pydikondala manikyala rao
-
ఫొటోగ్రాఫర్ నుంచి మంత్రి స్థాయికి..
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు (60) కన్నుమూశారు. విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కరోనాతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మధుమేహంతో కొన్నిరోజులుగా బాధపడుతున్న ఆయన ఒక్కసారిగా ఆరోగ్యంలో మార్పు రావడంతో ప్రాణాలు విడిచారు. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ ఇతర సమస్యలు ఆయనను ఇబ్బంది పెట్టడంతో ఆరోగ్యం క్షీణించింది. బీజేపీ అగ్రనేతల ఆదేశాలతో న్యూఢిల్లీలోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ బృందం వెంటిలేటర్పై ఉన్న మాణిక్యాలరావుకు వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. శనివారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె గట్టిం సింధు, అల్లుడు నవీన్కిషోర్ ఉన్నారు. గతనెల 3న కరోనా పాజిటివ్ రావడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన కొద్దిరోజుల్లో కరోనా నెగెటివ్ వచ్చినా ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రాణాలు వదిలారు. మాణిక్యాలరావు పార్థివదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తున్న దృశ్యం అసామాన్యుడిగా ఎదిగిన సామాన్యుడు పైడికొండల సుబ్బారావు, రంగనాయకమ్మ దంపతుల తొలి సంతానం మాణిక్యాలరావు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు. మాణిక్యాలరావు సామాన్య ఫొటోగ్రాఫర్గా జీవితాన్ని ప్రారంభించారు. తాడేపల్లిగూడెంలోని కేఎన్ రోడ్డులో ప్రభాతా టాకీస్ వద్ద సారథి స్టూడియోను ప్రారంభించారు. తర్వాత స్టూడియోను కుమార్తె సింధు పేరిట సింధు స్టూడియోగా మార్చారు. అనంతర కాలంలో బస్ డిపో ఎదురుగా సింధు షూమార్టును ప్రారంభించారు. బాల్యంలోనే రాష్ట్రియ స్వయం సేవక్ సిద్ధాంతాలకు ఆకర్షితులై సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 7వ తరగతి చదువుతుండగా జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. హైసూ్కల్ విద్యార్థి దశలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం చేశారు. బీజేపీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా పనిచేసిన ఆయన పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన నరసాపురం ఎంపీగా యూవీ కృష్ణంరాజును గెలిపించడంలో విశేష కృషి చేశారు. 13వ వార్డు శివాలయం వీధిలో కౌన్సిలర్గా పోటీచేసి విజయం పొందలేకపోయారు. 2019లో నరసాపురం లోక్సభ బీజేపీ అభ్యర్థిగా పైడికొండల పోటీచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం వచ్చినా, తల్లి మరణం కారణంగా ఆ పదవిని స్వీకరించలేదు. సీమాంధ్ర ఉద్యమ కమిటీ ఉపాధ్యక్షుడిగా సీమాంధ్ర అవసరాలను కేంద్ర నాయకుల వద్దకు తీసుకెళ్లారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడిగా ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, 30 మండలాల్లో శీతల శవపేటికల ఏర్పాటు వంటివి చేశారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. అయోధ్య కరసేవలో పాల్గొన్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ కేబినెట్లో ఆయన దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నిట్ తెచ్చిన ఘనత ఆయనిదే రాష్ట్ర విభజన అనంతరం జాతీయ విద్యాసంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ను తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేయడంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు నిట్ ఇక్కడికి రాకుండా మోకాలడ్డిన సమయంలో కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి, బీజేపీ అగ్రనాయకుల ఆశీస్సులతో జాతీయ విద్యాసంస్థను ఇక్కడకు తీసుకువచ్చారు. మంత్రిగా రాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణానికి కృషి చేశారు. పట్టణంలో బలుసులమ్మ, ముత్యాలమ్మ, నందికొమ్మ రామాలయ నూతన నిర్మాణాలు ఆయన హయాంలోనే జరిగాయి. ధైర్యం చెప్పి వెళ్లి.. ‘కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్ వచ్చింది. కరోనా వస్తే రహస్యంగా దాయవద్దు. భయపడాల్సిన అవసరం లేదు. ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన వ్యాధి కాదు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, ఆరోగ్యంపై సాధ్యమైనంత శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటే ఇబ్బంది లేదు’ అంటూ ఆయన గతనెల 4న వాట్సాప్లో వీడియో సందేశం ఇచ్చి కరోనా చికిత్సకు విజయవాడ వెళ్లారు. చిరునవ్వు చిరునామా చెరిగిపోయింది వెండిలాంటి జుట్టు, ముఖంపై చిరునవ్వు చిరునామా, రండి, కూర్చోండి అంటూ ఆప్యాయత నిండిన పిలుపు కలబోతగా మాణిక్యాలరావు జనంతో ఉన్నారు. ఆనందం వచ్చినా, కోపం వచ్చినా దాచుకోని వ్యక్తిగా మాణిక్యాలరావు మెలిగారు. ఆయన మరణంతో జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వంతో మాణిక్యాలరావు సత్సంబంధాలు కొనసాగించారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, అగ్రనేతలు అమిత్షా వంటి వారితో పాటు జేవీఎల్ నరసింహారావు, కిషన్రెడ్డి, సోము వీర్రాజు వంటి వారితో స్నేహసంబంధాలు కొనసాగించారు. ఆయనకు కర్ణాటక పార్టీ నేతలతోనూ సంబంధాలు ఉన్నాయి. వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వివిధ వర్గాలతో కలిసిమెలిసి పనిచేశారు. నిట్ పైడికొండలను మరువదు తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్ స్థాపనలో కీలకపాత్ర పోషించినందుకు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును నిట్ ఎన్నటికీ మరువదని డైరెక్టర్ సీఎస్పీ రావు అన్నారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మాణిక్యాలరావు మరణం ఊహించలేదని, కరోనా నుంచి కోలుకుని తిరిగి వస్తారనుకుంటున్న దశలో ఆయన మరణం విషాదకరం అని పేర్కొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు దేవదాయ, ధర్మాదాయశాఖ మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు పార్థివదేహానికి అధికార లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు జరిగాయి. స్థానిక 6వ వార్డులోని శ్మశాన వాటికలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత పట్టణానికి చేరుకున్న మాణిక్యాలరావు పార్థివదేహాన్ని స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆయన కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు ఉంచారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు 20 మందిని మాత్రమే శ్మశాన వాటికలోకి అనుమతినిచ్చారు. శ్మశాన వాటిక ప్రాంగణం వద్ద మాణిక్యాలరావు చిత్రపటాన్ని సందర్శనార్థం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వచ్చిన పోలీసు దళం గాలిలోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమరి్పంచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, నాయకులు ఈతకోట తాతాజీ, అయినం బాలకృష్ణ, కంచుమర్తి నాగేశ్వరావు, నల్లకంచు రాంబాబు, తాడికొండ వాసు తదితరులు హాజరయ్యారు. సోము వీర్రాజు కన్నీటి పర్యంతం మాణిక్యాలరావు అంత్యక్రియల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారాన్ని పంచుకున్న వ్యక్తిని అధికార లాంఛనాలతో పంపించాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. 1981లో తన ఆ«ధ్వర్యంలో మాణిక్యాలరావు బీజేపీలో చేరారన్నారు. మాణిక్యాలరావు శాసనసభ్యులుగా, మంత్రిగా ఉత్సాహంగా పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తిని ఈ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదన్నారు. మాణిక్యాలరావు కుటుంబానికి పార్టీ తరఫున సానుభూతి తెలిపారు. మాణిక్యాలరావు మరణం పారీ్టకి, వ్యక్తిగతంగా తనకు తీరని నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని కోల్పోయా వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయానని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరణం పట్ల రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంతాపం తెలిపారు. దేవదాయ మంత్రిగా జీర్ణావస్థలో ఉన్న పలు ఆలయాలను ఆయన పునరుద్ధరించారన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారన్నారు. నిట్ను తాడేపల్లిగూడెం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడానని, ఎంతో ధైర్యంగా ఉన్నారన్నారు. కరోనాను జయించి ఆరోగ్యవంతంగా వస్తారని తాను భావించానని, ఇంతలోనే ఇలా జరగడం అత్యంత బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. చాలా బాధ కలిగించింది కరోనా మహమ్మారికి మాజీ మంత్రి మాణిక్యాలరావు బలి కావడం చాలా బాధ కలిగించిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సంతాపం తెలిపారు. మాణిక్యాలరావు క్రమశిక్షణ, నిబద్ధత గల నేత అని అన్నారు. ఉదయం ఆయన అల్లుడుతో ఫోన్లో మాట్లాడి యోగ క్షేమాలు కనుక్కుంటే బాగానే ఉందని చెప్పగానే ఎంతో సంతోషించానన్నారు. బీజేపీలో పేరున్న నాయకుడు ఇలాంటి పరిస్థితుల్లో దూరమవ్వడం చాలా బాధాకరం అన్నారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని ఎమ్మెల్యే కొట్టు అన్నారు. మంత్రి నాని దిగ్భ్రాంతి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతిపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్లు ఆయన తెలిపారు. సౌమ్యులు, ప్రజల నాయకుడు మూడున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో నిబద్ధత, నిజాయతీ, అంకితభావంతో పనిచేసిన నేత అని కొనియాడారు. దేవదాయశాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారని, బీజేపీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో నిట్ విద్యాసంస్థ నెలకొల్పటంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఆప్యాయంగా పలకరించే ఆయన మృతి బీజేపీకి తీరని లోటన్నారు. -
‘భారతీయుడినని సగర్వంగా చెప్పుకునేలా చేశాడు’
సాక్షి, పశ్చిమ గోదావరి: ‘జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏను రద్దు చేసి దేశమంతటా ఒకే రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన ధీరుడు ప్రధాని నరేంద్ర మోదీ’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం పోడూరు మండలం వేడంగిలో బీజేపీ సభ్యత్వ నమోదులో కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఒక్కరు భారతీయుడు అని సగర్వంగా చెప్పుకునే విధంగా మోదీ సుపరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి తామే వాటిని అమలు చేసినట్లు దుష్ప్రచారం చేసిందని టీడీపీని విమర్శించారు. పైగా ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు అందినకాడికి ప్రజలను దోచుకున్నారని మండిపడ్డారు. -
‘నా అభిమానులంతా బీజేపీలో చేరండి’
సాక్షి, విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి వల్ల ప్రపంచ దేశాలు అన్ని భారతదేశం వైపు చూస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోం సహాయక మంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రి మాణిక్యాలరావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలబెట్టాడని కొనియాడారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం తన అభిమానులు అందరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ.. గతంలో బీజేపీని ఒక వర్గానికి చెందిన పార్టీగా ముద్రవేశారు కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోదీ సాధించిన విజయంతో బీజేపీ అన్ని వర్గాల పార్టీగా అవతరించిందన్నారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారికి తమ పార్టీలో ఉన్నతమైన పదవులు లభించాయన్నారు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీయే అన్నారు. -
‘రాజీనామా స్పీకర్కు పంపలేదు.. సీఎంకే పంపాను’
సాక్షి, అమరావతి : నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన దీక్ష కూడా చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. రాజీనామా పత్రాలను సీఎం చంద్రబాబుకు మాత్రమే పంపానని, స్పీకర్కు పంపలేదని స్పష్టం చేశారు. ‘రాజీనామా ఆమోదించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకే వచ్చాను. నా దీక్ష నియోకవర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది’ అని చెప్పుకొచ్చారు. -
విమానాలు, స్టార్ హోటళ్లలో గడుపుతూ..
సాక్షి, పశ్చిమగోదావరి : కేంద్రం ఇచ్చిన నిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాలు, స్టార్ హోటళ్లలో విలాసవంతంగా గడుపుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోకెళ్లా ఏపీకే ప్రధాని మోదీ అధిక నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల కరువు సాయాన్ని ప్రకటించిందని జీవీఎల్ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వ దొంగలు దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. దొంగ దీక్షలు చేస్తూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కరువు సాయం ప్రభుత్వ దొంగల బారిన పడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఓఆర్పీ అంటే ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అనేది బీజేపీ నినాదమైతే.. కాంగ్రెస్ వాళ్లకు మాత్రం ఓన్లీ రాహుల్-ఓన్లీ ప్రియాంక అంటూ ఎద్దేవా చేశారు. -
మాణిక్యాలరావు దిక్ష భగ్నం
-
హమీలను తక్షణమే నెరవేర్చాలి..
-
ప్రారంభమైన మాణిక్యాల రావు నిరాహార దీక్ష
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తాడేపల్లి గూడెంలో ‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సాధనకై పోరుబాట’ పేరుతో సోమవారం ఉదయం దీక్షను ప్రారంభించారు. తొలుత తెలుగుతల్లికి, బీజేపీ వ్యవస్థాపక నేతలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పైడికొండల మాట్లాడుతూ.. జిల్లాకు ఇచ్చిన 56 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత నెల 25ననే చంద్రబాబు నాయుడుకి రాజీనామా అల్టిమేటం పంపినట్లు తెలిపారు. నెల రోజులు దాటినప్పటికి ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మాణిక్యాలరావుతో పాటు బీజేపీ నేతలు నరిశె సోమేశ్వర్రావు, ఈతకోట తాతాజీ, వట్టి శైలజ, కర్రి ప్రభాకర్ బాలాజీ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. -
అందుకే నేను దీక్ష చేస్తున్నా: పైడికొండల
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి అక్రమాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆరోపించారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... స్థానిక టీడీపీ నాయకుల కుతంత్రాలు కారణంగానే నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను చంద్రబాబు కావాలనే అమలు చేయడం లేదని విమర్శించారు. ఆటో మొబైల్ రంగానికి కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెంలో ఆటోనగర్ నిర్మాణం, విమానాశ్రయ భూముల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు తదితర ప్రధాన హామీలు అమలు చేసే అవకాశం ఉన్నా కూడా స్థానిక నేతలు ఒత్తిడితో ముఖ్యమంత్రి నిలిపి వేయడం దారుణమన్నారు. సోమవారాన్ని పోలవరంగా మార్చానని చెబుతున్న ముఖ్యమంత్రి ఏ పనీ చేయకుండా ఈ జిల్లాపై ఎందుకు కక్ష గట్టారో చెప్పాలన్నారు. ఈ జిల్లా ప్రజలు మీకు అన్ని నియోజకవర్గాలు నెగ్గించి ఇస్తే ఈ జిల్లాను వెనుకబడిన జిల్లాగా వదిలేశారని ఆయన అన్నారు. జిల్లాను తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేయడం వల్లే మీకు రాజీనామా అల్టిమేటం పంపానని చెప్పారు. ఇప్పటి వరకు నేను పంపిన అల్టిమేటంపై సీఎం స్పందించని కారణంగానే ఈనెల 21 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతున్నానని తెలిపారు. నా నిరవధిక నిరాహారదీక్ష ద్వారా అయినా ఈ జిల్లా, నియోజకవర్గానికిచ్చిన హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చాలని అన్నారు. ఈ దీక్షకు ప్రజలంతా అండగా నిలిచి హామీలు అమలుకు సహకరించాలని పైడికొండల మాణిక్యాలరావు కోరారు. -
‘సమస్యల గురించి చెప్తే.. సీటు దక్కుతుందో..లేదో..’
