intolerance
-
Supreme Court: నిందితుల్ని జైల్లోనే ఉంచడానికి పీఎంఎల్ఏ కేసులా?
న్యూఢిల్లీ: నిందితులను జైలులో ఉంచడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)ను ఉపయోగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం మాదిరిగా పీఎంఎల్ఏ నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. ఛత్తీస్గఢ్కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ పతి త్రిపాఠీకి బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. త్రిపాఠీపై చేసిన ఆరోపణలను ఛత్తీస్గఢ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా జైలులోనే ఉంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘ఓ వ్యక్తిని జైలులో ఉంచేందుకు పీఎంఎల్ఏను వాడుకోరాదు. ఆరోపణలను కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆయన్ను విడుదల చేయకుండా జైలులో ఉంచడాన్ని ఏమనాలి?. సెక్షన్ 498ఏ కింద పెళ్లయిన మహిళలు భర్త, అతడి కుటుంబీకులపై కట్నం వేధింపుల కేసులు ఎడాపెడా పెట్టినట్లే పీఎంఎల్ఏను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా?’అంటూ తలంటింది. ఇందుకు కారణమైన అధికారులకు సమన్లు జారీ చేస్తామంది. అయితే, సాంకేతికపరమైన కారణాలతో నేరగాళ్లకు బెయిలివ్వడం సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదించారు. -
భారత్ను చైనాతో పోల్చొద్దు: మోదీ
న్యూఢిల్లీ: అభివృద్ధి విషయంలో భారత్ను పొరుగు దేశమైన చైనాతో పదేపదే పోలుస్తుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. భారత్ను ప్రజాస్వామ్య దేశాలతో పోల్చాలి తప్ప చైనాతో కాదని తేలి్చచెప్పారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల వార్తా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతోందని చెప్పారు. భారత్ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చమే సముచితమని సూచించారు. ఇండియాలో నిరుద్యోగం, అవినీతి, పరిపాలనాపరమైన అడ్డంకులు, నైపుణ్యాల లేమి వంటివి పెద్దగా లేవని మోదీ పేర్కొన్నారు. నిజంగా ఇలాంటి అంశాలు ఉండి ఉంటే, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే హోదా మన దేశానికి దక్కేది కాదని స్పష్టం చేశారు. పలు అంతర్జాతీయ సంస్థల్లో భారత సంతతి సీఈఓలు సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇండియాలో నైపుణ్యాల లేమి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని మోదీ వెల్లడించారు. ప్రఖ్యాత విదేశీ సంస్థలను ఆకర్శించడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో మైనార్టీలను అణచివేస్తున్నారన్న ఆరోపణల్లో పస లేదని స్పష్టం చేశారు. మైనారీ్టలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. 20 కోట్ల మంది మైనార్టీలు ఇక్కడ క్షేమంగా జీవిస్తున్నారని చెప్పారు. -
జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ పట్ల ప్రభుత్వ అసహనం మరోసారి తేటతెల్లమయ్యింది. కొలీజియం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ రెండు వర్గాలుగా విడిపోయాయి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకంలో ప్రభుత్వం పాత్ర పరిమితంగానే ఉండడం ఏమిటని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాజ్యసభలో మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానామిచ్చారు. ఆయన ఏం చెప్పారంటే.. పెండింగ్ కేసులు ఆందోళనకరం ‘దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఐదు కోట్లకుపైగా కేసులు పెండింగ్లో ఉండడం ఆందోళకరం. ఇందుకు ప్రధాన కారణం కోర్టుల్లో జడ్జి పోస్టులు ఖాళీగా ఉండడం. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కానీ, జడ్జి పోస్టుల భర్తీలో ప్రభుత్వం పాత్ర పరిమితమే. నియమించాల్సిన జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియమే ప్రతిపాదిస్తుంది. అందులో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. మార్పులు చేయకపోతే.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు దేశ వైవిధ్యాన్ని, నాణ్యతను ప్రతిబింబించే పేర్లను ప్రతిపాదించాలని కొలీజియంకు ప్రభుత్వం తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ, ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ పార్లమెంట్, దేశ ప్రజల సెంటిమెంట్ను ప్రతిబింబించడం లేదు. ఎక్కువ మాట్లాడితే న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం చూస్తే కోర్టుల్లో జడ్జీలను నియమించడం ప్రభుత్వ హక్కు. కానీ, 1993 తర్వాత ఈ పరిస్థితిని మార్చేశారు. జడ్జిల అపాయింట్మెంట్లలో ప్రభుత్వానికి భాగస్వామ్యం కల్పిస్తూ 2014లో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్జేఏసీ) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. జడ్జిలను నియమించే ప్రక్రియలో మార్పులు చేయకపోతే ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల సమస్య తలెత్తూనే ఉంటుంది’ అని రిజిజు తేల్చిచెప్పారు. కొలీజియం అనేది దేశ ప్రజలు కోరుకుంటున్న వ్యవస్థ కాదని ఆయన కొన్ని వారాలుగా గట్టిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కొలీజియంకు వ్యతిరేకంగా పలువురు ప్రస్తుత, మాజీ కేంద్ర మంత్రులు గళం విప్పుతున్నారు. కానీ, కొలీజియం వ్యవస్థను పట్టాలు తప్పించేలా ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు ఇటీవలే హెచ్చరించింది. 20 పేర్లను పునఃపరిశీలించండి కొలీజియంకు తిప్పి పంపిన కేంద్ర ప్రభుత్వం హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది. ఆ 20 పేర్లను మరోసారి పరిశీలించాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీ నాటికి హైకోర్టుల్లో 331 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొత్తం శాంక్షన్డ్ పోస్టులు 1,108 కాగా, 25 హైకోర్టుల్లో ప్రస్తుతం 777 మంది జడ్జీలు ఉన్నారని తెలిపారు. 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టుల భర్తీ కోసం పలు హైకోర్టుల నుంచి అందిన 147 ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి వివిధ హైకోర్టుల్లో రికార్డు స్థాయిలో 165 మంది జడ్జిలను నియమించినట్లు కిరణ్ రిజిజు వివరించారు. ఒక సంవత్సరంలో ఇంతమందిని నియమించడం ఒక రికార్డు అని పేర్కొన్నారు. -
ఐరాస నివేదికపై భారత్ అసంతృప్తి
ఐరాస: ఐసిస్ ఉగ్రవాద సంస్థపై ఐరాస సెక్రటరీ జనరల్ విడుదల చేసిన నివేదికపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. పాక్ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కరేతోయిబా, జేషే మహ్మద్ సంస్థలకు ఐసిస్కు మధ్య ఉన్న సంబంధాల గురించి పలు మార్లు హెచ్చరించినా నివేదికలో పేర్కొనలేదని భారత్ అసంతృప్తి తెలిపింది. అఫ్గాన్లో ఐసిస్ అకృత్యాలపై ఐరాస్ 14వ సెక్రటరీ జనరల్ రిపోర్టును ఇటీవల విడుదల చేసింది. పాక్ మద్దతుతో హక్కానీ నెట్వర్క్ విస్తరించడాన్ని, పలు ఉగ్రసంస్థలకు ఆల్ఖైదా, ఐసిస్తో ఉన్న సంబంధాలను విస్మరించకూడదని ఐరాసలో భారత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రబంధాలపై భారత్ పలుమార్లు వివరాలందించిందని, ఆందోళన వ్యక్తం చేసిందని, కానీ కార్యదర్శి నివేదిక ఈ బంధాలను ప్రస్తావించలేదని చెప్పారు. భవిష్యత్లోనైనా సభ్యదేశాల ఆందోళనను పట్టించుకొని నివేదికలు రూపొందించాలని కోరారు. పాక్ నుంచి తాము ఎదుర్కొంటున్న ఉగ్రముప్పుపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందన్నారు. ఆసియాలో ఐసిస్ విస్తరణకు యత్నించడాన్ని నివేదికలో పొందుపరిచారు. దీనిపై తిరుమూర్తి స్పందిస్తూ, ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు. -
మీ నిరసనలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు చేస్తున్న ధర్నాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర శాంతియుతంగా సత్యాగ్రహం చేయడానికి అనుమతినివ్వాలని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ‘ఇప్పటికే మీ ధర్నాలతో ఢిల్లీ గళం నొక్కేశారు. ఇంకా నగరం లోపలికి కూడా వస్తారా?’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిరసన తెలిపే హక్కు ఉండొచ్చు. అదే సమయంలో పౌరులందరికీ నగరంలో స్వేచ్ఛగా, నిర్భయంగా తిరగడానికి సమాన హక్కులుంటాయి. వాటిని కాలరాయకూడదు’అని కోర్టు హితవు పలికింది. జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్ల ధర్మాసనం రైతులు చేస్తున్న ధర్నాలతో స్థానిక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదో తెలుసుకున్నారా? అని ప్రశ్నించింది. రైతుల నిరసనలతో ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయని పేర్కొంది. రైతులు ఇప్పటికే సాగు చట్టాలను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అలాంటప్పుడు మళ్లీ నిరసనలెందుకు? అని ప్రశ్నించింది. కోర్టులపై రైతులు నమ్మకం ఉంచాలని హితవు పలికింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హైకోర్టుని ఆశ్రయించిన రైతులు , దాని సత్వర విచారణకు మళ్లీ కోర్టుకి వెళ్లొచ్చని, ఇలా సత్యాగ్రహాలు చేయడం వల్ల ఒరిగేదేమిటని పేర్కొంది. శాంతియుతంగానే రైతులు నిరసన చేస్తారని రైతు సంఘాల తరఫున హాజరైన లాయర్ ప్రశ్నించగా ఆయనపై విరుచుకుపడింది. ‘శాంతియుతంగా నిరసనలంటే ఏమిటి? మీరు జాతీయ రహదారులను దిగ్బంధిస్తారు. రైళ్లను అడ్డుకుంటారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ శాంతియుత నిరసనలంటే ఎలా?’అని బెంచ్ ప్రశ్నించింది. -
మీరు చేయకపోతే.. మేమే స్టే విధిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతు ప్రతినిధులతో కేంద్రం జరుపుతున్న చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తామని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం మరింత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తేల్చిచెప్పింది. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభించే వరకు ఆ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, ఆ చట్టాల అమలుపై అంత పట్టుదల ఎందుకని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆ చట్టాల అమలును నిలిపేయండి. లేదంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు మేమే స్టే విధించాల్సి వస్తుంది’అని హెచ్చరించింది. చట్టాలపై స్టే విధించాలనుకోవడం లేదని, వాటి అమలును మాత్రమే తాత్కాలికంగా నిలిపేసి, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తే.. కోర్టు ఏర్పాటు చేయనున్న కమిటీకి పరిష్కారం కనుగొనడం సులభమవుతుందని వివరించింది. కొత్త వ్యవసాయ చట్టాలు, రైతు ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు(మంగళవారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది. సమస్య పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. అమలుపై స్టే ఇవ్వలేరు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రాథమికహక్కులకు భంగం కలిగిస్తోందనో, లేక రాజ్యాంగ పరిధిలో లేదనో కోర్టు భావిస్తేనే.. చట్టాల అమలుపై స్టే విధించడం సాధ్యమవుతుందని ఆయన వాదించారు. పిటిషనర్లు తమ వాదనల్లో ఈ అంశాలను లేవనెత్తలేదని గుర్తు చేశారు. దానికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు పరిష్కారం కనుగొనడంలో విఫలమైనందువల్లనే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు చేసిన చట్టాలు రైతుల ఆందోళనలకు కారణమయ్యాయి. ఆ సమస్యను మీరే పరిష్కరించాలి’అని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే.. చట్టాలపై స్టే విధించడానికి తాము వ్యతిరేకమేనని పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం గుర్తు చేసింది. చట్టాల అమలుపై స్టే విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తమకు అందించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ను కోరింది. వ్యవసా య చట్టాలను పలు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాలు ప్రయోజనకరమని పేర్కొనే ఒక్క పిటిషన్ కూడా తమ ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది. ఆందోళనలు కొనసాగించవచ్చు ‘చట్టాల అమలును నిలిపివేసిన తరువాత కూడా ఆందోళనలను కొనసాగించుకోవచ్చు. ఆందోళనల గొంతు నులిమేశామన్న విమర్శలను మేం కోరుకోవడం లేదు’అని రైతు సంఘాల తరఫున హాజరైన న్యాయవాదులతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే కమిటీకి నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎం లోధా సహా రెండు, మూడు పేర్లను సూచించాలని ఇరువర్గాలను ధర్మాసనం కోరింది. సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందులో ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రభుత్వం, రైతు ప్రతినిధుల మధ్య జనవరి 15న మరో విడత చర్చలు జరగనున్నాయని, ఆ లోపు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ.. చర్చల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా ఉందని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. చట్టాల అమలుపై స్టే విధిస్తే.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగే అవకాశముందని పేర్కొంది. ‘స్టే’తో లాభం లేదు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం కానీ, సుప్రీంకోర్టు కానీ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. ఆ చట్టాల రద్దు కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, అయితే, చట్టాల అమలుపై స్టే విధించడం పరిష్కారం కాబోదన్నది తమ అభిప్రాయమని భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా శాఖ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చాదునీ పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమొక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. రాజ్యాంగవిరుద్ధమైన ఆ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు భోగ్ సింగ్ మాన్సా కోరారు. కొనసాగితే హింసాత్మకం.. రైతుల ఆందోళన ఎక్కువకాలం కొనసాగితే అది హింసాత్మకంగా మారే ప్రమాదముందని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ‘మనందరిపై బాధ్యత ఉంది. ఏ చిన్న సంఘటన అయినా హింసకు దారి తీయవచ్చు. అలాంటిది ఏదైనా జరిగితే మనమంతా బాధ్యులమవుతాం. ఎవరి మరణానికి కూడా మనం బాధ్యులం కాకూడదు’ అని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించేవారిని తాము కాపాడబోమని పేర్కొంది. పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఈ చట్టాలను రూపొందించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైతేనే.. సాగు చట్టాలు అన్యాయమైనవని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని, రాజ్యాంగ విరుద్ధమైనవని నిర్ధారణ అయితే చట్టాలపై కోర్టు స్టే విధించగలుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని గట్టి ఆధారాలుంటే తప్ప పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడం సాధ్యం కాదని న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేదీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వాదన వినకుండానే ఒక నిర్ధారణకు వచ్చారు. పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడానికి పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేయడం ప్రాతిపదిక కాకూడదు. ఎంపీల విజ్ఞతకు సంబంధించిన విషయమిది. కోర్టు పరిధిలో లేని అంశమిది’ అని ద్వివేదీ పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారు కాబట్టి చట్టాలను నిలిపేయాలనడం సరికాదన్నారు. -
జట్టులో లేని ఆటగాళ్లను పంపిస్తారా?
