Road Transport and Safety Bill
-
జూన్ 1నుంచి బీఐఎస్ హెల్మెట్స్ తప్పనిసరి
న్యూఢిల్లీ, సాక్షి: వచ్చే ఏడాది(2021) జూన్ 1నుంచి దేశంలో బీఐఎస్ ప్రమాణాలు లేని హెల్మెట్ల తయారీ, విక్రయాలను నిషేధిస్తూ కేంద్ర రోడ్ రవాణా శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ద్విచక్ర వాహనదారులను కొంతమేర ప్రమాదాల నుంచి రక్షించే యోచనలో భాగంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్నేళ్లుగా ఇందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చినట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. దేశంలో వార్షికంగా 1.7 కోట్ల ద్విచక్ర వాహనాలు తయారవుతున్నట్లు ఆటో రంగ విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా.. దేశీ పరిస్థితులకు అనుగుణంగా బీఐఎస్ ప్రమాణాలతో తేలికపాటి హెల్మెట్ల తయారీ, వినియోగానికి అనుమతించినట్లు నిపుణులు పేర్కొన్నారు. తలకు తగిలే గాయాలు రోడ్డు ప్రమాదాలలో 45 శాతం తలకు గాయాలవుతుంటాయని ఎయిమ్స్ ట్రౌమా సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ గుప్తా పేర్కొంటున్నారు. వీటిలో 30 శాతం తీవ్రంగా గాయపడిన సందర్భాలుంటాయని తెలియజేశారు. దేశీయంగా హెల్మెట్లకు బీఐఎస్ సర్టిఫెకెట్(ఐఎస్ఐ మార్క్)ను తప్పనిసరి చేయాలని కొంతకాలంగా రోడ్ రవాణా శాఖ ప్రయత్నిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సుమారు 44,000-56,000 మంది హెల్మెట్లను ధరించకపోవడంతో మరణించినట్లు అనధికార లెక్కలున్నట్లు ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. దేశీయంగా రోజూ 2 లక్షల హెల్మెట్లు విక్రయమవుతాయని ద్విచక్ర వాహన హెల్మెట్ల తయారీదారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీవ్ కపూర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే వీటిలో అత్యధికం ప్రమాణాలులేనివే ఉంటాయని తెలియజేశారు. ప్రభుత్వం తీసుకురానున్న నిబంధనలతో వేలమంది ప్రాణాలకు రక్షణ లభించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
4 గంటలు.. 143 కేసులు..
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత ఉల్లంఘనలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనాయణ్రెడ్డి నేతృత్వంలో నాలుగు గంటల పాటు జరిగిన ఈ తనిఖీల్లో మొత్తం 143 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 11 నుంచి రెండు గంటల పాటు, మధ్యాహ్నం 1.30 నుంచి మరో రెండు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వీటిలో హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న 44 మంది ద్విచక్ర వాహనచోదకులు, రాంగ్సైడ్లో వాహనాలు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న 60 మంది, ఆటో పైలెటింగ్కు పాల్పడుతున్న 26 మంది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న ఏడుగురితో పాటు టు వీలర్పై ముగ్గురు ప్రయాణిస్తున్న నేపథ్యంలో మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారిపై కేసు పెట్టడంతో పాటు ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఉల్లంఘనులకు చెక్ చెప్పడం, ప్రమాదాలు తగ్గించడానికి ఉద్దేశించిన ఈ స్పెషల్ డ్రైవ్స్ కొనసాగుతాయని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనాయణ్రెడ్డి తెలిపారు. -
రోడ్డు ప్రమాదాలపై సుప్రీం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని రహదారుల ప్రమాదాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన రహదారులపై పడిన గుంతుల కారణంగా అనేక మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వారికంటే రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని జస్టిస్ మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం శుక్రవారం అభిప్రాయపడింది. ఈ అంశంపై రహదారుల భద్రతా సంస్థ దృష్టిసారించాలని కోర్టు ఆదేశించింది. పౌరుల జీవిత, మరణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించాలని కోర్టు వ్యాఖ్యానించింది. రహదారులపై జరిగే ప్రమాదాలు ఎక్కువ శాతం గుంటల కారణంగానే సంభవిస్తున్నాయని, ప్రభుత్వాలు వారికి నష్టపరిహారం కూడా చెల్లించవలసి వస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో తమకు నివేదికను అందజేయల్సిందిగా రహదారుల భద్రతా సంస్థను న్యాయస్థానం ఆదేశించింది. -
రోడ్డు ప్రమాదాలు అడ్డుకునేదెలా?
సాక్షి, అమరావతి: మొక్కుబడి నిధుల కేటాయింపు, తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో రాష్ట్రంలో రహదారి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కళ్లెం వేయాలంటే ఏటా రహదారి భద్రతకు రూ.30 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం మొక్కుబడిగా రూ.10 కోట్లు నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. రవాణా శాఖలో అదనపు పోస్టులతో పాటు అవసరమయ్యే నిధులను, మౌలిక వసతులు కేటాయించాలని రవాణా శాఖ సమగ్ర ప్రతిపాదనలు రూపొందించినా.. సర్కారు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. రవాణా శాఖకు అదనంగా సిబ్బంది, నిధులు కేటాయిస్తే 2020 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 15 శాతానికి తగ్గిస్తామని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ లీడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్ఫోర్సుమెంట్ యూనిట్లు ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని రవాణా శాఖ ప్రతిపాదించింది. రాష్ట్ర స్థాయి రోడ్ సేఫ్టీ లీడ్ ఏజెన్సీ కింద 18 పోస్టులు, జిల్లా స్థాయిలో 21 పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. రవాణా శాఖ ప్రతిపాదనలివే... రాష్ట్ర స్థాయిలో రోడ్డు భద్రతకు ప్రత్యేకంగా 18 పోస్టులు, జిల్లా స్థాయిలో 21 పోస్టులను కేటాయించాలి. రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్, ప్రాంతీయ రవాణా అధికారి స్థాయిలో ఓ అసిస్టెంట్ సెక్రటరీ, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్–2 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, సర్కిల్ ఇన్స్పెక్టర్–2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఆర్అండ్బీ), హోం గార్డులు–5, డేటా ఎంట్రీ ఆపరేటర్లు–2, పరిపాలనాధికారి స్థాయిలో ఓ మేనేజరు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మొత్తం 18 పోస్టులు మంజూరు చేయాలి. జిల్లా స్థాయిలో ప్రాంతీయ రవాణా అధికారి, మోటారు వెహికల్ ఇన్స్పెక్టరు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టరు–2, హోం గార్డులు–10, సర్కిల్ ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టర్లు–2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మేనేజరు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 21 మందిని రహదారి భద్రత కోసం కేటాయించాలి. ఈ పోస్టులకుగాను పే అండ్ అలవెన్సుల కింద మొత్తం రూ.15.10 కోట్లు, వాహనాలకు రూ.81 లక్షలు, కార్యాలయ భవనాలకు రూ.45 లక్షలు కలిపి మొత్తం ఏడాదికి రూ.16.36 కోట్లు, రహదారి భద్రత కింద స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, ఇతర సాంకేతిక పరికరాలకు రూ.15 కోట్ల కలిపి మొత్తం రూ.30 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ నిధులు కేటాయించాలని రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదించినా.. ఇంతవరకు పట్టించుకోలేదు. రూ.3 వేల కోట్లకు పైగా రవాణా ఆదాయం రవాణా శాఖ ఆదాయం రూ.3 వేల కోట్లకు చేరింది. రయ్ రయ్మని ఆదాయం ఏ ఏటికాయేడు గణనీయంగా పెరుగుతోంది. కానీ ప్రభుత్వం రహదారి భద్రత కోసం నిధుల కేటాయింపులు మాత్రం మొక్కుబడిగా విదిల్చడం గమనార్హం. -
ప్రాణాల కోసం ప్రయాణం
ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేసే యువతలో అవేర్నెస్ కలిగించడం కోసం రామ్ చల్లా చార్మినార్ టు థేమ్స్ ప్రయాణించబోతున్నారు. రోడ్డు మీద 19000 కి.మీలు. సింగిల్ డ్రైవింగ్. యాభై రోజుల ట్రిప్. ఇలా ప్రయాణించే మొదటి తెలుగు వ్యక్తి ఇతడే. నేను ఎంబిఏ చదువుకున్నాను. నాన్నగారు చల్లా రాధాకృష్ణ పోలీసు శాఖలో పని చేసేవారు. తల్లి వసంతకుమారి నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్గా చేసి రిటైరయ్యారు. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. ప్రస్తుతం యుకేలోని యుఏఈ ఎక్స్చేంజ్లో పనిచేస్తున్నాను. ‘‘నాలుగు సంవత్సరాల క్రితం అంటే 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మా నాన్నగారు మరణించారు. అది ఆయన చేసిన తప్పు కారణంగా కాదు. ఇతరులు చేసిన తప్పు వల్ల. కాని ఫలితం? చిన్న వయసులోనే నేను తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. నాన్నగారు ట్రాఫిక్ రూల్స్ మాత్రమే కాదు అన్ని విషయాలలోనూ చాలా క్రమశిక్షణతో ఉండేవారు. రోడ్డుకి ఎడమపక్కగా వెళ్లడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో కావడం... అన్నీ పద్ధతిగానే ఉండేవారు. ఆ రోజు ఇంటి నుంచి కారులో బయటకు పని మీద బయలుదేరారు. సీటు బెల్టు పెట్టుకున్నారు. నెమ్మదిగానే కారు నడుపుతున్నారు. అంతలోనే రాంగ్రూట్లో పదిహేడు సంవత్సరాల ఒక కుర్రాడు కారులో వేగంగా వచ్చాడు. నాన్న కారుని గట్టిగా ఢీకొట్టాడు. అక్కడికక్కడే నాన్న కన్ను మూశారు. ఆ కుర్రవాడికి కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. బాధ్యత తెలియని ఒక కుర్రవాడు చేసిన తప్పుకి నా తండ్రి బలి కావలసి వచ్చింది. అప్పటికి నేను లండన్లో ఉన్నాను. ఆయన సడెన్గా పోవడంతో నాలో ఏదో తెలియని దిగులు బయలుదేరింది. జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. మన టైమ్ లిమిటెడ్ అనే విషయం ఈ సంఘటన ద్వారా ప్రాక్టికల్గా అర్థం అయ్యింది. ఆరు నెలల వరకు కోలుకోలేకపోయాను. మరో ఆరు నెలల వరకు ఏం చేయాలా అనే విషయం మీద ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాను. 2006 నుంచి నాతో స్నేహంగా ఉన్న కొందరు మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. పెద్ద స్థాయిలో కాకపోయినా, చేతనైన పనులు చేయడం మొదలుపెట్టాను. ఒక సంస్థగా రిజిస్టర్ చేశాం. 2015 లో నా మిత్రుడు కల్యాణ్తో కలిసి, ఎన్జీవోని ఏడుగురు బోర్డు సభ్యులతో సొసైటీగా రిజిస్టర్ చేశాం. చాలా మందికి ఎన్జీవో అనగానే... 50 సంవత్సరాలు దాటినవారనో, సోమరిగా ఉండేవారనో ఒక ముద్ర పడిపోయింది. ఎవ్వరి దగ్గరా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ ఆర్గనైజేషన్ని ప్రారంభించాను. మా సంపాదనలో నుంచే ఇందులో 17 లక్షలు పెట్టుబడి పెట్టాం. సేవా కార్యక్రమాలతో పాటు డ్రైవింగ్ పట్ల చైతన్యం కలిగించడమే మా ప్రధాన కార్యక్రమం. అయితే ఏదైనా పెద్ద పని చేసి ఆ విషయంలో అందరి దృష్టిని ఆకర్షించాలనిపించింది. ఆలోచించగా నాకు వచ్చిన ఆలోచనే చార్మినార్ నుంచి లండన్ వరకు రోడ్ ట్రిప్. ఇదీ ప్రయాణం చార్మినార్ నుంచి లండన్ బ్రిడ్జి వరకు ప్రయాణించేలా రెండు చారిత్రాక ప్రదేశాలను ఎంచుకున్నాను. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుంటున్నాను. 50 రోజుల పాటు ఒంటరి ప్రయాణం. ఇలా ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ ప్రయాణిస్తున్న మొదటి తెలుగు వ్యక్తిని నేనే. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు ఇలా ప్రయాణించారు. అయితే ఇద్దరు ముగ్గురు కలిసి టీమ్గా వెళ్లారు. ముంబై నుంచి ఎస్యువి మహీంద్రా మోటార్ కార్ స్పాన్సర్ చేస్తారని భావిస్తున్నాను. ఈ ప్రయాణం ఖర్చు 50 లక్షలు. జూన్ 1 వ తేదీన ఇక్కడ నుంచి బయలుదేరాలనుకుంటున్నాను. మొత్తం 19000 కి.మీ. ప్రయాణం. అన్ని దేశాల నుంచి లెటర్స్ తీసుకున్నాను. ‘కార్నెట్’ అని వెహికల్ పాస్పోర్టు ఉంటుంది. అది కూడా తీసుకున్నాను. ‘అలెర్ట్ టుడే అలైవ్ టుమారో’ అనేది మా స్లోగన్. కజగిస్థాన్లో కూడా తెలుగు ఎంబసీలు ఉంటారు. ఇలా ప్రతి దేశంలోనూ ఉన్న ఎంబసీలను ముందుగానే అవేర్నెస్ కోసం కలిసినవారితో మాట్లాడతాను. దారిలో ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వచ్చు కానీ, అన్నిటినీ అధిగమించడానికి మానసికంగా సంసిద్ధంగా ఉన్నాను. అంతా సవ్యంగా సాగితే యాభై రోజులలో పూర్తవుతుంది. ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను ఈ ప్రయాణం కోసం డైట్ ప్లాన్ చేసుకుంటున్నాను. బయటి ఆహారం తీసుకోకుండా, నాకు నేను స్వయంగా వండుకునేలా అన్నీ సమకూర్చుకుంటున్నాను. బేసిక్ ఫిట్నెస్ గురించి జాగ్రత్త పడుతున్నాను. ప్రతి నాలుగు గంటలకి కారు ఆపి, సుమారు అరగంటసేపు వాకింగ్ చేస్తాను. రోజూ తొమ్మిది గంటలకు మించకుండా డ్రైవ్ చేస్తాను.అది కూడా బ్రేకులు తీసుకుంటూ. నైట్ డ్రైవ్ చేయను. సాధారణమైన హోటల్స్లో అకామడేషన్ ముందుగానే బుక్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న అనారోగ్యాలకు సంబంధించిన మందులు నా వెంట తీసుకువెళ్తాను. కారు రిపెయిర్ వస్తే, నేనే స్వయంగా బాగుచేసుకునేలాగ పది రోజులు ట్రయినింగ్ తీసుకుంటున్నాను. జంప్లీడ్ బ్యాటరీ, జిపిఎస్ ట్రాకింగ్, ఫిజికల్ మ్యాప్స్ నాతో తీసుకువెళ్తాను. లోకల్గా ఉండే ఎంబసీ కాంటాక్ట్ నంబర్లు ఉంచుకుంటున్నాను. ఇంతకుముందు ఇలా లాంగ్ డ్రైవ్ చేసినవారి నుంచి వారి అనుభవాలు, ఇతర సమాచారం సేకరించాను. నా ఆశయం అక్కడ మొదలవుతుంది... తిరుగు ప్రయాణంలో పాఠశాలలకి, కాలేజీలకు వెళ్లి రోడ్ సేఫ్టీ గురించి వివరించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ప్రయాణిస్తే ఎంత దూరమైనా ప్రయాణించవచ్చనడానికి నేనే ఉదాహరణ అని చూపిస్తాను. యాక్సిడెంట్ వీడియోలను ప్రదర్శిస్తూ, చిన్న చిన్న విషయాలే ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను. నాన్నగారి పట్ల నాకున్న గ్రాటిట్యూడ్ను ఇలా చూపించాలనుకుంటున్నాను. సురక్షిత ప్రయాణం కోసం ఎక్కడకు వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సరైన సమయానికి బయలుదేరాలి. సేఫ్టీ రూల్స్ను అనుసరించాలి. ఇంట్లో వారిని గుర్తు చేసుకోవాలి. -
రోడ్డు భద్రత పట్టేదెవరికి..!
అతివేగం అనర్థదాయకం.. ఓవర్ లోడ్ ప్రమాదకరం.. ఇవి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగాఅధికారులు పలికే నినాదాలు. కేవలం వారోత్సవాల్లో తప్ప ఆచరణలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారుల కంటికి మాత్రం కన్పించడం లేదు. వారోత్సవాల్లో నినాదాలివ్వడమే కాదు.. ఏడాది మొత్తం నిబంధనలపై నిఘా వేయాల్సిన అవసరం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని చూసీ చూడనట్లు విడిచిపెట్టకుండా అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ఇలా ప్రయాణించేవారు ప్రమాదాల బారిన పడకుండా కాపాడిన వారవుతారు. అంతేకాక రోడ్డు భద్రత అందరి బాధ్యత అనేది అధికారులు గుర్తించాల్సిన అంశం. ఇటీవల ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన కొన్ని ప్రమాదకర ప్రయాణ దృశ్యాలు. – ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
మృత్యు శకటాలు
జిల్లాలో వాహనాలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. సగటున ప్రతి రెండు రోజులకు ముగ్గురు చొప్పున ప్రాణాలు తీస్తున్నాయి. గత మూడు వారాల్లో 34 మంది దుర్మరణం పాలయ్యారు. పెరిగిపోతున్న ప్రమాదాలకు ఈ సంఖ్య అద్దం పడుతోంది. ప్రధానంగా అతి వేగం, అజాగ్రత్త వెరసి రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలో 29వ భద్రత వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమయ్యే చర్యలు చేపట్టనున్నట్టు ఉప రవాణా కమిషనర్డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు ప్రకటించారు. సాక్షి, విశాఖపట్నం : రోజూ ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మృత్యు ఘంటికలు మోగిస్తూ జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఆయా కుటుంబాల్లో చీకట్లను నింపుతున్నాయి. లారీలు, కార్లు, జీపులతో పాటు ద్విచక్ర వాహనాలే యమపాశాలుగా మారుతున్నాయి. ప్రధానంగా అతి వేగం, అజాగ్రత్త వెరసి రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆదివారం వరకు ఈ 22 రోజుల్లో 34 మంది దుర్మరణం పాలయ్యారు. పెరిగిపోతున్న ప్రమాదాలకు ఈ సంఖ్య దర్పణం పడుతోంది. వేగమే ప్రధాన శత్రువు ప్రమాదాల్లో ప్రాణాలు హరించడానికి వేగమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తమ వాహనాలు గాని, ఎదురుగా వస్తున్న వాహనాలు గాని అతి వేగంగా నడపడంతో ప్రమాదాలకు హేతువవుతున్నాయని పోలీసు అధికారులు గుర్తించారు. రోడ్డు ప్రమాదాల్లో ఇవే ఎక్కువగా ఉంటున్నాయని వీరు చెబుతున్నారు. వేగంగా దూసుకుపోతున్నప్పుడు వాటిని అదుపు చేయలేక ప్రమాదాల పాలవడమో, లేక ఎదుటి వారిని ఢీకొట్టడమో జరుగుతున్నాయని వీరు పేర్కొంటున్నారు. ప్రమాద కారకుల్లో యువకులు, విద్యార్థులే అధికంగా ఉంటున్నారు. వీరిలో దూకుడు స్వభావమే దీనికి కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో అజాగ్రత్త కూడా దుర్ఘటనల పాలవడానికి దారి తీస్తున్నట్టు వీరి లెక్కల్లో తేలింది. ఇదీ కార్యాచరణ ప్రణాళిక మర్రిపాలెం : రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా కార్యాచరణ ప్రణాళికను డీటీసీ ప్రకటించారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన వివిధ వర్గాల డ్రైవర్లకు ప్రత్యేక పునఃశ్చరణ తరగతులు డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాలు పలు కళాశాలల్లో హెల్మెట్ ధారణ, సీటు బెల్ట్ వినియోగం, రహదారి భద్రత గురించి విద్యార్థులకు అవగాహన సదస్సులు స్కూల్ వాహనాల డ్రైవర్లు, విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ,కరపత్రాలు, బ్రోచర్లతో ప్రచారం ట్రాఫిక్ ఉల్లంఘనల మీద ప్రత్యేక తనిఖీలు పాదచారులకు రహదారి నిబంధనల గురించి వివరిస్తారు. లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ మేళాలు ఏర్పాటు చేస్తారు. ప్రమాదాల నివారణకు చర్యలు.. రోడ్డు ప్రమాదాల నివారణకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచార రథం ద్వారా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నాం. డ్రైవర్లకు ప్రత్యేక పునశ్చరణ తరగతులు నిర్వహిస్తాం. విశాఖ, అనకాపల్లి, గాజువాకల్లో లారీ, ఆటో డ్రైవర్లకు బీపీ, మధుమేహం, కంటి వైద్య పరీక్షలు చేయిస్తాం. హెల్మెట్లు, లైసెన్స్ల ఆవశ్యకతపై కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు భద్రతపై లఘుచిత్రాలను ప్రదర్శిస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై స్పెషల్ డ్రైవ్ ద్వారా కేసులు నమోదు చేస్తున్నాం. హెల్మెట్, సీట్ బెల్ట్ల ధారణపై అవగాహనా ర్యాలీలు నిర్వహిస్తాం. ఇంకా పాదచారులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం. – వెంకటేశ్వరరావు, డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ వేగ నియంత్రణ లేకే.. హైస్పీడు బైక్లతో ప్రమాదమని తెలిసినా వేగంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. రాంగ్రూట్లో రావడం ప్రమాదాలకు మరో కారణం. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం. –రమేష్కుమార్, ఏడీసీపీ, ట్రాఫిక్ -
హైదరా‘బ్యాడ్’ రోడ్లు!