సాక్షి, పశ్చివ గోదావరి : పచ్చకండువా ఉంటే తప్ప పనులు జరిగే పరిస్థితి లేదని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వాపోయారు. సమస్యల ప్రస్తావన తీసుకొస్తే వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందో లేదోనని టీడీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని వాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం నిధులతోనే జరుగుతోంది. జిల్లా ప్రజలకు టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. స్థానిక టీడీపీ నాయకుల స్వార్థం కారణంగానే ఎలాంటి పనులు జరగడం లేదు. నిట్ (నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని తాడేపల్లిగూడెం నుంచి ఆకివీడుకి తరలించే ప్రయత్నం చేసినపుడు కూడా రాజీనామా చేస్తానని చెప్పాను. ఫిషింగ్ హార్బర్, డెల్టా ఆధునికీకరణ, ఆక్వా యూనివర్సిటి వంటి సమస్యల పరిష్కారం కాలేదు. అవన్నీ హమీలకే పరిమితం అయ్యాయి’ అని చెప్పారు. (ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబుకు అల్టిమేటం) పశ్చిమ గోదావరి జిల్లాను చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి ఎన్ని సీట్లు ఇచ్చినా జిల్లాకు న్యాయం జరగలేదని ఆగ్రహం వక్యం చేశారు. పశ్చిమ వాసులకు ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదనీ, దానికోసం పోరాడుతున్నా చంద్రబాబు ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కేవలం ఆ పార్టీ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూర్చాయని విమర్శించారు. ‘ఏ ఇండస్ట్రీ వచ్చినా సీఎం ఆయన సొంత జిల్లాకు తరలించాలని చూస్తున్నారు. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరికి ఎన్ని పరిశ్రమలు ఇచ్చారో చెప్పాలి’ అని ప్రశ్నించారు. ఇదిలాఉండగా.. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న మాణిక్యాలరావు టీడీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల ముంగిట రాజీనామాస్త్రం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎన్నికల ముంగిట మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు రాజీనామాస్త్రాన్ని ప్రయోగించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిని అధికార పార్టీ అడ్డుకుంటుందని, ముఖ్యమంత్రి ఇప్పటివరకూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆయన ఆరో పించారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చేనెల 6న వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాణిక్యాలరావు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జిల్లాలోతీవ్రచర్చకు దారి తీసింది. అభివృద్ధి విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు మంగళవారం ప్రకటించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనుల నిమిత్తం 56 హామీలిచ్చి వాటిలో కొన్నింటికి జీఓలు, మరికొన్నింటికి సీఎం హామీ ఐడీ నంబర్లు ఇచ్చికూడా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మాణిక్యాలరావు ఆరోపించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి గాను 15 రోజుల వ్యవధిలో కార్యాచరణ ప్రకటించకుంటే 16వ రోజున ప్రజలతో కలిసి నిరవధిక నిరసన దీక్ష చేపడతానని హెచ్చరించారు. 15 రోజుల్లో అభివృద్ధి విషయంలో సీఎం నిర్ణయం తీసుకోకుంటే ఆయనకు పంపిన లేఖను స్పీకర్కు పంపి ఆమోదించే బాధ్యత కూడా సీఎం తీసుకోవాలని కోరారు. అయితే నాలుగేళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ముఖ్యమంత్రిని పొగుడుతూ వచ్చిన మాణిక్యాలరావు తెలుగుదేశం, బీజేపీ మధ్య విభేదాలు మొదలైన తర్వాత స్వరం మార్చుతూ వచ్చారు. నాలు గేళ్లు మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోలేకపోవడంపై ఆయన ఏనాడూ నోరు విప్పలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమిపై విశ్వాసంతో ఎమ్మెల్యే, ఎంపీలను మొత్తంగా జిల్లా ప్రజలు కూటమికి కట్టబెట్టినా, జిల్లాకు ఒక ప్రాజెక్టు కాని, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ కాని, యూనివర్సిటీ కాని, తీరప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కాని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెబుతున్న మాణిక్యాలరావు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఏ ప్రాజెక్టు తేలేకపోయారు. నిట్ ఒక్కటే ఈ నా లుగేళ్లలో వచ్చింది. అయితే నాలుగున్నరేళ్ల కాలంలో కూడా మిత్రపక్షాల మధ్య విభేదాల కారణంగా ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడానికే పరిమితం అయ్యారు. అధికార పార్టీ నేతలు కూడా మాణిక్యాలరావుకు పేరు రా కూడదన్న పద్ధతిలో వ్యవహరించడంతో అక్కడా అభివృద్ధి జరగకుండా పోయింది. ఇరుకున పడ్డ అధికార పక్షం మిత్రపక్షాలను నమ్మి గెలిపిస్తే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తాడేపల్లిగూడెంను అభివృద్ధి చేయకుండా చేశారు. తెలుగుదేశం, బీజేపీ మధ్య సంబంధాలు తెగిపోయిన తర్వాత అభివృద్ధిపై బహిరంగ చర్చ అంటూ హైడ్రామా నడిపారు. ఇప్పుడు తాజాగా అభివృద్ధి చేయడం లేదంటూ పైడికొండల మాణిక్యాలరావు రాజీనా మాస్త్రం సంధించడంతో అధికారపక్షం ఒక విధంగా ఇరుకునపడింది. ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో వారు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎదురుదాడికి దిగుతున్నారు. మరోవైపు ఈ రాజీనామా పై ముఖ్యమంత్రి కూడా స్పందించారు. సొంత జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోతే మాణిక్యాలరావు ఎందుకు మాట్లాడరని చంద్రబాబు ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు, రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదని చంద్రబాబు విమర్శించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి.. టీడీపీతో తెగతెంపులు చేసుకున్నాక.. అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో ప్రభుత్వం తమకు ఎంతో సహకారం అందించిందని ప్రకటించిన మాణిక్యాలరావు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్న సమయంలో రాజీనామా డ్రామాకు తెరతీశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రాజీనామాతో నాలుగేళ్లు అధికారంలో ఉండి బీజేపీ, నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీలు జిల్లా అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని తేలిపోయింది. -
ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబుకు అల్టిమేటం
-
తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం, బీజేపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం, ఘర్షణ చోటుచేసుకుంది. జగన్నాధపురం గ్రామంలో అక్రమంగా మట్టి రవాణాకు పాల్పడుతోన్న 30 లారీలను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు అడ్డుకున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే పైడికొండల, అధికారులకు సమాచారమిచ్చినా స్పందించకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. పైడికొండలకు మద్దతుగా ఆందోళనలో వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆందోళనకు వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. గ్రామంలోని అన్ని మార్గాలను తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు దిగ్బంధనం చేశారు. ఇరువర్గాల ఆందోళనలతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతూ..మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతోన్న వారిని అరెస్ట్ చేసి వారి వాహనాలను అధికారులు తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే తెలుగుదేశం నేతలు రోడ్లు దిగ్బంధించడం సిగ్గుచేటన్నారు. రోడ్లు దిగ్బంధనం చేసిన వారిని వదిలి నా వద్దకు వచ్చి జులూం చూపితే ఖబడ్దార్ అంటూ పోలీసులకు మాణిక్యాల రావు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మీకు(పోలీసులకు) చేతకాకపోతే చెప్పండి.. మీరు పది నిమిషాలు వెళ్లిపోండి..తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు. -
తాడేపల్లిగూడెంలో మళ్లీ ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న(గురువారం) మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు గృహ నిర్బంధాన్ని, పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం ర్యాలీ నిర్వహించాయి. తహశీల్దార్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు మళ్లీ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపించడంతో భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు పరస్పరం సవాళ్లు విసురుకున్న సంగతి తెల్సిందే. -
‘ఏపీలో ఎవరికీ రక్షణ లేదు’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అసలు రాష్టంలో ఎవరికీ రక్షణ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావును హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాడేపల్లిగూడెం బయల్దేరిన తమ పార్టీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంపై కన్నా అసహనం వ్యక్తం చేశారు. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డుపై బైఠాయించిన కన్నా.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందనడానికి ఇదే ఉదాహరణని ఆరోపించారు. ‘ మా ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అన్యాయంగా రోడ్డుపైనే అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. మాణిక్యాలరావు పరిస్థితి విషమంగా ఉంది. రాష్టంలో ప్రతిపక్ష నేతకు సైతం రక్షణ లేదు. మిగతా రాజకీయ పార్టీల నాయకులకి రక్షణ ఎక్కడ ఉంటుంది. మాణిక్యాలరావును అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని ఆయన ప్రశ్నించారు. మాణిక్యాలరావును హౌస్ అరెస్ట్ చేయడంతో కోర్ కమిటీ సమావేశం రద్దు చేసుకుని తాడేపల్లిగూడెం బయల్దేరిన కన్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు జీవీఎల్, కావూరి సాంబశివరావులను కూడా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా వారిని హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో కన్నా ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చదవండి: మాణిక్యాలరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రికత్త -
మాణిక్యాలరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రికత్త
సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావు నివాసం(తాడేపల్లిగూడెం) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గృహ నిర్బంధం నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించిన ఆయనను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి ఇంట్లో పడేశారు. రోడ్డుపై గంటకు పైగా తీవ్రమైన ఎండలో కూర్చోవడం, పోలీసులు లోపలికి తీసుకెళ్లే క్రమంలో జరిగిన పెనుగులాటలో మాణిక్యాల రావు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అభివృద్ధికి ఆటంకం, మట్టి మాఫియా బాపిరాజు డౌన్ డౌన్, పోలీసుల దైర్జన్యం నశించాలంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కాగా స్థానిక జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లపై ఉచిత ఇసుక పేరుతో తెలుగు దొంగలు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మాణిక్యాల రావు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. దీంతో నిరసన చేపట్టేందుకు ఉపక్రమించిన మాణిక్యాల రావును పోలీసులు ఎత్తుకెళ్లి ఇంట్లో పడేశారు. -
చంద్రబాబు మానసికస్థితిపై అనుమానంగా ఉంది
తాడేపల్లిగూడెం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పాటు స్థానిక జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లపై మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం మాణిక్యాల రావు విలేకరులతో మాట్లాడారు. దేశం భ్రష్టుపట్టుకుని పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని పారద్రోలాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కుతూ కాంగ్రెస్తో అంటకాగుతున్న చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న ఆ పార్టీ నుంచి కార్యకర్తలు, నేతలు బయటకొచ్చి పార్టీని పునర్మించండని పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ధి పథంలో ఉన్న వ్యక్తులందరూ నా సలహాతోనే పైకొచ్చారు..నేనే వారందరికీ మార్గదర్శినని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు మానసిక స్థితిపై తనకు అనుమానంగా ఉందని, ఆయన ఎక్కడైనా చూపించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క అంగుళమైనా ఇసుక ఉచితంగా వస్తుందా అని ప్రశ్నించారు. ఉచిత ఇసుక పేరుతో రాష్ట్రాన్ని తెలుగు దొంగలు దోచుకు తింటున్నారని ఆరోపించారు. నీరు-చెట్టు తెలుగుదేశం పాలిట కల్పతరువుగా మారిందని వ్యాక్యానించారు. జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లకు ఈ సందర్భంగా మాణిక్యాల రావు సవాల్ విసిరారు. మీరు తవ్వే నల్లజర్ల, జగన్నాథపురం చెరువుల్లో అయినా లేక మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తా, టైం మీరు చెప్పినా లేక మమ్మల్ని చెప్పమన్నా సరే నేను రెడీ అని మాణిక్యాల రావు ప్రకటించారు. గురివింద గింజలా మీ కింద మచ్చ ఉంచుకుని నాపై విమర్శలు చేస్తారా అని ఘాటుగా విమర్శించారు. నేను చేసే సేవాకార్యక్రమాల గురించి గుడి, బడి, ఆసుపత్రి దగ్గర అడిగితే చెబుతారు..నేనొక సామాన్యుడిగా ఇవన్నీ చేశా..మీరు గొప్పవాళ్లని చెబుతున్నారు కదా మీరు చేసిందేమిటో కనీసం ఒక్కటైనా చెప్పాలని సూటిగా అడిగారు. -
ఖబడ్దార్.. అంటూ హెచ్చరించిన పైడికొండల
సాక్షి, ప.గో జిల్లా : మాజీ మంత్రి, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు ప్రభుత్వ ఉద్యోగులపై ఫైర్ అయ్యారు. పెంటపాడు మండలంలోని జట్లపాలెం గ్రామంలో సీసీ రోడ్డు ఓపెనింగ్కు వెళ్లిన పైడికొండలకు ప్రోటోకాల్ ప్రకారం అక్కడి రెవెన్యూ అధికారులు, గ్రామ నాయకులు హాజరుకాకపోవడంతో వారిపై విరుచుకపడ్డారు. కావాలనే కొంతమంది ప్రజాప్రతినిధులు ఇదంతా చేయిస్తున్నారని, అధికారులంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండకపోతే..ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ప్రజలంతా కలిసి అధికారులను నిలదీయాలని, వారి ఆఫీసుల నుంచి బయటకు రానీయకుండా చేయాలంటూ పిలుపునిచ్చారు. -
శివాజీ చెప్పిందే నిజమైతే ఫెయిలయినట్టే
కాకినాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరుపై మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పైడికొండల మాణిక్యాల రావు విలేకరులతో మాట్లాడుతూ..జగన్పై జరిగిన దాడి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే ప్రజలకు నిజాలు తెలుస్తాయని అన్నారు. జగన్పై జరిగిన దాడి ఆయన అభిమానే చేశాడని, చిన్న గాయమే అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నమేనని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాష్ట్రంలో సంచరించడానికి భయపడే పరిస్థితులను సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణభయంతో ప్రతిపక్షాలు బయట తిరగకుండా ఉంటే వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విమానాశ్రయాలను ఏపీ పోలీసులే పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. గతంలో కూడా విశాఖ రన్వేపై రాష్ట్రానికి చెందిన పోలీసులే జగన్ను అడ్డుకోవడం చూశామని గుర్తు చేశారు. ఆపరేషన్ గరుడ అంటూ నటుడు శివాజీ చెప్పింది నిజమే అయితే ఎందుకు మీ ప్రభుత్వం.. మీ పోలీసు వ్యవస్థ జగన్పై జరిగిన దాడిని అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు. ఒక వేళ శివాజీ చెప్పిందే నిజమైతే దాడి మీ ఫెయిల్యూర్గా భావించి మీరు, హోంమంత్రి చినరాజప్ప రాజీనామా చేసి ప్రభుత్వాన్ని శివాజీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా శివాజీని అదుపులోకి తీసుకుని ఆపరేషన్ గరుడ వెనక ఎవరు ఉన్నారో విచారణ జరిపించాలని కోరారు. ఒకవేళ ఆపరేషన్ గరుడపై విచారణ జరిపితే దీని వెనకున్న పెద్దలకు, మీ ప్రభుత్వానికి నష్టమా అని చంద్రబాబును ప్రశ్నించారు. -
చెన్నారెడ్డినే తరిమిన వాళ్లం.. చంద్రబాబు మాకెంత..!
తాడేపల్లిగూడెం: దమ్ముంటే తెలుగుదేశం పార్టీ సభను అడ్డుకోవాలని టీడీపీ నాయకుడు ఒకరు ఛాలెంజ్ చేశారు. మర్రి చెన్నారెడ్డిని తరిమిన ఘనత మాది. ఆఫ్ట్రాల్ చంద్రబాబును తరమడం పెద్ద కష్టం కాదని ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. విమానాశ్రయ భూముల నిర్వాసితులకు పట్టాలు ఇవ్వాలని, చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో మౌన పోరాట దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టే ముందు విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా టీడీపీ నాయకులు మాట్లాడితే వెనుకడుగు వేయమని హెచ్చరించారు. శనివారం ధర్మపోరాట దీక్షలో గూడెంకు ఇచ్చిన హామీల అమలులో అధికార పార్టీ నాయకుల స్పందనపై మా పోరాటం ఆధారపడి ఉంటుందన్నారు. తాడేపల్లిగూడెంలో ధర్మపోరాట దీక్ష చేసుకోడానికి ఈ ప్రాంతం పనికొచ్చింది కాని, ప్రభుత్వ వైద్య కళాశాల ఇవ్వడానికి పనికిరాదా అన్నారు. 2015 ఆగస్టులో నిట్ వేదికపై నుంచి ఇచ్చిన హామీలకు అతీగతీ లేదన్నారు. కేంద్రం ఈ రాష్ట్రానికిచ్చిన హామీలు 95 శాతం పూర్తిచేస్తే, మిగిలిన ఐదు శాతం హామీల అమలు కోసం ధర్మపోరాటం చేయడం ఎందుకని ప్రశ్నించారు. గూడెం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయని సీఎంపై ఏ పోరాటం చేయాలన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పి సభ నిర్వహించుకోవాలన్నారు. మౌనపోరాటం చేస్తామని ప్రకటించాక విమానాశ్రయ భూముల్లో 1800 మందికి పట్టాలు ఇస్తామని టీడీపీ నాయకులు ప్రకటించారు. విమానాశ్రయ భూముల్లో 5300 మంది పట్టాదారులుంటే కేవలం 1800 మందికి ఇస్తాననడం సరికాదు. అందరికీ పట్టాలిస్తానని సభలో ప్రకటించాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర చేస్తూ టీడీపీ వారిని ప్రశ్నిస్తున్నారని ఆయనపై దాడికి రెక్కీ నిర్వహిస్తే ప్రభుత్వం కళ్లు తేలేసి చూస్తుందా అన్నారు. అభిమాన నటుడుగా ఉన్న పవన్కల్యాణ్కు అన్యాయం జరిగితే మూల్యం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిం చారు. శాంతియుతంగా మౌనదీక్ష చేస్తున్న మమ్మల్ని రెచ్చగొడితే మేము కూడా కర్ర చేత్తో పట్టుకోడానికి సిద్ధమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు కోడూరి లక్షీనారాయణ, మహిళా మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి శరణాల మాలతీరాణి, పార్టీ నాయకులు ఈతకోట తాతాజీ, యెగ్గిన నాగబాబు, నరిశే సోమేశ్వరరావు, ధనలక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. సాధిద్దాం.. పట్టాలు సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మౌన పోరాట దీక్ష సాగింది. ఎమ్మెల్యే సతీమణి సూర్యకుమారి కూడా దీక్షలో పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యం శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలే దీనికి నిదర్శనమని మాణిక్యాలరావు అన్నారు. ఇంటెలిజెన్సు వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం దీనికి కారణమన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై దాడికి రెక్కీ నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు రక్షణ కొరవడిందన్నారు. పసుపు తమ్ముళ్ల రక్షణకే పోలీసు బలగం సరిపోతుందన్నారు. పవన్ కల్యాణ్తో పాటు, ప్రతిపక్ష నేతల రక్షణకు ప్రత్యేక వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
‘చెన్నారెడ్డినే తరిమిన ఘనత మాది’
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. విమానాశ్రయ భూముల నిర్వాసితులకు పట్టాలు ఇవ్వడంలో టీడీపీ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. వారికి మద్దతుగా తాడేపల్లి గూడెంలో శుక్రవారం ఆయన నిరసన దీక్ష చేపట్టారు. భూ నిర్వాసితులకు పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చంద్రబాబు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను రెచ్చగొడితే తిరగబడతామని హెచ్చరించారు. అవసరమైతే కర్రలు చేతబట్టి ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. ‘మర్రి చెన్నారెడ్డినే తరిమిన ఘనత మాది. ఆఫ్ట్రాల్ చంద్రబాబును తరిమికొట్టడం పెద్ద కష్టం కాదు. దమ్ముంటే మా నిరసన దీక్షని అడ్డుకోండి’ అని సవాల్ చేశారు. నిట్ ప్రారంభోత్సవంలో బాబు ఇచ్చిన 56 హామీలకు కూడా అతీగతీ లేదని మండిపడ్డారు. -
ధర్మ పోరాట దీక్ష.. కేంద్రం నిధులతోనే
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమ గోదావరి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సక్రమంగా వాడుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. తాడేపల్లి గూడెంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలలో సుమారు రూ. 27,000 కోట్లు రాష్ట్రానికి ఎమ్ఆర్జీఎస్ నిధులు ఇచ్చిందని, ఆ నిధులతో పోలవరం ప్రాజెక్టునే నిర్మించేయవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ది పనులు చేపట్టారని తెలిపారు. ఈ నెల 29న టీడీపీ ధర్మ పోరాట దీక్ష కూడా మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే చేస్తున్నారని ఎద్దేవ చేశారు. హామీలు నెరవేర్చేవరకు పోరాటం ఆగస్టు 20, 2015న నిట్ శంకుస్థాపనలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇచ్చిన సుమారు నలభై హామీలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. ధర్మ పోరాట దీక్షలో ఇచ్చిన హామీలపై ఇచ్చే ప్రకటన ఆధారంగా అవసరమైతే పోరాటం చేస్తానని తెలిపారు. బీజేపీ నుంచి పోటీచేస్తే డిపాజిట్లు తెచ్చుకోలేరని ముళ్లపూడి బాపిరాజు అనడం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ పాలన ఇలాగే కొనసాగితే బాపిరాజు తన నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. బీజేపీ నాయకులు తమకు అనుకూలమైన పోలీసులని నియమించుకుంటున్నారని బాపిరాజు అనడం సబబు కాదని, టీడీపీ నాయకుల్లాగా పేకాట, కోడిపందాలు, క్రికెట్ బెట్టింగ్లతో తమకు పనిలేదని పేర్కొన్నారు. -
‘అక్కడ మొక్కితే.. ప్రధానికి మొక్కినట్టే’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పరిస్థితులు అన్నివేళలా ఒకేలా ఉండవని వ్యాఖ్యానించారు. ‘నేను సభలో మాట్లాడటం కోసం ప్రయత్నిస్తున్నా.. నన్ను పట్టించుకోవడం లేదు. పరిణామాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సమైక్యాంధ్ర ఉద్యమసమయంలో గ్రామాల్లోకి వెళ్లలేకపోయేవాళ్లం.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత టీడీపీ చేస్తోన్న వాదనను ప్రజలు నమ్మడం లేదు. రాష్ట్రంలో అవినీతి జరుగుతోంది కాబట్టే పైనుంచి నిధులు కట్ చేసి ఉంటారనే భావనలో ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కన్పిస్తోంది. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయం. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కొన్ని బృందాలను కర్ణాటకకు పంపింద’ని మాణిక్యాలరావు తెలిపారు. మరో బీజేపీ నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. పార్లమెంట్ మెట్లకు మొక్కి వెళ్లడమంటే.. పార్లమెంటులో అత్యున్నత స్థానంలో కూర్చొన్న ప్రధానమంత్రికి మొక్కినట్టే అన్నారు. రాఫెల్ డీల్ వంటి విషయాల గురించి మాట్లాడేంత పెద్ద వాళ్లం కాదని.. శాండ్, ల్యాండ్ గురించి మాట్లాడతామని అన్నారు. -
ఏపీ బీజేపీకి కొత్త సారధి?