సౌతాంప్టన్: భారత జట్టు మేనేజ్మెంట్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన విలేకర్లు మీడియా సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. ప్రపంచకప్లో రేపు భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా... దీనికి నెట్ ప్రాక్టీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన బౌలర్లు దీపక్ చహర్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లు వచ్చారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు... టీమిండియా కెప్టెన్ కోహ్లి కాకపోయినా, హెడ్కోచ్ రవిశాస్త్రినో లేదంటే కనీసం సీనియర్ క్రికెటర్ ఎవరైనా వస్తారని ఆశించారు. తీరా జట్టులో చోటేలేని ఆటగాళ్లు మీడియా హాల్లో కనబడటంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విలేకరులు... సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. దీనిపై టీమిండియా మీడియా మేనేజర్ను సంప్రదించగా... భారత్ ప్రపంచకప్ ఆట ఇంకా మొదలుకాకపోవడం వల్లే నెట్ బౌలర్లను పంపించాల్సి వచ్చిందని బదులిచ్చాడు. గత ప్రపంచకప్లోనూ భారత జట్టుతో మీడియాకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అప్పటి కెప్టెన్ ధోని మీడియా సమావేశాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బుమ్రాకు డోప్ టెస్టు: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సోమవారం డోప్ టెస్టు నిర్వహించారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) గుర్తింపు ఉన్న ఏజెన్సీ బుమ్రా నుంచి మూత్ర నమూనాలను సేకరించింది. ఇది ప్రపంచకప్ టోర్నీ కావడంతో పలానా జట్టుకు అని కాకుండా ర్యాండమ్గా ఎవరికైనా డోపింగ్ పరీక్షలు నిర్వహించే అవకాశముంటుంది. -
‘ఇలాంటి దేశం మనకొద్దు’
దుబాయ్ : రానున్న ఎన్నికల్లో గెలుపు కంటే కూడా మరో ముఖ్యమైన సవాలును ఎదుర్కోబోతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ. దుబాయ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ శనివారం ఇక్కడి ఐఎమ్టీ దుబాయ్ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2019 లోక్సభ ఎన్నికల్లో మా పార్టీ గెలుపుకంటే మరో ముఖ్యమైన సవాలును ఎదుర్కొబోతున్నామని తెలిపారు. జర్నలిస్ట్ల మీద కాల్పులు.. వేర్వేరు కారణాల పేరు చేప్పి జనాల మీద జరిగే దాడులను ఆపడమే నా ముందున్న అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. మనక్కావాల్సింది ఇలాంటి భారతదేశం కాదు. ఓర్పు అనేది మన సంస్కృతిలో భాగం. కానీ ప్రస్తుత ప్రభుత్వం వల్ల దేశంలో అసహనం పెరిగిపోయిందన్నారు రాహుల్ గాంధీ. ఒక అంశాన్ని వేర్వేరు కోణాల్లో ఎలా చూడాలనే విషయం భారతదేశమే తనకు నేర్పిందన్నారు. అంతేకాక భారతదేశంలో మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తే.. విదేశాలకు వెళ్లిన వారంతా తిరిగి దేశంలోకి వస్తారన్నారు. -
కేసీఆర్ అసహనం ఓటమికి సంకేతం: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో పార్టీ కేడర్పై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేయడం టీఆర్ఎస్ ఓట మికి సంకేతం అని సీపీఎం అభివర్ణించింది. టీఆర్ఎస్ పాలనలో చెప్పిం ది ఎక్కువ చేసింది తక్కువ, అప్పులు ఎక్కువ అభివృద్ధి తక్కువ అని ఆ పార్టీ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలకే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. బుధవారం ఎంబీభవన్లో పార్టీ నాయకులు టి.జ్యోతి, డి.జి.నర్సింహారావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాజికన్యాయం– సమగ్రాభివృద్ధి సాధన దిశగా ప్రత్యామ్నాయ విధానాలతో పోటీచేస్తున్న సీపీఎం–బీఎల్ఎఫ్ అభ్యర్థులను బలపరచాలని ప్రజలను కోరారు. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉండటంతో, తెలంగాణ ప్రజలను ఏమార్చడానికి లోక్సభ ఎన్నికలకు ముందు పట్టు సాధించేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారన్నారు. పాలకపార్టీకి ఈసీ వత్తాసు అధికార టీఆర్ఎస్కు ఈసీ వత్తాసు పలికేలా వ్యవహరిస్తోందని జ్యోతి ఆరోపించారు. కోట్లాది రూపాయలు పంపిణీ కోసం గ్రామాలకు చేరుతున్నా ఈసీ ఉదాసీనంగా ఉందన్నారు. ఇప్పటికై నా డబ్బు, మద్యం పంపిణీ అరికట్టేలా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమపథకాల చుట్టే ప్రధానపార్టీల మేనిఫెస్టోలు తిరిగినా, మౌలికంగా మార్పు ఎలా తెస్తారు, పథకాల అమలుకు అవసరమైన డబ్బును ఎలా సమకూరుస్తారన్న విషయాన్ని వెల్లడించలేదన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
అడవిలో అలజడి
కాకులు దూరని కారడవి కాదు.... చీమలు దూరని చిట్టడవి కాదు....అదొక మామూలు అడవే... కానీ అతి పెద్ద అడవి....ఆ అడవిలో ఒక అలజడి...అది సింహం సృష్టించిన సంహారమా!అది వ్యాఘ్రం విసిరిన పంజాయా!అది ఏనుగులు చేసిన విధ్వంసమా!అది నక్కలు పన్నిన కుతంత్రమా!అది తోడేళ్ళు ఆడిన నాటకమా!అది గద్దలు లేపిన దుమారమా!అది పందికొక్కులు మెక్కిన ఫలహారమా!అవన్నీ ఎలాగూ ఉన్నాయి,అందుకు కాదు అలజడి...మరెందుకు అడవిలో అలజడి రేగింది?ఈ అజెండాతోనే అడవికి రారాజు...మృగరాజు అడవిలోని అతిముఖ్య అమాత్య శేఖరులతో అత్యవసర సమావేశానికి ఆదేశించాడు. ‘‘ఏమిటి! నా అడవిలో అలజడి! నా చట్టం పట్టు తప్పుతోందా! ఏమిటి?’’ అంటూ గట్టిగా గర్జించాడు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించిన ఆ అడవిలో సింహరాజు చేసిన గర్జన భూదిగంతములంతటా ప్రతిధ్వనించింది. భూకంపం వచ్చినట్లుగా అడవిలోని పక్షులన్నీ భయభ్రాంతులకు గురవుతూ తమ వృక్షావాసాల నుంచి ఒక్కసారిగా రెక్కలు టపటపలాడిస్తూ ఎటో ఎగరిపోయాయి.అడవిలోని అల్ప జంతుజాలమంతా కకావికలమై భూమి కలుగుల్లోనో, చెట్ల పొదల్లోనో ముడుచుకుపోయి దాక్కున్నాయి. మృగరాజు అడిగిన ప్రశ్నకు అమాత్యులేవీ సమాధానం చెప్పడానికి సాహసించలేక మౌనంగా ఉండిపోయాయి. అవి ఉలుకు, పలుకు లేకుండా ఉండడంతో మృగరాజుకు అసహనం కలిగింది. ఏనుగు నుద్దేశించి ‘‘మత్తేభమా! ఏమిటిదంతా! మాకు తలవంపులు తెచ్చేవిధంగా అడవిలో అలజడి!’’ అని తిరిగి ప్రశ్నించింది.తననుద్దేశించి మృగరాజు అడిగేసరికి మత్తగజానికి మాట్లాడక తప్పలేదు.‘‘నేడు కొత్తగా వచ్చిన అలజడి కాదు ప్రభూ! అడవిలో మన న్యాయం ప్రతిష్టించినప్పటి నుంచి ఉన్న అలజడే. అయితే దాని తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అదే మనకు తలనొప్పిగా పరిణమించింది’’‘‘ఏది ఏమైనా మాకిది చాలా సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తోంది. ఇదేమైనా మన ప్రత్యర్థుల పన్నాగమంటావా!’’ అంటూ నక్కవైపుతిరిగి‘‘జంబుకోత్తమా! నీవద్దేమైనా సమాచారముందా? కాలికి బలపం కట్టుకొని అడవంతా కలియదిరుగుతుంటావుగా! నీవైనా చెప్పు’’ అంటూ అడిగింది సింహం.ఏనుగు మాట్లాడిన తరువాత కొంత ధైర్యం తెచ్చుకున్న నక్క ‘‘ఏమీ లేదు ప్రభూ! అదే మన అడవి న్యాయం ఇక చెల్లదని కొద్దిమంది అల్పులు కొండలెక్కి, గుట్టలెక్కి అరుస్తూ అఘోరిస్తున్నారు’’నక్క ఇచ్చిన సమాచారానికి సింహం పక్కనే నిల్చున్న పెద్దపులి ఆగ్రహంతో శివాలెత్తి పోయింది.‘‘మృగరాజా! మీరు ఆదేశించండి! ఇప్పటికిప్పుడే వెళ్ళి వాళ్ళందరి భరతం పడతాను. వారేమనుకుంటున్నారు? ఇది అడవి కాదనుకుంటున్నారా! అడవి న్యాయం వద్దనిచెప్పడానికి వారికెన్ని గుండెలు’’ అంటూ పెద్ద పెట్టున గాండ్రించింది. మర ఫిరంగి మ్రోగినట్లుగా వచ్చిన ఆ శబ్దానికి కలుగుల్లోని ఎలుకలు బిక్కచచ్చి ఆంజనేయ దండకం ఆలపించాయి. పులి దూకుడుగా వ్యవహరించి పరిస్థితిని చేయి దాటిపోయేటట్లు చేస్తుందనే ఆందోళనతో ఏనుగు కల్పించుకొని ‘‘వ్యాఘ్ర శ్రేష్టమా! ఆగాగు, అన్ని పనులను దండనతోనే చక్కదిద్దలేము. యుగయుగాలుగానున్న మన చట్టానికి సవాలు ఎదురైనప్పుడు సంయమనంతో వ్యవహరించాలి’’‘‘హా!...చాలు.. చాలు మీ నీతి బోధలు. ఆఫ్ట్రాల్ భీతహరిణాలు! మనలను చూసి భయంతో పరుగులు పెట్టే వాటి గురించి ఇంతగా ఆలోచించాలా’’ అంటూ పులి కొట్టిపడేసింది. పులి వైఖరి నక్కకు నచ్చలేదు. అయినా పైకి నవ్వు పులుముకుంటూ ‘‘అయ్యా! మృగ శ్రేష్టమా! మీరు తలుచుకుంటే ఏమైనా చేయగల సమర్థులు. అందులో సందేహంలేదు. కానీ మనం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు వచించియున్నారు. నిజమే! నీవన్నట్లు అల్పులైన హరిణాలు మన కాళ్ళ కింద అణిగి, మణిగి ఉండతగ్గవే. అయితే అవన్నీ కలసి దుమ్ము రేపితే మట్టి మన కళ్ళలో వచ్చి పడుతుంది సుమా! వాటిని నీవు వేటాడుతున్నప్పుడు అవి తెలివిగా అమాంతంగా పరుగెడుతున్న దిక్కుమార్చి నీకు దక్కకుండా తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి గుర్తుంచుకో... ‘‘ఓహో!... మీ నక్క జిత్తులు వదిలించుకున్నారు కాదు. ఈ డొంక తిరుగుడు ఎందుకు? అటో ఇటో సూటిగా తేల్చేయకుండా’’ అని పులి జంబుకం వైపు చురచుర చూసింది. అప్పుడు సింహం కల్పించుకొని ‘‘ఆపండి! మీ వాగ్వివాదం...