RTC JAC
-
నేడు గవర్నర్తో ఆర్టీసీ జేఏసీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో మంగళవారం ఉదయం 8 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భేటీ కానుంది. కొద్దిరోజుల క్రితమే సచివాలయం నుంచి బిల్లు రాజ్భవన్కు చేరిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే గవర్నర్ ప్రకటించారు. అసెంబ్లీ ఆమోదం పొంది నెలపైనే గడిచినందున వీలైనంత తొందరలో బిల్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదించి పంపాలని జేఏసీ కోరనుందని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వంలో విలీనం కంటే ముందే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఆర్థిక అంశాలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని కూడా వారు కోరనున్నట్టు తెలిసింది. రెండు వేతన సవరణలుసహా మొత్తం 30 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్కు సమర్పించనున్నారు. -
ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదు
-
సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్య దేశంలో డిపోల్లో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదంటూ అశ్వత్థామ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ తరపున ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల డ్యూటీల విషయంలో సీఎం ఆదేశాలను అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కొన్ని బస్సులను రద్దు చేస్తున్నారని, సమ్మె కాలంలో కొందరు అధికారులు చేసిన నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారుల కోసమే రిటైర్మెంట్ వయసు పెంచారని, ప్రస్తుతం ఏ ఒక్క కార్మికుడు కూడా తృప్తిగా పని చేయడం లేదన్నారు. లేబర్ కమిషన్ చెప్పినా మా సంఘాలు వద్దని చెబుతున్నారని, ఆర్టీసీలో యూనియన్లను గుర్తించాలని కోరారు. ఎన్నికలు జరిగేవరకు ప్రస్తుత గుర్తింపు సంఘాలను గుర్తించాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు -
రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దు
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం... కార్మికులంతా సంఘటితంగా ఉద్యమించి డిమాండ్ల సాధనకు దీక్షగా సమ్మెలో పాల్గొన్నారు. విధుల్లో చేరండంటూ ముఖ్యమంత్రి మూడు సార్లు పిలిచినా స్పందించకుండా కార్మిక సంఘ నేతల సూచనలకే పెద్ద పీట వేశారు. ఇప్పుడు తీరు మారిపోయింది. రెండేళ్ల వరకు తమ కార్మిక సంఘాలకు ఎన్నికలే వద్దంటూ ఇప్పుడు ఆ కార్మికుల సంతకాలతోనే మూకుమ్మడి లేఖలు లేబర్ కమిషనర్కు అందుతున్నాయి . గత ఆదివారం సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో ప్రగతిభవన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో, రెండేళ్ల వరకు యూనియన్లే అవసరం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిపోల వారీగా ఓ నిర్దేశిత పత్రం సిద్ధం చేసి దానిపై కార్మికుల సంతకాలు తీసుకుని లేబర్ కమిషనర్ కార్యాలయానికి పంపుతున్నారు. దీనిపై మళ్లీ కార్మిక సంఘాల జేఏసీ స్పందించింది. ఇది వేధించటమేనని పేర్కొంటూ నిరసనగా శుక్రవారం డిపోల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది. ‘వెల్ఫేర్ కౌన్సిళ్లపై నమ్మకం ఉన్నందునే...’ డిపో స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం వెల్ఫేర్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని ఆత్మీయ సమ్మేళనంలో సీఎం సూచించారు. ప్రతి డిపో నుంచి ఇద్దరు చొప్పున ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, ఆ కమిటీలే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయన్నారు. రెండేళ్ల వరకు ఇక కార్మిక సంఘాలతో పని ఉండదని, అప్పటి వరకు గుర్తింపు సంఘం ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన పనిలేదని ఆయన వివరించారు. రెండేళ్ల తర్వాత యూనియన్లు అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైతే అప్పుడు చూద్దామని ముక్తాయించారు. దీనికి అనుగుణంగా అధికారులు చర్య లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి లేఖల కార్యక్రమం మొదలైంది. కార్మికుల సమస్యను తక్షణం పరిష్కరించేందుకు ‘వెల్ఫేర్ కౌన్సిళ్లు’కృషి చేస్తాయన్న నమ్మకం తమకు ఉందని, రెండేళ్ల వరకు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు అవసరం లేదని ఏ డిపోకు ఆ డిపోగా ఓ నమూనా సిద్ధం చేసి కార్మికులందరితో సంతకాలు తీసుకుంటున్నారు. జేఏసీ నేతలు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కార్మికులకు ఇష్టం లేకపోయినా, అధికారులు బలవంతంగా వారితో సంతకాలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరోసారి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో మంగళవారం ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై ఈ సమీక్షా సమావేశంలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికను గురువారం జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీకి సంబంధించిన తాజా పరిణామాలను సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి: ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం? అత్యంత సుదీర్ఘంగా 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం అవునన్నా.. కాదన్నా మంగళవారం నుంచి కార్మికులు విధులకు హాజరుకావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే, కార్మికులు సమ్మె విరమించినా.. విధుల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే..మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేఏసీ చెప్పడాన్ని ప్రకటనలో తప్పుబట్టారు. ఈ క్రమంలో మంగళవారం విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు పెద్దసంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఆర్టీసీ కార్మికుల పోరాటం.. తీరని విషాదం
సాక్షి, నిజామాబాద్/ సంగారెడ్డి : అత్యంత సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించినప్పటికీ ప్రభుత్వం విధుల్లోకి చేర్చుకునేందుకు నిరాకరించడంతో తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సమస్యలు పరిష్కరించాలని సమ్మెలోకి వెళ్లినందుకు ఇప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు తమను విధుల్లోకి చేర్చుకోవాలని వేడుకుంటున్నారు. ఉద్యోగం కోసం కంటతడి పెడుతూ.. కార్మికులు పలుచోట్ల ప్రభుత్వాన్ని, అధికారులను ప్రాధేయపడుతున్నారు. డిపోల మందు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న రాజేందర్ (55) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమ్మె విరమించినా ప్రభుత్వం తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో రాజేందర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని, గుండెపోటుతో రాజేందర్ మృతి చెందారని కార్మికులు తెలిపారు. రాజేందర్ది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పాడ్ గ్రామం. నురగలు కక్కుతూ పడిపోయిన ఆర్టీసీ కార్మికుడు సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్లోనూ విషాద ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న భీమ్లా మంగళవారం ఉదయం తిరిగి విధుల్లోకి చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చాడు. అయితే, అతన్ని విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులు భీమ్లాను అరెస్టు చేసి.. ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్కు తరలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భీమ్లా నురగలు కక్కుతూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో ఆయనను తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో భీమ్లాకు గుండెపోటు వచ్చిందని తోటి కార్మికులు తెలిపారు. మేనేజర్ కాళ్ళు మొక్కిన కార్మికులు విధుల్లో చేరేందుకు నిజామాబాద్ డిపో 1కు ఆర్టీసీ కార్మికులు మంగళవారం భారీగా తరలివచ్చారు. తమను విధుల్లో చేర్చుకోవాలని డిపో మేనేజర్కు వినతిపత్రం ఇచ్చారు. అయితే, వారిని విధుల్లోకి చేర్చుకోలేమని డిపో మేనేజర్ తేల్చి చెప్పారు. దీంతో ఆందోళన చెందిన కార్మికులు మేనేజర్ కాళ్ళు మొక్కి డ్యూటీలో చేర్చుకోవాలని వేడుకున్నారు. -
ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే
సాక్షి, హైదరాబాద్: కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకుంటారా? లేక ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తికరంగా మరాంది. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రతిపాదించింది. దీంతో విధుల్లో చేరతామంటూ గురువారం రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా డిపోల వద్ద ఇదే పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని మేనేజర్లు వారికి చెప్పి పంపించేస్తున్నారు. మరోవైపు ఆర్టీసిని నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలని, అంత శక్తి ప్రభుత్వ వద్ద లేదని సీఎం చేసిన వ్యాఖ్యలు కార్మికుల్లో కలవరం రేపుతున్నాయి. దీంతో వారి ఆశలన్నీ సీఎం తీసుకునే నిర్ణయంపైనే ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తూ ఆర్టీసీ రూట్లను కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ కొనసాగనుంది. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా సమ్మె విరమణ ప్రతిపాదనపై చర్చించి తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సమ్మెకు సంబంధించిన అంశం కార్మిక న్యాయస్థానంలోనే తేల్చాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, అది తేలిన తర్వాతే వారిని విధుల్లోకి చేర్చుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె విరమణ పేరిట మోసం..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విరమణ విషయంలో కార్మిక సంఘాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే.. సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ బుధవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జేఏసీ ప్రకటనపై టీజేఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా.. జేఏసీ-1 సమ్మె విరమించేది లేదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. సమ్మెలో ఇప్పటివరకు 29మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని ఆయన తెలిపారు. మరణించిన కుటుంబాలను ఎవరూ ఆదుకోలేదని తెలిపారు. దీనికితోడు సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చెప్పడం.. కార్మికులను మోసం చేయడమేనని హనుమంతు మండిపడ్డారు. ఇలా విరమించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే సమ్మె విరమిస్తే సరిపోయేదని, కార్మికులను బలి పశువులను చేస్తూ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసిందని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ కేవలం మూడు కార్మిక సంఘాలను కలుపుకొని మాత్రమే ముందుకు వెళ్తోందన్నారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు పేరుకుపోయాయని పేర్కన్నారు. ఆర్టీసీ కార్మికులు చాలావరకు పేద వాళ్ళు అని, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ తమను పిలిచి కార్మికుల సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుతున్నామని అన్నారు. -
సాయంత్రం ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ఆర్టీసీపై సమీక్ష జరపనున్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదన, హైకోర్టులో కేసు, ఇతర అంశాలపై ఆయన చర్చించనున్నారు. కాగా ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పలు అంశాలపై అక్టోబర్ 4న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కాగా న్యాయస్థానంలో కూడా కార్మికులకు ఊరట లభించలేదు. దీంతో విలీన ప్రతిపాదనను పది రోజుల క్రితమే ఆర్టీసీ జేఏసీ పక్కన పెట్టింది. తాజాగా ఎలాంటి షరతులు లేకుండా తమ సూచనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధమని, లేనిపక్షంలో సమ్మె కొనసాగిస్తామని జేఏసీ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో పలుచోట్ల కార్మికుల్లో అయోమయం నెలకొంది. సమ్మె విరమణపై కార్మికులు తర్జనభర్జన పడుతున్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె విరమణ..! సమ్మెపై సాయంత్రానికి స్పష్టత తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ... ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలనే అంశంపై చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు ఉండాలి, భవిష్యత్లో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చించి, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనున్నారు. ఇక సమ్మె విరమిస్తే విధుల్లోకి చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఆదేశాల కోసం కార్మికులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వ స్పందన?!
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆర్టీసీ కార్మికులు 47 రోజులపాటు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. గత అక్టోబర్ 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మెలో దాదాపు 50వేలమంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం విధుల్లో చేరాలని రెండుసార్లు గడువు విధించినప్పటికీ.. కార్మికులు పెద్దగా చలించలేదు. కొంతమంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువశాతం దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారు నెలన్నరకుపైగా తమకు వచ్చే జీతాలను సైతం పణంగా పెట్టి సమ్మె చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం ముందుకు, సమాజం ముందుకు తీసుకురాగలిగారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాల ఖర్చులు ఇలా అనేక సమస్యలు వెంటాడినా కార్మికులు మూకుమ్మడిగా నిలబడి ఉద్యమం చేశారు. ఈ సమ్మెకాలంలో పలువురు కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయి.. ఆత్యహత్యలు చేసుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులు తమ సమ్మెను విరమణకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, మళ్లీ సమ్మెకు పూర్వం ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం కల్పించాలని, విధుల్లోకి చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. సుదీర్ఘ సమ్మె నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమించి.. తిరిగి విధుల్లోకి చేరేందుకు సమ్మతించిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్టీసీ సమ్మె విషయంలో ఒకింత చురుగ్గా వ్యవహరించారు. పలుమార్లు సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను అంగీకరించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వెంటనే విధుల్లోకి చేరాలని సీఎం కేసీఆర్ గతంలో రెండుసార్లు కార్మికులకు డెడ్లైన్ విధించారు. ఆ డెడ్లైన్లకు పెద్దగా కార్మికుల నుంచి స్పందన రాలేదు. కానీ, హైకోర్టు ఉత్తర్వులు, మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమణకు ఒప్పుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందని ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం కోరినట్టు బేషరతుగా విధుల్లోకి చేరేందుకు కార్మికులు ముందుకొచ్చారు. అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను సైతం కార్మికులు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో నెట్టింది. ప్రజలు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా దసరా పండుగ సమయంలో సమ్మె చేపట్టడం.. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవ్వడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. అయితే, 50వేలమంది కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు వారికి విధుల్లో చేరేందుకు గడువు ఇచ్చింది. తాజాగా కూడా ప్రభుత్వం కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కార్మికులను బేషరతుగా ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంటుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. -
ఆర్టీసీ సమ్మె విరమణ..!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. 47 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. బేషరతుగా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. విధుల్లో చేరిన కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, సమ్మెకు ముందున్న పరిస్థితులను సంస్థలో మళ్లీ కల్పించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు లేకుంటేనే కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరుతారని, కార్మికులు విధుల్లో చేరితే డ్యూటీ చార్జ్ల మీద మాత్రమే సంతకాలు పెడతారని ఆయన తెలిపారు. సమ్మె కొనసాగింపుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్నటినుంచి తీవ్ర తర్జనభర్జనలకు లోనైన సంగతి తెలిసిందే. సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్ కోర్టుకు నివేదించడంతో.. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ బుధవారం కూడా సమావేశమైంది. సమ్మె విషయమై లేబర్ కమిషన్కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సమావేశంలో నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు కొనసాగింపు కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. గత 47 రోజులుగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సమ్మె కొనసాగించడం సమంజసం కాదని, ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడటంతో సమ్మె విరమణకే జేఏసీ మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అయితే, ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికులు సమ్మె విరమణకు ఓకే చెప్పడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధం!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై విషయంలో కార్మిక సంఘాల జేఏసీ సందిగ్ధంలో పడింది. కేసు కార్మిక న్యాయస్థానానికి చేరడం, డిమాండ్లకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగింపు విషయంలో కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం జేఏసీ ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయింది. హైకోర్టు నుంచి అందిన తుది ఉత్తర్వు ప్రతిని పూర్తిగా పరిశీలించి బుధవారం న్యాయవాదులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అప్పటివరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. విడివిడిగా సమావేశాలు... ఒకటిగా సమాలోచనలు.. సమ్మెకు సంబంధించి హైకోర్టులో వాదనలు దాదాపు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం కార్మికుల్లో కలకలం మొదలైంది. ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు వస్తాయన్న ఆశతో ఉన్న కార్మికులు... తాజా పరిణామాలతో కొంత ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం మాత్రం సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నందున, ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని సమ్మె విషయాన్ని తేలిస్తే బాగుంటుందంటూ జేఏసీ నేతలపై ఒత్తిడి వచ్చింది. దీంతో జేఏసీలోని కార్మిక సంఘాలు విడివిడిగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. డిపోలవారీగా కమిటీ ప్రతినిధులను ఆహ్వానించి అభిప్రాయ సేకరణ జరిపాయి. టీఎంయూ, ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కార్మికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమ్మె విషయంపై చర్చిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు కొందరు అలా.. మరికొందరు ఇలా 46 రోజులపాటు ఉధృతంగా సమ్మె కొనసాగించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం, ఇప్పటికే రెండు నెలలపాటు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన నేపథ్యంలో సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని పెద్ద సంఖ్యలో కార్మికులు అభిప్రాయపడ్డారు. అయితే ఇన్ని రోజులు సమ్మె చేసి ఒక్క డిమాండ్కు కూడా ప్రభుత్వం అంగీకరించకపోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని, తాడోపేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. సమ్మెను కొనసాగిస్తే ఉద్యోగ భద్రత కరువైందన్న ఆందోళనతో మరికొందరు మరణించే ప్రమాదం ఉన్నందున ఈ విషయాన్ని కూడా పరిగణించాలని కొందరు సూచించారు. సూపర్వైజర్ల సంఘం భేటీలో మాత్రం ఎక్కువ మంది సమ్మెను విరమించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా భిన్న వాదనలు వినిపించడంతో కార్మిక సంఘాలు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయాయి. అనంతరం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత జేఏసీ భేటీ అయింది. అప్పటివరకు సంఘాలుగా కార్మికుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ఇందులో చర్చించారు. జేఏసీలో కూడా మళ్లీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం మొండిపట్టుతో ఉన్నందున కార్మికులు కూడా సమ్మెను కొనసాగించాలంటూ ఓ సంఘానికి చెందిన నేతలు పేర్కొన్నారు. సమ్మె విరమించాక ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకుంటే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. సమ్మె విరమించి వస్తే విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టత కోరి దానిపై నిర్ణయం తీసుకుంటే మంచిదంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం మధ్యవర్తిత్వం నెరపడం సరికాదని మరొకరు పేర్కొన్నారు. వెరసి మరికొంత సమ యం తీసుకొని తుది నిర్ణయానికి రావాలని తీర్మానించారు. ఇందుకు న్యాయవాదులతో కూడా చర్చించాలని నిర్ణయించారు. కోర్టు పేర్కొన్న విషయాలపైనా కూలంకషంగా చర్చించాలని, ఇం దుకు న్యాయవాదులతో మాట్లాడాలని నిర్ణయించి తుది నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేశారు. జేఏసీ నిర్ణయానికి కార్మికులు కట్టుబడతామన్నారు: అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ జేఏసీ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిపోలకు సంబంధించిన కమిటీల ప్రతినిధులు తేల్చిచెప్పారని సమావేశానంతరం అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం న్యాయవాదులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇప్పటివరకు మరణించిన కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్నారు. మరోవైపు బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన జేఏసీ–1, ఎన్ఎంయూ నేతలు తుది నిర్ణయం వెల్లడించనున్నారు. ఆ సంఘాలకు సంబంధించిన కార్మికుల్లో ఎక్కువ మంది సమ్మె కొనసాగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. -
ముగిసిన ఆర్టీసీ జేఏసీ భేటీ.. కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సమ్మె కొనసాగించాలా? వద్దా? అని దానిపై ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం ముగిసింది. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికుల హామీ ఇచ్చారని వివరించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదని, కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రేపు హైకోర్టు తుది తీర్పు ప్రకటించిన తరువాత సమ్మెపై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని, కోర్టు తీర్పు తరవాత రెండు రోజుల్లో ఆర్టీసీ జేఏసీ నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. జేఏసీ తుది నిర్ణయం తీసుకునేవరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు. ఎల్బీనగర్ హిమగిరి ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. కార్మికుల సమ్మె అంశంతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించిన అనంతరం కార్మిక సంఘాల నేతలు కీలక నిర్ణయం వెలువరించే అవకాశముంది. అంతకుముందు కార్మిక సంఘాల నేతలు విడివిడిగా సమావేశమై.. తెలంగాణవ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను డిపోలవారీగా సేకరించారు. ఎల్బీనగర్లోని హిమాగిరి ఫంక్షన్ హాల్లో టీఎంయూ నేతలు, కేకే గార్డెన్లోని ఈయూ నేతలు, సీఐటీయూ కార్యాలయంలో ఎస్టీఎఫ్ నేతలు, టీజేఎంయూ కార్యాలయంలో ఆ సంఘం నేతలు సమావేశమై చర్చించారు. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఉద్యోగ భద్రతపై గ్యారెంటీ ఏది? 46 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం వాదన ఏమిటి, కార్మికుల తరఫున ఏ వాదన వినిపించారు, కోర్టులు ఏం చెప్పాయి అన్నది చర్చించారు. అయితే, సమ్మె విరమణ విషయంలో కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, ఇంకా సమ్మె కొనసాగిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని, లేబర్ కోర్టులో ఈ అంశం తేలడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది ఎన్ని రోజులైనా ప్రభుత్వం దిగొచ్చేవరకు సమ్మె కొనసాగించాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఏమిటని కార్మికులు నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. సమ్మెను విరమిస్తే ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కనీసం లేబర్ కోర్టులో తేలేవరకైనా సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఈయూ సమావేశంలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. బ్యాలెట్ పెట్టి కార్మికుల అభిప్రాయం తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ పొందిన తర్వాత సమ్మె విరమించాలని పలువురు కార్మికులు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. లేబర్ కమీషన్కు హైకోర్టు ఇచ్చిన 15 రోజుల సమయం వరకు వేచిచూద్దామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని కార్మికుల్లో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సమ్మెపై తర్జనభర్జన ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర తర్జనభర్జనలకు లోనవుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించడం.. సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు నివేదించడంతో ఇరకాటంలో పడిన కార్మిక సంఘాల నేతలు.. సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 46రోజులుగా కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమించే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమై.. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింపుపై తుది ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో చోటుచేసుకున్న 24 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలపైనా కార్మిక నేతల మధ్య చర్చ జరిగింది. కార్మికులు సమ్మె విరమించి.. బేషరతుగా విధుల్లోకి చేరేందుకు ముందుకొస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కార్మికులు విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం రెండు గడువు విధించింది. ఈ డెడ్లైన్లకు అప్పట్లో పెద్దగా స్పందన రాని విషయం తెలిసిందే. -