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పై, ప్రధాని నరేంద్ర మోదీఫై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నతరుణంలో వారిని ధీటుగా ఎదుర్కొనే విధంగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. టీడీపీకి సరైన కౌంటర్ ఇచ్చే నాయకుడిని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి కంభంపాటి హరిబాబు తొలగించి.. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. కొత్త అధ్యక్ష ఎంపిక బాధ్యతని అమిత్షా పూర్తిగా ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ రాం మాధవ్కు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే అధ్యక్ష రేసులో ఒకే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు పేర్లు వినిపించినా రాంమాధవ్ మాణిక్యాలరావు వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఈ క్రమంలో మిగిలిన ఇద్దరు నేతలకు కీలక బాధ్యతల్లో చోటు కల్పించాలని భావిస్తున్నారట. కానీ, ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముఖ్యనేతల భేటీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నేపథ్యంలో రాంమాధవ్ బీజేపీ ముఖ్య నేతలతో గురువారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో టీడీపీని ఎలా కట్టడి చేయాలి, అధ్యక్ష పదవిని ఎవరు సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే అంశాలపై సీనియర్ నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. అధ్యక్షుడిగా హరిబాబు ఫెయిల్? ఇటీవల బీజేపీని టార్గెట్ చేసిన టీడీపీపై అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు తగినరీతిలో స్పందించలేకపోవడం, పలు సందర్భాల్లో ఆయన మెతక వైఖరి ప్రదర్శించడంతో బీజేపీ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. మిగిలిన నేతలు ఎప్పటికప్పడు టీడీపీపై దాడికి దిగుతున్నా, హరిబాబు మాత్రం దూకుడుగా వ్యవహరించలేదనే అభిప్రాయం నేతల్లో ఉంది. ఈ నేపధ్యంలోనే ఆయన స్ధానంలో మాణిక్యాల రావును నియమించేందుకు నిర్ణయం తీన్నారని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
ఆపరేషన్ ద్రవిడ వెనుక ఎవరున్నారు..
సాక్షి, అమరావతి: హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని ఏపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు డీజీపీని కోరారు. ఈ మేరకు డీజీపీ మాలకొండయ్యకి ఆయన లేఖ రాశారు. ఆపరేషన్ ద్రవిడ పేరుతో కుట్రలు జరుగుతున్నాయన్న అపోహలు ప్రజలకు పోవాలంటే విచారణ జరిపించాలన్నారు. ఆపరేషన్ ద్రవిడ కోసం రూ.4800 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ శివాజీ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. శివాజీ మాటల ప్రకారం ఏపీలో అరాచకాలు, కుట్రలు జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందని.. అందుకే ఆపరేషన్ ద్రవిడ వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకు తెలియాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని లేఖలో డీజీపీని కోరినట్లు మాణిక్యాలరావు వివరించారు. సినీ నటుడు శివాజీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఓ జాతీయ పార్టీ ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టబోతోందని శివాజీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ ద్రవిడ’లో ఇదొక భాగమన్నారు. ఏపీ, తెలంగాణకు చెంది ‘ఆపరేషన్ గరుడ’.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ రావణ’.. కర్ణాటకలో ‘ఆపరేషన్ కుమార’ను ఆ పార్టీ చేపట్టబోతోందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్కు అనుసంధానకర్తగా ఓ రాజ్యాంగ శక్తి వ్యవహరిస్తోందన్నారు. ఫలితంగా ఆయన పదవీ కాలం పొడగించబోతున్నారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం రూ.4,800 కోట్లు కేటాయించారని, ఇందులో సగం ఇప్పటికే పంపిణీ జరిగిందంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. -
ముగ్గురూ ముగ్గురే
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో పేరుకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు బీజేపికి చెందిన వారు కాగా ఇద్దరు టీడీపీకి చెందిన వారు. బీజేపీ నుంచి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావు తనను అంటరానివారిగా టీడీపీ నాయకులు చూస్తున్నారని చెబుతున్నారు. మిగిలిన ఇద్దరు మంత్రులది వారి పంథా వారిదే. జనం గోడు పట్టించుకోవడం లేదు. జిల్లాలో సాగునీరు అందక వరిపైరు ఎండిపోతోందని రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా.. కనీసం ఆ విషయమై సమీక్ష జరిపే ప్రయత్నం కూడా ఆ ఇద్దరు మంత్రులు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. పితాని సత్యనారాయణ నియోజకవర్గంలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఆయన ఇప్పటి వరకూ ఆ ప్రాంతాల్లో పర్యటించిన పాపాన పోలేదు. ఇక మరోమంత్రి కేఎస్ జవహర్ది కూడా ఇదే తీరు. పచ్చని పొలాలతో కళకళలాడే పశ్చిమలో మునుపెన్నడూ లేనివిధంగా కరువు ఛాయలు అలముకుంటున్నాయి. మార్చి మొదటివారంలోనే పంట పొలాలు బీటలు వారిపోతున్నాయి. వెరసి అన్నదాతకు తీవ్ర సాగునీటి కష్టం వచ్చింది. ఆరుగాలం శ్రమించే రైతులు ఇప్పుడు రబీ గట్టెక్కేదెలాగా అని మధనపడుతున్నారు. వంతుల వారీ విధానంతో సాగునీరు అందిస్తామన్న పాలకుల హామీలు గాలిలో కలిసిపోవడంతో చుక్క నీరు అందక రైతన్నలు రబీపై ఆశలు వదిలేసుకుంటున్నారు. జిల్లాలో నరసాపురం, యలమంచిలి, మొగల్తూరు, ఆచంట, పెనుమంట్ర, అత్తిలి, భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, పాలకొల్లు, పెంటపాడు, దెందులూరు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల్లో ఎప్పుడూ లేని విధంగా సాగునీటి ఎద్దడి నెలకొంది. గోదావరి డెల్టాలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో శివారు పొలాలకు నీరు అందే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పచ్చని పంట పొలాలకు నెర్రలు వచ్చాయి. పాలకులు ఏం చేస్తున్నట్టు? సాగునీటి సమస్యపై రైతులు అల్లాడుతున్నా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అండగా నిలవాల్సిన పాలకులు కనీసం స్పందించడం లేదని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కనీసం జిల్లాలోని ఇరిగేషన్ అధికారులను కూర్చోబెట్టి ఏం జరుగుతోంది, ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుతామన్న ఆలోచన కూడా చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మూడు నెలల క్రితం జరిగిన నీటిపారుదల సలహామండలి సమావేశంలో పట్టిసీమ నుంచి నీరు తరలించడం ద్వారా గోదావరి డెల్టా నష్టపోతోందన్న విషయాన్ని మంత్రి పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని వెంటనే పట్టిసీమ నుంచి నీటి సరఫరా నిలిపివేయాలని కోరారు. అయితే తర్వాత దానిపై దృష్టి పెట్టలేదు. ఒకవైపు గోదావరిలో నీరు అడుగంటినా రికార్డుల కోసం 105 టీఎంసీలను తరలించేశారు. పట్టిసీమ కట్టేసే సమయానికే గోదావరిలో నీటి లభ్యత చాలా తక్కువ ఉందని తేలింది. అయినా డెల్టాను కాపాడే దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుత సాగునీటి సంక్షోభం తీవ్రస్థాయిలో ముందుకు వచ్చింది. మంత్రులు కేవలం తమ స్వప్రయోజనాలు, సొంత నియోజకవర్గాలకే పరిమితం అయిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రి కామినేని వివరణ
సాక్షి, విజయవాడ: తనపై సొంత పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో బీజేపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం వివరణ ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే నిన్న జరిగిన పార్టీ పదాధికారుల సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయినట్టు వెల్లడించారు. అసలేం జరిగింది..? రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షతన ఆదివారం విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కమలనాథులు కీలక విషయాలు చర్చించారు. ఏపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మంత్రులు బయటకు వచ్చి సీఎం చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేశారు. అప్పటివరకు సమావేశంలో ఉన్న మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ అంశం ప్రస్తావనకు రాగానే బయటకు వెళ్లిపోయారు. ఆయన హడావుడిగా బయటకు వెళ్లిపోవడం పట్ల పలువురు అభ్యంతరం చేశారు. దీంతో మంత్రి కామినేని ఈరోజు వివరణయిచ్చారు. ఏ నిర్ణయానికైనా కట్టుబడతా.. బీజేపీ మంత్రుల రాజీనామాలను అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీకి పంపితే బాగుంటుందని సమావేశంలో చర్చించుకున్నారు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడతానని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జవాబిచ్చినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిదని హరిబాబు సూచించడంతో ఈ అంశంపై చర్చను ముగిసించారు. -
పైకి పొత్తులు... లోన కత్తులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పైకి మిత్రపక్షాలుగా కలిసి మెలిసి ఉన్నట్లు కనపడుతున్నా పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జిల్లాలో తమకు ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక మంత్రి ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఏ విషయంలోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా, ప్రతి విషయంలో అవమానకరంగా వ్యవహరిస్తోందన్న భావన బీజేపీలోని కిందిస్థాయి కార్యకర్త వరకూ ఉంది. దీంతో వారు కసితో రగిలిపోతున్నారు. పార్టీ జిల్లాలో ఎదగకపోవడానికి తెలుగుదేశమే కారణమని వారంతా అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నుంచి ఏదైనా సహాయం నిలిచిపోతే దాన్ని పెద్ద ఇష్యూగా చేసి చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ కేంద్రం ఇస్తున్న నిధుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఉపాధిహామీ పథకంతోనే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సిమెంట్రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేసుకుంటున్నారని అయితే అవన్నీ తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం ఎంతవరకూ సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో బీమా పథకాన్ని చంద్రన్న బీమా పేరుతో తమ స్వలాభం కోసం ప్రచారం చేస్తోందని, ఈ పథకానికి ముందు ప్రధాని పేరు పెట్టాలని అసెంబ్లీలో కోరినా చంద్రబాబునాయుడు ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేస్తున్నారు. పోలవరానికి కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రచారం దుర్మార్గమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసవర్మ ఆరోపిస్తున్నారు. పోలవరానికి నాబార్డు ద్వారా రుణం ఇప్పించి, ఆ రుణాన్ని కేంద్రం చెల్లిస్తుందని అటువంటప్పుడు దానికి బడ్జెట్లో ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ మంత్రులకు సరైన ప్రొటోకాల్ ఇవ్వడం లేదు. ఆఖరికి జన్మభూమి కమిటీలు కూడా ఏకపక్షంగానే వేశారు. నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజుకు కూడా చాలా కార్యక్రమాలకు ఆహ్వానం ఉండటం లేదు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో ఆయనకు చెప్పకుండానే జెడ్పీ చైర్మన్ బాపిరాజు కార్యక్రమాలు నిర్వహించడం తెలిసిందే. ఈ విషయంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తమవల్లే తాడేపల్లిగూడెంలో బీజేపీ గెలిచిందని, అందువల్ల తాము చెప్పినట్లే వినాలనే తరహాలో తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కలిసి పనిచేయడానికిఅభ్యంతరం లేదు బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు భూపతి శ్రీనివాసవర్మ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వ సహకారం పొందుతూ ఎక్కడా బీజేపీ, ప్రధానమంత్రి పేరు చెప్పకపోవడంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కేంద్రం నుంచి ఏదైనా అందకపోతే దాన్ని పెద్ద వివాదంగా మారుస్తున్నప్పుడు కేంద్ర సహకారంతో చేసే పనులను ఎందుకు ప్రస్తావించరు. కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉంది. అయితే ఏపీకి రావాల్సిన వాటి కోసం మేము కూడా ప్రయత్నిస్తున్నాం. -
బెడిసికొడుతున్న బీజేపీ, టీడీపీ సంబంధాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మిత్రపక్షం బీజేపీతో పొత్తుకు నమస్కారం అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడంతో జిల్లాలో తాడేపల్లిగూడెం రాజకీయం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలోనిర్వహించిన జిల్లా సమీక్షా మండలి సమావేశానికి బీజేపీ నుంచి గెలిచిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తాను వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేయడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు అయింది. తాడేపల్లిగూడెం కేంద్రంగా తెలుగుదేశం, బీజేపీల మధ్య మూడున్నర సంవత్సరాలుగా జరుగుతున్న వివాదాలు అటు సీఎం చంద్రబాబునాయుడికి కూడా తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెం అసెంబ్లీ సీటు ఆశించి (పొత్తు కారణంగా బీజేపీ ఇచ్చారు) అది దక్కకపోవడంతో జెడ్పీ చైర్మన్ అయిన ముళ్లపూడి బాపిరాజు ప్రతిక్షణం తాడేపల్లిగూడెం వ్యవహారాల్లో చెయ్యి పెట్టడం, మంత్రికి వ్యతిరేకంగా పనిచేయడంతో విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి వద్ద కూడా అనేక పంచాయితీలు జరిగినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు మంత్రి మాణిక్యాలరావుకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం, దానిపై తెలుగుదేశం నాయకులు స్పందించి సోము వీర్రాజు నాలుక కోస్తామనడం తెలిసిందే. దీంతో మంత్రి మాణిక్యాలరావు పోలీసులపై వత్తిడి తీసుకువచ్చి మున్సిపల్ చైర్మన్పై కేసు పెట్టించారు. ఇటీవల జరిగిన జన్మభూమి సభల్లో మంత్రికి సమాచారం ఇవ్వకుండా జెడ్పీ చైర్మన్ పాల్గొనడం మంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, అదే సభకు ఆలస్యంగా వచ్చిన మంత్రి మాణిక్యాలరావు జెడ్పీ చైర్మన్ వ్యాఖ్యలపై స్పందించడంతో ఇరువర్గాలు రోడ్డెక్కాయి. మంత్రిని మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావు ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని వ్యాఖ్యానించడం, తనను కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కు వచ్చే నిధులు కట్ చేస్తానంటూ మంత్రి రెచ్చిపోవడం తెలిసిందే. జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఈ వివాదం పరిష్కరించమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా జెడ్పీ చైర్మన్ బాపిరాజుతో పుల్లారావు విడిగా భేటీ అయ్యారు. మొదట మంత్రి మాణిక్యాలరావే ఈ వివాదాన్ని మొదలు పెట్టారని, అందువల్ల ఆయనే వెనక్కి తగ్గాలని, తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని బాపిరాజు స్పష్టం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం బలంతో గెలిచిన మంత్రి ఆ విషయాన్ని మర్చిపోయి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని బాపిరాజు ఆరోపించినట్లు సమాచారం. మంత్రి మాణిక్యాలరావు మాత్రం ఉదయం వరకూ తాడేపల్లిగూడెంలోనే ఉన్నా ఉదయమే కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లిపోయారు. చాలా రోజుల తర్వాత జిల్లా అంశాలపై సమీక్షా సమావేశం పెట్టినా మంత్రి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
కన్నాలేసేవాడే సిగ్గుపడాలి
-
కన్నాలేసేవాడే సిగ్గుపడాలి: మంత్రి
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు మద్దతుగా తనపై విమర్శలు చేసిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్పై మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. తాను నిరంతర శ్రామికుడినని, అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చానని చెప్పుకొచ్చారు. ‘నన్ను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని మున్సిపల్ చైర్మన్ కామెంట్ చేశాడు. అవును నేను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్నే. నేను ఈరోజుకీ ఫోటోగ్రాఫర్ననే అందరికీ చెప్తా. 24 గంటల్లో 18 గంటలు పనిచేసే నిరంతర శ్రామికుడిని. కష్టపడ్డావోడు సిగ్గుపడక్కర్లేదు, కన్నాలేసేవాడే సిగ్గుపడాలి. నాపై కామెంట్లు చేస్తున్న నీవు నీ చరిత్ర ఏంటో తెలిసుకో, నేను నీ చరిత్ర బయటకు తీయడానికి క్షణం పట్టదు. నీకు దమ్ముంటే నా చరిత్ర గురించి తెలుసుకో. నువ్వెంత వెతికినా నా వెనుక నా కష్టమే కనపడుద్ది. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఫోటోగ్రాఫర్గా పనిచేసి అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చా. నేను ఫొటోగ్రాఫర్కు ఫొటోగ్రాఫర్ని, ఆటోడ్రైవర్కు ఆటో డ్రైవర్, కూలీకి కూలీని. నేనెప్పుడూ కష్టపడే జీవినే, నిరంతర శ్రామికుడినని గర్వంగా చెబుతాన’ని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. -
గజల్కు మద్దతుపై మాట మార్చిన మంత్రి
-
గజల్ శ్రీనివాస్కు ఏపీ మంత్రి మద్ధతు
-
గజల్ శ్రీనివాస్కు వత్తాసు పలికిన ఏపీ మంత్రి
సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ ‘గజల్’ శ్రీనివాస్కు ఏపీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మద్ధతు తెలిపారు. గజల్ శ్రీనివాస్ పై కావాలని కుట్ర ప్రకారమే ఇలా చేశారని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారం రికార్డ్ చేయకపోతే శ్రీనివాస్పై అలాంటి వీడియోలు బయటకు ఎలా వస్తాయన్నారు. గజల్ శ్రీనివాస్ దేశ వ్యాప్తంగా తిరిగి అద్బుతమైన గజల్స్ వినిపించిన వ్యక్తి అని, తనకు చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ తెలుసునన్నారు. శ్రీనివాస్ ఏ తప్పు చేయలేదని మరోసారి మంత్రి మాణిక్యాల రావు అన్నారు. లైంగిక వేధింపుల వీడియోలతో అడ్డంగా దొరికిన నిందితుడికి గౌరవప్రద మంత్రి హోదాలో ఉన్న మాణిక్యాలరావు వత్తాసు పలకడం హాట్ టాపిక్గా మారింది. అయితే పలు వీడియోలే సాక్ష్యాలుగా బాధితురాలు తనపై జరిగిన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయగా శ్రీనివాస్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మహిళల పట్ల గజల్ శ్రీనివాస్ ముసుగు వేసుకున్న ఒక క్రూరమృగం అన్నది వీడియోలతో నిర్ధారణ అయిందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. గజల్ శ్రీనివాస్కు వత్తాసు పలికిన ఏపీ మంత్రి -
మంత్రి మాణిక్యాలరావుకు అవమానం
విజయవాడ: విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అవమానం జరిగింది. బుధవారం ఆయన ఆలయ వెనుక భాగం నుంచి వెళ్లే సమయంలో సిబ్బంది గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. అరగంట సేపు ఆయన అక్కడ వేచివున్నారు. మాణిక్యాలరావు వచ్చిన సమయంలోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు రావడంతో ఆలయ సిబ్బంది అంతా అటువైపు వెళ్లిపోయారు. తనపట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన అధికారులపై మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణ ఇవ్వాలని ఆలయ అధికారులను ఆదేశించారు. మహామండపం మెట్ల మార్గంలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. శానిటేషన్ కాంట్రాక్టర్కు నోటీసులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. కాగా, తమ పార్టీకి చెందిన మంత్రికి అవమానం జరగడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘ముద్రగడ కాస్త సమయమివ్వాలి’
అమరావతి: కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం చేసే పోరాటంలో న్యాయం ఉందని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ముద్రగడ దీక్ష వెనుక వైఎస్సార్ సీపీ హస్తం లేదని వివరించారు. కాపు రిజర్వేషన్ ఆలస్యం అవుతుందనే ముద్రగడ ఉద్యమం చేస్తున్నారని చెప్పారు. ముద్రగడ ఉద్యమంతో కాపులు దాడులకు పాల్పడుతున్నారనే మంత్రుల ఆరోపణలతో తాను ఏకీభవించటం లేదన్నారు. కాపుల ఉన్నతి కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ.. రిజర్వేషన్ల అమలుకు కాస్త సమయమివ్వాలని సూచించారు. -
ఫ్లెక్సీ వివాదంపై వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు
తాడేపల్లిగూడెం: దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేరిట ఇటీవల ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. వాటికి పోలీసులను రెండు షిఫ్టుల్లో కాపలా పెట్టారు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయబోగా.. మంత్రి, ఆయన అనుచరులు అడ్డుకుని దాడులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఫ్లెక్సీల వివాదంపై పశ్చిమగోదావరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్యే మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమురి నాగేశ్వరరావు, ఉంగుటూరు కన్వినర్ పుప్పాల వాసుబాబు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదుచేశారు. ఫ్లెక్సీల వివాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎస్పీకి అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణపై అక్రమంగా హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారని.. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ నేతలు ఎస్పీని కోరారు. -
మంత్రి ఫ్లెక్సీలకు పోలీసుల కాపలా!