మనలో మనం కలహించుకోవడానికి కాదు నేను మిమ్మల్ని ఇక్కడకు పిలిచింది. హరిణాలు లేకుండా మన అడవి మనజాలదు. అలాగే అడవిన్యాయాన్ని అవి కాదనడానికి వీల్లేదు. కావున రెండింటికీ సయోధ్య కుదిర్చే సలహా ఇవ్వండి’’ అంటూ తిరిగి నక్కవైపే చూసింది.సింహమంతటి మృగ మహారాజు తననే సలహా చెప్పమని అడిగే సరికి జంబుకానికి లోలోపల ఆనందం జివ్వున ఉప్పొంగింది. దాన్ని బయటకు కనిపించకుండా ‘‘ప్రభూ! మీ దయాదాక్షిణ్యాల క్రింద బ్రతుకుతున్న భృత్యులం. మీ క్షేమమే మా క్షేమం. అదే అడవికి క్షేమం. అంతకు మించినది మరేముంది!’’ నక్క ఇలా సాగదీస్తూ మాట్లాడుతుంటే చిరుతకు చిర్రెత్తుకొచ్చింది.‘‘అది సర్లే!... మీ భట్రాజుల పొగడ్తలు తర్వాత చేద్దురుగాని. మీ ఆలోచన ఏమిటో తొందరగా చెప్పండి’’ అని అడిగింది. ‘‘మృగరాజ్య శేఖరులారా! నా యోచన ప్రకారం ఆ కురంగముల వద్దకు మన ప్రతినిధిని పంపుదాం. మొదట వారి కోర్కెలేమిటో తెలుసుకుందాం. రాజనీతి గురించి మీకు పాఠాలు చెప్పేటంతటి దాన్ని కాను. సామ, దాన,బేధముల తరువాత ఎలాగూ దండోపాయముందిగా’’ అని పలికింది.ఈ ప్రతిపాదనకు పులితో సహా అన్ని అంగీకరిస్తున్నట్లు తలలూపాయి. అతి చిక్కు సమస్యను తానే పరిష్కరించినట్లుగా నక్క అన్నిటివైపు ఒకసారి కలియజూసి తిరిగి ధీమాగా మాట్లాడింది.‘‘మన అమాత్యశేఖరులలో శాకాహార భక్షకులైన మత్త గజేంద్రమే ఇందుకు సార«థ్యం వహించి కార్య భారాన్ని వహిస్తే మంచిది. ఎలాగూ హరిణాలకు మనపై నమ్మకం లేదు’’ అంటూ మరొక సలహా ఇచ్చింది.‘‘భలే, భలే...భేష్! గోమాయువా! అలాగే చేద్దాం. మన కుంజరమును ఆ కురంగముల వద్దకు రాయబారిగా పంపుతున్నాను’’ అంటూ ప్రకటన చేసి మృగరాజు గంభీరంగా అడుగులు వేస్తూ నిష్క్రమించింది. ఆహా! ఎంతటి శోభాయమానంగా ఉందా దృశ్యం... అడవిలోని హరిణాలన్నీ ఒక్క చోట చేరితే అతి మనోహరం కదా! ప్రకృతిలోని వర్ణాలన్నీ విరబూసినట్లుంది. ఉషోదయాన ఆకుల గలగలల సవ్వడి వింటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో... ఇంద్రధనస్సులోని రంగులన్నింటినీ మేనికి పులుముకున్న ఆ కురంగములు అటూ ఇటూ చక చకా కదులుతూ ఒకటితో నొకటి దరహాస పలికింపులను చూస్తే మనస్సు పులకించక మానదు. వాటి వదనాల్లో లాలిత్యం, లావణ్యం విరజిమ్ముతుంటే... కళ్ళలో అణువణువునా ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది. మహిషాసురున్ని వధించి, దశమికి విజయోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైనట్లుందా సమూహం.ఆ హరిణాలు చిన్న చిన్న గుంపులుగా విడిపోయి ముచ్చటించుకుంటున్న సమయంలో ఎవరో వస్తున్నట్లుగా కలకలం రేగింది. ఎవరు? ఎవరు? అని ఒకటి మరొకదాన్ని అడుగుతున్న సమయానికి మృగరాజు పంపిన మదపుటేనుగు భారీకాయాన్ని మోస్తూ, తొండమూపుతూ అక్కడికి వచ్చింది. ఏనుగు తమ సమీపానికి వచ్చేసరికి లేళ్ళన్నీ ఒకే పెద్ద గుంపుగా వచ్చి నిలబడ్డాయి.ఏనుగు వాటికి ఎదురుగా నిలిచి ఒక్కసారి అంతటా పరికించి చూసింది. లేళ్ళ నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. ఇంతటి భారీ కాయమొచ్చి నిలబడితే అవి పల్లెత్తి మాట్లాడకుండా ఉండడంతో ఏనుగు ఒకింత కోపంతో ఘీంకరించి‘‘మీరంతా ఇలా గుమిగూడడం అడవికి మంచిది కాదు. మీలో దేనికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే అవి ఒక్కొక్కటిగా మృగరాజు వద్దకు వెళ్ళి చెప్పుకోవాలి. అంతేకాని కొండలెక్కి, గుట్టలెక్కిఅలజడికి దిగడం సరికాదు’’ అంటూ ఆయాసంగా పలికింది. ‘‘ఇబ్బంది కాదు మహానుభావా! మత్తగజమా!’’ అంటూ గుంపు వెనక భాగంలోంచి ఒక హరిణం గట్టిగా అరిచింది. అంతటా ముందున్నవన్నీ బాగా చెప్పావని అభినందిస్తున్నట్లుగా కాలి గిట్టలతో నేలకు రాస్తూ,గుర్–గుర్ మంటూ సకిలిస్తూ వెనక్కి తిరిగి చూశాయి. ‘‘ఇబ్బంది కాకపోతే కష్టం కావచ్చు. అంత మాత్రానికే ఇంత హంగామా చేస్తారా!’’‘‘కాదు, కాదు... కష్టం కూడా కాదు మహాశయా!’’ అంటూ అన్నీ ఒక్క పెట్టున గొంతెత్తాయి.‘‘ఇలా అన్నీ అరిస్తే నాకేమీ అర్థం కాదు. మీలో ఎవరైనా ఒకటి మీ కోర్కెలేమిటో నాకు ఎరుక పరిస్తే, మృగరాజుకు తెలియబరుస్తాను’’ ‘‘అలాగే... అలాగే...’’ అంటూ గుంపు ముందు భాగానున్న హరిణాలలో బంగరు మేని ఛాయతోనున్న ఒకటి మిగతా వాటిని వారించి ఏనుగు ఎదుటికి వచ్చి నిల్చుంది.‘‘గజరాజా! మా మొర అలకించడానికి మీరు వచ్చినందుకు ధన్యవాదములు. ఇబ్బందులు, కష్టాలు ఓర్చుకోలేక మేమిలా గుమిగూడలేదు. అవన్నీ మాకు సహజమే. అంతకు మించిన ఉపద్రవం మామీద వచ్చి పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం వేటాడుతోంది. మాలో ఒక్కదానికి మాత్రమే కాదు. మా జాతి జాతంతా నిత్యం భయ భ్రాంతులకు గురవుతోంది. అడవిలో ఆహారానికి వెళ్ళినా, నదీ తీరాలవద్ద నీళ్లుతాగుతున్నా, ఎండకు తాళలేక చెట్ల కింద సేద తీరుతున్నా, చివరకు చెట్టు పొదల్లో విశ్రమిస్తున్నా...మా పిల్లలకు పాలిస్తున్నా...అక్కడ, ఇక్కడ అని లేదు అన్ని చోట్ల మాపై వ్యాఘ్రాల వేట విలయతాండవం చేస్తోంది. మా నీడను చూసి మేమే భయపడాల్సి వస్తోంది’’ అంటూ ఉద్వేగభరితంగా రుద్ధ కంఠంతో విన్నవించింది. ఆ మాటల్లో అనంతకాలంగా గూడుకట్టుకున్న ఆవేదన ఉప్పెనలా పెల్లుబికింది. కాసేపు ఆ హరిణం తనను తాను సంభాళించుకొని కంఠస్వరం మార్చి మళ్ళీ ఇలా చెప్పింది. ‘‘ఏం! ఈ అడవి మాది కాదంటారా! నిర్భయంగా జీవించే హక్కు మాకు లేదా! చెప్పండి’’ అంటూ ఏనుగును నిలదీసింది. ‘‘రెండు రోజుల క్రితం మాలో ఒకటి ఏమరుపాటున ఒక వృద్ధ వ్యాఘ్రం సమీపానికి వెళ్లడమే అది చేసిన పాపమైపోయింది. ఆ వ్యాఘ్రం కండకావరంతో కన్నూమిన్నూ కానకుండా మా దానిపై లంఘించి రాక్షసంగా నొక్కి, రక్కి గాయపర్చింది. మా హరిణం ఎలాగో చావు తప్పించుకుని బయటపడింది. ఈ అన్యాయాన్ని అది నోరు తెరచి మాకు చెప్పడం వల్ల బయటకు తెలిసి వచ్చింది. బయటకు చెప్పలేక మౌనంగా రోదిస్తున్నవీ, కిరాతకంగా బలైనవి మా జాతిలో చాలా ఉన్నాయి. ఇలాంటి అన్యాయాలకు అంతం పలకాలనే మేమిలా చేస్తున్నాం’’ అని దృఢంగా పలికి ఊరుకుంది. ఆ హరిణం చెప్పిన విషయాన్ని సావధానంగా ఆలకించిన ఏనుగు ‘‘ఇంతకీ మీ కోర్కెలేమిటో మాకు విశదం కాలేదు’’ అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. అంతా విని సీతకి రాముడికి సంబంధమేమిటో తెలియదన్నట్లుగా ఏనుగు మాట్లాడే సరికి హరిణాలన్నీ ఆగ్రహంతో ఎగరి గంతులేస్తూ‘‘మీకు విశదం కాకపోవడమే మా విషాదం’’ అంటూ తిరిగి బర్–బర్మంటూ గావుకేకలు పెట్టాయి.‘‘శాంతించండి! శాంతించండి! ఆవేశపడకండి! మనం చెప్పదల్చుకున్న విషయాన్ని స్పష్టం చేద్దాం’’ అంటూ ఇంతకు మునుపు వివరించిన ఆ లేడియే మిగతా వాటిని సమాధానపరచి ‘‘మా కోర్కె ఒకే ఒక్కటి. మమ్ములను భయోత్పాతంలో ముంచుతున్న మీ ఆటవిక న్యాయం మాకొద్దు. దాన్ని తిరగరాయాలి. బలాఢ్యులకు చట్టం చుట్టం కారాదు. అడవిలోని జంతువులన్నీ అంతటా సమానమని కొత్త చట్టాన్ని లిఖించాలి. కండ బలంతో మాపై దాడి చేసే మృగమదాంధులను వెలి వేయాలి. ఇలా చేస్తేనే మా అలజడి అగుతుంది. ఇంతే. ఇంతకు మించి ఏమీ లేదు’’ అని తెలియజేసి అడుగులు వెనక్కు వేసి లేళ్ళ గుంపులో కలిసింది. ఏనుగుకు ఏం చేయాలో, ఏమని సమాధానం చెప్పాలో కాసేపు పాలుపోలేదు. కొంత ఆలోచించిన తరువాత‘‘అడవి న్యాయాన్ని అధర్మమనీ, దీన్ని తిరగ రాయమని మీరు అడుగుతున్నట్లు నాకర్థమైంది. ఇది నా చేతిలో లేనిది. మృగరాజుకు విన్నవిస్తాను. ఆపై ప్రభువుల ఇష్టం. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని మాత్రం ప్రత్యుత్తరమిచ్చి, తను ఇక చేయగలిగింది ఏమీ లేదని తలచి వెనక్కు తిరిగి భారంగా అడుగులు వేస్తూ వెళ్ళి పోయింది. ఏనుగు కనుమరుగు అయ్యేవరకు హరిణాల గుంపు కదలకుండా నిశ్చలంగా నిలబడి పోయాయి. తమను అధికారం ఆదుకుంటుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా లోకానికి తమ గోడును వినిపించేటట్లు చేయగలిగామనే సంతృప్తి వాటిల్లో కనిపించింది. ఆ అలజడి చివరికేమైంది?ఆటవిక న్యాయం అంతమైందా?అధికారం దాన, భేద, దండోపాయాలతో అణచి వేసిందా?ఇవి సమాధానాలు దొరకని ప్రశ్నలని భావించకండి!మాకెందుకులేనని మౌనం వహించకండి!రండి! వెళ్దాం!కాకులుదూరే కారడవికి...చీమలు దూరే చిట్టడవికి...అమ్మో! నాకు భయమేస్తుంది...క్రూరమృగాలు చంపుకుతింటాయి...అంటూ అక్కడే ఆగి పోయారా...ఆ భయం పెనుభూతమై మిమ్మల్ని కూడా వెంటాడుతుంది... - ఎస్. జి. జిజ్ఞాస -
ఎన్నిసార్లు చెప్పాలి..
