Union Budget 2019
-
అకౌంట్లతో పనిలేదు..
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ జూలై 5వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టిన 2019–20 వార్షిక బడ్జెట్లో ఒక లొసుగును సవరించారు. తన బడ్జెట్ ప్రతిపాదనకు ఒక కీలక సవరణను గురువారం తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే... ఒక సంవత్సరంలో ‘ఒక అకౌంట్’ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్డ్రాయెల్స్ జరిపితే 2 శాతం మూలం వద్ద పన్ను (టీడీఎస్) విధించాలని జూలై 5 బడ్జెట్ ప్రతిపాదించింది. అయితే ‘రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్ల నుంచి కోటి పైబడిన విత్డ్రాయెల్స్ చేస్తే 2 శాతం టీడీఎస్ ఉండదా’ అనే సంశయం పలు వర్గాల నుంచి వ్యక్తమయ్యింది. బడ్జెట్లో ఈ లొసుగును సవరిస్తూ ఆర్థిక మంత్రి 2019 ఫైనాన్స్ బిల్లుకు ఒక సవరణను తీసుకువచ్చారు. దీని ప్రకారం .. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్ నుంచి విత్డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. భారీ నగదు లావాదేవీల నిరోధం లక్ష్యంగా బడ్జెట్లో ఆర్థిక మంతి ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. 28 ఇతర సవరణలతోపాటు ఈ ప్రతిపాదనకూ లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. మొత్తం పన్ను బకాయిల్లో ఈ టీడీఎస్ కూడా భర్తీ అయ్యే అవకాశాన్నీ తాజా బడ్జెట్ ప్రతిపాదన కల్పిస్తోంది. -
‘కిసాన్ సమ్మాన్’తో రైతులకు అవమానమే
సాక్షి, న్యూఢిల్లీ: కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు మూడు విడతలుగా ఇస్తున్న రూ.6 వేల సాయం రైతులను అవమానించేదిగా ఉందని కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బడ్జెట్పై చర్చలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ బడ్జెట్ పద్దులపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ నుంచి ప్రధాన వక్తగా ఉత్తమ్ మాట్లాడారు. ‘2018–19 సంవత్సరానికి గానూ వ్యవసాయానికి బడ్జెట్లో రూ.75,753 కోట్లు కేటాయించి చివరకు 29 శాతం కోత విధించి రూ.53 వేల కోట్ల వ్యయం చేశారు. నేడు దేశంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. శాస్త్రీయమైన కనీస మద్దతు ధరలు లేకపోవడం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విషయంలో లోపభూయిష్ట విధానాలు, సరైన పంట ల బీమా సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం దుర్భరంగా మారి రోజూ 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో రోజురోజుకూ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోవడం బాధాకరం. ఒక్కో ఏడాది 11 నుంచి 13 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2016 నుంచి రైతు ఆత్మహత్యలపై అధికారిక గణాంకాలు లేకపోవడం విచారకరం’ అని అన్నారు. దేశంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, కౌలు రైతులు వాణిజ్య పంటల వేసుకోవడం వల్ల వారికి పెట్టుబడి అధికమై నష్టాలు వచ్చినపుడు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. దేశంలో కోట్లాది మంది కౌలు రైతులకు ఉపయోగపడేలా ఒక చట్టం తేవాలని, గతంలో ఉమ్మడి ఏపీలో ఇలాంటి కౌలుదారు హక్కుల చట్టం తేవడం జరిగిందని, ఇలాంటి చట్టం దేశంలోనూ తెస్తే కోట్లాది మంది కౌలు రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రైతు ఆదాయం ఎంత పెంచారు? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016–17లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇదే విషయాన్ని ప్రధాని పదే పదే చెప్పారని, కానీ ఈ మూడేళ్ళలో రైతుల ఆదాయం ఎంత పెరిగిందో ఎక్కడా చెప్పడం లేదని ఉత్తమ్ అన్నారు. ఈ మూడేళ్లలో వ్యవసాయ జీడీపీ కానీ, రైతుల ఆదాయం కానీ ఎక్కడ పెరిగిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక సర్వేల్లో ఎక్కడా కూడా రైతు, వ్యవసాయ ఆదాయాలు పెరగలేదని, సున్నా శాతం అభివృద్ధి ఉందని, 2022 నాటికి రైతు ఆదాయం పెరగాలంటే ఆరేళ్ల పాటు ఏటా 13 శాతం పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2014లో ఎన్నికల ముందు బీజేపీ.. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని వివరించారు. పత్తి రైతులకు కనీసం రూ.6 వేల మేర కనీస మద్దతు ధర ఇవ్వాలని ఉత్తమ్ కోరారు. పంటల బీమాతో తెలంగాణకు పైసా రాలేదు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్రం తెచ్చిన పథకం రైతులను అవమానపరిచేలా ఉందని ఉత్తమ్ చెప్పారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున, అది కూడా మూడు విడతల కింద ఇస్తుందని పేర్కొన్నారు. అంటే ఐదుగురు సభ్యులున్న కుటుంబంలో ఒక్కొక్కరికి రూ.3.30 వస్తుందని, ఇది రైతులకు ఎలా ఉపయోపడుతుందని ప్రశ్నించారు. కోట్లాది మంది కౌలు దారులు, ఆదివాసీ రైతులు, భూమి లేని పేద రైతులకు ఇది వర్తించడం లేదని అన్నారు. ప్రధానమంత్రి పసల్ భీమా యోజన పథకంలో 50 శాతం మంది రైతులకు పంటల భీమా అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే 25 శాతానికి మించి అందడం లేదన్నారు. తెలంగాణలో పంటలు నష్టపోయిన రైతులకు ఈ పథకం కింద ఒక్క పైసా రాలేదని అన్నారు. ఈ పథకం వల్ల రైతుల కంటే బీమా కంపెనీలకు ఎక్కువ లాభం ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణలోని నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉందని ఉత్తమ్ చెప్పారు. ఎన్నికల ముందు రాజ్నాథ్ సింగ్ వచ్చి నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, వెంటనే అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
జనరంజకం నిర్మల బడ్జెట్
భారత్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభు త్వం బడ్జెట్ ను రూపొందించింది. ఆ మేరకు విధానపరమైన చర్యలను కూడా తీసుకుంది. ఇదంతా కార్పొరేట్లకు సంబంధించిన వ్యవహారం అని, తమకేమీ సంబంధం లేదని చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు అనుకుంటుంటారు. కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం ఆర్థికాభివృద్ధి అంటే కేవలం కార్పొరేట్, పారిశ్రామిక అభివృద్ధి అన్నంతవరకే పరిమితం కాలేదు. దానికి నిదర్శనమే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్. అందులో పేర్కొన్నట్లుగా.. మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగానికి చేరుకుంది. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి ఇచ్చిన చేయూత. ఆరు వేల పెట్టుబడి మద్దతును రైతులందరికీ అందిస్తామని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సంప్రదాయ, కుటీర పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది దుకాణదారులు, వాటిలో పనిచేసే వారికి మేలు చేకూర్చేలా పెన్షన్ పథకాన్ని వర్తింపచేయాలని బడ్జెట్లో ప్రకటించటం అందరూ స్వాగతించాలి. ఆదాయపు పన్ను, జీఎస్టీ పన్ను వసూళ్లను కేంద్ర ప్రభుత్వం అధికంగా అంచనా వేసి చూపించిందని, అంత సాధ్యం కాదని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చెప్పుకొచ్చారు. ఆదాయపు పన్ను 23.25 శాతం, జీఎస్టీ 44.98 శాతం చొప్పున పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని ఆయన లెక్కలు వేశారు. కానీ, ఈ లెక్కలకు ఆధారం ఏం టి? ఏ ప్రాతిపదికన ఈ లెక్కలు వేశారు? అని నిర్మల రాజ్యసభలో ప్రశ్నిస్తే.. సరిగ్గా ఆమె మాట్లాడే రోజు చిదంబరం సభకు హాజరు కాలేదు. వాస్తవానికి ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, ఇతర పన్నులన్నీ కలిపితే ఆదాయపు పన్నుగా లెక్కిస్తారు. బహుశా చిదంబరం కార్పొరేట్, ఇతర పన్ను ల్ని తీసేసి ఆదాయపు పన్ను ఒక్కదానినే లెక్కించి అంత రాబడి అసాధ్యం అని చెప్పి ఉండొచ్చు అని నిర్మలా సీతారామన్ బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చారు. అదేవిధంగా జీఎస్టీ విషయంలోనూ చిదంబరం వేసినవి కాకిలెక్కలేనని పార్లమెంటులోనే నిర్మలా సీతారామన్ తూర్పారబట్టారు. నరేం ద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి బ్యాంకుల నెత్తిన పెట్టిన మొండి బాకీల స్థాయి ఎక్కడికి చేరిందంటే.. ప్రభుత్వ రంగ, జాతీయస్థాయి బ్యాంకులు అసలు కొనసాగుతాయా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యా యి. రిజర్వ్ బ్యాంకు ఈ మొండి బాకీలపై ఒక నివే దిక వెలువరించింది. మొండి బాకీలకు కారణం ప్రభుత్వ, బ్యాంకు విధానాల్లోని లోపాలు కూడా కారణమని తెలిపింది. అలాంటి విధాన లోపాలను గత ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం సవరించింది. బడ్జెట్ అంటే ఒకప్పుడు పైపై మెరుగులు, ఆయా వర్గాల ప్రజల్ని సంతృప్తి పరిచేందుకు కేటాయింపులు ప్రకటించి శభాష్ అనిపించుకోవడాలు మాత్రమే అన్నట్లుగా ఒక తంతుగా జరిగేది.అలాం టి కాస్మొటిక్ వ్యవహారాలకు మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. కాగా, రాష్ట్రానికి కేటాయింపులు ఏమీ లేవని, పోలవరం లాంటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదని ప్రతిపక్షాలు, ఎంపీలు అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. ఇంతకు ముందే చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గతంలో ఎన్నడూ లేనన్ని ఎక్కువ నిధులు ఇస్తోంది. పోలవరం సహా ఆయా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు. వీటికి ఆయా శాఖల ద్వారా కేటాయింపులు జరుగుతాయి. ప్రత్యేకంగా బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావన లేదన్నది నిజమే. కానీ, అలా ప్రత్యేకంగా ఏ ఒక్క ప్రాజెక్టు, రాష్ట్రం గురించి కూడా మంత్రి ప్రసంగంలో చోటివ్వలేదన్నది కూడా నిజం. ఎందుకంటే ఇది దేశాభివృద్ధికి రూపొందించిన బడ్జెట్ కాబట్టి. పైగా, ఇది ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కొనసాగింపుగా పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్. దానికి తోడు ప్రస్తుత ఆర్థిక సంఘం గడువు ఈ ఏడాదితో ముగుస్తోంది. కొత్త ఆర్థిక సంఘం నివేదిక ఈ ఏడాది నవంబర్లో వచ్చే అవకాశం ఉంది. అంటే.. అందులో పేర్కొన్న విధంగా రాష్ట్రాలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సైతం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో నిధుల వస్తాయని పేర్కొన్నది. ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే నిధుల కేటాయించడం, రాష్ట్రం లోని గుళ్లకు చరిత్రలో తొలిసారి బడ్జెట్ కేటాయింపులు చేయడం స్వాగతించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడులాగా కేటాయింపులు చేసి వదిలేయటం కాకుండా వాస్తవంగా ఆ కేటాయింపుల మేరకు నిధులు విడుదల చేసి జగన్ మడమతిప్పని ముఖ్యమంత్రి అనిపించుకోవాలి. పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త -
ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్లో రైలు ఎక్కి హైదరాబాద్లో దిగాలనే ఇక్కడ ప్రజల దశాబ్దాల కోరిక నెరవేరడానికి మరి కొన్నేళ్లు పట్టొచ్చు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ మొదటి దశ పనులు వేగంగానే సాగుతున్నాయి. మనోహరాబాద్ నుంచి తూప్రాన్ మీదుగా గజ్వేల్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. సిద్దిపేట వరకు భూసేకరణ పూర్తి కాగా, సిరిసిల్ల వరకు భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వేబడ్జెట్లో ఏటా కేటాయింపులు చేస్తున్న నేపథ్యంలో సిద్దిపేట వరకు రైల్వేలైన్ పూర్తవ్వడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చునని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ రైల్వే బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కేవలం కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్కు రూ.200 కోట్లు కేటాయించడం చూస్తుంటే కొత్త రైల్వేలైన్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. 13 రైల్వేస్టేషన్లు ... 160 బ్రిడ్జిలు కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం ఇప్పటికే తూప్రాన్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రైల్వేలైన్తోపాటు 13 రైల్వేస్టేషన్ల నిర్మాణం, అవసరమైన వంతెనల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. ఈ లైన్లో 160 బ్రిడ్జిలు, 7 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, 49 రోడ్డు అండర్ బ్రిడ్జిల నిర్మాణం జరపాల్సి ఉంటుంది. → నాలుగు దశలు... 151.40 కిలోమీటర్లు.. → మొదటి దశ: మనోహరాబాద్ – గజ్వేల్ (32 కి.మీ), → రెండో దశ: గజ్వేల్– దుద్దెడ (32.15 కి.మీ) → మూడో దశ: దుద్దెడ –సిరిసిల్ల ( 48.65 కి.మీ), → నాలుగో దశ: సిరిసిల్ల – కొత్తపల్లి (38.60 కి.మీ) కేసీఆర్ కలల ప్రాజెక్టుగా... సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని హరీష్రావుకు వదిలేసి 2004లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించిన కేసీఆర్.. యూపీఏ–1 ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన విషయం విదితమే. అప్పుడు ఆయన మదిలో మెదిలో ఆలోచనే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎంపీలతో కలిసి అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, రైల్వే శాఖ మంత్రి లాలూప్రసాద్ యాదవ్లను ఒప్పించి రైల్వేలైన్ను సాధించారు. కొత్తపల్లి నుంచి వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, తూప్రాన్ మీదుగా మనోహరాబాద్ స్టేషన్కు అనుసంధానం చేసే విధంగా ఈ లైన్ను నిర్ధారిస్తూ 2006లోనే సర్వే చేశారు. రూ.800 కోట్ల అంచనాతో కొత్త రైల్వేలైన్ ప్రారంభించబోతున్నట్లు యూపీఏ ప్రభుత్వం రైల్వే బడ్జెట్లో స్పష్టం చేశారు. 2006లో కేంద్ర మంత్రివర్గం నుంచి కేసీఆర్ బయటికి రావడం, ఎంపీ స్థానానికి రాజీనామా, తిరిగి ఎన్నిక, తదితర ఉద్యమ, రాజకీయ పరిణామాల్లో రైల్వేలైన్పై ప్రగతి కనిపించలేదు. 2009లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా విజయం సాధించి, కొత్తపల్లి రైల్వేలైన్ ప్రగతి కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. వివిధ కారణాల వల్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వేలైన్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. 2014 తరువాతే బడ్జెట్ కేటాయింపులు 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బోయినపల్లి వినోద్కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఢిల్లీలో మంత్రాంగం జరిపి కొత్తపల్లి రైల్వేలైన్ ముందుకు కదిలేలా తనవంతు ప్రయత్నం చేశారు. 151.40 కిలోమీటర్ల రైల్వేలైన్కు అంచనా వ్యయం రూ.1160 కోట్లుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్రం ఈ లైన్కు సంబంధించి పలు ఆంక్షలు విధించింది. రైల్వేలైన్ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, రైలు నడవడం ప్రారంభమయిన తరువాత మొదటి ఐదేళ్లు నష్టాలను భరించాలనే ఒప్పందం మేరకు కేంద్రం బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిపింది. నాలుగు దశల్లో జరిగే రైల్వేలైన్ నిర్మాణం పనులకు సంబంధించి 2017–18 బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించగా, 2018–19లో మరో రూ.125 కోట్లు కేటాయించారు. ఈసారి మరో రూ.200 కోట్లు కేటాయించడంతో తొలిదశ పనులు పూర్తయినట్లేనని చెప్పవచ్చు. సిద్దిపేట వరకు దాదాపు భూసేకరణ పూర్తి – సిరిసిల్లలో నోటీసులు రైల్వేలైన్కు సంబంధించి ఒకవైపు మొదటి దశ పనులు జరుగుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. గజ్వేల్ వరకు రైల్వేలైన్ వేసే పనులు సాగుతుండగా, సిద్దిపేట వరకు భూసేకరణ దాదాపుగా పూర్తయింది. సిరిసిల్ల జిల్లాలో రైల్వేలైన్ సందర్భంగా భూములు కోల్పోతున్న వారికి భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు. సిరిసిల్లలో మిడ్మానేర్ బ్యాక్ వాటర్ మీదుగా కిలోమీటరు పొడవునా బ్రిడ్జి నిర్మాణం జరపాల్సి ఉంటుంది. సిరిసిల్ల వరకు భూసేకరణ పూర్తయితే మూడు దశల నిర్మాణం పనులకు ఆటంకాలు తొలగినట్టే. రైల్వే లైన్ హైలైట్స్ ► 2004లో కరీంనగర్ ఎంపీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రతిపాదన ► 2006 : యూపీఏ–1 ప్రభుత్వం సర్వే చేసి, రూ.800 కోట్ల అంచనాతో బడ్జెట్ నివేదిక ► 2014: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత పనుల్లో కదలిక ► 2015: తాజా సర్వేలో కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ అంచనా వ్యయం రూ.1160 కోట్లు ► 2016: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన ► 2017–18 : రైల్వే బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయింపు ► 2018–19 : రైల్వే బడ్జెట్లో మరో రూ.125 కోట్లు కేటాయింపు ► 2019–20 : ఈసారి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించిన కేంద్రం -
మార్కెట్లో ‘వాటా’ ముసలం!
స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ తాజా ప్రతిపాదన స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించింది. బడ్జెట్ రోజు, ఆ తర్వాతి రోజు కొనసాగిన నష్టాలకు ప్రధాన కారణాల్లో ఈ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్రతిపాదన కూడా ఒకటి. ఈ ప్రతిపాదన కారణంగా టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు, డిమార్ట్ రిటైల్ స్టోర్స్ చెయిన్ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ వంటి దిగ్గజ కంపెనీలు కనీసం 10–20 శాతం మేర వాటాను విక్రయించాల్సి వస్తుంది. బీఎస్ఈలో దాదాపు 4,000కు పైగా కంపెనీలు లిస్ట్కాగా, వీటిల్లో 1,100 మేర కంపెనీలు వాటా విక్రయం జరపాల్సి వస్తుంది. ఇదంతా ఒకెత్తు. బహుళజాతి కంపెనీలు(ఎమ్ఎన్సీ) బాధ ఇంకొక ఎత్తు. చాలా ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతం రేంజ్లో ఉంది. ఇవి 10 శాతం మేర వాటా విక్రయించాల్సి రావచ్చు. అయితే వాటా విక్రయానికి బదులుగా అసలు స్టాక్ మార్కెట్ నుంచే డీలిస్ట్ అయ్యే దిశగా ఈ ఎమ్ఎన్సీలు యోచిస్తున్నాయని సమాచారం. ఈ విషయమై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ.... లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ హోల్డింగ్ను ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ విషయమై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి ఒక లేఖ రాశామని ఆమె పేర్కొన్నారు. పబ్లిక్ హోల్డింగ్ పెంపు ప్రతిపాదనకు సెబీ త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తుందని, రెండేళ్ల గడువుని ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన స్టాక్ మార్కెట్ నుంచి లిక్విడిటీని లాగేయడమే కాకుండా, ప్రమోటర్ వాటా అధికంగా ఉన్న బహుళ జాతి కంపెనీలు మన స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి దోహదపడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 65 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఇలాంటి కంపెనీలకు పెద్దగా ఇబ్బంది లేదు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఈ కంపెనీలు డీలిస్టింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక బిజినెస్ టు బిజినెస్(బీ2బీ)రంగంలో ఉన్న కంపెనీలు పూర్తిగా డీలిస్టింగ్కే మొగ్గుచూపుతున్నాయి. ఇలాంటి కంపెనీల వ్యాపారాలకు బ్రాండ్లతో పని లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే తాజా ప్రతిపాదనలపై ఎమ్ఎన్సీలు ఇప్పటివరకైతే, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అప్పడూ ఇదే పరిస్థితి... మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ 2010–13లో 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనను తెచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. పలు ఎమ్ఎన్సీలు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేశాయి. ఈ తాజా ప్రతిపాదన ప్రకారం ప్రజలకు 35 శాతం వాటాను కేటాయించాల్సి వస్తే, ఎమ్ఎన్సీలు రూ.50,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించాల్సి రావచ్చు. ఎమ్ఎన్సీలు, ఇతర భారత కంపెనీలు కలసి మొత్తం మీద రూ. 4 లక్షల కోట్ల మేర షేర్లను విక్రయించే అవకాశాలున్నాయి. ఎమ్ఎన్సీలు...మంచి పనితీరు... మార్కెట్, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నా, చాలా ఎమ్ఎన్సీలు మంచి పనితీరునే కనబరుస్తూ వచ్చాయి. మొత్తం గత 16 ఏళ్లకు గాను 11 ఏళ్లలో ఎమ్ఎన్సీ షేర్లు నిఫ్టీని మించిన రాబడులనిచ్చాయి. 2006 నుంచి చూస్తే, వరుసగా 13 ఏళ్ల పాటు నిఫ్టీని మించిన పనితీరును ఎమ్ఎన్సీలు చూపించాయి. తాజా ప్రతిపాదన తక్షణం అమలయ్యే అవకాశాల్లేవు. దశలవారీగానే ఈ ప్రతిపాదన అమల్లోకి రావచ్చు. కనీసం 3–4 ఏళ్లు పడుతుందని అంచనా. అయినప్పటికీ, ఇది ఆయా షేర్ల పనితీరుపై తీవ్రంగానే ప్రభావం చూపించవచ్చు. ప్రమోటర్ వాటా 75 శాతానికి పైగా ఉన్న సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ వంటి కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్) విధానంలో తమ వాటాను విక్రయించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఇది ఆయా షేర్ల పనితీరుపై సమీప భవిష్యత్తులో తీవ్రంగానే ప్రభావం చూపుతుంది. అయితే సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ కంపెనీల ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని, ఈ షేర్లు తగ్గితే అది కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించాలని ఆంటిక్ స్టాక్ బ్రోకింగ్ పేర్కొంది. ఓఎఫ్ఎస్ల వెల్లువ... ఈ ప్రతిపాదన కారణంగా ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్)లు వెల్లువెత్తుతాయని నిపుణులంటున్నారు. వాటా విక్రయానికి చౌకైన, వేగవంతమైన ప్రక్రియ ఇదేనని, దీంతో స్టాక్ మార్కెట్లో ఓఎఫ్ఎస్లు వెల్లువెత్తుతాయని, దీంతో సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్య తలెత్తుతుందని వారంటున్నారు. ఈ ప్రతిపాదన కారణంగా కొన్ని ఉత్తమ ఫలితాలూ ఉంటాయని విశ్లేషకులంటున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్ల యాజమాన్యం మరింతగా విస్తరిస్తుందని, స్టాక్ మార్కెట్ మరింతగా విస్తరిస్తుందని, షేర్లకు సరైన విలువ లభిస్తుందని, కార్పొరేట్ గవర్నెన్స్ మరింతగా మెరుగుపడగలదని వారంటున్నారు. అంతే కాకుండా నాణ్యత గల షేర్లు సమంజసమైన ధరకు లభించే అవకాశాలూ ఉన్నాయి. -
పరుగులు తీస్తున్న పుత్తడి!
సాక్షి, కామారెడ్డి: కేంద్ర బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. బడ్జెట్కు ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.33,700 వరకు ఉండగా, కస్టమ్స్ సుంకం పెరగడంతో ధర రూ.34,700 లకు చేరింది. అంటే ఒక్కసారిగా రూ. వెయ్యి వరకు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండడంతో కొనుగోళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కూడా కాకపోవడంతో బంగారం క్రయవిక్రయాలు తక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో బంగారంపై సుంకం పెంచడంతో ధరలు మాత్రం పెరుగుతున్నాయి. దీంతో కొనుగోళ్లు చాలావరకు పడి పోయినట్టు బంగారం వర్తకులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో అరవైకి పైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ భారీ ఎత్తున బంగారం అమ్మకాలు సాగుతుంటాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ కాకపోవడం, ధరలు పెరగడంతో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నా యి. పెరుగుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధర లు పెరగడంతో బంగారం కొనేదెలా అం టూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం విక్రయదారులు కూడా అమ్మకాలు తగ్గిపోవడంతో ఇబ్బంది పడతున్నారు. సుమారు మూడు నెలల వరకు శుభ ముహూర్తాలు కూడా లేవు. అటు సీజన్ లేకపోవడం, ఇటు ధర పెరగడంతో బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు పని లేక ఆందోళన చెందుతున్నారు. -
కొత్తపల్లి–మనోహరాబాద్కు లైన్క్లియర్
సాక్షి, కరీంనగర్ : కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించింది. కరీంనగర్ నుంచి నేరుగా హైదరాబాద్కు వెళ్లేందుకు వీలుగా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ను 2006–07 సంవత్సరంలో రూ.1160 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం రైల్వేబడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2014 సంవత్సరం నుంచి రైల్వేపనుల్లో వేగం పెరిగింది. మొత్తం 150 కిలోమీటర్ల దూరం ఉన్న కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్లో ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 32 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయి. 2020 సంవత్సరంనాటికి కరీంనగర్కు రైలు తీసుకొస్తామన్న ప్రజాప్రతినిధుల మాటలు ఆచరణలో మాత్రం సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడంలేదు. ఈ రైల్వే నిర్మాణ పనులు కరీంనగర్ జిల్లాలో ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్కుమార్ హయాంలోనైనా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణం పూర్తవుతుందనే ఆశాభావంతో జిల్లాప్రజలున్నారు. బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఇలా ► 2015–16–రూ.20కోట్లు ► 2016–17–రూ.30కోట్లు ► 2017–18–రూ.350కోట్లు ► 2018–19–రూ.125కోట్లు ► 2019–20–రూ.200కోట్లు -
బడ్జెట్లో ఏపీకి ఏమి దక్కలేదు
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్లో ఏపీకి ఏమి దక్కలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం రాజ్యసభలో బడ్జెట్పై జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోలియం ఉత్పత్తులపై అదనంగా ఒక రూపాయి ఎక్సైజ్ డ్యూటీ విధించడం సామాన్యుడిపై తీవ్ర భారంగా మారుతుందన్నారు. రైల్వేల ఆపరేటింగ్ నిష్పత్తి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యాన్ని చేరుకోవడం శుభపరిణామంగా చెప్పుకొచ్చారు. ఎలక్ట్రిక్ వెహికల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు విజయసాయి రెడ్డి. పొలవరానికి నిరంతరంగా నిధులు: వేమిరెడ్డి బడ్జెట్లో ఏపీకి చాలా ఇస్తారని ఆశించాం.. కానీ నిరాశే మిగిలిందన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేయలేదని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, రాజధానికి నిధులు ఇవ్వలేదన్నారు. ఏపీ రెవెన్యూ లోటు ఎంతో లెక్క తేల్చడం లేదని ఆయన విమర్శించారు. ఏపీ ఏజీ రూ. 16 వేల కోట్ల రెవెన్యూ లోటుగా తేల్చిందన్నారు. రెవెన్యూ లోటుకు సంబంధించి నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్కు నిరంతరంగా నిధులు విడుదల చేయాలని వేమిరెడ్డి డిమాండ్ చేశారు. బడ్జెట్లో కడప స్టీల్ ప్లాంట్, వెనకబడిన జిల్లాలకు నిధుల ఊసే లేదన్నారు. ఐఐటీ, ఐఐఎంల నిర్మాణానికి నిధులు లేక ఆ ప్రాజెక్ట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. భారత్మాల, సాగర్ మాల ప్రాజెక్ట్లను స్వాగతిస్తున్నాం అన్నారు. -
రెడ్ సిగ్నల్ హైదరాబాద్లో ఆగని రైలు
జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్కు సరిపడా రైళ్లు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణం కోసం మూడు నెలల ముందు నుంచే ప్రణాళికలను రూపొందించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా షిరిడీ, శబరి, బెంగళూరు, విశాఖ, తిరుపతి, ముంబై, పాట్నాలకు డిమాండ్ అధికంగా ఉంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను ఏర్పాటు చేయాలని చాలాకాలంగా నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల సంక్షేమ సంఘాలు సైతం ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్ నగరానికి మొండి చెయ్యి చూపించింది. రైల్వే ప్రాజెక్టులపై ఊరించి ఉసూరుమనిపించింది. ఒక్క యాదాద్రి ఎంఎంటీఎస్ రెండో దశకు విదిలించిన రూ.20 కోట్లు మినహా ఎక్కడా సిటీ ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. పైగా యాదాద్రికి కేటాయించిన ఈ నిధులు సైతంగత మధ్యంతర బడ్జెట్లోప్రకటించినవే. ఇప్పుడు పింక్బుక్లో చేర్చారు. నాలుగు రోజుల ఉత్కంఠ తరువాత కేంద్ర బడ్జెట్లో రైల్వేలకు అందిన కేటాయింపులను బుధవారం విడుదల చేశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ విస్తరణ, వట్టినాగులపల్లి టర్మినల్ నిర్మాణం వంటి కీలకమైన ప్రాజెక్టులు ఈ బడ్జెట్లో కనీసం ప్రస్తావనకు కూడా రాకపోవడం గమనార్హం. మరోవైపు ఐదేళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ సాగుతూనే ఉంది. అది ఎప్పటికి పూర్తవుతుంది, రెండో దశ రైళ్లు ఎప్పటి వరకు పట్టాలెక్కుతాయనే అంశాన్ని పూర్తిగా విస్మరించారు. నిధుల కొరత కారణంగా నిలిచిపోతున్న రెండో దశకు ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి, ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాలు, అదనపు టిక్కెట్ బుకింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి వాటికి స్థానం లేకుండా పోయింది. మొత్తంగా ఈ ఏడాది రైలు నగరంలో ఆగకుండానే పరుగులు తీసింది. చర్లపల్లి టర్మినల్కు కేటాయింపులేవీ.. నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరిగిన రద్దీ, రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి స్టేషన్ను 4వ టర్మినల్గా విస్తరించేందుకు మూడేళ్ల క్రితం బడ్జెట్లోనే ప్రతిపాదించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 1.8 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి మరో వందకు పైగా రైళ్లు, లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మూడింటిపైన పెరిగిన ఒత్తిడి, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లిని అభివృద్ధి చేయాలని భావించారు. సుమారు రూ.200 కోట్ల అంచనాలతో ప్రణాళికలను రూపొందించారు. 50 ఎకరాల భూమి అదనంగా అవరమని గుర్తించారు. ఈ టర్మినల్ నిర్మిస్తే సుమారు 10 ప్లాట్ఫామ్లతో ప్రతి రోజు కనీసం 200 రైళ్ల రాకపోకలకు అవకాశం లభిస్తుందని అప్పట్లో ప్రతిపాదించారు. విజయవాడ నుంచి, కాజిపేట్ వైపు నుంచి వచ్చే రైళ్లన్నింటినీ చర్లపల్లి ద్వారా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండడం వల్ల ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి.కానీ ఈ ప్రాజెక్టుకు తాజా బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా దక్కలేదు. వట్టినాగుల పల్లి టర్మినల్ ప్రస్తావన కూడా లేకపోవడం గమనార్హం. యాదాద్రికి రూ.20 కోట్లు.... ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించి యాదాద్రికి రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని 2016–17 బడ్జెట్లో ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్కు రూ, 20 కోట్లు కేటాయించారు. ఇది కూడా గత మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిందే. ఈ సారి పింక్ బుక్లో చేర్చారు అంతే. ఇది మినహాయించి ఈ బడ్జెట్ వల్ల నగరానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదు. యాదాది మార్గం అందుబాటులోకి వస్తే ప్రతి రోజు హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయం లభిస్తుంది. అప్పట్లో రాష్ట్రప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.సుమారు రూ. 412 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం 59 శాతం వాటా చొప్పున, రైల్వే 41 శాతం భరించవలసి ఉంది. కానీ దీనికి ఇప్పటి వరకు టెండర్లను పిలవకపోవడం గమనార్హం. -
గవర్నర్తో సీఎం జగన్ భేటీ
సాక్షి, విజయవాడ : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ నగరంలోని గేట్వే హోటల్కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జూలై 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్, ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తదితర అంశాలపై సీఎం జగన్ గవర్నర్తో చర్చించనున్నారు. ఇక మంగళవారం ముందుగానే గేట్వే హోటల్కు చేరుకున్న గవర్నర్ నరసింహన్కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సాదర స్వాగతం పలికారు. -
బడ్జెట్.. ముంచెన్!
విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను పోటు మరింతగా పెరుగుతుందనే ఆందోళనతో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 38,800 పాయింట్ల దిగువకు, నిఫ్టీ, 11,600 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 907 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 793 పాయింట్ల నష్టంతో 38,721 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో 288 పాయింట్ల మేర క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 11,559 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది బాగా నష్టపోయింది ఈ రోజే. సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, 2016, ఏప్రిల్ తర్వాత ఈ సూచీలు అత్యధికంగా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఆర్థిక, వాహన, చమురు షేర్లు బాగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తుండటం, డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అంచనాలు తల్లకిందులు... మందగమనంలో ఉన్న వినియోగ రంగానికి జోష్నివ్వడానికి కేంద్రం బడ్జెట్లో తాయిలాలు ఇవ్వగలదని అందరూ అంచనా వేశారని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. ఈ అంచనాలన్నీ తల్లకిందులు కావడం, మరోవైపు రానున్న ఆర్థిక ఫలితాలు మరింత అధ్వానంగా ఉండబోతున్నాయన్న ఆందోళనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని వివరించారు. సెన్సెక్స్ భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ ఎలాంటి ఊరటలేకపోగా, ఈ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. మరిన్ని విశేషాలు.. ► ఇటీవల ప్రతిరోజూ ఆల్టైమ్ హైలను తాకుతున్న బజాజ్ ఫైనాన్స్ షేర్ 8 శాతం నష్టంతో రూ.3,415 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► అమ్మకాలు తగ్గుతుండటంతో వాహన కంపెనీలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయన్న వార్తలు వాహన షేర్లను పడగొట్టాయి. హీరో మోటోకార్ప్ 5.3 శాతం, మారుతీ సుజుకీ 5.2 శాతం, టాటా మోటార్స్ 3.4 శాతం, బజాజ్ ఆటోలు 2 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఓఎన్జీసీ 5.4 శాతం, ఎల్ అండ్ టీ 4.3 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.85 శాతం చొప్పున కుదేలయ్యాయి. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ భారీగా పతనమైంది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్కు సంబంధించిన ఖాతాలో రూ.3,800 కోట్ల మోసం జరిగిందన్న విషయం వెలుగులోకి రావడంతో బీఎస్ఈలో పీఎన్బీ షేర్ 11 శాతం నష్టంతో రూ.72.80 వద్ద ముగిసింది. ► ఎల్ అండ్ టీ కంపెనీ ఇటీవలనే బలవంతంగా చేజిక్కించుకున్న మైండ్ట్రీ షేర్ 10 శాతం నష్టంతో రూ.774 వద్ద ముగిసింది. మైండ్ట్రీ వ్యవస్థాపకులు కృష్ణకుమార్ నటరాజన్, ఎన్ఎస్. పార్థసార«థి, రోస్టో రావణన్లు తమ తమ డైరెక్టర్ల పదవులకు, కంపెనీ పదవులకు రాజీనామా చేయడం దీనికి కారణం. ► దాదాపు 300కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్; హీరో మోటోకార్ప్, ఈరోస్ మీడియా, ఎస్కార్ట్స్, సన్ టీవీ, కాక్స్ అండ్ కింగ్స్, గోవా కార్బన్, గ్రాఫైట్ ఇండియా తదితర షేర్లు ఈ పతన జాబితాలో ఉన్నాయి. ► ఎల్ అండ్ టీ రేటింగ్ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, బ్యాంక్ ఆఫ్ అమెరికా డౌన్గ్రేడ్ చేయడంతో ఎల్ అండ్ టీ షేర్ 4% నష్టంతో రూ.1,490 వద్ద ముగిసింది. ఎందుకు పడిందంటే... ఎఫ్పీఐలపై పన్ను సంపన్న వర్గాలపై మరింత పన్ను విధించాలన్న ప్రతిపాదన.. భారత్లో ఇన్వెస్ట్ చేస్తున్న 2,000కు పైగా విదేశీ ఫండ్స్పై తీవ్రంగానే ప్రభావం చూపగలదని నిపుణులంటున్నారు. ట్రస్ట్ల మార్గంలో భారత్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఎఫ్పీఐలపై తాజా సర్చార్జీ భారం మరింతగా పెరుగుతుందని, ఫలితంగా పన్ను పరంగా భారత్కు ఉన్న ఆకర్షణ తొలగుతుందని, విదేశీ పెట్టుబడులు నీరసిస్తాయని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా ప్రతిపాదన కారణంగా విదేశీ ఇన్వెస్టర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) భారం మరింతగా పెరుగుతుంది. ఈ పన్ను విషయమై త్వరలోనే వివరణ ఇస్తామని సీబీడీటీ చైర్మన్ పేర్కొనగా, ఇక ఎలాంటి వివరణ అవసరం లేదని, అంతా స్పష్టంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెగేసి చెప్పారు. దీంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బడ్జెట్ ప్రతిపాదనలు... లిస్టెడ్ కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో షేర్ల సప్లై పెరిగి లిక్విడిటీ ఆవిరైపోతుంది. ఐటీ, పీఎస్యూ షేర్లపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక ఎమ్ఎన్సీలు మన మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేస్తాయి. ఇక సంపన్నులపై అధిక పన్నులు విధించడం, షేర్ల బైబ్యాక్పై 20 శాతం పన్ను తదితర ప్రతిపాదనలు కూడా మార్కెట్పై తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం... అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతకు సిద్ధమవుతోంది. అయితే గత శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించాయి. ఆర్థిక వ్యవస్థ బానే ఉందన్న సంకేతాలు ఈ గణాంకాలు ఇవ్వడంతో ఫెడరల్ రిజర్వ్ రేట్లకోత విషయంలో పునరాలోచించే అవకాశాలున్నాయన్న అంచనాలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మోర్గాన్ స్టాన్లీ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లను డౌన్గ్రేడ్ చేయడమే కాకుండా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తన పెట్టుబడులను తగ్గించుకోవాలని(ఇది దాదాపు ఐదేళ్ల కనిష్ట స్థాయి) నిర్ణయించుకోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ కారణాలన్నింటి వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ 2.5 శాతం, హాంగ్సెంగ్ సూచీ 1.5 శాతం, జపాన్ నికాయ్ సూచీ 1 శాతం, దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక యూరప్సూచీలు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. జూన్ క్వార్టర్ ఫలితాలు.. ఎలా ఉంటాయో ? వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉన్న నేపథ్యంలో నేటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. బ్యాంక్లు మినహా ఇతర రంగాల కంపెనీల ఆర్థిక ఫలితాల్లో పెద్దగా మెరుపులు ఉండకపోవచ్చని, అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న ఆందోళన నెలకొన్నది. 2 రోజులు..రూ. 5 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా సోమవారం ఇన్వెస్టర్ల సంపద రూ.3.39 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.3,39,193 కోట్లు ఆవిరై రూ.1,47,96,303 కోట్లకు పడిపోయింది. బడ్జెట్ రోజు సంపద నష్టాన్ని కూడా కలుపుకుంటే మొత్తం రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5,61,773 కోట్లు హరించుకుపోయింది. ఎదురీదిన యస్ బ్యాంక్ అన్ని షేర్లు క్షీణించినా, యస్ బ్యాంక్ మాత్రం ఎదురీదింది. ఆరంభంలోనే ఐదేళ్ల కనిష్ట స్థాయి, రూ.85.70కు పడిపోయిన ఈ షేర్ తర్వాత పుంజుకొని 5.5 శాతం లాభంతో రూ.93 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులు భేషుగ్గా ఉన్నాయని యాజమాన్యం స్పష్టతనివ్వడంతో పాటు ఉన్నత స్థాయిల్లోని నిర్వహణ పదవులను భర్తీ చేయడం కూడా కలిసి వచ్చింది. సెన్సెక్స్లో ఈ షేర్తో పాటు టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభపడ్డాయి. మొత్తం మీద 31 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లు నష్టపోయాయి. -
నిరాశాజనకం.. నిరుత్సాహకరం
దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించే స్ఫూర్తి కూడా కేంద్ర బడ్జెట్లో కొరవడటం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ప్రభుత్వ మొత్తం వ్యయం, ప్రజలను ప్రభావితం చేస్తున్న రంగాల్లో పెట్టే వ్యయంలో కూడా పెరుగుదల కనిపించడం లేదు. తీవ్రమైన నిరుద్యోగిత అలుముకున్న తరుణంలో పనికి ఆహార పథకం తిరోగమించడం ప్రమాదకరం. ప్రభుత్వం స్వయంగా ఖర్చుపెట్టడం, సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించడానికి బదులుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరింతగా తలుపులు బార్లా తెరవడం అంటే.. ప్రజలపై ప్రభుత్వం నేరుగా ఆయుధం గురిపెడుతున్నట్లే లెక్క. విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడటం కేంద్రప్రభుత్వాన్ని మరింత విదేశీ ఒత్తిళ్లకు లోబడేలా చేస్తుంది. అంతకు మించి రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయి కేంద్రంపై ఆధారపడటం.. భారత సమాఖ్యతత్వానికి, ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలిపెట్టు అవుతుంది. ఆర్థిక శాస్త్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నడూ బలమైన అంశంగా భావించలేదు. తొలి దఫా పాలనలో అది తీసుకొచ్చిన కీలకమైన సంస్కరణలు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ఎంత వినాశకరంగా పరిణమించాయో అందరికీ తెలిసిందే. కాబట్టే 2019–20 కేంద్ర బడ్జెట్ మనకు ఏదో తెచ్చిపెడుతుందని భావిం చడం అర్థరహితం. ఇలాంటి సందర్భంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే స్ఫూర్తి కూడా కేంద్ర బడ్జెట్లో కొరవడటం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆర్థిక కార్యాచరణ నెమ్మదించడం, వ్యవసాయరంగ సంక్షోభం. భారీస్థాయి నిరుద్యోగిత, విదేశీ చెల్లింపుల భారం వంటి సీరియస్ సమస్యలపై కూడా బడ్జెట్ పెద్దగా దృష్టి కేంద్రీకరించినట్లు లేదు. ముఖ్యంగా రాబడి వృద్ధి రేటు మందగించిపోతోంది. ఆర్థిక కార్యాచరణ మందగించడం ఒక కారణం కాగా, పేలవమైన జీఎస్టీ వసూళ్లు ప్రధాన కారణం. 2018–19కి గాను సవరించిన వసూళ్ల అంచనాను ప్రస్తుత ఆర్థిక మంత్రి ఉల్లేఖించారు. ఇవి గత సంవత్సరం బడ్జెట్ అంచనాలకు సమీపంగా ఉన్నాయి. కానీ తాజాగా కాగ్ ప్రకటించిన గణాంకాలకంటే ఇవి కాస్త అధికంగా ఉండటం గమనార్హం. కాగ్ నివేదిక ప్రకారం 2018–19 సంవత్సరంలో కేంద్రప్రభుత్వం బడ్జెట్ అంచనాతో పోలిస్తే జీఎస్టీ రాబడిలో రూ. 1.6 లక్షల కోట్లు తక్కువగా నమోదైంది. ఇక 2019–20 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసినా వాస్తవానికి అలా కనిపించడం లేదు. బడ్జెట్ ప్రకారం చేసిన వ్యయంలో కూడా పెరుగుదల కనిపించడం లేదు. మొత్తం వ్యయం, ప్రజలపై ప్రభావితం చేస్తున్న రంగాల్లో పెట్టిన వ్యయం విషయంలో కూడా పెరుగుదల కనిపించడం లేదు. చాలావరకు పెరిగిన వ్యయాలు సాధారణ జీడీపీలో అంచనా వేసిన రేటు ప్రకారంగానే జరుగుతూ వచ్చాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహాత్మాగాంధీ జాతీయ పనికి ఆహార పథకం విషయంలో 2018–19కి గాను సవరించిన అంచనాలతో సరిపోల్చితే తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరుద్యోగిత అలుముకున్న తరుణంలో పనికి ఆహార పథకం తిరోగమించడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. చేసిన ఈ వ్యయాలకు సంబంధించిన గణాంకాలు కూడా 2018–19కి గాను సవరించిన అంచనాల ప్రాతిపదికపైనే పొందుపర్చడమైనది. సవరించిన అంచనాల కంటే వాస్తవ అంచనా తగ్గుముఖం పట్టినందువల్ల 2019–20లో కూడా ఈ పతనం కొనసాగుతుందని స్పష్టమవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యవ్యవస్థ ఒత్తిళ్లను సంతృప్తిపర్చాల్సి ఉందని ఎన్డీఏ భావిస్తున్నందున అంచనా వేసిన ఈ వ్యయాలనైనా కేంద్రప్రభుత్వం ఖర్చుపెట్టగలదా అనేది సందేహమే. ముంచుకొస్తున్న మాంద్య పరిస్థితుల్లో వ్యయానికి సంబంధించి పెట్టుకున్న లక్ష్యాలను కూడా కొనసాగించడం కష్టమే కావచ్చు. ఈ పరిస్థితుల్లో దేశానికి అవసరమైంది రాబడి, ఖర్చుల గణాంకాలను వల్లించే బడ్జెట్పై కేవలం చర్చ కాదు. ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసే అదనపు రాబడి వనరులపై తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. కానీ ఈ కోణంలో ఎలాంటి సృజనాత్మక ఆలోచనలను చేపట్టడానికీ ఎన్డీఏ ప్రభుత్వం తిరస్కరించడం గమనార్హం. ప్రస్తుతం కేంద్రానికి వస్తున్న రాబడుల ట్రెండ్స్ని భవిష్యత్తుకు కూడా సూచికలుగా అలా ప్రస్తావించడం మినహా తాజా బడ్జెట్ పెద్దగా ఊడబొడిచిందేమీ లేదు. ఈ దఫా బడ్జెట్లో గణనీయంగా పేర్కొనాల్సిన విషయం ఏమిటంటే సంపద పన్ను పెంచడం. దేశంలోని బిలియనీర్ల మొత్తం ఆదాయం రూ. 560 లక్షల కోట్లుగా అంచనా. వీరిపై కనీసం ఒక్క శాతం సంపద పన్ను పెంచినా సరే కేంద్రప్రభుత్వానికి రూ. 5.6 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. ఇక వారి వారసత్వ ఆస్తులపై కూడా పన్ను పెంచినట్లయితే అదనంగా రూ.9.3 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రకాల పన్నులను దేశీయ బిలియనీర్లపై విధించినట్లయితే రూ.15 లక్షల కోట్ల రాబడి కేంద్ర ఖజానాకు సమకూరుతుంది. దేశంలో కునారిల్లుతున్న సంక్షేమ పథకాలకు ఈ భారీ మొత్తం కాస్త ఊపిరి పోసే అవకాశం ఉంది. ఇంత రాబడి వచ్చినట్లయితే, ప్రతి భారతీయుడికీ అయిదు ప్రాథమిక హక్కులకు హామీ ఇవ్వవచ్చు. అవేమిటంటే, ఆహార హక్కు, ఉపాధి హక్కు, సెకండరీ స్థాయివరకు నాణ్యమైన విద్యను పొందే హక్కు, ప్రభుత్వం నిర్వహించే జాతీయ ఆరోగ్య సేవ ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ హక్కు, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2,000ల వృద్ధాప్య పింఛను (ఇప్పుడు నెలకు రూ. 200 మాత్రమే ఇస్తున్నారు). హక్కుతోపాటు దివ్యాంగులకు ప్రయోజనాలు కూడా కల్పించవచ్చు. నిజానికి, బడ్జెట్ సమర్పించడానికి ముందు, సంపన్నులపై వారసత్వ పన్ను విధిస్తారని భావించారు. ఆశ్చర్యకరంగా ప్రస్తుత బడ్జెట్ దాని ప్రస్తావన అయినా తేలేదు. మరోవైపున, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి ఊదరగొడుతున్నారు. తాజా బడ్జెట్లో ఏదైనా వ్యూహా త్మకపరమైన అంశం ఏదైనా ఉందంటే, దేశంలోనికి ఎఫ్డీఐలను ఆకర్షించడం మాత్రమే. ఇది కూడా కార్మికుల హక్కులను అణిచివేయడం, భూమిని మరింత సులభంగా స్వాధీనపర్చుకోవడం ద్వారా అమలు కానుంది. ఈ రకమైన అభివృద్ధిని కొనసాగించడం అంటే నిరుద్యోగి తను మరింతగా పెంచడానికే దారితీస్తుంది. ప్రభుత్వం స్వయంగా ఖర్చుపెట్టడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించడం అనే అంశాలను దేశ ఆర్థిక వ్యవస్థ చోదకశక్తిగా మార్చడానికి బదులుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరింతగా తలుపులు బార్లా తెరవడం అనేది ప్రజలపై ప్రభుత్వ ఆయుధంగా మారనుంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగమనంలోకి జారిపోతున్న తరుణంలో, బహుళ జాతీయ సంస్థలు ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కోల్పోతున్న తరుణంలో ప్రభుత్వమే ఖర్చుపెట్టడం ద్వారా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడం ప్రజా ప్రయోజనాలకు పట్టం కట్టినట్లవుతుంది. నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదం లక్ష్యమే ఇది. కానీ ఆ మార్గంలో గత ఐదేళ్లలో కేంద్రం ఎంతమేరకు నడిచింది? కేంద్ర ప్రభుత్వం కొన్ని తీపి మాటలు చెబుతూ కొద్దిమేరకు పెట్టుబడులను తీసుకురాగలిగినట్లు చెప్పుకోవడం నిజమని భావించినప్పటికీ, అది గత అయిదేళ్లలో ఎన్ని ఉద్యోగాలను సృష్టించగలిగింది అనేది ప్రశ్న. ఒకవైపు బహుళ జాతి సంస్థలు, మరోవైపు దేశీయ బడా వాణిజ్యవేత్తలు సాధించిన వృద్ధి రేటు అధికంగా ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, పెంచి చెబుతున్న ఇంత భారీ జీడీపీ రేట్లు కూడా దేశ శ్రామిక వర్గానికి అవసరమైన సహజ ఉపాధిని పెంచలేకపోవడం గమనార్హం. ఇలాంటి తరహా వృద్ధి ధోరణులతో దేశీయ నిరుద్యోగితను తొలగిస్తామని చెప్పడం పూర్తిగా అవాస్తవికమే అవుతుంది. ఇదంతా అందరికీ అనుభవైకవేద్యమైన విషయమే కానీ మోదీ ప్రభుత్వం కూడా మధ్యయుగాల ఫ్రాన్స్ బర్బన్ రాజుల్లాగా, ‘నేర్చుకున్నదీ లేదు.. మర్చిపోయిందీ లేదు’ అనే దోరణిలో కూరుకుపోవడం విశేషం. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో పొందుపర్చిన రెండు అంశాలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీయనున్నాయి. ఒకటి. ప్రభుత్వ రుణాల కోసం అంతర్జాతీయ ద్రవ్యమార్కెట్లను సంప్రదించడం. దీనివెనుక ఎలాంటి విలువైన కారణం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ రుణాలపై పరిమితి అనేది ద్రవ్యలోటుపై స్వయంగా విధించుకున్న సీలింగ్పై ఆధారపడి ఉంటుందే తప్ప దేశీయ మార్కెట్లో రుణాలు సాధించలేని ప్రభుత్వ అసమర్థతపై ఆధారపడి ఉండదు. ప్రభుత్వం విదేశాల నుంచి రుణాలకు ప్రయత్నించడం పెరగటం అంటే, భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ ద్రవ్యసంస్థల పట్టును మరింతగా పెంచడమే అవుతుందని మర్చిపోరాదు. ఇలాంటి నేపథ్యంలో రుణాలను తేవడంలో వాటిని తీర్చడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా దేశంపై నిరంకుశంగా మితవ్యయాన్ని రుద్దడానికి ఆస్కారం ఉంటుంది. పైగా బడ్జెట్ విదేశీ మారక మార్కెట్టును ద్రవ్యమార్కెట్తో ముడిపెట్టింది. దీనివల్ల రూపాయి పతనం మరింత పెరిగి ప్రభుత్వంపై రుణభారం ఆకాశాన్ని అంటుతుంది. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ ఒత్తిళ్లకు పూర్తిగా లోబడాల్సిన పరిస్థితి ఏర్పడక మానదు. ఇక రెండో అంశం సమాఖ్యతత్వానికి చెందినది. జీఎస్టీని తనకు తానుగా భారత రాజ్యాంగంలోని సమాఖ్య చట్రంపై చేసిన భారీ దాడిగా చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి వివేచన లేకుండా ఈ ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని గుడ్డిగా ఆమోదించేశాయి. కానీ ఆశించిన రాబడిలో జీఎస్టీ విఫలం కావడం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై దారుణ ప్రభావం వేసింది. దీనికంటే మిన్నగా ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో, కేంద్రప్రభుత్వం తన రాబడిని పెంచుకోవడానికి సెస్సులు, సర్చార్జీలను పునరుద్ధరిం చింది. అంటే ఇలా ఆర్జించే రాబడిలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం వాటా ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వం గుప్పిటలో ఉంచుకోవడానికి ఇది ఇతోధికంగా ఉపయోగపడుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఎందుకంటే రాష్ట్రాలు ఒక మూలకు నెట్టబడి కేంద్రం సహాయానికి దేబిరించాల్సి వస్తుంది. కేంద్రం కూడా తనకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, వ్యతిరేకంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలను ఉపేక్షించడం అలవాటు చేసుకునే స్థితి ఏర్పడుతుంది. భారత సమాఖ్యతత్వానికి, ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు అవుతుంది. వ్యాసకర్త విశ్రాంత ఆర్థిక ఆచార్యులు, జేఎన్యూ, ఢిల్లీ ప్రభాత్ పట్నాయక్ -
2 రోజుల్లో రూ. 5.61లక్షల కోట్లు ఆవిరి
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్ల ఉత్థాన పతనాలను ఒడిసిపట్టుకోవడం అంత ఆషామాషీ వ్యవహారేమీ కాదు. దేశీయంగా తాజా ఆర్థిక,రాజకీయ పరిణామాల విశ్లేషణ, గ్లోబల్ మార్కెట్ల ఆటుపోట్లు తదితర అంశాల పట్ల చురుకుగా ఉండాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ముఖ్యంగా కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలకు చేరి ఇన్వెస్టర్లను బాగా ఊరించాయి. కానీ ఈ ఉత్సాహాన్ని తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సార్వత్రిక బడ్జెట్ భారీగా దెబ్బతీసింది. 40 వేలస్థాయికి చేరుకున్న సెన్సెక్స్ కుప్పకూలి ఇన్వెస్టర్లను వణికించింది. రెండు సెషనల్లోనే ఏకంగా రూ. 5.61 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరై పోయింది. బడ్జెట్ డే రోజు 394 కోల్పోయిన సెన్సెక్స్ సోమవారం మరింత దిగజారి 793 పాయింట్ల మేర పతనమైంది. సోమవారం ఒక్కరోజే 3.39 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్ల బలహీనత కూడా మార్కెట్లను దెబ్బతీసినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా హెవీ వెయిట్ స్టాక్స్ కూడా పేకమేడల్లా కూలిపోవడంతో ఇన్వెస్టర్లు షాక్లో ఉండిపోయారు. ఒక్క ఐటీ మినహా అన్ని రంగాలు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, రియాల్టీ, మీడియా, ఆటో, మెటల్, ఫార్మా రంగ సూచీల్లో నష్టం అత్యధికంగా ఉంది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు కూడా రెండున్నర శాతం వరకూ కోల్పోయాయి. గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజున ఈ స్థాయిలో పతనాన్ని నమోదు చేసిందన మార్కెట్ నిపుణులు తెలిపారు. ఎఫ్సీఐల్లో ఉన్న 40-45 శాతం మంది ఈ కొత్త పన్నుల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉండడంతో ఎఫ్పీఐ అమ్మకాల జోరందుకుందన్నారు. తాజా గణాంకాల ప్రకారం స్టాక్మార్కెట్లోని బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 4న (బడ్జెట్కు ముందు రోజు) రూ.153.58 లక్షల కోట్లుగా ఉంది. జూలై 5 (బడ్జెట్ డే) నాటికి రూ.151.35 లక్షల కోట్లుగా ఉంది. జూలై 8న సోమవారం రూ.147.96 లక్షల కోట్లకు పతనమైంది. అంటే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.5.61 లక్షల కోట్లకుపైగా క్షీణించిందన్నమాట. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా బలహీనంగా ముగిసింది. -
కేంద్ర బడ్జెట్ ప్రకంపనలు స్టాక్ మార్కెట్..
-
స్టాక్ మార్కెట్కు బడ్జెట్ షాక్
ముంబై : స్టాక్ మార్కెట్పై కేంద్ర బడ్జెట్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ మార్కెట్ను మెప్పించడంలో విఫలమవడంతో మదుపుదారులు అమ్మకాలకు తెగబడ్డారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో సోమవారం కీలక సూచీలు భారీగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లకు దీర్ఘకాల మూలధన రాబడిపై పన్నును పెంచడం ఎఫ్పీఐలను తీవ్ర నిరాశకు లోనుచేసిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టంతో 38,816 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 215 పాయింట్ల నష్టంతో 11,595 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత రెండు సెషన్లలో స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో మదుపుదారుల సంపద రూ 5 లక్షల కోట్ల మేర ఆవిరైంది. -
మార్కెట్పై ‘బడ్జెట్’ ప్రభావం
న్యూఢిల్లీ: గత శుక్రవారం బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కీలక నిర్ణయాలు, ప్రతిపాదనల ప్రభావం ఈ వారం మార్కెట్పై ఉంటుందని, అలాగే ఐఐపీ(పారిశ్రామికోత్పత్తి), ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక గణాంకాలపైనా ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక జూన్ త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యే కంపెనీల ఫలితాలు కూడా మార్కెట్ ట్రెండ్ను నిర్ణయించొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 9న టీసీఎస్, 12న ఇన్ఫోసిస్ ఫలితాలు విడుదల కానున్నాయి. అలాగే, బడ్జెట్ నిర్ణయాల నేపథ్యంలో డాలర్తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ అంశాల ప్రభావం సైతం ఉంటుందని భావిస్తున్నారు. గత శుక్రవారం బడ్జెట్ నిర్ణయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సూచీలు నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లిస్టెడ్ కంపెనీల్లో కనీస ప్రజల వాటాను ప్రస్తుత 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, బైబ్యాక్పై 20 శాతం పన్ను వంటి అంశాలు మార్కెట్లకు రుచించలేదు. ‘‘ఎంతగానో వేచి చూసిన బడ్జెట్ కార్యక్రమం ముగిసింది. అయితే, దీని తాలూకూ ప్రభావం ఈ వారం కూడా మార్కెట్పై కొనసాగుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోదీ తెలిపారు. ‘‘బడ్జెట్ ప్రభావం సోమవారం నాటి మార్కెట్పైనా ఉంటుంది. సూచీల్లో భారీ క్షీణత మరింత నష్టాలు ఉంటాయన్న సంకేతాన్నిస్తోంది. 11,800ను నిఫ్టీ కోల్పోతే మరింత క్షీణతకు దారితీస్తుంది’’అని రెలిగేర్ బ్రోకింగ్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ తెలిపారు. ఇక, పారిశ్రామిక ఉత్పత్తి, జూన్ నెల ద్రవ్యోల్బణం గణాంకాలు, చమురు ధరల కదలిక, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి సైతం ఈ వారం మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటాను పెంచే ప్రతిపాదన అవసరమైనదే కానీ, లార్జ్క్యాప్ కంపెనీల విషయంలో దీని అమలు సమస్యలతో కూడుకున్నదేనని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ అన్నారు. మార్కెట్లకు నిరుత్సాహం... ‘‘ప్రభుత్వం నుంచి మద్దతు చర్యలను మార్కెట్ ఆశించింది. కానీ, అది జరగలేదు. దేశీయంగా, అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులే ఇందుకు కారణం’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్హెడ్ వినోద్నాయర్ పేర్కొన్నారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై ప్రోత్సాహకాల్లేమి మార్కెట్లను సమీప కాలంలో నిరుత్సాహంగా మార్చొచ్చన్నారు. ఈ స్థాయి నుంచి మార్కెట్ పనితీరు అన్నది 2020 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక పనితీరుపై ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపించారు. ఈ వారంలో వచ్చే ఫలితాలు 8వ తేదీన డెల్టాకార్ప్, గోవా కార్బన్ , 9న టీసీఎస్, 10న సీసీఎల్, 12న ఇండస్ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, కర్ణాటక బ్యాంకు, 13న డీహెచ్ఎఫ్ఎల్, డీమార్ట్ ఈ వారంలో ఫలితాలు విడుదల చేయనున్న ప్రముఖ కంపెనీల్లో కొన్ని. ‘‘బడ్జెట్లో అదనపు సాయం కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు కొనసాగుతాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. 2019–20 ఫలితాల విషయంలో ఎన్ఎస్ఈ 500 కంపెనీల పన్ను అనంతరం లాభంలో 30 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఎడెల్వీజ్ ఇన్వెస్టర్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్కపూర్ తెలిపారు. తొలి వారంలో విదేశీ పెట్టుబడులు వెనక్కి న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై అనిశ్చితి అంచనాల నేపథ్యంలో జూలై తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 475 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు దాదాపు అయిదు నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతూ వస్తున్నారు. ఈక్విటీ, డెట్ మార్కెట్లకు సంబంధించి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) నికరంగా ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఏప్రిల్లో రూ. 16,093 కోట్లు, మే లో రూ. 9,031.15 కోట్లు, జూ¯Œ లో రూ. 10,385 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. -
నేడు ఆర్బీఐ బోర్డు సభ్యులతో సీతారామన్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం(నేడు) రిజర్వ్ బ్యాంక్ కేంద్ర బోర్డు సభ్యులతో సమావేశం కానున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక అంశాలను ఈ సందర్భంగా ఆమె ఆర్బీఐకి వివరించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యం ఇందులో ప్రధానంగా చర్చకు రానుంది. ఈ ఏడాది(2019–20) ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తాజా పూర్తిస్థాయి బడ్జెట్లో తగ్గించిన సంగతి తెలిసిందే. మధ్యంతర బడ్జెట్లో అంచనాలతో పోలిస్తే నికరంగా రూ.6,000 కోట్లు ఖజానాకు అదనంగా సమకూరనుండటంతో ఇది సాధ్యమైంది. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020–21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూడా జీడీపీలో 3 శాతానికి కట్టడి చేయడం, ప్రాథమిక లోటును పూర్తిగా తొలగించడం వంటి అంశాలతో రోడ్మ్యాప్ను సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటారు. అదేవిధంగా ద్రవ్యలోటు నుంచి కేంద్రం చెల్లించాల్సిన వడ్డీలను మినహానయిస్తే, మిగిలిన లోటును ప్రాథమిక లోటుగా వ్యవహరిస్తారు. ఇక ఆర్బీఐ మిగులు నిధుల విషయానికొస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.90,000 కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు అంచనా. గతేడాదితో పోలిస్తే(రూ.68,000 కోట్లు) ఇది 32 శాతం అదనం. అంతేకాదు ఇప్పటిదాకా ఆర్బీఐ నుంచి కేంద్రం అందుకున్న అత్యధిక డివిడెండ్గా కూడా ఇది నిలవనుంది. -
ప్రజాప్రయోజనాలకు పట్టం కట్టిన బడ్జెట్
ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరవ బడ్జెట్ ఆయన రెండో దఫా పాలనకు అభినందనలు తెలిపిన బడ్జెట్గా చరిత్రలో నిలిచిపోనుంది. జవహర్లాల్ నెహ్రూ, మన్మోహన్ సింగ్ తర్వాత అయిదేళ్ల పూర్తి కాలం తర్వాత మరోసారి కేంద్రంలో ఎన్నికైన మూడో ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. నూతన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నప్పుడు ఢిల్లీలో వర్షం కురి సింది, సెన్సెక్స్ కూడా తాత్కాలికంగా కుప్పగూలింది. ఇది ఏరకంగా చూసినా విశిష్టమైన సందర్భం. అవకాశాలను విస్తరించిన సందర్భం. నరేంద్రమోదీ రెండో దఫా పాలనలో తొలి బడ్జెట్ సందర్భంగా శుక్రవారం ఉదయం అందరి ఆశలూ ఆకాశాన్ని అధివసించాయి. తొలి దఫా పాలనలో మోదీ ఆర్థిక వ్యవస్థను చక్కగా నిర్వహించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి భారీ సంస్కరణలతోపాటు, సులభతరమైన వాణిజ్యం, ద్రవ్యోల్బణ నియంత్రణ, ద్రవ్యలోటును తగ్గించడం, ఆర్థిక వృద్ధిరేటను 7శాతం వద్ద నిలకడగా కొనసాగించడం వంటి చర్యలు మోదీ ప్రతిష్టను మరింతగా నిలిబెట్టాయి. ఇప్పుడు ఆయన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు పెంచడంపై దృష్టిపెట్టింది. ఇది ప్రస్తుతం ఉన్న 2.7 ట్రిలియన్ డాలర్లనుంచి పెనుగంతు వేయడం లాంటిదే. ఉపాధి కల్పన, వృద్ధి, ఆర్థిక వ్యవస్థపై డేటాను స్థిరీకరించడం, ఆర్థిక వ్యవస్థను మెరుగు చేయడంలో సమస్యలు, పన్నుల తగ్గింపు, ఆదాయ పెంపు, ద్రవ్య సమతుల్యతను కొనసాగించడం వంటి భారీ సవాళ్లు ప్రస్తుత కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పటికీ ఒడిదుడుకులతో సాగుతుండటంతో ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చి, పబ్లిక్ పెట్టుబడి ఆధారంగా ఉద్యోగాలను కల్పించడం పెనుసవాలుగా మారుతోంది. కేంద్రప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన భారీ పథకాలు ఉజ్వల, సౌభాగ్య.. వంట గ్యాస్, విద్యుత్ సరఫరాను అవసరమైన వారికి అందించి కోట్లమంది జీవితాలను సౌకర్యవంతంగా మార్చాయి. దాదాపుగా 1.95 కోట్ల గృహాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తగినంతమేరకు ప్రయోజనాలు లభించాయి. ఇక ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకంతో రూ. 80,200 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 1.25 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించడమైంది. గత అయిదేళ్లుగా దేశం సాధించిన ప్రయోజనాలను మరింత సంఘటితం చేయడంపై తాజా బడ్జెట్ దృష్టి సారించింది. గావ్, గరీబ్, కిసాన్, స్వదేశీలపై మరింతగా కేంద్రీకరించనున్నారు. ఆర్థిక వృద్ధి నమూనాను ప్రతిపాదించడమే కాకుండా, ప్రతిరంగంలోనూ ప్రైవేటీకరణకు, విదేశీ పెట్టుబడులను స్వాగతించడం కోసం విస్తృతంగా తలుపులు తెరవటం జరుగుతోంది. 2018–2030 మధ్యలో ఒక్క రైల్వే మౌలిక వసతుల కల్పనకే దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల మదుపు అవసరముంది. కాలం చెల్లిన పవర్ ప్లాంట్లను తప్పించి మెరుగైనవాటి కల్పన కోసం అత్యున్నత స్థాయి సాధికారిక కమిటీకి సిఫార్సు చేయనున్నారు. ఉదయ్ ఇప్పటికే ఈ విషయంలో ఎంతో సహకరించింది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత వృద్ధి చెందనుంది. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు, కార్పొరేట్ సౌవరిన్, వెంచర్ ఫండ్లు అనే మూడు గ్లోబల్ ప్లేయర్లను ఏకత్రాటికి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం వార్షిక గ్లోబల్ మీట్కు ప్లాన్ చేస్తోంది. గడచిన సంవత్సరాల్లో పెద్దగా విజయం సాధించని మేక్ ఇన్ ఇండియాకు ఈ బడ్జెట్ మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇక టూరిజం, విద్య, సంస్కృతి వంటి వెనుకబడిన రంగాలపై తాజాగా దృష్టి పెట్టనున్నారు. సరళీకరణ అనంతర దశలో అభివృద్ధి చోదకశక్తులుగా గుర్తింపు పొందిన ఐటీ, విద్య, సేవారంగాలు గత అయిదేళ్లుగా మంచి పనితీరు కనబర్చలేదు. భారత్మాల రోడ్ కనెక్టివిటీని పెంచే ప్రాజెక్టుగా ఖ్యాతి పొందనుంది. సాగరమాల అనేది ఓడరేవులు, జలమార్గాల కనెక్టివిటీలో ఇతోధికంగా తోడ్పడనుంది. వీటితో మౌలిక వసతుల కల్పనా రంగం తిరిగి గాడిన పడుతుంది. నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో వేతనజీవులు, మధ్య ఆదాయ బృందాలు, రైతులు, యువజనులు ప్రధాన లబ్ధిదారులు అవుతున్నారు. పైగా సగటు మనిషి జేబులో మరింత డబ్బును ఉంచేందుకు ఈ బడ్జెట్ ప్రయత్నించింది. ఇది డిమాండును మరింతగా పెంచి వృద్ధికి తోడ్పడుతుంది. మొత్తంమీద నిర్మల బడ్జెట్ వాణిజ్య అనుకూల బడ్జెట్ అనే చెప్పాలి. డాక్టర్ ఆర్ బాలశంకర్, బీజేపీ సెంట్రల్ కమిటీ మెంబర్ -
మండిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కోసం ఇంధనంపై పన్ను పెంచడంతో ఆ ప్రభావం రవాణారంగం, వాహనదారులపై పడింది. శనివారం పెట్రోల్ ధర లీటరుపై కనిష్టంగా రూ.2.40, డీజిల్ ధర రూ.2.36 మేర పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్పై రూ.2.45 పెరిగి లీటరు ధర రూ.72.96కు చేరుకుంది. ఇదే ముంబైలో రూ.2.42 పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.78.57కు, కోల్కతాలో రూ.2.49 పెరిగి రూ.75.15కు, చెన్నైలో రూ.2.57 పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.75.76కు చేరిందని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. కాగా, ఢిల్లీలో డీజిల్ రూ.2.36 పెరిగి లీటరు రూ.66.69కు, ముంబైలో రూ.2.50 పెరిగి లీటర్ ధర రూ.69.90 కు చేరుకుందని పేర్కొంది. రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, వ్యాట్ ఆధారంగా ఈ ధరలు వేర్వేరుగా ఉండే అవకాశముందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ల ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్ది వ్యత్యాసం ఉంటుందని తెలిపింది. ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో పెట్రోల్, డీజిల్లపై రోడ్లు, మౌలికరంగాల సెస్, పన్నులు కలిపి లీటరుకు రూ.2 మేర విధించడం ద్వారా ఏడాదికి రూ.24 వేల నుంచి రూ.28 వేల కోట్ల మేర సమీకరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్పై మొత్తం పన్ను భారం రూ.17.98 ఉండగా, కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం ఇది లీటర్పై రూ.19.98కు పెరిగింది. డీజిల్ లీటర్పై ఉన్న మొత్తం పన్ను భారం కూడా రూ. 13.83 నుంచి రూ.15.83కు పెరిగింది. వ్యాట్ కూడా రాష్ట్రాలను బట్టి మారుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై వ్యాట్ 27 శాతం, డీజిల్పై 16.75 శాతం ఉంది. ముంబైలో వ్యాట్ పెట్రోల్పై 26 శాతానికి తోడు అదనపు ట్యాక్స్ రూ.7.12 వసూలు చేస్తున్నారు. డీజిల్పై ఇక్కడ 24 శాతం సేల్స్ ట్యాక్స్ పడుతోంది. -
రాష్ట్రాల ప్రయోజనాలు పట్టని బడ్జెట్
కడప కార్పొరేషన్: 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుపయోగంగా మారిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. శనివారం కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల ప్రయోజనాలను మోదీ దృష్టిలో పెట్టుకోలేదన్నారు. ఆదాయ పెంపే లక్ష్యంగా ఎడా పెడా పన్నులు వేయడం దారుణమన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోవడం విచారకరమన్నారు. విభజన చట్టంలోని గిరిజన, సెంట్రల్, పెట్రోలియం యూనివర్సిటీలకు నామమాత్రంగా నిధులు కేటాయించారన్నారు. పోలవరానికి రూ.52వేల కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, రాజధానికి నిదుల కేటాయింపు జరగలేదన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధునికీకరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విధాన పరమైన చర్యలు చేపట్టకపోగా, పెట్రోల్, డీజిల్పై సుంకం విధించి సామాన్యుని జీవితం దుర్భరం చేశారని మండిపడ్డారు. రైతాంగానికి అదనంగా చేసిందేమీ లేదని పెదవి విరిచారు. దేశంలో ఉన్న కోట్లాది మంది నిరుద్యోగ యువతకు ఏ విధంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తారో చెప్పలేదన్నారు. సామాన్య మానవుని జీవన ప్రమాణాలు పెంచే వ్యవస్థను తీసుకురాకుండా ఆదాయం ఎలా పెంచుతారని ప్రశ్నించారు. బాబుకు ప్రతిపక్షనేతగా ఉండే అర్హత లేదు తాను ఎందుకు ఓటమిపాలయ్యాడో తెలుసుకోలేని చంద్రబాబుకు ప్రతిపక్షనేతగా ఉండే అర్హత లేదని సీఆర్సీ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుంటే, చంద్రబాబు అప్పుడే విమర్శలు చేస్తూ తన నైజాన్ని చాటుకున్నారన్నారు. మీడియాను ఎదుర్కొనే సత్తా లేక లోకేష్ ట్వీట్లపైన బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్ పాల్గొన్నారు. -
‘ప్రింట్’పై సుంకం కొరడా!