తాడేపల్లిగూడెం: మంత్రులకు పోలీసులు భద్రత కల్పించడం సాధారణ విషయం. ఇందుకు భిన్నంగా దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన పేరిట అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు పోలీసు కాపలా పెట్టించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బస్టాండ్ ఎదుట వీధిలో నివాసం ఉంటున్న మంత్రి.. తన ఇంటికి వెళ్లే మార్గంలో గల ఫ్లెక్సీలకు నలుగురు పోలీసులను కాపలా ఉంచారు. రెండు షిఫ్టుల్లో మొత్తం 8 మంది పోలీసులు ఆ ఫ్లెక్సీల వద్ద డ్యూటీ చేస్తున్నారు. అదే వీధిలో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయబోగా.. మంత్రి, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ప్రతిష్ట కోసమో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ.. తన పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ఇలా పోలీసు కాపలా ఏర్పాటు చేసుకున్నారు. ఇది చూసిన వారంతా ‘మంత్రా.. మజాకా’ అనుకుంటున్నారు. -
గుజరాత్ మాదిరిగా ఏపీ అభివృద్ధి
ఏపీకి సాయంపై ప్రధాని మోదీ భరోసా సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ బీజేపీ నేతల బృందానికి హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కంటే అధికంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, భవిష్యత్తులో కూడా సాయం అందిస్తామని తెలిపారు. ‘‘మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు ముంబై వంటి వాణిజ్య నగరాన్ని గుజరాతీలు కోల్పోయారు. సముద్రతీరం, పర్వతాలు మినహా నదులు తదితర వనరులు లేవు. ఉప్పు అమ్మకాలపైనే రాష్ట్రాదాయం ఆధారపడేది. తర్వాత పర్వతాల నుంచి వజ్రాలను వెలికితీశారు. కాలక్రమంలో అదొక పెద్ద వ్యాపారంగా మారింది. పరిశ్రమలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం గుజరాత్ దేశంలోనే అగ్రగామిగా నిల్చింది. ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఆ విధంగా లేదు. ఏపీలో పలు వనరులు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో కష్టపడి పనిచేసే ప్రజలున్నారు. ప్రతి పెద్ద కంపెనీలో ఏపీకి చెందిన వారు ఉద్యోగాలు చేస్తున్నారు’’ అని మోదీ గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ బీజేపీ నేతలకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రానికి అందనంత అత్యధిక సాయాన్ని ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ప్రకటించినందుకు ఏపీ బీజేపీ నేతల బృందం శనివారం ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాలను కలసి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, ఎంపీ గోకరాజు, మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర నాయకులు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. నిరంతరం అండగా..: ప్యాకేజీతో పాటుగా ఏపీ అభివృద్ధికి నిరంతరం అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించిన వాటికి చట్టబద్ధత కల్పించేందుకు బీజేపీ అగ్ర నేతలు హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమాల అమలు కాలపరిమితిలో జరగాలని కేంద్రాన్ని కోరామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించిందని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ వల్లే గెలిచా..: జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఏపీకి ప్రకటించిన ప్యాకేజీని అర్థం చేసుకొని ఎన్డీఏ కృషిని స్వాగతిస్తారని భావిస్తున్నానని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. పవన్ వల్లే తాను ఎన్నికల్లో గెలిచానని తెలిపారు. శుక్రవారం పవన్ సమావేశానికి తమ అనుచరులు కూడా హాజరయ్యారని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, పి.రఘురాం తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు. -
'శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి'
శ్రీశైలం: శ్రీశైలంలో కొలువుతీరిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి పి. మాణిక్యాలరావు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావుతో కలిసి భ్రామరాంబ పుష్కరవనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. -
మచ్చలేని పాలన బీజేపీ సొంతం
భీమవరం : మచ్చలేని పాలన బీజేపీ సొంతమని, రెండేళ్ల పాలనను అవినీతి రహితంగా పూర్తి చేయడం తమ పార్టీ ఘనత అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. భీమవరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శనివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ అధ్యక్షతన నిర్వహించిన వికాస్ పర్వ్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనంతా అవినీతే ప్రధాన ధ్యేయంగా సాగిం దని విమర్శించారు. అందుకు భిన్నంగా నరేంద్రమోదీ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తోందని మాణిక్యాలరావు పేర్కొన్నారు. కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ గుర్తింపు పొందిందన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 28లక్షల మంది పార్టీ సభ్యులున్నారని చెప్పారు. విదేశాల్లో సైతం మన దేశం గౌరవ ప్రతిష్టలు పెంపొందించడానికి ప్రధాని మోదీ కృషిచేస్తుంటే, కొందరు రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమన్నారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ.65 వేల కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.25 వేల కోట్లను కేవలం నూతన రాజధాని అమరావతికి కేటాయించారని వివరిం చారు. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసే లక్ష్యంతో కేంద్రం ఉందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారం కోసం కాకుండా ఒక సిద్ధాంతం కోసం పని చేస్తోందన్నారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ పార్టీ మనకేం చేసిందని కాకుండా, పార్టీకి మనమేం చేశామని ప్రశ్నించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. పార్టీ నాయకులు పీవీఎస్ వర్మ, డీఆర్కే రాజు, న రసింహారెడ్డి, కోడూరి లక్ష్మీనారాయణ, అల్లూరి సాయిదుర్గరాజు, కురెళ్ల నరసింహరావు, బూచి సురేంద్రనాథ్ బెనర్జీ పాల్గొన్నారు. -
నాన్నే నాకు ప్రేరణ
తాడేపల్లిగూడెం : బంధాలకు విలువ ఇస్తూ.. ధైర్యంగా, నిజాయితీగా ఎలా బతకాలనే విషయంలో నాన్నే నాకు ప్రేరణ. నాన్నతో తండ్రిగా కంటే.. స్నేహితురాలిగా అన్ని విషయాలనూ షేర్ చేసుకుంటుంటాను. నాన్నలో కష్టపడే తత్వం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆయనే ఆదర్శం. కుటుంబ సభ్యులపై ఆయన చూపే వాత్సల్యం, కుటుంబంతో ఆయన మమేకమైన తీరును నాన్నమ్మ చెబుతుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఈ విషయంలో ఆయన నాకు రోల్మోడల్. బిడ్డ వ్యక్తిత్వాన్ని, ఇష్టాయిష్టాలను గౌరవించే తండ్రి నాకు దొరకడం అదృష్టం. ప్రతి సమస్యనూ ఒంటరిగానే ఎదుర్కోవాలంటారు నాన్న. నాన్న నా పక్కన ఉంటే కొండంత ధైర్యం. ఎప్పుడైనా డిప్రెషన్ అనిపిస్తే వెంటనే నాన్న దగ్గరకు వెళతా. నాన్నకు కుదిరినప్పుడు ఆయనతో మార్నింగ్ వాక్కు వెళుతుంటా. నడిచే దారిలో చాలా విషయాలు చెబుతారు. నాన్న, నేను కలిసి అమ్మను ఆటపట్టిస్తుంటాం. అమ్మ మా ఇద్దర్నీ ఆటపట్టిస్తుంటుంది. ఏడు నదుల పుష్కరాలకు నాన్నతో కలిసి వెళ్లా. - గట్టిం సింధు, పైడికొండల మాణిక్యాలరావు కుమార్తె -
రాజీనామా చేస్తానన్న మంత్రి... దిగొచ్చిన బాబు
జెడ్పీ చైర్మన్ బాపిరాజుపై సీఎం ఆగ్రహం మిత్రపక్షంతో ఘర్షణ వైఖరి తగదని హితవు నష్ట నివారణ బాధ్యత కళా వెంకట్రావుకు అప్పగింత ఏలూరు : రాజీనామా చేస్తానన్న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వ్యాఖ్యలతో దిగివచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. జెడ్పీ చైర్మన్ ముళ్ల పూడి బాపిరాజుపై మండిపడ్డారు. భవిష్యత్లో ఇటువంటి చర్యలకు పాల్పడవద్దంటూ అక్షింతలు వేశారు. సమస్య పరిష్కార బాధ్యతను ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు, రెడ్డి సుబ్రహ్మణ్యంకు అప్పగించారు. పెంటపాడు మండలం ఆకుతీగపాడు, పడమర విప్పర్రు, అలంపురం గ్రామాల్లో సుమారు రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులు ప్రారంభించడానికి జెడ్పీ చైర్మన్ బాపిరాజు బుధవారం ఏర్పాట్లు చేసుకున్న సంగతి విదితమే. ఈ విషయాన్ని మంత్రి మాణిక్యాలరావుకు తెలియజేయలేదు. దీనిపై ఆగ్రహించిన మంత్రి విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన ఆయన ఒక దశలో పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారనే ప్రచారం జరిగింది. దీంతో కంగుతిన్న టీడీపీ నేతలు రంగంలోకి దిగి సీఎం చంద్రబాబు ఎదుట పంచాయితీ ఏర్పాటు చే శారు. గురువారం రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇరువర్గాలతో సమావేశమయ్యారు. ఫిర్యాదుల కట్టతో సీఎం చెంతకుముఖ్యమంత్రి సమక్షంలో పంచాయితీకి వెళ్లేముందు జెడ్పీ చైర్మన్ బాపిరాజు పెద్ద కసరత్తే చేశారు. తాడేపల్లిగూడెంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీపీలు, ఇతర ముఖ్య నాయకులతో గురువారం ఉదయం సమావేశమయ్యారు. మంత్రికి వ్యతిరేకంగా వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తల క్లిప్పింగులను సేకరించి ఒక ఫైల్ తయారు చేశారు. ఓటుకు నోటు కేసు వెలుగు చూసిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పదవి నుంచి తప్పుకోక తప్పదని మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలు చేశారని, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారనే ఫిర్యాదులను సైతం సిద్ధం చేశారు. ముఖ్యంగా మైనారిటీ నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఇవన్నీ ముఖ్యమంత్రి ఎదుట ఉంచి పంచాయితీ చేయాలని భావించారు. అయితే, చంద్రబాబు అందుకు అవకాశం ఇవ్వలేదని సమాచారం. బాపిరాజు తాడేపల్లిగూడెంకు సంబంధించిన అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేయగా సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ‘నువ్వేం చెప్పవద్దు. గతంలోనే నీకు చెప్పాను. ఇది మంచి పద్ధతి కాదు. మిత్రపక్షాన్ని కలుపుకుపోవాల్సిన సమయంలో సమస్యలు సృష్టించవద్దు’ అని గట్టిగా చెప్పడంతో బాపిరాజు మౌనం వహించినట్టు సమాచారం. ఇదిలావుండగా, జెడ్పీ చైర్మన్ తీరుపై మంత్రి మాణిక్యాలరావు తన వాదనను గట్టిగానే వినిపించినట్టు భోగట్టా. తాను నియోజకవర్గంలో లేని సమయంలోనే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని ఆధారాలతో సహా ముఖ్యమంత్రి ముందు ఉంచారు. తాను మంత్రిని అయినా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేననే కనీస ప్రోటోకాల్ కూడా పాటించకుండా చేపడుతున్న కార్యక్రమాలు ఇబ్బందిగా మారుతున్నాయని మంత్రి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. భవిష్యత్లో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ముఖ్యమంత్రి బాధ్యత అప్పగించారు. -
కేంద్రానికి ఏపీ అల్లుడు
రాష్ట్రాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తారు అడ్డగోలు విభజన వల్లే కాంగ్రెస్ భూస్థాపితం వికాస్ పర్వ్లో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఒంగోలు : కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లుడిలా భావించి అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. వరకట్న నిషేధ చట్టం సమయంలో అల్లుడికి కట్న కానుకలను పసుపు కుంకుమల పేరుతో మామలు ముట్ట చెబుతున్నట్లే నేడు ప్రత్యేక హోదా నిషేధం అయినందున ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక ప్యాకేజీల రూపంలో లక్షల కోట్ల నిధులు ఇస్తున్నామని, అందువల్లే ఏపీ జీడీపీ 10.99గా ఉందన్నారు. గురువారం ఒంగోలులోని కాపు కల్యాణమండపంలో మోదీ పాలన రెండేళ్లు పూర్తరుున సందర్బంగా బీజేపీ నిర్వహించిన వికాస్పర్వ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో రాష్ట్రంలో బీజేపీ తప్ప మిగితా పార్టీలు, కార్మిక వర్గాలు అంతా సమైక్య నినాదాన్నే చేశాయన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేసినందునే కాంగ్రెస్ భూస్థాపితమైందని మంత్రి స్పష్టంచేశారు. ఇప్పటికి కూడా సోనియాగాంధీ, రాహుల్గాంధీలు అవినీతి చేయాలని చూస్తున్నారని, అదే జరిగితే తీహార్ జైలు ఖాయం అన్నారు. పదేళ్లు కాదు..మీరిస్తామన్న అయిదేళ్లు ప్రత్యేక హోదా అయిన విభజన చట్టంలో ఏమైందో చెప్పాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నెత్తిన మొట్టి నిలదీయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. భారతీయ జనతా మహిళా మోర్చా జాతీయ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ గ్రామసీమల్లోను, అమరావతిలోను రోడ్లకోసం వెచ్చిస్తున్న నిధులంతా కేంద్రం జారీచేసినవే అన్నారు. రామాయపట్నం పోర్టుకు కూడా కేంద్రం సిద్దంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే 5వేల ఎకరాలు సేకరించి కేంద్రానికి అప్పచెప్పిన వెంటనే కేంద్రం పోర్టు నిర్మాణానికి సంసిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా, చివరకు కాంగ్రెస్ పాలనలో సైతం కేంద్రం జారీచేసే నిధులకు రాష్ట్రప్రభుత్వం ప్రధాని ఫొటోను, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రచురిస్తుందని, కానీ ఏపీలో మాత్రం అటువంటి పరిస్థితి కనబడడంలేదన్నారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పులి వెంకట కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా పార్టీ నాయకులు ఎస్.రవీంద్రరాజు, పాతూరి వెంకట సుబ్బారావు, బత్తిన నరశింహారావు, కందుకూరి సత్యన్నారాయణ, మువ్వల వెంకట రమణారావు, మీనాకుమారి, గోలి నాగేశ్వరరావు, పేర్ల సుబ్బన్న, నరాల రమణారెడ్డి, ఈదా సుధాకరరెడ్డి, ఖలీఫాతుల్లాభాషా, ఎం.వెంకటేశ్వర్లు, సెగ్గం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాపులపై వేధింపులను ఉపసంహరించుకోవాలి.. సమావేశం ప్రారంభానికి ముందుగా కాపు సంఘం నేతలు గాదె కృష్ణారావు, ధనుంజయ, కొక్కిరాల సంజీవ్కుమార్, తోట రంగారావు, ఆరిగ చలమయ్య తదితరులు మంత్రి మాణిక్యాలరావును దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం ముద్రగడ పద్మనాభం చేపడుతున్న దీక్షకు సంబంధించి వినతిపత్రాన్ని ఆయనకు అందించారు. తునిలో జరిగిన ఘటనలో అమాయకులను కేసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని, గతంలో సీఎం చెప్పినట్లుగా కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. కాపులను బీసీలలో చేర్చే అంశంపై మంజునాధన్ కమిషన్ వేసినా వాస్తవానికి ఇంతవరకు కమిషన్ అడుగు కూడా ముందుకు వేయలేదని, కనుక తక్షణమే కమిషన్ చర్యలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. -
‘లెక్క’లేదు
ఆస్తుల వివరాలు వెల్లడించని ఎమ్మెల్యేలే అధికం ఇద్దరు మంత్రులదీ అదే తీరు వివరాలు ఇవ్వని వారిలో ప్రభుత్వ విప్ చింతమనేని సహా 10 మంది ఏలూరు : శాసనసభలో జిల్లా సమస్యలను ప్రస్తావించడంలోను.. అభివృద్ధికి దోహదపడే చర్చల్లోనూ నోరుమెదపని జిల్లాలోని ప్రజాప్రతినిధు లు తమ ఆస్తుల వివరాలను వెల్లడించే విషయంలోనూ వెనుకబడే ఉన్నారు. వైఎస్సార్ సీపీ నేతలపై అడ్డగోలుగా విరుచుకుపడే ఎమ్మెల్యేల్లో చాలామంది తమ ఆస్తుల వివరాలను మాత్రం ఇంతవరకు శాసనసభకు సమర్పించలేదు. ప్రస్తుత శాసనసభ కొలువుదీరి 20నెలలు కావస్తున్నా మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సహా జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు ఆస్తుల లెక్కలను శాసన సభకు ఇవ్వలేదు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తాజాగా వెల్లడించిన జాబితాలో ఆస్తుల వివరాలు ప్రకటించిన వారిలో మన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఐదుగురు మాత్రమే ఉన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఆస్తుల వివరాలను శాసన సభకు సమర్పించారు. -
ఇద్దరి మధ్య ‘ఇగో’ చిచ్చు