కర్నూలు : ‘ఇప్పటికే ఆలస్యమైంది. భవనం ప్రారంభించాం కదా? ఎన్నిసార్లు చెప్పాలి’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో రూ.3.67 కోట్ల వ్యయంతో నిర్మించిన జెడ్పీ నూతన పరిపాలన భవనాన్ని, పక్కనేఏర్పాటు చేసిన గౌతమబుద్ధుని విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ భవనాన్ని పరిశీలించాలని కోరగా, లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. మెట్లు ఎక్కేందుకు కూడా ఇష్టపడకుండానే వెనుదిరిగారు. లోకేష్ వస్తున్నారని మూడు రోజులుగా జెడ్పీ చైర్మన్తో పాటు అధికారులు, సిబ్బంది రాత్రీ పగలు కష్టపడి భవనాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే మంత్రికి జెడ్పీటీసీ సభ్యులను పరిచయం చేయాలని, నాల్గో తరగతి ఉద్యోగులకు యూని ఫాం ఇప్పించాలని, నూతన భవనంలోని తన చాంబర్లో మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించాలని చైర్మన్ కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే.. సమయం లేదంటూ మంత్రి ఒకానొక సందర్భంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్లో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకపోవడంతో సంబంధిత అధికారులు, జెడ్పీ పాలకవర్గ సభ్యులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మాతా శిశు భవనం ప్రారంభం కర్నూలు సర్వజన వైద్యశాలలో రూ.24 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన మాతాశిశు భవనాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. దీంతో పాటు రూ. 6.57 కోట్లతో నిర్మాణం కానున్న ఆధునిక బర్న్స్వార్డు, రూ.22 కోట్లకు పైగా నేషనల్ అక్రిడియేషన్ బోర్డు హాస్పిటల్స్ నిధులతో చేపట్టబోయే అప్గ్రేడెడ్ పనులకు శంకుస్థాపన చేశారు. గైనిక్వార్డులో ప్రసవించిన బాలింతలకు బేబీ కిట్లను అందజేశారు. అంతకుముందు జోహరాపురం వద్ద రూ.17 కోట్లతో హంద్రీ నదిపై హైలెవల్ వంతెన నిర్మాణానికి, రూ.కోటి అంచనాతో 5వ వార్డు జమ్మిచెట్టు వద్ద హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి, రూ.1.50 కోట్ల అంచనాతో 6వ వార్డు కమేళా వద్ద ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉస్మానియా కళాశాల మైదానంలో మైనారిటీ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ, పెళ్లికుమార్తెలకు ‘దుల్హన్’ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కర్నూలులో డిసెంబరులో జరిగే ఇస్తెమాకు పంచాయతీరాజ్ శాఖ తరఫున మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం నందికొట్కూరు మం డలం బ్రాహ్మణకొట్కూరులో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతో పాటు పలు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి నేరుగా కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకొని అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి అఖిలప్రియ, శాసనమండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్, ఎంపీలు టీజీ వెంకటేష్, బుట్టా రేణుక, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, వైస్ చైర్మన్ పుష్పావతి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖర్రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఇన్చార్జ్లు కేఈ ప్రతాప్, వీరభద్రగౌడ్, కే మీనాక్షినాయుడు, మాండ్ర శివానందరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఓర్వకల్ వద్ద జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన పారిశ్రామివేత్తలు, మీడియా సమావేశంలో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. శంకుస్థాపనలకే పరిమితయ్యారంటూ ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయని ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబును అడగగా.. అందుకు ఆయన తీవ్రంగా స్పందించారు. ‘ప్రతిపక్షం వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు. చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదా.. కేసుల మాఫీ కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా మెక్కుబడిగా మీడియా సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు రెండు నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరో వైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) ఇంతవరకు అధికారంలోకి రాలేదన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోవడం కొసమెరుపు. -
చిన్న పిల్లాడి పెద్ద మనసు
పిల్లాడు తన దగ్గరున్న చిల్లర నాణేలనిజేబులోంచి తీసి లెక్కించసాగాడు. వెయిట్రెస్ అసహనంగా ఫీలైంది. పిల్లాడు మెనూలోమరో ఫొటో వైపు చూపిస్తూ, ‘మరి ఈ బటర్ స్కాచ్ ఎంత?’ అన్నాడు. ఒక వేసవికాలం మధ్యాహ్నం. ఒక పదేళ్ల పిల్లాడు ఐస్క్రీమ్ పార్లర్కు వెళ్లాడు. ఎగిరి కూర్చున్నట్టుగా కుర్చీలో కూర్చున్నాడు. పెద్దవాళ్లు ఎవరూ వెంటలేని చిన్న పిల్లాడి దగ్గరికి వచ్చింది ఒక వెయిట్రెస్. గ్లాసు మంచినీళ్లు ముందుపెట్టి, ‘ఏం కావా’లని అడిగింది.టేబుల్ మీదున్న మెనూలోంచి ఒక ఫొటో చూపిస్తూ, ‘ఈ కస్టర్డ్ ఆపిల్ ఐస్క్రీమ్ ఎంత?’ అని అడిగాడు పిల్లాడు.‘యాభై రూపాయలు’ బదులిచ్చింది.పిల్లాడు తన దగ్గరున్న చిల్లర నాణేలని జేబులోంచి తీసి లెక్కించసాగాడు. వెయిట్రెస్ అసహనంగా ఫీలైంది.పిల్లాడు మెనూలో మరో ఫొటో వైపు చూపిస్తూ, ‘మరి ఈ బటర్ స్కాచ్ ఎంత?’ అన్నాడు. ఇంతలో పార్లర్కు వేరే కస్టమర్లు రావడంతో ఆమె త్వరగా కానిమ్మన్నట్టుగా జవాబు ఇస్తూ, ‘నలభై రూపాయలు’ అంది.పిల్లాడు మళ్లీ నాణేలు లెక్కించసాగాడు. వెయిట్రెస్ ఓపిక నశిస్తోంది. చివరకు తేల్చుకున్నట్టుగా, ‘బటర్ స్కాచ్’ అన్నాడు. ఆమె వేగంగా ఐస్క్రీమ్ తెచ్చి, బిల్లు కూడా టేబుల్ మీద పెట్టి, ఇతర కస్టమర్లకు ఏం కావాలో చూడటానికి వెళ్లింది. కాసేపయ్యాక తిరిగి వచ్చేసరికి పిల్లాడు టేబుల్ మీద లేడు. డబ్బు కౌంటర్లో కట్టేసి వెళ్లిపోయాడు. టేబుల్ మీద టిప్పుగా పెట్టిన పది రూపాయి బిళ్లలు చూసేసరికి ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. -
ఆగర్భ హింస
‘‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తాన’’ని పంతులుగారన్నప్పుడే భయమేసింది.‘‘ఆఫీసులో నా మొగుడున్నాడు ! అవసరమొచ్చినా సెలవివ్వడ’’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది – ‘‘వాడికేం? మగమహారాజని ‘‘ఆడా మగా వాగినప్పుడే అర్థమైపోయింది – ‘‘పెళ్ళి’’ అంటే ‘‘పెద్దశిక్ష ’’ అని ‘‘మొగుడు’’ అంటే ‘‘స్వేచ్ఛా భక్షకుడు’’ అని మేం పాలిచ్చి పెంచిన జనంలో సగం మమ్మల్ని విభజించి పాలిస్తుందని ! సావిత్రి అనే స్త్రీవాద కవయిత్రి రాసిన ఈ కవిత మొదటిసారి చదివినపుడే కాదు, చదివిన ప్రతిసారీ హృదయాన్ని కంపింపజేస్తుంది . కేవలం పదకొండు పొట్టి వాక్యాలలో సావిత్రి మనం చూస్తున్న సమాజాన్ని, మన చుట్టూ పంజరంలా వేల ఊచలతో పరుచుకున్న పురుష పెత్తందారీ సమాజాన్ని చిత్రిక పట్టింది . చిత్రంగా మగవాళ్ళు కూడా విసుగునో, తప్పించుకోలేని పెత్తనాన్నో చెప్పాలంటే మొగుడు అన్న పదాన్నే వాడుతూ మొగుడు అనే పదవికి వున్న నిరంకుశ ధోరణిని చెప్పకనే ఒప్పుకుంటూ ఉంటారని ఆమె ఈ చిన్ని కవితలో చెప్పుకొచ్చింది. ‘తల్లి’ కడుపును చీల్చుకొని బయట పడకముందునుంచే బంగారు ‘తల్లి’కి లెక్కలేనన్ని కష్టాలు. ఒక్కో దశలో ఒక్కోరకం హింసను దాటుకొనొచ్చి నిలబడాలి ఆ తల్లి. పెళ్లయ్యాకైతే కొంతమందికి చెప్పుకోలేని, చెప్పనివ్వలేని హింస.. గృహహింస. నవంబర్ 25 ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్’ సందర్భంగా...రవీందర్ బాగా చదువుకున్న వ్యక్తి. ఒక ప్రైవేట్ సంస్థలో ఉన్నతోద్యోగంలో వున్నాడు. అతని భార్య ప్రవీణ, టీచర్. వారికిద్దరు పిల్లలు. అత్తమామలు వంటి బాదరబందీ లేని ఆధునిక కుటుంబం. అయినా రవీందర్ ఎప్పుడూ ప్రవీణను మనశ్శాంతిగా ఉండనిచ్చేవాడు కాదు. దానికి కారణం ఆమె ఒంటి రంగు. ఆమె నల్లగా ఉండటం అతనికి చాలా అసహనం కలగజేసేది. ఆమె ఇచ్చిన కట్నం డబ్బు ఆమె రంగును ఆనాడు అతని కంటికి కనిపించనీయకుండా అడ్డుపడింది. కానీ ఈరోజు ఆమెకి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఆమె లాగే నల్లగా ఉండటం అతనికి చిరాకుగా మారింది. ఆ చిరాకును అతను మొదట్లో సూటిపోటి మాటలతో వ్యక్తపరచేవాడు. కాలక్రమంలో ప్రవీణకు పుట్టింటివాళ్ళ వెన్నుదన్ను పెద్దగా లేదని అర్థమయ్యాక అతని అసహనం మాటల నుంచి చేతలకు మారింది. అతను పెట్టే హింస తట్టుకోలేనిదిగా వున్నా నలుగురి ముందు పరువు పోతుందనీ, పిల్లలు తండ్రి లేనివారవుతారనీ, ఈ వయసులో మొగుడ్ని వదిలేస్తే ఇంక దిక్కేముందనీ, నిదానంగా ఆయనే మారుతారని ప్రవీణ ఈ అత్యాచారాన్ని తన కర్మగా భావిస్తూ, భరిస్తూ వచ్చేది. సరిగ్గా పోయిన కార్తీక మాసంలో రవీందర్ కొట్టిన దెబ్బలు ఆమెకు తగలరాని చోట తగిలి అక్కడికక్కడే మరణించింది. అలా మరణించే వరకు ఆమె తన సహనాన్ని పాతివ్రత్యం అనీ, ఆ పాతివ్రత్యానికి దేవుడి ఆశీస్సులు తప్పకుండా వుంటాయని అందరికీ చెప్తూ ఉండేది. ప్రవీణ మరణం ప్రమాదకర మరణం అని అందరినీ నమ్మించిన కొంతకాలానికి రవీందర్ ప్రవీణకు పుట్టిన నల్ల పిల్లల్ని ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపేసి, ఇంకా పసి వయసులోనే వున్నాడు అని సమాజపు ఆమోదాన్ని పొంది రెండవ పెళ్లి చేసేసుకున్నాడు. ఈసారి కట్నానికి పెద్ద ఆశపడకూడదనీ, తనకి తెల్లటి అమ్మాయే కావాలని తెలిసివచ్చిందని భావించి, తెల్లటి అమ్మాయిని వెదికి పెళ్లి చేసుకున్నాడు. ప్రవీణ కేసు భారత దేశంలో నమోదు కాని అనేకానేక గృహ హింస కేసులలో ఒక కేసుగా, పోలీస్ స్టేషన్ వరకు రాని హత్యగా కాలగర్భంలో కలిసి పోయింది. స్త్రీవాద యోధులు మిరాబెల్ సిస్టర్స్ నవంబర్ 25వ తేదీని ఐక్య రాజ్య సమితి ‘‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్’’గా ప్రకటించింది. చలమూ, పెరియార్ ఈ వీ రామస్వామి ఇంకా చాలామంది స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షించిన పెద్ద మనుషులు స్త్రీకి ’నీ గురించి నీవే ఆలోచించుకోవాలి’ అని చెప్పారు. తనకేం కావాలో, తాను అనుభవిస్తున్న బాధల రూపమేమిటో తానైతేనే బాగా చెప్పగలదని భావించారు. ప్రపంచవ్యాప్తంగా మొలకెత్తిన ఈ ఆలోచనా రూపమే స్త్రీవాదం. ఈ స్త్రీవాదం సాధించిన విజయమే నవంబర్ 25. స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నినదిస్తూ ఏర్పడిన ఈ రోజు వెనుక ఒక ఘనమైన త్యాగం వుంది. ఆ త్యాగమూర్తులు ముగ్గురూ అనన్య సామాన్యమైన సాహసం కలిగిన స్త్రీలు. వీరే డొమినికన్ రిపబ్లిక్కు చెందిన ‘మిరాబెల్ సిస్టర్స్’గా ప్రసిద్ధి పొందిన పాట్రియా మెర్సిడెస్ మిరాబెల్ రెయెస్, మారియా అర్జెంటీనా మినెర్వా మిరాబెల్ రెయెస్, ఆంటోనియా మారియా టెరెసా మిరాబెల్ రెయెస్లు.డొమినికన్ నియంత రాఫెల్ ట్రుజిలో అమలు జరుపుతున్న అన్యాయాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా వీరు గొంతెత్తారు. వీరి నిర్భీకతను సహించలేక నియంత రాఫెల్ 1960 నవంబర్ 25న వారిని హత్య చేయించాడు. దేశంపై వీరి హత్య తీవ్ర ప్రభావాన్ని చూపింది. తరువాతి కాలంలో వీరు ‘‘ఫెమినిస్ట్ ఐకాన్స్’’గా ప్రసిద్ధి పొందారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1999 డిసెంబర్ 17 నాటి సమావేశంలో వీరి వర్ధంతిని ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్గా ప్రకటించింది. ఈ దినోత్సవం ఎందుకంటే..? ఈ అంతర్జాతీయ దినోత్సవం ఆవశ్యకత ఏమిటన్న దానికి ఐక్యరాజ్య సమితి ఇలా సమాధానమిచ్చింది... ‘‘మహిళలపై జరుగుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘన. చట్టాలలో, ఆచరణలో స్త్రీల మీద వున్న వివక్షకు, స్త్రీపురుషుల మధ్య వున్న అసమానత్వానికి పర్యవసానమే మహిళలపై జరుగుతున్న హింస. మహిళలపై జరుగుతున్న హింస అనేక రంగాలపై తిరోగమన ప్రభావాన్ని కలుగజేస్తుంది. పేదరిక నిర్మూలన, ఎయిడ్స్పై పోరాటం, శాంతిభద్రతలు వంటి అనేక అంశాలకు విఘాతం కలిగిస్తూ వుంది. మహిళలపై హింస అనివార్యమైనది కాదు. నివారణ సాధ్యమైనది, అత్యంత ఆవశ్యకమైనది. మహిళలపై హింస యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న జాడ్యం, రుగ్మత. మహిళలపై హింస బహిరంగ ప్రదేశాలలోనూ, రహస్య ప్రదేశాలలోనూ జరుగుతూనే వుంది. దీనికి అనేక రూపాలున్నాయి. కొన్ని సార్లు ఇది గృహ హింస, సన్నిహిత భాగస్వామి చేసే హింసగా ఉంటే, మరికొన్నిసార్లు లైంగిక వేధింపులు, లైంగిక దాడుల రూపంలోనూ, స్త్రీల జననాంగ విచ్ఛేదన, లైంగిక హత్యల రూపంలోనూ వుంటున్నది’’ అని పేర్కొన్నది. అంతే కాకుండా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీన జరిగే ‘హ్యూమన్ రైట్స్ డే’ వరకు క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాల్సిందిగా పిలుపునిస్తున్నది. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘‘స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐక్యత’’ప్రచారానికి థీమ్గా ‘‘లీవ్ నో వన్ బిహైండ్: ఎండ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్ అండ్ గర్ల్స్’’ని ప్రకటించారు. అంటే అణగారిన వర్గాల వారిని, అల్పసంఖ్యాక వర్గాల వారిని, శరణార్థులను ఎవ్వరినీ వదిలి పెట్టకుండా అందర్నీ కలుపుకుని ‘‘యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్’’–30 సాధించడానికి మహిళలపై హింస నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. అన్ని వర్గాల మహిళలూ బాధితులే! ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసకు సంబంధించి ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసకు బలవుతున్నారు. ఈ హింసకు అన్ని ఆదాయ వర్గాల వారు, అన్ని వయసుల వారు, అన్ని విద్యార్హతలు కలిగిన మహిళలూ బాధితులే. ఈ హింస స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది . తీవ్రమైన సంఘటనల్లో మహిళలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. స్త్రీల మీద హింసకు ప్రపంచ వ్యాప్తంగా భర్త వంటి సన్నిహిత భాగస్వాములే కారణమవుతున్నారు. స్త్రీల మీద జరిగే హింసలో శారీరక హింస కంటే లైంగిక హింస తక్కువే అయినప్పటికీ సన్నిహిత భాగస్వాములు హింసకు పాల్పడే ఘటనల్లో రెండు హింసలూ ఏకకాలంలో జరుగుతున్నాయి. అసమానతల నేపథ్యం ఆదిమ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి అసమానత లేదు. ఉత్పత్తి కన్నా, సంతానోత్పత్తికి ఎక్కువ గౌరవమున్న కాలంలో స్త్రీ సమ ప్రాధాన్యతను పొందుతూ వచ్చింది. ఎప్పుడైతే పురుషుడు ఆయుధోత్పత్తిపై ఆసక్తి చూపుతూ ఉత్పత్తిని పెంచుకుంటూ వచ్చాడో అప్పుడు శ్రమ విభజన మొదలయింది, దీనినే ఏంగెల్స్ ‘‘చరిత్రలో మొదటి శ్రమ విభజన స్త్రీపురుషుల మధ్య జరిగింది. మొదటి వర్గ పీడన, స్త్రీలపై పురుషుల పీడన ఒకే కాలంలో సంభవించాయి. కుటుంబంలో భర్త బూర్జువా, భార్య కార్మికురాలు’’ అని తన ‘కుటుంబం – వ్యక్తిగత ఆస్తి రాజ్యాల పుట్టుక’ లో పేర్కొన్నాడు. ఆశ్చర్యకరంగా ఎంతెంతో పెద్ద మేధావులు, తత్వవేత్తలూ స్త్రీకి కూడా పురుషునితో సమానమైన ఆలోచన చేయదగ్గ మెదడు ఉందని అంగీకరించడానికి నిరాకరించిన వారే. స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సర్వత్రా సంకెళ్ళమయమయ్యాడన్న రూసో స్త్రీ దగ్గరికొచ్చేసరికి ‘‘స్త్రీల చదువంతా తప్పనిసరిగా పురుషులను ఆనందపెట్టడానికి, వారికి ఉపయోగపడటానికి, పురుషులకు చిన్నతనంలో చదువు నేర్పటానికి, పెద్దయ్యాక వారి అవసరాలు తీరుస్తూ వారి జీవితం సౌఖ్యంగా సాగటానికి స్త్రీలు చదువుకోవాలి’’ అన్నాడు. పురుషులు స్త్రీని సంతాన రక్షణకు, ఇంటి అవసరాలను చూసుకోవడానికి పరిమితం చేసిన తరువాత అందుకు అనుగుణమైన తర్ఫీదును స్త్రీలకూ ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ శిక్షణలో మొదటి అంశమే నీవు పురుషుని సౌఖ్యం కోసం పుట్టావ్ అన్న భావజాలం. ఈ భావజాలం స్త్రీ మనశ్శరీరాలను ఎంత ఆక్రమించుకున్నదంటే మూడవ నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వేలో కుటుంబ హింస గురించి చేసిన సర్వేలో ఆడవాళ్లను మగవాళ్ళు కొట్టవచ్చు అని 55% మహిళలు అంగీకరించారు. అత్తమామలను అగౌరవపరిస్తే 48%, ఇంటిని నిర్లక్ష్యం చేస్తే 38%, భర్తతో వాదన పెట్టుకుంటే 35%, భర్త అనుమతి లేకుండా బయటకు వెళితే 30% మహిళలు భర్త తమను కొట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ తరహా పితృస్వామ్యం మెదడులో ఇంకిపోయిన మహిళలు కీలకమైన పదవులలో, భావజాల వ్యాప్తికి పనిచేసే విద్యాలయాల్లో ఉంటూ పురుషులకు ఇతోధికంగా సహాయం చేస్తూ వస్తున్నారు. పురుషస్వామ్యం దాని పని అది చేసుకుంటూ వెళుతూ ఉంటే చైతన్యవంతులైన స్త్రీలు స్త్రీవాదులుగా మారి స్త్రీల జీవితాలకు చేసిన సేవ చిన్నది కాదు. పునరుత్పత్తి చేసే అవయవాలు ఉన్నప్పటికీ తాను బిడ్డకు జన్మనివ్వాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఈనాటికీ లేదు. కానీ బ్రిటన్కి చెందిన మార్గరెట్ సాంగర్ వంటివారు ఎంతో పోరాడిన తరువాత ఈ రోజు అబార్షన్ హక్కు అమలులోకి వచ్చింది. స్త్రీలకు మేలు చేసిన సంస్కరణోద్యమం స్త్రీ వాద ఉద్యమమే కాదు, సంస్కరణోద్యమం కూడా భారతీయ స్త్రీలకు మేలు చేసింది, మార్పు రాత్రికి రాత్రే రాకపోయినా మార్పు రాకుండా ఆగిపోలేదు. గృహ హింస ఇండియాలో ప్రత్యేకమైన నేరంగా మొదటిసారి 1983లో చట్టాల్లో చేరింది. ఆ సంవత్సరం ఇండియన్ పీనల్ కోడ్ లో ‘సెక్షన్ 498–ఎ’ చేర్చడం ద్వారా భర్త లేదా అతని కుటుంబం భార్య మీద చేసే క్రూరత్వం ఒక ప్రత్యేకమైన నేరంగా పరిగణనలోకి వచ్చింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గృహహింసను కొలవడానికి కాన్ఫ్లిక్ట్ టాక్టిక్ స్కేల్ను ఉపయోగించింది. ఈ సర్వే ప్రకారం భారతదేశంలో 15 నుంచి 49 వయసు ఉన్న మహిళల్లో 39.7% మంది ఎదో ఒక రకమైన హింసకి బాధితులు. బీహార్లో అత్యధికంగా 60% మంది మహిళలు హింసకి బాధితులు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లో 36.8% మంది, కేరళలో 19.8%, తమిళనాడులో 44.1%, కర్ణాటకలో 21.5%. స్త్రీలు హింసకి బాధితులు. ఈ సర్వే ప్రకారం... నిరక్షరాస్యులైన స్త్రీలలో 44% హింసకి బాధితులైతే, విద్యాధికులైన స్త్రీలలో బాధితులు 14%. అలాగే భర్త నిరక్షరాస్యుడు అయితే 20% స్త్రీలు హింసకి బాధితులు అవుతుండగా, భర్త విద్యాధికుడు అయితే 8.9% స్త్రీలు హింసకి బాధితులు అవుతున్నారు. అసలు మద్యపానం చేయని భర్త ఉంటే 12% స్త్రీలు హింసకి బాధితులు అయితే భర్త తాగుబోతు అయితే 38% స్త్రీలు హింసకి బాధితులు అవుతున్నారు. ఆర్థిక స్థితిగతులు కూడా కుటుంబ హింసని ప్రభావితం చేస్తున్నాయి. సంపన్న వర్గాలలో హింసకి బాధితులు అయిన మహిళలు 19% అయితే నిరుపేద వర్గాలలో బాధిత మహిళలు 44%. ఈ సర్వే ప్రకారం మన దేశంలో 66%మంది మహిళలు తమపై జరిగిన హింసను ఎవరికీ చెప్పుకోరు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం భర్త మరియు ఇతర కుటుంబ సభ్యుల క్రూరత్వం వల్ల మహిళలపై జరిగిన నేరాలు 2012 లో 29% ఉండగా, 2015లో అది 34% అయింది. ఈ కేసులు నమోదు చేయడానికి స్త్రీలు ముందుకు రావడానికి కారణం 2005 నుంచి అమలులోకి వచ్చిన ‘గృహ హింస’ చట్టం కారణం కావచ్చుట! ప్రతి 5 నిమిషాలకీ ఒక ఇంటిలో కుటుంబ హింస జరుగుతూ వుండే భారత దేశంలో ఇటువంటి చట్టం అవసరం ఎంతైనా వుంది. ఈ చట్టానికి ముందు కుటుంబ హింసకి గురైన మహిళలకు అందుబాటులో వుండిన చట్టపరమైన ఉపశమనాలన్నీ దీర్ఘకాలికమైనవి. అటు 498–ఎ అయినా, విడాకులయినా అనేక సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ చట్టం ఈ లోపాలని సరిదిద్దిందనే చెప్పవచ్చు. ఈ చట్టంలోకి హింసకు గురయ్యే భార్యలే కాకుండా పిల్లలు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో వుండే మహిళలు, వితంతువులై పుట్టింటికి చేరిన వారు వారి సొంత అన్నదమ్ములపై కూడా కేసులు పెట్టొచ్చు. ఈ చట్టం హింసను విపులంగా వర్గీకరించింది. అది శారీరక, లైంగిక హింస మాత్రమే కాదు, మాటలతో వేధించడం, మానసికంగా హింసించడం కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ కేసు జరుగుతున్నంత కాలం ఆమె కావాలనుకుంటే తన భర్త ఇంటిలోనే వుండి పోరాడే నివాస హక్కుని ఈ చట్టం కల్పించింది. ఈ చట్టం అమలు తీరుపై పలువురు పలురకాలైన సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. సిగ్గుపడాలి మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా బయటకి రాకుండా స్త్రీలు హింసను తాము తట్టుకోగలిగినంత మేర అనుభవిస్తున్నారు. సమాజం స్త్రీ చుట్టూ అల్లి పెట్టిన సంప్రదాయ వల చాలా గట్టిది. స్త్రీలు ఈ భ్రమాత్మకమయిన సంప్రదాయాలను ఛేదించుకుని బయటకి రావాలి. సమాజం కోసమో సంప్రదాయాల కోసమో లేదా చివరికి పిల్లల కోసమో స్త్రీలు హింసను భరించాల్సిన అవసరంలేదని తెలుసుకోవాలి. తండ్రులుగా, సోదరులుగా మగవాళ్ళు తమ స్త్రీలకు అక్కర వచ్చినపుడు పటిష్టమైన కొండంత అండగా నిలబడే శిక్షణను మన విద్య నేర్పించాలి. తస్లీమా నస్రీన్ అంటారు ‘‘మనం స్త్రీలం. ఒంటరిగా, చప్పుడు కాకుండా ఒంటరి ప్రదేశాల్లో ఏడుస్తూ ఇక ఎంతో కాలం ఉండలేం. మనం బాధితులమైతే గట్టిగా అరవాలి. మన అరుపులు అందరికీ వినిపించాలి’’. వ్యవస్థల ద్వారా జరిగే అణచివేతను ఆపటానికి స్త్రీలు పోరాడకపోతే ఆ స్త్రీలు సిగ్గుపడాలి. ప్రతిఘటించకుండా, పోరాడకుండా, ఆ వ్యవస్థను కొనసాగనిస్తున్నందుకు, మన పిల్లలను, మన పిల్లల పిల్లలనూ ఆ అణచివేతలో పడిపోనిస్తున్నందుకు సిగ్గుపడాలి. గృహహింసపై కవీంద్రుని కథ రవీంద్రనాథ్ టాగోర్ 1913లో ఒక క«థ రాశాడు. ఆ క«థ పేరు ‘‘భార్య వ్రాసిన లేఖ’’. 104 ఏళ్ళ క్రితం ఆయన రాసిన ఈ క«థలోని భార్య తన భర్తకి రాసిన ఉత్తరంలో చాలా విషయాలను చర్చకు పెడుతుంది. ఆమె ఆదరించి పెంచిన చిన్న అమ్మాయి ఒకతె వివాహానంతరం చీరకు నిప్పంటించుకుని చనిపోతుంది. అది చూసి సమాజం దిగ్భ్రమ చెందదు, కనీసం అయ్యో అని సానుభూతి కూడా చూపదు, చూపకపోగా ’’ఆడవాళ్లు చీరలకు నిప్పంటించుకుని చచ్చిపోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది’’ అని చిరాకు పడుతుంది. దానిని ప్రశ్నిస్తూ ఆ ఉత్తరం రాసిన భార్య ‘ఇదంతా నాటకం’ అన్నారు మీరు. కావచ్చు. కానీ ఈ నాటక క్రీడ కేవలం బెంగాలీ స్త్రీల చీరల మీదుగానే జరుగుతుందేం! బెంగాలీ వీరపురుషుల ధోవతుల అంచుల మీదుగా జరగదెందుకని?అది కూడా ఆలోచించి చూడటం యుక్తం...!’’ అంటుంది. స్త్రీలు అనుభవిస్తున్న కుటుంబ హింస ఈ కథా కాలానికంటే కూడా చాలా పురాతనమైంది. – సామాన్య కిరణ్ -
ఇష్టం లేకపోతే ఇంటికెళ్లండి
♦ రికార్డులు ఇష్టమొచ్చినట్లు రాస్తారా? ♦ ‘భూప్రక్షాళన’ తీరుపై కలెక్టర్ అసహనం ♦ మరుగుదొడ్ల ఫొటోలు అప్లోడ్ చేయాలని ♦ అధికారులకు ఆదేశాలు జారీ ఖిల్లాఘనపురం : రెవెన్యూ రికార్డులను ఇష్టమొచ్చినట్లు రాస్తే ఎలాగని రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్వేతామహంతి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పనిచేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లండి..’అంటూ అసహనం వ్యక్తంచేశారు. సమస్యలు ఉన్న సర్వే నంబర్ల వివరాలు, సమస్యలను గుర్తించి ప్రత్యేకంగా ఓ రికార్డులో పొందుపర్చమని చెప్పామని, ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గురువారం ఆమె మండలం ఉప్పరిపల్లి, అప్పారెడ్డిపల్లి గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను ప్రత్యేకంగా పరిశీలించారు. గ్రామాల్లో ఆరురోజులుగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలు, రికార్డులను తీసుకుని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆమె కార్యాలయంలో ఉన్న ఆర్ఓఆర్, కాస్రాపహాణి, ఓల్డ్ ఆర్ఓఆర్, చెసాల, చేత్వార్లో ఉన్న భూములకు అధికారులు ప్రత్యేకంగా రాసిన రికార్డుల్లోని భూముల మధ్య వ్యత్యాసం ఉండడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ రికార్డును మరోసారి పరిశీలించాలని డిప్యూటీ తహసీల్దార్ సునితను కోరారు. అనంతరం అప్పారెడ్డిపల్లికి వెళ్లిన కలెక్టర్ రికార్డుల నమోదు ప్రక్రియను చూసి అసహనం వ్యక్తంచేశారు. మరుగదొడ్ల ఫొటోలు అప్లోడ్ చేయండి ఉప్పరిపల్లిలో మరుగుదొడ్లను నిర్మించుకున్నప్పటికీ బిల్లులు రాలేదని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆమె అక్కడే ఉన్న ఎంపీడీఓ రెడ్డయ్య, ఏపీఓ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ మహిమూద్ను పిలిచి విచారించారు. ఫొటోలు అప్లోడ్ చేయకపోవడంతోనే బిల్లులు ఆలస్యమైనట్లు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ను కలెక్టర్ హెచ్చరించారు. బతుకమ్మ చీరలు పంపిణీ మండలంలోని అప్పారెడ్డిపల్లిలో గురువారం కలెక్టర్ శ్వేతామహంతి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, సర్పంచ్ నర్సింహారెడ్డి, శ్రీనువాసులు, శంకర్గౌడ్, శ్రీనువాసాచారి, కృష్ణయ్య, విష్ణు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్ పంపిస్తా!
►పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు ►ఇంజనీరింగ్ పనులపై కలెక్టర్ అసహనం ►తీసుకున్న జీతానికి న్యాయం చేయాలని ►అధికారులకు తీవ్ర హెచ్చరిక ‘నిధులున్నా పనులు చేపట్టేందుకు నిర్లక్ష్యం ఎందుకు?. మీ పనితీరు మార్చుకోండి. లేకుంటే ఆదిలాబాద్కు పంపిస్తా’ అంటూ కలెక్టర్ యోగితా రాణా ఇంజనీర్లను హెచ్చరించారు. మంగళవారం సర్వశిక్షాభియాన్ ఇంజనీరింగ్ పనుల సమీక్షలో ఆమె అధికారుల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘తీసుకున్న జీతానికి న్యాయం చేయరా..’ అంటూ నిలదీశారు. ఇష్టం లేకుంటే బదిలీ చేయించుకొని వెళ్లిపోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. పనులు చేపట్టేందుకు నిర్లక్ష్యమెందుకు..? కాలపరిమితి అంటూ లేదా..? ప్రతి పనికి ఏదో ఒక సాకు. అలసత్వం ప్రదర్శిస్తే ఆదిలాబాద్ జిల్లాకు పంపిస్తా’ అని జిల్లా కలెక్టర్ యోగితా రాణా ఇంజనీర్లను హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్వశిక్షాభియాన్ ఇంజనీరింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ‘పనితీరు మార్చుకోలేకపోతే బదిలీ చేసుకొని వెళ్లిపోండి..లేక నిర్లక్ష్యం వీడి పనిచేయండి. నెలసరి తీసుకున్న జీతానికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా..? పని విషయంలో వెనక్కి తగేది లేదు. పనితీరు మారాల్సిందే’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కనీసం లక్ష నుంచి రెండు లక్షల వ్యయంతో చేపట్టే చిన్న చిన్న పనులను కూడా టెండర్ల సాకుతో పూర్తిచేయకపోవడం ఇంజనీర్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సివిల్ పనులు నిర్ణీత గడువులోగా పాలసీ ప్రకారం పూర్తి చేయాలని, ప్రతి పనికి టెండర్ల ఖరారు...పరిపాలన మంజూరు వంటి కారణాలతో కాలయాపన చేస్తే ఇకపై సహించేది లేదని ఖరాకండిగా చెప్పారు. ఇకపై ఆయా పనులకు అగ్రిమెంట్ చేసుకునే ముందు వాటిని ఎంత వ్యవధిలో పూర్తి చేస్తారో ఖచ్చితంగా పేర్కొని పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు టెండర్లు ఆహ్వనించని పనులకు వెంటనే టెండర్లు పిలవాలన్నారు. 144 అదనపు గదుల పనులు సెప్టెంబర్ 10లోగా పూర్తిచేయాలని కలెక్టర్ యోగితా సూచించారు. పూర్తయిన పనికి ఫొటోగ్రాప్స్ పొందుపర్చాలని, కోర్టు కేసులు కారణంగా ఏవైనా పనులు ఆగిన పక్షంలో వాటి వివరాలను సంబంధిత తహసీల్దార్లకు అందజేయాలని ఆదేశించారు. విద్యా శాఖకు సంబంధించిన పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సరళా వందనానికి సూచించారు ఈ సమావేశంలో డీఈవో , ఎస్ఎస్ఏ ఈఈ సాంబయ్య, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
దేశం వెనక్కి వెళుతోంది: నటి
కోల్కతా: దేశం వెనక్కు వెళుతోందని నటి, మోడల్ గౌహర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నానాటికీ అసహనం విపరీతంగా పెరిగిపోతుందన్నారు. ‘ముందుకెళుతున్నాం అనే పేరిట భారతదేశం మరింత వెనక్కు వెళుతుండటాన్ని చూసి నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను. దేశంలో విపరీతంగా అసహనం ఉంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తప్పకుండా శాంతంగా ఉండాలి’ అని ఆమె చెప్పారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నిలువరించేందుకు కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. ‘ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేయలేకుంటే మహిళలపై నేరాలు ఆగవు. 70 ఏళ్లలో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు మహిళలు మాట్లాడగలుగుతున్నారు. నేను నా గురించి మాట్లాడగలిగితే నాకు ఏం కావాలో అది ఎంపిక చేసుకుంటాను. ఈ విషయంలో కొంతమంది ఆలోచన విధానం మారితే బాగుంటుంది’ అని ఆమె చెప్పుకొచ్చింది. -
ప్రమాణాలు నిల్.. ఫైటింగ్లు ఫుల్
విద్యా వికాసానికి అసహన బంధనాలు ప్రపంచంలో తొలి 500 వర్సిటీల్లో భారత వర్సిటీలకు చోటు లేదు ప్రమాణాలు పెంచే చర్యలు నిల్.. నిధులు, పోస్టుల కోతలు ఫుల్ వర్సిటీల్లో అసహన నిరసనలు.. భావజాలాల మధ్య భౌతిక ఘర్షణలు భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామిక చర్చకు పాతర సంక్లిష్ట పరిస్థితుల్లో భారత ఉన్నత విద్య: విద్యావేత్తల ఆందోళన భారత ఉన్నత విద్యారంగం ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని విద్యావేత్తలు, మేధావుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ విశ్వవిద్యాలయాలతో పోటీలో మన విశ్వవిద్యాలయాలు ఎక్కడున్నాయి అనేది చూస్తే.. అగ్రస్థాయిలోని తొలి 500 విశ్వవిద్యాలయాల్లో ఐఐఎస్సీ, ఐఐటీలకు మినహా దేనికీ స్థానం లభించలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీలో మరింతగా మెరుగుపడడానికి కృషి జరగాల్సి ఉండగా.. ఇటీవలి పరిణామాలు పరిస్థితిని మరింత దిగజార్చే విధంగా ఉన్నాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి విరుద్ధ భావనలు, సిద్ధాంతాలపైన అయినా మేధోమధనానికి, భావప్రకటనా స్వాతంత్య్రానికి, స్వేచ్ఛాయుత చర్చలకు ప్రజాస్వామిక వేదికలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు.. ‘కుడి ఎడమ’ల భావోద్వేగాల అసహనాలకు భౌతిక ఘర్షణలకు కేంద్రాలుగా మారుతుండటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. సైద్ధాంతిక పరిశోధనలకు నిధుల కేటాయింపులో కోత పెట్టడం, ఆధికారంలో ఉన్నవారి భావజాలానికి విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేసే అధ్యాపకులను విధుల నుంచి తొలగించడం వంటి చర్యలతో విద్యారంగంలో ప్రమాణాలు మరింత క్షీణిస్తాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రమాణాల వెతలు.. కోతల మోతలు..: భారతదేశంలో ఉన్నత విద్యారంగం స్వాతంత్య్రానంతరం గణనీయమైన పురోగతి సాధించింది. ప్రస్తుతం దాదాపు 750 విశ్వవిద్యాలయాలు, 35,000 కళాశాలలు, మూడు కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ.. వీటిలో ఏవీ ప్రపంచంలో అగ్రగామి సంస్థలుగా పోటీపడగల స్థాయిలో లేవు. తాజాగా ప్రకటించిన క్యూఎస్ ప్రపంచ వర్సిటీల జాబితాలో తొలి 150 స్థానాల్లో, టైమ్స్ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో కానీ.. తొలి 200 స్థానాల్లో భారతదేశానికి చెందిన ఏ ఒక్క విద్యా సంస్థకూ చోటు దక్కలేదు. ఐఐఎస్సీ, ఐఐటీలు కొన్నిటికి మాత్రం 150, 200 ర్యాంకుల తర్వాత స్థానాలు లభించాయి. ఈ పరిస్థితుల్లో ఆయా విద్యాసంస్థల ప్రమాణాలను అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా పెంచేందుకు కృషి చేయాల్సి ఉండగా.. అందుకు విరుద్ధమైన పరిణామాలు సంభవిస్తుండటం విద్యావేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉదాహరణకు ప్రతిష్ఠాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో పరిశోధనలకు కేటాయించే నిధులకు ఏకంగా 83 శాతం కోతపెట్టారు. 2017-18 విద్యా సంవత్సరానికి చేర్చుకునే పీజీ, పరిశోధన విద్యార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో సైతం గత నెలలో 25 మంది అధ్యాపకులను విధుల నుంచి తొలగించారు. ఈ చర్యల పట్ల విద్యార్థులు, విద్యావేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ‘భావ ప్రకటన’కు అసహన సంకెళ్లు..: ఇక భావప్రకటనా స్వాతంత్య్రానికి, మేధో మధనానికి కేంద్ర బిందువులుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో.. ఆ స్వాతంత్య్రం క్రమంగా క్షీణిస్తుండటం ఉన్నత విద్యారంగంలో చీకటి అలముకునే పరిస్థితులను కల్పిస్తోందని మేధావులు విచారం చెందుతున్నారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా వర్సిటీల్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2016లో జేఎన్యూలో విద్యార్థులు నిర్వహించిన ఒక కార్యక్రమం.. కశ్మీర్ అంశంపై రాజకీయ వివాదంగా మారడంతో లెఫ్ట్ రైట్ విద్యార్థి విభాగాల మధ్య పోటాపోటీ నిరసనలు పెల్లుబికాయి. విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్ను బీజేపీ ఎంపీ ఫిర్యాదుతో దేశద్రోహం ఆరోపణల మీద అరెస్ట్ కూడా చేశారు. ఆ పరిణామాలు జాతీయవాదం మీద దేశవ్యాప్తంగా చర్చలకు దారితీశాయి. 2016లో కులవివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ వేములకు సంఘీభావంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులను ఈ ఏడాది పరీక్షలు రాయకుండా నిషేధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్జాస్ కాలేజీలో పలువురు విద్యార్థులు ‘నిరసనల సంస్కృతి’ పేరుతో తలపెట్టిన ఒక సదస్సుకు వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థి సంస్థ హింసాత్మక నిరసనలకు దిగింది. గత ఏడాది జేఎన్యూ వివాదంలో ఏబీవీపీ అభ్యంతరాలకు గురైన ఉమర్ఖాలిద్, షీలా రషీద్లను ఈ సదస్సుకు వక్తలుగా ఆహ్వానించడం బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు చెందిన ఏబీవీపీకి ఆగ్రహం తెప్పించింది. హింసాత్మక నిరసనల కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది. నిజానికి ఇటువంటి భౌతిక సంఘర్షణలు, విపరీత నిరసనలు ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. రామ్జాస్కళాశాల ఘటనకు వారం ముందు.. జోధ్పూర్లోని జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాజశ్రీ రాణావత్.. వర్సిటీలో ఒక ప్రసంగం ఇవ్వడం కోసం జేఎన్యూ ప్రొఫెసర్ నివేదితా మీనన్ను ఆహ్వానించారు. దీనిపై ఏబీవీపీ నిరసన చేపట్టడంతో ప్రొఫెసర్ రాజశ్రీని సస్పెండ్ చేశారు. ఆమె కశ్మీర్ మీద, అక్కడ భారత సైన్యం పాత్ర మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసు కూడా నమోదు చేశారు. అంతకుముందు.. 2013లో యూపీలోని ముజఫర్నగర్లో మత ఘర్షణలపై రూపొందించిన ఒక డాక్యుమెంటరీని ఢిల్లీ యూనివర్సిటీలో ప్రదర్శించడాన్ని ఏబీవీపీ అడ్డుకుంది. ఈ పరిణామాలతో వర్సిటీల స్వయంప్రతిపత్తి, భావప్రకటనా స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యయుత చర్చా సంప్రదాయాలు క్షీణించిపోతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్వేచ్ఛా, సహనాలతోనే మేధో వికాసం..: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో మేధోచర్చల సంప్రదాయాన్ని, అసమ్మతి తెలిపే స్వేఛ్చను ధ్వంసం చేసే ఇటువంటి ఘటనలు.. 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గణనీయంగా పెరిగాయనేది అందరూ అంగీకరిస్తున్న విషయం. అప్పటివరకూ వామపక్ష భావజాలానికి పట్టుగొమ్మలుగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ‘జాతీయవాదం’ అజెండాను విస్తరించేందుకు ప్రభుత్వ పరోక్ష మద్దతుతో ఏబీవీపీ దూకుడుగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే.. విద్యారంగం అనేది భిన్న వాదనలు, భిన్నాభిప్రాయాల మధ్య మేధోమధనానికి వేదికగా ఉండాలే కానీ.. భౌతిక సంఘర్షణలకు కేంద్రం కారాదనేది ప్రముఖ విద్యావేత్తల ఉవాచ. ప్రస్తుతం భారత విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగి వికాసం దిశగా పయనించాలంటే.. అన్ని రకాల భావనలనూ అంగీకరించి, దానిపై చర్చించే ప్రజాస్వామిక వైఖరులను పెంపొందించడం ఒక్కటే మార్గమని వారు చెప్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
పోలీసు రాజ్యం
