KS Jawahar
-
కొత్త సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ప్రస్తుత సీఎస్ డా.కేఎస్ జవహర్రెడ్డిని బదిలీ చేస్తూ నీరబ్కుమార్ప్రసాద్ను సీఎస్గా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ చాంబర్ టీటీడీ వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ సహచర కార్యదర్శులు, శాఖాధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపేందుకు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సీఎస్లు గోపాల కృష్ణ ద్వివేది, రజత్ భార్గవ, కె.విజయానంద్, పీసీసీఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు కె.సునీత, ప్రవీణ్ ప్రకాశ్, ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ తదితరులున్నారు. -
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఇందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, కేంద్ర ఏజెన్సీ అధికారులను ఆదేశించింది. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాలు ఉండాలని సూచించింది. ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని సూచించింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కమిషనర్లు జ్ఞానేష్కుమార్, సుఖ్బీర్సింగ్ సంధు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, కేంద్ర ఏజెన్సీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైనవారందరూ సమన్వయంతో చర్యలు తీసుకోవడంపై దిశానిర్దేశం చేశారు. మద్యం, నగదు, మత్తుపదార్థాలు, ఆయుధాల అక్రమ రవాణా, తాయిలాల పంపిణీపై కఠినమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. భద్రతా దళాల తరలింపు, సున్నిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల సరిహద్దుల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలిచ్చారు. పోలింగ్ రోజున అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసేయాలని సూచించారు. నేరస్తులు, సంఘవిద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. లైసెన్స్డ్ ఆయుధాలను సకాలంలో డిపాజిట్ చేయించుకోవాలని, నాన్బెయిలబుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని సూచించారు. ముప్పు ఎదుర్కొంటున్న నేతలు, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని నిర్దేశించారు. వ్యయ పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ మాట్లాడుతూ ఎక్కడా రీ పోలింగ్కు అవకాశం లేని విధంగా ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్కు 48 గంటల ముందు (సైలెంట్ పీరియడ్) ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని, వాటిని సమర్థంగా అడ్డుకోవాలని చెప్పారు. కట్టుదిట్టంగా కోడ్ అమలు: సీఎస్ జవహర్రెడ్డి ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు రూ.258 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను స్వా«దీనం చేసుకున్నట్టు వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు, 632 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. పటిష్ట భద్రత: డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి మావోయిస్టుల సమస్య ఉండే 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల మహారాష్ట్రకు పంపిన 10 కంపెనీల పోలీసు బలగాలను తిప్పి పంపడమేగాక అదనపు బలగాలను పంపాలని ఆయన కోరారు. ఏపీసీఈవో ముఖేశ్కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్కుమార్ప్రసాద్, రజత్భార్గవ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్ గుప్త, అదనపు డీజీపీ బాగ్చి, పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్వానం లేదు.. ఫొటోకూ చోటు లేదా!
కొవ్వూరు: ‘పదవి గొప్ప.. మర్యాద సున్నా’ అన్నట్టుగా ఉంది మాజీ మంత్రి కేఎస్ జవహర్ పరిస్థితి. మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అయిన ఆయన తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. ఎంత చరిత్ర ఉంటేనేం.. ఎన్ని పదవులు ఉంటేనేం.. కొవ్వూరులో శనివారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయనకు కనీస ఆహ్వానం కూడా లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారిగా మూడు పార్టీలతో టీడీపీ నేత పెండ్యాల అచ్చిబాబు ఆధ్వర్యాన ఈ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ సమావేశానికి జవహర్కు ఆహ్వానం లేకపోగా.. ఆ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సైతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన ఫొటోకు చోటు దక్కలేదు. దీనినిబట్టి దళిత సామాజికవర్గ నేతకు టీడీపీలో దక్కిన గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దళితులపై చిన్నచూపు కేవలం దళిత నేత కావడమే ఆయన చేసిన పాపమా? అంటూ టీడీపీ దళిత నాయకులు మండిపడుతున్నారు. ఆ పార్టీలో దళితులపై వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని ఆరోపిస్తున్నారు. తానెవరికీ తలవంచే ప్రసక్తే లేదని, పెత్తందార్ల పైనే తన పోరాటమని, పార్టీకి బానిసగా పని చేస్తానని పలు సందర్భాల్లో జవహర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకే పెత్తందార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి జవహర్ను ఆహ్వానించలేదంటూ దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి జవహర్ వర్గీయులు గైర్హాజరయ్యారు. టీడీపీలో పెత్తందార్ల హవానే నడుస్తోందని చెప్పడానికి ఈ సమావేశమే ఓ ఉదాహరణని విమర్శిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా మరోవైపు జవహర్కు కొవ్వూరు టికెట్ కేటాయించాలని కోరుతూ దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యాన తాడేపల్లిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు దళిత, ప్రజా సంఘాలు, మాదిగ దండోరా నేతలు పాల్గొని పార్టీ పెద్దలకు వినతిపత్రం సమర్పించారు. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన డప్పు కళాకారులు, చర్మకారులు, ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు నియోజకవర్గ దళిత నాయకులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జవహర్కు టికెట్పై టీడీపీలో మరోసారి రచ్చ నడుస్తోంది. తాను పోటీలో ఉంటానని జవహర్ ఇప్పటికే ప్రకటించగా.. ఆయనను అచ్చిబాబు వర్గం పూర్తిగా పక్కన పెట్టి దూకుడుగా వ్యవహరించడంతో విభేదాలకు మళ్లీ ఆజ్యం పోసినట్టయ్యింది. ఎన్నికల వేళ టీడీపీలో విభేదాలు సద్దుమణగకపోవడం చూసి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. -
అక్రమ మద్యం, గంజాయిపై నిఘా పెంచండి: కేఎస్ జవహర్రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీస్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అక్రమ మద్యం, గంజాయి తదితర మాదక ద్రవ్యాల రవాణా, వాడకంపై ఉక్కుపాదం మోపేందుకు సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో సమన్వయం చేసుకోండి. వీటితో సంబంధం ఉన్న కింగ్ పిన్లను గుర్తించి పీడీ యాక్టు కింద అరెస్టు చేయండి. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులలో నిఘాను మరింత పటిష్టం చేయండి. ముఖ్యంగా గంజాయి సాగు చేసే గిరిజనులను ఆపరేషన్ పరివర్తన్ కింద ప్రత్యామ్నయ పంటల సాగు వైపు ప్రోత్సహించండి. ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వచ్చే అవకాశాలున్నందున సరిహద్దులతో పాటు రాష్ట్రంలోని అన్ని చెక్పోస్టుల్లో నిఘాను అధికం చేసి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. ఎస్ఈబీ కమిషనర్ యం.రవిప్రకాశ్ మాట్లాడుతూ.. గంజాయికి సంబంధించి 90 శాతం ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా నుంచి.. 10 శాతం కోరాపుట్ నుంచి ఏపీలోకి వస్తోందని తెలిపారు. ఒడిశా డీజీపీ సమన్వయంతో గంజాయి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి 25 మంది కింగ్ పిన్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.4.38 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. మద్యం సరఫరాకు సంబంధించి రాష్ట్రంలోని ప్రతి డిస్టిలరీకి ఒక సహాయ కమిషనర్ స్థాయి అధికారిని ఇన్చార్జ్గా పెట్టామని చెప్పారు. మద్యం రవాణా చేసే వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అధికారులు దేవకుమార్, వాసుదేవరావు, రజత్ భార్గవ, డా.మల్లిఖార్జున, ఢిల్లీ రావు, రవిశంకర్ అయ్యన్నార్, కాంతిరాణా టాటా, విజయ సునీత, రవి సుభాష్, తుహిన్ సిన్హా, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దు రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్.జవహర్రెడ్డి ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ‘నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయండి. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు.. ప్రతిరోజూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలి. తాగునీటి సరఫరా విధానాన్ని పర్యవేక్షించేందుకు రూపొందించిన యాప్ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి’ అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. 9 జిల్లాల్లో తాగునీటికి ఇబ్బంది లేదని కలెక్టర్లు నివేదించినట్లు చెప్పారు. మిగిలిన 17 జిల్లాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపేందుకు అవసరమైన నీటిని కాలువల ద్వారా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రూపొందించిన యాప్ను శుక్రవారం అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామ స్థాయిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధిత ఇంజనీర్ ఆమోదంతో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా డిమాండ్ను యాప్లో అప్లోడ్ చేసి జిల్లా కలెక్టర్ ద్వారా పంపిస్తే ఆమోదిస్తామని తెలిపారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, నారాయణరెడ్డి, జాన్ సత్యరాజ్, బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు. -
అసలుకు ఎసరు.. జాతీయ కొసరు
కొవ్వూరు: అనుకొన్నదొక్కటి...అయినదొక్కటి అన్న చందంగా తయారైంది మాజీ మంత్రి కేఎస్ జవహర్ పరిస్థితి. తాను కొవ్వూరు నియోజకవర్గం నుంచి కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటా.. అంటూ జవహర్ తొడ కొట్టారు. రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువడుతుందని తన వర్గీయులకు చెబుతూ వచ్చారు. కొవ్వూరు సీటు తనకే వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జవహర్ను ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు మంగళవారం ఈ మేరకు ప్రకటన సైతం విడుదల చేశారు. దీంతో జవహర్కు ఇంక అసెంబ్లీ సీటు ఆశలు వదులుకోవాల్సిందే అన్న సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ పదవి ఇచ్చి బుజ్జగించారని స్పష్టమవుతోంది. జవహర్కే కొవ్వూరు సీటు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన టీడీపీలోని ఆయన వర్గం నాయకులు ఇప్పుడు వ్యతిరేక వర్గంతో కలిసి పనిచేయలేని పరిస్థితి నెలకొంది. జవహర్ కోసం టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావును తీవ్రంగా విభేదించి, ఇన్నాళ్లూ ఆయనకు దూరంగా ఉన్న నాయకులంతా ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. మరికొందరైతే పార్టీ వీడే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జవహర్కు ఆ పార్టీ అధిష్టానం ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడంతో పెండ్యాల అచ్చిబాబు వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. నారా లోకేష్ ఇన్నాళ్లూ ఈ పదవిలో కొనసాగారు. పార్టీలో అటువంటి కీలకమైన పదవిని జవహర్కు కట్టబెట్టడంపై అచ్చిబాబు వర్గీయులు మండిపడుతున్నారు. కీలక పదవి దక్కిందని జవహర్ వర్గీయులు కొందరు సంబర పడుతున్నారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న జవహర్ ఫొటోను మాత్రం టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచార రథంపైన గానీ,ఫ్లెక్సీల్లో గానీ వేయడం లేదు. మరిప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలోకి వచ్చినా ఫొటో అయినా వేస్తారా? లేదా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జవహర్ ఫొటో వేయించినా మళ్లీ ఇరువర్గాల మధ్య విభేదాలు భగ్గుమనే అవకాశాలున్నాయి. దళితుడైన జవహర్కు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టామని ఆ పార్టీ అధిష్టానం చెప్పుకోవడానికే ఇన్నాళ్లూ ఆయన పదవి ఉపయోగ పడింది. ఇక మీదటనైనా జాతీయ స్థాయి పదవికై నా ఆ పార్టీ నేతలు, వ్యతిరేక వర్గీయుల నుంచి గుర్తింపు లభిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే మరీ. -
కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి: సీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరగనున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్నిఆదేశించారు. మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్ సైట్లన్నిటిలో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ఫోటోలు, ఆడియో, వీడియోలు వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అదే విధంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన పొటోలను,ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయపరమైన ప్రకటనలన్నీ తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఏశాఖనుంచైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి కార్యదర్శులకు స్పష్టం చేశారు.ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే అలాంటి వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యల తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని అన్నారు.చాలా వరకు కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళనున్నందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పూర్తి స్పష్టత ఉండేలా ఈమార్గదర్శకాలను పూర్తిగా చదివి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి సీఈఓ ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్ లో నివేదిక ఇవ్వాలని అందరు కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను వివరిస్తూ ఎన్నికల షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కొత్త పధకాలు ప్రకటించడానికి వీలులేదని స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్లు మంజూరు, హామీలు, శంకుస్థాపనలు పూర్తి నిషేధమని సీఈవో స్పష్టం చేశారు. వర్క్ఆర్డర్ ఉన్న కేత్ర స్థాయిలో పనులు మొదలు కాని పనులు చేపట్ట కూడదని తెలిపారు. పనులు పూర్తయిన వాటికి నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. వివిధ రకాల ఫించన్లు పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. కోడ్ అమలులోకి వచ్చాక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షలు లేదా వీడియో సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద వివిధ రిజిష్టర్డ్ లబ్దిదారులకు యదావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందు ఏవైనా పనులకు సంబంధించి టెండర్లు పలిచి ఉంటే ఆప్రక్రియను కొనసాగించుకోవచ్చని కాని టెండర్లను ఖరారు చేయడానికి వీలులేదని సీఈవో మీనా కార్యదర్శులకు తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని చెప్పారు. అలాగే వివిధ పబ్లిక్ ఆస్థులు అనగా బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్లు, రైల్వే,రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్లు, వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నిటినీ షెడ్యూల్ వెలువడిన 48గంటల్లో తొలగించాలని సీఈవో స్పష్టం చేశారు. అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లను నిలిపి వేయాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు లేక ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల వంటి ప్రజా ప్రతినిధుల ఫొటోలు ఉండరాదని తెలిపారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు, కార్యాలయిల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు,సందేశాలు వంటివి ఉండరాదని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అలాగే పీఎం, సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్ని, కేన్సర్ వంటి రోగులకు అత్యవసర చికిత్సల కోసం సకాలంలో నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సద్భావనా దివస్, గాంధీ జయంతి వంటి జాతీయ ప్రాముఖ్యతా దినోత్సవాల వేడుకల్లో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు వంటి ప్రజా ప్రతినిధులు పాల్గొన వచ్చని, ఆవేడుకల్లో రాజకీయపరమైన ప్రసంగాలు ఏపచేయరాదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సిసిఏ నిబంధనలు ప్రకారం ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఎ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఇఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.ఇంకా ఈసమావేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన పలు సందేశాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్,వై.శ్రీలక్ష్మి,కె.విజయా నంద్,వర్చువల్గా యం.టి కృష్ణబాబు, అనంతరాము పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, హరీశ్ కుమార్ గుప్త, ప్రవీణ్ ప్రకాశ్, సునీత, కాంతిలాల్ దండే, చిరంజీవి చౌదరి, వాణీ మోహన్, పలువురు కార్యదర్శులు,కమీషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి జవహర్ యూటర్న్
కొవ్వూరు: మాజీ మంత్రి కేఎస్ జవహర్ యూటర్న్ తీసుకున్నారు. కొవ్వూరు టిక్కెట్ ఇవ్వకపోవడంతో తిరువూరులోనైనా అవకాశం ఇవ్వాలంటూ అధినేతను వేడుకొంటున్నారు. టీడీపీ కొవ్వూరు టిక్కెట్ ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించడంపై ఆయన షాకయ్యారు. తాను నియోజకవర్గం నుంచే పోటీలో ఉంటానని రెండు రోజుల క్రితం శపథం చేశారు. అది నిజమేననుకుని ఆయన వర్గీయులందరూ భ్రమ పడ్డారు. అయితే జవహర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తిరువూరుపై ఆయన కన్నెశారు. దీని భాగంగా ఆయన స్వగ్రామమైన గానుగపాడు పయనమయ్యారు. అక్కడే మకాం వేసి ఆదివారం నాలుగు మండలాలకు చెందిన టీడీపీ నాయకులతో భేటీ కానున్నట్లు సమాచారం. దీంతో ఐదేళ్లుగా కొవ్వూరులో ఆయన వర్గీయులుగా ముద్ర వేసుకున్న నాయకుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ అధిష్టానం కొవ్వూరు టిక్కెట్ను ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించడంపై జవహర్ వర్గం తీవ్రస్థాయిలో మండిపడింది. శుక్రవారం కూడా జవహర్ విలేకరుల సమావేశం నిర్వహించి, తాను కొవ్వూరు నుంచి కచ్చితంగా పోటీలో ఉంటానని వెల్లడించారు. ఇప్పుడు జవహర్ యూటర్న్ తీసుకోవడంతో ఆయన వర్గీయులకు ఏమి చేయాలో తెలియడం లేదు. ముప్పిడికి టిక్కెట్ ఇవ్వడాన్ని విభేదించిన తాము.. మళ్లీ ఆయన చెంతకు ఎలా వెళ్లతామంటూ తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్ల నుంచి జవహర్ కోసం ఎన్నోసార్లు తగవులు పడ్డాం, ఇప్పుడు టీడీపీలో వ్యతిరేక వర్గంతో కలిసి ఎలా పనిచేయగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జవహర్ మాత్రం మరోసారి తిరువూరు నుంచి అవకాశం ఇవ్వాలంటూ అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. -
టీడీపీలో సీనియర్లకు మొండిచేయి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు సీన్ కట్ అయ్యింది. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్ నాయకులను పొత్తుల పేరుతో, సర్వేల పేరుతో వారి టికెట్లు గల్లంతు చేసి టీడీపీ వదిలించుకుంది. జిల్లాలో ఏకంగా ఐదుగురు సీనియర్లకు మొండిచేయి చూపి డబ్బు సంచులకే ప్రాధాన్యం ఇస్తూ ‘క్యాష్ అండ్ క్యారీ’ పద్ధతిలో టికెట్లు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దళిత మాజీ మంత్రులు కేఎస్ జవహర్, పీతల సుజాత, టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు వేటుకూరి శివరామరాజు, బండారు మాధవనాయుడుకు టీడీపీ జాబితాలో సీటు గల్లంతు కాగా పార్టీ పెద్దలు నామమాత్రంగా అయినా పట్టించుకోని దుస్థితి. పక్కన పెట్టేశారు జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టారు. సామాజిక, ఆర్థిక ప్రాబల్యం ఉండి నియోజకవర్గంలో పనిచేస్తున్నా లోకేష్తో సత్సంబంధాలు గొప్పగా లేవని, సంతృప్తిస్థాయి లేదనే కారణాలతో టికెట్లు గల్లంతు చేశారు. అది కూడా సామాజిక సమీకరణాలు పట్టించుకోకుండా ఎస్సీల్లో ఒకే సామాజిక వర్గానికి అన్ని సీట్లు ఇవ్వటం, పొత్తుల పేరుతో టీడీపీ కాపు సీట్లన్నీ పూర్తిగా వదిలించుకోవడం, బీసీలకు ఒక్క సీటు మాత్రమే కేటాయించడంపై జిల్లా తెలుగుదేశం పార్టీలో రాజకీయం రగులుతుంది. డబ్బే ప్రామా ణికం అంటూ అడ్డగోలుగా టికెట్లు కేటాయించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర అసంతృప్తితో.. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా పార్టీ కనీసం స్పందించలేదు. శివరామరాజు అనుచరులతో సమావేశాలు నిర్వహించి టీడీపీకి గుడ్బై చెబుతానని తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక నరసాపురం నుంచి 2014 ఎమ్మెల్యేగా గెలుపొందిన బండారు మాధవనాయుడు అక్కడ క్రియాశీలకంగా పనిచేసి టికెట్ ఆశించి పొత్తుల పేరుతో భంగపడ్డారు. కనీసం పార్టీ నుంచి పిలుపు లేకపోగా అధినేత అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి భంగపడటంతో రాజీనామా దిశగా యోచన చేస్తున్నారు. అలాగే టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పొత్తులతో టికెట్ పొగొట్టుకున్నారు. జిల్లా అధ్యక్షుడు కావడంతో పార్టీ పెద్దలు ఒకటికి రెండు సార్లు బుజ్జిగించటంతో మౌనంగా ఉన్నారు. పెత్తందారులదే టీడీపీలో పెత్తనం అంటూ.. రెండు దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీ సొంత సామాజిక వర్గం నేతల చేతిలో అణచివేత, వేధింపులకు గురైనా.. పార్టీ వీడకుండా ఉన్న మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్ జవహర్కు చంద్రబాబు మొండిచేయి చూపారు. 2014లో జవహర్ కొవ్వూరు నుంచి, పీతల సుజాత చింతలపూడి నుంచి గెలుపొంది మంత్రులుగా పనిచేశారు. అయినా ఆయా నియోజకవర్గాల్లో బాబు సొంత సామాజికవర్గ నేతల చేతిలో రాజకీయంగా బలికావడంతోపాటు 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లలో కనీసం ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా కూడా వేయించుకోలేని దుస్థితి వారిద్దరిదీ. సా మాజిక కోణంలో అయినా కచ్చితంగా అవకాశం వస్తుందని రెండు జాబితాల వచ్చే వరకు వేచి చూసి భంగపడిన వారు తీవ్ర అసంతృప్తితో మాట్లాడారు. పెత్తందారులదే టీడీపీలో పెత్తనమని, దళితులను పట్టించుకోవడం లేదంటూ ఘాటుగా మాట్లాడటంతో జిల్లాలో చర్చగా మారింది. -
టీడీపీకి రాజీనామా దిశగా మాజీ మంత్రి కేఎస్ జవహర్?