ఏలూరు : పోటాపోటీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు తహతహలాడాల్సిన టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ నాయకులు ‘ఇగో’ సమస్యతో కత్తులు దూస్తున్నారు. ఎక్కడికక్కడ తమ వర్గానిదే పైచేయి కావాలంటూ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, టీడీపీ నేత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య కొన్నాళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. తాజా గా సోమవారం ఆ ఇద్దరూ ఇరు పార్టీల శ్రేణుల సమక్షంలోనే ఆరోపణలు గుప్పించుకున్నారు. తాడేపల్లిగూడెంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, దేవాదాయ శాఖ మం త్రి పైడికొండల మాణిక్యాలరావు పెంటపాడు మండలం ప్రత్తిపాడు వెళ్లారు. అక్కడ పంచాయతీ కార్యాలయంలో వారికి అల్పాహారం ఏర్పాటు చేయగా, అదే సమయానికి జెడ్పీ ముళ్లపూడి బాపిరాజు, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. బాపిరాజు మంత్రి మాణిక్యాలరావును ఉద్దేశించి ‘నమస్కారం మినిస్టర్ గారూ.. మా పార్టీ వాళ్లను కాస్త చూడండి. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి చాలా కష్టాలు పడ్డారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఇటీవల ప్రత్తిపాడులో మీరు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించేందుకు వెళ్లినప్పుడు అక్కడ మా ఎంపీటీసీకి కనీస సమాచారం ఇవ్వలేదు. ఇలాగైతే ఎలా’గని అసహనం వ్యక్తం చేశారు. ‘టీడీపీ శ్రేణులను కాకుండా ప్రతిపక్ష పార్టీల వాళ్లను మీరు వెంటేసుకుని తిరుగుతూ ప్రోత్సహిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఏం మాట్లాడుతున్నారు. 35 ఏళ్లు నేను కూడా ప్రజాసేవలో ఉండే రాజకీయాల్లోకి వచ్చాను. నేనేం చేయాలో మీరు చెబుతారా’ అని మాణిక్యాలరావు ఘాటుగానే మాట్లాడినట్టు తెలిసింది. వాగ్వాదం ముదిరి పరిస్థితి ఒకింత ఉద్రిక్తపూరితంగా మారడంతో మంత్రి శిద్ధా రాఘవరావు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప చేశారు. -
అవసరమైతే సీలేరు జలాలు
తాడేపల్లిగూడెం : దాళ్వా పంటను రక్షించుకునేందుకు అవసరమైతే సీలేరులో విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేసి నీటిని గోదావరి డెల్టాకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రైతులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాళ్వా పంట ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని సాగుకు నీరందించేందుకు సీలేరు నీటిని గోదావరికి మళ్లించడం జరుగుతుందన్నారు. గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోతున్న దృష్ట్యా మార్చి ఒకటో తేదీకల్లా దాళ్వా సాగు ముగించేలా రైతులు సన్నద్ధం కావాలని మంత్రి కోరారు. ఈ నెలాఖరు నాటికి నారుమడులను పూర్తి చేసుకోవాలని సూచించారు. వంతుల వారీ విధానంలో దాళ్వా పంట చేలకు సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. స్లూయిస్లు, షట్టర్లు మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. జల వనరుల శాఖ ఎస్ఈ బాబు, ఈఈ శ్రీనివాస్,పెంటపాడు వాటర్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ బూరుగుపల్లి త్రినాథరావు, రావిపాడు సొసైటీ అధ్యక్షుడు ములగాల బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
నోటీస్ బోర్డులో కబ్జాదారుల వివరాలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 వేల ఎకరాల దేవాలయ భూములు కబ్జాదారులు కబ్జా చేశారని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు తెలిపారు. కబ్జాదారుల వివరాలు దేవాలయాల వద్ద నోటీస్ బోర్డులో ఉంచుతామని తెలిపారు. పోలవరం పనుల నిర్మాణం తీరుపై తమ పార్టీ పూర్తి సంతృప్తితో ఉందన్నారు. పోలవరంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పోలవరం పనులను వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అలాగే పోలవరం పనుల్లో జరగుతున్న జాప్యాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశామని మాణిక్యాలరావు చెప్పారు. అక్టోబర్ నెలాఖరు నాటికి ఈ ప్రగతి వెబ్ సైట్లో ఆలయ సేవలు, ఆస్తులు, ఆభరణాల వివరాలు పొందుపరుస్తామన్నారు. -
పవన్ రాజకీయ స్వార్థం కోసమే..
మంత్రాలయం(కర్నూలు జిల్లా): తన రాజకీయ స్వార్థం కోసమే జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ రాజధాని భూముల విషయంలో రైతులను రెచ్చగొడుతున్నారని దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు విమర్శించారు. సోమవారం సాయంత్రం మంత్రాలయంలో ఓ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం దాదాపు భూసేకరణ పూర్తి కావచ్చిందన్నారు. కేవలం మూడు వేల ఎకరాలకు సంబంధించిన రైతులను రెచ్చగొట్టే ప్రయత్నంలో జనసేన పార్టీ ఉందన్నారు. ఇప్పటికే 90 శాతం భూములను రాజధాని కోసం రైతులు ఇచ్చారన్నారు. ఇప్పటికైనా ఇతర పార్టీలు రాజకీయ స్వార్ధం వీడి రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు. -
20న నిట్కు శంకుస్థాపన
తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా): నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఏర్పాటుకు ఈనెల 20న శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నెల 20న ఉదయం 8.30లకు కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని ఆయన చెప్పారు. -
ఈ నెల 26న నిట్కు శంకుస్థాపన
తాడేపల్లి గూడెం: ఈ నెల 26న నిట్ శాశ్వత భవనాలకు శంకు స్థాపన చేయనున్నట్లు దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. -
సీఎం చంద్రబాబుకు మంత్రి ఝలక్
•పుష్కరాల కార్యక్రమాలపై కేబినెట్లో చర్చ •దేవాదాయ మంత్రి, అధికారులపై సీఎం అసంతృప్తి •దీటుగా స్పందించిన మంత్రి మాణిక్యాలరావు •మాకు సంబంధం లేకుండా కార్యక్రమాలు •చేపడుతూ మమ్మల్ని నిందించడం సరికాదని వ్యాఖ్య •మంత్రి ప్రశ్నకు సమాధానమివ్వలేక మౌనం దాల్చిన చంద్రబాబు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మిత్రపక్షమైన బీజేపీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు షాకిచ్చారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో గోదావరి పుష్కరాల నిర్వహణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగు రోజుల కిందట రాజమండ్రిలో నిర్వహించిన అఖండ హారతి కార్యక్రమానికి అంతగా ప్రచారం రాలేదని, అందుకు ఏర్పాట్లు చేయకపోగా సరిగా నిర్వహించలేదంటూ అధికారులతో పాటు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి మంత్రి దీటుగా సమాధానమిచ్చి సీఎంని షాక్కు గురిచేసినట్టు సమాచారం. పుష్కరాల కార్యక్రమాలు పేరుకు మాత్రమే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సాగుతున్నాయని, ఏ కార్యక్రమంలోనూ తమ శాఖకు పాత్ర ఉండటంలేదని మంత్రి సమాధానమిచ్చినట్లు తెలిసింది. పుష్కరాలకు సంబంధించి మొత్తం పనులు, బాధ్యతలు మీ సొంత పార్టీకి చెందిన మంత్రులకు అప్పగించి సరిగా జరగడం లేదని తమను నిందించడంలో అర్థం లేదని మాణిక్యాలరావు అన్నట్లు సమాచారం. పుష్కరాలపై వేసిన కమిటీలన్నింటినీ తనకు సంబంధం లేకుండా నియమించారని, అలాంటప్పుడు తమను తప్పుబట్టడం సరికాదని ఆయన సూటిగా చెప్పడంతో చంద్రబాబు సమాధానమివ్వలేక మౌనం దాల్చారు. కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని మొదటి నుంచీ చెబుతున్న చంద్రబాబు, పుష్కరాల కార్యక్రమాలు వేటిలోనూ దేవాదాయ శాఖను భాగస్వామ్యం చేయలేదు. పైగా పుష్కరాల కోసం ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ నేతృత్వంలో ఒక కమిటీని, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మరో కమిటీని, మంత్రి నారాయణ నేతృత్వంలో మరో కమిటీని నియమించారు. వీటిలోనూ దేవాదాయ శాఖ మంత్రికి భాగస్వామ్యం లేదు. వివిధ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లోనూ మాణిక్యాలరావు ప్రమేయం లేదు. ఆఖరుకు పుష్కరాల లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా కేవలం గంట ముందు మంత్రికి సమాచారమిచ్చారు. అప్పటివరకు ఒక లోగో తయారు చేస్తున్నారన్న సమాచారం కూడా మంత్రికి లేదు. మరోవైపు పుష్కరాలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశాలకూ తగిన సమయంలో సమాచారమివ్వకపోగా, మాణిక్యాలరావును దాదాపుగా దూరం పెట్టారు. ఇంతకాలం ఇవేవీ పట్టించుకోనప్పటికీ, కార్యక్రమాలు సరిగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేయడమేంటని మంత్రి మాణిక్యాలరావు దీటుగా సమాధానం చెప్పడంతో ముఖ్యమంత్రి ఇరకాటంలో పడ్డారని తెలిసింది. -
జూలై 14 నుంచి గోదావరి పుష్కరాలు
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగ కర్తలు నిర్ణయించిన ముహూర్తం మేరకు గోదావరి పుష్కరాలు జులై 14 నుంచి ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. గురువారం శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ... పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని 1971 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే పురపాలక, పట్టణాభివద్ధి శాఖ నుంచి 898 పనులు, రోడ్లు, భవనాలు శాఖ ద్వారా 277, సాగునీరు, ఆయకట్టు ప్రాంతాల అభివద్ధి శాఖ నుంచి 244, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 72, దేవాదాయ శాఖ ద్వారా 441, ఏపీఈపీడీసీఎల్ శాఖ నుంచి 39 పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. వీటి కోసం రూ. 1162.11 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వ సహాయంగా రూ. 600 కోట్లు అడిగామన్నారు. -
మోదీతోనే దేశాభివృద్ధి
చింతలపూడి : దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే సత్తా ప్రధాని నరేంద్రమోదీకే ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. చింతలపూడి పాత బస్టాండ్ సెంటర్లో బీజేపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ కన్వీనర్ తుల్లిమెల్లి కుటుంబరావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి సాధిస్తుందని నమ్మి జన్ధన్, స్వచ్ఛభారత్ వంటి వినూత్న కార్యక్రమాలను మోదీ ప్రవేశపెట్టారన్నారు. అధికారం చేపట్టగానే ప్రజలకు అవసరం లేని 70 చట్టాలను రద్దు చేశారన్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి సంతకాలను తీసుకునే విధానంతో పాటు, నోటరీ చేయించే పద్ధతిని మోదీ రద్దు చేశారని, ఇకపై సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే కారణమని అన్నారు. సమావే శంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, నియోజకవర్గ కన్వీనర్ కుటుంబరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బీవీ నాగచంద్రారెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం పలువురు మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. సభలో పట్టణ బీజేపీ కన్వీనర్ కొనకళ్ల రాము, బీజేపీ రాష్ట్ర నాయకులు పీవీఎస్ వర్మ, రామ్మోహన్రావు, కె.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.త్వరలో ఆలయ కమిటీల భర్తీరాష్ట్రంలోని ఆలయ కమిటీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రగడవరంలోని శ్రీశ్రీశ్రీ విజయ శంకర బాల కనక దుర్గాదేవి శివ పంచాయతన క్షేత్రాన్ని సందర్శించారు. ద్వారకాతిరుమలలో సాంకేతిక విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. -
పీఎంపీలకు శిక్షణ ఇచ్చేలా కృషి
తాడేపల్లిగూడెం :(తాలూకా ఆఫీస్ సెంటర్) :నూతన వైద్య విధానంపై పీఎం పీలకు శిక్షణ ఇచ్చే విధంగా రాష్ట్ర కేబినెట్లో చర్చించి కృషి చేస్తానని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జిల్లా 52వ వార్షికోత్సవ సమావేశం శనివారం స్థానిక జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వి. మురళీ కృష్ణమూర్తి అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ జనవరి 2న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి నూతన వైద్య విధానంపై శిక్షణ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు కోసం చర్చిస్తానని తెలిపారు. పీఎంపీలు సీజనల్ రోగాలపైన, ఎయిడ్స్ తదితర వ్యాధులపైన ప్రజ లను అప్రమత్తం చేయాలని కోరారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు, చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ను సన్మానించారు. అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు శిరిగినీడి నాగభూషణం, పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు మోదుగ కృష్ణారావు, సెంట్రల్ యాక్షన్ కమిటి చైర్మన్ వీబీటీ రాజు, పీఎంపీ రాష్ట్ర సలహాదారు కె. ఎస్.ఎన్.బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కోటేశ్వరరావు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పీఎంపీలు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి తాడేపల్లిగూడెం : నియోజకవర్గ అభ్యున్నతికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సూచించారు. శనివారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, మునిసిపల్ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. గూడెం పరిధిలో ఆర్అండ్బీ రహదారుల అభివృద్ధికి రూ.14 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పట్ణణంలో వివిధ పనుల కోసం రూ.2.50 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. పురపాలక సంఘంలో పారిశుధ్యం మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రెండో ఫ్లైఓవర్ వంతెన కోసం సేకరించిన స్థలంలో నిర్వాసిత కుటుంబాలకు శివాలయం సమీపంలో స్థలాలు కేటాయించేందుకు ఏర్పాటు చేసినట్టు తహసిల్దార్ నాగమణి మంత్రికి వివరించారు. బీసీ రుణాల దరఖాస్తు స్వీకరణ తేదీని పెంచేందుకు సంబంధిత శాఖ మంత్రి ర వీంద్రతో చర్చిస్తున్నట్టు మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పెంటపాడు/తాడేపల్లిగూడెం : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శనివారం మండలంలోని ముదునూరు, ఆకుతీగపాడు, కోరిమిల్లి, కె.పెంటపాడు, యానాలపల్లి, జట్లపాలెంలో రైతు సాధికార సదస్సులు నిర్వహించారు. మదునూరులో సర్పంచ్ అద్దంకి పెద వెంకట రత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా రుణమాఫీ, పింఛన్ల పంపిణీని చేపట్టామన్నారు. రుణమాఫీతో సుమారు 32 లక్షల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలగనున్నట్టు చెప్పారు. ఉద్యాన పంటలకు ఎకరానికి రూ.10 వేలు అందించే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన 48 గంటల్లో సొమ్ము ఇచ్చే ఏర్పాటు చేశామని, అలా అందకపోతే తనను సంప్రదించాలని రైతులకు సూచించారు. ఈనాం భూముల పాస్బుక్ల జారీకి కలెక్టర్ కె.భాస్కర్తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఎంపీపీ పెదపోలు వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సభ్యులు కిలపర్తి వెంక ట్రావు, డీసీసీబీ డెరైక్టర్ దాసరి అప్పన్న, ఎంపీటీసీ సభ్యురాలు అద్దంకి ఆశాజ్యోతి, మాజీ సర్పంచ్ బుద్దన బాబు, ఆకుతీగపాడు బాబు, పాలూరి బాస్కరరావు, ఎంపీడీవో జీవీకే మల్లికార్జునరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పడాల ఉమాశంకర్, మండల ఐకేపీ ఏపీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగున్నరేళ్లలో ‘పోలవరం’ నిర్మాణం
పెనుగొండ రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాలుగున్నరేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని చెప్పారు. ఆదివారం పెనుగొండలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి, కృష్ణా జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, రాయలసీమకు దాహర్తి తీరుతుందని, రాష్ట్రానికి విద్యుత్ కొరత ఉండదని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు కృషి రాష్ట్రాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు అన్నివిధాల కృషి చేస్తున్నారని తెలిపారు. సింగపూర్, జపాన్లలో పర్యటించి పారిశ్రామిక వేత్తలను ఆకర్షించారన్నారు. పరిశ్రమలకు 24 గంటలు నీరు, విద్యుత్ సదుపాయాలు అందించడానికి పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించినట్టు మాణిక్యాలరావు చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పడానికి ఎందరో పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని, దీంతో యువతకు ఉపాధి పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో 85 శాతం మందికి లబ్ధి చే కూరిందని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే ఉద్యాన పంటలకూ రుణమాఫీని వర్తింపచేశామన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక యువజన నాయకులు మంత్రి మాణిక్యలరావును సత్కరించారు. సమావేశంలో జెడ్పీటీసీ రొంగల రవికుమార్, ఎంపీటీసీ ఏడిద కోదండ చక్రపాణి, బీజేపీ నాయకులు పిల్లి వెంకట సత్తిరాజు, కానూరి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్
