ్..బీజేపీకి ఫస్ట్ టైమ్ ఇలా..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఇక, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరి ఫైట్ నడిచింది. కాగా, పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గానూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీకి 82, కాంగ్రెస్కు 114, జేడీఎస్కు 23, ఇతరులకు 5 ఓట్లు లభించాయి. అయితే, ఇటీవలి కాలంలో జరిగిన ప్రతీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీకి భారీగా ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ దూసుకుపోయేది. కానీ అనుహ్యంగా కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ దూసుకెళ్లింది. తాజాగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ సీనియర్ నేతలు లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. #WATCH | Postal ballots to be counted first as counting of votes in Karnataka Assembly elections begins in Hubballi pic.twitter.com/BQ7tzIFZU5 — ANI (@ANI) May 13, 2023 ఇక, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి ముందు నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్పై జేడీఎస్ అధినేత కుమారస్వామి సెటైర్లు వేశారు. ఇంతవరకు తనతో ఎవరూ చర్చలు జరపలేదన్న కుమారస్వామి. మరో రెండు, మూడు గంటలు వేచి చూద్దామన్నారు. తనకు ఎవరూ ఆఫర్ చేయలేదని.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తానేనంటూ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023) అంతకుముందు, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం బసవరాజు బొమ్మ హుబ్లీలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేశారు. అభివృద్ధి పనులే గెలిపిస్తాయి.. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు కూడా గెలుపు తమదేనని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందే కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ ఆఫీసు వద్ద సంబురాలు చేసుకున్నారు. #WATCH | Celebrations underway at national headquarters of Congress party in New Delhi as counting of votes gets underway for #KarnatakaPolls. pic.twitter.com/e0eGObhLh3 — ANI (@ANI) May 13, 2023 #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 12 seats, BJP in 8 seats while the JDS leads in one seat.#KarnatakaPolls pic.twitter.com/hnkhpjfXqv — ANI (@ANI) May 13, 2023 -
కన్నడ మంత్రులకు శాఖల కేటాయింపు
బెంగళూరు: తర్జన భర్జనల అనంతరం కర్ణాటక సర్కారులో మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం కుమారస్వామి ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకోగా.. డిప్యూటీ సీఎం పరమేశ్వర హోం బాధ్యతలు నిర్వహించనున్నారు. కుమారస్వామి సోదరుడు రేవణ్ణకు ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ), కాంగ్రెస్ నేత డీకే శివకుమార్కు భారీ, మధ్య నీటిపారుదల, వైద్య విద్య శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆర్వీ దేశ్పాండేకు రెవెన్యూ, కేజే జార్జ్కు భారీ, మధ్యతరహా పరిశ్రమలు అప్పగించారు. ఏకైక మహిళామంత్రి జయమాలకు మహిళా, శిశుసంక్షేమ శాఖ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కృష్ణ బైర గౌడకు గ్రామీణాభివృద్ధి, శివ శంకర రెడ్డికి వ్యవసాయం, ప్రియాంక్ ఖర్గేకు సాంఘిక సంక్షేమæ శాఖ బాధ్యతలను అప్పగించారు. -
కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్ఆర్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. ఉత్తర (బాంబే) కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నా రాజీనామా లేఖను పంపించాను. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించనందుకు నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. ఉత్తర కర్ణాటకలో మా పార్టీ మరికొన్ని సీట్లు గెలిచుంటే.. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునేవాళ్లం’ అని పాటిల్ ఆదివారం బెంగళూరులో తెలిపారు. -
కర్ణాటకలో ఎట్టకేలకు శాఖలపై ఏకాభిప్రాయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముందడుగు పడింది. సంకీర్ణ ప్రభుత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ల మధ్య శాఖల పంపకంపై సయోధ్య కుదిరింది. జూన్ 6న కొత్త మంత్రులు ప్రమాణంచేస్తారని ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వరతో కలసి కుమారస్వామి శుక్రవారం గవర్నర్తో భేటీ అయిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేసి పది రోజులు పూర్తయినా కాంగ్రెస్, జేడీఎస్ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకంపై ప్రతిష్టంభన నెలకొనడంతో మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం తెలిసిందే. అటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్.. కుమారస్వామి, మాజీ సీఎం సిద్దరామయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వమే ముఖ్యం తప్ప మంత్రిత్వ శాఖలు కాదనీ, ఆర్థిక శాఖను జేడీఎస్కే ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారని వేణుగోపాల్ తెలిపారు. కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ మాకంటే మాకే కావాలంటూ కాంగ్రెస్, జేడీఎస్లు ఇన్నాళ్లూ పట్టుబట్టడం తెలిసిందే. ఈ అంశంపై మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడతో రాహుల్ ఫోన్లో మాట్లాడినట్లు వేణుగోపాల్ చెప్పారు. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేయాలని ఇరు పార్టీలూ నిర్ణయం తీసుకున్నట్లు వేణుగోపాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్కు దక్కే శాఖలు హోం, రెవెన్యూ, నీటి పారుదల, విద్య, వైద్యం, ఆరోగ్యం, బెంగళూరు నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం, అటవీ–పర్యావరణం, పరిశ్రమలు, కార్మిక, గనులు, భూ విజ్ఞాన శాస్త్రం మంత్రిత్వ శాఖలు దక్కనున్నాయి. వీటితోపాటు మహిళా–శిశు సంక్షేమం, ఆహార–పౌర సరఫరాలు, హజ్, వక్ఫ్, మైనారిటీ వ్యవహారాలు, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, విజ్ఞాన సాంకేతికత, సమాచార సాంకేతికత, యువజన–క్రీడలు, కన్నడ సంస్కృతి శాఖలు కాంగ్రెస్ వద్దే ఉంటాయి. జేడీఎస్కు దక్కే శాఖలు ఆర్థిక, ఎక్సైజ్, విద్యుత్తు, నిఘా, సమాచార, ప్రణాళిక–గణాంకాలు, ప్రజా పనులు, సహకారం, పర్యాటకం, మత్స్య పరిశ్రమ, పశు సంవర్ధక శాఖ, ఉద్యాన, పట్టు పురుగుల పెంపకం, చిన్న తరహా పరిశ్రమలు, రవాణా, సూక్ష్మ నీటి పారుదల శాఖలు జేడీఎస్కు దక్కాయి. -
జేడీఎస్కు ఆర్థికం, కాంగ్రెస్కు హోం!
న్యూఢిల్లీ/బెంగళూరు: కన్నడనాట మంత్రి పదవుల పంపిణీ ఓ కొలిక్కివచ్చింది. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణం ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక మంత్రి పదవి జేడీఎస్కు, హోం శాఖ కాంగ్రెస్కు ఇచ్చేట్లు ఒప్పందం కుదిరిందని ఆయా పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. రెండు పార్టీల ముఖ్య నేతలు ఢిల్లీలో కొనసాగించిన పలు దఫాల చర్చల్లో పదవుల కేటాయింపుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై విదేశాల్లో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇక్కడి నేతలతో ఫోన్లో మాట్లాడారని వెల్లడించాయి. పదవుల కేటాయింపు ఒప్పందం తుది దశలో ఉందని తెలుస్తోంది. అయితే, తుది నిర్ణయం తీసుకోబోయే ముందు కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, జేడీఎస్ ప్రధాన కార్యదర్శి డానిష్ అలీ బెంగళూరు వెళ్లి తమ పార్టీ నేతలతో మాట్లాడతారని సమాచారం. ‘ మా పార్టీకి ఆర్థిక శాఖ ఇవ్వాలని అంగీకారం కుదిరింది. దీనిపై బెంగళూరు వెళ్లి సీఎంతోపాటు పార్టీ అధినేత దేవెగౌడతో మాట్లాడి ఖరారు చేస్తాం’ అని జేడీఎస్ నేత డానిష్ అలీ తెలిపారు. మే 23వ తేదీన జేడీఎస్కు చెందిన కుమారస్వామి సీఎంగా, కాంగ్రెస్ నేత పరమేశ్వర డెప్యూటీ సీఎంగా ప్రమాణంచేశాక కీలక మంత్రిత్వశాఖలపై రెండు పార్టీలు పట్టుబట్టాయి. నేడు ప్రకటిస్తాం: సీఎం కేబినెట్ విస్తరణ, మంత్రి పదవుల కేటాయింపుపై శుక్రవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఎం కుమారస్వామి చెప్పారు. ‘నాతో పాటు జేడీఎస్ అధినేత దేవెగౌడ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఢిల్లీలో జరిగిన పరిణామాలపై చర్చలు జరిపి, అంతిమ నిర్ణయం శుక్రవారం ప్రకటిస్తాం’అని చెప్పారు. ఆర్థిక శాఖ విషయమై ఇబ్బందుల్లేవని, అంగీకారానికి వచ్చామని సమాధానమిచ్చారు. -
15 రోజుల్లో మాఫీపై నిర్ణయం
బెంగళూరు: రుణమాఫీపై 15 రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం కుమారస్వామి చెప్పారు. ప్రతి రైతు ఇంటికొచ్చి వారి రుణాలను రద్దుచేసినట్లు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లని, చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయానికి తీసుకున్న రుణాలను రెండు దశల్లో మాఫీ చేస్తామని చెప్పారు. బుధవారం ఆయన రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రైతులు ఎంత రుణం తీసుకున్నా మాఫీచేస్తామని స్పష్టంచేశారు. 2009 ఏప్రిల్ 1 – 2017 డిసెంబర్ మధ్య రుణాలు పొందిన రైతులకు పథకాన్ని వర్తింపజేస్తారు. వేడుకలు, బైకులకు వాడుకున్న రుణాలనూ రద్దుచేయాలా.. సాగు కోసం తీసుకున్న రుణాలతో కొందరు పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారని, కొందరు బైకులు కొనుగోలు చేస్తున్నారని కుమారస్వామి అన్నారు. అలాంటి వారి రుణాలను కూడా మాఫీ చేయాలా అని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘రుణ మాఫీపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే, రైతులను కాపాడేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాఫీ చేయాల్సిన మొత్తం ఎంతో లెక్కగడుతున్నాం. మరో 2–3 రోజుల్లో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకుంటాం’ అని కుమారస్వామి అన్నారు. ప్రతి జిల్లాలో నియమించే నోడల్ అధికారి రుణాలు పొందిన రైతుల వివరాలు సేకరిస్తారని, వాటి ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తాను, ఉపముఖ్యమంత్రి పరమేశ్వర సమావేశమై ఈ విషయంపై చర్చిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రూ.53 వేల కోట్ల విలువైన రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచార సమయంలో జేడీఎస్ ప్రకటించింది. ఈ హామీ అమలు ఆలస్యమవడంతో బీజేపీ సోమవారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
కర్ణాటకలో శాఖలపై కాక!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీఎస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేపోతోంది. అధిష్టానం కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. డిప్యూటీ సీఎం పరమేశ్వర అధిష్టానంపైనే పూర్తి విశ్వాసం ఉంచగా సిద్దరామయ్య త్వరగా తేల్చాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. అధిష్టానం విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆర్థిక శాఖ సహా కీలకమైన 4 శాఖలపై నిర్ణయం తీసుకోలేదు. రైతు రుణమాఫీ నేపథ్యంలో ఇది తనవద్దే ఉంచుకోవాలని సీఎం పట్టుబడుతుండగా.. తమకే కావాలని సిద్దరామయ్య ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పార్టీ ట్రబుల్ షూటర్ గులాంనబీ ఆజాద్ డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారూ మంత్రి పదవుల కోసం పట్టుబట్టడం కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారింది. అటు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, సీఎం సోదరుడు రేవణ్ణలు పీడబ్ల్యూడీ శాఖ కావాలంటున్నారు. కాంగ్రెస్ పలు శాఖలపై ఒత్తిడి తెస్తుండటంతో సంకీర్ణంపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని బయటపెట్టేలా జేడీఎస్ ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. కింది స్థాయిలో ఇరుపార్టీల్లోనూ అసంతృప్తి తారస్థాయిలో కనబడుతోంది. ఫలితాలు రాగానే బేషరతు మద్దతు ఇస్తామంటూ కాంగ్రెస్ ముందుకొచ్చిందని ఇప్పుడు కొర్రీలు పెట్టడం సరికాదంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాహుల్ గాంధీ విదేశాల నుంచి భారత్కు తిరిగొచ్చాకే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. పుణ్యాత్ముడివల్లే అధికారం: కుమారస్వామి సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ను కుమారస్వామి పుణ్యాత్ముడితో పోల్చారు. ఆ పుణ్యా త్ముడి వల్లే అధికారంలోకి వచ్చానన్నారు. ‘ఈరోజు నాకు ప్రజల ఆశీస్సులు లేకున్నా పుణ్యాత్ముడు రాహుల్ నాపై నమ్మకం ఉంచడం వల్లే అధికారం దక్కింది. ఆయన్ని కూడా విశ్వాసంలోకి తీసుకునే ఓ నిర్ణయం తీసుకుంటా’ అని రైతులతో కుమారస్వామి అన్నారు. ప్రజా విశ్వాసం కాకుండా కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపైనే తాను ఆధారపడి ఉన్నానని గతంలో వ్యాఖ్యానించడంతో బీజేపీ సహా అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. -
నేడో రేపో మంత్రివర్గ కూర్పు
