Nagaram
-
నిద్రలోనే తెల్లారిన బతుకులు.. ఒక్కొక్కరికి రూ.4లక్షల పరిహారం
సాక్షి, సూర్యాపేట: నిద్రలోనే ముగ్గురి బతుకులు తెల్లారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు బాగా తడిసిన ఇంటి గోడ కూలడంతో వృద్ధ దంపతులతో పాటు కుమారుడు దుర్మరణం చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలోని నాగారం మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. శీల రాములు(90), రామక్క (83) దంపతులు తమ చిన్న కుమారుడు, ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీను(38)తో కలిసి చిన్న రేకుల ఇంట్లో జీవిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీను భార్య.. పిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. కాగా బుధవారం రాత్రి రోజూ మాదిరిగానే శిథిలావస్థకు చేరిన ఆ రేకుల ఇంట్లోనే ఓ గదిలో ముగ్గురు కలిసి ఒకే చోట నిద్రించారు. వర్షాలకు ఇంటి గోడలు బాగా తడవడంతో రాత్రి సమయంలో మధ్య గోడ కూలి వారి మీద పడటంతో ముగ్గురూ నిద్రలోనే విగతజీవులుగా మారారు. గురువారం సాయంత్రం విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగ్ తీసేందుకు ఆ ఇంటికి రాగా ఎప్పుడూ బయట కూర్చునే వృద్ధదంపతులు కనిపించకపోవడం, ఇంటి గడియ లోనికి వేసి ఉన్నా ఎవరూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. స్థానికులతో కలిసి గోడల మట్టిని తొలగించగా మృతదేహాలు కన్పించాయి. పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒక్కొక్కరికి రూ.4లక్షల పరిహారం విషయం తెలిసిన వెంటనే మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొరికి రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. తక్షణ సహాయంగా రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 75వేలు మంత్రి జగదీశ్రెడ్డి స్వయంగా అందజేశారు. వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యావకాశం కల్పించడంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. చదవండి: భారీ వర్షాలు, వరదలు.. ‘ధ్రువీకరణ’ వరదపాలు. వరంగల్ విద్యార్థుల గోస -
తమిళిసై వద్ద పెండింగ్లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్పర్సన్పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్పర్సన్కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
Hyderabad: నాగారం, ఘట్కేసర్, దమ్మాయిగూడలో లింక్ రోడ్లు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని రహదార్లకు మహద్భాగ్యం కలుగనుంది. నగరానికి తూర్పున ఉన్న మేడ్చల్ జిల్లా పరిధిలోని దమ్మాయిగూడ, జవహర్నగర్, నాగారం, ఘట్కేసర్ స్థానికసంస్థల పరిధిలో 4 లేన్లు, 6 లేన్లతో విశాలమైన రహదారులు రానున్నాయి. ఇన్నర్ రింగ్రోడ్, ఔటర్రింగ్ రోడ్కు అనుసంధానంగా ప్రజల సాఫీ ప్రయాణానికి లింక్, స్లిప్రోడ్లలో భాగంగా ప్రభుత్వం ఇటీవల 104 రోడ్ల పనులకు నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. వాటిల్లో 50 రోడ్ల పనుల్ని ప్రాధాన్యతతో చేపట్టాల్సిందిగా సూచించింది. ఐదు ప్యాకేజీలుగా.. మొత్తం ఐదు ప్యాకేజీలుగా పనులకు నిధులు మంజూరు చేయగా వాటిల్లో మూడో ప్యాకేజీలోని 13 కారిడార్ల (రోడ్ల) పనులు చేసేందుకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) టెండర్లు ఆహ్వానించింది. వీటి అంచనా వ్యయం రూ.293.55 కోట్లు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన భూసేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి పనులు లేని ప్రాంతాల్లో రోడ్ల పనులు వేగంగా జరగనున్నాయి. వీటికి అవసరమైన నిధుల్ని హెచ్ఎండీఏ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. టెండర్లు పిలిచిన రోడ్ల వివరాలు.. దమ్మాయిగూడ మునిసిపాలిటీలో.. ► దమ్మాయిగూడ రోజ్గార్డెన్ ఫంక్షన్హాల్ నుంచి నాగారం రోడ్ (ఈసీఐఎల్ను కలుపుతూ): 2.80 కి.మీ.లు. ► చీర్యాల జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మద్గూడ: 1.70 కి.మీ.లు. జవహర్నగర్ కార్పొరేషన్లో.. ► ఫైరింగ్ కట్ట నుంచి ఎన్టీఆర్ విగ్రహం రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి దమ్మాయిగూడ రోడ్ (మునిసిపల్ పరిధి వరకు ): 1.90 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి డంపింగ్ యార్డ్ వరకు: 2.35 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి వంపుగూడ రోడ్ వరకు: 1.20 కి.మీ.లు నాగారం మునిసిపాలిటీలో.. ► రాంపల్లి క్రాస్రోడ్స్ నుంచి సర్వే నెంబర్ 421 వరకు(హెచ్పీ పెట్రోల్పంప్ దగ్గర) : 3.90 కి.మీ.లు. ► సర్వే నెంబర్ 421 (హెచ్పీ పెట్రోల్పంప్ దగ్గర)నుంచి యామ్నాంపేట (నాగారం మునిసిపాలి టీ సరిహద్దు వరకు): 3.10 కి.మీ.లు. ► చర్లపల్లి నుంచి ఓఆర్ఆర్ సర్వీస్రోడ్ వరకు( వయా కరీంగూడ ): 3.80 కి.మీ.లు ► యామ్నాంపేట ఫ్లైఓవర్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు: 2.60 కి.మీ.లు ► చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ వరకు: 3.30 కి.మీ.లు పోచారం మునిసిపాలిటీలో.. ► యామ్నాంపేట నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ఘట్కేసర్ మునిసిపాలిటీలో.. ► శివారెడ్డిగూడ నుంచి మాధవ్రెడ్డి బిడ్జ్రి : 2.50 కి.మీ.లు. ప్రయోజనాలు ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే నగరంనుంచి శివారు ప్రాంతాలకు సాఫీ రవాణా సాధ్యమవుతుంది. ప్రజలకు ప్రయాణదూరం, సమయం, ఇంధనవ్యయం తగ్గుతాయి. వాహన కాలుష్యం తగ్గడంతో ప్రయాణాల వల్ల తలెత్తే ఆరోగ్య ఇబ్బందులూ తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం) -
‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యింది.. మీరు కూడా రండి’
నాగారం: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త.. మృతదేహాన్ని టాటా ఏస్ వాహనంలో స్వగ్రామానికి తీసుకొచ్చాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పస్తాల గ్రామానికి చెందిన చిత్తలూరి శ్రీనివాస్, సూరాంబ (35) దంపతులు తమ పిల్లలు శ్రావణి, ప్రశాంత్. పదేళ్లుగా హైదరాబాద్లోని రామాంతాపూర్లో నివసిస్తూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి శ్రీనివాస్ ఇంట్లో ఇద్దరు పిల్లలను పక్క గదిలో నిద్రించమని చెప్పి భార్యతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో సూరాంబను విచక్షణారహితంగా కొట్టి, ప్లాస్టిక్ తాడుతో ఆమె మెడకు ఉరివేసి హత్య చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూరగాయలకు వినియోగించే తన టాటా ఏస్ వాహనంలో ఆమె మృతదేహాన్ని వేసుకొని స్వగ్రామం పస్తాలకు బయల్దేరాడు. మార్గమధ్యలో గురువారం తెల్లవారుజామున పిల్లలకు ఫోన్చేసి ‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యి మృతిచెందింది. పస్తాలకు తీసుకెళ్తున్నా, మీరు కూడా రండి’ అని చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని పస్తాలకు తీసుకొచ్చి తన ఇంటిముందు ఉంచాడు. బీపీ డౌన్ అయ్యి మృతిచెందిందని గ్రామస్తులతో చెప్పగా వారు మృతదేహంపై ఉన్న గాయాలను గుర్తించి ఏమైందని నిలదీశారు. దీంతో శ్రీనివాస్ తానే చంపానని అంగీకరించాడు. అయితే గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మొగుళ్ల బక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేశ్ తెలిపారు. -
వెయ్యి చెరువుల తోట.. హరిత సూర్యాపేట
నీళ్లు లేక.. నింపే దిక్కులేక వట్టిపోయి నిర్జీవంగా మారిన చెరువులు. సాగు అవసరాలేమోగానీ పశువుల తాగునీటికి కటకటే. చెరువులు, వాగులు, వంకలు, బావులు ఎండిపోయి కనిపించేవి. వర్షాధార పంటలతో, అరకొర దిగుబడులతోనే రైతులు నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు ఆ గ్రామాలకు కొత్త కళ వచ్చింది. ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వచ్చి చేరిన నీటితో చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయ్. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద కాల్వలన్నీ గోదావరి నీటితో నిండుగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు నీటి తడులతో ఆకుపచ్చ తివాచీ పరచినట్లు కనిపిస్తోంది. సాక్షి: హైదరాబాద్: జలం ఉంటేనే జీవం. పచ్చని పంటలు. గొడ్డూ గోదా. ఊరంతా కోలాహలం. రైతు కళ్లలో వెలకట్టలేని ఆనందం. సొంతూరిని నమ్ముకొని సాఫీగా సాగే బతుకులు. కాలం కాకపాయె... కలలు చెదిరిపాయె! అవన్నీ పదిహేను, పదహారేళ్ల కిందటి వరకు నీళ్లు లేక.. నింపే దిక్కులేక వట్టిపోయి నిర్జీవంగా మారిన చెరువులు. సాగు అవసరాలు పక్కనపెడితే కనీసంగా పశువులకు తాగునీటి అవసరాలను కూడా తీర్చే పరిస్థితులు లేక బోసిపోయి కనిపించేవి. చెరువుల్లో నీరు లేక బావులు అడుగంటగా, బోర్లలో నీరు పాతాళానికి చేరిపోయేది. అలాంటి పరిస్థితుల్లో వర్షాధార సాగుతో, అరకొర దిగుబడులతోనే రైతులు నెట్టుకొచ్చేవారు. అమ్ముకుందామన్నా భూములకు ధరలు లేక...ఊళ్లకు ఊళ్లే వలసలతో బోసిపోయేవి. అలాంటి గ్రామాలకు ఇప్పుడు కొత్త మురిపెం వచ్చింది. ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వచ్చి చేరిన నీటితో చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద కాల్వలన్నీ గోదావరి నీటితో నిండుగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు నీటి తడులతో పచ్చగా కనిపిస్తోంది. వేసవి సమయంలోనూ చెరువులు అలుగు దుంకుతుండటంతో పరీవాహక పల్లెలు పులకిస్తున్నాయి. నిండిన చెరువుల కింద సాగు పెరగడం, భూముల ధరలకు రెక్కలు రావడంతో రైతుల సంబురం అంబరాన్ని అంటుతోంది. సంబురం నింపిన గోదారి ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రధానమైన కాకతీయ కాల్వ 284 కిలోమీటర్లు ఉండగా, దాని కింద 9.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి కొనసాగింపుగా కాకతీయ కాల్వ 284వ కిలోమీటర్ నుంచి 346 కి.మీ వరకు విస్తరణే లక్ష్యంగా ఎస్సారెస్పీ స్టేజ్–2 చేపట్టారు. దీని ద్వారా తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటున్న వరంగల్ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. రూ.1,220 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా కాకతీయ కాల్వల తవ్వకంతో పాటు 14 నీటి పంపిణీ కాల్వలు (డిస్ట్రిబ్యూటరీలు) తవ్వకం చేశారు. ముఖ్యంగా చివరి ఆయకట్టు ప్రాంతమైన సూర్యాపేట జిల్లాలో డీబీఎం–69, 70, 71 కింద 156 గ్రామాల పరిధిలో 2.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, 900ల వరకు చెరువులున్నాయి. వీటిని 2019 నవంబర్ నుంచి నింపుతూ వస్తున్నారు. గతేడాది ఖరీఫ్లో నీటి లభ్యత ఉండటంతో ఈ చెరువులకు నీటి విడుదల అవసరం పడలేదు. చదవండి: (‘ఎల్ఆర్ఎస్’ ఆధారంగా ఇకపై పన్నుల వడ్డన) ప్రస్తుతం యాసంగి సాగు జరుగుతుండటంతో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. అందులో భాగంగానే చివరి చెరువు వరకు నీరు చేరుతోంది. చిట్టచివర ఉన్న చెరువులను మొదట నింపేలా టెయిల్–టు–హెడ్ విధానం ద్వారా నీటిని సరఫరా చేస్తుండటంతో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులన్నీ 100% నిండుతున్నాయి. వాటి కిందే 55 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. ఇంతవరకూ గోదావరి జలాలను ఎరుగని పరీవాహక రైతులు ప్రస్తుతం నిండుతున్న చెరువులు, పారుతున్న కాల్వల కారణంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్సారెస్పీ కాల్వలకు లైనింగ్ చేయకపోవడం కొంత ఇబ్బందిగా మారుతోంది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రూ.300 కోట్లతో కాల్వల ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపినా అవి ఇంతవరకు ఆమోదం పొందలేదు. ఈ కాల్వల లైనింగ్ పనులు పూర్తయితే పూర్తి సామర్థ్యంతో కాల్వలకు నీటిని పారించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఆనవాళ్లు కోల్పోయి... ఇప్పుడదే ఆదరువు ఈ చెరువు సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పెద్దచెరువు. కాకతీయుల కాలం నాటికి ఈ చెరువు ఫీడర్ చానళ్లు పూడుకుపోయి, పరీవాహకమంతా ధ్వంసమై పదిహేనేళ్లుగా వట్టిపోయి కనిపించేది. నీటి చుక్క కనిపించక దీని చుట్టూతా ఎడారిని తలపించేది. దీని పరిధిలోని 324 ఎకరాల ఆయకట్టులో ఎన్నడూ పదిహేను శాతం కూడా సాగైంది లేదు. అలాంటిది ఇప్పుడు 400 కిలోమీటర్ల నుంచి వస్తున్న గోదావరి జలాలతో పులకిస్తోంది. ఎస్సారెస్పీ స్టేజ్–2 కాల్వల ద్వారా నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతుండటంతో ఏకంగా అలుగు దుంకుతోంది. పెద్దపెద్ద చేపలు చెరువులో సందడి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ముంబైకి వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు చేరుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయానికి పనికిరాని గుట్టలను సైతం నీళ్లొచ్చాయన్న సంతోషంతో చదును చేసి పంట సాగు మొదలుపెట్టారు. ‘ఈ చెరువు నిండక ముందు మూడెకరాల్లోనే సాగు చేసే వాణ్ని. కానీ ఇప్పుడు ఏడెకరాల్లో వరి సాగు చేశా. మొత్తం పంటకు నీరందుతోంది. బోర్లు, బావుల వాడకం పూర్తిగా తగ్గించా’అని ఆ చెరువు పరిధిలోని ఆయకట్టు రైతు అనంతుల సత్తయ్య పేర్కొన్నారు. పెద్ద చెరువును పరిశీలిస్తున్న ఇంజనీర్లు ‘సారు'ంటే.. గుండెలు పొంగేవి! ఈ చెరువు దివంగత సాగునీటి రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్రావు స్వగ్రామం జాజిరెడ్డి గూడెంలోని తీగల చెరువు. పక్కనే మూసీ నది పారుతున్నా ఏనాడూ నిండింది లేదు. చిన్నపాటి లిఫ్టు ద్వారా ఈ చెరువు, దాని పరిధిలోని ఆయకట్టుకు నీరివ్వాలని తలంచినా సాధ్యపడలేదు. అయితే విద్యాసాగర్రావు చొరవతో ఎస్సారెస్పీ స్టేజ్–2 పనులను పూర్తి చేయడంతో ఈ చెరువు ప్రస్తుతం నిండి దీని కింద ఆయకట్టు 800 ఎకరాలు సాగులోకి వచ్చింది. ఈ చెరువులోకి నీళ్లొచ్చాకే ఇక్కడ ఎకరం భూమి రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెరిగింది. ‘నిండని చెరువుతో అరకొరగా వ్యవసాయం చేసే వాళ్లంతా నీళ్లొచ్చాక రెండు పంటలు సాగు చేస్తున్నారు. కందులు, పెసలు, పత్తి సాగు చేసే వాళ్లు వరికి మళ్లారు. ఎకరాకి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. గతంలో 8 బోర్లు వేసినా పడలేదు. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. ఎస్సారెస్పీ కాల్వల లైనింగ్ జరిగితే మరింత మేలుంటుందని గ్రామానికి చెందిన రైతులు పున్న హరిప్రసాద్, చింత నర్సయ్యలు పేర్కొన్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది నాగారం మండల పరిధిలో ఎస్సారెస్పీ కాల్వలకు దగ్గరగా కొత్తగా సాగులోకి వస్తున్న భూమి. కాల్వల్లో నీరు పారకం ఇకపై ఆగదన్న భరోసాతో ఇప్పటికే కొంత పొలంలో నాట్లు వేయగా, మరింత బీడు భూమిని సాగులోకి తెచ్చేలా రైతులు దున్నటం మొదలు పెట్టారు. ఇప్పటికే కొంత బీడు భూమిని సాగులోకి తెచ్చే యత్నాల్లో ఉండగా, ఇకముందే మొత్తం భూమిని సాగు చేస్తానని రైతులు చెబుతున్నారు. రావి చెరువు పక్కన కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని మాచవరం గ్రామంలోని రావి చెరువు. 0.24 టీఎంసీ సామర్థ్యం గల ఈ చెరువు 16 ఏళ్లలో ఏనాడూ నిండింది లేదు. దీని కింద 200 ఎకరాల ఆయకట్టు ఉండగా బోర్లు, బావుల కిందే ఆరుతడి పంటల సాగు జరిగేది. ఈ చెరువు కింద ఏనాడూ రెండో పంట వేసింది లేదు. వేసవి వస్తే బోర్లు పనిచేయక, తాగునీరు లేక ట్యాంకర్లు పెట్టి ఇంటింటికీ బిందెలను లెక్కగట్టి సరఫరా చేసేవారు. అలాంటి చెరువు ప్రస్తుత సమయంలోనూ నిండుకుండను తలపిస్తోంది. కాళేశ్వరం నుంచి 450 కి.మీ. దూరం దాటుకొని ఎస్సారెస్పీ స్టేజ్–2 కాల్వల ద్వారా వచ్చిన గోదారి జలాలతో కళకళలాడుతోంది. మూడుకిస్తామన్నా పోలే... ఇప్పుడు ఎకరా రూ. 30 లక్షలు నిర్ణీత ఆయకట్టుకు అదనంగా మరో 200 ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. నీళ్లు నిండుగా ఉండటంతో గతంలో 15–18 మీటర్ల దిగువన ఉండే భూగర్భ జలాలు ప్రస్తుతం 3 మీటర్లలోనే లభ్యతగా ఉన్నాయి. ‘16 ఏళ్లలో ఎప్పుడూ చెరువు నిండలేదు. ఎన్నోసార్లు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అవుతోంది. ఇక్కడి చెరువుల్లో చేపలు భారీగా చేరాయి. 8 నెలలు చేపలనే తింటున్నారు. ఒక్కోటి 6–8 కిలోలు ఉంటుంది’ అని గ్రామానికి చెందిన మురహరిరెడ్డి, బొబ్బయ్యలు తెలిపారు. తెలంగాణ వస్తే ఏ మొస్తుందన్న దానికి... ఈ ఊరికే చేరిన నీళ్లే తార్కాణమని ఎంపీపీ నిమ్మాది భిక్షం పేర్కొన్నారు. నీళ్ల రాకతో రూ. 3 లక్షలు కూడా రాని ఎకరా పొలం ఇప్పుడు రూ. 30 లక్షలు పలుకుతోందని చెప్పారు. తీగలచెరువు -
సూర్యాపేట జిల్లా నాగారం ఎస్ఐ దాష్టీకం...