(సాక్షి, బిజినెస్ ప్రతినిధి): ఒకవైపు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్న డాలర్–రూపాయి విలువతో ఆందోళన చెందుతున్న ప్రింట్ మీడియాపై... శుక్రవారం నాటి బడ్జెట్ మరో బండను పడేసింది. దిగుమతి చేసుకునే న్యూస్ప్రింట్పై 10 శాతం సుంకం విధించడం ఈ రంగంపై తీవ్రమైన ప్రభావాన్నే చూపించనుంది. ఎందుకంటే ఒకవైపు డిజిటల్ మీడియా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటంతో ప్రింట్ మీడియాకు ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా విదేశాల్లో సైతం న్యూస్ప్రింట్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతేడాది ఒకదశలో టన్ను న్యూస్ప్రింట్ ధర 820 డాలర్లకు కూడా చేరింది. ఆ దెబ్బకు కొన్ని చిన్న పత్రికలు మూతపడ్డాయి కూడా. అక్టోబర్ తరువాత కొంత దిగిరావటం మొదలై.... రెండు నెలల కిందట ధరలు కాస్త స్థిరపడి.. ప్రస్తుతం టన్ను న్యూస్ప్రింట్ ధర 700 డాలర్లకు అటూఇటుగా ఉంది. నిజానికి చాలా వరకూ పత్రికలు తక్షణ ఇబ్బందులు రాకుండా ఐదారు నెలలకు సరిపడా నిల్వల్ని ముందే తెచ్చుకుని పెట్టుకుంటాయి. కాబట్టి తగ్గిన ధరల తాలూకు ఫలితం వాటికింకా అందలేదనే చెప్పాలి. పోనీ ఇప్పుడైనా ఉపశమనం దొరుకుతుందని భావించిన ప్రింట్ మీడియాపై శుక్రవారం నాటి బడ్జెట్ ఏకంగా బాంబునే వేసింది. ఇప్పటిదాకా వీటిపై దిగుమతి సుంకం లేకపోగా... ఒకేసారి 10 శాతం విధించటం గమనార్హం. ఈ చర్యతో మరిన్ని చిన్న, భాషా పత్రికలు మూతపడవచ్చనే ఆందోళన నెలకొంది. ‘‘ప్రకటనల ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఆశించిన సాయం అందించకపోగా ప్రభుత్వం ఇలా సుంకాలు మోపి దెబ్బతీయడం దురదృష్టకరం’’అని భారతీయ భాషా పత్రికల సంఘం (ఐఎల్ఎన్ఏ) అధ్యక్షుడు పరేష్నాథ్ తప్పుబట్టారు. ఆంగ్ల పత్రికలకు ప్రయివేట్ ప్రకటనలు, టెండర్ నోటిఫికేషన్ల రూపంలో ఆదాయం బాగానే వస్తుందని, దేశవ్యాప్తంగా విస్తరించిన చిన్న, మధ్య స్థాయి భాషా పత్రికలు ఈ భారాన్ని మోయలేవని ఆయన చెప్పారు. తక్కువ నాణ్యతతో, ఎక్కువ లాభాలు ఆర్జించాలని దేశీ న్యూస్ప్రింట్ తయారీదారులు ఆలోచిస్తున్నారని, వారి ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం దిగుమతి సుంకం విధించిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఈ సుంకాన్ని తక్షణం తొలగించాలని, తన చర్యను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
రాజకీయకోణంలోనే కేంద్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ కోణంలోనే కేంద్ర ప్రభుత్వం 2019–20 బడ్జెట్ను ప్రవేశ పెట్టిందని, ప్రధాని మోదీ తెలంగాణ పట్ల అనుసరిస్తు న్న కక్షపూరిత వైఖరికి కేంద్ర బడ్జెట్ అద్దం పడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శాసనసభ ఆవరణలోని టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలనే ధృక్పథం బడ్జెట్లో లోపించిందని, బడ్జెట్ ప్రతిపాదనల్లో సమాఖ్య స్ఫూర్తి కొరవడిందని విమర్శించారు. తెలంగాణలో 4 లోక్సభ స్థానాలను గెలుచు కున్న బీజేపీ..బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి చేసిం ది శూన్యమన్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించిన మరుసటి రోజే బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ తరఫున అమిత్షా ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసినా.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా బడ్జెట్లో నయాపైసా కేటాయించలేదని కర్నె మండిపడ్డారు. అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడంపై అమిత్షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి బీజేపీ పక్షాన గెలిచిన ఎంపీలు.. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడాలన్నారు. బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రస్తావనే ఏదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ టీఆర్ఎస్ అడగలేదంటూ బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని.. గతంలో ప్రధాని మోదీని కలిసిన ప్రతీ సందర్భంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు ఈ అంశంపై వినతి పత్రాలు సమర్పించారన్నారు. -
తెలంగాణలో బీజేపీ బలపడలేదు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలన ఉన్నంతకాలం తెలంగాణలో పాగా వేయటం బీజేపీకి అసాధ్యమని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీ అధినేతను ఢీకొనలేరని తేల్చి చెప్పారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్నేహభావంతో మెలిగే తత్వం ఉన్న తెలంగాణ ప్రజలు, విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను ఆదరించరని, సంఘ్పరివార్ ఆలోచనలను తిప్పిగొడతారన్నారు. గత ఐదేళ్లుగా ముస్లింలు, బడుగు బలహీనవర్గాలు, గిరిజనుల విద్యకోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలతో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్కు ప్రజలు అండగా ఉంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం బీజేపీ అధినేత అమిత్షా తెలంగాణకు రావటం ఆ పార్టీ అంతర్గత విషయమని, దాన్ని పట్టించుకోనన్నారు. కానీ, తెలంగాణలో పాగా వేసే చర్యల్లో భాగంగానే అమిత్షా ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణకు వచ్చినట్టయితే వారికి ఆశాభంగం తప్పదని ఆయన పేర్కొన్నారు. అత్యంత బలీయమైన శక్తిగా ప్రాంతీయ పార్టీలున్న ఒడిషా, తమిళనాడు, తెలంగాణలాంటి ప్రాంతాల్లో బీజేపీ ఎన్నటికీ విజయం సాధించలేదని, ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ కనుమరుగై ప్రాంతీయ పార్టీల హవా సాగుతోందన్నారు. గత ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ గెలవటం ఆ పార్టీ బలంగా ఉండటం వల్ల కాదని, మూడు చోట్ల అతి విశ్వాసం, ఒక స్థానంలో సరైన అభ్యర్థి లేకపోవటం టీఆర్ఎస్ ఓటమికి కారణమని అసదుద్దీన్ పరోక్షంగా పేర్కొన్నారు. ఇక భారీ విజయంతో వచ్చిన అహంకారం బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోందని, ఆ పార్టీ నేతలు రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఎమ్మెల్యే దాడికి పాల్పడటం, ఆయన మనుషులు తుపాకీతో రెచ్చిపోవటం ఇందులో భాగమేనన్నారు. అది మంచి పద్ధతి కాదంటూ ప్రధాని నరేంద్రమోదీ ఖండించిన వెంటనే ఆగ్రా వెళ్లే దారిలో ఓ ఎంపీ అనుచరులు టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడటం ఆ పార్టీ నాయకుల వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు. ఎన్నికల్లో సులభంగా రూ.50 లక్షలు ఖర్చు పెట్టే నేతలు, టోల్ వద్ద రూ.50 చెల్లించేందుకు మనసు ఒప్పదా అని ప్రశ్నించారు. సోమవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరోసారి ప్రధాని ‘ఈ తీరు నచ్చదు’అని అంటారంటూ ఎద్దేవా చేశారు. బడ్జెట్తో సామాన్యుని నడ్డి విరిచింది ఇక కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని, పేద ప్రజలపై ప్రేమ ఒలకబోసే మాటలు చెప్పే బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో వారిపై భారం మోపిందన్నారు. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల పేదలకు అశనిపాతమే అవుతుందన్నారు. ఆదాయపన్నుపై సర్ఛార్జి కూడా భారంగా మారుతుందన్నారు. మోదీ తరచూ చెప్పే నారీ శక్తి మాటలకు, బడ్జెట్లో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని చూస్తే ఎక్కడా పొంతన కనిపించదని విమర్శించారు. న్యూస్ప్రింట్పై కస్టమ్ డ్యూటీ పెంపు, పుస్తకాల ధరలకు రెక్కలొచ్చే నిర్ణయాలు సరికాదని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కోటి మంది ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్స్ అంటూ ఘనంగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం, వారికి అందించే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్లో కోత పెట్టిందని విమర్శించారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావనే లేదన్నారు. -
నిర్మలాజీ.. నిరాశపరిచారు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదని.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రాజెక్టులకు జాతీయహోదా అంశం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కనీసం ప్రస్తావనకు నోచుకోలేదని.. జాతి ప్రయోజనాల జాబితాలో తెలంగాణ ప్రాజెక్టులు లేవా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా శనివారం కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. అభివృద్ధిబాటలో ఉన్న తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని ట్విటర్ వేదికగా కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ దృక్కోణంలో ఎలాంటి ప్రయోజనం కల్పించని కేంద్ర బడ్జెట్ 2019–20 ప్రతిపాదనలు పూర్తిగా నిరాశపరిచాయి. వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించినా.. మా విన్నపాలను మీరు పూర్తిగా విస్మరించారు’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథను నీతి ఆయోగ్ ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు ప్రతిష్టాత్మక పథకాలకు రూ.24 వేల కోట్లు కేటాయించాలని సిఫారసు చేసినా.. కనీసం 24 రూపాయలకు కూడా కేటాయించక పోవడం విడ్డూరం. తెలంగాణ ఆవిర్భవించి ఐదేళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలు ఊసేలేదు. బయ్యారం స్టీల్ ప్లాంటు, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ వంటి అంశాలు ప్రస్తావనకు నోచుకోలేదు. అభివృద్ధి బాటలో నడుస్తున్న కొత్త రాష్ట్రంపై ఎందుకు ఈ రకమైన వివక్ష’అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్దిలో లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్టైల్స్ అనేవి అత్యంత కీలకరంగాలు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు బడ్జెట్లో ఎలాంటి మద్దతు లేదు. హైదరాబాద్లో ఐటీఐఆర్ ఏర్పాటుపై కనీస ప్రస్తావన లేకపోగా, ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్ రంగానికి ఎలాంటి ప్రోత్సాహం లేదని’కేటీఆర్ అన్నారు. ‘పెట్రోల్, డీజిల్ ధర పెంపుతో దేశ ప్రజలపై నిత్యావసరాల భారం పెరుగుతుందని.. గుజరాత్ సీఎం హోదాలో ప్రస్తుత ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు అంటూ గతంలో మోదీ ట్వీట్ను తన సందేశానికి కేటీఆర్ జత చేశారు. కేటాయింపుల్లో శూన్యహస్తం: కవిత ‘నిర్మలా సీతారామన్గారు.. ఒక మహిళగా మీరు పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశ పెట్టడం చూసి ఎంతో గర్వించా. ఆర్థికసర్వేలో అనేక ప్రశంసలు అందుకున్న తెలంగాణకు కేటాయింపుల్లో శూన్య హస్తాన్నే అందించారు. ఈసారి బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు దక్కక పోవడం చాలా బాధాకరం’అని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విటర్లో వ్యాఖ్యానించారు. -
కేంద్రబడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగింది
-
భగ్గుమన్న పెట్రోల్ : భారీగా వడ్డన
జైపూర్: కేంద్రం బడ్జెట్ ప్రతిపాదనలతో పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్సైజ్ సుంకం, రోడ్ సెస్ పెంపును ప్రకటించారు. కొత్త రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంధనంపై సెస్పెంపుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా రాజస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ .5 వరకు పెరిగాయి. పెట్రోల్పై వ్యాట్ రేటును 26 శాతం నుంచి 30 శాతానికి, డీజిల్పై 18 శాతం నుంచి 22 శాతానికి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఆ మేరకు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పెట్రోల్ ధర రూ .4.62 మేర పెరిగిందని రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీత్ బాగై వెల్లడించారు. దీంతో జైపూర్లో పెట్రల్ ధర లీటరుకు 75.77 రూపాయలకు చేరింది. ఇంతకుముందు 71.15 రూపాయలుగా ఉంది. అలాగే డీజిల్ ధర లీటరుకు 4.59 రూపాయలు పెరిగి 66.65 రూపాయలు నుంచి రూ.71.24 కు చేరింది. మధ్యప్రదేశ్లో కూడా లీటరు పెట్రోల్ ధర రూ. 4.5 చొప్పున పెరిగింది. తాజా పెంపుతో లీటరు పెట్రోలు ధర రూ. 78.19 గానూ, డీజిల్ ధర రూ. 70.02గా ఉంది. సార్వత్రిక బడ్జెట్లో కేంద్రం నిర్ణయంతో అదనపు పన్నుభారం విధించక తప్పలేదని రాష్ట్రమంత్రి జితు పట్వారి తెలిపారు. వివిధ నగరాల్లో పెరిగిన ఇంధన ధరలు ఇలా ఉన్నాయి: హైదరాబాద్: పెట్రోలు ధర లీటరుకు రూ. 77.48 డీజిల్ ధర లీటరుకు రూ. 72.62 అమరావతి: పెట్రోలు ధర లీటరుకు రూ. 77.17 డీజిల్ ధర లీటరుకు రూ. 71.96 చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 75.76 డీజిల్ ధర లీటరుకు రూ. 70.48 ముంబై : పెట్రోలు ధర లీటరుకు రూ. 78.57 డీజిల్ ధర లీటరుకు రూ. 69.90 -
ట్విట్టర్లో కేంద్రంపై కేటీఆర్ విమర్శలు
-
బౌండరీలు ఎక్స్పెక్ట్ చేస్తే.. స్టడీ సింగిల్స్
సాక్షి,ముంబై: ఆర్థిక బడ్జెట్పై ప్రముఖపారిశ్రామిక వేత్త , మహీంద్ర అండ్ మహీంద్ర ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. బౌండరీలు కొడతారని ఆశిస్తే .ఆమె స్టడీ సింగిల్స్ తీశారని ట్వీట్ చేశారు. రన్రేట్ తగ్గకుండా చూసుకుంటూ..దీర్ఘకాలానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆకాంక్ష ఆమె బడ్జెట్లో కనిపించిందని వ్యాఖ్యానించారు. అందరూ ఆశించినట్టుగా ..పలు అంచనాలకు భిన్నంగా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే విధానం ..పెద్ద పెద్ద ఎత్తుగడలు కాకుండా.. మోదీ ప్రభుత్వం దీర్ఘకాలిక బడ్జెట్పై దృష్టి పెట్టిందన్నారు. ప్యాసింజిర్ వాహనాలపై వస్తు, సేవల పన్ను (జిఎస్టి) తగ్గింపును ఆశించి భంగపడిన బిజినెస్ టైకూన్ స్పందిస్తూ అన్ని కార్లపై జీఎస్టీని తగ్గించే బదులు, మొబిలీటీ, ప్రోత్సాహకాలతో మాత్రమే ఆమె సరిపెట్టారని పేర్కొన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే ప్రయాణంలో సీతారామన్ బడ్జెట్ దేశానికి సహాయపడుతుందని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ముఖ్యంగా మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థ పుంజుకునే దశలో సీతారామన్ ఎత్తుగడలు, అడుగులతో ఆర్థికరంగం పుంజుకోనుందని, ఆర్థిక వ్యవస్థ అనే ఇంజీన్కు ఇవి లూబ్రికెంట్లా పనిచేస్తాయంటూ వరుస ట్వీట్లలో ప్రశంసించడం విశేషం. కాగా విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్పై అధికార పక్షం ప్రశంసలు కురిపిస్తుండగా, నిర్మలా సీతారామన్ వాక్చాతుర్యం తప్ప, పటిష్టమైన ఆర్థిక విధానాలపై దృష్టిపెట్టలేదన్న విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సందేహాన్ని వ్యక్తం చేయగా, పెట్టుబడులకు సంబంధించి, ముఖ్యంగా ఎఫ్డీఐలపై కీలక అంశాల ప్రస్తావన లేదని మాజీ ఆర్థికమంత్రి , కాంగ్రెస్ నేత చిదంబరం, ఇతర రాజకీయ ఆర్థిక విమర్శకులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: అందరమూ దానికోసమే వెదుకుతున్నాం..! Tweeted earlier that I was hoping @nsitharaman ji would ‘hit some boundaries.’ She chose instead to take steady singles & keep the run-rate moving. Despite expectations of big moves to instantly crank-up the economy she decided to keep her eye firmly on the long term; (1/6) — anand mahindra (@anandmahindra) July 5, 2019 Instead of lowering GST on all cars,she aligned with the vision for mobility&incentivised only https://t.co/Ca5IhmdsSR fact, the budget is an accumulation of seemingly unspectacular moves that’ll NUDGE the economy onto a trajectory toward $5T & an improved ‘ease of living.’(2/6) — anand mahindra (@anandmahindra) July 5, 2019 -
బడ్జెట్లో విభజన అంశాలను పట్టించుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేక హోదా విభజన అంశాల పరిష్కారం ఎక్కడ కనపించలేదని ఏఐసీసీ సెక్రటరీ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. శనివారమిక్కడ విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ ఏపీకి పూర్తిగా నిరాశే మిగిల్చిందని ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్కు, ట్రిపుల్ ఐటీ సంస్థలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. రాజధాని అమరావతికి కూడా నిధులు కేటాయించలేదని.. పెద్ద ఎత్తున నిధులు యివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా నిధుల గురించి చర్చించారని గుర్తు చేశారు. ఏపీకి లోటు బడ్జెట్ ఉందని.. న్యాయం చేయాలని రుద్రరాజు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యులకు భారం మిగిల్చారని మండిపడ్డారు. ఏపీలో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాహుల్ గాంధీ రాజీనామా చేశారన్నానరు. త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తాడని తెలిపారు. నూతనంగా వచ్చే అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. -
అందరికీ అందుబాటు ఇల్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :అందరికీ ఇళ్లు దిశగా నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. అందుబాటు గృహాలను (అఫర్డబుల్ హౌజింగ్) దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను రూపొందించారు. అఫర్డబుల్ హౌజింగ్లకు అదనపు వడ్డీ రాయితీలు, ప్రభుత్వ స్థలాల కేటాయింపులు, నిర్మాణ గడువు కుదింపు వంటివన్నీ ఈ విభాగాన్ని బలోపేతం చేయనున్నాయి.ఆర్ధికాభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి అత్యంత కీలకం. మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా. దీన్నే ఫోకస్ చేస్తూ నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ను రూపొందించారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్మాణ రంగానికి ప్రయోజనాలు కలుగుతాయి. అందుబాటు గృహాలకు (అఫర్డబుల్ హౌజింగ్) వడ్డీ మినహాయింపును రూ.3.5 లక్షలకు పెంచారు. ఇది తొలిసారి గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. రూ.45 లక్షల లోపు గృహాలను కొనుగోలు చేసే వారికి ఈ వడ్డీ రాయితీ అందుతుంది. 1.95 కోట్ల పీఎంఏవై గృహాలు.. ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గ్రామీణంలో 2020–22 ఆర్ధిక సంవత్సరంలో లబ్ధిదారులకు 1.95 కోట్ల గృహాలను అందించాలని నిర్ణయించారు. అలాగే గతంలో 2015–16లో పీఎంఏవై కింద ఒక గృహ నిర్మాణానికి 314 రోజుల సమయాన్ని ప్రతిపాదించింది. కానీ, 2017 నుంచి దీన్ని 114 రోజులకు తగ్గించేసింది. అంటే నిర్మాణంలో వేగం పెంచింది. అందుబాటు గృహాల నిర్మాణాల వైపు డెవలపర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ స్థలాలను కేటాయించనున్నారు. జాయింట్ డెవలప్మెంట్ కింద వీటిని నిర్మిస్తారు. ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్న స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అందుబాటు గృహాల నిర్మాణానికి స్థానిక డెవలపర్లు ముందుకొచ్చే అవకాశముందని క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్ రెడ్డి తెలిపారు. లాజిస్టిక్, వేర్హౌజ్లకు ఊతం.. పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేకమైన సరుకు రవాణా కారిడార్లు, రైల్వే, ఎయిర్ లైన్స్ కారిడార్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ఫోకస్ చేసింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రూ.100 కోట్లను కేటాయించింది. దీంతో రియల్టీ రంగంలో లాజిస్టిక్, వేర్ హౌజ్ విభా గాలకు డిమాండ్ పెరుగుతుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. పునర్వినియోగ ప్లాస్టిక్ గ్రీన్ టెక్నాలజీ వినియోగంతో రోడ్ల నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 30 వేల కి.మీ. నిర్మించనున్నారు. దీంతో రోడ్ల నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పర్యావరణహితమైన రోడ్లను ప్రతిపాదించింది. రెంటల్ పాలసీతో జోష్.. తాజా బడ్జెట్లో పాత రెంటల్ పాలసీలో సంస్కరణలు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే నేషనల్ అర్బన్ రెంటల్ హౌజింగ్ పాలసీని తీసుకురానున్నారు. దీంతో గృహాల సరఫరా తక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో అద్దె గృహాలను సరఫరా పెరుగుతుంది. అద్దె గృహాలను పెంచేందుకు స్పష్టమైన ప్రోత్సాహాకాలు ఉంటాయి. ఈ పాలసీని అన్ని రాష్ట్రాల్లో అమలుకు చర్యలు తీసుకుంటారు. హౌజింగ్ ఫర్ ఆల్ను వేగవంతం చేసేందుకు అద్దె గృహాలను వినియోగించుకునే అవకాశం ఉంది. స్టూడెంట్ హౌజింగ్కు డిమాండ్.. నివాస విభాగంలో స్టూడెంట్ హౌజింగ్కు డిమాండ్ను సృష్టిస్తుంది. ఉన్నత విద్యారంగంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందుకోసం ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.400 కోట్లను కేటాయించింది. దీంతో స్టూడెంట్ హౌజింగ్కు డిమాండ్ పెరుగుతుంది. పెట్టుబడులకు అవకాశాలు కల్పించింది. హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల నియంత్రణ అధికారాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి నేషనల్ హౌజింగ్ బోర్డ్ (ఎన్హెచ్బీ)కి బదిలీ చేశారు. దీంతో పారదర్శకత నెలకొంటుంది. అతిక్రమణలను తగ్గించడంతో పాటూ నియంత్రణ సులువవుతుంది. రిటైల్, హాస్పిటాలిటీలో వృద్ధి.. చిన్న రిటైలర్ల రిజిస్ట్రేషన్ విధానాన్ని సులభతరం చేశారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ కోసం స్థానిక సోర్సింగ్ నిబంధనలను సరళీకృతం చేశారు. దీంతో భవిష్యత్తులో రిటైల్ రంగానికి ప్రయోజనం చేకూరుతుంది. అసంఘటిత రిటైల్ రంగంలో ఊత్సాహం నెలకొంటుంది. ఆతిధ్య రంగాన్ని ప్రోత్సహించేందుకు 17 ఐకానిక్ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. దీంతో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది ఆతిధ్య రంగానికి బూస్ట్నిస్తుంది. ముడి ఉత్పత్తుల ధరల పెరుగుదల.. ఈసారి బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక రంగ హోదా ప్రతిపాదన ఊసేలేదు. పన్నులు, భూముల విధానాల్లో ఎలాంటి సంస్కరణలు చేయలేదు. పైగా పీవీసీ, వినైల్ ఫ్లోరింగ్ షీట్స్, టైల్స్ వంటి నిర్మాణ ముడి సరకుల దిగుమతి సుంకాన్ని పెంచారు. ముడి ఉత్పత్తుల మీద 1 శాతం ఇన్ఫ్రా సర్చార్జీని పెంచారు. దీంతో డెవలపర్లకు నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అంతిమంగా కొనుగోలుదారులకు ధరలు పెరిగే ప్రమాదముంది. వడ్డీ మినహాయింపుపై పరిమితి తగదు వడ్డీ మినహాయింపులు కేవలం రూ.45 లక్షల ధర గృహాలకు మాత్రమే పరిమితం చేయడం కొంత అసంతృప్తి. ఎందుకంటే ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఈ ధర గృహాలకు ఆశించిన స్థాయిలో సప్లై లేదు. అందుకే అన్ని రకాల గృహాలకు వడ్డీ మినహాయింపును ఇవ్వాలి.– జక్షయ్ షా, చైర్మన్, క్రెడాయ్ అందరికీ ఇళ్లు లక్ష్యం చేరుకుంటాం కేంద్ర ప్రభుత్వం హౌజింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అందుబాటు గృహా లకు ప్రభుత్వ స్థలాల కేటాయింపు, వడ్డీ రాయితీలు వంటివి ఈ విభాగానికి బూస్ట్నిస్తాయి. – నిరంజన్ హిర్నందానీ,ప్రెసిడెంట్, నరెడ్కో నగరాల్లో అద్దె గృహాలకు డిమాండ్ రూ.1.5 లక్షల అదనపు వడ్డీ రాయితీ, రెంటల్ పాలసీ, పీఎంఏవై కేటాయింపులు గృహ విభాగంలో డిమాండ్ తీసుకొస్తాయి. గృహల సరఫరా పెరగడంతో పాటూ బ్యాంక్లకు లిక్విడితో కొనుగోళ్లు కూడా పెరుగుతాయి. రెంటల్ హౌజింగ్ పాలసీతో ప్రధాన నగరాల్లో అద్దె గృహాల సరఫరా పెరిగే అవకాశముంది. – అన్షుమన్ మేగజైన్, చైర్మన్, 45 లక్షల లోపు గృహాలకు డిమాండ్ రూ.1.5 లక్షల వడ్డీ మినహాయిపు కారణంగా తొలిసారి గృహ కొనుగోలుదారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. రూ.45 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు డిమాండ్ పెరుగుతుంది.– నాయర్, సీఈఓ, జేఎల్ఎల్ ఇండియా -
కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్డెట్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఆయన తన ఆవేదనను తెలియజేశారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని వ్యాఖ్యానించారు. ఎకనామిక్ సర్వే తెలంగాణ రాష్ట్ర చర్యలను ప్రశంసిస్తూ ప్రత్యేక సాయం అందించాలన్న వినతులను ఆర్థిక మంత్రి పట్టించుకోలేదని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీమ్లను నీతి ఆయోగ్ ప్రశంసించిందని తెలిపారు. రూ.24వేల కోట్లను కేటాయించాలని నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే.. బడ్జెట్లో కనీసం రూ.24 కూడా కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం లేదా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేస్తూనే ఉందని, కానీ ఈ అంశాలను కనీసం బడ్జెట్లో ప్రస్తావించలేదని తెలిపారు. -
1,174 కంపెనీలు వాటా విక్రయించాలి
న్యూఢిల్లీ: ఒక కంపెనీలో ప్రజలకుండే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. కంపెనీలో ప్రజల వాటాను 35 శాతానికి పెంచడానికి ఇదే సరైన సమయమని తన తొలి బడ్జెట్లో ఆమె ప్రతిపాదించారు. క్యాపిటల్ మార్కెట్ను ప్రజలకు మరింత చేరువ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అందుకే ఈ ప్రతిపాదన తెస్తున్నామని ఆమె వివరించారు. ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే మార్కెట్ నియంత్రణ సంస్థ;సెబీకి ఇప్పటికే ఒక లేఖ రాసిందని పేర్కొన్నారు. రూ.3.87 లక్షల కోట్ల విలువైన విక్రయాలు... ఈ ప్రతిపాదన కారణంగా దాదాపు 1,174 కంపెనీల ప్రమోటర్లు తమ వాటాను విక్రయించాల్సి ఉంటుంది. టీసీఎస్, విప్రో, డిమార్ట్, కోల్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలివర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీలు దాదాపు 4,700 వరకూ ఉంటాయని, వీటిల్లో 1,174 కంపెనీల్లో ప్రమోటర్ల వాటా 65 శాతానికి మించి ఉంటుందని సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఈ 1,174 కంపెనీలన్నీ కలసి రూ.3.87 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించాల్సి ఉంటుందని ఈ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. నిఫ్టీలోకి కొత్త కంపెనీలు.... ఈ వాటా విక్రయానికి సెబీ తగినంత సమయం ఇవ్వాలని సెంట్రమ్ బ్రోకింగ్ ఎనలిస్ట్ జగన్నాథమ్ తునుగుంట్ల పేర్కొన్నారు. లేకుంటే ప్రమోటర్ల వాటా విక్రయాలు మార్కెట్లో వెల్లువెత్తుతాయని వివరించారు. ఈ తాజా ప్రతిపాదన కారణంగా రెండేళ్లలో పలు కంపెనీలు వాటా విక్రయ ఆఫర్లను ప్రకటిస్తాయని ఇండియానివేశ్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ వినయ్ పండిట్ చెప్పారు. ప్రస్తుతం ఫ్రీ–ఫ్లోట్ మెథడాలజీ ఆధారంగా నిఫ్టీలో షేర్లను చేరుస్తున్నారని, ఈ తాజా ప్రతిపాదన కారణంగా పలు షేర్లు నిఫ్టీ నుంచి వైదొలగాల్సి వస్తుందని, కొత్త కంపెనీలు నిఫ్టీలోకి వస్తాయని వివరించారు. -
చంద్రబాబు అన్నం లేకుండా ఉండగలరు కానీ..