న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకంపై ఉత్కంఠకు తెరపడనుంది. సోమ లేదా మంగళవారానికి మంత్రిత్వ శాఖల కేటాయింపులపై నిర్ణయం వెలువడుతుందని కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ ఆదివారం చెప్పారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్య చికిత్స నిమిత్తం, ఆమె కొడుకు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి విదేశాలకు వెళ్లారు. వారు తిరిగి రావడానికి కనీసం వారం పడుతుందనీ, అప్పటివరకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని తొలుత ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిపై కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, సోనియా, రాహుల్ల విదేశీ పర్యటన మంత్రివర్గ కూర్పుకు ఆటంకం కాబోదని స్పష్టం చేశారు. ఫోన్లో సంప్రదించడానికి రాహుల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకం ఇంకా పూర్తికాకపోవడం తెలిసిందే. రాష్ట్ర నేతలతో సంప్రదించి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న అనంతరం తుది ఆమోదం కోసం ఆ జాబితాను అధిష్టానానికి పంపుతామని వేణుగోపాల్ చెప్పారు. ఆర్థిక, హోం, ప్రజా పనులు, విద్యుత్తు, నీటిపారుదల, పట్టణాభివృద్ధి తదితర కీలక మంత్రిత్వ శాఖల పంపకాలపై కాంగ్రెస్–జేడీఎస్ల మధ్య విభేదాలు తలెత్తడం తెలిసిందే. ముఖ్యమంత్రిగా జేడీఎస్కు చెందిన కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వర ఇప్పటికే ప్రమాణం చేశారు. ఒప్పందం ప్రకారం ఇంకా కాంగ్రెస్కు 21, జేడీఎస్కు 11 మంత్రిపదవులు దక్కాల్సి ఉంది. యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలను ఆమోదించారా? బీజేపీకి చెందిన ఎంపీలు బీఎస్ యడ్యూరప్ప, బి.శ్రీరాముల రాజీనామాలపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ లోక్సభ సెక్రటేరియట్ను కోరారు. కర్ణాటకకు చెందిన ఎంపీలు బీఎస్ యడ్యూరప్ప, బి.శ్రీరాములు ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో వారిద్దరూ లోక్సభకు రాజీనామాలు సమర్పించినట్లు ప్రకటించారు. వారి రాజీనామాలను వెంటనే ఆమోదించినట్లు ప్రకటించిన లోక్సభ సెక్రటేరియట్.. వెబ్సైట్ లో మాత్రం ఆ స్థానాలను ఖాళీగా చూపడం లేదని అహ్మద్ పటేల్ చెప్పారు. ఈనెల 17వ తేదీన ఆ ఇద్దరూ రాజీనామా చేయగా 27 వరకు వారిని ఎంపీలుగానే వెబ్సైట్ చూపుతోందనీ, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. -
మీ పదవీకాలం సజావుగా సాగాలి: మోదీ
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జేడీఎస్ నేత కుమారస్వామికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ‘కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసిన కుమారస్వామి, పరమేశ్వరలకు శుభాకాంక్షలు. వారి పదవీకాలం సజావుగా సాగాలని కోరుకుంటున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీజేపీ దూరంగా ఉంది. కమల్ శుభాకాంక్షలు చెన్నై: కొత్త సీఎం కుమారస్వామికి మక్కల్ నీది మయ్యం అధినేత కమల్హాసన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘కొత్త ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఇది మంచి ఆరంభం’ అని ట్వీట్ చేశారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా, రాహుల్, ఏచూరి, కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యలతో కమల్ సమావేశమయ్యారు. -
కేపీసీసీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర సంపన్న దళిత కుటుంబంలో పుట్టి విదేశాల్లో ఉన్నత చదువులు కూడా చదివారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కష్టకాలంలోనూ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2010 అక్టోబరులో కేపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై బుధవారంవరకూ నిరంతరాయంగా కొనసాగి ఆ పదవిలో అత్యంత ఎక్కువ కాలం ఉన్న నేతగా రికార్డులకెక్కారు. తన భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తూనే మృదువుగా మాట్లాడగల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివిన అనంతరం ఆస్ట్రేలియాలోని వైటీ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత తమ కుటుంబం స్థాపించిన విద్యాసంస్థలకు పరిపాలనాధికారిగా పనిచేశారు. 1989లో పరమేశ్వర గురించి తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఆయనను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదే ఏడాది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి జనతాదళ్ అభ్యర్థిపై విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో 55.8 వేల ఓట్ల మెజారిటీ సాధించి తొలిసారిగా ఎస్ఎం కృష్ణ మంత్రివర్గంలో సహాయ మంత్రి పదవి పొందారు. 2013లో ఆయన కేపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా జరిగిన కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించినా పరమేశ్వర అనూహ్యంగా ఓడిపోయారు. -
అవకాశవాద కూటమి
న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్లది అధికారం కోసం ఏర్పడిన అవకాశవాద కూటమి అని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ విమర్శించారు. విపక్ష నేతలంతా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరవ్వడాన్ని ‘అవినీతి సంబరం’గా ఆయన అభివర్ణించారు. 2019 ఎన్నికల్లో ఆయా పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రధాని మోదీని ఓడించాలనుకోవడం పగటికలేనని ప్రసాద్ అన్నారు. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా గద్దెనెక్కిన ప్రభుత్వం ఇదని పేర్కొన్నారు. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ల సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన బుధవారాన్ని బీజేపీ బ్లాక్ డేగా పాటించింది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఆధ్వర్యంలో బెంగళూరులోని ఆనంద్ రావు కూడలి వద్ద గాంధీజీ విగ్రహం ముందు బీజేపీ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్లో మోసపోయామనే భావనలో ఉన్న నేతలు బీజేపీలోకి రావాలని యడ్యూరప్ప ఆహ్వానించారు. -
మోదీ అశ్వమేధ గుర్రాన్ని కట్టేశాం
బెంగళూరు/మైసూరు: ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాల అశ్వమేధ గుర్రాన్ని కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ కూటమి కట్టేసిందని కర్ణాటక సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రమాణం చేశాక మాట్లాడుతూ ‘మోదీ, షాల అశ్వమేధ గుర్రాన్ని కట్టేయడమే నా లక్ష్యమని యూపీ ఎన్నికల తర్వాత చెప్పా. కాంగ్రెస్ సాయంతో ఈరోజు కర్ణాటకలో నేను ఆ పని చేయగలిగా’ అని అన్నారు. సీఎంగా ప్రమాణం చేయడానికి ముందు ఆయన మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు రుణాలను మాఫీ చేసి తీరుతామనీ, అయితే ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున అందుకు కొంత సమయం పడుతుందన్నారు. రైతులు ఆత్మహత్యల వంటి తీవ్ర చర్యలకు పాల్పడకుండా మనోనిబ్బరంతో ఉండాలనీ, రైతుల బిడ్డగా, సేవకుడిగా వారి బాధను అర్థం చేసుకుంటానన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీఎస్లు కలిసే పోటీ చేస్తాయని వెల్లడించారు. సంకీర్ణ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఏదైనా చేయాలంటే భాగస్వామ్య పక్షం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుతో దేశరాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామ ని అన్నారు. బీజేపీకి అధికారం దక్కనివ్వకూడదన్న లక్ష్యంతోనూ, దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్తో జతకలిసినట్లు కుమారస్వామి వెల్లడించారు. -
కూటమి సవాల్ కాదు.. బీజేపీదే అధికారం
న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల్లో ప్రజాతీర్పు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఓటమిని కూడా విజయంగా చెప్పుకునేందుకు ఆ పార్టీ సరికొత్త కారణాలు వెతుక్కుంటోందని సోమవారమిక్కడ అన్నారు. ప్రాంతీయ విపక్ష కూటమితో కలసి కాంగ్రెస్ బలమైన కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ‘2014లోనూ ఈ పార్టీలన్నీ బీజేపీని వ్యతిరేకించాయి. 2019లోనూ వీరం తా కలిసి పనిచేయటం మాకు ఇబ్బందేం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుంది’ అని ఆయన చెప్పారు. ఈ కూటమిలోని చాలాపార్టీలకు వారి రాష్ట్రాల బయట పెద్దగా ప్రభావం లేవని.. అలాంటప్పుడు ఈ కూట మి అదనపు ఓట్లను ఎలా పొందగలుగుతుందన్నా రు. కాంగ్రెస్ మంత్రులు ఓటమిపాలైనప్పటికీ.. ఎం దుకు సంబరాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ చెప్పాలని షా డిమాండ్ చేశారు. విశ్వాస పరీక్ష కోసం యడ్యూరప్ప ఏడ్రోజుల గడువు అడిగినట్లు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ లాయర్ అబద్ధమాడారన్నారు. -
వాళ్ల కలహాలే గెలిపిస్తాయి
న్యూఢిల్లీ: కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అంతర్గత కలహాలు కర్ణాటకలో తాము తిరిగి గెలిచేందుకు దోహదపడతాయని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్లు రాజకీయ ప్రత్యర్థులని, ఆ కూటమి విఫలమయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్, జేడీఎస్లు ఎన్నికల సమయంలో ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పనిచేశారు. ఇప్పుడు అగ్ర నేతల మధ్య సత్సంబంధాలతో వారు ఓటర్ల మద్దతు పొందలేరు. రెండు పార్టీల మధ్య అంతర్గత కలహాలు ఏర్పడతాయన్నది సుస్పష్టం’ అని అన్నారు. మూణ్నాళ్ల ముచ్చటే: సదానంద గౌడ కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మూడు నెలల కన్నా ఎక్కువ కాలం కొనసాగదని కేంద్రమంత్రి సదానందగౌడ జోస్యం చెప్పారు. ఇరు పార్టీలు అనైతిక పొత్తుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయని ఆరోపించారు. -
కొన్నాళ్లే కాంగ్రెస్–జేడీఎస్ సర్కారు
న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ అపవిత్ర పొత్తుతో ఏర్పాటైన ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించబోదని బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ యత్నించిందన్న ఆరోపణలను షా ఖండించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో షా మాట్లాడారు. ప్రధానిపై రాహుల్ ‘అవినీతి’ ఆరోపణల్ని తాను సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన జేడీఎస్.. ఎన్నికల తర్వాత ఆదేపార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. ‘ఈ సంకీర్ణం నిలవదు’ బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్–జేడీఎస్ల అపవిత్ర బంధంతో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువకాలం నిలవదని కేంద్రం మంత్రి అనంత్ కుమార్ అన్నారు. బీజేపీ మాత్రమే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదన్నారు. తామిచ్చిన హామీలను నమ్మిన ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారన్నారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించటంలో బీజేపీ శ్రేణులు ఒక్క నిమిషం కూడా వృథా చేయబోవన్నారు. బీజేపీని అడ్డుకోవాలనే ఏకైక నెపంతో 78మంది సభ్యులున్న కాంగ్రెస్.. కేవలం 38 మంది సభ్యుల జేడీఎస్ కాళ్ల వద్ద సాగిలపడటం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొంటే గెలిచేవాళ్లం కదా: జవదేకర్ బొమ్మనహళ్లి: కర్ణాటకలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లకుండా ఉండేందుకే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సీఎం పదవికి రాజీనామా చేయడం ద్వారా యడ్యూరప్ప గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘రాష్ట్రంలో బీజేపి కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను కొంటున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. మేం ఎక్కడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదు. అలా చేసి ఉంటే ఈరోజు బలపరీక్షలో విజయం సాధించేవాళ్లం కదా’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలకు తమకు మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చారని జవదేకర్ పేర్కొన్నారు. విధానసభలో తాము ఓడిపోలేదనీ, నైతిక విజయం తమదేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలముందు బీజేపీ–జేడీఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏ ముఖంతో జేడీఎస్తో పొత్తుకు వెళ్లారని ప్రశ్నించారు. -
23న కుమారస్వామి ప్రమాణం
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి మే 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడు రోజులకే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో.. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి శాసనసభా పక్ష నేతగా ఉన్న కుమారస్వామిని శనివారం రాత్రి గవర్నర్ వజుభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ‘గవర్నర్ ఆహ్వానం మేరకు ఆయనను కలుసుకున్నాను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం మే 15న సమర్పించిన వినతిపత్రం మేరకు మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు’ అని కుమార స్వామి చెప్పారు. గవర్నర్ను కలిసిన అనంతరం రాజ్భవన్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15 రోజుల్లో సభలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారని, అంతకంటే ముందుగానే బలపరీక్షకు వెళ్తామని తెలిపారు. మే 21న కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉండవచ్చని తొలుత చెప్పిన ఆయన.. కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం మే 23న ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. అందుకు కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. మే 21న రాజీవ్ గాంధీ వర్ధంతి నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని మే 23కు మార్చారని జేడీఎస్ నాయకుడొకరు చెప్పారు. ‘మే 24న బలపరీక్షకు వెళ్లాలన్న అంశంపై కాంగ్రెస్తో చర్చించాం’ అని కుమారస్వామి పేర్కొన్నారు. మే 21న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి ధన్యవాదాలు చెపుతానని, అలాగే కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన ఎంత మంది మంత్రులుగా ఉండాలన్న అంశంపై వారితో చర్చిస్తానని ఆయన తెలిపారు. విపక్ష నేతలకు ఆహ్వానం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించామని కుమారస్వామి చెప్పారు. యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాయావతి, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర, పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్–జేడీఎస్లు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాయని తెలిపారు. మరోసారి బీజేపీ తమ ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన కుమార స్వామి.. ‘వారు ఇబ్బందులు సృష్టిస్తారన్న విషయం తెలుసు. వాటిని తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. -
గెలుస్తాననుకున్నా..!