సాక్షి, సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకు వచ్చామని పదేపదే చెబుతున్నా అదంతా మాటలకే పరిమతమన్నట్టు కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినవారిపైనే దాడులు చేస్తూ పోలీసు వ్యవస్థను అభాసుపాలు చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి, ఆర్థిక, అంగబలం ఉన్న వారి మాటే పోలీస్ స్టేషన్లో చెల్లుబాటవుతుందని సూర్యాపేట జిల్లాలోని నాగారాం ఎస్ఐ నిరూపించారు. సివిల్ కేసులో తలదూర్చడమే కాకుండా, న్యాయం చేయాలంటూ ఆశ్రయించిన రైతులపైనే ఎస్ఐ లింగం దౌర్జన్యం చేశారు. వారిని లాఠీతో చితకబాదడమే కాకుండా చెప్పినట్టు వినకుంటే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. ప్రాణభయంతో సదరు రైతులు జిల్లా ఎస్పీ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. రైతులపై దాష్టీకానికి దిగిన ఎస్ఐ లింగంపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఆయన తీరు మార్చుకోక పోవడంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నా కూడా ఆయన తీరు మాత్రం ఏ మాత్రం మారలేదు. (ప్రేమ పెళ్లి: టెకీ అనునామానాస్పద మృతి) -
విద్యుత్శాఖ కార్యాలయంలో పాము హల్చల్
సాక్షి, నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా విద్యుత్శాఖ కార్యాలయం ఆవరణలో నాగుపాము హల్చల్ చేసింది. పాత ఎస్ఈ కార్యాలయం ఎదుట ఓ ఉద్యోగి తన కారును పార్కింగ్ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వెళ్లుదామని కారు దగ్గరకు వెళ్లగానే పాము కనిపించింది. దీంతో ఉద్యోగులు, స్థానికులు పాము అంటూ అరవడంతో భయపడి అక్కడే పార్కింగ్ చేసిన కారులోకి చొచ్చుకెళ్లింది. ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో ఉద్యోగులు పాములు పట్టే నిపుణులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పామును పట్టుకుని వెళ్లారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకొని ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు. -
మేడ్చల్లో వృద్ధాశ్రమం పేరుతో చిత్రహింసలు
-
నాగారంలో దారుణం: వృద్ధులపై పైశాచికం
సాక్షి, మేడ్చల్ : జిల్లాలోని నాగారం సమీపంలోని శిల్పనగర్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చంది. వృధాశ్రమం పేరుతో అక్రమంగా సైకియాట్రిక్ పునరావాస కేంద్రాన్ని నడపుతూ.. వృద్ధులను చిత్రహింసలకు గురి చేస్తున్న వైనం ఆలస్యంగా బయటపడింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సంబంధిత నిర్వాహకులకు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మల్కాజిగిరి డిసీపీ రక్షిత మూర్తి, ఏసీపీ శివకుమార్ బాధితులను నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలం నుంచి శిల్పనగర్లో పలువురు వృద్ధాశ్రమం నడుపుతున్నారు. అయితే తెరవెనుక మాత్రం జరిగే తంతు వేరు. మానసికంగా సరిగా లేని వారిని బాగుచేస్తాం అని చెప్పి, లక్షల్లో డబ్బులు వస్తూలు చేస్తున్నారు. అంతేకాదు బాధితులకు నరకయాతన చూపిస్తూ తీవ్ర వేధింపులకు గురిస్తున్నారు. చెప్పిన మాట వినకుంటే శరీరంపై నిప్పుతో కాల్చటం లాంటి పైశాచిక చర్యలకు పాల్పడేవారని బాధితులు ఆవేదన ఆరోపిస్తున్నారు. పది నుంచి పదిహేను మంది ఉండాల్సిన గదిలో 50 మందిని నిర్బంధిస్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. మరోవైపు ఈ అక్రమ ఆశ్రమంలో యువత కుడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బరువు తగ్గడం కోసం వచ్చిన వారిని తిండి పెట్టకుండా నరకం చూపిస్తారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులను ఎదురు తిరిగి ప్రశ్నిస్తే గోలుసులతో కట్టి వేస్తారని బాధితుల మాటలో స్పష్టం అవుతోంది. దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బాధితులకు మెడికల్ పరీక్షల అనంతరం సంబంధిత కేంద్రాలకు తరలించే పనిలో ఉన్నారు. -
‘ఆ చెరువును కాపాడతా’
సాక్షి, మేడ్చల్: నాగారంలోని అన్నరాయని చెరువు పరిరక్షణకు కృషి చేస్తానని మంత్రి చామకూర మల్లారెడ్డి హామీయిచ్చారు. అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు శనివారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. చెరువును కాలుష్య కాసారంగా మార్చిన డ్రైనేజీని మళ్లించి, పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. చెరువు చుట్టూ కట్ట నిర్మించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటించాలని మంత్రికి సభ్యులు విజ్ఞప్తి చేశారు. గతంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువు అభివృద్ధి పనులకోసం విడుదలయిన నిధుల గురించి ఆరా తీస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. అప్పటికప్పుడు నాగారం మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి చెరువును పరిశీలించి పరిరక్షణ సమితి అడిగిన పనుల గురించి వివరాలు తెలియచేయలని ఆదేశించారు. పరిరక్షణ సమితి సభ్యులు ఇచ్చిన అభ్యర్థనపై మేడ్చల్-మల్కాజ్గిరి నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజినీర్ స్పందించాలని సూచించారు. మంత్రి మల్లారెడ్డిని కలిసిన వారిలో మామిడాల ప్రశాంత్, కొమిరెల్లి సుధాకర్ రెడ్డి, బోగి వెంకట్, విజయశేఖర్, వీరేశం, కృష్ణమాచార్యులు, మల్లారెడ్డి, రఘుపతి, శర్మ, వివేక్, శ్రీనివాసరెడ్డి, సుధాకర్, నరసింహులు తదితరులు ఉన్నారు. తర్వాత పరిరక్షణ సభ్యులు నాగారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి మంత్రికి ఇచ్చిన వినతిపత్రాన్ని అందించారు. -
చెరువుల పరిరక్షణకు ముందుకు రావాలి
సాక్షి, కీసర: కాలుష్యకాసారంగా తయారవుతున్న చెరువులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాల్సిన అవసరం ఉందని కీసర సీఐ నరేందర్గౌడ్ అన్నారు. ఆదివారం నాగారం అన్నరాయని చెరువును బాగు చేయాలని అన్నరాయని చెరుపు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ కాలనీవాసులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు నగర శివారులో ఉన్న చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అప్పుడే చెరువులను కాపాడుకోగలగుతామన్నారు. అన్నరాయని చెరువు ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఉండేదని, ప్రస్తుతం పూర్తిగా కాలుష్యకాసారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసులు చెరువు బాగుకోసం చేపడుతున్న కార్యాచరణకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి చెరువును బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయించాలని చెరువు పరిరక్షణ కమిటీ సభ్యులు మామిడాల ప్రశాంత్, పోడూరి శ్రీనివాస్, రాకేష్, వెంకట్, కృష్ణమాచార్యులు, మహేష్, విజయ శేఖర్, సుధాకర్రెడ్డి, సుబ్రమణ్యం, శ్యామసుందర్రెడ్డి డిమాండ్ చేశారు. చెరువును బాగు చేయడంతోపాటు, ఆహ్లాదకరంగా ఉండేలా చెరువు కట్టపై మొక్కలను నాటాలన్నారు. అన్నరాయిని చెరువు బాగుపడేంతవరకు తమ ఉద్యమాన్ని, నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తామని సభ్యులు వెల్లడించారు. తమకు మద్దతు తెలిపినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ
సాక్షి, నాగారం: స్వచ్ఛంద సంస్థ ‘బీ ద చేంజ్’ సౌజన్యంతో ఆషీ ఫౌండేషన్ సభ్యులు శనివారం నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. వీటితో పాటు వాటర్ బాటిళ్లు, పెన్నులు కూడా ఇచ్చారు. దాదాపు వంద మంది విద్యార్థులకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డితో పాటు స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు పవిత్ర, కావ్య, సౌమ్య, జయ, భార్గవ్, రామకృష్ణ పాల్గొన్నారు. పేద విద్యార్థుల చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు వలంటీర్లు తెలిపారు. జూపార్క్, చార్మినార్, గోల్కొండ కోట ప్రదేశాలకు పేద విద్యార్థులను తీసుకెళ్లి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నామని చెప్పారు. వలంటీర్లు వచ్చిన వచ్చిన వారంతా కాలేజీ విద్యార్థులే కావడం విశేషం. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వీరిని పాఠశాల సిబ్బంది అభినందించారు. తమకు ఉచితంగా బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేసినందుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. -
చెరువు పరిరక్షణ కోసం విద్యార్థుల ర్యాలీ
సాక్షి, నాగారం: అన్నరాయని చెరువును కాపాడాలని కోరుతూ నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి చెరువు వరకు ఈ ర్యాలీ సాగింది. చెరువును రక్షించుకుందామంటూ దారిపొడవునా విద్యార్థులు నినదించారు. చెరువు కట్ట మీద విద్యార్థులను కూర్చొబెట్టి అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు అవగాహన కల్పించారు. చెరువును కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, నీటి ప్రాముఖ్యాన్ని వివరించారు. గత వారం కూడా ఇదే రోజున ర్యాలీ నిర్వహించామని, వరుసగా రెండో వారం విద్యార్థులు తరలిరావడం సంతోషంగా ఉందని అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డి, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేశ్, కృష్ణమాచార్యులు, శాంప్రసాద్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 14న చక్రీపురం నుంచి చెరువు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నాగారం వాసులతో పాటు పర్యావరణ ప్రియులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కొనసాగుతున్న ఆక్రమణలు ఒకపక్క చెరువు పరిరక్షణ కోసం పాటుపడుతుంటే మరోపక్క ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఎస్వీ నగర్ రోడ్డు నంబర్ 7 వద్ద దుండగులు ఆక్రమణలకు తెర తీశారు. దీనిపై కీసర ఎమ్మార్వో, స్థానిక వీఆర్ఓలకు ఫిర్యాదు చేసినట్టు ఎస్వీనగర్ కాలనీ వాసి కొమిరెల్లి సుధాకర్రెడ్డి తెలిపారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి చెరువును కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
అన్నరాయుని చెరువును రక్షించండి
సాక్షి, కీసర: అన్నరాయుని చెరువును పరిరక్షించాలని నాగారం మున్సిపాలిటీలోని పలు కాలనీల వాసులు, హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. చెరువును కాలుష్య కాసారంగా మార్చిన మురుగునీటి పైపును మళ్లించాలని కోరారు. నాగారంలోని అన్నరాయుని చెరువును ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టు నిర్మాణానికి రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు పనులు చేపట్టలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా పూడికతీత పనులకు ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని గుర్తు చేశారు. సుందరీకరణ పనులు చేపట్టి చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. మామిడాల ప్రశాంత్, కె. సుధాకర్రెడ్డి, ఎ. శంకర్రెడ్డి, కె. శ్రీధర్, పి. వీరేశం, బి. రామకృష్ణ, వెంకట్ బోగి, ప్రవీణ్కుమార్, అమరేందర్ రెడ్డి తదితరులు ప్రజావాణికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. (అన్నరాయని చెరువు పరిరక్షణ ర్యాలీ) ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు అన్నరాయుని చెరువును కాపాడుకునేందుకు నాగారం మున్సిపాలిటీ వాసులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్థ ప్రతినిధులతో కలిసి చెరువులోని ప్లాస్టిక్ వ్యర్థ్యాలను తొలగించారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పాఠశాల విద్యార్థులు, వృద్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. కృష్ణమాచార్యులు, శ్రీనివాస్రెడ్డి, మహేశ్, రాకేశ్, సుబ్రహ్మణ్యం తదితరులు స్వయంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎత్తిపోశారు. పర్యావరణ స్పృహ ఉన్నవారు ఎవరైనా చెరువు రక్షణకు స్వచ్ఛందంగా తరలి రావాలని నాగారం వాసులు కోరుతున్నారు. -
బైక్తో పాటు బావిలో పడిన వ్యక్తి
-
198వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, మామిడికుదురు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 197వ రోజు ఆదివారం పి. గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలో జననేత పాదయాత్ర చేశారు. రేపు (సోమవారం) ఇదే మండలంలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. నగరం నుంచి రేపు ఉదయం 198వ రోజు పాదయాత్ర మొదలుపెడతారు. మామిడికుదురు, కికలపేట మీదురుగా అప్పనపల్లి క్రాస్ చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత పాశర్లపూడి, పాశర్లపూడి బాడవ వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. 197వ రోజు పాదయాత్రలో భాగంగా నగరంలో ఓఎన్జీసీ గ్యాస్ ప్రమాద బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రభుత్వం తమకు తగిన న్యాయం చేయలేదని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయం చేస్తానని జననేత వారికి హామీయిచ్చారు. వైఎస్ జగన్ ఈరోజు 8.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,414.2 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. -
అన్నరాయని చెరువును కాపాడండి
సాక్షి, నాగారం: తమ గ్రామంలోని అన్నరాయని చెరువును కాపాడాలంటూ మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం వాసులు నినదించారు. ఆదివారం చక్రీపురం కూడలి నుంచి అన్నరాయని చెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. నాగారం ఎస్వీ నగర్, విష్ణుపురి కాలనీ, సిద్ధార్థ కాలనీ వాసులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చెరువును పరిరక్షించాలంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. చెరువును కాపాడాలంటూ నినదించారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీళ్ల చెరువు కాస్తా కాలుష్య కాసారంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులోని గుర్రపు డెక్కను తొలగించి, డ్రైనేజీలను మూసీలోకి మళ్లించాలని ఎన్నో ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. మరోపక్క ఆక్రమణలతో చెరువు కుంచించుకుపోతోందని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చెరువు మాయం కావడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ.39.44 లక్షలతో అన్నరాయని చెరువు పునరుద్ధరణ, పూడికతీత పనులకు శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు మేలుకుని అన్నరాయని చెరువు పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని నాగారం గ్రామస్తులు కోరుతున్నారు. తమ ఊరి చెరువు కోసం భవిష్యత్తులోని మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. -
మానని గాయం..అందని సాయం..
నగరం దుర్ఘటనకు మూడేళ్లు.. పీడ కలలా వెన్నాడుతున్న గ్యాస్ పైప్లైన్ విస్ఫోటం నేటికీ అమలు కాని వాగ్దానాలు సాయం కోసం బాధితుల ఎదురుచూపులు అది 2014 జూన్ 27వ తేదీ..సమయం ఉదయం ఆరు గంటలు.. నగరం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) ఎదురుగా పేలుడు శబ్ధాలతో భారీ విస్ఫోటం..సుమారు 22 మంది మృత్యువాత.. 17 మందికి తీవ్రగాయాలు.. ఒళ్లంతా కాలిన గాయాలతో.. ప్రాణాలు అరచేతపట్టుకుని అంతా పరుగులుదీశారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సుమారు మూడేళ్ల క్రితం జరిగిన ఈ దుర్ఘటన ఇంకా ‘నగరం’వాసుల కళ్లముందు పీడకలలా వెంటాడుతూనే ఉంది. మూడేళ్ల క్రితం వరకు నిత్యం వినియోగదారులతో కళకళలాడే భోజన హోటళ్లు, ఆ పరిసర ప్రాంతాలు నేటికీ కళావిహీనంగానే కనిపిస్తున్నాయి. పేలుడు అనంతరం పరామర్శలకు వచ్చిన నేతలు, అధికారులు ఎడాపెడా బాధితులకు హామీలిచ్చేశారు. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడమే మరిచారు. - నగరం (మామిడికుదురు): అమలుకు నోచుకోని హామీలు.. నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతామంటూ చేసిన వాగ్దానాలు నేటికీ అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో 200 మంది ఉద్యోగులు 20 రోజులు రెండు విడతలుగా ఇంటింటా నిర్వహించిన సర్వే నివేదికలను బుట్టదాఖలు చేశారు. ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో పాటు గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. నగరంలో కమ్యూనికేషన్ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా దానికీ మోక్షం లేదు. స్థానికంగా ఉన్న పీహెచ్సీని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఆస్పత్రి అభివృద్ధికి పైసా నిధులు కూడా కేటాయించలేదు. మమ్మల్ని పట్టించుకోలేదు నాటి పేలుడులో మా కుటుంబంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాకు ఒక్కొక్కరికీ రూ.ఐదు లక్షలు పరిహారం ఇచ్చారు. నాకు నాలుగు నెలల 15 రోజులు గెయిల్ ఆధ్వర్యంలోనే చికిత్స జరిగింది. తరువాత నన్ను పట్టించుకోలేదు. తదుపరి ఆరు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాను. దానికి గాను రూ.7.25 లక్షలు ఖర్చయ్యింది. వాళ్లు ఇచ్చిన ఐదు లక్షలు పోగా అదనంగా మరో రూ.2.25 లక్షలు ఖర్చయ్యింది. ఇళ్లు దెబ్బతిన్నందుకు గాను పరిహారం ఇస్తామన్నారు. అదీ ఇవ్వలేదు. ఇప్పటికీ గెయిల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. - బోనం పెద్దిరాజు, బాధితుడు సహాయం కోసం.. పేలుడు సంఘటనలో నా కొడుకులు మోహన వెంకటకృష్ణ, మధుసూదన్, మావయ్య వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. చిన్న కొడుకు వెంకటకృష్ణ పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. రెండు చేతులు సరిగా పని చేయడం లేదు. చేతులకు ఆపరేషన్ చేయిస్తామన్నారు. దానిని పట్టించుకోవడం లేదు. ఆపరేషన్కు ఐదు లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంత ఆర్థిక స్థోమత మా కుటుంబానికి లేదు. గెయిల్ వారే ఆ ఖర్చు భరించాల్సి ఉంది. దీంతో పాటు పిల్లలకు చదువు చెప్పిస్తామన్నారు. దీనిపై నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేసినా ఫలితం లేదు. - వానరాశి దుర్గాదేవి, బాధితురాలు ఉద్యోగం ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు గెయిల్ పైప్లైన్ పేలుడులో నాన్న వానరాశి వెంకటరత్నం మృతి చెందారు. మా కుటుంబానికి ఆయనే ఆధారం. నేను డిగ్రీ చదువుకున్నా. మృతుల కుటుంబాల్లో అర్హులు ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. పేలుడు జరిగి రెండేళ్లు కావస్తున్నా నేటికీ ఆ హామీని నెరవేర్చలేదు. ఎన్నో సార్లు గెయిల్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. - వానరాశి నాగసత్యస్వామి ఇళ్లు కట్టిస్తామన్న హామీని విస్మరించారు పేలుడు సంఘటనలో మా కుటుంబంలో ఆరుగురు చనిపోయారు. సొంత స్థలంఉంటే మృతుల కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ప్రభుత్వాధికారులకు, గెయిల్ అధికారులకు ఎన్ని పర్యాయాలు విజ్ఞాపన పత్రాలు అందించినా వారు పట్టించుకోలేదు. పేలుడు జరిగిన సమయంలో మాత్రం పదే పదే మా చుట్టూ తిరిగిన అధికారులు మళ్లీ కంటికి కనిపించనే లేదు. ఇళ్లు కట్టించి ఇస్తామన్న హామీని మాత్రం విస్మరించారు. - అల్లూరి రామతులసి -
మేడిగడ్డ ద్వారానే గోదావరి జలాలు
నాగారం(తుంగతుర్తి) : మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారానే ఈ ప్రాంత ప్రజలకు గోదావరి జలాలు సాధ్యమని, అందులో భాగంగానే మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని డి.కొత్తపల్లి గ్రామ స్టేజీ వద్ద ఎస్సారెస్పీ కాల్వ సీసీ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎస్సారెస్పీ 71డీబీఎం కాల్వకు ఎనిమిది నుంచి పద్నాలుగున్నర కిలోమీటర్ వరకు రూ.10 కోట్లతో సీసీ లైనింగ్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి మేడిగడ్డ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ఎస్సారెస్పీ ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లోని బీడు భూములను సస్యశ్యామలంగా చేస్తామన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలకు 2018 నాటికి రెండు పంటలకు నీరందిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసే ప్రతి ప్రాజెక్టును కాంగ్రెస్, టీడీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని చెప్పారు. 40 సంవత్సరాల క్రితం పాలకులు హెలికాఫ్టర్ ద్వారా సర్వే చేసి కాలువలు పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారని, ఏళ్లు గడిచినా కాల్వలు పూర్తయ్యింది లేదని పేర్కొన్నారు. సమైక్య పాలనలో ఓట్ల కోసమే కాల్వలను అసంపూర్తిగా నిర్మించారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సారెస్పీ కాల్వలకు 28 తూములు ఏర్పాటు చేసి చెరువులు నింపుతామని, రూ.287 కోట్లతో ఎస్సారెస్పీ ఫేజ్–2 కాల్వ మరమ్మతులు పూర్తి చేయనున్నట్టు వివరించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం మూడేళ్లలో పూర్తిచేశామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు, ఎంపీపీ దావుల మనీషా, తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పాశం విజయయాదవరెడ్డి, ఎస్సారెస్పీ రెండో దశ ఎస్ఈ ఎ.వెంకటేశ్వర్లు, ఈఈ సుధీర్, డీఈఈలు ప్రవీణ్, రవికుమార్, సునీల్ప్రసాద్, ఏఈఈలు హరిక్రిష్ణ, బాలరాజు, కామేశ్వరి, అశోక్, జెడ్పీటీసీ పేరాల పూలమ్మ, పీఏసీఎస్ చైర్మన్ అశోక్రెడ్డి, పాశం యాదవరెడ్డి, దావుల వీరప్రసాద్, మార్కెట్ వైస్చైర్మన్ గుజ్జ యుగేందర్రావు, తహసీల్దార్ పులి సైదులు, మండల అధ్యక్షుడు గుండగాని అంబయ్య, కుంట్ల సురేందర్రెడ్డి, గుడిపాటి సైదులు, ఉప్పలయ్య, కె.శోభన్బాబు, పానుగంటి నర్సిం హారెడ్డి, సర్పంచ్లు బి.సైదులు, లక్ష్మీనర్సు, గుండగాని సోమేష్, ఎంపీటీసీ వంగూరి రజిత, శ్రీను పాల్గొన్నారు. -
ఈ విజయం ఆనందాన్నిచ్చింది
‘‘నేను, సందీప్ కలిసి చేసిన మూడో సినిమా ‘నగరం’. ఈ చిత్రానికి ఇంత మంచి ఆదరణ రావడం హ్యాపీ. ప్రేక్షకులు మా సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. విమర్శకులు సైతం బాగుందని ప్రశంసిస్తున్నారు. దర్శకుడు లోకేష్ ఈ మూవీని చక్కగా తెరకెక్కించారు. చిత్రాన్ని ఆదిరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని రెజీనా అన్నారు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ముఖ్యపాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ సమర్పణలో ఏకెఎస్ ఎంటర్టైన్మెంట్, పొటెన్షియల్ స్టూడియోస్ నిర్మించిన ‘నగరం’ గత శుక్రవారం విడుదలైంది. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా విడుదల టైమ్లో నేను, రెజీనా వేరే సినిమా షూటింగ్ కోసం మలేసియాలో ఉన్నాం. ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నారని తెలిసి, ఆనందపడ్డాం. కథ బాగుండటంవల్లే ఈ విజయం. కొన్ని కారణాల వల్ల ‘నగరం’ ఆలస్యంగా విడుదలైంది. అయినా తెలుగు, తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. తెలుగు హీరోకు తమిళంలో ఇంత పెద్ద సక్సెస్ రావడం, రెండో వారంలో మరిన్ని థియేటర్స్ పెరగడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. -
నగరం నాకు రిలీఫ్ ఇచ్చింది
‘నగరం’ కథ విన్నప్పుడే, ఆ కాన్సెప్ట్కి కనెక్ట్ అయిపోయా. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ కావడంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, మధుసూదన్ ముఖ్య పాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘నగరం’ ఈరోజు విడుదలవుతోంది. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ప్రతి మనిషిలో మంచీ, చెడూ ఉంటాయి.. వారిలోని మంచితనం కరెక్ట్ టైమ్కి బయటపడితే బాగుంటుంది’ అన్నదే ‘నగరం’ కథ. ఈ యూనిట్ అంతా కొత్తవారే. సినిమాపై ఉన్న ప్యాషన్తో ఉద్యోగాలు వదులుకుని మరీ తీశారు. ఒక మంచి డైరెక్టర్ నా చిత్రం ద్వారా పరిచయమవుతున్నందుకు గర్వంగా ఉంది. నా గత చిత్రాలు ‘రన్, ఒక్క అమ్మాయి తప్ప’ సరిగ్గా ఆడలేదు. దాంతో నాపై నాకే డౌట్ వేసింది. నేను సరైన కథలను ఎంచుకుంటున్నానా? అని. ‘నగరం’ ప్రివ్యూ చూసిన తెలుగు, తమిళ పరిశ్రమ పెద్దలు ‘చాలా బాగుంది’ అని అభినందిస్తుంటే రిలీఫ్ అనిపించింది. -
‘నగరం’ మూవీ స్టిల్స్
-
నాలుగు జీవితాలు 48 గంటలు...!