హైకోర్టు తీర్పుకాపీ అందేవరకూ ఆందోళనలు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే.. అవి దొందూ దొందే అన్న చందంగా మారాయనే విషయం స్పష్టమవుతోందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ నాయకుడు లింగమూర్తి మూడు రోజులుగా రాంనగర్లో చేస్తున్న నిరాహార దీక్షను సోమవారం రాత్రి అఖిలపక్షం నేతలు ప్రొఫెసర్ కోదండరాం, చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, వినోద్రెడ్డి, మందకృష్ణ మాదిగ, కె.గోవర్ధన్, కె.రమ తదితరులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేదన్నారు. గత 45 రోజులుగా ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి కోర్టు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికీ సమ్మెను చట్ట వ్యతిరేకంగా గుర్తించడానికి కోర్టు అంగీకరించలేదని, కార్మికులను బిడ్డలుగా చూడాలి తప్ప అణచివేసే ధోరణి మంచిదికాదని మొదటి నుంచీ చెబుతోందని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ చూసేవరకు ఆందోళనలు ఆపకుండా యథావిధిగా కొనసాగుతాయని, నేడు తలపెట్టిన సడక్ బంద్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో ప్రధాన డిమాండ్లు సాధ్యమవుతున్నప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో సాధ్యం కాకపోవడానికి కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలనే స్వార్థ బుద్ధే అసలు కారణమనే విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోందన్నారు. హైకోర్టు సాక్షిగా దాఖలు చేసిన పిటిషన్, కేసీఆర్ మాటలు ఒకేరకంగా ఉన్నాయన్నారు. కార్మికుల సమ్మె పట్ల కేసీఆర్ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల 45 రోజుల సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకట్, సుధాభాస్కర్, డి.జి. నర్సింగ్రావు, న్యూడెమోక్రసీ నాయకులు హన్మేష్, ఎస్.ఎల్. పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె.. లేబర్ కోర్టే తేలుస్తుంది
సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తేల్చే అధికారం కన్సిలియేషన్ అధికారి అయిన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్కు లేదు. సమ్మె చర్చలు విఫలమైనట్లుగా ప్రభుత్వానికి తెలియజేసే అధికారం మాత్రమే కన్సిలియేషన్ అధికారికి ఉంటుంది. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చాల్సిన అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. సమ్మె చట్ట విరుద్ధమంటూ అక్టోబర్ 5న కన్సిలియేషన్ అధికారి ఇచ్చిన నివేదికకు అనుగుణంగా కార్మిక శాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకం. ఈ విషయాన్ని తేల్చే అధికారం పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. మేం జారీ చేస్తున్న ఈ ఉత్తర్వుల ప్రతి అందిన రెండు వారాల్లోగా సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుని లేబర్ కోర్టుకు నివేదించాలి. ఒకవేళ ఏ నిర్ణయాన్ని తీసుకోనట్లయితే అందుకు కారణా లను వివరిస్తూ ఆర్టీసీ సమ్మె కేసులోని వాదప్రతివాదులందరికీ కూడా తెలియజేయాలి. ఈ దశలోనూ కన్సిలియేషన్ అధికారి తీసుకున్న నిర్ణయానికి ఎవరూ ప్రభావితం కారాదు. దానిని పూర్తిగా విస్మరించాలి. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చడం మా పరిధిలో లేదు’అని హైకోర్టు స్పష్టంచేసింది. తాము పనిచేసే చోట మెరుగైన పరిస్థితులు కోసమే కార్మికులు సమ్మెలోకి వెళతారని, సమ్మెలోకి వెళ్లడమంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవడమని భావించడం తప్పు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేసింది. ఆర్టీసీ యాజమాన్యం/ప్రభుత్వం అలాంటి ముగింపునకు రావడం న్యాయసమ్మతం కాదని గుర్తుంచుకోవాలని సూచించింది. ‘ఇది ఆర్టీసీ యాజమాన్యానికో లేదా కార్మికులకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. ఉద్యోగం నుంచి తొలగిస్తే 48 వేల మంది కాకుండా లక్షల్లో ఉండే వారి కుటుంబ» సభ్యులను రోడ్డున పడేసినట్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితులు వస్తే ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. లక్షలాది మంది కుటుంబ సభ్యులను అనాథలుగా చేయడం న్యాయమా అనే కోణంలో ప్రభుత్వం/ఆర్టీసీ సంస్థ ఆలోచించుకోవాలి. నిరుద్యోగం రాజ్యమేలుతున్న తరుణంలో ఉద్యోగ అర్హత వయసు మీరిన వాళ్లకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి. అందుకే ఈ విషయాన్ని ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసీ యాజమాన్యానికి వదిలేస్తున్నాం. వారు ఆదర్శనీయంగా వ్యవహరించాలి. విశాల హృదయంతో చర్యలు ఉండాలి. మానవీయతతో స్పందించాలి. అపరిష్కృతంగా ఉన్న సమ్మె వ్యవహారాన్ని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని పేర్కొంటూ ఆర్టీసీ సమ్మెపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలని, సిబ్బంది డిమాండ్ల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు సోమవారం ముగిశాయి. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. సమ్మె చేస్తున్నవారికి జైలుశిక్ష వేయొచ్చు: ఏఏజీ విచారణ సందర్భంగా తొలుత ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదిస్తూ.. సమ్మె చట్ట వ్యతిరేకమని, ఈ మేరకు కన్సిలియేషన్ అధికారి కూడా ప్రకటించారని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సమ్మె చట్టవ్యతిరేకమని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించాల్సిన అవసరం కూడా లేదని, చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్న వారికి నెలరోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి వరకు జరిమానా విధించేందుకు చట్టంలో వీలుందని పేర్కొన్నారు. అదే చట్టంలోని 22 (1) సెక్షన్లోని ఎ, బి, సి, డి ప్రకారం సమ్మెలోకి వెళ్లినవారిపై చర్యలు తీసుకునే వీలుందని చెప్పారు. ఇక ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల వ్యవహారాన్ని లేబర్ కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన సిండికేట్ బ్యాంక్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించగా.. ధర్మాసనం కల్పించుకుని ఆ తీర్పు ఇక్కడి కేసులో వర్తించదని చెప్పింది. సమ్మె చట్ట వ్యతిరేకమని ఆ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పలేదని.. వాదప్రతివాదనలు, తమ వద్ద ఉన్న పత్రాల ఆధారంగా లేబర్ కోర్టు తేల్చుతుందని పేర్కొంది. తాము ముందు సమ్మె చట్ట వ్యతిరేకమా కాదా, ఈ మేరకు ప్రకటన చేసే అధికారం ఏ అధికారికి ఉంది.. అనే విషయాలనే తేల్చుతామని తెలిపింది. అయినా ఇప్పటి వరకూ ఆర్టీసీ ఈ విషయం గురించి కార్మిక శాఖ కమిషనర్కు ఎందుకు నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించింది. హైకోర్టులో కేసు ఉన్నందున కోర్టు ధిక్కారం అవుతుందని ఏఏజీ చెప్పగా.. తామేమీ స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు పట్ల గౌవరంతో కమిషనర్కు నివేదించలేదని ఏజీ చెప్పారని తెలిపింది. నిజం ఎక్కడుందో తెలియడంలేదు.. యూనియన్ తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్రెడ్డి వాదిస్తూ.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసే విస్తృతాధికారం సెక్షన్ 89 ప్రకారం హైకోర్టుకు ఉందని చెప్పారు. వాదప్రతివాదుల్లో ఏఒక్కరు కమిటీ ఏర్పాటుకు అంగీకరించినా అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వొచ్చునని రామానుజశర్మ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘కమిటీ ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని ఆశించాం. ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ దశలో మా విస్తృతాధికారాలను వినియోగించి కమిటీ వేసినా ఆ తర్వాత కూడా అదే పరిస్థితులు ఉంటాయనే అనిపించింది. రాజ్యాంగంలోని 226 అధికరణ ప్రకారం మాకు ఆకాశమే హద్దు. అయితే మా ప్రయత్నాలు నిర్ధకం అయ్యాయి. ఇసుక రేణువంత ఆశ ఉన్నా మాకున్న విస్తృతాధికారాల అస్త్రాన్ని సంధించేవాళ్లం’అని నిస్సహాయత వ్యక్తంచేసింది. తిరిగి ప్రకాష్రెడ్డి వాదనలు కొనసాగిస్తూ, టీఎస్ఆర్టీసీ 2016 అక్టోబర్లో ఏర్పడితే అంతకుముందే 2015 డిసెంబర్ 1నే ఆర్టీసీని అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి తెచ్చినట్లుగా సంస్థ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని.. ఈ కేసులో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అఫిడవిట్లను దాఖలు చేశారని, వాళ్ల వాదనల్ని వాళ్లే ఖండించుకున్నారని, నిజం ఎక్కడ దాగి ఉందో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ అన్ని రంగాల్లోనూ ఉత్పాదకవృద్ధి సాధించడానికి కార్మికుల సేవలే ఎనలేనవని అధికారిక నివేదికలే చెబుతున్నాయని, అయిదేళ్లల్లో డీజిల్ లీటర్ ధర రూ.20 పెరిగితే అందుకు అనుగుణంగా టికెట్ల రేట్ల పెంపునకు సీఎం అనుమతి ఇవ్వలేదని సాక్షాత్తు రవాణా మంత్రి శాసనసభలో చెప్పారని ప్రకాష్రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజలపై భారం పడకూడదని భావిస్తే అందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించాలేగానీ ఆర్టీసీ కాదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం/ఉద్యోగుల పరస్పర విరుద్ధమైన ఈ వాదనలపై తాము స్పందించబోమని, ఈ విషయాలను లేబర్ కోర్టులో తేల్చుకోవాలని ధర్మాసనం సూచించింది. సమ్మె విరమిస్తామన్నా సర్కారు స్పందించలేదు.. ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నందున అందుకు అనుగుణంగా చర్చలు జరపాల్సిందిగా ఆదేశాలివ్వాలని ప్రకాష్రెడ్డి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. బస్సులు పూర్తి స్థాయిలో లేవని, ఉన్న అరకొర సౌకర్యాలను కూడా అనుభవం ఉన్న డ్రైవర్లతో నడపకపోవడంతో ప్రమాదాల శాతం పెరిగిందని, మరమ్మతులకు వచ్చిన వాటిని బాగు చేసే నాథేడే లేడని తెలిపారు. ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయడమో, భూస్థాపితం చేయాలనే దురుద్ధేశం చాలా స్పష్టంగా కనబడుతోందని ఆరోపించారు. తొలుత విధుల్లోకి చేరాలని గడువు పెట్టి బెదిరించారని, ఇప్పుడు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినా ఉద్యోగాల్లో చేర్చుకుంటామనే ధీమా ఏమీ లేదని సాక్షాత్తు ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయపార్టీ నేత మాదిరిగా ఆయన అఫిడవిట్ దాఖలు చేశారని, ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. రోజూ 97 లక్షల మంది అంటే రాష్ట్ర జనాభాలో మూడో వంతు మంది ప్రజలు ఆర్టీసీ సమ్మె వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశంతో సమ్మె విరమించాలని తాను కూడా యూనియన్కు సూచించానని, దీంతో సమ్మె విరమిస్తామని వారు చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ప్రకాష్రెడ్డి చెప్పారు. అయితే, చర్చలు జరపాలని తాము ఆదేశాలివ్వలేమని, చర్చలు స్వచ్ఛందంగా ఉండాలేగానీ బలవంతంగా ఉండకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. సమ్మె విరమణకు సిద్ధంగా ఉంటే లేబర్ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకునే వరకు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరవచ్చునని సూచించింది. ఆర్టీసీ సిబ్బంది శ్రమశక్తికి సంబంధించిన పీఎఫ్ రూ.900 కోట్లు, ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో దాచుకున్న రూ.500 కోట్లను సంస్థ తీసేసుకుందని, వాటిని చెల్లించాలని కోరితే యూనియన్ డిమాండ్లు అన్యాయమని ఎదురుదాడి చేయడం దారుణమని ప్రకాష్రెడ్డి కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకునే అవకాశాలు లేవని సునీల్ శర్మ అధికారపార్టీ నాయకుడి మాదిరిగా అఫిడవిట్లో పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఇది వదిలిపెట్టకూడని విషయమని, కోర్టు రికార్డుల్లో ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేసిన అధికారి గురించి నమోదు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని, ముస్సోరిలో ఐఏఎస్ అధికారుల శిక్షణ సరిగ్గా లేదని అర్ధం అవుతోందని వ్యాఖ్యానించింది. విధుల్లో చేర్చుకోవాలని చెప్పలేం: ధర్మాసనం ప్రయాణికులు ఇబ్బందులు పడకూదని విధుల్లో చేరేందుకు కార్మికులు వెళితే రేపు విధుల్లోకి తీసుకోకపోతే పరిస్థితి ఏమిటని ప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. సమ్మె విరమణకు వారు సిద్ధంగా ఉన్నారని, విధుల్లో చేర్చుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డి స్పందిస్తూ.. ఆ విధంగా అఫిడవిట్లో లేదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కల్పించుకుని, సమ్మె విరమించిన వాళ్లను విధుల్లో చేర్చుకోవాలని చేరాలని ఉత్తర్వులు ఇవ్వలేమని.. ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి మాత్రమే చేస్తామని తేల్చి చెప్పారు. తిరిగి ప్రకాష్రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. సుప్రీంకోర్టు 1963లో ఇచ్చిన తీర్పు ప్రకారం సమ్మె చట్టబద్ధమో, చట్టవ్యతిరేకమో తేల్చవచ్చుగానీ సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగింపునకు వీల్లేదని నివేదించారు. సంస్థలో మెరుగైన సౌకర్యాల కోసమే సమ్మెలోకి వెళ్లారని, కార్మికులు విధుల్లో చేరాలంటే ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని కోరారు. చివర్లో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, ఇదే తుది నిర్ణయం కాదని, పారిశ్రామిక వివాదాల చట్టం కింద లేబర్ కోర్టు ఉత్తర్వులు ఇస్తుందని, ఆ తర్వాత తగిన విధంగా అడుగులు ఉంటాయని చెప్పారు. వాదనలు కోర్టు సమయం ముగిసిన తర్వాత కూడా కొనసాగాయి. అనంతరం సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ స్పందించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేస్తూ కేసు విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది. స్టే కొనసాగింపు... 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అమలు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో జారీ చేసిన స్టే ఉత్తర్వులను మంగళవారం వరకు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దీనిపై దాఖలైన వ్యాజ్యంతోపాటు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో పిల్పై మంగళవారం విచారణ జరుపుతామని పేర్కొంది. -
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. మంగళవారం తలపెట్టనున్న సడక్ బంద్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ రేపటి సడక్ బంద్ను వాయిదా వేస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. జడ్జిమెంట్ కాపీ చూసి రేపు సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కేవలం సడక్ బంద్నే వాయిదా వేస్తున్నామని నిరసన దీక్షలు మాత్ర రేపు యధాతదంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. దీక్ష విరమించిన జేఏసీ నేతలు మూడు రోజులుగా ఆర్టీసీ జేఏసీ ముఖ్యనేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేస్తున్న నిరవదిక నిరాహారదీక్షను సోమవారం సాయంత్రం విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు అఖిలపక్ష నాయకులు కోదండరాం, చాడ వెంకట్రెడ్డి, తమ్మినేని వీరభద్రం,మందకృష్ణ మాదిగలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆస్పత్రిలోనే జేఏసీ నాయకులతో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. -
లేబర్ కోర్టుకు ఆర్టీసీ సమ్మె!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై సోమవారం తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు జారీ చేసింది. ఈ అంశాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని హైకోర్టు తెలిపింది. రెండు వారాల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్కు సూచించింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశించలేమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడింది. ప్రభుత్వంతో చర్చల కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరగా.. కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరింది. 45 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధర్మాసనానికి వివరించారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారం అవుతుందన్నారు. ప్రభుత్వం మాత్రం తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ యాక్సిడెంట్లు చేయిస్తుందని హైకోర్టుకు వివరించారు. ఈ విషయం లేబర్ కోర్టు చూసుకుటుందని, తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు అభిప్రాయపడింది. సోమవారం ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ‘పిటిషినర్ కోరిన దాని ప్రకారం.. తమ ముందు రెండు అంశాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించడం. రెండోది కార్మికులను చర్చలకు పిలవమని ప్రభుత్వాన్ని ఆదేశించడం. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంటుంది. కార్మికులను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టుకు ఉందో లేదో చెప్పమని మొదటి నుంచి అడుగుతున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్లలో బస్సులు లేకపోయినా మెట్రోలో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అని పేర్కొంది. -
అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేవరకు నిరశన కొనసాగిస్తానంటూ స్వీయ గృహనిర్బంధం చేసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థాహరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లోపలి నుంచి గడియపెట్టుకుని కొందరు కార్మికులతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థారెడ్డిని పోలీసులు ఆదివారం సాయంత్రం చాకచక్యంగా అరెస్టు చేశారు. రెండు రోజుల దీక్షతో ఆయన ఆరోగ్యంగా స్వల్పంగా క్షీణించిందని వైద్యులు ప్రకటించటంతో, ఆయనను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన దీక్ష నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో శాంతిభద్రతల పరంగా ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉండటంతో ఆయన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుండి ప్రయత్నించారు. కానీ ఆయన తలుపులు గడియ వేసి ఉండటంతో పోలీసులు లోనికి వెళ్లలేకపోయారు. దీక్ష నేపథ్యంలో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ వద్దకు పోలీసులు మీడియా ప్రతినిధులను తప్ప వేరేవారిని అనుమతించటం లేదు. కానీ అరెస్టు చేయాలంటే తలుపులు తీయాల్సి ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు రూటు మార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బీజేపీ నేతలు జితేందర్రెడ్డి, వివేక్లులు వచ్చారు. వారిని అనుమతించటంతో వారు అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిసి బయటకు వచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా లోనికి ప్రవేశించారు. దీంతో అశ్వత్థారెడ్డితోపాటు ఉన్న కార్మికులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వారించి ఆయనను ఆరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ వైద్యులు వచ్చి పరీక్షించి బీపీ, షుగర్లెవల్స్ పెరిగాయని ప్రకటించారు. వెంటనే చికిత్స తీసుకోని పక్షంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఆరెస్టు చేసినా తన దీక్ష కొనసాగుతుందని, ఆసుపత్రిలో కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి మానుకుని చర్చలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. అశ్వత్థామరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా పోలీసులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేశారని ఆర్టీసీ మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు. 44 రోజులుగా సమ్మె చేస్తున్నామని, తమ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించిన చర్చలకు పిలవాలని, తమ న్యాయమైన 25 డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తమ ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీలో విలీనం అనే అంశాన్ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. కాగా అంతకు ముందు నిరాహారదీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలు వివేక్, జితేందర్ రెడ్డి, రామచంద్రరావు తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో వివేక్, జితేందర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన తమను ఎందుకు లోపలకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. -
రాజిరెడ్డి దీక్ష భగ్నం.. అశ్వత్థామరెడ్డికి వైద్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజు కొనసాగుతోంది. ఎల్బీనగర్లోని రెడ్డి కాలనీలో ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి కొనసాగిస్తున్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇంటి డోర్ పగలగొట్టి మరి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చే క్రమంలో రాజిరెడ్డి.. ఇంటి డోర్ వేసుకుని దీక్ష కొనసాగించారు. ఇంటి తలుపు పగలగొట్టి రాజిరెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో రెడ్డి కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. శనివారం నుంచి హస్తినాపూర్లో తన నివాసంలో అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం, ఆయన ఆరోగ్యం బాగోలేకపోతే పోలీసులు దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అశ్వత్థామరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మందకృష్ణ అరెస్టు.. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మహాదీక్షకు ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిరాపార్క్ దగ్గర ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రధాన రహదారులపై చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఇందిరా పార్క్కు వస్తున్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హబ్సిగూడలోని కృష్ణ లాడ్జ్లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మందకృష్ణను అరెస్ట్ చేశారు. ఆయనను నాచారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మందకృష్ణ విమర్శించారు. ఎట్టిపరిస్థిలోనూ భవిష్యత్తులో దీక్ష చేసి తీరుతామని అన్నారు. ఎమ్మార్పీఎస్ చేపట్టిన మహాదీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బలగాలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి దీక్ష చదవండి: ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల ఆందోళన సమ్మెలో భాగంగా కార్మికులు ఆర్టీసీ డిపోల దగ్గర ఆందోళనకు దిగారు. ఖమ్మం డిపో దగ్గర బైఠాయించిన కార్మికులు... బస్సును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలోనూ డిపోల దగ్గర ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు ఇంటి దగ్గర చీపురులతో ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు ఆర్టీసీ కార్మికులు. మరోవైపు -
నిరశనలు... అరెస్టులు