బెంగళూరు: రాజీనామా చేసే ముందు, సీఎం యడ్యూరప్ప అసెంబ్లీలో ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. రాజీనామా చేయడం తథ్యమని నిర్ణయించుకున్న తరువాత చేసిన ఈ వీడ్కోలు ప్రసంగంలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిపై విమర్శలు గుప్పించారు. అధికారంలో కొనసాగితే రైతు సంక్షేమం కోసం పాటు పడ్తామనుకున్నానని, అది సాధ్యం కాకపోతున్నందుకు బాధపడ్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు అతిపెద్ద పార్టీగా బీజేపీకే పట్టం కట్టారని, కాంగ్రెస్, జేడీఎస్ కుట్రపూరితంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడి ప్రజాతీర్పును కాలరాశాయన్నారు. అయినా, రాష్ట్రాభివృద్ధికోసం కలసి వస్తారన్న ఆశతో కొందరు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడానని ఆయన వెల్లడించారు. విశ్వాసపరీక్షలో విజయం సాధిస్తాననుకున్నానన్న యడ్యూరప్ప.. ఆశించినవన్నీ జరగవు కదా! అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేసిన ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కాంగ్రెస్–జేడీఎస్ అవకాశవాద కూటమి. కుట్ర చేసి ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కారు. మీరు ఎమ్మెల్యేలను బంధించారు. పాపం వారు తమ కుటుంబసభ్యులతోనూ మాట్లాడుకోకుండా చేశారు. మీ ఎమ్మెల్యేలంతా వాళ్ల కుటుంబ సభ్యులను చూసుకునే అవకాశం దక్కినందుకు ఇవాళ సంతోషంగా ఉండుంటారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడాను. ఇది వాస్తవం. ఆత్మ ప్రబోధం మేరకే ఓటేయాలని వారిని కోరాను. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం ఉన్న పార్టీ. అందుకే ఆ ఎమ్మెల్యేలు నేటి రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకుంటారనుకున్నాను. కేంద్రంలో మోదీ ప్రభుత్వ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని వారితో అన్నాను. కొందరు ఇందుకు అంగీకరించారు కూడా. కాంగ్రెస్కు గానీ, జేడీఎస్కు గానీ ప్రజామోదం దక్కలేదనేది వాస్తవం. అతిపెద్ద పార్టీగా నిలిచినందునే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించారు. నావి ప్రజా రాజకీయాలు. ఇకపైనా నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఈ విశ్వాస పరీక్షను అగ్నిపరీక్షలా భావించాను. ఇదేం తొలిసారి కాదు. నా జీవితమంతా అగ్నిపరీక్షే. ఇద్దరు సభ్యులున్న బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో అడుగడుగునా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మనం అనుకునేది వేరు. దేవుడి ఆలోచన వేరు’ అని వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు ‘నా చివరి శ్వాస వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటా. ఇక కర్ణాటక రాష్ట్రమంతా పర్యటిస్తా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్సభ స్థానాలను, అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలను బీజేపీ గెలుచుకోవటంలో చిత్తశుద్ధితో పనిచేస్తా. ఈ సీట్లను ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇస్తా. నేను పోరాడుతూనే పైకొచ్చాను. నాకు అధికారం ఇవ్వకపోతే చనిపోతానని ఒకరు (కుమారస్వామి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ)చెప్పారు. నాకు అధికారం దక్కినా, దక్కకపోయినా నేను మాత్రం అలా అనను. మన కాంగ్రెస్ మిత్రుల కుట్ర కారణంగా ప్రజాతీర్పు, ప్రజాస్వామ్యం ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో నేను విశ్వాస పరీక్షకు పట్టుబట్టడం లేదు. నేను రాజీనామా చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై ప్రజల వద్దకు వెళ్లి న్యాయం అడుగుతాను. గవర్నర్ దగ్గరికెళ్లి రాజీనామా సమర్పించబోతున్నాను’ అని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సందర్శకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్తో కరచాలనం చేసి సభ నుంచి యడ్యూరప్ప బయటకెళ్లారు. నాడు వాజ్పేయి..నేడు యడ్యూరప్ప! అది 1996.. కేవలం 13రోజుల పాటు ప్రధానిగా ఉన్న వాజ్పేయి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే రాజీనామాకు ముందు ఆయన చేసిన ఉద్వేగభరిత ప్రసంగం దేశ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలిచిపోయింది. నాటి ప్రసంగాన్ని డీడీ ప్రత్యక్ష ప్రసారంలో అందించటంతో దేశ ప్రజల మనసుల్లో అది చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈ సుదీర్ఘ, ఉద్వేగపూరిత ప్రసంగంతో సభ్యుల విశ్వాసాన్ని పొందలేకపోయినా.. దేశ ప్రజల నమ్మకాన్ని వాజ్పేయి చూరగొన్నారు. ‘నేను పదవి కోసం పాకులాడుతున్నానని అంటున్నారు. ప్రజలు మా పార్టీకి అత్యధిక సంఖ్యలో సీట్లు కట్టబెడితే నేను అధికారానికి ఎందుకు దూరంగా ఉండాలి? ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు’ అంటూ వాజ్పేయి విపక్షాలకు చురకలు అంటించా రు. శనివారం నాడు అసెంబ్లీలోనూ యడ్యూరప్ప ఇదే రీతిలో మాట్లాడారు. ‘ప్రజలు మాకు 104 సీట్లు వరంగా ఇచ్చారు. ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంది. అధికారం లేకపోయినా నా జీవితం ప్రజలకు అంకితం. నేను యోధుడ్ని.. చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాను’ అని అన్నారు. -
ఢీ కొట్టని యెడ్డీ..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాల్లో ఐదురోజుల సస్పెన్స్కు తెరపడింది. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప.. కీలకమైన విశ్వాసపరీక్షకు ముందు బల నిరూపణ చేసుకోలేకపోతున్నానంటూ రాజీనామా చేశారు. గవర్నర్ వజూభాయ్ వాలా బలనిరూపణ కోసం యెడ్డీకి 15 రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్–జేడీఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు శనివారం సాయంత్రమే విశ్వాసపరీక్ష జరపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి నిరసనలు, ఆందోళనలు లేకుండానే.. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగింది. సభలో ఉద్వేగ భరిత ప్రసంగం చేసిన యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని బీజేపీయేతర విపక్ష నేతలు పేర్కొన్నారు. అనంతరం మమతా బెనర్జీ సహా వివి ధ పార్టీల అధ్యక్షులు కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు ఫోన్లో అభినందనలు తెలిపారు. కాగా, కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు రావాలంటూ.. జేడీఎస్ నేత కుమారస్వామిని గవర్నర్ ఆహ్వానించారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ సోనియా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మమత, కేసీఆర్, చంద్రబాబు తదితరులను కుమారస్వామి ఆహ్వానించారు. ఉదయం నుంచీ ఉత్కంఠ శనివారం ఉదయం నుంచీ బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం హైదరాబాద్లో బసచేసిన రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఉదయమే వేర్వేరు బస్సుల్లో బెంగళూరులోని ఓ హోటల్కు చేరుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల సమయంలో వీరిని పటిష్టమైన భద్రత నడుమ అసెంబ్లీకి తీసుకొచ్చారు. అక్కడ ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్య.. ఎన్నికైన అందరు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదంతా జరుగుతుండగానే.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ మిత్రులైన బీజేపీ సభ్యులతోనూ మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ హోటల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక భద్రత నడుమ అసెంబ్లీకి తీసుకొచ్చారు. అనంతరం సిద్దరామయ్య కాంగ్రెస్ సభ్యులకు విప్ జారీ చేశారు. మరోవైపు, వీలైనంత ఎక్కువ మందిని లాగేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే సాయంత్రం 4 గంటలకు విశ్వాస పరీక్ష జరగాల్సి ఉండగా.. ఓ గంటముందు నుంచీ బీజేపీలో విశ్వాసం సన్నగిల్లటం ప్రారంభమైంది. యడ్యూరప్పే రంగంలోకి దిగినా.. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినప్పటినుంచీ విశ్వాస పరీక్షలో గెలుస్తామంటూ యడ్యూరప్ప ధీమాగా కనిపించారు. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన గానీ, బీజేపీ నేతలు గానీ పరీక్షలో నెగ్గటంపై నమ్మకంగా కనిపించలేదు. బలపరీక్షలో నెగ్గేందుకు ఏడుగురు అదనపు ఎమ్మెల్యేల బలం అవసరం ఉండగా.. జేడీఎస్, కాంగ్రెస్ కూటమిలోని ఎమ్మెల్యేలను ఒప్పించటంలో యడ్యూరప్ప బృందం విఫలమైంది. యడ్యూరప్పే స్వయంగా రంగంలోకి దిగి పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడినా పెద్దగా లాభం లేకపోయింది. కూటమి ఎమ్మెల్యేల్లో యెడ్డీ సహా పలువురు బీజేపీ నేతలు మాట్లాడిన ఆడియో టేపులను కాంగ్రెస్ విడుదల చేయటం సంచలనం రేపింది. వారికి మంత్రి పదవులు ఇస్తామని యడ్యూరప్ప స్వయంగా భరోసా ఇవ్వడంతో బలనిరూపణలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ను బీజేపీ బంధించిందని ఆరోపణలు రాగా.. ఈయన సరిగ్గా యడ్యూరప్ప ప్రసంగానికి ముందు సభలో ప్రవేశించారు. అసెంబ్లీలో ప్రకటన అనంతరం రాజ్భవన్ చేరుకున్న యడ్యూరప్ప.. గవర్నర్ వజూభాయ్ వాలాకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. యెడ్డీ రాజీనామాతో జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రి బాధ్యతలు (కాంగ్రెస్ మద్దతుతో) చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికైన 221 సీట్లలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి 117 ఎమ్మెల్యేల బలముంది. న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు: ఆజాద్ గులాంనబీ ఆజాద్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ‘గవర్నర్ మా రెండు పార్టీలను (జేడీఎస్, కాంగ్రెస్) చీల్చేందుకు యడ్యూరప్పకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ.. ఎమ్మెల్యేల బేరసారాలు జరగకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా న్యాయవ్యవస్థ వ్యవహరించినందుకు కృతజ్ఞతలు’ అని ఆజాద్ పేర్కొన్నారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన యడ్యూరప్ప 2007లో ఏడు రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అనంతరం 2008లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాక దాదాపు మూడేళ్లపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదురోజుల సస్పెన్స్ మే 15న వెల్లడైన ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో కన్నడ నాట అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఫలితాలు వెలువడుతుండగానే జేడీఎస్కు సంపూర్ణ మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవటంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. కూటమి కంటే ముందే యడ్యూరప్ప గవర్నర్ను కలసి అతిపెద్ద పార్టీగా నిలిచిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరారు. అటు, మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువమందే తమకు మద్దతుగా ఉన్నారంటూ జేడీఎస్, కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలసి తమ ఎమ్మెల్యేల జాబితాను ఇచ్చారు. కొంత సమయం తీసుకున్న గవర్నర్ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం, బల నిరూపణకు 15 రోజుల గడువు ఇవ్వడంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అర్ధరాత్రి కోర్టు తలుపులు తట్టి.. మరునాడు జరగాల్సిన యెడ్డీ ప్రమాణస్వీకారాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించింది. తమ అభ్యర్థులు చేజారకుండా బౌన్సర్లతో పటిష్టమైన భద్రత నడుమ రిసార్టులు, హోటళ్లలో వారిని ఉంచింది. అయితే.. యెడ్డీ ప్రమాణస్వీకారానికి అడ్డుతగలబోమన్న సుప్రీంకోర్టు.. శనివారం సాయం త్రం 4కు బలనిరూపణ జరగాల్సిందేనని ఆదేశించింది. దీంతో రాత్రికి రాత్రి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్కు తరలించారు. శుక్రవారమంతా వీరితో సమావేశమై విశ్వాస పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. అయినా ఇరు పార్టీల నేతలకు మనస్సులో ఎక్కడో శంక. తమ ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో చేజారతారన్న అనుమానం వెంటాడా యి. కానీ శనివారం అసెంబ్లీలో ఎలాంటి నిరసనలు లేకుండానే యడ్యూరప్ప రాజీనామాను ప్రకటించటంతో ఐదురోజుల థ్రిల్లర్ ప్రస్తుతానికి ముగిసినట్లే కనబడుతోంది. -
‘తక్కువ సమయం’ సహేతుకమే
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పును న్యాయ నిపుణులు స్వాగతించారు. ప్రొటెం స్పీకర్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు సహేతుకం, సమర్థనీయమైనవి, దీంతో ఎమ్మెల్యేల కొనుగోళ్లపై అనుమానాలు నివృత్తి అవుతాయని సీనియర్ లాయర్లు రాకేశ్ ద్వివేది, అజిత్ సిన్హా, వికాస్ సింగ్ అభిప్రాయపడ్డారు. బలపరీక్షకు కోర్టు కాల పరిమితి విధించడంలో తప్పు లేదని అజిత్ అన్నారు. ప్రమాణ స్వీకారాన్ని కోర్టు వాయిదా వేసి ఉండాల్సిందన్న వికాస్..బలపరీక్షకు తక్కువ సమయం ఇవ్వడం సబబేనన్నారు. ‘బలపరీక్షకు తక్కువ సమయం ఇవ్వడం సమంజసమే. గోవా, ఉత్తరాఖండ్లో ఇలాగే జరిగింది. ఆలస్యం చేస్తే ఎమ్మెల్యేలు ఫిరాయించే ముప్పుంది. ఇప్పటికే రెండ్రోజులు లేటైంది’ అని ద్వివేది అన్నారు. ద్వివేదితో అజిత్ ఏకీభవించారు. బలపరీక్షకు ఎక్కువ సమయం ఇస్తే ఎమ్మెల్యేల కొనుగోళ్ల పందేరానికి తెరతీసినట్లవుతుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్గా నియమించడంపై స్పందిస్తూ..ఆ నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్దే అని ద్వివేది అన్నారు. -
రాజ్భవన్ ముట్టడి యత్నం విఫలం
సాక్షి, బెంగళూరు: గవర్నర్ వజూభాయ్ వాలా సంఖ్యాబలం లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాజ్భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్వీన్స్క్రాస్ రోడ్డులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. రాజ్భవన్లోనికి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసి సమీపంలోని కబ్బన్పార్కుకు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. గవర్నర్, పోలీసుల తీరును నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ సమీపంలోని ఇండియన్ ఎక్స్ప్రెస్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. ‘ఛలో రాజ్భవన్’ కార్యక్రమంలో ఎంపీ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధారాలతో ఆడియో క్లిప్పును విడుదల చేసింది. చిత్రదుర్గ గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దడ్డల్కు మంత్రి పదవితో పాటు భారీగా డబ్బు ఆశచూపినట్లు అందులో ఉంది. -