త్రికాలమ్ అమరావతిలో శాసనసభ, శాసనమండలి భవన సముదాయాన్ని ప్రారంభించిన శుభసందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెప్పాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా చర్చిస్తారనీ, ప్రజాభ్యుదయానికి దోహదం చేసే చట్టాలను చేస్తారనీ, ఆ చట్టాలను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తారనీ ఆశించాలి. అధికారపక్ష నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా ప్రారంభోత్సవానికి హాజరైతే బాగుండేది. ఆహ్వానం పంపిం చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థికమంత్రి యనమల రామ కృష్ణుడు చెబితే ఎస్ఎంఎస్ సైతం తమకు రాలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. హైదరాబాద్ను వీడి వెడుతున్న సందర్భంగా కొన్నిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ కొందరు సీనియర్ పాత్రికేయులను కలుసుకున్నారు. కలుపుకొని వెళ్ళే వైఖరిని కొనసాగించి స్వయంగా ప్రతి పక్ష నాయకులకు ఫోన్ చేసి ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తే ఆయన ప్రతిష్ఠ పెరిగేది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తే నిర్మాణాత్మకమైన వాతావరణం ఏర్పడటానికి తోడ్పడేది. అటువంటి సద్భావన లేదనేది స్పష్టం. మొత్తం మీద ప్రారంభోత్సవం ఏకపక్షంగా జరిగింది. సభా కార్యక్ర మాలు కూడా ఏకపక్షంగా జరగబోవని కోరుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిని స్వయంగా ఆహ్వానించకపోగా అదేరోజే ప్రతిపక్ష నాయకుడిని తప్పుపడుతూ మంత్రివర్గం తీర్మానించడం పాలకుల అసహనానికి పరాకాష్ఠ. లోగడ నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష నాయకులు జలగం వెంగళరావు తీరును తప్పుపడుతూ మంత్రివర్గం తీర్మానించింది. అప్రజాస్వామిక ధోరణి ఇదే వైఖరి కొనసాగితే కొత్త శాసనసభా ప్రాంగణంలో సైతం నిరర్థకమైన, అప్రజాస్వామికమైన, అసహనంతో, తిట్ల దండకంతో కూడిన పాత వైఖరే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమాలోచన జరిపి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా ఎటువంటి నిర్ణ యాలు తీసుకోవాలో, ఏయే చట్టాలు చేయాలో నిర్ణయించుకొని ప్రశాంత వాతా వరణంలో సభ జరిగే విధంగా వ్యవహరిస్తే ప్రజలు సంతోషిస్తారు. ఎవరు ఘాటుగా విమర్శిస్తారో, పరుష పదజాలం ప్రయోగిస్తారో, గొంతు చించుకుం టారో వారి వాదనలోనే పస ఉన్నదని భావిస్తే పొరపాటు. ఎవరు సమంజ సంగా, సహేతుకంగా, శాంతంగా మాట్లాడతారో వారినే ప్రజలు ఆదరిస్తారు. ప్రతిపక్ష సభ్యులను రెచ్చగొట్టి వారు వాకౌట్ చేసేవరకూ వెంటబడి ఆనక సభను ఏకపక్షంగా జరుపుకొని ఆత్మస్తుతికీ, పరనిందకూ గంటల సమయం వెచ్చిం చడం ఇంతకు ముందు జరిగిన సమావేశాలలో చూశాం. కొత్త ప్రాంగణంలోనైనా ఇందుకు భిన్నంగా సభాకార్యక్రమాలు జరిగితే సభాపతికి సభ్యులందరి మన్ననా దక్కుతుంది. పార్లమెంటు తలుపులు మూసి విభజన చట్టం ఆమోదించినప్పుడే అవ మానం దిగమింగా. శపథం చేశా, చేసి చూపిస్తున్నానంటూ ముఖ్యమంత్రి చంద్ర బాబు చెప్పుకున్నారు. రెండేళ్ళలోనే సచివాలయం, శాసనసభా ప్రాంగణం నిర్మించినందుకు తనను తాను అభినందించుకున్నారు. మంచిదే. కానీ పాస్టర్ పార్ట్నర్స్ అనే సంస్థ అమరావతి నిర్మాణానికి డిజైన్లు రూపొందిస్తోంది. ఇదంతా 2019 నాటికి పూర్తవుతుందని అంటున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఉండటానికి ఇంకా ఏడేళ్ళ సమయం ఉంది. 2019 వరకూ హైదరాబాద్లోనే చట్టసభల సమావేశాలు జరుపుకోవడానికి అవకాశం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మాణ సంస్థలతో కొత్త రాజధానికి రూపకల్పన చేస్తున్నారు. అందులో శాసనసభా భవనానికీ చోటు కల్పించారు. ఈ లోగా తాత్కాలిక శాసనసభా భవన సముదాయం ఎందుకు? తాత్కాలిక సచివాలయం మాత్రం ఎందుకు? శాశ్వత ప్రాతిపదికపైన నిర్మించుకుంటే వృథావ్యయం ఉండేది కాదు. ‘తాత్కా లిక దుబారా’ ఎందుకో చెప్పవలసింది ముఖ్యమంత్రి మాత్రమే. ఎందుకంటే ఆయన ఒక్కరి అభద్రతా భావం కారణంగానే హడావుడిగా అందరినీ అమ రావతికి తరలిస్తున్నారు. ప్రశ్నించే అలవాటు లేదు కనుక మంత్రివర్గ సహ చరులు అధినాయకుడి నిర్ణయాన్ని శిరసావహిస్తున్నారు. ఎన్నికలలో గెలిచారు కనుక అయిదేళ్ళ వరకూ ఏమి చేసినా ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలులేదనే అప్రజాస్వామిక ధోరణి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జవాబుదారీతనం కలికానికి కూడా లేదు. మితిమీరిన అసహనం స్వీయపక్షంలోనే కాదు ప్రతిపక్షంలోనూ ఎవ్వరు ప్రశ్నించినా ముఖ్యమంత్రి సహించే పరిస్థితి లేదు. పెనుగంచిప్రోలు దగ్గర బస్సు ప్రమాదం అనంతర పరి ణామాలలో ముఖ్యమంత్రి వైఖరి, మంత్రివర్గ తీర్మానం ఇందుకు నిదర్శనం. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెడుతున్న ‘దివాకర్ ట్రావెల్స్’ బస్సు కాలు వలో పడిపోతే పదిమంది ప్రయాణికులు మరణించారు. 32 మంది గాయప డ్డారు. ఈ వార్త విని ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కారులో అక్కడికి చేరుకునే వరకూ పాలకపక్షం ప్రతినిధులు ఎవ్వరూ రాలేదు. అక్కడికి గంటలోపు ప్రయాణ దూరంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ బాధితు లను పరామర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించే ప్రయత్నం చేయలేదు. పెనుగంచిప్రోలు నుంచి నందిగామ ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిపక్ష నాయకుడికి శవాలను చుట్టివేసి తరలిస్తున్న దృశ్యం కనిపించింది. ఆసుపత్రిలో నాలుగు శవాలు మూటలు కట్టి ఉన్నాయి. వాటిలో ఒక శవంపైన డ్రైవర్ ఆదినారాయణ పేరు రాసి ఉంది. డ్రైవర్ శవానికి పోస్ట్మార్టమ్ చేశారా అని డాక్టర్ని జగన్ మోహన్ రెడ్డి అడిగితే అతను తడబడుతూ చేయలేదని చెప్పాడు. స్పీడ్ నియంత్రణ వ్యవస్థ లేకుండా 130 కిలోమీటర్ల వేగంతో పోతున్న బస్సు పది అడుగులు పైకి లేచి రోడ్డు పక్కన కాలువలో పడిందంటే డ్రైవర్ తాగి ఉండాలని అనుకోవడం సహజం. అది తెలుసుకోవాలంటే శవపరీక్ష ఒక్కటే మార్గం. పరీక్ష చేయకుండానే శవాన్ని పంపించివేయడానికి రంగం సిద్ధం చేశారు. రెండో డ్రైవర్ కనిపించకుండా పోయాడు. అతడిని పట్టుకొని విచారించినా వాస్తవాలు కొంత వరకూ తెలిసేవి. పోస్ట్మార్టం రెండు గంటలలో పూర్తి చేశామని మొదట చెప్పిన వైద్యులు తరచి డ్రైవర్ సంగతి అడిగితే శవపరీక్ష జరగలేదని చెప్పారు. డాక్టర్ దగ్గర ఉన్న కాగితాలు అడిగి ప్రతిపక్ష నాయకుడు తీసుకున్నారు. వెనకనే నిల బడిన జిల్లా కలెక్టర్ బాబు డాక్టర్ వైపు కోపంగా చూస్తూ కాగితాలు ఇవ్వవద్దనీ, వివరాలు చెప్పవద్దనీ కళ్ళతోనే వారిస్తున్నారు. వెనక్కి తిరిగి జిల్లా కలెక్టర్తో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ బస్సు యజమానిని రక్షించేందుకు వాస్తవా లను మరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారనీ, ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకు వెళ్ళవలసి వస్తుందనీ హెచ్చరించారు. ప్రమాదంలో మరణించినవారి పట్ల వ్యవహరిస్తున్న బాధ్యతారహితమైన తీరునూ, గాయపడినవారినీ చూసిన తర్వాత ఎవరికైనా వ్యవస్థ పట్ల ఆగ్రహం కలుగుతుంది. అదే ధర్మాగ్రహాన్ని ప్రతి పక్ష నేత ప్రదర్శించడం అభ్యంతరకరమంటూ వాదించడం, మంత్రివర్గం పని కట్టుకొని టేపులన్నీ చూసి ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ తీర్మానించడం చూస్తుంటే ఎంత అల్పంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్నదో తెలుస్తున్నది. ప్రమాదంలో చనిపోయినవారికి సంతాపం తెలుపుతూ తీర్మానం చేయలేదు. బస్సు యాజ మాన్యంపైన కేసు పెట్టాలనీ, ప్రమాద కారణాలపైన దర్యాప్తు చేస్తామనీ తీర్మా నించలేదు. ఉత్తరోత్తరా బస్సు ప్రమాదాలను నివారించడానికి తీసుకోవలసిన చర్యలను గుర్తించాలని తీర్మానం చేయలేదు. రాజధాని నిర్మాణం కోసం సింగ పూర్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల వివరాలు చర్చించలేదు. వివిధ ప్రాజె క్టుల వ్యయం అంచనాలను చిత్తం వచ్చినట్టు పెంచివేసిన సందర్భాలలోనూ ఇలాగే జరిగింది. ముఖ్యమైన అన్ని విషయాలలో ఏకపక్షంగానో, కొంతమంది ఆంతరంగికులతో చర్చించో నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి అప్రధా నమైన అంశంపైన మంత్రివర్గ సమావేశంలో సమయం వృథా చేయడం విశేషం. మీడియా అడగవలసిన ప్రశ్నలే అవి మీడియా ప్రతినిధులు అడగవలసిన ప్రశ్నలనే జగన్ మోహన్ రెడ్డి అడిగారు. మీడియా అడిగినా, ప్రతిపక్ష నాయకుడు అడిగినా సమాధానం చెప్పవలసిన బాధ్యత డాక్టర్కు ఉన్నది. కలెక్టర్కూ ఉన్నది. ముఖ్యమంత్రి బాటలోనే అధి కారులూ నడిచి అహంకారపూరితంగా, పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా, అమానవీయంగా వ్యవహరించడం దుర్మార్గం. ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరించడం, ప్రశ్నించిన వారిని అణచి వేయడం దేశం అంతటా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసు దాష్టీకం శ్రుతి మించుతోంది. నగరి శాసనసభ్యురాలు రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు పూర్తిగా అభ్యంతరకరం. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఆహ్వానం అందుకొని గన్నవరం విమానాశ్రయంలో దిగిన శాసనసభ్యురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించడం ఆత్యయిక పరిస్థితిని తల పించిన దురాగతం. శుక్రవారంనాడు ఆమె కోర్టుకు వెడుతుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అరాచకం. ప్రభు త్వాన్ని ప్రశ్నించే ధైర్యం, తెలివితేటలు ఉన్నాయి కనుక ఒక మహిళా శాసన సభ్యురాలిని ఒక సంవత్సరం పాటు శాసనసభ నుంచి బహిష్కరించడమే కాకుండా కక్షకట్టి వెంటబడి వేధించడం అమానవీయం. పోలీసులనూ, కార్య కర్తలనూ ప్రయోగించి ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలని ప్రయత్నించడం కంటే అప్రజాస్వామ్యం ఏముంటుంది? టీవీ చానళ్ళు వచ్చిన తర్వాత అన్న మాట అనలేదనీ, చేసిన పని చేయ లేదనీ బుకాయించడానికి ఆస్కారం లేదు. ప్రత్యేక హోదా కావాలంటూ గట్టిగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునూ, ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ మాటమార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునూ చూపించే అవకాశం ఉంది. తాను ప్రతిపక్షంలో ఉండగా, అధికారంలో ఉండగా ఎంతమంది అధి కారులతో ఎంత అమర్యాదగా మాట్లాడారో, ఎవరి తాటవొలుస్తానన్నారో, ఎవరిని బదిలీ చేయిస్తానంటూ బెదిరించారో చూపించడానికి అనేక సంద ర్భాలూ, దృశ్యాలూ ఉన్నాయి. పార్టీ నాయకుల ఆదేశం పాటిస్తూ జెండాలు పట్టుకొని రోజాను నిందిస్తూ నినాదాలు చేసిన స్త్రీలు సైతం ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు చెప్పుకోవడానికి సాటి మహిళ ప్రయత్నిస్తుంటే ఆమెకు అడ్డుతగలడం, వ్యతిరేకంగా కేకలు వేయడం ఎటువంటి సంస్కారమో వారు ఆలోచించుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికా రులకు నియమావళి ఉంటుంది. అంతకు మించిన ఆత్మసాక్షి ఉంటుంది. వాటికి అనుగుణంగానే వ్యవహరించాలి. వారు ప్రజాసేవకులు కానీ పాలకులకు బానిసలు కాదు. మర్రి చెన్నారెడ్డితో విభేదాలు వచ్చి రాష్ట్రాంతరం వెళ్ళిపోయిన ఎస్ఆర్ శంకరన్ని నియమ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించడం లోనూ, ఆత్మాభిమానంతో నైతికంగా వ్యవహరించడంలోనూ, పేదప్రజలకు సేవ చేయడంలోనూ ఆదర్శంగా తీసుకోవాలి. అధికారులు సైతం పార్టీలకు విధే యంగా ఉంటూ పార్టీల ప్రాతిపదికగా చీలిపోవడం తమిళనాడులో చూశాం. మొన్నటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారులు నియమావళికీ, నైతికతకూ ప్రాధాన్యం ఇస్తారనే మంచి పేరు ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నతా ధికారులను (కలెక్టర్ కావచ్చు, డీజీపీ కావచ్చు) ప్రతిపక్షంపైన ప్రయోగించడం చూస్తుంటే తమిళనాడు తరహా వాతావరణం ఇక్కడ కూడా నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడు ప్రధానమైన అంగాలు–చట్ట సభలూ, ప్రభుత్వ యంత్రాంగం, న్యాయవ్యవస్థ. చట్టసభలు ప్రజల సమస్యల పైన చర్చ జరపకుండా ఆధిక్య ప్రదర్శనతో, ఎత్తుగడలతో నిరర్థకంగా సాగిపోతు న్నాయి. పాలకపక్షం ప్రయోజనాలు రక్షించే ధోరణిలో ప్రభుత్వ యంత్రాంగం, ఉన్నతాధికారులూ ఉన్నారు. న్యాయవ్యవస్థలో జీవితకాలం గడిచినా తీర్పులు వెలువడవు. మీడియాకూ పరిమితులున్నాయి. ప్రజాస్వామ్య ప్రియులకు ఎటు చూసినా నిర్వేదమే కలుగుతోంది. ఈ పరిస్థితి మారాలి. - కె. రామచంద్రమూర్తి -
అసహనం పెరిగిపోతోంది
-
అసహనం పెరిగిపోతోంది