సాక్షి, హైదరాబాద్/హస్తినాపురం: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె శనివారం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం బస్ రోకో చేపట్టారు. దీనికి అనుమతి లేదని, బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా కార్మికులు శనివారం ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు జేఏసీ రాష్ట్ర నేతలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా వారికి మద్దతుగా అన్ని డిపోల వద్ద కార్మికులు కూడా దీక్షలు నిర్వహించటంతో స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ కార్మికులను అరెస్టు చేశారు. ముఖ్యంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గృహానిర్బంధం చేయడంతోపాటు, కోకన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తిలు చేపట్టిన దీక్షలను భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీక్షలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలపటంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. వారిని నిలవరించే క్రమంలో పోలీసులతో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అశ్వత్థామరెడ్డి గృహ నిర్బంధం... సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం ధర్నా చౌక్ ఇందిరాపార్కు వద్ద నిరశన దీక్ష చేపట్టాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. అయితే దీనికి పోలీసులు అనుమతిత్వలేదు. దీంతో వీఎస్టీ సమీపంలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం దీక్ష ఉండటంతో, దానిని భగ్నం చేసే క్రమంలో తెల్లవారుజామునే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. ఈ విషయం ముందుగానే ఊహించిన జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఇళ్ల వద్దకు రావాలంటూ అందుబాటులో ఉన్న కార్మికులకు సమాచారం అందించారు. హస్తినాపురం జయక్రిష్ణ ఎన్క్లేవ్లోని అశ్వత్థామరెడ్డి, రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజిరెడ్డి ఇళ్ల వద్దకు శుక్రవారం అర్ధరాత్రి దాటాక పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీక్షా శిబిరం వద్దకు బయలుదేరితే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి అశ్వత్థామరెడ్డి బయటకు రాకుండా ఇంట్లోనే తలుపు గడియపెట్టుకుని ఉండిపోయారు. ఆయనతోపాటు పలువురు ఆర్టీసీ కార్మికులు కూడా ఉన్నారు. దీంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఇంట్లోనే దీక్ష ప్రారంభిస్తున్నట్టు ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆయనతోపాటు మహిళా కార్మికులు కూడా దీక్షలో పాల్గొన్నారు. మహిళా కార్మికులను వెలుపలికి రావాల్సిందిగా పోలీసులు కోరినా వారు తిరస్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. అశ్వత్థామరెడ్డి దీక్ష విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలేకరులను తప్పించి ఎవరినీ ఆపార్ట్మెంట్లోని అనుమతించలేదు. దీంతో పోలీసులు దమనకాండ నిర్వహిస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సంధ్యలను అనుమతించలేదు. ఆగ్రహానికి గురైన మందకృష్ణ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో సంధ్య గేటు దూకి లోనికి వెళ్లేందకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రెడ్డికాలనీలో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు రాజిరెడ్డి అరెస్టు.. విడుదల.. ఇదే సమయంలో రాజిరెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజిరెడ్డి వద్దకు పోలీసులు వెళ్లకుండా చుట్టూ మహిళా కార్మికులు వలయంగా ఏర్పడ్డారు. అయినా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని, రాజిరెడ్డిని అరెస్టు చేసి పహడీషరీఫ్ పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడే ఆయన దీక్షను కొనసాగించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాజిరెడ్డిని విడిచిపెట్టారు. మరో కోకన్వీనర్ లింగమూర్తి సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి బొల్లారం స్టేషన్ను తరలించారు. అక్కడ ఆయన దీక్ష కొనసాగించారు. సునీల్శర్మకు ఏం తెలుసు..?: అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఆర్టీసీ నష్టాలను పదేపదే చెబుతున్న ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోంది. నష్టాలకు కారణమైన ప్రభుత్వమే సంస్థను నిర్వీర్యం చేసింది. 17 నెలల క్రితం ఎండీగా వచ్చిన సునీల్శర్మకు ఆర్టీసీ గురించి ఏం తెలుసు. ఇప్పటివరకు కనీసం ఏడు సార్లు కూడా ఆయన ఆర్టీసీ కార్యాలయానికి రాలేదు. ముఖ్యమంత్రి తయారు చేసిన అఫిడవిట్లపై సునీల్శర్మ సంతకాలు పెడుతున్నారు. వాటిని చూస్తే అధికారుల రూపొందించినట్టు లేవు. రాజకీయ పార్టీలు తయారు చేసినట్టే ఉన్నాయి. కోర్టులు చివాట్లు పెట్టినా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవటం లేదు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. సంస్థను మూసివేసేందుకు నష్టాల ముద్ర వేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్పై వెనక్కు తగ్గినా ప్రభుత్వం పట్టించుకోకపోవటమే దీనికి నిదర్శనం. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా కార్మికులు భయపడలేదు, భయపడరు. సమ్మె కొనసాగుతుంది. మరింత ఉధృతమవుతుంది. ప్రశాంతంగా దీక్ష చేయబోతే, పోలీసులు 144 సెక్షన్తో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలతో చేతులు కలిపామన్న ఆరోపణలు అవాస్తవం. తీరు మారకుంటే భవిష్యత్తులో ప్రజా క్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి అవమానం తప్పదు. కేరళ ఎంపీ సంఘీభావం.. రాజిరెడ్డి సహా పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకుని పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్లో ఉన్న కేరళ సీపీఐ ఎంపీ బినాయ్ విశ్వం కూడా అక్కడికి చేరుకుని సంఘీభావం తెలిపారు. కార్మికులను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం సరి కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న వ్యవహారం, ఇక్కడి ప్రభుత్వం తీరును పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు. పోలీసు స్టేషన్ వద్ద మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష చేస్తే నాటి ప్రభుత్వం అనుమతించిందని, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల దీక్షకు మాత్రం అనుమతించకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలన్నారు. ప్రభుత్వ వేధింపుల కారణంగా 27 మంది కార్మికులు చనిపోయారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు జరిపిన సమ్మె కారణంగానే రాష్ట్రం ఏర్పడిందని చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం వారి పట్ల నిరంకుశంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పోలీసులు కూడా మానవత్వంతో ఆలోచించాలన్నారు. -
ఆశ్వత్థామ ఇంటి వద్ద నిరసనకు దిగిన న్యూడెమోక్రసీ నేతలు
-
ఆర్టీసీ సమ్మె: ‘జేఏసీ కీలక నిర్ణయం’
సాక్షి, హైదరాబాద్ : సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మిగిలిన అంశాలపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులను ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు. సేవ్ ఆర్టీసీ పేరుతో రేపటి నుంచి డిపోల ముందు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. కార్మికులు ఆత్మస్తైర్యాన్ని కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు, ప్రజల మద్దతు ఉందన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ నెల 15న గ్రామ గ్రామానికి బైక్ ర్యాలీ నిర్వహించి, 16న తనతో పాటు జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక దీక్ష చేపట్టబోతున్నామని చెప్పారు. 17,18తేదిలలో ప్రతి డిపో ముందు 50మంది చొప్పున కార్మికులు నిరహారదీక్షకు చేపడుతారన్నారు. 19న సడక్ బంద్ పేరుతో హైదరాబాద్ నుంచి కోదాడ వరకు ర్యాలీ నిర్వహించబోతున్నామని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. -
హైపవర్ కమిటీకి ఒప్పుకోం : తేల్చిచెప్పిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు విచారణ బుధవారం కొనసాగింది. సమ్మె పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని, దీనిపై తమ అభిప్రాయం చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరగా.. ఈ కమిటీకి తాను ఒప్పుకునేది లేదని ప్రభుత్వం న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తెలిపారు. ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని మీరెలా చెప్తారని ప్రశ్నించింది. సమ్మె పరిష్కారానికి హైపవర్ కమిటీ వేయాల్సిందేనంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్ వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. ఇప్పటివరకు 27మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పిటిషనర్లు న్యాయస్థానానికి నివేదించారు. హైపవర్ కమిటీని వేసి సమస్యను పరిష్కరించాలని రాపోలు ఆనంద భాస్కర్ కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను రేపటికి వాయిదా వేసింది. కార్మికుల సమ్మెపై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: హైపవర్ కమిటీపై సర్కార్ నిర్ణయంతో మరో మలుపు! -
తెలంగాణ ఆర్టీసీలో మరో బలిదానం
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరో ప్రాణం బలైపోయింది. మహబూబాబాద్ డిపో డ్రైవర్ నరేష్ బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నరేష్ ప్రాణాలు విడిచాడు. నరేష్కు భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్, సాయికిరణ్ ఉన్నారు. అతను 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా నరేష్ భార్య హృద్రోగంతో బాధపడుతోందని, నెలకు రూ. 5వేల మందులు వాడుతున్నారని, మరోవైపు ఇద్దరు పిల్లలు చదువుతుండటంతో నరేష్ ఆర్థికంగా అనేక బాధలు పడుతున్నాడని, ఈ క్రమంలో మొదలైన సమ్మె ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని తోటి కార్మికులు చెప్తున్నారు. నరేష్ ఆత్మహత్య వార్త తెలియడంతో అఖిలపక్ష నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇది ప్రభుత్వ హత్యేనని, కోర్టు విచారణ పేరిట కాలయాపన చేయకుండా కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి.. సమస్యను పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నా చావుకు ముఖ్యమంత్రే కారణం! ఆత్మహత్య చేసుకునే ముందు ఆర్టీసీ డ్రైవర్ నరేష్ సూసైడ్ లెటర్ రాసినట్టు తెలుస్తోంది. ‘నా చావుకు ముఖ్యమంత్రే కారణం. నా వల్ల ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలి. ఆర్టీసీలో నాదే చివరి బలిదానం కావాలని ముఖ్యమంత్రిగారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా కుటుంబానికి వచ్చిన ఇబ్బంది మరో కుటుంబానికి రాకూడదు. ఇది నేను సొంతంగా రాసిన లేఖ. నా అంత్యక్రియలకు అశ్వత్థామరెడ్డి హాజరుకావాలి. ఆర్టీసీ కార్మికులు బాగుండాలి’ అంటూ ఈ లేఖలో నరేష్ పేర్కొన్నాడు. ఈ లేఖను చూసి ఆర్టీసీ కార్మికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
ఆర్టీసీ పరిరక్షణకు 17న సబ్బండ వర్గాల మహాదీక్ష
పంజగుట్ట: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని అమ్ముకునేందుకు చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు దాన్ని కాపాడుకునేందుకు చూస్తున్నారు. అందుకే న్యా య వ్యవస్థతోపాటు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఆర్టీసీ కార్మికులకు లభిస్తోంది’అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కార్మిక వర్గాలు, పేద వర్గాలను అణగదొక్కేందుకు చూస్తున్న వారికి చెమటలు పట్టించేలా కార్యాచరణ రూపొందించినట్లు ప్రకటించారు. 17న వేలాది మందితో ఇందిరాపార్క్ వద్ద ‘సబ్బండ వర్గాల మహాదీక్ష’, 18న ఆర్టీసీ జేఏసీ సడక్ బంద్కు సంపూర్ణ మద్దతు, 20న గవర్నర్ను కలసి ఆర్టీసీ ప్రైవేటీకరణతో పేదవర్గాలకు జరిగే నష్టంపై వివ రణ, 30న నాలుగు లక్షల మందితో హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంద కృష్ణ మాదిగ, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, సామాజిక వేత్త జేబీ రాజు, మాజీ మంత్రి రవీంద్రనాయక్, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్, రాములు నాయక్ తదితరులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకుని ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
హైకోర్టు నిర్ణయంపై స్పందించిన ఆర్టీసీ జేఏసీ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, కమిటీ ఏర్పాటుకు తాము అంగీకరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరపాలని ఆయన కోరారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ అనంతరం మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుతో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: ఆర్టీసీ సమ్మె: హైకోర్టు కీలక నిర్ణయం సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మా ప్రయోగానికి హైకోర్టు ఒప్పుకోలేదని, సమ్మె చట్ట విరుద్ధమని ఎక్కడ ప్రస్తావించలేదని అశ్వత్థామరెడ్డి గుర్తు చేశారు. కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని, ఈ విషయమై బుధవారంలోగా తమకు ప్రభుత్వ అభిప్రాయాన్ని చెప్పాలని అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
గవర్నర్ ముందుకు గాయపడ్డ మహిళలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని డిక్లేర్ చేసేందుకు హైకోర్టు తిరస్కరించడంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రేపు (మంగళవారం) ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ ఉన్నందున జేఏసీ నేతల నిరాహార దీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. సమ్మెపై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. చదవండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఛలో ట్యాంక్బండ్ సందర్భంగా పోలీసుల లాఠీఛార్జ్లో మహిళా కార్మికులు గాయపడ్డారని, గాయపడిన మహిళలను మంగళవారం గవర్నర్ తమిళిసై వద్దకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టు చెప్పారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగుతుందని హైకోర్టు పేర్కొన్నట్టు తెలిపారు. హైకోర్టు విచారణ అనంతరం రేపు తమ కార్యాచరణపై స్పందిస్తామని చెప్పారు. -
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోమవారం వాదనలను కొనసాగించిన హైకోర్టు.. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమంటూ ఓ పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆర్టీసీని పబ్లిక్ యూటిలిటీ సర్వీస్గా ప్రకటించినందున అత్యవసర సేవల (ఎస్మా) పరిధిలోకి వస్తుందని కృష్ణయ్య పేర్కొన్నారు. కాబట్టి ఆర్టీసీ సమ్మెపై ఎస్మా ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే, అత్యవసర సేవలు నిలిచిపోయినప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని, ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధంగా చెప్పలేమని హైకోర్టు పేర్కొంది. ప్రజాప్రయోజనాల పేరిట ఆధారాలు లేకుండా విచిత్రమైన ఇష్యూస్ను కోర్టు ముందుకు తీసుకొస్తే.. రిలీఫ్ ఇవ్వలేమని, ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని అనేకసార్లు తాము కోరామని గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని, ఇలాగే చేయాలని ఆదేశించలేమని పేర్కొన్న హైకోర్టు.. విచారణను రేపట్టికి వాయిదా వేసింది. ఇక, రాష్ట్రంలోని పలు రూట్లను ప్రవైటీకరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని విచారణ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. -
ఆర్టీసీ సమ్మె : నేడు మంత్రుల ఇళ్ల ముందు నిరసనలు
-
18న సడక్ బంద్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సంఘాలు సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని నిర్వహించాయి. శనివారం చలో ట్యాంక్బండ్ కార్యక్రమంలో పోలీసు నిర్బంధాన్ని ఛేదించి వందల సంఖ్యలో కారి్మకులు గమ్యం చేరటంతో వచి్చన ఊపుతో ఉత్సాహంగా ఉన్న సమ్మె కార్యాచరణకు మరింత పదునుపెట్టాయి. ఇందులో భాగంగా ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘సడక్ బంద్’నిర్వహించాలని నిర్ణయించాయి. ఇది దాదాపు రాష్ట్ర బంద్ తరహాలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. మొత్తంగా రాష్ట్ర రహదారులన్నింటిని దిగ్బంధం చేయటం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. 37 రోజులు గా సమ్మె చేస్తున్నా, స్వయంగా హైకోర్టు కొన్ని సూచనలు చేసినా ప్రభుత్వం దిగిరాకపోవటాన్ని జేఏసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి, కో కనీ్వనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక నిరశన ప్రారంభించాలని నిర్ణయించింది. ఆదివారం అఖిలపక్ష నేతలతో సుదీర్ఘంగా భేటీ అయిన జేఏసీ నేతలు అనంతరం కార్యాచరణను ప్రకటించారు. జేఏసీ కోకనీ్వనర్లు రాజిరెడ్డి, సుధ తదితరులతో కలసి కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి వివరాలను వెల్లడించారు. నేడు మంత్రుల ఇళ్ల ముందు నిరసనలు పరిస్థితిని సీఎంకు వివరించి ఆయనలో మార్పు తెచ్చేలా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చొరవ తీసుకునేలా కోరా లని జేఏసీ నిర్ణయించింది. సోమవారం వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేసి వారిని కలసి వివ రించాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని ఇళ్లు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఇళ్లను ముట్టడించనున్నట్టు జేఏసీ ప్రకటించింది. మంగళవారం జేఏసీ కన్వీనర్, కో కనీ్వనర్లు ఇందిరాపార్కు వద్ద నిరవధిక నిరశనలు ప్రారంభించనున్నారు. ఇందిరాపార్కు వద్ద అనుమతి లభించని పక్షంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో చేపట్టనున్నట్టు అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. ఆర్టీసీ కారి్మకులపై ప్రభుత్వ తీరు, చలో ట్యాంక్బండ్లో పోలీసుల ప్రవర్తనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. చలో ట్యాంక్బండ్లో మహిళా కండక్టర్ల పట్ల పోలీసులు తీవ్రంగా వ్యవహరించారని, చాలామంది గాయపడ్డారని, దీనిపై అవసరమైతే జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సమ్మె మొదలైనప్పటి నుంచి చలో ట్యాంక్బండ్ వరకు చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాలకు సంబంధించిన ఫొటోలను, ఇప్పటివరకు చనిపోయిన కారి్మకులకు సంబంధించిన ఫొటో వివరాలను ప్రదర్శించనున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ఈ రెండు కార్యక్రమాలను నిర్వహించాలని అనుకున్నామని, కార్యక్రమం ఖరారయ్యాక కచి్చతమైన తేదీలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. వీలైతే ఓరోజు హైదరాబాద్లో కూడా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. సడక్బంద్లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఆ పార్టీ నేత సంపత్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ నేత నరసింహారావు, బీజేపీ నేతలు జితేందర్రెడ్డి, మోహన్రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్, సీపీఐ నేత సుధాకర్, ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. అనుమతివ్వకపోగా దమనకాండనా..? ‘సమ్మెను ఇప్పటివరకు శాంతియుతంగానే నిర్వహించాం. అదే పంథాలో ట్యాంక్బండ్పై గంట సేపు నిరసన వ్యక్తం చేస్తామని కోరినా అనుమతి ఇవ్వలేదు. చలో ట్యాంక్బండ్కు వచ్చిన కారి్మకులు, మహిళలపై పోలీసులు దమనకాండకు దిగారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు యతి్నస్తున్నారు. చలో ట్యాంక్బండ్లో మావోయిస్టులు చొరబడ్డారన్న ఆరోపణ ను ఖండిస్తున్నాం. రాజ్యమన్నా, రాజ్యాంగమన్నా గౌరవమున్నవారు మాత్రమే ఇందులో పాల్గొన్నారు’అని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కార్మికులకు తోడుగా విపక్షాల కార్యకర్తలు.. ఇక నుంచి ఆర్టీసీ జేఏసీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. సమ్మె కార్యాచరణకు మద్దతు, సంఘీభావం తెలపటానికే పరిమితం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని ఆయా పారీ్టలు నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ–అఖిలపక్ష నేతల భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. తదుపరి కార్యాచరణలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, అప్పుడు ప్రజల మద్దతు పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. దీనికి అన్ని పారీ్టలు సమ్మతించినట్లు సమాచారం. సోమవారం హైకోర్టులో మళ్లీ వాదనలు ఉన్నందున మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, ఆర్టీసీ సమ్మె అంశాన్ని జాతీయ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఆదివారం నిర్ణయించింది. సోమ లేదా మంగళవారాల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల కమిషన్ను కలసి ఆర్టీసీ కారి్మకులకు న్యాయం చేయాలని కోరనుంది. ఇందుకోసం ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనుంది. -
ఎల్లుండి నుంచి నిరవధిక దీక్ష
-
కార్మికులపై లాఠీ
-
‘చలో ట్యాంక్బండ్’ ఉద్రిక్తం
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల జేఏసీ శనివారం హైదరాబాద్లో నిర్వహించిన చలో ట్యాంక్బండ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ట్యాంక్బండ్కు వచ్చే అన్ని మార్గాలను మూసేసినా ఆందోళనకారులు ఎలాగోలా అక్కడకు చేరుకున్నారు. జిల్లాల్లోనూ పలుచోట్ల ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు తరలివచ్చారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా ఆందోళనకారులు సైతం పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు లాఠీలు, తూటాలను లెక్కచేయబోమని ఆందోళనకారులు నినాదాలు చేశారు. దాదాపు 3,800 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: సకల జనుల సామూహిక దీక్షను ట్యాంక్బండ్పై నిర్వహించుకునేందుకు ఆర్టీసీ కారి్మకులకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ట్యాంక్బండ్పైకి ఎవరినీ రానీయకుండా అష్టదిగ్బంధనం చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద, మారియట్ హోటల్ వద్ద భారీ బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేయడంతోపాటు పారామిలటరీ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. అలాగే లోయర్ ట్యాంక్బండ్కు వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు. ఆంధ్ర మహిళా సభ, ఆర్టీసీ క్రాస్రోడ్స్, అశోక్నగర్ చౌరస్తా, ఇందిరాపార్క్, కట్టమైసమ్మ దేవాలయం, రాణిగంజ్, బుద్ధభవన్ తదితర ప్రాంతాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే మారియట్ చౌరస్తా, లిబర్టీ చౌరస్తాల వద్ద ట్యాంక్బండ్ వైపునకు వెళ్లే దారులను మూసేశారు. పదుల సంఖ్యలో మఫ్టీలో ఉన్న పోలీసులు ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహించి ప్రయాణికుల్లా తరలివచి్చన కండక్టర్లు, డ్రైవర్లను గుర్తించి అరెస్టు చేశారు. బేగంపేట్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్తోపాటు అన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన ఆర్టీసీ కార్మికుడు బందోబస్తును ఛేదించుకొని... చలో ట్యాంక్బండ్లో పాల్గొనడం కోసం వివిధ పారీ్టల నాయకులు ముందుగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ట్యాంక్బండ్ సమీపంలోని తమ పార్టీ కార్యకర్తలు, కారి్మకుల ఇళ్లలో తలదాచుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తొలుత సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. వెంకటేశ్వర్రావు, కె. గోవర్ధన్లతోపాటు 50 మంది కార్యకర్తలు ఇందిరాపార్క్ చౌరస్తాలోకి దూసుకొచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేయగా కాసేపటికే మారియట్ హోటల్ సమీపంలోని కవాడిగూడ చౌరస్తాలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, గౌతమ్జీల నేతృత్వంలో వందలాది మంది ట్యాంక్బండ్పైకి దూసుకురావడానికి ప్రయతి్నంచగా పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు వచ్చారు. అదే సమయంలో పోలీసుల దృష్టి మళ్లించి రాణిగంజ్, హకీంపేట్తోపాటు వివిధ జిల్లాల నుంచి వచి్చన కారి్మకులు పోలీసు బందోబస్తు, బారికేడ్లను ఛేదించుకొని ట్యాంక్బండ్పైకి వందలాదిగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని బతుకమ్మ ఘాట్ వద్ద అడ్డుకొని అరెస్టు చేశారు. చలో ట్యాంక్బండ్ నేపథ్యంలో శనివారం ట్యాంక్బండ్ పైకి దూసుకొస్తున్న ఆందోళనకారులు అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా రణరంగం ఇదే సమయంలో ఆర్టీసీ క్రాస్రోడ్లోని సీపీఎం కార్యాలయం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నున్న నాగేశ్వర్రావు, వెంకట్, మల్లు లక్షి్మ, అరుణోదయ విమలక్క, పీవోడబ్ల్యూ సంధ్యల నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్రోడ్స్, అశోక్నగర్, ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుంటూ ట్యాంక్బండ్వైపు దూసుకువచ్చారు. కట్టమైసమ్మ దేవాలయం వద్ద మరోసారి వారిని అడ్డుకోవడానికి ప్రయతి్నంచినా పోలీసులకు సాధ్యంకాలేదు. అక్కడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగానే వారికి ఎ.వి. కళాశాలలో ఉన్న వందలాది మంది ఆందోళనకారులు జత కలిశారు. ఇదే సమయంలో హిమాయత్నగర్, లిబర్టీ దగ్గర నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డిల నేతృత్వంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు వారికి తోడయ్యారు. అశోక్నగర్లోని ఆయన నివాసంలో కె.లక్ష్మణ్ గృహనిర్బంధం ఆర్టీసీ కారి్మకులకు మద్దతుగా సకల జనుల సామూహిక దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారమే హైదరాబాద్ చేరుకున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ లిబర్టీ మీదుగా ట్యాంక్బండ్ వైపు వెళ్లేందుకు యతి్నంచగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రొఫెసర్ కోదండరాంను అంబేడ్కర్ విగ్రహం వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్, బూర్గుల రామకృష్ణారావు భవన్వైపు నుంచి ఆర్టీసీ కార్మికులు వందలాది మంది మహిళలు, కారి్మకులు తరలిరావడంతో అంబేడ్కర్ విగ్రహం వద్ద వేలాది మంది చేరారు. అంతా కలసి ట్యాంక్బండ్వైపునకు వెళ్లి బారికేడ్లను తొలగించడానికి ప్రయతి్నంచారు. కొందరు బారికేడ్లను దాటి ట్యాంక్బండ్ చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని భావించిన పోలీసులు... ఉన్నతాధికారుల ఆదేశం మేరకు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆపై లాఠీచార్జి చేశారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి లిబర్టీ, దోమలగూడవైపు ఆందోళనకారులను తరిమారు. ఆగ్రహానికిగురైన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వగా మోత్కూరి శేఖర్ అనే ఎస్ఐకి గాయాలయ్యాయి. చివరకు తమ్మినేని, నారాయణ, చాడ వెంకట్రెడ్డి, కోదండరాం సహా వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురికి గాయాలు... పోలీసుల లాఠీచార్జి్జలో పలువురికి గాయాలయ్యా యి. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ శేషమ్మ ముక్కుకు తీవ్ర గాయమవగా ముషీరాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ కారి్మకుడు ఆశయ్యకు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన పీడీఎస్యూ నేత అనిల్కు కా ళ్లు విరిగాయి. మరోవైపు ఆందోళనకారుల దాడిలో చిక్కడపల్లి ఏసీపీ కిరణ్ సైతం గాయపడ్డారు. ట్యాంక్బండ్ను చేరుకొని చూపించాం.... పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాదాపు వెయ్యి మంది కారి్మకులం ట్యాంక్బండ్ చేరుకొని చూపించామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. వేల మంది కారి్మకులు స్వచ్ఛందంగా పాల్గొని చలో ట్యాంక్బండ్ను విజయవంతం చేశారన్నారు. సరూర్నగర్ సభ విజయవంతంతో చలో ట్యాంక్బండ్ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించిందని దుయ్యబట్టారు. వివిధ పారీ్టల కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసినా తమ కార్యదీక్ష ముందు నిలవలేకపోయారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కారి్మకుల శక్తిని గుర్తించాలని సూచించారు. ఇందులో గాయపడ్డ కారి్మకులకు ఉచితంగా సేవ చేసేందుకు ముందుకొచి్చన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉద్యమంలో మావోయిస్టులు ఉన్నారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. చలో ట్యాంక్ బండ్ సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుతున్న ఆర్టీసీ మహిళా ఉద్యోగులు మరోసారి బంద్ ఆలోచన? సమ్మెలో భాగంగా చేపట్టిన వివిధ రూపాల నిరసనల కార్యాచరణ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణను సిద్ధం చేసేందుకు కారి్మక సంఘాల జేఏసీ సిద్ధమైంది. ఆదివారం ఉదయం జేఏసీ నేతలు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. చలో ట్యాంక్బండ్ కార్యక్రమం నేపథ్యంలో కొందరు జేఏసీ నేతలను పోలీసులు శుక్రవారమే అదుపులోకి తీసుకొన్నారు. జేఏసీ కో–కన్వీనర్ రాజిరెడ్డి సహా మరికొందరిని అదుపులోకి తీసుకోగా జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సహా ఇతర ముఖ్యులను ట్యాంక్బండ్ సమీపంలో శనివారం ఉదయం అరెస్టు చేసి రాత్రికి విడుదల చేశారు. దీంతో కొత్త కార్యాచరణ ఖరారుపై జేఏసీ నేతలు భేటీ కాలేకపోయారు. ఆదివారం అఖిలపక్ష నేతలతో జేఏసీ సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది. పోలీసులు కార్మికులపట్ల కఠినంగా వ్యవహరించి లాఠీచార్జి జరపడంతో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా మహిళా కారి్మకులు ఎక్కువ మంది గాయపడ్డారు. దీన్ని జేఏసీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతోపాటు స్వయంగా హైకోర్టు సూచించినా, పదుల సంఖ్యలో కారి్మకులు చనిపోయినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం వంటి అంశాలను కారణంగా చూపుతూ మరోసారి రాష్ట్ర బంద్ నిర్వహించాలన్న అభిప్రాయాన్ని కొందరు అఖిలపక్ష నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై ఆదివారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పోలీసుల లాఠీచార్జి, బలప్రయోగానికి నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. నగరంలో జరిగే ధర్నాలో అఖిలపక్ష నేతలు పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిర్బంధం ‘చలో ట్యాంక్బండ్’కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. టీపీసీసీ కీలక నేతలతోపాటు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, మండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిలను హైదరాబాద్లో, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాలను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని జూబ్లీ చెక్పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఉద్వేగం ముందు నిలవలేకపోయారు: చాడ సాక్షి, హైదరాబాద్: ప్రజల ఉద్వేగం ముందు పోలీసులు తట్టుకోలేకపోయారని, మిలీనియం మార్చ్ను తలపించే విధంగా చలో ట్యాంక్బండ్ విజయవంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని, మరింత ప్రజాగ్రహానికి గురికాక ముందే చర్చల ద్వారా ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల అతి ప్రవర్తనతో యుద్ధ వాతావరణం ఏర్పడిందని, ఈ చర్యలు అప్రకటిత అత్యవసర పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. ఇకనైనా మొండి వైఖరి వీడాలి: తమ్మినేని తీవ్ర నిర్బంధాన్ని అధిగమించి చలో ట్యాంక్బండ్ కార్యక్రమం జయప్రదమైందని, ఇది కారి్మకులు సాధించిన విజయమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజలు, ఆర్టీసీ కారి్మకులు, వామపక్షాలు, రాజకీయ పారీ్టల కార్యకర్తలు కలిసి విజయవంతం చేశారన్నారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరిని విడనాడి కోర్టు సూచనలు పాటించి, చర్చల ద్వారా సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంఘాలు కూడా విలీనంపై పట్టుబట్టే అవకాశం అంతగా లేనందున కారి్మకుల సంక్షేమం కోసం ప్రతిష్టకు పోకుండా ఈ సమస్యకు ఇంతటితో తెరదించాలని సూచించారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారు: కృష్ణసాగర్రావు ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాల గొంతు నొక్కుతున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, తెలంగాణను పోలీస్ రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ను గృహ నిర్బం ధం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. హేయమైన చర్య: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సాక్షి, హైదరాబాద్: చలో ట్యాంక్బండ్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులపై బాష్పవాయువు ప్రయోగించడం, మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను గృహ నిర్బంధం చేయడం, అక్రమ అరెస్ట్లకు పాల్ప డటం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమని ఓ ప్రకట నలో ఆయన విమర్శించారు. గత 36 రోజు లుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా, కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ప్రభుత్వ మొండితనం, మూర్ఖత్వాన్ని తెలియజేస్తోందన్నారు. ఇప్పటికైనా సీఎం బేషజాలకు పోకుండా ఆర్టీసీ జేఏసీని చర్చకు పిలిచి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో ప్రభుత్వం కార్మికులు, రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ ఓ నియంత: పొన్నాల సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంత.. ఆయనకు కనీస మానవత్వం కూడా లేదు’అని పీపీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోందని, అయినప్పటికీ రజాకార్లను తలపించిన పోలీసులను తíప్పించుకొని చలో ట్యాంక్ బండ్ను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. హన్మకొండలో ని తన నివాసంలో శనివారం సాయం త్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కేసీఆర్కు మానవతా దృక్పథం లేదని, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులపై నిర్దయతో వ్యవహరించారని, కొండగట్టు బస్ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణిస్తే వారి కుటుంబాలను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. -
నేడు ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్బండ్
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్/తార్నాక: ఒకవైపు ఆర్టీసీ కార్మికులు శనివారం నిర్వహించతలపెట్టిన చలో ట్యాంక్బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించడం, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ చలో ట్యాంక్బండ్ చేపట్టి తీరుతామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించడంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్బండ్ వైపునకు వచ్చే అన్ని మార్గాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు చలో ట్యాంక్బండ్ కార్యక్రమానికి అఖిలపక్షాల మద్దతు కూడా ఉండటంతో వివిధ పార్టీలకు చెం దిన కార్యకర్తలు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ట్యాంక్బండ్కు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు పెద్దెత్తున ముందస్తు అరెస్టులకు దిగారు. కార్మిక సంఘాలకు చెందిన పలువురు నాయకులతో పాటు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, తెలంగాణ జన సమితి, తదితర పార్టీలకు చెందిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్కు చేరుకోకుండా నిఘాను ఏర్పాటు చేశారు. అదే సమయంలో చలో ట్యాంక్బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ గట్టి పట్టుదలతో ఉంది. శుక్రవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించడంతోపాటు ఉస్మాని యా వర్సిటీ విద్యార్థి సంఘాలతోనూ సమావేశమయ్యారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతో తమ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అన్ని జిల్లాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు నగరానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయమే జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. మిగతా నేతలు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. చలో ట్యాంక్బండ్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించడంతో ఆర్టీసీ కార్మికులు సోషల్ మీడి యా ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. విద్యార్థుల అరెస్టులు... చలో ట్యాంక్బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్న ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకునేందుకు పోలీ సులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. అఖిలపక్ష నేతల భేటీ... చలో ట్యాంక్బండ్ సక్సెస్ చేయడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై శుక్రవారం ముఖ్దూంభవన్లో అఖిలపక్షనేతలు సమావేశమయ్యారు. చాడ వెంకటరెడ్డి, అజీజ్పాషా, పశ్యపద్మ (సీపీఐ), తమ్మినేని వీరభద్రం, డీజీ నరసింహా రావు (సీపీఎం), ప్రొ. కోదండరాం (టీజేఎస్), ఎల్.రమణ (టీడీపీ) తదితరులు పాల్గొన్నారు. ముందస్తు అరెస్ట్లు అప్రజాస్వామికం... పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యానికి ఊపరిపోస్తాయని టీజేఎస్ నేత కోదండరాం చెప్పారు. చట్టాన్ని కాదని ఆర్టీసీని ప్రభుత్వం ఎలా ప్రైవేటీకరిస్తుందని సీపీఎంనేత తమ్మినేని ప్రశ్నించారు. కాగా చలో ట్యాంక్బండ్లో పాల్గొని సక్సెస్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. చలో ట్యాంక్బండ్కు అనుమతి లేదు ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ చలో ట్యాంక్బండ్ కార్యక్రమానికి అనుమతి లేదని నగర ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్కుమార్ శుక్రవారం అన్నారు. అయినప్పటికీ కొంద రు ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, అలా కాకుండా ఉండేందుకు పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు అప్పర్ ట్యాంక్బండ్ పూర్తిగా మూసేస్తున్నామని తెలిపారు. ►సికింద్రాబాద్ వైపు నుంచి ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనచోదకు లు కర్బాలామైదాన్, కవాడిగూడ చౌరస్తా, సీజీఓ టవర్స్, ముషీరాబాద్ చౌరస్తా మీదుగా వెళ్లాలి. ►ఇందిరాపార్క్ వైపు నుంచి వచ్చే వాహనాలు అశోక్నగర్ ఎక్స్ రోడ్స్ మీదుగా ప్రయాణించాలి. ►తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి మీదుగా ప్రయాణించాలి. ►ఇక్బాల్ మినార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు నెక్లెస్ రోటరీ, నెక్లెస్ రోడ్ మీదుగా వెళ్లాలి. ►హిమాయత్నగర్ వై జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ నుంచిబషీర్బాగ్ మీదుగా వెళ్లాలి. -
చలో ట్యాంక్బండ్ మరో మిలియన్ మార్చ్
సాక్షి, హైదరాబాద్/సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్బండ్ కార్యక్రమాన్ని మరో మిలియన్ మార్చ్ తరహాలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల సరూర్నగర్లో నిర్వహించాలని నిర్ణయించిన బహిరంగసభకు పోలీసులు అనుమతివ్వకున్నా, కోర్టు ద్వారా అనుమతి పొంది సభకు భారీగా జన సమీకరణ జరిపిన నేపథ్యంలో దీనికి కూడా పెద్దసంఖ్యలో జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అఖిలపక్ష నేతలు కూడా దీనికి మద్దతు తెలిపిన నేపథ్యంలో, కారి్మకుల కుటుంబ సభ్యులతోపాటు ఆయా పారీ్టల నుంచి భారీగా కార్యకర్తలు తరలేలా ఇటు జేఏసీ, అటు పారీ్టలు సం యుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి గురువారం జేఏసీ నేతలు వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు జరిపారు. ఉస్మానియా విద్యార్థులు కూడా ఈ సభకు తరలేలా వారితోనూ చర్చిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉస్మానియా విద్యార్థులతో జేఏసీ నేతలు సమావేశం కానున్నా రు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. ఇటు ప్రజలకు అటు కోర్టుకు అబద్ధాలు: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆర్టీసీ విషయంలో ఇటు ప్రజలతో పాటు అటు కోర్టుకు కూడా అబద్ధాలు చెప్పి చీవాట్లు పెట్టించుకున్నారని, ఒకదశలో కోర్టుకు క్షమాపణలు చెప్పడానికి కూడా ఐఏఎస్ అధికారులు సిద్ధమయ్యారని ఆర్టీసీ జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. అధికారులకు ఏమాత్రం చీమూనెత్తురున్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘ఆర్టీసీ కార్మికుల తల్లుల కడుపుకోత’పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. అద్దె బస్సుల వల్లనే నష్టం వస్తోందన్న విషయాన్ని చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు కూడా తప్పుడు లెక్కలు చెప్పి చీవాట్లు పెట్టించుకున్నారన్నారు. చర్చలే ప్రజాస్వామ్యానికి పునాది అని.. కారి్మకులను వెంటనే చర్చలకు పిలిచి పరిష్కరించాలన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప సమ్మె జరగలేదన్నారు. ‘మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. 9 గంటలు మంత్రులతో చర్చించారు. 9 నిమిషాలు మాతో చర్చిస్తే సమస్య పరిష్కారమయ్యేది కదా.. ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఈ నెల 9న నిర్వహించే చలో ట్యాంక్బండ్ను విజయవంతం చేయాలి.’అని అన్నారు. కార్మికుల చావులు ప్రభుత్వ హత్యలే ఆర్టీసీ కారి్మకుల చావులు ప్రభుత్వ హత్యలేనని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. 11వ తేదీలోపు మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంకా ఎంతమంది కడుపుకోతలను చూస్తారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడినవారి సమస్యలను పరిష్కరించకుండా ప్రగతిభవన్ మాటున ఉండాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఆ గిరే మీకు ఉరితాడు..: ఎల్.రమణ ఆర్టీసీ ప్రజలతో ముడిపడి ఉన్న రవాణా వ్యవస్థ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న శ్రీనివాస్రెడ్డి, సురేశ్గౌడ్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష చొప్పున మిగతా 20 మంది కార్మిక కుటుంబాలకు రూ.25 వేల చొప్పున అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. కార్మికులు బరితెగించి కొట్లాడుతుంటే కేసీఆర్ గిరి గీసుకొని ఉన్నారని, ఆ గిరే మీకు ఉరితాడు అవుతుందని హెచ్చరించారు. 48 వేల కుటుంబాలతో ఆటలు: చాడ కార్మికుల కడుపుకోతకు కేసీఆర్దే బాధ్యత అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. 48 వేల కుటుంబాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. కేసీఆర్ నయా నయీంగా మారాడని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఎద్దేవా చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రాజిరెడ్డి, థామస్రెడ్డి, న్యూడెమోక్రసీ నేత కె.గోవర్ధన్, బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, సుధా తదితరులు పాల్గొన్నారు. 6,459 బస్సులు నడిపాం: ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా గురువారం 6,459 బస్సులు నడిపినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,531 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,459 మంది తాత్కాలిక కండక్టర్లు విధుల్లో ఉన్నట్టు తెలిపింది. 5,453 బస్సుల్లో టిమ్ యంత్రాలు వినియోగించామని, 386 బస్సుల్లో సంప్రదాయ పద్ధతిలో టికెట్లు జారీ చేశామని అధికారులు చెప్పారు. సీఎం ఉద్యోగం ఊడుతది: కోమటిరెడ్డి ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కారి్మకుల ఉద్యోగాలు తీస్తే.. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉద్యోగం కూడా ఊడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద మహిళా కారి్మకులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీ భావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంగళ వారం అర్ధరాత్రి వరకు విధుల్లో చేరకుంటే సుమారు 50 వేల మంది కారి్మకుల ఉద్యోగాలు ఊడినట్లేనని కేసీఆర్ హెచ్చరించినా బెదిరింపులకు భయపడకుండా కారి్మకులు ఏకతాటిపై నిలబడి ఐక్యతను చాటుకోవడం అభినందనీయమన్నారు. చలో ట్యాంక్బండ్ సక్సెస్ చేయండి: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: గత 35 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 9న ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘చలో ట్యాంక్బండ్’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం ఓ ప్రకటనలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం దృష్టి: లక్ష్మణ్ జగిత్యాల: ఆర్టీసీ కారి్మకులు అధైర్య పడొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. జగిత్యాల డిపో ఎదుట గురువారం సమ్మెలో పాల్గొన్న కారి్మకులను కలసి సంఘీభావం తెలిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కారి్మకులను రోడ్డు పాలు చేసిందన్నారు. ఉద్యమ సమయంలో ఇచి్చన మాట నిలుపుకోవాలని కోరారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం సైతం దృష్టి పెట్టిందని, ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పోలీసుల తీరుపై స్పీకర్కు ఫిర్యాదు సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పోలీసులు తనతో అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో స్పీకర్ను కల సిన సంజయ్ పోలీసుల తీరుకు సంబంధించిన క్లిప్పింగులు, వీడియోలను సమరి్పంచారు. స్పందించిన స్పీకర్ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సుశీల్కుమా ర్ సింగ్ను ఆదేశించినట్టు సంజయ్ మీడియాకు తెలిపారు. ఆర్టీసీ కుటుంబాలకు ఎస్వీకేలో ఉచిత వైద్యం సాక్షి, హైదరాబాద్: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కారి్మకులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం కలి్పంచాలని హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్వీకే భవనంలో సాధారణ ప్రజల కోసం నిర్వహిస్తున్న క్లినిక్లోనే పని రోజుల్లో ఉదయం 10–12 గంటల మధ్య, సాయంత్రం 6–8 గంటల మధ్య డాక్టర్ అందుబాటులో ఉంటారని ఈ కమిటీ కార్యదర్శి ఎస్.వినయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ ప్రజల నుంచి రూ.30 ఫీజు తీసుకుని వైద్యం చేస్తుండగా, ఆర్టీసీ కారి్మకుల కుటుంబాలకు కన్సల్టేషన్ ఫీజు లేకుండా ఒక కోర్సు మందులను కూడా ఉచితంగా ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
ఆర్టీసీ ‘మార్చ్’కు బీజేపీ మద్దతు
సాక్షి, హైదరాబాద్: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ నెల 9న తలపెట్టిన మిలియన్ మార్చ్కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని, వారి పోరాటాలకు మద్దతు ఇస్తూనే బీజేపీ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. మాజీ ఎంపీలు జి.వివేక్, జితేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డిలతో ఏర్పాటైన ఆ కమిటీ కార్యాచరణను రూపొందిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ మూడు సార్లు డెడ్లైన్ విధించినా 300 మంది ఆర్టీసీ కార్మికులు కూడా జాయిన్ కాలేదన్నారు. సీఎం వారి ఆదరణను కోల్పోయారని, నైతికంగా సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రం గమనిస్తోందని, ఏ సందర్భంలో ఏం చేయాలో అదే చేస్తుందని చెప్పారు. ఇక పార్టీ సంస్థాగత ఎన్నికలపై పదాధికారులు, జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించామని లక్ష్మణ్ తెలిపారు. నెలాఖరుకి పార్టీ మండల, జిల్లా కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని, డిసెంబర్లో రాష్ట్ర కమిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పారన్నారు. కార్యక్రమంలో ఎంపీ దర్మపురి అరవింద్, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీకి బకాయిల్లేం..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి బకాయిల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఒకే మాటపై నిలిచాయి. ఆరీ్టసీకి ఏ రకంగానూ బకాయిలు లేమని ప్రభుత్వం చెప్పగా.. సంస్థకు తాము ఇవ్వాల్సిన అవసరమే లేదని జీహెచ్ఎంసీ స్పష్టంచేసింది. ఈ రెండు వాదనలను ఆర్టీసీ ఎండీ సమరి్థంచారు. మొత్తానికి ముగ్గురూ కలసి ఆరీ్టసీకి చెల్లించాల్సింది ఏమీ లేదని హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మలు వేర్వేరుగా ఉన్నత న్యాయస్థానంలో కౌంటర్లు దాఖలు చేశారు. ఆర్టీసీనే ప్రభుత్వానికి బకాయి: – ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించింది. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ బకాయి పడలేదు. ఆర్టీసీనే మోటారు వాహన పన్ను (ఎంవీ ట్యాక్స్) కింద ప్రభుత్వానికి 2017–18 నుంచి రూ.540.16 కోట్లు బకాయి పడింది. ఆరీ్టసీకి రాష్ట్ర ప్రభుత్వం రుణం రూపంలో డబ్బు ఇవ్వడమే తప్ప, ఆ రుణాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించిన చరిత్ర ఆ సంస్థకు లేదు. ఇచి్చన రుణాన్ని తిరిగి చెల్లించాలని ఆరీ్టసీకి ఇన్నేళ్లలో ఏనాడు కూడా ప్రభుత్వం నోటీసు జారీ చేసింది లేదు. తీసుకున్న రుణానికి ఫలానా సమయంలోపు వడ్డీ చెల్లించాలన్న గడువుంటుంది. అయితే ఇప్పటివరకు ఆర్టీసీ విషయంలో అటువంటి గడువేదీ నిర్దేశించలేదు. ఈ రుణాలను రోజువారీ నిర్వహణకు, బస్సుల కొనుగోలుకు, బస్సు షెడ్ల నిర్మాణానికి ఉపయోగించుకునే వెసులుబాటును ఆరీ్టసీకి ఇచ్చారు. వివిధ వర్గాల పౌరులకు ఇచ్చిన రాయితీల తాలూకు డబ్బును ప్రభుత్వం చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువే ఇచ్చింది. రాయితీల కింద రూ.1,230.20 కోట్లు, పెట్టుబడుల నిమిత్తం రూ.1,219 కోట్లు, రుణం కింద రూ.1,294.23 కోట్లు, బస్సుల కొనుగోలుకు రూ.160.12 కోట్లు.. ఇలా మొత్తం రూ.3,903.55 కోట్లు చెల్లించింది. ఆరీ్టసీకి జీహెచ్ఎంసీ చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ప్రభుత్వమే ఇచ్చింది. అందువల్ల జీహెచ్ఎంసీ ఎటువంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరీ్టసీకి జీహెచ్ఎంసీ రూ.1,492 కోట్ల మేర రుణపడి ఉందని నేను చెప్పలేదు. ఆర్టీసీ అంత మొత్తం జీహెచ్ఎంసీ నుంచి కోరుతోందని మాత్రమే చెప్పాను. 2014–15 నుంచి 2017–18 వరకు ఆరీ్టసీకి వివిధ పద్దుల కింద రూ.2,786.16 కోట్లు ఇచ్చాం. 2018–19లో రూ.662.39 కోట్లు, 2019–20లో రూ.455 కోట్లు విడుదల చేశాం. మా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది – జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్టీసీ కోరుతున్నట్లు నష్టాలను భరించే స్థితిలో జీహెచ్ఎంసీ లేదు. 2016 మే వరకు రూ.137.95 కోట్లు చెల్లించాం. అదే ఏడాది మరో రూ.198.45 కోట్లిచ్చాం. 2016 అక్టోబర్ నాటికి జీహెచ్ఎంసీ రూ.562.98 కోట్ల లోటు బడ్జెట్లో ఉంది. ఈ లోటు కొనసాగి 2017–18కు రూ.313.10 కోట్లు, 2018–19కు రూ.768.20 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఆ లోటు కొనసాగుతోంది. 2016–17 సంవత్సరానికి ఆరీ్టసీకి రూ.273.84 కోట్లు విడుదల చేసేలా చూడాలని ప్రభుత్వం జీహెచ్ఎంసీని కోరింది. అయితే ఆర్థిక సమస్యల వల్ల ఆ మొత్తాన్ని చెల్లించే పరిస్థితిలో లేమని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. జీహెచ్ఎంసీ పరిధిలో బస్సులను నడపడం వల్ల వచి్చన నష్టాలను భరించాలని ఆర్టీసీ మమ్మల్ని కోరుతూ వచి్చంది. అయితే మా ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మాత్రమే డబ్బు చెల్లించగలమని స్పష్టంగా చెప్పాం. అసలు చట్ట ప్రకారం ఆర్టీసీకి మేం ఎటువంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరమే లేదు. ఆర్టీసీకి ప్రభుత్వం అదనపు చెల్లింపులే చేసింది – ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ స్థితిగతులపై రవాణా మంత్రికి 11.9. 2019న అంతర్గత నివేదిక ఇచ్చాం. మంత్రికి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి గురించి వివరించాం. ఈ సందర్భంగా వివిధ పద్దుల కింద ప్రభుత్వం ఆరీ్టసీకి విడుదల చేసిన నిధుల గురించి వివరించాం. దీని ఫలితంగా 2019–20 సంవత్సరానికి బడ్జెట్లో కేటాయించిన రూ.550 కోట్లకు గాను ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.455 కోట్లు విడుదలయ్యాయి. వాస్తవానికి ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఎటువంటి మొత్తాన్ని రుణపడి లేదు. మం త్రికి చెప్పిన లెక్కలు జీహెచ్ఎంసీ నుంచి ఆరీ్టసీకి రావాల్సినవి కావు. ప్రభుత్వం గ్యారెంటీగా ఉన్న రుణం రూ.345 కోట్ల గురించి కూడా మంత్రికి వివరించాం. రాష్ట్ర విభజనకు ముందు లెక్కలు అందుబాటులో లేవు. వివిధ వర్గాల పౌరులకు వచి్చన రాయితీల మొత్తం రూ.3,006.15కోట్లు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీ అందుకున్నది రూ.3,903.55 కోట్లు. ప్రభుత్వం రూ.897.40 కోట్లు అదనంగా చెల్లించింది. దీనికి తోడు రూ.850 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీగా ఉంది. ఇచి్చన నిధులను వాడుకునే స్వేచ్ఛను ఆరీ్టసీకి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం తాను ఇచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించాలని కోరడం గానీ, వడ్డీ చెల్లించాలని అడగటం గానీ ఇప్పటివరకు చేయలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చిన నష్టాలకు స్పందించి గతంలో రూ.336.40కోట్లు జీహెచ్ఎంసీ విడుదల చేసింది. 2019 అక్టోబర్ లోనూ ఇలానే అడిగాం. అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అందువల్ల నష్టాలను భరించే స్థితిలో లేమని జీహెచ్ఎంసీ చెప్పింది. -
ఆర్టీసీ సమ్మె : ‘50 వేల మందికి 360 మందే చేరారు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రభుత్వం విధించిన డెడ్లైన్ దాటుకుని పరుగులు పెడుతోంది. బుధవారం అన్ని బస్ డిపోల ముందు నిరాహార దీక్షలు చేపట్టాలన్న ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపు మేరకు కార్మికులు, వామపక్ష నాయకులు కదం తొక్కారు. ముషీరాబాద్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు పాల్పడకుండా.. చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. (చదవండి : ప్రైవేట్ బస్సులు నడిస్తే కార్మికుల శవాలపైనే..) ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ డెడ్లైన్ పెట్టాడు. బెదిరించాడు. అయినా 50 వేల మంది కార్మికుల్లో కేవలం 360 మంది మాత్రమే విధుల్లో చేరారు. చేరిన వాళ్ళలో కూడా డ్రైవర్లు, కండక్టర్లు లేనేలేరు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాల ప్రజలు అండగా ఉన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. చూస్తూ ఊరుకోలేక రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డాయి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే... కార్మికుల శవాలపైన మాత్రమే ప్రైవేట్ బస్సులు వెళ్ళాలి. ప్రైవేట్ బస్సులను నడిపితే ఎక్కడికక్కడ కార్మికులు అడ్డుకుంటారు. అవసరమైతే తగులబెడతారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వపరం చేసి చూపించారు. ఇక్కడెందుకు సాధ్యం కాదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలి’అని అన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మెను ఉధృతం చేయడంతో బస్ డిపోల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులకు పాట్లు తప్పడం లేదు. -
ఆగదు ఆగదు ఆగదు.. ఆర్టీసీ సమ్మె ఆగదు..!!