యడ్యూరప్ప కార్యాలయానికి తాళం
జయనగర: విధాన సౌధలోని మూడో అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయానికి తాళం పడింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విధాన సౌధ మూడవ అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయం చేరుకున్నారు. యడ్యూరప్ప పూజలు నిర్వహించి సీఎం సీటులో ఆశీనులయ్యారు. కొన్ని గంటలపాటు అక్కడే గడిపారు. కార్యాలయం ముందు సిద్దరామయ్య బోర్డు తొలగించి యడ్యూరప్ప నామఫలకం కూడా తగిలించారు. అయితే శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయానికి తాళం పడింది. బలపరీక్ష నెగ్గేవరకు పాలనాపరమైన ఎలాంటి నిర్ణయాలను తీసుకోరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో విధానసౌధ అధికారులు ముఖ్యమంత్రి యడ్యూరప్ప కార్యాలయానికి తాళంవేశారు. -
వంద శాతం గెలుస్తాం
బెంగళూరు: బల పరీక్షలో వంద శాతం గెలుస్తానని కర్ణాటక సీఎం యడ్యూరప్ప అన్నారు. ‘ఈ రాజకీయ క్రీడలో మేం మా ఆధిక్యాన్ని నిరూపించుకుంటాం. బలపరీక్షలో నెగ్గుతాం’ అని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత సాధారణ ఆధిక్యం లేకుండానే సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప.. పీఠమెక్కిన దాదాపు 55 గంటల్లోనే విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్నారు. మా ఎమ్మెల్యేను ఢిల్లీలో ఉంచారు: ఆజాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ని బీజేపీ అధిష్టానం బేరసారాల కోసం ఢిల్లీకి పిలిపించుకుందనీ, అక్కడ నుంచి ఆయన తిరిగిరాకుండా కట్టడి చేస్తోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్థానం లో ఉన్న గవర్నర్.. ఆయన చేతులతోనే రాజ్యాంగం పీక నొక్కుతున్నారని ఆజాద్ మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారనడానికి సుప్రీం ఉత్తర్వులే నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి
పట్నా / పణజి / ఇంఫాల్: కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా నిర్ణయం నేపథ్యంలో గోవా, మణిపుర్లో కాంగ్రెస్, బిహార్లో ఆర్జేడీ నేతలు ఆయా రాష్ట్రాల గవర్నర్లతో శుక్రవారం భేటీ అయ్యారు. బిహార్ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ రాజ్భవన్లో గవర్నర్ సత్యపాల్ మాలిక్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 80 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ నిలిచిన నేపథ్యంలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ‘గవర్నర్ను కలసి మాకు 111 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉన్నట్లు లేఖను సమర్పించాం. వీరిలో ఆర్జేడీతో పాటు కాంగ్రెస్, హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం), సీపీఐ(ఎంఎల్) పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ గవర్నర్ బలపరీక్షకు ఆదేశిస్తే మేం కచ్చితంగా విజయం సాధిస్తాం. ఎందుకంటే చాలామంది శాసనసభ్యులు మాకు అనుకూలంగా ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు’అని మీడియాకు తెలిపారు. ఏకైక పెద్దపార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న కర్ణాటక గవర్నర్ నిర్ణయం సరైనదైతే.. బిహార్లో ఆర్జేడీని కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందేనని స్పష్టం చేశారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లలో గెలుపొందగా, జేడీయూ 71 చోట్ల, బీజేపీ 53 చోట్ల, కాంగ్రెస్ 27 సీట్లలో గెలుపొందాయి. వీటితో పాటు ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ చెరో రెండు సీట్లను దక్కించుకున్నాయి. తొలుత ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీయూ.. ఆ తర్వాత బీజేపీతో జట్టుకట్టింది. మృదులా సిన్హాతో కాంగ్రెస్ భేటీ గోవాలో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షనేత చంద్రకాంత్ కవ్లేకర్ గోవా గవర్నర్ మృదులా సిన్హాను శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజ్భవన్లో కాంగ్రెస్ నేతలతో కలసి ఆమెకు లేఖను సమర్పించారు. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం గవర్నర్కు పార్టీ రాసిన లేఖ ప్రతిని దీనికి జత చేశారు. తమ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏడు రోజుల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఈ లేఖలో తెలిపింది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న కర్ణాటక గవర్నర్ నిర్ణయం 2017లో గోవా గవర్నర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని రుజువు చేస్తోందని పేర్కొంది. 40 సీట్లున్న గోవా అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 17 చోట్ల విజయం సాధించినా.. కేవలం 13 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ గోవా ఫార్వర్డ్ పార్టీ(3), మహరాష్ట్రవాది గోమంతక్ పార్టీ(3), ముగ్గురు స్వతంత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు మణిపుర్ మాజీ సీఎం ఇబోబీ సింగ్ నేతృత్వంలో 9 మంది కాంగ్రెస్ సీఎల్పీ నేతల బృందం శుక్రవారం ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ జగదీశ్ ముఖితో రాజ్భవన్లో భేటీ అయింది. ఈ సందర్భంగా అసెంబ్లీలోని 60 స్థానాల్లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిల్చిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరినట్లు సింగ్ మీడియాకు తెలిపారు. గతేడాది జరిగిన మణిపుర్ అసెంబ్లీఎన్నికల్లో కాంగ్రెస్ 28 చోట్ల, బీజేపీ 21 సీట్లలో విజయం సాధించాయి. కానీ స్థానిక పార్టీల సాయంతో బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మృదులా సిన్హాకు లేఖ ఇస్తున్న కాంగ్రెస్ నేతలు -
హైదరాబాద్లో కర్ణాటకం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటకం హైదరాబాద్కు చేరింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్లు తమ ఎమ్మెల్యేలను శుక్రవారం ఉదయం భాగ్యనగరానికి తరలించాయి. తొలుత కేరళలోని కొచ్చికి వెళ్లాలని భావించినా చివరికి హైదరాబాద్నే ఎంచుకున్నారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా ఇరుపార్టీల ఎమ్మెల్యేలంతా రాజధానిలోని తాజ్కృష్ణ, నోవాటెల్ హోటళ్లకు ప్రత్యేక బస్సుల్లో చేరిపోయారు. జేడీఎస్ పేరిట మాదాపూర్ నోవాటెల్లో 36 గదులను, కాంగ్రెస్ పేరిట తాజ్కృష్ణలో 120 గదులు బుక్ చేశారు. ఒక్కో గదిలో ఒక్కో ఎమ్మెల్యేను ఉంచారు. మిగతా గదులను ఇరుపార్టీల కీలక నేతలు, వ్యూహకర్తలు, సీనియర్ లీడర్లకు అప్పగించారు. ఓ ఇండిపెండెంట్తో కలిపి కాంగ్రెస్ నుంచి 77 మంది, జేడీఎస్ నుంచి 36 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. హుటాహుటిన రాష్ట్ర నేతలు.. ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించాలని కాంగ్రెస్–జేడీఎస్ గురువారం అర్ధరాత్రి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ కర్ణాటక ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు హైదరాబాద్కు వస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా ఈ రెండు హోటళ్ల వద్దకు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్ణాటక ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తూ వారికి కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఉదయం 8 గంటల నుంచే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హోటల్కు చేరుకొని కర్ణాటక ఎమ్మెల్యేలకు కావాల్సిన సదుపాయాలను పర్యవేక్షించారు. అర్ధరాత్రి సమయంలోనే కర్ణాటక ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్కు చేరుకుంటారని భావించారు. కానీ తర్వాత తాజ్, నోవాటెల్ హోటళ్లను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల క్యాంపులో ఎక్కడా ఎవరూ సెల్ఫోన్ వాడకుండా ఇరు పార్టీలు జాగ్రత్తలు వహించాయి. బస చేస్తున్న హోటళ్లలోని ల్యాండ్లైన్ నుంచి కూడా ఫోన్కాల్ బయటకు వెళ్లే అవకాశం లేకుండా చేసినట్టు తెలిసింది. తాజ్కు చేరుకున్న ఎమ్మెల్యేల్లో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సాయంత్రం సిద్దరామయ్య రాక.. శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయన్ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఆహ్వానించి తాజ్ హోటల్కు తీసుకువచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో హోటల్ చేరుకున్న సిద్దరామయ్య.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్అలీ, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, వీహెచ్, కన్నడ పార్టీ కీలక నేత డీకే శివకుమార్, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్, వేణుగోపాల్తో భేటీ అయ్యారు. 5.30 గంటల సమయంలో కన్నడ కాంగ్రెస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. శనివారం బలనిరూపణ సమయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సిద్దరామయ్య ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం ముగియనుండగా 5.50 గంటల సమయంలో జేడీఎస్ నేత కుమారస్వామి తాజ్కృష్ణకు చేరుకున్నారు. కన్నడ పీసీసీ నేతలతో భేటీ అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఆయన నోవాటెల్కు వెళ్లారు. కాగా తాజ్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో సిద్దరామయ్యను ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నోవాటెల్లో కుమారస్వామి, రేవణ్ణ ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య సమావేశం నిర్వహించగా.. అంతకుముందే జేడీఎస్ నేత కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ నోవాటెల్లో వారి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జేడీఎస్ నుంచి ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు తిప్పుకునేందుకు చేస్తున్న వ్యూహాలను కుమారస్వామి వారికి వివరించారు. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తుతో ప్రభుత్వం ఏర్పడుతుందని, ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో దేవెగౌడ రేవణ్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. బీజేపీ నుంచి పొత్తు ప్రతిపాదన రావడం, సున్నితంగా తిరస్కరించిన అంశాలను కుమారస్వామి, రేవణ్ణకు ఆయన వివరించినట్టు తెలిసింది. గొడవ చేయొద్దు.. సస్పెండ్ చేస్తారు.. తమ ఎమ్మెల్యేలకు జేడీఎస్, కాంగ్రెస్ ముఖ్య నేతలు కీలక సూచనలు చేశారు. శనివారం అసెంబ్లీలో జరగబోయే బలనిరూపణ సమయంలో బీజేపీ... ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగి సస్పెన్షన్ ప్లాన్ వేసిందని వివరించారు. ప్రొటెం స్పీకర్గా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేను నియమించడం వెనుకున్న ఆంతర్యం కూడా ఇదేనని, దీనిపైనా శుక్రవారం రాత్రి సుప్రీంకు వెళ్తున్నట్టు సిద్ద రామయ్య, కుమారస్వామి తమ పార్టీల ఎమ్మెల్యేలకు సూచించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉండాలని, సహనం పాటించాలని పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ? కాంగ్రెస్, జేడీఎస్ క్యాంపులో ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్ అయ్యారన్న ప్రచారంతో ఇరుపార్టీల నేతలు కలవరానికి గురయ్యారు. గెలిచినప్పట్నుంచే ఆనంద్సింగ్, ప్రతాప్గౌడ పాటిల్ ఇద్దరూ పార్టీకి దూరంగా ఉన్నట్టు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారు. అయితే వీరిలో ఆనంద్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడని, ప్రతాపగౌడ పాటిల్ బీజేపీ అధీనంలో ఉన్నట్టు తెలిపారు. అలాగే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ముగ్గురిలో బీఎస్పీకి చెందిన శేఖర్ సైతం హైదరాబాద్ చేరుకున్నారని, మరో ఇద్దరు బెంగళూరులోనే ఉన్నారని సమావేశంలో ప్రకటించారు. ఈ ముగ్గురు కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మద్దతు తెలుపుతారని సిద్దరామయ్య ఎమ్మెల్యేలకు వివరించారు. బీజేపీ నెగ్గే అవకాశం లేదు: కుమారస్వామి బలపరీక్షలో బీజేపీ నెగ్గే అవకాశం లేదని కుమారస్వామి ధీమాగా చెప్పారు. శుక్రవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీకి సంఖ్యాబలం లేదన్నారు. ‘ఆపరేషన్ కమల’కు చిక్కకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉన్నారనీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఏకతాటిపై నిలబడ్డారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఒకవేళ బీజేపీ ‘ఆపరేషన్ కమల’ చేపడితే, ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తాము లాక్కుంటామని హెచ్చరించారు. సంఖ్యాబలం లేకపోయినా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నతాధికారులను బదిలీ చేశారని కుమారస్వామి ఆరోపించారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్ వద్ద మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. గవర్నర్ రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం దారుణం. మా కూటమి ఎమ్మెల్యేలంతా ఒక్క తాటిపై ఉన్నారు’ అని చెప్పారు. బస ఖర్చు భారీగానే.. హైదరాబాద్లో కాంగ్రెస్–జేడీఎస్ క్యాంపు ఖర్చు భారీగానే ఉంది. తాజ్లో అప్పటికప్పుడు రూం బుక్ చేయాలంటే కనీసం రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఖర్చవుతుంది. భోజనం, ఇతర ఖర్చులన్నీ కలిపి 24 గంటలకు రూ.30 వేల వరకు ఖర్చవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అంటే 120 గదులకు ఒక్కరోజుకే రూ.36 లక్షలు అవుతుంది. అలాగే నోవాటెల్లో ఒక్కో గదికి రూ.9 వేల చొప్పున కాగా.. భోజనం, తదితర ఖర్చులు మరో రూ.6 వేలకు పైగా అయినట్టు తెలిసింది. ఇలా ఆ పార్టీ ఎమ్మెల్యేల బసకు రూ.5.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఖర్చయినట్టు తెలిసింది. ఇవి కాకుండా ప్రయాణం, మధ్యలో భోజనం, ఇతర ఖర్చులకు కూడా భారీగానే వెచ్చించినట్టు సమాచారం. ఒక్క రోజు క్యాంపు మొత్తం ఖర్చు రెండు పార్టీలకు కలిపి రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా అవుతుందని టీపీసీసీ, కేపీసీసీ నేతలు చర్చించుకున్నారు. అర్ధరాత్రి బెంగళూరుకు.. తాజ్లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాత్రి 8.40 గంటల ప్రాంతంలో డిన్నర్ చేశారు. అర్ధరాత్రి సమయంలో హోటల్ నుంచి మూడు బస్సుల్లో బెంగళూరు శివారులోని ఈగల్ రిసార్ట్కు వెళ్లారు. నోవాటెల్లో 9.30 గంటలకు భోజనం చేసి జేడీఎస్ ఎమ్మెల్యేలు రాత్రి 10 గంటలకు రెండు బస్సులో ఈగల్ రిసార్ట్కు బయల్దేరారు. కుమారస్వామి కారులో.. సిద్దరామయ్య ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. మొరాయించిన బస్సు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తాజ్కృష్ణ వద్దకు వచ్చిన ఓ బస్సు హోటల్ లోపలికి వెళ్లేందుకు మొరాయించింది. 22 మంది ఎమ్మెల్యేలు లోపల ఉండగా బస్సు దిగేందుకు తలుపులు కూడా తెరుచుకోలేదు. దీంతో తాజ్కృష్ణ హోటల్ ముందు ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎలాగోలా ఎమ్మెల్యేలను బస్సు నుంచి బయటకు తీసుకొచ్చి భారీ బందోబస్తు మధ్య హోటల్ లోపలికి చేర్చారు. చెడిపోయిన బస్సు రోడ్డుపై రెండు గంటలు అలాగే ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాత్రూంలో ఎమ్మెల్యేలు.. హైరానా! సిద్దరామయ్య, కుమారస్వామి ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించలేదు. అదే సమయంలో కర్ణాటక నుంచి ఓ బీజేపీ ఎమ్మెల్యే హోటల్లోకి వచ్చాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీంతో మధుయాష్కీని కుమారస్వామి అప్రమత్తం చేశారు. 200 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు హోటల్ను జల్లెడ పట్టారు. మరో 200 మంది కార్యకర్తలను హోటల్ చుట్టూ మోహరించారు. చివరికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. బాత్రూంకు వెళ్లారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిందకు రాకపోవడంతో హైడ్రామా నడిచింది. గదుల్లోనూ లేకపోవడం, భోజనానికి రాకపోవడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. 20 నిమిషాల తర్వాత వారు ప్రత్యక్షం కావడంతో శాంతించారు. తాజ్కృష్ణలో సిద్దరామయ్య, కుమారస్వామితో జానారెడ్డి తదితరులు తాజ్కృష్ణ వద్ద రోడ్డుపై నిలిచిపోయిన బస్సు -