నాలుగు జీవితాలు.. మూడు కోణాలు.. రెండు ప్రేమకథలు... 48 గంటల్లో ఊహించని మార్పులు.. అవన్నీ ‘నగరం’లోనే ఉన్నాయి. ఆ ఢిపరెంట్ కాన్సెప్ట్ ఏంటో చూడాలంటే ఈ నెల 10 వరకు వెయిట్ చేయ్యాల్సిందే. ఏకేఎస్ ఎంటర్టైన్ మెంట్, పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్లపై లోకేశ్ దర్శకత్వం లో రూపొందిన చిత్రం ‘నగరం’. జంటగా నటించారు. చిత్రనిర్మాత అశ్వనికుమార్ సహదేవ్ మాట్లాడుతూ– ‘‘నలుగురు వ్యక్తుల మధ్య ఒక నగరంలో 48 గంటల్లో జరిగే కథ ఇది. సందీప్ కిషన్ది ఒక స్టోరి. రెజీనాది ఇంకో కథ. శ్రీ అనే వ్యక్తిది మరో స్టోరి. ఈ ముగ్గురినీ కలిపే డ్రైవర్ పాత్ర ఇంకొకటి. స్క్రీన్ప్లే బేస్డ్ చిత్రం. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నాం. తమిళంలో ‘మానగరం’గా రిలీజ్ అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: జావేద్ రియాజ్, కెమెరా: సెల్వకుమార్ ఎస్కె, ఎడిటింగ్: గౌతంరాజు. -
ఆరు టిఫిన్ బాంబులు లభ్యం
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని డి.నాగారం గ్రామ శివారులో ఆదివారం పోలీసులకు ఆరు టిఫిన్ బాంబులు లభ్యమయ్యాయి. డి.నాగారం గ్రామం నుంచి అల్లాపురం గ్రామానికి వెళ్లడానికి గతంలో పాత బాట ఉండేది. ఈ ప్రాంతమంతా గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో, బాటలో మావోయిస్టులు ఈ బాంబులను ఏర్పాటు చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షానికి మట్టి కొట్టుకుపోయి ఇవి పైకి కనిపించాయి. ఇవి పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. స్థానిక రైతులు గుర్తించి చౌటుప్పల్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ సిబ్బందితో వెళ్లి ఆరు టిఫిన్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 15ఏళ్ల క్రితం ఏర్పాటు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పీపల్పహడ్ గ్రామం నుంచి అల్లాపురం గ్రామానికి ప్రత్యేక బాటను ఏర్పాటు చేయడంతో 12ఏళ్లుగా ఈ బాటను ఉపయోగించడం లేదు. ఆరు టిఫిన్ బాంబులను జిల్లా పోలీసు కేంద్రానికి తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
గోడ కూలి ఒకరు మృతి
నెక్కొండ : ఇంటి గోడను కూలుస్తుండగా మీదపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాగారం గ్రామంలో మంగళవారం సా యంత్రం జరిగింది. గ్రామానికి చెందిన పూర్ణకంటి యాకయ్య(50) ఉదయాన్నే అదే గ్రామానికి చిదురాల యాకూబ్కు చెందిన పాత ఇంటి ని కూల్చేందుకు కూలీకి వెళ్లాడు. ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్లే కొద్ది సమయం ముందు ఇల్లును ధ్వంసం చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మీద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృ తుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
నాగారం గ్రామంలో చోరీ
కీసర (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామంలో ఓ ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదును మాయం చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరగ్గా గురువారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామం లక్ష్మీనగర్ కాలనీ నివాసి పాండు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం భువనగిరి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సంగతి పసిగట్టిన దొంగలు రాత్రి ఇంట్లోకి చొరబడి బీరువాను పగులగొట్టి అందులోని 6 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి, 31 వేల నగదును ఎత్తుకుపోయారు. పాండు కుటుంబసభ్యులు గురువారం మధ్యాహ్నం ఇంటికి చేరుకుని చూడగా చోరీ సంగతి తెలిసింది. ఈ మేరకు వారు కీసర పోలీసులకు సమాచారం అందించారు. -
శవమై తేలిన బాలుడు
నగరం: గుంటూరు జిల్లా నగరం మండలం చిరకాలవారిపాలెం గ్రామంలోని చెరువులో ఆదివారం సాయంత్రం ఓ బాలుడి మృతదే హం లభ్యమైంది. మృతుడు నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన పమిడిమర్రు గ్రామానికి చెందిన ఆలమూరు ప్రమోద్(15) గా గుర్తించారు. ప్రమోద్కు మతిస్థిమితం సరిగా ఉండదు అని గ్రామస్తులు తెలిపారు. నాలుగు రోజులు క్రితమే ప్రమోద్ తల్లిదండ్రులు బాలుడు కనిపించటంలేదని నగరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
క్రైమ్ స్క్రీన్ప్లే!
అబ్బాయిని క్రూరంగా చంపేసిన బాబాయ్ రాకేశ్ రెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు నేరేడ్మెట్(సికింద్రాబాద్): అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఓ బాబాయ్ తనతో చనువుగా ఉండే అబ్బాయ్ని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని భావించాడు... తన గదికి వచ్చిన ఆ అబ్బాయ్ కిడ్నాప్కు గురైనట్లు నాటకానికి తెరలేపాడు.... పథకం పారదని తెలిసి క్రూరంగా హత్య చేసి... ఆ అబ్బాయ్ బావ మీద అనుమానం వచ్చేలా చేశాడు... ఇంత కథనడిపించినా... పోలీసుల చాకచక్యంగా వ్యవహరించడంతో ఎట్టకేలకు చిక్కి కటకటాల్లోకి చేరాడు... జవహర్నగర్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరి కథనం ప్రకారం... * నాగారం శ్రీశ్రీనివాసనగర్ కాలనీకి చెందిన కె. బాల్రెడ్డి కుమారుడు రాకేష్రెడ్డి (29) విదేశాల్లో విద్యనభ్యసించి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడం, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. రాకేష్రెడ్డి సోదరి, బావల మధ్య గొడవలతో మానసికంగా కుంగిపోయాడు. * కరీంనగర్ జిల్లాకు చెందిన కె.శ్రీధర్రెడ్డి (40) రాకేష్కు బాబాయి. చిన్నతనం నుంచి ఇతడితో చనువుగా ఉండేవాడు. శ్రీధర్రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి పలువురి వద్ద నుండి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఈ బాధితుల్లో రాకేష్రెడ్డి ద్వారా వచ్చిన అతడి మిత్రులూ ఉన్నారు. ఈ డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి రావడంతో అక్టోబర్ మొదటి వారంలో ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. * శ్రీధర్రెడ్డి ఈ నెల 21న కరీంనగర్ నుంచి కాప్రా సాకేత్లో ఉండే బంధువు హరీష్రెడ్డి ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రాకేష్ కూడా అక్కడకు వచ్చాడు. 22న హరీష్రెడ్డి అనంతపూర్ వెళ్ళగా... రాకేష్ 23న తన ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేశాడు. * ఇంట్లో సమస్యల నేపథ్యంలో మనశ్శాంతి కోసం వచ్చానని శ్రీధర్రెడ్డితో చెప్పాడు. రాకేష్రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు అతని కుటుంబీకులకు మేసేజ్ పంపితే... సోదరి భర్తతో ఉన్న వైరం కారణంగా అతడి పైనే అనుమానం వస్తుందని పథకం వేశాడు. అలా వచ్చే డబ్బుతో కొన్ని అప్పులు తీర్చుకోవచ్చని భావించాడు. మధ్యాహ్నం రాకేష్ నిద్రపోతున్నప్పుడు అతడి ఫోన్తోనే తండ్రి బాల్రెడ్డికి రూ.8 లక్షలు డిమాండ్ చేస్తూ మెసెజ్ పంపాడు. * ఈ ఎస్సెమ్మెస్ అందుకుని తీవ్ర ఆందోళనకు గురైన రాకేష్ కుటుంబ సభ్యులు పదేపదే రాకేష్ఫోన్కు కాల్స్ చేశారు. రాకేష్ నిద్రలేస్తే కిడ్నాప్ నాటకం బయటపడి, పరువుపోతుందని భావించిన శ్రీధర్... ఇంట్లోని కత్తితో నిద్రతో ఉన్న రాకేష్ మెడపై పొడవటంతో పాటు కడుపులో పలుమార్లు పొడిచి చంపేశాడు. కొద్దిసేపటికి బాల్రెడ్డి ఫోన్కు ‘రాత్ 9 బజే 8 లాక్స్ చాహియే గాడి ఐసిఐసిఐకే ఆగె గడ్బడ్ మత్కర్నా ఆప్కి ఇచ్చా’ (రాత్రి 9 గంటలకు 8 లక్షలు కావాలి ఎవరి ముందు గడబిడ చేయవద్దు) అని మరో సందేశం పంపాడు. * రాకేష్ మృతదేహాన్ని మాయం చేసేందుకు ఓ మిత్రుడి సహాయం కోరి భంగపడిన శ్రీధర్ గత్యంతరం లేక అదే రోజు రాత్రి బాల్రెడ్డికి ఫోన్ చేసి మీ కుమారుడు హరీష్రెడ్డి ఇంట్లో చనిపోయి పడి ఉన్నాడని చెప్పాడు. అప్పటికే బాల్రెడ్డి కీసర పోలీసులకు కుమారుడి అదృశ్యం, ఎస్సెమ్మెస్లపై ఫిర్యాదు చేశారు. శ్రీధర్ నుంచి ఫోన్ రావడంతో జవహర్నగర్ పోలీసులకూ సమాచారం ఇచ్చారు. * దర్యాప్తు చేపట్టిన జవహర్నగర్ పోలీసులు హత్యాస్థలికి వచ్చిన దగ్గర నుంచి శ్రీధర్ ప్రవర్తన అసాధారణంగా మారిపోయింది. పోలీసు జాగిలాలు వస్తున్నాయని తెలిసి అనారోగ్యమంటూ అక్కడి నుంచి జారుకుని ఓ ఆస్పత్రిలో చేరాడు. తరచు హత్యాస్థలిలో ఉన్న రాకేష్ కుటుంబీకులకు ఫోన్లు చేస్తూ పోలీసులు వెళ్ళారా? జాగిలాలు ఏం చేశాయి? అంటూ అడిగాడు. * హత్యాస్థలిలో ప్రవర్తన, జాగిలాలు ఏం చేస్తున్నాయంటూ అత్యుత్సాహం ప్రదర్శించడం తదితర చర్యలతో పోలీసులకు శ్రీధర్పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతని వద్ద నుండి రాకేష్కు చెందిన సెల్ఫోన్లు, బైక్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకుని మంగళవారం రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన ఏసీపీ సయ్యద్ రఫీక్, జవహర్నగర్ ఇన్స్పెక్టర్ పి.వెంకటగిరి, సిబ్బందిని డీసీపీ రమారాజేశ్వరి అభినందించారు. -
నేటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకం
-
నేటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకం
కలల్ని కబళించిన కీలలు నిశ్చింతతో కూడిన జీవితానికి చిరునామాగా పేరొందిన సీమ.. మృత్యుధామంగా మారి నేటికి ఏడాది. బాలసూర్యుడు తొంగి చూడడానికి ముందే.. కాలయముడు తాండవమాడి నేటికి ఏడాది. కలలు కంటున్న వారిని కీలలు కబళించి నేటికి ఏడాది. చుట్టలు చుట్టుకున్న లోహసర్పం లాంటి పైపులైన్..విస్ఫోటించి 22 నిండు ప్రాణాల్ని కాటేసి నేటికి ఏడాది. గత సంవత్సరం జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో ‘గెయిల్’ పైపులైన్ పేలి విలయం సృష్టించింది. ఆ విషాదస్మృతులపై... చెవులు చిల్లులు పడే విస్ఫోటంతో.. ఉన్నట్టుండి ఒక్కసారిగా చుట్టుముట్టిన అగ్ని జ్వాలలు.. కాలిబూడిదైన పరిసరాలు, పశువులు, పక్షులు.. ఎక్కడ ఎలా ఉన్నవారు అలాగే సజీవదహనమైపోయిన మనుషులు.. తీవ్రమైన కాలిన గాయాలతో బాధితుల హాహాకారాలు, రోదనలు.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున నగరం గ్రామంలో నెలకొన్న హృదయవిదారక పరిస్థితి ఇది. నాటి చేదు అనుభవాల నుంచి గ్రామం ఇంకా తేరుకోలేదు. ఆ విషాదాగ్ని రేపిన గాయాల మంటతో నగరం వాసుల గుండెలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. నగరం (మామిడికుదురు) : సరిగ్గా ఏడాది క్రితం జూన్ 27 ఉదయం 5.30 గంటలు.. ఇంకా తెలవారలేదు. నగరం గ్రామమంతా గాఢంగా నిద్రిస్తున్న వేళ.. ఒక్కసారిగా భారీ శబ్దం.. గెయిల్ గ్యాస్ పైప్లైన్ విస్ఫోటం.. క్షణాల్లో మృత్యు జ్వాలలు గ్రామంపై విరుచుకుపడ్డాయి. ఏం జరుగుతోందో తెలిసేలోపే 16మంది ఎక్కడ ఉన్నవారు అక్కడే మృత్యుకీలలకు సజీవంగా ఆహుతైపోయారు. వీరిలో కొందరు నిద్రలోనే శాశ్వత నిద్రకు వెళ్లిపోయారు. మరో ఆరుగురు తరువాత వివిధ ఆస్పత్రుల్లో కన్నుమూశారు. మరికొందరు కాలిన గాయాలతో ప్రాణాలరచేత పట్టుకుని పరుగులు తీశారు. హాహాకారాలు, రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. సంఘటన జరిగిన రోజున చెట్లు చేమలు, ఇళ్లు, పశువులు, పక్షులూ అన్నీ కాలి బూడిదైపోయాయి. 17 మంది తీవ్రంగా గాయపడి జీవచ్ఛవాల్లా మిగిలారు. ఆ రోజును తలుచుకుంటే నగరం గ్రామం ఇప్పటికీ ఉలిక్కిపడుతోంది. నాటి భయంకర జ్ఞాపకాలు నేటికీ కళ్లెదుట మెదులుతున్నాయని స్థానికులు కన్నీళ్లతో చెబుతున్నారు. పచ్చగా కళకళలాడిన గ్రామం ఎండిన మోడులా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగితాలకే పరిమితమైన మోడల్ విలేజ్ హామీ ఈ ఘోర విషాదం తర్వాత నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతామంటూ పాలకులు చేసిన హామీల హంగామా కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో 200 మంది ఉద్యోగులు 20 రోజులు రెండు విడతలుగా ఇంటింటా సర్వే నిర్వహించారు. గ్రామస్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సర్వే చేసి, ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దీని ఆధారంగా గ్రామాన్ని గెయిల్ చేత అభివృద్ధి చేసి మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ ఘోరకలి జరిగి ఏడాది కావస్తున్నా.. ఆ హామీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. విస్ఫోటంవల్ల ఏర్పడిన గొయ్యినీ పూడ్చలేదు పైప్లైన్ విస్ఫోటం వల్ల ఆ ప్రాంతంలో రోడ్డు మధ్యన సుమారు 10 అడుగుల లోతున పెద్ద గొయ్యి ఏర్పడింది. దీనిని ఇంతవరకూ పూడ్చలేదు. దీంతో స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్ఘటన జరిగి ఏడాది కావస్తున్నా దీనిని పూడ్చకపోవడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.6వేల వంతునే పరిహారం ఇచ్చారు విస్ఫోటంలో దెబ్బతిన్న 1,316 కొబ్బరి చెట్లకు రూ.8 వేల చొప్పున పరిహారం ఇస్తామని తొలుత హామీ ఇచ్చిన గెయిల్ చివరకు రూ.6 వేల చొప్పునే ఇచ్చింది. వీటితోపాటు మంటల్లో దెబ్బతిన్న 125 కొబ్బరి చెట్లకు పరిహారం ఇవ్వాలని రెండో విడత సర్వేలో నిర్ణయించారు. కానీ ఇంతవరకూ ఆ పరిహారం ఇవ్వనే లేదు. కాలిపోయిన మట్టిని తొలగించి దాని స్థానే ఉపాధి హామీ పథకంలో కొత్త మట్టి కప్పి ఇస్తామన్నారు. అదీ అమలుకు నోచుకోలేదు. మాకు జీవనోపాధి కల్పించాలి మా కుటుంబంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాకు ఇది పునర్జన్మ. కాకినాడ ఆస్పత్రిలో నాలుగు నెలలు చికిత్స పొంది ఇంటికి వచ్చా. నాకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తామంటున్నారు. చెన్నై రావాలని చెబుతున్నారు. నా కుటుంబానికి నేనే ఆధారం. ముందుగా మా కుటుంబానికి జీవనోపాధి కల్పిస్తే సర్జరీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. - బోనం పెద్దిరాజు, బాధితుడు నా బిడ్డ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది విస్ఫోటంలో నాతోపాటు నా కొడుకులు మోహన వెంకటకృష్ణ, మధుసూదన్, మావయ్య వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాం. నా కొడుకు వెంకటకృష్ణ పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరమే. వాడికి మూడు ఆపరేషన్లు చేయించారు. మరో ఆపరేషన్ చేయాల్సి ఉంది. చిన్న వయస్సు కావడంతో ఏడాది తరువాత చేస్తామన్నారు. పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత గెయిల్ తీసుకోవాలి. - వానరాశి దుర్గాదేవి, బాధితురాలు చాలా హామీలు నెరవేర్చాం బాధితులకు ఇచ్చిన హామీలను చాలావరకూ నెరవేర్చాం. నగరం ఘటనతో కేజీ బేసిన్లో పైప్లైన్ నెట్వర్క్ను శక్తిమంతంగా చేస్తున్నాం. మధ్యకాలిక చర్యల్లో భాగంగా రూ.419 కోట్లతో 90 కిలోమీటర్ల మేర తాటిపాక-చించినాడ పైప్లైన్ మార్పిడి పనులు నిర్వహిస్తున్నాం. నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్గా అభివృద్ధి చేసేందుకు రూ.2 కోట్ల విలువ చేసే కార్యకలాపాలకు గెయిల్ ఆమోదం తెలిపింది. త్వరలో ఈ పనులు చేపడతాం. మామిడికుదురులో నిరుద్యోగుల కోసం రూ.1.35 కోట్లతో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశాం. ప్రభుత్వాధికారుల సిఫారసు మేరకు అర్హులకు ఉద్యోగాలు ఇస్తాం. రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికెట్లు అందగానే మంటల్లో దెబ్బ తిన్న 125 కొబ్బరి చెట్లకు మరో రూ.2వేల పరిహారం చెల్లిస్తాం. నగరం, రాజోలు ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి రూ.25 లక్షలు విడుదల చేశాం. మరో రూ.25 లక్షల విడుదలకు ఆమోదం తెలిపాం. రూ.36 లక్షలతో మొబైల్ మెడికల్ వ్యాన్ ఏర్పాటు చేశాం. గెయిల్ కార్యకలాపాలపై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు 80 గ్రామాల్లో బుర్రకథల ద్వారా ప్రచారం నిర్వహించాం. గతంలో ఉండే 11 అంకెల టోల్ ఫ్రీ నంబర్ స్థానే అయిదు అంకెలతో (15101) టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. వీటితోపాటు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాం. - ఎంవీ అయ్యర్, డీజీఎం, గెయిల్ ఏడాదైనా అసంపూర్తిగానే.. మలికిపురం/అమలాపురం టౌన్ : మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్లైన్ విస్ఫోటం జరిగి ఏడాదవుతున్నా.. అక్కడి పరిస్థితులను అటు గెయిల్ సంస్థ కానీ, ఇటు ప్రభుత్వం కానీ పూర్తిస్థాయిలో చక్కదిద్దలేదు. ఇది కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గండంగా మారింది. పైప్లైన్ పేలుడు తరువాత ఏడాదిలోగా అన్నింటినీ పునరుద్ధరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ నేటికీ నెరవేరలేదు. దీనికి బాధ్యత వహించాల్సిన గెయిల్ సంస్థ కూడా అధునాతన సాంకేతిక ప్రక్రియతో పైప్లైన్లు పునరుద్ధరించి, గ్యాస్ సరఫరాను పెంచి, పరిశ్రమల విస్తరణకు చేయాల్సిన కృషిని కూడా విస్మరించినట్టు కనిపిస్తోంది. దెబ్బతిన్న పైప్లైన్లను కొంతమేర ఆధునికీకరించారు. కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. విద్యుదుత్పత్తిపై పెను ప్రభావం నగరం పైప్లైన్ పేలుడు ప్రభావం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. పేలుడుకు ముందు నగరం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్) నుంచి ఈ మూడు జిల్లాల్లోని విద్యుదుత్పత్తి కేంద్రాలకు గ్యాస్ సరఫరా అయ్యేది. పేలుడు తరువాత గ్యాస్ సరఫరాను 50 శాతం మాత్రమే పునరుద్ధరించారు. మిగిలిన 50 శాతం నేటికీ పునరుద్ధరణ కాలేదు. ఈ ప్రభావం కొత్త పరిశ్రమల ఏర్పాటుపై తీవ్రంగా పడింది. తెలంగాణ రాష్ట్రం విడిపోవడంతో మన రాష్ట్రానికి మిగులు విద్యుత్ రావడంతో ఆ ప్రభావం రాష్ట్ర విద్యుత్ రంగంపై పెద్దగా కనిపించలేదు. అదే ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే నగరం విస్ఫోటం పర్యవసానానికి విద్యుత్ పరంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చి ఉండేది. నగరం నుంచి పూర్తిస్థాయి గ్యాస్ సరఫరాకు ఎంత సమయం పడుతుంది, ఏ మేరకు విద్యుదుత్పత్తి జరుగుతుందనేదానిపై గెయిల్ అధికారులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. నష్టం ఇలా.. నగరం పేలుడు అనంతరం తొలి ఆర్నెల్లూ రోజుకు 30 లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ నుంచి సరఫరా లేకపోవడంతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలు పవర్ ప్రాజెక్టులు పని చేయకుండా పోయాయి. తరువాత ఆరు నెలల్లో కేంద్రం తీసుకున్న చర్యలతో రోజుకు 16 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరాను దశలవారీగా పునరుద్ధరించగలిగారు. ఈ చర్యలతో 50 శాతం ఉత్పత్తి మెరుగు పడింది. పూర్తిస్థాయి ఉత్పత్తి జరగాలంటే రోజుకు మరో 14 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా జరగాల్సి ఉంది. తొలి ఆర్నెల్ల కాలంలో ఓఎన్జీసీ రోజుకు రూ.2 కోట్ల చొప్పున రూ.360 కోట్ల మేర ఆదాయం కోల్పోయింది. అదే సమయంలో ఓఎన్జీసీ నుంచి గ్యాస్ కొనుగోలు చేసే గెయిల్ సంస్థ కూడా రూ.200 కోట్ల ఆదాయం కోల్పోయినట్టు ఆ వర్గాలు ద్వారా తెలుస్తోంది. తరువాతి ఆర్నెల్లలో రోజుకు రూ.కోటి చొప్పున రూ.180 కోట్ల మేర గెయిల్ ఆదాయం కోల్పోయింది. సరఫరా అవుతున్న గ్యాస్లో నీరు, మలినాలవల్ల పైప్లైన్లు త్వరగా పాడైపోతున్నాయని భావించి మరింత నాణ్యమైన గ్యాస్ అందించాలని ఓఎన్జీసీని గెయిల్ కోరింది. అప్పటివరకు గ్యాస్ కొనుగోలు నిలిపివేసింది. దీంతో ఓఎన్జీసీ కూడా అధునాతన మిషన్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ కారణంగా ఆరు నెలలుగా 14 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. మందకొడిగా పైప్లైన్ మరమ్మతులు విస్ఫోటానికి కారణమైన పైప్లైన్లకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో మరమ్మతులు చేపట్టారు. పాత పైప్లైన్ల స్థానే కొత్తవి వేసే పనులకు గెయిల్ సంస్థ రూ.వెయ్యి కోట్లతో టెండర్లు పిలిచింది. పలు కాంట్రాక్ట్ సంస్థలకు ఆ పనులను అప్పగించింది. ఈ పైప్లైన్ పనులు జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకం కలుగుతోంది. -
చాక్లెట్ ఆశ చూపి...చిన్నారిపై అత్యాచారం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన గిడుగు రాజు(45) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలు.... విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన ఓ కుటుంబం మండలంలోని నగరం గ్రామంలో ఇటుక బట్టీల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వారి కూమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. స్కూల్ పక్కనే నివాసముండే గిడుగు రాజు అనే వ్యక్తి బాలికకు చాక్లెట్ల ఆశ చూపి వారం రోజులుగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బుధవారం నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. (మామిడికుదురు) -
నగరం.. మానని గాయం
-
తూర్పుపాలెంలో పేలిన ట్రాన్స్ఫార్మర్
మలికిపురం : తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో సోమవారం ఉదయం జీసీఎస్లో ట్రాన్స్ఫార్మర్ పేలింది. దాంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. మంటలు చమురు ట్యాంకులకు వ్యాపించకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కాగా నగరం ఘటన మరవక ముందే ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. -
నగరం ఘటనపై కేంద్రం, గెయిల్కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనలో కేంద్ర ప్రభుత్వం, పెట్రోలియం శాఖ, గెయిల్కు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. నగరం ప్రమాదంలో 21మంది మృతి చెందారు. జూన్ 27న 13 మంది సజీవ దహనం కాగా ఇద్దరు కిమ్స్ ఆస్పత్రిలో, ఐదుగురు కాకినాడ అపోలో ఆస్పత్రిలో చనిపోయిన సంగతి తెలిసిందే. -
గెయిల్ దుర్ఘటన బాధితులకు వైఎస్ఆర్ సీపీ సాయం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా నగరం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలిన దుర్ఘటన బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం అందజేసింది. మృతుల కుటుంబ సభ్యులకు లక్ష రూపాయిల ఎక్స్గ్రేసియా, గాయిపడినవారికి 25 వేల రూపాయిల చొప్పున వైఎస్ఆర్ సీపీ సాయం చేసింది. నాణ్యత లోపం వల్లే నగరం ప్రమాదం జరిగిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పైపులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామని జ్యోతుల నెహ్రూ చెప్పారు. -
'నగరం'ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మామిడికుదురు : 'నగరం' గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆమె గెయిల్, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నలుగురు డైరెక్టర్లతో ఓ బృందం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బృందం 15 రోజులు నగరంలో పర్యటించి వివిధ అంశాలపై పరిశీలన జరిపి నివేదిక అందచేస్తుందని పేర్కొన్నారు. దాని ఆధారంగా గెయిల్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుందన్నారు. ఈ నెల 6న వాహనాలు, పంటలు కోల్పోయిన బాధితులకు రూ.1.02 కోట్ల పరిహారాన్ని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అందచేస్తారన్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి పైప్ లైన్ నమునా శాంపిల్ పంపించాలని పెట్రోలియం శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. -
21కి చేరిన ‘నగరం’ మృతుల సంఖ్య
ఇంకా ఐదుగురి పరిస్థితి విషమం కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనలో మంగళవారం అర్ధరాత్రి మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరింది. సంఘటన జరిగిన జూన్ 27న 13 మంది సజీవ దహనం కాగా ఇద్దరు కిమ్స్ ఆస్పత్రిలో, ఐదుగురు కాకినాడ అపోలో ఆస్పత్రిలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వానరాశి వెంకటరత్నం (46) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ప్రస్తుతం కాకినాడ అపోలోలో ఆరుగురు, ట్రస్ట్లో ఆరుగురు, సాయిసుధలో ఒకరు చికిత్స పొందుతున్నారు. వారిలో మరో ఐదుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు వైద్యులుచెబుతున్నారు. -
గెయిల్ పైప్లైన్ మార్చడం కుదరదు
కోనసీమ ప్రాంతంలో ఇప్పుడున్న గెయిల్ పైప్లైన్ వ్యవస్థను మార్చడం కుదరదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అయితే కొత్తగా వేసే పైప్లైన్లను మాత్రం జనావాసాలకు దూరంగా వేయాలని సూచించామన్నారు. బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని గెయిల్కు తెలిపామని.. అలాగే, మృతుల కుటుంబాల్లో అర్హులకు గెయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. గెయిల్ ప్రమాద ఘటనలో ఊహించని ప్రాణనష్టం జరిగిందని చినరాజప్ప చెప్పారు. పరిసర గ్రామాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గెయిల్ను ఆదేశించామన్నారు. ఇప్పుడున్న పైప్లైన్ కాలపరిమితి ముగిసిందని తాము భావిస్తున్నామని, ఈ విషయాన్ని తేల్చేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించామని, కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
గెయిల్ బాధితులకు పరిహారం పంపిణీ
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ గ్యాస్ పైపులైను పేలిన సంఘటనలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం పంపిణీ చేశారు. హోంశాఖ మంత్రి చినరాజప్ప, గెయిల్ ప్రతినిధులు నష్టపరిహారం అందజేశారు. నగరం గ్రామాన్ని దత్తత తీసుకుంటామని గెయిల్ ప్రతినిధులు చెప్పారు. నగరాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గెయిల్ దుర్ఘటనలో 21 మంది మరణించగా, మరికొందరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. -
బ్లో అవుట్ దెబ్బకు 180 మెగావాట్ల విద్యుత్ ఫట్!