ఇలా ఎవరన్నారు? ఎందుకన్నారు? సోది లేకుండా స్ట్రెయిట్గా పాయింట్లోకి పోదాం.. ఎవరన్నారు? మారుతీ సుజుకీ రహదారి భద్రత సూచిక.. ఏటా ఆ సంస్థ ఈ నివేదికను విడుదల చేస్తుంది. 2017కి సంబంధించినది తాజాగా విడుదలైంది. ఆ నివేదికలో ఓవరాల్గా నగరానికి చివరి స్థానం దక్కింది. ఎందుకన్నారు? రహదారి భద్రత సూచిక కోసం ఓ 12 పరామితులను ప్రామాణికంగా పెట్టుకున్నారు. దాని ఆధారంగా దేశంలోని 10 ప్రముఖ నగరాల్లో క్షుణ్నంగా సర్వే చేశారు. ఒక్కో నగరానికి సంబంధించి 1,000–1,200 మందిని ప్రశ్నించి..వివిధ అంశాలపై అభిప్రాయాలను తీసుకున్నారు. అందులో తేలిన అంశాల ఆధారంగా ఈ నిర్ణయానికొచ్చారు. ఏమిటా 10 నగరాలు? ఏమిటా 12 పరామితులు? సర్వే చేసిన నగరాలు: హైదరాబాద్, రాయ్పూర్, ఇండోర్, ఢిల్లీ, పుణే, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై పాదచారుల హక్కులు: రద్దీ ఉన్న రహదారులపై జీబ్రా క్రాసింగ్స్, సైకిలింగ్ ట్రాక్స్..కొన్ని చోట్ల నో వెహికల్ డేలు పాటించడం వంటివి జరగాలి. ముఖ్యంగా మెట్రో వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు పాదచారులు నడవటానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉండాలి. ఇలాంటి పనులు జరిగినప్పుడు తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఈ సర్వేలో పాల్గొన్న ప్రజలు చెప్పారు. - ఈ విభాగంలో విజేత: రాయ్పూర్ రోడ్ల నిర్వహణ, లైటింగ్: బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై తగినంత లైటింగ్ ఉండాలి. సుందరీకరణలో భాగంగా విభిన్నమైన లైటింగ్ను ఏర్పాటు చేయడం, పర్యావరణ అనుకూలమైన సౌర విద్యుత్ను వినియోగించుకోవడం.. విజేత: కోల్కతా మోటారు చట్టాలు, ట్రాఫిక్ నియంత్రణ: రాత్రి వేళల్లో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే తగు జరిమానాలు..ప్రజల్లో అవగాహన కల్పించడానికి సోషల్ మీడియాను వినియోగించుకోవడం, రద్దీ వేళల్లో సమర్థవంతంగా ట్రాఫిక్ను నియంత్రించడం.. విజేత: చెన్నై అత్యవసర సేవలు: ఏ ఉత్పాతం జరిగినా తగు విధంగా స్పందించేలా అత్యవసర సేవల విభాగాలను తీర్చిదిద్దడం.. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు వంటివాటికి దారి ఇచ్చేలా వాహన చోదకులకు అవగాహన కల్పించడం, ఫుట్పాత్లు, రోడ్లపై అక్రమణలను తొలగించేలా చేయడం.. దీని వల్ల అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ సర్వీసు వాహనాలు వెళ్లడానికి వీటిని వాడుకోవచ్చు. విజేత: అహ్మదాబాద్ రోడ్ల శుభ్రత: ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేయడం.. ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం.. చెత్త తరలించే వాహనాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ట్రాకింగ్ చేయడం.. నగరంలో ఉత్పత్తయ్యే ప్లాస్టిక్ను రోడ్లు నిర్మాణం, రిపేర్లకు పునర్వినియోగించడం. విజేత: ఇండోర్ కనెక్టివిటీ: అంతర్గత రోడ్లకు, ప్రధాన రహదారులకు మధ్య కనెక్టివిటీ.. ఫ్లైఓవర్లు.. నగరంలో విస్తృతంగా మెట్రో, ట్రామ్, రైలు సదుపాయాలు.. విజేత: ఢిల్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: బస్సుల ప్రయాణానికి ప్రత్యేకమైన లేన్లు, తగు పార్కింగ్ సదుపాయాలు, వరదలు వంటివి రాకుండా నీరు నిలవకుండా సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ విజేత: అహ్మదాబాద్ రహదారి భద్రత: ప్రమాదాల నియంత్రణ, సీటుబెల్టు, హెల్మెట్లు పెట్టుకునేలా చూడటం.స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ గన్స్, ట్రాఫిక్ సైన్స్ ఏర్పాటు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో ప్రజలు అనుసరించే తీరు.. విజేత: రాయ్పూర్ చిన్నపిల్లల భద్రతకు అనుకూలమైన వాతావరణం: స్కూళ్లు, నివాస ప్రాంతాల వద్ద స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు. సురక్షిత డ్రైవింగ్పై బస్సు డ్రైవర్లకు, రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం. విజేత: కోల్కతా దివ్యాంగులకు అనుకూలంగా: రవాణా వాహనాల్లో వీరికి ప్రత్యేకమైన సీట్లు ఏర్పాటు చేయడం.. రద్దీ ప్రదేశా ల్లో రోడ్లు దాటడానికి వాయిస్ ఇండికేటర్స్.. వాళ్ల కోసం ప్రత్యేకమైన క్యాబ్లు.. బస్సుల్లో రాయితీ టికెట్పై ప్రయాణం.. విజేత: ముంబై రోడ్ల నాణ్యత: గుంతలు లేకుండా అత్యుత్తమమైన రహదారుల నిర్మాణం.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, తక్కువ సమయంలో మరమ్మతులు చేయడం.. విజేత: ఢిల్లీ భారీ వాహనాల ట్రాఫిక్ నియంత్రణ: రద్దీ సమయాల్లో నగరంలోకి ప్రవేశించకుండా కచ్చితమైన పర్యవేక్షణ, వాటి కోసం ప్రత్యేకమైన రహదారుల ఏర్పాటు..వాహనాల ఓవర్ లోడింగ్ నియంత్రణ విజేత: అహ్మదాబాద్.. చివరగా... ఈ 12 విభాగాల్లోనూ వచ్చిన మార్కుల ఆధారంగా రాయ్పూర్కు మొదటి స్థానం దక్కగా.. హైదరాబాద్కు చివరి స్థానం దక్కింది. రహదారుల భద్రత, చిన్నపిల్లల భద్రతకు అనుకూల వాతావరణం విభాగాల్లో తప్ప అన్నింటిలోనూ నగరానికి చివరి స్థానమే వచ్చింది. ఈ రెండింటిలో 9వ స్థానం దక్కింది. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
‘స్లెడ్జింగ్ చేయను.. హారన్ కొట్టను’
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో స్లెడ్జింగ్ చేయడం, డ్రైవింగ్ చేస్తుండగా హారన్ కొట్టడం ఇష్టం ఉండదని టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే తెలిపాడు. మహారాష్ట్ర మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్(ఎమ్వీడీ), టాటా గ్రూప్ సంయుక్తంగా రోడ్డు భద్రత, శబ్ద కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా మార్చి 24న ముంబై వాంఖడే మైదానంలో రోడ్ సేఫ్టీ ఎలెవన్-నో హాంకింగ్ ఎలెవన్ అనే జట్ల పేరుతో ఓ టీ20 మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్లో రహానేతో పాటు యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా పలువురు దేశవాళీ కిక్రెటర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రహానె మాట్లాడుతూ.. మైదానంలో స్లెడ్జింగ్ చేయడం ఇష్టం ఉండదని, అలాగే డ్రైవింగ్ చేసే సమయంలో అనవసరంగా కారు హారన్ మోగించడం కూడా తనకు ఇష్టం ఉండదని తెలిపాడు. ముంబై వంటి మెట్రో నగరాల్లో శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద సమస్యగా మారిందని చెప్పుకొచ్చాడు. క్రికెట్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నాడు. -
తగ్గిన మరణాలు.. పెరిగిన జరిమానాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో భారీ స్థాయిలో మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య కంటే గతేడాది మృతుల సం ఖ్య గణనీయంగా తగ్గిందని రోడ్డు భద్రత విభాగం నివేదిక వెల్లడించింది. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా జరిమానాలు చెల్లిస్తున్నారని స్పష్టం చేసింది. బుధవారం రోడ్డు భద్రత డీజీపీ కృష్ణ ప్రసాద్ ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యతో పాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ప్రమాద గణాంకాలను పొందుపరిచినట్టు తెలిపారు. దేశవ్యాప్త ప్రమాద గణాంకాలు.. దేశవ్యాప్తంగా 2014–2016 వరకు జరిగిన ప్రమా దాలు, మృతులపై రోడ్డు భద్రత విభాగం గణాంకాలు విడుదల చేసింది. అదే విధంగా రాష్ట్ర గణాంకాలను సైతం విశ్లేషించింది. 2014లో దేశవ్యాప్తంగా 4.89లక్షల ప్రమాదాలు జరగ్గా.. అందులో 1.39 లక్షలమంది మృత్యువాతపడ్డారు. 2015లో 5.01 లక్షల ప్రమాదాలు జరగ్గా 1.46 లక్షల మంది మృతిచెందారు. 2016లో 4.80లక్షల ప్రమాదాలు జరగ్గా అందులో 1.50 లక్షలమంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో 2శాతం తగ్గుదల కనిపించడంతో పాటు మృతుల సంఖ్యలో 10శాతం తగ్గుదల కనిపిస్తోందని కృష్ణప్రసాద్ వెల్లడించారు. ప్రతీ 100 రోడ్డు ప్రమాదాల్లో 2014లో 34 మంది చనిపోతే, 2015లో 33మంది, 2016లో 31మంది, 2017లో 29 మంది మృతి చెందారని తెలిపారు. ఉల్లం‘ఘనమే’..: నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనదారులు భారీస్థాయిలోనే జరిమానాలు చెల్లిస్తున్నా రు. ఏటా జరిమానాల చెల్లింపులు 20–30శాతం పెరిగిపోతే గతేడాది మాత్రం 50శాతానికి పైగా పెరిగిన ట్టు రోడ్డు భద్రత విభాగం అధ్యయనంలో తేలింది. -
రోడ్డు సేఫ్టీపై క్రికెట్ మ్యాచ్
ముంబై : రోడ్డు ప్రమాదలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు భారత క్రికెటర్లు నడుం బిగించారు. కిక్రెట్ ను అమితంగా ప్రేమించే దేశంలో ప్రజలకు క్రికెట్ ద్వారానే మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో పలువురు క్రికెటర్లు ముందుకొచ్చారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేలా.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 24న క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్టు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్, శిఖర్ ధావన్, అంజిక్యా రహానేలతో పాటు పలువురు దేశవాళీ కిక్రెటర్లు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా నకిలీ హెల్మెట్లు తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సచిన్ లేఖ కూడా రాశారు. ఇక దేశంలో రోడ్డు ప్రమాదాల వలన ఎక్కవ మంది చనిపోతున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడంవల్లే ఎక్కవగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలు సర్వేల్లో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అవగాహన కలిగించేందుకు క్రికెటర్లు ముందుకొచ్చారు. -
‘త్వరలో డ్రైవింగ్ లైసెన్స్–ఆధార్ లింక్’
న్యూఢిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్లను ఆధార్తో అనుసంధానించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు బుధవారం ఓ కమిటీ తెలిపింది. రహదారి భద్రతపై గతంలో కోర్టు సుప్రీంకోర్టు మాజీ జడ్టి జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. గత నవంబరు 28న తాము రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శితో సమావేశం నిర్వహించామనీ, నకిలీ లైసెన్స్లను ఏరివేసేందుకు ఆధార్ అనుసంధానాన్ని త్వరలోనే చేపట్టనున్నట్లు సదరు అధికారి తమకు చెప్పారని కమిటీ పేర్కొంది. అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందిస్తోందంది. సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే అన్ని రాష్ట్రాల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్లను ఆధార్తో అనుసంధానించే పనిని కేంద్రం మొదలుపెడుతుందని కమిటీ తన నివేదికలో చెప్పింది. -
పాత వాహనాలకు కాలం చెల్లు!
సాక్షి, హైదరాబాద్: పదిహేనేళ్లు దాటిన వాహనాలు రోడ్డు ఎక్కకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలం చెల్లిన వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నందున వాటి విషయంలో అలసత్వం సరికాదన్న నిపుణుల సూచనతో ఏకీభవించింది. అలాగే మద్యం తాగి నడిపేవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. రహదారి భద్రతపై ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నా రు. వచ్చే నెలలో జరగనున్న మలిదఫా సమా వేశంలో వీటిపై ప్రకటన చేయనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో కమిటీ సభ్యులు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, పి.మహేందర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డిలతోపాటు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్శర్మ, డీజీపీ మహేందర్రెడ్డి, రైల్వే పోలీసు డీజీ కృష్ణప్రసాద్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జాతీయ రహదారుల విభాగం ఈఎన్ సీ గణపతిరెడ్డి, రాష్ట్ర రహదారుల ఈఎన్సీ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు.. వాహన ప్రమాదాలు, వాటి రూపంలో ఏటా సగటున ఏడు వేల మంది మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణించి రోడ్డు భద్రతను ఎలా పటిష్టం చేయాలో సిఫారసు చేసేందుకు సీఎం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కొన్ని నిర్దిష్ట సూచనలు చేసే బాధ్యతను కమిటీ.. జేఎన్టీయూ ప్రొఫెసర్ లక్ష్మణరావు, ఓయూ ప్రొఫె సర్ ఎం.కె.కుమార్, వరంగల్ నిట్ ప్రొఫెసర్ ప్రసాద్, ఇండియన్ ఫెడరేషన్ ఫర్ రోడ్ సేఫ్టీ ప్రతినిధి వినోద్, రోడ్సేఫ్టీ క్లబ్ ప్రతినిధి పి.శ్రీనివాస్ తదితరులకు అప్పగించింది. ఈ సమావేశంలో వారంతా పాల్గొని తమ సూచనలిచ్చా రు. మద్యం తాగి వాహనం నడిపే వారిపై, నిబంధనలు పాటించని వారి విషయంలో కఠిన చర్యలు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ నిబంధనలు, వేగ నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. వచ్చే జనవరి తొలివారంలో రహదారి భద్రతావారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇçప్పుడు తీసుకున్న నిర్ణయాలపై మలిదఫా సమావేశంలో చర్చించి ప్రకటించనున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ ఏడాది మృతుల సంఖ్య 5,931.. 2015లో 21,552 ప్రమాదాల్లో 7,110 మృతిచెందగా, 2016లో 22,811 ప్రమాదాల్లో 7,219 మంది, ఈ సంవత్సరం నవంబర్ వరకు 20,0172 ప్రమాదాలు చోటు చేసుకోగా 5,931 మంది చనిపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని మంత్రి తుమ్మల వెల్లడిం చారు. మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గినంత మాత్రాన దీన్ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. దేశంలో రోడ్డు భద్రత చర్యలు పాటిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా పోలిస్తే బాగా వెనకబడిన విషయాన్ని మరవవద్దని పేర్కొన్నారు. -
రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత
కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో రహదారి భద్రతకు పోలీసులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసులకు సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో సెట్కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తీసుకున్న రహదారి భద్రత చర్యల కారణంగా ప్రమాదాల సంఖ్య తగ్గించగలిగామని చెప్పారు. అదే స్ఫూర్తితో పోలీసు అధికారులు జిల్లాలో భద్రత చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా సిబ్బంది ఎంపిక చేయాలన్నారు. అధికంగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలను గుర్తించేందుకు అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. -
నాన్నకు ప్రేమతో..
♦ రోడ్డు భద్రతపై తల్లిదండ్రులకు ♦ పోస్టుకార్డులను రాయించిన పోలీసులు హిందూపురం : ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులు రోడ్డు భద్రత నియామాలు పాటించేవిధంగా విద్యార్థులతో వారి నాన్నకు రోడ్డుభద్రత గురించి వివరించాడానికి విద్యార్థులతో నాన్నకు ప్రేమతో అంటూ పోస్టుకార్డులు రాయించారు పోలీసులు. బుధవారం కిరికెరలోని ఎల్ఆర్జీ పాఠశాలలో పెనుకొండ డీఎస్పీ కరీమూల్లా షరీఫ్, రూరల్ సీఐ రాజగోపాల్నాయుడు ఆధ్యర్యంలో పోలీసులు రోడ్డు భద్రతపై విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలతో వారి నాన్నకు ఒక కార్డుపై రోడ్డు భద్రత గురించి హెల్మ్ట్ ధరించామని, తాగిబండి నడపొద్దని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్లో మాట్లాడావద్దని మీ ప్రాణలకు ప్రమాదం జరిగితే మేము అనాథలవుతామని పోస్టుకార్డులపై రాయించి పోస్టు చేయించారు. అనంతరం డీఎస్పీ కరీమూల్లా షరీఫ్ మాట్లాడుతూ హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారన్నారు. ప్రమాదాలను పూర్తీగా నివారించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ ఆంజినేయులు, ఎల్ఆర్జీ పాఠశాల ఏఓ నరేష్ ప్రధానోపాధ్యాయులు ప్రసాధ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
టీనేజ్ స్పీడ్కు బ్రేక్
►పిల్లలకు రహదారి భద్రతా పాఠాలు ►స్కూళ్లు, కాలేజీల్లో ఆర్టీఏ రోడ్ సేఫ్టీ క్లబ్లు ►1,450 విద్యా సంస్థల్లో ఏర్పాటుకు ప్రణాళికలు సిటీబ్యూరో: అసలే కుర్రాళ్లు. ఆపైన టాప్గేర్లో హైస్పీడ్. కళ్లు మూసి తెరిచేలోగా మాయమైపోవాలనుకుంటారు. మరోవైపు బైక్, కార్ రేసింగ్లు. అయితే రోడ్డు నిబంధనలపై అవగాహన ఉండదు. స్కూల్ దశల్లోనే బైక్ రైడింగ్ చేయాలనే ఉత్సాహంతో ప్రాణాలు కోల్పోతున్న టీనేజ్ కుర్రాళ్లు. అలాంటి పిల్లల వాహన డ్రైవింగ్కు కళ్లెం వేసేందుకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందిస్తోంది. నగర శివార్లలోని స్కూళ్లు, కళాశాలలు, తదితర విద్యాసంస్థల్లో వినూత్నంగా రోడ్డు భద్రతా క్లబ్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. సుమారు 1,450 విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకొని ఈ క్లబ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి పూర్తిగా పిల్లల క్లబ్లు ∙ఈ రోడ్డు సేఫ్టీ క్లబ్బుల నిర్వహణలో పిల్లలే ప్రధాన భాగస్వాములు. ఒకరిద్దరు టీచర్లు, కొందరు పిల్లలతో కలిపి క్లబ్లు ఏర్పాటు చేస్తారు. రోడ్డు భద్రతపై స్కూల్లో చేపట్టవలసిన కార్యక్రమాలను ఈ క్లబ్లే చేపడతాయి. ఈ క్లబ్లకు ఆర్టీఏ శిక్షణనిస్తుంది. ∙ఉదయం ప్రార్థన సమయంలో రోడ్డు భద్రత నిబంధనలను గుర్తు చేసుకోవడంతో పాటు, రోడ్డు భద్రతపై రూపొందించిన షార్ట్ఫిల్మ్లను ప్రదర్శిస్తారు. ∙పిల్లలే పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా ఆర్టీఏ శిక్షణనిస్తుంది. అవసరమైన మెటీరియల్ను ఆర్టీఏ అందజేస్తుంది. ∙8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, కాలేజీల్లో ఇంటర్ స్టూడెంట్స్ను భాగస్వాములుగా చేస్తూ ఈ క్లబ్లు ఏర్పాటు చేస్తారు. ∙కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ, ఉప్పల్, బోడుప్పల్, అల్వాల్, మల్కాజిగిరి, బాలానగర్, షామీర్పేట్ తదితర ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనే బ్లాక్స్పాట్లు కూడా అధికంగా ఉన్నట్లు రవాణా అధికారులు గుర్తించారు. ∙స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్డే వంటి వేడుకల్లో రోడ్డు భద్రతపై పిల్లలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు. ప్రమాద రహిత జీవనమే లక్ష్యంగా.. ముందస్తుగానే పిల్లల్లో అవగాహన కల్పించడం, ఉపాధ్యాయులను, స్కూళ్లను, తల్లిదండ్రులను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయడం ద్వారా భవిష్యత్ తరాలు ప్రమాదరహిత జీవనం కొనసాగించాలన్నదే మా ఆకాంక్ష. అందుకే ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. – డాక్టర్ పుప్పాల శ్రీనివాస్, ఉప రవాణా అధికారి, మేడ్చల్. -
రోడ్డు భద్రత యాప్లో ప్రమాద దృశ్యాలు
– అప్లోడ్ చేయాలని పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశం కర్నూలు: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగినా ఆ దృశ్యాలను ఫొటోలు తీసి.. రోడ్డు భద్రత యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని పోలీసు అధికారులను డీజీపీ సాంబశివరావు ఆదేశించారు. బుధవారం ఉదయం విజయవాడ నుంచి అన్ని జిల్లాల పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి రాయలసీమ ఐజీ శ్రీధర్రావు, ఎస్పీ ఆకె రవికృష్ణ, అడిషనల్ ఎస్పీ షేక్షావలీ హాజరయ్యారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ..వాహనాలను రాంగ్ రూట్లో నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. జిల్లాల వారీగా రోడ్డు ప్రమాదాల సమచారాన్ని అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల్లోని హాస్పిటల్స్ ఫోన్ నంబర్లు పోలీసు సిబ్బంది కలిగి ఉండాలన్నారు. కొత్తగా ఎంపికైన ఎస్ఐలు శిక్షణకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని చెక్పోస్టుల సమాచారం అందజేయాలన్నారు. డీఎస్పీ రమణమూర్తి, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు మహేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, డేగల ప్రభాకర్, సుబ్రమణ్యం, ఆదిలక్ష్మీ, రామాంజనేయులు (కమ్యూనికేషన్), ఆర్ఐలు రంగముని, జార్జ్, రామకృష్ణ, ఈ.కాప్స్ ఇంచార్జి రాఘవరెడ్డి, డీఐజీ సీసీ నారాయణ, డీసీఆర్బీ ఎస్ఐ పులిశేఖర్, ఈ.కాప్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
విజయనగరం టౌన్: రోడ్డు భద్రతా కమిటీతో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతా చర్యలను వి«విధ శాఖాధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ యూసీజీ నాగేశ్వరరావు, ఎస్పీ ఎల్కెవి.రంగారావులు నిర్వహించిన సమీక్షలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో కారణాలను అధికారులకు విశ్లేషించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను విస్తరించాలని, ఆక్రమణలు తొలగించాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. అధిక లోడ్లతో వెళ్లే వాహనాలను సీజ్ చేయాలని, ప్రత్యేక దాడులను పోలీసులు, ఆర్టీవో, ఆర్టీసీ అధికారులతో సంయుక్తంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై ట్రక్ బేలను మరింతగా విస్తరించాలన్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో మున్సిపల్ శాఖాధికారులు రాత్రి సమయాల్లో ఎక్కువ కాంతి ఉండే విధంగా లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారులపై ట్రామా కేర్ సెంటర్లు మరింతగా ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రేడియం, రిఫ్లక్టివ్ టేప్లను , హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై మద్యం షాపులను తొలగించాలని జాతీయ రహదారులకు కనీసం 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఎస్పీ సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టేప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు మరింత సమర్ధవంతంగా రూపొందించాలని జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనరు కృష్ణవేణి, అదనపు ఎస్పీ ఎవి.రమణ, ఆర్టీసీ రీజనల్ మేనేజరు అప్పారావు, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, విజయనగరం డీఎస్పీ ఎవి.రమణ, బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు, రోడ్డు భద్రతా నోడల్ అధికారి త్రినాథరావు, మున్సిపల్ కమిషనరు నాగరాజు, జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులు, జాతీయ రహదారుల నిర్మాణ కాంట్రాక్టర్లు, పోలీస్, ఆర్టీసీ, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నిబంధనలు ఇవీ
అనంతపురం సెంట్రల్ : రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోడ్డు నియమ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి. లేకుంటే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని రోడ్డు, రవాణాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఎవరైనా వాహనం నడపాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. – రిజిస్ట్రేషన్ లేకపోతే వాహన చట్టం సెక్షన్ 39, 192 ప్రకారం జరిమానా విధిస్తారు. – డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సెక్షన్ 3, 4 , 180, 181 ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష వేస్తారు. – పొల్యూషన్ సర్టిఫికెట్స్ లేకపోతే సెక్షన్ 190(2) ప్రకారం రూ. 1000 జరిమానా విధిస్తారు. – ఇన్సూరెన్స్ లేకపోతే సెక్షన్ 196(ఏ) ప్రకారం 3 నెలలు జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తారు. మద్యం తాగి నడిపితే : మద్యం సేవించి వాహనం నడుపరాదు. మోటారు వాహన చట్టం సెక్షన్ 185 ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడితే : ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ నేరంగా పరిగణిస్తారు. మోటారు వాహన చట్టం సెక్షన్ 184 ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా విధిస్తారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణిస్తే : పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులకు ఎక్కించుకొని వెలితే మోటారు వాహన చట్టం సెక్షన్ 86 ప్రకారం జరిమానా లేదా పర్మిట్పై చర్యలు తీసుకుంటారు. సీట్ బెల్ట్ ధరించకపోతే : సీఎంవీ రూల్ 138(3) ప్రకారం విధిగా సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ ధరించకపోతే మోటారు వాహన చట్టం సెక్షన్ 177 ప్రకారం జరిమానా రూ.100 విధించబడుతుంది. స్కూల్ బస్సులు నిబంధనలు పాటించకపోతే : ఏపీ మోటారు వాహనాల నియమావళి 1989 నందు 185(జి) ప్రకారం పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్నా, 60 ఏళ్లు దాటిన వారు డ్రైవింగ్ చేసినా, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినా మోటారు వాహన చట్టం సెక్షన్ 86 ప్రకారం జరిమానా లేదా పర్మిట్పై చర్యలు తీసుకుంటారు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే : సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం, నిబందన అతిక్రమించిన వారికి వాహన చట్టం సెక్షన్ 184 ప్రకారం రూ. 1000 జరిమానా లేదా సీఎంవీ రూల్ 21(6) ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే : హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ తప్పని సరిగా ధరించాలి. లేని రూ.100 జరిమానా విధిస్తారు. అతి వేగం ప్రమాదకరం : వాహనాలను అతివేగంగా నడపటం అత్యంత ప్రమాదకరం. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 112, 183 (1) ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష పడుతుంది. -
రోడ్డు సేఫ్టీపై డీజీపీ రివ్యూ
విజయవాడ: రోడ్డు ప్రమాదాల నివారణపై బుధవారం డీజీపీ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సాంబశివరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రోడ్డు సేఫ్టీ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మన రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది.. అధికారులకు చెడ్డపేరు వచ్చినా నిబంధనలను కఠినంగా అమలు చేసి హెల్మెట్ తప్పనిసరి చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో 77 శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. ద్విచక్రవాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు 32 శాతం మంది, నాలుగు చక్రాల వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు 17 శాతం మంది మృతి చెందుతున్నారని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 'రోడ్డు ప్రమాదాలపై శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే హడావిడి చేసి ఆ తర్వాత వదిలేస్తున్నారు. ఏర్పేడులో జరిగిన ప్రమాదం పై ముఖ్యమంత్రి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏర్పేడు తరహా ప్రమాదాలు జరగకూడదని సీఎం సీరియస్గా చెప్పారు. యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ బాధ్యత కూడా ఓనర్పై ఉండాలి. రోడ్డు సేఫ్టీ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది' అని ఆయన అన్నారు. హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను కళ్లారా చూసి కూడా ఏం చేయలేకపోతున్నాం.. పెద్దాపురం రోడ్లు వర్షం వస్తే చాలు అధ్వాన్నంగా తయారవుతున్నాయి. రోడ్డు భద్రత చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలని అన్నారు. -
ప్రమాదాలు జరిగితే కలెక్టర్లు, ఎస్పీలదే బాధ్యత
శాఖాధిపతుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: జిల్లాల్లో జరిగే ఏ ప్రమాద ఘటనకైనా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత వహించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రులు, శాఖాధిపతులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సూచించారు. ఉచిత ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, ఎక్కడైనా వసూళ్లు జరిగితే పీడీ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు. అధికారులు తప్పు చేసినా ఉపేక్షించనని, ఏ స్థాయి అధికారి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు. అధికారు ల్లో నైపుణ్యం, సామర్థ్య పెంపు బాధ్యతల్ని విశ్రాం త సీఎస్ ఎస్పీ టక్కర్కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోని వారిని ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించేందుకు త్వరలో చట్టాన్ని తెస్తున్నట్లు తెలిపారు. పర్యాటక శాఖపై సమీక్ష సందర్భంగా భవానీ ద్వీపాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.10 కోట్లతో వాటర్ స్క్రీన్ల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాకు అనుకూలంగా పనిచేయాల్సిందే.. అధికారులంతా తమకు అనుకూలంగా పనిచేయాల్సిందేనని, లేకపోతే చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి కొందరు అధికారులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, దీన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన కాంతీలాల్ దండే.. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ విధానం సరిగా లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని తాను పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే అందులోని వాస్తవాన్ని పట్టించుకోకుండా సీఎం ఏకంగా శాఖాధిపతుల సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తి విరుచుకుపడ్డారు. హద్దు మీరితే ఉన్నతాధికారులయినా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టే బాధ్యతను రెవెన్యూ, హోం, మైనింగ్ శాఖ మంత్రులకు అప్పగిస్తున్నానన్నారు. -
హెచ్చరించిన సచిన్.. ఎందుకో తెలుసా..!