ప్రొటెం స్పీకర్గా బోపయ్య
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం (తాత్కాలిక) స్పీకర్గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ శుక్రవారం నియమించారు. సభలో అత్యంత అనుభవజ్ఞుడిని కాకుండా బోపయ్యను ప్రొటెం స్పీకర్గా నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. సభలోని సభ్యుల్లో అత్యంత అనుభవజ్ఞుడిని ప్రొటెం స్పీకర్గా నియమించడం సంప్రదాయం. అలా చూస్తే ప్రస్తుతం ఎన్నికైన శాసనసభ్యుల్లో కాంగ్రెస్కు చెందిన ఆర్వీ దేశ్పాండే అత్యంత అనుభవజ్ఞుడు. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బోపయ్య నాలుగుసార్లే ఎమ్మెల్యే అయ్యారు. కానీ గవర్నర్ బోపయ్యను ప్రొటెం స్పీకర్గా నియమించడం పట్ల కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. గవర్నర్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరించడం బాధాకరమనీ, ఆయన నిర్ణయం విస్తుగొల్పిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండూ రావ్ అన్నారు. కళంకితుడైన, గతంలో స్పీకర్గా సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూసిన అదే వ్యక్తిని మళ్లీ ప్రొటెం స్పీకర్గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ల ఇన్చార్జ్ రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ప్రొటెం స్పీకర్ విధులు ఇవే.. కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడం, స్పీకర్ ఎన్నిక జరిగే వరకూ సభను నిర్వహించడం ప్రొటెం స్పీకర్ విధులు. ఎన్నికలు జరిగిన వెంటనే ప్రొటెం స్పీకర్ను నియమిస్తారు. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేసినా లేదా మరణించినా కూడా ప్రొటెం స్పీకర్ను నియమిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ముందు ప్రొటెం స్పీకర్ అప్పటి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదీ లేనిదే తేల్చే బలపరీక్ష నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం తప్పేమీ లేదని రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారి చెప్పారు. స్పీకర్ను ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు ప్రొటెం స్పీకర్ బలపరీక్ష నిర్వహించడం సక్రమమేనన్నారు. సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్.. నేడు విచారణ ప్రొటెం స్పీకర్గా కేజీ బోపయ్యను గవర్నర్ నియమించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్లు శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్ను కోర్టు శనివారం విచారించనుంది. ఈ కేసును జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి కేటాయిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్లు కూడా సభ్యులుగాగల ధర్మాసనం కాంగ్రెస్, జేడీఎస్ల పిటిషన్ను ఉదయం 10.30 గంటలకే విచారించనుంది. బల పరీక్ష 4 గంటలకు జరగాల్సి ఉండగా, అంతకు ముందే విచారణ చేపట్టనుండటం గమనార్హం. గతంలో సుప్రీం మొట్టికాయలు 2008లోనూ బోపయ్య ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు. అప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయనే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జగదీశ్ షెట్టర్ స్పీకర్గా నియమితులు కాగా, బోపయ్య డిప్యూటీ స్పీకర్ అయ్యారు. షెట్టర్ రాజీనామా అనంతరం 2009 నుంచి 2013 మధ్య స్పీకర్గా పనిచేశారు. బోపయ్య స్పీకర్ పదవిలో ఉండగా బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చింది. విశ్వాసపరీక్షలో యడ్యూరప్పను గెలిపించేందుకు 11 మంది బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సహా మొత్తం 16 మందిపై బోపయ్య అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించగా, సుప్రీంకోర్టు 2011లో కొట్టివేసింది. బోపయ్య ప్రాథమిక రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారనీ, ఆయనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని సుప్రీంకోర్టు అప్పట్లో తీవ్రంగా ఆక్షేపించింది. -
నేడే యడ్యూరప్ప పరీక్ష
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయం అంతిమ ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం యడ్యూరప్ప సర్కారు బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడమే సమస్యకు పరిష్కారమని తేల్చింది. బల నిరూపణ కోసం యడ్యూరప్ప సర్కారుకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును పక్కనపెడుతూ శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరపాలంది. యడ్యూరప్ప సర్కారు ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కాంగ్రెస్–జేడీఎస్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం ఉదయం విచారణ కొనసాగింది. ‘యడ్యూరప్పకు బలముందో లేదో సభే నిర్ణయిస్తుంది. దీనికి సరైన పరిష్కారం బలపరీక్షే’ అని జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచ్ పేర్కొంది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ భూషణ్లు సభ్యులుగా ఉన్న ఈ బెంచ్.. రహస్య బ్యాలెట్ పద్ధతిలో బలనిరూపణకు అనుమతి ఇవ్వాలన్న యడ్యూరప్ప విజ్ఞప్తిని తోసిపుచ్చింది. బలపరీక్షలో ఓటు వేసేలా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేను నామినేట్ చేయవద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్ర గవర్నర్ను ఆదేశించింది. సభ విశ్వాసం పొందేవరకూ కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఎలాంటి కీలకమైన విధానపర నిర్ణయాలు తీసుకోకూడదని ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని విచారిస్తామని తెలిపింది. నేడు జరిగే బలపరీక్ష సందర్భంగా చట్టానికి లోబడి ప్రొటెం స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీ వెలుపల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. మెజార్టీకి సంబంధించిన అంశం..సభలోనే నిరూపించుకోవాలి: సుప్రీం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం ఉన్న తమను కాదని బీజేపీని గవర్నర్ వజూభాయ్ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్–జేడీఎస్లు సుప్రీంను ఆశ్రయించడం తెల్సిందే. ఆ పిటిషన్పై శుక్రవారం సుప్రీంలో వాదనలు కొనసాగాయి. కాంగ్రెస్–జేడీఎస్ల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం, యడ్యూరప్ప, బీజేపీ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ‘అంతిమంగా చూస్తే ఈ అంశం మెజార్టీకి సంబంధించింది. దానిని సభలోనే నిరూపించుకోవాలి’ అని కోర్టు అభిప్రాయపడింది. మే 12న కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 స్థానాలు సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 112 స్థానాలు అవసరం కాగా.. 117 ఎమ్మెల్యేల బలమున్న తమను కాదని, అప్రజాస్వామికంగా గవర్నర్ బీజేపీని ఆహ్వానించారనేది కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఆరోపణ. గవర్నర్ విచక్షణాధికారం: ముకుల్ రోహత్గీ పిటిషన్ విచారణ సందర్భంగా తమకే మెజార్టీ ఉందని బీజేపీ, కాంగ్రెస్–జేడీఎస్ కూటములు కోర్టుకు తెలిపాయి. వాటి తరఫున హాజరైన న్యాయవాదుల వాడివేడి వాదనలతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగింది. గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సరికాదని కాంగ్రెస్–జేడీఎస్లు వాదించగా.. ఆ కూటమి సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖలు వివాదాస్పదంగా ఉన్నాయని బీజేపీ అభ్యంతరం తెలిపింది. హెచ్డీ కుమార స్వామిని తమ నేతగా పేర్కొంటూ కాంగ్రెస్–జేడీఎస్లు సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల విశ్వసనీయతను రోహత్గీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించాలని గవర్నర్కు యడ్యూరప్ప రాసిన లేఖల్ని ఆయన కోర్టుకు సమర్పించారు. ‘మేం అతిపెద్ద పార్టీగా అవతరించాం. మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. మాకు ఇతరుల మద్దతు ఉంది’ అని మే 16న గవర్నర్కు యడ్యూరప్ప రాసిన లేఖలోని సారాంశాన్ని రోహత్గీ చదివి వినిపించారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే ప్రజలు పట్టం కట్టారని కాంగ్రెస్ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని ఆయన వాదించారు. ‘తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల పేర్లను గవర్నర్కు ఇవ్వాల్సిన అవసరం లేదు. శాసనసభా పక్ష నేత వాటిని బహిర్గతం చేయనక్కర్లేదు. ఆ పని అసెంబ్లీలో చేయవచ్చు. మా లెక్క ప్రకారం మాకు మద్దతుంది. రాష్ట్రంలో ఎవరు స్థిరమైన ప్రభుత్వాన్ని అందించగలరో వారితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడం గవర్నర్ విచక్షణాధికారం’ అని రోహత్గీ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం వచ్చిన అభ్యర్థనల్ని గవర్నర్ నిర్ధారించుకోనవసరం లేదని, వాస్తవ పరిస్థితి, స్థిరత్వం, ఎన్నికల్లో అధికార పార్టీని తిరస్కరించారా? అన్నవే గవర్నర్ చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్–జేడీఎస్లు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ సంతకం లేదు. అందువల్ల ఆ జాబితాను పట్టించుకోవడంలో అర్థం లేదు’ అని రోహత్గీ పేర్కొన్నారు. ఫలితాలు తేలకుండానే యడ్యూరప్ప లేఖ రాశారు: సింఘ్వీ ఎక్కువ సభ్యులున్న కూటమిని కాదని.. మెజార్టీ లేని పార్టీని గవర్నర్ ఆహ్వానించడం సరైనదా? కాదా? అన్నదే ఈ కేసులోని అసలు అంశమని కాంగ్రెస్–జేడీఎస్ తరఫు న్యాయవాది సింఘ్వీ వాదించారు. ‘కౌంటింగ్ పూర్తికాకముందే లేదా ఎన్నికల సంఘం ఎమ్మెల్యేలకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడాని కంటే ముందుగానే మే 15 సాయంత్రం 5 గంటలకు గవర్నర్కు యడ్యూరప్ప లేఖ రాశారు. ఆ సమయంలో మెజార్టీ ఎవరిదో ఇంకా స్పష్టంగా తెలియదు. ఆ సమయంలో గవర్నర్కు రాసిన లేఖలో తనకు మెజార్టీ ఉందని యడ్యూరప్ప చెప్పకూడదు’ అని అన్నారు. కాంగ్రెస్–జేడీఎస్ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల విషయంలో తన విచక్షణాధికారాలను గవర్నర్ వినియోగించలేదని కుమారస్వామి తరఫున హాజరైన లాయర్ కపిల్ సిబల్ వాదించారు. ‘ఏ’నా.. ‘బీ’నా? ఎవరిని పిలవాలి?: సుప్రీం ‘ఇక్కడ ఒక వ్యక్తి తమకు మెజార్టీ ఉందని గవర్నర్కు చెప్పారు. మరోవైపు మరో వ్యక్తి కూడా ఎమ్మెల్యేల జాబితాతో తమకు మెజార్టీ ఉందని చెప్పారు. ‘ఏ’ ను కాదని ‘బీ’ని, ‘బీ’ని కాదని ‘ఏ’ను దేని ఆధారంగా గవర్నర్ పిలిచారో మనం నిర్ణయించాలి. గతంలో 24 లేదా 48 గంటల్లో బలాన్ని నిరూపించుకోవాలని కోర్టులు ఆదేశించిన సందర్భాలున్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది. ఇంతలో రోహత్గీ జోక్యం చేసుకుంటూ బలపరీక్షకు సోమవారం వరకూ తమకు గడువునివ్వాలని కోరగా.. శుక్రవారం లేదా శనివారమే బలపరీక్షకు ఆదేశించాలని కాంగ్రెస్–జేడీఎస్ కూటమి కోర్టును అభ్యర్థించింది. ‘ఎన్నికల్లో ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు దానికి మొదట అవకాశం ఇవ్వాలని సర్కారియా కమిషన్ పేర్కొంది. ఒకవేళ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న పార్టీల కూటమికి మెజార్టీ వస్తే దానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్న పార్టీలకు తర్వాత అవకాశం కల్పించారు’ అని బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు వాదనలు వినిపించగా.. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి తరఫున పి.చిదంబరం కూడా వాదించారు. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు.. ► శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలి. ► సాయంత్రం 4 లోగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కావాలి. ► విశ్వాస పరీక్ష సందర్భంగా రహస్య బ్యాలెట్ విధానాన్ని అవలంబించకూడదు. ► బలపరీక్ష కన్నా ముందు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను నామినేట్ చేయకూడదు. ► విశ్వాస పరీక్ష కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు. భద్రత ఏర్పాట్లను డీజీపీ స్వయంగా పర్యవేక్షించాలి. ► బల నిరూపణ జరిగేంతవరకు ప్రభుత్వం పాలన నిర్ణయాలు తీసుకోకూడదు.(‘పాలనపరమైన నిర్ణయాలు తీసుకునే సమయం తనకు(యడ్యూరప్పకు) ఉండదు లెండి. వేరే పనుల్లో ఆయన బిజీగా ఉంటారు కదా’– జస్టిస్ సిక్రీ సరదా వ్యాఖ్య) ► సభలో బల నిరూపణ ద్వారానే మెజారిటీ తేలుతుంది. ► ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ యడ్యూరప్పకు గవర్నర్ పంపిన లేఖ రాజ్యాంగ బద్ధతపై తరువాత విచారణ జరుపుతాం. ► 24 లేదా 48 గంటల్లో బలనిరూపణ చేసుకోవాలంటూ ఆదేశించిన దాఖలాలు గతంలోనూ ఉన్నాయి. -
అంతరాత్మలున్నాయా?