తాడేపల్లిగూడెం : రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. ప్రజలు సుఖ, సౌఖ్యాలతో ఉండాలంటే స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శనివారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన స్వచ్ఛభారత్లో వారు పాల్గొన్నారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు రహదారులను, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రజలు దేశభక్తి ప్రేరణతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. చేయి చేయి కలిపి స్వచ్ఛభారత్లో ముందుకెళితే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు స్వచ్ఛభారత్ నిర్వహించనున్నట్టు చెప్పారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ప్రతి వారూ తమ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటురోగాలను తగ్గించవచ్చన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ దేశాన్ని శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం కోసం రూ. 62 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు మాట్లాడుతూ కేవలం రోడ్లు, పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మనసు, హృదయాలను పవిత్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, డీఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు నరసింహరాజు, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ , తాడేపల్లిగూడెం ఎంపీపీ పరిమి రవికుమార్, టీవీ ఆర్టిస్టు రవికిరణ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఖండభట్టు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
మిలమిలా గోదారి
సాక్షి, రాజమండ్రి : గోదావరి నది మధ్యలో గోదావరి మాత భారీ విగ్రహం నెలకొల్పడంవల్ల రాజమండ్రికి ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యత లభిస్తుందని రాష్ర్ట దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ చేసిన ఈ ప్రతిపాదనను ఆయన స్వాగతించారు. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాజమండ్రి పుష్కర ఘాట్లో గోదావరి నదికి కార్తిక పున్నమి హారతి నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను ప్రపంచం గర్వించే రీతిలో నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం నెలకోసారి పౌర్ణమి నాడు మాత్రమే నిర్వహిస్తున్న హారతిని ప్రతి రోజూ ఇచ్చేవిధంగా చర్యలు చేపడతామన్నారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, తెలుగునాట ముమ్మాటికీ రాజమండ్రియే సాంస్కృతిక రాజధాని అని, తమిళనాడులో తంజావూరు మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిని ప్రకటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు తెలుగు భాష ప్రధాన కేంద్రంగా కూడా రాజమండ్రినే ఎంపిక చేయాలన్నారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ, అందరూ సహకరిస్తే గోదావరి మధ్యలో భారీ ఎత్తున గోదావరి మాత విగ్రహాన్ని మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి 144 సంవత్సరాలకు గోదావరి నదికి వచ్చే విశేష పుష్కరాలకు వచ్చే ఏడాది రాజమండ్రి వేదిక అవుతోందని, వీటిని ముందు తరాలవారు చూడలేకపోయారని, ముందు తరాలు కూడా చూడలేరని, మనకు మాత్రమే ఆ అదృష్టం దక్కిందని అన్నారు. మాజీ డీజీపీ అరవిందరావు మాట్లాడుతూ, గోదావరికి షోడశోపచారాలతో వైదిక సంప్రదాయాలతో జరుగుతున్న పున్నమి హారతి కార్యక్రమం భక్తుల్లో భక్తితో పాటు జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుందన్నారు. స్వామి విజ్ఞానానంద మాట్లాడుతూ నదులు పరోపకారార్థం ఉద్భవించినవని, వాటినుంచి మనం నిస్వార్థ సేవ నేర్చుకోవాలని, వాటిని పరిరక్షించుకోవాలని అన్నారు. బుద్ధవరపు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీఎస్ కుమార్ సారథ్యంలో జరిగిన ఈ పున్నమి హారతికి వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో పబ్లికేషన్స్ అధినేత డాక్టర్ విజయ్కుమార్, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, చైతన్యరాజు, రవికిరణ్వర్మ, రాజమండ్రి మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేశ్, రామకృష్ణంరాజు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ, శ్రీలంకకు చెందిన పర్యావరణ పరిరక్షణ నిపుణుడు, రచయిత దయాదిశ నాయకే, గంగా పరిరక్షణకు కృషి చేస్తున్న స్వామి విజ్ఞానానందజీ, రామదూతస్వామి, రైల్వే అడిషనల్ డీజీ కిశోర్కుమార్, సమాచార శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు, మాజీ డీజీపీ అరవిందరావు, ప్రముఖ పాత్రికేయులు శ్రీనివాస్, వల్లీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు
స్కిన్నెరపురం (అత్తిలి) : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. మండలంలో స్కిన్నెరపురం, కంచుమర్రు గ్రామాల్లో బుధవారం జన్మభూమి-మా ఊరు సభ జరిగింది. స్కిన్నెరపురంలో జరిగిన సభకు మంత్రి సుజాత, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. జిల్లాలో రెండు, మూడు రోజుల్లో ఇసుక సమస్య తీరుతుందన్నారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో సమస్యలు నెలకొన్నాయని, భవిష్యత్ అవసరాలను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు జన్మభూమి కార్యక్రమం వేదికగా ఉందన్నారు. ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని, ఐఎస్ఎల్ నిర్మాణానికి రూ.12 వేలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజలను భాగస్వాములు చేసి, పేదరికాన్ని జయించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ సందర్భంగా పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. గర్భిణులకు సీమంతం చేసి, సారెను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేతా సత్యనారాయణ, వైస్ ఎంపీపీ దిరిశాల భీమరాజు, జెడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, సర్పంచ్లు వనుం రామ కనకదుర్గ, దొంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల పవిత్రతను కాపాడడం అందరి బాధ్యత
జుత్తిగ (పెనుమంట్ర) : ఆలయాల పవిత్రతను కాపాడే బాధ్యత భక్తులతో పాటు సిబ్బంది, అర్చకులపై కూడా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. జుత్తిగలోని ఉమావాసుకీరవి సోమేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం ఆయన సతీసమేతంగా సందర్శించి పూజలు నిర్వహించారు. స్వామి వారికి రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బీవీఎస్.వర్మ, మండల పార్టీ అధ్యక్షుడు గంటా హనుమంతరావు, మహిళామోర్చా అధ్యక్షురాలు చిటికెన నాగలక్ష్మిరామస్వామి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోకల రామోహనరావు తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వరాలయ అభివృద్ధికి కృషి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జుత్తిగ సోమేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తానని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మంత్రి ఆలయ సందర్శనలో భాగంగా ట్రస్టుబోర్డు చైర్మన్ సత్తిరాజు వెంకటశ్రీ రామారావు ఆలయ ఆదాయ వివరాల నివేదికను మంత్రికి అందజేశారు. ఆలయానికి చెందిన సుమారు 37 ఎకరాల ఈనాం భూములు అన్యాక్రాంతమైన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఈ అంశంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. -
సాయంలోనూ రాజకీయాలా
తాడేపల్లిగూడెం : తుపాను బాధితులకు సాయం చేయడంలోనూ రాజకీయాలు చేస్తారా.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉండే ప్రాంతాల్లో మాత్రమే సాయం చేయాలా.. ఇదేం న్యాయం.. అంటూ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం సాయం అందించేవాడు బాధితుడు ఔనా.. కాదా అనేది మాత్రమే ప్రామాణికం కావాలి కానీ అతడు టీడీపీనా, బీజేపీయా అనే కోణంలో చూడడం దారుణమంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక గుణ్ణం ఫంక్షన్ హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వైఖరిపై మంత్రి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో హుదూద్ తుపాను బాధితులకు సాయం అందించే విషయంలో గూడెం ప్రాంతంలో సేకరించిన వస్తువులు, ఇతర సామాగ్రి టీడీపీ నాయకులున్న చోట మాత్రమే పంచాలని, అక్కడికే పంపాలని బాపిరాజు చెప్పినట్టుగా తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది సరైనా పద్ధతా అని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలు చేసే వారికి మునిసిపల్ వైస్ చైర్మన్ లాంటి వ్యక్తులు మద్దతివ్వవచ్చా అని నిలదీశారు. తాను భీమిలి నియోజకవర్గానికి ఇన్చార్జిగా పనిచేశానని, అక్కడ ఎమ్మెల్యే టీడీపీకి చెందినవారని, అలాగని, బీజేపీకి చెందిన తాను సహాయం అందించ లేదా అని మాణిక్యాలరావు ప్రశ్నించారు. మనం సాయం అందించేవాడు నిజమైన బాధితుడా, అతనికి సహాయం సక్రమంగా అందుతుందా అనే కోణంలో మాత్రమే ఆలోచిస్తామన్నారు. తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీను తుపాను వచ్చిన రోజు సాయంత్రం 15 వేల ఆహారపు పొట్లాలను ఇక్కడి నుంచి తీసుకురాగా, అక్కడ పంచామన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడిన వెంటనే సింహాచలం దేవస్థానం నుంచి ఆహార పొట్లాలను తుపాను ప్రభావిత ప్రాంతంలో సిద్ధంగా ఉంచామన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో చేసుకోవాలి గాని, సహాయ కార్యక్రమాల సమయంలో కాదని మంత్రి విమర్శించారు. ఎన్నికల సమయంలో తాను ఇంటిలో ఉండి రాజకీయాలు చేశానని, ఇలాంటివి తనకు కొత్తేమీ కాదన్నారు. టీడీపీ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని మంత్రి సూచించారు. -
దేవుళ్ల మంత్రిని దూరం పెట్టారెందుకో!
తిరుపతి వెంకన్న, బెజవాడ కనకదుర్గమ్మ నవ్యాంధ్రప్రదేశ్కు సాంస్కృతిక రాయబారులని ఇటీవల ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఘనంగా ప్రకటించారు. ఆదాయపరంగా కూడా కొత్త రాష్ట్రంలో ఈ రెండు పుణ్యక్షేత్రాలే చాలా కీలకం కానున్నాయి. యాధృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో తెలియదు గానీ.. ఆ రెండు క్షేత్రాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. తిరుమల బ్రహ్మోత్సవాలకు కుటుంబ సభ్యులతో వెళ్లిన మంత్రిని అక్కడ సెక్యూరిటీ అధికారులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఆ తర్వాత ఉన్నతాధికారులు కల్పించుకున్నా దేవాదాయ శాఖ మంత్రికి గౌరవ మర్యాదలు దక్కలేదని స్వయంగా మంత్రి వర్గీయులే వాదిస్తున్నారు. ఇక విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్ర ఉత్సవాలకు మంత్రి దూరంగా ఉండాల్సిన పరి స్థితి కల్పించారని అంటున్నారు. ఉత్సవాల సందర్భంగా ఏటా అమ్మవారి జన్మనక్షత్రం (మూలా నక్షత్రం) రోజున దుర్గమ్మకు ముఖ్యమంత్రి లేదా దేవాదాయ శాఖ మంత్రి పట్టు వస్త్రాలను సమర్పిం చడం ఆనవాయితీ. ఎప్పుడైనా ఆ ఇద్దరికీ కుదరని పక్షంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఈ ఏడాది ఇందుకు భిన్నంగా అమ్మవారి జన్మ నక్షత్రం రోజున కృష్ణా జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వాస్తవానికి సీఎం చంద్రబాబునాయుడు మూలా నక్షత్రం రోజుకు నాలుగు రోజులు ముందుగా దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. దీంతో సీఎంకు బదులుగా దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అందరూ భావించారు. కానీ మంత్రి మాణిక్యాలరావు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయనకు అవకాశం ఇవ్వకుండా దేవినేని ఉమకు ఆ అవకాశం కట్టబెడుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చర్చనీయూంశమైంది. అదే రోజున కేబినెట్ సమావేశం ఉన్నందున మాణిక్యాలరావుకు బదులు ఉమకు అవకాశం కల్పించారని అధికార వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి ఆ సమావేశానికి కీలకమైన భారీ నీటి పారుదల శాఖ మంత్రి హోదాలో దేవినేని ఉమ కూడా వెళ్లాల్సి ఉంది కదా అన్న ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. బీజేపీకి చెందిన మంత్రి కావడంతోపాటు సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో కూడా మాణిక్యాలరావును పక్కనపెట్టి దేవినేని ఉమకు అవకాశం కల్పించారని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి దసరా ఉత్సవాల తొలిరోజు నుంచి దూరంగానే ఉన్న మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాల సమర్పణ వ్యవహారంతో అమ్మవారి ఉత్సవాలు ముగిసేవరకూ దూరంగానే ఉన్నారు. దేవాదాయ శాఖకు మంత్రి ఉండి కూడా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకాకపోవడం ఇదే ప్రథమం అని బెజవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తిరుమల సిఫార్సు లేఖల రద్దు వ్యవహారంలో మంత్రి మాణిక్యాలరావు మాట నెగ్గకపోవడం.. ఇప్పుడు దుర్గమ్మ ఉత్సవాలకు మంత్రి ఒక్కసారి కూడా వెళ్లకపోవడం తదితర పరిణామాలు ఎటు దారితీస్తాయోనని కమలనాథులు కలవరపడుతున్నారు. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
'పుష్కరాల్లో గోదావరికి మహా హారతి'
హైదరాబాద్: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో గంగా హారతి తరహాలో గోదావరి హారతి ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో మాణిక్యాలరావు మాట్లాడుతూ... నర్సాపురం, కొవ్వూరు, రాజమండ్రిలలో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలు సందర్భంగా టీటీడీ ఆన్లైన్ బుకింగ్లో 11 వేల టికెట్లు ఉంచుతామన్నారు. గోదావరి పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని చెప్పారు. గతంలో పుష్కరాలకు కేంద్రం రూ. 50 కోట్లు నిధిలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఆసాయాన్ని రూ. 100 కోట్లుకు పెంచాలని కేంద్రాన్ని కోరతామని మాణిక్యాలరావు తెలిపారు. -
'నెలరోజుల్లో టీటీడీ పాలక మండలి ఏర్పాటు'
హైదరాబాద్: టీటీడీ పాలక మండలిని నెలరోజుల్లో ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మాణిక్యాలరావు తెలిపారు. అలాగే కాణిపాకం, విజయవాడ ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉత్సవ కమిటీలపై బుధవారంలోపు నిర్ణయం తీసుకుంటామని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. టీటీడీ పాలక మండలి ఇటీవలే రద్దు అయింది. అయితే టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే చాలా మంది టీడీపీ నాయకులు ఆశగా వేచి చూస్తున్నారు. అయితే దేవాదాయశాఖ కమిషనర్ జేసీ శర్మ అధ్యక్షతన టీటీడీకి ఓ ఆథారటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆథారటీ టీటీడీ పాలక మండలి ఏర్పాటయ్యే వరకు ఆ ఆథారటీ పని చేస్తు ఉంటుంది. -