సాక్షి, విజయవాడ : ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నం లేకుండా ఉండగలరు కానీ, అధికారం లేకుండా ఉండలేరంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు అంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కేంద్రం ఏడా పెడా పన్నులు పెంచింది. కేంద్రం ఆదాయాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్రాల ప్రయోజనాలపై కేంద్రం దృష్టి పెట్టలేదు. పెట్రోల్ ధరలు పెంచితే దాని ప్రభావం వివిధ రంగాలపై పడుతుంది. పూర్తి మెజారిటీ వచ్చిందనే దర్పముతో రాష్ట్రాలు అవసరం లేదనే విధంగా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారు. మీడియాలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఫలితంగా దేశీయ మీడియా దెబ్బతింటుంది. ఈ బడ్జెట్ కార్పొరేట్ ఆదాయం పెంచేలా ఉంది తప్ప.. సామాన్యుల ఆదాయం కాదు. పన్నుల విధింపులలో పారదర్శకత లేదు. జీఎస్టీ ఏకీకృతం కాలేదు.. ముడి సరుకు, అంతిమ ఉత్పత్తి పైనా పన్నులు వేస్తున్నారు. గ్రామీణ అభివృద్ధికి ఏమాత్రం ఈ బడ్జెట్ సహకరించదు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు.. విభజన చట్టంలో ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు.. పోలవరం నిధుల ప్రస్తావన లేదు.. రాజధాని నిధులు లేవు.. రైల్వేల విషయంలోనూ ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింద’’ని పేర్కొన్నారు. -
బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది
-
గిరిజన చరిత్ర డిజిటలీకరణ
సాక్షి, ఆసిఫాబాద్: కేంద్ర బడ్జెట్లో జిల్లాకు నిరాశే మిగిలింది. దేశ వ్యాప్తంగా వెనకబడిన కుమురంభీం జిల్లా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఎటువంటి బడ్జెట్ కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ అస్ప్రిరేషనల్ జిల్లాలో కుమురం భీం జిల్లా ఒకటిగా ఉన్నప్పటికీ బడ్జెట్లో ఆ ఊసే లేదు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజన సాంస్కృతిని డిజిటలీకరణ చేస్తామని పేర్కొనడం జిల్లాలో గిరిజనుల కొంత ఊరట కలిగే అంశం. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ 2019–20 దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో రాష్ట్రాల పరంగా తెలంగాణకు పెద్దగా నిధుల కేటాయింపులేవు. అందులోనూ జిల్లాలకు ప్రత్యేకించి ప్రస్తావన లేకపోవడంతో దేశ వ్యాప్తంగా ఈ వా ర్షిక సంవత్సరంలో అమలు చేయనున్న పలు పథకాల్లో జిల్లా ప్రజలకు అనాది నుంచి ఆదివాసీ, గిరిజనులు ఎంతో చరిత్ర కలిగినప్పటికీ వారిపై పరిశోధన, చరిత్ర అందరికీ అందుబాటులో లేదు. అయితే ఈ బడ్జెట్లో దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనుల సంస్కృతి, నృత్యం, ఆచారాలు, చరిత్రను డిజటలీకరణ చేయనున్నారు. చరిత్రను పుస్తకాల్లో కాక ఇక ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి భద్ర పర్చనున్నారు. దీంతో జిల్లాలో పోరాట యోధుడు కుమురం భీం చరిత్ర, జంగుబాయి, గిరిజన కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు, గుస్సాడీ నృత్యాలు, తుడం వాయిద్యాలు, ఇతర సంప్రదాయాలకు సంబందించిన నృత్యాలతో పాటు హైమన్ డార్ఫ్ పరిశోధనలు, జోడే ఘాట్ లాంటి ప్రదేశాలు జిల్లాలో గిరిజన చరిత్ర డిజిటలీకరణ లో చోటు దక్కే అవకాశం ఉంది. రైతులకు మరింత భారం ఇక పెట్రోల్ డిజీల్ ధరలు పెరగడంతో రైతులకు, వాహనదారులకు మరింత భారం కానుంది. లీటరు పెట్రోల్, డిజిల్ కు రూ.1 చొప్పున సెస్ విధిస్తుండడంతో వ్యవసాయంలో ట్రాక్టర్లు, జనరేటర్లు, ఇతర సాగు చేసే యంత్రాల వినియోగంలో ఆర్థిక భారం పడనుంది. అయితే రైతు సంఘాల ఏర్పాటుతో రైతులకు కొంత లబ్ధితో పాటు చిరు దాన్యాల సాగు కోసం పప్పు దాన్యాల విప్లవం కోసం ప్రోత్సాహాకాలు అందిస్తే స్థానిక రైతులు పత్తి నుంచి పప్పుదాన్యాల పంటల వైపు మళ్లే అవకాశం ఉంది. గ్యాస్ సడ్సిడీతో మహిళలకు ఊరట పేదింటి మహిళకు కట్టెల పొయ్యి వాడే వారికి కొంత ఊరట కలగనుంది. దేశ వ్యాప్తంగా అందరికీ గ్యాస్ పొయ్యిలను సబ్సిడీ పై ఇచ్చేందుకు ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. ఇప్పటికే జిల్లాలో ఆరు గ్యాస్ ఎజెన్సీల పరిధిలో లక్ష వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మరో 10వేల మంది వరకు గ్యాస్ క¯ð క్షన్లు వరకు పొందాల్సి ఉంది. గిరిజన గూడెల్లో ఉండే మహిళలు ఇంకా కట్టెల పొయ్యిల మీదనే వంట చేస్తున్నారు. వీరికి లబ్ధి చేకూరనుంది. మహిళ సంఘాలకు ‘ముద్ర’ ఇప్పటి వరకు వివిధ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు ఇచ్చే ముద్ర రుణాలను ఇక నుంచి మహిళా సంఘాల సభ్యలకు ఇవ్వనున్నారు. ఒక మహిళా సంఘానికి ఒక లక్ష రూపాయల వరకు ముద్ర రుణాలను ఇవ్వనున్నారు. జిల్లాలో 7425 మహిళా సంఘాలు ఉండగా ఇందులో 80వేల మంది మహిళా సభ్యులు ఉన్నారు. అలాగే జన్ధన్ బ్యాంకు ఖాతా ఉన్న మహిళలకు రూ.5వేల వరకు ఓవర్ డ్రాప్ట్ నగదు తీసుకునే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా మహిళా సమ్మిళిత శిశు అభివృద్ధి పథకం కోసం 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.27వేల కోట్లు కేటాయించారు. అంతేకాక మహిళా సంక్షేమం అమలు చేసేందుకు ‘నారి తూ నారాయణీ’ అనే కమిటీ ఏర్పాటు కూడా చేయననున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి దేశ వ్యాప్తంగా కోటి మంది యువతకు వృత్తిలో నైపుణ్యతను సాధించేందుకు ప్రధాన్ మంత్రి కౌశల్ యోజనతో నైపుణ్యం కలిగించనున్నారు. జిల్లాలో దాదాపు 20వేల మంది యువత నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా. ఈ పథకం అమల్లోకి వస్తే జిల్లాలోని యువతకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అంతేకాక ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కోసం భారత్ నెట్ పథకం కింద ఇంటర్నెట్ సేవల పథకం ప్రారంభం కానుంది. రూ.45లక్షల లోపు ఇళ్లు కొనుగోలు చేసే వారికి ఇంటి రుణం పై ఆదాయపు రాయితీ రూ.1.5 మేర కొత్తగా కలగనుంది. దేశవ్యాప్తగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు, సాగుతోపాటు ప్రతి నివాసాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జిల్లాలో రోడ్డు సౌకర్యం లేని 300పైగా ఆవాసాలకు సౌకర్యం కలగనుంది. దీంతో గ్రామస్తులు కొంత ఊరట చెందుతున్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు మహర్దశ
కేంద్ర బడ్జెట్ నగరవాసికి నిరాశేమిగిల్చింది. నిత్యావసరాలైన పెట్రోల్, డీజిల్పై అదనపు సర్చార్జ్ విధింపు ఫలితంగా నగరవాసిపై రోజూకోటిన్నర రూపాయల అదనపు భారం పడనుంది. ఆదాయ పన్ను స్లాబ్లో ఎలాంటి మార్పులు సైతంలేకపోవటంతో వేతన జీవులనుఆకట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో అట్టడుగు, మధ్య తరగతి వర్గాలు సొంతింటి కలను నెరవేర్చుకునే దిశగా రూ.45 లక్షల లోపు ఇళ్ల కొనుగోలుపై రూ.3.5 లక్షల వడ్డీ రాయితీ ప్రకటన సంతోషం నింపగా, నగరంలో రియల్టీకు మరింత ఊపు తెచ్చింది. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కోటి రూపాయలవరకు షరతుల్లేని రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించటంతో ఇప్పటికేఐదువేల వరకు ఉన్న మధ్య తరహా పరిశ్రమల యూనిట్ల విస్తరణ, కొత్తవి ఏర్పాటు అయ్యేఅవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇక స్టార్టప్ కంపెనీల్లోపెట్టుబడులపై ఐటీ శాఖ మినహాయింపు ఇవ్వటంతో నగరంలో ఐటీ స్టార్టప్ల వెల్లువెత్తునున్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. డీజిల్ ధరల పెంపుతో గ్రేటర్ ఆర్టీసీ మరింత చతికిలబడే అవకాశం ఉంది. ఇప్పటికే నష్టాల బాటలోకూరుకుపోయిన ఆర్టీసీకి ప్రతి నెలా మరో కోటిన్నర అదనపు భారం పడనుంది. ఇక దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లో పెద్దగా భారీప్రాజెక్టులేవీ ఉండే అవకాశం లేదని సమాచారం.గత బడ్జెట్లోనే ప్రతిపాదించిన పనులు పట్టాలెక్కని పరిస్థితి ఉండగా, తాజా బడ్జెట్ సైతం పాత ప్రతిపాదనలకు కొనసాగింపుగానే ఉండే ఛాన్స్ ఉన్నట్లు రైల్వే కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర బడ్జెట్ అంత ఆశాజనకంగా ఏమీ లేదని సెంటర్ ఫర్ సొషల్ స్టడీస్ డైరెక్టర్ రామచంద్రయ్యఅభిప్రాయపడ్డారు. సాక్షి,సిటీబ్యూరో: రూ.45 లక్షలలోపు గృహాలపై రూ.3.5 లక్షల వడ్డీరాయితీ ప్రకటించడంతో గ్రేటర్ పరిధిలో వేతనజీవులు, మధ్యతరగతి వర్గానికి కలిసొచ్చే అశం. దీంతో శివార్లలో అపార్ట్మెంట్లు, సొంత గృహాల నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. మహానగరం ప్రస్తుతం ఓఆర్ఆర్ పరిధి వరకు విస్తరించడంతో ఆయా ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు భారీగా పెరిగే అవకాశాలున్నట్లు రియల్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న పరిశ్రమలకు పెద్ద ఊరట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.కోటి వరకు షరతులు లేని రుణాలు మంజూరు చేస్తామని ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడంతో ఆయా రంగాలు సంతోషంలో మునిగాయి. గ్రేటర్ పరిధిలో సుమారు ఐదువేలకు పైగా ఈ తరహా పరిశ్రమలుంటాయి. రుణం మంజూరైతే మూలధన కొరత ఉండదని, పరిశ్రమల విస్తరణ, ఉత్పత్తులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్టార్టప్, ఐటీ రంగాలకు ఊపు సాంకేతిక, సేవల రంగంలో నూతన ఒరవడిని సృష్టించే నవకల్పనలకు తాజా బడ్జెట్ పెద్దపీట వేసింది. స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఐటీశాఖ స్కూృటినీ పరిధి నుంచి మినహాయించడం.. దూరదర్శన్లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా చానల్ ఏర్పాటు వంటివి ఈ రంగానికి కలిసొస్తుంది. ప్రధానంగా ఐటీ రంగానికి కొంగుబంగారంగా ఉన్న గ్రేటర్ సిటీలో తాజా బడ్జెట్తో నూతన సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టార్టప్ల ఏర్పాటుకు మరింత వెసులుబాటు ఉంటుందని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్(హైసియా) వర్గాలు చెబుతున్నాయి. తద్వారా ఉద్యోగ అవకాశాలు సైతం భారీగా కల్పించవచ్చంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు మహర్దశ సాక్షి,సిటీబ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపుతో నగరంలో ఆ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ వాహనాలపై జీవితకాల పన్ను మినహాయింపు మాత్రమే లభిస్తుండగా.. తాజాగా కేంద్ర బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు పలు నిర్ణయాలు తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు, తదితర వాహనాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు జీఎస్టీ మండలి ముందు ఈ ప్రతిపాదనను ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది. గ్రేటర్లో ఇప్పటి దాకా ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం 3926 మాత్రమే తిరుగుతున్నాయి. వీటిలో బైక్లే ఎక్కువ. కార్లు, ఇతర వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. విద్యుత్ చార్జింగ్ పాయింట్లు తగినంత అందుబాటులో లేకపోవడంతో పాటు వాహనాలపైన పెద్దగా ప్రోత్సాహకాలు కూడా లేకపోవడంతో కొనుగోళ్లు అంతగా లేవు. తాజా ప్రతిపాదనలతో ఈ వాహనాల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బైక్లపై రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు, కార్లపై రూ.25 వేలకు పైగా తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రజా రవాణా రంగంలో బ్యాటరీ బస్సులను ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ నగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. మరో 600 బస్సుల కోసం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. వీటిలో 300 బస్సులను గ్రేటర్ హైదరాబాద్లో అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంలో భాగంగా ఆర్టీసీ ఆశించిన విధంగా బ్యాటరీ బస్సులు లభిస్తే పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేసినట్లవుతుంది. చార్జింగ్ పాయింట్లు ఎక్కడ? ఎలక్ట్రిక్ వాహనాలపై పన్న తగ్గింపు ప్రోత్సాహకమే అయినప్పటికీ అదే స్థాయిలో చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సాధారణ ప్రజలకు అలాంటి సదుపాయం లేదు. ఆర్టీసీ, రైల్వే వంటి సంస్థలే సొంతంగా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. భవిష్యత్లో పెట్రోల్ బంకుల స్థాయిలో విద్యుత్ చార్జింగ్ కేంద్రాలు పెరిగితే తప్ప ఈ తరహా వాహనాల వినియోగం పెరిగే అవకాశం లేదు. అరకోటి దాటిన వాహనాలు హైదరాబాద్లో ఇంధన వాహనాల సంఖ్య ప్రస్తుతం అరకోటి దాటింది. సుమారు 30 లక్షల బైక్లు, మరో 15 లక్షల కార్లు, 5 లక్షలకు పైగా ఆటోలు, క్యాబ్లు, లారీలు, ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సులు, క్యాబ్లు ఉన్నాయి. ఈ వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో నగరటంలో ప్రజారోగ్యానికి పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో కాలుష్య రహిత, పర్యావరణ హితమైన వాహనాల అవసరం ఎంతో ఉంది. కానీ ఇప్పటి వరకు వీటిపైన ఒక నిర్ధిష్టమైన విధానం లేకపోవడంతో వాహనదారులు కొనేందుకు ముందుకు రావడం లేదు. కేంద్రం పేర్కొన్నట్లుగా జీఎస్టీ తగ్గింపుతో వాహనాల ధరలు తగ్గితే పర్యావరణ పరిరక్షణకు మేలు జరగుతుంది. మహిళకు మరింత ఆసరా సాక్షి,సిటీబ్యూరో: సెల్ఫ్హెల్ప్ గ్రూప్ మహిళలకు ‘ముద్ర యోజన’ కింద గ్రూప్లో ఒకొక్కరికి రూ.లక్ష రుణం ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించడంతో నగరంలోని 10,690 గ్రూపుల్లోని మహిళలకు ఆర్థిక ఆసరా లభించనుంది. సక్రమంగా నిర్వహిస్తున్న గ్రూపులకు ఇప్పటికే రూ.10 లక్షల చొప్పున వరకు బ్యాంకు రుణం లభిస్తుండగా, బడ్జెట్లో ముద్ర రుణం కింద ప్రకటించడం అదనపు ఆసరా కానుందని భావిస్తున్నారు. ఇదే కాక జన్ధన్ ఖాతా గల మహిళలకు రూ.5 వేలు ఓవర్ డ్రాప్ట్ సదుపాయం కూడా వారికి ఉపకరించేదేనని చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో గత ఆర్థిక సంవత్సరం 8,337 సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు రూ.323 కోట్లకు పైగా రుణాలు అందజేయగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి దాకా 700 గ్రూపులకు రూ.31.45 కోట్ల రుణసాయం అందించారు. పరిశ్రమలకుఇంకా ఇవ్వాల్సింది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరిన్ని రాయితీలు ప్రకటిస్తే బాగుండేంది. ఎంఎఎస్ఎంఈ పరిశ్రమలకు సులభతర రుణాలు జారీ చేస్తామనడం సంతోషం. కానీ బ్యాంకర్లు సవాలక్ష షరతులు విధించి రుణం ఆశలు ఆవిరయ్యేలా చేయకుండా చూడాలి.– అనిల్రెడ్డి, ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చర్స్అసోసియేషన్ సౌతిండియా ఉపాధ్యక్షుడు ఆహ్వానించదగ్గపరిణామం ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు ఆహ్వానిందగిన పరిణామం. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఓలా క్యాబ్లలో ఈ వాహనాలనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం. త్వరలో హైదరాబాద్లోనూ ఓలా ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తేనున్నాం. ప్రభుత్వం బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలు స్టార్టప్లకు సైతం ఎంతో ప్రోత్సాహకంగా ఉన్నాయి.– భవీష్ అగర్వాల్, ఓలా కో– ఫౌండర్ నిరుత్సాహపరిచింది బడ్జెట్ అందరికీ ఊరటనిస్తుందనుకున్నాం. కానీ పూర్తి విరుద్ధంగా ఉంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపింది. విభజన అంశాలను బడ్జెట్లో ప్రస్తావించలేదు. బంగారంపై భారం మోపడం సామాన్యులకు ఇబ్బందే. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు రాయితీలు ఇస్తే బాగుండేది.– ఎంకే బద్రుద్దీన్, టీఆర్ఎస్ మైనార్టీ నేత ఆర్టీసీపై డీజిల్ ధర పిడుగు: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం పీకల్లోతు నష్టాల్లో గ్రేటర్ ఆర్టీసీ ప్రతినెలా రూ.1.5 కోట్లమేర భారం ఆర్టీసీపై మరోసారి ఇంధనభారం పడనుంది. ఇప్పటికే సుమారు రూ.550 కోట్ల భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీకి.. కేంద్ర బడ్జెట్ పిడుగుపాటుగా మారింది. డీజిల్పై పెరిగిన ధరలతో ప్రతినెలా మరో రూ.1.5 కోట్ల మేర అదనపు భారం పడనుంది. క్రమం తప్పకుండా పెరుగుతున్న డీజిల్ ధరలు ఏటా ఆర్టీసీకి శరాఘాతంగా మారుతున్నాయి. ప్రతిరోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందిస్తున్న అతి పెద్ద ప్రజారవాణా సంస్థ ఆర్టీసీ. కానీ బస్సుల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వస్తున్న ఆదాయం కంటే ఖర్చులు రెట్టింపు ఉండడంతో ఎటేటా సంస్థ అప్పుల్లో కూరుకుపోతోంది. ఇప్పుడు మరోసారి డీజిల్ ధర పెంపు మరింత భారంగా మారే అవకాశం ఉంది. గ్రేటర్ ఆర్టీసీలోని 29 డిపోల్లో మొత్తం 3,850 బస్సులు ఉన్నాయి. వీటిలో డిపో స్పేర్ బస్సులు మినహాయించి ప్రతిరోజు 3,500 బస్సులు ప్రయాణికుల సేవల్లో ఉంటున్నాయి. ఈ బస్సులు రోజుకు 9.7 లక్షల కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. ఆర్టీసీలో బస్సులు సగటున 4 కిలోమీటర్లకు లీటర్ డీజిల్ ఖర్చవుతున్నట్టు అంచనా. సిటీ బస్సుల కోసం ప్రతిరోజు 2.19 లక్షల లీటర్ల డీజిల్ను వినియోగిస్తున్నారు. తాజాగా పెరుగనున్న డీజిల్ ధరల వల్ల ప్రతినెలా రూ.1.5 కోట్ల భారం తప్పదని సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. -
ప్రాజెక్టులు పట్టాలెక్కేనా..!
సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్ ప్రకటించినా రైల్వే కేటాయింపులపై మాత్రం ఉత్కంఠ అలాగే ఉండిపోయింది. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసినప్పటి నుంచి రైల్వేల్లో ఏ ప్రాజెక్టుకు ఏ మేరకు నిధులు కేటాయించారు.. కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులేంటి.. అనే అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. రైల్వేలకు లభించిన కేటాయింపులు, నిధులు, తదితర అంశాలపై ‘పింక్ బుక్’లో ప్రవేశపెట్టే వరకు బడ్జెట్లో ఏముందో తెలియని పరిస్థితి. ప్రత్యేకించి దక్షిణ మధ్య రైల్వేలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయించారో.. కొత్తగా చేసిన ప్రతిపాదనలేంటనేది కూడా తెలియని పరిస్థితి. నగరంలో మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన చర్లపల్లి, యాదాద్రి ప్రాజెక్టులపై ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. అలాగే చాలాకాలంగా షిరిడీ, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం తదితర నగరాలకు ప్రయాణికుల డిమాండ్కు తగిన విధంగా కొత్తగా రైళ్లను నడపాలనే డిమాండ్ ఉంది. అలాగే ఆరేళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇంకా పూర్తి కాలేదు. తాజా బడ్జెట్ నేపథ్యంలో నగరంలోని పెండింగ్ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయా? లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. దక్షిణమధ్య రైల్వేకు ఏ మేరకు నిధులు కేటాయించారో, ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనాలు లభించనున్నాయో తెలియాలంటే మరో ఒకటి, రెండు రోజుల పాటు ఆగాల్సిందే. ప్రతిపాదనలకే యాదాద్రి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్ల మారా>్గన్ని నిర్మించి యాదాద్రికి రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని మూడేళ్ల క్రితం ప్రతిపాదించారు. ఈ మేరకు సర్వే కూడా పూర్తయింది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రతిరోజు హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయం లభించనుంది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు రూ.430 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం 59 శాతం వాటా, రైల్వే 41 శాతం భరించాలి. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుత బడ్జెట్లోనైనా కదలిక ఉంటుందా, నిధులు కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది. చర్లపల్లి ప్రాజెక్టు పెండింగే..! నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరిగిన రద్దీ, రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి స్టేషన్ను 4వ టర్మినల్గా విస్తరించేందుకు మూడేళ్ల క్రితం బడ్జెట్లోనే ప్రతిపాదించారు. సుమారు రూ.200 కోట్ల అంచనాలతో ప్రణాళికను సైతం రూపొందించారు. 50 ఎకరాల భూమి అదనంగా అవరమని గుర్తించారు. ఈ టర్మినల్ నిర్మిస్తే 10 ప్లాట్ఫామ్లతో ప్రతిరోజు కనీసం 200 రైళ్ల రాకపోకలకు అవకాశం లభిస్తుందని లెక్కేశారు. విజయవాడ, కాజిపేట్ వైపు నుంచి వచ్చే రైళ్లన్నింటినీ చర్లపల్లి నుంచి మళ్లించేందుకు అవకాశం ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండడం వల్ల ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి. అన్ని విధాలుగా ఎంతో అనుకూలంగా ఉన్న ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంతో అసలు ఇదీ పూర్తవుతుందా.. లేదా అన్న అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయిస్తారనేది పింక్బుక్లోనే ఉంటుంది. 2013లో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ గతేడాది నుంచే దశలవారీగా వినియోగంలోకి తేవాలని భావించినా నిధుల కొరతతో పూర్తి కాలేదు. -
హామీ ఇచ్చి మొండిచేయి చూపారు
-
ఇక పెట్రోల్ మంటే
సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్ వాహనదారులకు వాత పెట్టింది. సామాన్యులకు మళ్లీ పెట్రో మంట అంటుకుంది. ఇప్పటికే రోజువారి సవరణతో పెట్రో, డీజిల్ ధరలు పైసా పైసా ఎగబాకుతూ పరుగులు తీస్తుండగా.. బడ్జెట్లో సుంకాలు పెంపు మరింత భారంగా మారనున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్పై ఎక్సైజ్ డ్యూటీ, సెస్ రూపాయి చొప్పున బడ్జెట్లో పెంచారు. ఫలితంగా హైదరాబాద్లో పెట్రోల్పై రూ.2.69, డీజిల్పై రూ.2.65 అదనపు భారం పడింది. దాంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.74.88, డీజిల్ రూ.70.06 గా ఉన్నవి కాస్తా శుక్రవారం రాత్రి నుంచి పెట్రోల్ రూ.77.57, డీజిల్ రూ.72.71కు చేరాయి. హైదరాబాద్ పరిధిలో సుమారు 60.34 లక్షల వివిధ రకాల వాహనాలున్నాయి. అందులో పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలు 44.04 లక్షలు, డీజిల్ బస్సులు, మినీ బస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరాత్ర వాహనాలు కలిపి సుమారు 20.30 లక్షల వరకు ఉంటాయని అంచనా. మహానగరం పరిధిలో సుమారు 560 పైగా పెట్రోల్, డీజిల్ బంక్లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్ నిర్ణయంతో గ్రేటర్లోని వాహనదారుల నుంచి రోజుకు సగటున రూ.కోటిన్నరకు పైగా అదనపు భారం పడనుంది. పన్నుల మోతనే.. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణ చార్జీల బాదుడు కారణంగా కనిపిస్తోంది. పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్ పన్నుల విధింపు అధికంగానే ఉంది. నగరంలో పెట్రోల్పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. వాస్తవంగా పెట్రో ఉత్పత్తులపై రెండు రకాల పన్నుల విధిస్తుండడంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను(వ్యాట్) విధిస్తున్నాయి. ప్రజలపై పన్ను భారం తగదు ఇప్పటికే పెట్రో, డీజిల్ ధరలు రోజువారి సవరణతో పెచడం భారంగా మారింది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో సుంకాలు పెంపు మరింత భారమే. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి ఎక్సైజ్, అమ్మకం పన్ను వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఖాజానా నింపేందుకు ప్రజలపై పన్ను బాదుడు తగదు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ఉత్పత్తులు చేర్చితే ధరలు దిగి ఉపశమనం కలుగుతుంది. – బందగి బద్షా రియాజ్ ఖాద్రీ, చైర్మన్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ హైదరాబాద్లో వాహనాల సంఖ్య ఇలా ద్విచక్ర వాహనాలు 44,04,669 కార్లు 10,35,965 సరుకు రవాణా 2,50,329 ఆటోరిక్షాలు 1,46,757 క్యాబ్లు 80,420 ట్రాక్టర్లు 32,595 విద్యాసంస్థల బస్సులు 12,944 మ్యాక్సి క్యాబ్లు 18,510 స్టేజీ క్యారియర్లు 8,391 కాంట్రాక్టు క్యారేజ్ 5,949 ఇరత వాహనాలు 37,869 స్వర్ణం మరింత ప్రియం సాక్షి,సిటీబ్యూరో: సామాన్యులకు బంగారం మరింత ప్రియం కానుంది. సంపన్నులు మొదలు సామాన్యుల వరకు పెళ్లిళ్లు, శుభకార్యాల్లో తప్పనిసరిగా కొనుగోలు చేసే ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం పన్ను భారం మోపింది. కేంద్ర బడ్జెట్ నిర్ణయం ఫలితంగా బంగారం కొనుగోలుపై 12.5 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధిస్తారు. ప్రస్తుతం వీటిపై 10 శాతం మాత్రే వసూలు చేస్తున్నారు. అదనంగా జీఎస్టీ మోత కూడా మోగుతుంది. ఇప్పటికే రూపాయి బలహీనపడటం, చమురు ధరలు తక్కువగా ఉండటంతో బంగారం ధర భారీగా పెరిగింది. ఇప్పుడు ఈ పన్నులు కూడా తోడయితే మరింత ధర మండడం ఖాయమేనని చెప్పొచ్చు. బంగారం విక్రయాలకు హైదరాబాద్ నగరం పెట్టింది పేరు. సీజన్, బులియన్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా సిటీలో ప్రతిరోజు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాల విక్రయాలు సాగుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు తెలంగాణ జిల్లాల నలుమూలల నుంచి రాజధానికే వచ్చి బంగారం కొనుగోలు చేయడం పరిపాటి. ప్రస్తుతం నగరంలో బంగారం 10 గ్రాముల ధర (22 క్యారెట్) రూ.32,520, 24 క్యారెట్స్ అయితే రూ.34,300గా ఉంది. దీనిపై అదనంగా సుమారు రూ.110 వరకు పెరిగే అవకాశం ఉంది. -
విత్త మంత్రి సీత కన్ను
సాక్షి, ఒంగోలు సిటీ: కేంద్ర బడ్జెట్పై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. పెండింగ్ ప్రాజెక్టులు ఇతర అంశాలకు ఆర్ధిక ఊరట కలుగుతుందని భావించారు. ఇందుకు భిన్నంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఆశలపై ఒక్క సారిగా నీళ్లు చిలకరించినట్లయింది. కేంద్ర బడ్జెట్ ద్వారా జిల్లాలోని ప్రతిపాదిత నీటిపారుదల, రవాణా ప్రాజెక్టులకు ఊతమిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. విభజన హామీ ప్రస్తావనతో పాటు ఇతర అంశాల ఊసే లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్ధాయి బడ్జెట్ను శుక్రవారం కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు. తెలుగువారి ఆడపడుచుగా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపలేకపోయారు. ఆర్ధిక లోటు జిల్లా అభివృద్ధిని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక అవకతవకల ఫలితాన్ని ఈ ప్రభుత్వం మోయాల్సి వస్తోంది. ఖజానా ఖాళీ అయ్యింది. వివిధ రకాల లావాదేవీలను నిర్వహించడానికి కొన్ని సందర్భాల్లో కష్టతరమవుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కేంద్రానికి విన్నవించింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపు ఉంటుందని భావించినా నయాపైసా కేటాయింపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆశాభంగం కలిగించింది. సామాన్యులకు ఈ బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేకపోగా వివిధ రూపాల్లో ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయి. ప్రజల సగటు ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం.. అదనపు భారాన్ని పరోక్షంగా మోపింది. రానున్న రోజుల్లో సామాన్యుడి కొనుగోలు శక్తి ఇంకా తగ్గిపోతుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. ప్రతి కుటుంబం కప్పం కట్టాల్సిందేనని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా బడ్జెట్లోని అంశాలు గుదిబండలు కానున్నాయని చెబుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్లోని అంశాలు జిల్లాపై ఎంత మేర ప్రభావం చూపనున్నాయో ఓసారి పరిశీలిద్దాం.. ఐటీ రిటర్నులు ఇవ్వాల్సిందే.. పన్ను చెల్లింపు విధానంలో పారదర్శకతను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి లావాదేవీ బ్యాంకుకు అనుసంధానం కానుంది. రూ.2.5 లక్షల లావాదేవీలు దాటిన వారు రిటర్నులు వేయాల్సిందే. రానున్న రోజుల్లో ఆధార్ కార్డు ఆధారంగా రిటర్నులు వేసే వెసులుబాటు కల్పించారు. బ్యాంకుల్లో నోట్ల చలామణిని తగ్గించనున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించనున్నారు. నోట్ల చలామణి రానున్న రోజుల్లో బాగా తగ్గుతుంది. కొత్తగా రూ.20 కాయిన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. చిల్లర లావాదేవీలే అధికంగా ఉండనున్నాయి. రూ.5 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉన్నా లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే సామాన్యులు సైతం ఇక వారి లావాదేవీలను అనుసరించి కప్పం కట్టాల్సిందే. మెరుగైన రవాణా జిల్లాలోని గ్రామాలు, పట్టణాలకు రహదారుల వ్యవస్థను అనుసంధానం చేసి మెరుగైన రవాణా అందుబాటులో తీసుకురావడానికి సాగర్మాల, భారత్మాల కార్యక్రమాలను అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. సాగర్మాల రెండో దశ కింద జిల్లాలో రూ.25 కోట్లతో రహదారి అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. జిల్లాలో మూడొంతుల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. సాగర్మాల ప్రాజెక్టు కింద పరిమితంగానే నిధులు విడుదల కానున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లాకు కలిగే ప్రయోజనం బహు స్వల్పమే. ప్రతి ఇంటికీ జలశక్తి సాధ్యమేనా? జిల్లాలో 750 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. ఒంగోలులోనూ ఐదు రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ తాగునీటి సమస్యతీవ్రంగా ఉంది. వెలుగొండ నీరు విడుదలైతేనే తాగునీటికి ఇబ్బందులు ఉండవంటున్నారు. 2020కి జలశక్తి పథకం కింద ప్రతి ఇంటికీ రక్షిత నీరు అందిస్తామన్న ప్రతిపాదన కార్యాచరణకు నోచుకుంటుందా అనే సంశయం నెలకొంది. ఇప్పటికే రూ.68 కోట్ల తాగునీటి తోలకం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. జలజీవన్ మిషన్ జిల్లాలో సాధ్యపడేది కాదంటున్నారు. ఖేల్ ఇండియా.. నేతి బీరే క్రీడల అభివృద్ధి నేతిబీర చందంగానే ఉంది. జిల్లాలో ఎందరో నైపుణ్యం గల క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లేక రాణించలేకపోయారు. ఎందరో మాణిక్యాలు మట్టిలో కలిశాయి. క్రీడా దిగ్గజాలు జిల్లా కీర్తిని ప్రపంచ దేశాల్లో ఎగరవేయడానికి తగిన వనరులు లేక జిల్లా వరకే పరిమితమయ్యారు. ఖేల్ ఇండియా ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం ఏదో మొక్కుబడి కార్యక్రమమే అంటున్నారు. ఖేల్ ఇండియా విధి విధానాలపై బడ్జెట్లో సవిరణ లేకపోవడం గమనార్హం. ఒంగోలులో మినీ స్టేడియం నిర్మాణమే నత్తకు మేనత్తలా కొనసాగుతోంది. జలమార్గం రవాణాకు ప్రాధాన్యం నదీ జలాలను వినియోగించుకుని జల రవాణాను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ కాలుష్యంతో పాటు రవాణా వ్యయం తగ్గుతుందని భావిస్తున్నారు. జిల్లాలో బకింగ్హాం కాలువ జల రవాణా వ్యవస్థ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. రూ.1,400 కోట్లతో ఈ కాలువను ఆధునీకరిస్తే కాకినాడ నుంచి చెన్నై పోర్టు వరకు జల రవాణా మెరుగవుతుంది. పాలకులు ప్రయత్నిస్తే జిల్లాకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఒకే గ్రిడ్ ద్వారా విద్యుత్ జిల్లాలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లు ఉన్నాయి. దర్శి ప్రాంతంలో హైడల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ గ్రిడ్కు కలుస్తోంది. రాష్ట్రంలో రెండు గ్రిడ్లు ఉన్నాయి. ఇక నుంచి దేశవ్యాప్తంగా ఒన్ ఇండియా ఒన్ గ్రిడ్ పథకం కింద.. ఉత్పత్తి అయిన విద్యుత్ను ఒకే గ్రిడ్కు కలిపే విధానం అమలులోకి తీసుకురానున్నారు. విద్యుత్ పంపిణీ ఒకే గ్రిడ్ ద్వారా జరిగే విధానంతో విద్యుత్ కొరత అధిగమించే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం వివిధ సంస్థల ద్వారా రోజుకు సుమారు 50 మెగావాట్ల వరకు ఉత్పత్తి జరుగుతోంది. జన్ధన్ ఖాతాలపై రూ.5 వేల ఓడీ జిల్లాలో 5,62,423 మంది పొదుపు గ్రూపుల మహిళలు ఉన్నారు. వీరిలో జన్ధన్ ఖాతాలు ఉంటే వారికి రూ.5 వేల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఇవ్వనున్నారు. బ్యాంకులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 3.5 లక్షల మందికి జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. రూ.5 వేల బ్యాంకు ఓడీని అవసరాలకు తగినట్లుగా వాడుకుని తిరిగి చెల్లించే వెసులుబాటు కలగనుంది. పాలకు మార్కెట్.. పశువుకు దాణా జిల్లాలో మెగా పశుగ్రాస క్షేత్రాలు ఉన్నాయి. వీటి నుంచి 30 వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. 1,509 ఎకరాల్లో గ్రాసం పండిస్తున్నారు. వీటితోపాటు ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, సైలేజి గడ్డి, టీఎంఆర్, కాన్సట్రేట్ ఫీడ్, ఫాడర్ సీడ్ కార్యక్రమాలు అమలులో ఉన్నా సక్రమంగా నిధులు లేక పశుగ్రాసం తగినంత దొరకడం లేదు. ఈ బడ్జెట్ ద్వారా పాడిపరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పశువులకు దాణా అందుబాటులో ఉంచడంతో పాటు పాల ఉత్పత్తిని పెంచి రైతుకు లాభం చేకూర్చడానికి మార్కెట్ వసతికి ప్రణాళికాబద్ధంగా పని చేయడానికి చర్యలు తీసుకోనున్నారు. పొదుపు గ్రూపులకు ‘ముద్ర’ రుణం జిల్లాలో 57,586 పొదుపు గ్రూపులు ఉన్నాయి. వీటికి ఈ బడ్జెట్లో ముద్ర రుణాలు ఇవ్వడానికి వెసులుబాటు కల్పించారు. గ్రూపుకు రూ.లక్ష లెక్కన ముద్ర రుణం పొందే వీలుంది. రుణ రికవరీల్లో నూరు శాతంగా ఉన్న గ్రూపులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన బ్యాంకర్లకు మార్గదర్శకాలు రానున్నాయి. మహిళల్లో ఔత్సాహికులకు రుణాలు పరిశ్రమల ద్వారా అభివృద్ధి చెందాలనుకునే ఔత్సాహిక మహిళలకు పరిశ్రమల స్థాపనకు బ్యాంకు రుణాలు ఇప్పించడానికి తగిన ప్రొత్సాహం ఇవ్వనున్నాయి. జిల్లాలో 5,800 వరకు చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలను మహిళలే నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడానికి బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించడానికి బడ్జెట్లో ఆయా బ్యాంకులకు ఆర్థిక మద్దతు ఇవ్వనుంది. స్టాండప్ ఇండియా వంటి పథకాల ద్వారా హామీ లేని రుణం రూ.కోటి వరకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకు బ్యాంకు బ్రాంచ్లకు లబ్ధిదారుల ఎంపికకు వార్షిక లక్ష్యాలను ఇవ్వనున్నారు. ఎల్ఈడీ.. ఎందుకు ప్రతిపాదించినట్లో? బడ్జెట్లో 35 కోట్ల ఎల్ఈడీ బల్బులు ఇవ్వడానికి ప్రతిపాదించారు. అన్ని ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని బడ్జెట్లో పెట్టారు. జిల్లాలో 16 లక్షల గృహ విద్యుత్ వినియోగదారులకు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులు 9,90,528 మంది ఉంటే గ్యాస్ కనెక్షన్లు 8,83,867 మంది కలిగి ఉన్నారు. 74,013 మందికి స్పెషల్ డ్రైవ్ ద్వారా పంపిణీకి చర్యలు తీసుకోగా 73,219 మంది తీసుకున్నారు. దీనదయాల్ పథకం కింద అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. అన్ని ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు, ఎల్ఈడీ బల్బుల ప్రతిపాదన జిల్లాకు అంతగా ప్రయోజనం చేకూరే అంశం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రజా రవాణాలో బహుళ ప్రయోజన కార్డులు ప్రయాణాల్లో వేగం పుంజుకుంది. ఇక నుంచి బస్సు, విమానం, రైలు ఇలా ప్రజారవాణా వ్యవస్థల్లో గమ్యస్థానాలకు చేరుకోవడానికి బహుళ ప్రయోజన కార్డులను ప్రవేశపెట్టనుంది. ఇక ప్రజా రవాణా సులభతరం కానుంది. వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటే ఒకే కార్డులో నమోదు చేసుకుని ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. జిల్లాలో పండుగలు, ఇతర ముఖ్యమైన దినాలు, విశేష దినాల్లో రద్దీ వల్ల ప్రయాణల్లో ప్రయాసపడుతున్నారు. ఇకపై ఒకే కార్డులో బహుళ ప్రయోజనం పొందే వెసులుబాటు కలగనుంది. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ జిల్లాలో 1,028 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. డిజిటల్ ఇండియా నేపథ్యంలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం విస్తరించాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఇంకా ఇంటర్నెట్ లేని గ్రామాలకు ఈ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోనున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ అన్ని గ్రామాలకు విస్తరించనున్నారు. వీటికి సంబంధించి యూనిట్లను నెలకొల్పడానికి స్థలాల ఎంపికకు చర్యలు తీసుకుంటారు. ఆశాజనకంగా లేని బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు ఆశాజనకంగా లేదు. కేంద్ర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి, దేశ ఆర్థికాభివృద్ధికి, దేశ భద్రతకు పెద్ద పీట వేసినా రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించి నిరాశపరిచారు. కొన్ని అంశాలు ఆహ్వానించదగ్గవే అయినా విభజన లోటుతో అల్లాడుతున్న రాష్ట్రానికి అన్యాయం చేశారు. విభజన సమయంలో సహాయం చేస్తానన్న హామీని నిలబెట్టుకోలేదు. విశాఖపట్నం, విజయవాడ మెట్రోల ఏర్పాటుపై బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ప్రత్యేక హోదా సాధన విషయంలో పార్లమెంట్లో సభ్యులందరం కలిసి కేంద్రంతో తప్పక పోరాడతాం. – మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎంపీ రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం జరగలేదు కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఏ మాత్రం న్యాయం జరగలేదు. విభజన హామీల ప్రస్తావనే లేదు. ఒకటి రెండు అంశాల్లో సామాన్యులకు మేలు చేసినట్లే చేసి పెట్రో ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరిచారు. సామాన్యులపై వివిధ రూపాల్లో భారాలు మోపారు. విభజన హామీలపై కేంద్రం బడ్జెట్లో ఏమాత్రం ప్రస్తావించలేదు. నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల మంజూరు ఊసేలేదు. ప్రధాని మోదీ పునరాలోచించి నవ్యాంధ్ర ప్రజలకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. – బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
మోదం..ఖేదం