సాక్షి, తూర్పుగోదావరి: టికెట్ దక్కకపోవడంతో టీడీపీని వీడే యోచనలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జవహర్.. అధిష్టానం ఫోన్లకు సైతం స్పందించలేదు. జవహర్ను బుజ్జగించేందుకు ముప్పినేని వెంకటేశ్వర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జవహర్ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో చంద్రబాబు కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కొవ్వూరు టికెట్ను జవహర్ ఆశిస్తుండగా, నిన్న ప్రకటించిన జాబితాలో కొవ్వూరు స్థానాన్ని ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించిన సంగతి తెలిసిందే. జవహర్.. కొవ్వూరులోని నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఇవాళో, రేపో టీడీపీని వీడే ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మాజీ మంత్రి కేఎస్ జవహర్కు ఘోర అవమానం ఎదురైందా? పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెట్టారా? ద్విసభ్య కమిటీలోని ఓ నేత ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకున్నారా? ఏళ్ల తరబడి పార్టీకి చేసిన సేవను లెక్క చేయకుండా పక్కన పెట్టేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల రెండో జాబితాలో ఆయనకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం గురువారం అధికారిక ప్రకటన చేసింది. ఈసారి జవహర్కు కొవ్వూరు టికెట్టు దక్కనీయకుండా పార్టీలోని ఆయన వైరివర్గాలు బలంగా పని చేశాయి. దీంతో ఒకవేళ ఇక్కడ కాకపోయినా గత ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనైనా టికెట్టు ఇస్తారని జవహర్ వర్గం భావించింది. కానీ, అక్కడ టీడీపీ అభ్యర్థిగా కొటికలపూడి శ్రీనివాసరావును అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. దీంతో గోపాలపురం నియోజకవర్గానికై నా పంపుతారని భావించగా.. మద్దిపాటి వెంకట్రాజు పేరు ఖరారు చేసింది. ఇప్పుడు కొవ్వూరులో కూడా ముప్పిడి పేరు ప్రకటించడం ద్వారా అన్నిచోట్లా జవహర్కు చంద్రబాబు మొండిచేయే చూపారు. ఫలితంగా పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో మాత్రమే కొనసాగే పరిస్థితి జవహర్కు ఏర్పడింది. ఈ పరిణామంతో ఆయన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. భగ్గుమన్న జవహర్ వర్గీయులు పార్టీ జిల్లా అధ్యక్షుడు.. అందునా మాజీ మంత్రి అయిన జవహర్నే పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్గా మారింది. జిల్లా స్థాయి నేతనే ఇలా పరాభవిస్తే.. ఇక సామాన్య నేతలకు టీడీపీలో న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్న ఆయా వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. అధినేత నిర్ణయం జవహర్ వర్గీయులకు మింగుడు పడటం లేదు. తమ నేతకు చేసిన అవమానానికి పార్టీ తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని వారు సవాల్ విరుసుతున్నారు. ఈ అవమానంపై వారు భగ్గుమన్నారు. కొవ్వూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఫెక్ల్సీలను చించేశారు. అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తాజా పరిణామాల నేపథ్యంలో జవహర్ తన వర్గీయులతో సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జవహర్ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం సుజయకృష్ణ రంగారావును పంపింది. పార్టీ ఆదేశాల మేరకు పని చేయాలని సూచిస్తున్నా జవహర్ ససేమిరా అంటున్నారు. -
కొవ్వూరు టీడీపీలో ఇరు వర్గాల కొరకొర
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కేఎస్ జవహర్పై అసమ్మతి రగులుతోంది. టీడీపీలోని ద్విసభ్య కమిటీ ఒక వర్గం గానూ, నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగల మరో ముఖ్యనేత అచ్చిబాబు వర్గం మరోపక్క జవహర్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. నియోజకవర్గంలో వారి సానుభూతిపరులను ఏకం చేస్తున్నాయి. రహస్య సమావేశాలు పెట్టి చర్చలు జరుపుతున్నాయి. జవహర్కు అసెంబ్లీ స్థానం కేటాయిస్తే మూకుమ్మడిగా వ్యతిరేకిస్తామని, తమ అభిప్రాయాన్ని కాదని అవకాశం కల్పిస్తే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈమేరకు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరులో ఈ రెండు వర్గాల నాయకులు గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ‘జవహర్ వద్దు – టీడీపీ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఈ పరిణామం కొవ్వూరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ముప్పిడిని బరిలోకి దింపే యోచన కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును బరిలోకి దింపేందుకు ఈ రెండు వర్గాలూ పావులు కదుపుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ముప్పిడి పోటీని అంగీకరించారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు భరోసాతో ముప్పిడి రంగంలోకి దిగి నియోజకవర్గంలో పర్యటనలు ముమ్మరం చేశారు. నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. గతంలో జవహర్తో ద్విసభ్య కమిటీలోని ఓ సభ్యుడైన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి సన్నిహితంగా మెలిగారు. ఆ సాన్నిహిత్యంతో ఆయన ఆర్థికంగా ఎదిగినట్లు చెబుతారు. అనంతరం వారి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలతో చౌదరి సైతం జవహర్కు దూరమయ్యారు. జవహర్ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చిబాబు వర్గాన్ని వ్యతిరేకించడంతో ఆయన కూడా వ్యతిరేక కూటమి కట్టారు. ఫ్లెక్సీల వివాదం తమ పంతం నెగ్గించుకోడానికి ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు వర్గాలు దొరికిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇటీవల జవహర్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో వ్యక్తుల పేర్లకు బదులు గ్రామ టీడీపీ నేతలు అని పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు దొమ్మేరు గ్రామంలో వివాదంగా మారింది. ఓ వర్గం నేతలు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మరీ జవహర్పై విమర్శలు గుప్పించారు. జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు జవహర్కు వ్యతిరేకంగా తాజాగా మరో నినాదాన్ని తెర పైకి తీసుకువచ్చారు. ‘జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు’ అని ప్రచారం చేస్తున్నారు. గురువారం ఓచోట ఆత్మీయ సమావేశం పెట్టి మరీ విమర్శలు చేశారు. జవహర్ను కొవ్వూరు అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకోవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 2014 నుంచి సీనియర్ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టిన ఆయన వర్గ విభేదాలకు కారకుడయ్యారని ఆరోపించారు. నియోజకవర్గ నాయకులు పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోవడం లేదని అంటున్నారు. జవహర్ వైపే అధినేత మొగ్గు నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు వాటికి చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. సీటు ఎవరికన్న స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య రోజు రోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. జవహర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇదే జరిగితే జవహర్కు వ్యతిరేకంగా పని చేస్తున్న రెండు వర్గాలూ టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జవహర్ను కాదంటే ఆయన వర్గం వ్యతిరేకమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఈ వర్గ విభేదాలతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. -
టీడీపీలో ఫ్లెక్సీల లొల్లి
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ తన పుట్టిన రోజును వేదికగా చేసుకుని నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్లెక్సీల్లో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నట్లు వ్యక్తుల పేర్లు కాకుండా గ్రామ టీడీపీ అని పేర్కొనడం వివాదానికి కారణమైంది. నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెండ్యాల అచి్చబాబు స్వగ్రామమైన దొమ్మేరులో ఆయన ఫొటో లేకుండా ఈ తరహా ఫ్లెక్సీల ఏర్పాటును ఆ పార్టీ స్థానిక నాయకులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అచ్చిబాబు వర్గీయులు శుక్రవారం గ్రామంలో సమావేశమై మరీ జవహర్పై బహిరంగ విమర్శలకు దిగారు. గ్రామ కమిటీ, స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా ‘దొమ్మేరు టీడీపీ’ అని పేర్కొంటూ తమ గ్రామంలో ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని, ఇది జవహర్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పార్టీని రెండు గ్రూపులుగా చేసేందుకు ఆయన ప్రయతి్నస్తున్నారని సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు యలమర్తి శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు)మండిపడ్డారు. దొమ్మేరు గ్రామ కమిటీని సంప్రదించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అచి్చబాబు చెప్పినట్లే నడుస్తాం తప్ప, జవహర్ చెప్పినట్లు కాదని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడు కేవీకే రంగారావు, ఉప సర్పంచ్ కలగర సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొక్కిరిపాటి శ్రీహరి కూడా జవహర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పారీ్టకి, ఆ ఫ్లెక్సీలకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించారు. గతంలో అచ్చిబాబు చెబితేనే జవహర్కు 13 రోజుల ముందు టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలిపించామని అన్నారు. దొమ్మేరులో జవహర్కు మద్దతుదారులు లేరని ప్రకటించారు. అందువల్లే సొంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారన్నారని అన్నారు. కొవ్వూరులో శుక్రవారం జరిగిన జవహర్ పుట్టిన రోజు వేడుకలకు సైతం అచి్చబాబు వర్గీయులు దూరంగానే ఉన్నారు. ఇటీవల అభ్యర్థుల ఖరారులో భాగంగా అధిష్టానం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా జవహర్ పేరు ప్రస్తావించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా వివాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎనిమిదేళ్లుగా..: జవహర్, అచ్చిబాబు వర్గాల మధ్య ఏడెనిమిదేళ్లుగా వివాదం నడుస్తోంది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా పనిచేస్తోంది. గతంలో అచి్చబాబు వర్గం వ్యతిరేకించినందునే జవహర్ను అధిష్టానం కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి పంపింది. అక్కడ ఓటమి చవిచూసిన ఆయన మళ్లీ కొవ్వూరుపై దృష్టి సారించారు. పేరుకు జిల్లా అధ్యక్షుడి పదవి కట్టబెట్టినప్పటికీ కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అధిష్టానం షరతు విధించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
Andhra Pradesh: వేగంగా ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాధాన్యత ప్రాజెక్టుల పనుల ప్రగతిని సమీక్షిస్తూ గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆయా ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ఫలాలను అందించాలన్నారు. పోలవరంతోపాటు ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న వెలిగొండ, వంశధార ఫేజ్–2 స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పనుల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ముఖ్యమంత్రికి నివేదించారు. సీమ ప్రాజెక్టులను వరదనీటితో నింపేలా.. గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్(సొరంగం)లో ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెలుసుగా ఉన్న ప్రాంతం)లో పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ పద్ధతిలో పనులు పూర్తి చేసినట్లు అధికారులు సీఎం జగన్కు వివరించారు. నాన్ ఫాల్ట్ జోన్లో మరో 149 మీటర్ల లైనింగ్ పనులు మాత్రమే మిగిలాయని, వాటిని జూలై లోగా పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత డిజైన్ మేరకు పూర్తి సామర్థ్యం ప్రకారం గాలేరు–నగరి ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 – 40 రోజుల్లోనే నీటిని ఒడిసిపట్టి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ► వెలిగొండలో మొదటి టన్నెల్, హెడ్ రెగ్యులేటర్ ఇప్పటికే పూర్తైనట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్లో 18,787 మీటర్లకుగానూ ఇప్పటికే 17,461 మీటర్ల పనులు పూర్తయ్యాయి. మరో 1,326 మీటర్ల పనులు మాత్రమే మిగిలినట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్ అక్టోబర్కు పూర్తవుతుందన్నారు. రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14 శాతం పూర్తైనట్లు చెప్పారు. ఆగస్టు నాటికి రెండో టన్నెల్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్లో గొట్టిపడియ, కాకర్ల డ్యామ్, తీగలేరు అప్రోచ్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్తోపాటు ఈస్ట్రన్ మెయిన్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ సొరంగాల ద్వారా నల్లమలసాగర్లోకి నీటిని తరలించేందుకు వీలుగా మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► వంశధార ఫేజ్–2 స్టేజ్–2 ప్రాజెక్టు పనులను డిస్ట్రిబ్యూటరీలతో సహా ఈ ఏడాదే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి స్టేజ్–2లో అంతర్భాగమైన హీరమండలం రిజర్వాయర్ను నింపే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► తోటపల్లి బ్యారేజీలో మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగరం, మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ తదితర ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్షించారు. ఆ ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ► హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. శరవేగంగా పోలవరం.. ► పోలవరం పనుల ప్రగతిపై సీఎం జగన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. గోదావరి వరదల ఉద్ధృతికి కోతకు గురై ఈసీఆర్ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్)–1 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాథాలను ఇప్పటికే ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్తో యథాస్థితికి తెచ్చే పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ► ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో అగాథాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులు చురుగ్గా సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తయ్యాక గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్వాల్కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేస్తామన్నారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి జలాశయాన్ని పూర్తి చేస్తామన్నారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ పోలవరం జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా ఎడమ కాలువ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ► గైడ్ బండ్లో జారిన ప్రాంతాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ నియమించిన నిపుణుల కమిటీ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అధికారులు ఈనెల 15, 16వతేదీల్లో పరిశీలించిన అంశాన్ని అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. నేల స్వభావంలో మార్పుల వల్లే గైడ్ బండ్లో కొంత ప్రాంతం జారి ఉండవచ్చని నిపుణుల కమిటీ అనుమానాలు వ్యక్తం చేసిందన్నారు. గైడ్ బండ్లో దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్, సిమెంట్ స్లర్రీతో నింపి గాబియన్లు వేయడం ద్వారా తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని కమిటీ సూచించిందన్నారు. ఆ మేరకు పనులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గైడ్ బండ్ను పూర్తిగా విశ్లేషించాక శాశ్వత మరమ్మతులపై కమిటీ సూచనలు చేయనుంది. సీడబ్ల్యూసీ సూచనల మేరకు గైడ్ బండ్ను పటిష్టం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ► పోలవరం తొలిదశ పూర్తి చేసేందుకు రూ.12,911.15 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకోగా కేబినెట్ నోట్ తయారీపై వివిధ శాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు. ► పోలవరం పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేయడంలో జాప్యం చేస్తుండటం వల్ల ఖజానాపై భారం పడుతోందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ముందుగా నిధులు విడుదల చేసిన తరహాలోనే పోలవరానికి కూడా ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ► పోలవరంలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల్లో 20,946 నిర్వాసిత కుటుంబాలకుగానూ ఇప్పటికే 12,658 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 8,288 కుటుంబాలకు కూడా పునరావాసం కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. సకాలంలో ఆయకట్టుకు నీటి విడుదల ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా క్యాలెండర్ ప్రకారం నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు సమీక్షలో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, తోటపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేశామన్నారు. మిగతా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఆయకట్టుకు పుష్కలంగా నీటిని అందించాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. అంబటి, అధికారులకు సీఎం అభినందనలు నాలుగో జాతీయ జల అవార్డుల్లో (నేషనల్ వాటర్ అవార్డ్స్–2022) ఆంధ్రప్రదేశ్ నాలుగు అవార్డులను దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. జలæ వనరుల సంరక్షణ, నీటి నిర్వహణకుగాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచింది. శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్కర్ చేతుల మీదుగా అందుకున్న అవార్డును జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సీఎం జగన్కు చూపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్య, వివిధ ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు. -
చిరుధాన్యాల సాగుకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం
-
Andhra Pradesh: 57 మంది ఐఏఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 57 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎనిమిది జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం కల్పించింది. పలు జిల్లాల జాయింట్ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. -
AP: 14న రాష్ట్ర కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి : ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయంలోని ఒకటో బ్లాక్లో మ.12 గంటలకు ఈ భేటీ ఉంటుంది. బడ్జెట్ సమావేశాలు పురస్కరించుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. -
ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్లవి.. కుట్రపూరిత కథనాలే
సాక్షి, అమరావతి: ‘సీఎస్తో కలసి వెళ్లిన ఓఎస్డీ’ శీర్షికన ఎల్లో మీడియా ప్రచురించిన కథనాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. దారుణమైన అబద్ధాలను ఆలంబనగా చేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, ఆంధ్రజ్యోతి వెబ్సైట్, ఏబీఎన్ చానల్ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ అధినేత అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చులకన చేస్తూ, కుట్రపూరితంగా కట్టుకథలు అల్లాయని స్పష్టం చేశారు. ఓ అత్యున్నత స్థాయి అధికారిని, వ్యవస్థను కించపరుస్తూ తప్పుడు కథనాలు ప్రచురించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఉద్యోగులందరిలో అత్యున్నతస్థాయి అధికారిని టార్గెట్ చేస్తూ అవాస్తవాలను ప్రచురించడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిష్టకు భంగం కలిగించడం ద్వారా ఏ జర్నలిజం విలువల ఆధారంగా పని చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. తాను ఖండనలో పొందుపరిచిన అన్ని విషయాలను అంతే ప్రాధాన్యతతో, బేషరతుగా క్షమాపణలు చెబుతూ ప్రచురించాలన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన సత్యదూరమైన న్యూస్ ఐటమ్ను ఆయా పత్రికల్లో ఏ పేజీల్లో ఎంత ప్రాముఖ్యతతో ప్రచురించారో, ఏ సమయంలో ఎంత ప్రాధాన్యతతో చానల్లో కథనాలను ప్రసారం చేశారో అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యతతో ఖండనను ప్రసారం చేస్తూ జరిగిన పొరపాటుకు క్షమాపణలు కూడా చెప్పాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆ న్యూస్ ఐటమ్కు బాధ్యులపై న్యాయ నిపుణుల సలహా, ప్రభుత్వ నిబంధనలకు లోబడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీట్ నంబర్ 1 డి... వెళ్లింది హైదరాబాద్ వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలపురం సమీపంలో రూ.5 కోట్లతో పునర్నిర్మించిన శ్రీ భానుకోట సోమేశ్వరాలయం మహా కుంభాభిషేకాన్ని ఫిబ్రవరి 4వతేదీ ఉదయం 9.58 గంటలకు నిర్వహించాలని ముహూర్తాన్ని నాలుగు నెలల క్రితమే 2022 అక్టోబర్ 14 నిర్ణయించారని సీఎస్ తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తాను ఫిబ్రవరి 2వతేదీ రాత్రి 11 గంటలకు రేణిగుంట ద్వారా కడప చేరుకున్నట్లు వివరించారు. 3వ తేదీ ఉదయం 9.50 గంటలకు కడప కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తాను చదువుకున్న జిల్లా పరిషత్ హైస్కూల్ ముద్దనూరులో విద్యార్ధులతో సమావేశం ముగియగానే 4.40కి బయలుదేరానని, సుమారు 8.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్, ఇతర అధికారులు తనకు మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారని తెలిపారు. రాత్రి 9 గంటలకు స్పైస్జెట్ ఎస్జీ 3003 సిరీస్ ద్వారా 1 డి సీట్లో ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నట్లు జవహర్రెడ్డి వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే శుక్రవారం రోజు సీఎస్తో కలసి ఓఎస్డీ విజయవాడ వెళ్లారని, ఒకే వాహనంలో ప్రయాణించారని ప్రచురించిన కథనాలు ఊహాజనితం, సత్యదూరమని చెప్పారు. దారుణమైన ఈ అబద్ధాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఓటు హక్కు సద్వినియోగంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
సాక్షి, అమరావతి: ప్రజలందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుల అస్త్రం ఓటు హక్కని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండినవారందర్నీ ఓటర్లుగా నమోదు చే యించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్తగా 3.03 లక్షల మంది ఓటర్ల నమోదుతో పాటు, మొత్తం 3,99,84,868 మంది ఓటర్లున్నట్టు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన కళాశాల విద్య కమిషనర్ పి.భాస్కర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదా వరి జిల్లాల కలెక్టర్లు కేవీఎన్ చక్రధర్బాబు, ఎం.హరినారాయణ, ఎ.మల్లికార్జున, పి.ప్రశాంతి, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో ఎంఎన్.హరేంద్ర ప్రసాద్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావు, శాసనమండలి డిప్యూటీ సెక్రటరీ కె.రాజ్కుమార్లతో పాటు ఏఆర్వోలు, బీఆర్వోలకు గవర్నర్ ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు. -
వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్నిరకాల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్రెడ్డి రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన రోడ్ సేఫ్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జవహర్రెడ్డి మాట్లాడుతూ.. నూతన వాహనాలు కొనుగోలు చేసే వారికి సంబంధిత డీలర్లు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లతో వాహనాలను అందించేలా చూడాలన్నారు. పాత వాహనదారులు కూడా నిర్దిష్ట వ్యవధిలోగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ వాహనాలపై అధికారుల హోదాతో కూడిన నేమ్ బోర్డులు ఉంటున్నాయని, ఆ విధంగా చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే ఉండాలన్నారు. రేడియం టేప్ అతికించాలి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని రవాణా, అద్దె వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రక్కులు వంటి వాహనాల వెనుక భాగంలో విధిగా రేడియం టేప్ అతికించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్న అన్ని ముఖ్య కూడళ్లలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించాలని రవాణా, పోలీస్ శాఖలను ఆదేశించారు. ఆర్ అండ్ బీ కార్యదర్శి ప్రద్యుమ్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలను వివరించారు. 15 ఏళ్లు దాటిన పాత వాహనాలు స్క్రాపింగ్ చేసేందుకు వీలుగా స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో ఆటోమేషన్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ సివిల్ పనుల ప్రతిపాదనలకు కమిటీ ఆమోదించింది. కొన్ని జిల్లాల్లో ఈ ట్రాక్స్ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్గుప్త, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, అదనపు డీజీపీ (రోడ్డు సేఫ్టీ) కృపానంద త్రిపాఠి ఉజేల, రవాణా శాఖ అదనపు కమిషనర్ ఎస్ఏవీ ప్రసాదరావు పాల్గొన్నారు. -
AP: సచివాలయాల పనితీరు బాగుంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటివద్దే సేవలందించే వలంటీర్ల వ్యవస్థతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు ఎప్పుడూ సమర్థవంతంగా ఉండేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులతో తనిఖీలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఏమైనా లోటుపాట్లు, పనితీరు సక్రమంగా లేనట్లు తేలితే వాటిని సరిచేయడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా మెరుగైన సేవలు అందించేలా వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. 2020 అక్టోబర్ 20 నుంచి ఈ నెల 3వ తేదీ వరకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో 27,473 తనిఖీలను నిర్వహించారు. ఇందులో ఒకసారి కన్నా ఎక్కువసార్లు 2,870 సచివాలయాలను సందర్శించారు. అక్కడ సిబ్బంది, వలంటీర్ల పనితీరు, రంగాల వారీగా ప్రజలకు అందిస్తున్న సేవలను పరీశీలించడమే కాక.. ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి, వాటి పనితీరును మదింపు చేశారు. 2021 సెప్టెంబర్ 1 నుంచి ఈ నెల 3 వరకు కూడా సచివాలయాల పనితీరును పరిశీలించారు. దాని ప్రకారం చూస్తే.. 80.90 శాతం గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు బాగుందని.. మరో 17.99 శాతం ఓ మోస్తరుగా ఉన్నాయని తేలింది. మిగిలిన 1.11 శాతం సచివాలయాల పనితీరు బాగోలేదని తేలింది. అలాగే, 76.59 శాతం మంది వలంటీర్ల పనితీరు బాగుందని, 21.55 శాతం వలంటీర్ల పనితీరు ఓ మోస్తరుగా ఉందని.. 1.86 శాతం వలంటీర్ల పనితీరు బాగోలేదని ఆ తనిఖీల్లో తేలింది. తనిఖీలు విధిగా నిర్వహించండి : సీఎస్ ఈ నేపథ్యంలో.. ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పథకాల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సచివాలయాలను క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్రెడ్డి గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు నెలలో తప్పనిసరిగా రెండు గ్రామ, వార్డు సచివాలాయాలను తనిఖీ చేయాలని సూచించారు. అలాగే, శాఖాధిపతులు నెలకు రెండు, కలెక్టర్లు వారంలో రెండు..జాయింట్ కలెక్టర్లు వారానికి నాలుగు గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీచేయాలని జవహర్రెడ్డి స్పష్టంచేశారు. బాగోలేని, మోస్తరు పనితీరు సచివాలయాలపై ఫోకస్ ఇక పనితీరు బాగోలేని, మోస్తరు పనితీరు మాత్రమే ఉన్న సచివాలయాలపై కారణాలు అన్వేషించి ఫోకస్ పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్జైన్ తెలిపారు. మంచి పనితీరు కనబరిచేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాల్సిందిగా కోరినట్లు ఆయన పేర్కొన్నారు. -
డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి: డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి సూచించారు. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన 27వ రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సీఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్, ఆన్లైన్ లోన్ యాప్ల మోసాల విషయంలో ప్రజలు పూర్తి అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మోసాలను నియంత్రించేందుకు జాతీయ స్థాయిలో ఒక పరిష్కార మార్గాన్ని రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మోసాలను అరికట్టేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, అభయగోల్డ్, హీరా, కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు, సహారా, ప్రగతి, అవని, ఆదర్శ్ తదితర కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించిన కేసుల ప్రగతిపైనా సమావేశంలో చర్చించారు. కేసులను ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సీఎస్ స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఇన్చార్జ్ అంజనీ మిశ్రా, డీజీఎం రూటా మహాపాత్ర, ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, విజయకుమార్, సత్య ప్రభాకరరావు, విజయవాడ ఏసీపీ సీహెచ్ శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు మొబైల్ అప్లికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులందరికీ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కె.ఎస్.జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చర్యలు చేపట్టింది. ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ అప్లికేషన్కు అవసరమైన సమాచారాన్ని ఐటీ శాఖకు అందించేందుకు సచివాలయంలోని అన్ని శాఖలు ఓ మిడిల్ లెవల్ ఆఫీసర్ను, శాఖాధిపతుల కార్యాలయాల్లో డిప్యూటీ కమిషనర్ స్ధాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని తెలిపింది. జిల్లా స్థాయిలో సమాచారాన్ని అందించేందుకు జిల్లా రెవెన్యూ ఆఫీసర్ను నోడల్ అధికారిగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. నిర్దేశించిన నమూనా పత్రంలో నోడల్ అధికారి పేరు, హోదా, కార్యాలయం చిరునామా, మొబైల్ నంబర్, ఇ–మెయిల్ ఐడీని ఐటీ శాఖకు పంపాలని పేర్కొంది. ఐటీ శాఖ వెంటనే నోడల్ అధికారులను సంప్రదించి మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయాలని, ఉద్యోగులు మొబైల్ అప్లికేషన్లో ఎన్రోల్ అయ్యేందుకు అవసరమైన శిక్షణ కూడా నోడల్ అధికారులకు ఇవ్వాలని పేర్కొంది. ఉద్యోగుల సెలవుల నిర్వహణ కూడా ఈ వ్యవస్థలోనే ఉంటుందని పేర్కొంది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఇదే విధానంలో హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల్లో జనవరి 1 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమల్లోకి తెస్తుండగా మిగతా కార్యాలయాల్లో జనవరి 16 నుంచి అమల్లోకి తేనున్నారు. స్వయంప్రతిపత్తి గల సంస్థలు, రీజినల్, డివిజనల్, స్థానిక సంస్థలు, మండల, గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి వరకు గల సబార్డినేట్ కార్యాలయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలు చేయాల్సిన బాధ్యత శాఖాధిపతులు కార్యాలయాల అధిపతులపైన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో హాజరు బాధ్యత జిల్లా కలెక్టర్లపైన ఉంటుందని స్పష్టం చేశారు. -
Andhra Pradesh: ఈ–ఆఫీస్ @ 2023.. మార్గదర్శకాలివే..!