మన మంత్రులకు ఎన్ని మార్కులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ర్ట మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సర్వే చేయించిన నేపథ్యంలో మన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు ఎన్ని మార్కులు వచ్చాయనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’ అన్న ఆంగ్ల నానుడి ప్రకారం చూస్తే.. తొలి రెండు నెలల పాలనలో మంత్రుల వ్యవహార శైలిపై వెల్లడైన అభిప్రాయమే భవిష్యత్లో వారి పనితీరుకు మరింత పదును పెట్టేందుకు దోహదం చేస్తుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో తొలినాళ్ల పనితీరుపై మన జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాల రావులకు సీఎం ఎన్ని మార్కులు వేశారనేది చర్చంశనీయమైంది. సర్వే ఫలి తాల్లో మధ్య ఆంధ్రప్రదేశ్లోని మంత్రులకు 30.2 శాతంతో సంతృప్తికర మార్కులు రాగా, 51శాతం ఓకే అని, 18.8 శాతం బాగోలేదని తేలింది. ఆ బాగున్న శాతంలో మన జిల్లా మంత్రుల వాటా ఎంత, బాగోలేదని తేలినదాంట్లో మన వాళ్ల శాతం ఎంత అనేదానిపై ఎవరి వద్దా స్పష్టమైన సమాచారం లేదు. టీడీపీ, బీజేపీ వర్గాలు మాత్రం ఎవరికి వారు తమ మంత్రి పనితీరు బాగుందని బాబు మెచ్చుకున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మాణిక్యం చేసిన ప్రతిపాదనలన్నిటికీ ఓకే దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పని తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తికరంగా ఉన్నారని భారతీయ జనతాపార్టీ వర్గాలతోపాటు టీడీపీ శ్రేణులూ వాదిస్తున్నాయి. హడావుడి లేకుండా.. వివాదాలకు పోకుండా తన పనితాను చేసుకుపోయే మాణిక్యాలరావు వ్యవహార శైలిని మొదటి నుంచీ గమనిస్తున్న బాబు ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారని అంటున్నారు. తిరుమలలో సిఫార్సు లేఖల రహిత దర్శనానికి శ్రీకారం చుట్టాలన్న మంత్రి ప్రతిపాదన కష్టసాధ్యమైనప్పటికీ టీడీడీ ఉన్నతాధికారులను చంద్రబాబు హైదరాబాద్ పిలిపించుకుని మరీ విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. గోదావరి జలాలను విజ్జేశ్వరం నుంచి తాడేపల్లిగూడెంకు తరలించేందుకు మంత్రి ప్రతిపాదించిన రూ.129 కోట్ల ప్రాజెక్టుకు కూడా సీఎం సానుకూలంగా స్పందించారు. ఇక తాడేపల్లిగూడెం పట్టణంలోని మురుగునీటిని అవుట్లెట్ల ద్వారా బయటకు పంపేం దుకు రూ.54కోట్లతో ప్రతిపాదించిన ప్రాజెక్టుకు కూడా సీఎం అంగీకారం తెలిపారు. విమానాశ్రయ భూముల్లో దీర్ఘకాలికంగా నివాసముం టున్న 2,557 కుటుంబాలకు శాశ్వత ఇంటిస్థల పట్టాలు ఇవ్వాలన్న మంత్రి సూచనపై కూడా సీఎం సానుకూలంగా స్పం దించి సర్వే చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ లెక్కన చూస్తే తమ మంత్రి పనితీరుపై బాబు సంతృప్తికరంగానే ఉన్నారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సుజాత మాటేమిటి ఇక జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఏకైక మంత్రి పీతల సుజాత పనితీరుపై చంద్రబాబు ఏం తేల్చారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దళిత మహిళామంత్రిగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పార్టీ వర్గాలు తనకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని సుజాత భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెను తొలిసారిగా మంత్రివర్గంలో తీసుకుని, కీలకమైన శాఖలు కట్టబెట్టడంతో ఉత్సాహంగా పనిచేస్తున్నా పార్టీ శ్రేణులపరంగా ఆమెకు సరైన సహకారం అందడం లేదని అంటున్నారు. గనులు, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల పనితీరుపై ఎక్కడా నెగెటివ్ మార్కు పడలేదని, తమ మంత్రి సుజాత తీరుపై చంద్రబాబు సంతృప్తిగానే ఉన్నారని ఆమె వర్గీయులు చెప్పుకుంటున్నారు. అయితే సహచర మంత్రి మాణిక్యాలరావు మాదిరి కనీసం ఆమె సొంత నియోజకవర్గమైన చింతలపూడి అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టుకూ ఇంతవరకు సానుకూల ప్రకటన రాలేదంటున్న వారూ లేకపోలేదు. మంత్రిగా ముందు నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసేవిధంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని సూచిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చే మార్కులు ఎలా ఉన్నా మొత్తంగా జిల్లా అభివృద్ధిపై సచివుల ‘మార్కు’ ఇంకా పడలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. -
అడకత్తెరలో అధికారులు
‘కొత్త పిచ్చోడు పొద్దెరగడు’ అనేది ముతక సామెతే కానీ.. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుతమ్ముళ్లకు ఇప్పుడు సరిగ్గా వర్తిస్తుంది. అధికారం కోసం ఆవురావురమని ఎదురుచూసి.. తీరా సర్కారు కొలువుదీరిన తర్వాత ఇంకా సరిగ్గా కుదురుకోలేని పరిస్థితుల్లోనే ఉన్న టీడీపీ నేతలు ముందుగా అధికారులపై అడ్డంగా పడిపోతున్నారు. చోటామోటా నేతల నుంచి మంత్రుల వరకు ఎక్కడికక్కడ, ఎవరికి వారు తమ దర్పమంతా అధికారులపైనే చూపిస్తున్నారు. ఇక జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య అధికారులు అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు. మంత్రులిద్దరూ జిల్లాస్థాయి అధికారులను తమ వెంటే ఉండాలని హుకుం జారీ చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం జిల్లాలో అన్నిచోట్లా ఒకేసారి మొదలైంది. రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వీరవాసరం మండలం అండలూరులో జరిగిన కార్యక్రమంలో, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాస్థాయి అధికారులంతా తాము పాల్గొనే సదస్సులోనే ఉండాలని ఇరువురు మంత్రులూ పట్టుపట్టడంతో అధికారులు నానాకష్టాలూ పడ్డారట. మొత్తం మీద వ్యవసాయ శాఖ జేడీ ఇద్దరి వద్దా హాజరు వేయించుకుని అటు కొంతమంది.. ఇటు కొంతమంది అధికారులను సర్దుబాటు చేసినా ఏలూరు మండలం చాటపర్రులో కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పాల్గొనే కార్యక్రమానికి ఎవరు వెళ్లాలనే విషయమై అధికారుల నరాలు తెగే ఉత్కంఠకు గురయ్యారట. అసలే అధికారులపై చీటికీమాటికీ ఇంతెత్తున లేచే ప్రభాకర్ వద్దకు వెళ్లాలంటే తలలు పండిన అధికారులకు సైతం చెమటలు పడుతుంటాయి. అయితే జిల్లాస్థాయి ఉన్నతాధికారి అక్కడికి వెళ్లడంతో ఆ రోజుకు హమ్మయ్య అని అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇలాగైతే రానున్న కాలంలో ఎన్నికష్టాలు ఎదుర్కోవాలో అంటూ అధికారులు టెన్షన్ పడుతున్నారట. మరోవైపు.. అధికారిక కార్యక్రమాల ఆహ్వానాలను తమను స్వయంగా కలిసి ఇవ్వాలని, లేదంటే వచ్చేది లేదంటూ ప్రజాప్రతినిధులు భీష్మిస్తున్నారట. డెల్టా ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఇటీవల ఇదే అం శాన్ని రాద్ధాంతం చేయడంతో ఒకటికి మూడుసార్లు అధికారులు సదరు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయన్ను రావాల్సిందిగా బతిమిలాడారట. ఇలా అధికారులు ప్రతి చిన్న పనికి ప్రజాప్రతినిధుల దర్శనం కోసం ఇతర పనులు మానుకుని కాళ్లరిగేలా వాళ్ల ఇళ్ల చుట్టూ తిరగడానికే కాలం సరిపోతోందని అంటున్నారు. మొత్తంగా ఈ రెండు నెలల పాలన చూస్తే.. అంతకుముందు తొమ్మిదేళ్ల చంద్రబాబు హయాంలోని పోకడలే మళ్లీ మొదలయ్యాయంటూ అధికారులు ఒకరి కష్టాలను ఒకరికి చెప్పుకుంటూ గుండె బరువు దించుకుంటున్నారట. ‘పవర్’ చూపిన పోలీస్ జిల్లాకు కొత్తగా వచ్చిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు రౌడీలు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికారపార్టీ వారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. ఏ అధికారైనా వచ్చిన కొత్తలో ఇటువంటి ప్రకటనలే చేస్తుంటారు. కానీ మన జిల్లాకు వచ్చిన అధికారులు చేతల్లో చేసి చూపించారు. అధికారం వచ్చిందన్న దన్నుతో టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుండటమన్నది అంకన్నగూడెం ఘటన సాక్షిగా ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక ఏలూరు నగరంలో టీడీపీ నేతలూ తామేం తక్కువ కాదంటూ ఇటీవల ఓ యువకుడిని నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ యువకుడి బంధువులు ఖమ్మం జిల్లా భద్రాచలం వాసులు కావడం, ప్రస్తుత ఎస్పీ రఘురామ్రెడ్డి గతంలో అక్కడ పనిచేయడంతో ఉన్న పరిచయాల దృష్ట్యా నేరుగా ఆయన్ని కలిశారు. ఆయన స్పం దించడంతో పోలీసులు నగర డెఫ్యూటీ మేయర్తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను కేసునుంచి బయటపడేయాలని పోలీసులపై ఎంత ఒత్తిళ్లు, ఆబ్లిగేషన్స్ వచ్చినా అధికారులు లెక్క చేయలేదు. ఇరువురు ఎమ్మెల్యేలు అదే పనిగా తిరిగినా.. చట్ట ప్రకారమే నడుచుకుంటామని చెప్పిన పోలీసు అధికారులు నిందితులను కటకటాల్లోకి తోశారు. పవర్లో ఉన్నాం.. ఏమైనా చెల్లుబాటవుతుందని విర్రవీగుతున్న వారికి అసలు ‘పవర్’ చూపించిన అధికారులు ఇదే పట్టు కొనసాగిస్తారా.. ఏమో చూద్దాం! - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
15 రోజుల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తాం
పెదపాడు : రాబోయే 15 రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ గంచీరి దేవికారాణి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున రుణాలు మాఫీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డ్వాక్రా గ్రూపునకు లక్ష చొప్పున ఇచ్చి వడ్డీని ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్లను రూ.1,000కి పెంచుతున్నట్టు తెలిపారు. పేద విద్యార్థులంతా చదువుకుని ఉన్నతస్థితికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేయాలని నిర్ణయించినట్టు మాణిక్యాలరావు చెప్పారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ అభయహస్తం, ఆమ్ఆద్మీ, జనశ్రీ బీమా యోజన స్కాలర్షిప్పులను నియోజకవర్గంలో 5,661మందికి అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 70 వేల 600 మందికి ఉపకార వేతనాలు మంజూరు చేసినట్టు చెప్పారు. నరసాపురం ఎంపీ గంగరాజు మాట్లాడుతూ ఆశ్రం ఆసుపత్రిలో సేవాగుణంతోనే వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్, దెందులూరు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
వజ్ర కిరీటంపై సమగ్ర విచారణ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అవినీతి ఆరోపణలు రుజువైతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, విధుల నుంచి తొలగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు. శుక్రవారం ఏలూరులో తనను కలిసిన విలేకరులతో మంత్రి మాట్లాడారు. నగరంలోని ఆర్ఆర్ పేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో వజ్రాల కిరీటం వ్యవహారం, మేనేజర్గా పనిచేసిన తల్లాప్రగడ విశ్వేశ్వరరావుపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై మంత్రి స్పందించారు. ఈవో వ్యవహార శైలిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. ఆరోపణలు వాస్తవాలేనని నిగ్గుతేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆయన పనితీరుపై తనకు పలుమార్లు ఫిర్యాదులు అందాయని, అవినీతి ఆరోపణలతోపాటు వ్యక్తిగత వ్యవహార శైలిపైనా విమర్శలు రావడంతో వెంటనే బదిలీ చేశామని చెప్పారు. శాఖాపరమైన విచారణను ఈ రీజియన్ అధికారులు చేపడితే అతను కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. ఈ దృష్ట్యా ఇతర జిల్లాల అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని చెప్పారు. -
జెండా పండుగకు తమ్ముళ్ల డుమ్మా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఊహించిందే జరిగింది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య పెరుగుతున్న ఎడబాటు పంద్రాగస్టు అధికారిక వేడుకల్లో స్పష్టంగా కనిపించింది. జెండా వందనం బాధ్యతను ప్రభుత్వం బీజేపీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించిన నేపథ్యంలో శుక్రవారం ఏలూరులో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు డుమ్మా కొట్టారు. ఈ గైర్హాజరీ యాధృచ్ఛికంగా జరిగిందా.. ఉద్దేశపూర్వకమా అని ఎవరూ బహిరంగంగా చెప్పే పరిస్థితి లేదు.నవ్యాంధ్రలో మొదటిసారి జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కానరాకపోవడం చర్చనీయూంశమైంది. వాస్తవానికి జెండా వందనం బాధ్యత తనకే వస్తుందని చివరి నిమిషం వరకు ఆశించి భంగపడిన గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత కర్నూలులో రాష్ట్రస్థారుులో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లిపోయూరు. మిగిలిన ఎమ్మెల్యేలైనా ఈ కార్యక్రమానికి హాజరౌతారని అందరూ భావించారు. కానీ .. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రమే కాసేపు మెుహం చూపించి వెళ్లిపోయారు. మిగి లిన ప్రజాప్రతినిధులెవరూ కానరాలేదు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా రాకపోవడం చర్చనీయూంశమైంది. తమ పార్టీకి చెందిన మంత్రి కాబట్టి నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు హాజరై చివరివరకు ఉన్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలోను, అంతకుముందు తొమ్మిదేళ్ల టీడీపీ హయాంలోను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కనీసం 10మంది ఎమ్మెల్యేలైనా జిల్లా కేంద్రం ఏలూరులో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని ఆ తర్వాత నియోజకవర్గాల్లో జెండా వందనం కార్యక్రమాలకు వెళ్లేవారు. ఈసారి ఇలా జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎగ్గొట్టడం రాజకీయ విశ్లేషకుల్లో చర్చకు దారితీసింది. తెలుగుదేశం, బీజేపీ మధ్య దూరం పెరుగుతోం దన్న భావనకు ఈ వేడుకలు బీజం పోశాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
మోడల్ జిల్లా మన లక్ష్యం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాను మోడల్గా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. వ్యవసాయం, విద్య, వైద్య, పారిశ్రామికం రంగాలతోపాటు ఇతర రంగాల్లోనూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తారని, ఈ యజ్ఞంలో జిల్లా ప్రజలు, సంస్థలు పాలుపంచుకోవాలని కోరారు. ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో శుక్రవారం నిర్వహించిన 68వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథం లో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని మంత్రి మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు పుట్టిన మన జిల్లాలోనే ఎందరో త్యాగధనులు స్వాతంత్య్ర సముపార్జనలో అవిరళ కృషి చే శారని కొనియాడారు. సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తోం దని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండు అం శాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ శాఖ ల మధ్య సమన్వయం పెంపొం దించేందుకు ఏడు ప్రాధాన్యతా అంశాలతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని చెప్పారు. 445 గ్రామాల్లో ‘సుజల స్రవంతి’ గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు అందించేందుకు, ప్రజలను రోగాల బారినుంచి రక్షిం చేందుకు జిల్లాలోని 445 గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేయనున్నట్టు మం త్రి మాణిక్యాలరావు చెప్పారు. ఈ పథకం కింద 20 లీటర్ల నీటిని రూ.2కే అందిస్తామన్నారు. ప్రతిష్టాత్మకంగా పుష్కరాలు వచ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలి పారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నిటినీ ధ్యాన కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఆలయ భూముల పరి రక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్టోబర్ నుంచి పింఛను మెుత్తాల పెపు జిల్లాలో వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పిం ఛను మెుత్తాలను అక్టోబర్ 2నుంచి పెంచుతున్నట్టు మంత్రి తెలిపారు. అక్టోబర్ 2నుంచే 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం జిల్లాలో రూ.122 కోట్ల వ్యయంతో 159 కొత్త లైన్లను అభివృద్ది చేసినట్టు చెప్పారు. రూ.151 కోట్లతో ట్రాన్స్ఫ్మారర్లు, కండక్టర్లు, కేబుల్స్ సమకూర్చేందుకు అనుమతులు వచ్చాయని వివరించారు. దీంతో గృహావసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి ఏడు గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించే అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కాటమనేని భాస్కర్, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొమ్మారెడ్డి నాగచంద్రారెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి), మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, నగర మేయర్ దంపతులు షేక్ నూర్జహాన్, డీఐజీ పి.హరికుమార్, జిల్లా ఎస్పీ కె.రఘురామ్రెడ్డి, జిల్లా మొదటి అదన పు జడ్జి వై. లక్ష్మణరావు, డిస్ట్రిక్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కె.శివాచార్యులు, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు, ఆర్డీవో బి.శ్రీనివాసరావు, డీపీవో అల్లూరి నాగరాజువర్మ, జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ బి.రమణ, ఇరిగేషన్ ఎస్ఈ డి.తిరుమలరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ కె.వేణుగోపాల్, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ పులి శ్రీనివాసులు, డీఈవో నరసింహరావు, వ్యవసాయ శాఖ జేడీ వి.సత్యనారాయణ, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ కె. జ్ఞానేశ్వరరావు, ఉద్యాన శాఖ ఏడీ ఎన్.సుజాత, గనుల శాఖ ఏడీ వైఎస్ బాబు పాల్గొన్నారు. -