హైదరాబాద్:ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గెయిల్ గ్యాసు బ్లో అవుట్ దెబ్బ కాస్తా విద్యుత్ ఉత్పత్తిపై పడింది. లీకేజీ అయిన గెయిల్ ప్రధాన ట్రంకు లైను నుంచి నేరుగా ల్యాంకో ప్లాంటుకు గ్యాసు సరఫరా అవుతోంది. ఈ ప్లాంటుకు ఇప్పటివరకు రోజుకు 0.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాసు (ఎంసీఎండీ) సరఫరా అయ్యేది. తాజా బ్లో అవుట్తో ఇది నిలిచిపోయింది. ఫలితంగా 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా జీవీకే, రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ గ్యాసు పవర్ కంపెనీ (ఏపీజీపీసీఎల్), స్పెక్ట్రమ్... మొత్తం నాలుగు గ్యాసు ఆధారిత ప్లాంట్లకు ఇదే లైను ద్వారా కొద్ది మొత్తంలో గ్యాసు సరఫరా అవుతోంది. ఇది కూడా తాజా ఘటనతో నిలిచిపోయింది. ఫలితంగా మరో 40 మెగావాట్ల విద్యుత్ నష్టపోయినట్టు ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే గ్యాసు బ్లో అవుట్ దెబ్బకు మొత్తం 180 మెగావాట్ల విద్యుత్ను ఇరు రాష్ట్రాలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ గ్యాసు ప్లాంట్లతో పీపీఏ అమలులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ వాటా 97 మెగావాట్లు కాగా ఆంధ్రప్రదేశ్ వాటా 83 మెగావాట్లు. -
జీసీఎస్ గ్రీన్బెల్టులో స్వల్పంగా గ్యాస్ లీక్
మామిడికుదురు(తూర్పుగోదావరి జిల్లా): గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటన నుంచి తేరుకోకముందే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసీ గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) గ్రీన్బెల్ట్ ఏరియాలో స్వల్పంగా గ్యాస్ లీక్ అవడం స్థానికులను ఆదివారం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. రాజోలు మండలం పొన్నమండ-8 బావి నుంచి జీసీఎస్కు చమురు, సహజవాయు నిక్షేపాలను తరలించే పైపులైన్ నుంచి ఈ లీకేజీ జరిగింది. పొగ మాదిరిగా సహజవాయువుతోపాటు కొద్దిపాటి ముడిచమురు లీకవుతున్నట్టు స్థానికులు ఆదివారం సాయంత్రం గుర్తించారు. పదిరోజులుగా ఇది కొనసాగుతున్నట్టు సమాచారం. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఓఎన్జీసీ వైఖరిని నిరసిస్తూ 216 జాతీయ రహదారిపై ఆదివారం ధర్నాకు దిగారు. అయితే ఉత్పత్తి నిలిపివేసిన బావి నుంచి లీకేజీ వస్తోందని, అయినప్పటికీ లీకేజీని ఆపేశామని ఓఎన్జీసీ అధికారులు చెప్పారు. -
కునుకు లేకుండా చేస్తున్న మరో పైపులైన్
మామిడికుదురు: ‘నగరం’ మహా విస్ఫోటం కళ్లముందు కదలాడుతుండడంతో.. గెయిల్ సంస్థ తమ ఊళ్ల నుంచి వేసిన గ్యాస్ పైపులైన్లు నగరం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తరచూ అవి లీకవుతూ ఉండడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని తాటిపాక-కాకినాడ ట్రంక్ పైపులైన్ తరచూ మరమ్మతులకు గురవడం స్థానికులను భయానికి గురి చేస్తోంది. ఈ లైన్ వెళ్తున్న పాశర్లపూడిలో పైపులైన్లకు వారం రోజుల వ్యవధిలో కేవలం 500 మీటర్ల పరిధిలోనే ఆరుచోట్ల మరమ్మతులు చేశారు. భూమికి అయిదున్నర అడుగుల లోతులో ఏర్పాటు చేసిన 18 అంగుళాల పైపులైన్ల ద్వారా నిత్యం ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల సహజ వాయువు సరఫరా చేస్తున్నారు. నగరం నుంచి కాకినాడ వరకూ ఒకటి, తాటిపాక నుంచి సామర్లకోట వరకూ మరొకటి ఈ పైపులైన్లు ఉన్నాయి. ఈ లైన్లలో ఎక్కడ లీకేజీలున్నా దానిని గుర్తించే యూనిట్ తాటిపాక టెర్మినల్లో ఉంది. ఆ పైపులు తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, భారీ విధ్వంసానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. విజయవాడ ల్యాంకో ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేస్తున్న ఈ పైపులైన్ కంట్రోల్ యూనిట్ వాల్వ్ 10 కిలో మీటర్ల దూరంలోని దిండి గ్రామంలో ఉంది. ప్రమాద సమయానికి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగి అందుబాటులో లేకపోవడమే విస్ఫోటానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీక్పై ఆందోళన రాజోలు మండలం పొన్నమండ-8 బావి నుంచి జీసీఎస్కు చమురు, సహజవాయు నిక్షేపాలను తరలించే పైపులైన్ నుంచి లీకేజీ జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఓఎన్జీసీ వైఖరిని నిరసిస్తూ ఆదివారం ధర్నాకు దిగారు. అయితే ఉత్పత్తి నిలిపివేసిన బావి నుంచి లీకేజీ వస్తోందని, దీనివల్ల ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. -
20కి చేరిన మృతులు
కాకినాడ: నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 20కి పెరిగింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కె.చిన్నా శనివారం అర్ధరాత్రి, తాటికాయల రాజ్యలక్ష్మి (25) చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. రాజ్యలక్ష్మి భర్త సత్యనారాయణ, చిన్న కుమార్తె సజీవ దహనం కాగా పెద్ద కుమార్తె లక్ష్మీ జ్యోత్స్నదేవి (4) శుక్రవారం అర్ధరాత్రి మరణించింది. ఆ కుటుంబంలో మిగిలి ఉన్న రాజ్యలక్ష్మి కూడా మరణించడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కాగా మరో ఏడుగురు చికిత్స పొందుతూ మరణించారు. చిరు, బొత్సలకు నిరసనల సెగ అమలాపురం: గెయిల్ పైపులైన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు నగరం గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ‘మాయదారి పరామర్శలు మాకొద్దు.. న్యాయం చేసేవారే రండి. లీడర్స్ గో బ్యాక్, యూపీఏ వల్లే మాకీ దుర్గతి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. బాధితులకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సర్వం ధ్వంసం
పూరిపాకలే దెబ్బతిన్నాయన్న చంద్రబాబు ప్రకటనపై బాధితుల ఆగ్రహం పక్కా ఇళ్లకు పరిహారంపై ప్రకటన చేయని ప్రభుత్వం అమలాపురం: ఏదైనా భారీ ప్రమాదం సంభవించినప్పుడు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని నష్టంపై ఒక నిర్ణయానికి వస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే రెవెన్యూ, ఇతర విభాగాల సిబ్బంది ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. నష్టాన్ని అంచనా వేస్తారు. అయితే, తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైపు లైను పేలిన ఘటనలో ఇళ్లకు జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ ప్రమాదంలో 20 మంది మృత్యువాతపడ్డారు. పంటలు, కొబ్బరి తోటలు, జంతువులు, పక్షులకు తీవ్ర నష్టం జరిగింది. నివాస గృహాలకూ భారీ నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన రోజున సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూరిపాకలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. వారిని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించారు. దీంతో దెబ్బతిన్న పక్కా భవనాలకు పరిహారం ఇవ్వరేమోనని బాధితులు ఆందోళన చెందుతున్నా రు. ఈ ప్రమాదంలో పూరిపాకలే కాదు.. పక్కా భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు తీవ్రతకు గోడలు బీటలు వారాయి. ఫ్లోరింగ్ ధ్వంసమైంది. గుమ్మాలు, తలుపులు మాడి మసైపోయాయి. ప్రమాదంలో మొత్తం 12 ఇళ్లు దగ్ధమవగా, వీటిలో ఆరు పక్కా భవనాలు, ఒక పెంకుటిల్లు, ఒక షాపింగ్ కాంప్లెక్స్, నాలుగు పూరిళ్లు ఉన్నాయి. పెంకుటింట్లో నివాసముంటున్న సత్యనారాయణ, జ్యోత్స్నాదేవి, ఏడాది బాలిక, అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆర్.సూర్యనారాయణ, బాలాజీ, దివ్యతేజ, మరో బాలిక మృత్యువాత పడ్డారు. పక్కా భవనాల్లో నివసిస్తున్నవారిలో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ భవనాలకు ఎంత నష్టం జరిగి ఉంటే ఇంతమంది మరణించి ఉంటారన్న విషయాన్ని సర్కారు పట్టించుకోలేదు. బీటలు వారిన ఇళ్లు ఎంతోకాలం ఉండవని, ఉన్నా అవి నివాసయోగ్యం కాదని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం పక్కా భవనాలకు నష్ట పరిహారంపై ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
గ్యాస్ పేలుడు బాధితుల్ని ఆదుకోవాలి: చాడా
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పేలుడు దుర్ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్రకమిటీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే పేలుడు జరిగిందని, బాధితులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా సరిపోదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్యాస్ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. -
తాటిపాకలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ లీకేజీ
కాకినాడ: నగరం విషాదం మరవక ముందే మరో గ్యాస్ లీకేజీ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. తాటిపాక ఓఎన్జీసీ రిఫైనరీలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ లీకేజితో స్థానికులు బెంబేలెత్తారు. లీకేజీని ఆపేందుకు ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, నగరం వద్ద ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి పొగవస్తున్న ప్రాంతాన్ని తాటిపాక ప్లాంట్ ఇంచార్జ్ విక్రాంత్ పరిశీలించారు. పైప్లైన్ తుప్పుబట్టి ఉండడంతోనే గ్యాస్ లీకవుతుందని ఆయన తెలిపారు. నిప్పు ఉంటే ప్రమాదమేనని ఆయన హెచ్చరించారు. నగరం గ్యాస్ పైపు పేలుడులో మృతి చెందిన వారి సంఖ్య 20కి పెరిగింది. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తాటికాయల రాజ్యలక్ష్మి(25) ఆదివారం మృతి చెందింది. -
నిర్లక్ష్యం మాటున గ్యాస్ వెల్ స్టేషన్లు
-
గెయిల్ పై 304 సెక్షన్ కింద కేసు నమోదు
-
చిరు, బొత్సలకు చేదు అనుభవం
-
చిరు, బొత్సలకు చేదు అనుభవం
కాకినాడ: కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు తూర్పుగోదావరి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు ఆదివారం చిరంజీవి, బొత్స నగరం వెళ్లారు. పేలుడు జరిగిన సంఘటనా స్థలాన్ని వీరిద్దరూ పరిశీలించారు. బాధితులను పరామర్శించే సమయంలో చిరంజీవి, బొత్సలను నగరం ప్రజలు అడ్డుకున్నారు. చిరంజీవి, బొత్సలకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. తమకు మీ పరామర్శలు అవసరం లేదంటూ నిరసన తెలిపారు. చిరంజీవి, బొత్స తదితరులు అక్కడ నుంచి వెనుదిరిగారు. -
గెయిల్ పైపులైన్లలో నాణ్యతెంత ?
-
నగరం ఘటనపై కేసు నమోదు
-
నగరం ఘటనలో చికిత్స పొందుతున్న యువకుడి మృతి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ పైప్లైన్ పేలుడు దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. ఈ ప్రమాదంలో గాయపడి.. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పందొమ్మిదేళ్ల కాసు చిన్నా మృతి చెందారు. గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. ఈ ప్రమాదంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై గెయిల్ సంస్థపై, అధికారులుపై పలు కేసులు నమోదు చేశారు. మృతుల బంధువులకు 25 లక్షల పరిహారాన్ని కేంద్ర, రాష్ట్రాలతోపాటు, గెయిల్ సంస్థ ప్రకటించింది. -
నగరం ఘటన: గెయిల్ పై 304 సెక్షన్ కింద కేసు నమోదు
రాజమండ్రి: నగరం పైప్ లైన్ పేలుడు దుర్ఘటనలో గెయిల్ సంస్థపై 304 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుర్ఘటనలో అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారనే ఆరోపణలపై గెయిల్ సంస్థపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. విచారణ ప్రకారం ఈ కేసులో మరిన్ని సెక్షన్ల విధించే అవకాశం ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో శరవేగంగా విచారణ జరుగుతోందని.. అమలాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందం కూడా దర్యాప్తులో భాగమైంది. -
'నగరం' ఘటన మానవ తప్పిదం వల్లే..