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం ఆరంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పని తీరులో నూతనత్వం సంతరించుకోనుంది. కాగితాలు, ఫైళ్లతో పని లేకుండా అంతా ఈ–ఆఫీస్ పద్ధతిలో కార్యకలాపాలు జరగనున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఈ–ఆఫీస్ నుంచే నిర్వహించాలని సీఎస్ డా.కె.ఎస్.జవహర్రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫైళ్లు, తపాల్స్ అన్నీ ఈ–ఆఫీస్, అధికారిక ఈ–మెయిల్స్ ద్వారానే జరగాలని, భౌతికంగా తీసుకోబడవని తెలిపారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఇటీవల సీఎస్ జారీ చేశారు. ఈ–ఆఫీస్ను ప్రవేశపెట్టి ఆరు సంవత్సరాౖలెనా ఇంతవరకు అమలు కాలేదు. ఈ–ఆఫీస్కు స్పష్టమైన మార్గదర్శకాలున్నప్పటికీ శాఖలు, సచివాలయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఫిజికల్ విధానంలోనే జరుగుతున్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితంగా సిబ్బంది శక్తి, ఉత్పాదకత, వనరులతో పాటు సమయం వృధా అవుతోందన్నారు. కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. శాఖాధిపతుల కార్యాలయాలు సమర్పిస్తున్న కొన్ని ప్రతిపాదనలు, ఏసీబీ కేసులు అందుబాటులో లేవన్న ఫిర్యాదులున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇ–ఆఫీస్ను నిజమైన స్ఫూర్తితో అమలు చేయడానికి కఠినమైన మార్గదర్శకాలను అనుసరించాలని చెప్పారు. అసాధారణ కేసులకు సంబంధించి సంబంధిత కార్యదర్శి అనుమతి తీసుకుంటే తప్ప మిగతా కార్యాకలాపాలన్నీ జనవరి 1వ తేదీ నుంచి ఇ–ఆఫీస్ ద్వారానే కొనసాగించాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ సూచనలను చిత్తశుద్ధిలో అనుసరించాలని సీఎస్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇ – ఆఫీస్ నిర్వహణపై సాధారణ పరిపాలన శాఖ ఈ నెలాఖరు వరకు శాఖాధిపతులు, శాఖలు, ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు శిక్షణ ఇస్తోంది. ఇవీ మార్గదర్శకాలు.. ► ఆమోదిత ముసాయిదా ప్రతుల కరస్పాండెన్స్లన్నింటీపై (జీవోలు మినహా) తప్పనిసరిగా సంబంధి అధికారి డిజిటల్ సంతకం ఉండాలి. ఆ ప్రతులను ఎంట్రీలో సూచించిన చిరునామాకు ఇ–ఆఫీస్లో ఇ–డిస్పాచ్లోనే పంపాలి. ఆమోదించిన ముసాయిదా ప్రతులను (జీవోలు మినహా) కూడా ఇడిస్పాచ్ ద్వారానే పంపాలి. ► ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థలోనే జీవో నంబర్లను జనరేట్ చేయాలి. తుది జీవోను నంబర్తో పాటు సంతకం చేసిన స్కాన్డ్ కాపీలను ప్రభుత్వ అధికారిక ఇ–మెయిల్స్ ద్వారా మాత్రమే పంపించాలి. ► ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాలు అన్ని ప్రతిపాదనలను తప్పనిసరిగా డిజిటల్ ఆకృతిలో (పీడీఎఫ్) ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ కమ్యూనికేషన్ విభాగం ఇ–మెయిల్ ఐడీ, ఇ–ఆఫీస్ వ్యవస్థలోని ఇ–డిస్పాచ్ ద్వారా లేదా అధికారిక ఇ–మెయిల్ ద్వారానే పంపాలి. భౌతిక ఆకృతిలో సమర్పించిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోబడవు. డిజిటల్ ఫార్మాట్లో ప్రతిపాదనను సమర్పించడంలో జాప్యానికి సంబంధిత కార్యాలయమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికారిక ఇ–మెయిల్, ఇ–డిస్పాచ్ ద్వారా డిపార్ట్మెంట్లో స్వీకరించిన అన్ని ప్రతిపాదనలు, డిస్పాచ్ విభాగంలో సంబంధిత సిబ్బంది ఇ–రశీదులుగా మార్చి, వెంటనే సంబంధిత శాఖ అధికారులకు పంపాలి. ► ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లు కూడా నివేదికలను డిజిటల్ ఫార్మాట్లో ఏకకాలంలో ఏపీ విజిలెన్స్ కమిషన్కు, సంబంధిత శాఖ కార్యదర్శికి పంపాలి. రిఫరెన్స్ కోసం నిర్ణీత సమయంలో ప్రభుత్వానికి స్థూలమైన భౌతిక నివేదికను పంపాలి. ► సచివాలయాల శాఖలన్నీ తప్పనిసరిగా అన్ని సాధారణ ఉత్తర ప్రత్యుతరాలు (కరస్పాండెన్స్లు) డిజిటల్ ఫార్మాట్లో ఇ–డిస్పాచ్ ద్వారా ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ కమ్యునికేషన్ విభాగాల అధికారికి పంపించాలి. డీవో లేఖలతో పాటు ఇతర ముఖ్యమైన ఉత్తర ప్రత్యుత్తరాలను సంబంధిత అధికారి అధికారిక ఇ–మెయిల్కు పంపాలి. -
పోలీసు ఉద్యోగార్థులకు వయో పరిమితి పెంపుపై గెజిట్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఈ మేరకు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనరల్ కేటగిరిలో 18 నుంచి 26 ఏళ్ల వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారైతే 18 నుంచి 31 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ ఉద్యోగాలకు జనరల్ కేటగిరిలో 21 నుంచి 29 ఏళ్ల వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారైతే 21 నుంచి 34 ఏళ్ల వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 6,100 కానిస్టేబుల్, 411 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం పోలీసు శాఖ అక్టోబర్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు తాజాగా వయో పరిమితి రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల మరింత మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుంది. -
రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం .. ఈ–కేవైసీ చేస్తేనే పీఎం కిసాన్
సాక్షి, అమరావతి: ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద నిధులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నెలాఖరులోపు రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని, లేకపోతే జనవరిలో విడుదల చేయనున్న 13వ విడత పీఎం కిసాన్ నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ–కేవైసీ ప్రక్రియ ఉద్దేశం రైతుల వాస్తవికతను ధ్రువీకరించుకోవడం కోసమేనని కేంద్రం వెల్లడించింది. నెలాఖరులోపు పూర్తిచేయాలి : సీఎస్ అర్హులైన లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. ఆయన కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కేంద్రం ఆదేశాల మేరకు ఈ–కేవైసీ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. రాష్ట్రంలో క్రియాశీలక రైతులు 49,13,283 మంది ఉండగా, వారిలో ఈ నెల 21వ తేదీ వరకు 35,16,597 రైతులకు ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయిందని, 13,96,686 మంది రైతుల ఈ–కేవైసీ పెండింగ్లో ఉందని సీఎస్ చెప్పారు. వారికి ఈ నెలాఖరులోపు పూర్తి చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులందరూ పీఎం కిసాన్ ప్రయోజనం పొందేలా వెంటనే ఈ–కేవైసీని పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీలోపు 13వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. -
జవహర్రెడ్డిపై హైకోర్టు అసహనం
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార వ్యాజ్యంలో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలన్న తమ ఆదేశాలను గౌరవించకపోవడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సమావేశం ఉందన్న కారణంతో కోర్టు ముందు హాజరు కాకపోవడాన్ని తప్పుపట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారా..అంటూ ప్రశ్నించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో పూర్తి వివరాలు పేర్కొనలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓ రోజులో ఎన్ని సమావేశాలు నిర్వహిస్తారో వివరాలు తెప్పించుకోగలమని తెలిపింది. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించి మహోన్నత వ్యక్తులైన మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్ వంటి వారే కోర్టు ముందు హాజరయ్యారని, వారికన్నా మీరు గొప్ప వారా అంటూ ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కార వ్యాజ్యంలో మిగిలిన అధికారులు హాజరు కావడం, పిటిషనర్కు చెల్లించాల్సిన వేతన బకాయిలన్నింటినీ చెల్లించడంతో కోర్టు ధిక్కార పిటిషన్ను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణమూర్తి అనే ఉద్యోగి తనకు 2005 నుంచి 2019 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.10.59 లక్షలను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు బకాయిల చెల్లింపునకు ఆదేశాలిచ్చింది. అధికారులు అమలు చేయలేదంటూ కృష్ణమూర్తి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్, ఏలూరు జల వనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీరామకృష్ణ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ సోమయాజులు బకాయిలు ఎందుకు చెల్లించలేదో కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రావత్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. జవహర్రెడ్డి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్కు బకాయిలను చెల్లించినట్లు మిగిలిన అధికారులు చెప్పడంతో న్యాయమూర్తి దానిని రికార్డ్ చేసి కోర్టు ధిక్కార పిటిషన్ను మూసివేశారు. -
టీటీడీ ఈవో జవహర్రెడ్డి రిలీవ్
సాక్షి, అమరావతి/తిరుమల: టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ జవహర్రెడ్డి ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. టీటీడీ ఈవోగా ప్రస్తుతానికి అదనపు బాధ్యతలను టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ఇకనుంచి జవహర్రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.సత్యనారాయణ, యువజన సర్వీసుల శాఖ కమిషనర్గా కె.శారదాదేవి నియమితులయ్యారు. యువజన సర్వీసుల శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సి.నాగరాణిని రిలీవ్ చేశారు. సెర్ఫ్ సీఈవో ఎండీ ఇంతియాజ్కు మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పూర్వజన్మ సుకృతం: జవహర్రెడ్డి కాగా ఈవో బాధ్యతల నుంచి రిలీవ్ అయిన జవహర్రెడ్డి ఆదివారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి టీటీడీ ఈవో (ఎఫ్ఏసీ) బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జవహర్రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి కొలువులో 19 నెలలు భక్తులకు సేవలందించానని, ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. టీటీడీ పాలన కాస్త భిన్నమైనదని, ఆలయ వ్యవహారాలు, అర్చక వ్యవస్థ కొత్త అనుభూతినిచ్చాయని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా పేదవర్గాల వారికి స్వామివారి దర్శనం చేయించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. టీటీడీ ఈవో(ఎఫ్ఏసీ) ధర్మారెడ్డి టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. జేఈవో (ఆరోగ్యం, విద్య) సదాభార్గవి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. -
రాష్ట్రంలో 1,072 ఆలయాల నిర్మాణం
తిరుపతి ఎడ్యుకేషన్: శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవదాయశాఖ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 1,072 ఆలయాల నిర్మాణానికి టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ (డీపీపీ) కార్యనిర్వాహక మండలి ఆమోదం తెలిపింది. త్వరలో భారీ ఎత్తున కల్యాణమస్తు, సామూహిక వివాహాలు, దేశవ్యాప్తంగా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని తీర్మానించింది. తిరుపతిలో గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ధర్మకర్తల మండలి సభ్యురాలు అల్లూరి మల్లీశ్వరి వర్చువల్గా, ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయసారథి, ఏఈవో సత్యనారాయణ పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ► రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో ఒక్కో ఆలయం రూ.10 లక్షల వ్యయంతో ఏడాదిలోపు 1,072 ఆలయాల నిర్మాణం. ఈ ఆలయాల్లో అర్చకులుగా పనిచేసేందుకు ముందుకొచ్చే వారికి దేవదాయశాఖ సహకారంతో తిరుపతిలో శిక్షణ. ► దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ప్రతినెలా శ్రీనివాసకల్యాణం. ► ఏప్రిల్ 23న కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్, మే 8న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మే నెలలో ఢిల్లీ, జూన్లో హైదారాబాద్, జూన్ 23 నుంచి జూలై 4 వరకు అమెరికాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాసకల్యాణాల నిర్వహణ. ► గోదావరి జిల్లాల్లో త్వరలో శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు ఏర్పాట్లు. ► కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడడంతో సామూహిక వివాహాల నిర్వహణకు పండిత మండలి ఏర్పాటు. మండలి నిర్ణయించే పవిత్ర ముహూర్తాల్లో జిల్లా యంత్రాంగాల సహకారంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహణ. ► తిరుపతిలో ప్రతినెలా టీటీడీ ఆధ్వర్యంలో ఒక యజ్ఞం. మే నెలలో అన్నమయ్య జయంతి ఉత్సవాల నిర్వహణ. ► గుడికో గోమాత కార్యక్రమం ద్వారా ఇప్పటికి దేశంలోని 141 ఆలయాలకు ఉచితంగా గోవు, దూడ అందజేత. ఈ కార్యక్రమాన్ని విస్తృత పరిచే ఏర్పాట్లు. ► రాష్ట్రంలోని టీటీడీ, దేవదాయశాఖ భూముల్లో గో ఆధారిత వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించి, వారు పండించిన ఉత్పత్తులను శ్రీవారి ప్రసాదాల తయారీకి కొనుగోలు చేయాలి. -
సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు
సాక్షి, అమరావతి: సీఎం కార్యాలయం(సీఎంవో)లో పనిచేసే అధికారులకు శాఖలను కేటాయిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. కేఎస్ జవహర్రెడ్డి(స్పెషల్ సీఎస్): జీఏడీ, హోం శాఖ, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్య శాఖ, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్మెంట్, రాష్ట్ర విభజన సమస్యలు సాల్మన్ ఆరోఖ్యరాజ్(కార్యదర్శి): పౌర సరఫరాలు, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు ధనుంజయ్రెడ్డి(కార్యదర్శి): ఆర్థిక, ప్రణాళిక శాఖ, జల వనరులు, వ్యవసాయ అనుబంధ రంగాలు, మునిసిపల్ పరిపాలన, ఇంధన శాఖ, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు ముత్యాలరాజు(అదనపు కార్యదర్శి): ప్రజాప్రతినిధుల వినతులు, రెవెన్యూ(ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్), గృహ నిర్మాణం, రవాణా, రోడ్లు, భవనాల శాఖలు, కార్మిక, నైపుణ్యాభివృద్ధి శాఖలు -
హనుమాన్ జన్మస్థలం అభివృద్ధికి టీటీడీ శ్రీకారం
తిరుమల: తిరుమల అంజనాద్రిలో ఆకాశగంగ వద్ద హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సుందరీకరణ పనులకు భూమిపూజను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రాచార్యులు, విశ్వహిందూ పరిషత్ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మ పాల్గొన్నారు. టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు, కంకణబట్టార్ మోహన రంగాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు రక్షబంధన పూజ, అంకురార్పణ, పంచగవ్యారాధన, వాస్తుహోమం, శిలలకు వాస్తు దర్శనం, శంఖునకు అభిషేకం, విశేష హోమాలు, రత్నన్యాసం, ప్రథమ శిలాస్థాపన, భూమిపూజ నిర్వహించారు. టీటీడీ మాజీ బోర్డు సభ్యులు(దాతలు) నాగేశ్వరరావు, మురళీకృష్ణ పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఫల, పుష్పాలంకరణ.. ఆకాశగంగ వద్ద భూమి పూజ ప్రాంగణంలోని వేదికపై ఏర్పాటు చేసిన ఫల, పుష్పాలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆపిల్, ద్రాక్ష, పైనాపిల్, మొక్కజొన్న, రోజా, సంపంగి, కట్ ఫ్లవర్స్తో అద్భుతంగా రూపొందించారు. -
15 తర్వాత ఆఫ్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు
తిరుమల: కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ తర్వాత ఆఫ్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన శ్రీవారి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు అనుమతి మేరకు ఈ నెల 15వ తేదీ తర్వాత ఆఫ్లైన్లో రోజుకు 10 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆన్లైన్లోనూ రోజుకు 10 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవల అనుమతికి సంబంధించి ఈ నెల 17న జరిగే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్ల జారీకి సంబంధించి వెబ్ పోర్టల్ సిద్ధమైందన్నారు. టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళం అందించిన దాతలకు ప్రివిలేజ్ కింద శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేస్తామన్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 9.30 నుంచి భక్తులు టీటీడీ వెబ్సైట్ నుంచి శ్రీవారి ఉదయాస్తమాన సేవాటికెట్లను బుక్ చేసుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్వీబీసీలో ప్రచారం చేస్తున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
11 ఆలయాలకు రూ.8.48 కోట్లు మంజూరు
తిరుమల: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు ద్వారా 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఈవో చాంబర్లో శ్రీవాణి ట్రస్టుపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఆలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రస్టు ద్వారా చేపట్టిన 50 నూతన ఆలయాలు, 84 ఆలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణ పనులు, 42 భజన మందిరాల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు. శ్రీవాణి ట్రస్టు, దేవదాయ శాఖ సీజీఎఫ్ ద్వారా మంజూరు చేసే ఆలయాల నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ డేటాబేస్డ్ సిస్టమ్ను తయారు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి అందిన 1,100 దరఖాస్తులను దేవదాయ శాఖ పరిశీలనకు పంపామని, పరిశీలన పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మాన్ని మరింత వ్యాప్తి చేయడంలో భాగంగా పురాతన ఆలయాల పునర్నిర్మాణం, ఆలయాలు లేనిచోట ఆలయ నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, ఎఫ్ఏ సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, డిప్యుటీ సీఈ ప్రసాద్, డిప్యుటీ ఈవో జనరల్ డాక్టర్ రమణప్రసాద్, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి లంక విజయసారథి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యాల మేరకు పోలవరం పనులు: కేఎస్ జవహర్రెడ్డి
పోలవరం రూరల్: ప్రభుత్వ లక్ష్యాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. ఈఎన్సీ నారాయణరెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతీ పనిని పరిశీలించి వాటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల మధ్య జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణం, వివిధ దశల్లో చేపట్టి పూర్తి చేసిన పనుల పురోగతిపై ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. హెడ్ వర్క్స్, స్పిల్వే, బ్రిడ్జి, గేట్లు, ఎర్త్ కం రాక్ఫిల్ డ్యామ్, గ్యాప్–3, ఓటీ రెగ్యులేటర్, బండ్–2, ట్విన్ టన్నెల్స్ తదితర పనులను పరిశీలించారు. పనుల వివరాలను ఎస్ఈ కె.నరసింహమూర్తి మ్యాప్ ద్వారా వివరించారు. గురువారం రాత్రి ప్రాజెక్టు ప్రాంతంలోనే జవహర్రెడ్డి బస చేశారు. -
కల్యాణమస్తుకు త్వరలో ముహూర్తం
తిరుమల: టీటీడీ త్వరలో నిర్వహించనున్న కల్యాణమస్తు సామూహిక వివాహాల నిర్వహణకు అర్చక స్వాములతో చర్చించి ముహూర్తాలను ఖరారు చేయవలసిందిగా టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ప్రతి శనివారం శ్రీవేంకటేశ్వర వ్రత కల్పం నిర్వహించేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందగానే శ్రీవేంకటేశ్వర వ్రత కల్పం ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే టీటీడీ అనుబంధ ఆలయాల్లో గోపూజ ప్రారంభించామని, మిగిలిన ఆలయాల్లో కూడా గోపూజ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర దేవదాయ శాఖ ఆధీనంలోని 6ఎ, 6బి ఆలయాల్లో కూడా గో పూజ ప్రారంభించాలన్నారు. ప్రైవేట్ ఆలయాల్లో గోపూజ ప్రారంభించాలనుకునే వారికి కోరిన వెంటనే గోమాతను అందిస్తామన్నారు. సనాతన ధార్మిక పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు విద్యార్థులకు పుస్తకాలను అందించాలని ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
వేగంగా వెలిగొండ పనులు