సాక్షి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్ కొన్ని వర్గాల్లో ఆశలు నింపగా మరికొందరికి నిరాశను మిగిల్చింది. కేంద్ర బడ్జెట్లో పెట్రోలు, డీజిల్పై ఒక రూపాయి సుంకం పెంచుతున్నట్లు ప్రకటించిన వెంటనే లీటరు పెట్రోల్పై రూ.2.50, లీటరు డీజిల్పై రూ.2.60 ధరలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రతినెలా జిల్లాపై రూ.112కోట్ల అదనపు భారం పడనుంది. కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రెండు సీజన్లకు కలిపి రూ.6వేల ఆర్ధిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. తాజా బడ్జెట్లో రైతులకు ప్రత్యేక ప్రకటనలు ఏమీ లేకున్నా.. రూ.6వేల సాగు సాయాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 4.41లక్షల మంది రైతులు ఉండగా, అయిదు ఎకరాల లోపు పంట భూములున్న రైతులు 4.25లక్షల మందిదాకా ఉంటారని జిల్లా వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే 90శాతానికి పైగా రైతులు అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న వారే. దీంతో కేంద్రం నుంచి ప్రతిఏటా రూ.255కోట్ల మేర ఆర్థిక సాయం పెట్టుబడుల కోసం అందనుంది. మహిళా సంఘాలకు మేలు మేలు జిల్లా వ్యాప్తంగా 28,335 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 3,11,685 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. తాజా కేంద్ర బడ్జెట్లో ఎస్హెచ్జీల్లోని ఒక మహిళకు రూ.ఒక లక్ష చొప్పున ముద్ర రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.283.35 కోట్ల మేర రుణాలు అందనున్నాయి. అంతే కాకుండా.. ఒక్కో గ్రూప్లోని ఒక్కో మహిళకు జన్ధన్ ఖాతాతోపాటు బ్యాంకులో రూ.5వేల చొప్పున ఓవర్ డ్రాఫ్ట్కు అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఫలితంగా రూ.156కోట్ల మేర సంఘాలు, మహిళలు లబ్ధి పొందనున్నారు. ఉద్యోగులకు ఊరట కేంద్ర బడ్జెట్ సగటు ఉద్యోగిపైనా కరుణ చూపించినట్లే కనిపిస్తోంది. ఫిబ్రవరి నాటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని రూ.5లక్షలుగా ప్రకటించింది. ఈ పరిమితిని తాజా బడ్జెట్లో పెంచకున్నా.. పాత పరిమితినే కొనసాగించనుండడంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వార్షిక వేతనంలో ఇతర మినహాయింపులు, సేవింగ్స్ మినహాయించే రూ.5లక్షల సీలింగ్ పెట్టింది. ఇది కనీసం రూ.6లక్షలపైచిలుకు వార్షిక వేతనానికి పన్ను మినహాయింపు లభించినట్టేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు రమారమి 20వేల మంది ఉండగా, వీరిలో రూ.5లక్షల వేతనం పొందే వారు దాదాపు 5వేల మంది దాకా ఉంటారని అంచనా. ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో వీరందరికీ లబ్ధి చేకూరినట్లేనని పేర్కొంటున్నారు. -
బడ్జెట్ గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు
-
కేంద్ర బడ్జెట్లో జిల్లాకు మొండి చేయి
కేంద్ర ప్రభుత్వం వేతనజీవులు.. చిన్న, సన్నకారు రైతుల పట్ల మమ అన్పించడం మినహా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ప్రత్యేక చొరవ చూపెట్టలేకపోయింది. రీఆర్గనైజేషన్ బిల్లు అంశాలే గుర్తించలేదు. చట్టంలో పొందుపర్చిన ఉక్కుపరిశ్రమ ఊసే లేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రానికి మొండిచేయి చూపారు. బడ్జెట్లో జిల్లా ఊసే లేకుండా పోయింది. మధ్యతరగతి ప్రజానీకానికి ప్రత్యక్షంగా ఊరట కల్పించినా, పరోక్షంగా నడ్డివిరిచే చర్యలే అధికంగా ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రూపొందించిన బడ్జెట్పై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కడప: కేంద్ర ప్రభుత్వం చర్యలు చిరుద్యోగులు, బడుగుజీవులకు ఊరట కల్పించే దిశగా ఉన్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్లో ఈ విషయం ప్రస్ఫుటమౌతోంది. రాష్ట్రాల ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా అసంఘటిత కార్మికులు, చిరుద్యోగులు, పేద, మధ్యతరగతి ప్రజానీకానికి లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. వేతన జీవులకు ఆదాయపు పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచారు. సెక్షన్ 80సీ పరిమితి రూ.1.5 లక్షలు నుంచి రూ.2 లక్షలకు పెంచడాన్ని చిరుద్యోగులు హర్షిస్తున్నారు. గృహ రుణాలు, ఇంటి అద్దెలు, ఇన్స్రూ?న్స్లను అందులో చూపించవచ్చు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిస్తోంది. ఔట్సోర్సింగ్, నూతనంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది ప్రయోజనకరమని, 10 ఏళ్లు సర్వీసు ఉన్న ఉద్యోగులకు బడ్జెట్తో వాతలు పెట్టారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రూ.5 లక్షల పైన వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను చెల్లింపు బాదుడు పెట్టారని పలువురు వివరిస్తున్నారు. రూ.10 లక్షల వరకూ 20 శాతం చెల్లించేలా నిర్ణయించడంపై ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. కర్షకుడిపై కరుణ రైతుల పట్ల కనీస బాధ్యతను కేంద్ర ప్రభుత్వం గుర్తించి బడ్జెట్లో పెట్టింది. పెట్టుబడి నిధి కింద చిన్న, సన్నకారు రైతులకు ఎకరాకు రూ.6 వేలు కేటాయించేలా పొందుపర్చారు. పెట్టుబడి నిధి రూ.3 లక్షల కోట్లకు పెంచాలనే డిమాండ్ ఉన్నా పరిగణనలోకి తీసుకోలేదు. చిన్న, సన్నకారు రైతులకు రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ పథకం ద్వారా జిల్లాలో నేరుగా 3.64 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కాగా కౌలుదారులకు, వ్యవసాయ కూలీలకు ప్రయోజనం గుర్తించకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోతున్న రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఈ పరిణామం కొంత హర్షించదగ్గ విషయమని పలువురు వెల్లడిస్తున్నారు. గృహాపకరణ వస్తువుల పెంపుతో నిర్మాణభారం పెరగనుంది. అయితే, రూ.45 లక్షలలోపు గృహ రుణాలు పొందిన వారికి రూ.3.5 లక్షలు వడ్డీ రాయితీ వర్తించేలా తీసుకున్న నిర్ణయంతో కాస్తా ఊరట దక్కింది. పెట్రో భారం పెట్రోల్, డీజిల్పై లీటరు రూ.2.50 ధర పెరిగింది. తెలియకుండానే ప్రజానీకం భారం భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.73.97, డీజిల్ ధర రూ.68.83 ఉంది. జిల్లాలో 300 పెట్రోల్ బంకుల ద్వారా ఒక్క రోజుకు సరాసరిగా పెట్రోల్ 5 లక్షల లీటర్లు, డీజిల్ 15 లక్షలు లీటర్లు వినియోగం ఉంది. పెంచిన ధరల కారణంగా ప్రతి రోజు పెట్రోల్పై రూ.12.5 లక్షలు, డీజిల్పై రూ.37.5 లక్షలు అదనపు భారం భరించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రీ–ఆర్గనైజేషన్(పునర్ వ్యవస్థీకరణ) బిల్లులోని ఇతర అంశాలు గుర్తుకు రాలేదని పలువురు వాపోతున్నారు. కడప గడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని చట్టం చేసినా నరేంద్రమోదీ సర్కార్ విస్మరిస్తోంది. తాజా బడ్జెట్లో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ పరిణామం జిల్లా వాసులకు రుచించడం లేదు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం పట్ల ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్ర ప్రజానీకం పెదవి విరుస్తోంది. పసిడిపై పిడుగు ప్రొద్దుటూరు కల్చరల్ : బంగారం వ్యాపారంలో రెండో ముంబయిగా ప్రొద్దుటూరు పట్టణం పేరుగాంచింది. జిల్లా నుంచే కాక కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు కర్ణాటక నుంచి కూడా కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే ఇటీవల కాలంలో బంగారం ధర పెరగడంతో వ్యాపారాలు తగ్గాయని చెప్పవచ్చు. బంగారంపై రెండేళ్ల క్రితం విధించిన 3 శాతం జీఎస్టీ నుంచి ఇంకా కోలుకోకముందే.. కేంద్రం పన్ను పెంచడంపై బంగారు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. 10 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీతో మొత్తం 13 శాతం ఉండేది. అయితే ఈ బడ్జెట్లో 12.5 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీతో కలిపి మొత్తం 15.5 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల కొనుగోళ్లు బాగా తగ్గి బంగారు వ్యాపారులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు అంటున్నారు. కేంద్రం పెంచిన పన్ను వల్ల దేశంలోకి బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మార్కెట్ ధర కంటే స్మగ్లింగ్ ద్వారా వచ్చే బంగారం 10 గ్రాములపై రూ.1300 నుంచి రూ.1500 తక్కువగా లభిస్తోంది. పెంచిన పన్ను వల్ల స్మగ్లింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం డాలర్ల ఖర్చును తగ్గించుకోవడానికి ప్రజల్లో బంగారంపై మోజు తగ్గించడానికి, బంగారంపై పన్ను పెంచుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బంగారం ధర పెరుగుదలతో వ్యాపారాలు తగ్గిపోయాయని, పన్ను పెంపుతో తాము జీవనోపాధి కోల్పోతామని షరాబు వ్యాపారులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 6 వేల మంది స్వర్ణకార్మికులు, 750 మందిపైగా వ్యాపారులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 వేల మంది స్వర్ణకార్మికులు, 5 వేల మంది దాకా వ్యాపారులు ఉన్నారు. వీరందరిపై పన్నుల పెంపు ప్రభావం చూపనుంది. ఉదయం 24 క్యారెట్ల గ్రాము ధర రూ.3390 ఉండగా బడ్జెట్ తరువాత రూ.180 పెరిగి రూ.3570 చేరింది. వెండి కిలోపై రూ.300 పెరిగింది. ఉక్కు పరిశ్రమ ఊసే లేదు ఆంధ్రప్రదేశ్కు విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ బడ్జెట్ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ ఊసే లేదు. రాజధానికి గానీ, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు గానీ ఏమాత్రం నిధులు కేటాయింపులు జరగలేదు. కొత్త ప్రభుత్వంలోనైనా రాష్ట్రానికి కేంద్రం సహకారం ఇస్తుందని ప్రజలు భావించినా నిరాశే ఎదురయ్యింది. – కె.సురేష్బాబు, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ లోటు బడ్జెట్ను పూడ్చే ప్రయత్నం చేయలేదు విభజన వల్ల ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ ఏర్పడింది. దాన్ని పూడ్చేందుకు కేంద్రం ఆర్థిక సహకారం అందించలేదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిది. బడ్జెట్లో దాని ప్రస్తావనే తీసుకురాలేదు. పోలవరం ప్రాజక్టు నిధుల విషయం గానీ, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదన గానీ లేదు. – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ కేంద్రంతో పోరాటం చేయాలి ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారినా అన్యాయమే చేశారు. విభజన హామీలను అమల్లోకి తీసుకురాలేదు. ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా, ఆగిపోయిన ప్రాజెక్టులకు నిధులు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, లోటు బడ్జెట్ను పూడ్చేందుకు ఆర్థిక సహకారం వంటివి బడ్జెట్లో పొందుపరచలేదు. ఇది ఏపీ ప్రజల గొంతు కోసే పని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకొని బీజేపీపై పోరాటం చేయాలి. – ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి, సీపీఎం ప్రజా వ్యతిరేక బడ్జెట్ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజానుకూలంగా లేదు. బడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం, నష్టం చేసేలా, పెట్టుబడిదారులకు ఊడిగం చేసేలా ఉంది. ప్రత్యేక విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాలు ప్రస్తావనకు రాకపోవడం బీజేపీ నిరంకుశ పాలనకు నిదర్శనం. బడ్జెట్ అంతా అంకెలగారడీతో, అబద్ధాలతో, అర్ధ సత్యాలతో నిండిపోయింది. – జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి, సీపీఐ రాష్ట్రానికి మోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయించకుండా మోసం చేసింది. అమరావతికి నిధుల ప్రస్తావన లేదు. బ్యాంకింగ్, రైల్వే, విమానయాన సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించాల్సి ఉండగా.. ఆ ఊసే లేకపోవడం బాధాకరం. –నీలి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి, కాంగ్రెస్ రైతులకు భరోసా ఇవ్వని బడ్జెట్ కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రైతులకు ఏమాత్రం భరోసా లేవ్వలేదు. ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం పంట సాగు ఖర్చులకు 50 శాతం మేర ధరలు పెంచుతామని చెప్పింది. ఇప్పుడు ఆ ఊసే లేకపోవడం బాధాకరం. రైతులపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. పెట్రోల్, డీజిల్పై రూ.1 సుంకం పెంచడం సరికాదు. – బి.దస్తగిరిరెడ్డి, జిల్లా కార్యదర్శి, ఏపీ రైతు సంఘం పేదల సంక్షేమానికి నిధులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా బాగుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రైతులకు ప్రాధాన్యత కల్పించారు. పేదల సంక్షేమానికి నిధులు కేటాయించారు. – ఆర్.సదాశివశర్మ, సీనియర్ ఆడిటర్, ప్రొద్దుటూరు వ్యవసాయ రంగానికి పెద్దపీట కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, విద్యాభివృద్ధికి పెద్దపీట వేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచడానికి రూ.80 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్ట పరచడానికి 10 వేల వ్యవసాయ సంస్థలను నూతనంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. – కనపర్తి త్రివిక్రమ్రెడ్డి, ప్రిన్సిపాల్, గౌరీశంకర్ జూనియర్ కాలేజీ, ప్రొద్దుటూరు -
కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం
-
‘అనంత’కు అన్యాయం
కేంద్రంలోని బీజేపీ సర్కార్ జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. నిధుల కేటాయింపులో మరోసారి మొండిచేయి చూపింది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ జిల్లా వాసులను నిరాశపరిచింది. జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బెల్, సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ, ఎనర్జీ యూనివర్సిటీలకు నిధులు కేటాయించకపోవడంపై జిల్లావాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి రాష్ట్రానికి సంజీవనిగా భావిస్తున్న ప్రత్యేకహోదా ఊసు లేకపోవడం అందరినీ నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరకు రూ.1 సెస్ విధించడం, బంగారం, ఇతర విలువైన ఆభరణాలపై కస్టమ్స్ సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడంపై మధ్యతరగతి పెదవి విరుస్తోంది. అయితే వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆర్థికమంత్రి తెలపడం, ఆ జాబితాలో ‘అనంత’ పేరు ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. మొత్తమ్మీద కొన్ని వర్గాలకు వెసులుబాటు మినహా సామాన్యులకు ఈ బడ్జెట్లో పెద్దగా లబ్ధి కల్గించే ప్రకటనలు లేవు. అలాగే జిల్లా అభివృద్ధికి కూడా దోహదపడే అంశాలు లేకపోవడం గమనార్హం. – సాక్షి ప్రతినిధి, అనంతపురం ‘అనంత’ అభివృద్ధిని విస్మరించారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. పూర్తిగా వెనుకబడిన ‘అనంత’ అభివృద్ధిని కేంద్రం విస్మరించింది. ఆర్థికాభివృద్ధి సాధించామని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నా...పేద కుటుంబాల్లో ఎలాంటి మార్పు రాలేదు. జాతీయ సంపద పంపిణీ సరిగా జరగడం లేదు. బడ్జెట్ కేటాయింపులు చూస్తే కార్పొరేట్ వర్గాలకే మేలు జరిగేలా ఉంది. – తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ బుక్కరాయసముద్రం మండలంలోని జంతులూరు వద్ద ఏర్పాటు చేయనున్న సెంట్రల్ వర్సిటీకి ఈ బడ్జెట్లో కేంద్రం ఆశించినంత మేర నిధులు విడుదల చేయలేదు. కేవలం రూ.13 కోట్లు కేటాయించడంతో ఆ నిధులన్నీ జీతాలు, నిర్వహణకే సరిపోతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. భవన నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాకపోవడంతో సెంట్రల్ వర్సిటీ తరగతులు జేఎన్ టీయూలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. సాక్షిప్రతినిధి, అనంతపురం: కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది. ‘అనంత’కు తీరని అన్యాయం జరిగింది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా పెట్రోలు, డీజిల్లపై లీటర్కు రూపాయి సెస్ విధిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇది కాకుండా ఇతర పన్నులు కలిపి లీటర్పై రూ.2.50 వరకూ అదనంగా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం అన్ని రంగాలపై చూపే అవకాశం ఉంది. హోదాను విస్మరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకహోదాపై ఆశలు పెట్టుకుంది. హోదా ప్రకటిస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా మేలు జరిగే ప్రాంతం అనంతపురమే. హోదా ఇస్తే పరిశ్రమలు ఏర్పాటైæ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కేంద్ర బడ్జెట్లో హోదా ప్రస్తావన లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించే అంశం. ఇక దేశవ్యాప్తంగా వెనుకబడిన 150 జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కేంద్రం ప్రకటించింది. అందులో అనంతపురం జిల్లాను కూడా చేర్చడం జిల్లా వాసులకు కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే జిల్లా అభివృద్ధికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారు? పరిశ్రమలు, ఇతర రంగాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారికి శుభవార్త 2022నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే మధ్యతరగతి ప్రజలు రూ.45 లక్షల వరకూ రుణం తీసుకుంటే అందులో రూ.3.50 లక్షల వడ్డీ రాయితీ ఇస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. గతంలో ఈ రాయితీ రూ.2 లక్షలే ఉండేది. ఇప్పుడు రూ.1.50 లక్షలు అదనంగా రాయితీ ఇచ్చారు. అలాగే ఉద్యోగులకు ఏడాదికి రూ.5 లక్షల వార్షికాదాయం ఉంటే ఎలాంటి ఆదాయపు పన్ను లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే పన్ను చెల్లింపుదారులకు మాత్రం ఊరట లభించలేదు. రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్యలో ఆదాయం కలిగి పన్ను చెల్లించేవారు ఇకపై 3 శాతం అదనంగా సర్చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 కోట్లుపైన ఆదాయం ఉంటే 7 శాతం సర్చార్జ్ చెల్లించాలి. రూ.లక్ష వరకూ ముద్ర రుణాలు కేంద్రం ప్రభుత్వం ఇది వరకే అమలు చేస్తున్న ‘ముద్ర’ యోజన ద్వారా మహిళలకు రూ.లక్ష వరకూ రుణాలు ఇస్తామని కేంద్రం బడ్జెట్ సందర్భంగా ప్రకటించింది. దీంతో మహిళలకు ఊరట కల్గనుంది. అలాగే స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు కూడా రూ.5 వేల ఓవర్డ్రాప్ట్ ఇవ్వనున్నారు. ఇక సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రాయితీలు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే జిల్లాలో ఏటా రూ.5 వేల కోట్లపైనే రైతులు వ్యవసాయ రుణాలు తీసుకోనుండగా.. వీరు సకాలంలో చెల్లిస్తే రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన వారికి రుణాలు రీషెడ్యూలు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. జిల్లాలో సెంట్రల్యూనివర్సిటీ స్థాపిస్తున్నారు. దీనికి గత బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ.13 కోట్లు కేటాయించారు. బెల్, సెంట్రల్ కస్టమ్స్ అండ్ఎక్సైజ్ అకాడమీ, ఎనర్జీ యూనివర్సిటీలకు ఎలాంటి కేటాయింపులు బడ్జెట్లో లేవు. మొత్తం మీద బడ్జెట్లో సామాన్యులకు పెద్దగా లబ్ధికల్గించే ప్రకటనలు లేవు. సామాన్యుడి నడ్డివిరిచేలా ఉంది కేంద్ర బడ్జెట్ సామాన్యుని నడ్డివిరిచేలా ఉంది. ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ఉపయోగం లేకపోగా తీవ్ర అన్యాయం జరిగింది. విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తకపోవడం దారుణం. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోవడం ద్వారా అన్ని రకాల చార్జీలు పెరుగుతాయి. దీని ప్రభావం సామాన్యులపై పడుతుంది. కేంద్ర బడ్జెట్లో దుగ్గిరాజ పట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ల ప్రస్తావన రాకపోవడం దారుణం. – వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారు గ్రామీణాభివృద్ధికి, జలసంరక్షణకు పెద్ద పీట వేశారు. ఏపీ విద్యారంగానికి సంబంధించి ఏపీ సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు, గిరిజన వర్సిటీకి రూ.8 కోట్లు కేటాయించారు. పరిశోధనలకు సంబంధించి ప్రత్యేక కమిషన్ (నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ) ఏర్పాటు స్వాగతించాల్సిన అంశం. అయితే రెవెన్యూ లోటును పూడ్చడానికి గానీ, కొత్త రైల్వే లైను ప్రతిపాదనలు లేవు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం నిరాశపరిచింది. ఉన్నత విద్య, పాఠశాల విద్యకు కేటాయింపులు మెరుగ్గా ఉంటే బాగుండేది. గృహ రుణాలపై వడ్డీ రాయితీ స్వాగతించే అంశం. ఆదాయపన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు. చిల్లర వ్యాపారులకు ప్రధానమంత్రి కర్మయోగ మాన్ధన్ ,హర్ ఘర్ జల్ , ఒకే దేశం ఒకే కార్డు , ప్రవాస భారతీయులకు ఆధార్కార్డు , ప్రధాన మంత్రి ఘర్ యోజన ఆకర్షణీయ పథకాలుగా ఉన్నాయి. –డాక్టర్ డి. మురళీధర్ రావు , అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్కేయూ నిరాశ పర్చిన బడ్జెట్ కేంద్ర బడ్జెట్ భారత ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినట్టు లేదు. వ్యవసాయ రంగ సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆశాజనకంగా లేదు. బడ్జెట్ నిరాశ పరిచింది. మోదీ సర్కార్ బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎన్నికల్లో రాజకీయాలను, ప్రజలను మేనేజ్ చేసుకోవచ్చు, ప్రజల ప్రేమాభిమానం లేకపోయినా ఫర్వాలేదు అనే అభిప్రాయంతో కొనసాగుతున్నట్లు కనబడుతోంది. – ఇమామ్, కదలిక ఎడిటర్ కార్పొరేట్ వర్గాలకే అనుకూలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ వర్గాలకే అనుకూలంగా ఉంది. 44 కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబ్ కోడ్లుగా మారుస్తున్నట్లు ప్రకటించడం ఇందులో భాగమే. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలను రూ.1.50 లక్షల కోట్లు ఉపసంహరించి.. వాటిని ప్రైవేటు పెట్టుబడులకు బదిలీ చేస్తామడం దారుణం. వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తూ యాజమాన్యంతో సహా ప్రైవేటుకు కట్టబెడుతోంది. –వి.రాంభూపాల్, సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి -
మౌలిక పెట్టుబడులపై భారీ నజర్
న్యూఢిల్లీ: ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తుల సరసన నిలిచే బలమైన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం దేశంలో మౌలిక వసతులను ప్రపంచస్థాయికి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతులు, డిజిటల్ ఎకానమీ, ఉద్యోగ కల్పన ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేదిశగా దూసుకెళ్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గ్రామాలు–పట్టణాల మధ్య నెలకొన్న దూరాన్ని చెరిపేస్తూ.. వీటిని కలిపే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. ‘సరైన అనుసంధానతే ఆర్థిక వ్యవస్థకు జీవనాడి. అందుకే మౌలికవసతుల కల్పనకు ఏడాదికి రూ.20లక్షలకోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నాం. ఈ దిశగా ఆర్థిక సహకారం కోసం క్రెడిట్ గ్యారెంటీ ఎన్హాన్స్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటుచేస్తాం. ఇందుకు సంబంధించి ఆర్బీఐ నియమ నిబంధనలు రూపొందిస్తోంది’అని మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రూ.80,250కోట్ల వ్యయంతో 1.25 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. పీఎంజీఎస్వైతో అనుసంధానత గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక–ఆర్థికపరమైన సానుకూలమార్పులు తీసుకురావడంతోపాటు అన్నిరకాల వాతావరణాల్లోనూ పట్టణ ప్రాంతాలతో అనుసంధానత విషయంలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. జాతీయ రహదారుల గ్రిడ్ను ఏర్పాటుచేసే యోచనలోనూ ఉన్నట్లు చెప్పారు. 2018–19లో మొత్తం 300 కిలోమీటర్ల మేర మెట్రోలైన్లకోసం అనుమతులు ఇచ్చామన్న మంత్రి.. దేశవ్యాప్తంగా 657 కిలోమీటర్ల మెట్రోరైల్ నెట్వర్క్ వినియోగంలోకి వచ్చిందన్నారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎమ్సీ) ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన చెల్లింపుల వ్యవస్థ ద్వారా 2019 నుంచి మెట్రో సేవలు, టోల్ టాక్స్ల వద్ద వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రైల్వేలకు రూ.50 లక్షల కోట్లు! 2018–30 మధ్య రైల్వేల్లో మౌలిక వసతులకల్పనకు రూ.50లక్షల కోట్ల పెట్టుబడుల అవసరముందని సీతారామన్ పేర్కొన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకున్న స్థలాల్లో.. ప్రజలకు అవసరమైన వసతుల నిర్మాణాలను చేపట్టే యోచన ఉందని ఆమె తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఆర్థికసాయం విషయంలో వినూత్నంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్న మంత్రి.. పూర్తయిన ప్రాజెక్టులను విక్రయించుకోవడం (బ్రౌన్ఫీల్డ్ అసెట్ మానిటైజేషన్) ద్వారా ఆర్థిక సమస్యలనుంచి బయటపడే విషయంలో భారత్ సానుకూల ఫలితాలను సాధించిందని వెల్లడించారు. విమానయానానికీ ఊతం పౌరవిమానయాన రంగాన్ని ప్రోత్సహించడంతోపాటుగా.. రోడ్లు, జలమార్గాలు, మెట్రో, రైలు రవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పీఎం గ్రామ సడక్ యోజన, పారిశ్రామిక కారిడార్లు, సరుకుల రవాణాకు ప్రత్యేక కారిడార్లు, భారత్మాల, సాగరమాల, జల్మార్గ్ వికాస్, ఉడాన్ వంటి పథకాను తీసుకొచ్చామని నిర్మల గుర్తుచేశారు. ‘సామాన్యులకు సేవలందించేందుకు భారీ మౌలికవసతుల సంస్కరణలను తీసుకొచ్చాం. ఈ సంస్కరణలు కొనసాగేందుకు నిర్మాణ, మౌలికవసతుల రంగంతోపాటు, డిజిటల్ ఎకానమీ, చిన్న–మధ్యతరహా సంస్థల్లో ఉద్యోగ కల్పన కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది’అని మంత్రి వెల్లడించారు. భారత్మాల,సాగరమాలతో.. భారత్మాల కార్యక్రమం ద్వారా జాతీయ రహదారుల కారిడార్లు, హైవేలను కలుపుతుండగా.. సాగరమాల ప్రాజెక్టు ద్వారా పోర్టుల మధ్య అనుసంధానత పెరుగడంతోపాటు.. పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ ఆధునీకరించబడుతోంది. జల్మార్గ్ వికాస్ ప్రాజెక్టు ద్వారా జాతీయ జలమార్గాలను నిర్మించడంతోపాటు జల రవాణాను మరింతగా ప్రోత్సహించే కార్యక్రమాలను కేంద్రం చేపట్టింది. రైలు, రోడ్డుమార్గాలకంటే అంతర్గత జలరవాణా ద్వారానే రవాణా వ్యయం తగ్గుతుంది. తద్వారా దేశీయంగా తయారైన వస్తువుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని కేంద్రం భావిస్తోంది. 2018 నవంబర్లో వారణాసిలో గంగానదిపై జలరవాణా టెర్మినల్ ప్రారంభం వినియోగంలోకి వచ్చింది. 2019–20ల్లోగా షాహిబ్గంజ్, హల్దియాల్లో టెర్మినల్స్ పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలో గంగానదిపై కార్గోల ద్వారా రవాణా నాలుగురెట్లు పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉడాన్ పథకం ద్వారా గ్రామీణ–పట్టణ తేడాలను కలిపేసే ప్రయత్నం జరుగుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్గా ఉన్న భారత్.. విమాన కొనుగోలుకు ఆర్థికసాయం అందించడంతోపాటు భారత గడ్డపైనుంచి విమానసేవలను ప్రారంభించేందుకు అవసరమైన ‘లీజింగ్’కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించనున్నట్లు నిర్మల తెలిపారు. -
గ్రామీణం 2.0
బంపర్ విజయంతో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ సర్కారు.. రెట్టించిన ఉత్సాహంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. పల్లెవాసులకు ఇళ్లు, రోడ్లు ఇతరత్రా మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో మొదలైన ప్రతిష్టాత్మక పథకాల్లో కొన్నింటి లక్ష్యాలు సాకారమయ్యాయి. దీంతో వీటి ప్రాధాన్యాలను పెంచి తాజా బడ్జెట్లో కొత్త లక్ష్యాలను నిర్దేశించారు. గ్రామీణాభివృద్ధికి గేరు మార్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన గత లక్ష్యం అనుకున్నదానికంటే మూడేళ్లు ముందే నెరవేరడంతో మూడో దశ కింద 1,25,000 కిలోమీటర్ల పల్లె రహదారులను మెరుగుపరచనున్నారు. ఇందుకు రూ.80వేల కోట్లకుపైగానే వెచ్చించనున్నారు. ఇక గ్రామీణ ఇళ్ల నిర్మాణంలో కూడా కొత్తగా వచ్చే మూడేళ్లలో 1.95 లక్షల గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. మొత్తంమీద మోదీ సర్కారు.. గ్రామీణాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఫ్లాగ్షిప్ 2.0 వెర్షన్ను పట్టాలెక్కించిందని పరిశీలకులు భావిస్తున్నారు. – న్యూఢిల్లీ అంచనాలకు మించి ఉపాధి హామీ 2019–20 కేటాయింపు: రూ. 60,000 కోట్లు 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.61,084 కోట్లు - 2005లో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈ దఫా 11% పెరిగింది. అయితే, సవరించిన అంచనాలతో పోలిస్తే కాస్త తగ్గింది. - దీనికి ప్రధాన కారణం చాలా రాష్ట్రాల్లో లక్ష్యాలను మించి ఉపాధి పనులను కల్పించడంతోపాటు నిధులను కూడా అవసరాన్ని మించి ఖర్చుచేశారు. - అవసరమైతే డిమాండ్ మేరకు తాజా కేటాయింపులు మరింత పెంచుతారు. స్వచ్ఛ భారత్ సాకారం 2019–20 కేటాయింపు: రూ. 12644 కోట్లు. 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.16,978కోట్లు - 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున మొదలైన ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. - బహిరంగ మలవిసర్జన (ఓడీఎఫ్) అలవాటు దాదాపు కనుమరుగైంది. - ఓడీఎఫ్ రహిత గ్రామాల సంఖ్య 5.6 లక్షలకు చేరింది. - గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98% పారిశుద్ధ్య లక్ష్యాల్లో విజయం. - ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి భారత్ను ఓడీఎఫ్ రహిత దేశంగా ప్రకటించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. - ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్ఘాట్ వద్దనున్న గాంధీ దర్శన్ ప్రాంగణంలో ‘రాష్ట్రీయ స్వచ్ఛత కేంద్రం’ను నెలకొల్పనున్నామని వెల్లడించారు. దేశమంతా విద్యుత్ వెలుగులు 2019–20 కేటాయింపు: రూ.4,066 కోట్లు. 2018–19 కేటాయింపు (సవరించిన అంచనా): రూ.3,800 కోట్లు. - దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజనలో భాగంగా 2017లో ఆరంభించిన సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ లక్ష్యం ఇటీవలే సాకారమైనట్లు కేంద్ర ప్రకటించింది. - దీనికోసం ఇప్పటివరకూ రూ. 16,320 కోట్ల వినియోగం. - ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్కు కేటాయింపులు రూ.3,970 కోట్ల నుంచి రూ.5,280 కోట్లకు పెంచారు. - ఉజాల స్కీమ్ కింద పేద, మధ్యతరహా కుటుంబాలకు ఉచితంగా 143 కోట్ల ఎల్ఈడీ బల్బులను అందజేయాలని లక్ష్యం. - ఎల్ఈడీ బల్బులతో ఏటా రూ.18,341 కోట్ల మేర విద్యుత్ బిల్లులు ఆదా - సోలార్ స్టవ్లు, బ్యాటరీ చార్జర్లను ప్రోత్సహిచేందుకు కూడా ఈ ఎల్ఈడీ బల్బుల అమలు విధానాన్ని ఉపయోగించుకోనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ రోడ్లకు ఇక మహర్దశ 2019–20 కేటాయింపు:రూ.19,000 కోట్లు 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.15,500 కోట్లు - ముందుగా అనుకున్నట్లు 2022 నాటి లక్ష్యం కంటే ముందే.. 2019 మార్చినాటికే దాదాపు 97% ఆవాసాలను రోడ్లతో అనుసంధానించారు. - మొత్తం 17.84 లక్షల ఆవాసాల్లో 15.8 లక్షల ఆవాసాలకు పక్కా రోడ్లు వచ్చాయి. - గడిచిన 1,000 రోజుల్లో సగటున రోజుకు 130–135 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగినట్లు అంచనా. - ఇందులో 30,000 కిలోమీటర్ల రోడ్లను పర్యావరణ అనుకూల (గ్రీన్) సాంకేతికతతో నిర్మించడం విశేషం. - పీఎంజీఎస్వై ఫేజ్–3ను ఇప్పుడు అమలు చేయనున్నారు. - ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో 1,25,000 కిలోమీటర్ల రోడ్లను అప్గ్రేడ్ చేయనున్నారు. దీనికి రూ.80,250 కోట్లు ఖర్చవుతుందని తాజా బడ్జెట్లో అంచనా వేశారు. గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కొత్త జోష్ 2019–20 కేటాయింపులు: రూ.25,853 కోట్లు 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.26,405 కోట్లు - ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)లో భాగంగా 2022 కల్లా దేశవ్యాప్తంగా ఇళ్లు లేని బలహీనవర్గాలకు పక్కా ఇళ్లను కట్టిఇవ్వడమే కేంద్రం లక్ష్యం. - పీఎంఏవై తొలి దశను 2016–17 నుంచి 2018–19 వరకూ మూడేళ్లపాటు అమలుచేశారు. దీనికింద గ్రామాల్లో కొత్తగా కోటి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకు రూ.81,975 కోట్లు ఖర్చయింది. గడిచిన ఐదేళ్లలో 1.54 కోట్ల ఇళ్లను నిర్మించారు. - ఇప్పుడు రెండో దశ కింద 2019–20 నుంచి 2021–22 మధ్య 1.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. - అంతేకాదు ఈ ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు కూడా ఉచితంగా కల్పించనున్నారు. - ఇక పట్టణ ప్రాంతాలకొస్తే 81 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, 47 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 26 లక్షలు పూర్తయ్యాయి. 24 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. - ఒక్కో ఇంటి నిర్మాణానికి 2015–16లో 314 రోజులు పట్టగా.. 2017–18 నాటికి ఇది 114 రోజులకు తగ్గిందని కేంద్రం వెల్లడించింది. తాగునీటికి ‘జల్ జీవన్’ 2019–20 కేటాయింపులు: రూ.10,001 కోట్లు 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.5,500 కోట్లు - వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటి కష్టాల నేపథ్యంలో జాతీయ గ్రామీణ తాగునీటి పథకానికి (ఎన్ఆర్డీడబ్ల్యూపీ) మరింతగా నిధుల పెంపు. - తాజాగా జల్ జీవన్ మిషన్ను బడ్జెట్లో ప్రకటించారు. దీనికింద 2024 నాటికి గ్రామీణ కుటుంబాలన్నింటికీ (హర్ ఘర్ జల్) తాగునీటిని అందించడమే లక్ష్యం. - వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తగిన మౌలిక వసతుల కల్పన, భూగర్భజలాల పెంపు, మురుగునీటి నిర్వహణ కూడా జల్జీవన్ మిషన్లో భాగమే. గ్రామీణ టెలిఫోన్ 2019–20 కేటాయింపు: రూ.8,350 కోట్లు. 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.5,000 కోట్లు. - భారత్ నెట్ ఫేజ్–1 కింద 1,21,652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ పూర్తి. 1.16లక్షల పంచాయతీల్లో అందుబాటులో సర్వీసులు. - దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్బ్యాంక్ యాక్సెస్ లభించింది. మరింత వేగం పెంచేందుకు పీపీపీ పద్ధతిలో పనులు. - 39,359 పంచాయతీల్లో వైఫై హాట్స్పాట్స్ ఇన్స్టలేషన్ పూర్తి. -
కోటి దాటితే కోతే!!
సాక్షి, అమరావతి: వ్యవస్థలో నగదు చలామణీని తగ్గించి డిజిటల్ లావాదేవీలను పెంచే దిశగా కేంద్రం పలు చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి ఒక ఏడాదిలో నగదు రూపంలో కోటి రూపాయలు మించి విత్డ్రా చేస్తే అదనంగా కొంత చేతి చమురు వదలనుంది. నగదు రూపంలో కోటి రూపాయలు దాటి తీస్తే రెండు శాతం సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు. కోటి రూపాయలు దాటి ఎంత మొత్తం తీస్తే ఆ మొత్తంపై రెండు శాతం సర్ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకు బ్యాంకు నుంచి వివిధ సందర్భాల్లో ఒక ఏడాదిలో కోటిన్నర రూపాయలు నగదు రూపంలో తీస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి లక్ష రూపాయలు కోత పడిపోతాయి. నగదు చెలామణిని తగ్గించి డిజిటల్ లావాదేవీలు పెంచడం కోసం ఈ సర్ చార్జిని విధిస్తున్నట్లు సీతారామన్ తెలిపారు. ► అదే విధంగా వార్షిక టర్నోవర్ రూ.50 కోట్ల లోపు ఉన్న వారికి డిజిటల్ లావాదేవీలపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ను (ఎండీఆర్) పూర్తిగా ఎత్తివేసినట్లు మంత్రి తెలిపారు. అంటే రూ.50 కోట్ల లోపు టర్నోవర్ లోపు ఉన్న వ్యాపార సంస్థల్లో కార్డు లేదా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేస్తే ఎటువంటి అదనపు రుసుములు చెల్లించనవసరం లేదు. ఈ ఎండీఆర్ భారాన్ని ఆర్బీఐ, బ్యాంకులు సంయుక్తంగా భరిస్తాయని మంత్రి చెప్పారు. ఇప్పటికే డెబిట్ కార్డు ద్వారా రూ.2,000 లోపు జరిపే లావాదేవీలు, భీమ్ యాప్ ద్వారా చేసే లావాదేవీలపై రుసుములు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ► ఈ మధ్యనే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లావాదేవీలపై కూడా కేంద్రం రుసుములను తొలగించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి డిజిటల్ లావాదేవీలు పెంచడంపై కేంద్రం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్ 2016లో 79.67 కోట్లుగా ఉన్న డిజిటల్ లావాదేవీల సంఖ్య మార్చి 2019 నాటికి 332.34 కోట్లకు ఎగబాకింది. అదే విలువ పరంగా చూస్తే డిజిటల్ లావాదేవీలు రూ.108 లక్షల కోట్ల నుంచి రూ.258 లక్షల కోట్లకు చేరాయి. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో డిజిటల్ లావాదేవీలు మరింత పెరిగే అవకాశముందనేది మార్కెట్ పరిశీలకుల అంచనా. -
జీరో బడ్జెట్... ఖర్చు లేని సాగు
జీరో బడ్జెట్ వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పూర్వ పద్ధతుల వైపు మళ్లాల్సి ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో దేశ వ్యవసాయ స్థితిగతులను ప్రస్తావిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఐక్య రాజ్య సమితికి చెందిన ఆహార – వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) పెట్టుబడులు, రసాయన ఎరువులు అవసరం లేని సహజ వ్యవసాయం చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ తరహా సాగు పద్ధతి అమలు చేస్తున్నారని చెప్పారామె. వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్, రైతు సంఘాలు కలసి కర్ణాటకలో దీన్నో ఉద్యమంలా చేపట్టాయని, తర్వాత కొన్ని రాష్ట్రాలు ఈ పద్ధతిని అనుసరించాయని ఆమె తెలిపారు. ఇదివరకే ఈ పద్ధతిని అనుసరించాల్సిందిగా నీతి ఆయోగ్ రాష్ట్రాలకు సూచించటం గమనార్హం. జీరో బడ్జెట్.. అంటే!! సంక్షిప్తంగా చెప్పాలంటే ఖర్చు లేని వ్యవసాయమన్న మాట. విత్తనాలకు, ఎరువులకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లో కొనుగోలు చేసి వాడాల్సినవి ఏమీ వుండవు. మట్టిలోని సూక్ష్మ జీవులు, వానపాములే మొక్కల పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. విత్తనాలను కూడా రైతులే తమ పంట నుంచి తయారు చేసుకుంటారు. ఎరువులు చల్లే పని లేదు. ప్రకృతిలో దొరికే వాటితోనే భూమికి బలాన్నివ్వవచ్చు. అందుకే ఈ సాగు పద్ధతిలో ఖర్చులుండవు. కాబట్టే జీరో బడ్జెట్ ఫార్మింగ్గా పిలుస్తున్నారు. పాలేకర్ చెబుతున్నదేమిటి? దేశీ ఆవు పేడ, మూత్రంతో భూసారం పెంచే ద్రావణాలు (బీజామృతం, జీవామృతం) తయారు చేసుకుని భూమికి తిరిగి జవసత్వాలను అందించడం, రసాయనిక అవశేషాలు లేని ఆహారాన్ని పండించుకోవడం పాలేకర్ పద్ధతిలోని ప్రత్యేకత. పొడి సున్నం, పొడి మట్టి, బెల్లం, బావి / బోరు / నది నీరును కూడా ఈ ద్రావణాల్లో కలుపుతుంటారు. ‘భూమి అన్ని పోషకాలున్న అన్నపూర్ణ. పోషకాలను మొక్కల వేళ్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చేది సూక్ష్మ జీవరాశి. వాటిని పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం ఇచ్చి.. వీలైన పద్ధతిలో మల్చింగ్ చేస్తే చాలు’అంటారు పాలేకర్. పొలంలో పలు రకాల అంతర పంటలు వేయడం ద్వారా పంటల జీవ వైవిధ్యాన్ని పెంపెందుకునే వీలుండటం ఈ పద్ధతిలోని మరో ప్రత్యేకత. పండ్ల తోటల సాళ్ల మధ్య అడుగు లోతు కందకాలు తీయడం ద్వారా వాననీటి సంరక్షణ చేపట్టడం, ఆ విధంగా పంటను కరువు పరిస్థితులను తట్టుకునేలా చేయడం ఇంకో ప్రత్యేకత. రైతాంగ ఆత్మహత్యల నివారిణి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 లక్షల మంది రైతులు అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల నుంచి విముక్తమయ్యారని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గతంలో ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నాణ్యమైన, పోషక – ఔషధ విలువలతో కూడిన సహజాహారం పండించే రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకు అమ్మితే వ్యవసాయ సంక్షోభం పరిష్కారమవుతుందని సూచించారు. కేంద్రం ఇప్పుడు దానికే మొగ్గుచూపుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రసంగం చెబుతోంది. -
ప్చ్...సూపర్ రిచ్!
దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ధనవంతులు మరింత పన్ను చెల్లించడానికి సిద్ధం కావాలంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కోటీశ్వరులు చెల్లించే ఆదాయ పన్నుపై సర్చార్జీలను భారీగా పెంచేశారు. సర్చార్జీల పెంపువల్ల రూ.2–5 కోట్ల ఆదాయం ఉన్న వారిపై నికరంగా 3%, రూ.5 కోట్లు ఆదాయం దాటినవారిపై 7% వరకు అదనపు భారం పడుతుంది. ఈ సర్చార్జీల పెంపుతో రూ.5 కోట్లు ఆదాయం దాటిన వారు నికరంగా 42.74% పన్ను చెల్లించాల్సి రానుంది. ఇది అగ్ర రాజ్యం అమెరికాలోని వ్యక్తిగత ఆదాయ పన్ను రేటు కంటే అధికం. అమెరికాలో గరిష్టంగా ఆదాయ పన్ను రేటు 40 శాతంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును సీతారమన్ బద్ధలు కొట్టారు. సంపన్నులపై సర్చార్జీలను పెంచడం ద్వారా రూ.12,000 కోట్ల అదనపు ఆదాయం రానుంది. ఇదే సమయంలో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని ఆమె పేర్కొన్నారు. నిజానికి ఈ వెసులుబాటు గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే కల్పించారు. ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయకుండా సెక్షన్ 87 కింద లభించే రిబేటును రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు వరకు అప్పట్లోనే పెంచారు. దీనివల్ల రూ.5 లక్షల లోపు ఆదాయం వున్న వారు చెల్లించాల్సిన పన్నుపై రిబేటు లభిస్తుంది. సంపన్నులపై భారం ఇలా పెరిగింది.. ప్రస్తుతం పన్ను పరిధిలోకి వచ్చే వార్షికాదాయం రూ.10 లక్షల దాటితే 30% గరిష్ట పన్ను విధిస్తున్నారు. ఇది కాకుండా రూ.50 లక్షలు ఆదాయం దాటిన వారిపై రెండు రకాల సర్చార్జీలను విధిస్తున్నారు. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల లోపు ఆదాయం ఉన్న వారిపై 10 శాతం, రూ. కోటి దాటితే 15% సర్ చార్జి విధిస్తున్నారు. దీనిపై 4% సుంకం అదనం. ఇప్పుడు రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల లోపు ఉన్నవారిపై సర్ చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, అదే రూ.5 కోట్లు దాటితే 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. దీంతో రూ.2–5 కోట్ల లోపు ఆదాయం ఉన్న వారు చెల్లించే నికర పన్ను రేటు (శ్లాబ్ రేటు+ సర్చార్జీ+ సుంకం) 35.88 శాతం నుంచి 39 శాతానికి పెరిగింది. అదే విధంగా రూ.5 కోట్ల ఆదాయం దాటిన వారి పన్ను భారం 42.74 శాతానికి చేరింది. గృహరుణంపై మరింత మినహాయింపు అందరికీ ఇళ్లు అన్న లక్ష్యాన్ని తొందరగా చేరుకోవడానికి అందుబాటు ధరల్లోని గృహాలపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతూ బడ్జెట్లో నిర్ణయించారు. ప్రస్తుతం గృహరుణాలపై చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభించేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.3.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. కానీ ఇంటి విలువ రూ.45 లక్షలలోపు ఉంటేనే ఈ పెంపు వర్తిస్తుంది. అలాగే మార్చి 31, 2020లోగా కొనుగోలు చేసిన ఇళ్లకు మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. 15 ఏళ్ల కాలానికి రుణం తీసుకుంటే వడ్డీ మినహాయింపు పరిమితిని అదనంగా రూ.1.5 లక్షలకు పెంచడం వల్ల సుమారుగా రూ.7 లక్షల వరకు ప్రయోజనం చేకూరనుందని సీతారామన్ పేర్కొన్నారు. పన్ను పరిధిలోకి మరింత మంది పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు బడ్జెట్లో పలు నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఏడాదికి రూ.50 లక్షలు దాటి చెల్లింపులు చేసే వారితో పాటు కాంట్రాక్టర్లు, వృత్తినిపుణులపై 5% టీడీఎస్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కరెంట్ అకౌంట్ ఖాతాలో రూ. కోటికి మించి డిపాజిట్ చేస్తే, రూ. లక్ష మించి విద్యుత్ బిల్లు చెల్లిస్తే, అదే విధంగా ఏడాదిలో విదేశీ పర్యటనల రూపంలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను శ్లాబుల్లో ఈసారి బడ్జెట్ సందర్భంగా ఎలాంటి మార్పులూ చేయలేదు. అయితే శ్లాబులేవీ లెక్కించకుండా రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఎటువంటి పన్ను భారం లేకుండా గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 87 రిబేటు పరిమితిని నాటి బడ్జెట్ సందర్భంగా రూ.3,50,000 నుంచి రూ.5,00,000కు పెంచారు. దీంతో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు చెల్లించాల్సిన పన్నుపై రిబేటు లభించడం ద్వారా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈసారి బడ్జెట్లో మాత్రం వార్షికాదాయం రూ.2 కోట్లు దాటిన వారిపై మాత్రం అదనపు సర్ఛార్జీ విధిస్తున్నట్లు ప్రకటించారు. -
బడ్జెట్పై మోదం.. ఖేదం
2019–20 ఆర్థిక సంవత్సరానికి కేంద్రబడ్జెట్ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దాదాపు అన్ని రంగాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్తో ఏ రంగాలు ఉత్తేజ పడతాయో, ఏవి డీలా పడతాయో చూద్దాం.. సానుకూల ప్రభావం గ్రామీణ భారతం: గ్రామాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణ వ్యయాలను పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని గృహాల నిర్మాణం, పశుదాణా ఉత్పత్తి చేసే చిన్న వ్యాపారులకు మద్దతు లాంటి చర్యలు గ్రామీణ భారతంతో సంబంధమున్న కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రకటించిన చర్యలతో ఎఫ్ఎంసీజీ రంగం ఉత్తేజం పొందనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు: పీఎస్యూ బ్యాంకులకు బడ్జెట్లో రూ.70వేల కోట్ల రీక్యాప్ సాయం ప్రకటించారు. దీంతో పాటు షాడో బ్యాంకుల రుణ డిఫాల్టులపై పాక్షిక వన్టైమ్ గ్యారెంటీ కల్పన కూడా పీఎస్బీలకు మేలు చేయనుంది. డిఫాల్టయ్యే అవకాశమున్న ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ నియంత్రణా పరిధిలోకి తీసుకురావడం ద్వారా బ్యాంకులను బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ఎస్బీఐ, బీఓబీ, కెనరాబ్యాంక్, యూబీఐ, బీఓఐ, పీఎన్బీ తదితరాలకు ప్రయోజనం దక్కనుంది. జలవనరులు: 2024 నాటికి దేశంలో అన్ని గృహాలకు తాగునీటి సరఫరా లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న నీటికొరత నివారణపై దృష్టి సారించాలని నిర్ణయించింది. దీంతో వాటర్పైప్, ఇరిగేషన్ తదితర జల సంబంధిత రంగాలకు ప్రయోజనం కలగనుంది. విమానయానం: ఏవియేషన్ రంగంలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు నష్టాల ఊబిలో ఉన్న ఎయిరిండియాను విక్రయించేందుకు, ఎయిర్క్రాఫ్ట్ల లీజు, ఫైనాన్సింగ్ విభాగాల్లోకి ప్రవేశించేందుకు కొత్త ప్రణాళికలను ప్రకటించింది. అద్దెదారులు: పట్టణాల్లో నానాటికీ పెరిగిపోతున్న జనాభాలో అధికభాగం అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారు. ఇలాంటివారికి ప్రయోజనం కలిగేలా ఒక నమూనా అద్దె చట్టం తీసుకువస్తామని ప్రభుత్వం బడ్జెట్లో హామీ ఇచ్చింది. రియల్టీ, నిర్మాణం: వచ్చే మూడేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 1.95 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు కనెక్టివిటీ పెంచేందుకు రహదారులు, ఇతర రకాల రోడ్ల నిర్మాణంపై ఎక్కువ శ్రద్ధ పెడతామని తెలిపింది. ఈ ప్రకటన మౌలిక వసతులు, నిర్మాణం, సిమెంట్ రంగాలకు ఉత్తేజాన్నిస్తుంది. ప్రతికూల ప్రభావం ఆభరణాలు, బంగారం దిగుమతిదారులు: పసిడిపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడంతో బంగారం, ఆభరణ రంగాలకు చెందిన కంపెనీలు డీలాపడ్డాయి. సుంకం పెంపుతో నగలు, బంగారం మరింత ప్రియం అవుతాయి. పసిడిపై పన్నులు తగ్గిస్తారని ప్రపంచ పసిడి సమాఖ్య అంచనా వేసినా, చివరకు ప్రభుత్వం సుంకాల పెంపునకే మొగ్గు చూపింది. రక్షణ: రక్షణ రంగానికి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన 3.05 లక్షల కోట్ల రూపాయలనే కొత్త బడ్జెట్లో ఖరారు చేశారు. అదనపు కేటాయింపులు లేవు. ఈ మొత్తం గతేడాది కన్నా ఎక్కువే ఐనా పెరిగిన ధరలతో పోలిస్తే ఏమంత పెద్ద మొత్తం కాదని నిపుణులు భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే మిలటరీ సామగ్రిపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించడం ఒక్కటే ఈ రంగానికి ఊరటనిచ్చే అంశం. మధ్యతరగతి: పెట్రో ఉత్పత్తులపై అదనపు సెస్సుతో మధ్యతరగతి వర్గంపై భారం పెరగనుంది. ఆటో విడిభాగాలు: విద్యుత్ వాహానాల దిశగా సమాజాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రకటించింది. అయితే ఈ క్రమంలో ఆటో విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం ఆటో రంగానికి రుచించని అంశం. పర్యావరణం: జలరవాణాను ప్రోత్సహిస్తూ ఇందుకోసం నదులను ఎక్కువగా వినియోగిం చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ చర్యలు పర్యావరణ సమస్యలు తీసుకువస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికాదాయ వర్గాలు: ఏడాదికి రూ. 2 కోట్ల కన్నా ఎక్కువ ఆర్జించే వ్యక్తులపై బడ్జెట్లో పన్ను పెంచారు, సంవత్సరానికి కోటి రూపాయలకు మించి బ్యాంకు నుంచి విత్డ్రా చేస్తే 2 శాతం లెవీ విధించనున్నారు. -
ఈ ఏడాదే 3 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే భారత ఆర్థిక వ్యవస్థ 3 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రెండు కోట్ల కోట్ల రూపాయలు) స్థాయికి చేరుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం 10.55 గంటలకు లోక్సభలోని తన స్థానానికి చేరుకున్నారు. పలువురు మహిళా ఎంపీలు ఆమెకు అభినందనలు తెలియజేశారు. గ్యాలరీలో కూర్చున్న తన తల్లిదండ్రులు సావిత్రి నారాయణన్ సీతారామన్, కుమార్తె వాంగ్మయ్కు నిర్మలచేతులు ఊపుతూ అభివాదం చేశారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. రాబోయే కొన్నేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు 3.4 కోట్ల కోట్ల రూపాయలు) స్థాయిని అందుకోవాలంటే వ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను తమ ప్రభుత్వం ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చిందనీ, రాబోయే కొన్నేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిని కూడా చేరుకునే సామర్థ్యం మన ఆర్థిక వ్యవస్థకు ఉందని చెప్పారు. ‘ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో మనది ఆరవ అతిపె ద్ద ఆర్థిక వ్యవస్థ. ఐదేళ్ల క్రితం మనం 11వ స్థానంలో ఉండేవాళ్లం. కొనుగోలు శక్తి ప్రకారం చూసుకుంటే ఇప్పటికే మనం చైనా, అమెరికాల తర్వాత మూడో స్థానంలో ఉన్నాం’అని నిర్మల తెలిపారు. ఎన్నో చేశాం.. ఇంకా ఎంతో చేయాలి గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం పరోక్ష పన్నుల వసూ ళ్లు, దివాలా చట్టం, స్థిరాస్తి వ్యాపారం తదితరాలకు సంబంధించి ఎన్నో భారీ సంస్కరణలు చేపట్టిందని పేర్కొన్నారు. అయితే 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఆర్థిక వ్యవస్థ ఎదగాలంటే మాత్రం ఇవి సరిపోవనీ, ఇంకా ఎన్నో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ‘ఓ వైపు జీఎస్టీ, దివాలా చట్టం వంటి సంస్కరణలు పార్లమెంటులో జరుగుతుంటే, మరోవైపు కింది స్థాయిలో సామాన్యులకు సాయం అందించేందుకు ముద్ర రుణాలు, పలు ఇతర కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది. సగటు వ్యక్తి జీవితాలను ఇంకా మెరుగుపరిచేందుకు మనం మౌలిక వసతులు, డిజిటల్ ఆర్థిక సేవలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమ ల్లో ఉద్యోగ కల్పన తదితరాలపై భారీగా పెట్టుబ డులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరడానికి భారత ఆర్థిక వ్యవస్థకు 55 ఏళ్లు పట్టింది. అదే ప్రజల హృదయాలు ఆశలు, ఆకాంక్షలు, నమ్మకంతో నిండినప్పుడు కేవలం ఐదేళ్లలోనే మరో లక్ష కోట్ల డాలర్ల స్థాయికి ఎదిగి మొత్తంగా 2 లక్షల కోట్ల డాలర్లను స్థాయిని అందుకున్నాం. ఇక ఇప్పుడు, ఈ ఆర్థిక ఏడాదిలోనే 3 లక్షల కోట్ల డాలర్ల మార్కును కూడా చేరుకోబోతున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పెద్ద పెద్ద అడుగులు వేస్తోంది’అని నిర్మల తన ప్రసంగంలో చెప్పారు. ప్రతి ఒక్కరికీ రక్షిత తాగునీరు మా ప్రాథమ్యం ప్రతి పౌరుడికీ రక్షిత తాగు నీరు అందించడం తమ ప్రభుత్వ ప్రాథమ్యమని నిర్మల చెప్పారు. 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచి నీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతీ గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణను కూడా స్వచ్ఛ భారత్ కిందకు తీసుకురావాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని తెలిపారు. అలాగే కొత్తగా పది వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత, రవాణా సౌకర్యాలే ఆర్థిక వ్యవస్థ బతికేందుకు రక్తం వంటివని, రహదారులు సహా అన్ని రకాల రవాణా మార్గాలు, సౌకర్యాల ను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం అత్యం త ప్రాధాన్యతనిస్తోందన్నారు. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీకి రూ. 1.5 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపును కూడా అదనంగా ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. గతంలో మా ప్రభుత్వం ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల పథకం, భారతమాల, సాగరమాల, జల మార్గాల అభివృద్ధి, ఉడాన్, పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేకంగా సరకు రవాణాకే కేటాయించిన కారిడార్లు తదితర పథకాల ద్వారా రవాణా సౌకర్యాలు, అనుసంధానతను ఎంతో పెంచిందని నిర్మల చెప్పారు. భారతమాల రెండో దశలో భాగంగా రహదారులను అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్రాలకు కూడా సాయం చేస్తామన్నారు. -
మధ్యతరగతిపై ‘మైనారిటీ’ ప్రేమ!
భారతీయ పాలకవర్గాలు సంపన్నులనుంచి అధిక పన్నులు రాబట్టి పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తుంటారన్నది సాధారణ అభిప్రాయం. ప్రధాని మోదీ కూడా ఆ కోవకు చెందినవారే అని చాలామంది భావిస్తూండవచ్చు కానీ 2014 నుంచి 2019 దాకా మధ్యతరగతి ముక్కుపిండి వసూలు చేసిన పన్ను రాబడుల నుంచే పేదవర్గాలకు దాదాపు రూ. 11 లక్షల కోట్ల నగదును మోదీ ప్రభుత్వం పంపిణీ చేసిందని గణాంకాల అంచనా. ఇలా తాయిలాలు అందించడం ద్వారా మోదీ పేదల ఓట్లను కొల్లగొట్టారు. మధ్యతరగతినుంచి పన్నుల రూపంలో గుంజుతున్నప్పటికీ, వారిని హిందూత్వ భ్రమల్లో ముంచెత్తి తమవైపుకు తిప్పుకున్నారు. ముస్లింలకు ఏ మేలూ చేయకున్నా లౌకికవాద పార్టీలు వారితో మొన్నటివరకూ ఆటాడుకున్నట్లుగానే, మధ్యతరగతితో మోదీ ప్రభుత్వం ప్రస్తుతం ఆటాడుకుంటోంది. నరేంద్రమోదీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో పొందుపర్చిన ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, సంవత్సరానికి 2 కోట్ల రూపాయలకు మించి సంపాదన కలిగిన సంపన్నులపై పన్నురేట్లను మరింత పెంచడమే. సంవత్సరానికి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయమున్న అతి ధనవంతులపై పన్ను మరింతగా పెంచారు. అంటే అత్యధిక పన్నురేటు ఇప్పుడు 42.3 శాతానికి పెరిగింది. ఈ పెరిగిన పన్ను రేట్లను చూస్తుంటే ’సంపన్నులను పీల్చి పిండేయండి’ అనే ఇందిరా గాంధీ పాలనా శైలికి సరైన ఉదాహరణగా కనబడుతుంది. నాలాంటి విశ్లేషకులలో చాలామందికి ఇదే అభిప్రాయం కలగవచ్చు కానీ కాషాయ రాజకీయాలలో పూర్తిగా మునిగితేలుతున్న వారి దృష్టి మరొక రకంగా ఉండవచ్చు. 1977లో అత్యవసర పరిస్థితి ముగిసిన అనంతరం రాజ్యాంగంలో పొందుపరిచిన సోషలిజం సూత్రాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా పూర్తిగా కట్టుబడిందనటానికి తాజా బడ్జెట్ చక్కటి రుజువుగా నిలుస్తోందని వీరు ప్రశంసల వర్షం కురిపించవచ్చు. అయితే భారతదేశ చరిత్రలోనే అత్యంత మితవాద ప్రభుత్వ పాలనకు నరేంద్రమోదీ రెండో దఫా నాయకత్వం వహిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. అయితే ఈ రెండు అభిప్రాయాలూ తప్పే. ఎందుకంటే మోదీ ప్రభుత్వం పీల్చిపిప్పి చేస్తున్నది నిజానికి సంపన్నవర్గాలను కాదు. మొదటినుంచి తన పట్ల అత్యంత విశ్వాసం ప్రదర్శిస్తున్న, తనకు బలమైన ఓటుబ్యాంకుగా నిలబడుతూ వస్తున్న భారతీయ మధ్యతరగతి ప్రజల మూలుగులను మోదీ ప్రభుత్వం పీల్చివేస్తోంది. ఇప్పుడు మనం వేయవలసిన ప్రశ్న ఏమిటంటే, అపరిమిత విశ్వాసాన్ని ఈ తరగతి ప్రజలు తనపై చూపుతున్న కారణంగానే వారిపట్ల ప్రభుత్వం ఇలాంటి చిన్నచూపును ప్రదర్శిస్తోందా? మరోవైపున గడచిన అయిదు సంవత్సరాలలో, జాతీయ సంపదను పేదలకు పంచిపెట్టడంలో, బదిలీ చేయడంలో మోదీ ప్రభుత్వం బహుశా అసాధారణమైన, అద్భుతమైన పాత్రను పోషిస్తూ వచ్చింది. గృహ నిర్మాణం, టాయిలెట్లు, వంటగ్యాస్, ముద్రా రుణాలు వగైరా జనరంజక పథకాలకోసం కేంద్ర ప్రభుత్వం ఈ అయిదేళ్లలో 9 నుంచి 11 లక్షల కోట్ల రూపాయలను నిరుపేదలకు పంపిణీ చేసిందనడంలో సందేహమే లేదు. పేదలకు జాతీయ సంపదను పంపిణీ చేయడంలో కేంద్రం ఎంత విజయం సాధించిందంటే రెండో దఫా ఎన్నికల్లో మోదీ అసాధారణ మెజారిటీతో, విజయగర్వంతో అధికారంలోకి వచ్చారు. అయితే పేదలకు పంచిపెట్టిన ఇంత భారీ డబ్బు ఎక్కడినుంచి వచ్చినట్లు? సాధారణంగానే ఇదంతా సంపన్నవర్గాల నుంచి పన్నుల రూపంలో కేంద్రప్రభుత్వం వసూలు చేసిందే అని మనందరికీ సహజంగానే అనిపించవచ్చు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. ఒకవైపు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పడిపోతున్నా, కేంద్రప్రభుత్వం వినియోగదారులకు దాని ప్రయోజనాన్ని అందించడానికి బదులుగా చమురుపై పన్నులను పదేపదే పెంచుతూ పోయి లాభాన్ని మొత్తంగా తన జేబులో వేసుకుంది. చమురు అమ్మకాల ద్వారా సాధించిన భారీ లాభంలో ఎక్కువ శాతం వాహనదారులైన మధ్యతరగతి ప్రజలనుంచే వచ్చిందన్నది వాస్తవం. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని ఇలా ముగించవచ్చు. జాతీయ సంపదను అసాధారణంగా పంపిణీ చేయడంలో పేదలు లబ్ధి పొంది ఉండవచ్చు కానీ ఇదంతా దేశంలో మధ్యతరగతికి చెందిన అన్ని సెక్షన్లనూ పిండగా వచ్చిందే అని చెప్పాలి. పేదలకు పంచి పెట్టిన ఈ 11 లక్షల కోట్ల రూపాయల డబ్బులో కొంచెం కూడా సంపన్నులనుంచి రాలేదు. మధ్యతరగతిని పిండి వసూలు చేసిన ఈ డబ్బు పంపకం తోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం పేదల ఓట్లను భారీస్థాయిలో కొనగలిగింది. పెద్దపెద్ద నగరాల నుంచి నగరీకరణ చెందిన రాష్ట్రాల వరకు.. మధ్యతరగతి ప్రజలు కూడా భారీ స్థాయిలో ఈసారి బీజేపీకే ఓటు వేశారని అర్థమవుతుంది. దేశంలో అతివేగంగా పట్టణీకరణకు గురైన రాష్ట్రం హరియాణా. భారత్లోని అత్యంత సంపన్నులు ఈ రాష్ట్రంలోని నగరాల్లో ఉండగా అత్యంత నిరుపేదలు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. 2014 ఎన్నికల వరకు బీజేపీ ఈ రాష్ట్రంలో కనీస మాత్రం ఓట్లను మాత్రమే పొందగలిగింది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో దాని ఓటు ఇక్కడ 58 శాతానికి అమాంతంగా పెరిగింది. మోదీ పాలనా తీరుకు ఇదొక ముఖ్యమైన రాజకీయ ఉదాహరణ. ఆయన ప్రధానంగా మధ్యతరగతి ప్రజలనుంచి పన్నులను రాబట్టి వాటిని దిగువ తరగతికి పంచిపెట్టారు. అయినప్పటికీ ఈ రెండు వర్గాల ప్రజలూ సమాన స్థాయిలో మోదీకి ఓట్లు గుద్దేశారు. 2014 కంటే 2019 నాటికి మధ్యతరగతి మోదీకి అత్యంత విశ్వసనీయమైన ఓటు బ్యాంకుగా ఆవిర్భవించింది. దాని ఫలితాన్ని వారు చాలా సంతోషంగా చెల్లిస్తున్నారు కూడా. ఇప్పుడు తాజా బడ్జెట్కేసి చూద్దాం. ఇప్పుడు సైతం సంపన్నులనుంచి తాము పన్నులను రాబడుతున్నట్లు సూచనా మాత్రంగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సంపన్నవర్గాలు దీనిపట్ల ఏమాత్రం ఆందోళన చెందుతున్నట్లు లేదు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం సాధించిన 6,351 మంది వ్యక్తులు పన్నులు చెల్లించారు. వీరి సగటు ఆదాయం రూ.13 కోట్లు. కానీ ప్రభుత్వానికి వీరివల్ల వచ్చిన అదనపు రాబడి ఎంతో తెలుసా? కేవలం రూ. 5,000 కోట్లు మాత్రమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒక సంవత్సరం టి20 క్రికెట్ పోటీల నిర్వహణలో ఆర్జిస్తున్న రాబడి కంటే ఇదేమంత ఎక్కువ కాదు. సంపన్నుల నుంచి ప్రభుత్వం అధిక పన్నులను రాబడుతున్నట్లు పేదలు భావిస్తూ సంతోషం పొందుతున్నట్లు కనిపించవచ్చు కానీ మరోవైపున సంపన్న వర్గాలు తమపై పన్ను విధింపులను ఏమాత్రం లెక్క చేయకుండానే ఎలెక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడంలో పోటీపడుతున్నారు. తమ ఆనందం కోసం, చౌకబారు వినోదాల కోసం పేదలు సులువుగా మోసపోతారు. కానీ, వాస్తవానికి అపహాస్యం పాలయ్యేది మధ్యతరగతివారే. ఎందుకంటే, 2014–19 మధ్య కాలంలో పేదలకు అందే సంక్షేమాలకు సహకారం అందించింది వారు మాత్రమే. అటువంటివారికి పెట్రోలు, డీజిల్పై అదనపు పన్నులు విధించడం ద్వారా ఆర్థికమంత్రి మంచి బహుమానమే ఇచ్చారు. ఇక వీరు ముడి చమురు ధరలు తగ్గడం కోసం ఊపిరి బిగపట్టి ఎదురు చూడాల్సిందే. వీటితోపాటు ధనవంతులను కాకుండా మధ్యతరగతివారిని బాదే మరిన్ని విధానాలు కూడా ఉన్నాయి. మోదీ హయాంలో ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభం పన్నును ప్రవేశపెట్టారు. డివిడెండ్ల పంపిణీ పన్ను పెరిగింది. ఏడాదికి పది లక్షల రూపాయలకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి డివిడెండ్లపై అదనపు పన్ను విధించారు. రూ.50లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఆదాయం ఉన్నవారి ఆదాయాలపై సర్ చార్జ్ విధించారు. మధ్యతరగతికి ఉన్న సబ్సిడీలను తగ్గించడంతోపాటు వంట గ్యాస్ వంటి వాటిపై ఉన్న సబ్బిడీలను తొలగించారు. ఇటువంటి నాన్ మెరిట్ సబ్సిడీలను తొలగించడాన్ని మనం స్వాగతించాల్సిందే. కానీ, పన్నులు కడుతున్నదెవరనేది గుర్తించాలి. మధ్యతరగతిని ఈవిధంగా పెంచుకుంటూ పోవడం ద్వారా మోదీ, బీజేపీ వారి వివేచనతో సరిగ్గా ఆడుకుంటున్నారు. ఆర్థిక వ్యవహారాల ద్వారా కాకుండా వారి మనోభావాలను సంతృప్తిపరచడం ద్వారా అది తన విధేయతను ప్రదర్శిస్తోంది. అందుకే మరింత బలంగా భారతీయతను హిందుత్వగా నిర్వచిస్తోంది. దీనికి ముస్లిం వ్యతిరేకత తోడవుతోంది. వారిలో చాలామంది ఇప్పటికీ మూకదాడుల పట్ల అభ్యంతరాలు చూపుతున్నా, ముస్లింలు మంత్రివర్గంలో, ప్రభుత్వ ఉన్నత పదవుల్లో, పార్లమెంటులో గణనీయంగా తగ్గిపోవడంపట్ల సంతోషంగానే ఉన్నారు. తమ బడ్జెట్ ఉపన్యాసాల్లో బీజేపీ ఆర్థిక మంత్రులు ఎన్నిసార్లు మధ్యతరగతిని ప్రస్తావించారో చెబుతూ నా సహోద్యోగి, రాజకీయ వ్యవహారాల సంపాదకుడు డీకే సింగ్ ఆశ్చర్యకరమైన అంశాలను బయటపెట్టారు. సాధారణంగా, అవి సగటున ఐదుసార్లు. అయితే, పీయూష్ గోయెల్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా 13సార్లుకు పెరిగింది. సరే, అది ఎన్నికల సందర్భం అనుకోండి. ప్రస్తుతం నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఆ సంఖ్య మూడుకు పడిపోయింది. ఫిబ్రవరిలో చేసిన తన ఉపన్యాసంలో పీయూష్ గోయెల్ మధ్యతరగతివారికి ఇచ్చిన హామీలన్నింటినీ ఆమె మర్చిపోయారు. ప్రామాణిక మినహాయింపు పెంచడం, మూలం వద్ద పన్ను మినహాయింపు, పన్ను శ్లాబ్ల్లో రాయితీలు అన్నిటినీ నిర్మల విస్మరించారు. పేదలు కృతజ్ఞతతో ఓటు వేసినప్పుడు మధ్యతరగతివారు తమపై అపారమైన ప్రేమాభినాలతో ఓటువేస్తున్నప్పటికీ వారి గురించి ఇక ఆలోచించాల్సిన అవసరమేముంది? దశాబ్దాలుగా భారత దేశంలో ముస్లిం మైనారిటీ వర్గంతో మన లౌకికవాద పార్టీలు ఈవిధంగానే ఆటాడుకున్నాయి. బీజేపీ, ఆరెస్సెస్ పట్ల భయంతో ముస్లింలు తమకు ఓటు వేస్తారని వారికి తెలుసు. అందుకే ముస్లింలకు ఏదైనా చేయాల్సిన అవసరం వారికి కనిపించలేదు. ప్రతిఫలంగా వారి ఓట్లన్నీ పడిపోతాయి. అటువంటి బలవత్తర కారణంతోనే ఇప్పుడు మెజార్టీ మధ్యతరగతి అంతా తమకు ఓటు వేస్తోందని బీజేపీకి అర్థమైపోయింది. మనం ఇప్పుడు వారిని ‘మోదీ ముస్లింలు’ అని పిలవడానికి కారణం అదే. వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘రక్షణ’కు 3.18 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో 2019– 20 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ శాఖకు రూ. 3.18 లక్షల కోట్లు కేటాయించారు. 1962 చైనా యుద్ధం తర్వాత అతి తక్కువగా దేశ జీడీపీలో దాదాపు 1.6 శాతం మేర రక్షణ శాఖకు కేటాయింపులు చేశారని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కేటాయింపుల్లో పెట్టుబడి మూలధన వ్యయం కోసం రూ. 1,08,248 కోట్లు కేటాయించారు. వీటి ద్వారా కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర మిలటరీ పరికరాలు, కొనుగోలు చేయను న్నారు. అలాగే రెవెన్యూ వ్యయాన్ని రూ. 2,10,682 కోట్లుగా ఖరారు చేశారు. ఈ నిధులను వేతనాలు, సైనిక వ్యవస్థల నిర్వహణ నిమిత్తం వినియోగిస్తారు. అలాగే ఈసారి రూ. 2.95 లక్షల కోట్లు బడ్జెట్ అంచనాలను చూపించగా.. 7.93 శాతం వృద్ధితో రూ. 3,18,931 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కార్యాలయం తెలిపింది. అలాగే మన దేశంలో తయారు కాని రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునేందుకు కస్టమ్స్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ. 1,12,079 కోట్ల పెన్షన్ నిధులను విడిగా కేటాయించారు. ఈ పెన్షన్ నిధులను, మొత్తం శాఖ బడ్జెట్ను కలిపి చూస్తే రక్షణ శాఖ బడ్జెట్ రూ. 4.31 లక్షల కోట్లు అవుతుంది. అయితే బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయించిన నిధుల తో రక్షణ నిపుణులు నిరాశ వ్యక్తం చేశారు. హోం శాఖకు 1.19 లక్షల కోట్లు మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణకు పెద్దపీట హోం మంత్రిత్వ శాఖకు మొత్తంగా రూ. 1,19,025 కోట్లను ఈ బడ్జెట్లో కేంద్రం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్తో పోలిస్తే ఇది రూ. 5,858 కోట్లు ఎక్కువ. మౌలిక వసతులను మెరుగుపర్చడం, పోలీసు వ్యవస్థను ఆధునీకరించడం, సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన రక్షణ కల్పించడంపై కేంద్రం ఎక్కువగా దృష్టిపెట్టింది. 2018–19 బడ్జెట్కు సంబంధించి సవరించిన అంచనా (రూ. 1,13,167 కోట్లు) కంటే 5.17 శాతం ఎక్కువగా ఈ సారి హోం శాఖకు నిధులు అందనున్నాయి. దేశ రాజధానిలో చట్టాన్ని అమలు చేసే ఢిల్లీ పోలీసు విభాగానికి రూ. 7,496.91 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇండో–పాక్, ఇండో–చైనా సహా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ. 2,129 కోట్లను ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్లో తెలిపింది. నక్సల్, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనటంతోపాటు అవసరమైనప్పుడు ఇతర విధులను కూడా నిర్వర్తించే సీఆర్పీఎఫ్కు తాజా బడ్జెట్లో రూ. 23,963.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇండో–పాక్, ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కాపలాకాసే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు రూ. 19,650.74 కోట్ల నిధులను కేంద్రం అందించనుంది. మొత్తంగా అన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఎన్ఎస్జీ, అస్సాం రైఫిల్స్) కలిపి మొత్తంగా రూ. 71,713.9 కోట్లను కేంద్రం కేటాయించింది. 2018–19 బడ్జెట్లో ఈ మొత్తం రూ. 67,779.75 కోట్లు మాత్రమే. దేశం లోపల నిఘా కోసం పనిచేసే నిఘా విభాగం (ఐబీ)కి ప్రస్తుత బడ్జెట్లో రూ. 2,384.1 కోట్లు ఇచ్చారు. ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబీకులకు రక్షణ కల్పించే ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ)కు రూ. 535.45 కోట్లను కేటాయించారు. మౌలిక వసతులకు 4 వేల కోట్లు బ్యారక్లు, నివాస గృహాల నిర్మాణం, ఆధునిక వాహనాలు, ఆయుధాల కొనుగోలు తదితరాల వంటి మౌలిక వసతుల కోసం రూ. 4,757 కోట్లను కేంద్రం ఈ బడ్జెట్లో కేటాయించింది. పోలీసు దళాల ఆధునీకరణకు రూ. 3,462 కోట్లు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి రూ. 825 కోట్లు, జమ్మూ కశ్మీర్లో వలసదారులు, ఇంకా వలస వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చిన వారికి పునరావాసం కోసం రూ. 842 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ కోసం రూ. 953 కోట్లను బడ్జెట్లో కేంద్రం కేటాయించింది. -
ఊసేలేని కాళేశ్వరం జాతీయ హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం మొండిచెయ్యి చూపింది. రాష్ట్రంలో 70 శాతం భూభాగానికి సాగునీటిని అందించే ప్రాజెక్టుకు నిధులిచ్చి ఆదుకోవాలని కోరినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావన రాలేదు. బడ్జెట్ కసరత్తులో భాగంగా రాష్ట్రాల ప్రతిపాదనలు, సూచనలు తీసుకొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో జూన్ 21 జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం తరఫున ఈ భేటికీ హాజరైన ఆర్థిక వ్యవహారాల ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జాతీయ హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.88 వేల కోట్లు ఖర్చవుతున్నాయని, వాటి లో అధిక భాగం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీకరించిన అప్పులేనని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. జూన్ 24న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ప్రసంగించిన టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు కూడా జాతీయ హోదాకై డిమాం డ్ చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావన చేయలేదు. జాతీయ హోదా అంశాన్ని పూర్తిగా విస్మరించింది. ఇక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఈ అంశాలను సైతం పక్కనపెట్టింది. ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన కింద రాష్ట్రం నుంచి 11 ప్రాజెక్టులకు నిధులు అందాల్సి ఉంది. -
పరిశోధనల ‘పాఠశాల’
న్యూఢిల్లీ: దేశ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చదిద్దేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విధానంలో పాఠశాల విద్య, ఉన్నత విద్యలో భారీ మార్పులను ప్రతిపాదించారు. పరిశోధనలు, నవకల్పనలపై మరింత దృష్టిపెడతామన్నారు. పరిశోధనలను ప్రోత్సహించి సమన్వయపరిచేందుకు, వాటికి నిధులు అందించేందుకు జాతీయ పరిశోధన ఫౌండేషన్ (ఎన్ఆర్ఎఫ్)ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘దేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిశోధనల రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్ఆర్ఎఫ్ కృషి చేస్తుంది. వేర్వేరు శాఖల్లో పరిశోధనలకు కేటాయించే నిధులను ఎన్ఆర్ఎఫ్కు మళ్లించడంతోపాటు అదనపు కేటాయింపులు కూడా చేస్తాం’’అని నిర్మలా సీతారామన్ శుక్రవారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో విద్యా రంగానికి తాజా బడ్జెట్లో రూ. 94,853.64 కోట్లను కేటాయించారు. 2018–19 సవరించిన బడ్జెట్ అంచనాలతో పొలిస్తే తాజా కేటాయింపులు 13 శాతం మేర పెరిగాయి. గత బడ్జెట్లో విద్యా రంగానికి నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ. 85,010 కోట్లు కేటాయించగా ఆ కేటాయింపులను తర్వాత రూ. 83,625.86 కోట్లకు సవరించారు. ఈసారి కేటాయింపులను విభాగాలవారీగా చూస్తే పాఠశాల విద్యకు రూ. 56,536.63 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 38,317.01 కోట్లు కేటాయించారు. అలాగే యూజీసీకి రూ. 4,600.66 కోట్లు (2018–19 సవరించిన అంచనాల్లో రూ. 4,687.23 కోట్లు), ఐఐటీలకు రూ. 6,409.95 కోట్ల మేర కేటాయింపులు చేశారు. ఇక ఐఐఎంలకు రూ. 445.53 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కు రూ. 899.22 కోట్లు కేటాయించారు. విద్యా రంగానికి సంబంధించి ముఖ్యాంశాలు ఇవీ... - విద్యారంగంలో ప్రపంచ స్థాయి సంస్థలను ఏర్పాటు చేసేందుకు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 400 కోట్లు కేటాయింపు. ఇది గతేడాది చేసిన సవరించిన అంచనాలకు మూడు రెట్లు అదనం. - నూతన విద్యా విధానం–2019 ముసాయిదాలో పేర్కొన్న ప్రకారం ఎన్ఆర్ఎఫ్లో సైన్సెస్, టెక్నాలజీ, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్–హ్యుమానిటీస్ విభాగాలు ఉండనున్నాయి. వ్యవసాయం, వైద్యం, ఫిజిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో సైన్స్, సోషియాలజీ, ఆర్కియాలజీ, ఆర్ట్ హిస్టరీ, లిటరేచర్ వంటి పాఠ్యాంశాలకు సంబంధించిన అన్ని రకాల పరిశోధనలకు ఎన్ఆర్ఎఫ్ పూర్తిస్థాయిలో నిధులు అందించనుంది. - దేశంలో క్రీడా సంస్కృతిని క్షేత్రస్థాయిలో తిరిగి పెంపొందించేందుకు ఉద్దేశించిన ఖేలో ఇండియా పథకాన్ని విస్తరించి అవసరమైన ఆర్థిక సహకారం అందించడం. - అన్ని స్థాయిల్లో క్రీడలకు ఆదరణ కల్పించేందుకు, క్రీడాకారులను తయారు చేసేందుకు వీలుగా ఖేలో ఇండియా పథకం కింద జాతీయ క్రీడా విద్యా బోర్డు ఏర్పాటు. - జాతిపిత మహాత్మాగాంధీ సిద్ధాంతాలపట్ల యువతకు అవగాహన కల్పించేలా ‘గాంధీ–పీడియా’ను అభివృద్ధి చేయనున్నారు. - ప్రపంచంలోని 200 అత్యుత్తమ యూనివర్సిటీల్లో భారత్ నుంచి మూడు ఉన్నతవిద్యా సంస్థలు (రెండు ఐఐటీలు, ఒక ఐఐఎస్సీ–బెంగళూరు) నిలిచాయని సీతారామన్ వివరించారు. దేశ ఉన్నత విద్యాసంస్థల్లోకి విదేశీ విద్యార్థుల చేరికలను ఆకర్షించేలా ‘స్టడీ ఇన్ ఇండియా’కు శ్రీకారం. ‘ప్రపంచ విద్యా కేంద్రంగా ఎదిగేందుకు భారత్కు ఎంతో సామర్థ్యం ఉంది’అని సీతారామన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో వేర్వేరు దేశాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉంటే దానివల్ల ఆ సంస్థ విలువ పెరుగుతుంది. ‘స్టడీ ఇన్ ఇండియా’ కార్యక్రమం వల్ల విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందుతారు. ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం చొరవ తీసుకుని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నిజంగా అభినందించదగ్గ విషయం. – ప్రొ.మహేశ్ పంచజ్ఞుల, డీన్ (అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాలు) ఐఐటీ మద్రాస్. -
గ్రామీణంవైపు అడుగులు
వరసగా రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బాటలోనే సాగింది. దేశ ఆర్థిక వ్యవస్థను అయిదేళ్లలో ఇప్పుడున్న 2.7 లక్షల కోట్ల డాలర్ల నుంచి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. కనుకనే తక్షణం కళ్లముందు కనబడే ఫలితాలకంటే దీర్ఘకాల ప్రయోజనాలపైనే నిర్మలా సీతారామన్ ఎక్కువగా దృష్టి సారించినట్టు కనబడుతోంది. బడ్జెట్ ప్రసంగం ప్రతిని బ్రీఫ్ కేసులో తెచ్చే పాత సంప్రదాయాన్ని విడనాడి ఉత్తరాది సంప్రదాయం ఉట్టిపడేవిధంగా ఉన్న ఎర్ర రంగు వస్త్రంతో రూపొందించిన బ్యాగ్తో ఆమె పార్లమెంటుకు వచ్చారు. ప్రతి రంగానికీ ఓటాన్ అకౌంట్లో చేసిన కేటాయింపుల్నే దాదాపుగా ఆమె కొనసాగించారు. కేంద్రం ముందున్న సవాళ్లు సామాన్యమైనవి కాదు. దేశంలో నిరుద్యోగిత ఎప్పుడూ 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. శరవేగంతో అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా ఇన్నాళ్లుగా మనకున్న గుర్తింపు ఈ ఆఖరి త్రైమాసిక ఫలితాల తర్వాత మాయమైంది. దేశంలో వినిమయం బాగా మందగించిందని ఆ ఫలితాలు వెల్లడించాయి. అందుకే కావొచ్చు... ఈ బడ్జెట్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన ప్రతి పాదనలు చేశారు. ముఖ్యంగా బీమా, విమానయానం, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగాల్లో ఈ పెట్టుబడులను ముమ్మరం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించబోతోంది. అలాగే మధ్య, చిన్న, లఘు పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈలు) లబ్ధికి చర్యలు ప్రకటించారు. ముఖ్యంగా 25 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించడానికి ఇప్పుడున్న వార్షిక టర్నోవర్ పరిమితి రూ. 250 కోట్లను రూ. 400 కోట్లకు పెంచారు. ఫలితంగా చాలా సంస్థలు ఈ పన్ను నుంచి విముక్తమవుతాయి. జీఎస్టీలో రిజి స్టరైన సంస్థలు తీసుకునే రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీనిచ్చేందుకు రూ. 350 కోట్లు కేటా యించారు. కోటిన్నరకన్నా తక్కువ వార్షిక టర్నోవర్ ఉండే రిటైల్ వ్యాపారులు, చిన్న దుకాణ దారులకు కొత్తగా పింఛన్ పథకాన్ని ప్రకటించారు. సేవా పన్ను, జీఎస్టీకి ముందున్న ఎక్సయిజ్ సుంకాలకు సంబంధించిన వ్యాజ్యాల్లో చిక్కుకున్న రూ. 3.75 లక్షల కోట్లకుపైగా మొత్తాన్ని విడుదల చేసేందుకు అనువైన వివాద పరిష్కార పథకాన్ని అమలు చేయబోతున్నారు. గ్రామీణ సడక్ యోజనతోసహా పలు పథకాలకు కేటాయింపులు పెంచడం మౌలికరంగ సదుపాయాల పటిష్టతకు దోహదపడతాయి. రాగలకాలంలో రూ. 80,000 కోట్లతో 1,25,000 కి.మీ. వేయడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సంప్రదాయ పరిశ్రమల బలోపేతానికి ఇందులో ప్రతిపాదనలు న్నాయి. వెదురు, తేనె, ఖాదీ వంటి రంగాలకు ప్రయోజనం చేకూరేలా వంద క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా తోడ్పడి ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత, జీఎస్టీ అమల్లోకొచ్చాక ఈ పరిశ్రమల కార్యకలాపాలు మందగించాయి. వీటిల్లో పనిచేసే చాలామంది ఉపాధికి దూరమయ్యారు. తాజాగా చేసిన ప్రతిపాదనలు అవి మెరుగుకావడానికి దోహదపడతాయని భావించాలి. ఈ తరహా పరిశ్రమలు ఎక్కువగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంటాయి. బంగారం, స్థిరాస్తులు వగైరాలపై పెట్టుబడులు పెట్టే అలవాటున్నవారు ఈక్విటీ రంగానికి మళ్లడమే లక్ష్యంగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీల్లో ప్రజల వాటాను ఇప్పుడున్న 25 శాతం నుంచి 35శాతానికి పెంచారు. అయితే ఇది ఏమేరకు ప్రయోజనం చేకూరుస్తుందన్నది చూడాల్సి ఉంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కాగితాల రూపంలో ఉండేవి. బంగారం, స్థిరాస్తుల తరహాలో ఇవి కళ్లెదుట కనబడేవి కాదు. అందువల్ల మన దేశంలో ప్రజానీకం ఈక్విటీ పెట్టుబడులకు అంతగా అలవాటు పడలేదు. పైగా అత్యంత చంచలస్వభావంతో ఉండే ఈక్విటీల జోలికెళ్లాలంటే చాలా మంది భయపడతారు. జాతీయంగానో, అంతర్జాతీయంగానో ఏర్పడే పరిణామాల ప్రభావంతో ఈక్విటీల విలువ హఠాత్తుగా పడిపోతే తమ పరిస్థితేమిటని ఆలోచిస్తారు. మరో సంగతేమంటే మన ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడున్న 25 శాతం నిబంధన పాటించడానికే ముందుకు రావడం లేదు. కొత్త నిబంధన అమల్లోకొస్తే పెద్ద సంస్థలన్నీ కలిసి దాదాపు 4 లక్షల కోట్ల ఈక్విటీలను మార్కెట్కు విడిచిపెట్టాలి. ఒక్కసారిగా ఆ స్థాయిలో విడుదలైతే వాటి ధర పడిపోతుందన్న భయాందోళనలు చాలా సంస్థలకున్నాయి. అయితే ఈ పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వం ఎలాంటి నియమనిబంధనలు రూపొందిస్తుందో చూడాలి. సంపన్నులపై పన్ను విధింపు ఈ బడ్జెట్లో చెప్పుకోదగిన మరో అంశం. ఏడాదికి రూ.2.5 కోట్లు సంపాదన దాటినవారు చెల్లించే ఆదాయపు పన్నును అదనంగా 3 శాతం... రూ. 5 కోట్ల సంపాదన దాటినవారు చెల్లించే పన్నుపై మరో 7 శాతం పెంచుతూ ప్రతిపాదించారు. కానీ ఆ స్థాయి సంపాదనపరుల సంఖ్య మన దేశంలో మరీ ఎక్కువేమీ కాదు. అందువల్ల ఖజానాకు వచ్చే ఆదాయం రూ. 12,000 కోట్లుమించదు. రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇవ్వడం మినహా మధ్య తరగతికి ఈ బడ్జెట్లో పెద్దగా చేసింది లేదు. పైగా పెట్రోల్పైనా, డీజిల్పైనా లీటర్కు రూపాయి సెస్ విధించడం ద్వారా ఆ వర్గానికి షాకిచ్చారు. నిజానికి రవాణారంగంపై తీవ్ర ప్రభావం చూపే ఈ నిర్ణయం వల్ల మొత్తంగా అన్నిటి ధరలూ పెరుగుతాయి. అసలు బడ్జెట్ అంటేనే పరస్పర విరుద్ధ ప్రయోజనాల మధ్య సామరస్యత చేకూర్చే కసరత్తు. అందుకే ఏదైనా ఇవ్వాలంటే ఎక్కడో అక్కడ తీసుకోకతప్పదు. అందుకే అమెరికా రాజకీయ నేత ఒకరు చాన్నాళ్లక్రితం బడ్జెట్ కసరత్తును చమత్కరిస్తూ ‘పన్నుల తగ్గింపు, బడ్జెట్ సమతుల్యత అనేవి అద్దంలో ప్రతిబింబంవంటివి. అవి కనబడతాయిగానీ... ఎవరికీ అందవు’ అన్నాడు. -
ప్రవాసీలకు త్వరలోనే పట్టాలు!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్రానికి చెందిన ఎన్నారైలకు ఊరట లభించింది. ఆధార్ కార్డులు లేకపోవడంతో భూమి పట్టాల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం దొరికింది. విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు ఆధార్ మంజూరీలో ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారత్కు వచ్చే ఎన్నారైలకు పాస్పోర్టుల సాయంతో తక్షణమే ఆధార్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆధార్ కోసం 180 రోజులు వేచి చూడకుండా.. సాధ్యమైనంత త్వరగా వీటిని మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఎన్నారైలకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి మార్గం సుగమమైంది. ప్రవాసీలకు ఆధార్ కార్డు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం కొత్త పాస్ పుస్తకాలను జారీ చేసిన రాష్ట్ర సర్కార్.. వీటికి ఆధార్ నంబర్ను తప్పనిసరి చేసింది. అంతేగాకుండా నేరుగా భూ యజమానే రావాలని షరతు విధించింది. దీంతో స్వదేశానికి వచ్చినా.. ఆధార్ లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది. దీనిపై కలెక్టరేట్ల చుట్టూ ఎన్నారైలు ఎన్ని చక్కర్లు కొట్టినా.. ప్రభుత్వం పరిష్కార మార్గం చూపకపోవడంతో నిరాశతోనే వెనుదిరిగారు. లక్షకు పైగా మందికి ఉపశమనం ప్రవాసీలకు ఆధార్ కార్డు ఇవ్వాలనే నిర్ణయంతో లక్షకు పైగా మందికి ఉపశమనం కలగనుంది. ఎన్నారైలుగా ఉండి ఆధార్ కార్డు కలిగి ఉండటం నేరం కనుక.. అధిక శాతం మందికి ఈ కార్డుల్లేవు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయంతో విదేశాల్లో గణనీయంగా ఉన్న మన రాష్ట్ర వాసులకు ప్రయోజనం కలుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల పట్టాదారు పాస్పుస్తకాలు ఇంకా పెండింగ్లో ఉండగా.. ఇందులో 1.05 లక్షల వరకు ఎన్నారైలకు సం బంధించినవే ఉన్నాయని అధికారవర్గాలు చెబు తున్నాయి. ఆధార్ కార్డుల పొందిన వెంటనే వీరూ త్వరలోనే పట్టాలు పొందనున్నారు. -
రైల్వే ప్రాజెక్టుల్లో 'పీపీపీ'
న్యూఢిల్లీ: రైల్వేల సత్వర అభివృద్ధి కోసం ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించారు. రైల్వేలో మౌలిక వసతుల కల్పన కోసం 2018 నుంచి 2030 సంవత్సరాల మధ్య రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని ఆమె తెలిపారు. ఈ బడ్జెట్లో రైల్వే కోసం రూ. 65,837 కోట్ల నిధులను కేటాయించారు. అలాగే మూలధన వ్యయం కింద గతంలో ఎన్నడూ లేనంతగా, అత్యధికంగా రూ. 1.6 లక్షల కోట్లను ఇచ్చారు. కొత్త రైల్వే మార్గాల నిర్మాణానికి రూ. 7,255 కోట్లు, గేజ్ మార్పిడికి రూ. 2,200 కోట్లు, డబ్లింగ్కి రూ. 700 కోట్లు, సిగ్నలింగ్, టెలికాం విభాగానికి రూ. 1,750 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. రోలింగ్ స్టాక్ అవసరాల కోసం మరో రూ. 6,114.82 కోట్లు ఇచ్చారు. విభాగాల వారీగా చూస్తే చాలా వరకు విభాగాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో చేసిన కేటాయింపులనే ఇప్పుడూ కొనసాగించారు. వాటిలో ఏ మాత్రం మార్పులు చేయలేదు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మల మాట్లాడుతూ ‘ప్రత్యేక ప్రయో జక వాహకాల (ఎస్పీవీ) ద్వారా సబర్బన్ రైల్వేల్లో పెట్టుబడులు పెట్టేందుకు, పీపీపీ పద్ధతిలో మెట్రో రైల్ నెట్వర్క్లో భాగం అయ్యేందుకు రైల్వే శాఖను ప్రోత్సహిస్తాం’ అని చెప్పారు. సరకు రవాణా కోసం నదీ మార్గాలను కూడా ఉపయోగించుకోవడం ద్వారా రోడ్డు, రైల్వేలపై భారం తగ్గించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోందని ఆమె తెలిపారు. ప్రయాణికుల సదుపాయాలకు 3 వేల కోట్లు రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చెప్పుకోదగ్గ మొత్తంలోనే నిధులను బడ్జెట్లో కేటాయించారు. సౌకర్యాల మెరుగుదలకు రూ. 3,422.57 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం బడ్జెట్లో తెలిపింది. గతేడాది బడ్జెట్తో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికుల సౌకర్యాలకు 200శాతం నిధులు కేటాయించారు. అయితే రైల్వేకు రెవెన్యూ వ్యయాలు తలనొప్పిగా మారాయి. ఉద్యోగుల జీతాల కోసం దాదాపుగా రూ. 86,554.31 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. గతేడాది కంటే ఇది రూ. 14 వేల కోట్లు ఎక్కువ. నిర్భయ నిధి కోసం రూ. 267.64 కోట్లు, వీడియో నిఘాకు ఉపయోగించే వ్యవస్థకు రూ. 250 కోట్లు, కొంకణ్ రైల్వే కార్పొరేషన్కు రూ. 17.64 కోట్లు కేటాయించారు. మొత్తంగా రైల్వేకు 2019–20లో రూ. 2,16,675 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనా వేసింది. కాగా, 2018 ఏడాదిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వేకు మూలధన వ్యయం కింద రూ. 1.48 లక్షల కోట్లు ఇవ్వడంతోపాటు బడ్జెట్లో రూ. 55,088 కోట్ల నిధులు కేటాయించారు. ఆస్తులను అమ్మం,ఉద్యోగ భద్రత ఉంటుంది రైల్వే మంత్రి పియూష్ గోయల్ రైల్వే ఉత్పత్తి యూనిట్లను, ఇతర ఫ్యాక్టరీలను ప్రైవేట్ పరం చేయను న్నారనే భయాలపై ఆ శాఖ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను అమ్మే ఆలోచన రైల్వేకి లేదనీ, ప్రైవేటీకరణ ద్వారా ఉద్యోగాలు పోతాయనడం అవాస్తవమని తెలిపారు. ట్రైన్–18ని తయారు చేసిన, ట్రైన్–20ని తయారు చేస్తున్న మన ఫ్యాక్టర్లీలోనే మెట్రో రైల్ బోగీలను కూడా తయారు చేసేందుకు తాము పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు. -
‘రియల్’ రయ్.. రయ్..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రం ఇచ్చిన రాయితీలు రాష్ట్రంలో ఆ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా రాజధాని భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2020 వరకు రూ. 45 లక్షలలోపు గృహాల కొనుగోలుకు రుణాలు తీసుకునే వారికి వడ్డీ చెల్లింపులో అదనంగా రూ. లక్షన్నర మేరకు ఆదాయపు పన్ను రాయితీ లభించనుంది. ఫలితంగా గృహ రుణాలపై లభించే ఆదాయపు పన్ను రాయితీ రూ. 3.5 లక్షలకు చేరుకుంది. దేశంలో ప్రతి కుటుంబానికీ సొంతింటి కలను నెరవేరుస్తామని చెబుతున్న కేంద్రం... ప్రస్తుతం ఇచ్చిన రాయితీతో సొంతింటి కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. మరోవైపు తొలిసారిగా ఇళ్లు కొనుగోలు చేస్తున్న వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గరిష్టంగా రూ. 2.67 లక్షల వడ్డీ రాయితీ రావడం గమనార్హం. దీంతో మొత్తం పన్ను రాయితీ రూ. 6 లక్షలకు చేరుకుంది. కేంద్రం ఇచ్చిన ఈ రాయితీలతో నిర్మాణరంగం మరింత ఊపందుకోనుంది. మరోవైపు భారీ గృహ సముదాయాలు నిర్మించేందుకు ముందుకు వచ్చే రియల్ సంస్థలకు భూములు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రియల్ కంపెనీలు స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయం సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే మధ్యతరగతి వాళ్ల కలలను సాకారం చేయనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. పెట్రో ధరలతో ముడిసరుకుల భారం.. పెట్రోల్, డీజిల్లపై సెస్ విధించడంతో లీటరుకు రూ. 2 చొప్పున పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇది నిర్మాణరంగంపైనా ప్రభావం చూపే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుక, స్టీలు, సిమెంటు, కాంక్రీటు తదితర సరుకులపై రవాణా భారం పడే అవకాశాలు ఉండటంతో బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో మరింత జోరుగా.. దేశంలోని ప్రధాన నగరాల్లోకెల్లా హైదరాబాదులోనే ధరలు తక్కువగా ఉండటం తెలిసిందే. దీంతో భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా ఊపందుకుంటోంది. ప్రభుత్వం తాజాగా కల్పించిన ప్రోత్సాహకాలు, రాయితీలను భవిష్యత్తులో మరిన్ని కల్పిస్తే రియల్ రంగం వేగంగా ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ రెసిడెన్షియల్ విభాగంలో 30 శాతం వృద్ధి నమోదైందని ఇటీవల క్రెడాయ్ (ద కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులు వెల్లడించారు. పెరిగిన ఇళ్ల రేట్లు గృహ విక్రయాల్లో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానం దక్కించుకుందని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ జేఎల్ఎల్ వెల్లడించింది. 2019 ప్రథమార్థంలో దేశవ్యాప్తంగా ఉన్న 7 నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్లాట్ల అమ్మకాల్లో హైదరాబాద్ వేరే నగరాలను వెనక్కి నెట్టింది. జనవరి నుంచి జూన్ మధ్య దాదాపు 65 శాతం వృద్ధి నమోదు కాగా, జాతీయ సగటు 22 శాతంగా ఉంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్ నిలిచాయి. పశ్చిమ హైదరాబాద్లో నివాస సముదాయాలకు గిరాకీ ఎక్కువ ఉందని తెలిపింది. స్వాగతిస్తున్నాం... గృహ రుణాలపై లభించే ఆదాయపు పన్ను రాయితీ రూ. 3.5 లక్షలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. దీనికి పీఎంఏవై కింద లభిస్తున్న రూ. 2.67 లక్షల పన్ను రాయితీ కలిపితే గరిష్టంగా రూ. 6 లక్షల ప్రయోజనం చేకూరనుంది. సొంతింటి కలను నెరవేర్చాలనుకునే మధ్యతరగతి వర్గాలకు మంచి ప్రోత్సాహాన్నిస్తుంది. భారీ గృహ సముదాయాలు నిర్మించాలనుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ కేటాయింపులు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఆహ్వనిస్తున్నాం. అయితే పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వల్ల రవాణా చార్జీలు పెరిగి ఇసుక, స్టీలు, సిమెంటు, కాంక్రీటు వంటి వాటి ధరలు పెరుగుతాయన్న ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ను ఆర్బీఐ పరిధిలోకి తీసుకురావడం వల్ల బిల్డర్లకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తుందని విశ్వసిస్తున్నాం. ఈసారి బడ్జెట్లో ఇవన్నీ నిర్మాణరంగానికి సానుకూల అంశాలే. – సి.శేఖర్రెడ్డి, మాజీ ప్రెసిడెంట్, క్రెడాయ్ -
ప్రతిభాశాలి సీతారామన్
దేశానికి పూర్తికాలం రక్షణ మంత్రిగా పని చేసిన ఏకైక మహిళ.. కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టిన రెండో మహిళ..భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యురాలిగా ఉన్న రెండో మహిళ..కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ నాయకురాలు.. ఈ విశేషణాలన్నీ ఒక్కరికే చెందుతాయి. ఆమే నిర్మలా సీతారామన్..! కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో శుక్రవారం లోక్సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల బహుముఖ ప్రజ్ఞాశాలి. పుస్తక పఠనంపై ఎంతగా ఆసక్తి చూపుతారో సామాజిక మాధ్యమం ట్విట్టర్లోనూ ఆమె అంతే చురుగ్గా ఉంటారు. తమిళనాడులోని మదురైలో 1959, ఆగస్టు 18న ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు నిర్మల. తండ్రి నారాయణ్ సీతారామన్ రైల్వే ఉద్యోగి. తల్లి సావిత్రి గృహిణి. తండ్రి నుంచి క్రమశిక్షణను, తల్లి నుంచి పఠనాసక్తిని పుణికి పుచ్చుకున్నారు నిర్మల. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎం.కాం. పట్టా పుచ్చుకున్నారు. భారత్– యూరప్ జౌళి వాణిజ్యంపై పీహెచ్డీ చేశారు. యూనివర్సిటీలో పరిచయమైన తెలుగు వ్యక్తి పరకాల ప్రభాకర్ను 1986లో పెళ్లాడారు. తర్వాత ఇద్దరూ లండన్ వెళ్లారు. అక్కడ నిర్మల ప్రైస్వాటర్ కూపర్స్ సంస్థలో పని చేశారు. కొన్నాళ్లు బీబీసీకి కూడా సేవలందించారు. 1991లో స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రభాకర్ స్వస్థలమైన నరసాపురం(ఆంధ్రప్రదేశ్)లో కొన్నాళ్లుండి, అటు తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె ఉంది. నిర్మల హైదరాబాద్లో ప్రణవ పేరుతో ఒక విద్యా సంస్థను స్థాపించారు. భర్త ప్రభాకర్ది కాంగ్రెస్ కుటుంబం కాగా, నిర్మల 2006లో బీజేపీలో చేరారు. ప్రభాకర్ 2007లో చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న నిర్మల 2010లో బీజేపీ అధికార ప్రతినిధుల్లో ఒకరిగా నియమితులయ్యారు. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2014లో ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017, సెప్టెంబర్ 3న రక్షణ శాఖ బాధ్యతలను చేపట్టారు. ఇందిరా గాంధీ తర్వాత రక్షణ మంత్రిగా పని చేసిన మహిళ నిర్మలే. అయితే, ఇందిరాగాంధీ ఏడాది పాటే ఆ శాఖను నిర్వహించారు. నిర్మల పూర్తికాలం రక్షణ మంత్రిగా ఉన్నారు. 2019లో మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నిర్మలా సీతారామన్కు కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. -
సామాన్యుడికి ‘పెట్రో’ వాత
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం 2019–20 బడ్జెట్లో వినియోగదారులకు షాకిచ్చింది. లీటర్ పెట్రోల్, డీజిల్లపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని రూపాయి మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పార్లమెంటులో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈ మేరకు ప్రకటన చేశా రు. అలాగే ‘రోడ్లు–మౌలిక వసతుల సెస్’ కింద లీటర్ పెట్రోల్, డీజిల్పై మరో రూపాయిని అదనంగా పెంచుతున్నామని తెలిపారు. గతంతో పోల్చుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర లు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.2.5 వరకూ, లీటర్ డీజిల్ ధర రూ.2.3 వరకూ పెరిగింది. ఈ పెంపు కారణంగా ఖజా నాకు ఏటా రూ.28,000 కోట్ల ఆదాయం చేకూరనుంది. చమురు దిగుమతులపై రూపాయి పెంపు.. కేంద్రం నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.70.51కు, ముంబైలో 76.15కు చేరుకోగా, లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.64.33కు, ముంబైలో రూ.67.40కు చేరుకుంది. అలాగే భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడిచమురుపై టన్నుకు రూపాయి మేర సుంకాన్ని పెంచుతూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీనికారణంగా ఖజానాకు రూ.22 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. ఇప్పటివరకూ ముడిచమురు దిగుమతులపై టన్నుకు రూ.50 మేర జాతీయ విపత్తు అగంతుక నిధి(ఎన్సీసీడీ) కోసం వసూలుచేస్తున్నారు. భారత్ విదేశాల నుంచి ఏటా 220 మిలియన్ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్పై రూ.19.98 ఎక్సైజ్ సుంకాన్ని, లీటర్ డీజిల్పై రూ.15.83 సుంకాన్ని కేంద్రం వసూలుచేసినట్లు అయింది. 2018, అక్టోబర్లో ఎన్నికల సందర్భంగా అప్పటి ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పెట్రో ఉత్పత్తులపై లీటర్కు రూ.1.50 మేర సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
పెట్రోల్పై రూ.2.69, డీజిల్పై రూ.2.65
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెట్రోల్, డీజిల్పై అదనపు సుంకాలు విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.74.88 ఉండగా, అది రూ.77.57కు చేరింది. అంటే పెట్రోల్పై రూ.2.69 పెరిగింది. డీజిల్ ధర బుధవారం లీటర్ రూ.70.06 ఉండగా, అది రూ.72.71కి చేరింది. అంటే డీజిల్పై రూ.2.65 పెరిగింది. పెట్రోల్, డీజిల్ ఒక్కో లీటర్పై 1 శాతం చొప్పున విధించిన స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ, సెస్తో పాటు రాష్ట్రం పరిధిలోని ఇతరత్రా సుంకాలతో కలిపి ఈ మేర పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ ప్రభావం తెలంగాణలోని 90 లక్షల వాహనదారులపై పడనుంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 60 లక్షల వాహనాలున్నాయి. ముఖ్యంగా సరుకు రవాణాపై ఈ భారం ఎక్కువ ఉంటుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా నిత్యావసరాలు, కూరగాయాలు, పండ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల భారమే ఎక్కువగా ఉంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నా పెట్రో ధరలు మాత్రం దిగిరావట్లేదు. పన్నులతో బాదుడు.. పెట్రో ఉత్పత్తులపై రెండు రకాల పన్నుల విధిస్తుండటంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధిస్తున్నాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్పై రూ.17.98లు, డీజిల్పై రూ.13.83 వసూలు చేస్తోంది. ఆ తర్వాత మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పన్ను మోత మోగిస్తోంది. తెలంగాణలో పెట్రోల్పై 35.2 శాతం, డీజిల్ 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. తమిళనాడులో పెట్రోల్పై 34 శాతం, డీజిల్పై 24 శాతం వ్యాట్ ఉండగా, డిల్లీలో పెట్రోల్పై వ్యాట్ పన్ను 27 శాతం ఉండగా, గోవాల్లో అతి తక్కువగా 17 శాతం వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్పైనే చమురు ఉత్పత్తుల ధరలు ఆధారపడినట్లు కనిపిస్తోంది. -
రాష్ట్రం ఆశలు... అడియాసలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పూర్తిస్థాయి బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే నిధులనుబట్టి పూర్తిస్థాయి బడ్జెట్ పెడదామనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, విజ్ఞప్తులు బుట్టదాఖలయ్యాయి. కనీసం నీతి ఆయోగ్ సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకోకుండానే రాష్ట్రానికి చెందిన ఉపయుక్త ప్రాజెక్టులకు కూడా కేంద్రం నిధులు కేటాయించలేదు. మొత్తం బడ్జెట్లో పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ. 19 వేల కోట్లకుపైగా చూపిన కేంద్రం... ఈసారి కూడా రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. మొత్తంమీద కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఈ బడ్జెట్పై సీఎం కేసీఆర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కాళేశ్వరంపై కరుణ లేదు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని లేదంటే రూ. 20 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. స్వయంగా సీఎం కేసీఆర్ కూడా ప్రధానిని కలసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన ఆర్థికశాఖ అధికారులు కూడా మరోసారి ఈ ప్రతిపాదనను అధికారికంగా కేంద్రం ముందుంచారు. కానీ 2019–20 బడ్జెట్లో కేంద్రం ఒక్క రూపాయిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించలేదు. కాపీ కొట్టారు కానీ కాసులివ్వలేదు... మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా జలశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం.. మన పథకానికి మాత్రం డబ్బులివ్వలేదు. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు అందించే ఈ ప్రాజెక్టుకు రూ. 19,500 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. నీతి ఆయోగ్ కూడా ఈ పథకం అద్భుతమని ప్రశసించి నిధులివ్వాలని కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. అయినా నీతి ఆయోగ్ సిఫారసులను, ప్రశంసలను కేంద్రం పట్టించుకోలేదు. మిషన్ కాకతీయ పథకానికి కూడా రూ. 5 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఈ పథకం గురించి కూడా కేంద్రం పట్టించుకోలేదు. అయినా దేశవ్యాప్తంగా జలశక్తి పథకానికి రూ. 10 వేల కోట్లు ఎలా సరిపోతాయనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఒక్క తెలంగాణలోనే మిషన్ భగీరథకు రూ.40 వేల కోట్లు అవసరం కానుండగా దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లు ఎలా సరిపోతాయని ఉన్నతస్థాయి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే లైన్లు లాంటి అంశాలను కూడా కేంద్రం పక్కన పడేయడం గమనార్హం. కొత్త పథకాలకు కటకటే...! రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ఏ ఒక్క పథకానికి కూడా కేంద్రం నిధులు కేటాయించకపోవడం రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపనుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు, నెలవారీ సాధారణ ఖర్చులకు రాష్ట్ర ఖజానా నుంచి తీసినా కేంద్ర సాయంతో కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఈ లెక్కలు తప్పడంతో ఇప్పుడు కొత్త సంక్షేమ పథకాల అమలుకు కటకట ఎదురుకానుంది. ఉద్యోగులకు పీఆర్సీ అమలు, నిరుద్యోగ భృతి లాంటి వాటి అమలుకు ఆర్థిక వెసులుబాటు కష్టమేనని, కొత్త పథకాల అమలులో జాప్యం జరుగుతుందని అధికార వర్గాలంటున్నాయి. -
పెట్రోల్, బంగారం మరింత ప్రియం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి. ఇటు సిగరెట్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, ఏసీల ధరలు సైతం అధికమవనున్నాయి. పన్నులు పెరుగుతుండటంతో వీటి ధరలు కూడా పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, కెమెరా పరికరాలు, మొబైల్ ఫోన్ల చార్జర్లు, సెట్ టాప్ బాక్సుల ధరలు తగ్గనున్నాయి. ‘మేకిన్ ఇండియా లక్ష్యాన్ని సుసంపన్నం చేసుకోవడంలో భాగంగా పలు వస్తువులపై సుంకాన్ని పెంచుతున్నాం..’అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయింపుని ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. ‘దేశీయ ముద్రణ రంగానికి ఊతమిచ్చేలా పామాయిల్కు సంబంధించిన స్టెరాయిన్, కొవ్వు నూనెలు, వివిధ రకాల కాగితపు ఉత్పత్తులపై మినహాయింపుని తొలగిస్తున్నాం. దిగుమతి చేసుకునే పుస్తకాలపై 5 శాతం కస్టమ్ డ్యూటీ విధిస్తున్నాం.’అని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఒక లీటర్పై రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్ కింద రూ.1, ఎక్సైజ్ సుంకం కింద రూ.1 విధించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. ఇటు బీడీలు, సిగరెట్లపై పరిమాణం, రకాన్ని బట్టి 10 పైసల నుంచి రూ.10 వరకు ఎక్సైజ్ డ్యూటీ విధించారు. అలాగే హుక్కా, జర్దాలాంటి పొగాకు ఉత్పత్తులపై 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఎక్సైజ్ డ్యూటీ విధించారు. పూర్తిగా విదేశాల్లో తయారైన వాహనాలు, విదేశీ కార్ల దిగుమతులపై 25 శాతం నుంచి 30 శాతానికి కస్టమ్స్ డ్యూటీని పెంచినట్లు చెప్పారు. ఆటో మొబైల్ పరికరాలు, వాహనాల ఇం జన్ల ఫిల్టర్లు, అద్దాలు, తాళాలపై 2.5 శాతం నుంచి 5 శాతానికి.. మార్బుల్స్పై 20 శాతం నుంచి 40 శాతానికి, ఏసీలపై 10 శాతం నుంచి 20 శాతానికి కస్టమ్స్ డ్యూటీని పెంచినట్లు చెప్పారు. సెరామిక్ టైల్స్, గోడకు అతికించే టైల్స్ వంటి వాటిపై 10 శాతం నుంచి 15 శాతానికి.. దిగుమతి చేసుకునే స్టెయిన్లెస్ స్టీల్ దాని సంబంధిత పరికరాలపై 5 శాతం నుంచి 7.5 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంచినట్లు వెల్లడించారు. ఇక సీసీటీవీ కెమెరా/ఐపీ కెమెరా చార్జర్, చార్జింగ్ కేబుల్, లౌడ్ స్పీకర్లు, ఆఫ్టికల్ ఫైబర్లపై 15 శాతం.. డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్), సీసీటీవీ కెమెరా, ఐపీ కెమెరాలపై 5 శాతం నుంచి 20 శాతం కస్టమ్ డ్యూటీ పెంచినట్లు ఆమె తెలిపారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల పరికరాలపై కస్టమ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి కావాల్సిన ముడి సరుకులు, కెమెరాకు సంబంధించిన పరికరాలు, మొబైల్ ఫోన్ చార్జర్లు, సెట్ టాప్ బాక్సుల ధరలు మరింత తగ్గుతాయని వెల్లడించారు. -
'అష్ట'లక్ష్మీ గ్రామోస్తుతే
పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా మంత్రిగా రికార్డులకెక్కిన నిర్మలా సీతారామన్.. ఓ మహిళగా, ఓ సాధారణ కుటుంబం వచ్చిన మహిళగా.. కేంద్ర మంత్రిగా ఆలోచించారు. సొంతింటి కలనుంచి..దేశ రక్షణ వరకు తనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని,గావ్–గరీబ్–కిసాన్ నినాదంతో బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట ఒక మహిళగా.. అదీ ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నిర్మలా సీతారామన్కు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలు పడే ఇబ్బందులు బాగా తెలుసు. అందుకే మహిళా సంక్షేమానికి తాజా బడ్జెట్లో సరిపోయేటన్ని నిధులు కేటాయించారు. ఖాతాలో డబ్బుల్లేకుండా మహిళలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో స్వయం సహాయక బృందాల్లో జన్ధన్ ఖాతాలున్న వారందరికీ.. రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) ఇస్తామని ప్రకటించారు. ఎస్హెచ్జీ గ్రూపుల్లో ఒకరికి ముద్రలోన్ కింద లక్ష రూపాయల రుణం ఇస్తామన్నారు. ఎల్ఈడీతో వెలుగు జిలుగులు విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండడంతో దీనిపై వెచ్చిస్తున్న మొత్తాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎల్ఈడీలను పంపిణీ చేసింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఇంటి వెలుగులు పెరగడంతోపాటు కరెంటు బిల్లు తగ్గించేందుకు 143కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీచేయనున్నట్లు ఆమె తెలిపారు. దీంతోపాటు సౌరవిద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు సోలార్ స్టవ్లు, సోలార్ బ్యాటరీలను తక్కువ మొత్తానికి విక్రయించనున్నట్లు వెల్లడించారు. ఆయుష్మాన్ భవ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వైద్య సమస్యలే పతాక శీర్షికల్లో కనబడుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు మందు రాసేందుకు నిర్మల నడుంబిగించారు. పేద, మధ్య తరగతికి ప్రాణవాయువైన ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక దృష్టిపెడుతూనే.. మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ఆధునీకరణతోపాటు.. వైద్య విద్యను పటిష్టం చేసే దిశగా అడుగులేశారు. గత రెండు బడ్జెట్లతో పొలిస్తే.. వైద్య రంగానికి నిధులను గణనీయంగా పెంచారు. దీంతోపాటుగా సాంప్రదాయ వైద్యానికీ సరైన ప్రాధాన్యతనిచ్చారు. ప్రపంచస్థాయికి మన విద్య వివిధ రంగాల్లో నైపుణ్యత లేమి కారణంగా వస్తున్న సమస్యలకు విద్యారంగంలో ఉన్న అడ్డంకులే కారణమని గుర్తించిన నిర్మలా సీతారామన్.. పాఠశాల విద్యనుంచే మార్పులు తప్పవని నిర్ణయించారు. అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్యలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. పరిశోధనలు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేలా.. నైపుణ్యతతో కూడిన విద్యకు ప్రోత్సాహాన్నిందిచేలా కేటాయింపులు చేశారు. క్రీడలకూ సమాన ప్రాధాన్యమిచ్చేలా ఖేలో ఇండియాకు కేటాయింపులు పెంచారు. మా‘ఇంటి’ మాలక్ష్మి మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు కలే. అలాంటి కలను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నెరవేర్చుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి నిర్మల మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పథకం కింద 81 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి 26 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయనున్నారు. దేశ ‘రక్షణ’కు సింహభాగం మాజీ రక్షణశాఖ మంత్రిగా ఆ శాఖకు జరగాల్సిన కేటాయింపులపైనా నిర్మల వెనక్కు తగ్గలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో చేసిన రూ.3.18లక్షల కోట్ల కేటాయింపులనే కొనసాగించారు. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో భద్రతను దృష్టిలో పెట్టుకుని అధునాతన యుద్ధ విమానాలు, ఆయుధాలు కొనుగోలుకు భారీ మొత్తాన్నే వినియోగించనున్నారు. రైతే రాజుగా నిలిచేలా యూపీఏ హయాంలో పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు పడిన కష్టం నిర్మలకు తెలుసు. గత ఐదేళ్లుగా దేశం ఈ పరిస్థితిని అధిగమించి.. ధాన్యాన్ని ఎగుమతి చేసుకునే పరిస్థితికి వెళ్లడం వెనక రైతు సేవ గొప్పదని పార్లమెంటు సాక్షిగా ప్రశంసించారు. అందుకే రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయడంతోపాటు.. అన్ని రకాలుగా వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు భారీగా వరాలు కురిపించారు. మహిళనే.. కానీ! ఆడవారికి బంగారమంటే ఎంత ఇష్టమో తెలియంది కాదు. నిర్మలకు మహిళగా వారి ఆసక్తులు తెలుసు. కానీ బంగారంపై దిగుమతి సుంకం పెంచడం వెనక కూడా బలమైన కారణమే ఉంది. దిగుమతిపై వెచ్చించే వ్యయం తగ్గి తద్వారా లోటు తగ్గుతుంది. ఈ విషయంలో ఓ మహిళగా కంటే.. మంత్రిగా చేయాల్సింది అదే. సుంకం పెంచడం ద్వారా బంగారం వినియోగం కాస్త తగ్గుతుందని. బడ్జెట్ కాదు..‘బహీ ఖాతా’ 2019–20 బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిటిష్ హయాం నుంచి వస్తున్న మరో సంప్రదాయానికి చెల్లుచీటీ పలికారు. సాధారణంగా బడ్జెట్ పత్రాలను లెదర్ బ్రీఫ్కేసులో తీసుకొచ్చి మీడియాకు ఫోజులివ్వడం పరిపాటి. అయితే ఈసారి నిర్మలా సీతారామన్ మాత్రం బడ్జెట్ పత్రాలను బ్రీఫ్కేసుకు బదులుగా ఎర్రటి సిల్క్ వస్త్రాన్ని నాలుగువైపులా కుట్టి తయారుచేసిన భారత సంప్రదాయ బహీఖాతా(లెడ్జర్)లో పెట్టుకుని పార్లమెంటుకు తీసుకొచ్చారు. ఈ ‘బహీఖాతా’పై భారత ప్రభుత్వ ముద్ర కూడా ఉండటం గమనార్హం. ప్రాచీన కాలంలో వ్యాపారస్తులు తమ పద్దు పుస్తకాలను ఇదేవిధమైన ఓ వస్త్రంలో చుట్టిపెట్టేవారు. దాన్ని బహీఖాతాగా పిలిచేవారు. ఇది కాస్తా కాలక్రమేణా సంప్రదాయంగా మారింది. పద్దుల పుస్తకాలను భద్రపరచడానికి రోమన్లు,గ్రీకులు సైతం ఇదే తరహా పద్ధతిని అనుసరించేవారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. బహీఖాతా’ అనేది భారతీయ సంప్రదాయం. దాన్నే మేం అనుసరిస్తున్నాం. ఇది పాశ్చాత్య బానిసత్వం నుంచి భారతీయతకు మారుతున్నామని చెప్పడానికి సంకేతం. అందుకే ఇది బడ్జెట్ కాదు.. ‘బహీఖాతా(పద్దుల పుస్తకం) క్రిష్ణమూర్తి సుబ్రహ్మణ్యం చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ నేను బడ్జెట్ డాక్యుమెంట్లను తీసుకొచ్చేందుకు లెదర్బ్యాగ్ని ఎందుకు ఉపయోగించలేదంటే, బ్రిటీష్ వలసవాదాన్ని వదిలించు కోవడానికే. మన ప్రత్యేకతను చాటడానికి ఇదే సరైన సమయమని భావించా. అలాగే ఇది మోయడం సులువుగా కూడా ఉంటుంది. - నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి -
మేకిన్ ఇండియా దిశగా మోదీ 2.0 బడ్జెట్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే–2 ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సభలో సుదీర్ఘంగా చదివి వినిపించారు. పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు సృష్టించిన నిర్మల.. సందర్భోచితంగా చిన్న చిన్న సూక్తులు వినిపిస్తూ.. సభికులను ఆకట్టుకున్నారు. బడ్జెట్లో తమ ప్రభుత్వ కేటాయింపులను, ప్రాధాన్యాలను స్పష్టంగా ప్రకటించారు. ప్రసంగానికి ముందు ఆర్థిక మంత్రికి స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, ఇతర సహచర మంత్రులు అభినందనలు తెలిపారు. సుమారు 2 గంటల 15 నిమిషాలకుపైగా ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇంగ్లిష్లో ఆమె ప్రసంగించినా.. మధ్య, మధ్యలో హిందీ, తమిళం, ఉర్దు, సంస్కృత పదాలను సమయానుకూలంగా వాడారు. ఆమె కీలకమైన ప్రకటనలు చేసినప్పుడల్లా సహచర సభ్యులు బల్లలు చరుస్తూ సంతోషం వెలిబుచ్చారు. మొత్తం రూ. 27,86,349 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లో మేకిన్ ఇండియా దిశగా పలు రాయితీలు ప్రకటించారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ప్రోత్సాహకాలు ఇచ్చారు. స్టార్టప్లను మరిన్ని నెలకొల్పే దిశగా చర్యలు తీసుకున్నారు. అలాగే కార్పొరేట్లకు పన్నుల్లో ఊరట కలిగించారు. కానీ సుంకం పెంపుతో పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. డజన్ల కొద్దీ వస్తువులపైన దిగుమతి సుంకాన్ని విధించారు. అయితే స్టార్టప్లకు, గృహనిర్మాణం, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం ద్వారా దేశాభివృద్ధిని పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. విమానయానం, బీమా, మీడియాలో విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తామని ప్రకటించారు. ధనవంతులకు సర్ చార్జ్.. ఈ ఏడాది బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబ్ల్లో ఏ విధమైన మార్పులు చేయలేదు. కానీ ధనవంతుల ఆదాయానికి మాత్రం సర్చార్జ్ పెంచారు. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకూ పన్ను పరిధిలోని ఆదాయానికి 39 శాతం, రూ. 5 కోట్లు పైబడిన ఆదాయం సంపాదించే వారికి 42.47 శాతం సర్చార్జ్ విధించారు. దీనిపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి అత్యంత ధనవంతులు మరింత తోడ్పాటు అందించాలని చెప్పారు. ఇక రూ. కోటి పైబడిన నగదు ఉపసంహరణపై 2 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. బంగారంపై కస్టమ్స్ సుంకం పెంపు.. పన్ను ఆదాయంలో పెరుగుదలకు, లోటును తగ్గించడానికి ప్రభుత్వరంగ సంస్థల్లోనివాటాలను విక్రయించడానికి ఆర్థిక మంత్రి ప్రణాళికలు ప్రకటించారు. అలాగే ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, కంపెనీల నుంచి మరింత డివిడెండ్ వచ్చేలా చూడాలన్నారు. ఇక పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.1, సెస్ రూ.1 విధించారు. బంగారం నుంచి ఆటోమొబైల్ పరికరాలు, పొగాకు ఉత్పత్తుల వరకూ డజన్ల కొద్దీ వస్తువులపై దిగుమతి సుంకాలను విధించారు. పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. కార్పొరేట్లకు ఊరట.. కార్పొరేట్ కంపెనీలకూ ఆర్థిక మంత్రి ఊరట నిచ్చా రు. రూ. 400 కోట్ల వరకూ ఆదాయం ఉన్న కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం రూ. 250 కోట్లు ఆదాయం ఉన్న కంపెనీలకు ఈ ట్యాక్స్ విధిస్తుండగా.. దాని పరిమితిని రూ. 400 కోట్లకు పెంచారు. దాదాపు 99.3 శాతం కంపెనీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాలు మేకిన్ ఇండియాకు ప్రోత్సాహం దిశగా కొన్ని పెట్టుబడులు, ముడిసరుకులపై రాయితీలు ఇచ్చారు. అదేవిధంగా కొన్ని వస్తువులపై సుంకాలను పెంచారు. విద్యుత్పై నడిచే వాహనాలను ప్రోత్సహించేందుకు ఆ వాహనాల తయారీకి కావాల్సిన పరికరాలపై కస్ట మ్స్ సుంకాన్ని తగ్గించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనా ల్లో ఉపయోగించే కొన్ని విడిభాగాలపై కస్టమ్స్ సుం కాన్ని పూర్తిగా ఎత్తివేశారు. వీటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి తీసుకున్న అప్పునకు సంబంధించిన వడ్డీపై అదనంగా రూ. 1.5 లక్షల ఆదాయపు పన్నును తగ్గిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని, ఇది ఆరో అతిపెద్ద వ్యవస్థ అని సీతారామన్ పేర్కొన్నారు. వచ్చే సంవత్సరాల్లో దీనిని 5 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలిసారి ఇల్లు కొంటే.. రైతులకు నగదు సహాయం పెంపుతో పాటు ఒక కొత్త పింఛన్ పథకం తీసుకొచ్చారు. చిన్న మొత్తంలో పన్నులు కట్టేవారికి ఉపశమనం కలిగించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70 వేల కోట్ల మూలధన నిధిని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. తొలిసారి రూ. 45 లక్షల లోపు ఇల్లు కొంటే వారికి రూ. 1.5 లక్షలను అదనంగా వడ్డీ చెల్లింపులో తగ్గించాలని ప్రతిపాదించారు. బడ్జెట్లో కొన్ని రక్షణ పరికరాలకు ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. ఇక నిధుల సేకరణ కోసం తొలి గ్లోబల్బాండ్ను ప్రభుత్వం విక్రయించనుంది. వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ. 100 కోట్లు వెచ్చించనున్నామని ఆమె చెప్పారు. ఇది గ్రీన్ బడ్జెట్: ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రజానుకూల బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ బడ్జెట్ భవిష్యత్పై ఆశలు కల్పించేదిగా ఉందన్నా రు. శుక్రవారం మీడియాతో ప్రధాని మాట్లాడుతూ..‘ఈ బడ్జెట్తో దేశంలోని పేదలకు సాధికారత చేకూరుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తిని పెంపొందించేందుకు బడ్జెట్ దృష్టి సారించింది. ఇది గ్రీన్ బడ్జెట్. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు నిర్మాణాత్మక సంస్కరణపై రోడ్మ్యాప్ రూపొందించాం’ అన్నారు. ఎన్నడూ ఇలా జరగలేదు: చిదంబరం ఇది పసలేని బడ్జెట్. ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం అస్పష్టంగా సాగడం విడ్డూరం. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. దేశంలోని ఏ వర్గం వారికి కూడా బడ్జెట్ ద్వారా ఊరట కల్పించలేకపోయారు. వివిధ మంత్రిత్వ శాఖలకు, ముఖ్యమైన పథకాలకు కేటాయింపులు లేవు. ఆదాయ వ్యయ వివరాలు, ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు వంటి వాటిని వెల్లడించలేదు. -
మోదీ ప్రొడక్షన్స్ సమర్పించు.. మదర్ భారత్
అర్థం ఒకటే!. కానీ ఆర్థికంగా భారత్–ఇండియా వేర్వేరు!! ‘పల్లెలు – పేదలు – రైతులు’... ఇది అత్యధికులుండే భారతమైతే... ‘పట్టణాలు– మధ్యతరగతి – ఉద్యోగులు’ అనే ధోరణి ఇండియాది!! వీటి మధ్య అంతరాన్ని తగ్గించాలనుకున్నారు నిర్మలా సీతారామన్. అందులో భాగమే శుక్రవారం నరేంద్ర మోదీ సమర్పణలో ‘మదర్ ఇండియా’కు బదులు ఆవిష్కరించిన ‘మదర్ భారత్’ బడ్జెట్. మూడేళ్లలో కరెంటు లేని గ్రామమనేదే లేకుండా చేస్తామన్నారు. నాలుగేళ్లలో మంచినీరు అందని పల్లె ఉండదన్నారు. 80వేల కోట్లతో 1,25,000 కిలోమీటర్ల రోడ్లు వేస్తామని... ఐదేళ్లలో ప్రతి ఊరికీ రోడ్డు ఉంటుందని చెప్పారు. దేశ చరిత్రలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ కనక మహిళలకు ఓవర్డ్రాఫ్ట్ వంటి వరాలిచ్చారు. అయితే భారత్ కోసం ఇండియాపై చెర్నాకోల ఝుళిపించారు. మధ్య తరగతికి పన్ను ఊరట లేదు సరికదా... ధనికులకు చుర్రుమనిపించారు. రూ.5 కోట్ల వార్షికాదాయం దాటినవారిపై ప్రపంచంలో ఎక్కడా లేనంతగా 42.5% పన్ను బాదేశారు. లీటరు పెట్రోల్, డీజిల్పై రెండు రూపాయల మేర పెంచేశారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని సైతం అదనంగా 2.5% వడ్డించారు. ‘‘అరె! మీరు మహిళలా ఆలోచించరెందుకు? బంగారం ధర అంతలా పెరిగితే ఎలా?’’ అన్న విపక్షాల ప్రశ్నలకు... ‘నేను మహిళనే కానీ.. మంత్రిని’ అనేది ఆమె సమాధానం కావచ్చు. దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి నిర్మల భారీ సంస్కరణలకు తెరలేపారు. విదేశాల నుంచి మరిన్ని రుణాలు తేవటం.. ప్రభుత్వ సంస్థల్లో వాటాలమ్మి రూ.1.05 లక్షల కోట్లు సమీకరించడం.. మీడియా, ఏవియేషన్, యానిమేషన్, బీమా మధ్యవర్తిత్వ వ్యాపారాల్లోకి ఎఫ్డీఐలను పెంచటం... రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా ట్రస్టుల్లోకి విదేశీ నిధులు ఆకర్షించడం.. ఇలా ఎన్నో ఆశల్ని కళ్లెదుట పెట్టారు. కాకపోతే ఇవేవీ అంత తేలిగ్గా అయ్యేవి కావు. ‘‘ప్రభుత్వ సంస్థల్లో వాటాలమ్మినా కొనేవారుండాలిగా? అసలంత నాణ్యమైన ప్రభుత్వ సంస్థలెక్కడున్నాయి? ఎఫ్డీఐలు ఎందుకొస్తాయ్?’’ అనేది విపక్షాల విమర్శ. అయితే ఎంత నడకైనా ఆరంభమయ్యేది ఒక అడుగుతోనే!!. అదిగో... ఆ మొదటి అడుగు వేస్తూ భారత్ను పటిష్ఠ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే చర్యలకు టెంకాయ కొట్టారు నిర్మల. ఈ నడక తీరుతెన్నులను చెప్పేది తదుపరి బడ్జెట్లే!!. 2019–20 బడ్జెట్ ముఖ్యాంశాలివీ పెట్రోల్, డీజిల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, రోడ్ సెస్ ప్రతి లీటరుకు ఒక రూపాయి పెంపు. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి పాన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డునైనా వాడుకునేందుకు వెసులుబాటు. సంవత్సరంలో కోటి రూపాయల కంటే ఎక్కువ డబ్బును నగదు రూపంలో బ్యాంకు ఖాతాల నుంచి తీసుకుంటే 2 శాతం టీడీఎస్ (డబ్బు చేతికందక ముందే దానిపై పన్ను) విధింపు. బంగారం, ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.5 శాతానికి, స్టెయిన్లెస్ స్టీల్పై 5 నుంచి 7.5 శాతానికి పెంపు బంగారం, ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.5 శాతానికి, స్టెయిన్లెస్ స్టీల్పై 5 నుంచి 7.5 శాతానికి పెంపు స్వయం సహాయక బృందాల్లోని ఒక మహిళకు ముద్ర పథకం కింద రూ. లక్ష వరకు రుణం. మిగతా మహిళలకు రూ. 5వేల వరకు ఓడీ చిన్న దుకాణాల వద్ద డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను ఎత్తివేయనున్న ఆర్బీఐ, బ్యాంకులు అందుబాటు ధరల ఇళ్ల రుణాలపై రూ. 1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపు పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్యలో ఉంటే పన్ను రేటు 3%. అదే ఆదాయం రూ. 5 కోట్లు దాటితే, పన్ను రేటు 7% ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం చేసిన అప్పుపై చెల్లించే వడ్డీపై రూ. 1.5 లక్షల వరకు పన్ను తగ్గింపు రూ. 400 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలు కూడా 25% కార్పొరేట్ పన్ను పరిధిలోకి -
ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు
న్యూఢిల్లీ: సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్బీలు) రుణ వితరణ పరంగా సమస్యల్లేకుండా చూసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందించనున్నట్టు బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే అర్థం అవుతోంది. పీఎస్బీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ఆర్థిక రంగ ప్రేరణకుగాను వాటికి మరో రూ.70,000 కోట్ల నిధుల సాయాన్ని ప్రకటిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బ్యాంకులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ఆన్ లైన్ లో వ్యక్తిగత రుణాలను, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందించాలని మంత్రి సూచించారు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకు కస్టమర్, ఇతర అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలను అందుకునే విధంగా ఉండాలన్నారు. ఖాతాదారుల అనుమతితోనే.... ‘‘ఖాతాదారులకు వారి ఖాతాల్లో ఇతరులు చేసే డిపాజిట్ల విషయంలో ప్రస్తుతం పూర్తి నియంత్రణ లేదు. ఖాతాదారుల అనుమతితోనే ఇతరులు డిపాజిట్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పీఎస్బీల్లో గవర్నెన్స్ బలోపేతం చేసేందుకు సంస్కరణలు కూడా తీసుకొస్తాం’’ అని మంత్రి చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనాల ద్వారా ఇప్పటికి 8 బ్యాంకులను తగ్గించినట్టు ప్రకటించారు. బ్యాంకులకు అదనంగా 1.34 లక్షల కోట్లు వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్య నేపథ్యంలో బ్యాంకులకు అదనంగా రూ.1.34 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ముందుకు వచ్చింది. ఇది ఎన్బీఎఫ్సీలకు రుణ కల్పనకు దోహదం చేస్తుంది. -
ఎన్బీఎఫ్సీలకు బాసట..
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కొంత ఊరటనిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎన్బీఎఫ్సీల నుంచి అత్యుత్తమ రేటింగ్ ఉన్న అసెట్స్ను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొనుగోలు చేస్తే కేంద్రం వన్టైమ్ పాక్షిక రుణ హామీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల మేర విలువ చేసే ఎన్బీఎఫ్సీల అసెట్స్ కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం వన్టైమ్ ప్రాతిపదికన పాక్షికంగా హామీనిస్తుంది. ఒకవేళ నష్టం వాటిల్లితే 10 శాతం దాకా హామీ ఉంటుంది‘ అని మంత్రి తెలిపారు. వినియోగ డిమాండ్ను నిలకడగా కొనసాగించడంలోనూ, చిన్న..మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చడంలోను ఎన్ బీఎఫ్సీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె చెప్పారు. గతేడాది సెప్టెంబర్లో ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలు డిఫాల్టు అయినప్పట్నుంచీ ఎన్బీఎఫ్సీలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉంటున్నాయి. అయినప్పటికీ వాటి నియంత్రణ విషయంలో ఆర్బీఐకి పరిమిత స్థాయిలోనే అధికారాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ బీఎఫ్సీలను ఆర్బీఐ మరింత పటిష్టంగా నియంత్రించే విధంగా ఫైనాన్స్ బిల్లులో మరిన్ని చర్యలుంటాయని సీతారామన్ తెలిపారు. డీఆర్ఆర్ తొలగింపు.. పబ్లిక్ ఇష్యూల ద్వారా ఎన్బీఎఫ్సీలు నిధుల సమీకరణకు సంబంధించి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ (డీఆర్ఆర్) నిబంధనను ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం డెట్ పబ్లిక్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించే ఎన్బీఎఫ్సీలు డీఆర్ఆర్ కింద కొంత మొత్తాన్ని పక్కన పెట్టడంతో పాటు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా స్పెషల్ రిజర్వ్ కింద మరికాస్త పక్కన పెట్టాల్సి ఉంటోంది. మరోవైపు, గృహ రుణాల రంగంపై నియంత్రణాధికారాలను ఎన్హెచ్బీ నుంచి ఆర్బీఐకి బదలాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆమె వివరించారు. పెన్షను రంగ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ట్రస్టును విడదీయనున్నట్లు తెలిపారు. -
‘సీత’మ్మ నష్టాలు!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. అందరి మాటలు విన్నారు. కానీ ఎవ్వరి మాటను మన్నించినట్లు కనిపించలేదు. భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం నుంచి భారీ సంస్కరణలే ఉంటాయనుకున్న మార్కెట్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. నిధుల కొరతతో ఎన్బీఎఫ్సీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, వినియోగం రంగంలో మందగమనం చోటు చేసుకొని వాహన ఇతర కంపెనీలన్నీ కుదేలై ఉండగా, ఆదుకునే చర్యలుంటాయని అందరూ అంచనా వేశారు. సెన్సెక్స్ ప్రారంభం: 39,990 సెన్సెక్స్ గరిష్టం : 40,032 సెన్సెక్స్ కనిష్టం : 39,441 సెన్సెక్స్ ముగింపు : 39,513 ఈ అంచనాలకు భిన్నంగా సీతమ్మ బడ్జెట్ ఉండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. ఒక్క బ్యాంక్ షేర్లు మినహా, మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ఇది చెత్త బడ్జెట్ కానప్పటికీ, సంపన్నులపై అధిక పన్ను విధింపు, 20 శాతం షేర్ల బైబ్యాక్ ట్యాక్స్, లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ షేర్హోల్డింగ్ను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనలు సెంటిమెంట్ను దెబ్బతీశాయని నిపుణులంటున్నారు. మరిన్ని వివరాలు... బడ్జెట్పై ఆశావహ అంచనాలతో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఆసియా మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, భారీ సంస్కరణలను ఆశిస్తూ కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 11,950 పాయింట్లను అధిగమించాయి. బడ్జెట్కు ముందే సెన్సెక్స్ 124 పాయింట్ల లాభంతో 40,032 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఆరంభమైనప్పటి నుంచి నష్టాలు ఆరంభమయ్యాయి. ప్రసంగం పూర్తయ్యేంత వరకూ పరిమిత శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్, నిఫ్టీలు ఆ తర్వాత భారీ నష్టాల దిశగా సాగాయి. మధ్యలో ఒకింత కోలుకున్నప్పటికీ, ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 149 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్395 పాయింట్లు పతనమై 39,513 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 136 పాయింట్లు క్షీణించి 11,811 పాయింట్ల వద్ద ముగిశాయి. దీంతో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సానుకూలతలున్నా క్షీణతే.. బడ్జెట్ప్రతిపాదనలకు ముందు 40 వేల పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్, బడ్జెట్ తర్వాత ఆ జోరును కొనసాగించలేక చతికిలపడింది. ఆప్షన్ల ట్రేడింగ్కు సంబంధించి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) విషయంలో ఒకింత ఊరట లభించడం, ప్రభుత్వ రంగ బ్యాంక్లకు రూ.70,000 కోట్ల మూలధన నిధులందడం, మౌలిక రంగానికి భారీగా నిధులు కేటాయించడం వంటి సానుకూల చర్యలున్నప్పటికీ, ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. డాలర్తో రూపాయి మారకం నష్టాల నుంచి రికవరీ అయినా కూడా మన మార్కెట్ నష్టపోయింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది ఫిబ్రవరి 1న సెన్సెక్స్ 3,044 పాయింట్లు, నిఫ్టీ 918 పాయింట్లు చొప్పున లాభపడటం విశేషం. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 119 పాయింట్లు, నిఫ్టీ 22 పాయింట్లు చొప్పున పెరిగాయి. మరిన్ని విశేషాలు.. ► మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో 25 షేర్లు నష్టాల్లో ముగియగా, ఆరు షేర్లు– ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే లాభపడ్డాయి. ► యస్ బ్యాంక్ షేర్ 8.3 శాతం నష్టంతో రూ.88 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరె¯Œ ్స, బజాజ్ ఫైనాన్ ్స, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పతనానికి పంచ కారణాలు.. పబ్లిక్ హోల్డింగ్ 35 శాతానికి పెంపు... స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన స్టాక్ మార్కెట్ను పడగొట్టింది. ఇప్పటికే ఓవర్బాట్ పొజిషన్లో ఉన్న మార్కెట్లో ఈ ప్రతిపాదన కారణంగా విక్రయ ఆఫర్లు వెల్లువెత్తుతాయనే భయాలతో సెన్సెక్స్,నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. 25% పబ్లిక్ హోల్డింగ్ నిబంధననే ఇప్పటిదాకా పలు ప్రభుత్వ రంగ కంపెనీలు అమలు చేయలేకపోయాయి. మరోవైపు ఈ నిబంధన కారణంగా మల్టీ నేషనల్ కంపెనీలు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి మొగ్గుచూపుతాయని నిపుణులంటున్నారు. మార్కెట్లో ఈ నిబంధన పెను కలకలమే సృష్టించింది. 20 శాతం బైబ్యాక్ ట్యాక్స్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ట్యాక్స్(డీడీటీ)ను పలు కంపెనీలు ఎగవేసి షేర్ల బైబ్యాక్కు ప్రాధాన్యత ఇస్తుండటంతో షేర్ల బైబ్యాక్ను నిరుత్సాహపరచడానికి 20 శాతం బైబ్యాక్ ట్యాక్స్ను విధించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. వాటాదారులు కొనుగోలు చేసిన ధరను కాకుండా కంపెనీ ప్రకటించే బైబ్యాక్ ధర నుంచి ఇష్యూ ధరను తీసివేసి వచ్చిన దానిపై 20 శాతం చొప్పున పన్ను విధిస్తారు. దీంతో కంపెనీలపై భారీగా పన్ను భారం పడుతుందని, ఫలితంగా కంపెనీలు షేర్ల బైబ్యాక్లు ప్రకటించవని నిపుణులంటున్నారు. . సంపన్నులపై అధిక పన్ను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు, రూ.5 కోట్లకు మించిన పన్ను ఆదాయం గల సంపన్నులపై సర్చార్జీని పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దీంతో ఈ రెండు కేటగిరీల సంపన్నుల పన్ను 3–7 శాతం రేంజ్లో పెరగనున్నది. సంపన్నులపై అధిక పన్ను విధించడం తప్పు కాకపోయినా, మొత్తం వారు చెల్లించాల్సిన పన్ను 42 శాతానికి పెరగడం.. మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. భారీ డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ.90,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు పెంచే ప్రతిపాదన కారణంగా మార్కెట్లో లిక్విడిటీ ఇబ్బందులు తలెత్తుతాయన్న భయందోళనలు నెలకొన్నాయి. పెట్రోల్, లోహాలపై ఎక్సైజ్ సుంకం మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన భారీ నిధుల కోసం రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ పేరుతో ఒక్కో లీటర్ పెట్రోల్, డీజిల్లపై రూ. 1 అదనపు సుంకం విధించారు. పుత్తడి వంటి విలువైన లోహాలపై ప్రస్తుతమున్న కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం ప్రతికూల ప్రభావం చూపించాయి. రూ.2.2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.22 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,22,580 కోట్లు తగ్గి రూ.151,35,496 కోట్లకు పడిపోయింది. అధికాదాయం ఆర్జించే వర్గాలపై పన్ను విధించడం, భారీగా నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం కారణంగా సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తగ్గనుండటం, ఇక కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, తదితర ప్రతిపాదనల వల్ల స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది... – అమర్ అంబానీ, యస్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ -
బడ్జెట్పై మంత్రి బుగ్గన అసంతృప్తి
సాక్షి, అమరావతి : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేవని, ప్రత్యేక హోదా, రాజధాని, రెవెన్యూ లోటు, పోలవరం వంటి కీలక అంశాల్లో తమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని కోరిన వాటిలో కేవలం పొదుపు సంఘాలకు వడ్డీ రాయితీని మాత్రమే ఇచ్చారని అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రభావం రాష్ట్ర బడ్జెట్పై తప్పకుండా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేయూతనివ్వాల్సిన అవసరం ఉందనీ, కానీ కేంద్రం అలా చేయలేదని అన్నారు. రాష్టానికి రావాల్సిన ప్రతి అంశంపై కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని, అయితే కొన్ని కేటాయింపులపై సర్దుకుపోవాలన్నారు. ఏదేమైనా నవరత్నాలు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిహామీని అమలురుస్తామని ఆయన ఉద్ఘాటించారు. -
కేంద్ర బడ్జెట్ 2019 ప్రధానాంశాలు
-
బడ్జెట్ 2019 : ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే
-
మేడమ్స్ బడ్జెట్ 2019
-
బడ్జెట్ ఎఫెక్ట్ : బంకుల్లో నో స్టాక్ బోర్డులు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ సామాన్యుడి చమురు వదిలించే పనిలో పడింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. తాజా బడ్జెట్లో వెల్లడించిన దాని ప్రకారం సుంకాల పెంపు నేపథ్యంలో పెట్రోల్పై రూ.2.5, డీజిల్పై రూ.2.3 మేర పెరగనుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం రూ.1తో పాటు, రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్రోల్, డీజిల్పై సెస్ కింద మరో రూ.1 చొప్పున విధిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. తాజా సుంకాలకు వ్యాట్ను అదనంగా జోడించినప్పుడు పెట్రోల్ రూ.2.5, డీజిల్ రూ.2.3 మేర పెరిగే అవకాశం ఉంది. ఈ సుంకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ.28 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. శుక్రవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.51గా ఉండగా, డీజిల్ ధర రూ.64.33గా ఉంది. ముంబైలో పెట్రోలధర రూ.76.15 కాగా డీజిల్ ధర 67.40గా ఉంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు గురించి ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం పొందకముందే ఆయిల్ కంపెనీలు చమురు ధరలు పెంచేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ.. వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. -
‘చైనా తరువాత మనదేశమే’
సాక్షి, విజయవాడ : ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజల ఆశలు నెరవేర్చేలా ఉదని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు అన్నారు. 2019-20 బడ్జెట్ 25 లక్షల కోట్లు దాటిందని రానున్న ఐదేళ్లలో అది 50 లక్షల కోట్లకు చేరుతుందని అంచనావేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్ గొప్ప ఆర్ధిక శక్తిగా ఎదగనుంది. తాజా బడ్జెట్లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారు. 6 లక్షల గ్రామాలకు జలశక్తి యోజనా పథకం ద్వారా తాగునీరు అందించనున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఉపాధి చూపే విధంగా బడ్జెట్ ఉంది. చైనా తరువాత భారతే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ముందుకు సాగుతోంది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వివిధ రంగాల్లో సుమారు రూ.35 వేల కోట్లు కేటాయింపులు జరిగాయి. తెలంగాణకు రూ.20 వేల కోట్లు కేటాయింపులు జరిగాయి. 2030 నాటికి విద్యుత్ వాహనాల వినియోగం పెరిగేలా బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించారు’ అన్నారు. -
మహిళలను పట్టించుకోని బడ్జెట్
బెంగళూరు : మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతోన్న బడ్జెట్ పట్ల స్త్రీలు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ నిర్మలా సీతారామన్ వారికి మొండి చెయ్యి చూపారన్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామాయ్య. కేంద్ర బడ్జెట్పై ఆయన స్పందిస్తూ.. దేశ ప్రజలు ఈ బడ్జెట్ పట్ల సంతోషంగా లేరన్నారు. ప్రజల ఆశలపై నీళ్లు కుమ్మరించేలా బడ్జెట్ ఉందన్నారు. గతంలో మోదీ ప్రభుత్వం వ్యవసాయం రంగంలో రెట్టింపు పెరుగుదల చూపుతామన్నారు. కానీ దాన్ని సాధించలేకపోయారని విమర్శించారు. కనీస మద్దతు ధర గురించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు సిద్దరామయ్య. రైతులను తీవ్ర నిరాశలోకి నెట్టిన బడ్జెట్ ఇది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన గురించి బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధకరమన్నారు. గత 45 ఏళ్లల్లో కంటే అత్యధిక నిరుద్యోగిత రేటు ప్రస్తుతం నమోదయ్యిందన్నారు. -
జనం నెత్తిన పెట్రో బాంబ్
-
‘రైల్వేలను బలోపేతం చేసేలా బడ్జెట్’
న్యూఢిల్లీ : పార్లమెంట్లో శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైల్వేలను బలోపేతం చేసేలా ఉందన్నారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పదేళ్లలో రైల్వేలో దాదాపు 50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా బడ్జెట్ రూపకల్పన ఉందన్నారు. రైల్వే సమస్యలకు పరిష్కారాన్ని సూచించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరించేలా ఉందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. పేద, ధనిక తారతమ్యం లేని బడ్జెట్ ఇదని.. మేకిన్ ఇండియా, స్టార్టప్, ఉద్యోగాల కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. బడ్జెట్ 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న విమర్శల్ని ఆయన కొట్టి పారేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రవేశ పెట్టిన ఒక్క బడ్జెట్ కూడా ప్రజలను మెప్పించలేకపోయిందని మండి పడ్డారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లన్ని గాలిలో మేడలు నిర్మించాయని అందుకే ప్రజలు ఆ పార్టీని నమ్మలేదని పియూష్ గోయల్ ఆగ్రమం వ్యక్తం చేశారు.