సాక్షి, హైదరాబాద్ : నేటితో 33వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ను దాటుకుని ముందుకు సాగుతోంది. ఏదేమైనా డిమాండ్లు సాధిస్తామని కార్మికులు మెట్టు దిగడం లేదు. బుధవారం అన్ని బస్ డిపోల ముందు నిరాహార దీక్షలకు ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. డిపోల ముందు ధర్నాకు దిగి బస్సులను అడ్డుకున్న కార్మికులు, విపక్ష నేతల్ని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. సూర్యాపేట బస్డిపో ముందు అఖిలపక్ష నాయకులు, కార్మికులు ధర్నాకు దిగారు. బస్సులు బయటకు వెళ్లకుండా గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నిరసనకారులను పోలీసులు స్టేషన్కు తరలించే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. (చదవండి : ఆర్టీసీ సమ్మె : వెనకడుగు వేయం) ముఖ్యమంత్రి నిర్ణయం ఏమై ఉంటుందో.. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డెడ్లైన్ ముగిసిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 5100 బస్ రూట్లను ప్రైవేటుకు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సమ్మెపై కార్మికులు మెట్టుదిగకపోవడంతో మిగిలిన 5 వేల రూట్లపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రైవేటు బస్సుల పర్మిట్లపై.. ఆర్టీసీ మనుగడపై ప్రభుత్వం సాయంత్రంలోపు ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు సమచారం. రేపు హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై కూడా ప్రభుత్వం చర్చించనుంది. డెడ్లైన్ ముగిసిన తర్వాత ఆర్టీసీ ఉండదని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. డెడ్లైన్ లోపల చేరింది 373 మంది.. నాగర్కర్నూల్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, కరీంనగర్-1, కామారెడ్డి, బాన్సువాడ, ఖమ్మం, మధిర, భద్రాద్రి కొత్తగూడెం, బోధన్, మిర్యాలగూడ, సూర్యాపేట బస్ డిపోల వద్ద నిరసనకు దిగిన కార్మికులు, అఖిలపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. బాన్సువాడ అంబెడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 50 మంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇక డెడ్లైన్ లోపల రాష్ట్ర వ్యాప్తంగా 373 మంది కార్మికులు విధుల్లో చేరేందుకు రిపోర్టు చేశారు. -
ఆర్టీసీ సమ్మె : వెనకడుగు వేయం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. అయినప్పటికీ తిరిగి డ్యూటీలో చేరే విషయంలో కార్మికులు వెనకడుగు వేయడంలేదు. దాదాపు 300 మంది మినహా మిగిలినవారంతా సమ్మెలోనే కొనసాగాలని నిర్ణయించు కున్నట్టు తెలుస్తోంది. డిపోల్లోనే కాకుండా పోలీసు స్టేషన్లు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ఆర్టీఓ, ఎస్పీ డీఎస్పీ తదితర కార్యాలయాల్లో కూడా తిరిగి చేరికకు సంబంధించిన లేఖలు ఇవ్వచ్చని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల కార్మికులు ఆయా కార్యాలయాల్లో అందజేశారు. ఆ వివరా లన్నీ పూర్తిగా క్రోడీకరించాల్సి ఉన్నందున, మంగళవారం అర్ధరాత్రి 12 వరకు ఎంతమంది కార్మికులు లేఖలు ఇచ్చారన్న విషయంలో స్పష్టత రాలేదు. దీంతో రాత్రి వరకు ఆర్టీసీ అధికారికంగా ఆ సంఖ్యను ప్రకటించలేదు. సాయంత్రం 6 గంటల వరకు 150 మంది, రాత్రి తొమ్మిది వరకు 240 మంది, 10 వరకు ఆ సంఖ్య 300కి కాస్త అటూ ఇటూగా చేరుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం కచ్చితమైన సమాచారం తెలుస్తుందని తెలిపారు. కనీసం వేయి మందికిపైగా చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినా.. అది సాధ్యం కాలేదు. కార్మిక నేతలు రంగంలోకి దిగి.. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు విధుల్లో చేరిన కార్మికులనే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని, మిగతావారికి సంస్థతో ఎలాంటి సంబంధం ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తేల్చి చెప్పటంతో తొలుత కార్మికుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే రెండు నెలలుగా జీతాలు లేనందున రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది కార్మికులు విధుల్లో చేరే విష యంలో కుటుంబ సభ్యులు, సన్ని హితులతో చర్చించారు. ఎక్కువ మంది చేరేందుకే ఆసక్తి కనబరిచారు. విషయం తెలిసి కార్మిక సంఘాల నేతలు వెంటనే రంగం లోకి దిగారు. సంఘాలుగా విడివిడిగా జిల్లా స్థాయి నేతలను నగరానికి పిలిపించుకుని చర్చలు జరిపారు. న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇన్ని వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ప్రభుత్వానికి లేనందున అది చెల్లుబాటు కాదని, బేషరతుగా చేరాలన్న మెలికపెట్టడంతో భవిష్యత్తులో జీతాలు పొందడం సహా అన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయని, ఇన్ని రోజులు పోరాటం చేసి ఇప్పుడు చేతులెత్తేస్తే సంస్థను కాపాడు కోలేమని చెప్పారు. ఇదంతా కార్మికులందరికీ చేరేలా చర్యలు చేసుకున్నారు. దీంతో కార్మికుల్లో చాలామంది విధుల్లో చేర కుండా ఆగిపోయారు. జేఏసీలో భాగంగా ఉన్న సూపర్వైజరీ అసోసియేషన్ పరిధిలో ఉండే ఉద్యోగులు మాత్రం తిరిగి విధుల్లో చేరేందుకే ఆసక్తి కనపడింది. వారిలో కొందరు మంగళవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో లేఖలు అందజేశారు. అఖిలపక్ష నేతలతో జేఏసీ భేటీ... ముఖ్యమంత్రి విధించిన గడువు చివరి రోజైన మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపైనే ఎక్కువ సేపు చర్చించారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన మీదట, అసలు ఆర్టీసీని ప్రైవేటీకరించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదనే అంశంపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31 శాతం వాటా ఉన్నందున, దాన్ని మూసివేయాలంటే కచ్చితంగా కేంద్రం అనుమతించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను కార్మికులకు తెలియజేసి.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు డిపోల ముందు కార్మికులు నిరసనలు వ్యక్తం చేశారు. విధుల్లో చేరేందుకు వచ్చే కార్మికులను అడ్డుకునేందుకు వారు కాపలా తరహాలో దీక్షలు నిర్వహించారు. అన్ని డిపోల వద్ద వంటావార్పు ఏర్పాటు చేసి భోజనాలు కూడా అక్కడే చేసేలా చూశారు. జిల్లాల్లో పనిచేస్తున్న దాదాపు వందమంది హైదరాబాద్బస్భవన్లో లేఖలివ్వటం విశేషం. కార్మికులు భయపడొద్దు: అశ్వత్థామరెడ్డి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్టీసీని ప్రైవేటీకరించడం సాధ్యం కాదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్లో రాజకీయ పక్షాలతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రకటనలు చూసి భయాందోళనకు గురికావద్దని కార్మికులకు సూచించారు. కోర్టులో సాగుతున్న న్యాయపోరాటాన్ని బలహీన పరచడానికి ముఖ్యమంత్రి వేస్తున్న ఎత్తుగడలనే సంగతి గ్రహించాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా జేఏసీతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈనెల 7న నిర్వహించే సడక్బంద్లో భాగంగా ఉపాధ్యాయ, ఉద్యోగులు పెన్డౌన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 9న నిర్వహించే ఛలో ట్యాంక్బండ్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రాజిరెడ్డి, థామస్రెడ్డి, రవీందర్రెడ్డి, వివిధ పార్టీల నేతలు జూలకంటి రంగారెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోసారి సీఎం సమీక్ష? ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఎంతమంది విధుల్లో చేరారన్న లెక్కలకు సంబంధించి అందుబాటులో ఉన్న వివరాలను మంగళవారం రాత్రి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు అధికారులు అందజేశారు. వాటిని ఆయన సీఎంకు తెలియజేశారు. దీనిపై మరోసారి ముఖ్యమంత్రి స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. 7న హైకోర్టులో వాదనలు ఉన్నందున, మరోసారి ముఖ్యమంత్రి సమీక్షిస్తారని చెబుతున్నారు. కార్మికుల స్పందన తక్కువగా ఉన్న నేపథ్యంలో, ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు మరిన్ని ఎక్కువగా ఇచ్చే విషయంలో కీలక ప్రకటన ఉండనుందని చెబుతున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 72.46 శాతం బస్సులు నడిచినట్లు ఆర్టీసీ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 1937 అద్దె బస్సులను కలుపుకొని మొత్తం 6,484 బస్సులు నడిచాయని తెలిపింది. -
తరుముతున్న డెడ్లైన్.. కార్మికుల్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: గత 32 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తిరిగి బేషరతుగా విధుల్లో చేరడానికి మంగళవారం అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు డెడ్లైన్ పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ విధించిన డెడ్లైన్ గడువు మరికాసేపట్లో ముగియబోతుండటంతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ విధించిన డెడ్లైన్కు కార్మికులు తలొగ్గుతారా? లేక సమ్మెను కొనసాగిస్తారా? కార్మికులు దిగిరాకపోతే.. కేసీఆర్ అన్నట్టే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు చేస్తారా? అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆఫర్కు కార్మికుల నుంచి ఓ మోస్తరుగా స్పందన వస్తున్నట్టు కనిపిస్తోంది. సీఎం డెడ్లైన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 208 మంది ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరినట్టు సమాచారం. బస్భవన్ కేంద్రంగా 100 మందికిపైగా విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్పీ కార్యాలయాల్లో, ఆర్ఎం కార్యాలయాల్లో నేటి అర్ధరాత్రి వరకు కార్మికులు విధుల్లోకి చేరేందుకు అవకాశం కల్పించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5100 రూట్లను ప్రైవేటీకరించిన సంగతి తెలిసిందే. డెడ్లైన్లోపు కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరకపోతే.. పూర్తిగా అన్నీ రూట్లను ప్రైవేట్ చేస్తామంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం కేసీఆర్ డెడ్లైన్ విధించినా కార్మికులు విధుల్లో చేరేది లేదని, ఇప్పటివరకు విధుల్లో చేరిన కార్మికులు కూడా తిరిగి వెనక్కి వస్తున్నారని ఆర్టీసీ జేఏసీ తెగేసి చెప్తోంది. కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిందేనని, సమ్మె చేస్తున్న కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తోంది. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేటీకరించలేదని, ఇందుకు కేంద్రం అనుమతి కూడా ఉండాలని అంటున్నారు. ఇప్పటివరకు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. -
విధుల్లో చేరం.. సమ్మె ఆపం
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ కార్మికులను బెదిరించే ధోరణి మానేసి ఇప్పటికైనా చర్చలకు సిద్ధం కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. చర్చలకు ఆహ్వానిస్తే ఏయే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందో, ఏయే డిమాండ్ల విషయంలో జేఏసీ పట్టువిడుపులను ప్రదర్శిస్తుందో స్పష్టమవుతుందని, అది ఆర్టీసీ సమ్మెకు పరిష్కారంగా మారుతుందని పేర్కొంది. ఈ నెల ఐదో తేదీ అర్ధరాత్రిలోపు కార్మికులు విధుల్లోకి రావాలని, రాని వారికి ఇక ఆర్టీసీతో సంబంధం ఉండదన్న ముఖ్య మంత్రి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ డెడ్లైన్ను కార్మికులు పట్టించుకోరని తేల్చిచెప్పింది. తమ డిమాండ్లకు పరిష్కారం రానంతవరకు సమ్మెను ఆపబోమని స్పష్టం చేసింది. ఆర్టీసీలో 5,100 మార్గాలను ప్రైవేట్కు కేటాయిం చటం, ఐదో తేదీ నాటికి విధుల్లో చేరని కార్మికులను ఇక తీసుకోబోమంటూ డెడ్లైన్ విధింపు, ఐదు వేల బస్సులకే ఆర్టీసీ పరిమితం... తదితర విషయాలపై శనివారం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో, ఆర్టీసీ జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్ రాజి రెడ్డి, సుధ తదితరులు మీడియాతో మాట్లాడారు. తాము ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై చర్చలకు సిద్ధమై, వాటికి పరిష్కార మార్గాలు చూపనంతవరకు సమ్మెను ఆపబోమని నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న రహస్య ఎజెండాను మనసులో పెట్టుకుని ముఖ్యమంత్రి కార్మికులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం బెదిరింపులకు కార్మికులెవరూ భయపడొద్దని, 49 వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ఎవరికీ లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఖరారు చేసిన సమ్మె కార్యాచరణ అలాగే కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులను బిడ్డలుగా భావిస్తున్నానని అన్నందుకు సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నామని, కానీ ఆయన ఒకవైపు బిడ్డలు అంటూనే మరోవైపు కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఏదో ఓ కమిటీ వేసి తమ డిమాండ్లపై చర్చించాలని పేర్కొన్నారు. మేం అన్ని డిమాండ్లపై పట్టుపట్టి కూర్చోమని, చర్చల్లో పట్టువిడుపులకు అవకాశం ఉంటుందన్నారు. తమది సీఎం చెబుతున్నట్లుగా చట్ట విరుద్ధ సమ్మె కాదని, చట్టబద్ధమైందేనని పునరుద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లీగల్ లేదు ఇల్లీగల్ లేదు, సమ్మె సమ్మెనే అన్న కేసీఆర్, తెలంగాణ వచ్చాక సమ్మె విషయంలో మాటమార్చడం సబబు కాదన్నారు. ఆర్టీసీకి బకాయిలు లేవు అనటం కూడా సరికాదని, దానిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగు చూస్తాయన్నారు. 23 వేల మందికి కూర్చోబెట్టి జీతాలిస్తారా?.. కేవలం 5 వేల బస్సులే ఆర్టీసీలో ఉంటాయన్న ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం 28 వేల మంది కార్మికులు సరిపోతారని, మరి మిగిలిన 23 వేల మందికి పని ఉండదని, వారిని కూర్చోబెట్టి జీతాలిస్తారా అని ప్రశ్నించారు. 97 డిపోలకు గాను 48 డిపోలే సరిపోతాయని, మిగిలిన డిపోల డీఎంల పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డీఎంల నుంచి ఈడీల వరకు బయటకొచ్చి తమతో కలసి సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రిజర్వేషన్ రోస్టర్ అమలు ఆర్టీసీలో పక్కాగా జరుగుతోందని, సగం రూట్లను ప్రైవేటీకరించాక వచ్చే ప్రైవేటు సంస్థలు వాటిని అమలు చేస్తాయా అని ప్రశ్నించారు. అప్పుడు రిజర్వేషన్ల పద్ధతికే విఘాతం కలుగుతుందన్నారు. యూనియన్ల నుంచి కార్మికులను దూరం చేసేలా ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దాన్ని కార్మికులు గుర్తించాలని కోరారు. ఆర్టీసీలో రూ.650 కోట్ల డిప్రిసియేషన్ ఫండ్ ఉంటుందని, అది ఎక్కడుందో తేల్చి దానితో కొత్త బస్సులు కొనాలని సూచించారు. ఆర్టీసీ నష్టాలు కేంద్రం భరించే అవకాశం ఉండదన్నారు. జీతాలివ్వకుంటే పరిస్థితేంటి?... కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలంటున్నారని, రేపు జీతాలకు డబ్బులేదు ఇవ్వలేమంటే అప్పుడు వారు ఏం చేయాలని ప్రశ్నించారు. నష్టాలొచ్చే రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తామని సీఎం అన్నారని, కానీ నష్టాలొచ్చే రూట్లు తీసుకునేందుకు వారు పిచ్చివాళ్లా అని ప్రశ్నించారు. అందుకే కార్మికులు వాస్తవాలు గుర్తించి సమస్య పరిష్కారమయ్యేవరకు సమ్మెలో ఉండాలని, ఆత్మద్రోహం చేసుకుని పిరికివారిలా పారిపోవద్దని సూచించారు. గతంలో ముఖ్యమంత్రి ఇలాగే డెడ్లైన్లు విధించారని, ఎవరూ చలించలేదని, ఇప్పుడు కూడా ఒకటి రెండు శాతం మంది విధుల్లో చేరినా మిగతావారు సమ్మెలోనే ఉంటారన్నారు. చాలా ప్రాంతాల నుంచి కార్మికులు తమకు ఫోన్ చేసి సమ్మెను కొనసాగించాలని పేర్కొంటున్నారని, ఆపితే ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు దిగ్బంధం వాయిదా ఐదో తేదీన రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని, ఆ రోజు న్యాయస్థానాలకు సంబంధించిన పోస్టుల భర్తీ పరీక్ష ఉన్నందున, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. -
కేసీఆర్ ప్రకటనపై స్పందించిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్: మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్లైన్ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కీలక భేటీ నిర్వహించింది. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ సమావేశం అనంతరం జేఏసీ కన్వీనర్ ఆశ్వాత్థామరెడ్డి వివరాలను వెల్లడించారు. ఉద్యోగులను తొలగించే అధికారం ఎవరికీ లేదని, డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తమ సమస్యల పరిష్కారంపై హామీ రాలేదని అన్నారు. సమావేశం అనంతరం జేఏసీ నేతలు మాట్లాడారు. సీఎం డెడ్ లైన్లు పెట్టడం కొత్తకాదని, కోర్టులను సైతం సీఎం డిక్టేట్ చేస్తున్నారని విమర్శించారు. తొలుత చర్చలు జరిపి కార్మికులకు డెడ్ లైన్లుపెట్టాలని అన్నారు. ఉద్యోగాలు తీసే అధికారం సీఎంకు లేదని, డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో కూడా రిజర్వేషన్లు అమలు ఉన్నాయని, ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్లకు బుగ్గ కారులో తిరగాలని సోకు లేదని, కార్మికుల డిమాండ్ల కోసమే యూనియన్లు పనిచేస్తున్నామని వివరించారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి సీఎం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్మికులు నా బిడ్డలు అనుకుంటూనే కేసీఆర్ వారిని ఇబ్బంది పెడ్తున్నాడని మండిపడ్డారు. ఎవరో ఇద్దరు ముగ్గురు పిరికివాళ్లు ఉద్యోగంలో చేరుతున్నారని, కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారని వెల్లడించారు. భేటీ సందర్భంగా జేఏసీ నేతలు భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. -
పోరు ఆగదు
-
5న సడక్ బంద్.. 9న చలో ట్యాంక్బండ్
సాక్షి, హైదరాబాద్ (సుందరయ్య విజ్ఞానకేంద్రం): సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. నాలుగు కోట్ల మంది ప్రజల రవాణాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. శనివారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి తెలంగాణ ఆర్టీసీ విడిపోలేదని, అందువల్ల సీఎం తీసుకునే అప్రజాస్వామిక నిర్ణయాలు చెల్లవని పేర్కొన్నారు. తమ కార్యాచరణలో భాగంగా ఢిల్లీ వెళ్లి ఈనెల 4, 5వ తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వినతిపత్రం సమరి్పంచనున్నట్టు వెల్లడించారు. సీఎం మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోరారు. సీఎం మొండి వైఖరి విడనాడాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సీఎం నిర్ణయాలు చెల్లవు: కోదండరాం ఏపీఎస్ ఆర్టీసీ నుంచి తెలంగాణ ఆర్టీసీ ఇంకా విడిపోనందున ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు చెల్లవని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. సర్కారు ప్రకటనలకు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కోర్టును ధిక్కరించే ఇలాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదన్నారు. అసలు సీఎంకు చట్టం గురించి తెలుసా అని ప్రశ్నించారు. సంస్థను ప్రైవేటుపరం చేసే అధికారం ఆయనకు లేదని పేర్కొన్నారు. న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. సీఎంకు కారి్మక చట్టాలు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కోర్టుకు సైతం తప్పుడు నివేదికలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి, వాటి ఆస్తులను అమ్ముకునే కుట్రలో భాగంగానే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు. ఇదీ జేఏసీ కార్యాచరణ... మృతిచెందిన కార్మికులకు సంతాపంగా 3న అన్ని డిపోలు, మండలాలు, నియోజకవర్గాల్లో సమావేశాలు 4న రాజకీయ పార్టీలతో కలసి అన్ని డిపోల వద్ద ధర్నాలు 5న సడక్ బంద్లో భాగంగా రహదారుల దిగ్బంధనం 6న అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మిక కుటుంబాల నిరసన 7న అన్ని ప్రజా సంఘాలతో ప్రదర్శనలు 8న చలో ట్యాంక్బండ్ ముందస్తు సన్నాహక కార్యక్రమాలు 9న చలో ట్యాంక్బండ్, సామూహిక నిరసనలు -
28వ రోజుకు చేరుకున్న అర్టీసీ సమ్మె
-
27వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
-
అవసరమైతే మిలియన్ మార్చ్!