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఇరిగేషన్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద ప్రాజెక్టు సొరంగం నిర్మాణ పనులను జవహర్రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జవహర్రెడ్డి మాట్లాడుతూ.. నల్లమల సాగర్లో తొలి దశలో 10.6 టీఎంసీల నీరు నిల్వ చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది మందికి సాగు, తాగునీరు అందుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 1.19 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని వివరించారు. మంగళవారం కొత్తూరు వద్ద సొరంగ నిర్మాణాలను పరిశీలించి.. జిల్లాలో జరుగుతున్న వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై సమీక్ష జరుపుతామని చెప్పారు. బోటులో కొల్లం వాగుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రెండో సొరంగంలో జరుగుతున్న మాన్యువల్ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి సొరంగం నుంచి 14వ కిలోమీటరు వద్ద రెండో సొరంగంలోకి తీసిన అప్రోచ్ టన్నెల్ను సైతం పరిశీలించారు. -
జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్రెడ్డి
సాక్షి, అమరావతి: టీటీడీ ఈవోగా పనిచేస్తున్న డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డిని ప్రభుత్వం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. టీటీడీ ఈవో అదనపు బాధ్యతలు ఆయనకే అప్పగించింది. రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఉన్న సతీష్చంద్ర ఈ నెలాఖరులో రిటైర్ అయ్యాక ఆ బాధ్యతలను పూర్తిస్థాయిలో శ్యామలరావు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండీ, ఇంధనశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జి.సాయిప్రసాద్ క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను అదనంగా నిర్వర్తిస్తున్న రజత్భార్గవను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. పరిశ్రమలు, వాణిజ్యశాఖ (ఫుడ్ ప్రాసెసింగ్) ముఖ్య కార్యదర్శి ముఖేష్కుమార్ మీనాను ఆర్థికశాఖ కొత్తగా ఏర్పాటుచేస్తున్న వాణిజ్యపన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టుకు బదిలీ చేశారు. ఇప్పటివరకు డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులో పనిచేసి వెనక్కి వచ్చిన ఎస్.సురేష్ కుమార్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న వి.చినవీరభద్రుడిని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్గా బదిలీ చేశారు. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్గా ఉన్న రంజిత్బాషాను సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా బదిలీ చేశారు. యువజన వ్యవహారాల డైరెక్టర్, ఏపీ స్టెప్ ఎండీ సి.నాగరాణిని చేనేతశాఖ డైరెక్టర్గా నియమించారు. ఆప్కో ఎండీగా అదనపు బాధ్యతలు ఆమెకే అప్పగించారు. చేనేత డైరెక్టర్ అర్జునరావును బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్గా బదిలీ చేశారు. ఇప్పటివరకు ఆ పోస్టు అదనపు బాధ్యతలు చూస్తున్న అనంతరామును రిలీవ్ చేశారు. -
వేద విజ్ఞానంతోనే భారత్కు గుర్తింపు
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): భారతీయ వేద విజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. ప్రాచీన వేదజ్ఞాన సంపదతోనే భారతదేశం విశ్వగురుగా ప్రపంచవేదికపై విశిష్ట గుర్తింపు సాధించిందని తెలిపారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజ్భవన్ నుంచి వెబినార్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం చేస్తూ.. ప్రాచీన కాలం నుంచి మన గ్రంథాలు, సాంస్కృతిక వారసత్వం, విజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు ప్రేరణగా నిలిచిందన్నారు. భారతీయ గణిత, జ్యోతిష్య, వాణిజ్య, ఆర్థిక శాస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ముందంజలో ఉండేవని తెలిపారు. విజ్ఞానాన్ని మౌఖిక ప్రసారం అనే భారతీయ సంప్రదాయాన్ని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం కాపాడుతుండడం అభినందనీయమని ప్రశంసించారు. పరిశోధక విద్యార్థులు వేద గణితం వంటి అంశాలను ఎంపిక చేసుకోవాలని గవర్నర్ సూచించారు. గణేశన్ శౌత్రికి మహా మహోపాధ్యాయ పురస్కారం తిరుపతికి చెందిన వేద పండితుడు గణేశన్ శౌత్రికి మహామహోపాధ్యాయ (గౌరవ డాక్టరేట్ ) పురస్కారం లభించింది. స్నాతక్సోత్సవంలో యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు పూర్తి చేసిన 180 మందికి డిగ్రీలు అందజేశారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్.సుదర్శనశర్మ, టీటీడీ ఈవో కేఎస్ జవహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
తిరుమల/చంద్రగిరి: తిరుమల శ్రీవారిని ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం న్యాయమూర్తికి పండితులు వేద ఆశీర్వచనం అందించగా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, ఏఈవో ధర్మారెడ్డిలు శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అలాగే, శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామిని, కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని కూడా జస్టిస్ నరసింహ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం చంద్రగిరిలోని రాయలవారి కోటను సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. ఇక, ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో ఇన్కమ్టాక్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ పురి, నటుడు విజయ్దేవరకొండ ఉన్నారు. అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. -
సర్వభూపాల వాహనంపై సర్వాంతర్యామి
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కాళీయమర్ధనుడి అలంకారంలో సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి శ్రీరాజమన్నార్ అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహన సేవలలో పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వాములు, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో కేఎస్ జవహర్రెడ్డి దంపతులు, ఇతర అధికారులు, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమవారం ఉదయం 9 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీమలయప్ప స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీనివాసుడికి గోదాదేవి మాలలు.. చెన్నై నుంచి గొడుగులు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి మాలలు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. తొలుత పెద్దజీయర్ మఠంలో ప్రత్యేక పూజల అనంతరం వీటిని ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీవిల్లి పుత్తూరు ఆలయంలో గోదాదేవికి అలంకరించిన మాలలను సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడవాహన సేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే, నేటి గరుడవాహన సేవలో స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి ట్రస్టుఆధ్వర్యంలో చెన్నై నుండి 9 గొడుగులను ఆదివారం తిరుమలకు తీసుకొచ్చారు. సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్జీ వీటిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డిలకుఅందజేశారు. -
బ్రహ్మోత్సవాల నుంచి నడకదారిలో భక్తులకు అనుమతి
తిరుమల: శ్రీవారి దర్శనం చేసుకునే సామాన్య భక్తుల కోసం నిర్మిస్తోన్న నడక దారి పైకప్పు పనులు పూర్తయ్యాయని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల నుంచి నడకదారిలో భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు. అలిపిరి నుంచి తిరుమల వరకు జరుగుతోన్న నడక దారి పైకప్పు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. తొలగించిన కాంక్రీట్ వ్యర్థాలను త్వరితగతిన తొలగించాలని అధికారులను ఆదేశించారు. 1న డయల్ యువర్ ఈవో డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం అక్టోబర్ 1న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు జరగనుంది. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవోకి ఫోన్ ద్వారా తెలపవచ్చు. ఇందుకుగాను 0877–2263261 నంబర్ను సంప్రదించాలి. -
టీటీడీ బోర్డు కార్యదర్శిగా ఈవో ప్రమాణ స్వీకారం
తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్య కార్యదర్శిగా టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్రెడ్డి శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈవోతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. గరుడోత్సవం రోజున శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను అందజేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ ఆహ్వానించనుందని వెల్లడించారు. దీంతోపాటు హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నామన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుని సంకీర్తనలు పాటలు పోటీలను ‘అదివో అల్లదివో’ పేరుతో నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలపై నిరంతర పరిశోధనలు అన్నమాచార్యుల సంకీర్తనలపై నిరంతరం పరిశోధనలు నిర్వహించేందుకు తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ‘అన్నమయ్య పీఠం’ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన సమీక్షించారు. -
‘నవనీత సేవ’లో భక్తులకు అవకాశం
తిరుమల: దేశీయ గోవుల నుంచి సేకరించిన పాల నుంచి పెరుగు తయారు చేసి, దాన్ని చిలికగా వచ్చిన వెన్నను వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవలో భక్తులు పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. ఈ నెల 13వ తేదీ నుంచి 7 బ్రాండ్లతో పరిమళభరిత అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో జవహర్రెడ్డి మాట్లాడారు. తిరుమలలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్ హిల్స్గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఇందుకోసం దశలవారీగా డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను వినియోగించనున్నట్లు చెప్పారు. తొలి దశలో 35 విద్యుత్ కార్లను (టాటానెక్సాన్) తిరుమలలోని సీనియర్ అధికారులకు అందించినట్లు తెలిపారు. రెండో దశలో యాత్రికులకు ఉచిత బస్సులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయని వీటిని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు. వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా సంబంధిత టికెట్లను ఆ¯న్లై¯న్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
కోవిడ్ వల్లే పరిమితంగా దర్శన టికెట్లు
తిరుమల: ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను డీనోటిఫై చేసే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆ మహమ్మారి వల్లే తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో టికెట్లు జారీచేస్తున్నామని టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలోను, ఆ తర్వాత మీడియా సమావేశంలోను ఈఓ మాట్లాడారు. కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో.. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులు కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఐదు వేల నుంచి 8 వేలకు పెంచినట్లు ఈఓ వెల్లడించారు. గదులు పొందే యాత్రికులు బసకు సంబంధించిన ఫిర్యాదులను 9989078111 నెంబర్లో ఇవ్వాలని జవహర్రెడ్డి తెలిపారు. అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని.. దీనిపై త్వరలోనే సమగ్ర గ్రంథం ముద్రిస్తామన్నారు. అలాగే, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం పనులను వచ్చే సెప్టెంబరు 14న ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. 13న గరుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామి ఆగస్టు 13వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై దర్శనమిస్తారని ఈఓ తెలిపారు. అలాగే, ఆగస్టు 18 నుంచి 20 వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయని, ఇందుకోసం ఆగస్టు 17న ఆంకురార్పణ నిర్వహిస్తామన్నారు. -
శ్రీవారి భక్తులకు సులభంగా అద్దె గదులు
తిరుమల: శ్రీవారి భక్తులకు సులభంగా, త్వరితగతిన అద్దె గదులు కల్పించాలని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఆయన వసతి కల్పనకు నూతనంగా రూపొందించిన సాఫ్ట్వేర్పై అధికారులతో సమీక్షించారు. ఈవో మాట్లాడుతూ తిరుమలలో అద్దె గది కోసం ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్న భక్తులు సంబంధిత గదుల స్లిప్పులను తిరుపతిలోనే స్కాన్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం అలిపిరి టోల్గేట్, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలిపిరి టోల్గేట్ నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి స్లిప్పులు స్కాన్ చేసుకున్న 30 నిమిషాల్లో, అలిపిరి నడకమార్గంలో వెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లేవారికి గంటలో ఎస్ఎంఎస్లు వస్తాయన్నారు. భక్తులు నేరుగా సంబంధిత ఉప విచారణ కార్యాలయానికి వెళ్లి గదులు పొందొచ్చని సూచించారు. అనంతరం టీటీడీ కాల్ సెంటర్ ద్వారా వస్తున్న పలు ఫిర్యాదులను విభాగాల వారీగా సమీక్షించారు. అంతకుముందు రిసెప్షన్ అధికారులు నూతనంగా రూపొందించిన అకామిడేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్పై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు. అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ట్రూనాట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ ట్రూనాట్ కిట్ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేస్తున్నారని, ఇకపై ట్రూనాట్ ద్వారా పరీక్షలు చేయాలన్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్ పెండింగ్ కేసులకు తక్షణమే నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. 104 కాల్ సెంటర్పై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. నేడు సెకండ్ డోసు మాత్రమే.. గురువారం కరోనా టీకా రెండో డోసు మాత్రమే వేస్తున్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి డోసు ఎవరికీ వెయ్యరని చెప్పారు. -
పూర్తి స్థాయిలో వెంటిలేటర్లను వినియోగించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు వేల వెంటిలేటర్లు ఉన్నాయని, వీటిని కరోనా బాధితుల అవసరం మేరకు పూర్తి స్థాయిలో వినియోగించాలని కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ డా.కె.ఎస్.జవహర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆయన జిల్లా కలెక్టర్లతో జూమ్ ద్వారా సమావేశం నిర్వహించారు. పడకలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లను త్వరితగతిన పునరుద్ధరించి, వాటికి నోడల్ అధికారులను నియమించాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఏవైనా అవసరాలుంటే వెంటనే మౌలిక వసతులను కల్పించాలని ఆదేశించారు. హోం ఐసొలేషన్లో ఉన్నవారిని ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లతో నిత్యం పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 70 వేల మంది ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారిని పరీక్షించాల్సి ఉందన్నారు. 104 కాల్ సెంటర్ను 24 గంటలూ పర్యవేక్షించాలని చెప్పారు. ఆక్సిజన్ సరఫరాను జాగ్రత్తగా చూడాలని సూచించారు. కోవిడ్ నియంత్రణకు నియమించిన ప్రత్యేక అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు అనిల్కుమార్ సింఘాల్, ముద్దాడ రవిచంద్ర, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ పాల్గొన్నారు. -
శ్రీరామనవమి రోజున ఆధారాలు బయటపెడతాం
తిరుమల: శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్యలో దేవాలయం నిర్మితమవుతున్న తరుణంలో హనుమంతుడి జన్మస్థలాన్ని కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉందని టీటీడీ ఈవో కేఎస్ జవహర్రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో నూతన ప్లవనామ సంవత్సర ఉగాది ఆస్థానంలో పాల్గొన్న జవహర్రెడ్డి అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రం హనుమంతుడి జన్మస్థలం తమ ప్రాంతమేనని చెప్పలేదన్నారు. హనుమంతుడి జన్మస్థలంపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. టీటీడీ పండితుల వద్ద బలమైన ఆధారాలు కర్ణాటకలోని హంపి ప్రాంతం హనుమంతుడి జన్మస్థలంగా చెబుతున్నారని జవహర్రెడ్డి పేర్కొన్నారు. అయితే టీటీడీ పండితుల వద్ద ఉన్న ఆధారాలను శ్రీరామనవమి రోజున బయట పెడతామని తెలిపారు. ఇతర రాష్ట్రాలవారు కూడా తమ వద్ద ఉన్న ఆధారాలను బయట పెట్టవచ్చన్నారు. ఇప్పటికే టీటీడీ నియమించిన పండితుల కమిటీ తిరుమలలోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని పురాణాలను పరిశీలించి బలమైన ఆధారాలను సేకరించిందని వివరించారు. పురాణేతిహాసాలతో పాటు చారిత్రక ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చాయని చెప్పారు. హనుమంతుడి జన్మస్థలంపై పండితులు సేకరించిన ఆధారాలతో తయారు చేసిన నివేదికను శ్రీరామనవమి రోజున ప్రజల ముందుకు తీసుకువచ్చి అందరి అభిప్రాయాలను తీసుకుంటామని జవహర్రెడ్డి వివరించారు. ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 7 గంటల నుంచి ఉగాది ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహించామని చెప్పారు. -
టీటీడీ ప్రాజెక్టులన్నీ హెచ్డీపీపీలోకి విలీనం
తిరుపతి ఎడ్యుకేషన్: టీటీడీలోని అన్ని ప్రాజెక్టులను హిందూ ధర్మప్రచార పరిషత్ (హెచ్డీపీపీ)లోకి విలీనం చేయనున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు. ధర్మ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో మంగళవారం ఆయన సీనియర్ అధికారులతో సమీక్షించారు. టీటీడీలోని హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటిని హెచ్డీపీపీలో విలీనం చేసి పరిశోధన, కార్యక్రమాల రూపకల్పన, ముద్రణ, ప్రచారం వంటి ఉప విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సప్తగిరి మాసపత్రిక పాత సంచికలను డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. టీటీడీకి అవసరమైన అన్ని రకాల మందుల కొనుగోలుకు కేంద్రీకృత విధానాన్ని అనుసరించాలని సూచించారు. టీటీడీ ఉద్యోగుల్లో నైపుణ్యం పెంచేందుకు అనుగుణంగా కొత్తగా విధుల్లో చేరే ఉద్యోగులకు రెండు నెలల పాటు శిక్షణను తప్పనిసరి చేయాలని, క్యాడర్ వారీగా శిక్షణ మాడ్యూళ్లను తయారు చేయాలని ఆదేశించారు. కాల్ సెంటర్లో కాలర్ ఏజెంట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. సేవల విభాగాన్ని హెచ్ఆర్ విభాగంగా పిలవాలని, ఇక్కడ చేపట్టాలి్సన విధులకు సంబంధించి జేఈవో, డీఈవో, డిప్యూటీ ఈవో (సేవలు)లతో కమిటీని వేశారు. -
తిరుమల అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం
తిరుమల: తిరుమల గిరుల్లోని అంజనాద్రి శ్రీ ఆంజనేయస్వామివారి జన్మ క్షేత్రమని పురాణాలు ముక్త కంఠంతో చెబుతున్నాయని పలువురు పండితులు టీటీడీ ఈఓ కేఎస్ జవహర్రెడ్డికి వివరించారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి ఆధారాలతో నిరూపించాలని ఈఓ పండితులను కోరారు. టీటీడీ పరిపాలన భవనంలోని ఈఓ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన పండితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ కొన్ని దేవాలయాల స్థల పురాణాల ఆధారంగా వేరువేరు ప్రాంతాలను హనుమంతుని జన్మ స్థలంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పౌరాణిక, చారిత్రక, ఆచార వ్యవహార దృష్టితో ఆంజనేయస్వామివారు తిరుమలలో జన్మించారని పరిశోధించి నిరూపించడానికి పండితులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆధునిక కాలంలో శ్రీవారి భక్తులందరికీ అంజనాద్రిపై మరింత భక్తి విశ్వాసాలు ఏర్పడాలని ఈఓ సూచించారు. స్కంధ పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణం, వెంకటాచల మహాత్మ్య మొదలైన పురాణాల్లో ఉన్న శ్లోకాలను పండితులు సమావేశంలో ప్రస్తావించారు. ఈ సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధర శర్మ, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు జె.రామక్రిష్ణ, శంకరనారాయణ, ఎస్వీ వేద ఆధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ పాల్గొన్నారు. -
అశ్లీల వీడియో లింక్ పంపిన అటెండర్ తొలగింపు