- దేశంలో అన్ని రూపాల్లో హింస పెచ్చరిల్లుతోంది - ప్రముఖ హిందీ రచయిత అశోక్ వాజ్పేయి విమర్శ - దురదృష్టవశాత్తు ప్రపంచం ఇండియాలా మారుతోందని వ్యాఖ్య - కన్నుల పండువగా ప్రారంభమైన 7వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: దేశంలో అసహనం తీవ్ర స్థాయికి చేరుకుందని.. మతం, కులం, విద్య, వ్యక్తిగతం వంటి అన్నిరూపాల్లోనూ హింస పెచ్చరిల్లుతోందని ప్రముఖ హిందీ రచయిత అశోక్ వాజ్పేయి వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా స్వేచ్ఛాపూరిత ప్రజాస్వామిక వాతావరణంపై ఇదే రకమైన దాడి జరుగుతోందని పేర్కొన్నారు. శుక్రవారం 7వ హైదరాబాద్ సాహిత్య సాంస్కృతిక ఉత్సవం(లిటరరీ ఫెస్టివల్) ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడి బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, పలు దేశాలకు చెందిన సాహిత్య, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి ప్రముఖ హిందీ రచయిత అశోక్ వాజ్పేయి ముఖ్య అతిథిగా హాజరై.. "మన కాలంలో సాహిత్యం" అన్న అంశంపై ఉపన్యసించారు. దురదృష్టవశాత్తూ ప్రపంచం ఇండియాలా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అసహనం తీవ్ర స్థాయికి చేరుకుందని.. మతం, కులం, విద్య, వ్యక్తిగతం వంటి అన్నిరూపాల్లోనూ హింస పెచ్చరిల్లుతోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా స్వేచ్ఛాపూరిత ప్రజాస్వామిక వాతావరణంపై ఇదే రకమైన దాడి జరుగుతోందన్నారు. కలిసే జీవించాం.. భారతదేశం ఎప్పుడూ ఏకోన్ముఖ సమాజం కాదని.. ఇక్కడ అన్ని మతాలు, సమాజాలు కలిసి జీవించాయని అశోక్ వాజ్పేయి గుర్తు చేశారు. "మన భారతీయ సంప్రదాయ వివేకంలో "ఇతర" అనేది లేదు. ప్రతిదీ మనదే. ఇక్కడ ఇతరులు లేకుండా దేవుడు కూడా మనలేడు. అందుకే రకరకాల అవతారాల్లో వచ్చి ఇతరులను కలిశాడు.." అని ప్రాచీన భారతీయ బహుముఖీనతను ప్రస్తుతించారు. ప్రస్తుతం ఆ వివేకం కొరవడుతోందని.. దాన్ని ప్రశ్నించిన వారిని జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని మండిపడ్డారు. ఆ ధోరణిని నిరసిస్తూ తన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును, హెచ్సీయూ ఇచ్చిన డీ.లిట్ను రోహిత్ వేములకు జరిగిన అన్యాయానికి నిరసనగా వెనక్కి ఇచ్చానని గుర్తుచేశారు. "ఒక కొలంబియా రచయిత చెప్పినట్లు.. ఈ ప్రపంచం సరిగ్గా నిర్మితం కాలేదనడం అబద్ధం. ఇంకో మెరుగైన ప్రపంచానికి అవకాశం ఉంది. దానికోసం మనం కల కనొచ్చు.." అని ఆశాభావం వ్యక్తం చేశారు. సాహిత్యం మాత్రమే ఒక ప్రత్యామ్నాయ సమాజ నిర్మాణాన్నీ, నైతికతనూ, మత విశ్వాసాన్నీ, భావజాలాన్నీ ఇవ్వగలదని పేర్కొన్నారు. మతం, రాజకీయం రెండూ కూడా సత్యాన్ని ఇవ్వలేవని, సాహిత్యం మాత్రమే సత్యాన్ని అందించగలుగుతుందని వ్యాఖ్యానించారు. సాహిత్యం అంటేనే సంబరం "ఒక నిజమైన రచయిత నీకో సత్యాన్ని ఇస్తాడు, అదే సమయంలో ఆ సత్యాన్ని అతడే శంకిస్తాడు. అత్యున్నత సత్యం అంటూ ఏదీ ఉండదు. సాహిత్యం అంటేనే ప్రతిసారీ జీవితాన్ని సెలబ్రేట్ చేయడం. కానీ ఒక్కోసారి జీవితం కూడా సాహిత్యాన్ని సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి సాహిత్య సమావేశాలు అందుకు వీలు కల్పిస్తాయి.."అని ఫెస్టివల్ నిర్వాహకులను అశోక్ వాజ్పేయి అభినందించారు. 60 ఏళ్ల క్రితం తన 17వ ఏట హైదరాబాద్లోని "కల్పన" పత్రిక తన హిందీ కవితలను అచ్చు వేసి కవిగా తనకు తొలి గుర్తింపు ఇచ్చిందంటూ హైదరాబాద్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన తన కవితలను ఆంగ్లంలోనూ, హిందీలోనూ చదివి వినిపించినప్పుడు సభికుల్లో మంచి స్పందన వచ్చింది. అనంతరం మరో అతిథి ఫిలిప్పీన్స్ రాయబారి టెరిస్టా సి డాజా మాట్లాడారు. భారతీయ సంస్కృతి, కళలు, భాషలకు.. ఫిలిప్పీన్స్ కళలు, భాషలకు ఎంతో దగ్గర సంబంధం ఉందన్నారు. ఆ దేశంలోని సుమారు 400 స్థానిక భాషలలో సంస్కృత భాష మూలాలు కనిపిస్తాయని... భారతీయ నృత్య రూపాలను పోలిన నృత్యాలు ఫిలిప్పీన్స్లో ప్రాచుర్యంలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్లు అజయ్గాంధీ, కిన్నెర మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయలలితపై ఆసక్తికర చర్చ లిటరరీ ఫెస్టివల్లో ప్రముఖ తమిళ రచయిత్రి, సీనియర్ జర్నలిస్టు వాసంతి రాసిన ‘అమ్మ జయలలిత.. జర్నీ సినీస్టార్ టు పొలిటికల్ క్వీన్’పుస్తకంపై ఆసక్తికర చర్చ జరిగింది. మొత్తం తమిళ సమాజాన్నే ప్రభావితం చేసిన జయలలితపై ఈ పుస్తకం అనేక కోణాలను ఆవిష్కరించింది. జయలలిత వ్యక్తిగత జీవితం నుంచి సినీ, రాజకీయ జీవితం వరకు అనేక అంశాలను ప్రస్తావించిన ఈ పుస్తకం వెలువడిన అనంతరం రచయిత్రి వాసంతి తమిళనాడులో ఉండలేని పరిస్థితి నెలకొంది. తాజాగా చర్చా కార్యక్రమంలో ఆ పుస్తకంలోని పలు అంశాలను సమన్వయకర్తగా వ్యవహరించిన సునీతారెడ్డి ప్రస్తావించారు. సినిమాల్లో, రాజకీయాల్లో బలంగా ఉన్న పురుషాధిపత్యాన్ని ఎదుర్కోవడం, ప్రత్యర్థి కరుణానిధిపై రాజకీయంగా పైచేయి సాధించడం, సంక్షేమం కోసం జయలలిత ప్రవేశపెట్టిన పథకాలు, శోభన్బాబుతో జయలలిత బంధం తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ సమయంలో రచయిత్రి వాసంతి మాట్లాడుతూ.. జయలలిత గొప్ప నాయకురాలు కాకపోయినా, అవకాశాలను తనకు అనుకూలంగా మలచుకుని, వ్యూహాత్మక ఎత్తుగడలతో ఎదిగారని చెప్పారు. కేవలం పదో తరగతి చదివినా విస్తృతమైన అధ్యయనంతో ఆంగ్లంపై పట్టు సాధించారని, జయలలిత జీవితంలో నిరంతర సంఘర్షణ, ఒత్తిడి, బాధలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు అందానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిన జయలలిత రాజకీయాల్లోకి వచ్చాక తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయలేదన్నారు. శుక్రవారం నాటి కార్యక్రమాల్లో దివ్యదిశ సంస్థ "చైల్డ్హుడ్ ఇన్ మై సిటీ" కార్యక్రమం ఆకట్టుకుంది. మహాశ్వేతాదేవి కథ ఆధారంగా ప్రదర్శించిన "చోళీ కే పీచే క్యా హై" నాటక ప్రదర్శన, ఫిలిప్పీన్స్ కళాకారుల "కార్మిక్ హార్వెస్ట్", ఆదిలాబాద్ గిరిజనుల గుస్సాడి నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
తండ్రుల ఒత్తిడి వల్ల పిల్లలకూ సమస్యలే!
మీరు తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారా? మీ పిల్లల దగ్గర కూడా మీ అసహనం ప్రదర్శిస్తున్నారా? తండ్రుల మానసిక ఒత్తిడి పిల్లల వికాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు పరిశోధకులు. పారాడే వయసులోనూ పిల్లలు తండ్రుల ఒత్తిడిని గ్రహించగలరని వెల్లడించారు మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న తండ్రులను గమనిస్తూ ఉండే పిల్లలు ఆ తర్వాత పెరుగుతూ ఉండే క్రమంలో తమ భావవ్యక్తికరణ సరిగా జరపలేరని పేర్కొంటున్నారు ఈ అధ్యనానికి నేతృత్వం వహించిన టామీషా హేర్వుడ్. ఇలాంటి తండ్రులు వెంటనే పిల్లల సమక్షంలో తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచిస్తున్నారు. ‘‘ఒత్తిడిని నియంత్రించుకోకపోవడం వల్ల తండ్రులు తాము డిప్రెషన్కు లోనుకావడంతో పాటు తమ పిల్లల వికాసానికీ ప్రతిబంధకమవుతారు’’ అంటూ హెచ్చరిస్తున్నారు ఆ అధ్యయనంలో పాలుపంచుకున్న మానసిక నిపుణులు. -
భారత్కు మళ్లీ అమెరికా సుద్దులు!
వాషింగ్టన్: భారత్లో అసహనం, హింస పెరిగిపోతున్నాయంటూ వస్తున్న కథనాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులను కాపాడేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడుతున్న వారిని చట్టప్రకారం శిక్షించాలని సూచించింది. గొడ్డుమాంసాన్ని తింటున్నవారిపై దాడులు జరగడం, బీఫ్ తరలిస్తున్నారని మధ్యప్రదేశ్లో ఇద్దరు ముస్లిం మహిళలను కొట్టడం వంటి ఘటనలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. మతస్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలోనూ, అసహనాన్ని ఎదుర్కోవడంలోనూ మేం భారత ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటాం. అసహనం, హింస పెరిగిపోతున్నాయని వస్తున్న వార్తలపై మేం ఆందోళన చెందుతున్నాం. ప్రస్తుతం ఈ సమస్యను ప్రపంచమంతా ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో పౌరులను అండగా ఉంటూ.. దాడులకు కారణమైన వారిని చట్టప్రకారం శిక్షించాలని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. -
కేసుల విచారణ లోపభూయిష్టం
♦ డీజీపీకి నివేదిక అందజేస్తా ♦ సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్లో పలు ఠాణాల విలీనం ♦ కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్పై యోచన ♦ ఇసుక అక్రమ రవాణా నిరోధానికి ఎస్పీలకు ఆదేశాలు ♦ హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తాండూరు: సీరియస్ కేసుల్లో పోలీసుల విచారణ లోపభూయిష్టంగా ఉందని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ అసహనం వ్యక్తం చేశారు. తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. వివిధ కేసుల రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఐజీ విలేకరులతో మాట్లాడారు. తాండూరులో సీరియస్ కేసుల విచారణ సరిగా జరగంలేదని, లోపాలు చాలాఉన్నాయని అన్నారు. ఆయా కేసులకు సంబంధించి రికార్డుల నిర్వహణ సరిగాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా నుంచి సీసీఎస్ డీఎస్పీ, ఇద్దరు సీఐలతో కేసుల రికార్డుల నిర్వహణను పరిశీలించగా లోపాలు ఉన్నట్టు తేలిందన్నారు. ఆయా అంశాలపై డీజీపీకి నివేదిక అందజేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కోర్టుల్లో కేసులు నిలబడేలా విచారణ ప్రక్రియతోపాటు రికార్డుల నిర్వహణను పోలీసులు మెరుగు పర్చుకోవాల్సి ఉందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పోలీసుశాఖలో కూడా పునర్విభజన ప్రక్రియ మొదలైందనన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్ పోలీసుస్టేషన్లు సైబరాబాద్ పశ్చిమంలో కలువనున్నట్టు తెలిపారు. సైబరాబాద్ తూర్పు, పశ్చిమలో 15 ఠాణాల్లో మార్పు జరుగనుందని చెప్పారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం కలుగుతుందని, తద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రభుత్వం 20 మండలాలతో ఒక జిల్లా ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నదని చెప్పారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇసుక అక్రమ మార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చినట్టు డీఐజీ స్పష్టం చేశారు. కానిస్టేబుళ్లకు ఆదివారం వారాంతపు సెలవు ఇచ్చే విషయమై ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. జిల్లా ఎస్పీ బీ.నవీన్కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. కొత్త ఎస్ఐలు ఠాణాలకు పరిమితం కావద్దు.. కొత్తగా నియామకమైన ఎస్ఐలు ఠాణాలకే పరిమితం కావొద్దని అకున్ సబర్వాల్ సూచించారు. ఉదయం 10గంటలకు తాండూరుకు చేరుకున్న డీఐజీ నేరుగా పట్టణంలోని మినీ స్టేడియానికి వెళ్లారు. అక్కడ తాండూరు పోలీసు సబ్డివిజన్ పరిధిలోని సీఐలు,ఎస్ఐలు, కానిస్టేబుళ్ల పరేడ్ను పరిశీలించారు. కానిస్టేబుళ్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ కానిస్టేబుళ్ల బదిలీలపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. పరేడ్లో యూనిఫాంలు బాగున్న కానిస్టేబుళ్లకు రివార్డులు ఇవ్వాలని ఎస్పీ నవీన్కుమార్ను ఆదేశించారు. అనంతరం ఎస్పీ నవీన్కుమార్, తాండూరు ఏఎస్పీ చందనదీప్తి, తాండూరు రూరల్, అర్బన్ సీఐలు సైదిరెడ్డి, వెంకట్రామయ్యలతో పలు అంశాలపై డీఐజీ సమీక్షించారు. తర్వాత డీఏసీ కార్యాలయ ఆవరణలో డీఐజీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నవీన్కుమార్, ఏఎస్పీ చందనదీప్తి, సీఐలు సైదిరెడ్డి, వెంకట్రామయ్య, ఎస్ఐలు రేణకారెడ్డి, నాగార్జున, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డీఐజీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. -
'మోదీని అదే అడగాలనుకుంటున్నా'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఓటమిని జీర్ణించుకోలేకే తమ పాలన అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. 'ఓటమిని తట్టుకోలేకే పార్లమెంట్ లో తమను సోనియా గాంధీ అడ్డుకుంటున్నారని ప్రధాని మోదీ అంటున్నారు. ఢిల్లీలో ఓటమిని జీర్ణించుకోలేకే ఢిల్లీ ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారా అని మోదీని అడగాలనుకుంటున్నా'ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదం పైనా కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. ఈ సినిమాపై కోర్టు ఇచ్చిన తీర్పు మోదీ పాలన పెరిగిన అసహనంకు గట్టి చెంపపెట్టుగా ఆయన వర్ణించారు. ఒక్క కట్ తో రెండు రోజుల్లో 'ఉడ్తా పంజాబ్' సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్సీని బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.