అక్షర తూణీరం క్యాంప్ కట్టడం ఓ బ్రహ్మవిద్య అని కొందరు, కాదు క్షుద్ర విద్య అని మరికొందరు అంటుం టారు. తన అనుకున్నవాళ్లందర్నీ ఒకచోట మళ్లే యడాన్ని క్యాంప్ రాజకీయం అంటారు. రేపు చేతులెత్తాల్సిన వాళ్లందర్నీ ఒకే తాటిమీద, ఒకే గూట్లో ఉంచడం. వాళ్లని రాచమర్యాదలతో ఆ పది రోజులూ సేవించుకోవడం చిన్న సంగతి కాదు. నరాలు తెగిపోతాయ్. ఎందుకంటే వాళ్లకి బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవ్. సర్వభో గాలు ఉంటాయ్. ఈ క్యాంప్లు గడచిన నలభై ఏళ్లలో చాలా మంచి ఫలితాలు ఇవ్వడంతో బహుళ ప్రాచుర్యం పొందాయి. ఈ క్యాంప్కి చాలామంది ఐచ్ఛికంగా వస్తే, కొద్దిమంది బలవం తంగా తీసుకు రాబడతారు. బడా ఎన్నికల నించి పంచాయతీ స్థాయి దాకా ఈ రాజకీయం నడు స్తోంది. అప్పట్లో మావూరి మున్సబు గారి మామిడితోట క్యాంప్లు పెట్టడా నికి చాలా ప్రసిద్ధికెక్కింది. తాటాకు పందిళ్లు, మడత మంచాలు, పేకాట లకి విశాలమైన గడ్డి పరుపులు ఏర్పా టుగా ఉండేవి. వంటలకి, వార్పులకి అనువైన గాడి పొయ్యిలు, కోరినపు డల్లా ఒళ్లుపట్టి, టెన్షన్ దింపేసే పని వాళ్లు, చేగోడీల నించి చేపల పులుసు దాకా వండి వడ్డించగల వంటవాళ్లు క్యాంప్ని సుభిక్షం, సుసంపన్నం చేస్తుండేవారు. ఈ సంప్రదాయం మన దేశంలో అన్ని దిక్కులా ఉంది. 30 ఏళ్ల క్రితం తమిళనాట ఓ క్యాంప్లో విధివశాత్తు ఉండాల్సి వచ్చింది. మద్రా సులో మెరీనా బీచ్కి దగ్గర్లో పది పన్నెండు అంత స్థుల హోటల్ని ఉన్నట్టుండి క్యాంప్గా మార్చే శారు. నేనందులో నెలవారీ కస్టమర్ని. మిగతా గదులన్నీ తమిళ పంచెలతో, బంగారు చెయిన్లతో నిండిపోయాయి. హోటల్ వారు తమ కిచెన్ని క్యాంపుకి అంకితం చేశారు. నన్ను మాత్రం క్యాంపులో కోరినవన్నీ ఉచితంగా తినెయ్యమ న్నారు. ఫ్రీగా తాగేయచ్చన్నారు. నిజంగా ఆ తిండి ఓ గొప్ప అనుభవం. ఆంధ్రలో కూడా క్యాంప్లు నడపగల సమ ర్థులున్నారు. వారాల తరబడి కప్పలు చెదర కుండా, పిట్టలెగరకుండా కాపాడుకురావడం చిన్న విషయం కాదు. సమాచార వ్యవస్థని పూర్తిగా కట్టిపెట్టాలి. అన్నిరకాల ఆటలతో వాళ్లని ఉల్లాస మరియు వినోద పరచాలి. అవసరమైతే మన వాళ్లని ఆటలో కూచోపెట్టి, అవతలివాళ్లకి కుప్పలు తెప్పలుగా సొమ్ములొచ్చేలా చూడాలి. నిత్యావస రాలైన మందు, మందులు అందిస్తూ ఉపద్రవం రాకుండా చూసుకోవాలి. అవసరమైతే రెండు డైలీ పేపర్లలో నాలుగు పేజీలు జాగ్రత్తగా కల్తీచేసి క్యాంప్ సభ్యులకు హాయిని కలిగించాలి. ఇలా చేస్తేనే ఓసారి రసాభాస అయింది. ఓ సాయంకాల వేళ సిల్కు లాల్చీ ఫెళ ఫెళల్లోంచి నిజం డైలీ పేజీ జారి పడింది. దాంట్లో పెద్దక్షరాల్లో సమాచారం వేరేగా ఉంది. ‘‘ఇంకే వుంది... క్యాంపు మునిగింది’’ అనుకుంటున్నారు కదూ? రెండు మూడు బృహత్ క్యాంపులు నిర్వ హించినాయన చెప్పినప్పుడు నేనూ అలాగే అను కున్నా. ‘‘ఏవుందండీ... జరిగిన చిన్న పొరబా టుకి వంద కోట్లు పెనాల్టీ పడిందండీ. దాదాపు యాభైమంది మోసం చేశారంటూ ఎదురు తిరి గారు. తలొక రెండూ వడ్డించి సరిచేశాం. ఇవన్నీ తప్పదండీ చివరాఖరికి అంతరాత్మ ప్రబోధం అంటారండీ’’ అంటూ ఆర్గనైజర్ నిట్టూర్చాడు! శ్రీరమణ, వ్యాసకర్త ప్రముఖ కథకుడు -
కర్నాటకం: బోపయ్యతో బేఫికర్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా కేజీ బోపయ్యను గవర్నర్ వాజుభాయ్ వాలా ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ఎదురైనప్పుడు బీఎస్ యడ్యూరప్పను ఆయన కాపాడటమే దీనికి కారణమని తెలుస్తోంది. 2009-13 మధ్యకాలంలో కర్ణాటక శాసనసభా స్పీకర్గా బోపయ్య పనిచేశారు. 2011, అక్టోబర్లో ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పపై తిరుగుబాటు చేశారు. దీంతో శాసనసభలో యడ్యూరప్ప అవిశ్వాస పరీక్ష ఎదుర్కొవాల్సి వచ్చింది. స్పీకర్గా ఉన్న బోపయ్య తిరుగుబాటు చేసిన 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి యెడ్డీ సర్కారును కాపాడారు. బోపయ్య నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించగా, సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో ఆయన అతి వేగంగా స్పందించారని వ్యాఖ్యానించింది. సర్వత్రా ఉత్కంఠ.. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బోపయ్యను ప్రొటెం స్పీకర్గా గవర్నర్కు నియమించివుంటారన్న అనుమానాన్ని కాంగ్రెస్, జేడీఎస్ వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా యడ్యూరప్ప సర్కారుకు ఆయన అనుకూలంగా వ్యవహరించే అవకాశముందని ఆరోపించాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసేటప్పుడు అత్యంత అనుభవశాలి అయిన ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. కర్ణాటక ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్వీ దేశ్పాండే అత్యంత సీనియర్ సభ్యుడు. ఆయనను పక్కనపెట్టేసి బోపయ్యను ప్రొటెం స్పీకర్గా నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కర్ణాటక అసెంబ్లీలో రేపు ఏం జరుగుతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే కే జీ బోపయ్య
-
కర్ణాటక: ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు అత్యంత ఉత్కంఠ రేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప శాసనసభలో రేపు బలనిరూపణకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్గా నియమించారు. ఉత్తర్వులు వెలువరించిన 5 నిమిషాల్లోనే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ వాజూభాయ్ వాలా నిర్ణయంపై కాంగ్రెస్, జేడీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంప్రదాయం ప్రకారం సీనియర్ అయిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా నియమించాలని, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ పార్టీ నేత ఆర్వీ దేశ్పాండేను విస్మరించడం సరికాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే కేజే బోపయ్యను నియమిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరాజ్పేట స్థానం నుంచి బోపయ్య గెలిచారు. 2009లోనూ ఆయన ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు. నియమ నిబంధనల ప్రకారమే ప్రొటెం స్పీకర్ నియామకం జరిగిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలోనూ ఆయనను ప్రొటెం స్పీకర్గా నియమించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరోపణల్లో పసలేదని కొట్టిపారేశారు. -
కర్ణాటక గవర్నర్ను రీకాల్ చేయండి: మోదీ
న్యూఢిల్లీ: ‘కర్ణాటక గవర్నర్ కృతనిశ్చయంతో భారత సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఆయన్ను వెంటనే రీకాల్ చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరాలని ప్రధానికి విజ్ఞప్తి చేశాను’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ను మోదీ 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. అప్పటి కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ను విమర్శిస్తూ మోదీ చేసిన ఈ ట్వీట్ను కాంగ్రెస్ పార్టీ గురువారం రీట్వీట్ చేసింది. కర్ణాటక గవర్నర్ను రీకాల్ చేయాలన్న మోదీ వ్యాఖ్యలకు తాము కూడా అంగీకరిస్తున్నట్లు వ్యంగ్యంగా స్పందించింది. కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ 2011, మే 19న మోదీ ఈ ట్వీట్ చేశారు. -
కాంగ్రెస్, జేడీఎస్ చలో కేరళ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ.. విశ్వాస పరీక్షలో గెలుపొందేందుకు ‘ఆపరేషన్ కమల్’కి తెరలేపింది. అసెంబ్లీలో బల నిరూపణకు ప్రస్తుతమున్న 104 ఎమ్మెల్యేలు సహా మరో 8 మంది బీజేపీకి అవసరం. దీంతో మిగిలిన వారి కోసం కాంగ్రెస్, జేడీఎస్లపై దృష్టి పెట్టింది. దీంతో ఈ ఆపరేషన్లో చిక్కుకోకుండా కాంగ్రెస్, జేడీఎస్లు తమ ఎమ్మెల్యేలను కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ రిసార్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. కుమారస్వామి, సిద్దరామయ్య సహా జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్యనేతలు కొచ్చిలోని ‘క్రౌన్ ప్లాజా’ 5స్టార్ హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోటల్ ముందు కేరళ పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటుచేశారు. అయితే.. వీరిని తరలించేందుకు ఏర్పాటుచేసుకున్న ప్రత్యేక విమానానికి డీజీసీఏ అధికారులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రోడ్డుమార్గంలో పుదుచ్చేరికి తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కరొక్కరుగా.. హోస్పేట ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ (కాంగ్రెస్) రిసార్టుకు రాకుండానే అదృశ్యమయ్యారు. దీనికి తోడు.. బుధవారం రాత్రి ఇప్పుడే వస్తానంటూ రిసార్టు నుంచి బయటకెళ్లిన మస్కి ఎమ్మెల్యే ప్రతాప గౌడ తిరిగి రాలేదు. ఆరోగ్యం బాగాలేదంటూ గురువారం రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన హుమ్నబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ కూడా అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత వీరి ఫోన్లు స్విచాఫ్ వస్తుండటంతో కూటమిలో కలవరం మొదలైంది. క్యూలో మరికొందరు! కాంగ్రెస్కు చెందిన కొందరు లింగాయత్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎమ్మెల్యేలు వెంకట్రావ్ నాడగౌడ, మహంతేశ్ కౌజల్గి, అమరేగౌడ, డీఎస్ హులగేరితో కమలదళ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరితో పాటు వెంకటరమణప్ప, శివశంకరరెడ్డి, స్వతంత్ర ఎమ్మెల్యేలు నాగేష్, శంకర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఆంగ్లో–ఇండియన్ ఎమ్మెల్యే నియామకాన్ని అడ్డుకోండి
యశవంతపుర: కర్ణాటక విధానసభకు ఆంగ్లో ఇండియన్ వినీషా నీరోను నామినేట్ చేస్తూ గవర్నర్ వజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్–జేడీఎస్లు గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. యడ్యూరప్ప అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకునే వరకూ గవర్నర్ నిర్ణయాన్ని అడ్డుకోవాలని తమ పిటిషన్లో పేర్కొన్నాయి. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై దాఖలైన పిటిషన్తోపాటుగా నేడు ఈ పిటిషన్ సుప్రీంలో విచారణకు రానుంది. గురువారం యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆంగ్లో–ఇండియన్ను గవర్నర్ నామినేట్ చేశారు. గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకు జెఠ్మలానీ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే తరహా పిటిషన్ను విచారిస్తున్న ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సూచించింది. -
మావీ ‘అతిపెద్ద’ పార్టీలే!
న్యూఢిల్లీ/పణజి/పట్నా: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని ఆయుధంగా మార్చుకోనున్నాయి. గోవా, మణిపుర్, మేఘాలయతో పాటు బిహార్లో అతిపెద్ద పార్టీలుగా నిల్చిన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను కోరేందుకు సిద్ధమయ్యాయి. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరుతూ 16 మంది ఎమ్మెల్యేల సంతకాల లేఖను శుక్రవారం రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హాకు అందజేయనున్నట్లు గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షనేత చంద్రకాంత్ కవ్లేకర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గానూ కాంగ్రెస్ 17 సీట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. గవర్నర్తో సమావేశంలో గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుని కర్ణాటక తరహాలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరతామన్నారు. మరోవైపు మణిపుర్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్, మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాలు శుక్రవారం ఆయా రాష్ట్రాల గవర్నర్లతో సమావేశం కానున్నారు. మణిçపూర్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉన్నందున తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరతామని ఇబోబీ సింగ్ తెలిపారు. బిహార్ గవర్నర్తో భేటీ కానున్న తేజస్వీ కర్ణాటక ఉదంతం నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి బిహార్ గవర్నర్ సత్యపాల్తో శుక్రవారం భేటీ అవుతానని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నితీశ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి కర్ణాటక తరహాలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతామన్నారు. -
1996లో అలా.. 2018లో ఇలా!
ఇప్పుడు కర్ణాటకలో తమను కాదని గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీ నేత యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించడాన్ని కాంగ్రెస్, దేవెగౌడ పార్టీ జేడీఎస్ అన్యాయం, అక్రమమని గొంతు చించుకుంటున్నాయి. అయితే, ఒకప్పుడు గుజరాత్లో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ సర్కారును అక్రమంగా గద్దెదించడంలో కాంగ్రెస్ పార్టీ, దేవెగౌడ తమ పాత్రలను మరచిపోయినట్లు కనిపిస్తోంది. గవర్నర్ సిఫార్సుతో మెహతా బర్తరఫ్! అది 1996 సెప్టెంబర్. గుజరాత్లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీనియర్ నేత శంకర్సింహ్ వాఘేలా వర్గీయులు తిరుగుబాటు చేశారు. మెహతా ప్రభుత్వానికి అసెంబ్లీలో 121 మంది బీజేపీ శాసనసభ్యుల మద్దతు ఉండగా, వారిలో 40 మంది తనను సమర్థిస్తున్నారని వాఘేలా ప్రకటించి, ప్రతిపక్షమైన కాంగ్రెస్తో చేతులు కలిపారు. వాఘేలా, కాంగ్రెస్కు చెందిన పారిఖ్ కలిసి సురేశ్మెహతా సర్కారుపై అవిశ్వాసం ప్రకటించి, తిరుగుబాటు చేయడంతో బీజేపీ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి చెందిన స్పీకర్ హెచ్ఎల్ పటేల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో సభను నడిపిన కాంగ్రెస్కు చెందిన ఉపసభాపతి చందూభాయ్ ధాబీ వాఘేలా–పారిఖ్ వర్గానికి గుర్తింపు ఇచ్చారు. మళ్లీ కోలుకుని అసెంబ్లీకి వచ్చిన స్పీకర్ పటేల్ డెప్యూటీ స్పీకర్ ఉత్తర్వును రద్దు చేయడం గందరగోళం, కొట్లాటలకు దారితీసింది. అసెంబ్లీలో రభస జరగడంతో బలపరీక్షకు ఓటింగ్ నిర్వహించడం కుదరలేదు. వాఘేలా వర్గం, కాంగ్రెస్ నేతలు గవర్నర్ కృష్ణపాల్ సింగ్ను కలసి మెహతా సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కారు రద్దుకు గవర్నర్ సిఫార్సు దాంతో మెహతా ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశా>రు. ఆ సమయంలో దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటినుంచి మద్దతిస్తోంది. దేవెగౌడ ప్రభుత్వం గుజరాత్ నుంచి గవర్నర్ నివేదిక అందిన వెంటనే సురేశ్ మెహతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఇప్పటి కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా అప్పుడు గుజరాత్ బీజేపీ అధ్యక్షుని హోదాలో తమ పార్టీ సర్కారుకు జరిగిన ‘అన్యాయాన్ని’ కళ్లారా చూశారు.. అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అదే దేవెగౌడ కొడుకు కుమారస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కోరినా వజూభాయ్ పట్టించుకోలేదు. వాజ్పేయి ఔట్.. దేవెగౌడ ఇన్ 1996లోనే సభలో మెజారిటీ నిరూపించుకోలేక ప్రధాని పదవికి వాజ్పేయి రాజీనామా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 1996 లోక్సభ ఎన్నికల తర్వాత 161 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అటల్ బిహారీ వాజ్పేయిని అప్పటి రాష్ట్రపతి శంకర్దయాళ్ శర్మ ఆహ్వానించారు. బలపరీక్ష నాటికి అవసరమైన మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో.. ఓటింగ్కు ముందే వాజ్పేయి రాజీనామా చేశారు. అయితే, విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వాజ్పేయి చేసిన ఆవేశపూరిత ప్రసంగాన్ని నేటికీ గుర్తు చేసుకుంటారు. అనంతరం, కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడే సంకీర్ణ సర్కారుకు మద్దతివ్వడానికి కాంగ్రెసేతర జాతీయ. ప్రాంతీయపార్టీలు అంగీకరించకపోవడంతో.. కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ ప్రభుత్వానికి దేవెగౌడ నేతృత్వం వహించడం కొసమెరుపు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
యడ్డీ ప్రమాణాన్ని అడ్డుకోలేం!
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయంపై సుప్రీంకోర్టులో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్–జేడీఎస్లు సుప్రీంలో ఉమ్మడి పిటిషన్ దాఖలు చేయగా.. ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మెజార్టీ ఉండగా.. బీజేపీ నేత యడ్యూరప్పను ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆహ్వానించారని, దానిని అడ్డుకోవాలని అర్థరాత్రి 12 గంటల సమయంలో కాంగ్రెస్–జేడీఎస్లు సుప్రీం తలుపుతట్టాయి. అప్పటికప్పుడే వాదనలు వినాలని ఆ పార్టీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. దీంతో జేడీఎస్–కాంగ్రెస్లు ఉమ్మడిగా దాఖలు చేసిన పిటిషన్ విచారణ కోసం అప్పటికప్పుడు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని సీజేఐ ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున 2.11 గంటలకు కాంగ్రెస్–జేడీఎస్ పిటిషన్పై ప్రత్యేక ధర్మాసనం విచారణ ప్రారంభించింది. 5.28 గంటలకు మధ్యంతర ఆదేశాలిస్తూ.. ‘ యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై మేం స్టే ఇవ్వలేం. అయితే ప్రమాణస్వీకారం, కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు అనేవి కేసు తుది తీర్పునకు లోబడి ఉంటాయి’ అని స్పష్టం చేసింది. గవర్నర్, యడ్యూరప్ప లేఖల్ని సమర్పించండి.. మెజార్టీ ఉన్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమిని ఆహ్వానించకపోవడం అప్రజాస్వామికమని, గురు వారం ఉదయం 9 గంటలకు ప్రమాణస్వీకారం ఉండడం వల్లే అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని కాంగ్రెస్–జేడీఎస్ల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేశ్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించాలని, లేదంటే వాయిదా వేయాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు సుప్రీం నిరాకరిస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలాకు యడ్యూరప్ప పంపిన లేఖ, యడ్యూరప్పను ఆహ్వానిస్తూ గవర్నర్ పంపిన సమాధానాన్ని శుక్రవారంలోగా తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ధర్మాసనం వాయిదావేసింది. అర్ధరాత్రి పిటిషన్ వేయాల్సిన అవసరమేంటి? ఈ కేసులో కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, బీజేపీ ఎమ్మెల్యేలు గోవింద్ కర్జోల్, ఉదాసి, బసవరాజ్ బొమ్మైల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీలు వాదనలు వినిపిస్తూ.. ప్రమాణ స్వీకారం వాయిదా, స్టే విధించాలన్న అభ్యర్థనను వ్యతిరేకించారు. ‘యడ్యూరప్ప, గవర్నర్ల మధ్య సమావేశంలో ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తం వ్యవహారం అస్పష్టంగా ఉంది. ఇంతవరకూ అన్నీ ఊహాగానాలే’ అని వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పిటిషన్ దాఖలు చేయడాన్ని రోహత్గీ ప్రశ్నిస్తూ.. ‘ఒకరి ప్రమాణ స్వీకారంతో ఏదైనా ఘోరం జరిగిపోతుందా? ఇది చావు బతుకుల సమస్యో లేక ఎవరినో ఉరితీస్తున్న అంశమో కాదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీని ఆహ్వానించడం గవర్నర్కున్న రాజ్యాంగ విధి.. ఆయన చర్యలు ఎప్పుడూ న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ కేసులో లాగానే యథాపూర్వ స్థితిని కొనసాగించమని కోర్టు ఆదేశించవచ్చు’ అని రోహత్గీ వాదించారు. ఆ సయయంలో సింఘ్వీ జోక్యం చేసుకుంటూ.. బలనిరూప ణ కోసం గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. అలా చేయడం వల్ల ప్రలోభాలకు, ఎమ్మెల్యేల కొనుగోలుకు దారితీసే ప్రమాదముందన్నారు. -
గుమస్తా నుంచి సీఎంగా
సాక్షి,బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీఎస్ యడ్యూరప్ప జీవితంలో కూడా ఎన్నో మలుపులు, వివాదాలున్నాయి. సాధారణ ప్రభుత్వ గుమస్తా నుంచి ప్రభుత్వ అధినేతగా ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న యడ్యూరప్ప జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై హిందుత్వ విధానాలను అనుసరించారు. డిగ్రీ పూర్తయ్యాక కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్కు ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఉద్యోగం వదిలి స్వగ్రామంలోని ఒక రైస్ మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. 1980లో బీజేపీలో చేరి 1983లో తొలిసారిగా శికారిపుర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2007, 2008, 2018లలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. షాకిచ్చిన జేడీఎస్: 2006లో ధరమ్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జేడీఎస్తో చేతులు కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. యడ్డీ 2007లో తొలిసారి సీఎంగా ప్రమాణం చేసినా జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో వారంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2011లో రాజీనామా చేయ డంతోపాటు జైలుకెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తరువాత బీజేపీని వీడి కర్ణాటక జనతా పక్ష పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. 2013 ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు సీట్లే గెలుచుకుంది. 2014 ఎన్నికలకు ముందు తన పార్టీని బీజేపీలో విలీనం చేసి షిమోగా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
యడ్డీ గట్టెక్కేదెలా..?
న్యూఢిల్లీ: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ముందు బలనిరూపణ పెద్ద సవాలుగా నిలిచింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీ బలం 105 మాత్రమే. మెజారిటీ మేజిక్ ఫిగర్ మాత్రం 112. ఈ పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నెగ్గడమెలా? ఇందుకు సంబంధించి యడ్యూరప్ప ముందు రెండు మార్గాలున్నాయి. అవి.. 1. విపక్ష సభ్యుల గైర్హాజరు విశ్వాస పరీక్ష సమయంలో కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన కనీసం 13 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా చేయాలి. లేదా అసెంబ్లీకి హాజరైనా ఓటింగ్లో పాల్గొనకుండా చూడాలి. దానివల్ల అసెంబ్లీకి హాజరై ఓటేసే ఎమ్మెల్యేల సంఖ్య 209కి పడిపోతుంది. అప్పుడు హాజరైన లేదా ఓటేసిన ఎమ్మెల్యేల్లో యూడ్యూరప్పకు మెజారిటీ(సగం కన్నా ఒకరు ఎక్కువ) లభిస్తే సరిపోతుంది. అంటే 105 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే యడ్యూరప్ప గట్టెక్కుతారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీకి ఇప్పటికే 105 మంది శాసన సభ్యుల మద్దతుంది. గైర్హాజరైన లేదా ఓటేయని ఎమ్మెల్యేలను ఆయా పార్టీలు బహిష్కరిస్తే ఉప ఎన్నికలు జరుగుతాయి. 2. కాంగ్రెస్, జేడీఎస్ల్లో చీలిక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లో.. ఏ ఒక్క పార్టీ నుంచైనా కనీసం మూడింట రెండొంతుల మంది ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరాలి. ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కాకుండా ఉండాలంటే.. కాంగ్రెస్ నుంచి కనీసం 52 మంది లేదా జేడీఎస్ నుంచి 24 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించాలి. కాంగ్రెస్ నుంచి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు వస్తే బీజేపీ బలం 157 చేరుతుంది. లేదా జేడీఎస్ నుంచి మూడింట రెండొంతుల మంది వస్తే బీజేపీ బలం 129కి చేరుతుంది. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఫిరాయించేలా ఒప్పించడం కష్టసాధ్యమే. -
ఆ ఎమ్మెల్యేలంతా కోటీశ్వరులే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు భారీగా బ్లాక్మనీ వెదజల్లాయంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తుల వివరాల గురించి నివేదిక విడుదల చేశాయి. ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన 221 మంది ఎమ్మెల్యేలలో 215 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. సగటున ఒక్కో ఎమ్మెల్యే 35 కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్నారని, 2013 ఎన్నికల్లో గెలుపొందిన వారి కంటే ఇది 11 కోట్లు ఎక్కువని వెల్లడించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసినట్లు ఏడీఆర్ తెలిపింది. టాప్ 10లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే.. ధనవంతులైన ఎమ్మెల్యేల జాబితాలోని టాప్ 10 మందిలో ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. హోసకోటె ఎమ్మెల్యే ఎన్ నాగరాజు 1015 కోట్ల రూపాయల సంపదతో ప్రథమ స్థానంలో ఉండగా.. డీకే శివకుమార్ 840 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో నిలిచారు. సురేశ్ బీఎస్ 416 కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నారు. కాంగ్రెస్కే మొదటి స్థానం... కొత్తగా ఎన్నికైన చట్టసభ ప్రతినిధుల్లో అత్యధిక మంది కోటీశ్వరులైన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీలోని 99 శాతం మంది ఎమ్మెల్యేలని కోటీశ్వరులుగా పేర్కొన్న ఏడీఆర్.. సగటున ఒక్కో ఎమ్మెల్యే 60 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిపింది. ఇక 98 శాతం మంది కోటీశ్వరులైన ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అయితే వీరి సగటు ఆస్తుల విలువ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కంటే చాలా తక్కువ(రూ. 17 కోట్లు)ని పేర్కొంది. జేడీఎస్.. 95 శాతం.. 24 కోట్లు.. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకున్న జేడీఎస్.. సగటున 24 కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్న 95 శాతం ఎమ్మెల్యేలతో మూడో స్థానంలో నిలిచింది. క్రిమినల్ కేసుల్లో కూడా... ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా.. 221 మంది ఎమ్మెల్యేలలో 35 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. కాగా ఈ విషయంలో బీజేపీ 41 శాతం మంది ఎమ్మెల్యేలతో ప్రథమ స్థానంలో ఉండగా.. జేడీఎస్- కాంగ్రెస్లు 30 శాతం మంది ఉన్నారు. -
గవర్నర్ హామీ ఇచ్చారు: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్- జేడీఎస్ కూటమి సీఎం అభ్యర్థి హెచ్డీ కుమారస్వామి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కోరారు. రాజ్భవన్కు వెళ్లిన ఆయన తమకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్కు తెలిపారు. ఆ మేరకు ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన లేఖను వజుభాయ్కి కుమారస్వామి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ నిర్ణయం తర్వాతే తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. రాజ్యాంబద్దంగా నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వివరించారు. కుమారస్వామితో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ జి.పరమేశ్వర కూడా భేటీలో పాల్గొన్నారు. కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై గవర్నర్తో చర్చించారు. గవర్నర్పై నమ్మకం ఉంది రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమకు గవర్నర్పై నమ్మకం ఉందని, ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మా నుంచి ఒక్క నేత కూడా ఇతర పార్టీలోకి వెళ్లలేదు. గవర్నర్ అన్యాయం చేయరని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి భావిస్తోందని ఆయన చెప్పారు. తొలుత అడ్డగింత.. ఆపై భేటీ తొలుత రాజ్భవన్లోకి కాంగ్రెస్, జేడీఎస్ నేతలను సిబ్బంది అనుమతించకపోవడంతో కొంత సమయం అక్కడ ఉద్రిక్త చోటుచేసుకుంది. గవర్నర్కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అయితే గవర్నర్ అనుమతించాక కుమారస్వామి, పరమేశ్వర రాజ్భవన్లో ఆయనతో చర్చించారు. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. గవర్నర్కు లేఖను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమకు వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటే ధర్నా చేపడతామని తెలిపారు. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సైతం వెనుకాడేది లేదని ఈ కూటమి నేతలు అంటున్నారు. -
కర్ణాటక: రాజ్భవన్ వద్ద హైడ్రామా
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమను అనుమతించకపోతే ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సిద్ధమైంది. తమ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో జేడీఎస్ నేత కుమారస్వామి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర రాజ్భవన్కు చేరుకున్నారు. అయితే సిబ్బంది ఆ నేతలను రాజ్భవన్లోకి అనుమతించలేదు. దీంతో కుమారస్వామి, పరమేశ్వర, ఎమ్మెల్యేలు గేటు బయటే ఉండిపోయారు. దీంతో రాజ్భవన్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కలిసి కుమారస్వామి, పరమేశ్వర ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. అనంతరం యడ్యూరప్ప కూడా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, గవర్నర్ వజుభాయ్ ఎదుట పరేడ్ నిర్వహించాలని రెండు పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోరుతూ కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. తమకు మద్దతుందని, కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ వజుభాయ్ని కోరనున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కుమారస్వామని అనుమతించకపోతే గవర్నర్కు వ్యతిరేకంగా ధర్నా చేయాలని ఈ కూటమి యోచిస్తోంది. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హక్కుందని, ఈ నేపథ్యంలో గవర్నర్ తమవైపు మొగ్గు చూపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం ఉంటే.. అవసరమైతే న్యాయం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్-జేడీఎస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
100కోట్లకు ఎమ్మెల్యేలు.. స్పందించిన జవదేకర్
సాక్షి, బెంగళూరు: వంద కోట్ల రూపాయలు అంటేనే ఊహించుకోవడం కష్టమని, అలాంటి నోట్ల రాజకీయాలు ఎవరు చేస్తున్నారో కర్ణాటకలో అందరికీ తెలుసునని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ నోట్ల కట్టలతో జేడీఎస్ నేతలను కొనాలని, మంత్రి పదవులంటూ వారిని ప్రలోభపెట్టాలని చూస్తోందంటూ కుమారస్వామి చేసిన ఆరోపణలపై జవదేకర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంద కోట్ల నగదు అంటే భారీ మొత్తమని, అయినా నగదుతో నేతలను మభ్యపెట్టడం కాంగ్రెస్-జేడీఎస్కు బాగా తెలుసునని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు మేం విజ్ఞప్తి చేశాం. బీజేపీ ఎన్నటికీ నియమాలను ఉల్లంఘించదు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మేం ఇప్పటికీ విశ్వసిస్తున్నాం. మరోవైపు ప్రత్యర్థి కూటమి బీజేపీపై బురద చల్లే యత్నం చేస్తోంది. వ్యాపారం చేసినట్లుగా.. నేతలను కొనడం కాంగ్రెస్కు బాగా తెలుసు. జేడీఎస్తో కూటమిపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. న్యాయమార్గాన్ని అనుసరించి గవర్నర్ అనుమతితో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని’ ప్రకాష్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వాన్ని బీజేపీనా, లేక కాంగ్రెస్-జేడీఎస్లు ఏర్పాటు చేస్తాయా అన్న దానిపై దక్షిణాది రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రలోభాల పర్వాన్ని బీజేపీ కొనసాగిస్తుందని కాంగ్రెస్- జేడీఎస్ కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి నేడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 100 కోట్లు, మంత్రి పదవులు ఆఫర్ చేస్తుందని ఆరోపించారు. ‘ఆపరేషన్ కమల్’ విజయవంతమైందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమ కూటమితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. బీజేపీ తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేను లాక్కుంటే.. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కుంటామని ఆయన హెచ్చరించారు. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు -
కర్ణాటక: ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు!
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టినట్టు వచ్చిన వార్తలను పీసీసీ అధ్యక్షుడు జి. పరమేశ్వర తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరైయ్యారని చెప్పారు. బీదర్ నుంచి ప్రత్యేక విమానంలో రావడం వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా వచ్చారని వివరించారు. కాగా, కర్ణాటక పీసీసీ కార్యాయలంలో జరిగిన పార్టీ శాసనసభా భేటీకి కొందరు ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగింది. డిప్యూటీ సీఎం అడగలేదు: శివకుమార్ మరోవైపు తమ పార్టీకి చెందిన 78 మంది ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని, ఎటువంటి ప్రలోభాలకు లొంగబోరని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ అన్నారు. తాను ఉప ముఖ్యమంత్రి పదవి అడిగినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. తానేమీ అడిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే తమ తక్షణ ప్రాధాన్యత అని చెప్పారు. -
‘అది పచ్చి అబద్ధం.. ఆయనెవరో కూడా తెలియదు’
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. అయితే అనంతరం నెలకొన్న రాజకీయా పరిణామాలతో ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై చర్చ జరగుతున్న నేపథ్యంలో భిన్న వాదనలు, వదంతులు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ కర్ణాటక ఇన్ఛార్జ్, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ను కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సీఎం అభ్యర్థి హెచ్డీ కుమారస్వామి కలిశారని ప్రచారం జరుగుతోంది. జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారన్న నేపథ్యంలో జవదేకర్ను తాను కలుసుకున్నానన్నది పచ్చి అబద్ధమని జేడీఎస్ నేత కుమారస్వామి చెప్పారు. బీజేపీతో సంప్రదింపులు జరిపారన్న వదంతులపై కుమారస్వామి ఘాటుగా స్పందించారు. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ... ‘జవదేకర్ అంటే ఎవరు. ఆ వ్యక్తి గురించి నాకు తెలియదు. నేను ఏ జవదేకర్నుగానీ, బీజేపీ నేతతోగానీ ఇప్పటివరకూ భేటీ కాలేదు. బీజేపీ నేతలెవరూ నన్ను సంప్రదించలేదు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరతో సహా వెళ్లి, మేం మరోసారి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కలవనున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నట్లు’ వివరించారు. కాగా, తాను తమ్ముడి వెంటే ఉన్నానని, కుమారస్వామే ముఖ్యమంత్రి అభ్యర్థి అని జేడీఎస్ నేత రేవణ్ణ స్పష్టం చేసిన విషయం విదితమే. -
బీజేపీ బలపరీక్షలో నెగ్గుతుందా?
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరు బలపరీక్షలో నెగ్గుతారు? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇటు యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ, అటు కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం కల్పించాలని గవర్నర్ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్ వాలా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి ఆయన మొదట అవకాశం ఇస్తారా? లేక పూర్తి మెజారిటీ తమకు ఉందని చెప్తున్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి చాన్స్ ఇస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై.. యడ్యూరప్పను నాయకుడిగా ఎన్నుకుంది. యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ను మరోసారి కలిసి.. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ సొంతంగా 104 స్థానాలు గెలుచుకుంది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సంఖ్యాబలం 105కు చేరుకుంది. అటు, జేడీఎస్ శాసనసభాపక్షం కూడా భేటీ అయి.. కుమారస్వామిని నాయకుడిగా ఎన్నుకుంది. కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ నేతలు బుధవారం సాయంత్రంలోగా గవర్నర్ను కలువనున్నారు. తమకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో లేఖను గవర్నర్కు అందజేసి.. మొదట తమకు అవకాశం ఇవ్వాలని కోరబోతున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై.. జీ పరమేశ్వరను నాయకుడిగా ఎన్నుకుంది. జేడీఎస్కు మద్దతుగా నిలువాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటు బీజేపీకిగానీ, అటు జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి గానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం ఉందా? అన్నది ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీలోని 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 112. బీజేపీకి ఇప్పటివరకు అధికారికంగా 105మంది సభ్యుల మద్దతు ఉంది. ఇందులో స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్ కూడా ఉన్నారు. ఆయన కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ) పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు కాంగ్రెస్ 78 స్థానాలు, జేడీఎస్ 38 స్థానాలు గెలుపొందాయి. మరో స్వతంత్ర ఎమ్మెల్యే ప్రస్తుతానికి వైఖరి తెలియాల్సి ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులను కలుపుకుంటే.. ఆ కూటమి బలం 116కు చేరుకుంటుంది. అలవోకగా మ్యాజిక్ ఫిగర్ను దాటవచ్చు. బలపరీక్షలోనూ కుమారస్వామి కూటమి గెలువవచ్చు. కానీ అసలు తిరకాసు ఇక్కడే ఉంది. బీజేపీ బేరసారాలకు పలువురు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆకర్షితమైనట్టు తెలుస్తోంది. వీరు లోపాయికారిగా బీజేపీ అనుకూలంగా పనిచేస్తారని, బీజేపీ బలపరీక్ష ఎదుర్కొంటే.. గైర్హాజరై.. ఆ పార్టీకి పరోక్షంగా సహకరిస్తారని అంటున్నారు. ఇప్పటివరకు పరిణామాలనుబట్టి చూస్తే.. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. వారు బీజేపీ నేత శ్రీరాములు బంధువులని, గాలి జనార్దన్రెడ్డి సన్నిహితులని తెలుస్తోంది. అటు జేడీఎస్ శాసనసభాపక్ష భేటీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఒకవేళ ఈ ఎనిమిది మంది సభ్యులు (కాంగ్రెస్ నుంచి ఆరుగురు.. జేడీఎస్ నుంచి ఇద్దరు) బీజేపీకి ఆకర్షితులై.. తమ పార్టీల సమావేశాలకు దూరంగా ఉంటే.. అప్పుడు బీజేపీ బలనిరూపణ నల్లేరుమీద బండినడక అవుతోంది. బీజేపీ ప్రస్తుతం సాధారణ మెజారిటీకి ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు తక్కువగా ఉంది. మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ఫిరాయిస్తే.. బీజేపీ సులుభంగానే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని భావించవచ్చు. కానీ, క్షణక్షణానికి కర్ణాటకలో రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం కాదు.. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తాను తలుచుకుంటే బీజేపీ నుంచి రెట్టింపు ఎమ్మెల్యేలను లాక్కుంటానని కుమారస్వామి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం.. అసెంబ్లీలో బలనిరూపణ వరకు కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా, సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. -
కర్ణాటక: అదేపనిగా ఫోన్ చేస్తున్నారు!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాలు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా నిలిచిన కమలదళం.. ఎట్టిపరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు ఎరవేసి.. మంత్రి పదవులు ఆశజూపి తమవైపు లాక్కునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. బీజేపీ నేతలు తమకు అదేపనిగా ఫోన్ చేస్తున్నారని ఇటు కాంగ్రెస్, అటు జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. తమకు మద్దతునిస్తే.. కేబినెట్ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ బేరసారాలు ఆడుతున్నట్టు వారు చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే టీడీ రాజెగౌడ బీజేపీ బేరసారాలపై నోరువిప్పారు. ‘బీజేపీ నేతలు అదేపనిగా ఫోన్ చేస్తున్నారు. అయినా మేం ఏమీ భయపడటం లేదు. నాకు ఫోన్ చేయవద్దని వారికి స్పష్టంగా చెప్పాను. నేను నిబద్ధత కలిగిన కాంగ్రెస్ వ్యక్తిని. చాలాకాలంగా వారు నన్ను అడుగుతూ వస్తున్నారు. వారి పనే ఇది’ అని రాజెగౌడ మీడియాకు తెలిపారు. జేడీఎస్ ఎమ్మెల్యే అమరెగౌడ లింగనగౌడ పాటిల్ కూడా బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చినట్టు తెలిపారు. ‘బీజేపీ నేతల నుంచి నాకు ఫోన్ వచ్చింది. మాతో వచ్చి చేరండి మీకు మంత్రి పదవి ఇస్తామని వారు చెప్పారు. కానీ జేడీఎస్తోనే ఉంటాను. కుమారస్వామే మా సీఎం’ అని తెలిపారు. -
అనూహ్యంగా తెరపైకి రేవణ్ణ..!
సాక్షి, బెంగళూరు : జేడీఎస్ సీనియర్ నేత, హెచ్డీ దేవెగౌడ రెండో తనయుడు రేవణ్ణ బుధవారం అనూహ్యంగా తెరపైకి వచ్చారు. తన తమ్ముడు కుమారస్వామిని జేడీఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నామని ఆయన స్వయంగా తెలిపారు. తద్వారా తాను బీజేపీతో చేతులు కలుపబోతున్నట్టు వస్తున్న ఊహాగానాలకు రేవణ్ణ చెక్ పెట్టారు. జేడీఎస్ఎల్పీ భేటీ తర్వాత కుమారస్వామితో కలిసి రేవణ్ణ విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్కు ఆ పార్టీ కొద్ది దూరంలో నిలిచిపోవడంతో ఇతర పార్టీల నుంచి వలసలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దేవెగౌడ సొంత కుటుంబంలోని వర్గపోరును ఆసరా చేసుకొని.. రేవణ్ణను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. రేవణ్ణకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేయడం ద్వారా ఆయనను తమవైపు ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించింది. రేవణ్ణకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో సులభంగా బలపరీక్ష గండాన్ని గట్టెక్కవచ్చునని బీజేపీ భావించినట్టు కథనాలు వచ్చాయి. దేవేగౌడకు నలుగురు తనయులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దేవేగౌడ మూడో కుమారుడు కుమారస్వామి. తమ్ముడు కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రేవణ్ణకు వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరిగింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప కూడా రేవణ్ణ వర్గం మద్దతు తమ పార్టీకి ఉందని గవర్నర్తో చెప్పినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలకు, ఊహాగానాలకు చెక్ పెడుతూ.. తాను తమ్ముడి వెంటే ఉన్నానని, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని రేవణ్ణ స్పష్టం చేశారు. -
బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోంది
-
వందకోట్లు.. మంత్రి పదవి.. సంచలన వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో సాగుతున్న ప్రలోభాల పర్వంపై జేడీఎస్ అధినేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 100 కోట్లు, కేబినెట్ మంత్రి పదవి ఆఫర్ చేస్తుందని ఆయన తెలిపారు. బుధవారం బెంగళూరులోని ఓ హోటల్లో జరిగిన జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘ఆపరేషన్ కమల్’ విజయవంతమైందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. బీజేపీ తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేను లాక్కుంటే.. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కుంటామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేల బేరసారాలకు తెరతీసేలా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సూచించారు. ఉత్తరాదిలో విజయవంతంగా సాగిన బీజేపీ అశ్వమేధ యాగానికి కర్ణాటకలో ఫుల్స్టాప్ పడిందని, కర్ణాటక ఫలితాలు బీజేపీ అశ్వమేధ యాగాన్ని అడ్డుకున్నాయని కుమారస్వామి వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రసక్తే లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. జేడీఎస్లో చీలిక వస్తుందని తప్పుడు ప్రచారం చేశారని, తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రచారం వల్ల బీజేపీకి 104 స్థానాలు రాలేదని, సెక్యూలర్ ఓట్లు చీలడం వల్లే ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చాయని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మోదీ, బీజేపీ గెలుపు కాదని అన్నారు. బీజేపీ అధికారం కోసం వెంపర్లాడుతోందని, ప్రధాని మోదీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆయన స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీని చీల్చాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. అధికార బలంతో ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని, ఐటీ దాడులు చేయిస్తూ.. వారిని ఆందోళనకు గురిచేయాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు. మరికాసేపట్లో ఆయన రాష్ట్ర గవర్నర్ను కలువనున్నారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయనకు ఇచ్చి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు. బీజేపీతో టచ్లో ఉన్నారని భావిస్తున్న దేవెగౌడ కొడుకు రేవణ్ణ కూడా జేడీఎస్ శాసనసభాపక్ష భేటీలో పాల్గొనడం గమనార్హం. జేడీఎస్లో ఎలాంటి చీలిక లేదని, పార్టీ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నామని రేవణ్ణ తెలిపారు. ఇక ఈ భేటీకి ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు మాత్రం హాజరుకాలేదు. -
జేడీఎస్కూ ఝలక్.. ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచి.. మ్యాజిక్ ఫిగర్కు తొమ్మిది స్థానాల దూరంలో నిలిచిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా తన ఆపరేషన్ తీవ్రతరం చేసింది. ఇటు కాంగ్రెస్, అటు జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది. ఇందుకు తగినట్టు ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొడితే.. ఇటు ప్రభుత్వానికి నేతృత్వం వహించాలనుకుంటున్న జేడీఎస్కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామిని జేడీఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం బెంగళూరులోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజా వెంకటప్ప నాయక, వెంకటరావు నాదగౌడ గైర్హాజరయ్యారు. వీరు రాకపోవడంపై జేడీఎస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ఆకర్షణకు లోనై ఈ ఎమ్మెల్యేలు జేడీఎస్ఎల్పీ భేటీకి దూరంగా ఉన్నారా? అన్న చర్చ పార్టీలో నడుస్తోంది.