తిరుపతి సెంట్రల్: శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ఒకరు ఓ భక్తుడికి మెయిల్ ద్వారా అశ్లీల వీడియో లింక్లను పంపిన ఘటనను తీవ్రంగా పరిగణించిన పాలక మండలి సదరు సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్రెడ్డి దీనిపై తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించడంతో సైబర్ క్రైం పోలీసు బృందం రంగంలోకి దిగింది. శతమానం భవతి వివరాలు కోరగా.. ఎస్వీబీసీ ప్రసారం చేసే శతమానం భవతి కార్యక్రమం ద్వారా పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి శుభ సందర్భాల్లో పురోహితులు ఆశీర్వచనాలు అందిస్తారు. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు ఈ కార్యక్రమం వివరాలు పంపాలని కోరగా ఎస్వీబీసీ కార్యాలయం సిబ్బంది ఒకరు అశ్లీల వీడియో లింక్ పంపినట్లు గుర్తించారు. మెయిల్ తెరిచి చూసి నిర్ఘాంతపోయిన భక్తుడు దీనిపై టీటీడీ చైర్మన్, ఈవోకు ఫిర్యాదు చేయడంతో తక్షణమే విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్ తిరుపతి అలిపిరిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి సుమారు 82 కంప్యూటర్లను, సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించింది. టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు క్షుణ్నంగా విచారణ కొనసాగుతోంది. కంప్యూటర్ల సెక్యూరిటీ ఆడిట్.. అశ్లీల వీడియోను మెయిల్ చేసిన అటెండర్ను విధుల నుంచి తొలగించినట్లు ఎస్వీబీసీ సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో భాగంగా ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ ఆడిట్ చేసినట్లు చెప్పారు. ముగ్గురు నలుగురు సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సైబర్ సెల్ టీం విచారణలో ప్రాథమికంగా తేలిందని, పూర్తి వివరాలు పరిశీలించాక విధుల నుంచి తప్పించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక టీటీడీ పర్యవేక్షణలో.. ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ విభాగాన్ని టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు సీఈవో ప్రకటించారు. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్కు పాస్వర్డ్ ఏర్పాటు చేసి ఎవరు వినియోగిస్తున్నారో నమోదు చేస్తామన్నారు. ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోకి తెస్తామని చెప్పారు. -
దర్మ ప్రచార కార్యక్రమాలపై టీటీడీ చైర్మన్ సమీక్ష
తిరుమల: హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మ ప్రచార కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు పలు సూచనలు చేశారు. జిల్లా ధర్మ ప్రచార మండలి పేరుతో ఆసక్తి గల భక్తులను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. శారద పీఠాధిపతిని కలిసిన వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్.జవహర్రెడ్డి, ఏఈవో ఏవీ ధర్మారెడ్డిలు శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. గోగర్భం సమీపంలోని శారద పీఠానికి చేరుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. నేడు డయల్ యువర్ ఈవో: తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు జరుగనుంది. భక్తులు 0877–2263261 నెంబర్కు ఫోన్ చేసి సందేహాలు, సూచనలను టీటీడీ ఈవో కేఎస్ జవహర్రెడ్డికి నేరుగా తెలుపవచ్చు. -
లోక కళ్యాణార్థం టీటీడీలో అఖండ పారాయణం
సాక్షి, తిరుపతి : లోక కళ్యాణార్థం 180 రోజులుగా టీటీడీ అఖండ పారాయణం నిర్వహిస్తుంది. శ్రీవారి ఆలయం ముందు ఉన్న నాదనీరాజన మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. భగవద్గీత, సుందరకాండ పారాయణం, వశిష్ట విరాట పర్వంలోని ముఖ్యమైన వాటిని మంత్రోశ్చరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ కేఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణార్ధం ఆరు నెలలుగా అఖండ పారాయణం నిర్వహిస్తున్నామని, ఈరోజు ఆరవ అఖండ పారాయణం 20 నుంచి 24 విభాగాల్లో 128 శ్లోకాలు అఖండ పారాయణం చేశారని తెలిపారు. ప్రపంచం ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 300మంది వేద పారయణ దారులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. (శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు) -
ముగిసిన షోడశదిన సుందరకాండ దీక్ష
సాక్షి, తిరుమల : లోక సంక్షేమం కోసం కరోనా వ్యాప్తిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపట్టిన షోడశదిన సుందరకాండ దీక్ష నేటితో ముగిసింది. తిరుమలలోని వసంత మండపంలో సెప్టెంబరు 29న ఈ దీక్ష ప్రారంభమైంది. "రాఘవో విజయం దద్యాన్మమ సీతా పతిఃప్రభుః " అనే మహామంత్రం ప్రకారం సుందరకాండలోని మొత్తం 68 సర్గల్లో గల 2,821 శ్లోకాలను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం చేసారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి ఒక గంట పాటు ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహించి,నేడు పూర్ణాహుతి నిర్వహించారు. నూతనంగా భాద్యతలు చేపట్టిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీక్షలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మహా సంకల్పంతో దీక్ష చేపట్టిన అదనపు ఈవో ధర్మారెడ్డిని అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు విరాళాలు అందించిన దాతలకు జవహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దేవదేవుని ఆశీస్సులతో కరోనా మహమ్మారి పూర్తిగా అంతం అవుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. (ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు) -
ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమలలో గత నెలలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే ఈ నెల 16 నుంచి 24 వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కోవిడ్ ఇంకా పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తుండటంతో దర్శనం టికెట్ల సంఖ్య పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు ఆయన శ్రీవారి ఆలయంలోని పలు ప్రాంతాలను, నూతనంగా నిర్మిస్తున్న పరకామణి భవనం పనులను పరిశీలించారు. -
కోవిడ్ నియంత్రణలో ఏపీ, తమిళనాడు భేష్
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు కనబర్చిన ప్రతిభ భారతదేశంలో చెప్పుకోదగ్గదని.. ఈ రాష్ట్రాలు ప్రతిస్పందించిన తీరు ఆమోఘమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో 10 వేల మంది కాంటాక్టు వ్యక్తుల వివరాలు సేకరించి పరిశోధన జరిపారు. ఇప్పటివరకూ జరిపిన అతిపెద్ద పరిశోధన, సర్వే ఇదేనని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దీనిపై సమగ్ర విశ్లేషణ జరపగా.. భారతదేశం లాంటి 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు అద్భుతంగా పనిచేశాయని, నియంత్రణలో తమదైన శైలిలో పోరాటం చేశాయని పేర్కొన్నారు. పరిశోధకులు ఏం తేల్చారంటే..: వైరస్ సంక్రమణ, వ్యాప్తిని ప్రజలకు తెలియజేయడంలో ఏపీ, తమిళనాడు బ్రహ్మాండంగా పనిచేశాయి. ప్రాథమిక సంరక్షణ, వైద్య బాధ్యతలు నిర్వర్తించడంలో అద్భుతంగా పనిచేశాయి. లక్షణాలున్న వారిని గుర్తించడానికి రోజువారీ 5 కిలోమీటర్ల దూరం ఇంటింటికీ వెళ్లి నమూనాలు సేకరించి మరీ వారికి వైద్యం అందించారు. లక్షలాది మంది పాజిటివ్ బాధితులను ముందస్తుగా గుర్తించి వ్యాధి సంక్రమణ ఎక్కువ కాకుండా చూడటంలో సఫలమయ్యారు. ప్రాథమిక కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు 5 నుంచి 14 రోజుల తర్వాత కూడా లక్షణాలను గుర్తించి.. వారికి వైద్య పరీక్షలు చేసి సంరక్షించారు. వైరస్ సంక్రమణ ఇలా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకడంలో ఎక్కువగా ఒకే వయసు వారు ఉన్నట్టు వెల్లడైంది. చిన్నారుల్లో కూడా అదే వయసు వారికి ఎక్కువగా వ్యాప్తి అయింది. కేసుల సారూప్యత, వయసుల వారీగా తేడాలు, సంక్రమణ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు వంటి వాటిని తక్కువ సమయంలో గుర్తించగలిగారు. 70 శాతం మంది పాజిటివ్ వ్యక్తుల నుంచి ఇతరులకు ఎలాంటి సంక్రమణ కాలేదు. 8 శాతం మంది పాజిటివ్ వ్యక్తులు 60 శాతం కొత్త అంటువ్యాధుల్ని కలిగి ఉన్నారు. మృతుల్లో పురుషులే ఎక్కువ రెండు రాష్ట్రాల్లో మృతుల్లో మహిళల కంటే పురుషులు 62 శాతం ఎక్కువగా ఉన్నారు. మరణించిన వారిలో 63 శాతం మందికి ఏదో ఒక అనారోగ్యం ఉందని తేలింది. మొత్తం మృతుల్లో 45 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారు. 36 శాతం మందిలో రెండు లేదా అంతకు మించిన జబ్బులున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో వైరస్ సోకి మృతి చెందిన వారి కంటే జూలైలో మృతి చెందిన వారు 26 శాతం తక్కువ. మృతుల్లో 85 సంవత్సరాల వయసు వారు 16.6 శాతం ఉన్నారు. భారత్లో లాక్డౌన్ వల్ల ఒకరి నుంచి మరొకరికి సంక్రమణ వేగం బాగా తగ్గింది టెస్టింగ్.. ట్రేసింగ్ వ్యూహంతోనే.. మన రాష్ట్రంలో టెస్టింగ్, ట్రేసింగ్ వ్యూహాన్ని అనుసరించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కువ టెస్టులు చేయండని మొదటి నుంచీ చెబుతూ వచ్చారు. అవే ఆదేశాలు పాటిస్తున్నాం. ఇప్పటికీ 70 వేలకు తగ్గకుండా పరీక్షలు చేస్తున్నాం. కేసులు ఎక్కువ నమోదు కావచ్చు గానీ.. మరణాల్ని నియంత్రించగలిగాం. రోజువారీ మరణాల సంఖ్యను 90 నుంచి 40కి తగ్గించగలిగాం. ఏపీ వ్యూహాలే ఇప్పుడు చాలా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. మనకున్న వైద్యులు, వైద్య సిబ్బంది బాగా పని చేశారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు పెంచుకోవడం మంచి ఫలితాలిచ్చింది. – డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వైద్య, ఆరోగ్య శాఖ -
కేసులు తగ్గుముఖం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. భౌతిక దూరం పాటించడం, మాస్కు ధారణే నియంత్రణ మార్గమన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మించి వసూలు చేసే ప్రయివేటు ఆస్పత్రుల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అధికంగా వసూలు చేస్తున్నాయంటూ పత్రికలు రాస్తున్నాయని, అయితే ఆ ఆస్పత్రుల పేర్లు కూడా రాస్తే బావుంటుందన్నారు. పేర్లు రాయకపోయినా మా దృష్టికి తెచ్చినా విచారణ జరుపుతామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 12 వరకూ నమోదైన కేసులతో పోల్చుకుంటే, సెప్టెంబర్ 13 నుంచి 26 వరకూ నమోదైన కేసుల్లో 23.75శాతం తగ్గుదల ఉంది. ► గతంలో రోజుకు 91 మరణాలుంటే ఇప్పుడా సంఖ్య 50 లోపే.. ప్రస్తుతం పట్టణాల్లో 40 శాతం, గ్రామాల్లో 60 శాతం కేసులు నమోదవుతున్నాయి. ► ప్రస్తుతం రోజుకు 70 వేలకు పైగా పరీక్షలు జరుగుతున్నాయి. వాటిలో ఆర్టీపీసీఆర్ టెస్టులు 35 వేలు చేస్తున్నాం. ఈ సంఖ్యను 50 వేలకు పెంచనున్నాం. దీనికి సంబంధించి పరికరాల కొనుగోలుకు టెండర్లు పూర్తయ్యాయి. ► రాష్ట్రంలో కేసుల రెట్టింపు గడువు బాగా పెరిగింది. దీంతో పాటు ఒక పాజిటివ్ వ్యక్తి వైరస్ వ్యాప్తి ఒకరి కంటే తక్కువే ఉంది. ► రాష్ట్రంలో 240 ఆస్పత్రుల్లో 53 వేల పడకలు సిద్ధం చేసి సేవలందిస్తున్నాం. దేశంలోనే ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఏపీలో 28 వేల ఆక్సిజన్ పడకలు తయారు చేశాం. ► కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత ఏపీదే. ► లక్షణాలున్నవారందరికీ పరీక్షలు చేయాలని చెప్పాం. 104కి కాల్ చేసినా వచ్చి పరీక్షలు చేస్తారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారికి మందులివ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించాం. -
ఇంటి వద్దే ఉచితంగా వైద్యం
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పౌరుల ఆరోగ్య వివరాలను సేకరించి ఇంటి వద్దే ఉచితంగా వైద్యం అందించే సదుపాయం దేశంలో తొలిసారిగా ఏపీలో మొదలు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఏఎన్ఎంలు సోమవారం నుంచి 1.48 కోట్ల కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి సుమారు 5.34 కోట్ల మంది ప్రజల వివరాలను నమోదు చేయనున్నారు. ప్రమాదకరంగా పరిగణించే ఏడు రకాల జబ్బులను గుర్తించడంతోపాటు వైద్య సదుపాయం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా డేటాను నమోదు చేస్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరోగ్య రంగాన్ని సంస్కరించి ప్రజల ఆరోగ్య వివరాలన్నీ క్యూఆర్ కోడ్తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నెలలో పూర్తయ్యేలా ప్రణాళిక.. ► ఒక్కో ఏఎన్ఎంకు 500 నుంచి 800 ఇళ్ల వరకు కేటాయించారు. ► రోజుకు 25 నుంచి 30 ఇళ్లలో స్క్రీనింగ్ చేపట్టి నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏఎన్ఎంలకు 40వేల మంది ఆశా కార్యకర్తలు సాయం అందిస్తారు. ► స్క్రీనింగ్ ద్వారా సేకరించే ఆరోగ్య వివరాలు ఎన్సీడీ అండ్ ఏఎంబీ యాప్లో నమోదవుతాయి. అక్కడ నుంచి సెంట్రల్ పోర్టల్కు అనుసంధానం అవుతాయి. నాలుగు కేటగిరీలు... ► స్క్రీనింగ్ పరీక్షల కోసం ప్రజలను నాలుగు విభాగాలుగా విభజించారు. ► ఆరేళ్ల లోపు చిన్నారులు, 6 – 20 ఏళ్ల లోపువారు, 20 – 60 ఏళ్ల వయసు లోపు వారు, 60 ఏళ్లు దాటిన వారు అనే విభాగాలుగా వర్గీకరించి ఆరోగ్య వివరాల సేకరణకు 9 నుంచి 53 ప్రశ్నలు రూపొందించారు. రెండో దశలో ట్రీట్మెంట్ ► తొలుత 5.34 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని స్క్రీనింగ్చేసి ఎవరికి ఎలాంటి జబ్బులు, లక్షణాలున్నాయో గుర్తిస్తారు. ఎలాంటి చికిత్స అవసరమో సూచిస్తారు. పెద్ద జబ్బులైతే నేరుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు పంపిస్తారు. ఏఎన్ఎంలు సేకరించే హెల్త్ డేటాను ఆరోగ్యశ్రీ కార్డుల్లో నిక్షిప్తం చేసి పౌరుల ఆరోగ్య వివరాలను భద్రపరుస్తారు. సత్వరమే మెరుగైన వైద్యం అందేలా ఇది ఉపకరిస్తుంది. వీటిపై ప్రధాన దృష్టి ► ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రధానంగా ఏడు రకాల జబ్బులను గుర్తించి పరీక్షలు నిర్వహించి వైద్య సదుపాయం అందేలా చర్యలు చేపడతారు. ► మధుమేహం ► హైపర్ టెన్షన్ ► లెప్రసీ (కుష్టువ్యాధి) లక్షణాలు ► క్షయ ప్రాథమిక లక్షణాలు ► నోరు, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లు లాంటివి ► చిన్నారులు, మహిళల్లో రక్తహీనత ► చిన్నారుల్లో వినికిడి లోపం, ఇతరత్రా పుట్టుకతో వచ్చే జబ్బులను గుర్తించి చికిత్స అందేలా చర్యలు. సామాన్యులకు మరింత చేరువలో వైద్యం ‘చాలామందికి జీవనశైలి జబ్బులు ఉన్నట్లు కూడా తెలియదు. అలాంటి వారందరి కోసం ఇంటివద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహించి వైద్యం అందించే కార్యక్రమం దేశంలో మొదటి సారి మన రాష్ట్రంలోనే మొదలవుతోంది. ఇది సామాన్యులకు వైద్యాన్ని మరింత చేరువ చేస్తుంది’ – డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ -
కోవిడ్కు కళ్లెం!
సాక్షి, అమరావతి: ఎయిర్పోర్టుల్లోనే ఆగాల్సింది... స్క్రీనింగ్ లోపాలతో దేశంలోకి చొరబడేసింది. పారాసెటమాల్ మాత్రలు వాడి కొందరు స్క్రీనింగ్ కళ్లుగప్పి దేశంలోకి వైరస్ను తెచ్చేశారు. అప్పుడు మొదలైంది రాష్ట్రంలో ‘టీటీటీ’.. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్. వలంటీర్ల వ్యవస్థను వినియోగించుంటూ కోవిడ్ కట్టడికి ఆరంభంలోనే చర్యలు ప్రారంభమయ్యాయి. ఇదంతా కొలిక్కి వస్తున్న దశలో ఢిల్లీ వెళ్లి వచ్చిన మర్కజ్ యాత్రికులకు కొందరు విదేశీయుల ద్వారా వైరస్ సోకడం.. దేశ రాజధాని నుంచి పలు రాష్ట్రాలకు కోవిడ్ వ్యాప్తి మొదలైంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ టెస్టింగ్ సామర్థ్యం, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. దాపరికం లేకుండా వివరాలను వెల్లడించింది. విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న వారిని అక్కున చేర్చుకుంటూనే వైరస్ నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేయడం సత్ఫలితాలనిస్తోంది. మంగళవారం ఉదయం వరకు ఏపీలో 47,31,866 టెస్టులు చేయగా ప్రతి పది లక్షల జనాభాకు 88,612 పరీక్షలతో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. కరోనా మొదలైన తొలి రోజుల్లోనే దీనికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకుంటూ జీవనాన్ని సాగిద్దామని, వ్యాక్సిన్ వచ్చే వరకు సహజీవనం చేయక తప్పని పరిస్థితి నెలకొందన్న సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో ఇప్పుడు అంతా ఏకీభవిస్తున్నారు. ఒకే ఒక్కటి నుంచి... ► రాష్ట్రంలో కరోనా తొలి కేసు వెలుగులోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతుండగా అప్పుడు కనీసం వైరస్ను నిర్థారించే సామర్థ్యం కూడా మనకు లేదు. తిరుపతిలో నమూనాల సేకరణకు మాత్రమే వీలుంది. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు 14 వైరాలజీ ల్యాబొరేటరీలు, 240కి పైగా ట్రూనాట్ మెషీన్లు, ఐదు ప్రైవేటు ల్యాబ్లతో అనూహ్యంగా సామర్థ్యాన్ని పెంచగలిగారు. ► ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతను పరిష్కరిస్తూ ఒక్క నిర్ణయంతో 12 వేల మంది సిబ్బంది నియామకాలకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు.రాష్ట్రంలో సగటున నేడు రోజుకు 70 వేల టెస్టులు నిర్వహిస్తుండటం గమనార్హం. అంతా పారదర్శకంగా.. ► కరోనా కలకలం మొదలైన తొలి రోజుల్లోనే ‘పారదర్శకంగా పనిచేద్దాం.ప్రజలకు సేవలందిద్దాం’ అని సీఎం జగన్ సూచించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం దీన్ని తు.చ. తప్పకుండా పాటిస్తోంది. ఐసీఎంఆర్ పోర్టర్లో వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. ఒక్క ఫోన్కాల్తో... ► వైద్యసేవల కోసం ఎలాంటి సిఫారసులతో పనిలేకుండా 104 కాల్సెంటర్కు ఫోన్ చేస్తే చాలు పడకల నుంచి వైద్యం వరకు అన్నీ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► 14410, 108లతో పాటు పలు యాప్లు అందుబాటులోకి తెచ్చింది. రోగులకు సేవల్లో జాప్యం లేకుండా చెంతనే కాలింగ్ బెల్స్, హెల్ప్ డెస్క్లు ఏర్పాటయ్యాయి. ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ ఐవీఆర్ఎస్ ద్వారా రోగులకే నేరుగా ఫోన్ చేసి సదుపాయాల గురించి వాకబు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కావడం గమనార్హం. ఆరోగ్యశ్రీలో చేర్చిన తొలి రాష్ట్రం.. ► దేశంలో ఆంధ్రప్రదేశ్ మినహా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇప్పటిదాకా కోవిడ్ను ఆరోగ్యశ్రీలోకి చేర్చలేదు. కార్డు లేనివారికి సైతం ఉచితంగా వైద్యం అందేలా ఆరోగ్యశ్రీలో చేర్చారు. కరోనా చికిత్సకు రూ.18 వేల నుంచి రూ.2.60 లక్షల వరకూ ధరలు నిర్ణయించి ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఏ ఆస్పత్రిలోనైనా ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించిన ఏకైక రాష్ట్రం ఏపీ. ► రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 5.83 లక్షలు దాటింది. ఎక్కువ టెస్టులు చేయడం ద్వారా వైరస్ కట్టడి దిశగా ప్రభుత్వం రూపొందించిన వ్యూహం ఫలించింది. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో మరణాల రేటు 0.86 % మాత్రంగానే ఉంది. చివరి నిమిషంలో ఆస్పత్రికి రావడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని మరణాలు నమోదు కాగా వారిని కాపాడేందుకు అధికార యంత్రాంగం, వైద్య సిబ్బంది చివరివరకు శ్రమించారు. క్రిటికల్ కేర్పై ప్రత్యేక దృష్టి.. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని అనుసరించాం. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా కాకుండా క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాం. మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగాం. – డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, స్పెషల్చీఫ్ సెక్రటరీ పారదర్శకంగా వివరాలు.. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు చేపట్టిన ఏ పనిలోనూ చిన్న దాపరికం కూడా లేదు. టెస్టుల నుంచి మృతుల వరకూ అన్ని లెక్కలు పక్కాగా వెల్లడిస్తున్నాం. పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