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ఎన్నిసార్లు చెప్పినా వాహనదారుల వైఖరిలో పూర్తిస్థాయిలో మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండంటూ మాజీ క్రికెటర్ సచిన్ తన ఫేస్ బుక్ లో ఆదివారం ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో కేవలం గంటలోనే 20 లక్షల మంది వీక్షించడం విశేషం. అరకోటికి పైగా షేర్లు, లక్షల మంది లైక్స్ తో దుమ్మురేపుతుంది. రోడ్డు భద్రతా అంటే హెల్మెట్ ధరించడమని తనతో సెల్ఫీ దిగేందుకు రోడ్డుపై ఆగిన ఇద్దరు యువకులకు సచిన్ చెప్పారు. ఈ వీడియో గమనించినట్లయితే.. ఓ యువకుడిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దయచేసి హెల్మెట్ ధరించండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. మరోసారి తనకు బైకుపై కనిపిస్తే హెల్మెట్ తోనే కనిపించాలని యువకుడికి సూచించగా .. ఒకే అంటూ అతడు బదులిచ్చాడు. ఆపై సచిన్ ను గుర్తించి నమస్కారం పెట్టిన మరికొందరికి కూడా సచిన్ ఇదే విషయాన్ని సూచించారు. -
ప్రాణనష్టం నివారణకు రోడ్డుసేఫ్టీ వెహికల్స్
ప్రారంభించిన అర్బన్ ఎస్పీ రాజకుమారి అందుబాటులో మూడు వాహనాలు రాజమహేంద్రవరం రూరల్ : రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు రోడ్డు సేఫ్టీ వాహనాలను ఏర్పాటు చేశామని అర్బ¯ŒS జిల్లా ఎస్పీ పి.రాజకుమారి తెలిపారు. శనివారం సాయంత్రం మోరంపూడి సెంటర్లో మూడు వాహనాలను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు సేఫ్టీ వాహనాలు ఆ ప్రాంతానికి వెళ్లి క్షతగాత్రులను తీసుకుని సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్చుతాయన్నారు. అర్బ¯ŒS జిల్లా పరిధిలో 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 45 మంది, 2014లో 75 మంది మృత్యువాత పడ్డారన్నారు. రాజానగరం పోలీస్స్టేష¯ŒS పరిధిలో నరేంద్రపురం, బొమ్మూరు పోలీస్స్టేష¯ŒS పరిధిలో మోరంపూడి, కడియం పోలీస్స్టేష¯ŒS పరిధిలో బుర్రిలంక గ్రామాల్లో జాతీయరహదారి పక్కన ఈ వాహనాలు ఉంటాయన్నారు. ఈ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉందని, ప్రమాదం తెలిసిన వెంటనే ఐదు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుంటాయన్నారు. అర్బ¯ŒS జిల్లాలో ఈ–బీట్ సిస్టమ్ : రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లాలో ఈ–బీట్ సిస్టమ్ అమలు చేస్తున్నామని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఈ–బీట్ సిస్టమ్లో ఆఫ్లై¯ŒS యాప్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అర్బ¯ŒS జిల్లాలో 68 బీట్లు ఉన్నాయన్నారు. బీట్ షెడ్యూల్ ప్రకారం పది నుంచి 20 పాయింట్లు ఉంటాయన్నారు. ప్రతి పాయింట్ వద్ద బీట్ కానిస్టేబుల్ 20 నుంచి 30 నిమిషాలు ఉండాలన్నారు. ఇప్పటికే 26 సెల్ఫోన్లకు ఈ–బీట్ సిస్టమ్ అప్లోడ్ చేశామన్నారు. కార్యక్రమాల్లో డీఎస్పీలు రమేష్బాబు, కులశేఖర్, నారాయణరావు, సత్యానందం, త్రినాథరావు, జి.శ్రీనివాసరావు, రామకృష్ణ, ఇ¯ŒSస్పెక్టర్లు చింతా సూరిబాబు, కనకారావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, కె.వరప్రసాదరావు, సురేష్, కృపానందం, రవీంద్ర, రవికుమార్, రామకోటేశ్వరరావు, సాయిరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకటి నుంచే ‘ట్రాఫిక్ బోధన’
►రహదారి భద్రతను సబ్జెక్ట్గా చేర్చాలని నిర్ణయం ►ఎస్సీఈఆర్టీ బృందంతో ట్రాఫిక్ కాప్స్ కసరత్తు ►ఇప్పటికే పాఠ్యాంశాలు సిద్ధం చేసిన పోలీసులు ►ఈ ఏడాదికి ఆన్లైన్లో ఈ–బుక్స్ సాక్షి, సిటీబ్యూరో: ⇒రహదారిపై ఏఏ ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేసుకోవాలి? పార్కింగ్లో ఉన్న రకాలను వివరించండి. ⇒ ట్రాఫిక్ సిగ్నల్లో ఎన్ని లైట్లు ఉంటాయి? ఏఏ రంగు దేన్ని సూచిస్తుందో సోదాహరణగా రాయండి. ⇒రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమిటి? ⇒అత్యవసర సమయాల్లో ఏఏ నెంబర్లకు సంప్రదించాలో పేర్కొనండి. ....ఇకపై విద్యార్థులకు పరీక్షల్లో ఈ తరహా ప్రశ్నలూ ఎదురుకానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ‘రహదారి భద్రత విద్య (రోడ్డు భద్రత, జాతి భవిష్యత్తు)’ పేరుతో అదనంగా ఓ సబ్జెక్ట్ చేరనుంది. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) వారు కసరత్తు పూర్తి చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ఉద్దేశించి మూడు పుస్తకాలను డిజైన్ చేశారు. ఆరు నుంచి ఎనిమిది వరకు అనుకున్నా... రహదారి భద్రత విద్య సబ్జెక్ట్ను కేవలం ఆరు నుంచి ఎనిమిదో తరగతి వారికి మాత్రమే పరిచయం చేయాలని, వారిలో అవగాహనకు కృషి చేయాలని ప్రాథమికంగా ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు గత ఏడాదే ప్రాథమికంగా పాఠ్యాంశాలను సైతం సిద్ధం చేశారు. అయితే నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ఆలోచన, ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రోడ్డు క్రాసింగ్, లైన్ డిసిప్లేన్ వంటి ప్రాథమిక అంశాలను బోధించనున్నారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు రహదారి భద్రతకు సంబంధించి లోతైన అంశాలతో పాటు ఎంవీ యాక్ట్లోని కీలక నిబంధనలు, వాటిని పాటిస్తే కలిగే లాభాలు, విస్మయిస్తే చోటు చేసుకునే పరిణామాలు తదితర అంశాలను పాఠ్యాంశంగా చేర్చనున్నారు. తొమ్మిది పది తరగతులకు పార్కింగ్ విధానాలు, వాటిలో ఉండే లోటుపాట్లు, రహదారి భద్రత నిబంధనల్నీ వివరించనున్నారు. ఈ ఏడాదికి ఈ–బుక్స్ రూపంలో... ఈ విద్యా సంవత్సరం (2017–18) నుంచే రహదారి భద్రత విద్యను ఓ సబ్జెక్ట్గా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఎస్సీఈఆర్టీ ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. అయితే తుది కసరత్తులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ ఏడాదికి టెక్ట్స్బుక్స్ అందించడం కష్టసాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్కాపీలను సిద్ధం చేసి పాఠశాలలకు ఆన్లైన్లో ఈ–బుక్స్ రూపంలో పంపించాలని భావిస్తున్నారు. వాటిని ఆయా పాఠశాలలకు చెందిన వారు ప్రింట్ఔట్స్ రూపంలో విద్యార్థులకు ఇచ్చేలా చర్యలు తీçసుకుంటారు. వచ్చే విద్యా సంవత్సరం (2018–19) నుంచి సోషల్ లేదా మోరల్ సైన్స్లకు అనుబంధంగా రహదారి భద్రత విద్య సబ్జెక్ట్ టెక్ట్స్బుక్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎస్సీఈఆర్టీతో భేటీ అయిన ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ సబ్జెక్టులు, అందులోని అంశాలను పరిశీలించారు. ఇతర ఉపయుక్తమైన అంశాలు... రహదారి భద్రత విద్య సబ్జెక్ట్లో కొన్ని ఇతర ఉపయుక్తమైన అంశాలను చేర్చాలని ట్రాఫిక్–ఎస్సీఈఆర్టీ అధికారులు నిర్ణయించారు. 100, 101, 108 వంటి ఎమర్జెన్సీ నెంబర్ల ఉద్దేశం, వాటిని వినియోగించాల్సిన విధానం, దుర్వినియోగం చేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులు తదితర వివరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటితో పాటు ఇంటి పరిసరాలు, వీధులు, కాలనీలు పరిశుభ్రంగా ఉంచడానికి పాటించాల్సిన అంశాలనూ పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు. రాష్ట్రంలో రాష్ట్ర, కేంద్ర సిలబస్లతో నడిచే పాఠశాలలు ఉన్నాయి. తొలి దశలో స్టేట్ సిలబస్లోని పాఠ్యపుస్తకాల్లో ట్రాఫిక్ పాఠాలను చేరుస్తున్నారు. సెంట్రల్ సిలబస్ అమలులో ఉన్న పాఠశాలలకు బుక్లెట్స్ను సరఫరా చేసి ప్రత్యేక పీరియడ్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో అమలైన తర్వాత కేంద్రం పరిధిలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కు (ఎన్సీఈఆర్టీ) లేఖ రాయడం ద్వారా ఆ సిలబస్లోనూ పాఠ్యాంశాలుగా చేర్చేలా ప్రయత్నాలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాఠ్యాంశంగా కాకుండా సబ్జెక్ట్గా.. ‘ఏటా వేల మందిని పొట్టనపెట్టుకుంటున్న, అంతకు రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులుగా మారుస్తున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి అవసరమైన అన్ని రకాలైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అంశాలను సబ్జెక్టుగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తొలుత దీన్ని ఓ పాఠ్యాంశంగా చేర్చాలని భావించాం. అయితే ప్రతి విద్యార్థి నేర్చుకోవడమేనేది కచ్చితంగా చేయడానికే సబ్జెక్టుగా పెట్టాలని నిర్ణయించాం. బడి ఈడు నుంచే బాధ్యతల్ని పెంచితే సత్ఫలితాలు ఉంటాయి. ఆ మేరకు విద్యాశాఖ అధికారులతో కలిసి కసరత్తు పూర్తి చేస్తున్నాం’. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ ఏఏ తరగతుల వారికి ఏం బోధిస్తారంటే... ఒకటో తరగతి: ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత రెండో తరగతి: పాదచారులు–జాగ్రత్తలు మూడో తరగతి: రవాణా సౌకర్యాలు –వాహనాలపై ప్రయాణం 4,5,6,7 తరగతులు: రోడ్డు భద్రత–ప్రాముఖ్యత, ట్రాఫిక్ సిగ్నల్స్–సైన్ బోర్డులు, రోడ్ ప్రమాదాలు–కారణాలు, భద్రతా చర్యలు–సురక్షిత ప్రయాణం, విద్యార్థులు, రవాణా సౌకర్యాలు 8,9,10 తరగతులు: రోడ్డు భద్రత–ప్రాముఖ్యత, వాహనాలు నిలుపు విధానం, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ప్రమాదాలు– నిరోధించే మార్గాలు, భద్రతా చర్యలు, తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలు. (ప్రతి తరగతి వారికీ కొన్ని వీడియో క్లాసులు ఉండేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి) -
9 పట్టణాల్లో ట్రాఫిక్ పార్కులు
ఏలూరు సిటీ : జిల్లాలోని 9 పట్టణాల్లో మే 15 నాటికి 9 ట్రాఫిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ కె.భాస్కర్ చెప్పారు. మంగళవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని, ఈ పరిస్థితిని నివారించేందుకు రోడ్డు భద్రతపై అనేక కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏలూరు నగరపాలక సంస్థతో పాటు 9 పురపాలక సంఘాల్లో ట్రాఫిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ పార్కులను మే 15 నాటికి పట్టణాల్లో ఏర్పాటు చేస్తే కమిషనర్లకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని చెప్పారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రతిరోజూ రెండు, మూడు ప్రమాదాలు జరిగుతుంటే ఐదారుగురు చనిపోతున్నారని, ఈ పరిస్థితిని నివారించాలి్సన బా«ధ్యత అందరిపై ఉందన్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రధాన రహదారుల్లో మద్యం షాపులు తొలగింపు జిల్లాలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఏప్రిల్ 1 నుంచి ఒక్క మద్యం దుకాణాలు కనిపించేందుకు వీలులేదని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో మద్యం షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని, మద్యం తాగాలనే కోరిక కలిగించే ప్రచార బోర్డులు కూడా కనిపించేందుకు వీలులేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర ప్రధాన రహదారుల్లోనూ మద్యంషాపులు ఇకపై కనిపించబోవని స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై ఏ చిన్న గొయ్యి కనిపించినా సహించబోమని, టోల్ప్లాజాలు ఏర్పాటు చేసుకుని ప్రజల నుంచి ఎలా పన్నులు వసూలు చేస్తున్నారో అదేస్థాయిలో జాతీయ రహదారులపై నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ చెప్పారు. జాతీయ రహదారులపై 27 చోట్ల గుంటలు ఉన్నట్లు పరిశీలనలో తేలిందని, వాటిని మూడురోజుల్లోగా మరామ్మత్తులు చేయాలని ఎన్హెచ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇకపై గొయ్యి కన్పించిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో గోతులు సంబంధిత అధికారులు పూడ్చివేయకుంటే కలెక్టర్గా కాకుండా జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో బా«ధ్యులను జైలుకు పంపించేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. జిల్లాలో 45 ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. సమావేశంలో డీటీసీ సత్యనారాయణమూర్తి, ఆర్అండ్బీ ఎస్ఈ ఎంవీ నిర్మల, పంచాయితీరాజ్ ఎస్ఈ ఇ.మాణిక్యం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.కోటేశ్వరి, డీఈవో ఆర్ఎస్ గంగాభవాని, నగరపాలక సంస్థ కమిషనర్ యర్రా సాయి శ్రీకాంత్, నేషనల్ హైవే అథారిటీ అధికారి వెంకటరత్నం, నేషనల్ హైవే విజయవాడ పీడీ టి.సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు యాక్సిడెంట్ ఫ్రీ డే
ప్రమాదాలు జరగకుండా నిబంధనలు పాటించండి: పోలీస్ శాఖ సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రత వారోత్స వాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్శాఖ అవగాహన కార్య క్రమాలు చేపడుతోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా యాక్సిడెంట్ ఫ్రీ డేగా పా టించాలని వాహనదారులను కోరింది. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో 7వేల మంది మృత్యువాత పడుతున్నారని.. వీరి లో ద్విచక్ర వాహనదారులు, పాదాచారులే 50 శాతానికి పైగా ఉంటున్నారని పేర్కొంది. యువకులే అధికంగా ప్రాణాలు కోల్పో తున్నారని, ప్రమాదాలు జరుగకుండా మంగళవారం యాక్సిడెంట్ ఫ్రీ డేగా పా టించాలని డీజీపీ అనురాగ్శర్మ, రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ కృష్ణప్రసాద్ చెప్పారు. రాష్ట్రంలో ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు
నల్లగొండ క్రైం : నా కుమారుడు అడిగినా బైకు కొనివ్వలేదని, మీ పిల్లలను కూడా గారాబం చేసి బైక్లు కొనిస్తే మనకే నష్టం జరుగుతుందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రోడ్డు భద్రత ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక క్లాక్టవర్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. దేశంలో నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, నెలకు 400 మంది, సంవత్సరానికి 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 99 శాతం మానవతప్పిదాల వల్లే జరుగుతున్నాయన్నారు. సీటుబెల్ట్, హెల్మెట్ పెట్టుకోకపోవడం, అతివేగం, మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కార్లలో వెనుక సీట్లో కూర్చున్న వారే ఎక్కువగా మరణిస్తున్నారని, ఆ సీట్లో కూర్చున్న వారు కూడా సీటుబెల్ట్ పెట్టుకోవాలన్నారు. లైసెన్స్ లేని వారికి బండి ఇస్తే యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విద్యార్థులు తమ తండ్రి చెప్పాలని సూచించారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు కేసులు రాస్తుంటారని అన్నారు. భద్రత ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు, డ్రైవర్లకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కలెక్టర్ గౌరవ్ఉప్పల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ కమిటీతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ గత 14 రోజులుగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వివిధ అంశాలపై విద్యార్థులకు, ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించామన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదరహితంగా మార్చాలన్నారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు జాగ్రత్తలపై ఆలోచన ఉంటుందని, ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం వ్యాసరచన, పెయింటింగ్, స్లో సైక్లింగ్, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంసప్రతాలు, హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్, సీఐలు ఉన్నారు. -
జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ
– రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నగరంలో భారీ ర్యాలీ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునని డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ పి.ప్రమీళ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అవుట్ డోర స్డేడియం నుంచి నంద్యాల చెక్ పోస్టు వరకు అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వాహనదారులు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టును తప్పక పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలు,దేవాలయాల సమీపంలో వాహనానలు నెమ్మదిగా పోయేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ జగదీశ్వరాజు, ఎంవీఐ అతికనాథ్, ఏఎంంవీఐ రమణనాయక్, రఘునాథ్ పాల్గొన్నారు. వాహనాల వేలం పాట వాయిదా బుధవారం నిర్వహించాల్సిన పాత వాహనాల వేలం పాటను వాయిదా వేసినట్లు డీటీసీ పి.ప్రమీళ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం, రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసినట్లు వివరించారు. తిరిగి ఫిబ్రవరి ఒకటో తేదీన వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు. -
రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా 2 కే రన్
సిద్దిపేట: రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సిద్దిపేటలో 2కే రన్ను నిర్వహించారు. ఈ రన్ను పోలీసు కమిషనర్ శివకుమార్, శాసనసభ్యుడు రామలింగారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం విభాగాల వారీగా బహుమతులు ప్రదానం చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్ వేణుగోపాల్రెడ్డి, సత్యనారాయణ, సతీష్కుమార్, ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐలు సురేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, వెంకటేశం, ఎస్పైలు, సిబ్బంది, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. -
కన్నోళ్లకు కన్నీళ్లు మిగుల్చొద్దు
► రోడ్డు భద్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలి ► అవగాహన సదస్సులో ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ నిర్మల్ రూరల్ : నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ కన్నవాళ్లకు, భార్యాపిల్లలకు జీవితాంతం కన్నీళ్లను మిగిల్చవద్దని, ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు ఉండవని ఎస్పీ విష్ణు వారియర్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలోని దివ్య గార్డెన్స్ లో బుధవారం ఆటో డ్రైవర్లు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ, దేశంలో ప్రతీ సెకన్ కు ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. వీటిని నివారించాలంటే ఇంట్లో నుంచి ద్విచక్ర వాహనం బయటకు తీస్తున్నామంటే తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. తలకు భారం అనుకోవద్దని, అదే తమను కాపాడుతుందన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. భారీ వాహనాలను నడిపేటప్పుడు కచ్చితంగా రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలన్నారు. వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు అనేవే ఉండవన్నారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడుపవద్దని సూచించారు. పోలీస్ సిబ్బంది కూడా హెల్మెట్ లేకుండా విధులకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో రోడ్డు భద్రతకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ‘డ్రంకన్ డ్రైవ్ చేపట్టే బదులు.. మద్యం అందుబాటులో లేకుండా చేయాలి..’ అని విద్యార్థిని అర్ఫత్షా అడిగిన ప్రశ్నకు ఎస్పీ సమాధానమిచ్చారు. లిక్కర్ తయారీ ప్రభుత్వం చేతిలో ఉం టుందని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్న విషయం మన చేతుల్లో ఉంటుందని చెప్పారు. అలాగే విద్యార్థిని మనోజ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా తమ నాన్న, అన్నలను బయటకు వెళ్లనివ్వవద్దని పేర్కొన్నారు. మద్యం తాగి నడిపితే ఇంట్లోకి అనుమతించవద్దని ఆమె పేర్కొనడాన్ని ఎస్పీ ప్రశంసించారు. హెల్మెట్ ధరించకపోవడంతో కలిగే అనర్థాలపై రూపొందించిన షార్ట్ఫిల్్మను పట్టణ పోలీసులు ప్రదర్శించి చూపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి, ఎంవీఐ అజయ్కుమార్రెడ్డి, పట్టణ సీఐ జీవన్ రెడ్డి, ఎస్సైలు సునీల్కుమార్, కిరణ్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు సేఫ్టీ వీక్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్ సేఫ్టీ వారోత్సవాలను ప్రారంభించినట్లు రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రమాదాలకు గల ప్రధాన కారణాల్లో ఒక్కో అంశాన్ని తీసుకొని జిల్లాల్లో పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. మంగళవారం ప్రారంభమైన కార్యక్రమాలు 23 వరకు నిర్వహిస్తామని, ఈ నెలాఖరు 31వ తేదీని యాక్సిడెంట్ ఫ్రీ డేగా నిర్ణయించామని పేర్కొన్నారు. 18న డ్రంకన్ డ్రైవ్, 19న ఓవర్ స్పీడ్పై.. 17న విద్యార్థులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొంటారని, 18న డ్రంకన్ డ్రైవ్ అంశంపై ఎక్సైజ్, వైన్స్, బార్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కృష్ణప్రసాద్ తెలిపారు. 19న ఓవర్ స్పీడ్ అంశంపై ఆర్టీఏ, మెడికల్ అండ్ హెల్త్, ఆర్అండ్బీ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఓవర్ లోడ్పై 20న ట్రాన్స్పోర్ట్, ఆర్అండ్బీ విభాగాలు, హెల్మెట్ వినియోగంపై 21న పోలీసులు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు, సీట్ బెల్ట్పై 22న సిటీ పోలీస్, హెచ్ఎండీఏ, అర్బన్ అథారిటీలు, 23న సెల్ఫోన్ డ్రైవింగ్పై ఐటీ ఇండస్ట్రీ, టెలికమ్ సర్వీసెస్ విభాగాలు కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు. అవగాహన కార్యక్రమాల్లో అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై వాహనదారులు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామగుండం, రాచకొండ, కరీంనగర్, వరంగల్ కమిషనర్లు, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్ ఎస్పీలు 500 మందితో ర్యాలీ నిర్వహిస్తారని అదనపు డీజీపీ తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ప్లెక్సీలు, పోలీస్ స్టేషన్లలో వాహనదారులతో సభలు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తారని వివరించారు. -
మోటారు వాహన ఫీజుల మోత
-
మోటారు వాహన ఫీజుల మోత
► లైసెన్సు, హైపోథికేషన్ , ఫిట్నెస్ చార్జీలను భారీగా పెంచిన కేంద్రం ► వీటికి అదనంగా ప్రభుత్వ ఫీజులు ► కసరత్తు చేస్తున్న అధికారులు ► రెండు మూడు రోజుల్లో అమల్లోకి.. సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చార్జీల మోత మోగించింది. ఇంతకాలం నామమాత్రంగా ఉన్న ఫీజులను భారీగా పెంచింది. ఇప్పటికే రోడ్డు భద్రత చట్టంలో భాగంగా నిబంధనలను ఉల్లంఘించేవారికి పెనా ల్టీలను భారీగా పెంచే కసరత్తు జరుగు తుండగా... ఏ మాత్రం సమాచారం లేకుండా లైసెన్సు, ఫిట్నెస్ రెన్యూవల్ వంటి ఫీజులను పెం చేసింది. ఈమేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి గెజిట్ నోటిఫికేషన్ అందింది. ఆ మేరకు స్థానికంగా ఫీజులను సవరించేందుకు రవాణా శాఖ కసరత్తు ప్రారం భించింది. అదనంగా రాష్ట్ర ఫీజులు సాధారణంగా కేంద్రం నిర్ధారించిన ఫీజు లకు అదనంగా ఇతర రుసుములు జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంటుంది. అందువల్ల ఇప్పటికే కేం ద్రం అమలు చేస్తున్న ఫీజులకంటే ఎక్కువగా మన రాష్ట్రంలో రవాణా శాఖ ఫీజులు ఉన్నాయి. తాజాగా కేంద్రం పలు ఫీజులను పెంచిన నేపథ్యంలో... రాష్ట్రంలో ఆయా ఫీజులు ఏవిధంగా ఉండాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో కొత్త ఫీజులను ఖరారు చేసే అవకాశముంది. ఆ వెంటనే అవి అమల్లోకి వస్తాయి. సాధారణంగా కేంద్రం ఇలాం టి ఫీజులు సవరించేటప్పుడు భారీగా పెంచకుండా ఉంటుంది. కానీ ఈ సారి వందల్లో ఉన్న ఫీజులను వేలల్లోకి మార్చి వాహనదారులపై భారం మోపింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ల రెన్యూవల్ అంశం ప్రస్తుత ఫీజు కొత్త ఫీజు మోటార్ సైకిల్ 100 200 (మాన్యువల్) 400 (ఆటోమేటెడ్) మూడు చక్రాల వాహనం 100 400 (మాన్యువల్) 600 (ఆటోమేటెడ్) మీడియం/హెవీ వెహికిల్ 300 600 (మాన్యువల్) 1,000 (ఆటోమేటెడ్) (ఇవి కేంద్రం నిర్ణయించిన ఫీజులు..వీటికి రాష్ట్ర ప్రభుత్వం మరింత చేర్చి ఫీజులు నిర్ణయిస్తుంది) లైసెన్సు, మోటారు వాహనాల పాత, కొత్త ఫీజులు (రూ.లలో) (కేంద్రం నిర్ణయించిన మేర) అంశం ప్రస్తుత ఫీజు కొత్త ఫీజు తాత్కాలిక లైసెన్స్ (లెర్నర్) 30 150 డ్రైవింగ్ లైసెన్స్ 200 200 అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ 500 1,000 లైసెన్స్ రెన్యూవల్ 50 200 డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్లో ఆలస్యమైతే 100 300 (గ్రేస్ పీరియడ్ గడువు దాటితే ప్రతి సంవత్సరానికి రూ.1,000 చొప్పున అదనంగా చెల్లించాలి) డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ 2500 10,000 డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్ 1,500 5,000 అభ్యంతరాలపై అప్పీలుకు ఫీజు 100 500 హైపోథికేషన్ ఒప్పందం మోటార్ సైకిల్ 100 500 మూడు చక్రాల వాహనం 100 1,000 మీడియం/హెవీ వెహికిల్ 100 3,000 -
డేంజర్@30