-
గ్యాస్ లీకేజీపై అఖిలపక్షం వేయండి: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్యాస్ లీకేజీ వంటి దుర్ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. ఈ విషయంపై అందరి అభిప్రాయాలూ తెలుసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు శనివారం లేఖ రాశారు. -
పండుల, వీహెచ్, హర్షలపై జనం కన్నెర్ర
కాకినాడలో మురళీమోహన్తో వాగ్వాదం మామిడికుదురు/ అమలాపురం (తూర్పు గోదావరి జిల్లా): గ్యాస్ పైపులైను పేలుడు ప్రాంతాన్ని సందర్శించేందుకు శనివారం నగరం గ్రామానికి వచ్చిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎంపీ హర్షకుమార్, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావులపై జనం ఆగ్రహం ప్రదర్శించారు. ఎంపీ రవీంద్రబాబు తొలుత గ్రామాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించగా స్థానికులు ప్రమాదం జరిగిన రోజే ఎందుకు రాలేదని నిలదీశారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ మధ్యాహ్నం వచ్చీరాగానే టీవీ చానళ్ల వారితో మాట్లాడుతూ పైపులైన్ల నిర్వహణ సక్రమంగా లేదని చమురు సంస్థలను విమర్శించారు. అప్పటికే వారిని చుట్ట్టుముట్టిన స్థానికులు... అధికారంలో ఉన్న పదేళ్లూ మీరేం చేశారంటూ హర్షకుమార్పై ధ్వజమెత్తారు. ‘గో బ్యాక్ హర్షకుమార్... డౌన్ డౌన్ హర్షకుమార్’ అంటూ 216 జాతీయ రహదారిపై కొద్దిసేపు ధర్నా చేశారు. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో కలసి వచ్చిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ను బాధిత కుటుంబాలకు చెందిన వారు నిలదీశారు. -
‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కేసు
ఉత్తరకోస్తా జిల్లాల ఐజీ అతుల్సింగ్ సాక్షి, రాజమండ్రి: నిర్లక్ష్యంగా వ్యవహరించి పలువురి ప్రాణాలు పోవడానికి కారకులైన ‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కింద కేసు నమోదు చేసినట్టు ఉత్తరకోస్తా జిల్లాల ఐజీ అతుల్సింగ్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. ఐజీ సింగ్ రాజమండ్రి పోలీసు అతిథి గృహంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ విచారణ పూర్తయ్యాక అవసరమైతే సెక్షన్లు మారుస్తామన్నారు. అమలాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందాన్ని కూడా రప్పిస్తున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్మూర్తి, ఓఎస్డీ రమాదేవి, డీఎస్పీలు నామగిరి బాబ్జీ, ఉమాపతివర్మ, మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మురుగు కాల్వలో దూకి తండ్రి.. ప్రహరీ దూకి కుమార్తెలు
అమలాపురం టౌన్ : గెయిల్ పైపులైన్ విస్ఫోటం నగరం గ్రామవాసులను ఇంకా వెన్నాడుతూనే ఉంది. చీకటి మాటు నుంచి మంటలు దూసుకువస్తుంటే.. అనేకమంది ప్రాణభీతితో దిక్కూదరీ ఎంచకుండా చెల్లాచెదురయ్యారు. ఇప్పుడిప్పుడే వారు మళ్లీ గ్రామానికి వస్తున్నారు. వీరిలో వాకా వీరాస్వామి కుటుంబం ఒకటి. శుక్రవారం ఉదయమే గ్రామానికి చెందిన వాకా వీరాస్వామి, కాండ్రేగుల సత్యనారాయణ, కొల్లాబత్తుల ఏసు కాలకృత్యాల కోసం వాడ్రేవుపల్లి డ్రెయిన్ ప్రాంతానికి వెళ్లారు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున ఎగసిపడ్డ మంటలు రోడ్డు వైపు దూసుకువచ్చాయి. క్షణంలో మంటలు చుట్టుముడతాయనగా ముగ్గురూ మురుగు కాల్వలోకి దూకేశామని వీరాస్వామి చెప్పారు. మురుగు నీరైనా, కొద్దిసేపు భరించారు. ఊపిరాడకపోవడంతో చేసేది లేక కాల్వలోంచి ఒక్క ఉదుటున గట్టుపైకి వచ్చి కొబ్బరి తోటలకు అడ్డంపడి మంటలకు అందనంత దూరానికి పారిపోయారు. తమలాగే మరికొందరు కూడా మురుగుకాల్వలో దూకి ప్రాణాలు దక్కించుకున్నట్టు వీరాస్వామి చెప్పాడు. వీరాస్వామి కుమార్తెలు దుర్గ, నాగవేణిలు ఇంటి ప్రహరీ దూకి, ప్రాణాలు దక్కించుకున్నారు. పైపులైను పేలిన సమయంలో వారిద్దరూ ఇంట్లో నిద్రిస్తున్నారు. తండ్రి బయటకు వెళ్లినప్పుడు వారిద్దరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంటి ముఖ ద్వారం తలుపుల సందు నుంచి పొగలు రావడాన్ని దుర్గ గమనించింది. వెంటనే చెల్లిని లేపి కిటికీ తలుపులు తీసి చూసింది. ముఖద్వారానికి ఉన్న కర్టెన్ కాలిపోతూ కనిపించింది. ఇంటికెదురుగా ఉన్న పెంకుటింట్లోని వారు మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తూ కనిపించారు. భీతావహులైన అక్కాచెల్లెళ్లు ఇంటి వెనుకే ఉన్న నగరం మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రహారీని అతికష్టంపై దూకి గండం నుంచి బయటపడ్డారు. అప్పటికే వారి ఇంటిని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. తండ్రికి ఆసరాగా దుర్గ ఇంట్లోనే నిర్వహిస్తున్న ఫొటో స్టూడియో కెమెరాలు, ఇతర ఉపకరణాలు కాలిపోయాయి. -
ఎటు చూసినా బూడిద కుప్పలే
మరుభూమిలా మారిన నగరం సన్నిహితుల శవాలు, కాలిన ఇళ్లను చూసి విలపిస్తున్న గ్రామస్తులు అమలాపురం/ మామిడికుదురు/కాకినాడ క్రైం: ఎటు చూసినా పచ్చటి పొలాలు, గుబురు చెట్లు.. ఆకాశాన్నంటే కొబ్బరి తోటలు.. సెలయేర్లలో తామర, కలువ పూల హొయలు.. పాడి పశువులతో కళకళలాడే పశువుల కొట్టాలు.. పక్షుల కిలకిలారావాలు.. ప్రకృతికి పట్టుగొమ్మలా ఉండే నగరం గ్రామం మొన్నటి చిత్రమిది. నేడు.. అదో రగులుతున్న చితి. ప్రకృతిని వికృతిగా మార్చిన నిర్లక్ష్యానికి బలైన గ్రామం. చైనా డ్రాగన్లా బుసలుకొడుతూ విరుచుకుపడిన అగ్నిగోళాలకు గ్రామం మొత్తం మాడి మసైపోయింది. తెలతెలవారుతుండగా పక్షుల కిలకిలలతో నిద్ర లేవాల్సిన ఆ ప్రాంతం హాహాకారాలతో మిన్నంటింది. లేగదూడల పరుగులు, పశువుల పదఘట్టనలకు లేచే దుమ్ముతో, కమ్మని మట్టి వాసనతో దినచర్య మొదలెట్టాల్సిన గ్రామం అగ్నిగోళాల మధ్య చిక్కుకుని విలవిల్లాడింది. పల్లె జనం దిక్కూతెన్నూ తెలియకుండా పరుగులెత్తారు. శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపు లైను సృష్టించిన విధ్వంసానికి గ్రామం గ్రామమే వల్లకాడులా మారింది. శనివారం ఆ గ్రామానికి వెళ్లిన వారికి అదో మరుభూమిలా కనిపించింది. ప్రకృతి సోయగం మాయమైంది. ఎటు చూసినా బూడిద కుప్పలే దర్శనమిచ్చాయి. కాలిపోయిన ఇళ్లు, మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. నిండు గెలలతో ఉండాల్సిన కొబ్బరి చెట్లు ఇప్పుడు మాడిపోయి నల్లగా మారిపోయాయి. మసిబొగ్గులా మారిన పశువులు, పక్షులు అక్కడక్కడా పడి ఉన్నాయి. అక్కడక్కడా నిప్పు రగులుతూనే ఉంది. పెను మంటల్లో కాలిపోయిన దేహాల వాసన ఇంకా వస్తూనే ఉంది. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న వారు ఒక్కొక్కరుగా తిరిగి వస్తున్నారు. తమ వారి కోసం వెదుక్కుంటున్నారు. సన్నిహితులు, బంధువులు, తోటి గ్రామస్తులు మరణించిన విషయం తెలుసుకొని బోరుమంటున్నారు. కాలిపోయిన ఇళ్లు, విలువైన వస్తువులను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బతుకులేమిటంటూ కుమిలిపోతున్నారు. ఈ విషాదం తమ జీవితాల్లో మరువలేనిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరి మృతి గెయిల్ గ్యాస్ పైపులైను పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 18కి పెరిగింది. పేలుడు జరిగిన శుక్రవారంనాడే 16 మంది మృత్యు వాత పడగా, 27 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాయుడు సూర్యనారాయణ (20), మహమ్మద్ తక్వి (42) శనివారం మరణించారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ అపోలోలో చికిత్స పొందుతున్న కాశి చిన్నా, తాటికాయల రాజ్యలక్ష్మి, ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వానరాశి వెంకటరత్నం, బోణం రత్నకుమారి, బోణం పెద్దిరాజు, సాయిసుధ ఆస్పత్రిలో ఉన్న రుద్ర సూరిబాబుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన హైపవర్ కమిటీ గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి (హైపవర్) కమిటీ శనివారం నగరం గ్రామానికి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించింది. కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి (రిఫైనరీల విభాగం) ఆర్.పి.సింగ్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం పేలుడుకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసింది. పేలుడు సంభవించిన ప్రాంతంలో మట్టి, పైపుల నమూనాలను సేకరిస్తోంది. ఈ కమిటీలో చమురు సంస్థల భద్రత డెరైక్టరేట్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లకు చెందిన అధికారులున్నారు. జనావాసాల మధ్య నుంచి పైపులైన్ వెళ్లడంపై సింగ్ విస్మయం వ్యక్తంచేశారు. పేలుడుకు కారణాలను ఒకట్రెండు రోజుల్లో తేలుస్తామని ఆయన చెప్పారు. నష్టం అంచనాకు సర్వే బృందాలు పేలుడు వల్ల జరిగిన నష్టంపై పూర్తిస్థాయి అంచనాకు ప్రభుత్వం సర్వే బృందాలను నియమించింది. ఈ బృందాలు నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు చెందిన ఒక తహసీల్దారు, ఒక డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ, హౌసింగ్, విద్యుత్, ఆరోగ్యం, ఇతర శాఖలకు చెందిన అధికారులతో ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు 50 మందితో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
అండగా ఉంటా...
-
అన్నీ బాధామయ గాథలే..
-
'నగరం బాధితులను ఆదుకుంటాం'
-
చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని..
-
ఇక్కడి ప్రజలంటే ఎందుకంత నిర్లక్ష్యం ?
-
'నగరం' బాధితులకు అండగా ఉంటా..
-
బాధితులకు అండగా ఉంటాం: వైఎస్ జగన్
నగరం: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్లైన్లో పేలిన ప్రదేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అధికారులు, నేతలు ఆయనకు వివరించారు. ఈ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్ గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్లో పేలుడు సంభవించి, 17 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా నిట్టనిలువునా తగలబడిపోయిన కొబ్బరి చెట్లను, ఇళ్లు కాలిపోయి శ్మశానవాటికను తలపిస్తున్న గ్రామాన్ని ఆయన పరిశీలించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన వెంట గ్రామానికి తరలి వచ్చారు. అంతకు ముందు ఆయన బాధితులను పరామర్శించారు. బాధితులను అందరిని కలుసుకొని పరామర్శించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ తెల్లవారుజామున జరిగిన సంఘటనను, వారుపడిన బాధలను వివరిస్తుంటే జగన్ చలించిపోయారు. ఒకే కుటుంబంలో ఆరుగురు, మరో కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఆ కుటుంబాలు అన్నిటిని ఆయన కలుసుకుంటున్నారు. బాధితులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ బాధలు చెప్పుకున్నారు. బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. -
బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్
-
నగరం ప్రమాదమెలా జరిగింది ?
-
మృత్యు ఘడియలు
-
నగరం చేరుకున్న వైఎస్ జగన్మోహన రెడ్డి
నగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామం చేరుకున్నారు. ఈ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్ గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్లో పేలుడు సంభవించి, 16 మంది సజీవ దహనమయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలను జగన్ పరామర్శిస్తున్నారు. బాధితులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అంతకు ముందు జిల్లా అధికారులతో జగన్ మాట్లాడారు. గ్రామంలోని పరిస్థితులను, తీవ్రంగా గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి గురించి, వారికి అందించే సహాయక చర్యల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, బాధితులు ఓఎన్జిసి, గెయిల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. -
గెయిల్ ఘటనపై ఆర్పి సింగ్ కమిటీ విచారణ
అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా గెయిల్ గ్యాస్పైప్ లైన్ దుర్ఘటనపై విచారణ చేపట్టేందుకు కమిటీ సిద్ధమైంది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్పి సింగ్ నేతృత్వంలో ఏర్పాటు అయిన ఉన్నతస్థాయి కమిటీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించనుంది. దుర్ఘటన పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిజాన్ని నిగ్గు తేల్చనుంది. శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్ గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్లేన్లో పేలుడు సంభవించి.... 16 మంది సజీవ దహనమయ్యారు. ఘటనపై స్పందించిన కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి కమిటీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న గెయిల్ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. -
గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలుడు విషాదం
-
మీడియా ఉండబట్టే కదా రెచ్చిపోతున్నారు: మురళీమోహన్
నగరం గ్యాస్ పైపులైన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్.. ఆ బాధితులపైనే మండిపడ్డారు. ''మీడియా ఉండబట్టే కదా మీరింతగా రెచ్చిపోతున్నారు.. మీడియా ముందు వద్దు, లోపలకు రండి మాట్లాడుకుందాం. అన్నీ ఇచ్చాం కదా, అయినా ఏమీ సాయం అందలేదని అంటారెందుకు'' అంటూ బాధితుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సాయం అందలేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, చుట్టపుచూపుగా వచ్చి పలకరించినంత మాత్రాన ఏమీ అయిపోదని కొంతమంది బాధితులు ఎంపీ మురళీమోహన్ను కాకినాడ ఆస్పత్రిలో నిలదీశారు. తమ బతుకులు బుగ్గి అయిపోయాయని, కొబ్బరిచెట్లు మొత్తం కాలిపోయాయని, ఇళ్లు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయని, అయినా ఎవరూ ఆదుకోలేదని అన్నారు. దాంతో మురళీమోహన్కు ఎక్కడలేని కోపం వచ్చింది. ''అన్నీ చేస్తున్నా.. ఏమీ ఇవ్వట్లేదని ఎందుకు అంటారు? డబ్బులు ఇచ్చాం కదా.. ఏ ప్రభుత్వానివైనా డబ్బులు డబ్బులే'' అన్నారు. అంతేకాదు, మీడియా ముందు మాట్లాడొద్దని.. అన్ని విషయాలు లోపలకు వెళ్లి మాట్లాడుకుందామని అన్నారు. ఇంకా ఏదో అడగబోతుంటే.. మీడియా ఉండబట్టే కదా మీరింతగా రెచ్చిపోతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువ నీడ కూడా లేకుండా పోయిన తమవాళ్లను ఎవరూ పట్టించుకోవట్లేదని, కనీస సాయం కూడా అందించలేదని మరికొందరు మహిళలు ఆయన దృష్టికి తీసుకురాగా, అందరినీ సొంతమనుషుల్లా అనుకుని వాళ్లను కూడా మీరే చూసుకోవాలని చెప్పారు. -
'మీడియా ఉండబట్టే కదా రెచ్చిపోతున్నారు'
-
ఎటు చూసినా కలచివేసే దృశ్యాలే.....
-
ఎందరో ఆపద్బాంధవులు!
తెల్లవారుజామునే మంటలు.. చుట్టుముడుతున్న అగ్ని కీలలు.. ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలి 16 మంది మరణించగా.. ఇంకా ఎంతోమంది ఆస్పత్రులలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దారుణ పరిస్థితుల్లో ఎంతోమంది ఉదారంగా ముందుకొచ్చారు. బూడిదకుప్పల నడుమ, మాంసపుముద్దల మధ్య నుంచి వెళ్తూ.. తమకు చేతనైనంత సాయం చేశారు. కూర్చున్నవాళ్లు కూర్చున్నట్లే మరణించినా, ఇంట్లో పడుకున్న తల్లీబిడ్డలు పడుకున్నట్లే ప్రాణాలు కోల్పోయినా.. అలాంటివాళ్ల మృతదేహాలను బయటకు తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక క్షతగాత్రుల పరిస్థితి మరీ దారుణం. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మాంసపు ముద్దల్లా పడి ఉన్న అనేకమందిని బయటకు తీసుకొచ్చి, వారిని ఆస్పత్రులకు తరలించడం కూడా కష్టమే. అక్కడున్న పోలీసు సిబ్బంది, వైద్యసిబ్బంది చాలా తక్కువమంది. అలాంటి తరుణంలో స్థానికులు మేమున్నామంటూ ముందుకొచ్చారు. పోలీసులకు, వైద్య సిబ్బందికి తమకు చేతనైన సాయం చేశారు. బాధితులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా.. తమంతట తాముగా ముందుకొచ్చి వారిని ఆస్పత్రులకు తరలించారు. తమ చేతులమీదుగా వారిని తీసుకొచ్చి, వీలైనంత వరకు కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. వీరి సేవలను పోలీసులు కూడా ప్రశంసించారు. స్థానికుల సాయం లేకపోతే తాము అంత త్వరగా బాధితులను తరలించలేకపోయేవారిమని డీఎస్పీ వీరారెడ్డి కూడా మీడియాతో అన్నారు. స్థానికులు ఫోన్ చేసి ఇక్కడ ప్రమాదం సంభవించిందని చెప్పినప్పుడు ముందుగా స్పందించినది డీఎస్పీ వీరారెడ్డే. ఆయన హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, బాధితులను కాపాడేందుకు ప్రయత్నించారు. -
ఎటు చూసినా కలచివేసే దృశ్యాలే.....
అమలాపురం : సరిగ్గా ఒక్క రోజు క్రితం ఆ గ్రామం కళకళలాడింది. పచ్చని కొబ్బరి తోపులు... వాటి మధ్య వంపులు తిరుగుతూ పారే కాలువ... ఒకవైపు కేజీ బేసిన్లో చమురు, సహజ వాయువుల ఉత్పత్తిలో కీలకంగా ఉండే తాటిపాక మినీ రిఫైనరీ, ఓఎన్జీసీఎస్. మరోవైపు మార్కెట్ యార్డు గోడౌన్లు, అందమైన భవనాలు, హోటళ్లు, 216 జాతీయ రహదారి. చమురు సంస్థల్లోకి వెళ్లొచ్చే ఉద్యోగులు, ప్రయాణికులతో కిటకిటలాడే రహదారి. ఇలా ఎప్పుడూ సందడిగా ఉండే మామిడికుదురు మండలం నగరంలోని వానవాశివారి మెరక మరుభూమిగా మారిపోయింది. గెయిల్కు చెందిన పైపులైన్ దుర్ఘటనతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. మంటల్లో కాలిపోయిన శవాలు, ఒళ్లంతా తగులబడి సహాయం కోసం క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు..బుగ్గవుతున్న ఇళ్లు, మాడిమసైపోయిన పచ్చని కొబ్బరి చెట్లు, తప్పించుకునేందుకు వీలు లేక అగ్నికీలల బారిన పడి చనిపోయిన పశువులు, పక్షులు. ఇలా హృదయ విదారక ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. కొంతమంది చిన్న చిన్న వ్యాపారులు ఉదయం వేళే నిద్ర లేచి తమ తమ దుకాణాలు తెరిచి పొట్టపోసుకునే సమయం... ఇంకొంత మంది ఇంకా నిద్రమత్తులోనే జోగుతున్న వేళ.. భవిష్యత్తు గురించి తియ్యటి కలలు కంటున్న తరుణం... ఆ ఆశలన్నీ సమాధైపోయాయి. వారి కలలన్నీ ఛిద్రమైపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతం ఓ శ్మశాన వాటికలా మారిపోయింది. 24 గంటల క్రితం పచ్చగా కళకళలాడిన నగరం గ్రామం ఒక్కరోజులోనే కన్నీటి సంద్రంలో కూరుకు పోయింది. గెయిల్ పైప్లైన్ పేలిన ఘటనలో 16 మంది మృత్యువాతపడిన నగరం గ్రామమంతా విషాదం నెలకొంది. -
మంటలా,పేలుడా...ఏది ముందు?
-
మృత్యు జ్వాల
-
పేలిన గెయిల్ గ్యాస్ పైప్లైన్
-
మృత్యు విస్ఫోటం
-
శ్మశానంగా మారిన నగరం
-
ముద్దు బిడ్డలు మాంసపు ముద్దలయ్యారు
నగరం: అగ్నికీలలు చుట్టుముట్టాయి.. ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. తనను హత్తుకొని నిద్రిస్తున్న ఇద్దరు ముద్దు బిడ్డలను రక్షించుకొనేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించలేదు. బిడ్డలతోపాటు ఆమెను కూడా మృత్యువు కబళించింది. చుట్టపుచూపుగా వచ్చిన ఆమె మరిది, తోడికోడలు కూడా సజీవదహనమయ్యారు. గెయిల్ గ్యాస్ పైపు దుర్ఘటనలో గటిగంటి వాసు కుటుంబం విషాదమిది. 216 జాతీయ రహదారి సమీపంలో వాసు కుటుంబం హోటల్ నడుపుకొంటోంది. శుక్రవారం తెల్లవారుజామున గెయిల్ గ్యాస్ పైపు పేలుడుతో సంభవించిన మంటలు వాసు ఇంటిని కూడా చుట్టుముట్టాయి. ఏమి జరుగుతోందో తెలిసేలోపే వాసు భార్య అనంతలక్ష్మిని, ఆమెను హత్తుకుని నిద్రిస్తున్న పిల్లలు సుజాత (6), సాయి గణేష్ (4) లతోపాటు ముందురోజే వచ్చిన వాసు తమ్ముడు మధు (35), మరదలు కోకిల (33)ను కబళించాయి. క్షణాల్లోనే ఐదుగురూ మసైపోయారు. బిడ్డలను రక్షించేందుకు అనంతలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించి విఫలమైనట్లు మృతదేహాలు పడి ఉన్న తీరు చెబుతోంది. కాగా వాసు ఆచూకీ తెలియరాలేదు. -
మృత్యుకీలలు
కోనసీమవాసులకు సుఖసంతోషాలను ఇవ్వకపోగా వారి పాలిట ఇప్పుడు పెనుగండంగా మారింది ఆ గడ్డ గర్భంలోని సంపద. కలుగుల్లోని కాలనాగుల్లా ఆ గడ్డ పొరల్లో విస్తరించిన గ్యాస్ పైపులైన్లలో ఒకటి విస్ఫోటించి 15 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో 27 మందిని మృత్యువు పిడికిట్లో ఇరికించింది. - నేలలోని గొట్టాలే.. కాలయముని హస్తాలు - తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో విరుచుకుపడ్డ చిచ్చు - 15 మంది సజీవ దహనం - మరో 27 మందికి గాయాలు - 15 మంది పరిస్థితి విషమం సాక్షి, కాకినాడ/ మామిడికుదురు : చెలరేగిన అగ్నికీలల నడుమ చిక్కుకున్న అమాయకులు కార్చిచ్చులో మొలకల్లా మాడిపోయారు. మాంసపు ముద్దల్లా మిగిలారు. కొందరు.. జరుగుతున్నది నిజమో, పీడకలో తెలియకుండా నిద్రలోనే కన్నుమూశారు. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన ట్రంక్ పైపులైన్ పేలిన ఘటనలో గతంలో ఎన్నడూలేని రీతిలో భారీగా ప్రాణనష్టం సంభవిం చింది. చమురు సంస్థల తీరుపై ఆగ్రహోదగ్రులైన బాధితులు గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ను ముట్టడించి వాహనాలను ధ్వంసం చేశారు. పరామర్శకు వచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమం త్రి ధర్మేంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు , హోం మంత్రి చినరాజప్పను చుట్టుముట్టి చమురు సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు మూల్యం గెయిల్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేసే ట్రంక్ పైపులైన్ నగరం సమీపంలో వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్ను ఆనుకుని పైపులైన్ జాయింట్ వద్ద జరిగిన ఈ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టించింది. పైపులైన్ పేలడంతో ఎగసిపడిన గ్యాస్ ఆ ప్రాంతమంతా ఆవరించింది. నిద్రలో ఉన్న జనం ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్నికీలలు విరుచుకు పడ్డాయి. జాయింట్ వద్ద పైపులైన్లీకైన సమయంలో గ్యాస్ మాత్రమే ఎగజిమ్మిందని, వరుసగా రెండుసార్లు సంభవించిన పేలుడుతో గ్యాస్ రాపిడికి గురై మంటలు వ్యాపిం చాయని స్థానికులు చెబుతున్నారు. లీకై న గ్యాస్ ఎగజిమ్ముతూ, పరిసరాల్లో కమ్ముకుంటున్న సమయంలోనే స్థానికులెవరో పొయ్యి వెలిగించడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందనే వా దన కూడా వినిపిస్తోంది. పేలుడుతో మంటలు బ్లో అవుట్ సంభవించినప్పటి లా 30 నుంచి 40 మీటర్ల ఎత్తున ఎగసి పడ్డాయి. మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పైపులైన్ లీకైనా అధికారులు మొక్కుబడి చర్యలు మాత్రమే చేపట్టడంతో.. అందుకు మూల్యాన్ని అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. పేలుడు ధాటికి పది అడుగుల గొయ్యి ఏర్పడగా పైపులైన్పై కప్పిన గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది. పదికి పైగా అగ్నిమాపక శకటాలు 3 గంటల పాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చినా.. రాత్రి వరకూ భూమిలోం చి పొగలు, వేడిగాలులు వస్తూనే ఉన్నా యి. అధికారులు స్పందించకపోయినా గ్రామస్తులే సహాయ, పునరావాస చర్య ల్లో నిమగ్నమయ్యారు. మంటలను అదుపు చేయడంతో పాటు మృతులను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో చురుగ్గా పాల్గొన్నారు. -
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం, కేంద్ర, రాష్ర్ట మంత్రులు మామిడికుదురు/కాకినాడ క్రైం : నగరం పైపులైన్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వ పరంగా మెరుగైన వెద్యసహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్రప్రదాన్తో కలిసి ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం మధురపూడి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో నగరం చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓఎన్జీసీ డౌన్డౌన్ అంటూ సీఎం ఎదుట నినాదాలు చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రావాల్సిందిగా బాధితులు పట్టుబట్టినప్పటికీ పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడులతో కలిసి కాకినాడ చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, బీజేపీ ఏపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తదితరులతో కలిసి కాకినాడ అపోలోలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడ్డ వారికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. స్థానికుల నిరసన ఒకే కుటుంబంలో ఐదుగురు మృత్యువాత పడిన ఇంటిని కానీ, మరో కుటుంబంలో ముగ్గురు చనిపోయిన ఇంటిని కానీ చంద్రబాబు పరిశీలించకుండానే వెనుదిరగడంపై స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఎంతో హడావిడి చేసి పోలీసు బందోబస్తు మధ్య ఎవరిని ఉద్దరించడం కోసం ఇక్కడకు వచ్చారంటూ బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వెంట వచ్చిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రోడ్డుపైన కారు దిగి, రోడ్డుపైనే నిలుచుని మళ్లీ అక్కడ నుంచే వెనుదిరిగారే తప్ప సంఘటన స్థలంలో కనీసం కాలుమోపలేదు. -
మృత్యుకీలలు
కోనసీమవాసులకు సుఖసంతోషాల్నివ్వకపోగా కష్టనష్టాల పాలు చేస్తున్న ఆ గడ్డ గర్భంలోని సంపదే.. వారి పాలిట పెనుగండంగా మారింది. కలుగుల్లోని కాలనాగుల్లా ఆ గడ్డ పొరల్లో విస్తరించిన గ్యాస్ పైపులైన్లలో ఒకటి విస్ఫోటించి 15 నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. మరో 27 మందిని మృత్యువు పిడికిట్లో ఇరికించింది. పద్మవ్యూహంలో అభిమన్యుని చుట్టుముట్టిన కౌరవుల్లా.. చెలరేగిన అగ్నికీలల నడుమ చిక్కుకున్న అమాయకులు కార్చిచ్చులో మొలకల్లా మాడిపోయారు. కొందరు.. జరుగుతున్నది నిజమో, పీడకలో తెలియకుండా నిద్రలోనే కన్నుమూశారు. మరి కొందరు పగవారిలా తరిమే కీలల బారి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీసినా ఫలితం లేక విగతజీవులై నేలకొరిగారు. వేకువకు ముందే విరుచుకుపడ్డ విలయాగ్ని చివరికి పచ్చని పంటపొలాలనూ, తోటలనూ, మూగజీవాలనూ బుగ్గి చేసింది. - నేలలోని గొట్టాలే.. కాలయముని హస్తాలు - పచ్చనిసీమపై విరుచుకుపడ్డ చిచ్చు - నగరంలో విస్ఫోటించిన పైపులైన్ - 15 మంది సజీవ దహనం, 27 మందికి గాయాలు - వారిలో 15 మంది పరిస్థితి విషమం సాక్షి, కాకినాడ / మామిడికుదురు : మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన ట్రంక్ పైపులైన్ పేలిన ఘటనలో గతంలో ఎన్నడూలేని రీతిలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. చమురు సంస్థల తీరుపై ఆగ్రహోదగ్రులైన బాధితులు గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ను ముట్టడించి వాహనాలను ధ్వంసం చేశారు. పరామర్శకు వచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి ధర్మేంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పలను చుట్టుముట్టి చమురు సంస్థల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోనసీమలో 1993లో కొమరాడ..1995లో దేవర్లంక.. 1996లో దేవరపల్లి, 2005లో తాండవపల్లిలో బ్లో అవుట్లు సంభవించాయి. వీటిలో దేవర్లంక బ్లో అవుట్ రెండు నెలల పాటు ప్రజ్వరిల్లింది. ఈ ఘటనల్లో పచ్చని పొలాలు మాడిమసైపోయాయి. కోట్లాది రూపాయల ఆస్తి బుగ్గయింది. ఇక పరిపాటిగా మారిన పైపులైన్ల లీకేజ్లతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్ని ఘటనలు జరిగినా ఇప్పటి వరకూ ఆస్తినష్టమే తప్ప ప్రాణనష్టం లేదు. శుక్రవారం నాటి ఘటన కోనసీమలో చమురు కార్యకలాపాల చరిత్రలోనే తొలిసారి 15 ప్రాణాలను బలిగొంది. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక ప్రాణాలే మూల్యం.. గెయిల్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేసే ట్రంక్ పైపులైన్ ఉదయం 5.10 గంటల సమయంలో పేలిపోయింది. నగరం సమీపంలో వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్ను ఆనుకుని పైపులైన్ జాయింట్ వద్ద జరిగిన ఈ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టించింది. పైపులైన్ పేలడంతో ఎగసిపడిన గ్యాస్ ఆ ప్రాంతమంతా ఆవరించింది. నిద్రలో ఉన్న జనం ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్నికీలలు విరుచుకు పడ్డాయి. జాయింట్ వద్ద పైపులైన్లీకైన సమయంలో గ్యాస్ మాత్రమే ఎగజిమ్మిందని, వరుసగా రెండుసార్లు సంభవించిన పేలుడుతో గ్యాస్ రాపిడికి గురై మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. కాగా లీకైన గ్యాస్ ఎగజిమ్ముతూ, పరిసరాల్లో కమ్ముకుంటున్న సమయంలోనే స్థానికులెవరో పొయ్యి వెలిగించడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. పేలుడుతో మంటలు బ్లో అవుట్ సంభవించినప్పటిలా 30 నుంచి 40 మీటర్ల ఎత్తున ఎగసి పడ్డాయి. మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పైపులైన్ లీకైనా అధికారులు మొక్కుబడి చర్యలు మాత్రమే చేపట్టడంతో.. అందుకు మూల్యాన్ని అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. పేలుడు ధాటికి పది అడుగుల గొయ్యి ఏర్పడగా పైపులైన్పై కప్పిన గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది. పదికి పైగా అగ్నిమాపక శకటాలు సుమారు మూడు గంటల పాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చినా.. రాత్రి వరకూ భూమి లోంచి పొగలు, వేడిగాలులు వస్తూనే ఉన్నాయి. అధికారులు స్పందించకపోయినా గ్రామస్తులే సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యారు. మంటలను అదుపు చేయడంతో పాటు మృతులను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో చురుగ్గా పాల్గొన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు.. కోనసీమ చవి చూసిన పెనువిషాదాల్లో ఒకటి అనదగ్గ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 15 మందిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. వారంతా కనీసం గుర్తు పట్టేందుకు కూడా వీల్లేని రీతిలో మాంసపుముద్దల్లా మిగిలారు. మరో 27మంది వరకు గాయాల పాలవగా, వారిలో 15 మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వారిని తొలుత అమలాపురం ఏరియా, కిమ్స్ ఆస్పత్రులకు తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ అపోలో, ట్రస్ట్, సేఫ్ ఆస్పత్రులకు తరలించారు. కాకినాడలో 11 మంది, రాజమండ్రిలో ఇద్దరు, అమలాపురం కిమ్స్లో ఏడుగురు, రాజోలులో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు హాహాకారాలతో ఆస్పత్రులు దద్దరిల్లిపోతున్నాయి. బాధ భరించలేక ‘మమ్మల్ని చంపేయండి’ అని వైద్యులకు మొర పెట్టుకుంటుంటే చూసేవారికి గుండెల్ని పిండినట్టయింది. శ్మశానాన్ని తలపించిన ఘటనాస్థలి పేలుడు జరిగిన ప్రాంతం ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలతో శ్మశానాన్ని తలపించింది. అగ్ని కీలల్లో దగ్ధమై, మాంసపుముద్దల్లా మిగిలిన మృతులు, మాడి మోడుల్లా మిగిలిన కొబ్బరిచెట్లు, మంటల్లో చిక్కుకొని బూడిదైన పక్షులు.. ఏ వైపు చూసినా కన్ను తట్టుకోలేని బీభత్సమే.. గుండె భరించలేని విధ్వంసమే. ఈ ఘటనలో క పది కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. 12 ఇళ్లు, మండల వ్యవసాయశాఖ కార్యాలయం, ఒక షాపింగ్ కాంప్లెక్స్ అగ్నికి ఆహుతయ్యాయి. 15 ఎకరాల్లో కొబ్బరి తోటలు మాడిమసైపోయాయి. ఓఎన్జీసీ మినీ రిఫైనరీ, ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటరు (జీసీఎస్), గెయిల్ కార్యాలయాలు సమీపంలో ఉండడంతో పైపులైన్ ప్రారంభంలో ఈ ఘటన జరిగి ఉంటే ఊహకందనంత పెను విధ్వంసమే జరిగేది. పేలుడు ప్రాంతానికి చేరువలోనే మూడు ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. దుర్ఘటన పగటిపూట జరిగి ఉంటే వందల్లో ప్రాణ నష్టం ఉండేదని స్థానికులు అంటున్నారు. ఉదయం 5.10 గంటలకు ఘటన జరిగితే గంటన్నర వరకూ పోలీసులు మినహా అధికారులెవరూ కన్నెత్తై చూడలేదు. ఆరున్నరకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఉవ్వెత్తున ఎగసిపడే మంటలను అదుపు చేసేందుకు సాహసం చేయలేకపోయారు. ఒకటి తర్వాత మరొకటిగా ప్రభుత్వ అగ్నిమాపక శకటాలతో పాటు గెయిల్, రిలయన్స్, రవ్వ, కెయిర్న్ ఎనర్జీ, జీఎస్పీసీలకు చెందిన పది శకటాలు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. కాగా పేలుడుపై కేసు నమోదు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు. భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సీఎం డౌన్..డౌన్ గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా ప్రాణ, ఆస్తినష్టాలకు కారణమైన ఓఎన్జీసీ, జీసీఎస్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్ర హోదగ్రులయ్యారు. వందల మంది జీసీఎస్ మెయిన్ గేట్ను చుట్టుముట్టి గ్యాస్ కలెక్షన్ సెంటర్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఆ సంస్థ సిబ్బంది వాహనాలను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రతో కలిసి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సీఎం డౌన్ డౌన్..ఓఎన్జీసీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం వారిని సముదాయించి దుర్ఘటనను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ జరిపించి దుర్ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరామర్శించేందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్లకు బాధితులు తమ గోడు వినిపించారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారు. నగరంలో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ కోటగుమ్మం (రాజమండ్రి) : మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైపులైన్ పేలుడుతో దగ్ధమైన విద్యుత్ లైన్లను పునరుద్ధరించినట్టు ఈపీడీసీఎల్ ఎస్ఈ (ఆపరేషన్స్) ఎన్. గంగాధర్ తెలిపారు. ఈ సంఘటనలో 49 హౌస్ సర్వీసులు, 9 హెచ్టీ, ఎల్టీ స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయాయన్నారు. ఇళ్ల సర్వీసులు ఎవరికి వారే వేసుకోవలసి ఉన్నా మానవతా దృక్పథంతో పునరుద్ధరించడంతో పాటు కొత్త స్తంభాలు వేశామన్నారు. -
భయపెడుతున్న బ్లో అవుట్లు
1993 మామిడికుదురు మండలం కొమరాడలో బ్లో అవుట్ సంభవించి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. 50 ఎకరాల విస్తీర్ణంలో చమురు జల్లులు పడ్డాయి. నిప్పు తగలకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 1995 జనవరి 8న అల్లవరం మండలం దేవర్లంక (పాశర్లపూడి బావి) బ్లో అవుట్ సంభవించింది. ఇది కోనసీమలోనే అతిపెద్ద బ్లో అవుట్. 60 అడుగుల ఎత్తున అగ్నికీలలు ఎగిశాయి. 65 రోజుల పాటు మండుతూనే ఉంది. మంటల అదుపునకు అమెరికా నుంచి వచ్చిన నిపుణుల బృందం దీనిని ప్రపంచంలోనే రెండో పెద్ద బ్లో అవుట్గా పేర్కొంది. 80 ఇళ్లు, వంద ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రూ.100 కోట్ల వరకూ నష్టం వాటిల్లింది. 1997 రావులపాలెం మండలం దేవరపల్లి బావిలో బ్లో అవుట్ సంభవించింది. 12 గంటల్లో మంటలను అదుపు చేశారు. 2005 అమలాపురం రూరల్ మండలం తాండవపల్లి బావిలో బ్లో అవుట్ సంభవించింది. సాయంత్రానికల్లా మంటలను అదుపులోకి తెచ్చారు. 2011, 2012 రాజోలు మండలం కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలి అనేక ఎకరాల్లో పంట కాలిపోయింది. 2012లో రాజోలు మండలం కాట్రేని పాడు బావిలో బ్లో అవుట్ సంభవించింది. వెంటనే అదుపులోకి వచ్చింది. -అమలాపురం టౌన్ -
అధికారులపై చర్యలు తీసుకోండి
* గెయిల్ ఘటనపై హక్కుల సంఘం సాక్షి,హైదరాబాద్: గెయిల్ పేలుడు దుర్ఘటనపై మానవహక్కుల సంఘం(హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. పేలుడుకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు వై. సోమరాజు వేసిన పిటిషన్ను పరిశీలించిన సంఘం అక్కడి గ్రామాల్లో ప్రజలకు జీవించే హక్కును కాపాడాలని స్పష్టం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. తమ ఆదేశాలపై ఏం చర్యలు తీసుకున్నారో పేర్కొంటూ జూలై 10 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. -
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
* నేడు ఘటనాస్థలికి వైఎస్సార్సీపీ అధినేత సాక్షి, హైదరాబాద్: నగరం దుర్ఘటన పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. శనివారం ఆయన సంఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి.. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో ఉన్న జగన్ శుక్రవారం రాత్రే హైదరాబాద్కు బయలుదేరారు. శనివారం ఉదయం హైదరాబాద్కు చేరుకుని.. అనంతరం విమానంలో రాజమండ్రికి వెళతారు. అక్కడ్నుంచి రోడ్డుమార్గంలో ఘటనాస్థలికి చేరుకుంటారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆయన దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే.. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, ఘటనకు దారితీసిన కార ణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోండి: రఘువీరారెడ్డి గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడులో బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి కోరారు. భద్రతా లోపమే కారణం: వామపక్షాలు గ్యాస్పైప్ లైన్ పేలుడు దుర్ఘటన .. భద్రతా లోపంతోనే జరిగిందని సీపీఐ, సీపీఎంలు పేర్కొన్నాయి. ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలే ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. టీ సీఎం కేసీఆర్ సంతాపం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో గ్యాస్ లీకేజీతో ఎగసిపడిన మం టల్లో పదహారు మంది సజీవ దహనం అయిన సంఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. * టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాల కృష్ణ, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి కూడా పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
నగరం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: గెయిల్ పైపులైను పేలుడు దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ, గెయిల్ నుంచి ఇచ్చే పరిహారానికి ఇది అదనమని పీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాల్సిందిగా పెట్రోలియంశాఖ మంత్రితోపాటు కేబినెట్ సెక్రెటరీ, గెయిల్ చైర్మన్లను ఆదేశించినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కి శుక్రవారం ఉదయం ఓ సందేశం పంపారు. వెంటనే ప్రధానితో మాట్లాడా గ్యాస్పైప్లైన్ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే షాక్కి గురైనట్టు కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. ఉదయం ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే ప్రధానమంత్రికి వివరాలను చెప్పడంతోపాటు తక్షణం సహాయ చర్యలు తీసుకోవాలని కోరినట్టు వివరించారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కోరినట్లు తెలిపారు. ప్రమాద సంఘటన తెలిసి తాను ఒక్కసారిగా నిర్ఘాంత పోయినట్టు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ప్రమాదంలో పలువురు మృత్యువాత పడటంపై కాంగ్రెస్పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కూడా ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం పైపులైను పేలుడు దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహాయ పునరావాస చర్యల పర్యవేక్షణకు సీఎం చంద్రబాబు, పెట్రోలియం శాఖ కార్యదర్శి సౌరబ్చంద్ర, గెయిల్ ఛైర్మన్ బీసీ త్రిపాఠి, ఓఎన్జీసీ ఛైర్మన్ డి.కె.సర్రాఫ్లతో కలిసి ప్రత్యేక విమానంలో ఏపీ వెళ్లారు. అంతకుముందు కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గెయిల్ పైపులైను పేలుడు దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ద్వారా విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈడీ, ఆయిల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ డెరైక్టరేట్ (ఓఐఎస్డీ) ఈడీలతో పాటు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ)సభ్యుడు నామినీగా ఉంటారని తెలిపారు. ఓఎన్జీసీ భద్రత కోసం రాజ్యాంగ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ పరిధిలోని ఓఐఎస్డీ చమురు, గ్యాస్ సంస్థల భద్రతకు సంబంధించిన డిజైనింగ్, నిర్వహణ, మరమ్మతు వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నప్పటికీ ఈ విభాగానికి రాజ్యాంగపరమైన ఎలాంటి అధికారాలు లేవని తెలుస్తోంది. అప్పటి పెట్రోలియం మంత్రి జైపాల్రెడ్డి ఓఐఎస్డీకి రాజ్యాంగ అధికారాలు కల్పించాలని చేసిన ప్రతిపాదనలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ విషయాన్ని ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లగా ఓఐఎస్డీకి రాజ్యాంగ అధికారాలు కల్పించే దిశగా పనిచేస్తుందని బదులిచ్చారు. -
మృత్యు విస్ఫోటం
* పేలిన గెయిల్ గ్యాస్ పైప్లైన్ * 16 మంది దుర్మరణం * తూర్పుగోదావరి జిల్లా ‘నగరం’ గ్రామంలో దారుణం * 27 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం * కిలోమీటర్ పరిధిలో సర్వం బుగ్గి.. కోట్లలో ఆస్తి నష్టం * విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ: కేంద్రం * మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం * తీవ్ర గాయాలైన వారికి రూ. 5 లక్షలు * బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: చంద్రబాబు అమలాపురం/మామిడికుదురు/కాకినాడ క్రైం: పచ్చని కోనసీమలో ప్రాణాంతకమైన చిచ్చు ప్రజ్వరిల్లింది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం వేకువజామున గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) పైపులైన్ ఒక్కసారిగా విస్ఫోటం చెందింది. 30, 40 మీటర్ల ఎత్తులో కోరలుసాచి విరుచుకుపడ్డ దావాగ్ని కీలలు చూస్తుండగానే విధ్వంసం సృష్టించాయి. దాదాపు కిలోమీటరు పరిధిలో పచ్చని గ్రామాన్ని భస్మీపటలం చేయడమేగాక 16 నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. మరో 27 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పెనుగులాడుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రచండ వేగంతో ఎత్తివచ్చిన పెను మంటల బారిన పడి పలువురు నిద్రలోనే నిస్సహాయంగా సజీవ దహనమయ్యారు. ఇంకొందరు తప్పించుకునేందుకు అటూ ఇటూ పరిగెత్తుతూనే నిలువునా కాలిపోయారు. ఇద్దరు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఉదయం 5.10 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కాలం చెల్లిన పైప్ లైన్ కావడంతో గ్యాస్ ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోయిందని చెబుతున్నారు. మంటల ధాటికి కిలోమీటర్ పరిధిలో పచ్చని కొబ్బరి తోటలు చూస్తుండగానే నిలువునా అంటుకున్నాయి. పావుగంట వ్యవధిలో కాలిపోయి మొండి మోడులై మిగిలాయి. పదుల కొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. గ్రామంలోనూ, ఊరి మీదుగా వెళ్తున్న 218 నంబర్ జాతీయ రహదారిపైనా పలు వాహనాలు బూడిద కుప్పలుగా మిగిలాయి. పైపులైను పేలుడు జరిగిన ప్రాంతంలో ఏకంగా 10 అడుగుల గొయ్యి ఏర్పడింది. పేలుడు ధాటికి పైపులైన్పై కప్పిన కాంక్రీట్ గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది. చివరికి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పాక కూడా చాలాసేపు భూమిలోంచి పొగలు, వేడిగాలులు వచ్చాయి. పైగా మంటలను ఒకవైపు ఆర్పుతుండగానే అవి మరోవైపు చెలరేగుతూ ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలికి సమీపంలోనే ఉన్న ఓఎన్జీసీ మినీ రిఫైనరీ, ఓఎన్జీసీ జీసీఎస్లకు మంటలు వ్యాపిస్తే పెను విధ్వంసమే జరిగి ఊరంతా శ్మశానప్రాయంగా మారేదే! కానీ అవి జీసీఎస్ మెయిన్ గేట్ దరిదాపుల వరకూ వ్యాపించి అక్కడితో ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చడమే గాక కోట్లలో ఆస్తి నష్టం కలగజేసిన ఈ ఘోరకలి లాభార్జనే తప్ప జనం భద్రత పట్టని చమురు సంస్థల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యం పొందినవారికి రూ. 5 లక్షలు, గాయాలపాలైన వారికి రూ. 50 వేలు తక్షణ సాయంగా అందిస్తామన్నారు. బాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. తామూ హై పవర్ కమిటీ వేశామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాబు ప్రకటించారు. అంతా క్షణాల్లో పైపులైను పేలుడు సంభవించిన సమయంలో గాలి ఉధృతంగా వీస్తుండడంతో ఆ ప్రాంతానికి పశ్చిమంగా అర కిలోమీటరు మేర క్షణాల్లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో ఏం జరిగిందో తెలిసేలోపే పలువురు మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మాడి మసైపోయాయి. ఆ సమయంలో స్థానికులు, రోడ్డుపై ప్రయాణిస్తున్నవారు భీతిల్లి పరుగులు తీశారు. వారిని కూడా అగ్నిగోళాల్లాంటి మంటలు వెంటాడి గాయపరిచాయి. దూరంగా ఉన్నవారు అగ్నికీలల ఉగ్రరూపాన్ని చూసి కళ్లెదుటే తోటి మనుషులు తగలబడుతున్నా దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు. ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది, మరో ఇద్దరు ఉద్యోగులు, ఇతర కుటుంబాలకు చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి, కిమ్స్ ఆస్పత్రికి, రాజోలు ఏరియా ఆస్పత్రికి, రాజమండ్రి, కాకినాడ ఆస్పత్రులకు తరలించారు. 80 శాతానికి పైగా గాయాలవడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాలిన గాయాలతో వారు చేస్తున్న ఆర్తనాదాలు అందరి హృదయాలనూ కలచి వేస్తున్నాయి. అర్ధరాత్రి దాటాక జ్యోత్స్నాదేవి అనే చిన్నారి కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విస్ఫోటం జరిగిన చోటికి సమీపంలో మూడు ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. స్కూళ్లు పనిచేస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగి ఉంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది. 40 మీటర్ల ఎత్తుకు ఎగసిన కీలలు పైప్లైన్లో గ్యాస్ ఎగదన్నడంతో మంటలు బ్లో అవుట్ తరహాలో దాదాపు 40 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే జీసీఎస్ నుంచి గ్యాస్ సరఫరా నిలిపివేసినా అప్పటికే పైపులో ఉన్న గ్యాస్ వల్ల గంట పాటు మంటలు ఎగదన్నుతూనే ఉన్నాయి. అంతెత్తున ఎగసిపడే మంటలను పైపులైన్ వద్దకు వెళ్లి ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలాసేపటి వరకూ సాహసించలేకపోయారు. పెను విషాదంపై అలసత్వం గ్యాస్ విస్ఫోటనంపై చమురు సంస్థల అధికారులు గానీ, ప్రభుత్వాధికారులు గానీ చురుగ్గా స్పందించలేదు. ఉదయం 5.10కి ఘోరం జరిగినా 6.30 వరకూ అగ్నిమాపక శకటాలు రాలేదు. పక్కనే ఉన్న జీసీఎస్, మినీ రిఫైనరీల అగ్నిమాపక శకటాలు కూడా వెంటనే రంగంలోకి దిగకపోవడంపై స్థానికులు మండిపడ్డారు. పోలీసులు తప్ప ఏ శాఖల అధికారులూ సకాలంలో స్పందించలేదు. చివరికి అగ్నిమాపక శకటాలు వచ్చి కొన్నిచోట్ల మంటలను అదుపు చేసినా, మరికొన్నిచోట్ల రాజుకుంటూనే ఉన్న మంటలను చూసీచూడనట్టు వదిలేశాయి. స్థానిక ఎమ్మెల్యేలు మండిపడడంతో వాటిని ఆర్పేందుకు ఉపక్రమించాయి. ప్రైవేటు చమురు సంస్థలు రవ్వ, రిలయన్స్లకు చెందిన శకటాలు వచ్చేసరికే మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయి. ప్రమాదంపై స్థానిక అధికారులు స్పందించలేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు, కలెక్టర్ నీతూ ప్రసాద్లకు బాధితులు ఫిర్యాదు చేశారు. తాటిపాక ఓఎన్జీసీ జీసీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఉపద్రవం జరిగిందని, తర్వాత కూడా వారు స్పందించలేదని ఆరోపిస్తూ స్థానికులు దానిపై దాడికి యత్నించారు. మెయిన్ గేట్ను దాటుకుని జీసీఎస్ వైపు దూసుకుపోయారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. సిబ్బంది వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. మంటలా, పేలుడా.. ఏది ముందు? ఈ ఘోరానికి సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ స్టేషన్ (జీసీఎస్) నుంచి విజయవాడలోని ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు ‘గెయిల్’ సంస్థ గ్యాస్ సరఫరా చేస్తోంది. దీనికి సంబంధించిన పైపులైన్ నగరం గ్రామం వద్ద వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్ సమీపంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో పేలిపోయింది. ఆ విస్ఫోటంతో పైపులైన్ నుంచి గ్యాస్ లీకై పరిసరాల్లో వ్యాపించింది. తర్వాత కొద్ది సమయానికే పైపులైన్ మరోసారి పేలిపోయింది. అప్పటికే చుట్టూ గ్యాస్ ఆవరించి ఉండడంతో రెప్పపాటు కాలంలోనే గ్రామాన్ని మంటలు చుట్టుముట్టాయి. సెకన్కు 40 కేజీల ఒత్తిడితో గ్యాస్ వెళ్తుండగా పైపులైన్ పేలిందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. రెండు పైపుల మధ్య జాయింట్ వద్ద ఈ పేలుడు సంభవించింది. సరిగ్గా ఇక్కడే మూడు నెలల క్రితం పైపులైన్ లీకైందని, అయినా గెయిల్ అధికారులు పట్టించుకోనందువల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే పైపులైన్ నుంచి గ్యాస్ లీకవుతూ వచ్చిందన్నది మరో కథనం. అప్పుడప్పుడూ ఇలా జరుగుతూనే ఉంటుందని నగరం వాసులు పెద్దగా పట్టించుకోలేదు. అటు గెయిల్ అధికారులూ లీకేజీని గుర్తించలేదు. దీంతో ఆ ప్రాంతమంతా వాతావరణంలో గ్యాస్ కమ్ముకుంది. శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఒక హోటల్ యజమాని పొయ్యి వెలిగించబోగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని కొందరు అంటుండగా, ఒక మహిళ ఇంట్లో పొయ్యి వెలిగించగానే విస్ఫోటం సంభవించిందని మరికొందరం టున్నారు. లీకైన తరువాత గాలి వాలు వల్ల ఓఎన్జీసీ జీసీఎస్ వైపు గ్యాస్ ఎక్కువగా వ్యాపించింది. ఈ కారణంగానే ప్రమాద తీవ్రత అటు మళ్లింది. జీసీఎస్ ప్రధాన గోడకు 200 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. అదే జీసీఎస్లో జరిగి ఉంటే ఊరంతా శ్మశానంగా మారేదని స్థానికులు అంటున్నారు. పక్షులూబుగ్గయ్యాయి గ్యాస్ అలముకున్నాక మంటలు చెలరేగడంతో చెట ్లమీది పక్షులు సైతం తప్పించుకునే వీలులేక మసిబొగ్గుల్లా మిగిలాయి. 12 ఇళ్లు, ఒక సంస్థ కార్యాలయం, ఓ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా దగ్ధం కాగా, మరో పది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్థానికుల వాహనాలతో పాటు గ్రామంగుండా వెళ్తున్న 216 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నవారి వాహనాలు సైతం తగలబడిపోయాయి. సుమారు 15 ఎకరాల్లో కొబ్బరి తోటలు కాలి బూడిదయ్యాయి. రూ.10 కోట్ల వరకు ఆస్తినష్టం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. -
మంటల్లో కోనసీమ
లాభాల యావే తప్ప భద్రత పట్టని చమురు కంపెనీలు అమలాపురం: తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం నుంచి అపారమైన చమురు, సహజవాయువులను తరలించుకుపోతున్న చమురు సంస్థలు అక్కడి ప్రజల భద్రతను పూర్తిగా గాలికొదిలేశాయి. స్థానికాభివృద్ధి పేరుతో అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటూ ప్రమాదాల నిరోధానికి కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించడంలేదు. దీంతో కోనసీమ ఏ క్షణమైనా పేలే మందుపాతరలా మారిపోయింది. గత రెండు దశాబ్దాల్లో ఈ ప్రాంతంలో ఐదు బ్లో అవుట్లు సంభవించాయి. పదుల సంఖ్యలో పైప్లైన్ లీకేజీలు జరిగాయి. ఆ ఘటనల్లో కేవలం ఆస్తి నష్టాలే జరిగాయి. తాజాగా నగరంలో శుక్రవారం సంభవించిన గ్యాస్ పైపులైన్ పేలుడులో 16 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 27 మంది క్షతగాత్రులై విషమ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుర్ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆక్రోశిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రకటనలు గుప్పించడం, తరువాత ఆ విషయాన్ని గాలికి వదిలేయడం షరా మామూలైందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజల భద్రత గాలికి... కోనసీమ భూగర్భంలో దాదాపు 900 కిలోమీటర్ల మేర చమురు సంస్థలకు చెందిన గ్యాస్ పైపులైన్లు ఉన్నాయి. 30కి పైగా చమురు బావులున్నాయి. తాటిపాకలో మినీ రిఫైనరీ, గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) ఉన్నాయి. కేజీ బేసిన్ పరిధిలో తరచూ ఏదో ఒకచోట గ్యాస్ లీకవ్వడం, ఆస్తి నష్టం వాటిల్లడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఓఎన్జీసీ గతంలో ఒక అధ్యయన కమిటీని నియమించింది. ఈ ప్రాంత భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువైనందున పైపులైన్లు త్వరగా తుప్పుపట్టి పాడైపోతాయని కమిటీ తేల్చి చెప్పింది. కనీసం ప్రతి ఏడేళ్లకోసారైనా పైపులైన్లను తప్పక మార్చాలని సూచించింది. అయితే ఈ నివేదికను ఓఎన్జీసీ బుట్టదాఖలు చేసింది. ఇక ప్రైవేటు చమురు సంస్థల గురించి చెప్పాల్సిన అవసరమేలేదు. తాటిపాక గెయిల్ టెర్మినల్ పాయింట్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ సంస్థకు పైపులైన్ ద్వారా రోజుకు 8 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఇందుకు 18 ఎం.ఎం. ట్రంక్ పైపులతో 15 ఏళ్ల కిందట పైప్లైన్ వేశారు. అధ్యయన కమిటీ సూచనల మేరకు దాన్ని ఇప్పటికి రెండుసార్లు మార్చాల్సి ఉండగా అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మూడు నెలల కిందట గ్యాస్ లీకవ్వగా తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. అప్పుడే పటిష్టమైన చర్యలు తీసుకుని ఉంటే ఈ పెనువిషాదం వాటిల్లేది కాదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గెయిల్ అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బుగ్గి చేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉత్తుత్తి ఉద్యమాల్లో నాయకులు ఈ ప్రాంత సహజ సంపదతో కోట్లు ఆర్జిస్తున్న చమురు సంస్థలు నిబంధనల ప్రకారం లాభాల్లో 2 శాతం ఆ ప్రాంతం అభివృద్ధికి వెచ్చించాల్సి ఉంది. ఈ నిబంధన ను ఆ సంస్థలు ఏనాడూ నూరుశాతం అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రజలు దీనిపై పోరాటాలు చేస్తున్నా ఖాతరు చేయడంలేదు. ప్రజాప్రతినిధులు సైతం ఉత్తుత్తి ఉద్యమాలే చేసి ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
ఒకే నెలలో రెండు పెను విషాదాలు
ఒకే నెలలో సంభవించిన రెండు పెను విషాదాలు తెలుగువారికి అంతులేని ఆవేదన మిగిల్చాయి. పంచభూతాలైన నీరు, నిప్పు పగబట్టి 40 మంది తెలుగువారి ఉసురు తీశాయి. బియాస్ నది రూపంలో జలరక్కసి 24 మంది విద్యార్థులను కానరాని లోకాలకు తీసుకుపోయింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే కోనసీమ వాసులపై గ్యాస్ రూపంలో మృతువు కాటేసింది. నగరం గ్రామాన్ని నరకంగా మార్చేసి 16 మందిని మింగేసింది. విహారయాత్రకని వెళ్లిన 24 మంది విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను హిమచల్ ప్రదేశ్ లోని బియాస్ నది మింగేసింది. కులుమనాలి సమీపంలో మండిలోని తలౌటి ప్రాంత్రం వద్ద జూన్ 8న జరిగిన ఈ ఘటన విద్యార్థులకు తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది. తామెంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కంటిపాపలను క్షణాల్లో జలరక్కసి ఎత్తుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టేలోపే ప్రవాహంలోకి లాక్కుపోయింది. బియాస్ విషాదం తాలుకూ తడి ఆరకముందే తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామాన్ని శుక్రవారం (జూన్ 27న) ఉదయం మృత్యుజ్వాల కమ్మేసింది. గ్యాస్ రూపంలో 16 మందిని మసి చేసింది. నిలువెల్లా కాల్చేసి బూడిద మిగిల్చింది. అన్నెంపున్నెం ఎరుగని పల్లెవాసుల శరీరాలను ఛిద్రం చేసి 15 మందిని ఆస్పత్రి పాల్జేసింది. రక్కసి కీలలకు ఇంకా ఎంత మంది బలౌతారోనని బాధిత కుటుంబాలు భీతిల్లుతున్నాయి. బియాస్, నగరం విషాదాల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. హిమచల్ అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించి బియాస్ దుర్ఘటనకు కారణమయ్యారు. ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం నగరం ప్రజల పాలిట మృత్యుజ్వాలగా మారింది. బియాస్ నదిలో గల్లంతైన కొంత మంది విద్యార్థుల శవాలు ఇంకా దొరక్కపోవడం విషాదంలో విషాదం. నగరం ఘటనలో కళ్లెదుటే 16 మంది కాలి బూడిదయిపోవడం గుండెలు పిండేసే విషాదం. పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కొనసాగినంతకాలం ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. -
నగరం విషాదం జరిగిన తీరిదీ..
-
నగరం ప్రమాదంలో తప్పెవరిది?
-
పేదోళ్లమైనందుకేనా.. ఈ నిర్లక్ష్యం!
-
సీఎం గారు వచ్చారు.. వెళ్లారు!
-
'ఈ ఘటన దురదృష్టకరం'
-
'బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'
-
గెయిల్ బాధితులకు బాలకృష్ణ సంతాపం
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా గెయిల్ పైపులైన్ పేలుడు దుర్ఘటనపై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలక ప్రగాఢ సానుభూతి తెలిపారు. మామిడికుదురు మండలం నగరం వద్ద శుక్రవారం గ్యాస్ పైపులైన్ పేలడంతో 15 మంది మరణించారు. మరో 25 మంది గాయపడగా, వీరిలో తొమ్మిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయిల చొప్పున ఎక్స్ గ్రేసియా ప్రకటించారు. -
బాధ్యులపై కఠిన చర్యలు: చంద్రబాబు
నగరం: ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకుపైపులైను మామిడికుదురు మండలం నగరం వద్ద పేలిన దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాల పిల్లలకు టెన్త్ వరకు ఉచిత విద్యను అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. కమిటీ సమర్పించే తుదినివేదిక ఆధారంగా ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు మీడియాతో అన్నారు. నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్గా గెయిల్ తీర్చిదిద్దుతుందని, మృతుల కుటుంబాల పేరుపై 5 లక్షల రూపాయల సబ్సిడీ ఫండ్ను ఏర్పాటు చేస్తామన్నారు. -
నగరం మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా!
నగరం: తూర్పు గోదావరి జిల్లా నగరంలో చోటుచేసుకున్న గెయిల్ పైప్లైన్ పేలుడు దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు గెయిల్ కంపెనీ నుంచి 20 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 3 లక్షలు, కేంద్రం నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకుపైపులైను మామిడికుదురు మండలం నగరం వద్ద పేలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 25 మందికి గాయాలు కాగా, వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. -
నగరంలో 'సీఎం డౌన్ డౌన్.. చంద్రబాబు గో బ్యాక్'
నగరం: తూర్పు గోదావరి జిల్లా నగరం దుర్ఘటన స్థలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. పలుమార్లు ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించకోకపోవడంపై స్ధానికులు, బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తన పర్యటన రద్దు చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో ప్రభుత్వానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. 'సీఎం డౌన్ డౌన్', 'చంద్రబాబు గోబ్యాక్' అంటూ చేసిన నినాదాలు చేయడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులను బుజ్జగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్డంతో అక్కడ కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ప్రజాగ్రహం : సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
-
నిర్లక్ష్యమే కారణమైతే.. చర్యలు తప్పవు
-
నిండు జీవితాల్ని ఛిద్రం చేసిన విషాదం
-
నిర్వహణ లోపం వల్లే 'గెయిల్' పేలుడు
-
భాదితకుటుంబాలను ఆదుకుంటాం: నరసింహం
-
నిర్వహణ లోపం వల్లే 'గెయిల్' పేలుడు
తూర్పు గోదావరి జిల్లా శుక్రవారం జరిగిన గెయిల్ పైపులైన్ పేలుడుకు గల కారణాలను ఆంధ్ర విశ్వివిద్యాలయం ప్రొఫెసర్ సీవీ రామన్ విశ్లేషించారు. పైపులైన్ల నిర్వహణ, ప్రమదాలు జరగడానికి గల కారణాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. డెల్టాలో చమురు తవ్వకాల వల్ల జరిగిన ప్రమాదం కాదు. ఇది కేవలం నిర్వహణలోపం వల్లే జరిగింది. పైపులైనును ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఈ తరహా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదసంకేతాలను ముందుగా గుర్తించకపోవడం వల్ల, సమన్వయ లోపం వల్ల ఇలా జరిగింది. గెయిల్ అధికారుల దగ్గర్నుంచి స్థానిక పంచాయతీ సర్పంచి వరకు అందరి మధ్య సమన్వయం ఉండాలి. పైపులైన్ మీద ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటాయి. అందువల్ల ప్రతి మూడు నెలలకు ఒకసారి వీటిని సాంకేతిక నిపుణులు పరిశీలించాలి. ఐదు, పదేళ్లకోసారి మాత్రమే చూస్తే లోపాలు కూడా సరిగ్గా తెలియవు. పాతికేళ్ల నాటి పైపులు అంటే.. వాటి జాయింట్ల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. -
''నగరం'' నిద్రపోతున్న వేళ మృత్యుజ్వాల
-
ఒఎన్జిసి కార్యాలయంపై స్థానికుల దాడి
-
క్షతగాత్రుల్లో 15మంది పరిస్థితి విషమం
-
'పైప్లైన్పై చేయి వేస్తే ఆరేళ్లు జైలన్నారు'
గ్యాస్ పైప్లైన్లు తుప్పు పట్టాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. గెయిల్ పేలుడు ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు గెయిల్ సంస్థ బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా పాడైపోయిన పైప్లైన్ల స్థానంలో కొత్త పైప్లైన్లు వేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. పైప్లైన్ల లీకేజి విషయంలో తాను కేంద్రానికి మూడుసార్లు లేఖ రాసినా, అధికార పక్షంలో ఉన్న ఎంపీ అయినా కూడా తన లేఖను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అంతే కాకుండా 1960 నాటి పైపులైను చట్టం ప్రకారం పైప్లైన్లపై చేయి వేస్తే ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారని, ఆ నిబంధన మార్పుతో పాటు, గ్యాస్ లీక్ వల్ల ప్రమాదాలు జరిగితే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలనే అంశాన్ని చేర్చాలని ప్రతిపాదించినా ఫలితం లేకపోయిందన్నారు. యూపీఏ ప్రభుత్వంలోని చమురు మంత్రిత్వశాఖ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పైప్లైన్ లీక్ వల్ల ఎకరం మేరకు గ్యాస్ వ్యాపించిందని, అగ్గిపుల్ల వెలిగించటంతో పేలుడు జరిగిందని హర్షకుమార్ అన్నారు. అదే ఏ పదో లేక ఇరవయ్యో ఎకరాల మేరకు గ్యాస్ వ్యాపించి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదన్నారు. ఓఎన్జీసీ, గెయిల్ నిర్లకక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా ఆ సంస్థలు ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాలన్నారు. లేకుంటే కోనసీమ ప్రజలు గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను పూర్తిగా బహిష్కరించే అవకాశం ఉందని హర్షకుమార్ అన్నారు. ప్రభుత్వాలు స్పందించి ప్రజలకు భద్రతతో పాటు భరోసా కల్పించాలని ఆయన కోరారు. -
పేలుడుపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
-
గెయిల్ క్షతగాత్రుల వివరాలు ఇవే
అమలాపురం : గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటనలో గాయపడిన 12మంది క్షతగాత్రులు అమలాపురం కోనసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో పలువురు 90శాతం గాయపడినవారే. మెరుగైన చికిత్స కోసం వారిలో కొందరిని కిమ్స్ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడినవారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు అయిదుగురు ఉన్నారు. గాయపడినవారి వివరాలు. 1.ఎం.డి.తఫీ,2.తాటికాయల రాజ్యలక్ష్మి, 3.ఓనరాసి దుర్గాదేవి, 4.ఓనరాసి వెంకటరత్నం,5.రాయుడు సూర్యనారాయణ, 6.బోనం పెద్దిరాజు, 7.బోనం రత్నకుమారి,8.పల్లాలమ్మ, 9.ఓనరాసి మధుసూదన్ (9), 10.మోహన్ కృష్ణ (7), 11.జోత్స్నాదేవి (8), 12.కావీ చిన్నా (18నెలలు). కాగా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మద్దాల బాలాజీ, గోపిరెడ్డి దివ్యతేజ మృతి చెందారు. దుర్ఘటనలో 18మంది సజీవ దహనం కాగా, 30మంది గాయపడిన విషయం తెలిసిందే. -
పాతికేళ్ల నాటి పైపులైను.. పదేపదే లీకేజిలు
కోనసీమ ప్రాంతంలో ఓఎన్జీసీ కార్యకలాపాలు దాదాపు రెండున్నర దశాబ్దాలకు ముందునుంచే ఉన్నాయి. కేజీ బేసిన్లో ఉన్న గ్యాస్ నిక్షేపాలను వెలికి తీయడానికి సుమారు 25 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పైపులైన్లు వేశారు. సాధారణంగా ప్రమాణాల ప్రకారం చూస్తే ఈ పైపులైన్ల జీవితకాలం దాదాపు 50 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ అసలు సమస్య అంతా జంక్షన్ల వద్దే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పదే పదే ఈ జంక్షన్ల వద్ద నుంచి గ్యాస్ లీకై, దానికి సంబంధించిన వాసన వచ్చేదని స్థానికులు కూడా పలుమార్లు తెలిపారు. కానీ, అధికారులు మాత్రం గతంలో జరిగిన కొన్ని చిన్న చిన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుని వారి హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు, దాని తీవ్రతను గుర్తించలేదు. ఓఎన్జీసీ వెలికితీసిన గ్యాస్ను తాటిపాకలోని గ్యాస్ కలెక్షన్ సెంటర్కు పంపుతారు. అక్కడి నుంచి గెయిల్ పైప్లైన్ల ద్వారా ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో తదితర సంస్థలకు గ్యాస్ సరఫరా అవుతుంది. ఇలా సరఫరా అయ్యే గ్యాస్ పలుమార్లు లీకవ్వడం, ఆ విషయాన్ని స్థానికులు గెయిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాళ్లు వచ్చి చూసేసరికి అంతా సర్దుమణగడం లాంటివి జరగడంతో, లీకేజి గురించి ఈ ప్రాంత వాసులు ఏం చెప్పినా దాన్ని తేలిగ్గా తీసుకోవడం అధికారులకు అలవాటైపోయింది. శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ పైపులైన్ లీకై.. భారీ ప్రమాదం సంభవించినా, ఆ విషయం తెలియజేయడానికి గెయిల్ అధికారుల కోసం ప్రయత్నిస్తే ఎవరూ స్పందించలేదని స్థానికులు చెప్పారు. చుట్టుపక్కల ఇళ్లకు కూడా మంటలు వ్యాపించడంతో మెలకువ వచ్చి, ఇంట్లో ఉన్న పిల్లలను భుజాన వేసుకుని పరుగులు తీసిన తల్లులు.. తమ పిల్లలు బతికే ఉన్నారంటే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే, వాళ్లు బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఇళ్లు పూర్తిగా కాలిపోయి.. కనీసం అక్కడో ఇల్లు ఉందనే విషయాన్ని కూడా గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయాయి. పూరిళ్లు మొత్తం మాయమైపోయాయి. పెంకుటిళ్లు కూడా కాలిపోయాయి. వాటిలో ఉన్నవారు మొత్తం మరణించారు. పక్కా డాబా ఇళ్లకు ఉన్న తలుపులు, కిటికీలు కూడా కాలిపోయాయి. 20 అంగుళాల మందం ఉన్న పైపులైన్ పగిలిపోయింది. జాయింట్ వద్ద తుక్కుతుక్కుగా మారిపోయింది. ఎట్టకేలకు ఉదయం 6.45 గంటలకు మంటలు చల్లారాయి. అయినా భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సంఘటన జరగదన్న నమ్మకం మాత్రం ఇక్కడివారికి లేదు. -
సంఘటనపై నివేదిక కోరాం: యనమల
-
మా వనరులు గుజరాత్కు తరలిస్తారు కాని, మాకు రక్షణ ఇవ్వరా?
-
పేలుడు ఘటన దురదృష్టకరం: చంద్రబాబు
న్యూఢిల్లీ : గెయిల్ పైప్లైన్ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ పేలుడు ఘటనలో 14మంది చనిపోవటం బాధాకరమన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని ఘటనాస్థలానికి వెళుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామన్నారు. తనతో పాటు పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఘటనా స్థలానికి వస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. -
'అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదు'
-
ఒక్కసారిగా ఆందోళన చెందా: ప్రణబ్ ముఖర్జీ
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సంఘటన విషయం తెలియగానే ఆయన శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు వల్ల పది అడుగుల గొయ్యి పడిందని తెలిసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బాధిత కుటుంబాల వెంట ఉండాలని ఆయన తెలిపారు. ఇంత పెద్దప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే తాను ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యానని, క్షతగాత్రులకు వైద్యసేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పాల్గొంటుందని ఆశిస్తున్నానని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. -
కోనసీమలో మరో బ్లో అవుట్
-
'అధికారులకు, 108కు ఫోన్ చేసినా పట్టించుకోలేదు'
అమలాపురం : గెయిల్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ పైప్లైన్ బలహీనపడిందని, అందుకే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. చాలాసార్లు లీకులు వస్తున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వారు ధ్వజమెత్తారు. ఈ దుర్ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. పైప్లైన్ను రెండు నెలలుగా మరమ్మతు చేస్తున్నారని, అయితే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయలేదని స్థానికులు తెలిపారు. లీకు రాకుండా అధికారులు శ్రద్ధ పెట్టలేదన్నారు. ఉదయం 5.30 గంటలకు ప్రమాదం జరిగిందని, పేలుడు జరగగానే భయంతో పరుగులు తీశారన్నారు. అయిదు కిలోమీటర్ల వరకూ పేలుడు శబ్ధం వినిపించిందన్నారు. పేలుడు సంభవించిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి, అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసు డీఎస్పీ అధికారి మాత్రమే స్పందించారని స్థానికులు వెల్లడించారు. ఆయన మాత్రమే ఘటనాస్థలానికి చేరుకున్నారన్నారు. తమ కళ్ల ఎదుటే చాలామంది మృత్యువుతో పోరాడారని, అయితే తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామన్నారు. గ్రామం మధ్యలో ఉన్న పైప్లైన్ను తక్షణమే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేకుంటే తాము ఊరు విడిచి పోవాల్సిన ఉంటుందన్నారు. పైప్లైనును మార్చకపోవటమే ప్రమాదానికి కారణమన్నారు. రిఫైనరీకి కూతవేటు దూరంలో ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. బయట అధికారులు వచ్చేంతవరకూ కూడా గెయిల్ అధికారులు పట్టించుకోలేదన్నారు. హోటల్లో టీ పెట్టడానికి స్టౌ వెలిగించాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయన్నారు. ప్రమాదం తర్వాత ఏర్పడ్డ కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. ప్రజలకు భరోసా ఇచ్చేంతవరకూ పనులు నిలిపి వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
ఇదో దురదృష్టకర ఘటన:చంద్రబాబు
-
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: యనమల
న్యూఢిల్లీ : పైప్లైన్ పేలుడు ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నివేదిక కోరామని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. గ్యాస్ చాలా రోజుల నుంచి లీక్ అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారని యనమల పేర్కొన్నారు. గ్యాస్ పైప్లైన్ తుప్పుపట్టి పాడైందని చెబుతున్నా.... అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు... నగరంలోని జీసీఎస్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని వాహనాన్ని ధ్వంసం చేశారు. -
బ్లో అవుట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
ఢిల్లీ పర్యటను రద్దు చేసుకున్న చంద్రబాబు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేశారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైప్లైన్ పేలుడు ఘటన నేపథ్యంలో ఆయన తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్తో కలిసి ఆయన సంఘటనా స్థలానికి వెళ్లనున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న అమలాపురం ఎంపీ రవీంద్రబాబు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఢిల్లీ నుంచి సాయంత్రానికి అమలాపురం చేరుకుంటామని రవీంద్రబాబు తెలిపారు. My condolences to the families who lost their loved ones in East Godavari blast. Ordered an enquiry & action plan to avoid these in future. — N Chandrababu Naidu (@ncbn) June 27, 2014 -
క్షతగాత్రుల్లో 15మంది పరిస్థితి విషమం
కాకినాడ : గెయిల్ పేలుడు ఘటనలో మొత్తం 15మంది మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి పద్మావతి అధికారికంగా ప్రకటించారు. మరో 32మంది గాయపడ్డారని, వారిలో 15మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆమె శుక్రవారమిక్కడ తెలిపారు. క్షతగాత్రులకు అమలాపురం ఏరియా ఆస్పత్రి సహా స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పద్మావతి చెప్పారు. కాగా అధికారికంగా 15మంది మృతి చెందినట్లు చెబుతున్నా... 18మంది చనిపోయినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ మృతి చెందినవారిలో గోపిరెడ్డి దివ్యతేజ, మద్దాల బాలాజీగా గుర్తించారు. -
గుర్తు పట్టలేని స్ధితిలో మృతదేహాలు
-
తీవ్ర భయాందోళనలో నగర ప్రజలు
-
సంఘటనా ప్రాంతంవద్ద భయానక పరిస్ధితి
-
పేలుడుపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మోడీ ఆదేశించారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేబినెట్ కార్యదర్శి తదితరులతో కూడా మోడీ చర్చించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్ లైన్ పేలిన విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ పేలుడులో 18మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. My thoughts with the families of those who lost their lives in the GAIL Pipeline fire in AP. Prayers with the injured. — Narendra Modi (@narendramodi) June 27, 2014 గెయిల్ పేలుడు ఘటనపై ఇంకా కారణాలు తెలియరాలేదని గెయిల్ ఛైర్మన్ బీసీ త్రిపాఠి తెలిపారు. 18 అంగుళాల పైప్లైన్ వద్ద పేలుడు జరిగిందని ఆయన శుక్రవారమిక్కడ చెప్పారు. సంఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టినట్లు త్రిపాఠి పేర్కొన్నారు. I have spoken to the Petroleum Minister, Cabinet Secretary & GAIL Chairman and asked them to ensure immediate relief at the accident site. — Narendra Modi (@narendramodi) June 27, 2014 -
ముందే లీకైన గ్యాస్!!
కోనసీమలోని నగరం వద్ద గెయిల్ గ్యాస్ పైప్లైను పగిలిపోవడం వల్ల గ్యాస్ ముందుగానే లీకైంది. గురువారం అర్ధ రాత్రి సమయంలో పైప్లైన్ పగలడంతో గ్యాస్ దాదాపు అరకిలోమీటరు మేర వ్యాపించింది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అక్కడున్న ఓ హోటల్లో టీ పెట్టడానికి స్టౌ వెలిగించాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దాంతో అక్కడున్న ఇద్దరు అక్కడికక్కడే కాలిపోయారు. ఆ పక్క నుంచి బైకులో వెళ్తున్న తండ్రి, కూతురు కూడా సజీవ దహనమయ్యారు. ఇళ్లలో ఉన్నవాళ్లు పడుకున్నవాళ్లు పడుకున్నట్లే కాలిపోయారు. ఆ ప్రాంతంలో దాదాపు 10 అడుగుల మేర పెద్ద గొయ్యి ఏర్పడింది. అరకిలోమీటరు పరిధిలో అంతా బూడిద అయిపోయింది. మృతదేహాలు కనీసం గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా కాలిపోయాయి. అయితే.. ఇంత పెద్ద సంఘటన జరిగినా, ఓఎన్జీసీ, గెయిల్ అధికారులు మాత్రం వెంటనే స్పందించలేదు. ఈ ప్రాంతంలో ఉండే ఉన్నతాధికారులు తమ సెల్ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారంటూ స్థానికిఉలు జీసీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఓఎన్జీసీకి సంబంధించిన ఫైరింజన్లు వెనువెంటనే వచ్చి ఉంటే ప్రమాద తీవ్రత చాలావరకు తగ్గేదని స్థానికులు అంటున్నారు. -
మండిపడ్డ బాధితులు.. మంత్రి, కలెక్టర్ ఘెరావ్
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జరిగిన గ్యాస్ పైప్లైన్ పేలుడుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్లను ఘెరావ్ చేశారు. పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. పైపులైన్లు మాత్రం మార్చకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే తాజా ప్రమాదం జరిగిందని అన్నారు. ఇక్కడ కొన్ని పైపులైన్లు గ్రామాల మధ్య నుంచి, మరికొన్ని పంటపొలాల మధ్య నుంచి ఉన్నాయి. దశాబ్దాల నాటి పైపులైన్లు కావడంతో పాటు, వాటి నిర్వహణను కూడా పట్టించుకోకపోవడమే తరచు ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం అవుతోందని ఆరోపించారు. దీంతో.. బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గెయిల్ నుంచి కూడా పరిహారం ఇప్పిస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. ఢిల్లీనుంచి ఉన్నతాధికారులు వస్తున్నారన్నారు. క్షతగాత్రులను రాజోలు, అమలాపురం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమించిన 8 మందిని మాత్రం అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున అంతా నిద్రమత్తులో ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారికంగా 13 మంది మరణించినట్లు చెబుతున్నా, మృతులసంఖ్య ఇప్పటికే 18కి చేరినట్లు సమాచారం. మరో 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు వచ్చి, పరిసరాలు తీవ్రంగా వేడెక్కాయి. -
కోనసీమ గుండెలపై ఆరని బ్లో అవుట్
-
రేపు నగరం గ్రామానికి వైఎస్ జగన్
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జరిగిన గెయిల్ పైపులైను పేలుడు సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపం, సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోందని, వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాద సంఘటనపై విచారణ జరిపించాలని జగన్ కోరారు. కాగా, శనివారం నాడు నగరం గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. కాగా.. క్షతగాత్రుల్లో ఎనిమిదిమందిని అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో వారిని కాపాడేందుకు వైద్యబృందాలు శ్రమిస్తున్నాయి. మరోవైపు రాజోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు మరణించారు. క్షతగాత్రులలో 15 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. -
కోనసీమ గుండెలపై ఆరని బ్లో అవుట్
అటూ ఇటూ పచ్చటి పంటపొలాలు, అరటి, కొబ్బరితోటలతో అలరారే కోనసీమలో గ్యాస్ పైపులైన్లు గుండెలమీద కుంపటిలా ఉన్నాయి. పదేపదే ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నా, అధికారులు మాత్రం శాశ్వత చర్యలు చేపట్టిన పాపాన పోవట్లేదు. ఈమధ్యే కొన్నిసార్లు పైపులైన్ లీకేజి వచ్చింది. అయినా దాన్ని పట్టించుకోకపోవడం వల్లే మామిడికుదురు మండలం నగరం వద్ద తాజా ప్రమాదం కూడా జరిగింది. ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకుపైపులైను పేలడం వల్లే ఇంత భారీ ప్రమాదం సంభవించింది. గతంలో లీకేజి వచ్చినా కూడా మొత్తం పైపులైనును పరిశీలించాల్సింది పోయి.. కేవలం అక్కడికక్కడ మాత్రమే మరమ్మతులు చేసి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రస్తుత ప్రమాదంలో మంటలను కొంతవరకు అదుపులోకి తెచ్చారు. మూడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. దాదాపు 20 మీటర్ల మేర పైపులైన్ పగిలిపోయింది. 200 కొబ్బరిచెట్లు మంటల్లో మొదలు దగ్గర్నుంచి పూర్తిగా కాలిపోయాయి. సమీపంలో ఉన్న ఇళ్లు కూడా కాలిపోయాయి. ఒకే ఇంట్లోని ముగ్గురు సజీవంగా దహనమయ్యారు. కొబ్బరిచెట్లు కాలిపోవడం, ఇళ్లపై కూడా ప్రభావం ఉండటంతో ఈ ప్రాంతమంతా భయానకంగా ఉంది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రమాదం సంభవించడంతో ఏం జరిగిందో తెలిసేలోపే అంతా అయిపోయింది. గాయపడిన వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని రాజోలు ఆస్పత్రికి తరలించారు. 1993లో మామిడికుదురు మండలం కొమరాడలో తొలిసారిగా బ్లోఅవుట్ సంభవించింది. ఇక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లోఅవుట్ పాశర్లపూడి 19 స్ట్రక్చర్ పరిధిలో 1995లో అల్లవరం మండలం దేవర్లంకలో సంభవించింది. ఈ బ్లో అవుట్ రావణాకాష్టంలా రగులుతూ 65 రోజుల పాటు అందరినీ అష్టకష్టాల పాలు చేసి, చివరకు విదేశీ నిపుణుల సహకారంతో అదుపులోకి వచ్చింది. 1997లో రావులపాలెం మండలం దేవరపల్లిలో బ్లోఅవుట్ సంభవించి దానంతట అదే ఆరిపోయింది. 2005 సెప్టెంబర్లో పాశర్లపూడి స్ట్రక్చర్లోని తాండవపల్లిలో మరోసారి బ్లో అవుట్ సంభవించి కోనసీమ వాసుల గుండెలపై కుంపటి చిచ్చురేపింది. -
గెయిల్ ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి
న్యూఢిల్లీ : ఓఎన్జీసీ పైప్లైన్ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనపై ఆరా తీసిన ఆయన తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను ఆదేశించారు. మరోవైపు మంటలు అదుపులోకి వచ్చినట్లు టీపీడీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. పేలుడు ఘటనలో 13మంది సజీవ దహనం కాగా, మరో 15మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
పనిచేయని యాంటీ ఫైర్ పరికరాలు
యాంటీ ఫైర్ పరికరాలు పనిచేయకపోవడం వల్లే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పగిలి, భారీ అగ్నిప్రమాదం సంభవించిందంటున్నారు. దాదాపు వంద మీటర్ల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. మృతుల సంఖ్యను ప్రాథమికంగా 13 అని నిర్ధారించినా, అది కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలకు కూడా మంటలు వ్యాపించాయి. పొగలు దట్టంగా అలముకోవడంతో సహాయ చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిపుణులు చేరుకున్నారు. గెయిల్ గ్యాస్ పైపులైన్లు తరచు లీకవుతున్నా, పాతబడిపోయిన పైపులైన్లను మార్చేందుకు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. ప్రస్తుతం రిఫైనరీకి కాకుండా, గ్రీన్బెల్ట్ వద్ద ప్రమాదం సంభవించడంతో తీవ్రత కొంతవరకు తగ్గినట్లేనని చెబుతున్నారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను బయటకు తీశారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సాంకేతిక పరమైన చర్యలు చేపట్టడానికి అవకాశం లేకపోతోంది. పైప్లైను పగుళ్లను నివారించడానికి, మంటలను అదుపుచేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. నివాసప్రాంతాలకు సమీపంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా సంఘటన స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
ముగిసిన పంచాయతీ నామినేషన్ల ఘట్టం
కీసర, న్యూస్లైన్: నాగారం, దమ్మాయిగూడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరిరోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నాగారం గ్రామంలో మంగళవారం కౌకుట్ల అనంతరెడ్డి, అన్నంరాజు అర్చన సర్పంచ్కు నామినేషన్లు దాఖలు చేశారు. 49 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు సమర్పించారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 13 నామినేషన్లు, 18 వార్డు స్థానాలకు గాను 154 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి మధుసుదన్ తెలిపారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. దమ్మాయిగూడలో... దమ్మాయిగూడలో మొత్తం 83 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం సర్పంచ్ స్థానానికి ఇండిపెండెంట్గా స్వప్న నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 3 నామినేషన్లు, 16 వార్డు స్థానాలకు గాను 80 నామినేషన్లు అందినట్లు ఎన్నికల అధికారి కె.శ్రీనివాస్ తెలిపారు. జవహర్నగర్లో మొత్తం 276 నామినేషన్లు జవహర్నగర్: జవహర్నగర్లో మంగళవారం చివరిరోజు వివిధ పార్టీల నాయకులు తమ అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున బ్యాండ్మేలాలతో వెళ్లి నామినేషన్లు వేశారు. జవహర్నగర్ దళిత నాయకుడు యాకస్వామి వార్డు అభ్యర్థులతో కలిసి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయగా, టీడీపీ సర్పంచ్ అభ్యర్థి వెంకటాపురం రాంచందర్ (చందు) టీడీపీ రాష్ట్ర నాయకుడు మల్లారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి నక్క ప్రభాకర్గౌడ్, గ్రామ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించి వార్డు అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేశారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 23 మంది, 20 వార్డులకు గాను 253 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శంషాబాద్లో... శంషాబాద్: శంషాబాద్ మేజర్ గ్రామపంచాయతీ నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. మొత్తం 20 వార్డులకుగాను 162 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ స్థానానికి మొత్తం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వార్డు సభ్యులకు తీవ్ర పోటీ నెలకొంది. 1వార్డు జనరల్ స్థానానికి అత్యధికంగా 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 2వ వార్డులో 14 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నేత నామినేషన్ టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా ఆ పార్టీ నాయకుడు రాచమల్ల దాసు జనసందోహంతో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు ఆర్. గణేష్గుప్తా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుక్కవేణుగోపాల్, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీపామల్లేష్, ఎంపీటీసీ అభ్యర్థులు డి. వెంకటేష్గౌడ్, వై.సురేష్గౌడ్, జహంగీర్ఖాన్.వై కుమార్ తదితరులున్నారు. -
మేడారం జాతరకు ఆర్టీసీ
నిజామాబాద్ నాగారం న్యూస్లైన్ : ఆసియాలోనే పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈనెల 12వ తేదీ నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. జాతరకు జిల్లా నుంచి ఇప్పటికే భక్తులు బయలుదేరి వెళుతున్నారు. జాతరలో సేవలు అందించేందుకు ఆర్టీసీ, దేవాదాయ శాఖ అధికారులు బయలుదేరి వెళుతున్నారు. జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్ధం జిల్లా నుంచి పలు డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ వారు నడుపుతున్నారు. ఇందుకు ఆర్టీసీ సర్వం సిద్ధం చేసింది. ప్రణాళికలు తయారు చేసుకొని మరీ బస్సులను కేటాయించింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు సైతం అక్కడే మకాం వేయనున్నారు. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ నుంచి 225 బస్సులు, ఆర్ఎం, డిపో మేనేజర్లతో పాటు అధికారులు, 450 డ్రైవర్లు, 225 కండక్టర్లు మేడారం జాతరలో ప్రయాణికులకు సేవలు అందించనున్నారు. తరలనున్న ఆర్టీసీ యంత్రాంగం .. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్కు సంబంధించిన అధికారులు అందరూ మేడారం ఏర్పాట్లకు వెళ్లనున్నారు. ఆర్టీసీ ఆర్ఎం కృష్ణకాంత్, నిజామాబాద్ డిపో-1, డిపో-2, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడలకు చెందిన డిపో మేనేజర్లు, సీటీఎమ్, సూపరింటెడెంట్లు, ఇతర అధికారులు వెళ్లనున్నారు. జిల్లా నుంచి 225 బస్సులను జాతరకు కేటాయించారు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక్క కండ క్టర్ చొప్పున బయలు దేరుతున్నారు. వీరే కాక మరికొంత మంది వాలంటీర్లను కూడా తీసుకుంటున్నారు. ఇలా జిల్లా నుంచి పెద్దసంఖ్యలో మేడారం జాతరలో అధికారులు ప్రయాణికులకు, భక్తులకు సేవలు అందించనున్నారు. వీరంతా సోమవారం వెళ్లి ఈనెల 16వ తేదీ వరకు అక్కడే విధులు నిర్వహించి, 17న జిల్లాకు తిరుగు పయనమవుతారు. జిల్లాలో ఉన్న ఆరు డిపోల నుంచి బస్సులను జాతరకు కేటాయించారు. ఈ బస్సులన్నీ సోమవారం నుంచి మేడారం జాతరకు సంబంధించి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. నిజామాబాద్ బస్టాండ్ నుంచి ప్రతి పది నిమిషాలకు వరంగల్కు బస్సు బయలు దేరుతుందని ఆర్ఎం కృష్ణకాంత్ తెలిపారు. -
వేటు ఎవరిపైనో?
నిజామాబాద్ నాగారం, న్యూస్లైన్: లక్షల రూపాయల విలువ చేసే రాగి తీగను అమ్ముకుని జేబులు నింపుకున్న సంఘటనలో అసలు దోషులను తప్పించే యత్నాలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలోని ట్రాన్స్కో స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన స్టాక్ను సిబ్బంది అమ్ముకున్నారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు.. నివేదికను ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రాకు పంపించారు. ఆయన ఎవరిపై చర్యలు తీసుకుంటారో తేలాల్సి ఉంది. ఏం జరిగిందంటే ట్రాన్స్ఫార్మర్లలో కాపర్, అల్యూమినియం తీగలను వినియోగిస్తారు. మరమ్మతుల అనంతరం పాత వైరును స్టోర్ రూమ్లో నిల్వ చేస్తారు. కొత్త వైరు కూడా స్టోర్ రూమ్లోనే భద్రపరుస్తారు. 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లలో కాపర్, మిగిలిన ట్రాన్స్ఫార్మర్లలో అల్యూమినియం వైరు ఉపయోగిస్తారు. సుమారు రూ. 60 లక్షల విలువ చేసే వైరును సిబ్బంది అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ఒక ఏడీఈ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేశారు. విచారణ జరిపి నాలుగు రోజులలో నివేదిక పంపాలని ట్రాన్స్కో ఎస్ఈని ఆదేశించారు. ఈ క్రమంలో విచారణ జరి పి న అధికారులు స్టోర్ రూమ్లోని తీగలను తూకం వేయించారు. కాపర్, అల్యూమినియం నిల్వ లెక్కలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారం క్రితం సీఎండీకి ఎస్ఈ ద్వారా నివేదిక పంపించారు. అయితే బాధ్యుడిని తప్పించేందుకు ఓ ఉన్నతాధికారి యత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలలోనే ఏటా డిసెంబర్లో స్టోర్ రూమ్లోని నిల్వలు లెక్కిస్తారు. వరంగల్ కార్యాలయం నుంచి అకౌంట్స్ అధికారులు వచ్చి, ఈ వ్యవహారం చూస్తారు. 2013 డిసెంబర్లో లెక్కలు కలిశాయి. అయితే నెల రోజులలోనే స్టోర్ రూమ్లోని కాపర్ వైరు మాయం కావడం గమనార్హం. కాగా స్టోర్ రూమ్లో ఉన్న ప్రతి వస్తువు బాధ్యత ఏడీఈదే. ఆయన నిల్వను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు దోషులను వదిలి, ఇతరులను బలి చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.