నాలుగు వైద్య కళాశాలలకు రూ.2,050 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక కొత్త వైద్య కళాశాల నిర్మించ తలపెట్టిన సర్కారు.. తాజాగా నాలుగు వైద్య కళాశాలలకు రూ.2,050 కోట్ల మేర పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కేఎస్ జవహర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. మచిలీపట్నం, పిడుగురాళ్ల, పులివెందుల, పాడేరు కళాశాలలకు ఈ నిధులు మంజూరు చేశారు. ఇవికాక.. అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల స్థలాల నిమిత్తం ఒక్కో కాలేజీకి రూ.104.17 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులిచ్చింది. ఇప్పటికే ఈ కళాశాలల డిజైన్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన పనులకు కన్సల్టెంట్లనూ నియమించారు. మూడేళ్లలో మొత్తం 16 వైద్య కళాశాలలను పూర్తిచేయాలన్నది సర్కారు లక్ష్యం. వైద్యవిద్యలో అతిపెద్ద ప్రాజెక్టు రాష్ట్రంలో వైద్యవిద్యకు సంబంధించి ఇది అతిపెద్ద ప్రాజెక్టు. స్పెషాలిటీ వైద్యానికి పెద్దఎత్తున అవకాశం ఏర్పడుతుంది. వేలాది మందికి వైద్యవిద్య.. లక్షలాది మందికి మెరుగైన వైద్యం అందుతుంది. ఈ కాలేజీలన్నింటినీ సకాలంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ వైద్య వ్యవస్థ బలోపేతానికి ఇది మంచి పునాది. – డా. కేఎస్ జవహర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ.. వైద్య, ఆరోగ్యశాఖ ఏ కళాశాలకు ఎంత కేటాయించారంటే.. ► కృష్ణాజిల్లా మచిలీపట్నం కాలేజీకి రూ.550 కోట్లకు అనుమతులిచ్చారు. ప్రస్తుతం ఇక్కడ జిల్లా ఆస్పత్రి కొనసాగుతోంది. ఈ కళాశాలకయ్యే ఖర్చును 60–40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇప్పటికే ఈ కళాశాలకు 150 ఎంబీబీఎస్ సీట్లకు సర్కారు ఎసెన్షియాలిటీ ఇచ్చింది. ► గుంటూరు జిల్లా పిడుగురాళ్ల కళాశాలకు రూ.500 కోట్లకు అనుమతులిచ్చారు. దీనికి కూడా కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వ్యయంచేస్తాయి. ఈ కళాశాలకు కూడా 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎసెన్షియాలిటీ ఇచ్చారు. ► కడప జిల్లా పులివెందులలో ఏర్పాటుచేసే వైద్య కళాశాలకు రూ.500 కోట్లకు అనుమతిచ్చారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎసెన్షియాలిటీ ఇచ్చారు. ► విశాఖ జిల్లా పాడేరు కళాశాలకు రూ.500 కోట్లకు అనుమతిచ్చారు. ఈ కళాశాలకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వ్యయం చేస్తాయి. దీనికి 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎసెన్షియాలిటీ ఇచ్చారు. ► ఇక స్థలాల కోసం ఒక్కో కాలేజీకి కేటాయించిన రూ.104.17 కోట్లకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని వైద్యవిద్యా సంచాలకులను డా.కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. -
జాప్యం లేని చికిత్స
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో భారీ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ పేషెంటు రావడం, ఆస్పత్రిలో చేర్చుకోవడం, వసతులు లేకపోతే మరో ఆస్పత్రికి వెళ్లండని చెప్పడం జరిగేవి. కానీ, ఇప్పుడిక అలా కుదరదు. కొత్త విధానం ప్రకారం.. వివిధ స్థాయిల్లోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ బాధ్యతతో కూడిన చికిత్సలు, చేరికలు ఉండాలని.. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అన్ని ఆస్పత్రులూ అనుసంధానమై ఉండాలని అధికారులు నిర్ణయించారు. పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, బోధనాసుపత్రి ఇలా అన్ని స్థాయిల్లోని ఆస్పత్రులు సమాచార లోపం లేకుండా పనిచేయాలి. త్వరలోనే ఈ సంస్కరణలను అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కేఎస్ జవహర్రెడ్డి అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు. సంస్కరణల్లో ప్రధానాంశాలు.. – ఒక ఆస్పత్రి నుంచి నుంచి మరో ఆస్పత్రికి రోగిని అనవసరంగా పంపించకూడదు. మౌఖిక ఆదేశాలు కుదరవు. విధిగా కారణాలు రాయాలి. పీహెచ్సీలో ఎక్స్రే ఉన్నప్పుడు అదే ఎక్స్రేకు మరో ఆస్పత్రికి పంపించకూడదు. – స్పెషలిస్టు డాక్టరు వద్దకు లేదా పెద్దాసుపత్రులకు పంపించేటప్పుడు ఫోన్ ద్వారా వారికి వివరాలన్నీ చెప్పి పేషెంటును పంపించాలి. – రోగి ఉన్నతాసుపత్రికి వెళ్లిన వెంటనే చేర్చుకుని వైద్యం అందించాలి. అక్కడికెళ్లాక రోగులు కారిడార్లలో వేచి ఉండే పరిస్థితి ఉండకూడదు. – గోల్డెన్ అవర్లో రోగి ప్రాణాలు కాపాడేందుకు యత్నించాలి. పీహెచ్సీ స్థాయిలో ఇలా.. – రోగిని చేర్చుకునే సమయంలో అన్ని రకాల వివరాలు నమోదు చేయాలి. రోగికి సంబంధించి మెడికల్ ఆఫీసర్/నర్సుదే ప్రాథమిక బాధ్యత. – ప్రాథమిక దశలో అన్నిరకాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. తక్షణమే ప్రాథమిక వైద్యం అందించాలి. – రోగికి పీహెచ్సీ స్థాయిలో వైద్యంలేదని నిర్ధారించుకున్నాకే సీహెచ్సీ లేదా ఏరియా ఆస్పత్రికి 104లో పంపించాలి. సీహెచ్సీ/ఏరియా/జిల్లా ఆస్పత్రి/బోధనాసుపత్రుల్లో ఇలా.. – కిందిస్థాయి ఆస్పత్రుల నుంచి వచ్చిన పేషెంట్లను 10 నిమిషాల్లో చేర్చుకోవాలి. – రోగి పరిస్థితిని బట్టి ప్రొటోకాల్ ట్రీట్మెంటు పాటించాలి. – పెద్దాసుపత్రికి పంపించేటప్పుడు రోగి పరిస్థితిని స్పెషలిస్టు డాక్టరుకు పూర్తిగా వివరించాలి. – పైస్థాయి ఆస్పత్రుల వైద్యం అవసరమైనప్పుడు కిందిస్థాయి ఆస్పత్రుల్లో 10 నిమిషాల్లో డిశ్చార్జి ప్రక్రియ పూర్తిచేయాలి. – బోధనాసుపత్రుల్లోనూ వైద్యం లేకపోతే అప్పుడు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోని నెట్వర్క్ ఆస్పత్రులకు పంపించాలి. రెఫరల్ విధానం పారదర్శకంగా ఉండాలి – రోగులను ఇతర ఆస్పత్రులకు పంపించేటప్పుడు కనీస కారణాలు చూపించాలి. – దీనికి పీహెచ్సీ లెవెల్లో మెడికల్ ఆఫీసర్.. ఇతర ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్లు బాధ్యత వహించాలి. – మనం ఏ ఆస్పత్రికి అయితే రెఫర్ చేస్తున్నామో అక్కడ వైద్యానికి వసతులు ఉన్నాయో లేదో తెలుసుకున్నాకే పంపించాలి. -
సామాన్యుడికి వైద్యమే లక్ష్యం
సాక్షి, అమరావతి: ‘సిఫార్సు చేయడానికి అందరికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండరు.. ఇది కాదు కావాల్సింది.. ప్రతి సామాన్యుడికి వైద్యం అవసరం అనగానే సేవలు అందించేలా వ్యవస్థను తయారుచేయండని సీఎం వైఎస్ జగన్ కరోనా వచ్చిన మొదట్లోనే చెప్పారు. అదే అమలుచేస్తున్నాం. ఒకరిద్దరు సిఫార్సులకు వెళ్లి ఉండొచ్చు. కానీ, 104కు కాల్చేసినా, 14410కు కాల్ చేసినా వెంటనే స్పందిస్తున్నారు. వీళ్లందరూ సామాన్యులే కదా. ప్రతి జిల్లాలోనూ వారికి అందుబాటులో వైద్యం ఉంది. పడకలకు ఎక్కడా ఢోకాలేదు.. సిఫార్సుల అవసరమూలేదు. పడకల సంఖ్యను కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూపిస్తున్నాం. 108కు కాల్ చేసినా వెంటనే కాల్ డైవర్ట్ చేసి 104కు ఇస్తున్నారు’.. అని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. కేఎస్ జవహర్రెడ్డి స్పష్టంచేశారు. ఎన్ని ఆస్పత్రులు ఉన్నాయి.. ఎక్కడ ఎన్ని పడకలున్నాయి.. అన్న సమాచారాన్ని ప్రత్యేక యాప్ల ద్వారా అందిస్తున్నామని మంగళవారం ఆయన మీడియాతో చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కంటైన్మెంట్ జోన్లలోనే 96 శాతం కేసులు ► ఆగస్టు 23–29 మధ్య 72,592 కేసులు నమోదైతే పట్టణాల్లో 44 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 56 శాతం ఉన్నాయి. ► అనంతపురం, గుంటూరు, కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉచ్ఛస్థితిలో వైరస్ ఉంది. పశ్చిమ గోదావరి, తూర్పులో కూడా తీవ్రత తగ్గింది. క్లినికల్ మేనేజ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాం. మరణాల రేటును బాగా నియంత్రించగలిగాం. చాలా రాష్ట్రాల్లో మరణాల రేటు ఎక్కువ. మన రాష్ట్రంలో 1 శాతం కంటే తక్కువే ఉంది. 96 శాతం కేసులు కంటైన్మెంట్ క్లస్టర్లలోనే వస్తున్నాయి.రాష్ట్రంలో కేసుల డబ్లింగ్ రేటు 30 రోజులకు పైనే పడుతోంది. ► గడిచిన వారం రోజుల్లో 597 మరణాలు సంభవిస్తే.. అవి పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాల్లో సమానంగా ఉన్నాయి. మొదటి రెండు వారాల్లో కంటే తర్వాతి రెండు వారాల్లో మరణాలు తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 221 ఆస్పత్రులకుగాను 204 ఆస్పత్రుల్లో పేషెంట్లు ఉన్నారు. ► 212 ఆస్పత్రుల్లో డిస్ప్లే బోర్డులు, హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. ► ఇప్పటివరకూ 14,916 ఫోన్కాల్స్ 104కు వచ్చాయి. వీటిలో 14,399 పరిష్కారం కాగా, 221 హెల్ప్ డెస్కులో ఉన్నాయి. ► లక్షణాలున్నప్పుడు 104కు కాల్చేస్తే టెస్టు ఎక్కడ చేయించుకోవాలో చెబుతారు..ఆ తర్వాత అడ్మిషన్ ఎక్కడ ఉందో చెబుతారు. ► ప్రతి ఆస్పత్రిలోనూ పడకలున్నాయి. ఎక్కడా ఇబ్బందిలేదు. సిబ్బంది మనోధైర్యం దెబ్బతీయొద్దు ► వైద్యులు, వైద్య సిబ్బంది కష్టపడి పనిచేస్తుంటే వారి మానసిక స్థైర్యం దెబ్బతీసేలా అనాలోచితంగా కథనాలు రాస్తున్నారు. ఎక్కడో ఒకరికి చికిత్స అందించలేదని రాస్తున్నారు.. 99 మందికి చికిత్స అందించింది కనిపించడం లేదా? ► ఇది హెచ్చరిక అనుకోండి, సూచన అనుకోండి.. ఆదేశాలు అనుకోండి. వైద్యసిబ్బంది మనోస్థైర్యం దెబ్బతీసేలా మాత్రం కథనాలు రాయొద్దని చెబుతున్నాం. ► ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ డబ్బులు వసూలుచేస్తే ఫిర్యాదు చేయండి.. దానిపై చర్యలు తీసుకుంటాం. కరోనా నియంత్రణకు మాస్కే కవచం గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కరోనా నియంత్రణకు మాస్కే కవచమని, దీనిపై పెద్దఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలను చేపట్టామని రాష్ట్ర వైద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. కోవిడ్ రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు జిల్లాల్లో నిర్వహిస్తున్న కోవిడ్ ఆసుపత్రులను, కోవిడ్ కేర్ సెంటర్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. తొలుత గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్దార్థ జిల్లా కోవిడ్ ఆసుపత్రిని కలెక్టర్ ఇంతియాజ్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ కాటంనేని భాస్కర్తో కలిసి సందర్శించారు. కొన్ని పత్రికల్లో బెడ్ వివరాలు తెలిపే బోర్డుల గురించి ఇతర అంశాలపై అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్నారని.. దానిని నివారించేందుకు మీడియా సమక్షంలో పర్యటన చేపట్టామన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని.. ప్రజలు కూడా విధిగా మాస్కులు ధరించాలన్నారు. అనంతరం పలువురు బాధితులతో ఫోన్లో మాట్లాడి వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీయగా.. వారు సంతృప్తి వ్యక్తంచేశారు. తర్వాత విజయవాడ ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. కోవిడ్ ఆసుపత్రిలో బెడ్ల వివరాలు తెలిపే డిజిటల్ బోర్డు ఏర్పాటుచేయాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. -
ఆ మూడు లక్షణాలున్నా ఆస్పత్రిలో చేరొచ్చు
వరుసగా మూడు లేదా నాలుగు రోజుల పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తగ్గిపోతే నేరుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందొచ్చు. ఇలాంటి లక్షణాలున్న వారికి పరీక్షలు లేకుండానే ఆస్పత్రిలో చేర్చుకునిచికిత్స ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించాం. సాక్షి, అమరావతి: కరోనా వైరస్కు సంబంధించిన మూడు ప్రధాన లక్షణాలుంటే నిర్ధారణ పరీక్షలు కూడా అవసరంలేదని, నేరుగా ఆస్పత్రికి వెళ్తే చేర్చుకుంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కేఎస్ జవహర్రెడ్డి అన్నారు. మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేయాల్సిన అన్ని చర్యలూ చేపట్టిందని.. ఇక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఎక్కువగా ఉన్నాయని శనివారం ఆయన మీడియాతో అన్నారు. జవహర్రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► అన్లాక్ తర్వాత పాజిటివిటీ రేటు పెరిగింది. ఇప్పుడు కేసులు కాదు మరణాల నియంత్రణే మనముందున్న కర్తవ్యం. ► ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఈ స్థాయికి రాబోతోంది. ప్రజలు రక్షణ చర్యలు విధిగా పాటించాలి. ► మరణాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కనీసం ఆరు రోజులు ఆస్పత్రిలో ఉండాలి. రెమ్డెసివిర్, తోసిజుమాంబ్ వంటి మందులు వాడాలి. సాధారణ, ఆక్సిజన్ బెడ్ మీద మరణాలు సంభవించకూడదని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. ► ఈనెల 12 వరకూ నాలుగు జిల్లాల్లో సీరో–సర్వైలెన్స్ జరుగుతోంది. దీన్నిబట్టి ఏపీలో యాంటీబాడీస్ స్థాయి ఎంత పెరిగాయి.. ఎంతమందికి వైరస్ వచ్చి పోయిందో తెలుస్తుంది. ► ఈ ఫలితాలను బట్టి తదుపరి వ్యూహం అమలుచేస్తాం. ► 104, 14410, జిల్లాల్లో ఉన్న కాల్సెంటర్ నంబర్లను ఉపయోగించుకోవాలి. -
ప్లాస్మా దాతలు ఏరీ!
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ బారినపడి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి ప్లాస్మా థెరపీ ఓ సంజీవని. కరోనాతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న యువకులు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకూ పదిమంది మాత్రమే ప్లాస్మా దానం చేశారు. అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు. ► కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి దాన్ని విషమ పరిస్థితిలో ఉన్నవారికి ఇవ్వడాన్ని ప్లాస్మా థెరపీ అంటారు. ► కరోనా నుంచి కోలుకున్న 28 రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీస్ బాగా వృద్ధి చెంది ఉంటాయి. కోలుకున్న వారు కేవలం 400 మిల్లీలీటర్ల రక్తాన్ని దానం చేస్తే చాలు. దీనిలో ప్లాస్మాతో క్లిష్ట పరిస్థితిలో ఉన్న వారిని బతికించవచ్చు. ► ప్లాస్మా ఇచ్చిన వారికి గానీ, తీసుకున్న వారికి గానీ ఎలాంటి ఇబ్బందులు రావు. ► జూలై 24 నాటికి రాష్ట్రంలో 39,935 వేల మంది కరోనా నుంచి కోలుకుంటే ఇందులో 70 శాతం మంది 40 ఏళ్లలోపు వారే. వీరిలో ఇప్పటివరకూ ప్లాస్మాను ఇచ్చింది కేవలం 10 మంది మాత్రమే. యువకులు ముందుకు రావాలి కరోనాతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న యువకులు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాలి. దీనిపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దు. తిరుపతిలోని స్విమ్స్, కర్నూలు జీజీహెచ్లో ప్లాస్మా సేకరణ ఉంది. విజయవాడ, గుంటూరులకు కూడా అనుమతి కోరాం. – డా.కె.ఎస్.జవహర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే ప్లాస్మా ఇస్తే ఏదో జరుగుతుందని అనుమానపడుతున్నారు. ఇది పూర్తి నిరాధారం. ప్రపంచం మొత్తం ఈ పద్ధతిని అనుసరిస్తోంది. ప్లాస్మా సేకరణ ఐసీఎంఆర్ నిబంధనల మేరకే జరుగుతుంది. కోలుకున్న యువకులు ముందుకు రావాలని కోరుతున్నాం. – డా.కె.ప్రభాకర్రెడ్డి, ప్రత్యేక అధికారి, కమాండ్ కంట్రోల్ సెంటర్ -
మాస్క్ ధరించడం తప్పనిసరి
సాక్షి, అమరావతి: ఇంటి నుంచి బయటకు వస్తే మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ, పనిచేసే ప్రదేశాలతో పాటు ప్రయాణాల సమయంలో మాస్క్ను తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోవిడ్–19 నియంత్రణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు మాస్క్ను ధరించడం అలవాటుగా మార్చుకునే విధంగా స్థానిక జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కోరారు. -
అందరికీ ఆరోగ్య సిరి
సాక్షి, అమరావతి: కాన్పు నుంచి కరోనా దాకా ఎలాంటి వైద్యమైనా ఉచితంగానే అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకుసంపూర్ణ ఆరోగ్య భరోసా కల్పిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ పెద్ద జబ్బులకు చికిత్సలు అందక ప్రైవేట్ ఆస్పత్రుల ఛీత్కారాలతో నరకం చవిచూసిన దుస్థితి నుంచి ఇప్పుడు భరోసాగా ఆరోగ్యశ్రీతో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఆరోగ్యశ్రీలో జబ్బుల సంఖ్య పెరిగింది, వార్షికాదాయ పరిమితీ పెరిగింది. అన్నిటికీ మించి శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో రోజుకు రూ.225 చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మాట ప్రకారం... ► పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి తొలుత పశ్చిమ గోదావరి, ఇప్పుడు ఈనెల 16 నుంచి మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో తాజాగా ఇది అమలులోకి రానుంది. 1,059 నుంచి 1,259 చికిత్సలకు... ► గత సర్కారు హయాంలో ఆరోగ్యశ్రీలో 1,059 చికిత్సలు ఉండగా అది కూడా సరిగా వైద్యం అందేది కాదు. దీంతో చికిత్స ఖర్చు రోగి కుటుంబమే భరించాలి.. లేదంటే చావే శరణ్యం. ఇలాంటి దుస్థితిని తప్పిస్తూ ఇప్పుడు 1,259 చికిత్సలకు పెంచి భరోసా కల్పిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం... ► రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల్లో 716 సూపర్ స్పెషాలిటీ చికిత్సలు పొందే వీలు కల్పించింది. ఈ ఏడాది మే 30 నాటికి 3,577 మంది రోగులు ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.18.80 కోట్లు వ్యయంచేసింది. వార్షికాదాయ పరిమితి రూ.5 లక్షలకు పెంపు.. ► తెల్లకార్డు ఉన్నా లేకపోయినా రూ.5 లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ పథకం వర్తింపచేయడంతో 95 శాతం పైగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. ► గత ప్రభుత్వం ఆస్పత్రులకు బకాయి పెట్టిన సుమారు రూ.650 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించింది. దీర్ఘకాలిక జబ్బుల బాధితులకు పెన్షన్ ► దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారిని ఆదుకునేందుకు ప్రతి నెలా జబ్బును బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ► ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే అందరికీ క్యూ ఆర్ కోడ్తో హెల్త్ కార్డులు(క్విక్ రెస్పాన్స్ కార్డులు) జారీ ఇప్పటికే Æరాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. కోవిడ్కూ ఆరోగ్యశ్రీలో చికిత్స.. ► కోవిడ్ చికిత్సను తొలిసారిగా ఆరోగ్యశ్రీలో చేర్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. కనిష్టంగా రూ.16 వేల నుంచి రూ.2 లక్షల పైచిలుకు వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీకార్డుతో పనిలేకుండా ఎవరైనా ఉచితంగా చికిత్స పొందవచ్చు. చికిత్స ఖర్చులు తలచుకుని ఏ ఒక్కరూ భయపడకూడదనే లక్ష్యంతో వైద్యానికి ఎంత వ్యయమైనా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందేవిధంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో అమలుచేస్తున్న ఈ వినూత్న పథకం వల్ల జబ్బు చేస్తే భయపడే పరిస్థితులుతొలగిపోయాయి’ –డా.కె.ఎస్.జవహర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ -
తెలంగాణ, కర్నాటకల నుంచి వచ్చే వారికి పరీక్షలు తప్పనిసరి
సాక్షి, అమరావతి: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారికి సరిహద్దుల వద్ద స్వాబ్ టెస్ట్లు తప్పనిసరి చేసి, క్వారంటైన్కు తరలించనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి క్వారంటైన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను గతంలో రిస్క్ ప్రాంతాలుగా ప్రకటించింది. కాగా ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో కేసులు తీవ్రస్థాయికి చేరుకోవడంతో వాటిని హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించింది. ► విదేశాల నుంచి వచ్చే వారికి ఏడురోజుల క్వారంటైన్ తప్పనిసరి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారికి గతంలో ఉన్న 14 రోజుల క్వారంటైన్ విధానాన్ని 7 రోజులకు తగ్గింçపు. ► విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్లో ఉన్న వారికి 5వ రోజు, 7వ రోజు కోవిడ్ టెస్టులు చేయాలి. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్గా పరీక్షలు. 10శాతం మందిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తారు. ► విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టుల నిర్వహణ. వారందరికీ 14 రోజుల క్వారంటైన్. రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్గా పరీక్షలు. 14రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి. ► రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి వచ్చే వారికి సరిహద్దుల వద్దే స్వాబ్ టెస్టులు. తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి 14 రోజుల హోం క్వారంటైన్. రాష్ట్రానికి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా ఇ–పాస్ తీసుకున్న వారికే అనుమతి. ► సరిహద్దుల వద్ద పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వస్తే కోవిడ్ ఆసుపత్రులకు తరలింపు. హోం క్వారంటైన్లో ఉండే వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్ఎం, గ్రామ/ వార్డు వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. -
ప్రాథమిక ఆరోగ్యానికి సర్కారు భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా వైద్య రంగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. టెలీ మెడిసిన్నుప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానించాలని తాజాగా నిర్ణయించింది. ఇలాంటి విధానం దేశంలో ఎక్కడా లేదు. ఫోన్ చేస్తే చాలు సమస్యలు వినడం, వాటిని పరిష్కరించడం, మందులు అవసరమైతే ఇంటికే పంపించడం చకచకా జరిగిపోతున్నాయి. బయటకు వెళ్ల లేని చాలా మంది టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సలహాలు, సూచ నలు పొందుతున్నారు. ఇంటి వద్దకే వచ్చి మందులు ఇచ్చిపోతుంటే ఆనం దం పొందుతున్నారు. ఇప్పటి వరకు 31 వేల పైచిలుకు మంది టెలీ మెడిసిన్ 14410 నంబర్కు ఫోన్ చేసి వైద్యుల సూచనలు, సలహాలు పొందారు. టెలీ మెడిసిన్తో వెయ్యి పీహెచ్సీల అనుసంధానం ► ఉచితంగా వైద్యం అందించే ఆసుపత్రులు గ్రామీణ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయా? వాటిలో 24 గంటలూ వైద్య సేవలందుతాయా? వైద్యులు, నర్సులు ఎప్పుడూ అక్కడే ఉంటారా? ఇంటి ముంగిటకే డాక్టర్ వస్తారా? మందులు ఉచితంగా ఇస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ రాష్ట్రంలో ‘అవును’ అనే సమాధానం వస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరులో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. అప్పుడలా.. ఇప్పుడిలా.. ► గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక ఆరోగ్య రంగం పరిస్థితి దారుణంగా ఉండేది. డాక్టరు ఉంటాడో ఉండడో.. మందులు అందుబాటులో ఉన్నాయో లేదో.. చివరకు కట్టు కట్టడానికి బ్యాండేజ్ కూడా ఉండని పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారు. అవసరమైన మందులన్నీ ఉచితంగా ఇస్తారు. ప్రసవానికి వెళితే గైనకాలజిస్ట్ ఉండరన్న భయం లేదు. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు అవసరమైతే భరోసా ఇచ్చేలా బోధనాసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. ఫోన్ చేస్తే చాలు 108 వేగంగా రావడం మొదలైంది. రక్త పరీక్షల నుంచి వైద్య సేవల వరకూ ఇంటి ముంగిటకే వచ్చి పరీక్షించే 104 వాహనాలు పల్లెలకు తరలి వెళ్లాయి. వీటన్నింటికీ తోడు అపర సంజీవని ఆరోగ్యశ్రీ పెద్దన్నయ్యలా అండగా నిలబడింది. వెరసి పేద వాడికి ఎలాంటి జబ్బు చేసినా, అండగా మేమున్నాం అంటూ సర్కారు నిలబడిన తీరు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆరోగ్యాంధ్ర యాప్తో పీహెచ్సీల అనుసంధానం ► రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ ఆరోగ్యాంధ్ర యాప్తో అనుసంధానిస్తున్నారు. దీంతో రెస్పాన్స్ సిస్టంను ఏర్పాటు చేసి.. ఎవరైనా వైద్య సేవలు అందడం లేదని ఆరోగ్యాంధ్ర యాప్లో కామెంట్ పెడితే చాలు.. వెంటనే స్పందించి సదరు డాక్టర్ లేదా సిబ్బందికి సమాచారం వెళుతుంది. ► వారు వెంటనే సేవలు అందేలా చర్యలు తీసుకుంటారు. దీనికోసం ప్రత్యేకంగా ఐటీ సిబ్బంది పనిచేస్తున్నారు. ► పీహెచ్సీల్లో 217 రకాల మందులు అందుబాటులో ఉండాలనేది నిబంధన. కానీ గతంలో 100 రకాల మందులు కూడా అందుబాటులో ఉండేవి కావు. ► ఇప్పుడు అక్కడి అవసరాలు, జబ్బుల తీరును బట్టి, సీజన్లో వచ్చే వ్యాధులను బట్టి గరిష్టంగా 180 నుంచి 190 రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. 15 రకాల యాప్లతో సేవలు ► ఐటీ సేవలు మరింతగా బలోపేతమయ్యాయి. ప్రస్తుతం 15 యాప్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సేవలు అందిస్తున్నారు. ► గర్భిణులకు వైద్య పరీక్షలు, ప్రసవానికి సూచనలు సలహాలు, హైరిస్క్ ప్రెగ్నెన్సీ, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వంటివాటికి ఐటీ ఆధారిత యాప్ల ద్వారానే సేవలు అందిస్తున్నారు. నాడు–నేడుతో మహర్దశ నాడు–నేడు కార్యక్రమం కింద చేపట్టే పనులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. మొత్తం 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతీకరించనున్నారు. 2021 సెప్టెంబర్ లక్ష్యంగా పనులు పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు ► ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు ప్రతి గ్రామ, పట్టణాల్లోని ప్రతి వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తోంది. ► ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలకు 11 వేల మంది పైచిలుకు ఏఎన్ఎం (ఆగ్జిలరీ నర్స్ మిడ్వైఫరీ)లను నియమించింది. ► వీళ్లందరికీ త్వరలోనే యాప్లతో కూడిన ట్యాబ్లు ఇవ్వనున్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో తగినన్ని మందులు అందుబాటులో ఉంచి, తక్షణ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. ► ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11,197 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నారు. అందుకుగాను రూ.1,745 కోట్లు వ్యయం చేయనున్నారు. ► గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పణిదెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గతంలో 70 రకాల మందులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 170కి పెరిగింది. గతంలో రోజుకు 60 నుంచి 70 మంది మాత్రమే ఔట్ పేషెంట్లు వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 130 నుంచి 140కి పెరిగింది. పీహెచ్సీ లెవెల్లో కావాల్సినంత ఫర్నిచర్ వచ్చింది. కంప్యూటర్లు, రిఫ్రిజిరేటర్ను కూడా సమకూర్చారు. పేషంట్లు కూర్చోవడానికి వెయిటింగ్ హాల్ను బాగా తీర్చిదిద్దారు. డాక్టర్, ఫార్మసిస్ట్, ఇతర సిబ్బంది కొరత లేదు. ఇదొక్కటే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్సీలన్నీ ఇలా రూపు రేఖలు మారిపోయాయి. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ బలోపేతం జబ్బులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వైద్యం చేస్తే తీవ్రత తగ్గించవచ్చు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పీహెచ్సీల్లో అన్ని వసతులూ కల్పిస్తున్నాం. బహుశా ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు–నేడు కింద పనులు మొదలయ్యాయి. కొద్ది నెలల్లోనే దీని సేవలు అందుబాటులోకి వస్తాయి. –డా.కె.ఎస్.జవహర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ -
ఏపీ: 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
మొదటి లక్ష టెస్టులకు 59 రోజుల సమయం పడితే 10వ లక్ష టెస్టులు చేయడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పట్టింది. చివరి మూడు లక్షల టెస్టులు కేవలం 12 రోజుల్లో పూర్తి చేశారు. ఒక్కసారి ఈ వివరాలు పరిశీలిస్తే... ఆదివారం ఉదయం నాటికి నిర్వహించిన టెస్టుల సంఖ్య ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనాను కట్టడి చేయాలంటే వ్యక్తిగత శుభ్రతతోపాటు ఎక్కువ టెస్టులు నిర్వహించడం,పాజిటివ్ బాధితులను కంటైన్మెంట్ చేయడమే అత్యుత్తమ మార్గం. ఈ రెండు వ్యూహాలను విజయవంతంగా అమలు చేయడంతో ఏపీ పేరు అంతటా మారుమోగుతోంది. ఎక్కడ చూసినా ఏపీ మోడల్నే అనుసరించాలన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ప్రభావం మొదలయ్యే నాటికి రాష్ట్రంలో టెస్టింగ్కు సంబంధించిన వనరులే లేకున్నా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టింది. దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. ఆదివారం నాటికి ఆంధ్రప్రదేశ్లో 10.17 లక్షల పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 1.05 లక్షల పరీక్షలు జరిగాయి. సరిగ్గా 4 నెలల క్రితం రాష్ట్రంలో ఒక్క టెస్టు కూడా చేయలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా రోజూ 34 వేలకు పైగా పరీక్షలు చేసే సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ సాధించడం గమనార్హం. చాలా దేశాల సగటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో అధిక సంఖ్యలో టెస్టులు జరుగుతుండటం ప్రభుత్వ ముందుచూపు, జాగ్రత్త చర్యలను రుజువు చేస్తున్నాయి. అధికార యంత్రాంగం, వైద్య సిబ్బంది కృషి కారణంగా కరోనా నియంత్రణలో ఏపీ దేశంలోనే రోల్మోడల్గా నిలిచింది. – సాక్షి, అమరావతి రోజుకు సగటున 34,525 టెస్టులు ► రాష్ట్రంలో ప్రస్తుతం 14 వైరాలజీ ల్యాబొరేటరీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవికాకుండా 47 ట్రూనాట్ మెషీన్లు, సీబీనాట్, నాకో ల్యాబొరేటరీలు, క్లియా మెషీన్ల ద్వారా కూడా టెస్టులు చేస్తున్నారు. ► మొత్తం 78 ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. ► 47 ట్రూనాట్ మెషీన్ల ద్వారా రోజుకు 8,125 టెస్టులు చేయవచ్చు. ► 5 సీబీనాట్, 2 నాకో, 5 సీఎల్ఐఏ ల్యాబొరేటరీల్లో కూడా పరీక్షలు చేస్తున్నారు ► ఏపీలో మొత్తం అన్ని ల్యాబ్ల్లో కలిపి రోజుకు సగటున 34,525 టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉంది. పది లక్షల టెస్టులు 3 రాష్ట్రాల్లోనే ► దేశంలో ఇప్పటివరకూ 10 లక్షల కరోనా టెస్టులు నిర్వహించింది కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే కావడం గమనార్హం. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇందులో ఉన్నాయి. ► తమిళనాడులో 13.06 లక్షలు, మహారాష్ట్రలో 10.85 లక్షల టెస్టులు నిర్వహించారు. ► ఏపీలో ఇప్పటిదాకా 10.17 లక్షల టెస్టులు చేశారు. ► మిగతా రెండు రాష్ట్రాలు 10 లక్షల టెస్టులు నిర్వహించినా అవి రెండూ ఏపీ కంటే జనాభాలో పెద్ద రాష్ట్రాలు కావడం గమనార్హం. పైగా దేశంలో ఎక్కువ సంఖ్యలో కేసులు ఆ రెండు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ► తమిళనాడులో పాజిటివిటీ రేటు 8.19 శాతం, మహారాష్ట్రంలో 18.44 శాతం ఉండగా ఏపీలో కేవలం 1.84 శాతం మాత్రమే ఉంది. ఫిబ్రవరి 1న హైదరాబాద్కు తొలి నమూనా కరోనా మొదలైన ఆరంభంలో మన రాష్ట్రంలో వైరాలజీ ల్యాబొరేటరీ లేకపోవడంతో ఫిబ్రవరి 1న తొలి నమూనాను హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. మార్చి 6వతేదీ వరకు రాష్ట్రంలో ల్యాబొరేటరీలు లేవు. మార్చి 7న తిరుపతిలో మొదటిసారి వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా 14 ల్యాబ్లను ప్రారంభించారు. ఏ టెస్టు ఎలా చేస్తారంటే? రాష్ట్రంలో 5 రకాల పద్ధతుల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఏ ల్యాబ్లో ఎలా నిర్ధారణ చేస్తున్నారన్నది పరిశీలిస్తే... వైరాలజీ ల్యాబొరేటరీల్లో దీన్నే ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ మెథడ్ అంటారు. గొంతులో లేదా ముక్కులో నుంచి ద్రవాన్ని సేకరించి పరీక్షిస్తారు. దీన్ని రియల్ టైమ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ అంటారు. వైరస్ నిర్ధారణలో ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ పద్ధతిగా నమోదైంది. ట్రూనాట్.. సీబీనాట్.. నాకో ల్యాబొరేటరీల్లో ఈ మూడు ల్యాబొరేటరీల్లో గొంతులోంచి గానీ ముక్కులో నుంచి గానీ ద్రవాలను తీసి పరీక్ష చేస్తారు. వాస్తవానికి ట్రూనాట్ మెషీన్లను క్షయ నిర్ధారణకు ఉపయోగించేవారు. వీటిని కరోనా పరీక్షలకూ వాడుకోవచ్చని ఐసీఎంఆర్ అనుమతించింది. చిప్ సాయంతో ఫలితాలొస్తాయి. వీటి ఫలితాల కచ్చితత్వం 50 శాతమే ఉంటుంది. అందుకే ట్రూనాట్, సీబీనాట్, నాకో ల్యాబుల్లో పాజిటివ్ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్కు పంపిస్తారు. క్లియా మెషీన్లలో పైన పేర్కొన్న ల్యాబ్ల్లో ద్రవాలను తీసి పరీక్షిస్తే ఇక్కడ రక్త నమూనాలను తీసి నిర్ధారిస్తారు. ఇందులో కూడా కచ్చితత్వం 50 శాతమే. ఇక్కడ పాజిటివ్ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్ టెస్ట్కు పంపిస్తారు. 14 వైరాలజీ ల్యాబ్లు.. ఏపీలో మార్చి 6కి ముందు ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేదు. ఇప్పుడా సంఖ్య 14కు పెరిగింది. జిల్లాకొకటి చొప్పున 12 జిల్లాల్లో, చిత్తూరు జిల్లాలో 2 చొప్పున మొత్తం 14 వైరాలజీ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మంగళగిరి ఎయిమ్స్ ల్యాబ్తో కలిపితే వీటి సంఖ్య 15కు చేరుతుంది. ఇక ప్రైవేట్లో 4 ల్యాబ్లున్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే ఈ ల్యాబ్లు ఎప్పుడొచ్చాయి? రోజుకు ఎన్ని చేస్తున్నారో పరిశీలిస్తే... నోట్ : పూలింగ్ పద్ధతిలో ఒకేసారి ఎక్కువ పరీక్షలు జరిపే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సాధారణ కెపాసిటీలో 10 టెస్టులు చేయొచ్చనుకుంటే.. ఆ పది టెస్టులు నెగిటివ్ వస్తే సమయం వృధా అయినట్టే. అదే పూలింగ్ విధానంలో అయితే ఒకేసారి 50 టెస్టులను మిషన్లో పరీక్షించి పాజిటివ్ వస్తే తిరిగి నిర్ధారణ చేస్తారు. అదే 50 నమూనాలు నెగటివ్ అని తేలితే సమయం వృధా కాకుండా ఒకేసారి 50 మందికి టెస్టులు నిర్వహించినట్టవుతుంది. సీఎం ఆదేశాలతో ల్యాబ్లు పెంచాం రాష్ట్రంలో టెస్టులు పెంచి పాజిటివ్ బాధితులను కంటైన్మెంట్ చేయడం వల్లే కరోనాను మెరుగ్గా నియంత్రించగలిగాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైరాలజీ ల్యాబొరేటరీల సంఖ్య పెంచాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దస్థాయిలో ల్యాబొరేటరీలు పెంచలేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా నియంత్రణలో ఉంది. – డా.కె.ఎస్.జవహర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ పీహెచ్సీల్లోనూ నమూనాల సేకరణ రాష్ట్రంలో వైరాలజీ ల్యాబొరేటరీలు పెంచడం వల్లే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ టెస్టులు చేయగలుగుతున్నాం. అన్ని పీహెచ్సీలకూ కిట్లు పంపించాం. స్థాయిని బట్టి పీహెచ్సీల్లో నమూనాలు సేకరించి వైరాలజీ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. ఈ విధానం వల్లే ఎక్కువ టెస్టులు చేయగలిగాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
మృతదేహాల్లో 6 గంటల తర్వాత కరోనా ఉండదు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాధితో మరణించిన వారి మృతదేహాలలో 6 గంటల తర్వాత వైరస్ ఉండదని వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్రెడ్డి వెల్లడించారు. వైరస్తో మృతి చెందిన వారి దహన సంస్కారాలను అడ్డుకుని ఇబ్బందులు కలుగజేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ భవన ప్రాంగణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని కోరారు. జవహర్రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► మాస్కు ధరించడం, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం అనే మూడు సూత్రాలు పాటిస్తే కరోనా మన దరిచేరదు. ► రాష్ట్రంలో మార్చి 9న తొలి కరోనా కేసు నమోదైతే జూలై 3వ తేదీ నాటికి ఆ సంఖ్య 16,934కి చేరింది. ► రాష్ట్రంలో ఇప్పటివరకు 9,71,611 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. ప్రతి 10 లక్షల మందికి సగటున 18,195 పరీక్షలు చేశాం. ► పరీక్షలు నిర్వహించేందుకు మొదట్లో మనకు ఒక ల్యాబ్ కూడా ఉండేది కాదు. ప్రస్తుతం 15 ప్రభుత్వ, 4 ప్రైవేట్ కలిపి మొత్తం 19 ల్యాబ్లు పని చేస్తున్నాయి. ► పరీక్షా ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు ప్రభుత్వ ల్యాబ్లలో 47 ఆర్టీపీసీ యంత్రాలు ఉన్నాయి. ► కరోనా వైరస్తో 9,096 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో వ్యాధి తీవ్రత తక్కువ ఉన్న 600 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ► వెయ్యికి పైగా శాంపిల్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎక్కువగా.. వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ► కరోనా వ్యాప్తికి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయం చేసేందుకు వివిధ కేటగిరీలుగా విభజించి ర్యాండమ్గా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ► బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, నిర్మాణ రంగం, వ్యవసాయ కూలీలు, కూరగాయలు విక్రయించేవారు, పరిశ్రమల్లోని కార్మికులు, మార్కెట్ యార్డులు, ఆరోగ్య తదితర రంగాల్లో పని చేసేవారికి ర్యాండమ్గా పరీక్షలు చేయిస్తున్నాం. ► పండ్లు, కూరగాయలు అమ్మేవారి ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించాం. 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా మృతి చెందుతున్నారు. ► కరోనా వ్యాధి ముదిరిన తర్వాత చికిత్సకు ఎక్కువ మంది వస్తున్నారు. లక్షణాలు కన్పించిన వెంటనే దగ్గర్లోని డాక్టర్, పీహెచ్సీ, సీహెచ్సీలను లేదా ఆశా వర్కర్లు, వలంటీర్లను సంప్రదించాలి. ► ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెలీ మెడిసిన్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్చేసి సూచనలు పొందాలి. లాక్డౌన్ ఎత్తివేశాక కేసుల సంఖ్య పెరిగింది. ► డాక్టర్లపై భారాన్ని తగ్గించేందుకు 22 వేల మంది డాక్టర్లు, 24 వేల మంది పారా మెడికల్ తదితర సిబ్బందిని పెద్దఎత్తున నియమిస్తున్నాం. ► కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు త్వరలోనే కోవిడ్ చికిత్సలకు అనుమతి ఇస్తాం. అక్కడ వసూలు చేసే చార్జీలపై కూడా నియంత్రణ ఉంటుంది. -
4 వేలకు చేరువలో కోలుకున్నవారి సంఖ్య
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య నాలుగు వేలకు చేరువైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్లో 133 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొంది. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,905కు చేరుకుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 17,609 మందికి పరీక్షలు నిర్వహించగా 465 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 7,961కి చేరింది. ఇందులో 1,423 కేసులు ఇతర రాష్ట్రాలు, 308 కేసులు విదేశాల నుంచి వచ్చినవారివి కాగా మిగిలినవి రాష్ట్రానికి చెందినవి. కొత్తగా నాలుగు మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 96కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,960గా ఉంది. 40 ఏళ్లు దాటితే జాగ్రత్తలు పాటించాల్సిందే వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి నలభై ఏళ్లు పైబడిన హై రిస్క్ గ్రూప్ వారు కూడా కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సూచించారు. ఊపిరితిత్తులు, ఆస్తమా సంబంధిత సమస్యలున్నవారు, స్టెరాయిడ్స్ వాడుతున్నవారు, అతిగా పొగ తాగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే కేవలం జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలే కాకుండా శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందులున్నా దగ్గర్లోని పీహెచ్సీని సంప్రదించాలన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ► ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే 104 టోల్ ఫ్రీ నంబర్ లేదా, వైఎస్సార్ టెలీ మెడిసిన్ 14410 నంబర్కు ఫోన్ చేయాలి. ► స్థానిక ఆశా వర్కర్ లేదా, గ్రామ/వార్డు వాలంటీరుకు సమాచారమివ్వాలి. ► ఆస్తమా, ఆయాసం ఉన్నా ఏమీ కాలేదన్న ధీమా వీడాలి. ► బీపి , షుగర్ , గుండె జబ్బులతో పాటు హైరిస్క్ గ్రూపు వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. ► 40–49 ఏళ్ల వారికి శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందులున్నా దగ్గల్లోని కొవిడ్ కేర్ సెంటర్ను తక్షణం సంప్రదించాలి. జైళ్లలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు రాష్ట్రంలోని పలు జైళ్లలో ఐదుగురు ఖైదీలకు కరోనా పాజిటివ్ సోకడంతో జైళ్లశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడికి మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్ తెలిపారు. ► కోవిడ్ నేపథ్యంలో రద్దీగా ఉన్న జైళ్ల నుంచి 463 మంది ఖైదీలకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. గడువు ముగిసిన అనంతరం వారు జైలుకు తిరిగి రావాలి. ► రాష్ట్రంలోని 91 జైళ్లలో 5,800 మంది ఖైదీలున్నారు. వారికి కరోనా సోకకుండా చర్యలు చేపట్టారు. ► ఖైదీలతో కుటుంబసభ్యులు, బంధు మిత్రుల ములాకాత్లు రద్దు. ఫోన్లో మాట్లాడుకొనే సౌలభ్యం కల్పించారు. ► జైలు పరిసరాల్లో శానిటైజేషన్ చేస్తున్నారు. ఖైదీలకు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్లు, గ్లౌజులు అందించడంతోపాటు వారు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ ఐదుగురు కొత్త ఖైదీలే.. రాష్ట్రంలో రాజమహేంద్రవరం, నెల్లూరు, కడప, అనంతపురం జైళ్లలో ఐదుగురు ఖైదీలకు పాజిటివ్ వచ్చింది. వారంతా జైలుకు కొత్తగా వచ్చిన వారే. ఖైదీలను జైలుకు తీసుకొచ్చే ముందే కోవిడ్ పరీక్ష చేయిస్తున్నారు. కొత్త ఖైదీలను తీసుకొచ్చిన వెంటనే వారిని 21 రోజల పాటు ఐసోలేషన్ వార్డులో ఉంచి తర్వాత పాత ఖైదీలు ఉండే బ్యారక్కు తరలిస్తాం. – జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్ -
'కరోనా మరణాలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టండి'
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ సోకిన వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జేసీలు, పీహెచ్సీ వైద్య అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 60 సంవత్సరాల నిండిన వారు, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక లక్షణాలు ఉన్న వారిని, జ్వరం,దగ్గుతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి టెస్టులు నిర్వహించాలని చెప్పారు. వారి పరిధిలోని ప్రైమరీ ఆరోగ్య బృందం పై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. (తెలంగాణలో కొత్తగా 143 కరోనా కేసులు) 6వ విడత ఇంటింటి సర్వే కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి మెడికల్ అధికారి వారి ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగే శాంపిల్స్ సేకరణ, కొవిడ్ పరీక్షలు జరిగే ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అంతేగాక కరోనా లక్షణాలు కలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులకు చేయించుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. అంతేగాక టెలిమెడిసిన్, ఆరోగ్య సేతు యాప్,104 కాల్ సెంటర్ ద్వారా కూడా ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుండి విమానాలు, రైళ్ళు,బస్సులు ద్వారా వచ్చిన వారి వివరాలు పిహెచ్సి డాక్టర్ వద్ద ఉంచుకుని ఆలాంటి వారి ఆరోగ్యం పట్ల నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ బయిటకు వెళ్ళి నపుడు భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు విధిగా మాస్క్ ధరించే విధంగా ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.అలాగే కరోనా లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులకు చేయించుకునేలా అవగాహన కలిగించడంతో పాటు సమాజంలో కరోనా పట్ల స్టిగ్మా లేకుండా చూడాలని నీలం సాహ్ని పేర్కొన్నారు. ఆరోగ్య సేతు యాప్ ను స్మార్ట్ ఫోన్ వినియోగించే వారందరూ విధిగా వినియోగించేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు. గత మూడు మాసాలకు పైగా కొవిడ్ నియంత్రణకు విశేష కృషి చేస్తున్నందుకు కలెక్టర్లు సహా సంబంధిత అధికారులను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. బయటి ప్రాంతాల నుండి వచ్చిన వారు విధిగా హోం క్వారంటైన్లో ఉండాలన్నారు. గ్రామ స్థాయి బృందాలు మరింత చురుగ్గా పనిచేసేలా చూడాలని, హైరిస్క్ వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కొవిడ్ మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా పాజిటివ్ లక్షణాలున్న,హైరిస్క్ కేసులు ఉంటే వెంటనే ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ శాంపిల్స్ సేకరణ పాయింట్లుగా ఉండాలని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రజలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులు చేయించుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, ఆరోగ్య సేతు యాప్ ను వినియోగించేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్, సీఆర్డీఏ అదనపు కమీషనర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన పీజీ వైద్య విద్య ఫీజులు
-
ఏపీలో భారీగా తగ్గిన పీజీ వైద్య విద్య ఫీజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పీజీ వైద్య విద్య కోర్సుల ఫీజులను ప్రభుత్వం భారీగా తగ్గించింది. 2020–21 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్యార్థుల అడ్మిషన్లు దగ్గర పడిన నేపథ్యంలో ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వైద్య కళాశాలల్లో భారీగా ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీజీ వైద్య సీట్లతోపాటు పీజీ దంత వైద్య సీట్ల ఫీజులనూ తగ్గించడం విశేషం. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా, ఎన్ఆర్ఐ కోటా ఇలా అన్నింటిలోనూ ఫీజులను తగ్గించింది. డబ్బున్న వారికే పీజీ వైద్య విద్య సొంతం కాకూడదని, పేద, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి విద్యార్థులకు కూడా పీజీ వైద్య విద్య అందుబాటులో ఉండాలని వివిధ కేటగిరీల్లో 40 నుంచి 50 శాతం మేరకు ఫీజులను కుదించింది. సర్కార్ తాజా నిర్ణయంతో రూ.కోటి నుంచి రూ.కోటిన్నర పలికే యాజమాన్య కోటా సీటు ఫీజు లక్షల్లోకి తగ్గిపోయింది. కన్వీనర్ కోటా సీట్లకు సైతం ఏడాదికి రూ.7.60 లక్షలున్న ఫీజు కూడా దాదాపు సగానికి పడిపోయింది. కాగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పీజీ వైద్య విద్య సీట్ల భర్తీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు భారీ లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఓపెన్ కేటగిరీలో సీటు పొందిన రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థి స్లైడింగ్ (వేరే సీటుకు మారితే)కు వెళ్తే ఖాళీ అయిన సీటును అదే రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థికి కేటాయిస్తారు. ఇంతకుముందు వరకు ఇలా లేకపోవడంతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీ అభ్యర్థులు నష్టపోయారు. ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు ► మైనారిటీ, నాన్ మైనారిటీ, ప్రైవేటు అన్ ఎయిడెడ్ అన్ని కళాశాలల్లో ఒకే తరహా ఫీజులు ► 2020–21 నుంచి 2022–23 వరకూ ఈ ఫీజులు అమల్లో ఉంటాయి. ► ఏపీ ఫీ రెగ్యులేటరీ కమిటీ ప్రతిపాదించిన మేరకు ఫీజుల నిర్ణయం ► ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, లేబొరేటరీ/లైబ్రరీ, కంప్యూటర్/ఇంటర్నెట్, నిర్వహణ ఫీజులన్నీ కలిపే కొత్త ఫీజులు ► వార్షిక ఫీజును ఆయా కళాశాలలు రెండు దఫాలుగా వసూలు చేయొచ్చు. ► ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు ► ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే పీజీ వైద్య విద్యార్థులకు ఎంత స్టైఫండ్ ఇస్తున్నారో ప్రైవేటు కళాశాలలూ అంతే ఇవ్వాలి. ► ఫీజుల వసూళ్లపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉంటుంది. ఈ ఏడాది పీజీ వైద్య విద్య అడ్మిషన్లు నిలిపేస్తున్నాం పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్య సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పీజీ వైద్య విద్య, పీజీ డెంటల్ అడ్మిషన్లు నిలిపేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కళాశాలల పనితీరు, ఖాతాల నిర్వహణ చూడకుండానే ఫీజులు నిర్ణయించడం బాధాకరమని పేర్కొంది. విద్యార్థులు చెల్లించే ఫీజుల కంటే ఏడాదికి విద్యార్థులకు తాము చెల్లించే స్టైఫండే అధికంగా ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో తాము అడ్మిషన్లు చేయలేమని, అందుకే నిలిపివేస్తున్నట్టు వివరించింది. -
టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. దుమ్ములపేట ప్రాంతంలోని హౌసింగ్ సైట్ పరిశీలిస్తామని టీడీపీ బృందం ప్రకటించింది. మడ అడవులను ధ్వంసం చేస్తూ ఇళ్ల పట్టాలను ఇస్తున్నారని అసత్య ఆరోపణలు చేస్తూ.. దుమ్ముల పేట ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రులు కేఎస్ జవహర్, పితాని సత్యనారాయణ కాకినాడకు చేరుకున్నారు. దీంతో టీడీపీ కార్యాలయంలో మాజీ హోం మంత్రి చినరాజప్ప, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబులను పోలీసులు అడ్డుకున్నారు. (‘రైతు భరోసా’ను ప్రారంభించిన సీఎం జగన్) కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా సెక్షన్ 144 అమల్లో ఉన్నందున పర్యటనకు అనుమతుల్లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఇక చేసేది ఏం లేక టీడీపీ బృందం వెనక్కి తగ్గింది. మీడియో సమావేశం అనంతరం పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి పోయారు. కాగా దుమ్ములపేట వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ బృందానికి గట్టిగా సమాధానం చెప్పాలని ఇటు ఇళ్ళ స్ధలాల లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. (పక్కా.. ఈ బుడతలు మిమ్మల్ని ఫిదా చేస్తారు ) -
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్యం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా వీరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేటగిరీల వారీగా గతంలో చెల్లించిన దానికంటే స్వల్ప మొత్తంలో ప్రీమియాన్ని పెంచి, ఉద్యోగుల నగదు రహిత వైద్య పథకం (ఈహెచ్ఎస్)ను పటిష్టంగా అమలు చేస్తారు. ఈ మేరకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇకపై ఆస్పత్రులకు సకాలంలో నిధులు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులకు వైద్యం ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ఈ నిధులను గ్రీన్చానెల్లో చేర్చారు. దీనివల్ల సకాలంలో, ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు బిల్లులు చెల్లించే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంపై పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రీమియంలో మార్పులు ఇలా... ► కొత్త ప్రీమియం రేట్ల ప్రకారం రెండు స్లాబులు నిర్ణయించారు. ► గతంలో నెలకు రూ.90 చెల్లించే ఉద్యోగులు ఇక నుంచి రూ.225 చెల్లిస్తారు. ► గతంలో నెలకు రూ.120 చెల్లించేవారు ఇప్పుడు రూ.300 చెల్లిస్తారు. ► దీని ప్రకారం ఏడాదికి ఉద్యోగుల నుంచి రూ.400 కోట్లు వస్తాయని అంచనా. అంతే మొత్తం ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ► పెంచిన ప్రీమియం 2019, డిసెంబర్ నుంచి వర్తిస్తుంది. ► అన్ని యూనివర్సిటీలు, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలు, వైద్యవిధాన పరిషత్ విభాగాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గతంలో ఈ పథకంలో లేరు. ఇప్పుడు వీరిని కూడా చేర్చారు. 9,000 మందిని పథకం పరిధిలో చేర్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే.. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో పనిచేసే 9 వేల మంది గతంలో ఈ పథకంలో లేరు. ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి విన్నవించినా స్పందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీళ్లందరినీ పథకం కిందకు తీసుకురావడంతో వారికి మెరుగైన వైద్యం అందే అవకాశం కలిగింది. –ఉల్లి కృష్ణ, అధ్యక్షులు, కె.సురేష్, ప్రధాన కార్యదర్శి (వైద్యవిధాన పరిషత్ ఉద్యోగుల సంఘం) -
కొత్తగా రెండు టెస్టింగ్ ల్యాబ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం పది టెస్టింగ్ ల్యాబొరేటరీలు అందుబాటులోకి వచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. కె.ఎస్. జవహర్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలో శుక్రవారం ఆయన సమాచార శాఖ కమిషనర్ టి. విజయ కుమార్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు టెస్టుల పరంగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని, 1,02,460 టెస్టులు చేశామని, అన్ని రాష్ట్రాల్లో కలిపి 9 లక్షల టెస్టులే నిర్వహించారని వివరించారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దేశ జనాభాలో రాష్ట్ర జానాభా 4 శాతం కంటే తక్కువ. టెస్టుల పరంగా అత్యధికంగా 12 శాతం టెస్టులు మన రాష్ట్రంలోనే నిర్వహించామని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► శుక్రవారం వచ్చిన 60 పాజిటివ్ కేసుల్లో 57 పాత క్లస్టర్లలోనే వచ్చాయి. 3 కేసులు కొత్త క్లస్టర్లలో ఉన్నాయి. ► రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ► కొత్తగా శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశాం. దీంతో మొత్తం 10 ల్యాబ్లు అందుబాటులోకి వచ్చాయి. ► నెల్లూరులో ల్యాబ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ► పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ల్యాబ్ల ఏర్పాటుకు ప్రైవేట్ మెడికల్ కళాశాల యాజమాన్యాలను సంప్రదిస్తున్నాం. ► విశాఖపట్నం, విజయవాడలో ఉన్న హెచ్ఐవి వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబ్లను కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్లుగా మార్చేందుకు అనుమతి వచ్చింది. వీటిలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తులకు టెస్టులు నిర్వహిస్తాం. ► రాష్ట్రంలో మరో 5 సబినాట్ టెస్టింగ్ మిషన్లతో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి వచ్చింది. ► రూ. కోటితో డీఆర్డీఓ, స్విమ్స్ సౌజన్యంతో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో అంగీకారం కుదిరింది. ఈ ల్యాబ్ రీసెర్చ్కు కూడా ఉపయోగపడుతుంది. ► అన్ని జిల్లాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం వల్ల టెస్టుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ► గుజరాత్ నుండి వచ్చిన సుమారు 6 వేల మంది మత్స్యకారులకు పూల్డ్ శాంపిల్ టెస్టింగ్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహిస్తాం. నెగెటివ్గా నిర్థారించుకున్న వారిని మాత్రమే స్వస్థలాలకు పంపేందుకు కలెక్టర్లు ఏర్పాటు చేశారు. -
వైద్య సిబ్బందిపై దాడి; తీసుకునే చర్యలు ఇవే..
సాక్షి, అమరావతి : కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల కాంటాక్ట్స్ సర్వే చేస్తున్న సిబ్బందిపై భౌతిక దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి హెచ్చరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి జిల్లా కలెక్టర్లకు తగు ఆదేశాలిచ్చామని తెలిపారు. కరోనా రోగుల మృత దేహాల్ని ఖననం చేసేటప్పుడు.. దహన వాటికలలోనూ ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై దాడులు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టి కొచ్చిందని పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిపై లేనిపోని అపోహలతో వైద్య సిబ్బంది విధులకు ఆటకం కలిగించొద్దని ఆదేశించారు. కాంటాక్ట్ల అన్వేషణ పూర్తి చేసి, సంబంధిత వ్యక్తులకు పరీక్షలు చేయటం ద్వారానే వ్యాధి నివారణ త్వరితగతిన సాధ్యమవుతుందన్నారు. వ్యాధి సోకిన పార్దివ దేహాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం స్టెరిలైజ్ చేసి సీల్ చేస్తారని, ఇలాంటి మృత దేహాల్ని పూడ్చటం లేదా కాల్చటం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. ప్రజలందరూ దీన్ని అవగాహన చేసుకోవాలన్నారు. (‘జేమ్స్.. మీరు లేకుండా ఏదీ మాములుగా ఉండదు’ ) సమాజ హితం కోసం నిరంతరం పాటు పడే వైద్య సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలని సూచించారు, కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 22న తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే శిక్షలు తప్పవని హెచ్చరించారు. బెయిల్కు కూడా అవకాశం లేదని పేర్కొన్నారు. దౌర్జన్యకర చర్యలకు పాల్పడినా, ప్రేరేపించినా, ప్రోత్సహించినా 3 నెలల నుంచి అయిదేళ్ల వరకు కారాగార శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా ఉంటుందని తెలిపారు. వైద్య, వైద్యేతర సిబ్బందిని గాయపరిచే వారికి 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలు జరిమాన, నష్టపరిచిన ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. భౌతిక దాడులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా జిల్లా కల్లెక్టర్లకు ఆదేశాలిచ్చామని కేఎస్ జవహర్ అన్నారు. (నా భర్త నాతోనే ఉన్నాడు: ఇర్ఫాన్ భార్య ) -
ఇప్పటివరకు చేసిన పరీక్షల్లో 60,250 నెగిటివ్
-
7 కొత్త మండలాల్లో కరోనా విస్తరించింది
-
కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నాలుగు జిల్లాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. అదికూడా ఆ నాలుగు జిల్లాల్లోని అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే 66.06 శాతం కేసులు నమోదయ్యాయి. గురువారం సాయంత్రానికి రాష్ట్రంలో 893 కేసులు నమోదు కాగా, పైన పేర్కొన్న నాలుగు జిల్లాల్లోనే 590 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,034 టెస్టులు చేశారు. టెస్టులు, పాజిటివ్ కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఇన్ఫెక్షన్ రేటు 1.85 శాతం మాత్రమే. డిశ్చార్జి అయ్యే పేషెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ రెండు జిల్లాల్లో ఒక్క కేసూ లేదు ► విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తూర్పుగోదావరి, విశాఖపట్నం వంటి జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ నియంత్రణలోనే ఉంది. ► కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటి వరకు 17,884 నమూనాలను పరీక్షించారు. ఇందులో 590 పాజిటివ్ కాగా, మిగతా 17,294 కేసులు నెగిటివ్గా తేలాయి. ► రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో ఒక్క కర్నూలు జిల్లాలోనే 26.20 శాతం, గుంటూరు జిల్లాలో 21.83 శాతం కేసులు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 48.03 శాతం కేసులు నమోదయ్యాయి. గ్రీన్ జోన్లో 573 మండలాలు : డా.కె.ఎస్.జవహర్రెడ్డి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వ్యాప్తి చెందిన 181 క్లస్టర్లను గుర్తించామని, 573 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు. 66 శాతం కేసులు కేవలం నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయని, అవి కూడా పట్టణాల్లోనే ఉన్నాయన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రెండు రోజులుగా చిత్తూరు జిల్లాలో 14 కేసులు మినహా.. ఇతరత్రా నమోదవుతున్న కేసులన్నీ రెడ్జోన్లలోనే ఉన్నాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. టెస్ట్లు చేయడంలో రాష్ట్రం.. దేశంలోనే మొదటి స్థానంలోకి వచ్చిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► రాష్ట్ర వ్యాప్తంగా 181 క్లస్టర్లు ఉన్నాయి. ఇందులో 121 పట్టణ ప్రాంతాల్లో, 60 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 573 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయి. 56 మండలాలు రెడ్జోన్లో, 47 ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. జిల్లాల వారీగా అయితే 590 కేసులు ఈ నాలుగు జిల్లాల్లోనే నమోదయ్యాయి. ► ‘గ్రీన్ జోన్లను కాపాడండి.. రెడ్జోన్లను నియంత్రించండి’ అనే నినాదంతో ముందుకెళుతున్నాం. దేశంలో 10 లక్షల జనాభాకు సగటున 334 టెస్ట్లు చేస్తుంటే మన రాష్ట్రంలో 961 టెస్టులు చేస్తున్నాం. ► ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలో ఒక్కొక్కరికి 3 మాస్స్లు ఇస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 16 వేల పడకలకు 2.21 లక్షల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాం. వెంటిలేటర్ కంటే ఆక్సిజన్ చికిత్సే మంచిదని ఐసీఎంఆర్ చెబుతోంది. ర్యాపిడ్ టెస్ట్లు చేసుకోవచ్చని ఐసీఎంఆర్ ఆదేశాలు ► ర్యాపిడ్ టెస్ట్లు చేసుకోవచ్చని ఐసీఎంఆర్ ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ మొదలుపెట్టాం. ఫిబ్రవరి 25 నాటికి రాష్ట్రంలో ఒకే ఒక్క ల్యాబొరేటరీలో 90 టెస్టుల సామర్థ్యం ఉండేది. ఇప్పుడు ల్యాబొరేటరీల సంఖ్య 9కి పెంచి రోజుకు 3,480 టెస్టులు చేసే స్థాయికి చేరుకున్నాం. ► ఎక్కడ టెస్టులు చేసినా వైరాలజీ ల్యాబొరేటరీలో చేసేదే ఫైనల్. అయితే ఎక్కువ మందికి ప్రాథమిక స్క్రీనింగ్ చేసేందుకు ర్యాపిడ్ టెస్టులు ఉపయోగపడతాయి. ఔట్ పేషెంట్ సేవలకు ఇబ్బంది లేకుండా 14410 నంబర్ ద్వారా టెలి మెడిసిన్ ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకూ 306 మంది డాక్టర్లు స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చారు. 4 వేల మందికి పైగా ఈ పద్ధతిలో వైద్య సేవలు పొందారు. బులెటిన్లోని అంశాలే రాయండి ► రాష్ట్రంలో 3 లక్షల పీపీఈ కిట్లు, 1.40 లక్షల ఎన్–95 మాస్క్లు అందుబాటులో ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ప్రతి పనీ పారదర్శకంగా చేస్తోంది. మేము విడుదల చేసే బులెటిన్లోని అంశాలే రాయండి. ఇదే అధికారికంగా భావించండి. ► ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉన్నప్పుడు ఇక టెస్ట్లు దాస్తున్నారనడంలో నిజం లేదు. గ్రీన్జోన్లో 84.7 % మండలాలు రాష్ట్రంలో 573 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయి. 56 రెడ్ జోన్లో, 47 ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. వాస్తవాలు మాట్లాడండి కరోనాతో మృతులకు సంబంధించి ఆడిట్ చేస్తున్నాం. క్రిటికల్ కేర్ నిపుణులను ఏర్పాటు చేశాం. టెస్టులు దాస్తే దాగేవి కావు. చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వాస్తవాలు మాట్లాడండి. వేలాది మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. మీరు వారిని ప్రోత్సహించకపోయినా ఫరవాలేదు.. దయచేసి విమర్శించకండి. – డా.కె.ఎస్ జవహర్రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ -
13 జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులు ఉన్నాయి