సాక్షి, నిర్మల్ : జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా కొత్త జిల్లాలో తొలిసారి రోడ్డు భద్రత కమిటీ సమావేశం ఒకవైపు జరుగుతుండగా.. మరోవైపు సారంగాపూర్ మండలంలోని మహబూబ్ ఘాట్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. భద్రత కమిటీ ప్రమాదాల నివారణకు చర్యలపై ఉపక్రమిస్తుండగా మరోపక్క ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. కొత్త సంవత్సరం ప్రారంభమై వారం రోజులు కాకముందే జరిగిన మూడు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఈ మూడు ప్రమాదాల్లో భైంసాలో, మహబూబ్ ఘాట్పై జరిగిన ప్రమాదాల్లో రహదారులపై సాంకేతిక సమస్యలే ప్రమాదాలకు ఒక కారణమయ్యాయి. మామడ మండలం పొన్కల్ వద్ద మానవ తప్పిదంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రోడ్డు భద్రత కమిటీపై ఉంది. 30 ప్రమాదకర స్పాట్స్ జిల్లాలో 30 ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంత్యంత ప్రమాదకర స్థలాల్లో సాంకేతిక సమస్యలను సరిదిద్దాలని శుక్రవారం రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు తక్షణ చర్యలకు దిగనున్నారు. రోడ్డు భద్రత కమిటీలో కలెక్టర్ చైర్మన్ గా ఉండగా ఎస్పీ వైస్ చైర్మన్, కన్వీనర్గా ఆర్టీవో, సభ్యులుగా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, డీఎంహెచ్వో అధికారులున్నారు. త్వరలో ఈ సభ్యులు డేంజర్ స్పాట్లను సందర్శించనున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలపై ఈ కమిటీ ప్రతిపాదనలు రూపొందిస్తుంది. ఆ ప్రతిపాదనాల మేరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నారు. ఇంకా 30 డేంజర్ స్పాట్లలో ప్రధానంగా భైంసా–భోకర్ రోడ్డు, బాసర–ముథోల్, మామడ–పొన్కల్, నిర్మల్–భైంసా, నిర్మల్ ఫైర్స్టేషన్–చిట్యాల, భైంసా–మంజ్రి, తానూర్–బెల్తరోడ, నిర్మల్లో కట్ట చెరువు, కుంటాల–అర్లి(కె) క్రాస్ రోడ్డు వద్ద అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. భైంసా ఫైర్ స్టేషన్ వద్ద డివైడర్ నుంచి క్రాస్ చేస్తూ రాంగ్రూట్లో వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. భైంసా నుంచి మంజ్రి దారిలో టీ జంక్షన్ వద్ద అధికంగా ఎండ్లబండ్లు రావడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయని గుర్తించారు. తానూర్ నుంచి బెల్తరోడ మార్గంలో బెల్తరోడ ఎక్స్రోడ్డు వద్ద రెండు రోడ్లు కలిసే జంక్షన్ ఉండడం, ఈ మార్గం పల్లంగా ఉండడం, నాందేడ్కు పెద్ద వాహనాలు అధిక వేగంగా వెళ్తుండడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిర్మల్ కంచెరోని చెరువు వద్ద పెద్ద వాహనాలు ఇరుపక్కలా నిలిపి ఉంచడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిర్మల్ ప్రవేశ మార్గం కావడం, రోడ్డు మలుపుగా ఉండడం ఇక్కడ ప్రమాదాలకు కారణమవుతోంది. కుంటాల–అర్లి(కె) మార్గంలో అర్లి ఎక్స్రోడ్డు వద్ద 61వ నంబర్ జాతీయ రహదారిపైకి ఓ గ్రామం నుంచి వచ్చే రోడ్డు, వాగుపై నుంచి వచ్చే రోడ్డు కలుస్తుండడంతో ఇక్కడ ప్రమాదాలకు కారణం అవుతోంది. రెండేళ్లలో 197 మంది మృత్యువాత నిర్మల్ జిల్లాలో రెండేళ్లలో 1033 రోడ్డు ప్రమాదాలు జరుగగా 197మంది మృతి చెందగా 836 మంది గాయాలపాలయ్యారు. ప్రమాదాల నివారణపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. రోడ్డు భద్రత కమిటీలో 108 అంబులెన్స్ వాహనాలకు సంబంధించి సభ్యులున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ వాహనాలు తక్షణం సంఘటన స్థలానికి వెళ్లిన పక్షంలో కొన్ని ప్రాణాలైన కాపాడుకునే అవకాశముంటుంది. శుక్రవారం మహబూబ్ ఘాట్పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు అరగంటకుపైగా రోడ్డుపైనే గాయాలతో కొట్టుమిట్టడారు. ప్రమాదాలు జరిగినప్పుడు తొలి గంట సమయంలోనే చికిత్స అందిన పక్షంలో ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉంటాయి. ఈ విషయమై ఆర్టీవో అబ్దుల్ మొహిమిన్ ను వివరణ కోరగా... రోడ్డు భద్రత కమిటీ త్వరలో జిల్లాలో ప్రమాదకర స్థలాలను సందర్శించి నివారణకు చర్యలు తీసుకుంటుందని బదులిచ్చారు. -
15నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు
హైదరాబాద్: హైటెక్స్లో ఈనెల 15వ తేదీ నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిర్మాణంలో నూతన పద్ధతులు, పర్యావరణం, రోడ్ల భద్రత, ప్రమాదాల నివారణపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కాగా, 338 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
జనం చచ్చిపోతుంటే.. నిద్రపోతున్నారా?
► జాతీయ రహదారుల మృతులు మీ రాష్ట్రంలోనే ఎక్కువ ► ప్రమాదాలు తగ్గాయంటున్నారు.. మరి మృతులెందుకు పెరిగారు? ► సీఎం బావమరిది కొడుకే మృతిచెందారు కదా.. చర్యలు తీసుకున్నారా? ► ఏపీ రవాణా, పోలీసు, ఆరోగ్యశాఖ అధికారులపై ‘సుప్రీం’కమిటీ ఆగ్రహం ► 9లోగా అఫిడవిట్ దాఖలుకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్ ‘‘రాష్ట్రంలో జాతీయ రహదారులన్నీ మృత్యుకుహరాలుగా మారాయి. రోడ్డెక్కితే భద్రత లేకుండా పోయింది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మీ రాష్ట్రంలో జాతీయ రహదారులపై మృతి చెందినంత మంది దేశంలో మరే రాష్ట్రంలోనూ చనిపోలేదు. ఇంత జరుగుతున్నా నిద్రపోతున్నారా?’’ అంటూ సుప్రీంకోర్టు కమిటీ రాష్ట్ర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాల నేపథ్యంలో నివారణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 9లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. జాతీయ రహదారులమీద జరుగుతున్న ప్రమాదాలపై సుప్రీంకోర్టు గతంలోనే రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ అధ్యక్షతన కమిటీ వేసింది. కమిటీ ఈనెల 2న ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీసు, రవాణా, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా వారిపై తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో కేవలం జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో 432 మంది మృతిచెందారని కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమావేశానికి వెళ్లిన అధికారుల్లో ఒకరు తెలిపారు. దేశంలోనే రోడ్డు ప్రమాద మృతుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటూ.. దీనిపై అధికారులు చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదని కమిటీ ఆక్షేపించింది. ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర అధికారులు పేర్కొనగా.. మరి మృతులు ఎక్కువ ఎందుకున్నారని ప్రశ్నించింది. దీంతో వారినుంచి జవాబు కరువైంది. గత రెండేళ్లుగా వరుసగా ఏపీనే ప్రమాద మృతుల్లో తొలిస్థానంలో ఉందంటూ.. స్వయానా రాష్ట్ర సీఎం చంద్రబాబు బావమరిది కుమారుడే తెలంగాణ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయాన్ని కమిటీ గుర్తుచేసింది. రోడ్డు ప్రమాదాలపై చర్చిద్దామంటే సీఎం బిజీగా ఉన్నారని అధికారులు జవాబివ్వగా కమిటీ స్పందిస్తూ.. సీఎం బిజీగా ఉంటే చీఫ్ సెక్రటరీ ఉన్నారు లేదా సంబంధిత మంత్రి ఉన్నారు కదా వాళ్లనెందుకు భాగస్వాముల్ని చేయలేదని ప్రశ్నించినట్టు సమాచారం. ఇంత ఘోరంగా ఉన్నా పట్టించుకోవట్లేదు రాష్ట్ర రవాణా, పోలీసు, ఆరోగ్యశాఖ అధికారుల బృందంపై పలు అంశాల్లో కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. ఏ పనైనా పత్రాల్లో చూపిస్తున్నారు తప్పితే అమలు కావట్లేదని తప్పుపట్టింది. సమావేశంలో రాష్ట్ర అధికారుల్ని కమిటీ నిలదీసిన అంశాలివీ.. ⇒ ఇప్పటివరకూ రోడ్డు ప్రమాదాల నివారణకు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయలేదు. ⇒ దీనికోసం ప్రత్యేక నిధి(స్పెషల్ ఫండ్)ని కేటాయించలేదు. ⇒ ఓవర్లోడ్తో లారీలు వెళుతున్నా పట్టించుకోవట్లేదు. దీనివల్ల రోడ్లు పాడవుతున్నాయి. ⇒ ఒక్కో ఆటోలో 20 మంది వెళుతున్నా పట్టించుకోవట్లేదు. ⇒ ఇసుక లోడ్లతో వెళుతున్న ట్రాక్టర్లపై 20 మందిదాకా వెళుతున్నా మీకు కనపడట్లేదు. ⇒ ప్రమాదాలు తగ్గాయంటున్నారు.. మరి మృతులు పెరగడానికి కారణం తెలుసుకోలేదు. ⇒ రహదారుల్లో బ్లాక్స్పాట్స్ గుర్తించామంటున్నారు. మరి దీనివల్ల ప్రమాదాలు తగ్గలేదేం.. ⇒ ప్రమాద బాధితులకు వైద్యమందడానికి ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటు ఇప్పటికీ సరిగా లేదు. ⇒ 20 ఆస్పత్రుల్ని ఉన్నతీకరించమంటే ఇప్పటికీ ఏడు ఆస్పత్రులను సరిగా చేయలేదు. -
ప్రమాదాల అడ్డుకట్టకు లీడ్ ఏజెన్సీ
జాతీయ రహదారి భద్రత వర్క్షాప్లో సిఫారసులు సాక్షి, విశాఖపట్నం: రహదారి భద్రతకు సంయుక్తంగా పాటుపడాలని అన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇందుకోసం వినూత్న విధానాలను ప్రవేశపెట్టాలని సిఫారసు చేశాయి. రక్తమోడుతున్న రహదారుల్లో 2020 నాటికి ప్రమాదాల సంఖ్య సగానికి తగ్గించాలనే బ్రెజీలియా డిక్లరేషన్ స్ఫూర్తిగా విశాఖలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ రహదారి భద్రత వర్క్షాప్ శనివారం సాయంత్రం ముగిసింది. వివిధ రాష్ట్రాల మంత్రులు, రవాణాశాఖ కమిషనర్లు, ఐదు దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొని రహదారి భద్రతపై విస్తృతంగా చర్చించి సిఫార్సులు చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వీటి ఆమోదానికి చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి సూచించారు. పర్వతప్రాంతాలు ఎక్కువున్న హిమాచల్, మేఘాలయలాంటి రాష్ట్రాల్లో రోడ్డుభద్రతపై చర్చించి సిఫార్సులు చేయాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి రాష్ట్రంలోనూ లీడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని, కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ విధానాన్ని అన్నిరాష్ట్రాల్లో అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, రోడ్ల వెంబడి ఉండే ప్రైవేటు ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెం టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతోపాటు పరికరాల కొనుగోలుకు ఆర్థికసాయమందించాలని సిఫారసు చేసింది. -
రోడ్డు భద్రతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ
సాక్షి, హైదరాబాద్: రహదారులు రక్తమోడుతూ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రోడ్డు భద్రత కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించిన నేపథ్యంలో.. రోడ్డు భద్రత నిధిని ఏర్పాటు చేసిన రాష్ట్రప్రభుత్వం మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. జాతీయ రహదారులపై క్షతగాత్రులకు వేగంగా వైద్యసాయం అందేలా 108 తరహాలో ప్రత్యేక అత్యవసర వైద్య సేవల అంబులెన్సులను ప్రారంభించాలని యోచిస్తోంది. జీపీఆర్ఎస్తో అనుసంధానమయ్యే ఈ అంబులెన్సులు వేగంగా ప్రమాద స్థలికి చేరుకునేలా నిర్ధారిత పరిధికి ఒకటి చొప్పున అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ఇందులో తక్షణం వైద్యం అందించేలా అన్ని రకాల వసతులుంటాయి. ఇక రాష్ట్రంలో 50 పోలీసు స్టేషన్ల పరిధిలో జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. దీంతో ఆయా పోలీసు స్టేషన్లకు ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రహదారులకు వంద మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదనే నిబంధన అమలు విషయంలో కూడా సమాలోచనలు జరుపుతోంది. ఆసుపత్రులను మెరుగుపరుస్తాం: మంత్రి మహేందర్రెడ్డి క్షతగాత్రులకు సకాలంలో సరైన వైద్యం అందితే ప్రాణాపాయం తప్పే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాలని నిర్ణయించినట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి వెల్లడించారు. దీంతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీసేవలను విస్తరిస్తామని చెప్పారు. గురువారం సచివాలయంలో జరిగిన రహదారి భద్రత మండలి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020 నాటికి రోడ్డు ప్రమాదాలను కనీసం 50 శాతానికి తగ్గించాలనే గత తీర్మానానికి కట్టుబడి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. రహదారులపై ఏర్పాటైన బెల్టుషాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఇక నుంచి ఎంతమంది రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సేవలందించిందీ ప్రభుత్వానికి లెక్కలు సమర్పించాలని ప్రైవేటు ఆసుపత్రులను ఆదేశించనున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో జాతీయ రహదారులపై లోపాలు సరిచేస్తామని, వాటి వివరాలను కేంద్రానికి పంపితే రూ.900 కోట్ల ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఇప్పటికే నాగార్జునసాగర్, జహీరాబాద్ రహదారులపై బ్లాక్ స్పాట్లు లేకుండా చేస్తున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ఆర్థిక, హోం, రవాణా శాఖల కార్యదర్శులు నవీన్ మిట్టల్, రాజీవ్ త్రివేది, సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ సుల్తానియా, రోడ్ సేఫ్టీ అథారిటీ అదనపు డీజీ కృష్ణప్రసాద్, జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి, రాష్ట్ర రహదారుల ఈఎన్సీ రవీందర్రావు, ఆర్టీసీ ఎండీ రమణారావు, డీఎంఈ రమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రహదారి భద్రతపై జాతీయ శిక్షణ శిబిరం
19, 20 తేదీల్లో నిర్వహణకు సన్నాహాలు హాజరుకానున్న విదేశీ ప్రతినిధులు మర్రిపాలెం : విశాఖ నగరంలో రహదారి భద్రత జాతీయ శిక్షణ శిబిరం నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ నెల 19, 20 తేదీల్లో హోటల్ నోవాటెల్ జరగబోయే ఈ శిబిరంలో విదేశీ ప్రతినిధులు పాల్గొనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే రవాణా శాఖాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిబిరం విజయవంతం కావడానికి ఆ శాఖ కమిషనర్ ఎన్.సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగారు. సంబంధిత అధికారులకు ఆయా బాధ్యతలు అప్పగించారు. ‘రహదారి భద్రత’ అంశాలపై తీర్మానాలు? ఇటీవల పార్లమెంట్లో ‘రహదారి భద్రత’ బిల్లు ఆమోదం పొందడం తెలిసిందే. ఈ క్రమంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడంతో అందరి చూపు విశాఖపై పడింది. శిబిరంలో ‘రహదారి భద్రత’పై పలు అంశాలు తీర్మానించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా అమలు చేయబోయే పాలనా సంస్కరణలు, మోటార్ వాహనాల చట్టంలో మార్పుల గురించి చర్చించనున్నారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథులుగా కేంద్ర రవాణా, హైవే, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కారీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు చీఫ్ సెక్రటరీ ఎస్.పి.టక్కర్ హాజరు కానున్నారు. ప్రపంచ బ్యాంక్ నిపుణులు, గ్లోబల్ లీడ్ రోడ్ సేఫ్టీ, గ్లోబల్ రోడ్ సేఫ్టీ ప్రతినిధులు, సౌత్ ఆసియా ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు, న్యూజిలాండ్ పోలీస్ విభాగం అధికారులు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా, హైవేల ఉన్నతాధికారులు, సుప్రీంకోర్టు నియమించిన రోడ్ సేఫ్టీ ప్రతినిధులు ఈ శిబిరంలో పాల్గొంటారు. ఇంకా మేఘాలయ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రవాణా, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు విచ్చేయనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతీయ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేపడుతున్నామని డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ‘రహదారి భద్రత’పై దృష్టిసారించడంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేశారు. -
లెసైన్సు లేకుండా నడిపితే బండి జఫ్తు
ఇప్పటి వరకు 6900 డ్రైవింగ్ లెసైన్స్లు సస్పెన్షన్ రహదారి భద్రతా నిబంధనలు మరింత కఠినతరం సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఆదేశాలతో ఆర్టీఏ చర్యలు సిటీబ్యూరో: రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించేవారిపై రవాణాశాఖ మరోసారి కొరడా ఝళిపించింది. వివిధ రకాల ఉల్లంఘనలపై ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 6900లకు పైగా డ్రైవింగ్ లెసైన్స్లు సస్పెండ్ చేసింది. లెసైన్సులపై సస్పెన్షన్ కొనసాగుతున్నా.. లెక్కచేయకుండా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. అలాంటివారి లెసైన్సులు రద్దు చేయడంతో పాటు తీవ్రమైన నేరానికి పాల్పడినట్లు కే సులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చాలని నిర్ణయించింది. రోడ్డు భద్రతా నిబంధనల అమలు పర్యవేక్షణపై సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ ఆదేశాల మేరకు రవాణాశాఖ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటి వరకు పోలీసుల నుంచి అందిన వివరాల మేరకు రవాణా అధికారులు రంగారెడ్డి జిల్లా పరిధిలో 6 వేలు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 900 డ్రైవింగ్ లెసైన్సులను సస్పెండ్ చేశారు. మూడు నెలల పాటు ఈ తాత్కాలిక నిలుపుదల అమల్లో ఉంటుంది. ఆ నాలుగు కీలకం.... మద్యం తాగి వాహనాలు నడిపినా, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా లెసైన్సులపై వేటు పడుతుంది. అలాగే అధిక వేగం, పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం వంటి ఉల్లంఘనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఈ నాలుగు రకాల ఉల్లంఘనల కారణంగానే దే శవ్యాప్తంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. సాధికార కమిటీ ఆదేశాల మేరకు పోలీసులు, రవాణాశాఖ కార్యాచరణ చేపట్టారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో డ్రైవింగ్ లెసైన్సులను తాత్కాలికంగా నిలుపుదల చేయడమే కాకుండా, సస్పెన్షన్ టైమ్లో తిరిగి రోడ్డెక్కకుండా వారిపై నిఘా పెడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతుండటంతో నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆర్టీఏ అధికారులు భావిస్తున్నారు. నిరంతర సమీక్ష... రోడ్డు భద్రతా నిబంధనల అమల్లో ప్రతి నెలా ఆర్టీఏ అధికారులు సమీక్ష నిర్వహిస్తారు. అలాగే మూడు నెలలకు ఒకసారి న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు సాధికార కమిటీకి నివేదికను అందజేస్తారు. ఈ కమిటీ ఆదేశాల మేరకు అన్ని చోట్ల చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో డ్రైవింగ్ లెసైన్సులపై సస్పెన్షన్ విధించడం, అలాంటి ఉల్లంఘనులు మరోసారి రోడ్డెక్కకుండా నిఘా కొనసాగించడం ఇదే మొట్టమొదటిసారి అని హైదరాబాద్ జేటీసీ రఘునాథ్ అభిప్రాయపడ్డారు. చిన్నారి రమ్య మతి ఉదంతం నేపథ్యంలో రోడ్డు భద్రతా నిబంధనలు, లెసైన్సుల జారీని మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. -
బరువు కాదు.. బాధ్యత
♦ హెల్మెట్ వినియోగం తప్పనిసరి ♦ యువత బాధ్యతతో మెలగాలి ♦ ‘సాక్షి’ అవగాహన సదస్సులో డీటీసీ బసిరెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి ‘సెల్ ఫోన్ స్క్రీన్పై చిన్న గీత పడకూడదని స్క్రీన్ గార్డు.. కిందపడితే ఎక్కడ చెడిపోతుందోనని ప్లిప్ కవర్ వేయించుకోవడంపై నేటి యువత ఎంతో శ్రద్ధ చూపుతోంది. బైక్పై వెళ్తున్నప్పుడు కిందపడితే శరీరంలో ప్రధాన భాగమైన తలకు దెబ్బ తగిలితే పరిస్థితి ఏమిటన్న దానిపై ఇసుమంత జాగ్రత్త తీసుకోవడం లేదు. ప్రాణం కంటే సెల్ ఫోన్ విలువైందా..? పిల్లలు ప్రయోజకులై పేరు తెస్తారని తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకుంటారు.. అడిగిందల్లా కాదనకుండా అప్పు చేసైనా కొనిస్తారు. అలాంటి వారి ఆశలపై నీళ్లు చ ల్లి కడుపు కోత మిగల్చ కూడదు. బైక్లపై వేగంగా వెళ్తూ ప్రమాదాలకు గురై వృుతి చెందిన వారిలో అత్యధికులు విద్యార్థులు కావడం ఆందోళన కలిగిస్తోంది. కన్నవారి కలలను నిజం చేయడం కోసమైనా బైక్పై వెళ్తున్నప్పుడు భారంగా కాక బాధ్యతగా భావించి హెల్మెట్ పెట్టుకోవాలి’ అని కడప నగర శివారులోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సులో పలువురు వక్తలు పేర్కొన్నారు. వైవీయూ/ఎడ్యుకేషన్ :రహదారి భద్రత, వ్యక్తిగత భద్రత అన్నవి మనందరి బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలోని కందుల గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ‘రహదారి భద్రత - హెల్మెట్ వినియోగం’ అన్న అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. బసిరెడ్డి విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం వాడే సెల్ఫోన్కు గీతలు పడకుండా స్క్రీన్గార్డ్ వేయించుకుంటారని, ఎంతో విలువైన తలకు హెల్మెట్ ధరించడానికి ఎందుకు ఆలోచిస్తారని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 943 ప్రమాదాలు చోటుచేసుకోగా అందులో 336 మంది చనిపోయారన్నారు. ఇందులో 256 ద్విచక్ర వాహన ప్రమాదాలు చోటుచేసుకోగా 80 మంది మరణించారన్నారు. వీరిలో అధికశాతం మంది హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలనే తలకు గాయం కావడం ద్వారా మరణించారన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారుల పిల్లలు సైతం బైక్రైడింగ్లో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. విద్యార్థులకు చదువుకునే రోజుల్లో వాహనాలపై మోజు ఉంటుందని అయితే ఆ మోజులో ప్రాణాలను ఫణంగా పెట్టే విన్యాసాలు తగవని పేర్కొన్నారు. అటువంటి విన్యాసాల ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే మీ తల్లిదండ్రుల పడే ఆవేదనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. 18 సంవత్సరాలలోపు వారు ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపకూడదన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు నేరుగా సంబంధిత ధృవీకరణ పత్రాలతో పాటు పరీక్షకు హాజరై లెసైన్స్లు పొందాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగసాధనలో సఫలం కావాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమానికి సాక్షి బ్యూరో ఇన్చార్జి ఎం.బాలకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా. సాక్షి బ్రాంచ్ మేనేజర్ సుప్రియ, ఎడిషన్ ఇన్చార్జి రంగాచార్యులు, కేఎస్ఆర్ఎం, కేఎల్ఎం ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా. వి.ఎస్.ఎస్. మూర్తి, ఖాజాపీర్లు ప్రసంగించారు. అంతకు ముందు రవాణ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన షార్ట్ఫిల్మ్లు, రహదారి భద్రతపై రూపొందించిన గీతాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ బి.వి. నాగిరెడ్డి, కళాశాల పీడీ నారాయణ, ప్రకాష్రెడ్డి, ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతా ఉద్యమంలో మేము సైతం
సాక్షి,సిటీబ్యూరో: రోడ్డు భద్రతా ఉద్యమంలో తాము కూడా భాగస్వాములమవుతామని, రవాణాశాఖ కార్యక్రమాలకు మద్దతునిస్తామని సినీనటుడు రాజీవ్ కనకాల,ఆయన సతీమణి యాంకర్ సుమ అన్నారు. గురువారం డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ కోసం వారు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రాంతీయ రవాణా అధికారులు దశరథం, జీపీఎన్ ప్రసాద్ వారిని సాదరంగా ఆహ్వానించి ఇద్దరి డ్రైవింగ్ లెసైన్సుల రెన్యువల్ ప్రక్రియను ముగించారు. -
రాజధాని రోడ్లపై మృత్యుఘంటికలు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెరుగుతున్న ప్రమాదాలు ఏటా వందలాదిమంది మృతి వీరిలో ద్విచక్ర వాహనచోదకులే అధికం జాతీయ రహదారుల పరిధి అధికమే కారణం విజయవాడ : రాజధాని పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్డు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల్లో నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఏటా వందల సంఖ్యలో వాహనదారులు మృత్యువాత పడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. కేవలం అతి వేగం, నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలే అధికంగా ఉన్నాయి. సోమవారం రాత్రి విజయవాడ శివారులోని నల్లకుంట వద్ద జరిగిన బస్సు ప్రమాదం కూడ కేవలం డ్రైవర్ మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లే నలుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. ముఖ్యంగా రహదారుల విస్తరణ, రవాణా శాఖ అధికారులు వాహన సామర్థ్యాన్ని సమగ్రంగా పరిశీలించకపోవడం, జాతీయ రహదారులపై కొన్నిచోట్ల సంకేత సూచికలు లేకపోవడం.. వెరసి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పర్యవసానంగా ఏటా వాహన ప్రమాదాల్లో వేల సంఖ్యలో జనం గాయలపాలవుతుండగా వందల సంఖ్యలో చనిపోతున్నారు. ఇతర జిల్లాలకు లేని విధంగా కృష్ణా జిల్లాలో జాతీయ రహదారుల విస్తీర్ణం అధికంగా ఉంది. దీంతోపాటు కరకట్ట మార్గాలు, రాష్ట్ర రహదారులు కూడా ఉన్నాయి. విజయవాడ మీదుగా విశాఖపట్నం, హైదరాబాద్లకు కలిపే జాతీయ రహదారి సుమారు 176 కిలోమీటర్లు జిల్లాలో ఉంది. ఇది కాకుండా రాష్ట్ర రహదారులు వందల కిలోమీటర్లు ఉన్నాయి. విజయవాడ నుంచి అవనిగడ్డకు కరకట్ట మార్గం, విజయవాడ నుంచి జగదల్పూర్కు మైలవరం మీదుగా వెళ్లే రహదారులున్నాయి. ఈ క్రమంలో జాతీయ రహదారులపై మితిమీరిన వేగం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అది కూడా ఇబ్రహీంపట్నం జంక్షన్, కంచికచర్ల, నందిగామ మధ్య అధికంగా జరుగుతున్నాయి. వాహన వేగాన్ని అంచానాలు వేసే స్పీడ్ గన్లు జాతీయ రహదారులపై ఏర్పాటు చేయకపోవడం, రవాణా శాఖ అధికారులు అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి కేసులు నమోదుచేయకపోవడం వల్ల వాహనాల వేగం రోజురోజుకీ అధికమవుతోంది. సోమవారం రాత్రి నల్లకుంట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు, బస్సు డ్రైవర్ మృతిచెందారు. అమలాపురానికి చెందిన ధనుంజయ ట్రావెల్స్కు చెందిన బస్సు డ్రైవర్ అతిగా మద్యం సేవించడంతో పాటు అధికవేగంతో వెళ్ళటం వల్ల వాహనాన్ని నియంత్రించలేకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని రవాణా శాఖ అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే జాతీయ రహదారులపై సైన్ బోర్డులు, అవసరమైన చోట్ల రేడియం స్టికర్లు ఉండాలి. కాని విజయవాడ జగ్గయ్యపేట మధ్య అతి తక్కువగానే కనిపిస్తుండటంతో వాహనాల వేగానికి హద్దు లేకుండా పోయింది. రహదారి భద్రత గాలికి కృష్ణా జిల్లా వాహన ప్రమదాలు అధికంగా జరిగే జిల్లాలో మొదటి మూడు స్థానాల్లో నిలుస్తుంది. ప్రతిఏటా జరిగే వాహన ప్రమదాల్లో అనేక మంది వాహనదారులతో పాటు అభంశుభం తెలియని అనేక మంది బలి అవుతున్నారు. రవాణా శాఖ అధికారులు, పోలీసులు, కేవలం రహదారి భద్రతా వారోత్సవాల సమయంలో మినహా మిగిలిన సమయంలో వాహన ప్రమాదాలను పట్టించుకుంటున్న దాఖలాలు లేకపోవడంతో ప్రమాదాలు పెరగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. జిల్లాలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా అధికంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో 1634 వాహన ప్రమదాలు జరగ్గా వాటిలో 1609 మంది గాయాలపాలయ్యారు. 366 మంది మృత్యువాత పడ్డారు. -
వెలుగు దారిలో...
ఆదర్శం రెండు సంవత్సరాల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయి నప్పుడు లోకమంతా చీకటి మయంగా తోచింది డా॥సంజయ్, డా॥శుభాంగి తంబ్వేకర్ దంపతులకు. తమ ముద్దుల కూతురు అరుంధతి లేని ఈ లోకంతో తమకు పనేమిటి అని కూడా అనిపించింది. చుట్టూ దట్టమైన చీకటి. ఆ చీకట్లో గోడ మీద అరుంధతి ఫోటోలో నవ్వు వెలుగుతోంది. ఆ అందమైన వెలుగును అజరామరం చేయాలంటే... తాము నిస్పృహలోకి, వైరాగ్యంలోకి జారిపోకూడదు. కూతురు పేరు మీద చేసే ప్రతి మంచి పని...ఆమెను తమ మధ్య సజీవంగా ఉంచుతుందని ఆశిస్తూ డా॥అరుంధతి ఫౌండేషన్ ప్రారంభించారు. చదువులో అత్యుత్త ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఫౌండేషన్ తరపున పురస్కారం ఇవ్వడం మాత్రమే కాదు.. రకరకాల మార్గాల్లో సేవాపథంలో పయనిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టిని కేంద్రీక రిస్తున్నారు. రోడ్డు భద్రత గురించి కాలేజీ విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించి వారితో ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నారు. దీనిలో... ‘నేను ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తాను’, ‘మద్యం తాగి ఎప్పుడు డ్రైవ్ చేయను’ ‘నా ఫోన్కు కాల్ వస్తే... బండి ఆపి మాట్లాడతాను’. ‘ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించను’ మొదలైన ప్రతిజ్ఞలు ఉంటాయి. అవగాహనా సదస్సులు, ప్రతిజ్ఞకు మాత్రమే పరిమితం కాకుండా రోడ్ల బాగోగులపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఫలానా చోట రోడ్డు చెత్తగా ఉంది అని తెలిస్తే సంబంధిత అధికారులు, ఆ ప్రాంత రాజకీయ నాయకులతో మాట్లాడి ఆ రోడ్డును మెరుగుపరిచే విధంగా ఫౌండేషన్ తరపున కృషి చేస్తున్నారు. కర్నాటకలోని కోలార్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీయంసీ)లో చదువు కుంటున్న అరుంధతి రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆమె హెల్మెట్ ధరించే ఉన్నారు. మితి మీరిన వేగంతో కూడా వెళ్లడం లేదు. రోడ్డు పరిస్థితి బాగోలేకపోవడం వల్లే అరుంధతి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అది తల్లిదండ్రులైన సంజయ్, శుభాంగిలను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ‘‘అరుంధతికి కవిత్వం, భరత నాట్యంలో ప్రావీణ్యం ఉంది. తనలో సేవాదృక్పథం కూడా ఎక్కువే’’ అని కూతురు గురించి తడి కళ్లతో చెబుతారు డా॥శుభాంగి. ‘‘విధిరాత వల్లే ప్రమాదం జరుగు తుందనే మాటను నేను నమ్మను. ఏదో ఒక తప్పిదం లేకపోతే ప్రమాదం జరగదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకూ ప్రమాదాలను నివారించవచ్చు’’ అంటారు డా॥సంజయ్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్రమశిక్షణ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవు అంటున్న ఈ తంబ్వేకర్ దంపతులు స్కూలు, కాలేజీ స్థాయిలో విద్యార్థులకు ట్రాఫిక్ అవేర్నెస్, రోడ్డు భద్రత గురించి అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. 5-10 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకు కార్టూన్లు, కథల రూపంలో పై విషయాలపై అవగాహన కలిగిస్తున్నారు. 12-16 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థులకు డ్రైవింగ్లో జాగ్రత్తలు, జవాబుదారీతనం గురించి వీడియోల ద్వారా అవగాహన కలిగిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పని చేస్తున్న ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’లాంటి ఇతర సంస్థలతో కూడా కలిసి పని చేస్తుంది అరుంధతి ఫౌండేషన్. ట్రాఫిక్ నిబంధలకు తిలోదకలిచ్చే తల్లిదండ్రులను ఉద్దేశించి- ‘‘తల్లిదండ్రులే ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోతే... పిల్లలకు ఏది మంచో ఎవరు చెబుతారు?’’ అంటారు డా॥శుభాంగి. బెంగళూరులోనే కాదు ‘ఫ్రెండ్స్ ఆఫ్ ది అరుంధతీ ఫౌండేషన్’ పేరుతో దేశంలోని వివిధ నగరాల్లో రోడ్డు భద్రత గురించి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ, తమ కూతురు తమకు దూరమై నట్టుగా మరెవరూ అవ్వకూడదని తపిస్తున్నారు తంబ్వేకర్ దంపతులు. ‘‘మేము చేస్తున్న కృషి ఒక్కరి ప్రాణం కాపాడినా అంతకంటే కావాల్సింది ఏముంది!’’ అంటున్నారు ఇద్దరూ ఏక కంఠంతో. అరుంధతీ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలతో ఎందరో ప్రభావితం అవుతున్నారు. ఈమధ్యే ఒక స్కూలు ప్రిన్సిపల్, సైకిల్పై వచ్చే తన విద్యార్థులకు ఉచితం హెల్మెట్లు కొని పెట్టారు. అంటే తంబ్వేర్ దంపతులు ఊహించిన స్పందన మొదలైనట్లే కదా! -
ఇక కాస్కోండి!
తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలపై {పత్యేక దృష్టి కఠిన చర్యలకు ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారుల నిర్ణయం ఈనెల ఆఖరి వారం నుంచి పూర్తిస్థాయిలో అమలు విలేకరులకు వెల్లడించిన రెండు విభాగాల అధిపతులు సిటీబ్యూరో: రహదారి భద్రత నిబంధనలు తెలిసినా బేఖాతర్ చేస్తూ దూసుకుపోవడం... ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే నో, ఈ-చలాన్ వస్తేనో ఆ మొత్తం చెల్లించడం... ఆపై షరా మామూ లే అన్నట్లు వ్యవహరించడం... ఈ విధంగా రెచ్చిపోతూ రోడ్డు ప్రమాదాలకు కారణమౌతున్న ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, ఆర్టీఏ అధికారు లు నిర్ణయించారు. ఇప్పటికే అమలులో ఉన్న చర్యలతో పాటు ఈ నెల ఆఖరి వారం నుంచి మరింత కఠిన చర్యలు తీసుకోనున్నారు. నగర ట్రాఫిక్ చీఫ్ జితేందర్, ఆర్టీఏ కమిషనర్ సందీప్ సుల్తానియా సంయుక్తంగా శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను స్పష్టం చేశారు. ‘ఓనర్ల’ పైనా చార్జ్షీట్స్... అసలు డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా, వాహన సామర్ధ్యానికి సరిపడిన లెసైన్స్లు లేకుండా రోడ్లపైకి వచ్చే వాళ్లు సిటీలో ఎందరో ఉంటున్నారు. ఇలాంటి వారిని పట్టుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించి వదిలి పెడుతున్నారు. ఇకపై ఈ తరహాలో వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి జరిమానాతో పాటు వీరికి వాహనం ఇచ్చిన యజమాని పైనా కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. కోర్టులో నేరం నిరూపితమైతే ఊచలు లెక్కపెట్టాల్సిందే. ‘ఐదింటికి’ లెసైన్స్ సస్పెన్షన్.. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, ఓవల్ లోడ్, డ్రంకన్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ వంటి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధించి ఊరుకోరు. ఆర్టీఏ అధికారుల ద్వారా వారి డ్రైవింగ్ లెసైన్స్ను నిర్ణీత కాలం సస్పెండ్ చేయిస్తారు. సస్పెండైన లెసైన్స్తో డ్రైవింగ్ చేస్తూ చిక్కితే కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. ఈ నేరానికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. పక్కాగా పొల్యూషన్ ‘చెక్’... నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి కాలుష్య తనిఖీ ( పొల్యూషన్ చెక్)లను కఠినతరం చేయనున్నారు. ప్రస్తుతం ఈ కాలుష్య తనిఖీ యంత్రాలు రెండు సిలిండర్ల పరిజ్ఞానంతో పని చేస్తున్నాయి. దీన్ని నాలుగు సిలిండర్ల పరిజ్ఞానానికి మార్చుకోవడం, డేటాను ఆన్లైన్ చేయడం కచ్చితం చేస్తున్నారు. ప్రస్తుతం టెండర్లు, యూని యన్లతో చర్చల దశలో ఉన్న ఈ విధానాన్ని త్వరలో అమలు చేస్తారు. ఆపై ప్రతి వాహనమూ కాలుష్య పరీక్షల ధ్రువపత్రం కలిగి ఉండాలన్నది కచ్చితం చేయనున్నారు. ప్రత్యామ్నాయ చిరునామాకు ‘సైట్’... సిటీలో నడుస్తున్న అనేక వాహనాలు వాటి యజ మానుల పేర్లతో, ప్రస్తుత చిరునామాలతో ఉండట్లేదు. దీనివల్ల ఉల్లంఘనలకు సంబంధించిన ఈ- చలాన్ల జారీ సాధ్యం కాకపోవడంతో పాటు అత్యవసర సమయాల్లో యజమానుల్ని, వారి కుటుంబీకుల్ని గుర్తించడం కష్టసాధ్యంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా ఆర్టీఏ వెబ్సైట్లో (్టట్చటఞౌట్ట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ) ‘ఆల్ట్రనేట్ అడ్ర స్’ అనే లింకు చేర్చారు. ఈ తరహా వాహనచోదకులు ఇందులోకి వెళ్లి ప్రత్యామ్నాయ చిరునామా పొందుపర్చాలి. టూవీలర్పై ‘ఇద్దరికీ’ హెల్మెట్ మస్ట్... ద్విచక్ర వాహన ప్రమాదాల్లో వాహనాన్ని నడుపుతున్న వారి కంటే వెనుక కూర్చున్న వారే ఎక్కువ మంది చనిపోతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు వాహనాన్ని నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వాళ్లూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. గతనెల్లో హెల్మెట్ ధరించని 50 వేల మందిపై కేసులు నమోదు చేశామని, వీటిలో వెనుక కూర్చున్న వారు పెట్టుకోని కేసులూ ఉన్నాయన్నారు. రిపీటెడ్ వైలేటర్స్ పైనే రోడ్డు ప్రమాదాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నాం. లెసైన్స్ రద్దు, చార్జ్షీట్స్ అనేవి ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన రిపీటెడ్ వైలేటర్స్కు మాత్రమే అమలు చేస్తాం. ప్రస్తుతం అన్నీ ఆన్లైన్ చేయడంతో రిపీటెడ్ వైలేటర్స్, సస్పెండైన లెసైన్స్ వివరాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ చేతిలోని పీడీఏ మిషన్ల సాయంతో పరిశీలించవచ్చు. ‘ఓవర్ స్పీడింగ్’ నిబంధనను అధికారికంగా వేగాన్ని నిర్దేశించి, సైనే జ్ బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే అమలు చేస్తాం. - జితేందర్, ట్రాఫిక్ చీఫ్ నిమిషానికో రోడ్డు ప్రమాదం ఏటా దేశంలో ప్రతి నిమిషానికీ ఓ రోడ్డు ప్రమాదం జరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో అత్యధికం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నవే. నిబంధనలు, భద్రతా నియమాలు తెలిసి కూడా పట్టించుకోకపోవడమే దీనికి కారణం. ఆధునిక పరి జ్ఞానం జోడిస్తూ డ్రైవింగ్ లెసైన్స్ల జారీ విధానాన్నీ మార్చనున్నాం. నిబంధనల అమలుతో పాటు మౌళిక సదుపాయాల అభివృద్ధి, ట్రామా సెంటర్ల ఏర్పాటు, బ్లాక్స్పాట్స్కు మరమ్మతులు వంటి చర్యల్నీ ప్రభుత్వం తీసుకుటోంది. - సుల్తానియా, ఆర్టీఏ కమిషనర్ -
ఆ పద్ధతిలో మార్పురావాలి:సచిన్
న్యూఢిల్లీ:క్రికెట్ లో స్ట్రైకర్కు నాన్ స్ట్రైకర్ కు ఉన్న అవగాహనే రోడ్డు ప్రయాణంలోనూ పాటించాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. వాహనాలపై వెళ్లేవారు పాదచారులను గౌరవిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నాడు. నగరంలో ఆదివారం రహదారి భద్రతా ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించిన అనంతరం సచిన్ తనదైన క్రికెట్ భాషలో మాట్లాడాడు. క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్ మెన్కు అవతలి ఎండ్లో ఉన్న ఆటగాడికి చక్కని సమన్వయం ఎంతో ముఖ్యమైనదో.. అదే తరహా విధానాన్ని రోడ్లుపై వెళుతున్నప్పుడు కూడా పాటిస్తే మంచిదన్నాడు. ఈ రకంగా మనం స్వచ్ఛందంగా రూల్స్ ను పాటించిన రోజున భారతీయ రోడ్లు అత్యంత సురక్షితమైన రహదారులుగా మారతాయనడంలో ఎటువంటి సందేహం లేదని మాస్టర్ తెలిపాడు. దీనిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సచిన్ పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా తాను రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఎదురైన చేదు అనుభవాలను సచిన్ పంచుకున్నాడు. చాలా మంది ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వారి ఇష్టానుసారం వెళ్లే విషయం చాలాసార్లు చూశానన్నాడు. 'కొంతమంది డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ పెట్టుకోరు. వారి వద్ద హెల్మెట్ ఉంటుంది. అయితే ఆ హెల్మెట్ ను వారి చేతుల్లోనూ, లేకపోతే బైక్ హ్యాండిల్ పైనో ఉంచుతారు. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది' అని సచిన్ తెలిపాడు. ఇదిలాఉండగా, ప్రతీ మూడు నుంచి నాలుగు నిమిషాల మధ్య వ్యవధిలో ఒక జీవితం రోడ్డు ప్రమాదాల బారిన పడి అర్థాంతరంగా ముగిసిపోతున్న విషయాల్ని గణాంకాలు స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సంవత్సరానికి 10 లక్షలకు మందికి పైగా మృత్యువాత పడుతుండగా, దాదాపు 50 లక్షల మంది వరకూ తీవ్రమైన గాయాలుపాలవుతున్నారు. -
భద్రం బీకేర్ఫుల్ బ్రదరూ..