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ పరిరక్షణకు జరుగుతున్న పోరాటంలో కార్మికులు విజయతీరాలకు ఎంతో దూరంలో లేరు. అనుమానమొద్దు.. విజయం మనదే. ప్రగతి భవన్లో కేసీఆర్ ఒంటరయ్యారు. ఆయన వెంట మంత్రుల్లేరు. ఎమ్మెల్యేలు లేరు. కానీ ఆర్టీసీ కార్మికుల వెంట రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, అన్నింటికీ మించి ప్రజలున్నారు. ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసే క్రమంలో అవసరమైతే ట్యాంక్బండ్పై మిలియన్ మార్చ్ నిర్వహిద్దాం’అని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. ప్రభుత్వంలో విలీనం అయితే తప్ప ఆర్టీసీ బతకదని, దాన్ని కచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమ్మె కార్యాచరణలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ‘సకల జనభేరి’సభకు ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా కార్మికులు సభకు తరలివచ్చారు. ఇండోర్ స్టేడియంలో మాత్రమే సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, లోపల స్థలం లేక భారీ సంఖ్యలో కార్మికులు బయటే ఉండిపోయారు. ఇంత భారీ ఉద్యమం శాంతియుతంగా నిర్వహించటం చిన్న విషయం కాదని, ప్రపంచవ్యాప్తంగా అరుదైనదని పేర్కొన్నారు. కార్మికలు తమ జీతాల కోసం సమ్మె చేయట్లేదని, సంస్థను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నారని చెప్పారు. ఈ తపన ఎంత బలంగా ఉందో.. సకల జనభేరి సభకు 50 వేల మంది రావటమే నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తప్పుపడుతున్నా ఇప్పటివరకు సీఎంలో చలనం లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణమంటూ సీఎం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ చెబుతున్నట్లు కారి్మకులకు సగటు జీతం రూ.50 వేలు లేనే లేదని, వారివన్నీ తక్కువ జీతాలేనని స్పష్టం చేశారు. చిన్నచిన్న కారణాలకే కారి్మకుల ఇంక్రిమెంట్లు కట్ చేస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన చర్చల సమయంలో కార్మిక సంఘం నేతలను అధికారులు అవమానించారని మండిపడ్డారు. దీన్ని కారి్మక సంఘం నేతలు సమర్థంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పటికే 15 మంది కారి్మకులు మృతి చెందారని, ఇంకా ఎంతమందిని సీఎం బలి తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ హత్యలే: చాడ వెంకటరెడ్డి కేసీఆర్కు రాజ్యాంగంపై అవగాహన లేదని, అందుకే ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్ తీరులో ఇప్పటికే 15 మంది ఆర్టీసీ కారి్మకులు మృతిచెందారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. హైకోర్టు అక్షింతలు వేస్తుంటే.. తప్పుడు లెక్కలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆ విషయం గ్రహించి కోర్టు మొత్తం కూపీ లాగుతోందన్నారు. అంతిమ విజయం కారి్మకులదేనని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ప్రైవేటీకరించటం ఉందా: రేవంత్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం తమ ఎజెండాలో లేదని సీఎం అంటున్నారని, మరి ఆరీ్టసీని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు చేస్తున్న అంశం ఏ ఎజెండాలో ఉందో చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. తన వ్యాపారాలకు పనికొచ్చేవే చేస్తున్నారని, అవన్నీ ఎన్నికల మేనెఫెస్టోలో పెట్టే చేస్తున్నారా అని ప్రశ్నించారు. మీరు, మీ కొడుకు, కూతురు, అల్లుడు, బంధువులు సీఎం, మంత్రులు, ఎంపీలు అవుతారని మేనిఫెస్టోలో ప్రకటించారా అని ఎద్దేవా చేశారు. ‘సభాప్రాంగణానికి చేరుకునేందుకు 3 కిలోమీటర్ల దూరం నడిచి రావాల్సిన పరిస్థితి ఏర్పడేలా వేల మంది కార్మికులు వచ్చారు. ఇవి నిరసనలు కాదా.. ధర్నాలు కాదా.. కేసీఆర్కు కని్పంచట్లేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్కు కూతవేటు దూరంలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తే సీమాంధ్ర సీఎం అనుమతించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో కారి్మకులు సభ నిర్వహించుకుంటామంటే అవకాశం లేకుండా చేయటం విడ్డూరమన్నారు. నిజానికి ఆర్టీసీ నష్టాల్లో లేదని, నష్టాల్లోకి నెట్టేశారన్నారు. ధనవంతులు తిరిగే విమాన ఇంధనంపై ఒక శాతం పన్ను వేస్తూ, పేదలు తిరిగే ఆర్టీసీ బస్సుల డీజిల్పై 27.5 శాతం పన్ను వేయటం లాంటివాటి వల్ల నష్టాలు వచ్చాయన్నారు. విమాన ఇంధనంపై పన్ను తగ్గించి ప్రైవేటు సంస్థకు రూ.500 కోట్ల లాభం చేకూర్చి, డీజిల్పై పన్ను పెంచి ఆర్టీసీపై రూ.700 కోట్ల భారం మోపారన్నారు. వేల మంది పోలీసు పహారా పెట్టినా 21న ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా ‘కోట గోడ’ను కొట్టామని, ప్రజలు తలుచుకుంటే ప్రగతి భవనే ఉండదని హెచ్చరించారు. కోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దుతుంటే కేసీఆర్ గాడిద పండ్లు తోముతడా అని మండిపడ్డారు. బుధవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరికి హాజరైన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడెందుకు నష్టాలు: ఎల్.రమణ తాను రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నష్టాల ఆరీ్టసీని లాభాల్లోకి తెచ్చానన్న కేసీఆర్, సీఎం అయ్యాక తీవ్ర నష్టాల్లోకి ఎందుకు వెళ్లిందో చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకే దాన్ని ప్రైవేటీకరించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆర్టీసీ కారి్మకులు కీలకమవుతారని, సాధారణ ప్రయాణికులకు వాస్తవాలు చెప్పటం ద్వారా కనీసం కోటి మందిని ప్రభావితం చేయగలుగుతారని, అది ఎన్నికల ఫలితాన్ని శాసిస్తుందన్నారు. డిస్మిస్ భయం లేని ఆత్మగౌరవ ఉద్యమం: మందకృష్ణ మాదిగ సెల్ఫ్ డిస్మిస్ అంటూ కేసీఆర్ ఎంత బెదిరించినా ఆర్టీసీ కారి్మకులు ఆత్మ గౌరవంతో ఉద్యమం చేస్తున్నారని ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ ఓటమి దిశలో ఉన్నారని, ఆర్టీసీ కారి్మకులు గెలుపుబాటలో ఉన్నారని పేర్కొన్నారు. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రలో ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, మిగులు బడ్జెట్ రాష్ట్రం తెలంగాణలో ప్రైవేటీకరిస్తారా అని ప్రశ్నించారు. ఈ సభ చూస్తే కేసీఆర్కు దడ: జితేందర్రెడ్డి సరూర్నగర్ సభకు వచి్చన కారి్మక జన ప్రవాహం చూస్తే ప్రగతి భవన్లో కేసీఆర్కు దడ ఖాయమని బీజేపీ నేత జితేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఆర్టీసీ కారి్మకులను ఉద్యమంలో వాడుకుని ఇప్పుడు వారినే డిస్మిస్ పేరుతో బెదిరించటం దారుణమన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కరెంటు సరిగా లేకపోయినా దిక్కుండదని, కేసీఆర్కు కావాల్సింది ఓట్లు తప్ప ప్రజల సంక్షేమం కాదన్నారు. ఇప్పటికే ఏ పథకానికీ నిధుల్లేకుండా పోయాయని, ఈ దివాలా ప్రభుత్వం ఎందుకు, కేసీఆర్ను దింపేస్తే సరిపోతుంది కదా అని పేర్కొన్నారు. సభలో కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ నేత వివేక్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి, సీపీఎం నేత నరసింహారావు, చెరుకు సుధాకర్, విమలక్క, జాజుల శ్రీనివాసగౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. గమ్యం చేరి తీరాలి: అశ్వత్థామరెడ్డి కారి్మకులు గెలుపు కోసం పోరాడుతుంటే, ప్రభుత్వం ఓడిపోవొద్దని పోరాడుతోందని, ఏదో సమయంలో కచి్చతంగా ప్రభుత్వం పట్టు సడలి ఓడిపోవటం ఖాయమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గమ్యాన్ని చేరి తీరాల్సిందేనని, ఇందుకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతామని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనుకుంటే ఆరీ్టసీని ప్రైవేటీకరించే తరహా పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. నిర్బంధాన్ని ఛేదించుకుని వేల సంఖ్యలో కారి్మకులు ఈ సభకు తరలి వచ్చారని, ఇదే ఉత్సాహంతో అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగుతారని జేఏసీ కోకనీ్వనర్ రాజిరెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ఆరీ్టసీని విలీనం చేస్తే యూనియన్లనే తాము రద్దు చేసుకుంటామన్నారు. నేడు దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా కారి్మకులంతా ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని ఈ సభలో తీర్మానించారు. గురువారం రాత్రి వరకు ఈ దీక్ష కొనసాగనుంది. నిరాహార దీక్ష చేస్తూ ప్రస్తుతం నిమ్స్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు దీక్ష విరమించేలా చేయాలని కూడా తీర్మానించారు. గురువారం ఉదయం 9 గంటలకు నిమ్స్కు వెళ్లి ఆయనకు నిమ్మరసం ఇచ్చి విరమింపచేయాలని నిర్ణయించినట్లు జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు వెల్లడించారు. -
‘మేనిఫెస్టోలో కేసీఆర్ ఆ విషయం చెప్పారా’
-
ఆర్టీసీ సమ్మె : ‘మేనిఫెస్టోలో కేసీఆర్ ఆ విషయం చెప్పారా’
సాక్షి, హైదరాబాద్: గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు బుధవారం సకల జనుల సమరభేరికి పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ సభలో ఆర్టీసీ కార్మికులు, విపక్ష పార్టీల నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు. సకల జనుల సమరభేరి సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదని చెప్తున్న కేసీఆర్ డీజిల్ మీద 27.5 శాతం వ్యాట్ ఎందుకు వేస్తున్నారని.. ఇది మేనిఫెస్టోలో ఉందా అని ప్రశ్నించారు. 20 శాతం బస్సులను ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి.. వాటిని మేఘా కృష్ణారెడ్డికి ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పారా అని చురకలంటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదని.. ఊసరవెళ్లి ఎర్రబెల్లి అంటారు. సీఎం కేసీఆర్ కూడా విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదు అంటారు.. మరి మీ కొడుకు, కూతురు, అల్లుడుకు మంత్రి పదవులు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పారా. 50 వేల కార్మికుల కుటుంబాలకు మద్దతుగా నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మద్దతుగా నిలించింది. ఏ స్వేచ్ఛ కోసం తెలంగాణ ప్రజలు పోరాడారో.. మళ్లీ నేడు అదే స్వేచ్ఛ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. సకలజనుల సమరభేరికి కోర్టు అనుమతిచ్చి 24 గంటలు గడువకముందే వందల కిలోమీటర్ల నుంచి కార్మిక సోదరులు సరూర్నగర్ గ్రౌండ్లో కదం తొక్కారు. ఇది తెలంగాణ ప్రజల స్ఫూర్తి’ అని రేవంత్ అన్నారు. -
అనగనగా ఆర్టీసీ.. తల్లిపై ప్రేమతో
ప్రజారవాణాలో అతి ముఖ్యమైన ఆర్టీసీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. నిజాం రైల్వేస్లో భాగంగా ‘రోడ్ ట్రాన్స్పోర్టు డివిజన్’ (ఆర్టీడీ) పేరుతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1932లో ప్రగతి చక్రం ప్రస్థానం ప్రారంభమైంది. 22 బస్సులు, 166 మంది సిబ్బందితో తొలుత పరుగులు పెట్టింది. ఆ తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ప్రజా రవాణా రంగంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. అయితే ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం వివిధ సందర్భాల్లో సమ్మెకు దిగిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి చేస్తున్న సమ్మె... ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్దదిగా మారనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కార్మికులు 27 రోజులు సమ్మె చేయగా... ఇప్పుడు చేపట్టిన సమ్మెకు ఇప్పటికే 25 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ...ఒక సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ప్రజా రవాణా సంస్థ. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఆర్టీసీలో కార్మికులు చేపట్టిన సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఇరువై ఐదు రోజులు గడిచినప్పటికీ అనిశ్చితి తొలగిపోవడంలేదు. దీంతో ఇప్పటి వరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలలో ఇదే అతిపెద్ద సమ్మెగా మారుతోంది. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన కాలంలో రోడ్డు రవాణా విభాగం (ఆర్టీడీ)గా నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్లో ఒక విభాగంగా మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగింది. ప్రజా రవాణా రంగంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. నిజానికి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ కాలంలోనే రైల్వే రంగానికి బలమైన పునాదులు ఏర్పడ్డాయి. ఉస్మాన్ అలీఖాన్ సమయంలో రవాణా రంగం బాగా విస్తరించుకుంది. రైల్వే, ఆర్టీసీ, విమానయాన సేవలతో నిజాం రవాణా వ్యవస్థ సుసంపన్నమైంది. గౌలిగూడ బస్స్టేషన్ ఇదే అతి పెద్ద సమ్మె... ♦ ఆర్టీసీలో తరచుగా సమ్మెలు జరుగుతూనే ఉన్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు చివరి అస్త్రంగా సమ్మెను సంధిస్తున్నాయి. జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ బకాయిల చెల్లింపు, ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాను అరికట్టడం, రన్నింగ్ టైమ్ పెంచడం వంటి డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఇప్పటి వరకు అనేక సార్లు సమ్మెకు దిగారు. ♦ సమస్యల పరిష్కారం కోసం 2000 సంవత్సరంలో కార్మికులు 14 రోజుల పాటు సమ్మె చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యాయి. అప్పట్లో సమ్మె జనజీవితంపైన ప్రభావం చూపింది. ప్రైవేట్ రవాణా సదుపాయాలు తక్కువగా ఉండడం, ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీపైనే ఆధారపడడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ♦ మోటారు వాహన పన్ను రద్దుతో పాటు, ఆర్టీసీ అభివృద్ధికి నిధుల కేటాయింపు, తదితర డిమాండ్లతో 2003లో మరోసారి కార్మికులు సమ్మెకు దిగారు. అప్పట్లో సమ్మె ఉధృతంగా సాగింది. 24 రోజుల పాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సమ్మెను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి వైఎస్ రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ♦ ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో సకల జనుల సమ్మెలో భాగంగా 2011 అక్టోబర్ నెలలో కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కార్మికులు ముందంజలో నిలిచారు. సర్వీసులన్నీ స్తంభించాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ♦ కానీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలలో మాత్రం ప్రస్తుతంకొనసాగుతున్నదే అతి పెద్ద సమ్మెగా నిలిచింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితిలో ఇప్పటికే 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో చేపట్టిన ఈ సమ్మెకు కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. ♦ ఈ సమ్మెతో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రైవేట్ సిబ్బంది సహాయంతో పాక్షికంగా బస్సులు నడుపుతునప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ♦ మరోవైపు సమ్మె కారణంగా ఆర్టీసీ సైతం కోట్లాది రూపాయల నష్టాన్ని చవి చూస్తోంది. సాధారణ రోజుల్లో 3750 బస్సులతో, 42 వేల ట్రిప్పులు నడిచే సిటీ బస్సుల్లో ప్రతి రోజు 32 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం 1000 నుంచి 1500 బస్సులు మాత్రం రోడ్డెక్కుతున్నాయి. నిజాం కాలం నాటి బస్ టికెట్ ఇదీ చరిత్ర...... బ్రిటీష్ పాలిత ప్రాంతాలకు ధీటుగా హైదరాబాద్ స్టేట్లో రవాణా సదుపాయాలు విస్తరించుకున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ నగరంలో అప్పటి వరకు కేవలం సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితమైన మోటారు వాహన సదుపాయం క్రమంగా సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్–హైదరాబాద్ నగరాల మధ్య రవాణా సదుపాయాలు పెరిగాయి. ఆ రోజుల్లో ఇదే ప్రధానమైన మార్గం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి హుస్సేన్సాగర్ చెరువు కట్ట మీదుగా ఆబిడ్స్, కోఠీ మార్గంలో బస్సులు తిరిగేవి. 1879లో ఆవిర్భవించిన నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే సంస్థ తొలిసారిగా సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రైల్వే సేవలను ప్రారంభించింది. ఈ నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్లో ఒక విభాగంగానే 1932లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ’నిజాం స్టేట్ రైల్వేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డివిజన్’ను ఏర్పాటు చేశారు.ఇలా హైదరాబాద్ రాజ్యంలో రోడ్డు రవాణా వ్యవస్థ ప్రారంభమైంది. 22 బస్సులు, 166 మంది సిబ్బందితో ఆర్టీసీ ప్రస్థానం మొదలైంది.ఈ బస్సులను స్కాట్లాండ్ ఆటోమొబైల్ సంస్థ అల్బైనో తయారు చేసింది. అప్పటి వరకు ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో ఈ బస్సులను రూపొందించారు. 1932లో తొలిసారి బస్సుల ప్రారంభం... అమ్మ ప్రేమకు గుర్తుగా... నిజాం కాలంలో బస్సు నంబర్ ప్లేట్పై హైదరాబాద్ స్టేట్ను సూచించేలా హెచ్వై తరువాత ’జడ్’ ఉండేది. ఉదాహరణకు ’హెచ్వై జడ్ 223.’ అనే నెంబర్తో బస్సులు కనిపించేవి. ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి మీద ప్రేమతో ఆర్టీసీ బస్సల నెంబర్ప్లేట్లపైన ’జడ్’ అనే అక్షరాన్ని చేర్చారు. మొదట ఆయన తన తల్లి అమాత్ జహరున్నీసా బేగం పేరు మీద రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ప్రభుత్వ సంస్థకు ఓ వ్యక్తి పేరు పెట్టడం తగదని మంత్రులు సూచించడంతో బస్సు నెంబర్లలో తన తల్లిపేరు కలిసి వచ్చేలా ఆమె పేరులోని ’జడ్’ (జహరున్నీసా) అనే అల్ఫాబెటిక్ను చేర్చారు. ఈ సంప్రదాయం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ ప్రారంభమైన 1958 నుంచి కూడా బస్సుల రిజిస్ట్రేషన్లపై ’జడ్’ అనే అక్షరం వచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2014లో ఆర్టీసీ విభజన తర్వాత కూడా ఈ సంప్రదాయం స్థిరంగా ఉంది. ఆర్టీఏలో పోలీసు వాహనాలకు ’ పీ’ సిరీస్తో, రవాణా వాహనాలకు ’టీ’ సీరిస్ నెంబర్లతో, ఆర్టీసీ బస్సులకు ’జడ్’ సిరీస్తో నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. -
నేడు సకల జనుల సమరభేరి
-
నేడు ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం సకల జనుల సమరభేరి పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో విపక్ష పార్టీలన్నీ పాల్గొనబోతున్నాయి. తొలుత ఈ సభను సరూర్నగర్ మైదా నంలో భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్నా.. హైకోర్టు సూచనలతో పరిమితులతో కూడిన సభలాగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ జరగనుంది. స్టేడియం సామర్థ్యం ఐదు వేలే... సభను 3 లక్షల మందితో భారీగా నిర్వహించాలని జేఏసీ తొలుత నిర్ణయించింది. వీరిలో దాదాపు లక్షన్నర మంది కార్మికుల కుటుంబీకులే ఉంటారని అంచనా వేసింది. సమ్మెకు విపక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుండటంతో, జనసమీకరణకు ఆయా పార్టీలన్నీ హామీ ఇచ్చాయి. సరూర్నగర్ మైదానంలో సభకు ప్రణాళిక సిద్ధం చేసుకుని అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతో మంగళవారం జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న అనంతరం షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఫలితంగా వేదికను ఇండోర్ స్టేడియంలోకి మార్చాల్సి వచి్చంది. స్టేడియం సామర్థ్యం కేవలం 5 వేలే కావడంతో జనసమీకరణ కసరత్తును విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉధృతంగా నిరసనలు.. హైకోర్టు వ్యాఖ్యలతో కార్మికుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో గత రెండు రోజులుగా వారు నిరసనల హోరు పెంచారు. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, విపక్షాల కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఆర్మూర్లో కార్మికులు, అఖిలపక్ష నేతలు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి బస్టాండు వద్ద కార్మికులు మోకాళ్లపై మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాట సహాయ నిధికి తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పక్షాన రూ.25 వేలు, కామారెడ్డి కోర్టు సిబ్బంది రూ.5 వేలు అందజేశారు. సమ్మె మొదలయ్యాక మృతి చెందిన ఆర్టీసీ కార్మికులకు బాన్సువాడ, జగిత్యాల, మెట్పల్లి, గోదావరిఖని, హుస్నాబాద్ డిపోల వద్ద నివాళులరి్పంచారు. మంథని వద్ద గోదావరి నదిలో బీజేపీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. నల్లగొండలో కార్మికుల నిరసనలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మద్దతు ప్రకటించారు. కండక్టర్ నీరజ ఆత్మహత్య నేపథ్యంలో సత్తుపల్లిలో బంద్కు పిలుపినివ్వటంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. సీఐటీయూ నేతను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కార్యకర్తలు, కార్మికులు ఖమ్మం టూటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సిద్దిపేటలో కార్మికుల దీక్షా శిబిరం వద్ద సీపీఐ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కార్మికులకు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆర్టీసీ పరిరక్షణ, హక్కుల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది వీరోచిత పోరాటమని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కొనియాడింది. వారి పోరాటానికి ఏపీఎస్ఆరీ్టసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మరోవైపు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 73 శాతం బస్సులను తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. ‘కోర్టుకు తప్పుడు వివరాలిస్తోంది’ ప్రభుత్వం కోర్టుకు తప్పుడు వివరాలు అందిస్తోం దని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. ముఖ్యంగా నిధులకు సంబంధించి తప్పుడు లెక్కలు ఇస్తోందని ఆరోపించింది. మంగళవారం సాయంత్రం జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్రావు తదితరులు మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో 2014 వరకు రూ.1,099 కోట్లు, ఆ తర్వాత 2019 వరకు రూ.1,375 కోట్లు రాయితీ పాస్లకు సంబంధించి రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాల్సి ఉందని, జీహెచ్ఎంసీ నుంచి రూ.1,496 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామంటూ ప్రభుత్వం చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. షరతులతో హైకోర్టు అనుమతి ఆర్టీసీ జేఏసీ బుధవారం తలపెట్టిన సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. దీని ప్రకారం సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. సరూర్నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఈనెల 24న పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. అయితే, పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ టి.వినోద్కుమార్ షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య సభ నిర్వహించి, 7 గంటల కల్లా ఖాళీ చేయాలని, శాంతియుతంగా నిర్వహిస్తామని పోలీసులకు జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి హామీ ఇవ్వాలని ఆదేశించారు. సభలో ప్రసంగించే వారి సంఖ్యను ఐదుగురికి పరిమితం చేయాలన్నారు. మరో ఒకరిద్దరికి అవకాశం ఇవ్వొచ్చని, ప్రసంగించే వారి పేర్లను పోలీసులకు ఇవ్వాలని సూచించారు. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఐదువేల మందికి మించి పాల్గొనవద్దని ఆదేశించారు. -
ఆర్టీసీ సమ్మె: ఏపీలో ఉద్యమాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నేత దామోదర్ మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని మద్దతు తెలిపారు. అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామన్నారు. వీరికి మద్దతుగా ఏపీలోనూ ఉద్యమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘గతంలో చంద్రబాబుకు పోటీగా ఒకశాతం అదనంగా ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కమిటీ వేశారు. మరి ఆ పని మీరెందుకు చేయడం లేదు’ అని కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. కార్మికులు సంస్థ పరిరక్షణ, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం నేత వైవీ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేసీఆర్ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇక్కడ కార్మికులు పోరాటం ప్రారంభించాక వారికి మద్దతుగా ఏపీలో కూడా జేఏసీగా ఏర్పాటై ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా సరే, పోరాటంలో కార్మికులదే అంతిమ విజయమని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ ఫెడరేషన్ కూడా ఆందోళనకు సిద్ధమవుతుందని వెల్లడించారు. త్వరలో అన్ని రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులతో కలిసి ‘చలో తెలంగాణ కార్యక్రమం’ చేపడతామని ప్రకటించారు. (చదవండి: 25వ రోజుకు ఆర్టీసీ సమ్మె: చరిత్రలోనే పెద్దది రికార్డు) సమ్మెకు మద్దతు తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని ఆదుకుంటానని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం సంస్థకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదన్న విషయాన్ని కోర్టుకు వివరించామన్నారు. 25 రోజులుగా జరుగుతున్న సమ్మెలో 28 మంది కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ విడిపోలేదని.. సంస్థలు, సర్వీసులు కలిసే ఉన్నందున అక్కడ ప్రభుత్వంలో విలీనం చేసినట్టే ఇక్కడా చేయమంటున్నామని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పల్లె వెలుగు నష్టాలు ప్రభుత్వం భరించాలని... నష్టాన్ని భరించలేకపోతే సంస్థకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు. -
25వ రోజుకు ఆర్టీసీ సమ్మె: చరిత్రలోనే పెద్దది రికార్డు
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధనలో భాగంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారంతో 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె సంస్థ చరిత్రలో ఇదే అతి పెద్దదిగా రికార్డు నమోదు చేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా 27 రోజులపాటు సమ్మెలో పాల్గొన్నారు. కానీ కార్మికుల డిమాండ్ల సాధనే లక్ష్యంగా జరిగిన సమ్మెల్లో మాత్రం ఇదే పెద్దది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ పరిరక్షణ- వేతన సవరణ డిమాండ్తో 24 రోజులపాటు సమ్మె చేశారు. 1967లో 20 రోజులపాటు సమ్మె జరిగింది. ఇక, సమ్మెలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు సమ్మెపై హైకోర్టులో మంగళవారం కీలక విచారణ జరగనుంది. -
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు...
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీకి చట్ట ప్రకారం చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల బకాయిల్లో కనీసం రూ.47 కోట్లయినా ప్రభుత్వం ఇచ్చే స్థితిలో ఉందో లేదో వెంటనే తెలపాలి. సమస్యను యూనియన్, ఇతర అంశాల కోణంలో చూడొద్దు. సామాన్య ప్రజల రవాణా ఇబ్బందుల కోణంలోనే చూడాలి. నెల రోజులు కావొస్తున్నా ఇప్పటికీ 40 శాతమే బస్సులు నడుస్తున్నాయి. ఆదిలాబాద్లో ఓ గిరిజన వ్యక్తి తన బిడ్డకు జబ్బు చేస్తే చేతుల్లో పెట్టుకుని వరంగల్ ఆస్పత్రికి తీసుకెళ్లగలడా. మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కు డెంగీతో బాధపడే రోగిని అంబులెన్స్, ప్రైవేటు వాహనాల్లో తీసుకురాలేని వాళ్లు తన బిడ్డల ప్రాణాలపై ఆశలు వదులుకోవాలా? అలాంటి వాళ్లను చచ్చిపోనిస్తుందా ప్రభుత్వం? ప్రభుత్వం తక్షణమే రూ.47 కోట్లు ఇస్తే.. బిడ్డల ప్రాణాలు నిలుస్తాయి కదా.. ప్రభుత్వం ఆర్థికంగా ఆర్టీసీని ఎలా ఆదుకుని నాలుగు డిమాండ్ల పరిష్కారానికి ఏ నిర్ణయం తీసుకుంటుందో మంగళవారం చెప్పాలి’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని, అలాగే కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చిత్తశుద్ధి గల ఉన్నతాధికారి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్, ఇతరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాల్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం 2 గంటల పాటు విచారించింది. అన్ని డిమాండ్లపై చర్చించాలి కదా.. తొలుత ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదిస్తూ.. ఈ నెల 26న యూనియన్ ప్రతినిధులతో చర్చలకు ఆహ్వానించామని, అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆంశంపై చర్చిస్తేనే ఇతర అంశాల్లోకి వెళ్తామని యూనియన్ ప్రతినిధులు షరతు విధించారని చెప్పారు. యూనియన్ల తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదిస్తూ.. విలీనం డిమాండ్ వదులుకున్నామని తాను చెప్పినట్లు ప్రభుత్వ న్యాయవాదే చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. 21 డిమాండ్లనే చర్చించాలని హైకోర్టు చెప్పినట్లు అధికారులు తప్పుగా పేర్కొన్నారని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. 21 డిమాండ్లు ఆర్థికంగా పెద్దగా సంబంధం లేనివని మాత్రమే చెప్పామని, అన్ని డిమాండ్లపైనా చర్చ జరపాలనే 18న ఉత్తర్వులు ఇచ్చామని స్పష్టం చేసింది. ఎక్కడో ఓ చోట నుంచి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నాల్లో భాగంగా 21 డిమాండ్లపై చర్చలు జరిపి ఉంటే విశ్వాసం పెరిగేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు తగ్గిందనే భావన వచ్చేదని అభిప్రాయపడింది. అలాంటప్పుడు చర్చలెందుకు..? చర్చలకు ముందే ఫలితాలు ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి ఈడీ కమిటీ నివేదిక రూపొందించినట్లు ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్లోజ్డ్ మైండ్ ఫలితం కూడా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు చర్చలు జరపడం ఎందుకు? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 4 డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయని తేల్చిన కమిటీ.. మిగిలిన డిమాండ్లను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. కోర్టు అంటే ఆషామాషీగా తీసుకున్నట్లుగా ఉందని, ప్రధానంగా ఉన్నతాధికారుల వైఖరి దారుణంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీవ్ర ఆర్థిక భారమయ్యే డిమాండ్లు రెండే ఉన్నాయని, మిగిలిన డిమాండ్లపై అధికారులు ఎందుకు కసరత్తు చేయలేదని ప్రశ్నించింది. గతంలో కార్మికులకు 44 శాతం వేతనం పెంచామని ఏఏజీ చెప్పగానే, అప్పుడు అంత విశాల హృదయంతో ఉదారంగా ఇవ్వడమెందుకో, ఇప్పుడు ఏమీ ఇవ్వలేమనడం ఎందుకో, అప్పుడు 22 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కాదు కదా అని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగుల్ని తొలగించారో చెప్పాలని ధర్మాసనం కోరగా, ఆర్టీసీ ఉద్యోగుల్లో మార్పు వస్తుందనే ఆశతో ఉన్నామని ఏఏజీ బదులిచ్చారు. కార్మికులు కారణం కాదు ప్రకాశ్రెడ్డి వాదిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన రాయితీల వల్ల ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు రూ.4 వేల కోట్లకుపైగా ఉన్నాయని, వీటిని ప్రభుత్వం చెల్లించకపోగా అప్పులు చేసి ఆర్టీసీ కార్పొరేషన్ను ఆర్థికంగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని చెప్పారు. సిటీ బస్సులకు జీహెచ్ఎంసీ 1,492 కోట్లు, ప్రభుత్వ రాయితీల నిమిత్తం రూ.1,099 కోట్లు, ఉద్యోగుల పీఎఫ్ రూ.454 కోట్లు, ఉద్యోగుల సహకార సంఘం నిధులు రూ.400 కోట్ల వరకు మొత్తం రూ.4 వేలు కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని పేర్కొన్నారు. డిపోలను 95 నుంచి 97కు పెంచారని, ఉద్యోగులు 65,740 నుంచి 49,733కు తగ్గినా సగటు ఉత్పాదక పెరిగిందని, నష్టాలకు ప్రభుత్వ/ఆర్టీసీ సంస్థ యాజమాన్య నిర్వాకమే కారణమని చెప్పారు. తలసరి ఉత్పాదకత 55 కి.మీ. నుంచి 61 కి.మీ.లకు పెరిగిందని, సగటు 326 కి.మీ. నుంచి 342 కి.మీ. నడపుతున్నారని, 91.48 లక్షల నుంచి 97.55 లక్షలకు రోజుకు గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఆక్యుపెన్సీ 69 శాతం నుంచి 74.5 శాతానికి పెరిగేందుకు ఆర్టీసీ కార్మికులు శ్రమించారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన రాయితీల బకాయిల్లో రూ.47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్–226 కింద ప్రతీది న్యాయ సమీక్ష చేసేందుకు హైకోర్టుకు తావులేదని ఏఏజీ అనడాన్ని కోర్టు తప్పపట్టింది. ‘10 వేల బస్సుల్లో 4 వేలు మాత్రమే నెల రోజులుగా నడుస్తున్నాయి. ప్రజా రవాణా కుంటుపడింది. రోగుల ఇక్కట్లు వర్ణనాతీతం. సామాన్య ప్రజల కష్టాలే తమ ముందు ప్రధాన అంశం. పౌరహక్కులు, మానవహక్కుల అంశంతో ముడిపడిన వ్యవహారమిది. మాకు ఆకాశమే హద్దు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం న్యాయ సమీక్ష చేస్తాం’అని ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఏజీ హాజరుకు ఆదేశం.. చాలా కార్యక్రమాలకు, పథకాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రజా రవాణా సమస్య పరిష్కారానికి రూ.47 కోట్లు ఇవ్వగలదో లేదో, ఆ విధమైన ఆర్థిక స్థోమత ఉందో లేదో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఆర్టీసీ సొంతగా ఆర్థికాభివృద్ధి సాధించాలని, ఎంతకాలం ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని ఏఏజీ బదులిస్తూ.. ప్రస్తుతం రూ.10 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ తాము ప్రభుత్వం నుంచి సమాచారాన్ని తెలుసుకోవాలని నిర్ణయించామని, హైకోర్టు ప్రభుత్వ ప్రతినిధిగా ఏజీని విచారణకు పిలిపించాలని ఆదేశించింది. ఏజీ వచ్చిన వెంటనే ‘ఈడీ కమిటీ నివేదికలో 4 డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు అవసరం అవుతాయని తేల్చింది. ఆ మొత్తాన్ని వెంటనే ప్రభుత్వం ఇవ్వగలదో లేదో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని సంప్రదించి మంగళవారం చెప్పండి. మిగిలిన డిమాండ్లకు ఆర్థికంగా ఎంత భారం పడుతుందో తెలుసుకోండి. వీటి విషయంలో కసరత్తు చేసినట్లుగా ఈడీల నివేదికలో లేదు’అని ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని ఏజీ కోరితే మంగళవారం ఉదయం బదులు మధ్యాహ్నం విచారిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కీలక వివరణ కోరిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై హైకోర్టు నిలదీసింది. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన రూ. 1475 కోట్లు, ప్రభుత్వ సబ్సిడీ కింద రావాల్సిన రూ. 1492 కోట్లతోపాటు ప్రభుత్వం నుంచి రూ. 2,300 కోట్ల చెల్లింపులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే రేపటిలోగా (మంగళవారం) వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. ఎలుండి వరకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అందుకు హైకోర్టు అంగీకరించలేదు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆర్టీసీకి నిధుల బకాయిలపై రేపటిలోగా పూర్తి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకపోవడం వల్లే నష్టాలు! ఇక ఆర్టీసీ కార్మిక సంఘాల తరఫున వాదనలు వినిపించిన ప్రకాశ్ రెడ్డి.. కార్మికులు లేవనెత్తిన ప్రతి అంశంమీద చర్చలు జరపాల్సిందేనని హైకోర్టుకు నివేదించారు. కార్మికుల 26 డిమాండ్లను కచ్చితంగా చర్చించాలన్నారు. కార్మికులు లేవనెత్తిన అంశాలు మొత్తం న్యాయపరమైనవేనని, వీటివల్ల ఆర్ధికభారం పడుతుందని ప్రభుత్వం వాయిదావేస్తూ వస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్కు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాకనే ఆర్టీసీ నష్టాల్లో ఉందని వివరించారు. ఆర్టీసీ కార్పొరేషన్కు ఇప్పటివరకు పూర్తిస్థాయి ఎండీని ప్రభుత్వం నియమించలేదని, ఎండీ ఉండి ఉంటే, కార్మికులు తమ సమస్యలను ఆయనకు చెప్పుకునేవారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లో మాట్లాడిన అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టుకు తప్పుడు లెక్కలు! ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎంఎన్యూ) జాతీయ అధ్యక్షుడు మౌలాలా ఆరోపించారు. ఆర్టీసీకి బకాయిలపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని అన్నారు. సమ్మె చట్టబద్ధమేనని హైకోర్టు చెప్పిందని, కార్మికులు అధైర్యపడవద్దని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. చదవండి: ఆర్టీసీ సమ్మెపై విచారణ: హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆగ్రహం.. ఏజీ రావాల్సిందే! -
ఆర్టీసీ సమ్మెపై విచారణ: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరపాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదనీ, చర్చలు జరపకుండానే కార్మిక నేతలు బయటకు వెళ్లిపోయారని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. విలీనం డిమాండ్కు పట్టుబట్టకుండా మిగతా డిమాండ్లపై చర్చ జరపవచ్చు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. విలీనం డిమాండ్ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చించాలని కార్మిక సంఘాలకు సూచించింది. మొత్తం 45 డిమాండ్లలో ఆర్టీసీ సంస్థపై ఆర్థికభారం పడని డిమాండ్లపై చర్చ జరగాలని, మొదట 21డిమాండ్లపై చర్చ జరిగితే కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఓవర్ నైట్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విలీనం డిమాండ్ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చ జరపాలని, లేకపోతే సమ్మె విషయంలో ప్రతిష్టంభన కొనసాగి.. ఇటు కార్మికులు, అటు ప్రజలు ఇబ్బంది పడతారని న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు కార్మిక సంఘాల తరఫు న్యాయవాది ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చర్చల విషయంలో హైకోర్టు ఆదేశాలను ఆర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని పేర్కొన్నారు. కేవలం 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారని, ఇతర డిమాండ్లపై వారు చర్చించడం లేదని పేర్కొన్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆగ్రహం.. ఏజీ రావాల్సిందే! చదవండి: ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కీలక వివరణ కోరిన హైకోర్టు -
కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికుల బైఠాయింపు
-
‘రాత్రి వరకు ఆరోగ్యం బాగానే ఉంది.. కావాలనే’
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కూనంనేని సాంబశివరావును సోమవారం ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై రెండు రోజులుగా కూనంనేని సాంబశివరావు కార్మికులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పోలీసులు సాంబశివరావును అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్బంధకాండను కొనసాగిస్తూ అక్రమ అరెస్టులు చేపడుతుందని మండిపడ్డారు. నిన్న రాత్రి వరకు ఆయన దగ్గరే ఉన్నామని.. అప్పటి వరకు ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని రాజిరెడ్డి తెలిపారు. మెడికల్ టెస్టుల పేరిట కావాలనే రాత్రి 2 గంటల సమయంలో పోలీసులను పంపించి అరెస్టు చేయించారని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, అధికారుల మధ్య జరిగిన చర్చలు సైతం ప్రభుత్వం నిర్భంధంగా జరిపిందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని కేసీఆర్కు భయం పట్టిందని, అందుకే అక్రమ అరెస్టులు కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. -
ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. ఎండీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, అధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. చర్చలు విఫలం కావడానికి కారణం మీరంటే మీరు అని ఇరు పక్షాలు ఆరోపించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం సంస్థ ఎండీకి లేఖాస్త్రాన్ని సంధించారు. మొత్తం 45 డిమాండ్లపై చర్చకు సిద్ధమంటూ లేఖలో నేతలు పేర్కొన్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపు కలెక్టరేట్ల ముట్టడి ఆర్టీసీ సమ్మెలో భాగంగా తమ ఉద్యమాన్ని కార్మిక సంఘాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపునకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనను విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. -
చర్చలు విఫలం
-
హోరెత్తిన ధర్నాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలతో హోరెత్తించారు. కుటుంబ సభ్యులతో కలసి డిపోల ఎదుట ధర్నాలు చేపట్టారు. చర్చ లు జరుగుతాయన్న సమాచారం ఉన్నా సమ్మె మాత్రం ఉధృతంగా కొనసాగింది. ఈనెల 30న సరూర్నగర్లో సకల జనుల సమరభేరి పేరుతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని నిర్ణయించినందున అందుకు జనసమీకరణ కసరత్తు కూడా ప్రారంభించారు. సమ్మెలో ఉన్న కార్మికులు కుటుంబసభ్యులతో కలసి ఆ సభకు హాజరు కావాలంటూ ఎవరికివారు ప్రచారం చేస్తున్నారు. స్థానిక విపక్ష నేతలను కలిసి ఆయా పార్టీల కార్యకర్తలు, సాధారణ జనం కూడా సభకు తరలాలని కోరుతున్నారు. ఆదివారం దీపావళి పండుగ కావ టంతో సొంతూళ్లకు వెళ్లేవారితో శనివారం బస్టాండ్లు కిటకిటలాడాయి. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను తిప్పినా అవి సరి పోక జనం ఇబ్బంది పడాల్సి వచ్చింది. పండుగకు బస్సు కష్టాలు.. దసరా వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు నానా తిప్పలు పడ్డ అనుభవంతో కొందరు ప్రయాణాలు మానుకోవటం విశేషం. పండగ రద్దీ నేపథ్యంలో గత 20 రోజుల్లో తొలిసారి శనివారం 75% బస్సులు తిప్పినట్టు అధికారులంటున్నారు. మొత్తం బస్సులు తిప్పినా పండుగ రద్దీ తాకిడికి సరిపోని పరిస్థితి. అలాంటిది ఉన్న బస్సు ల్లో 75% తిప్పటంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రైవేటు వాహనాలకు గిరాకీ పెరిగింది. అధిక చార్జీలు వసూలు చేయటంతో వారి జేబులకు చిల్లు్ల పడింది. దసరా సమయంలో ప్రైవేటు బస్సులు వచ్చినట్టుగానే శనివారం కూడా చాలా బస్టాండ్లలో వీటి హవా కనిపించింది. మెదక్లో ఆర్టీసీ కార్మికులు కొందరు హోటళ్లలో పని చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. హుస్నాబాద్, జహీరాబాద్ డిపోల ముందు ధర్నాలు చేశారు. మెదక్ డిపో ఎదుట మహిళా కండక్టర్లు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అరగుండు..అరమీసం.. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల ఎదుట కార్మికులు పిల్లలతో కలిసి ధర్నాలు చేపట్టారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ వారు చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం బస్ డిపో వద్ద కార్మికుల నిరసనకు సంఘీభావంగా అఖిలపక్ష నేతలు చెవిలో పూలతో పాల్గొన్నారు. కార్మి కులకు మద్దతుగా వామపక్ష విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మెట్పల్లి డిపో వద్ద సమ్మయ్య, జేఆర్రావు అనే డ్రైవర్లు అరగుండు, అరమీసంతో నిరసన చేపట్టారు. గోదావరి ఖని డిపో వద్ద నిరసనలు చేపట్టారు.మంథనిలో కార్మికుల కుటుం బీకుల నిరసనలో ఎమ్మెల్యే శ్రీధర్బాబు పాల్గొన్నారు.శనివారం 4782 ఆర్టీసీ బస్సులు, 1944 అద్దె బస్సులు మొత్తం 6,726 బస్సులు తిప్పినట్టు అధికారులు ప్రకటించారు. 4,782 ప్రైవేటు డ్రైవర్లు, 6,726 మంది కండక్టర్లు విధుల్లో ఉన్నట్టు వెల్లడించారు. 4,961 బస్సుల్లో టికెట్ జారీ యంత్రాలు, 939 బస్సుల్లో సాధార ణంగా టికెట్ల జారీ జరిగిందన్నారు. బస్సుల కోసం 22 వేల దరఖాస్తులు తాజాగా అద్దె బస్సుల కోసం పిలిచిన టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,248 బస్సుల కోసం టెండర్లు పిలిచారు. టెండరు పత్రాల దాఖలు శనివారం సాయంత్రం వరకు సాగింది. 22,300 దరఖాస్తులు రావటం విశేషం. హైదరాబాద్లో 248 బస్సులకు టెండర్లు పిలవగా 332 దరఖాస్తులు అందాయి. జిల్లాల్లో వేయి బస్సులకు గాను 22 వేల దరఖాస్తులు వచ్చాయి. వారం క్రితం వేయి బస్సులకు టెండర్లు పిలవగా జిల్లాల్లో 9,700 దరఖాస్తులు రాగా హైదరాబాద్లో మాత్రం 18 వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో బస్సులు సిద్ధంగా ఉన్నవారికి ప్రాధాన్యమిస్తూ అనుమతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత 48 గంటల్లోనే బస్సు నడుపుకొనేందుకు అనుమతిస్తారు. కానీ రెడీగా బస్సులు ఉన్న టెండర్లు 90 మాత్రమే అందినట్టు తెలిసింది. బస్సులు లేని వారిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు 90 రోజుల్లో బస్సులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. -
జెండాలో నుంచి గులాబీ రంగు మాయం..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ మరింత ఉధృతమవుతోంది. యాజమాన్యంతో శనివారం జరిగిన ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) కీలక నిర్ణయం తీసుకుంది. టీఎంయూ జెండా రంగు మార్చుకుంది. గులాబీ రంగులో ఉన్న జెండాలు తొలగించి.. తెల్లరంగు జెండాలు వాడాలని టీఎంయూ నిర్ణయించింది. తెల్లరంగు జెండాపై ధనస్సు గుర్తుతో టీఎంయూ జెండా కొత్త రూపు సంతరించుకుంది. రేపు కొత్త జెండాతో టీఎంయూ ఆవిర్భావ దినోత్సవం జరపుకోనుంది. (చదవండి : ఆర్టీసీ చర్చలు : ‘మొబైల్ ఫోన్లు లాక్కున్నారు’) (చదవండి : ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’) -
ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’
-
ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ముందే చెప్పినట్టు ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ తెలిపారు. చర్చలు జరుగుతుండగా మళ్లీ వస్తామని చెప్పి ఆర్టీసీ జేఏసీ నేతలే వెళ్లిపోయారని అన్నారు. వారు మళ్లీ తిరిగి వచ్చినా చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన 21 అంశాలపై చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా మాట్లాడుతూ.. ‘26 డిమాండ్లపై చర్చించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు అన్నారు. విలీనంపై కూడా చర్చ జరపాలని పట్టుబట్టారు. విలీనంపై చర్చ సాధ్యంకాదు అన్నాం. దాంతో సభ్యులతో చర్చించుకుని వస్తామన్నారు. ఇప్పటివరకు రాలేదు’అని చెప్పారు. కాగా, ఎర్రమంజిల్లోని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 22వ రోజుకు చేరింది. (చదవండి : ఆర్టీసీ చర్చలు : ‘మొబైల్ ఫోన్లు లాక్కున్నారు’ -
నిర్బంధంగా చర్చల ప్రక్రియ కొనసాగింది
-
ఆర్టీసీ చర్చలు : ‘అందుకే బయటికి వచ్చేశాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ నేతలతో యాజమాన్యం చర్చలు విఫలమయ్యాయి. ఎర్రమంజిల్లోని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కోర్టు ఉత్తర్వులు అమలు చేశామని చెప్పడానికే చర్చలు పెట్టారని, సమస్యల పరిష్కారం కోసం కాదని జేఏసీ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ‘నిర్బంధంగా చర్చల ప్రక్రియ కొనసాగింది. మా మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. కేవలం నలుగురిని మాత్రమే చర్చలకు ఆహ్వానించారు. కోర్టు తీర్పును వక్రీకరించి 21 అంశాలపైననే చర్చిస్తామని యాజమన్యం స్పష్టం చేసింది. పూర్తి డిమాండ్లపై చర్చలు జరపాలని మేము పట్టుబట్టాం. 26 డిమాండ్లపై చర్చలు జరపాలని అన్నాం. యాజమాన్యం మా మాటల్ని పట్టించుకోలేదు. అందుకే బయటికి వచ్చేశాం. సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. మా డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా వెళ్తాం’అన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 22వ రోజుకు చేరింది. -
ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు టైమ్ ఫిక్స్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎట్టకేలకు చర్చలకు ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ఉన్న ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో ఈ చర్చలు జరుగుతాయని సమాచారం. అయితే కార్మిక సంఘాల నేతలతో చర్చల్లో ఆర్టీసీ ఈడీలు పాల్గొంటారని తెలిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు 5 గంటల పాటు జరిగిన సమీక్షలో ఎట్టకేలకు చర్చల ప్రక్రియకు సీఎం కేసీఆర్ సమ్మతం తెలిపినట్లు సమాచారం. ఈ నెల 28న హైకోర్టులో సమ్మెపై విచారణ ఉన్న నేపథ్యంలో చర్చలు జరిపి వివరాలు కోర్టుకు సమర్పించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. గడువు ఎక్కువగా లేనందున శనివారమే చర్చలకు ముహూర్తం ఖాయం చేశారు. సమ్మె ప్రారంభం కాకముందు ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ చర్చలు జరిపిన ఎర్రమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఈ చర్చలు ఉంటాయని తెలుస్తోంది. బస్భవన్లోనే చర్చలు జరపాలని తొలుత భావించినా, అక్కడికి పెద్ద సంఖ్యలో కార్మికులు వచ్చే అవకాశం ఉండటంతో ఎర్రమంజిల్లో జరపాలని భావిస్తున్నట్లు తెలిసింది. చర్చల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించకపోవటం విశేషం. శుక్రవారం రాత్రి పొద్దుపోయేవరకు అటు కార్మిక సంఘాల జేఏసీకి కూడా ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది. నివేదికపై సుదీర్ఘ చర్చ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ కాకుండా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపై పరిశీలించి నివేదిక సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. సమ్మె పరిష్కారానికి చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు సునీల్శర్మను ఆదేశించిన నేపథ్యంలో, కమిటీ ఏర్పాటు బాధ్యతను సునీల్శర్మకే సీఎం అప్పగించారు. మూడు రోజుల కింద జరిగిన సమీక్షలో సీఎం సమక్షంలోనే ఎండీ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ గురువారమే నివేదికను సిద్ధం చేయగా, అదేరోజు సాయంత్రం ఎండీకి సమర్పించారు. దీనిపై చర్చించిన ఎండీ చేసిన సూచనల మేరకు పలు మార్పులు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మరోసారి కమిటీ సభ్యులు భేటీ అయి తుది నివేదిక సిద్ధం చేసి సాయంత్రం ఎండీకి అందజేశారు. ప్రగతిభవన్లో నివేదికపై దాదాపు 5 గంటలపాటు సీఎం సమీక్షించారు. కార్మికులతో చర్చలు జరపాలా వద్దా.. జరిపితే ఏయే అంశాలు ఎజెండాలో ఉండాలి.. సమ్మె పర్యవసానాలు, సమ్మెకు దారితీసిన పరిస్థితులు, తరచూ సమ్మెల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, ఆర్టీసీ కుప్పకూలే దుస్థితికి చేరుకోవటానికి దారితీసిన పరిస్థితులు.. ఇలా సమగ్ర సమాచారాన్ని కోర్టుకు సమర్పించటం తదితర అంశాలపై చర్చించారు. సమ్మెపై పలుసార్లు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆర్టీసీ ఇన్చార్జి ఎండీకి చేసిన సూచనలు, ఐఏఎస్ అధికారుల కమిటీ తీరుపై చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చాయి. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడని డిమాండ్లపైనే ఈ చర్చలు ఉంటాయని తెలుస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ప్రధాన డిమాండుగా జేఏసీ పేర్కొంటున్నా, అసలు దాన్ని పరిగణనలోకే తీసుకోబోమని సీఎం ఇప్పటికే తేల్చిచెప్పారు. దీంతో ఇప్పుడు చర్చల్లో ఆ అంశం ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. కోర్టు సూచించినట్లు మిగతా అంశాల ప్రస్తావనే ఉండనుంది. కాగా, సమావేశానంతరం సీఎంవో నుంచి కానీ, ఆర్టీసీ నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అధికారులు కూడా మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. ప్రభుత్వానికి నివేదిక మూడు రోజుల పాటు కసరత్తు చేసిన అనంతరం ఆర్టీసీ ఉన్నతాధికారుల కమిటీ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ఆర్టీసీ ఎండీ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు కసరత్తు చేసి ఆర్టీసీ ఈడీలు టి.వెంకటేశ్వరరావు, ఎం.వెంకటేశ్వరరావు, వినోద్కుమార్, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఆర్టీసీ ఆర్థిక సలహాదారు రమేశ్లతో కూడిన ఈ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. దాన్ని సీఎం కేసీఆర్కు అందజేశారు. అంతా రికార్డు చేయాలి: అశ్వత్థామరెడ్డి చర్చలకు ఆహ్వానిస్తే సంతోషమేనని, అయితే ఆర్టీసీ విలీనం అంశం కూడా చర్చల్లో ఉండాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి శుక్రవారం రాత్రి ‘సాక్షి’తో తేల్చిచెప్పారు. చర్చల ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేయాలని తాము కోరబోతున్నట్లు వెల్లడించారు. వీడియో రికార్డు జరపలేకపోతే చర్చల సారాంశాన్ని నమోదు చేసి తమ సంతకాలు, చర్చల్లో పాల్గొన్న అధికారుల సంతకాలు తీసుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు. -
సర్కారు దిగొచ్చే వరకు..
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టంచేసింది. కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం 20వ రోజుకు చేరుకుంది. అయితే, సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కార్మికుల్లో ఆందోళన రేగింది. దీంతో జేఏసీ నేతలు రంగంలోకి దిగి ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అక్కడి కార్మికులతో సమావేశం నిర్వహించి ఆందోళన విరమించుకోవద్దని పేర్కొనగా, హైదరాబాద్లో ఉన్న జేఏసీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్మికులకు సూచనలు చేశారు. కార్మికుల రక్షణకు హైకోర్టు జోక్యం చేసుకుంటుందని, కోర్టు ఉన్నాక అన్యాయం జరిగే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలపై జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చాక ఆర్టీసీకి రూ.4,250 కోట్లు ఇచ్చినట్టు చెప్పిన మాటల్లో నిజం లేదని, కేవలం రూ.712 కోట్లు మాత్రమే ఇచ్చారని స్పష్టంచేశారు. ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయం.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో సమ్మె కార్యాచరణను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన రాస్తారోకోలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు పేర్కొన్న జేఏసీ.. దాని బదులు ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలకు వెళ్లి సమ్మెకు దారి తీసిన పరిస్థితులను విద్యార్థులకు వివరించి వారి మద్దతు కూడగట్టుకోవాలని నిర్ణయించింది. మరోవైపు గురువారం కూడా అన్ని డిపోల ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు. ఉదయం వేళ కొన్ని బస్సులను అడ్డుకున్నా, పోలీసుల జోక్యంతో అవి రోడ్డెక్కాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు తిప్పుతున్నా, హైదరాబాద్లో మాత్రం వాటి జాడే కనిపించకపోతుండటం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బస్సుల్లేక సకాలంలో విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నామని పేర్కొంటూ ఆందోళనలు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్ నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద కొందరు ప్రయాణికులు రోడ్డుపై నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గురువారం 6,395 బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,290 బస్సుల్లో టికెట్ల జారీ యంత్రాలు వినియోగించారని, 1531 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని అధికారులు పేర్కొన్నారు. రేపు ఎండీకి కమిటీ నివేదిక.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో ఆర్టీసీ ఎండీ ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల ఉన్నతాధికారుల కమిటీ రెండు రోజులపాటు చర్చించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగిలిన 21 డిమాండ్లపై సూచనలు సిద్ధం చేసింది. అనంతరం గురువారం సాయంత్రం ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్శర్మతో కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా నివేదికలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించింది. శనివారం తుది నివేదికను ఎండీకి అందజేయనుంది. -
బెట్టు వద్దు..మెట్టు దిగండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం ఇరు వర్గాలు పట్టు విడుపుల ధోరణితో వ్యవహరించాలని, ఇద్దరూ ఒక మెట్టు దిగాలని హైకోర్టు సూచించింది. అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం మెట్టు దిగకపోతే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్చల ప్రక్రియను పర్యవేక్షించాలని, చర్చల ద్వారానే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుందని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలన్న ఈ నెల 18 నాటి హైకోర్టు ఉత్తర్వులు మంగళవారం అధికారికంగా వెలువ డ్డాయి. ఆ ఉత్తర్వుల ప్రతి ప్రభుత్వానికి అందింది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ (ప్రస్తుతం ఇన్చార్జి ఉన్నారు) చర్చలు జరపాలని ధర్మాసనం ఆదేశించింది. ఈనెల 28న జరిగే తదుపరి విచారణ నాటికి చర్చలు ఫలప్రదమై ఆర్టీసీ సమ్మె విరమణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది. సమ్మెలోకి వెళ్లిన కార్మిక సంఘాలు లేవనెత్తిన పలు డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడినవి కావని, వీటి విషయంలో ప్రభుత్వం చర్చలు జరిపి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు న్యాయపరిధికి లోబడి ఉంది.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో ఆర్థిక అంశాలను సంబంధం లేనివాటిని ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. వాటిని అమలు చేయడానికి ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడదని వ్యాఖ్యానించింది. ఆర్థిక అంశాలతో ముడిపడిన కొన్ని డిమాండ్లు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయబద్ధంగా, చట్టపరంగా చెల్లించాల్సినవేనని పేర్కొంది. ‘‘రాజ్యాంగంలోని 14, 15, 16, 19, 21 అధికరణాల ప్రకారం ఈ డిమాండ్లు ఆమోదించదగ్గవని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఆర్టీసీ చట్టం 1950లోని సెక్షన్ 19(1)(సి), ఇతర సెక్షన్ల ప్రకారం ఆర్టీసీ సిబ్బందికి పని చేసేందుకు ఆరోగ్యకర వాతావరణం, తగిన వేతనాలు, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్పై ఉంది. కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించే నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కోర్టు తన న్యాయ పరిధికి లోబడి ఉంది. అందుకే యూనియన్, జేఏసీల డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రానికి గానీ కార్పొరేషన్కు గానీ ఆదేశాలు ఇవ్వడం లేదు. సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. రాష్ట్రంలోని పురుషులు, మహిళలు, పిల్లలను దృష్టిలో పెట్టుకుని సామరస్యంగా చర్చలు జరపాలని ఆదేశిస్తున్నాం. ఈ నెల 28న జరిగే తదుపరి విచారణ నాటికి చర్చలపై సానుకూల సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాం’’అని హైకోర్టు తన 14 పేజీల మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి..
-
ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి..
సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి దిగారు. దీంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడి నుంచి ప్రయాణికులకు తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్న బస్సుపై చేవెళ్ల సమీపంలో దుండగులు దాడి చేశారు. వికారాబాద్ డిపో అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొనసాగుతున్న నిరసనలు ఆర్టీసీ కార్మికుల సమ్మె కార్మిక కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ జంపన్న డిపో ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు జంపన్నను అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్ మాస్క్లు ధరించి ‘సేవ్ ఆర్టీసీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. మహిళా కండక్టర్లంతా కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఈ రోజు ఉదయం బస్సులను ఆపి ప్రైవేట్ డ్రైవర్, కండక్టర్లకు విధుల్లోకి రావద్దంటూ పూలు ఇచ్చి విజ్ఞప్తి చేశారు. విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ డ్రైవర్, కండక్టర్లకు రేపటి నుంచి మీరు విధులకు రావొద్దని, మేము చేసే ఉద్యమానికి మద్దత్తు పలకాలని కోరారు. -
ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉధృతి
-
ఆర్టీసీ సమ్మె: ఆందోళన ఉధృతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. డిమాండ్ల పరిష్కారం కోసం 18 వరోజూ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిల పక్షం వంటా వార్పునకు పిలుపు నిచ్చింది. సికింద్రాబాద్లోని జేబీఎస్ వద్ద ఆర్టీసీ జేఏసీ, రాజకీయ జేఏసీ నేతలు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోవైపు ఆర్టీసీ సమ్మె విద్యార్థులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. బస్సుల కొరత కారణంగా వారు నానా పాట్లు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత ఆర్టీసీ కార్మికుల సమ్మె కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. సమ్మెలో భాగంగా కార్మికులు వేకువజామునే కరీంనగర్ బస్ స్టేషన్కు చేరుకొని ఆందోళనకు దిగారు. పార్కింగ్ స్థలంలో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో అద్దం ద్వంసమయింది. సమ్మెకు సహకరించాలని బస్సులు నడిపే తాత్కాలిక డ్రైవర్లను కార్మికులు కోరారు. బస్ స్టేషన్లో ఉన్న బస్సును డిపోలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు బస్సులు బయటికి వెళ్లకుండా నిలిచిపోయాయి. బస్సులను అడ్డుకున్న జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీతాలు లేక న్యాయమైన డిమాండ్ కోసం కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని నేతలు విమర్శించారు. -
ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. సోమవారం 17వ రోజు రాష్ట్రవ్యా ప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేశారు. బస్ డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడపడానికి చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. వేతనాలు లేక ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని, తమ ఆవేదన అర్థం చేసుకోవాలంటూ తాత్కాలిక డ్రైవర్లు, కం డెక్టర్లను వేడుకున్నారు. ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ సర్కారుపై మండిపడ్డారు. కరీంనగర్–1 డిపోకు చెందిన డ్రైవర్ జంపన్న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలుపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్మిక వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. విద్యార్థుల అవస్థలు.. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు సోమవారం తెరుచుకున్నాయి. 24 రోజుల సెలవుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణికుల తాకిడికి తగినట్టుగా బస్సులు నడపాలని ప్రభుత్వం ఆరీ్టసీని ఆదేశించింది. ఈ క్రమంలో రోజువారీగా నడిపిన వాటి కంటే ఎక్కువ నడపాల్సి ఉండగా.. అధికారులు మాత్రం విఫలమయ్యారు. తక్కువ బస్సులే రోడ్డెక్కడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ పరిధిలో 2 వేల బస్సులు నడపాలని ఆర్టీసీ భావించింది. అయితే, కేవలం 859 బస్సులు మాత్రమే నడపగలిగారు. అవి కూడా సమయానుకూలంగా నడవలేదు. ఫలితంగా గంటల తరబడి వేచి చూడాల్సి వచి్చంది. విద్యార్థుల బస్ పాస్లను అన్ని బస్సుల్లో అనుమతించాలని ఆర్టీసీ ఆదేశించినప్పటికీ చాలాచోట్ల పాసులను అనుమతించలేదు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 6,276 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ తెలిపింది. గవర్నర్ను కలిసిన ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, బీఎస్ రావు, సుధ తదితరులు సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గవర్నర్కు వివరించారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, చర్చలు జరిపేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కోరారు. సమ్మె జరుగుతున్న సమయంలో అద్దె బస్సులు పెంచేలా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ పరిస్థితిని వివరించారు. తమ వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు. ఎంజీబీఎస్లో అఖిలపక్షం ధర్నా.. సమ్మె విషయంలో సర్కారు అనుసరిస్తున్న వైఖ రికి నిరసనగా సోమవారం హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆర్టీసీ జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, కాంగ్రెస్ నేత వీహెచ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. నూరు శాతం బస్సులు నడపాలి నూరుశాతం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కండక్టర్లు ప్రయాణికులకు తప్పని సరిగా టికెట్లు జారీ చేయాలని, బస్సు పాసులను అనుమతించాలని స్పష్టంచేశారు. కండక్టర్లకు టిమ్ మెషీన్లు ఇవ్వాలని సూచించారు. అవసరాన్ని బట్టి బస్సు డిపోల్లో కొత్తగా మెకానిక్లు, ఎల్రక్టీíÙయన్లను నియమించుకోవాలని ఆదేశించారు. -
సమ్మె: హైకోర్టులో మరో మూడు పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయమై హైకోర్టులో సోమవారం మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు నోటీసులు జారీచేసింది. అన్ని పిటిషన్లపై ఈ నెల 28న వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె నేటితో 17వ రోజుకు చేరుకున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రోజు (సోమవారం) సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలువనున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని, దీనిపై జోక్యం చేసుకోవాలని జేఏసీ ప్రతినిధులు గవర్నర్ను కోరనున్నట్టు సమాచారం. సమ్మె మరింత ఉధృతం చేస్తాం ఆర్టీసీ సమ్మెలో భాగంగా నగరంలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వద్ద ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన టీజేఎస్ చీఫ్ కోదండరాం ఆర్టీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవడమే లక్ష్యంగా తమ ఉద్యమం ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరామ్ కోరారు. -
నేడు కీలక నిర్ణయం వెలువడనుందా?
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీని కాపాడుకుందాం... ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించుకుందాం..’ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే నినాదం కనిపించింది. వేలమంది ఆర్టీసీ కార్మికులు ఈ నినాదం రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని కూడళ్ల వద్ద నిలబడి సాధారణ ప్రజానీకంతో మాట్లాడి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. శనివారం నాటి బంద్కు ప్రజలు కూడా మద్దతు తెలపటంతో వారికి కృతజ్ఞతలు తెలుపుతూనే తదుపరి తమ కార్యాచరణకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కొన్ని ప్రాంతాల్లో వారి కుటుంబసభ్యులు కూడా నిలబడి ప్రజలకు గులాబీ పూలు ఇచ్చి మరీ మద్దతు కోరటం విశేషం. ఇక యథాప్రకారం డిపోల ముందు నిలబడి బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాత్కాలిక డ్రైవర్లు తమ పొట్టకొట్టొద్దని వేడుకునే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా కార్యక్రమాలు జరగటంతో రాష్ట్రంలో ఎక్కడా పెద్ద ఉద్రిక్తత నెలకొనలేదు. గత పక్షం రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న సత్తుపల్లికి చెందిన డ్రైవర్ ఖాజామియా ఆదివారం గుండెపోటుతో మృతి చెందటం కార్మికులను కలచివేసింది. ఉద్యోగ భద్రత దిగులుతోనే ఆయన మృతి చెందాడంటూ కార్మికులు ఆరో పించారు. ములుగు జిల్లాలో జాతీయ రహదారిపై ఆదివారం సాయత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్ పరారయ్యాడు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 4,502 ఆర్టీసీ బస్సులు, 1,953 అద్దె బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తంగా 71.93% సర్వీసులు రోడ్డెక్కినట్టు వెల్లడించింది. నేడు కీలక నిర్ణయం వెలువడనుందా? ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలంటూ 18న హైకోర్టు ఇచ్చిన ఆదేశం తాలూకు ప్రతి సోమ వారం అధికారులకు అందే అవకాశముంది. దీంతో సోమవారం కీలక నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రతి అందితే దాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి తదుపరి కార్యాచరణను అధికారులు రూపొందించనున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు దసరా సెలవుల పొడిగింపు పూర్తి కావటంతో సోమవారం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటివరకు ఆయా విద్యా సంస్థ ల బస్సులను కూడా ప్రభుత్వం స్టేజీ క్యారియర్లుగా వాడుకుంది. ఇప్పుడు ఆ బస్సులన్నీ తిరిగి విద్యా సంస్థలకు వెళ్లిపోయాయి. విద్యార్థులకు ఇబ్బంది కాకుండా బస్సులు ఏర్పాట్లు చేయాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ఆదివారం ముందస్తు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇక విద్యార్థుల బస్ పాస్లు కేటగిరీతో సంబం ధం లేకుండా అన్ని బస్సుల్లో చెల్లుబాటయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ సమ్మె 16వ రోజు ఉధృతంగానే కొనసాగింది. అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే డిపోల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నాల్లో పాల్గొన్నారు. నేడు వీడియో కాన్ఫరెన్సు విద్యాసంస్థలు తెరుచుకోనుండటంతో పరిస్థితిని అంచనా వేసి ఆదేశాలు జారీ చేసేందుకు వీలుగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ, రవాణా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. -
ఆర్టీసీ జేఏసీ మరో కీలక నిర్ణయం
-
సమ్మె: ఆర్టీసీ జేఏసీ మరో కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై పొలిటికల్ జేఏసీతో ఆదివారం ఆర్టీసీ జేఏసీ భేటీ అయింది. ఆర్టీసీ సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం మరోసారి గవర్నర్ తమిళసైని కలువాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. 16వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ను కోరాలని జేఏసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం కూడా ఆర్టీసీ జేఏసీ మరోసారి సమావేశమవుతుందని, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోరాదని, విజయం సాధించేవరకు పోరాడుదామని అన్నారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఇదే పొలిటికల్ జేఏసీతో భేటీ అనంతరం ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 21న అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి బైఠాయించనున్నారు. 22న మా పొట్టకొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను కార్మికులు విజ్ఞప్తి చేయనున్నారు. 23న ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు తెలపాలని, సమ్మెలో భాగస్వామ్యం కావాలని కోరనున్నారు. 24న మహిళా కండక్టర్ల దీక్ష, 25న హైవేలు, రహదారులపై రాస్తారోకోలు చేపట్టనున్నారు. 26న ప్రభుత్వం మనసు మారాలని ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష చేప్టనున్నారు. 27న పండగ సందర్భంగా జీతాలు లేకపోవడంవల్ల నిరసన, 28న సమ్మెపై హైకోర్టు విచారణ సందర్భంగా విరామం. ఇక, ఈ నెల 30న 5లక్షల మందితో సకల జనుల సమర భేరి నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది.