land disputes
-
ల్యాండ్ టైట్లింగ్తో భూ వివాదాలకు తెర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం–2022 వల్ల భూ వివాదాలు, మోసాలను అరికట్టి యాజమాన్య హక్కుపై పూర్తి భరోసా కల్పించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. వాస్తవాలను గమనించకుండా కొన్ని రాజకీయ పార్టీలు, కొంత మంది న్యాయవాదులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు దేశంలోని 12 రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయని, భూములకు శాశ్వత హక్కు రావాలంటే ఈ చట్టం అమలు జరగాలని అన్నారు. యజమాని ఎక్కడున్నా భూమికి రక్షణ అవసరమని, ప్రతి మూడు నెలలకోసారి మొబైల్ ఫోన్లో భూమి వివరాలను చెక్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని వివరించారు. ఎవరైనా మార్పులు, చేర్పులకు ప్రయత్నిస్తే మనకు సమాచారం కూడా వస్తుందన్నారు. న్యాయ వ్యవస్థలో 66 శాతం కేసులు, 24 శాతం హత్యలు భూ తగాదాలకు సంబంధించినవే ఉన్నాయని చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఇలా.. సాక్షి: ఈ చట్టం వల్ల భూ యజమానులకు ప్రయోజనాలేమిటి? కల్లం: ఈ చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయితే ఆ భూమికి అతనే యజమాని అనే హామీని ప్రభుత్వం ఇస్తుంది. ఆ భూమిపై హక్కుకు ఈ రికార్డే సాక్ష్యం. ఒకవేళ రికార్డుల్లో ఏదైనా పొరపాటు వల్ల భూమి హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇందుకోసం టైటిల్ ఇన్సూరెన్సు వ్యవస్థ ఏర్పాటవుతుంది. సాక్షి: ఈ చట్టం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి? కల్లం: వ్యవసాయ భూమి కొనుగోలు చెయ్యాలంటే రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు చేయించుకోవాలి. ఆ తరువాత ఆర్వోఆర్ చట్ట రిజిస్ట్రేషన్ ప్రకారం తహసీల్దార్ విచారణ చేసి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చెయ్యాలి. కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేచోట, ఒకేసారి జరుగుతాయి. భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటే హక్కులకు సంపూర్ణ హామీ ఉన్నట్లే. సాక్షి: రెవెన్యూ రికార్డుల్లో ఎలా నమోదు చేసుకోవాలి? కల్లం: తహసీల్దార్కు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ విచారణ చేసి నమోదు చేస్తారు. పట్టాదారు రికార్డుల్లో పాస్ పుస్తకం జారీ చేస్తారు. కొత్త విధానంలో టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసి, సర్టిఫికెట్ జారీ చేస్తారు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ప్రాథమిక పరిశీలన చేసి, రికార్డుల వివరాలు, దరఖాస్తుదారు అర్జీల్లో పొందుపరిచి నిర్ధారించి సర్టిఫికెట్ ఇస్తారు. సాక్షి: టైటిల్ రిజిస్టర్లో ఏర్పడే భూ వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? కల్లం: భూమి రికార్డులను రూపొందించిన ఆ రికార్డుల్లో పొరపాట్లను సరి చెయ్యడానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటయ్యింది. భూమి యజమానుల రికార్డు అయినా రిజిస్టర్ 1, 1బిలో తప్పులుంటే సవరణ కోసం ఆర్వోఆర్ చట్టం కింద రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు, జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ దాఖలు చెయ్యవచ్చు. కొత్త చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో తప్పులుంటే జిల్లా స్థాయిలోని ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు.టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలకు సంబంధించి వివాదాలుంటే జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ దగ్గర అప్పీల్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చే తీర్పుపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు. సాక్షి: ఈ చట్టం కింద ఏర్పడే నూతన వ్యవస్థలు ఏమిటి? కల్లం: కొత్త చట్టం అమలులోకి వస్తే భూమి హక్కుల రిజిస్టర్కు భూమి టైటిలింగ్ ఆఫీసర్లను నియమిస్తారు. టైటిల్ రిజిస్టర్పై వివాదాలుంటే పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్లను నియమిస్తారు. ఇప్పుడున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు అనుబంధ సంస్థలుగా పని చేస్తాయి. సాక్షి: కొత్త చట్టంలో సివిల్ కోర్టుల పాత్ర ఏమిటి? కల్లం: ఆర్వోఆర్ చట్టం కింద నిర్వహించే 1బి రిజిస్టర్లో నమోదు, తప్పొప్పుల సవరణ బాధ్యత సివిల్ కోర్టులకు లేనట్లే. ఈ కొత్త చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో తప్పులను సవరించే బాధ్యత కూడా సివిల్ కోర్టులకు ఉండదు. వారసత్వ/ఆస్తి పంపకాల వివాదాలు, ప్రస్తుతం కోర్టుల్లో పెండింగులో ఉన్న వివాదాలు, టైటిల్ రిజిస్టర్ తయారీకి సంబంధం లేని ఇతర భూ వివాదాలు సివిల్ కోర్టు పరిధిలోనే ఉంటాయి. కొత్త చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వివాదాల వివరాలు టీఆర్లో నమోదు చేయించుకోవాలి. అంతిమంగా ఉత్తర్వుల ప్రకారం చర్య తీసుకుంటారు. టీఆర్ నమోదైన వివరాలపై అభ్యంతరాలుంటే హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సాక్షి: కొత్త చట్టంలో రికార్డులు ఎవరు నిర్వహిస్తారు? కల్లం: ఈ చట్టం కింద మూడు రికార్డులుంటాయి. 1. భూమి హక్కులకు అంతిమ సాక్ష్యంగా ఉండే టైటిల్ రిజిస్టర్, 2. భూ సమస్యలుంటే నమోదు చేసే వివాదాల రిజిస్టర్, 3. భూమిపై ఇతర హక్కులను నమోదు చేసే చార్లెస్ అండ్ కొవనెంట్స్ రిజిస్టర్. ఈ మూడు రిజిస్టర్లను కలిపి రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అంటారు. ఈ రికార్డులను ల్యాండ్ అథారిటీ, సంబంధిత అధికారులు నిర్వహిస్తారు. సాక్షి: అభ్యంతరాలుంటే ఎంత కాలంలో తెలపాలి? కల్లం: టైటిల్ రిజిస్టర్లో ఉన్న వివరాలపై అభ్యంతరాలు ఉంటే ఆ వివరాలు నమోదైన రెండు సంవత్సరాల లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆర్వోఆర్ చట్ట ప్రకారం రూపొందిన రిజిస్టర్–1లో అభ్యంతరాలుంటే సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ 1బిలో నమోదు చేసిన వివరాలపై అభ్యంతరాలుంటే 90 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఈ చట్టంలో అత్యధికంగా రెండేళ్ల కాల వ్యవధి ఇచ్చారు. సాక్షి: కొత్త చట్టం హక్కులకు భద్రతా? భంగమా? కల్లం: హక్కులకు పూర్తి భద్రత చేకూర్చడం, భూ యజమానులకు ప్రభుత్వమే భరోసాగా ఉండడమే ఈ చట్టం ఉద్దేశం. భూములన్నింటికీ ఒకే రికార్డు ఉండటం, ఈ రికార్డును ఆన్లైన్లో పూర్తి రక్షణతో అందరికీ అందుబాటులో ఉంచడం వలన పారదర్శకత వస్తుంది. తారుమారు చేసే అవకాశం లేకుండా రికార్డులు నిర్వహిస్తారు. ఈ చట్టం వలన భూ వివాదాలు భారీగా తగ్గుతాయి. కొత్తగా భూ యాజమాన్య వివాదాలు ఏర్పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. కోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ చట్టం కింద నమోదు చేసుకోవాలి. ఆ వివరాలకు ప్రభుత్వ గ్యారెంటీ లభిస్తుంది. టైటిల్ రిజిస్టర్లో క్లరికల్ తప్పిదాలుంటే టీఆర్ఓ వద్ద అప్పీలు చేసుకోవాలి. సాక్షి: ఇలాంటి చట్టం ఎక్కడైనా ఇప్పటికే అమలులో ఉందా? కల్లం: టైటిల్ గ్యారెంటీ చట్టం ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా, కెనడా, బ్రిటన్, కామన్వెల్త్, తదితర వంద దేశాల్లో అమల్లో ఉంది. సాక్షి: కొత్త చట్టంలో భూమి కొనుగోలు చేస్తే కలిగే ప్రయోజనాలేమిటి? కల్లం: ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే భూమి కొనుగోలు చేసే ముందు టైటిల్ రిజిస్టర్లో వివరాలు చూసుకుంటే చాలు. పాత విధానంలో ఆర్ఎస్ఆర్ నుంచి ప్రస్తుత అడంగల్ వరకూ ప్రతి సంవత్సరం రికార్డు పరిశీలించాల్సిన అవసరం ఉండదు. టైటిల్ రిజిస్టర్లో పేరుంటే ప్రభుత్వ భరోసాతో భూమి కొనుగోలు చెయ్యవచ్చు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేసారి సులభంగా జరిగిపోతాయి. రిజిస్ట్రేషన్ జరిగిందంటే భూమి హక్కుల బదిలీ జరిగినట్టే. అన్ని రకాల భూములకూ ఈ చట్టం వర్తిస్తుంది. అన్ని రకాల భూములకు ఒకటే రిజిస్టర్ ఉంటుంది. సాక్షి: తగాదాలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు? కల్లం: వివాదాలుంటే సర్వే, హద్దుల చట్టం కింద సంబంధిత అధికారులను కానీ, సివిల్ కోర్టును కానీ ఆశ్రయించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య భాగ పంపిణీ, వారసత్వ తగాదాలు ఉంటే సివిల్ కోర్టులు పరిష్కరిస్తాయి. ఆస్తి పన్నులు, ఇతర వివాదాలు, కేసులు ఉంటే న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి.రికార్డుల వివరాలపై అభ్యంతరాలుంటే చట్టంలో పేర్కొన్న కాల వ్యవధిలో ఎల్టీఏఓ, అప్పీలు వేసి, వివరాలు టీఆర్ఓ వద్ద నమోదు చేసుకోవాలి. అప్పీల్ చేసుకోకపోతే ఆ భూమిపై హక్కులకు ప్రభుత్వ గ్యారెంటీ లభించదు. ప్రస్తుతం సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో వచ్చే అంతిమ తీర్పు ప్రకారమే టైటిల్ రిజిస్టర్లో హక్కుల నమోదు జరుగుతుంది. కానీ కోర్టుల్లో వివాదంలో ఉన్న వివరాలు టీఆర్ఓ వద్ద నమోదు చేయించుకుని, ఆ సర్టిఫైడ్ కాపీని సంబంధిత కోర్టుకు తెలియజేయాలి. -
జంట హత్యల కేసులో నిందితుల అరెస్ట్
కృష్ణా: మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గత గురువారం సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులు ఐదుగురిని కూచిపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటు వారు హత్యకు వినియోగించిన ఆయుధాలతో సహా 72 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ సందర్భంగా మొవ్వ మండలం కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఆదివారం గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... బోయపాటి ధనలక్ష్మి తన సొంత బాబాయి కొడుకులు గణేష్, లోకేష్, భువనేష్, పిన్ని స్వర్ణ పంచాయతీ ఆఫీస్ వద్ద తన తండ్రిని, గ్రామంలోని కృష్ణ వీధి మొదట్లో తన తల్లిని నరికి చంపారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణాజిల్లా ఎస్పీ పి.జాషువా ఆదేశాల మేరకు గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్.వెంకట నారాయణ ఆదేశాల మేరకు కూచిపూడి ఎస్ఐ డి.సందీప్, సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆదివారం నిందితులను పమిడిముక్కల మండలం వీరమాచినేనిపాలెంలో అదుపులోకి తీసుకున్నారు. హత్యకు కారణాలు మృతులకు(వీరంకి వీర కృష్ణ, వరలక్ష్మి), నిందితులకు మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో 3 ఎకరాల భూమి గురించి గత కొన్నేళ్లుగా వివాదాలు ఉన్నాయి. వీరంకి కృష్ణ 1.50 ఎకరాలు, నిందితులు 1.50 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. మృతుడికి చెందిన 1.50 ఎకరాలను కూడా నిందితులు ఆక్రమించాలని ప్రయత్నిస్తూ మూడుసార్లు పాస్ పుస్తకాలకు దరఖాస్తు చేయగా, మూడుసార్లు రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. తిరిగా తాజాగా నాలుగోసారి దరఖాస్తు చేశారు. తహసీల్దార్ సదరు పొలం పొజిషన్లో ఎవరు ఉన్నారని విచారణ చేయాలని ఆర్ఐ, వీఆర్వోలను ఆదేశించగా, ఈనెల 21న ఇరు వర్గాలను అయ్యంకి పంచాయతీ కార్యాలయానికి రావాలని పిలిపించారు. ఈ నేపథ్యంలో వీరంకి వీర కృష్ణ బతికి ఉండగా తమకు పాస్ పుస్తకాలు రానివ్వరని, అయ్యంకి గ్రామానికి కూడా వెళ్లలేమనే ఉద్దేశంతో నిందితులు పథకం ప్రకారం వీర కృష్ణతో గొడవ పెట్టుకుని తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో సుమారు ఒంటి గంట సమయంలో పంచాయతీ కార్యాలయం వద్ద కత్తులతో నరికి చంపారు. అనంతరం వీరంకి కృష్ణ భార్య వరలక్ష్మిని కూడా గ్రామంలో కృష్ణ వీధి మొదట్లో నరికి చంపారు. ఈ కేసులో ఏ1గా వీరంకి గణేష్(23), ఏ2గా వీరంకి నాగ లోకేష్(22), ఏ3గా వీరంకి భువనేశ్వర్(20), ఏ4గా వీరంకి స్వర్ణ(42), ఏ5గా భట్టిప్రోలు మండలం చింతమోటు గ్రామానికి చెందిన సమీప బంధువు శొంఠి జానేష్ కుమార్(22)లపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో డీఎస్పీతో పాటు పామర్రు సీఐ ఎన్.వెంకట నారాయణ, కూచిపూడి ఎస్ఐ డి.సందీప్ పాల్గొన్నారు. -
గిరిజన భూ వివాదాలకు సత్వర పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజన భూ వివాదాల సత్వర పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని గిరిజనులకు చెందిన షెడ్యూల్డ్ ఏరియా ‘భూ బదలాయింపు నిబంధనలు (ఎల్టీఆర్) 1/70’ ప్రకారం వారి హక్కులను కాపాడేలా పక్కా కార్యాచరణ చేపట్టింది. దాదాపు 1976 నుంచి పేరుకుపోయిన వేలాది ఎల్టీఆర్ కేసుల్లో వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించే దిశగా ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చడంతోపాటు ఇటీవల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పెండింగ్లో ఉన్న ఎల్టీఆర్ కేసులు విచారణ వేగవంతం చేయడం, పాత కేసుల్లోని భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, కొత్తగా నమోదైన కేసులను 6 నెలల గడువులోను, అప్పీల్కు వెళ్లిన కేసులు రెండు నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. అప్పటికీ వివాదం కొలిక్కిరాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్ విచారణకు వెళుతుంది. కేసుల్లో గిరిజనులకు అనుకూలమైన ఉత్తర్వులను వేగంగా అమలులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చింన వాటి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఐటీడీఏ పీవోలు, మైదాన ప్రాంత కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపించాలి. ఎల్టీఆర్ కేసులు, హక్కులపై ఐటీడీఏల పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు ఇచ్చింది. గిరిజన భూములకు రక్ష 1/70 యాక్ట్ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించారు. భూములకు సంబంధించి 1/70 (1959 చట్ట సవరణ) సెక్షన్–3తో గిరిజనులకు భూములపై హక్కులున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు చెందిన భూములు వారే అనుభవించాలి. గిరిజనులు నుంచి గిరిజనులు భూములు పొందచ్చు. గిరిజనుల నుంచి గిరిజనేతరులు కొనుగోలు చేయడం, ఆక్రమించడం వంటివి చెల్లవు. భూముల అన్యాక్రాంతాన్ని నిరోధించడమే దీని ఉద్దేశం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం (షెడ్యూల్డ్ ఏరియా) 37 మండలాల పరిధిలోని 3,512 గ్రామాల్లో నివసించే వారికి ఈ హక్కులు వర్తిస్తాయి. గిరిజనులకు చెందిన భూవివాదాల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలకు చెందిన రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం, సీతంపేట, కోట రామచంద్రపురం, పోలవరం ఐటీడీఏల పరిధిలో ఐదు ప్రత్యేక ఎల్టీఆర్ కోర్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలను తొలుత డిప్యూటీ తహసిల్దార్ (డీటీ) గుర్తించి నోటీసులు జారీ చేస్తారు. తగిన సమాచారం సేకరించిన అనంతరం ఐటీడీఏల పరిధిలోని పాడేరు, రంపచోడవరం, ఎల్వీఎన్ పేట, కేఆర్ పురం, పోలవరం కోర్టుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు విచారణ చేపడతారు. ఈ వివాదాల్లో తగిన పత్రాలు, ఆధారాలను సమర్పించడం ద్వారా భూమి ఎవరిదో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ ఆర్డర్ అమలు ఇలా ♦ ప్రారంభం (1976) నుండి ఈ ఏడాది జూన్ వరకు 29,810 ఎల్టీఆర్ వివాదాలు(1,47,554 ఎకరాలు) గుర్తించారు. ♦ 12,678 కేసులు (56,882 ఎకరాలు) గిరిజనులకు అనుకూలంగా ఉత్తర్వులు అమలయ్యాయి. ♦ 11,754 కేసుల్లో 51,278 ఎకరాలను గిరిజనులకు స్వాదీనం చేశారు. ♦ 924 కేసుల్లో 5,604 ఎకరాలను అప్పగించాల్సి ఉంది. మరికొన్ని కేసులు పలుస్థాయి (కోర్టు)ల్లో పెండింగ్లో ఉన్నాయి. -
Andhra Pradesh:భూ చిక్కుముడులకు చెక్
22(ఏ) చెర నుంచి విముక్తి గుంటూరు జిల్లా కుర్నూతల గ్రామంలోని జాస్తి వీరయ్య, ఆయన ఇద్దరు సోదరులు, చెల్లెళ్లకు కలిపి సర్వే నంబర్ 159లో 6.60 ఎకరాల భూమి ఉంది. ఆయన సోదరి.. తన కుమార్తె పెళ్లికి కొంత భూమిని పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నిస్తే కాలేదు. 2016 నుంచి దానిపై వారు పోరాడుతూనే ఉన్నారు. ఈ పొలం రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆ కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రీ సర్వే మొదలైంది. సర్వే నంబర్ 159లోని మొత్తం 25.69 ఎకరాలు 19 మంది రైతుల పేరు మీద ఉంది. అందులో ముగ్గురు రైతులకు చెందిన 3.25 ఎకరాలను 2016లో దేవదాయ శాఖ తన భూమిగా పేర్కొంది. దీంతో ఆ సర్వే నంబర్ మొత్తాన్ని 22 (ఏ)1 (సి)లో నమోదు చేయడంతో మిగిలిన 16 మంది రైతుల భూమి కూడా వివాదంగా మారింది. ఇప్పుడు రీ సర్వేలో సబ్ డివిజన్ ద్వారా 16 మంది రైతులకు, దేవదాయ శాఖగా చెప్పిన భూమికి ప్రత్యేకంగా ఎల్పీఎం నంబర్లు రావడంతో సమస్య పరిష్కారమైంది. ప్రతి గ్రామంలో నిత్యం భూ తగాదాలు.. ఏ కోర్టుకు వెళ్లినా దాదాపు సగం కేసులు భూ సమస్యలే. భూ పంపకాలు చేసుకోవాలన్నా, పిల్లల పెళ్లిళ్లు.. చదువుల కోసం విక్రయించాలన్నా, తుదకు దానమివ్వాలన్నా కూడా సమస్యే. ఈ సమస్యలన్నింటికీ ఒకే సమాధానం భూముల రీ సర్వే. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో జరిగింది. ఆ తర్వాత దేశంలోనే ఎవరూ అంత ధైర్యం చేయలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ ఎంతో దూర దృష్టితో ఆలోచించి ఈ సాహసానికి పూనుకున్నారు. ఒక్క కలం పోటుతో రీ సర్వేకు ఆదేశించారు. వెరసి లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరిస్తూ వారి రాతలు తిరగరాస్తున్నారు. బొల్లికొండ ఫణికుమార్, సాక్షి ప్రతినిధి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేతో లక్షల సంఖ్యలో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు, నిషేధిత ఆస్తులు, వారసత్వ అంశాలు వంటి ఎన్నో చిక్కు ముడులను విప్పుతూ రీ సర్వే సమాధానం చూపుతోంది. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని వందలాది పనులను రీ సర్వే బృందాలు ప్రతి గ్రామంలో కొలిక్కి తెస్తున్నాయి. రీ సర్వే జరిగిన తీరు, రైతులకు కలిగిన ప్రయోజనాలను ‘సాక్షి’ బృందం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల, గారపాడు, యామర్రు, అనంతవరప్పాడు గ్రామాల్లో ప్రత్యక్షంగా పరిశీలించింది. ప్రతిచోటా భూ వివాదాలు, సమస్యలు పరిష్కారమైనట్లు స్పష్టమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పేరుతో జరుగుతున్న రీ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాల్లో పూర్తయింది. ఆ గ్రామాల్లో తాజా వివరాలతో డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి భూ కమతాన్ని కొలిచి అక్షాంశ, రేఖాంశాలతో హద్దులు నిర్ణయించారు. ఆ హద్దుల్లో ప్రభుత్వ ఖర్చులతోనే సర్వే రాళ్లు పాతారు. ప్రతి రైతుకు భూ హక్కు పత్రం ఇచ్చారు. వారి భూ కమతానికి సంబంధించి ఆధార్ మాదిరిగా ఒక విశిష్ట సంఖ్య (యునిక్ కోడ్) కేటాయించారు. పట్టాదార్ పాస్ పుస్తకంలోనే క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని స్కాన్ చేసి భూమి వివరాలను ఎప్పుడైనా చూసుకునే అవకాశం కల్పించారు. ఇవన్నీ చేయడానికి ముందే రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేశారు. సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో ప్రయోజనాలు ► 2 వేల గ్రామాల తుది ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్)లు సిద్ధం ► 7.8 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు జారీ ► హద్దుల్లో 25.8 లక్షల సర్వే రాళ్లు పాతారు ► 2 లక్షల మ్యుటేషన్లు, 4.3 లక్షల సర్వే సబ్ డివిజన్లు చేయడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం ► 1.08 లక్షల మంది రైతుల పేర్లు తొలిసారి రికార్డుల్లోకి ఎక్కాయి ► 2 వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ► 4 లక్షలకుపైగా సరిహద్దు వివాదాలు పరిష్కారం ► 18.3 లక్షల ల్యాండ్ పార్సిల్ మ్యాప్స్ (ఎల్పీఎం) జారీ.. (సర్వే నంబర్లు) ల్యాండ్ కన్వర్షన్ సమస్యకు పరిష్కారం కుర్నూతల గ్రామానికి చెందిన దూపాటి శివనాగేంద్రం దంపతులకు సర్వే నంబర్ 151, 152లో 4 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయ భూమిగా ఉన్న వారి భూమిని వ్యవసాయేతర భూమిగా (గజాల్లో) నమోదు చేయడంతో ఆ భూమి విలువ ఉన్న దాని కంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అదే సర్వే నంబర్లో ఉన్న మరో రైతు తన అవసరాల కోసం తన వాటా భూమిని వ్యవసాయేతర భూమిగా (ల్యాండ్ కన్వర్షన్) మార్చుకున్నారు. సబ్ డివిజన్ జరక్కపోవడంతో మొత్తం ఆ సర్వే నంబర్లోని భూమి అంతా వ్యవసాయేతర భూమిగా నమోదైంది. దీంతో మిగిలిన రైతులు తమ భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేయాలంటే దాని విలువ ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారింది. రీ సర్వేలో సబ్ డివిజన్ జరిగి ప్రతి భూ కమతానికి ప్రత్యేకంగా ఎల్పీఎం నంబర్ ఇవ్వడంతో శివనాగేంద్రం కుటుంబంతోపాటు చాలా మంది రైతులకు మేలు జరిగింది. కాలువ పోరంబోకుగా నమోదైన భూమికి విముక్తి వట్టిచెరుకూరు మండలం గారపాడుకు చెందిన బొడ్డపాటి నర్సారెడ్డికి ఉన్న 3.3 ఎకరాలను కాలువ పోరంబోకు భూమిగా చూపుతూ నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారు. సర్వే నంబర్ 115లో నర్సారెడ్డి భూమితోపాటు కాలువ పోరంబోకు భూమి కూడా ఉంది. కాలువ భూమి ప్రభుత్వ పోరంబోకు కావడం, ఆ సర్వే నంబర్లోని భూములు సబ్ డివిజన్ కాకపోవడంతో నర్సారెడ్డి భూమి 22 (ఏ)1 (బీ)లో నమోదైంది. రీ సర్వేలో ప్రతి భూమికి సబ్ డివిజన్ జరిగి నర్సారెడ్డి భూమికి ప్రత్యేకంగా ఎల్పీఎం నంబర్ను ఇచ్చి వెబ్ల్యాండ్–2లో నమోదు చేశారు. దీంతో నిషేధిత జాబితా నుంచి విముక్తి లభించింది. 50 ఏళ్ల సమస్యకు పరిష్కారం వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన రాయపాటి ఇస్సాకుకు 0.37 సెంట్ల భూమి ఉంది. తన తండ్రి 50 ఏళ్ల క్రితం ఆ భూమిని కొనుగోలు చేశాడు. అప్పట్లో స్టాంప్ పేపర్ మీద ఈ భూమి కొన్నట్లు రాయించుకున్నారు. అప్పటి నుంచి వారి ఆధీనంలోనే ఆ భూమి ఉన్నా, రిజిస్టర్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అనేక సంవత్సరాలుగా అలాగే వదిలేశారు. రీ సర్వేలో సాదాబైనామా కేసుల పరిష్కారంలో భాగంగా రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఇస్సాకు పేరును అడంగల్లో నమోదు చేశారు. పట్టాదార్ పాస్బుక్ కూడా జారీ అయింది. వారసత్వంగా వచ్చిన ఆస్తికి మ్యుటేషన్ వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామానికి చెందిన యామర్తి వెంకట నాగదుర్గా శ్రీలక్ష్మికి వారసత్వంగా 75 సెంట్ల భూమి వచ్చింది. 50 ఏళ్ల నుంచి ఆమె కుటుంబం చేతిలోనే ఆ భూమి ఉంది. ఆమె తాత నరసింహారావు, ఆ తర్వాత ఆయన కొడుకు సీతారామాంజనేయుల నుంచి ఆమెకు భూమి వచ్చింది. కానీ దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు. పాత రెవెన్యూ రికార్డుల్లో నరసింహారావు పేరు తప్ప ఇతర వివరాలు లేవు. అనారోగ్య కారణాలతో ఆ భూమిని అమ్ముకుందామని శ్రీలక్ష్మి తండ్రి ప్రయత్నిస్తే ఆన్లైన్లో ఎక్కలేదు కాబట్టి కుదరదన్నారు. రీ సర్వేలో విచారించి ఎవరి నుంచి అభ్యంతరాలు లేకపోవడం, భూమి వారి ఆ«దీనంలో ఉండడంతో ఇటీవలే ఆమె పేరుతో మ్యుటేషన్ చేశారు. ఏపీ రీ సర్వే దేశానికి రోల్ మోడల్ దేశంలో వందేళ్ల తర్వాత ఏపీలో మాత్రమే జరుగుతున్న రీ సర్వే కార్యక్రమం విజయవంతమైంది. మన రీ సర్వేను ఇతర రాష్ట్రాలు మోడల్గా తీసుకుంటున్నాయి. ఈ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాం. రాష్ట్రంలోని మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికిగాను డ్రోన్లు, విమానాలతో ఇప్పటికి 1.06 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సర్వే చేశాం. త్వరలో డ్రోన్, ఏరియల్ సర్వే పూర్తవుతుంది. 2 వేల గ్రామాల్లో అన్ని దశల రీ సర్వే పూర్తయి ఆ గ్రామాల ఆర్ఓఆర్లు సిద్ధమయ్యాయి. రీ సర్వే ప్రతి దశలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన లక్షలాది భూ సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతున్నాయి. ఇప్పటి వరకు 23 వేలకుపైగా వివాదాలను మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు, కొత్త ఎంట్రీలు.. వంటివి లక్షల్లో జరుగుతున్నాయి. భావితరాలకు సైతం తమ భూముల గురించి తెలిసేలా డిజిటల్ రికార్డులు రూపొందుతున్నాయి. రీసర్వేలో వాటికి భద్రత ఏర్పడుతుంది. టాంపరింగ్కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. గ్రామ స్థాయిలోనే భూముల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. – సిద్ధార్ధ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ -
భూ వివాదం: నిర్మాత సురేష్బాబు, రానాలపై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్: ఫిలింనగర్ భూ వివాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు నిర్మాత సురేష్బాబు, రానాలపై క్రిమినల్ కేసు నమోదైంది. తమను దౌర్జన్యంగా ఖాళీ చేయించారని వ్యాపారి ప్రమోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఖాళీ చేయకుంటే అంతు చూస్తామని సురేష్బాబు బెదిరించినట్లు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా బంజరాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదన్నారు. దాంతో నాంపల్లి కోర్టును బాధితుడు ఆశ్రయించాడు. సురేష్బాబు, రానా సహా మరికొందరిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. దాంతో సురేష్బాబు, రానాపై కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. -
మహిళపై కారు ఎక్కించి హత్య
సాక్షి, మండ్య: రెండు కుటుంబాల మధ్య ఉన్న వ్యవసాయ భూమి గొడవలో మహిళ పైన కారు ఎక్కించి హత్య చేశారు. ఈ దారుణం మండ్య జిల్లాలోని నాగమంగళ తాలుకాలోని బెళ్ళూరు సమీపంలో ఉన్న గాణసంద్ర గ్రామంలో జరిగింది. బెంగళూరులో నివసించే గాణసంద్రవాసి రామకృష్ణయ్య భార్య జయలక్ష్మి (50) హతురాలు. పొలం పనులు చేయిస్తుండగా వివరాలు.. జయలక్ష్మీకి గత 10 సంవత్సరాల క్రితం గాణసంద్ర గ్రామంలో సర్వే నంబర్ 84లో బంజరు భూమిని ప్రభుత్వం ఇవ్వగా ఆమె సాగు చేస్తోంది. అయితే భూమి తమదని గౌడయ్య అతని కుటుంబ సభ్యులు అనేకసార్లు జయలక్షి్మతో గొడవ పెట్టుకున్నారు. బోర్లను కూడా ధ్వంసం చేశారు. మంగళవారం జయలక్ష్మి బెంగళూరు నుంచి వచ్చి ట్రాక్టర్తో పొలం పనులు చేయిస్తుండగా గౌడయ్య, కుమారుడు అనిల్ సహా 8 మంది దాడి చేశారు. జయలక్ష్మి మీదకు అనిల్ కారుతో దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ట్రాక్టర్ డ్రైవర్, కూలీలను కొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. (చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..) -
సర్వేతో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: దేశంలో వందేళ్ల తర్వాత నిర్వహిస్తున్న భూముల సర్వేతో కొత్త చరిత్రను లిఖిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రీ సర్వే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, ఈ మహాయజ్ఞం ఫలాలు ప్రజలకు కచ్చితంగా అందాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే) పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. తొలివిడత గ్రామాల్లో జనవరికి పత్రాలు ‘రీ సర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం. వందేళ్ల తర్వాత మళ్లీ సర్వే చేస్తున్నాం అంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లే. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంత మంది సర్వేయర్లు, సిబ్బంది మన వద్ద అందుబాటులో ఉన్నందున వేగంగా చేయగలుగుతున్నాం. తొలివిడత సర్వే పూర్తైన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం జనవరి నాటికి పూర్తి కావాలి’ అని సీఎం సూచించారు. మరో 2 వేల గ్రామాల్లో.. సర్వే పూర్తైన రెండు వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యుటేషన్లు, 92 వేల ఫస్ట్ టైం ఎంట్రీస్ జరిగాయని, 7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామని అధికారులు తెలిపారు. 4.30 లక్షల సబ్ డివిజన్లు పూర్తి కాగా 19 వేల భూ వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. ఫలితంగా ప్రజలకు రూ.37.57 కోట్ల మేర డబ్బు ఆదా అయిందని వెల్లడించారు. మరో 2 వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను అధికారులు సీఎంకు తెలియచేశారు. 2023 ఫిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేసి అదే నెల చివరికల్లా భూహక్కు పత్రాలను కూడా అందజేస్తామని చెప్పారు. గ్రామ సచివాలయం యూనిట్గా.. సమగ్ర సర్వేను సకాలంలో పూర్తి చేసేందుకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ సూచించారు. గ్రామ సచివాలయాన్ని యూనిట్గా తీసుకుని కావల్సినంత మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో తగినంత సిబ్బందిని సమకూర్చుకుని ఖాళీలున్న చోట వెంటనే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కారమైన లబ్ధిదారులకు వ్యక్తిగత లేఖలు.. ‘ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ‘22 ఏ’ భూములు, ఇతర సమస్యలను పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలి. వారికి జరిగిన మేలును వివరిస్తూ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత లేఖలు పంపాలి. సర్వే రాళ్ల ఉత్పత్తి వేగాన్ని పెంచాలి. రాళ్ల తయారీ వేగం పెరిగేలా భూగర్భ గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇందులో ఎలాంటి జాప్యానికి తావుండరాదు’ అని సీఎం జగన్ స్పష్టం చేయగా మార్చి కల్లా సర్వేకు అవసరమైన రాళ్లు సిద్ధంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ ప్రాంతాల్లో సర్వేపై.. అర్బన్ ప్రాంతాల్లోనూ భూముల సర్వేను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 4,119 వార్డు సచివాలయాల్లో సర్వే బృందాల ఏర్పాటు, శిక్షణ ఇప్పటికే పూర్తైందని అధికారులు తెలిపారు. హద్దుల మార్కింగ్, రోవర్ల సహాయంతో జీసీపీ ఐడెంటిఫికేషన్ ప్రక్రియను 2023 జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 1,16,685 ప్రభుత్వ, పోరంబోకు ల్యాండ్ పార్సిల్స్కు సంబంధించి 3,37,702 ఎకరాలను గుర్తించినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. 2023 జూలై నాటికి పట్టణ ప్రాంతాల్లో సమగ్ర సర్వే హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మైనింగ్ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రీ సర్వేలో కీలకంగా సర్వేయర్ల సైన్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన భూముల రీ సర్వేలో గ్రామ సర్వేయర్లు, వార్డు ప్లానింగ్ సెక్రటరీలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ప్రభుత్వం చురుకైన యువకులకు అన్ని రకాల శిక్షణ ఇప్పించి, వారి ద్వారా ప్రాజెక్టును పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న భూములు, ఇళ్లు, ఇతర స్థిరాస్తులను రీ సర్వే చేసి యజమానులకు హక్కు పత్రాలు ఇస్తున్నారు. దీనివల్ల లక్షల్లో పేరుకుపోయిన భూ వివాదాలు పరిష్కారమవుతాయి. అస్తవ్యస్తంగా ఉన్న భూమి రికార్డుల స్వచ్ఛీకరణ జరిగి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వస్తాయి. తొలి విడతగా 2 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయి 8 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో కూడా రీసర్వే విజయవంతంగా జరుగుతోంది. గ్రామ సర్వేయర్లతో కొత్త తరం సమగ్ర రీ సర్వే కోసం వేలాది మంది సర్వేయర్లు అవసరం. ఈ కార్యక్రమం మొదలు పెట్టే నాటికి మండల సర్వేయర్లు మాత్రమే ఉండేవాళ్లు. అదీ కొన్ని మండలాల్లోనే ఉన్నారు. చాలా మండలాల్లో సర్వేయర్లు లేక ఇబ్బంది కలిగేది. ఆ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ సమగ్ర సర్వేకి అక్కరకు వచ్చింది. సచివాలయాల్లో 11,600 మందికిపైగా సర్వేయర్లు నియమితులయ్యారు. పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల్లో వార్డు ప్లానింగ్ సెక్రటరీలు 3,300 మందిని ప్రభుత్వం నియమించింది. మొత్తంగా ఈ 14,900 మందిని సమగ్ర సర్వేలో ప్రభుత్వం వినియోగిస్తోంది. వీరందరికీ శిక్షణ ఇచ్చింది ప్రతి రెవెన్యూ డివిజన్ నుంచి ఇద్దరు మండల సర్వేయర్లు, ముగ్గురు గ్రామ సర్వేయర్లను బృందాలుగా ఏర్పాటు చేసి మొత్తం 275 బృందాలకు తొలి దశలో శిక్షణ ఇచ్చింది. వారిద్వారా వివిధ డివిజన్లలోని సర్వేయర్లు, ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇప్పించింది. వారిలో 70 శాతం మంది సివిల్ ఇంజినీరింగ్ పట్టభద్రులు కావడంతో సర్వే అంశాలను తేలిగ్గా ఆకళింపు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా కరోనా సమయంలోనూ ఏడాదిన్నరలో 11,187 మందికి శిక్షణ ఇచ్చింది. గ్రామ సర్వేయర్లకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన మూడు రకాల డిపార్ట్మెంటల్ పరీక్షల్లో 94 శాతం మంది ఉత్తీర్ణులవడానికి ఈ శిక్షణ ఉపయోగపడింది. శిక్షణ ఇలా తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్వే అకాడమీ ద్వారా సర్వే సెటిల్మెంట్ శాఖ వీరికి శిక్షణ ఇచ్చింది. ఒక ప్రణాళిక ప్రకారం భూ సర్వేకి సంబంధించి 50కి పైగా అంశాల్లో శిక్షణ ఇచ్చింది. సంప్రదాయ సర్వే విధానాలకు ఆధునిక టెక్నాలజీని జోడించి సిలబస్ రూపొందించింది. కీలకమైన డ్రోన్ పైలట్ సర్వే, డ్రోన్ డెస్టినేషన్ సర్వే కోసం జిల్లాల్లో డ్రోన్ పైలట్, కో పైలట్లు గ్రామ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా మండలాల వారీగా మిగిలిన వారికి ఇవే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 679 మండలాల్లోనూ మండలానికో డ్రోన్ సర్వే ట్రైౖనర్ను నియమించారు. వీరి ద్వారానే ప్రస్తుతం డ్రోన్ సర్వే జరుగుతోంది. రీసర్వే విజయవంతంగా జరగడానికి గ్రామ సర్వేయర్లే కారణం సర్వే అకాడమీ ద్వారా ఆధునిక, సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అవసరమయ్యేలా సంప్రదాయ, ఆధునిక, క్షేత్ర స్థాయి ప్రత్యక్ష సర్వే విధానాలపై శిక్షణ ఇచ్చాం. దీని ఫలితంగా రీ సర్వే విజయవంతంగా జరుగుతోంది. – సీహెచ్వీఎస్ఎన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్, ఏపీ సర్వే అకాడమీ -
వ్యక్తిని హత్య చేసి..తెగిపడిన తలతో సెల్ఫీలు
ఇటీవల కాలంలో మనుషులు చాల ఘోరంగా తయారవుతున్నారు. ఏదో వివాదం తలెత్తితే చాలు హత్యలు దాక వెళ్లిపోతున్నారు. పైగా ఏదో ఘనకార్యం చేసినట్లుగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. వినేందుకే జుగుప్పకరంగా ఉంటున్నాయి ఆ ఘటనలు. అచ్చం అలాంటి ఘటనే జార్ఖండ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...జార్ఖండ్లోని ఖుంటి జిల్లాలో 20 ఏళ్ల గిరిజన యువకుడు 24 ఏళ్ల తన బంధువుని అతి కిరాతకంగా తల నరికి చంపాడు. ఈ ఘటన ముర్హు ప్రాంతంలో చోటు చేసుకుంది. 55 ఏళ్ల తండ్రి తన కొడుకు కను ముండా డిసెంబర్ 1న ఇంట్లో ఒక్కడే ఉన్నాడనొ, మిగతావాళ్లంతో పొలాలకు వెళ్లారని చెప్పారు. తాము ఇంటికి తిరిగి వచ్చి చూడగా కను కనిపించలేదు. దీంతో మృతుడి తండ్రి కొడుకు కోసం గాలించి విఫలమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదులో తన మేనల్లుడు సాగర్ ముండా, అతని స్నేహితులే తన కొడుకుని అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలించడం ప్రారంభించారు. విచారణలో... నిందితులు కనుని దారుణంగా నరికి చంపి, తెగిపడిన తలతో నిందితుడు, అతని స్నేహితులు సెల్ఫీలు దిగారని చెప్పారు. మృతుడి మొండం గోప్లా అడవిలోనూ తల 15 కిలో మీటర్ల దూరంలో దుల్వా తుంగ్రీ ప్రాంతంలో కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐతే ఓ భూమి విషయమై మృతుడి కుటుంబానికి, నిందితుల కుటుంబాలకి మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలే ఈ హత్యకు కారణమని చెప్పారు. పోలీసులు మృతుడితో సహా నిందితుల దగ్గర ఉన్న ఐదు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, ఎస్యూవీ కారుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితుల తోపాటు ప్రధాన నిందితుడి భార్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: భర్త క్రూరత్వం! భార్య అనారోగ్యంతో ఉందని...) -
ఆ భూమి సినీ పెద్దలదే..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 4, 5, 8, 9, 10, 12లోని 26.16 ఎకరాల భూమి సినీ పెద్దలదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అనేందుకు ఆధారాలను సర్కార్ చూపలేకపోయిందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ను కొట్టివేసింది. ఖానామెట్లో నిర్మాత డి.రామానాయుడు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గోవిందరెడ్డి, ఇతరులు 26.16 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సదరు భూమికి చెందిన హక్కుల వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం రిట్ అప్పీల్ను దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ జరిపి బుధవారం ఉత్తర్వులిచ్చింది. మాజీ సైనికుడికి భూమి ఇచ్చిన పత్రాలపై సంతకాలకు అప్పటి తహసీల్దార్ సంతకాలకు పొంతన లేదని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అంతకుముందు వాదనలు వినిపించారు. ఫోర్జరీ సంతకాలతో మాజీ సైనికుడికి కేటాయించిన ట్లుగా పత్రాలు సృష్టించారని, అతని నుంచి మరొక వ్యక్తి కొనుగోలు చేస్తే.. వారి నుంచి ప్రతివాదులు భూమిని కొనుగోలు చేశారన్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రభు త్వం రికార్డులను సవరించడం చెల్లదని సింగిల్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరారు. సినీ ప్రముఖుల తరఫు న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు. ఆ భూమిని తాము కొనుగోలు చేసినప్పుడు అధికారులెవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయడం చెల్లదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ భూముల వ్యవహారంలో రాష్ట్ర సర్కార్ జోక్యం చేసుకోరాదని, అనుబంధ స్వేతార్ రద్దు చేసి భూముల స్వాధీనానికి ప్రయత్నించరాదన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో కలుగజేసుకోవడానికి నిరాకరించింది. ఆ భూమి ప్రభుత్వానిదే అనేందుకు ఆధారాలు చూపలేకపోయిందని తప్పుపట్టింది. సర్కార్ అప్పీల్ను కొట్టివేస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చింది. -
భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు
సాక్షి, అమరావతి: భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు లంచాలకు తావులేకుండా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ట్రిబ్యునళ్లను సమగ్ర భూ సర్వే ముగిసిన తర్వాత కూడా కొనసాగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే సందర్భంగా తలెత్తే వివాదాలు, అభ్యంతరాల పరిష్కారానికి ఏర్పాటైన మొబైల్ ట్రిబ్యునళ్లను ఆ తరువాత కూడా రెవెన్యూ డివిజన్లలో పూర్తి స్థాయిలో కొనసాగించాలని సూచించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. వివాదాల పరిష్కారానికి సమర్థ యంత్రాంగం భూముల సర్వే సందర్భంగా తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలి. మొబైల్ ట్రిబ్యునల్ యూనిట్లపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థను తెచ్చి శాశ్వత ప్రాతిపదికన ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. దీనివల్ల న్యాయపరంగా దక్కే హక్కులను వేగంగా పొందేందుకు వీలుంటుంది. వివాదాల్లో కూరుకుపోయి తరతరాలుగా హక్కులు పొందలేని పరిస్థితి ఉండకూడదు. సర్వే సందర్భంగా ప్రభుత్వంతో వివాదాలు, వ్యక్తిగత వివాదాలను అంశాలవారీగా గుర్తించాలి. సర్వే నంబర్ల జాబితాలో ఈ వివాదాలను కూడా పేర్కొనాలి. దీనివల్ల భూమి లీగల్గా క్లియర్గా ఉందా? లేదా? అన్నది కొనుగోలుదారులకు తెలుస్తుంది. అదే సమయంలో వివాదాలను పరిష్కరించే ప్రయత్నం సమాంతరంగా జరగాలి. అప్పీళ్లపై థర్డ్ పార్టీ పర్యవేక్షణ సర్వేలో నాణ్యత చాలా ముఖ్యం. వివాదాల పరిష్కారంలో నాణ్యతతో కూడిన ప్రక్రియ ఉండాలి. సమగ్ర సర్వే సందర్భంగా వచ్చే అప్పీళ్లపై థర్డ్ పార్టీ పర్యవేక్షణ ఉండాలి. దీనివల్ల హక్కుదారులకు ఎలాంటి నష్టం ఉండదు. తప్పులకు పాల్పడే సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. థర్డ్ పార్టీ పర్యవేక్షణ వల్ల పక్షపాతం, వివక్ష, అవినీతికి తావుండదు. సిబ్బందిలో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. ఎవరైనా ఓ వ్యక్తి తన భూమిలో సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే, కచ్చితంగా సర్వే చేయాలి. నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించాలి. వేగం పెరగాలి.. నెలకు వెయ్యి గ్రామాల చొప్పున ఏరియల్, డ్రోన్ ఫ్లైయింగ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొనగా ఈ లక్ష్యాన్ని పెంచాలని సీఎం ఆదేశించారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కూడా సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. 2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి సమగ్ర సర్వేను పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. సమావేశంలో విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి.సాయిప్రసాద్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్, సీసీఎల్ఏ కార్యదర్శి అహ్మద్ బాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. సీఎం జగన్ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ గుర్నాని రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఐటీ, హై ఎండ్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి పెంపుపై టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించారు. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయిన గుర్నాని ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో వీటిని అమలు చేసి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు. విశాఖలో టెక్ మహీంద్ర కార్యకలాపాల విస్తరణపై వివరించారు. అనంతరం టెక్ మహీంద్రతో కలిసి పని చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో టెక్ మహీంద్ర గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ (అడ్మినిస్ట్రేషన్) సీవీఎన్ వర్మ, సీనియర్ బిజినెస్ హెడ్ రవిచంద్ర కొల్లూరు, రిక్రూట్మెంట్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి వీరంరెడ్డి, అడ్మిన్ మేనేజర్ (విజయవాడ) జయపాల్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన గుర్నాని ఏపీలో టెక్ మహీంద్ర కార్యకలాపాలు, విస్తరణపై చర్చించిన విషయం విదితమే. -
వెంకటేశ్, సురేశ్బాబు మోసం చేశారు
సాక్షి, హైదరాబాద్(యాకుత్పురా): సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ తనకు అమ్మిన భూమిని ఆయన కొడుకు రానా పేరున రిజిస్ట్రేషన్ చేశారంటూ సదరన్ స్పైసిస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నందకుమార్ ఆరోపించారు. ఆయన మంగళవారం పురానీ హవేలీలోని సిటీసివిల్ కోర్టు ఎదుట మీడియాతో మాట్లాడారు. ఫిలింనగర్లో తనకు అగ్రిమెంట్ చేసిన భూమిని తనతో పాటు మరొకరికి కూడా అగ్రిమెంట్ చేసి మోసం చేశారని ఆరోపించారు. (చదవండి: ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..) కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రానా పేరున రిజిస్ట్రేషన్ చేశారనన్నారు. సినీ నటుడు వెంకటేశ్ సైతం 1200 గజాల భూమిని తనకు లీజ్ అగ్రిమెంట్ చేశారని నందకుమార్ తెలిపారు. సదరు స్థలం నుంచి బలవంతంగా తనను ఖాళీ చేయించేందుకు దగ్గుపాటి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా.. రానా హాజరు కాకపోవడంతో విచారణను ఆగస్టు 2కు కోర్టు వాయిదా వేసింది. -
సర్వేతో భూ వివాదాలన్నీ పరిష్కారం
సాక్షి, అమరావతి: సమగ్ర సర్వేతో అన్ని భూ వివాదాలు పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సమగ్ర సర్వే లక్ష్యాల్లో భూ వివాదాల పరిష్కారం ఒకటని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలు తీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించుకున్న గడువులోగా సమగ్ర సర్వేను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని, సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని చెప్పారు. డ్రోన్లు, ఓఆర్ఐ పరికరాలు, రోవర్లుతో పాటు సర్వే రాళ్లు సమకూర్చుకోవడం వంటి ప్రతి అంశంలోనూ వేగంగా పనిచేయాలని స్పష్టంచేశారు. సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. వందేళ్ల తర్వాత సర్వే జరుగుతోందని, దీన్ని పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు. సమగ్ర సర్వే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటివరకూ సర్వే ప్రగతిని సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, భూపరిపాలన చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చిచ్చురేపిన భూ వివాదం...దంపతులపై ట్రాక్టర్ ఎక్కించి..
రాయచూరు రూరల్: భూ వివాదం నేపథ్యలో దంపతులపై ప్రత్యర్థులు ట్రాక్టర్ ఎక్కించి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన లింగసూగూరు తాలూకా సర్జాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు హనుమంతు 50 ఏళ్లుగా 10 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే ఈ పొలం తమదంటూ మహానంది, దొడ్డ మల్లేష్, గోవిందు, వీరేష్లు శుక్రవారం రాత్రి మరో 15 మందితో కలిసి హనుమంతుతో గొడవ పడ్డారు. ఓ దశలో హనుమంతు, ఆయన భార్య శాంతమ్మలపై ట్రాక్టర్ ఎక్కించి ఉడాయించారు. స్థానికులు గమనించి దంపతులను రిమ్స్కు తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: తల్వార్తో కేక్ కటింగ్, ముగ్గురు అరెస్టు) -
భూమి అమ్మకుండా అడ్డుపడుతున్నాడని..
ఆత్మకూర్ (ఎస్) (సూర్యాపేట): ఆర్థిక ఇబ్బం దుల కారణంగా భూమిని కొంత అమ్ముదా మంటే తండ్రి వద్దన్నాడు. దీంతో ఆగ్రహించిన ఇద్దరు కొడుకులు తండ్రిని దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్పహాడ్కు చెందిన యరగాని శ్రీను (50) అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారు లు రాజశేఖర్, సంతోష్, కుమార్తె రాజ్యలక్ష్మి ఉ న్నారు. ముగ్గురికీ పెళ్లిళ్లు చేశారు. వీరికి గ్రా మంలో 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండ గా ఇద్దరు కుమారులకు మూడున్నర ఎకరాల చొప్పున రాసిచ్చారు. మిగతా రెండు ఎకరాల ను శ్రీను తన వద్దే పెట్టుకున్నాడు. పెద్ద కుమారుడు రాజశేఖర్ డీసీఎం డ్రైవర్ కాగా, చిన్న కుమారుడు సంతోష్ ట్రాక్టర్ డ్రైవర్. కుమార్తెకు అమ్మిచ్చి!: ఆర్థిక ఇబ్బందులతో భూమిని విక్రయించేందుకు రాజశేఖర్, సంతో శ్ సిద్ధపడగా.. తండ్రి శ్రీను అడ్డుపడ్డాడు. దీని పై తండ్రితో పలుమార్లు ఘర్షణపడ్డారు. పెద్ద లు సైతం అప్పులు తీర్చేందుకు భూమిని విక్రయించవచ్చని చెప్పినా తండ్రి వినలేదు. అదీగాకుండా తమ వద్ద ఉన్న రెండు ఎకరాల్లో కూతురు రాజ్య లక్ష్మికి పెళ్లి సమయంలో ఒప్పుకున్న ప్రకారం అర ఎకరం భూమిని కుమారులకు తెలియకుండా ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూమిని ఇటీవల విక్రయించారు. దీంతో తమ భూమి అమ్మకానికి అడ్డుపడటం, సోదరికి భూమి రిజిస్ట్రేషన్ చేయించడంతోపాటు విక్రయించి ఇవ్వడంతో కుమారులు తండ్రిపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో గురువారం తల్లి అంజమ్మ కూలికి వెళ్లగా.. అన్నదమ్ములు కత్తి, గొడ్డలితో వచ్చి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. అంజమ్మ ఫిర్యాదుతో రాజశేఖర్, సంతోష్పై కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
రియల్ హత్యలే..దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం
సాక్షి,హైదరాబాద్: సంచలనం సృష్టించిన రియల్టర్ల జంట హత్యల కేసును రాచకొండ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఇబ్రహీంపట్నం చెర్లపటేల్గూడలో నెలకొన్న భూ వివాదాలే హత్యలకు కారణమని విచారణలో బయటపడింది. హత్యలో ప్రధాన సూత్రధారి చైతన్యపురి కమలానగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేరెడ్డి మట్టారెడ్డి అలియాస్ మేరెడ్డి అశోక్రెడ్డి/సత్తిరెడ్డి/ భద్రి/ఏవీ రమణ, కృష్ణా జిల్లా జగన్నాథపురానికి చెందిన ఖాజా మోహియుద్దిన్, మెదక్ కొండపాక మేదిరిపూర్కు చెందిన బుర్రి భిక్షపతి, సరూర్నగర్ హుడా కాంప్లెక్స్కు చెందిన సయ్యద్ రహీమ్, బిహార్ రాష్ట్రం సివాన్ జిల్లా టెటారియా గ్రామానికి చెందిన సమీర్ అలీ, రాజు ఖాన్లను అరెస్ట్ చేశారు. హత్యలో వినియోగించిన రెండు తుపాకులను తయారు చేసిన చందన్ సిబాన్, సోనూలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 19 లైవ్ రౌండ్లున్న రెండు 7.65 ఎంఎం తుపాకులు, రెండు ఖాళీ కాట్రిడ్జ్లు, బుల్లెట్ వెహికిల్, కారు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తి వివరాలను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఇదీ వివాదం.. చర్లపటేల్గూడ గ్రామంలో 1369, 1370, 1371, 1372 సర్వే నంబర్లలోని భూమిని 20 ఏళ్ల క్రితం లేఅవుట్ చేశారు. వీటిలో చాలా మంది ఉద్యోగులు, ప్రవాసులు వాయిదా పద్ధతిలో కొనుగోలు చేశారు. ఈ లేవుట్ శివారు ప్రాంతంలో ఉండటంతో కొనుగోలుదారులు వారి ప్లాట్లను తనిఖీ చేయడం, చూసుకోవటం వంటివి చేయలేదు. 2014లో మట్టారెడ్డి ఈ వెంచర్లో 1111 గజాల చొప్పున నాలుగు ప్లాట్లను కొనుగోలు చేశాడు. ఇందులో ఫామ్ హౌస్ కట్టుకోవటంతో పాటు జామ తోటను పెంచాడు. ఆ తర్వాత 2018లో మరో నాలుగు ప్లాట్ల కొనుగోలు చేశాడు. ఈ సర్వే నంబర్ల పక్కనే ఉన్న 14 ఎకరాల 10 గుంటల భూమిని మృతుడు నవారి శ్రీనివాస్ రెడ్డి తన డ్రైవర్ దూడల కృష్ణ పేరు మీద కొనుగోలు చేశాడు. భూ యజమానులైన శాంతాకుమారి, ఎం పురుషోత్తం రెడ్డిలతో అగ్రికల్చర్ ల్యాండ్ లీజు ఒప్పందం చేసుకున్నాడు. అప్పట్నుంచి తన పార్ట్నర్ రాఘవేందర్ రెడ్డితో కలిసి రోజూ వ్యవసాయ భూమికి వచ్చేవాడు. ఈ క్రమంలో లేక్ విల్లా ఆర్చిడ్స్లో ప్లాట్ ఓనర్లు స్థానికంగా ఉండకపోవటాన్ని అవకాశంగా మలుచుకున్న శ్రీనివాస్రెడ్డి.. ఆ ప్లాట్ల లావాదేవీలలో తలదూర్చడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మట్టారెడ్డికి శ్రీనివాస్రెడ్డి మధ్య వైరం మొదలైంది. ప్లాట్ ఓనర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ తక్కువ ధరకు ప్లాట్లను కొనుగోలు చేస్తున్న మట్టారెడ్డికి శ్రీనివాస్ రెడ్డి వెంచర్లోకి ఎంటర్ కావటం నచ్చలేదు. వెంచర్లో అభివృద్ధి పనులకు తరుచూ అడ్డుతగులుతుండటంతో ఎలాగైనా శ్రీనివాస్ రెడ్డిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. బుల్లెట్పై ఒకరు, బస్సులో మరొకరు.. ఈ నెల 1న ఉదయం 6 గంటలకు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు ఏపీ09 ఏడబ్ల్యూ 0047 కారులో తమ వ్యవసాయ భూమికి వెళ్లారు. ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి కారు నడుపుతున్నాడు. అప్పటికే అక్కడ కాపు కాస్తున్న ఖాజా మోహియుద్దీన్, భిక్షపతిలు లిఫ్ట్ కావాలని అడిగారు. దీంతో శ్రీనివాస్రెడ్డి కారు ఆపగా.. ఆయన తలపై ఖాజా మోహియుద్దీన్ తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. దీంతో తనని తాను రక్షించుకునేందుకు శ్రీనివాస్రెడ్డి కారు దిగి పారిపోతుండగా.. ఖాజా అతన్ని వెంబడించి కాల్పులు జరిపాడు. శ్రీనివాస్రెడ్డి అక్కడిక్కడే కుప్పకూలాడు. శ్రీనివాస్రెడ్డి పారిపోతున్న సమయంలో పక్క సీటు నుంచి డ్రైవర్ సీటులోకి వచ్చిన రాఘవేందర్ రెడ్డిపై భిక్షపతి కాల్పులు జరిపాడు. ఛాతీలోకి బుల్లెట్ దిగిన రాఘవేందర్ రెడ్డి అపస్మారక స్థితిలో కారును నడిపే ప్రయత్నం చేయగా.. వాహనం ఆగిపోయింది. కాల్పుల తర్వాత నిందితులు ఇద్దరూ మట్టారెడ్డి ఫామ్ హౌస్కు వెళ్లి ‘పని పూర్తయిందని’ తెలిపి, తుపాకులను అక్కడే పెట్టేసి వెళ్లిపోయారు. ఖాజా తన బుల్లెట్ వాహనంలో పారిపోగా.. భిక్షపతి నడుచుకుంటూ వెంచర్ నుంచి బయటికి వచ్చి బస్సు ఎక్కి ఇంటికి వెళ్లిపోయాడు. మట్టారెడ్డి నేరచరితుడే.. ఈ హత్య కేసులో సూత్రధారి అయిన మేరెడ్డి మట్టారెడ్డి కూడా నేరచరితుడే. ఇతని మీద నారాయణగూడ, మలక్పేట, సరూర్నగర్ పీఎస్లలో మూడు చీటింగ్ కేసులున్నాయి. కర్మన్ఘాట్లో సొంత అపార్ట్మెంట్తో పాటూ ఇతర ప్రాంతాల్లో మొత్తం 78 ఎకరాల భూములు ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. నాలుగు లగ్జరీ కార్లున్నాయి. యూట్యూబ్లో చూసి.. హత్యకు 20 రోజుల ముందే బిహార్ నుంచి రెండు తుపాకులను కొనుగోలు చేశారు. గతంలో ఖాజా మోహియుద్దీన్, భిక్షపతిలకు తుపాకీ పట్టుకున్న అనుభవం లేకపోవటంతో ఇద్దరూ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారని, ఫిబ్రవరి 28నే హత్యకు ప్రయత్నించగా విఫలమైందని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. లేక్విల్లా ఆర్చిడ్స్లో చాలా వరకు ప్లాట్లు 2–3 రిజిస్ట్రేషన్లు జరిగాయని, అసోసియేషన్ ప్రతినిధులను విచారించి, ఈ హత్య కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉందని ఆరా తీసి వారిని కూడా అరెస్ట్ చేస్తామని సీపీ పేర్కొన్నారు. పోలీసులకు దృశ్యం సినిమా చూపించిన మట్టారెడ్డి హత్య జరిగిన రోజు ఘటన స్థలంలో ఉన్న మట్టారెడ్డిపై మృతుల కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడంతో వెంటనే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణకు ఏమ్రాతం సహకరించలేదని సీపీ తెలిపారు. తమ మధ్య చంపుకొనేంత విభేదాలు లేవని పదే పదే వ్యాఖ్యానించినట్లు చెప్పారు. విచారణలో మట్టారెడ్డికి ఫామ్ హౌస్ ఉందని విషయం పోలీసులకు తెలిసింది. దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులకు.. ఫామ్హౌస్లో సీసీ కెమెరా కనిపించింది. ఫుటేజ్ను పరిశీలించగా.. హత్య జరిగిన అనంతరం పచ్చ చొక్కా వేసుకున్న వ్యక్తి ఫామ్ హౌస్లోకి హడావుడిగా రావటం కనిపించింది. ఆ వ్యక్తిని ఆరా తీయగా.. శ్రీనివాస్ రెడ్డిపై కాల్పులు జరిపిన ఖాజా మోహియుద్దీన్ అని తేలింది. బిహార్లో తుపాకుల కొనుగోలు.. లేక్విల్లా ఆర్చిడ్స్ వాచ్మన్ ఖాజా మోహియుద్దీన్తో కలిసి మట్టారెడ్డి శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డిల హత్యకు పథకం రచించాడు. ఇందుకోసం ఖాజా.. తన స్నేహితుడైన బుర్రి భిక్షపతి సహాయం తీసుకున్నాడు. హత్య చేసేందుకు వీరిరువురికీ తలా 1,111 గజాల ప్లాట్ను ఇస్తానని మట్టారెడ్డి హామీ ఇచ్చాడు. తుపాకుల కోసం ఆరా తీయగా.. తన మామ సయ్యద్ రహీంకు బిహార్ గ్యాంగ్లతో పరిచయం ఉందని, తుపాకులు సమకూరుస్తాడని తెలపడంతో మట్టారెడ్డి రూ.1.20 లక్షల నగదు ఇచ్చాడు. కారులో బిహార్కు వెళ్లి సమీర్ అలీ నుంచి రెండు తుపాకులను కొనుగోలు చేశారు. వీటిని బిహార్కు చెందిన చందన్ సిబాన్, సోనులు తయారు చేశారు. (చదవండి: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో వీడిన మిస్టరీ) -
అటవీ భూముల ఆక్రమణలను గుర్తించాలి
సాక్షి, అమరావతి: భూ వివాదాలకు తెర దించుతూ శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టిన సమగ్ర భూ సర్వేను వేగవంతం చేయాలని జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అధికారులకు సూచించింది. ప్రభుత్వ భూములు, అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించేందుకు అవసరమైతే రెవెన్యూ, అటవీశాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వే చేయాలని స్పష్టం చేశారు. తొలుత అటవీ భూముల సరిహద్దులను నిర్దిష్టంగా గుర్తించాలన్నారు. సబ్ కమిటీ గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో సమావేశమై పలు సూచనలు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్) శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిదార్ధ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ ఎం.ఎం.నాయక్, డీఎంజీ వెంకటరెడ్డి, డీటీసీపీ డైరెక్టర్ రాముడు తదితరులు పాల్గొన్నారు. కాపాడకుంటే పర్యావరణ సమస్యలు.. దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తూ తొలిదశలో 51 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి కాగా ఈ ఏడాది చివరి నాటికి 11,501 గ్రామాల్లో పూర్తి చేసే లక్ష్యంతో కృషి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించిది. అటవీశాఖ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం, నకిలీ ధ్రువపత్రాలతో ఆక్రమించుకున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భాల్లో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేస్తున్నారని చెప్పారు. అటవీ భూములను కాపాడుకోకుంటే పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వీటిని నివారించేందుకు శాస్త్రీయంగా ఆక్రమణలను గుర్తించాలన్నారు. సర్వే పనులు ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల వ్యయంతో 4,500 సర్వే బృందాలతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు సబ్ కమిటీ పేర్కొంది. ఇప్పటికే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమైనట్లు తెలిపింది. 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2 వేల రోవర్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర భూసర్వే జరుగుతోందన్నారు. 2023 జూన్ నాటికి దశలవారీగా రీసర్వే పూర్తి కావాలన్న లక్ష్యం మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు 1,287 గ్రౌండ్ ట్రూతింగ్ లో భాగంగా 1,287 ఆవాస ప్రాంతాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 606 గ్రామాల్లో తొలివిడత మ్యాపింగ్, 515 హ్యాబిటేషన్లలో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 161 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ వాలిడేషన్ ముగిసింది. అన్ని శాఖల సమన్వయంతో రీసర్వేను లక్ష్యం మేరకు పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. -
భూ వివాదాలు బంద్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. సబ్ డివిజన్, మ్యుటేషన్ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్కు అనుగుణంగానే రికార్డుల్లో మార్పులు చేయాలని స్పష్టం చేశారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా, తక్కువ రుసుముతో చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా భూ వ్యవహారాల్లో శాశ్వతంగా నిలిచిపోయే పారదర్శక విధానాలు అమలు చేయాలని, వివాదాలు, అభ్యంతరాల పరిష్కారానికి గ్రామ సచివాలయాల స్థాయిలో యంత్రాంగం ఉండాలని నిర్దేశించారు. గడువులోగా సర్వే పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 2023 జూన్ నాటికి పథకాన్ని పూర్తి చేస్తామని, రెవెన్యూ డివిజన్కు మూడేసి డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకతకు పెద్దపీట భూ వ్యవహారాల్లో పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేయాలి. విక్రయించిన వారు, కొనుగోలు చేసినవారు మోసాలు, ఇబ్బందులకు గురి కాకూడదు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యే నాటికి సబ్ డివిజన్, మ్యుటేషన్ ప్రక్రియలు పూర్తి చేయాలి. దీనివల్ల వివాదాలు, సమస్యలు లేకుండా రికార్డుల్లో స్పష్టత ఉంటుంది. స్పష్టమైన సబ్ డివిజన్, రికార్డుల్లో మార్పులు, సర్వహక్కులతో కొనుగోలుదారులకు భూమి దఖలు పడాలి. దీనిపై అధికారులు సమగ్ర విధానాన్ని సిద్ధం చేయాలి. వివాదాలు కొనసాగుతుంటే జీవితాంతం భూ యజమానులను, కొనుగోలు చేసిన వారిని వెంటాడతాయి. ఇప్పుడున్న విధానాలను ప్రక్షాళన చేసి ప్రజలకు మంచి విధానాలు అందుబాటులోకి తీసుకురావాలి. విధానాలే శాశ్వతం.. భూ రికార్డుల్లో సంస్కరణలు తేవాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ వ్యవస్థ ఉండాలి. రికార్డుల క్రమబద్ధీకరణలో పారదర్శకతకు పెద్దపీట వేసి చిరకాలం నిలిచిపోయేలా విధానాలు ఉండాలి. తమకు ఇష్టం లేదని రికార్డుల్లో పేర్లు తొలగించడం, నచ్చినవారి పేర్లను చేర్చడం లాంటి వాటికి ఇకపై చోటు ఉండకూడదు. ఎవరు అధికారంలో ఉన్నా అనుసరిస్తున్న విధానాలు శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలి. నామమాత్రపు రుసుముతో.. గిఫ్ట్లు, వారసుల మధ్య పంపకాలకు రిజిస్ట్రేషన్ను ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేయడం, రికార్డులు సమర్థవంతంగా నిర్వహించడం, గిఫ్టు రూపేణా వచ్చిన భూమిపై న్యాయపరంగా అన్ని హక్కులు సంక్రమించేందుకు ఇది ఉపకరిస్తుంది. సాదా బైనామాలను క్రమబద్ధీకరించేందుకు తగిన విధానాలు తీసుకురావాలి. దీనివల్ల రికార్డుల ప్రక్షాళనకు అవకాశం లభిస్తుంది. వీటికోసం విధించే రుసుములు నామమాత్రంగా ఉండాలి. దీనిపై అధికారులు కార్యాచరణ రూపొందించాలి. చుక్కల భూముల వివాదాలకు పరిష్కారం దీర్ఘకాలంగా తేలని చుక్కల భూముల వివాదాలను పరిష్కరించాలి. లేదంటే ఈ వివాదాలు తరతరాలుగా ప్రజలను వేధిస్తాయి. భూ వివాదాలు, అభ్యంతరాలపై ఎప్పటికప్పుడు పరిష్కారాలు చూపేందుకు గ్రామ సచివాలయాల స్థాయిలో యంత్రాంగం ఏర్పాటుపై ఎస్వోపీ రూపొందించాలి. నిర్దిష్ట కాల పరిమితితో వివాదాలు పరిష్కారం కావాలి. అంతేకాకుండా ఆ వివరాలు రికార్డుల్లో నమోదు కావాలి. లంచాలకు ఎక్కడా ఆస్కారం ఉండకూడదు. రికార్డులు తారుమారు చేయలేని విధంగా విధానాలు ఉండాలి. రిజిస్ట్రేషన్లకు సంబంధించి సచివాలయాల సిబ్బందికి తగిన శిక్షణ, అవగాహన కల్పించాలి. -
‘రెండు గుంటలు’.. రెండు హత్యలు
సాక్షి, జగిత్యాల (కరీంనగర్): ప్రేమానురాగాలు మరిచారు.. స్నేహం, బంధుత్వాలు పట్టవనుకున్నారు.. కేవలం రెండు గుంటల భూమి కోసం నెలకొన్న వివాదం అన్నదమ్ముల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది.. పరస్పరం ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ శివారులో ఈరిశెట్టి రాజేశ్(28) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ► ధరూర్కు చెందిన ఈరిశెట్టి బుచ్చిలింగంకు నలుగురు కుమార్తెలు. వీరిలో ముగ్గురికి వివాహాలు చేశారు. మరో కూతురు రాజేశ్వరికి మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందిన బక్కశెట్టి గంగారెడ్డితో పెళ్లి జరిపించి, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. ► బుచ్చిలింగం అన్న కుమారుడు ఈరిశెట్టి వెంకన్న, అల్లుడు గంగారెడ్డిలకు ఒకేచోట చెరో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వెంకన్నకు రెండు గుంటల భూమి ఎక్కువ ఉందనే కారణంతో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ► ఈ రెండు గుంటల్లో తనకో గుంట ఇవ్వాలని గంగారెడ్డి, తాను ఇవ్వబోనని వెంకన్న ఘర్షణ పడుతున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. ► ఈ క్రమంలో 24 మే 2020న గంగారెడ్డి, అతడి కుమారులు వేణు, సతీశ్, సంతోష్లు వెంకన్న ఇంటికి వెళ్లారు. తమకు గుంట భూమి ఇవ్వాల్సిందేనని గొడవకు దిగారు. ఆగ్రహించిన వెంకన్న, అతని కుమారులు రాజేశ్, రాకేశ్లు గంగారెడ్డిని కత్తితో పొడిచి, చంపారు. ► ఈ కేసులో వెంకన్న, రాజేశ్, రాకేశ్లు జైలుకు వెళ్లి, ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. అయి తే, తమ తండ్రిని చంపిన వారిని ఎలాగైనా హతమార్చాలని గంగారెడ్డి కుమారులు భావించారు. ఇందుకు మరికొందరి సాయం తీసుకున్నారు. ► ఆదివారం ఉదయం వెంకన్న కుమారుడు రాజేశ్ తన మొక్కజొన్న చేను వద్దకు వెళ్తుండగా గ్రామ శివారులో తల్వార్, ఇనుపరాడ్లతో కొట్టి, హత్య చేశారు. ►జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై అనిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ► రాజేశ్కు భార్య లత, కూతురు అక్షర(4), కుమారుడు మన్విత్(3) ఉన్నారు. లత ఐదోవార్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. అతని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ► మృతుడి సోదరుడు రాకేశ్ ఫిర్యాదు మేరకు వేణు, సంతోష్, సతీశ్తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. -
ట్రస్టీల మధ్య గొడవ.. విద్యార్థులను గదుల్లోనే ఉంచి
సాక్షి, మైసూరు(కర్ణాటక): ట్రస్టు సభ్యులు వారిలో వారు గొడవపడి, కళాశాలకు వచ్చిన విద్యార్థులను గదుల్లో బంధించిన ఘటన నగరంలోని విజయనగరలో ఉన్న ప్రైవేట్ పీయూ కళాశాలల్లో మంగళవారంచోటు చేసుకుంది. ట్రస్టీలు వనితా, సలోని, రునాల్, రేణుకా, అశోక్ కుమార్ అనే ఐదుమంది ట్రస్టీలు ఉన్నారు. విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులు దుర్వినియోగం చేశారని వనితా, రేణుకాను ట్రస్టు నుంచి సస్పెండ్ చేశారు. ఒక స్థలం విషయమై కూడా రేణుకాతో మిగతావారికి రగడ జరిగింది. రేణుకాకు చెందిన వారు రోజూ కళాశాల వద్దకు వచ్చి ఈ స్థలం మాది అని గొడవ చేస్తున్నారు. మంగళవారం మళ్లీ వచ్చి కాలేజీ గదులకు తాళాలు వేయడంతో పాటు టీవీ, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. డిడిపియు శ్రీనివాస్ మూర్తి వచ్చి పరిశీలించారు. విజయనగర పోలీసులు పిల్లలను బయటకు పంపి గొడవచేసిన వారిపై కేసు నమోదు చేశారు. -
650 గ్రామాల్లో... తుది దశకు సమగ్ర భూసర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష’ పథకం ద్వారా భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే పలు గ్రామాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కాగా తాజాగా మరో 650 గ్రామాల్లో సమగ్ర భూసర్వే ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సర్వే ముగింపునకు సంబంధించి నెంబర్ 13 ముసాయిదా నోటిఫికేషన్లు డిసెంబర్ 22వతేదీలోపు ఇచ్చేందుకు సర్వే, సెటిల్మెంట్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక బృందాలను నియమించారు. అభ్యంతరాల పరిశీలన.. సర్వే ఆఫ్ ఇండియా అందచేసిన డ్రోన్ ఫొటోలు, క్షేత్ర స్థాయిలో భూ యజమానులు చూపించిన సరిహద్దులను సరిచూసి కొలతలు వేసే పనిని ఇప్పటికే పూర్తి చేశారు. ఆయా గ్రామాల సరిహద్దులు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములు, పట్టా భూముల సర్వే దాదాపుగా పూర్తైంది. వీటి ప్రకారం కొత్తగా రూపొందించిన కొలతలపై భూ యజమానుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. వీటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్లు చర్యలు తీసుకుంటున్నారు. అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత రైతుల ఆమోదంతో తుది రికార్డులు రూపొందిస్తారు. ఈ పనులన్నీ డిసెంబర్ 22లోపు పూర్తి చేసి నెంబర్ 13 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ప్రయోగాత్మక సర్వేతో పూర్తి స్పష్టత రెవెన్యూ డివిజన్కు ఒక గ్రామం చొప్పున మొత్తం 51 గ్రామాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన రీ సర్వే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తైనట్లు సర్వే శాఖ అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో కొత్తగా భూమి రిజిష్టర్లు, మ్యాప్లు అందుబాటులో ఉంచారు. ప్రతి భూమికి ఒక విశిష్ట సంఖ్య కూడా కేటాయించారు. ప్రతి గ్రామంలో సగటున ఒక ఎకరం తేడా కూడా లేకుండా కొత్త సరిహద్దులు నిర్ణయించారు. రెండు చోట్ల మాత్రం 3 ఎకరాలకు పైబడి తేడా ఉండడంతో రైతుల ఆమోదంతో వివాదాలకు ఆస్కారం లేకుండా హద్దులను నిర్ణయించారు. రీ సర్వేకు ముందు ఈ గ్రామాల్లో మొత్తం 6,405 సర్వే నెంబర్లు ఉండగా సర్వే తర్వాత రూపొందించిన కొత్త రికార్డుల ప్రకారం 21,374 ఎల్పీ (ల్యాండ్ పార్సిల్స్)గా నమోదు చేశారు. ఈ రికార్డుల ప్రకారమే ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకు అవసరమైన కార్యాచరణపై కసరత్తు ప్రారంభించారు. మొత్తంగా 51 గ్రామాల్లో జరిగిన ప్రయోగాత్మక సర్వేతో రీసర్వేపై పూర్తి స్పష్టత వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన గ్రామాల్లో సర్వేను వేగవంతం చేశారు. -
సీఎం జగన్ ప్రత్యేక చొరవ: 48 గంటల్లో భూవివాదం పరిష్కారం
-
మూడెకరాల కోసం నాలుగు హత్యలు
రాయచూరు రూరల్: కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలో భూ వివాదం నలుగురి హత్యకు దారితీసింది. మూడు ఎకరాల కోసం ఈ ఘోరం జరిగింది. వివరాలు... భాగల్కోటె జిల్లా జమఖండి తాలూకా మధురఖండిలో రెండు కుటుంబాల మధ్య ఆస్తి వివాదం ఉంది. ధార్వాడ కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి పొలంలో ఉన్న అన్నదమ్ములు హన్మంతు (48), మల్లప్ప (44), ఈశ్వర్ (40) బసవరాజ్ (36)లను వరుసకు బంధువులైన పుటాణి కుటుంబ సభ్యులు మారణాయుధాలతో హతమర్చారు. కోర్టు తీర్పు ఆలస్యం అవుతుండటంతో శనివారం రాత్రి కాపుగాచి నలుగురిని కిరాతకంగా చంపేశారు. దీంతో జమఖండి పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: Karnataka: బాలికతో అసభ్య ప్రవర్తన.. నడిరోడ్డుపై -
టీడీపీ నేత దాష్టీకం.. దళిత దంపతులపై దాడి
పెదకూరపాడు: ప్రశ్నించిన దళితులపై టీడీపీ నేతలు, సానుభూతి పరుల దాడులు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. పొలం వద్ద జరిగిన చిన్న వాగ్వాదం విషయమై మాట్లాడదాం రండి అని దళిత దంపతులను పిలిచి, కర్రలతో దాడి చేసి కులం పేరుతో దూషించి, పోలీసుస్టేషన్కు వెళ్లకుండా అడ్డుకున్న ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం హుస్సేన్నగరం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని హుస్సేన్నగరం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన సాతులూరి లక్ష్మయ్య, దేవకరుణ దంపతులు కౌలుకు పొలం సాగు చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఆ పొలంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత నెల్లూరు బుల్లెబ్బాయి గోర్రు తోలారు. 13వ తేదీ సాయంత్రం లక్ష్మయ్య, దేవకరుణ పొలం చూసేందుకు వెళ్లగా.. గోర్రు సక్రమంగా తోలకపోవడంతో బుల్లెబ్బాయిని ప్రశి్నంచారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయమై మాట్లాడదాం రండి అని దంపతులను గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు నెల్లూరు మల్లికార్జునరావు తన ఇంటికి అదే రోజు సాయంత్రం పిలిపించారు. దంపతులు జరిగిన విషయం చెబుతుండగానే.. పొలంలో గొర్రు తోలిన నెల్లూరు బుల్లెబ్బాయి లక్ష్మయ్యను మాపై ఫిర్యాదు చేస్తావురా అంటూ కాలితో తన్నగా.. బుల్లెబ్బాయి కుటుంబసభ్యులు నెల్లూరి బోస్బాబు, శివయ్య, రోశయ్య, పవన్, అరుణ, రమాదేవి, రమాదేవి కోడలు, బుల్లెబ్బాయి భార్య కర్రలతో దాడి చేశారు. కులం పేరుతో దూషించారు. బాధితులు పోలీసుస్టేషన్కు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్గంమధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో దళిత దంపతులు అర్ధరాత్రి సమయంలో అమరావతి మండలం అత్తలూరు మీదగా 75తాళ్ళూరు వచి్చ, అక్కడ నుంచి పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెదకూరపాడు సీహెచ్సీలో ప్రథమ చికిత్స చేయించుకుని.. అమరావతి సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గుంజి తిరుమలరావు తెలిపారు. -
తండ్రి, కుమారుడి ప్రాణం తీసిన స్థల వివాదం
బొమ్మలసత్రం: స్థల వివాదం తండ్రి, కుమారుడి ప్రాణం తీసింది. ఈ ఘటన ఆదివారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు..నంద్యాలలో కోటా వీధికి చెందిన చిన్న సుబ్బరాయుడు, వెంకట లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు నాగరమేష్, కుమార్తె సుదీపిక ఉన్నారు. చిన్న సుబ్బరాయుడుతో పాటు సమీప బంధువు కందాల కృష్ణమూర్తికి పూర్వీకుల నుంచి భూములు వచ్చాయి. నంద్యాల మండలం పులిమద్ది గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 246లో రెండు ఎకరాలు, కొత్తపల్లి గ్రామ సమీపంలోని సర్వే 1578లో 55 సెంట్ల భూమిని వీరిద్దరూ కౌలుకు ఇచ్చేవారు. వచ్చిన ధాన్యాన్ని రెండు భాగాలుగా పంచుకునే వారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు గౌరీశంకర్, విజయ్కుమార్ న్యాయవాదులు కావటంతో నాలుగేళ్ల క్రితం రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి ఆన్లైన్లో భూములను తమ పేర్లపై మార్చుకున్నారు. ఈ విషయం తెలిసి గౌండా పని చేస్తున్న చిన్న సుబ్బరాయుడు కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను నిలదీశారు. ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో డిగ్రీ వరకు చదువుకున్న సుబ్బరాయుడు కుమారుడు నాగరమేష్ మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం నంద్యాల శివారు ప్రాంతంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడు. కుమారుడి మృతితో మనస్తాపం చెందిన చిన్న సుబ్బరాయుడు శనివారం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక శనివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్న బంధువులు చిన్న సుబ్బరాయుడి మృత దేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కందాల కృష్ణమూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యడియూరప్పకు చుక్కెదురు
సాక్షి బెంగళూరు: బెంగళూరులో స్థలం డీ నోటిఫికేషన్ కేసులో ముఖ్యమంత్రి యడి యూరప్పకు చుక్కెదురైంది. యడియూరప్పపై నమోదైన ఈ డీనోటిఫికేషన్ కేసు విచారణను మూసివేయాలని లోకాయుక్త విభాగం ఇచ్చిన బీ–రిపోర్టును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శనివారం తోసిపుచ్చింది. జడ్జి శ్రీధర్ గోపాలకృష్ణ ఆ బి–రిపోర్టును తిరస్కరిస్తూ నివేదిక సక్రమంగా లేదని, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారం మళ్లీ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తెలిపారు. కేసు పూర్వపరాలు.. 2000–01లో నగరంలోని వైట్ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ చుట్టుపక్కల భూములను ఐటీ కారిడార్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మారతహళ్లి, బెళ్లం దూరు, సర్జాపుర, దేవరబీసనహళ్లి, కాడుబీ సనహళ్లి, కరిమమ్మన అగ్రహార గ్రామాల్లోని 434 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటూ కేఐఏడీబీ ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్ యడియూరప్ప కేఐఏడీబీ స్వాధీనం చేసుకున్న దేవరబీసనహళ్లి సర్వే నంబర్ 49లో ఉన్న 4.30 ఎకరాలు, బెళ్లందూరు గ్రామం సర్వే నంబర్ 46లో ఉన్న 1.17 ఎకరాలు, సర్వే నంబర్18లో ఉన్న 1.10 ఎకరం, సర్వే నంబర్ 10.33 గుంటల స్థలాలను అక్రమంగా డీనోటిఫై చేశారని 2013 జూలై 10న వాసుదేవ రెడ్డి అనే వ్యక్తి లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని లోకాయుక్త కోర్టు 2015, ఫిబ్రవరి 18న పోలీసులను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు 2015, ఫిబ్రవరి 21న ఎఫ్ఐఆర్ దాఖలు చేసి యడియూరప్పను ఏ2గా లోకాయుక్త పోలీసులు చేర్చారు. అయితే 2019, జనవరి 25న తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని యడియూరప్ప హైకోర్టును కోరగా ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఈ కేసులో విచారణను పారదర్శకంగా చేపట్టాలని లోకాయుక్త పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వివాదాలు లేకుండా వైఎస్సార్ జగనన్న భూరక్ష
మంగళగిరి (దుగ్గిరాల): రాష్ట్రంలో ఎక్కడా భూవివాదాలు లేకుండా పరిష్కరించేందుకే వైఎస్సార్ జగనన్న భూరక్ష రీసర్వే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో భూరక్ష రీసర్వే పైలట్ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి భూములకు సరిహద్దుల సర్వే రాయిని పాతారు. ఈ సందర్భంగా సర్వేపై రైతుల అభిప్రాయాలను తెలుసుకోగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ.. 114 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, నాటి నుంచి ఇప్పటివరకు సర్వే నిర్వహించకపోవడంతో భూముల వివాదాలు అధికమయ్యాయన్నారు. రూ.1,000 కోట్లతో మూడు విడతలుగా రాష్ట్రం మొత్తం సర్వే నిర్వహిస్తామన్నారు. తద్వారా స్పష్టమైన రికార్డులు తయారుచేయడమే భూరక్ష లక్ష్యమన్నారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి.. ఎక్కడా వివాదాలు లేకుండా సుశిక్షితులైన అధికార యంత్రాంగంతో సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా భూవివాదాల్లో సరిహద్దులే వివాదాలుగా ఉంటాయని, వాటిని పూర్తిగా పరిష్కరించడం, ప్రభుత్వ ఖర్చుతోనే వివాదాలు లేకుండా చేయడం ఒక చరిత్రగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), అన్నాబత్తుని శివకుమార్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి, ల్యాండ్ రికార్డ్స్, సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ దినేష్కుమార్, ఆర్డీవో భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూ రీ సర్వేతో భూ వివాదాలు పూర్తిగా తొలగిపోతాయి : ధర్మాన కృష్ణదాస్
-
భూవివాదం.. యువకుడిని కొట్టి చంపిన దుండగులు
భోపాల్: భూతగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని దుండగులు అతికిరాతకంగా కొట్టి చంపారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న దృశ్యాలు కొందరు మొబైల్లో చిత్రీకరించగా.. దీన్నీ చూసిన నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు. రఈ ఘోర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఉజ్జాయిని జిల్లాలో పశువుల మేతకు సంబంధించిన భూ వివాదంలో 26 ఏళ్ల గోవింద్ అనే యువకుడిని అయిదుగురు దుండగులు కర్రలతో దాడికి తెగబడ్డారు. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లే వరకు అతన్ని చితకబాదుతూనే ఉన్నారు. అయితే నడిరోడ్డుమీదే ఇంత దారుణం జరుగుతున్నా ఎవరూ ఆపకపోవడం బాధకరం ఈ దృశ్యాలన్నీ మొబైల్లో రికార్డయ్యాయి. ఇందులో గోవింద్ రోడ్డు మీద పడుకున్నట్లు చూపిస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. వారిలో ఒకరు అతని భుజాలు పట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నిస్తుండగా అతను కదలటం లేదు. తీవ్రంగా కొట్టి, తన్నిన అనంతరం అతన్ని బైక్పై తీసుకుళ్లి వాళ్ల ఇంటి ముందు పడేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ ఇండోర్లోని మరో పెద్ద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కాగా గోవింద్కు పశువుల పెంపకం, మేత కోసం భూమి విషయంలో కొంతమందితో చాలాకాలంగా వివాదంలో ఉన్నాడు. ఈ విషయంపై కూర్చొని సమస్యను పరిష్కరించుకుందామని నిందితుల్లో గోవింద్ను తన ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారని గోవింద్ స్నేహితుడు సూరజ్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుల్లోని అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అనుమానంతో ఓ వ్యక్తిపై 10 మంది దాడి..మృతి తల్లిదండ్రులను మత్తులోకి పంపించి.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే.. -
భూ తగాదాలు... గ్యాంగ్స్టర్లు... ప్రాణభయం
వేదిక రెజ్లింగ్ స్టేడియమే కావచ్చు... కానీ అది రెజ్లర్ల మధ్య గొడవ మాత్రమే కాదు... దాని వెనక బయటకు కనిపించని అనేక చీకటి కథలున్నాయి... దేశంలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో రెండు ఒలింపిక్ మెడల్స్ను సాధించిన దిగ్గజం తనది కాని బాటలో వెళ్లి తప్పుడు మనిషిగా తేలిన వైనమిది... ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి సాధించిన కీర్తి ప్రతిష్టలను పణంగా పెడుతూ సాధారణ గల్లీ గూండాలతో చేసిన స్నేహం, ఆపై శత్రుత్వం సుశీల్ కుమార్ను పతకాలు సాధించే స్థాయి నుంచి పతనం వైపు నడిపించింది. న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 4న ఈ ఘటన జరిగిన రోజున వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే... ఛత్రశాల్ స్టేడియంలో రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసే కొందరి మధ్య వాదోపవాదాల తర్వాత క్షణికావేశంలో జరిగిన ఉదంతంలా కనిపించింది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఆస్తి, భూ తగాదాలు ప్రాథమిక కారణం కావడంతో పాటు రౌడీల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది. నిజానికి 18 రోజులపాటు సుశీల్ తప్పించుకు తిరిగింది పోలీసుల భయం వల్ల కాదని... గ్యాంగ్స్టర్లు తనను చంపేస్తారనే భయంతోనే అతను ఆ పని చేసినట్లు తెలుస్తోంది. నేపథ్యమిదీ... ఢిల్లీలోని మోడల్ హౌస్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ఒక ఫ్లాట్ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. తన భార్య పేరిట ఉన్న ఈ ఫ్లాట్ను సందీప్ అలియాస్ కాలా జఠేడి అనే వ్యక్తి భాగస్వామ్యంతో కలిసి సుశీల్ కొన్నాడు. సుశీల్ స్నేహం చేసిన ఈ కాలా జఠేడి న్యూఢిల్లీలో గ్యాంగ్స్టర్లలో ఒకడు. అతనిపైన పెద్ద సంఖ్యలో పోలీసు కేసులు ఉన్నాయి. ఢిల్లీ పరిసరాల్లో భూ కబ్జాల్లో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చాలా మంది రెజ్లర్లతో పాటు క్రిమినల్స్ కూడా ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఇందులో కొన్నాళ్లుగా జఠేడి మేనల్లుడి వరుస, అత్యంత ఆత్మీయుడైన రెజ్లర్ సోనూ మహల్, మరో రెజ్లర్ సాగర్ రాణా ఉంటున్నారు. రెజ్లర్ సోనూపై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. సమభాగస్వామ్యం ఉన్న ఈ ఫ్లాట్ను జఠేడి అమ్మాలని భావించగా, అందుకు సుశీల్ అంగీకరించలేదు. దానిని అమ్మి తన డబ్బులు ఇవ్వాలంటూ సుశీల్పై జఠేడి ఒత్తిడి పెంచగా... ఫ్లాట్లో ఉంటున్న సోనూ, సాగర్ ఖాళీ చేయాలంటూ సుశీల్ మరోవైపు చెబుతూ వచ్చాడు. గుణపాఠం చెప్పాలని... సుశీల్ గత కొంత కాలంగా జఠేడి ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్స్టర్ నీరజ్ బవానా, నవీన్ బాలిలతో స్నేహం పెంచుకోవడం కూడా జఠేడి ఆగ్రహానికి కారణమైంది. ఫ్లాట్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సుశీల్పై సోనూ తదితరులు బహిరంగంగా దుర్భాషలాడటం మొదలు పెట్టారు. దాంతో వారికి గుణపాఠం చెప్పాలని సుశీల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 4న స్టేడియం ముందు వీరంతా ఎదురెదురుగా తలపడ్డారు. అప్పటికే నీరజ్కు సంబంధించిన గూండాలను సుశీల్ తన కోసం పిలిపించుకున్నాడు. జఠేడి భయంతో సుశీల్ తనను ఏమీ చేయడని సోనూ భావించినా... నీరజ్ గూండాలు వారిని చితకబాదారు. ఆవేశపరుడైన సుశీల్ కూడా తాను ఓ చేయి వేశాడు. పైగా తనేంటో అందరికీ తెలియాలని, వారిలో భయం ఉండాలంటూ ఈ ఘటనను వీడియో షూట్ చేయమని తనవారికి సూచించాడు. తీవ్రంగా గాయపడిన సాగర్ తర్వాతి రోజు ఆసుపత్రిలో మరణించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వేర్వేరు చోట్ల నుంచి తప్పించుకుంటూ... తన మేనల్లుడు సోనూపై దాడి సహజంగానే జఠేడికి కోపం తెప్పించింది. దాంతో సుశీల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. అనూహ్య ఘటన తర్వాత బెదిరిన సుశీల్ ఆ రోజు నుంచి ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తనకు ప్రాణహాని ఉందంటూ ముందస్తు బెయిల్ కోసం చేసిన దరఖాస్తులో కూడా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి మొదలు పెట్టి యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో దాక్కున్నాడు. తనను క్షమించమంటూ చివరకు జఠేడిని ఫోన్లో కోరేందుకు కూడా సుశీల్ ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసుల చేతికి చిక్కిన తర్వాత కూడా అతను హత్య కేసుకంటే కూడా తనకు రౌడీల నుంచి రక్షణ కల్పించమంటూ అతను కోరాడని తెలిసింది. సస్పెండ్ చేయనున్న రైల్వేస్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్ను ఉద్యోగం నుంచి తొలగించాలని రైల్వే శాఖ భావిస్తోంది. నార్తర్న్ రైల్వేలో సుశీల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ హోదాలో ఉన్నాడు. అయితే ప్రాథమిక స్థాయిలో క్రీడలను తీర్చిదిద్దే బాధ్యతలతో 2015 నుంచి అతను ఢిల్లీ ప్రభుత్వం వద్ద డిప్యుటేషన్ మీద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ హోదాలో పని చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా కొనసాగింపు కోరినా ఢిల్లీ ప్రభుత్వం అందుకు అనుమతించకపోవడంతో రైల్వేస్కు వెళ్లిపోయాడు. నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా నేరాల్లో నిందితుడిగా ఉంటే దర్యాప్తు ముగిసేవరకు సస్పెండ్ చేస్తామని, సుశీల్ విషయంలో కూడా అదే జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. మరోవైపు సుశీల్పై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. ప్రస్తుతం అతనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని... చట్ట పరంగా విచారణ తర్వాత ముగిసి తీర్పు వచ్చిన తర్వాతే దానిపై మాట్లాడతామని స్పష్టం చేసింది. -
ఇటు నుంచి ఇటే జైలుకు పంపేవాళ్లం
సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదానికి సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో ఎస్.శ్రీను, తహసీల్దార్ యు.ఉమాదేవిలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లపై అప్పీల్ దాఖలు చేసిన కేసుల్లో సదరు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. ఈ రోజు విచారణకు హాజరై ఉంటే.. ఇటు నుంచి ఇటే ఈ ముగ్గురిని జైలుకు పంపేవాళ్లమని హెచ్చరించింది. ఓ భూ వివాదం వ్యవహారంలో ఈ ముగ్గురు అధికారులకు 2 నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ 2020 డిసెంబర్ 15న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా సదరు అధికారులు హాజరయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్ప డంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సింగిల్ జడ్జి ఆదేశాల్లో లోపం ఎక్కడ ఉందో చెప్పకుండా ఆదేశాలను అమలు చేయలే దు. పైగా కోర్టు ఆదేశాలను తమకు అనుకూలంగా మల్చుకు నే ప్రయత్నం చేశారు. పిటిషనర్లకు పట్టాదార్ పాస్పుస్తకాలు ఇవ్వాలని ఆదేశించినా.. ఇవ్వకపోగా రుజువు చేయకుండా పిటిషనర్ ఆక్రమణదారుడు అని ఎలా అంటారు? సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అభ్యంతరముంటే ఆ ఉత్తర్వులను ఎత్తేయా లని కోరాలి. ఇవేమీ చేయకుండా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ చేయాల్సిందంతా చేసి బేషరతు క్షమాపణలు కోరితే అంగీకరించం’అని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఈ ముగ్గురు అధికారులు హాజరుకావాలని స్పష్టం చేస్తూ విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఏమన్నారంటే.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఈజె డేవిడ్.. ఎనిమిదేళ్ల క్రితం సంగారెడ్డి రెడ్డి జిల్లా కంది సమీపంలోని చిమ్నాపూర్లో ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి పట్టాదార్ పాస్బుక్ ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా.. అది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో డేవిడ్ హైకోర్టును ఆశ్రయించగా.. రెవెన్యూ అధికారులు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే.. ఈ భూమికి సంబంధించి విలేజ్ మ్యాప్, టిప్పన్, వసూల్ బక్వాయి, సేత్వా ర్ తదితర రికార్డులు లేవని, ఇవి ‘ఖిల్లాదాఖ్లా’భూములంటూ డేవిడ్ దరఖాస్తును తహసీల్దార్ తిరస్కరించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆర్డీవో, తర్వాత అదనపు కలెక్టర్ ముందు అప్పీల్ దాఖలు చేయగా.. తహసీల్దార్ ఆదేశాలను సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద డేవిడ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు.. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ముగ్గురికి రెండు నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
భూ రికార్డుల స్వచ్ఛీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కు పత్రాలు (ఆర్వోఆర్–అడంగల్) తప్పుల తడకగా.. అస్తవ్యస్తంగా తయారయ్యాయి. భూ రికార్డులను నవీకరించి నిర్వహించడానికి వీలుగా 2014లో అప్పటి ప్రభుత్వం ‘వెబ్ల్యాండ్’ కొత్త సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది. అది కాస్తా తప్పుల తడకగా.. లోపభూయిష్టంగా తయారైంది. ఫలితంగా భూ యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే దుస్థితి దాపురించింది. వెబ్ల్యాండ్ రికార్డులు సక్రమంగా లేకపోవడంవల్లే భూ వివాదాలు పెరిగి ఘర్షణలకు దారి తీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో హత్యలకు దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని వివాదాల విషయంలో ఇరువర్గాలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న దృష్టాంతాలు లక్షల్లో ఉన్నాయి. అందువల్లే భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూములు, పట్టణ, గ్రామీణ ఆస్తులను రీసర్వే చేసి ప్రతి సబ్ డివిజన్కు సరిహద్దు రాళ్లు నాటాలని నిర్ణయించింది. తద్వారా ల్యాండ్ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని పక్కాగా చేపడుతోంది. ప్రైవేట్ భూములు ప్రభుత్వ ఖాతాలో.. అనేకచోట్ల ప్రైవేట్ భూములు ప్రభుత్వ ఖాతాల్లోనూ, ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోను అడంగల్లో నమోదై ఉన్నాయి. కొందరు కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది, రిటైర్డు ఉద్యోగులు ముడుపులు తీసుకుని తప్పుడు రికార్డులు సృష్టించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు కూడా ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించారు. ఇప్పటికీ చాలా భూములు రెవెన్యూ రికార్డుల్లో అన్ నోన్ (ఎవరివో తెలియవు) అనే ఖాతాలోనే ఉన్నాయి. తప్పుల సవరణ కోసం... 2020 జూన్ 1 నుంచి 2021 జనవరి 29వ తేదీ వరకూ 8 నెలల్లో భూ యాజమాన్య పత్రం (ఆర్వోఆర్/అడంగల్)లో తప్పుల సవరణ కోసం 4,17,650 వినతులు వచ్చాయి. వెబ్ల్యాండ్ ఎంత అస్తవ్యస్తంగా.. తప్పుల తడకగా ఉందనేది ఈ గణాంకాలే చెబుతున్నాయి. వాటిలో.. 2,04,577 తప్పులను అధికారులు సరిదిద్దారు. 43,047 అర్జీలు పెండింగ్లో ఉండగా.. 1,70,026 అర్జీలను వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. అందుకే స్వచ్ఛీకరణ దశాబ్దాల తరబడి సబ్ డివిజన్ కాకపోవడం, కిందిస్థాయిలో జరిగిన అక్రమాలు వంటి కారణాల వల్ల అడంగల్లోనూ, వెబ్ల్యాండ్ అడంగల్లోనూ కొన్ని తప్పులు ఉన్న మాట వాస్తవమేనని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు అంగీకరించారు. ఈ తప్పులను సరిదిద్ది ప్రక్షాళన చేయడం కోసమే ప్రభుత్వం రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. -
ప్రత్యర్థుల కత్తుల వేట, ఒకరు మృతి
సాక్షి, సంగారెడ్డి: భూవివాదం నేపథ్యంలో ఇరువర్గాలు కత్తులు, గొడ్డళ్లతో దాడులు చేసుకోవడంతో ఓ నిండు ప్రాణం బలైన ఘటన చౌటకూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా గ్రామానికి చెందిన బేగరి దేవయ్య, కాశగారి ప్రదీప్ మధ్య భూతగాదాలున్నాయి. ఈక్రమంలో మంగళవారం ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దేవయ్య, ఆయన కొడుకు కరుణాకర్పై ప్రత్యర్థివర్గానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో.. కరుణాకర్ ప్రాణాలు విడువగా దేవయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరూ రక్తపు మడుగులో ఉన్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తీవ్రంగా గాయపడ్డ దేవయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దేవయ్య ఎస్సీ కార్పొరేషన్లో ఏడీగా పనిచేస్తున్నాడు. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
సాక్షి, శంకరపట్నం(మానకొండూర్): శంకరపట్నం మండలం మెట్పెల్లి గ్రామంలో గురువారం కాంగ్రెస్ నాయకుడు రాచమల్ల సంపత్ హత్యకు గురయ్యాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మెట్పెల్లి గ్రామానికి చెందిన రాచమల్ల సంపత్కు భోనగిరి ఓదయ్య మధ్య భూగాదాలు ఉన్నాయి. ఇటీవల ఈ భూముల విషయంలో కేశవపట్నం పోలీసులను ఆశ్రయించారు. పెద్ద మనుషుల సమక్షంలో శుక్రవారం పంచాయితీ ఉండగా గురువారం పొలం వద్దకు సంపత్ వెళ్లాడు. పొలం వద్ద రాచమల్ల సంపత్, బోనగిరి ఓదయ్య ఘర్షణపడ్డారు. సమీపంలోని భోనగిరి ఓదయ్య కుమారుడు జంపయ్య వచ్చి సంపత్ మెడ వెనుక భాగంలో గొడ్డలితో నరికాడు. రక్తపు మడుగులో పడి సంపత్ అక్కడికక్కడే మృతిచెందాడు. చదవండి: మోజు తీరగానే ఫోన్లో తలాక్.. సమాచారం అందుకున్న మృతుడి తండ్రి రాజలింగం, తల్లి నాగమల్లమ్మ, భార్య రజిత సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి రోదించారు. మెట్పెల్లిలో భూతగాదాలతో రాచమల్ల సంపత్ హత్యకు గురైన విషయం తెలుసుకున్న డీసీపీ శ్రీనివాస్, హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్రావు ,హుజురాబాద్ రూరల్, జమ్మికుంట, జమ్మికుంట రూరల్ సీఐలు కిరణ్, సృజన్రెడ్డి, రాములు, సైదాపూర్, వీణవంక, ఇల్లందకుంట ఎస్సైలు భారీగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్రావు పరిశీలించారు. హత్యకు గురైన సంపత్ తండ్రి రాజలింగం, కుటుంబసభ్యుల నుంచి వివరాలు తీసుకున్నారు. భూతగాదాలతోనే సంపత్ హత్యకు గురయ్యాడని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పోలీసుల వత్తాసుతో హత్య భూవివాదంలో కేశవపట్నం పోలీసులను ఆశ్రయిస్తే స్పందించకుండా ఓదయ్యకే వత్తాసు పలకడంతో మాటువేసి తన కొడుకును హత్య చేశారని మృతుడి తండ్రి రాజలింగం ఆరోపించారు. వీణవంక మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధిపై ఆరోపణలు చేశారు. కేశవపట్నం స్టేషన్లో పనిచేస్తున్న అధికారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మృతుడి తండ్రి ఆరోపణలు చేయడంతో కేశవపట్నం ఎస్సై రవిని సంఘటన స్థలం నుంచి స్టేçషన్కు పంపించడం గమనార్హం. -
శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తనపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని ఆయన అన్నారు. మంత్రి మల్లారెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆ శ్యామలదేవి ఎవరో కూడా తెలియదు. నా భూమి పక్క భూమి ఆమెది అని తెలుస్తుంది. ఇప్పటికే నాకు చాలా భూమి ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ఒక మహిళకు మంత్రిగా సహాయం చేయడానికి సిద్ధం. శ్యామల అనే మహిళ ... నన్ను ఇప్పటివరకూ కలవలేదు. నేను ఎవరినీ బెదిరించలేదు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే’ అని స్పష్టం చేశారు. (మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు) కాగా భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఈ నెల 6వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుమారుడిపై కూడా కేసు నమోదు అయింది. -
మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
దుండిగల్: ఓ భూవివాదంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఆరో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తల్లి పద్మావతి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, మంత్రితో పాటు ఆయన కుమారుడు, వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పద్మావతి కుమార్తె శ్యామలాదేవి హైకోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. బాధితురాలు శ్యామలాదేవి ఫిర్యాదు ప్రకారం... తల్లి పొన్నబోయిన పద్మావతి పేరుపై సూరారం సర్వే నంబర్ 115, 116, 117లలో 2.13 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని విక్రయించాలంటూ మంత్రి తన అనుచరులతో బెదిరించారు. దీనిపై 2017లో పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. దీంతో తల్లి పద్మావతితో కలిసి కోర్టులో మల్లారెడ్డిపై భూవివాదానికి సంబంధించిన పిటిషన్ వేసేందుకు న్యాయవాది లక్ష్మీనారాయణను ఆశ్రయించారు. అయితే మంత్రితో చేతులు కలిపిన న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకని బాధితులనుంచి స్టాంప్ పేపర్పై సంతకాలు తీసుకున్నాడు. వాటి ఆధారంగా మల్లారెడ్డి అనుచరుడు గూడూరు మస్తాన్కు ఆ భూమిని అమ్మేందుకు రూ.ఎనిమిది లక్షలతో అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నకిలీ అగ్రిమెంట్ పేపర్లను తయారు చేశారు. దీన్ని అడ్డుపెట్టుకొని పద్మావతి, శ్యామలాదేవిలను ఆ భూమిలోకి రానివ్వలేదు. ఈ ఒత్తిడులు ఇలా ఉన్న సమయంలోనే కొన్ని నెలల క్రితం శ్యామలాదేవి తల్లి పద్మావతి, సోదరి మరణించారు. దీంతో ఒంటరిగా ఉన్న తనకు ప్రాణహాని ఉందంటూ, మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్యామలాదేవి దుండిగల్ పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయలేదు. దీంతో కోర్టులో శ్యామలాదేవి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. -
భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు
సాక్షి, హైదరాబాద్ : భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను విచారించి పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని, ఆ ట్రిబ్యునళ్లకు క్వాసీ జ్యుడీషియల్ అధికారాలివ్వాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ రెవెన్యూ కోర్టులకు వచ్చే కేసులు పెరగడం, ధరణి పోర్టల్ అమలు నేపథ్యంలో సమస్యలు వస్తుండటంతో వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే ట్రిబ్యునళ్లను శాశ్వత ప్రాతిపదికన ఉంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటికే దాదాపు 20 వేల కేసులు రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. వాటితోపాటు చిన్నచిన్న ఫిర్యాదులు, ధరణి అమలు ద్వారా వస్తున్న సమస్యలు, సంధికాలంలో వచ్చిన సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అసెంబ్లీలో చెప్పినట్లు ఈ ట్రిబ్యునళ్లకు నిర్ణీత కాలపరిమితి విధించకుండా భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగించాలన్న రెవెన్యూ ఉన్నతాధికారుల సూచన మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి భూ సమగ్ర సర్వేనే మార్గమని, వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. సమగ్ర భూ సర్వే ద్వారా గరిష్ట స్థాయిలో భూ వివాదాలు పరిష్కారం అయ్యాక మాత్రమే ట్రిబ్యునళ్లపై మళ్లీ నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
జహీరాబాద్లో కాల్పుల కలకలం
సాక్షి, మెదక్: జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. భూ వివాదం విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గం వారు మరో వర్గంపై కాల్పులకు పాల్పడ్డారు. కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి పరిధిలోని జహీరాబాద్ మండలంలోని గోవిందపూర్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన సుమారు 30 ఎకరాల భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చెలరేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్కు చెందిన కమల్ కిశోర్ పల్లాడ్ గోవిందపూర్ శివారులోని జీడిగడ్డతాండ గ్రామంలోని 104 , 105 సర్వే నెంబర్లలోని 31 ఎకరాల భూమిలో 15 మంది కూలీలతో కడీలు వేయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్కు చెందిన అలీ అక్బర్, అస్రద్లు జీడిగడ్డతాండకు వెళ్లారు. సర్వే నంబర్ 109లో అలీ అక్బర్ భూమి ఉంది. అయితే కమల్ కిశోర్ పల్లాడ్ కడీలు వేయించే భూమిలో కూడా తమ ల్యాండ్ ఉందంటూ అలీ అక్బర్ వర్గం గొడవకు దిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం పెరిగింది. (చదవండి: వివాదం ఉందంటే అక్కడ వీరి కన్ను పడుద్ది!) ఈ నేపథ్యంలో అలీ అక్బర్ జహీరాబాద్కు చెందిన లాయక్ అనే రౌడీ షీటర్కు ఫోన్ చేసి పిలిపించాడు. స్కార్పియో వాహనంలో ఆయుధాలతో జీడిగడ్డతాండకు చేరుకున్న లాయక్.. కర్రలు, కత్తులతో కమల్ కిశోర్ వర్గంపై దాడి చేశాడు. తుపాకీతో గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. భయభ్రాంతులకు గురైన ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఒక్కరికి గాయాలు అయ్యాయి. ఇక కమల్ కిశోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. అలీఅక్బర్, అస్రద్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక రౌడీ షీటర్ లాయక్ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. లాయక్పై జహీరాబాద్ రూరల్ పీఎస్లో రౌడీషీట్ తెరిచారు. ఇక 2018లో జరిగిన ఓ హత్యకు సంబంధించి లాయక్పై కేసు నమోదు అయ్యిందని పోలీసులు తెలిపారు. అంతేకాక కమల్ కిషోర్, అక్బర్ అలీ మధ్య దాదాపు పదేళ్లుగా ఈ భూ వివాదం కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
భూవివాదం: ఇద్దరిపై కత్తిపోట్లు
భూవివాదం ఇద్దరి ప్రాణం మీదకు తెచ్చింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా ఇప్పుడు ఎక్కువ ధర రావడంతో విక్రయదారురాలు వేరొకరికి అమ్మకానికి చూపడంతో వివాదం మొదలైంది. చివరకు కత్తితో పొడిచి ప్రాణాపాయానికి తెచ్చేంత పరిస్థితి నెలకొంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. భోగాపురం: పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన అరుణ, విజయనగరం కాణిపాక గ్రామానికి చెందిన పతివాడ ప్రవీణ్కుమార్పై కోనాడకు చెందిన బసవ ఉపేంద్ర కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకోవడంతో సంచలనం రేగింది. దీనికి సంబంధించి భోగాపురం సీఐ శ్రీధర్ తెలిపిన వివరాలు.. కోనాడ గ్రామానికి చెందిన రామగురువులు అనే మహిళ తనకున్న 1.90 ఎకరాల భూమిని వారి బంధువులైన బసవ అచ్చిబాబుకు గతంలో విక్రయించేందుకు సిద్ధపడి వారి నుంచి కొంత మొత్తం నగదు తీసుకుంది. ఇటీవల కాలంలో ఆ భూముల ధరలకు రెక్కలు రావడంతో డబ్బులకు ఆశపడి రామగురువులు అదే భూమిని అచ్చిబాబుకు తెలియకుండా విజయవాడలో ఉంటున్న శ్రీనివాసరెడ్డికి అమ్మేందుకు తన కూతురు అరుణతో కలిసి రామగురువులు శుక్రవారం భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న అచ్చిబాబు తన కుమారులు ఉపేంద్ర, వెంకటేష్, కె.అప్పలరెడ్డితో కలిసి భోగాపురం రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. రామగురువులును ప్రశ్నించాడు. గతంలో ఈ భూమిని తనకు విక్రయించేందుకు అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు తనకు తెలియకుండా వేరొకరికి ఎలా విక్రయిస్తావని ఇది ఎంత వరకు సమంజసమని అచ్చిబాబు రామగురువులును నిలదీశాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో అచ్చిబాబుతో వచ్చిన కుమారుల్లో ఒకరైన బసవ ఉపేంద్ర కొపోద్రిక్తుడై తమ్ముడు వెంకటేష్, స్నేహితుడు అప్పలరెడ్డితో కలిసి రామగురువులు కుమార్తె అరుణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇంతలో కొనుగోలుదారులు తరఫున వచ్చిన కాణిపాకకు చెందిన ప్రవీణ్కుమార్ ఈ సంఘటనను తన సెల్ఫోన్లో చిత్రీకరించడంతో గమనించి ఉపేంద్ర ఆయనపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో చేరుకున్నాడు. అప్పటికే రక్తం మడుగులో ఉన్న అరుణ, ప్రవీణ్కుమార్ను వెంటనే విజయనగరంలోని తిరుమల ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఉపేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీధర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సంఘటన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జనం మధ్య జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనన్న భయాందోళనకు గురయ్యారు. -
హైదరాబాద్: బంజారాహిల్స్లో కిడ్నాప్ కలకలం
-
సినీ ఫక్కీలో డిస్ట్రిబ్యూటర్ కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: సినిమా పంపిణీదారుడు శివ గణేష్పై కడప జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి దౌర్జన్యం చేశాడు. శివ గణేష్ని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి భూ దస్త్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. తుపాకులు, కత్తులతో తన అనుచరులతో కలిసి హల్చల్ చేశాడు. ఈ ఘటన నగరం నడిబొడ్డున బంజారాహిల్స్లో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుని ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కొండారెడ్డి, అతని గ్యాంగ్లోని 10 మందిపై కేసు నమోదు చేశారు. తుపాకులు, కత్తులు చూపించి కొండారెడ్డి తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడని శివ గణేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. శామీర్పేట, కడప జిల్లాకు చెందిన భూమికి సంబంధించిన పత్రాలపై కొండారెడ్డి గ్యాంగ్ బలవంతంగా సంతకాలు చేయించుకుందని తెలిపాడు. నాలుగు టీమ్ల ఏర్పాటు శివ గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారుంటూ కొండారెడ్డితో పాటు మరో పదిమందిపై శివగణేష్ ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. తుపాకులతో బెదిరించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు మొత్తం నాలుగు టీమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, బాధితుడు శివగణేష్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయనున్నారు. -
భూ వివాదం: ఎస్ఐపై జెడ్పీటీసీ ఫిర్యాదు
సాక్షి, మునుగోడు/రామగిరి(నల్లగొండ): మునుగోడు ఎస్ఐ మండలంలోని భూ వివాదాలతో పాటు ఇసుక అక్రమ రవాణాదారులకు అండగా నిలుస్తున్నాడని ఆరోపిస్తూ స్థానిక జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణిరవి ఆదివారం ట్విట్టర్లో డీజీపీతో పాటు మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, నల్లగొండ ఎస్పీ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. భూవివాదాల్లో అనేక మందిని ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ఒకే వర్గం వ్యక్తులకు పూ ర్తి మద్దతు పలుకుతూ బాధితులను రోజుల తరబడి స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నాడని ఆరో పించారు. ఎస్ఐ చేస్తున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అధి కారులు తగిన విచారణ జరిపి చర్యలు తీసుకో వాలని కోరారు. స్పందించిన జిల్లా ఎస్పీ రంగనాథ్ త్వరలో విచారణ జరిపిస్తానని మెసేజ్ ద్వారా హామీ ఇచ్చినట్లు జెడ్పీటీసీ తెలిపారు. అదృశ్యమైన మహిళ మృతి మిర్యాలగూడ: రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మృతిచెందింది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. టూ టౌన్ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వాసవీనగర్కు చెందిన కామెల్లి సుధీర్కుమార్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు పట్టణానికి చెందిన అనూష(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. కొంత కాలంగా కుటుంబంలో కలహాలు చోటు చేసుకోవడంతో రెండు రోజుల క్రితం అనూష ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త సుధీర్కుమార్ టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బోటిక్పార్క్ పెద్ద చెరువు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం అనూషదిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి అనూష తల్లికి సమచారం అందించారు. మధ్యాహ్నం మిర్యాలగూడకు చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా, క్షణికావేశంలో కుటుంబ కలహాలతోనే అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ట్రిబ్యునల్కు భూ పంచాయితీలు
ఎస్.శ్రీనివాస్ అనే వ్యక్తి సిరిసిల్ల నివాసి. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెలో 1.24 ఎకరాలు ఉందని, రెవెన్యూ అధికారులు తనకు తెలియకుండానే మరొకరి పేరిట పట్టాచేశారని ఫిర్యాదు చేశాడు. ఆర్డీవో కోర్టులో ఏడాదికి పైగా కేసు నడుస్తోంది. ఇరువర్గాల వాదనలు ఆర్డీవో విన్నారు. హియరింగ్ ముగిసింది. తీర్పు వస్తుందనే దశలో కరోనా లాక్డౌన్ వచ్చింది. కేసు వాయిదా పడింది. లాక్డౌన్ అనంతరం భూ వివాదం పరిష్కారం అవుతుందని ఇరువర్గాలు భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శ్రీనివాస్ కేసు ఆర్డీవో కోర్టులో అలాగే ఉంది. ఇలాంటి కేసులు జిల్లాలో దాదాపు 736వరకు ఉన్నాయి. వీటిల్లో జేసీకోర్టులో ఇటీవలే తీర్పులు వచ్చి హైకోర్టుకు వెళ్లిన కేసులు 20వరకు ఉన్నాయి. హియరింగ్లో 56 కేసులు ఉన్నాయి. ముస్తాబాద్(సిరిసిల్ల): ఏళ్లుగా కొనసాగుతున్న భూ పంచాయితీల సత్వర పరిష్కారానికి తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. రెవెన్యూకోర్టులో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తోంది. భూముల ధరలు పెరగడం, భూ పంచాయితీ సమస్యలతో దాడులు, హత్యలు వంటి ఘటనలు జరగకుండా ట్రిబ్యునల్ దోహదపడేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల కోర్టుల్లో 736కేసులు ఉన్నాయి. ఇవి సంవత్సరాలుగా హియరింగ్ జరగడం, వాయిదాల దశలో ఉన్నాయి. కొన్ని తుదితీర్పు దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకురావడం, అందులో భాగంగా భూ పంచాయితీలకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారు. అధికారులకు తప్పనున్న పనిభారం ప్రోటోకాల్ అమలు, రెవెన్యూ సంబంధ పనులు, ఇతర బాధ్యతలతో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లు(ప్రస్తుత అడిషనల్ కలెక్టర్లు) బీజీగా ఉంటారు. భూ సేకరణ, మంత్రులు, అధికారుల పర్యటనలు, సమావేశాలతో ఒత్తిళ్లమధ్య విధులు నిర్వహిస్తుంటారు. దీంతో భూ సమస్యల పరిష్కారానికి వారికి సరైన సమయం, విచారణ చేసే అవకాశాలు తక్కువ. ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం లభిస్తుందని కక్షిదారులు ఆశిస్తున్నారు. రిటైర్డుజడ్జి ద్వారా ట్రిబ్యునల్ జిల్లాలో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను ట్రిబ్యునల్కు బదలాయింపు చేస్తారు. నూతన రెవెన్యూ చట్టం ప్రకారం రిటైర్డు జడ్జిని నియమించి కేసుల పరిష్కారానికి కృషి చేయనున్నారు. ప్రతి వెయ్యి భూ పంచాయితీలకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది. ఈ లెక్కన జిల్లాలో ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఫిర్యాదులు లేని భూ వివాదాలు జిల్లాలో ఫిర్యాదులు లేని భూ సమస్యలు చాలానే ఉన్నాయి. అన్నదమ్ముల భూ పంపిణీ వివాదాలు, సరిహద్దు పంచాయితీలు, ఒకరి పేరిటా ఉన్న భూమిని మరొకరి పేరుతో పట్టా చేయడం, ఆన్లైన్లో తప్పులు, రికార్డుల్లో తక్కువ భూమి నమోదు, సర్వే నంబర్లలో తప్పులు, 1బీ రికార్డుల్లో పేరు మార్పిడి, మ్యూటేషన్లు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో కొన్ని రెవెన్యూ కోర్టుల వరకు వెళ్తే.. ఊర్లో పెద్ద మనుషుల ద్వారా మరిన్ని పంచాయితీలు నడిచేవి ఉన్నాయి. వీటన్నింటికి ట్రిబ్యునల్ పరిష్కారం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
బయటపడుతున్న రెవెన్యూ లీలలు!
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): రెవెన్యూ శాఖలోని కొందరు వీఆర్వోలు అక్రమాలకు పాల్పడ్డారు. బడాబాబుల వద్ద డబ్బులు తీసుకుని చిన్న, సన్నకారు రైతుల భూములను మరొకరికి పట్టా చేసి ఇచ్చారు. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో తమకు గతంలో జరిగిన అన్యాయాన్ని బాధితులు ఇప్పుడు వెల్లబోసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకపోవడంతో ఇతరులకు పట్టా చేసి ఇచ్చిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన చిట్యాల నర్సుబాయి అనే వృద్ధురాలికి 921 సర్వే నంబర్లో 21 గుంటల భూమి ఉంది. ఈ భూమిని నర్సుబాయి కుటుంబ సభ్యులు చాలా ఏళ్ల కిందనే కొనుగోలు చేశారు. అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కాగా తెలంగాణ ప్రభుత్వం సాదా బైనామాలపై ఉన్న భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని నిర్ణయించగా తమ గ్రామ వీఆర్వోకు వినతి పత్రం సమర్పించింది. సాదా బైనామాపై ఉన్న భూమిని పట్టా మార్పిడి చేయడానికి ఈ గ్రామ వీఆర్వో లంచం అడగగా నర్సుబాయి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. అంతే నర్సుబాయికి సంబంధించిన భూమిని మరో మోతుబరి రైతు పేరిట పట్టా మార్పిడి చేశారు. సాదాబైనామాలకు సంబంధించిన కాగితాలు నర్సుబాయి వద్ద ఉండగా పట్టా మార్పిడి ఆమె పేరిట కాకుండా ఎలాంటి కాగితాలు లేని వ్యక్తి పేరిట పట్టా చేశారు. ఇదే తొర్తి గ్రామానికి చెందిన కుండ మధు 781 సర్వే నంబర్లో 24 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఇతను 2007లో ఆర్వోఆర్లో దరఖాస్తు చేసుకుని తన పేరిట పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ సైతం తీసుకున్నాడు. ఈ భూ మిని మధు సాగు చేస్తున్నాడు. కానీ భూ ప్రక్షాళనలో భాగంగా మధుకు డి జిటల్ పాసు పుస్తకం రావాల్సి ఉంది. అప్పటికే మధుకు సంబంధించిన భూమి మరో బడా రైతు పేరిట పట్టా చేయబడింది. ఆర్వోఆర్కు సంబంధించిన ప్రొసీడింగ్తో పాటు ఉమ్మడి రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నా రికార్డులలో మాత్రం మధు పేరుకు బదులు మరోకరి పేరు ఉంది. ఇలా నర్సుబాయి, మధులకు భూమి ఉన్నా రెవెన్యూ రికార్డులలో అక్రమాలు చోటు చేసుకోవడంతో రైతుబంధుకు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందలేక పోయారు. తమ భూమికి సంబంధించిన రికార్డులను సరి చేసి తమకు పట్టా పాసు పుస్తకం జారీ చేయాలని వీఆర్వో, ఇతర అధికారులకు విన్నవించగా ఏదో ఒక సాకు చెబుతూ పట్టా సర్టిఫికెట్లను జారీ చేయలేదు. కాగా రికార్డులను సరిచేస్తామని వీఆర్వో నమ్మించడంతో బాధితులు ఎక్కడ కూడా తమ బాధ చెప్పుకోలేదు. చివరకు వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడంతో పట్టాల మార్పిడిలో చోటు చేసుకున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఒక నర్సుబాయి, కుండ మధులకు సంబంధించిన సమస్యనే కాదు. ఎంతో మంది చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన సమస్య. చిన్న సన్నకారు రైతుల భూములను డబ్బులు ఇచ్చిన వారి పేరిట పట్టా మార్పిడి చేసిన అవినీతి వీఆర్వోల బాగోతం ఇది. కబ్జా కాలమ్ రద్దుతో అసలు సమస్య కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం పహణీలలో కబ్జా కాలమ్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కబ్జా కాలం రద్దు కావడంతో పట్టా పాసు పుస్తకాలు రాని భూముల యజమానుల పరిస్థితి అగమ్యగోచరం కానుంది. తొర్తికి చెందిన చిట్యాల నర్సుబాయి, కుండ మధులు ఇది వరకు కబ్జా కాలంలో ఉండగా కబ్జా కాలం రద్దయితే యాజమాన్య హక్కులను పూర్తిగా కోల్పోతారు. సమగ్ర దర్యాప్తు జరిపితేనే.. తొర్తితో పాటు పలు గ్రామాల్లో చోటు చేసుకున్న అక్రమాలు వెలుగులోకి వచ్చి బాధితులకు న్యాయం జరగాలంటే భూ రికార్డులపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాదా బైనామాలపై ఉన్న భూముల పట్టాల మార్పిడికి చిన్న, సన్నకారు రైతులు వీఆర్వోలు అడిగినంత ఇచ్చుకోకపోవడంతో భూముల యజమానులు మారిపోయారు. వీఆర్వోలు గ్రామాలలో తిష్టవేసి ఉన్నంత కాలం పట్టాల మార్పిడికి సంబంధించి వారు ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకున్నారు. వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడంతో తమకు గతంలో జరిగిన అన్యాయాన్ని బాధితులు ఇప్పుడు వెల్లబోసుకుంటున్నారు. అసైన్డ్ భూములది అదే పరిస్థితి.. అసైన్డ్ భూములను గతంలో పొందిన కొందరు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో భూములను విక్రయించుకున్నారు. ఈ భూములకు సంబంధించి పట్టాల మార్పిడికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అసైన్డ్ భూముల పట్టాల మార్పిడిని రిజిస్ట్రేషన్ పద్ధతిలో కాకుండా సాదాబైనామాలపై మార్పిడి చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో ఒక్కో ఎకరం భూమి పట్టా మార్పిడికి రూ. 25వేల వరకు కింది స్థాయి ఉద్యోగులు వసూలు చేశారు. కొందరు డబ్బులు ఇవ్వకపోవడంతో సాదాబైనామా దరఖాస్తులను వీఆర్వోలు పక్కన పడేశారు. ప్రతి రెవెన్యూ కార్యాలయంలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు పడి ఉన్నాయి. అవినీతి వీఆర్వోలపైనే చర్యలు తీసుకువాలి అధికారం తమ చేతిలో ఉందనే ధీమాతో కొందరు వీఆర్వోలు తమ పరిధిలోని గ్రామాల్లో అడ్డగోలుగా దోచుకున్నారు. అక్రమంగా ఎన్నో రకాల ఆస్తులను కొందరు అవినీతి వీఆర్వోలు సంపాదించుకున్నారు. ప్రభుత్వం విచారణ చేపట్టి ఇలాంటి వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
భూ నిర్ణయాలు వద్దు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల ఏడో తేదీ నుంచే ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. రెవెన్యూ వివాదాలపై నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కొత్తగా భూమి హక్కులు, పట్టదారు పాసుపుస్తకాలు చట్టం–2020 మనుగడలోకి వస్తున్న తరుణంలో భూ వివాదాలు, ఇతరత్రా వ్యవహారాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో రాజధాని శివారు జిల్లాలోని ఓ అధికారి పాత తేదీతో ఉత్తర్వులు ఇవ్వడం..దీనిపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త చట్టంలో రెవెన్యూ వ్యవహారాల్లో అధికారుల పాత్రను పరిమితం చేయడంతో పాటు రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. దీంతో ఇప్పటివరకు తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ల కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల విచారణ బాధ్యతలను త్వరలో ఏర్పాటు చేయబోయే ఫాస్ట్ట్రాక్ ట్రిబ్యునళ్లకు బదలాయించనున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ కేసులు, ఇతర భూ వివాదాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సీసీఎల్ఏ స్పష్టం చేశారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. నాయబ్ తహసీల్దార్లకు ప్రోటోకాల్ విధులు తహసీల్దార్లకు ప్రోటోకాల్ విధుల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రముఖుల పర్యటనలను దగ్గరుండి చూసుకునే తహసీల్దార్లు ఇకపై కేవ లం రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు, ప్రభుత్వ భూ ముల పరిరక్షణకే పరిమితం కానున్నారు. ఇక పై ప్రోటోకాల్ బాధ్యతలను నయాబ్ తహసీల్దార్లు(డిప్యూటీ తహసీల్దార్లు) చూసుకోనున్నారు. ఇదిలావుండగా, వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కాపాడే విధులను వీఆర్ఏలకు కట్టబెడతారు. అయితే ప్రస్తుతం ఉన్నట్లుగాకుండా ఒకరినే ఈ సేవలకు వాడుకొని మిగతావారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. రిజిస్ట్రేషన్లపై వారం రోజుల్లో స్పష్టత రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా తహసీల్దార్ల అధికారాలకు కత్తెర పెట్టిన సర్కారు కేవలం సాగు భూముల రిజిస్ట్రేషన్లకే పరిమితం చేసింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్లే చేస్తారు. అయితే, ఎప్పటి నుంచి ఈ విధానం అమలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
భూ వివాదాల పరిష్కారానికి కాలపరిమితి!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. వివాద, అవినీతి రహిత పాలన అందించేలా ఈ వ్యవస్థను మలచాలని భావిస్తున్న సర్కారు.. భూ వివాదాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. అక్రమాలు, అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న రెవెన్యూ శాఖను సంస్కరించాలని సీఎం కేసీఆర్ పట్టు్టదలగా ఉన్నారు. కేశంపేట, కీసర, షేక్పేట తదితర తహసీల్దార్ల అవినీతి లీలలు, కొన్నాళ్ల కిందట అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సజీవ దహనం çఘటన తో అవాక్కయిన ప్రభుత్వం.. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. 20 కీలక నియమాలతో.. ప్రస్తుతం మనుగడలో ఉన్న 144 చట్టాలు/నియమాల్లో కాలం చెల్లినవాటికి మంగళం పాడి.. కేవలం 20 చట్టాలను క్రోడీకరిస్తూ కొత్త చట్టం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శివశంకర్, బలరామయ్య, రంగారెడ్డి జిల్లా మాజీ జేసీ సుందర్ అబ్నార్ తదితర రెవెన్యూ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ వారం రోజులుగా కొత్త చట్టం తయారీపై సంప్రదింపులు జరుపుతోంది. ఉద్యోగుల సర్దుబాటు, హోదాల మార్పులు, చేర్పులు తదితర అంశాలపై చర్చిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. రెవెన్యూ వివాదాల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితిని నయా చట్టంలో చేర్చనున్నారు. తహసీల్దార్ స్థాయిలో 45 రోజుల్లో పరిష్కారం కాని అర్జీని నేరుగా కలెక్టర్కు పంపాలని, అక్కడా పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్కు నివేదించాలని, అది ఇచ్చే తీర్పు సంతృప్తికరంగా లేదని భావిస్తే.. రెవెన్యూ కోర్టుకు అప్పీల్ చేసుకునేలా కొత్త విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. దరఖాస్తు పురోగతి వివరాలు భూ వివాదాలు సకాలంలో పరిష్కరించేందుకు కొత్త విధానం దోహదపడుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే సమస్యల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. దరఖాస్తుదారు అర్జీ దాఖలు చేసింది మొదలు... దాని పురోగతి (స్టేటస్) ఎలా ఉంది? ఏ అధికారి వద్ద పెండింగ్లో ఉందనే సమాచారాన్ని కూడా ఆన్లైన్లోనే చూసుకునేలా ఏర్పాట్లు చేయనుంది. -
వివాదం ఉందంటే అక్కడ వీరి కన్ను పడుద్ది!
సాక్షి, హైదరాబాద్: ముందు ఆర్టీఐకి దరఖాస్తు చేస్తారు.. తర్వాత వివాదాస్పద భూములపై కన్నేస్తారు.. ఆ తర్వాత వెంచర్ వేస్తారు.. ఇదీ భూబకాసురుల భూమంతర్.. అయితే, దీని వెనుక ఓ గ్రేటర్ ఎంపీ ఉన్నాడా? అంటే.. ఉన్నాడనే అనుమానాలకు కొన్ని ఆధారాలు ఏసీబీ అధికారులకు చిక్కాయి. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎంపీ.. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల్లోనే అత్యంత చురుకైన నేతగా ఆయనకు పేరుంది. ఆయన సమాచార హక్కు చట్టం కింద వివాదాస్పద భూముల వివరాలు అడగడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కీసర తహసీల్దార్ నాగరాజు వ్యవహారంలో సహనిందితుడు రియల్టర్ అంజిరెడ్డి వద్ద నుంచి అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో గ్రేటర్కు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన పత్రాలు లభ్యమవడం, అవి కూడా ఆయన లెటర్ హెడ్తో ఉండటం ఏసీబీ అధికారులను ఆశ్చర్యపోయేలా చేసింది. (చదవండి: 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) అధికారుల మచ్చిక.. భూముల స్వాధీనం విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రియల్టర్ అంజిరెడ్డి సదరు ఎంపీకి అనుచరుడు. వివాదాస్పద భూముల విషయంలో వీరు పథకం ప్రకారం వెళతారు. ముందు వీరందరు కలిసి నగర శివారులోని వివాదాస్పద భూముల వివరాలు తెలపాలంటూ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేస్తారు. అదే తహసీల్దార్ ఆఫీసులో ఉన్న తహసీల్దార్ నుంచి కిందిస్థాయి అధికారులకు లక్షల రూపాయలు లంచాలిచ్చి తమవైపునకు తిప్పుకుంటారు. తరువాత ఆ భూములను తమ పేరుపై బదలాయించుకుని, అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తారు. ఒక్కో దరఖాస్తులో పదుల సంఖ్యలో సర్వే నంబర్లు వేసి ఉండటంతో కొన్నేళ్లుగా నగరం చుట్టూ ఉన్న వందల ఎకరాలపై వీరు కన్నేసినట్లు స్పష్టమవుతోంది. వివరాలు కోరిన భూములు ఉన్నాయా? గతేడాది నుంచి గ్రేటర్ పరిధిలోని దుండిగల్, కండ్లకోయ, గుండ్లపోచంపల్లి, శామీర్పేట, కీసర, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో వీరు వివాదాస్పద, లిటిగేషన్ భూములకు సంబంధించి ఆర్టీఐకి అనేక దరఖాస్తులు చేసినట్లు సమాచారం. ఇవన్నీ వందల ఎకరాల్లో ఉంటాయని తెలిసింది. వీటి విలువ రూ.వందల కోట్లపైమాటే. వీరు దరఖాస్తు చేసిన భూములు ఇప్పుడు అలాగే ఉన్నాయా? లేక, అవి కూడా అన్యాక్రాంతమయ్యాయా? ఎవరి పేరు మీదనైనా రిజిస్ట్రేషన్ అయ్యాయా? ఇందుకు ఏయే మండలాల రెవెన్యూ అధికారులు సహకరించారు? తదితర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయాలపై త్వరలోనే ఏసీబీ అధికారులు ఆరా తీయనున్నారు. ఒకవేళ అందులో అక్రమాలున్నట్లు తేలితే.. ఈ వ్యవహారం ఆ ఎంపీ మెడకు చుట్టుకోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. (కీసర ఇంచార్జ్ తహశీల్దార్గా గౌతమ్ కుమార్) -
మహిళపై కత్తులతో దాడి, పరిస్థితి విషమం!
-
మహిళపై కత్తులతో దాడి, పరిస్థితి విషమం!
సాక్షి, చిత్తూరు: ఆస్తి తగాదాల విషయంలో ఓ మహిళపై సమీప బంధువులు విచక్షణారహితంగా దాడి చేశారు. చిత్తూరు జిల్లా కెవి పల్లె మండలం పాపిరెడ్డిగారి పల్లెలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్థులైన సమీప బంధువులు కత్తులతో తెగబడటంతో తులసి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తులసి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తులసిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని తులసి భర్త అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ‘నన్ను నా భార్యను చంపడానికి పథకం ప్రకారం దాడి చేశారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (రిటైర్డ్ ఐఏఎస్ పేరుతో డబ్బులు వసూలు, అరెస్ట్) -
సూర్యాపేట జిల్లా నాగారం ఎస్ఐ దాష్టీకం...
సాక్షి, సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకు వచ్చామని పదేపదే చెబుతున్నా అదంతా మాటలకే పరిమతమన్నట్టు కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినవారిపైనే దాడులు చేస్తూ పోలీసు వ్యవస్థను అభాసుపాలు చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి, ఆర్థిక, అంగబలం ఉన్న వారి మాటే పోలీస్ స్టేషన్లో చెల్లుబాటవుతుందని సూర్యాపేట జిల్లాలోని నాగారాం ఎస్ఐ నిరూపించారు. సివిల్ కేసులో తలదూర్చడమే కాకుండా, న్యాయం చేయాలంటూ ఆశ్రయించిన రైతులపైనే ఎస్ఐ లింగం దౌర్జన్యం చేశారు. వారిని లాఠీతో చితకబాదడమే కాకుండా చెప్పినట్టు వినకుంటే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. ప్రాణభయంతో సదరు రైతులు జిల్లా ఎస్పీ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. రైతులపై దాష్టీకానికి దిగిన ఎస్ఐ లింగంపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఆయన తీరు మార్చుకోక పోవడంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నా కూడా ఆయన తీరు మాత్రం ఏ మాత్రం మారలేదు. (ప్రేమ పెళ్లి: టెకీ అనునామానాస్పద మృతి) -
కన్నతల్లిని నరికి చంపిన కొడుకు
టి.నరసాపురం: భూ వివాదాల నేపథ్యంలో కన్నతల్లిని పాశవికంగా కన్నకొడుకే హతమార్చిన ఘటన మండలంలోని శ్రీరామవరం గ్రామంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో పేరుబోయిన సరోజిని (55) మృతిచెందింది. ఈమె కొడుకు శ్రీను తల్లిని అత్యంత కర్కశంగా నరకడంతో మొండెం, తల వేరయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టి.నరసాపురం మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన పేరుబోయిన సరోజిని భర్త నాగరాజు 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. ఈమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడు, కుమార్తె వివాహాలు అయ్యాయి. తల్లి చిన్న కుమారుడితో కలిసి ఉంటోంది. తనకున్న 5 ఎకరాల భూమిని ఎకరంన్నర చొప్పున పంచిపెట్టింది. దీంతో పెద్ద కుమారుడు శ్రీను తన వాటాగా వచ్చిన భూమిలో నిమ్మతోట వేశాడు. అనంతరం నిమ్మతోటను కౌలుకు ఇచ్చాడు. కుటుంబంలో రూ.3 లక్షల వరకు బాకీ ఉందని, వాటిని తీర్చాలని తల్లి ముగ్గురిని కోరింది. బోరు వేసేందుకు అప్పు చేశామని, బాకీ తీరే వరకు నిమ్మకాయలు కోయడం కుదరదని తల్లి సరోజిని కౌలు రైతుకు చెప్పడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం కౌలు రైతు నిమ్మకాయలు కోస్తుండగా సరోజిని అడ్డుకుంది. దీంతో తోటలో ఉన్న తల్లి సరోజినిని కత్తితో నరికి చంపాడు. సరోజిని శరీరం నుంచి తల వేరై అక్కడే పడిపోయింది. హత్య చేసిన వెంటనే నిందితుడు గ్రామంలోకి వెళ్లి స్వయంగా గ్రామస్తులకు హత్య విషయం చెప్పాడు. ఈ విషయంపై వీఆర్వో రాంబాబు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని జంగారెడ్డిగూడెం సీఐ బీఎన్ నాయక్, ఎస్సై కె.రామకృష్ణలు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సెల్ టవర్పై యువకుడు హల్చల్
సాక్షి, సూర్యాపేట : భూ వివాదంలో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఓ యువకుడు హల్చల్ చేశాడు. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని నర్సింహపురం గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. తనకు సంబంధంలేని భూ వివాదంలో తనపై అక్రమ కేసు నమోదు చేశారని నిరసనకు దిగాడు. మునగాల పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని సెల్ టవర్పై నుంచి హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. -
సూర్యాపేట: సెల్ టవర్పై యువకుడు..
-
అన్నని చంపిన తమ్ముడు
శివ్వంపేట(నర్సాపూర్) : పొలం వద్ద చోటుచేసుకున్న ఘటనలో అన్నపై తమ్ముడు పారతో దాడి చేసిన ఘటనలో చికిత్స పొందుతూ అన్న మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి అల్లీపూర్ గ్రామంలో మంగళి మల్లేశ్ సొంత అన్నను మూడు రోజుల క్రితం పొలం వద్ద పారతో దాడి చేశాడు. తలతో పాటు పలు చోట్ల తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతు మంగళవారం మృతిచెందాడు. అకారణంగా అన్నపై దాడి చేసి మరణానికి కారణామైన మల్లేశ్పై బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తు మంగళవారం రాత్రి మల్లేశ్ ఇళ్లు కూల్చి వేశారు. గొవడ జరిగిన అనంతరం పోలీస్ స్టేషన్లో తెలిపినప్పటికీ ఎస్ఐ రమేశ్ స్పందించలేదని అతడిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు అంత్యక్రియలు జరగనివ్వమని ఆందోళనకు దిగారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మల్లేశ్ని గ్రామానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్, డివిజన్ పరిధిలో తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ సీఐలు స్వామిగౌడ్, నాగార్జున గౌడ్, నాగయ్యలతో పాటు ఎస్ఐలు సిబ్బంది భారీగా గ్రామానికి మోహరించారు. అన్ని విధాలుగా ఆదుకుంటాం బాధిత రాములు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని డీఎస్పీ కిరణ్ కుమార్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోని బాధిత కుటుంబానికి మల్లేశంకు సంబంధించిన 30 గుంటల భూమి ఇప్పించే విధంగా ఒప్పందం చేశారు. అనంతరం సాయత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఇళ్లు కూల్చివేసిన వారిపై అలాగే పోలీసుల విధులకు ఆటంకం ఏర్పరిచిన వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు సీఐ స్వామి గౌడ్ తెలిపారు. -
టీడీపీ నేత వేధింపులు.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
బాపట్ల: స్థల వ్యవహారంలో గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వేగేశన నరేంద్రవర్మరాజు మాజీ డ్రైవర్ కె.వీరేశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడు వీరేశ్ కథనం ప్రకారం... వేగేశన వద్ద కారు డ్రైవర్గా పనిచేసినప్పుడు ఐదు సెంట్ల స్థలాన్ని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. నరేంద్రవర్మ దగ్గర పని మానే సమయంలో తిరిగి భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బాధితుడు కోరాడు. ఆ స్థలం తన పేరుతో ఉండటం వల్ల తాను ప్రభుత్వం ఇచ్చే స్థలానికి అనర్హుడిని అవుతానని, ఆ స్థలాన్ని తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాడు. అయితే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వేగేశనను ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు కాదంటూ కాలం వెళ్లబుచ్చారని తెలిపారు. ఈక్రమంలోనే వీరేశ్ పేరిట భూమి ఉండటంతో ప్రభుత్వం అందించే నివాస స్థలం అతనికి అందలేదు. అయితే ఇటీవల వేగేశన అనుచరులు గోపి, చటర్జీ ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారని, దీంతో ఆందోళనకు గురై నిద్రమాత్రలు మింగినట్లు వీరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
టీడీపీ నేత వేధింపులు.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
-
సినిమా షూటింగ్లా చూస్తున్నారే గానీ..
గోపాల్పేట(వనపర్తి): సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. కళ్ల ముందు ఓ మనిషిని (అందులోనూమహిళ) కత్తితో విచక్షణారహితంగా దాడి చేస్తున్నా సినిమా షూటింగ్లా చూస్తున్నారే గానీ వారించేవారు కరువయ్యారు. జిల్లాలోని గోపాల్పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన అర్జున్రావు అదే గ్రామానికి చెందిన అనంతరావు భార్య రత్నమ్మ(60)పై మటన్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలైన రత్నమ్మను వనపర్తి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బుద్దారానికి చెందిన అర్జున్రావుకు 375, 376 సర్వే నంబర్లలో 2.28గుంటల భూమి ఉండేది. ఈ భూమిని 2010లో అనంతరావు మధ్యవర్తిగా ఉండి దాయాది కుటుంబసభ్యులకు అమ్మించాడు. 2018లో 2.28 ఎకరాల అమ్మిన భూమి సమీపంలోని 405, 406 సర్వే నంబర్లలోని 13గుంటలు, 15గుంటల భూమిని వేరొకరి పేరుమీద పట్టా చేయించాడని అర్జున్రావు ఆరోపిస్తూ గ్రామ పెద్దల వద్ద ఇటీవల పంచాయితీకి పెట్టాడు. ‘నీ పొలం అమ్మినట్లయితే నా పొలంలో 28గుంటలు తీసుకో’ అని అనంతరావు గ్రామస్తుల సమక్షంలో కాగితంపై రాసిచ్చాడు. అప్పటినుంచి తనకు రాసిచ్చిన ప్రకారం భూమిని ఇవ్వాలని వాదనలు జరిగాయి. ఈ విషయంపై ఐదురోజుల కిందట గోపాల్పేట పోలీస్స్టేషన్లో అర్జున్రావు ఫిర్యాదు చేశారు. (మహిళపై కత్తితో పదేపదే దాడి) రెండు కుటుంబాలకు చెందిన వారు కూర్చొని మాట్లాడుకోవాలని ఎస్ఐ రామన్గౌడ్ సూచించారు. ఈ విషయంపై బుధవారం ఉదయం గ్రామంలోని పాలకేంద్రం వద్ద అర్జున్రావు అతని భార్య శేషమ్మ, కొడుకు నరేందర్రావు, అతడి మనువడు ప్రశాంత్రావు కలిసి అనంతరావుతో వాదనలకు దిగాడు. ఇది కాస్త ఘర్షణలకు దారితీసింది. గొడవ పెరగడంతో అర్జున్రావు అనంతరావు తలపై కర్రతో కొట్టాడు. ఈ క్రమంలో అనంతరావు భార్య రత్నమ్మ అడ్డువచ్చింది. అప్పటికే ఆవేశంగా ఉన్న అర్జున్రావు వెంట తీసుకున్న మటన్ కత్తితో రత్నమ్మను విచక్షణారహితంగా నరికాడు. అడ్డుకోబోయిన స్థానికుడు మేకల సహదేవుడుపై కత్తితో దాడి చేయగా ఆయన గాయపడ్డాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు 100డయల్ చేసి సమాచారం చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు రత్నమ్మ భర్త అనంతరావు ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అర్జున్రావు, అతని భార్య శేషమ్మ, కొడుకు నరేందర్రావు, మనువడు ప్రశాంత్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామన్గౌడ్ చెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అపూర్వరావు, డీఎస్పీ కిరణ్కుమార్, సీఐ సూర్యనాయక్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసున్నారు. చూస్తుండి పోయిన జనం బుద్దారంలో ఉదయం బాధితురాలు రత్నమ్మపై అర్జున్రావు కత్తితో దాడి చేస్తుండగా అక్కడ దాదాపు పది నుంచి 15మంది వరకు ఉన్నారు. సహదేవుడు ఒక్కడే ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ మిగిలిన వారు ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. పథకం ప్రకారమే కత్తి, కర్రతో దాడి వనపర్తి క్రైం: బుద్దారం ఘటనపై బుధవారం సాయంత్రం పట్టణ పోలీస్స్టేషన్లో డీఎస్పీ కిరణ్కుమార్ వివరాలు వెల్లడించారు. తమకు తెలియకుండా భూమి విషయంలో మోసం చేశాడని, బంధువులపై కోపం పెంచుకుని పథకం ప్రకారమే అర్జునయ్య తమ బంధువులైన అనంతరావుపై కర్రతో దాడి చేశారు. అడ్డోచ్చిన భార్య రత్నమ్మలపై మటన్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు చెప్పారు. ప్రాణాలతో కోట్టుమిట్టాడుతున్న ఆమెను, గాయపడిన అనంతరావును వనపర్తి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం నిందితులను వారి తోటలో అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో వనపర్తి సిఐ సూర్యనాయక్, వనపర్తి, గోపాల్పేట ఎస్ఐలు వెంకటేష్గౌడ్, రామన్గౌడ్ తదితరులు ఉన్నారు. -
మహిళపై కత్తితో పదేపదే దాడి
సాక్షి, వనపర్తి: రెండు కుటుంబాల మధ్య మూడేళ్లుగా నలుగుతున్న భూవివాదం మారణాయుధాలతో దాడులు చేసుకునేవరకు వెళ్లింది. ఈ ఘటన జిల్లాలోని గోపాల్పేట మండలం బుద్దారంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అర్జున్రావు అనే వ్యక్తి అనంతరావు, రత్నమ్మ దంపతులపై కత్తితో అతి దారుణంగా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని హైదరాబాద్కు తరలించారు. రత్నమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అనంతరావు దంపతులపై అర్జున్రావు దాడి చేస్తున్న సమయంలో చుట్టూ పదుల సంఖ్యలో జనం ఉన్నా ఎవరూ అడ్డుకోకపోవడం శోచనీయం. ఇక అర్జున్రావు రత్నమ్మపై కత్తితో దాడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (పోలీసులమంటూ ప్రేమజంటపై దౌర్జన్యం) -
వీడిన రాంచంద్రారెడ్డి హత్యకేసు మిస్టరీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాంచంద్రారెడ్డి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా రాంచంద్రారెడ్డి సమీప బంధువు ఐనా ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరుడు కిడ్నాప్కు పాల్పడి అనంతరం హత్య చేసినట్లు నిర్థారణ అయింది. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (షాద్నగర్లో రియల్టర్ దారుణ హత్య!) షాద్నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో 9 ఎకరాల 9 గుంటల భూ వివాదమే హత్యకు కారణంగా కాగా, దీని వెనుక ఇంకెవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాంచంద్రారెడ్డి శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయనను షాద్నగర్లో కిడ్నాప్ చేసిన దుండగులు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల వద్ద హతమార్చారు. నిన్న షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాంచంద్రారెడ్డి హత్యపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
షాద్నగర్లో కిడ్నాప్.. కొత్తూరులో హత్య
షాద్నగర్ రూరల్: భూవివాదాల నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఓ వ్యాపారిని శుక్రవారం షాద్నగర్లో కిడ్నాప్ చేసిన దాయాదులు కొత్తూరులో హత్య చేశారు. ఫరూఖ్నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి (55) కొన్నేళ్లుగా జడ్చర్లలో స్థిరపడి అక్కడే పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. సొంత గ్రామంలో వ్యవసాయ పొలం ఉండటంతో అప్పుడప్పుడు అన్నారానికి వచ్చి వెళ్తుండేవాడు. కాగా పొలం విషయంలో రాంచంద్రారెడ్డికి అన్నారంలోని తన దాయాదులతో గతంలో ఘర్షణలు జరిగాయి. దీనిపై షాద్నగర్ పోలీస్స్టేషన్లో కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా భూ విషయంలో మాట్లాడుకుందామని దాయాదులు చెప్పడంతో రాంచంద్రారెడ్డి మధ్యాహ్నం డ్రైవర్ పాషాతో కలసి తన ఇన్నోవా వాహనంలో షాద్నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ వైపు వచ్చాడు. దీంతో భూమి విషయం మాట్లాడేందుకు దాయాదులు ఇన్నోవా కారు ఎక్కి మాట్లాడుతుండగా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో వారు తమ వద్ద ఉన్న కత్తులను చూపించి బెదిరించడంతో డ్రైవర్ పాషా వాహనం దిగి పారిపోయాడు. ఇదే అదునుగా భావించిన వారు రాంచంద్రారెడ్డిని ఆయన వాహనంలోనే కిడ్నాప్ చేసి షాద్నగర్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ వైపునకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న షాద్నగర్ ఏసీపీ సురేందర్ ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సెల్ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా రాంచంద్రారెడ్డి కొత్తూరు మండలంలోని పెంజర్ల శివారులోని ఓ వెంచర్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి కారును పరిశీలించగా కత్తిపోట్లకు గురై కొనఊపిరితో ఉన్న రాంచంద్రారెడ్డిని ప్రైవేటు వాహనంలో షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలోనే రాంచంద్రారెడ్డి మృతి చెందాడు. గతంలో మృతుడు బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్గా బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. కొత్తూరులో సంఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి, ఏసీపీ సురేందర్ పరిశీలించారు. అనంతరం క్లూస్టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. -
షాద్నగర్లో రియల్టర్ దారుణ హత్య!
సాక్షి, హైదరాబాద్: షాద్నగర్కు చెందిన రియల్టర్, కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఆయన ఈ సాయంత్రం కిడ్నాపైనట్టు తొలుత వార్తలొచ్చాయి. భూ వివాదం నేపథ్యంలో ఆయనను కిడ్నాప్ చేసినట్టు, రామచంద్రారెడ్డి డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. షాద్నగర్లోని టీచర్స్ కాలనీలో నివాసముండే రామచంద్రారెడ్డిని ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందు ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి కిడ్నాప్ చేసినట్టు అతను పోలీసులకు తెలిపాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్డారు. అంతలోనే కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో రామచంద్రారెడ్డి హత్యకు గురైనట్టు సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని షాద్నగర్ ఆసుపత్రికి తరలించారు. షాద్నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో చాలా కాలంగా ఓ భూ వివాదం నడుస్తోంది. ఇరువర్గాల గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామచంద్రారెడ్డి జడ్చర్ల సింగిల్ విండో చైర్మన్గా పనిచేశారు. (చదవండి: చైనా వస్తువుల బ్యాన్ తొందరపాటు చర్య: కేసీఆర్) -
ఆ ..భూమి ఎవరికి దక్కేనో..?
త్రిపురారం (నాగార్జునసాగర్) : మండలంలోని అంజనపల్లి గ్రామ శివారు పాల్తీ తండా పరిధి సర్వే నంబర్ 335లో సుమారు 361 ఎకరాల భూమి ఎవరికి దక్కేనో అని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే నంబర్లోని డీఫారెస్ట్ భూమిని గిరిజనులు 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ డీ ఫారెస్ట్ భూములకు అక్కడి ప్రాంత గిరిజనులకు అప్పటి ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ పొంది అంజనపల్లి గ్రా మీణ వికాస్ బ్యాంక్లో వ్యవసాయ రుణాలు సైతం తీసుకున్నారు. పలు దఫాలు ప్రభుత్వం అందించిన రుణమాఫీ పథకం సైతం పొందారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో 335 సర్వే నంబర్లో ఉన్న 361 ఎకరాల భూమి డీ ఫారెస్ట్కు చెందుతుందని అటవీ అధికారులు తేల్చి చెప్పడంతో గిరిజనలు తిరగబడ్డారు. దీంతో వివాదాస్పదం కావడంతో ఈ భూమిని పార్ట్ బీలోకి చేర్చారు. అప్పటి నుంచి గతంలో పట్టా పొంది డీ ఫారెస్ట్లో భూమి కలిగి ఉన్న రైతులకు నూతన పట్టాదారు పుస్తకాలు రాక రైతుబంధు, రైతుబీమా వర్తించకపోవడంతో గిరిజన రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. గిరిజన రైతులకు భూమి వర్తించింది ఇలా.. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం జరగకముందు పెద్దవూర మండలంలోని పర్వేదుల గ్రామ పరిధిలో పాల్తీ తండా ఉంది. అయితే సాగర్ డ్యాం నిర్మాణం చేసినప్పుడు ముంపునకు గురైంది. దీంతో అప్పటి అధికారులు నిబంధనల ప్రకారం పాల్తీ తండాను త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామ శివారులోకి తరలించి శాశ్వత ఇళ్ల స్థలాలు ఇచ్చి ముంపునకు గురైన ప్రతి గిరిజన కుటుంబానికి అక్కడ ఉన్న డీ ఫారెస్ట్ భూముల్లో 5 ఎకరాల చొప్పున కేటా యించి 2 ఎకరాలు మాత్రమే ఇచ్చి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ మంజూరు చేశారు. అప్పటి నుంచి గిరిజనులు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. -
గ్యాంగ్వార్కు స్కెచ్ వేసింది అక్కడే!
ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రమైన మంగళాద్రి... చేనేతకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన పట్టణం... రాను రాను హత్యా రాజకీయాలు, రౌడీ షీటర్లకు నిలయంగా మారిపోతోంది. గడిచిన ఏడేళ్లలో మూడు కిరాయి హత్యలు, వేర్వేరు నేరాలతో పాటు పలుచోట్ల అల్లర్లు సృష్టించడానికి, కోట్ల విలువ చేసే భూముల కబ్జాకు మంగళగిరిలో ఉన్న రౌడీషీటర్లు బ్లేడ్బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని వాడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా నిఘా వర్గాలు పట్టించుకోకపోవటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, తాడేపల్లిరూరల్: తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు ‘ఏ’ గ్రేడ్ రౌడీషీటర్లను, ఆ రౌడీషీటర్లు బ్లేడ్ బ్యాచ్నీ, గంజాయి బ్యాచ్నీ పెంచి పోషిస్తున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన గ్యాంగ్వార్ వెనుక మంగళగిరికి చెందిన ఒక చిట్ఫండ్ ఫైనాన్స్ కంపెనీ వ్యాపారి హస్తం ఉంది. విజయవాడ గ్యాంగ్వార్లో మృతి చెందిన మాజీ రౌడీషీటర్ తోట సందీప్ను చంపితే తమను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని, ఆ భయాన్ని ఆధారం చేసుకుని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సెటిల్మెంట్లు చేయొచ్చన్న ఆలోచనతో మంగళగిరికి చెందిన కిరణ్, ఏవీఎస్, తంబి అనే రౌడీషీటర్లను ఉసిగొల్పి వీరి వద్ద ఉన్న సుమారు పదిమందిని విజయవాడ పంపి ఆ గ్యాంగ్వార్లో పాల్గొనేలా చేశారు. మణికంఠ అలియాస్ పండు మంగళగిరిలో ఐదు రోజుల పాటు ఉండి ఈ గ్యాంగ్వార్కు వ్యూహరచన చేశాడు. ఇదే సమయంలో పండు టిక్టాక్లో ఒక భయంకరమైన వీడియోను అప్లోడ్ చేసి, తాము హత్య చేయబోతున్నామనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఇంత జరుగుతున్నా ఇక్కడ పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యకరం. గతంలో కిరణ్ అన్నయ్య హేమంత్ను వర్గపోరులో భాగంగా అతి దారుణంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రాళ్లతో కొట్టి చంపారు. అదే బాట ఎంచుకున్న కిరణ్ తన ఆధిపత్యాన్ని చూపించుకునేందుకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుని చిన్న ల్యాండ్ సెటిల్మెంట్లో నలభై, యాభై వేల కమీషన్ కోసం ఈ హత్యకు పాల్పడ్డాడు. ఏవీఎస్, మణికంఠ(పండు) తాడేపల్లిలో మకాం వేసిన సందీప్ విజయవాడలో వెలివేసిన చెందిన వెల్లంకి సందీప్ అలియాస్ పెద్దబాండు, అతని అనుచరుడు గుర్రాల కళ్యాణ్ అలియాస్ చిన్నబాండు తాడేపల్లి ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రజలను తమ బ్లేడులతో భయభ్రాంతులకు గురిచేసేవారు. యాభై రూపాయలు ఇవ్వలేదని తాడేపల్లిలో బార్ అండ్ రెస్టారెంట్లో ఒక వ్యక్తిపై బ్లేడ్తో దాడికి పాల్పడ్డారు. క్యారంబోర్డు ఆకర్షణతో... టీడీపీ నాయకుడు, ఫైనాన్షియర్, ప్రస్తుత రౌడీషీటర్ యువకులను సన్మార్గంలో నడపడానికి కారంబోర్డు ఏర్పాటు చేశాడని బయటకు ప్రచారం చేస్తూ లోపల మాత్రం భవిష్యత్తులో తాను చేయబోయే భూకబ్జాలకు, ఫైనాన్షియల్ వసూళ్లకు సిద్ధం చేశాడు. కిరణ్ కూడా సదరు రౌడీషీటర్ ఈ మధ్య కాలంలో జైలుకి వెళ్లే వరకు అతని అడుగుజాడల్లోనే నడుస్తూ కరుడుగట్టిన నేరస్తుడు అయ్యాడు. ప్రేమ వ్యవహారంలో జోక్యం విజయవాడలో పలు కళాశాలల్లో విద్యార్థుల మధ్య జరిగే ముక్కోణపు ప్రేమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని కిరణ్, ఏవీఎస్. తంబి, రవి, వంశీ తదితరులు సెటిల్మెంట్లు చేస్తూ విద్యార్థులను సైతం బెదిరించి వారి వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. విజయవాడ కళాశాలల్లో జరిగిన ఈ ప్రేమ వ్యవహారాలను మణికంఠ కిరణ్ వద్దకు పంపడంతో కిరణ్ రౌడీయిజం గురించి ఆనోటా ఈనోటా బహిర్గతం అయింది. చదవండి: ‘సందీప్, పండూ గతంలో స్నేహితులు’ భూకబ్జాలకు వీరే నాంది తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ నాయకుడు, ఫైనాన్షియర్ చేసిన భూకబ్జాలకు వీరిని కాపలా పెట్టి భూములను ఆక్రమించి సొమ్ము చేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు లేదా కుటుంబసభ్యుల మధ్య ఏర్పడిన వివాదాలను అడ్డం పెట్టుకుని కోటి రూపాయల విలువైన భూమిని కేవలం పాతిక లేదా ముప్ఫై లక్షల రూపాయలు ఇచ్చి భూమిలో ఉన్న రెండో వ్యక్తిని దౌర్జన్యంగా బయటకు పంపించి ఆ భూమిని తన సొంతం చేసుకున్నాడు. సెటిల్మెంట్ అయిన తర్వాత వీరికి పదో పరకో ఇచ్చి సదరు ఫైనాన్షియర్ చేతులు దులుపుకొనేవాడు. వీరి ఆగడాలు ఎక్కువ అవడంతో నిదానంగా తన కార్యాలయం నుంచి బయటకు పంపించి ఏమీ తెలియనట్లు పెద్దమనిషిలా వ్యవహరించడం గమనార్హం. చదవండి: గ్యాంగ్ వార్; వెలుగులోకి కొత్త విషయాలు విజయవాడ నేరస్తులంతా ఇక్కడే 2007లో పోలీసులకు సైతం ఐపీ పెట్టి కాల్వలోకి కారును తోసేసి చనిపోయినట్లు సృష్టించిన ప్రముఖ నేరస్తుడి దగ్గర్నుంచి గంజాయి వంటి మత్తు పదార్థాల కోసం యాచకులను సైతం వదలకుండా దాడులకు పాల్పడే బ్లేడ్ బ్యాచ్, రౌడీషీటర్లు మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతంలో నేరస్తులను కూడగట్టి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి శివారు ప్రాంతాలైన పాత రైల్వేగేటు ప్రాంతంతో పాటు హాయ్ల్యాండ్ వెనుక ప్రాంతం, అమరావతి టౌన్షిప్, చినకాకాని గ్రామానికి, రైల్వే ట్రాక్ మధ్య, తాడేపల్లిలోని మహానాడు, సుందరయ్య నగర్, పుష్కరఘాట్లు, ఐఓసీ ఎదురుగా ఉన్న వెంచర్లు, విజయవాడ క్లబ్ వెనుక ఉన్న కృష్ణానది తదితర ప్రాంతాల్లో స్థలాలు మారుస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సందీప్ హత్య చేసే ముందు కుంచనపల్లి గ్రామంలో కూడా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కార్యకర్త ఆధ్వర్యంలో జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా నిఘా వర్గాలు వీరిపై దృష్టి సారించి ఈ ప్రాంతాన్ని నేరస్తుల బారి నుంచి కాపాడుతారో లేదో వేచిచూడాలి. -
గ్యాంగ్వార్లో మాజీ రౌడీ షీటర్ మృతి
-
బెజవాడ గ్యాంగ్ వార్పై మంత్రి సీరియస్
సాక్షి, విజయవాడ: నగరంలో రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పోలీస్ కమిషనర్కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉద్రిక్తతలు చోటుచేసుకున్న శ్రీనివాస్ నగర్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ వివాదంలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గత టీడీపీ పాలనలో విజయవాడలో రౌడీ పాలన సాగిందని మంత్రి మండిపడ్డారు. ఇకపై నగరంలో వారి ఆటలు సాగవన్నారు. పటమటలో ఆదివారం ఇరువర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. టీడీపీకి చెందిన తోట సందీప్, జనసేనకు చెందిన పండు గ్యాంగ్ల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. (బెజవాడ గ్యాంగ్ వార్లో కొత్త ట్విస్ట్) -
టీడీపీ,జనసేన భూ వివాదం: ఒకరి మృతి
సాక్షి, విజయవాడ: బెజవాడ గ్యాంగ్ వార్లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పటమటలో ఆదివారం జరిగిన ఇరువర్గాల పరస్పర దాడులను రెండు విద్యార్థి గ్రూపుల మధ్య తలెత్తిన వివాదంగా మొదట అంతా భావించారు. మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ వివాదంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. రూ.2 కోట్ల విలువైన స్థలం కోసం ఘర్షణ జరిగినట్లు తెలిసింది. యనమలకుదురులో ఓ ల్యాండ్ సెటిల్మెంట్లో భాగంగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. (రేపటి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు) ఒకే ల్యాండ్ విషయంలో ఇద్దరు జోక్యం చేసుకోవడంతో వివాదం తలెత్తింది. ల్యాండ్ దక్కించుకునేందుకు హత్యలకు ఇరువర్గాలు స్కెచ్ వేశాయి. రాజీ ముసుగులో ప్లాన్ అమలుకు రెండు గ్రూపులు సిద్ధమయ్యాయి. పక్కా ప్లాన్తోనే కత్తులు,కర్రలతో వెళ్లినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. టీడీపీకి చెందిన తోట సందీప్, జనసేనకు చెందిన పండు గ్యాంగ్ల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గుర్తింపు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. దాదాపు 30 మంది ఘర్షణకు పాల్పడినట్టు గుర్తించారు. (చంద్రబాబుపై కేసు నమోదు) భూ వివాదంలో ఒకరు మృతి.. టీడీపీ, జనసేన మధ్య జరిగిన భూ వివాదంలో ఒకరు మృతి చెందారు. రూ.2 కోట్ల స్థలం విషయంలో చెలరేగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సందీప్ చికిత్స పొందుతూ మృతిచెందారు. మరణాయుధాలతో ఇరువర్గాలు దాడులు చేసుకోగా, ఆసుపత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలను విజయవాడ సీపీ ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
స్థల వివాదం: ముగ్గురు దారుణ హత్య
ముంబై : స్థల వివాదం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీద్ జిల్లాలోని కేజ్ తెహ్సిల్ గ్రామానికి చెందిన బాబు పవర్ కుటుంబానికి అదే ప్రాంతానికి చెందిన మరో కుటుంబంతో గత కొన్ని సంత్సరాలుగా స్థల వివాదం నడుస్తోంది. స్థల వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పవర్ కుటుంబంపై ప్రత్యర్థులు దాడి చేశారు. బాబు పవర్తో పాటు, ప్రకాశ్ బాబు పవర్, సంజయ్ బాబు పవర్లను కత్తులతో నరికి చంపారు. అంతటితో ఆగకుండా ఇంట్లోని వస్తువులను సైతం కాల్చి బూడిద చేశారు. ఘటనలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలతో సంబంధం ఉన్న 12మందిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి : అసహాయురాలిపై అత్యాచారం -
భూ ఆక్రమణ నిజమే:రెవెన్యూ శాఖ
-
రేవంత్ భూ ఆక్రమణ నిజమే
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కొండల్రెడ్డిలపై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలను రెవెన్యూ వర్గాలు నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై మరింత లోతుగా విచారించేందుకుగాను ప్రత్యేక అధికారిని కూడా ప్రభుత్వం నియమించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయనపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న రెవెన్యూ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోనికి వస్తుం డడం, స్థానికుల నుంచి సాక్ష్యాధారాలు కూడా లభిస్తుండడంతో ప్రత్యేకంగా విచారణ చేయించడం ద్వారా రేవంత్ అక్రమాలను పూర్తి స్థాయిలో వెలికితీయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జరుగుతున్న విచారణలో రేవంత్ సోదరులిద్దరూ ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రైవేటు భూములతోపాటు రోడ్లను కూడా వదల్లేదని వెల్లడయినట్టు తెలుస్తోంది. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అధికార వర్గాలందించిన సమాచారం ప్రకారం... గోపనపల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 34లో ఎకరా 11 గుంటలు, సర్వే నెం 126, కోమటికుంటలో ఎఫ్టీఎఫ్ బఫర్జోన్లో ఎకరా 14 గుంటల భూమిని రేవంత్ సోదరులు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ భూముల ఆక్రమణలతో చెరువులోకి నీళ్లు రాకుండా రేవంత్ అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో రేవంత్రెడ్డి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, వాల్టా చట్టాన్ని, తెలంగాణ రెవెన్యూ ఫస్లీ చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు తగిన ఆధారాలు కూడా రెవెన్యూ విచారణలో వెలుగులోకి వస్తున్నట్టు సమాచారం. గోపనపల్లి సర్వే నెంబర్ 127లో ఐదెకరాల 21 గుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేయించుకున్నారని, సర్వే నెంబర్ 128, 160లలో 10 గుంటల ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేశారని, సర్వే నెంబర్ 127లో వందేళ్ల నుంచి ఉన్న బండ్ల బాటను కూడా వదలకుండా కబ్జా చేశారనే ఆరోపణలు రేవంత్ ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారాల్లో ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి డి.శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు అధికారుల పాత్ర కూడా ఉందని, అందులో ఒకరు మృతి చెందగా, మరొకరు రిటైర్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరింత లోతుగా విచారణ జరిపించడం ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ బయటకు తీయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. స్థానికుల ఆరోపణల ఆధారంగా.. గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్రెడ్డి ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని కొందరు, తమ పేరిట మ్యుటేషన్ చేసినందుకు డబ్బులిస్తామని చెప్పి ఇవ్వలేదని కొందరు ఆరోపిస్తున్నారు. స్థానికులు కొందరు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించగా స్టేటస్కో ఉత్తర్వులు వచ్చాయని అంటున్నారు. అయితే, ఈ విషయంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా ఈ భూమి మ్యుటేషన్ జరిగిందని నిర్ధారించి సీఎస్కు నివేదిక ఇచ్చారు. తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని, తప్పుడు మ్యుటేషన్లు చేశారని ఆ నివేదికలో కలెక్టర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భూమితో పాటు ఇతర ఆరోపణలపై కూడా ప్రత్యేక అధికారి చేత విచారణ జరిపించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండడం గమనార్హం. -
రేవంత్ రెడ్డి అక్రమ భూ దందా!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడితో కలసి తప్పుడు పత్రాలతో అత్యంత ఖరీదైన భూమిని తమ పేరిట మ్యుటేషన్ చేయించుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ విచారణలో బహిర్గతమైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉండగా, అందులో 6 ఎకరాల 7 గుంటల భూమిని రేవంత్రెడ్డి అక్రమ మార్గంలో హస్తగతం చేసుకున్నారని నివేదిక వెల్లడించింది. గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో గల భూమికి సంబంధించి తమకు హక్కు ఉందని, రేవంత్రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కొల్లా అరుణ 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ సోదరుడు అనుముల కొండల్రెడ్డి ఈ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అనిల్ కుమార్ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశిచింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ మేరకు సీఎస్కు నివేదిక సమర్పించారు. తప్పుడు పత్రాలతో తొలుత వేరే వారి పేరు మీద భూమి రాయించి, ఆ తర్వాత వారి నుంచి కొనుగోలు చేసినట్లు రేవంత్రెడ్డి, కొండల్రెడ్డి పత్రాలు సృష్టించినట్లు తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని అక్రమంగా మ్యుటేషన్ చేసిన అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్/డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవహారం ఇలా జరిగింది.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 127లో 10.21 ఎకరాల భూమి 1977 వరకు వడ్డె హనుమ, అతడి వారసుడు వడ్డె మల్లయ్య పేరు మీద ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. 1978 నుంచి ఈ భూమి ‘మల్లయ్య’పేరు మీద పహాణీలో నమోదవుతూ వస్తోంది. మల్లయ్య పేరు ఉంది కానీ.. ఆయన ఇంటి పేరు లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండానే 1993–94 నుంచి ఈ భూమికి పట్టాదారుగా మల్లయ్యకు బదులు ‘దబ్బ మల్లయ్య’అనే కొత్త వ్యక్తి పేరును రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. ఆ తర్వాత 2001–02 నుంచి పహాణీల్లో మల్లయ్య పేరు తొలగించారు. ఆ తర్వాత ఇ.మల్లయ్య అనే మరో కొత్త వ్యక్తి తెరపైకి వచ్చాడు. 2005లో అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్/తహసీల్దార్ ఇ.మల్లయ్యకు వారసుడిగా చెప్పుకొనే ఇ.లక్ష్మయ్య పేరు మీద 2 ఎకరాల 21 గుంటల భూమి రాశారు. ఆ భూమి లక్ష్మయ్య కాస్తులో ఉన్నట్లు తేల్చేశారు. అదే తహశీల్దార్ మళ్లీ ఈ వివరాలు సవరిస్తూ.. లక్ష్మయ్య కేవలం ముప్పైఒకటిన్నర గుంటల్లో కాస్తులో ఉన్నట్లు రాశారు. ఎలాంటి ఆధారం లేకుండానే లక్ష్మయ్య పేరు మీద మొదట 2 ఎకరాల 21 గుంటలు రాయడం, మళ్లీ సవరించి ముప్పైఒకటిన్నర గుంటలకు మార్చడం రెండూ తహశీల్దార్ అధికార పరిధిని అతిక్రమించినట్లు విచా రణలో తేలింది. ఈ ముప్పైఒకటిన్నర గుం టల భూమిని అనుముల రేవంత్రెడ్డి కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్ రాసు కున్నారు. ఈ సేల్ డీడ్ ఆధారంగా రేవంత్రెడ్డికి అనుకూలంగా తహసీల్దార్ వ్యవహరించారు. రేవంత్రెడ్డి పేరును ఈ భూమి కి హక్కుదారుడిగా పేర్కొం టూ 2005లో అప్పటి తహసీల్దార్ రికార్డుల్లో ఎంట్రీ చేశారు. ఎలాంటి ఆధారాల్లేకుండానే ఇ.లక్ష్మయ్య మరో ఎకరం ఇరవై తొమ్మిదిన్నర గుంటల భూమిని కొండల్రెడ్డికి అమ్మాడు. అధికారులు ఆ కొనుగోలు ప్రకారం కొండల్రెడ్డి పేరిట 2015లో మ్యుటేషన్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా తన పేరు మీద పత్రాలు సృష్టించడం ద్వారా డి.మల్లయ్య అనే వ్యక్తి 2 ఎకరాల 20 గుంటల భూమిని కళావతి అనే మహిళకు అమ్మాడు. ఈ భూమిని కూడా అధికారులు కళావతి పేరు మీద మార్పిడి (మ్యుటేషన్) చేశారు. ఆ తర్వాత ఆ భూమిని కళావతి.. ఎ.కొండల్రెడ్డి పేరు మీదకు బదిలీ చేశారు. ఇదే సర్వే నంబర్లోని మరో ఎకరం 24 గుంట లను అలీసల్మాన్ బిన్, మహఫూజ్, హబీబ్ అబ్దుల్ రహీం, ఎ.వెంకటరావు, ఇతరుల నుంచి కొనుగోలు చేసినట్లు 2014లో కొండల్రెడ్డి సేల్ డీడ్ చేసుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో భూ విక్రేతలకు సంబంధించి ఎలాంటి ఎంట్రీలు లేకపోయినా, స్థానిక తహసీల్దార్ సేల్ డీడ్ ఆధారంగా కొండల్రెడ్డి పేరు మీద భూమిని మ్యుటేషన్ చేశారు.1989లో ఎ.వెంకటరెడ్డి అనే వ్యక్తి దబ్బ మల్లయ్య నుంచి 1 ఎకరం 10 గుంటల భూమి కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే 1989లో దబ్బ మల్లయ్య పేరు మీద ఈ భూమి ఉన్నట్లు రికార్డుల్లో లేదు. వెంకటరావు అనే మరో వ్యక్తి ఈ భూమిలోని పదమూడున్నర గుంటల భూమిని ఆ తర్వాత ఎ.కొండల్రెడ్డి పేరు మీదికి బదలాయించారు. హక్కుదారులెవరో స్పష్టత లేకున్నా.. గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో గల భూమికి హక్కు దారులెవరు అనే విషయంలో స్పష్టత లేదని అధికారులు తేల్చారు. అయినా తప్పు డు డాక్యుమెంట్ల ఆధారంగా, తప్పుడు మ్యుటేషన్లు చేసినందుకు, తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. -
ఎమ్మార్వోలకు ‘పార్ట్–బీ’ బాధ్యత!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తేరుకుంది. చిక్కుముడిగా మారిన పార్ట్–బీ భూములను పరిష్కరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల పేరిట కాలయాపన చేసిన రెవెన్యూశాఖ.. ఈ భూ వివాదాలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు వీలుగా.. సవరణ అధికారాన్ని తహసీల్దార్లకు ఇవ్వాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం.. పట్టాదార్ పాస్పుస్త కాలు ఇవ్వకుండా పక్కనపెట్టింది. కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములు, భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు–రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, ప్రైవేటు భూముల మధ్య వివాదాస్పదంగా ఉన్నవాటిని కూడా ఈ కేటగిరీలో నమోదు చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల మేర భూము లకు పార్ట్–బీ కేటగిరీలో చేర్చింది. అయితే, వీటిని సకాలంలో పరిష్కరించడంలో రెవె న్యూ యంత్రాంగం ఎడతెగని జాప్యం ప్రదర్శించింది. సాఫ్ట్వేర్ సమస్యలు, తప్పొప్పు లను సవరించే అధికారం జేసీలకు కట్టబెట్టడంతో పార్ట్–బీ భూముల వ్యవహారం జటిలమైంది. ఈ భూములకు పాస్పుస్తకాలు నిలిపేయడంతో ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ రైతులు తిరగడం.. ఆ వివాదాలను పరిష్క రించే అధికారం తమకు లేదని తహసీల్దార్లు చెప్పినా వినకపోవడంతో ఉద్దేశపూర్వంగా రెవెన్యూ ఉద్యోగులే చేయడం లేదనే భావన రైతాంగంలో నెలకొంది. ఈ వివాదాలు మొ దలు. భౌతిక దాడులు వరకు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇటీవల అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురికావడంతో ప్రభుత్వం మేలుకుంది. సాం కేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఒక వైపు చర్యలు తీసుకుంటునే.. పార్ట్–బీ భూ ములను కూడా సాధ్యమైనంత త్వరగా కొలి క్కి తేవాలని నిర్ణయించింది. ఇందులో భా గంగా ఈ భూములను పరిశీలించి.. పరిష్క రించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్ప గిం చాలని యోచిస్తోంది. తాజాగా తహసీ ల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసినందున.. కొత్త తహసీల్దార్లు కుదురుకోగానే స్పష్టమైన మార్గ దర్శకాలను వెలువరించ నున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. త్వరలో సీఎంతో భేటీ! రెవెన్యూ సమస్యలపై త్వరలో సీఎం కె.చంద్రశేఖర్రావుతో రెవెన్యూ ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేయ నున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీ ఆర్ హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ.. మం గళవారం రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ను కలసింది. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల కొరత తదితర అంశాలపై చర్చించింది. అలాగే తాజా పరిణామాలను వివరించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలోనే సమావేశ తేదీని ఖరారు చేస్తానని హామీ ఇచ్చినట్లు రవీందర్రెడ్డి తెలిపారు. అలాగే తహసీల్దార్ల బదిలీకి కృషి చేసినందున కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. -
ఎమ్మార్వోలకే ‘పార్ట్–బీ’ బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్ : ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తేరుకుంది. చిక్కుముడిగా మారిన పార్ట్–బీ భూములను పరిష్కరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లూ జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల పేరిట కాలయాపన చేసిన రెవెన్యూశాఖ.. ఈ భూ వివాదాలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు వీలుగా.. సవరణ అధికారాన్ని తహసీల్దార్లకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం.. పట్టాదార్ పాస్పుస్తకాలు ఇవ్వకుండా పక్కనపెట్టింది. కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములు, భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు–రెవెన్యూ శాఖ ల మధ్య తగాదా, ఫారెస్టు, ప్రైవేటు భూముల మధ్య వివాదాస్పదంగా ఉన్నవాటిని కూడా ఈ కేటగిరీలో నమోదు చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల మేర భూములను పార్ట్–బీ కేటగిరీలో చేర్చింది. అయితే, వీటిని సకాలంలో పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగంఎడతెగని జాప్యం ప్రదర్శించింది. సాఫ్ట్వేర్ సమస్యలు, తప్పొప్పులను సవరించే అధికారం జేసీలకు కట్టబెట్టడంతో పార్ట్–బీ భూముల వ్యవహారం జటిలమైంది. ఈ భూములకు పాస్పుస్తకాలు నిలిపేయడంతో ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ రైతులు తిరగడం.. ఆ వివాదాలను పరిశీలన, పరిష్కరించే అధికారం తమకు లేదని తహసీల్దార్లు చెప్పినా వినకపోవడంతో ఉద్దేశపూర్వంగా రెవెన్యూ ఉద్యోగులే చేయడం లేదనే భావన రైతాంగంలో నెలకొంది. ఈ వివాదాలు మొదలు. భౌతిక దాడులు వరకు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇటీవల అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురికావడంతో ప్రభుత్వం మేలుకుంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటునే.. పార్ట్–బీ భూములను కూడా సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ భూములను పరిశీలించి.. పరిష్కరించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని యోచిస్తోంది. ఈ మేరకు సాఫ్ట్వేర్లో ఎడిట్ ఆప్షన్ అనుమతిని తహసీల్దార్లకు ఇవ్వనుంది. తాజాగా తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసినందున.. కొత్త తహసీల్దార్లు కుదురుకోగానే ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను వెలువరించనున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. త్వరలో సీఎంతో భేటీ! రెవెన్యూ సమస్యలపై త్వరలో సీఎం కె.చంద్రశేఖర్రావుతో రెవెన్యూ ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి నేతృత్వంలోనిప్రతినిధి బృందం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ను కలసింది. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల కొరత తదితర అంశాలపై చర్చించింది. అలాగే తాజా పరిణామాలను వివరించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలోనే సమావేశ తేదీని ఖరారు చేస్తానని హామీ ఇచ్చినట్లు రవీందర్రెడ్డి తెలిపారు. అలాగే తహసీల్దార్ల బదిలీకి కృషి చేసినందున కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. -
‘ఆ భూ వివాదంతో సంబంధం లేదు’
సాక్షి, మెడ్చల్: అబ్దుల్లాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని భూవివాదంతో తనకు ఎటువంటి సంబంధం లేదని ముడుచింతల జెడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గౌరెల్లి గ్రామ పరిధిలో కేవలం 9 ఎకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని వెల్లడించారు. టెనెంట్(పీ.టీ) హోల్డర్ నుంచి కొనుగోలు చేశానని, ఎటువంటి భూకబ్జాలకు పాల్పడలేదన్నారు. కొన్ని మీడియా సంస్థల్లో తనపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఎవరి సంపాదన ఎంత, అది ఎలా వచ్చిందో విచారణ చేస్తే వాస్తవాలు బయటకొస్తాయని తెలిపారు. ఇరవై ఏళ్ల తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం వంటిదని తెలిపారు. కొనుగోలు చేసిన స్థలంలో ఇంతవరుకు కాలు కూడా మోపలేదని హరివర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. -
వివాదాలకు వెళ్తే చర్యలు తప్పవు
సాక్షి, లింగంపేట(నిజామాబాద్) : మండలంలోని జల్దిపల్లి లో వివాదాలకు పోతే చర్యలు తప్పవని అందరూ సోదరభావంతో మెలగాలని ఎల్లారెడ్డి డీఎస్పీ సత్తెన్న సూచించారు. శుక్రవారం పలువురు అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కేసు గ్రామంలో వివాదాస్పదం కావడంతో వారు విచారణకు వచ్చారు. అన్ని వర్గాల వారిని సంయమనం పాటించాల ని సూచించారు. ఈ క్రమంలో గ్రామంలో శాం తియుత వాతావరణం నెలకొల్పడానికి అధికారులు కృషి చేశారు. గతంలో ఎస్సీలకు గ్రామంలో తీగునీరు, విద్యుత్, హోటళ్లు, కిరాణ దుకాణాల్లో సరుకులు నిషేధించినట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ చేశారు. శుక్రవారం అధికారులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితులు చక్కబడ్డాయా లేదా అన్న విషయంపై ఆరా తీశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడా రు. తాము అందరం కలిసిమెలసి ఉంటున్నామని ఎలాంటి బహిష్కరణలు చేసుకోవడంలేదని వివరించారు. గ్రామంలో అన్ని వర్గాల వారిని విచారించారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలిసిమెలసి జీవించాలని సూచించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్నేహంగా మెలగాలన్నారు. సమాజంలో అందరూ సమానమే అన్నారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన హక్కులు వర్తిస్తాయన్నారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువా కాదన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామేశ్వర్, ఎంపీడీవో మల్లికార్జున్రెడ్డి, ఎస్ఐ సుఖేందర్రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
‘కాషాయం’ చాటున భూదందాలు!
సాక్షి, కావలి (నెల్లూరు): పట్టణంలో బీజేపీ భూదందాలు శృతిమించుతున్నాయి. కావలి పట్టణంలోని ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములను ఆక్రమించుకోవడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం అనంతరం పార్టీ ముసుగులో అధికారులను బెదిరించడం కావలిలో నిత్యకృత్యమైపోయాయి. పనిలో పనిలో అధికార వైఎస్సార్సీపీ నాయకులపై విమర్శలు చేసి తమ దందాలో ఎక్కడా జోక్యం చేసుకొని తమకు అడ్డు పడకుండా కట్టడి చేసే విధంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. బీజేపీ నాయకుల తీరు! పట్టణంలోని బాలకృష్ణారెడ్డి నగర్లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాలను బీజేపీ నాయకురాలు పేదలు వద్ద వసూళ్లకు పాల్పడి వారికి నకిలీ పట్టాలు ఇచ్చింది. ఆ స్థలాలు వద్దకు వెళ్లిన పేదలను అసలు యజమానులు అడ్డుకొన్నారు. దీంతో రెక్కల కష్టాన్ని బీజేపీ నాయకురాలుకు ఇచ్చిన పేదలు ఆందోళన చెంది, తమల్ని ఇలా చేశారేమిటని ప్రశ్నిచడంతో, ఆమెకు పార్టీలో ఒకరిద్దరు నాయకులు అండగా నిలబడ్డారు. బీజేపీ నాయకురాలు బాధితులైన పేదలు నేరుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని కలిసి తమగోడు చెప్పకొన్నారు. అలాగే అధికారులను కలిసి తాము మోసపోయిన వైనాన్ని కన్నీటిపర్యంతమై తెలియజేశారు. దీంతో అధికారులు విచారించి పేదలు మోసపోయారని గుర్తించి, న్యాయం చేయాలని నిర్ణయించారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కూడా అధికారులను కలిసి...‘జరిగిందేదో జరిగిపోయింది పేదలకు న్యాయం చేయాలి’ అని కోరారు. చివరిగా రెవెన్యూ అధికారులు బీజేపీ నాయకురాలి బాధితులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. వ్యూహాత్మకంగా కమిషన్ ఏర్పాటు బీజేపీ నాయకులు అధికారులను భయపెట్టి తమకు అనుకలూంగా మలుచుకోవాలని వ్యూహాత్మకంగా జాతీయ ఎస్సీ, బీసీ కమీషన్ సభ్యులను కావలికి తీసుకొచ్చి విచారణ జరిపించారు. వారు కూడా ఇంటి పట్టాలు కావాలంటే అధికారులు ఇవవాలే కాని, ప్రవేటు వ్యక్తులు ఎలా ఇస్తారని అసహనం వ్యక్తం చేయడంతో స్థానిక బీజేపీ నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయి పడినట్లు అయింది. ఇది ఇలా ఉండగా చివరి అస్త్రంగా సాక్షత్తూ ఐఏఎస్ అధికారి అయిన కావలి సబ్ కలెక్టర్ను బెదిరించి తొంగదీసుకోవాలని బీజేపీ నాయకులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించినప్పటికీ ఆయన బెదరలేదు. దీంతో చేసేది ఏమీ లేక ఆ వ్యహారాన్ని పక్కనపెట్టేశారు. ఇక పట్టణంలోని మద్దూరుపాడు వద 1986 రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫ్లాట్లుగా అమ్మేసిన స్థలాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. వాటిపై కన్నుపడిన ఒక బీజేపీ నాయకుడు మరో ఇద్దరిని కలుపుకొని అక్కడ 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దీంతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు తమ స్థలాలను బీజేపీ నాయకుడు, మరికొందరు కలిసి ఆక్రమించుకొని కంచె వేసి మళ్లీ ఫ్లాట్లుగా తయారు చేసి అమ్మకాలకు సిద్ధమౌతున్నారని అధికారులను కలిసి మొర పెట్టుకొన్నారు. ఫ్లాట్ల యజమానులను తీవ్రస్థాయిలో బెదించారు. ఈ స్థలాలు విషయంలో పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ సమస్యను ను నేటి వరకు అధికారులు తేల్చనే లేదు. ముసునూరులోనూ భూదందా ముసునూరులోనే పమిడి స్కూలును ఆనుకొని ఎకరా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి బీజేపీ నాయకుడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్వాధీనం చేసుకొన్నాడు. వీటిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ భూములన్నీ కూడా బహిరంగ మార్కెట్లో రూ. కోట్లు విలువ చేసేవి కావడం గమనార్హం. ఈ పరిణామాల నేపధ్యంలో కావలి బీజేపీలో భూదందాలు చేసే వారిలో తీవ్ర అసహనం నెలకొంది. అధికారులు తమకు లొంగి అణిగిమణిగి ఉండి తమకు అడ్డు రాకుండా ఉండాలంటే, మొదట అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యేను, ఆ పార్టీ నాయకులు గురించి ఏదో ఒక విధంగా రోడ్డెక్కి గోల చేస్తే కాని పరిస్థితులు తమకు అనుకూలంగా ఏర్పడవనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపధ్యంలో వారికి డబ్బును ఇవ్వగలిగిన కొత్త వ్యక్తి చేతిలో ఉండటంతో ఆయనకు నాయకత్వం పెంచుతామని చెప్పి, సోమవారం కావలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భూదందాలు, బెదింపులు అంటూ ధర్నా చేసారు. ఇందుకోసం కావలి టౌన్, కావలిరూరల్, జలదంకి, బోగోలు మండలాలాల్లోని పేదలకు కావలికి ఆటోలో వచ్చి వెళ్లితే రూ.100 ఇస్తామని చెప్పడంతో, పలువురు వచ్చారు. వయోభారంతో ఉన్న వారు కూడా బీజేపీ వారు సమకూర్చిన ఆటో ఎక్కి కావలి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. -
మహిళ ప్రాణం తీసిన భూ తగాదా
సాక్షి, మిర్యాలగూడ: భూ తగాదాలతో ఓ మహిళ దారుణహత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్కు చెందిన మారెపల్లి అమృతారెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్రెడ్డి అన్నదమ్ములు. వీరి స్వస్థలం నారాయణపురం. వీరు 20 ఏళ్ల నుంచి మిర్యాలగూడలో నివాసం ఉంటున్నారు. వీరికి మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి పంపకాల విషయంలో కొన్ని సంవత్సరాల నుంచి అమృతారెడ్డికి, వాసుదేవరెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి అతడి భార్య మంజులతో కలిసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో గురువారం ప్రొక్లెయిన్తో చెట్లు తొలగించారు. దాంతో అమృతారెడ్డి అతడి కుమారుడితో కలిసి అక్కడికి చేరుకొని భూమి విషయంలో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మారెపల్లి మంజుల, ఆమె భర్త వాసు దేవరెడ్డిపై అమృతారెడ్డి, అతడి కుమారుడు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో మంజుల తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన వాసుదేవరెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ రమేష్బాబు, మాడ్గులపల్లి ఎస్ఐ రావుల నాగరాజు ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మంజుల -
ప్రాణం తీసిన గెట్ల పంచాయతీ
సాక్షి, నల్గొండ: జిల్లాలోని మాడుగులపల్లి మండలం నారాయణపురం గ్రామ శివారులో దారుణం చోటు చేసుకుంది. గెట్ల పంచాయతీ ఓ మహిళా రైతు ప్రాణం తీసింది. వివరాలు.. నారాయణపురం గ్రామానికి చెందిన మహిళా రైతు మంజుల(55)కు కొన్ని రోజులుగా బంధువులతో పొలం గెట్ల గురించి వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో మంజుల బంధువులైన అమృతా రెడ్డి, అతని కుమారుడు గురువారం పొలంలో పని చేసుకుంటున్న ఆమెపై గొడ్డలితో దాడి చేసి నరికి చంపారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మంజుల భర్త వాసుదేవ రెడ్డిని కూడా తీవ్రంగా గాయ పర్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంజుల మృత దేహంతో పాటు వాసుదేవ రెడ్డిని కూడా ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భూ తగాదాలే హత్యకు కారణంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అమృతా రెడ్డి, అతని కుమారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
సెల్ టవర్ ఎక్కిన మహిళ
-
సెల్ టవరెక్కి మహిళ హల్చల్
సాక్షి, నల్లగొండ: భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసింది. వివరాలు.. జిల్లాలోని నకిరేకల్ మండలం కడపర్థికి చెందిన సోమయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో అంజమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం సోమయ్య మరణించాడు. అయితే చనిపోవడానికి ముందే సోమయ్య తనకున్న రెండెకరాల భూమిని ఇద్దరి భార్యలకు సమంగా పంచాడు. ఈ ఏడాది అంజమ్మ తన పొలంతో పాటు పక్కనే ఉన్న మొదటి భార్య పొలాన్ని కూడా దున్నింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఈ వివాదం ఎంతకి తెగకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ అంజమ్మ సెల్ టవర్ ఎక్కింది. విషయం తెలుసుకున్న పోలీసులు కడపర్థి చేరుకుని అంజమ్మను కిందకు దించడానికి ప్రయత్నం చేస్తున్నారు. -
పూర్తి స్థాయి సర్వే జరిగి 111 సంవత్సరాలు
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబాస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సన్నబియ్యం సేకరించాలని జగన్ ఆదేశించారన్నారు. ఈ మేరకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి కమిటీ : పిల్లి సుభాష్చంద్రబోస్ గత ప్రభుత్వం భూముల వ్యవహారం ఆన్లైన్ చేయడం వల్ల అనేక అవకతవకలు జరిగాయని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఫలితంగా రైతుల భూమి హక్కుకు భంగం కల్గిందని.. భద్రత లేదని విమర్శించారు. భూసమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి రిటైర్డ్ జడ్జి, అనుభవజ్ఞులైన రిటైర్డ్ సర్వేయర్, రెవెన్యూ అధికారులతో ఒక కమిటీ నియమించాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారన్నారు. ఇది ఒక ఆహ్లదకరమైన.. ఆహ్వానించదగిన నిర్ణయమని కొనియాడారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి భూ సర్వే జరిగి దాదాపు 111 సంవత్సరాలు అవుతుందన్నారు. రీసర్వేను జగన్ ఒక చాలెంజ్గా తీసుకున్నారని.. దీనిపై అనుభవజ్ఞులైన అధికారులతో సమీక్షిస్తున్నారని తెలిపారు.