-
అడుగడుగునా అభద్రత
ఏటా మన రాష్ట్రంలో సగటున 15 వేల మంది మృత్యువాత పడుతుండగా, దాదాపు 60 వేల మంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. విశాఖ జిల్లా పరిధిలో ఏటా సగటున 500 మంది బలైపోతుండగా, రెండు వేల మంది అంగవికలురవుతున్నారు. రహదారి భద్రత పట్ల ప్రభుత్వం చిన్న చూపు.. ప్రమాదాల నియంత్రణ పట్ల అశ్రద్ధ.. ఇటీవలి రోడ్డు ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. 2010లో కేంద్రం తెరపైకి తెచ్చిన ‘జాతీయ రహ దారి భద్రత విధానం’ ప్రతిపాదనలకే పరిమితం. విధివిధానాలను బోర్డు పర్యవేక్షిస్తుందని కేంద్రం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స, త్వరితగతిన నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలు బోర్డు పరిశీలనలో ఉంటా యని తెలిపింది. అయితే రహదారి భద్రత బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగినా.. ఆచరణలో మాత్రం సఫలం కాలేదు. మర్రిపాలెం:ప్రభుత్వాధినేతలు, అధికారులు రహదారి భద్రత గురించి ప్రకటనలు చేస్తున్నారు. ఆచరణలో మాత్రం శ్రద్ధ కనిపించడం లేదు. ప్రమాదాల నియంత్రణకు, ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు మళ్లీ తాజాగా ప్రకటించారు. ప్రతి వంద కిలోమీటర్లకు డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం ప్రకటన బాగానే ఉన్నా.. ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. హైవేల్లో మద్యం షాపులు నిషేధిస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. హైవేలలో మద్యం షాపుల బోర్డులు ఆకర్షించేటట్లు ఉండరాదని తాజాగా ప్రకటించడంతో.. షాపులు యథావిధిగా ఉంటాయని తెలుస్తోంది. సమన్వయ లోపం... ప్రమాదాల నియంత్రణలో రవాణా, ఆర్టీసీ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. రహదారి భద్రతకు ఆయా శాఖలు ఐక్యంగా కృషి చేయడం లేదు. ప్రతి ఏడాది రహదారి భద్రతా వారోత్సవాలు జరపడం ‘ఓ పనైపోయింది’ అన్నట్టుగా ఆయా శాఖల అధికారులు వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. రవాణా, ఆర్టీసీ, పోలీస్ శాఖలు ‘రహదారి భద్రత’లో ప్రత్యక్షంగా, ఆర్ అండ్ బీ శాఖ పరోక్షంగా ముడిపడి ఉన్నాయి. ఆయా శాఖలు ‘రహదారి భద్రత’కు ఐక్యంగా కృషి చేస్తే ప్రమాదాలు తగ్గించవచ్చు. ఏడాదిలో ఒకటి రెండుసార్లు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆయా శాఖల అధికారులు సమీక్ష సమావేశాలు జరిపి ప్రమాదాలు తగ్గుముఖానికి కొన్ని ప్రతిపాదనలు చేయడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం తెలిసిందే. పరిశోధనలకు తావు లేదు... ఎక్కడైనా ప్రమాదం జరిగినా, ఆయా ప్రాంతాలలో వరుస ప్రమాదాల చోటుచేసుకున్నా పరిశోధన జరగాలి. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు వెలికితీయాలి. అక్కడ మరో ప్రమాదం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి. ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాలి. కానీ ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు. ప్రమాదం తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం, తూతూ మంత్రంగా రవాణా అధికారి ఓ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతోంది. మరో ప్రమాదం జరిగినా అదే విధానం అమలు జరుగుతోంది. ప్రమాద ప్రాంతాలలో ప్రత్యేక నిఘా జిల్లాలో అనకాపల్లి నుంచి ఆనందపురం, అనకాపల్లి నుంచి అడ్డరోడ్డు ప్రమాద ప్రాంతాలుగా గుర్తించాం. అక్కడ ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేస్తాం. విద్యుత్ దీపాలు సక్రమంగా వెలిగేటట్టు హైవే అధికారుల సహాయం తీసుకుంటాం. అరుకు, పాడేరు, తదితర ఘాట్ రోడ్డుల పక్కగా రెయిలింగ్ ఏర్పాటు చేయాలి. ఘాట్ ప్రాంతాలలో జీపులు, ఆటోలు అదుపు తప్పడంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ప్రతి మండలంలో ఓ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించి రెయిలింగ్, రక్షణ ఏర్పాట్ల అవసరాన్ని గుర్తించి సంబంధిత శాఖలకు తెలియజేస్తాం. జిల్లా కలెక్టర్కు పరిస్థితి వివరించి అవసరమైన సహాయం కోరతాం. - ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ -
సమ్మె సంపూర్ణం
డిపోలకే పరిమితమైన బస్సులు * హైదరాబాద్లో రోడ్డెక్కని 70 శాతం ఆటోలు * లారీలు తిరగకపోవటంతో స్తంభించిన సరుకు రవాణా సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రత బిల్లుతోపాటు కార్మిక చట్టాల్లో మార్పులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పది ప్రధాన కార్మిక సంఘాల పిలుపుతో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె సంపూర్ణంగా జరిగింది. తెలంగాణలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజామున కొన్ని జిల్లా సర్వీసులు రోడ్డెక్కినప్పటికీ ఆ తర్వాత ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం ఆరు తర్వాత సమ్మె ముగిసినట్టు ప్రకటించటంతో క్రమంగా బస్సులు రోడ్డెక్కాయి. తెలంగాణలో నిత్యం 11,688 బస్సు సర్వీసులు నడవాల్సి ఉండగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 310 సర్వీసులు మాత్రమే నడిచాయి. బస్సులు తిరగకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమ్మెకు ఆటో సంఘాలు, లారీ యజమానుల సంఘం సంపూర్ణ మద్దతు తెలపటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. హైదరాబాద్లో ఒక ఆటో సంఘం సమ్మెలో పాల్గొనకపోవటంతో 30 శాతం వరకు ఆటోలు తిరిగాయి. లారీలు, ట్రాలీలు పూర్తిగా నిలిచిపోవటంతో సరుకు రవాణా కూడా స్తంభించింది. సాధారణంగా దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలు రాష్ట్రంలో అంతగా విజయం సాధించే పరిస్థితి ఉండదు. కానీ, ఈసారి రోడ్డు భద్రత చట్టం, కార్మిక చట్టాల అంశాలు ప్రధాన ఎజెండా కావటంతో స్థానిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో సమ్మె విజయవంతమైంది. సింగరేణి కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించటంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. రైల్వే సంఘాలు సమ్మెకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించినా.. రైళ్లు మాత్రం యథావిధిగానే నడిచాయి. చాలావరకు బ్యాంకులు యథావిధిగానే పనిచేశాయి. కొన్ని చోట్ల కార్మిక సంఘాల ప్రతినిధులు బ్యాంకులను బలవంతంగా మూసివేయించారు. పలు ప్రాంతాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని కార్మిక ప్రతినిధులు నినదించారు. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు త్వరలో జాతీయ కార్మిక సంఘాలు ఢిల్లీలో నిర్వహించే సదస్సులో ఆర్టీసీ సహా పలు సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయించారు. ఏపీలోనూ సమ్మె సక్సెస్ సాక్షి, విజయవాడ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రంలో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మె జయప్రదమైంది. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు నిర్వహించాయి. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కర్నూలులో కార్మికులు, పోలీసులకుమధ్య తోపులాట చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన బ్యాంకులు, ఫ్యాక్టరీలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. బుధవారం మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, లారీలు రోడ్లపైకి రాలేదు. నిరసన ర్యాలీలకు సీపీఐ, సీపీఎం, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, మధు, పి.గౌతంరెడ్డి నాయకత్వం వహించారు. రాజధానిలో ప్రశాంతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా ముగిసింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్కూల్ ఆటోలు కూడా బంద్లో పాల్గొనడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. గ్రేటర్లోని 28 డిపోలకు చెందిన సుమారు 3,500 బస్సులు, లక్షకు పైగా ఆటోలు బంద్లో పాల్గొనడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోకల్ రైళ్లపై ఆధారపడి రాకపోకలు సాగించారు. సమ్మె నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులతో కిక్కిరిసాయి. మరోవైపు రవాణా బంద్ కారణంగా సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్ వంటి వాహనాలు ప్రయాణికులను నిలువుదోపిడీ చేశాయి. -
సమ్మె ప్రశాంతం
నిలిచిన ఆటోలు, బస్సులు పాఠశాలల మూసివేత సెవెన్సీటర్ ఆటోల నిలువుదోపిడీ ప్రయాణికుల పడిగాపులు సిటీబ్యూరో: రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె బుధవారం నగరంలో ప్రశాంతంగా ముగిసింది. ఉద యం నుంచి సాయంత్రం వరకు ఆటోలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. కొన్నిచోట్లస్కూళ్లు తెరచుకున్నా.. ఆటోలు అందుబాటులో లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు బంద్ను సొమ్ము చేసుకొనేందుకు సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్లు రంగంలోకి దిగాయి. రెట్టింపు చార్జీలతో నిలువు దోపిడీకి దిగాయి. సెట్విన్ బస్సులు సైతం అదే బాటలో నడిచాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోవడంతో మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ మార్గాల్లో ప్రైవేట్ వాహనాలు ప్రయాణికుల జేబులు లూఠీ చేశాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి బస్సులు, ఆటోలు అందుబాటులో లేకపోవడంతో సెవెన్ సీటర్ ఆటోవాలాలకు కాసుల పంట పండింది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, తదితర ఆస్పత్రుల వద్ద రోగుల తరలింపు సమస్యగా మారింది. ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే స్తంభించిన రవాణా... సార్వత్రిక సమ్మె విజయవంతానికి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, ఎస్డబ్ల్యూఎఫ్ తదితర సంఘాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్టీవీకే, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం, తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. దీంతో తెల్లవారు జామునుంచే ప్రజా రవాణా నిలిచిపోయింది. కార్మిక సంఘాల ప్రతినిధులు ఎంజీబీఎస్, జేబీఎస్, తదితర ప్రాంతాల్లో బస్సుల రాకపోకలను నిలిపివేశారు. అన్ని ఆటో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాగ్లింపల్లి సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... రహదారి భద్రతా బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ప్రజా రవాణాను నిర్వీర్యం చేసేందుకు, రవాణా రంగంలో ప్రైవేట్ సంస్థలకు పెద్దపీట వేసేందుకే కేంద్రం ఈ బిల్లును ముందుకు తెస్తోందని కార్మిక సంఘాలు ధ్వజమెత్తాయి. ఆర్టీసీ క్రాస్రోడ్స్, అబిడ్స్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీల్లో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. రైల్వే సంఘాల సంఘీభావం... సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రైల్వే కార్మిక సంఘాలు సికింద్రాబాద్లో భారీ ప్రదర్శన చేపట్టాయి. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో రైల్ నిలయంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సంఘ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. రైల్వేల ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సంఘ నేతలు శివ కుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా ఆటోల బంద్
హైదరాబాద్: కేంద్రం అమలు చేయాలనుకుంటున్న రోడ్సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు వివిధ ఆటో యూనియన్ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం హిమాయత్నగర్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో తీర్మానించారు. ఇప్పటికే ఆర్థికంగా వెనకబడ్డ ఆటో డ్రైవర్లు కొత్త చట్టం అమలుతో మరింత కష్టాలపాలవుతారని నాయకులు అన్నారు. సిగ్నల్ జంప్ చేస్తే 5వేలు, నోపార్కింగ్, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రై వింగ్ చేస్తే 5వేలు, బీమా సమస్య ఉంటే 20వేలు, వాహనం కండిషన్ లేకుంటే 10 వేలు, ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగితే 4 లక్షల జరిమానా, జైలు శిక్ష వంటి నిబంధనలు బిల్లులో ఉన్నాయని, ఆ నిబంధనలను వెంటనే తొలిగించాలని డిమాండ్ చేశారు. రహదారి భద్రత బిల్లుతో ఎదురయ్యే అనర్థాలపై ఈనెల 19న బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని ఆటో యూనియన్ల జేఏసీలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బి. వెంకటేశం (ఏఐటీయూసీ), హబీబ్ (బీఎంఎస్), ఈశ్వరరావు (సీఐటీయూ), కిరణ్ (ఐఎఫ్టీయూ), ఎ. నరేందర్ (ఐఎఫ్టీయూ), సత్తిరెడ్డి (టీసీఏడీయూ), రవి (టీఆర్ఏటీటీయూ) తదితరులు పాల్గొన్నారు. -
కలర్ఫుల్.. కేర్ఫుల్..
-
ఇక హెల్మెట్ల వాడకం తప్పనిసరి
విజయనగరం క్రైం: జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధారణపై గత మూడు నెలల నుంచి అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్ ఆదేశాల మేరకు జిల్లాలోని 41 పోలీసు స్టేషన్ల పరిధిలో హెల్మెట్ ధారణపై ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సమాయిత్తమవుతున్నారు. జిల్లా కేంద్రంలో హెల్మెట్ ధారణతో ఇబ్బందులు జిల్లా కేంద్రం విజయనగరంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించటం వల్ల అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఏదైనా కార్యాలయానికి వెళ్లాలన్నా హెల్మెట్ పట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. దొంగలు హెల్మెట్ ధరించి చోరీలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. అందరూ హెల్మెట్లు ధరించడంతో పోలీసులు దొంగలను గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. హత్యలు, దాడులు చేసేందుకు కూడా హెల్మెట్లను వినియోగిస్తున్నారు. గతంలో జిల్లా కోర్టు సమీపంలో ఒక వ్యక్తిని హత్య చేసిన నేరస్తుడు హెల్మెట్తో వె ళ్లాడు. ఘటన తర్వాత పరారయ్యాడు. హెల్మెట్ ధరించి వచ్చిన దుండగులు మహిళల మెడల్లోని బంగారు అభరణాలు దొంగిలించిన ఘటనలు అనేకం ఉన్నాయి. 2009లో అప్పటి ఎస్పీ నవీన్ గులాఠీ జిల్లావ్యాప్తంగా హెల్మెట్లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాకేంద్రంలోని ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ వాడకం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే విధంగా మినహాయింపు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్కు వినతిపత్రం అందించారు కూడా. దీనిపై ఎస్పీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. నేటి నుంచి ధరించాల్సిందే: ఎస్పీ విజయనగరం క్రైం: ద్విచక్ర వాహనదారులు ఆగస్టు 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్ తెలిపారు. హెల్మెట్లు ధరిస్తే ప్రమాదాలు జరిగినపుడు ప్రాణపాయం నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది తలకు గాయమై మృతి చెందుతున్నారన్నారు. ఈ నిబంధనను తప్పనిసరిగా అందరూ ఆచరించాలని, నిబంధనను అతిక్రమించిన వారి నుంచి ఆపరాధ రుసుం వసూలు చేస్తామని పేర్కొన్నారు. -
హెల్మెట్.. ఇక తప్పనిసరి
నేటినుంచి ధరించాలని సర్కారు ఆదేశం వేచిచూసే ధోరణిలో నగర పోలీసులు కొత్త సీపీ వచ్చిన తర్వాతే నిర్ణయం విజయవాడ సిటీ: ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన హెల్మెట్ల ధారణ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనచోదకులందరూ విధిగా హెల్మెట్లు ధరించి తీరాలని గురువారం నిర్వహించిన రోడ్డు భద్రత సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఐ.వై.ఆర్.కృష్ణారావు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. రాష్ట్రంలో నానాటికీ పెరిగి పోతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. వేర్వేరు కారణాలపై జరిగే హత్యల కంటే రెట్టింపు స్థాయిలో రోడ్డు ప్రమాద మృతులు ఉంటున్నారు. ఈ కారణంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావించింది. తొలుత జూలై ఒకటో తేదీ నుంచే అమలుచేయనున్నట్టు మూడు నెలల కిందట ప్రకటించారు. వాహనచోదకుల సంఖ్యకు అనుగుణంగా హెల్మెట్లు లేకపోవడం, ప్రజల్లో వీటి ధారణపై అవగాహన కొరవడడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలుచేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వేచిచూద్దాం.. పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు బదిలీ, పుష్కర విధుల నేపథ్యంలో హెల్మెట్ వాడకంపై పోలీసు శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. జూలైలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఆగస్టు ఒకటో తేదీ నుంచి హెల్మెట్ ధారణపై దృష్టిసారించాలని పోలీసు అధికారులు భావించారు. ఈలోగా సీపీ బదిలీ, పుష్కరాలు వచ్చాయి. తిరిగి ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు వంటి విధులతో పోలీసులు తీరిక లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు అమలుచేయడం ఇబ్బందేనని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే ఈ-చలానాలతో పోలీసులపై వ్యతిరేకత నెలకొంది. తిరిగి హెల్మెట్ అంటూ వెంటపడితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పోలీసుల అభిప్రాయం. ప్రజల వ్యతిరేకత పెరిగితే ప్రభుత్వం తిరిగి తమనే బాధ్యులను చేస్తుందనేది వీరి వాదన. వీటన్నింటిని అధిగమించి హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలంటే కొత్త పోలీసు కమిషనర్ వచ్చే వరకు వేచిచూడడమే మంచిదని నిర్ణయించారు. నాసిరకం హెల్మెట్లు ప్రభుత్వం సీరియస్గా ఉందనే సమాచారంతో నాసిరకం హెల్మెట్లు మార్కెట్లోకి వ్యాపారులు దించినట్టు చెబుతున్నారు. నగరంలో నాలుగు లక్షల వరకు ద్విచక్రవాహనాలు ఉన్నట్టు పోలీసు లెక్కల ద్వారా తెలుస్తోంది. వీరికి సరిపడా హెల్మెట్లు లేవు. కొన్ని షాపుల్లో బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారు. నాణ్యత కలిగిన హెల్మెట్లు తగిన సంఖ్యలో లేకపోవడంతో వాహనదారులు వీటిని కొనేందుకు ఇష్టపడటం లేదు. గతంలో రూ.200కి దొరికిన హెల్మెట్ను ఇప్పుడు రూ.500కు విక్రయిస్తున్నారు. అదేమంటే స్టాకులేదని చెబుతున్నట్టు వాహనచోదకుల వాదన. కారణాలేమైనప్పటికీ శనివారం నుంచి హెల్మెట్ల వాడకం సాధ్యపడదని పోలీసులు అంటున్నారు. కొత్త సీపీ వచ్చిన తర్వాత తగిన సమయం తీసుకొని అమలుచేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పోలీసుల ఊగిసలాట నిబంధనల అమలులో కీలక పాత్ర పోషించే పోలీసు శాఖ మాత్రం ప్రజల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని వేచిచూసే ధోరణి కనబరుస్తోంది. కొత్త పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జారీచేసే ఆదేశాలకు అనుగుణంగా వెళ్లాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. దీనికి రవాణాశాఖ ఓకే చెబుతుంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపే పోలీసు శాఖ మాత్రం ఊగిసలాటలో ఉంది. -
తాగి నడిపితే భారీ జరిమానా!
న్యూఢిల్లీ: మద్యంతాగి డ్రైవింగ్ చేసిన వారికి ఇక మీదట మరింత కఠిన శిక్ష తప్పకపోవచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి భారీ జరిమానా విధించే అవకాశముంది. తొలిసారి పట్టుబడిన వారికి ప్రస్తుత జరిమానా కంటే ఐదు రెట్లు అధికంగా అంటే 10 వేల రూపాయలు వేయవచ్చు. కేంద్ర రవాణ శాఖ రూపొందించిన రోడ్డు రవాణ, భద్రత బిల్లులో ఈ మేరకు కఠిన నిబంధనలను చేర్చారు. ఈ బిల్లును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా పరిశీలన కోసం అన్ని రాష్ట్రాలకు పంపింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చగా శిక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినవారికి 2 వేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. తాజా బిల్లులో జరిమానాను పది వేల రూపాయలకు పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మరోసారి పట్టుబడిన వారికి అత్యధికంగా జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించనున్నారు. -
మృత్యు రహదారులకు అడ్డుకట్ట... ‘రోడ్డు సేఫ్టీ’
సందర్భం దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత విస్తృత పరిమాణంతో కేంద్రప్రభుత్వం రోడ్డురవాణా, భద్రతా చట్టం 2015పై బిల్లును ప్రవేశపెట్టింది. గత నెల చివర్లో దేశవ్యాప్తంగా రవాణా ఆపరేటర్లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలిపినా ప్రజా భద్రత దృష్ట్యా ఈ బిల్లుపై జాతీయస్థాయిలో చర్చ జరగవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రోడ్డురవాణా, భద్రతా చట్టం 2015 పేరిట ఒక బిల్లును ప్రవే శపెట్టింది. దీనికి ప్రతిస్పంద నగా ఏప్రిల్ 30న లారీ, ఆటో డ్రైవర్ యూనియన్లతోపాటు దేశవ్యాప్తంగా రవాణా ఆపరే టర్లు నిరసన ప్రదర్శనలు నిర్వ హించారు. దేశంలో జరుగుతు న్న రోడ్డు ప్రమాదాలను నిత్యం పరిశీలిస్తున్న ప్రజలు భారతీయ వాహన చట్టాలను సవరించాల్సిన అవసర ముందని భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ప్రమాద క్లెయిమ్లు తదితరమైన ఘటనలపై కోర్టు కేసులు పెరిగి పోతున్నాయి. టోల్ చార్జీలపై ప్రజా నిరసన కారణంగా పలు రాష్ట్రాల్లో బహుళ పన్నుల విధానాన్ని రద్దు చేయా లని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న రవాణా అవస రాలు, రవాణా మౌలిక సౌకర్యాల అవసరం కారణంగా దేశవ్యాప్తంగా రోడ్ నెట్వర్క్ల విస్తరణకు, నిర్వహణకు ప్రైవేట్ పెట్టుబడే పరిష్కారమని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించి చట్టాల్లో మార్పు తీసుకువస్తానని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, భద్రతా చట్టం 2015ను ప్రతిపాదించారు. ఇది 350 పేజీల భారీ డాక్యు మెంట్. రోడ్డు రవాణాకు సంబంధించిన ప్రతి అంశాన్ని దీంట్లో పొందుపర్చారు. ఈ చట్టం కింద ఇన్ని నిబంధన లను ఏర్పర్చవలసిన అవసరం ఉందా అన్న ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఈ చట్టం కింది సాధికారిక వ్యవస్థ లను ప్రతిపాదించింది. 1. జాతీయ రహదారి భద్రత, వాహన క్రమబద్ధీకరణ అథారిటీ. 2. జాతీయ రోడ్డు రవాణా, బహుళ నమూనా సమన్వయ అథారిటీ. వీటిలో మొదటిది ప్రధానంగా వాహనాలకు సం బంధించింది. రెండోది రహదారులు మినహా రవాణా మౌలిక సౌకర్యాల వ్యవస్థకు సంబంధించింది. డ్రైవింగ్ లెసైన్స్, మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్లు, బీమా, ఉత్పత్తి దారుల నుంచి వెహికల్ సమాచారం, పర్మిట్లు, రోడ్ ప్రమాదాలు, నేరాలు, జరిమానాలు వంటి వాటికి సం బంధించి జాతీయ ఏకీకృత వ్యవస్థను కూడా ఈ బిల్లు ప్రతిపాదించింది. రాష్ట్రాల మద్య సమాచార పంపకంలో అంతరాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమస్యల కారణంగా ఇది సరైన చర్యే. అయితే దీనికి సమాచారా న్ని రూపొందించి, అందించే వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పర్చుకోవడం అవసరం. అయితే, ఈ బిల్లు మొత్తం మీద క్రమబద్ధీకరణ సం స్థలను కేంద్రీకరించాలని చూస్తోంది. ఇది కేంద్ర-రాష్ట్ర సమన్వయాన్ని, సమాచార పంపకాన్ని, సంస్థల మధ్య సహకారాన్ని ఈ చట్టం ప్రతిపాదించడం లేదు. కేంద్రీ కరణ అనేది అవినీతికి రాచమార్గం కల్పిస్తుంది. దేశవ్యా ప్తంగా నెలకొన్న పలు రహదారి సమస్యలకు ఇది పరి ష్కారం చూపదు కూడా. 2005 జనవరి 13న నాటి ప్రధాని నేతృత్వంలో ఉన్న, మౌలిక సౌకర్యాల కల్పనపై కేబినెట్ కమిటీ ఆదే శాల మేరకు రోడ్డు భద్రత, నిర్వహణపై ఒక నిపుణుల కమిటీ ఏర్పడింది. రోడ్డు భద్రత విషయంలో వివిధ దేశాల్లో అత్యున్నత స్థాయిలో రాజకీయ చిత్తశుద్ధి ఉం దని ఈ కమిటీ తన అధ్యయనంలో కనుగొంది. రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని అంశాల పరిష్కారానికి పూర్తి బాధ్యత వహించే ఏకైక సంస్థ ఏ దేశంలోనూ లేదని ఆ అధ్యయనం తెలిపింది. రోడ్డు ప్రమాదాలకు చెందిన నేరస్థ స్వభావాన్ని నివారించాలని, నిబద్ధ హైవే పోలీసును, రోడ్డు భద్రత నిధిని, సమర్థ నిర్వహణను కమిటీ ప్రతిపాదించింది. అయితే ప్రస్తుత ప్రతిపాదిత బిల్లులో మెడికో- లీగల్ కేసుల సమస్యను ఏమాత్రం ప్రస్తావించలేదు. జాతీయ రహదారులపై కీలకమైన ఆ గంట సమయం లో తీసుకోవలసిన తక్షణ చర్యలను నిర్వచించినప్పటికీ ఇతర రహదారుల ఊసు ఈ బిల్లులో లేదు. పైగా ప్రమా దకరమైన వస్తువులను, సరకులను తీసుకువెళుతున్న పెట్రోలియం, రసాయనాల టాంకర్లకు పబ్లిక్ లయబి లిటీ ఇనూరెన్స్ యాక్ట్ 1991 కింద బీమా సౌకర్యం కల్పించాలని ప్రస్తుత బిల్లు ప్రతిపాదించిందే కానీ అలాంటి వాహనాలు కలిగిస్తున్న ప్రమాదాల బారిన పడిన ప్రజలను గాలికొదిలేసింది. పైగా వాహనాల నుం చి వచ్చే వాయు, శబ్ద కాలుష్యం గురించి పేర్కొనడమే తప్ప, సహజ వనరులను దెబ్బతీస్తున్న వాహనాల కాలు ష్యం గురించి ప్రస్తావించలేదు. ఈ బిల్లుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ప్రధానంగా నిరక్షరాస్యులు నడుపుతున్న సరుకు రవా ణా రంగానికి సంబంధించి ఈ బిల్లు మరింత స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. భారతీయ ఆర్థికవ్యవస్థలో ప్రాధాన్యం ఉన్న ఈ రంగాన్ని అహేతుకమైన రీతిలో ఇబ్బంది పెట్ట కూడదు. అదే సమయంలో ఉద్యోగాల కల్పనకు వీలు కల్పిస్తున్న ఏక వాహన యజమానులు, చిన్న స్థాయి రవాణాదారులకు భద్రతకు ఈ బిల్లు హామీ ఇవ్వాలి. పైగా ప్రభుత్వ నిధులపై భారాన్ని తగ్గించాలి కూడా. (వ్యాసకర్త ప్రభుత్వ విధాన నిపుణులు) ఈమెయిల్: nreddy.donthi@gmail.com -
దేశంలో స్తంభించిన రవాణా
పలు రాష్ట్రాల్లో పూర్తిగా నిలిచిపోయిన వాహనాలు న్యూఢిల్లీ: ‘రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లు’ను నిరసిస్తూ గురువారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర రవాణా కార్పొరేషన్ల సిబ్బంది, ప్రైవేటు ఆపరేటర్లు చేపట్టిన ఒకరోజు సమ్మె విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేయడంతో సాధారణ జనజీవనంపై ప్రభావం పడింది. పలు రాష్ట్రాల్లో ప్రయాణికులకు, రవాణాకు తీవ్రంగా ఇబ్బంది ఎదురైంది. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లు-2015’ను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఊసీసీటీయూ, ఎల్పీఎఫ్తో పాటు రాష్ట్ర కార్మిక సంఘాలు గురువారం ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ బిల్లు రాష్ట్రాల రవాణా సంస్థ హక్కులనేమీ దెబ్బతీయదని, ఈ సమ్మెను విరమించుకోవాలని కేంద్ర రవాణా మంత్రి గడ్కారీ విజ్ఞప్తి చేసినా.. కార్మిక సంఘాలు వెనక్కి తగ్గలేదు. కేరళలో ఉదయం నుంచే బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు కూడా రోడ్డుపైకి రాలేదు. దీంతో అక్కడి యూనివర్సిటీలు గురువారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. కర్ణాటక, పంజాబ్, గుజరాత్, అస్సాం, హర్యానాల్లోనూ జనజీవనం స్తంభించింది. బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా సమ్మె పాటిం చాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బలి, బళ్లారి, రాయచూర్, మైసూర్ వంటి చోట్ల రోడ్లపైకి వచ్చిన పలు ఆర్టీసీ బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తమిళనాడులో పెద్ద సంఖ్యలో వాహనాలు సమ్మెను పాటించాయి. బిల్లు వ్యతిరేకంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
‘రవాణా’ బంద్ ఉపసంహరణ
సాక్షి, ముంబై: ‘రోడ్డు భద్రత బిల్లు-2014’కు వ్యతిరేకంగా గురువారం చేపట్టిన బంద్ను రాష్ట్ర రవాణా వ్యవస్థ యూనియన్లు ఉపసంహరించుకున్నాయి.రవాణ శాఖ మంత్రి దివాకర్ రావుతో జరిగిన చర్చల అనంతరం బంద్ ఉపసంహరించుకున్నట్లు యూనియన్లు ప్రకటించాయి. గురువారం ఉదయం రావుతేతో యూనియన్లు జరిపిన చర్చల్లో మంత్రి సానుకూలంగా స్పందించారు. పార్లమెంటులో కొత్త బిల్లుకు అనుమతి లభించగానే కొత్త మోటర్ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాగా, పుణేలో (చర్చలకు ముందు) ఆర్టీసీ సిబ్బంది నల్ల రిబ్బన్లు కట్టుకుని విధులు నిర్వహించారు. బంద్ కారణంగా లోకల్ రైళ్లలో రద్దీ పెరిగింది. ఉదయం కార్యాలయాలకు చేరుకునే ఉద్యోగులు బస్టాపుల్లో వేచి ఉండాల్సి వచ్చింది. మరోవైపు ముంబైలో బంద్ ప్రభావం అంతగా కనబడలేదు. -
రవాణ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా
విజయనగరం: రహదారి భద్రత బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ నిరసనలు చేపడుతున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురంలో గురువారం ఉదయం పలు కార్మిక సంఘాల నాయకులు రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలి నిర్వహించారు. ర్యాలి అనదతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న నాయకులు కాంప్లెక్స్ ఎదుట బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. -
ఖమ్మంలో డిపోలకే పరిమితమైన బస్సులు
ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న రహదారుల భద్రత బిల్లును వ్యతిరేకిస్తూ ఖమ్మం బస్స్టేషన్లో కార్మికులు ఆందోళన బాటపట్టారు. పలు కార్మిక సంఘాల నాయకులు విధులను బహిష్కరించి బస్సులను డిపోలకు పరిమితం చేసి ఆందోళన చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాష్ట్రంలో ‘రవాణా’ బంద్
- రోడ్డు భద్రత బిల్లు-2014 కు వ్యతిరేకంగానే.. - దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన ఎన్ఎఫ్టీవీ - బిల్లుపై పునరాలోచించాలని డిమాండ్ సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘రోడ్డు భద్రత బిల్లు-2014’కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఆర్టీసీ, బెస్ట్ బస్సు, ఆటో, ట్యాక్సీల సంఘాలు ఏప్రిల్ 30న బంద్కు పిలుపునిచ్చాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ (ఎన్ఎఫ్టీవీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా రైల్వే మినహా మిగతా రవాణా వ్యవస్థలన్నీ పూర్తిగా నిలిచిపోనున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన రోడ్డు భద్రత బిల్లు కారణంగా ప్రైవేటు రవాణ వ్యవస్థకు మేలు జరిగినప్పటికీ ఆటో, ట్యాక్సీ, ఆర్టీసీ, బెస్ట్ లాంటి ప్రజా రవాణ సంస్థలపై ప్రభావం పడుతుందని నేషనల్ ఫెడరేషన్ అభిప్రాయపడుతోంది. ఈ విషయంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో వివిధ సంఘాల నాయకులు భేటీ అయ్యారని, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దేశ వ్యాప్తంగా చక్కా జాం (చక్రాలకు బ్రేక్) చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. బిల్లుపై కేంద్ర పునరాలోచించాలని డిమాండ్ చేసింది. దేశంలోని 40 లక్షల మంది కార్మికులతో పాటు రాష్ట్రంలోని ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లు, రెండు లక్షల మంది ట్యాక్సీ డ్రైవర్లు, ముంబైలో సేవలందిస్తున్న బెస్ట్, ఆర్టీసీ సేవలు నిలిచిపోతాయని ఫెడరేషన్ స్పష్టం చేసింది. శివసేన అనుబంధ యూనియన్లు మినహా హింద్ మజ్దూర్ సభ, భారతీయ మజ్దూర్ సంఘ్, సిటూ, ఐటక్, ఇంటక్ తదితర యూనియన్లు బంద్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. ముంబైకర్ల ఆందోళన ఆటో, ట్యాక్సీ, బస్సులు అన్నీ బంద్ అయితే రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందని ముంబైకర్లు ఆందోళన చెందుతున్నారు. ముంబైలో లోకల్ రైళ్ల తర్వాత అత్యధిక శాత ం ప్రజలు ప్రయాణించేది బెస్ట్ బస్సుల్లోనే. ప్రతిరోజు దాదాపు 40 లక్షల మంది ముంబైకర్లు బెస్ట్ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. లక్షకుపైగా ఆటోలు, 15 వేలకుపైగా ట్యాక్సీలు నగరంలో సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రంలో రవాణా మొత్తం స్తంభించిపోనుంది. -
రహదారి భద్రత ప్రాజెక్టులకు ఐటీ మినహాయింపు
న్యూఢిల్లీ: రహదారి భద్రతను మెరుగుపర్చేవి, ప్రమాదాలను నివారించేవిగాను ఉండే ప్రాజెక్టులకు ఆదాయ పన్ను (ఐటీ) నుంచి మినహాయింపు లభిస్తుందని రహదారుల శాఖకు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. అయితే, ఇందుకోసం సదరు ప్రాజెక్టు అర్హమైనదిగా ప్రకటించాలంటే ముందుగా సామాజిక, ఆర్థిక సంక్షేమ జాతీయ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. రహదారుల శాఖ కార్యదర్శి విజయ్ చిబ్బర్కు రాసిన లేఖలో ఈ అంశాలు తెలిపారు. రహదారుల భద్రతను ప్రోత్సహించేలా, ట్రాఫిక్పై అవగాహన పెంచేలా చేపట్టే ప్రాజెక్టులకు పన్ను మినహాయింపులపై స్పష్టతనివ్వాలంటూ రహదారుల శాఖ కోరిన నేపథ్యంలో శక్తికాంత దాస్ తాజా వివరణ ఇచ్చారు. -
వినాయకుడికి హెల్మెట్ ఉంది.. మనకొద్దా..
న్యూఢిల్లీ: రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందుకోసం దేవుళ్లతో ఓ కొత్త త్రీడీ వీడియోను రూపొందించి యూట్యూబ్లో ఉంచింది. ఇప్పుడా ప్రచార చిత్రం విరివిగా ప్రజలను ఆకర్షిస్తోంది. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు అజాగ్రత్తలో వ్యవహరించడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలకు లోనవుతూ ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుందని 'ఇండియన్ హెడ్ ఇంజ్యూరీ ఫౌండేషన్' అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తాను రూపొందించిన ప్రచార చిత్రంలోభాగంగా 'దేవుళ్లు మన రక్షకులు.. అనుక్షణం మనల్ని కాపాడుతూ వెన్నంటి ఉండేవారు.. సర్వశక్తిమంతులు. అలాంటి దేవుళ్లే రోడ్డు భద్రత పాటిస్తుంటే మనమెందుకు పాటించకూడదు' అని ఈ వీడియో ద్వారా 'ఇండియన్ హెడ్ ఇంజ్యూరీ ఫౌండేషన్' ప్రశ్నించింది. ఈ వీడియోలో దుర్గామాత, వినాయకుడు, విష్ణుమూర్తి.. సింహం, ఎలుక, గరుడను అదిరోహిస్తూ ప్రయాణం ప్రారంభిస్తూ ఒక్కసారిగా ఆగి తమ కిరీటాలను ధరిస్తారు. దీనిద్వారా దేవుళ్లే బయటికెళ్లేటప్పుడు కిరీటాలు లేకుండా వెళ్లేవారు కాదని, అవి తమ తలకు ఎలాంటి హానీ కలగకుండా రక్షణగా ఉంటాయని సూచిస్తూ మనుషులైన మనం తప్పకుండా హెల్మెట్ ధరించకూడదా అని అందులో ఉంది. -
రహదారుల భద్రతకు రూ. 2,960 కోట్లు!
-
రహదారి భద్రత ఇలాగేనా?!
ఏదో అవసరం పడి రోడ్డెక్కేవారిని మోటారు వాహనం రూపంలో మృత్యువు నీడలా వెంటాడుతుంది. అయినవాళ్లంతా ఆత్రంగా ఎదురుచూస్తున్న వేళ ఏ చౌరస్తాలోనో, మరే మలుపులోనో నడి రోడ్డుపై నెత్తుటి ముద్దగా మారుస్తుంది. నిత్యమూ వందలాది కుటుంబాలను విషాదంలో ముంచేసే ఈ ప్రమాదాలను అరికట్టడంపై సాగుతున్న నిర్లక్ష్యాన్ని గమనించి నిరుడు సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేయడంతోపాటు అవసరమైన సూచనలు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా నియమించింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాక కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లుకు రూపకల్పనచేసి పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అమెరికా, బ్రిటన్, సింగపూర్, జపాన్, కెనడా, జర్మనీ వంటి వివిధ దేశాల చట్టాలను అధ్యయనం చేసి అందులోని మంచి అంశాలను ఈ బిల్లులో పొందుపరుస్తామని కూడా ఆయన చెప్పారు. మన రహదార్లపై రోజుకు నాలుగొందలమంది...ఏటా దాదాపు లక్షన్నరమంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మరో అయిదున్నర లక్షలమంది ఈ ప్రమాదాల్లో క్షతగాత్రులవుతున్నారు. సగటున ప్రతి నాలుగు నిమిషాలకూ ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితిని సరిచేసి ప్రయాణికులు క్షేమంగా, వేగంగా, తక్కువ వ్యయంతో గమ్యస్థానాలు చేరేలా కృషిచేస్తామని... సరుకు రవాణా సులభమయ్యేలా చర్యలు తీసుకుంటామని తాజా సవరణ బిల్లు చెబుతున్నది. అంతేకాదు... వచ్చే అయిదేళ్లలో రహదార్లపై 2 లక్షల మరణాలను నివారిస్తామని, కేవలం రవాణా భద్రత, సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా జీడీపీ మరో నాలుగు శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటామని, ఈ రంగంలో పెట్టుబడుల ద్వారా కొత్తగా 10 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటించింది. వాహనాల క్రమబద్ధీకరణకు, రహదారి భద్రతకు ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తున్నది. వినడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి మరణాలకు కారకులయ్యే వ్యక్తుల లెసైన్సుల్ని రద్దు చేయడం, భారీ జరిమానాలు విధించడంవంటి నిబంధనలున్నాయి. భారీ జరిమానాల విధింపువల్ల ఆచరణలో ఎలాంటి ప్రభావమూ ఉండబోదని...ఇది తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడం కాక అతని కుటుంబం మొత్తాన్ని శిక్షకు గురిచేయడం అవుతుందని నిపుణులు వ్యక్తంచేసిన అభిప్రాయాల తర్వాత ఈ జరిమానా నిబంధనలో మార్పు తెచ్చారు. అంతక్రితం రూ. 2,500 నుంచి రూ. 20,000 వరకూ జరిమానా విధించే అవకాశం ఉండగా దాన్ని కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 5,000 ఉండేలా మార్చారు. అయితే, మృతుల కుటుంబాలకిచ్చే పరిహారానికి సంబంధించిన నిబంధనే అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. అసలు సవరణ బిల్లు రూపకల్పనలోని ఆంతర్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇప్పటివరకూ ప్రమాదాల్లో మరణించినవారి వయసు, వారి సంపాదన సామర్థ్యం, వారిపై ఆధారపడినవారి అవసరాలు వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునళ్లు పరిహారాన్ని నిర్ణయించేవి. న్యాయస్థానాలు సైతం బాధిత కుటుంబాలకు రూ. 2 కోట్ల వరకూ పరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పిన సందర్భాలున్నాయి. అయితే, తాజా సవరణ బిల్లు ఈ పరిహారం పరిమితిని గరిష్టంగా రూ. 15 లక్షలకు కుదిస్తోంది. ‘ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే...’ అన్నట్టు బీమా సంస్థలు కొంతకాలంగా పరిహారం చెల్లింపులవల్ల తాము నష్టపోతున్నామని వాపోతున్నాయి. దీన్ని సరిచేయకపోతే దివాలా తీయాల్సివస్తుందని హెచ్చరిస్తున్నాయి. అయినవారిని కోల్పోయి, భవిష్యత్తు అగమ్యగోచరమై దిక్కుతోచని స్థితిలో పడే బాధిత కుటుంబాలకు సాంత్వన చేకూర్చడంకంటే... డబ్బివ్వడానికి విలవిల్లాడుతున్న బీమా సంస్థల ఏడుపే కేంద్రానికి ఎక్కువైపోయిందా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇది అన్యాయం, అధర్మం మాత్రమే కాదు...బాధిత కుటుంబాలతో క్రూర పరిహాసమాడటమే అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మోటారు వాహనాల చట్టం పాతికేళ్లక్రితం నాటిది. 1988లో అమల్లోకొచ్చిన ఆ చట్టం స్థానంలో సమగ్రమైన చట్టం తీసుకురావాలని యూపీఏ ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసమని 2007, 2011ల్లో రెండు కమిటీలు ఏర్పరిచింది. ఆ కమిటీలిచ్చిన నివేదికలపై అధ్యయనాల్లోనే కాలం గడిచిపోయింది. ఇన్నాళ్లకైనా ఒక సమగ్రమైన చట్టం తెస్తున్నారనుకుంటే దాన్ని కాస్తా ఇలాంటి లొసుగులతో నింపడం న్యాయం కాదు. సవరణ బిల్లులో వాహనాలకు వాడే విడి భాగాల ప్రామాణికతల గురించి, వాహనచోదకులు పాటించాల్సిన నిబంధనల గురించి, ప్రమాదం జరిగిన సందర్భాల్లో వర్తించే జరిమానాలు, శిక్షలు వగైరా చర్యల గురించి ఉన్నాయి. కానీ మొత్తంగా రహదారుల భద్రత కోణాన్ని ఈ బిల్లు స్పృశించటం లేదు. రహదారుల అధ్వాన్నస్థితివల్ల ఏటా వేల కోట్ల రూపాయల నష్టం సంభవిస్తున్నదని వాహనాల యాజమాన్యాలు అంటున్నాయి. భారీవర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా మారినా, ఫుట్పాత్లే లేకున్నా బాధ్యత తీసుకుని సరిచేసేవారుండరు. ఇక పాశ్చాత్య ప్రమాణాలతో తయారవుతున్న వాహనాలు ఇక్కడి రహదారులకు ఎంతవరకూ సరిపోతాయో సమీక్షించే యంత్రాంగం... వాహనాల డిజైన్ లోపాలు ప్రమాదాలకు దోహదపడుతున్న తీరును గమనించే వ్యవస్థ లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని సమగ్రమైన చట్టం తీసుకురావలసిన అవసరం ఉండగా అరకొర చర్యలతో, అన్యాయమైన నిబంధనలతో సవరణ బిల్లు తీసుకురావడం సరికాదు. కేంద్రం ఈ విషయంలో ఆలోచించాలి. -
భద్రతకు మారుపేరు ఆర్టీసీ
అనంతపురం రూరల్: భద్రతకు మరోపేరు ఆర్టీసీ అని, ప్రతి కార్మికుడూ స్వీయ నియంత్రణతో ప్రమాదాల రేటును సున్నా శాతానికి తీసుకురావాలని ఆర్టీసీ ట్రాన్స్పోర్టు ఓఎస్డీ ఎంవీ రావు, మోటర్ వెహికల్ ఇన్స్స్పెక్టర్(ఎంవీఐ) శ్రీనివాసులు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంవీఐ మాట్లాడుతూ వాహనం నడుపుతూ సెల్ ఫోన్లో మాట్లాకూడదని తెలిసీ కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఫలితంగా వెలకట్టలేని ప్రజల ప్రాణాలు, రూ. లక్షల విలువచేసే బస్సులు ప్రమాదానికి గురికావాల్సి వస్తుందన్నారు. కార్మికులు చిత్తశుధ్ధితో విధులు నిర్వర్తించి అవార్డుల కోసం పోటీ పడాలన్నారు. ఓఎస్డీ మాట్లాడుతూ భద్రతే ఆర్టీసీ బ్రాండ్ అని అన్నారు. సంస్థలో డ్రైవర్లదే కీలకపాత్ర అన్నారు. కోటి కిలోమీటర్లు తిరిగితే 8 ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 0 శాతం ప్రమాద రేటు తీసుకురావాలన్నారు. రాష్ట్రస్థాయిలో తక్కువ ప్రమాదరహిత రేటు శాతాన్ని సాధించిన అనంతపురం డిపో మేనేజర్ రమణ, ఉరవకొండ డిపో మేనేజర్ ప్రశాంతి, కదిరి డిపో మేనేజర్ గోపీనాథ్ ఆర్టీసీ అధికారులు, ఎన్ఎంయూ నేతలు సన్మానించారు. డెప్యూటీ సీటీఎం మధుసూదన్, సీఎంఈ శ్రీలక్ష్మి, డీఎంలు మోహన్కుమార్, నరసింహులు, బాలచంద్రప్ప, రాజవర్ధన్రెడ్డి, ఆర్ఎం కార్యాలయం అధికారి వినయ్కుమార్, కంట్రోలర్ శివలింగప్ప, తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలు అందించిన డ్రైవర్ల వివరాలిలా.. జోనల్ స్థాయిలో 3వ స్థానం వైఎన్ రాజు (తాడిపత్రి) రీజియన్లో : వీ ఆంజనేయులు(కదిరి) మొదటిస్థానం, కేకే మొహిద్దీన్(తాడిపత్రి) రెండో స్థానం, ఏ రామయ్య(తాడిపత్రి)మూడోస్థానం. డిపోల వారీగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినవారు.. అనంతపురం : ఎస్ రెహ్మాన్, జీకే మోహిద్దీన్, వీవీ స్వామిజ గుత్తి : ఆర్ ఈశ్వరయ్య, వీవీ రాముడు, ఎస్ నిజాం గుంతకల్లు : ఆర్ గోపాల్, టీఏ రెహ్మాన్, ఎన్ ఈరన్న కళ్యాణదుర్గం : జీ గోవిందు, టీ నాగరాజు, జీ వెంకటేశులు రాయదుర్గం : వీ శేఖర్, డీజీ నాయక్, బీ నాగేంద్ర తాడిపత్రి: ఎస్ఎం బాష, ఎన్ పెద్దన్న, డీ ఖాసీం ఉరవకొండ: బీఎస్ వలి, పీఏ మర్తుజ, ఏ వెంకటేశులు ధర్మవరం : పీకే మోదీన్, సీ అమీర్, ఎస్ మల్లేష్ హిందూపురం : ఎస్ నూరుల్ల, ఏఏ నాయక్, ఈఎన్ రాజు మడకశిర : ఎంఎన్ స్వామి, ఏడీబీ బేగ్, బీఎస్ నాయక్ కదిరి : ఎస్ మహ్మద్ అలీ, కేఎస్ఏ ఖాన్, ఎస్ మహ్మద్షఫీ పుట్టపర్తి : పీహెచ్వీ ఖాన్, బీఎఫ్ ఖాన్, జీఎస్ శేఖర్ బెస్ట్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు.. విశ్వనాథ్ (అనంతపురం), ఖలందర్ (కళ్యాణదుర్గం), బీ మోహన్ (గుంతకల్లు), రాముడు (తాడిపత్రి), రాయుడు (ధర్మవరం). చిత్రలేఖనంలో ప్రతిభ చూపిన విద్యార్థులు : ఎంకే సాయికుమార్ (మొదటి స్థానం), వీ రాజేష్ , టీ బాబు, సీ శివ, ఎస్ వంశీ, కే కార్తీక్, జీ జీవన్కుమార్, కే మంజునాథాచారి, ఎం ఇందిర, కే కౌసల్య, పీ రాజేశ్వరి. -
డ్రైవర్లకు ప్రశాంతత అవసరం
రోడ్డు భద్రతా వారోత్సవాలలో కలెక్టర్ కేవీ రమణ కడప అర్బన్ : డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిలో ప్రశాంతత ఉండాలని జిల్లా కలెక్టర్ కేవీరమణ పేర్కొన్నారు. 26వ రహదారి భద్రత వారోత్సవాలను రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ ఆవరణంలోని సమావేశ మందిరంలో వివిధ కళాశాలల విద్యార్థులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో, ట్రాలీ డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారుల వల్ల జరుగుతున్నాయన్నారు. డ్రైవింగ్ చేసే వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండి వాహనాలు నడపాలన్నారు. వేగంగా వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్గులాఠీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత యేడాది కాలంలో 2 లక్షల మందికి పైగా కేవలం రోడ్డు ప్రమాదాల వల్ల మృతి చెందారన్నారు. కుటుంబ యజమాని ప్రమాదంలో మృత్యువాత పడితే ఆ కుటుంబం రోడ్డున పడినట్లేనన్నారు. ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. డీటీసీ బసిరె డ్డి మాట్లాడుతూ అనేక రకాల కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ నరసింహారెడ్డి వాహనదారులు అప్రమత్తంగా ఉండే గీతానికి నృత్య ప్రదర్శన చేశారు. పలు కరపత్రాలను, గోడ పత్రాలను కలెక్టర్, ఎస్పీఆవిష్కరించారు. సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం గోపీనాధ్రెడ్డి, జెడ్పీ సీఈవో మాల్యాద్రి ప్రసంగించారు. కడప డీఎస్పీ ఈజీ అశోక్కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం, ఎంవీఐలు శ్రీకాంత్, వేణు, ఏఎంవీఐ లు హేమకుమార్, వివిధ కళాశాలల విద్యార్థులు, ఆర్టీసీ, ఆటోడ్రైవర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మొదటి రోజే అట్టర్ ఫ్లాప్
ఖమ్మం:ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు భద్రత వారోత్సవాలు మొదటి రోజే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ వారోత్సవాలు మొక్కుబడిగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు ప్రారంభం అవుతాయని, 17 వరకు జరుగుతాయని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసిన దానిని పెడచెవిన పెట్టారనేందుకు ఆదివారం ఖమ్మంలోని రవాణా శాఖ కార్యలయంలో ప్రారంభమైన భద్రతా వారోత్సవాల కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది. జన సమీకరణకు పాట్లు ఆదివారం నుంచి భద్రత వారోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిసి కూడా రవాణా శాఖ అధికారులు తగిన ప్రచారం నిర్వహించలేదు. దీంతో ఈ కార్యక్రమానికి ఎవరూ రాలేదు. అసలు ఈ కార్యక్రమమున్న విషయం కనీసంగా డ్రైవర్లకుగానీ, ప్రజలకుగానీ తెలియలేదు. దీంతో ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం జనం లేకపోవటంతో మధ్యాహ్నం 2-30 తర్వాత ప్రారంభమైంది. కుర్చీలు నిండటం కోసం ఆటో డ్రైవర్లు, ఇతర డ్రైవర్లను, వాహన చోదకులను తీసుకొచ్చేందుకు రవాణా శాఖ సిబ్బంది నానా పాట్లు పడ్డారు. సిబ్బంది డుమ్మా మొదటి రోజే భద్రతా వారోత్సవాల ప్రారంభం కార్యక్రమానికి కార్యాలయ సిబ్బంది డుమ్మా కొట్టడం పలువురిని విస్మయపరిచింది. ఆర్టీవో, సీనియర్ఎంవీఐ, ఏఎంవీఐ, సీనియర్ అసిస్టెంట్, హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులు తప్ప ఎవరూ హాజరుకాలేదు. కొరవడిన సమన్వయం భద్రతా వారోత్సవాల సందర్భంగా రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం కొరవడింది. ఈ వారోత్సవాల విషయం తమకు తెలీదని, మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కార్యక్రమానికి రావాలంటూ మెసేజ్ వేశారని, అందువల్లే తాము రాలేకపోయామని కొంతమంది సిబ్బంది చెప్పారు. జిల్లా ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవటంతో ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహించాల్సి వచ్చిందని, ఆదివారం కావటంతో డ్రైవర్లు, ప్రజలు అందుబాటులో లేరని, అందుకే అందరూ హాజరుకాలేకపోయారని రవాణాశాఖ అధికారులు చెప్పారు. జిల్లాలోని అన్ని రవాణా కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం పేలవంగా జరిగినట్టు సమాచారం. భద్రత నినాదం కాదు.. జీవన విధానం భద్రత అనేది నినాదం కాదు.. జీవన విధానమని ఆర్టీవో మొహిమిన్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు నడిపే వారు రవాణా శాఖ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. కార్లు నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఎంవీఐ రవీందర్, ఏఎంశీఐ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ పాల్గొన్నారు. -
జాతీయ రహదారి భద్రతావారోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్: 26వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై ప్రయాణించేపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కార్యక్రమంలో ప్రజలకి అవగాహన కల్పించనున్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయి. దేశంలోని ఢిల్లీ, బెంగళురు, ముంబై, చెన్నై, కోల్కతా, బరోడా, వడోదరా, పూణే, భువణేశ్వర్, హైదరాబాద్, చండీగర్ నగరాలలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. -
‘రోడ్ సేఫ్టీ క్లబ్’
దేశంలో సంభవించే మరణాల్లో అధిక శాతం రోడ్డు ప్రమాదాలే. వాహనదారులే కాదు... రోడ్డు మీద నడిచే వాళ్ల తప్పుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారిపై రకరకాల గీతలుంటాయి. సిగ్నల్స్ కనిపిస్తాయి. కానీ... వాటి గురించిన క్షుణ్ణంగా ఎంత మందికి తెలుసు! చిన్న చిన్న పొరపాట్లు, తప్పుల వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. వీటిని నివారించాలంటే నిబంధనలపై అవగాహన ఉండాలి. వాటిని కచ్చితంగా పాటించాలి. అదే పని చేస్తోంది నగరంలోని ‘రోడ్ సేఫ్టీ క్లబ్’. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి అవేర్నెస్సే సరైన మార్గమంటున్న ఈ క్లబ్ విశేషాలు... -ఓ మధు ఫుట్పాత్ ఉంటే ఓకే... లేనప్పుడు ఎక్కడ నడవాలి? చాలా మందికి ఈ విషయం తెలియదు. అలాగే వివిధ సూచీలు కనిపిస్తాయి. వాటిపై ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. ఇది చిన్న విషయమే అనుకోవడం వల్లే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించేలా చేయడం రోడ్ సేఫ్టీలో భాగమే. అదే ఈ క్లబ్ లక్ష్యం. ఎక్కువగా దీనిపై పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు క్లబ్ మెంబర్స్. ఈ కార్యక్రమాలన్నింటినీ స్కూళ్లు, కాలేజీలకు చేరువ చేయడానికి ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్... క్లబ్కు సహకారం అందిస్తోంది. ఇప్పటి వరకు అరవైకి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీరితో పాటు ఆటో, ట్యాక్సీ, బస్, లారీ డ్రైవర్లకూ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ‘రోడ్డు ఎవరి ప్రాపర్టీ కాదు. అందరిదీ. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వారు వాడతారు. నిబంధనల ఉల్లంఘనకూ పాల్పడతారు. అలా కాకుండా సూచించిన సిస్టమ్లో వెళితే చాలా ప్రమాదాలు నివారించవచ్చు. ఈ దిశలోనే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం’ అంటారు రోడ్ సేఫ్టీ క్లబ్ ఫౌండర్, మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. మార్పు సాధ్యమేనా! ‘1983లో 40 లక్షల మంది లెప్రసీ రోగులుండేవారు. ఆ వ్యాధిని అదుపు చెయ్యటం అప్పుడు కష్టం. కానీ... భారత్ను ఇప్పుడు పోలియో రహిత దేశంగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ఈ మార్పు కేవలం అవగాహనతో వచ్చిందే. తమ తప్పు లేకుండా ప్రమాదానికి గురైనవారు లెక్కకు మించే ఉన్నారు. రోడ్డుపై కాలు పెట్టిన మరుక్షణం నుంచి అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండక తప్పదు. రోడ్డు ప్రమాదాలు ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశమంతటా ఇదే పరిస్థితి. విషయం ఇంత తీవ్రమైనదైనప్పుడు దాని గురించి అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేయడం అత్యంత ముఖ్యమైనదని భావించాం’ అన్నారు క్లబ్ ఆర్గనైజర్, ఐడీఎఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సంజయ్రామ్. వాకథాన్... రోడ్డు ప్రమాదం జరిగిన చాలా సేపటికి గానీ బాధితులు ఆసుపత్రికి చేరడం లేదు. సరైన సమయానికి తేగలిగితే వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. డాక్టర్గా ఇలాంటి సంఘటనలు చాలా చూశాను. ఈ దిశగా కూడా అవేర్నెస్ తెచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని స్థాయిల్లో రోడ్డు నిబంధనలు పకడ్బందీగా పాటించేలా చేయగలిగితే ఎన్నో ప్రమాదాలు అరికట్టవచ్చు. ఈ నెల 11న నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద రహదారి భద్రతా వారోత్సవంలో భాగంగా వాకథాన్ నిర్వహిస్తున్నాం. గతేడాది జరిగిన వాకథాన్కు ఖర్చు మేమే భరించాం. ఈ ప్రజోపయోగ కార్యక్రమానికి కార్పొరేట్ సంస్థలు కూడా సహకరిస్తే సేవలు మరింత విస్తరిస్తాం’ అని క్లబ్ కోఆర్గనైజర్, పిడియాట్రిస్ట్ డాక్టర్ గీతాంజలి చెబుతున్నారు. అందరికీ అవగాహన... చిన్నప్పటి నుంచే రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్నది క్లబ్ ఉద్దేశం. అందులో భాగంగా ఐదు నుంచి పదో తరగతి పిల్లలకు క్లబ్ సభ్యులు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో స్కూల్లో కొంత మంది పిల్లలను ఎంపిక చేసి వారి ద్వారా అక్కడ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసేలా చూస్తున్నారు. పోస్టర్లు, స్లోగన్స్, ఎస్సే రైటింగ్ వంటివి పెడుతున్నారు.అలాగే కార్పొరేట్ సంస్థలకు కూడా కార్యక్రమాలు విస్తరించారు. వారి కోసం వీడియో ప్రజంటేషన్, ఇంటరాక్షన్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. చదువుకోని హెవీ వెహికిల్ డ్రైవర్లకు వారానికి రెండుసార్లు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏడాదికోసారి సేఫ్టీ వీక్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్కూల్ బస్ డ్రైవర్లకూ అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని పాఠశాలల నుంచి చాలా మంది పిల్లలు ఆసక్తిగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు క్లబ్ సభ్యులు చెబుతున్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్స్ పాటించడం, రోడ్ క్రాసింగ్, ఓవర్లోడ్ వంటివి ప్లకార్డులతో ప్రచారం చేస్తున్నారు. మెదక్ ఘటన సమయంలో... ‘మెదక్లో స్కూల్ బస్ ప్రమాదం వార్త తెలియగానే సంఘటనా స్థలికి చేరుకున్నాం. ఆ ప్రాంతంలో స్కూల్ బస్ డ్రైవర్స్ కోసం రోడ్ సేఫ్టీ గురించి నాలుగు సెషన్స్ నిర్వహించాం. ఆ తర్వాత ఆ జిల్లాలోని అన్ని స్కూల్స్లోనూ అవగాహన కల్పించాం. కార్యక్రమాలను మరింత విస్తరించడానికి కొందరికి శిక్షణ ఇచ్చి ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నాం’ అంటారు శ్రీనివాస్. క్లబ్ వివరాలకు http://www.meetup.com/ROADSAFETYCLUB/లింక్ క్లిక్ చేయవచ్చు. -
ఫిబ్రవరిలో మోటారు వాహనాల సవరణ బిల్లు!