మహిళా మంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పంద్రాగస్టు వేడుకలు జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య దూరం పెంచనున్నాయా.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నేరుగా వీరిద్దరి మధ్య ఎటువంటి వివాదం లేకపోయినా ప్రోటోకాల్ బాధ్యతల అప్పగింత అగాధం పెంచుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జెండా వందనం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించడంపై గనులు, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కోస్తా జిల్లాల్లో ఏకైక దళిత మహిళా మంత్రిగా చంద్రబాబు కేబినెట్లో స్థానం సంపాదించిన సుజాతను పక్కనపెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన మాణిక్యాలరావుకు ప్రోటోకాల్ హోదా కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది. హైదరాబాద్లో మూడురోజుల కిందట జరిగిన కేబినెట్ భేటీలో స్వయంగా మంత్రి సుజాత ఈ విషయాన్ని ప్రస్తావించినా.. చివరకు మాణిక్యాలరావుకే జెండా వందనం చేసే బాధ్యతను అప్పగించడంపై ఆమె కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే జిల్లా కేంద్రంలో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనకూడదని మంత్రి సుజాత నిర్ణయించుకున్నట్టు సమాచారం. తొలుత జిల్లాలో ఉండకుండా ఆ రోజు హైదరాబాద్ వెళ్లాలని భావించిన ఆమె మనసు మార్చుకుని కర్నూలులో జరిగే రాష్ట్ర వేడుకల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ‘కృష్ణా’లో ఇలా ఎందుకు జరగలేదు? స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రభుత్వం తరఫున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం కోసం సహజంగా ఏ మంత్రి అయినా ఎదురుచూస్తారు. జిల్లాలో టీడీపీకి చెందిన ఏకైక మహిళా దళిత మంత్రిగా ఈసారి తనకే ఆ అవకాశం వస్తుందని సుజాత భావిం చారు. కానీ.. పొరుగున ఉన్న కృష్ణాజిల్లాలో అధికార పార్టీ రాజకీయాల్లో చోటుచేసుకున్న కుల సమీకరణల వల్ల ఆమెకు ఇక్కడ అవకాశం దక్కలేదని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి చెందిన వారు ఇద్దరే ఉన్నారు. ఒకరు మన జిల్లాకు చెందిన మాణిక్యాలరావు కాగా, మరొకరు కృష్ణాజిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్. వీరిద్దరిలో కచ్చితంగా ఎవరో ఒకరికి జెండా వందనం చేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు భావించారు. అయితే కృష్ణా జిల్లాలో టీడీపీకి చెందిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పక్కనపెట్టి కామినేని శ్రీనివాస్కు ప్రొటోకాల్ హోదా ఇచ్చే ధైర్యం చేయలేకపోయిన చంద్రబాబు మన జిల్లాకు వచ్చేసరికి దళిత వర్గానికి చెందిన సుజాతను తప్పించి మాణిక్యాలరావుకు అవకాశం ఇచ్చారని దళిత, బహుజన సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం దళిత మహిళ కాబట్టే పీతల సుజాతపై చిన్నచూపు చూశారని ఆయా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. -
'పవర్ స్టార్ వల్లే టీడీపీకి పవర్'
ద్వారకాతిరుమల : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మద్దతు వల్లే టీడీపీ పవర్ లోకి వచ్చిందని, చిరంజీవి పార్టీ పెట్టడంతోనే కాపులకు గుర్తింపు లభించిందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ద్వారకాతిరుమల కాపు కల్యాణ మండపంలో జిల్లా కాపునాడు శ్రీ వేంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం జరిగిన కాపు ప్రజాప్రతినిధుల అభినందన సభకు ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ ఛైర్మన్ వట్టి వెంకటరంగ పార్థసారధి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా కాపు సంఘ అద్యక్షుడు చినమిల్లి వెంకటరాయుడు, పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి పైడికొండల మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియపై క్యాబినేట్ సమావేశంలో చర్చ జరిగిందని, త్వరలోనే ఇది పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం కాపు వర్గీయులు దుందుడుకు స్వభావంతో, దాడులు చేసేవిధంగా సమాజంలో ముద్రపడ్డారని, దీన్ని మార్చుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రం విడిపోవడం మన అదృష్టం రాష్ట్ర విభజన జరగడం వల్లే కాపులను బీసీల్లో చేర్చే ప్రతిపాదన వేగవంతమైందని, కలిసి ఉంటే జరిగే పరిస్థితి లేదని సమావేశంలో పాల్గొన్న రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. కాపుల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకే ఉపముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చారని, కాపులను బీసీ చేర్చే ప్రక్రియ కూడా అమలవుతుందని చెప్పారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కాపు విద్యార్థులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ కాపుల ఆధ్యుడు, ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఏలూరులో ఏర్పాటు చేస్తానని, ఆయన పేరుతో కల్యాణ మండపాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్రావు, కాపు నేతలు పిల్లా వెంకటరాయుడు, బొల్లిశెట్టిరావు, వెంకటరత్నం నాయుడు, ఆర్ఎస్ఆర్ మాస్టారు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, మైగాపుల మోహన్ పాల్గొన్నారు. -
తాడేపల్లిగూడెంలో నిట్
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) తాడేపల్లిగూడెం పట్టణంలో కొలువు తీరనుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్ర విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్రం నుంచి కేంద్రానికి తాజాగా అధికారులు నివేదిక పంపించారు. దేశంలో 36 నిట్లు ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో వరంగల్లో మాత్రమే నిట్ ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గూడెంలో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కేంద్రానికి చెందిన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పట్టణానికి వస్తుందని చెబుతూ వచ్చారు. పురపాలక శాఖ మంత్రి కె.నారాయణ ఆధ్వర్యంలో ఇటీవల మంత్రుల బృందం గూడెంలో పర్యటించి వెళ్లింది. పట్టణంలోని విమానాశ్రయ రన్వే సమీపంలో ఉన్న భూమిని, వెంకట్రామన్నగూడెంలో ఉద్యానవర్సిటీ వెనుక ఉన్న కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న భూములను పరిశీలించి వెళ్లింది. ఈ మేరకు శనివారం కేంద్రానికి పంపిన జాబితాలో తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయడానికి ఉన్న అనువైన పరిస్థితులు, భూముల వివరాలను పేర్కొన్నారు. నిట్ అంటే ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మేనే జ్మెంట్ల విద్యాసంస్థల వ్యవస్థను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా చెబుతారు. 2007లో పార్లమెంటులో చేసిన చట్టం ద్వారా నిట్లను నేషనల్ ఇంపార్టెన్స్గా పేర్కొన్నారు. నిట్లో సీట్లు సగం ఈ సంస్థ ఉన్న ప్రాంతానికి, మిగిలిన సగం సీట్లను దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ స్థాయిలో డిగ్రీ కోర్సులు ఉంటాయి. ఈ విద్యాసంస్థలు స్వయం ప్రతిపత్తితో నడుస్తాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా బోధన ప్రణాళికను తయారు చేసుకునే స్వేచ్ఛ వీటిలో ఉంటుంది. -
పావనపర్వానికి పటిష్టమైన ఏర్పాట్లు
సాక్షి, రాజమండ్రి :గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జరిగే పుష్కరాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు ఉభయగోదావరి జిల్లాల అధికారులను ఆదేశించారు. పుష్కర సన్నాహకంగా తొలి సమావేశాన్ని ఆదివారం రాజమండ్రి నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో రెండు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించారు. పుష్కరాలకు దక్షిణ భారతం నుంచే కాక ఉత్తరాది రాష్ట్రాల నుంచీ భక్తులను ఆహ్వానించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. గత పుష్కరాల కన్నా రెట్టింపు భక్తులు తరలి వస్తారని అంచనాలు వేస్తున్నందున వర్షాలు కురిసినా, వరద వచ్చినా భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. గత పుష్కరాల్లో పని చేసిన అధికారుల సూచనలు తీసుకోవాలని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. పుష్కరాల కోసం నియమించనున్న మంత్రుల కమిటీ ఈ నెల 8న రాజమండ్రిలో సమావేశం అయ్యే అవకాశం ఉందని, ఆలోగా అన్ని శాఖల అధికారులు నివేదికలను తయారు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఆహారాది సేవలందించేందుకు పలు సేవా సంస్థలు ఇప్పటి కే తనను సంప్రదిస్తున్నాయన్నారు. రాజమండ్రిలో గతంలో ఏర్పాటు చేసినట్టు.. ఈసారి ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని స్నానఘట్టాల వద్ద షవర్ బాత్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిధులు కేంద్రం ఇచ్చినా, రాష్ట్రానివైనా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేని రీతిలో పుష్కరాల నిర్వహణ ఉంటుందని హామీ ఇచ్చారు. రెండు కోట్ల మంది వస్తారని అంచనా.. వివిధ శాఖల అధికారులు వారంలోగా నివేదికలు సిద్ధం చేస్తే వాటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా తుదిరూపు ఇవ్వడానికి వీలవుతుందని తూర్పుగోదావరి కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ అన్నారు. ఈ పుష్కరాలకు కనీసం రెండుకోట్లమంది వస్తారని అంచనా వేస్తున్నారని, వారికోసం కొత్త ఘాట్ల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఘాట్లలో కొన్నింటిని పునర్నిర్మించాలని, కొత్తగా తొమ్మిది నిర్మించాల్సి ఉందని ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించినట్టు చెప్పారు. గత పుష్కరాలకు ఏ శాఖకు నిధులెన్ని వచ్చాయి, ఇప్పుడెన్ని కావాలి అనే అంశాలను నివేదికల్లో స్పష్టంగా పొందుపరచాలన్నారు. ప్రభుత్వం అందించే నిర్ణీత ప్రొఫార్మాలోనే ప్రతిపాదనలు అందించాలన్నారు. రెండు జిల్లాల ప్రతిపాదనల ఆధారంగా సంయుక్తంగా కార్యాచరణ చేపట్టనున్నట్టు చెప్పారు. త్వరలో మరో సమావేశం.. పశ్చిమగోదావరి జిల్లాలో గత నెల 31న తొలి సమావేశం నిర్వహించామని ఆ జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. త్వరలో మరో సమావేశం ఏర్పాటుచేసి తుది నివేదికలు తీసుకుంటామన్నారు. తర్వాత రెండు జిల్లాల కలెక్టర్లు సమావేశమై ప్రతిపాదనలను ఖరారు చేస్తామన్నారు. కార్పొరేషన్ నుంచి మెరుగైన సేవలు..కార్పొరేషన్ పరంగా అందించే సేవలను మెరుగుపరుస్తామని రాజమండ్రి మేయర్ పంతం రజనీ శేషసాయి చెప్పారు. ప్రభుత్వపరమైన ఏర్పాట్లను ఘనంగా చేపట్టాలని మంత్రిని కోరారు. పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మంత్రిని కోరారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, రాజమండ్రి ఆర్డీఓ నాన్రాజు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, రెండు జిల్లాల పంచాయతీరాజ్, ఆర్టీసీ, ఆర్అండ్బీ, విద్యుత్తు, పోలీసు, వైద్య, ఆరోగ్య తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రణాళికాబద్ధంగా నివేదికలివ్వండి.. గత పుష్కరాలలో పశ్చిమగోదావరి జాయింట్ కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్గా పనిచేస్తున్న అనూరాధ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆర్థిక మంత్రి అధ్యక్షతన ప్రభుత్వం ఐదుగురు కేబినెట్ మంత్రులతో సబ్ కమిటీ వేస్తోంది. వివిధ శాఖల కార్యదర్శి స్థాయి అధికారులతో కూడా రాష్ట్ర స్థాయి అధికారిక కమిటీనీ నియమిస్తున్నారు. రెండు జిల్లాల్లో జిల్లాలవారీగా ప్రజా ప్రతినిధులతో ఒక కమిటీ, కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల కమిటీలు వేస్తారు. పుష్కర తేదీల నిర్ణయంలో తర్జనభర్జనలతో నిమిత్తం లేకుండా పనులను చేపట్టాలి. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చే వస్తువుల ధరలు గతంలో ఆకాశాన్నంటాయి. ఈసారి మార్కెట్ కమిటీలతో చర్చించి నిర్ణీత ధరలకు అందించే ఏర్పాటుచేయాలి. తూర్పుగోదావరిలో 81, పశ్చిమాన 50 ఘాట్ల జాబితా అధికారులు ఇచ్చారు. వీటిలో కొన్నింటిని భవిష్యత్తు అవసరాలకు కూడా ఉపయోగపడేలా అభివృద్ధి చేసుకోవాలి. పుష్కరాలను ఓ అవకాశంగా భావించి అవసరమైన పనులతోపాటు అవసరం లేని పనులను అనుబంధంగా ప్రతిపాదించవద్దు. గతంలో ఇలాంటి పనులు నిధుల్లేక అసంపూర్తిగా నిలిచిపోయాయి. పనుల్లో ఆర్భాటం, అందం వంటి వాటి కన్నా వసతులు, భక్తుల సౌకర్యాలకే పెద్దపీట వేయాలి. వరదలు వస్తాయని భావించి వాటికి అనుగుణంగానే బారికేడ్లు నిర్మించాలి. ఘాట్లలో మూడంచెల భద్రతను అమలు చేయాలి. భక్తుల విశ్వాసాలు, అవసరాలను ప్రాధాన్యంగా పరిగణించి ఆలయాలను అభివృద్ధి చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాల సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కళాకారులను ముందు నుంచే గుర్తించాలి. ఒకేసారి వివిధ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలి. భక్తులతోపాటు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి విధులు నిర్వహించే ఉద్యోగులపై కూడా దృష్టిపెట్టాలి. అర్చకులు ఎవరు ఏయే ఘాట్లలో ఉండాలి, ఏ సేవకు ఎంత మొత్తం వసూలు చేయాలో ధరలు, జాబితాలు దేవాదాయ శాఖ అధికారులు ముందుగానే తయారుచేసి ఉంచాలి. ట్రాఫిక్, యాత్రికుల భద్రత తదితర రక్షణ చర్యలను పోలీసుశాఖ ఓ ప్రణాళికతో అమలు చేయాలి. -
పుష్కరాల ఏర్పాట్లుకు 500 కోట్ల ప్రతిపాదనలు
సరసాపురం: రాష్ట్రంలో దాదాపు 28 వేల ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమైనాయిని గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం నరసాపురంలోని గోదావరి పుష్కరాల రేవును మంత్రి మాణిక్యాలరావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని చెప్పారు. పుష్కరాల ఏర్పాట్లపై రూ.500 కోట్ల ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు మాణిక్యాలరావు చెప్పారు. -
6 వేలమంది ఉద్యోగుల జాడలేదు
ద్వారకాతిరుమల: రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో సుమారు 6వేల మంది ఎక్కడ పనిచేస్తున్నారో తెలియడం లేదని, ప్రస్తుతం వారిని వెదికే పనిలో ఉన్నామని రాష్ట్ర ఆ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో 14 వేల మంది ఉద్యోగులు సరైన పనిలేకుండా ఉన్నారని, ముందు వారికి పనికల్పించే పనిలో పడ్డామని చెప్పారు. జీతాలు తీసుకుంటూ ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో తెలియని 6 వేల మంది సిబ్బందిని గుర్తించాల్సి ఉందన్నారు. ఆలయాల్లో ఎన్ఎంఆర్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అంశాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రముఖ ఆలయూలున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రహదారులను విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆలయాల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాల్సి ఉందని, అంతకుముందే పదోన్నతులు పొంది అక్కడే పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. -
బాధ్యతలు చేపట్టిన మ్రంతులు
జంగారెడ్డిగూడెం మహిళా శిశు సంక్షేమ, గనుల శాఖల మంత్రి పీతల సుజాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదివారం సచివాలయంలో వారికి కేటాయించిన ఛాంబర్లలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానం ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, వేదపండితులు హాజరయ్యారు. వారు బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో వేదపండితుల వేదాశీర్వచనం ఇచ్చారు. -
'మాకు సామాన్య భక్తులే విఐపిలు'
తమకు సామాన్య భక్తులే విఐపిలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాల రావు గురువారం హైదరాబాద్లో తెలిపారు. రాష్ట్రంలోని దేవాదాయ భూ ములు లీజు వ్యవహారంపై సాధ్యమైనంత త్వరలో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. దేవాదాయాలకు చెందిన ఆస్తులు ద్వారా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. -
‘దసరా’కు స్టేట్ ఫెస్టివల్ హోదా!
విజయవాడ: దసరా ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలు (స్టేట్ ఫెస్టివల్)గా ప్రకటించాలనే దుర్గమ్మ భక్తుల డిమాండ్ నేరవేరే అవకాశాలు కనపడుతున్నాయి. దసరా ఉత్సవాలకు పక్షం రోజులు ముందు హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చి హడావుడి చేయడం ఆ తరువాత భక్తుల సమస్యలను పట్టించుకోకపోవడం జరుగుతోంది. అదే స్టేట్ ఫెస్టివల్గా ప్రకటిస్తే ఉత్సవ నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఐఏఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయి. నిర్వహణా వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్రం నలుమూలలు నుంచి వచ్చే భక్తులకు శాశ్వత సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. దేవాదాయశాఖ మంత్రిగా మాణిక్యాలరావు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు స్టేట్ ఫెస్టివల్ హోదా కల్పించడంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దుర్గగుడికి ఉన్నతాధికారి సాలీనా వంద కోట్ల రూపాయల పైగా ఆదాయం వస్తున్న దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సరైన అధికారి లేరు. దేవస్థానం ఈవో తీసుకునే నిర్ణయాలను కమిషనర్ అనుమతికి పంపి, అక్కడ ఆమోదం పొందిన తరువాతనే చేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో తీవ్ర జాప్యంతో పాటు నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయి. ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే దేవస్థానం నిధులు దుర్వినియోగం అరికట్టవచ్చని భక్తుల భావన. ఐఏఎస్ స్థాయి అధికారి నియమించాలనే ఆలోచన ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని మంత్రి మాణిక్యాలరావు దృష్టికి వెళ్లగా పరిశీలిస్తానంటూ హామీ ఇచ్చారు.