న్యూఢిల్లీ: రహదారి భద్రతలో ప్రపంచస్థాయి ప్రమాణాలను తీసుకొచ్చేలా మోటారు వాహనాల చట్టానికి సవరణపై కేబినెట్ నోట్ను ఇప్పటికే పంపామని, ఫిబ్రవరిలో కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ మంగళవారం ఢిల్లీలో తెలిపారు. సవరణ ప్రతిపాదనపై ప్రధాని మోదీ పలు సూచనలు చేశారన్నారు. బిల్లులో వీటినీ పొందుపరిచి చేరుస్తామని ... కేబినెట్ ఆమోదం తర్వాత తదుపరి పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామన్నారు. కాగా, రామసేతును ధ్వంసం చేయకుండానే సేతుసముద్రం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ మార్గంపై అధ్యయనం చేసి అఫిడవిట్ రూపొందించామని, ప్రధాని ఆమోదించాక దాన్ని సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని గడ్కారీ తెలిపారు. పండ్లు, కూరగాయలను రైతులు స్వేచ్ఛగా విక్రయించుకునేలా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టం పరిధి నుంచి వాటిని తప్పించడంపై రాష్ట్రాలను సంప్రదిస్తామని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మంగళవారం తిరువనంతపురంలో తెలిపారు. మరోవైపు జీఎస్టీ అమలుపై రాష్ట్రాలకు ఏడాది సమయాన్ని అదనంగా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. -
నేడు ఆటోల బంద్
రోడ్ సేఫ్టీ బిల్లు-2014పై నిరసన జేఏసీ నాయకుల స్పష్టీకరణ సుల్తాన్బజార్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్ సేఫ్టీ బిల్లు-2014కు నిరసన గా శుక్రవారం ఆటోల బంద్కు ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు బి.వెంకటేశం(ఏఐటీయూసీ), కిరణ్ (ఐఎఫ్టీయూ), వేముల మారయ్య (టీఆర్ఎస్కేవీ), అమానుల్లాఖాన్ (టీఏడీజేఏసీ)లు ఈ వివరాలు తెలిపారు. రోడ్ సేఫ్టీ బిల్లు-2014 మోటార్ రంగంలో ఉన్న కార్మికులకు శాపంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూవారీగా ఆటోలు నడిపేవారి బతుకు భారమై పోతుందన్నారు. 8వ తరగతి చదువుకున్న వారే ఆటోలు నడపాలనే నిబంధన, ఈ-చలాన్లతో పాటు జీవో 108 మేరకు చలాన్ ఒక్కసారి రూ.100 నుంచి రూ.వెయ్యికి పెంచడం వంటివి ఆటో డ్రైవర్లకు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. చలానా కనీస మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ నరహంతక చట్టాన్ని తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి, రాష్ట్ర రవాణా శాఖ అధికారుల ఆంక్షలు, దాడులకు నిరసనగా శుక్రవారం ఒక్క రోజు ఆటో బంద్ పాటి ంచనున్నట్టు వారు తెలిపారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు జరిగే భారీ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని ఆటోడ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ బంద్లో స్కూల్ వ్యాన్ డ్రైవర్లు కూడా పాల్గొంటారని వారు తెలిపారు. -
‘మేము సైతం..’ ట్రాఫిక్పై హిజ్రాల అవగాహన
కొరుక్కుపేట: నిత్యం రోడ్లపై మరణమృదంగ ధ్వనులు వినిపిస్తున్నాయి. విపరీతమైన రద్దీ, నిబంధనలు పాటించని వాహనచోదకులు, ఎవరికి వారు తొందరగా వెళ్లాలనే తొందర ఇవన్నీ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆచరణలో అది కనిపించడం లేదు. రెండు, మూడు నెలలుగా ఎన్జీవోలు, విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీరి బాటలోనే మేము సైతం అంటూ నగరానికి చెందిన కొందరు హిజ్రాలు గళం విప్పారు. అన్నానగర్ చర్చి వద్ద సోమవారం వారు జాగ్రత్తలు పాటించండి.. ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు.. తొందరపాటు పనికిరాదంటూ హితవు పలికారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్లకార్డులు ప్రదర్శించారు. కరపత్రాలు పంచారు. -
రోడ్డుపై బీకేర్ ఫుల్!
దేశంలో రోజూ రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. రోడ్డు భద్రతపై అవగాహనా రాహిత్యమే దీనికి ప్రధాన కారణని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. స్టార్ల ప్రచారం రెండు ప్రముఖ కంపెనీలు గురువారం నగరంలో చేపట్టిన రోడ్డు భద్రత ప్రచార కార్యక్రమంలో బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రభృతులు పాల్గొన్నారు. రోడ్లను సురక్షిత మార్గాలుగా మార్చడం, నివారించదగ్గ ప్రమాదాల సంఖ్యను బాగా తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశాలు. ఇందులో భాగంగా పౌరులను ప్రోత్సహించడం, ముఖ్యంగా యువతపై దృష్టి సారించి వాహనాలను నడిపే సమయంలో వారిని బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చూడడం... లాంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అవగాహన లేమితో... ఈ సందర్భంగా కరిష్మా కపూర్ మాట్లాడుతూ దేశంలో రోడ్డు భద్రత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. సరైన జాగ్రత్తలు పాటించకపోవడం, రోడ్డు భద్రతపై అవగాహన లేకపోవడంతో ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఎన్నో వేల ప్రాణాలను కాపాడగలిగిన వారమవుతామని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఆహూతులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయబోమంటూ ప్రమాణం చేశారు. -
అప్పుడు గానీ రోడ్ సేఫ్టీ సాధ్యపడదు!
-
ప్రమాదాల నివారణకు ప్రణాళిక
గుర్గావ్: నానాటికి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గుర్గావ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నగరంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డు ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు రోడ్డు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హుడా సిటీ సెంటర్ నుంచి సుభాష్ చౌక్ వరకు ప్రయోగాత్మక ఆడిట్ నిర్విహ ంచారు. ఈఎంబీఏఆర్క్యూ ఇండియా అనే సంస్థ భాగస్వామ్యంతో నగర పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీస్ కమిషనర్ అలోక్నాథ్ దీన్ని ప్రారంభించారు. పోలీసు అధికారులు, ఈఎంబీఏఆర్క్యూ ప్రతినిధులు కలిసి అత్యంత ప్రమాదకరమైన జోన్లను గుర్తించే ందుకు సుమారు 5.5 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్లో సర్వే ప్రారంభించారు. ఈ సర్వేలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడమేకాకుండా అక్కడే ఎందుకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయాన్ని విశ్లేషించారు. ఈ ఆడిట్లో భాగంగా మొత్తం రోజంతా ఆ కారిడార్లో ప్రయాణించిన వాహనాల రద్దీ, వాటి వేగం తదితర విషయాలను కూడా గమనించారు. కాగా, ఈ కారిడార్లో సరాసరి 50 కి.మీ.వేగంతో వాహనాలు నడపాల్సి ఉండగా, వాహనదారులు అంతకంటే ఎక్కువ వేగంతో వాహనాలను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కారిడార్లో అనేక క్రాసింగ్లు ఉన్నాయని, వీటి సమీపంలో అతి వేగం వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఒక అధికారి విశ్లేషించారు. ఈ కారిడార్లో జంక్షన్ల విస్తీర్ణాన్ని తగ్గిస్తే, వాహనాదారులు అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో వేగం తగ్గించాల్సి ఉంటుందని, దాంతో ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఈఎంబీఏఆర్క్యూ ప్రతినిధులు గుర్తించినట్లు ఆ సంస్థ ప్రతినిధి సారికా పండా తెలిపారు. అలాగే ఆయా జంక్షన్ల వద్ద పాదచారుల సిగ్నల్స్ను ఏర్పాటుచేయడం, వారు నిలబడి ఉండేందుకు తగిన స్థలాన్ని కేటాయించడం వంటి మార్పులు చేస్తే ప్రమాదాలు కొంతమేరకు తగ్గుతాయని ఆ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడినట్లు సారిక తెలిపారు. కాగా, వచ్చే మంగళవారం హుడా అధికారులతో మరోసారి సమావేశమై తాము తయారుచేసిన నివేదికపై చర్చిస్తామని ఆమె వివరించారు. ఇదిలా ఉండగా, ప్రయోగాత్మకంగా నిర్వహిం చిన ఆడిట్ విజయవంతమైందని, త్వరలోనే మిగి లిన ప్రధాన రోడ్లపై ఆడిట్ నిర్వహిస్తామని కమిషనర్ మిట్టల్ తెలిపారు. ‘గుర్గావ్ రోడ్లపై ప్రమాదాల నివారణకు చాలా మంచి సూచనలు అందాయి. వాటిని అమలు చేయడం కూడా సులభమే.. రోడ్లపక్కన పేవ్మెంట్లు, సైకిల్ ట్రాక్లను ఏర్పాటుచేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా..’మని ఆయన చెప్పారు. కాగా, హుడా సెంటర్ మెట్రో స్టేషన్, ఫోర్టిస్ ఆస్పత్రి, యునిటెక్ సిటీ పార్క్ వద్ద కూడా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ బృందం నివేదిక సమర్పించింది. -
విద్యార్థులకు రోడ్డు భద్రతపై పాఠాలు
గుర్గావ్: రోడ్డు భద్రత గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలనే ప్రయత్నంలో భాగంగా అన్ని కాలేజీల్లోనూ కార్యక్రమాలు నిర్వహిస్తామని గుర్గా వ్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నియమాలను ఉల్లంఘిస్తే ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో కూలంకషంగా వివరించారు. ఇక నుంచి కాలేజీ విద్యార్థులకు కూడా మోటారు వాహనాల చట్టం ప్రాధాన్యం గురించి విశదీకరించనున్నారు. ‘ఏదైనా మార్పు తేవాలని కోరుకుంటే, అందుకోసం ముందుగా యువతను ఎంచుకోవాలి. వాళ్లే మన భవిత. ప్రజలంతా ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని కోరుకుంటే ముం దుగా కాలేజీ విద్యార్థులకు అవగాహన కలిగించాలి. కొత్తగా వాళ్లు బైకులు కొనుక్కోగానే ఎంతో ఎనలేని ఉత్సాహంతో ఉంటారు. కావాలనే నియమాలను ఉల్లంఘిస్తారు. ఈ పరిస్థితిని నిరోధించాలి. రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రతిరోజూ కనీసం 1,400 మంది దొరికిపోతున్నారు. చలానాలు విధిం చడం వల్ల మా లక్ష్యం నెరవేరడం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా రోడ్డు భద్రత నియమాలు పాటిం చాలి. అందుకే ఈ ప్రచారోద్యమాలు నిర్వహిస్తున్నాం’ అని ట్రాఫిక్ విభాగం డిప్యూటీ కమిషనర్ వినోద్ కౌశిక్ వివరించారు.ఇందుకోసం సీనియర్ పోలీసు అధికారులు ముందుగా కాలేజీల ప్రిన్సిపాల్స్తో చర్చించి తేదీ లు, సమయం ఖరారు చేస్తారు. వాళ్ల తరగతులకు ఇబ్బంది లేని సమయంలో ఇన్స్పెక్టర్, ఏసీపీ స్థాయి అధికారులు వచ్చి నిబంధనల ప్రాధాన్యం గురించి వివరిస్తారు. నాటకాలు ప్రదర్శించడంతోపాటు క్విజ్ పోటీలు పెడతారు. వీటికితోడు చిన్న పుస్తకాలు, కరపత్రాలను పంపిణీ చేస్తారు. తమ విభాగానికి సిబ్బంది తక్కువ కాబట్టి వారానికి ఒక కాలేజీని ఎంచుకుంటామని కౌశిక్ వివరించారు. అన్ని వివరాలను ఖరారు చేశాక తేదీలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. -
రోడ్డు భద్రత.. సామాజిక బాధ్యత
ఒంగోలు : రోడ్డు భద్రత ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత అని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ వి.నాగశివుడు అన్నారు. ఆర్టీసీ గ్యారేజీ ఆవరణలో ఆదివారం జరిగిన రీజియన్ స్థాయి ప్రమాదరహిత వారోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రస్తుతం ఎక్కువగా ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే చోటుచేసుకుంటున్నాయన్నారు. రోడ్డు భద్రతపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన లేని కారణంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్లకు సంస్థ సీయూజీ సిమ్ కార్డులను అందజేసింది అత్యవసర సమయంలో సమాచార సేకరణ లేదా సమాచారం తెలియజేసేందుకు మాత్రమేనన్నారు. అందువల్ల వాటిని ప్రయాణంలో తక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. బస్సుల కండీషన్ మెరుగుపరిచేందుకు ఆర్టీసీ ప్రత్యేక దృష్టిపెట్టిందని పేర్కొన్నారు. ఆర్టీసీ సీఎంఈ రవికాంత్ మాట్లాడుతూ సమాజంలో నేడు ఆరోగ్య, ఆర్థిక, ఉద్యోగ భద్రత వంటి వాటిపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిస్తున్నా రోడ్డు భద్రతపై మాత్రం దృష్టి సారించడంలేదన్నారు. ప్రజలను చైతన్యం చేయడం కోసమే ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రమాద రహిత డ్రైవర్లను సన్మానించడం ద్వారా కార్మికుల్లో కూడా నూతనోత్తేజాన్ని ఆర్టీసీ నింపుతోందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, పలు డిపోల మేనేజర్లతో పాటు పలు కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డిపో స్థాయిలో ప్రమాదరహిత డ్రైవర్లుగా వరుస మూడు స్థానాల్లో నిలిచిన వారికి సన్మానంతో పాటు ప్రథమ స్థానం కింద రూ.500, ద్వితీయ రూ.400, తృతీయ రూ.300 నగదు బహుమతిని అందజేశారు. -
రోడ్డు ప్రమాదాలపై షార్ట్ ఫిల్మ్లు
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలపై వాహనదారుల్లో షార్ట్ఫిల్మ్ల ద్వారా అవగాహన కల్పిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ షార్ట్ఫిల్మ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించారు. సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, త్రిబుల్ రైడింగ్ తదితర అంశాలపై డిజిక్విస్ట్ సంస్థ రూపొందించిన షార్ట్ఫిల్మ్లను శుక్రవారం నుంచి తెలంగాణ జిల్లాలోని ఉన్న థియేటర్లలో మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు. ప్రతి థియేటర్ యాజమాన్యం ఈ షార్ట్ ఫిల్మ్లను నెలరోజుల వ్యవధిలో కనీసం ఏడు రోజులు ప్రదర్శించాల్సి ఉంటుంది. -
రోడ్డు ప్రమాదాలకు చెక్..
- బ్లాక్ స్పాట్ల గుర్తింపునకు ఆదేశాలు - ఇప్పటికే సగం స్థలాలకు మరమ్మతులు - ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినచర్యలు సాక్షి, ముంబై: తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న స్థలాలను ‘బ్లాక్ స్పాట్’గా గుర్తించి, వాటిని సరిచేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల ట్రాఫిక్, రవాణా విభాగాల ఉన్నతాధికారులు బ్లాక్ స్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలతో ఢిల్లీకి రావాల్సిందిగా ఇటీవల హైవే రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆదేశించారు. మాజీ మంత్రి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఏడాదిలో మూడు అంతకంటే ఎక్కువ ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాలు వరుసగా జరిగితే ఆ ఘటన స్థలాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తిస్తారు. రాష్ట్రంలో ప్రతి ఏడాదీ 13 వేల మంది రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. అయితే తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న స్థలాలను ఇప్పటివరకూ ప్రభుత్వం సరిచేయకపోవడం గమనార్హం. ప్రమాదాలు జరుగుతున్న 150 స్థలాలను ‘బ్లాక్ స్పాట్స్’గా గుర్తించారు. ఇందులో 131 స్థలాలను నేషనల్ హైవేపైనా, 19 స్థలాలను స్టేట్ హైవేపైనా గుర్తించారు. వీటిలో జాతీయరహదారిపైన గుర్తించిన 63 స్థలాలను, రాష్ట్ర హైవేపైనా గుర్తించినా అన్ని స్థలాలను బాగుచేయించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. హైవే పోలీసు అధికారులు అందజేసిన వివరాల మేరకు.. ముంబై-అహ్మదాబాద్ హైవేపైన ఉన్న ఠాణే జిల్లాలోని కుడే నుంచి సతివాలి సెక్షన్ వరకు ఉన్న మార్గం రాష్ట్రంలోనే చాలా అపాయకరమైందిగా గుర్తించారు. ఈ స్థలంలో 2011-13 మధ్య కాలంలో దాదాపు 14 ప్రాణాంతకమైన ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇక్కడ రోడ్డు ప్రమాదాల సంఖ్యను కొంత మేర తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారి తెలిపారు. బ్లాక్ స్పాట్లను హైవే పోలీస్ విభాగం గుర్తిస్తుండగా, ప్రజా పనుల విభాగం, నేషనల్ హైవే అథారటీ (ఎన్హెచ్ఏఐ) ఈ ఘటనా స్థలాలను సరి చేయనున్నాయని హైవే డిప్యూటీ సూపరింటెండెంట్ బలిరామ్ కదమ్ తెలిపారు. రాష్ట్ర పోలీసులు అందజేసిన గణాంకాల ప్రకారం.. 2011లో 68,438 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన 58,41,782 మందిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా రూ.70.44 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు. 2012లో 66,316 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 53,60,536 మందిపై ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించినందుకు గాను కేసు నమోదు చేసి రూ.68.31 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు. 2013లో 63,019 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 51,97,460 మందిపై ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించిన కేసులు నమోదు చేసి, వారినుంచి రూ.63.62 కోట్లను వసూలు చేశారు. కాగా, 2014లో ఏప్రిల్ వరకు 21,049 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 18,85,498 మందిపై ట్రాఫిక్ నియమ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.23.20 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు.